• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

పెట్రో బాదుడుకు రంగం సిద్దం చేసిన ” మోడీ బాబా ” ! పొదుపు చేయని వారు దేశభక్తులు కాదా !!

13 Wednesday May 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP, WAR

≈ Leave a comment

Tags

#Fuel Prices India, BJP, BJP u turn on Fuel prices, fuel politics, Fuel Price in India, Mody Hyderabad call, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు పొదుపోపదేశం చేశారు. ఇంకేముంది పొలోమంటూ కాన్వారులను తగ్గించుకుంటున్నట్లు అనేక మంది ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారు సరేసరి. ప్రధానికి ఇంత ఆకస్మికంగా జ్ఞానోదయం ఎందుకు కలిగినట్లు అని ”దేశంకోసం-దర్మం కోసం ” ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. విదేశీ మారకద్రవ్యం, ఇతర అంశాల సమస్యలు ఇప్పటికిప్పుడు తలెత్తాయా ? నిజం అయితే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని ఎందుకు ప్రకటించటం లేదు. ముందు జాగ్రత్త అని బిజెపి నేతల ముక్తాయింపు.జనాల్లో అదెప్పుడూ ఉంటుంది. విడ్డూరం గాకపోతే వారు చెబితేనే జాగ్రత్తపడతరా ! ఇక చమురు ధరలను పెంచకతప్పదని కేంద్ర చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు చెప్పకనే చెప్పారు. బుధవారం నాడు మరోసారి మోడీ సందేశం. నిజానికి అది మంత్రులకు కాదు, జనానికే. అనివార్యమై ధరలను పెంచామని చెప్పబోతున్నారు. నిర్ణీత వంద కొరడా దెబ్బలను ఒకేసారి తింటారా దశలవారీనా అన్నది తేల్చుకోవాలని జనాలకు అవకాశం ఇస్తున్నారు తప్ప నూరు వాతలు తప్పవు.ఇప్పటికే ఆమేరకు మీడియాకు తాజా లీకులు వదిలారు. పెట్రోలు మీద లీటరుకు రు.14, డీజిల్‌ మీద రు.42, గృహవినియోగ ఎల్‌పిజి సిలిండరు మీద రు.674 నష్టం వస్తున్నదన్నది వాటి సారం. చమురు, గ్యాస్‌ సబ్సిడీలను ఎత్తివేసినందున ఏదో ఒక రూపంలో జనాలు ఈ మేరకు భరించటానికి సిద్దపడాలనే సందేశం ఇప్పటికే చేరవేశారు. వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్‌ ధరలను ఎలా పెంచిందీ చూశాము. రోజుకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చమురు కంపెనీలకు నష్టం వస్తున్నదనిపూరీ చెప్పారు. ధరల పెంపుదల గురించి అడగ్గా మీకు తెలియనిదేముంది ప్రధాని నరేంద్రమోడీ ”భవిష్యత్‌ దార్శనికుడు ” అన్నట్లుగా చెప్పారు. అంటే ఆదివారం నాడు (2026 మే 10) హైదరాబాదులో చేసిన ఒక విలక్షణ ప్రసంగంలో మోడీ యమలీలను గుర్తు చేశారు. ఎప్పుడూ చేసే రాజకీయాలను వదల్లేదు గానీ ఇతర విషయాలే మీడియాలో పతాకశీర్షికలయ్యాయి,విశ్లేషణలు వెలువడ్డాయి.మన్‌కీ బాత్‌ పేరుతో 2014 అక్టోబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రేడియోలో నెలకు ఒకసారి చొప్పున 113సార్లు మోడీ ప్రసంగించారు. ఎంతమంది ఎన్నింటిని విన్నారో ఎవరికి వారు లెక్కవేసుకోవాల్సిందే. ఒక సర్వే ప్రకారం ఐదుశాతం మంది శ్రోతలు మాత్రమే ఆలకించినట్లు తేలింది. అలాంటి ప్రసంగమే హైదరాబాద్‌లో చేశారని చెప్పవచ్చు. దానిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసిన సమీక్షల సారం ఏమిటంటే ఇంథన ధరలను పెంచకతప్పదనే మహత్తర సందేశాన్ని ప్రధాని దేశానికి అందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే పెంచుతారని ఊరూవాడా భావించారు. అయితే వెంటనే ఆ ప్రకటన వెలువడలేదు. కారణం ఏమిటంటే అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి కుదిరి సాధారణ పరిస్థితి ఏర్పడుతుందనే వార్తలు రావటం ఒకటి. నిజంగా అది జరిగితే ధరలు ఎందుకు పెంచారని జనం ప్రశ్నిస్తారు. రెండవది ప్రతిపక్షాలు చెప్పింది వాస్తవమే అని నిర్ధారించుకుంటారు. ఇప్పుడు ఏ పేరుతో పెంచాలా అని మధనపడుతున్నారు.ఊహించని విధంగా పశ్చిమాసియా సంక్షోభం కొనసాగటం మోడీ పరివారానికి అవకాశమిస్తున్నదని చెప్పవచ్చు.

ఇజ్రాయెల్‌ నెతన్యాహు, అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ మాటలను నమ్మి వారం రోజుల్లో ఇరాన్‌ పని అయిపోతుంది లెమ్మని కేంద్రంలోని పెద్దలు తడిబట్ట వేసుకొని పడుకున్నారని సంక్షోభ ప్రారంభంలో వారి తీరుతెన్నులే స్పష్టం చేశాయి. ఏ రోజు తిరిగి దాడులు మొదలౌతాయో తెలియని స్థితి. ఆందోళనలో ఉన్న వారికి బిపి పెరుగుతూ తగ్గుతూ ఉండే మాదిరి యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ మార్కెట్‌ చమురు ధరలు ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో మన స్టాక్‌ మార్కెట్‌ ఈ కారణంగానే భారీగా పతనమైంది. ఇప్పటికే చమురు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ వార్తలను రాయిస్తున్నారు. గతంలో ప్రత్యేక పన్నులు, సెస్‌ల రూపంలో బాదిన బాదుడుకు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లలో రాబడి పెరిగినపుడు ఏ మీడియా కూడా ఆ వార్తలను ప్రముఖంగా రాయలేదు గతంలో లాల్‌బహుదూర్‌ శాస్త్రి పాక్‌తో యుద్దం వచ్చినపుడు ఇచ్చిన పిలుపు మాదిరే ఇప్పుడు తమ మోడీ దేశ పౌరులకు పొదుపు విజ్ఞప్తి చేశారు తప్ప బలవంతం చేయటం లేదని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు.నాడు యుద్ధం వచ్చింది గనుక శాస్త్రి ఆ పిలుపు ఇచ్చారు, ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కూడా లేవు, అంతా సజావుగానే ఉందని చెబుతూ ఆ పిలుపు ఇవ్వటం ఏమిటి ? మచ్చుకు మోడీ ప్రవచించిన పది సుభాషితాల్లో కొన్నింటిని చూద్దాం. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్న లోకోక్తి తెలిసిందే.

” దేశం కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు, దేశం కోసం బతకడం,దేశ కర్తవ్యం కోసం పాటు పడటమూ దేశభక్తే ” అని మోడీ చెప్పారు. పొదుపును కూడా దేశభక్తికి ముడిపెట్టారు.ఇదే ప్రమాదకరం. పొదుపు పాటించనివారు దేశభక్తులు కాదనే భావాన్ని చెప్పకనే చెప్పారు. కడుపునిండా తినటానికి తిండిలేదనే కదా ఎనభై కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఐదేసి కిలోల ఉచిత బియ్యం లేదా గోధుమలను ఇస్తోంది.వారిని పొదుపు చేయమంటే ఆ ఉచితాన్ని వదులుకోవాలి మరి. వంట నూనె వాడకం తగ్గించటం కూడా దేశభక్తే అన్నారు. పొదుపు గురించి దేశ పౌరులకు మోడీ చెప్పాల్సినపని లేదు.మన జీన్స్‌లోనే ఉంది.అవసరమైన మేరకే వస్తువులను వాడతారు. ” సాధ్యమైన మేరకు ఇంటి నుంచే పని చేసే పద్దతి అనుసరించండి, అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు, ఇంథనాన్ని పొదుపుగా వాడండి ” మోడీ సుభాషితాల్లో ఒకటి. ఈ చర్యకు ప్రధానే స్వయంగా శ్రీకారం చుట్టి ఉంటే బాగుండేది. హైదరాబాదు వచ్చి ఎక్కడో జరిగే పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసే బదులు అదేదో ఢిల్లీ నుంచే చేయవచ్చు, గతంలో అనేక సార్లు అలా చేశారు.వేలాది మంది పోలీసులు, ఇతర ఏర్పాట్లకు అనవసర ఖర్చు, ఆయాసమూ తప్పేది, ట్రాఫిక్‌ ఆంక్షల వలన అదనపు దూరం ప్రయాణించిన వాహనదారులకు అదనపు పెట్రోలు, డీజిలు కలసి వచ్చేది.మోడీ స్వయంగా చెప్పినట్లు దేశం ఇంతటి ఇబ్బందుల్లో ఉన్నపుడు లక్షల మంది జనాన్ని తెలంగాణా అంతటి నుంచి ఎండల్లో రప్పించటానికి వాహనాలకు పెద్దమొత్తంలో ఇంథనం ఖర్చు చేయటం అవసరమా ? అందువలన పొదుపు గురించి ఇతరులకు చెప్పేముందు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా ? మధ్య ప్రదేశ్‌లో బిజెపి రాజకీయ నిరుద్యోగి సౌభాగ్య సింగ్‌ ఠాకూర్‌కు పాఠ్యపుస్తకాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు.దానికి ప్రమాణస్వీకారం కోసం డజన్లకొద్దీ వాహనాలతో ఉజ్జయని నుంచి భోపాల్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరం అనుయాయులతో అట్టహాసంగా వెళ్లారు. బిజెపి నేతల పొదుపు ఇలా ఉంటుంది. హైదరాబాద్‌ ఉపన్యాసంపై తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత మోడీ తన కాన్వారును గణనీయంగా తగ్గించుకున్నట్లు చెబుతున్నారు.కొత్తగా కొనుగోలు చేయకుండా విద్యుత్‌ వాహనాలను వినియోగించాలని చెప్పినట్లు వార్త. ఇదంతా పౌరుల మీద భారం మోపే ప్రచార ఎత్తుగడే.విదేశీ ప్రయాణాలు వద్దంటూ చెప్పిన మోడీ వారం రోజుల పాటు ఐదు దేశాల కార్యక్రమం పెట్టుకున్నారు. గతంలో నెహ్రూ 44సార్లు విదేశీ పర్యటనలు చేస్తే మోడీ సెంచరీ కొట్టారు.

ఏడాది పాటు బంగారం కొనవద్దంటూ మరో సలహా ! తరువాత కొనుగోలు చేయవచ్చా ? ధరలు ఇప్పటికిప్పుడే పెరగలేదే ! ఏడాది పాటు మారుటోరియం ఎందుకు సూచించారు. రూపాయి విలువను కాపాడలేని కేంద్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా డాలర్లకు కొరత ఏర్పడుతోంది.మన స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసిన విదేశీయులందరూ వాటాలను అమ్మివేసి డాలర్లలో తమ దేశాలకు తరలించుకుపోతున్నారు. 2025 ఏడాది మొత్తంలో 2.4లక్షల కోట్ల రూపాయలను తరలిస్తే ఈ ఏడాది మే 11వ తేదీ నాటికే 2.28లక్షల కోట్లు దాటాయని వార్తలు.మే ఒకటవ తేదీతో ముగిసిన వారంలో 7.794 బిలియన్‌ డాలర్లు మన విదేశీ మారకద్రవ్యంలో తగ్గి 690.693 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతి ప్రోత్సాహ పథకాల వంటి ఎన్ని కబుర్లు చెప్పినా, రాయితీలు ఇచ్చినా దిగుమతులు పెరుగుతున్నాయి తప్ప ఎగుమతులు పెరగటం లేదు. అయినా విదేశీ వస్తువులు వాడవద్దని ప్రధాని చెబుతారు, దిగుమతులకు ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ఏటా మన దేశం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నది.ముడి చమురు తరువాత బంగారానికే ఎక్కువగా విదేశీమారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది.బంగారంతో నగలు చేయించేందుకు కొంత మందికి పని కల్పించవచ్చు తప్ప నిజానికి అది ఉత్పాదతకు పనికి వచ్చేది కాదు. గత కొద్ది సంవత్సరాలుగా పసిడి ధర పెరుగుతూనే ఉన్నప్పటికీ మోడీ మాట్లాడ లేదు. గతంలో బంగారం దిగుమతులపై పన్ను ఎక్కువగా ఉన్న కారణంగా దొంగరవాణా పెరిగిందని తగ్గించారు. తాజాగా దిగుమతి పన్ను, సెస్‌లు కలిపి ఆరు నుంచి 15శాతానికి పెంచారు. నిరంతరం దిగుమతులు తప్ప ఎగుమతులు పెరగటం లేదు. ఒకదశ దాటిన తరువాత చెల్లింపుల సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయవద్దని, వివాహాలు విదేశాల్లో చేయవద్దని చెప్పారు. విదేశాలు లేదా పొరుగు రాష్ట్రాల్లోని విలాసవంతమైన ప్రాంతాల్లో వివాహాలు చేసేవారందరూ శతకోటీశ్వరులు తప్ప సామాన్యులు కాదు.మోడీ తన పాలనా కాలంలో కోటీశ్వరులు, శతకోటీశ్వరులను పెంచారు తప్ప తగ్గించలేదు.తాను అధికారానికి వచ్చినపుడు కేవలం 70మంది బిలియనీర్లు ఉంటే 2026నాటికి 308పెరిగారు.కోటీశ్వరుల గురించి చెప్పాల్సిందేముంది ! సామాన్యుల వద్ద ఉన్న సంపదశాతం తగ్గుతున్నదని అనేక విశ్లేషణలు వెల్లడించిన సంగతి తెలిసిందే.వారంతా సొమ్మును విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేయక ఏం చేస్తారు !

స్వదేశీ ఉత్పత్తి పెరగాలంటారు. దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా ఆయన పలుకుబడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 95చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ ఏం చేస్తున్నట్లు ? దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకాన్ని చూస్తే 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే.తాజాగా చమురు ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సిన రాయల్టీ తగ్గించి ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.

మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26లో రు.2.07 లక్షల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40, ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 ఇటీవలి వరకు వసూలు చేశారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు పెట్రోలు మీద ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.3 పైన పేర్కొన్న రెండు సెస్‌లు కలిపి రు.8.50, డీజిలుపై సెస్‌ రు.6 కొనసాగుతోంది.ఇప్పుడు మార్కెటింగ్‌ కంపెనీలకు నెలకు లక్ష కోట్ల నష్టం వస్తుందని గుండెలు బాదుకుంటున్న మంత్రి పూరీ ఇన్నేండ్లుగా మోడీ ఏలుబడిలో వినియోగదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం అంతకుముందున్నదాని కంటే అదనంగా వసూలు చేసిన రు.16.5లక్షల కోట్ల ప్రత్యేక ఎక్సయిజ్‌ పన్ను సంగతి మాట్లాడరేం.

పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు నంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంథనంపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బాబాల మాదిరి పొదుపు గురించి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు.గణనీయంగా తగ్గించాల్సిందిపోయి పెంచకపోవటం తమ ఘనత అని చెప్పుకుంటున్నారు.ఇది గోబెల్స్‌ పద్దతి. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత ధర పెరుగుతున్నది. మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర మార్చినెల 25వ తేదీ వరకు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఏప్రిల్‌లో 114.48, మే పన్నెండవ తేదీవరకు 105.09 డాలర్లు, అంటే నాలుగేండ్ల నాటి స్థాయికి చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం ఇది.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఇరాన్‌పై దాడులు ప్రారంభం ఫిబ్రవరి 28న కాగా అంతకు ముందు 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. జనం జేబులు కొట్టాలనుకున్నపుడు మాత్రం ఈ విధానం గుర్తుకు రాదు, కేంద్రానికి సెగ తగలగానే మళ్లీ మొదలు పెడతారా ? చావు తెలివితేటలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేశం కోసం- ధర్మం కోసం : ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి విలువలు, వలువలు – ఒక పరిశీలన !

27 Monday Apr 2026

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Dattatreya Hosabale, Mohan Bhagwat, Narendra Modi Failures, NSAP, RSS, RSS Hypocrisy, women reservation, women reservation bill 2023

ఎం కోటేశ్వరరావు

జనాలు వెర్రి వెంగళప్పలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌(రాష్ట్రీయ స్వయం సేవక్‌) మేథావుల ప్రగాఢవిశ్వాసం.కొన్ని సందర్భాల్లో కొందరి తీరు చూస్తే నిజమే అనిపించకపోదు. వాట్సాప్‌ యూనివర్సిటీని చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అలవోకగా అందమైన మాటలతో అబద్దాలు, నీటి జాడలు కనిపించని ఎడారుల్లో కూడా మహాసముద్రాలు ఉన్నాయని చెప్పగలరు. ఎవరైనా నిలదీస్తే పురాతన కాలంలో ఉండేవని చెప్పాం అంటారు.పరస్పర విరుద్దంగా మాట్లాడగల మాయల మరాఠీలు. ” ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలను ప్రధాని మోడీ అనుపమానంగా ప్రచారం చేస్తారు, ఉత్తమ ప్రతినిధి ” ఇది 2026 ఏప్రిల్‌ చివరి వారంలో అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌసబలే చెప్పినదానికి మీడియా పెట్టిన శీర్షిక. ఈ పెద్దమనిషి వాషింగ్టన్‌లోని హడ్సన్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రసంగాల్లో చెప్పిన అంశాలు, పిటిఐతో మాట్లాడినవి మీడియాలో వచ్చాయి. నాలుగు నెలలకు ముందు ” బిజెపి కళ్లద్దాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ను చూడటం పెద్ద తప్పిదం ” 2025 డిసెంబరు చివరి వారంలో కొలకతాలో తమ సంస్థ శతవార్షికోత్సవాల ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చెప్పిన సుభాషితం.ఇద్దరూ ఆ సంస్థలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్ననేతలే. అయినా రెండు నాలుకలతో ఎందుకు మాట్లాడినట్లు ? జనాలకు రెండింటినీ పోల్చుకొని చూసే తీరిక, అవకాశం ఉండదని వారికి తెలుసు గనుక.మోడీ ప్రభుత్వ నిర్వాకాలను తమకు అంటగట్టవద్దని ఒక నోటితో, తమ విలువలను మోడీ గొప్పగా ప్రచారం చేస్తున్నారని, తమకు ప్రతీక అని మరోమాట. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి తెలిసినవారందరికీ అది ఎన్ని నాలుకలతో మాట్లాడుతుందో తెలుసు. ఆ సంస్థలో అమాయకంగా చేరుతున్నవారు, అది చెబుతున్న మాటలే పరమ సత్యాలని నమ్ముతున్నవారు దేశం కోసం- ధర్మం కోసం ఒకసారి ఆత్మపరిశోధన చేసుకోవాల్సి ఉంది.ఇద్దరు అగ్రనేతలు రెండు విధాలుగా మాట్లాడటాన్ని రాజకీయ పరిభాషలో చెప్పాలంటే మోడీ వ్యతిరేక-అనుకూల ముఠాలకు ప్రతిబింబం.వారూ మానవమాత్రులేగా మరి ! నరేంద్రమోడీ తీరుతెన్నులను వ్యతిరేకిస్తున్నారనే కక్షతో 2005లో సంజరు జోషి అనే ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపినేత సెక్స్‌ కుంభకోణంలో ఉన్నారంటూ వీడియోలు పంపిణీ చేయించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఒక మహిళతో ఉన్న దృశ్యాలు నిజమే అయితే సంఘపరివార్‌ సంస్థనేతల బండారానికి, కాకుంటే వారు కూడా కుట్రలు, ప్రతికుట్రలకు అతీతులు కారనటానికి నిదర్శనం.ఆ ఉదంతం తరువాత 2005లో ప్రధాన కార్యదర్శిపదవికి రాజీనామా చేశారు. అయినా మోడీ కక్ష తీరలేదని చెబుతారు. 2012 జోషి గనుక పార్టీ జాతీయ కార్యవర్గంలో ఉంటే సమావేశాన్ని తాను బహిష్కరిస్తానని పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నితిన్‌ గడ్గరీని బెదిరించారని, దాంతో జోషీ రాజీనామా చేశారు, ఆ వార్త వెలువడిన రెండు గంటల్లోనే తాను సమావేశానికి హాజరువుతున్నట్లు మోడీ ప్రకటించారని నాడు వార్తలు. ఒక నాడు బిజెపిలో కొన్ని రాష్ట్రాలలో చక్రం తిప్పిన జోషి(64) ఇప్పుడు నరేంద్రమోడీ దెబ్బకు విలవిల్లాడుతూ ఎలాంటి పదవులు లేకుండా ఇంటి దగ్గరే పార్టీ కార్యకర్తలతో కాలక్షేపం చేస్తున్నారు.హౌసబలే చెప్పినట్లు నరేంద్రమోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలకు ప్రతీక అంటే ఎవరూ చేసేదేమీ లేదు !

