• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Xi Jinping

చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

27 Wednesday May 2026

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

anti china, Asia NATO, Donald trump, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue, Qusd 2026 Delhi meet, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

మంగళవారం నాడు ఢిల్లీలో నాలుగుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. మహాభారతంలో నలుగురిని దుష్ట చతుష్టయం అని పిలిచారు.వారు దుర్మార్గానికి పాల్పడ్డారు గనుక దుష్ట అని విశేషణాన్ని చేర్చారు. అమెరికా,భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలు ఒక కూటమిగా భద్రత చర్చలు జరపాలని నిర్ణయించుకున్నందున చతుర్భుజ భద్రతా సంప్రదింపులు(క్వాడ్రలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌-క్వాడ్‌) అని పేరు పెట్టారు.పదే పదే అంత పెద్ద పేరుతో పలకలేం గనుక చతుష్టయం అందాం. మన విదేశాంగమంత్రి జై శంకర్‌ ఆహ్వానం మేరకు చతుష్టయ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఎందుకు జరిగిందయ్యా అంటే చైనాకు చెక్‌(అడ్డుకొనేందుకు) పెట్టేందుకు అని కొన్ని మీడియా సంస్థలు శీర్షికలు పెట్టాయి. పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన అది సాధుజంతువుగా ఉంటుందా ? కొన్ని దేశాలు సమావేశమైనపుడు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం,సంపదల సృష్టికి సహకారం, మద్దతు ఇవ్వాలి తప్ప మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు అంటూ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా కుట్రలకు తెరతీయటం, కూటమిగా సంఘర్షణకు పూనుకోవటాన్ని చైనా వ్యతిరేకిస్తుందని ఆమె చెప్పారు. లోపల ఏం మాట్లాడుకున్నారో పైకి ఏం చెప్పారన్నదాని గురించి పెద్దగా బుర్రలు బద్దలు చేసుకోనవసరం లేదు. ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నందున ఎదుటివారికి చెప్పేందుకే ఉన్న నీతి సూత్రాలకు కొదవ ఉండదు.ముందుగా ఈ సమావేశం గురించి పెద్దగా చర్చలు కూడా జరగలేదు గనుక సాదాసీదా సమావేశంగానే మీడియా భావించిందని చెప్పాలి. ఈ భేటీకి పది రోజుల ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా యాత్ర చేసిన తరువాత నిజంగానే ఆ ఏముంటుందిలే అని పెద్దగా పట్టించుకోలేదు. పైకి ఏమి చెప్పినా దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకారవాణా జరగాలన్నది ఈ కూటమి అజెండాలో ఒకటి. ప్రపంచాన్ని పక్కదారి పట్టించేందుకు లేని సమస్యను ఉన్నట్లుగా చూపే ఒక మైండ్‌ గేమ్‌. సోవియట్‌ యూనియన్‌తో ఐరోపాకు ముప్పు పొంచి ఉందంటూ నాటో కూటమిని ఏర్పాటు చేసినట్లుగానే ఆ ప్రాంతంలో చైనా ముప్పు గురించి ప్రచారం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే ఎవరైతే ఈ డిమాండ్‌ చేస్తున్నారో ఆ దేశాల్లో ఒకటైన అమెరికా తన ఇరుగూ కాదు పొరుగూ కాదు, ఖండమూ కాదు, పదివేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హార్ముజ్‌ జలసంధిలో ఆయుధాలను చూపి నౌకల దిగ్బంధాన్ని అమలు జరుపుతూ మరోవైపు చైనా పెరటితోట వంటి దక్షిణ చైనా సముద్రం గురించి తేల్చాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.ఇంతవరకు చైనా ఏ ఒక్క నౌకనూ అడ్డుకున్న ఉదంతం లేదు.ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నౌకా రవాణాకు సంబంధించి నిఘావేసేందుకు నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

నిజానికి చతుష్టయ కూటమి ఏర్పాటలో దేశాల మధ్య అవగాహన తప్ప ఎలాంటి ఒప్పందమూ లేదు. తొలుత 2002 భారత్‌ మినహా మూడు దేశాలు త్రిపక్ష కూటమిగా ఏర్పడ్డాయి.తరువాత ఐదేండ్లకు భారత్‌ చేరింది.దీన్ని మరికొన్ని దేశాలను కలుపుకొని విస్తరించాలని చూసినప్పటికీ ఏ దేశమూ ముందుకు రాలేదు. తరువాత పదేండ్ల పాటు దాన్ని గురించిపెద్దగా పట్టించుకోలేదు. 2017 నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు, ప్రకటనలు చేస్తున్నారు.2021 నుంచి ఏటా ఒక సభ్యదేశంలో కూటమి అగ్రనేతల సమావేశాలు, దానికి ముందు విదేశాంగ మంత్రుల సన్నాహక సంప్రదింపులు జరుపుతున్నారు. ఆరుసార్లు అధినాయక సభలు జరగ్గా రెండుసార్లు వీడియో కాన్ఫరెన్సులు, రెండుసార్లు జపాన్‌లో, మరో రెండుసార్లు అమెరికాలో జరిగాయి.2024జూన్‌30 నుంచి జూలై రెండవ తేదీ వరకు కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్‌డిసిలో జరిగింది.డోనాల్డ్‌ ట్రంప్‌ మనతో సహా అనేక దేశాలపై పన్నుల యుద్ధం ప్రకటించటంతో గతేడాది సమావేశం జరగలేదు. తనకు వ్యతిరేకంగా జతకట్టడటంగా చైనా పరిగణిస్తుండగా, ఆసియా నాటో కూటమి అని రష్యా అంటున్నది,ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. పైకి ఎవరు ఏమి చెప్పినప్పటికీ చైనాను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం. దక్షిణ చైనా సముద్రంలోనికొన్ని దీవుల గురించి జపాన్‌, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. అయితే ఏ ఒక్క దేశపు నౌకనూ చైనా మలేసి(అడ్డుకున్న)న ఉదంతం లేదు. అయినప్పటికీ స్వేచ్చా రవాణా పేరుతో అమెరికా నాటకం ఆడుతోంది.ఇతర దేశాలను కూడగట్టేందుకు చూస్తోంది.ఆసియా-పసిఫిక్‌ లేదా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ పెత్తనం సాగాలన్నది దాని అసలు లక్ష్యం. ఇరాన్‌-అమెరికా మధ్య తలెత్తిన పోరు నేపధ్యంలో సంధి గురించి చర్చలు ఒకవైపు మరోవైపు విదేశాంగ మంత్రుల సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. అమెరికా మంత్రి మార్కో రూబియో, జపాన్‌ మంత్రి టోషిమిట్సు మోటెగీ, పెనీ వాంగ్‌(ఆస్ట్రేలియా) పాల్గంటుండగా జై శంకర్‌ అధ్యక్షత వహించారు.

నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన రూబియో ఇండో -పసిఫిక్‌ ప్రాంతం స్వేచ్చగా, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పాడు. ఇలాంటి సమావేశాలను భావసారూప్యత కలిగిన దేశాలతో ఏదో మొక్కుబడిగా జరపటం కాకుండా అనేక అంశాల్లో భాగస్వాములుగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.నౌకా రవాణా, కీలకమైన ఖనిజాలు,లోహాల వంటి అంశాలపై నిర్దిష్ట కార్యాచరణకు పూనుకుంటామని రూబియో అన్నాడు.ఈ ఏడాది ముగిసేలోగా నలుగురు అగ్రనేతల భేటీ ఉంటుందన్నాడు. గతేడాది వాషింగ్టన్‌లో జరిగిన సమావేశ చర్చల కొనసాగింపు ఉంటుందని మన విదేశాంగశాఖ ఢిల్లీ సమావేశం గురించి చెప్పింది. చతుష్టయ కూటమి లక్ష్యాలుగా ప్రజాస్వామ్యం, మానవహక్కులు,చట్టబద్దమైన పాలన వంటి కబుర్లు చెబుతున్నది. వీటన్నింటినీ అమెరికా ఉల్లంఘిస్తున్నది. చట్టబద్దంగా ఎన్నికైన వెనెజులా అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్‌ చేసి తమ దేశానికి తీసుకుపోయి తప్పుడు కేసులతో విచారణ జరుపుతున్నది. అక్కడ ఉన్న చమురు సంపదలన్నింటినీ తన దేశ కంపెనీలకు అప్పగించింది.ఇరాన్‌లో ఉన్న ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించి వేరే పాలకులను ఏర్పాటు చేస్తామని వాషింగ్టన్‌ బహిరంగంగా ప్రకటించటమేగాక దానిలో భాగంగా సుప్రీం నేత ఖమేనీ, ఇతర అనేక మందిని చంపివేయటంతో పాటు దాడులు కూడా చేసిన సంగతి తెలిసిందే. గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని బరితెగించి సమర్ధించిన అమెరికా మానవహక్కుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలను వల్లించినట్లే.ఇది సైనిక కూటమి కాదని చెప్పినప్పటికీ మన దేశ ఆధ్యర్యంలో నాలుగు దేశాల మిలిటరీ మలబార్‌ సైనిక విన్యాసాలు జరిపాయి.

చైనాను కట్టడి చేయాలని నాలుగుదేశాల నేతలకూ ఉన్నప్పటికీ పిల్లిమెడలో గంటకట్టేదెవరన్న సమస్య ఉంది.ఆర్థిక రంగాల్లో సహకరించుకొనేందుకు అనేక వేదికలు ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నారు.ఒక వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయాయి. ఆర్థిక, మిలిటరీ రంగాలలో ఏ ఒక్క దేశానికీ పోలిక లేదు అసమానతలు ఉన్నాయి.చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకుపోయి తెగేంతవరకు లాగేందుకు ఎవరూ సిద్దంగా లేరు ప్రత్యేకించి భారత్‌, ఆస్ట్రేలియాలు అలాంటి వైఖరిని కనపరిచాయి. ఆర్థిక రంగంలో మిగిలిన మూడు దేశాలను నమ్ముకున్న భారత్‌కు ఆశించిన మేరకు పెట్టుబడులు రాలేదు. దీంతో గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత ఐదు సంవత్సరాల పాటు నామ మాత్ర సంబంధాలను మాత్రమే కొనసాగించిన మనదేశం ఇప్పుడు పెట్టుబడులకు ఆహ్వానం పలకటంతో సహా సాధారణ సంబంధాలను పునరుద్దరించుకుంది. అటువంటపుడు చైనా వ్యతిరేకత అనే ఎర్రగీతను దాటి ముందుకు పోయే స్థితి లేదు. తక్షణం పరిష్కరించాలని భావిస్తున్న ప్రాంతీయ సమస్యల తీవ్రతను తగ్గించే అవకాశాలు కూడా లేవని ఇన్ని సంవత్సరాల అనుభవం నేర్పింది.పశ్చిమాసియాలో ఇరాన్‌పై దాడి చేసి దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక అమెరికా గిలగిలా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే.అమెరికాకు ఏ ఒక్క దేశమూ మద్దతుగా నిలవకపోగా ఇరాన్‌కు మద్దతుగా చైనా వ్యవహరిస్తున్నది, భద్రతా మండలిలో దాన్ని కాపాడిన తీరు తెలిసిందే.

చతుర్భుజ భద్రతా చర్చల పేరుతో వ్యవహరిస్తున్నవారు ఇప్పుడు ఇతర అంశాల మీద కేంద్రీకరించటాన్ని బట్టి ఈ కూటమి దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత వెల్లడి అవుతున్నది. కొందరు సాధువులు రాత్రికి ఒక చోట చేరి ప్రతి రోజూ గంజాయిదమ్ము కొట్టేవారు. అది తలకు ఎక్కగానే తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలి, ఈ బతుకు ఎంతకాలం అంటూ ప్రగల్భాలు పలికేవారట. తెల్లారేసరికి దమ్ముదిగి ఎవరి కర్రా బుర్రా తీసుకొని వారు ఊరు మీదకు వెళ్లేవారు. చైనా పేరు పెట్టకుండా దాన్ని ఉద్దేశించి ఆర్ధికబలవంతం, ధరల తిమ్మినిబమ్మిని,సరఫరా వ్యవస్థల విచ్చిన్నం, అక్రమ మార్కెట్‌ పద్దతులు, కీలకమైన ఖనిజాల ఉత్పత్తి మీద కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్న దేశాలంటూ ధ్వజమెత్తుతూ ప్రతి సమావేశంలో మాట్లాడుతుంటారు. నాలుగుదేశాల నేతలు సమావేశమైనపుడు పరోక్షంగా చైనా మీద మాటలదాడిలో ఎవరూ తక్కువ తినటం లేదన్నది గతసమావేశాల తీరుతెన్నులు స్పష్టం చేశాయి. చైనా నుంచి తలెత్తిన ముప్పు పేరుతో చేస్తున్న ప్రచారానికి దానితో సంబంధాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. అలాంటి దేశంతో లావాదేవీలు తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకొనేందుకు ప్రతిదేశమూ విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నది. ఉదాహరణకు 2014లో మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో చైనా 38 బిలియన్‌ డాలర్ల మేరకు మిగులు ఉండగా 2026నాటికి 116 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా వస్తువుల దిగుమతుల్లో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నారు.గతేడాది ట్రంప్‌ మనపై పన్నుల దాడి ప్రారంభించినపుడు నరేంద్రమోడీ చైనా పర్యటనలో షీ జింపింగ్‌, పుతిన్‌తో కలసి అవసరమైతే తాము ఏకమౌతామనే సంకేతాన్ని ఇచ్చిన సంగతిని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. చైనాను మింగేస్తాం, నలిపేస్తాం అంటూ కొండంత రాగం తీసిన ట్రంప్‌ ఈ నెలలోనే పెద్ద సంఖ్యలో తన కార్పొరేట్‌ అధిపతులను బీజింగ్‌ పర్యటనకు తీసుకువెళ్లి సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. అది వాణిజ్య పర్యటన తప్ప మరొకటి కాదు. విలువైన ఖనిజాల ఉత్పత్తులను చైనా బంద్‌ చేయటంతో తిరిగి కాళ్లబేరానికి రావటాన్ని చూశాము. గతేడాది ఆస్ట్రేలియాలో లోవీ సంస్థ నిర్వహించిన సర్వేలో చైనా తమకు ఆర్థిక భాగస్వామితప్ప ముప్పుదేశం కాదని మెజారిటీ అభిప్రాయపడినట్లు తేలింది. చైనా అనేక దేశాలతో వాణిజ్య మిగులుతో ఉంటే ఆస్ట్రేలియా అదే చైనాతో 2025లో 4.21 బిలియన్‌ డాలర్లు మిగులులో ఉంది. అందువలన అది చైనాతో తగాదాకు ఏమాత్రం సిద్దపడటం లేదు. ఉత్తర కొరియాను చూసి జపాన్‌ భయపడుతున్నది తప్ప చైనాతో వాణిజ్యాన్ని వదులుకొనేందుకు సిద్దంగా లేదు. అమెరికా కనుసన్నలలో నడిచే దక్షిణ కారియా పరిస్థితి అంతే. ఢిల్లీ సమావేశంకోసం వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌కు ఎంత చమురు కావాలంటే అంత సరఫరా చేస్తామంటూ బిస్కెట్‌ వేశారు.మన అవసరాలకు ప్రతిదేశం నుంచి చమురు కొనుగోలు చేయాల్సి ఉంది.అలాగాక అమెరికాను నమ్మి మిగిలిన దేశాలను వదలివేస్తే పరిస్థితి తారుమారైతే అమెరికన్లు మన జట్టుపట్టుకుంటారు, తమ కాళ్ల ముందు పడేట్లు చేసుకుంటారు. రూబియో ఢిల్లీలో మాట్లాడుతూ విలువైన లేదా కీలక లోహాలపై ఒక ఏర్పాటును ప్రకటిస్తామని, పరస్పర సహకారం, పెట్టుబడులు సరఫరాలను సమన్వయం చేసుకుంటామని చెప్పాడు. ఇండో-పసిఫిక్‌ ఇంథన భద్రతను కూడా పటిష్టపరుస్తామన్నాడు. ఇంకా ఇండో-పసిఫిక్‌ నౌకా నిఘాసహకారం పెంచుకుంటామని చెప్పాడు. ఇలాంటి సాధారణ విషయాలు తప్ప ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామమేదీ ఢిల్లీ సమావేశంలో జరగలేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

20 Wednesday May 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Narendra Modi Failures, Taiwan Matters, Trump China 2026 Trip, US attack Iran, West Asia Crisis, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

కతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వినతి మేరకు ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అంతకు ముందు రెండు మూడు రోజుల్లో ఒప్పందానికి రాకపోతే యుద్దాన్ని తిరిగి ప్రారంభిస్తానని చెప్పాడు. పార్లమెంటు ఆమోదం పొందకపోతే ఇరాన్‌పై సాగిస్తున్న దాడులను నిలిపివేయాలంటూ అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తూ మంగళవారం నాడు అమెరికా సెనేట్‌ 50-47తో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతకు ముందు ఏడు సార్లు డెమోక్రటిక్‌ పార్టీ ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. నలుగురు అధికార రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు చేతులు కలపటంతో నెగ్గింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక దేశం మీద యుద్ధం చేయాలంటే పార్లమెంటు తీర్మానం అవసరం. అయితే అధ్యక్షుడికి ఉన్న అధికారాల గురించి 1973లో పార్లమెంటు చేసిన తీర్మానం మేరకు అరవై రోజులకు మించి సైనిక చర్యకు ఆదేశిస్తే పార్లమెంటు ఆమోదం విధిగా పొందాల్సి ఉంది. ఈ కారణంగానే అసలు తాము ఇరాన్‌ మీద యుద్దం చేయటం లేదని, మిలిటరీ చర్య మాత్రమే అని బుకాయించాడు, అంతేకాదు ఫిబ్రవరి 28న దాడులను ప్రారంభించిన ట్రంప్‌ ఏప్రిల్‌ 7న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాడు. అప్పటి నుంచి అదిరింపులు బెదిరింపులతో కాలం గడుపుతున్నాడు. అమెరికా చేసిన దాడులనుంచి తాము అనేక విషయాలను నేర్చుకున్నామని, మరోసారి దాడులకు పాల్పడితే ఊహించని విధంగా దెబ్బతీస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి ప్రకటించాడు. తిరుగులేనిదని చెప్పుకున్న ఎఫ్‌-35 యుద్ధ విమానాన్నే కూల్చివేశామని, మరో 42 ఇతర విమానాలు, శక్తివంతమైన డ్రోన్లను కూడా తాము కూల్చివేసినట్లు అమెరికన్‌ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు కూడా ఇరాన్‌ ప్రకటించింది.యుఏయి అణువిద్యుత్‌ కేంద్రంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడిచేసింది.దానికేమీ నష్టం జరగనప్పటికీ అవసరమైతే క్షిపణులతో ధ్వంసం చేయగలమని సందేశాన్ని ఇరాన్‌ పంపింది.

మే నెల 14,15 తేదీలలో ప్రపంచంలో ఇద్దరు శక్తివంతులైన నేతలు చైనా రాజధాని బీజింగ్‌లో భేటీ అయ్యారు. సహజంగానే ఈ కలయిక ఫలితాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతోంది.అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవసారి చైనా సందర్శించాడు. పర్యటనకు ముందు, తరువాత కూడా ఈ ఉదంతం గురించి పెద్ద ఎత్తున విశ్లేషణలు వెలువడ్డాయి. డ్రాగన్‌ దేశ సందర్శన విఫలమైందని,వాణిజ్య పోరు ఎదురుతన్నిందని,అమెరికన్‌ కార్పొరేట్లు నిరాశాపూర్వక ప్రయత్నాలు చేసినట్లు, ఇంకా అనేక అంశాల గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యలు, వివరణలు వెలువడ్డాయి. విజయవంతమైందనే మాట ఎక్కడా వినిపించలేదు. సాధారణంగా దేశాధినేతల పర్యటనలు ఇతర దేశాల ఆహ్వానం మేరకే జరుగుతాయి. ట్రంప్‌ తాజా పర్యటనకు చైనా నుంచి అలాంటి ఆహ్వానం లేదు. మీ ఇంటికి ఒకసారి రావాలని కొందరు అంటారని తెలిసిందే, అలాగే ట్రంప్‌ తన వాంఛను వెలిబుచ్చిన తరువాత అంతకంటేనా అని బీజింగ్‌ స్పందించింది.అలాగని మర్యాదలకు లోటు చేయలేదు.ట్రంప్‌ పరివారానికి హెచ్చరికలతో పాటు అనేక బహుమతులు కూడా ఇచ్చిపంపారు. అయితే వాటిలో దొంగచెవులు, నిఘా కెమెరాలను అమర్చారంటూ స్వదేశానికి తీసుకుపోకుండా ఒక చెత్తబుట్టలో వేసి చూపి మరీ ట్రంప్‌ బృందం చైనాను అవమానించింది అనటం కంటే తన చౌకబారు తనాన్ని వెల్లడించుకుంది. గతంలో కూడా అమెరికన్లు గుట్టుచప్పుడు కాకుండా అదేపని చేసేవారని వార్తలు వచ్చాయి. ఈ చర్య ద్వారా షీ జింపింగ్‌ యంత్రాంగం తమ బుట్టలో పడలేదనే ఉక్రోషం ప్రదర్శితమైంది.చైనాను వత్తిడి చేయటంలో విఫలం కావటాన్ని వాణిజ్య యుద్దంలో ట్రంప్‌ ఓటమిగా కొందరు వర్ణించారు.ఆ పెద్ద మనిషి అంతగా కోరి మరీ ఎందుకు చైనా వెళ్లాడంటే ముక్తసరి సమాధానం అమెరికా ఆర్థిక పరిస్థితి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందనే సమాధానం వచ్చింది. చైనా పర్యటన సమయంలో ట్రంప్‌ రేటింగ్‌ 34 శాతానికి దిగజారింది.రుణ భారం జిడిపికి వందశాతం దాటింది. పులిమీద పుట్రలా ఇరాన్‌పై దాడి చేసి మరింత లోతుగా కూరుకుపోయింది.గౌరవ ప్రదమైన విధంగా ఇరాన్‌తో రాజీకుదర్చాలనే అజెండా తెరవెనుక ఉందని చెబుతున్నారు.వ్రతం చెడ్దా ఫలం దక్కలేదు.చైనా పైచేయిగా ఉందని వాషింగ్టన్‌ మేథో సంస్థ విదేశీ వ్యవహారాల మండలి(సిఎఫ్‌ ఆర్‌) వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఏమిటో వేరే చెప్పనవసరం లేదు.అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాటి వెనుక టెస్లా కంపెనీ యజమాని ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్‌, అందరికీ సుపరిచితమైన ఆపిల్‌, బ్లాక్‌రాక్‌, ఎన్‌విడియా, బోయింగ్‌, జిఇ, మైక్రాన్‌ ఇలా అనేక కంపెనీల అధిపతులు ఉంటారు.ఎవరు మంత్రులు కావాలో, ఏ విధానాలను అనుసరించాలో కూడా నిర్దేశించేది వారే.

