• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Prices

ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

20 Wednesday May 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Narendra Modi Failures, Taiwan Matters, Trump China 2026 Trip, US attack Iran, West Asia Crisis, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

కతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వినతి మేరకు ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అంతకు ముందు రెండు మూడు రోజుల్లో ఒప్పందానికి రాకపోతే యుద్దాన్ని తిరిగి ప్రారంభిస్తానని చెప్పాడు. పార్లమెంటు ఆమోదం పొందకపోతే ఇరాన్‌పై సాగిస్తున్న దాడులను నిలిపివేయాలంటూ అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తూ మంగళవారం నాడు అమెరికా సెనేట్‌ 50-47తో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతకు ముందు ఏడు సార్లు డెమోక్రటిక్‌ పార్టీ ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. నలుగురు అధికార రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు చేతులు కలపటంతో నెగ్గింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక దేశం మీద యుద్ధం చేయాలంటే పార్లమెంటు తీర్మానం అవసరం. అయితే అధ్యక్షుడికి ఉన్న అధికారాల గురించి 1973లో పార్లమెంటు చేసిన తీర్మానం మేరకు అరవై రోజులకు మించి సైనిక చర్యకు ఆదేశిస్తే పార్లమెంటు ఆమోదం విధిగా పొందాల్సి ఉంది. ఈ కారణంగానే అసలు తాము ఇరాన్‌ మీద యుద్దం చేయటం లేదని, మిలిటరీ చర్య మాత్రమే అని బుకాయించాడు, అంతేకాదు ఫిబ్రవరి 28న దాడులను ప్రారంభించిన ట్రంప్‌ ఏప్రిల్‌ 7న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాడు. అప్పటి నుంచి అదిరింపులు బెదిరింపులతో కాలం గడుపుతున్నాడు. అమెరికా చేసిన దాడులనుంచి తాము అనేక విషయాలను నేర్చుకున్నామని, మరోసారి దాడులకు పాల్పడితే ఊహించని విధంగా దెబ్బతీస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి ప్రకటించాడు. తిరుగులేనిదని చెప్పుకున్న ఎఫ్‌-35 యుద్ధ విమానాన్నే కూల్చివేశామని, మరో 42 ఇతర విమానాలు, శక్తివంతమైన డ్రోన్లను కూడా తాము కూల్చివేసినట్లు అమెరికన్‌ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు కూడా ఇరాన్‌ ప్రకటించింది.యుఏయి అణువిద్యుత్‌ కేంద్రంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడిచేసింది.దానికేమీ నష్టం జరగనప్పటికీ అవసరమైతే క్షిపణులతో ధ్వంసం చేయగలమని సందేశాన్ని ఇరాన్‌ పంపింది.

మే నెల 14,15 తేదీలలో ప్రపంచంలో ఇద్దరు శక్తివంతులైన నేతలు చైనా రాజధాని బీజింగ్‌లో భేటీ అయ్యారు. సహజంగానే ఈ కలయిక ఫలితాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతోంది.అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవసారి చైనా సందర్శించాడు. పర్యటనకు ముందు, తరువాత కూడా ఈ ఉదంతం గురించి పెద్ద ఎత్తున విశ్లేషణలు వెలువడ్డాయి. డ్రాగన్‌ దేశ సందర్శన విఫలమైందని,వాణిజ్య పోరు ఎదురుతన్నిందని,అమెరికన్‌ కార్పొరేట్లు నిరాశాపూర్వక ప్రయత్నాలు చేసినట్లు, ఇంకా అనేక అంశాల గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యలు, వివరణలు వెలువడ్డాయి. విజయవంతమైందనే మాట ఎక్కడా వినిపించలేదు. సాధారణంగా దేశాధినేతల పర్యటనలు ఇతర దేశాల ఆహ్వానం మేరకే జరుగుతాయి. ట్రంప్‌ తాజా పర్యటనకు చైనా నుంచి అలాంటి ఆహ్వానం లేదు. మీ ఇంటికి ఒకసారి రావాలని కొందరు అంటారని తెలిసిందే, అలాగే ట్రంప్‌ తన వాంఛను వెలిబుచ్చిన తరువాత అంతకంటేనా అని బీజింగ్‌ స్పందించింది.అలాగని మర్యాదలకు లోటు చేయలేదు.ట్రంప్‌ పరివారానికి హెచ్చరికలతో పాటు అనేక బహుమతులు కూడా ఇచ్చిపంపారు. అయితే వాటిలో దొంగచెవులు, నిఘా కెమెరాలను అమర్చారంటూ స్వదేశానికి తీసుకుపోకుండా ఒక చెత్తబుట్టలో వేసి చూపి మరీ ట్రంప్‌ బృందం చైనాను అవమానించింది అనటం కంటే తన చౌకబారు తనాన్ని వెల్లడించుకుంది. గతంలో కూడా అమెరికన్లు గుట్టుచప్పుడు కాకుండా అదేపని చేసేవారని వార్తలు వచ్చాయి. ఈ చర్య ద్వారా షీ జింపింగ్‌ యంత్రాంగం తమ బుట్టలో పడలేదనే ఉక్రోషం ప్రదర్శితమైంది.చైనాను వత్తిడి చేయటంలో విఫలం కావటాన్ని వాణిజ్య యుద్దంలో ట్రంప్‌ ఓటమిగా కొందరు వర్ణించారు.ఆ పెద్ద మనిషి అంతగా కోరి మరీ ఎందుకు చైనా వెళ్లాడంటే ముక్తసరి సమాధానం అమెరికా ఆర్థిక పరిస్థితి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందనే సమాధానం వచ్చింది. చైనా పర్యటన సమయంలో ట్రంప్‌ రేటింగ్‌ 34 శాతానికి దిగజారింది.రుణ భారం జిడిపికి వందశాతం దాటింది. పులిమీద పుట్రలా ఇరాన్‌పై దాడి చేసి మరింత లోతుగా కూరుకుపోయింది.గౌరవ ప్రదమైన విధంగా ఇరాన్‌తో రాజీకుదర్చాలనే అజెండా తెరవెనుక ఉందని చెబుతున్నారు.వ్రతం చెడ్దా ఫలం దక్కలేదు.చైనా పైచేయిగా ఉందని వాషింగ్టన్‌ మేథో సంస్థ విదేశీ వ్యవహారాల మండలి(సిఎఫ్‌ ఆర్‌) వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఏమిటో వేరే చెప్పనవసరం లేదు.అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాటి వెనుక టెస్లా కంపెనీ యజమాని ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్‌, అందరికీ సుపరిచితమైన ఆపిల్‌, బ్లాక్‌రాక్‌, ఎన్‌విడియా, బోయింగ్‌, జిఇ, మైక్రాన్‌ ఇలా అనేక కంపెనీల అధిపతులు ఉంటారు.ఎవరు మంత్రులు కావాలో, ఏ విధానాలను అనుసరించాలో కూడా నిర్దేశించేది వారే.

ఈ బృందం ఆశాభంగం చెందటానికి కారణాలు ఏమిటి ? గతంలో చైనాకు అవసరమైన చిప్స్‌ను సరఫరా చేయటంలో ఎన్‌విడియా కంపెనీ వాటా 95 శాతం ఉండగా ఇప్పుడు సున్నా శాతానికి పడిపోయింది.చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను సరఫరా చేయకూడదన్న ఆదేశాలకు సదరు కంపెనీ తలొగ్గింది. సవాలుగా తీసుకున్న చైనా తన స్వంత కంపెనీలను ప్రోత్సహించి చిప్స్‌ను అభివృద్ధి చేసుకుంటున్నది. విధిలేక నిషేధం ఎత్తివేసిన తరువాత చూద్దాం, అవసరమైనపుడు మేమే సంప్రదిస్తాం అన్నట్లుగా చైనా అటువైపే చూడలేదు.అందుకే ఆ కంపెనీ యజమాని ట్రంప్‌తో పాటు బీజింగ్‌ వెళ్లాడు. నూటనలభై కోట్ల జనాభాలో 2027 నాటికి 120 కోట్ల మంది మధ్య తరగతిలో ఉంటారని అంచనా. ప్రపంచంలో వీరి వాటా 25శాతం. ఇంత మంది వినియోగదారుల మార్కెట్‌ను అమెరికా కార్పొరేట్లు వదులు కుంటాయా ? వాటికి కావాల్సింది లాభాలు, వాటికోసం రాజకీయాలు చేస్తాయి, అవి తమకు ఆటంకంగా మారినపుడు ప్లేటు ఫిరాయిస్తాయి.

సంస్కరణలు అంటే మన మాదిరి విదేశాలకు ఏకపక్షంగా తలుపులు బార్లా తెరవటం కాదు.మనం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ నిర్దేశిత విధానాల చట్రంలో చేస్తే దానికి భిన్నంగా టెక్నాలజీ అందిస్తే మార్కెట్‌లో అవకాశమిస్తాం అనే షరతు మీద చైనా కమ్యూనిస్టులు వ్యవహరించారు.ఈ కీలకమైన అంశాన్ని వదలి వారు నియంతలు, మనది ప్రజాస్వామ్యం అందుకే చైనాతో పోల్చుకోవద్దు అంటూ కొందరు సొల్లు కబుర్లు చెబుతారు. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి.చైనా తనకు పోటీగా రాదని భావించినంత కాలం అమెరికన్లు ఎలాంటి యాగీ చేయలేదు. తరువాతే అక్కడ మానవహక్కులు లేవని, కరెన్సీ విలువను తగ్గించి ఉంచుతున్నారని, సబ్సిడీలతో సరకులను తక్కువ ధరలకు ఎగుమతి చేస్తున్నారని ఇలా రకరకాల సాకులను ముందుకు తెచ్చారు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు 2018లో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించాడు. పెద్ద మొత్తంలో అమెరికా పెట్టుబడులు తగ్గించాడు, వాణిజ్యమూ తగ్గింది. అయినా గడచిన ఎనిమిది సంవత్సరాల్లో చైనాకు స్వల్ప సమస్యలు తప్ప అదేమీ కుప్పకూలి పోలేదు. వాణిజ్యం తరువాత చిప్‌ వార్‌ను ప్రారంభించాడు.దాన్ని కూడా సవాలుగా తీసుకొని మీ చిప్స్‌ మాకు అవసరం లేదనట్లుగా ఇప్పుడు చైనా ఉంది. దాంతో చైనా పట్ల వైఖరిని మార్చుకోవాలని కొన్ని పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు వత్తిడి తెచ్చిన కారణంగానే పిలవక పోయినా పెద్ద సంఖ్యలో వాటి యజమానులను వెంటేసుకొని ట్రంప్‌ బీజింగ్‌ వెళ్లాడు. చైనా కనీసం ఐదు వందల విమానాలను కొనుగోలు చేస్తుందని కొందరు జోశ్యం చెప్పారు.అన్నిగాకున్నా రెండు వందలు అమ్ముదామని ట్రంప్‌ చెప్పాడు. చివరికి దీని గురించి అడిగితే చైనా ప్రతినిధి సమాధాన్ని దాటవేయటంతో బోయింగ్‌: కంపెనీ వాటాల ధరలు నాలుగుశాతం పడిపోయాయి. ఎన్‌విడియా చిప్స్‌ కంపెనీకి సైతం ఇదే ఆశాభంగం ఎదురైందని వార్తలు. బీజింగ్‌ తన ప్రయోజనాలను ఫణంగా పెట్టుకొని తమకు రాయితీలు ఇస్తుందని ట్రంప్‌ ఎలా ఆశించాడు, ఆలోచించాడన్నది ఒక చిక్కు ప్రశ్నగా మారింది.కొన్ని దేశాల్లో దళారీ బూర్జువా శక్తులు వ్యక్తిగతంగా తాము లబ్డిపొంది దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా, ఇతర ధనిక దేశాలకు సహకరించినట్లుగానే చైనా కమ్యూనిస్టులు చేస్తారని ఆశించి భంగపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌ నుంచి తనకు చమురు అందకుండా చేసేందుకు అమెరికా కుట్రలు తెలిసిందే. అదే ఇరాన్‌ మీద దాడులు చేస్తూ సంక్షోభ పరిష్కారానికి ఇరాన్ను దారికి తేవాలని కోరటం కూడా ట్రంప్‌ దురాశే.

ఇప్పుడు చైనా అమ్ములపొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి. ఏడాది క్రితం చైనా వస్తువులపై 145శాతం పన్నులు విధిస్తా అంటే తాము కూడా అదే మర్యాద చేస్తామని ట్రంప్‌కు చెప్పారు. తన దగ్గర తిరుగులేని అస్త్రాలు ఉన్నాయని, చైనాను నాశనం చేస్తానని చెప్పటం తప్ప వాషింగ్టన్‌ ఇంతవరకు బయటకు తీసిందేమీ లేదు.చైనా ప్రతి సుంకాలు విధిస్తే మనకు నష్టమా అని ప్రశ్నిస్తే వారు పెద్ద తప్పు చేశారు, మనం దిగుమతి చేసుకొనే వస్తువుల్లో ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం గనుక నష్టపోయేదే వారే అని అమెరికా విత్త మంత్రి స్కాట్‌ బెసెంట్‌ గొప్పలు చెప్పాడు. అటువంటపుడు ట్రంప్‌ చైనా ఎందుకు వెళ్లినట్లు ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తే వాటి తయారీకి అవసరమైన విలువైన ఖనిజాల ఉత్పత్తులను నిలిపివేసి డ్రాగన్‌ వాషింగ్టన్‌లో రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. సముద్రంలో నీరున్నా తాగేందుకు పనికి రాదన్నట్లు అమెరికా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాలను చూసుకొనే స్థితి లేదని గగ్గోలు పెడుతున్నారు. ఒంటరిగా చేయలేమని భావించి పాక్స్‌ సిలికా పేరుతో కొన్ని దేశాలతో కూటమి గట్టింది, వాటి ప్రయత్నాలు ఫలించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంతవరకు ఆగలేమంటూ కార్పొరేట్లు ట్రంప్‌ మీద వత్తిడి తెస్తున్నాయి. చైనాను దెబ్బతీయటంతో పాటు దానికి ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలను తయారు చేసే ఎత్తుగడతో గత పది సంవత్సరాలుగా అక్కడి నుంచి కంపెనీలను తరలించాలని శ్వేత సౌధం వత్తిడి చేస్తున్నది.ఆమేరకు యాపిల్‌ కంపెనీ మనదేశానికి వచ్చినప్పటికీ దానికి ఎదురైన సమస్యలను చూసి మిగిలిన సంస్థలు సాహసించటం లేదు.ఎలన్‌ మస్క్‌ టెస్లా కంపెనీ తయారు చేస్తున్న విద్యుత్‌ కార్లలో సగం చైనాలోనే ఉన్నాయి, అయినప్పటికీ అమెరికా పరిశ్రమను బీజింగ్‌ నాశనం చేయనుందని, గగ్గోలు పెడితే జో బైడెన్‌ సర్కార్‌ 2024లో చైనా కార్లపై వందశాతం దిగుమతి సుంకం విధించింది.అయినా చైనా తగ్గలేదు.

వాణిజ్య అంశాల్లో పరిస్థితి ఇలా ఉంటే రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణ జరిగిన నాటి నుంచీ తైవాన్‌ అంశం నలుగుతూనే ఉంది. ఆ ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తిస్తూనే విడదీసి ప్రత్యేక దేశంగా మార్చాలనే కుట్రలకు అమెరికా తెరతీసింది, టిబెట్‌ను మరోదేశంగా మార్చాలనే ఎత్తుగడతో దలైలామా పేరుతో తిరుగుబాటుకు తోడ్పాటునిచ్చిన సంగతి తెలిసిందే.చైనాకు కేవలం 59 మైళ్ల దూరంలో ఉన్న తైవాన్‌ రక్షణకు 9,500 మైళ్ల దూరం నుంచి వచ్చి యుద్దం ఎలా చేయగలమని ట్రంప్‌ ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌ జర్నలిస్టులను ప్రశ్నించాడు. ఇలాంటి స్పందన గతంలో ఏ అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి రాలేదు. అమెరికన్లు ఎందుకు తైవాన్‌ గురించి ఆందోళన చెందుతున్నారంటే అక్కడి చైనా జాతీయుల గురించి కాదు, ఆధునిక చిప్స్‌ తయారీ ఫ్యాక్టరీల పైనే కన్ను. ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను నాశనం చేస్తామని గతంలో అమెరికా బెదిరించింది.తైవాన్‌ అంశం గురించి చైనా ముందుకు తెస్తే ట్రంప్‌ ఇరాన్‌ గురించి ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి.అమెరికా అధ్యక్ష భవనం విడుదల చేసిన ప్రకటనలో కేవలం 163 పదాలే ఉన్నాయి.హార్ముజ్‌ జలసంధి గురించిన ప్రస్తావన మూడుసార్లు ఉంది.చైనా విడుదల చేసిన ప్రకటనలో అసలు ఇరాన్‌ ప్రస్తావనే లేదు, కేవలం మధ్య ప్రాచ్య పరిస్థితి అనే మాటమాత్రమే ఉంది.

ఇరాన్‌పై విజేతగా బీజింగ్‌ అడుగుపెట్టేందుకు కలలు గన్న ట్రంప్‌కు ఆశాభంగం ఎదురైంది. రెండు రోజుల ట్రంప్‌ పర్యటన తరువాత జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమాసియా సంక్షోభంలో ఎలాంటి సానుకూల పరిణామాలు లేవు. గతంలో మాదిరే ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. పెద్ద ఎత్తున దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కథనాలను వండి వారుస్తున్నారు.మరో నెల రోజుల పాటు సముద్రంలో ఉన్న నౌకలనుంచి రష్యన్‌ ముడి చమురు కొనుక్కొనేందుకు భారత్‌తో సహా కొన్ని దేశాలకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుమతిని పొడిగించాడు.బ్రెంట్‌ రకం ముడిచమురు ధర మంగళవారం నాడు రెండు డాలర్లు తగ్గి 110 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి అమెరికా చమురు వినియోగదారులపై 45 బిలియన్‌ డాలర్ల మేర అదనపు భారం పడింది.అందువలన అనిశ్చితి ఇంకా కొనసాగితే మరింత పెరిగి నవంబరులో జరిగే ఎన్నికల్లో ఓటర్లు ట్రంప్‌కు చుక్కలు చూపించే అవకాశం ఉంది. అనేక దేశాలకు ఎరువుల సరఫరాతో పాటు, వాటి ఉత్పత్తికి అవసరమైన గ్యాస్‌ లభ్యత కూడా తీవ్రంగా మారే అవకాశం ఉంది, ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగాయి. మరికొద్ది వారాల్లో మనదేశంలో ఖరీఫ్‌ తరుణం ప్రారంభం కానుంది.ఎరువులను కేంద్ర ప్రభుత్వం ఎలా అందించనుందో చూడాల్సి ఉంది.యావత్‌ దేశాన్ని కలవర పెడుతున్న అమెరికా దాడులను ఖండించే ధైర్యం లేకపోయినా కనీసం ఆపమని ట్రంప్‌ను నరేంద్రమోడీ ఎందుకు వేడుకోరన్న ప్రశ్నకు జవాబు దొరకటం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రో బాదుడుకు రంగం సిద్దం చేసిన ” మోడీ బాబా ” ! పొదుపు చేయని వారు దేశభక్తులు కాదా !!