ఈ వారంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల గురించి చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఒక పరామర్శలో వివరించటం సాధ్యం గాదు గనుక ఇద్దరు నేతల సుభాషితాలకే పరిమితం కావటం సముచితం. మేం మాట్లాడే భాషను, విలువలను తనదైన అనితర శైలిలో నరేంద్రమోడీ చెబుతారంటూ, మేము ఒక చెట్టునాటండి అంటే మోడీ అదే పదాలను ఉచ్చరించకపోవవచ్చు, తల్లిపేరుతో ఒక చెట్టు అంటారని హౌసబలే ఉదహరించారు.అనేక ప్రభుత్వ పథకాలు ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన మాదిరే ఉన్నాయని కూడా చెప్పారు.ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ విలువల గురించి చూద్దాం. సంఫ్‌ు ప్రచారక్‌లలో ఒకరైన నరేంద్రమోడీ కట్టుకున్న భార్యను వదలివేయటం గురించి దాచారు. అబద్దం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని అడిగేంత అమాయకులం అని కాషాయ దళాలు చెప్పుకుంటాయి. సినిమాల్లో, కథల్లో విలన్‌ తాను ఒంటరినని అమ్మాయిలను మోసం చేస్తాడు. మోడీ తనదైన శైలిలో తాను ఒంటరినని, అందువలన అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదంటూ ఎన్నికల సభల్లో చెప్పారు. నాలుగు అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలో భార్య గురించి నిజాలను దాచారు, కాంగ్రెస్‌ నేతలు మోడీ బండారం బయటపెట్టటంతో తరువాత రాయాల్సి వచ్చింది. ఆ తరువాత మరొక కత చెప్పారు. ఏమిటంటే మోడీకి తెలిసీ తెలియని వయస్సులోనే పెళ్లి చేశారని, వయస్సు వచ్చిన తరువాత దేశం కోసం-హిందూ ధర్మం కోసం భార్యను వదలివేశారని చెప్పారు.సనాతన ధర్మం ప్రకారం, ముఖ్యంగా దానికి కట్టుబడి ఉన్నామని, కాపాడలని ప్రవచించే వారు వివాహం ఎలా చేసుకున్నప్పటికీ భార్యను వదలివేయకూడదు. చిన్నతనంలో తెలియక పెళ్లి చేసుకున్నారనుకుందాం వయస్సు బుద్ధి వికసించిన తరువాత అయినా తిరిగి భార్యను చేరదీయాలా వద్దా ! అనేక మంది ప్రచారక్‌లు వయస్సు మీరిన తరువాత వివాహాలు చేసుకున్నారు.వారిని చూసి అయినా మోడీ తన భార్యను కాపురానికి తెచ్చుకోలేదు, కనీసం విడాకులు ఇచ్చి చట్టపరంగా తెగతెంపులు చేసుకోలేదు. ఇలాంటి వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలకు ప్రతీక అని చెబుతున్నారు, అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలు ఇలాగే ఉంటాయా అన్న ప్రశ్న ఎవరైనా అడిగితే …..!

సంఫ్‌ు చెబుతున్నమాదిరే ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటున్నాయని హౌసబలే తన భుజాన్ని తానే చరుచుకున్నారు.యుపిఏ పాలనా కాలంలో జాతీయ సామాజిక సహాయ పధకం(ఎన్‌ఎస్‌ఏపి) కేంద్రం ప్రారంభించింది.దీన్లో 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మొత్తం మూడు కోట్ల మందికి పైగా పెన్షన్‌ ఇస్తున్నారు.నరేంద్రమోడీలో ఎంత మానవత్వం ఉట్టిపడుతున్నదంటే ఆయన అధికారానికి వచ్చినపుడు ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపు 10,547 రూపాయలు,తాజా కేటాయింపులు రు.9,652 కోట్లు. కేంద్ర బడ్జెట్‌లో 0.58శాతం నుంచి 0.2కు దిగజారింది. దేశంలో ఏడాదికేడాది వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదని తెలుసు, వారికి నెలకు ఇచ్చే ముష్టి 200,300 రూపాయలు ఏమూలకు వస్తాయో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు చెప్పాలి. ఎలాంటి బడ్జెట్‌ కేటాయింపులు పెంచలేదు, ఈ పధకం కూడా తాము చెప్పినట్లే ఉందని వారు చంకలు కొట్టుకుంటున్నారా ? తమ మార్గదర్శకంలో నడుస్తున్న బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎంతెంత పెన్షన్లు ఇస్తున్నారో, అవి సరిపోతున్నాయో లేదో ఎప్పుడైనా వృద్దుల దగ్గరకు వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్‌ ” స్వచ్చంద సేవకులు ” యోగక్షేమాలు విచారించారా ? విచారించిన తరువాత కూడా ఈ మొత్తాలను పెంచాలని కేంద్రానికి సూచించాలని వారికి తట్టలేదా ?మార్గదర్శక్‌ మండల్‌ పేరుతో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి వారిని ఒక దగ్గర పెట్టారు, వారు కూడా వృద్దాప్య పెన్షన్‌ పెంచాలని మోడీకి సలహా ఇవ్వలేకపోయారు. ఇదే కాలంలో కార్పొరేట్లకు ఇచ్చిన సబ్సిడీలు ఏ విధంగా పెరిగాయో మానవత్వ ముఖాలు ఉన్నట్లు చెప్పుకుంటున్న వారికి తెలియదా ! వివిధ రాష్ట్రాలు దయాదాక్షిణ్యాలతో తమ బడ్జెట్ల నుంచి అదనపు మొత్తాలను పెన్షన్లు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగువేలు, తెలంగాణాలో రెండువేలు ఇస్తున్నారు.నెలకు రెండు వందలు, మూడు వందలు ముష్టిమాదిరి వేస్తున్న నరేంద్రమోడీ తమ బాటలో నడుస్తున్నారని చెప్పుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి జనాలు ఆలోచించుకోవాలి.మోడీకి కుటుంబం లేదు, తల్లిని ఆయన సోదరులే చూసుకుంటున్నారని విన్నాం. అటువంటి వారికి వృద్దులు, ఒంటరి మహిళల జీవితాలు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తాయి ! ఆయనకు తెలియదు, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెప్పరు !!

మహిళా రిజర్వేషన్‌ గురించి నరేంద్రమోడీ నాయకత్వం ఆడిన గొప్ప నాటకం తమ రచనే అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకుంటుందా ?వాజ్‌పాయి పాలనా కాలంలో అంతకు ముందు లోక్‌సభలో ప్రవేశపెట్టటం విఫలమైన చరిత్ర అందరికీ తెలిసిందే. 2014 నుంచి 2023వరకు మోడీ దాన్ని పట్టించుకోలేదు, ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్తు చేయలేదంటే వారికి తెలియకనా, కానే కాదు, 2024 ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్‌ అంశాన్ని ముందుకు తెచ్చి ఓట్లు దండుకొనేందుకు రూపొందించిన పెద్ద పథకం. తదుపరి జనాభా లెక్కల తరువాతనే అది అమల్లోకి వస్తుందనే షరతును దానికి తగిలించారు. అప్పటికి జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు,గతంలో విధించిన నియోజకవర్గాల పునర్‌వ్యవస్థకరణ అంశం గడువు 2026లో ముగుస్తుందనీ తెలుసు. కానీ మూడు సంవత్సరాల ముందే దాన్ని చేపట్టారంటే మరుసటి ఏడాది జరిగే ఎన్నికల కోసమే.ఈ అంశాన్ని మరోసారి 2029 ఎన్నికలకు వినియోగించుకోవాలనే మరో ఎత్తుగడకు తెరతీశారు.మహిళల పేరుతో తమకు అనుకూలంగా ఉండేట్లు ఉత్తరాదిలో సీట్లు పెంచాలని చూశారు. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేదనీ తెలుసు. మోడీ అత్యంత ప్రజాస్వామికవాది అని చెబుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు అవసరమైన మెజారిటీ లేదని తెలిసి కూడా ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని ముందుగా చర్చించాలనే సలహా మోడికి ఇవ్వలేదా ? లేక ప్రతిపక్షాలను బ్లాక్‌మెయిల్‌ చేయాలనే దుష్టఆలోచన ఎవరి బుర్రలో పుట్టినట్లు ?కనీసం మోడీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న తెలుగుదేశం పార్టీకి కూడా రాజ్యాంగ సవరణ బిల్లులో ఏముందో చెప్పలేదు. అడుగడుగునా మహిళలను వంచించే ఎత్తుగడ, బుల్డోజ్‌ చేసే దుష్ట ఆలోచన తప్ప మరొకటి దీన్లో లేదు. ఇవన్నీ ఇలాంటి అతితెలివి ప్రదర్శన చేసిన వారి విలువలు, వలువలకు మచ్చుకు మాత్రమే.

బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ వేరు కాదు. అదే సంస్థచెందిన నాధూరామ్‌ గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేసినపుడు ఆ సంస్థ మీద నిషేధం విధించారు. దాంతో తాము ఒక సాంస్కృతిక సంస్థగా ఉంటామంటూ కేంద్రానికి లేఖ రాసి నాటి నెహ్రూ ప్రభుత్వంలో ఉన్న తమ అనుకూలురను రంగంలోకి దించి నిషేధాన్ని ఎత్తివేయించుకున్నారు. రాజకీయాలు చేసేందుకు 1951లో భారతీయ జనసంఘం అనే పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.అత్యవసర పరిస్థితి తరువాత 1977లో దాన్ని రద్దు చేసి జనతా పార్టీలో చేరారు.ఆ ప్రయోగం వికటించింది. పార్టీలో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యులుగా ఉండకూడదనే అంశం వచ్చినపుడు కావాలంటే మేం విడిపోతాం తప్ప సంబంధాలు వదులుకొనేది లేదంటూ 1980లో బిజెపిని ఏర్పాటు చేశారు. దాని గురించి హౌసబలే ఏం చెప్పారంటే ” వారు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు.అదే జనతా పార్టీ నుంచి విడివడి మరొక రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముఖ్యకారణం. ఆ విదంగా ఉన్న బొడ్డుతాడు బంధాన్ని విచ్చిన్నం చేయలేరు.” అయినా రెండూ వేర్వేరు సంస్థలని జనాన్ని నమ్మించేందుకు బుకాయిస్తారు. హిందూ గుర్తింపు నాగరికతపరమైనది తప్ప మతం పరమైంది కాదు అని అమెరికన్లను నమ్మించేందుకు హౌసబలే ప్రయత్నించారు.తాము హిందువుల ఐక్యత,ఉద్దరణ కోసం పనిచేస్తున్నామని మరోవైపు చెబుతారు. భారతీయులనే మాట వారి నోట రాదు.ఈ దేశంలో కోట్లాది మంది ఇతర మతాలవారు ఉన్నారు. నిజంగా భారతీయుల కోసం పని చేసే వారు అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను జరుపుతారు, లేదా కమ్యూనిస్టుల మాదిరి ఏ మతాన్ని ప్రత్యేకించి భుజానవేసుకోకుండా దూరంగా ఉంటారు.మరి ఆర్‌ఎస్‌ఎస్‌ దానికి భిన్నంగా కేవలం హిందూమత సభలు, పండగల్లోనే మునిగితేలు తుంది. ఇలాంటి సంస్థ భారతీయ సమాజాన్ని ఐక్యంగా ఎలా ఉంచుతుంది ? మేకతోలు కప్పుకున్నంత మాత్రాన పులిచారలు కనిపించకపోవచ్చు తప్ప మాసిపోవు. ఈ గడ్డమీద భారతీయ సంస్కృతి తప్ప హిందూమతానికి మూలమైన వివక్ష, దుర్మార్గపూరితమైన మనుసంస్కృతికి స్థానం ఉండదు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నవారందరూ నరేంద్రమోడీ వ్యవహారశైలితో ఏకీభవించటం లేదు గానీ విధిలేక అన్నివిధాలుగా మద్దతు ఇస్తారు.ఇప్పటికే దేశంలోని అన్ని రంగాలను ఆక్రమించాం, మంచితరుణం మించిపోతే రాదు అంటూ హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉన్మాదం బాగా తలకెక్కిన వారికి ఈ విషయంలో మోడీ తీరు నచ్చటం లేదు. ఆ పెద్దమనిషికి కార్పొరేట్ల సేవే ముఖ్యం,వారు లేకపోతే తనకు పదవి లేదని తెలుసు. మన కార్పొరేట్లు తమ లాభాల కోసం మతంతో సహా దేన్నయినా వినియోగించుకుంటారు, అయితే మతాన్ని పూర్తిగా రంగంలోకి దించి మతరాజ్యంగా మారితే నష్టమని వారికి తెలుసు. గనుక ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను పూర్తిగా అమలు జరిపేందుకు వారు సిద్దం కాదు. మరోవైపు సంఘపరివార్‌ పరిస్థితి ఏమిటి ? మోడీ లేకపోతే అధికారం లేదు, అది లేకపోతే తన అజెండాను ముందుకు తీసుకుపోలేదు. మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ అజండాకే లేదా దాని అదుపు ఆజ్ఞలకంటే అంతర్జాతీయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు, జాతీయంగా కార్పొరేట్‌ అజండాను తలకెత్తుకున్నారు.ఈ ప్రక్రియలో కొన్ని అంశాలను ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగా సమర్ధించలేదు, విబేధించనూలేదు. చెప్పరాని చోట తగిలిన దెబ్బ గురించి చెప్పుకోలేనట్లుగా దాని పరిస్ధితి ఉంది. కార్పొరేట్లను కాదంటే దాని పని ఖాళీ. మిత్ర వైరుధ్యం ఉంది. దానికి తోడు తనది సాధారణ మానవజన్మ కాదని, దైవ నిర్ణయం మేరకు అవని మీద అవతరించానని మోడీ బాబా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకే కడుపులో లేకున్నా కావలింతలను ప్రదర్శిస్తారు.ముందే చెప్పుకున్నట్లు ఇద్దరు సంఫ్‌ు జాతీయ నేతలు భిన్నంగా మాట్లాడారు.బిజెపికి జన్మనిచ్చిన సంస్థదే ఆధిపత్యం అని దాని నేతలు భావిస్తుంటే తమ రాజకీయాలతోనే బిజెపి అధికారానికి వచ్చింది, దాంతోనే ఆర్‌ఎస్‌ఎస్‌ బలపడింది తప్ప మీ గొప్పేమీ లేదని మోడీ, షా భావిస్తున్నారు.ఇరు పక్షాలకూ అహం సమస్య ఉంది.మోడీ చర్యలు నష్టదాయకమని భావించినపుడు పరోక్షంగా వాటితో తమకేమీ సంబంధం లేదని సంఘనేతలు చెప్పటం దైవాంశ సంభూతునికి సహజంగానే రుచించవు.తమది స్వతంత్ర సాంస్కృతిక సంస్థ అని మోహన్‌భగవత్‌ చెబితే అదే కుదురుకు చెందిన నరేంద్రమోడీ కాదు ప్రపంచంలో అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థ(ఎన్‌జిఓ) అని ఎర్రకోట ప్రసంగంలో చెప్పారు. భగవత్‌ హిందూత్వకు ప్రతీక అయితే మోడీని కొందరు హిందూ హృదయ సామ్రాట్‌ అని కీర్తిస్తున్నారు. రాముడు-హనుమంతుడి మాదిరి ఉండాలి తప్ప ఒకే గద్దెమీద ఇద్దరు దేవుళ్లకు అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని అవలక్షణాలూ సంఫ్‌ు సభ్యులకూ ఉంటాయి, వారేమీ అతీతులు కాదు.బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన జెపి నడ్డా 2024 మే నెలలో ఒక సందర్భంగా మాట్లాడుతూ అతల్‌ బిహారీ వాజ్‌పాయి కాలం నాటికీ ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఉనికిలో మార్పు వచ్చిందన్నారు. ప్రారంభంలో మాకు అంత సామర్ధ్యం లేదు,చిన్న పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం ఉండేది.నేడు మేం పెరిగాం,సామర్ద్యం కలిగి ఉన్నాం.బిజెపి తనంతట తానే పని చేయగలదు, అదీ తేడా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతపరమైన రంగం, దాని పని అది చేస్తుంది అన్నారు. తాము కేవలం ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగం కాదు అని చెప్పటమే ఇది.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి, మరోమారు చర్చిద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మాహుతిదళ బుడిబుడి రాగాలు – భారత మహిళలకు దొంగనక్క క్షమాపణలు !

19 Sunday Apr 2026

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, TDP, Women, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Delimitation bill 2026 India, Donald trump, Emotional blackmail, Narendra Modi Failures, pavan kalyan, RSS, women reservation, YS jagan

!ఎం కోటేశ్వరరావు

దేశంలో సరికొత్త నాటక రాజకీయాలు అదీ మరోసారి మహిళల పేరుతో మొదలయ్యాయి.ప్రతిపక్షాల మద్దతు లేకుండా వీగిపోతుందని తెలుసు. వేదగణితం ప్రకారం కూడా మూడింట రెండువంతుల మెజారిటీ పాలక కూటమికి లేదు. అయినా కనీసం మాటమాత్రంగా సంప్రదింపులు జరపని అపర ప్రజాస్వామిక వాదులతో కూడిన ఎన్‌డిఏ పక్షాల కారణంగా నారీశక్తి ముసుగులో ప్రవేశపెట్టిన రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయింది.నారీ బిల్లు వీగిపోయిందని కొన్ని మీడియా సంస్థలు శీర్షికలు పెట్టాయి. మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టమై గజెట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయింది. ఓడిపోయింది మోడీ మరియు మద్దతు ఇచ్చిన ఆత్మాహుతి దళానికి చెందిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, జగన్‌మోహనరెడ్డి బిల్లు మాత్రమే.కిందపడ్డా నాదే పైచేయి అన్నట్లు జగన్‌మోహనరెడ్డి మాట్లాడుతున్నారు.బిల్లును ఓడించిన పార్టీలు తాము ఏమి సాధించామో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మోడీకి మద్దతు ఇచ్చి వ్రతం చెడినా ఫలం దగ్గని ఆ పెద్దమనిషి తానేమి సాధించారో చెప్పాలి. పచ్చి అబద్దాలతో ప్రకటన చేశారు. కేంద్రం ప్రతిపాదించిన 50శాతం పెంపుదలను ఆమోదించి ఉంటే అన్నారు. బిల్లులో అలాంటి పదజాలం ఉందో లేదో కూడా సరిచూసుకోకుండా జనాన్ని, తన గణాలను తప్పుదారి పట్టించారు. బిల్లును ఓడించారంటూ బుడిబుడి రాగాలు తీస్తున్న తెలుగుదేశం, జనసేన, బిజెపి నేతలతో కలసి వైసిపి నాయకులు కూడా సామూహిక రోదన కార్యక్రమాల్లో పాల్గ్గొని ఉంటే జగన్‌ వ్రతం సంపూర్ణం అయి ఉండేది.దీన్లో కూడా ఎటూ కాకుండా పోయారు.నిడదవోలులో మూడు పార్టీల కూటమి దుకాణం పెడితే దానికి దగ్గరలో అయినా మోడీ ఓదార్పు యాత్రను జగన్‌ చేపట్టి ఉంటే సార్ధకనామధేయుడై ఉండేవారు. దక్షిణాది, కుటుంబనియంత్రణ పాటించిన ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అడ్డుకోవటమే ప్రతిపక్షాలు సాధించిన అంశం. ఇది కూడా అర్ధంగాక పోతే ఎక్కడైనా చికిత్సకు చేర్చటం మంచిది.

