• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

సాధికారత కాదు రైతులపై దాడి-కార్పొరేట్ల దోపిడీకి అప్పగింత !

21 Monday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Agri Bills, agriculture in india, Farmers empowerment, indian farmers


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


రైతుల స్థితిగతుల గురించి ఏమాత్రం స్పహ లేకుండా కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సెప్టెంబరు 20 ” రైతుల పాలిట దుర్దినం”. పైగా బిల్లులు రైతుల పరిస్థితులను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చని, ధరలను తామే నిర్ణయించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అంటూ కేంద్రం తెచ్చిన ఈ మూడు బిల్లులు ”కరోనా వ్యాధికన్నా కూడా ప్రమాదమైనవి”.
కేవలం పెట్టుబడులు- లాభాలు తప్ప ఏ నిబంధనలు పాటించని విదేశీ, స్వదేశీ కంపెనీలు రైతుల పంటలను తక్కువ ధరలకు కొని, భారీగా నిల్వ చేసి, వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఇప్పటివరకు చట్టవిరుద్దంగా బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారు.కొత్త బిల్లు ప్రకారం ఎంతైనా నిల్వ చేసుకోవచ్చని చట్టమే అనుమతిస్తే ఇక వీరికి అడ్డెవరు? ఎవరూ ప్రశ్నించటానికికూడా చట్టం అనుమతించదు. ఇప్పటివరకూ చట్టవిరుద్దమైన బ్లాక్‌ మార్కెటింగ్‌ ఇకనుండి చట్టబద్దమవుతుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు నిర్వీర్యంమవుతాయి. ప్రభుత్వం నిర్ణయిస్తున్న మద్దతు ధరను అమలుపరచటానికి మార్కెట్‌ యార్డులుండవు. ప్రైవేట్‌ కంపెనీలు ఇష్టమొచ్చిన ధరకు ఇష్టమొచ్చిన చోట కొనుక్కోవచ్చు, ఇష్టమొచ్చినంత సరుకును గోదాములలో దాచుకోవచ్చు. వారిపై ఎటువంటి పన్నులూ వుండవు. అగ్రి బిజినెస్‌ కంపెనీలు ధరలు నిర్ణయించటానికి, ముందస్తు వ్యాపారానికి( ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ )కీఈబిల్లులు అవకాశం కల్పిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిత్యావసర వస్తువుల చట్టంలో చిరుధాన్యాలు,పప్పు ధాన్యాలు,ఆలుగడ్డలు ఉల్లిపాయలు ఇకపై నిత్యావసర సరుకుల చట్టం పరిధిలోకి రావు, నిల్వ చేసుకోవచ్చు. అసాధారణంగా ధరలు పెరిగినపుడే ప్రభుత్వాలు ఆంక్షలు విధించాలని చెబుతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నవారే ధరలను నియంత్రిస్తారు.ఎగుమతి దిగుమతి విధానాలు కూడా వీరే నిర్ణయిస్తారు. ఇకపై వ్యాపార సంస్ధలు,కంపెనీలు, ఎటువంటి రుసుములు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని కొత్తచట్టం చెప్తోంది.రిలయన్స్‌, అదానీ, పెప్సీ వంటి బడా కంపెనీలు వ్యవసాయ వ్యాపారంలో ప్రవేశించారు. వారికి మార్గం సుగమం చేయటమే వ్యవసాయ, నిత్యావసర సరకుల చట్టాల సవరణ బిల్లుల లక్ష్యం.
ఈబిల్లు వలన నిత్యావసర సరుకుల కత్రిమ కొరత సష్టించేందుకు దారితీసే ప్రమాదం ఉందని అనుభవం చెప్ప్తున్నది. బ్రిటిష్‌ పాలనలో రైతులను కాల్చుకు తిన్నారు. అదే విధంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం ద్వారా అన్నదాత పొట్ట కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది. రైల్వేల నుంచి విమానాల వరకు అన్నింటిని ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పచెప్తున్నది. కోల్డ్‌ స్టోరేజ్‌లు ఎక్కువ కట్టినందువలన వ్యవసాయఉత్పత్తులను నిల్వ చేసుకోటానికి రైతులకు అవకాశం లభిస్తుందంటున్నారు. కోల్డ్‌ స్టోరేజి లు ఎవరివి? ఎవరు కడతారు? వ్యాపారులకు అది కూడా ఒక లాభసాటి వ్యవహారమే.
ఎక్కువ రోజులు వ్యవసాయ ఉత్పత్తులను ఆపుకోగలిగిన శక్తి సామాన్య రైతులకు లేదు. చిన్న రైతులు 86.2 శాతం మందివున్నారు. 12 కోట్ల 60 లక్షల చిన్న రైతులకు ఒక్కొక్కరికీసగటున 0.6 హెక్టార్ల సాగు భూమి మాత్రమేవున్న విషయాన్ని గమనించాలి. కౌలు రైతులైనా చిన్న రైతులయినా పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసి మంచి ధర కోసం ఎదురు చూడలేరు. తెచ్చిన అప్పులను చెల్లించటానికి, కుటుంబం గడవటానికి పంటను అమ్ముకోక తప్పదు. ఎక్కువ శాతం పంట అమ్ముకున్న తరువాత ధరలను పెంచటం ప్రపంచ అగ్రిబిజినెస్‌ నాటకంలో భాగమే.

కనీస మద్దతు ధరకే కొనాలని ఈ బిల్లులో వుందా?
కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కంపెనీలు కొనటానికి వీలులేదని ఈ బిల్లులో ఎందుకు చేర్చ లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.పెద్ద పెద్ద కంపెనీలకు స్టోరేజ్‌, ప్రాసెసింగ్‌ సదుపాయాలు కల్పించి మార్కెట్‌ పై పూర్తి అధికారాలను వారికి కట్టపెట్టే ప్రయత్నంలో భాగమే ఈ బిల్లు, ఇది రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితిని ఇంకా దూరం చేస్తుంది. కార్పొరేటు కంపెనీలకి మేలుచేసేందుకే ఈ బిల్లులకు ఆమోదం పొందారు. ఒప్పంద వ్యవసాయం ప్రారంభమైతే ప్రభుత్వం నిర్ణయించే కనీస మద్దతు ధరల ప్రమేయం ఉండదు. ఒప్పంద షరతులను ఒక సారి రైతులు అంగీకరించిన తరువాత ఎవరైనా కోర్టుకు వెళ్లినా చెల్లదు.
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ , తెలుగుదేశం రెండు కూడా ఈ బిల్లును సమర్థించాయి. దీన్ని ఎలా వ్యతిరేకించాలా అని రైతులు, ప్రజలు ఆలోచించాలి. స్వామీనాధన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరల నిర్ణయం, అవసరమైనపుడు పంట కొనుగోళ్ళను ప్రభుత్వం చేపట్టనంతకాలం రైతుకు మంచి ధర దొరకదు. వ్యవస్ధలో వున్న లోపాలను సవరించి రైతులకు లాభంచేయాల్సిన ఫ్రభుత్వాలు ఏకంగా వ్యవసాయమార్కెట్లను నాశనం చేయపూనుకున్నాయి. ఇల్లంతా ఎలుకలున్నాయని ఇల్లు తగలపెట్టడానికి పూనుకుంటున్నారు.
ఆహారస్వావలంబన సాధించి దేశానికి అన్నం పెట్టే రైతులను నాశనం చేయటం వలన దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం నాశన మౌతాయి. బీహార్‌ రాష్ట్రం లో 2006 సం.లోనే వ్యవసాయమార్కెట్‌ లను రద్దు చేశారు.మార్కెట్‌ కమిటీల రద్దు తర్వాత ధరలు తగ్గిపోయాయి. ఉదాహరణకు మొక్కజొన్న క్విటాలుకు మద్దతుధర రూ.1850.వుంది. ఎక్కువ మంది రైతులు 1000 రూపాయల కన్నా తక్కువ ధర కే అమ్ముకోక తప్పలేదు. మద్దతు ధర కే కొనాలనే నిబంధన బిల్లులో ఎక్కడా లేదు. క్రమేపీ కనీస మద్దతు ధరను ఉపసంహరించుకోవటానికే ఆ నిబంధనలను చేర్చలేదని అర్ధమౌతుంది.

ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం

రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం ఉమ్మడి జాబితా లోనిది. ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తన పెత్తనాన్ని రుద్దుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే బిల్లులను నిరంకుశంగా తెచ్చారు. రైతన్నలలో తలెత్తుతున్న ఆందోళనలను ఖాతరు చేయకుండా ప్రవేశపెట్టొందంటూ తాను ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం వినిపించుకోలేదని అకాలీదళ్‌ నేత, కేంద్ర మంత్రి హరిసిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేశారు.

బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులను సెలెక్ట్‌ కమిటీ కి పంపాలన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఓటింగ్‌ జరపాలన్న ప్రతిపాదనను ఖాతరు చేయలేదు. రూల్స్‌ ప్రకారం ఒక్క ఎంపీ అడిగినా ఓటింగ్‌ పెట్టాలి. పార్లమెంటు సభ్యులు చేసేదేమీ లేక కోపంతో బిల్లు ప్రతులను చించివేశారు. పోడియం వైపు దూసుకు వెళ్లారు. గొంతెత్తి అరిచారు.
విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు.

బిల్లుల పై భిన్న వ్యాఖ్యానాలు..

వ్యవసాయ బిల్లులను పార్లమెంటు ఆమోదించటం వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని, కోట్లాదిమంది రైతులకు సాధికారతను ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.
రైతుల దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులు పంటను కొనేధర కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను బిల్లులలో ఎందుకు పొందుపరచ లేదని మాజీ మంత్రి చిదంబరం ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఆహార భద్రతకు విఘాతం కల్పిస్తాయని కూడా అన్నారు.

వ్యవసాయ రంగ బిల్లులు” రైతుల పాలిట మత్యు గంటలు” అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు అన్ని కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తాయని ఫలితంగా రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోతుందని స్ఠాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల పేరుతో మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశానికి తీరని నష్టం చేస్తాయని, దేశానికి వెన్నెముక అయిన రైతుల్ని కార్పొరేట్‌ శక్తులకు బానిసలుగా మార్చేస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. రైతాంగం, వ్యవసాయం పై ముప్పేట దాడి చేస్తున్నారని, బడా వ్యా పారవేత్తలు, కార్పోరేట్‌ సంస్ధలు, అగ్రిబిజినెస్‌ సంస్ధలు పెద్దఎత్తున దోపిడీ చేయటానికి ఒక నిబంధనావళిని రూపొందిస్పున్నారని మార్క్సిస్టు పార్టీ నాయకులు అన్నారు.
తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్ళి అమ్ముకోవటం సాధ్యమేనా ? ఇది తేనెపూసిన కత్తి లాంటి చట్టం అని, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించితీరాలని, కార్పోరేట్‌ గద్దలకోసమే ఈ వ్యవసాయ బిల్లు అని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయబిల్లులు అన్నదాతలకు డెత్‌ వారెంట్‌ లాంటివని కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బస్వా వ్యాఖ్యానించారు.రైతుల ప్రాణాలను హరించే ఈ బిల్లిలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
రైతులనుబానిసలుగా మారుస్తారా అని డీయంకే ఎంపీ ఇళంగోవాన్‌ ప్రశ్నించారు. రైతుల ఉసురు తీసుకునేవి.రైతులను ఆటవస్తువులుగా మార్చేస్తాయని ఇళంగోవాన్‌ విమర్శించారు.ఈ బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో కనీసం ఆర్‌ యస్‌ యస్‌ అనుబంధరైతు సంఘాలతోనూ చర్చించలేదని ఎస్‌ పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ అన్నారు.

25న ఆందోళనకు 250 రైతుసంఘాల పిలుపు

వ్యవసాయ రంగ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేష్‌ రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలు మొదలు పెట్టారు. బిల్లులను ఉపసంహరించుకునేలా ఆందోళన తీవ్రతరం చేయాలని భారతదేశంలోని 250 రైతుసంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 25న బందుకు పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలలోనూ కలెక్టర్‌ఆఫీసుల వద్ద ఆందోళనలకు సిద్దమవుతున్నారు. రైతుల పైనా వ్యవసాయం పైనా జరుగుతున్నదాడిని ఎదుర్కోవాలి.

గమనిక : వ్యాస రచయిత ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమడ ప్రాంత రైతు సంఘం నాయకులు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దొంగ చెవులు, సమాచార తస్కరణ బడా చోర్‌ అమెరికా సంగతేమిటి ?

20 Sunday Sep 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

China, Datamining, Eavesdroppers, EDWARD SNOWDEN, US CIA, US NSA


ఎం కోటేశ్వరరావు
నవంబరులో జరిగే ఎన్నికల్లో ప్రచారం కోసం డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బిడెన్‌ తయారు చేయించిన ఓట్‌ జో ఆప్‌ నుంచి కీలకమైన సమాచారం బయటకు పోతున్నట్లు కనుగొన్నారు. ఓటర్ల రాజకీయ అనుబంధాలు ఏమిటి, గతంలో వారు ఎవరికి ఓటు వేశారు అన్న సమాచారం దానిలో ఉంటుందట, ఇప్పుడు అది ఎవరికి అవసరం, ఇంకెవరికి మన ప్రధాని నరేంద్రమోడీ జిగినీ దోస్త్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కే.
గూగుల్‌ ఖాతాదారుల 2ఎఫ్‌ఏ ఎస్‌ఎంఎస్‌ కోడ్స్‌ను తస్కరించేందుకు ఇరానియన్‌ హాకర్ల గ్రూప్‌ ఒక ఆండ్రాయిడ్‌ అక్రమ చొరబాటుదారును అభివృద్ది చేసింది.
రాబోయే రోజుల్లో సమాచారాన్ని తస్కరించే అక్రమచొరబాటుదార్ల దాడులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలని బ్రిటన్‌లోని ఎన్‌సిఎస్‌సి విద్యా సంస్ధలకు సలహాయిచ్చింది.


జర్మనీలో ఒక ఆసుపత్రి సమాచార వ్యవస్ధపై జరిగిన దాడి కారణంగా కంప్యూటర్‌ వ్యవస్ధలు పని చేయలేదు. దాంతో తక్షణం చికిత్స అందించవలసిన ఒక మహిళా రోగిని మరో పట్టణంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి రావటంతో ఆమె మరణించింది.
తమ సంఘంలోని రెండు లక్షల మంది నర్సుల వ్యక్తిగత సమాచార భద్రతకు తగిన చర్య తీసుకోని కారణంగా చోరీకి గురైనట్లు కెనడాలోని అంటారియో రాష్ట్ర నర్సుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలోని న్యూజెర్సీ యూనివర్సిటీ హాస్పిటల్‌ సమాచార వ్యవస్ధపై జరిగిన దాడిలో 48వేల మందికి సంబంధించిన సమాచారం చోరీకి గురైంది. అమెరికా ఫెడరల్‌ కోర్టుల ఫోన్‌ వ్యవస్ధ గురువారం నాడు పనిచేయలేదు.సైబర్‌దాడుల గురించి 75శాతం మంది ఐటి ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేసినట్లు కనెక్ట్‌వైజ్‌ అనే సంస్ధ తాజా నివేదికలో వెల్లడించింది. ఇవన్నీ తాజా వార్తల్లో కొన్ని మాత్రమే.


ఇక కంప్యూటర్‌ అక్రమ చొరబాటుదార్ల మధ్య పరస్పర సహకారం పెరుగుతున్నట్లు పాజిటివ్‌ టెక్నాలజీస్‌ అనే సంస్ధ తాజా నివేదికలో వెల్లడించింది.2020 సంవత్సరం రెండవ త్రైమాసికంలో జరిగిన సైబర్‌దాడుల గురించి చేసిన విశ్లేషణలో తొలి మూడు మాసాలతో పోల్చితే తొమ్మిది శాతం, 2019తో పోల్చితే 59శాతం పెరిగినట్లు, కరోనా కారణంగా ఏప్రిల్‌, మే మాసాల్లో రికార్డులను బద్దలు చేస్తూ దాడులు పెరిగినట్లు తెలిపింది. వస్తుతయారీ, పారిశ్రామిక కంపెనీలపై దాడులు పెరిగినట్లు తేలింది. తాము కోరిన మొత్తాన్ని చెల్లించని పక్షంలో తాము కాపీ చేసుకున్న లేదా తస్కరించిన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని దాడులకు పాల్పడిన వారు బెదిరిస్తున్నట్లు విశ్లేషణలో తేలింది. లాక్‌బిట్‌ మరియు రాగనర్‌ లాకర్‌ వంటి చోరీ ముఠాలు ఈ రంగంలో గాడ్‌ ఫాదర్‌ లేదా డాన్‌గా ఉన్న మేజ్‌తో జతకట్టటం, సహకరించుకోవటానికి ముందుకు వస్తున్నట్లు తేలింది. అందరూ కలసి మేజ్‌ బృందం పేరుతో తస్కరించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేస్తున్నారు. దాన్ని చూపి కంపెనీలను బెదిరిస్తున్నారు. వీటన్నింటినీ చూసినపుడు ఒకటి స్పష్టం. సమాచార చౌర్యం అన్నది ప్రపంచ వ్యాపిత సమస్య. బడా కంపెనీలు తమ ప్రయోజనాల కోసం తస్కరిస్తే, దాన్ని చోరీ చేసి బెదిరించి సొమ్ము చేసుకొనే వారు కూడా తయారయ్యారు.


చైనా సంస్కరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులకు, సంస్దలకు ద్వారాలు తెరుస్తున్న సమయంలో వాటికి ఆద్యుడిగా ఉన్న డెంగ్‌ సియావో పింగ్‌ ఒక మాట చెప్పాడు. గాలి కోసం కిటికీలు తెరుస్తున్నపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలు కూడా ప్రవేశిస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసుఅన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాల నుంచి, మన దేశం నుంచీ చైనా వెళుతున్నవారిలో గూఢచారులు లేరని ఎవరైనా చెప్పగలరా ? దానికి ప్రతిగా చైనా తన పని తాను చేయకుండా ఉంటుందా ?


ఈ వాస్తవాన్ని విస్మరించి పాఠకులను, వీక్షకులను ఆకర్షించేందుకు మన మీడియా పడుతున్న పాట్లు చెప్పనలవిగావటం లేదు. తాజా విషయానికి వస్తే బెంగళూరు నగరంలోని కేంద్ర ప్రభుత్వ జాతీయ సమాచార కేంద్రంలోని వంద కంప్యూటర్లు ఒక నెల రోజుల్లోనే రెండు సార్లు సైబర్‌ దాడికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అంటే సమాచార తస్కరణ జరిగింది. జరిగినట్లు కూడా తెలియదు. ఎలక్ట్రానిక్‌ సమాచారాన్ని ఏమీ చేయకుండానే కాపీ చేసుకొనే సౌలభ్యం గురించి తెలియని వారెవరు ? ఈ దాడి పైన చెప్పుకున్న మేజ్‌ బృందం చేసినట్లు చెబుతున్నారు. ఈ కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న ఎలక్ట్రానిక్‌ పాలనకు సంబంధించి అనేక అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. జాతీయ రహదారుల సంస్ధ సమాచార వ్యవస్ధమీద కూడా దాడి జరిగింది.ఇంకా ఇలాంటి దాడులు ఎన్ని జరిగాయో తెలియదు. ఆ వివరాలను బహిరంగంగా చెబితే ప్రభుత్వ పరువు పోతుంది కనుక అధికార యంత్రాంగం మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నది వేరే చెప్పనవసరం లేదు.
చైనాకు చెందిన సంస్ధ ఒకటి మన దేశంలోని వేలాది మంది ప్రముఖులు, సంస్ధలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అక్కడి ప్రభుత్వానికి అంద చేస్తున్నదని ఒక ఆంగ్ల పత్రిక రాసిన వార్త కొద్ది రోజుల క్రితం సంచలనం అయింది. దానిలో ఉన్న అంశాలు ఏమిటట ? పది వేల మంది ప్రముఖులకు సంబంధించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని జెన్‌హువా అనే సంస్ధ సేకరించి విశ్లేషిస్తోందట. ఎప్పటి నుంచి ? 2018లో ప్రారంభం అంటున్నారు ? అంతకు ముందు ఎందుకు చేయలేదు ? చెప్పేవారు లేరు. అప్పటి నుంచే ఆ సమాచారం ఎందుకు అవసరమైంది. మనకు తెలియదు. మరి సమాచార సేకరణ నిజమా కాదా ? నూటికి నూరుపాళ్లు నిజమే. బహిరంగంగా తెలిసిన సమాచారమే కాదు, తెలియని సమాచారాన్ని కూడా చైనా సేకరించుతుంది. ఎందుకని ? ప్రపంచంలో ఆ పని చేయని దేశం ఏది ? ఒక్కటి కూడా లేదు. ఇదంతా బహిరంగ రహస్యమే. సమాచార చోరీ గురించి పభుత్వానికి తెలుసు అని ఐటి శాఖ చెప్పింది. మరి తెలిసిందాన్ని సంచలన విషయంగా మీడియా వారు ఎందుకు చెబుతున్నారు ? అలా చెబితే తప్ప జనాలకు కిక్కు రావటం లేదు మరి. చైనాకు వ్యతిరేకంగా ఇప్పుడు ఏది చెప్పినా గిట్టుబాటు అవుతుందన్న లాభాపేక్ష. అమెరికా ఇతర దేశాల గురించి రాస్తే ఢిల్లీ ప్రభువులకు ఎక్కడ ఆగ్రహం వస్తుందో అన్న భయం. కమ్యూనిస్టు వ్యతిరేకత సరే సరి !
కొద్ది సంవత్సరాలు వెనక్కు వెళితే 2010లో చేరి అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అనే కుర్రాడు (37) సిఐఏ, ఎన్‌ఎస్‌ఏ వంటి సంస్ధలు సేకరించిన వందల కోట్ల ఫైళ్లను ప్రపంచానికి బహిర్గతం చేశాడు. అమెరికా నగరం వాషింగ్టన్‌లోని మన రాయబార కార్యాలయం, న్యూయార్క్‌లోని మన ఐరాస కార్యాలయాల కంప్యూటర్‌ వ్యవస్ధలోకి చొరబడిన అమెరికన్‌ ఎన్‌ఎస్‌ఏ ప్రభుత్వ ఆదేశాలు, ఇతర సమాచారాన్ని తస్కరించింది.గూగుల్‌, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌, యాహూ వంటి బడా ఐటి కంపెనీలు సేకరించిన అమెరికనేతర దేశాలకు చెందిన సమాచారం మొత్తం అమెరికాకు చేరిపోయింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.


ప్రపంచ వ్యాపితంగా 97 బిలియన్లు అంటే 9,700 కోట్ల సమాచార అంశాలను అమెరికా చోరీ చేసిందని గార్డియన్‌ పత్రిక ఆరేండ్ల క్రితం వెల్లడించింది. దాని దౌత్యవేత్తలు, గూఢచారులు పంపిన నివేదికలు కూడా వాటిలో ఉన్నాయి. అమెరికన్లు తమ శత్రువుల సమాచారాన్ని మాత్రమే సేకరించి మిత్రులను మినహాయించలేదు. శత్రుదేశంగా పరిగణించే ఇరాన్‌ నుంచి 1400 కోట్లు, మిత్ర దేశమైన పాకిస్ధాన్‌ నుంచి 1350 కోట్లు, పశ్చిమాసియాలో అత్యంత సన్నిహిత దేశమైన జోర్డాన్‌ నుంచి 1270 కోట్లు, ఈజిప్టు నుంచి 760, మన దేశం నుంచి 630 కోట్ల ఫైళ్ల సమాచారాన్ని తస్కరించింది.


మన దేశం తమకు మిత్ర దేశమని చెబుతూనే రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించిన సమాచారాన్ని, వాణిజ్య అంశాలు ప్రత్యేకించి అణు, అంతరిక్ష కార్యక్రమాలను అమెరికా సేకరించినట్లు హిందూ పత్రిక వెల్లడించింది. ఇంటర్నెట్‌ నుంచి 630, టెలిఫోన్ల నుంచి 620 కోట్ల వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. ఆరు సంవత్సరాల నాడు ఈ వివరాలు వెల్లడైనపుడు ప్రొఫెసర్‌ గోపాలపురం పార్ధసారధి అనే మాజీ సీనియర్‌ దౌత్యవేత్త మాట్లాడుతూ హిందూ పత్రిక ప్రకటించిన వార్తల గురించి ఎవరూ ఆశ్చర్య పడనవసరం లేదని, ప్రతివారూ ప్రతి ఒక్కరి మీద నిఘావేస్తారు, కొంత మంది మంచి పరికరాలను కలిగి ఉండవచ్చు, వారి సౌకర్యాలు మనకు గనుక ఉంటే మనమూ అదే పని చేస్తామని గట్టిగా చెప్పగలను అని గార్డియన్‌ పత్రికతో చెప్పారు.


