ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

స్వతంత్ర, సమగ్ర పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు జరిపి బహిర్గతం చేసేంత వరకు ఏఐ డేటా సెంటర్లకు అనుమతి ఇవ్వరాదని, ఇచ్చిన వాటిని అధ్యయనాలు చేసేంతవరకు నిలిపివేయాలంటూ ఏపీలోని విశాఖ పట్నంలో సెప్టెంబరు 6న జరిగిన జాతీయ సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. “విశాఖపట్నం ప్రకటన”ను ఆమోదించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీలో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వర్తమానంలో ఆర్థిక, సమాచార వ్యవస్థల్లో డేటా ఎంతో కీలకంగా మారింది. ఏదైనా కొత్త సమస్యలను సృష్టించకూడదన్నది పారిశ్రామిక విప్లవం నేర్పిన ఒక పెద్దపాఠం. పశ్చిమ దేశాల్లో కొన్ని పరిశ్రమల కాలుష్యం భరించరానిదిగా తయారుకావడంతో జనాల్లో వ్యతిరేకత, ఆరోగ్యం తదితర కారణాలతో ప్రభుత్వాలు అలాంటి వాటిని మూసివేయడం లేదా వేరే దేశాలకు తరలించాలని నిర్ణయించాయి. ఆ సంస్థలు ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడిన అధికారంలోని పెద్దలు పెట్టుబడులు, పరిశ్రమల రాక అంటూ ముద్దుపేర్లు తగిలించి తమ ఘనతగా గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో కొందరు రాజులు వలసవాదులకు మద్దతు ఇచ్చి దేశాన్ని వారికి ఎలా అప్పగించారో, ఆధునిక కాలంలో కొందరు పాలకులు వినాశకర పరిశ్రమలు, ఉత్పత్తులను అనుమతిస్తున్నారు.

ఉదాహరణకు ఇటలీలో మితేనీ రసాయన కర్మాగారంలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు తయారు చేశారు. దాని కాలుష్యంతో భూగర్భజలాలు కూడా కలుషితమయ్యాయి. సదరు ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లోటే పరశురామ్ అనే ప్రాంతానికి తరలించి అక్కడ కొత్త ఫ్యాక్టరీ పేరుతో ఏర్పాటు చేసి అదే రసాయనాలను ఉత్పత్తి చేశారు. చైనాకు సైతం అలాంటి కాలుష్యకారక పరిశ్రమలు వచ్చాయి. అయితే వాటి ముప్పును గ్రహించిన అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. పాతబడిన నౌకలను ధ్వంసం చేయటం, గ్రీన్ రీసైక్లింగ్ పేరుతో పశ్చిమ దేశాల్లో తయారైన వ్యర్థాలను 2018లో నిషేధించింది. కానీ మనవంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. గ్లైఫోసేట్ అనే కలుపు నివారణ రసాయనాన్ని అనేక దేశాల్లో నిషేధించినా మన దేశం అనుమతించింది. అది కలుపు మొక్కలతో పాటు పచ్చగా ఉండే ప్రతిదాన్నీ హరించడంతో పాటు దాన్ని కూడా తట్టుకొని బతికే కలుపు మొక్కలు విస్తరించటంతో చివరకు నిషేధించాల్సి వచ్చింది.

ఇటీవలి కాలంలో కాలుష్యకారక ఫ్యాక్టరీలు, ఉత్పత్తులతో పాటు డేటా సెంటర్లు కూడా పర్యావరణ సమస్యలను ముం దుకు తెస్తున్నాయి. దాంతో వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడి సర్కార్ విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయిస్తున్న గూగుల్ డేటా సెంటర్‌తో తలెత్తే పర్యావరణ ముప్పుపై ఎలాంటి నివేదికలు లేకుండా దొడ్డిదారిన దానికి అనుమతి ఇచ్చారు. అమెరికాను వదలి మనదేశానికి రావటం పెద్ద గొప్పగా ప్రచారం చేస్తున్నారు. అసలు సంగతేమిటంటే అక్కడ ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటంతో ఇక్కడకు వస్తున్నాయి తప్ప మన మీద ప్రేమ కాదు. డెమాక్రాట్లు లేదా రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలు, పట్టణాలు-గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి చోటా ఆందోళనలు సాగుతున్నాయి. వాటి సమీప ప్రాంతాల్లోని వారిలో వ్యతిరేకుల సంఖ్య 42 నుంచి 75 శాతానికి పెరిగినట్లు ఆగస్టులో చేసిన ఒక సర్వేలో తేలింది. గాలప్ సర్వేలో 53 శాతం మంది అణు విద్యుత్ కేంద్రాల సమీపంలో నివసించటానికి మొగ్గు చూపగా, డేటా కేంద్రాల వద్ద ఉండేది లేదని 71 శాతం చెప్పటం గమనించాల్సిన అంశం. భూమితో పాటు ఆ కేంద్రాలను చల్లబరచేందుకు భారీ మొత్తంలో నీరు, విద్యుత్ అవసరం. గాలిలో కాలుష్యాన్ని పెంచుతాయి, వాతావరణం వేడెక్కుతుంది. అందుకే సమీపాల్లో నివసించేందుకు అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు అవసరమైన అనుమతుల కోసం స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు అందిస్తున్నట్లు ఫుడ్ అండ్ వాటర్ వాచ్ సంస్థ రాజకీయ డిప్యూటీ డైరెక్టర్ థామస్ మేయర్ చెప్పాడు.

మరోవైపు కృత్రిమ మేథ(ఏఐ)తో వచ్చే ప్రయోజనాల గురించి కొందరు నేతలు ఊరిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఏఐ బుడగ పేలిపోయి జూలై నెలలో స్టాక్ మార్కెట్‌లో 2.18 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోయింది. ఇలాంటి బుడగలు పేలితే మొత్తం ఆర్థిక వ్యవస్థల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమెరికాలో వందలాది సంస్థలతో “డేటా సెంటర్ల నిలిపివేత కూటమి” ఏర్పాటైంది. పర్యావరణ రక్షణ అంశంలో లోపభూయిష్టంగా ఉన్న అమెరికా ఏఐ చట్టాన్ని రక్షించాలంటూ డోనాల్డ్ ట్రంప్ మద్దతుతో కార్పొరేట్ సంస్థలు చేసిన యత్నాన్ని పర్యావరణ పరిరక్షణ సంస్థలు వమ్ము చేశాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లోని చట్టసభ సభ్యులు డేటా సెంటర్ల ఏర్పాటును వాయిదా వేయాలని తీర్మానాలు ప్రతిపాదిస్తున్నారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ దేశంలో తొలిసారి డేటా సెంటర్లు వద్దని తీర్మానం చేసిన రాష్ట్రంగా చరిత్రకెక్కింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో వీటి ఏర్పాటుతో తలెత్తిన సమస్యలను గుర్తించారు. వీటి నిర్మాణానికి భారీ యంత్రాల వినియోగంతో ధ్వని కాలుష్యం పెరిగింది. డీజిల్ జనరేటర్లతో వేడి పెరుగుతున్నది, ఎయిర్ కండిషనర్లు నిరంతరం రొద పెడుతున్నాయి. ఈ కేంద్రాలలో రాత్రంతా వెలుగు ఉండటంతో పరిసరాల జనాల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని వెలుగు కాలుష్యం అంటున్నారు. కొన్ని కేంద్రాలు గ్యాస్‌తో నడుస్తూ కాలుష్యాలను విడుదల చేస్తున్నాయి.