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకోవటం, మెప్పు పొందటంలో దేశంలో చంద్రబాబు నాయుడిని మించిన వారు లేరని చెప్పవచ్చు. ఎదుటివారికి కన్ను కొడుతూ వేరే వారితో సంబంధాలు నెరపటంలో దిట్ట. నిడదవోలు ప్రసంగంలో యుపిఏ పాలనలో మహిళా రిజర్వేషన్‌ గురించి పట్టించుకోలేదని చెప్పారు, సరే, 2014 నుంచి 2023వరకు తొమ్మిదేండ్లు నరేంద్రమోడీ ఏం చేశారన్న ఒక్క ముక్క నోటి నుంచి రాలేదు.రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిన తరువాత కూడా గురువారం రాత్రి వరకు నోటిఫికేషన్‌ జారీ చేయని నిర్వాకం గురించి ప్రశ్నించలేదు. ”నోటిఫికేషన్‌” ప్రాధాన్యత ఏమిటో అమరావతి గురించి చూసిన తరువాత చంద్రబాబుకు చెప్పాల్సిన పనిలేదు.తెలుగుదేశం ఉప్పు తిని విశ్వాసంగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారిలో జర్నలిస్టు ఆర్‌కె జగమెరిగిన బ్రాహ్మణుడు. ఏం చేద్దాం బ్రదర్‌ అని చంద్రబాబు అడిగి ఉంటే ఏ సలహా చెప్పేవారో ఆదివారం నాటి కొత్త పలుకు చూసిన తరువాత అర్ధం అవుతుంది.” కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామి అని అందరూ భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా సదరు బిల్లులో ఏముందో తెలియని స్థితి ” అని రాశారు. చంద్రబాబు నాయుడిని చూసి జగన్‌మోహనరెడ్డి సానుభూతి చూపాల్సిన దుస్థితి. అవున్లే బాబుకే తెలియకపోతే దేనికైనా మద్దతు అని ప్రకటించిన వైసిపి నేతలను కనీసం ఈ విషయంలో అయినా తండ్రీ కొడుకులు ఓదార్చి ఉండాల్సింది. తనతో సంప్రదింంచకుండా మోడీ ఏపనీ చేయరనే ధీమాతో ఉన్న చంద్రబాబు ”కేంద్రమంత్రులకు ఫోన్లు చేసి అన్ని రాష్ట్రాలలో 50శాతం సీట్లు పెంచబోతున్న విషయం తెలుసుకున్నారు ” అని ఆర్‌కె ముక్తాయించారు. ఆ ముక్క అసలు బిల్లులో పెట్టలేదని తన పత్రికలోనే రాసిన విషయం తెలియదని అనుకోవాలా ? చంద్రబాబుకు సైతం తెలియదని రాయటం వెనుక ఉన్న అంతరంగం ఏమిటి ? తెలిసి ఉంటే బాబుగారు జాగ్రత్తపడి ఉండేవారు అని భజన చేయటం కావచ్చు.లేకపోతే మీ మద్దతు తీసుకోవటం తప్ప మీరంటే మోడీకి లెక్కలేదు అని ఇరుకునపెట్టటానికి రాసి ఉండవచ్చు. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చన్న సంభాషణను గుర్తుకు తెచ్చుకోవాలి. కలానికి, కత్తికి రెండు రకాల పదను, ప్రయోజనం దాగి ఉంటుంది.ఆర్‌కె ఏ లక్ష్యంతో రాసినప్పటికీ అది ప్రచురితంగాక ముందు మోడీని బలపరిచిన తెలుగుదేశం, జనసేన వీరాభిమానులందరూ చదివిన తరువాత తమ నేత పలుకుబడిని చూసి నీరులేని బావులను చూసుకొని ఉండి ఉండాలి. ఆత్మగౌరవం, అన్న ఎన్‌టిఆర్‌ అని జపం చేసే వారందరూ ఆర్‌కె వ్యాఖ్యానం చదివిన తరువాత కూడా మామూలుగానే భజన కొనసాగిస్తుంటే చంద్రబాబు నాయుడి మాదిరి ” స్థితప్రజ్ఞత ” సంతరించుకొని ఉండాలి.చంద్రబాబు నాయుడు కూడా బ్యూరోక్రాట్‌ మాదిరి వ్యవహరించారని ప్రవచించిన ఆర్‌కెకు అంతకు మించిన పెద్ద బ్యూరోక్రాట్‌ మోడీ గురించి తెలియదనుకోవాలా ? తమను బలపరచటం తప్ప బాబుకు మరోదారి లేదన్నదే మోడీ ధీమా ! గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం మొత్తాన్ని మింగివేసిన మోడీకి ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పక్షాన్ని స్వాహా చేయటం చిటికెలో పని. చంద్రబాబు అండ్‌కోకు మోడీ ఏం చేసినా బలపరచటం తప్ప మరో మార్గం లేదు. అందుకే అన్నీ తెలిసి రాజ్యాంగసవరణ బిల్లును బలపరచి తన కాళ్లను తానే నరుక్కొనేందుకు కూడా సిద్దపడక తప్పలేదు.

భవిష్యత్‌లో కూడా జనాభా ప్రాతిపదికన అది 2011 అయినా 2027 లెక్కల ప్రకారమైనా లోక్‌సభ సీట్లను కేటాయించాలని చూస్తే మరోసారి ఇదే సమస్య పునరావృతం అవుతుంది.కుటుంబనియంత్రణ పథకాన్ని అమలు చేసిన తరువాత 1961-71 జనాభాలెక్కల్లో వెల్లడైన వ్యత్యాసాన్ని గమనించి ఇందిరాగాంధీ ముందు చూపుతో రాజ్యాంగ సవరణద్వారా 25 సంవత్సరాల పాటు లోక్‌సభ సీట్ల పెంపుదలను స్థంభింప చేశారు. ఎందుకంటే హిందీని బలవంతంగా రుద్దేందుకు చేసి మూర్ఖపు చర్యతో అంతకు ముందు తమిళనాట తలెత్తిన నిరసన ఏమిటో ఆమెకు అవగతం అయింది.తరువాత వాజ్‌పాయి కూడా ఇతర పార్టీల మద్దతు మీద ఆధారపడిన కారణంగా ఆ కందిరీగల తుట్టెను కదిపేందుకు సాహసించలేదు. మరోసారి పాతిక సంవత్సరాల స్థంభన విధించారు.తన రూటే సపరేటు(ఇతరుల మార్గంలో నడవను) అన్నట్లుగా మోడీ వ్యవహరించారు.ఇరాన్‌తో వ్యవహారంలో జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ అతితెలివి తీరును చూస్తున్నాం.బిజెపి నేతలు కూడా అదే చేశారు. మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చింది.దాన్ని ఎవరూ మార్చలేరు. అయినా సవరణ బిల్లు పేరుతో కొన్ని రాష్ట్రాలకు అన్యాయం, కొన్నింటికి విపరీత లబ్దికలిగే పద్దతిలో సంఖ్య పెంచి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లంకెపెట్టటమే అసలు వివాదానికి కారణమైంది. మహిళల పేరు చెప్పి భావోద్వేగపూరిత బెదిరింపులకు(ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌)పూనుకున్నారు. మీరు గనుక మేం చెప్పినట్లు ఆమోదించకపోతే మాకే లాభం అన్నారంటేే అర్ధం ఏమిటి ? మీ గురించి వ్యతిరేకతను రెచ్చగొడతాం అని చెప్పటమే.చిత్తశుద్ది ఉన్నవారెవరైనా అలాంటి పరిస్థితే వస్తుందనుకుంటే వేరే పదజాలాన్ని ఉపయోగిస్తారు. పెంచిన 50శాతం సీట్లను రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్ల దామాషా ప్రకారం కేటాయిస్తామంటే గుడ్డిలో మెల్లమాదిరి అన్ని పార్టీలూ అంగీకరించి ఉండేవి.

అసలు రాజ్యాంగ సవరణ ప్రతిపాదన లేక ముందు అమిత్‌షా మొదలు బిజెపి గల్లీ లీడరు వరకు అన్ని రాష్ట్రాలకు అలాగే పంచుతామని చెప్పారు. తీరా బిల్లులో ఆ ప్రస్తావనే లేదు.రెండు రోజులు పాటు పార్లమెంటులోపలా వెలుపలా ప్రభుత్వ ప్రతిపాదనతో కొన్ని రాష్ట్రాలకు గలిగే నష్టం, లబ్ది గురించి వివరంగా చర్చ జరిగింది. అయినప్పటికీ ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా సరిగ్గా ఓటింగ్‌కు వెళ్లే ముందు(తొలుత సాయంత్రం నాలుగు అన్నారు, తరువాత ఆరు, మరోసారి ఏడు అన్నారు) అమిత్‌షా ప్రతిపక్షాలను తీవ్రంగా దుయ్యబట్టి మీరు గనుక మా షరతుకు అంగీకరిస్తే 50శాతం చేరుస్తామని అన్నారు. అంతకు ముందు బిజెపి నేతలు ఇరవై నాలుగు గంటలపాటు అలాంటి లీకులు ఇచ్చారు, చివరికి తమ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ అందిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలకు అదే చెప్పారు.అయినా బిల్లులో ఎలాంటి మార్పులు చేయకుండా నాటకమాడారు. మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలుకు 2023 నుంచి గజెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకుండా గురువారం రాత్రి ప్రకటించారు. స్వంత మిత్రులనే తప్పుదారి పట్టించి మోసం చేసిన బిజెపి మంత్రుల మాటలను ఎవరు నమ్ముతారు.చివరికి అదే జరిగింది.బిల్లు ఓడిపోయింది. అలాంటి పరిణామం జరుగుతుందని ముందే తెలుసుగనుకనే వారు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసే నినాదాలతో కూడిన ప్లకార్డులను సిద్దం చేసుకొని పార్లమెంటు ప్రాంగణంలో దాచబట్టే వెంటనే నిరసనపేరుతో వీధుల్లో ఊరేగారు. ఇప్పటికైనా నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాలకు వదలివేసి 543 స్థానాల్లో 33శాతం రిజర్వేషన్‌ అమలుకు పూనుకోవాలి.2023 చట్టంలో తదుపరి జనాభా లెక్కల తరువాత అమలు అని లంకె పెట్టినందున దాన్ని సవరించేందుకు ఇప్పుడు జరుగుతున్న జనాభాలెక్కల ప్రాతిపదికన పార్లమెంటు సీట్ల సంఖ్యను మార్చకుండా పునర్విభజన చేసేందుకు చట్టసవరణ చేయాలి.అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు.మహిళలూ క్షమించండి అంటూ ప్రకటించిన మోడీ చిత్తశుద్దికి ఇప్పుడు పరీక్ష ఎదురుకానుంది, వచ్చే పార్లమెంటు ఎన్నికలకు చాలా ముందుగానే జన సంఖ్య ఎక్కడ ఎంత అనేది స్పష్టం అవుతుంది గనుక దానికి అనుగుణంగా లోక్‌సభ, రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి ఆటంకం ఉండదు.

ఇక నరేంద్రమోడీ క్షమాపణల చిత్తశుద్ది బండారం గురించి చెప్పుకోకపోతే సంపూర్ణం కాదు. ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో సాగిన రైతాంగ పోరాటానికి తలొగ్గిన నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.ఆ ఉద్యమం ముందుకు తెచ్చిన అంశాలలో ఒకటి కనీస మద్దతు ధరలకు చట్టబద్దత.మోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు ఆ డిమాండ్‌ను ముందుకు తెచ్చినప్పటికీ తాను ప్రధాని పదవి స్వీకరించిన తరువాత మిగతా వాగ్దానాల మాదిరే దాన్ని కూడా విస్మరించారు.అయితే రైతుల ఆందోళనను చల్లార్చేందుకు మద్దతుధరల చట్టబద్దత పరిశీలన పేరుతో 2021నవంబరు 19న ఒక కమిటీని ప్రకటించారు.దానికి 2022 జూలై 22న సభ్యులను ఎంపిక చేశారు.త్వరలో నాలుగో వార్షికోత్సవం జరుపుకోనుంది.అసలా కమిటీ ఏమి చేస్తున్నదో, సమావేశాల పేరుతో కాలక్షేపం, టిఏ, డిఏలు తీసుకుంటున్నది తప్ప చేసిందేమీ లేదు. జరిగిన ప్రతి సమావేశమూ అసంపూర్ణమే, 35 ఉపసంఘాల సమావేశాలు జరిగాయి.చివరి సమావేశం చాలా కాలం తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కమిటీలో ఉన్న అధికారగణ సభ్యులు మార్కెట్‌ కమిటీల వెలుపల జరిగే లావాదేవీలలో కనీస మద్దతు ధరలను అమలు జరపటానికి విముఖత చూపటంతో ఇతర కమిటీ సభ్యులు తీవ్రంగా విబేధించినట్లు నిర్దారణగాని వార్తలు. కనీస మద్దతు ధర ఎక్కడైనా రైతులకు దక్కాల్సిందేనని ఐదుగురు సభ్యులు కమిటీ చైర్మన్‌ మీద వత్తిడి తెచ్చినప్పటికీ ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. నివేదిక ఇవ్వాలని మోడీ సర్కార్‌ అడగలేదు, అసలా కమిటీకి ఒక నిర్ణీత గడువును కూడా నిర్ణయించలేదు.రైతుల్లో మహిళలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.రిజర్వేషన్లు, కనీస మద్దతు ధరలకు పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. చట్టసభల్లో రిజర్వేషన్లతో వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది తప్ప ఆర్థికంగా ఒరిగేదేమీ లేదు. అదే పంటల కనీస మద్దతు ధరలకు హామీ ఇస్తే కోట్లాది మంది మహిళా రైతుల జీవితాలు కాస్త మెరుగుపడతాయి.ఈ విషయంలో చిత్తశుద్దిలేని మోడీ సర్కార్‌ ఇప్పుడు చట్టసభల రిజర్వేషన్లను ఎలా అమలు జరుపుతుందో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

10 Tuesday Mar 2026

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Donald trump, India-US trade deal, MAGA, Narendra Modi Failures, Russian oil, US attack Iran

ఎం కోటేశ్వరరావు

కేవలం విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటనతో సరిపెడదామని చూసిన పాలక కూటమి యత్నంతో సోమవారం నాడు పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. పశ్చిమాసియాలో పరిస్థితి గురించి ప్రకటన కాదు, చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. గల్ఫ్‌లో చిక్కుకు పోయిన భారతీయుల గురించి ఆందోళన చెందుతున్నట్లు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి మంత్రి చెప్పారు.యుద్ధం, దాని పర్యవసానాల గురించి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చర్చించాలని ప్రతిపక్షం పట్టుబట్టటంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సమావేశాలు వాయిదా పడ్డాయి, పశ్చిమాసియా పరిస్థితి గురించి ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ స్థానం అనుమతించలేదు. యుద్ధాలు, ప్రపంచాన్ని కుదిపివేసే ఇతర సంక్షోభాలు అప్పటి వరకు ఉదాసీనంగా ఉన్నవారిలో, కొందరు నేతల మీద ఉన్న భ్రమలు పటాపంచలు అవుతాయి, అయితే కొందరు వాటిని బహిరంగంగా అంగీకరించటానికి ముందుకు రారు. ఫర్లేదు, ఒకసారి బుర్ర ఆలోచించటం ప్రారంభించిన తరువాత ఎంతకాలం బిడియపడతారు ! ఎన్‌డిఏ ప్రభుత్వం, నరేంద్రమోడీ అనుసరించే లొంగుబాటు విధానాల గురించి వామపక్షాలు, ఇతర పార్టీలు ఎంతగా మొత్తుకున్నా చెవికి ఎక్కని వారికి గూబగుయ్యి మనిపించేలా వినిపించినందుకు నిజంగా డోనాల్డ్‌ ట్రంప్‌కు ” అభినందనలు ” చెప్పక తప్పదు.ప్రతి తరంలోనూ ఒక మహానుభావుడు అవతరిస్తాడు మరి ! జీవ పరిణామ క్రమంలో కొన్ని జీవుల మెదళ్లు ఎదగలేదు, మనుషుల్లో కూడా అలాంటి వారు ఉంటే వారి పట్ల జాలి చూపుదాం !!

నెల రోజుల పాటు రష్యన్‌ ముడిచమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించగానే నరేంద్రమోడీ భక్తి మైకంలో ఉన్నవారికి చెర్నాకోల దెబ్బలా తగిలి మత్తువదిలింది. ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు అన్న శ్రీశ్రీ పాట చాలా మందికి డోనాల్డ్‌ ట్రంప్‌ను గుర్తుకు తెచ్చింది. అది కూడా కొత్తగా రష్యాలో కొనుగోలు చేసేందుకు కాదు. అమెరికా ఆంక్షల కారణంగా రష్యన్‌ రేవుల నుంచి బయలుదేరి, ఏ దేశానికి వెళ్లాలో తెలియక సముద్రంలో లంగరు వేసిన చమురు టాంకర్లలో ఉన్న సరకు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి.ఈ ఉదంతాన్ని చూస్తే బందీగా ఉన్న బానిసకు రెండు నిమిషాల్లో కాలకృత్యాలు తీర్చుకురా అన్న యజమాని ఉదారత్వం కనిపించింది. ఇంతకీ మనం అసలైన దేశభక్తులం అని చెప్పుకొనే కాషాయదళాల పాలనలో ఉన్న స్వేచ్చా జీవులమా, అమెరికా యజమానులకు బానిసలమా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే ! యావత్‌ దేశంలో ఆత్మగౌరవం గలవారందరూ అమెరికా ప్రకటనపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే బిజెపి మాత్రం నరేంద్రమోడీ దౌత్య విజయం అంటూ భజన చేస్తున్నది. మొత్తం మీద ఈ పరిణామం ఆ పార్టీ నిజస్వరూపాన్ని వెల్లడించింది. నిజంగా విజయమే అయితే 30 రోజులే గడువు ఎందుకు ? నీ ఆంక్షలను మేము ఖాతరు చేయం, ఇప్పటి వరకు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురు ఇది, ముందు ముందు కూడా కొనసాగిస్తాం అని మోడీ సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది ? మధ్యలో రష్యా నుంచి దిగుమతులను ఎందుకు తగ్గించినట్లు ? పిల్లి పాలుతాగుతూ తనను ఎవరూ చూడలేదు అనుకుంటుందట. అమెరికా బెదిరింపులకు లొంగి మాస్కో నుంచి దిగుమతులు ఎలా తగ్గించారో లోకం కోడై కూస్తున్నది.చైనా అలా తగ్గించినట్లు వార్తలు లేవు. మన ఛాతీ 56 నుంచి 6 అంగుళాలకు తగ్గిపోయిందా ! ఇంతా చేసి ఇంటా బయటా పరువుపోయినా భారత్‌ సాధించింది కేవలం 30రోజుల పాటు దిగుమతులకు అనుమతా, సిగ్గుచేటు !ఈ చమురు గురించి మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడి చమురు ధర కంటే నాలుగైదు డాలర్లు ఎక్కువగా ఉంటుందట, గతంలో రష్యా మనకు ఇచ్చిన 13 డాలర్ల రాయితీ పోయి ఇది అదనం. అవసరం మనదైపుడు వ్యాపారులు కొండెక్కుతారని తెలిసిందే.

