Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ ఆహ్వానం మేరకు గురు, శుక్రవారాల్లో చైనా పర్యటన జరిపేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం నాడు బీజింగ్‌ చేరుకున్నాడు. అన్ని రోడ్లూ రోమ్‌కే దారి తీసినట్లు ఈ పర్యటన గురించి పెద్ద ఎత్తున ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. పరిణామాలు, పర్యవసానాల గురించి విశ్లేషణలు వెలువడ్డాయి. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్‌ పంపిన తాజా ప్రతిపాదనలను ట్రంప్‌ తిరస్కరించాడు. అదొక చెత్తకాగితమని, దాన్నసలు పూర్తిగా చదవలేదంటూ తాత్కాలిక శాంతి అవగాహన వెంటిలేటర్‌ మీద ఉందని వ్యాఖ్యానించాడు. మరోసారి ఇరాన్‌పై దాడులకు తెగబడేందుకు అమెరికా సిద్దపడుతున్నదని వార్తలు వస్తున్న పూర్వరంగంలో ట్రంప్‌ చైనా పర్యటన జరగనుంది. ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ ఈ యాత్ర ముగిసేవరకు ఎలాంటి దాడులు జరిపే అవకాశం లేదని చెప్పవచ్చు. ఇప్పటికే చైనాతో బేరసారాల్లో బలహీనపడిన అమెరికా మరోసారి దుస్సాహసానికి వడిగడితే మరింతగా చులకనకావచ్చు. నిజానికి ట్రంప్‌ యాత్ర మార్చి 31, ఏప్రిల్‌ రెండవ తేదీలలో జరగాల్సి ఉంది. ముందస్తు పథకం ప్రకారం ఇరాన్‌ మీద దాడి చేసి తన ఆయుధశక్తి, పాటవంతో దాన్ని లొంగదీసుకొని చైనా నేతల ముందు ప్రదర్శించాలని 78 ఏండ్ల ట్రంప్‌ కలలు కన్నాడు.అయితే అనుకున్నదొకటి అయింది ఒకటి బోల్తాపడ్డావులే బుల్‌బుల్‌ పిట్టా అన్నట్లుగా పరిస్థితిమారింది. పులిలా బీజింగ్‌లో అడుగుపెట్టాలనుకొని పిల్లిలా వెళ్లనున్నాడని చెప్పవచ్చు. ఒకేసారి రెండు ప్రధాన అంశాలపై కేంద్రీకరించలేకనే గత పర్యటన వాయిదా వేసుకున్నాడు.ట్రంప్‌ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. తన బీజింగ్‌ పర్యటన భీబత్సంగా (ఆంగ్లంలో వైల్డ్‌ అనే పదం వాడాడు. దీనికి అనేక అర్ధాలు ఉన్నాయి) ఉంటుందని కొంతమంది ప్రపంచ నేతలతో ఫిబ్రవరి నెలలో వర్ణించాడు. ఇరాన్‌తో పంచాయతీ కారణంగా మార్చినెలలో పర్యటనను వాయిదా వేసుకున్నాడు, అది ఇప్పటికీ ఇంకా తెగలేదు అయినప్పటికీ బీజింగ్‌ వెళ్లిరాక తప్పదన్నట్లుగా పరివారంతో బయలు దేరాడు.తనతో పాటు పదహారు లేదా 17 మంది వాణిజ్య, పారిశ్రామిక దిగ్గజాలను బీజింగ్‌ తీసుకుపోతున్నాడు.తొలిసారి అధికారానికి వచ్చిన తరువాత 2017లో ట్రంప్‌ పర్యటన తరువాత మరొక అమెరికా అధినేత డ్రాగన్‌ గడ్డమీద అడుగుపెట్టలేదు. ఆ పర్యటన తరువాత మరుసటి ఏడాది బస్తీమే సవాల్‌ అన్నట్లుగా చైనా మీద ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.అయినప్పటికీ అంతమంది వాణిజ్యవేత్తలతో అడుగుపెడుతున్నాడంటే పైకి ఏమి చెప్పినప్పటికీ చైనాతో వాణిజ్య సంబంధాలను వదులుకొనేందుకు అమెరికన్‌ బహుళజాతి గుత్త సంస్థలు సిద్దంగా లేవన్న సందేశాన్ని ఇచ్చినట్లే. ఇరాన్‌తో వివాదం తెగేంతవరకు ఆగలేమంటూ, ఆలశ్యం చేస్తే బేరసారాల్లో ఇంకా బలహీనపడతామంటూ వారు ట్రంప్‌పై వత్తిడి తెచ్చినట్లు కనిపిస్తోంది. చైనాతో పెట్టుబడులు, వాణిజ్య ఏర్పాట్లపై చర్చకు ట్రంప్‌ పర్యటన జరగనుందని కొందరి విశ్లేషణ.

