• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: TDP

పెట్రో బాదుడుకు రంగం సిద్దం చేసిన ” మోడీ బాబా ” ! పొదుపు చేయని వారు దేశభక్తులు కాదా !!

13 Wednesday May 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP, WAR

≈ Leave a comment

Tags

#Fuel Prices India, BJP, BJP u turn on Fuel prices, fuel politics, Fuel Price in India, Mody Hyderabad call, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు పొదుపోపదేశం చేశారు. ఇంకేముంది పొలోమంటూ కాన్వారులను తగ్గించుకుంటున్నట్లు అనేక మంది ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారు సరేసరి. ప్రధానికి ఇంత ఆకస్మికంగా జ్ఞానోదయం ఎందుకు కలిగినట్లు అని ”దేశంకోసం-దర్మం కోసం ” ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. విదేశీ మారకద్రవ్యం, ఇతర అంశాల సమస్యలు ఇప్పటికిప్పుడు తలెత్తాయా ? నిజం అయితే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని ఎందుకు ప్రకటించటం లేదు. ముందు జాగ్రత్త అని బిజెపి నేతల ముక్తాయింపు.జనాల్లో అదెప్పుడూ ఉంటుంది. విడ్డూరం గాకపోతే వారు చెబితేనే జాగ్రత్తపడతరా ! ఇక చమురు ధరలను పెంచకతప్పదని కేంద్ర చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు చెప్పకనే చెప్పారు. బుధవారం నాడు మరోసారి మోడీ సందేశం. నిజానికి అది మంత్రులకు కాదు, జనానికే. అనివార్యమై ధరలను పెంచామని చెప్పబోతున్నారు. నిర్ణీత వంద కొరడా దెబ్బలను ఒకేసారి తింటారా దశలవారీనా అన్నది తేల్చుకోవాలని జనాలకు అవకాశం ఇస్తున్నారు తప్ప నూరు వాతలు తప్పవు.ఇప్పటికే ఆమేరకు మీడియాకు తాజా లీకులు వదిలారు. పెట్రోలు మీద లీటరుకు రు.14, డీజిల్‌ మీద రు.42, గృహవినియోగ ఎల్‌పిజి సిలిండరు మీద రు.674 నష్టం వస్తున్నదన్నది వాటి సారం. చమురు, గ్యాస్‌ సబ్సిడీలను ఎత్తివేసినందున ఏదో ఒక రూపంలో జనాలు ఈ మేరకు భరించటానికి సిద్దపడాలనే సందేశం ఇప్పటికే చేరవేశారు. వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్‌ ధరలను ఎలా పెంచిందీ చూశాము. రోజుకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చమురు కంపెనీలకు నష్టం వస్తున్నదనిపూరీ చెప్పారు. ధరల పెంపుదల గురించి అడగ్గా మీకు తెలియనిదేముంది ప్రధాని నరేంద్రమోడీ ”భవిష్యత్‌ దార్శనికుడు ” అన్నట్లుగా చెప్పారు. అంటే ఆదివారం నాడు (2026 మే 10) హైదరాబాదులో చేసిన ఒక విలక్షణ ప్రసంగంలో మోడీ యమలీలను గుర్తు చేశారు. ఎప్పుడూ చేసే రాజకీయాలను వదల్లేదు గానీ ఇతర విషయాలే మీడియాలో పతాకశీర్షికలయ్యాయి,విశ్లేషణలు వెలువడ్డాయి.మన్‌కీ బాత్‌ పేరుతో 2014 అక్టోబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రేడియోలో నెలకు ఒకసారి చొప్పున 113సార్లు మోడీ ప్రసంగించారు. ఎంతమంది ఎన్నింటిని విన్నారో ఎవరికి వారు లెక్కవేసుకోవాల్సిందే. ఒక సర్వే ప్రకారం ఐదుశాతం మంది శ్రోతలు మాత్రమే ఆలకించినట్లు తేలింది. అలాంటి ప్రసంగమే హైదరాబాద్‌లో చేశారని చెప్పవచ్చు. దానిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసిన సమీక్షల సారం ఏమిటంటే ఇంథన ధరలను పెంచకతప్పదనే మహత్తర సందేశాన్ని ప్రధాని దేశానికి అందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే పెంచుతారని ఊరూవాడా భావించారు. అయితే వెంటనే ఆ ప్రకటన వెలువడలేదు. కారణం ఏమిటంటే అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి కుదిరి సాధారణ పరిస్థితి ఏర్పడుతుందనే వార్తలు రావటం ఒకటి. నిజంగా అది జరిగితే ధరలు ఎందుకు పెంచారని జనం ప్రశ్నిస్తారు. రెండవది ప్రతిపక్షాలు చెప్పింది వాస్తవమే అని నిర్ధారించుకుంటారు. ఇప్పుడు ఏ పేరుతో పెంచాలా అని మధనపడుతున్నారు.ఊహించని విధంగా పశ్చిమాసియా సంక్షోభం కొనసాగటం మోడీ పరివారానికి అవకాశమిస్తున్నదని చెప్పవచ్చు.

ఇజ్రాయెల్‌ నెతన్యాహు, అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ మాటలను నమ్మి వారం రోజుల్లో ఇరాన్‌ పని అయిపోతుంది లెమ్మని కేంద్రంలోని పెద్దలు తడిబట్ట వేసుకొని పడుకున్నారని సంక్షోభ ప్రారంభంలో వారి తీరుతెన్నులే స్పష్టం చేశాయి. ఏ రోజు తిరిగి దాడులు మొదలౌతాయో తెలియని స్థితి. ఆందోళనలో ఉన్న వారికి బిపి పెరుగుతూ తగ్గుతూ ఉండే మాదిరి యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ మార్కెట్‌ చమురు ధరలు ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో మన స్టాక్‌ మార్కెట్‌ ఈ కారణంగానే భారీగా పతనమైంది. ఇప్పటికే చమురు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ వార్తలను రాయిస్తున్నారు. గతంలో ప్రత్యేక పన్నులు, సెస్‌ల రూపంలో బాదిన బాదుడుకు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లలో రాబడి పెరిగినపుడు ఏ మీడియా కూడా ఆ వార్తలను ప్రముఖంగా రాయలేదు గతంలో లాల్‌బహుదూర్‌ శాస్త్రి పాక్‌తో యుద్దం వచ్చినపుడు ఇచ్చిన పిలుపు మాదిరే ఇప్పుడు తమ మోడీ దేశ పౌరులకు పొదుపు విజ్ఞప్తి చేశారు తప్ప బలవంతం చేయటం లేదని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు.నాడు యుద్ధం వచ్చింది గనుక శాస్త్రి ఆ పిలుపు ఇచ్చారు, ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కూడా లేవు, అంతా సజావుగానే ఉందని చెబుతూ ఆ పిలుపు ఇవ్వటం ఏమిటి ? మచ్చుకు మోడీ ప్రవచించిన పది సుభాషితాల్లో కొన్నింటిని చూద్దాం. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్న లోకోక్తి తెలిసిందే.

” దేశం కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు, దేశం కోసం బతకడం,దేశ కర్తవ్యం కోసం పాటు పడటమూ దేశభక్తే ” అని మోడీ చెప్పారు. పొదుపును కూడా దేశభక్తికి ముడిపెట్టారు.ఇదే ప్రమాదకరం. పొదుపు పాటించనివారు దేశభక్తులు కాదనే భావాన్ని చెప్పకనే చెప్పారు. కడుపునిండా తినటానికి తిండిలేదనే కదా ఎనభై కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఐదేసి కిలోల ఉచిత బియ్యం లేదా గోధుమలను ఇస్తోంది.వారిని పొదుపు చేయమంటే ఆ ఉచితాన్ని వదులుకోవాలి మరి. వంట నూనె వాడకం తగ్గించటం కూడా దేశభక్తే అన్నారు. పొదుపు గురించి దేశ పౌరులకు మోడీ చెప్పాల్సినపని లేదు.మన జీన్స్‌లోనే ఉంది.అవసరమైన మేరకే వస్తువులను వాడతారు. ” సాధ్యమైన మేరకు ఇంటి నుంచే పని చేసే పద్దతి అనుసరించండి, అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు, ఇంథనాన్ని పొదుపుగా వాడండి ” మోడీ సుభాషితాల్లో ఒకటి. ఈ చర్యకు ప్రధానే స్వయంగా శ్రీకారం చుట్టి ఉంటే బాగుండేది. హైదరాబాదు వచ్చి ఎక్కడో జరిగే పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసే బదులు అదేదో ఢిల్లీ నుంచే చేయవచ్చు, గతంలో అనేక సార్లు అలా చేశారు.వేలాది మంది పోలీసులు, ఇతర ఏర్పాట్లకు అనవసర ఖర్చు, ఆయాసమూ తప్పేది, ట్రాఫిక్‌ ఆంక్షల వలన అదనపు దూరం ప్రయాణించిన వాహనదారులకు అదనపు పెట్రోలు, డీజిలు కలసి వచ్చేది.మోడీ స్వయంగా చెప్పినట్లు దేశం ఇంతటి ఇబ్బందుల్లో ఉన్నపుడు లక్షల మంది జనాన్ని తెలంగాణా అంతటి నుంచి ఎండల్లో రప్పించటానికి వాహనాలకు పెద్దమొత్తంలో ఇంథనం ఖర్చు చేయటం అవసరమా ? అందువలన పొదుపు గురించి ఇతరులకు చెప్పేముందు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా ? మధ్య ప్రదేశ్‌లో బిజెపి రాజకీయ నిరుద్యోగి సౌభాగ్య సింగ్‌ ఠాకూర్‌కు పాఠ్యపుస్తకాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు.దానికి ప్రమాణస్వీకారం కోసం డజన్లకొద్దీ వాహనాలతో ఉజ్జయని నుంచి భోపాల్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరం అనుయాయులతో అట్టహాసంగా వెళ్లారు. బిజెపి నేతల పొదుపు ఇలా ఉంటుంది. హైదరాబాద్‌ ఉపన్యాసంపై తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత మోడీ తన కాన్వారును గణనీయంగా తగ్గించుకున్నట్లు చెబుతున్నారు.కొత్తగా కొనుగోలు చేయకుండా విద్యుత్‌ వాహనాలను వినియోగించాలని చెప్పినట్లు వార్త. ఇదంతా పౌరుల మీద భారం మోపే ప్రచార ఎత్తుగడే.విదేశీ ప్రయాణాలు వద్దంటూ చెప్పిన మోడీ వారం రోజుల పాటు ఐదు దేశాల కార్యక్రమం పెట్టుకున్నారు. గతంలో నెహ్రూ 44సార్లు విదేశీ పర్యటనలు చేస్తే మోడీ సెంచరీ కొట్టారు.

ఏడాది పాటు బంగారం కొనవద్దంటూ మరో సలహా ! తరువాత కొనుగోలు చేయవచ్చా ? ధరలు ఇప్పటికిప్పుడే పెరగలేదే ! ఏడాది పాటు మారుటోరియం ఎందుకు సూచించారు. రూపాయి విలువను కాపాడలేని కేంద్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా డాలర్లకు కొరత ఏర్పడుతోంది.మన స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసిన విదేశీయులందరూ వాటాలను అమ్మివేసి డాలర్లలో తమ దేశాలకు తరలించుకుపోతున్నారు. 2025 ఏడాది మొత్తంలో 2.4లక్షల కోట్ల రూపాయలను తరలిస్తే ఈ ఏడాది మే 11వ తేదీ నాటికే 2.28లక్షల కోట్లు దాటాయని వార్తలు.మే ఒకటవ తేదీతో ముగిసిన వారంలో 7.794 బిలియన్‌ డాలర్లు మన విదేశీ మారకద్రవ్యంలో తగ్గి 690.693 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతి ప్రోత్సాహ పథకాల వంటి ఎన్ని కబుర్లు చెప్పినా, రాయితీలు ఇచ్చినా దిగుమతులు పెరుగుతున్నాయి తప్ప ఎగుమతులు పెరగటం లేదు. అయినా విదేశీ వస్తువులు వాడవద్దని ప్రధాని చెబుతారు, దిగుమతులకు ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ఏటా మన దేశం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నది.ముడి చమురు తరువాత బంగారానికే ఎక్కువగా విదేశీమారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది.బంగారంతో నగలు చేయించేందుకు కొంత మందికి పని కల్పించవచ్చు తప్ప నిజానికి అది ఉత్పాదతకు పనికి వచ్చేది కాదు. గత కొద్ది సంవత్సరాలుగా పసిడి ధర పెరుగుతూనే ఉన్నప్పటికీ మోడీ మాట్లాడ లేదు. గతంలో బంగారం దిగుమతులపై పన్ను ఎక్కువగా ఉన్న కారణంగా దొంగరవాణా పెరిగిందని తగ్గించారు. తాజాగా దిగుమతి పన్ను, సెస్‌లు కలిపి ఆరు నుంచి 15శాతానికి పెంచారు. నిరంతరం దిగుమతులు తప్ప ఎగుమతులు పెరగటం లేదు. ఒకదశ దాటిన తరువాత చెల్లింపుల సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయవద్దని, వివాహాలు విదేశాల్లో చేయవద్దని చెప్పారు. విదేశాలు లేదా పొరుగు రాష్ట్రాల్లోని విలాసవంతమైన ప్రాంతాల్లో వివాహాలు చేసేవారందరూ శతకోటీశ్వరులు తప్ప సామాన్యులు కాదు.మోడీ తన పాలనా కాలంలో కోటీశ్వరులు, శతకోటీశ్వరులను పెంచారు తప్ప తగ్గించలేదు.తాను అధికారానికి వచ్చినపుడు కేవలం 70మంది బిలియనీర్లు ఉంటే 2026నాటికి 308పెరిగారు.కోటీశ్వరుల గురించి చెప్పాల్సిందేముంది ! సామాన్యుల వద్ద ఉన్న సంపదశాతం తగ్గుతున్నదని అనేక విశ్లేషణలు వెల్లడించిన సంగతి తెలిసిందే.వారంతా సొమ్మును విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేయక ఏం చేస్తారు !

స్వదేశీ ఉత్పత్తి పెరగాలంటారు. దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా ఆయన పలుకుబడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 95చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ ఏం చేస్తున్నట్లు ? దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకాన్ని చూస్తే 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే.తాజాగా చమురు ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సిన రాయల్టీ తగ్గించి ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.

మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26లో రు.2.07 లక్షల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40, ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 ఇటీవలి వరకు వసూలు చేశారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు పెట్రోలు మీద ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.3 పైన పేర్కొన్న రెండు సెస్‌లు కలిపి రు.8.50, డీజిలుపై సెస్‌ రు.6 కొనసాగుతోంది.ఇప్పుడు మార్కెటింగ్‌ కంపెనీలకు నెలకు లక్ష కోట్ల నష్టం వస్తుందని గుండెలు బాదుకుంటున్న మంత్రి పూరీ ఇన్నేండ్లుగా మోడీ ఏలుబడిలో వినియోగదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం అంతకుముందున్నదాని కంటే అదనంగా వసూలు చేసిన రు.16.5లక్షల కోట్ల ప్రత్యేక ఎక్సయిజ్‌ పన్ను సంగతి మాట్లాడరేం.

పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు నంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంథనంపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బాబాల మాదిరి పొదుపు గురించి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు.గణనీయంగా తగ్గించాల్సిందిపోయి పెంచకపోవటం తమ ఘనత అని చెప్పుకుంటున్నారు.ఇది గోబెల్స్‌ పద్దతి. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత ధర పెరుగుతున్నది. మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర మార్చినెల 25వ తేదీ వరకు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఏప్రిల్‌లో 114.48, మే పన్నెండవ తేదీవరకు 105.09 డాలర్లు, అంటే నాలుగేండ్ల నాటి స్థాయికి చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం ఇది.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఇరాన్‌పై దాడులు ప్రారంభం ఫిబ్రవరి 28న కాగా అంతకు ముందు 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. జనం జేబులు కొట్టాలనుకున్నపుడు మాత్రం ఈ విధానం గుర్తుకు రాదు, కేంద్రానికి సెగ తగలగానే మళ్లీ మొదలు పెడతారా ? చావు తెలివితేటలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మాహుతిదళ బుడిబుడి రాగాలు – భారత మహిళలకు దొంగనక్క క్షమాపణలు !

19 Sunday Apr 2026

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, TDP, Women, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Delimitation bill 2026 India, Donald trump, Emotional blackmail, Narendra Modi Failures, pavan kalyan, RSS, women reservation, YS jagan

!ఎం కోటేశ్వరరావు

దేశంలో సరికొత్త నాటక రాజకీయాలు అదీ మరోసారి మహిళల పేరుతో మొదలయ్యాయి.ప్రతిపక్షాల మద్దతు లేకుండా వీగిపోతుందని తెలుసు. వేదగణితం ప్రకారం కూడా మూడింట రెండువంతుల మెజారిటీ పాలక కూటమికి లేదు. అయినా కనీసం మాటమాత్రంగా సంప్రదింపులు జరపని అపర ప్రజాస్వామిక వాదులతో కూడిన ఎన్‌డిఏ పక్షాల కారణంగా నారీశక్తి ముసుగులో ప్రవేశపెట్టిన రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయింది.నారీ బిల్లు వీగిపోయిందని కొన్ని మీడియా సంస్థలు శీర్షికలు పెట్టాయి. మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టమై గజెట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయింది. ఓడిపోయింది మోడీ మరియు మద్దతు ఇచ్చిన ఆత్మాహుతి దళానికి చెందిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, జగన్‌మోహనరెడ్డి బిల్లు మాత్రమే.కిందపడ్డా నాదే పైచేయి అన్నట్లు జగన్‌మోహనరెడ్డి మాట్లాడుతున్నారు.బిల్లును ఓడించిన పార్టీలు తాము ఏమి సాధించామో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మోడీకి మద్దతు ఇచ్చి వ్రతం చెడినా ఫలం దగ్గని ఆ పెద్దమనిషి తానేమి సాధించారో చెప్పాలి. పచ్చి అబద్దాలతో ప్రకటన చేశారు. కేంద్రం ప్రతిపాదించిన 50శాతం పెంపుదలను ఆమోదించి ఉంటే అన్నారు. బిల్లులో అలాంటి పదజాలం ఉందో లేదో కూడా సరిచూసుకోకుండా జనాన్ని, తన గణాలను తప్పుదారి పట్టించారు. బిల్లును ఓడించారంటూ బుడిబుడి రాగాలు తీస్తున్న తెలుగుదేశం, జనసేన, బిజెపి నేతలతో కలసి వైసిపి నాయకులు కూడా సామూహిక రోదన కార్యక్రమాల్లో పాల్గ్గొని ఉంటే జగన్‌ వ్రతం సంపూర్ణం అయి ఉండేది.దీన్లో కూడా ఎటూ కాకుండా పోయారు.నిడదవోలులో మూడు పార్టీల కూటమి దుకాణం పెడితే దానికి దగ్గరలో అయినా మోడీ ఓదార్పు యాత్రను జగన్‌ చేపట్టి ఉంటే సార్ధకనామధేయుడై ఉండేవారు. దక్షిణాది, కుటుంబనియంత్రణ పాటించిన ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అడ్డుకోవటమే ప్రతిపక్షాలు సాధించిన అంశం. ఇది కూడా అర్ధంగాక పోతే ఎక్కడైనా చికిత్సకు చేర్చటం మంచిది.