అమెరికా తస్కరించిన సమాచారాన్ని బయట పెట్టటానికి మూడు సంవత్సరాల ముందు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ అమెరికన్‌ సిఐఏ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తూ న్యూ ఢిల్లీ వచ్చి ఆరు రోజులు ఉన్నాడు. కంప్యూటర్ల నుంచి సమాచార నైతిక తస్కరణ, సాఫ్ట్‌వేర్లను తెలుసుకోవటం ఎలా అనే అంశం మీద శిక్షణ పొందాడు. అంటే మన దేశంలో అలాంటి నిపుణులకు కొదవ లేదన్నది స్పష్టం. సమాచారాన్ని నిల్వ చేసే పద్దతులు తెలుసుకోవటం ఎలానో, కంప్యూటర్లలోకి దొంగలు ఎలా ప్రవేశిస్తారో, వారిని ఎలా నిరోధించాలో కూడా విద్యార్ధులకు శిక్షణ అవసరమే మరి. తమ దగ్గరకు వచ్చే వారు ఏ లక్ష్యంతో వస్తున్నారో శిక్షణా సంస్దలు తెలుసుకోలేవు. చాకుతో మామిడి, కూరగాయలను ఎలా కోయవచ్చో చెప్పటంతో పాటు అవసరం అయితే దాన్నే ఆత్మరక్షణకు ఎలా ఉపయోగించుకోవచ్చో చెబుతారు. అది తెలిసిన వారు దారి తప్పినపుడు నేరానికి ఉపయోగించటంలో ఆశ్చర్యం ఏముంది?


ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ తాను భారత్‌ వెళుతున్నట్లు అక్కడ సమాచార నిల్వ, తస్కరణ వంటి అంశాల్లో శిక్షణ పొందబోతున్నట్లు అమెరికా భద్రతా అధికారులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడని ఒకవైపు చెబుతారు. తీరా అతను రహస్య సమాచారాన్ని బయట పెట్టిన తరువాత అమెరికా ఎన్‌ఎస్‌ఏ చెప్పిందేమిటి ? తమ కాంట్రాక్టు ఉద్యోగిగా అంటే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్నోడెన్‌ను నియమించే సమయంలో సిఐఏ అధికారులు క్షుణ్ణంగా మంచి చెడ్డల గురించి ప్రశ్నించకుండానే ఎంపిక చేశారట. అతను విదేశాలకు దేనికి వెళ్లాడు, ఏం చేశాడు, అతన్ని కలిసిన, కలుస్తున్న వ్యక్తులెవరు ? వారెలాంటి వారు తదితర అంశాలను పట్టించుకోలేదని, జాగ్రత్త చేయాలంటూ 17లక్షల రహస్య ఫైళ్లను అతనికి అప్పగించారని తెలిపింది. అయితే అతను సిఐఏ కాంట్రాక్టరుగా, సాంకేతిక సహాయకుడిగా భారత్‌ వస్తున్నట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి స్పష్టంగా తెలుసు. తాను వ్యాపారనిమిత్తం భారత్‌ వచ్చానని స్నోడెన్‌ చెప్పినట్లు అతనికి శిక్షణ ఇచ్చిన కోయింగ్‌ సొల్యూషన్స్‌ సిఇఓ రోహిత్‌ అగర్వాల్‌ చెప్పాడు. తాము సిఐఏ గూఢచారులమనిగానీ, దాని తరఫున వచ్చామని గాని ఎక్కడా వెల్లడించవద్దని సిఐఏ అధికారులు జారీ చేసిన మార్గదర్శక సూత్రాల్లోనే ఉంది కనుక స్నోడెన్‌ తాను వ్యాపారినని చెప్పాడు.అలాంటి వారందరూ ఏ దేశం వెళితే అక్కడి అమెరికా రాయబార కార్యాలయాల్లోనే పని చేస్తారు అన్నదీ బహిరంగ రహస్యమే.
సమాచారాన్ని సేకరించేందుకు, గూఢచర్యం కోసం కొన్ని కంపెనీలనే కొనుగోలు చేయటం అందరికీ తెలిసిందే.1970లో క్రిప్టో ఏజి అనే స్విస్‌ కంపెనీని అమెరికా, జర్మనీ గూఢచార సంస్ధలు కొనుగోలు చేసి వంద దేశాలల్లో వేగుల కార్యకలాపాలకు దాన్ని వేదికగా చేసుకున్నాయి. అయితే రెండు దేశాల అధికారుల మధ్య పరస్పర అనుమానాలు తలెత్తి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. సిఐఏ సిబ్బందిలో కొంత మందికి జర్మన్‌ భాష రాకపోవటం కూడా దీనికి కారణమైంది.


ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌ను కూడా ఉపయోగించుకొని వాటి ద్వారా వివిధ దేశాలకు వెళుతున్న సమాచారాన్ని తెలుసుకున్నట్లు గార్డియన్‌ పత్రిక బ్రిటన్‌ గూఢచార సంస్ధ చేసిన నిర్వాకం గురించి వెల్లడించింది. అది తాను సేకరించిన సమాచారాన్ని అమెరికా ఎన్‌ఎస్‌ఏకు అంద చేసింది. రోజుకు 60 కోట్ల మేర ఫోన్‌ సంభాషణలు, సమాచారానికి సంబంధించిన అంశాలను అందచేసేది. సముద్ర గర్భంలో వేసిన ఇటలీలోని ఆప్టిక్‌ కేబుళ్ల కేంద్రాల నుంచి వీటిని సేకరించారు. ఇదంతా చట్టబద్దమే అని ఈ కుంభకోణం వెల్లడైనపుడు బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొన్నది. సమాచారాన్ని 30 రోజుల పాటు నిల్వచేసి విశ్లేషణ చేసిన తరువాత అవసరమైన వాటిని ఉంచుకొని మిగిలిన వాటిని పారవేసేవి. అందువలన ఏ దేశంలో అయినా ఆయా ప్రభుత్వ సంస్ధలు ఫోన్‌ కంపెనీలు, ప్రయివేటు కంపెనీల ద్వారా సంబంధించిన సమాచారాన్ని పర్యవేక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాయి. అందువలన ఫోన్ల ద్వారా, టిక్‌టాక్‌ వంటి ఆప్‌ల ద్వారా సమాచారాన్ని చైనా లేదా మరొక దేశం సేకరించటం రహస్య వ్యవహారమేమీ కాదు. ప్రతి దేశమూ చేస్తున్నదే.
అమెరికా ప్రపంచ వ్యాపితంగా 61వేల హాకింగ్‌లకు అమెరికన్లు పాల్పడినట్లు ఆరు సంవత్సరాల క్రితం హాంకాంగ్‌ పత్రిక సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు బయటపెట్టింది. అన్నమైతే నేమిరా సున్నమైతే నేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లు కొన్ని అంశాల మీద భిన్నంగా మాట్లాడినా అమెరికా చేస్తున్న అన్ని అక్రమాలకు బాసటగా నిలుస్తున్న ఐరోపా యూనియన్‌ దేశాల కూటమితో సహా అమెరికా ఏ దేశాన్నీ వదలలేదు. ఎవరినీ నమ్మకపోవటమే దీనికి కారణం. చివరికి జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఫోన్లను కూడా దొంగచెవులతో విన్నట్లు పత్రికలు రాయటంతో బెర్లిన్‌లోని అమెరికా రాయబారిని పిలిపించి సంజాయిషీ అడిగారు. ఇదేం మర్యాద అంటూ ఆమె నాటి అధ్యక్షుడు ఒబామాతో ఫోన్లో మాట్లాడారు.

దొంగచెవులు, గూఢచర్యం వంటి పనులకు 2013లో అమెరికా 5,300 కోట్ల డాలర్ల( దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు) కేటాయించింది. రోజుకు 20కోట్ల వర్తమానాలను అమెరికా ప్రపంచవ్యాపితంగా సేకరించినట్లు 2014జనవరిలో గార్డియన్‌ పత్రిక రాసింది. మన ఆధార్‌ కార్డులు, వాటిని మన బ్యాంకు ఖాతాలు, ఇతర పధకాలకు అనుసంధానం చేసినందున వాటిలో ఉన్న సమాచారం మొత్తం చోరీకి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన బతుకులన్నీ బజార్లో ఉన్నట్లే ! వ్యక్తిగత సమాచార తస్కరణకు ఎవరు పాల్పడినా గర్హనీయమే, ఖండించాల్సిందే. మన దేశంతో సహా అన్ని దేశాలూ చేస్తున్నదే అన్నది పచ్చి నిజం ! ఇక్కడ సమస్య పదివేల మంది మీద నిఘావేసింది అన్న చైనా గురించి గుండెలు బాదుకుంటున్న వారికి ప్రపంచ జనాభా పడక గదుల్లో కూడా ఏం జరుగుతోందో తెలుసుకొనే అమెరికా బడా చోరీలు, చోరుల గురించి పట్టదేం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అకాలీ మంత్రి రాం రాం, 25న భారత బంద్‌ – బిజెపి భజన పార్టీల్లో భయం భయం !

19 Saturday Sep 2020

Posted by raomk in AP, AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Telangana

≈ Leave a comment

Tags

Farmers agitations, SAD minister quits modi cabinet, September 25th Bharat Bandh


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు మరి. గతంలో ఇందిరా గాంధీ మీద కూడా జనం ఈగవాలనిచ్చే వారు కాదు. ఈనెల 25న భారత బంద్‌కు పిలుపు ఇవ్వటం ద్వారా రైతు సంఘాలు మట్టి పిసుక్కునే రైతును మోడీ గురించి ఆలోచింప చేస్తున్నాయి. అకాలీ దళ్‌ మంత్రి హరసిమ్రత్‌ కౌర్‌ నరేంద్రమోడీ కొలువు నుంచి తప్పుకుంటూ చేసిన రాజీనామా మోడీ మీద మరులుకొన్న వారిని ఒక్క కుదుపు కుదిపింది. దీనర్ధం ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని కాదు. సంస్కరణలు, రైతాంగాన్ని ఆదుకొనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ ముందుకు తెస్తున్న ముప్పు గురించి గ్రామీణ భారతంలో తీవ్ర మధనానికి ఈ పరిణామం తోడ్పడుతుంది. ఈ రోజు కావాల్సింది అదే. పొలాలు పదునెక్కితేనే పంటలకు అదును, సాగు సాధ్యం. రైతాంగ బుర్రలకు అదే వర్తిస్తుంది. తమ పంటలకు మిత్ర పురుగులేవో శత్రుకీటకాలేవో తెలుసుకోగలిగిన రైతాంగం తమకు మేలు-కీడు చేసే వారిని, విధానాలను గుర్తించలేరా ?
పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతాంగం కరోనాను కూడా లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాన్ని లెక్కచేయకుండా నాకెదురేముంది అన్నట్లు పార్లమెంట్‌లో నరేంద్రమోడీ రైతాంగానికి నష్టం-కార్పొరేట్లకు ఇష్టమైన వ్యవసాయ సంబంధిత బిల్లులను ఆమోదింపచేసుకున్నారు. మేమూ సంగతేమిటో తేల్చుకుంటామని రైతులు చెబుతున్నారు. రైతువ్యతిరేకమైన చర్యలను తాము ఆమోదించలేమని చెబుతూ పంజాబ్‌ శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడి) పార్టీకి చెందిన మంత్రి హరసిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ గురువారం నాడు రాజీనామా చేయటం, దాన్ని శుక్రవారం నాడు రాష్ట్రపతి ఆమోదించటం వెంటవెంటనే జరిగిపోయాయి. రాజ్యసభలో ముగ్గురు, లోక్‌సభలో ఇద్దరు సభ్యులున్న ఈ పార్టీ మంత్రి వర్గం నుంచి తప్పుకుంది తప్ప ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినట్లు ఇది రాస్తున్న సమయానికి ప్రకటించలేదు. తాము పదవి వీడినా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తూనే రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తామని అకాలీదళ్‌ నేత, లోక్‌సభ ఎంపీ అయిన సుఖవీందర్‌ సింగ్‌ ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడే సుఖవీర్‌, ఆయన భార్యే హరసిమ్రాత్‌ కౌర్‌. స్ధానిక వత్తిళ్ల కారణంగానే ఆమె రాజీనామా చేశారు తప్ప తమ రైతాంగ విధానాలు కాదని బిజెపి ప్రకటించి సమస్య తీవ్రతను మభ్యపెట్టేందుకు, ఆందోళన చేస్తున్న రైతాంగాన్ని అవమానించేందుకు ప్రయత్నించింది. ఈ పూర్వరంగంలో ఆ పార్టీని తమ కూటమిలో ఉంచుకొని బిజెపి బావుకొనేదేమీ ఉండదు, అలాగే కొనసాగి అవమానాల పాలుకావటం తప్ప అకాలీదళ్‌ పొందే లబ్ది ఏమీ ఉండదు. ఈ నెల 25న భారత బంద్‌కు రైతు సంఘాలు పిలుపు నిచ్చినందున ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ దాని పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటాయన్నది యావత్‌ ప్రజానీకం కన్పార్పకుండా చూడనుంది.
అకాలీ మంత్రి రాజీనామాకు ముందు జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా, చిత్తశుద్ధిని ప్రశ్నించేవిగా ఉన్నాయి. అకాలీదళ్‌ అగ్రనేత అయిన 92 ఏండ్ల ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ నివాసం ముందు రైతులు నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను అంతకు ముందు కేంద్రం ఆర్డినెన్స్‌ల ద్వారా తెచ్చింది. అవి రైతులకు మేలు చేకూర్చేవి అంటూ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ సెప్టెంబరు మూడవ తేదీన ఒక వీడియో ద్వారా పంజాబ్‌ పౌరులకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవి రైతులకు హాని చేస్తాయంటూ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ రైతాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాదల్‌ ప్రకటనకు నిరసగా మూడు రోజులు వరుసగా రైతులు ఆయన నివాసం ఎదుట నిరసన తెలిపారు.ఈ నేపధ్యంలో తాము కేంద్రం నుంచి రాజీనామా చేయటం తప్ప మరొక మార్గం లేదని దళ్‌ రైతు విభాగనేత సికిందర్‌ సింగ్‌ మల్కా ప్రకటించారు. బిల్లులను వ్యతిరేకించాలని దళ్‌ విప్‌ జారీ చేసింది. చర్చలో బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులు ప్రసంగించారు. గురువారం నాడు మంత్రి రాజీనామా ప్రకటన వెలువడింది. తాను ఒక రైతుబిడ్డ, సోదరిగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.
అంతర్గతంగా అకాలీ దళ్‌ నాయకత్వం ఏ విధంగా భావించినప్పటికీ రైతాంగంలో తలెత్తిన భయాందోళనలను రాజకీయంగా తమను మరింతగా దూరం చేస్తాయని భయపడిందన్నది స్పష్టం. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మార్కెట్‌ యార్డులకు వెలుపల వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ప్రభుత్వ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఇది తమకు నష్టదాయకమని రైతులు భావిస్తున్నారు. వ్యాపారులు దేశంలో ఎక్కడైనా ఎలక్ట్రానిక్‌ పద్దతుల్లో పంటలను కొనుగోలు చేయవచ్చు.రైతులు అమ్కుకోవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత మార్కెట్ల వెలుపల జరిగి క్రయ, విక్రయాలపై మార్కెట్‌ ఫీజు, లెవీ, సెస్‌ల వంటివి విధించేవి.కార్పొరేట్లకు అనుకూలంగా తాజా బిల్లుతో వాటిని రద్దు చేశారు.
నిత్యావసరకుల చట్టానికి చేసిన సవరణల ప్రకారం కొన్ని ఉత్పత్తులను నిత్యావసర లేదా అత్యవసర వస్తువులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. వాటి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్దీకరించటం లేదా నిషేధించవచ్చు. యుద్దం, కరవు, అసాధారణంగా ధరల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే కొన్ని ఆహార వస్తువులు, ఉత్పత్తుల సరఫరాలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ధరలు గణనీయంగా పెరిగినపుడు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమాణాలపై ఆంక్షలను ప్రకటించాల్సి ఉంది.తోటల ఉత్పత్తుల ధరలు వందశాతం, ఆహార వస్తువు ధరలు 50శాతం పెరిగినపుడు వ్యాపారుల నిల్వలపై పరిమితులు విధిస్తారు. ధరల పెరుగుదలను నిర్ధారించేందుకు గడచిన పన్నెండునెలల్లో ఉన్న ధరలు లేదా గడచిన ఐదు సంవత్సరాలలో ఉన్న ధరల సగటు తీసుకొని ఏది తక్కువైతే దాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఉదాహరణకు ఉల్లిధర ఒక నెలలో కిలో 15 నుంచి 40 రూపాయలకు పెరిగిందనుకుందాం. అప్పుడు ఆంక్షలు విధించాలంటే పన్నెండు నెలల సగటు చూసినపుడు 30, ఐదేండ్ల సగటు లెక్కించినపుడు 40 రూపాయలు ఉంటే 30 రూపాయల మీద వందశాతం అంటే 60 రూపాయలకు పెరిగినపుడు, ఇదే విధంగా ఆహార వస్తువుల ధరల పెరుగుదల కూడా అలాగే ఉంటే 30 రూపాయల మీద యాభైశాతం అంటే 45 రూపాయలకు పెరిగినపుడు మాత్రమే వ్యాపారుల నిల్వల మీద ఆంక్షలు విధిస్తారు. లేనట్లయితే అపరిమితంగా నిల్వలు చేసుకోవచ్చు. వినియోగదారుల జేబులు కొల్లగొట్టవచ్చు.
రైతుల సాధికార మరియు రక్షిత బిల్లు పేరుతో తెచ్చిన దానిలో రైతులు మరియు వ్యాపారుల మధ్య ఒప్పందం( కాంట్రాక్టు ) కుదుర్చుకోవచ్చు. దాని ప్రకారం అంగీకరించిన మేరకు రైతులకు వ్యాపారులు ధరలు చెల్లించాలి, వ్యాపారులకు రైతులు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలి. ఇక్కడే మతలబు ఉంది. నాణ్యతను నిర్ణయించేది వ్యాపారులుగానే ఉంటున్నారు తప్ప రైతుల చేతుల్లో ఏమీ ఉండదు. ఆ పేరుతో ధరల్లో కోత విధిస్తే చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మార్కెట్‌ యార్డుల్లోనే నాణ్యత లేదనే పేరుతో వ్యాపారులు ధరలను తగ్గిస్తున్న విషయం తెలిసిందే. రేపు కాంట్రాక్టు వ్యవసాయంలో వ్యాపారులు అదే పని చేస్తే రైతులకు చెప్పుకొనే దిక్కు కూడా ఉండదు.
ఈ బిల్లులు చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే భవిష్యత్‌ సాగు అవసరాలకు అనువుగా ఉంటాయని వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ” బిల్లులు చట్టాలైన తరువాత పోటీ పెరుగుతుంది మరియు ప్రయివేటు పెట్టుబడులు గ్రామాలకు చేరతాయి. వ్యవసాయ ప్రాధమిక సదుపాయాలు సమకూరుతాయి, నూతన వ్యవసాయ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తాయి. ఈ సంస్కరణల ద్వారా తమ వ్యవసాయం లాభసాటిగా మారేందుకు రైతులు బడా వ్యాపారులు, ఎగుమతిదార్లతో సంబంధాలను నెలకొల్పుకోవచ్చు, ఆదాయాన్ని పెంచుకోవచ్చు ” అని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ చెప్పారు. ఇవన్నీ రైతాంగాన్ని మభ్యపెట్టేవే తప్ప మరొకటి కాదు.
పంజాబ్‌ రాజకీయాలను చూసినపుడు బిజెపి, నరేంద్రమోడీ పలుకుబడి అక్కడ పని చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచింది, అదే విధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. ఒక నాడు తిరుగులేని ప్రాంతీయ పార్టీగా ఉన్న అకాలీదళ్‌ నేడు ఒక చిన్న శక్తిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో మూడో స్ధానానికి పడిపోయింది. రైతులు ముఖ్యంగా సిక్కు జాట్ల పార్టీగా ఉన్నది కాస్తా రైతుల్లో తన పట్టును కోల్పోయింది. కేంద్రం పైన చెప్పిన వ్యవసాయ ఆర్డినెన్స్‌లు జారీ చేసిన తరువాత గత మూడు నెలలుగా వాటిని సమర్ధించేందుకు అకాలీదళ్‌ నానా పాట్లు పడింది. దేశంలో కరోనా వైరస్‌ నిరోధంలో వైఫల్యం, ఆర్ధిక రంగంలో రికార్డు స్ధాయిలో దిగజారుడు, ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఆందోళనలు చూసిన తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరువు నిలవాలంటే వాటిని వ్యతిరేకించటం తప్ప మరొక మార్గం లేదనే అంచనాకు వచ్చినట్లు కనిపిస్తోంది. లాభసాటిగా ఉంటుంది అనుకుంటే ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యం లేదు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పంజాబ్‌ రైతులు వీధుల్లోకి రావటానికి కారణాలు ఏమిటన్నది అసక్తి కరం. ఒప్పంద వ్యవసాయం అన్నది గత అకాలీ-బిజెపి ప్రభుత్వ హయాంలో 2013లోనే ప్రవేశపెట్టారు తప్ప దాని అమలు గురించి రైతాంగాన్ని వత్తిడి చేయలేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఒప్పంద వ్యవసాయాన్ని బలవంతంగా చేయిస్తారనే భయం రైతాంగంలో తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.
ఆర్డినెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ అసెంబ్లీ ఆగస్టు 28న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోలేదు. గత రెండు వారాలుగా వివిధ రైతు సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి.వాటిని ఖాతరు చేయకుండా కేంద్రం ఆర్డినెన్స్‌ల స్ధానంలో బిల్లులను ప్రతిపాదించి పార్లమెంట్‌లో ఆమోదింపచేయించుకుంది.లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత అకాలీ మంత్రి రాజీనామా చేశారు. తాము కూడా బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేస్తామని ఆమ్‌ ఆద్మీ ప్రకటించటంతో అకాలీల మీద వత్తిడి పెరిగింది.రాజీనామాతో తాము రైతుల కోసం పదవులను త్యాగం చేశామని చెప్పుకొనేందుకు అకాలీలు వెంటనే పావులు కదిపినట్లుగా భావిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్ధానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆమ్‌ఆద్మీకి 20, అకాలీ- బిజెపి కూటమికి 18 మాత్రమే వచ్చాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 13 స్ధానాలకు గాను అకాలీ, బిజెపి రెండేసి సీట్లు మాత్రమే గెలిచాయి. అకాలీ పార్టీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బిజెపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సగం సీట్లు కావాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. బాదల్‌ కుటుంబం కారణంగానే తాము కూడా ఓటమి పాలైనట్లు భావిస్తోంది. అందువలన కూడా రాజీనామా అస్త్రం ప్రయోగించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి అకాలీ మంత్రి రాజీనామా ఎన్‌డిఏలోని ఇతర చిన్న పార్టీలకు, విడిగా ఉంటూ బిజెపికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు నిస్సందేహంగా ఒక కుదుపు వంటిదే. భారత బందుకు మద్దతు ఇవ్వాలా లేదా అన్న పరీక్ష ఆ పార్టీల ముందుకు రానుంది. ఆర్ధిక వ్యవస్ధ, ఉపాధి గురించి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. మరోవైపు నరేంద్రమోడీ సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. జిఎస్‌టి నష్టపరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకొనేందుకు దేవుడి మీద నెట్టిన తీరు తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇలాగే ఎంతకైనా తెగించే అవకాశాలున్నట్లు ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి.
ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు మంగళం పాడే విద్యుత్‌ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణా అసెంబ్లీ తీర్మానం చేయటం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న భయాలను వెల్లడిస్తోంది. కానీ అదే పార్టీ వ్యవసాయ సంస్కరణల గురించి ఎలాంటి తీర్మానం చేయలేదు. తీవ్రమైన అవినీతి కేసుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి సర్కార్‌ ఏ వైఖరి తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో అనే గుంజాటనలో ఉంది. జిఎస్‌టి బకాయిలపై దేవుడి లీల అన్న కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో కలిసేందుకు ముందుకు రాలేదు. మరోవైపున విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం విధించిన షరతులను అమలు చేసేందుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. 2004 ఎన్నికల్లో బిజెపితో కలసి భంగపడిన తెలుగుదేశం2014లో లబ్ది పొందింది. వైసిపి దాడులు, కేసులను ఎదుర్కొనేందుకు బిజెపితో సఖ్యతకు ప్రయత్నించినా తాజా విద్యుత్‌, వ్యవసాయ సంస్కరణల పర్యవసానాల గురించి పునరాలోచనలో పడటం ఖాయం. ఇదే విధంగా తమిళనాడులోని అన్నాడిఎంకె, ఇతర రాష్ట్రాల్లోని బిజెపి భజన పార్టీలు కూడా ఆర్ధిక రంగంలో నరేంద్రమోడీ అనుసరించే విధానాలు, ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనే తీరు, వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణలు వాటి పర్యవసానాలు, అకాలీ పార్టీ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఏ గట్టునుండాలో తేల్చుకొనేందుకు పరిణామాలు తొందర పెడుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాల విలీనాలు-భిన్న వైఖరులు ఎందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి !

17 Thursday Sep 2020

Posted by raomk in AP, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP hypocrisy, Hyderabad liberation day, Razakars (Hyderabad), RSS - Hyderabad’s liberation, TRS government


ఎం కోటేశ్వరరావు


చరిత్ర నిర్మాతలు ప్రజలు. కానీ చరిత్రను ఎలా రాయాలో నిర్దేశించేది విజేతలు లేదా పాలకులు అన్నది ఒక అభిప్రాయం. ప్రతి దానికీ కొన్ని మినహాయింపులు ఉన్నట్లుగానే చరిత్ర నమోదులో కూడా అలాంటివి ఉండవచ్చు. చరిత్రలో మనకు నిరంకుశులు – ప్రజాస్వామ్య వాదులు, శ్రామికజన పక్షపాతులు – శ్రామిక జన వ్యతిరేకులు కనిపిస్తారు. ఆ రాణీ ప్రేమ పురాణం ఈ ముట్టడి కైన ఖర్చులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అందువలన చరిత్రను చూసే, రాసేవారి ఆసక్తి వెనుక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి వ్యక్తిగతం కావచ్చు, భావజాల పరంగానూ ఉంటాయి.