ఒక అధ్యయనం ప్రకారం అమెరికాలోని మొత్తం డేటా సెంటర్ల కారణంగా 2030 నాటికి ఆరు లక్షల మందిలో ఆస్మా లక్షణాలు కనిపిస్తాయని, 1,300 మంది ముందుగానే చనిపోతారని, ఏటా ఆస్మాతో మరణిస్తున్నవారి కంటే మూడోవంతు మరణాలు పెరుగుతాయని, ప్రజారోగ్య రక్షణకు ఏటా అదనంగా 20 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తేలింది. ఒక పెద్ద సెంటర్‌లోని కంప్యూటర్ యంత్రాలను చల్లబరచేందుకు రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీరు(అమెరికా గాలన్ 3.8 లీటర్లకు సమానం) అవసరం. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో గూగుల్ సంస్థ ఏడు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, మరో ఆరింటిని నిర్మిస్తున్నట్లు 2025 నివేదిక ఒకటి వెల్లడించింది. అరిజోనా రాష్ట్రంలోని మరికోపా అనే ప్రాంతంలో నాలుగు కేంద్రాల కారణంగా భూగర్భజలాల కొరత ఉందంటూ 2023లోనే కొత్తగా ఇండ్ల నిర్మాణానికి అనుమతులు నిలిపివేశారు. డేటా కేంద్రాలకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం. వాటికోసం సరఫరా వ్యవస్థల నిర్మాణానికి ఖర్చు తడచిమోపెడు అవుతుంది. ఆ మొత్తాన్ని దామాషా ప్రకారం అయినా గృహ వినియోగదారుల మీద కూడా మోపుతారు, అది వారి మీద అదనపు బాదుడే. ఈ విధంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇరవై శాతం రేట్లు పెరిగాయి.

అంటే కార్పొరేట్ల లాభాల కోసం సాధారణ పౌరులు అదనపు భారం మోయాలి. పౌరుల నుంచి వ్యతిరేకత రావటంతో డేటా సెంటర్లు తమకు అవసరమైన విద్యుత్‌ను వారే ఉత్పత్తి చేసుకోవాలి లేదా స్థానికుల మీద భారం పడకుండా అదనపు చార్జీలు చెల్లించాలని రాష్ట్ర గవర్నర్ జోష్ షాప్రియో ప్రకటించాల్సి వచ్చింది. డేటా సెంటర్లు వద్దనే ఆందోళన ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. నెదర్లాండ్స్‌లోని జీవూల్డే అనే 22 వేల మంది ఉన్న పట్టణంలో మేటా 410 ఎకరాల ప్రభుత్వ భూమిలో 200 మెగావాట్ల కేంద్రాన్ని ప్రతిపాదించింది. ఆ పట్టణం మొత్తం వినియోగించే విద్యుత్‌కు రెండు రెట్లు ఈ కేంద్రానికి అవసరమని తేలడంతో అక్కడి జనాలు దాన్ని వ్యతిరేకించారు. నెదర్లాండ్స్ ప్రభుత్వమే డేటా సెంటర్లు 70 మెగావాట్లకు మించి పెట్టరాదని నిర్ణయించడంతో మేటా కేంద్రం రద్దయింది. తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డేటా సెంటర్‌ను వ్యతిరేకించిన వారే గెలిచారు. ఐర్లండ్‌లో వ్యతిరేకత కారణంగా యాపిల్ కంపెనీ ఒక బిలియన్ డాలర్ల ప్రాజెక్టును రద్దు చేసుకుంది. జనాల అభ్యంతరాలను సుప్రీంకోర్టు సమర్థించింది. అక్కడి డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం పదేండ్ల క్రితం దేశం మొత్తం వినియోగించే విద్యుత్‌లో కేవలం ఐదు శాతం ఉండగా, గతేడాది 23 శాతానికి చేరింది. 2034 నాటికి 31 శాతం కానుంది.

చిలీలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన కేంద్రంపై పర్యావరణ ప్రభావం గురించి తగిన నివేదిక ఇవ్వక పోవటంతో కోర్టు అడ్డుకున్నది. అదే గూగుల్ మరోచోట ఏర్పాటు చేయతలపెట్టిన కేంద్రాన్ని జనం అడ్డుకున్నారు. ధనిక దేశాల వారు వినోదం కోసం ఏఐ చిత్రాలను రూపొందించేందుకు మా నీటిని ఫణంగా పెట్టి డేటా కేంద్రాల నిర్మాణం అవసరం లేదని చిలీ నీటి హక్కుల సంస్థ ప్రతినిధి టానియా రోడ్రిగజ్ స్పష్టం చేశారు. ఉరుగ్వేలో గూగుల్ తలపెట్టిన కేంద్రానికి 20 లక్షల గ్యాలన్ల నీరు కావాలని తేలటంతో జనం వ్యతిరేకించారు. చివరకు చల్లబరిచేందుకు నీటిని వాడబోమంటూ చిన్న కేంద్రానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా, మరికొన్ని దేశాల్లో కూడా డేటా సెంటర్లకు వ్యతిరేకత పెరుగుతున్నది. డేటా సెంటర్లకు సంబంధించి కొన్ని అవాస్తవాలు-నిజాల గురించి చూద్దాం. అమెరికా అనుభవంలో నిర్మాణ సమయంలో ఉపాధి తప్ప పర్మినెంట్ ఉద్యోగాలు ఒక పెద్ద కేంద్రంలో 50 నుంచి 150 మందికి లభిస్తాయి. అవి కూడా భద్రతా సిబ్బంది, నిపుణులైన సాంకేతిక నిపుణులకే పరిమితం. అదనపు పెట్టుబడులు, అనుబంధ పరిశ్రమలు, ప్రభుత్వాలకు అదనపు పన్నులూ రావు, ప్రజల సొమ్ము వాటికి ఖర్చు చేస్తారు. స్థానిక వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. జార్జియా రాష్ట్రంలో 70 శాతం కేంద్రాలకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వలేదు.

