Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

జనాలు వెర్రి వెంగళప్పలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌(రాష్ట్రీయ స్వయం సేవక్‌) మేథావుల ప్రగాఢవిశ్వాసం.కొన్ని సందర్భాల్లో కొందరి తీరు చూస్తే నిజమే అనిపించకపోదు. వాట్సాప్‌ యూనివర్సిటీని చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అలవోకగా అందమైన మాటలతో అబద్దాలు, నీటి జాడలు కనిపించని ఎడారుల్లో కూడా మహాసముద్రాలు ఉన్నాయని చెప్పగలరు. ఎవరైనా నిలదీస్తే పురాతన కాలంలో ఉండేవని చెప్పాం అంటారు.పరస్పర విరుద్దంగా మాట్లాడగల మాయల మరాఠీలు. ” ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలను ప్రధాని మోడీ అనుపమానంగా ప్రచారం చేస్తారు, ఉత్తమ ప్రతినిధి ” ఇది 2026 ఏప్రిల్‌ చివరి వారంలో అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌసబలే చెప్పినదానికి మీడియా పెట్టిన శీర్షిక. ఈ పెద్దమనిషి వాషింగ్టన్‌లోని హడ్సన్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రసంగాల్లో చెప్పిన అంశాలు, పిటిఐతో మాట్లాడినవి మీడియాలో వచ్చాయి. నాలుగు నెలలకు ముందు ” బిజెపి కళ్లద్దాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ను చూడటం పెద్ద తప్పిదం ” 2025 డిసెంబరు చివరి వారంలో కొలకతాలో తమ సంస్థ శతవార్షికోత్సవాల ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చెప్పిన సుభాషితం.ఇద్దరూ ఆ సంస్థలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్ననేతలే. అయినా రెండు నాలుకలతో ఎందుకు మాట్లాడినట్లు ? జనాలకు రెండింటినీ పోల్చుకొని చూసే తీరిక, అవకాశం ఉండదని వారికి తెలుసు గనుక.మోడీ ప్రభుత్వ నిర్వాకాలను తమకు అంటగట్టవద్దని ఒక నోటితో, తమ విలువలను మోడీ గొప్పగా ప్రచారం చేస్తున్నారని, తమకు ప్రతీక అని మరోమాట. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి తెలిసినవారందరికీ అది ఎన్ని నాలుకలతో మాట్లాడుతుందో తెలుసు. ఆ సంస్థలో అమాయకంగా చేరుతున్నవారు, అది చెబుతున్న మాటలే పరమ సత్యాలని నమ్ముతున్నవారు దేశం కోసం- ధర్మం కోసం ఒకసారి ఆత్మపరిశోధన చేసుకోవాల్సి ఉంది.ఇద్దరు అగ్రనేతలు రెండు విధాలుగా మాట్లాడటాన్ని రాజకీయ పరిభాషలో చెప్పాలంటే మోడీ వ్యతిరేక-అనుకూల ముఠాలకు ప్రతిబింబం.వారూ మానవమాత్రులేగా మరి ! నరేంద్రమోడీ తీరుతెన్నులను వ్యతిరేకిస్తున్నారనే కక్షతో 2005లో సంజరు జోషి అనే ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపినేత సెక్స్‌ కుంభకోణంలో ఉన్నారంటూ వీడియోలు పంపిణీ చేయించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఒక మహిళతో ఉన్న దృశ్యాలు నిజమే అయితే సంఘపరివార్‌ సంస్థనేతల బండారానికి, కాకుంటే వారు కూడా కుట్రలు, ప్రతికుట్రలకు అతీతులు కారనటానికి నిదర్శనం.ఆ ఉదంతం తరువాత 2005లో ప్రధాన కార్యదర్శిపదవికి రాజీనామా చేశారు. అయినా మోడీ కక్ష తీరలేదని చెబుతారు. 2012 జోషి గనుక పార్టీ జాతీయ కార్యవర్గంలో ఉంటే సమావేశాన్ని తాను బహిష్కరిస్తానని పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నితిన్‌ గడ్గరీని బెదిరించారని, దాంతో జోషీ రాజీనామా చేశారు, ఆ వార్త వెలువడిన రెండు గంటల్లోనే తాను సమావేశానికి హాజరువుతున్నట్లు మోడీ ప్రకటించారని నాడు వార్తలు. ఒక నాడు బిజెపిలో కొన్ని రాష్ట్రాలలో చక్రం తిప్పిన జోషి(64) ఇప్పుడు నరేంద్రమోడీ దెబ్బకు విలవిల్లాడుతూ ఎలాంటి పదవులు లేకుండా ఇంటి దగ్గరే పార్టీ కార్యకర్తలతో కాలక్షేపం చేస్తున్నారు.హౌసబలే చెప్పినట్లు నరేంద్రమోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలకు ప్రతీక అంటే ఎవరూ చేసేదేమీ లేదు !