చరిత్రను వర్గదృష్టితో పరిశీలిస్తే ఒక మాదిరి, కులం – మతం- ప్రాంతీయం వంటి కళ్లద్దాలతో చూస్తే మరొక విధంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమం, సంస్కరణ, అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలతో ప్రభావితులైన తరం రాసిన చరిత్రలో ఆ భావజాల ప్రభావాలు కనిపిస్తాయి. అలాంటి శక్తులు పాలకులుగా ఉన్నారు కనుక దాన్ని వివాదాస్పదం కావించలేదు. ఆ చరిత్రకు ఆమోదం లభించింది. అయితే ఆ చరిత్ర మొత్తాన్ని కమ్యూనిస్టులు రాసిన చరిత్రగా వక్రీకరిస్తూ మన దేశంలోని మత శక్తులు ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు ఎప్పటి నుంచో చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు. వారి చరిత్ర మత ప్రాతిపదికగానే ఉంటుంది. ఆ ప్రాతిపదికతో జనాల మధ్య విభజన గోడలు కట్టాలనే ఎత్తుగడదాగి ఉంది. ఆ గోడలతో వారేమి చేసుకుంటారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న.


ఏ కులం, ఏ ప్రాంతం, మతం వారైనా కష్టజీవులుగా తాము దోపిడీకి గురవుతున్నామా లేదా అనే ప్రాతిపదికన ఆలోచించాలని కమ్యూనిస్టులు చెబుతారు. దానికి భిన్నంగా కులం, ప్రాంతం, మత ప్రాతిపదికన సమీకృతం కావాలన్నది ఆ శక్తుల వాంఛ. అదే జరిగితే నష్టపోయేది శ్రామికులు, లబ్ది పొందేది దోపిడీదార్లు. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా పాలకులు, మతం మధ్య సఖ్యత, ఒకదాన్ని ఒకటి బలపరుచుకోవటం ముఖ్యంగా ఫ్యూడల్‌ సమాజాలలో కనిపిస్తుంది. దోపిడీదార్లకు మతం ఆటంకంగా మారినపుడు దాని పెత్తనాన్ని బద్దలు కొట్టి పక్కన పెట్టటాన్ని ఐరోపా పరిణామాల్లో చూస్తాము.


ఆసియా, ఆఫ్రికా వంటి వెనుకబడిన ఇంకా ఫ్యూడల్‌ వ్యవస్ధ బలంగా ఉన్న చోట్ల మతం ప్రభావితం చేస్తూనే ఉంది. మన దేశానికి వస్తే పెట్టుబడిదార్లు మతంతో, ఫ్యూడల్‌ వ్యవస్దతో రాజీపడటం కనిపిస్తుంది. బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం చేయటం (వారి పేర్లతో దేవాలయాలను పిలవటం-హైదరాబాద్‌ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బిర్లా మందిర్‌ అనే పిలుస్తారు.) మతంతో రాజీ, దాన్ని ఉపయోగించుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. అలాగే ఇతర మతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు మసీదు, చర్చ్‌లు కట్టించినా లక్ష్యం ఒకటే.
బ్రిటీష్‌ వారి పాలనలో సంస్ధానాలు తిరుగుబాటు చేసిన చోట విలీనం చేసుకున్నారు. రాజీపడిన చోట సామంత రాజ్యాలుగా లేకా ప్రత్యేక అధికారాలు, రక్షణతో కొనసాగాయి. చరిత్రను మత ప్రాతిపదికన చూడటం ఎలా జరుగుతోందో చూద్దాం. స్వతంత్ర భారత్‌లో కలిసేందుకు హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాలు వ్యతిరేకించి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు పన్నిన వ్యూహంలో భాగంగా స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని ప్రకటించాయి. నిజానికి అవెన్నడూ స్వతంత్ర రాజ్యాలు కాదు, బ్రిటీష్‌ ఇండియాకు సామంత రాజ్యాలుగానే ఉన్నాయి. అవి స్వతంత్ర దేశాలుగా అవతరించటం అంటే మన తల మీద ఒక సామ్రాజ్యవాద తొత్తును, గుండెల మీద మరొకతొత్తును ప్రతిష్టించుకోవటం తప్ప వేరు కాదు. ఈ కుట్రను ఛేదిస్తూ నాటి కేంద్ర ప్రభుత్వం సంస్ధాలను విలీనం చేసుకున్నది.
హైదరాబాదులో సంస్ధానాధీశుడు ముస్లిం, మెజారిటీ జనాభా హిందువులు. కాశ్మీరులో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందువు. నిజాం నవాబు లొంగిపోయి ఒప్పందం చేసుకోవటాన్ని ముస్లిం పాలకుల నుంచి హిందువులు విమోచన పొందినట్లుగా బిజెపి, దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణిస్తుంది. కాశ్మీరు స్వతంత్ర రాజ్యంగా ఉండాలనటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్దించింది. దాని వాంఛలకు భిన్నంగా కాశ్మీరు విలీనంగాక తప్ప లేదు. మరి దీన్నేమనాలి ? హిందూపాలకుల నుంచి ముస్లింలు విముక్తి పొందినట్లా ?


1921లో కేరళలోని మలబారు ప్రాంతంలో జరిగిన మోప్లా తిరుగుబాటును కూడా మత కోణంతో బిజెపి చూస్తోంది. బ్రిటీష్‌ వారు, స్ధానిక భూస్వాముల మీద ఆ ప్రాంతంలో గణనీయంగా ఉన్న ముస్లింలు, ఇతరులు జరిపిన తిరుగుబాటును హిందువుల మీద జరిగిన దాడులుగా చిత్రించి దాన్ని స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నిరాకరిస్తూ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేందుకు నిర్ణయించింది.


ఆపరేషన్‌ పోలో పేరుతో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్దానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసుకున్న రోజు. నాలుగు రోజుల్లోనే యూనియన్‌ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం నవాబు సైన్యం చేతులెత్తేసింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తిలక్‌ వంటి వారు జనాన్ని సమీకరించేందుకు నాటి ముంబై ప్రావిన్సులో వినాయకచవితి పండుగలను ప్రోత్సహించారు. అలాగే నిజాం రాజు సంఘం పేరుతో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రారంభమైన పోరుతో తన అధికారానికి ఎసరు రావటాన్ని గమనించి మతం పేరుతో సంస్ధానంలో ఉన్న ముస్లింలను ఆ ఉద్యమానికి దూరం చేసేందుకు, అణచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రయివేటు మిలిటెంట్లను ప్రోత్సహించాడు. ఆ శక్తులు మతోన్మాదంతో ఉత్తేజం పొందినవి కావటంతో వారి చర్యల్లో ఎక్కడైనా కొన్ని మత ప్రాతిపదికన జరిగి ఉండవచ్చు తప్ప రజాకార్లు నాటి హిందూ, ముస్లిం మతాలకు చెందిన జాగీర్దార్లు, దేశముఖుల రక్షణకోసమే పని చేశారు. వారిని వ్యతిరేకించిన వారిలో ఎందరో సామాన్య ముస్లింలు ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాటానికి నాంది అయిన భూ సమస్యలో దేశముఖ్‌కు వ్యతిరేకంగా చట్టబద్దమైన పోరు సాగించిన సామాన్య ముస్లిం రైతు బందగీ కోర్టులో విజయం సాధించిన తరువాత హత్యకు గురికావటం ఉద్యమానికి నిప్పురవ్వను రగిలించిన ఉదంతం కాదా ?


నిజాం రాచరికపు దౌర్జన్యాలను ఎండగట్టిన కలం యోధుడు షోయబుల్లాఖాన్‌. నిజాం రజాకార్‌ మూకల దాడిలోనే కన్నుమూసిన వీరుడు. రాచరికపు నిర్బంధాన్ని లెక్కచేయక, 1938లోనే ఔరంగాబాద్‌లో శ్రామిక మహాసభలో పాల్గొని మఖ్దూం మొహియుద్దీన్‌, హబీబ్‌లు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా 1939లో హైదరాబాద్‌లో కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ప్రారంభించిన వారిలో ఆలం ఖుంద్‌మిరీ ఒకరు. ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ తొలి అధ్యక్షుడు మఖ్దూం మొహియుద్దీన్‌. 1947 ఆగస్టు 15న ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగురవేశారు. నిజాం కాలేజీలో విద్యార్థి నాయకుడు రఫీ అహ్మద్‌ కూడా జాతీయ పతాకం ఆవిష్కరించారు. వీరంతా ఎవరు ?


విసునూరు దేశ్‌ ముఖ్‌ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ భూమి రక్షణ కోసం జరిగిన పోరాటం రైతాంగానికి స్ఫూర్తి నిచ్చింది. 1946, జూలై 4న దొడ్డి కొమరయ్య నేలకొరగటంతో రైతాంగం తిరుగుబాటు ప్రారంభమైంది. పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే 1947, ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. అప్పటికే చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగుతున్న లాంగ్‌ మార్చ్‌ అనేక ప్రాంతాలను విముక్తి చేసింది. తెలంగాణాలో కమ్యూనిస్టులు నిజాం సైన్యాలు, రజాకార్లను చావు దెబ్బతీస్తున్నారు. అక్కడ కూడా కమ్యూనిస్టులు ఆధిపత్యం వహిస్తే నైజాం సంస్ధానం మరో ఏనాన్‌గా మారుతుందేమో అని అమెరికా,బ్రిటన్‌ పాలకులు భయపడి దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అణచివేయాలని నెహ్రూ ప్రభుత్వాన్ని కోరారు.


కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు సంఘటితంగా ముందుకు సాగటం తట్టుకోలేని భూస్వాముల పెద్దలైన బూర్గుల రామక్రిష్ణారావు, కెవి రంగారెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి అక్కడ నెహ్రూ, పటేల్‌ తదితర పెద్దలకు మొరపెట్టుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజంటు కె యం మున్షీ ని వివరాలు కోరారు. ఆయన ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పాడు. నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లోకి నైజాం పోలీసులు కానీ, రజాకారు మూకలు గానీ పోలేకపోతున్నాయి. ఇంతకుముందు గ్రామాల మీదే కేంద్రీకరించే వాళ్ళు, ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలపై కూడా కేంద్రీకరిస్తున్నారు. వాళ్ళకు ప్రజామద్దతు రోజరోజుకు పెరిగిపోతోంది. ఇదంతా బెజవాడ కేంద్రంగా కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్న పట్టు అని రిపోర్టు ఇచ్చాడు. అసలే హైదరాబాద్‌ దేశానికి నడిబొడ్డున ఉంది. ఇది ఇలాగే ఉంటే కమ్యూనిస్టుల చేతికిపోతే మొత్తం దక్షిణ భారత దేశంపై దీని ప్రభావం పడుతుంది. ఆ తరువాత దేశం మొత్తానికి విస్తరించినా విస్తరించవచ్చు. ఇక మనం ఉపేక్షించటం మంచిది కాదని భావించిన కేంద్రం వెంటనే సైనికచర్యకు ఉపక్రమించింది. దానికే ఆపరేషన్‌ పోలో అని పేరు పెట్టారు. ఆ కారణంగానే కాశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాకిస్ధాన్‌పై దాడి కంటే నెజాం సంస్ధాన విలీనానికి ఎక్కువ మంది మిలిటరీని దించారు. జనరల్‌ జెయన్‌ ఛౌదరి నాయకత్వలో సైన్యాలు వచ్చాయి. సెప్టెంబర్‌ 13న వచ్చాయి. 17కల్లా ఆపరేషన్‌ క్లోజ్‌ అయింది.


తెలంగాణలో కమ్యూనిస్టు నాయకత్వంలో రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్‌ రైతాంగం కూడా షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా రైతాంగం కాశ్మీరు రాజు సైన్యం, తరువాత పాకిస్థాన్‌ సైన్యాలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కాశ్మీర్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది.
రెండు చోట్లా ప్రజాపోరాటాలు ముందుకు తెచ్చిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కొత్త సమస్యలు తలెత్తాయి. వాటిని పక్కన పెట్టి తెలంగాణా బీజేపీ, ఆరెస్సెస్‌ పరివారం విలీనమా? విమోచనమా? అన్న చర్చను ముందుకు తెస్తున్నది. విలీనం ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిం రాజు నుంచి హిందువుల విమోచనగా వక్రీకరిస్తున్నారు. కాశ్మీరు విలీనానికి అంగీకరించిన ప్రత్యేక రక్షణలను తొలగించటమే కాదు చివరకు ఆ రాష్ట్రాన్నే బిజెపి రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసింది. హైదరాబాద్‌ రాజ్యం గానీ, కాశ్మీర్‌ సంస్థానం గానీ ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో విలీనమైన విషయం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడదు. మెజారిటీ మత సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఈ అంశాల మీద ఆ పార్టీ వ్యవహరిస్తోంది అని చెప్పవచ్చు.


హైదరాబాద్‌, కాశ్మీర్‌ రాచరికాలను కూలదోయటం గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ రెండు ప్రాంతాలలోనూ రైతాంగ పోరాటాలతో సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలే, స్వాతంత్య్రోద్యమ సంప్రదాయాల ఫలితంగా ఏర్పడిన ఇండియన్‌ యూనియన్‌లో విలీనానికి పునాది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం సరైనదా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే దాని ప్రకారం హిందువుల విముక్తి కోసం పోరాడే చిత్తశుద్ది దానికి నిజంగా ఉంటే బ్రిటీష్‌ ఇండియాలో ముస్లిం పాలకుడి పాలనలో అణచివేతకు గురైన మెజారిటీ హిందువులున్న హైదరాబాదు సంస్దానంవైపు అది ఎందుకు చూడలేదు. దానిలో 85శాతం హిందువులు, 12శాతమే ముస్లింలు ఉన్నారు. దేశ సగటు కంటే ఎక్కువ మంది హిందువులున్న ప్రాంతం. తెలంగాణా ఫ్యూడల్‌ శక్తుల వ్యతిరేక పోరాటంతో అణుమాత్రం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు. కాశ్మీర్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావద్దనీ, రాచరికమే కొనసాగాలనీ చెప్పిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. అంతే కాదు అక్కడి భూమిలో ఎక్కువ భాగం హిందూ భూస్వాముల చేతుల్లో ఉంది. ఆ భూమి కోసం పోరాటం నిర్వహించిన షేక్‌ అబ్దుల్లాను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించి భూస్వాముల కొమ్ము కాచింది. అటు స్వాతంత్య్రోద్యమంతోనూ సంబంధం లేకపోగా తెల్లదొరల సేవలో తరించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. మెజారిటీ పౌరులు ముస్లింలు, పాలకుడు, భూస్వాములు హిందువులు కావటంతో వారికి మద్దతుగా కాశ్మీరులో తన శాఖలను ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేకంగా ప్రయత్నించింది. ప్రజాపరిషత్‌ అనే సంస్ధ ముసుగులో భూస్వాముల తరఫున పని చేసింది. అదే హైదరాబాదు సంస్ధానంలో రాజు ముస్లిం, 95శాతంపైగా భూస్వాములు హిందువులు, వారంతా రాజు మద్దతుదారులుగా ఉన్నందున ఆ ప్రాంతంలో తన మత రాజకీయాలకు చోటు ఉండదు,అన్నింటికీ మించి రాజు – భూస్వాములు కలసే జనాన్ని దోపిడీ చేస్తున్నందున భూస్వాములకు ప్రత్యేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం కలగలేదు కనుకనే కేంద్రీకరించలేదని చెప్పవచ్చు.మహాత్మా గాంధీ హత్య కారణంగా నిషేధానికి గురైన ఈ సంస్ద భవిష్యత్‌లో రాజకీయాల్లో పొల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా కొనసాగుతామని కేంద్ర ప్రభుత్వానికి హామీ పత్రం రాసి ఇచ్చింది. దాంతో రాజకీయ రంగంలో కార్యకలాపాల కోసం 1950దశకంలో జనసంఫ్‌ు అనే రాజకీయ పార్టీని ముందుకు తెచ్చింది.


” భారత రాజ్యాంగ సభలో చేరేందుకు తిరస్కరించిన సంస్థానాలలో కాశ్మీరు ఒకటి. మంత్రివర్గ పధకం కింద ఏర్పాటైన ఆ సభ 1946 డిసెంబరు నుంచి పని చేస్తున్నది. ఏ రాష్ట్రమైనా అలా తిరస్కరిస్తే దాన్ని శత్రుపూరిత చర్యగా పరిగణించాల్సి ఉంటుందని తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడిగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ హెచ్చరించినప్పటికీ మహరాజు తిరస్కరించారు. సంస్థానాధీశులకు స్వతంత్రంగా ఉండే హక్కుకు నిర్ద్వంద్వంగా ముస్లిం లీగు మద్దతు ప్రకటించటం రాజ్యాంగ సభలో చేరకూడదనే రాజు మూర్ఖత్వాన్ని మరింత బలపరించింది.1947 జూన్‌ 17న ముస్లింలీగ్‌ నేత మహమ్మదాలీ జిన్నా ఈ మేరకు ప్రకటించారు. జమ్ము -కాశ్మీరు గనుక స్వతంత్ర దేశంగా ఉండదలచుకుంటే పాకిస్తాన్‌ స్వాగతిస్తుందని, స్నేహపూరిత ఒప్పందాలు చేసుకుంటుందని 1947 జూలై 11న మరింత స్పష్టంగా వెల్లడించారు.


విడిపోవటం ఖాయమని స్పష్టమైన తరువాత మహరాజు(కాశ్మీర్‌) భారత్‌లో చేరే మానసిక స్థితిలో లేరు. జమ్ము మరియు కాశ్మీర్‌ పేర్కొంటున్నదానిని హిందూ రాజ్యంగా ఉంచాలని, లౌకిక భారత్‌గా గుర్తింపు ఉండకూడదని, విలీనం చేయకూడదని రాజుకు విధేయులుగా ఉన్న జమ్మూలోని హిందూ నేతలు రాజుకు మద్దతు ఇచ్చారు.ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ (ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పూర్వ అవతారము) 1947 మే నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహారాజు పట్ల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ విలీనం గురించి ఇప్పుడు చేస్తున్నదానికి తరువాత చేయాల్సినదానికి తమ మద్దతు ఉంటుందని దానిలో పేర్కొన్నారు.1947 మే నెలలోనే ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు చౌదరి హమీదుల్లా ఖాన్‌ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తక్షణమే కాశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించాలని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని మహరాజును కోరారు. దీనికి ముస్లింలంతా సహకరిస్తారని, స్వతంత్ర మరియు ప్రజాస్వామిక కాశ్మీర్‌ దేశానికి తొలి రాజ్యాంగబద్ద పాలకుడిగా మహరాజుకు మద్దతు ఇస్తామని హామీని ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్‌ ప్రభుత్వం కాశ్మీర్‌ మీద దాడికి వస్తే దేశంలోని ముస్లింలు దానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపడతారు, అవసరమైతే భారత్‌ సాయం కూడా కోరతామని చెప్పారు. నాతో సహా భారత్‌కు అనుకూలంగా గళమెత్తిన వారందరినీ హిందూ వ్యతిరేకులు, ద్రోహులు అని హిందూ దురహంకారులు ఖండించారు.భారత్‌లో విలీనం కావాలని, షేక్‌ అబ్దుల్లాను విడుదల చేయాలని ముల్కరాజ్‌ సరాఫ్‌ సంపాదకత్వంలోని జమ్మూ దినపత్రిక రణవీర్‌ రాసినందుకు 1947 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.”
ఈ వివరాలను ఎపిలోగ్‌ అనే పత్రిక 2010 నవంబరు సంచికలో ప్రత్యక్ష సాక్షి అనే శీర్షికతో 2005లో పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న, జమ్మూకు చెందిన ప్రముఖ జర్నలిస్టు బలరాజ్‌ పూరీ రాశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ వాదుల నిజస్వరూపం. ఇప్పుడు వారు దేశ సమగ్రత గురించి జనాలకు సుభాషితాలు చెబుతున్నారు. ఈ విద్రోహకర పాత్ర దాస్తే దాగేది కాదు. నేటి తరాలకు చరిత్రపట్ల ఆసక్తి లేదనే భావంతో పచ్చి అవాస్తవాలు, ద్రోహాన్ని కప్పి పుచ్చుకొనేందుకు దేశంలో మరింతగా సామాజిక విభజనను రెచ్చగొట్టేందుకు విషపు బీజాలు నాటారు. అవి ఇప్పుడు వృక్షాలుగా మారి విషఫలాలను ఇస్తున్నాయి.


సెప్టెంబర్‌ 17ను కొందరు విద్రోహ దినోత్సవం అంటు న్నారు. కొందరు విమోచన దినోత్సవం అంటున్నారు. కొందరు విలీన దినోత్సవం అంటున్నారు. దీనిని ఎలా చూడాలి? నైజాం వ్యతిరేక పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంస్దాన విలీనం జరిగింది. నిజాం వ్యతిరేక పోరుకు నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో కొందరు యూనియన్‌ సైన్యాలు వచ్చినందున నెహ్రూ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుంది కనుక సాయుధ పోరాటాన్ని విరమించాలని చెప్పటమే కాదు, ఆయుధాలు పారవేశారు. అయితే కొద్ది రోజుల్లోనే నెహ్రు ప్రభుత్వ వర్గనైజం బయట పడింది. సాధించిన విజయాల రక్షణకు మరికొన్ని సంవత్సరాలు పోరు జరపాల్సి వచ్చింది.


నైజాం రాజు స్వాతంత్య్ర వ్యతిరేకి. విలీనానికి ముందు ఒక ఫర్మానా జారీ చేశాడు. ఎవ్వరూ ఎక్కడా సంస్ధానంలో త్రివర్ణ పతాకం ఎగురవేయగూడదనేది ఆ హుకుం. ఏ వ్యక్తి అయినా జాతీయ జండా ఎగురవేస్తే ఇతర దేశాల జండా ఎగరేసినట్టే. అందుకు 3ఏండ్లు జైలుశిక్ష గానీ, జరిమానా కానీ లేదా ఆ రెండూ కానీ అమలు చేస్తామనేది ఆ ఫర్మానా సారాంశం. కమ్యూనిస్టులు, యువత, విద్యార్ధులు ఈ ఫర్మానాను ధిక్కరించి ముందుకురికారు. హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకుడు రఫీ అహ్మద్‌ నిజాం కాలేజీలో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. సుల్తాన్‌బజార్‌లో కాంగ్రెస్‌ నాయకుడు స్వామి రామానంద తీర్థ జాతీయ జెండా ఎగరేశాడు. బ్రిజ్‌రాణీ గౌర్‌ కోఠీ మహిళా మండలిలో జండా ఎగరేశారు. ఇలా అనేక చోట్ల పతాకావిష్కరణలు జరిగాయి. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం, నైజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతధస్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ ఎగ్రిమెంట్‌) 1947 నవంబర్‌ 29న చేసుకుంది.


ప్రజల మీద సాగించిన దాడులు, హత్యాకాండకు నిజాం రాజు, రజాకార్‌ మూకలు, వారికి మద్దతుగా ఉన్న దేశ ముఖ్‌లు, జాగిర్దార్లను విచారణ జరిపి శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిజాంను విలీనం తరువాత రాజప్రముఖ్‌గా నియమించింది. అపార ఆస్తులు వదిలేశారు. ఆ రోజుల్లో సంవత్సరానికి 50లక్షల జీతం ఇచ్చారు. 1951 అక్టోబర్‌ 31వరకూ ఆయనను ఆ పదవిలో కొనసాగించారు. రాజాభరణాలు ఇచ్చారు. నవాబుకే కాకుండా, జమిందార్లు, జాగీర్‌దార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి పరిహారం చెల్లించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ నవాబ్‌ ఫర్మానా జారీ చేశాడు. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు వరకు అంటే 1950 జనవరి 26 వరకు నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్‌ రాష్ట్రంలో పరిపాలన సాగింది. 1950 జనవరి 26న ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించడం నైజాం చేతులమీదుగానే సాగింది.


యూనియన్‌ మిలిటరీ రావటంతో అంతకు ముందు గ్రామాల నుంచి పారిపోయిన జాగీర్దార్లు, దేశముఖులు తిరిగి గ్రామాలకు వచ్చి రైతాంగం చేతుల్లోని భూములను లాక్కోవటం ప్రారంభించారు. వాటిని రక్షించుకొనేందుకు కమ్యూనిస్టులు 1951వరకు సాయుధపోరాటాన్ని కొనసాగించారు. యూనియన్‌ సైన్యాలు రైతాంగం మీద విరుచుకుపడ్డాయి. నిజాం ప్రభుత్వ దాడిలో మరణించింది 1500మంది కాగా, నెహ్రూ సైన్యాలు 2500 మందిని పొట్టన పెట్టుకున్నాయి. అందువలన కమ్యూనిస్టులలో కొందరు సెప్టెంబరు 17ను విద్రోహదినంగా పరిగణించారు. ఇప్పటికీ అదే భావంతో ఉన్నవారు కూడా ఉన్నారు.
భూసంస్కరణలకు, కౌలుదార్ల హక్కులు కాపాడేందుకు కేంద్రం ఒప్పుకోవటంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం విరమించారు. దీన్ని తరువాత నక్సల్స్‌గా మారిన వారు రివిజనిజంగా, తెలంగాణా రైతాంగానికి చేసిన ద్రోహంగా పరిగణించటమే కాకుండా పోరాటాన్ని కొనసాగించి ఉండాల్సిందని సూత్రీకరించారు. కొనసాగించి ఉంటే చైనాలో మాదిరి దేశంలో విప్లవానికి దారితీసేదన్నది వారి భావం.