ఈ కేంద్రాలను చల్లబరిచేందుకు ఉపయోగించే నీటిని తిరిగి విడుదల చేసినప్పుడు అవి వేడిగా ఉంటాయి. నీటి వనరులు, పర్యావరణాన్ని ప్రభావితం చేసే కొత్త సమస్యలను సృష్టిస్తాయి. చైనాలో కూడా పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లు ఉన్నాయి. అందుకే చైనా సముద్రాల్లో 35 మీటర్ల లోతులో తేలియాడే వాటిని ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. షాంఘై తీరంలో రెండువేల సర్వర్లు ఉన్న కేంద్రాన్ని 115 అడుగుల లోతులో ఏర్పాటు చేశారు. ఇలాంటి ఏర్పాట్ల వలన 90 శాతం ఇంధనం ఆదా అవుతుంది, అవసరమైన విద్యుత్‌లో 97 శాతం సమీపంలోని ఉపరితల గాలి మరల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. బ్రిటన్‌లో మైక్రోసాఫ్ట్ జరిపిన ప్రయోగంలో భూమి మీద ఏర్పాటు చేసిన వాటి కంటే నీటిలో వాటి వైఫల్యాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అయినా వాణిజ్యపరంగా ముందుకు పోలేదు. భూమి మీద ఏర్పాటు చేసే డేటా సెంటర్ల ప్రాజెక్టు మొత్తం విద్యుత్‌లో చల్లబరిచేందుకే 40 శాతం అవసరం కాగా, సముద్రాల్లో వాటికి అది అవసరం ఉండదు. విద్యుత్ వినియోగ సామర్థ్యం సముద్రాల్లో ఎక్కువని తేలింది. నీటి అవసరం ప్రత్యేకంగా ఉండదు. చల్లబరిచేందుకు అవసరమైన వ్యవస్థల ఖర్చు సముద్రంలో తక్కువ, భూమి అవసరం 90 శాతం తక్కువ. ఉపాధి పేరుతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి వారు భారీ మొత్తాల్లో అప్పనంగా సబ్సిడీలు ఇస్తున్నపుడు ఎవరైనా వాటిని ఎందుకు వదులుకుంటారు? ప్రత్యామ్నాయాల వైపు చూడటానికి వారేమైనా ప్రజల పక్షం వహించేవారా!

భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


‘‘హిందువులు నిద్రలేస్తే ప్రపంచం మేల్కొన్నట్లే” ఇదీ అమెరికా, కెనడా, బ్రిటన్ పర్యటనలో భాగంగా కెనడాలోని టొరంటో నగరంలో జరిగిన సభలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్ భగవత్ చెప్పిన సుభాషితం. ఎంతో చక్కగా చెప్పారు, ఇంతకూ హిందువులు ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పకుండా అది జరిగితే, ఇదైతే అని చెప్పటం వల్ల ఉపయోగమేమిటి? నిద్ర లేవకుండా ఎవరు అడ్డుకున్నారు? భగవత్ మూడు దేశాల పర్యటన అన్ని చోట్లా తీవ్ర వివాదాన్ని రేపింది. అవి నోరున్న దేశాలు గనుక వార్తలు ప్రపంచవ్యాపితంగా వెళ్లాయి. మనదేశ మీడియాలో కూడా చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది బీజేపీ, తెరవెనుక ఉండి దాన్ని ఆడిస్తున్నది మాతృసంస్థ ఆరెస్సెస్‌ అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి సంస్థ అధినేత పర్యటన అంటే ఒక రాజ్యాంగేతర శక్తి చేస్తున్నట్లే భావించాలి. తనను ఒక సాంస్కృతిక సంస్థగా కాషాయదళం చెప్పుకుంటుంది. కానీ, ప్రపంచానికి అది మేకతోలు కప్పుకున్న పులి, ఒక మతోన్మాద సంస్థగా అనేక మంది భావిస్తున్నారు. ఆ మచ్చను తుడిచివేసుకొనేందుకు వంద సంవత్సరాల క్రితం అది పుట్టినప్పటి నుంచీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.

భారత్ విశ్వగురువుగా మారింది తప్ప విశ్వశక్తి కాదని టొరొంటో సభలో ఆరెస్సెస్‌ అధినేత చెప్పారు. ప్రపంచ మిలిటరీ, జీడీపీలో అగ్రభాగాన ఉన్నందున అమెరికా ప్రపంచశక్తి అని భావిస్తే అదొకతీరు. మనం ఏ రంగంలో ముందున్నట్లు, గురువుగా ప్రపంచానికి నేర్పిందేమిటి? “హిందూ విశ్వ బంధు-స్నేహ బంధంతో ప్రపంచ ఆలింగనం” అనే ఇతివృత్తంతో కెనడియన్ హిందూస్ ఫర్ అవుట్‌రీచ్, రిలేషన్స్ అండ్ డైలాగ్(కోర్డ్) సంస్థ ఏర్పాటు చేసిన సభలో భగవత్ మాట్లాడుతూ భారత్ సూపర్ పవర్ కాదని, తన స్వంత వ్యక్తిత్వంతో ప్రపంచానికి సేవలు అందించిందని, భారత్ ఎదుగుదలను ఆధిపత్యంతో కాక సేవతో కొలవాలని అన్నారు. సేవ భారత జన్యుమూలాల్లోనే ఉందని, హిందువులు మేలుకొంటే ప్రపంచమే నిద్రలేచినట్లని చెప్పారు. ముస్లింలు, పార్సీలు, యూదులు, క్రైస్తవులు ఎక్కడైనా వేధింపు లకు గురైతే భారత్‌లో ఆశ్రయం దొరికిందని, భారత పూర్వీకులు దేశాలను ఆక్రమించేందుకు కాక జ్ఞానాన్ని పంచేందుకు విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు.ఇక్కడ సమస్య యావత్ ప్రపంచానికి మన పూర్వీకులు జ్ఞానం ప్రసాదిస్తే, అది మన వేదాలు, పురాణాల్లో నిక్షిప్తమై ఉంటే దాన్ని మనం వినియోగించుకోకుండా “మ్లేచ్చులకు” అందించి వారు విమానాలు, క్షిపణులను తయారు చేసేందుకు ఎందుకు సహకరించినట్లు? పారిశ్రా మిక విప్లవాన్ని, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉండి, సమాజాన్ని నిచ్చెనమెట్ల వివక్షా పూరితంగా ఎందుకు తయారు చేసుకున్నాం. సముద్రాలు దాటి ప్రయాణించిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎందుకు నిబంధనలు విధించినట్లు?