ఈ సందర్భంగా వాణిజ్యంతో పాటు ఇరాన్‌, తైవాన్‌, పన్నులు, కంప్యూటర్‌ చిప్స్‌,విలువైన ఖనిజాలు ఇతర సమస్యలు కూడా చర్చకు రావచ్చని చెబుతున్నారు.వీటిపై బీజింగ్‌ ధృడమైన వైఖరితో ఉంది.తన విదేశాంగ విధానం విజయవంతమైందని నవంబరులో జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల ముందు ప్రదర్శించుకొనేందుకు కూడా ట్రంప్‌ చూస్తున్నాడు.లక్ష కోట్ల డాలర్ల మేర చైనా పెట్టుబడులు, వాణిజ్య విమానాల కొనుగోలు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అమెరికా కోరుకుంటోంది.వారు గనుక లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులతో అమెరికాలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తాయని జనవరిలో డెట్రాయిట్‌ ఎకనమిక్‌ క్లబ్‌ సమావేశంలో ట్రంప్‌ చెప్పాడు.అయితే ఇప్పుడు పెట్టుబడులపై ఒప్పందం కుదరకపోవచ్చని, ఇరాన్‌ అంశం ట్రంప్‌ స్థితిని బలహీనపరిచిందని, అమెరికా మిలిటరీ బలహీనతలు ఏమిటో వెల్లడైనందున గతంలో మాదిరి పొగరుగా మాట్లాడటం కుదరదని చెబుతున్నారు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత కూడా అంతకు ముందు మాదిరే దూకుడును ప్రదర్శించాడు. అయితే చైనా ఏమాత్రం వెనక్కు తగ్గకపోవటంతో బీజింగ్‌ను సంతుష్టీకరించేందుకు కొన్ని బిస్కెట్లు కూడా వేశాడు.చైనా విద్యార్థుల వీసాలకు అనుకూలంగా నిర్ణయం,ఆధునిక ఏఐ చిప్స్‌ను ఎగుమతి చేసేందుకు అంగీకరించటం, తైవాన్‌కు ఆయుధసరఫరా పాకేజ్‌ల నిలిపివేత, చైనాలో మానవహక్కులు లేవన్న ఆరోపణలపై మౌనం,చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై ధ్వజమెత్తే మంత్రుల నోళ్ల కట్టడి, షీ జింపింగ్‌ మంచి స్నేహితుడని, అద్భుతమైన సంబంధాలను కలిగి ఉన్నామని పదే పదే స్వయంగా చెప్పటం వంటి అంశాలున్నాయి. తాను ఈసారి అక్కడకు వెళ్లినపుడు తనను షీ జింపింగ్‌ గట్టిగా హత్తుకుంటాడని కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించాడు. అయితే చైనా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు, పొగడ్తలకు పొంగిపోలేదు. గతేడాది దక్షిణ కొరియాలో ట్రంప్‌-షీ జింపింగ్‌ భేటీలో వాణిజ్య పోరు మీద రాజీకుదిరింది. ట్రంప్‌ జరిపే పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత చెడగొట్టకుండా ఉంటే చాలు అని కూడా కొందరు అమెరికన్లు భావిస్తున్నారు.ఇరాన్‌ వ్యవహారంలో తప్పుడు లెక్కలు వేసుకున్నట్లుగా బీజింగ్‌తో వ్యవహరిస్తే ప్రమాదకరమని కూడా హెచ్చరిస్తున్నారు. గతంలో తమను ఉపయోగించుకొని చైనా, ఇతర దేశాలు ఎంతగానో లాభపడ్డాయని, ఇక ముందు అలా జరగటానికి వీల్లేదని చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు చైనా విషయంలో మాట మార్చాడు. పన్నులు, విలువైన ఖనిజాలు, కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాల్లో తలెత్తిన ఉద్రిక్తతలను పెద్దవేమీ కాదన్నట్లుగా మాట్లాడటమే కాదు, చైనాతో ఎంతో వాణిజ్యం చేస్తూ లబ్ది పొందినట్లు చెప్పాడు.