సెప్టెంబరు 17ను తెలంగాణా విమోచన పేరుతో బిజెపి, సమైక్యతా దినంగా తెలంగాణా ప్రభుత్వం పాటిస్తున్నది. తెలంగాణా రైతాంగం సాధించుకున్న హక్కులను హరించిన విద్రోహ దినంగా పరిగణించిన కమ్యూనిస్టులు బిజెపి ఇతర కొన్ని శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్న పూర్వరంగంలో వారు కూడా ఈ సందర్భంగా సభలు జరిపి జనాన్ని చైతన్య పరిచేందుకు, నైజాం సంస్థాన విలీనంలో చెరగని కమ్యూనిస్టుల పాత్రను వివరించేందుకు నిర్ణయించారు.


రైతాంగం, వృత్తుల వారిని అణచేందుకు హిందూ జమీందార్లూ, ముస్లిం రాజూ ఏకమయ్యారు. రైతాంగానికీ, జమీందార్లకు మధ్య సాగిన వర్గపోరాటం అది. ఈ వర్గ ఐక్యతను మరుగుపరచేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పోరాటంతో ఏ సంబంధమూలేని ఆ పార్టీ దీనిని హిందువుల విమోచనా దినోత్సవంగా జరపాలని అంటున్నది. 1947 అక్టోబరు 26న విలీనమైన కాశ్మీర్‌ దినోత్సవం లేదా సెప్టెంబరు 15న విలీనమైన జునాగఢ్‌ దినోత్సవాలను గానీ జరపాలని ఆ పార్టీ ఎన్నడూ చెప్పలేదు. సెప్టెంబర్‌ 17న నైజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసింది వాస్తవం. ఈ నేపధ్యంలో విలీనాన్ని ఉత్సవంగా జరపాలా లేక ఆ రోజును స్మరించుకుంటూ కర్తవ్యాలను నిర్ణయించుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.

గమనిక : 2020 సెప్టెంబరు 17న రాసిన ఈ విశ్లేషణను నవీకరించి తిరిగి పాఠకులకు అందించటమైంది

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేవుడి మీద ఒట్టు – నిజంగానే యావత్‌ ప్రపంచం నరేంద్రమోడీ వైపు చూస్తోంది !

12 Saturday Sep 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India economy, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్‌ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్దానంతో 66లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ రోజులు పట్టదు. ఇతర దేశాల జనాభాతో పోలిస్తే మన కేసుల సంఖ్య తక్కువే అని ప్రాధమిక గణితం తెలిసిన వారు కూడా చెబుతారు. సంతోషించాల్సిన అంశమే. దీన్ని నరేంద్రమోడీ గారి విజయ ఖాతాలోనే వేద్దాం. కేసులు తక్కువగా ఉన్నపుడు లాక్‌డౌన్‌ ప్రకటించి విపరీతంగా పెరుగుతున్నపుడు ఎత్తివేసిన ఘనతను కూడా ఆయనకే ఆపాదిద్దాం.


జనవరిలోనే వైరస్‌ గురించి తెలిసినా, అధికారులు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించి సకాలంలో లాక్‌డౌన్‌ ప్రకటించకుండా, ప్రకటించినా అరకొర చర్యలతో అమెరికన్లకు ముప్పు తెచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. ఆ పెద్దమనిషి జిగినీ దోస్తు, కౌగిలింతల ఫేం నరేంద్రమోడీ మే 16వ తేదీ నాటికి కరోనా కేసులు పూర్తిగా ఆగిపోతాయని చెప్పిన నీతి ఆయోగ్‌ అధికారుల మాటలు నమ్మినట్లు కనిపిస్తోంది. నిజంగా తగ్గిపోతే ఆ ఖ్యాతి తనఖాతాలో ఎక్కడ పడదోనని పెద్ద నోట్లను రద్దు చేసిన మాదిరి ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో చర్చలు లేకుండా ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు నరేంద్రమోడీ. అయితే అంచనాలు తప్పి కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ దశలవారీ ఎత్తివేసి మరింత పెరిగేందుకు కారకులయ్యారు, అయినా దాన్ని కూడా విజయంగానే చిత్రించేందుకు ప్రయత్నించారన్నది సర్వత్రా వినిపిస్తున్నమాట. అధికారులదేముంది ! రాజుగారికి ఏది ప్రియమో అదే కదా చెప్పేది. తప్పుడు సలహాలు, జోశ్యాలు చెప్పిన వారి మీద చర్య తీసుకున్నారా ? అదేమీ లేదు.


అన్నీ బాగానే ఉన్నాయి. అసలు విషయం ఆర్ధికం సంగతేమిటి ? దీన్ని ఎవరి ఖాతాలో వేయాలి, ఎవరిని బాధ్యులుగా చేయాలి ? నాకు సంబంధం అంటకట్టేందుకు చూస్తున్నారు, నాకేం బాధ్యత లేదు అని జిఎస్‌టి విషయంలో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గారికి పగలూ, రేయీ దేవతలతో సహా కలలోకి వచ్చిన దేవుడు ఒకటికి పదిసార్లు స్పష్టం చేశారని తెలిసింది.


పెద్ద వాటిలో ఒక్క చైనా తప్ప అనేక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు కరోనా భాషలో చెప్పాలంటే ఆక్సిజన్‌ సిలిండర్ల మీద ఉన్నాయి. మనది వెంటిలేటర్‌ మీద ఉంది అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్న తెలుగు లోకోక్తి తెలిసిందే.జనాభాతో పోల్చుకుంటే మన కరోనా కేసులు తక్కువ అని చెబుతున్నవారు ఆర్ధిక రంగంలో అన్ని దేశాల కంటే దిగజారుడులో అగ్రస్ధానంలోకి ఎందుకు నెట్టారో మాట్లాడరేమి ? ఏమిటీ మన దేశ ప్రత్యేకత ? అదైనా చెప్పాలి కదా !
వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో అంటే ఏప్రిల్‌-జూన్‌ మధ్య జిడిపి వృద్ది రేటు 24శాతం తిరోగమనంలో ఉందని, ఇంకా లెక్కలు పూర్తిగానందున నవంబరు 28న సరైన లెక్కలు చెబుతామని కేంద్రం ప్రకటించింది. కొందరు ఆర్ధికవేత్తలు దిగజారుడు 35శాతం వరకు వుండవచ్చని చెప్పారు. నిండా మునిగిన వారికి లోతు ఎంత ఉంటేనేం ! మొదటి మూడు నెలలే కాదు మిగిలిన తొమ్మిదినెలలూ ఎంత తిరోగమనంలో ఉంటామన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం తప్ప మిగిలిన అందరూ కుస్తీపడుతున్నారు.


వర్తమాన ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి(2021 మార్చి 31) మన ఆర్ధిక వ్యవస్ధ 14.8శాతం తిరోగమనంలో ఉంటుందని గోల్డ్‌మన్‌ శాచస్‌, 10.5శాతమని ఫిచ్‌ రేటింగ్‌ సంస్ధలు జోశ్యం చెప్పగా మన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్ధికవేత్తలు 16.5శాతంగా పేర్కొన్నారు. వరుసగా రెండు త్రైమాసాలు(ఆరునెలలు) ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనంలో ఉంటే మాంద్యం అంటారు. స్వతంత్ర భారత చరిత్రలో 1958లో 1.2శాతం 1966లో 3.66, 1973లో 0.32, 1980లో 5.2శాతం తిరోగమన వృద్ధి నమోదైంది. తొలి త్రైమాసిక తాత్కాలిక ఫలితాలను ప్రకటించిన తరువాత ప్రతి సంస్ధ అంతకు ముందు వేసిన అంచనాలను సవరించి లోటును మరింత పెంచింది. ఉదాహరణకు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసర్చ్‌ సంస్ద 5.3శాతంగా పేర్కొన్న లోటును 11.8శాతానికి పెంచింది.ఎస్‌బిఐ మాత్రం 20 నుంచి 16.5శాతానికి తగ్గించింది. అయితే వచ్చే జూన్‌ నాటికి ఆర్ధిక వ్యవస్ద పురోగమించవచ్చని కూడా ఈ సంస్దలు జోశ్యం చెబుతున్నాయి. రెండవ త్రైమాసంలో 12శాతం విలోమ అభివృద్ధి ఉంటుందని, రానున్న మూడు సంవత్సరాలలో సగటున పదమూడు శాతం చొప్పున అభివృద్ధి నమోదు చేస్తేనే కరోనాకు ముందున్న స్ధాయికి జిడిపి చేరుకుంటుందని క్రిసిల్‌ సంస్ధ చెప్పింది.
వాస్తవ జిడిపిలో పదమూడు శాతం అంటే 30లక్షల కోట్ల రూపాయలు శరీరం మీద మిగిలిపోయే మచ్చ మాదిరి శాశ్వత నష్టం సంభవిస్తుందని, ఆసియా-పసిఫిక్‌ ప్రాంత దేశాలలో ఈ నష్టం మూడు శాతానికి మించి ఉండదని క్రిసిల్‌ పేర్కొన్నది. జి20 దేశాలలో మన జిడిపి పతనం గరిష్టంగా ఉందని మూడీస్‌ పేర్కొన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే ఏడాది కూడా జిడిపిలోటులోనే ఉంటుందని అంచనా వేసింది.ఆక్స్‌ఫర్డ్‌ అనలిటికా మరింత స్పష్టంగా సచిత్రంగా చూపింది. భారత్‌లో మరో ఉద్దీపన పధకాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అభిప్రాయపడింది. ఆరోగ్యం, ఆహారం, అవసరమైన వారికి ఆదాయ మద్దతు, వాణిజ్యానికి రాయితీలు ఇవ్వాలని ఐఎంఎఫ్‌ సమాచార శాఖ అధికారి గెరీ రైస్‌ చెప్పారు. వర్తమాన సంవత్సరంలో 4.5శాతం, వచ్చే ఏడాది ఆరుశాతం తిరోగమన వృద్ధి ఉంటుందని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది.


కరోనా వైరస్‌ సమయంలో ప్రభుత్వ ఖర్చు తగ్గినకారణంగా అదిశాశ్వత నష్టాన్ని కలిగించవచ్చని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వం తన డబ్బు సంచి ముడి విప్పకపోతే కోలుకోవటం కష్టమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉద్దీపన ప్రకటించాలనే సూచనలు అన్ని వైపుల నుంచీ వస్తున్నాయి. ఇది కూడా 21లక్షల కోట్ల రూపాయల పధకం వంటిదే అయితే ప్రభుత్వం రానున్న రోజుల్లో మరింత నగుబాట్ల పాలు కావటం ఖాయం.
ఏప్రిల్‌ జూలై మాసాల్లో గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 9.4లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ ఏడాది ఆ వ్యవధిలో 10.5లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది కంటే తక్కువ.2020-21 బడ్జెట్‌లో అంతకు ముందు సంవత్సరం కంటే మొత్తంగా 12.7శాతం అదనపు ఖర్చు ఉంటుందని ప్రతిపాదించారు. అయితే ఇప్పటి వరకు పెరిగింది 11.3శాతం మాత్రమే. కరోనా బాధితులను ఆదుకొనేందుకు మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పుకొనే చర్యలకు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చినట్లు ? బడ్జెట్‌లో కొన్నింటికి తగ్గించి మరికొన్నింటికీ ఖర్చు చేస్తున్నారను కోవాలి. ఇది కూడా రెవెన్యూ ఖర్చు తప్ప దాని మీద వచ్చే రాబడి నామమాత్రం. దాని వలన ఆస్తుల కల్పన జరగదు, ఉపాధి పరిమితం తప్ప పెరగదు. మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వం ఖర్చు చేస్తే వాటిని వినియోగించుకొనేందుకు ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. తద్వారా కొంత ఉపాధి పెరుగుతుంది. ఇప్పుడు అది చాలా పరిమితంగానే చేస్తున్నారు. ఇది ఆర్ధిక వ్యవస్ధ దిగజారటానికి లేదా పక్షవాత రోగి మాదిరి తయారు కావటానికి దారితీస్తుంది.


సిఎంఐయి సంస్ధ సమాచారం ప్రకారం గత రెండు సంవత్సరాలలో ప్రతి మూడు మాసాలకు 1.5లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చేసిన ఖర్చు రూ.19,200 కోట్లు మాత్రమే. 2018-19 మరియు 2019-20సంవత్సరాలలో ప్రతి మూడు మాసాలకు సగటున మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం లేదా ప్రయివేటు రంగం కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి. అంత మొత్తం ఉన్నపుడే ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు ప్రారంభం అయింది. ఇప్పుడు జూన్‌తో ముగిసిన మూడు మాసాల్లో ప్రకటించిన నూతన ప్రాజెక్టుల విలువ ఐదోవంతు కేవలం రూ.70,600 కోట్లు మాత్రమే. గతంలో ప్రకటించిన పధకాల పూర్తి కూడా చాలా తక్కువగా ఉంది. ప్రయివేటు వినియోగం 2014 సెప్టెంబరు తరువాత కనిష్టంగా నమోదైంది.
కేంద్రం, రాష్ట్రాలు కరోనా ఉద్దీపనల పేరుతో చేసిన ఖర్చు ఏప్రిల్‌-జూన్‌ మధ్య 16శాతం పెరిగింది. ఇది పెట్టుబడులను ఆకర్షించటానికి లేదా ప్రయివేటు వినిమయం పెరగటానికి గానీ తోడ్పడదని ఆర్ధిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఉపాధి పోగొట్టుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉంటే పని చేస్తున్న వారికి కూడా వేతనాల కోత గురించి తెలిసిందే. ఇది పారిశ్రామిక, సేవా రంగాలలో మాంద్యానికి దోహదం చేసింది. ఎగుమతులు 19శాతం పడిపోయాయి. ఇది ఒక నష్టం. ఇదే సమయంలో దిగుమతులు 40శాతం తగ్గిపోయాయి. దీని అర్ధం ఏమిటి ? కొనుగోలు డిమాండ్‌ తగ్గిపోవటమే, అది కేంద్రానికి, రాష్ట్రాలకు వచ్చే ఆదాయానికి కూడా గండికొడుతుంది.
కరోనాను ఎదుర్కొనేందుకు లేదా దాని కారణంగా దిగజారిన ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించేందుకు అదనపు ఖర్చు చేసినందువలన గాక ఆదాయం తగ్గిన కారణంగానే లోటు ఏర్పడుతున్నది. దానిని పూడ్చుకొనేందుకు కేంద్రం అప్పులు చేయటానికి లేదా రిజర్వుబ్యాంకును ఆదేశించి అదనంగా నోట్లను ముద్రించి కేంద్రం కొంత మేరకు బయటపడవచ్చు. రాష్ట్రాలు అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోతాయి. రిజర్వుబ్యాంకు నోట్లను ముద్రిస్తే అది ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. గతంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన బిజెపికి దాని పర్యవసానాలు తెలుసు కనుక నోట్ల ముద్రణ గురించి గుంజాటన పడుతోంది. అవసరమైన సాకులు వెతుకుతోందని చెప్పవచ్చు. ఏ పేరుతో చేసినా అది సామాన్యుల నెత్తిమీద మోదటమే అవుతుంది. ద్రవ్యలోటు పన్నెండు శాతానికి పెరుగుతుందని, అప్పులు జిడిపిలో 90శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్ధను పునరుజ్జీవింప చేసేందుకు పెద్ద ఉద్దీపన పధకాన్ని ప్రకటించాలని ఫిక్కి అధ్యక్షురాలు సంగీతా రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. లాక్‌డౌన్‌ సడలించిన కారణంగా తమ ఆర్డర్లు పెరిగాయని 25శాతం కంపెనీలే జూన్‌లో పేర్కొనగా ఆగస్టునాటికి 44శాతానికి చేరాయని ఆమె పేర్కొన్నారు.


1933లో అమెరికా ఎదుర్కొన్న మాదిరి సవాలును ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటోందని ప్రధాని ఆర్ధిక సలహాదారుల బృంద సభ్యుడైన నీలేష్‌ షా సుప్రసిద్ద జర్నలిస్టు కరన్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బలంగా ఉన్న ఎంఎస్‌ఎంఇలను ఆదుకొని బలహీనమైన వాటిని అంతరించి పోయేందుకు అనుమతించాలని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. స్వాతంత్య్రం తరువాత తొలిసారిగా దేశం ఒకేసారి వైద్య, ఆర్ధిక, ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, దీన్నొక అవకాశంగా మార్చుకోవాలన్నారు. ప్రపంచ పుత్తడి మండలి అంచనా ప్రకారం భారత్‌లో రెండులక్షల కోట్ల డాలర్ల విలువగల 25వేల టన్నుల బంగారం గృహస్తుల వద్ద ఉంది. దీనిలో ఎక్కువ భాగం లెక్కల్లో లేదు. అందువలన అలాంటి బంగారం కలిగిన వారందరికీ క్షమాభిక్ష పెట్టి చట్టబద్దం గావిస్తే బిలియన్ల డాలర్లను సమీకరించుకోవచ్చు అన్నారు నీలేష్‌ షా. దేశం ఇప్పటికి 500 బిలియన్‌ డాలర్ల విలువగల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే దానిలో 376 బిలియన్ల మేరకు అధికారికంగా జరగ్గా 140 బిలియన్‌ డాలర్ల విలువగలది దొంగబంగారం అన్నారు. 1933లో అమెరికా ఆర్ధిక మాంద్యం నుంచి తప్పించుకొనేందుకు బంగారాన్ని జాతీయం చేసిందని, మన దేశంలో గతంలో మొరార్జీదేశారు జాతీయానికి బదులు నియంత్రణ చట్టాన్ని తెచ్చారన్నారు. మన ఆర్ధిక వ్యవస్ధ కోలుకొనేందుకు జనం త్యాగాలు చేయాలన్నారు. కోటక్‌ మహీంద్రా కంపెనీలో పని చేస్తున్న నీలేష్‌ షా వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పినప్పటికీ నరేంద్రమోడీకి సలహాలు ఇచ్చే సమయంలో అవి ప్రభావితం చూపకుండా ఉంటాయా, లేక వాటిని పక్కన పెట్టి మోడీగారికి ఇష్టమైన సలహాలు చెబుతారా ?


నరేంద్రమోడీ ప్రపంచ నాయకుడు, ఆయన కోసం ప్రపంచ మంతా ఎదురు చూస్తోందని బిజెపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. మరొక విధంగా అది నిజమే అనిపిస్తున్నది. ప్రపంచ నేతగాకపోతే 2018 సియోల్‌ శాంతి బహుమతిని నరేంద్రమోడీ ఎందుకు పొందారు ? ఇప్పటి వరకు 14 మంది ఈ బహుమతిని పొందగా మోడీ తొలి భారతీయుడని మోడీ అభిమానులు పొంగిపోయారు. మోడినోమిక్స్‌, యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీకి గాను నరేంద్రమోడీకి సియోల్‌ శాంతి బహుమతి ప్రదానం ‘ అంటూ శీర్షికలు పెట్టిన పత్రికలున్నాయి. మోడినోమిక్స్‌(మోడీ తరహా ఆర్ధిక విధానం) ద్వారా భారత్‌లో మరియు ప్రపంచంలో వున్నతమైన ఆర్ధిక అభివద్ధికి అందించిన తోడ్పాటుకుగాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు మన విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొన్నది. ‘ అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచేందుకు ఆయన అంకిత భావం, ప్రపంచ ఆర్ధిక వద్ధి పెంపుదల, ప్రపంచంలో వేగంగా వద్ధి చెందుతున్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధ అభివద్ది పెంపుదలతో భారత పౌరుల మానవాభివద్ధికి కషి, అవినీతి వ్యతిరేక మరియు సామాజిక ఏకీకరణం ద్వారా ప్రజాస్వామ్యం మరింతగా అభివద్ధి చెందించే ప్రయత్నాలకు గుర్తింపు ఇది, క్రియాశీలకమైన విదేశాంగ విధానంతో ప్రపంచవ్యాపితంగా వున్న దేశాలతో వ్యవహరించిన మోడీ సిద్దాంతాలు, ఆసియా పసిఫిక్‌ దేశాలతో సానుకూల విధానంతో ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతికి ప్రధాని చేసిన కషిని కూడా ఎంపిక కమిటీ గుర్తించింది అని కూడా ప్రకటన పేర్కొన్నది.


ఇంతగొప్ప నరేంద్రమోడీ ప్రధానిగా ఉండగా అమెరికాను అధిగమించే వేగంతో పెరుగుతున్న కరోనా కేసులేమిటి ? 2008 ఆర్ధిక సంక్షోభంలో దెబ్బతిన్న తాము కూడా భారత స్ధాయిలో జిడిపిలో దిగజారలేదు, అక్కడ ఇలా ఎందుకు జరుగుతోంది, ఆర్భాట ప్రకటనలేనా అసలేమీ లేదా అనే సందేహాలతో యావత్‌ ప్రపంచం భారత్‌ను, దానికి ప్రతినిధిగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ గురించి నిజంగానే మోరెత్తి చూస్తోంది. లేకపోతే ఇప్పుడు మన దేశం నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకొనేది ఏమి ఉంది కనుక ? ఆస్తికులు నమ్మే, నాస్తికులు తిరస్కరించే దేవుడి మీద ఒట్టు. ఇది నిజమని అందరూ నమ్మాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్ర సిద్దాంతాల హల్‌చల్‌ : నాడు కమ్యూనిజం-నిన్న సోవియట్‌-నేడు చైనా బూచి !

10 Thursday Sep 2020

Posted by raomk in BJP, CHINA, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China Threat, conspiracy theories, Pentagon on China military


ఎం కోటేశ్వరరావు
మానవాళి చరిత్రలో రాజ్యము – అధికారము ఉనికిలోకి వచ్చిన తరువాత కుట్రలు, కుట్ర సిద్దాంతాలు వాటి వెన్నంటే తలెత్తాయి. అధికారం లేని వారు లేదా బలహీనులు కుట్ర సిద్ధాంత ఆశ్రయం పొందుతారు అన్నది కొందరి అభిప్రాయం. దీనికి విస్తృత అర్ధం, భిన్న భాష్యాలు చెప్పవచ్చు. వాటితో అందరూ ఏకీభవించాలని లేదు. ప్రపంచంలో నిరంతరం కుట్ర సిద్దాంతాలు పుడుతూ జనారణ్యంలో కలియ తిరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అంశం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరోవిధంగా చెప్పాలంటేే వాటితో లబ్ది పొందాలనుకొనే బలమైన శక్తులు వాటిని ముందుకు తెస్తాయి.


కమ్యూనిజం ప్రపంచాన్ని ఆక్రమిస్తోంది, ప్రజాస్వామ్యాన్ని హరిస్తోంది కనుక దాన్ని అడ్డుకోవాలన్న కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తీసుకువచ్చింది బలవంతులైన సామ్రాజ్యవాదులే. అది వాస్తవం కాదని గ్రహించలేని వారు దాన్ని నిజమే అని నమ్మి ఆ సిద్దాంతానికి ఊతమివ్వటాన్ని చూస్తున్నాము. తరువాత కాలంలో సోషలిస్టు సోవియట్‌ను బూచిగా చూపి భయపెట్టటం ఎరిగిందే. ప్రాంతీయంగా పశ్చిమాసియాలో ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను మారణాయుధాలను గుట్టలుగా పోసిన బూచాడిగా చూపిన వైనం మన కళ్ల ముందే జరిగింది. ఇప్పుడు చైనా బూచిని ముందుకు తెచ్చారు. దాన్ని అర్దం చేసుకోలేని వారు ఆశ్రయం ఇస్తున్నారు. కుట్ర సిద్దాంత వైరస్‌ ఒకసారి ఎవరిలో అయినా ప్రవేశించిందంటే అది కరోనా కంటే ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. భౌతిక దూరాన్ని పాటిస్తే కరోనా మన దరిచేరదు. కానీ కుట్ర సిద్దాంత వైరస్‌కు అలాంటివేమీ ఉండదు. ఒకరి వాట్సాప్‌లో ప్రవేశించినా, చెవి అప్పగించినా చాలు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.