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకోవటం, మెప్పు పొందటంలో దేశంలో చంద్రబాబు నాయుడిని మించిన వారు లేరని చెప్పవచ్చు. ఎదుటివారికి కన్ను కొడుతూ వేరే వారితో సంబంధాలు నెరపటంలో దిట్ట. నిడదవోలు ప్రసంగంలో యుపిఏ పాలనలో మహిళా రిజర్వేషన్‌ గురించి పట్టించుకోలేదని చెప్పారు, సరే, 2014 నుంచి 2023వరకు తొమ్మిదేండ్లు నరేంద్రమోడీ ఏం చేశారన్న ఒక్క ముక్క నోటి నుంచి రాలేదు.రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిన తరువాత కూడా గురువారం రాత్రి వరకు నోటిఫికేషన్‌ జారీ చేయని నిర్వాకం గురించి ప్రశ్నించలేదు. ”నోటిఫికేషన్‌” ప్రాధాన్యత ఏమిటో అమరావతి గురించి చూసిన తరువాత చంద్రబాబుకు చెప్పాల్సిన పనిలేదు.తెలుగుదేశం ఉప్పు తిని విశ్వాసంగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారిలో జర్నలిస్టు ఆర్‌కె జగమెరిగిన బ్రాహ్మణుడు. ఏం చేద్దాం బ్రదర్‌ అని చంద్రబాబు అడిగి ఉంటే ఏ సలహా చెప్పేవారో ఆదివారం నాటి కొత్త పలుకు చూసిన తరువాత అర్ధం అవుతుంది.” కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామి అని అందరూ భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా సదరు బిల్లులో ఏముందో తెలియని స్థితి ” అని రాశారు. చంద్రబాబు నాయుడిని చూసి జగన్‌మోహనరెడ్డి సానుభూతి చూపాల్సిన దుస్థితి. అవున్లే బాబుకే తెలియకపోతే దేనికైనా మద్దతు అని ప్రకటించిన వైసిపి నేతలను కనీసం ఈ విషయంలో అయినా తండ్రీ కొడుకులు ఓదార్చి ఉండాల్సింది. తనతో సంప్రదింంచకుండా మోడీ ఏపనీ చేయరనే ధీమాతో ఉన్న చంద్రబాబు ”కేంద్రమంత్రులకు ఫోన్లు చేసి అన్ని రాష్ట్రాలలో 50శాతం సీట్లు పెంచబోతున్న విషయం తెలుసుకున్నారు ” అని ఆర్‌కె ముక్తాయించారు. ఆ ముక్క అసలు బిల్లులో పెట్టలేదని తన పత్రికలోనే రాసిన విషయం తెలియదని అనుకోవాలా ? చంద్రబాబుకు సైతం తెలియదని రాయటం వెనుక ఉన్న అంతరంగం ఏమిటి ? తెలిసి ఉంటే బాబుగారు జాగ్రత్తపడి ఉండేవారు అని భజన చేయటం కావచ్చు.లేకపోతే మీ మద్దతు తీసుకోవటం తప్ప మీరంటే మోడీకి లెక్కలేదు అని ఇరుకునపెట్టటానికి రాసి ఉండవచ్చు. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చన్న సంభాషణను గుర్తుకు తెచ్చుకోవాలి. కలానికి, కత్తికి రెండు రకాల పదను, ప్రయోజనం దాగి ఉంటుంది.ఆర్‌కె ఏ లక్ష్యంతో రాసినప్పటికీ అది ప్రచురితంగాక ముందు మోడీని బలపరిచిన తెలుగుదేశం, జనసేన వీరాభిమానులందరూ చదివిన తరువాత తమ నేత పలుకుబడిని చూసి నీరులేని బావులను చూసుకొని ఉండి ఉండాలి. ఆత్మగౌరవం, అన్న ఎన్‌టిఆర్‌ అని జపం చేసే వారందరూ ఆర్‌కె వ్యాఖ్యానం చదివిన తరువాత కూడా మామూలుగానే భజన కొనసాగిస్తుంటే చంద్రబాబు నాయుడి మాదిరి ” స్థితప్రజ్ఞత ” సంతరించుకొని ఉండాలి.చంద్రబాబు నాయుడు కూడా బ్యూరోక్రాట్‌ మాదిరి వ్యవహరించారని ప్రవచించిన ఆర్‌కెకు అంతకు మించిన పెద్ద బ్యూరోక్రాట్‌ మోడీ గురించి తెలియదనుకోవాలా ? తమను బలపరచటం తప్ప బాబుకు మరోదారి లేదన్నదే మోడీ ధీమా ! గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం మొత్తాన్ని మింగివేసిన మోడీకి ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పక్షాన్ని స్వాహా చేయటం చిటికెలో పని. చంద్రబాబు అండ్‌కోకు మోడీ ఏం చేసినా బలపరచటం తప్ప మరో మార్గం లేదు. అందుకే అన్నీ తెలిసి రాజ్యాంగసవరణ బిల్లును బలపరచి తన కాళ్లను తానే నరుక్కొనేందుకు కూడా సిద్దపడక తప్పలేదు.

భవిష్యత్‌లో కూడా జనాభా ప్రాతిపదికన అది 2011 అయినా 2027 లెక్కల ప్రకారమైనా లోక్‌సభ సీట్లను కేటాయించాలని చూస్తే మరోసారి ఇదే సమస్య పునరావృతం అవుతుంది.కుటుంబనియంత్రణ పథకాన్ని అమలు చేసిన తరువాత 1961-71 జనాభాలెక్కల్లో వెల్లడైన వ్యత్యాసాన్ని గమనించి ఇందిరాగాంధీ ముందు చూపుతో రాజ్యాంగ సవరణద్వారా 25 సంవత్సరాల పాటు లోక్‌సభ సీట్ల పెంపుదలను స్థంభింప చేశారు. ఎందుకంటే హిందీని బలవంతంగా రుద్దేందుకు చేసి మూర్ఖపు చర్యతో అంతకు ముందు తమిళనాట తలెత్తిన నిరసన ఏమిటో ఆమెకు అవగతం అయింది.తరువాత వాజ్‌పాయి కూడా ఇతర పార్టీల మద్దతు మీద ఆధారపడిన కారణంగా ఆ కందిరీగల తుట్టెను కదిపేందుకు సాహసించలేదు. మరోసారి పాతిక సంవత్సరాల స్థంభన విధించారు.తన రూటే సపరేటు(ఇతరుల మార్గంలో నడవను) అన్నట్లుగా మోడీ వ్యవహరించారు.ఇరాన్‌తో వ్యవహారంలో జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ అతితెలివి తీరును చూస్తున్నాం.బిజెపి నేతలు కూడా అదే చేశారు. మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చింది.దాన్ని ఎవరూ మార్చలేరు. అయినా సవరణ బిల్లు పేరుతో కొన్ని రాష్ట్రాలకు అన్యాయం, కొన్నింటికి విపరీత లబ్దికలిగే పద్దతిలో సంఖ్య పెంచి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లంకెపెట్టటమే అసలు వివాదానికి కారణమైంది. మహిళల పేరు చెప్పి భావోద్వేగపూరిత బెదిరింపులకు(ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌)పూనుకున్నారు. మీరు గనుక మేం చెప్పినట్లు ఆమోదించకపోతే మాకే లాభం అన్నారంటేే అర్ధం ఏమిటి ? మీ గురించి వ్యతిరేకతను రెచ్చగొడతాం అని చెప్పటమే.చిత్తశుద్ది ఉన్నవారెవరైనా అలాంటి పరిస్థితే వస్తుందనుకుంటే వేరే పదజాలాన్ని ఉపయోగిస్తారు. పెంచిన 50శాతం సీట్లను రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్ల దామాషా ప్రకారం కేటాయిస్తామంటే గుడ్డిలో మెల్లమాదిరి అన్ని పార్టీలూ అంగీకరించి ఉండేవి.

అసలు రాజ్యాంగ సవరణ ప్రతిపాదన లేక ముందు అమిత్‌షా మొదలు బిజెపి గల్లీ లీడరు వరకు అన్ని రాష్ట్రాలకు అలాగే పంచుతామని చెప్పారు. తీరా బిల్లులో ఆ ప్రస్తావనే లేదు.రెండు రోజులు పాటు పార్లమెంటులోపలా వెలుపలా ప్రభుత్వ ప్రతిపాదనతో కొన్ని రాష్ట్రాలకు గలిగే నష్టం, లబ్ది గురించి వివరంగా చర్చ జరిగింది. అయినప్పటికీ ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా సరిగ్గా ఓటింగ్‌కు వెళ్లే ముందు(తొలుత సాయంత్రం నాలుగు అన్నారు, తరువాత ఆరు, మరోసారి ఏడు అన్నారు) అమిత్‌షా ప్రతిపక్షాలను తీవ్రంగా దుయ్యబట్టి మీరు గనుక మా షరతుకు అంగీకరిస్తే 50శాతం చేరుస్తామని అన్నారు. అంతకు ముందు బిజెపి నేతలు ఇరవై నాలుగు గంటలపాటు అలాంటి లీకులు ఇచ్చారు, చివరికి తమ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ అందిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలకు అదే చెప్పారు.అయినా బిల్లులో ఎలాంటి మార్పులు చేయకుండా నాటకమాడారు. మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలుకు 2023 నుంచి గజెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకుండా గురువారం రాత్రి ప్రకటించారు. స్వంత మిత్రులనే తప్పుదారి పట్టించి మోసం చేసిన బిజెపి మంత్రుల మాటలను ఎవరు నమ్ముతారు.చివరికి అదే జరిగింది.బిల్లు ఓడిపోయింది. అలాంటి పరిణామం జరుగుతుందని ముందే తెలుసుగనుకనే వారు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసే నినాదాలతో కూడిన ప్లకార్డులను సిద్దం చేసుకొని పార్లమెంటు ప్రాంగణంలో దాచబట్టే వెంటనే నిరసనపేరుతో వీధుల్లో ఊరేగారు. ఇప్పటికైనా నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాలకు వదలివేసి 543 స్థానాల్లో 33శాతం రిజర్వేషన్‌ అమలుకు పూనుకోవాలి.2023 చట్టంలో తదుపరి జనాభా లెక్కల తరువాత అమలు అని లంకె పెట్టినందున దాన్ని సవరించేందుకు ఇప్పుడు జరుగుతున్న జనాభాలెక్కల ప్రాతిపదికన పార్లమెంటు సీట్ల సంఖ్యను మార్చకుండా పునర్విభజన చేసేందుకు చట్టసవరణ చేయాలి.అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు.మహిళలూ క్షమించండి అంటూ ప్రకటించిన మోడీ చిత్తశుద్దికి ఇప్పుడు పరీక్ష ఎదురుకానుంది, వచ్చే పార్లమెంటు ఎన్నికలకు చాలా ముందుగానే జన సంఖ్య ఎక్కడ ఎంత అనేది స్పష్టం అవుతుంది గనుక దానికి అనుగుణంగా లోక్‌సభ, రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి ఆటంకం ఉండదు.

ఇక నరేంద్రమోడీ క్షమాపణల చిత్తశుద్ది బండారం గురించి చెప్పుకోకపోతే సంపూర్ణం కాదు. ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో సాగిన రైతాంగ పోరాటానికి తలొగ్గిన నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.ఆ ఉద్యమం ముందుకు తెచ్చిన అంశాలలో ఒకటి కనీస మద్దతు ధరలకు చట్టబద్దత.మోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు ఆ డిమాండ్‌ను ముందుకు తెచ్చినప్పటికీ తాను ప్రధాని పదవి స్వీకరించిన తరువాత మిగతా వాగ్దానాల మాదిరే దాన్ని కూడా విస్మరించారు.అయితే రైతుల ఆందోళనను చల్లార్చేందుకు మద్దతుధరల చట్టబద్దత పరిశీలన పేరుతో 2021నవంబరు 19న ఒక కమిటీని ప్రకటించారు.దానికి 2022 జూలై 22న సభ్యులను ఎంపిక చేశారు.త్వరలో నాలుగో వార్షికోత్సవం జరుపుకోనుంది.అసలా కమిటీ ఏమి చేస్తున్నదో, సమావేశాల పేరుతో కాలక్షేపం, టిఏ, డిఏలు తీసుకుంటున్నది తప్ప చేసిందేమీ లేదు. జరిగిన ప్రతి సమావేశమూ అసంపూర్ణమే, 35 ఉపసంఘాల సమావేశాలు జరిగాయి.చివరి సమావేశం చాలా కాలం తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కమిటీలో ఉన్న అధికారగణ సభ్యులు మార్కెట్‌ కమిటీల వెలుపల జరిగే లావాదేవీలలో కనీస మద్దతు ధరలను అమలు జరపటానికి విముఖత చూపటంతో ఇతర కమిటీ సభ్యులు తీవ్రంగా విబేధించినట్లు నిర్దారణగాని వార్తలు. కనీస మద్దతు ధర ఎక్కడైనా రైతులకు దక్కాల్సిందేనని ఐదుగురు సభ్యులు కమిటీ చైర్మన్‌ మీద వత్తిడి తెచ్చినప్పటికీ ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. నివేదిక ఇవ్వాలని మోడీ సర్కార్‌ అడగలేదు, అసలా కమిటీకి ఒక నిర్ణీత గడువును కూడా నిర్ణయించలేదు.రైతుల్లో మహిళలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.రిజర్వేషన్లు, కనీస మద్దతు ధరలకు పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. చట్టసభల్లో రిజర్వేషన్లతో వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది తప్ప ఆర్థికంగా ఒరిగేదేమీ లేదు. అదే పంటల కనీస మద్దతు ధరలకు హామీ ఇస్తే కోట్లాది మంది మహిళా రైతుల జీవితాలు కాస్త మెరుగుపడతాయి.ఈ విషయంలో చిత్తశుద్దిలేని మోడీ సర్కార్‌ ఇప్పుడు చట్టసభల రిజర్వేషన్లను ఎలా అమలు జరుపుతుందో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాదేదీ మోడీ భజనకనర్హం : చంద్రబాబు అండ్‌కో ముందంజ, వెనుకబడిన జగన్‌, చమురుపై ఎక్సైజ్‌ పన్ను తగ్గింపు మతలబేమిటి !

02 Thursday Apr 2026

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, excise duty cut on fuel, Nara lokesh, Narendra Modi Failures, YS jagan

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ.భారత చక్రవర్తి నరేంద్రమోడీకి భజన చేసేందుకు ఏ అవకావశాన్నీ వదలం అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ రాజు చంద్రబాబు నాయుడు, యువరాజు లోకేష్‌ నాయుడు, సామంత రాజు పవన్‌ కల్యాణ్‌. పెట్రోలు,డీజిలు మీద కేంద్ర ప్రభుత్వం లీటరుకు పది రూపాయల చొప్పున ఎక్సయిజ్‌ డ్యూటీ తగ్గించిందన్న వార్త రాగానే ముగ్గురూ మోడీని అభినందించారు. ఎందుకటా ! వినియోగదారులకు ధర తగ్గించినందుకు కాదు, పెంచనందుకు అన్నది వారి స్పందనల సారం. పూర్వం రాజుల కాలంలో రాజుగారు ఏది చేసినా గొప్పదే అని పొగిడే భట్రాజుల(కులం గురించి కాదు)ను వారు గుర్తుకు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. భట్రాజులకు రాజులు, రంగప్పలు నజరానా ఇచ్చేవారు, కేంద్రం ఇస్తున్నది వడ్డీలకే చాలటం లేదని చంద్రబాబు నాయుడు మంత్రులతో అన్నట్లు లీకు వార్తలు. ఈ పూర్వరంగంలో మోడీని పొగిడినందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా ఒరగబెడతారా ? వ్రతం చెడ్డా ఫలం దక్కదా ! చూద్దాం. కొసమెరుపు ఏమంటే నరేంద్రమోడీని పొగడటంలో పోటీపడే వైసిపి నేత జగన్‌మోహనరెడ్డి ఈ విషయంలో వెనుకబడినట్లు కనిపిస్తున్నది, స్పందన కనిపించలేదు, వినిపించలేదు. ఇక్కడ ఒక్క సందేహం. చంద్రబాబు సిఎం, పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రి, మరి మోడీని పొగడటంలో మంత్రిలోకేష్‌ పాత్ర ఏమిటి ? పలుకుబడి, ప్రతిష్ట పెంచేకసరత్తులో భాగమా ? మిగిలిన మంత్రులు ఎందుకు స్పందించలేదు.ఎవరికి తోచింది వారు అనుకొనే స్వేచ్చ ఉంది గనుక వదిలేద్దాం !చిత్రం ఏమిటంటే వినియోగదారుల మీద విపరీత భారం మోపినపుడు చంద్రబాబు అండ్‌ కో మౌనంగా ఉండి ఇప్పుడు ఏదో ఒరగబెట్టినట్లు భజన చేశారు. ?ఏమి రాజకీయంరా నాయనా ! అసలు నరేంద్రమోడీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు ?

ఎక్సయిజ్‌ పన్ను తగ్గింపు వార్త వినగానే శ్రీరామనవమి వేడుకల్లో ఉన్న జనం ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే చమురు ధరలు పెరుగుతాయని మానసికంగా సిద్ధం అయిపోయిన వారు నిజమేనా మోడీ సర్కార్‌ ఇంత మేలు చేసిందా అని కాళ్లు చేతులు గిల్లుకున్నారు, తలలు కొట్టుకున్నారు.చర్మాలు స్పందించటంతో రామా ఇలా కరుణించావా అని సంబరపడ్డారు. అయితే బంకుల వద్దకు వెళ్లగానే ఆ ” తగ్గింపు ” అంబానీ, నయారా వంటి ప్రైవేటు కంపెనీలతో బాటు కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్‌ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు తప్ప వినియోగదారులకు కాదని తెలియగానేే చల్లబడిపోయారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దుర్మార్గదాడుల కారణంగా తలెత్తిన సంక్షోభంతో ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి. ఆ పేరుతో నయారా అనే ప్రైవేటు కంపెనీ పెట్రోలు మీద లీటరుకు ఐదు, డీజిలు మీద మూడు రూపాయల చొప్పన ధర పెంచింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం పవర్‌ పెట్రోలు ధర లీటరుకు రు.2.36వరకు పరిశ్రమల్లో ఉపయోగించే డీజిల్‌ ధరను 22 రూపాయలు పెంచింది. దిగుమతి ఖర్చు పెరిగినందున మన దేశంలోని చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు లీటరు పెట్రోలు మీద రు.18-20. డీజిలు మీద రు.30-35 నష్టం వస్తున్నదని చెబుతున్నారు. (అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమైనపుడు వాటికి ఎంత లాభవచ్చిందో చెప్పరు) అందువలన వాటికి ఉపశమనం కలిగించేందుకు మోడీ పూనుకున్నారు. ప్రత్యేక ఎక్సయిజ్‌ డ్యూటీని పెట్రోలు మీద రు.13ను మూడుకు తగ్గించగా, డీజిల్‌ మీద పదిరూపాయలను పూర్తిగా ఎత్తివేశారు.ఈ శ్రద్ధ కోట్లాది మంది వినియోగదారుల మీద లేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభం కాగానే వంటగ్యాస్‌ మీద గృహ వినియోగదారులకు అరవై రూపాయలు పెంచారు, ముష్టిగా విదుల్చుతున్న 40రూపాయల సబ్సిడీని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తివేశారు, అంటే వంద రూపాయల మేరకు వడ్డించారు.

