• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Netanyahu

నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !

17 Wednesday Jun 2026

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, Donald trump, Netanyahu, war compensation, West Asia Peace Talks

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌ – అమెరికా మధ్య కుదిరినట్లు చెబుతున్న మరో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై డిజిటల్‌ సంతకాలు జరిగాయని, శుక్రవారం నాడు జెనీవాలో ఇరు దేశాల నేతలు భౌతికంగా సంతకాలు చేస్తారని చెబుతున్నారు. నిశ్చితార్దం జరిగిన తరువాత ఆగిపోయిన వివాహాలను ఎన్నింటినో చూశాం.ఈ ఒప్పందం కూడా అలా కాకూడదని అందరం కోరుకుందాం.అయితే ఎనభై ఏండ్ల డోనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడేం చేస్తాడో తెలియదు గనుక సంతకాలు జరిగేంతవరకూ అనుమానమే. ఒప్పంద అంశాలపై పరస్పర విరుద్దమైన భాష్యాలు వెలువడుతుండటమే దీనికి కారణం. ఒప్పందం కుదిరిందని ప్రకటించిన ట్రంప్‌ మరోసారి ఇరాన్‌ మీద ఆరోపణలకు పూనుకున్నాడు. ఇరాన్‌ గనుక అణ్వాయుధాలను సమకూర్చుకుంటే నరకం చూపుతామని అన్నాడు. దాడులతో తమకు జరిగిన నష్టానికి 400 బిలియన్‌ డాలర్లు పరిహారం చెల్లించాలని ఇరాన్‌ కోరుతున్నది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉంది, గతంలో అది అంగీకరించిన అంశాలే దీనిలో ఉంటాయని చెబుతున్నారు. ఇరాన్‌ కంటే తన మీద పెరుగుతున్న వత్తిడితో డోనాల్డ్‌ ట్రంప్‌ సతమతం అవుతున్నాడు. ఈ పూర్వరంగంలో రానున్న రోజుల్లో పరిణామాలు, పర్యవసానాల గురించి చర్చలు మొదలయ్యాయి. బహుశా ఇప్పటి వరకు అనేక దేశాలు, కూటముల మధ్య ఒప్పందాలు జరిగాయి, అయితే ఇంతగా అనుమానాలు, సందేహాలు తలెత్తింది మరొకటి లేదు. యుద్దం అనగానే విపరీతమైన ఖర్చు, జనం మీద భారం పడుతుంది. ఇరాన్‌పై అమెరికా దాడి, అది ఎదుర్కొన్న ప్రతిఘటన, ఇతర ఖర్చుల గురించి ఇంతవరకు నిర్దిష్టమైన అంచనాలేవీ లేవు. అమెరికాకు రోజుకు 90 నుంచి 200 కోట్ల డాలర్లు అయినట్లు ఒక అంచనా కాగా అమెరికా రక్షణశాఖ 2,500 కోట్ల డాలర్లని చెప్పింది.ఈ సంఖ్యను ఎవరూ నమ్మటం లేదు. ఇది తాత్కాలిక ఖర్చు మాత్రమే అని దీర్ఘకాలంలో లక్ష కోట్ల డాలర్లు అవతుందని హార్వర్డు విశ్వవిద్యాలయ నిపుణులు చెప్పారు.అమెరికాలో ప్రతి కుటుంబానికి ఒక్క చమురు ఖర్చే అదనంగా 450 డాలర్ల వంతున అయిందని ఒక అంచనా కాగా ఇతరాలను కూడా కలుపుకుంటే 63వేల నుంచి లక్ష కోట్ల వరకు జనాలకు చేతి చమురు వదులుతుందని మరొక అంచనా.ఈ లెక్కన డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చిపనితో ప్రపంచం ఎంత నష్టపోయిందో ప్రస్తుతానికి ఊహించుకోవాలే తప్ప లెక్కలు చెప్పలేము.

ఇక ఒప్పందం కుదిరింది అని చెప్పిన తరువాత వీటి సంగతేమిటి అంటూ అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.వాటిలో కొన్నింటిని చూద్దాం. ఒప్పందంపై సంతకాలు జరిగాయా అంటే సమాధానం లేదు, అయితే ఒప్పందం ఎలా ఉండాలో అంటే ఒక విధంగా ఇంటిని ఎలా నిర్మించాలో ముందుగా ఇంజనీరు రూపొందించే ప్లాన్‌ మాదిరి అవగాహన మీద సంతకాలు చేసినట్లు ట్రంప్‌, జెడివాన్స్‌ చెప్పాడు. ఒప్పంద ముసాయిదా పత్రాలను పరస్పరం మార్చుకున్నారు, వాటిలో కొన్నింటి అమలు ప్రారంభించి 60 రోజుల్లో అంతిమ ఒప్పందం ఖరారు చేసుకుంటారు.అయితే ఒప్పందం గురించి అనుకున్నాం గనుక భౌతికంగా సంతకాలు జరగక ముందే వెంటనే హార్ముజ్‌ జలసంధిని తెరుస్తారని ట్రంప్‌ చెప్పాడు, అయితే శుక్రవారం తరువాతే అని కూడా అదే పెద్దమనిషి చెప్పాడు. అయితే ఒకటి రెండు నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జలసంధి నుంచి వచ్చాయని వార్తలు వెలువడ్డాయి. దాన్ని ఎలా తెరుస్తారన్నదాని మీద సందేహాలు.ఎలాంటి దారి సుంకం చెల్లించకుండా ప్రయాణించవచ్చని ట్రంప్‌ చెప్పాడు. అరవై రోజుల సంధి కాలంలో మాత్రమే ఎలాంటి రుసుమూ ఉండదని తరువాత తాము చేసిన ఏర్పాట్ల మేరకు రక్షణ, పర్యావరణ సుంకం వసూలు చేస్తామని ఇరాన్‌ చెప్పింది. అంటే జలసంధి మీద అదుపు తమదే అని చెప్పినట్లే.

ఒప్పందంతో ఇరాన్‌ సాధించేదేమిటి ? కుదిరినట్లు చెబుతున్న అవగాహనకు వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నట్లు పశ్చిమదేశాల వార్తా సంస్థలు పేర్కొన్నాయి.ఇరాన్‌ మీద ఆంక్షలు తొలుగుతాయి, విదేశాల్లో స్థంభింప చేసిన దాని నిధులను విడుదల చేస్తారు. అరవై రోజుల్లో తాము 24 బిలియన్‌ డాలర్లను పొందుతామని టెహరాన్‌ చెబితే కాదు పన్నెండు బిలియన్‌ డాలర్లు మాత్రమే అందుబాటులోకి వస్తాయని, ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసేది లేదని ట్రంప్‌ చెప్పాడు.దీర్ఘకాలం పాటు యురేనియం శుద్ధి ఉండదని, నిల్వల తనిఖీకి అనుమతి, అణ్వాయుధాలను తయారు చేయబోమని అంగీకరిస్తేనే ఆర్థిక ఆంక్షలు తొలుగుతాయని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ చెప్పాడు.షరతులు ఉండవని ఇరాన్‌, కాదు ఉంటాయని అమెరికా చెబుతోంది.ఇరాన్‌ విడుదల చేసినట్లు చెబుతున్న 14 అంశాలను ఒక పత్రిక ప్రచురించగా అది తప్పుడు వార్త అని ట్రంప్‌ తోసిపుచ్చాడు. రెండు రోజుల్లోగా విడుదల చేస్తామని అమెరికా అధికారులు సోమవారం నాడు చెప్పగా సంతకాలు చేసేంతవరకు బహిర్గతం కాదని ట్రంప్‌ ప్రకటించాడు.అప్పటి వరకు అది రహస్యమే అన్నాడు. ఒప్పందంలో లెబనాన్‌ కూడా భాగమే అని ఇరాన్‌, మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ చెబుతున్నది.అయితే ఒప్పందం కుదిరింది అన్న తరువాత కూడా లెబనాన్‌ మీద ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నది, అక్కడి నుంచి తమ సేనలు వెనక్కు రావని నెతన్యాహు చెప్పాడు.తమ దేశ రక్షణకు గాను గాజా, లెబనాన్‌, సిరియాలో భద్రతా ప్రాంతాలను ఏర్పాటు చేసుకున్నామని అక్కడి నుంచి వైదొలిగేది లేదన్నాడు.లెబనాన్‌లో ఆరులక్షల మంది పౌరులను నివాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ తరిమివేసింది. గాజాలో మాదిరి అక్కడి నివాసాలన్నింటినీ ధ్వంసం చేస్తామని చెబుతున్నది. నెతన్యాహు జవాబుదారీతనంతో ఉండాలని, అమెరికా లేకపోతే ఇజ్రాయెల్‌ లేదని గుర్తించాలని ట్రంప్‌ మంగళవారం నాడు వ్యాఖ్యానించాడు.అయితే ఇదంతా ఉత్తుత్తి బెదరింపే అని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరినా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ చిచ్చును ఆర్పేందుకు అమెరికా సిద్దంగా లేదు.

అణుకార్యక్రమం మీద ఒప్పందం ఉంటుందా అంటే అవునని, కాదని భిన్న కథనాలు వెలువడుతున్నాయి. అవగాహన ఒప్పందం ప్రకారం అరవై రోజుల పాటు కాల్పుల విరమణ మాత్రమే అమల్లో ఉంటుంది.ఈ వ్యవధిలో అణు కార్యక్రమంపై ఒప్పందానికి మార్గాన్ని సుగమం చేస్తారు. 2015లో ఇరాన్‌తో నాటు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసుకున్న మాదిరి ఒప్పంద అంశాలతోనే మరోసారి జరగవచ్చని భావిస్తుండగా, దాన్నుంచి ఏకపక్షంగా వైదొలిగిన ట్రంప్‌ అంతకంటే మెరుగ్గా ఏం సాధిస్తాడనేది అసలు ప్రశ్న.అణు ఒప్పందం కుదరకపోతే తిరిగి దాడులను జరుపుతామని ట్రంప్‌ ప్రకటించాడు.అంతే కాదు తమ దళాలు జలసంధిలోనే ఉంటాయని, అందుకయ్యే ఖర్చులకు పశ్చిమాసియా దేశాల ఆదాయం నుంచి ఇరవై శాతం వసూలు చేస్తామని కూడా చెప్పాడు, అంటే తమ సేనలను కిరాయికి ఇస్తున్నట్లే సంకేతమిచ్చాడు.ఈ అంశాలన్నీ శుక్రవారం నాటికి ఒక స్పష్టతకు వస్తాయా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఒప్పందం కోసం తొందరపడుతున్న ట్రంప్‌ అసలు తొలుత చెప్పిందేమిటి ? సాధించిందేమిటి ? ఇరాన్‌లో పాలకులను మారుస్తా అన్నాడు. ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని, మిలిటరీని, క్షిపణుల తయారీ కార్యక్రమాన్ని నాశనం చేస్తానని చెప్పాడు.వీటిలో ఏ ఒక్కటీ సాధించలేకపోయాడు. తన పౌరులతో సహా అనేక దేశాల జనాలను అనేక ఇబ్బందులకు గురిచేశాడు. అమెరికా బలహీనతలు ఏమిటో ప్రపంచానికి తేటతెల్లం అయ్యేందుకు దోహదం చేశాడు.ప్రపంచ వ్యవస్థలో అనేక నూతన పరిణామాలు, పర్యవసానాలకు నాంది వేసిన అమెరికా అధ్యక్షుడిగా చరిత్రకెక్కాడు. వ్యూహాత్మకంగా అమెరికా ఎంత దివాలాకోరుగా ఉందో వెల్లడి చేశాడు. దీని అర్ధం అది మిలిటరీ శక్తిని కోల్పోయిందని కాదు.వేలాది మందిని చంపి, అనేక దేశాల నానా ఇబ్బందులకు గురి చేసి, అనివార్య స్థితిలో స్వయంగా సృష్టించుకున్న ఇరాన్‌ ఊబి నుంచి బయటపడేందుకు పడిన అతగాడి తపనను ప్రపంచం చూసింది.అమెరికా ఏం చేసినా గుడ్డిగా అనుసరించేందుకు, సమర్ధించేందుకు కూడా మిత్రదేశాలుగా చెప్పుకున్నవేవీ సిద్దంగా లేవని రెండవ ప్రపంచ యుద్దం తరువాత తొలిసారిగా వెల్లడైంది. వారితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఇరాన్‌పై దాడులకు పూనుకున్నాడు. ఆ పోరుతో తమకు సంబంధం లేదని, తమది కాదని పశ్చిమదేశాలు ప్రకటించాయి. కిందపడినా తనదే గెలుపన్నట్లుగా ఇరాన్‌ మీద విజయం సాధించానని పదే పదే ప్రకటించి వ్యక్తిగతంగా అభాసు పాలయ్యాడు.దేశీయంగా చూస్తే స్వంత జనాన్నే మోసం చేశాడు. రెండవసారి తనను గెలిపిస్తే విదేశాల్లో జోక్యం చేసుకోనని, దేశ ఆర్థిక సమస్యల మీదనే కేంద్రీకరిస్తానని చెప్పాడు, మరోసారి అమెరికాను అగ్రగామిగా చేస్తానన్నాడు.దానికి భిన్నంగా వ్యవహరించాడు.

ఇప్పుడు కుదిరిందని చెబుతున్న ఒప్పందంలోని అంశాలని దాడులతో నిమిత్తం లేకుండానే దౌత్య పద్దతుల్లో సాధించి ఉండే అవకాశం ఉందన్నది స్పష్టం. ఒప్పందం కుదుర్చుకొని ఒబామా ఇరాన్‌కు జీవితాన్ని ఇచ్చాడని ఆరోపించిన ట్రంప్‌ ఇప్పుడు కొత్తగా సాధించిన అంశాలేమిటని రానున్న రోజుల్లో అమెరికన్లు ప్రశ్నిస్తారనటం నిస్పందేహం.తాముగా అణుబాంబులను తయారు చేయబోమని తమ దివంగత నేత అయాతుల్లా ఖమేనీ సంవత్సరాల క్రితమే చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామని ఇరాన్‌ ఎప్పటి నుంచో చెబుతున్నది. పార్లమెంటు అనుమతి లేకుండా ట్రంప్‌ బాధ్యతారహితంగా ఇరాన్‌ మీద దాడులు ప్రారంభించి సమర్ధించుకొనేందుకు నానాపాట్లు పడ్డాడు. ఇతగాడి అతి తెలివితో అనివార్యమైన స్థితిలో ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని ఆయుధంగా మార్చుకొని అమెరికా ఆధిపత్యానికి గండికొట్టింది.ఇంతే కాదు, పశ్చిమాసియా, గల్ఫ్‌దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక, సైనిక స్థావరాలను కూడా తొలిసారిగా తన లక్ష్యంగా చేసుకుంది, గురిచూసి కొట్టింది. ఈ క్రమంలో అమెరికాకు స్థానం కల్పిస్తే తమకు వచ్చే ముప్పు ఏమిటో కూడా ఆయా దేశాలకు స్పష్టం చేసింది. ఇరాన్‌పై దాడులను ఆపేందుకు గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వత్తిడి తక్కువేమీ కాదు. గతంలో ఎన్నిసార్లు దాడులు చేసినా, పదేండ్లపాటు ఇరాక్‌తో యుద్దం చేసినా అలాంటి ఆలోచన చేయలేదు. పిల్లిని గదిలో బంధిస్తే పులిగా మారుతుందున్న లోకోక్తిని ఇరాన్‌ రుజువు చేసింది.అయితే అమెరికా బాధిత దేశాలన్నింటికీ ఇలాంటి అవకాశాలు రావు గానీ, ఇతర పద్దతులను తప్పకుండా అన్వేషిస్తాయి. నిజానికి తొలుత జలసంధిని దిగ్బంధిస్తే వచ్చే పరిణామాల గురించి ఇరాన్‌ నాయకత్వం భయపడింది.చివరకు జరిగేదేదో జరుగుతుంది చూద్దాం అని తెగించింది. బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కిచచ్చినట్లు చాలా తక్కువ ఖర్చుతో డ్రోన్లు, స్వల్పశ్రేణి క్షిపణులు, మందుగుండుతో నింపిన చిన్న పడవలు, మందుపాతరలతో నౌకలను స్థంభింప చేయవచ్చన్న ఆలోచన పని చేసింది.ఈ చర్య దౌత్యపరంగా కూడా ఇరాన్‌ పైచేయి సాధించటానికి తోడ్పడింది.అమెరికన్లు ఈ చిన్న అంశాన్ని పసిగట్టలేకపోయారు.తమ ఆంక్షలను ఉల్లంఘించిందనే పేరుతో ఏ ఒక్క నౌక మీద కూడా ఇరాన్‌ దాడులు చేయలేదు, అదే అమెరికన్లు ధిక్కారమును సైతుమా అన్నట్లు మన దేశం కోసం ప్రయాణించిన మూడు నౌకల మీద దాడులు చేసి ముగ్గుర మన పౌరుల ప్రాణాలు తీశారు.

ఇరాన్ను దెబ్బతీసేందుకు అమెరికన్లు భారీ మొత్తాల్లో ఆయుధాలను ఉపయోగించారు.దాని దగ్గర ఉన్న నిల్వలు కరిగిపోవటంతో ఉక్రెయిన్‌కు ఉద్దేశించిన వాటిని ఇటువైపు మళ్లించారు. దక్షిణ కొరియాలో ఉన్నవాటిని కూడా తరలించారు. తిరిగి ఆయుధాలను సమకూర్చుకోవాలంటే సంవత్సరాలు పడుతుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించిందంటే ట్రంప్‌ ఎంతకు తెగించాడో అర్ధం చేసుకోవచ్చు.అత్యాధునిక ఆయుధాలు ఉన్నా ఇరాన్ను దెబ్బతీయలేకపోయాయి. అమెరికా మిలిటరీ బడ్జెట్‌తో పోలిస్తే కేవలం వందోవంతు మాత్రమే ఇరాన్‌ ఖర్చు చేస్తున్నది, దానికి వైమానిక దళం లేదు, ఉన్న నౌకా దళాన్ని అమెరికా దెబ్బతీసింది, అయినా ఇరాన్‌ ప్రతిఘటన యావత్‌ దేశాల మిలిటరీకి అనేక పాఠాలు నేర్పుతున్నది. ముందే చెప్పుకున్నట్లుగా అమెరికా మిత్రదేశాల నుంచి వేరు పడింది, మద్దతు ఇవ్వనందుకు ట్రంప్‌ ఐరోపా నేతలను ఎలా తూలనాడిందీ తెలిసిందే.ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి చెప్పే అమెరికాకు ఇరాన్‌ మీద దాడితో వాటిని ప్రస్తావించే నైతిక హక్కును దెబ్బతీసింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !

10 Wednesday Jun 2026

Posted by raomk in Asia, BJP, Current Affairs, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, Donald trump, Narendra Modi Failures, Netanyahu, West Asia Crisis

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌పై అమెరికాాఇజ్రాయెల్‌ 2026 ఫిబ్రవరి 28న ప్రారంభించిన ఏకపక్ష దాడులకు వందరోజులు నిండాయి. పోరు నిలిపివేయాలని ట్రంప్‌ ఆదేశించినప్పటికీ మంగళవారం నాడు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు జరిపి అనేక మందిని బలిగొన్నది. నిఘా ముసుగులో హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో తమపై దాడులకు సిద్దపడిన అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్‌ కూల్చివేసింది. దానికి ప్రతిగా మంగళవారం నాడు దక్షిణ ఇరాన్‌పై అమెరికా దాడులు జరిపింది. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా మధ్య ప్రాచ్యం, గల్ఫ్‌లోని నాలుగు అమెరికా స్థావరాలపై టెహరాన్‌ దాడిచేసింది. బహరెయిన్‌లో తిష్టవేసిన అమెరికా పంచమదళ విమానవాహక యుద్ద నౌకమీద క్షిపణులను ప్రయోగించినట్లు ప్రకటించింది. జోర్డాన్‌, కువైట్లలో ఉన్న అమెరికా వైమానిక స్థావరాల మీద కూడా దాడులు జరిపింది. ఆత్మరక్షణ కోసం ఇరాన్‌పై జరిపిన దాడులను నిలిపివేసినట్లు అమెరికా మిలిటరీ కమాండ్‌ చెప్పింది. లెబనాన్‌ మీద దాడులకు తెగబడటం అంటే ట్రంప్‌కు తెలియకుండా జరిగేది కాదు. ఇరాన్ను రెచ్చగొట్టే ఎత్తుగడలో భాగమే. బర్రె చచ్చిన తరువాత గానీ పాడి గురించి బయటపడదు అంటారు. అమెరికా జరిపిన ఈ దుర్మార్గానికి అప్పటి నుంచి ప్రపంచంలో ప్రతికూలంగా ప్రభావితంగాని దేశం లేదంటే అతిశయోక్తి కాదు.అయినా మనతో సహా అనేక దేశాలు అమెరికా వైఖరిని ఖండించేందుకు ముందుకు రావటం లేదు. అదే దానికి బలం చేకూరుస్తోంది.మనదేశ ఆహ్వానం మీద విశాఖ సైనిక విన్యాసాల్లో పాల్గని తిరిగి వెళుతున్న ఇరాన్‌ నౌకపై అమెరికా దాడి చేస్తే మన జలాల్లో కాదు కదా అని ఖండించేందుకు మోడీ సర్కార్‌ ముందుకు రాలేదు.హార్ముజ్‌ జలసంధిలో మనకోసం చమురును తీసుకువచ్చేందుకు వెళుతున్న నౌకపై అమెరికా మిలిటరీ కాల్పులు జరిపింది. దాన్లో ఉన్న 24 మంది మన నావికులు సురక్షితం అని చెప్పటం తప్ప అమెరికా చర్యను మన 56 అంగుళాల ఛాతీ ఖండించలేకపోయింది.తమ ఆంక్షలను ఉల్లంఘించి సదరు నౌక ప్రయాణించినందున దాడి చేసినట్లు అమెరికా ప్రకటించింది. తనకు ఏమాత్రం సంబంధం లేని జలాల్లో అమెరికా తిష్టవేసి దారిన పోయే నౌకలపై దాడి చేయటం ఏ అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణమో మోడీ సర్కార్‌ చెప్పాలి.నెహ్రూ రికార్డును అధిగమించామని సంబరాలు చేసుకుంటున్నారు, అది కూడా వాస్తవం కాదు. 1946లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు పొందింది. దాని కొనసాగింపుగా నెహ్రూ ప్రధాని పదవిని చేపట్టారు, ఎవరో నియమిస్తే కాదు. ఆ నెహ్రూ మొత్తం మీద అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగలేదు, మరి నరేంద్రమోడీ ? ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. అందుకే ఎన్నాళ్లు పదవిలో ఉన్నారని కాదు, ఏం చేశారన్నదే దేశానికి ముఖ్యం. . హార్ముజ్‌ నుంచి బాబ్‌ ఎల్‌ మాండెబ్‌(ఎర్ర సముద్రం) జలసంధి ప్రాంతాన్ని ప్రతిఘటన భద్రతా ప్రాంతంగా ఇరాన్‌ ప్రకటించింది. వంద రోజుల తరువాత జరిగిన ఈ పరిణామం పశ్చిమాసియా సంక్షోభాన్ని మరో మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

మధ్యధరా సముద్రం నుంచి సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించి అక్కడి నుంచి హిందూమహాసముద్రం(అరేబియా సముద్రం) ద్వారా జరిగే నౌకా రవాణా ఇప్పుడు అనిశ్చితంగా మారింది. తన అనుయాయులను కాపాడుకొనేందుకు ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక దేశాలు మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉంది. అమెరికాాఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులు, ఆడుతున్న నాటకాలకు తెరపడాలంటే ఇరాన్‌కు ఇంతకు మించి ప్రత్యామ్నాయం కనిపించటం లేనట్లుగా ఉంది. బాబ్‌ ఎల్‌ మాండెబ్‌(ఏడెన్‌ జలసంధి) మీద ఇరాన్‌ అనుకూల ఎమెన్‌ దళాలు పట్టుకలిగి ఉన్నాయి. హార్ముజ్‌ జలసంధి ద్వారా జరిగే రవాణాకు ఆటంకం కలిగితే ఆసియా దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. అదే ఏడెన్‌ జలసంధి దిగ్బంధనానికి గురైతే ఐరోపా, అమెరికా, ఆసియా దేశాలన్నీ ప్రభావితం అవుతాయి.ప్రపంచ వాణిజ్యంలో 9 నుంచి 12శాతం వరకు ఈ మార్గం ద్వారా జరుగుతున్నది.ఒక వేళ ఇది మూతపడితే నౌకలు ఆఫ్రికాలోని గుడ్‌హౌప్‌ ఆగ్రం మీదుగా తిరిగి వచ్చేందుకు అదనంగా 15 రోజుల వ్యవధితో పాటు రవాణా, బీమా ఖర్చులు కూడా పెరుగుతాయి.చమురు, గ్యాస్‌తో పాటు ఇతర వస్తువుల రవాణా కూడా గణనీయంగా ప్రభావితం అవుతుంది.అమెరికా తనకున్న ఆయుధ శక్తిని ప్రయోగిస్తుంటే ప్రతిఘటిస్తున్న ఇరాన్‌ తనకున్న అవకాశాలతో అడ్డుకుంటున్నది.బలవంతుడైన సర్పము అమెరికా అయితే ఇరాన్‌ చలిచీమల వంటిది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా అమెరికా దుశ్చర్యలకు జవాబిస్తున్నది.అక్టోబరులో ఇజ్రాయెల్‌ ఎన్నికలు, నవంబరులో అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు ఉండటంతో నెతన్యాహు, డోనాల్డ్‌ట్రంప్‌కు ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు.వారిని గుడ్డిగా సమర్ధిస్తున్న ఇతర ఇతర దేశాల నేతల పరిస్థితీ అంతే ఉంది. వారిద్దరు సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించాల్సింది కూడా వారే, దాన్ని ఎలా చేస్తారో చూడాలి. ఈ లోగా తమపౌరులపై భారాలు మోపితే తమ పరిస్థితి ఏమిటో అన్న ఆందోళన వారిని నమ్ముకున్న వారిలోనూ మొదలైంది.దానికి మనదేశమే ఉదాహరణ.

డోనాల్డ్‌ ట్రంప్‌ ఏ రోజు ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో తెలియదు.ఇప్పటికి 37సార్లు ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందనో, ఆ దేశాన్ని ఓడించామనో, మరకొటో చెప్పాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించాడు.అతగాడి కనుసన్నలలో పని చేస్తున్న నెతన్యాహు ఒక వైపు లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అంటూనే దాడులు కొనసాగిస్తున్నాడు. అందువలన ఇరాన్‌-అమెరికా ఒప్పందం కుదరటం ఒక సమస్య అయితే తరువాత అయినా అమెరికా-ఇజ్రాయెల్‌ దానికి కట్టుబడి ఉంటాయా అన్న ప్రశ్న ఉండనే ఉంది.ఈ పూర్వరంగంలో వంద రోజుల సంక్షోభం గురించి ఒకసారి ప్రధాన అంశాలను సింహావలోకనం చేసుకుందాం.యావత్‌ ప్రపంచంలో అన్ని రంగాలలో అనిశ్చితి, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల చోటుచేసుకుంది.స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలి మదుపుదార్లకు భారీ నష్టం వాటిల్లింది.ముడి చమురు దిగుమతి చేసుకొనే దేశాల వినియోగదారులే కాదు, ఎగుమతి చేసే అమెరికాలోనూ ధరమంట బాధితులు ఉన్నారు. ఇల్లుకాలి కొందరు ఏడుస్తుంటే మరికొందరు దేనికో అన్నట్లుగా సామాన్యులు తమ బడ్జెట్లను ఎలా సర్దుకోవాలా అని ఆందోళన పడుతుంటే కార్పొరేట్‌ కంపెనీలు తమ లాభాలను ఎలా నిలబెట్టుకోవాలా అని చూస్తున్నాయి. చమురు ధరలు తగ్గినప్పటికీ ఆందోళన ఇంకా తగ్గటం లేదు. ఉదాహరణకు మనదేశం ఏప్రిల్‌ నెలలో ముడి చమురు పీపాను సగటున 114.48 డాలర్లకు కొనుగోలు చేస్తే మే నెలలో 106.23 డాలర్లకు తగ్గినప్పటికీ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు నష్టం వస్తున్నదని పెట్రోలు, డీజిలు, ఇతర ఉత్పత్తుల ధరలను పెంచారు. జూన్‌ నెలలో ఇది రాసిన సమయానికి సగటున కొనుగోలు చేసిన ధర 97.44 డాలర్లకు తగ్గినా వినియోగదారుల నుంచి పెంచిన రేట్లే వసూలు చేస్తున్నారు తప్ప పైసా కూడా తగ్గించలేదు. ఫిబ్రవరి 28కి ముందు 70 డాలర్లకు కొనుగోలు చేశాము. అప్పుడూ తగ్గించలేదు.1970దశకంలో తగిలిన చమురు షాక్‌ కంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ ఇంథన సంస్థ చెప్పింది.ఈ పోరు సామాన్యుల జేబులను ఖాళీ చేస్తుండగా చమురు కంపెనీలకు అపార లాభాలను సమకూర్చుతున్నది. ఏప్రిల్‌ ఏడవ తేదీన బ్రెంట్‌ రకం ముడి చమురు ధర బహిరంగ మార్కెట్‌లో 138 డాలర్లు పలికింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి చమురు, గ్యాస్‌ కంపెనీలు దాడులు ప్రారంభమైన తొలి నెల రోజుల్లో సగటున గంటకు మూడు కోట్ల డాలర్లమేర అదనంగా లాభాలు పొందాయంటే ఆమేరకు జనం జేబులు ఖాళీ అయినట్లే ! ముడిచమురు ధర వంద డాలర్లకు అటూ ఇటూగా కొనసాగితే 2026 ఆఖరుకు 234 బిలియన్‌ డాలర్ల మేర అదనపు లాభాలు పొందుతాయని అంచనా. ఒక్క షెల్‌ కంపెనీ తొలి మూడు మాసాల్లో 6.9బిలియన్‌ డాలర్ల మేర లాభం పొందింది, ఇది అంతకు ముందు త్రైమాస కాలంతో పోల్చితే రెట్టింపు. తొలివారాల్లో ఐరోపా యూనియన్‌ చమురు కంపెనీలు రోజుకు 9.28 కోట్ల డాలర్ల మేర యుద్ద లాభాలు పొందాయి. బ్రిటన్‌లో ఉన్న కంపెనీలు నాలుగువారాల్లో 73.5 బిలియన్‌ డాలర్ల మేర మార్కెట్‌ విలువను పెంచుకున్నాయి. ఇరాన్‌పై దాడుల కారణంగా వంద రోజుల్లో అమెరికాకు వందబిలియన్‌ డాలర్ల మేర తక్షణ నష్టం వాటిల్లింది. ఇక పర్యావరణానికి సంబంధించి తొలి 14 రోజు దాడుల్లోనే తక్కువగా కర్బన ఉద్గారాలను విడుదల చేసే 84దేశాలు ఏడాది మొత్తంలో విడుదల చేసే కర్బన కాలుష్యం కంటే ఎక్కువగా ( 50లక్షల టన్నులు) అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు విడదల చేశాయి.

యుద్ధ ప్రభావం ఆహార రంగం మీద కూడా పడింది. 2023 తరువాత తొలిసారిగా అధిక ధరలు నమోదయ్యాయి. ఇంథనం, ఎరువుల ధరలు పెరిగితే ఆహార ధరలతో పాటు పాకింగ్‌, రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి.ఎరువుల కంపెనీలకు విపరీత లాభాలు వచ్చాయంటే ఆ మేరకు రైతాంగం నష్టపోవటంతో పాటు వినియోగదారుల మీద అదనపు భారం పడుతుంది.ఈ ఏడాది ఆఖరు నాటికి ఎరువుల ధరలు 31శాతం పెరుగుతాయని, వాటిలో యూరియా ధర 60శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది.ప్రపంచంలో 60శాతం చమురు గిరాకీ రవాణా రంగం నుంచే ఉంటున్నది.దాని మీద పడే భారం సామాన్యులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నది ధరల పెరుగుదల కారణంగా అనేక దేశాలు చేపట్టిన చర్యలతో చమురు గిరాకీ రెండు శాతం తగ్గిందని అంచనా, 76దేశాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. ఇది ఎక్కువగా ఆసియా దేశాల్లో జరిగింది. వాహన వేగపరిమితి, ఇంటి నుంచే పని, పౌర రవాణా వ్యవస్థలకు ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకున్నాయి.మన వంటి దేశాలలో సంక్షోభాల సమయంలో జనం మీద పడే భారాలు, కుటుంబాలకు అయ్యే అదనపు ఖర్చుల గురించి మదింపు వేసేందుకు సరైన యంత్రాంగం, సంస్థలు లేవు. ప్రభుత్వం ఎలాంటి సమాచారసేకరణ చేయటం లేదు గనుక వాటి గురించి చెప్పటం కష్టం.పెరుగుతున్న భారాలను తగ్గించుకొనేందుకు సంక్షేమ పథకాలకు కోతపెడతారు. గతంలో ఏడాదికి ఉజ్వల పధకం కింద పన్నెండు సిలిండర్లు రాయితీ ధరకు ఇవ్వగా తరువాత వాటిని తొమ్మిదికి ఇప్పుడు నాలుగు చేశారు. మూడీ ఎనలిటిక్స్‌ చెబుతున్నదాని ప్రకారం అమెరికాలో సగటున ప్రతి కుటుంబం యుద్ద సమయంలో 750 డాలర్లు అదనంగా ఖర్చు చేశారు. ఇంధనం మీదనే దీనిలో 447 డాలర్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28న సగటున ఒక గ్యాలన్‌(3.78 లీటర్లు) ధర 2.98 డాలర్లు ఉండగా ఈ వారంలో 4.22 డాలర్లుగా ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువవారు బాధితులుగా మారారు.ఈ కారణంగానే 66శాతం మంది ట్రంప్‌ పనితీరును వ్యతిరేకిస్తున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.ఒక సర్వే ప్రకారం ఇరాన్‌పై మిలిటరీ చర్య తప్పు అని 61శాతం మంది భావించారు.

ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధాలు,ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ ఆయుధాలు అమ్ముకుంటూ అమెరికా కార్పొరేట్లు లబ్దిపొందుతున్నాయి. వాటికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వెనుకాడటం లేదు. ఇరాన్‌పై పోరులో గెలిచేది లేదని తెలిసినప్పటికీ అమెరికా భారీ మొత్తాలను కేటాయిస్తున్నది. సాధారణ మిలిటరీ బడ్జెట్‌కు తోడు అదనంగా ఇరాన్‌ కార్యకలాపాలకుగాను 200బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని ట్రంప్‌ సర్కార్‌ కోరింది, చివరకు 98 బిలియన్‌ డాలర్లకు ఆమోదం లభించింది, ఈ మొత్తం ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టేందుకే అని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌పై మిలిటరీ చర్యకు అమెరికా రక్షణ శాఖ రోజుకు రెండు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నది.వచ్చే ఏడాది లక్షన్నర కోట్ల డాలర్లు రక్షణ బడ్జెట్‌కు కేటాయించాలని ట్రంప్‌ సర్కార్‌ కోరింది. ఇదే సమయంలో ఇతర బడ్జెట్లలో 10శాతం కోత విధించాలని కూడా కోరింది. ముందే చెప్పుకున్నట్లు రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించామని చెప్పుకొనేందుకు ఇరాన్‌పై బెదిరింపులతో ఒప్పందానికి తెచ్చుకోవాలని అమెరికా చూస్తోంది. తమ ప్రతిఘటనను హార్ముజ్‌తో పాటు బాబ్‌ అల్‌ మెండాబ్‌కు కూడా విస్తరిస్తామని ఇరాన్‌ ప్రకటించటంతో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, అది ఎన్ని రోజులు అన్నది ట్రంప్‌ మీద ఆధారపడి ఉంటుంది !జజ-ద్‌ీ ×అ్‌వతీఅa్‌ఱశీఅaశ్రీ ూఱషవఅరవ

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌ చెప్పిందే నిజమా : అడ్డంతిరిగిన అమెరికా ! సందిగ్దంలో ఒప్పందం !

09 Thursday Apr 2026

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, Donald trump, Narendra Modi Failures, Netanyahu, US attack Iran, US-Iran Truce

ఎం కోటేశ్వరరావు

అమెరికా, డోనాల్డ్‌ ట్రంప్‌ నమ్మక ద్రోహులని ఇరాన్‌ మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. రెండువారాల పాటు ఇరాన్‌పై దాడులను విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుఝామున ఈ ప్రకటన వెలువడింది. దానికి ప్రతిగా హార్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌ అంగీకరించింది.రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని తాను సమర్ధిస్తానని అయితే దానిలో లెబనాన్‌పై దాడులకు సంబంధించిన అంశం లేనందున దాడులు కొనసాగిస్తానని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇప్పుడు అదే ఒప్పందాన్ని సందిగ్దంలో పడవేసింది. ఇరాన్‌తో కుదిరిన అవగాహనలో లెబనాన్‌పై కాల్పుల విరమణ అంశం లేదని బుధవారం నాడు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రకటించాడు. దీంతో అమెరికా ఆడిన నాటకం బట్టబయలైంది. ట్రంప్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైంది. ఒప్పందానికి తూట్లు పొడిచి ఇరాన్‌ మీద నెపం మోపేందుకు ట్రంప్‌ యంత్రాంగం అతి తెలివి ప్రదర్శించింది. అమెరికాకు అందచేసిన పది అంశాల్లో ఒకటిగా లెబనాన్‌ మీద దాడుల నిలిపివేతను ఇరాన్‌ స్పష్టంగా పేర్కొన్నది.అదేమీ తెలియనట్లు జెడి వాన్స్‌ మాట్లాడటం మోసకారితనమే. ఒప్పందం జరిగిన రోజే లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ వందలాది మందిని చంపింది. దీనికి ప్రతిగా తెరిచిన హార్ముజ్‌ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.రెండో రోజు గురువారం నాడు కూడా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగాయి.దానికి ప్రతిగా ఇరాన్‌, లెబనాన్‌లోని హిజబుల్లా కూడా దాడులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది రాసిన సమయానికి కుదిరిన ఒప్పందం విఫలమైనట్లే కనిపిస్తోంది. దానికి పూర్తి బాధ్యత ట్రంప్‌దే. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు అమెరికా కనుసన్నలలో పనిచేసే ఇజ్రాయెల్‌ దాడులకు వాషింగ్టన్‌ అనుమతి ఉందన్నది నిర్వివాదం.

తాజా అంశాలకు ముందు జరిగిన పరిణామాలను ఒక్కసారి నెమరువేసుకుందాం. పోరు ఇంకా ముగియలేదని తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌ మీదనే(తుపాకి గుండు బయటకు రావాలంటే నొక్కాల్సిన మీటను ట్రిగ్గర్‌ అంటారు) ఉన్నాయని ఇరాన్‌ ప్రకటించింది. ట్రంప్‌ ప్రకటన తరువాత రెండు వైపుల నుంచీ దాడుల వార్తలు లేవు.ఇరాన్‌ ప్రతిఘటనతో గుక్కతిప్పుకోలేని అమెరికా వ్యూహాత్మకంగా ఈ అవగాహనను అంగీకరించిందా ? ఈలోగా తన బలగాలను మరింతగా కూడదీసుకుంటుందా అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఏకపక్షంగా గడువులను ప్రకటించిన ట్రంప్‌ ఆ సమయంలో అన్ని రకాల దళాలను అదనంగా పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యానికి తరలించి భూతల దాడులకు సన్నాహాలు చేశాడు.ఒక్క రాత్రితో ఇరాన్‌ నాగరికతను నాశనం చేస్తానని మాట్లాడిన సంగతి తెలిసిందే.అమెరికా-ఇజ్రాయెల్‌ దుష్ట ఆలోచన గురించి ఎలాంటి భ్రమలు లేనప్పటికీ ఎంతో సంయమనం,దూరదృష్టితో ఇరాన్‌ ప్రతిఘటన నిలిపివేతకు అంగీకరించింది. మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా పదిహేను అంశాలు, ఇరాన్‌ పది ప్రతిపాదనలను అందచేశాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరువాత రెండువారాల వ్యవధిలో వీటి గురించి చర్చలు జరుగుతాయి. ఎవరు వేటిని అంగీకరిస్తారు, తిరస్కరిస్తారు అన్నది చర్చల ప్రారంభం తరువాత మాట్లాడుకోవాలి తప్ప ఊహాగానాల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. నిజానికి ఈ అంశాలు ఎప్పటి నుంచో నలుగుతున్నవే.రెండు దేశాలూ వాటిని తిరస్కరించాయి.అందువలన ఇప్పుడేమి జరగనుందనే ఉత్కంఠ సహజంగానే ప్రపంచమంతటా తలెత్తింది.