ప్రస్తుతం మన దేశంలో బిజెపి వంటి సంఘపరివార్‌ సంస్ధలు. మీడియా, సామాజిక మాధ్యమం చైనా బూచిని జనాల మెదళ్లకు ఎక్కిస్తున్నదా ? తమ అనుభవంలోకి వచ్చిన దాని బట్టి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. చైనా నుంచి ముప్పు వస్తోందంటూ అనేక దేశాలను రెచ్చగొడుతూ, కూడగడుతూ అంతర్జాతీయంగా అమెరికా అటువంటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చైనా అణ్వాయుధాలు ప్రపంచానికి ఆటంకంగా ఉన్నాయని, నౌకా దళంలో చైనా తమను మించి పోయిందని అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగన్‌ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇవి చైనా మిలిటరీ ముప్పు అనే కుట్ర సిద్ధాంత అంశాలే.
ఇలాంటి ప్రచారం అమెరికా ఉత్తిపుణ్యానికే చేయదు. రక్షణ ఖర్చును ఇబ్బడి ముబ్బడి చేసేందుకు దేశీయంగా పార్లమెంట్‌ మీద వత్తిడి తేవటం, ముప్పును ఎదుర్కోవాలంటే ఆయుధాలు సమకూర్చుకోవాలి, అంటే యుద్ద పరిశ్రమల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టేందుకు మానసికంగా జనాన్ని ఒప్పించే ఎత్తుగడ దీనిలో ఉంది. మిలిటరీ రీత్యా చైనా విజయవంతంగా ఎన్నో మార్పులు చేసిందని పొగడటం అంటే అమెరికాలోని సామాన్యులను భయపెట్టటమే. ఇవన్నీ నిజానికి పాతబడిన విద్యలే. అమెరికన్లను బురిడీ కొట్టించేందుకు తమను తాము నిందించుకొనేందుకు సైతం సిద్ద పడతారు. దానితో వారికి పోయేదేమీ లేదు. ఉదాహరణకు అమెరికా నిద్రపోతుంటే చైనా ఆయుధాలతో ఎదిగిపోయింది అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో చేసిన వ్యాఖ్య దానిలో భాగమే. వాస్తవానికి అది అతిశయోక్తి తప్ప వేరు కాదు. రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు, తామే కాదు తమ స్నేహితులు కూడా నిద్రపోయారని చెప్పాడు. అదే సమయంలో అమెరికా స్నేహితులు, అనుయాయులు కలిస్తే చైనా కంటే ఎంతో బలం కలిగి ఉన్నామని పాంపియో చెప్పాడు.ఇది చైనాను బెదిరించటం.


ఇటీవలి కాలంలో తాను నాయకత్వం వహిస్తున్న నాటో కూటమి ఖర్చును రక్షణ పొందుతున్న దేశాలే ఎక్కువ భాగం భరించాలని ట్రంప్‌ బహిరంగంగా వత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. తాము 70శాతం ఖర్చు చేస్తుంటే మొత్తం ఐరోపా సభ్యదేశాలు 30శాతమే చెల్లిస్తున్నాయని ట్రంప్‌ రుసురుసలాడాడు. అయితే ఖర్చు ఎక్కువ భాగం అమెరికన్‌ సిబ్బందికి, ఆయుధాలకే ఖర్చు అవుతున్నందున తాము అదనంగా చెల్లించాల్సిన పనిలేదని నాటో దేశాలు బదులిచ్చాయి. ఇప్పుడు చైనా బూచిని చూపటం అంటే ఆసియాలోని దేశాలకు రక్షణ కల్పిస్తున్న తమ ఖర్చులో సింహభాగాన్ని భరించాలని అమెరికన్లు కోరటమే.


ఖండాంతర, నియంత్రిత క్షిపణులను చైనా మిలిటరీ తయారు చేసిందని, అవి అమెరికాకు ముప్పు తెస్తాయని, రాబోయే పది సంవత్సరాలలో ఇప్పుడున్న రెండువందల అణ్వాయుధాలు రెట్టింపు అవుతాయని పెంటగన్‌ పేర్కొన్నది. నిజానికి ఏ దేశం దగ్గరైనా అలాంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయో మిలిటరీ ఉన్నతాధికారులందరికీ కూడా తెలియదు. ఊహాగానాలు తప్ప సంఖ్యను ఎన్నడూ బయట పెట్టరు. ఇలాంటి అంకెలన్నీ చీకట్లో బాణాలు వేయటం తప్ప మరొకటి కాదు. ” గతంలో చైనాకు క్షిపణులు ఎక్కువ అవసరం ఉండేది కాదు. కానీ చైనాను తన వ్యూహాత్మక పోటీదారుగా అమెరికా పరిగణిస్తున్నది. ఈ నేపధ్యంలో తగినన్ని ఆయుధాలను సమకూర్చుకోని పక్షంలో చైనా ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని ” పెంటగన్‌ నివేదిక గురించి చైనా రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గమనించాల్సిన అంశం ఏమంటే తనకు అవసరం అనుకుంటే చైనా అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే అణ్వాయుధాలను తయారు చేయగల స్ధితిలో ఉంది. అయితే తన 140 కోట్ల జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచే మహత్తర కృషికి అది ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప వనరులను ఆయుధాల కోసం దుర్వినియోగం చేయటం లేదు.


క్షిపణులు లేదా రాకెట్ల ద్వారా ప్రయోగించే ఆయుధాల సంఖ్య ఎంత అన్నదాన్ని బట్టి ఒక దేశ సైనిక పాటవాన్ని లెక్కించటం ఒక పద్దతి. చైనా మరో రెండువందలను తయారు చేయనుంది గనుక తమకు ముప్పు అని అమెరికా చెబుతున్నది. కానీ తన దగ్గర దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న ఆయుధాలను యావత్‌ ప్రపంచానికి ముప్పుగానా లేక శాంతి కోసం తయారు చేసిందా ? స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) 2020 వార్షిక నివేదిక అమెరికా మోహరించిన అణ్వాయుధాలు 1,750, ఇతరంగా 4,050, అమ్ముల పొదిలో మరో 5,800 ఉన్నాయని పేర్కొన్నది. రష్యాతో ఒప్పందంలో భాగంగా కొన్ని మధ్యంతర శ్రేణి ఆయుధాలను ఉపసంహరించిన తరువాత పరిస్ధితి ఇది. 2019లో అమెరికా స్వయంగా చెప్పినదాని ప్రకారం దాని దగ్గర మొత్తం 6,185 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 2,385 వినియోగానికి స్వస్తి చెప్పారు లేదా నాశనం చేశారు. మోహరించిన ఆయుధాలు 1365. వీటిని చూపే అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది. బయటకు వెల్లడించనివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వాటి ముందు చైనా వద్ద ఉన్న ఆయుధాలెన్ని, అది తెచ్చే ముప్పు ఎంత ?


నిజానికి ఒక దేశం దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నా ఎదుటి దేశం మీద ప్రయోగిస్తే సర్వనాశనం తప్ప ఏ దేశమూ మిగలదు. చైనా దగ్గర కూడా గణనీయంగా అణ్వాయుధాలు ఉన్నాయి గనుకనే అమెరికా దూకుడు తగ్గిందన్నది వాస్తవం, అయితే మానసిక ప్రచారదాడి కొనసాగుతూనే ఉంటుంది.1980 దశకం నుంచీ చైనా వద్ద రెండువందలకు మించి అణ్వాయుధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. వాటి సంఖ్యను పెంచటం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం స్టాక్‌ హౌం సంస్ధ సిప్రి మరియు అమెరికన్‌ సైంటిస్ట్స్‌ ఫెడరేషన్‌ 320 ఉన్నట్లు జోశ్యం చెప్పాయి. కనుక పెంటగన్‌ కొత్తగా కనుగొన్నదేమీ లేదన్నది స్పష్టం.గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా ఒక్కటే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని చెప్పిన దేశం. అంతే కాదు అణ్వాయుధాలు లేని దేశాల మీద వాటిని ప్రయోగించబోమని, బెదిరించబోమని కూడా ప్రకటించింది.


పెంటగన్‌ అంచనా ప్రకారం భూమి మీద నుంచి ఖండాంతరాలకు ప్రయోగించే క్షిపణులు చైనా వద్ద 1250కు పైగా ఉన్నాయి. అవి 500 నుంచి 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని చెబుతోంది. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ప్రకారం అమెరికా మధ్యంతర శ్రేణి క్షిపణుల తయారీ నిలిపివేసింది. చైనా బూచిని చూపి ట్రంప్‌ సర్కార్‌ ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి కొత్త క్షిపణులను పరీక్షిస్తోంది. ఈ చర్య మరింతగా ఆయుధ పోటీని పెంచేదే తప్ప తగ్గించేది కాదు. రాడార్లు పసి గట్టకుండా, ధ్వని లేకుండా వేగంగా ప్రయాణించే అమెరికన్‌ బాంబర్లను కూడా కూల్చివేయగల రష్యా ఎస్‌-400 దీర్ఘ శ్రేణి ఆయుధం అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయనుంది. చైనా త్వరలో వీటన్నింటినీ అధిగమించే ఆయుధాలను రూపొందిస్తున్నదని పెంటగన్‌ నివేదిక పేర్కొన్నది.


చైనా నౌకాదళంలో 350 యుద్ద ఓడలు, జలాంతర్గాములున్నాయని, సంఖ్యరీత్యా ప్రపంచంలో పెద్దదని, కొన్ని రంగాలలో తమకంటే ముందున్నదని, తమ వద్ద 293 మాత్రమే ఉన్నాయని పెంటగన్‌ పేర్కొన్నది. ఇది కూడా మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. అమెరికా వద్ద ఉన్న ఆధునిక యుద్ద ఓడలతో పోల్చితే చైనా బలం తక్కువే. అమెరికా వద్ద భారీ అణ్వాయుధాలను ప్రయోగించే పదకొండు బడా యుద్ద నౌకలు ఉన్నాయి. ఒక్కొక్కదాని మీద 80 యుద్ద విమానాలను ఉంచేంత పెద్దవి ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా నౌకాదళం విస్తరించినప్పటికీ అణ్వాయుధేతర విమానవాహక నౌకలు రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో క్షిపణులును కూల్చివేసే విధ్వంసక క్షిపణులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చైనా నిర్మిస్తున్న నౌకలు అమెరికా వద్ద ఉన్నవాటి కంటే పెద్దవిగా ఉండబోతున్నాయని పశ్చిమ దేశాలు జోశ్యాలు చెబుతున్నాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని ఇప్పటికే చైనా అనేక రంగాలలో నిరూపించింది.


అమెరికా కనుసన్నలలో పని చేసే జపాన్‌, దక్షిణ కొరియా ఇటీవలి కాలంలో విమానవాహక నౌకలతో సహా అనేక భారీ యుద్ద నావలను రంగంలోకి దించాయి. చైనా దగ్గర ఉన్న చిన్న తరహా యుద్ద నావలు కలిగించే భారీ నష్టాన్ని పెంటగన్‌ పరిగణనలోకి తీసుకోవటం లేదని ఒక విశ్లేషకుడు వాపోయాడు, అమెరికాను హెచ్చరించాడు. వెయ్యి అంతకు పైగా టన్నుల సామర్ధ్యం ఉన్న తీర రక్షక గస్తీ నౌకలు చైనాలో గత పది సంవత్సరాలలో 60 నుంచి 130కి పెరిగితే అమెరికా వద్ద 70 మాత్రమే ఉన్నాయని,రెండు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్న సైనీకీకరణ గావించిన చేపల పడవలను తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నాడు.
పెంటగన్‌ నివేదిక వచ్చిన సమయంలోనే చైనా విమాన వాహక రెండవ యుద్ద నౌక షాండోంగ్‌ శిక్షణ విన్యాసాలను ప్రారంభించింది. ఇది గత ఏడాది డిసెంబరులో నౌకాదళంలో చేరింది. తొలి నౌక లయనింగ్‌ కూడా పచ్చ సముద్రంలో సంచరిస్తున్నది. ఒకేసారి రెండు యుద్ద నౌకలు విన్యాసాలు జరపటం ఇదే తొలిసారి. తైవాన్‌ నుంచి అమెరికా పిచ్చిపనులు చేసేట్లయితే సమన్వయంతో వాటిని అరికట్టేందుకు వీలుకలుగుతుందని వార్తలు వచ్చాయి. ఈ రెండు నౌకల సంచారం ఎందుకనే విషయాన్ని చైనా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే జోశ్యాలు వెలువడ్డాయి. షాండోంగ్‌ యుద్ద విమానాలతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, లయనింగ్‌ తన రేవు నుంచి ఎక్కువ దూరం ప్రయాణించనందున సాధారణ శిక్షణ కార్యక్రమాలకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. రెండు నౌకలు సమీపం నుంచి అదే విధంగా దూరం నుంచి సమన్వయం చేసుకోవటం గురించి కూడా పరీక్షలు జరుపుతాయి.


జాతీయ వాదం ప్రపంచానికి ఎంతటి చేటు తెచ్చిందో అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్ధాలతో మానవాళి చవి చూసింది. అందువలన జాతీయ వాదానికి గురైన ఏ జాతీ ప్రశాంతంగా లేదు, ప్రపంచాన్ని శాంతంగా ఉండనివ్వలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. జాతీయ వాదం వేరు దేశభక్తి వేరు. జాతీయవాదాన్నే దేశభక్తిగా చిత్రించి జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న రోజులివి.


బ్రిటీష్‌ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే నాడు జాతీయవాదం-దేశ భక్తి. నేడు అసలు సిసలు దేశభక్తులుగా చెప్పుకుంటున్న సంఘపరివార్‌కు నాడు అవి పట్టలేదు. ఒక దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత జాతీయవాదం ముందుకు వస్తే దాని స్వభావం భిన్నంగా ఉంటుంది. జర్మనీలో ముందుకు తెచ్చిన జాతీయవాదాన్ని నాజీలు దేశభక్తిగా ప్రచారం చేశారు. ఐరోపాలో ఉన్న జర్మన్‌లు, జర్మనిక్‌ భాష మాట్లాడేవారందరూ ఒకే దేశంగా ఉండాలి. జర్మన్‌ జాతి ఔన్నత్యాన్ని నెలకొల్పాలి. యూదులు, పోల్స్‌, రుమేనియన్లు అల్పజాతి వారు కనుక వారిని జర్మన్‌ గడ్డ నుంచి పంపివేయాలి. ఇదే నాజీల దేశభక్తి. దీన్ని ఆమోదించిన వారు జాతీయవాదులు, దేశభక్తులు.ఈ వాదాన్ని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, జర్మనీలో వారికి చోటు లేదు, ఇదీ తీరు. హిట్లర్‌ జాతీయ వాదాన్ని సమర్ధించిన వారు దేశభక్తులు, వ్యతిరేకించిన కమ్యూనిస్టులను జర్మన్‌ ద్రోహులని ఆరోజు చిత్రహింసల పాలు చేశారు.


చైనాతో మన సరిహద్దును బ్రిటీష్‌ వారి హయాంలో వివిధ సందర్భాలలో అధికారులు ఇష్టమొచ్చినట్లు గీశారు. ఒకరు గీసినదానిలో ఆక్సారుచిన్‌ చైనా ప్రాంతంగా మరొక దానిలో మనదిగా ఉంది. అదే విధంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను టిబెట్‌ అంతర్భాగంగా, బ్రిటీష్‌ ఇండియా భాగంగా పేర్కొన్న సందర్భాలున్నాయి. స్వాతంత్య్రానికి ముందు ఆ ప్రాంతాన్ని బ్రిటీష్‌ ఇండియా సర్కార్‌ ఆధీనంలో ఉన్నదానిని టిబెట్‌ స్వాధీనం చేసుకున్న సందర్భాలున్నాయి. బ్రిటీష్‌ వారితో టిబెట్‌ పాలకులు చేసుకున్న ఒప్పందాలను వేటినీ చైనా పాలకులు అంగీకరించలేదు. తమ సామంత రాజ్యానికి అలాంటి హక్కులేదని వాదించారు. ఒప్పందాలు అమలు కూడా కాలేదు. సరిహద్దులను ఖరారు చేసుకోవాలని నాడు చైనా గానీ బ్రిటీష్‌ ఇండియా గానీ పూనుకోలేదు.


అంతెందుకు మన దేశంలో ఆశ్రయం పొందిన 14 దలైలామా 1959లో తిరుగుబాటు చేసి మన దేశానికి పారిపోయి రావటానికి ముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగమే అని చెప్పాడు. ఆ తరువాత 2003లో కూడా వాస్తవానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌కు చెందిందని చెప్పాడు.


1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది, 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. తరువాత కాలంలో సరిహద్దుల సమస్య ముందుకు వచ్చింది. రెండు దేశాలూ తమ వైఖరే సరైనదే అనే విధంగా వ్యవహరించాయి. దానికి తోడు దలైలామా సమస్య తోడై అది యుద్దానికి దారి తీసింది. వివాదం తెగలేదు. అయితే పరిష్కారం కావాలి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలి. అందుకు సంప్రదింపులు పరిష్కారం తప్ప ఆయుధాలు మార్గం కాదు. 1962లో యుద్ద సమయంలో అన్ని పార్టీలు జాతీయవాదానికి గురై చైనాను దురాక్రమణదారుగా పేర్కొని యుద్దాన్ని సమర్ధించాయి. సిపిఐ జాతీయ నాయకత్వం దీని గురించి ఒక వైఖరి తీసుకోవాల్సివచ్చింది. ఆ సమయంలో జరిగిన చర్చలలో కొందరు సరిహద్దు వివాదాన్ని సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించాలనే వైఖరిని పార్టీ ప్రకటించాలని ప్రతిపాదించారు. మిగిలిన వారు యుద్దాన్ని సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే వైఖరి తీసుకున్నారు. అప్పటికి సైద్దాంతిక విభేదాల గురించి చర్చ తప్ప పార్టీలో చీలిక లేదు. సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన పార్టీనేతలను, ఆ అభిప్రాయాన్ని బలపరిచిన వారిని దేశ వ్యాపితంగా నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసింది. తరువాత వారంతా సిపిఎంగా ఏర్పడ్డారు.


దేశభక్తి పేరుతో రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ విభాగం జనసంఫ్‌ు, ఇతర సంస్దలు చైనా వ్యతిరేక వైఖరిని తీసుకొని, యుద్దాన్ని వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించాయి. కానీ తరువాత కాంగ్రెస్‌ పాలకులు, జనతా పార్టీలో చేరి అధికారంలో భాగస్వాములైన జనసంఘనేతలు, తరువాత బిజెపిగా అధికారానికి వచ్చిన వారూ చేసిందేమిటి ? సరిహద్దు సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, రెండు వైపులా తుపాకులు పేల కూడదని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మరోసారి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ఇతర సంస్ధల నేతలు చైనా వ్యతిరేక ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. దానికి మీడియా తోడైంది సరే. 1962లో యుద్దాన్ని సమర్దించి జాతీయవాదానికి గురైన సిపిఐ ఇప్పుడు ఆ వైఖరిని సవరించుకున్నది. సిపిఎం మాదిరే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే వైఖరినే తీసుకున్నది.
అనేక దేశాలలో కమ్యూనిస్టులు ఇలాంటి సమస్యలు వచ్చినపుడు జాతీయవాదానికి లోను కాకుండా ఒక సూత్రబద్ద వైఖరిని తీసుకున్నారు. పాలస్తీనాను ఆక్రమించి స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా అడ్డుకుంటున్న పాలకుల వైఖరిని ఇజ్రాయెల్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తున్నది. అక్కడి యూదుదురహంకారులు కమ్యూనిస్టులను దేశద్రోహులని నిందిస్తున్నా, దాడులకు పాల్పడినా కమ్యూనిస్టులు తమ వైఖరిని మార్చుకోలేదు.


చైనాతో సరిహద్దు వివాద పరిష్కారానికి శాంతియుత చర్చలు-ఇచ్చిపుచ్చుకోవటాలు తప్ప మరొక పరిష్కారం అసాధ్యం. ఈ విషయం ప్రతిపార్టీకీ తెలుసు. అయినప్పటికీ పైకి జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నాయి. మే, జూన్‌ మాసాలలో కొత్తగా చైనా వారు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పారు. తీరా మన ప్రధాని అఖిలపక్ష సమావేశంలో అబ్బే అలాంటిదేమీ లేదు అని ప్రకటించారు. తాజాగా మన ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు వస్తున్న చైనా వారిని పసిగట్టిన మన మిలిటరీయే చొరవ తీసుకొని కొన్ని కొండలను ఆధీనంలోకి తెచ్చుకుందని ప్రకటించారు. అసలేం జరుగుతోంది అన్నది తెలియటం లేదు.


యుద్దం వద్దు అన్న వారిని మన మిలిటరీ సత్తాను అవమానించే వారిగా చిత్రిస్తూ దాడి చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ శక్తి అమెరికా. అలాంటి దేశం జరిపిన యుద్దాలలో ఎక్కడైనా విజయం సాధించిందా ? అలాంటపుడు చైనా మనలను గానీ, మనం చైనాను గానీ యుద్ధంలో ఓడించి సమస్యలను పరిష్కరించుకోగలమా ? మన దగ్గర ఉన్న నాలుగు రూకలను అటు అమెరికా లేదా రష్యా మరొక దేశం నుంచో కొనుగోలు చేసే ఆయుధాలకు సమర్పించుకోవటం తప్ప మరొకటేమైనా జరుగుతుందా ? మన ప్రాంతాలను చైనాకు అప్పగించాలని ఎవరూ కోరటం లేదు. గతంలో లేదు భవిష్యత్‌లో కూడా ఉండదు. దేశభక్తి గురించి ఏ పార్టీ మరొక పార్టీకి బోధలు చేయాల్సిన,నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భిన్న అభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రాన ఎవరూ దేశద్రోహులు కాదు. ఉద్రేకాలకు లోనుకాకుండా ఆలోచించాల్సిన సమయమిది. గతంలో ప్రపంచంలో జరిపిన అనేక యుద్దాలు ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు లేదా జాతీయ దురహంకారంతో చేసినవే. అలాంటి వైఖరికి జనం మూల్యం చెల్లించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుత్తీ, కొడవలి, నక్షత్రాలుంటే బ్రెజిల్లో 15 ఏండ్ల జైలు !

08 Tuesday Sep 2020

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Brazil, Brazill Communists, equate communist symbols with Nazi ones, Jail time for hammer and sickle, Jair Bolsonaro


ఎం కోటేశ్వరరావు
పారిశ్రామిక విప్లవ కాలంలో యజమానులు ప్రవేశపెట్టిన యాంత్రిక మగ్గాలు తమ ఉపాధిని హరించటంతో పాటు, ప్రాధాన్యతను తగ్గిస్తాయని, వాటి మీద పని చేసే నైపుణ్యంలేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారని బ్రిటన్‌లోని నిపుణులైన చేనేత కార్మికులు భావించారు. వాటిని విధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని నిర్ధారణకు వచ్చి అదే పని చేశారు. చరిత్రలో యంత్రవిధ్వంసక కార్మికులుగా మిగిలిపోయారు. పెట్టుబడిదారీ విధానాన్ని సరిగా అర్ధం చేసుకోలేని తొలి రోజుల్లో అది జరిగింది.


ప్రపంచంలో సోషలిజం, కమ్యూనిజం గురించి గత రెండు శతాబ్దాలుగా తెలిసినప్పటికీ వాటిని వ్యతిరేకించే నిరంకుశ శక్తుల ఆలోచన యంత్రవిధ్వంసకుల స్ధాయినిదాటలేదని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఆ కార్మికులకు దిక్కుతోచక యంత్ర విధ్వంసం చేస్తే ప్రస్తుతం కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దిక్కుతోచక చిహ్నాల నిషేధానికి పాల్పడుతున్నారా ?
కమ్యూనిస్టు చిహ్నాలుగా పరిగణిస్తున్న సుత్తీ, కొడవలి, నక్షత్రం కమ్యూనిస్టు భావజాలం పురుడు పోసుకోక ముందే ఉన్నాయి. సుత్తీ, కొడవలిని కార్మిక-కర్షక మైత్రికి, నక్షత్రాన్ని ఐదు భూ ఖండాలకు గుర్తుగా కార్మికవర్గంపై జరిపినదాడిలో పారిన రక్తానికి చిహ్నంగా ఎర్రజెండాను కమ్యూనిస్టులు స్వీకరించారు. వాటిమీద కమ్యూనిస్టులకేమీ పేటెంట్‌ హక్కు లేదు. అయితే ఆ చిహ్నాలను వినియోగించిన వారికి పది నుంచి పదిహేనేండ్ల పాటు జైలు శిక్ష విధించాలని కోరుతూ సెప్టెంబరు రెండవ తేదీన బ్రెజిల్‌ పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో కుమారుడు, పార్లమెంట్‌ సభ్యుడు అయిన ఎడ్వర్డ్‌ బోల్జానో దాన్ని ప్రతిపాదించాడు. వాటిని తయారు చేసినా, విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షార్హంగా పరిగణిస్తూ చట్టసవరణకు నిర్ణయించారు. నాజీలు, తరువాత కమ్యూనిస్టులు పోలాండ్‌ను ఆక్రమించారని అందువలన వారిని హంతకులుగా పరిగణించాలని, వారి చిహ్నాలను ఉపయోగించిన వారిని శిక్షించాలని బోల్జానో చెప్పాడు. అది పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందా? లేదా, పొందితే తదుపరి కమ్యూనిస్టుల మీద నిషేధం విధిస్తారా ? ఏమైనా జరగొచ్చు.


పచ్చి మితవాదులైన తండ్రీ కొడుకులు తాము కమ్యూనిస్టు వ్యతిరేకులమని బహిరంగంగానే గతంలో ప్రకటించుకున్న నేపధ్యంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం ఆశ్చర్యమేమీ కాదు. కమ్యూనిస్టులు, నాజీలు ఒకటే అనేందుకు రుజువులు ఇవిగో అంటూ నాటి సోవియట్‌లోని ఉక్రెయిన్‌లో కమ్యూనిస్టులు కరవుకు కారకులయ్యారని ఒక చిత్రాన్ని, నాజీల చిత్రహింసలకు సంబంధించి ఒక చిత్రాన్ని ట్వీట్‌ చేశాడు. అయితే కరవు అని చెప్పిన చిత్రం బ్రిటీష్‌ ఇండియాలోని బెంగాల్‌ కరవుకు సంబంధించింది. కొందరు ఆ విషయాన్ని చెప్పినప్పటికీ ఎడ్వర్డ్‌ వెనక్కు తీసుకొనేందుకు నిరాకరించాడు. కరోనా వైరస్‌కు కారణం చైనాయే అంటూ గతంలో ప్రకటించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కూడా కారకుడయ్యాడు.


