• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Europe

ఇరాన్‌పై అమెరికా దాడి : చర్చలు, కాల్పుల విరమణ నిరవధిక వాయిదా ?

22 Wednesday Apr 2026

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, China, Donald trump, Hormuz mission, Iran nuclear weapon, Islamabad Talks, West Asia Crisis

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరుగుతాయని భావిస్తున్న రెండవ దఫా అమెరికా-ఇరాన్‌ చర్చలు నిరవధికంగా వాయిదా పడినట్లు వార్తలు. మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ వినతి మేరకు కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు మంగళవారం నాడు ట్రంప్‌ ప్రకటించాడు. అయితే తమ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. నిర్ణీత వ్యవధిని పేర్కొనలేదు గనుక నిరవధికం అనుకుంటున్నారు. మాటమార్చి మరోసారి ఏ చెబుతాడో తెలియదు. చర్చలంటూనే వివిధ దేశాల్లో ఉన్న 14 మంది ఇరానియన్లు, సంస్థలపై కొత్తగా ఆంక్షలను ప్రకటించాడు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో ఇరాన్ను దారికి తేవాలని చూస్తే కుదిరేది కాదని చెప్పవచ్చు. ఇస్లామాబాద్‌ ప్రయాణ సన్నాహాలు చేసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వాయిదా వేసుకున్నాడు.బుధవారం నాడు చర్చలు జరుగుతాయనే అంచనాతోనే వేలాది మంది సిబ్బందితో పాక్‌ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. తమ మెడమీద కత్తి పెట్టి చర్చలంటే కుదిరేది కాదని టెహరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా గొంతెమ్మ కోరికలను ముందుకు తెస్తోందని, ఇలాంటి స్థితిలో చర్చలంటే సమయం వృధాతప్ప మరొకటి కాదంటూ చర్చలుకు వచ్చేది లేదని చెప్పకనే చెప్పింది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో అమెరికా దిగ్బంధనం ముగిసేవరకు మాటల్లేవని అన్నది. కాల్పుల విరమణ పొడిగింపు గురించి గురువారం ఉదయం వరకు ఇరాన్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ పేరుతో అమెరికా బలగాలను కూడగట్టుకుంటున్నదని గతంలోనే అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి మిలిటరీకి అనుకూలంగా టెహరాన్‌లో జనం వీధుల్లోకి వచ్చారు, ఈ సందర్భంగా ఒక ఆధునిక ఖండాంతర క్షిపణి ప్రయోగ వాహనాన్ని ప్రదర్శించారు. ఇరాన్‌ వద్ద దాడులకు ఉపయోగించే డ్రోన్లు, క్షిపణులు ఇప్పటికీ వేలాదిగా ఉన్నాయని అమెరికా రక్షణశాఖ గూఢచార నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.మరోవైపు ప్రత్యర్ధుల క్షిపణులను కూల్చివేసే అమెరికా పేట్రియాట్‌ వ్యవస్థలు సగం ఖర్చయినట్లు చెబుతున్నారు.

మంగళవారం రాత్రి వరకు జరిగిన పరిణామాలను ఒకసారి నెమరు వేసుకుందాం. గడువు ముగిసేలోగా తాము చెప్పినట్లు ఒప్పందం జరగకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్‌ మరోమారు బెదిరించాడు.తాను విజయం సాధించినట్లు కూడా చెప్పుకున్నాడు.గడువు పొడిగించేది లేదన్నాడు.తాము ఇప్పటికే 27 నౌకలను వెనక్కు తిప్పి పంపినట్లు అమెరికా మిలిటరీ చెప్పుకుంది.దీని వలన ఇరాన్‌ రోజుకు 50కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నదని ట్రంప్‌ చెప్పాడు.ఉభయ దేశాలూ కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు అమెరికన్‌ మిలిటరీ సెంట్రల్‌ కమాండ్‌ మాజీ అధిపతి డేవిడ్‌ పెట్రాస్‌ చెప్పాడు. ఒప్పందం కుదిరేట్లయితే స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే వచ్చి సంతకాలు చేస్తాడని లేదా వీడియో సమావేశంలో పాల్గ్గొంటారని మరోవైపు రాయిటర్స్‌ పేర్కొన్నది.ఉభయ పక్షాలు తమ తమ ఎత్తుగడలతో కొనసాగుతున్నాయి. ఆదివారం తమ నౌకను దిగ్బంధించటం ఓడదొంగల దుశ్చర్య వంటిదేనని ఇరాన్‌ పేర్కొన్నది.ఆ నౌకలో క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు చైనా నుంచి వచ్చాయని మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ పార్లమెంటు సభ్యురాలు నికీ హేలీ ఆరోపించారు.నిజమే నిజమే చాలా ప్రమాదకరంగా చైనా వ్యవహరిస్తోందంటూ అమెరికా అనుకూల మీడియా వ్యాఖ్యాతలు భజన ప్రారంభించారు. ఆ కంటెయినర్‌ నౌకతో తమకు సంబంధం లేదని అతిశయోక్తులు ప్రచారం చేస్తున్నారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఖండించాడు.ఒక వైపు అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండగానే ఇరాన్‌ నౌక ఒకటి హార్ముజ్‌ జలసంధి నుంచి ఓమన్‌ గల్ఫ్‌ వైపు ప్రయాణించినట్లు వార్తలు, మరో రెండు నౌకలు కూడా దాటినట్లు చెబుతున్నా, అవి ఏ దేశానివో స్పష్టం కాలేదు.

పశ్చిమాసియా సంక్షోభం బుధవారం నాటికి 54వ రోజులో ప్రవేశించింది. నాలుగు నుంచి ఆరువారాల్లో ఇరాన్ను నాశనం చేసి తమ లక్ష్యాలను సాధిస్తానని ప్రగల్భాలు పలికిన డోనాల్డ్‌ట్రంప్‌ పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అన్నట్లుగా ఉందంటే అతిశయోక్తి కాదు.శుద్ది చేసిన యురేనియం బాంబుల తయారీకి దగ్గరలో ఉందని ఒకసారి చెబుతారు.దాన్ని తమకు స్వాధీనం చేయాల్సిందే అంటారు. గతేడాది తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌ అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయని ఇప్పుడు వాటి నుంచి యురేనియాన్ని సేకరించటం చాలా కష్టం, దీర్ఘకాలం పడుతుందని సోమవారం నాడు ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ఇంతకు ముందు చైనా నుంచి భారీ విమానాల్లో ఆయుధాలు దిగాయని చీకట్లో బాణాలు వేసినట్లు ప్రచారం చేశారు.దానికి ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇప్పుడు క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు పంపుతున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు.నిజం ఏమిటి ? అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకలో ఏమున్నాయో తెలియదు. అమెరికన్లు చెప్పిన ప్రతిమాటను నమ్మాల్సిన అవసరం లేదు. అయితే బీజింగ్‌ నుంచి టెహరాన్‌కు రసాయనాలు పంపటం కొత్త కాదు, రహస్యమూ కాదు.మనతో సహా అనేక దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి,మనమూ కొన్ని రసాయనాలను ఎగుమతి చేస్తున్నాము. వాటిని దేనికి వినియోగించుకోవాలనే షరతులేమీ దిగుమతి చేసుకొనే దేశాలకు ఉండవు.ఉదాహరణకు అమెరికా కంపెనీలు చిప్స్‌ను ఎగుమతి చేస్తున్నాయి. వాటిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించవచ్చు, ఆయుధాల తయారీలో చొప్పించవచ్చు.చైనా సరఫరా చేస్తున్నదని చెబుతున్న రసాయనాలు కూడా అలాంటివే.ఉదాహరణకు చైనా నుంచి అమెరికాకు నచ్చని లేదా వ్యతిరేకించే దేశం చాకులను దిగుమతి చేసుకుంటే తమను పొడవటానికే అని నికీ హేలీ వంటి వారు గుండెలు బాదుకుంటారు. ఇదంతా అమెరికా ఆడించే నాటకంలో భాగం తప్ప మరొకటి కాదు.

తన నౌక ఎంవి టౌస్కాను ఓమన్‌ జలసంధిలో దిగ్బంధించిన తరువాత ఆ ఉదంతాన్ని విస్మరించి ఇరాన్‌ చర్చలకు వస్తుందని ఎవరూ భావించరు. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించే పరిస్థితి ఉండదు. అందుకే చర్చల తలుపులను పూర్తిగా మూసివేయకుండా ఎటూ తేల్చకుండా పరిణామాలను గమనిస్తున్నది. ఒప్పందం కుదిరితేనే ఇరాన్‌ నౌకలపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తానంటూ ట్రంప్‌ పదే పదే ప్రకటనలు చేస్తున్నాడు. ఉభయదేశాలూ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు భారతీయ కాలమానం ప్రకారం గురువారం ఉదయానికి ముగియనుండగా పొడిగిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అమెరికా స్వాధీనంలో ఉన్న నౌక గత ఆరువారాల్లో రెండు సార్లు ఇరాన్‌-చైనాల మధ్య రాకపోకలు సాగించినట్లు చెబుతున్నారు. అయితే నౌకల తీరుతెన్నులను గమనించినపుడు ఒక దేశ రేవు నుంచి బయలు దేరిన అక్కడ నింపిన సరకులను మధ్యలో దించి మరోనౌక నుంచి తెచ్చిన వాటిని రవాణా చేయటం సాధారణంగా జరిగేదే. సదరు వస్తువులపై వేరే దేశాల తయారీ అనే స్టిక్కర్లు కూడా వేస్తారు. అసలు ఎక్కడ తయారైందనే ఆనవాలు లేకుండా లేదా మరోదేశ తయారీ అని ముద్రలు వేస్తారు. ఇరాన్‌ నౌకను ఒమన్‌ జలసంధిలో అమెరికా యుద్ద నౌక నుంచి ఆరుగంటలపాటు చేసిన హెచ్చరికలను నౌకా సిబ్బంది ఖాతరు చేయలేదు, ఇరాన్‌వైపు నడిపేందుకు చూశారు. దాంతో అమెరికా నౌకాదళం కాల్పులు జరిపి ఇంజన్‌ గది నుంచి సిబ్బంది బయటకు రావాలని హెచ్చరించింది. సిబ్బంది ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడకపోవటంతో నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఒకవేళ అమెరికా గనుక తిరిగి దాడులకు పాల్పడితే తమ దగ్గర ఉన్న కొత్త అస్త్రాలను బయటకు తీస్తామని ఇరాన్‌ హెచ్చరించింది.

అమెరికా అనుసరించిన వైఖరితో హార్ముజ్‌ జలసంధి మీద ఇరాన్‌ పట్టుబిగిసిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నటికీ అణ్వాయుధాలను తయారు చేయకుండా చూడటమే తన లక్ష్యం అన్న ట్రంప్‌ గడచిన 54 రోజుల్లో రోజుకో కొత్త లక్ష్యాన్ని ప్రకటిస్తుండగా టెహరాన్‌ మొదటి నుంచి చెబుతున్నదానికే కట్టుబడి ఉంది.జలసంధి మీద ఇరాన్‌ అదుపు కలిగి ఉన్నప్పటికీ గతంలో దాన్ని ఒక ఆయుధంగా చేసుకోలేదు. అదే మాదిరి ఇప్పుడు కూడా ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్‌ వేసుకున్న అంచనాలు తప్పాయి.దాన్నే కాదు, ఎమెన్‌ జలసంధిని కూడా అవసరమైతే మూసివేయిస్తామని ఇరాన్‌ నేతలు ప్రకటించారు.అదే జరిగితే సూయజ్‌ కాలువ ద్వారా మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం ద్వారా హిందూమహా సముద్రంలోకి ప్రవేశించే రవాణా కూడా నిలిచిపోవటం అనివార్యం. ఇరాన్‌ వైఖరిని చూస్తుంటే రానున్న రోజుల్లో హార్ముజ్‌ను తన అదుపులో ఉంచుకొనేందుకు పూనుకున్నదని చెప్పవచ్చు.పట్టుసాధించటమేగాక అమెరికా దాడులతో తమకు కలిగిన నష్టాలను పూడ్చుకొనేందుకు ఆ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి సుంకం వసూలు చేసి పునరుద్దరణకు వినియోగిస్తామని కూడా ప్రకటించింది.పీపాకు ఒక డాలర్‌ వంతున పన్ను విధిస్తే ఒక్కో టాంకర్‌ ద్వారా ఇరవైలక్షల డాలర్ల రాబడి వస్తుంది.సాధారణ సమయంలో రోజుకు 120 నుంచి 150 నౌకలు ఆ మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రపంచ వ్యాపితంగా వందల కోట్ల మంది జనాలను ఇబ్బందుల పాలు చేయటం తప్ప ఇంతవరకు అమెరికా సాధించిందేమీ లేదు.గతంలో అన్ని దుర్మార్గాల్లోనూ పాలుపంచుకున్న ఐరోపా మిత్రదేశాలు ఈసారి ముఖం చాటేశాయి.ఇరాన్‌ దాడులతో తాము కూడా నష్టపోతున్నప్పటికీ ప్రత్యక్ష పోరుకు దిగేందుకు గల్ఫ్‌ దేశాలు ఇప్పటి వరకు నిరాకరించాయి. రానున్న రోజుల్లో అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తే గల్ఫ్‌ దేశాలను కూడా ఎలా దెబ్బతీయగలదో ఇరాన్‌ నిరూపించింది.అది మరింత దూరం ప్రయాణించి దాడి చేసే క్షిపణులను రూపొందిస్తున్నది.ఈ రీత్యా కూడా పశ్చిమాసియాలో ఇరాన్‌ పట్టు పెరగనుంది.

పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తరువాత చైనా గురించి కూడా చర్చ జరుగుతున్నది.పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదంటూ ఆరోపణలు, ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు.అసలు కారకులైన అమెరికా, ఇజ్రాయెల్‌ను వదలి బీజింగ్‌పై కేంద్రీకరించటం ఒక ఎత్తుగడలో భాగమే. తన ఇంథన భద్రతా చర్యల్లో భాగంగా ఇరాన్‌, గల్ఫ్‌ దేశాలతో సఖ్యతతో ఉండటమే గాక పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతోంది.ఇరాన్‌-సౌదీ మధ్య ఉన్న దీర్ఘకాలిక విబేధాలను మధ్యవర్తిత్వంతో పరిష్కరించింది.అనేక దేశాలకు భరోసా ఇస్తున్నది. అమెరికా దుశ్చర్యలను ఖండిస్తున్నది తప్ప ఇరాన్‌ మీద పెద్దగా వత్తిడి తేవటం లేదు, భద్రతా మండలిలో దానికి అనుకూలంగా రష్యాతో కలసి వీటోను కూడా ప్రయోగించి రక్షించింది. తన ఇంథన భద్రతలో భాగం ఒకటో, రెండో దేశాలపై ఆధారపడటంలేదు. అమెరికా కుట్రలను ముందుగానే గ్రహించిన కారణంగా కొన్ని నెలల పాటు సరఫరా ఆగినా తట్టుకొనేందుకు అవసరమైన నిల్వలను చేసుకున్నది.ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత స్వల్పంగా చమురు ధరలను పెంచిన చైనా తాజాగా అంతకంటే ఎక్కువగా తగ్గించింది. మరోవైపు గల్ఫ్‌ దేశాలతో వాణిజ్య సంబంధాలను గణనీయంగా పెంచుకుంది. ఆ ప్రాంత దేశాలతో 2024లో 257 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను నిర్వహించింది. ఈ మొత్తం పశ్చిమదేశాలతో సాగించిన మొత్తం వాణిజ్యం కంటే ఎక్కువ. అమెరికా బెదిరింపులకు లొంగకుండా ఇరాన్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న తీరును చూసిన తరువాత పేద, వర్ధమాన దేశాల్లో చైనా పలుకుబడి పెరగటం, అమెరికా ప్రభావం తగ్గటం అనివార్యం !బ్‌ ూ్‌శీషసర

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత పరువు తీస్తున్నదెవరు : ఇప్పటికైనా ఆత్మగౌరవాన్ని మోడీ పునరుద్దరిస్తారా ? అసెంబ్లీ ఎన్నికల తరువాత రోజుకు రు.2,400 కోట్ల వడ్డింపు !

03 Friday Apr 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, BJP, Donald trump, Fuel Price in India, Iran Oil, Narendra Modi Failures, RSS, Russian oil

ఎం కోటేశ్వరరావు

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నది ఒక లోకోక్తి. తనకు ఎదురులేదన్నట్లుగా నల్లేరు మీద బండిలా నడుస్తున్న నరేంద్రమోడీ పరిస్థితి అలాగే ఉందా ? కాలవైపరీత్యం గాకపోతే పొగిడిన మీడియా నోళ్లే అపహాస్యపు శీర్షికలు పెడతాయని ఎవరైనా ఊహించారా ! తాజాగా ఒక వార్త శీర్షిక ఇలా ఉంది. ” ఇరాన్‌ యుద్ధ పరిహాసం : ఏడు సంవత్సరాల్లో తొలిసారిగా టెహరాన్‌ నుంచి చమురు తెచ్చుకోనున్న భారత్‌ ”. ఆంగ్లలో ఐరనీ అనే పదానికి పరిహాసం, ఎగతాళి, గేలి ఇలా పర్యాయపదాలు ఎన్నో ఉన్నాయి. మీడియా ఇలాంటి శీర్షిక పెట్టటానికి కారకులు ఎవరు ? కచ్చితంగా నరేంద్రమోడీ తప్ప మరొకరు కాదు. అమెరికాను పక్కన పెట్టి హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు ఐరోపాలోని ధనిక దేశాలు ప్రారంభించిన ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌ కోరిక మేరకు 60దేశాల జాబితాలో మనం కూడా చేరాము. ఇది డోనాల్డ్‌ ట్రంప్‌కు కోపం తెప్పిస్తుందో ఏం పాడో, లేకపోతే ”అనుమతి” ఇచ్చాడా, ఏదైనా జరిగి ఉండవచ్చు, ఇంకా ఇలాంటి వాటిని ఎన్ని చూడాల్సి వస్తుందో ! ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత జరిగిన పరిణామాలను కాషాయదళాలు మింగా కక్కలేకుండా ఉన్నాయి. కడుపులో ఉన్న ఇరాన్‌ వ్యతిరేకతను వెల్లడించలేరు, ఇజ్రాయెల్‌, అమెరికా అనుకూలతను దాచుకోలేని ఒక మానసిక స్థితి,దీనికి చికిత్స లేదు.