నియంత జూలియస్‌ సీజర్‌ చరిత్రలో అతగాడి నమ్మినబంటు బ్రూటస్‌ వెన్నుపోటు పొడుస్తాడు, అప్పుడు బ్రూటస్‌ నువ్వు కూడానా ( యూ టూ బ్రూటస్‌) అంటాడు సీజర్‌.ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే అధికారమే పరమావధిగా ఉన్నవారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ముఖ్యంగా పరీక్షా సమయం వచ్చినపుడు అసలు రంగు బయటపడుతుంది. బ్రిక్స్‌ కూటమిలో స్థాపక సభ్యులైన బ్రెజిల్‌,రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇండోనేషియా, ఈజిప్టు,ఇథియోపియా ఉన్నాయి.ఒక సభ్యురాలైన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతున్నాయి, వాటిని ఇరాన్‌ ప్రతిఘటిస్తున్నది.ఈ క్రమంలో కూటమిలోని సౌదీ అరేబియా,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న అమెరికా సైనిక కేంద్రాలు, ఎంబసీల మీద ఇరాన్‌ దాడులు చేస్తున్నది.ఈ పరిణామంపై కూటమికి ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో నాయకత్వం వహిస్తున్న భారత్‌ నోరుమెదపలేదు. ఇది మన గురించి ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తున్నది ? గతేడాది ఇదే అమెరికా, ఇజ్రాయెల్‌ పన్నెండు రోజుల పాటు ఇరాన్‌పై దాడులు చేసినపుడు బ్రిక్స్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రెజిల్‌ వెంటనే ఆ చర్య అంతర్జాతీయ న్యాయాన్ని ఉల్లంఘించటమే అని ఖండించింది. అప్పుడు అది తన ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. గత డిసెంబరు నుంచి భారత్‌ అధ్యక్ష స్థానంలోకి వచ్చింది. కూటమి కంటే తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నదని, అమెరికా-ఇజ్రాయెల్‌కు దగ్గర ఉన్నట్లు సంకేతాలు పంపినట్లు అల్‌ జజీరా పత్రిక, సండే గార్డియన్‌ వ్యాఖ్యానించాయి. సరిగ్డా యుద్ధ ప్రారంభానికి ముందు నరేంద్రమోడి ఇజ్రాయెల్‌ పర్యటన, ఇతర అంశాల గురించి పేర్కొన్నాయి. పారిశ్రామిక దేశాలతో కూడిన జి 7 కూటమికి ప్రత్యామ్నాయంగా పేద దేశాల ప్రయోజనాల కోసం ఏర్పడిందే బ్రిక్స్‌, దాని అజెండాల్లో ఇప్పుడు సభ్య దేశాల భద్రత అంశం కూడా ఉంది. అందువలన ఇరాన్‌ భద్రతకు ముప్పు తెచ్చిన వారి గురించి మౌనంగా ఉంటే కుదరదు, మనకు మన ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలి. బ్రిక్స్‌ అమెరికా వ్యతిరేక కూటమి అని ట్రంప్‌ ఆరోపించాడు. సభ్య దేశాల సంగతి తేలుస్తాం అని మాట్లాడాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన మిలిటరీ విన్యాసాలకు భారత్‌ దూరంగా ఉంది.అమెరికాకు ఆగ్రహం కలిగించే చర్యలేవీ చేపట్టబోమని చెప్పకనే చెప్పింది. విశాఖపట్టణంలో మనదేశం మిలన్‌ 2026 విన్యాసాల్లో ఇరాన్‌ పాల్గొనగా అమెరికా మొఖం చాటేసింది.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలి అన్న లోకోక్తులు తెలిసిందే. అమెరికాతో అన్ని దేశాలూ వాణిజ్యం చేస్తున్నాయి, అయినా ఒక పరిణామం జరిగినపుడు వాటి గురించి పట్టించుకోకుండా స్పందిస్తున్నాయి. అమెరికా దాడులను ఒక్క మనదేశం తప్ప బ్రిక్స్‌ స్థాపకసభ్యులైన నాలుగు దేశాలూ విడివిగా ఖండించాయి. మూడు రోజులు ఆలశ్యంగా ఈ ఉన్మాదానికి స్వస్థి పలకాలని దక్షిణాఫ్రికా స్పందించింది. ముందుగా పాలక ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది. అవసరమైతే మధ్యవర్తి పాత్రపోషిస్తామని కూడా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా ప్రకటించాడు. ఇదే దక్షిణాఫ్రికా జనవరి నెలలో నిర్వహించిన బ్రిక్స్‌ నౌకాదళ విన్యాసాలలో ఇరాన్‌ భాగస్వామిగా ఉండటానికి అంగీకరించినందుకు దక్షిణాఫ్రికాపై ట్రంప్‌ తీవ్రంగా విమర్శించాడు. తొలి దాడి, ఖమేనీ హత్య జరిగిన మూడు రోజుల తరువాత భారత విదేశాంగశాఖ ఒక ప్రకటన చేస్తూ చర్చలు, దౌత్యాన్ని కోరుతున్నామని, వివాదం త్వరగా ముగియాలని పేర్కొన్నది. ఇరాన్‌ నేతలతో ఎలాంటి మాటలు లేకపోగా దాని పేరు ఎత్తకుండా గల్ఫ్‌ దేశాల నేతలతో మాట్లాడుతూ వాటి భూభాగాలపై జరుగుతున్న దాడులను నరేంద్రమోడీ విమర్శించారు. గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ, వెస్ట్‌బాంక్‌ ప్రాంతంలో పాలస్తీనియన్లపై కొనసాగుతున్న మారణకాండను ప్రపంచ దేశాలు ఖండిస్తుండగా ఫిబ్రవరి 25,25 తేదీలలో పర్యటన జరిపి పార్లమెంట్‌ నెసెట్‌లో మాట్లాడుతూ వర్తమానంలో, తరువాత కూడా తాము ఇజ్రాయెల్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు.హమస్‌ దాడులను ఖండించారు గానీ వారిని అణచేపేరుతో గాజాలో టెల్‌అవీవ్‌ జరిపిన మారణకాండ గురించి పల్లెత్తుమాట అనలేదు. గాజాలో యుద్ద నేరాల కేసులో తమ ముందు హాజరు కావాలని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు కోరిన నెతన్యాహును ఆలింగనాలు చేసుకున్నారు. రెండు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని కూడా మోడీ చెప్పారు. ఆ మాటలు చెబుతున్న సమాయానికే అమెరికా, ఇజ్రాయెల్‌ అన్ని యుద్ధ సన్నాహాలు చేసుకున్నాయి.ఒక రోజు తేడాతో దాడులను ప్రారంభించాయంటే మోడీకి ఆ విషయం తెలియకుండా ఎలా ఉంటుందని విమర్శకులు అంటున్నారు. నిజంగా తెలియదంటే మన వేగుల వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించాల్సి ఉంటుంది. తెలుసు అంటే ఎరుకలో ఉండి కూడా మోడీ వెళ్లారంటే ఇజ్రాయెల్‌కు సమర్ధనే అన్నది స్పష్టం. దీని గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గల్ఫ్‌లో ఉన్న భారతీయుల గురించే మా తపన అని జైశంకర్‌ చెప్పారు. ఇరాన్‌లో కూడా ఉన్నారుగా, అయినా తమ మీద దాడి చేస్తే ఎక్కడ అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నా వాటి మీద దాడి చేస్తామని ముందే ఇరాన్‌ ప్రకటించింది. దాని అర్ధం తెలియనంత అమాయకంగా కేంద్ర ప్రభుత్వం ఉందని నమ్మటానికి ఎవరూ చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. గతంలో ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులను తీసుకు వచ్చేందుకు తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని కొద్ది రోజులు ఆపారని మోడీ గురించి పెద్ద ప్రచారం చేశారు కదా, ఆ పని ఇప్పుడెందుకు చేయలేదు ?

పశ్చిమాసియా సంక్షోభ సమయంలో భ్రమల్లో ఉన్న అనేక మంది భారతీయులను మరో అంశంలో కూడా అమెరికా కళ్లు తెరిపించింది. మన స్వేచ్చా మీడియా దాని గురించి పెద్దగా వార్తలు ఇవ్వటానికి చర్చిందేందుకు భయపడింది. తమను దెబ్బతీసేందుకు భారత్‌ను అనుమతించనివ్వం, ఇరవై ఏండ్ల క్రితం చైనా వ్యవహారంలో చేసిన తప్పిదాన్ని పునరావృతం కానివ్వం, ఇది భారత్‌కు అర్ధమైంది, మాకు పోటీగా మరొక అర్ధిక వ్యవస్థ ఎదగటం మా పౌరుల ప్రయోజనాలకు విరుద్దం అని న్యూఢిల్లీ గడ్డమీద రైసినా 2026 చర్చల్లో అమెరికా విదేశాంగశాఖ ఉపమంత్రి క్రిస్టోఫర్‌ లాండవ్‌ తెగేసి చెప్పినా మనం గొణగటం తప్ప గట్టిగా మాట్లాడలేకపోయాం. దీని అర్ధం ఏమిటి ? గత పన్నెండు సంవత్సరాలుగా చైనాను పక్కకు నెట్టి మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా పథకాలతో భారత్‌ను ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తాని మోడీ అండ్‌కో చెబుతున్నది.దానికి మేం అనుమతించం అని అమెరికా చెప్పింది. అంతే కాదు భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం కూడా తొలుత తమ ప్రయోజనాలకే పెద్ద పీటవేసిందని కూడా క్రిస్టోఫర్‌ ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పాడు. ముందే చెప్పినట్లుగా సంచలనాత్మక పరిణామాలు జరిగినపుడు జనంలో అనేక ఆలోచనలకు నాంది పడుతుంది. భారత్‌ను విశ్వగురువుగా మారుస్తానని చెప్పిన నరేంద్రమోడీ అమెరికా తోకగా మారుస్తున్నారని పశ్చిమాసియా సంక్షోభం వెల్లడించింది. గతంలో వామపక్షాలు, ఇతర పార్టీలు, ఎందరో మేథావులు చెప్పినా పట్టించుకోని వారు ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీరుతో ఆలోచించకతప్పటం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

హీరోయిన్‌ త్రిషను కించపరిచిన బిజెపి నేత క్షమాపణ : హీరో విజై మౌనముద్రకు అర్ధం ఏమిటి !

18 Wednesday Feb 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Filims, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, Women

≈ Leave a comment

Tags

Actor Vijay, BJP, DMK, Nainar Nagendran, Narendra Modi Failures, Tamilnadu Elections 2026, Tamilnadu politics, Thrisha, TVK

ఎం కోటేశ్వరరావు

తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది ? ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నట్లు కలలు కంటున్న సినీహీరో విజై ఒంటరిగా బరిలో దిగుతారా లేక ఏ పార్టీతో అయినా జతకడతారా ? తన ఆధిపత్యాన్ని అంగీకరించటం తప్ప సిద్దాంత రాద్దాంతాలేమీ లేవనే సందేశం పంపుతున్న తమిళ వెట్రి కజగమ్‌(టివికె) నేతను ఎవరైనా భరించగలరా ? డిఎంకె నాయకత్వంలోని కూటమిలో తాము కొనసాగాలంటే అధికారంలో కూడా భాగం పంచాలని కోరుతున్న కాంగ్రెస్‌ ఎత్తుగడ ఏమిటి ? ఇలా ఎన్నో సశేషాలుగా ఉన్న విశేషాలు అక్కడ జరుగుతున్నాయి. విలువలు, వలువలు, సంస్కారం అంటూ కబుర్లు చెప్పే బిజెపి కుదురులోని రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ నోరుపారవేసుకొని అభాసుపాలయ్యారు. భారతీయ సంస్కృతికి తామే ప్రతీకలమని చెప్పుకొనే వారు ఎంత అసహ్యంగా మాట్లాడుతారో ఈ ఉదంతం వెల్లడించింది.గతంలో అనేక మంది సినీనటులు పార్టీలను పెట్టినపుడు,రాజకీయాల్లోకి వచ్చినపుడు వారి అనుభవం గురించి ఇతరులు విమర్శలు చేశారు. అయితే అనుభవం ఉన్న వారు మాత్రం వెలగబెడుతున్నదేమిటి అన్న అంశం ఉన్నప్పటికీ నటీనటులపై ఒక మేరకు విమర్శను అర్ధం చేసుకోవచ్చు గానీ చౌకబారు మాటలు తగవు.

విజైకు అనుభవం లేదంటూనే ముందుగా హీరోయిన్‌ త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని బిజెపినేత చేసిన వ్యాఖ్య ఏ విధంగా చూసినప్పటికీ తీవ్ర అభ్యంతరకరం. మాజీ ప్రధాని వాజ్‌పాయి దశాబ్దాల పాటు ఒకనాడు తాను ప్రేమించిన రాజకుమారి కౌల్‌కు వేరే వ్యక్తితో వివాహమైన తరువాత తాను కూడా దంపతుల ఇంట్లో జీవించారు.ఆమెకు పుట్టిన కుమార్తె గురించి నిరూపితం కాని వార్తలు వచ్చినా ఎన్నడూ ఏ రాజకీయ నేత, పార్టీ కూడా వారి బంధం గురించి బహిరంగంగా రచ్చ చేయలేదు. త్రిషతో స్నేహం కారణంగా విజై భార్య విదేశాల్లో ఒంటరిగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఏమైనప్పటికీ అది వారి వ్యక్తిగత వ్యవహారం. అనేక మంది ఇష్టపూర్వకంగా సహజీవనం చేయటం ఈ రోజుల్లో అందునా సినిమా రంగంలో సర్వసాధారణంగా జరుగుతోంది. రాజకీయ రంగంలో కూడా ప్రారంభమైంది. విజరు రాజకీయ నేతగా మారిన కారణంగానే నాగేంద్రన్‌ మాటలు సంచలనం కలిగించాయి. బహుశా బిజెపి అగ్రనాయకత్వం కూడా చివాట్లు పెట్టిన కారణంగా ఆ పెద్దమనిషి తన వ్యాఖ్యలపట్ల క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేయటం తప్పే, ఎవరైనా వాటితో గాయపడితే విచారం వ్యక్తం చేస్తున్నాను.మా పార్టీ అఖిల భారత మహిళా విభాగం అధ్యక్షురాలు వనాతి శ్రీనివాసన్‌, అన్నామలై ఈ అంశం గురించి నాతో మాట్లాడారు. నా రాజకీయ జీవితంలో ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు, కానీ ఆరోజు దాన్నుంచి వైదొలిగి మాట్లాడాను అని నాగేంద్రన్‌ పేర్కొన్నారు. నాగేంద్రన్‌ వ్యాఖ్యలపై ఎలాంటి ప్రత్యక్ష ప్రస్తావన లేకుండా త్రిష తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన చేయించారు. వ్యాఖ్యలు చౌకబారుగా ఉన్నాయని, రాజకీయాల్లో తాను తటస్థంగా ఉన్నానని,రానున్న రోజుల్లో కూడా ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదని ఆమె పేర్కొన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అంతగా దిగజారి మాట్లాడతారని ఎన్నడూ ఊహించలేదన్నారు.తనకు సంబంధం లేని అంశాల్లో తన పేరును లాగవద్దని కోరారు. సంచలనం కలిగించిన ఈ ఉదంతం గురించి విజై ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం దాల్చారు. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడలేదు. ఒక వేళ ఏ పరిస్థితిలోనైనా బిజెపితో జట్టుకట్టాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఈ వైఖరి తీసుకున్నారా లేక మరింత రచ్చ అవుతుందని భావించారో తెలియదు.

అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా రానున్న రోజుల్లో బిజెపి పట్ల విజై వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్న తలెత్తింది.కరూరులో జరిగిన తొక్కిసలాట మరణాల ఉదంతం తరువాత బిజెపి గురించి ఇంతవరకు ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఓడించాల్సింది డిఎంకెను గనుక దాని వరకే పరిమితం అవుదాం అని తప్పించుకున్నారు.గతేడాది కేంద్ర బడ్జెట్‌ మీద విమర్శలు చేసిన విజై ఈసారి మౌనం పాటించారు.కరూరు కేసు, తన వ్యాపారలావాదేవీలు, కేంద్ర సంస్థలను చూసి భయపడే ఈ వైఖరి తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. రెండు కూటములనూ వ్యతిరేకిస్తానంటూ ప్రకటించినా తరువాత వెనక్కు తగ్గారు. ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఉండవచ్చని భావిస్తున్నారు. డిఎంకె కూటమి, అన్నాడిఎంకె-బిజెపి, టివికే, సీమన్‌ అనే మాజీ నటుడు, దర్శకుడు ఏర్పాటు చేసిన నామ్‌ తమిళ్‌ కచ్చి(ఎన్‌టికె) కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు, అయితే ఎన్‌టికే ప్రభావం పరిమితమే. తమిళనాడు రాజకీయాలు డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య కేంద్రీకృతమయ్యాయి. గతంలో పార్టీ పెడతానంటూ లీకులు వదిలిన రజనీకాంత్‌ ధైర్యం చేయలేకపోయారు.మరో ప్రముఖ నటుడు కమల్‌ హసన్‌ పార్టీ పెట్టి విఫలమయ్యారు. వారిద్దరి తరువాత ప్రేక్షకాదరణ ఉన్న విజరు పరిస్థితి చెప్పలేము. స్టార్‌ హీరోల సభలకు జనం రావటం, ఈలలు, కేకలు వేయటం వేరు, ఓట్లు పడటం మరొకటి. కెప్టెన్‌ విజయకాంత్‌ కూడా పేరున్న నటుడే అయినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.

తమ పార్టీ మాత్రమే డిఎంకెను సవాలు చేయగలదని టివికె నేత విజై ప్రతి సభలోనూ చెబుతున్నారు. దీని గురించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్‌ స్పందన ఏమిటని ప్రశ్నించినపుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.” ఇంటి మీదకు కూడా ఎక్కలేని వారు స్వర్గానికి ఎగురుతామని కలలు కంటున్నారు. అతనికి ఏమాత్రం అనుభవం లేదు. ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి, తరువాత ఏదైనా జరుగుతుంది” అంటూ నవ్వారు. ఒక్క కౌన్సిలర్‌ కూడా పార్టీలో లేరు గానీ 30శాతం ఓట్లు తనకు ఉన్నాయని విజరు ఎలా చెప్పుకుంటారు. ముందు విజై తన కుటుంబంతో సంబంధాలను నిర్వహించుకోవాలి, గొప్పనేతలు చెప్పిన అంశాలను సక్రమంగా జనాలకు చెప్పాలి, ముందు వీటన్నింటి నుంచి బయటపడాలి అన్నారు. ఈ వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారటంతో వాటిని వెనక్కు తీసుకుంటారా అని అడగ్గా చెప్పినదానికి కట్టుబడి ఉంటాను అన్నారు. తరువాత విధిలేక క్షమాపణ చెప్పారు. టివికె సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల కుమార్‌ మాట్లాడుతూ గతంలో బిజెపికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని,వచ్చే ఎన్నికల్లో ఇంకా దిగజారతాయని అన్నారు.కొంత మంది బిజెపి నేతలు డిఎంకె తొత్తులుగా ఉన్నారన్నారు. బిజెపి ఎంఎల్‌ఏ, మహిళా నాయకురాలు వనాతి శ్రీనివాసన్‌ మాట్లాడుతూ నాగేంద్రన్‌ ఎంతో మృదువుగా మాట్లాడే మనిషని, అలాంటి వ్యాఖ్యలు చేయటం విచారకరమంటూ తన అసంతృప్తిని తెలియచేస్తానని చెప్పారు. డిఎంకె, కాంగ్రెస్‌ నేతలు మహిళానేతలను వేధిస్తారని ఆరోపించారు.

ఈ ఉదంతం జరగ్గానే డిఎంకె నేతలు బిజెపి అధ్యక్షుడిపై ధ్వజమెత్తారు. పార్టీ ప్రతినిధి టికెఎస్‌ ఇలాంగోవన్‌ స్పందిస్తూ మహిళలను కించపరచటంలో బిజెపి నేతల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.” వారు మనుధర్మాన్ని అనుసరిస్తారు, అది మహిళలకు ఎన్నడూ గౌరవం ఇవ్వలేదు, సహజంగానే అతను అలా మాట్లాడతారు. అందుకే తమిళనాడు జనాలు బిజెపికి వ్యతిరేకంగా, వారు మహిళలను అవమానిస్తారు, ఆ విషయంలో వారు పేరుమోశారు, నాగేంద్రన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కు బానిసగా మారారు, అందుకే అతను అలా మాట్లాడారు ” అన్నారు. తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు సెల్వపెరుంతగరు కూడా విమర్శించారు. త్రిష గురించి అలా మాట్లాడటం దిగ్భ్రాంతికి గురిచేసింది.దేశంలో చేయాల్సిన పని చాలా ఉంది, అది చేయకుండా అతను వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు.రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు తగవు అన్నారు. తమ నేత సదుద్ధేశ్యంతో చేసిన వ్యాఖ్యలను డిఎంకె వక్రీకరించిందంటూ బిజెపి నేతలు నాగేంద్రన్‌కు మద్దతుగా మాట్లాడారు. ఆ పార్టీ నాయకురాలు విజయధరణి మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరినపుడు డిఎంకె తన గురించి చెడు వ్యాఖ్యలు చేసిందని, వారెప్పుడూ మహిళల పట్ల అలాగే మాట్లాడతారని ఆరోపించారు.తమ నేత చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. నాగేంద్రన్‌ చౌకబారు మాటలపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ మరోవైపు హీరో విజైను ఎలా సమర్ధించాలో పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఇబ్బందికరంగా పరిణమించింది. విజై-త్రిష మధ్య ఉన్న సంబంధం గురించి పలు కథనాలు ఈ వివాదానికి ముందే ఉన్నాయి. అయితే బజారుకు ఎక్కలేదు గనుక సమస్య రాలేదు. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలను బిజెపి నేత ఒక కుదుపుకుదిపారు. రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవాస్తవాలు చెబుతున్నదెవరు పియూష్‌ గోయలా – రాహుల్‌ గాంధీనా : పత్తి రైతులు, పరిశ్రమకు ముప్పుగా మారిన మోడీ-ట్రంప్‌ ఒప్పందం !