కమ్యూనిస్టు సంబంధిత లేదా కమ్యూనిస్టు నేతల పేర్లతో ఉన్న బహిరంగ స్ధలాలు, సంస్ధలు, కట్టడాల పేర్లు కూడా మార్చాలని బ్రెజిల్‌ పాలకులు ఆలోచిస్తున్నారు. పాలకపక్ష చర్యను బ్రెజిల్‌ కమ్యూనిస్టు యువజన సంఘం ఖండించింది. గతంలో నిరంకుశ పాలకులు ఇదే విధంగా తమ సంస్ధను, కమ్యూనిస్టు పార్టీని పని చేయనివ్వకుండా చేశారని తిరిగి అదే చర్యకు ఒడిగట్టారని పేర్కొన్నది. తూర్పు ఐరోపాలోని పోలాండ్‌, హంగరీ వంటి దేశాలలో చేస్తున్న మాదిరే ఇక్కడ కూడా చేస్తున్నారని పేర్కొన్నది. కమ్యూనిజం-నాజీజాలను ఒకే గాటన కడుతున్న ఐరోపా యూనియన్‌ వైఖరినే బ్రెజిల్‌ పాలకులు అనుసరిస్తున్నారని ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప వేరు కాదని విమర్శించింది. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీలను ఓడించేందుకు సోవియట్‌ కమ్యూనిస్టులు తమ రక్తాన్ని ధారపోశారన్న నిజం దాస్తే దాగేది కాదని పేర్కొన్నది.


తమ భావజాలాన్ని వ్యక్తపరిచేందుకు విధించే ఈచర్యలను తాము సహించబోమని, ప్రజల్లో తమ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తామని స్పష్టం చేసింది.ఇవి బ్రెజిల్‌ ప్రజాస్వామిక స్వేచ్చ, సామాజిక ఉద్యమాల మీద దాడి తప్ప మరొకటి కాదన్నది. కమ్యూనిస్టులను అరెస్టులు చేయాలని, హతమార్చాలని తండ్రీ కొడుకులు, వారితో కుమ్మక్కయిన జనరల్‌ హామిల్టన్‌ మౌరో చూస్తున్నారని వారి ఆటలను అరికట్టేందుకు ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని కమ్యూనిస్టు యువజన సంఘం పేర్కొన్నది.
ఉక్రెయిన్‌,మరికొన్ని తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అధికారానికి వచ్చిన నియంతలు, ఫాసిస్టు శక్తులు కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించారు. కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు పెట్టారు.తాను ఉక్రెయిన్‌ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించాలని బిల్లును ప్రతిపాదించినట్లు ఎడ్వర్డ్‌ బోల్జానో చెప్పాడు.

బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు పార్టీ(పిసిడిఓబి)కి ఎనిమిది మంది సభ్యులున్నారు, 27కు గాను ఒక రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది, అనేక మున్సిపల్‌, కార్పొరేషన్లలో పార్టీ అధికారంలో ఉంది. కమ్యూనిస్టు చిహ్నాల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తరువాత కమ్యూనిస్టు, ఇతర పురోగామి శక్తుల కార్యకలాపాలను నిషేధించినా ఆశ్చర్యం లేదు. కరోనా వైరస్‌ నివారణలో వైఫల్యం, కార్మికుల హక్కులపై దాడి, ఆర్ధిక రంగంలో తిరోగమనం వంటి సమస్యలతో బోల్సనారో ప్ర భుత్వం నానాటికీ ప్రజావ్యతిరేకంగా మారుతున్నది. కమ్యూనిస్టు పార్టీ ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ప్రజా ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది.
గత ఎన్నికలలో మితవాద బోల్సనారో అధికారానికి వచ్చిన తరువాత విదేశాంగ విధానాలలో ప్రభుత్వం గుడ్డిగా అమెరికాను అనుసరిస్తున్నది. దానిలో భాగంగానే బ్రిక్స్‌ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మరో భాగస్వామి అయిన చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. మంత్రులు బహిరంగంగానే చైనా వ్యతిరేక ప్రకటనలు చేస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 11న బ్రెజిల్‌-అమెరికా సంబంధాలను కాపాడాలనే పేరుతో ఎడ్వర్డ్‌ బోల్జానో ఒక ఉపన్యాసం చేశాడు. ఒక దేశాన్ని ఎలా నాశనం చేయవచ్చు అనే పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెనెజులా గురించి అభూత కల్పనలతో సంక్షేమ చర్యలకు వ్యతిరేకంగా వక్తలు ఉపన్యాసాలు చేశారు. అంతకు ముందు గ్లోబలిజం-కమ్యూనిజం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంకా ఇలాంటివే క్యూబాకు వ్యతిరేకంగా కూడా నిర్వహించారు.


కమ్యూనిస్టు వ్యతిరేకతకే బ్రెజిల్‌ ప్రభుత్వం పరిమితం కాలేదు. క్రైస్తవ విలువల పేరుతో అబార్షన్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలను ఇప్పించారు. విదేశాంగ విధానంలో లాటిన్‌ అమెరికన్‌ దేశాల ఐక్యత, రక్షణ అనే వైఖరికి బ్రెజిల్‌ దూరం అవుతున్నది. అంతర్జాతీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగం రూపొందించిన విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నది.
ఇటీవలి కాలంలో ఐరోపా, అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు రెచ్చిపోతున్నాయి. అనేక దేశాల్లో మితవాద శక్తుల పట్టు పెరుగుతోంది. గతేడాది సెప్టెంబరులో ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించటాన్ని చూస్తే ఒక వ్యవస్ధగానే కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రోత్సహిస్తోంది. రెండవ యుద్ద ప్రారంభంలో సోవియట్‌ యూనియన్‌ ఒక ఎత్తుగడగా జర్మనీతో చేసుకున్న ఒప్పందాన్ని సాకుగా చూపుతూ నాజీలు – కమ్యూనిస్టులూ ఒకటే అనే పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్నాయి. నాజీలు సోవియట్‌ మీద జరిపిన దాడి, కమ్యూనిస్టుల చేతుల్లోనే నాజీలు నాశనమైన చరిత్రను దాచేందుకు ప్రయత్నిస్తున్నారు.


అమెరికా ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించాలనే బిల్లు ప్రతిపాదనను చూడాల్సి ఉంది. అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా జో బిడెన్‌, కమలాహారిస్‌ ఎన్నికైతే అమెరికా కమ్యూనిజం వైపుకు పోయినట్లే అని గత పది రోజులుగా రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ వంటి డెమోక్రటిక్‌ సోషలిజం గురించి మాట్లాడేవారు, ఎలిజబెత్‌ వారెన్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌, కమలా హారిస్‌ వంటి ఉదారవాదులను కమ్యూనిస్టులుగా చిత్రించి రిపబ్లికన్‌ పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్న అమెరికన్ల ఓట్లకోసం నానా గడ్డీ కరుస్తున్నది. మన దేశంలో ఇందిరా గాంధీని కూడా సోషలిస్టుగా పశ్చిమ దేశాల మీడియా చిత్రించిన విషయం తెలిసిందే. అందువలన వారి పరిభాషలో సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా చిత్రించిన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కొన్ని అంశాలలో మితవాదులతో విబేధించే పరిమిత పురోగామి భావాలు కలిగిన వారిగానే చూడాల్సి ఉంది.


బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో పారిశ్రామిక విప్లవకాలంలో యంత్రాలను విధ్వంసం చేసినంత మాత్రాన ఆ క్రమం ఆగలేదు, పెట్టుబడిదారీ విధానం మరింతగా యాంత్రిక విధానాలతో ముందుకు పోతున్నది. ఐరోపా లేదా బ్రెజిల్‌ మరొక దేశంలో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించినంత మాత్రాన, వాటిని వినియోగించే పార్టీలను ఎన్నికలకు దూరం చేసినంతనే పురోగామి శక్తుల రధచక్రాలు ఆగిపోతాయనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి ఉండదు. మహత్తర తెలంగాణా సాయుధ పోరాట ప్రారంభంలో వడిసెలతో శత్రువులను ఎదుర్కొన్న యోధులకు తుపాకులు సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారలేదు. శిక్షణ పొందిన మిలిటరీతో సమంగా తమకు తామే ప్రాధమిక పరిజ్ఞానంతో తుపాకులు పేల్చిన సామాన్యులు కిరాయి మూకలు, సైన్యాన్ని ఎలా ఎదిరించారో చూశాము. అవసరాలు అన్నింటినీ సంపాదించుకొనే మార్గాలను కూడా చూపుతాయి.


బ్రెజిల్‌, ఇండోనేషియా, ఐరోపా మరొక చోట ఎక్కడైనా దోపిడీ శక్తులను హతమార్చక తప్పదు, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకోవాలనే నిశ్చయానికి కార్మికవర్గం, రైతులు రావాలే గాని సుత్తీ, కొడవలి, నక్షత్రం, ఎర్రజెండాగాక పోతే మరో గుర్తులు, పతాకంతో సంఘటితం అవుతారు. లాటిన్‌ అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలలో విప్లవాన్ని సాధించిన పార్టీలన్నీ తొలుత కార్మిక మరొక పేరుతో ప్రారంభమయ్యాయి తప్ప కమ్యూనిస్టు పార్టీలుగా కాదన్నది చరిత్రలో ఉంది. వియత్నాం కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ వియత్నాం వర్కర్స్‌ పార్టీ ప్రధమ కార్యదర్శిగా పని చేశారు. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రోతొలుత క్యూబా ప్రజా పార్టీలో చేరారు. వివిధ ఉద్యమాల పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు.పాపులర్‌ సోషలిస్టు పార్టీ పేరుతో ఉన్న కమ్యూనిస్టులతో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకున్నారు తప్ప బహిరంగంగా పార్టీతో కలవలేదు. కమ్యూనిస్టుల గురించి జరిగిన తప్పుడు ప్రచార నేపధ్యంలో నియంతలను వ్యతిరేకించే వారిని సమీకరించేందుకు ఆ పని చేశారు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత తాను కమ్యూనిస్టును అని కాస్ట్రో ప్రకటించారు. కమ్యూనిస్టుల మీద నిషేధం విధించిన పూర్వరంగంలో కమ్యూనిస్టులు వివిధ దేశాలలో అనేక మారు పేర్లతో పని చేశారు. మన దేశంలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ పేరుతో కమ్యూనిస్టులు పని చేసిన విషయం తెలిసినదే. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది. ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం. పార్టీ చిహ్నాలు, జెండాలు వేరుగావచ్చు, అధికారాన్ని శ్రామికవర్గ రాజ్య నిర్మాణానికి ఉపయోగిస్తున్నాయా లేదా అన్నదే గీటు రాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన పౌరులే కాని టిబెటన్ల కిరాయి మెరుపు దళం ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ కథేమిటి ?

06 Sunday Sep 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

SFF, Special Frontier Force, Tibetan refugees


ఎం కోటేశ్వరరావు


సరిహద్దుల్లో ఏం జరుగుతోందో తెలియటం లేదు గానీ మన టీవీ ఛానల్స్‌, పత్రికలు మాత్రం చైనాకు ‘దడ’ పుట్టిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. వాటిని చూసినవారు, చదివిన వారు నిజంగానే నిజం అనుకుంటున్నారు. ఎందుకంటే యుద్దం వచ్చేస్తోంది, మనం విజయ పతాక ఎగరేయబోతున్నట్లుగా హడావుడి కనిపిస్తోంది. ఒక వైపు చైనాకు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు, చేయాల్సిందే. ఇదే సమయంలో మరోవైపు రికార్డు స్ధాయిలో ఆర్ధిక వృద్ధి రేటు పతనం. ఎంతసేపూ ఆత్మనిర్భర పధకం గురించి చెప్పటమే తప్ప ఇంతవరకు ఆత్మవిశ్వాసం కలిగించే మాట ఒక్కటంటే ఒక్కటి కూడా మన ప్రధాని లేదా ఆర్ధిక మంత్రి నోటి నుంచి ఎందుకు వెలువడటం లేదు ? దీనికి అంత ప్రాధాన్యత లేదని భావిస్తున్నారా ?


నరేంద్రమోడీ కోసం ప్రపంచం చూస్తోంది అని బిజెపి భజనపరులు చెబుతారు. అది నిజం. శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్నది ఒక సామెత. ప్రపంచ దేశాల మధ్య సహకారం- ప్రపంచ ఆర్ధిక అభివృద్దికి చేసిన కృషికిగాను మన ప్రధాని నరేంద్రమోడీకి కొరియా ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. అదేమిటో అది తీసుకున్న తరువాత మన ఆర్ధిక వృద్ధి రేటు క్రమంగా దిగజారటం ప్రారంభమైంది. త్రైమాసిక వృద్ధి రేటు 8.2 నుంచి 3.1శాతానికి దిగజారింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో తాత్కాలిక అంచనా ప్రకారం 23.9శాతం దిగజారింది. వాస్తవంలో ఎంత అన్నది నవంబరు 27న ప్రకటించే వివరాల్లో గానీ తెలియదు. అందువలన మోడీ పాలనలో భారతదేశం ఇలా ఎందుకు దిగజారిందా అని ప్రపంచం ఎదురు చూస్తున్నది.
ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా కరోనా పోరు పేరుతో ఎంతగట్టిగా కంచాలు, రేకులతో మోతలు మోగించి, దీపాలు ఆర్పించి-వెలిగించి ఒకటికి రెండు సార్లు సంకల్పం చెప్పించిందీ చూశాము. దీపాల వెలుగుతో కరోనా అంతరించి పోతుంది అని చెప్పిన పండితుల జోశ్యం ఏమైందో చూస్తున్నాము. రోజుకు దాదాపు లక్ష కేసులతో ప్రపంచంలోనే అగ్రదేశ స్దాయికి చేరబోతున్నది. ఇప్పటికే బ్రెజిల్‌ను అధిగమించి రెండవ స్దానంలోకి దేశాన్ని చేర్చారు. అతి త్వరలోనే అమెరికాను సైతం అధిగమించే దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది అని యావత్‌ ప్రపంచం నరేంద్రమోడీ వైపు చూస్తోందన్నది నిజం. సరిహద్దు వివాదంలో ఇప్పుడు చైనాతో ఏం చేయబోతున్నారో అని కూడా ప్రపంచం చూస్తోంది.


ఆర్ధిక పరిస్ధితి గురించి లీకులు ఇచ్చి కథలు రాయించేందుకు ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. అందువలన చైనా-సరిహద్దు వివాదం-మిలిటరీ గురించి రంజుగా మీడియాకు అందిస్తున్నారు. అలాంటి వాటిలో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)ఒకటి. మన సైన్యంలో ప్రత్యేక విభాగాలుగా చెప్పుకొనేవి ఏడెనిమిది ఉన్నాయి. వాటి కార్యకలాపాలు, బడ్జెట్‌ వివరాలు పార్లమెంట్‌కు కూడా చెప్పనవసరం లేనప్పటికీ వాటన్నింటికీ చట్టబద్దత ఉంది. దీనికి అది లేదు. అయితే ఇతర ఖర్చులు అనే పేరుతో ఈ దళానికి నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నట్లుగా మనం భావించాలి.


పత్రికలు చందాదారుల సంఖ్యను, ఛానళ్లు రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు పడుతున్న తాపత్రయంలో అతిశయోక్తులతో జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయని చెప్పక తప్పదు.ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ పేరుతో పని చేస్తున్న దళం చైనాకు దడపుట్టిస్తున్నదని మీడియా చెబుతోంది. దాని గురించి ఒక పత్రిక ఇలా రాసింది.” ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ భారత సైన్యంలో భాగం కాదు. ఆ దళం చేసే సాహసాలకు,త్యాగాలకు బహిరంగంగా గుర్తింపు ఉండదు. అదంతా రహస్యం. ఆ దళం చేసే పని కూడా రహస్యమే. సైన్యానికి కూడా ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ కదలికలు తెలియవు. ప్రధాన మంత్రి కార్యాలయం(పిఎంఓ) పరిధిలో ఈ దళం పని చేస్తుంది. రీసర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) ఆదేశాలతో ముందుకు సాగుతుంది. అప్పగించిన బాధ్యతలను గప్‌చుప్‌గా పూర్తి చేస్తుంది. ” ఇలా సాగింది.
దీన్ని సూటిగా చెప్పాలంటే ఒక కిరాయి సాయుధ బృందం తప్ప మరొకటి కాదు. ఇది రహస్యంగా పని చేస్తుందని చెబుతున్నారు గనుక ఎన్ని ప్రాణాలు పోయినా, ఎంత నష్టం జరిగినా బయటకు తెలిసే అవకాశం కూడా లేదు. చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకని ? అసలు వీరు మన పౌరులే కాదు. చైనా నుంచి వచ్చిన వారికి మానవతా పూర్వక లేదా మతపరమైన కారణాలతో ఆశ్రయం ఇచ్చిన మనం వారిని చైనాకు వ్యతిరేకంగా వినియోగించుకుంటున్నాము. దీని గురించి కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా అంగీకరిస్తే అంతర్జాతీయంగా తలెత్తే సమస్యలకు సమాధానాలు ఉండవు. ఇప్పుడు చైనాతో వివాదంలో తొలిసారి దాన్ని వినియోగించటంలో ఇది కూడా ఒక కారణమా ?


దీని గురించి రాసిన జర్నలిస్టులకు, ప్రచురించిన పత్రికలకు, ఛానళ్లకు తెలియకపోవచ్చు లేదా తెలిసినా తెలియనట్లు వ్యవహరించవచ్చు గానీ ఈ కిరాయి బాపతు వ్యవహారం బహిరంగ రహస్యం. 1959లో టిబెట్‌లో విఫల తిరుగుబాటు చేసిన దలైలామాను మన దేశానికి తరలించటంలో అమెరికన్‌ సిఐఏ శిక్షణలో తయారైన ముఠాలు కీలక పాత్ర పోషించాయి. మన దేశం, అమెరికా, నేపాల్‌లో తిరుగుబాటు టిబెటన్లకు శిక్షణ ఇచ్చి దాడులు చేయించారు. ఆ ముఠాలకు చైనా సైన్యం చుక్కలు చూపింది. 1962లో చైనాతో యుద్దం యుద్దంలో ఓడిపోయిన కసి లేదా పరాభవంతో ఉన్న మన ప్రభుత్వం తరువాత కాలంలో వారితో సరిహద్దుల్లో దాడులు, విద్రోహ కార్యకలాపాలు చేయించేందుకు ఆ ముఠాలను సంఘటితపరచి చేరదీసింది.
ఇది జరిగి 58 సంవత్సరాలు అవుతున్నది. ఈ దళంలో ప్రారంభంలో చేరిన వారు కూడా ఇంకా పని చేస్తున్నారట. ఒక వేళ అదే నిజమైతే అమెరికా సిఐఏ శిక్షణ పొందిన వారిని మనం పోషించటం, అందునా కీలకమైన ‘ రా ‘ పర్యవేక్షణలోనా ? ఇది అసలు సిసలు దేశభక్తులకు తగినపనేనా ? సిఐఏ పెంచి పోషించిన వారు అమెరికాకు విధేయులుగా ఉంటారా మన దేశానికా ?


మరొక విధంగా చూస్తే దాని తొలి తరం వారు ఇరవై -పాతిక సంవత్సరాల ప్రాయంలో చేరారు అనుకుంటే వారి వయస్సు ఇప్పటికి 78-83 సంవత్సరాలు ఉంటుంది. అతిశయోక్తులు గాకపోతే వారు చైనాకు దడపుట్టిస్తారా ? అరవై సంవత్సరాల క్రితం శరణార్ధుల పేరుతో వచ్చిన సామాన్యులు లేదా సిఐఏ శిక్షణలో తయారైన ముఠాలకు చెందిన సంతానం మన దేశంలోనే పుట్టి పెరిగింది. వారు కూడా ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటిన వారుగానే ఉంటారు. టిబెట్‌లో పుట్టి పెరిగిన వారంటే కొండలు, కోనల గురించి తెలిసిన వారనుకోవచ్చు. మన దేశంలోని కర్ణాటక, హిమచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ తదితర ప్రాంతాలలోని శరణార్ధి శిబిరాలలో పుట్టి పెరిగి పైన చెప్పిన ముఠాలలో చేరిన వారికి టిబెట్‌ అనుపానులు ఎలా తెలుస్తాయి ? ఇలాంటి ముఠాలను భారతదేశం చేరదీసిందని చైనీయులకు తెలియదా ? అలాంటి వారిని కనిపెట్టేందుకు టిబెట్‌లోనే పుట్టి పెరిగిన వారిని చైనా సైన్యంలోకి తీసుకోదా, వారికి శిక్షణ ఇవ్వదా, వారి ముందు వీరు ఏ విషయంలో సరితూగుతారు ?


ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు, దేశంలోని పచ్చి మితవాదుల ఆధ్వర్యంలో నడిచే ” స్వరాజ్య ” పత్రిక సెప్టెంబరు 3న రహస్య ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ గురించి ఒక విశ్లేషణ రాసింది. ఆ దళాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి చైనాకు వ్యతిరేకంగా ఎన్నడూ వినియోగించలేదని, అయితే అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నదని తాజాగా తొలిసారి లడఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌ సో దక్షిణ ప్రాంతాన్ని మన దేశం ఆక్రమించుకోవటంలో ధైర్యంగా ముందుకు పోయి దాని అసలు కర్తవ్యాన్ని నెరవేర్చిందని పేర్కొన్నది. టిబెట్‌లో రహస్యంగా విద్రోహకార్యకలాపాలను సాగించటం, చైనా అధికార యంత్రాంగలోకి చొరబడటం వంటి కార్యకలాపాలకు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ను ఏర్పాటు చేశారు. పారాచూట్ల ద్వారా శత్రు ప్రాంతాల్లో దిగటంలో కూడా వీరికి శిక్షణ ఇచ్చారు. 1971లో అంతర్యుద్దం సందర్భంగా నేటి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ కొండ ప్రాంతాల్లో ఉన్న పాక్‌ సైన్యంపై దాడులు చేసేందుకు వీరిని వినియోగించారని తరువాత దాన్ని రహస్యంగా ఉంచారని, ఎట్టకేలకు ఇప్పుడు దాని ఉనికిని అంగీకరిస్తూ చైనాకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటుందని స్వరాజ్య విశ్లేషకుడు పేర్కొన్నారు.


ఇదే స్వరాజ్య పత్రిక 2018 మార్చి 25న ” టిబెట్‌ తిరుగుబాటు దినం: టిబెట్‌లో సిఐఏ ఎందుకు తనకార్యకలాపాలను నిలిపివేసింది ? ” అనే పేరుతో ఒక విశ్లేషణ ప్రచురించింది. అందువలన ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ వ్యవహారం రహస్యం కాదు అని వేరే చెప్పనవసరం లేదు. 1959 మార్చి 10న టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు వెనుక సిఐఏ హస్తం గురించి దీనిలో రాశారు. అదే నెల 21న తిరుగుబాటు ముగిసింది. దలైలామా అదృశ్యమై అరుణాచల్‌లోని తవాంగ్‌ ప్రాంతంలో మన దేశంలో ప్రత్యక్షమయ్యాడు. హిందీ-చీనీ భాయి భాయి అన్నట్లుగా ఉన్న సమయంలో చైనా మనతో యుద్దానికి తలపడిందని అనేక మంది విమర్శిస్తారు. దానికంటే ముందే చైనా వ్యవహారాల్లో నాటి నెహ్రూ ప్రభుత్వం వేలు పెట్టిన విషయాన్ని స్వయంగా దలైలామా ప్రవాసంలో స్వేచ్చ పేరుతో రాసిన తన ఆత్మకథలో పేర్కొన్నాడు. తన సోదరుడు 1956లో భారత్‌లో సిఐఏ ఏజంట్లతో సమావేశమయ్యాడని, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారని తెలిపాడు. టిబెట్‌ మాదిరి భౌతిక పరిస్ధితులు ఉండే అమెరికాలోని కాంప్‌ హాలే ప్రాంతానికి టిబెటన్లను తరలించి సిఐఏ శిక్షణ ఇచ్చింది. వారికి ఆయుధాలు, నిధులు ఇచ్చి నేపాల్‌ ద్వారా టిబెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనేక మంది చైనా సైనికుల చేతిలో హతమయ్యారన్నదీ బహిరంగ రహస్యమే. నేపాల్‌లో ఆ తిరుగుబాటుదార్లకు ఉపాధి కల్పించేందుకు, సిఐఏ కార్యకలాపాల కేంద్రంగా వినియోగించేందుకు నేపాల్‌లోని పోఖ్రాన్‌ నగరంలో ఒక హౌటల్‌ను కూడా సిఐఏ నిర్మించి ఇచ్చింది.