మనపూర్వీకులు ప్రపంచాన్ని చుట్టి జ్ఞానాన్ని అందిం చారని చెబుతున్న వారు ప్రయాణాలను నిషేధించిన బౌధాయన ధర్మశాస్త్రం, మనుస్మృతి గురించి ఏం చెబుతారు. సముద్రాలు దాటితే కుల భ్రష్టులౌతారు, ఆచారాలు మంటకలుస్తాయని చెప్పిన ఆంక్షల నేపథ్యంలో భగవత్ చెప్పిన పూర్వీకులు విదేశాలకు వెళ్లారంటే వారు తిరుగుబాటుదారులై ఉండాలి. అలాంటి వారిని పొగుడుతున్న కాషాయ దళాలు మరోవైపు మనుస్మృతిని విమర్శించే వారిని హిందూ వ్యతిరేకులు అని ఎందుకు నిందిస్తున్నట్లు? సనాతనాన్ని కాపాడాలి లేదా పునరుద్ధరిం చాలని చెబుతున్నవారు సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నట్లా, వెనక్కు నడపాలని చూస్తున్నారా? జనాలు ఊరూపేరులేని వాట్సాప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా స్వంత మెదళ్లకు పని పెట్టాలి. హిందూ అంటే మతం కాదు, జీవన విధానం అని చెబుతారు. “నేను హిందూ అని చెప్పినపుడు ఆ పదాన్ని ఒక నిర్దిష్ట భాష, ప్రత్యేక ఆరాధన రూపం, లేదా ఏ జీవన శైలితోనూ నిర్వచించకూడదు. హిందువులు అందరినీ గౌరవించాలి, అందరినీ ఆమోదించాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడాలి,” అని భగవత్ చెప్పారు. ఆచరణలో కాషాయ దళాలు అలాగే ఉన్నాయా? ఒకవైపు వసుధైక కుటుంబం అని చెబుతారు. మరోవైపు దేశంలో జనాభాను పెంచుతూ ముస్లింలు మెజారిటీగా మారేందుకు చూస్తున్నారని ఆరోపిస్తూ, హిందువులు పిల్లలను ఎక్కువగా కనాలని ప్రబోధించటం తెలీదా? దక్షిణ భారత్‌లో ఉన్న హిందువులు కుటుంబ నియంత్రణ ఎందుకు పాటిస్తున్నారు, ఉత్తర భారతంలోని వారు ఎందుకు ముందుకు రావటం లేదు? జనాభా నియంత్రణ అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

ప్రపంచ సగటు జననాల రేటు 2.23 కాగా, అంతకంటే తక్కువగా ఉన్న ముస్లిం దేశ సమాజాలు కూడా ఉన్నాయి. యావత్ ప్రపంచాన్ని మతపరంగా ముస్లింలతో నింపాలనే కుట్ర ఉంటే మాల్దీవులు, మలేషియా, బహరెయిన్, ఇరాన్, టర్కీ వంటి చోట్ల మనకంటే తక్కువగా జననాల రేటు ఎందుకు ఉన్నట్లు? ఏ దేశానికైనా జనాభా వృద్ధి రేటు 2.1గా ఉండాలన్నది ఆ రంగ నిపుణుల సిఫార్సు. మనదేశంలో సగటు రెండుగా ఉంది. ఇక మతాల వారీ చూస్తే ముస్లింలు 2.36, హిందువులు 1.94 ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 1992లో ముస్లింలలో 4.41గా ఉన్న పిల్లలు 2019-21 నాటికి 2.36కు తగ్గారు. ఇదే కాలంలో రెండు మతాల వారి మధ్య ఉన్న తేడా 1.11 నుంచి 0.42కు తగ్గింది. కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవారు, నమ్మేవారు దీనికి ఏ సమాధానం చెబుతారు? యావత్ ప్రపంచం ఒకే కుటుంబం అని మోహన్ భగవత్ సెలవిస్తారు. వారి రాజకీయ ప్రతినిధి బీజేపీ ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అని చెబుతుంది. చట్టసభల ఎన్నికల్లో మాత్రం దేశంలో 15శాతంగా ఉన్న ముస్లిం సామాజిక తరగతిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా తమ అభ్యర్ధులుగా నిలపదు. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అన్ని కులాలవారికీ ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని చెప్పే పార్టీ మత వివక్షతో అసలు అవకాశం కల్పించకపోవటాన్ని మతోన్మాదం లేదా మతవిభజనగాక ఏ పేరుతో పిలవాలి? మోహన్ భగవత్ పర్యటనకు మూడు దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక్కడ సమస్య వ్యక్తిగతం కాదు. భావజాలం, విద్వేష పూరిత వ్యాఖ్యలు, ఆచరణకు సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.

ఆరెస్సెస్‌ సభతో కెనడాలో సామాజిక అశాంతి తలెత్తుతుందని, మైనారిటీలుగా ఉన్న ముస్లింలు, సిక్కులు, దళితులకు ముప్పు తలెత్తుతుందని ఎన్‌డిపి పక్ష ఎంపీలు ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. అక్కడి పౌర సమాజంలోని 267 సంస్థలు, బృందాలు కూడా భగవత్ ప్రవేశానికి అనుమతి ఇవ్వకూడదని, ఆరెస్సెస్‌ను నిషేధించాలని కోరాయి. దీనికి పోటీగా వందకుపైగా ఇండో-కెనడియన్ హిందూ సంస్థలు రాసిన లేఖలో ఆధారం లేకుండా నిషేధం విధించటం అన్యాయమైన రాజకీయ వత్తిడి అని, భగవత్ పర్యటనను అడ్డుకోవటమంటే కెనడా హిందూ సమాజం పట్ల వివక్ష చూపటమేనని పేర్కొన్నాయి. కెనడా మాజీ రక్షణ మంత్రితో సహా మరికొందరు ఆరెస్సెస్‌కు మద్దతు పలికారు. బ్రిటన్‌లో దక్షిణాసియా సంతతికి చెందినవారు, మానవహక్కుల బృందాలు పర్యటనను వ్యతిరేకించాయి. వసుధైక కుటుంబ ఉత్సవాల ముసుగులో అమెరికాలో ఏర్పాటు చేసిన మోహన్ భగవత్ పర్యటనపట్ల కూడా వ్యతిరేకత వెల్లడైంది. సభ జరిగిన మాడిసన్ స్క్వేర్ న్యూయార్క్ నగరంలో ఉంది. ఆ నగర మేయర్ జోహ్రాన్ మందానీ ఆరెస్సెస్‌ నేత పర్యటనకు తాను వ్యతిరేకమని, అయితే ఒక మేయర్‌గా భగవత్ కార్యక్రమాలను అడ్డుకొనే అధికారం తనకు లేదని చెప్పారు. జోహ్రాన్ తండ్రి గుజరాతీ మూలాలున్న అమెరికా పౌరుడు మహమ్మద్ మందానీ, తల్లి ప్రముఖ భారతీయ సినిమా దర్శకురాలు మీరా నాయర్. మూడు పదులు దాటిన జోహ్రాన్ న్యూయార్క్ నగరానికి తొలి ఇండియన్-అమెరికన్ మేయర్‌గా చరిత్రకెక్కారు.