ఒక నాడు మన దిగుమతుల్లో ఇరాన్‌ చమురు అగ్రభాగాన ఉంది. అలాంటిది 2019 నుంచి కొనుగోలు నిలిపివేశాము.మనకు ఎక్కడ లబ్ది ఉంటే అక్కడ కొనుక్కుంటాము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో పోల్చితే ఇరాన్‌ చమురు ధర పెరిగిందనా, నాణ్యత పడిపోయిందనా ? ఎందుకు నిలిపివేసినట్లు, తిరిగి ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లు ? జవాబుదారీ తనంలో ” ఘనత ” వహించిన పెద్దలు నోరు, మెదపరు, ఎందుకంటే దేశం కోసం-ధర్మం కోసం మౌనంగా ఉన్నాం అంటారు. ఏం జరిగినా నోర్మూసుకొని ఉండాలని ఏ సనాతన ధర్మం, ఏ పురాణాలు, ఇతిహాసాలు చెప్పాయి. పాండవులకు అన్యాయం జరిగితే శ్రీకృష్ణుడి రాయబారం, సీతను తిరిగి తనవద్దకు పంపి యుద్ధాన్ని నివారించాలని వాలి కుమారుడు అంగదుడిని శాంతి సందేశంతో రావణుడి వద్దకు పంపిన రాముడు (ఇప్పుడు ఇరాన్‌ యుద్దంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తామన్న పాకిస్తాన్ను బ్రోకర్‌ అని చౌకబారుగా వర్ణించిన పెద్దలు ఇతిహాసాల్లో జరిగిందాన్ని కూడా అలాగే అంటారేమో ఖర్మ) గురించి చదువుకున్నాం.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు మనలను ఎవరూ నమ్మని కారణంగా ఎవరూ పిలవటం లేదు, పెద్దరికం వహించాలని కోరటం లేదు గనుక దళారీ అని కసి తీర్చుకున్నాం. ఇప్పుడు మరి 60దేశాల చొరవలో మన పాత్రను ఎలా వర్ణిస్తారో తెలియదు.

డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరిస్తే మనం మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి అమెరికాను ”సంతుష్టీకరించేందుకు ” ప్రయత్నించాం. ఇప్పుడు అదే అమెరికా కావాలంటే ఇరాన్‌ చమురు కొనుక్కోవచ్చు అని చెప్పగానే ఉరుకులు పరుగులతో ఎగబడ్డాం.రెండూ మోడీ ఏలుబడిలోనే జరిగాయి.ఎంత ఆత్మగౌరవం ! ఇరాన్‌ నుంచి పింగ్‌ షన్‌ అనే చమురు టాంకరు ఆరులక్షల పీపాల చమురుతో బయలుదేరి గుజరాత్‌లోని వాడినర్‌ రేవుకు చేరనుందని వార్తలు.మన తీరుతెన్నులు చూస్తున్న ఇరాన్‌, ఇతర దేశాల దగ్గర మన గౌరవం పెరిగిందా తరిగినట్లా ? రష్యా చమురు సంగతి కూడా అంతే అనుకోండి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకోలేదా అని అడ్డు సవాళ్లు విసిరే వారు టెహరాన్‌ నుంచి ఎందుకు నిలిపివేశారో చెప్పాలి. మతకోణం ఉందంటే ఉలిక్కిపడతారా ? అమెరికా ఆడించినట్లు ఆడి 145 కోట్ల దేశం పరువు ఎవరు తీశారు ? ఇరాన్‌ విషయంలో అమెరికా తన లక్ష్యాలను గుట్టుచప్పుడు కాకుండా మార్చుకుంది, హార్ముజ్‌ జలసంధి నుంచి మీ చమురు మీరు తెచ్చుకోండి మేం చేసేదేమీ లేదని చేతులెత్తేశాడు ట్రంప్‌. మనం మాత్రం అతగాడి తోకపట్టుకు నడిచి ఇప్పుడు వ్రతం చెడ్దా ఫలం దక్కని స్థితిలో పడ్డాం.ఏం గతంలో వద్దన్నారుగా ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని ఇరాన్‌ అనలేదు గనుక సరిపోయిందిగాని, అని ఉంటే ? అమెరికా మబ్బులను చూసి చేతిలోని ముంతలో నీరు పారపోసుకోకూడదని గ్రహిస్తారా ! అమెరికా మీద వ్యతిరేకతతో ఎత్తుగడగా భారత్‌ పట్ల ఇరాన్‌ అనుకూలంగా వ్యవహరించిందని, పోరు ముగిసిన తరువాత కూడా అదే విధంగా ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఏప్రిల్‌ నాలుగవ తేదీన గుజరాత్‌ వాడినార్‌ రేవుకు చేరనుందని చెప్పిన ఇరాన్‌ నౌక మూడు రోజులుగా ప్రయాణ దిశ మార్చుకొని చైనా వైపు పయనిస్తున్నదని శుక్రవారం నాడు నౌకల కదలికలను నమోదు చేసే కెప్లర్‌ సంస్థ పేర్కొన్నది. అయితే వాణిజ్య నౌకలు ఎప్పుడు దిశమార్చుకుంటాయో తెలియదని నౌకనుంచి అందుతున్న సంకేతాలను బట్టి చివరకు అది ఎక్కడకు చేరేది చెప్పలేమని కూడా తెలిపింది. ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్నకు రిటోలియా అనే సంస్థ చెప్పినదాని ప్రకారం గతంలో 30 నుంచి 60 రోజుల వరకు చెల్లింపులకు గడువు ఇచ్చేవారని, ఆ చమురును అమ్మింది ఎవరో, కొనుగోలు చేసింది ఎవరో కూడా వెల్లడి కాలేదని, ఇప్పుడు ఆ షరతులను కఠినతరం గావించటం కారణం కావచ్చంటున్నారు. చెల్లింపుల సమస్య పరిష్కారమైతే తిరిగి భారత్‌ వైపు ప్రయాణించవచ్చని కూడా రిటోలియా పేర్కొన్నది.వాడినార్‌లో రష్యా కంపెనీ రోస్‌నెఫ్ట్‌కు చెందిన నయారాఎనర్జీ సంస్థ ఏడాదికి రెండు కోట్ల టన్నుల సామర్ధ్యం గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది.

తన రాజకీయ ప్రయోజనం, ఆధిపత్యం, ఇరాన్‌ చమురును కొల్లగొట్టేందుకు, ఇజ్రాయెల్‌ కోసం చేసే రాజకీయాల్లో భాగంగా టెహరాన్‌పై ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసే వారి తాటవలుస్తామని ట్రంప్‌ బెదిరించాడు.చైనా మరికొన్ని దేశాలు ఖాతరు చేయకుండా దిగుమతులు చేసుకున్నాయి. అంతకు ముందు 2018-19లో మన దిగుమతి అవసరాల్లో 10-12శాతం అంటే 23-24 మిలియన్‌ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం. ట్రంప్‌ 2019లో ఆంక్షలు విధించటంతో ఆ ఏడాది మే నెల నుంచి క్రమంగా తగ్గించి 2019-20లో రెండు మిలియన్‌ టన్నులకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిలిపివేశాం. అంతకు ముందు మనదేశానికి రాయితీలతో పాటు అప్పుకూడా ఇచ్చింది. వాటినే నరేంద్రమోడీ యుపిఏ ప్రభుత్వం చేసిన చమురు అప్పును తాను తీర్చాల్సి వచ్చిందని ప్రచారం చేయటమే గాక ఆ పేరుతో సెస్సులు, ఇతర భారాలను మోపిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తరువాత రష్యా నుంచి కొనుగోలు చేశాము, దాని మీద కూడా ఆంక్షలు విధించటంతో గరిష్టంగా రోజుకు 20లక్షల పీపాల దిగుమతిని ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సగానికి తగ్గించుకున్నాం. ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ట్రంప్‌ రష్యా , ఇరాన్‌ నుంచి చమురు తెచ్చుకోవచ్చు అంటూ మనకు ”అనుమతి” ఇచ్చాడు. ఇప్పుడు గతంలో ఇచ్చిన రాయితీని మనం కోల్పోయాము, మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఎందుకీ దుస్థితి ?

యుద్దం కారణంగా ఇప్పటికే జనం మీద భారాలు మోపటం ప్రారంభించారు,పవర్‌ పెట్రోల్‌, పరిశ్రమల్లో వాడే డీజిల్‌, ఇథనాల్‌ లేని పెట్రోలు, గృహ, వాణిజ్య గ్యాస్‌ ధరలను పెంచారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇప్పటికి ఇప్పుడు ఇరాన్‌ పోరు ముగిసినప్పటికీ ఇంథన ధరలు తగ్గే అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ హెచ్చరించింది. బ్రెంట్‌ రకం చమురు పీపా ధర 70 నుంచి 120 డాలర్ల వరకు పెరిగింది.మనం కొనుగోలు చేసే ముడి చమురు కూడా ఇదేవిధంగా పెరిగింది. సంక్షోభం ముగిసిన తరువాత పూర్వపు స్థితికి ధరలు దిగివస్తాయా ? జనం మీద భారం మోపటం లేదంటూనే మానసికంగా సిద్దం చేస్తున్నారు. చమురు మార్కెట్‌ కంపెనీలకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఎక్సయిజ్‌ పన్ను రద్దు చేశామని చెప్పారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) ద్వారా మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగు వారాల్లో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 75శాతం పెరిగాయని తెలిపారు. అయినా కొనుగోలు ధరలకంటే తక్కువకే కంపెనీలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయని, పెట్రోలు మీద లీటరుకు రు.26, డీజిలు మీద 81.90 నష్టం వస్తున్నదని, రెండూ కలిపితే రోజుకు రు.2,400 కోట్ల మేర వాటికి నష్టం వస్తున్నదని పేర్కొన్నారు. ఆసియాలో 30 నుంచి 50, ఉత్తర అమెరికాలో 20, ఐరోపాలో 30శాతం ఇంథన ధరలు పెరిగినట్లు పెట్రోలియం శాఖా మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి భారీగా ధరలు పెంచటం రెండవది నష్టాలను ప్రభుత్వం భరించటం అంటూ రెండోదానికే ప్రధాని నిర్ణయించినట్లు చెప్పారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గ్యాస్‌ మీద నామమాత్ర సబ్సిడీ తప్ప పెట్రోలు, డీజిలు మీద సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు. సెస్సుల పేరుతో లక్షల కోట్ల భారం మోపారు. 2022కు ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆమేరకు పెంపు తగ్గితే తగ్గింపు అన్న విధానాన్ని అమలు చేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా వినియోగదారులకు తగ్గించలేదు.ముందే చెప్పుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికల తరువాత అసలు రంగు బయటపడుతుంది.ప్రతి రోజుకు వస్తున్న రు.2,400 కోట్లను ప్రభుత్వం భరించాలంటే నెలకు 72వేల కోట్లు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు పెరిగాయని దిగుమతులు నిలిపివేసి రైతులను ఇబ్బంది పెట్టిన పాలకులను ఎవరైనా నమ్ముతారా ? గత పది సంవత్సరాల్లో దాదాపు 25లక్షల కోట్ల రూపాయలను అదనపు ఎక్సయిజ్‌, సెస్సుల రూపంలో వినియోగదారుల నుంచి పిండుకున్న ఘనత మరచిపోగలమా ?

రానున్న రోజుల్లో ముడిచమురు ధరల గురించి రాయిటర్స్‌ మార్చినెలలో జరిపిన విశ్లేషణలో 2026లో బ్రెంట్‌ రకం ముడి చమురు సగటున 82.85 డాలర్లు ఉంటుదని పేర్కొన్నారు.ఫిబ్రవరిలో చెప్పిన 63.85 డాలర్లకంటే ఇది 30శాతం ఎక్కువ. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున ఈ అంచనాలు మారిపోవచ్చు.ఏప్రిల్‌ 11వరకు రష్యా చమురు కొనుగోలుకు ట్రంప్‌ ” అనుమతి ” గడువు ఉంది.తరువాత ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో తెలియదు. మార్కెట్‌ చరిత్రను చూస్తే 2008లో ముడి చమురు ధర గరిష్టంగా 145 డాలర్లకు చేరింది.ఇరాన్‌ పోరు ఇంకా కొనసాగితే ఆ రికార్డును అధిగమించవచ్చని జోస్యం చెబుతున్నారు.సంక్షోభం మే మొదటి పక్షం వరకు కొనసాగితే 150 డాలర్లకు చేరవచ్చని జెపి మోర్గాన్స్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ మూడవ తేదీన పేర్కొన్నది.(మరికొన్ని సంస్థలు రెండువందల డాలర్లు అన్నాయి) అంతకు ముందు రోజు బ్రెంట్‌ రకం ధర 109 డాలర్లు ఉండగా సమీప భవిష్యత్‌లో 120-130 డాలర్ల మధ్య ఉండవచ్చని మోర్గాన్స్‌ అంచనా వేసింది. ఎలాంటి షరతులు లేకుండా హార్ముజ్‌ జలసంధిని ఒక వేళ ఈ రోజు తెరిచినా సరఫరా వ్యవస్థ పునరుద్దరణకు మూడు నుంచి ఆరునెలలు పడుతుందని చమురు రంగ నిపుణులు అంటున్నారు.దాడుల్లో జరిగిన నష్టాల తీవ్రత వెల్లడైన తరువాత మరింత స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే అంతా అనిశ్చితే, అస్పష్టతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !

18 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Hormuz mission, Narendra Modi Failures, NATO allies, Netanyahu, US attack Iran, Vladimir Putin

ఎం. కోటేశ్వరరావు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ ప్రారంభించిన దాడులు మంగళవారం నాడు పద్దెనిమిదవ రోజులో ప్రవేశించాయి. వాటికి దీటుగా టెహ్రాన్‌ కూడా ప్రతి దాడులతో బెంబేలెత్తిస్తున్నది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నౌకలకు రక్షణ కల్పించాలన్న ట్రంప్‌ కోరికను ఏ ఒక్క మిత్ర దేశం కూడా అంగీకరించలేదు. ఇది తమ యుద్ధం కాదని బయటకు చెప్పకుండానే ముఖం చాటేస్తుండటంతో ట్రంప్‌కు దిక్కుతోచక పిచ్చి ప్రేలాపనలకు దిగాడు. అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచీ కొంత మంది అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ పక్షాన చైనా, రష్యా ఎందుకు దాడుల్లో పాల్గ్గొనటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా తమతో కలసి దాడులకు పూనుకోవటంలేదని డోనాల్డ్‌ ట్రంప్‌ తన మిత్ర దేశాల మీద తిట్ల పురాణం ప్రారంభించాడు. చివరికి చైనా గనుక హార్ముజ్‌ జలసంధికి యుద్ధ నౌకలను పంపి ఇరాన్‌ను కట్టడి చేయకపోతే ఈ నెలాఖరులో బీజింగ్‌ పర్యటనను వాయిదా వేసుకుంటానని చైనాను కూడా బెదిరించాడు. మాకేం తొందరలేదు, వస్తే రా, లేకపోతే లేదు నీ ఇష్టం అన్నట్లుగా చైనా ఉంది. నాటోలో ఉన్న దేశాలే కాదు, ఇరాన్‌ దాడులకు గురవుతున్న గల్ఫ్‌ దేశాలు కూడా యుద్ధంలో దిగేందుకు అంగీకరించటం లేదు.

ఇరాన్‌పై దాడులు ఎప్పుడు ముగుస్తాయన్నది మరొక ప్రశ్న. ప్రారంభించిన అమెరికాకే దిక్కు తోచటం లేదు. ఇరాన్‌ వైపు నుంచి ఇలాంటి ప్రతిఘటన ఉంటుందని తనకెవరూ చెప్పలేదని, నెపాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా సలహాదారులు, నిఘా యంత్రాంగం మీద నెట్టేందుకు పూనుకున్నాడు. అయితే అలాంటిదేం లేదు, ముందుగానే ట్రంప్‌కు హెచ్చరికలు అందాయని వార్తలు. ఒకవైపు ఇరాన్‌లో వేలాది కేంద్రాలపై దాడులు చేశామని, దాని మిలిటరీ నడ్డి విరిచామని రోజూ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతుంటాడు. అదే నిజమైతే జరుగుతున్న క్షిపణి దాడుల సంగతేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. మొత్తంగా నాశనం చేశావని ఎలాగూ చెప్పావు కదా. ఇంక చేయాల్సిందేమీ లేదని గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించవచ్చు కదా అని ట్రంప్‌ మిత్రుడే బహిరంగంగా చెప్పిన తరువాత కూడా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎవరికైనా మదం తలకెక్కినపుడు హితవచనాలు రుచించవు. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గ్గొనే ఉద్దేశం తమకు లేదని జర్మనీ పేర్కొన్నది. హార్ముజ్‌ జలసంధిలో నౌకల రక్షణకు మిలటరీని పంపాలనే కోరిక తమకు లేదని స్పష్టం చేసింది. ఆసియాలో అమెరికా అనుయాయి దేశం దక్షిణ కొరియా, అక్కడ అమెరికాకు తొమ్మిది మిలిటరీ కేంద్రాలు, వాటిలో అన్ని దళాలకు చెందిన 25 వేల మంది సైనికులు ఉన్నారు. తాము కూడా హార్ముజ్‌కు నౌకాదళాన్ని పంపటం లేదని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. తమ దేశంలో నిల్వ ఉంచిన ఆయుధాలను పశ్చిమాసియాకు తరలించారని, దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర కొరియా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటని కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై పరిమితులు విధించనున్నట్లు చెప్పాడు. నౌకలను పంపే అంశం పరిశీలనలో లేదని జపాన్‌ ప్రధాని తకాయిచి పార్లమెంటులో చెప్పారు. ఆస్ట్రేలియా కూడా అదే బాటలో ఉంది. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రి కాజా కలాస్‌ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న చర్యలను మార్చాలనే కోరిక ఇప్పటికైతే తమకు లేదని చెప్పాడు. బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ కూడా తమ దేశం విస్తృత యుద్ధంలోకి రాదని అన్నాడు.

ఇలావుండగా…యుద్ధ లక్ష్యాల గురించి ట్రంప్‌ మాట మార్చాడు. తాము ముడి చమురు కోసం ఇరాన్‌ మీద దాడి చేయలేదని ట్రంప్‌ చెప్పుకున్నాడు. హార్ముజ్‌ జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా తమ మిత్ర దేశాల కోసమే దాడి చేసినట్లు మాట మార్చాడు. అందుకుగాను ఆ ప్రాంతంలో రక్షణ కోసం చైనా, జపాన్‌ వంటి దేశాలు యుద్ధ నౌకలను పంపాలని అన్నాడు. తమకు చమురు అవసరం లేదని, కావాల్సిన దానికంటే రెండింతల ఎక్కువ ఉందని, మా మంచి మిత్రుల కోసమే దాడి చేశామని అన్నాడు. నిజానికి ఇతర దేశాలను రక్షించాలని తప్ప మా కోసం దాడులు చేయటం లేదన్నాడు. తమ మిత్ర దేశాలు ముఖ్యంగా నాటో దేశాల వైఖరి ఆశాభంగం కలిగించిందని ట్రంప్‌ చెప్పాడు. మేం మాత్రం వారికోసం ఎల్లవేళలా ఉండాలి, కాని వారు మాత్రం మాకోసం రారు అంటూ బి-2 స్పిరిట్‌ బాంబరు బొమ్మను చూపుతూ హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు మాకు ఎవరి అవసరమూ లేదని ఊగిపోయాడు. తమకు సహకరించకపోతే నాటోకు రానున్నది చెడు కాలమన్నాడు.

ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి గల్ఫ్‌, ఇతర దేశాలను యుద్ధంలోకి లాగాలని అమెరికా తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్‌ వైపు నుంచి క్షిపణుల వర్షం కురుస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా దాడులకు గల్ఫ్‌ దేశాలు పూనుకోలేదు. అమెరికాను నమ్మి నిజంగా తమ దళాలను రంగంలోకి దింపితే తలెత్తే పర్యవసానాల గురించి పైకి చెప్పుకోవటం లేదుగానీ అవి తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. పొద్దున లేస్తే ఇరాన్‌తో ముఖాముఖాలు చూసుకోవాల్సింది తామని…ఈ రోజు అమెరికా ఉంటుంది, రేపు వెళ్లిపోతుంది. తాము శాశ్వతంగా బలమైన ఇరాన్‌తో వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తప్పనిసరై అమెరికా స్థావరాలు ఉన్న కారణంగా కొన్ని ఆయుధాలను గల్ఫ్‌ దేశాల మీద ప్రయోగించాల్సి వస్తోంది తప్ప తమ కేంద్రీకరణ అంతా ఇజ్రాయిల్‌ మీదనే అని తాజాగా ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా యుద్ధ స్థావరాలున్న గల్ఫ్‌ దేశాల మీద దాడి చేస్తే అవి అమెరికాకు వ్యతిరేకంగా వ్యహరించాలనే ఎత్తుగడ ఉందని బహిరంగంగానే చెబుతున్నారు.

తాజా పరిణామాల్లో మరో ముఖ్యాంశం ఏమంటే ఇరాన్‌పై అమెరికా దాడి రష్యాకు పెట్రో డాలర్లను కురిపిస్తోంది. ట్రంప్‌ అనుకున్నదొకటి అవుతున్నది ఒకటి. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని అన్ని దేశాలకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. నరేంద్రమోడీ సైతం ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఏ మాత్రం పసిగట్టినా ట్రంప్‌ బెదిరించగానే రష్యా నుంచి చమురు కొనుగోలును సగానికి సగం తగ్గించి ఉండేవారు కాదు. ఇప్పుడు పరువూ పోయింది. రష్యా నుంచి వచ్చే రాయితీ కూడా లేదని చెబుతున్నారు. చమురుపై ఆంక్షలతో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ నాలుగేళ్లుగా కొంత ఇబ్బంది పడినప్పటికీ భారత్‌ చైనా కొనుగోళ్లతో నిలిచింది. ఇటీవల ట్రంప్‌ బెదిరించటంతో మన దేశం సగానికి కొనుగోళ్లను తగ్గించింది. హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో అనేక దేశాల నుంచి ఒత్తిడి పెరగటంతో రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ”అనుమతి” ఇచ్చింది. దీంతో ప్రస్తుతం రోజుకు 15 కోట్ల డాలర్ల మేర పుతిన్‌ సర్కార్‌కు రాబడి వస్తోంది.
పన్నెండు రోజుల తరువాత బ్రిక్స్‌ కూటమి అధ్యక్ష స్థానం (భారత్‌)…ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఖండించింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్‌ నేతలతో మాట్లాడారు. ఆ తరువాతే మన దేశానికి ఎల్‌పిజి ని తీసుకువచ్చే మూడు ట్యాంకర్లను సురక్షితంగా హార్ముజ్‌ జలసంధి నుంచి ఇరాన్‌ అనుమతించింది. మన దేశంపై వచ్చిన ఒత్తిడి, వంట గ్యాస్‌ సెగ తగిలిన తరువాతగాని మన నేతలకు తత్వం తలకెక్కలేదని చెప్పవచ్చు!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

04 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Ali Hosseini Khamenei, BJP, China, Donald trump, Narendra Modi Failures, Netanyahu, us and israel attack iran, Vladimir Putin, West Asia Crisis

ఎం. కోటేశ్వరరావు

ఫిబ్రవరి 28న అడ్డగోలుగా అమెరికా, ఇజ్రాయిల్‌ మిలిటరీ దళాలు ఇరాన్‌పై దాడులను ప్రారంభించాయి. ఆ దేశ సుప్రీమ్‌ నేత అయతుల్లా అలీ ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర సీనియర్‌ నేతలను అనేక మందిని హత్య చేశాయి. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా తనకున్న సత్తామేరకు ఆత్మరక్షణ ఎదురు దాడులు చేస్తోంది. అమెరికా దాడుల ఆంతర్యం గురించి మీడియాలో రోజూ వస్తున్న వార్తల పూర్వ రంగంలో మరోసారి చెప్పనవసరం లేదు. అనేక కోణాల గురించి చర్చ జరుగుతున్నది.
ఇక అంతా వారే చేశారంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ మాజీ అధ్యక్షులైన బరాక్‌ ఒబామా, జో బైడెన్ల మీద విరుచుకుపడ్డాడు. వారిద్దరూ నిద్రపోయిన కారణంగానే ఇరాన్‌ అణుముప్పు తలెత్తిందని ఆరోపించాడు. ఈ పెద్దమనిషి టెహ్రాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా తప్పుకొని చేసిందేమిటి? తాను గనుక వైదొలగకపోతే ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు ఈపాటికే ఇరాన్‌ అణుబాంబులను తయారు చేసి ఉండేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లగల ఆయుధాలను రూపొందించు కోవటం తమ హక్కని, ఇతరులకు అది లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సుదూర ప్రాంతాల లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను మనం కూడా తయారు చేస్తున్నాం. ఏదో ఒక రోజు ఇరాన్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌ గాకపోతే మరొకడు మనకూ వర్తింపచేయడని గ్యారంటీ ఏముంది ?
ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తే వాటిని ఇజ్రాయిల్‌ మీద ప్రయోగిస్తుందన్నది ఒక ఆరోపణ. మరి ఇజ్రాయిల్‌ ఎవరి మీద ప్రయోగించేందుకు అణుబాంబులను తయారు చేసినట్లు? అణ్వాయుధాలను రూపొందించిన వారందరూ ఎవరో ఒకరి మీద ప్రయోగించేందుకు అన్న అమెరికా అడ్డగోలు వాదనలను మన దేశంలోని కొందరు సమర్ధిస్తుంటారు. మరి మనం ఎవరి మీద వేసేందుకు రెండుసార్లు అణుపరీక్ష జరిపినట్లు? ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ కూడా బాంబులను కలిగి ఉన్నాయి వాటి గురించి అమెరికా మాట్లాడదేం! అనేక సార్లు ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయిల్‌ తమ ఏజంట్లను ప్రయోగించి దాడులు చేశాయి. అనేక మంది శాస్త్రవేత్తలను చంపివేశాయి. కాస్పియన్‌ సముద్రంలో ఇరాన్‌ సహజ వాయువు పైప్‌లైన్లను 2024 ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌ ధ్వంసం చేసింది. ఏప్రిల్‌ నెలలో సిరియా రాజధాని డెమాస్కస్‌ లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం మీద దాడికి ప్రతిగా ఇరాన్‌ ఎదురు దాడి చేసింది తప్ప…తర ఏ సందర్భంలోనూ ముందుగా అది టెల్‌అవీవ్‌ మీద దాడులు చేయలేదు.
అమెరికా, ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే దేశాలు, సాయుధ బృందాలకు ఇరాన్‌ సాయం చేయటం సరైంది కాదు కదా! ఈ వాదన చేస్తున్న వారు ఐరాస నిర్దేశించిన పాలస్తీనా ప్రాంతాలను తీర్మానం చేసిన మరుసటి రోజు నుంచే ఇజ్రాయిల్‌ ఎందుకు ఆక్రమించుకొని పాలస్తీనియన్లను ఆ ప్రాంతాల నుంచి తరిమివేస్తున్నట్లు? దానికి పశ్చిమ దేశాలు ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు? తమ మాతృభూమి కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇస్తున్నది ఇరాన్‌, అడ్డుకొనే దుర్మార్గానికి ఆసరా ఇస్తున్నవి అమెరికా, దాని మిత్ర దేశాలు. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని అవి మావే అని చెబుతున్న ఇజ్రాయిల్‌ దుండగాలను సమర్ధిస్తున్నవారు ఏదోఒక సాకుతో మరో దేశాన్ని ఆక్రమించరనే హామీ ఏముంది? కెనడాను తమ 51వ రాష్ట్రంగా మార్చాలని ట్రంప్‌ అంటే తప్పు పట్టిన అదే కెనడా నేడు అమెరికా దుండగానికి, పాలస్తీనా ఆక్రమణలో ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్నది. పాలస్తీనా ప్రాంతాలు తమ రక్షణకు హామీగా కావాలని యూదు దురహంకారులు చెబుతున్నట్లే అమెరికా రక్షణకు గ్రీన్‌లాండ్‌ అవసరం అంటున్న అమెరికా చర్యను విమర్శించిన ఫ్రాన్సు, బ్రిటన్‌, జర్మనీ ఇప్పుడు ఇరాన్‌పై దాడిని సమర్ధిస్తున్నాయి. తమ స్థావరాలను వినియోగించుకొని మరింత మంది పసిపిల్లలను చంపమని, గాజాను నాశనం చేసిన మాదిరి ధ్వంసం చేయమని చెబుతున్నట్లు కాదా!
చరిత్రలో యూదులకు అన్యాయం జరిగిందని, ఇజ్రాయిల్‌ బాధిత దేశం అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యూదులు నీచులంటూ మధ్యయుగాల్లోనే పశ్చిమాసియా ప్రాంతం నుంచి మధ్యయుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో తరిమివేశారు. నాజీ మూకలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దేశాల్లో ఊచకోత కోశాయి. వారికి న్యాయం చేసే పేరుతో మాతృభూమిగా ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారన్నది ఒక వాస్తవం. అదే సమయంలో పాలస్తీనా కూడా అవతరించాలని ఐరాస చేసిన నిర్ణయం గడచిన ఎనిమిది దశాబ్దాలుగా అమల్లోకి రాకపోతే ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు ఎందుకు ప్రశ్నించరు? వారికి మాతృభూమి లేకనే ఇరుగు పొరుగు దేశాల్లో తల దాచుకుంటున్నారు. తమ దేశ ఏర్పాటు కోసం సాయుధ పోరాట మార్గాన్ని కొందరు చేపట్టారు. అలాంటి సంస్థలలో ఒకటైన హమాస్‌ 2023 అక్టోబరు ఏడున దాడి చేసి 1200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా పట్టుకోవటాన్ని ప్రపంచంలో ఎవరూ సమర్ధించలేదు. కానీ ఆ పేరుతో గాజాలో 70 వేల మందిని ఊచకోత కోసిన ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని హమాస్‌ చర్యను ఒకే గాటన కట్టటం ఏ విధంగా సమర్ధనీయం? మన దేశం పాలస్తీనా ఏర్పాటును పూర్తిగా సమర్ధించింది. కానీ ఇటీవల ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లి హమాస్‌ దురాగతాన్ని ఖండించారు తప్ప ఇజ్రాయిల్‌ మారణకాండ గురించి పల్లెత్తు మాట అనలేదు. మానవత్వం గురించి కబుర్లు చెబితే ఎలా! దాడులు ప్రారంభమైన తరువాత ఇజ్రాయిల్‌, ఇతర దేశాలతో మాట్లాడారు తప్ప ఇరాన్‌ నేతలకు మోడీ ఎందుకు ఫోన్‌ చేయలేదు! పోనీ ఇరాన్‌ మన శత్రు దేశమా? కాదే, అమెరికా బెదిరించేవరకు 2019కు ముందు చమురు దిగుమతి చేసుకన్నాంగా !
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు, అందువలన అతగాడు మరణిస్తే సంతాపం తెలపాల్సిన అవసరం లేదు, ఖండించాల్సిన పని కూడా లేదంటున్నారు. పోనీ కాసేపు నిజమే అనుకుందాం. వెనిజులా అధ్యక్షుడు మదురో మన వ్యవహారాల్లో వేలు పెట్టలేదుగా, చమురు సరఫరా చేశాడుగా, అతన్ని అమెరికా కిడ్నాప్‌ చేస్తే ఎందుకు ఖండించలేదో ఎవరైనా చెప్పగలరా? ఆర్టికల్‌ 370 రద్దును ఖమేనీ వ్యతిరేకించాడని అంటున్నారు. ఆ మాటకు వస్తే చైనా కూడా వ్యతిరేకించింది, అయినా సీ జిన్‌పింగ్‌తో మోడీ చెట్టపట్టాలు వేసుకోలేదా? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును పాక్‌ పాలిత ప్రాంతమని, మన అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్‌ను భారత పాలిత ప్రాంతంగా అమెరికా వర్ణించింది. అంటే కాశ్మీరు మనది అని చెప్పకపోయినప్పటికీ అమెరికాతో సన్నిహితంగా మసలుతున్నాం. ఖమేని మరణానికి సంతాపం తెలపాలా లేదా అన్నది ఒక సమస్య. కచ్చితంగా చెప్పాలని ఎవరూ అనటం లేదు, అయితే హత్యను, ఇరాన్‌ మీద దాడిని ఖండించాలా లేదా, ఎందుకు నోరువిప్పటం లేదు! కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఇరాన్‌ మన మిత్ర దేశమే అని చెబుతున్నారు కదా? ఎందుకుని వారితో మాట్లాడలేదు! ఈ వైఖరి ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే మనం అమెరికా చంకనెక్కాం, దాని హత్యాకాండను సమర్ధించాం అని కాదా !
ఇరాన్‌కు కోపం ఉంటే అమెరికా, ఇజ్రాయిల్‌ మీద తీర్చుకోవాలిగానీ గల్ఫ్‌ దేశాల మీద దాడులు చేయటం ఏమిటన్నది మరొక అతి తెలివి వాదన. ఒక వేళ తమ మీద దాడి చేస్తే అమెరికా వైమానిక స్థావరాలు, నౌకల మీద విరుచుకుపడతామని పదే పదే ఇరాన్‌ ముందే ప్రకటించింది. అలాంటపుడు గల్ఫ్‌ దేశాలు తమ గడ్డ మీద ఉన్న స్థావరాల నుంచి అమెరికన్లను ఎందుకు ఖాళీ చేయించలేదు. స్థావరాలు ఎందుకు అంటే అమెరికా పెట్టుబడులు ఆ ప్రాంతంలో ఉన్నాయి గనుక వాటిని రక్షించుకొనేందుకని అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లుగా సమర్ధిస్తున్నారు. అమెరికా పెట్టుబడులు మన దేశంలో, చైనాలో కూడా ఉన్నాయి, మరి వాటి రక్షణకు మిలిటరీ స్థావరాలను నెలకొల్పలేదేం! మనకు పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రం లోని డిగోగార్షియా దీవుల్లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉంది. అక్కడ ఏం పెట్టుబడులు ఉన్నట్లు ? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్లుగా సాకులు చెబుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లోని స్థావరాలను ఉపయోగించుకొని అమెరికా ఇప్పుడు ఇరాన్‌ మీద దాడులు చేస్తున్నది. అందుకే వాటిని టెహ్రాన్‌ లక్ష్యంగా చేసుకుంది తప్ప ఆ దేశాల మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం అంటే ముందు హతమయ్యేది నిజం. అందువలన ఏ మాట, చర్య వెనుక ఏ ప్రయోజనం దాగుందో జనం తెలుసుకోవాలి!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !

28 Wednesday Jan 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Narendra Modi Failures, World Military Power, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

77వ రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన సైనిక బలగాల సత్తాను ప్రదర్శించారు. న్యూఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిపిన కవాతును చూసి దేశం యావత్‌ పులకించిపోయింది.ప్రతి దేశం రిపబ్లిక్‌ దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం, ఇతర ముఖ్య ఉదంతాలు ఉంటే ఆరోజున ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించి తమ శక్తి ఇదని ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు విశ్లేషకులు, కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలు, విశ్లేషణల్లో అతిశయోక్తులు దార్లాయి.ఈ నేపధ్యంలో ప్రపంచ మిలిటరీ బలం బలగాల గురించి పరిమితంగా అయినా ఒక్కసారి అవలోకనం చేసుకోవటం అవసరం. హిందూ మహాసముద్రం భారతదేశానిదే అని ఒక విశ్లేషకుడు చెప్పారు. ఒక దేశ సరిహద్దు నుంచి 12 నాటికల్‌ మైళ్ల(ఒక్కో నాటికల్‌ మైలు 1.852 కిలోమీటర్లకు సమానం) వరకు ఆయా దేశాలకు సర్వహక్కులు ఉంటాయి.పన్నెండు నుంచి 24 నాటికల్‌ మైల్స్‌ వరకు కస్టమ్స్‌, వలసలు,కాలుష్యాలకు సంబంధించిన చట్టాలు అమలు చేసే అధికారం ఉంటుంది.రెండువందల నాటికల్‌ మైల్స్‌ వరకు సముద్ర ఉత్పత్తులు,ఆ పరిధిలో ఉన్న ఖనిజవనరులను తవ్వితీసుకొనే హక్కు ఆయాదేశాలకు ఉంటుంది. ఆపైన ఉండే ప్రాంతం అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. శ్రీలంక-భారత్‌ మధ్య దూరం 288 కిలోమీటర్లు మాత్రమే ఉన్నందున సమదూరంతో సరిహద్దుల నిర్ణయం జరిగింది. నిజానికి హిందూమహాసముద్రం అంటే మనదేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు. పొడవు 9,600, వెడల్పు 7,600 కిలోమీటర్లు ఉంది.మనదేశానికి ఇది మూడువైపుల ఉంది. దీనిలో అందరికీ తెలిసిన అరేబియా సముద్రం, బంగాళాఖాతం,మరికొన్ని ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.వీటన్నింటినీ కలిపి హిందూ మహాసముద్రం అంటున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం వరకు విస్తరించి ఉంది.

మనదేశం వద్ద 1,500 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ నౌకలను దెబ్బతీసే సామర్ధ్యం గల దీర్ఘశ్రేణి క్షిపణి (ఎల్‌ఆర్‌-ఎఎస్‌హెచ్‌ఎం)తో చైనా,అమెరికా నౌకలను కూడా దెబ్బతీయగలవని విశ్లేషకుడు చెప్పారు. అది నిజమే, ఎప్పుడు యుద్ధం వచ్చినపుడు, ఎదుటి వారు దాడికి దిగనంతవరకు మాత్రమే.హిందూమహాసముద్ర అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించిన ఏ దేశనౌకనైనా వెంటనే పేల్చివేయటానికి ఉండదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అలాంటి క్షిపణులను తయారు చేసే దేశంగా మనం ఇటీవలనే సామర్ధ్యం సంపాదించుకున్నాం.మనకంటే బలమైన మిలిటరీ శక్తి ఉన్న విషయాన్ని దాచి ప్రపంచంలో మనకు ఎదురులేదని ఎవరైనా చెపితే అది వాట్సాప్‌ పాండిత్యం తప్ప మరొకటి కాదు. వర్తమాన బలా బలాల గురించి ఈ సందర్భంగా చూద్దాం.మన దగ్గర ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయోగించగల ఖండాంతర క్షిపణి అగ్ని-5 ఉంది. ఇతర దేశాలలో మినిట్‌మాన్‌- అమెరికా క్షిపణి 13,000 కిమీ, రష్యాలో ఆర్‌ఎస్‌- 28 శాటమాన్‌ క్షిపణి పదకొండువేల కి.మీ, చైనా వద్ద డాంగ్‌ ఫెంగ్‌-41 రకం తొమ్మిదివేల కిలోమీటర్లు ప్రయాణించగలవి ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద గరిష్టంగా 15వేల కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి తయారీలో ఉన్నట్లు ఊహాగానాలు. దాని వద్ద శక్తివంతమైన ద్రీర్ఘశ్రేణి క్షిపణులు ఉన్నకారణంగా తేడా వస్తే తన మిత్రదేశంగా ఉన్న జపాన్‌ మీద ప్రయోగించగలదనే భయంతోనే అమెరికా ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరిస్తున్నది. ఇలా ఒకరిని మించి ఒకరు తమ ఆయుధాలకు పదునుపెట్టుకుంటున్నారు.ఇప్పటికే ప్రపంచంలో చైనా నావికాదళశక్తిలో ఒకటవ స్థానంలో ఉంది. అమెరికా వద్ద అన్ని రకాల యుద్ధ నావలు 471 ఉండగా చైనా 1,025 భారత్‌ 290 మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే అమెరికా వద్ద విమానవాహక యుద్ద నౌకలు 11, చైనా దగ్గర మూడు, భారత్‌ వద్ద రెండు ఉన్నాయి. ఈ పూర్వరంగంలో మనదేశం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆయుధాలను తయారు చేసుకోవాల్సిందే అనటం నిర్వివాదాంశం. దీనిలో భాగంగానే అణ్వస్త్రాలను తయారు చేసుకొనే అవకాశాలను అట్టిపెట్టుకొని అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాం.గతంలో రెండుసార్లు మనం అణుపరీక్షలు జరిపినపుడు మిత్రదేశం అంటూనే మన మీద కక్షతో అమెరికా ఒక్కటే ఆంక్షలు విధించింది.శత్రువైరుధ్యాలు ఉన్నప్పటికీ చైనా అలాంటి చర్యలకు పాల్పడలేదు.