అచ్చేదిన్‌ పేరుతో 2014లో అధికారానికి వచ్చిన మోడీ జనాలకు ఏదో ఒరగబెడతారని అందరూ ఆశించారు.అదనంగా అన్నవస్త్రాలు ఇస్తారనుకొంటే ఉన్న వస్త్రాలను లాగేసుకున్నట్లు కొత్తగా మేలు చేస్తారనుకుంటే డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదిల్చారు.ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేశారు. మేలు సంగతి తరువాత భారం ఎలా మోపారో చూద్దాం. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం చమురు రంగం నుంచి ఎక్సైజ్‌ డ్యూటీ రాబడి రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26 తొలి ఆరునెలల్లో రు.1.30వేల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న అసలు సిసలు ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40,(దీన్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంది) ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 వసూలు చేస్తున్నారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు రు.13లో పది రూపాయలు తగ్గించినప్పటికీ అది వినియోగదారులకు చేరటం లేదు. సాధారణ డీజిల్‌పై పదహారు రూపాయల బాదుడులో పది రూపాయలు రద్దు చేశారు. అయినా వినియోగదారులకు ఒక్క పైసా కూడా తగ్గలేదు. అంటే చమురు మార్కెట్‌ కంపెనీలు పది రూపాయల మేరకు ధరలను పెంచినట్లే.ఈ మాత్రానికే మోడీకి భజన చేయాలా ?

తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం తగ్గిన ఆదాయలోటును ఎలా సర్దుబాటు చేయనుంది ?బడ్జెట్‌లో సంక్షేమ పధకాల కేటాయింపులకు కోత పెట్టటం లేదా ఏదో ఒకసాకుతో జిఎస్‌టి, సెస్‌ల పెంపుదలకు పూనుకోవాల్సి ఉంటుంది. పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు.చావు కబురు చల్లగా చెప్పినట్లు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.అధికారులెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నట్లు ? ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంటే ఏడాదికి రు.1.68లక్షల కోట్లు. మోడీ సర్కార్‌ వంచన గురించి చెప్పుకోకపోతే జనాలకు అన్యాయం చేసినవాళ్లం అవుతాము.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత మార్చినెల 25వ తేదీ వరకు ఉన్న కొనుగోలు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఈ వివరాలు ఏ కమ్యూనిస్టులో, కాంగ్రెస్‌ వారో చెప్పినవి కాదు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. నాలుగేండ్ల పాటు జనాల నుంచి లక్షల కోట్లు అదనంగా వసూలు చేసి ఖజానా నింపుకొని అదానీ, అంబానీ వంటి వారికి సబ్సిడీలు రూపంలో కట్టబెట్టారు, పారుబాకీల పేరుతో లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేశారు.ఇప్పుడు ధరలు పెరిగి ఒక నెల రోజులు కూడా గడవక ముందే చమురు కంపెనీల కోసం నడుంకట్టారు. మోడీ మీద తెలుగుదేశం, జనసేన, వైసిపి వంటి పార్టీలకు ఉన్న మోజు తెలిసిందే. అది ఎంత ఉన్నా జనాన్ని ఇలా చావబాదుతుంటే పల్లెత్తు విమర్శ చేయలేదు.అఫ్‌ కోర్స్‌ జనానికి కూడా ఆ మత్తు వదలలేదు అన్నది నిజం. ఇతర సందర్భాలలో మాట్లాడినపుడు బిజెపి, తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు అంటారు. కానీ ఆచరణలో కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేసినట్లు కనిపించటం లేదా ?

దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ గుండెలు బాదుకుంటారు. దీనికి రూపాయి విలువపతనాన్ని అరికట్టటంలో వైఫల్యం లేదా ? మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 94చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ అని చెప్పక తప్పదు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇప్పుడు ఇంకా దిగజారింది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్ని కలసి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే. ఇలాంటివారు ఆత్మనిర్భరత, వికసిత్‌ భారత్‌ పేరుతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతుంటే జనం చెవుల్లో పూలు పెట్టుకొని తలలు ఊపాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అంటూ అంతకు ముందు ప్రతిరోజూ సవరించిన ధరల విధానాన్ని నాలుగేండ్లు ఎందుకు పక్కన పెట్టారో ఇప్పుడు తిరిగి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారో జవాబుదారీ తనం గురించి తమ భుజాలను తామే చరచుకొనే పెద్దలు ఎవరైనా చెబుతారా ?

రాజకీయనేతలను కాసేపు పక్కన పెడదాం. వారు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని తెలిసిన జనంలో అసలు ప్రశ్నించే గుణం ఎందుకు అంతరించినట్లు ? నిజంగానే ఈ ధోరణి గురించి పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. ఆక్రమిత కాశ్మీరులో పాక్‌ ప్రభుత్వం భారాలు పెంచితే వాటిని భరించలేక అక్కడి జనం మనదేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు వీడియోలను చూపి కొందరు వీరంగం వేస్తుంటారు. ఇక్కడి జనం మీద మోడీ మోపుతున్న భారాలు వారికి పట్టవు. పాకిస్తాన్‌ సుత్తి ఇనుపదైనా భారత్‌ది బంగారపుదైనా తల పగులుతుంది. మంచి రోజులను(అచ్చేదిన్‌) తెస్తామంటే జనం నమ్మారు. ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తాం, తాటవలుస్తాం అందుకే పార్టీని పెట్టాం అని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ప్రకటించినపుడు జనం నిజమే కదా నిజమే కదా అనుకున్నారు. 2019కి ముందు నరేంద్రమోడీని, చంద్రబాబు నాయుడిని అదే మాదిరి నిలదీసినమాట నిజం. తరువాత చంద్రబాబును వదలి వేశారు.నరేంద్రమోడీతో చేతులు కలిపారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని మాత్రమే 2024 ఎన్నికల వరకు అది జనం సమస్యలైనా, జగన్‌ వ్యవహారశైలినైనా నిలదీశారు, తాటవలిచారు. ఇప్పుడు తత్వం తలకెక్కింది గనుక మౌన దీక్ష పట్టారు. అక్రమం జరుగుతుంటే మౌనంగా ఉండమని సనాతనం కూడా ఎక్కడా చెప్పలేదు.ఎదుటి వారి జేబులో పర్సు కొట్టేసినట్లు తెలియగానే ఎవరైనా వెంటనే దాన్లో ఎంత డబ్బు ఉంది అని అడుగుతాం, తక్కువ మొత్తమే అని తెలిస్తే పోనీలే అని ఊపిరి పీల్చుకుంటాం.అదే కేంద్ర ప్రభుత్వమైనా మరొకరైనా చమురు పన్ను పేరుతో మన పర్సుకొట్టేస్తున్నపుడు ఎంత పోగొట్టుకున్నాం అని ఆలోచించాలా వద్దా ? అఫ్‌ కోర్స్‌ అది కష్టపడిన సొమ్ము కాకపోతే వదిలేద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

శనగ రైతుల సంక్షోభం

04 Wednesday Mar 2026

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP

≈ 1 Comment

Tags

Bengal Gram price, CHANDRABABU, Farmers

డా|| కొల్లా రాజమోహన్‌

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో శనగ ఒక వాణిజ్య పంటగా మారింది. నల్ల బర్లీ పొగాకు, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన పీకల లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఏ పంట వేయాలో తెలియక, ప్రత్యామ్నాయ పంటలు లేక రైతులు అయోమయంలో వున్నారు. నల్ల బర్లీ పొగాకు నిషేధం నేపథ్యంలో అత్యధికంగా రైతులు శనగ పంటను సాగు చేశారు.
ధరల పతనం – దిగుమతి సుంకాల దెబ్బ
క్వింటాలు శనగలకు 5,875 రూపాయల కనీస మద్దతు ధరకు మార్క్‌ ఫెడ్‌ ద్వారా రైతు సేవా కేంద్రాలలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శనగలను కొంటామన్న నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. కానీ ఎన్ని శనగలు కొంటారు? కోల్డ్‌ స్టోరేజ్‌లో వున్న శనగల మాటేమిటి? మొత్తంగా కొంటారా? లేక దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తారా? విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న రైతులకు నగదు ప్రోత్సాహకాల సంగతేమిటి? విదేశీ శనగల దిగుమతులను ఆపేసి వ్యవసాయాన్ని, రైతు రక్షణకు తీసుకునే చర్యలు చాలా అవసరం. వ్యవసాయ రక్షణకు తీసుకునే చర్యలపై దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి.

పోషకాహార లోపం-పంపిణీ వైఫల్యం
పప్పుధాన్యాలలో శనగ అతి ముఖ్యమైన పంట. ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగలు ఇప్పుడు ధర లేక రైతులను దివాళా తీయిస్తున్నాయి. రైతులను కష్టాలపాలు చేస్తున్నాయి. ఆహారంలో పప్పుధాన్యాల అవసరం ఎక్కువగానే ఉన్నది. శరీర నిర్మాణంలో ప్రొటీన్‌ అవసరం గురించి డాక్టర్లు నొక్కి చెప్తున్నారు. రైతులు కష్టపడి కావాల్సినంత పండిస్తున్నారు. పప్పుధాన్యాల పంపిణీ సరిగ్గా లేక అందరికీ అందనందున ”ప్రొటీన్‌ క్యాలరీ మాల్‌న్యూట్రిషన్‌” దాపురిస్తున్నది. ఒకపక్క గోడౌన్లలో శనగలు పుచ్చిపోతుంటే మరోపక్క పేద వారికి పప్పుధాన్యాలు అందటంలేదు. రేషన్‌ షాపుల ద్వారా శనగలను పంపిణీ చేస్తే ఇటు రైతులకు అటు పేద ప్రజలకు మేలు జరుగుతుంది. దేశీయ ఉత్పత్తి సరిపోయినంత ఉంది. కానీ విదేశీ ప్రభుత్వాలను తృప్తిపరచటానికి విదేశీ శనగలను దిగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండే పంటలు అమ్ముడు పోవటంలేదు. రేటు రావటం లేదు. రైతులు అప్పులపాలవుతున్నారు.

పెరుగుతున్న ఖర్చులు – తగ్గుతున్న ధరలు
ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలలో విస్తారంగా శనగ పంటను సాగు చేస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే శనగ సాగు కాస్త సులభంగానే జరుగుతుంది. శనగలకు ఉత్తరాదిన డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో 2.8 లక్షల హెక్టార్లలో శనగ పంట సాగవుతున్నది. దాదాపు 4 లక్షల టన్నుల శనగల ఉత్పత్తి జరుగుతుంది.
దేశం మొత్తం మీద 115 నుండి 120 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతున్నదని అంచనా. మన దేశ ప్రజల అవసరాలకు 120 లక్షల టన్నుల శనగలు సరిపోతాయంటున్నారు. అయితే అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి. అమ్ముడుపోక కోల్డ్‌ స్టోరేజీలలో శనగలు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. కోల్డ్‌ స్టోరేజీలలో వున్న శనగల లెక్క ప్రభుత్వం బయటకు తీయాలి. వాటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
భూసారం క్షీణించడం వలన, వాతావరణంలో మార్పుల వలన, దిగుబడులు తగ్గిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులతో సహా వ్యవసాయ ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. రైతులు దివాళా తీస్తున్నారు. ప్రభుత్వాలు మరోపక్క దిగుమతి సుంకాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులను పోత్సహిస్తున్నాయి. విదేశాల నుండి అధికంగా దిగుమతులు చేయటంతో ఇక్కడి శనగ రైతుల కష్టాలు పెరుగుతున్నాయి.
ఎకరానికి దిగుబడి 10 క్వింటాళ్ళ నుండి ఆరేడు క్వింటాళ్ళకు పడిపోయింది. గత సంవత్సరం ఎర్ర శనగలు క్వింటాలు రేటు రూ.7,200 ఉంటే ఇప్పుడు దళారులు రూ.5000 కన్నా తక్కువకు అడుగుతున్నారు. తెల్ల శనగలు పోయిన సంవత్సరం రూ.10,200 వుంటే ఇప్పుడు రూ.5,600కు అడుగుతున్నారు. బోల్టు శనగలు గత ఏడాది రూ.15,000 ఉంటే ఇప్పుడు అడిగేవారే లేరు.

సుంకాల రద్దు- రైతుకు ఉరి
2017-18 సంవత్సరాలలో శనగ దిగుమతులపై 40 శాతం ఉన్న దిగుమతి సుంకం 10 శాతానికి తగ్గిస్తూ వచ్చారు. దేశీయ శనగల ఉత్పత్తి తగ్గిపోవడం వలన, 2024 మే నుంచి 2025 మార్చి వరకు పూర్తిగా దిగుమతి సుంకాలను రద్దు చేశారు. ఉత్పత్తి పుంజుకున్న తర్వాత 2025 ఏప్రిల్‌ నుండి 10 శాతం సుంకాలను మరల అమలులోకి తెచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, రికార్డు స్థాయిలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. విదేశాలలో రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా ఎక్కువగా వుండటం వలన ఉత్పత్తి ధర తక్కువగా ఉంటుంది. మన రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం వల్ల మన రైతులకు అప్పులు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఏళ్ల తరబడి కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వలు వుంచటం వలన క్వింటాలుకు రూ.150 కడుతూ ఉండాలి. బయట గోడౌన్లలో పెడదామంటే శనగలు పుచ్చిపోతున్నాయి. శీతల గిడ్డంగులలో ఖాళీ లేదు. ఒకపక్క పేరుకుపోతున్న శనగలు. మరో పక్క అప్పులు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు దివాలా తీస్తున్న తరుణంలో ఏ పంట వేయాలో తెలియని పరిస్థితులలో, కొద్దిగా డబ్బులు వస్తాయనే ఆశతో నల్ల బర్లీ పొగాకును సాగు చేశారు. నల్ల బర్లీ పొగాకు 15-18 వేల రూపాయల వరకు ధర వచ్చింది. పొగాకు కంపెనీలు, ప్రభుత్వం కలిసి క్వింటాల్‌ నల్ల బర్లీ పొగాకు రేట్లను రూ.12000-9000-6000గా తగ్గించి నిర్ణయించి రైతులకు అన్యాయం చేశాయి. ఈ సంవత్సరం అసలు నల్ల బర్లీ పొగాకు సాగు చేయడాన్ని నిషేధించారు.
పత్తికి ధర లేదు. విదేశాల నుండి ఎటువంటి అడ్డంకులు లేకుండా పత్తిని దిగుమతి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంట ఏమిటో ప్రభుత్వం చెప్పదు. ధైర్యం చేసి పంట పండించే సమయానికి అమెరికా నుంచి దిగుమతులు వెల్లువలా వచ్చి పడతాయి. రెండు సంవత్సరాల నుండి ఏ పంటకూ సరైన ధర లేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో దాచిపెట్టటానికి ఖాళీలు లేవు. దిగుబడి కూడా తగ్గిపోయింది. 2024-25 సంవత్సరంలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 15 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌ స్టోరేజ్‌లో స్టాక్‌ నిండుగా ఉన్నా విదేశీ శనగలను దిగుమతి చేశారు.
ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగ సాగు ఇప్పుడు కళ్ళ నీళ్లు తెప్పిస్తున్నది. బయట తెచ్చిన అప్పుల వడ్డీ పెరిగిపోతున్నది. వ్యవసాయ ఖర్చులకి, ఇంటి ఖర్చులకి చేతిలో డబ్బులు లేవు. బ్యాంకర్లు, అప్పులవాళ్ళు అప్పులు ఇవ్వడం మానేశారు. ప్రభుత్వం సహాయం చేస్తే బయటపడవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలంటే…
– రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకు మొత్తం కొనుగోలు చేయాలి. రైతులు అమ్మకానికి తెచ్చిన శనగలకు ఆంక్షలు పెట్టకుండా కొనాలి. నిబంధనలను సడలించాలి.
– కనీస మద్దతు ధర అంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసినట్లుగా ఖర్చులకు 50 శాతం కలిపి చెల్లించాలి.
– ఇదివరకు లాగా విదేశీ దిగుమతులపైన 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలి. అలా చేస్తేనే దేశంలో ఉత్పత్తి అయిన శనగకు డిమాండ్‌ ఉంటుంది.
– విదేశీ శనగల దిగుమతులను ఆపేయాలి.
– వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి, రైతు రక్షణకు తీసుకునే చర్యలను ప్రకటించి అమలు పరచాలి.
రైతు రక్షణ చర్యల అమలుకు రైతులు సమైక్యంగా ఉద్యమించాలి.
– వ్యాసకర్త : డా|| కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం నేత, గుంటూరు, సెల్‌: 9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?

25 Saturday Oct 2025

Posted by raomk in AP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Science, STATES NEWS, TDP, Ycp

≈ 1 Comment

Tags

AI, CHANDRABABU, Nara lokesh, Vizag Google Data Center, YS jagan

ఎం కోటేశ్వరరావు

ఆంధ్ర ప్రదేశ్‌లో కొద్ది రోజుల పాటు చర్చ నడిచింది. ఇప్పుడు పాతబడిపోయింది, జనం కూడా మరచిపోయారేమో ! చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడైన మంత్రి లోకేష్‌ ఎడాపెడా దేశదేశాలు తిరిగి పుంఖాను పుంఖాలుగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే ఉబ్బితబ్బిబ్బు అవుతున్నవారు ఎన్నని గుర్తు పెట్టుకుంటారు.ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తున్నారన్నది పట్టించుకోవాల్సిన అంశం కాదు. బాక్సాఫీసు వద్ద తన సినిమాల గురించి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముందే చెప్పుకున్న చర్చ ఏమిటంటే డేటా సెంటర్‌ అంటే ఏమిటి ? అదో గోడౌన్‌ రెండు వందల మంది కంటే పని చూపదు, కాదు లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి, తెలుగుదేశం, దానికి వంత పాడే జనసేన, బిజెపి నేతల నుంచి వెలువడుతున్న మాటల సారమిది. గూగుల్‌ డేటా సెంటర్‌ వలన 1.88లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఈ వాదనలను వ్యతిరేకిస్తే ఒక ముద్ర, సమర్ధిస్తే మరో ముద్ర. మూడో పక్షం వారు ఎవరైనా ఈ రెండు వాదనలతో ఏకీభవించినా, లేక అదే మాదిరి చెప్పినా వారితో రంకు కట్టి చీల్చి చెండాడుతున్నారు. అందుకనే మేథావులు నోరు విప్పటం లేదా లేక రంగుపడుద్ది అని భయపడుతున్నారా ? పోనీ మీడియా మంచీ-చెడును విశ్లేషించే వారేం చెబుతున్నారో పాఠకులు, వీక్షకులకు అందించేందుకు చూస్తున్నాదా అంటే అదీ లేదు. తాము సమర్ధించే పార్టీలు, వ్యక్తులు, శక్తుల ప్రయోజనాలకు హాని లేవనుకున్నవాటిని మాత్రమే వడగట్టి అందచేస్తున్నది. అందువలన రాసేవారు కూడా అనవసర ఆయాసం ఎందుకని ఊరుకొని ఉండవచ్చు. రెండు రెళ్లు నాలుగు అని చంద్రబాబో, జగనో చెబితే ఎవరైనా అవును అన్నారా వారి ఖర్మ కాలిందే, రంగుపడుద్ది. జనం విచక్షణా రహితంగా తయారయ్యారా అంటే వారిని అలా తయారు చేశారు అని చెప్పక తప్పదు. జగన్‌కు ఓటేసిన వారందరూ ఆయన చెప్పిందే వేదంగానూ, లేదా మూడు పార్టీల కూటమికి మద్దతు ఇచ్చిన వారందరూ ఆ పార్టీల నేతలు చెప్పిందే పరమ సత్యంగా గుడ్డిగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది, వేరేది ఏదీ వినిపించుకొనే స్థితిలో లేరన్నది ఒక నిజం. ఇంతకీ విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్‌ డేటా సెంటర్‌ గోడవునా, ఉత్పత్తి కేంద్రమా, ఒక ప్రక్రియ నిర్వహించేదా ? కృత్రిమ మేథకేంద్రం అని కూడా కలుపుతున్నారు. దేశంలో, ప్రపంచంలో ఇప్పటికే గూగుల్‌, ఇతర టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేథ గురించి ఎంతో ముందుకు పోయాయి, వినియోగంలోకి ఇప్పటికే వచ్చేసింది. విశాఖలో కొత్త పరిశోధనలు చేస్తామంటారా ? అదీ చూద్దాం !