దలైలామా, అనుచరగణానికి ఘనస్వాగతం పలికిన నెహ్రూ ప్రభుత్వ చర్యను తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగానే చైనా పరిగణించింది. అయితే రాజకీయంగా ఆశ్రయం కల్పిస్తే వచ్చే సమస్యలకు భయపడి సిఐఏ రూపొందించిన పధకం మేరకు ఒక మతపెద్దగా పరిగణించి ఎర్రతివాచీ పరిచారు. నాటి నుంచి నేటి వరకు టిబెటన్లు రాజకీయ శరణార్ధులు కాదు, మతపరమైన వారిగా పరిగణించి మానవతా పూర్వక రక్షణ పొందుతున్నారు. రాజకీయ ఆశ్రయం కల్పించే దమ్ము, ధైర్యం మన 56 అంగుళాల ఛాతీకి కూడా లేకపోయింది. అ పని చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న భయమే కారణం. ఇదే చేయలేని వారు చైనాతో యుద్దానికి తలపడగలరా అన్నది సమస్య.


1972 ఫిబ్రవరి 21న అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌, చైనా అధినేత మావో మధ్య చారిత్రాత్మక సమావేశం జరిగింది. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రచ్చన్న యుద్ద క్రీడలో తమను పావులుగా వాడుకున్నారని తరువాత దలైలామా అమెరికన్లపై మండి పడ్డారు. చైనాకు ఎక్కడ కోపం వస్తుందో నని దలైలామాను చాలా సంవత్సరాల పాటు అమెరికాకు రానివ్వలేదని కూడా గమనించాలి.
అప్పుడు అమెరికా పావులుగా వాడుకుంటే ఇప్పుడు ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ పేరుతో ఉన్న టిబెటన్లను భారత్‌ బలిపశువులుగా ఉపయోగిస్తున్నదని, అదేమీ మెరుపు దళం కాదని చైనా నిపుణులు వ్యాఖ్యానించారు. ఆరువేల మందితో ఈ దళాన్ని ఏర్పాటు చేసినట్లు మన మీడియాలో వార్తలు వచ్చాయి తప్ప నిర్దారణ కాదు. ఇదే సమయంలో గరిష్టంగా వెయ్యి మంది కంటే లేరని చైనా నిపుణులు చెబుతున్నారు. రెండు అంచనాల్లోనూ అతి ఉండవచ్చు. భారత సైన్యం విదేశీ సైనికులను, అందునా టిబెటన్లను అసలు విశ్వసించదని, వారి స్ధాయి చాలా తక్కువగా ఉంటుందని, జీవనోపాధిగా టిబెటన్లు ఈ దళంలో చేరతారని చైనా నిపుణుడు గ్లోబల్‌ టైమ్స్‌తో చెప్పాడు. రాయిటర్స్‌ వార్తా సంస్ధ,పశ్చిమ దేశాల మీడియా రాసిన వార్తల్లో భారత్‌లోని ప్రవాస టిబెట్‌ ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌ఎఫ్‌కు మద్దతు ఇస్తున్నదని, భారత సైన్యంతో భుజం భుజం కలిపి చైనా మిలిటరీతో పోరాడుతున్నట్లు రాసినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. ప్రవాస టిబెటన్ల ప్రభుత్వం పేరుకు తప్ప ఉనికిలో లేదని, ఈ సమయంలో వెలుగులోకి వచ్చేందుకు ప్రయత్నించవచ్చని, ప్రవాస టిబెటన్లతో కుమ్మక్కై భారత దేశం టిబెట్‌ను తురుపు ముక్కగా వినియోగించుకోవటం అంటే తన కాళ్లమీద తానే కాల్చుకోవటం వంటిదని పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పబ్‌జీపై దాడిలో మోడీజీ నిజాయితీ ఎంత ?

04 Friday Sep 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, USA

≈ 1 Comment

Tags

India apps ban, India PUBG, Modi’s surgical strike on PUBG, PUBG


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ మరో 117 చైనా యాప్‌లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్‌టాక్‌ మరో 58 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్ధితి ఎలా ఉందంటే ప్రభుత్వం ఏమి చెప్పినా మనం తలూపాల్సిందే, లేకపోతే దేశద్రోహుల కింద లెక్క. చెప్పిందాన్ని నోరెత్తకుండా అంగీకరించటమే దేశభక్తి. ఆ యాప్‌లతో పాటు అమెరికా, ఐరోపా దేశాలలో తయారైన ఎన్నో ఎంతో కాలం నుంచి వినియోగంలో ఉన్నాయి. ప్రతి యాప్‌ వినియోగదారుల సమాచారాన్ని ఏదో ఒక దేశానికి లేదా కార్పొరేట్‌ కంపెనీలకు, గూఢచార సంస్థలకు చేరవేస్తున్నవే అన్నది అవునన్నా కాదన్నా తిరుగులేని సత్యం. యాప్‌లందు చైనా యాప్‌లు వేరయా అంటారా ? అయితే వాటి ముప్పు గురించి ఇప్పటి వరకు తెలియదా ? చైనా యేతర దేశాల యాప్‌లు దేశ రక్షణకు ఉపయోగపడుతున్నాయా అని ఎవరైనా అడిగారో అంతే సంగతులు, బూతులతో దాడి చేసేందుకు అసలు సిసలు దేశ భక్తులం మేమే అని తమకు తామే కితాబులు ఇచ్చుకొని, కీర్తి కిరీటాలను స్వయంగా తల మీద పెట్టుకున్న గుంపులు సిద్దంగా ఉంటాయి. అయినా విమర్శనాత్మకంగా చూడక, ప్రశ్నించక తప్పదు !


దేశ రక్షణకే కాదు, సామాజిక భద్రతకు సైతం ముప్పుగా పరిణమించిన వాటి మీద చర్య తీసుకోవాల్సిందే. రాజీ పడకూడదు. ఎవరైనా కోరుకొనేది అదే ! అలాంటి వైఖరి, చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నది చూద్దాం. పబ్‌జీ వీడియో గేమ్‌కు రూపకల్పన చేసింది ఐరిష్‌ జాతీయుడు. దాన్ని తీసుకొని తయారు చేసింది దక్షిణ కొరియా కంపెనీ. చైనా అతి పెద్ద మార్కెట్‌ కనుక దానిలో ప్రవేశించి సొమ్ము చేసుకోవాలని కొరియా కంపెనీ చైనా కంపెనీ టెన్సెంట్‌తో ఒప్పందం చేసుకొని పదిశాతం వాటా ఇచ్చింది. కంప్యూటర్లలో ఉపయోగించేది ఒకటైతే సెల్‌ఫోన్లలో ఉపయోగించే రకం మరొకటి. దాన్ని టెన్నెంట్‌ తయారు చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెల్‌ఫోన్లలో ఆడేదాన్ని మాత్రమే నిషేధించింది. కంప్యూటర్లలో శుభ్రంగా ఆడుకోవచ్చు. సెల్‌ఫోన్ల ద్వారా వినియోగదారుల సమాచారం చైనాకు అందకూడదు, కానీ కంప్యూటర్ల ద్వారా దక్షిణ కొరియాకు చేరవచ్చు అని పరోక్షంగా నరేంద్రమోడీ సర్కార్‌ చెబుతున్నది. దక్షిణ కొరియా అమెరికా అడుగుజాడల్లో నడిచే దేశం. తాను సేకరించిన సమాచారాన్ని అమెరికాకు ఇవ్వకూడదు అన్న హామీని మన ప్రభుత్వం తీసుకున్నదా ? తెలియదు, తీసుకున్నట్లు ప్రభుత్వమూ చెప్పలేదు.


పబ్‌జి ద్వారా వినియోగదారుల సమాచార తస్కరణ ఒక సమస్య అయితే సామాజికంగా తలెత్తే లేదా జరిగే హాని అంతకంటే పెద్దది. మరి ఈ అంశం గురించి మోడీ సర్కార్‌ వైఖరి ఏమిటి ? 2017లో పబ్‌జీని చైనాలో ప్రవేశపెట్టారు. కాని దానిలో ఉన్న అంశాలు యువతను తప్పుదారి పట్టించేవిగానూ, హింసాత్మక ధోరణులకు పురికొల్పేవిగా ఉండటంతో చైనా 2018లోనే నిషేధించింది. మన దేశంలో అనేక కోర్టుల్లో దీనికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. నరేంద్రమోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రాజధాని అహమ్మదాబాద్‌, రాజకోటలో తాత్కాలికంగా నిషేధించారు. గత ఏడాదే దీని గురించి పలు రాష్ట్రాల్లో చర్చలు జరిగాయి. విద్యార్ధుల పాలిట మత్తు మందుల వంటివి, హాని కలిగిస్తున్నాయి, పిల్లల్లో హింసాత్మక ధోరణులు పెరుగుతున్నాయి అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల మానసిక సమస్యలు కూడా తలెత్తాయి. అవేమీ కేంద్ర ప్రభుత్వ దృష్టిలో లేవా ?


అంతెందుకు ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆ దుష్ఫలితాల గురించి తెలుసు ! మహారాష్ట్రలో ఈ ఆటను నిషేధించాలని, దేశంలో సమీక్ష జరిపేందుకు నైతిక నియమావళి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముంబై హైకోర్టులో పదకొండు సంవత్సరాల బాలుడు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. ఆ పిల్లవాడి తరఫున స్వయంగా న్యాయవాది అయిన అతని తల్లి కోర్టుకు హాజరు అవుతున్నది. ప్రధాని నరేంద్రమోడీ విద్యార్ధులు, తలిదండ్రులతో గతంలో మాటా మంతీ జరిపిన సమయంలో ఒక తల్లి మాట్లాడుతూ తన కుమారుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిస అయ్యాడని వాపోయింది. అప్పుడు ప్రధాని మాట్లాడుతూ అతను పబ్జివాలానా ఏమిటి అని ప్రశ్నించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్‌ (ప్రచారం) అయింది. ఈ కేసులో ఆ ఉదంతాన్ని కూడా పిటీషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు.


హింసాత్మక ధోరణులను పెంచే అంశాలపై సమీక్ష జరిపే నైతిక నియమావళి కమిటీ సమీక్షలో పబ్‌జీ ఆట ప్రమాదకరమని భావించి ఆ కమిటీ చైనాలో నిషేధించాలని సిఫార్సు చేసింది, దాన్ని అక్కడ అమలు జరిపారు. మన దేశంలో కూడా అలాంటి కమిటీని వేసి చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ముంబై కేసులో పిటీషనరు ప్రశ్నించాడు. ఇలాంటి ఆటలే పిల్లల మీద ప్రతికూల ప్రభావాలు చూపుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక నివేదికలో హెచ్చరించిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అంతే కాదు బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ కూడా పబ్జీ ఆట నిషేధానికి తీసుకున్న చర్యల గురించి నివేదిక ఇమ్మని కేంద్రాన్ని కోరింది. పబ్‌జీని జూదంగా మార్చి ఆడుతున్న పెద్ద వారిని గుజరాత్‌లో పోలీసులు అరెస్టులు కూడా చేశారు.


చైనా కమ్యూనిస్టు దేశం, నియంతృత్వం ఉంటుంది, అక్కడ ఏమైనా చేయగలరు, మనది ప్రజాస్వామిక దేశం అక్కడ చేస్తున్న మాదిరి ఇక్కడ చేయటం కుదరదు అనే వాదన ఇటీవల అనేక సందర్భాలలో కొందరు ముందుకు తెస్తున్నారు. బాధ్యతను తప్పించుకొనేందుకు అదొక సాకు తప్ప మరొకటి కాదు. తప్పుదారి పడుతున్న పిల్లలను సరైన దారిలోకి తెస్తామంటే ప్రజాస్వామ్యం అడ్డుకుంటుందా ? ఒక వేళ అడ్డుకునేట్లయితే భావి తరాలను చెడగొట్టే అలాంటి ప్రజాస్వామ్యం మనకెందుకు ? పబ్‌జి యాప్‌ను నిషేధిస్తే చైనా కంపెనీ టెన్సెంట్‌కు లక్ష కోట్ల రూపాయల నష్టమని కొందరు చెబుతున్నారు. పదిశాతం వాటా ఉన్న కంపెనీకే అంతనష్టమైతే తనదని కూడా చూసుకోకుండా చైనా కమ్యూనిస్టులు దాన్ని నిషేధించారు. మరి మన ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు కొనసాగనిచ్చినట్లు ? పోతే పోనీయండి పిల్లలు ఏమైతే మాకేం అని పాలకులు అనుకుంటున్నారా ?


2018 మార్చినెల తరువాత తొమ్మిది నెలల కాలంలో చైనా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క వీడియో గేమ్‌ను కూడా అమ్మకానికి అనుమతించలేదని ఆ విధానాన్ని 2019లో కూడా కొనసాగిసాంచవచ్చని 2018 డిసెంబరు 13న ఒక పత్రికలో కెవిన్‌ వెబ్‌ అనే విలేకరి రాశారు. ప్రభుత్వ విధానాలకు వీడియో గేమ్‌లు ఉన్నాయా లేదా అని పరిశీలించి అభిప్రాయం చెప్పేందుకు ఒక నైతిక నియమావళి కమిటీని కూడా చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నైతికత గురించి కబుర్లు చెప్పే మన పాలకులు ఇంతవరకు అలాంటి కమిటీని ఏర్పాటు చేయలేదు. సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు అనే హాంకాంగ్‌ నుంచి వెలువడే పత్రికను నడుపుతున్నది కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్టుల పట్ల దానికి సానుభూతి కూడా ఉన్నట్లు మనకు కనపడదు. అలాంటి పత్రిక రాసిన కథనం ప్రకారం 2018 మార్చినెలలో హింసాత్మక, ఇతరంగా దురుసుగా వ్యవహరించటాన్ని ప్రోత్సహించే సినిమాలు, వీడియోగేమ్‌లు, యూ ట్యూబ్‌ సీరీస్‌ లేదా చిత్రాలను, నూతన మీడియా విభాగం కిందికి వచ్చే అన్నింటినీ సమీక్షించేందుకు చైనా సర్కార్‌ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దాన్నుంచి అనుమతులు వచ్చే వరకు కొత్త వాటిని వేటినీ అంగీకరించకూడదని నిర్ణయించింది.అంతకు ముందు అనుమతించిన వాటి మీద కూడా ఆంక్షలు విధించింది.


చైనా సెంట్రల్‌ టీవీ ( మన దూరదర్శన్‌ వంటిది) వెల్లడించిన సమాచారం ప్రకారం నైతిక విలువల సమీక్ష కమిటీ 20గేమ్‌లను సమీక్షించి తొమ్మిదింటిని తిరస్కరించింది. మిగిలిన వాటిలో మార్పులను సూచించింది. కొన్ని వీడియో గేమ్‌లు పిల్లలను వ్యసన పరులుగాను, పని పాటలు లేని వారిగానూ మారుస్తాయనే విమర్శ చైనాలో వచ్చింది. 2018లో వీడియో గేమ్‌లపై 34 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేసినట్లు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో గేమ్స్‌ తయారీ సంస్ధ చైనా కంపెనీ టెన్సెంట్‌. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన దాని ఆదాయం 200 బిలియన్‌ డాలర్లు పడిపోయింది. పిల్లలు అదే పనిగా గేమ్స్‌లో మునిగి పోకుండా ఉండేందుకు వారిని గుర్తించి వ్యవధిని పరిమితం చేసే అంటే నిర్ణీత వ్యవధి తరువాత గేమ్‌లు ఆగిపోయే విధంగా సాప్ట్‌వేర్‌లో మార్పులు కూడా టెన్సెంట్‌ కంపెనీ చేసింది. చైనాను ఆర్ధికంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే మన సర్కార్‌ యాప్‌లను నిషేధించింది. కానీ అంతకంటే ముందే చైనా తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తమ కంపెనీకి ఎంత నష్టం వచ్చినా ఆ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ నేత అనుకుంటున్న నరేంద్రమోడీ లేదా ఆయన సలహాదారులు, పెద్ద యంత్రాంగం వీటన్నింటినీ గమనిస్తున్నదా ? నిజంగా గమనిస్తే పబ్‌జీ వంటి ప్రమాదకరమైన వీడియో గేమ్‌ల మీద చర్య తీసుకొనేందుకు సరిహద్దులో చైనాతో సమస్య వచ్చేంత వరకు ఆగాలా ? అందువలన పబ్‌జీ గురించి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి తెలియని విషయము కాదు అన్నది స్పష్టం. తలిదండ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, కోర్టులలో కేసులు ఎందుకు దాఖలు అవుతున్నాయో పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా ? కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు చైనాను దెబ్బతీసేందుకు నిషేధం అని ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే చిత్తశుద్ధి సమస్య ముందుకు వస్తున్నది. జాతిని ఏకత, శీలముతో నిర్మిస్తాము అని చెప్పుకొనే సంఘపరివార్‌ కుటుంబంలో పెరిగిన వారే ఇప్పుడు దేశంలోని అని ప్రధాన పదవులలో ఉన్నారు. పబ్‌జీ గాక పోతే దాని తాతల వంటి ప్రమాదకర వీడియో గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి, మరి వాటి సంగతేమిటి ?


ప్రపంచంలో ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మీద కొత్త యుద్దం మొదలైంది. పది సంవత్సరాల క్రితం వరకు చైనా ఈ రంగంలోకి వస్తుందని లేదా తమకు పోటీ ఇస్తుందని అమెరికా వంటి దేశాలు ఊహించలేదు. చైనా వారికి తెలివి తేటలు లేవు, ఫ్యాక్టరీల్లో గొడ్డు చాకిరీ చేస్తారు గానీ వారికి ఆంగ్లం రాదు, ఆంగ్లం రాకుండా కృత్రిమ మేథలో ప్రవేశించలేరు అన్న భ్రమలున్నవారికి దిమ్మతిరిగేలా చైనా ముందుకు వచ్చింది. రాజకీయ రంగంలో ఎవరు ఎటు వుండాలో తేల్చుకోవాల్సిన సమయాల మాదిరి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోటీలో కూడా అమెరికా – చైనాల మధ్య ఏ పక్షంలో ఉండాలో దేశాలూ, కంపెనీలు తేల్చుకోవాల్సిస తరుణం వచ్చిందని అమెరికా మీడియా సంస్ధ సిఎన్‌ఎస్‌ విశ్లేషకులు జిల్‌ దిసిస్‌ జూలై11న రాసిన దానిలో పేర్కొన్నారు. ఫలానా యాప్‌, పరికరం ఫలానా దేశానిది అయితే కొనవద్దు అనే ఆంక్షలకు, ఇతర దేశాల మీద వత్తిళ్లకు శ్రీకారం చుట్టింది అమెరికా. ఇది రాబోయే రోజుల్లో పెట్టుబడిదారీ దేశాల్లోనే కొత్త విబేధాల సృష్టికి నాంది పలకటం ఖాయం.


అమెరికాతో సహా అనేక దేశాలు చైనాతో వాణిజ్యలోటులో ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు రాజకీయంగా చైనా వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆస్ట్రేలియా, జపాన్‌, జర్మనీ, దక్షిణ కొరియా,బ్రెజిల్‌, సౌదీ అరేబియా, స్విడ్జర్లాండ్‌, ఒక దేశం కాకున్నా తైవాన్‌ ప్రాంతం చైనాతో వాణిజ్యంలో మిగుల్లో ఉన్నాయి. అందువలన ఎవరు ఎటు ఉండాలో తేల్చుకోవాల్సిన స్ధితే వస్తే ఈ దేశాల్లో ఉన్న కార్పొరేట్‌ సంస్ధలు నష్టాలు మూటగట్టుకొని లేదా మడి గట్టుకొని చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంటాయా లేక అనుకూల వైఖరిని తీసుకుంటాయా అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు రావటం అనివార్యం.తటస్ధ వైఖరి తీసుకున్నా అది అమెరికాకు ఓటమే అవుతుంది. టిక్‌టాక్‌ యాప్‌ చైనా కంపెనీది అయినప్పటికీ దాని సిఇఓ అమెరికన్‌. మన దేశం దాన్ని నిషేధించిన తరువాత మా భద్రతకు సైతం ముప్పే అంటూ అమెరికా పల్లవి అందుకుంది. నిజంగా ముప్పు అనుకుంటే చైనా కంపెనీకి ఒక అమెరికన్‌ సారధ్యం వహించటం నిజంగా ఆశ్చర్యమే. అదే అమెరికా దాన్ని తమ దేశంలోని కార్పొరేట్లకు విక్రయించాలని కోరిన విషయం కూడా తెలిసిందే.


ప్రస్తుతం యాప్‌ల తయారీలో ప్రపంచ వ్యాపితంగా తీవ్ర పోటీ నెలకొన్నది. యాప్‌లు వస్తువులను తయారు చేయవు. వాటిని మార్కెటింగ్‌ చేసేందుకు ఉపయోగపడతాయి. వినోదం లేదా సమాచారం, ఆటల వంటి వాటిని వినియోగదారులకు చేరుస్తాయి. వాటి ద్వారానే డబ్బు సంపాదించవచ్చు. ఇటీవలి కాలంలో చైనాలో పెరుగుతున్న లేదా కొత్తగా పుట్టుకు వస్తున్న బిలియనీర్లు ఈ రంగం నుంచి వచ్చిన వారే అత్యధికులు. ఇప్పుడు యాప్‌ల సునామీని ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ విభాగాన్ని విశ్లేషిస్తున్నవారు చెబుతున్నమాట. యాప్‌ అనీ అనే ఒక సంస్ధ రూపొందించిన నివేదిక ప్రకారం 2020 తొలి ఆరు నెలల కాలంలో ప్రపంచ యాప్‌ ఆర్ధిక వ్యవస్ధలో మొబైల్‌ యాప్స్‌ మరియు గేమ్స్‌ మీద 50 బిలియన్‌ డాలర్ల మేర వినియోగదారులు ఖర్చు చేశారు.అంతకు ముందు ఆరునెలలతో పోలిస్తే పదిశాతం ఎక్కువ. ప్రపంచ వ్యాపితంగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపధ్యంలో మే నెలలో రికార్డు స్ధాయిలో 9.6బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ప్రపంచ వ్యాపితంగా 1.6లక్షల కోట్ల గంటల పాటు వినియోగదారులు ఆరునెలల కాలంలో మొబైల్స్‌తో కాలక్షేపం చేశారని అంచనా.రానున్న రోజుల్లో కొత్త అంశాలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలను చూసేందుకు వినియోగదారులు పోటీ పడతారని భావిస్తున్నారు. ప్రపంచ యాప్‌ల సునామీకి, అమెరికా-చైనాల పోటీకి ఇదే కారణం.


కరోనా వైరస్‌ ఒక వైపు ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తున్నది అన్నది ఒక చేదు నిజం. ఇదే సమయంలో గతంలో ఏ వైరస్‌ చూపని ప్రభావం జన జీవితాల మీద చూపుతున్నది అంటే అతిశయోక్తి కాదు. సెల్‌ ఫోన్‌ లేకుండా రోజువారీ జీవనం గడవదు అనుకొనే పరిస్ధితి రావటానికి కరోనా వైరస్‌ ముందు పది సంవత్సరాలు పడుతుందని అని అంచనా వేశారు అనుకుందాం. కరోనా ఆ వ్యవధిని రెండు మూడు సంవత్సరాలు తగ్గించి వేసిందని తాజా అంచనా. కొద్ది సంవత్సరాల క్రితం పుడుతున్న పిల్లలు ముందు అమ్మా అనటం కంటే అమ్మాయి అంటున్నారని జోక్‌లు పేలాయి. చందమామను చూపి పిల్లలకు తిండి తినిపించే తల్లులు పాత సినిమాలు, కథల్లో మాత్రమే కనిపిస్తారు. సెల్‌ ఫోన్లు చూపి తినిపించే వారు ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నారు. కరోనా ఈ పరిణామాన్ని మరింత వేగవంతం కావించింది. సెల్‌ ఫోన్‌ లేకుండా బడికి వెళ్లం అని పిల్లలు మారాం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.


ఇప్పటికే టెలికాం రంగంలో చైనా దూసుకుపోతున్నది. ఐదవతరం ఫోన్ల సాంకేతిక పరిజ్ఞానంలో చైనా హువెయి కంపెనీ ముందున్నది. భద్రతా కారణాలను సాకుగా చూపి దాని పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయవద్దని అమెరికా తన అనుంగు దేశాలను ఆదేశిస్తున్నది. యాప్‌లను కూడా ఇదే సాకుతో అడ్డుకో చూస్తున్నది. గాల్వన్‌ లోయ ఉదంతాలకు ముందు మన దేశానికి టిక్‌టాక్‌, పబ్‌జి, తదితర చైనా యాప్‌ల నుంచి ముప్పు ఉందని ప్రభుత్వం చెప్పలేదు. వెనెజులా, ఇరాన్‌ మీద కక్ష గట్టిన అమెరికా మనదేశాన్ని తన వైపు తిప్పుకుంది. అమెరికా బెదిరింపులకు లొంగి మనం ఆ రెండు దేశాల నుంచి చమురు కొనుగోలు ఆపి అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాము. ఐదవతరం టెలికాం టెక్నాలజీ విషయంలో కూడా ఇదే వైఖరి తీసుకున్నాము.చైనా కంపెనీలను టెండర్లలో పాల్గొన కుండా నిషేధించటంతో పాటు పెట్టుబడులను కూడా అడ్డుకుంటూ నిబంధనలను రూపొందించారు. మనం చైనా వ్యతిరేక శిబిరం అంటే అమెరికా టెంట్‌లోకి దూరేందుకు గాల్వన్‌ లోయ ఉదంతాలు ఒక సాకు తప్ప మరొకటి కాదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.