13 Wednesday May 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP, WAR

≈ Leave a comment

Tags

#Fuel Prices India, BJP, BJP u turn on Fuel prices, fuel politics, Fuel Price in India, Mody Hyderabad call, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు పొదుపోపదేశం చేశారు. ఇంకేముంది పొలోమంటూ కాన్వారులను తగ్గించుకుంటున్నట్లు అనేక మంది ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారు సరేసరి. ప్రధానికి ఇంత ఆకస్మికంగా జ్ఞానోదయం ఎందుకు కలిగినట్లు అని ”దేశంకోసం-దర్మం కోసం ” ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. విదేశీ మారకద్రవ్యం, ఇతర అంశాల సమస్యలు ఇప్పటికిప్పుడు తలెత్తాయా ? నిజం అయితే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని ఎందుకు ప్రకటించటం లేదు. ముందు జాగ్రత్త అని బిజెపి నేతల ముక్తాయింపు.జనాల్లో అదెప్పుడూ ఉంటుంది. విడ్డూరం గాకపోతే వారు చెబితేనే జాగ్రత్తపడతరా ! ఇక చమురు ధరలను పెంచకతప్పదని కేంద్ర చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు చెప్పకనే చెప్పారు. బుధవారం నాడు మరోసారి మోడీ సందేశం. నిజానికి అది మంత్రులకు కాదు, జనానికే. అనివార్యమై ధరలను పెంచామని చెప్పబోతున్నారు. నిర్ణీత వంద కొరడా దెబ్బలను ఒకేసారి తింటారా దశలవారీనా అన్నది తేల్చుకోవాలని జనాలకు అవకాశం ఇస్తున్నారు తప్ప నూరు వాతలు తప్పవు.ఇప్పటికే ఆమేరకు మీడియాకు తాజా లీకులు వదిలారు. పెట్రోలు మీద లీటరుకు రు.14, డీజిల్‌ మీద రు.42, గృహవినియోగ ఎల్‌పిజి సిలిండరు మీద రు.674 నష్టం వస్తున్నదన్నది వాటి సారం. చమురు, గ్యాస్‌ సబ్సిడీలను ఎత్తివేసినందున ఏదో ఒక రూపంలో జనాలు ఈ మేరకు భరించటానికి సిద్దపడాలనే సందేశం ఇప్పటికే చేరవేశారు. వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్‌ ధరలను ఎలా పెంచిందీ చూశాము. రోజుకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చమురు కంపెనీలకు నష్టం వస్తున్నదనిపూరీ చెప్పారు. ధరల పెంపుదల గురించి అడగ్గా మీకు తెలియనిదేముంది ప్రధాని నరేంద్రమోడీ ”భవిష్యత్‌ దార్శనికుడు ” అన్నట్లుగా చెప్పారు. అంటే ఆదివారం నాడు (2026 మే 10) హైదరాబాదులో చేసిన ఒక విలక్షణ ప్రసంగంలో మోడీ యమలీలను గుర్తు చేశారు. ఎప్పుడూ చేసే రాజకీయాలను వదల్లేదు గానీ ఇతర విషయాలే మీడియాలో పతాకశీర్షికలయ్యాయి,విశ్లేషణలు వెలువడ్డాయి.మన్‌కీ బాత్‌ పేరుతో 2014 అక్టోబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రేడియోలో నెలకు ఒకసారి చొప్పున 113సార్లు మోడీ ప్రసంగించారు. ఎంతమంది ఎన్నింటిని విన్నారో ఎవరికి వారు లెక్కవేసుకోవాల్సిందే. ఒక సర్వే ప్రకారం ఐదుశాతం మంది శ్రోతలు మాత్రమే ఆలకించినట్లు తేలింది. అలాంటి ప్రసంగమే హైదరాబాద్‌లో చేశారని చెప్పవచ్చు. దానిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసిన సమీక్షల సారం ఏమిటంటే ఇంథన ధరలను పెంచకతప్పదనే మహత్తర సందేశాన్ని ప్రధాని దేశానికి అందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే పెంచుతారని ఊరూవాడా భావించారు. అయితే వెంటనే ఆ ప్రకటన వెలువడలేదు. కారణం ఏమిటంటే అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి కుదిరి సాధారణ పరిస్థితి ఏర్పడుతుందనే వార్తలు రావటం ఒకటి. నిజంగా అది జరిగితే ధరలు ఎందుకు పెంచారని జనం ప్రశ్నిస్తారు. రెండవది ప్రతిపక్షాలు చెప్పింది వాస్తవమే అని నిర్ధారించుకుంటారు. ఇప్పుడు ఏ పేరుతో పెంచాలా అని మధనపడుతున్నారు.ఊహించని విధంగా పశ్చిమాసియా సంక్షోభం కొనసాగటం మోడీ పరివారానికి అవకాశమిస్తున్నదని చెప్పవచ్చు.

ఇజ్రాయెల్‌ నెతన్యాహు, అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ మాటలను నమ్మి వారం రోజుల్లో ఇరాన్‌ పని అయిపోతుంది లెమ్మని కేంద్రంలోని పెద్దలు తడిబట్ట వేసుకొని పడుకున్నారని సంక్షోభ ప్రారంభంలో వారి తీరుతెన్నులే స్పష్టం చేశాయి. ఏ రోజు తిరిగి దాడులు మొదలౌతాయో తెలియని స్థితి. ఆందోళనలో ఉన్న వారికి బిపి పెరుగుతూ తగ్గుతూ ఉండే మాదిరి యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ మార్కెట్‌ చమురు ధరలు ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో మన స్టాక్‌ మార్కెట్‌ ఈ కారణంగానే భారీగా పతనమైంది. ఇప్పటికే చమురు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ వార్తలను రాయిస్తున్నారు. గతంలో ప్రత్యేక పన్నులు, సెస్‌ల రూపంలో బాదిన బాదుడుకు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లలో రాబడి పెరిగినపుడు ఏ మీడియా కూడా ఆ వార్తలను ప్రముఖంగా రాయలేదు గతంలో లాల్‌బహుదూర్‌ శాస్త్రి పాక్‌తో యుద్దం వచ్చినపుడు ఇచ్చిన పిలుపు మాదిరే ఇప్పుడు తమ మోడీ దేశ పౌరులకు పొదుపు విజ్ఞప్తి చేశారు తప్ప బలవంతం చేయటం లేదని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు.నాడు యుద్ధం వచ్చింది గనుక శాస్త్రి ఆ పిలుపు ఇచ్చారు, ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కూడా లేవు, అంతా సజావుగానే ఉందని చెబుతూ ఆ పిలుపు ఇవ్వటం ఏమిటి ? మచ్చుకు మోడీ ప్రవచించిన పది సుభాషితాల్లో కొన్నింటిని చూద్దాం. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్న లోకోక్తి తెలిసిందే.

” దేశం కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు, దేశం కోసం బతకడం,దేశ కర్తవ్యం కోసం పాటు పడటమూ దేశభక్తే ” అని మోడీ చెప్పారు. పొదుపును కూడా దేశభక్తికి ముడిపెట్టారు.ఇదే ప్రమాదకరం. పొదుపు పాటించనివారు దేశభక్తులు కాదనే భావాన్ని చెప్పకనే చెప్పారు. కడుపునిండా తినటానికి తిండిలేదనే కదా ఎనభై కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఐదేసి కిలోల ఉచిత బియ్యం లేదా గోధుమలను ఇస్తోంది.వారిని పొదుపు చేయమంటే ఆ ఉచితాన్ని వదులుకోవాలి మరి. వంట నూనె వాడకం తగ్గించటం కూడా దేశభక్తే అన్నారు. పొదుపు గురించి దేశ పౌరులకు మోడీ చెప్పాల్సినపని లేదు.మన జీన్స్‌లోనే ఉంది.అవసరమైన మేరకే వస్తువులను వాడతారు. ” సాధ్యమైన మేరకు ఇంటి నుంచే పని చేసే పద్దతి అనుసరించండి, అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు, ఇంథనాన్ని పొదుపుగా వాడండి ” మోడీ సుభాషితాల్లో ఒకటి. ఈ చర్యకు ప్రధానే స్వయంగా శ్రీకారం చుట్టి ఉంటే బాగుండేది. హైదరాబాదు వచ్చి ఎక్కడో జరిగే పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసే బదులు అదేదో ఢిల్లీ నుంచే చేయవచ్చు, గతంలో అనేక సార్లు అలా చేశారు.వేలాది మంది పోలీసులు, ఇతర ఏర్పాట్లకు అనవసర ఖర్చు, ఆయాసమూ తప్పేది, ట్రాఫిక్‌ ఆంక్షల వలన అదనపు దూరం ప్రయాణించిన వాహనదారులకు అదనపు పెట్రోలు, డీజిలు కలసి వచ్చేది.మోడీ స్వయంగా చెప్పినట్లు దేశం ఇంతటి ఇబ్బందుల్లో ఉన్నపుడు లక్షల మంది జనాన్ని తెలంగాణా అంతటి నుంచి ఎండల్లో రప్పించటానికి వాహనాలకు పెద్దమొత్తంలో ఇంథనం ఖర్చు చేయటం అవసరమా ? అందువలన పొదుపు గురించి ఇతరులకు చెప్పేముందు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా ? మధ్య ప్రదేశ్‌లో బిజెపి రాజకీయ నిరుద్యోగి సౌభాగ్య సింగ్‌ ఠాకూర్‌కు పాఠ్యపుస్తకాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు.దానికి ప్రమాణస్వీకారం కోసం డజన్లకొద్దీ వాహనాలతో ఉజ్జయని నుంచి భోపాల్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరం అనుయాయులతో అట్టహాసంగా వెళ్లారు. బిజెపి నేతల పొదుపు ఇలా ఉంటుంది. హైదరాబాద్‌ ఉపన్యాసంపై తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత మోడీ తన కాన్వారును గణనీయంగా తగ్గించుకున్నట్లు చెబుతున్నారు.కొత్తగా కొనుగోలు చేయకుండా విద్యుత్‌ వాహనాలను వినియోగించాలని చెప్పినట్లు వార్త. ఇదంతా పౌరుల మీద భారం మోపే ప్రచార ఎత్తుగడే.విదేశీ ప్రయాణాలు వద్దంటూ చెప్పిన మోడీ వారం రోజుల పాటు ఐదు దేశాల కార్యక్రమం పెట్టుకున్నారు. గతంలో నెహ్రూ 44సార్లు విదేశీ పర్యటనలు చేస్తే మోడీ సెంచరీ కొట్టారు.

ఏడాది పాటు బంగారం కొనవద్దంటూ మరో సలహా ! తరువాత కొనుగోలు చేయవచ్చా ? ధరలు ఇప్పటికిప్పుడే పెరగలేదే ! ఏడాది పాటు మారుటోరియం ఎందుకు సూచించారు. రూపాయి విలువను కాపాడలేని కేంద్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా డాలర్లకు కొరత ఏర్పడుతోంది.మన స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసిన విదేశీయులందరూ వాటాలను అమ్మివేసి డాలర్లలో తమ దేశాలకు తరలించుకుపోతున్నారు. 2025 ఏడాది మొత్తంలో 2.4లక్షల కోట్ల రూపాయలను తరలిస్తే ఈ ఏడాది మే 11వ తేదీ నాటికే 2.28లక్షల కోట్లు దాటాయని వార్తలు.మే ఒకటవ తేదీతో ముగిసిన వారంలో 7.794 బిలియన్‌ డాలర్లు మన విదేశీ మారకద్రవ్యంలో తగ్గి 690.693 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతి ప్రోత్సాహ పథకాల వంటి ఎన్ని కబుర్లు చెప్పినా, రాయితీలు ఇచ్చినా దిగుమతులు పెరుగుతున్నాయి తప్ప ఎగుమతులు పెరగటం లేదు. అయినా విదేశీ వస్తువులు వాడవద్దని ప్రధాని చెబుతారు, దిగుమతులకు ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ఏటా మన దేశం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నది.ముడి చమురు తరువాత బంగారానికే ఎక్కువగా విదేశీమారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది.బంగారంతో నగలు చేయించేందుకు కొంత మందికి పని కల్పించవచ్చు తప్ప నిజానికి అది ఉత్పాదతకు పనికి వచ్చేది కాదు. గత కొద్ది సంవత్సరాలుగా పసిడి ధర పెరుగుతూనే ఉన్నప్పటికీ మోడీ మాట్లాడ లేదు. గతంలో బంగారం దిగుమతులపై పన్ను ఎక్కువగా ఉన్న కారణంగా దొంగరవాణా పెరిగిందని తగ్గించారు. తాజాగా దిగుమతి పన్ను, సెస్‌లు కలిపి ఆరు నుంచి 15శాతానికి పెంచారు. నిరంతరం దిగుమతులు తప్ప ఎగుమతులు పెరగటం లేదు. ఒకదశ దాటిన తరువాత చెల్లింపుల సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయవద్దని, వివాహాలు విదేశాల్లో చేయవద్దని చెప్పారు. విదేశాలు లేదా పొరుగు రాష్ట్రాల్లోని విలాసవంతమైన ప్రాంతాల్లో వివాహాలు చేసేవారందరూ శతకోటీశ్వరులు తప్ప సామాన్యులు కాదు.మోడీ తన పాలనా కాలంలో కోటీశ్వరులు, శతకోటీశ్వరులను పెంచారు తప్ప తగ్గించలేదు.తాను అధికారానికి వచ్చినపుడు కేవలం 70మంది బిలియనీర్లు ఉంటే 2026నాటికి 308పెరిగారు.కోటీశ్వరుల గురించి చెప్పాల్సిందేముంది ! సామాన్యుల వద్ద ఉన్న సంపదశాతం తగ్గుతున్నదని అనేక విశ్లేషణలు వెల్లడించిన సంగతి తెలిసిందే.వారంతా సొమ్మును విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేయక ఏం చేస్తారు !

స్వదేశీ ఉత్పత్తి పెరగాలంటారు. దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా ఆయన పలుకుబడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 95చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ ఏం చేస్తున్నట్లు ? దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకాన్ని చూస్తే 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే.తాజాగా చమురు ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సిన రాయల్టీ తగ్గించి ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.

మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26లో రు.2.07 లక్షల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40, ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 ఇటీవలి వరకు వసూలు చేశారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు పెట్రోలు మీద ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.3 పైన పేర్కొన్న రెండు సెస్‌లు కలిపి రు.8.50, డీజిలుపై సెస్‌ రు.6 కొనసాగుతోంది.ఇప్పుడు మార్కెటింగ్‌ కంపెనీలకు నెలకు లక్ష కోట్ల నష్టం వస్తుందని గుండెలు బాదుకుంటున్న మంత్రి పూరీ ఇన్నేండ్లుగా మోడీ ఏలుబడిలో వినియోగదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం అంతకుముందున్నదాని కంటే అదనంగా వసూలు చేసిన రు.16.5లక్షల కోట్ల ప్రత్యేక ఎక్సయిజ్‌ పన్ను సంగతి మాట్లాడరేం.

పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు నంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంథనంపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బాబాల మాదిరి పొదుపు గురించి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు.గణనీయంగా తగ్గించాల్సిందిపోయి పెంచకపోవటం తమ ఘనత అని చెప్పుకుంటున్నారు.ఇది గోబెల్స్‌ పద్దతి. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత ధర పెరుగుతున్నది. మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర మార్చినెల 25వ తేదీ వరకు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఏప్రిల్‌లో 114.48, మే పన్నెండవ తేదీవరకు 105.09 డాలర్లు, అంటే నాలుగేండ్ల నాటి స్థాయికి చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం ఇది.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఇరాన్‌పై దాడులు ప్రారంభం ఫిబ్రవరి 28న కాగా అంతకు ముందు 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. జనం జేబులు కొట్టాలనుకున్నపుడు మాత్రం ఈ విధానం గుర్తుకు రాదు, కేంద్రానికి సెగ తగలగానే మళ్లీ మొదలు పెడతారా ? చావు తెలివితేటలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌కు చెప్పుకోరాని చోట తగిలిన దెబ్బ: ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌పై ఇరాన్‌ దాడి ఆంతర్యం ?

08 Friday May 2026

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, China, Donald trump, Hormuz mission, Narendra Modi, West Asia Crisis, West Asia Peace Talks

ఎం కోటేశ్వరరావు

తాజాగా ఇరాన్‌-అమెరికా మధ్య జరిగిన కాల్పులు ప్రేమతో జరుపుకున్నవే అని డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం నాడు వ్యాఖ్యానించాడు.(రోడ్దు మీద ఒక వాహనాన్ని మరొక వాహనం కొట్టినపుడు పెద్దగా నష్టం జరగకపోతే రెండూ ముద్దు పెట్టుకున్నాయని సరదాగా చెప్పుకోవటం వంటిది) రెండు దేశాల మధ్య శాంతి చర్చలు దోబూచులాడుతున్న సమయంలో ఇలా మాట్లాడటం గమనించదగిందే అయినా ట్రంప్‌ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులను ప్రారంభించటమైతే చేసింది గానీ, ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి అమెరికా నానా ఇబ్బందులు పడుతున్నది.ఇరాన్‌ దాడుల్లో జరిగిన నష్టం గురించి ట్రంప్‌ చెప్పుకోలేడు, అలాగని దాచుకోలేడు.చెప్పకపోతే ప్రాణం పోతుంది చెప్పుకుంటే పరువుపోతుంది..గల్ఫ్‌లోని పదిహేను అమెరికా మిలిటరీ కేంద్రాలలో 228 కట్టడాలు, ధ్వంసమైన పరికరాలకు సంబంధించి ఇటీవల ఇరాన్‌ కొన్ని చిత్రాలను విడుదల చేసింది.వాటిలో విమానాలను నిలిపే ప్రాంతాలు, చమురు డిపోలు,విమానాలు, రాడార్లు, సమాచార వ్యవస్థల వంటివి ఉన్నాయి. ఆ చిత్రాలు నిజమైనవా లేక కృత్రిమ సృష్టి అని చెప్పలేక అమెరికా ఏవేవో చెబుతున్నది.ఎవరెన్ని చెప్పినా ఇరాన్‌ గురిచూసి దెబ్బతీసింది.ట్రంప్‌ చెప్పినట్లుగా మరిన్ని దాడులకు పాల్పడితే ఇదే మాదిరి పరాభవం ఎదురుకావచ్చనే హెచ్చరికలే భూతల దాడులకు దిగకుండా అమెరికా మిలిటరీ జాగ్రత్తపడుతున్నదని చెప్పవచ్చు.గల్ఫ్‌లోని కొన్ని మిలిటరీ కేంద్రాలు దాడులకు పనికి రాకుండా పోయినట్లు చెబుతున్నారు. ఇరాన్‌పై దాడులతో తమకు 25బిలియన్‌ డాలర్ల మేర నష్టం వచ్చినట్లు రక్షణశాఖ కబుర్లు చెప్పినప్పటికీ 50బిలియన్‌ డాలర్లకు పైమాటే ఉంటుంది.పశ్చిమాసియా, మధ్య ప్రాచ్య ప్రాంతంలో జరిగిన నష్టాలకు సంబంధించిన చిత్రాలను విడుదల చేయవద్దని వాణిజ్య ఉపగ్రహ కంపెనీలను ట్రంప్‌ యంత్రాంగం ఆదేశించిందంటేనే అది ఎంతగా మూసిపెడుతోందో తెలుస్తోంది. ఇరాన్‌ విడుదల చేసిన చిత్రాలు చైనా, రష్యా ఉపగ్రహాలు తీసినవని వేరే చెప్పనవసరం లేదు. గురిచూసి అమెరికా లక్ష్యాలను దెబ్బతీయటం కూడా ఆయా దేశాలు అందించిన సమాచారం, ఐరోపా సంస్థలు విడుదల చేసిన సమాచారం, చిత్రాలతోనే సాధ్యమైంది.