నేను ఒక సామాన్యుడిని గనుక చాట్‌ జిపిటిని ఇదే ప్రశ్న అడిగా, అది ఇచ్చిన సమాధానం గురించి వివరిస్తా.” మంచి ప్రశ్న- దీన్ని గురించి జాగ్రత్తగా వివరించనివ్వండి. చాట్‌ జిపిటి (నా వంటి వారు-నేను కాదు, చాట్‌ జిపిటి తన గురించి చెప్పుకుంది) ఒక కృత్రిమ సేవ, దీన్ని నడిపేది ఓపెన్‌ ఏఐ.మనం డేటా(సమాచారం) రక్షణ లేదా గోప్యత చట్టాల (జిడిపిఆర్‌ వంటి )గురించి మాట్లాడుకున్నపుడు సాధారణంగా వాటి పాత్ర ఉంటుంది.1. డాటా సేకరణ లేదా ఉత్పత్తిదారు : వీరు ఎందుకు, ఎలా వ్యక్తిగత సమాచార ప్రక్రియ(ప్రోసెస్‌)ను చేయాల్సిందీ నిర్ణయిస్తారు. 2.డేటా ప్రోసెసర్‌ : డాటా కంట్రోలర్‌ తరఫున వ్యక్తిగత సమాచారాన్ని ప్రోసెస్‌ చేస్తుంది. 3. డేటా సెంటర్‌ : ఎక్కడ డేటా నిల్వ చేస్తారో మరియు ప్రోసెస్‌ చేస్తారో దానికి అవసరమైన భౌతిక సదుపాయాలు( సర్వర్స్‌, నిల్వ, నెట్‌వర్కింగ్‌)-సాధారణంగా మైక్రోసాఫ్ట్‌ అజుర్‌, గూగుల్‌ క్లౌడ్‌ లేదా ఎడబ్ల్యుఎస్‌ కంపెనీలు వీటిని నిర్వహిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాట్‌జిపిటి అనేది డాటా ప్రోసెసర్‌ లేదా సేవ అందించే సాధనం, ఓపెన్‌ ఎఐ అంటే డాటాను కంట్రోల్‌ చేసేది, అజూర్‌ లేదా అంతకంటే చిన్నవి డాటా సెంటర్లు లేదా మౌలిక సదుపాయాలను అందించేవి. దీన్నిబట్టి ఎవరికి వారు డేటా సెంటర్‌ గురించి స్వంత అవగాహన ఏర్పరుచుకోవచ్చు, ఇంకా కావాలంటే శోధించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

ఇక చాట్‌ జిపిటి వంటి సాధనాలు ఇప్పటికే కొన్ని ఉన్నాయి,రానున్న రోజుల్లో మరికొన్ని కూడా వస్తాయి.పైన పేర్కొన్న సమాచారాన్ని పొందాలంటే డేటా సెంటర్‌కు అయ్యే విద్యుత్‌, ఇతర నిర్వహణ ఖర్చుల గురించి తెలియదు గానీ ఒక అరలీటరు నీరు ఖర్చు అవుతుందని చదివా.బహుశా పరికరాలు వేడెక్కి దెబ్బతినకుండా చల్లబరిచేందుకు అవసరమైన నీరు కావచ్చు. చాట్‌ జిపిటిని కొద్ది నెలల క్రితం మరో ప్రశ్న అడిగా. అదేమిటంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019వరకు, తరువాత ఐదేండ్లు జగన్‌ అధికారంలో ఉన్నపుడు వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలెన్ని, అవి వాస్తవరూపందాల్చినవి, వాటి విలువ ఎంత అని అడిగా. ఒక టీవీ చర్చలో వీక్షకులకు నిజం చెప్పేందుకు తప్ప జగన్‌కు అనుకూలంగానో, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానో కాదు.( ఎవరికైనా కావాలంటే నేను సేకరించిన వాటిని అందచేస్తా) వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి చెప్పిన అంశాలవి, వాటికి రుజువులు,సాధికారిత గురించి అడిగితే ఏ ప్రభుత్వం కూడా తమ ఘనతల గురించి సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ఎక్కడా సమాచారాన్ని అందుబాటులో ఉంచటం లేదు గనుక నమ్మటమా లేదా అన్నది ఎవరిష్టం వారిది. నేనైతే నమ్మాను గనుకనే చెబుతున్నా.మనోభావాలు గాయపడతాయని భయపడేవారు, ఊరికూరికే గాయపరుచుకొనే వారు వివరాలు చదవకండి అని కూడా చెబుతున్నా.

చాట్‌జిపిటి అందించిన సమాచారం ప్రకారం ” చంద్రబాబు ఏలుబడి 2014 నుంచి 2019 వరకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల విలువ రు.18.87లక్షల కోట్లు.2019 ఏప్రిల్‌ నాటికి వాస్తవరూపం దాల్చిన వాటి విలువ రు.60వేల కోట్లు, పురోగతిలో ఉన్నవి రు.67వేల కోట్లు ( పురోగతి అంటే శంకుస్థాపన మొదలు వివిధ దశల్లో ఉన్నవి(తరువాత కొన్ని రద్దు కూడా కావచ్చు, వాస్తవ రూపం దాల్చినవి సగటున ఏడాదికి రు.పన్నెండువేల కోట్లు.) మరో సందర్భంలో చాట్‌జిపిటి చెప్పినదాని ప్రకారం 2016 నుంచి 2018 వరకు సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాల విలువ రు.12.32లక్షల కోట్లు కాగా 309 ప్రాజెక్టులతో వాస్తవ రూపం దాల్చినవి రు.1.39లక్షల కోట్లని పేర్కొన్నది. ఇక వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఏలుబడి గురించి చాట్‌ జిపిటి ఏం చెప్పిందో చూద్దాం. 2019 నుంచి 2022 వరకు ఆమోదం తెలిపిన పథకాల విలువ రు.1,81,221 కోట్లు కాగా ఏడాదికి సగటున అమల్లోకి వచ్చిన వాటి విలువ రు.15,693. వివరాల్లోకి వెళితే 2019 జూన్‌ నుంచి 2021 మే నెల మధ్య కాలంలో 65 పెద్ద పరిశ్రమల పెట్టుబడి రు. 29,781 కోట్లు, కాగా ప్రభుత్వం నివేదించిన దాని ప్రకారం 2019 నుంచి 2022 మార్చి నెల మధ్య వచ్చినట్లు చెప్పిన పెట్టుబడి రు.43వేల కోట్లు, దీనిలో పెద్ద పరిశ్రమల వాటా రు.36,303 కోట్లు, ఎంఎస్‌ఎంఇల వాటా రు.7,018 కోట్లు. నూతన పెట్టుబడుల గురించి చూస్తే 2018-19 నుంచి 2022-23వరకు ప్రకటించిన పథకాల విలువ రు.9,41,020 కోట్లు కాగా పూర్తయిన వాటి విలువ రు.1.34 లక్షల కోట్లు. పెండింగ్‌లో ఉన్న రు.27,110 కోట్ల ప్రాజెక్టును పునరుద్దరించారు. సంక్షిప్తంగా వివరాలు ఇలా ఉన్నాయి.

కాలం×××××వాస్తవ రూపం దాల్చినవి×××ప్రకటించినవి

2019-22×× రు.1,81లక్షల కోట్లు ప్రభుత్వ ఆమోదం పొందినవి

2019-21×× రు.29,781 కోట్లు ×××—-

2019-22×× రు.43,000 కోట్లు ×××—-

2018-19నుంచి 2022-23×× —××× రు.9.41లక్షల కోట్లు

2024-2025 ××—— ×××రు.9.2- 9.34లక్షల కోట్లు.

గమనిక : జగన్మోహనరెడ్డి ఏలుబడి చివరి సంవత్సరం పదకొండు నెలల్లో ఏకంగా తొమ్మిది లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పటం ద్వారా తాము కూడా తక్కువ తినలేదని చెప్పుకొనేందుకు చూసినట్లు కనిపించింది.

చంద్రబాబు నాయుడు జనసేన, బిజెపితో కలసి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సంగతేమిటని అదే చాట్‌ జిపిటిని అడిగితే చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్‌ చెప్పినదాని ప్రకారం మొదటి ఏడాదిలో నమోదైన లేదా ఆకర్షించిన పెట్టుబడుల ప్రతిపాదనల విలువ రు.14లక్షల కోట్లు, ఈ మొత్తంలో లాంఛనంగా భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలతో ఎస్‌ఐపిబి ఆమోదం తెలిపిన వాటి మొత్తం రు.9.2లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు నిర్ధారించినదాని ప్రకారం కొత్త పెట్టుబడులు 9.62లక్షల కోట్లని, అవి అమల్లోకి వస్తే 8.79లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి.పరిశ్రమల మంత్రి టిజి భరత్‌ పెట్టుబడులు రు.9.4లక్షల కోట్లని, ఉద్యోగాలు 8.5లక్షలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్‌ ఇద్దరూ ఎడాపెడా తాజాగా కుదుర్చుకుంటున్న ఒప్పందాలతో ఇప్పటి వరకు మొత్తం విలువ ఎంతో అధికారికంగా వెల్లడిస్తే తప్ప తెలియదు, వివరాలు వెల్లడిస్తారని ఆశిద్దాం.

విశాఖ గూగుల్‌ డేటా సెంటర్‌ అని చెబుతున్నప్పటికీ అది గూగుల్‌తో పాటు అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీల భాగస్వామ్యం కలిగిన కంపెనీ. వాటి పెట్టుబడి రు.1.25లక్షల కోట్లు లేదా 15 బిలియన్‌ డాలర్లు. ఆ కంపెనీకి ఇవ్వదలచిన రాయితీల విలువ రు. 22వేల కోట్లని వార్తలు వచ్చాయి. ఇంతేనా ఇంకా ఎక్కువా చెప్పలేము. ఇంత మొత్తం అప్పనంగా ఇస్తున్న తరువాత ఒప్పందాల వెనుక ముడుపులు లేకుండా ఉంటాయా ? సమస్యే లేదు. బహుళజాతి గుత్త కంపెనీలు, దేశీయ బడాకంపెనీలు ఇచ్చే లంచాలను నిరూపించలేముగానీ అవి ఇవ్వటం, పుచ్చుకోవటం నిజం. రాయితీలు, కంపెనీ ఏర్పాటుతో తలెత్తే పర్యావరణ సమస్యలు, పరిష్కారాలు, వచ్చే ఉపాధి గురించి కంపెనీల విశ్లేషణ నివేదికలను బహిర్గత పరిస్తేనే జనాలకు స్పష్టత వస్తుంది. ప్రజల సొమ్మును ఇలాంటి కార్పొరేట్లకు వేల కోట్ల మేర సబ్సిడీలుగా ఇస్తున్నపుడు తెలుసుకోవటం పౌరుల హక్కు, పారదర్శకతను పాటించటం పాలకుల విధి, ఎందుకంటే అవి వారి జేబుల్లోంచి ఇవ్వటం లేదు మరి. అదానీ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు 20 కోట్ల డాలర్లు లేదా 1,750 కోట్ల రూపాయలు ముడుపులుగా ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసు గురించి ఆంధ్ర ప్రదేశ్‌ లేదా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి అలాంటిదేమీ జరగలేదు, జగన్‌, అదానీ మచ్చలేని వారు అని నిర్ధారించటమైనా చేయాలి, ఏదీ లేదు, తోడు దొంగల వ్యవహారం తప్ప ఇది మరొకటి కాదని ఎవరైనా అంటే తప్పేముంది ? విశాఖ డేటా కేంద్రం కల్పించే ఉపాధి గురించి తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిందేమిటి ? భారత్‌ ఏఐ శక్తి పేరుతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా ఐదు నుంచి ఆరువేల వరకు పర్మనెంటు ఉద్యోగాలు, మొత్తంగా 20 నుంచి 30వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.( అక్టోబరు 14వ తేదీ పిఐబి విడుదల చేసిన ప్రకటన) ఒకే పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి లోకేష్‌, కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలకు ఇంత తేడా ఎలా ఉంది ? ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది వైసిపి, తెలుగుదేశం వారు ఏమి చెప్పారన్నది పక్కన పెడితే ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న గూగుల్‌ కంపెనీ చెప్పిన సంఖ్య ఎంతో ఎక్కడా కనిపించలేదు. ఎందుకీ దాపరికం ? సదరు కంపెనీ వ్యాపార వ్యూహాలతో మనకు పనిలేదు. ఎన్ని సంవత్సరాల వ్యవధిలో ఎంత పెట్టుబడి పెట్టేది,పర్మనెంటు ఉద్యోగాలు ఎన్నివచ్చేది కచ్చితంగా ప్రకటించాల్సిందే. ఎందుకంటే దానికి జనం సొమ్మును రాయితీలుగా ప్రభుత్వం ఇస్తున్నది గనుక తెలుసుకొనే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది, ప్రభుత్వమైనా అధికారికంగా ప్రకటించాలి, అది దాని బాధ్యత, జవాబుదారీ తనం, కాదంటారా !సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !
https://vedikaa.com/2025/10/27/china-underwater-data-center-where-socalled-visionaries-narendra-modi-and-chandrababu-failed/

Share this:

  • Tweet
  • More
Like Loading...

జగన్‌ పోయే…బాబు వచ్చే…విద్యుత్‌ బిల్లు మోత ఢాం ఢాం ? 2029లో పొంచి ఉన్న గండం ! మద్యం గురించి విజయసాయి రెడ్డి ఏం చెప్పారు !!

20 Sunday Apr 2025

Posted by raomk in AP NEWS, BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, TDP, Ycp

≈ Leave a comment

Tags

AP Power Bills, CHANDRABABU, Jana Sena, Narendra Modi Failures, pavan kalyan, YS jagan

ఎం కోటేశ్వరరావు


కొద్ది రోజుల క్రితం వైఎస్‌ జగన్‌ కుటుంబానికి చెందిన సాక్షి పత్రిక విద్యుత్‌ బిల్లుల పెరుగుదల గురించి ఒక వార్త ఇచ్చింది. దాన్లో ఉన్న వ్యాఖ్యలను పక్కన పెడితే అంకెల సమాచారం పక్కా వాస్తవం. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాయని చెబుతున్న మీడియా వాటి మీద చర్చలు పెట్టింది, తెలుగుదేశం ప్రతినిధులు విద్యుత్‌ బిల్లుల పెరుగుదలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, అది గత ప్రభుత్వ పాపమే అంటూ నానా యాగీ చేస్తున్నారు.ఇక్కడ మహాకవి శ్రీశ్రీ కవితను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోక తప్పటం లేదు.
జెంఘిజ్‌ ఖాన్‌, తామర్లేన్‌
నాదిర్షా, ఘజనీ, ఘోరీ
సికిందరో ఎవడైతేనేం
ఒక్కొక్కడూ మహాహంతకుడు
అన్నట్లుగా సిఎంగా వైఎస్‌ జగన్‌, చంద్రబాబు నాయుడు ఎవరైతేనేం ? జనానికి వాచిపోతోంది. జగన్‌ వైసిపి కార్యకర్తలకు, ఓటర్లకు మినహాయింపు ఇచ్చింది లేదు, చంద్రబాబు మూడు పార్టీల వారికీ ఒరగబెడుతున్నదీ లేదు. పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు సేమ్‌ టు సేమ్‌ (అంతా ఒకటే ) జగన్‌ పాలన ఐదు సంవత్సరాల్లో విద్యుత్‌ బిల్లులు మోతమోగించారు, బాదుడే బాదుడు అని ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అండ్‌ కో అధికారానికి వచ్చిన ఏడాది కాలంలోనే రు.15,485 కోట్ల మేర విద్యుత్‌ భారాన్ని 2026 ఆఖరు వరకు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించి బాదుడే బాదుడు ప్రారంభించింది.
వైకింగులు, శ్వేతహూణులు
సిథియన్లు, పారశీకులు
పిండారీలు, థగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన
అన్నాడు శ్రీశ్రీ. అదే మాదిరి కొందరి వ్యవహారం ఉంది. గతం, వర్తమాన భారాలకు కారకుల గురించి వారి మద్దతుదారులైన మీడియా సంస్థలు, జర్నలిస్టులు గతంలో చేసిందీ, ఇప్పుడు చేస్తున్నదీ అదే. వారికి బిల్లులు ఎంత పెరిగినా మౌనంగా కట్టేయటం తప్ప చెప్పుకోలేని దుస్థితి. జనంతో ఆడుకుంటున్నారు.