ఈ బృందం ఆశాభంగం చెందటానికి కారణాలు ఏమిటి ? గతంలో చైనాకు అవసరమైన చిప్స్‌ను సరఫరా చేయటంలో ఎన్‌విడియా కంపెనీ వాటా 95 శాతం ఉండగా ఇప్పుడు సున్నా శాతానికి పడిపోయింది.చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను సరఫరా చేయకూడదన్న ఆదేశాలకు సదరు కంపెనీ తలొగ్గింది. సవాలుగా తీసుకున్న చైనా తన స్వంత కంపెనీలను ప్రోత్సహించి చిప్స్‌ను అభివృద్ధి చేసుకుంటున్నది. విధిలేక నిషేధం ఎత్తివేసిన తరువాత చూద్దాం, అవసరమైనపుడు మేమే సంప్రదిస్తాం అన్నట్లుగా చైనా అటువైపే చూడలేదు.అందుకే ఆ కంపెనీ యజమాని ట్రంప్‌తో పాటు బీజింగ్‌ వెళ్లాడు. నూటనలభై కోట్ల జనాభాలో 2027 నాటికి 120 కోట్ల మంది మధ్య తరగతిలో ఉంటారని అంచనా. ప్రపంచంలో వీరి వాటా 25శాతం. ఇంత మంది వినియోగదారుల మార్కెట్‌ను అమెరికా కార్పొరేట్లు వదులు కుంటాయా ? వాటికి కావాల్సింది లాభాలు, వాటికోసం రాజకీయాలు చేస్తాయి, అవి తమకు ఆటంకంగా మారినపుడు ప్లేటు ఫిరాయిస్తాయి.

సంస్కరణలు అంటే మన మాదిరి విదేశాలకు ఏకపక్షంగా తలుపులు బార్లా తెరవటం కాదు.మనం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ నిర్దేశిత విధానాల చట్రంలో చేస్తే దానికి భిన్నంగా టెక్నాలజీ అందిస్తే మార్కెట్‌లో అవకాశమిస్తాం అనే షరతు మీద చైనా కమ్యూనిస్టులు వ్యవహరించారు.ఈ కీలకమైన అంశాన్ని వదలి వారు నియంతలు, మనది ప్రజాస్వామ్యం అందుకే చైనాతో పోల్చుకోవద్దు అంటూ కొందరు సొల్లు కబుర్లు చెబుతారు. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి.చైనా తనకు పోటీగా రాదని భావించినంత కాలం అమెరికన్లు ఎలాంటి యాగీ చేయలేదు. తరువాతే అక్కడ మానవహక్కులు లేవని, కరెన్సీ విలువను తగ్గించి ఉంచుతున్నారని, సబ్సిడీలతో సరకులను తక్కువ ధరలకు ఎగుమతి చేస్తున్నారని ఇలా రకరకాల సాకులను ముందుకు తెచ్చారు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు 2018లో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించాడు. పెద్ద మొత్తంలో అమెరికా పెట్టుబడులు తగ్గించాడు, వాణిజ్యమూ తగ్గింది. అయినా గడచిన ఎనిమిది సంవత్సరాల్లో చైనాకు స్వల్ప సమస్యలు తప్ప అదేమీ కుప్పకూలి పోలేదు. వాణిజ్యం తరువాత చిప్‌ వార్‌ను ప్రారంభించాడు.దాన్ని కూడా సవాలుగా తీసుకొని మీ చిప్స్‌ మాకు అవసరం లేదనట్లుగా ఇప్పుడు చైనా ఉంది. దాంతో చైనా పట్ల వైఖరిని మార్చుకోవాలని కొన్ని పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు వత్తిడి తెచ్చిన కారణంగానే పిలవక పోయినా పెద్ద సంఖ్యలో వాటి యజమానులను వెంటేసుకొని ట్రంప్‌ బీజింగ్‌ వెళ్లాడు. చైనా కనీసం ఐదు వందల విమానాలను కొనుగోలు చేస్తుందని కొందరు జోశ్యం చెప్పారు.అన్నిగాకున్నా రెండు వందలు అమ్ముదామని ట్రంప్‌ చెప్పాడు. చివరికి దీని గురించి అడిగితే చైనా ప్రతినిధి సమాధాన్ని దాటవేయటంతో బోయింగ్‌: కంపెనీ వాటాల ధరలు నాలుగుశాతం పడిపోయాయి. ఎన్‌విడియా చిప్స్‌ కంపెనీకి సైతం ఇదే ఆశాభంగం ఎదురైందని వార్తలు. బీజింగ్‌ తన ప్రయోజనాలను ఫణంగా పెట్టుకొని తమకు రాయితీలు ఇస్తుందని ట్రంప్‌ ఎలా ఆశించాడు, ఆలోచించాడన్నది ఒక చిక్కు ప్రశ్నగా మారింది.కొన్ని దేశాల్లో దళారీ బూర్జువా శక్తులు వ్యక్తిగతంగా తాము లబ్డిపొంది దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా, ఇతర ధనిక దేశాలకు సహకరించినట్లుగానే చైనా కమ్యూనిస్టులు చేస్తారని ఆశించి భంగపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌ నుంచి తనకు చమురు అందకుండా చేసేందుకు అమెరికా కుట్రలు తెలిసిందే. అదే ఇరాన్‌ మీద దాడులు చేస్తూ సంక్షోభ పరిష్కారానికి ఇరాన్ను దారికి తేవాలని కోరటం కూడా ట్రంప్‌ దురాశే.

ఇప్పుడు చైనా అమ్ములపొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి. ఏడాది క్రితం చైనా వస్తువులపై 145శాతం పన్నులు విధిస్తా అంటే తాము కూడా అదే మర్యాద చేస్తామని ట్రంప్‌కు చెప్పారు. తన దగ్గర తిరుగులేని అస్త్రాలు ఉన్నాయని, చైనాను నాశనం చేస్తానని చెప్పటం తప్ప వాషింగ్టన్‌ ఇంతవరకు బయటకు తీసిందేమీ లేదు.చైనా ప్రతి సుంకాలు విధిస్తే మనకు నష్టమా అని ప్రశ్నిస్తే వారు పెద్ద తప్పు చేశారు, మనం దిగుమతి చేసుకొనే వస్తువుల్లో ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం గనుక నష్టపోయేదే వారే అని అమెరికా విత్త మంత్రి స్కాట్‌ బెసెంట్‌ గొప్పలు చెప్పాడు. అటువంటపుడు ట్రంప్‌ చైనా ఎందుకు వెళ్లినట్లు ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తే వాటి తయారీకి అవసరమైన విలువైన ఖనిజాల ఉత్పత్తులను నిలిపివేసి డ్రాగన్‌ వాషింగ్టన్‌లో రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. సముద్రంలో నీరున్నా తాగేందుకు పనికి రాదన్నట్లు అమెరికా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాలను చూసుకొనే స్థితి లేదని గగ్గోలు పెడుతున్నారు. ఒంటరిగా చేయలేమని భావించి పాక్స్‌ సిలికా పేరుతో కొన్ని దేశాలతో కూటమి గట్టింది, వాటి ప్రయత్నాలు ఫలించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంతవరకు ఆగలేమంటూ కార్పొరేట్లు ట్రంప్‌ మీద వత్తిడి తెస్తున్నాయి. చైనాను దెబ్బతీయటంతో పాటు దానికి ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలను తయారు చేసే ఎత్తుగడతో గత పది సంవత్సరాలుగా అక్కడి నుంచి కంపెనీలను తరలించాలని శ్వేత సౌధం వత్తిడి చేస్తున్నది.ఆమేరకు యాపిల్‌ కంపెనీ మనదేశానికి వచ్చినప్పటికీ దానికి ఎదురైన సమస్యలను చూసి మిగిలిన సంస్థలు సాహసించటం లేదు.ఎలన్‌ మస్క్‌ టెస్లా కంపెనీ తయారు చేస్తున్న విద్యుత్‌ కార్లలో సగం చైనాలోనే ఉన్నాయి, అయినప్పటికీ అమెరికా పరిశ్రమను బీజింగ్‌ నాశనం చేయనుందని, గగ్గోలు పెడితే జో బైడెన్‌ సర్కార్‌ 2024లో చైనా కార్లపై వందశాతం దిగుమతి సుంకం విధించింది.అయినా చైనా తగ్గలేదు.

వాణిజ్య అంశాల్లో పరిస్థితి ఇలా ఉంటే రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణ జరిగిన నాటి నుంచీ తైవాన్‌ అంశం నలుగుతూనే ఉంది. ఆ ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తిస్తూనే విడదీసి ప్రత్యేక దేశంగా మార్చాలనే కుట్రలకు అమెరికా తెరతీసింది, టిబెట్‌ను మరోదేశంగా మార్చాలనే ఎత్తుగడతో దలైలామా పేరుతో తిరుగుబాటుకు తోడ్పాటునిచ్చిన సంగతి తెలిసిందే.చైనాకు కేవలం 59 మైళ్ల దూరంలో ఉన్న తైవాన్‌ రక్షణకు 9,500 మైళ్ల దూరం నుంచి వచ్చి యుద్దం ఎలా చేయగలమని ట్రంప్‌ ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌ జర్నలిస్టులను ప్రశ్నించాడు. ఇలాంటి స్పందన గతంలో ఏ అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి రాలేదు. అమెరికన్లు ఎందుకు తైవాన్‌ గురించి ఆందోళన చెందుతున్నారంటే అక్కడి చైనా జాతీయుల గురించి కాదు, ఆధునిక చిప్స్‌ తయారీ ఫ్యాక్టరీల పైనే కన్ను. ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను నాశనం చేస్తామని గతంలో అమెరికా బెదిరించింది.తైవాన్‌ అంశం గురించి చైనా ముందుకు తెస్తే ట్రంప్‌ ఇరాన్‌ గురించి ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి.అమెరికా అధ్యక్ష భవనం విడుదల చేసిన ప్రకటనలో కేవలం 163 పదాలే ఉన్నాయి.హార్ముజ్‌ జలసంధి గురించిన ప్రస్తావన మూడుసార్లు ఉంది.చైనా విడుదల చేసిన ప్రకటనలో అసలు ఇరాన్‌ ప్రస్తావనే లేదు, కేవలం మధ్య ప్రాచ్య పరిస్థితి అనే మాటమాత్రమే ఉంది.

ఇరాన్‌పై విజేతగా బీజింగ్‌ అడుగుపెట్టేందుకు కలలు గన్న ట్రంప్‌కు ఆశాభంగం ఎదురైంది. రెండు రోజుల ట్రంప్‌ పర్యటన తరువాత జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమాసియా సంక్షోభంలో ఎలాంటి సానుకూల పరిణామాలు లేవు. గతంలో మాదిరే ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. పెద్ద ఎత్తున దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కథనాలను వండి వారుస్తున్నారు.మరో నెల రోజుల పాటు సముద్రంలో ఉన్న నౌకలనుంచి రష్యన్‌ ముడి చమురు కొనుక్కొనేందుకు భారత్‌తో సహా కొన్ని దేశాలకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుమతిని పొడిగించాడు.బ్రెంట్‌ రకం ముడిచమురు ధర మంగళవారం నాడు రెండు డాలర్లు తగ్గి 110 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి అమెరికా చమురు వినియోగదారులపై 45 బిలియన్‌ డాలర్ల మేర అదనపు భారం పడింది.అందువలన అనిశ్చితి ఇంకా కొనసాగితే మరింత పెరిగి నవంబరులో జరిగే ఎన్నికల్లో ఓటర్లు ట్రంప్‌కు చుక్కలు చూపించే అవకాశం ఉంది. అనేక దేశాలకు ఎరువుల సరఫరాతో పాటు, వాటి ఉత్పత్తికి అవసరమైన గ్యాస్‌ లభ్యత కూడా తీవ్రంగా మారే అవకాశం ఉంది, ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగాయి. మరికొద్ది వారాల్లో మనదేశంలో ఖరీఫ్‌ తరుణం ప్రారంభం కానుంది.ఎరువులను కేంద్ర ప్రభుత్వం ఎలా అందించనుందో చూడాల్సి ఉంది.యావత్‌ దేశాన్ని కలవర పెడుతున్న అమెరికా దాడులను ఖండించే ధైర్యం లేకపోయినా కనీసం ఆపమని ట్రంప్‌ను నరేంద్రమోడీ ఎందుకు వేడుకోరన్న ప్రశ్నకు జవాబు దొరకటం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

13 Wednesday May 2026

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, Donald trump, Trump China 2026 Trip, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ ఆహ్వానం మేరకు గురు, శుక్రవారాల్లో చైనా పర్యటన జరిపేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం నాడు బీజింగ్‌ చేరుకున్నాడు. అన్ని రోడ్లూ రోమ్‌కే దారి తీసినట్లు ఈ పర్యటన గురించి పెద్ద ఎత్తున ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. పరిణామాలు, పర్యవసానాల గురించి విశ్లేషణలు వెలువడ్డాయి. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్‌ పంపిన తాజా ప్రతిపాదనలను ట్రంప్‌ తిరస్కరించాడు. అదొక చెత్తకాగితమని, దాన్నసలు పూర్తిగా చదవలేదంటూ తాత్కాలిక శాంతి అవగాహన వెంటిలేటర్‌ మీద ఉందని వ్యాఖ్యానించాడు. మరోసారి ఇరాన్‌పై దాడులకు తెగబడేందుకు అమెరికా సిద్దపడుతున్నదని వార్తలు వస్తున్న పూర్వరంగంలో ట్రంప్‌ చైనా పర్యటన జరగనుంది. ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ ఈ యాత్ర ముగిసేవరకు ఎలాంటి దాడులు జరిపే అవకాశం లేదని చెప్పవచ్చు. ఇప్పటికే చైనాతో బేరసారాల్లో బలహీనపడిన అమెరికా మరోసారి దుస్సాహసానికి వడిగడితే మరింతగా చులకనకావచ్చు. నిజానికి ట్రంప్‌ యాత్ర మార్చి 31, ఏప్రిల్‌ రెండవ తేదీలలో జరగాల్సి ఉంది. ముందస్తు పథకం ప్రకారం ఇరాన్‌ మీద దాడి చేసి తన ఆయుధశక్తి, పాటవంతో దాన్ని లొంగదీసుకొని చైనా నేతల ముందు ప్రదర్శించాలని 78 ఏండ్ల ట్రంప్‌ కలలు కన్నాడు.అయితే అనుకున్నదొకటి అయింది ఒకటి బోల్తాపడ్డావులే బుల్‌బుల్‌ పిట్టా అన్నట్లుగా పరిస్థితిమారింది. పులిలా బీజింగ్‌లో అడుగుపెట్టాలనుకొని పిల్లిలా వెళ్లనున్నాడని చెప్పవచ్చు. ఒకేసారి రెండు ప్రధాన అంశాలపై కేంద్రీకరించలేకనే గత పర్యటన వాయిదా వేసుకున్నాడు.ట్రంప్‌ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. తన బీజింగ్‌ పర్యటన భీబత్సంగా (ఆంగ్లంలో వైల్డ్‌ అనే పదం వాడాడు. దీనికి అనేక అర్ధాలు ఉన్నాయి) ఉంటుందని కొంతమంది ప్రపంచ నేతలతో ఫిబ్రవరి నెలలో వర్ణించాడు. ఇరాన్‌తో పంచాయతీ కారణంగా మార్చినెలలో పర్యటనను వాయిదా వేసుకున్నాడు, అది ఇప్పటికీ ఇంకా తెగలేదు అయినప్పటికీ బీజింగ్‌ వెళ్లిరాక తప్పదన్నట్లుగా పరివారంతో బయలు దేరాడు.తనతో పాటు పదహారు లేదా 17 మంది వాణిజ్య, పారిశ్రామిక దిగ్గజాలను బీజింగ్‌ తీసుకుపోతున్నాడు.తొలిసారి అధికారానికి వచ్చిన తరువాత 2017లో ట్రంప్‌ పర్యటన తరువాత మరొక అమెరికా అధినేత డ్రాగన్‌ గడ్డమీద అడుగుపెట్టలేదు. ఆ పర్యటన తరువాత మరుసటి ఏడాది బస్తీమే సవాల్‌ అన్నట్లుగా చైనా మీద ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.అయినప్పటికీ అంతమంది వాణిజ్యవేత్తలతో అడుగుపెడుతున్నాడంటే పైకి ఏమి చెప్పినప్పటికీ చైనాతో వాణిజ్య సంబంధాలను వదులుకొనేందుకు అమెరికన్‌ బహుళజాతి గుత్త సంస్థలు సిద్దంగా లేవన్న సందేశాన్ని ఇచ్చినట్లే. ఇరాన్‌తో వివాదం తెగేంతవరకు ఆగలేమంటూ, ఆలశ్యం చేస్తే బేరసారాల్లో ఇంకా బలహీనపడతామంటూ వారు ట్రంప్‌పై వత్తిడి తెచ్చినట్లు కనిపిస్తోంది. చైనాతో పెట్టుబడులు, వాణిజ్య ఏర్పాట్లపై చర్చకు ట్రంప్‌ పర్యటన జరగనుందని కొందరి విశ్లేషణ.

ఈ సందర్భంగా వాణిజ్యంతో పాటు ఇరాన్‌, తైవాన్‌, పన్నులు, కంప్యూటర్‌ చిప్స్‌,విలువైన ఖనిజాలు ఇతర సమస్యలు కూడా చర్చకు రావచ్చని చెబుతున్నారు.వీటిపై బీజింగ్‌ ధృడమైన వైఖరితో ఉంది.తన విదేశాంగ విధానం విజయవంతమైందని నవంబరులో జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల ముందు ప్రదర్శించుకొనేందుకు కూడా ట్రంప్‌ చూస్తున్నాడు.లక్ష కోట్ల డాలర్ల మేర చైనా పెట్టుబడులు, వాణిజ్య విమానాల కొనుగోలు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అమెరికా కోరుకుంటోంది.వారు గనుక లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులతో అమెరికాలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తాయని జనవరిలో డెట్రాయిట్‌ ఎకనమిక్‌ క్లబ్‌ సమావేశంలో ట్రంప్‌ చెప్పాడు.అయితే ఇప్పుడు పెట్టుబడులపై ఒప్పందం కుదరకపోవచ్చని, ఇరాన్‌ అంశం ట్రంప్‌ స్థితిని బలహీనపరిచిందని, అమెరికా మిలిటరీ బలహీనతలు ఏమిటో వెల్లడైనందున గతంలో మాదిరి పొగరుగా మాట్లాడటం కుదరదని చెబుతున్నారు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత కూడా అంతకు ముందు మాదిరే దూకుడును ప్రదర్శించాడు. అయితే చైనా ఏమాత్రం వెనక్కు తగ్గకపోవటంతో బీజింగ్‌ను సంతుష్టీకరించేందుకు కొన్ని బిస్కెట్లు కూడా వేశాడు.చైనా విద్యార్థుల వీసాలకు అనుకూలంగా నిర్ణయం,ఆధునిక ఏఐ చిప్స్‌ను ఎగుమతి చేసేందుకు అంగీకరించటం, తైవాన్‌కు ఆయుధసరఫరా పాకేజ్‌ల నిలిపివేత, చైనాలో మానవహక్కులు లేవన్న ఆరోపణలపై మౌనం,చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై ధ్వజమెత్తే మంత్రుల నోళ్ల కట్టడి, షీ జింపింగ్‌ మంచి స్నేహితుడని, అద్భుతమైన సంబంధాలను కలిగి ఉన్నామని పదే పదే స్వయంగా చెప్పటం వంటి అంశాలున్నాయి. తాను ఈసారి అక్కడకు వెళ్లినపుడు తనను షీ జింపింగ్‌ గట్టిగా హత్తుకుంటాడని కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించాడు. అయితే చైనా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు, పొగడ్తలకు పొంగిపోలేదు. గతేడాది దక్షిణ కొరియాలో ట్రంప్‌-షీ జింపింగ్‌ భేటీలో వాణిజ్య పోరు మీద రాజీకుదిరింది. ట్రంప్‌ జరిపే పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత చెడగొట్టకుండా ఉంటే చాలు అని కూడా కొందరు అమెరికన్లు భావిస్తున్నారు.ఇరాన్‌ వ్యవహారంలో తప్పుడు లెక్కలు వేసుకున్నట్లుగా బీజింగ్‌తో వ్యవహరిస్తే ప్రమాదకరమని కూడా హెచ్చరిస్తున్నారు. గతంలో తమను ఉపయోగించుకొని చైనా, ఇతర దేశాలు ఎంతగానో లాభపడ్డాయని, ఇక ముందు అలా జరగటానికి వీల్లేదని చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు చైనా విషయంలో మాట మార్చాడు. పన్నులు, విలువైన ఖనిజాలు, కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాల్లో తలెత్తిన ఉద్రిక్తతలను పెద్దవేమీ కాదన్నట్లుగా మాట్లాడటమే కాదు, చైనాతో ఎంతో వాణిజ్యం చేస్తూ లబ్ది పొందినట్లు చెప్పాడు.