ఏప్రిల్‌ ఎనిమిది నుంచి ఇరాన్‌-అమెరికా మధ్య కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది.రెండు దేశాల మధ్య పరస్పర దాడులు నిలిచిపోయాయి.అమెరికా కారణంగా ఇస్లామాబాద్‌లో తొలి చర్చలు విఫలమైన తరువాత ఇంతవరకు దోబూచులాట తప్ప మలి చర్చలు ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం నాడు తమపై ఇరాన్‌ 15ఖండాంతర,మూడు క్రూయిజ్‌ క్షిపణులు,నాలుగు డ్రోన్లతో దాడులు చేసిందని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆరోపించింది. (యుఏయి-దుబాయి అంటే అందరికీ బాగా తెలుస్తుంది.దుబారు, షార్జా, అబూదాబీ వంటి ఏడు ప్రాంతాలు కలసి ఉన్నదేశాన్ని ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌గా వ్యవహరిస్తారు, 1971లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది, రాజధాని అబూదాబీ, కోటి పది లక్షల మంది జనాభా ఉండగా దుబారు పెద్ద నగరం) కాల్పుల విరమణ అవగాహన తరువాత ఇదే పెద్ద దాడి.దుబారు చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఫుజాయిరా రేవుపై జరిగినదాడిలో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని వార్తలు. ముగ్గురు భారతీయ కార్మికులు గాయపడ్డారు.హార్ముజ్‌ జలసంధితో నిమిత్తం లేకుండా వేరే మార్గంలో చమురు ఎగుమతులు చేసేందుకు ఈ రేవు అనువుగా ఉంది. జలసంధి వెలుపల తిష్టవేసిన అమెరికా ప్రతి రోజూ ఇరాన్ను రెచ్చగొట్టేందుకు చూస్తున్నది, బలవంతంగా జలాల్లో ప్రవేశించేందుకు పూనుకుంది. అందువల్లనే ఇది పధకం ప్రకారం చేసిన దాడి కాదని, ”అమెరికా మిలిటరీ దుస్సాహసానికి ” ప్రతి స్పందన అని ఇరాన్‌ వర్ణించింది.ఇప్పటి వరకు హార్ముజ్‌ జలసంధి వెలుపలనే తిష్టవేసిన అమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలోకి చొరబడేందుకు చూసినపుడు తాము దాడి చేసినట్లు ఇరాన్‌ ప్రకటించగా అబ్బే అలాంటిదేమీ లేదని ట్రంప్‌ చెప్పుకున్నాడు. ఇరాన్‌ దాడి వెనుక అనేక అర్ధాలు, అంశాలు ఉన్నాయి.గల్ఫ్‌ దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా ఎమిరేట్స్‌ను ఒంటరి పాటు చేసేందుకు ఇరాన్‌ పూనుకుందని చెప్పవచ్చు. దుబాయిపై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్లు మోడీ సర్కార్‌ స్పందించింది. రుణాలు చెల్లించాలని పాకిస్తాన్‌పై రుణాల చెల్లింపుకు ఎమిరేట్స్‌ వత్తిడి చేయటం వెనుక మనదేశం కూడా ఉందని వ్యాఖ్యలు వెలువడిన పూర్వరంగంలో కృతజ్ఞతగా ఇలా స్పందించిందని చెప్పవచ్చు. తరువాత ఎలాంటి పరిణామాలు జరగలేదు గనుక ఒక వ్యూహంలో భాగంగా ఇరాన్‌ దాడిని చెప్పవచ్చు.

పశ్చిమాసియా పరిణామాల్లో గల్ఫ్‌ దేశాల పాత్ర గురించి మీడియా అంతగా కేంద్రీకరించకపోవటానికి కారణం వార్తా సంస్థలను పశ్చిమదేశాలు నియంత్రించటమే.చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల బృందం(ఒపెక్‌) నుంచి దుబాయి ఎందుకు ఆకస్మికంగా బయటకు వచ్చింది ?దాని వెనుక ఉన్న కథేంటి అన్నదితెలుసుకోవాలి.గల్ఫ్‌ దేశాల్లో గతంలోనే విబేధాలు ఉన్నప్పటికీ అవి ఈ సందర్భంగా మరింతగా బయటకు వచ్చాయి. తాము పధకం ప్రకారం దాడి చేయలేదని, నియంత్రణల్లో ఉన్న హార్ముజ్‌ జలసంధి నుంచి నౌకలకు దారి కల్పించేందుకు అమెరికా చేసిన మిలిటరీ దుస్సాహసానికి స్పందనకు ఫలితమని ఇరాన్‌ అధికారి చెప్పాడు. అంతకు ముందు నౌకలకు దారి కల్పిస్తామని అమెరికా ప్రకటించింది.ఈ క్రమంలో ఒక యుద్ధ నౌకపై ఇరాన్‌ రెండు క్షిపణులను ప్రయోగించింది. తాము వేగంగా వచ్చి దాడులు చేసే ఆరు ఇరాన్‌ నౌకలపై కాల్పులు జరిపామని, వాటిని ముంచివేశామని, ఇరాన్‌ దాడిలో దెబ్బతిన్నది దక్షిణ కొరియా నౌక తప్ప తమది కాదని అమెరికా చెప్పుకుంది.ఎమిరేట్స్‌పై దాడి పెద్ద విషయం కాదని,చర్చల్లో ఇరాన్‌ ఎంతో నయంగా ఉందనికూడా ట్రంప్‌ వ్యాఖ్యానించాడు.

ఇరాన్‌ మీద దాడి చేసిన ఇజ్రాయెల్‌కు యుఏయి ఎంతో సన్నిహితంగా ఉంది.లాంఛనంగా రక్షణ ఒప్పందం లేకున్నప్పటికీ అదే మాదిరి రెండు దేశాలూ వ్యవహరిస్తున్నాయి.ఇరాన్‌ దాడుల నుంచి రక్షణకు గగనతల వ్యవస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసింది.టెహరాన్‌పై ఇజ్రాయెల్‌ దుష్ట పథకాలకు ఎమిరేట్స్‌ ఎప్పటి నుంచో సాయపడుతున్నది. అమెరికా స్థావరాలకు చోటు కల్పించటమేగాక దాడులకు సైతం తమ వైమానిక స్థావరాల సౌకర్యాలను వినియోగించుకొనేందుకు ఎమిరేట్స్‌ సహకరించిందని,ఒమన్‌, మరొక దేశం మీద ఇజ్రాయెలే దాడిచేసి తాము చేసినట్లుగా చిత్రించేందుకు కూడా తోడ్పడినట్లు ఇరాన్‌ నిర్ధారించుకున్నది.తమ గురించి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు అవసరమైన ఏఐ మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చినట్లు టెహరాన్‌ భావిస్తున్నది.అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జయెద్‌(ఎంబిజెడ్‌) ఇజ్రాయెల్‌ మొసాద్‌, అమెరికా సిఐఏలతో కలసి పశ్చిమాసియా-మధ్య ప్రాచ్య ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నాడు.ఈజిప్టులోతొలిసారిగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్‌ మొర్సీ ప్రభుత్వాన్ని కూలదోయటం, అరబ్బు విప్లవాలను పక్కదారి పట్టించేందుకు నిధులు అందచేయటం వంటి తప్పుడు పనులకు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి.వాటిలో భాగంగా ట్యునీసియా,లిబియా, సూడాన్‌, ఎమెన్‌లలో జోక్యం చేసుకోవటం, నేరగాండ్లు, కిరాయి సాయుధులను సమకూర్చి అంతర్యుద్దాలకు దోహదం చేయటం వంటి దుర్మార్గాలకు మద్దతు ఇచ్చాడు.ఈ కారణంగా లక్షలాది మంది అరబ్బులు మరణించటం, ఇబ్బందులకు గురయ్యారు. తన సరిహద్దులను విస్తరించేందుకు ఇజ్రాయెల్‌ ఎలా దుర్మార్గాలకు పాల్పడుతున్నదో అదేమాదిరి ఎమిరేట్స్‌ విస్తరణకు పథకాలు వేశాడని కూడా చెబుతారు.పశ్చిమ దేశాలలో విద్యను అభ్యసించిన ఎంబిజె అమెరికాలో తన పలుకుబడిని పెంచుకొనేందుకు అప్పటి వరకు ప్రపంచానికి అంతగా తెలియని సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ను అమెరికన్లకు పరిచయం చేశాడు. తరువాత రియాద్‌లో ఉన్న ప్రముఖులను సిఐఏ ఏజంట్లుగా మార్చేందుకు సహకరించాడు. ఎమెన్‌లో ఇరాన్‌ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు అక్కడి వేర్పాటువాదులను తొలుత ఎమిరేట్స్‌ ప్రోత్సహించింది, తరువాత ఆ బాధ్యతను చేపట్టేట్లుగా సౌదీ అరేబియాను ప్రయోగించింది. తరువాత ప్రత్యర్ధులుగా మారారు. ఇప్పుడు సూడాన్‌, లిబియా, ఎమెన్లలో ఉన్న ఎమిరేట్స్‌ మద్దతు ఉన్న సాయుధులను అడ్డుకొనేందుకు సౌదీ అరేబియా, ఈజిప్టు చూస్తున్నాయి.

అమెరికా ఎత్తుగడలో భాగంగా ఒపెక్‌ కూటమి నుంచి ఎమిరేట్స్‌ వైదొలుగుతూ గతవారంలో నిర్ణయం తీసుకుంది.చమురు ఉత్పత్తి కోటాలతో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పింది. ఆరుదశాబ్దాలుగా ఒపెక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సౌదీని, ఇరాన్ను దెబ్బతీసేందుకే ఈ మేరకు పావులు కదిపినట్లు చెబుతున్నారు. రియాద్‌-అబూదాబీల మధ్య శాశ్వత వైరుధ్యం ఏర్పడినట్లు అల్జీరియా అధ్యక్షుడు అబ్దుల్‌మాదిజిద్‌ తెబ్బోనే వ్యాఖ్యానించాడు, ఎమిరేట్స్‌ వైదొలగటాన్ని తాను పట్టించుకోవటం లేదన్నాడు. ఎమిరేట్స్‌పై ఇరాన్‌ దాడి చేస్తే సౌదీ ఉష్ట్రపక్షిలా ఉందంటూ అబుదాబీ వ్యాఖ్యాతలు రెచ్చిపోయారు.అయితే ఎమిరేట్స్‌ వైదొలిగినందున అది నష్టపోయే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. వలస కార్మికులు, కిరాయి సాయుధ మూకలు, చిన్న సైన్యం మాత్రమే కలిగి ఉన్నందున ప్రత్యర్ధులను ఎలా ఎదుర్కొంటుందనేది ప్రశ్న.ఇజ్రాయెల్‌, అమెరికాలు ఆదుకుంటాయనే ఆశ మాత్రమే ఉంది. ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లు, క్షిపణులను పసిగట్టే లేజర్‌ వ్యవస్థలను ఇజ్రాయెల్‌ సమకూర్చి, వాటి నిర్వహణకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. వీటితో పాటు అబుదాబీ, దుబారు నగరాలకు ఐరన్‌ డ్రోమ్‌ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది. ఇరాన్‌ వీటన్నింటినీ గమనించిన కారణంగానే సోమవారం నాడు ఎమిరేట్స్‌ మీద క్షిపణి ప్రయోగం చేసింది.లెబనాన్‌లోని తన మద్దతుదారులైన హిజబుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.దుబారు పథకాలపై ఒక్క టెహరానే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న సౌదీ, ఒమన్‌,కతార్‌, పాకిస్తాన్‌, టర్కీ కూడా ప్రేక్షకులుగా ఉండజాలవు. ఉమ్మడి శత్రువైన ఇజ్రాయెల్‌తో పాటు దానికి సహకరించే ఏ దేశాన్నీ కూడా అవి వదలవు.

ఇటీవలి దాడులతో ఇరాన్‌ పట్ల గల్ఫ్‌ దేశాలు గుర్రుగా ఉన్నప్పటికీ అమెరికాతో కలసి దాడులకు పూనుకోలేదు. సోమవారం నాడు ఎమిరేట్స్‌పై దాడి గురించి ముందుగానే సౌదీ అరేబియా,ఒమెన్‌లకు ఇరాన్‌ చెప్పినట్లు గత గురువారం నాడే అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రాయటం గమనించాలి.అయితే ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పిందీ ఆ పత్రిక వెల్లడించలేదు. ఇరాన్‌ చర్యలపై ఆగ్రహం ప్రకటించినప్పటికీ సౌదీ మంత్రులు టెహరాన్‌తో సంబంధాల్లోనే ఉన్నారు. ఎమిరేట్స్‌ మద్దతుదార్లను వ్యతిరేకించే శక్తులకు పాకిస్తాన్‌లో సౌదీ కొనుగోలు చేసిన ఆయుధాలను మార్చినెలలో లిబియాకు తరలించారు.ఇక గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ జరిపిన దాడులకు సంబంధించి ఎమిరేట్స్‌ మీద ప్రత్యేకంగా కేంద్రీకరించినట్లు వివరాలు వెల్లడి అవుతున్నాయి. కాల్పుల విరమణకు ముందు రెండు వేల ఖండాంతర క్షిపణులు, డ్రోన్లను టెహరాన్‌ సంధించింది.మిగతా దేశాలతో పోలిస్తే ఎమిరేట్స్‌ వైఖరి ఒకటైతే అంతర్జాతీయంగా వత్తిడి తెచ్చేందుకు కూడా దానిపై దాడులను కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా, లక్షలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా దుబారు, తదితర నగరాలకు రావటం కూడా ఒక ప్రధాన కారణం. దాడుల్లో ఎవరైనా విదేశీయులకు హాని జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంది, పర్యాటకులు, వ్యాపారుల రాక తగ్గి ఆర్థికంగా ఎమిరేట్స్‌ నష్టపోతుందనే ఎత్తుగడ కూడా ఉంది.అది భావించినట్లుగానే అనేక హౌటళ్ల గదులు జనాలు లేక ఖాళీగా ఉంటున్నాయి. ఇదే అదునుగా అవసరమైన మరమ్మతులకు వాటిని మూసినట్లు కూడా చెబుతున్నారు. అమెరికా దాడులకు సౌదీ సహకరించినప్పటికీ చర్చలకూ చొరవ చూపిందని చెబుతుండగా దాడులను కొనసాగించాల్సిందేనని ఎమిరేట్స్‌ పట్టుబడుతున్నదని, తొమ్మిదినెలల వరకు దాడులు జరిగినా తట్టుకుంటామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మధ్యవర్తిగా ముందుకు వచ్చిన పాకిస్తాన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించి విఫలమై ఎమిరేట్స్‌ తమ రుణాలను వెంటనే తీర్చాలని మెడమీద కత్తి పెట్టినట్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీనికి రెండు ప్రధాన కారణాలను చెబుతున్నారు. సౌదీతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవటం, ఇరాన్‌ దాడులను ఖండించాలన్న డిమాండ్‌కు అంగీకరించకపోవటం, పాక్‌ను దెబ్బతీసేందుకు భారత్‌ తెచ్చిన వత్తిడి ఉన్నట్లు భావిస్తున్నారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ పరిశోధనల్లో నిర్లక్ష్యం – అడుగడుగునా రైతులకు అన్యాయం ! వేదాల్లో అన్నీ లేవని మోడీ పరివారానికి ఏ భాషలో చెప్పాలి !!

03 Sunday May 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Environment, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Science, USA

≈ Leave a comment

Tags

Agricultural research and Development, BJP, china agriculture, FAO, Farmers matters, Narendra Modi Failures, pseudoscience, R & D in India, RSS discipline hypocrisy exposed, Saffron gang hypocrisy

ఎం కోటేశ్వరరావు

పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలా లేదా అన్న అంశంపై నాలుగేండ్ల నాడు వేసిన కమిషన్‌ ఏం చేస్తోందో తెలియదు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మద్దతు ధరలతో పాటు దిగుబడి పెంపుదల, సాగు ఖర్చుల తగ్గింపు గురించి అనేక మంది చెప్పటం తెలిసిందే. పోనీ దానికైనా గడచిన పన్నెండేళ్లలో మోడీ సర్కార్‌ ఏమైనా చేసిందా ? వ్యవసాయ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి తీరుతెన్నులు, ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు గురించి రోమ్‌ నగరంలో ఉన్న ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) ఏప్రిల్‌ 30వ తేదీన ఒక నివేదికను విడుదల చేసింది. సభ్యదేశాల ప్రభుత్వాలు అందచేసే సమాచారం మేరకు 2023వరకు ఉన్న వివరాల ప్రకారం రూపొందించిన నివేదిక. గడచిన రెండు దశాబ్దాలలో ఏటా 1.8శాతం చొప్పున పరిశోధనకు ఖర్చు పెరుగుతూ 50.4 బిలియన్‌ డాలర్లకు చేరింది.వర్తమాన సహస్రాబ్ది తొలి పదేండ్లలో విస్తరణ మందకొడిగా ఉందని, 2009తరువాత పెరిగిందని గమనించారు.రైతే రాజు, దేశానికి వెన్నెముక, రైతులేనిదే రాజ్యం లేదు వంటి మాటలు ఎన్నో విన్నాం. ఏం జరిగింది, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ రిసర్చ్‌(ఐజెఓఇఏఆర్‌) 2026 మార్చినెల సంచిక, పేజీ 126లో దిగువ వివరాలు ఉన్నాయి. పంట ఉత్పత్తి అంకెలను మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా, దిగుబడి హెక్టారుకు టన్నులుగా గమనించాలి.చైనాలో మనకంటే సాగుభూమి తక్కువ, అయినా మొత్తం 69.కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంటే మనం 35.4కోట్ల టన్నులు చేసి చైనా కంటే మన జనాభా అదనంగా ఉన్నప్పటికీ అవసరానికి మించి పండిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాం.

పంటపేరు×× భారత ఉత్పత్తి××చైనా ఉత్పత్తి×××భారత దిగుబడి××చైనా దిగుబడి

వరి ×××××× 147-150 ×× 145 ××× 4.3 ×× 7.1

గోధుమ ×× 113-117 ×× 140 ××× 3.5 ×× 5.5

మొక్కజన్న × 35 ×× 280-290 ××× 3.2 ×× 6.1

సోయాబీన్‌×× 12-13 ×× 20 ××× 1.2 ×× 1.9

బం.దుంప×× 60 ×× 95 ××× 24 ×× 33

పిండికొద్దీ రొట్టె అన్న పెద్దలే కుండలో కూడు కుండలోనే ఉండాలి పిల్లాడు దుడ్డులా పెరగాలంటే కుదరదని కూడా చెప్పారు. జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచటంతో పాటు రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే దిగుబడులను కూడా అధికంగా సాధించాలి. అందుకు పెట్టుబడి, శాస్త్రవేత్తలు కావాలి. ప్రపంచంలో 2004లో 2,04,000 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటే 2023నాటికి 3,16,000కు పెరిగారు. మనదేశంలో పరిస్థితి ఏమిటి ? పూర్తికాలం పని చేసే పరిశోధకుల సంఖ్య రెండువేల సంవత్సరంలో 11,154 మంది ఉంటే 2018లో 11,372 మంది ఉన్నారు. అదే చైనాలో ప్రస్తుతం 43వేల మంది పని చేస్తున్నారు.శాస్త్రవేత్తల సంఖ్యను బట్టే వారి మీద పరిశోధన ఖర్చుకూడా ఉంటుంది. అది అధిక దిగుబడి వంగడాలు, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పండించటం మీద కూడా ప్రభావం చూపుతుంది.పారిశ్రామిక, ఐటి రంగాలకు అవసరమైన చౌక (కార్మికులు) ఇంజనీర్ల సృష్టి మీద చూపిన శ్రద్ధ అధికారంలో ఎవరున్నా వ్యవసాయం మీద పెట్టలేదు. ఎందుకంటే కోట్లాది మంది రైతుల కంటే లక్షల మంది పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మీద ఉన్న శ్రద్ద ఎక్కువ. అందుకే వ్యవసాయ రంగం ఇలా దిగజారిపోతున్నది, వ్యవసాయం గిట్టుబాటుగాక, అప్పులపాలైన రైతాంగ ఆత్మహత్యల గురించి వింటున్నాం.ఇతర రంగాల్లో అలాంటి పరిస్థితి లేనందుకు సంతోషమే గానీ ఇంకా ఎంతమంది రైతాంగాన్ని బలిపెట్టాలన్నదే ప్రశ్న.