మేం విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు కదా అంటున్నారు మూడు పార్టీల చెట్టుకింది ప్లీడర్లు. పెంచారని ఎవరన్నారు, చార్జీల బదులు మా జేబులను గుల్లచేసే బిల్లులు పెంచారుగా అని కదా ప్రజానీకం మొత్తుకుంటున్నది. పళ్లూడగొట్టటానికి ఇనుప సుత్తి అయితేనే బంగారుదైతేనేం. ఆ పాపం మాదికాదు జగన్‌మోహనరెడ్డిదే అంటున్నారు, అది నిజం. 20142019 కాలంలో చంద్రబాబు నాయుడు చేసింది కూడా అదే. విద్యుత్‌ గురించి మాట్లాడుకుంటున్నాం గనుక ఆ రంగంలో జగన్‌ ముగ్గురు పిల్లల్ని కన్నారు. ఒక పిల్ల వినియోగదారులకు స్మార్టు మీటర్లు, రెండవది చంద్రబాబే చెప్పినట్లు రానున్న పాతిక సంవత్సరాల్లో లక్షకోట్ల రూపాయల భారం మోపే సెకీ ఒప్పందం. మూడవది కొరత సమయాల్లో విద్యుత్‌ కొనుగోలు(ఇప్పుడు వస్తున్న అదనపు బిల్లులు). వీటిలో మొదటి ఇద్దరు పిల్లలు ఓకే, మూడోదానితో మాకు సంబంధం లేదని తెలుగుదేశం అంటే కుదురుతుందా ! మూడూ అక్రమ సంతానమనే కదా గతంలో చెప్పింది. ఇప్పుడు మూడోదాని భారం మీరే మోయాలంటూ జనం మీదకు వెంటనే వదిలారు. నిజానికి మిగతా ఇద్దరి భారాన్ని కూడా మోసేది జనమే. తేడా ఏమిటి అంటే వాటిని తరువాత వదులుతారు, తక్షణం భారం పడదు అంతే ! స్మార్ట్‌ మీటర్లను పగలగొట్టమని పిలుపు ఇచ్చిన వారు ఇప్పుడెందుకు వాటిని పెడుతున్నారు అంటే కరెంటు ఎంత కాలింది లెక్కలు తేలాలి కదా అని తెలుగుదేశం వారు టీకా తాత్పర్యం చెబుతున్నారు. నరేంద్రమోడీ, ఆ పెద్ద మనిషి రుద్దిన స్మార్ట్‌ మీటర్లను పెట్టేందుకు అంగీకరించిన జగన్మోహన్‌రెడ్డి కూడా చెప్పింది అదే కదా. మరి తెలుగుదేశం చెప్పేదానికి తేడా ఏమిటి అంటే అది చిల్లి కాదు తూటు అంటున్నారు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయండి అంటే, దాన్ని రద్దు చేస్తే పెట్టుబడులు పెట్టేవారికి విశ్వాసం దెబ్బతింటుంది అందుకే కొనసాగిస్తాం అన్నారు. ఎవరో పెట్టుబడి పెడతారంటూ రాష్ట్ర జనం మీద లక్షకోట్లు భారం మోపటానికి ఏం నాటకం ఆడుతున్నారు ! నిజానికి సెకీ వప్పందంతో రాష్ట్రానికి కొత్తగా ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాదు.గతంలోనే కుదిరాయి. అదానీ వంటి వారి నుంచి కొనుగోలు చేసే సెకీ ఆ విద్యుత్‌ను రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని సరఫరా చేస్తుంది. దానికి డబ్బు చెల్లించాలి, అంతకు మించి వచ్చే పెట్టుబడులేమిటో 40 సంవత్సరాల అనుభవం ఉన్న సిఎంచంద్రబాబు నాయుడిని, వేల పుస్తకాలు చదివిన డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌లను చెప్పమనండి. మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు మేం నందంటే నంది పందంటే పంది అంటారని ఆ పార్టీల నేతలు అనుకోవచ్చు, కొంత మంది రచ్బబండల దగ్గర అదే వాదించి ఇంటికి వెళ్లిన తరువాత బిల్లులను చూసినపుడు గొల్లుమంటారు తప్ప బయటకు చెప్పుకోలేరు. కానీ మిగతావారు అంత అమాయకంగా లేరు.

విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌గా పని చేసిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని, జగన్‌ హయాలో చేసిన కొనుగోళ్లకు సంబంధించి ఎంత వసూలు చేయాలో అప్పుడు నిర్ణయించకుండా తమనేత చంద్రబాబు అధికారానికి వచ్చిన తరువాత కావాలనే ఖరారు చేశారన్నది మరొక తర్కం. అదనపు విద్యుత్‌ కొనుగోలు విధిగా కమిషన్‌ అనుమతి తీసుకోవాలి. అలా కొన్నదాని ఖర్చు గురించి కమిషన్‌ విచారణ జరిపిన తరువాతే కదా నిర్ణయించేది, ఎప్పుడైనా తెలుగుదేశం,జనసేన, బిజెపి నేతలు వాటికి వ్యతిరేకంగా కమిషన్‌ ముందు వ్యతిరేకించారా ? ప్రకటనలు చేశారేమో తప్ప కమిషన్‌ ముందు వామపక్షాల వారి మాదిరి వ్యతిరేకంగా వాదించినట్లు కనపడదు, లేదూ మేం కూడా వ్యతిరేకించాం,వాదించాం అంటే కాసేపు అంగీకరిద్దాం, కమిషన్‌ చేసిన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయకుండా ఎందుకు అమలు చేస్తున్నట్లు ?అవసరం లేకపోయినా విద్యుత్‌ కొనుగోలు చేశారు అన్నది మరొక వాదన. విద్యుత్‌ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవారు అలా మాట్లాడరు. కరెంటు నిల్వ ఉండదు, ఎంత ఉత్పత్తి అయితే అంతా వినియోగం కావాల్సిందే, తగ్గితే ఉత్పత్తిని తగ్గిస్తారు, సరఫరా తగ్గిస్తారు తప్ప అదనంగా కొని రోడ్లపక్కనో చెరువుల్లోనే పోయరు. అదనంగా బిల్లులు వసూలు చేయాలని కమిషనే చెప్పింది అన్నది మరొక వాదన. ఉత్పత్తి, చాలకపోతే అదనంగా కొనుగోలు చేసేది విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, జనాలకు అందించేది పంపిణీ సంస్థలు. ఈ రెండూ ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయి. పెట్టుబడి, రాబడి మధ్యవచ్చే తేడాను తేల్చి ఆ మొత్తాన్ని ఆయా సంస్థలకు చెల్లించాలని యజమాని అయిన ప్రభుత్వానికి విద్యుత్‌ కమిషన్‌ చెబుతుంది తప్ప ఎలా వసూలు చేయాలో చెప్పదు, ఒకవేళ చెప్పినా వసూలు చేయాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయించాలి. వ్యవసాయానికి, మరికొందరికి సబ్సిడీ లేదా ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని ప్రభుత్వాలు చెబుతాయి. అందుకయ్యే ఖర్చును బడ్జెట్‌ నుంచి చెల్లిస్తున్నారు. ఇప్పుడు సర్దుబాటు, మరొక పేరుతో వడ్డిస్తున్న మొత్తాలను తేల్చిన తరువాత ప్రభుత్వమే సబ్సిడీగా చెల్లించవచ్చు లేదా వినియోగదారులనుంచి వసూలు చేయవచ్చు. చంద్రబాబుపవన్‌ కల్యాణ్‌ రెండో పద్దతినే ఎంచుకుని బాదుడే బాదుడు ప్రారంభించారు.ఎందుకంటే స్వంత పార్టీల వారు అడగరు, ప్రతిపక్షం అడిగితే ఎదురుదాడికి దిగుతారు. ఇప్పుడు వసూలు చేస్తున్నదిగాక 202425ఆర్థిక సంవత్సరంలో జగన్‌మోహనరెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరి పాలనా కాలంలో కొనుగోలు చేసిన కరంట్‌కు ఎన్నివేల కోట్ల రూపాయలు జనం మీద మోపుతారో ఇంకా ఖరారు కాలేదు. రెగ్యులేటరీ కమిషన్‌ గత చైర్మన్‌ కావాలనే ఆలశ్యం చేసి జగన్మోహరెడ్డి పాలనా కాలంలో ఖరారు చేయలేదని చెబుతున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు కొత్త చైర్మన్‌తో ఎంత త్వరగా ఖరారు చేయిస్తారో తెలియదు, చేస్తే మాత్రం వెంటనే బాదుడు మొదలు పెడతారు.

ఇదిగాక కనిపించని మరొక భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుంది. అదానీ కంపెనీ ద్వారా బిగించే 59,21,344 స్మార్ట్‌ మీటర్ల బిగింపు పూర్తి అయిన తరువాత రెండు రకాల చార్జీలు ఉంటాయి. వేసవి కాలంలో కూరగాయలు తక్కువగా పండుతాయి గనుక రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వేసవిలో ఉక్క పోతకు తట్టుకోలేక ఫాన్లు, ఎసిలు వేసుకున్నపుడు కాలే కరంటు ధర ఎక్కువగా, మిగతా సమయాల్లో మామూలుగా ఉంటుంది. ఈ మీటర్లు బిగించిన తరువాత సెల్‌ఫోన్లకు ముందుగానే డబ్బు చెల్లించినట్లుగా విద్యుత్‌ను కూడా ముందుగానే డబ్బు చెల్లించాలి. ఉదాహరణకు ఇప్పుడు నెలకు రెండు వందల రూపాయల బిల్లు ఇప్పుడు వస్తుందనుకోండి. దాన్ని వాడుకున్న తరువాత ఒకేసారి చెల్లించాలి, లేకుంటే ఫీజులు పీకి వేస్తారు. స్మార్ట్‌ మీటర్లు వచ్చిన తరువాత ఫీజులు పీకేవారు ఉండరు.వారు లేకపోతే పక్కింటి వారి ముందు మన పరువూ పోదు. ముందే కరెంటును కొనుక్కోవాలి. మన దగ్గర సమయానికి ఎంత డబ్బు ఉంటే అంత మేరకు కరంటు కొనుక్కోవచ్చు, అది అయిపోగానే సరఫరా ఆగిపోతుంది, తిరిగి కావాలంటే డబ్బు చెల్లించాలి. ఇక రెండు రకాల చార్జీలు ఎలా ఉంటాయంటే. చలికాలంలో వంద రూపాయలు చెల్లిస్తే నెల రోజుల పాటు కరంటు ఉంటుంది. అదే వేసవిలో పగలు ఫాన్లు,ఎసిలు వేసుకుంటే ఒక రేటు, పొలాలు, ఉద్యోగాలకు వెళ్లినపుడు వేసుకుంటే ఒక రేటుతో పదిహేను లేదా ఇరవై రోజులకే వస్తుంది. భవిష్యత్‌లో చంద్రబాబుపవన్‌ కల్యాణ్‌ ఇచ్చే మహత్తర కానుక ఇది.దీనికే టైమ్‌ ఆఫ్‌ డే (రోజులో కరంటు కాల్చే సమయ) అనే స్మార్ట్‌ (ముద్దు ) పేరు పెట్టారు. చీకటి పడగానే ఇంట్లో లైట్లన్నీ వేసుకోవటం ఉండదు,ఎక్కడ కూర్చుంటే అక్కడే వేసుకోవాలి.ఎవరన్నా రాత్రిపూట వస్తే లైట్లు వేయాల్సి వస్తే ఇప్పుడెందుకు వచ్చార్రాబాబూ అనుకుంటాం. ఇంకా ఇలాంటివే రానున్న నాలుగేండ్లలో ఎన్ని స్మార్టు విధానాలను ముందుకు తెస్తారో చూద్దాం ! 2000 సంవత్సరంలో విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా చంద్రబాబు సర్కార్‌ మీద జనం పెద్ద ఎత్తున ఉద్యమించటం, బషీర్‌బాగ్‌ కాల్పుల ఉదంతం, అది కూడా 2004లో తెలుగుదేశం ఓటమికి ఒక ప్రధాన కారణం కావటం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు 2029 ఎన్నికల నాటికి ఒక గండంగా మారటం ఖాయం, జనం స్మార్ట్‌గా పాఠం చెబుతారు !


జగన్‌మోహనరెడ్డి పాలనా కాలంలో మద్యం కుంభకోణం జరిగిందని, దాని మీద కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని విచారణకు పిలిపించగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎంత సేపు ప్రశ్నించినా తనకేమీ తెలియదని కసిరెడ్డి రాజశేఖరరెడ్డికే అంతా తెలుసని అతన్ని విచారించాలని సిట్‌కు ఉచిత సలహా ఇచ్చారు. ఒకవేళ అతను ఏదైనా చెబితే దానికి సాక్ష్యాలు ఉండాలి కదా అని వైసిపి అంటోంది. ఇక అసలైన సూత్రధారిగా చెబుతున్న రాజ్‌శేఖర రెడ్డి అజ్ఞాతం నుంచి ఒక ఆడియో పంపి ఆ కుంభకోణం గురించి తనకేమీ తెలియదని, తనపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డి సంగతి బయటపెడతానంటూ దానిలో పేర్కొన్నారు. మొత్తం మీద దీన్లో తేల్చేదేమిటో తెలియదు గానీ సిట్‌ దర్యాప్తు పూర్తి చేసి కేసు నమోదు చేసిన తరువాత మనీలాండరింగ్‌ గురించి ఇడి రంగంలోకి దిగుతుందని చెబుతున్నారు. మొత్తం మీద జనం సూపర్‌ సిక్స్‌ గురించి ఆలోచించకుండా ఇలాంటి విచారణ కబుర్లతో కాలక్షేపం చేసేందుకు బాగా పనికి వస్తుందని చెప్పవచ్చు ! పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి కుంభకోణ మొత్తం ఇప్పటికే తగ్గిపోయింది, చివరికి సున్నాగా తేలుతుందా, కూటమి ప్రభుత్వానికి చివరికి ఆయాసమే మిగులుతుందా ? డబ్బు కొట్టేయలేదని ఎవరూ చెప్పటం లేదు, ఎందుకంటే ప్రతి కుంభకోణం స్మార్డ్‌గా జరిగే రోజులివి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకాశానికి, బిజెపి అవకాశవాదానికి హద్దే లేదు :నాడు తెలంగాణాలో బండి సంజయ్‌, నేడు అన్నాడిఎంకె ఓట్ల కోసం అన్నామలై బలి !

13 Sunday Apr 2025

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP

≈ Leave a comment

Tags

AIADMK, BJP, BJP Appeasement, DMK, Narendra Modi, PMK, politics of iftar, SDPI, Tamilnadu Elections 2026, Tamilnadu politics


ఎం కోటేశ్వరరావు


తమిళనాడులో చరిత్ర పునరావృతమైంది. అధికారం కోసం మరోసారి అన్నాడిఎంకెతో బిజెపి ఎన్నికల ఒప్పందం చేసుకుంది.కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో 2025 ఏప్రిల్‌ 11న మైత్రీ బంధాన్ని ప్రకటించారు. ఈ కూటమికి అధికారం వస్తుందో రాదో తెలియదుగానీ ఈ పరిణామంతో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై పదవి మాత్రం పోయింది.అంటే అన్నారని అంటారు గానీ వీరశూర ప్రతిజ్ఞలు చేయాలని అతగాడిని ఎవరైనా కోరారా ? తెలంగాణా ఎలక్షన్‌ రెడ్డి(తూర్పు జగ్గారెడ్డి) మాదిరి గడ్డం ప్రతిజ్ఞ చేస్తే వేరు. డిఎంకె ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు తాను చెప్పులు ధరించేది లేదంటూ 2024 డిసెంబరు 28న తన ఇంటి ముందు ఆరుసార్లు కొరడా దెబ్బలు కొట్టుకొని పెద్ద ప్రదర్శన చేశారు. అదేమీ లేకుండానే 2025 ఏప్రిల్‌ 12న చెప్పులు వేసుకున్నారు.ఎందుకంటే అన్నాడిఎంకెతో కలసి బిజెపి విజయానికి ఇప్పటికే అమిత్‌ షా బాట వేసినందున నిరసన విరమించాలంటూ కొత్త అధ్యక్షుడు నాగేంద్రన్‌,కేంద్రమంత్రి ఎల్‌ మురుగన్‌, ఇతర నేతలు కలసి ఒక కార్యక్రమంలో చెప్పులు అందచేశారు. స్వయంగా పరువు తీసుకోవటం, విధి వైపరీత్యం అంటే ఇదే కదా ! అతగాడితో కలసి పని చేయటం తమకు అంగీకారం కాదని, రాష్ట్ర బిజెపి సారధిగా మరొకరిని పెట్టాలని అన్నాడిఎంకె విధించిన షరతుకు బిజెపి తలొగ్గింది. గతంలో అన్నాడిఎంకె నేతగా ఉన్న నైనార్‌ నాగేంద్రన్ను ఎంపిక చేసింది. 2019లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. తరువాత అన్నామలై బిజెపి అధ్యక్ష పదవి స్వీకరించిన తరువాత మాజీ సిఎం అన్నాదురై, జయలలిత, పళనిస్వామిని పదే పదే రెచ్చగొట్టే విధంగా విమర్శించారు. అతని వ్యాఖ్యలతో మైనారిటీల ఓట్లు పోతాయని కూడా అన్నాడిఎంకె భయపడిరది. ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైసిపిని ఓడిరచేందుకు ఉప్పు నిప్పుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజెపి చేతులు కలిపి విజయం సాధించటంతో అదే ఫార్ములాతో తమిళనాడులో కూడా గెలవాలని రెండు పార్టీల నేతలు కొంతకాలంగా ఆలోచనలు చేస్తున్నారు. అడ్డుగా ఉన్న అన్నామలైని తప్పించారు.

అధికారం వస్తుందంటే బిజెపి దేనికైనా సిద్దపడుతుంది. విలువలు, వలువల గురించి కబుర్లు చెప్పే ఆ పార్టీకి ఇతరులకు తేడా లేదు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను కొనసాగిస్తామని స్వయంగా ప్రకటించిన పార్టీ సరిగ్గా ఎన్నికలకు ముందు పదవి నుంచి తప్పించి కేంద్ర మంత్రి జి కిషన్‌ రెడ్డిని కూర్చోపెట్టింది. ఏడాదిన్నర కావస్తున్నా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోయింది. వ్రతం చెడ్డా ఫలందక్కలేదనట్లు బిజెపి పరిస్థితి తయారైంది. బండి సంజయ్‌ను తొలగించినా మిన్నువిరిగి మీద పడలేదు, ఇప్పుడు అన్నామలైని తొలగించినా అంతే. నోటి దురుసులో ఇద్దరూ ఇద్దరే. తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీకి అది తోకగా తయారైంది. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి మధ్యవర్తి పవన్‌ కళ్యాణ్‌ లాంటి వారెవరూ లేకపోతే నేరుగా కేంద్ర బిజెపి నాయకత్వం బేరం కుదుర్చుకుంది. ఇటీవల ఆమోదించిన వక్ఫ్‌ చట్ట సవరణను వ్యతిరేకించిన వారిని ముస్లిం సంతుష్టీకరణ పార్టీలుగా వర్ణించింది. వాటిలో అన్నాడిఎంకె ఒకటి. శుభకార్యానికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు ఇప్పుడు బిజెపి నేతలను చంకనెక్కించుకొని ముస్లింల ఓట్లను అర్ధించటం ఆ పార్టీకి పెద్ద పరీక్ష. సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డిపిఐ)ని ఉగ్రవాద పార్టీ అని బిజెపి వర్ణించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె మద్దతుతో అది ఒక స్థానానికి పోటీ చేసింది. ఇప్పుడు ఎస్‌డిపిఐ కూటమిలో భాగస్వామిగా కొనసాగితే బిజెపి దాని అభ్యర్థులను ఎలా బలపరుస్తుంది, సమర్ధిస్తుందన్నది ప్రశ్న.ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు ! మమ్మల్ని విమర్శించే వారేమైనా నాలుగు ఓట్లు వేయిస్తారా, ఒకటో అరో సీటు తెప్పిస్తారా !! అనుకున్నట్లుగా ఉంది. రాష్ట్రానికి పాచిపోయిన లడ్లు ఇచ్చారంటూ ధ్వజమెత్తి వాటినే మహాప్రసాదంగా స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌ మాదిరి అన్నాడిఎంకె నేత పళనిస్వామి కూడా తమిళనాడుకు బిజెపి చేసిన అన్యాయాల గురించి నిన్నటి వరకు ధ్వజమెత్తారు. ఆకస్మికంగా అదే పార్టీతో చేతులు కలిపితే తమిళ తంబీలు ప్రశ్నించకుండా ఉంటారా ? అంతకు ముందు బిజెపితో కలసి ఉన్నపుడు సంకీర్ణ ధర్మంగా సిఏఏను సమర్ధించామని విడిపోయిన తరువాత విమర్శించామని చెప్పుకున్న ఆ పెద్దమనిషిని మైనారిటీలు నమ్ముతారా ? అదే తర్కం ప్రకారం కొద్ది రోజుల క్రితం వ్యతిరేకించిన వక్ప్‌ చట్టానికి ఇప్పుడు జైకొట్టరనే హామీ ఏమిటి ?సినిమా నటుడు విజయ్‌ నాయకత్వంలోని టివికె పార్టీతో చేతులు కలపాలని తొలుత అన్నాడిఎంకె భావించి పావులు కదిపింది. విజయ్‌ అంగీకరించకపోవటంతో స్వంతంగా డిఎంకెను ఓడిరచలేమని గ్రహించి బిజెపిని కలుపుకుంది. బిజెపితో తెగతెంపులు చేసుకున్నా 2024లో మైనారిటీల ఓట్లు రాలేదని అందువలన తిరిగి ఆ పార్టీతో చేతులు కలిపినా నష్టం లేదన్నది అన్నాడిఎంకె అంతర్గత ఆలోచన అని కూడా చెబుతున్నారు.