ఈ వారంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల గురించి చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఒక పరామర్శలో వివరించటం సాధ్యం గాదు గనుక ఇద్దరు నేతల సుభాషితాలకే పరిమితం కావటం సముచితం. మేం మాట్లాడే భాషను, విలువలను తనదైన అనితర శైలిలో నరేంద్రమోడీ చెబుతారంటూ, మేము ఒక చెట్టునాటండి అంటే మోడీ అదే పదాలను ఉచ్చరించకపోవవచ్చు, తల్లిపేరుతో ఒక చెట్టు అంటారని హౌసబలే ఉదహరించారు.అనేక ప్రభుత్వ పథకాలు ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన మాదిరే ఉన్నాయని కూడా చెప్పారు.ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ విలువల గురించి చూద్దాం. సంఫ్‌ు ప్రచారక్‌లలో ఒకరైన నరేంద్రమోడీ కట్టుకున్న భార్యను వదలివేయటం గురించి దాచారు. అబద్దం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని అడిగేంత అమాయకులం అని కాషాయ దళాలు చెప్పుకుంటాయి. సినిమాల్లో, కథల్లో విలన్‌ తాను ఒంటరినని అమ్మాయిలను మోసం చేస్తాడు. మోడీ తనదైన శైలిలో తాను ఒంటరినని, అందువలన అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదంటూ ఎన్నికల సభల్లో చెప్పారు. నాలుగు అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలో భార్య గురించి నిజాలను దాచారు, కాంగ్రెస్‌ నేతలు మోడీ బండారం బయటపెట్టటంతో తరువాత రాయాల్సి వచ్చింది. ఆ తరువాత మరొక కత చెప్పారు. ఏమిటంటే మోడీకి తెలిసీ తెలియని వయస్సులోనే పెళ్లి చేశారని, వయస్సు వచ్చిన తరువాత దేశం కోసం-హిందూ ధర్మం కోసం భార్యను వదలివేశారని చెప్పారు.సనాతన ధర్మం ప్రకారం, ముఖ్యంగా దానికి కట్టుబడి ఉన్నామని, కాపాడలని ప్రవచించే వారు వివాహం ఎలా చేసుకున్నప్పటికీ భార్యను వదలివేయకూడదు. చిన్నతనంలో తెలియక పెళ్లి చేసుకున్నారనుకుందాం వయస్సు బుద్ధి వికసించిన తరువాత అయినా తిరిగి భార్యను చేరదీయాలా వద్దా ! అనేక మంది ప్రచారక్‌లు వయస్సు మీరిన తరువాత వివాహాలు చేసుకున్నారు.వారిని చూసి అయినా మోడీ తన భార్యను కాపురానికి తెచ్చుకోలేదు, కనీసం విడాకులు ఇచ్చి చట్టపరంగా తెగతెంపులు చేసుకోలేదు. ఇలాంటి వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలకు ప్రతీక అని చెబుతున్నారు, అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలు ఇలాగే ఉంటాయా అన్న ప్రశ్న ఎవరైనా అడిగితే …..!