దేశంలో జరిగిన అనర్దాలన్నింటికీ గాంధీ, నెహ్రూలే కారణం అని కాషాయ దళాలు నిరంతరం దుమ్మెత్తి పోస్తుంటాయి.వారి పూర్వీకులు బ్రిటీష్‌ వారి సేవకు బదులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గ్గొని నాయకత్వ స్థానాలకు వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా, ఎందుకు ఆ పని చేయలేదో చెప్పగలరా ? పోనీ వాజ్‌పాయి, ఇప్పుడు నరేంద్రమోడీ ఏలుబడిలో పరిశోధన అభివృద్ది రంగాలకు నిధులు ఎందుకు కేటాయించలేదు, ఇతర దేశాలతో ఎందుకు పోటీపడటం లేదో అయినా చెప్పాలి.ఎవరు అడ్డుకున్నారు.వేదాల్లోనే అన్నీ ఉన్నాయిష అని లొట్టలు వేసుకుంటూ చెప్పుకొనేవారి ఒళ్లో కూర్చుని రెండువేల సంవత్సరాల నాడే భారత్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, వినాయకుడికి ఏనుగు తల అమర్చటం దానికి నిదర్శనమని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన సంగతి తెలిసిందే. అదే బాటలో గోమూత్రం తాగితే కాన్సర్‌ నయమౌతుందని బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ సెలవిచ్చినదాన్నీ దేశం చూసింది. ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉన్న నాగేశ్వరరావు ఇంకా ముందుకు పోయి మహాభారత కాలంలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ పరిజ్ఞానంతో 100 మంది కౌరవులు ఒకేతల్లికి జన్మించారని కూడా చెప్పారు. అదే నిజమైతే పాండవులు వేర్వేరు తండ్రులకు ఎలా పుట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకులని చిత్రిస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నవారు శాస్త్రపరిశోధనలను ప్రోత్సహిస్తారా ? అమెరికాలోని లోవా విశ్వవిద్యాలయం చెప్పిన కొన్ని అంశాలను చూద్దాం.ఓయిసిడి సమాచారం(2022) ప్రకారం 2000-2002 మధ్య వ్యవసాయ పరిశోధనలకు అమెరికా, భారత్‌,బ్రెజిల్‌ దేశాలలో ఒక బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ప్రభుత్వాలు ఖర్చు చేశాయి.అదే 2019-21నాటికి చైనా ఖర్చు ఏడాదికి 1.3 నుంచి 6.6బిలియన్లకు పెరిగింది. అమెరికా,భారత్‌,బ్రెజిల్‌ చేసిన మొత్తం ఖర్చు కంటే చైనాలో ఎక్కువగా ఉంది.

దశాబ్దాల పాటు కొనసాగిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి తన అజెండాకు అనుగుణంగా వ్యవహరించేందుకు నీతి అయోగ్‌ను నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కేటాయిస్తే గాంధీ, నెహ్రూలు అడ్డుకొని ధర్నాలకు దిగిన ఉదంతాలేమీ లేవు.నీతి అయోగ్‌ 2025లో విడుదల చేసిన పదకొండవ పత్రంలో ఏం చెప్పిందో తెలుసా ! 1995-96లో కేంద్ర ప్రభుత్వం జిడిపిలో అన్ని రకాల పరిశోధనలకు కేటాయించిన మొత్తం 0.61 శాతం కాగా 2005-06లో అది 0.81కి పెరిగింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015-16లో 0.69శాతం, 2020-21లో 0.64శాతానికి పతనమైంది.వ్యవసాయ పరిశోధనలకూ ఇదే గతి అని వేరే చెప్పనవసరం లేదు.జిడిపిలో కనీసం రెండు శాతం కేటాయించాలని గతంలో ప్రణాళికా సంఘం సిఫార్సు చేసింది.దీని గురించి మోడీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రూపంలో అయినా ఎందుకు మాట్లాడటం లేదు ? ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2020లో తలసరి పరిశోధన పెట్టుబడి ఇజ్రాయెల్‌ 2,438 డాలర్లతో ప్రపంచంలో అగ్రగామిగా ఉండగా, తరువాత 2,192 డాలర్లతో అమెరికా,తొమ్మిదవ స్థానంలో ఉన్న చైనా 250, పద్నాలుగవ స్థానంలో 13 డాలర్లతో మనం ఉన్నాం. వీటినే అదే ప్రపంచ బ్యాంకు మరోవిధంగా చెప్పింది. జిడిపిలో ఇజ్రాయెల్‌ 5.4, అమెరికా 3.5శాతం కేటాయించగా చైనా 2.4, మనదేశం 0.7శాతం కేటాయించింది.అంతేనా ప్రభుత్వ రంగంలో మొత్తం పరిశోధనా సంస్థలు అమెరికా 727, చైనాలో 353, భారత్‌లో 18 ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక అంశాలను నీతి అయోగ్‌ తన పత్రంలో పేర్కొన్నది. ఇంత దరిద్రంగా ఉంటే మన పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు ఎలా పెరుగుతాయి, నాణ్యతలో ప్రపంచంలో ఎలా పోటీపడతాయి ? మోడీ విధానాలతో 2047నాటికి దేశం ఎక్కడికో పోతుందని నమ్మే వారు దేశంకోసం-ధర్మం కోసం బుర్రలు పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదా ! నరేంద్రమోడీ ఇజ్రాయెల్‌ పర్యటన జరిపి ఏం నేర్చుకొని వచ్చారు.ఇజ్రాయెల్‌ పితృస్వామికం, మనది మాతృస్వామికం అని చెప్పారు.దీని మీద సామాజిక మాధ్యమాల్లో జనాలు ఎంతగా అపహాస్య చేశారో తెలిసిందే. అక్కడి నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే పాలస్తీనా ప్రాంతాలలో ఇజ్రాయెల్‌ యూదులను ఎలా ప్రవేశ పెట్టి జనాభా నిష్పత్తిని ఎలా మార్చివేసిందో, కాశ్మీరులో కూడా అలాగే చేయాలని ప్రయోగాలు చేసింది.పెగాసెస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకు వచ్చి విమర్శనాత్మకంగా ఉండే మీడియా, రాజకీయంగా విబేధించే పార్టీల నేతల సమాచారాన్ని దొంగచెవులతో వినేందుకు చూసింది, వివిధ దేశాల్లో హంతక దళాలతో హత్యలు ఎలా చేయించవచ్చో నేర్చుకున్నది తప్ప మరొకటి కాదు.

చరిత్రలో నరేంద్రమోడీ ఏ ప్రధానీ వెళ్లనన్ని సార్లు చైనా వెళ్లారు, దాని నేతలతో భేటీ అయ్యారు.పోనీ చైనా నుంచి అయినా నేర్చుకున్నారా అదీ లేదు. ఓయిసిడి నివేదిక ప్రకారం 2019-21 సంవత్సరాలలో చైనా వ్యవసాయ ఉత్పత్తుల విలువ 1.6లక్షల కోట్ల డాలర్లు, అమెరికాలో 0.4,భారత్‌ విలువ 0.2లక్షల కోట్ల డాలర్లు మాత్రమే.మనదేశంతో పోలిస్తే చైనా విస్తీర్ణం చాలా ఎక్కువ, దానిలో 10.6శాతం 1.02మిలియన్ల చదరపు కిలోమీటర్లలో మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. అదే మనదేశంలో 52.8శాతం భూమి 1.69మిలియన్‌ చదరపు కిలోమీర్లలో సాగు చేస్తున్నాం.అయినా మన ఉత్పత్తి విలువ తక్కువగా ఎందుకుందో చైనాలో ఎక్కువ ఎందుకో ఎప్పుడైనా మోడీ తెలుసుకున్నారా ! ప్రపంచం మొత్తంలో ఉన్న భూమిలో 11.6శాతం మాత్రమే సాగులో ఉంది,భారత్‌ అగ్రస్థానంలో ఉండగా అమెరికాలో 17.1, రష్యాలో 7.4శాతంలో వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ప్రభుత్వ రంగం చేస్తున్న ఖర్చు గురించే మాట్లాడుకున్నాం. ప్రైవేటు రంగం కూడా ఇటీవలి సంవత్సరాల్లో పరిశోధనలకు ఖర్చు చేస్తున్నది.అది గుత్త సంస్థలకు మాత్రమే లాభాలు చేకూర్చుతున్నది తప్ప అందరికీ కాదు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం వ్యవసాయ పరిశోధనల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటుంది.అక్కడ ప్రభుత్వ ఖర్చు తగ్గుతున్నది. చైనాలో ప్రైవేటు పరిశోధనలు దాదాపు లేవు.భారత్‌,బ్రెజిల్‌, ఐరోపా యూనియన్‌లో పెరుగుతున్నాయి.. ప్రైవేటు రంగం కేంద్రీకరణ అంతా మార్కెట్లో గిరాకీ, లాభం ఉన్నవాటి మీదే ఉంటుంది. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గటం వలన టిఎఫ్‌పి(టోటల్‌ ఫ్యాక్టర్‌ ప్రొడక్టివిటీ) సూచిక అమెరికాలో ఇటీవలి కాలంలో ఆరుశాతం తగ్గింది.దీని అర్ధం ఏమిటంటే పదేండ్ల కాలంలో ఉత్పాదకత అమెరికాలో లాభసాటిగా లేదు.అందుకే పెద్ద ఎత్తున ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి అక్కడి ఉత్పత్తులను ఇతర దేశాల మార్కెట్లలో గుమ్మరించేందుకు అదిరింపులు, బెదరింపులు చేస్తున్నది.

మనువాదులు, సనాతనులుగా చెప్పుకొనేందుకు గర్వపడుతున్నవారు ఇటీవలి కాలంలో వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే వాదనలను ముందుకు తెస్తున్నారు.జర్మన్‌ హిట్లర్‌తో సహా పలువురు విదేశీయులు వివిధ రూపాల్లో వచ్చి మన పురాణాలు, వేదాలను తమ దేశాలకు తీసుకుపోయి వాటిలో ఉన్న విజ్ఞానాన్ని తస్కరించి తమవిగా చెప్పుకొని అనేక ఆవిష్కరణలు చేశారని చెప్పేవారి సంగతి తెలిసిందే. అదే నిజమైతే మనం ఆ విజ్ఞానాన్ని ఆవిష్కరించటానికి బదులు సమాజానికి అజ్ఞానాన్ని ఎందుకు పంచినట్లు ?ఆంగ్లేయులు ఇతర ఐరోపావారు మనదేశానికి రాకముందే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం వచ్చింది, తరువాతే వారి అదనపు ఉత్పత్తులను అమ్ముకొనేందుకు మనతో సహా ప్రపంచాన్ని ఆక్రమించుకున్నారు. పురాణాల్లో ఉన్న కొన్నింటికి ఆధునిక గణిత, శాస్త్రసిద్దాంతాలను అంటగడుతూ ఇవన్నీ గతంలోనే మనవారికి తెలుసని గతం గురించి గొప్పలు చెప్పుకుంటాయి కాషాయ దళాలు, వాటి తప్పుడు ప్రచారాన్ని తలకు ఎక్కించుకున్నవారు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఏక పార్టీ నియంతృత్వం, దాని విధానాలు మనకు పనికి రావు, చైనీయులు కాపీ కొడతారు అని సొల్లు కబుర్లు చెబుతారు.కమ్యూనిస్టు సిద్దాంతాన్ని, సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు చెబుతున్నమాట నిజం. కానీ ఉత్పత్తులు ఎలా చేయాలో, పంటలు ఎలా పండించాలో నేర్చుకొనేందుకు ఆడలేక మద్దెల ఓటిగా ఉందని సాకుచెప్పినట్లుగా సిద్దాంతాలతో పనేముంది ?అన్నీ అందరికీ తెలియవని మన పురాణాలే చెబుతున్నాయి. కుమారిల భట్టు వేదపండితుడే అయినప్పటికీ మిగతా అంశాల గురించి తెలియదు. బౌద్దం, జైనుల తత్వశాస్త్రం గురించి అధ్యయనం చేయటానికి వారి ఆశ్రమాలకు మారువేషంలో వెళ్లి అధ్యయనం చేసి తరువాత వాదించాడని చెబుతారు.ఆదిశంకరుడు సైతం పరకాయ ప్రవేశ విద్య ద్వారా కామకళా శాస్త్రాన్ని నేర్చుకొని ఉభయ భారతీదేవితో వాదించి ఆమె భర్త మండన మిశ్రుని శృంగేరి మొదటి పీఠాధిపతిగా నియమించినట్లు చెబుతారు. ఇక్కడ సమస్య ఏమంటే మన ఘనాపాటీలు, సంస్కృత పండితులు ఇంతవరకు వాటిలో ఉందని చెబుతున్న విజ్ఞానాన్ని బయటకు తీయలేదు, నూతన ఆవిష్కరణలు చేయలేదు.ఇప్పటికైనా ఆదిశంకరుల మాదిరి పరకాయ ప్రవేశం చేసిన చైనా, ఇతర దేశాల నుంచి దేశం కోసం-ధర్మం కోసం దేశభక్తులుగా మారి ఆధునిక యుద్ద విమానాల సాంకేతిక పరిజ్ఞానాలను సేకరిస్తారా ? పారిశ్రామిక,వ్యవసాయ రంగంలో వృద్ధికి తోడ్పడతారా ? పడక కుర్చీల కాలక్షేపపు కబుర్లు చెబుతూనే ఉంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమిరా బాలరాజూ…… బంగ్లాదేశ్‌ కంటే వెనుక బడిన జిడిపి ! కాషాయ దళాలు వీరంగం వేస్తే కుదరదు !! యుపిఏ చివరి రోజులు తిరిగి వస్తున్నాయా ?

23 Thursday Apr 2026

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Bangladesh Per capita GDP, BJP, Fuel prices freezing, IMF on GDP, India GDP, Modinomics a farce, Narendra Modi Failures, RSS, Saffron gang

ఎం కోటేశ్వరరావు

వికసిత్‌ భారత్‌ పేరుతో దేశ జిడిపిని 2047 మూడో, రెండో స్థానానికో తీసుకుపోతారని జనమంతా ఎందురు చూస్తున్నారు. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జిడిపిలో భారత్‌ ఆరోస్థానానికి పడిపోయింది.తలసరి జిడిపి మనది 2.81వేల డాలర్లు కాగా బంగ్లాదేశ్‌ 2.91వేలతో ఎగువన ఉంది. చైనా 14.87వేలతో ఇంకా ముందుంది.బంగ్లాదేశ్‌తో పోలుస్తారా అంటూ కాషాయ దళాలు వీధుల్లో వీరంగం వేస్తే కుదరదు.చేదు నిజాలను అంగీకరించకతప్పదు మరి.ఇది ఐఎంఎఫ్‌ చెప్పిన సమాచారం. 1980 నుంచి 2000 వరకు రెండు దేశాల మధ్య స్వల్పతేడా ఉంది.మోడీ అధికారానికి వచ్చిన సమయంలో మనకంటే బంగ్లాదేశ్‌ వెనుకబడి ఉంది.పన్నెండేళ్ల మోడీనోమిక్స్‌ అభివృద్ధి పథంలో దేశం నడిచిందని చెప్పిన తరువాత ఇప్పుడు మనం వెనుకబడిపోయాం.ఎంత చెట్టుకు అంతగాలి అంటారు గానీ, బంగ్లాదేశ్‌ చిన్న చెట్టు నుంచి ఎక్కువగా వస్తోంది.మొత్తం జిడిపిని జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి, ఇది వేదగణితంలో కూడా మారదు మరి. దీన్ని చూస్తుంటే ఒక సినిమాలో ఏమిరా బాలరాజూ నీవలన దేశానికి ఉపయోగం ఏమిటి అన్న మాట గుర్తుకు వస్తున్నది. ఇరాన్‌మీద జరుగుతున్న యుద్దంతో మనకేం సంబంధం లేదు, మన మీద ఎలాంటి ప్రభావం పడదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న తరుణంలో ఐఎంఎఫ్‌ నివేదిక వెలువడింది. ఒక్కసారిగా నాలుగో స్థానం నుంచి ఆరుకు దిగజారిందంటే మన వృద్ధి ఎంత బలహీనంగా ఉందో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆర్థిక స్థితి గురించి ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌ నెలలో వేసిన అంచనాలు పరిస్థితిని వెల్లడించాయి. అయితే నాలుగు లేదా ఆరులో ఉన్నప్పటికీ సమీప దేశాలతో పోలిస్తే తేడాలు పెద్దగా లేవు. ఉదాహరణకు వంద నాలుగో స్థానం అనుకుంటే 101ఐదో స్థానం మాదిరిగా చెప్పుకోవచ్చు.తాజా ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం అమెరికా 32.38,చైనా 20.85,జర్మనీ 5.5, జపాన్‌ 4.38, బ్రిటన్‌ 4.26, భారత్‌ 4.15, ఫ్రాన్సు 3.27లక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగి ఉన్నాయి. అందువలన నాలుగు నుంచి ఆరు స్థానాల వరకు ఉన్న దేశాల్లో ఏ చిన్న మార్పు వచ్చినా వరుస మారుతున్నది.మన స్థానం ఎందుకు తగ్గుతున్నట్లు ? పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఎన్ని స్టెరాయిడ్లు ఇచ్చినా ఫలితం ఎందుకు రావటం లేదు !

రూపాయి పతనం గురించి మోడీ, ఇతర బిజెపి నేతలు మన్మోహన్‌ హయాంలో చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకుంటే ఆడపిల్లలకంటే ఎక్కువగా సిగ్గుపడిపోతారు గనుక ఇప్పుడు మాట్లాడటం లేదు, కిందపడినా గెలుపు మాదే అన్నట్లుగా ఉన్నారు. గతంలో రూపాయి పతనమైతే మన్మోహన్‌ సింగ్‌ చేతగాని తనం, అవినీతి అన్నారు.ఇప్పుడు మరోవిధంగా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుకల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.వ్యవస్థా సంబంధిత సమస్యల కంటే రూపాయి మార్పులే జిడిపి స్థానం పడిపోవటానికి కారణమని, రానున్న సంవత్సరాలో భారత్‌ పుంజుకుంటుందని ఐఎంఎఫ్‌ చెప్పింది.జోతిష్కాలన్నీ అలాగే ఉంటాయి. ప్రపంచ జిడిపి లెక్కలన్నీ అమెరికా డాలర్లలోనే ఉంటాయి.అందువలన డాలర్‌తో ప్రతిదేశ కరెన్సీ విలువను బట్టి పరిస్థితి మారుతూ ఉంటుంది.మనదేశంలో ఉత్పత్తి ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే విలువ పడిపోతుంది. గడిచిన ఏడాది కాలంలో రు.80లలో ఉన్న మారకం రు.90లోకి పతనమైంది.అందుకే డాలర్ల లెక్కలో మన జిడిపి తగ్గింది.ఇటీవల జరిగిన పరిణామాలన్నీ మన రూపాయి పాపాయి మీద వత్తిడిని మరింతగా పెంచాయి. ముడిచమురు ఉత్పత్తిలో మోడీ అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో 37.4మిలియన్‌ టన్నుల నుంచి ప్రస్తుతం 25మి.టన్నులకు పడిపోయింది, సహజవాయు ఉత్పత్తి కూడా తగ్గింది.ఈ మేరకు విదేశీ దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తున్నది.దీనికి గాను డాలర్లు కావాలి, వాటిని కొనుగోలు చేయాలంటే మన రూపాయి విలువ పతనం అవుతున్నది. ఇటీవలి కాలంలో మన స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు పెద్ద మొత్తంలో లాభాలు దండుకొని వెనక్కు తీసుకోవటం కూడా డాలర్లు తరలిపోవటానికి ఒక కారణం. తన డాలరు పెత్తనాన్ని కాపాడుకొనేందుకు ఇరాన్‌ వంటి దేశాలనే తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు చూస్తున్న అమెరికా తన కరెన్సీ విలువ పతనం కాకుండా చూస్తున్నది. భారత ఆర్థిక సంవత్సరం 2025-26లో మన వృద్ధి రేటు 6.5శాతం ఉన్నప్పటికీ కరెన్సీ విలువ పదకొండుశాతం పతనం కాగా జపాన్‌ ఎన్‌ 10, బ్రిటన్‌ పౌండ్‌ రెండు శాతాల చొప్పున పెరిగాయి. అందుకే స్వల్పంగానే అయినప్పటికీ అవి రెండు మనలను వెనక్కు నెట్టి పైకి వెళ్లాయి. మన జిడిపి లెక్కింపు ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చిన కారణంగా తగ్గిపోయినట్లు కొందరు చెబుతున్నారు, అదే వాస్తవం అయితే అంతకు ముందు పాత ప్రాతిపదిక సంవత్సరాన్ని తీసుకొని ఎక్కువగా చూపి జనాన్ని మభ్యపెట్టారని అనుకోవాల్సి ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం వలన మనకెలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భరోసా ఇస్తున్నారు. అలా జరగాలనే జనం కోరుకుంటున్నారు.అది నిజమా !ఇల్లు కట్టేటపుడు, పెళ్లి కుదిరిన తరువాత వాటిని పూర్తి చేసేందుకు అవసరమైతే ఎక్కడబడితే అక్కడ అప్పు తెచ్చి ముగించటం తెలిసిందే. తరువాతే అసలు కథ మొదలౌతుంది.యుద్ధ ప్రభావం కూడా అంతే.మనకు అవసరమైన ముడి చమురు దిగుమతులను తగ్గించటంలో మోడీ సర్కార్‌ విఫలమైంది.అవసరాలు పెరుగుతున్నపుడు దిగుమతులు కూడా పెరగాలి కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆత్మనిర్భరత నినాద కాలంలో మన స్వదేశీ ఉత్పత్తి 2014 38మిలియన్‌ టన్నులు ఉండగా ఇప్పుడు 25మి.టన్నులకు పడిపోయింది.అందువలన 88శాతం మేరకు దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది.రోజుకు సగటున 50లక్షల పీపాలను కొనుగోలు చేస్తున్నాం.ఈ మొత్తంలో 40శాతం హార్ముజ్‌ జలసంధి ద్వారా రవాణా అవుతుంది.వంటగ్యాస్‌ను 91శాతం గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.ఇప్పుడు దీనికీ ఆటంకం ఏర్పడింది.విదేశాల్లో ఉన్న భారతీయులు వందమంది అనుకుంటే 50మంది గల్ఫ్‌ దేశాల్లోనే ఉన్నారు. వారు ప్రతిఏటా 50బిలియన్‌ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు.ఇప్పుడు ఎంత తగ్గిందో లెక్కలు తేలిన తరువాత మాత్రమే తెలుస్తుంది.యుద్దానికి ముందు మనం సగటున 67డాలర్లకు ఒక పీపా దిగుమతి చేసుకుంటే అది 110 డాలర్లకు పెరిగింది. 2022 నుంచి దిగుమతి ధర తగ్గినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి తగ్గుదల లేకుండా గోళ్లూడగొట్టి అధికమొత్తాలను వసూలు చేశారు.అందుకే తేలుకుట్టిన దొంగల మాదిరి ఏమీ మాట్లాడటంలేదు, అయితే తాత్కాలికమే.