అమెరికా 15ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. తక్షణమే నెల రోజుల కాల్పుల విరమణ జరగాలి, అన్ని చర్యలు నిలిపివేసి ముఖాముఖీ చర్చలు పాకిస్తాన్‌లో జరిపేందుకు అవకాశం కల్పించాలి.ఇరాన్‌లోని నాటంజ్‌, ఇష్‌ఫహాన్‌, ఫోర్డో అణుకేంద్రాలను శాశ్వతంగా ధ్వంసం చేయాలి. ఇరాన్‌ గడ్డమీద యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలి.శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని అంతర్జాతీయ అణు ఇంథన సంస్థ (ఐఏఇఏ) పర్యవేక్షణలో మరోదేశానికి తరలించాలి.ఇరాన్‌లోని అన్ని మిలిటరీ, పౌరకేంద్రాలు ఎక్కడ ఉన్నప్పటికీ ఎప్పుడు పడితే అప్పుడు ఐఏఇఏ నిరాటంక తనిఖీకి అనుమతించాలి.హార్ముజ్‌ జలసంధిని తటస్థ ప్రాంతంగా చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్చగా నౌకా రవాణాకు అనుమతించాలి.బాలిస్టిక్‌ క్షిపణుల పరిధిని పరిమితం చేసి సంఖ్యను తగ్గించుకొని ఆత్మరక్షణకు మాత్రమే వినియోగించాలి.హిజబుల్లా, హౌతీల వంటి సాయుధ బృందాలకు నిధులు, ఆయుధాల అందచేత నిలిపివేయాలి. నిర్బంధంలో ఉన్న విదేశీ పౌరులందరకీ, ద్వంద్వ పౌరసత్వం ఉన్న అందరికీ స్వేచ్చ నివ్వాలి.అమెరికా ఆస్తులు మరియు పొరుగున ఉన్న గల్ఫ్‌ దేశాలను లక్ష్యంగా చేసుకోకుండా ఒక ఒప్పందానికి రావాలి.సమగ్రమైన ఆంక్షల నుంచి ఊరట, ప్రాధమిక,ఇతర ఆంక్షలు పూర్తిగా తొలగింపు.విదేశాల నుంచి సేకరించే ఇంధనంతో బుషేహర్‌లో ఉన్న అణువిద్యుత్‌ కేంద్రానికి అమెరికా మద్దతు.ఇరాన్‌ ఇంథన రంగంలో పశ్చిమదేశాల పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.ఒప్పందం కుదిరిన తరువాత ఆటోమేటిక్‌గా అమల్లోకి వచ్చే ఐరాస ఆంక్షల తొలగింపు.ప్రాంతీయ స్థిరత్వానికి చట్టపరమైన అంగీకారంతో శాశ్వత శాంతి ఒప్పందం.

ఇరాన్‌ ప్రతిపాదించిన పది అంశాలు ఇలా ఉన్నాయి.ఇరాన్‌ మీద ఇంకేమాత్రం దాడులు చేయకూడదు.అమెరికా, దాని అనుయాయి దేశాలు అన్ని రకాల దాడులను శాశ్వతంగా ఆపాలి.తాత్కాలిక విరమణ కాదు, శాశ్వత ఒప్పందం కుదరాలి.విదేశాల్లో స్థంభింపచేసిన ఇరాన్‌ ఆస్తులన్నింటినీ ఒప్పందంలో భాగంగా తిరిగి ఇవ్వాలి. లెబనాన్‌ మీద ఇజ్రాయెల్‌ దాడులను ఆపాలి.అన్ని రకాల అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలి.ఇరాన్‌ అనుయాయుల మీద ఇంకేమాత్రం దాడులు జరపకూడదు.హార్ముజ్‌ జలసంధిలో స్వేచ్చగా నౌకా రవాణాకు అనుమతి. ప్రయాణించే ప్రతి నౌకకూ ఇరవైలక్షల డాలర్ల ఫీజు చెల్లించాలి.ఈ ఫీజులో ఒమన్‌కూ వాటా ఇస్తాం.దాడుల కారణంగా దెబ్బతిన్న తమ ఆస్తుల పునరరుద్దరణకు ఈ ఫీజు ద్వారా సమకూడే సొమ్మును ఖర్చు చేస్తాం. అన్ని ఒప్పందాలకు ఐరాస భద్రతా మండలి తీర్మాన హామీ ఉండాలి. అయితే బుధవారం నాడు వచ్చిన కొన్ని వార్తల ప్రకారం అధికారిక పార్సీ భాషలో పేర్కొన్న ఒక కీలక అంశం విదేశీ మీడియా, ఇతరులకు ఆంగ్లంలో జారీ చేసిన ప్రతిపాదనల్లో లేదని చెబుతున్నారు. యురేనియంను శుద్ధి చేసుకొనే హక్కు తమకు ఉండాలన్న అంశం పార్సీలో ఉందని అంటున్నారు.. ఎన్నో ప్రగల్భాలు పలికిన ట్రంప్‌ పాకిస్తాన్‌ తడిక రాయబారానికి ఎందుకు అంగీకరించాడు అన్నది చర్చ.

డోనాల్డ్‌ ట్రంప్‌ హీన సంస్కృతికి ప్రతిబింబం.ు ముందు ఇరాన్‌పై దాడులకు తెగబడి దిక్కుతోచని ట్రంప్‌ సభ్యసమాజం నోటితో ఉచ్చరించలేని, సైగలద్వారా చూపలేని బూతు పదజాలంతో ఇరాన్‌పై దూషణలకు దిగాడు. స్వేచ్చ పేరుతో బూతులు మాట్లాడటం అమెరికాలో సర్వసాధారణం అని తెలిసిన వారికి ట్రంప్‌ బూతుపురాణం ఆశ్చర్యం కలిగించలేదు.అలాంటి వాడిని తన స్నేహితుడు, వ్యూహాత్మక భాగస్వామి అని 56 అంగుళాల ఛాతీ విరుచుకొని చెప్పుకున్నవారందరూ సిగ్గుపడతారా ? గర్వపడతారా ! జాలి చూపుదాం, వదిలేద్దాం. ఇరాన్‌లో పాలకులను గద్దె దింపుతాం అంటూ బయలు దేరిన ట్రంప్‌నే గద్దె దించాలని అమెరికాలో అధికార పార్టీకి చెందిన వారు కూడా కోరారు.దీన్నే విధి వైపరీత్యం అంటారు. ఒక్క లక్ష్యమూ నెరవేరలేదు. ఇరాన్‌ గెలిచింది అనటం కంటే అమెరికా ఓడిందని వర్ణించటం సరైనది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఎనిమిది గంటల లోగా తాను చెప్పినట్లుగా హార్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలను పేల్చివేస్తామని ట్రంప్‌ బెదిరించాడు. ఒక్క రోజులో ఇరాన్ను ఆక్రమించుకోగలమని చెప్పాడు. తమ విద్యుత్‌ కేంద్రాల చుట్టూ మానవకవచాలుగా ఏర్పడాలని కవులు, కళాకారులు, యువకులు,యావత్‌ పౌరులకు ఇరాన్‌ ప్రభుత్వం పిలుపునిచ్చింది. వేలాది మంది జాతీయ పతాకాలతోగుమికూడారు.అమెరికా, ఇజ్రాయెల్‌ దుర్మార్గాల చరిత్రను చూసినపుడు నిరాయుధులైన పిల్లలు,మహిళలు, ఆసుపత్రుల్లోని రోగులు, సహాయ కేంద్రాలకు చేరిన అభాగ్యులు ఎవరినీ వదలకుండా చంపివేసిన దుర్మార్గాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.ఇరాన్‌లో అని ప్రాంతాల మీద దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నందున ఎక్కడో మరణించేబదులు, దేశరక్షణ కోసం ప్రాణాలర్పించటానికి మానవ కవచాలుగా ఏర్పడటానికి ముందుకు వచ్చారు. వారిని చంపివేస్తారా ? భయపడి వెనక్కు తగ్గుతారా ? అన్న చర్చ జరిగింది, చివరకు ట్రంప్‌ తోకముడవక తప్పలేదు.

రాజ్యాగంలోని 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చింది.అయితే ఇది అంత తేలిక కాదు. అతగాడి చర్యల ద్వారా తమ ప్రయోజనాలకు ముప్పు వచ్చినట్లు పాలకవర్గం భావిస్తేమాత్రం ఎంతో సులువు. ఉక్రెయిన్‌ సంక్షోభం, గాజాలో మారణకాండ, తాజాగా ఇరాన్‌పై దాడులతో అమెరికాలోని చమురు, ఆయుధ కంపెనీలు, వ్యాపారులకు లాభాల పంట పంట పండుతున్నది. ఆయుధ కంపెనీల వాటాల ధరలు నెల రోజుల్లో 25శాతం పెరిగాయి.చమురు కంపెనీల సంగతి సరేసరి అమెరికాలో దొరికే ముడి చమురు ధర 60 నుంచి 110 డాలర్లకు పెరిగింది, వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ధరలు కూడా అలాగే పెరిగాయి. అందువలన ట్రంప్‌ను ఇప్పటికిప్పుడు తొలగించేందుకు పూనుకుంటే ఈ రంగంలోని కార్పొరేట్లు మౌనంగా ఉంటారా ? సమస్యే లేదు. ప్రపంచంతో వారికి పనిలేదు. నిజానికి ట్రంప్‌ను గద్దె దించాలన్న డిమాండ్‌ దాడులు ప్రారంభమైన నెల రోజుల వరకు ముందుకు రాలేదు.అమెరికాకు తగులుతున్న ఎదురుదెబ్బలు, ఇరాన్‌ లొంగే అవకాశం, అమెరికా గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన తరువాతే ప్రారంభమైంది.బహుశా తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని కార్పొరేట్‌ శక్తులు కూడా వత్తిడి తెచ్చి ఉంటాయి, జనంలో తలెత్తిన నిరసన తెలిసిందే. రెండు వారాల విరామ ఒప్పందం వెనుక సూత్రధారి చైనా, పాత్రధారి పాకిస్తాన్‌ అనే విశ్లేషణలు వెలువడ్డాయి. పాక్‌ మధ్యవర్తిత్వం గురించి వార్తలు వెలువడిన సమయంలో ఇస్లామాబాద్‌లో చర్చలకు తాము అంగీకరించేది లేదని కొద్ది రోజుల క్రితం ఇరాన్‌ ప్రకటించింది.పాకిస్తాన్‌ అమెరికా తొత్తు అన్న సంగతి తెలిసిందే. అటువంటి దాన్ని నమ్ముకొని చర్చలకు దిగితే ఏం జరిగేది చెప్పలేని స్థితిలో నాటకీయంగా కాల్పుల విరమణ అవగాహన ఎలా కుదిరిందన్న ప్రశ్న ముందుకు వచ్చింది.ట్రంప్‌ ప్రకటనకు ముందు జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా అవలోకనం చేసుకోవటం అవసరం. ఇరాన్‌ మీద దాడి చేసేందుకు అమెరికా భద్రతామండలి తీర్మానాన్ని ఆయుధంగా చేసుకొనేందుకు చూసింది. హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు అవసరమైతే బలప్రయోగం చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న తీర్మానం మండలి ముందుకు వచ్చినపుడు మంగళవారం నాడు చైనా, రష్యా వీటో చేసి ఇరాన్‌కు బాసటగా నిలిచాయి. అది అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ.ఆ తీర్మానం, ట్రంప్‌ విధించిన దాడుల గడువు మధ్య పది గంటల వ్యవధిలో చైనా రంగంలోకి దిగి తన మిత్రదేశమైన ఇరాన్ను ఒప్పించింది అని చెబుతున్నారు.ట్రంప్‌ను విలేకర్లు దీని గురించి అడగ్గా అవును నేను విన్నాను అని వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం.హార్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ను ఒప్పించటం అంటే అమెరికాకు లొంగిపొమ్మని కాదు. సంక్షోభ ముగింపుకు ఎక్కడో ఒక దగ్గర నాంది పలకాలి. ఇరాన్‌ ఎంత మిత్రదేశమో గల్ఫ్‌ దేశాలు కూడా చైనాకు అంతే దగ్గర. సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య సయోధ్య కుదిర్చిన సంగతిని మరచిపోరాదు.గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ జరుపుతున్నదాడులు వాంఛనీయం కాదన్నది తప్ప చైనా ఖండించలేదు.ఐరాస తీర్మాన సమయంలో చైనా, రష్యా తటస్థంగా ఉన్నాయి. అదే బలప్రయోగానికి పూనుకోవాలన్న తీర్మానం వచ్చినపుడు అవి రెండూ టెహరాన్‌ రక్షణకు నిలిచాయి.ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మార్గదర్శనం చేశాయంటే అతిశయోక్తి కాదు. నలభై రోజుల దాడుల సమయంలో ఈ రెండు దేశాలు ఎలాంటి హడావుడి, ఆర్భాటం లేకుండా మద్దతునిచ్చాయి.అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు, నావలు, విమానాల కదలికలకు సంబంధించిన ఉపగ్రహ,కృత్రిమ మేధ విశ్లేషణలు ఇరాన్‌కు అందచేసిన కారణంగానే నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేసి ట్రంప్‌కు ఊపిరి సలపకుండా చేశాయని అమెరికా పత్రికలే రాశాయి. ఒప్పందానికి ముందు తమ విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇరాన్‌,రష్యా, గల్ఫ్‌ దేశాలతో 26సార్లు ఫోన్‌ సంభాషణలు జరిపినట్లు చైనా ప్రతినిధి విలేకర్లతో చెప్పాడు. దాడుల సమయంలో చైనా మౌనం గురించి ” నీ శత్రువు తప్పు చేస్తున్నపుడు అస్సలు అంతరాయం కలిగించవద్దు ” అనే శీర్షికతో ఎకనమిస్ట్‌ పత్రిక ఒక విశ్లేషణ చేసింది.వచ్చే నెలలో డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా పర్యటనకు వెళ్లనున్న తరుణంలో ఈ ఒప్పందం కుదరటం గమనించాల్సిన అంశం. కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం గురించి ప్రధాని షెహబాజ్‌, ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్‌ పాత్ర గురించి ట్రంప్‌ పేర్కొన్నాడు. చిత్రం ఏమిటంటే ఈ ఒప్పందాన్ని హర్షించిన ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ ప్రస్తావన చేయలేదు.అందుకే అందని ద్రాక్ష పుల్లన అన్నారు, అసలు సంగతేమంటే విశ్వగురువును పిలిచినవారెవరూ లేరు ! ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకు మన సంగతి మనం చూసుకోవాలని తమ ఆరాధ్య దైవం మౌనంపై భక్తులు సమర్ధనకు దిగారు. ఒప్పందం కుదరగానే హర్షం వెలిబుచ్చుతూ ప్రభుత్వం ఎందుకు స్పందించింది ? ఇరాన్‌ మీద ఏకపక్షంగా అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులకు తెగబడినపుడు ఎందుకు మౌనం దాల్చినట్లు ? నరం లేని నాలుకలు ఏమైనా మాట్లాడతాయి మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌ పోరు మరో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందా !

02 Thursday Apr 2026

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, Donald trump, Imperialist war, Netanyahu

ఎం కోటేశ్వరరావు

ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్‌ దుష్టకూటమి ఇరాన్‌పై ప్రారంభించిన దాడులకు ముందు వారు అనుకున్నది ఒకటి అయింది, అవుతున్నదీ మరొకటి.పండుగాడి దెబ్బ తగిలినట్లుంది ట్రంప్‌కు, అందుకే ఏం మాట్లాడుతున్నాడో, ఉన్మాదంతో ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఇది రాస్తున్న సమయానికి హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరవకపోయినా దాడులను ముగించాలనుంది అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ భీకరదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు ఐదవ వారంలో ప్రవేశించాయి. జలసంధిని తెరవటం తన ప్రాధాన్యతల్లో లేదన్నాడు, అందుకే అందని ద్రాక్ష పుల్లన అనే సామెత వచ్చింది.ఎన్ని అదిరింపులు, బెదిరింపులకు పాల్పడినా నాటో కూటమి దేశాలు ఇది తమ యుద్ధం కాదంటూ జలసంధి ఛాయలకు వచ్చేది లేదని చెప్పాయి. మీ మీద దాడులు జరుపుతున్నా మీకు పౌరుషం లేదా అంటూ దాడుల్లో భాగస్వాములను చేసేందుకు గల్ఫ్‌ దేశాలను రెచ్చగొట్టినా కావాలంటే నష్టాల ఖర్చులను భరిస్తాం తప్ప వచ్చేది లేదన్నట్లుగా అవి ఉన్నాయి.దీంతో ట్రంప్‌కు ఉన్న పిచ్చికాస్త మరింత ముదిరింది.ఈ నేపధ్యంలో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అనే అమెరికా దినపత్రిక కథనం సారాంశం ఇలా ఉంది.హార్ముజ్‌ జలసంధిని తెరవకపోయినా ఆపరేషన్‌ ఎపిక్‌ ఫురీ దాడులను ముగించేస్తానని మిత్రదేశాలకు ట్రంప్‌ చెప్పాడు. వ్యూహాత్మకమైన ఆ జలసంధిని తెరిపించేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ట్రంప్‌ చెప్పిన గడువు దాటి వివాదం మరింతగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.జలసంధిని తెరిపించే అంశాన్ని తరువాత చూసుకోవచ్చు ప్రస్తుతానికి అది ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. ముందు ఇరాన్‌ నౌకా దళాన్ని, క్షిపణులు తయారీ సామర్ధ్యాన్ని బలహీనపరచి దాడులను నిలిపివేస్తే తరువాత దౌత్యపరంగా టెహరాన్ను వత్తిడి చేయవచ్చు. అది కూడా విఫలమైతే ఐరోపా ఇతర ప్రాంతాల్లో ఉన్న మిత్రదేశాలు రంగంలోకి దిగి చొరవ చూపాలని ట్రంప్‌ కోరతాడు.మిలటరీ చర్యలను నిలిపివేసేందుకు జలసంధిని తెరిపించటం ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి కాదని అధ్యక్ష భవనం మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌, దాడులు ముగిసిన తరువాత ఏదో విధంగా జలసంధి తిరిగి తెరుచుకొనే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చెప్పాడు.ఎందుకంటే మూసివేయటం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు విరుద్ధం అని రూబియో అన్నాడు. నౌకా దళంలో కొంత భాగాన్ని ముంచివేయటంతో సహా భారీ నష్టాలు జరిగినా ఇంకా ఇరాన్‌ ప్రతిఘటిస్తున్నది. త్వరగా దాడులను ముగిస్తానని చెబుతూనే ఇప్పటికే ట్రిపోలీ అనే భారీ యుద్ద నౌక, రెండున్నరవేల మందికి పైగా మెరైన్లను మధ్య ప్రాచ్య ప్రాంతానికి అమెరికా తరలించింది, మరో పదివేల మంది పదాతి దళాలను చేరవేసేందుకు చూస్తున్నది. ఇది రాస్తున్న సమయానికి బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర 113 డాలర్ల వద్ద ఉండగా మనదేశం దిగుమతి చేసుకొనే రకం ముడి చమురు ధర 121 డాలర్లు(నాలుగురోజుల నాటిది) ఉంది. అంతకు ముందు 157డాలర్లకు పెరిగింది.

దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ చర్చల సంగతి ఎటూ తేలలేదు, అమెరికా షరతులకు లొంగేది లేదని ఇరాన్‌ కరాఖండిగా చెప్పింది.పరిస్థితి ఇలా ఉంటే పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచంలో తలెత్తే ఆర్థిక సమస్యల గురించి చర్చ మొదలైంది. నెల రోజులు దాటిన యుద్దంతో చమురు నుంచి ఆహారం వరకు ప్రభావితం అవుతున్నాయి.అమెరికాకు మంగళవారం నాటి వరకు 36 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టం జరిగింది. ప్రతి సెకనుకు 11,574 డాలర్లు (డాలరకు 95 రూపాయలు) ఖర్చు అవుతున్నాయి. ప్రపంచం 1970దశకం నాటి స్టాగ్‌ఫ్లేషన్‌కు( ఆర్థిరంగం గిడసబారటం, ధరలు, నిరుద్యోగం పెరుగుదల దీని లక్షణాలు) గురవుతుందా అని కొందరు సందేహిస్తుండగా పరిస్థితి తీవ్రంగా ఉంది తప్ప అలాంటి అవకాశం లేదని మరికొందరంటున్నారు. అమెరికాలో గడచిన తొమ్మిది నెలల్లో మూడుసార్లు అక్కడి కార్మికవర్గం రాజులు లేరు, రాజరికాలు లేవు అంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. తొలిసారి 50,రెండవసారి 70, మూడవసారి 90లక్షల మంది పాల్గ్గొన్నారు.మూడవసారి మార్చి చివరి వారంలో జరిగిన ప్రదర్శనల్లో అమెరికాలో జరిగిన రోజునే వివిధ ఖండాలలోని పన్నెండు దేశాలలో కార్మికులు స్థానిక సమస్యలను తీసుకొని ప్రదర్శనలు జరపటం విశేషం. అమెరికా వినియోగదారులపై భారం ఎలా పడిందంటే ఫిబ్రవరి నెలలో జాతీయ సగటు గ్యాస్‌ ధర 2.98 డాలర్లు ఉంటే ఆదివారం నాడు అది 3.98 డాలర్లు ఉంది.సరఫరా, ధరల నియంత్రణలో భాగంగా 32దేశాలు,13 సహదేశాలు (వీటిలో మనదేశం లేదు) సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ ఇంథన సంస్థ(ఐఇఏ) తన పర్యవేక్షణలో ఉన్న 120కోట్ల పీపాల చమరులో 40 కోట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ సంస్థ నిబంధన ప్రకారం ప్రతి సభ్యదేశం 90 రోజులకు సరిపడా చమురు ఉత్పత్తులను నిల్వచేసుకోవాలి. ఈ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్‌ చరిత్రలో సరఫరా విచ్చిన్నంలో అతిపెద్దదని ఆ సంస్థ పేర్కొన్నది.దీనికి ట్రంప్‌ బాధ్యుడని వేరే చెప్పనవసరం లేదు.దేశం కోసం-ధర్మం కోసం ఏమైనా చేస్తామని ఒట్టి కబుర్లు చెప్పటం తప్ప తాజా పరిస్థితికి కారకుడైన తన మిత్రుడిని నరేంద్ర మోడీ ఇంతవరకు తప్పు పట్టలేదు.పరీక్షా సమయంలోనే ఎవరేమిటో తెలుస్తుందంటారు.

ఇరాన్‌పై దాడుల తరువాత అనేక దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి విలువ ఎంత అన్నది స్పష్టంగా చెప్పలేము.మన దేశంలో రు.51లక్షల కోట్లు నష్టపోయినట్లు అంచనా, ఇంకా పతనం కొనసాగితే నష్టాలు పెరుగుతాయి.అమెరికాలో జతకూర్చిన సమాచారం ప్రకారం ఒక్క రోజులో ఎస్‌ అండ్‌ పి 500 సూచిక 1.66శాతం పతనంతో ఒక లక్ష కోట్ల డాలర్లు, నాస్‌డాక్‌ 2.09శాతం పతనంతో ఆరువందల బిలియన్‌ డాలర్లు, డౌ సూచిక 1.2శాతం పతనం 300బి.డాలర్లు మొత్తం ఒక్కరోజులో 1.2లక్షల కోట్ల డాలర్లు ఆవిరైంది. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా మాంద్యంలోకి వెళ్లేందుకు 37శాతం అవకాశాలున్నట్లు పోలీమార్కెట్‌ అంచనా వేసింది.కార్పొరేట్‌ కంపెనీలు పెరిగిన ఖర్చులను వినియోగదారుల మీద మోపితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి అడుగేస్తారు,నియామకాలు తగ్గిపోతాయి.అమెరికాలో ఉత్పత్తి అయ్యే డబ్ల్యుటిఐ రకం ముడి చమురు ధర 2025 డిసెంబరులో 57 డాలర్లు ఉంటే ఇది రాసిన సమయంలో 102 డాలర్లు ఉంది.దీనికి అనుగుణంగానే అమెరికాలో ధరలు పెరిగాయి.ఫిబ్రవరిలో విమాన ఇంథనం పీపాధర 99 డాలర్లు ఉంటే మార్చినెల 20న 197 డాలర్లకు పెరిగింది. స్లోక్‌ అనే ఆర్థికవేత్త జనవరిలో అమెరికా ఆర్థిక స్థితి గురించి ఆశాభావం వెలిబుచ్చాడు. ఎప్పుడైతే ట్రంప్‌ యుద్ధాన్ని ప్రారంభించాడో ఇప్పుడా పెద్దమనిషి స్టాగ్‌ఫ్లేషన్‌ అవకాశాల గురించి హెచ్చరించాడు.

ముందే చెప్పుకున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకున్నది జరుగుతున్నది మరొకటి, ఎరక్కపోయి ఇరుక్కుపోయాను అన్నట్లుగా ఉన్నాడు. పశ్చిమాసియా సంక్షోభాన్ని ట్రంప్‌ ఎలా ముగిస్తాడో తెలియదు.స్వస్థిపలకటం అనివార్యం, అయితే అది అమెరికా నిర్దేశించినట్లు కాదు.ఇప్పుడు ఇరాన్‌ తన షరతులను ముందుకు తెస్తున్నది, ఇది ట్రంప్‌ కలలో కూడా ఊహించి ఉండడు. పెట్రోడాలర్‌ను సవాలు చేస్తూ చైనా యువాన్‌తో లావాదేవీలు జరిపేవారి నౌకలను హార్ముజ్‌ జలసంధి నుంచి అనుమతిస్తామని అది ప్రకటించింది.ఆ కరెన్సీలోనే అది కప్పం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌ యుద్ధం చైనా పెట్రో యువాన్‌కు శక్తినిస్తుందని అమెరికా డాలర్‌ ఆధిపత్యం బలహీనపడుతుందని ఈ పరిణామాల గురించి హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఇతర దేశాలను తన అదుపులో ఉంచుకొనేందుకు తనకు అనుగుణంగా ఆడించేందుకు ఉక్కిరి బిక్కిరి చేసే అంశాలుగా ప్రపంచంలోని చమురు సంపద, ఇతర వనరులను వినియోగించుకొనేందుకు వాటి మీద అదుపు సాధనకు అమెరికా ఎప్పుడో ఎత్తువేసింది.ఇప్పుడు అనూహ్యంగా గల్ఫ్‌ ప్రాంతంలో ఇరాన్‌ అదే పాత్ర పోషించాలని చూస్తోంది. సూయజ్‌ కాలువ ద్వారా మధ్యధరా సముద్రంలో ప్రవేశించిందేకు పర్షియా గల్ఫ్‌-ఎర్ర సముద్రాన్ని అనుసంధానం చేసే అల్‌ మండాబ్‌ జలసంధిని కూడా ఎమెన్‌ ద్వారా తన అదుపులోకి తెచ్చుకుంటామని హెచ్చరించింది. అదే జరిగితే ఐరోపా దేశాలను కూడా అది ఒక ఆట ఆడించగలదు. అమెరికా అనుసరిస్తున్న మొరటు సూత్రం ఒక్కటే.ఎవరినైనా అదుపులోకి తెచ్చుకోవాలంటే అంతర్జాతీయ సూత్రాలను పక్కన పెట్టు, జనం మీద బాంబులువేసి చంపు, దేశాలను నాశనం చేయి, అప్పుడు జనం నిరాశతో లొంగిపోతారు. అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ఇజ్రాయెల్‌ పాలస్తీనా ప్రాంతమైన గాజాలో చేసింది అదే.ఆసుపత్రులు, స్కూళ్లు, సహాయకేంద్రాలు వేటినీ వదల కుండా నాశనం చేసింది, 70వేల మందికి పైగా పిల్లలు, మహిళలను చంపివేసింది. ఆ ప్రాంతాన్ని మరుభూమిగా మార్చింది. అయినప్పటికీ హమస్‌గానీ, పాలస్తీనియన్లుగానీ ఇజ్రాయెల్‌కు లొంగలేదు.ఇప్పుడు ఇరాన్‌ కూడా యావత్‌ప్రపంచానికి అదే సందేశమిచ్చింది. మీ మీద దాడి చేసే ఉద్దేశం మాకు లేదు, మీ అధినేత అయాతుల్లా అలీ ఖమేనిని పదవి నుంచి తొలగిస్తే మీకు రక్షణ కల్పిస్తాం, లేకపోతే దాడులు చేస్తాం అని మెరికా తొలిరోజుల్లో బెదిరించింది.ఆడపిల్లలు చదుకొనే పాఠశాల మీద అమెరికా విమానాలు బాంబులు వేసిన దుర్మార్గం గురించి తెలిసిందే.ఇప్పుడు వేరేగా మాట్లాడుతోంది.

మార్చినెల 31, ఏప్రిల్‌ ఒకటవ తేదీల్లో చైనా సందర్శించాలని ట్రంప్‌ కార్యక్రమం నిర్ణయించుకున్నాడు. ఈ తేదీలకు ఉన్న ప్రాధాన్యత ఏమంటే ఐరాసలో కమ్యూనిస్టు చైనాను గుర్తించిన తరువాత అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ 1972 తొలిసారిగా బీజింగ్‌ను సందర్శించాడు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో అవసరం లేకపోయినా జపాన్‌ మీద అణుబాంబులు వేసి అమెరికా ప్రపంచాన్ని భయపెట్టింది. బహుశా డోనాల్డ్‌ ట్రంప్‌ లేదా అతగాడికి సలహాలు ఇచ్చిన వారు కూడా అలాంటి దుష్టాలోచననే ముందు పెట్టి ఉండాలి. అయితే ఈ సారి ప్రపంచం కంటే తనకు పోటీగా సవాల్‌ విసురుతున్న చైనాను బెదిరించేందుకు, తద్వారా ఇతర దేశాలను ప్రభావితం చేసేందుకు సిద్దపడినట్లు కనిపిస్తోంది.చైనా పర్యటన ఎప్పుడో ఖరారైంది గనుక ఈ లోగా ఇరాన్ను దెబ్బతీసి దాన్నే చైనా ముందు ప్రదర్శించాలన్న దుష్టాలోచనతోనే ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించినట్లు చెప్పవచ్చు. ట్రంప్‌ఆలోచన ఏమిటి ? ” రెండు మూడు వారాల్లో ఇరాన్‌ మీద విజయం సాధిస్తాం.చైనా వెళ్లినపుడు షీ జింపింగ్‌తో చర్చల్లో చూశారుగా ఇరాన్‌ పాలకులను మార్చాం, అక్కడ గతంలో రష్యాలో బోరిస్‌ ఎల్సిన్‌ అనే తొత్తును పీఠం ఎక్కించినట్లుగా మాకు అనుకూలమైన వాడిని పదవిలో ప్రతిష్టించాం.వాడు అక్కడి చమురు నిల్వలన్నింటి మీద అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాడు. ఇప్పటికే వెనెజులా చమురును స్వాధీనం చేసుకున్నా.మీకు ముడి చమురు అవసరం గనుక మేం చెప్పినట్లు వింటే, మాకు అవసరమైన విలువైన ఖనిజాలను మాకు సమర్పించుకుంటే ఓకే లేకపోతే మీ మీద కూడా ఆంక్షలు పెడతాం ” అని రిహార్సల్స్‌ వేసుకున్న ట్రంప్‌కు ఇరాన్‌ చుక్కలు చూపించింది. దాంతో మార్చినెలాఖరులో చైనా పర్యటనను వాయిదా వేసుకున్నాడు. మే నెల 14,15 తేదీల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.జరుగుతున్న పరిణామాలను బట్టి అది కూడా జరుగుతుందా వాయిదా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. తొందరేం లేదు, ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చన్నట్లుగా చైనా ఉంది. ఏ ముఖం పెట్టుకొని ట్రంప్‌ వెళతాడో చూద్దాం.చివరిగా చెప్పుకుంటున్నా అతి ముఖ్యమైన అంశం ఒకటుంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అది వియత్నాం,ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, లిబియా ఏ దేశం మీద దాడి చేసినా అమెరికాకు మిత్ర దేశాలు సహకరించాయి.తొలిసారిగా ఇరాన్‌పై దాడికి ముఖం చాటేశాయి, అది తమ యుద్దం కాదని ప్రకటించాయి. కొంత మంది వర్ణించినట్లు ఇప్పుడు జరుగుతున్న దాడి కేవలం ఇరాన్‌ మీద కాదు, దానికి మద్దతు ఇస్తున్న రష్యా, చైనాల మీద అన్నది నిజమేనా ! చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభం అవుతుందా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !

18 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Hormuz mission, Narendra Modi Failures, NATO allies, Netanyahu, US attack Iran, Vladimir Putin

ఎం. కోటేశ్వరరావు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ ప్రారంభించిన దాడులు మంగళవారం నాడు పద్దెనిమిదవ రోజులో ప్రవేశించాయి. వాటికి దీటుగా టెహ్రాన్‌ కూడా ప్రతి దాడులతో బెంబేలెత్తిస్తున్నది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నౌకలకు రక్షణ కల్పించాలన్న ట్రంప్‌ కోరికను ఏ ఒక్క మిత్ర దేశం కూడా అంగీకరించలేదు. ఇది తమ యుద్ధం కాదని బయటకు చెప్పకుండానే ముఖం చాటేస్తుండటంతో ట్రంప్‌కు దిక్కుతోచక పిచ్చి ప్రేలాపనలకు దిగాడు. అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచీ కొంత మంది అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ పక్షాన చైనా, రష్యా ఎందుకు దాడుల్లో పాల్గ్గొనటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా తమతో కలసి దాడులకు పూనుకోవటంలేదని డోనాల్డ్‌ ట్రంప్‌ తన మిత్ర దేశాల మీద తిట్ల పురాణం ప్రారంభించాడు. చివరికి చైనా గనుక హార్ముజ్‌ జలసంధికి యుద్ధ నౌకలను పంపి ఇరాన్‌ను కట్టడి చేయకపోతే ఈ నెలాఖరులో బీజింగ్‌ పర్యటనను వాయిదా వేసుకుంటానని చైనాను కూడా బెదిరించాడు. మాకేం తొందరలేదు, వస్తే రా, లేకపోతే లేదు నీ ఇష్టం అన్నట్లుగా చైనా ఉంది. నాటోలో ఉన్న దేశాలే కాదు, ఇరాన్‌ దాడులకు గురవుతున్న గల్ఫ్‌ దేశాలు కూడా యుద్ధంలో దిగేందుకు అంగీకరించటం లేదు.

ఇరాన్‌పై దాడులు ఎప్పుడు ముగుస్తాయన్నది మరొక ప్రశ్న. ప్రారంభించిన అమెరికాకే దిక్కు తోచటం లేదు. ఇరాన్‌ వైపు నుంచి ఇలాంటి ప్రతిఘటన ఉంటుందని తనకెవరూ చెప్పలేదని, నెపాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా సలహాదారులు, నిఘా యంత్రాంగం మీద నెట్టేందుకు పూనుకున్నాడు. అయితే అలాంటిదేం లేదు, ముందుగానే ట్రంప్‌కు హెచ్చరికలు అందాయని వార్తలు. ఒకవైపు ఇరాన్‌లో వేలాది కేంద్రాలపై దాడులు చేశామని, దాని మిలిటరీ నడ్డి విరిచామని రోజూ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతుంటాడు. అదే నిజమైతే జరుగుతున్న క్షిపణి దాడుల సంగతేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. మొత్తంగా నాశనం చేశావని ఎలాగూ చెప్పావు కదా. ఇంక చేయాల్సిందేమీ లేదని గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించవచ్చు కదా అని ట్రంప్‌ మిత్రుడే బహిరంగంగా చెప్పిన తరువాత కూడా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎవరికైనా మదం తలకెక్కినపుడు హితవచనాలు రుచించవు. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గ్గొనే ఉద్దేశం తమకు లేదని జర్మనీ పేర్కొన్నది. హార్ముజ్‌ జలసంధిలో నౌకల రక్షణకు మిలటరీని పంపాలనే కోరిక తమకు లేదని స్పష్టం చేసింది. ఆసియాలో అమెరికా అనుయాయి దేశం దక్షిణ కొరియా, అక్కడ అమెరికాకు తొమ్మిది మిలిటరీ కేంద్రాలు, వాటిలో అన్ని దళాలకు చెందిన 25 వేల మంది సైనికులు ఉన్నారు. తాము కూడా హార్ముజ్‌కు నౌకాదళాన్ని పంపటం లేదని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. తమ దేశంలో నిల్వ ఉంచిన ఆయుధాలను పశ్చిమాసియాకు తరలించారని, దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర కొరియా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటని కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై పరిమితులు విధించనున్నట్లు చెప్పాడు. నౌకలను పంపే అంశం పరిశీలనలో లేదని జపాన్‌ ప్రధాని తకాయిచి పార్లమెంటులో చెప్పారు. ఆస్ట్రేలియా కూడా అదే బాటలో ఉంది. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రి కాజా కలాస్‌ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న చర్యలను మార్చాలనే కోరిక ఇప్పటికైతే తమకు లేదని చెప్పాడు. బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ కూడా తమ దేశం విస్తృత యుద్ధంలోకి రాదని అన్నాడు.

ఇలావుండగా…యుద్ధ లక్ష్యాల గురించి ట్రంప్‌ మాట మార్చాడు. తాము ముడి చమురు కోసం ఇరాన్‌ మీద దాడి చేయలేదని ట్రంప్‌ చెప్పుకున్నాడు. హార్ముజ్‌ జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా తమ మిత్ర దేశాల కోసమే దాడి చేసినట్లు మాట మార్చాడు. అందుకుగాను ఆ ప్రాంతంలో రక్షణ కోసం చైనా, జపాన్‌ వంటి దేశాలు యుద్ధ నౌకలను పంపాలని అన్నాడు. తమకు చమురు అవసరం లేదని, కావాల్సిన దానికంటే రెండింతల ఎక్కువ ఉందని, మా మంచి మిత్రుల కోసమే దాడి చేశామని అన్నాడు. నిజానికి ఇతర దేశాలను రక్షించాలని తప్ప మా కోసం దాడులు చేయటం లేదన్నాడు. తమ మిత్ర దేశాలు ముఖ్యంగా నాటో దేశాల వైఖరి ఆశాభంగం కలిగించిందని ట్రంప్‌ చెప్పాడు. మేం మాత్రం వారికోసం ఎల్లవేళలా ఉండాలి, కాని వారు మాత్రం మాకోసం రారు అంటూ బి-2 స్పిరిట్‌ బాంబరు బొమ్మను చూపుతూ హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు మాకు ఎవరి అవసరమూ లేదని ఊగిపోయాడు. తమకు సహకరించకపోతే నాటోకు రానున్నది చెడు కాలమన్నాడు.

ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి గల్ఫ్‌, ఇతర దేశాలను యుద్ధంలోకి లాగాలని అమెరికా తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్‌ వైపు నుంచి క్షిపణుల వర్షం కురుస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా దాడులకు గల్ఫ్‌ దేశాలు పూనుకోలేదు. అమెరికాను నమ్మి నిజంగా తమ దళాలను రంగంలోకి దింపితే తలెత్తే పర్యవసానాల గురించి పైకి చెప్పుకోవటం లేదుగానీ అవి తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. పొద్దున లేస్తే ఇరాన్‌తో ముఖాముఖాలు చూసుకోవాల్సింది తామని…ఈ రోజు అమెరికా ఉంటుంది, రేపు వెళ్లిపోతుంది. తాము శాశ్వతంగా బలమైన ఇరాన్‌తో వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తప్పనిసరై అమెరికా స్థావరాలు ఉన్న కారణంగా కొన్ని ఆయుధాలను గల్ఫ్‌ దేశాల మీద ప్రయోగించాల్సి వస్తోంది తప్ప తమ కేంద్రీకరణ అంతా ఇజ్రాయిల్‌ మీదనే అని తాజాగా ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా యుద్ధ స్థావరాలున్న గల్ఫ్‌ దేశాల మీద దాడి చేస్తే అవి అమెరికాకు వ్యతిరేకంగా వ్యహరించాలనే ఎత్తుగడ ఉందని బహిరంగంగానే చెబుతున్నారు.

తాజా పరిణామాల్లో మరో ముఖ్యాంశం ఏమంటే ఇరాన్‌పై అమెరికా దాడి రష్యాకు పెట్రో డాలర్లను కురిపిస్తోంది. ట్రంప్‌ అనుకున్నదొకటి అవుతున్నది ఒకటి. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని అన్ని దేశాలకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. నరేంద్రమోడీ సైతం ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఏ మాత్రం పసిగట్టినా ట్రంప్‌ బెదిరించగానే రష్యా నుంచి చమురు కొనుగోలును సగానికి సగం తగ్గించి ఉండేవారు కాదు. ఇప్పుడు పరువూ పోయింది. రష్యా నుంచి వచ్చే రాయితీ కూడా లేదని చెబుతున్నారు. చమురుపై ఆంక్షలతో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ నాలుగేళ్లుగా కొంత ఇబ్బంది పడినప్పటికీ భారత్‌ చైనా కొనుగోళ్లతో నిలిచింది. ఇటీవల ట్రంప్‌ బెదిరించటంతో మన దేశం సగానికి కొనుగోళ్లను తగ్గించింది. హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో అనేక దేశాల నుంచి ఒత్తిడి పెరగటంతో రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ”అనుమతి” ఇచ్చింది. దీంతో ప్రస్తుతం రోజుకు 15 కోట్ల డాలర్ల మేర పుతిన్‌ సర్కార్‌కు రాబడి వస్తోంది.
పన్నెండు రోజుల తరువాత బ్రిక్స్‌ కూటమి అధ్యక్ష స్థానం (భారత్‌)…ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఖండించింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్‌ నేతలతో మాట్లాడారు. ఆ తరువాతే మన దేశానికి ఎల్‌పిజి ని తీసుకువచ్చే మూడు ట్యాంకర్లను సురక్షితంగా హార్ముజ్‌ జలసంధి నుంచి ఇరాన్‌ అనుమతించింది. మన దేశంపై వచ్చిన ఒత్తిడి, వంట గ్యాస్‌ సెగ తగిలిన తరువాతగాని మన నేతలకు తత్వం తలకెక్కలేదని చెప్పవచ్చు!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

04 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Ali Hosseini Khamenei, BJP, China, Donald trump, Narendra Modi Failures, Netanyahu, us and israel attack iran, Vladimir Putin, West Asia Crisis

ఎం. కోటేశ్వరరావు

ఫిబ్రవరి 28న అడ్డగోలుగా అమెరికా, ఇజ్రాయిల్‌ మిలిటరీ దళాలు ఇరాన్‌పై దాడులను ప్రారంభించాయి. ఆ దేశ సుప్రీమ్‌ నేత అయతుల్లా అలీ ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర సీనియర్‌ నేతలను అనేక మందిని హత్య చేశాయి. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా తనకున్న సత్తామేరకు ఆత్మరక్షణ ఎదురు దాడులు చేస్తోంది. అమెరికా దాడుల ఆంతర్యం గురించి మీడియాలో రోజూ వస్తున్న వార్తల పూర్వ రంగంలో మరోసారి చెప్పనవసరం లేదు. అనేక కోణాల గురించి చర్చ జరుగుతున్నది.
ఇక అంతా వారే చేశారంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ మాజీ అధ్యక్షులైన బరాక్‌ ఒబామా, జో బైడెన్ల మీద విరుచుకుపడ్డాడు. వారిద్దరూ నిద్రపోయిన కారణంగానే ఇరాన్‌ అణుముప్పు తలెత్తిందని ఆరోపించాడు. ఈ పెద్దమనిషి టెహ్రాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా తప్పుకొని చేసిందేమిటి? తాను గనుక వైదొలగకపోతే ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు ఈపాటికే ఇరాన్‌ అణుబాంబులను తయారు చేసి ఉండేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లగల ఆయుధాలను రూపొందించు కోవటం తమ హక్కని, ఇతరులకు అది లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సుదూర ప్రాంతాల లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను మనం కూడా తయారు చేస్తున్నాం. ఏదో ఒక రోజు ఇరాన్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌ గాకపోతే మరొకడు మనకూ వర్తింపచేయడని గ్యారంటీ ఏముంది ?
ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తే వాటిని ఇజ్రాయిల్‌ మీద ప్రయోగిస్తుందన్నది ఒక ఆరోపణ. మరి ఇజ్రాయిల్‌ ఎవరి మీద ప్రయోగించేందుకు అణుబాంబులను తయారు చేసినట్లు? అణ్వాయుధాలను రూపొందించిన వారందరూ ఎవరో ఒకరి మీద ప్రయోగించేందుకు అన్న అమెరికా అడ్డగోలు వాదనలను మన దేశంలోని కొందరు సమర్ధిస్తుంటారు. మరి మనం ఎవరి మీద వేసేందుకు రెండుసార్లు అణుపరీక్ష జరిపినట్లు? ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ కూడా బాంబులను కలిగి ఉన్నాయి వాటి గురించి అమెరికా మాట్లాడదేం! అనేక సార్లు ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయిల్‌ తమ ఏజంట్లను ప్రయోగించి దాడులు చేశాయి. అనేక మంది శాస్త్రవేత్తలను చంపివేశాయి. కాస్పియన్‌ సముద్రంలో ఇరాన్‌ సహజ వాయువు పైప్‌లైన్లను 2024 ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌ ధ్వంసం చేసింది. ఏప్రిల్‌ నెలలో సిరియా రాజధాని డెమాస్కస్‌ లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం మీద దాడికి ప్రతిగా ఇరాన్‌ ఎదురు దాడి చేసింది తప్ప…తర ఏ సందర్భంలోనూ ముందుగా అది టెల్‌అవీవ్‌ మీద దాడులు చేయలేదు.
అమెరికా, ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే దేశాలు, సాయుధ బృందాలకు ఇరాన్‌ సాయం చేయటం సరైంది కాదు కదా! ఈ వాదన చేస్తున్న వారు ఐరాస నిర్దేశించిన పాలస్తీనా ప్రాంతాలను తీర్మానం చేసిన మరుసటి రోజు నుంచే ఇజ్రాయిల్‌ ఎందుకు ఆక్రమించుకొని పాలస్తీనియన్లను ఆ ప్రాంతాల నుంచి తరిమివేస్తున్నట్లు? దానికి పశ్చిమ దేశాలు ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు? తమ మాతృభూమి కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇస్తున్నది ఇరాన్‌, అడ్డుకొనే దుర్మార్గానికి ఆసరా ఇస్తున్నవి అమెరికా, దాని మిత్ర దేశాలు. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని అవి మావే అని చెబుతున్న ఇజ్రాయిల్‌ దుండగాలను సమర్ధిస్తున్నవారు ఏదోఒక సాకుతో మరో దేశాన్ని ఆక్రమించరనే హామీ ఏముంది? కెనడాను తమ 51వ రాష్ట్రంగా మార్చాలని ట్రంప్‌ అంటే తప్పు పట్టిన అదే కెనడా నేడు అమెరికా దుండగానికి, పాలస్తీనా ఆక్రమణలో ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్నది. పాలస్తీనా ప్రాంతాలు తమ రక్షణకు హామీగా కావాలని యూదు దురహంకారులు చెబుతున్నట్లే అమెరికా రక్షణకు గ్రీన్‌లాండ్‌ అవసరం అంటున్న అమెరికా చర్యను విమర్శించిన ఫ్రాన్సు, బ్రిటన్‌, జర్మనీ ఇప్పుడు ఇరాన్‌పై దాడిని సమర్ధిస్తున్నాయి. తమ స్థావరాలను వినియోగించుకొని మరింత మంది పసిపిల్లలను చంపమని, గాజాను నాశనం చేసిన మాదిరి ధ్వంసం చేయమని చెబుతున్నట్లు కాదా!
చరిత్రలో యూదులకు అన్యాయం జరిగిందని, ఇజ్రాయిల్‌ బాధిత దేశం అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యూదులు నీచులంటూ మధ్యయుగాల్లోనే పశ్చిమాసియా ప్రాంతం నుంచి మధ్యయుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో తరిమివేశారు. నాజీ మూకలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దేశాల్లో ఊచకోత కోశాయి. వారికి న్యాయం చేసే పేరుతో మాతృభూమిగా ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారన్నది ఒక వాస్తవం. అదే సమయంలో పాలస్తీనా కూడా అవతరించాలని ఐరాస చేసిన నిర్ణయం గడచిన ఎనిమిది దశాబ్దాలుగా అమల్లోకి రాకపోతే ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు ఎందుకు ప్రశ్నించరు? వారికి మాతృభూమి లేకనే ఇరుగు పొరుగు దేశాల్లో తల దాచుకుంటున్నారు. తమ దేశ ఏర్పాటు కోసం సాయుధ పోరాట మార్గాన్ని కొందరు చేపట్టారు. అలాంటి సంస్థలలో ఒకటైన హమాస్‌ 2023 అక్టోబరు ఏడున దాడి చేసి 1200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా పట్టుకోవటాన్ని ప్రపంచంలో ఎవరూ సమర్ధించలేదు. కానీ ఆ పేరుతో గాజాలో 70 వేల మందిని ఊచకోత కోసిన ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని హమాస్‌ చర్యను ఒకే గాటన కట్టటం ఏ విధంగా సమర్ధనీయం? మన దేశం పాలస్తీనా ఏర్పాటును పూర్తిగా సమర్ధించింది. కానీ ఇటీవల ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లి హమాస్‌ దురాగతాన్ని ఖండించారు తప్ప ఇజ్రాయిల్‌ మారణకాండ గురించి పల్లెత్తు మాట అనలేదు. మానవత్వం గురించి కబుర్లు చెబితే ఎలా! దాడులు ప్రారంభమైన తరువాత ఇజ్రాయిల్‌, ఇతర దేశాలతో మాట్లాడారు తప్ప ఇరాన్‌ నేతలకు మోడీ ఎందుకు ఫోన్‌ చేయలేదు! పోనీ ఇరాన్‌ మన శత్రు దేశమా? కాదే, అమెరికా బెదిరించేవరకు 2019కు ముందు చమురు దిగుమతి చేసుకన్నాంగా !
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు, అందువలన అతగాడు మరణిస్తే సంతాపం తెలపాల్సిన అవసరం లేదు, ఖండించాల్సిన పని కూడా లేదంటున్నారు. పోనీ కాసేపు నిజమే అనుకుందాం. వెనిజులా అధ్యక్షుడు మదురో మన వ్యవహారాల్లో వేలు పెట్టలేదుగా, చమురు సరఫరా చేశాడుగా, అతన్ని అమెరికా కిడ్నాప్‌ చేస్తే ఎందుకు ఖండించలేదో ఎవరైనా చెప్పగలరా? ఆర్టికల్‌ 370 రద్దును ఖమేనీ వ్యతిరేకించాడని అంటున్నారు. ఆ మాటకు వస్తే చైనా కూడా వ్యతిరేకించింది, అయినా సీ జిన్‌పింగ్‌తో మోడీ చెట్టపట్టాలు వేసుకోలేదా? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును పాక్‌ పాలిత ప్రాంతమని, మన అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్‌ను భారత పాలిత ప్రాంతంగా అమెరికా వర్ణించింది. అంటే కాశ్మీరు మనది అని చెప్పకపోయినప్పటికీ అమెరికాతో సన్నిహితంగా మసలుతున్నాం. ఖమేని మరణానికి సంతాపం తెలపాలా లేదా అన్నది ఒక సమస్య. కచ్చితంగా చెప్పాలని ఎవరూ అనటం లేదు, అయితే హత్యను, ఇరాన్‌ మీద దాడిని ఖండించాలా లేదా, ఎందుకు నోరువిప్పటం లేదు! కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఇరాన్‌ మన మిత్ర దేశమే అని చెబుతున్నారు కదా? ఎందుకుని వారితో మాట్లాడలేదు! ఈ వైఖరి ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే మనం అమెరికా చంకనెక్కాం, దాని హత్యాకాండను సమర్ధించాం అని కాదా !
ఇరాన్‌కు కోపం ఉంటే అమెరికా, ఇజ్రాయిల్‌ మీద తీర్చుకోవాలిగానీ గల్ఫ్‌ దేశాల మీద దాడులు చేయటం ఏమిటన్నది మరొక అతి తెలివి వాదన. ఒక వేళ తమ మీద దాడి చేస్తే అమెరికా వైమానిక స్థావరాలు, నౌకల మీద విరుచుకుపడతామని పదే పదే ఇరాన్‌ ముందే ప్రకటించింది. అలాంటపుడు గల్ఫ్‌ దేశాలు తమ గడ్డ మీద ఉన్న స్థావరాల నుంచి అమెరికన్లను ఎందుకు ఖాళీ చేయించలేదు. స్థావరాలు ఎందుకు అంటే అమెరికా పెట్టుబడులు ఆ ప్రాంతంలో ఉన్నాయి గనుక వాటిని రక్షించుకొనేందుకని అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లుగా సమర్ధిస్తున్నారు. అమెరికా పెట్టుబడులు మన దేశంలో, చైనాలో కూడా ఉన్నాయి, మరి వాటి రక్షణకు మిలిటరీ స్థావరాలను నెలకొల్పలేదేం! మనకు పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రం లోని డిగోగార్షియా దీవుల్లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉంది. అక్కడ ఏం పెట్టుబడులు ఉన్నట్లు ? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్లుగా సాకులు చెబుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లోని స్థావరాలను ఉపయోగించుకొని అమెరికా ఇప్పుడు ఇరాన్‌ మీద దాడులు చేస్తున్నది. అందుకే వాటిని టెహ్రాన్‌ లక్ష్యంగా చేసుకుంది తప్ప ఆ దేశాల మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం అంటే ముందు హతమయ్యేది నిజం. అందువలన ఏ మాట, చర్య వెనుక ఏ ప్రయోజనం దాగుందో జనం తెలుసుకోవాలి!

Share this:

  • Tweet
  • More
Like Loading...

గాజా నరమేథం ఆగింది, ప్రజాశత్రువుకు శాంతి బహుమతి ! ఐఎంఎఫ్‌ విధానాలకు లాటిన్‌ అమెరికాలో ప్రతిఘటన !!

15 Wednesday Oct 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Gaza ceasefire deal, Israel genocide, Latin america left, Netanyahu, Nobel peace prize, Peru Protests, Venezuela

ఎం కోటేశ్వరరావు

అమెరికా ముందుకు తెచ్చిన 20 అంశాల శాంతి ప్రతిపాదన ఒప్పందంపై సోమవారం నాడు కైరో(ఈజిప్టు)లో అనేక మంది దేశాధినేతల సమక్షంలో సంతకాలు జరిగాయి. హమస్‌ వద్ద బందీలుగా ఉన్న 20మంది, ఇజ్రాయెల్‌ జైళ్లలో నిర్బంధంలో ఉన్న రెండువేల మంది పాలస్తీనియన్ల విడుదల జరిగింది. బందీలుగా ఉండి మరణించిన 28 మంది మంది భౌతిక కాయాలను కూడా అప్పగించేందుకు హమస్‌ అంగీకారం తెలిపింది. గాజాలో సాగిస్తున్న మారణకాండకు ప్రస్తుతానికి తెరపడింది.ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే మరోసారి ఇజ్రాయెల్‌ అలాంటి దుర్మార్గానికి పాల్పడనే హామీ ఏమీ లేదు. పాలస్తీనియన్లు ఊపిరి పీల్చుకొనేందుకు అవకాశం ఇచ్చే ఏ చర్యనైనా ఆహ్వానించాల్సిందే. అసలైన సమస్య పాలస్తీనా గుర్తింపు, ఐరాస తీర్మానం ప్రకారం దానికి కేటాయించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగటం మీద ఆధారపడి ఉంది. గతంలో కుదిరిన ఒప్పందాలేవీ కూడా ఈ అంశంపై ఎలాంటి పరిష్కారాన్ని చూపలేదు. ఏడాదికేడాది ఇజ్రాయెల్‌ ఆక్రమణలు, నివాసాల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనాభా స్వభావాన్ని మార్చేందుకు యూదులందరినీ తీసుకువచ్చి ఆ ప్రాంతాల్లో ఉంచుతున్నారు. ఒప్పందం మొదటి దశగా పేర్కొన్నదాని ప్రకారం బందీలు-ఖైదీల మార్పిడికి మాత్రమే పరిమితం.

సోమవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌ కైరో వెళ్లే ముందు జెరూసలెంలో ఉన్న ఇజ్రాయెల్‌ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించాడు.నూతన మధ్య ప్రాచ్యానికి చారిత్రాత్మక ఉషోదయం అని ఒప్పందాన్ని వర్ణించాడు. ఆ సందర్భంగా ఇద్దరు వామపక్ష వాదులైన ఎంపీలు పాలస్తీనా పట్ల అమెరికా వైఖరికి నిరసన తెలిపారు.అమెన్‌ ఒడే, ఓఫర్‌ కాసిఫ్‌ అనే ఎంపీలను భద్రతా సిబ్బంది బయటకు తీసుకువెళ్లారు. యూదు దురహంకారం, అరబ్బులను రెండోతరగతి పౌరులుగా చూసే వివక్ష వాస్తవం. అయితే మొత్తం యూదు సామాజికతరగతికి దీన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు.వారిలో కూడా పురోగామి,ప్రజాతంత్ర వాదులు ఉన్నారు గనుకనే అనేక మంది గాజాలో జరుపుతున్న మారణకాండను వ్యతిరేకించారు.దానికి సారధ్యం వహించిన నెతన్యాహు చర్యలకు నిరసన తెలిపారు.అయితే వాటికి ఉన్న పరిమితులు, మీడియా పూర్తిగా అలాంటి వార్తలను పక్కన పెట్టిన కారణంగా బయటి ప్రపంచానికి వివరాలు పూర్తిగా తెలియవు. ట్రంప్‌కు నిరసన తెలిపిన ఇద్దరు ఎంపీలలో ఒకరైన ఒడే సామాజిక మాధ్యమంలో తరువాత పెట్టిన పోస్టులో తామెందుకు ఆ చర్యకు పాల్పడిందీ తెలిపాడు. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించాలని యావత్‌ ప్రపంచ సమాజం అంగీకరించినందున ఆ పని ఎందుకు చేయరన్నదే తమ ప్రశ్న అని ఆ మాత్రానికే తమను పార్లమెంటునుంచి బయటకు గెంటారని పేర్కొన్నాడు.మరో ఎంపీ కాసిఫ్‌ ఒక ప్రకటన చేస్తూ ట్రంప్‌ చర్యలను విమర్శించాడు, పాలస్తీనా, ఇజ్రాయెల్‌ గుర్తింపు పరిష్కారాన్ని అమలు జరపాలని డిమాండ్‌ చేశాడు. అమెరికా మిత్రదేశాలుగా ఉన్న కెనడా, కొన్ని ఐరోపా దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తించినప్పటికీ అమెరికా ముందుకు రావటం లేదు. ఇజ్రాయెల్‌ అసలు ఉనికినే ప్రశ్నిస్తున్నది. ఐరాస అచేతనంగా ఉండిపోయింది. భద్రతామండలిలో ఎవరైనా కార్యాచరణకు తీర్మానం పెడితే వీటో హక్కుతో అమెరికా సైంధవుడిలా అడ్డుపడుతున్నది.మారణకాండనే ఆపేందుకు ముందుకు రాని వాషింగ్టన్‌ తన రాజకీయ, మిలిటరీ, ఆర్థిక అజెండాను పక్కకు పెట్టి పాలస్తీనాను గుర్తిస్తుందా ?