15 Sunday Feb 2026

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Farmers, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

cotton farmers, Donald trump, Farmers matters, Narendra Modi Failures, Piyush Goyal, Rahul gandhi, Textiles Industry, US-India trade Deal

ఎం కోటేశ్వరరావు

రైతులు నిజంగా అమాయకులే, ముల్లుగర్రతో ఎద్దుముడ్డి మీద పొడవటం తప్పఏమీ తెలియదు,(కొంత మందికి ఇప్పుడు ఎద్దులతో సాగు చేస్తారని తెలియదు, వాటి స్థానంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాలు వచ్చాయి) ఏం చెప్పినా తలూపుతారన్న గట్టి విశ్వాసం లేకపోతే మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అలా ఎందుకు మాట్లాడతారు. అమెరికా మన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన ఎగుమతులపై 18శాతం దిగుమతి పన్ను విధిస్తారు. అదే బంగ్లాదేశ్‌తో చేసుకున్న అవగాహన ప్రకారం దిగుమతి చేసుకొనే దుస్తులపై అమెరికా ఎలాంటి పన్ను విధించదు. ఈ అంశం మన దేశ వస్త్రపరిశ్రమ,వాణిజ్యవేత్తలలో ఆందోళనకు గురిచేసింది. దాంతో కేంద్ర మంత్రి రంగంలోకి దిగారు.మనకూ అలాంటి సౌకర్యం ఉందన్నారు. ఉంటే అమెరికా జారీ చేసిన ప్రకటనలో ఆ వివరం ఎందుకు లేదు ! అదంతే,మనకా రాయితీ ఎలా వస్తుందంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకుంటే ఎలాంటి పన్నులూ ఉండవని, ఈ అంశాన్ని సంతకాల సమయానికి ఒప్పందంలో భాగంగా చేర్చుతామని చెప్పారు. ఖాళీ చెక్కు మీద సంతకం చేసినపుడు ఎంతమొత్తమైనా రాసుకోవచ్చు. అమెరికాతో అలాంటి అవగాహనకు వచ్చినందున ఇంకా ఇలాంటి వాటిని మరెన్నింటిని చేర్చుతారో ! ఆ నిబంధన రైతాంగానికి నష్టం కదా అంటే కాదని సెలవిచ్చారు. ఎందుకటా అమెరికాలో పత్తి పరిమితంగానే పండుతుంది గనుక అన్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగేందుకు చూస్తున్నారు గనుకనే అడుగడుగునా అనుమానించాల్సిందే. ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా పియూష్‌ గోయల్‌ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు ఎవరేం చెప్పారో ? చూద్దాం !

అమెరికాతో కుదిరిన ఒప్పందంతో వచ్చే ముప్పు గురించి అనేక రైతు సంఘాల ప్రతినిధులు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కలిసి దానిపై గళమెత్తాలని కోరారు. అదేమీ తప్పు కాదు, అన్ని పార్టీల నేతలను అలా కలిసిన ఉదంతాలు ఎన్నో. కొంత మందిని రప్పించుకొని రాహుల్‌ నాటకమాడుతున్నారని కేంద్ర వాణిజ్యశాఖ పియూష్‌ గోయల్‌ ఆరోపించారు. రైతులు, వస్త్ర పరిశ్రమ వర్గాల్లో భయాన్ని రేపుతున్నారని అన్నారు. వాస్తవాలు తెలియకుండా తన అవివేకాన్ని స్వయంగా బయటపెట్టుకున్నారని, దేశ అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తున్నారని, ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నారని కూడా ధ్వజమెత్తారు. ” కఠిన వాస్తవాలు ” అంటూ ఎక్స్‌లో కొన్ని విషయాలను మంత్రి పోస్టు చేశారు. అభివృద్ధి చెందిన 38దేశాలతో కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ఇప్పుడున్న నాలుగు లక్షల కోట్ల రూపాయల వస్త్ర ఎగుమతులు 45 లక్షల కోట్ల పెరుగుతాయంటే ఎంతగా వృద్ధి అవకాశాలు ఉన్నాయో స్త్రీ, పురుషులకు లక్షలాది ఉద్యోగాలు ఎలా వస్తాయో ఊహించుకోవచ్చన్నారు. అమెరికా పత్తి ఉత్పత్తి చాల తక్కువని, స్థానిక అవసరాలకు పోను ఆరుబిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలు ఎగుమతులు చేస్తున్నారని, భారత్‌ నుంచి 2.7 బిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలును బంగ్లాదేశ్‌ దిగుమతి చేసుకుంటున్న విషయం రాహుల్‌కు తెలియదని అన్నారు. రాహుల్‌ గాంధీ కుటుంబం పాలన సాగించిన రోజుల్లో అమల్లోకి తెచ్చిన సెజ్‌ చట్టం నిబంధన 27(1) ప్రకారం ఎగుమతి చేసే వస్తువులకు గాను పత్తితో సహా ముడివస్తువులను ఎలాంటి పన్ను లేకుండా దిగుమతి చేసుకోవచ్చని, ఎగుమతుల కోసం సున్నా పన్నుల విధానం తెచ్చిన స్వంత పార్టీ మీదే రాహుల్‌ గాంధీ దాడి చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అంతకు ముందు రోజు రాహుల్‌ గాంధీ ఎక్స్‌ ద్వారా ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఊబిలోకి నడుస్తూ కోట్లాది మందిని దానిలోకి లాక్కుపోతున్నదని పేర్కొన్నారు. పద్దెనిమిది, సున్నా శాతం పన్నులంటూ జనాన్ని ప్రభుత్వం గందరగోళపరుస్తున్నదని అవాస్తవాలు చెప్పటంలో ప్రధాని ఎంతో నిపుణులని, మంత్రివర్గం గందరగోళాన్ని వ్యాపింప చేస్తున్నదని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు అమెరికా ఇచ్చిన ప్రత్యేక రాయితీ మనకూ రావాలంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉందని రాహుల్‌ పేర్కొన్నారు.పత్తి వివరాలేమిటి, ఎవరు చెబుతున్నది వాస్తవం, ఎవరిది అవాస్తవం !

ప్రపంచ పత్తి ఉత్పత్తి వివరాలను చూస్తే చైనాలో 7.5, భారత్‌లో 5.1,బ్రెజిల్‌ 4.1, అమెరికాలో 3,పాకిస్తాన్‌లో 1.1మిలియన్‌ టన్నుల పత్తి పండిందని 2025 అంచనా. బ్రెజిల్‌లో ప్రతి మనిషికి 0.19మి.ట, అమెరికాలో 0.088 , చైనాలో 0.052,మనదేశంలో 0.032 మి.టన్నులు ఉంది. ఈ వివరాలన్నీ తెలియకుండానే గోయల్‌ అమాత్యగిరీ వెలగబెడుతున్నారని అనుకోవాలా ? 2024 వివరాల ప్రకారం ప్రపంచంలో 90లక్షల టన్నుల ఎగుమతి జరగ్గా బ్రెజిల్‌ 27.74, అమెరికా 24.91, మనదేశం 4.65లక్షల టన్నులు ఎగుమతి చేసింది. రెండవ స్థానంలో ఉన్న మనం అంత తక్కువ, నాలుగవదిగా ఉన్న అమెరికా అంత ఎక్కువ ఎందుకు ఎగుమతి చేస్తున్నట్లు ! మనకంటే ఎక్కువగా పండిస్తున్నప్పటికీ చైనా ఎందుకు దిగుమతి చేసుకొంటోందంటే అక్కడ వస్త్ర పరిశ్రమకు అవసరం, తద్వారా విదేశాలకు ఎగుమతి చేసి లబ్ది పొందుతోంది.మన దేశంలో ఐదు కోట్లకు పైగా కదుళ్లు ఉండగా చైనా పది కోట్లు కలిగి ఉంది, వాటితో అక్కడి జనాభాకు పని కల్పిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో నిమిత్తం లేకుండానే పిలుపులు ఇచ్చిన మన మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర భారత్‌ సంగతేమిటి ? ఒక మౌలిక ప్రశ్న ఏమంటే వస్త్ర ఎగుమతులకు నిజంగా అంత అవకాశం ఉంటే మోడీ సర్కార్‌ 12 సంవత్సరాలపాటు అలాంటి ఒప్పందాలను ఎందుకు చేసుకోలేదు ? లక్షలాది మందికి ఉపాధి ఎందుకు కల్పించలేదు ?

మన రైతాంగం, పరిశ్రమ బంగ్లాదేశ్‌ గురించి ఎందుకు భయపడాలి ? బంగ్లాదేశ్‌ ప్రధాన ఉత్పత్తి వస్త్రాలు,రెడీమేడ్‌ దుస్తులు. అక్కడ పత్తి పెద్దగా పండదు, దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలో అదే ఎక్కువగా ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నది. వస్త్ర ఉత్పత్తులతో చైనా, భారత్‌, వియత్నాం వంటి దేశాలను సవాలు చేస్తున్నది. తాజా ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి నూలు, పత్తి దిగుమతి చేసుకొని దుస్తులను తమకు ఎగుమతి చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు అన్న వెసులుబాటు అమెరికా కల్పించింది. నిజానికి అది తమ పత్తి కొనుగోలు చేయాలనే షరతును రుద్దింది.ఒక దశలో షేక్‌ హసీనా పదవీచ్యుతురాలు గాక ముందు మన పత్తి, నూలు ఎగుమతుల్లో 70శాతం బంగ్లాదేశ్‌కే జరిగాయి.పైకి ఎన్ని చెప్పినప్పటికీ ఇప్పుడు అక్కడ మనకు వ్యతిరేకమైన బిఎన్‌పి అధికారానికి వచ్చింది. అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి చేసే రెడీమేడ్‌ దుస్తులలో 70శాతం అమెరికా ముడి సరకులేే ఉంటే ఎలాంటి దిగుమతి పన్ను ఉండదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పత్తి సంవత్సరం 2025-26 (అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు) బంగ్లాదేశ్‌ 84లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. బ్రెజిల్‌ నుంచి 19(22శాతం) భారత్‌ 14(15శాతం) బెనిన్‌ 10.6, కామెరూన్‌ 6.2, అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి 5.95లక్షల బేళ్ల వంతున దిగుమతి చేసుకోవాలని తలపెట్టింది. ఇప్పుడు తాజా ఒప్పందంతో అమెరికా నుంచి దిగుమతులు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. మన పత్తి కంటే అమెరికా సరకు రేట్లు తక్కువ, ఎందుకని ? 2026లో ఒక పౌను(453 గ్రాములు) దూదికి ప్రభుత్వ సాయంగా 55 సెంట్లు, మననగదులో రు.50 ఇస్తుంది. అంతమొత్తం సబ్సిడీ పొందుతున్న తరువాత ప్రపంచానికి చౌకధరలకు పత్తి ఎగుమతులు చేయకుండా ఎలా ఉంటుంది. పైసా పైసా లాభాన్ని లెక్కవేసుకొనేవారు అమెరికా పత్తికి ఎగబడక చస్తారా ? బంగ్లాదేశీయులు దూరంగా ఉంటారా ? ట్రంప్‌ విధించిన పన్నులతో మన ఎగుమతిదారులు అమెరికన్లకు చౌకగా దుస్తులు అందించలేకపోతున్నారని అచ్చే దిన్‌కు దూరం చేస్తున్నారనే ”జాలి గుండె ” నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే పత్తిపై 11శాతం పన్ను తగ్గించింది. పొడవు పింజ పత్తిని మాత్రమే దిగుమతికి అనుమతించామంటారు, రెండు తెలుగు రాష్ట్రాలు, దక్షిణాదిన పండేది అదే గనుక మన రైతులకు వెయ్యి నుంచి రెండువేల వరకు నష్టం వచ్చింది, అయితేనేం అమెరికన్లకు తక్కువ ధరలకు దుస్తులను అందించినందుకు మన బిజెపి నేతలు తమ భుజాలను తామే చరుచుకున్నారు. ఇప్పుడు కూడా అమెరికా నుంచి దిగుమతులు చేసుకోవాలని పియూష్‌ గోయల్‌ చెబుతున్నారు. అంటే ఈ ఏడాది కూడా పత్తి రైతుల నోట్లో మట్టికొట్టేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా పత్తిసాగు గిట్టుబాటు కావటం లేదంటూ అమెరికన్‌ రైతులు విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. దాంతో ట్రంప్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి వాణిజ్య ఒప్పందాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిందే అనే షరతులు పెడుతోంది.బ్రెజిల్‌ నుంచి పత్తి ఎగుమతుల్లో తీవ్ర పోటీ ఎదురుకావటంతో సబ్సిడీలతో రంగంలోకి దిగనుంది.

అమెరికాతో ఒప్పందం గురించి అడుగడుగునా దాగుడుమూతలే,పైకి చెబుతున్నది ఒకటి లోపల మరొకటి జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వివిధ రకాల ధాన్యాల నుంచి అమెరికాలో ఎథనాల్‌ తయారు చేస్తారు, ఆ క్రమంలో వచ్చే పిప్పి లేదా చెక్కను పశువుల దాణాగా వినియోగిస్తారు.తాజా ఒప్పందం ప్రకారం దాన్ని మనం ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలి, అది కోళ్ల ఫారాల యజమానులకు లబ్ది కలిగిస్తుంది, కానీ మన దగ్గర అందుకోసం సాగు చేస్తున్న రైతులేం కావాలి ? ఇదే మాదిరి సోయా ఆయిల్‌ను పన్నుల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. ఆ రైతుల పరిస్థితి ఏమిటి ? ఒక వైపు నూనె గింజల సాగును ప్రోత్సహిస్తామంటారు మరోవైపు ఆ రైతులను దెబ్బతీస్తారు. బయో ఇంథన ఉత్పత్తిలో భాగంగా ఇథనాల్‌ తయారీని ప్రోత్సహిస్తారు. అమెరికా నుంచి దాని చెక్కను దిగుమతి చేసుకుంటే ఇక్కడి కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు ?

ముందే చెప్పుకున్నట్లు పైకి చెబుతున్నది ఒకటి లోపల జరుగుతున్నది మరొకటి.అమెరికా నుంచి పప్పు ధాన్యాలను కూడా దిగుమతి చేసుంటారని ట్రంప్‌ యంత్రాంగం ”వాస్తవాల పత్రం ”లో చెప్పింది. మన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో మాట మార్చింది. ఫిబ్రవరి పన్నెండు కార్మికుల సార్వత్రిక సమ్మె సందర్భంగా రైతులు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గ్గొన్నారు. అలాగే ఐదేండ్ల పాటు ప్రతి ఏటా వంద బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ వస్తువులు, ఇంథనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌ అంగీకరించినట్లు తొలుత చెప్పారు. తరువాత మాట మార్చి అంగీకారం కాదు వాంఛిస్తున్నదని సవరించారు. డిజిటల్‌ సేవలపై పన్నులు ఎత్తివేసేందుకు మోడీ సర్కార్‌ అంగీకరించిందని తొలుత ప్రకటించారు.తరువాత దానికి సంబంధించిన పేరాను తొలగించారు.దాని బదులు డిజిటల్‌ వాణిజ్య సేవల గురించి సంప్రదింపులు జరిపేందుకు అంగీకరించిదని మార్చారు. ఇలా అమెరికా రోజుకొక మాట చెబుతున్నా మోడీ నోరు విప్పటం లేదు, ఇదేమని అడిగిన వారిని అభివృద్ధి నిరోధకులు, దేశ వ్యతిరేకులని ముద్ర వేస్తున్నారు. మార్చి నెలలో సంతకాలు జరుగుతాయని చెబుతున్న ఒప్పందంలో ఇంకెన్ని చేరుస్తారో, ఆ తరువాత చేర్చటానికి మరెన్ని షరతులకు అంగీకరిస్తారో, రైతాంగాన్ని ఎలా నట్టేట ముంచేందుకు చూస్తున్నారో తలచుకొంటే ఆందోళన కలుగుతోంది, జనం ఎలా స్పందిస్తారో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !

02 Monday Feb 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

Avimukteshwaranand saraswati, BJP, fake Hindu, Jyotish Peeth controversy, Narendra Modi, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు

వేదాలు నాలుగు, వాటి ప్రాతిపదికన దేశంలో ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలకు నలుగురు జగద్గురువులైన శంకరాచార్యలు ఉన్నారు. ఒడిషాలోని పూరీలో ఉన్న గోవర్ధన మఠం రుగ్వేదంతో సంబంధం కలిగినది, నిశ్చలానంద అధిపతి, గుజరాత్‌లోని ద్వారకలో ఉన్నది శారదా పీఠం, సామవేదం ప్రకారం నడుస్తుంది, స్వామి సదానంద సరస్వతి, కర్ణాటక శృంగేరిలో ఉన్న శారదా పీఠం యజుర్వేదాన్ని అనుసరిస్తుంది, స్వామి భారతీ తీర్థ.నాలుగవది ఉత్తరాఖండ్‌లో ఉన్న జ్యోతిర్మ్‌ఠం. ఇది అధర్వణవేదాన్ని పాటిస్తుంది. స్వామి అవిముక్తేశ్వరానంద అధిపతి. ఆయన నియామకాన్ని కొందరు సవాలు చేయటంతో అది సుప్రీం కోర్టుకు చేరింది.ఈ శంకరాచార్యకు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధ్య పెద్ద యుద్దమే నడుస్తున్నది. మాఘ మాసం సందర్భంగా జనవరి 18న మౌనీ అమావాస్య రోజున ప్రయాగరాజ్‌లో పల్లకిలో ఊరేగుతూ త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు రాగా కుదరదని అధికార యంత్రాంగం అడ్డుకుంది.రద్దీ ఎక్కువగా ఉందని సాకు చెప్పింది, కావాలంటే అందరి మాదిరి కాలినడకన వెళ్ల వచ్చంటూ అసలు ముందు మీరు శంకరాచార్య అని రుజువు ఏమిటి అని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి అండ లేదా ప్రమేయం లేకుండా ఇలా జరుగుతుందని ఎవరూ నమ్మటం లేదు. మొత్తం మీద ఈ వివాదం కొత్తమలుపు తిరిగింది. మార్చినెల పదవ తేదీలోగా ఆవును రాష్ట్రమాతగా ప్రకటించాలని, గోవధను, గొడ్డు మాంసాన్ని నిషేధించాలని లేనట్లయితే పది, పదకొండు తేదీలలో లక్నోలో జరిగే సాధు, సంతుల సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ” నకిలీ హిందువు ” గా ప్రకటిస్తామని అవిముక్తేశ్వరానంద ప్రకటించారు.

తానే జ్యోతిర్మఠ శంకరాచార్యనని, తాను చూపిన రుజువును పదిహేను రోజుల తరువాత కూడా తిరస్కరించలేదంటే ఇంతకంటే వేరే ఆధారం ఏమి కావాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని పీఠాధిపతి ప్రశ్నించారు. జనవరి 29న వారణాసిలో నిర్వహించిన పత్రికా గోష్టిలో ముఖ్యమంత్రికి అవిముక్తేశ్వరానంద సవాల్‌ విసిరారు. యోగి ప్రభుత్వం తనను వేధిస్తున్నదని 1966లో కరపత్రి జీ మహారాజ్‌ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నదని అన్నారు.సిఎం సన్నిహితుడు రామభద్రాచార్య తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని, వేధిస్తున్నారని ఆరోపించారు. ఇరవై నాలుగు గంటల్లో తన ఆచార్యత్వం గురించి రుజువులు చూపాలని అడిగారని, చూపి పదిహేను రోజులు కావస్తున్నా ప్రభుత్వం వాటిని కాదని తిరస్కరించలేదని చెప్పారు. యోగి నిజమైన హిందువో కాదో నిరూపించుకోవాలన్నది ఇప్పుడు ప్రశ ్న అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం క్షమాపణలు చెప్పి రక్షణ కల్పిస్తే ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రయాగరాజ్‌లో మాఘపూర్ణిమ రోజున పవిత్ర స్నానం చేస్తారని అవిముక్తేశ్వరానంద మీడియా ప్రతినిధి శైలేంద్ర యోగిరాజ్‌ చెప్పారు గానీ జరిగినట్లు వార్తలు లేవు. మౌనీ అమావాస్య రోజున తన పరివారంతో స్నానమాచరించటానికి అనుమతి నిరాకరించచటంతో జనవరి 18 నుంచి పది రోజుల పాటు ప్రయాగరాజ్‌లోని తన శిబిరంలోనే నిరసన దీక్ష చేసి 28వ తేదీన వెళ్లిపోయారు. తన అంతరాత్మ సంతృప్తికోసం సంగమంలో స్నానమాచరించాలని తలపెట్టానని అనుమతించకపోవటంతో ఎంతో కలచివేతకు గురయ్యానని, స్నానమాచరించకుండానే బరువైన హృదయంతో వెళ్లిపోతున్నట్లు శంకరాచార్యచెప్పారు. తానిలాంటి పరిస్థితిని ఎన్నడూ ఊహించలేదన్నారు. స్వామి అనుచరులు బారికేడ్‌ను ధ్వంసం చేసినట్లు పోలీసులు ఆరోపించారు.శంకరాచార్య ఎవరనేది సుప్రీం కోర్టులో వివాదం ఉన్నందున మీరు శంకరాచార్య అని ఎలా చెప్పుకుంటారంటూ అధికార యంత్రాంగం నోటీసు జారీ చేసింది.