పవర్‌ పెట్రోలు, పారిశ్రామిక అవసరాలకు వాడే డీజిల్‌ ధరలను మాత్రమే పెంచారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత మొత్తం చమురు, గ్యాస్‌ ధరలను పెంచుతారా లేదా అన్నది పెద్ద ప్రశ్న.ఎందుకంటే నరేంద్రమోడీ జిగినీదోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడప్పుడే సంక్షోభాన్ని ముగించేట్లు లేడు. యుద్దానికి ముందు రోజుకు 33.5కోట్ల డాలర్లను దిగుమతులకు ఖర్చు చేస్తుంటే ఆ మొత్తం ఇప్పుడు 55 కోట్ల డాలర్లకు పెరిగింది.నలభై ఐదు రోజుల యుద్ద కాలంలో పెరిగిన అదనపు చమురు బిల్లు 970 కోట్ల డాలర్లు.ఇది మన కరెన్సీ 92వేలకోట్లకు సమానం.ముడి చమురు ధర ఒక పీపాకు పదిడాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతా లోటు జిడిపిలో 0.4 నుంచి 0.5శాతం పెరుగుతుంది. గల్ఫ్‌ దేశాల నుంచి చమురు దిగుమతి చేసే టాంకర్ల బీమా ధరలు 400శాతం పెరిగాయి, రూపాయి విలువ నష్టం గురించి ముందే చెప్పుకున్నాం.చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో 40శాతం పెరిగాయి, మన రూపాయి విలువ 11శాతం తగ్గింది. దీంతో ప్రతి పీపాకు మనం చెల్లించాల్సిన మొత్తం 55శాతం పెరిగిందని అంచనా. మరింత సులభంగా చెప్పాలంటే యుద్దానికి ముందు ఒక పీపాను మన రూపాయల్లో రు.5,695కు తెచ్చుకుంటే ఇప్పుడు రు.9,500 చెల్లించాల్సి వస్తోంది.ఈ మొత్తం జనాలు లేదా ప్రభుత్వం భరించాల్సిందే. మోడీ జనం మీద దయచూపుతారా ? పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ కారణాలతో మన విదేశీమారక ద్రవ్యం100 బిలియన్‌ డాలర్లు తగ్గింది. యుద్దం కారణంగా వంటగ్యాస్‌ దిగుమతులు వెంటనే 30శాతం తగ్గాయి. దాంతో ఆందోళనకు గురైన ప్రభుత్వం చమురుశుద్ది కేంద్రాలలో ఉప ఉత్పత్తులైన ప్రొపేన్‌ మరియు బుటేన్‌లను వంటగ్యాస్‌ తయారీకి మళ్లించాలని ఆదేశించింది, దాంతో 25శాతం మాత్రమే అదనంగా అందుబాటులోకి వచ్చింది. ఈ కారణంగా ఇప్పటికీ గ్యాస్‌ సరఫరా ఆలశ్యం అవుతున్నది. గ్యాస్‌ ధర రు.60 పెంచారు, సబ్సిడీ రు.40 రద్దు చేశారు, అంటే వంద రూపాయలు వడ్డించారు.మన భూగర్భ నిల్వల సామర్ద్యం 1.4లక్షల టన్నులే,రోజుకు 80వేల టన్నులు కావాలి గనుక రెండు రోజులకూ సరిపోదు. అందుకే వెంటనే కొరత ఏర్పడింది.

ఈ సంక్షోభం కారణంగా దాదాపు పన్నెండు బిలియన్‌ డాలర్ల మేర వ్యవసాయ ఉత్పత్తులు ముప్పులో పడినట్లు గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(జిటిఆర్‌ఐ) అంచనా వేసింది.నాలుగు లక్షల టన్నుల బాస్మతి బియ్యం రేవుల్లో నిలిచిపోయింది.కాండ్లా రేవులో అరటి పండ్లు పనికిరాకుండా పోయాయి.తేయాకు ఇరవైశాతం ఎగుమతులు ఆగిపోయాయి.ఇదే విధంగా మనం దిగుమతి చేసుకొనే ఆపిల్‌,ఇతర ఉత్పత్తులు కూడా ఆగిపోయాయి.దిగుమతి చేసుకొనే ఎరువులు నెల రోజులు ఆలశ్యం అవుతాయని, ఇప్పటికే 20శాతం ధరలు పెరిగినట్లు చెబుతున్నారు.విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రతి ఏటా 50 బిలియన్‌ డాలర్లు మాతృదేశానికి పంపుతున్నారు.ఈ మొత్తంలో మధ్య ప్రాచ్య దేశాల నుంచి 15బిలియన్‌ డాలర్లు వస్తున్నాయి.తాజా సంక్షోభంతో ఈ మొత్తాల మీద ప్రతికూల ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే తెలియదు.పశ్చిమాసియా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా ఉండదని తొలిరోజుల్లో మాట్లాడిన అధికారపక్ష నేతలు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.నీతి ఆయోగ్‌ తాజా నివేదికలో దేశవాణిజ్యం, ఆర్థిక స్థిరత్వం గురించి చెబుతూ కరెంట్‌ ఖాతా లోటు పెరగనుందని చెప్పింది.దేశ ఎగుమతులు, దిగుమతుల్లో గల్ఫ్‌ ప్రాంత వాటా పన్నెండుశాతం ఉంది.యుఏయికి సరకులను పంపి అక్కడి నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తిరిగి ఎగుమతి చేస్తారు.ఇప్పుడు వాటికీ ముప్పు ఏర్పడింది.ఈ ప్రాంతం నుంచి మన ఎరువుల అవసరాల్లో 36శాతం, విలువైన రాళ్లు,లోహాలలో 32శాతం దిగుమతి చేసుకుంటున్నాము.మూడవ త్రైమాస కాలంలో యుద్దంతో నిమిత్తం లేని సమయంలో మన వస్తు ఎగుమతులు కేవలం 1.6శాతం పెరగ్గా దిగుమతులు 7.9పెరిగాయి.

ముడి చమురు ధరలు పెరగటం, కొరతల కారణంగా వృద్ధి రేటు తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు ఉందని ఏప్రిల్‌ ఎనిమిదిన ఆర్‌బిఐ గవర్నర్‌ సంజరు మల్హోత్రా విధాన ప్రకటనలో పేర్కొన్నారు.ద్రవ్యోల్బణ లక్ష్యం నాలుగుశాతం కాగా 4.6శాతానికి పెరగవచ్చని ఆర్‌బిఐ పేర్కొన్నది.నెల రోజుల పాటు రష్యన్‌ చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ” అనుమతి ” ఇచ్చింది. అయితే గతంలో ట్రంప్‌ బెదిరించిన కారణంగా మనం దిగుమతులు తగ్గించిన కారణం కావచ్చు,మార్కెట్‌లో డిమాండ్‌ ఇతర కారణాలతో గతంలో రష్యా ఇచ్చిన రాయితీలు ఇప్పుడు లేకపోగా అదనంగా చెల్లించి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.ప్రపంచ మార్కెట్‌ కంటే పీపాకు పదిహేను నుంచి ఇరవై డాలర్లు తక్కువగా రాయితీ ధరలకు రష్యా ముడిచమురును అందచేస్తే దాన్నుంచి ఉత్పత్తులు తయారు చేసి అంబానీ,నయారా కంపెనీలు విదేశాలకు లాభాలకు అమ్ముకున్నాయి తప్ప మన వినియోగదారులకు ఒక్క పైసా కూడా తగ్గించలేదు.ఇప్పుడు గతరాయితీలు పోగొట్టుకొని ప్రామాణిక బ్రెంట్‌ రకం కంటే రెండు నుంచి నాలుగు డాలర్లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది.అమెరికా పాటలకు అనుగుణ్యంగా డాన్సులు చేస్తే ఇలాగే ఉంటుంది మరి.అతి తెలివి ప్రదర్శిస్తే వ్రతమూ చెడుతుంది, ఫలితమూ దక్కదు ! మొత్తంగా పన్నెండేళ్ల పాలన తీరు తెన్నులను చూస్తే మన్మోహన్‌ సింగ్‌ హయాంలో యుపిఏ ఎదుర్కొన్న తీవ్ర పరిస్థితులు తిరిగి వస్తున్నాయా ? 2029లో మోడీ, బిజెపి పాలనకు తెరపడుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత పరువు తీస్తున్నదెవరు : ఇప్పటికైనా ఆత్మగౌరవాన్ని మోడీ పునరుద్దరిస్తారా ? అసెంబ్లీ ఎన్నికల తరువాత రోజుకు రు.2,400 కోట్ల వడ్డింపు !

03 Friday Apr 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, BJP, Donald trump, Fuel Price in India, Iran Oil, Narendra Modi Failures, RSS, Russian oil

ఎం కోటేశ్వరరావు

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నది ఒక లోకోక్తి. తనకు ఎదురులేదన్నట్లుగా నల్లేరు మీద బండిలా నడుస్తున్న నరేంద్రమోడీ పరిస్థితి అలాగే ఉందా ? కాలవైపరీత్యం గాకపోతే పొగిడిన మీడియా నోళ్లే అపహాస్యపు శీర్షికలు పెడతాయని ఎవరైనా ఊహించారా ! తాజాగా ఒక వార్త శీర్షిక ఇలా ఉంది. ” ఇరాన్‌ యుద్ధ పరిహాసం : ఏడు సంవత్సరాల్లో తొలిసారిగా టెహరాన్‌ నుంచి చమురు తెచ్చుకోనున్న భారత్‌ ”. ఆంగ్లలో ఐరనీ అనే పదానికి పరిహాసం, ఎగతాళి, గేలి ఇలా పర్యాయపదాలు ఎన్నో ఉన్నాయి. మీడియా ఇలాంటి శీర్షిక పెట్టటానికి కారకులు ఎవరు ? కచ్చితంగా నరేంద్రమోడీ తప్ప మరొకరు కాదు. అమెరికాను పక్కన పెట్టి హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు ఐరోపాలోని ధనిక దేశాలు ప్రారంభించిన ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌ కోరిక మేరకు 60దేశాల జాబితాలో మనం కూడా చేరాము. ఇది డోనాల్డ్‌ ట్రంప్‌కు కోపం తెప్పిస్తుందో ఏం పాడో, లేకపోతే ”అనుమతి” ఇచ్చాడా, ఏదైనా జరిగి ఉండవచ్చు, ఇంకా ఇలాంటి వాటిని ఎన్ని చూడాల్సి వస్తుందో ! ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత జరిగిన పరిణామాలను కాషాయదళాలు మింగా కక్కలేకుండా ఉన్నాయి. కడుపులో ఉన్న ఇరాన్‌ వ్యతిరేకతను వెల్లడించలేరు, ఇజ్రాయెల్‌, అమెరికా అనుకూలతను దాచుకోలేని ఒక మానసిక స్థితి,దీనికి చికిత్స లేదు.

ఒక నాడు మన దిగుమతుల్లో ఇరాన్‌ చమురు అగ్రభాగాన ఉంది. అలాంటిది 2019 నుంచి కొనుగోలు నిలిపివేశాము.మనకు ఎక్కడ లబ్ది ఉంటే అక్కడ కొనుక్కుంటాము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో పోల్చితే ఇరాన్‌ చమురు ధర పెరిగిందనా, నాణ్యత పడిపోయిందనా ? ఎందుకు నిలిపివేసినట్లు, తిరిగి ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లు ? జవాబుదారీ తనంలో ” ఘనత ” వహించిన పెద్దలు నోరు, మెదపరు, ఎందుకంటే దేశం కోసం-ధర్మం కోసం మౌనంగా ఉన్నాం అంటారు. ఏం జరిగినా నోర్మూసుకొని ఉండాలని ఏ సనాతన ధర్మం, ఏ పురాణాలు, ఇతిహాసాలు చెప్పాయి. పాండవులకు అన్యాయం జరిగితే శ్రీకృష్ణుడి రాయబారం, సీతను తిరిగి తనవద్దకు పంపి యుద్ధాన్ని నివారించాలని వాలి కుమారుడు అంగదుడిని శాంతి సందేశంతో రావణుడి వద్దకు పంపిన రాముడు (ఇప్పుడు ఇరాన్‌ యుద్దంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తామన్న పాకిస్తాన్ను బ్రోకర్‌ అని చౌకబారుగా వర్ణించిన పెద్దలు ఇతిహాసాల్లో జరిగిందాన్ని కూడా అలాగే అంటారేమో ఖర్మ) గురించి చదువుకున్నాం.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు మనలను ఎవరూ నమ్మని కారణంగా ఎవరూ పిలవటం లేదు, పెద్దరికం వహించాలని కోరటం లేదు గనుక దళారీ అని కసి తీర్చుకున్నాం. ఇప్పుడు మరి 60దేశాల చొరవలో మన పాత్రను ఎలా వర్ణిస్తారో తెలియదు.

డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరిస్తే మనం మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి అమెరికాను ”సంతుష్టీకరించేందుకు ” ప్రయత్నించాం. ఇప్పుడు అదే అమెరికా కావాలంటే ఇరాన్‌ చమురు కొనుక్కోవచ్చు అని చెప్పగానే ఉరుకులు పరుగులతో ఎగబడ్డాం.రెండూ మోడీ ఏలుబడిలోనే జరిగాయి.ఎంత ఆత్మగౌరవం ! ఇరాన్‌ నుంచి పింగ్‌ షన్‌ అనే చమురు టాంకరు ఆరులక్షల పీపాల చమురుతో బయలుదేరి గుజరాత్‌లోని వాడినర్‌ రేవుకు చేరనుందని వార్తలు.మన తీరుతెన్నులు చూస్తున్న ఇరాన్‌, ఇతర దేశాల దగ్గర మన గౌరవం పెరిగిందా తరిగినట్లా ? రష్యా చమురు సంగతి కూడా అంతే అనుకోండి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకోలేదా అని అడ్డు సవాళ్లు విసిరే వారు టెహరాన్‌ నుంచి ఎందుకు నిలిపివేశారో చెప్పాలి. మతకోణం ఉందంటే ఉలిక్కిపడతారా ? అమెరికా ఆడించినట్లు ఆడి 145 కోట్ల దేశం పరువు ఎవరు తీశారు ? ఇరాన్‌ విషయంలో అమెరికా తన లక్ష్యాలను గుట్టుచప్పుడు కాకుండా మార్చుకుంది, హార్ముజ్‌ జలసంధి నుంచి మీ చమురు మీరు తెచ్చుకోండి మేం చేసేదేమీ లేదని చేతులెత్తేశాడు ట్రంప్‌. మనం మాత్రం అతగాడి తోకపట్టుకు నడిచి ఇప్పుడు వ్రతం చెడ్దా ఫలం దక్కని స్థితిలో పడ్డాం.ఏం గతంలో వద్దన్నారుగా ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని ఇరాన్‌ అనలేదు గనుక సరిపోయిందిగాని, అని ఉంటే ? అమెరికా మబ్బులను చూసి చేతిలోని ముంతలో నీరు పారపోసుకోకూడదని గ్రహిస్తారా ! అమెరికా మీద వ్యతిరేకతతో ఎత్తుగడగా భారత్‌ పట్ల ఇరాన్‌ అనుకూలంగా వ్యవహరించిందని, పోరు ముగిసిన తరువాత కూడా అదే విధంగా ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఏప్రిల్‌ నాలుగవ తేదీన గుజరాత్‌ వాడినార్‌ రేవుకు చేరనుందని చెప్పిన ఇరాన్‌ నౌక మూడు రోజులుగా ప్రయాణ దిశ మార్చుకొని చైనా వైపు పయనిస్తున్నదని శుక్రవారం నాడు నౌకల కదలికలను నమోదు చేసే కెప్లర్‌ సంస్థ పేర్కొన్నది. అయితే వాణిజ్య నౌకలు ఎప్పుడు దిశమార్చుకుంటాయో తెలియదని నౌకనుంచి అందుతున్న సంకేతాలను బట్టి చివరకు అది ఎక్కడకు చేరేది చెప్పలేమని కూడా తెలిపింది. ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్నకు రిటోలియా అనే సంస్థ చెప్పినదాని ప్రకారం గతంలో 30 నుంచి 60 రోజుల వరకు చెల్లింపులకు గడువు ఇచ్చేవారని, ఆ చమురును అమ్మింది ఎవరో, కొనుగోలు చేసింది ఎవరో కూడా వెల్లడి కాలేదని, ఇప్పుడు ఆ షరతులను కఠినతరం గావించటం కారణం కావచ్చంటున్నారు. చెల్లింపుల సమస్య పరిష్కారమైతే తిరిగి భారత్‌ వైపు ప్రయాణించవచ్చని కూడా రిటోలియా పేర్కొన్నది.వాడినార్‌లో రష్యా కంపెనీ రోస్‌నెఫ్ట్‌కు చెందిన నయారాఎనర్జీ సంస్థ ఏడాదికి రెండు కోట్ల టన్నుల సామర్ధ్యం గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది.

తన రాజకీయ ప్రయోజనం, ఆధిపత్యం, ఇరాన్‌ చమురును కొల్లగొట్టేందుకు, ఇజ్రాయెల్‌ కోసం చేసే రాజకీయాల్లో భాగంగా టెహరాన్‌పై ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసే వారి తాటవలుస్తామని ట్రంప్‌ బెదిరించాడు.చైనా మరికొన్ని దేశాలు ఖాతరు చేయకుండా దిగుమతులు చేసుకున్నాయి. అంతకు ముందు 2018-19లో మన దిగుమతి అవసరాల్లో 10-12శాతం అంటే 23-24 మిలియన్‌ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం. ట్రంప్‌ 2019లో ఆంక్షలు విధించటంతో ఆ ఏడాది మే నెల నుంచి క్రమంగా తగ్గించి 2019-20లో రెండు మిలియన్‌ టన్నులకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిలిపివేశాం. అంతకు ముందు మనదేశానికి రాయితీలతో పాటు అప్పుకూడా ఇచ్చింది. వాటినే నరేంద్రమోడీ యుపిఏ ప్రభుత్వం చేసిన చమురు అప్పును తాను తీర్చాల్సి వచ్చిందని ప్రచారం చేయటమే గాక ఆ పేరుతో సెస్సులు, ఇతర భారాలను మోపిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తరువాత రష్యా నుంచి కొనుగోలు చేశాము, దాని మీద కూడా ఆంక్షలు విధించటంతో గరిష్టంగా రోజుకు 20లక్షల పీపాల దిగుమతిని ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సగానికి తగ్గించుకున్నాం. ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ట్రంప్‌ రష్యా , ఇరాన్‌ నుంచి చమురు తెచ్చుకోవచ్చు అంటూ మనకు ”అనుమతి” ఇచ్చాడు. ఇప్పుడు గతంలో ఇచ్చిన రాయితీని మనం కోల్పోయాము, మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఎందుకీ దుస్థితి ?