వివిధ రంగాలలో ప్రజ్ఞ కనపరచిన వారికి ఇచ్చే నోబెల్‌ బహుమతుల గురించి ఇంతవరకు ఎలాంటి వివాదమూ లేదుగానీ శాంతి బహుమతికి ఎంపికలు కొన్ని అపహాస్యానికి గురౌతున్నాయి. తాజాగా వెనెజులా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మరియా కోరినా మచోడోకు శాంతి బహుమతి అలాంటిదే. అక్కడి వామపక్ష నికోలస్‌ మదురో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చివరికి అమెరికా మిలిటరీ కూడా జోక్యం చేసుకోవాలని, బాంబులు వేయాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును కోరిన ఆమెను శాంతిదూతగా పరిగణించటం, తనకు వచ్చిన బహుమతిని తనకు నిర్ణయాత్మక మద్దతు ఇచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించటాన్ని చూస్తే నోబెల్‌ కమిటీ ఎవరి కనుసన్నలలో పని చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆమె తీరుతెన్నులన్నీ వెనెజులాలో అశాంతిని రెచ్చగొట్టేందుకు అమెరికాతో చేతులు కలిపి చేసిన నిర్వాకాలు తప్ప శాంతి చిహ్నాలే లేవు. అసలా బహుమతి తనకే ఇవ్వాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. మదురోను అరెస్టు చేసేందుకు అవసరమైన సమాచారమిచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్ల బహుమతి ఇస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెనెజులాను మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రంగా మార్చారంటూ వెనెజులా నుంచి వచ్చిన రెండు బోట్లమీద కాల్పులు జరిపి వాటిలో ఉన్నవారిని హత్య చేసి మాదకద్రవ్య సరఫరాదారులుగా ప్రచారం చేయటమే కాదు, అవసరమైతే సైనిక చర్యకు దిగేందుకు మిలిటరీని మోహరించిన సంగతి తెలిసిందే. మరియా కోరినా నిర్వాకాలను చూస్తే 2002లో హ్యూగో ఛావెజ్‌కు వ్యతిరేకంగా జరిగిన విఫల కుట్రలో ఆమె పాత్రధారి.కేవలం 47 గంటలు మాత్రమే అధికారంలో ఉన్న తిరుగుబాటుదార్లు రాజ్యాంగాన్ని , పతి ప్రజా సంస్థను రద్దు చేశారు. వెనెజులాను విముక్తి చేసేందుకు మిలిటరీ జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది. కరీబియన్‌ సముద్ర ప్రాంతంలో మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో దిగిన అమెరికా నౌకాదళానికి ఆమె జేజేలు పలికింది. వెనెజులా ఎన్నికల ఫలితాన్ని గుర్తించేందుకు నిరాకరించిన వ్యక్తితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన ఘనురాలామె. జెరూసలెంలో మూసివేసిన వెనెజులా రాయబార కార్యాలయాన్ని తెరవాలని కోరింది. వెనెజులా చమురు, నీరు, మౌలిక సదుపాయాలవంటి అన్నింటినీ ప్రవేటింకరించాలని కోరుతున్న శక్తుల ప్రతినిధిగా పని చేస్తున్నది.ఆమె శాంతి లేదా పురోగతికి ప్రతీక కాదని, ఫాసిజం, యూదు దురహంకారం మరియు నయాఉదారవాదాల ప్రపంచ కూటమిలో భాగం,ప్రజాస్వామ్య ముసుగులో శాంతిని విచ్చిన్నం చేసే శక్తి అని కొందరు విమర్శించారు. నోబెల్‌ శాంతి బహుమతి ఆశయం, లక్ష్యాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నవారికి దాన్ని ప్రదానం చేయటం పక్కా రాజకీయం. వియత్నాంలో దురాక్రమణకు పాల్పడి లక్షలాది మంది ప్రాణాలు తీసింది అమెరికా. దానికి నాయకత్వం వహించినవారిలో ఒకడు హెన్రీ కిసింజర్‌. అక్కడ కాల్పుల విరమణకు కృషి చేశాడనే పేరుతో 1973లో శాంతి బహుమతి ఇచ్చారు. అదే పెద్దమనిషి ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు మద్దతు ఇచ్చాడు.ఈజిప్టును లొంగదీసుకొని ఇజ్రాయెల్‌తో కాంప్‌డేవిడ్‌ ఒప్పందానికి తెరతీసిన జిమ్మీ కార్టర్‌కు 1978లో అదే బహుమతి ఇచ్చారు. ఆ ఒప్పందంలో పాలస్తీనా గుర్తింపును విస్మరించారు. పాలస్తీనా ప్రాంతంలో దురాక్రమణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌పై ఆంక్షల కోసం పెట్టిన తీర్మానాన్ని వీటో చేసిన పెద్దమనిషి బరాక్‌ ఒబామా,మిలిటరీ సాయాన్ని మరింతగా పెంచినందుకా అన్నట్లు 2009లో శాంతి బహుమతి పొందాడు. ఇలాంటి విషయాల్లో నేను మాత్రం తక్కువ తిన్నానా నాకెందుకు ఇవ్వరని ట్రంప్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలుగా పేరుమోసిన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ప్రయోగశాల లాటిన్‌ అమెరికా. వాటి ప్రజావ్యతిరేక, ప్రపంచ పెట్టుబడి అనుకూల విధానాల కారణంగా జన జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వాటిని బలవంతంగా అమలు జరిపేందుకు మిలిటరీ పాలకులు, నియంతలను రంగంలోకి తెచ్చారు. వారికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో జరిగిన పోరాటాలతో వామపక్ష శక్తులు ముందుకు వచ్చాయి, అనేక చోట్ల అధికారాన్ని పొందాయి. అయితే నయావలసవాద పునాదులను పూర్తిగా నాశనం చేయకుండా జనాలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ అసలు సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అందుకే ఎన్నికలలో వామపక్షాలకూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇదే సమయంలో బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు మరింతగా సంస్కరణల పేరుతో తమ విధానాలను రుద్దుతుఉన్న కారణంగా కార్మికవర్గం, ఇతర తరగతులు వీధులలోకి రావటం అనివార్యంగా కనిపిస్తున్నది.

ఈ పూర్వరంగంలో పెరూలో వామపక్ష అభ్యర్ధిగా ముందుకు వచ్చి విజయం సాధించిన ఒక సామాన్య స్కూలు టీచర్‌ పెడ్రో కాస్టిలో 2021లో అధికారానికి వచ్చిన ఏడాదిలోనే పదవి కోల్పోయాడు. తన మూలాలను మరచి మితవాద,మతవాద శక్తులతో చేతులు కలిపి కార్మికవర్గాన్ని విస్మరించాడు.పార్లమెంటు ఉద్వాసనతో పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పుడు ఉపాధ్యక్షరాలిగా ఉన్న దినా బోలార్టే 2022లో గద్దెనెక్కింది. అన్ని విధాలుగా పాలనలో విఫలం కావటంతో పార్లమెంటు గత శుక్రవారం నాడు పదవి నుంచి తొలగించింది.ఆమెకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. గురువారం రాత్రి చర్యకు ఉపక్రమించిన పార్లమెంటు మెరుపువేగంతో వ్యవహరించి తెల్లవారేసరికి ఉద్వాసన పలికింది. రాత్రి 11.30కు పార్లమెంటు రావాలని ఇచ్చిన ఆదేశాన్ని ఆమె ఉల్లంఘించింది. ఒకనాడు మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా వ్యతిరేకంగా ఓటువేశాయి. విచ్చలవిడి అవినీతి, రెచ్చిపోయిన నేరస్థ ముఠాలను అదుపుచేయటంలో వైఫల్యంతో దినా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగేవరకు పార్లమెంటు స్పీకరు జోస్‌ జెరీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. గత తొమ్మిది సంవత్సరాలలో ఏడుగురు అధ్యక్షులు మారారు. వారిలో ముగ్గురిని పార్లమెంటు తొలగించింది. అధ్యక్షులుగా ఎన్నికైన పార్టీ పార్లమెంటులో మెజారిటీ సాధించలేకపోవటం అనేక లాటిన్‌ అమెరికా దేశాల్లో జరుగుతున్నది.దామాషా ప్రాతినిధ్యంతో అనేక పార్టీలు పార్లమెంటులో అడుగుపెడుతున్నాయి. పౌరుల ఆగ్రహం తలెత్తినపుడు అధ్యక్షులను పార్లమెంట్లు తొలగిస్తున్నాయి. ప్రైవేట్‌ పెన్షన్‌ నిధులకు కార్మికులు చెల్లించాలనే బిల్లుకు వ్యతిరేకంగా యువతరం నిరసనలకు దిగింది.దీనికి తోడు ఉద్యోగ భద్రత లేదు, యువతలో నిరుద్యోగం విపరీతంగా ప్రబలింది.

మరో లాటిన్‌ అమెరికా దేశం ఈక్వెడార్‌. మితవాది, వాణిజ్యవేత్తలకు అనుకూలమైన అధ్యక్షుడు డేనియల్‌ నోబావోకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నది. చమురు మీద ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేయటంతో ఆగ్రహం భగ్గుమన్నది. ఒక గాలన్‌(3.79 లీటర్లు) డీజిలు ధర 1.8 డాలర్ల నుంచి 2.8డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ ధరలను బట్టి ఎప్పటికప్పుడు ధరలను సవరిస్తామని ప్రకటించారు. స్థానిక తెగలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ అనేక రూపాల్లో ఆందోళనకు పిలుపు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఆదివారం నాడు కొలంబస్‌ దినం రోజున(1492లో కొలంబస్‌ లాటిన్‌ అమెరికా గడ్డపై అడుగు పెట్టాడు) తాజా ప్రదర్శనలపై దేశవ్యాపితంగా పోలీసులు విరుచుకుపడ్డారు. దాంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పది జిల్లాల్లో అధ్యక్షుడు అత్యవసర పరిస్థితిని ప్రకటించేంతగా ఉద్రిక్తత పెరిగింది.గతవారంలో రోడ్డు మీద అధ్యక్షుడి కారునే అడ్డుకున్నారు. స్థానిక తెగలు ఎక్కువగా పని చేస్తున్న వ్యవసాయం, చేపలు పట్టటం, రవాణా రంగాలపై చమురు సబ్సిడీ ఎత్తివేత ప్రభావం ఎక్కువగా ఉంది. ఏటా ప్రభుత్వం 110 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇస్తున్నదని, ఈ కారణంగా ఇరుగుపొరుగున ఉన్న కొలంబియా, పెరూ దేశాలకు పెద్ద ఎత్తున అక్రమరవాణా జరుగుతున్నదని అధ్యక్షుడు వాదిస్తున్నాడు. డేనియల్‌ నోబావో నియంతమాదిరి వ్యవహరిస్తున్నాడని,చమురు సబ్సిడీ ఎత్తివేతకు ముందు ఇతర రాయితీలను కూడా తొలగించారని, చమురు అక్రమరవాణా అన్నది ఒక సాకుమాత్రమే నంటూ ఐదువేల మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగించారని కార్మిక నేతలు ప్రకటించారు. సమ్మెకు పిలుపు ఇచ్చిన సంస్థతో చర్చలకు ససేమిరా అనటంతో పరిస్థితి మరింతగా దిగజారింది. కొత్తగా రుణం ఇచ్చేందుకు రుద్దిన ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు పొదుపు పేరుతో నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఔషధాలు కూడా సరిగా ఉండటం లేదు. విదేశీ మిలిటరీ స్థావరాల ఏర్పాటును అనుమతించేందుకు జూన్‌లో పార్లమెంటు తీర్మానించింది. ఇది అమెరికా కోసమే అన్నది తరువాత వెల్లడైంది. ప్రజా వ్యతిరేక విధానాలకు, అమెరికాకు లొంగిపోవటాన్ని లాటిన్‌ అమెరికా కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచమా గాజాను మరచిపోవద్దు : ఇజ్రాయెల్‌ దాడిలో ప్రాణాలు వదలిన ఓ జర్నలిస్టు ఆఖరి కోరిక !!

13 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Don’t forget Gaza, Gaza Deaths, Israel genocide, Netanyahu, Palestine Journalist Anas al-Sharif, Palestinian People


ఎం కోటేశ్వరరావు


2023 అక్టోబరు ఏడున గాజాలో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన మారణకాండ మరోదశలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. హమస్‌ను అంతమొందించేందుకు గాజా స్వాధీనం తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ఇప్పటి వరకు 75వేల మంది వరకు నిరాయుధులైన పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది. వీరిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. దాదాపు రెండు లక్షల మందిని గాయపరిచారు, లక్షలాది ఇండ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలను నేలమట్టం గావించారు. అయినప్పటికీ హమస్‌, ఇతర సాయుధ బృందాలను పట్టుకోవటంలో విఫలమైంది. వారిని పట్టుకోవాలంటే గాజాను పూర్తిగా తన స్వాధీనంలో తెచ్చుకోవాలని ఇజ్రాయెల్‌ చెబుతోంది. నిజానికి ఒక విధంగా గాజా ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలోనే ఉంది. ఆకలితో మాడుతున్న పసిపిల్లలకు అవసరమైన ఆహారసాయాన్ని కూడా రాకుండా మిలిటరీ అడ్డుకుంటున్నది, సహాయ శిబిరాల వద్దకు వచ్చిన వారిని కూడా చంపివేస్తున్నది. ప్రపంచంలో అనేక యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో వార్తలను సేకరించే జర్నలిస్టులకు రక్షణ ఉంటుంది, ప్రమాదవశాత్తూ గాయపడటం, మరణించటం వేరు. కానీ గాజాలో ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను ఇజ్రాయెల్‌ బలగాలు చంపివేశాయి. తాజాగా అల్‌ జజీరా టీవీ, పత్రికలకు వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను హతమార్చారు, ఏమిటంటే వారంతా హమస్‌ సాయుధులతో కలసి ఉన్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. అనాస్‌ అల్‌ షరీఫ్‌ అనే ఆల్‌ జజీరా విలేకరి తన కుటుంబం, ప్రపంచానికి ఎక్స్‌ ద్వారా ఒక చివరి సందేశం పంపాడు.‘‘ ఇది చివరి వర్తమానం, మీకు అందే సమయానికి ఇజ్రాయెల్‌ నన్ను చంపివేస్తుంది, నా గళాన్ని అణచివేస్తుంది, ప్రపంచం గాజాను మరచిపోవద్దు ’’ అని దానిలో ఉంది. ఆదివారం రాత్రి అది నిజమైంది. గాజాలోని ఆల్‌ షిఫా ఆసుపత్రి సమీపంలో జర్నలిస్టులు ఉన్నారనే చిహ్నాలు ఉన్న గుడారాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపిన వైమానిక దాడిలో అల్‌ షరీఫ్‌తో పాటు తమ జర్నలిస్టులు మరో నలుగురితో సహా ఏడుగురిని చంపినట్లు అల్‌ జజీరా తెలిపింది.


ఓ జర్నలిస్టు చివరి సందేశం
అనాస్‌ అల్‌ షరీఫ్‌ చివరి సారిగా ఎక్స్‌లో పంపిన వర్తమానం ఇలా ఉంది.‘‘ ఇది నా వాంఛ మరియు చివరి వర్తమానం. ఇది మీకు చేరేలోపు ఇజ్రాయెల్‌ నన్ను చంపటంలో జయప్రదం అవుతుంది, నా గళం మూగపోయేట్లు చేస్తుంది. మొదటిది మీకు శాంతి చేకూరాలి, అల్లా దయ మరియు దీవెనలు మీకు కలగాలి. జబాలియా శరణార్ధి శిబిరంలో నేను జన్మించి కళ్లు తెరిచినప్పటి నుంచి అక్కడి వీధులు, సందుల్లో తిరుగాడుతూ నా జనం కోసం గళం విప్పి మద్దతు ఇచ్చిన ప్రతి అంశం గురించి అల్లాకు తెలుసు. మా స్వంత పట్టణమైన ఆక్రమిత అస్కలాన్‌( అల్‌ మజదాల్‌)కు తిరిగి వచ్చేందుకు అల్లా నా జీవితాన్ని పొడిగిస్తాడని ఆశిస్తున్నాను, అందువలన నేను నాకుటుంబం, ప్రేమించేవారిని కలుసుకొనేందుకు తిరిగివస్తాను. అయితే అల్లా వాంఛ ముందు మరియు ఆయన ఆదేశమే అంతిమం.
నేను బాధల మధ్యనే జీవించాను, అనేక నష్టాలు, ఇబ్బందులను చవిచూశాను. అయినప్పటికీ ఎలాంటి వక్రీకరణలు, తప్పుడు సమాచారం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని చేరవేసేందుకు ఒక్కసారి కూడా నేను వెనుకాడలేదు.ఏడాదిన్నరకు పైగా మన జనాలు ఎదుర్కొంటున్న ఊచకోతను ఆపేందుకు ఏమీ చేయని వారిని, మన పిల్లలు, మహిళల శరీరాలు ఛిద్రమైనా చలించని హృదయాలు కలవారిని, మౌనంగా దూరంగా ఉన్నవారిని, మన హత్యలను ఆమోదించిన వారిని, మన శ్వాసను ఆడనివ్వని వారిని అందరినీ అల్లా చూస్తున్నాడు.
ముస్లిం సమాజ కిరీటంలో మణి, ఈ ప్రపంచంలోని ప్రతి స్వేచ్చా జీవి గుండె చప్పుడు వంటి పాలస్తీనాను మీకు అప్పగిస్తున్నాను. దాని జనాన్ని, తప్పు చేసిన వారినీ, రక్షణ, శాంతిలేకుండా జీవించేందుకు లేదా కలలు కనేందుకు కూడా ఎన్నడూ సమయంలేని అమాయకులైన పిల్లలతో పాటు మీకు అప్పగిస్తున్నాను. వేలాది టన్నుల ఇజ్రాయెలీ బాంబులు, క్షిపణులతో నిర్మలమైన వారి శరీరాలు నలిగిపోయాయి, ఛిద్రమైన వారి భాగాలు అంతటా పడ్డాయి. బంధనాలు మిమ్మల్ని మౌనంగా ఉంచలేవు, సరిహద్దులు ఏమీ చేయలేవు. అపహరించిన మన మాతృభూమిలో స్వేచ్చ, హుందాతనపు సూర్యుడు ఉదయించే వరకు మన భూమి, పౌరుల విముక్తి కోసం మీరు వారధులుగా మారండి.
నా కుటుంబ మంచిచెడ్డలను మీకు అప్పగిస్తున్నాను. నేను కలలు కన్నవిధంగా నా కుమార్తె షామ్‌ ఎదగటాన్ని చూసే అవకాశం నాకు రాలేదు. నాకళ్ల వెలుగైన ఆమెను మీకు అప్పగిస్తున్నాను. నా భారం మోసేంతవరకు మరియు నా లక్ష్యాన్ని సాధించేవరకు అతని పెరుగుదలకు నా ప్రియమైన కుమారుడు సాలాప్‌ాను కూడా మీకు అప్పగిస్తున్నాను. నేను ప్రేమించే నా మాతృామూర్తిని కూడా మీకు అప్పగిస్తున్నాను.నేను ఇలా ఉండటానికి ఆమె చేసిన ప్రార్ధనలే కారణం. అవేనాకు పెట్టని కోట, ఆమె ఇచ్చిన వెలుగు బాట నాది. ఆమెకు శక్తిని ప్రసాదించాలని, శుభం కలగాలని నా తరఫున అల్లాను ప్రార్ధిస్తున్నాను.
నా జీవితకాల సహచరి, భార్య ఉమ్‌ సాలాప్‌ా(బయాన్‌) బాధ్యతను కూడా మీకు అప్పగిస్తున్నాను. యుద్ధం మమ్మల్ని రోజులు, నెలల తరబడి విడదీసింది. వంగని ఆలివ్‌ చెట్టు కొమ్మలా ధీటుగా ఆమె నిలిచింది, బంధానికి కట్టుబడి ఉంది, సహనంతో ఆల్లా మీద విశ్వాసంతో ఉంది. నా పరోక్షంలో ఆమె బాధ్యతలను నిర్వహించేందుకు ఆమె తన యావత్‌ శక్తి, విశ్వాసాన్ని వినియోగిస్తున్నది. వారందరికీ మీరు అండగా నిలవాలని కోరుతున్నాను, అల్లా తరువాత మీరే వారికి మద్దతు ఇవ్వాలి.
నేను గనుక మరణిస్తే, నా సిద్దాంతాలకు గట్టిగా నిలిచి నేను మరణించేందుకు సిద్దం. నేను అల్లా ఆదేశాలకు అనుగుణంగా నడుస్తానని ప్రమాణం చేశాను, నేను ఆయన్ను తప్పకుండా కలుసుకుంటాను. ఆయనతో ఎప్పటికీ నిలిచి ఉంటానని హామీ ఇస్తున్నాను. ఓ అల్లా అమరజీవుల్లో నన్ను ఒకరిగా స్వీకరించు, నా గత, భవిష్యత్‌ పాపాలను క్షమించు. నాజనం, నా కుటుంబం స్వేచ్చా బాటలో నడిచేందుకు అవసరమైన వెలుగునిచ్చేందుకు నా రక్తం తోడ్పడేట్లు చేయి. ఆకాంక్షలకు అనుగుణంగా నేను లేనట్లయితే నన్ను క్షమించు.
నా వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు దాన్ని ఎన్నడూ మార్చుకోకుండా, ద్రోహం చేయకుండా ఉండేందుకు దయతో నాకోసం ప్రార్ధించండి. గాజాను మరచిపోవద్దు. క్షమ మరియు మీలో ఒకడిగా అంగీకరించేందుకు మీరు చిత్తశుద్దితో చేసే ప్రార్ధనల్లో నన్ను మరవకండి.’’