సంఫ్‌ు చెబుతున్నమాదిరే ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటున్నాయని హౌసబలే తన భుజాన్ని తానే చరుచుకున్నారు.యుపిఏ పాలనా కాలంలో జాతీయ సామాజిక సహాయ పధకం(ఎన్‌ఎస్‌ఏపి) కేంద్రం ప్రారంభించింది.దీన్లో 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మొత్తం మూడు కోట్ల మందికి పైగా పెన్షన్‌ ఇస్తున్నారు.నరేంద్రమోడీలో ఎంత మానవత్వం ఉట్టిపడుతున్నదంటే ఆయన అధికారానికి వచ్చినపుడు ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపు 10,547 రూపాయలు,తాజా కేటాయింపులు రు.9,652 కోట్లు. కేంద్ర బడ్జెట్‌లో 0.58శాతం నుంచి 0.2కు దిగజారింది. దేశంలో ఏడాదికేడాది వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదని తెలుసు, వారికి నెలకు ఇచ్చే ముష్టి 200,300 రూపాయలు ఏమూలకు వస్తాయో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు చెప్పాలి. ఎలాంటి బడ్జెట్‌ కేటాయింపులు పెంచలేదు, ఈ పధకం కూడా తాము చెప్పినట్లే ఉందని వారు చంకలు కొట్టుకుంటున్నారా ? తమ మార్గదర్శకంలో నడుస్తున్న బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎంతెంత పెన్షన్లు ఇస్తున్నారో, అవి సరిపోతున్నాయో లేదో ఎప్పుడైనా వృద్దుల దగ్గరకు వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్‌ ” స్వచ్చంద సేవకులు ” యోగక్షేమాలు విచారించారా ? విచారించిన తరువాత కూడా ఈ మొత్తాలను పెంచాలని కేంద్రానికి సూచించాలని వారికి తట్టలేదా ?మార్గదర్శక్‌ మండల్‌ పేరుతో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి వారిని ఒక దగ్గర పెట్టారు, వారు కూడా వృద్దాప్య పెన్షన్‌ పెంచాలని మోడీకి సలహా ఇవ్వలేకపోయారు. ఇదే కాలంలో కార్పొరేట్లకు ఇచ్చిన సబ్సిడీలు ఏ విధంగా పెరిగాయో మానవత్వ ముఖాలు ఉన్నట్లు చెప్పుకుంటున్న వారికి తెలియదా ! వివిధ రాష్ట్రాలు దయాదాక్షిణ్యాలతో తమ బడ్జెట్ల నుంచి అదనపు మొత్తాలను పెన్షన్లు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగువేలు, తెలంగాణాలో రెండువేలు ఇస్తున్నారు.నెలకు రెండు వందలు, మూడు వందలు ముష్టిమాదిరి వేస్తున్న నరేంద్రమోడీ తమ బాటలో నడుస్తున్నారని చెప్పుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి జనాలు ఆలోచించుకోవాలి.మోడీకి కుటుంబం లేదు, తల్లిని ఆయన సోదరులే చూసుకుంటున్నారని విన్నాం. అటువంటి వారికి వృద్దులు, ఒంటరి మహిళల జీవితాలు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తాయి ! ఆయనకు తెలియదు, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెప్పరు !!

మహిళా రిజర్వేషన్‌ గురించి నరేంద్రమోడీ నాయకత్వం ఆడిన గొప్ప నాటకం తమ రచనే అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకుంటుందా ?వాజ్‌పాయి పాలనా కాలంలో అంతకు ముందు లోక్‌సభలో ప్రవేశపెట్టటం విఫలమైన చరిత్ర అందరికీ తెలిసిందే. 2014 నుంచి 2023వరకు మోడీ దాన్ని పట్టించుకోలేదు, ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్తు చేయలేదంటే వారికి తెలియకనా, కానే కాదు, 2024 ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్‌ అంశాన్ని ముందుకు తెచ్చి ఓట్లు దండుకొనేందుకు రూపొందించిన పెద్ద పథకం. తదుపరి జనాభా లెక్కల తరువాతనే అది అమల్లోకి వస్తుందనే షరతును దానికి తగిలించారు. అప్పటికి జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు,గతంలో విధించిన నియోజకవర్గాల పునర్‌వ్యవస్థకరణ అంశం గడువు 2026లో ముగుస్తుందనీ తెలుసు. కానీ మూడు సంవత్సరాల ముందే దాన్ని చేపట్టారంటే మరుసటి ఏడాది జరిగే ఎన్నికల కోసమే.ఈ అంశాన్ని మరోసారి 2029 ఎన్నికలకు వినియోగించుకోవాలనే మరో ఎత్తుగడకు తెరతీశారు.మహిళల పేరుతో తమకు అనుకూలంగా ఉండేట్లు ఉత్తరాదిలో సీట్లు పెంచాలని చూశారు. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేదనీ తెలుసు. మోడీ అత్యంత ప్రజాస్వామికవాది అని చెబుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు అవసరమైన మెజారిటీ లేదని తెలిసి కూడా ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని ముందుగా చర్చించాలనే సలహా మోడికి ఇవ్వలేదా ? లేక ప్రతిపక్షాలను బ్లాక్‌మెయిల్‌ చేయాలనే దుష్టఆలోచన ఎవరి బుర్రలో పుట్టినట్లు ?కనీసం మోడీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న తెలుగుదేశం పార్టీకి కూడా రాజ్యాంగ సవరణ బిల్లులో ఏముందో చెప్పలేదు. అడుగడుగునా మహిళలను వంచించే ఎత్తుగడ, బుల్డోజ్‌ చేసే దుష్ట ఆలోచన తప్ప మరొకటి దీన్లో లేదు. ఇవన్నీ ఇలాంటి అతితెలివి ప్రదర్శన చేసిన వారి విలువలు, వలువలకు మచ్చుకు మాత్రమే.

బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ వేరు కాదు. అదే సంస్థచెందిన నాధూరామ్‌ గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేసినపుడు ఆ సంస్థ మీద నిషేధం విధించారు. దాంతో తాము ఒక సాంస్కృతిక సంస్థగా ఉంటామంటూ కేంద్రానికి లేఖ రాసి నాటి నెహ్రూ ప్రభుత్వంలో ఉన్న తమ అనుకూలురను రంగంలోకి దించి నిషేధాన్ని ఎత్తివేయించుకున్నారు. రాజకీయాలు చేసేందుకు 1951లో భారతీయ జనసంఘం అనే పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.అత్యవసర పరిస్థితి తరువాత 1977లో దాన్ని రద్దు చేసి జనతా పార్టీలో చేరారు.ఆ ప్రయోగం వికటించింది. పార్టీలో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యులుగా ఉండకూడదనే అంశం వచ్చినపుడు కావాలంటే మేం విడిపోతాం తప్ప సంబంధాలు వదులుకొనేది లేదంటూ 1980లో బిజెపిని ఏర్పాటు చేశారు. దాని గురించి హౌసబలే ఏం చెప్పారంటే ” వారు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు.అదే జనతా పార్టీ నుంచి విడివడి మరొక రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముఖ్యకారణం. ఆ విదంగా ఉన్న బొడ్డుతాడు బంధాన్ని విచ్చిన్నం చేయలేరు.” అయినా రెండూ వేర్వేరు సంస్థలని జనాన్ని నమ్మించేందుకు బుకాయిస్తారు. హిందూ గుర్తింపు నాగరికతపరమైనది తప్ప మతం పరమైంది కాదు అని అమెరికన్లను నమ్మించేందుకు హౌసబలే ప్రయత్నించారు.తాము హిందువుల ఐక్యత,ఉద్దరణ కోసం పనిచేస్తున్నామని మరోవైపు చెబుతారు. భారతీయులనే మాట వారి నోట రాదు.ఈ దేశంలో కోట్లాది మంది ఇతర మతాలవారు ఉన్నారు. నిజంగా భారతీయుల కోసం పని చేసే వారు అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను జరుపుతారు, లేదా కమ్యూనిస్టుల మాదిరి ఏ మతాన్ని ప్రత్యేకించి భుజానవేసుకోకుండా దూరంగా ఉంటారు.మరి ఆర్‌ఎస్‌ఎస్‌ దానికి భిన్నంగా కేవలం హిందూమత సభలు, పండగల్లోనే మునిగితేలు తుంది. ఇలాంటి సంస్థ భారతీయ సమాజాన్ని ఐక్యంగా ఎలా ఉంచుతుంది ? మేకతోలు కప్పుకున్నంత మాత్రాన పులిచారలు కనిపించకపోవచ్చు తప్ప మాసిపోవు. ఈ గడ్డమీద భారతీయ సంస్కృతి తప్ప హిందూమతానికి మూలమైన వివక్ష, దుర్మార్గపూరితమైన మనుసంస్కృతికి స్థానం ఉండదు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నవారందరూ నరేంద్రమోడీ వ్యవహారశైలితో ఏకీభవించటం లేదు గానీ విధిలేక అన్నివిధాలుగా మద్దతు ఇస్తారు.ఇప్పటికే దేశంలోని అన్ని రంగాలను ఆక్రమించాం, మంచితరుణం మించిపోతే రాదు అంటూ హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉన్మాదం బాగా తలకెక్కిన వారికి ఈ విషయంలో మోడీ తీరు నచ్చటం లేదు. ఆ పెద్దమనిషికి కార్పొరేట్ల సేవే ముఖ్యం,వారు లేకపోతే తనకు పదవి లేదని తెలుసు. మన కార్పొరేట్లు తమ లాభాల కోసం మతంతో సహా దేన్నయినా వినియోగించుకుంటారు, అయితే మతాన్ని పూర్తిగా రంగంలోకి దించి మతరాజ్యంగా మారితే నష్టమని వారికి తెలుసు. గనుక ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను పూర్తిగా అమలు జరిపేందుకు వారు సిద్దం కాదు. మరోవైపు సంఘపరివార్‌ పరిస్థితి ఏమిటి ? మోడీ లేకపోతే అధికారం లేదు, అది లేకపోతే తన అజెండాను ముందుకు తీసుకుపోలేదు. మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ అజండాకే లేదా దాని అదుపు ఆజ్ఞలకంటే అంతర్జాతీయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు, జాతీయంగా కార్పొరేట్‌ అజండాను తలకెత్తుకున్నారు.ఈ ప్రక్రియలో కొన్ని అంశాలను ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగా సమర్ధించలేదు, విబేధించనూలేదు. చెప్పరాని చోట తగిలిన దెబ్బ గురించి చెప్పుకోలేనట్లుగా దాని పరిస్ధితి ఉంది. కార్పొరేట్లను కాదంటే దాని పని ఖాళీ. మిత్ర వైరుధ్యం ఉంది. దానికి తోడు తనది సాధారణ మానవజన్మ కాదని, దైవ నిర్ణయం మేరకు అవని మీద అవతరించానని మోడీ బాబా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకే కడుపులో లేకున్నా కావలింతలను ప్రదర్శిస్తారు.ముందే చెప్పుకున్నట్లు ఇద్దరు సంఫ్‌ు జాతీయ నేతలు భిన్నంగా మాట్లాడారు.బిజెపికి జన్మనిచ్చిన సంస్థదే ఆధిపత్యం అని దాని నేతలు భావిస్తుంటే తమ రాజకీయాలతోనే బిజెపి అధికారానికి వచ్చింది, దాంతోనే ఆర్‌ఎస్‌ఎస్‌ బలపడింది తప్ప మీ గొప్పేమీ లేదని మోడీ, షా భావిస్తున్నారు.ఇరు పక్షాలకూ అహం సమస్య ఉంది.మోడీ చర్యలు నష్టదాయకమని భావించినపుడు పరోక్షంగా వాటితో తమకేమీ సంబంధం లేదని సంఘనేతలు చెప్పటం దైవాంశ సంభూతునికి సహజంగానే రుచించవు.తమది స్వతంత్ర సాంస్కృతిక సంస్థ అని మోహన్‌భగవత్‌ చెబితే అదే కుదురుకు చెందిన నరేంద్రమోడీ కాదు ప్రపంచంలో అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థ(ఎన్‌జిఓ) అని ఎర్రకోట ప్రసంగంలో చెప్పారు. భగవత్‌ హిందూత్వకు ప్రతీక అయితే మోడీని కొందరు హిందూ హృదయ సామ్రాట్‌ అని కీర్తిస్తున్నారు. రాముడు-హనుమంతుడి మాదిరి ఉండాలి తప్ప ఒకే గద్దెమీద ఇద్దరు దేవుళ్లకు అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని అవలక్షణాలూ సంఫ్‌ు సభ్యులకూ ఉంటాయి, వారేమీ అతీతులు కాదు.బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన జెపి నడ్డా 2024 మే నెలలో ఒక సందర్భంగా మాట్లాడుతూ అతల్‌ బిహారీ వాజ్‌పాయి కాలం నాటికీ ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఉనికిలో మార్పు వచ్చిందన్నారు. ప్రారంభంలో మాకు అంత సామర్ధ్యం లేదు,చిన్న పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం ఉండేది.నేడు మేం పెరిగాం,సామర్ద్యం కలిగి ఉన్నాం.బిజెపి తనంతట తానే పని చేయగలదు, అదీ తేడా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతపరమైన రంగం, దాని పని అది చేస్తుంది అన్నారు. తాము కేవలం ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగం కాదు అని చెప్పటమే ఇది.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి, మరోమారు చర్చిద్దాం !