యుద్దం కారణంగా ఇప్పటికే జనం మీద భారాలు మోపటం ప్రారంభించారు,పవర్‌ పెట్రోల్‌, పరిశ్రమల్లో వాడే డీజిల్‌, ఇథనాల్‌ లేని పెట్రోలు, గృహ, వాణిజ్య గ్యాస్‌ ధరలను పెంచారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇప్పటికి ఇప్పుడు ఇరాన్‌ పోరు ముగిసినప్పటికీ ఇంథన ధరలు తగ్గే అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ హెచ్చరించింది. బ్రెంట్‌ రకం చమురు పీపా ధర 70 నుంచి 120 డాలర్ల వరకు పెరిగింది.మనం కొనుగోలు చేసే ముడి చమురు కూడా ఇదేవిధంగా పెరిగింది. సంక్షోభం ముగిసిన తరువాత పూర్వపు స్థితికి ధరలు దిగివస్తాయా ? జనం మీద భారం మోపటం లేదంటూనే మానసికంగా సిద్దం చేస్తున్నారు. చమురు మార్కెట్‌ కంపెనీలకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఎక్సయిజ్‌ పన్ను రద్దు చేశామని చెప్పారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) ద్వారా మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగు వారాల్లో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 75శాతం పెరిగాయని తెలిపారు. అయినా కొనుగోలు ధరలకంటే తక్కువకే కంపెనీలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయని, పెట్రోలు మీద లీటరుకు రు.26, డీజిలు మీద 81.90 నష్టం వస్తున్నదని, రెండూ కలిపితే రోజుకు రు.2,400 కోట్ల మేర వాటికి నష్టం వస్తున్నదని పేర్కొన్నారు. ఆసియాలో 30 నుంచి 50, ఉత్తర అమెరికాలో 20, ఐరోపాలో 30శాతం ఇంథన ధరలు పెరిగినట్లు పెట్రోలియం శాఖా మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి భారీగా ధరలు పెంచటం రెండవది నష్టాలను ప్రభుత్వం భరించటం అంటూ రెండోదానికే ప్రధాని నిర్ణయించినట్లు చెప్పారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గ్యాస్‌ మీద నామమాత్ర సబ్సిడీ తప్ప పెట్రోలు, డీజిలు మీద సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు. సెస్సుల పేరుతో లక్షల కోట్ల భారం మోపారు. 2022కు ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆమేరకు పెంపు తగ్గితే తగ్గింపు అన్న విధానాన్ని అమలు చేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా వినియోగదారులకు తగ్గించలేదు.ముందే చెప్పుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికల తరువాత అసలు రంగు బయటపడుతుంది.ప్రతి రోజుకు వస్తున్న రు.2,400 కోట్లను ప్రభుత్వం భరించాలంటే నెలకు 72వేల కోట్లు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు పెరిగాయని దిగుమతులు నిలిపివేసి రైతులను ఇబ్బంది పెట్టిన పాలకులను ఎవరైనా నమ్ముతారా ? గత పది సంవత్సరాల్లో దాదాపు 25లక్షల కోట్ల రూపాయలను అదనపు ఎక్సయిజ్‌, సెస్సుల రూపంలో వినియోగదారుల నుంచి పిండుకున్న ఘనత మరచిపోగలమా ?

రానున్న రోజుల్లో ముడిచమురు ధరల గురించి రాయిటర్స్‌ మార్చినెలలో జరిపిన విశ్లేషణలో 2026లో బ్రెంట్‌ రకం ముడి చమురు సగటున 82.85 డాలర్లు ఉంటుదని పేర్కొన్నారు.ఫిబ్రవరిలో చెప్పిన 63.85 డాలర్లకంటే ఇది 30శాతం ఎక్కువ. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున ఈ అంచనాలు మారిపోవచ్చు.ఏప్రిల్‌ 11వరకు రష్యా చమురు కొనుగోలుకు ట్రంప్‌ ” అనుమతి ” గడువు ఉంది.తరువాత ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో తెలియదు. మార్కెట్‌ చరిత్రను చూస్తే 2008లో ముడి చమురు ధర గరిష్టంగా 145 డాలర్లకు చేరింది.ఇరాన్‌ పోరు ఇంకా కొనసాగితే ఆ రికార్డును అధిగమించవచ్చని జోస్యం చెబుతున్నారు.సంక్షోభం మే మొదటి పక్షం వరకు కొనసాగితే 150 డాలర్లకు చేరవచ్చని జెపి మోర్గాన్స్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ మూడవ తేదీన పేర్కొన్నది.(మరికొన్ని సంస్థలు రెండువందల డాలర్లు అన్నాయి) అంతకు ముందు రోజు బ్రెంట్‌ రకం ధర 109 డాలర్లు ఉండగా సమీప భవిష్యత్‌లో 120-130 డాలర్ల మధ్య ఉండవచ్చని మోర్గాన్స్‌ అంచనా వేసింది. ఎలాంటి షరతులు లేకుండా హార్ముజ్‌ జలసంధిని ఒక వేళ ఈ రోజు తెరిచినా సరఫరా వ్యవస్థ పునరుద్దరణకు మూడు నుంచి ఆరునెలలు పడుతుందని చమురు రంగ నిపుణులు అంటున్నారు.దాడుల్లో జరిగిన నష్టాల తీవ్రత వెల్లడైన తరువాత మరింత స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే అంతా అనిశ్చితే, అస్పష్టతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాదేదీ మోడీ భజనకనర్హం : చంద్రబాబు అండ్‌కో ముందంజ, వెనుకబడిన జగన్‌, చమురుపై ఎక్సైజ్‌ పన్ను తగ్గింపు మతలబేమిటి !

02 Thursday Apr 2026

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, excise duty cut on fuel, Nara lokesh, Narendra Modi Failures, YS jagan

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ.భారత చక్రవర్తి నరేంద్రమోడీకి భజన చేసేందుకు ఏ అవకావశాన్నీ వదలం అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ రాజు చంద్రబాబు నాయుడు, యువరాజు లోకేష్‌ నాయుడు, సామంత రాజు పవన్‌ కల్యాణ్‌. పెట్రోలు,డీజిలు మీద కేంద్ర ప్రభుత్వం లీటరుకు పది రూపాయల చొప్పున ఎక్సయిజ్‌ డ్యూటీ తగ్గించిందన్న వార్త రాగానే ముగ్గురూ మోడీని అభినందించారు. ఎందుకటా ! వినియోగదారులకు ధర తగ్గించినందుకు కాదు, పెంచనందుకు అన్నది వారి స్పందనల సారం. పూర్వం రాజుల కాలంలో రాజుగారు ఏది చేసినా గొప్పదే అని పొగిడే భట్రాజుల(కులం గురించి కాదు)ను వారు గుర్తుకు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. భట్రాజులకు రాజులు, రంగప్పలు నజరానా ఇచ్చేవారు, కేంద్రం ఇస్తున్నది వడ్డీలకే చాలటం లేదని చంద్రబాబు నాయుడు మంత్రులతో అన్నట్లు లీకు వార్తలు. ఈ పూర్వరంగంలో మోడీని పొగిడినందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఏమైనా ఒరగబెడతారా ? వ్రతం చెడ్డా ఫలం దక్కదా ! చూద్దాం. కొసమెరుపు ఏమంటే నరేంద్రమోడీని పొగడటంలో పోటీపడే వైసిపి నేత జగన్‌మోహనరెడ్డి ఈ విషయంలో వెనుకబడినట్లు కనిపిస్తున్నది, స్పందన కనిపించలేదు, వినిపించలేదు. ఇక్కడ ఒక్క సందేహం. చంద్రబాబు సిఎం, పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రి, మరి మోడీని పొగడటంలో మంత్రిలోకేష్‌ పాత్ర ఏమిటి ? పలుకుబడి, ప్రతిష్ట పెంచేకసరత్తులో భాగమా ? మిగిలిన మంత్రులు ఎందుకు స్పందించలేదు.ఎవరికి తోచింది వారు అనుకొనే స్వేచ్చ ఉంది గనుక వదిలేద్దాం !చిత్రం ఏమిటంటే వినియోగదారుల మీద విపరీత భారం మోపినపుడు చంద్రబాబు అండ్‌ కో మౌనంగా ఉండి ఇప్పుడు ఏదో ఒరగబెట్టినట్లు భజన చేశారు. ?ఏమి రాజకీయంరా నాయనా ! అసలు నరేంద్రమోడీ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు ?

ఎక్సయిజ్‌ పన్ను తగ్గింపు వార్త వినగానే శ్రీరామనవమి వేడుకల్లో ఉన్న జనం ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే చమురు ధరలు పెరుగుతాయని మానసికంగా సిద్ధం అయిపోయిన వారు నిజమేనా మోడీ సర్కార్‌ ఇంత మేలు చేసిందా అని కాళ్లు చేతులు గిల్లుకున్నారు, తలలు కొట్టుకున్నారు.చర్మాలు స్పందించటంతో రామా ఇలా కరుణించావా అని సంబరపడ్డారు. అయితే బంకుల వద్దకు వెళ్లగానే ఆ ” తగ్గింపు ” అంబానీ, నయారా వంటి ప్రైవేటు కంపెనీలతో బాటు కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్‌ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు తప్ప వినియోగదారులకు కాదని తెలియగానేే చల్లబడిపోయారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దుర్మార్గదాడుల కారణంగా తలెత్తిన సంక్షోభంతో ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయి. ఆ పేరుతో నయారా అనే ప్రైవేటు కంపెనీ పెట్రోలు మీద లీటరుకు ఐదు, డీజిలు మీద మూడు రూపాయల చొప్పన ధర పెంచింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం పవర్‌ పెట్రోలు ధర లీటరుకు రు.2.36వరకు పరిశ్రమల్లో ఉపయోగించే డీజిల్‌ ధరను 22 రూపాయలు పెంచింది. దిగుమతి ఖర్చు పెరిగినందున మన దేశంలోని చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు లీటరు పెట్రోలు మీద రు.18-20. డీజిలు మీద రు.30-35 నష్టం వస్తున్నదని చెబుతున్నారు. (అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమైనపుడు వాటికి ఎంత లాభవచ్చిందో చెప్పరు) అందువలన వాటికి ఉపశమనం కలిగించేందుకు మోడీ పూనుకున్నారు. ప్రత్యేక ఎక్సయిజ్‌ డ్యూటీని పెట్రోలు మీద రు.13ను మూడుకు తగ్గించగా, డీజిల్‌ మీద పదిరూపాయలను పూర్తిగా ఎత్తివేశారు.ఈ శ్రద్ధ కోట్లాది మంది వినియోగదారుల మీద లేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభం కాగానే వంటగ్యాస్‌ మీద గృహ వినియోగదారులకు అరవై రూపాయలు పెంచారు, ముష్టిగా విదుల్చుతున్న 40రూపాయల సబ్సిడీని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తివేశారు, అంటే వంద రూపాయల మేరకు వడ్డించారు.

అచ్చేదిన్‌ పేరుతో 2014లో అధికారానికి వచ్చిన మోడీ జనాలకు ఏదో ఒరగబెడతారని అందరూ ఆశించారు.అదనంగా అన్నవస్త్రాలు ఇస్తారనుకొంటే ఉన్న వస్త్రాలను లాగేసుకున్నట్లు కొత్తగా మేలు చేస్తారనుకుంటే డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదిల్చారు.ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేశారు. మేలు సంగతి తరువాత భారం ఎలా మోపారో చూద్దాం. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం చమురు రంగం నుంచి ఎక్సైజ్‌ డ్యూటీ రాబడి రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26 తొలి ఆరునెలల్లో రు.1.30వేల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న అసలు సిసలు ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40,(దీన్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంది) ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 వసూలు చేస్తున్నారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు రు.13లో పది రూపాయలు తగ్గించినప్పటికీ అది వినియోగదారులకు చేరటం లేదు. సాధారణ డీజిల్‌పై పదహారు రూపాయల బాదుడులో పది రూపాయలు రద్దు చేశారు. అయినా వినియోగదారులకు ఒక్క పైసా కూడా తగ్గలేదు. అంటే చమురు మార్కెట్‌ కంపెనీలు పది రూపాయల మేరకు ధరలను పెంచినట్లే.ఈ మాత్రానికే మోడీకి భజన చేయాలా ?

తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం తగ్గిన ఆదాయలోటును ఎలా సర్దుబాటు చేయనుంది ?బడ్జెట్‌లో సంక్షేమ పధకాల కేటాయింపులకు కోత పెట్టటం లేదా ఏదో ఒకసాకుతో జిఎస్‌టి, సెస్‌ల పెంపుదలకు పూనుకోవాల్సి ఉంటుంది. పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు.చావు కబురు చల్లగా చెప్పినట్లు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.అధికారులెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నట్లు ? ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంటే ఏడాదికి రు.1.68లక్షల కోట్లు. మోడీ సర్కార్‌ వంచన గురించి చెప్పుకోకపోతే జనాలకు అన్యాయం చేసినవాళ్లం అవుతాము.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత మార్చినెల 25వ తేదీ వరకు ఉన్న కొనుగోలు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఈ వివరాలు ఏ కమ్యూనిస్టులో, కాంగ్రెస్‌ వారో చెప్పినవి కాదు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. నాలుగేండ్ల పాటు జనాల నుంచి లక్షల కోట్లు అదనంగా వసూలు చేసి ఖజానా నింపుకొని అదానీ, అంబానీ వంటి వారికి సబ్సిడీలు రూపంలో కట్టబెట్టారు, పారుబాకీల పేరుతో లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేశారు.ఇప్పుడు ధరలు పెరిగి ఒక నెల రోజులు కూడా గడవక ముందే చమురు కంపెనీల కోసం నడుంకట్టారు. మోడీ మీద తెలుగుదేశం, జనసేన, వైసిపి వంటి పార్టీలకు ఉన్న మోజు తెలిసిందే. అది ఎంత ఉన్నా జనాన్ని ఇలా చావబాదుతుంటే పల్లెత్తు విమర్శ చేయలేదు.అఫ్‌ కోర్స్‌ జనానికి కూడా ఆ మత్తు వదలలేదు అన్నది నిజం. ఇతర సందర్భాలలో మాట్లాడినపుడు బిజెపి, తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు అంటారు. కానీ ఆచరణలో కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేసినట్లు కనిపించటం లేదా ?

దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ గుండెలు బాదుకుంటారు. దీనికి రూపాయి విలువపతనాన్ని అరికట్టటంలో వైఫల్యం లేదా ? మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 94చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ అని చెప్పక తప్పదు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇప్పుడు ఇంకా దిగజారింది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్ని కలసి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే. ఇలాంటివారు ఆత్మనిర్భరత, వికసిత్‌ భారత్‌ పేరుతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతుంటే జనం చెవుల్లో పూలు పెట్టుకొని తలలు ఊపాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అంటూ అంతకు ముందు ప్రతిరోజూ సవరించిన ధరల విధానాన్ని నాలుగేండ్లు ఎందుకు పక్కన పెట్టారో ఇప్పుడు తిరిగి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారో జవాబుదారీ తనం గురించి తమ భుజాలను తామే చరచుకొనే పెద్దలు ఎవరైనా చెబుతారా ?

రాజకీయనేతలను కాసేపు పక్కన పెడదాం. వారు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని తెలిసిన జనంలో అసలు ప్రశ్నించే గుణం ఎందుకు అంతరించినట్లు ? నిజంగానే ఈ ధోరణి గురించి పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. ఆక్రమిత కాశ్మీరులో పాక్‌ ప్రభుత్వం భారాలు పెంచితే వాటిని భరించలేక అక్కడి జనం మనదేశంలో విలీనం కావాలని కోరుకుంటున్నట్లు వీడియోలను చూపి కొందరు వీరంగం వేస్తుంటారు. ఇక్కడి జనం మీద మోడీ మోపుతున్న భారాలు వారికి పట్టవు. పాకిస్తాన్‌ సుత్తి ఇనుపదైనా భారత్‌ది బంగారపుదైనా తల పగులుతుంది. మంచి రోజులను(అచ్చేదిన్‌) తెస్తామంటే జనం నమ్మారు. ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీస్తాం, తాటవలుస్తాం అందుకే పార్టీని పెట్టాం అని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ గతంలో ప్రకటించినపుడు జనం నిజమే కదా నిజమే కదా అనుకున్నారు. 2019కి ముందు నరేంద్రమోడీని, చంద్రబాబు నాయుడిని అదే మాదిరి నిలదీసినమాట నిజం. తరువాత చంద్రబాబును వదలి వేశారు.నరేంద్రమోడీతో చేతులు కలిపారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని మాత్రమే 2024 ఎన్నికల వరకు అది జనం సమస్యలైనా, జగన్‌ వ్యవహారశైలినైనా నిలదీశారు, తాటవలిచారు. ఇప్పుడు తత్వం తలకెక్కింది గనుక మౌన దీక్ష పట్టారు. అక్రమం జరుగుతుంటే మౌనంగా ఉండమని సనాతనం కూడా ఎక్కడా చెప్పలేదు.ఎదుటి వారి జేబులో పర్సు కొట్టేసినట్లు తెలియగానే ఎవరైనా వెంటనే దాన్లో ఎంత డబ్బు ఉంది అని అడుగుతాం, తక్కువ మొత్తమే అని తెలిస్తే పోనీలే అని ఊపిరి పీల్చుకుంటాం.అదే కేంద్ర ప్రభుత్వమైనా మరొకరైనా చమురు పన్ను పేరుతో మన పర్సుకొట్టేస్తున్నపుడు ఎంత పోగొట్టుకున్నాం అని ఆలోచించాలా వద్దా ? అఫ్‌ కోర్స్‌ అది కష్టపడిన సొమ్ము కాకపోతే వదిలేద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !

20 Friday Mar 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ 1 Comment

Tags

BJP, Donald trump, India-China trade, Narendra Modi Failures, TRADE BALANCE, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో దేశ వస్తు వాణిజ్య లోటు 34.7 నుంచి 27.1 బిలియన్‌ డాలర్లకు తగ్గినట్లు తమ భుజాలను తామే చరుకున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. కానీ అసలు విషయం ఏమంటే గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే అది 14.4 బిలియన్‌ డాలర్ల నుంచి పెరిగి రెండింతలైంది.ఒక నెలలో పెరిగి మరొక నెలలో తగ్గటం సర్వసాధారణం, మొత్తంగా ఏడాదిలో ఏం జరిగిందన్నదే గీటురాయి. పారిశ్రామిక అవసరాలకు వెండి దిగుమతులు 142 శాతం పెరిగితే బంగారం దిగుమతులు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 28.7శాతం పెరిగాయి, ఎందుకంటే నిత్యావసర వస్తువు కదా ! ఇంకా ఆర్థిక సంవత్సరం పూర్తి కాలేదు గనుక మోడీ సర్కార్‌ వ్యాపార లాభనష్టాల గురించి మరోసారి చెప్పుకుందాం. మన మీడియాలో మరోసారి చైనా మీద ఆధారపడటం ఎంతో ప్రమాదకరమంటూ హితోక్తుల రూపంలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటిలో ఒక దాని శీర్షిక ఏమంటే ”102 బిలియన్‌ డాలర్ల షాక్‌ ” వారు గ్రహించాల్సిందేమంటే చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే రేటింగ్‌లు పెరిగే తరుణం కాదిది.బీజింగ్‌తో ఇక మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదంటూ తలుపులు మూసుకున్న మనం పెట్టుబడుల కోసం వాటిని తెరిచాం, గత ఏడు సంవత్సరాలుగా మూతపడిన సరిహద్దు వాణిజ్యం ఉత్తరాఖండ్‌లో భారత్‌-చైనా-నేపాల్‌ సరిహద్దులు కలిసే లిపులేక్‌ కనుమదారిలో జూన్‌ ఒకటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కొద్ది నెలలుగా నేపాల్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ మన దేశం ముందుకు పోతున్నది. ఇలా చైనా కమ్యూనిస్టులకు ఎర్రతివాచీని పరిచామని తెలిసినప్పటికీ పుట్టుకతో పుట్టిన బుద్ధి గనుక కొందరు హెచ్చరికలు చేస్తున్నారు.