శంకరాచార్య పట్ల అనుసరించిన వైఖరి దురహంకారానికి నిదర్శనం, తీవ్ర అరిష్టదాయకమని సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ వర్ణించారు.యోగి ప్రభుత్వ చర్యతో ప్రపంచంలోని సనాతనులందరూ బాధపడ్డారని, అధికారం బిజెపిని గుడ్డిదానిగా మార్చిందన్నారు.కాంగ్రెస్‌ పార్టీ కూడా శంకరాచార్యకు మద్దతుగా నిలిచింది.తప్పిదాన్ని సరిచేసుకొనేందుకు మాఘపూర్ణిమ రోజున లాంఛనాలతో స్నానమాచరించేందుకు అధికారులు చూస్తున్నారని అవిముక్తేశ్వరానంద చెప్పగా అలాంటిదేమీ లేదని అధికారవర్గాలు చెప్పాయి.తనకు క్షమాపణ చెప్పాలని, రానున్న రోజుల్లో నలుగురు శంకరాచార్యలకు ప్రామాణిక లాంఛనాలతో పవిత్ర స్నానాలు ఆచరించే విధంగా నిబంధనలు రూపొందించాలని స్వామి డిమాండ్‌ చేశారు. జనవరి 18 ఉదంతంపై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలైంది. ప్రయాగరాజ్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌, మేలా అధికారిపై కేసులు దాఖలు చేయాలని కూడా దానిలో కోరారు. యోగి ఆదిత్యనాధ్‌పై అవిముక్తేశ్వరానంద చేసిన ఆరోపణలతో మనోభావాలు దెబ్బతిన్న కారణంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు రాష్ట్ర జిఎస్‌టి ఆయోధ్య ఉపకమిషనర్‌ ప్రశాంత కుమార్‌ సింగ్‌ ప్రకటించారు.రాజీనామాను నేరుగా గవర్నర్‌కు పంపారు, అయితే దాన్ని ఆమోదించిందీ లేనిదీ తెలియదు..

జ్యోతిర్మఠ్‌ పీఠం శంకరాచార్య గురించి గత ఎనిమిది దశాబ్దాలుగా వివాదాలు నడుస్తున్నాయి.అవిముక్తేశ్వరానంద 2022 నుంచి శంకరాచార్యగా గుర్తింపు పొందారు. అయితే అప్పటి నుంచీ వివాదం ప్రారంభమైంది. ఎక్కడా లేని విధంగా స్వామి రామకృష్ణ తీర్ధ మరణించిన తరువాత గత 168 సంవత్సరాల నుంచి ఈ పీఠానికి గుర్తింపు పొందిన శంకరాచార్యల గురించి వివాదాలు నడుస్తున్నాయి. అనేక మంది తమను పీఠాధిపతులుగా ప్రకటించుకొని కొనసాగారు.స్వాతంత్య్రానికి ముందు 1941లో మిగిలిన ముగ్గురు శంకరాచార్యలు ఉత్తరాఖండ్‌ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాలని స్వామి బ్రహ్మానంద సరస్వతిని కోరారు. ఆయన 1953 మే 20వ తేదీన మరణించినప్పటి నుంచి వారసత్వం గురించి ఇప్పటి వరకు వివాదాలు కొనసాగుతున్నాయి.బ్రహ్మానంద శిష్యుడు హరిహరానంద పీఠాన్ని అలంకరించేందుకు నిరాకరించారు. వారసుడిగా శాంతానంద సరస్వతి అని బ్రహ్మానంద విల్లు రాసినట్లుగా చెప్పటమే దీనికి కారణం. విల్లు చట్టబద్దతను ఇతర శంకరాచార్యలు ప్రశ్నించారు. ఆది శంకరుడు మహాత్మన్యాయ మహానుశాసనం ప్రకారం విల్లుద్వారా వారసుల నియామకం చెల్లదని వారు పేర్కొన్నారు. తరువాత కూడా వివాదాలు కొనసాగాయి. 1973లో స్వామి కృష్ణబోధ్‌ మరణంతో స్వామి స్వరూపానంద నియామకం జరిగింది. తరువాత వాసుదేవానంద సరస్వతిని కూడా శంకరాచార్యగా గుర్తించటంతో ఒకేసమయంలో ఇద్దరు శంకరాచార్యలు తయారయ్యారు. ఇది కోర్టుకెక్కటంతో 2017లో వీరిద్దరినీ గుర్తించేందుకు అలహాబాద్‌ హైకోర్టు నిరాకరించింది. స్వామి స్వరూపానంద 2022 సెప్టెంబరు 11న మరణించారు. ఆ మరుసటి రోజే తానే నూతన శంకరాచార్య అని స్వామి అవిముక్తేశ్వరానంద ప్రకటించుకున్నారు. అయితే అక్టోబరు 16నఆచారం ప్రకారం నిర్ణయించిన పీఠాధిపత్య స్వీకార కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు నిలిపివేసింది. అయితే కోర్టు ఉత్తరువులో పలు చోట్ల అవిముక్తేశ్వరానందను శంకరాచార్యగా ప్రస్తావించటం సమస్యను ఝటిలం చేసింది.కోర్టు అలా పేర్కొన్నది కనుక తానే ఆ స్థానంలో ఉన్నట్లు అప్పటి నుంచి అవిముక్తేశ్వరానంద చెబుతున్నారు.పీఠంలో కొనసాగుతున్నారు. సాంప్రదాయాలు, చట్టపరమైన అంశాల గురించి కోర్టు ఇంతవరకు తేల్చలేదు. దీనికి తోడు రాజకీయనేతలు కూడా వేలుబెట్టటం మరింతగా వివాదాన్ని పెంచింది. ఈ కారణంగానే ఉత్తర ప్రదేశ్‌ అధికార యంత్రాంగం మీరు శంకరాచార్యులనేందుకు ఆధారాలేమిటని ప్రశ్నించింది, పల్లకిలో ఊరేగుతూ స్నానానికి వెళ్లటాన్ని అడ్డుకుంది.

పదిరోజుల పాటు జరిపిన ధర్నా సమయంలో మాటల తూటాలు పేలాయి. యోగి ఆదిత్యనాథ్‌ను హిందువుగా పిలవాల్సిన అవసరం లేదని, అతన్ని తాను అక్బర్‌, ఔరంగజేబ్‌ అంటానని, సదరు వ్యక్తి దేవాలయాల కూల్చివేతకు మద్దతు పలికాడని అవిముక్తిశ్వేరానంద ధ్వజమెత్తారు. ధర్మం పేరుతో కొందరు వ్యక్తులు బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ పేరు పెట్టకుండా యోగి ఆదిత్యనాథ్‌ ధ్వజమెత్తారు.ఇలాంటి వారి పట్ల సనాతన ధర్మాన్ని నమ్మేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. హర్యానాలో ఒక మతపరమైన క్రతువులో మాట్లాడుతూ ఒక యోగి అంటే అన్నింటినీ త్యజించిన వాడు, ఒక స్వామి అంటే ధర్మం, జాతికంటే గొప్పవ్యక్తి కాదు. అతనికేమీ వ్యక్తిగత ఆస్థి ఉండదు,అనేక మంది కాలనేమి వంటి వారు ఉన్నారు.(రామాయణంలో హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవినీ మూలిక తెచ్చేందుకు హిమాలయాలకు ఎగిరి వెళుతున్న సమయంలో కాలనేమి అనే రాక్షసుడు మునివేషంలో వచ్చి తప్పుదారి పట్టించేందుకు చూస్తాడు) స్వాముల పేరుతో ఉండేవారు ధర్మం ముసుగు వేసుకుంటారు.వారు సనాతన ధర్మాన్ని బలహీన పరిచేందుకు కుట్ర చేస్తున్నారు. అయితే యోగి మాట్లాడిన కొద్ది గంటల తరువాత అవిముక్తేశ్వరానందకు మద్దతుగా ఉత్తర ప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ముందుకు వచ్చారు. భగవాన్‌ శంకరాచార్య లేదా గౌరవనీయమైన స్వాములు, ఆచార్యలు ఎవరి పట్లా కూడా అగౌవరవాన్ని ప్రదర్శించకూడదని, అలాంటి ఉదంతాలు జరిగినట్లు వెల్లడైతే విచారణ జరుపుతామని, తప్పుచేసిన వారి మీద చర్య తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి మీడియాకు చెప్పారు. శంకరాచార్యకు పాదాభివందనం చేస్తాం, పవిత్ర స్నానం ఆచరించాలని కోరతాం. వివాదం దాంతో సమసి పోవాలి. ఎవరైనా తప్పు చేస్తే విచారణ జరిపి బాధ్యులైన వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు.శంకరాచార్యను అవమానించటం అంటే సనాతన ధర్మాన్ని అవమానించటమే అని బిజెపి నేత సునీల్‌ భలారా విమర్శించారు. ప్రయాగరాజ్‌ అధికారులు దయ్యాల మాదిరి అవమానించారని, శంకరాచార్య శిష్యుల శిఖలు పట్టుకొని లాగారని అన్నారు.బిజెపి నేతల ఈ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో ఆ పార్టీలో ఉన్న గందరగోళంతో పాటు విబేధాలు కూడా వెల్లడయ్యాయి. వ్యక్తులుగా అభిప్రాయాలు వెల్లడించటం మినహా పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేని దుస్థితిలో ఉంది. అనేక మంది సంత్‌లు, ఆలిండియా అఖారాపరిషత్‌ కూడా అవిముక్తేశ్వరానందకు మద్దతు పలికింది.యోగి-శంకరాచార్య మధ్య వివాదం కొత్తగా తలెత్తింది కాదు,పరోక్షంగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నది,అవిముక్తేశ్వరానంద బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందగా యోగి ఠాకూర్‌.గతేడాది కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట, మరణాల గురించి యోగి అబద్దాలు చెప్పినందున రాజీనామా చేయాలని గతేడాది జనవరిలోనే అవిముక్తేశ్వరానంద డిమాండ్‌ చేశారు.నలభై రోజుల్లో ఆవును రాష్ట్రమాతగా ప్రకటించాలని,గొడ్డు మాంస ఎగుమతుల నిషేధం చేయకపోతే యోగిని నకిలీ హిందువుగా ప్రకటిస్తామని శంకరాచార్య చేసిన ప్రకటన ఏమౌతుందో ఆసక్తి కలిగిస్తోంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !

25 Sunday Jan 2026

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, BJP, Governors Walkout, MK Stalin, Narendra Modi, o, Puppet Rulers, Sidda Ramaiah

ఎం కోటేశ్వరరావు

కుక్క మనిషిని కరిస్తే సాధారణం, అదే మనిషి కుక్కను కరిస్తే పెద్ద వార్త. జర్నలిజం విద్యార్ధులకు చెప్పే ఉదాహరణ ఇది. అదే మాదిరి చట్టసభల నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు వాకౌట్‌ చేయటం పెద్ద వార్త కాదు, కానీ గవర్నర్లు అదే పని చేస్తే సంచలనం. కానీ మన మీడియా చర్మాలు మొద్దుబారటంతో దాని గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. పెద్దన్న నరేంద్రమోడీ పైనుంచి గమనిస్తున్నారన్న భయంతో రాజ్యాంగ పరిరక్షణకు మద్దతుదార్లం అని చెప్పుకొనే వారు కూడా గొణుగుతున్నారు తప్ప నోరు విప్పటం లేదు. మన దేశంలో అపహాస్యం పాలైన వాటిలో గవర్నర్ల వ్యవస్థ ఒకటి. తొలిసారిగా 1959 జూలై 31న రాష్ట్రగవర్నర్‌ సిఫార్సుతో ఆర్టికల్‌ 356ను ఉపయోగించి ఎన్నికలలో కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వంలో అధికారానికి వచ్చిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. భూ సంస్కరణల చట్టం తెచ్చి అమలు జరిపేందుకు పూనుకున్న కారణంగా అక్కడ ఉన్న అన్ని రకాల కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఏకమై విమోచన సమరం పేరుతో సాగించిన ఆందోళనను సాకుగా చూపి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందనే సాకుతో ఆ దుండగానికి పాల్పడ్డారు. నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే సదరు ఆందోళన వెనుక ఉన్నారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌లో సిపిఐ(ఎం) నాయకత్వాన ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం బలనిరూపణకు సిద్దం అవుతున్న తరుణంలో గవర్నర్‌ ధరమ్‌ వీర అధర్మంగా వ్యవహరించి ఆ ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేయటంతో రాష్ట్రపతి పాలన విధించారు. నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని వ్యతిరేకించే పార్టీలు రాష్ట్రాలలో అధికారానికి వస్తే గవర్నర్ల ద్వారా కుట్రలు, కూలదోయించటంలో ఎవరూ తక్కువ తినలేదు, 2014 నుంచి మోడీ సర్కార్‌ నియమించిన గవర్నర్లు బరితెగించి వ్యవహరిస్తున్నారు.

పార్టీ ఏజంట్ల మాదిరి గవర్నర్లు వ్యవహరిస్తున్నారని, ఎన్నికైన ప్రభుత్వాల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా వ్యవవరిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. చట్టసభలను ఉద్దేశించి ఏడాది ప్రారంభంలో గవర్నర్లు ప్రసంగించాల్సిన అవసరం లేకుండా రాజ్యాంగ సవరణ చేయటమే పరిష్కారమని, ఇతర పార్టీలతో కలసి దీని గురించి రానున్న పార్లమెంటు సమావేశాలలో లేవనెత్తుతామని చెప్పారు. జనవరి 22(2026)న కర్ణాటక గవర్నర్‌ తహ్వార్‌చంద్‌ గెహలట్‌ కేవలం కొన్ని పేరాల ప్రసంగాన్ని మాత్రమే చదివి మిగతాది వదలి ఉభయ సభల సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష బిజెపి, జెడిఎస్‌ సభ్యులు కూడా అనుసరించారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం తయారు చేస్తుందన్నది తెలిసిందే. దానిలో పదకొండు పేరాలను చదివేందుకు గవర్నర్‌ నిరాకరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని బదులు ఒక స్కీమును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆ ప్రసంగంలో విమర్శించారు. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 176, 163 ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం తయారు చేసిన ప్రసంగాన్ని విధిగా చదవటం తప్ప గవర్నర్‌కు మరొక అవకాశం లేదని, తన స్వంత అభిప్రాయాలను దానిలో చొప్పించే అధికారం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గవర్నర్‌ చర్యను ఖండించారు. అంతకు ముందు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే భాగాలు ఉన్నందున అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగంలో కొన్ని భాగాలను వదలి, కొన్నింటిని తాను చేర్చి చదివారు.తాము సూచించిన భాగాలను చేర్చకుండా ప్రసంగాన్ని రూపొందించారని లోక్‌భవన్‌ పేర్కొన్నది.కేరళకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యవిధానాన్ని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్రవేయని గవర్నర్‌ చర్యను విమర్శిస్తూ రాసిన భాగాలను గవర్నర్‌ విస్మరించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అనవసరమైన, ఆధారం లేని అంశాలు మంత్రివర్గం రూపొందించిన ప్రసంగంలో ఉన్నాయని, వాటిని తొలగించాలన్న తమ సూచనను పట్టించుకోకుండా రెండవసారి కూడా తొలి ముసాయిదానే పంపారని గవర్నర్‌ కార్యాలయం ఆరోపించింది. ఏ అంశ ం అవసరమో కాదో నిర్ణయించే విచక్షణ అధికారం గవర్నర్‌కు లేదు. అయితే గవర్నర్‌ ఏమి ప్రసంగించినప్పటికీ అసెంబ్లీ రికార్డులలో మంత్రివర్గం రూపొందించిన ప్రసంగపాఠమే ఉండాలని ప్రభుత్వం కోరింది. గతంలో మాదిరే మంత్రివర్గం తయారు చేసినదే రికార్డులలో ఉంటుందని స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌ ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ చర్యలు, విధానాలనే కాదు తొలిసారిగా గవర్నర్‌ చర్యను కూడా పశ్చిమబెంగాల్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ మంత్రివర్గం రూపొందించిన ప్రసంగంలో విమర్శించింది.1967లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టిన తరువాత 1969లో ఎన్నికలు జరిపారు. తిరిగి వామపక్షాలతో కూడిన ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రూపొందించిన ప్రసంగంలో గవర్నర్‌ చర్యను తప్పుపట్టింది. తన చర్యను తానే విమర్శించినట్లు అవుతుంది గనుక ఆ పేరాను చదివేది లేదని ధరమ్‌ వీర తిరస్కరించారు. తరువాత కూడా బెంగాల్లో పునరావృతమైంది. గవర్నర్‌ బిడి పాండేను బంగ్లా డామన్‌ పాండే( బెంగాల్‌ను నాశనం చేస్తున్న పాండే)గా వామపక్షాలు వర్ణించాయి.1984లో గవర్నర్‌ ఏపి శర్మ కొల్‌కతా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా తాను ఎంపిక చేసిన వ్యక్తిని తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాబితా నుంచి నియమించేందుకు తిరస్కరించారు.ఇలాంటి అనేక చర్యలకు పాల్పడుతుండటంతో గవర్నర్‌ కార్యక్రమాలను బహిష్కరించాలని వామపక్ష సంఘటన నిర్ణయించింది. గవర్నర్‌ పదవిని రద్దు చేయాలని సర్కారియా కమిషన్‌కు నివేదిక పంపింది.2007లో నందిగ్రామ్‌ హింసాకాండ సందర్భంగా గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ (మహాత్మా గాంధీ మనవడు) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు.ఈ డొంకతిరుగుడెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గంటే పోతుందిగా అని అప్పుడు సిపిఐ(ఎం) నేతలు గడ్డిపెట్టారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా గవర్నర్‌ను సమర్ధించిన మమతా బెనర్జీకి తరువాత బిజెపి నియమించిన గవర్నర్లు అదేపని చేస్తే భగ్గుమన్నారు,కొంత మందికి అంతే, తమదాకా వస్తే తప్ప తత్వం బోధపడదు. తరువాత కాలంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికై అర్ధంతరంగా రాజీనామా చేసిన బిజెపి అసంతృప్త నేత జగదీప్‌ థంకడ్‌ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్నపుడు బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు.

మనదేశంలో గవర్నర్లను మూడు తరగతులుగా చూడాలి. స్వాతంత్య్రానికి ముందు, తరువాత 1967వరకు, ఆ తరువాత వ్యవహరించిన తీరులో స్పష్టంగా దిగజారుడు కనిపిస్తుంది. బ్రిటీష్‌ వారి కాలంలో గవర్నర్‌ అంటే ప్రభుత్వ ప్రతినిధి, సర్వాధికారి. మనదేశంలోని ప్రోవిన్స్‌లకు అధిపతులుగా ఉన్నారు.ప్రజాప్రభుత్వాలు లేవు, స్వాతంత్య్రానికి ముందు 1935 నుంచి పరిమితంగా ప్రావిన్సు( రాష్ట్ర ) ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశమిచ్చినా వాటికి పెద్దగా అధికారాలు లేవు, గవర్నర్లే సర్వస్వం. తరువాత రెండు దశాబ్దాలలో దేశంలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలే లేవు(1957లో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తప్ప, దాని గురించి ముందే చెప్పుకున్నాం) గవర్నర్లుగా నియమితులైనవారు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నతరం వారే అత్యధికులు కనుక రాజ్యాంగ విలువలను పాటించారు.గవర్నర్ల గురించి జనానికి పెద్దగా తెలియదంటే అతిశయోక్తి కాదు. తొలిసారిగా కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోయిన 1967 నుంచి ఇప్పటి వరకు చూస్తే రాజకీయ పార్టీలలో తమకు పోటీగా వస్తున్నారని పక్కకు తప్పించిన నేతలు, సామాజిక సమీకరణల్లో భాగంగా కొందరిని గవర్నర్‌లుగా నియమిస్తున్నారు. వారు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి చేత నియమాకాలు పొందినవారు కావటంతో పార్టీల ఏజంట్లుగా సిగ్గువిడిచి ప్రవర్తిస్తున్నారు.