ఐపిఎస్‌ అధికారి అన్నామలై (40) 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి 2020 బిజెపిలో చేరారు, 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే పోలీసు అధికారిగా పనిచేశారు. బిజెపిలో చేరగానే ఇతర పార్టీల తోలువలిచి, తాటతీసే మొనగాడిగా సింహం అంటూ ప్రచారం సాగించారు.2024లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరులో డిఎంకె చేతిలో ఓడిపోయారు. కొంగు ప్రాంతంలో బలమైన గౌండర్‌ సామాజిక తరగతిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అన్నాడిఎంకె నేత ఎడప్పాడి కె పళనిస్వామి కూడా అదే ప్రాంతం, అదే సామాజిక తరగతికి చెందిన వ్యక్తి. అన్నామలై బిజెపి అధ్యక్షుడిగా ఉంటే పొత్తు ఉండదని కరాఖండితంగా చెప్పటంతో బిజెపి అగ్రనాయకత్వం దిగిరాక తప్పలేదు. కేంద్ర పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇస్తామని అమిత్‌ షా గట్టిగా చెప్పలేదు, మా గురించి మీకెందుకు ఆందోళన అంటూ విలేకర్లను ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ ఆ హోదాతో తమిళనాడులో చక్రం తిప్పాలనుకుంటే పళనిస్వామి అంగీకరిస్తారా అన్నది అనుమానమే. పార్టీ పదవి నుంచి తొలగించటాన్ని అన్నామలై అభిమానులు వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు. అన్నాడిఎంకెతో పొత్తు వార్తలు వెలువడిన సమయంలో ఉద్వాసన ఖాయమని తేలటంతో విధిలేక తాను మరోసారి రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయటం లేదని ప్రకటించారు.
2024లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె,బిజెపి విడివిడిగా పోటీ చేశాయి.ఈ రెండు కూటముల ఓట్లు కలిస్తే 13లోక్‌సభ నియోజకవర్గాలలో మెజారిటీ వచ్చిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ముందుగానే ఒప్పందం చేసుకొని కలసి పోటీ చేస్తే అధికారం ఖాయమనే అభిప్రాయంతో అవి కలిశాయి.లోక్‌సభ ఓటింగ్‌ వివరాలను చూసినపుడు త్రిముఖ పోటీ జరిగింది. డిఎంకె నాయకత్వంలోని కూటమి మొత్తం 39 స్థానాలను గెలుచుకుంది.ఇండియా కూటమికి 46.97, అన్నాడిఎంకె కూటమి 23.05, బిజెపి కూటమి 18.28,ఎన్‌టికె అనే ప్రాంతీయ పార్టీ 8.2శాతం చొప్పున ఓట్లు పొందాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ చూస్తే మొత్తం 234కు గాను ఇండియా కూటమి 221, అన్నాడిఎంకె 10, బిజెపి కూటమి మూడు సీట్లలో మెజారిటీ తెచ్చుకున్నాయి. అయితే బిజెపికి ఒక్క సీటులోనూ మెజారిటీ రాలేదు, దానితో కలసి పోటీ చేసిన పిఎంకె మూడు చోట్ల ఆధిక్యత కనపరిచింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ తమిళనాడును ఏడుసార్లు సందర్శించినా ఫలితం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం,జనసేన, బిజెపి పరస్పరం ఎలా తిట్టుకున్నాయో 2019 ఎన్నికల్లో చూశాము. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అనుసరించిన అప్రజాస్వామిక, కక్షపూరితమైన, బిజెపికి లంగుబాటు వైఖరిని, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయటం వంటి తీరును డిఎంకె నేత ఎంకె స్టాలిన్‌ అనుసరించలేదు. అన్నింటికీ మించి తమిళనాడుకు చేసిన అన్యాయం, డీలిమిటేషన్‌, హిందీని బలవంతంగా రుద్దేందుకు పూనుకున్న బిజెపిని ఎలాంటి తొట్రుపాటు లేకుండా వ్యతిరేకించి ఎండగడుతున్నారు.అందువలన ఆంధ్రప్రదేశ్‌ మాదిరి ఫలితాలను ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. ప్రముఖ హీరో విజయ్‌ స్వంత దుకాణం పెట్టుకొని బిజెపి, ఇండియా కూటమి రెండిరటినీ వ్యతిరేకిస్తానని ప్రకటించాడు. అన్నాడిఎంకె నుంచి ఉద్వాసనకు గురైన పన్నీర్‌ సెల్వం,టిటివి దినకరన్‌ వంటి వారు ఏ వైఖరి తీసుకుంటారో వెల్లడి కాలేదు. డీలిమిటేషన్‌, భాషా సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అన్నాడిఎంకె, బిజెపి మిత్రపక్షమైన పిఎంకె కూడా మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు బిజెపితో కలసి ఈ పార్టీలు ఈ అంశాలపై జనానికి ఏం చెబుతాయన్నది ప్రశ్న. ఇలాంటి తలనొప్పులు ఇండియా కూటమి పార్టీలకు లేదు. ఒకే మాట, బాటలో నడుస్తున్నాయి. వీటిని వ్యతిరేకించే పార్టీలకు డిఎంకెను గద్దె దించటం తప్ప ఎలాంటి భావసారూప్యత లేదు.


ఇతర పార్టీల వారు ఇప్తార్‌ పార్టీలకు వెళితే ముస్లింలను సంతుష్టీకరించేందుకు అని బిజెపి దాడి చేస్తుంది. మరి అదే పార్టీ ఈ ఏడాది ఏకంగా ఇప్తార్‌ విందు ఏర్పాటు చేసింది, ఎందుకు అంటే తమకు అందరూ ఒకటే అని చెప్పింది. దీన్నే తాము చేస్తే సంసారం, ఎదుటివారు చేస్తే వ్యభిచారం అంటారు. అన్నాడిఎంకెతో చేతులు కలపటం గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే అన్నామలై ఏర్పాటు చేసిన ఇప్తార్‌ విందుకు బిజెపి మిత్రపక్ష నేతలైన మాజీ సిఎం పన్నీర్‌ సెల్వం, టిటివి దినకరన్‌ తదితర నేతలు హాజరయ్యారు. ఇప్తార్‌ విందు కేవలం ప్రారంభం మాత్రమే, మేమంతా కలసి కూర్చుని ఐక్యమై తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అదే విందుకు వచ్చిన మాజీ తెలంగాణా గవర్నర్‌ తమిళశై సౌందర్‌రాజన్‌ అన్నారు.తనకు అధికారమిస్తే ఇప్తార్‌తో పాటు దీపావళి, క్రిస్మస్‌ విందులను అధికారికంగా ఇస్తానని అన్నామలై చెప్పుకున్నాడు. ఇతర బిజెపి అధ్యక్షుడు ఎవరైనా ఇప్తార్‌ ఇచ్చారా అని విలేకర్లతో గొప్పగా చెప్పుకున్నాడు. అర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ముస్లిం నేషనల్‌ ఫోరమ్‌ దేశవ్యాపితంగా ఇప్తార్‌ విందులు ఇస్తామని గతంలో ప్రకటించింది.రెండు కత్తులు ఒకే వరలో ఇమడవు అన్నట్లు, ఒకే సామాజిక తరగతి, ఒకే ప్రాంతానికి చెందిన నేతలు కూడా అంతే. దీనికి తోడు అన్నామలై 2023లో మాజీ సిఎం అన్నాదురై, జయలలిత, పళనిస్వామి గురించి చేసిన వ్యాఖ్యలు అప్పుడు అన్నాడిఎంకె వేరుపడటానికి కారణమైతే ఇప్పుడు అతగాడిపదవికి ఎసరు తెచ్చినట్లు చెబుతున్నారు. అప్పుడు అన్నామలై బిజెపి నేతలకు కొత్తదేవుడిగా కనిపించటంతో అన్నాడిఎంకెను వదులుకొనేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మోజు రింది గనుక అదే పార్టీతో చేతులు కలిపేందుకు పక్కన పెట్టారు. ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్నది పెద్ద ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అదానీ-జగన్‌ రెడ్డి ముడుపుల చెలగాటం : ఇరకాటంలో నరేంద్రమోడీ-చంద్రబాబు !

22 Friday Nov 2024

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, tdp, TDP, USA, Ycp

≈ Leave a comment

Tags

Adani bribery, Adani Group, BJP, CHANDRABABU, Gautam Adani Devised Bribery Scheme, Narendra Modi Failures, Solar Power, YS jagan

ఎం కోటేశ్వరరావు


వివాదాస్పద పారిశ్రామిక, వాణిజ్యవేత్త గౌతమ్‌ అదానీ పరివారపు లంచాల బాగోతం బట్టబయలైంది. హరిత ఇంథన కొనుగోళ్ల వ్యవహారంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్నవారికి 26.5 కోట్ల డాలర్ల మేరకు ముడుపులు చెల్లించిందని రెండు కేసులు దాఖలయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్‌ కోర్టులో నవంబరు 20న ఒక కేసును న్యాయశాఖ, మరో కేసును సెక్యూరిటీలు మరియు ఎక్సేంజ్‌ల నియంత్రణ సంస్థ వేసింది. ముడుపుల మొత్తంలో సింహభాగం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ముట్టిందని చెబుతున్నారు. అసలు తమ నేత అదానీ కంపెనీలతో ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకి)తో డిస్కామ్‌ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఒక ప్రభుత్వరంగ సంస్థ ఎక్కడైనా లంచాలు ఇస్తుందా అని వైసిపి ఒక ప్రకటనలో అమాయకత్వాన్ని ప్రదర్శించింది. అమెరికా కోర్టులో దాఖలు చేసిన కేసుల పత్రాలలో పేర్కొన్నదాని మేరకు సంక్షిప్తంగా వివరాలు ఇలా ఉన్నాయి.తాను స్వంతంగా లేదా ప్రయివేటు సంస్థలు ఉత్పత్తి చేసిన హరిత విద్యుత్‌ను సెకి కొని అవసరమైన వారికి విక్రయిస్తుంది. ఆ మేరకు 2019 డిసెంబరు, 2020 జూలై మధ్య కాలంలో కేంద్ర పునరుత్పాదక ఇంథన మంత్రిత్వశాఖ కంపెనీ సెకి ద్వారా అదానీ కంపెనీ, మరో అమెరికా కంపెనీ అజూర్‌ పవర్‌ నుంచి పన్నెండు గిగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు అంగీకరించింది.దానిలో అదానీ ఎనిమిది, అమెరికా కంపెనీ నాలుగు గిగావాట్లు సరఫరా చేయాల్సి ఉంది. విద్యుత్‌ను నిలువ చేయటానికి వీలుండదు గనుక తమ దగ్గర నుంచి కొనుగోలు చేసే వారి కోసం సెకి ప్రయత్నించింది. ఒప్పందాలు చేసుకుంటేనే సదరు కంపెనీలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.


అసలు కథ ఇక్కడి నుంచి ప్రారంభమైంది.అమెరికా న్యాయశాఖ ఆరోపించిన మేరకు గౌతమ్‌ అదానీ, అతగాడి మేనల్లుడు సాగర్‌ అదానీ, వినీత్‌ జైన్‌ మరో ఐదుగురు రాష్ట్రాలలో ఉన్న పాలకులు, అధికారులకు ముడుపుల బాగోతానికి తెరతీశారు. అమెరికా, ఇతర దేశాల నుంచి అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టే వారికి తెలియకుండా ఈ అక్రమాన్ని దాచి అమెరికా చట్టాల ప్రకారం మోసం చేశారు. సెకి నుంచి ఎవరైనా విద్యుత్‌ను కొనుగోలు చేస్తేనే అదానీ, అమెరికా కంపెనీలు ముందుకు పోవాల్సి ఉంటుంది. అయితే సెకి ధర ఎక్కువగా ఉండటంతో భారీ మొత్తంలో విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలేవీ ముందుకు రాలేదు.అదానీ, అమెరికా కంపెనీల పెద్దలు కూర్చుని రాష్ట్రాలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలంటే ఆయా రాష్ట్రాల నేతలు, అధికారులకు తామే ముడుపులు చెల్లించి సెకితో ఒప్పందాలు చేయించాలని పథకం వేశారు. దాని ప్రకారమే అంతా జరిగింది. అమెరికా కేసులో దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని, గౌతమ్‌ అదానీ అందుకోసమే కలిశారన్నది ఆరోపణ. ఆ తరువాతే 2021 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు సెకీతో ఒప్పందాలు చేసుకున్నాయని చెబుతున్నారు. అంటే ముడుపుల బేరసారాలకే వారి కలయిక అన్నది స్పష్టం.

ఇక ఈ ఒప్పందం గురించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తాజాగా అధికారంలోకి వచ్చిన తరువాత విడుదల చేసిన శ్వేత పత్రాల సందర్భంగా చెప్పిందేమిటి ? సెకి నుంచి యూనిట్‌కు రు.2.49 చొప్పున ఏడువేల మెగావాట్లు ఆంధ్రప్రదేశ్‌ కొనుగోలు చేసింది. మూడువేల మెగావాట్లు 2024సెప్టెంబరు నుంచి, మరో మూడువేల మెగావాట్లు 2025 సెప్టెంబరు, మిగిలిన వెయ్యి 2026 సెప్టెంబరు నుంచి సరఫరా చేయాలి. అయితే ఒప్పంద సమయంలో మార్కెట్లో యూనిట్‌ ధర రు.1.99 మాత్రమే ఉందని, సెకితో ఒప్పందం వలన ఏటా వినియోగదారులపై రు.850 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లకు విద్యుత్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేందుకు చెల్లించాల్సిన సరఫరా ఛార్జీల భారాన్ని ఏటా మూడు నుంచి మూడున్నరవేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని, ఇవన్నీ కలుపుకుంటే ఒప్పంద గడువు పాతిక సంవత్సరాలలో 62వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. దీని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (పార్టీ ద్వారా విడుదల చేసిన ప్రకటన) ఏమంటున్నారు ?


గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం యూనిట్‌ ధర రు.5.10కి చేరింది. ఈ భారాన్ని తగ్గించేందుకు పదివేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ తయారీకి జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.దాన్లో భాగంగా 2020 నవంబరులో 6,400 మెగావాట్లకోసం ఏపి గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా టెండర్లు పిలిచింది.యూనిట్‌ రు.2.49, 2.58 చొప్పున సరఫరా చేసేందుకు 24 టెండర్లు వచ్చాయి. అయితే న్యాయపరమైన సమస్యలతో వాటిని రద్దు చేసింది. ఆ తరువాత యూనిట్‌ ధర రు.2.49కి సరఫరా చేసేందుకు సెకి ముందుకు వచ్చింది.అది 2019 జూన్‌లో ఒప్పందాలను కుదుర్చుకున్న సంస్థల నుంచి సరఫరా చేస్తుంది. విద్యుత్‌ సరఫరా చార్జీలను మినహాయించేందుకు సెకి అంగీకరించింది. దీని వలన ఏటా రాష్ట్రానికి రు.3,700 కోట్ల మేర ఆదా అవుతుంది. చంద్రబాబు నాయుడు విద్యుత్‌ సరఫరా ఛార్జీల భారం రాష్ట్రం మీద పడుతుందని అంటే జగన్మోహనరెడ్డి లేదని చెబుతున్నారు. ఏది వాస్తవమో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి, ఒప్పంద పత్రాలను జనాల పరిశీలనకు అందుబాటులో ఉంచాలి. అప్పుడే నిజం తెలుస్తుంది.


అమెరికాలో దాఖలైన కేసు జగన్‌మోహనరెడ్డి లేదా ఇతర రాష్ట్రాలలో ఒప్పందం చేసుకున్నవారి మీద కాదు. అమెరికా, అంతర్జాతీయ మదుపుదార్లను ముడుపుల గురించి మభ్యపెట్టి అదానీ కంపెనీ మోసం చేసినదాని గురించి మాత్రమే. సూదికోసం సోదికి పోతే పాత గుట్టంతా రట్టయినట్లుగా ఈ క్రమంలో ముడుపుల బాగోతం బయటపడిరది. అదానీ అండ్‌ కో మొత్తం 26.5 కోట్ల డాలర్లు(మన కరెన్సీలో రు.2,209 కోట్లు) ముడుపులుగా ఇచ్చారని, ఈ మొత్తంలో రు.1,750 కోట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఒప్పించటానికి ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ముడుపులకు ఒప్పించిన తరువాత ఒడిషా, జమ్ము అండ్‌ కాశ్మీరు, తమిళనాడు, చత్తీస్‌ఘర్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. సెకి ఒప్పందాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అదానీ సంస్థ ఏడువేల మెగావాట్లు, అమెరికా సంస్థ 650 మెగావాట్లను మిగిలిన నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ముడుపుల గురించి దర్యాప్తు చేసేందుకు పూనుకున్న ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించినట్లు అమెరికన్‌ ఎఫ్‌బిఐ(మన సిబిఐ వంటిది) అధికారి ఫిర్యాదు చేశాడు.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సెకి ఒప్పందం కుదుర్చుకోక ముందు 2021 ఆగస్టులో సిఎం జగన్‌మోహన రెడ్డితో గౌతమ్‌ అదానీ వ్యక్తిగతంగా కలిసినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముడుపులు చెల్లించటం లేదా ఇచ్చేందుకు అదానీ వాగ్దానం చేసినట్లు, ఆ కారణంగానే ఒప్పందం చేసుకున్నట్లు అమెరికా సెక్యూరిటీస్‌ సంస్థ దాఖలు చేసిన కేసు 80, 81పేరాలలో పేర్కొన్నది. అదానీ గ్రీన్‌ మరియు అజూర్‌ పవర్‌ అంతర్గత వర్తమానాలలో సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలుకు అంగీకరించింది అనే సమాచారం ఉన్నట్లు మరోమాటలో చెప్పాలంటే ముడుపులు చెల్లించటం లేదా వాగ్దానం పనిచేసినట్లు కూడా పేర్కొన్నది. ఒక మెగావాట్‌కు రు.25లక్షలు చెల్లించేట్లు ఆ మొత్తం రు.1,750 కోట్లని, అదానీ కంపెనీ అంతర్గత రికార్డుల్లో ఉన్న అంశం దీనికి దగ్గరగా ఉందని కూడా చెప్పింది. ఇవన్నీ తమ మీద చేసిన నిరాధార ఆరోపణలు మాత్రమేనని, నేరం రుజువయ్యేవరకు నిందితులుగానే పరిగణించాలని అదానీ కంపెనీ వివరణ ఇచ్చింది.