ఏప్రిల్‌ నుంచి 2026 ఫిబ్రవరి వరకు చైనాతో వాణిజ్య లోటు 102 బిలియన్‌ డాలర్లు దాటింది.మోడీ సర్కార్‌ సాధించిన మరో రికార్డు ఇది.మార్చి నెల కూడా గడచిన తరువాత ఈ తేడా 111.4 బిలియన్‌ డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. ఏడాది క్రితం 91బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతుల ప్రోత్సాహ పిఎల్‌ఐ, వికసిత్‌ భారత్‌ వంటి నినాదాల అమలు, ఆచరణ ఫలితమిది. పెట్టుబడికి కనిపించేది లాభం తప్ప భావజాలం కాదు, దీని అర్ధం భావజాలాన్ని వాడుకోదు అని కాదు.1970 దశకం వరకు చైనాకు ఐరాసలో ప్రవేశం కల్పించకుండా అడ్డుకున్న వాషింగ్టన్‌ తనకు లాభం వస్తుందని గ్రహించే కదా పక్కా కమ్యూనిస్టు చైనాతో సంబంధాలు పెట్టుకొని పెట్టుబడులు పెట్టింది.దాని కమ్యూనిస్టు వ్యతిరేకత ఏమైనట్లు ? మనదేశంలో కూడా దాని ఏజంట్లు కమ్యూనిస్టు వ్యతిరేకతను వంటబట్టించుకున్నారు. ఇప్పటికీ రెచ్చిపోతున్నారు. గాల్వన్‌లోయ ఉదంతం తరువాత కేంద్ర ప్రభుత్వం అనేక చైనా యాప్‌లను నిషేధించింది.నేరుగా పెట్టుబడులను అడ్డుకోకుండా సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే వాటిని పూర్తిగా పరిశీలించాకే అనుమతించాలనే వంకతో ఆరు సంవత్సరాలుగా అడ్డుకుంటున్నది కాస్తా ఎలాంటి కారణం చెప్పకుండానే పదిశాతం వరకు పెట్టుబడులు నేరుగా చైనా వాటాదారుగా ఉన్న విదేశీ కంపెనీల నుంచి వచ్చేందుకు అనుమతించింది. దీని గురించి చైనా ఎలాంటి వ్యాఖ్య చేయనప్పటికీ ఇది చాలదు అన్నట్లుగా ఉందని వార్తలు వచ్చాయి. అందువలన రానున్న రోజుల్లో దీన్ని మరింతగా విస్తరించవచ్చు.అవసరం మనది మరి ! కేంద్రంలో ఉన్న బిజెపి, దాని వెనుక ఉండి నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ యంత్రాంగానికి ఏమీ తెలియకుండానే మోడీ సర్కార్‌ వైఖరిలో మార్పు వచ్చిందనుకుంటే అమాయకత్వం తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకత రెచ్చగొట్టటం తమను గుడ్డిగా అనుసరిస్తున్నవారిని నిలబెట్టుకొనేందుకు, సంతుష్టీకరించేందుకు కాషాయదళాలు నిత్యం చేస్తున్నదే, దానిలో ఎలాంటి మార్పు లేదు.చైనా వస్తువులు కార్పొరేట్లకు అవసరం. దాన్ని అడ్డుకొనేందుకు ఎవరు ప్రయత్నించినా వారిని అధికారానికి దూరం చేయటం పెద్దపనేమీ కాదు. ఇప్పుడు వారి ప్రయోజనాలే ముందుకు వచ్చాయి గనుక కాస్త తగ్గండి లేకపోతే మీ గురించి ఆలోచించాల్సి వస్తుందన్న హెచ్చరికతో తాజా పరిణామాలు సంభవిస్తున్నాయన్నది పచ్చినిజం. సంఘపరివార్‌ తన అజెండాను దేశం మీద రుద్దేందుకు అధికారం కావాలి గనుక వారి వత్తిడికి లొంగి మౌనంగా ఉంది.చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి, దాని వస్తువులను బహిష్కరించాలంటూ వీధుల్లో వీరంగం వేసిన అపర దేశభక్తులు ఇప్పుడెక్కడా కానరారు, సంఘపరివార్‌ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ విదేశీ కంపెనీల సేవలో తరిస్తున్నది.

గతంలో చైనా బజార్ల పేరుతో పెద్ద ఎత్తున కొందరు దుకాణాలను ఏర్పాటు చేసి మనదేశంలో తయారు చేసే నకిలీ వస్తువులను వినియోగదారులకు అంటగట్టారు.అదే సమయంలో చైనా చాలా తక్కువ ధరలకు వస్తువులను అందచేస్తున్న కారణంగా అనేక మంది అవి చౌక, నాశిరకం అని కూడా ప్రచారం చేశారు.కాని తరువాత కాలంలో నోళ్లు మూతపడ్డాయి. ఎందుకంటే చైనా వస్తువులు లేని ఇల్లు లేదు.ప్రస్తుతం మన ప్రభుత్వ పెద్దలు ఎన్ని కబుర్లు చెప్పినా ఔషధరంగం, ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహనాలు,సూర్యరశ్మి పలకల వంటి రంగాలలో చైనా నుంచి ముడి సరకులు లేదా సగం తయారైన వస్తువులు, యంత్రాలు, విడిభాగాలు లేకుండా మన దేశంలో అనేక పరిశ్రమలకు మనుగడలేదు. అందుకే కార్పొరేట్‌ శక్తులు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తున్నాయి తప్ప కమ్యూనిజం, చైనా మీద ప్రేమతో కాదు. అవే వస్తువులను మరొక దేశం ఏదైనా అందచేస్తే పొలోమంటూ అటే వెళతారు.చైనా అంత తక్కువ ధరలకు ఎలా అందిస్తున్నదని అనేక మంది ప్రశ్నించటాన్ని చూస్తున్నాము. ఆధునిక పద్దతుల్లో వస్తూత్పత్తిని తక్కువ ఖర్చుతో చేయవచ్చు అని వేరే చెప్పనవసరం లేదు. తన 140 కోట్ల జనానికి పనికల్పించాలంటే అవసరాలకు మించి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేసి పెట్టుబడులు సమకూర్చుకోవాలన్న విధానంలో భాగంగా ఇప్పటి వరకు పని చేసింది. ఇప్పుడు తన కార్మికులకు గణనీయంగా వేతనాలు పెంచిన కారణంగా గతంలో మాదిరి చౌకగా అన్ని వస్తువులను అందించటానికి వీలుకాదు గనుక విలువ ఎక్కువగా ఉంటే వస్తూత్పతికి ప్రాధాన్యత ఇస్తున్నది.గతంలో తక్కువ ధరకు ఫోన్లు అందించిన చైనా నుంచి ఇప్పుడు ఎక్కువ విలువగల ఫోన్లే వస్తున్నాయి, లేకపోతే మనదేశంలోనే తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా సగటున మన వద్ద నుంచి 65 బిలియన్‌ డాలర్ల మేర వస్తు, సేవలను పశ్చిమాసియా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న మన ఎగుమతుల గురించి పైకి చెప్పుకోలేని ఆందోళన పడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తలెత్తిన పశ్చిమాసియా పరిస్థితి ఎలాంటి పర్యవసానాలకు దోహదం చేయనుందో తరువాత గానీ వెల్లడికాదు. మార్చినెలలో అమెరికా కుదురుతుందని చెబుతున్న ఒప్పందం ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు.అమెరికాలో పన్నులు పెంచిన కారణంగా గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది మన ఎగుమతులు 12.8శాతం తగ్గాయి.

ఇప్పుడున్న వాణిజ్య లోటు గురించి గుండెలు బాదుకోకుండా దీర్ఘకాలంలో వచ్చే లాభాల గురించి దృష్టి పెట్టాలని చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ మన దేశంలో వెలువడుతున్న మీడియా కథనాలపై వ్యాఖ్యానించింది. లోటు గురించి అతిగా కేంద్రీకరించి నిజమైన అవకాశాలను విస్మరిస్తున్నారని పేర్కొన్నది.ఏప్రిల్‌ 2025 నుంచి ఫిబ్రవరి 2026వరకు మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 38శాతం పెరిగి 17.5 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు మన వాణిజ్య శాఖ వేసిన అంచనాను ఆ పత్రిక ఉటంకించింది. ( ఇదే నెలల్లో అమెరికాకు మన ఎగుమతులు 79.3బిలియన్‌ డాలర్లకు చేరినప్పటికీ వృద్ధి రేటు 3.8శాతమే.) ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 15శాతం పెరిగి 120 బిలియన్లకు చేరటంతో వాణిజ్య లోటు 102 బి.డాలర్లుగా ఉంది, ఏడాది ముగిసేలోగా ఇదే దామాషాలో ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. గత ఏడాది కాలంగా సాధారణ సంబంధాల ఏర్పాటుకు మన వైపు నుంచి చూపుతున్న చొరవకు స్పందనగా మన దేశం నుంచి చైనా దిగుమతులను వ్యూహాత్మకంగానే పెంచిందన్నది వాస్తవం.ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి మరి. ఏటా అప్పనంగా వందబిలియన్‌ డాలర్ల మేర మనదేశం హారతిపళ్లెంలో పెట్టి అప్పగిస్తుంటే వాటిని బీజింగ్‌ పోగొట్టుకుంటుందా ! ఇప్పుడున్న సంబంధాలు ఇలాగే మెరుగుపడితే రానున్న ఐదు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 1.4లక్షల కోట్ల డాలర్ల మేర వాణిజ్యలావాదేవీలకు అవకాశం ఉందని 2025 డిసెంబరులో మన దేశంలో చైనా రాయబారి షు ఫెయిహాంగ్‌ చెప్పాడు.

కేంద్ర ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నికబుర్లు చెప్పినా ప్రపంచ ఫ్యాక్టరీగా మారలేదు, సమీప భవిష్యత్‌లో అలాంటి సూచనలు కూడా లేవు.వస్తు, సేవారంగాలను చూస్తే మన దిగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి, ఎగుమతులు తక్కువగా ఉన్నందున ఏటా మొత్తం మీద వాణిజ్య లోటు వందబిలియన్‌ డాలర్ల వరకు ఉంటున్నది. వర్తమాన ఆర్థిక సంవత్సరం 2025-26లో ఫిబ్రవరి వరకు 5.8శాతం వృద్ధి రేటుతో 791 బిలియన్‌ డాలర్ల మేర వస్తు, సేవలను ఎగుమతి చేశాము. ఇదే సమయంలో 7.4శాతం వృద్ది రేటుతో 900 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు చేసుకున్నాం. ఇతర దేశాలతో మన వాణిజ్యం మిగులు ఉన్న కారణంగా కేవలం ఒక్క చైనాకే వంద బిలియన్‌ డాలర్లకు పైగా చెల్లిస్తున్నప్పటికీ మన మొత్తం వాణిజ్య లోటు వంద బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉంది. అంటే మరో మాటలో చెప్పాలంటే మిగతా దేశాలన్నించి నుంచి సంపాదించిన మొత్తాన్ని చైనాకు అప్పగిస్తున్నాం. ప్రవాస భారతీయులు ఏటా 135బిలియన్‌ డాలర్లు మనదేశానికి పంపుతున్న కారణంగా డాలర్ల కొరతను గణనీయంగా తీర్చుతున్నారు. కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉండి వృద్దిని పరుగులు పెట్టిస్తున్నట్లు బడాయిచెప్పుకోవటం తప్ప ఎగుమతులను పెంచలేని కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే దీనికి కారణం.మన వస్తువుల కంటే సేవల ఎగుమతుల రేటు ఎక్కువగా ఉంది.ధరల విషయంలో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ తదితర దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోవటమే ప్రధాన కారణం. మొత్తం ఎగుమతుల్లో 403 డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరుగుతున్నాయి. దిగుమతుల్లో 900బిలియన్‌ డాలర్లలో 714 బి.డాలర్లు వస్తువులే ఉన్నాయి. మన దిగుమతుల్లో ఎరువుల వాటా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 64.5శాతం పెరిగాయి, ధరలు కూడా ఎక్కువే. వర్తమాన పశ్చిమాసియా సంక్షోభం వీటి దిగుమతుల బిల్లును ఎంతగా పెంచుతుందో చెప్పలేము. ఇప్పటికే గల్ఫ్‌ నుంచి దిగుమతలకు అంతరాయ కలిగిన కారణంగా మన యూరియా ఫ్యాక్టరీలు సగం సామర్ధ్యంతో మాత్రమే పని చేస్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షణీయమైన లాభాలు వచ్చే రంగాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఎరువుల వంటివి అంతర్జాతీయ ధరలతో ఎక్కువగా ప్రభావితం అవుతున్నందున వాటి జోలికి పోవటం లేదు. నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు నిలిపివేసిన తరువాత తప్పనిసరై రామగుండం వంటి మూతబడిన వాటిని పునరుద్దరించటం తప్ప కొత్త వాటిని నెలకొల్పటం లేదు. చివరకు యూరియా దిగుమతులకు సైతం చైనా మీద ఆధారపడ్డాం. గతేడాది మన దేశంలో యూరియా కొరతకు చైనా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణం. అందువలన మన మీడియా విశ్లేషకులు, ఇతరులు గమనించాల్సిందేమంటే తమ వస్తువులను కొనాలని చైనా వారు మనలను ఎప్పుడూ దేబిరించలేదు. రెండు దేశాల మధ్య ఎలాంటి ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు లేవు. అది చేసే ఎగుమతులు మనకు పెద్దమొత్తంగా కనిపించవచ్చుగానీ మొత్తం ఎగుమతుల్లో 3-4శాతం మధ్యనే మన వాటా ఉంది. అందువలన వీధుల్లో వీరంగం వేసేవారిని చూసి మనం తలుపులు మూసుకుంటే ఆ మాత్రం ఎగుమతులకు నూతన మార్కెట్లను చూసుకోలేని స్థితిలో చైనా లేదని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

శనగ రైతుల సంక్షోభం

04 Wednesday Mar 2026

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP

≈ 1 Comment

Tags

Bengal Gram price, CHANDRABABU, Farmers

డా|| కొల్లా రాజమోహన్‌

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో శనగ ఒక వాణిజ్య పంటగా మారింది. నల్ల బర్లీ పొగాకు, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన పీకల లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఏ పంట వేయాలో తెలియక, ప్రత్యామ్నాయ పంటలు లేక రైతులు అయోమయంలో వున్నారు. నల్ల బర్లీ పొగాకు నిషేధం నేపథ్యంలో అత్యధికంగా రైతులు శనగ పంటను సాగు చేశారు.
ధరల పతనం – దిగుమతి సుంకాల దెబ్బ
క్వింటాలు శనగలకు 5,875 రూపాయల కనీస మద్దతు ధరకు మార్క్‌ ఫెడ్‌ ద్వారా రైతు సేవా కేంద్రాలలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శనగలను కొంటామన్న నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. కానీ ఎన్ని శనగలు కొంటారు? కోల్డ్‌ స్టోరేజ్‌లో వున్న శనగల మాటేమిటి? మొత్తంగా కొంటారా? లేక దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తారా? విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న రైతులకు నగదు ప్రోత్సాహకాల సంగతేమిటి? విదేశీ శనగల దిగుమతులను ఆపేసి వ్యవసాయాన్ని, రైతు రక్షణకు తీసుకునే చర్యలు చాలా అవసరం. వ్యవసాయ రక్షణకు తీసుకునే చర్యలపై దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి.

పోషకాహార లోపం-పంపిణీ వైఫల్యం
పప్పుధాన్యాలలో శనగ అతి ముఖ్యమైన పంట. ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగలు ఇప్పుడు ధర లేక రైతులను దివాళా తీయిస్తున్నాయి. రైతులను కష్టాలపాలు చేస్తున్నాయి. ఆహారంలో పప్పుధాన్యాల అవసరం ఎక్కువగానే ఉన్నది. శరీర నిర్మాణంలో ప్రొటీన్‌ అవసరం గురించి డాక్టర్లు నొక్కి చెప్తున్నారు. రైతులు కష్టపడి కావాల్సినంత పండిస్తున్నారు. పప్పుధాన్యాల పంపిణీ సరిగ్గా లేక అందరికీ అందనందున ”ప్రొటీన్‌ క్యాలరీ మాల్‌న్యూట్రిషన్‌” దాపురిస్తున్నది. ఒకపక్క గోడౌన్లలో శనగలు పుచ్చిపోతుంటే మరోపక్క పేద వారికి పప్పుధాన్యాలు అందటంలేదు. రేషన్‌ షాపుల ద్వారా శనగలను పంపిణీ చేస్తే ఇటు రైతులకు అటు పేద ప్రజలకు మేలు జరుగుతుంది. దేశీయ ఉత్పత్తి సరిపోయినంత ఉంది. కానీ విదేశీ ప్రభుత్వాలను తృప్తిపరచటానికి విదేశీ శనగలను దిగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండే పంటలు అమ్ముడు పోవటంలేదు. రేటు రావటం లేదు. రైతులు అప్పులపాలవుతున్నారు.

పెరుగుతున్న ఖర్చులు – తగ్గుతున్న ధరలు
ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలలో విస్తారంగా శనగ పంటను సాగు చేస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే శనగ సాగు కాస్త సులభంగానే జరుగుతుంది. శనగలకు ఉత్తరాదిన డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో 2.8 లక్షల హెక్టార్లలో శనగ పంట సాగవుతున్నది. దాదాపు 4 లక్షల టన్నుల శనగల ఉత్పత్తి జరుగుతుంది.
దేశం మొత్తం మీద 115 నుండి 120 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతున్నదని అంచనా. మన దేశ ప్రజల అవసరాలకు 120 లక్షల టన్నుల శనగలు సరిపోతాయంటున్నారు. అయితే అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి. అమ్ముడుపోక కోల్డ్‌ స్టోరేజీలలో శనగలు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. కోల్డ్‌ స్టోరేజీలలో వున్న శనగల లెక్క ప్రభుత్వం బయటకు తీయాలి. వాటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
భూసారం క్షీణించడం వలన, వాతావరణంలో మార్పుల వలన, దిగుబడులు తగ్గిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులతో సహా వ్యవసాయ ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. రైతులు దివాళా తీస్తున్నారు. ప్రభుత్వాలు మరోపక్క దిగుమతి సుంకాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులను పోత్సహిస్తున్నాయి. విదేశాల నుండి అధికంగా దిగుమతులు చేయటంతో ఇక్కడి శనగ రైతుల కష్టాలు పెరుగుతున్నాయి.
ఎకరానికి దిగుబడి 10 క్వింటాళ్ళ నుండి ఆరేడు క్వింటాళ్ళకు పడిపోయింది. గత సంవత్సరం ఎర్ర శనగలు క్వింటాలు రేటు రూ.7,200 ఉంటే ఇప్పుడు దళారులు రూ.5000 కన్నా తక్కువకు అడుగుతున్నారు. తెల్ల శనగలు పోయిన సంవత్సరం రూ.10,200 వుంటే ఇప్పుడు రూ.5,600కు అడుగుతున్నారు. బోల్టు శనగలు గత ఏడాది రూ.15,000 ఉంటే ఇప్పుడు అడిగేవారే లేరు.