రాజ్యాంగాన్ని రచించే సమయంలో గవర్నర్ల వ్యవస్థ గురించి పెద్ద చర్చే జరిగింది. గవర్నర్లు వద్దని, కావాలని వాదించిన వారు ఉన్నారు. రాజీమార్గంగా రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతిగా గవర్నర్‌ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గ సలహామేరకు పని చేయాల్సి ఉంటుందని పరిమితి విధించారు. ఇదే సమయంలో కొన్ని విచక్షణాధికారాలను కూడా కల్పించారు. ఇప్పుడు ఆ పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. అయితే ఎస్‌ఆర్‌ బొమ్మరు-కేంద్ర ప్రభుత్వ కేసులో సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. గవర్నర్ల చర్యలు కోర్టు సమీక్షలకు లోబడి ఉంటాయన్నదే అది.దానికి అనుగుణంగానే కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించి గవర్నర్ల చర్యలను సవాలు చేశాయి.అడ్డగోలుగా ఆర్టికల్‌ 356ను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయకూడదని, గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలను పాటించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తరువాత 2005లో రామేశ్వర ప్రసాద్‌-కేంద్ర ప్రభుత్వ వివాదంలో గవర్నర్ల విచక్షణ అధికారం,రాష్ట్ర అసెంబ్లీ పనివిధానం గురించిన అంశం ముందుకు వచ్చింది. బీహార్‌ ముఖ్యమంత్రి అసెంబ్లీని లాంఛనంగా రద్దు చేయకముందే గవర్నర్‌ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఉత్తరాఖండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంలో గవర్నర్‌ జోక్యం చేసుకున్నారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్లు కేంద్ర పాలకపార్టీ ఏజంట్లుగా తయారయ్యారు.1984లో తెలుగుదేశం పార్టీలో తలెత్తిన సంక్షోభంలో గవర్నర్‌గా ఉన్న రామ్‌లాల్‌ ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని కూలదోసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు నిరసనగా తలెత్తిన ప్రజానిరసనతో తిరిగి ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామం మరేరాష్ట్రంలోనూ జరగలేదు.

సుప్రీం కోర్టు 2025 ఏప్రిల్‌ ఎనిమిదిన మైలురాయిగా నిలిచే తీర్పునిచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన పది బిల్లులకు ఆమోదముద్ర వేసేందుకు తిరస్కరించటం గవర్నర్‌ రాజ్యాంగవిరుద్ధ చర్య అని ప్రకటించింది.తమిళనాడు ప్రభుత్వం 2020 నవంబరు నుంచి 2023 ఏప్రిల్‌ మధ్య పదమూడు బిల్లులను ఆమోదించగా వాటిలో పదింటిని ఆమోదించకుండా, తిప్పి పంపకుండా గవర్నర్‌ తనదగ్గరే అట్టిపెట్టుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200ప్రకారం గవర్నర్లకు నాలుగు అవకాశాలు ఉన్నాయి. ఒకటి బిల్లులకు ఆమోదం తెలపటం, ఆమోదం నిలిపివేయటం, ద్రవ్య బిల్లుతప్ప ఇతర వాటిని తిరిగి పరిశీలించాలని కోరటం,తిరిగి వచ్చిన వాటిని ఆమోదించటం, రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా నిలిపివేయటం. అయితే ఆ నిబంధనలో ఎటూ తేల్చకుండా ఎంతకాలం కొనసాగించవచ్చు అన్నది ఎక్కడా లేదు. దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు.తమిళనాడు గవర్నర్‌ చర్య ఉద్దేశ్య పూర్వకంగా బిల్లులను అడ్డుకున్నట్లున్నదని,రాజ్యాంగ పద్దతిని ఉల్లంఘించటమే అని కోర్టు పేర్కొన్నది. ఎలాంటి మార్పులు లేకుండా రెండవసారి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా ఉండటం తగదని, నిలిపివేయకూడదని రాజ్యాంగం పేర్కొన్నదని విధిగా పంపాలని పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు గవర్నర్‌ రవి పాల్పడ్డారని స్పష్టం చేసింది. బిల్లు వచ్చిన నెలరోజుల్లో ఆమోదం తెలపాలి,ఆమోదం తెలపని వాటిని కారణం తెలుపుతూ మూడు నెలల్లోగా తిప్పి పంపాలి.రెండవసారి వచ్చిన బిల్లుకు నెలరోజుల్లో ఆమోదం తెలపాలి, మూడు నెలలకు మించి బిల్లులను నిలిపివేయరాదు. ఆర్టికల్‌ 201ప్రకారం రాష్ట్రపతి కూడా నిరవధికంగా ఆమోదం నిలిపివేయరాదు. ఒకవేళ బిల్లు రాజ్యాంగవిరుద్ధంగా ఉందనకుంటే రాష్ట్రపతి దాని గురించి తప్పనిసరిగాకపోయినప్పటికీ సుప్రీం కోర్టు సలహాను కోరవచ్చు అని కూడా కోర్టు చెప్పింది.ఈ తీర్పులు వచ్చిన తరువాత కూడా గవర్నర్లు మంత్రివర్గం రూపొందించిన ప్రసంగాలకు బద్దులై ఉండకుండా స్వంతపైత్యాలను జోడించటం చూస్తున్నాం. అందువలన ఈ అంశంపై కూడా రానున్న రోజుల్లో రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టటం మినహా మరొక మార్గం లేదు. రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చేందుకు క్షణ క్షణం ప్రయత్నిస్తున్న బిజెపి చర్యలను అడ్డుకొనేందుకు అటు న్యాయవ్యవస్థను ఆశ్రయించటంతో పాటు వ్యతిరేకంగా ప్రజాసమీకరణ కూడా అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

17 Saturday Jan 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, inequality, Narendra Modi Achhedin, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు పెద్దలు. జగతిని నడిపించేది ధనమే. పూర్వకాలపు మన, ఇతర దేశాల తత్వవేత్తలు ప్రవచించినా ఆధునిక కాలంలో కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ చెప్పినా వాస్తవం అదే. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కూడా కమ్యూనిస్టులు చెప్పారు. ఇద్దరూ చెప్పింది ఒకటే కదా మనవారు ఎన్నడో చెప్పారు, వామపక్ష వాదుల ప్రత్యేకత ఏమిటని ఎవరికైనా సందేహం వచ్చిందంటే వారి బుర్రపని చేస్తున్నదని అర్ధం. నిజమే, సర్వేజనా సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అని లేదా ఇతర దేశాలలో తత్సమాన అర్ధంతో ఎవరు చెప్పినా వారంతా మంచి జరగాలని ఆకాంక్షించారు, సుబోధ చేశారు. కానీ విన్నవారు, పాటించినవారెవరూ లేరు, సుభాషితాలను దాటి అమలుకోసం ఎవరైనా ముందుకు పోతే విప్లవకారులంటూ అణచివేతలే అన్నది యావత్‌ప్రపంచ చరిత్ర. ఆ సారాన్ని గ్రహించిన మార్క్సిస్టు పెద్దలు చెప్పిందేమంటే మంచిమాటలతో సమాజం మారదు, మార్చేందుకు జనమే పూనుకోవాలి, వారిలో కూడా దోపిడీకి గురయ్యేవారే ముందుండాలి. అడ్డుకొనేవారు మామూలుగా వినకపోతే చివరికి బడితెలు పట్టుకొని మార్చటం తప్ప మరొక మార్గం లేదని కర్తవ్యబోధ చేశారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవలి కాలంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే ఈ మాటలు చెప్పేవారిలో సంపన్నుల బాగు కోరుకొనే వారే ఎక్కువగా ఉన్నారు. వారి ఉద్దేశ్యం ఏమిటంటే కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే మొదటికే మోసం వస్తుందన్నది వారి ఉద్దేశ్యం. అయితే నిజంగా మంచి కోరుకుంటున్నవారు లేరా అంటే ఉన్నారు.

2026 ప్రపంచ అసమానతల నివేదిక డిసెంబరులో విడుదలైంది.2018, 22 తరువాత ఇది మూడవది.ప్రపంచంలో, మనదేశంలో కూడా అసమానత తీవ్ర స్థాయిలో ఉందని హెచ్చరించింది. ఈ నివేదికను రూపొందించిన వారు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, రికార్డో గోమెజ్‌ కరేరా, రొవాయిడా మోషిరిఫ్‌, థామస్‌ పికెటి. ఆ నివేదికకు మన దేశానికి చెందిన జయతి ఘోష్‌,జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ముందు మాటరాశారు. సంపాదకుల్లో చివరి వ్యక్తి ఫ్రెంచి ఆర్థికవేత్త థామస్‌ పికెటి గురించి తెలుగువారికి కొంతమేరకు తెలుసు,ఎందుకంటే ఆర్థిక అసమానతల గురించి ఆయన హెచ్చరించిన అంశాలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. అసమానతలు అంటే కేవలం సంపదకే పరిమితం కాదు, వాతావరణ, లింగపరమైన, అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవటం, చివరికి ఎన్నికల కోసం నియోజకవర్గాల విభజనలో వివక్షతో సహా ఇతర అంశాలు ఉన్నాయి. ప్రపంచ అసమానతల సమాచార సంస్థకు అనుబంధంగా ఉన్న రెండువందల మందికి పైగా పరిశోధకులు అనేక కోణాల్లో చేసిన విశ్లేషణల సారమే ప్రపంచ అసమానతల నివేదిక. అన్ని అంశాలను ఇక్కడ సృజించటం సాధ్యం కాదు గనుక సంపదల పున:పంపిణీ గురించి చర్చిద్దాం.ప్రపంచాన్ని ” కమ్యూనిస్టు భూతం ” ఆవహించకుండా జనం దానివైపు మరలకుండా చూసేందుకు పెట్టుబడిదారీ ఆర్థిక, సామాజికవేత్తలు అనేక అంశాలను ముందుకు తెచ్చారు.వాటిలో ఊట సిద్దాంతం ఒకటి.

ప్రభుత్వాలు కేవలం పాలనకే పరిమితమై అన్ని రంగాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకే అప్పగిస్తే వారు సృష్టించే సంపదల మూట నుంచి ఊట యావత్‌ సమాజానికి దిగుతుందన్నది ఊట సిద్దాంతం. దానికి సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాల వంటి ముద్దుపేర్లు పెట్టారు, జనం కూడా నిజమే అని నమ్మారు, తమకూ సంపదల ఊట దిగుతుందేమోనని పోరాటాలు మాని ఆశతో చెంబులు పట్టుకు ఎదురు చూశారు, ధారలేమీ కారలేదు, కేవలం కొన్ని చుక్కలు మాత్రమే పడ్డాయి.దాంతో ఫలితం లేదని అసంతృప్తి చెందటం ప్రారంభించారు. సోషలిస్టు సమాజాలం కోసం జనం చూడకుండా కొన్ని తాయిలాలు అందించి సంతృప్తిపరచేందుకు ఐరోపాలో అనేక ప్రయోగాలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు జరిపి సోషలిజంలో ఇంతకంటే పెద్దగా ఒరిగేదేమిటని జనాన్ని కొంతకాలం మభ్యపెట్టారు. ప్రధమ సోషలిస్టు రాజ్యం సోవియట్‌ యూనియన్‌ కూలిపోవటంతో కమ్యూనిజం, సోషలిజాలపై విజయం సాధించామని, ఆ ప్రయోగం విఫలమైందని ప్రచారం చేశారు. అంతేనా పోటీ లేకపోవటంతో అప్పటి వరకు అమలు జరిపిన అనేక సంక్షేమాలకు కోత పెట్టటం ప్రారంభించారు. అసమానతలు అప్పటి నుంచి మరింత పెరగటంతో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు సంపదల పున:పంపిణీ అవసరమంటూ మరో పల్లవి అందుకున్నారు.సూత్రరీత్యా దీన్ని ఎవరూ వ్యతిరేకించరు, అయితే అది ఎలా అన్న అంశంమీదే తేడా వస్తున్నది. సంపదలు పంచినంత మాత్రాన వేగంగా దారిద్య్రం తగ్గుతుంది తప్ప ఆర్థిక వృద్ధి జరగదని, జనాలను సోమరులుగా మారుస్తాయని కొందరు చెబుతున్నారు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఈ మంచి సంస్కరణ అంశాన్ని ప్రచారం చేసి జనాన్ని సమీకరించేందుకు చూస్తున్నాయి. అసలేమీ లేనిదానికంటే ఏదో ఒకటి మంచిదే.అయితే భ్రమలు పెట్టుకోనవసరం లేదని చెప్పక తప్పదు.

అసమానతల గురించి తాజా నివేదకలో పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూద్దాం.మచ్చుకు ఒకటి, సబ్‌ సహారా ప్రాంతంలో ఒక బిడ్డ మీద పిపిపి పద్దతిలో 200యూరోలు ఖర్చు చేస్తుండగా ఐరోపాలో 7,400, ఉత్తర అమెరికా, ఓషియానా దేశాల్లో 9,000 యూరోలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో 0.001శాతం అంటే అరవైవేల మందికంటే తక్కువ ఉన్న కోటీశ్వరులు దిగువన ఉన్న 50శాతం జనాభా మొత్తం సంపదల కంటే మూడు రెట్లు ఎక్కువ కలిగి ఉన్నారు. ప్రతి ఏటా ప్రపంచ జిడిపిలో ఒకశాతం ధనికదేశాలకు తరలుతున్నది.ఇది ప్రపంచ వృద్ధికి ఇస్తున్నట్లు చెబుతున్న సాయానికి మూడు రెట్లు ఎక్కువ. స్త్రీ, పురుష వేతన తేడా అన్ని చోట్లా ఉంది. గంటకు ఒక పురుషుడు పొందే వేతనంలో మహిళకు వస్తున్నది 61శాతమే, వేతన చెల్లింపులేని పనిగంటలను కూడా లెక్కిస్తే ఈ తేడా 32శాతానికి దిగజారుతుంది.

సంపదల పున:పంపిణీ ఎలా అన్నదాని మీద పూర్తి ఏకాభిప్రాయం ఉందా అంటే లేదు అని చెప్పవచ్చు, దోపిడీ విధానాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయకుండా తీసుకొనే ఏ చర్య అయినా అది ఉపశమనం తప్ప మరొకటి కాదు.లాటిన్‌ అమెరికా దేశాల్లో, దక్షిణాఫ్రికా, నేపాల్‌ వంటి చోట్ల పురోగామివాదులు, కమ్యూనిస్టులు ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చారు.దోపిడీ వర్గ పునాదిని దెబ్బతీయకుండా దాని మీదే కొన్ని సంస్కరణలు మాత్రమే అమలు చేయటంతో ఒకదశ దాటిన తరువాత కార్మికవర్గంలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది.లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం ఇదే.కొన్ని చోట్ల ఒకసారి గెలిచిన వామపక్ష శక్తులు తరువాత ఓడిపోవటానికి కారణాలు ఇవే. అసమానతలు ఎక్కువగా ఉంటే సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి.ఈ కారణంగానే రాజకీయ పార్టీలు ప్రజాకర్షక నినాదాలు, చర్యలతో ముందుకు రావటం పెరిగింది. ఓట్ల కోసం అలాంటి చర్యలకు పాల్పడను, ఆ సంస్కృతికి దూరం అని కొండంత రాగం తీసిన నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి అదే చేస్తున్నది. అయితే ఇతర పార్టీలు చేస్తే జనాకర్షక పథకాలు, తాము చేసేవి సాధికారత కలిగించేవంటూ వంచనకు పాల్పడుతోంది. ఇవి దీర్ఘకాలంలో అభివృద్ధిని దెబ్బతీస్తాయని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆశ్రితులకు దేశ సంపదలను దోచిపెట్టి మరింతగా పెంచటమే గాక, సంపదలను సమంగా పంపిణీ చేయటాన్ని వ్యతిరేకించేవారే ఇలాంటి జనాకర్షక పథకాలను తీసుకువస్తారన్నది ఒక వాస్తవం. స్వాతంత్య్రం గురించి కన్న కలలు విఫలమై 1967లో కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోవటం, తనకు పార్టీలో సవాలు ఎదురైనపుడు గరీబీ హటావో పేరుతో ఇందిరా గాంధీ వాటికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అయితే మనవంటి సమాజాలాలలో అవి అవసరం. ఉదాహరణకు ఎన్‌టి రామారావు ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యపు పధకం, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు ఏ విధంగా సాయపడుతున్నాయో చూస్తున్నాం. ఇతర నగదు బదిలీ పథకాలు కూడా అలాంటివే.నిజానికి ఆ మొత్తాలు వస్తు,సేవల కొనుగోళ్ల రూపంలో తిరిగి ఆర్థిక వ్యవస్థలోకే వస్తున్నాయి. అందువలన ఈ మొత్తాలను ఇంకా పెంచటం సంపద పంపిణీలో భాగంగానే పరిగణించవచ్చు.అభివృద్ధి రేటుకు తగిన విధంగా పేదల ఆదాయాలు పెరగకపోతే ఫలాలు ధనికులకే చేరుతున్నట్లు లెక్క.మనదేశంలో అదే జరుగుతున్నది, శతకోటీశ్వరులు మరింతగా పెరుగుతున్నారు.

ప్రపంచ అసమానతల సమాచార కేంద్ర వివరాల ప్రకారం దిగువ విధంగా మనదేశంలో అసమానత పెరిగింది.దీన్ని రెండుగా విభజించి చూడాలి.1990 దశకంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టక ముందు, తరువాత సమాజంలోని మూడు తరగతుల సంపదలు ఎలా పెరిగాయో చూడవచ్చు.

సంవత్సరాలు××× దిగువ 50శాతం××ఎగువ 10శాతం××× ఎగువ ఒకశాతం

1961-1970×× 12.29 ×× 43.18 ××11.87

1971-1980×× 11.75 ×× 42.25 ×× 11.23

1981-1990×× 10.91 ×× 45.00 ×× 12.50

1991-2000×× 8.36 ×× 54.57 ××× 23.31

2001-2010×× 8.10 ×× 56.60 ××× 25.70

2010-2020×× 6.12 ×× 63.68 ××× 31.55

దీన్ని ముందే చెప్పుకున్నట్లుగా రెండు భాగాలుగా చేస్తే 1961 నుంచి 1990 వరకు సగటు దిగువ 50శాతం జనాభా వాటా 11.65శాతం కాగా ఎగువ పదిశాతం 43.47,ఎగువ ఒకశాతం 11.86శాతం కలిగి ఉన్నారు. ఇదే 1990 నుంచి 2020 వరకు వరుసగా 7.52-58.28-26.85శాతం ఉన్నారు. నూతన ఆర్ధిక విధానాలు అమలు జరిగిన మూడుదశాబ్దాలలో ఎగువ ఒకశాతం వాటా 226,పదిశాతం మంది వాటా 134శాతం పెరగ్గా దిగువ 50శాతం వాటా 63శాతం తగ్గింది. తాజా అంచనా ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 40శాతానికి చేరింది.మంచి రోజులు తీసుకువస్తానని చెప్పిన నరేంద్రమోడీ సంస్కరణలను మరింత వేగంగా అమలు జరుపుతానని కూడా చెప్పారు. దాని ఫలితం ఏమిటో చూశాము. కార్పొరేట్‌ పన్ను గణనీయంగా తగ్గించిన కారణంగా ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖజానా కోల్పోతున్నది. పోనీ ఆ మేరకు ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయా అంటే అదీ లేదు. పర్మనెంటు ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నది.మన దేశ కార్పొరేట్‌ సంస్థలకు పన్ను తగ్గించిన కారణంగా వాటిలో పెట్టుబడులు పెడితే లాభసాటిగా ఉండటంతో విదేశీ కంపెనీ నేరుగా పరిశ్రమల స్థాపనకు బదులు ఉన్న కంపెనీల వాటాలను స్టాక్‌మార్కెట్‌లో కొనుగోలు, విక్రయాలు చేస్తూ లాభాలను తమ దేశాలకు తరలించుకుపోతున్నాయి.

ఆదాయాన్ని బట్టి పన్ను విధించి, ఆ మేరకు అల్పాదాయవర్గాలకు రాయితీల రూపంలో సంపదల పంపిణీ ఒక పద్దతి. లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌లో అసమానతలు, దారిద్య్ర నిర్మూలన పథకాల్లో భాగంగా షరతులతో కూడిన నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న అమ్మవడి, తల్లిదీవెన పథకాలు వాటికి నకలే. తమ బుర్రలో పుట్టినవే అని ఎవరైనా చెప్పుకుంటే బడాయి తప్ప మరొకటి కాదు. 2003లో వామపక్ష నేత లూలా డ సిల్వా అధికారానికి వచ్చినపుడు అంతకు ముందున్న కొన్ని పథకాల అనుభవాలను చూసి మరింత లబ్ది చేకూరేవిధంగా అల్పాదాయ వర్గాలకు ఈ పథకాన్ని అమలు చేశారు. పిల్లలను బడికి పంపటం, టీకాలు వేయించిన వారికి నగదు బదిలీ జరిగింది.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు దీనికి అర్హులు. అంతర్జాతీయంగా అది ప్రశంసలు పొందింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది,సంపదల పంపిణీ వలన దారిద్య్ర తీవ్రత తగ్గుతుంది తప్ప అసమానత తొలగదు. గమనించాల్సిందేమంటే రెండు దశాబ్దాల తరువాత చూస్తే అసమానతలు ఎక్కువగా ఉన్న పది ప్రపంచ దేశాల్లో బ్రెజిల్‌ ఒకటిగా ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రైతు బంధు, భరోసా మరో పేరుతో అందచేస్తున్న నిధులు, పిఎం కిసాన్‌ మొత్తాలు కూడా సంపద పున:పంపిణీలో భాగమే. అయితే అవి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ఆర్చేవి తీర్చేవి కాదు.కనీస వేతనాల పెంపుదల కూడా సంపదల పంపిణీలో ఒక అంశమే. గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు, అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అవకాశాలను పెంచుతాయి. అందువలన సంపదల పంపిణీ గురించి మరింత నిర్దిష్టంగా మధనం జరగాల్సి ఉంది. తమ ప్రత్యేక లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించిన చైనాలో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అయితే వాటిని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.