మానవాళికి ముప్పు తెచ్చే యుద్ధాలు వద్దనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. కానీ ఉన్మాదంతో కొందరు ఊగిపోతున్నారు. పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని దెబ్బతీసే మన తాజా క్షిపణి ధ్వని వేగం (గాలిలో గంటకు 1,225కిలోమీటర్లు) పది మాక్‌లంటే 12,250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని పావు గంటలోనే పని ముగిస్తుందని చెబుతున్నారు. ఇది మన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అయితే వారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. రష్యా వద్ద 27 మాక్‌ల అవన్‌గార్డ్‌, చైనా వద్ద 27మాక్‌ల డిఎఫ్‌-41, అమెరికా దగ్గర ట్రైడెంట్‌ 24, మినిట్‌మాన్‌ 23,రష్యా వద్ద 20.64మాక్‌ల క్షిపణులు ఉన్నాయి. అందువలన మాదేవుడే అందరికీ అంటే ఎలా అంగీకరించటం లేదో ఇది కూడా అంతే. మన గొప్ప గురించి మనం చెప్పుకోవచ్చు తప్ప మనమే గొప్ప అంటే జనాలను తప్పుదారి పట్టించినట్లే. మన మిలిటరీ అజేయమే అయితే నరేంద్రమోడీ మన ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు వెనక్కు తీసుకురాలేదు, ఆపరేషన్‌ సింధూర్‌లో మరికొంత మందుకు పోయి ఉంటే పని జరిగేది కదా అని అనేక మంది అనుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం యుద్ధాల్లో కావాల్సింది ఎప్పటి సమాచారాన్ని అప్పుడు తెలియచేసే పరిజ్ఞానం. ఉక్రెయిన్‌కు అలాంటి సత్తాలేనప్పటికీ పశ్చిమ దేశాలు అందచేసిన సమాచారంతో గడచిన నాలుగు సంవత్సరాలుగా రష్యాను అడ్డుకోవటమే గాక, కొన్ని దాడులు కూడా చేయగలుగుతున్నదంటే కారణం అదే. ఆపరేషన్‌ సింధూర్‌లో తొలి రోజు మనకు ఎదురుదెబ్బలు తగలటానికి కారణం పాకిస్తాన్‌కు పశ్చిమదేశాలు(అమెరికాతో సహా) అందించిన సమాచారమే కారణంగా కొందరు భావిస్తున్నారు.

అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం మిలిటరీ అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహాలు అమెరికా వద్ద 247, చైనా 157, రష్యా 110,ఫ్రాన్స్‌ 17, ఇజ్రాయెల్‌ 12, ఇటలీ 10, మనదేశం 9, జర్మనీ 8,బ్రిటన్‌ 6, స్పెయిన్‌ 4 కలిగి ఉన్నాయి.అందువలన భూమి చుట్టూ తిరిగే అవి ఒకదాని వెనుక ఒకటి సమాచారాన్ని పసిగడితేనే 24గంటల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు.మిలిటరీతో సహా అన్ని అవసరాలకు గాను అమెరికా 5,176, బ్రిటన్‌ 653, చైనా 623, రష్యా 181, జపాన్‌ 88 కలిగి ఉండగా మనదేశం 62 కలిగి ఉంది. అయితే ఈ ఉపగ్రహాలు సేకరించే సమాచారం కూడా మిలిటరీ అవసరాలకు ఉపయోగపడుతుంది.ఈ కారణంగానే ప్రపంచంలో ఏమూల ఏమిజరిగినా అమెరికా ఇట్టే పసిగడుతున్నదంటే ఈ వ్యవస్థలే కారణం. ఇటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రపంచానికి భద్రత లేదని, తనకు అన్ని వైపుల నుంచీ ముప్పు ఉన్నదని అమెరికా ప్రపంచాన్ని నమ్మించేందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నది. గ్రీన్‌లాండ్‌ ప్రాంతాన్ని తాము ఆక్రమిస్తామని చెప్పిన ట్రంప్‌ తమ దేశ రక్షణకు ఉన్న ” గోల్డెన్‌ డోమ్‌ ” వంటిదాన్నే ఆ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఏమిటిది అంటే గగనతలం నుంచి జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించటం.మన రామాయణ, మహాభారత కథలో అలాంటివి చూసే ఉంటారు. రాక్షసులు యాగాన్ని కొనసాగ నివ్వకుండా చేసేందుకు చూస్తే రక్షణగా రాముడిని నియమించిన సంగతి, మహాభారతంలో బాణాలతో అర్జునుడి పరాక్రమం తెలిసిందే.కొన్ని దశాబ్దాలకు ముందే అమెరికా హాలీవుడ్‌ స్టార్‌వార్స్‌పేరుతో సినిమాలు తీసింది. ఇప్పుడు నిజంగానే అలాంటి గగనతల యుద్ధాలు జరుగుతున్నాయా ? అమెరికా కనుసన్నలలో పని చేసే సంస్థలు, కొందరు వ్యక్తులు రష్యా, చైనా ఈ రంగంలో ముందున్నాయని, ప్రపంచానికి ముప్పు ఉందని ప్రచారం చేస్తున్నారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడన్నట్లుగా తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. అంతా రహస్యంగా జరుగుతున్న వ్యవహారం గనుక ఈ పోటీ గురించి చెబుతున్న అంశాలను అవుననీ, కాదని చెప్పలేము.

భూ కక్ష్యలో ఉపగ్రహాలను దెబ్బతీసే సాంకేతిక పరిజ్ఞానం(ఎసాట్‌) ప్రతిదేశం కలిగి ఉండాలని అందరూ చెబుతున్నారు. గగనతల కేంద్రంగా ఆయుధాలు కావాలని అమెరికా మిలిటరీ నిపుణులు బహిరంగంగానే చెప్పారు.ఈ విషయంలో రష్యన్లు, చైనీయులు తమ సామర్ధ్యాలను ఎంతో ఆధునికంగా కనపరుస్తున్నారని, దాన్ని కాదనలేమని బ్రిటన్‌లోని డుర్హామ్‌ విశ్వవిద్యాలయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం సహడైరెక్టర్‌ బ్లెడిన్‌ బోవెన్‌ చెప్పాడు. నిజంగా అలాంటి వేదికలు ఇప్పుడు ఉన్నాయో లేదో చెప్పలేము గానీ అవసరమైన సాంకేతికతలను వారు చూపుతున్నారని అన్నాడు. ఒక ఉపగ్రహాన్ని నేరుగా దెబ్బతీయటం,ఇతరంగా కూల్చివేయటం వాటిలో ఒకటి.భూతలం నుంచి సముద్రాల్లో నౌకలను ముంచివేయటం, టెర్మినళ్లను దెబ్బతీయటం, ఎలక్ట్రానిక్స్‌ ద్వారా చేసేవన్నీ గగనతల పోరులో భాగమే అన్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ పోరులో స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ వంటి ప్రైవేటు ఉపగ్రహసేవలను అందించేవారు రష్యన్ల ఆయుధాలను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని, సైబర్‌దాడులకు పాల్పడుతున్నారని, అదే విధంగా రష్యా నుంచి సంకేతాలను అడ్డుకోవటాన్ని గమనించినట్లు బోవెన్‌ చెప్పాడు. గగనతల దాడుల ఆయుధాలను తయారు చేయకూడదన్న ఒప్పందాల మేరకు నాడు సోవియట్‌ వెనక్కు తగ్గిందని ఇప్పుడు రష్యా తిరిగి పూనుకున్నట్లు కనిపిస్తున్నదని రాండ్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎం క్లింటాక్‌ ఆరోపించాడు. సాధారణంగా గగనతలంపై రష్యా పరిమితంగానే ఆధారపడుతుందని, అదే అమెరికా తన ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలకు గరిష్టంగా ఆధారపడుతున్నది. రోజువారీ ఉపగ్రహ ప్రయోగాలను చూస్తే చైనా కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తున్నదని క్లింటాక్‌ చెప్పాడు. ముందే చెప్పుకున్నట్లు ట్రంప్‌ ప్రస్తావించిన ”గోల్డెన్‌ డోమ్‌ ” ఏర్పాటుకు 1983 నాటి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రకటించిన స్ట్రాటజిక్‌ డిఫెన్స్‌ ఇనిషియేటివ్‌ నాంది. దీన్నే స్టార్‌వార్స్‌ అని పిలిచారు.దీనిలో గగనతలంలో ఉండే పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే గోల్డెన్‌ డోమ్‌ వ్యవస్థ అణ్వాయుధాల నుంచి రక్షణ కల్పించలేదు గానీ ఇతరంగా ఎంతో ఉపయోగం అని బోవెన్‌ చెప్పాడు. గతంలో ఎదురైన అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించారని, గగనతలంలో అడ్డుకోవటం సంక్లిష్టమైనదని, వాటిని వేగంగా రూపొందించటం, పరీక్షించటం అంతతేలిక కాదని అంటున్నారు.

అంతరిక్ష రంగంలో మనదేశం అనేక విజయాలను సాధించింది. అయితే ఇంకా ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.చైనా తన సోషలిస్టు వ్యవస్థను కాపాడుకొనేందుకు అమెరికాతో పోటీ అని చెప్పకపోయినప్పటికీ మిలిటరీ రీత్యా బలాన్ని పెంచుకుంటున్నది, ఆర్థికంగా దానికా శక్తి ఉంది. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు మిలిటరీ మీద అవసరమైనదాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.మనదేశం 109 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంటే (జిడిపి 4లక్షల కోట్ల డాలర్లు) చైనా 303 బిలియన్‌ డాలర్లు (జిడిపి 19లక్షల కోట్ల డాలర్లు) వెచ్చిస్తున్నది.అమెరికా 831 బిలియన్‌ డాలర్లు (జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు) కేటాయించింది.తన ఆయుధ ప రిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా వెచ్చిస్తున్నది, చైనా స్వంతంగా తయారు చేసుకొనేందుకు పూనుకుంది.మనం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం. అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తే ఓకే, మనం కూడా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే పోటీపడే ఆర్ధిక శక్తి ఉందా లేదా అన్నది ముందు చూసుకోవాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !

21 Wednesday Jan 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, EU vs US, Green Land, Greenland annexation By US, Narendra Modi Failures, NATO

ఎం కోటేశ్వరరావు

గ్రీన్‌లాండ్‌ కోసం అమెరికా ఎంత దూరం వెళుతుందో మీరు చూస్తారంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఐరోపా నేతలకు ఒక సవాలు విసిరాడు. దవోస్‌ ప్రపంచ వాణిజ్య వేదిక సమావేశాలకు వెళ్లే ముందు ట్రంప్‌ మాటలివి. గ్రీన్‌లాండ్‌లోని అమెరికా మిలిటరీ కేంద్రానికి ఒక యుద్ధ విమానం కూడా వచ్చిందన్న వార్తలు ఒకవైపు, ఏం చేయాలో తోచక ఐరోపా కూటమి మరోవైపు. ప్రపంచ పరిణామాలు సామాన్యుల ఊహకు అందకుండా మారుతున్నాయి. అనేక దేశాల, దేశాధినేతల బండారాలు బయటపెడుతున్నాయి.కడుపులో చల్ల కదలకుండా కాలు మీద కాలువేసుకు కూర్చుందామంటే కుదరదు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అంటూ రెండు పక్షాలనూ సంతుష్టీకరించాలంటే జరిగేది కాదు. వెనెజులా మన మిత్రదేశమే, చౌకగా చమురు తెచ్చుకున్నాం, డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించగానే మానేశాం, ఆ దేశ అధ్యక్షుడు మదురో, సతీమణిని కిడ్నాప్‌ చేసినా తప్పని చెప్పలేకపోయాం.ఇరాన్‌ కూడా మనకు మిత్రదేశమే. మన రూపాయలు తీసుకొని చమురు విక్రయించింది.అమెరికా బెదిరించగానే అక్కడి నుంచీ కొనుగోలు నిలిపివేశాం. ఆ దేశం మీద దాడులు చేస్తాం, పాలకులను మార్చివేస్తామని పెద్దన్న అమెరికా బెదిరిస్తుంటే తగదని అనలేకపోయాం. ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలో అక్కడ ఉన్న మనవారిని వెనక్కు రప్పించేందుకు, పుతిన్‌కు చెప్పి దాడులు ఆపించామని చెప్పుకున్నాం, ప్రత్యేక విమానాలు పంపి భారతీయులను స్వదేశానికి రప్పించాం. కానీ ఇరాన్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రమ్మని సుభాషితం మాత్రమే చెప్పాం తప్ప విమానాలు పంపి వెనక్కు తీసుకురాలేదు. కొన్ని సమయాల్లో కొందరు ఎలా ప్రవర్తిస్తారో గుర్తు చేసేందుకే ఇవి. ఈ సందర్భంగా అమెరికా బెదిరింపులపై ఐరోపా స్పందన గురించి విశ్లేషించుకుందాం.

డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో కమ్యూనిస్టు చైనా మీద పన్ను ఉగ్రవాదదాడులను ప్రారంభించగానే అనేక మంది సంతోషించారు.చైనా వస్తువుల ధరలు పెరిగితే అంతకంటే చౌకగా అమెరికాకు ఎగుమతి చేసి లాభం పొందవచ్చని డాలర్‌ కలలు కన్నారు. ఇప్పుడు అదే ట్రంప్‌ తన పరబేధాలు లేకుండా బస్తీమే సవాల్‌ అందరి సంగతి చూస్తా అంటూ కొరడా ఝళిపిస్తుంటే దిక్కు తోచక దిక్కులు చూస్తున్నారు.చైనా మూడు చేపల కథలో దీర్ఘదర్శి మాదిరి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతున్నది. ప్రస్తుతం ఐరోపా ఇరకాటంలో పడింది. మదురోను కిడ్నాప్‌ చేసి వెనెజులా చమురు సంపదలన్నింటినీ స్వంతం చేసుకుంటామన్నపుడు దానికి పట్టలేదు. ఇప్పుడు డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామనగానే ఐరోపా సమాఖ్యకు గొంతులో పచ్చివెలక్కాయపడినట్లయింది. ఆర్కిటిక్‌ సముద్రంలోని ఆ మంచుదీవిని అన్నమాట ప్రకారం స్వాధీనం చేసుకోకపోతే అమెరికన్ల దృష్టిలో ట్రంప్‌ చులకన అవుతాడు. ఆక్రమించుకుంటే ఐరోపా సమాఖ్య అభాసుపాలవుతుంది. ఆపరేషన్‌ ఆర్కిటిక్‌ ఎండ్యూరెన్స్‌( ఆర్కిటిక్‌ ప్రాంతానికి బాసట) పేరుతో పరిమిత వన్యాసాలు జరిపేందుకు గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా పన్నెండు దేశాలు మిలిటరీ అధికారులు, సిబ్బందిని పంపేందుకు నిర్ణయించాయి, కొన్ని దేశాల నుంచి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. నిజంగా అమెరికా దురాగతానికి దిగి బలవంతంగా స్వాధీనానికి పూనుకుంటే వారు చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ ఉండదు. అయితే ఈ మాత్రానికే ఆగ్రహించిన ట్రంప్‌ ధిక్కారమును సైతునా అంటూ ఐరోపా దేశాల వస్తువుల మీద ఫిబ్రవరి ఒకటి నుంచి అదనపు సుంకాలు విధిస్తానని ప్రకటించాడు.

అయితే దీనికి ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై 108 బిలియన్‌ డాలర్ల మేర ప్రతి సుంకాలు విధించేందుకు ఆలోచిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది.తోటి నాటో దేశాన్ని మరో సభ్య దేశం ఆక్రమించుకోవటం ఏమిటి అని గట్టిగా ఖండించలేక ఆమోదించలేక ఇతర దేశాలు సతమతం అవుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ మా ఒక్కరి భద్రతకోసమే కాదు, ఐరోపా రక్షణకూ అవసరమే అని, తాము స్వాధీనం చేసుకోకపోతే రష్యా, చైనా ఆక్రమిస్తే మీకు అంగీకారమేనా అంటూ ట్రంప్‌ యంత్రాంగం ఎదురుదాడికి దిగింది. ఐరోపా యూనియన్‌ పరిస్థితిని చూస్తే అమెరికాను ఎదిరించే స్థితిలో లేదు. గత ఎనిమిది దశాబ్దాలుగా ఐరోపా రక్షణ బాధ్యత పేరుతో నాటో ఖర్చులో అధిక భాగం అమెరికా భరించింది. ఆ మేరకు పొదుపు మొత్తాలను పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాలకు మళ్లించిన ఐరోపా అనేక విధాలుగా రెండు ప్రపంచ యుద్ద నష్టాల నుంచి కోలుకున్నది. ఐరోపా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నది. ఉభయుల వాణిజ్యలావాదేవీల విలువ 2024లో 976 బిలియన్‌ డాలర్లు ఉండగా అమెరికా వస్తు ఎగుమతులు 370 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అందుకే దిగుమతి పన్ను అదనంగా వేస్తా అని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇది ఐరోపా బలహీనత కాగా అదే పరిస్థితి అమెరికాకూ ఉంది, 2015-19 సంవత్సరాలతో పోలిస్తే 2020-24 నాటికి అమెరికా నుంచి ఐరోపా దేశాలు దిగుమతి చేసుకున్న ఆయుధాలు 28 నుంచి 52శాతానికి పెరిగాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత ఇది జరిగింది. అందువలన మాతో తెగేదాకా లాగితే ఆయుధ దిగుమతులు తగ్గిస్తామని ఐరోపా సంకేతాలు పంపుతున్నది. అంతే కాదు చైనాతో లావాదేవీలు పెంచుకోవాల్సి వస్తుందని కూడా చెబుతున్నది. అందుకే దాగుడుమూతలాడుతున్నాయి. చైనా ప్రమాదాన్ని చూపి భారత్‌ను తన బుట్టలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, అదే ఎత్తుగడతో రష్యాను చూపి ఐరోపాను తన అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నది. అందుకే అప్పుడప్పుడు మిత్రవైరుధ్యాలు తలెత్తినప్పటికీ వాటిని శత్రువుల స్థాయికి తీసుకువెళ్లకుండా రాజీపడుతున్నాయి. ఇది ఎల్లకాలమూ సాధ్యమౌతుందా ?