అమెరికా కోర్టులో దాఖలైన కేసుల్లో ఏమి తేలుతుందో తెలియదు, అదానీ కంపెనీల మీద 2023లో హిండెన్‌బర్గ్‌ సంస్థ వెల్లడిరచిన నివేదిక, కొన్ని దేశాల్లో అదానీ కంపెనీల బాగోతాలు చూసిన తరువాత విదేశాల్లో మన గురించి ఒక చెడు అభిప్రాయం ఏర్పడిరదన్నది వాస్తవం. ఈ ఉదంతాల గురించి అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినందున ప్రతి వారి నోళ్లలో మనదేశం నానుతున్నది. ప్రభుత్వరంగ సంస్థ సెకి విద్యుత్‌ను అమ్మే స్థితిలో లేదన్న సందేశం, అందుకోసమే ప్రయివేటు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ నేతలకు ముడుపులు ఇచ్చినట్లు తాజా ఉదంతంతో వెల్లడైంది. విదేశాలు తిరిగి ప్రతిష్టను పెంచానని చెప్పుకున్న నరేంద్రమోడీ అదానీ కంపెనీల మీద వచ్చిన ఆరోపణల గురించి పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. శ్రీలంక ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అక్కడ విద్యుత్‌ ప్రాజెక్టును అదానీకి ఇప్పించారని వచ్చిన వార్తల గురించి చెప్పనవసరం లేదు. గతంలో హిండెన్‌బర్గ్‌ సంస్థ ముందుకు తెచ్చిన ఆరోపణల నిగ్గుతేల్చేందుకు పార్లమెంటరీ కమిటీ వేయాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఎందుకంటే అది తన లబ్దికోసం పనిచేసే ప్రైవేటు సంస్థ అంటూ కొట్టివేశారు. సెబిపేరుతో విచారణను నీరుగార్చారు. ఇప్పుడు అమెరికా అధికారిక సంస్థలే కేసులు దాఖలు చేసినందున మోడీ సర్కార్‌ గతంలో మాదిరి తప్పించుకుంటుందా ?


ఈ ఉదంతం గురించి పూర్తి వివరాలు తెలియవని, విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ రాష్ట్రాల నేతలకు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చినందున కేంద్రమే దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. ఈ ఉదంతంలో నరేంద్రమోడీచంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడినట్లు చెప్పవచ్చు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్‌మోహనరెడ్డి పట్ల ఎలాంటి సానుభూతి లేకున్నా, ముడుపులు ఇచ్చినట్లు చెబుతున్నది అదానీ గనుక విచారణ గురించి చంద్రబాబు పట్టుబడతారా అన్నది సందేహమే. ఎవరు అవునన్నా కాదన్నా మోడీఅదానీ బంధం గురించి తెలిసిందే. గతంలో తాను చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చినందున ఆ సంబంధాలతో అదానీ అండ్‌కోను బయటపడవేయిస్తే ఇక్కడ జగన్మోహనరెడ్డిని రక్షించినట్లే గాక సచ్చీలుడని అంగీకరించాల్సి ఉంటుంది. అదానీ కంపెనీల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆశిస్తున్న చంద్రబాబు మాట మాత్రంగా విచారణ జరపాలన్నారు తప్ప అంతకు మించి మాట్లాడకపోవచ్చన్నది ఒక అభిప్రాయం. గతంలో వైసిపి ప్రభుత్వం అదానీ కంపెనీతో చేసుకున్న విద్యుత్‌ మీటర్ల ఒప్పందాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం దాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకుంది. సెకి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే విద్యుత్‌ సమస్య తలెత్తవచ్చనే సాకు చూపి కొనసాగించవచ్చు. కేంద్రం తీసుకొనే నిర్ణయం, ప్రతిపక్షాలు ఈ సమస్యను ముందుకు తీసుకుపోయే తీరు తెన్నులను చూసిన తరువాత చంద్రబాబు వైఖరి నిర్ణయం కావచ్చు. అవినీతి అక్రమాలను నిలదీస్తా, తాట వలుస్తా అని గతంలో బీరాలు పలికిన జనసేన నేత పవన్‌ కల్యాణ్‌కూ ఇది పరీక్షే. అమెరికాకూ ఇది ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి.అక్కడి న్యాయశాఖ, ఆర్థికలావాదేవీల నియంత్రణ సంస్థ దాఖలు చేసిన కేసులు వీగిపోతే అవినీతిని సహించదనే దాని ప్రతిష్టకు భంగం కలుగుతుంది. మొత్తం మీద ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తిని రేకెత్తిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లడ్డు రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టికాయలు : లీకు వీరుడు చంద్రబాబు పప్పులో కాలేశారా ?

02 Wednesday Oct 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, TDP, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Narendra Modi, Pawan kalyan, Tirupati Laddu Controversy, YS jagan

ఎం కోటేశ్వరరావు


లడ్డు కల్తీ ఉదంతంలో దోషులుగా ఎవరు తేలతారో, ఏ శిక్షలు అనుభవిస్తారో ఆ భగవంతుడికే ఎరుక. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారవుతుందా అన్నది ఒక అనుమానం. కానీ తిరుమల శ్రీనివాసుడితో నిమిత్తం లేకుండా సుప్రీం కోర్టులో దాఖలైన పలు కేసులు, ఈ వివాదం నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. కల్తీ గురించి దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వ వేసిన సిట్‌ సరిపోతుందా లేక మరొక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అవసరమో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలంటూ అక్టోబరు మూడవ తేదికి కోర్టు వాయిదా వేసింది. కేంద్రం ఏమి చెబుతుందో కోర్టు ఏమి నిర్ణయిస్తుందో తెలియదు. అయితే అప్పటి వరకు సిట్‌ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. నిజానికి సిట్‌ దర్యాప్తు నిలిపివేయాలని కోర్టు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే నష్టనివారణ చర్యగా కనిపిస్తున్నది. లడ్డూలలో వాడే నేతిలో కల్తీ ఉందంటూనే దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఇచ్చిన నివేదికలో ఎన్‌డిడిబి లాబ్‌ తన జాగ్రత్తలు తాను తీసుకుంది. దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మార్చి జగన్మోహన్‌ రెడ్డిని మరింతగా దెబ్బతీయవచ్చని ఎవరైనా సలహా ఇచ్చారో లేక తనంతట తానే నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ లాబ్‌ నివేదికను బహిర్గతం చేసి చంద్రబాబు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. దాని గురించి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని ఇరకాటంలోకి నెట్టాయి. లడ్డూలో కల్తీకి పరిహారంగా లడ్డు పోటు, ఇతర ప్రాంతాలను ఆలయం శుద్ది చేసింది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏకంగా తానేమీ తక్కువ కాదన్నట్లు పదకొండు రోజుల దీక్ష పేరుతో చేసిన హడావుడి చూశాము. కల్తీ గురించి సిట్‌ వేసినపుడు దాని నివేదిక రాకుండా ముందుగానే ఉన్నట్లు కల్తీ గురించి సిఎం ఎలా ప్రకటిస్తారు ? అంటే మీకే స్పష్టత లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కోట్లాది మంది మనోభావాల మీద ప్రభావం చూపే అంశాలను నిర్ధారించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాట్లాడటం సరికాదని, దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని కూడా వ్యాఖ్యానించింది. అనేక కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తీర్పుల్లో కనిపించవు. ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియదు.


నెయ్యి కల్తీ నివేదిక గురించి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత ప్రతికూల స్పందనలు రావటంతో కొంత మంది కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. అసలు చంద్రబాబు నివేదికను బయటపెట్టాలనుకోలేదని, వందరోజుల పాలన సందర్భంగా ఎంఎల్‌ఏతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఎన్‌డిడిబి నివేదికను యథాలాపంగా ప్రస్తావించారని చెబుతున్నారు. దాన్ని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి సవాలు చేయటంతో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ సదరు నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని సమర్ధించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి లీకు వీరుడు అనే మారు పేరు ఉంది. అనేక అంశాలను కావాలనే వేరే మార్గంలో బయటపెట్టించి స్పందనను బట్టి దాన్ని వాడుకోవటం అలవాటు. గతంలో ప్రపంచ బ్యాంకు పధకాలను అమలు చేసే క్రమంలో వాటికి జనం మద్దతు కూడగట్టటం కోసం ఏ శాఖలో ఎంత అవినీతి ఉందో అనే సర్వేలు చేయించి వాటిని మీడియాకు అందచేసిన తీరు జనం మరచిపోయినా అది వాస్తవం. ఇప్పుడు లడ్డూ కల్తీలో ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. ఇప్పుడు ఒకవేళ సుప్రీం కోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించితే దాని మీద స్పందన ఎలా ఉంటుందో తెలియదు. అలాగాక ఇప్పుడు వేసిన సిట్‌ను కొనసాగిస్తే ముందే కల్తీ గురించి సిఎం చెప్పిన తరువాత దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వటం తప్ప వేరే ఏముంటుందని జనం భావిస్తారు. ఒకవేళ సిబిఐ విచారణ జరిపితే మూడు పార్టీల కూటమికి అనుకూలంగా దాని నివేదిక ఉంటుందని కూడా అదే జనం భావిస్తారు. విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది.


దేశ రాజకీయాల మీద చంద్రబాబు చూపిన ప్రభావం గురించి గతంలో ఎన్నో చెప్పుకున్నాం, ఇప్పుడు పలు దేవాలయాల్లో ప్రసాదాల మీద కూడా ‘‘ ప్రభావం ’’ చూపారని వార్తలు. అదేమిటంటే భక్తులు ప్రసాదాల పట్ల ముఖ్యంగా లడ్డుపట్ల అనుమానంగా చూస్తున్నారట. మీడియాలో వచ్చిన వివరాలను బట్టి బయటి సంస్థలు సరఫరా చేసే ప్రసాదాల మీద పూర్తి నిషేధం విధించాలని అయోధ్యలోని రామజన్మ భూమి దేవాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ డిమాండ్‌ చేశారు. తయారీ, పంపిణీలో మార్పులు తేవాలని, ఆలయ పూజారుల పర్యవేక్షణలో తయారు చేయాలని కోరారు. దేవాలయాల్లో వినియోగిస్తున్న నెయ్యి స్వచ్చత పట్ల ఆందోళన వెల్లడిరచారు. నైవేద్యాలలో కల్తీ ద్వారా దేవాలయాలను అపవిత్రం చేయాలన్న అంతర్జాతీయ కుట్ర ఉందని ఆరోపించారు.వాణిజ్య పద్దతిలో తయారు చేసే తీపి పదార్ధాల బదులు పండ్లు, పూల వంటి సహజ వస్తువులతో ప్రసాదాలను తయారు చేయాలని మధుర లోని ధర్మ రక్ష సంఫ్‌ు ప్రకటించింది. సంస్థ జాతీయ అధ్యక్షుడు సౌరవ్‌ గౌర్‌ మాట్లాడుతూ ప్రసాదాల తయారీలో మార్పులు తేవాలని, తిరిగి సాంప్రదాయ పద్దతులకు మరలాలని సంస్థలు, మత నేతలలో ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. సంగం నగరంగా పిలుస్తున్న ప్రయాగ్‌ రాజ్‌ (గతంలో అలహాబాదు) అలోప్‌ శంకరిదేవి, బడే హనుమాన్‌, మంకమేశ్వర వంటి వాటితో సహా అనేక దేవాలయాల్లో భక్తులు తెచ్చే స్వీట్లు తదితర పదార్ధాలను అర్పణలకు అనుమతించకుండా నిషేధించారు. లలితా దేవి ఆలయ ప్రధాన పూజారి శివమూర్తి మిశ్రా మాట్లాడుతూ భక్తులు కేవలం కొబ్బరి కాయలు, పండ్లు, ఎండిన పండ్లు మాత్రమే తేవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వెల్లడిరచారు.స్వీట్ల స్వచ్చత నిరూపితమయ్యే వరకు వాటిని దేవాలయాల్లో అనుమతించకూడదని లక్నోలోని మంకమేశ్వర దేవాలయ మహంత్‌ శ్రీధరానంద బ్రహ్మచారి జీ మహరాజ్‌ చెప్పారు. వెలుపలి నుంచి భక్తుల ప్రసాదాలు, సీట్లను అనుమతించేది లేదని అలోప్‌ శంకరీదేవి దేవాలయ ప్రధాన పూజారి, శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి కార్యదర్శి యమునా పూరీ మహరాజ్‌ ప్రకటించారు. సంగం తీరంలోని బడే హనుమాన్‌ మహంత్‌ బల్బీర్‌ జి మహరాజ్‌ మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణ నిర్మాణం పూర్తయిన తరువాత లడ్డుపేడ ప్రసాదాలను యాజమాన్యమే తయారు చేయనుందన్నారు.పక్కా హిందూత్వవాది యోగి పాలనలోనే పరిస్థితి ఇలా ఉంది.మధ్య ప్రదేశ్‌లోని సేహోర్‌లోని ప్రముఖ వింధ్యవాసినీ బీజాసన్‌ దేవీ దేవాలయ ప్రాంగణంలో స్వయం సహాయక బృందం విక్రయిస్తున్న లడ్డుల విక్రయాన్ని నిలిపివేయాలని ట్రస్టు సభ్యులు జిల్లా కలెక్టకర్‌కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. లడ్లు వాసన వస్తున్నాయని, రుచిలో తేడా ఉందని భక్తులు చెబుతున్నారని ట్రస్ట్‌ చైర్మన్‌ మహేష్‌ ఉపాధ్యాయ చెప్పారు. ఈ దేవాలయం భోపాల్‌కు 70కిలో మీటర్ల దూరంలో ఉంది.అయితే తాను సదరు స్వయం సహాయక బృందంతో మాట్లాడానని సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ చెప్పారు.

మన దేశంలో ప్రసాదాల గురించి భక్తులు అనుమానించటం కొత్తేమీ కాదు. వాటిని సరఫరా చేసే వారు లేదా తయారీకి ఉపయోగించే సరకులు కల్తీ లేదా నాసిరకంగా ఉంటున్నాయని గతంలో అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. నెయ్యి కల్తీ గురించి నాటి కలకత్తాలో వచ్చిన ఆరోపణల గురించి స్పెక్టేటర్‌ అనే పత్రిక 1886 సెప్టెంబరు 25వ తేదీ సంచికలో రాసింది. ఒక చట్టాన్ని చేయాలని భక్తులు కోరినట్లు దానిలో పేర్కొన్నది. నెయ్యిలో పంది, ఆవు కొవ్వు, ఇతర జంతువుల మాంసాలలో ఉన్న కొవ్వు కల్తీ జరుగుతున్నట్లు విశ్లేషణలో పేర్కొన్నది. తరువాత కలకత్తాలో నెయ్యి వ్యాపారం చేసే మార్వాడీలు నెయ్యిలో కల్తీ చేస్తున్న కారణంగా ఒక నాటికి బెంగాలీ జాతే అంతరించి పోతుందంటూ 1917లో ఒక పత్రికలో వచ్చిన వార్త ఆందోళనకు దారితీసింది.దాంతో మార్వాడీ అసోసియేషన్‌ నెయ్యి గోడవున్ల వద్దకు వెళ్లి 67నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా కేవలం ఏడు మాత్రమే స్వచ్చంగా ఉన్నట్లు తేలింది. దాంతో వేలాది మంది కలకత్తా బ్రాహ్మలు హుగ్లీ నది(బెంగాల్లో గంగానది పేరు) తీరాన హోమాలు చేసి కల్తీ నెయ్యి ఆరగించినందుకు ప్రాయచిత్తం, శరీరాలను శుద్ది చేసుకున్నారు. దాంతో మార్వాడీ అసోసియేషన్‌ కల్తీ చేసిన వారిని గుర్తించి వారి వద్దనుంచి జరిమానాల రూపంలో రు.75వేలు వసూలు చేసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనంలో గడ్డి భూములను కొనుగోలు చేసినట్లు ప్రకటించటంతో బ్రాహ్మలు శాంతించారట. అందువలన దేశంలో నెయ్యి కల్తీ వివాదం తిరుపతితోనే ప్రారంభమైందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే వ్యాపారంలాభం ఉంటుందో అక్కడ అవినీతి కూడా తోడుగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. వ్యాపారం చేస్తూ కల్తీ చేసేవారు, వినియోగించేవారు కూడా హిందువులే, ఎక్కడన్నా ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉంటే ఉండవచ్చు. నెయ్యి అంటే ఒక్క ఆవు, గేదె(బర్రె) పాలనుంచే కాదు, గొర్రెలు, మేకలు, ఒంటె పాల నుంచి కూడా తయారు చేస్తారు. శాస్త్రీయ పరీక్షలు అందుబాటులో లేని కాలంలో నెయ్యిని చేతిలో వేసుకొని నలపటం, వాసన చూడటం ద్వారా కల్తీ జరిగిందీ లేనిదీ చెప్పేవారటు. శాస్త్రీయ పరీక్షలు వచ్చిన తరువాత కూడా అనుసరించే పద్దతులను బట్టి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల తాజా వివాదంలో ఎన్‌డిడిబి అనుసరించిన పద్దతి గురించి నివేదికలో పేర్కొన్నది, దానితో పాటు ఫలితాల గురించి షరతులు వర్తిస్తాయంటూ కొన్ని సార్లు నివేదికలు తప్పుగా రావచ్చని కూడా చెప్పింది. అందుకే మరొక ప్రయోగశాలలో కూడా పరీక్ష చేయించకుండా చంద్రబాబు నాయుడు తొందరపడి నిర్దారణకు వచ్చి బహిర్గత పరిచారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.ఆ చర్య కోట్లాది మంది భక్తుల మనోభావాల మీద ప్రభావం చూపింది. ఎక్కడ ఎన్ని పరీక్షలు జరిపినా నెయ్యి స్వచ్చత గురించి ఏ లాబ్‌లోనూ ఫలితాలు ఒకే విధంగా ఉండవు అని కూడా చెబుతున్నారు. ఆవులు, గేదెలకు పెట్టే మేతను బట్టి కూడా ఫలితాలు భిన్నంగా ఉంటాయి.