ఈ నివేదిక ప్రకారం సమాజంలో ప్రపంచంలో ఎగువన ఉన్న పదిశాతం మంది వద్ద సంపద 58శాతం ఉంది (2022లో 57శాతం) దిగువన ఉన్న 50శాతం మందికి 15శాతం(2022లో 13శాతం). ఇంతకు ముందు పట్టికలో సంపదల పెరుగుదల రేటు చూశాము, ఉన్న సంపదల మొత్తం వేరు,పెరుగుదల రేటు వేరు. భారత్‌ మరియు చైనా గురించి చెప్పిందేమంటే ప్రపంచ మధ్యతరగతిలోకి చైనా జనాభా ఎక్కువ మంది చేరారని, అదే భారత్‌లో 1980లో మధ్య తరగతిలో ఉన్న 40శాతంలో ఎక్కువ మంది ఇప్పుడు దిగువ 50శాతంలోకి దిగజారినట్లు పేర్కొన్నది. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కారణంగా సంపదలు పోగుపడటం ఒకటైతే రాష్ట్రాలకు రావాల్సిన పన్నురాబడి తగ్గుతున్నది, అది సంక్షేమ పథకాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఉదాహరణకు వెనుకబడిన తరగతుల వారికి 50 ఏండ్లకే పెన్షన్‌ ఇస్తామని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ మాదిరి సామాజిక పెన్షన్లు నాలుగువేలకు పెంచుతామని చెప్పిన తెలంగాణా కాంగ్రెస్‌ వాగ్దానం అమలుకు నిధులు లేవు, బిజెపి పాలిత రాష్ట్రాలలో పరిస్థితి మరీ అధ్వానం, వారికి అసలు ఆ ఉద్దేశ్యమే లేదు అని వేరే చెప్పనవసరం లేదు. యుపిఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన పెన్షన్‌ మొత్తాలనే మోడీ సర్కార్‌ ఇప్పటికీ అందిస్తున్నది తప్ప పైసా పెంచలేదు. దాని మానవత్వ ముఖం అలా ఉంది. అందువలన మరో విధంగా చెప్పాలంటే సంపదల పున:పంపిణీని దెబ్బతీస్తున్నది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ రూపొందించిన ఆర్థిక చట్రంలోనే మన పాలకులు విధానాలను రూపొందిస్తున్నారు. అందుకే గొర్రె తోక మాదిరి జనజీవితాలు పెద్దగా పెరగటం లేదు. సంపదల పున:పంపిణీ నినాదం సంస్కరణ మాదిరి ఉన్నప్పటికీ అది కూడా వర్గపోరాట ప్రాధమిక రూపమే అని చెప్పవచ్చు. ఈ మాత్రపు సంస్కరణనే వ్యతిరేకించేవారు, సంపదలను సమాజపరం చేస్తే ఊరుకుంటారా ? దేశంలో కార్పొరేట్లు, ధనికుల పెత్తనం ఉన్నందున వారి మీద పన్ను తగ్గించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దానికి విరుద్దంగా పన్ను మొత్తాలను పెంచి పేదలకు పంచాలని ఇతరులు కోరుతున్నారు. పన్నులు పెంచుకుంటూ పోతే ఎగువన ఉన్నవారు కుప్పకూలుతారని వారి సమర్ధకులు అంటే పెంచకపోతే మరింతగా దిగజారతామని దిగువన ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.ఈ వైరుధ్యం మరింత ముదిరితే విప్లవానికే దారితీస్తుంది.ప్రస్తుతం మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు.

‘ చెడుగా మారేంత వరకు అసమానత మౌనంగానే ఉంటుంది.ఈ నివేదిక అసమానతకు మరియు నేటి అసమాన సామాజిక, ఆర్థిక నిర్మాణాలతో అవకాశాల నిరాకరణకు గురైన వందల కోట్ల మందికి గళాన్ని ఇస్తుంది” అని ప్రపంచ అసమానతల నివేదిక సంపాదకుల్లో ఒకరైన రికార్డో గోమెజ్‌ కరేరా వ్యాఖ్యానించాడు. ముందుమాట రాసిన వారిలో ఒకరైన జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ఇలా చెప్పారు.” నేటి విపరీత అసమానత అనివార్యమైనదేమీ కాదని చరిత్ర, అన్ని దేశాల అనుభవాలు, సిద్దాంతం కూడా చెబుతున్నది.పురోగామి పన్ను విధానం( సంపద పెరిగే కొద్దీ పన్నుల పెంపు), పెద్దమొత్తంలో సామాజిక పెట్టుబడి,న్యాయమైన కార్మిక ప్రమాణాలు, ప్రజాస్వామిక వ్యవస్థలు గతంలో తేడాలను తగ్గించాయి. ఇదే మరోసారి చేయగలవు ” సంపదల పున:పంపిణీ జరగాలని కోరుకొనే వారు ప్రచారానికి మాత్రమే పరిమితం కారాదు, కార్యాచరణకూ పూనుకోవాలి !హొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

03 Saturday Jan 2026

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, 2025 Kerala Lokal Elections, Believers in Kerala LDF, BJP, Kalpetta Municipal Chairman, LDF, Paniya Tribe, Pinarayi Vijayan, RSS, Sabarimala Gold case, Soniya gandhi, UDF Kerala

ఎం కోటేశ్వరరావు

మేం అందంగా లేకపోవచ్చు, మేమూ అందరిమాదిరి మనుషులమే…

మా శరీరాలు నల్లగా ఉండవచ్చు, మా హృదయాలు స్వచ్చం…

విత్తనాలు నాటేవారిలో మేమూ ఒకరిమే, వాటికి కాపలాదారులం కూడా ….

పిడికెడు ధాన్యమే మేం కోరుతున్నాం….

ఈ భావంతో లిపిలేని తమ భాషలో పాటలు పాడుకొంటారు కేరళలోని పనియా గిరిజన తెగకు చెందిన వారు. సమాజంలో నిరాదరణకు గురైన ఈ తెగకు చెందిన నాలుగుపదుల వయస్సున్న పి.విశ్వనాధన్‌ జీవనం కోసం కాపలాదారుగా పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబరులో జరిగిన ఎన్నికలలో కేరళలోని వయనాడ్‌ జిల్లా కేంద్రమైన కాల్‌పెట్టా మున్సిపల్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించాడు. ఇతర గిరిజన తెగలలో కురిచియా వారే రిజర్వుడు సీట్ల నుంచి ప్రాతినిధ్యం వహించారు తప్ప జనాభా రీత్యా ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన కారణంగా నోరులేని పనియా తెగకు చెందిన వారు ఇప్పటి వరకు ఇలాంటి పదవులను చేపట్టలేదు. దళితులు, గిరిజనులకు కేటాయించిన స్థానాల నుంచే ఆ తరగతులకు చెందిన వారు ఎన్నికై పదవులను చేపట్టటం సర్వసాధారణం. అయితే సిపిఐ(ఎం) తన కార్యకర్తగా పని చేస్తున్న విశ్వనాధన్ను ఒక జనరల్‌ వార్డు నుంచి పార్టీ పోటీకి నిలిపింది. పట్టణంలో అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్‌గా గెలిపించింది. గిరిజనులకు రిజర్వు చేసిన చైర్మన్‌ పదవిని చేపట్టారు.మళయాళ పత్రికలతో పాటు అక్కడి నుంచి వెలువడే జాతీయ పత్రికలన్నీ ఈ ఎన్నిక గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. విశ్వనాధన్ను ఒక పత్రిక హీరోగా వర్ణించింది. తమ పొలాల్లో పని చేసేందుకు గతంలో ఈ తెగవారిని భూస్వాములు బానిసలుగా చేసుకున్న చరిత్ర ఉంది.

యువకుడిగా డివైఎఫ్‌ఐ నేతగా, సిపిఐ(ఎం)లో ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆదివాసీ క్షేమ సమితి నేతగా, జానపద గాయకుడిగా విశ్వనాధన్‌ పని చేస్తున్నారు.గిరిజన తెగల హక్కులు, గౌరవం కోసం జరిగే అన్ని ఉద్యమాల్లో భాగస్వామి.చిన్న తనంలో చదువు సంధ్యలకు నోచుకోని కారణంగా ఈ వయస్సులో పదవ తరగతితో సమానమైన( మెట్రిక్‌ వంటిది) తుల్యత పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఎవరికోసమో ఎదురు చూడకుండా తమ సామాజిక తరగతికి చెందిన వారు తమ పరిమితులను అధిగమించి అన్ని ఆటంకాలను తట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. తన ఎన్నిక తమవారిలో ప్రోత్సాహానికి దోహదం చేస్తుందన్నారు.దరఖాస్తులు రాసుకోవటం కూడా రాని తమవారు ఇతరుల మీద ఆధారపడుతున్నారని చెప్పారు. వయనాడ్‌ జిల్లాలోని గిరిజనుల్లో పనియా తెగవారు 75వేల మంది ఉండగా కురుమా, కురిచియా తెగలకు చెందిన వారు 52వేల మంది చొప్పున ఉన్నారు. ఈ తెగకు చెందిన వారు వయనాడ్‌, కన్నూరు, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలో ఉన్నారు. పొరుగునే ఉన్న తమిళనాడు నీలగిరి జిల్లాలో, కర్ణాటకలో పరిమితగా ఉన్నారు. ఎన్నికైన తరువాత అధికారిక వాహనంలో తన తలిదండ్రులను కలుసుకొనేందుకు వెళ్లినపుడు వారిలో ఎలాంటి సంభ్రమాశ్చర్యాలు లేకుండా కొడుకును చూశారని, తన కుమారుడు ఈ పదవికి ఎన్నికైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తల్లి చెప్పినట్లు పిటిఐ తెలిపింది. అతని సామర్ధ్యం కారణంగానే జనరల్‌ సీటు నుంచి గెలిచారని సిపిఐ(ఎం) సీనియర్‌ నేత వి హారిస్‌ చెప్పారు.

కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ – కుమ్మక్కుతోనే బిజెపి విజయం: పినరయి విజయన్‌

కేరళలో కూడా మతపరమైన రాజకీయాలు పెరుగుతున్నాయని జనం జాగరూకులై ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హెచ్చరించారు.గురువారం నాడు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సిపిఐ(ఎం) వ్యతిరేకంగా 1990దశకంలో ప్రారంభమైన కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌-బిజెపి కుమ్మక్కు ఇప్పటికీ కొనసాగుతున్నదని, ఆ కారణంగానే ఇటీవల తిరువనంతపురంలో, 2024 ఎన్నికల్లో త్రిసూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిందని, అంతకు ముందు 2016లో నీమమ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలిచిందని చెప్పారు.తనకు అనుకూలంగా కాంగ్రెస్‌ సహకరించిందని నీమమ్‌లో గెలిచిన బిజెపి నేత ఓ రాజగోపాల్‌ స్వయంగా అంగీకరించిన అంశాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. తిరువనంతపురంలో బిజెపి గెలిచిన అనేక వార్డుల్లో కాంగ్రెస్‌కు అతి తక్కువగా ఓట్లు రావటాన్ని బట్టే కుమ్మక్కును గ్రహించవచ్చన్నారు. కర్ణాటకలో ముస్లింల ఇండ్ల కూల్చివేతపై తాను స్పందించిందాంట్లో తప్పులేదన్నారు. ఇలాంటి ఉదంతాలు విదేశాల్లో జరిగినా స్పందిస్తున్నపుడు దేశంలో జరిగిన వాటి మీద మౌనంగా ఎలా ఉంటామని ప్రశ్నించారు. కేరళకే పరిమితం కావాలని అనటం ఏమిటని అన్నారు. ఈ అంశాన్ని కర్ణాటక సిఎం సిద్దరామయ్యతో చర్చించారా అని అడగ్గా, ఇటీవల శివగిరి మఠసమావేశానికి ఆయన ఆలశ్యంగా వచ్చారని, మంత్రివర్గ సమావేశం, ఇతర కార్యక్రమాల వలన తాను ముందుగానే మాట్లాడి వెళ్లినట్లు చెప్పారు.

సోనియా గాంధీని కలిసిన శబరిమల బంగారం చోరీ కేసు నిందితులు !

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు సిట్‌ దర్యాప్తులో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంటున్నదన్న కాంగ్రెస్‌ ఆరోపణను విజయన్‌ తోసిపుచ్చారు. జవాబు చెప్పాల్సిన వారు ఎదురుదాడికి దిగినట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌ పొట్టి, దొంగబంగారం కొనుగోలు చేసిన వర్తకుడు గోవర్ధన్‌తో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు ఆడూర్‌ ప్రకాష్‌, ఆంటో ఆంటోనీ కాంగ్రెస్‌ నేత సోనియగాంధీతో కలసి దిగిన ఫొటో సంగతేమిటో చెప్పకుండా నాటకాలు వేస్తున్నారని సిఎం అన్నారు. పొట్టి పిలిస్తే వెళ్లానని ప్రకాష్‌ చెబుతున్నారని, ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళతారా, అసలు వారిని సోనియా వద్దకు తీసుకువెళ్లిన వారెవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఈ కేసు విచారణలో ఎలాంటి ఇబ్బంది లేదని, హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్నందున బిజెపి కోరుతున్నట్లుగా సిబిఐకి నివేదించాల్సిన అవసరం లేదని విజయన్‌ చెప్పారు.

ఏ కూటమి ఓట్లు పెరిగాయి, ఎవరికి తగ్గాయి !

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ ఘోరపరాజయం పాలైందని, రానున్న రోజుల్లో బిజెపి హవా ప్రారంభమౌతుందని మీడియాలో అనేక మంది చెబుతున్నారు. మళయాళ మనోరమ పత్రిక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన అంకెలను ఉటంకిస్తూ కొన్ని వివరాలను వెల్లడించింది. ఎల్‌డిఎఫ్‌కు మొత్తం 70,99,175 ఓట్లు వచ్చాయి, 2024లోక్‌సభ ఎన్నికల కంటే 4.3లక్షలు ఎక్కువ.యుడిఎఫ్‌, ఎన్‌డిఏల కంటె మెరుగైనదిగా ఉంది.లోక్‌సభ ఎన్నికల్లో యుడిఎఫ్‌ 90,18,752 ఓట్లు తెచ్చుకోగా తాజా ఎన్నికల్లో 82,37,385కు అంటే 7.81లక్షల ఓట్లు తగ్గాయి.ఎన్‌డిఏ(బిజెపి) ఓట్లు 38,37003 నుంచి 31,21,335కు పడిపోయాయి, 7.16లక్షల ఓట్లు తగ్గాయి.

బిజెపి మేయర్‌కు శృంగభంగం !

తిరువనంతపురం నగరమేయర్‌గా ఎన్నికైన బిజెపి నేత వివి రాజేష్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకొనే తానే ఇరుక్కు పోయారు. స్మార్ట్‌ సిటీ పధకంలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్‌ వాటా సొమ్ముతో 113 ఎలక్ట్రానిక్‌ బస్సులను కొనుగోలు చేసి నగరంలో, వెలుపలా వాటిని నడిపిస్తున్నారు.గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం వాటి నిర్వహణలో వచ్చే లాభంలో వాటాను నగర కార్పొరేషన్‌కు ఇవ్వాలని ఉంది. ఆ మేరకు తమకు ఇవ్వటం లేదంటూ బిజెపి మేయర్‌ ధ్వజమెత్తారు. ఆ బస్సులను రాష్ట్ర రవాణా సంస్థకు అప్పగించారు. కార్పొరేషన్‌ ఖాతా నుంచి కొంత సొమ్ము ఇచ్చినప్పటికీ అది కూడా ప్రభుత్వ సొమ్మే, దీనికి తోడు ప్రత్యేకంగా ఆ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఖాతా లేదు గనుక గనుక లాభనష్టాల ప్రస్తావన రాలేదు.పినరయి ప్రభుత్వం మీద ధ్వజమెత్తేందుకు మంచి అవకాశం దొరికిందని బిజెపి భావించింది. డీజిలుతో నడిచే బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ భారంగా ఉందని రవాణా శాఖ మంత్రి కెబి గణేష్‌ కుమార్‌ చెప్పారు. మేయర్‌కు నిజంగా ఆసక్తి ఉంటే వాటిని తిరిగి తమకు అప్పగించాలని లేఖ రాస్తే వెంటనే స్వాధీనం చేస్తామని ప్రకటించారు. ఆ బస్సులను ఆర్‌టిసి డిపోలలో నిలిపేందుకు వీల్లేదని, కార్పొరేషనే ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పారు. ప్రభుత్వం చౌకగా దొరికే డీజిల్‌ బస్సులను కొనుగోలు చేస్తుందని కూడా స్పష్టం చేశారు. దాంతో తత్వం బోధపడిన మేయర్‌ తమకు వాటిని వెనక్కు తీసుకోవాలనే ఉద్దేశ్యం లేదంటూ తోకముడిచారు. నగరమేయర్‌ పదవిని ఆశించి భంగపడిన బిజెపి కార్పొరేటర్‌, మాజీ డిజిపి అయిన ఆర్‌ శ్రీలేఖ ఒక భవనం విషయంలో కూడా భంగపడ్డారు. మాజీ మేయర్‌, సిపిఐ(ఎం) ఎంఎల్‌ఏ అయిన వికె ప్రశాంత్‌ ప్రస్తుతం కార్పొరేషన్‌కు చెందిన ఒక భవనానికి అద్దె చెల్లిస్తూ తన కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ భవనంలోనే సదరు ప్రాంత వార్డు కార్పొరేటర్‌ కార్యాలయం కూడా ఉంది. ప్రస్తుతం ఆ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలేఖ భవనం నుంచి ఎంఎల్‌ఏ ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. తాను ఒప్పందం మేరకు అద్దె చెల్లిస్తున్నందున ఖాళీ చేసే ప్రసక్తి లేదని, గడువు తీరేంతవరకు తననెవరూ కదిలించలేరని ప్రశాంత్‌ స్పష్టం చేశారు. దాంతో ఆమె అబ్బే ఊరికే కేవలం అభ్యర్ధించా అంటూ వెనక్కు తగ్గారు. నెల రోజులు కూడా గడవక ముందే బిజెపి ఇలాంటి పనులకు పాల్పడిందింటే రానున్న రోజుల్లో ఎలాంటి గిల్లి కజ్జాలకు దిగుతుందో చూడాల్సి ఉంది.

బంగ్లాదేశీయుడివా అంటూ గిరిజనుడిని కొట్టి చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి గూండాలు !

డిసెంబరు 17న కేరళ పాలక్కాడ్‌ జిల్లా అట్టపల్లమ్‌ గ్రామంలో హత్యకు గురైన చత్తీస్‌ఘడ్‌ వలస కూలీ, గిరిజనుడైన రామనారాయన్‌ భగేల్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 30లక్షల రూపాయలు మంజూరు చేసింది. తల్లి, భార్యకు ఐదేసి లక్షలు, ఇద్దరు పిల్లలకు పదేసి లక్షల చొప్పున వారి పేర్లతో ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేస్తారు. నువ్వు బంగ్లాదేశీయుడివా అంటూ రామనారాయన్‌ను కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో నిందితుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపికి చెందిన వారు ఉన్నారు. ఏడుగురిని అరెస్టు చేయగా మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో నిందితుల్లో ఇద్దరు పదిహేనేండ్ల క్రితం ఒక సిఐటియు మరియు డివైఎఫ్‌ఐ కార్యకర్తను చేసిన వారిలో ఉన్నారు. వారితో తమకేమీ సంబంధం లేదని బిజెపి చెప్పుకుంది. ఆ పార్టీకి చెందిన వారు ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు మీడియాకు తెలిసినప్పటికీ మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d