తన ఆర్థిక బలం, మిలిటరీ బలగాలను చూపి గరిష్టంగా లబ్దిపొందేందుకు, ప్రభావాన్ని మరింతగా పెంచుకొనేందుకు అమెరికా పూనుకుంది.అయితే బలహీనమైన అంశాల పట్ల కఠినంగా, బలమైన వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది ఐరోపా.దాన్లో భాగమే అమెరికా వస్తువులపై పన్ను వేస్తామని హెచ్చరించటంగా చెప్పవచ్చు. అట్లాంటిక్‌ దేవాల మధ్య ఇదొక తీవ్రమైన సంక్షోభానికి గుర్తు అని తాజా పరిణామాల గురించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. అంత తేలికగా అమెరికా వత్తిడికి ఐరోపా లొంగే అవకాశాలు లేవని కొందరు చెబుతున్నారు. ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు ఇప్పటి వరకు ఐరోపా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లుగా చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌ కావాల్సిందేనని ఆదివారం నాడు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ మరోసారి చెప్పాడు. ఆ ప్రాంతం అమెరికాలో అంతర్భాగం గాకపోతే రక్షణ అసాధ్యమన్నాడు. రక్షణ పేరుతోనే క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటాన్ని విమర్శించేవారు గ్రీన్‌లాండ్‌ విలీనాన్ని ఎలా సమర్ధించుకుంటారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా తమ చర్య అందరికీ మంచిదని, యూరోపియన్స్‌ దీన్ని అర్ధంచేసుకుంటారని భావిస్తున్నా అని మాత్రమే బెసెంట్‌ చెప్పాడు. ట్రంప్‌ ఈ విషయంలో వెనక్కు తగ్గకపోతే అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందానికి ఐరోపా పార్లమెంటు ఆమోద ముద్రవేసే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. బలవంతంగా ఒప్పించటాన్ని వ్యతిరేకించే సమాఖ్య 2023 నాటి ఆయుధంతో అమెరికాను దెబ్బతీయాలని ఫ్రాన్సు పిలుపునిచ్చింది. ఒకవైపు అమెరికాను అడ్డుకోవాలని అంటున్న ఐరోపా దేశాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం లేదు. గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో మిలిటరీ విన్యాసాలకు దూరంగా ఉండాలని జర్మనీ నిర్ణయించింది. శుక్రవారం నాడు వచ్చిన జర్మనీ మిలిటరీ బృందం ఆదివారం నాడు వెనక్కి వెళ్లింది. అమెరికా వత్తిడి తప్ప మరొక కారణం లేదు. ఈ మిలిటరీ విన్యాసంలో పాల్గన్నదేశాల మీద ప్రత్యేకించి పన్నులు విధించాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి అన్నమాట ప్రకారం పన్నులు వేస్తారా లేక బేరసారాల కోసం వాయిదా వేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

ఐరోపా ప్రతిపన్ను హెచ్చరిక కూడా ఎత్తుగడలో భాగమే అంటున్నారు. అమెరికాతో తెగతెంపులు చేసుకుంటే ఎనిమిది దశాబ్దాలుగా అనుసరించిన విధానాలన్నింటినీ మార్చుకోవాల్సి ఉంటుంది. అది ఒక్క గ్రీన్‌లాండ్‌తోనే సమసిపోదు. మొత్తం నాటో కూటమి ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది.ప్రపంచ బలాబలాల్లో వచ్చే మార్పులు తమకు లాభదాయకమా లేక అమెరికాతో ఉంటేనే మంచిదా అన్న మధింపు జరిగిన తరువాత నిర్ణయాత్మక పరిణామాలు జరుగుతాయి తప్ప ఇప్పటికిప్పుడు జరిగే అవకాశాలు పరిమితం. అసలు గ్రీన్‌లాండ్‌తో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో ఐరోపా మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ఒక వ్యూహం అనుసరిస్తున్నదని చెబుతున్నారు. గతేడాది డిసెంబరులో జాతీయ భద్రతా వ్యూహం పేరుతో రూపొందించిన పత్రంలో ఐరోపా సమాఖ్యలో రాజకీయ స్వేచ్చను బలహీనపరుస్తున్నారని, రాజకీయ వ్యతిరేకతను, భావ ప్రకటనా స్వేచ్చను అణచివేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.మరోవైపు ఐరోపాలో ఇటీవలి కాలంలో తలెత్తిన మితవాద జాతీయోన్మాద శక్తులను అమెరికా ప్రోత్సహిస్తున్నట్లు ఈ విమర్శల మర్మం అంటున్నారు. విద్వేష ప్రసంగాలను అదుపు చేసే చర్యల్లో భాగంగా ఇంటర్నెట్‌లో చొప్పిస్తున్న వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకున్న సాంకేతిక విభాగ ఐరోపా మాజీ కమిషనర్‌ తియెరీ బ్రెటన్‌పై అమెరికా ఆంక్షలు విధించటం కూడా వత్తిడిలో భాగమే అంటున్నారు. అమెరికా కంపెనీల పట్ల నిబంధనలను చూసీచూడనట్లు పోవాలని, వాటికి అవకాశాలను పెంచాలని ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ వత్తిడి చేస్తున్నారు.అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలన్న ట్రంప్‌ ఏలుబడిలో అది మరింతగా బరితెగించినట్లు కనిపిస్తోంది. ఐరోపాను ఒక వలస ప్రాంతంగా చూస్తూ తన నిబంధనలను అక్కడ రుద్దాలని చూస్తోందని, అందుకుగాను ఎంతకైనా తెగిస్తోందని ఐరోపా వర్గాలు భావిస్తున్నాయి.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇంతగా గతంలో ఎన్నడూ ఐరోపా పట్ల అమెరికా వ్యతిరేకత వెల్లడి కాలేదేని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు.తమను నాశనం చేయాలని వాషింగ్టన్‌ చూస్తున్నదని ఇనిస్టిట్యూట్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ నతాలీ టోసీ చెప్పారు. ఉదారవాద ప్రజాస్వామ్యం, ఐరోపా ఒక్కటి కావటం తమకు వ్యతిరేకంగా పరిగణిస్తున్నదని కూడా అన్నారు. నాటో అనుకూల ఐరోపా దేశాల్లో అమెరికా పట్ల పునరాలోచనకు నాంది పడింది.గ్రీన్‌లాండ్‌ గురించి అమెరికా చాలా కాలం క్రితమే తన వాంఛను వెల్లడించింది. డెన్మార్క్‌ మిలిటరీ గూఢచార సేవల విభాగం గత డిసెంబరులో తొలిసారి అమెరికా తమ జాతీయ భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించిందని ఒక నివేదికలో పేర్కొన్నది. తన మిత్రదేశాలను కూడా వదలకుండా అధిక పన్నులతో సహా ఆర్ధిక బలాన్ని వినియోగిస్తున్నదని, చివరికి మిలిటరీ ఫోర్సు వినియోగంలో కూడా వదలటం లేదని దానిలో ప్రస్తావించారు. ఈ పూర్వరంగంలోనే డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడరిక్సన్‌ తోటి నాటో సభ్యదేశంపై అమెరికా దాడికి దిగుతానని చెప్పటాన్ని గర్హించారు. భద్రత గురించి అమెరికా మీద అతిగా ఆధారపడటం మంచిది కాదని కొందరు నిపుణులు హెచ్చరించటం పెరుగుతోంది. ఇలా ఆధారపడిన కారణంగా స్వతంత్ర ఆత్మరక్షణ సామర్ధ్యం మీద ప్రభావం పడుతుందని, ఐరోపా మిలిటరీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రష్యా, చైనాల రక్షణ బడ్జెట్ల కంటే ఎక్కువగా 2025 ఐరోపా 447 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టినందున స్వతంత్ర మిలిటరీని ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదని ప్రశ్నిస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో యూరోలు ఖర్చు చేస్తే ప్రయోజనం లేదని, కీలకమైన గూఢచర్యం, నిఘా, భౌతిక పరిస్థితి వివరాలపై అమెరికా మీద ఆధారపడకతప్పదని, అనేక రంగాలలో ఐరోపా వెనుకబడి ఉందని మరికొందరు చెబుతున్నారు. అణ్వాయుధాలు తమ దగ్గర మాత్రమే సురక్షితంగా ఉంటాయని అమెరికన్లు భావిస్తున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్సు దగ్గర ఉన్నవి అవాంఛనీయ శక్తుల చేతుల్లో పడకుండా చూసేందుకు గాను మొత్తం ఖండ సాంప్రదాయ రక్షణ సామర్ధ్యాలను 2027 నాటికి తమ అదుపులోకి తెచ్చుకోవాలని వాషింగ్టన్‌ కోరుకుంటున్నదని రాయిటర్స్‌ వార్తలో పేర్కొన్న అంశాలు ఐరోపాలో ఆందోళనకు గురిచేశాయి. మొత్తం మీద ఐరోపాలో అమెరికాతో సంబంధాల గురించి ఒక మధనం ప్రారంభమైంది, అది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో, ఏ రూపంలో ఉంటుందో చూడాల్సి ఉంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

14 Wednesday Jan 2026

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, Denmark, Donald trump, Greenland annexation By US, NATO, RUSSIA, The Battle Over Greenland:

ఎం కోటేశ్వరరావు

ప్రస్తుతం డెన్మార్క్‌లో స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొనేందుకు అమెరికా రంగం సిద్దం చేసింది. ఆప్రాంతాన్ని తమ 51వ రాష్ట్రంగా స్వాధీనం చేసుకొనేందుకు అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధుల సభ సభ్యుడు రాండీ ఫైన్‌ ఒక బిల్లును ప్రవేశపెట్టాడు.ఈ దురాగతాన్ని ఐక్యంగా అడ్డుకోవాలని డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ నిర్ణయించాయి. గతంలో వాణిజ్యం పేరుతో ఐరోపా సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్‌,డచ్‌, పోర్చుగీసు,ఫ్రాన్సు వంటి దేశాలు ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాయి. ఆక్రమంలో వాటి మధ్య యుద్ధాలు కూడా జరిగాయి.ఇప్పుడు తన భద్రతకు ముప్పు పేరుతో ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా పావులు కదుపుతోంది. మాదకద్రవ్యాలను సరఫరా చేసే ముఠాకు నాయకుడంటూ తప్పుడు ప్రచారం చేసి వెనెజులా అధ్యక్షుడిని అపహరించింది. ఇరాన్‌లో ప్రజాందోళలను అణచివేస్తున్నందున జోక్యం చేసుకుంటామని బెదిరిస్తున్నది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఆర్కిటిక్‌ సముద్రంలో ఉన్న డెన్మార్క్‌కు చెందిన స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్‌ దీవి తన రక్షణకు అవసరమంటూ దాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకుంది. అన్ని ఖండాలలో 800కు పైగా చిన్నా, పెద్ద మిలిటరీ కేంద్రాలు, లక్షలాది మంది సైన్యాన్ని మోహరించిన అమెరికా ఏ దేశం మీదనైనా దాడికి దిగదలుచుకుంటే కొన్ని గంటల్లోనే సైన్యాన్ని దించగలదు. అలాంటిది చిన్న దేశమైన క్యూబా మొదలు పెద్ద దేశమైన చైనా వరకు అన్నీ తన భద్రతకు ముప్పు తలపెట్టాయంటూ ఒక మైండ్‌ గేమ్‌(మానసిక క్రీడ) ఆడుతోంది. ఆ సాకుతో బెదిరింపులకు, ఆక్రమణలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చెప్పిన అనేక మధురమైన మాటలతో ఇంక పనిలేదు, అనుకున్న లక్ష్యాలు నెరవేరటం లేదంటూ కర్ర పుచ్చుకొని దందాకు పూనుకుంది. తనకు లొంగని వెనెజులా మీద దాడి చేసి అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అపహరించి విచారణ తతంగం ప్రారంభించింది. ఆ దేశానికి తానే తాత్కాలిక అధ్యక్షుడనని ట్రంప్‌ ప్రకటించుకున్నాడు. తదుపరి లక్ష్యాలుగా కెనడా,గ్రీన్‌లాండ్‌,ఇరాన్‌, మెక్సికో, కొలంబియా ఇలా జాబితాను పెంచుకుంటూ పోతోంది.

ఇరాన్‌ మీద గతేడాది భీకరదాడి జరిపినప్పటికీ అది సాధించిందేమీ లేదు. అణుస్థావరాలకు ఆవగింజంత నష్టం కూడా జరగలేదని తేలింది. అందువలన ఇప్పుడు మరోసారి దాడి జరగాలంటే అనేక అంశాలను మదింపు చేసుకోవాల్సి ఉంటుంది. అందువలన తొలుత గ్రీన్‌లాండ్‌తో ఆక్రమణ ప్రారంభం కావచ్చన్నది ఒక అభిప్రాయం. ఒక గుండా ముందుగా బలహీనులనే దాడికి ఎంచుకుంటాడు. దాని వలన రెండు ప్రయోజనాలు ఒకటి నా తడాఖా ఇట్లుంటది అని చూపుకోవచ్చు, మిగిలిన వారిని బెదిరించవచ్చు. గ్రీన్‌లాండ్‌ను తాను స్వాధీనం చేసుకోనట్లయితే రష్యా, చైనా ఆక్రమించుకుంటాయని అందువలన తానే ఆపని చేయనున్నట్లు ట్రంప్‌ ఒక అబద్దాన్ని చెప్పాడు. నిజానికి అలాంటి ఆరోపణలను ఏ దేశం లేదా వాటిని వ్యతిరేకించే మీడియా కూడా చేసేందుకు సాహసించలేదు.జనాలను తప్పుదారి పట్టించేందుకు ఒక పధకం ప్రకారం గోబెల్స్‌ను మించి ప్రచారాలు చేయటంలో అమెరికా పేరుమోసింది.ఆర్కిటిక్‌ సముద్రంలో అనేక దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి.ఎక్కడా దాపరికం లేదు, చైనా కూడా అదే చేస్తోంది. కానీ గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొనేందుకే అని బీజింగ్‌ మీద కథనాలు రాస్తున్నారు. ఆర్కిటిక్‌ సముద్రంలో మంచుకరిగి పోతున్నదని గత మూడుదశాబ్దాలుగా అనేక మంది చెబుతున్నారు, దాని పరిణామాలు, పర్యవసానాల గురించి పరిశోధనలు చేయటం ఆ ప్రాంత దేశాలైన నార్వే, డెన్మార్క్‌, స్వీడన్‌,ఐస్‌లాండ్‌, కెనడా, అమెరికా, రష్యా, ఫిన్లాండ్‌ దేశాలకే కాదు, యావత్‌ మానవాళికి అవసరం.అయితే అవి అంగీకరించిన అంతర్జాతీయ చట్టాలు, నిబంధనల మేరకు జరగాలి. ప్రస్తుతం వార్తలోకి ఎక్కిన గ్రీన్‌ లాండ్‌ దీవి డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం. అది డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌కు అమెరికా రాజధాని వాషింగ్టన్‌డిసికి మధ్యలో రెండు దేశాలకు 3,200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రష్యాకు ఐదువేలు, చైనాకు ఎనిమిది, మనదేశానికి తొమ్మిదివేల కిలోమీటర్లు ఉంటుంది.గ్రీన్‌లాండ్‌ రాజధాని నుక్‌ పట్టణం డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌కు 3,500 కిలోమీటర్ల దూరంలో ఉంటే అమెరికా నగరం న్యూయార్క్‌కు 2,900కి.మీ దూరంలో ఉంది. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని చెబుతున్న అమెరికా, ఆర్కిటిక్‌ సర్కిల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రాంతంలో పరిశోధనలు చేసే హక్కు చైనాతో సహా ఏ దేశానికైనా ఉంటుందా లేదా ! ప్రచ్చన్న యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలో అమెరికా, సోవియట్‌ యూనియన్‌ కూడా అణుజలాంతర్గాములను మోహరించాయి. ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతాన్ని ఒక యుద్ధ కార్యక్షేత్రంగా మార్చేందుకు అమెరికా పూనుకుంది. ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లో ఉన్న తన మిలిటరీ కేంద్రాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తనకు ఆ దీవి పూర్తిగా కావాలని, మర్యాదగా ఇస్తే సరి, లేకుంటే బలప్రయోగం చేయాల్సి వస్తుందని బెదిరింపులకు దిగింది. రష్యా, చైనా నుంచి ఆర్కిటిక్‌ ప్రాంతానికి ముప్పు వచ్చిందని 2024లోనే అమెరికా ప్రచారం ప్రారంభించింది.

గ్రీన్‌లాండ్‌ ప్రాంతంపై అమెరికా కన్ను ఎందుకు ? ఆర్కిటిక్‌ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయి, అక్కడి సర్వేలో తేలిన 34 రకాల్లో 25 విలువైన ఖనిజ జాబితాలో ఉన్నాయి. నౌకా రవాణా మార్గంగా ఉండటం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతం కావటంతో దాన్ని తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని, చైనా, రష్యాలను మరింతగా ఇబ్బంది పెట్టాలన్నది అసలు లక్ష్యం.ఇదే జరిగితే ఐరోపా భద్రత, ప్రపంచ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌ భౌగోళికంగా ఉత్తర అమెరికాలో ఉంది, ఐరోపాలోని డెన్మార్క్‌లో భాగం అయినప్పటికీ స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ప్రపంచంలోని పెద్ద దీవి.జనాభా కేవలం 60వేల లోపే, వారు కూడా ఎక్కువగా చేపలవేట మీదే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాల నిర్వహణకు డెన్మార్క్‌తో అమెరికా రక్షణ ఒప్పందాలు చేసుకుంది. పర్యావరణ మార్పులతో మంచు కరిగిపోతుండటంతో నూతన నౌకా మార్గాలు ఏర్పడ్డాయి.ప్రయాణ దూరం తగ్గింది,ముడి చమురు, గ్యాస్‌, విలువైన ఖనిజాల వంటి లక్షల కోట్ల డాలర్ల విలువగల సహజవనరుల వెలికితీతకు మార్గం ఏర్పడింది.మిలిటరీ నిఘాకూడా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఆక్రమణను నిరోధించేందుకు అమెరికా ప్రవేశానికి డెన్మార్క్‌ అనుమతించింది. ఈ ప్రాంతాన్ని తమకు అమ్మాలని 1946లోనే వాషింగ్టన్‌ ప్రతిపాదించినప్పటికీ అంగీకరించలేదు.

ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియాలను దగ్గర చేసేందుకు సూయజ్‌ కాలువ మీదుగా కంటే ఆర్కిటిక్‌ ప్రాంతం అనువుగా ఉండటం, దూరం తగ్గటం, సమయం, ఖర్చు కూడా తగ్గుతుండటంతో ఇటీవలి కాలంలో నౌకా రవాణా పెరిగింది. చైనా, రష్యా నౌకలు సంచరిస్తున్నాయి. రష్యా నుంచి చైనాకు చమురు రవాణాకు ప్రత్యామ్నాయ నౌకా మార్గంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఆ నౌకల మీద నిఘాపెంచాలంటే అమెరికన్లకు ఈ దీవి ఎంతో అనువుగా ఉంటుంది.దీనితో పాటు ఉపగ్రహాలకూ అనువైన ప్రాంతం. ప్రస్తుతం కొన్ని రంగాలకు చమురు, బంగారం కంటే విలువైన ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా వీటిపై 90శాతం అదుపు కలిగి ఉంది, ఎవరు తోక ఝాడించినా వాటి ఎగుమతులు నిలిపివేసి ప్రతీకారం తీర్చుకుంటున్నది.అమెరికా కూడా దాని మీద ఆధారపడి ఉండటంతో ఎక్కడ అలాంటి వనరులుంటే వాటిని సొంతం చేసుకొనేందుకు అమెరికా పూనుకుంది. లిథియం, కోబాల్ట్‌,చమురు, గ్యాస్‌ పుష్కలంగా ఉన్నాయి.

గ్రీన్‌లాండ్‌ ఆక్రమణకు పూనుకుంటే ఐరోపా ఎలా స్పందిస్తున్న అంశాన్ని ఇప్పుడు అమెరికా మదింపువేస్తున్నది. నాటో ప్రారంభ దేశాలలో డెన్మార్క్‌ ఒకటి. ఇప్పుడు దాని స్వయం పాలిత ప్రాంతాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవటం అంటే నిబంధనలకు విరుద్దం. నాటో దేశాలన్నీ దాన్ని ఎదుర్కోవాలని నిబంధన ఉంది. అయితే గతంలో టర్కీ-గ్రీస్‌ మధ్య తలెత్తిన వివాదంలో నాటో నాయకత్వం చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా ? ఆదివారం నాడు బ్రిటన్‌, జర్మనీ నాయకత్వంలో కొన్ని దేశాల ప్రతినిధులు సమావేశమై ఆర్కిటిక్‌ ప్రాంత భద్రత గురించి మరింత సమన్వయంతో పని చేయాలని నిర్ణయించినట్లు వార్తలు. ఒక దేశసార్వభౌమత్వానికి వ్యతిరేకంగా అమెరికా చేసిన వ్యాఖ్యల పూర్వరంగంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కెనడా కూడా కోరింది. అయితే ముసుగులో కుమ్ములాట మాదిరి తప్ప నేరుగా అమెరికాను విమర్శించటానికి ఇంకా ముందుకు రావటం లేదు. తాము అమెరికన్లుగా మారటానికి సిద్ధంగా లేమని గ్రీన్‌లాండ్‌ ప్రధాని జేన్స్‌ ఫ్రెడరిక్‌ నీల్సెన్‌తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక ప్రకటన చేశాయి. తమ భవిష్యత్‌ను తామే నిర్ణయించుకుంటామని స్పష్టం చేశాయి.ఆర్కిటిక్‌ ప్రాంతంలో తమ వ్యతిరేకులను అడ్డుకోవటానికి ప్రాధాన్యత ఇస్తామని అమెరికా అధ్యక్ష భవనం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.అంతకు ముందు జనవరి నాలుగున ట్రంప్‌ స్వయంగా మాట్లాడుతూ గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో రష్యా, చైనా నౌకలు తిరుగుతున్నందున తమ జాతీయ భద్రతా అవసరాల రీత్యా ఆ ప్రాంతం తమకు కావాలని చెప్పాడు. ఎలా స్వాధీనం చేసుకోవాలా అన్నది అధ్యక్షుడు తన బృందంతో చర్చిస్తున్నాడని,మిలిటరీ వినియోగ అవకాశం ఎప్పుడూ ఉంటుందని అధ్యక్ష భవన ప్రకటన తేటతెల్లం చేసింది. 1979 నుంచి గ్రీన్‌లాండ్‌ డెన్మార్క్‌లో స్వయంపాలిత ప్రాంతంగా ఉంది, ప్రజాభిప్రాయ సేకరణ తరువాత స్వాతంత్య్రం ప్రకటించుకొనే అవకాశం కూడా 2009 నుంచి దానికి వచ్చింది. అయితే ఇంతవరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు.నిజానికి ట్రంప్‌ 2019లోనే గ్రీన్‌లాండ్‌ స్వాధీనం గురించి చెప్పాడు. ట్రంప్‌ వ్యాఖ్యలు వెలువడిన జనవరి నాలుగునే డెన్మార్క్‌ ప్రధాని మెటీ ఫ్రెడరిక్సన్‌ ఖండించారు.డెన్మార్క్‌ రాజరికంలోని మూడు ప్రాంతాలలో ఏ ఒక్కదానిని విలీనం చేసుకొనే హక్కు అమెరికా లేదని ఆమె పేర్కొన్నారు. ఫారో దీవి కూడా గ్రీన్‌లాండ్‌ వంటిదే అన్నారు, మరో దేశంగానే గాక చారిత్రకంగా సన్నిహితంగా ఉన్న దేశం మీద అమెరికా ఇలాంటి కోరికలను వెలిబుచ్చటం తగదన్నారు.

అమెరికా విస్తరణ కాంక్ష ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదు. కెనడా తమ 51వ రాష్ట్రం కావాలని గతంలోనే ట్రంప్‌ కోరిన సంగతి తెలిసిందే. అందువలన కెనడియన్లు కూడా అప్రమత్తం కావాలని అనేక మంది హెచ్చరిస్తున్నారు.గ్రీన్‌లాండ్‌తో పోల్చితే కెనడా పక్కనే ఉంటుంది, అక్కడ కూడా సహజ సంపదలు పుష్కలంగానే ఉన్న సంగతి తెలిసిందే.ప్రపంచంలో అధిక చమురు నిల్వలున్న దేశాల్లో నాలుగవదిగా ఉంది. బ్రిటన్‌ నుంచి రెండు దేశాలూ స్వాతంత్య్రం పొందినవే. గత రెండువందల సంవత్సరాల్లో లాటిన్‌ అమెరికాలో అమెరికన్లు జరపని కుట్ర లేదు, అనేక ప్రభుత్వాలను కూల్చివేశారు, అనేక మందిని హత్య చేయించారు. మొత్తం పశ్చిమార్ధగోళం తమకిందే ఉండాలని పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.చరిత్రలోకి చూస్తే కెనడాను ఆక్రమించుకొనేందుకు అమెరికా 1812లోనే ప్రయత్నించింది.1939వరకు కెనడాను ఆక్రమించాలనే మిలిటరీ వ్యూహాన్ని కొనసాగించి తరువాత ఉపసంహరించుకుంది, ట్రంప్‌కు ఆ గతం గుర్తుకు వచ్చి ఉంటుంది.కెనడా వర్తమాన చరిత్రను చూస్తే అన్ని అంశాల్లోనూ అమెరికాతో కలసి అనేక దాడుల్లో భాగస్వామిగా ఉంది.నాటో కూటమిలో కూడా చేరింది.అయితే కొన్ని సందర్భాలలో అమెరికా వైఖరితో విబేధించింది. అణ్వాయుధాల మోహరింపుకు అంగీకరించలేదు, వియత్నాంపై యుద్దాన్ని అంగీకరించలేదు. క్యూబా విషయంలో కూడా సానుకూలంగా ఉంది.చివరికి తన ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా రుద్దిన ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో మెక్సికోతో కలసి భాగస్వామి అయింది.గల్ఫ్‌వార్‌లో అమెరికాతో కలసిపనిచేసింది.వీటితో పాటు కొన్ని మిత్రబేధాలు ఉన్నాయి. అందుకే తాజా పన్ను ఉగ్రవాదాన్ని ట్రంప్‌ కెనడాకూ విస్తరించాడు.ఈ పూర్వరంగంలో చూసినపుడు గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొంటే ఐరోపా, మిగతా ప్రపంచం ఎలా స్పందిస్తుందో చూసిన తరువాత కెనడాను కూడా తనదారికి తెచ్చుకుంటుందా ? చూద్దాం ! హొహొహొహొహొహొహొహొహొహొహొహొహొహొహొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

24 Wednesday Dec 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Education, Europe, Germany, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti-science politics, Attack on Scientific Temperament, Donald trump, Hitler’s Gift, India pseudoscience, Narendra Modi Failures, RSS, Trump assault on science

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో రెండవసారి అధికారానికి వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తికాకుండానే డోనాల్డ్‌ ట్రంప్‌ సైన్సు, సంబంధిత అంశాలపై దాడులు చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా సైన్సు రక్షణకు అక్కడి శాస్త్రవేత్తలు నడుంకట్టారు. గత పదకొండు నెలల కాలంలోనే ట్రంప్‌ వేగవంతంగా, తీవ్రమైన దాడులు ఐదువందలసార్లు చేశాడని ఆ రంగం తీరుతెన్నులను పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు. అనేక సంస్థలలో అశాస్త్రీయ భావాలు కలవారితో నింపుతున్నాడు. పొమ్మనకుండానే పొగబెట్టినట్లుగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు నిధుల కోత పెడుతున్నాడు. ఈ వైఖరి సైన్సుపై నిరంకుశత్వంగా వర్ణిస్తూ దాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధులు కావాలని, వచ్చే ఏడాది చేపట్టే కార్యాచరణకు గాను డిసెంబరు 31లోగా విరాళాలు ఇవ్వాలని ” తాపత్రయపడే సైంటిస్టుల యూనియన్‌ ” పిలుపునిచ్చింది. మనతో సహా ప్రపంచంలో అనేక దేశాల్లో ఆశాస్త్రీయ కుహనా సైన్సును జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతున్నది.

డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సైన్సు మీద జరుపుతున్నదాడి వలన అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అది స్వయంగా చేసుకొనే తీవ్రహాని అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులు పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావటాన్ని సహించలేని ట్రంప్‌ వాటికి నిధులు కోతపెడతానని బెదిరించిన సంగతి తెలిసిందే.వాటితో నిమిత్తం లేకుండానే శాస్త్రపరిశోధనలను నిరుత్సాహపరిచేందుకు బిలియన్లకొద్దీ నిధులకోత ప్రారంభించాడు. ప్రధాన పరిశోధనా సంస్థల బడ్జెట్‌లో 50శాతం కోత పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీంతో అనేక మంది శాస్త్రవేత్తలు అమెరికా వీడటం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో హిట్లర్‌ యూదులపై జరిపిన ఊచకోత నుంచి తప్పించుకొనేందుకు ఆ సామాజిక తరగతికి చెందిన అనేక మంది విద్యావంతులు, శాస్త్రవేత్తలు అమెరికా, ఇతర ఐరోపా దేశాలకు వలసలు పోయారు.ఆ దేశాల్లో అనేక నవకల్పనలకు ఆద్యులయ్యారు. దీంతో ఇతర దేశాలకు ” హిట్లర్‌ ఇచ్చిన బహుమతి ” అని ఈ పరిణామాన్ని వర్ణించారు. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా అదే చేస్తున్నారని చెబుతున్నారు. ఈ చర్యలతో చైనాతో సహా ఐరోపా ధనికదేశాలన్నీ లబ్దిపొందుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దేశాల్లో ప్రతిభావంతులకు పట్టం కట్టేందుకు పెద్ద మొత్తాలలో నిధులు కేటాయించారు. ట్రంప్‌ శాస్త్ర సలహాదారైన మైఖేల్‌ క్రాటిసియోస్‌ మాట్లాడుతూ సైన్సు అసమర్ధంగానూ, కనపడకుండా కంటిమీద గట్టి పొరలా మారిందని, ప్రత్యామ్నాయాలను చూడనిరాకరించేవారి బందీగా మారినందున అంతటినీ మార్చివేయాలని చెప్పాడు. ఇలాంటి వారి మాటలను విన్నతరువాత 80ఏండ్ల ట్రంప్‌కు బుర్రపని చేస్తుందని ఎలా అనుకోగలం.

శాస్త్ర పరిశోధనలకు గత కొన్ని దశబ్దాలుగా అమెరికా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే, వివిధ రంగాలలో నోబెల్‌ బహుమతి గ్రహీతల్లో సగం మంది అక్కడి నుంచే ఉన్నారు.అలాంటి చోట శాస్త్రంపై కత్తికట్టటం అంటే అది ఒక్క అమెరికాకే కాదు, యావత్‌ ప్రపంచానికి నష్టం.ఇప్పటికీ అనేక వ్యాధులకు కారణాలు, చికిత్సలు సవాలుగానే ఉన్నాయి. ట్రంప్‌ తీసుకున్న మతిమాలిన చర్యల కారణంగా అనేక పరిశోధనలు అర్ధంతరంగా ఆగటం లేదా ఆలశ్యానికి దారితీస్తాయి.అన్ని దేశాల్లో ఉన్నట్లే బ్యూరోక్రసీ అమెరికాలో కూడా తక్కువేమీ కాదు.ఐదు రోజుల పనివారంలో రెండు రోజులు ప్రయోగశాలలకు బదులు ప్రభుత్వ యంత్రాంగ కాగితాలు నింపటానికే రెండు రోజులు పోతున్నదని అనేక మంది శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నమాట నిజం. నివారణకు మార్గాలు వెతకాలి తప్ప అసలు పరిశోధకులనే తొలగిస్తే ఎలా ? అమెరికా అనుసరిస్తున్న ప్రతికూల విధానాల ఫలితంగా అక్కడ ఉండేవారి సంఖ్య తగ్గుతోంది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలకు విదేశాలకు వెళ్లాలని దరఖాస్తుచేసుకున్నవారు 2024 మొదటి మూడునెలలతో పోలిస్తే మూడో వంతు పెరిగింది.అమెరికాకు రావాలనుకొనే వారు నాలుగోవంతు తగ్గారు.ఒకసారి ఉన్న పేరుపోతే తిరిగి తెచ్చుకోవటం కష్టమని అనేక మంది చెబుతున్నా ట్రంప్‌ చెవికి ఎక్కటం లేదు. అమెరికా మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నతంగా ఉండటానికి శాస్త్రపరిశోధనలే కారణమని, అలాంటివి లేకపోతే ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తుందని ఆందోళన చెందేవారు మరోవైపు ఉన్నారు. శాస్త్రవిజ్ఞానాన్ని మానవాళి సౌభాగ్యానికి వినియోగించాలి. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు ఎక్కడ జరిగినా కాస్త వెనుకా ముందూ ప్రపంచంలోని వారందరికీ అందుబాటులోకి వస్తాయి. అలాంటి పరిశోధనా రంగంలో ముందున్న అమెరికా ఒక్కసారిగా జెండా ఎత్తేస్తే లోకమంతా అలాగే ఉంటుందని కాదు గానీ, పరిశోధనలు ఆలశ్యమౌతాయి.

శాస్త్రపరిశోధనలు ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం అవుతున్నందున వాటిని ఆయుధాలుగా చేసుకొని వెనుకబడిన దేశాలను దోపిడీ చేయటం కూడా ఒక వాస్తవం. ఉదాహరణకు అధిక దిగుబడి వంగడాలను తయారు చేసిన దేశాలకు చెందిన సంస్థలు పేటెంట్‌ హక్కుల పేరుతో ఎంత అధిక ధరలకు వాటిని ఎలా విక్రయిస్తున్నారో చూస్తున్నాం. వర్షాలు, వరదలు, దుర్భిక్షం వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే పసిగట్టే పరిజ్ఞానాన్ని మరింత నిర్ధిష్టం కావించాలి. అది అమెరికాకూ అవసరమే అక్కడి కొన్ని రాష్ట్రాలలో సంభవించిన ప్రమాదకర వరదలు, తుఫాన్లను సకాలంలో పసిగట్టగలిగి ఉంటే నష్టాలు తగ్గి ఉండేవి. జలుబుకు కారణమౌతున్న వైరస్‌లు అమెరికాలో ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వలన డెంగీ ఎంత ప్రమాదకరంగా ఉందో తెలిసిందే. రాజకీయాలలో ప్రపంచమంతటా మితవాద శక్తులు పెరిగిపోతున్నట్లుగానే ప్రపంచంలో శాస్త్రవిజ్ఞానాన్ని వ్యతిరేకించే మూఢత్వం కూడా పెరుగుతున్నది. కరోనా సమయంలో మనదేశంతో సహా ప్రపంచమంతటా అలాంటి శక్తులు ఎలా రెచ్చిపోయాయో చూశాము. శాస్త్రవేత్తలు, వైద్యుల సలహాలను పక్కన పెట్టి, వాక్సిన్‌ను వ్యతిరేకంచే శక్తుల మాటలు నమ్మి లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సందర్భంగా లాక్‌డౌన్లు విధించినందుకు పెట్రోలు, డీజిలు వ్యాపారుల లాబీ రంగంలోకి దిగి లాక్‌డౌన్ల వలన ఆర్థిక వ్యవస్థలకు నష్టం అని ప్రచారం చేయించటాన్ని కూడా చూశాము. కరోనా లేకుండానే సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వలన కలిగిన నష్టం ఎంతో, ఎందుకు సంభవించిందో వారు చెప్పారా ? కరోనా గురించి మీడియా సంస్థలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశాయో కూడా చూశాము.కరోనా, వాతావరణమార్పులు వాస్తవం కాదని, వాక్సిన్ల వలన ప్రయోజనం లేదని అమెరికా, ఐరోపాలోని ప్రముఖ మీడియా సంస్థలు చేసిన తప్పుడు ప్రచారం తెలిసిందే.

పర్యావరణానికి కలుగుతున్న హాని, వివిధ వ్యాధుల నివారణకు అవసరమైన వాక్సిన్లపై జరిపే పరిశోధనలకు ట్రంప్‌ సర్కార్‌ నిధుల కోత పెడుతున్నది, సిబ్బందిని తగ్గిస్తున్నది. వాతావరణ మార్పులపై పరిశోధన చేస్తున్న ఎన్‌సిఏఆర్‌ వంటి సంస్థలను ఎత్తివేయాలని చూస్తున్నది. వచ్చే ఏడాది ఎలాంటి దాడులను చేస్తుందో తెలియదు, 2025లో పరిశోధనా ప్రయత్నాలు, కీలకమైన శాస్త్రీయ సమాచారంతో పౌరులందరికీ అందుబాటులో వెబ్‌సైట్లను మూసివేసింది.ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే లేదా వ్యతిరేకించేవారి మీద దాడులకు ఉసిగొల్పుతున్నది, పదవుల నుంచి తొలగిస్తున్నది. ప్రజారోగ్య రక్షణలో ముందున్న డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సిడిసి) అధిపతిగా సుసాన్‌ మోనారెజ్‌ బాధ్యతలు స్వీకరించినపుడు అనేక మంది పరిశోధకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమెకు రాజీపడని మైక్రోబయాలజిస్ట్‌ మరియు ఇమ్యునాలజిస్ట్‌ శాస్త్రవేత్తగా పేరుంది. ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలుగా పని చేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే ఆగస్టులో ట్రంప్‌ ఆమెను బయటకు పంపాడు. ఒక శాస్త్రవేత్తగా రాజీపడని కారణంగానే తనను తొలగించారని ఆమె చెప్పారు.సిడిసిలో కొంత మంది శాస్త్రవేత్తలను తొలగించాలని,ఎలాంటి శాస్త్రీయ సమాచారం లేకపోయినప్పటికీ కొన్ని వాక్సిన్లకు ఆమోద ముద్ర వేయాలని ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌ కెనడీ జూనియర్‌ తనపై తెచ్చిన వత్తిడికి లొంగని కారణంగా తప్పుడు ఆరోపణలతో తొలగించినట్లు ఆమె చెప్పారు. ఈ మంత్రి గతంలో అమెరికాలో అత్యంత అవినీతి సంస్థగా సిడిసిని వర్ణించాడు. వాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కెనడీ వాక్సిన్ల విషయంలోనే ఆమెను వత్తిడి చేయటం అంటే సదరు కంపెనీల లాబీ ఎంతటి శక్తివంతమైనదో అర్ధం చేసుకోవచ్చు. బహిరంగంగా వాక్సిన్లను విమర్శించిన వారిని ఆ సంస్థలో చేర్చాడు. నాలుగో వంతు సిబ్బందిని తగ్గించాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ విధానాలు ప్రజారోగ్యానికి ముప్పు తెస్తాయని మోనారెజ్‌ హెచ్చరించారు.నిబద్దత, ఆత్మగౌరవం ఉన్న శాస్త్రవేత్త ఎవరూ తగిన శాస్త్రీయ సమాచారం లేకుండా వాక్సిన్‌ లేదా ఔషధాలను అంగీకరించరని సుసాన్‌ కూడా అదే చేశారని అనేక మంది ప్రశంసించారు. ఆమెకు మద్దతుగా ఒక వైద్యాధికారి, ముగ్గురు సీనియర్‌ సిడిసి శాస్త్రవేత్తలు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు.