బిజెపి బీఫ్‌ రాజకీయం గురించి తెలిసిందే.2014ఎన్నికల్లో దాని ప్రచార అస్త్రాల్లో అదొకటి.ఆవు, ఎద్దు,దున్నపోతులు, గేదెల మాంసాన్ని బీఫ్‌ అంటారు. దీని ఎగుమతులకు వ్యతిరేకంగా నాటి యుపిఏ ప్రభుత్వం మీద నరేంద్రమోడీ ఉత్తరాదిన ఎన్నికల్లో ప్రచారం చేశారు. చిత్రం ఏమిటంటే అధికారానికి వచ్చిన తరువాత వాటి ఎగుమతులకు అనుమతి ఇచ్చారు. ఏటేటా పెరుగుతున్నట్లు ఎగుమతి గణాంకాలు చెబుతున్నాయి. 2023 వివరాల ప్రకారం బ్రెజిల్‌ తరువాత రెండవ స్థానంలో ఉన్న అమెరికాను పక్కకు నెట్టి మనదేశం ఎగబాకింది.బ్రెజిల్‌ అన్నిరకాల బీఫ్‌ను 30.12 లక్షల టన్నులు, దున్న, గేదె మాంసాన్ని భారత్‌ 14.75లక్షల టన్నులు ఎగుమతి చేసింది. తమ కారణంగా చీమలకు సైతం హాని కలగకూడదంటూ జైన మునులు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తారు. కానీ అనేక మంది ఆ మతానికి చెందిన వారు బీఫ్‌ ఎగుమతిదార్లుగా ఉన్నారు.ఒక సందర్భంలో స్వయంగా నరేంద్రమోడీయే ఆ విషయాన్ని చెప్పారు. మాంస ఎగుమతి ఒక సామాజిక తరగతికి మాత్రమే పరిమితమని చెప్పటం వాస్తవం కాదు, జైన్‌ సామాజిక తరగతికి చెందిన అనేక మంది నా స్నేహితులు ఆ వ్యాపారంలో ఉన్నారు, ఏదో ఒక సామాజిక తరగతికి ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దంటూ మాట్లాడారు. మన పురాణాలు, నమ్మకాల ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక దేవుడితో ముడిపడి ఉంది.గోవధను కొందరు వ్యతిరేకిస్తారు. గోమూత్రం తాగటం పవిత్రంగా భావిస్తారు. దున్నపోతు యుముడి వాహనం, అయినా వాటిని వధించి ఎగుమతులు చేస్తారు. ఎలుక వినాయకుడి వాహనం అంటారు, కానీ అది కనిపిస్తే చంపేయాలని చూస్తారు.(ఇలా చెబుతున్నానంటే నష్టదాయకమైన ఎలుకలను చంపకుండా వదలివేయమని నా ఉద్దేశ్యం కాదు) మొత్తం మీద నెయ్యి కల్తీ గురించి వచ్చే నివేదికలు ఏ ఒక్కటీ ఒకే విధంగా ఉండదని మాత్రం కొందరు నిపుణులు చెబుతున్నారు. అందువలన ముందే చెప్పుకున్నట్లు తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఎలా ముగుస్తుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లడ్డు రాజకీయం : సనాతనవాదిగా పవన్‌ కల్యాణ్‌ – కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడినదాంట్లో తప్పేంటి ?

28 Saturday Sep 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, CHANDRABABU, Narendra Modi Failures, Pawan kalyan, Prakash Raj, RSS, Tirupati Laddu Controversy, YS jagan


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది ? మాజీ సిఎం జగన్‌ మోహనరెడ్డిని ఇరుకున పెట్టాలని చూసిన చంద్రబాబు నాయుడు చివరకు తిరుమల పర్యటనను తీవ్ర వివాదాస్పదం గావించి మొత్తం మీద జగన్‌ నెత్తిన పాలుపోశారనే చెప్పాలి. పోలీస్‌ సెక్షన్‌ 30 తదితర ఆంక్షల పేరుతో ఆటంక పరచకుండా అనుమతించి ఉంటే పరమతాలకు చెందిన వారందరి మాదిరే జగన్‌ కూడా ఆలయసంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు రిజిస్టర్‌లో సంతకం చేసేవారా లేదా అనేది తేలిపోయి ఉండేది.చేయకపోతే అభ్యంతరం తెలిపి ఉంటే బంతి జగన్‌ కోర్టులో ఉండేది. అలాంటి అవకాశం లేకుండా వ్యవహరించటంతో జగన్‌ వ్యతిరేకులందరూ ఒక రకంగా నీరుగారిపోయారు. అయితే దీని మీద ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు గనుక జనం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఇకనైనా లడ్డు రాజకీయానికి తెరదించి రాష్ట్ర సమస్యల మీద కేంద్రీకరించాలి.


చంద్రబాబు నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల వెంకటేశ్వరుడి దర్శనాన్ని చేసుకొని ప్రార్ధిస్తానని ప్రకటించిన వైఎస్‌ జగన్‌మోహన రెడ్డిని పరోక్షంగా ప్రభుత్వం అడ్డుకుంది. అంతకు ముందు తెలుగుదేశం, జనసేన, బిజెపి, వారి కనుసన్నలలో పనిచేసే సంస్థలు, వ్యక్తులు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఆచారాలను మన్నిస్తూ దేవస్థాన రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందేనని, తలనీలాలు సమర్పించుకోవాల్సిందేనని ప్రకటించాయి. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి పాపానికి పాల్పడ్డారని దానికి ప్రాయచిత్తంగా సెప్టెంబరు 28 తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు చేయాలని క్రైస్తవమతావలంబకుడిగా అందరికీ తెలిసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. మరోసారి శుక్రవారం నాడు మీడియా సమావేశంలో కూడా అదే చెప్పారు. తాను నాలుగు గోడల మధ్య బైబిలు చదువుతానని, బయట అన్ని మతాలను పాటిస్తానని, తనది మానవమతమని ఏం కావాలంటే అది రాసుకోవచ్చని కూడా చెప్పారు. తమ ప్రభుత్వం జగన్‌కు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని, తిరుమల పర్యటనను అడ్డుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అన్యమతస్తులెవరైనా ఆలయ రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందే అన్నారు. ఇప్పుడు లడ్డు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తులో తేలేదేమిటి, జరిగిందని చెబుతున్న లడ్డు నెయ్యి కల్తీ ఎప్పటికి నిర్ధారణ అయ్యేను, నిందితులుగా ఎవరిని తేల్చేను, ఏ శిక్షలు పడేను అన్నది భక్తులు నమ్మే ఆ భగవంతుడికే తెలియాలి. లడ్డు పరిణామాలతో అనేక ముఖ్య సమస్యలు జనం అజెండానుంచి మాయమయ్యాయి. ముఖ్యంగా ఇటీవలి వరదల్లో సంభవించిన భారీ నష్టానికి కేంద్రం నుంచి వరదలా సాయం వస్తుందని ఆశలు రేకెత్తించిన వారికి కనీసం మబ్బులు కూడా కనిపించటం లేదు.


తిరుమల దేవుడి మహిమల సంగతి తెలియదు.అఫ్‌ కోర్స్‌ నిజంగా మహిమే ఉంటే తన లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంటే పట్టించుకోకపోవటమేమిటి, దాని పేరుతో రాజకీయం చేస్తుంటే ఉపేక్షించటం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరూ మనోభావాలను గాయపరుచుకోనవసరం లేదు. దేవుడి లడ్డులో కల్తీ నెయ్యి దగ్గర ప్రారంభమైన వివాదం మలుపులు తిరుగుతూ మతం, సనాతన ధర్మ పరిరక్షణ వైపు పయనిస్తోంది. అనేక మంది నిజరూపాలను బహిర్గతం చేస్తోంది. మతం పేరుతో రాజకీయం, ఓటు బాంకులను ఏర్పాటు చేసుకొనే పార్టీల జాబితాలో బిజెపితో పాటు తెలుగుదేశం, జనసేన కూడా పోటీ పడుతోందన్నది తేలిపోయింది. అయితే దేశంలో మతరాజకీయాలు చేసే వారి గురించి జనం కళ్లు తెరుస్తున్న స్థితిలో ఆంధ్రులు అలాంటి తిరోగమన రాజకీయ వలలో పడతారా ? తిరుమల లేదా మరొక మతకేంద్రం కావచ్చు, మతేతరులు వాటిని సందర్శించాలని అనుకున్నపుడు అక్కడి ఆచారాలను గౌరవిస్తున్నట్లు అంగీకరించాలన్న నిబంధనలు, ఆచారాలు ఉన్నాయి. శుక్రవారం నాటి విలేకర్ల సమావేశంలో తాను వాటిని పాటించనని లేదా పాటిస్తానని గానీ జగన్‌ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోసారి తిరుపతి వెళతానని కూడా చెప్పలేదు.


లడ్డు కల్తీ సంగతి విచారణ తరువాత ఏదో ఒకటి తేలుతుంది. కానీ ఈ వివాదం తెచ్చిన సమస్యలు మాత్రం ముందుకూడా కొనసాగుతాయి. భగత్‌ సింగ్‌, చేగువేరా భావజాలం కలవ్యక్తిగా అనేక మంది ఇప్పటివరకు పవన్‌ కల్యాణ్‌ గురించి భావిస్తున్నవారికి భ్రమలు తొలిగిపోయాయి. అఫ్‌కోర్స్‌ వారాహి పూజలను చూసినపుడే చాలా మందికి అర్ధమైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలిచ్చిందని విమర్శించి తిరుమల లడ్డుకు మరోవిధంగా ప్రచారం కల్పించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆ లడ్డూతోనే రాజకీయం ఆడుతున్నారు. అందువలన కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్నట్లుగా ఆ పెద్దమనిషి సనాతన ధర్మం గురించి రెచ్చిపోయి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించలేదు. ఎన్నో పుస్తకాలు చదివినట్లు చెప్పుకున్న మేథావికి సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో జరిగిన దారుణాలు, కలిగించిన హాని అర్ధం కాలేదా లేక పుస్తకాలు చదవటం అన్నది ఒట్టి కబుర్లేనా ? నిజంగా అర్ధమై ఉంటే కనీసం మౌనంగా ఉండేవారు తప్ప దాన్ని పరిరక్షిస్తానంటూ విరుచుకుపడేవారు కాదు. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేసినపుడు ప్రకాష్‌ రాజ్‌ ఎక్కడకు వెళ్లారంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారని ఒన్‌ ఇండియా అనే వెబ్‌సైట్‌ తన విశ్లేషణకు శీర్షిక పెట్టింది. అక్కడ జరిగిన వాటి గురించి వాస్తవాల కంటే అభూత కల్పనలే ఎక్కువ వచ్చాయి, కాదూ ఒక వేళ నిజమే అనుకుంటే నరేంద్రమోడీ, బిజెపి ఎందుకు పెద్దగా స్పందించలేదో చెప్పగలరా ? చిన్న పాటి విమర్శ, అభ్యంతరాన్ని కూడా బిజెపి, హిందూత్వశక్తులు సహించవు. ఆరునెలలకే వారు వీరవుతారన్నట్లుగా అంతకంటే ఎక్కువ కాలమే బిజెపితో బంధంలో ఉన్నందున అదే జరిగినట్లు కనిపిస్తోంది. అసలు లడ్డు వివాదం గురించి ప్రకాష్‌ రాజ్‌ అన్నదేమిటి ? ‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌, ఇది మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగింది.దయచేసి దర్యాప్తు చేయండి.దోషులను పట్టుకోండి కఠినమైన చర్యలు తీసుకోండి. జాతీయ స్థాయిలో అనవసర భయాలను ఎందుకు వ్యాపింపచేస్తారు,ఎందుకు పెద్దదాన్ని చేస్తారు.మనకు ఇప్పటికే తగినంత మతతత్వం ఉంది(కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు కృతజ్ఞతలు) ’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీని మీద పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘‘ నేను ప్రకాష్‌ రాజ్‌ను ఇష్టపడతాను, ఆయన నాకు మంచి స్నేహితుడు, మేము గొప్ప బంధాన్ని పంచుకుంటాము.రాజకీయ అంశాల మీద మేము విబేధించవచ్చు గానీ, ఒక నటుడిగా నేను నిజంగా గౌరవిస్తాను. అయితే ఈ సమస్య మీద వ్యాఖ్యానించే అవసరం ఆయనకు లేదు ’’ అంటూ స్పందించారు. ప్రపంచంలోని వారందరూ స్పందిస్తున్నట్లు అనేక అంశాల మీద నిరంతరం తన భావాలను వెల్లడిరచే ప్రకాష్‌ రాజ్‌ దీని మీద మౌనంగా ఎలా ఉంటారు ? ఎందుకు ఉండాలి ? వద్దని చెప్పటానికి పవన్‌ కల్యాణ్‌ ఎవరు ? ఇదేమీ వ్యక్తిగత వ్యవహారం కాదు.


వన్‌ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పినట్లు రాసిన అంశాలను బట్టి చూస్తే మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు విరుచుకుపడినట్లుగా పవన్‌ కల్యాణ్‌ తీరు ఉంది.‘‘ ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలను చూస్తే రాజకీయ అంశాలను ముందుకు తెచ్చినట్లుగా ఉంది.బిజెపిని, ప్రధాని మోడీని చర్చలోకి లాగుతున్నారు. తానొక గొప్ప లౌకికవాదినని ఆయన భావిస్తున్నారు. అతని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలుసు. నా ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేస్తుంటే ఆయన ఎక్కడ ఉన్నారు ? దాని మీద మాట్లాడారా ? కానీ అనేక మంది లౌకికవాదులు హిందూ సమాజం మీద వ్యాఖ్యానించటం సులభం కానీ ఇతర మతాల వారి మీద వ్యాఖ్యానించటానికి భయపడతారు. వారికి లౌకిక వాదం అంటే ఒక వైపు మాత్రమే ప్రయాణించే దారి వంటిది, హిందూయిజం వెలుపల ఉన్న సమస్యలను విమర్శించటాన్ని తప్పించుకుంటారు. అందరి పట్ల సమంగా చూడకపోతే లౌకికత్వం అంటే ఏమిటి ? వ్యాఖ్యానించదలచుకున్నవారు అందరినీ ఒకేవిధంగా చూడాలి, దీన్నే సగటు భారతీయుడు వాంఛిస్తున్నాడు. మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించాలి లేకపోతే మౌనంగా ఉండాలి ’’ ఇవన్నీ సంఘపరివారం స్కూల్లో బోధించే తర్కంలోని అంశాలే. ప్రతిదాన్నీ ప్రశ్నిస్తాను, అవసరమైతే తోలువలుస్తా, తాట తీస్తా అని మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ ఇలా మాట్లాడటం అవకాశవాదం తప్ప మరొకటి కాదు. అందుకే ప్రకాష్‌ రాజ్‌ పరోక్షంగా ఒక చురక అంటించారు. ‘‘ గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తరువాత మరో అవతారం, ఏంటీ అవాంతరం … ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ ఒక ఎక్స్‌, ‘‘ చేయని తప్పుకి సారీ చెప్పించుకోవటంలో ఆనందమేమిటో, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ మరో ఎక్స్‌లో స్పందించారు. అంతే కాదు, మరో ఎక్స్‌లో ఇలా పేర్కొన్నారు.‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌ గారూ … మీ ప్రెస్‌ మీట్‌ను నేను చూశాను. నేను చెప్పిందేమిటి, మీరు దానికి వక్రభాష్యం చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి నేను తిరిగి వస్తా, ఈ లోగా నేను ఇంతకు ముందు చేసిన ట్వీట్‌ను పూర్తిగా పరిశీలించండి, అవగాహన చేసుకోండి, ఊరికే అడుగుతున్నా ’’ అని పేర్కొన్నారు. సినిమా హీరో కార్తి ఎప్పుడూ నవ్వుముఖంతో కనిపిస్తాడు. లడ్డు గురించి అడిగితే అదే ముఖంతో అది సున్నితమైన అంశం అని చెప్పటాన్ని కూడా పవన్‌ కల్యాణ్‌ తప్పుపట్టారు.


ఎవరు ఎటు ఉన్నారో, ఎవరి రంగు ఏమిటో జనాలు గ్రహిస్తున్నారు. మాంసం తింటాంగనుక ఎముకలను మెడలో వేసుకు తిరుగుతాం అన్నట్లుగా తాము భారత మితవాదులమని సగర్వంగా చెప్పుకొనే పత్రిక ‘‘ స్వరాజ్య ’’. అది లడ్డు వివాదంపై ఒక విశ్లేషణకు ‘‘ తిరుపతి లడ్డు సమస్య : పవన్‌ కల్యాణ్‌ మీ ముఖంలో కనిపిస్తున్న హిందూయిజానికి ఆంధ్రలో స్వాగతం ’’ అని శీర్షిక పెట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా మరింత మంది బిజెపి ఏతర పార్టీల నేతలు సనాతన ధర్మం గురించి మాట్లాడాలని తద్వారా హిందువుల ప్రయోజనాలు రక్షించబడతాయని నొక్కి వక్కాణించారు. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ బోర్డు నెలకొల్పాలని పిలుపు ఇచ్చిన తరువాత సినిమా నటులు కార్తీ, ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించారని ప్రశంసలు కురిపించారు. నీవెవరో తెలియలాంటే నీ స్నేహితులను చూస్తే చాలన్నది గత లోకోక్తి ఇప్పుడు నీ బండారం తెలియలాంటే నిన్ను పొగుడుతున్నవారిని చూస్తే చాలు అని చెప్పాల్సి వస్తోంది. పవన్‌ కల్యాణ్‌ గారు చెబుతున్న సనాతన ధర్మం ఈ దేశంలో దాదాపు నలభై కోట్ల మంది దళితులు, గిరిజనులను అంటరానివారిగా వేల సంవత్సరాల పాటు వెలివాడల్లో దూరంగా పెట్టింది. వెనుకబడిన తరగతుల వారినీ పరిమితం కావించింది. మహిళలను అణచివేసింది.శూద్ర కులాలకు చెందిన వారితో సహా అందరినీ విద్యకు దూరం చేసింది. అందుకే అంబేద్కర్‌ ఈ సనాతన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకంటే ఎక్కువ అధ్యయనం చేసి ఉంటారని అనుకోలేము. సనాతన వాదాన్ని పరిరక్షించాలని కోరుతున్నవారు నిజానికి ఎంత మంది దాని ప్రకారం నడుచుకుంటున్నారు. సనాతన వాదం మారేది కాదంటున్నారు. ఏక పత్నీవ్రతుడైన రాముడిని, బహుపత్నులున్న కృష్ణుడినీ ఒకే రకమైన భక్తితో సనాతనులు సమర్థిస్తున్నారు.వివాహ బంధంతో నిమిత్తం లేకుండా వేరేవారికి పిల్లలను కనటాన్ని కూడా మహాభారతంలో సమర్ధించారు. పెళ్లితో నిమిత్తం లేకుండా ఏళ్లతరబడి సహజీవనం చేసిన వారు, ఏ కారణంగా చెప్పకుండా భార్యలను వదలివేసిన వారూ, సనాతనంతో సంబంధం లేని ఆధునిక చట్టాల ప్రకారం విడాకులు తీసుకొని అనేక వివాహాలు చేసుకుంటున్నవారు కూడా సనాతన పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. అదొక ఫాషనైపోయింది. సనాతనం గురించి మరొకదాని గురించి గతంలోనే అనేక చర్చలు జరిగాయి.ముఖం మీద నామం అడ్డంగా పెట్టుకోవాలా నిలువుగా పెట్టుకోవాలా అంటూ దాడులు చేసుకున్న సనాతనుల గురించి తెలిసిందే. ఇప్పటికీ దాని మీద ఏకీభావం లేదు. ఇప్పుడు అలాంటి వారంతా ఒకటై సనాతనాన్ని విమర్శించేవారి మీద దాడులకు దిగుతున్నారు. గతంలో లోకాయతులను అణచివేశారు. కొత్తగా మతం పుచ్చుకున్నవారు మరీ రెచ్చిపోతున్నారు. సనాతనం మనదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల బాటలో నిలుపలేదు. ఆ తిరోగమనవాదాన్ని పరిరక్షించి దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతున్నవారు తాత్కాలికంగా ఓటు బ్యాంకులను సృష్టించుకోవచ్చు తప్ప దేశానికి చేసే మేలేమీ ఉండదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d