సుంకాల రద్దు- రైతుకు ఉరి
2017-18 సంవత్సరాలలో శనగ దిగుమతులపై 40 శాతం ఉన్న దిగుమతి సుంకం 10 శాతానికి తగ్గిస్తూ వచ్చారు. దేశీయ శనగల ఉత్పత్తి తగ్గిపోవడం వలన, 2024 మే నుంచి 2025 మార్చి వరకు పూర్తిగా దిగుమతి సుంకాలను రద్దు చేశారు. ఉత్పత్తి పుంజుకున్న తర్వాత 2025 ఏప్రిల్‌ నుండి 10 శాతం సుంకాలను మరల అమలులోకి తెచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, రికార్డు స్థాయిలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. విదేశాలలో రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా ఎక్కువగా వుండటం వలన ఉత్పత్తి ధర తక్కువగా ఉంటుంది. మన రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం వల్ల మన రైతులకు అప్పులు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఏళ్ల తరబడి కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వలు వుంచటం వలన క్వింటాలుకు రూ.150 కడుతూ ఉండాలి. బయట గోడౌన్లలో పెడదామంటే శనగలు పుచ్చిపోతున్నాయి. శీతల గిడ్డంగులలో ఖాళీ లేదు. ఒకపక్క పేరుకుపోతున్న శనగలు. మరో పక్క అప్పులు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు దివాలా తీస్తున్న తరుణంలో ఏ పంట వేయాలో తెలియని పరిస్థితులలో, కొద్దిగా డబ్బులు వస్తాయనే ఆశతో నల్ల బర్లీ పొగాకును సాగు చేశారు. నల్ల బర్లీ పొగాకు 15-18 వేల రూపాయల వరకు ధర వచ్చింది. పొగాకు కంపెనీలు, ప్రభుత్వం కలిసి క్వింటాల్‌ నల్ల బర్లీ పొగాకు రేట్లను రూ.12000-9000-6000గా తగ్గించి నిర్ణయించి రైతులకు అన్యాయం చేశాయి. ఈ సంవత్సరం అసలు నల్ల బర్లీ పొగాకు సాగు చేయడాన్ని నిషేధించారు.
పత్తికి ధర లేదు. విదేశాల నుండి ఎటువంటి అడ్డంకులు లేకుండా పత్తిని దిగుమతి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంట ఏమిటో ప్రభుత్వం చెప్పదు. ధైర్యం చేసి పంట పండించే సమయానికి అమెరికా నుంచి దిగుమతులు వెల్లువలా వచ్చి పడతాయి. రెండు సంవత్సరాల నుండి ఏ పంటకూ సరైన ధర లేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో దాచిపెట్టటానికి ఖాళీలు లేవు. దిగుబడి కూడా తగ్గిపోయింది. 2024-25 సంవత్సరంలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 15 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌ స్టోరేజ్‌లో స్టాక్‌ నిండుగా ఉన్నా విదేశీ శనగలను దిగుమతి చేశారు.
ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగ సాగు ఇప్పుడు కళ్ళ నీళ్లు తెప్పిస్తున్నది. బయట తెచ్చిన అప్పుల వడ్డీ పెరిగిపోతున్నది. వ్యవసాయ ఖర్చులకి, ఇంటి ఖర్చులకి చేతిలో డబ్బులు లేవు. బ్యాంకర్లు, అప్పులవాళ్ళు అప్పులు ఇవ్వడం మానేశారు. ప్రభుత్వం సహాయం చేస్తే బయటపడవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలంటే…
– రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకు మొత్తం కొనుగోలు చేయాలి. రైతులు అమ్మకానికి తెచ్చిన శనగలకు ఆంక్షలు పెట్టకుండా కొనాలి. నిబంధనలను సడలించాలి.
– కనీస మద్దతు ధర అంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసినట్లుగా ఖర్చులకు 50 శాతం కలిపి చెల్లించాలి.
– ఇదివరకు లాగా విదేశీ దిగుమతులపైన 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలి. అలా చేస్తేనే దేశంలో ఉత్పత్తి అయిన శనగకు డిమాండ్‌ ఉంటుంది.
– విదేశీ శనగల దిగుమతులను ఆపేయాలి.
– వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి, రైతు రక్షణకు తీసుకునే చర్యలను ప్రకటించి అమలు పరచాలి.
రైతు రక్షణ చర్యల అమలుకు రైతులు సమైక్యంగా ఉద్యమించాలి.
– వ్యాసకర్త : డా|| కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం నేత, గుంటూరు, సెల్‌: 9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవాస్తవాలు చెబుతున్నదెవరు పియూష్‌ గోయలా – రాహుల్‌ గాంధీనా : పత్తి రైతులు, పరిశ్రమకు ముప్పుగా మారిన మోడీ-ట్రంప్‌ ఒప్పందం !

15 Sunday Feb 2026

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Farmers, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

cotton farmers, Donald trump, Farmers matters, Narendra Modi Failures, Piyush Goyal, Rahul gandhi, Textiles Industry, US-India trade Deal

ఎం కోటేశ్వరరావు

రైతులు నిజంగా అమాయకులే, ముల్లుగర్రతో ఎద్దుముడ్డి మీద పొడవటం తప్పఏమీ తెలియదు,(కొంత మందికి ఇప్పుడు ఎద్దులతో సాగు చేస్తారని తెలియదు, వాటి స్థానంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాలు వచ్చాయి) ఏం చెప్పినా తలూపుతారన్న గట్టి విశ్వాసం లేకపోతే మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అలా ఎందుకు మాట్లాడతారు. అమెరికా మన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన ఎగుమతులపై 18శాతం దిగుమతి పన్ను విధిస్తారు. అదే బంగ్లాదేశ్‌తో చేసుకున్న అవగాహన ప్రకారం దిగుమతి చేసుకొనే దుస్తులపై అమెరికా ఎలాంటి పన్ను విధించదు. ఈ అంశం మన దేశ వస్త్రపరిశ్రమ,వాణిజ్యవేత్తలలో ఆందోళనకు గురిచేసింది. దాంతో కేంద్ర మంత్రి రంగంలోకి దిగారు.మనకూ అలాంటి సౌకర్యం ఉందన్నారు. ఉంటే అమెరికా జారీ చేసిన ప్రకటనలో ఆ వివరం ఎందుకు లేదు ! అదంతే,మనకా రాయితీ ఎలా వస్తుందంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకుంటే ఎలాంటి పన్నులూ ఉండవని, ఈ అంశాన్ని సంతకాల సమయానికి ఒప్పందంలో భాగంగా చేర్చుతామని చెప్పారు. ఖాళీ చెక్కు మీద సంతకం చేసినపుడు ఎంతమొత్తమైనా రాసుకోవచ్చు. అమెరికాతో అలాంటి అవగాహనకు వచ్చినందున ఇంకా ఇలాంటి వాటిని మరెన్నింటిని చేర్చుతారో ! ఆ నిబంధన రైతాంగానికి నష్టం కదా అంటే కాదని సెలవిచ్చారు. ఎందుకటా అమెరికాలో పత్తి పరిమితంగానే పండుతుంది గనుక అన్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగేందుకు చూస్తున్నారు గనుకనే అడుగడుగునా అనుమానించాల్సిందే. ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా పియూష్‌ గోయల్‌ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు ఎవరేం చెప్పారో ? చూద్దాం !

అమెరికాతో కుదిరిన ఒప్పందంతో వచ్చే ముప్పు గురించి అనేక రైతు సంఘాల ప్రతినిధులు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కలిసి దానిపై గళమెత్తాలని కోరారు. అదేమీ తప్పు కాదు, అన్ని పార్టీల నేతలను అలా కలిసిన ఉదంతాలు ఎన్నో. కొంత మందిని రప్పించుకొని రాహుల్‌ నాటకమాడుతున్నారని కేంద్ర వాణిజ్యశాఖ పియూష్‌ గోయల్‌ ఆరోపించారు. రైతులు, వస్త్ర పరిశ్రమ వర్గాల్లో భయాన్ని రేపుతున్నారని అన్నారు. వాస్తవాలు తెలియకుండా తన అవివేకాన్ని స్వయంగా బయటపెట్టుకున్నారని, దేశ అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తున్నారని, ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నారని కూడా ధ్వజమెత్తారు. ” కఠిన వాస్తవాలు ” అంటూ ఎక్స్‌లో కొన్ని విషయాలను మంత్రి పోస్టు చేశారు. అభివృద్ధి చెందిన 38దేశాలతో కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ఇప్పుడున్న నాలుగు లక్షల కోట్ల రూపాయల వస్త్ర ఎగుమతులు 45 లక్షల కోట్ల పెరుగుతాయంటే ఎంతగా వృద్ధి అవకాశాలు ఉన్నాయో స్త్రీ, పురుషులకు లక్షలాది ఉద్యోగాలు ఎలా వస్తాయో ఊహించుకోవచ్చన్నారు. అమెరికా పత్తి ఉత్పత్తి చాల తక్కువని, స్థానిక అవసరాలకు పోను ఆరుబిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలు ఎగుమతులు చేస్తున్నారని, భారత్‌ నుంచి 2.7 బిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలును బంగ్లాదేశ్‌ దిగుమతి చేసుకుంటున్న విషయం రాహుల్‌కు తెలియదని అన్నారు. రాహుల్‌ గాంధీ కుటుంబం పాలన సాగించిన రోజుల్లో అమల్లోకి తెచ్చిన సెజ్‌ చట్టం నిబంధన 27(1) ప్రకారం ఎగుమతి చేసే వస్తువులకు గాను పత్తితో సహా ముడివస్తువులను ఎలాంటి పన్ను లేకుండా దిగుమతి చేసుకోవచ్చని, ఎగుమతుల కోసం సున్నా పన్నుల విధానం తెచ్చిన స్వంత పార్టీ మీదే రాహుల్‌ గాంధీ దాడి చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అంతకు ముందు రోజు రాహుల్‌ గాంధీ ఎక్స్‌ ద్వారా ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఊబిలోకి నడుస్తూ కోట్లాది మందిని దానిలోకి లాక్కుపోతున్నదని పేర్కొన్నారు. పద్దెనిమిది, సున్నా శాతం పన్నులంటూ జనాన్ని ప్రభుత్వం గందరగోళపరుస్తున్నదని అవాస్తవాలు చెప్పటంలో ప్రధాని ఎంతో నిపుణులని, మంత్రివర్గం గందరగోళాన్ని వ్యాపింప చేస్తున్నదని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు అమెరికా ఇచ్చిన ప్రత్యేక రాయితీ మనకూ రావాలంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉందని రాహుల్‌ పేర్కొన్నారు.పత్తి వివరాలేమిటి, ఎవరు చెబుతున్నది వాస్తవం, ఎవరిది అవాస్తవం !

ప్రపంచ పత్తి ఉత్పత్తి వివరాలను చూస్తే చైనాలో 7.5, భారత్‌లో 5.1,బ్రెజిల్‌ 4.1, అమెరికాలో 3,పాకిస్తాన్‌లో 1.1మిలియన్‌ టన్నుల పత్తి పండిందని 2025 అంచనా. బ్రెజిల్‌లో ప్రతి మనిషికి 0.19మి.ట, అమెరికాలో 0.088 , చైనాలో 0.052,మనదేశంలో 0.032 మి.టన్నులు ఉంది. ఈ వివరాలన్నీ తెలియకుండానే గోయల్‌ అమాత్యగిరీ వెలగబెడుతున్నారని అనుకోవాలా ? 2024 వివరాల ప్రకారం ప్రపంచంలో 90లక్షల టన్నుల ఎగుమతి జరగ్గా బ్రెజిల్‌ 27.74, అమెరికా 24.91, మనదేశం 4.65లక్షల టన్నులు ఎగుమతి చేసింది. రెండవ స్థానంలో ఉన్న మనం అంత తక్కువ, నాలుగవదిగా ఉన్న అమెరికా అంత ఎక్కువ ఎందుకు ఎగుమతి చేస్తున్నట్లు ! మనకంటే ఎక్కువగా పండిస్తున్నప్పటికీ చైనా ఎందుకు దిగుమతి చేసుకొంటోందంటే అక్కడ వస్త్ర పరిశ్రమకు అవసరం, తద్వారా విదేశాలకు ఎగుమతి చేసి లబ్ది పొందుతోంది.మన దేశంలో ఐదు కోట్లకు పైగా కదుళ్లు ఉండగా చైనా పది కోట్లు కలిగి ఉంది, వాటితో అక్కడి జనాభాకు పని కల్పిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో నిమిత్తం లేకుండానే పిలుపులు ఇచ్చిన మన మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర భారత్‌ సంగతేమిటి ? ఒక మౌలిక ప్రశ్న ఏమంటే వస్త్ర ఎగుమతులకు నిజంగా అంత అవకాశం ఉంటే మోడీ సర్కార్‌ 12 సంవత్సరాలపాటు అలాంటి ఒప్పందాలను ఎందుకు చేసుకోలేదు ? లక్షలాది మందికి ఉపాధి ఎందుకు కల్పించలేదు ?

మన రైతాంగం, పరిశ్రమ బంగ్లాదేశ్‌ గురించి ఎందుకు భయపడాలి ? బంగ్లాదేశ్‌ ప్రధాన ఉత్పత్తి వస్త్రాలు,రెడీమేడ్‌ దుస్తులు. అక్కడ పత్తి పెద్దగా పండదు, దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలో అదే ఎక్కువగా ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నది. వస్త్ర ఉత్పత్తులతో చైనా, భారత్‌, వియత్నాం వంటి దేశాలను సవాలు చేస్తున్నది. తాజా ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి నూలు, పత్తి దిగుమతి చేసుకొని దుస్తులను తమకు ఎగుమతి చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు అన్న వెసులుబాటు అమెరికా కల్పించింది. నిజానికి అది తమ పత్తి కొనుగోలు చేయాలనే షరతును రుద్దింది.ఒక దశలో షేక్‌ హసీనా పదవీచ్యుతురాలు గాక ముందు మన పత్తి, నూలు ఎగుమతుల్లో 70శాతం బంగ్లాదేశ్‌కే జరిగాయి.పైకి ఎన్ని చెప్పినప్పటికీ ఇప్పుడు అక్కడ మనకు వ్యతిరేకమైన బిఎన్‌పి అధికారానికి వచ్చింది. అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి చేసే రెడీమేడ్‌ దుస్తులలో 70శాతం అమెరికా ముడి సరకులేే ఉంటే ఎలాంటి దిగుమతి పన్ను ఉండదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పత్తి సంవత్సరం 2025-26 (అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు) బంగ్లాదేశ్‌ 84లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. బ్రెజిల్‌ నుంచి 19(22శాతం) భారత్‌ 14(15శాతం) బెనిన్‌ 10.6, కామెరూన్‌ 6.2, అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి 5.95లక్షల బేళ్ల వంతున దిగుమతి చేసుకోవాలని తలపెట్టింది. ఇప్పుడు తాజా ఒప్పందంతో అమెరికా నుంచి దిగుమతులు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. మన పత్తి కంటే అమెరికా సరకు రేట్లు తక్కువ, ఎందుకని ? 2026లో ఒక పౌను(453 గ్రాములు) దూదికి ప్రభుత్వ సాయంగా 55 సెంట్లు, మననగదులో రు.50 ఇస్తుంది. అంతమొత్తం సబ్సిడీ పొందుతున్న తరువాత ప్రపంచానికి చౌకధరలకు పత్తి ఎగుమతులు చేయకుండా ఎలా ఉంటుంది. పైసా పైసా లాభాన్ని లెక్కవేసుకొనేవారు అమెరికా పత్తికి ఎగబడక చస్తారా ? బంగ్లాదేశీయులు దూరంగా ఉంటారా ? ట్రంప్‌ విధించిన పన్నులతో మన ఎగుమతిదారులు అమెరికన్లకు చౌకగా దుస్తులు అందించలేకపోతున్నారని అచ్చే దిన్‌కు దూరం చేస్తున్నారనే ”జాలి గుండె ” నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే పత్తిపై 11శాతం పన్ను తగ్గించింది. పొడవు పింజ పత్తిని మాత్రమే దిగుమతికి అనుమతించామంటారు, రెండు తెలుగు రాష్ట్రాలు, దక్షిణాదిన పండేది అదే గనుక మన రైతులకు వెయ్యి నుంచి రెండువేల వరకు నష్టం వచ్చింది, అయితేనేం అమెరికన్లకు తక్కువ ధరలకు దుస్తులను అందించినందుకు మన బిజెపి నేతలు తమ భుజాలను తామే చరుచుకున్నారు. ఇప్పుడు కూడా అమెరికా నుంచి దిగుమతులు చేసుకోవాలని పియూష్‌ గోయల్‌ చెబుతున్నారు. అంటే ఈ ఏడాది కూడా పత్తి రైతుల నోట్లో మట్టికొట్టేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా పత్తిసాగు గిట్టుబాటు కావటం లేదంటూ అమెరికన్‌ రైతులు విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. దాంతో ట్రంప్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి వాణిజ్య ఒప్పందాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిందే అనే షరతులు పెడుతోంది.బ్రెజిల్‌ నుంచి పత్తి ఎగుమతుల్లో తీవ్ర పోటీ ఎదురుకావటంతో సబ్సిడీలతో రంగంలోకి దిగనుంది.

అమెరికాతో ఒప్పందం గురించి అడుగడుగునా దాగుడుమూతలే,పైకి చెబుతున్నది ఒకటి లోపల మరొకటి జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వివిధ రకాల ధాన్యాల నుంచి అమెరికాలో ఎథనాల్‌ తయారు చేస్తారు, ఆ క్రమంలో వచ్చే పిప్పి లేదా చెక్కను పశువుల దాణాగా వినియోగిస్తారు.తాజా ఒప్పందం ప్రకారం దాన్ని మనం ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలి, అది కోళ్ల ఫారాల యజమానులకు లబ్ది కలిగిస్తుంది, కానీ మన దగ్గర అందుకోసం సాగు చేస్తున్న రైతులేం కావాలి ? ఇదే మాదిరి సోయా ఆయిల్‌ను పన్నుల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. ఆ రైతుల పరిస్థితి ఏమిటి ? ఒక వైపు నూనె గింజల సాగును ప్రోత్సహిస్తామంటారు మరోవైపు ఆ రైతులను దెబ్బతీస్తారు. బయో ఇంథన ఉత్పత్తిలో భాగంగా ఇథనాల్‌ తయారీని ప్రోత్సహిస్తారు. అమెరికా నుంచి దాని చెక్కను దిగుమతి చేసుకుంటే ఇక్కడి కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు ?

ముందే చెప్పుకున్నట్లు పైకి చెబుతున్నది ఒకటి లోపల జరుగుతున్నది మరొకటి.అమెరికా నుంచి పప్పు ధాన్యాలను కూడా దిగుమతి చేసుంటారని ట్రంప్‌ యంత్రాంగం ”వాస్తవాల పత్రం ”లో చెప్పింది. మన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో మాట మార్చింది. ఫిబ్రవరి పన్నెండు కార్మికుల సార్వత్రిక సమ్మె సందర్భంగా రైతులు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గ్గొన్నారు. అలాగే ఐదేండ్ల పాటు ప్రతి ఏటా వంద బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ వస్తువులు, ఇంథనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌ అంగీకరించినట్లు తొలుత చెప్పారు. తరువాత మాట మార్చి అంగీకారం కాదు వాంఛిస్తున్నదని సవరించారు. డిజిటల్‌ సేవలపై పన్నులు ఎత్తివేసేందుకు మోడీ సర్కార్‌ అంగీకరించిందని తొలుత ప్రకటించారు.తరువాత దానికి సంబంధించిన పేరాను తొలగించారు.దాని బదులు డిజిటల్‌ వాణిజ్య సేవల గురించి సంప్రదింపులు జరిపేందుకు అంగీకరించిదని మార్చారు. ఇలా అమెరికా రోజుకొక మాట చెబుతున్నా మోడీ నోరు విప్పటం లేదు, ఇదేమని అడిగిన వారిని అభివృద్ధి నిరోధకులు, దేశ వ్యతిరేకులని ముద్ర వేస్తున్నారు. మార్చి నెలలో సంతకాలు జరుగుతాయని చెబుతున్న ఒప్పందంలో ఇంకెన్ని చేరుస్తారో, ఆ తరువాత చేర్చటానికి మరెన్ని షరతులకు అంగీకరిస్తారో, రైతాంగాన్ని ఎలా నట్టేట ముంచేందుకు చూస్తున్నారో తలచుకొంటే ఆందోళన కలుగుతోంది, జనం ఎలా స్పందిస్తారో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d