హృదయాలను కదలించే చివరి సందేశం పంపిన అనాస్‌ అల్‌ షరీఫ్‌ 28 సంవత్సరాల యువకుడు, జర్నలిస్టు, వీడియో గ్రాఫర్‌. అతని స్వస్థలం ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలో ఉంది.పాలస్తీనా విముక్తి పోరులో ప్రాణాలకు తెగించి వార్తలను అందిస్తున్నవారిలో ఒకడు. అతనికి హమస్‌ తీవ్రవాది ముద్రవేసిన ఇజ్రాయెల్‌ మిలిటరీ గత రెండు సంవత్సరాలుగా చంపివేస్తామని అనేక సార్లు బెదిరించింది. అది చంపదలుకున్నవారందరికీ ఏదో ఒక ముద్రవేస్తున్నది. ఇజ్రాయెల్‌ ఆరోపణను ఐరాస తిరస్కరించింది. గాజా మారణకాండకు సంబంధించి అతను తీసిన ఫొటోకు 2024లో పులిట్జర్‌ బహుమతి ఇచ్చారు. రెండు సంవత్సరాలుగా అల్‌ జజీరాలో పనిచేస్తున్నాడు. గత నెలలో ఆకలితో చంపుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యను వెలుగులోకి తెచ్చాడు. అప్పటి నుంచి అతని కోసం ఇజ్రాయెల్‌ మిలిటరీ వేట ప్రారంభించి చివరకు ఆగస్టు పది రాత్రి విమానాలతో దాడి చేసి హతమార్చింది.


అల్‌ షరీఫ్‌ వంటి ఎందరో పాలస్తీనియన్లు శరణార్ధి శిబిరాల్లోనే పుట్టి అక్కడే పెరిగి చివరికి అదే ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు అక్కడే మరణిస్తున్నారు. గత ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండ, పోరు అలాంటి ఎందరినో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దం చేస్తున్నది తప్ప పిరికిబారేట్లు చేయటం లేదు. 2023 అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను చంపినట్లు ఐరాస పేర్కొన్నది. రెండు ప్రపంచ యుద్దాలు, వియత్నాం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణ వంటి అనేక యుద్ధాలన్నింటిలో కూడా ఇంత మంది ప్రాణాలు కోల్పోలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.ఇటీవలి సంవత్సరాలలో జర్నలిస్టులకు ప్రాణాంతక, అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఉదంతం ఈ మారణకాండ. తనకు అనుకూలంగా వార్తలు ఇచ్చే వారిని తప్ప అంతర్జాతీయ జర్నలిస్టులను గాజాలో ప్రవేశించకుండా ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నది. ఈ నేపధ్యంలో స్థానిక పాలస్తీనియన్లే విలేకర్లుగా మారి ఆల్‌ జజీరా వంటి మీడియా సంస్థలకు వార్తలను అందిస్తున్నారు. అది కూడా లేనట్లయితే అసలు గాజాలో ఏం జరుగుతున్నదో బయటి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.


గాజాలో తాజా పరిణామాల విషయానికి వస్తే హమస్‌ ఆయుధాలు విసర్జింతవరకు దాడులు చేయటం తప్ప మరొకమార్గం లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ప్రస్తుతం 70నుంచి75శాతం వరకు తమ ఆధీనంలో ఉందని చెప్పాడు.హమస్‌కు రెండు గట్టి స్థావరాలు ఉన్నాయని పూర్తిగా తుదముట్టించాలంటే గాజా స్వాధీనం చేసుకోవాల్సిందే అన్నాడు. ఈ వైఖరిని అనివార్యమై కొన్ని పశ్చిమదేశాలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా అండతో ఈ దుర్మార్గానికి పూనుకున్నాడు. గాజాలో దాడులకు ఉపయోగించే ఆయుధాలను ఇజ్రాయెల్‌కు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే నిజంగా అమలు చేస్తుందా లేక వేరే మార్గాల ద్వారా సరఫరా చేస్తుందా అన్నది చెప్పలేము.హమస్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని జర్మనీ ఇదే సందర్భంగా పేర్కొన్నది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్‌ గత ఏడు దశాబ్దాల నుంచి చెబుతున్న ఆత్మరక్షణ కతలను పశ్చిమదేశాలు సమర్ధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పేరుతో పాలస్తీనాను అడ్డుకోవటం అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు.జర్మనీ గతంలో సరఫరా చేసిన ఫ్రైగేట్స్‌తోనే గాజాపై ఇజ్రాయెల్‌ నౌకాదళం తొలి దాడులు జరిపింది.


గాజా ఆక్రమణను అడ్డుకొనేందుకు ముస్లిం దేశాలన్నీ ఐక్యం కావాలని టర్కీ, ఈజిప్టు పిలుపునిచ్చాయి. ఈజిప్టుతో చర్చలు జరిపిన తరువాత విదేశాంగశాఖ మంత్రి బదర్‌ అబ్దెలెటీతో కలసి టర్కీ విదేశాంగ మంత్రి హకన్‌ ఫిదాన్‌ శనివారం నాడు విలేకర్ల సమావేశంలో ఈ పిలుపునిచ్చారు. రెండు దేశాలూ ఇజ్రాయెల్‌ చర్యను ఖండిరచాయి.తక్షణమే ఇస్లామిక్‌ దేశాల సంస్ధ సమావేశం జరపాలని కోరారు. ఇజ్రాయెల్‌ చర్య ఒక్క పాలస్తీనాకే గాక ఇరుగుపొరుగు దేశాలన్నింటికీ ప్రమాదమే అని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ దేశాల సంస్థ విదేశాంగ మంత్రుల కమిటీ కూడా ఖండిరచింది. భద్రతా మండలి, ప్రపంచ అగ్రరాజ్యాలు జోక్యం చేసుకోవాలని కోరింది. లక్షలాది మంది ఇజ్రాయెల్‌ పౌరులు రాజధాని టెల్‌ అవీవ్‌, ఇతర నగరాల్లో గాజా దురాక్రమణ ప్రతిపాదనను ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వ చర్యకు సైనికులు మద్దతు ఇవ్వరాదని నినదించారు. హమస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు అవసరమైతే నెతన్యాహు ప్రభుత్వ వైఖరిని నిరసనగా సాధారణ సమ్మె జరపాలని బందీల కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. స్వజనంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్‌ చర్యలకు నానాటికీ వ్యతిరేకత వెల్లడవుతున్నప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, నిస్సిగ్గుగా మద్దతు ప్రకటిస్తున్నాడు. మరింత పెద్ద ఎత్తున నిరసనోద్యమం జరిగితే తప్ప ఇజ్రాయెల్‌ వెనుకడుగువేసే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ అంచనా తప్పిందా, బంకర్‌లో నెతన్యాహు, జి7 సభ నుంచి అర్ధంతరంగా వెనుదిరిగిన ట్రంప్‌ !

18 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Ayatollah Ali Khamenei, Donald trump, Iran nuclear weapon, Israel Attack on Iran, Netanyahu


ఎం కోటేశ్వరరావు


ఇరాన్‌లో తెల్లవారు రaామున మూడు గంటల సమయంలో 2025 జూన్‌ 13వ తేదీ ఇజ్రాయెల్‌ వైమానిక దళం విరుచుకుపడిరది.రెండువందల జెట్‌లతో వంద లక్ష్యాలపై దాడి చేసింది. అనేక మంది మిలిటరీ ఉన్నతాధికారులు, అణుశాస్త్రవేత్తలను హత్యచేసింది. మరోవైపున ఆకస్మికదాడిని ఊహించని ఇరాన్‌ వెంటనే కోలుకొని ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రాణ భయంతో బంకర్‌లోకి వెళ్లిపోయాడు, నలభై లక్షల జనాభా ఉన్న రాజధాని టెల్‌అవీవ్‌ నగరం దాడులతో అతలాకుతలం అయినట్లు చెబుతున్నారు.కెనడాలో జరుగుతున్న జి7 కూటమి సమావేశాల నుంచి అర్ధంతరంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక రోజు ముందుగానే వెనుదిరిగాడు. ఇది రాసిన సమయానికి రెండు దేశాల మధ్య పరస్పరదాడులు కొనసాగుతున్నాయి. కోటీ 70లక్షల జనాభా ఉన్న టెహరాన్‌ నగరాన్ని వదలి వెళ్లాలని ఇజ్రాయెల్‌, దానికి వెన్నుదన్నుగా ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ పిలుపు ఇవ్వగా టెల్‌అవీవ్‌ను ఖాళీ చేయాలని ఇరాన్‌ ప్రకటించింది. ఇటీవలి కాలంలో నివాసిత ప్రాంతాల నుంచి జనం ఖాళీ చేయాలన్న పిలుపులు సర్వసాధారణంగా మారాయి. యుద్ధ సమయంలో జరిగిన నష్టాల గురించి ఎవరు ఏమి చెప్పినా అతిశయోక్తులు ఉంటాయన్నది తెలిసిందే. తమ పౌర నివాసాలపై ఇరాన్‌ దాడులు చేస్తున్నదంటూ ఇజ్రాయెల్‌ గుండెలు బాదుకుంటున్నది.దానికి పశ్చిమ దేశాల మీడియా సమర్ధన, కావాలంటే వారు కూడా మిలిటరీ కేంద్రాల మీద దాడులు చేయవచ్చు కదా అన్నట్లు ఫోజుపెడుతున్నాయి. ఇజ్రాయెల్‌ తొలిరోజు జరిపిన దాడి టెహరాన్‌లోని పౌరనివాస భవనం మీదే, అక్కడ నివశిస్తున్న అణుశాస్త్రవేత్తలతో సహా 60 మంది మరణించారు. నిత్యం గాజాలో ఆసుపత్రులు, పాఠశాలలతో సహా, నివాసభవనాలు చివరికి సహాయశిబిరాలు, సహాయ కేంద్రాల వద్ద ఉన్న పౌరుల మీద మారణకాండ జరుపుతున్నది, వేలాది మంది పిల్లలు, మహిళలు, కదలలేని వృద్దుల ఉసురుతీస్తున్న తీరు ప్రపంచం చూడటం లేదా !


కెనడాలో జరుగుతున్న జి7 కూటమి సమావేశాల నుంచి ముందే ఎందుకు వెనుదిరిగి వెళ్లిపోతున్నారన్న ప్రశ్నకు ఇంతకంటే ముఖ్యమైన పనులున్నాయని ట్రంప్‌ బదులిచ్చాడు. అటువంటపుడు అసలా సమావేశానికి ఎందుకు వెళ్లినట్లు ? ఈ పరిణామం గురించి భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఊహించినదానికి భిన్నంగా ఇరాన్‌ దాడులకు దిగటంతో తలెత్తిన పరిస్థితిలో ఏం చేయాలన్న తర్జన భర్జనలకు అన్నది ఒకటైతే, ఇరాన్‌పై స్వయంగా అమెరికా దాడులకు పూనుకోవాలన్న వత్తిడి పెరిగిన కారణం అని రెండవదిగా చెబుతున్నారు. రెండూ ఒకదానితో ఒకటి సంబంధాలు కలిగిన అంశాలే గనుక ఏం చేయనున్నారనేదాన్ని బట్టి పరిణామాలు ఉంటాయి. ఇరాన్‌ అణుబాంబులు తయారు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుందని గతంలో వార్తలు వచ్చాయి. అందుకే ట్రంప్‌ 60రోజుల్లో ఒప్పందానికి రాకపోతే మీ అంతు చూస్తానని ట్రంప్‌ బెదిరించాడు. ఆ గడువు ముగిసిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. అంతకు ముందు జాతీయ గూఢచార సంస్థ అధిపతి తులసీ గబ్బార్డ్‌ సెనెట్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్‌ అణుబాంబును తయారు చేయటం లేదని గూఢచారులు అంచనాకు వచ్చినట్లు చెప్పారు. అణుకార్యక్రమం నుంచి వైదొలిగేట్లు చేసే వత్తిడిలో భాగంగా ఇజ్రాయెల్‌ దాడులకు ట్రంప్‌ పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో కొన్ని కేంద్రాలు పాక్షికంగా దెబ్బతినటం తప్ప భూగర్భంలో ఉన్న అసలైన కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వార్తలు వచ్చాయి. వాటిని దెబ్బతీయాలంటే బి2 బాంబర్లు లేదా 30వేల పౌండ్లు(13,607కిలోలు) భారీ బాంబులు అవసరం, అవి ఇజ్రాయెల్‌ వద్దలేవు గనుక నేరుగా అమెరికా రంగంలోకి దిగాలని వత్తిడి వస్తున్నదట. ఇంతకంటే ముఖ్యమైన పనులన్న ట్రంప్‌ వ్యాఖ్యకు ఇదే అర్ధమా ? లేక గౌరవ ప్రదంగా ఇజ్రాయెల్‌ను ఎలా బయటపడవేయాలని చూస్తున్నాడా ?


కెనడా నుంచి అర్ధంతరంగా ట్రంప్‌ వాషింగ్టన్‌ వెళ్లటం ఇరాన్‌ మరియు ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కుదర్చటానికే అని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. అయితే మక్రాన్‌ చెప్పింది తప్పని, మీడియాలో ప్రచారం కోసం తాపత్రయపడుతున్నాడని, తన తిరుగు ప్రయాణానికి సయోధ్యకు సంబంధమే లేదని ట్రంప్‌ చెప్పాడు. అతగాడి మాటలను విశ్వసించాల్సినపని లేదు. ఇజ్రాయెల్‌ చర్యల గురించి పరిపరి విధాలుగా చర్చ జరుగుతున్నది. గతంలో మారణాయుధాలను గుట్టలుగా పోసిన ఇరాక్‌ నేత సద్దాం హుస్సేన్‌ ప్రమాదకరంగా మారినందున తాము దాడిచేశామని అమెరికా తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్‌ అణుబాంబు కార్యక్రమంలో ఉందని అది తమకు ముప్పు అని అందుకే ముందు జాగ్రత్తగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూస్తున్నది. దానికి అమెరికా, ఐరోపా ధనిక దేశాలు వంతపాడాయి. వర్తమాన ప్రపంచంలో అణుబాంబులు కలిగిన దేశాలు కొన్ని తమకు లొంగని వారిని బెదిరించేందుకు పూనుకున్నాయి. అందువలన ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేయవచ్చు. మనదేశం కూడా ఆ విధంగానే తయారు చేసింది. అణువిద్యుత్‌ కేంద్రాలు కలిగిన ఏ దేశమైనా ఆయుధాల తయారీకి అవసరమైన యురేనియంను శుద్ది చేసే సత్తా కలిగి ఉంటుంది.అమెరికా తొత్తు ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత మరోసారి అమెరికా కుట్రలకు సమాధానం చెప్పేందుకు ఇరాన్‌ నూతన నాయకత్వం అణుకార్యక్రమం చేపట్టింది.


నేడు పశ్చిమాసియాలో యుద్ధం చెలరేగటానికి అసలైన నేరస్తురాలు అమెరికా. ఇరాన్‌ తనకు కొరకరాని కొయ్యగా మారినప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా చేయని కుట్ర లేదు. ఇజ్రాయెల్‌ తనకు ఇరుగు పొరుగు అరబ్‌, ఇస్లామిక్‌ దేశాల నుంచి ముప్పు ఉందంటూ పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలతో పాటు ఇరుగుపొరుగుదేశాల ప్రాంతాలను ఆక్రమించింది. యూదులను తరలించి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో జనాభా నిష్పత్తిని మార్చి అవి తమ ప్రాంతాలే అని చెప్పేందుకు పూనుకుంది. ఇప్పుడు ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని బూచిగా చూపి రక్షణ కావాలంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నది. ఇరాన్‌ అణుసమస్య పదమూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. నాటోలో చేరాలా లేదా అన్నది ఒక సార్వభౌత్వ దేశంగా ఉన్న ఉక్రెయిన్‌కు ఉందని వాదిస్తున్న అమెరికా అదే సార్వభౌమత్వం కలిగిన ఇరాన్‌ అణుబాంబును తయారు చేస్తుంటే చేయటానికి వీల్లేదని చెప్పటం అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు. నాటోను విస్తరించబోమని గతంలో రష్యాతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగానే ఇరాన్‌తో చేసుకున్న 2015నాటి అణు నిరోధ ఒప్పందాన్ని అమలు జరపకుండా 2018లో ఏకపక్షంగా వైదొలిగింది. నాటోలో చేరే ఉక్రెయిన్‌తో తనకు ముప్పు ఉన్నందున రష్యా దాని మీది సైనిక చర్యను ప్రారంభించినట్లుగానే అమెరికా స్వయంగా వైదొలిగినందున తన కార్యక్రమాన్ని ఇరాన్‌ కొనసాగిస్తున్నది.ఇప్పుడు అది ఒక దశకు వచ్చినట్లు పసిగట్టింది గనుక ఆపివేయాలంటూ ఏకపక్షంగా బెదిరింపులకు దిగింది. ఆ ఒప్పందాన్ని అమెరికా పూర్తిగా అమలు జరిపి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు, ఇరాన్‌ మరియు ఇజ్రాయెల్‌ కూడా సురక్షితంగా ఉండేవి. అందువలన అసలు నేరస్తురాలు అమెరికా. చరిత్రను చూసినపుడు అది అడుగుపెట్టిన ప్రతి చోటా సమస్య పరిష్కారం సంగతి తరువాత కొత్త వివాదానికి తెరలేపటాన్ని చూడవచ్చు. ఒక విషవలయంగా మార్చి తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసం చూస్తున్నది. పశ్చిమాసియాలో అది ఇంతవరకు ఎలాంటి నిర్మాణాత్మక పాత్రను పోషించటం లేదు, ప్రతినాయకుడిగా మారుతున్నది. పాలస్తీనా సమస్యను పరిష్కరించకుండా చూస్తున్నది, గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని విహార ప్రాంతంగా మారుస్తానని ట్రంప్‌ చెప్పటం మరింత అగ్నికి ఆజ్యం పోయటం గాక మరేమిటి ? మధ్యప్రాచ్య అడవిలో రారాజు సింహం లాంటిది అమెరికా, దానిలో కందిరీగవంటిది ఇరాన్‌, దాన్ని చంపటానికి అవసరమైతే మొత్తం అడవిని తగలబెట్టాల్సి ఉంటుందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో ఒక రచయిత పేర్కొన్నాడంటే అమెరికన్ల ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

తాజా దాడులలో ఇప్పటి వరకు కనిపించినదాన్ని బట్టి ఇజ్రాయెల్‌కు ఉన్న పరిమితులు ఏమిటో అది అమెరికాను కూడా ఎలా యుద్దానికి లాగేందుకు చూస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇరాన్‌ శక్తిని అది తక్కువ అంచనా వేసింది. లెబనాన్‌లో ప్రభుత్వేతర సాయుధ శక్తిగా ఉన్న హిజబుల్లా నెట్‌వర్క్‌లో ప్రవేశించి గత ఏడాది దానికి భారీ నష్టం చేకూర్చింది. అదే మాదిరి ఇరాన్‌లో చేయాలని చూసింది, కొందరు విద్రోహులను చేరదీసి కొంత మేరకు నెరవేరినట్లు కనిపిస్తున్నది. ఇరాన్‌లో ఎందరు మిలిటరీ కమాండర్లను హతమార్చినా ప్రత్యామ్నాయం ఉంటారన్న అంశాన్ని విస్మరించింది.హిజబుల్లాలోనే అలాంటి నేతలు ఉన్నపుడు ఇరాన్‌లో కొదవేముంటుంది. తన తొత్తుతో దాడులు చేయించి ఇరాన్‌న్ను దారికి తెచ్చుకోవాలన్నది అమెరికా దుష్ట ఎత్తుగడ, రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌తో ఇటీవల భారీ ఎత్తున దాడులు చేయించినప్పటికీ పుతిన్‌ లొంగలేదు, అలాంటిది ఇరాన్‌ సలాం కొడుతుందా ? ఇరాన్‌ దాడులతో అమెరికా, ఇతర పశ్చిమదేశాలు ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్‌ ఐరన్‌ డ్రోమ్‌ దాన్ని కాపాడలేకపోయింది. రాజధాని, ఇతర నగరాలపై క్షిపణులతో విరుచుకుపడటంతో అది నివ్వెరపోయింది. చివరకు ప్రధాని నెతన్యాహు కూడా బంకర్‌లో దాక్కోవాల్సి వచ్చింది. మీకు రెండో అవకాశం ఇస్తున్నా అంటూ ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ కెనడా నుంచి ఆకస్మికంగా వెనుదిరగాల్సి వచ్చింది. తాను కూడా ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనాలా లేదా అని అమెరికా మల్లగుల్లాలు పడుతున్నది. నిజానికి ఇజ్రాయెల్‌ దాడికి దిగినప్పటికీ అమెరికాయే దాడి చేస్తున్నట్లు ఇరాన్‌ పరిగణిస్తున్నది.


ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డుల మాజీ జనరల్‌ కమాండర్‌ మొహసెన్‌ రెజాయి ఒక మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్‌కు ఇస్తున్న మద్దతు, ఆయుధాలను అమెరికా, ఐరోపా వెంటనే విరమించుకోవాలి. కొనసాగితే గగనతలంలో తమ క్షిపణులు తలపడతాయని, అవి అమెరికా, బ్రిటీష్‌, ఫ్రెంచి విమానాలు ఏవైనా తమకు ఒకటే అని అన్ని పరిణామాలు, పర్యవసానాలకు తాము సిద్దపడి ఉన్నామని చెప్పాడు. మేం ముందుగా దాడులు చేయంగానీ ముగించేది మాత్రం మేమే అన్నాడు. పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న తమ చమురు కేంద్రాలను ధ్వంసం చేస్తే ఏ దేశం కూడా చమురును వినియోగించుకోకుండా చేస్తామని ఇరాన్‌ అధినేత అలీ ఖమేనీ సలహాదారు మహమ్మద్‌ జావేద్‌ లారిజాని కూడా స్పష్టం చేశాడు.హార్ముజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కొన్ని కేంద్రాలను ఇజ్రాయెల్‌ దెబ్బతీయగలిగింది గానీ మధ్య,తూర్పు ప్రాంతాలో ఉన్న ముఖ్యమైన వాటిని అది తాకలేకపోయింది. తాము దాడులు చేయగానే అలీ ఖమేని వ్యతిరేకులు పెద్ద ఎత్తున రంగంలోకి వస్తారని అధికార మార్పిడికి ఆజ్యం పోయవచ్చని ఇజ్రాయెల్‌ భావించినట్లు కనిపిస్తోందని, దానికి భిన్నంగా పరిణామాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.విబేధాలు ఉన్నప్పటికి ఉమ్మడి శత్రువుగా ఇజ్రాయెల్‌ దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర దేశాలను వారు చూస్తున్నారు.పశ్చిమాసియా అంతటా అమెరికా వ్యతిరేక ధోరణులు పెరుగుతున్నపుడు ఖమేనీ పాలనపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ జనంలో జాతీయ భావాలు పెరిగినట్లు కనిపిస్తోంది, యుద్ధం ఎన్నిరోజులు సాగుతుందో, ఎలా ముగుస్తుందో తెలియదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా దమన రీతి : ఎమెన్‌పై దాడి, గాజాలో తిరిగి మారణకాండ !

19 Wednesday Mar 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR, Women

≈ Leave a comment

Tags

Donald trump, Gaza ceasefire deal, Israel’s Gaza Onslaught, Netanyahu, Yemen Houthis

ఎం కోటేశ్వరరావు


సామ్రాజ్యవాదులకు ప్రత్యేకించి ప్రపంచాన్ని తన చంకలో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికన్లకు నిత్యం ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు లేదా యుద్ధం ఉండాల్సిందే. అప్పుడే అక్కడి మిలిటరీ పరిశ్రమలు పని చేస్తాయి, బిలియన్ల కొద్దీ లాభాలు సంపాదించి పెడతాయి. ఒక వైపు ఉక్రెయిన్‌లో పోరు నివారిస్తా, పుతిన్‌తో మాట్లాడతా అంటున్న ట్రంప్‌ మరోవైపు మధ్య ప్రాచ్యంలోని ఎమెన్‌పై శనివారం నుంచి వైమానిక దాడులకు తెరతీశాడు. దీనికి కారణం ఏమిటి ? ఈ సందర్భంగా తోడేలు ` మేకపిల్లను కథను గుర్తుకు తెచ్చుకోవాలి. కాలువ నీటిని మురికి చేస్తూ నేను తాగేందుకు పనికి రాకుండా చేస్తున్నావంటూ మేకపిల్లతో తోడేలు దెబ్బలాటకు దిగింది. అదేమిటి నువ్వు ఎగున ఉన్నాను, నేను దిగువ ఉన్నాను, పైన నీళ్లు ఎలా మురికి అవుతాయని మేకపిల్ల ప్రశ్నించింది. నువ్వు గాకపోతే నీ అమ్మ మురికి చేసిందంటూ తోడేలు మేకపిల్ల మీద దాడి చేసి మింగేసింది. తాజా దాడులకు ట్రంప్‌ చెబుతున్న కారణం కూడా అదే మాదిరి ఉంది. ఎర్ర సముద్రంలో నౌకలపై జనవరి 19 తరువాత ఎమెన్‌ ఎలాంటి దాడులు జరపలేదు కదా ఇప్పుడెందుకు దానిపై యుద్ధానికి దిగారని ప్రశ్నిస్తే గతంలో వారు చేసిన దాడులతో మాకు ఎంతో నష్టం జరిగింది, ప్రాణాలకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ చెబుతున్నాడు. నిజానికి దుష్టాలోచనతోనే అమెరికా తెగించింది. గాజాలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ మరోసారి అక్కడి పౌరులను హత్య చేసేందుకు పూనుకుంది. సోమవారం రాత్రి నుంచి ఆకస్మికంగా వైమానిక దాడులు జరిపి వందలాది మంది ప్రాణాలు తీసింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలూ చేయలేదు. మానవతా పూర్వక సాయం చేస్తున్న ప్రాంతాలను కూడా వదలలేదు. ఇదే సమయంలో దానికి మద్దతుగా ఎమెన్‌పై అమెరికా దాడులు ప్రారంభించింది.ఈ రెండిరటిని వేర్వేరుగా చూడలేము.


ఉద్రిక్తతలను సడలించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అగ్రరాజ్యం అమెరికా మధ్య ప్రాచ్యంలో మరోసారి అగ్నికి ఆజ్యం పోసింది. శనివారం నుంచి ఎర్ర సముద్ర తీరంలోని ఎమెన్‌పై వైమానికదాడులకు పూనుకుంది. రాజధాని సనా నగరంతో సహా 30 ప్రాంతాల మీద దాడులు జరుగుతున్నట్లు పెంటగన్‌ వర్గాలు పేర్కొన్నాయి. దానికి ప్రతిగా ఆ ప్రాంతంలో తిష్టవేసిన అమెరికా విమానవాహక యుద్ధనౌక, ఇతర మిలిటరీ నౌకలపై హౌతీ సాయుధులు దాడులు చేస్తున్నారు. అమెరికా దాడులకు తక్షణ కారణంగా చెబుతున్న సాకును చూస్తే దుష్టాలోచన కడుపులో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు విరామంగా శాంతి ఒప్పందం కుదిరింది. దాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్‌ను పల్లెత్తు మాట అనని ట్రంప్‌ ఎమెన్‌పై దాడులకు ఆదేశించాడు. పదిరోజులుగా గాజాలోని పాలస్తీనియన్లకు బయటి నుంచి వస్తున్న సాయాన్ని అందనీయకుండా ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నది. అలాగే కొనసాగితే తాము అటువైపు వెళ్లే నౌకలపై దాడులకు దిగుతామని హౌతీలు ప్రకటించారు తప్ప కొత్తగా ఎలాంటి దాడి చేయలేదు.ఈ ప్రకటనను సాకుగా తీసుకొని తమ నౌకలకు ముప్పు తలెత్తిందని, స్వేచ్చగా నౌకాయానం జరగాలంటూ దాడులు జరుపుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడుల్లో కొంత మంది నేతలను చంపివేసినట్లు అధ్యక్ష భవనం ఒక ప్రకటన చేసింది. మొత్తం 53 మంది మరణించారు.


గాజా ప్రాంతంపై దాడులకు తెగబడి 2023 అక్టోబరులో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయెల్‌ చర్యలను ఖండిస్తూ అప్పటి నుంచి ఇటీవలి శాంతి ఒప్పందం వరకు 136 యుద్ధ, వాణిజ్య నౌకలు ప్రత్యేకించి ఇజ్రాయెల్‌ వైపు ప్రయాణించేవాటిమీద హౌతీలు దాడులు జరిపారు.క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడుల్లో రెండు నౌకలు మునిగిపోగా నలుగురు నావికులు మరణించారు. శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన జనవరి 19 నుంచి ఎలాంటి దాడులు లేవు. గాజాలోని పౌరులకు అందచేస్తున్న సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయెల్‌ నౌకల మీద దాడులు చేస్తామని గత బుధవారం నాడు హౌతీలు ప్రకటించగా ఆ సాకుతో శనివారం నుంచి అమెరికా దాడులకు తెగబడిరది.‘‘ హౌతీల దాడుల కారణంగా అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్ల నష్టం జరిగింది.అమాయకుల ప్రాణాలకు ముప్పు తలెత్తింది ’’ అని ట్రంప్‌ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాడు. గాజాను మొత్తంగా సర్వనాశనం చేసి వేలాది మంది పౌరులను ఊచకోత కోసి ఇజ్రాయెల్‌ కలిగించిన బాధ, వేదనలు ట్రంప్‌కు కనిపించలేదు. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో యుఎస్‌ఎస్‌ హారీట్రూమన్‌ విమానవాహక నౌక, మూడు నౌకాదళ డెస్ట్రాయర్లు, ఒక క్రూయిజర్‌ను అమెరికా మోహరించింది. ఇవిగాక యుఎస్‌ఎస్‌ జార్జియా అనే క్రూయిజ్‌ క్షిపణి జలాంతర్గామి కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నది. అమెరికా షిప్పింగ్‌, వైమానిక, నౌకాదళ ఆస్తుల రక్షణకు, స్వేచ్చగా నౌకా విహారం కోసం దాడులు చేసినట్లు ట్రంప్‌ చెప్పాడు.హౌతీల చర్యలకు పూర్తి బాధ్యత ఇరాన్‌దే అని ఆరోపించాడు. హౌతీల దాడులను ఇరాన్‌ చేసినట్లుగానే పరిగణిస్తామన్నాడు. నౌకలపై దాడులను ఆపేంతవరకు తమ దాడులు కొనసాగుతాయని చెప్పాడు.2025 జనవరి 20న రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మరొక దేశంపై ట్రంప్‌ జరిపిన తాలిదాడిగా చరిత్రలో నమోదైంది.


2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి గతంలో ట్రంప్‌ నాయకత్వంలోని ప్రభుత్వం ఏకపక్షంగా ఉపసంహరించుకుంది. తాజాగా మరోసారి దాని గురించి చర్చించేందుకు ముందుకు రావాలని ఇరాన్‌కు లేఖ రాసినట్లు అమెరికా చెప్పింది. తాము సముఖంగానే ఉన్నామని అయితే వత్తిడి, బెదిరింపులతో చర్చలకు వచ్చేది లేదని, తమకు అందిన లేఖలో కొత్త విషయాలేమీ లేవని, దాని మీద తరువాత స్పందిస్తామని ఖమేనీ నాయకత్వం స్పష్టం చేసింది. ఒకవైపు సంప్రదింపుల ప్రకటనలు చేస్తూనే మరోవైపు రెచ్చగొట్టే విధంగా ట్రంప్‌ ఆచరణ ఉంది.తమతో ఒప్పందానికి రాకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని బెదిరించాడు.తమ విదేశాంగ విధానం ఎలా ఉండాలో ఆదేశించే అధికారం అమెరికాకు లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది.తమపై దాడులకు దిగిన అమెరికా నౌకాదళంపై 72 గంటల్లో నాలుగుసార్లు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఎమెన్‌ హౌతీలు ప్రకటించారు. రెండు పక్షాలూ మిలిటరీ చర్యలను విరమించాలని ఐరాస కోరింది. అమెరికా దాడుల పర్యవసానాలను గల్ఫ్‌ దేశాలు పరిశీలిస్తున్నాయి, పరిమిత దాడులా లేక నిరవధికంగా సాగించేది స్పష్టం కాలేదు.తమ నౌకలపై దాడులను నిలిపివేసేంతవరకు తమ చర్యలు కొనసాగుతాయని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ అన్నాడు. అమెరికా 47 వైమానిక దాడులు జరిపింది. ప్రపంచ నౌకా రవాణా ఎర్ర సముద్రం ద్వారా పన్నెండుశాతం జరుగుతోందని, అమెరికా దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని చర్చలు జరపాలని రష్యా కోరింది.చైనా కూడా అదే మాదిరి స్పందించింది.


నాలుగో వంతు షియా, నాలుగింట మూడువంతుల సున్నీ ముస్లిం తెగలతో కూడిన దేశం ఎమెన్‌. మిలిటరీ, నౌకారవాణా రీత్యా కీలకమైన అరేబియాఎర్ర సముద్రాలను కలిపే ఏడెన్‌ గల్ఫ్‌లో ఉన్న ఆసియా దేశం. ఎదురుగా ఆఫ్రికాలోని జిబౌటీ ఉంది. సౌదీ అరేబియా, ఓమన్‌, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. అరేబియా సముద్రంలో ప్రవేశించాలంటే ఎమెన్‌ దాటి రావాల్సిందే. ఈ కీలకమైన ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా దీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్నది.మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ కేంద్రంగా ఉన్న ఒట్టోమన్‌ సామ్రాజ్యం పతనమైనపుడు ఉత్తర ఎమెన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. అయితే బ్రిటీష్‌ వారు ఏడెన్‌ గల్ఫ్‌ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని దక్షిణ ఎమెన్‌ ప్రాంతాన్ని తమ రక్షిత వలస దేశంగా ఉంచుకున్నారు.1960దశకంలో సోవియట్‌ యూనియన్‌ మద్దతుతో రెండు సంస్థలు వలస పాలకులపై తిరుగుబాటు చేశాయి. దాంతో ఉత్తర ఎమెన్‌లో 1967లో విలీనం చేసేందుకు ఆంగ్లేయులు ప్రతిపాదించారు తరువాత జరిగిన పరిణామాల్లో 1972లో ఉత్తర,దక్షిణ ఎమెన్‌ ప్రాంతాలలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఉత్తర ఎమెన్‌లో ఉన్నవారికి కమ్యూనిస్టు వ్యతిరేక సౌదీ అరేబియా, దక్షిణ ఎమెన్‌కు సోవియట్‌ మద్దతు ఇచ్చింది. అదే ఏడాది కైరోలో కుదిరిన ఒప్పందం మేరకు రెండు ప్రాంతాలను విలీనం చేసేందుకు నిర్ణయించారు. రెండు చోట్ల వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నాయి. 1979లో తిరిగి అంతర్యుద్ధం చెలరేగింది.1990లో విలీనం జరిగే వరకు ఉత్తర ఎమెన్‌కు సౌదీ మద్దతు కొనసాగింది.


వర్తమాన విషయాలకు వస్తే పేరుకు ఎమెన్‌ దేశంగా ఉన్నప్పటికీ, మొత్తం ప్రాంతాన్ని పాలించే ప్రభుత్వం పేరుకు మాత్రమే ఉంది. మొత్తం ఆరు సాయుధ శక్తులు ఆయా ప్రాంతాలపై పట్టు కలిగి ఉన్నాయి. నిత్యం చర్చల్లో ఉండేది హౌతీలు. ఎందుకంటే రాజధాని సనాతో సహా కీలక ప్రాంతాలన్నీ వారి చేతిలో ఉన్నాయి. అమెరికా లేదా ఇజ్రాయెల్‌ చేసే దాడులన్నీ ఈ ప్రాంతం మీదనే. వీరికి ఇప్పుడు ఇరాన్‌ మద్దతు ఇస్తుండగా వ్యతిరేకించే శక్తులకు గతంలో సౌదీ అరేబియా సాయం చేసేది. చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌, సౌదీ సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు అంగీకరించటంతో ఇప్పుడు సౌదీ సాయం నిలిచిపోయింది.హౌతీలను వ్యతిరేకించేవారికి అమెరికా మద్దతు కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌తో పాటు తన మద్దతుదార్లకు తోడ్పడేందుకు అమెరికా గతంలో, తాజా దాడులు జరుపుతోంది. హౌతీ అంటే దేవుడి సహాయకులు అనే అర్ధంతో పాటు ముస్లింలో ఒక గిరిజన తెగ అది. ఇతర ముస్లింలకు దీనికి తేడా ఉంది, వీరు ఎమెన్‌లో తప్ప మరో ఏ ఇస్లామిక్‌ దేశంలోనూ లేరు.


శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు బయటి నుంచి వస్తున్న సాయాన్ని అందకుండా అడ్డుకుంటున్నది.మరోవైపు హమాస్‌ మీద నిందలు వేస్తూ సోమవారం రాత్రి నుంచి గాజాలోని గుడారాల్లో ఆశ్రయం పొందిన అభాగ్యుల మీద వైమానిక దాడులకు తెగబడి 200 మందికి పైగా ప్రాణాలు తీసినట్లు వార్తలు వచ్చాయి. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని భావిస్తున్నారు. బుధవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు 400గా తేలింది. వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. హమస్‌ తిరిగి సాయుధంగా తయారవుతున్నదని, వారి నేతల మీదనే దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు పూనుకుంది. బందీల విడుదలకు హమస్‌ తిరస్కరిస్తున్నదని, కాల్పుల విరమణకు తమ ప్రతిపాదనలను ఆమోదించటం లేదంటూ పెద్ద ఎత్తున దాడులకు మిలిటరీని పంపాలని ప్రధాని నెతన్యాహు ఆదేశించాడు. ఇది ప్రారంభం మాత్రమే అని పెద్ద ఎత్తున దాడు చేయనున్నట్లు చెప్పాడు. గాజాలో నరక ద్వారాలు తెరుస్తామని మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ చెప్పాడు. గతంలో అంగీకరించిన ఒప్పందంలో రెండవ దశను ఉల్లంఘించేందుకే తాజా దాడులని పరిశీలకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా కాల్పుల విరమణకు స్వస్థి పలుకుతున్నదని హమస్‌ విమర్శించింది. మరోసారి ప్రారంభమైన దమనకాండకు అమెరికా కూడా బాధ్యత వహించాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d