ఇటీవలి కాలంలో తలెత్తిన విబేధాలతో ఎవరికి వారు ప్రత్యామ్నాయాలను చూసుకుంటూనే ఉన్నారు. తైవాన్‌తో సంబంధాలు కలిగిన ఒక్క దేశంతో తప్ప మిగిలిన అన్ని ఆఫ్రికా దేశాల నుంచి చేసుకొనే దిగుమతులపై ఎలాంటి పన్నులు ఉండవని చైనా తాజాగా ప్రకటించింది.ఈ చర్య తన వస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచుతుందని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా గణాంకశాఖ సమాచారం ప్రకారం 2022లో చైనా దిగుమతుల కంటే గతేడాది 50 బిలియన్‌ డాలర్ల మేరకు తక్కువ ఉన్నాయి. సోయాబీన్స్‌ కొనుగోలును చైనా నిలిపివేసింది.గతేడాది చైనా వాణిజ్య మిగులు 202బిలియన్‌ డాలర్లు ఉంది, తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసి లోటును తగ్గించాలని అమెరికా కోరుతోంది.మరోవైపు చైనా బదులు తైవాన్‌ ప్రాంతం నుంచి ఎక్కువగా కంప్యూటర్‌ చిప్స్‌, సర్వర్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది.మూడవ దేశాల ద్వారా చైనా వస్తువులను ఎగుమతులు చేస్తోంది. చైనా నుంచి 2017లో అమెరికా దిగుమతి చేసుకున్న వస్తువుల వాటా 22శాతం ఉండగా ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో కేవలం 7.5శాతం మాత్రమే ఉన్నాయి.వాషింగ్టన్‌ వస్తు దిగుమతులను ఆయుధంగా మార్చటం ఇది సూచిస్తున్నది.చైనాతో ఒప్పందం కుదుర్చుకోక ముందు దిగుమతి పన్ను 145శాతం విధిస్తూ ట్రంప్‌ కత్తి గట్టిన సంగతి తెలిసిందే.

జరుగుతున్న పరిణామాలను చూస్తున్నపుడు రెండుదేశాల మధ్య ప్రచ్చన్న యుద్దం జరుగుతున్నట్లు వేరే చెప్పనవసరం లేదు.కమ్యూనిస్టు చైనాను మొగ్గలోనే తుంచివేసేందుకు అసలు ఐరాసలో సభ్యత్వమే లేకుండా చేసేందుకు తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్నే అసలైన చైనాగా 1970దశకం వరకు గుర్తించిన సంగతి తెలిసిందే.తరువాత బీజింగ్‌ చేపట్టిన సంస్కరణలను అవకాశంగా తీసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టి చౌకగా వస్తువులను తయారు చేసి వాటిని దిగుమతి చేసుకొని అమెరికా, ఇతర ధనిక దేశాలు లబ్దిపొందాయి.ఎప్పుడైతే చైనా బలపడి తమకు సవాలు విసురుతోందని గ్రహించిందో అమెరికా అప్పటి నుంచి కట్టడి చేసేందుకు పూనుకుంది. దాన్ని సవాలుగా తీసుకున్న చైనా అనేక విజయాలతో ముందుకు పోతున్నది. వర్తమానానికి వస్తే చైనాకు అవసరమైన చమురు, గ్యాస్‌ను ఆయుధాలుగా చేసుకొని అమెరికా తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తోంది.మరోవైపున కృత్రిమ మేథ, చిప్స్‌తో వాణిజ్య సమతూకాన్ని సాధించాలని పావులు కదుపుతున్నది.దాన్లో భాగంగానే చిప్స్‌ను ఎగుమతి చేయరాదని, వాటి తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాలను సరఫరా చేయకుండా ఆంక్షలు విధించింది. ఆ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తున్న బీజింగ్‌ ఎలక్ట్రానిక్స్‌ పరికరాలకు అవసరమైన విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తులపై పట్టుసాధించటంతో పాటు విద్యుత్‌ వాహనాలు, సౌరపలకల వంటి రంగాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. గతేడాది చైనా తయారీ మోటారు వాహనాలు ప్రపంచ ఎగుమతుల్లో 21శాతానికి చేరాయి.అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ఐరోపా దేశాల కంటే చౌకగా విద్యుత్‌ వాహనాలను చైనా విక్రయిస్తోంది. చమురు అందకుండా చేయాలన్న అమెరికా ఎత్తుగడకు ప్రతిగా ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్‌ తయారీకి అవసరమైన ఏర్పాట్లతో పాటు పలకలను తయారు చేసి ఇతర దేశాలకు సైతం పెద్ద ఎత్తున ఎగుమతి చేసేదిగా చైనా తయారైంది.ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం దాని సౌరపలకల ఎగుమతులకు అనుకోని వరంలా మారింది.ప్రత్యామ్నాయ, హరిత ఇంథన వనరుల అభివృద్ధికి పూనుకున్న దేశాలన్నీ వాటిని దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికాకు జపాన్‌, చైనా ఇస్తున్న అప్పుల సంగతి తెలిసిందే.ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు పెట్టాలంటే వాషింగ్టన్‌ వద్ద పెట్టుబడులు లేవు, అందుకే పన్నులను ఆయుధాలుగా చేసుకొని తమ దేశంలో పరిశ్రమలు పెడితే రాయితీలు ఇస్తానని షరతులు పెడుతున్నాడు.

చైనాతో వైరం వలన తమకు వచ్చే లాభం లేదని అమెరికన్‌ కార్పొరేట్లు ఒక నిర్ణయానికి రాకుండా ఇంత మంది కట్టుగట్టుకొని ట్రంప్‌తో పాటు పొలోమంటూ బయలు దేరరు. అమెరికా ఎదురుదాడి చేస్తే ప్రతిఘటిస్తున్న ఇరాన్‌ మాదిరి చైనా కూడా అవసరమైన మేర ఆర్థిక రంగంలో ప్రతిఘటిస్తున్నది తప్ప తానే దాడి చేసేందుకు పూనుకోవటం లేదు, అవసరమూ లేదు. సంఘర్షణ రెండు దేశాలకూ నష్టమే. దాన్ని నివారించాలంటే ప్రధాన బాధ్యత అమెరికాదే అవుతుంది. యావత్‌ ప్రపంచాన్ని చాపచుట్టలా తన చంకలో పెట్టుకోవాలన్న దురాలోచనకు అది స్వస్థి పలికితే అనేక సమస్యలు సులభంగా పరిష్కారమౌతాయి. ప్రపంచ పెత్తనం సాధ్యం కాదని ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా దానికి అర్ధం కావటం లేదు. రెండు దేశాల మధ్య ప్రధాన వివాదం తైవాన్‌ విలీనం. ఏదో ఒకసాకుతో దాన్ని అడ్డుకొని స్వతంత్ర దేశంగా మార్చి చైనా పక్కలో బల్లెంగా తయారయ్యేందుకు అమెరికా చూస్తున్నది. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వమిచ్చి రష్యా ముంగిట తన ఆయుధాలను మోహరించాలని పన్నిన ఎత్తుగడ వికటించినా వాషింగ్టన్‌కు బుద్ధి రావటం లేదు. ఐరాస, చివరికి అమెరికా కూడా తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తించిన తరువాత కూడా విలీనాన్ని అడ్డుకుంటే చైనా చూస్తూ ఊరుకోజాలదు, అయితే వెంటనే అది జరగకపోయినా ఇబ్బంది లేదు గనుక తమాయిస్తున్నది. తెగేదాకా లాగితే స్వాధీనం పెద్ద కష్టమేమీ కాదు. తాజా పర్యటనలో ట్రంప్‌ దీనితో పాటు ఇతర వివాదాలపై చైనాతో సఖ్యతకు ప్రయత్నిస్తాడా, గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడా, చూద్దాం !