అమెరికా పార్లమెంట్‌కు సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మతస్వేచ్చ అమెరికా కమిషన్ (యుఎస్‌సిఐఆ‌ర్‌ఎఫ్) అమెరికా ప్రభుత్వ అధికారులు భగవత్‌ను కలవరాదని కోరింది. ఆరెస్సెస్‌ ఉపసంఘాలు మతపరమైన మైనారిటీల మీద హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఆ సంస్థ నివేదికలో పేర్కొన్నది. ఈ సంస్థ పక్షపాతంతో కూడినదని, దానికి విశ్వసనీయత లేదని మన విదేశాంగ శాఖ ఆరెస్సెస్‌ను వెనుకేసుకు వచ్చింది. తీవ్ర వ్యతిరేకత తలెత్తిన నేపథ్యంలో సభా నిర్వహకుల ఎక్స్ ఖాతాను ఆ సంస్థ యాజమాన్యం నిలిపివేసి వత్తిడి తరువాత పునరుద్ధరించింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సభకు హాజరయ్యేవారికి సూచించింది. ఇలాంటి సంస్థలు ఎంతగా రెచ్చగొట్టినా ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు లేకుండా కార్యక్రమం ముగిసింది. ఆరెస్సెస్‌ వ్యాపింపచేస్తున్న పచ్చి అవాస్తవాలు ఎన్నో. జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సే అంతకు ముందే తమ సంస్థనుంచి వెళ్లిపోయి హిందూమహాసభలో చేరాడన్నది వాటిలో ఒకటి. అయితే గాడ్సే ఎప్పుడు ఆరెస్సెస్‌లో చేరిందీ, ఎప్పుడు వెళ్లిపోయిందీ ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఆ సంస్థ సభ్యత్వం రహస్యం. నాధూరామ్ గాడ్సే, అతని సోదరుడు గోపాల్ గాడ్సే ఆరెస్సెస్‌లో చురుకైన కార్యకర్తలని, వారెప్పుడూ సంస్థ నుంచి బయటకు పోలేదని కుటుంబ సభ్యులు పదే పదే స్పష్టం చేశారు.గోపాల్ గాడ్సే మనుమడు సాత్యకీ సావర్కర్ ఒక పరువు నష్టం కేసులో 2026 ఆగస్టు నెలలో పూనా కోర్టులో సాక్ష్యమిస్తూ అదే చెప్పాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సావర్కర్, గాడ్సే కుటుంబాలకు ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాల గురించి సాత్యకి చెప్పిన అంశాలను ప్రచురించింది. గాడ్సే కోర్టులో చేసిన వాదనలను పుస్తకరూపంలో అచ్చువేసి ప్రచారంలో పెడుతున్నది కాషాయ దళం తప్ప మరొక “దేశభక్తుడు” ఎవరూ కాదు. అయినా సరే గాడ్సేతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరెస్సెస్‌ పదే పదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. మోహన్ భగవత్ మూడు దేశాల పర్యటన సందర్భంగా ఆర్గనైజర్ పత్రికలో దాన్నే పునరుద్ఘాటించారు.

పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !

Tags

, , , , , , , , ,

ఎం.కోటేశ్వరరావు

ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసంలో మేడిన్ ఇండియా ( భారత తయారీ) వస్తువులు ప్రపంచంలో ప్రతి మూలకూ చేర్చటం లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. “ఉన్నమాట అన్నా వు ఎవ్వరు నేర్పిన మాటరా వేదంలా విలువైన మాట” అనే సినిమా పాటను గుర్తుచేశారు. పాడిందే పాడరా అన్నట్లుగా ఇలాంటి మాటలు ఎన్నిసార్లు చెబుతారు, దేశాన్ని ఎటువైపు తీసుకుపోతు న్నారన్నదే అసలైన సమస్య. ప్రధానిగా తొలి ఆగస్టు పదిహేను అంటే 2014 ప్రసంగంలో మేకిన్ ఇండియా(భారత్‌లో తయారీ) పిలుపునిచ్చారు. “రండి, భారత్‌లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఏ దేశంలోనైనా విక్రయిం చండి, కానీ వాటిని భారత్‌లోనే ఉత్పత్తి చేయాలి” అని విదేశీ పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. అదే ఏడాది సెప్టెంబరు 25న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాదీ ఏదో ఒక సందర్భంగా ఇలాంటి పిలుపులిస్తూనే ఉన్నారు. కనుచూపు మేరలో కూడా ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపిం చటం లేదు, అయినా పదే పదే చెబుతున్నారంటే దాన్నే మనాలి? భారత తయారీ సప్తధారల్లో జరగాలని మోడీ చెప్పారు. చెప్పిన మాట చెప్పకుండా తన కార్యాలయం రాసిచ్చిన ఉపన్యాసాలను కొత్త కొత్త పదజాలంతో కాశీ మజిలీ కథల మాదిరి ఊకదంపుడుతో కొత్తవాటిని చెప్పటం తప్ప అడుగు ముందుకు పడటం లేదు. డ్రోన్ వ్యవస్థలను మనం అభివద్ధి చేయాలని, హైపర్‌సోనిక్ రక్షణ సాంకేతిక రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలని కూడా చెప్పారు. పన్నెండేండ్లుగా ఎవరు వద్దన్నారు.

ఇప్పటికే మనకంటే ఎంతో ముందున్న దేశాలు ఈ రంగాల్లో ఇంకా ముందుకు పోతాయి. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు దేశాన్ని తయారు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
పోటీతత్వం లేకపోతే వర్తమానంలో ఏ దేశమూ పరుగులో నిలవలేదు. అందుకు అవసరమైనట్లుగా పని చేశామా లేదా అన్నదే ముఖ్యం. స్విడ్జర్లాండ్‌లోని లాసానే నగరంలో 1990లో ఐఎండి బిజినెస్ స్కూలు ఉంది. దాన్నొక ప్రతిష్టాత్మక సంస్థగా పరిగణిస్తున్నారు. ప్రతి ఏటా దేశాలను ఎంచుకొని పోటీతత్వ సూచికలను ప్రకటిస్తుంటుంది. తాజా 2026 నివేదిక ప్రకారం మన దేశం 44వ ర్యాంకులో ఉంటే చైనా పన్నెండవదిగా ఉంది. ప్రధాని చెబుతున్నట్లుగా 2047 నాటికి లేదా అంతకు ముందే మనదేశం చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతుందా? మోడీ చెప్పినట్లు మన వస్తువులన్నీ ప్రపంచంలో అన్ని మూలలకు ఎగుమతి అవుతాయా? మాటలు కోటలు దాటటం తప్ప చేతలు గడపదాటటం లేదనే లోకోక్తి తెలిసిందే. ఇతర దేశాలతో పోటీ పడకపోవటానికి కాంగ్రెస్, నెహ్రూ, గాంధీ కారణమని కాషాయ దళాలు చెబుతుంటాయి.2014 నుంచి అధికారం లో ఉన్న మోడీ ఏం చేశారన్నదే ప్రశ్న. తొలిసారిగా ఎర్రకోటపై మోడీ జాతీయ జెండా ఎగురవేసినపుడు ఐఎండి నివేదిక ప్రకారం భారత్ 2013లో 40వదిగా, చైనా 21వ స్థానంలో ఉంది.