ఇటీవలి కాలంలో తలెత్తిన విబేధాలతో ఎవరికి వారు ప్రత్యామ్నాయాలను చూసుకుంటూనే ఉన్నారు. తైవాన్‌తో సంబంధాలు కలిగిన ఒక్క దేశంతో తప్ప మిగిలిన అన్ని ఆఫ్రికా దేశాల నుంచి చేసుకొనే దిగుమతులపై ఎలాంటి పన్నులు ఉండవని చైనా తాజాగా ప్రకటించింది.ఈ చర్య తన వస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచుతుందని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా గణాంకశాఖ సమాచారం ప్రకారం 2022లో చైనా దిగుమతుల కంటే గతేడాది 50 బిలియన్‌ డాలర్ల మేరకు తక్కువ ఉన్నాయి. సోయాబీన్స్‌ కొనుగోలును చైనా నిలిపివేసింది.గతేడాది చైనా వాణిజ్య మిగులు 202బిలియన్‌ డాలర్లు ఉంది, తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసి లోటును తగ్గించాలని అమెరికా కోరుతోంది.మరోవైపు చైనా బదులు తైవాన్‌ ప్రాంతం నుంచి ఎక్కువగా కంప్యూటర్‌ చిప్స్‌, సర్వర్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది.మూడవ దేశాల ద్వారా చైనా వస్తువులను ఎగుమతులు చేస్తోంది. చైనా నుంచి 2017లో అమెరికా దిగుమతి చేసుకున్న వస్తువుల వాటా 22శాతం ఉండగా ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో కేవలం 7.5శాతం మాత్రమే ఉన్నాయి.వాషింగ్టన్‌ వస్తు దిగుమతులను ఆయుధంగా మార్చటం ఇది సూచిస్తున్నది.చైనాతో ఒప్పందం కుదుర్చుకోక ముందు దిగుమతి పన్ను 145శాతం విధిస్తూ ట్రంప్‌ కత్తి గట్టిన సంగతి తెలిసిందే.

జరుగుతున్న పరిణామాలను చూస్తున్నపుడు రెండుదేశాల మధ్య ప్రచ్చన్న యుద్దం జరుగుతున్నట్లు వేరే చెప్పనవసరం లేదు.కమ్యూనిస్టు చైనాను మొగ్గలోనే తుంచివేసేందుకు అసలు ఐరాసలో సభ్యత్వమే లేకుండా చేసేందుకు తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్నే అసలైన చైనాగా 1970దశకం వరకు గుర్తించిన సంగతి తెలిసిందే.తరువాత బీజింగ్‌ చేపట్టిన సంస్కరణలను అవకాశంగా తీసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టి చౌకగా వస్తువులను తయారు చేసి వాటిని దిగుమతి చేసుకొని అమెరికా, ఇతర ధనిక దేశాలు లబ్దిపొందాయి.ఎప్పుడైతే చైనా బలపడి తమకు సవాలు విసురుతోందని గ్రహించిందో అమెరికా అప్పటి నుంచి కట్టడి చేసేందుకు పూనుకుంది. దాన్ని సవాలుగా తీసుకున్న చైనా అనేక విజయాలతో ముందుకు పోతున్నది. వర్తమానానికి వస్తే చైనాకు అవసరమైన చమురు, గ్యాస్‌ను ఆయుధాలుగా చేసుకొని అమెరికా తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తోంది.మరోవైపున కృత్రిమ మేథ, చిప్స్‌తో వాణిజ్య సమతూకాన్ని సాధించాలని పావులు కదుపుతున్నది.దాన్లో భాగంగానే చిప్స్‌ను ఎగుమతి చేయరాదని, వాటి తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాలను సరఫరా చేయకుండా ఆంక్షలు విధించింది. ఆ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తున్న బీజింగ్‌ ఎలక్ట్రానిక్స్‌ పరికరాలకు అవసరమైన విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తులపై పట్టుసాధించటంతో పాటు విద్యుత్‌ వాహనాలు, సౌరపలకల వంటి రంగాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. గతేడాది చైనా తయారీ మోటారు వాహనాలు ప్రపంచ ఎగుమతుల్లో 21శాతానికి చేరాయి.అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ఐరోపా దేశాల కంటే చౌకగా విద్యుత్‌ వాహనాలను చైనా విక్రయిస్తోంది. చమురు అందకుండా చేయాలన్న అమెరికా ఎత్తుగడకు ప్రతిగా ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్‌ తయారీకి అవసరమైన ఏర్పాట్లతో పాటు పలకలను తయారు చేసి ఇతర దేశాలకు సైతం పెద్ద ఎత్తున ఎగుమతి చేసేదిగా చైనా తయారైంది.ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం దాని సౌరపలకల ఎగుమతులకు అనుకోని వరంలా మారింది.ప్రత్యామ్నాయ, హరిత ఇంథన వనరుల అభివృద్ధికి పూనుకున్న దేశాలన్నీ వాటిని దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికాకు జపాన్‌, చైనా ఇస్తున్న అప్పుల సంగతి తెలిసిందే.ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు పెట్టాలంటే వాషింగ్టన్‌ వద్ద పెట్టుబడులు లేవు, అందుకే పన్నులను ఆయుధాలుగా చేసుకొని తమ దేశంలో పరిశ్రమలు పెడితే రాయితీలు ఇస్తానని షరతులు పెడుతున్నాడు.

చైనాతో వైరం వలన తమకు వచ్చే లాభం లేదని అమెరికన్‌ కార్పొరేట్లు ఒక నిర్ణయానికి రాకుండా ఇంత మంది కట్టుగట్టుకొని ట్రంప్‌తో పాటు పొలోమంటూ బయలు దేరరు. అమెరికా ఎదురుదాడి చేస్తే ప్రతిఘటిస్తున్న ఇరాన్‌ మాదిరి చైనా కూడా అవసరమైన మేర ఆర్థిక రంగంలో ప్రతిఘటిస్తున్నది తప్ప తానే దాడి చేసేందుకు పూనుకోవటం లేదు, అవసరమూ లేదు. సంఘర్షణ రెండు దేశాలకూ నష్టమే. దాన్ని నివారించాలంటే ప్రధాన బాధ్యత అమెరికాదే అవుతుంది. యావత్‌ ప్రపంచాన్ని చాపచుట్టలా తన చంకలో పెట్టుకోవాలన్న దురాలోచనకు అది స్వస్థి పలికితే అనేక సమస్యలు సులభంగా పరిష్కారమౌతాయి. ప్రపంచ పెత్తనం సాధ్యం కాదని ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా దానికి అర్ధం కావటం లేదు. రెండు దేశాల మధ్య ప్రధాన వివాదం తైవాన్‌ విలీనం. ఏదో ఒకసాకుతో దాన్ని అడ్డుకొని స్వతంత్ర దేశంగా మార్చి చైనా పక్కలో బల్లెంగా తయారయ్యేందుకు అమెరికా చూస్తున్నది. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వమిచ్చి రష్యా ముంగిట తన ఆయుధాలను మోహరించాలని పన్నిన ఎత్తుగడ వికటించినా వాషింగ్టన్‌కు బుద్ధి రావటం లేదు. ఐరాస, చివరికి అమెరికా కూడా తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తించిన తరువాత కూడా విలీనాన్ని అడ్డుకుంటే చైనా చూస్తూ ఊరుకోజాలదు, అయితే వెంటనే అది జరగకపోయినా ఇబ్బంది లేదు గనుక తమాయిస్తున్నది. తెగేదాకా లాగితే స్వాధీనం పెద్ద కష్టమేమీ కాదు. తాజా పర్యటనలో ట్రంప్‌ దీనితో పాటు ఇతర వివాదాలపై చైనాతో సఖ్యతకు ప్రయత్నిస్తాడా, గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడా, చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడు ఇరాన్‌ ప్రతిపాదనలకు ట్రంప్‌ తిరస్కరణ : ఊబిలో కూరుకుపోవద్దని హెచ్చరించిన జర్మనీ !

29 Wednesday Apr 2026

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, Donald trump, Vladimir Putin, West Asia Crisis, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రతిష్ఠంభనలో ఉన్న కాల్పుల విరమణ చర్చలు ఫలప్రదమయ్యేందుకు తాజాగా ఇరాన్‌ ముందుకు తెచ్చిన మూడు ప్రతిపాదనలను డోనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించినట్లుగా వార్తలు.హార్ముజ్‌ జలసంధికి మరోవైపున ఉన్న ఓమన్‌, రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌తో చర్చించిన తరువాత టెహరాన్‌ తన ప్రతిపాదనలను పాకిస్తాన్‌కు అందచేసింది.వాటి మీద తమ నేత సంతోషంగా లేరని అధ్యక్ష భవనపు మీడియా అధికారిణి కరోలిన్‌ వెల్లడించారు.సోమవారం నాడు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అర్గాచీ సెంట్‌ పీటర్స్‌బర్డ్‌లో భేటీ తరువాత ఇరాన్‌, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల ప్రయోజనాలకు తద్వారా సాధ్యమైనంత త్వరలో మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనేందుకు తాము చేయాల్సిందంతా చేస్తామని పుతిన్‌ హామీ ఇచ్చాడు.తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే వెంటనే చర్చలకు సిద్దమే అని ఇరాన్‌ ప్రకటించింది.వాటి గురించి లెబనాన్‌, ఇతర మీడియాల్లో వచ్చిన వార్తలను బట్టి మూడు ప్రతిపాదనల సారాంశం ఇలా ఉంది. ఇరాన్‌, లెబనాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి, భద్రతకు హామీ ఉండాలి.ఇది జరగకుండా ఈ దశలో చర్చలకు ఇరాన్‌ సిద్దం కాదు.ఈ మొదటి దశ మీద అంగీకారం కుదిరిన తరువాత రెండవ దశలో హార్ముజ్‌ జలసంధి నిర్వహణ గురించి చర్చలు ముందుకు పోతాయి, ఓమన్‌తో సమన్వయం చేసుకొని నూతన చట్టపరమైన పరిధి గురించి ఇరాన్‌ ముందుకు పోయే అంశం గురించి చర్చలు జరుగుతాయి. ఆ తరువాత అణుశుద్ది, సంబంధిత సమస్యలపై చర్చకు ఇరాన్‌ ముందుకు వస్తుంది. దీని అర్ధాన్ని సూటిగా చెప్పుకోవాలంటే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆగిపోవాలి, హార్ముజ్‌ జలసంధిని చెరపట్టిన అమెరికా విరమించాలి.ఈ ప్రతిపాదనలపై ట్రంప్‌ పెదవి విరిచినట్లు వార్తలు రావటంతో చమురు మార్కెట్‌లో బ్రెంట్‌ రకం ధర 111డాలర్లకు అటూ ఇటూగా పెరిగింది.అంతకు ముందు జరిగిన పరిణామాల్లో రెండవసారి చర్చలకు ఇస్లామాబాద్‌ వచ్చిన ఇరాన్‌ ప్రతినిధి వర్గం అమెరికన్ల కోసం ఎదురు చూడకుండా వెనుదిరిగివెళ్లిపోయింది.దాంతో అమెరికా ప్రతినిధులు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.రెండవ సారి చర్చలు జరగాలంటే జలసంధి దిగ్గంధనాన్ని ట్రంప్‌ విరమించాలని ఇరాన్‌ పదే పదే చెప్పింది. ఇప్పటి వరకు తాము 38 నౌకలను వెనక్కు తిప్పి పంపినట్లు అమెరికా మిలిటరీ కేంద్రం సోమవారం ఉదయం పేర్కొన్నది. మార్చినెల 2 నుంచి ఇజ్రాయెల్‌ దాడుల్లో 2,521 మంది తమ పౌరులు మరణించారని, 7,804 మంది గాయపడినట్లు లెబనాన్‌ తెలిపింది. ఏప్రిల్‌ 17న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించినా ఇజ్రాయెల్‌ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతూనే ఉంది. అక్కడ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్న హిజబుల్లా ఆ ఒప్పందాన్ని అంగీకరించటం లేదని ప్రకటించింది.రక్షణ శాఖ ట్రంప్‌ను తప్పుదారి పట్టిస్తున్నదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ అనుమానిస్తున్నట్లు వార్తలు.

బలహీనత ఏమిటో తెలిసిన తరువాత ఐరోపా దేశాలు డోనాల్డ్‌ ట్రంప్‌ను, అమెరికాను ఒక ఆట ఆడుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.ఇప్పటి వరకు నోటి దురుసుతనంతో ట్రంప్‌ అనేక విధాలుగా నాటో కూటమి దేశాలను అవమానించాడు, బెదిరించాడు.ఇప్పటివరకు లోపలదాచుకున్నదంతా ఐరోపా నేతలు బయటకు వెళ్లగక్కుతున్నారు. రానున్న రోజుల్లో సంబంధాల గురించి సంయమనం పాటిస్తున్నారు. అమెరికా-ఐరోపా మిత్రుల మధ్య ఉన్న విభజన మరింత పెరగటం కనిపిస్తున్నది.దానికి నిదర్శనమే జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ సోమవారం నాడు అసాధారణంగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు.ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో మాదిరి ఊబిలో దిగేట్లుగా వాషింగ్టన్‌ వైఖరి ఉన్నదని, ఎలాంటి వ్యూహం లేకుండా దాడులకు దిగిందని, అదే ఇప్పుడు పరిస్థితిని సంక్లిష్టం గావించిందని చెప్పటం మూమూలు విషయం కాదు.ఇరాన్‌ పైచేయి సాధిస్తున్నదని, యావత్‌ ఐరోపా ఆర్థికంగా ప్రతికూలతను ఎదుర్కొంటున్నదని కూడా మెర్జ్‌ చెప్పాడు. అందరూ అనుకున్నదాని కంటే ఇరాన్‌ బలంగా ఉందని, దాని నాయకత్వం అమెరికాను అవమానించిందని కూడా మొహమాటం లేకుండా చెప్పాడు.మిత్రదేశాలు ప్రైవేటు వ్యవహారంగా ఎంతో కాలం ఇబ్బందులను మూసిపెట్టుకోలేవని ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ నేత చెప్పాడు. వివాదాల్లో దిగటం కాదు, దాన్నుంచి బయటకు కూడా రావాలి, సంఘర్షణలతో తలెత్తే సమస్యలు ఇలాగే ఉంటాయి, ఎంతో బాధాకరంగా ఇరవై ఏండ్లు ఆఫ్ఘనిస్తాన్‌లో, ఇరాక్‌లో కూడా చూశామని మార్స్‌బెర్గ్‌ అనే పట్టణంలో విద్యార్ధుల సమావేశంలో చెప్పాడు. ఇరానియన్లు ఎంతో నైపుణ్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు లేకపోతే ఎంతో సమర్ధవంతంగా చర్చలు జరపటం లేదని కూడా వర్ణించవచ్చు.అమెరికన్లను ఇస్లామాబాద్‌కు రప్పిస్తున్నారు, ఎలాంటి ఫలితాలు లేకుండానే వెనక్కు పంపిస్తున్నారు,ప్రత్యేకించి ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ అని పిలిపించుకొనే వారు యావత్‌ అమెరికాను అవమానపరిచారని ఆరోపించాడు. జలసంధిలో అమర్చిన మందుపాతరలను తొలగించేందుకు జర్మనీ సహాయం చేస్తుందని అయితే అది పోరు ముగిసిన తరువాత మాత్రమే జరుగుతుందని కూడా చెప్పాడు. నిజానికి ఇరాన్‌ తన సత్తాను చాటుకుంది తప్ప అమెరికాను అవమానించలేదు. ఎదురులేని ప్రపంచ రారాజునని విర్రవీగుతున్న అమెరికా పరిమితులను తాజా పరిణామం స్పష్టం చేసింది. మీ పరువు మీరే తీసుకున్నారు, అనుభవించండి అని చెప్పాలనుకున్న జర్మనీ బయటకు మాట్లాడలేక ఇరాన్‌ పేరుతో ఆ వ్యాఖ్య చేసిందని చెప్పవచ్చు. ఐరోపా దేశాలను ట్రంప్‌ ఈ వివాదం సందర్భంగా ఎంతగా అవమానించిదీ తెలిసిందే.

జరుగుతున్న దాడుల పరిణామాలతీరు,ఆర్థిక నష్టాల గురించి ఐరోపాలో అంతర్గతంగా ఉన్న ఉక్కిరిబిక్కిరి పరిస్థితిని మెర్జ్‌ వెల్లడించినట్లు చెప్పవచ్చు, జర్మనీ వినియోగదారుల తీరు తెన్నుల సూచిక మే నెలలో 33.3 పాయింట్ల తిరోగమనంలో ఉండవచ్చని చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన 2022 నుంచి నెలవారీ ఇంథన పరిస్థితి ఇంతగా దిగజారలేదు.వాణిజ్య సూచిక 2020లోని బలహీన స్థాయికి పడిపోయింది.పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరు రెండు యూరోలు (రు.221) దాటింది.దీంతో వాటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.ధరలు పెరిగినా సరఫరాలో అనిశ్చితి కూడా ఐరోపాలో ఆందోళనకు దారితీస్తోంది.ఇంథన ధరలు విపరీతంగా పెరిగిపోవంటంతో ఫ్రాన్సులోని ట్రాన్స్‌వియా కంపెనీ మే, జూన్‌లో కొన్ని విమానాల ప్రయాణాలను రద్దు చేసింది. ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి సొమ్ము తిరిగి చెల్లిస్తామని లేదా తరువాత తిరిగి ప్రయాణించటానికి అవకాశం ఇస్తామని చెప్పింది.హార్ముజ్‌ జలసంధి రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో పెట్రోకెమికల్స్‌ కొరత ఏర్పడిందని దాంతో కండోమ్‌(గర్భనిరోధం లేదా సురక్షిత శృంగారం కోసం) ధరలను 30శాతం పెంచుతున్నట్లు ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న కారెక్స్‌ కంపెనీ ప్రకటించింది. ఏటా 500 కోట్ల కండోమ్‌లను ఈ కంపెనీ తయారు చేస్తున్నది,ప్రపంచ మార్కెట్‌లో 20శాతం వాటా కలిగి ఉంది. ఆర్థిక అనిశ్చితి ఉన్నపుడు కండోమ్‌లను ఎక్కువగా వాడతారని,ఈ ఏడాది 30శాతం డిమాండ్‌ అదనంగా ఉంటుందని, ధరలను పెంచకతప్పటం లేదని మలేసియాకు చెందిన ఈ కంపెనీ ప్రకటించింది.

ఇరాన్‌పై దాడులతో అమెరికా ఆయుధ నిల్వలు ముఖ్యంగా క్షిపణుల సంఖ్య బాగా తగ్గిపోయినట్లు వచ్చిన వార్తలను తాను నమ్మటం లేదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ అంటున్నట్లు మీడియా పేర్కొన్నది.వాన్స్‌ ఈ పరిస్థితిని చూసి ఆందోళనపడినట్లు చెబుతుండగా ఆయుధాలకేమీ కొదవ లేదని ట్రంప్‌ యంత్రాంగం చెబుతున్నది. ఇరాన్‌పై దాడుల గురించి అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ చెబుతున్న అంశాలను వాన్స్‌ పదే పదే ప్రశ్నిస్తున్నాడు.చెబుతున్నది నిజమేనా అని పలువురితో మాట్లాడి ఆరా తీస్తున్నాడు. ఇరాన్‌పై దాడులకు దక్షిణ కొరియా నుంచి క్షిపణులను తరలించినపుడు తమ సంగతేమిటని ఆ దేశ అధ్యక్షుడు బహిరంగంగానే ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో, చైనా మీద ప్రయోగించేందుకు తైవాన్‌లో, రష్యాను అదుపు చేసేందుకు అంటూ ఐరోపాలో అమెరికా పెద్ద ఎత్తున ఆయుదాలను నిల్వచేసింది. వీటిలో ఏవైనా లోటు ఏర్పడితే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందంటూ వాన్స్‌ భయాన్ని వ్యక్తపరిచినట్లు అట్లాంటిక్‌ పత్రిక రాసింది. ఎనిమిదివారాల దాడిలో ఇరాన్‌కు భారీగా నష్టం కలిగించామని ఆయుధాలకు ఎలాంటి లోటు లేదని రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ సైనిక ఉన్నతాధికారుల సమావేశంలో బహిరంగంగా చెప్పాడు.

మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ అమెరికాకు ఆగ్రహం తెప్పించే నిర్ణయం తీసుకుంది. మూడవ దేశం నుంచి ఇరాన్‌ వెళ్లాల్సిన వస్తువులను తమ భూభాగం ద్వారా చేరవేసేందుకు ఆరు మార్గాలను ప్రకటించింది.బలూచిస్తాన్‌లో సరిహద్దుల్లో వస్తుమార్పిడి కోసం కరాచీ, ఖాసిం, గద్వార్‌ రేవుల నుంచి ఏర్పాటు చేసింది.అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది.ఇరాన్‌ తన ఆహార అవసరాలకోసం దిగుమతుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నది.హార్ముజ్‌ జలసంధిలో అమెరికా అడ్డుకోవటంతో అది తన అవసరాలను కాస్పియన్‌ సముద్రం ద్వారా తెచ్చుకొనేందుకు పూనుకుంది. అందువలన ఇరాన్‌ చమురు రవాణాను అమెరికా అడ్డుకోగలదు తప్ప ఇతర ఇరాన్‌ దిగుమతులను నిరోధించలేదని చెప్పవచ్చు.వాటిని కూడా అడ్డుకొనేందుకు తెగబడితే సంక్షోభ స్వరూపమే మారిపోతుంది. చమురు ధరలు పెరగటంతో ప్రత్యామ్నాయ ఇంథనం గురించి వెతుకులాట ఎక్కువైంది.ఇది చైనాకు వరంగా మారినట్లు కనిపిస్తోంది.హరిత ఇంథన ఉత్పత్తులైన సోలార్‌ పలకలు, విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.ఫిబ్రవరితో పోలిస్తే 30శాతం విలువ పెరిగి మార్చినెలలో 25.77 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గతేడాది మార్చినెలతో పోలిస్తే విదేశాల్లో వాటి అమ్మకాలు 50శాతం పెరిగాయి. సోలార్‌ పలకల ఎగుమతి ఫిబ్రవరితో పోల్చితే మార్చినెలలో రికార్డు స్థాయిలో 68గిగావాట్లకు పెరిగాయి.దీనికి ప్రపంచమంతటా పెరిగిన చమురు ధరలతో పాటు చైనా పన్ను రాయితీల్లో చేసిన మార్పులు కూడా కారణమయ్యాయి.

కొసమెరుపు : స్వతంత్ర దేశాల విధానాలు ఎలా ఉండాలో అమెరికా ఇంకేమాత్రం నిర్దేశించలేదని ఇరాన్‌ వ్యాఖ్యానించింది.తన చట్టవిరుద్దమైన, గొంతెమ్మ కోరికలను వదులు కోవాలని ఇరాన్‌ రక్షణశాఖ ఉపమంత్రిó రజా తలాయి నిక్‌ షాంఘై సహకార దేశాల ప్రతినిధులతో చెప్పాడు. ఇరాన్‌ చేసిన మూడు ప్రతిపాదనల గురించి అమెరికా సమీక్ష చేస్తున్నదని వార్తలు రాగా ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు, అణుకార్యక్రమం మీద రాజీపడకూడదని సలహాదారులతో అన్నట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. తాజా ప్రతిపాదనల తరువాత మంగళవారం నాడు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. విశ్వాసం సన్నగిల్లుతున్నదని, జలసంధిపై చర్చలతో పరిష్కారానికి రావాలని ఐరాస కోరింది, అందరి మాటలను పెడచెవిన పెడుతున్న ట్రంప్‌కు ఈ మాటలు రుచిస్తాయా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !

20 Friday Mar 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ 1 Comment

Tags

BJP, Donald trump, India-China trade, Narendra Modi Failures, TRADE BALANCE, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో దేశ వస్తు వాణిజ్య లోటు 34.7 నుంచి 27.1 బిలియన్‌ డాలర్లకు తగ్గినట్లు తమ భుజాలను తామే చరుకున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. కానీ అసలు విషయం ఏమంటే గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే అది 14.4 బిలియన్‌ డాలర్ల నుంచి పెరిగి రెండింతలైంది.ఒక నెలలో పెరిగి మరొక నెలలో తగ్గటం సర్వసాధారణం, మొత్తంగా ఏడాదిలో ఏం జరిగిందన్నదే గీటురాయి. పారిశ్రామిక అవసరాలకు వెండి దిగుమతులు 142 శాతం పెరిగితే బంగారం దిగుమతులు అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 28.7శాతం పెరిగాయి, ఎందుకంటే నిత్యావసర వస్తువు కదా ! ఇంకా ఆర్థిక సంవత్సరం పూర్తి కాలేదు గనుక మోడీ సర్కార్‌ వ్యాపార లాభనష్టాల గురించి మరోసారి చెప్పుకుందాం. మన మీడియాలో మరోసారి చైనా మీద ఆధారపడటం ఎంతో ప్రమాదకరమంటూ హితోక్తుల రూపంలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటిలో ఒక దాని శీర్షిక ఏమంటే ”102 బిలియన్‌ డాలర్ల షాక్‌ ” వారు గ్రహించాల్సిందేమంటే చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే రేటింగ్‌లు పెరిగే తరుణం కాదిది.బీజింగ్‌తో ఇక మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదంటూ తలుపులు మూసుకున్న మనం పెట్టుబడుల కోసం వాటిని తెరిచాం, గత ఏడు సంవత్సరాలుగా మూతపడిన సరిహద్దు వాణిజ్యం ఉత్తరాఖండ్‌లో భారత్‌-చైనా-నేపాల్‌ సరిహద్దులు కలిసే లిపులేక్‌ కనుమదారిలో జూన్‌ ఒకటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. కొద్ది నెలలుగా నేపాల్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ మన దేశం ముందుకు పోతున్నది. ఇలా చైనా కమ్యూనిస్టులకు ఎర్రతివాచీని పరిచామని తెలిసినప్పటికీ పుట్టుకతో పుట్టిన బుద్ధి గనుక కొందరు హెచ్చరికలు చేస్తున్నారు.

ఏప్రిల్‌ నుంచి 2026 ఫిబ్రవరి వరకు చైనాతో వాణిజ్య లోటు 102 బిలియన్‌ డాలర్లు దాటింది.మోడీ సర్కార్‌ సాధించిన మరో రికార్డు ఇది.మార్చి నెల కూడా గడచిన తరువాత ఈ తేడా 111.4 బిలియన్‌ డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. ఏడాది క్రితం 91బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతుల ప్రోత్సాహ పిఎల్‌ఐ, వికసిత్‌ భారత్‌ వంటి నినాదాల అమలు, ఆచరణ ఫలితమిది. పెట్టుబడికి కనిపించేది లాభం తప్ప భావజాలం కాదు, దీని అర్ధం భావజాలాన్ని వాడుకోదు అని కాదు.1970 దశకం వరకు చైనాకు ఐరాసలో ప్రవేశం కల్పించకుండా అడ్డుకున్న వాషింగ్టన్‌ తనకు లాభం వస్తుందని గ్రహించే కదా పక్కా కమ్యూనిస్టు చైనాతో సంబంధాలు పెట్టుకొని పెట్టుబడులు పెట్టింది.దాని కమ్యూనిస్టు వ్యతిరేకత ఏమైనట్లు ? మనదేశంలో కూడా దాని ఏజంట్లు కమ్యూనిస్టు వ్యతిరేకతను వంటబట్టించుకున్నారు. ఇప్పటికీ రెచ్చిపోతున్నారు. గాల్వన్‌లోయ ఉదంతం తరువాత కేంద్ర ప్రభుత్వం అనేక చైనా యాప్‌లను నిషేధించింది.నేరుగా పెట్టుబడులను అడ్డుకోకుండా సరిహద్దు కలిగిన దేశాల నుంచి వచ్చే వాటిని పూర్తిగా పరిశీలించాకే అనుమతించాలనే వంకతో ఆరు సంవత్సరాలుగా అడ్డుకుంటున్నది కాస్తా ఎలాంటి కారణం చెప్పకుండానే పదిశాతం వరకు పెట్టుబడులు నేరుగా చైనా వాటాదారుగా ఉన్న విదేశీ కంపెనీల నుంచి వచ్చేందుకు అనుమతించింది. దీని గురించి చైనా ఎలాంటి వ్యాఖ్య చేయనప్పటికీ ఇది చాలదు అన్నట్లుగా ఉందని వార్తలు వచ్చాయి. అందువలన రానున్న రోజుల్లో దీన్ని మరింతగా విస్తరించవచ్చు.అవసరం మనది మరి ! కేంద్రంలో ఉన్న బిజెపి, దాని వెనుక ఉండి నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ యంత్రాంగానికి ఏమీ తెలియకుండానే మోడీ సర్కార్‌ వైఖరిలో మార్పు వచ్చిందనుకుంటే అమాయకత్వం తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకత రెచ్చగొట్టటం తమను గుడ్డిగా అనుసరిస్తున్నవారిని నిలబెట్టుకొనేందుకు, సంతుష్టీకరించేందుకు కాషాయదళాలు నిత్యం చేస్తున్నదే, దానిలో ఎలాంటి మార్పు లేదు.చైనా వస్తువులు కార్పొరేట్లకు అవసరం. దాన్ని అడ్డుకొనేందుకు ఎవరు ప్రయత్నించినా వారిని అధికారానికి దూరం చేయటం పెద్దపనేమీ కాదు. ఇప్పుడు వారి ప్రయోజనాలే ముందుకు వచ్చాయి గనుక కాస్త తగ్గండి లేకపోతే మీ గురించి ఆలోచించాల్సి వస్తుందన్న హెచ్చరికతో తాజా పరిణామాలు సంభవిస్తున్నాయన్నది పచ్చినిజం. సంఘపరివార్‌ తన అజెండాను దేశం మీద రుద్దేందుకు అధికారం కావాలి గనుక వారి వత్తిడికి లొంగి మౌనంగా ఉంది.చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి, దాని వస్తువులను బహిష్కరించాలంటూ వీధుల్లో వీరంగం వేసిన అపర దేశభక్తులు ఇప్పుడెక్కడా కానరారు, సంఘపరివార్‌ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ విదేశీ కంపెనీల సేవలో తరిస్తున్నది.

గతంలో చైనా బజార్ల పేరుతో పెద్ద ఎత్తున కొందరు దుకాణాలను ఏర్పాటు చేసి మనదేశంలో తయారు చేసే నకిలీ వస్తువులను వినియోగదారులకు అంటగట్టారు.అదే సమయంలో చైనా చాలా తక్కువ ధరలకు వస్తువులను అందచేస్తున్న కారణంగా అనేక మంది అవి చౌక, నాశిరకం అని కూడా ప్రచారం చేశారు.కాని తరువాత కాలంలో నోళ్లు మూతపడ్డాయి. ఎందుకంటే చైనా వస్తువులు లేని ఇల్లు లేదు.ప్రస్తుతం మన ప్రభుత్వ పెద్దలు ఎన్ని కబుర్లు చెప్పినా ఔషధరంగం, ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహనాలు,సూర్యరశ్మి పలకల వంటి రంగాలలో చైనా నుంచి ముడి సరకులు లేదా సగం తయారైన వస్తువులు, యంత్రాలు, విడిభాగాలు లేకుండా మన దేశంలో అనేక పరిశ్రమలకు మనుగడలేదు. అందుకే కార్పొరేట్‌ శక్తులు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తున్నాయి తప్ప కమ్యూనిజం, చైనా మీద ప్రేమతో కాదు. అవే వస్తువులను మరొక దేశం ఏదైనా అందచేస్తే పొలోమంటూ అటే వెళతారు.చైనా అంత తక్కువ ధరలకు ఎలా అందిస్తున్నదని అనేక మంది ప్రశ్నించటాన్ని చూస్తున్నాము. ఆధునిక పద్దతుల్లో వస్తూత్పత్తిని తక్కువ ఖర్చుతో చేయవచ్చు అని వేరే చెప్పనవసరం లేదు. తన 140 కోట్ల జనానికి పనికల్పించాలంటే అవసరాలకు మించి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేసి పెట్టుబడులు సమకూర్చుకోవాలన్న విధానంలో భాగంగా ఇప్పటి వరకు పని చేసింది. ఇప్పుడు తన కార్మికులకు గణనీయంగా వేతనాలు పెంచిన కారణంగా గతంలో మాదిరి చౌకగా అన్ని వస్తువులను అందించటానికి వీలుకాదు గనుక విలువ ఎక్కువగా ఉంటే వస్తూత్పతికి ప్రాధాన్యత ఇస్తున్నది.గతంలో తక్కువ ధరకు ఫోన్లు అందించిన చైనా నుంచి ఇప్పుడు ఎక్కువ విలువగల ఫోన్లే వస్తున్నాయి, లేకపోతే మనదేశంలోనే తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా సగటున మన వద్ద నుంచి 65 బిలియన్‌ డాలర్ల మేర వస్తు, సేవలను పశ్చిమాసియా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న మన ఎగుమతుల గురించి పైకి చెప్పుకోలేని ఆందోళన పడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా తలెత్తిన పశ్చిమాసియా పరిస్థితి ఎలాంటి పర్యవసానాలకు దోహదం చేయనుందో తరువాత గానీ వెల్లడికాదు. మార్చినెలలో అమెరికా కుదురుతుందని చెబుతున్న ఒప్పందం ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు.అమెరికాలో పన్నులు పెంచిన కారణంగా గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది మన ఎగుమతులు 12.8శాతం తగ్గాయి.

ఇప్పుడున్న వాణిజ్య లోటు గురించి గుండెలు బాదుకోకుండా దీర్ఘకాలంలో వచ్చే లాభాల గురించి దృష్టి పెట్టాలని చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ మన దేశంలో వెలువడుతున్న మీడియా కథనాలపై వ్యాఖ్యానించింది. లోటు గురించి అతిగా కేంద్రీకరించి నిజమైన అవకాశాలను విస్మరిస్తున్నారని పేర్కొన్నది.ఏప్రిల్‌ 2025 నుంచి ఫిబ్రవరి 2026వరకు మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 38శాతం పెరిగి 17.5 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు మన వాణిజ్య శాఖ వేసిన అంచనాను ఆ పత్రిక ఉటంకించింది. ( ఇదే నెలల్లో అమెరికాకు మన ఎగుమతులు 79.3బిలియన్‌ డాలర్లకు చేరినప్పటికీ వృద్ధి రేటు 3.8శాతమే.) ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 15శాతం పెరిగి 120 బిలియన్లకు చేరటంతో వాణిజ్య లోటు 102 బి.డాలర్లుగా ఉంది, ఏడాది ముగిసేలోగా ఇదే దామాషాలో ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. గత ఏడాది కాలంగా సాధారణ సంబంధాల ఏర్పాటుకు మన వైపు నుంచి చూపుతున్న చొరవకు స్పందనగా మన దేశం నుంచి చైనా దిగుమతులను వ్యూహాత్మకంగానే పెంచిందన్నది వాస్తవం.ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి మరి. ఏటా అప్పనంగా వందబిలియన్‌ డాలర్ల మేర మనదేశం హారతిపళ్లెంలో పెట్టి అప్పగిస్తుంటే వాటిని బీజింగ్‌ పోగొట్టుకుంటుందా ! ఇప్పుడున్న సంబంధాలు ఇలాగే మెరుగుపడితే రానున్న ఐదు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 1.4లక్షల కోట్ల డాలర్ల మేర వాణిజ్యలావాదేవీలకు అవకాశం ఉందని 2025 డిసెంబరులో మన దేశంలో చైనా రాయబారి షు ఫెయిహాంగ్‌ చెప్పాడు.

కేంద్ర ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాలుగా ఎన్నికబుర్లు చెప్పినా ప్రపంచ ఫ్యాక్టరీగా మారలేదు, సమీప భవిష్యత్‌లో అలాంటి సూచనలు కూడా లేవు.వస్తు, సేవారంగాలను చూస్తే మన దిగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి, ఎగుమతులు తక్కువగా ఉన్నందున ఏటా మొత్తం మీద వాణిజ్య లోటు వందబిలియన్‌ డాలర్ల వరకు ఉంటున్నది. వర్తమాన ఆర్థిక సంవత్సరం 2025-26లో ఫిబ్రవరి వరకు 5.8శాతం వృద్ధి రేటుతో 791 బిలియన్‌ డాలర్ల మేర వస్తు, సేవలను ఎగుమతి చేశాము. ఇదే సమయంలో 7.4శాతం వృద్ది రేటుతో 900 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు చేసుకున్నాం. ఇతర దేశాలతో మన వాణిజ్యం మిగులు ఉన్న కారణంగా కేవలం ఒక్క చైనాకే వంద బిలియన్‌ డాలర్లకు పైగా చెల్లిస్తున్నప్పటికీ మన మొత్తం వాణిజ్య లోటు వంద బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉంది. అంటే మరో మాటలో చెప్పాలంటే మిగతా దేశాలన్నించి నుంచి సంపాదించిన మొత్తాన్ని చైనాకు అప్పగిస్తున్నాం. ప్రవాస భారతీయులు ఏటా 135బిలియన్‌ డాలర్లు మనదేశానికి పంపుతున్న కారణంగా డాలర్ల కొరతను గణనీయంగా తీర్చుతున్నారు. కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో అధికారంలో ఉండి వృద్దిని పరుగులు పెట్టిస్తున్నట్లు బడాయిచెప్పుకోవటం తప్ప ఎగుమతులను పెంచలేని కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే దీనికి కారణం.మన వస్తువుల కంటే సేవల ఎగుమతుల రేటు ఎక్కువగా ఉంది.ధరల విషయంలో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ తదితర దేశాల ఉత్పత్తులతో పోటీ పడలేకపోవటమే ప్రధాన కారణం. మొత్తం ఎగుమతుల్లో 403 డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరుగుతున్నాయి. దిగుమతుల్లో 900బిలియన్‌ డాలర్లలో 714 బి.డాలర్లు వస్తువులే ఉన్నాయి. మన దిగుమతుల్లో ఎరువుల వాటా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 64.5శాతం పెరిగాయి, ధరలు కూడా ఎక్కువే. వర్తమాన పశ్చిమాసియా సంక్షోభం వీటి దిగుమతుల బిల్లును ఎంతగా పెంచుతుందో చెప్పలేము. ఇప్పటికే గల్ఫ్‌ నుంచి దిగుమతలకు అంతరాయ కలిగిన కారణంగా మన యూరియా ఫ్యాక్టరీలు సగం సామర్ధ్యంతో మాత్రమే పని చేస్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షణీయమైన లాభాలు వచ్చే రంగాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఎరువుల వంటివి అంతర్జాతీయ ధరలతో ఎక్కువగా ప్రభావితం అవుతున్నందున వాటి జోలికి పోవటం లేదు. నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు నిలిపివేసిన తరువాత తప్పనిసరై రామగుండం వంటి మూతబడిన వాటిని పునరుద్దరించటం తప్ప కొత్త వాటిని నెలకొల్పటం లేదు. చివరకు యూరియా దిగుమతులకు సైతం చైనా మీద ఆధారపడ్డాం. గతేడాది మన దేశంలో యూరియా కొరతకు చైనా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణం. అందువలన మన మీడియా విశ్లేషకులు, ఇతరులు గమనించాల్సిందేమంటే తమ వస్తువులను కొనాలని చైనా వారు మనలను ఎప్పుడూ దేబిరించలేదు. రెండు దేశాల మధ్య ఎలాంటి ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు లేవు. అది చేసే ఎగుమతులు మనకు పెద్దమొత్తంగా కనిపించవచ్చుగానీ మొత్తం ఎగుమతుల్లో 3-4శాతం మధ్యనే మన వాటా ఉంది. అందువలన వీధుల్లో వీరంగం వేసేవారిని చూసి మనం తలుపులు మూసుకుంటే ఆ మాత్రం ఎగుమతులకు నూతన మార్కెట్లను చూసుకోలేని స్థితిలో చైనా లేదని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !

11 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

#China arms to Iran, BJP, China, China Arms, Donald trump, Narendra Modi Failures, US attack Iran, West Asia Crisis, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

త్వరలో ఇరాన్‌పై యుద్ధం ముగుస్తుందని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అది నిజమో కాదో ఎత్తుగడో తెలియదు. సోమవారం నాడు 116 డాలర్లకు పెరిగిన బ్రెంట్‌ రకం ముడి చమురు ధర బుధవారం నాడు ఇది రాసిన సమయానికి 87 డాలర్లకు తగ్గింది.. ఇదే విధంగా మన స్టాక్‌ మార్కెట్‌లో సోమవారం నాడు రెండున్నరవేల పాయింట్ల వరకు పతనమైన సూచి మంగళవారం నాడు ఆరువందల పాయింట్లు పెరిగింది.ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.యుద్ధ ప్రభావం మన మీద పడుతున్నది.పెట్రోలు, డీజిలు కొరత లేదు గానీ వంటగ్యాస్‌ మండుతున్నది.ఇది ఒక అంశం. ఇరాన్‌పై జరిగిన దాడి సందర్భంగా కొంత మంది చైనా ఆయుధాల పనితీరు గురించి చర్చ చేస్తున్నారు. పాకిస్తాన్‌, వెనెజులా తరువాత ఇరాన్‌లో కూడా అవి తుస్సుమన్నాయని చెబుతున్నారు.ఇరాన్‌ దగ్గర ఆయుధ నిల్వలు తగ్గిపోయినట్లు , రోజూ ప్రయోగించే క్షిపణుల సంఖ్య పడిపోయినట్లు మరికొన్ని కథనాలు.మరోవైపున దాని క్షిపణి ప్రయోగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశామని అమెరికా చెబుతోంది.ఇంకో వైపున రోజూ క్షిపణి దాడుల వార్తలు తెలిసిందే. యుద్ధ సమయాల్లో ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రచారాలు సహజమే.

ఇరాన్‌కు మిత్రదేశాలు అని చెబుతున్న చైనా, రష్యా దాని తరఫున యుద్దంలోకి ఎందుకు దిగటం లేదు అని కొందరు తెలివిగా ప్రశ్నిస్తున్నామనుకుంటున్నారు. అమెరికా దాడిని అవి రెండూ ఖండించాయి.మనమూ యుద్ధంలోని మూడు దేశాలకూ మిత్రులమే కదా మనమెందుకు యుద్ధంలో అడుగుపెట్టలేదని మోడీని ఎవరైనా ప్రశిస్తున్నారా ? కనీసం ఇరాన్‌తో మాట్లాడను కూడా మాట్లాడలేదే !.అనేక పశ్చిమ దేశాలు అమెరికాకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి, అవి కూడా తమ మిలిటరీలను దించలేదు. అమెరికా మిలిటరీ స్థావరాలను అనుమతించిన కారణంగా గల్ఫ్‌దేశాల మీద ఇరాన్‌ దాడులు జరుపుతున్నది.ప్రత్యక్ష బాధితులైన ఆ దేశాలు కూడా యుద్దాన్ని ఎందుకు ప్రకటించటం లేదు. వాటి రక్షణకు అమెరికా చేస్తున్నదేమిటి ? చెప్పేవాడు లోకువ అయితే అడిగేవాడు రెచ్చిపోతుంటాడు.

కొందరు విశ్లేషకులు చెబుతున్నదేమిటి ? తాజా యుద్ధంతో ప్రధానంగా నష్టపోయేది చైనా.హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో చమురు సరఫరా నిలిచిపోతుంది.ఇరాన్‌లో దాని పెట్టుబడులకు దెబ్బతగులుతుంది. దాని ఆయుధాలు పనికిరావని తేలినందున కొనేవారు ఉండరు.అసలు ఇరాన్‌కు చైనా ఇచ్చిన ఆయుధాల గురించి ఊహాగానాలు తప్ప నిజానిజాలను నిర్ధారణగా చెప్పటం లేదు. చైనా ఆయుధాల గురించి చెబుతున్నవి వాస్తవం కాదు అని చెబుతున్నవారూ ఉన్నారు. విమానదాడుల నుంచి రక్షణకు జనవరిలో చైనా రాడార్లను భారీ విమానంలో పంపిందన్నది ఒక వార్త. రాడార్లు పెద్దవిగా ఉన్నందున ఉపగ్రహాల నిఘా నుంచి వాటిని దాచటం కష్టం. గతంలో చైనా ఆయుధాలను సరఫరా చేసింది. ఐరాస 2007లో చేసిన తీర్మానం తరువాత వాణిజ్యం నిలిచిపోయింది. అంతకు ముందుకుదిరిన ఒప్పందాల ప్రకారం 2015వరకు సరఫరాలు కొనసాగాయి. ఇరాన్‌ తయారు చేస్తున్న షాహేద్‌ డ్రోన్ల గురించి 2022 దర్యాప్తులో తేలిన అంశం ఏమంటే 80శాతం భాగాలు పశ్చిమదేశాలు అడ్డదారుల్లో అందించినవే.ఓల్టేజ్‌ కన్వర్టర్లు, ఇంజన్లు మాత్రం చైనావని చెప్పారు. ఇతర దేశాల డ్రోన్లు దొరికినపుడు వాటిని పరిశీలించి అదే రకాలను ఇరాన్‌ స్వయంగా తయారు చేస్తున్నది. పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాలతో కూడా చైనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అవి దెబ్బతినకుండా ఉండాలంటే సమతుల్యత పాటించాలి గనుక యుద్ధ విమానాలు కావాలని ఇరాన్‌ వత్తిడి తెచ్చినప్పటికీ వాటిని సరఫరా చేయలేదు. అయితే చైనా ఏమి సరఫరా చేసింది.2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం భూమి, అంతరిక్షంలో సమాచార సేకరణ కేంద్రాలను ఇరాన్‌లో ఏర్పాటు చేసింది.తరువాత 2021లో కుదిరిన 25 సంవత్సరాల ఒప్పందంలో కూడా వాటిని చేర్చింది.దాంతో బెయిడౌ-3 ఉపగ్రహ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన 12రోజుల దాడుల సమయంలో ఇరాన్‌లోని జిపిఎస్‌ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆ యుద్ధం తరువాత జూన్‌ నెలలో పౌర, మిలిటరీ అవసరాలకు బెయిడౌ-3 మీద పూర్తిగా ఆధారపడేందుకు ఇరాన్‌ ఒప్పందం చేసుకుంది. బీజింగ్‌ కేంద్రంగా పని చేస్తున్న మిజరావిషన్‌ అనే ఉపగ్రహ నిఘా కంపెనీ సేవలను కూడా పొందుతున్నది.

తాజా అమెరికా దాడుల సమయంలో ఇజ్రాయెల్‌లోని అవడా విమాన స్థావరంలో ఉంచిన 11 అమెరికా ఎఫ్‌-22 బాంబర్లు, అమెరికా యుద్ద నౌకలు, గగనతలంలోనే ఇంథనం నింపుకొనే విమానాల వంటి వాటి చిత్రాలను, సమాచారాన్ని ఆ సంస్థ ఇరాన్‌కు అందచేయటంతో వాటిని గురిచూసి కొట్టిందని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమాచారం రష్యా కూడా అందచేసి ఉంటుంది. ఈ కారణంగానే ఆ రెండు దేశాలూ సమాచారమిస్తున్నాయని అమెరికా మీడియా రాసింది. ఆధునిక యుద్ధంలో ఆయుధాలతో పాటు శత్రువు కదలికలను పసిగట్టే సమాచారమూ అంతే ముఖ్యమైనది.ఈ రంగంలో అమెరికాకు ధీటుగా చైనా అనేక ఉపగ్రహాలను కలిగి ఉంది. ఉక్రెయిన్‌-రష్యా పోరులో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అందించిన సమాచారంతోనే ఉక్రెయిన్‌ అనేక దాడులు చేసి రష్యాకు నష్టం కలిగించిన సంగతి తెలిసిందే.అమెరికా బెదిరింపులతో మనదేశం ఇరాన్‌ చమురు కొనుగోలు నిలిపివేసింది. ఇతర దేశాలు కూడా అదే చేశాయి. ఈ పూర్వరంగంలో ఇరాన్‌ చమురు ఎగుమతుల్లో 80శాతం చైనాకే జరుగుతున్నాయి. ఈ మొత్తం చైనా దిగుమతుల్లో 12-15శాతమే. హార్ముజ్‌ జలసంధిని ఇతర దేశాల నౌకలకు మూసివేసినప్పటికీ చైనా వాటిని మినహాయించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన పరిమితంగానే చైనా ప్రభావితం అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి మినహాయింపు మనకు ఇవ్వలేదు, కారణం మనం ఇజ్రాయెల్‌, అమెరికా వైపు మొగ్గటమే అని చెప్పవచ్చు.

రెండు దేశాల మధ్య వివాదం తలెత్తినపుడు ఎవరి బలాన్ని వారు ప్రదర్శిస్తారు. ఎలాంటి క్షిపణి ప్రయోగంలేకుండానే అమెరికా ఎఫ్‌-35 యుద్ధ విమానాలను చైనా దెబ్బతీస్తున్నందంటూ తాజాగా ఒక విశ్లేషణ వెలువడింది.అమెరికాకు పోటీగా చైనా మరో యుద్ధాన్ని ప్రారంభించిందని చెబుతున్నారు. ప్రపంచ బలాబలాలను సమతూకం చేసేందుకు చైనా మార్చినెల ఐదున 15వ పంచవర్ష ప్రణాళికను విడుదల చేసింది. పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం, విలువైన ఖనిజాల రంగంలో పురోగతికి దానిలో ప్రాధాన్యత ఇచ్చారు. అది పైకి ఆర్థిక పరమైనదిగా కనిపిస్తున్నప్పటికీ మిలటరీ లక్ష్యాలు కూడా ఉన్నాయని చడీ చప్పుడు లేకుండా చైనా ముందుకు పోతున్నతీరును ఎవరూ పట్టించుకోవటం లేదంటూ పెట్టుబడుల విశ్లేషకుడు షనాకా అన్సెలెమ్‌ పెరేరా వాపోయాడు. ఐదేండ్ల కాలంలో కృత్రిమ మేథ వినియోగం ద్వారా పరిశ్రమల్లో 1.4లక్షల కోట్ల డాలర్ల మేర అదనపు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా అనేక రంగాల గురించి దానిలో పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో చైనాను అడ్డుకొనేందుకు అమెరికా ఒక ఇనుపతెరను ఏర్పాటు చేసింది.ఫాక్స్‌సిలికా పేరుతో మనతో సహా అనేక దేశాలతో ఒక వ్యవస్థను రూపొందించింది. ఆధునిక చిప్స్‌, వాటి తయారీకి అవసరమైన యంత్రాలను అందకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చైనా రూపొందించిన పంచవర్ష ప్రణాళిక ఒక ఆర్థిక పథకం కాదు, అమెరికాతో యుద్ధ ప్రణాళిక అని పెరేరా పేర్కొన్నాడు. అమెరికా చిప్స్‌ చట్టం ఒక రైఫిల్‌ వంటిది కాగా చైనా పంచవర్ష ప్రణాళిక ఒక అమ్ముల పొది అని వర్ణించాడు.దీనిలో విలువైన ఖనిజాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ఈ రంగంలో చైనా ప్రపంచంలోనే ఆధిపత్యం వహిస్తున్నది.ఈ ఖనిజాలు విద్యుత్‌ వాహనాల నుంచి లక్ష్యాల మార్గదర్శనం చేసే వ్యవస్థలు, అత్యాధునిక రాడార్ల వరకు ఎంతో ముఖ్యమైనవి. అమెరికా ప్రతి ఎఫ్‌-35 ఆధునిక యుద్ద విమానానికి వందల కిలోల ఖనిజాలు, లోహాలు అవసరం. ఇంజన్లు, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలు, క్షిపణి బ్యాటరీలు, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలకు ఇవి లేకుండా పని జరగదు.

చైనా మీద అమెరికా 2018 నుంచి వాణిజ్యంతో పాటు చిప్స్‌ యుద్ధం కూడా చేస్తున్నది.దీనికి ప్రతిగా బీజింగ్‌ నూతన ఎత్తుగడలను రంగంలోకి తెచ్చింది. విలువైన ఖనిజాలు, వాటితో ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరకు ఉత్పత్తిలో నైపుణ్యం సాధించి, ఇతర దేశాలకు అందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది.వీటి దిగుమతులకు సంబంధించిన అమెరికా రక్షణశాఖ చేసుకున్న ఒప్పందాలు 2027లో ముగుస్తాయి.చైనాకు ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికాకు సంవత్సరాలు, దశాబ్దం పట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌ పోరులో అమెరికా పెద్ద మొత్తంలో విలువైన ఖనిజాలతో కూడిన ఆయుధాలను వినియోగిస్తున్నది. ఇరాన్‌ యుద్ధంలో అమెరికన్లు క్షిపణులు,డ్రోన్లను అడ్డుకొనే ఆయుధాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు, మరోవైపు చైనా వాటి తయారీకి అవసరమైన ఆ ఖనిజాల సరఫరాను కఠినతరం కావిస్తున్నదని పెరేరా వాపోయాడు. తెలివితేటలు అమెరికా సొత్తు కాదు. విలువైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం రానున్న 15 సంవత్సరాలు ఉంటుందని అంచనా. నిజంగానే చైనా తన పట్టు నిలుపు కుంటే అమెరికా ఎఫ్‌-35 విమానాలు ఎగిరే అవకాశాలు లేవని కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఇది కాస్త అతిగా ఉన్నప్పటికీ పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది.

చైనా ఆయుధాల్లో పసలేదని ఒక వైపు ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆయుధాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో చైనా కూడా అలాంటి ఆధునిక మిలిటరీ ఉత్పత్తులను సేకరించుకోవాలి, కానీ దానికి విరుద్ధంగా గడచిన ఐదు సంవత్సరాల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలను 72శాతం తగ్గించింది. మరోవైపు మనదేశం ప్రపంచంలో సాధారణ పరిస్థితుల్లో ఆయుధాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్నాం.(యుద్ధంలో ఉంది కనుక ఉక్రెయిన్‌ మనకంటే ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నది) విదేశీ ఆయుధాల స్థానంలో చైనా తన స్వంత ఉత్పత్తులను చేరుస్తున్నది. మరోవైపు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌లకు ఆధునిక ఆయుధాలను అమెరికా అందచేస్తున్నది, అవసరమైతే తైవాన్‌ విషయంలో నేరుగా జోక్యం చేసుకుంటామని అమెరికా, జపాన్‌ ప్రకటించాయి. నిజంగా తన ఆయుధాలు నాశిరకమైతే చైనా వాటితోఅమెరికాను అడ్డుకోగలదా ! చిత్రం ఏమిటంటే చైనా ఆయుధాలను చూసి ఇరుగు పొరుగు దేశాలు ఆధునిక ఆయుధాలను సమీకరించుకుంటున్నట్లు పశ్చిమదేశాల వ్యాఖ్యాతలు పాటపాడుతుంటారు. స్వీడన్‌లోని స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) తాజాగా వివిధ దేశాల ఆయుధాల గురించి ఒక నివేదికను విడుదల చేసింది. ఐరోపా 2021-25 సంవత్సరాలలో 33శాతం, ఆసియా,ఓషియానా దేశాలు 31శాతం ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి.అంతకు ముందు ఐదు సంవత్సరాలతో పోల్చితే ఇరవై శాతం తగ్గాయి. చైనా 72, దక్షిణ కొరియా 54, ఆస్ట్రేలియా 39 శాతం తగ్గించాయి. గతంలో ఆయుధ దిగుమతుల్లో తొలి పది దేశాల్లో ఉన్న చైనా 1991-95 తరువాత ప్రస్తుతం 21వదిగా ఉంది. తన దిగుమతుల్లో రష్యా నుంచి 66శాతం దిగుమతి చేసుకుంటోంది. చైనా సాధించిన ప్రగతి గురించి కొందరు ఉక్రోషంతో తక్కువ చేసి చూడవచ్చు. కానీ విధాన నిర్ణేతలు వాటి ఆధారంగా అంచనా వేసుకుంటే పప్పులో కాలేసినట్లే !అఱa

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా, చైనాల కట్టడికి మరిన్ని అణ్వాయుధాలు కావాలంటున్న అమెరికా !

04 Wednesday Feb 2026

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Science, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Arms race, Donald trump, East Asia Semiconductors, New START treaty, nuclear and missile tests, US build-up, US-Russia Nuclear Limits, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అమెరికా ా రష్యా మధ్య కుదిరిన వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం (స్టార్ట్‌) గడువు బుధవారం రాత్రితో (ఫిబ్రవరి నాలుగు) ముగియనుంది. పునరుద్దరణకు అవకాశాలు లేనందున ప్రపంచంలో నూతన ఆయుధ పోటీకి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏ రూపంలో ముందుకు వస్తుందో, ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో అన్న చర్చ ప్రారంభమైంది. ఆయుధ రంగంలో ముందున్న అమెరికా తాపీగా ఉంది. ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడినపుడు అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ జవాబిస్తూ ఒక వేళ ఒప్పందం గడువు తీరితే,అది ముగిసిపోతుంది అంతే అని స్పందించాడు.అమెరికా, రష్యా రెండు దేశాలూ పాతబడిన ఆయుధాలను తొలగించుకొనేందుకు గతంలో కుదిరిన ఒప్పందాన్ని వినియోగించుకున్నాయి తప్ప కొత్తవాటిని తయారు చేయటం మానుకోలేదనే విమర్శ ఉంది. ఆ రెండు దేశాల దగ్గర ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలలో 87శాతం ఉన్నాయి. గతంలో 2002లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఆయుధాలను 1,700 మరియు 2,200కు పరిమితం చేసుకోవాల్సి ఉంది. దాని స్థానంలో 2010లో పదేండ్లపాటు అమల్లో ఉండే నూతన ఒప్పందం ప్రకారం మరింతగా తగ్గించేందుకు అంగీకరించాయి.దీని గడువు పొడిగింపు వ్యవధి కూడా ముగిసిపోనుంది. ఉన్నవాటిని నవీకరించుకొనేందుకు, వాటికి అవసరమైన కేంద్రాల నిర్వహణ వంటి వాటికి అమెరికాకు రెండు లక్షల కోట్ల డాలర్లమేర ఖర్చు అవుతుందని అంచనావేశారు.రష్యా పరిస్థితి కూడా అటూఇటూగా అంతే. పోనీ ఇంత ఖర్చు చేసినా అమెరికా కలలుగన్న ప్రపంచాధిపత్యం సాధ్యం కాలేదు, పూర్వపు సోవియట్‌, తరువాత రష్యాకు యావత్‌ దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యం లేకపోయినా అమెరికాను అడ్డుకొనేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒప్పందం లాంఛనంగా ఫిబ్రవరి ఐదుతో ముగియనున్నప్పటికీ ఆ ప్రక్రియ 2023లోనే ప్రారంభమైంది. సమాచార మార్పిడి, తనిఖీల వంటి వాటిని రష్యా పక్కన పెట్టింది.

అమెరికాకు ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ కొత్తగా దానికి మరొక భయం పట్టుకుంది. గతంలో ఒక్క రష్యాతోనే పోటీ అనుకుంటే ఇప్పుడు చైనా ముందుకు వస్తోంది, రెండూ కలసి వస్తే తమ పరిస్థితేమిటని వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారట. నిజానికి అణుయుద్దమే వస్తే ఎవరూ మిగలరు. అమెరికా రక్షణ శాఖ తాజా నివేదిక ప్రకారం అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే ఆ సమాచారాన్ని మూడు నాలుగు నిమిషాల్లోనే చైనా కమాండర్లకు చేరవేయగలిగే సమాచార వ్యవస్థ బీజింగ్‌ వద్ద ఉందని పేర్కొన్నారు. శత్రు క్షిపణులు తమను చేరేలోగానే పసిగట్టి ఎదురుదాడికి దిగే సత్తా కలిగి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పదకొండువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఆధునిక క్షిపణిని చైనా 2024లో పసిఫిక్‌ సముద్రంలో పరీక్షించింది. తరువాత అనేక ప్రయోగాలు చేసింది. అమెరికాను ఎదుర్కొనేందుకు రకరాల క్షిపణుల తయారీలో ఉంది. 2050 నాటికి ఇప్పుడు మోహరించిన 1,770 అణ్వాయుధాల సంఖ్యను 4,625కు పెంచుకోవాలని చూస్తోంది. ఇతర ఆయుధాల సంగతి సరేసరి. ఒకవైపు ఇలా మారణాయుధాల గుట్టలను పెంచుతూనే ఎదుటి దేశాల మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారం చేస్తున్నది.

ఈ పూర్వరంగంలో భవిష్యత్‌లో ఆయుధ నియంత్రణ ఒప్పందాలంటూ జరిగితే వాటిలో చైనా కూడా చేరాల్సిందేనని అమెరికా పట్టుబడుతున్నది, ససేమిరా కుదరదని బీజింగ్‌ పలుసార్లు స్పష్టం చేసింది. ఒప్పందాల్లేకపోతే జరిగేదేమిటి ? ఆయుధ పోటీ మరింత పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. కొద్ది నెలల్లోనే రష్యా 60, అమెరికా వందశాతంపైగా అణ్వాయుధాలను పెంచుకుంటాయని, రిజర్వులో ఉంచిన వాటిని సిద్దం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలు, వాటి స్థితి ఇలా ఉంది.