ఒక నాడు కృత్రిమ మేధ రంగంలో ఐబిఎం, ఆపిల్‌, మైక్రోసాప్ట్‌ వంటి అమెరికన్‌ కంపెనీలు తప్ప మరొక పేరు వినిపించేది కాదు. ఇప్పటికీ అవి రంగంలో ఉన్నప్పటికీ చైనా కంపెనీలు ముందుకు దూసుకు వచ్చాయి. మేడిన్‌ చైనా 2025 పేరుతో చైనా ఉన్నత స్ధాయి సాంకేతిక పరిజ్ఞానంలో పట్టుసాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. పశ్చిమ దేశాల మీద ఆధారపడకూడదనే ప్రధాన అంశం దానిలో ఉంది. అందుకే తీగలతో పనిలేని ఫోన్లు, ఇంటర్నెట్‌, మైక్రోచిప్స్‌, రోబోరంగంలో బిలియన్ల డాలర్లను పెట్టుబడులుగా పెడుతున్నది.2019లో చైనా చేసుకున్న దిగుమతుల్లో పదిహేను శాతం లేదా 306 బిలియన్‌ డాలర్ల విలువగల చిప్‌సెట్లను చైనా దిగుమతి చేసుకుంది. ఈ నేపధ్యంలోనే తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తస్కరిస్తున్నది అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ట్రంప్‌ ప్రారంభించాడు.అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి తమకు సాంకేతిక పరిజ్ఞానం అందదు అనే నిర్ణయానికి చైనా వచ్చింది. పైన చెప్పుకున్నట్లు పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా అభివృద్ధి పిలుపుకు నేపధ్యం ఇదే.


ప్రపంచంలో తొలి సారిగా అణుబాంబును తయారు చేసింది, ప్రయోగించి భయపెట్టింది అమెరికా. అయితే నాటి సోవియట్‌ నేత స్టాలిన్‌ తాపీగా బాంబును తయారు చేయించి, అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసి ముందుకు పోయిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం తప్పుకాదు. తన వాణిజ్య ప్రయోజనాల కోసం టిక్‌టాక్‌ లేదా పబ్‌జి, మరొక కంపెనీ ఏదైనా చైనాకు దూరంగా జరిగినా ఆశ్చర్యం లేదు. అయినప్పటికీ వారికి వచ్చే నష్టం లేదు. కొత్త కంపెనీలను రంగంలోకి తెస్తారు తప్ప అయ్యో అంతా అయిపోయిందని చేతులు ముడుకు కూర్చోరు. సాంకేతిక రంగంలో చైనా ఏమీ లేని స్దితి నుంచి ప్రారంభం అయిందని గుర్తుంచుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కల్పిత వార్తలతో జనాలకు కహానీలు చెబుతున్న మీడియా !

03 Thursday Sep 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

#media lies on China, fake news, fake stories in media, media lies, Trump lies

ఎం కోటేశ్వరరావు


పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లుగా మీడియాలో నిజాయితీగల మీడియా వేరయా అని చెప్పుకోవాల్సిన రోజులు దాపురించాయి. మీడియాలో పని చేసే వారి గురించి చెప్పనవసరం లేదు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుందన్నట్లుగా ఏ మీడియాలో పని చేస్తే దాని యాజమాన్యానికి అనుగుణంగా రాయాలి, చూపాలి తప్ప పని చేసే వారికి వాస్తవాలతో పని లేదు. అందుకే మీడియా అన్నా వాటిలో పని చేసే వారన్నా విశ్వసనీయత లేని వారిగా పరిగణిస్తున్నారు.


మే, జూన్‌ మాసాలలో భారత-చైనా సరిహద్దుల్లో జరిగిన విచారకర పరిణామాల్లో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు మరణించారు, 73 మంది గాయపడ్డారు, పది మంది చైనా సైనికులకు బందీలుగా పట్టుబడ్డారు. మన సైనికులు కూడా చాలా మంది చైనీయులను చంపారని, బందీలుగా పట్టుకున్నారని చెప్పటం తప్ప అటువైపు నుంచి ఎలాంటి నిర్ధారణలు లేవు. మరణించిన వారి గురించి చైనా ప్రభుత్వం బయట పెట్టటం లేదని, కుటుంబ సభ్యుల నోరు నొక్కివేసిందని మన మీడియా చెబుతోంది. పోనీ అది నిజమే అనుకుందాం. గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతంలో మన వారు 20 మంది మరణించటం తప్ప బందీలుగా ఎవరూ లేరని మన అధికారులు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ తరువాతే చైనా తన దగ్గర ఉన్న పదిమంది మన సైనికులను మనకు బహిరంగంగా అప్పగించింది. మన వారెవరూ బందీలుగా లేరని చెప్పిన తరువాత ఆ పదిమందిని చంపినా మన వారు నోటితో సహా అన్నీ మూసుకోవటం తప్ప చేసేదేమీ లేదు. అయినా చైనా మనవారిని మనకు అప్పగించింది.


అప్పటి వరకు మన మీడియా అల్లిన కథలకు బందీల అప్పగింత చెంపదెబ్బ అయింది. అన్నింటికీ మించి మన భూ భాగాలను చైనా అన్ని కిలోమీటర్లు ఆక్రమించింది, ఇన్ని కిలోమీటర్లు ఆక్రమించింది అని స్వయంగా చూసి వచ్చినట్లుగా మీడియా రాసింది, చూపింది. చర్చలు చేసింది, చైనా వ్యతిరేక విషాన్ని నూరిపోసింది. దేశ భక్తిని ఎంత ఎక్కువగా ప్రదర్శించుకొంటే ఒక నాడు అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు చైనా వ్యతిరేకతను ఎంత ఎక్కువగా రెచ్చగొడితే అంత దేశ భక్తి అన్నట్లుగా మీడియా పోటీ పడి కేంద్ర పాలకుల మెప్పు పొందేందుకు ప్రయత్నించింది. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చైనా వారు మన ప్రాంతాలను ఆక్రమించలేదు అని చెప్పి మీడియాను బకరాను చేశారు. మీడియా ప్రచారాన్ని నమ్మి పైత్యం తలకెక్కించుకున్న వారి పరిస్ధితి తేలు కుట్టిన దొంగల మాదిరి తయారైంది.


రెండు దేశాల మధ్య ఎవరికీ చెందని ప్రాంతం కొంత ఉంది, దాన్ని చైనా ఆక్రమించుకుంది కనుకనే ప్రధాని మన ప్రాంతాన్ని ఆక్రమించలేదనే ఒక ప్రచారాన్ని ముందుకు తెచ్చారు. ఒక వేళ అదే నిజమైతే మన సైనికులను ఆప్రాంతానికి పంపి ప్రాణాలు పోయేందుకు నిర్ణయం తీసుకున్నది ఎవరు ? ఇంతకాలం ఆక్రమణకు పాల్పడని వారు ఇప్పుడెందుకు ఆ పని చేశారు అనే ప్రశ్నలు కూడా వస్తాయి. ఇక్కడ ఎవరికీ చెందని ప్రాంతమంటూ ఒకటి లేదు. ఒక నిర్ధారిత సరిహద్దు రేఖ లేదు. బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖ ఏ దేశ ఆధీనంలో ఏ ప్రాంతం ఉంది అని నిర్ధారించుకొని గీచింది కాదు, సుమారుగా నిర్ణయించారు. దాని ప్రకారం భారత్‌కు చెందినవి అనుకున్న కొన్ని ప్రాంతాలు చైనాకు చెందినవిగానూ, చైనాకు దక్కాల్సినవి అని పేర్కొన్నవి మన దేశ ఆధీనంలో ఉన్నాయి. ఆక్సారు చిన్‌ ప్రాంతం సరిహద్దు రేఖ ప్రకారం మనదిగా చూపారు కానీ అది ఎప్పటి నుంచో మా ఆధీనంలో ఉంది అని చైనా చెబుతోంది. దానితో విబేధించిన మన దేశం దాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించింది, పర్యవసానం 1962 యుద్దం. దానిలో మొత్తంగా జరిగిందేమిటి ? చొచ్చుకుపోయిన మన సేనలను వెనక్కు కొట్టిన చైనా తన ఆధీనంలో ఉన్న ప్రాంతానికి కట్టుబడి ఉంది. దాన్ని మనదే అంటున్నాము. మరోవైపున ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో ఉంది. మక్‌మోహన్‌ రేఖ ప్రకారం అది చైనా ప్రాంతంగా ఉంది. అందువలన అది మా టిబెట్‌ దక్షిణ భాగం అని చైనా చెబుతోంది. తమది అని చెబుతోంది తప్ప ఆక్రమించుకొనేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.
తిరిగి మరోసారి మీడియా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటమే విషాదకరం. దాన్ని నమ్మి అనేక మంది మరోసారి చిత్తయ్యారు. జూన్‌లో గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో మన సైనికులు చంపిన చైనా సైనికుల సమాధులు అంటూ జాతీయ మీడియాతో పాటు తెలుగు టీవీ ఛానల్స్‌ కూడా ఊదరగొట్టాయి. ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. మరోసారి పప్పులో కాలేశాయి. తప్పుడు వార్తలను ప్రచురిస్తే పాఠకులకు కలిగిన విచారానికి చింతిస్తున్నామని పత్రికలు ఒకప్పుడు చిన్నదో పెద్దదో వివరణ ఇచ్చేవి. ఇప్పుడు ఆ మాత్రపు విలువలను కూడా పాటించటం లేదు.


ఇంతకీ టీవీలలో చూపిన సమాధులు జూన్‌లో మరణించిన చైనా సైనికులవి కాదు. 1962 యుద్దంలో మరణించిన చైనా సైనికులవని, అవి ఆక్సారుచిన్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న చైనా గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలోని కాంగ్‌క్సివా అనే చోట ఏర్పాటు చేసిన యుద్ద స్మారక కేంద్రంలో ఉన్నట్లు తేలింది. వాటిని చూపి యాంకర్లు రెచ్చిపోయారు. బిజెపి లేదా సంఘపరివార్‌ సంస్ధల నేతలను తలదన్నే విధంగా మాట్లాడారు. గాల్వన్‌లోయలో మన సైనికుల చేతిలో హతులైన చైనా వారికి సంబంధించి రుజువులు ఏవి అనే అడిగేవారికి సమాధానం ఇవి అన్నారు. అంతే కాదు కావాలంటే వెళ్లి లెక్కపెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. ఇంకోసారి రుజువులు అడగొద్దు, వీరత్వం చూపిన మన సైనికులను అవమానించవద్దు అని ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రెచ్చిపోయారు. ఆచరణలో ఆజ్‌తక్‌ టీవీ అవమానించింది.
టైమ్స్‌ నౌ ఛానల్‌ కూడా అదే బొమ్మలను చూపింది. మన సైనికులు 35 మంది చైనా వారిని చంపారని మన దగ్గర ఇప్పటికే ఆధారాలున్నాయి, కానీ మరణాలు అంతకంటే ఎక్కువే అని చిత్రాలు చూపుతున్నాయని యాంకర్‌ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్‌క్సివా యుద్ద వీరుల స్మారక కేంద్రంలో 107 మంది సమాధులు ఉన్నట్లు చైనా సైన్యం అధికారికంగానే ప్రకటించింది. వాటితో పాటు 2019లో మరణించిన ఒక సైనికుని సమాధిని కూడా అక్కడే ఏర్పాటు చేశారు, దాంతో 108 ఉన్నట్లు చైనా సిసిటీవీ మిలిటరీ ఛానల్‌లో ఆగస్టు 24నే చూపారని తేలింది. అవే సామాజిక మాధ్యమంలో కూడా ఉన్నాయి. వాటిని మన టీవీల వారు తీసుకొని తాము కనుగొన్నట్లు ఫోజు కొట్టినట్లుగా తేలింది. గ్జిన్‌ జియాంగ్‌ మిలిటరీ ప్రాంతంలో ఉన్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఆ స్మారక కేంద్రానికి వెళ్లి నివాళి అర్పించటం జరుగుతుంది. అలాంటి ఒక సైనికుని చిత్రాన్ని మన టీవీలు చూపాయి. ఆ సైనికుడు విలపిస్తున్నట్లు అది గాల్వన్‌ లోయలో మరణించిన చైనా వారి గురించి అని మన టీవీలు వ్యాఖ్యానం చెప్పాయి. అక్కడ 107మంది సైనికుల వివరాలు, ఇతర విశేషాల గురించి ఒక వ్యాసం 2019 మార్చినెలలో ప్రచురితమైనట్లు బూమ్‌ వెబ్‌ సైట్‌ వెల్లడించింది.


ఇవిగో గాల్వన్‌లో మరణించి చైనా సైనికుల సమాధులు అంటూ ఇండియా టుడే టీవీ ప్రసారం చేసిన వాటిలో ఒక గూగుల్‌ చిత్రం ఉంది. అది 2011నాటిదని ఆల్ట్‌ న్యూస్‌ కనుగొన్నది. ఏ చిత్రం ఎప్పటిదో కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ఇండియా టుడే లేదా మరొక టీవీ ఛానల్స్‌ దగ్గర లేవా అంటే అందరి దగ్గరా ఉన్నాయి. వాటిని నిర్ధారణ చేసుకోవచ్చు గానీ తప్పుడు ప్రచారం చేయదలచుకున్నవారికి వాటితో పనేముంటుంది. తాము ప్రత్యేకంగా సంపాదించిన ఉపగ్రహ చిత్రాలంటూ ఇటీవలి కాలంలో టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు ప్రచురిస్తున్న లేదా ప్రదర్శిస్తున్నవన్నీ మిలిటరీ లేదా ప్రభుత్వం అందచేస్తున్నవే. వాటి గురించి మీడియా చేసే వ్యాఖ్యలు తప్ప నిజంగా అక్కడ జరుగుతున్నది ఏమిటన్నది సామాన్యులకు తెలియదు.


మన మీడియా ఒక్కటే కాదు, అనేక దేశాలలో అమెరికన్‌ సిఐఏ ఏజన్సీలు అందించే అనేక కథనాలు, చిత్రాలను పాఠకులకు, వీక్షకుల ముందు కుమ్మరిస్తున్నాయి. అమెరికా లేదా మరొక దేశ గూఢచార, ఇతర ప్రభుత్వ సంస్ధలు ప్రచారదాడిలో భాగంగా ఇలాంటి వాటిని నిరంతరం విడుదల చేస్తుంటాయి. వాటి వనరును పేర్కొన కుండా పత్రికలు , టీవీ ఛానల్స్‌కు ఆయా దేశాల్లో ఉన్న వార్తా సంస్దలు విడుదల చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాపితంగా కుహనా వార్తలు (ఫేక్‌ న్యూస్‌) పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. అందువలన అనేక అంతర్జాతీయ లేదా జాతీయ స్ధాయి మీడియా సంస్దలు వచ్చిన వార్తలను సరి చూసుకొనేందుకు, వాస్తవాలను తెలుసుకొనేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకొన్నాయి. వచ్చిన వార్తల తీరుతెన్నుల గురించి ప్రత్యేక కథనాలను వెలువరిస్తున్నాయి.


జూన్‌లో భారత-చైనా సరిహద్దులో జరిగిన ఉదంతాల గురించి వెలువడిన వీడియోలు, వార్తల గురించి బిబిసి విభాగం అదే పని చేసి కుహనా వార్తలు, కుహనా వీడియోలు, దృశ్యాల గురించి జూన్‌ 19న ఒక ప్రత్యేక కధనాన్ని వెలువరించింది. రెండు దేశాల సైనికులు దెబ్బలాడుకుంటున్న దృశ్యం అంటూ ఒక వీడియో వైరల్‌ అయింది. గాల్వన్‌ నది లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణ అని నమ్మిన వారు దాన్ని చూసి రకరకాల వ్యాఖ్యలు చేశారు. అయితే అదే వీడియో 2017 ఆగస్టులో, 2019 సెప్టెంబరులో కూడా అదే విధమైన సమాచారంతో యూట్యూబ్‌లో పోస్టు అయినట్లు బిబిసి తెలిపింది. ఏడాది క్రితం కాశ్మీరులో ఉగ్రవాదులతో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను గాల్వాన్‌ లోయ ఉదంతానికి అంటగట్టి ప్రచారం చేశారు. అదే విధంగా టిక్‌టాక్‌లో చైనా భాషలో ఉన్న ఒక వీడియోను కూడా అలాగే చిత్రించారు. దానిలో భారతీయ సైనికుడిని చైనా వారు తిడుతున్నట్లు, వెళ్లిపొమ్మని దబాయిస్తున్నట్లు ఉంది. జనవరిలో యూట్యూబ్‌లో పోస్టు అయిన ఆ వీడియోను తాజా ఉదంతంగా ఒక కాంగ్రెస్‌ నేత ప్రచారంలోకి తెచ్చారు. పోనీ సదరు వీడియో లడఖ్‌ ప్రాంతానిదా అంటే అదీ కాదు, అక్కడికి దాదాపు 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు సంబంధించింది.ఒక సైనికుడి మృతదేహానికి అంత్యక్రియలకు సంబంధించిన వీడియోను గాల్వన్‌ ఉదంతానికి జత చేసి ప్రచారం చేశారు. మేనెలలో లే-లడఖ్‌ ప్రాంతంలో ఒక ప్రమాదంలో మరణించిన సైనికుడికి సైనిక లాంఛనాలతో మహారాష్ట్రలోని స్వంత పట్టణంలో జరిపిన కార్యక్రమానికి సంబంధించిన వీడియో అది. గాల్వన్‌ లోయలో భారత సైనికుల మృతదేహాలంటూ హల్‌ చల్‌ చేసిన మరికొన్ని చిత్రాలను కూడా బిబిసి టీమ్‌ పరిశోధించింది. 2015లో నైజీరియా సైనికులపై అక్కడి బోకో హరామ్‌ తీవ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వారి చిత్రాలవి. వాటిని పాకిస్ధాన్‌ వెబ్‌సైట్‌ కూడా ఒకటి ఉపయోగించింది. అనేక మంది సైనికుల శవపేటికలకు సంబంధించిన మరో చిత్రాన్ని కూడా అదే వెబ్‌సైట్‌లో పెట్టి అది పుల్వామా దాడిలో మరణించిన భారత సైనికులని పేర్కొన్నారు. అది కూడా తప్పుడు చిత్రమే నంటూ పాఠకులను బిబిసి హెచ్చరించింది.


ప్రపంచంలో కల్పిత వార్తలు, రాజకీయ నేత అబద్దాలు ఇప్పుడు పెద్ద సమస్యలుగా తయారయ్యాయి. అతి పెద్ద కల్పిత వార్తల తయారీ కేంద్రాలకు అమెరికా నిలయం. అదే విధంగా రాజకీయ నేతల్లో అతి పెద్ద అబద్దాల కోరు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇతగాడి గురించి అక్కడి పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ చెప్పిన సత్యం. అబద్దాల సునామీ అనే శీర్షికతో గార్డియన్‌ పత్రిక ట్రంప్‌ 20వేల అబద్దాలను పూర్తి చేసిన సందర్భంగా వాషింగ్టన్‌ పోస్టు చెప్పిన అంశాలను ఉటంకిస్తూ జూలై 13న ఒక వార్తను రాసింది. జూలై 9న రికార్డు స్ధాయిలో ట్రంప్‌ 62 అబద్దాలను ఆడి అబద్దాల రికార్డును నమోదు చేసినట్లు వాషింగ్టన్‌ పోస్టు వాస్తవాల నిర్ధారిత విభాగం పేర్కొన్నది. అలాంటి ట్రంప్‌, అమెరికా మనకు జిగినీ దోస్తు, భాగస్వామి అని మనలను తనతో పాటు కైలాసానికి తీసుకుపోతుందన్నట్లుగా మన మీడియా చిత్రిస్తోంది.


ట్రంప్‌గారూ మీరు ఇన్ని అబద్దాలు ఆడుతున్నందుకు ఎప్పుడైనా విచారించారా అని భారత సంతతికి చెందిన విలేకరి ఎస్‌వి డాటే ఆగస్టు 13న ప్రశ్నించినట్లు గ్లోబల్‌ న్యూస్‌ అనే ఒక వెబ్‌సైట్‌ వార్తను రాసింది. విలేకర్లతో మాట్లాడి సమయాన్ని వృధా చేయటం ఎందుకు, యావత్‌ సమయాన్ని దేశభక్తిలోనే గడిపేస్తా అన్నట్లుగా అధికారానికి వచ్చిన తరువాత ఒక్క పత్రికా గోష్టి కూడా పెట్టని నిరంతర తపనశీలి మన ప్రధాని నరేంద్రమోడీ అన్న విషయం తెలిసిందే. కానీ ట్రంప్‌ వేరు తరచూ విలేకర్లతో మాట్లాడతారు. అలాంటి ఆగస్టు 13నాటి సమావేశంలో మామూలుగానే కరోనా వైరస్‌, ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జోబిడెన్‌ గురించి మాట్లాడిన తరువాత( నిజాలా అబద్దాలా అనేది కాసేపు పక్కన పెడదాం) అఫింగ్టన్‌ పోస్టు విలేకరిగా అధ్యక్ష భవన వార్తలను రాసే ఎస్‌వి డాటేను ప్రశ్నలు అడగండి అని ట్రంప్‌ స్వయంగా ఆహ్వానించాడు. కొన్ని వందల మంది విలేకర్లు ఉంటారు గనుక ప్రశ్నించే అవకాశం అందరికీ రాదు. మనవాడు తబ్బిబ్బు అయి తేరుకొని అధ్యక్ష మహౌదరు మూడున్నర సంవత్సరాలలో అమెరికా జనానికి మీరు చేసిందాన్ని గురించి అన్నీ అబద్దాలే చెప్పినందుకు ఎప్పుడైనా విచారించారా అని అడిగాడు. అన్నీ అంటే ఏమిటి అని ట్రంప్‌ తిరిగి ప్రశ్నించాడు. అదే అన్నీ అబద్దాలు, నమ్మశక్యం కాని అంశాలు చెప్పారు అని డాటే పునశ్చరణ గావించాడు. వాటిని ఎవరు చెప్పారు అని ట్రంప్‌ రెట్టించాడు. మీరే, లక్షల కొద్దీ ఉన్నాయి అని డాటే నొక్కి వక్కాణించాడు. కొద్ది సేపు మౌనంగా ఉన్న ట్రంప్‌ ఎలాంటి వ్యాఖ్య చేయకుండా మరొక విలేకరిని మాట్లాడాలని అడిగారు.


డోనాల్ట్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా పనిచేయక ముందు రిపబ్లికన్‌ పార్టీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్‌ అబద్దాల గురించి ప్రశ్నించేందుకు తాను ఐదు సంవత్సరాల పాటు వేచి చూశానని విలేకర్ల సమావేశం తరువాత ఎస్‌వి డాటే ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ట్రంప్‌-తన మధ్య జరిగిన సంభాషణను కూడా ట్విటర్‌లో పెట్టాడు. మరుసటి రోజు ఉదయానికే దాన్ని 38లక్షల మంది వీక్షించారు. అలాంటి ప్రశ్నలను మన విలేకర్లలో కొందరైనా అడిగే వారు ఇప్పటికీ ఉన్నారు, కానీ, అసలు అడిగేందుకు మన ప్రధాని నరేంద్రమోడీ అవకాశం ఇస్తారా ? ఒక వేళ మారు మనసు పుచ్చుకొని ఇచ్చినా అడిగిన విలేకరి ఉద్యోగం ఆఫీసుకు వెళ్లేంతవరకు అయినా ఉంటుందా ?


ఈ నేపధ్యంలో చైనా-భారత్‌ సరిహద్దు ఘర్షణలు లేదా మరొక అంశం మీద గానీ సామాజిక మాధ్యమాల్లో, వాటిని ఆధారం చేసుకొని సాంప్రదాయ పత్రికలు, టీవీ మాధ్యమాల్లో కధనాలను వెలువరించుతున్న వాటి పట్ల జనం జాగ్రత్త వహించకపోతే తప్పుడు అభిప్రాయాలను బుర్రలోకి ఎక్కించుకొనే ప్రమాదం ఉంది. చైనాతో, పాకిస్ధాన్‌తో మనకు సమస్యలున్నాయి గనుక వాటి గురించి ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో ఇలాంటి ప్రచారం జరుగుతోందా ? సామాజిక మాధ్యమంలో ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశాలమీదనే జరుగుతుంటే అలాగే అనుకోవచ్చు. కానీ గత ఆరు సంవత్సరాలలో మన దేశంలో బిజెపి, నరేంద్రమోడీ గురించి అనుకూల తప్పుడు ప్రచారాలు, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలకు సంబంధించి వ్యతిరేక తప్పుడు ప్రచారాలు తక్కువేమీ కాదు. సామాజిక మాధ్యమం పెద్ద ఎత్తున విస్తరించింది, ఆండ్రాయిడ్‌, స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చినందున వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటివి వినియోగంలోకి వచ్చిన తరువాత ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించటమే పనిగా పెట్టుకున్న సంస్ధలు, పార్టీలు అందుకోసం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నాయి. బిజెపి, దానికి సంబంధించిన మరికొన్ని సంస్ధలు ప్రచారంలోకి తెచ్చిన విద్వేష పూరిత, రెచ్చగొట్టే, ఇతర సమాచారాన్ని అడ్డుకోవద్దని తమ సిబ్బందికి చెప్పినట్లు ఫేస్‌బుక్‌ అధికారులు తాజాగా అంగీకరించిన అంశం తెలిసిందే. అందువలన ఎవరైనా అలాంటి అంశాలను నిర్ధారించుకోకుండా రెచ్చి పోవద్దు, పొరబాటు అభిప్రాయాలకు రావద్దని మనవి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d