పైన చెప్పుకున్నట్లు తాజా సూచికల ప్రకారం 44-12 స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచమంతటా తిరిగి యుపిఏ హయాంలో కోల్పోయిన దేశ ప్రతిష్టను తిరిగి తీసుకువచ్చా నని చెప్పిన తరువాత పరిస్థితి ఇది. చైనా ఎలా పెంచుకుందో, మనం ఎలా దిగజారామో దానికి కారకులు ఎవరో ఎవరిని అడిగినా చెబుతారు. ‘బుద్దులు భూములను ఏలుతుంటే రాతలు గాడిదలను కాస్తున్నాయనే’ లోకోక్తిని ఇక్కడ గుర్తు చేయకతప్పటం లేదు. మోడీ అధికారానికి వచ్చినపుడు కమ్యూనిస్టు చైనా నుంచి మనం 6,040 కోట్ల డాలర్ల మేర వస్తువులను దిగుమతి చేసుకున్నాం, 2026 మార్చినెల నాటికి 13,160 కోట్ల డాలర్లకు పెరిగాయి, ఇదే సమయంలో చైనాతో వాణిజ్యలోటు 3,600-4,000 కోట్ల మధ్య ఉన్నది 11,200 కోట్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో దిగుమతులు, వాణిజ్యలోటు మరింతగా పెరగనున్నట్లు చెబుతున్నారు. బీజేపీ నేతలు చైనా నుంచి మనం సెల్‌ఫోన్ల దిగుమతులను తగ్గించాం చూశారా మోడీ ఘనత అంటూ అడ్డుసవాళ్లు విసురుతారు. ఎలక్ట్రానిక్స్ రంగం లో పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రాయితీ లిస్తున్నది గనుక అనేక కంపెనీలు మనదేశం లోనే ఫోన్లు తయారు చేస్తున్నందున దిగుమతు లు తగ్గినమాట నిజం, కానీ మొత్తంగా దిగుమతులు ఎందుకు పెరుగుతున్నట్లు ? మన వాణిజ్యలోటు పెరగటం అంటే ఏటా మనం చైనాకు అప్పనంగా అంత మొత్తాలను చెల్లిస్తున్నాం. ఎందుకీ పరిస్థితి ?

ప్రపంచ సరఫరా గొలుసులో మనం కూడా ఒక భాగంగా ఉండాలని, వస్తువులను ఎగుమతి చేయాలని నిటి ఆయోగ్ నివేదికలు ఎప్పటికపుడు చెబుతూనే ఉన్నాయి. ఇదిగో ఫలానా రంగంలో అవకాశం ఉందని గుర్తు చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనే 2047 నాటికి లక్ష్యాలను చేరాలంటే మొత్తం 62 అంశాల జాబితాను రూపొందించి వాటిలో 12 రంగాలను గుర్తించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఇన్నేండ్ల నుంచి ఎందుకు విఫలమ య్యామనే అంశాన్ని మోడీ ఎప్పుడైనా చెప్పారా? ఈ రంగాల్లోకి అత్యధికంగా ప్రయివేటు పెట్టు బడులు వస్తేనే లక్ష్యాన్ని సాధించగలమని నిటిఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి చెప్పారు. మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో జీడీపీలో 25-26 శాతం ప్రయివేటురంగ పెట్టు బడులు ఉండేవి, ఇటీవల 22 శాతానికి తగ్గాయి, అదీ కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఇతర రాయితీలిచ్చినప్పటికీ పెరగకపోగా తగ్గాయి. దేశంలో ఉన్న ప్రయివేటు రంగమే ముందుకు రాకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఎలా వస్తాయి? 2047 నాటికి దేశ జీడీపీని 30లక్షల కోట్లకు చేరుస్తామని చెబుతున్నారు. అందుకు గాను వచ్చే 20ఏండ్లు ఏటా పదిశాతంపైగా వాస్తవ వృద్ధి రేటు ఉండాలని ఆర్థికవేత్తలు చెబు తున్నారు. దానికి ప్రాతిపదిక ఉందా? అలా జరిగితే ఇలా జరిగితే లక్ష్యాలను సాధించటం కష్టమేమీ కాదని చెప్పేవారు కోకొల్లలు… తనదిగాకపోతే కాశీ వరకు తాటిపట్ట మీద దేకవచ్చాన్నడట వెనుకటికి ఎవడో.

ప్రపంచ బ్యాంకు తాజా సమాచారం ప్రకారం ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 28శాతం కాగా మనం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ మన వాటా మూడు శాతం దగ్గరే ఉంది. 2004లో చైనా వాటా పదిశాతం లోపుగానే ఉంది. విలువలో 625 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 4.66లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇక అమెరికా విషయానికి వస్తే ఇదే కాలలో 22శాతం నుంచి 17కు, ఐరోపా ప్రాంత వాటా తగ్గి 15శాతానికి పరిమితం కాగా జపాన్ ఐదుశాతం కలిగి ఉంది.ఇదే సమయంలో మన వాటా 1.6-1.8శాతం మధ్య ఉంది, అది 2014నాటికి రెండు శాతానికి చేరింది. మోడీ ఏలుబడిలో ఇప్పటివరకు మూడుశాతానికి పెరిగింది. అమెరికా, జపాన్, జర్మనీ మూడింటి కంటే ఎక్కువగా చైనా ఉత్పత్తి ఉంది. ఆశలు, ఊహలు, అడుక్కొనే విషయాల్లో పిసినారితనం ఉండకూ డదంటారు పెద్దలు.ఇలాంటి స్థితిలో ప్రపంచ కేంద్రంగా మనదేశాన్ని మారుస్తానని, మోడీ, ఆయన భజన బృందం లోని ఆకాశానికి నిచ్చెనలు వేసే చంద్రబాబు వంటి వారు చెబితే నమ్మేదెలా ? పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తే కొన్ని రంగాల్లో పురోగతి ఉండవచ్చు కానీ మా ఊర్లో మిరియాలు తాటికాయలంత అంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. కరోనా సమయంలో చైనాలోని కంపెనీలన్ని అక్కడి నుంచి దుకాణాలు ఎత్తేసి భారత్‌కు వస్తున్నట్లు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడా చప్పుడు చేయటం లేదు. ఉత్పాదక రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తే దిగుమతులపై ఆధార పడాల్సిన పనిలేదు, ఉద్యోగ సృష్టి జరుగుతుంది.

అమెరికా అంత అగ్రరాజ్యమే మా దేశంలో పెట్టుబడులు పెడతారా లేక మీ సంగతి చూడమంటారా అని బెదిరింపులకు దిగటం వెనుక పరమార్ధం ఇదే. చైనా ఇప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తుల మీద కేంద్రీకరిస్తోంది, అది కేంద్రీకరణ తగ్గించిన రంగాల్లో మనం బలపడవచ్చని నిటి ఆయోగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో చైనా వాటా 2000 సంవత్సరంలో ఆరుశాతమే, 2030 నాటికి 45శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అమెరికా తదితర ధనిక దేశాలు 1948లో సోవియట్ యూనియన్, చైనా లేకుండా 23 స్థాపక దేశాలతో జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్(గాట్-పన్నులు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం) జరిగింది. దీనిలో భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. అది 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థగా మారింది. అయినప్పటికీ 2001 వరకు చైనాను దానిలో చేరకుండా అడ్డుకున్నారు.అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారుతూ చౌకగా అనేక ఉత్పత్తులను అందచేస్తున్న క్రమంలో తమ ప్రయోజనాల కోసం అడ్డుకున్నదేశాలే సభ్యత్వం ఇవ్వక తప్పలేదు. ఆ తరువాత బీజింగ్ వెనుదిరిగి చూడలేదు, ఎగుమతుల అవకాశాలు మరింతగా పెరిగాయి. నవీకరణతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ వచ్చాయి. మేడిన్ చైనా 2025 వంటి లక్ష్యాలు, అందుకు అవసరమైన విధానాలతో ముందుకు పోవటమే గాక అవసరమైన కార్మికశక్తి నైపుణ్యాల ను కూడా పెంచింది.