దేశం× ఆయుధాలు×మోహరింపు×నిల్వలు ×ఉపయోగంలో లేనివి

రష్యా×××× 5,449 ×× 1,710 ×× 2,589 ×× 1,150

అమెరికా×× 5,277 ×× 1,770 ×× 1,930 ×× 1,577

చైనా ×××× 600 ×× 24 ×× 576 ×× 0000

ఫ్రాన్స్‌×××× 290 ×× 280 ×× 10 ×× 0000

యుకె×××× 220 ×× 120 ×× 105 ×× 0000

భారత్‌×××× 180 ×× 0000 ×× 180 ×× 0000

పాక్‌ ×××× 170 ×× 0000 ×× 170 ×× 0000

ఇజ్రాయెల్‌ × 90 ×× 0000 ×× 90 ×× 0000

ఉ.కొరియా × 50 ×× 0000 ×× 50 ×× 0000

రెండవ ప్రపంచ యుద్దం నాటికి ఒక్క అమెరికా దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి.అవసరం లేకపోయినా జపాన్‌ మీద ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది.దాంతో మిగిలిన దేశాలు కూడా వాటిని సమకూర్చుకున్న కారణంగానే దాని దూకుడు తగ్గింది.అయినప్పటికీ దాని దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలు ఉండటంతో అనేక దేశాలను ఇతరంగా బెదిరిస్తూనే ఉంది,దాడులు, దురాక్రమణలకు పాల్పడుతూనే ఉంది. ఎర్రగీత దాటితే అణ్వాయుధాలను మోహరిస్తానని ఉక్రెయిన్‌ పోరులో రష్యా హెచ్చరించిన కారణంగానే నాటో దేశాలు అదుపులో ఉన్నాయి.ఆర్థిక రంగంలో తనకు సవాలు విసురుతున్న చైనా మీద అనేక కట్టుకథలను ప్రచారంలో పెట్టి ఇతర దేశాలను తన వెనుక సమీకరించుకొనేందుకు అమెరికా పూనుకుంది.వచ్చే నాలుగు సంవత్సరాల్లో బీజింగ్‌ తన అణ్వాయుధాలను వెయ్యికి పెంచుకోనుందని, వాటిని మోహరించటానికి ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం దానిలో భాగమే. ప్రతిదేశం మాదిరే చైనా కూడా తన పాటవాన్ని పెంచుకుంటున్నది.చైనా, పాకిస్తాన్‌లను బూచిగా చూపి మనదేశాన్ని కూడా ఆయుధ పోటీలోకి పశ్చిమదేశాలు దించుతున్నాయి. అవసరం లేకుండా శక్తికి మించి ఆయుధాలకు ఖర్చు చేస్తే పాక్‌ మాదిరి దివాలాదీయటం ఖాయం. ఆయుధాలను అమ్ముకొనేవారు రకరకాల కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తే వేర్వేరు ముసుగుల్లో ఉన్న వారి ఏజంట్లు వాటికి మసాలా దట్టిస్తారు. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో మనదేశం రక్షణ బడ్జెట్‌ను పెద్ద మొత్తంలో పెంచిన తీరు చూశాము.

ఆయుధ నియంత్రణ ఒప్పందం లేకపోవటంతో భారత్‌కు ఇబ్బంది వచ్చిందనే కొత్త పల్లవి కొందరు అందుకున్నారు. నిజానికి ఆ ఒప్పందంలో చైనా లేదు, అయినప్పటికీ ఇప్పుడు సరికొత్తగా ఆయుధాలు పెంచుకొనేందుకు పూనుకున్నందున మనం కూడా ఆలోచించాలని చెబుతున్నారు. చైనా సహకారంతో పాకిస్తాన్‌ కూడా అమ్ములపొదిని విస్తరించుకోవచ్చంటున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలనటంలో ఎలాంటి సందేహం లేదు, కానీ చైనాతో పోటీపడాలని చెప్పటం సరైందేనా ! మన దేశం నుంచి ముప్పు ఉందనే కారణంతో చైనా తన ఆయుధాలను పెంచుకోవటం లేదు, దాని కేంద్రీకరణ అంతా అమెరికా, దాని మిత్రదేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, తదితర దేశాల మీదనే. అమెరికాతో అవసరానికి మించి ఆయుధ పోటీకి దిగటం కూడా సోవియట్‌ దెబ్బతినటానికి ఒక కారణంగా కొందరు చెప్పటాన్ని, చైనా, మన ఆర్థిక శక్తిని విస్మరించకూడదు.

వర్తమాన కాలంలో మిలిటరీ శక్తిలో అణ్వాయుధాలు ప్రముఖ పాత్రపోషిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో కృత్రిమ మేథ(ఎఐ) ఆయుధ పోటీని గణనీయంగా ప్రభావితం చేయనుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ముఖ్యమైన సెమీకండక్టర్ల రంగంలో అమెరికా-చైనా పోటీపడుతున్నాయి. ఏ రంగంలోనైనా అవి లేకుండా గడిచే స్థితి లేదు.శత్రువుల కదలికలను పసిగట్టటం, స్థావరాలను స్పష్టంగా ఫొటోలు తీయటంలోనూ అవి కీలకంగా మారాయి. చైనా తన సత్తాను చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పూర్వరంగంలో సెమీకండక్టర్ల రంగంలో ప్రస్తుతం తూర్పు ఆసియాలోని తైవాన్‌ ప్రాంతం, జపాన్‌, దక్షిణ కొరియాలు ప్రధానంగా ముందుండగా అమెరికా, ఐరోపా దేశాలు కూడా గణనీయ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని, సెమికండక్టర్లను చైనాకు అందకుండా అమెరికా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. విడిగా ఉంటున్న తైవాన్‌ విలీనం 2049 నాటికి పూర్తి చేస్తామని చైనా ప్రకటించగా అడ్డుకొని తీరతామని, రక్షణగా సిలికాన్‌ షీల్డ్‌ ఏర్పాటు చేస్తామని, ఒక వేళ బలవంతంగా విలీనం చేసుకుంటే అంతిమంగా అక్కడ ఉన్న సెమికండక్టర్‌ పరిశ్రమలన్నింటినీ పేల్చివేస్తామని కూడా వాషింగ్టన్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ చైనా ఎప్పటికప్పుడు తైవాన్‌ తమదే అని వెనక్కు తగ్గేది లేదని ప్రకటిస్తున్నది, తాను విధించిన గడువు చాలా సంవత్సరాలు ఉన్నందున ఎలాంటి మిలిటరీ చర్యకు పాల్పడటం లేదు.ప్రస్తుతం అమెరికా వద్ద ఆధునిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రపంచ చిప్స్‌ తయారీలో కేవలం 12శాతమే అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. దాని అవసరాల కోసం ఎక్కువగా తైవాన్‌ మీద ఆధారపడుతున్నది. చైనాలో విలీనాన్ని అడ్డుకోవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే.మొత్తం మీద ప్రపంచ ఉత్పత్తిలో తైవాన్‌ సగం, ఆధునిక చిప్స్‌లో 90శాతం కలిగి కీలకమైన స్థానంలో ఉంది. పరిశ్రమలను అక్కడి నుంచి తరలించేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఈ పాటికి అమెరికా ఆ పని చేసి ఉండేది, అది సాధ్యం కాదని, వాటిలో పనిచేసే నిపుణులు కూడా తైవాన్‌లో గణనీయంగా ఉండటమే అని చెబుతున్నారు.మొత్తం 66శాతం ఉత్పాదక సంస్థలు తూర్పు ఆసియాలో 292 చోట్ల ఉన్నాయి.

మిలిటరీ రంగంలో ఏఐ లేదా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ చిప్స్‌ వినియోగం గురించి ఇంకా అనేక పరిశోధనలు జరగాల్సి ఉంది.ప్రస్తుతం ప్రయోగశాలలు సాధారణ ఉష్ణోగ్రతల వద్ద వాటిని పరీక్షించారు, అయితే అధిక వేడి, శీతల ప్రాంతాల్లో వాటి పనితీరును చూడాల్సి ఉంది.అవసరమైన సంఖ్యలో తయారు చేసే సంస్థల అవసరం కూడా ఒక సమస్యే. జోబైడెన్‌ హయాంలో చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను ఎగుమతి చేయరాదంటూ నివిడియా కంపెనీ మీద ఆంక్షలు విధించారు. అయితే దాన్ని సవాలుగా తీసుకొని భారీ మొత్తాలను కేటాయించిన డ్రాగన్‌ తనకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేయటమే కాకుండా ఆధునిక రకాల కోసం పరిశోధనలు చేస్తున్నది. ఈ పూర్వరంగంలోనే ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత నిషేధాన్ని సడలించి ఎగుమతులకు అనుమతులు ఇచ్చినప్పటికీ నివిడియా ఉత్పత్తి హెచ్‌-200రకం చిప్స్‌ తమకు అవసరం లేదని చైనా ప్రకటించినట్లు వార్తలు. క్వాంటమ్‌ సాంకేతిక పరిజ్ఞాన విషయంలో కూడా అమెరికా ఆంక్షలు విధించటం తెలిసిందే.ఒకవైపు పన్నుల యుద్ధం మరోవైపు సాంకేతిక రంగంలో అమెరికా దాడిని తట్టుకొనేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేయటమే గాక అనేక విజయాలను సాధించి స్వయంసమృద్ధి కోసం ప్రయత్నిస్తున్నది.చాట్‌జిపిటికి పోటీగా చాలా తక్కువ ఖర్చుతో డీప్‌సీక్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. తన అవసరాలకు ప్రపంచ సరఫరా గొలుసు మీద ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నది. ఎప్పుడైనా తైవాన్‌ విలీనం చేసుకుంటానంటూ చేస్తున్న ప్రకటనలతో సెమీకండక్టర్లకు దాని మీద ఎక్కువగా ఆధారపడిన అమెరికాకు దడపుట్టిస్తున్నది. బహుశా అందుకే తమ దేశంలో ఉత్పత్తి చేసే విధంగా 250 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.

ముందే చెప్పుకున్నట్లుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల కుట్రలను వమ్ము చేసేందుకు కృత్రిమ మేథలో ఇతరుల మీద ఆధారపడకుండా చైనా పూనుకుంది.2025 ఏప్రిల్‌లో కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో ప్రత్యేకంగా సమావేశం జరిపి కర్తవ్య నిర్దేశం చేసింది. ప్రభుత్వం దేశీయంగా ఉన్న పెద్ద కంపెనీలను ప్రోత్సహిస్తున్నది. సెమికండక్టర్లను స్వయంగా తయారు చేస్తున్నప్పటికీ అమెరికాలోని నివిడియా కంపెనీ మాదిరి ఆధునిక డిజైన్లలో అది ఇంకా వెనుకబడే ఉంది. సాంకేతిక అంతరాన్ని క్రమంగా తగ్గిస్తున్నది. ప్రపంచ నిపుణులను ఆకర్షించేందుకు అమెరికా మాదిరి సౌకర్యాలు కల్పిస్తూ 2025 అక్టోబరు నుంచి కె వీసాలను జారీ చేస్తున్నది.అమెరికాలో ఉన్న తన జాతీయులైన వారిని స్వదేశానికి రప్పిస్తున్నది. గతంలో అమెరికా విసిరిన సవాళ్లన్నింటినీ అధిగమించి ముందుకు పోయిన చైనా కృత్రిమ మేథలో కూడా విజయం సాధిస్తునటంలో ఎలాంటి సందేహం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !

28 Wednesday Jan 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Narendra Modi Failures, World Military Power, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

77వ రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన సైనిక బలగాల సత్తాను ప్రదర్శించారు. న్యూఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిపిన కవాతును చూసి దేశం యావత్‌ పులకించిపోయింది.ప్రతి దేశం రిపబ్లిక్‌ దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం, ఇతర ముఖ్య ఉదంతాలు ఉంటే ఆరోజున ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించి తమ శక్తి ఇదని ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు విశ్లేషకులు, కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలు, విశ్లేషణల్లో అతిశయోక్తులు దార్లాయి.ఈ నేపధ్యంలో ప్రపంచ మిలిటరీ బలం బలగాల గురించి పరిమితంగా అయినా ఒక్కసారి అవలోకనం చేసుకోవటం అవసరం. హిందూ మహాసముద్రం భారతదేశానిదే అని ఒక విశ్లేషకుడు చెప్పారు. ఒక దేశ సరిహద్దు నుంచి 12 నాటికల్‌ మైళ్ల(ఒక్కో నాటికల్‌ మైలు 1.852 కిలోమీటర్లకు సమానం) వరకు ఆయా దేశాలకు సర్వహక్కులు ఉంటాయి.పన్నెండు నుంచి 24 నాటికల్‌ మైల్స్‌ వరకు కస్టమ్స్‌, వలసలు,కాలుష్యాలకు సంబంధించిన చట్టాలు అమలు చేసే అధికారం ఉంటుంది.రెండువందల నాటికల్‌ మైల్స్‌ వరకు సముద్ర ఉత్పత్తులు,ఆ పరిధిలో ఉన్న ఖనిజవనరులను తవ్వితీసుకొనే హక్కు ఆయాదేశాలకు ఉంటుంది. ఆపైన ఉండే ప్రాంతం అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. శ్రీలంక-భారత్‌ మధ్య దూరం 288 కిలోమీటర్లు మాత్రమే ఉన్నందున సమదూరంతో సరిహద్దుల నిర్ణయం జరిగింది. నిజానికి హిందూమహాసముద్రం అంటే మనదేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు. పొడవు 9,600, వెడల్పు 7,600 కిలోమీటర్లు ఉంది.మనదేశానికి ఇది మూడువైపుల ఉంది. దీనిలో అందరికీ తెలిసిన అరేబియా సముద్రం, బంగాళాఖాతం,మరికొన్ని ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.వీటన్నింటినీ కలిపి హిందూ మహాసముద్రం అంటున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం వరకు విస్తరించి ఉంది.

మనదేశం వద్ద 1,500 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ నౌకలను దెబ్బతీసే సామర్ధ్యం గల దీర్ఘశ్రేణి క్షిపణి (ఎల్‌ఆర్‌-ఎఎస్‌హెచ్‌ఎం)తో చైనా,అమెరికా నౌకలను కూడా దెబ్బతీయగలవని విశ్లేషకుడు చెప్పారు. అది నిజమే, ఎప్పుడు యుద్ధం వచ్చినపుడు, ఎదుటి వారు దాడికి దిగనంతవరకు మాత్రమే.హిందూమహాసముద్ర అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించిన ఏ దేశనౌకనైనా వెంటనే పేల్చివేయటానికి ఉండదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అలాంటి క్షిపణులను తయారు చేసే దేశంగా మనం ఇటీవలనే సామర్ధ్యం సంపాదించుకున్నాం.మనకంటే బలమైన మిలిటరీ శక్తి ఉన్న విషయాన్ని దాచి ప్రపంచంలో మనకు ఎదురులేదని ఎవరైనా చెపితే అది వాట్సాప్‌ పాండిత్యం తప్ప మరొకటి కాదు. వర్తమాన బలా బలాల గురించి ఈ సందర్భంగా చూద్దాం.మన దగ్గర ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయోగించగల ఖండాంతర క్షిపణి అగ్ని-5 ఉంది. ఇతర దేశాలలో మినిట్‌మాన్‌- అమెరికా క్షిపణి 13,000 కిమీ, రష్యాలో ఆర్‌ఎస్‌- 28 శాటమాన్‌ క్షిపణి పదకొండువేల కి.మీ, చైనా వద్ద డాంగ్‌ ఫెంగ్‌-41 రకం తొమ్మిదివేల కిలోమీటర్లు ప్రయాణించగలవి ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద గరిష్టంగా 15వేల కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి తయారీలో ఉన్నట్లు ఊహాగానాలు. దాని వద్ద శక్తివంతమైన ద్రీర్ఘశ్రేణి క్షిపణులు ఉన్నకారణంగా తేడా వస్తే తన మిత్రదేశంగా ఉన్న జపాన్‌ మీద ప్రయోగించగలదనే భయంతోనే అమెరికా ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరిస్తున్నది. ఇలా ఒకరిని మించి ఒకరు తమ ఆయుధాలకు పదునుపెట్టుకుంటున్నారు.ఇప్పటికే ప్రపంచంలో చైనా నావికాదళశక్తిలో ఒకటవ స్థానంలో ఉంది. అమెరికా వద్ద అన్ని రకాల యుద్ధ నావలు 471 ఉండగా చైనా 1,025 భారత్‌ 290 మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే అమెరికా వద్ద విమానవాహక యుద్ద నౌకలు 11, చైనా దగ్గర మూడు, భారత్‌ వద్ద రెండు ఉన్నాయి. ఈ పూర్వరంగంలో మనదేశం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆయుధాలను తయారు చేసుకోవాల్సిందే అనటం నిర్వివాదాంశం. దీనిలో భాగంగానే అణ్వస్త్రాలను తయారు చేసుకొనే అవకాశాలను అట్టిపెట్టుకొని అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాం.గతంలో రెండుసార్లు మనం అణుపరీక్షలు జరిపినపుడు మిత్రదేశం అంటూనే మన మీద కక్షతో అమెరికా ఒక్కటే ఆంక్షలు విధించింది.శత్రువైరుధ్యాలు ఉన్నప్పటికీ చైనా అలాంటి చర్యలకు పాల్పడలేదు.

మానవాళికి ముప్పు తెచ్చే యుద్ధాలు వద్దనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. కానీ ఉన్మాదంతో కొందరు ఊగిపోతున్నారు. పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని దెబ్బతీసే మన తాజా క్షిపణి ధ్వని వేగం (గాలిలో గంటకు 1,225కిలోమీటర్లు) పది మాక్‌లంటే 12,250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని పావు గంటలోనే పని ముగిస్తుందని చెబుతున్నారు. ఇది మన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అయితే వారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. రష్యా వద్ద 27 మాక్‌ల అవన్‌గార్డ్‌, చైనా వద్ద 27మాక్‌ల డిఎఫ్‌-41, అమెరికా దగ్గర ట్రైడెంట్‌ 24, మినిట్‌మాన్‌ 23,రష్యా వద్ద 20.64మాక్‌ల క్షిపణులు ఉన్నాయి. అందువలన మాదేవుడే అందరికీ అంటే ఎలా అంగీకరించటం లేదో ఇది కూడా అంతే. మన గొప్ప గురించి మనం చెప్పుకోవచ్చు తప్ప మనమే గొప్ప అంటే జనాలను తప్పుదారి పట్టించినట్లే. మన మిలిటరీ అజేయమే అయితే నరేంద్రమోడీ మన ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు వెనక్కు తీసుకురాలేదు, ఆపరేషన్‌ సింధూర్‌లో మరికొంత మందుకు పోయి ఉంటే పని జరిగేది కదా అని అనేక మంది అనుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం యుద్ధాల్లో కావాల్సింది ఎప్పటి సమాచారాన్ని అప్పుడు తెలియచేసే పరిజ్ఞానం. ఉక్రెయిన్‌కు అలాంటి సత్తాలేనప్పటికీ పశ్చిమ దేశాలు అందచేసిన సమాచారంతో గడచిన నాలుగు సంవత్సరాలుగా రష్యాను అడ్డుకోవటమే గాక, కొన్ని దాడులు కూడా చేయగలుగుతున్నదంటే కారణం అదే. ఆపరేషన్‌ సింధూర్‌లో తొలి రోజు మనకు ఎదురుదెబ్బలు తగలటానికి కారణం పాకిస్తాన్‌కు పశ్చిమదేశాలు(అమెరికాతో సహా) అందించిన సమాచారమే కారణంగా కొందరు భావిస్తున్నారు.

అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం మిలిటరీ అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహాలు అమెరికా వద్ద 247, చైనా 157, రష్యా 110,ఫ్రాన్స్‌ 17, ఇజ్రాయెల్‌ 12, ఇటలీ 10, మనదేశం 9, జర్మనీ 8,బ్రిటన్‌ 6, స్పెయిన్‌ 4 కలిగి ఉన్నాయి.అందువలన భూమి చుట్టూ తిరిగే అవి ఒకదాని వెనుక ఒకటి సమాచారాన్ని పసిగడితేనే 24గంటల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు.మిలిటరీతో సహా అన్ని అవసరాలకు గాను అమెరికా 5,176, బ్రిటన్‌ 653, చైనా 623, రష్యా 181, జపాన్‌ 88 కలిగి ఉండగా మనదేశం 62 కలిగి ఉంది. అయితే ఈ ఉపగ్రహాలు సేకరించే సమాచారం కూడా మిలిటరీ అవసరాలకు ఉపయోగపడుతుంది.ఈ కారణంగానే ప్రపంచంలో ఏమూల ఏమిజరిగినా అమెరికా ఇట్టే పసిగడుతున్నదంటే ఈ వ్యవస్థలే కారణం. ఇటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రపంచానికి భద్రత లేదని, తనకు అన్ని వైపుల నుంచీ ముప్పు ఉన్నదని అమెరికా ప్రపంచాన్ని నమ్మించేందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నది. గ్రీన్‌లాండ్‌ ప్రాంతాన్ని తాము ఆక్రమిస్తామని చెప్పిన ట్రంప్‌ తమ దేశ రక్షణకు ఉన్న ” గోల్డెన్‌ డోమ్‌ ” వంటిదాన్నే ఆ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఏమిటిది అంటే గగనతలం నుంచి జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించటం.మన రామాయణ, మహాభారత కథలో అలాంటివి చూసే ఉంటారు. రాక్షసులు యాగాన్ని కొనసాగ నివ్వకుండా చేసేందుకు చూస్తే రక్షణగా రాముడిని నియమించిన సంగతి, మహాభారతంలో బాణాలతో అర్జునుడి పరాక్రమం తెలిసిందే.కొన్ని దశాబ్దాలకు ముందే అమెరికా హాలీవుడ్‌ స్టార్‌వార్స్‌పేరుతో సినిమాలు తీసింది. ఇప్పుడు నిజంగానే అలాంటి గగనతల యుద్ధాలు జరుగుతున్నాయా ? అమెరికా కనుసన్నలలో పని చేసే సంస్థలు, కొందరు వ్యక్తులు రష్యా, చైనా ఈ రంగంలో ముందున్నాయని, ప్రపంచానికి ముప్పు ఉందని ప్రచారం చేస్తున్నారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడన్నట్లుగా తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. అంతా రహస్యంగా జరుగుతున్న వ్యవహారం గనుక ఈ పోటీ గురించి చెబుతున్న అంశాలను అవుననీ, కాదని చెప్పలేము.