శాస్త్రీయ భావనలు, వైఖరుల మీద ఒక్క అమెరికాలోనే కాదు అనేక దేశాల్లో మితవాదశక్తులు దాడులు చేస్తున్నాయి. గత పదకొండు సంవత్సరాల్లో మనదేశంలో కూడా అదే జరిగింది.ఊహాజనితమైన ఆశాస్త్రీయ సాంకేతికపరమైన అంశాలను అధికారంలో ఉన్న పెద్దలే ప్రచారం చేస్తున్నారు. సైన్సును కాపాడాలంటూ గత ఏడాది ఆగస్టులో అనేక పట్టణాల్లో ప్రదర్శనలు చేసిన శాస్త్రవేత్తలను చూశాము. శాస్త్రీయ భావజాలంపై దాడి, పరిశోధనలకు నిధుల కోత పెట్టటాన్ని, కుహనా సైన్సును ముందుకు తేవటాన్ని నిరసించారు. హిందూత్వ భావజాలానికి అనుగుణంగా విద్యావిధానం, సిలబస్‌లో మార్పులు తెస్తున్నారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయని, ఇతర నాగరికతల కంటే వేదకాలమే గొప్పదనే ప్రచారం చేస్తూ జనాలను నమ్మించేందుకు చూస్తున్నారు. పురాతన కాలంలోనే మన దేశంలో ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసని దానికి నిదర్శనం గణేషుడేనని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే పురాతన కాలంలోనే దేశంలో ఇంటర్నెట్‌, ఉపగ్రహాలు ఉన్నాయని త్రిపుర ముఖ్యమంత్రిగా పని చేసిన బిజెపినేత విప్లవదేవ్‌ చెప్పారు.అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు మహాభారతంలో విదురుడు కూడా ఆ పరిజ్ఞానంతోనే యుద్దంలో జరుగుతున్నదాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడని చెప్పేవారున్న సంగతి తెలిసిందే. పురాతన భారతీయ విజ్ఞానం పేరుతో అనేక కోర్సులను ఐఐటిలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెడుతున్నారు. హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడటానికి మాంసాహారం తినటమే కారణమని హిమచల్‌ ప్రదేశ్‌లోని మండి ఐఐటి డైరెక్టర్‌ లక్ష్మీధర్‌ బెహరా సెలవిచ్చారు. ఇలాంటి అంశాలకు ప్రయోగశాలగా ఐఐటిని మార్చారు. భారతీయ విజ్ఞాన కేంద్రం (ఐకెఎస్‌) పేరుతో ఖరగ్‌పూర్‌ ఐఐటి అనేక అశాస్త్రీయ అంశాలను ప్రచురించింది. ఈ పేరుతో జ్యోతిష్యం వంటి వాటిని నూతన విద్యావిధానంలో చొప్పించేందుకు పూనుకున్నారు. డార్విన్‌ సిద్దాంతాన్ని సిలబస్‌నుంచి తొలగించారు. పురాతన కాలంలో అనేక ఇతర నాగరికతల మాదిరి మనదేశంలో కూడా శాస్త్రవిజ్ఞానం వర్ధిల్లిన మాట నిజం, దానికి అనేక దృష్టాంతాలున్నాయి. వాటిని చూపి నాడు లేనివాటిని కూడా ఉన్నాయని చెప్పటం జనాలను తప్పుదారి పట్టించటమే.పురాణాల్లో ఉన్న పుష్పక విమానాలను చూసే మన సంస్కృత గ్రంధాల్లో ఉన్న సమాచారాన్ని తస్కరించి నేటి విమానాలను పశ్చిమదేశాల్లో తయారు చేశారని చెబుతారు. ఆ గ్రంధాలు మన దగ్గర ఉన్నపుడు మనవారెందుకు చేయలేకపోయారంటే సమాధానం ఉండదు.ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సైన్సు వ్యతిరేకచర్యలకు పాల్పడటం ఆశ్చర్యం కలిగించటం లేదు. అతగాడి విధానాలను కార్మికవర్గం ఎలా ప్రతిఘటిస్తున్నదో అదే విధంగా అమెరికా శాస్త్రవేత్తలు ప్రారంభించిన ఉద్యమం కూడా ముందుకు పోయి తగిన ప్రభావం చూపటం అనివార్యం. మనదేశంలో కూడా శాస్త్రవేత్తలు, పురోగామివాదులు ముందుకు వచ్చి అలాంటి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టకపోతే రానున్న తరాలు సైన్సు -జ్యోతిష్యాలలో దేన్ని నమ్మాలో తెలియని అయోమయానికి లోనవుతాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాకు చెంపపెట్టు – 2025 జి20 సభ !

26 Wednesday Nov 2025

Posted by raomk in Africa, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

2025 G20 Summit, Donald trump, G20 Johannesburg meet, Narendra Modi

ఎం కోటేశ్వరరావు

అమెరికా జి20 సదస్సును బహిష్కరించటమంటే ప్రపంచ ఆర్థిక ఆకర్షణ శక్తి వేరేవైపు మరలుతున్నదనేందుకు సూచిక అని కెనడా ప్రధాని మార్క్‌ కార్నే చెప్పాడు. ప్రపంచ రాజకీయాలలో కెనడా అమెరికా అనుయాయిగా ఉంటున్నది, కొన్ని సందర్భాలలో విబేధిస్తున్నది. నవంబరు 22,23వ తేదీలలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 2025 సంవత్సర జి20 శిఖరాగ్ర సమావేశంలో కార్నే చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్య చేశాడు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే అమెరికా కోడి కూయనంత మాత్రాన తెల్లవారకుండా ఉండదన్నాడు..” సంఘీభావం, సమానత్వం, సుస్థిరత ” అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. ఐరాస నిర్దేశించిన 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇంకా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. ఈ సదస్సును డోనాల్డ్‌ ట్రంప్‌ బహిష్కరించటమేగాక సమావేశ ప్రకటనను ఆమోదించవద్దంటూ ముందే అధ్యక్ష స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాను బెదిరించాడు. వచ్చే ఏడాది జరిగే సదస్సుకు ఆతిధ్యం ఇచ్చే సభ్యదేశంగా, అధ్యక్ష స్థానాన్ని స్వీకరించాల్సి ఉండి కూడా ఒక చిన్న అధికారిని పరిశీలకుడిగా పంపాడు. బాధ్యతలను స్వీకరించే సాంప్రదాయ కార్యక్రమానికి కూడా రాకుండా దక్షిణాఫ్రికాను అవమానించాడు. ఈ ఏడాది మే నెలలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసాను అమెరికా అధ్యక్ష భవనంలో మీడియా ముందే ట్రంప్‌ అవమానించాడు. తెల్లజాతీయుల ఆధీనంలోని భూములను స్వాధీనం చేసుకుంటున్న ఆఫ్రికన్ల వీడియోను చూపి ఇది శ్వేతజాతీయుల మారణకాండ అంటూ ట్రంప్‌ రచ్చ చేశాడు. అప్పటి నుంచి కక్షకట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. వారి విధానాలు తనకు నచ్చటం లేదని అందువలన అక్కడ జరిగే జి20సమావేశాలకు వెళ్లటం లేదని జూలైలోనే ప్రకటించాడు. దక్షిణాఫ్రికా వస్తువులపై గరిష్టంగా 30శాతం పన్నులను విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దౌత్యమర్యాదలను తుంగలో తొక్కిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్య పర్యవసానాల గురించి అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఒక సభ్యదేశమై ఉండి నిజంగా ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటే సరైన స్ధాయి ఉన్న ఎవరినైనా పంపవచ్చు, ఇది అధినేతల సమావేశం, సరైన స్థాయి అంటే తన ప్రతినిధిగా ప్రత్యేకంగా ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులు పంపవచ్చు గాని అమెరికా చేసింది ఏమాత్రం సమర్ధనీయం కాదని దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రోనాల్డ్‌ లామోలా విమర్శించాడు. శతాబ్దాల తరబడి మైనారిటీ శ్వేతజాతీయులు దక్షిణాఫ్రికాలో సాగించిన జాత్యహంకార పాలన, ఆఫ్రికన్ల అణచివేత, బంటూస్థాన్‌(మన దళితవాడల వంటివి)లకే వారిని పరిమితం చేయటం వంటి దుర్మార్గం గురించి తెలిసిందే.1994లో ఆ పాలన అంతమైన తరువాత ఇన్నేండ్లకు అక్కడి శ్వేతజాతి రైతులను ప్రభుత్వం అణచివేస్తున్నదంటూ ట్రంప్‌ ఈ సమావేశాలను బహిష్కరించటం ఒక సాకు తప్ప మరొకటి కాదు.శ్వేత జాతీయుల మారణకాండ అని కూడా వర్ణించాడు. బహిష్కరించటమేగాక అమెరికా ఎదురుదాడికి దిగింది. అధ్యక్ష భవనపు మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా తమ దేశ అధ్యక్షుడిపై నోరుపారవేసుకుంటున్నట్లు ఆరోపించింది.వాతావరణ మార్పు, ప్రపంచ సంపద అసమానతల వంటివాటిపై దక్షిణాఫ్రికా కేంద్రీకరించి సదస్సు ప్రకటనలో వాటిని ప్రస్తావించటాన్ని అమెరికా తట్టుకోలేకపోయినట్లు వార్తలు వచ్చాయి.తాము సమావేశాన్ని బహిష్కరించటమేగాక సదస్సు ప్రకటన వెలువడకుండా అడ్డుకుంటామని అమెరికా బెదిరించింది.తమ అంగీకారం లేకుండా ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించింది. అమెరికా వైఖరిని ఒక్క అర్జెంటీనా తప్ప ఐరోపా, ఇతర ఖండాల దేశాలేవీ ఆమోదించలేదు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలి డోనాల్డ్‌ ట్రంప్‌ అనుయాయి, అతగాడు కూడా ప్రకటనను వ్యతిరేకించి సదస్సును బహిష్కరించాడు. దక్షిణాఫ్రికా అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, అక్రమవాణిజ్య పద్దతులను అనుసరిస్తున్నదని పాలస్తీనా మీద గట్టి వైఖరి తీసుకోవటమే గాక చైనా, రష్యాలతో కలుస్తున్నదని కూడా అమెరికా దాడి చేస్తున్నది. ఆర్థిక అసమానతల గురించి తక్షణమే చర్చించాల్సిన అవసరం ఉందని ప్రపంచ నేతలు గుర్తించిన తొలి సమావేశం ఇదని ఆక్స్‌ఫాం సంస్థ ప్రతినిధి మాక్స్‌ లాసన్‌ వ్యాఖ్యానించాడు.

ప్రపంచంలో అనేక కూటములు ఉన్నాయి. అవి సమావేశాలు జరపటం, సంకల్పాలు చెప్పుకోవటం, తీర్మానాలు ఆమోదించటం తప్ప సభ్య దేశాలకు వాటిని పాటించాల్సిన విధి లేదు. అలాంటి వాటిలో ఒకటి జి20. దీనిలో అర్జెంటీనా,ఆస్ట్రేలియ,బ్రెజిల్‌, కెనడా, చైనా,ఫ్రాన్సు, జర్మనీ, భారత్‌, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్‌, అమెరికా దేశాలతో పాటు ఐరోపా యూనియన్‌, ఆఫ్రికా యూనియన్‌ సభ్యులుగా ఉన్నాయి. ఆహ్వానితులుగా నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, ఐరాస, ప్రపంచ బ్యాంకు, ఆసియన్‌ కూటమి ఉంది. ఆఫ్రికా ఖండం నుంచి దక్షిణాఫ్రికా ఒక్కటే ఈ కూటమిలో ఉంది. తొలిసారిగా ఆఫ్రికా గడ్డమీద సదస్సు జరిగింది. జి20లోని సభ్య దేశాలు (ఐరోపా, ఆఫ్రికా యూనియన్లు మినహా) ప్రపంచ జిడిపిలో 85,అంతర్జాతీయ వాణిజ్యంలో 75, జనాభాలో 56, భూమిలో 60శాతం కలిగి ఉన్నాయి. అందువలన పరోక్షంగా ఈ దేశాల మీద ప్రభావం చూపేందుకు పెద్ద దేశాలన్నీ ప్రయత్నిస్తాయని వేరే చెప్పనవసరం లేదు. జోహన్నెస్‌ సభకు మన ప్రధాని నరేంద్రమోడీ హాజరై అన్ని ముఖ్య సమావేశాల్లో పాల్గ్గొన్నారు. పలుదేశాల నేతలతో జరిపిన చర్చలు ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. చైనా ప్రతినిధిగా ఆ దేశ ప్రధాని లీ క్వియాంగ్‌ పాల్గొన్నాడు.

జి7 ధనిక దేశాలే కాలక్షేపపు కబుర్లకు పరిమితం అవుతున్నపుడు భిన్న ధృవాలుగా ఉన్న జి20 అంతకు మించి ఫలవంతమైన చర్చల వేదికగా మారుతుందన్న భ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థిక అంశాల కంటే రాజకీయ పరమైనవాటికే జోహన్నెస్‌బర్గ్‌ సమావేశాల వేదిక నాంది పలికింది. సదస్సు తీర్మానం గురించి సంతకాలు చేయవద్దని ట్రంప్‌ చేసిన విన్నపాల రూపంలో ఉన్న ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయలేదు. ఇది దక్షిణాఫ్రికా విజయాల్లో ఒకటి. ముప్పై పేజీలు, 122 పేరాల అంతిమ ప్రకటనలో అనేక అంశాలు ఉన్నాయి. అది సాధారణ ప్రకటనగానే చూసే వారికి అనిపిస్తుంది, నిజం కూడా. అసమానతలు, రుణభారం, కీలకమైన ఖనిజాలు, ఇంథనం, సమానత్వం, నిరంతర అభివృద్ధి, పర్యావరణం ఇలా లేని అంశం లేదు. ముందే చెప్పుకున్నట్లు వాటిని అమలు జరపాల్సిన విధి సభ్యదేశాలకు లేదు గానీ వాటిని విస్మరిస్తే కుదరదు అనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చింది.అసమానతల గురించి సదస్సు ఆమోదించిన పత్రంలో అరవై కోట్ల మంది ఆఫ్రికన్లకు విద్యుత్‌ అందుబాటులో లేదని పేర్కొన్నారు.2030 నాటికి పునరుత్పత్తి ఇంథనాన్ని మూడు రెట్లు, ఇంథన సామర్ధ్యాన్ని రెండు రెట్లు పెంచాలని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాలకు సంబంధించిన అభివృద్ధి రుణాలు, రుణ భారం తదితర అంశాల గురించి పరస్పరం సమాచార మార్పిడి,రుణాలు ఇచ్చే దేశాలు, సంస్థల పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశాలను పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ నియామకం ఈ సందర్భంగా జరిగింది. ఆఫ్రికాలో అభివృద్ధికి దక్షిణాఫ్రికా చొరవ, కృషికి ఒక గుర్తింపు దక్కింది. రెండు రోజుల పాటు 130 వర్కింగ్‌ గ్రూప్‌ల సమావేశాలను సమర్ధవంతంగా నిర్వహించటంలో అక్కడి ప్రభుత్వ సామర్ధ్యం వెల్లడైంది.

జోహన్నెస్‌బర్గ్‌ సమావేశానికి ట్రంప్‌ గైరుహాజరు కావటంతో నాయకత్వ స్థానంలోకి వచ్చేందుకు చైనాకు అవకాశం వచ్చిందంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. అమెరికా పలుకుబడి కోల్పోతున్నదనే ఉక్రోషం దీనిలో ఎక్కువగా కనిపిస్తున్నది.అమెరికా ఏకపక్ష వైఖరి, పెత్తందారీతనం కారణంగా అనేక ఆఫ్రికా దేశాలు ఇప్పటికే చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్‌ తాజా వైఖరులతో అది వేగం పుంజుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రభావం పెంచుకొనేందుకు అమెరికాయే చైనాకు అవకాశం ఇస్తున్నదని దానితో పాటు ఐరోపా సమాఖ్య కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని బక్‌నెల్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ ఝీక్విన్‌ ఝ చెప్పాడు. అమెరికా బహిష్కరించిన వెంటనే దాని స్థానంలో చైనా చేరే అవకాశం ఉండదని అయితే మరింత నమ్మకమైన భాగస్వామిగా తనను తాను ప్రదర్శించుకొనేందుకు దోహదం చేస్తుందని బ్రిటన్‌ ఆర్థికవేత్త జింగ్‌ గు చెప్పారు.అంతర్జాతీయ సంస్థలు, పశ్చిమ దేశాలు విధించే కఠినమైన షరతులు లేకుండా ఇప్పటికే అనేక దేశాల్లో వివిధ ప్రాజక్టులకు చైనా సాయం చేసింది. ఆఫ్రికా ఇంథన అవసరాలలో భాగంగా ఇటీవలి కాలంలో చైనా నుంచి 60శాతం సౌరపలకలను దిగుమతి చేసుకున్నారు. బహిష్కరణ రాజకీయాలు, బెదిరింపులు చెల్లవని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా అమెరికాను నేరుగానే హెచ్చరించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు జి20తో పాటు దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సంస్థ(ఎపెక్‌), బ్రెజిల్లో జరిగిన ఐరాస వావావరణ మార్పు సమావేశాన్ని అమెరికా బహిష్కరించింది. ఇలాంటపుడు ఇతర దేశాలు చైనా వైపు చూడటం సహజం.అంతే కాదు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏకపక్షంగా విధించిన దిగుమతి సుంకాలు కూడా దేశాలను ఆలోచింపచేస్తున్నాయి. ఆఫ్రికాలోని 22 దేశాల దిగుమతులపై ఇప్పటి వరకు ఎలాంటి పన్నులు లేకపోగా ట్రంప్‌ ఇప్పుడు 15 నుంచి 30శాతం విధించాడు. తమతో దౌత్య సంబంధాలు కలిగిన అన్ని ఆఫ్రికా దేశాల సరకులపై ఎలాంటి పన్ను విధించబోమని ఎపెక్‌ సమావేశంలో చైనా నేత షీ జింపింగ్‌ ప్రకటించాడు. చైనా ప్రధాని లీ ఐరాస 80వ వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపు ఇవ్వగా డోనాల్డ్‌ ట్రంప్‌ పునరుత్పత్తి ఇంథనం గురించి అపహాస్యంగా మాట్లాడాడు. వచ్చే ఏడాది డిసెంబరులో జి20 సమావేశాలు అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీలో జరగనున్నాయి. ఈ మేరకు డోనాల్డ్‌ట్రంప్‌ గతంలోనే ప్రకటించాడు. ఇరవై సంవత్సరాల చరిత్రలో అమెరికాలో జరగటం ఇదే తొలిసారి. జోహన్నెస్‌ సమావేశాల సందర్భంగా అమెరికా అనుసరించిన వైఖరి వచ్చే ఏడాది సమావేశాలపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రపంచ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న పూర్వరంగంలో అనేక దేశాలు దాన్ని బహిష్కరించినా ఆశ్చర్యం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !

27 Monday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Environment, Europe, Germany, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ 1 Comment

Tags

# China underwater data center, BJP, CHANDRABABU, China, Data Centers, Data centers Employment, Narendra Modi Failures, Vizag Google Data Center, Xi Jinping, YS jagan

ఎం కోటేశ్వరరావు

సముద్రంలో చైనా నిర్మించిన పదమూడు వందల టన్నుల బరువుగల డేటా సెంటర్‌ ఆదివారం నాడు(2025 అక్టోబరు26న) ప్రారంభమైంది. ఇది గాలి మరలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించనుంది. హై క్లౌడ్‌ అనే కంపెనీ మొదటి దశలో భాగంగా 24మెగావాట్ల కేంద్రాన్ని షాంఘై తీరంలో నెలకొల్పింది. న్యూస్‌ అట్లాస్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సముద్రపు ఒడ్డున నిర్మించిన గాలి మరల విద్యుత్‌ కేంద్రం నుంచి 95శాతం విద్యుత్‌ను ఈ కేంద్రానికి సరఫరా చేస్తారు, సముద్రపు నీటిని చల్లబరిచేందుకు వినియోగిస్తారు. మొత్తం 22.6 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రంలో సాంప్రదాయపు డేటా సెంటర్ల కంటే 23శాతం విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. సముద్రంలో 114 అడుగుల అడుగున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని ఒక్కో గదిలో 4 నుంచి ఐదు వందల సర్వర్లు ఉంటాయి. సముద్రంలో ఏర్పాటు చేసిన టెలికాం కేబుళ్ల ద్వారా ఈస్ట్రన్‌ డేటా, వెస్ట్రన్‌ కంప్యూటింగ్‌ వ్యూహం ప్రకారం ప్రధాన భూభాగంలోని కేంద్రానికి అనుసంధానం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరో వందగదులను నిర్మించి విస్తరిస్తారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చైనాలో 2015లో పైలట్‌ ప్రాజక్టుగా సముద్రంలో ఒక డాటా కేంద్రాన్ని నిర్మించింది. ప్రాజెక్ట్‌ నాటిక్‌ పేరుతో చేసిన ఈ ప్రయోగానికి స్వస్తి పలికి 2024జూన్‌లో దాన్ని సముద్రంలో ముంచివేసింది. ఆదివారం నాడు సముద్రంలో తొలి వాణిజ్య డాటా కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. ఇలాంటివే మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కేంద్రం చైనాలో అతి పెద్ద తొలి స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఉన్న హైనాన్‌ సమీపంలో ఉంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో నిర్మించారు.

విశాఖలో అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీలతో కలసి గూగుల్‌ నిర్మించనున్న డేటా కేంద్రం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందన్నది చర్చ. లింక్‌డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణ జర్మనీలోని బిఎఎస్‌ఎఫ్‌ రసాయన కంపెనీతో డేటా సెంటర్ల ఉపాధిని పోల్చింది. సదరు జర్మనీ సంస్థ 684మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది, 50వేల మందికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తున్నది. అదే జర్మనీలో డాటా కేంద్రం 2,283మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగించే చోట పూర్తి కాలపు ఉపాధి 6,849 నుంచి 13,699 మందికి చూపుతుంది. రసాయన ఫ్యాక్టరీ ఒక మెగావాట్‌కు 73 మందికి ఉద్యోగ కల్పన చేస్తుంటే డేటా సెంటర్‌ ఒక మెగావాట్‌కు 3 నుంచి ఆరు ఉద్యోగాలను ఇస్తున్నది. గూగుల్‌ ఆధునిక సాంకేతిక ప్రక్రియలను వినియోగిస్తుంది గనుక ఇంకా తగ్గవచ్చు. ఆ లెక్కన చూసినా విశాఖలో నిర్మించే ఒక గిగావాట్‌(వెయ్యి మెగావాట్లు) కేంద్రం మూడు నుంచి ఆరువేల మందికి పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలు దీనికి దగ్గరగా ఉన్నాయి. దానికి భిన్నంగా రాష్ట్ర మంత్రి లోకేష్‌ చెప్పారు. ఇద్దరికి సమాచార వనరు ఏమిటి ? ఈ విషయాన్ని చెప్పటానికి బిడియపడాల్సిందేముంది. అదే గూగుల్‌ను అడిగితే అందించిన ఇతర విశ్లేషణలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలన్నీ సాధ్యమైనమేరకు తక్కువ మందితో పని చేయించుకొనేందుకు చూస్తాయి. కన్సిడర్‌ మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన సిడ్నీలోని డాటా కేంద్రం 2023లో అకస్మాత్తుగా ఆగిపోయింది. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా జరిగిన ఆ అంతరాయం 46 గంటల పాటు సేవల నిలిపివేతకు దారితీసింది. అప్‌టైమ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ సిబ్బంది కొరత గురించి పేర్కొన్నది. ప్రపంచ డాటా సెంట్లర్లలో 2019లో ఇరవైలక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులు ఉంటే 2025 నాటికి కేంద్రాలు పెరిగినా 23లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులా అన్నది వివరణ లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న 122 గిగావాట్ల సామర్థ్యంలో సగటు తీసుకుంటే ఒక్కో గిగావాట్‌కు 18,700 ఉన్నట్లు కనిపిస్తున్నది. విశాఖ గూగుల్‌ సెంటర్‌కు అందరూ కలసి 20 నుంచి 30వేల మంది ఉంటారని కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. డాటా కంపెనీలు సిబ్బందిని చేర్చుకోవటం, నిలుపుకోవటంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చిన్న కేంద్రాలు(ఒకటి నుంచి ఐదు మెగావాట్లు) 8 నుంచి 15 మంది, ఐదు నుంచి ఇరవై మెగావాట్ల కేంద్రాలు 15 నుంచి 35 మంది, ఇరవై అంతకు మించిన సామర్ధ్యం కలిగినవి 35 మందికి పైగా, 40 మెగావాట్ల సంస్థలు 45 మందిని, వంద మెగావాట్లు అంతకు మించి సామర్ధ్యం కలిగినవి కొద్దిమందితోనే నిర్వహిస్తున్నాయి, ఎందుకంటే యాంత్రీకరణ మరియు నిర్ణీత ప్రమాణాలతో ఉండే వ్యవస్థలు అందుకు దోహదం చేస్తున్నాయి. నియమించుకుంటున్నాయి. డేటా సెంటర్లలో మొత్తం 230 రకాల సిబ్బంది అవసరం అని చెబుతున్నారు. అయితే చిన్న సంస్థలు అంతమందిని నియమించవు, అవి అవసరమైనపుడు పొరుగు సేవలను ఉపయోగించుకుంటాయి. సగం డేటా సెంటర్లు అవసరమైన నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

రెండును రెండుతో కలిపినా, హెచ్చవేసినా ఫలితం నాలుగే. ఇది చెప్పటానికి గణితమేథావులతో పనిలేదు. డేటా సెంటర్లతో కలిగే పర్యావరణహాని, విషపూరితమైన వ్యర్ధాల వంటి ఇతర దుష్ఫలితాల గురించి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పినా(అఫ్‌ కోర్స్‌ అధికారంలో ఉన్నపుడు ఈ పెద్దమనిషి వీటి గురించి చెప్పలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పరు) ఆ రంగం గురించి అధ్యయనం చేసినవారు చెప్పినా విషయం ఒకటే. ఎవరైనా రాజకీయాలతో నిమిత్తం లేని వారు చెబితే చూశారా రాష్ట్ర అభివృద్దిని వ్యతిరేకించేవారు జగన్‌తో చేతులు కలిపి అవే వాదనలు చేస్తున్నారంటూ ప్రచారదాడికి దిగుతున్నారు. అంటే నోరు మూయించేందుకు ఇదొక రకం నియంతృత్వపోకడతప్ప మరొకటి కాదు. తేమ కారణంగా యంత్రాలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అమెరికాలోని డేటా కేంద్రాలన్నీ పొడివాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారని చెబుతున్నారు.పెట్టుబడిలో నాలుగో వంతు సబ్సిడీలు, సంవత్సరాల తరబడి రాయితీ ధరలకు నీరు, విద్యుత్‌ అందచేస్తున్న తరువాత ఏ పెట్టుబడిదారుడు మాత్రం చంద్రబాబు నాయుడి దరిచేరడు ! డాటా సెంటర్‌ మాప్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం గూగుల్‌కు ప్రపంచంలో 113 డాటా సెంటర్లు ఉండగా వాటిలో 68 పని చేస్తున్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారని అడిగితే సమాచారం లేదని బదులు వచ్చింది. ప్రపంచంలో గూగుల్‌ సంస్థలో లక్షా 83వేల మంది పనిచేస్తున్నారనే సమాచారం ఉంది తప్ప ఏ విభాగంలో ఎందరు అన్నది లభ్యం కావటం లేదు. ఎవరికైనా దొరికితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. మానవహక్కుల ఫోరం(హెచ్‌ఆర్‌ఎఫ్‌) సమాచారం ప్రకారం అమెరికాలోని అష్‌బర్న్‌ మరియు లీస్‌బర్గ్‌ డాటా సెంటర్లు రెండిలోనూ కలిపి ప్రత్యక్షంగా 400 మందికి పరోక్షంగా 3,100 మంది ఉపాధి దొరుకుతున్నట్లు పేర్కొన్నది.లోకేష్‌ చెప్పినట్లు లక్షా 88వేల ఉద్యోగాల్లో 88వేలు పర్మనెంటు అనుకుంటే మొత్తం గూగుల్‌ ఉద్యోగులు విశాఖలోనే ఉంటారన్నట్లుగా భావించాలి, అది జరిగేదేనా !

ఇంటర్నెట్‌ వెతుకులాటలో డాటా సెంటర్ల ఉపాధి గురించి ఎవరెటు తిప్పి చెప్పినా పెట్టుబడులు, స్థలాల విస్తీర్ణం ఎక్కువ, ప్రత్యక్ష ఉపాధి తక్కువ, పరోక్ష ఉపాధి గురించి మాత్రమే వెల్లడవుతున్నది. పరోక్షం అంటే భవనాల నిర్మాణ సమయంలో దొరికే ఉపాధి, వాటి చుట్టూ ఉండే నివాసాలతో కలిగే లబ్ది గురించి మాత్రమే ప్రస్తావన ఉంటున్నది. ఆ లెక్కన బడా పరిశ్రమలు అంతకంటే ఎక్కువ కల్పిస్తున్నాయి. వస్తూత్పత్తిలో చైనాను పక్కకు నెట్టే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా దేశాన్ని మారుస్తామన్న మాటలు ఇప్పుడు ఎకువగా వినిపించటం లేదు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి కబుర్లు పెరిగాయి.ఒకదానికి ఒకటి పోటీ కాదు, పరస్పరం సాయం చేసుకొనేవే.పెట్టుబడులు ఎక్కువ ఉపాధి తక్కువ ఉండే టెక్‌ కంపెనీల కోసం మోడీ, చంద్రబాబు వంటి వారు వెంపర్లాడుతున్నారు. ఒకసారి భవనాల నిర్మాణాలు పూర్తయిన తరువాత తాత్కాలిక కార్మికులకు పని ఉండదు. ఆటోమేషన్‌ ప్రధాన ప్రక్రియగా నడిచే ఈ కేంద్రాలలో కీలకమైన సిబ్బంది ఎవరంటే సెంటర్ల మేనేజర్లు, నెట్‌వర్క్‌ మరియు వ్యవస్థల అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక నిపుణులు, వారికి సహాయ సిబ్బంది.

ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఏటా పదివేల కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్లు అవసరమే, అయితే అవి కొత్త సమస్యలను సృష్టించకూడదు. మనదేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి తెలిసిందే. పాలకులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారంటే ఉత్పత్తులకు తప్ప కాలుష్యానికి కాదు, దాన్ని నివారించేందుకు పరిశ్రమలే చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేస్తే తమ లాభాలు తగ్గుతాయని తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో ఫార్మా, ఇతర సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీపంలోని సముద్రంలో కలుస్తున్నది. దాంతో మత్స్యకారుల ఉపాధికి దెబ్బతగులుతున్నది. పరిష్కరించండి మహానుభావా అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అడిగితే ఈ మధ్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది తాము కాదని, వంద రోజుల గడువులో పరిష్కరిస్తానని చెప్పారు. అధికారానికి వచ్చి 15నెలల తరువాత ఈ మాటలు చెప్పిన పెద్ద మనిషి ఇంతకాలం ఏం చేస్తున్నట్లు ?

డేటా అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తున్న పూర్వరంగంలో మనదేశం కూడా వెనుకపడకూడదు. కానీ నరేంద్రమోడీ లేదా రెండింజన్ల పాలనలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఎంతో నిర్లక్ష్యం చేశాయన్నది అంకెలే చెబుతున్నాయి.2019లో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉండగా 2025 నాటికి 1,350 మెగావాట్లకు చేరుతుందని చెబుతున్నారు. ఈ రంగంలో మిగిలిన దేశాలు ఎంతో ముందున్నాయి.దీనికి కూడా నెహ్రూయే కారణం అని చెబుతారేమో తెలియదు. ముందు చూపు లేకపోవటం తప్ప మరొకటి కాదు.చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు లేవు, మైక్రోసాఫ్ట్‌ కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో తప్ప ప్రభుత్వం వినియోగించటం లేదు.కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చైనా వెనుకబడిందని శత్రువులు కూడా చెప్పలేరు.తాజా సమాచారం ప్రకారం 2024నాటికి చైనాలో డేటా వాణిజ్య విలువ 47.23 బిలియన్‌ డాలర్లు కాగా 2030 నాటికి అది 97.30బి.డాలర్లకు పెరుగుతుందని రిసర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ సంస్థ పేర్కొన్నది. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ మరోవిధంగా ఉంది.అమెరికాలో 2025 నాటికి డాటా సెంటర్ల ఆదాయం 171.9 బిలియన్‌ డాలర్లు, కాగా చైనాలో 103.19 బిలియన్‌ డాలర్లని 2030 నాటికి 142.64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. మరో సమాచారం ప్రకారం ప్రపంచ డేటా సెంటర్ల సామర్ధ్యం 2024నాటికి 122.2 గిగావాట్లు. దీనిలో అమెరికా 53.7(44శాతం) కలిగి ఉండగా చైనా 31.9 గిగావాట్లు కలిగి ఉంది. మూడో స్థానంలో ఒక కూటమిగా ఐరోపా యూనియన్‌ 11.9 గిగావాట్లు, మనదేశం 3.6గా ఉంది.చైనాలో ఇటీవల జత చేసిన సామర్ధ్యాన్ని పని చేయించటం లేదని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతున్నదేమిటి ? దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలన్నింటా వృద్ది చెందితేనే డేటా కేంద్రాలకు చేతినిండా పని ఉంటుంది. గడచిన పదకొండు సంవత్సరాలుగా కబుర్లు తప్ప అభివృద్ధి లేని కారణంగా డేటా సెంటర్ల సామర్ధ్యం కూడా పెరగలేదన్నది స్పష్టం.విశ్లేషణలను కొనుగోలు చేసేవారు లేకపోతే రేపు విశాఖ గూగుల్‌ సెంటర్‌ అయినా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.

దేశాన్ని, రాష్ట్రాన్ని వికసిత్‌ భారత్‌లో ఎక్కడికో తీసుకుపోతామని ప్రధాని నరేంద్రమోడీ, ఆయన అడుగుజాడల్లో లేదా అడుగులకు మడుగులద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మంది దృష్టిలో దేశంలో అతి పెద్ద దార్శనికులు, ఇతరులకు తట్టనివి అనేకం వారికి కనిపిస్తాయని చెబుతారు. ఆ ప్రచారం వలన దేశానికి ఎంత లాభమో తెలియదు గానీ నష్టం కలిగిస్తున్నారంటే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) నేడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చెప్పనవసరం లేదు.తన పాలనలో జిడిపిని పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తెచ్చిన ఘనత నాదే అంటారు మోడీ. కాసేపు అంగీకరిద్దాం, ఆ పురోగతి ఇతర రంగాల్లో ఉందా ? వాటిలో కీలకమైన పరిశోధనకు కేటాయింపుల సంగతేమిటి ? 1995-96 నుంచి 2014-15వరకు రెండు దశాబ్దాల వార్షిక సగటు జిడిపిలో 0.73 శాతం ఉంది. యుపిఏ పాలనలో 2008-09లో జిడిపిలో 0.8శాతం నిధులు కేటాయిస్తే మోడీ ఏలుబడిలో 2017-18లో 0.7, ఇప్పుడు 0.64శాతానికి తగ్గించారు. దీనికైతే జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కచ్చితంగా కాదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే భావజాలంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల ఈ నిర్వాకాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధిస్తారా ? 2013 నాటి సైన్స్‌ మరియు టెక్నాలజీ విధానంలో, 2017-18 ఆర్థిక సర్వేలో కూడా కనీసం రెండు శాతం కేటాయించాలని చెప్పిన అంశం ఎవరికీ తెలియదా ? ఇద్దరు నేతలు దేశ దేశాలు తిరుగుతున్నారు కదా ఎక్కడ ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోరా ? ఎందుకీ నిర్లక్ష్యం ? మన అభివృద్ధి మీద గణనీయమైన ప్రభావం చూపాలంటే 2047నాటి వరకు కనీసం ఒక శాతం, ఆదర్శవంతంగా(ఐడియల్‌) ఉండాలంటే మూడుశాతం చొప్పున ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండికొద్దీ రొట్టె, పరిశోధనా రంగంలో మనం ప్రపంచ బస్‌ను అందుకోకుండా చేసింది ఎవరంటే ఎవరిని చూపాలి ? పరిశోధనలకు మనం తక్కువ కేటాయిస్తున్నా, పరిశోధనా పత్రాలు గణనీయంగానే మనవారు సమర్పిస్తున్నారుగా అని సమర్ధించుకొనే వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు ! ఎలాంటి పాలకులను మోస్తున్నాంరా బాబూ అని తల పట్టుకోవాలి !!

సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు ;

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?
https://vedikaa.com/2025/10/25/are-data-centers-godowns-or-production-houses-what-is-the-truth-about-ycp-and-tdp-claims-on-employment/

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d