రవాణా సదుపాయాల మెరుగుదలకు విస్తరించిన రోడ్లు,రైలు, బుల్లెట్ రైళ్లను చూసి అవసరం లేకున్నా నిర్మించిందని విమర్శించిన వారే ఇప్పుడు ఔరా ఎంత ముందు చూపుతో చేశారని ముక్కున వేలేసుకుంటు న్నారు. నిజానికి మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వ పెట్టుబడులు తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటంతో స్థానికంగా కొనుగోలు శక్తికూడా పెరిగింది. తక్కువ ఖర్చులో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు నేడు ఎంతో లాభసాటిగా మారాయి.2010 నుంచి పారిశ్రామిక ఉత్పత్తికి దోహదం చేయటంలో చైనా ప్రధమ స్థానంలో కొనసాగు తోంది. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని ఆక్రమించాల ని చూశారు. ఇప్పుడది సాధ్యం కాదు గనుక మార్కెట్లను కబళించేందుకు పూనుకున్నారు. వారికి చైనా కొరకరాని కొయ్యగా మారింది. అసలు ఏడుపు ఏమంటే ఇప్పటి వరకు ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా రానున్న రోజుల్లో సరఫరా కేంద్రంగా కూడా మారనున్నదని దోపిడీదార్లు భయ పడుతున్నారు. జపాన్ సుజుకీ కంపెనీ మనదేశం లో మారుతీ కార్లకు కీలక విడి భాగాలను అందిస్తున్నట్లే చైనా అను సరిస్తున్నది. దుస్తుల రంగంలో 2023 వివ రాలను చూసిన పుడు చైనా ముడిసరకు ఎగుమతులు 16, ఇంటర్‌మీడియెట్ ఉత్పత్తులు 21,పాక్షికంగా తయారైనవి 47, పూర్తిగా తయారైనవి 30శాతం ఉన్నాయి. వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి పలకల్లో పూర్తిగా తయారైనవి 54శాతం చొప్పున ఉన్నాయి.

విద్యుత్ వాహనాల లో 51శాతం పాక్షికంగా తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నది. ఇవన్నీ గిరాకీ మీద ఆధారపడి ఉన్నాయి.అనేక దేశాలు చైనా నుంచి విడి భాగాలను తెచ్చుకొని వాటితో పూర్తి వస్తువులను తయారు చేస్తున్నారు. అది లాభసాటిగా ఉన్నంత కాలం సాగుతుంది.చైనా లావాదేవీలన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకే జరుగుతున్నందున అమెరికా, మరికొన్ని దేశాలకు కడుపు మంటగా ఉంది. ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను కబళించేందుకు చూసిన శక్తులు నేడు అది విఫలమైందని, చైనా తొండి ఆట ఆడుతున్నదని అంటూ పూర్వపు రక్షణాత్మక విధానాలవైపు మళ్లుతున్నారు.పురాతన కాలంలో వివిధ దేశాల మధ్య వస్తు వ్యాపారం ఉన్నట్లు చరిత్రలో నమోదైంది. అయితే వర్తమానంలో ఎగుమతులు-దిగుమతుల క్రమం 1870లో ప్రారంభమైందని చెబుతు న్నారు. పారిశ్రామిక విప్లవం తరువాత వస్తూత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరగటంతో ఇది జరిగింది.

బ్రిటన్ ఎగుమతుల్లో ప్రధమ స్థానంలో ఉంది, ఒక దశలో అది ఎగుమతి చేసిన వాటిలో 42శాతం భారత ఉత్పత్తులు ఆక్రమించాయి.బ్రిటన్ తరువాత రెండవ స్థానంలో జర్మనీ హవా నడిచింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ముందుకు వచ్చింది .1980,90దశకాల్లో జపాన్ ఎలక్ట్రానిక్స్‌తో ప్రపంచాన్ని నింపివేసింది. నూతన సహస్రాబ్ది ప్రారంభం నుంచి చైనా అగ్రస్థానానికి చేరింది.1948లో ప్రపంచ వస్తు ఎగుమతుల విలువ కేవలం 59 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా 2025లో 26లక్షల కోట్ల డాలర్లు దాటింది.దానిలో చైనా వాటా ముందే చెప్పుకున్నట్లు 4లక్షల కోట్ల డాలర్లు దాటింది. నల్లమందు భాయీలని ప్రపంచం ఈసడించిన చైనీయులను పూర్తిగా మార్చి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాధించిన ఘనత ఇది! కాదంటారా !!

ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

గడచిన పదేండ్లలో ప్రపంచ వృద్ధి రేటులో పెద్ద మార్పు లేదు. కానీ అదే సమయంలో కొంత మంది సంపద విపరీతంగా పెరిగింది. ధనవంతుల సంఖ్యలో కూడా అదే తీరు. పేదలు మరింతగా పేదలౌతున్నారు. ఎందుకిలా జరుగు తోంది? యుబిఎస్ అనే పెద్ద స్విస్ బ్యాంకు 2026 సంవత్సర ప్రపంచ సంపద నివేదికను ఇటీవలే విడుదల చేసింది. దానిలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(వంద కోట్ల డాలర్లు, ప్రస్తుత విలువ ప్రకారం రూ.9,562 కోట్ల 34లక్షల,50వేలు) అంతకు మించి సంపద ఉన్నవారి సంఖ్య 2025లో ప్రపంచంలో 3,302 మంది ఉన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 383 మంది(13.1శాతం) పెరిగారు. వీరిలో వెయ్యి మందికి పైగా అమెరికా, 562 మంది చైనా, 211 మంది మనదేశంలో ఉన్నారు. తరువాత స్థానాల్లో జర్మనీ 193, రష్యాలో 122 మంది తేలారు. సగటున వీరి సంపద అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 25శాతం పెరిగింది. ప్రపంచ వృద్ధి రేటుకు ఎన్నోరెట్లు ఎక్కువ. దక్షిణ కొరియా, హంగరీలో పెరుగుదల రేటు రెట్టింపు కాగా, చిలీలో 80, చెక్, మెక్సికోలలో 60, బ్రెజిల్, గ్రీస్‌లలో యాభై శాతానికి మించి ఉంది. ఈ వివరాలు 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ సమాచారం మేరకు వెల్లడించారు. దక్షిణ కొరియాలో ఏడాది కాలంలో బిలియనీర్లు 31 నుంచి 52కు పెరిగారు.