భూ కక్ష్యలో ఉపగ్రహాలను దెబ్బతీసే సాంకేతిక పరిజ్ఞానం(ఎసాట్‌) ప్రతిదేశం కలిగి ఉండాలని అందరూ చెబుతున్నారు. గగనతల కేంద్రంగా ఆయుధాలు కావాలని అమెరికా మిలిటరీ నిపుణులు బహిరంగంగానే చెప్పారు.ఈ విషయంలో రష్యన్లు, చైనీయులు తమ సామర్ధ్యాలను ఎంతో ఆధునికంగా కనపరుస్తున్నారని, దాన్ని కాదనలేమని బ్రిటన్‌లోని డుర్హామ్‌ విశ్వవిద్యాలయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం సహడైరెక్టర్‌ బ్లెడిన్‌ బోవెన్‌ చెప్పాడు. నిజంగా అలాంటి వేదికలు ఇప్పుడు ఉన్నాయో లేదో చెప్పలేము గానీ అవసరమైన సాంకేతికతలను వారు చూపుతున్నారని అన్నాడు. ఒక ఉపగ్రహాన్ని నేరుగా దెబ్బతీయటం,ఇతరంగా కూల్చివేయటం వాటిలో ఒకటి.భూతలం నుంచి సముద్రాల్లో నౌకలను ముంచివేయటం, టెర్మినళ్లను దెబ్బతీయటం, ఎలక్ట్రానిక్స్‌ ద్వారా చేసేవన్నీ గగనతల పోరులో భాగమే అన్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ పోరులో స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ వంటి ప్రైవేటు ఉపగ్రహసేవలను అందించేవారు రష్యన్ల ఆయుధాలను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని, సైబర్‌దాడులకు పాల్పడుతున్నారని, అదే విధంగా రష్యా నుంచి సంకేతాలను అడ్డుకోవటాన్ని గమనించినట్లు బోవెన్‌ చెప్పాడు. గగనతల దాడుల ఆయుధాలను తయారు చేయకూడదన్న ఒప్పందాల మేరకు నాడు సోవియట్‌ వెనక్కు తగ్గిందని ఇప్పుడు రష్యా తిరిగి పూనుకున్నట్లు కనిపిస్తున్నదని రాండ్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎం క్లింటాక్‌ ఆరోపించాడు. సాధారణంగా గగనతలంపై రష్యా పరిమితంగానే ఆధారపడుతుందని, అదే అమెరికా తన ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలకు గరిష్టంగా ఆధారపడుతున్నది. రోజువారీ ఉపగ్రహ ప్రయోగాలను చూస్తే చైనా కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తున్నదని క్లింటాక్‌ చెప్పాడు. ముందే చెప్పుకున్నట్లు ట్రంప్‌ ప్రస్తావించిన ”గోల్డెన్‌ డోమ్‌ ” ఏర్పాటుకు 1983 నాటి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రకటించిన స్ట్రాటజిక్‌ డిఫెన్స్‌ ఇనిషియేటివ్‌ నాంది. దీన్నే స్టార్‌వార్స్‌ అని పిలిచారు.దీనిలో గగనతలంలో ఉండే పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే గోల్డెన్‌ డోమ్‌ వ్యవస్థ అణ్వాయుధాల నుంచి రక్షణ కల్పించలేదు గానీ ఇతరంగా ఎంతో ఉపయోగం అని బోవెన్‌ చెప్పాడు. గతంలో ఎదురైన అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించారని, గగనతలంలో అడ్డుకోవటం సంక్లిష్టమైనదని, వాటిని వేగంగా రూపొందించటం, పరీక్షించటం అంతతేలిక కాదని అంటున్నారు.

అంతరిక్ష రంగంలో మనదేశం అనేక విజయాలను సాధించింది. అయితే ఇంకా ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.చైనా తన సోషలిస్టు వ్యవస్థను కాపాడుకొనేందుకు అమెరికాతో పోటీ అని చెప్పకపోయినప్పటికీ మిలిటరీ రీత్యా బలాన్ని పెంచుకుంటున్నది, ఆర్థికంగా దానికా శక్తి ఉంది. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు మిలిటరీ మీద అవసరమైనదాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.మనదేశం 109 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంటే (జిడిపి 4లక్షల కోట్ల డాలర్లు) చైనా 303 బిలియన్‌ డాలర్లు (జిడిపి 19లక్షల కోట్ల డాలర్లు) వెచ్చిస్తున్నది.అమెరికా 831 బిలియన్‌ డాలర్లు (జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు) కేటాయించింది.తన ఆయుధ ప రిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా వెచ్చిస్తున్నది, చైనా స్వంతంగా తయారు చేసుకొనేందుకు పూనుకుంది.మనం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం. అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తే ఓకే, మనం కూడా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే పోటీపడే ఆర్ధిక శక్తి ఉందా లేదా అన్నది ముందు చూసుకోవాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

07 Wednesday Jan 2026

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Maduro Kidnap, Narendra Modi Failures, Nicolás Maduro, Nicolás Maduro Moros, Oil politics, US aggression against Venezuela, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

లాటిన్‌ అమెరికాలోని వెనెజులా ప్రస్తుతం ఒక విచిత్ర పరిస్థితిలో ఉంది.జనవరి మూడవ తేదీన రాజధాని కారకాస్‌పై దాడి చేసిన అమెరికా నిద్రలో ఉన్న అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి సిసిలీ ఫ్లోర్స్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకుపోయింది.నార్కో టెర్రరిస్టు అని అభియోగం మోపి న్యూయార్క్‌ కోర్టులో ప్రవేశపెట్టింది.తాను వెనెజులా అధ్యక్షుడినని, ఎలాంటి నేరం చేయలేదని మదురో కోర్టులో చెప్పాడు.తదుపరి ఏం జరుగుతుందో తెలియదు. తామే వెనెజులాను నడిపిస్తామని ట్రంప్‌ ప్రకటించాడు.ఏ న్యాయశాస్త్రంలోనూ ఒక దేశాన్ని నడిపించటం గురించి మనకు కనపడదు.ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగజ్‌ అధ్యక్ష భాద్యతలు చేపట్టారు.తమకు సహకరించకపోతే మదురో కంటే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని ట్రంప్‌ ఆమెను బెదిరించాడు.ఆర్థిక, రాజకీయ ” సంస్కరణలు ” చేపట్టాలని, అందుకు వెనెజులా పూర్తిగా సహకరిస్తుందంటూ విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ట్రంప్‌ ఆదేశించాడు. ఒక పెద్ద బృందం అక్కడికి వెళ్లనుందని సలహాదారు స్టీఫెన్‌ మిలర్‌ చెప్పాడు.వెనెజులాలో పరిస్థితి గురించి భిన్న కథనాలు వెలువడుతున్నాయ. వాటిని అవునని లేదా కాదని గానీ వెంటనే నిర్దారించలేము. ఉదాహరణకు కొందరు వెనెజులా అధికారులు అమెరికాతో చేతులు కలిపారని అంటున్నారు. అది జరిగి ఉండకపోతే అంత సులభంగా కిడ్నాప్‌ జరిగేదా అనే సందేహాలు ఉన్నాయి.దేని గురించి తొందరపడి నిర్దారణలకు రానవసరం లేదు. అమెరికా చర్యను ఐరాస ఖండించింది. ప్రపంచ ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి వంటిది భారత్‌ అని చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఈ దుర్మార్గాన్ని ఖండించకుండా మౌనముద్ర దాల్చారు.తాను భారత్‌ పట్ల సంతోషంగా లేనని ట్రంప్‌ ప్రకటించాడు. అతగాడిని ” సంతుష్టీకరించేందుకే ” మౌన దౌత్యమా ! మొత్తానికి మోడీని అమెరికా ఇరకాటంలో పెట్టింది. చమురుకోసమే అన్నది అందరికీ అర్ధమైన ఒక అంశం. మదురో మీద నార్కో టెర్రరిస్టు ముద్రవేసిన అమెరికా, ప్రస్తుతం అధ్యక్షరాలిగా ఉన్న డెల్సీ మీద అలాంటి ఆరోపణ చేయలేదు, తమకు సహరించకపోతే సంగతి చూస్తాం అని బెదిరించిందంటే కారణాలు ఉన్నాయన్నది స్పష్టం. వాటి గురించి ప్రపంచంలో పండిత మధనం జరుగుతోంది.

మదురోను ఎలా పట్టుకున్నారు, అందుకు అనుసరించిన పద్దతేమిటి అనే అంశాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కొన్ని నెలల పాటు మదురు నివశించే భవనం లాంటిదే ఒకటి ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహించారని, మదురో సిబ్బందిని ప్రలోభపెట్టి వివరాలు తెలుసుకున్నట్లు చెబుతున్నారు.అపహరణ సమయంలో జరిగిన ప్రతిఘటనలో 80 మంది మరణించారని, వారిలో 32 మంది క్యూబన్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగజ్‌, ఆమె సోదరుడు జార్జి ఇద్దరూ వామపక్ష గెరిల్లా కుటుంబం నుంచి వచ్చిన వారే. మదురో పాలకుడైతే జార్జి విధానాల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నాడు. వారి తండ్రి జార్జి ఆంటోనియో రోడ్రిగజ్‌ 1970దశకంలో వెనెజులా నిరంకుశత్వాన్ని వ్యతిరేకించిన గెరిల్లా పోరాట యోధుడు. అతన్ని పట్టుకొని పోలీసులు కస్టడీలో చంపివేశారు.డెల్సీ రోడ్రిగజ్‌ సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ ఆమెనేమీ చేయలేదు. ఇది లొంగదీసుకొనేందుకు బెదిరింపుగా కనిపిస్తున్నది. మరోవైపు డెల్సీ అమెరికా విదేశాంగ మంత్రితో సంబంధాలు కలిగి ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇవి ఛావెజ్‌ అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించటానికి ఎత్తుగడగా వ్యాపింపచేసినవి కూడా కావచ్చు.

చరిత్రను చూస్తే ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి ప్రపంచానికి నిత్యం నీతి సూత్రాలను బోధించే అమెరికా అడుగడుగునా వాటిని ఉల్లంఘించిన ఉదంతాలు కోకొల్లలు. అది సమర్ధించని నియంతలు లేరు, మారణకాండ లేదు.తమదారికి రాని వారిని ఏం చేస్తామో ఇది ప్రారంభం మాత్రమే అని మదురో అపహరణ తరువాత ట్రంప్‌ చెప్పాడంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ప్రపంచానికి ఎలాంటి ముప్పురానుందో ! రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్‌ హిట్లర్‌ యూదుల మారణకాండకు పాల్పడినా, అనేక దేశాలను ఆక్రమించుకోవటం ప్రారంభించినా ”ప్రజాస్వామిక ముసుగు ” వేసుకున్నదేశాలేవీ అడ్డుకోలేదు, వాడికి అమెరికా ఆయుధాలు కూడా అందించింది.సోవియట్‌ కమ్యూనిస్టుల మీదకు వెళ్లినపుడు సోషలిస్టు వ్యవస్థను అంతంచేస్తాడని కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ ఆనందించారు. ఉక్కు మనిషి స్టాలిన్‌ నాయకత్వంలో ప్రతిఘటించి చుక్కలు చూపించిన తరువాత హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు.ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో ఉన్న అమెరికన్‌ ఫాసిస్టు శక్తిని నిలువరించేది ఎవరు ? తదుపరి లక్ష్యం మెక్సికో, కొలంబియా, క్యూబా అని కూడా ట్రంప్‌ చెప్పాడు. అది అక్కడితోనే ఆగదు.రెండవ ప్రపంచ యుద్ధంతో భౌతిక వలసలు సాధ్యం కాదని గ్రహించిన సామ్రాజ్యవాదులు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను స్వాధీనం చేసుకొనేందుకు చూశారు.అది కూడా సాధ్యం కాదని 80 ఏండ్ల అనుభవం తేల్చింది. అందుకు గాను అంతకు ముందునాటి ఆక్రమణలు మినహా మరో మార్గం లేదని,గతంలో తమ పెరటి తోటగా పరిగణించిన లాటిన్‌ అమెరికాతోనే ప్రారంభం అని వెనెజులా ఉదంతం స్పష్టం చేసింది. అంతకు ముందు డెన్మార్క్‌ స్వయంపాలిత గ్రీన్‌ లాండ్‌ తమకు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్‌ తరహా సామ్రాజ్యవాదంగా చరిత్రలో నమోదైంది.

ప్రస్తుతం ప్రపంచంలో అస్థిరపరిస్థితి రోజు రోజుకూ పెరుగుతున్నట్లుగా ఉంది.ఉక్రెయిన్‌, పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, కాంగో, సూడాన్‌లో దాడులు, అంతర్యుద్ధాలు,రష్యా, ఇరాన్‌, వెనెజులాలపై ఆంక్షలు, ఐరాస ప్రసంగాల వేదికగా మారి చేష్టలుడిగి చూస్తున్నదిగా మారటం,సోవియట్‌తో ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత అమెరికా అనేక దేశాల మీద దాడులకు పూనుకోవటం, సిరియా,లిబియాల్లో జోక్యం, గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు మద్దతు, ఇరాన్‌పై దాడి, ఇరాక్‌, ఆఫ్ఘ్‌నిస్తాన్‌లో పరాభవం.మొత్తం మీద ప్రపంచంలో విలువైన వనరులను చేజిక్కించుకొనేందుకు అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్న అమెరికా తీరు ఇటీవలి కాలంలో మరింతగా ప్రపంచానికి తేటతెల్లమైంది. వెనెజులాలో జరిగిన దుర్మార్గానికి అమెరికా, ఐరోపా, ఇతర అమెరికా అనుకూల దేశాల్లోని మీడియా ” ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన నెలకొల్పే చర్య ” గా వర్ణించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. అమెరికా చెప్పిన కట్టుకతలనే వల్లిస్తున్నాయి.ఒక పధకం ప్రకారం వెనెజులాలో తన తొత్తు మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ బహుమతి ఇప్పించిన అమెరికా ఇప్పుడు ఆమెతో చిలుకపలుకులు పలికిస్తున్నది,వాటిని పట్టుకంని పశ్చిమదేశాల మీడియా వేదవాక్కులుగా చెబుతున్నది. వెనెజులా మాదక ద్రవ్యాల కేంద్రంగా ఉన్నట్లు చివరికి అమెరికా సంస్థలు కూడా చెప్పలేదు.డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌( డిఇఏ) తాజా నివేదికలో ఒక పేరాలో మాత్రమే పేర్కొన్నది. ఐరాస వందపేజీల నివేదికలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఐరోపా సమాఖ్య నివేదికలో కూడా అంతే. అయినా సరే పశ్చిమ దేశాల మీడియాకు అవేవీ పట్టలేదు. మదురో నియంత అంటూ రోతపాటలను పాడుతున్నాయి. మెక్సికో వంటి అనేక దేశాల్లో మాదకద్రవ్యాల ముఠాలు ఎలా చెలరేగుతున్నాయో అందరికీ తెలుసు, మెక్సికోలో నిజమైన పాలకులు అవే అని స్వయంగా ట్రంప్‌ తాజాగా చెప్పాడు.పక్కనే సరిహద్దు నుంచి పెంటానిల్‌ అనే డ్రగ్‌ సరఫరా అవుతున్నదని కూడా గతంలో చెప్పాడు.మరి దాని మీద ఎందుకు దాడి చేయలేదన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. అసలు కారణం ఏమిటంటే గత పాతిక సంవత్సరాలుగా వెనెజులా కొరకరాని కొయ్యగా తయారైంది.క్యూబా చమురు అవసరాలు తీరుస్తున్నది, పెద్ద మొత్తంలో చైనాకు సరఫరా చేస్తున్నది, ఒక్క వీటికే కాదు, ఎవరు వస్తే వారికి విక్రయిస్తున్నది.మనదేశం 2024లో 140 కోట్ల డాలర్ల మేర చమురు దిగుమతి చేసుకుంది. ట్రంప్‌ బెదిరించటంతో 2025లో 81శాతం తగ్గించింది.తెగించినవాడికి తెడ్డే లింగం అన్నట్లుగా ట్రంప్‌ ఎలాంటి శషభిషలు లేకుండా తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.కట్టుకథలు చెప్పినా నమ్మే స్థితిలో ప్రపంచం లేదు, శాసించేదిగా అమెరికా లేదు. ఇప్పటికీ బలమైన శక్తిగా ఉన్నప్పటికీ అదుపు చేసే శక్తి దానికి లేదు. ఇంకా ఆలశ్యం చేస్తే ఉన్న పట్టుకూడా జారిపోయేట్లు ఉన్నదని భావించి అమెరికా తెగింపుకు దిగింది. భద్రతా మండలిలో ఒక శాశ్వత రాజ్యంగా ఉండి మరో సర్వసత్తాక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్‌ చేసిందంటే ఐరాస ఉండీ లేనట్లే.తాను భాగస్వామిగా ఉండి నెలకొల్పిన అనేక సంస్థలు అనివార్యమై తనకే అడ్డుపడుతుండటంతో క్రమంగా అమెరికా నాశనం చేస్తున్నది.

వెనెజులాను ఆక్రమించటం దాని బలహీనతకు చిహ్నం తప్ప బలానికి కాదు. రష్యాను శాసించలేదని ఉక్రెయిన్‌ సంక్షోభం వెల్లడించింది. చైనా మిలిటరీ రీత్యా కూడా బలపడుతున్నది.ఈ రెండూ కలసి వాషింగ్టన్ను సవాలు చేస్తున్నాయి. అమెరికా ఎత్తుగడల గురించి రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మదురోను పట్టుకోవటం కాదని, అసలు లక్ష్యం చైనా అన్నది వాటిలో ఒకటి.చైనాను దెబ్బతీసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్‌ అందకుండా ఇప్పటికే ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచంలో చమురు దిగుమతి చేసుకొనే దేశాలలో చైనా అగ్రస్థానంలో ఉంది. వెనెజులా ఒక ప్రధాన సరఫరాదారు, అక్కడ చైనా పెట్టుబడులు కూడా ఉన్నాయి. అక్కడి చమురును స్వాధీనం చేసుకుంటే చైనాకు సరఫరా నిలిపివేయవచ్చు.మరో ప్రధాన సరఫరాదారు ఇరాన్‌ మీద కూడా మిలిటరీ చర్య ద్వారా దాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తున్నది. ఇదే సమయంలో మరో ప్రధాన వనరుగా ఉన్న రష్యాను కూడా చైనా నుంచి దూరం చేయాలనే ఎత్తుగడ ఉంది. దానిలో భాగంగానే ఉక్రెయిన్‌లో కోరిన ప్రాంతాలను అప్పగించేందుకు కూడా సిద్దపడుతున్నట్లు ట్రంప్‌ తీరుతెన్నులు ఉన్నాయి.అయితే అది జరగాలంటే అనేక చిక్కు ముడులు ఉన్నాయి. అమెరికా చెలగాటం తమకు ప్రాణగండంగా ఐరోపా భావిస్తే ప్రపంచ రాజకీయాలే మరోమలుపు తిరుగుతాయి. మొత్తం మీద చెప్పాలంటే చైనాకు చమురు దొరక్కుండా చేయాలనే ఎత్తుగడలో అమెరికా ఉంది. భారత్‌ మీద తాను ఆగ్రహంగా ఉన్నట్లు వారికి తెలుసని ఈ సందర్భంగా ట్రంప్‌ చేసిన ప్రకటన నరేంద్రమోడీని మరింతగా ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పటికే ఆపరేషన్‌ సింధూర్‌ను తానే ఆపివేయించానని పదే పదే చెప్పిన ట్రంప్‌ వాణిజ్య ఒప్పందం గురించి ఇంకా పట్టుబడుతూనే ఉన్నాడు.ఒక వైపు పాకిస్తాన్‌ మరో వైపు నుంచి బంగ్లాదేశ్‌ను మన మీదకు ఉసిగొల్పుతున్నాడు.

అమెరికా ఒక దేశాధ్యక్షుడిని పదవి నుంచి కూల్చివేయటం నికోలస్‌ మదురోతోనే ప్రారంభం కాలేదు. పనామాలో స్వయంగా మిలిటరీ నియంత మాన్యుయల్‌ నోరిగాను గద్దె నెక్కించింది అమెరికా. సంబంధాలు చెడింతరువాత మాదకద్రవ్యాల నిరోధం పేరుతో అదే అ మూడు వందల విమానాలు, 27వేల మంది సైనికులతో పనామా మీద దాడి చేసి అతగాడిని పట్టుకొని అమెరికాలో విచారించి 40 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. మానవాళికి ముప్పు తెచ్చే ఆయుధాలను గుట్టలుగా నిల్వచేశాడంటూ ఇరాక్‌ మీద దాడి చేసి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్ను పట్టుకొని తరువాత ఉరితీసి అమెరికా చంపింది.హైతీ అధ్యక్షుడు జీన్‌ బెట్రాండ్‌ అరిస్డైడ్‌ను కిడ్నాప్‌ చేసి పదవి నుంచి తొలగించింది. హొండూరాస్‌ అధ్యక్షుడు జువాన్‌ ఆర్లాండో హెర్నాండెస్‌ను అరెస్టు చేసి అమెరికా కోర్టులో మాదక ద్రవ్యాల కేసులో 45ఏండ్ల శిక్షవేసింది. ట్రంప్‌ అతగాడిని క్షమించి జైలు నుంచి ఇటీవలనే విడుదల చేశాడు. ఇరాన్‌లో అమెరికా, ఇతర ఐరోపా దేశాల చమురు కంపెనీలను జాతీయం చేసినందుకు ప్రధాని మహమ్మద్‌ మొసాదిక్‌ను తొలగించి నియంత షాను గద్దెనెక్కించింది.గౌతమాలాలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే పేరుతో జాకబ్‌ ఆర్బెంజ్‌ను తొలగించింది. అతనికీ కమ్యూనిజానికి సంబంధం లేదు. పశ్చిమదేశాలను వ్యతిరేకించే వామపక్ష అనుకూలుడైన అధ్యక్షుడు అబ్దుల్‌ కరీం ఖాశింను ఇరాక్‌లో హత్య చేయించింది. దక్షిణ వియత్నాంలో తామే గద్దె నెక్కించిన నియంత నగో దిన్‌ డైమ్‌ కమ్యూనిస్టులను అణచటంలో విఫలమయ్యాడని మిలిటరీ తిరుగుబాటులో తొలగించింది. కమ్యూనిస్టుల మీద నెపాన్ని నెట్టింది.గ్రెనడాలో హడ్సన్‌ ఆస్టిన్‌ను తొలగించింది.లిబియాలో గడాఫీని కూలదోయించి హత్య చేయించింది..

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

28 Sunday Dec 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

14th Dalai Lama, 2025 Pentagon Report, anti china, Anti communist, BJP, China, China Arms, Donald trump, Narendra Modi Failures, RSS, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా అమెరికా రక్షణశాఖ ( పెంటగన్‌ ) 2025 నివేదిక విడుదల చేసింది. దానిలో ఉన్న అభూత కల్పనలు, కుట్ర సిద్దాంతాలు, వక్రీకరణలతో సహా అనేక అంశాల గురించి మీడియాలో, ఇతరంగా అనేక మంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. హెచ్చరికలు, పరోక్ష బెదిరింపులు, బుజ్జగింపులు, చైనా, మనదేశం పరస్పరం దెబ్బలాడుకొనేందుకు తంపులు పెట్టటం వంటివి అనేకం ఉన్నాయి. ఈ ఏడాది నివేదిక ప్రత్యేకత ఏమంటే తనతో చెట్టపట్టాలు వేసుకుతిరిగి ఒకే కంచం, ఒకే మంచం అనే జిగిని దోస్తులా ఉన్న నరేంద్రమోడీకి సహజభాగస్వామి డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్ని పరీక్ష పెట్టాడంటే అతిశయోక్తి కాదు. ఏడాది కాలంలో ఎంతలో ఎంతమార్పు ? ఐదేండ్ల పాటు శత్రువుగా పరిగణించిన చైనాతో పూర్వంమాదిరి సంబంధాలు, అమెరికాతో ఎడబాటుకు 2025 నాంది పలికింది. అమెరికా మీడియా కొన్ని అంతర్గత అంశాల మీద విమర్శనాత్మకంగా ఉన్నప్పటికీ మొత్తం మీద ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కనుసన్నలలోనే ఉంటుంది.” భవిష్యత్‌లో ఘర్షణ అవకాశం ” ఉంటుందంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా భారత్‌-చైనా గురించి ఒక విశ్లేషణ రాసింది. దానికి ఆధారం పెంటగన్‌ నివేదికలోని అంశాలు. భవిష్యత్‌లో చైనాతో తలెత్తే యుద్ధం కోసం యావత్‌ హిమాలయ ప్రాంతంలో భారత్‌ వందల కోట్ల డాలర్లతో రోడ్లు, సొరంగాలు, విమానాలు ఎగిరే, దిగే ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. రక్షణ విషయంలో సమతూకంతో ఉండటం కాకుండా వ్యూహాత్మక పోటీని సంచలనాత్మకం కావిస్తోంది. 2020 గాల్వన్‌ లోయలో మాదిరి చైనా కొద్ది గంటల్లోనే అదనపు బలగాలను దించగలదు, మౌలిక సదుపాయాలు లేని కారణంగా అదే భారత్‌కు ఒక వారం పడుతుంది. మొత్తం వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందని గుర్తించామని, అందువలన ఆలోచనలు నాటకీయంగా మారినట్లు లడఖ్‌ ప్రాంతంలో రవాణా నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించిన మాజీ అధికారి మేజర్‌ జనరల్‌ అమ్రిత్‌ పాల్‌ సింగ్‌ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది.గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత రెండుదేశాల మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి పడిపోయాయని, డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నుల విధింపుతో భారత్‌, చైనాలతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నట్లు కూడా వ్యాఖ్యానించింది.

రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవాలని 2024 అక్టోబరు నుంచి నిర్ణయించుకోవటమేగాక వేగంగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాయి. దాంతో ఏడు సంవత్సరాల తరువాత ప్రధాని నరేంద్రమోడీ చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి హాజరై పుతిన్‌, షీ జింపింగ్‌లతో భేటీ జరిపి అమెరికాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. పెంటగన్‌ నివేదిక ఈ పూర్వరంగంలో తయారైందే అన్నది స్పష్టం. సరిహద్దులలో ఉద్రిక్తతలు తగ్గటాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా-భారత్‌ సంబంధాలను బలహీనపరిచేందుకు చూస్తున్నదని, పాకిస్తాన్‌తో రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకుంటున్నదని, అరుణాచల్‌ ప్రదేశ్‌ను ప్రధాన అంశంగా చూస్తున్నదని ఆ నివేదికలో చైనా మీద ఆరోపించారు. గత పదకొండు సంవత్సరాలు, అంతకు ముందు యుపిఏ హయాంలో అమెరికా జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు మన్మోహన్‌ సింగ్‌ ప్రయత్నించారు. ఆ కారణంతోనే యుపిఏ-2 హయాంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. తరువాత నరేంద్రమోడీ హౌడీమోడీ కార్యక్రమంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేసి చెట్టపట్టాలు వేసుకుతిరిగి మరింత సన్నిహితమయ్యారు. క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా మరింత చురుకుగా వ్యవహరించారు.ఈ పరిణామాలకు చైనా కారణమా ? ప్రారంభ సంవత్సరాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా అమెరికావైపే మొగ్గారు.దానిది ధృతరాష్ట్ర కౌగిలి అని అర్ధమయ్యాక అలీనవిధానం, సోవియట్‌ వైపు మొగ్గారు. పరిస్థితిని చూస్తుంటే ఇప్పుడు నరేంద్రమోడీ కూడా చైనాతో రానున్న రోజుల్లో ఎలా ఉంటారో తెలియదుగాని అనివార్యంగా అమెరికా బెదిరింపులను వ్యతిరేకించకతప్పని స్థితిలో ఉన్నారు. నరేంద్రమోడీ అమాయకంగా చైనా వలలో చిక్కుకున్నారని అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. అవసరాలు అలానడిపిస్తాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగమని మనదేశంలో ఆశ్రయం పొందుతున్న దలైలామా స్వయంగా చెప్పాడు. ఆ పెద్దమనిషికి మనదేశం అన్నివిధాలుగా మద్దతు ఇస్తున్నది.అదే మాట చైనా కూడా చెబుతున్నమాట నిజం.అయితే ఎన్నడూ ఆక్రమించుకుంటామని చెప్పలేదు.1962 యుద్ధం సందర్భంగా చైనా సేనలు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. అక్కడే తిష్టవేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.యుద్ధంలో కాల్పుల విరమణను వారే ప్రకటించి, తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు ఆవలకు వెళ్లాయి. ఇది చైనా వ్యతిరేకులు కూడా అంగీకరిస్తున్న తిరుగులేని వాస్తవం. బ్రిటీష్‌ అధికారులు గీచిన సరిహద్దు రేఖలను చైనా ఎన్నడూ అంగీకరించ లేదు. లడఖ్‌లోని ఆక్సారు చిన్‌ ప్రాంతం మనదిగానూ, అరుణాచల్‌ చైనాలో భాగంగా బ్రిటీష్‌ మాపుల్లో ఉంది. అందుకే సరిహద్దు వివాదం తలెత్తింది. ఐదేండ్ల క్రితం ఆరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి చైనా కొన్ని గ్రామాలు నిర్మిస్తున్నదని మన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవి అమెరికా సిఐఏ సృష్టించిన కట్టుకథలు, వక్రీకరించిన చిత్రాలు. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన మన మిలిటరీ అధికారి రావత్‌ అప్పుడే ఆ వార్తలు అవాస్తమని ప్రకటించారు. గతంలో ఎన్నడో నిర్మించిన ఇండ్లు పాతబడిపోయినందున వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు తప్ప చైనా ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని చెప్పారు.మన కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఎలాంటి దురాక్రమణలు జరగలేదని పార్లమెంటులో, వెలుపలా ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు, యుద్ధ విమానాలు విక్రయిస్తున్నది జాగ్రత్త అంటూ మనదేశాన్ని భయపెట్టేందుకు పెంటగన్‌ పూనుకుంది. ఆయుధాల క్రయ, విక్రయాలు అంతర్జాతీయ నిబంధనలమేరకే జరుగుతున్నాయి.చైనా గురించి మనలను రెచ్చగొడుతున్న అమెరికా దాని కంటే ముందుగానే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను, ఇతర ఆయుధాలను పాకిస్తాన్‌కు ఎందుకు అమ్మినట్లు ? మనకు కూడా ఎఫ్‌-35 విమానాలను ఇస్తామని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు కదా ? మనం ఫ్రాన్సునుంచి రాఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా చైనా నుంచి పాకిస్తాన్‌ కొనుగోలు చేసింది. చైనా విమానాలు ఎగరలేవు, ఆయుధాలు తుస్సుమనే నాశిరకం అని ఒకవైపు ప్రచారం చేస్తున్నవారు, వాటి గురించి ఎందుకు భయపెడుతున్నట్లు ? ఎంతో సమర్ధవంతమైనవని చెబుతున్న రాఫేల్‌ విమానాలను పాకిస్తాన్‌ ఆ నాశిరకం ఆయుధాలతోనే కూల్చివేసింది. ఆపరేషన్‌ సింధూర్‌లో ఏం జరిగిందీ, చైనా ఆయుధాల గురించీ నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు. ఆ తరువాతే కదా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి మోడీ వెళ్లటం, చైనాకు వీసాలు, విమానాల పునరుద్ధరణ వంటి సానుకూల పరిణామాలన్నీ చోటు చేసుకున్నది. సంబంధాల పునరుద్ధరణ సందర్భంగా రెండు దేశాలూ ఇతర దేశాలతో సంబంధాల విషయంలో పరస్పరం ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని నిర్ణయించాయి. పెంటగన్‌ నివేదికను చూసి మనదేశంలోని కొందరు నిజమే కదా అనుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.

తగాదాలు పెట్టటం, అనుమానాలను పెంచటంలో అమెరికా తరువాతే ఎవరైనా. పెంటగన్‌ నివేదికను బయటపెట్టిన తరువాత గతంలో అధ్యక్షుడిగా ఉన్న జార్జి డబ్ల్యు బుష్‌ మరియు రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణలు బయటకు వచ్చాయి. చైనాను నమ్మవద్దని ఇప్పుడు మనకు ట్రంప్‌ చెబుతున్నట్లే నాడు బుష్‌ కూడా పుతిన్‌కు చెప్పాడు. బుష్‌-పుతిన్‌ మధ్య 2001 నుంచి 2008వరకు జరిగిన సంభాషణల ప్రకారం చైనా నుంచి మీకూ మాకూ ఇద్దరికీ దీర్ఘకాలిక సవాలు ఉన్నదని, అందువలన మీరు జాగ్రత్తలు తీసుకోవాలని బుష్‌ చెప్పాడు. తొలిసారి స్లోవేనియాలో ఇద్దరు నేతలు భేటీ అయినపుడు రష్యా పశ్చిమదేశాల్లో భాగం అనీ శత్రుదేశం కాదని, చైనాతో జాగ్రత్తగా ఉండాలని, ఇద్దరికీ దీర్ఘకాలం సమస్యలుంటాయని బుష్‌ అన్నాడు.2005లో కూడా ఈ ప్రస్తావన చేసినపుడు మాకంటే మీకే ఎక్కువ సమస్యలని పుతిన్‌ చెప్పాడు. దానికి వారేమీ మా సరిహద్దులలో లేరని (చైనా – రష్యా మధ్య 4,195 కిలోమీటర్ల సరిహద్దు ఉంది ) చైనా నుంచి వ్యవస్థాపరమైన సవాలు ఉందని బుష్‌ బదులిచ్చాడు.అయితే పుతిన్‌ తక్కువేమీ తినలేదు గనుక తమకు తక్షణ ప్రమాదం నాటో తూర్పువిస్తరణ, ఐరోపాలో అమెరికా క్షిపణి మోహరింపు పధకాల నుంచి వుందని చెప్పాడు. చివరి సారిగా ఇద్దరు నేతల మధ్య 2008లో సంభాషణలు చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా బుష్‌ చైనా గురించి హెచ్చరించాడు. అయితే తమ దేశ సరిహద్దులకు పశ్చిమ దేశాల మిలిటరీ మోహరింపు తక్షణ ప్రమాదంగా ఉందని పుతిన్‌ స్పష్టం చేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో రష్యాను నమ్మించి మోసం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని నాటో చేసిన కుట్రలు బయటపడ్డాయి. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి తమకు తొత్తులుగా ఉండేవారిని గద్దెనెక్కించి, దానికి నాటో సభ్యత్వమిచ్చి రష్యా సరిహద్దుల్లో తిష్టవేసేందుకు పూనుకున్నారు. దానికి ప్రతిగానే రష్యా 2014లో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రాంతమైన క్రిమియాను స్వాధీనం చేసుకుంది. దాంతో రష్యాను జి 8 కూటమి నుంచి తొలగించారు.

అసలు అమెరికా ఎందుకు గుండెలు బాదుకుంటోంది ? ఆసియా ఖండంపై ఆధిపత్యం కోసం, దానిలో భాగంగా చైనాను కట్టడి చేసేందుకు దీర్ఘకాలంగా అది అనుసరిస్తున్న విధానానికి న్యూఢిల్లీ-బీజింగ్‌ సాధారణ సంబంధాల పునరుద్దరణ పెద్ద ఎదురుదెబ్బ.భారత్‌ మెడమీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలనుకున్న దాని ఎత్తుగడ పారే అవకాశం లేదని అనుకుంటున్నది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో మూడోదేశ జోక్యానికి అవకాశం లేదని మోడీ సర్కార్‌ స్పష్టం చేసింది.చైనాతో దౌత్య సంబంధాలు, వీసాలు, విమానాల పునరుద్దరణ ఏదో తాత్కాలిక వ్యూహంలో భాగం అనుకోలేము. రష్యా,చైనా, భారత్‌ సంబంధాలు మరింత సన్నిహితం కావటం సహజంగానే అమెరికాకు మింగుడుపడటం లేదు. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేదిగా కనిపిస్తున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా, భారత్‌,జపాన్‌,ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్‌ కూటమి భవిష్యత్‌ ఏమిటన్నది ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు.దక్షిణ చైనా సముద్రంలో చైనాను అడ్డుకొనేందుకు 2007లో ఈ కూటమిని అమెరికా ముందుకు తెచ్చింది. తరువాత దాని పరిణామాలు, పర్యవసానాలను మదింపు చేసుకొని మన్మోహన్‌ సింగ్‌ దాని పట్ల ఆసక్తి చూపకపోవటంతో ఒక విధంగా అది అటకెక్కింది. తరువాత నరేంద్రమోడీ ఉత్సాహం చూపటంతో 2017 నుంచి చురుకుగా పని చేస్తున్నది. అప్పటి వరకు అది ఆసియా – పసిఫిక్‌ అనే ఇతివృత్తంతో పని చేస్తున్నది కాస్తా మన దేశాన్ని ఇరికించేందుకు అమెరికా తెలివిగా ” ఇండో-పసిఫిక్‌ ” అజండాగా మార్చి దానికి భారత్‌ మూలస్థంభం అంటూ మోడీని మునగచెట్టు ఎక్కించి మన భుజాల మీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలని పధకం వేసింది. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో మోడీ ముందుకు పోతారా ? ఈ కూటమి తనకు వ్యతిరేకంగా రూపొందిన ” ఆసియా నాటో ” అని చైనా భావిస్తున్నది. తమకు ముప్పు తలపెట్టిన ఐరోపా కేంద్రంగా ఉన్న నాటో కూటమిని పుతిన్‌ వ్యతిరేకించటమేగాక దానికి పావుగా ఉన్న ఉక్రెయిన్‌ మీద మిలిటరీ చర్య జరుపుతున్న సంగతి తెలిసిందే. క్వాడ్‌ అంశంలో మరింత ముందుకు పోతే చైనాకు, వెనక్కు తగ్గితే అమెరికాకు ఆగ్రహం. అందుకే నరేంద్రమోడీకి డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్నిపరీక్ష పెట్టాడని చెప్పాల్సి వస్తోంది. ఏ దేశానికైనా దీర్ఘకాలిక విదేశాంగ విధానం ఉండాలి. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి అన్నట్లు ఎటువాటంగా ఉంటే అటుపోతే ఇలాంటి ఇరకాటాలే వస్తాయి మరి ! ఏం జరుగుతుందో చూద్దాం !!

రాజకీయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అది నడిపించే బిజెపిలోని అత్యధికులు కమ్యూనిస్టు వ్యతిరేకత, చైనా వ్యతిరేకత కారణంగా అమెరికా వైపు మొగ్గాలని వత్తిడి చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే మనవిదేశాంగ విధానం, స్వదేశీ విధానాలను నిర్దేశించేది ఇక్కడ ఉన్న పాలకవర్గం-బడా కార్పొరేట్లు, వారితో చేతులు కలిపే భూస్వామ్య, ధనిక రైతులు- అన్నది బహిరంగ రహస్యం. కొంత మందికి వెంటనే అవగతం గాకపోవచ్చు. అమెరికా విధించే షరతులు,వాణిజ్య విధానం తమకు నష్టదాయకమని పాలకవర్గం భావిస్తున్నది. దానికి అనుగుణంగా నడుచుకోవటం మినహా ప్రధానిగా ఎవరున్నా చేసేదేమీ లేదు. ధిక్కరిస్తే తమకు దాసులుగా ఉన్నవారిని గద్దెనెక్కిస్తారు.సంస్కరణలను మరింతవేగవంతంగా, ప్రతిఘటనను అణచివేసి తమకు మరింతగా లాభాలు సంపాదించి పెడతారనే నమ్మకంతోనే మన్మోహన్‌ సింగ్‌ను వదిలించుకొని నరేంద్రమోడీని రంగంలోకి తెచ్చారు. మారిన పరిస్ధితుల్లో అంతర్గతంగా మోడీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు, చైనా వైపు మొగ్గారు. అందుకే ట్రంప్‌ ఇప్పుడు అగ్నిపరీక్ష పెట్టారు. ఏ గట్టునుండాలో తేల్చుకొమ్మని హెచ్చరించాడు. చరిత్రలో అనేక మంది తీరుతెన్నులను చూసినపుడు జెండాలు, అజెండాలను ఊసరవెల్లి మాదిరి పరిస్థితికి తగినట్లుగా మార్చటం చూశాము. ముందు రోజు రాత్రి వరకు జనతా పార్టీని గట్టిగా సమర్ధించిన ” సోషలిస్టు ” జార్జి ఫెర్నాండెజ్‌ తెల్లవారేసరికి మొరార్జీదేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారటం తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d