అయితే ప్రపంచ మంతటా అలాగే ఉందా? కొన్ని దేశాల్లో స్ధిరంగా, కొన్నిచోట్ల తగ్గారు. చిలీలో పెరగకపోగా థాయ్‌లాండ్‌లో 25 నుంచి 22కు, సౌదీ అరేబియాలో19 నుంచి 16కు తగ్గారు. గతంలో లక్ష రూపాయల సంపద ఉంటే లక్షాధికారి అని పిలిచారు. ఇప్పుడు వారి స్థానంలో మిలియనీర్ (అంటే కనీసం పది లక్షలు)లు వచ్చారు. ఇది కూడా అమెరికన్ డాలర్లలో లెక్కవేస్తున్నారు. ఇలాంటి వారు గతేడాది 1.5శాతం మంది పెరిగారు. దీన్నే మరో విధంగా చెప్పాలంటే రోజుకు 2,680 మంది కొత్తగా మిలియనీర్లు అయ్యారు. తూర్పు ఐరోపాలో ఈ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. గతేడాది మొత్తం పదిలక్షల మంది కొత్తగా మిలియనీర్ల జాబితాలో చేరితే వారిలో సగం మంది ఒక్క అమెరికాలోనే ఉన్నారు. ప్రపంచంలో అధిక సంపద ఉన్న దేశం అమెరికా అన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి జనాలందరూ ధన వంతులా అన్నది అసలు సమస్య. సగటు ఆదాయం, సగటు సంపదకూ, మధ్యగత రాబడి, సంపదకూ తేడా ఉంది. దాన్ని అర్ధం చేసుకుంటే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎలన్ మస్క్ అమెరికాలో ఉన్నాడు. అయితే అమెరికన్లందరూ ఎలన్ మస్క్‌లు కారు. మనదేశంలో అంబానీ, అదానీలు ఎలా ధనవంతులో జనం అందరి స్థితి అది కాదని తెలిసిందే. యుబిఎస్ నివేదిక 30 ధనిక ఆర్థిక వ్యవస్థలున్న దేశాల గురించి సగటున ఒక వ్యక్తి సంపద ఎంత అని విశ్లేషించింది.

ఒక దేశ సంపద విలువను జనాభాతో భాగిస్తే సగటు ఎంతో తెలుస్తుంది. ఒకడి దగ్గర లక్ష, మరొకడి దగ్గర వెయ్యి రూపాయలుంటే సగటు ఇద్దరి రూ.50,500 అవుతుంది. లొట్టలేసుకుంటూ చెప్పే ఈ అంకెలతో రెండవ వాడికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా! ఈ లెక్కన స్విట్జర్లాండ్ సగటు సంపదలో మొదటి స్థానంలో ఉంటే అమెరికా రెండవది. మీడియన్ సంపద (మధ్యగత)ను చూస్తే అదే అమెరికా 28వ స్థానానికి దిగజారింది.మరో మాటలో చెప్పాలంటే 27 దేశాలు మెరుగ్గా ఉన్నాయి. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. ఒక ఊరిలో పది మంది ఉంటే ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయను కుందాం. సగటున చూసినా, మధ్యగతంగా చూసినా వెయ్యి రూపాయలే ఉంటాయి. అంటే సంపద అందరి దగ్గరా సమంగా ఉన్నట్లు. అదే ఊరిలోని మరో పది మందిలో ఒకడి దగ్గర లక్ష ఉండి తొమ్మిది మంది వద్ద వెయ్యి ఉంటే సగటున ఒక్కొక్కరి దగ్గర 10,900 ఉన్నట్లు మధ్యగత సంపద వెయ్యే ఉంటుంది. రెండవదే వాస్తవం. అందుకే సగటు సంపదలో అమెరికా రెండవది, మధ్యగతంలో 28వది. మరో ఉదాహరణగా బ్రిటన్‌‌ను చూద్దాం. ముప్ఫయి దేశాల జాబితాలో సగటులో 21, మధ్యగతంలో 13వదిగా ఉంది. దీని అర్ధం ఏమిటంటే అమెరికా కంటే సాధారణ పౌరుల పరిస్థితి బ్రిటన్‌లో మెరుగ్గా ఉంది, అసమానతలు తక్కువగా ఉన్నట్లు. మరికొన్ని వివరాలను చూద్దాం.అమెరికన్ డాలర్ల ప్రాతిపదికన సంపద విలువ.

దేశం — మధ్యగత– సగటు– గినీ
చైనా — 27,273 — 75,731 — 70.9
భారత్ —3,755—– 16,500— 80.2
పాక్ ——2,076——- 5,226— 74.4
బంగ్లా—- 3,842——- 9,786— 75.0
నేపాల్— 1,685 ——4,672 —-77.6
శ్రీలంక —8,615—- 23,991—- 77.2

ఎగువన ఉన్న అంకెలు చెబుతున్నదేమిటి? గినీ కోయఫిషియంట్ ప్రాతిపదికన 0 నుంచి 100వరకు పాయింట్లను చూస్తే ఎంత తక్కువ ఉంటే అంతగా అసమానతలు తక్కువగా, ఎంత ఎక్కువ ఉంటే అంతగా ఎక్కువ ఉన్నట్లు పరిగణిస్తారు. ఇదే విధంగా సగటుతో పోల్చినపుడు మధ్యగత ఎక్కువగా ఉంటే జనాల రాబడి లేదా సంపద ఎక్కువగా ఉన్నట్లు. ఈ వివరాల ప్రకారం చైనాలో కూడా సంపద అసమానతలు ఉన్నాయి. మనదేశం, ఇతర ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే తక్కువగా గిని ఉందంటే అర్ధం అసమానతలు తక్కువగా ఉన్నట్లు పరిగణిస్తున్నారు. మనం అగ్ర స్థానంలో ఉన్నాం. అమెరికాలో 77 ఉంది. ప్రజాస్వామిక దేశాలలో ఇంతగా అసమానతలు ఉండటం ఏమిటి? అక్కడే తొలి ట్రిలియనీర్-ఎలన్‌మస్క్ అవతరించాడు. మన నేతలు జీడీపీ చూశారా ‘యుపిఏ హయాంకంటే మేం పెంచాం’ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. జీడీపీ అంటే సంపద కాదు, ఒక ఏడాదిలో వస్తువులు, సేవల ద్వారా సృష్టించిన ఉత్పత్తి విలువ. తాము 2024 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల స్థాయికి జీడీపీని పెంచుతామని మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంది. మోడీ అధికారంలోకి వచ్చినపుడు 2014లో 2.04లక్షల కోట్లుగా ఉన్నది 2026లో 4.15లక్షల కోట్లకు(అంచనా) చేరింది. ఇప్పుడు 2029 నాటికి ఐదు లక్షల కోట్లకు చేరుస్తామని కొత్త గడువు చెప్పారు.

సోవియట్ యూనియన్ రద్దయిన తరువాత రష్యాలో ఉన్న ప్రభుత్వ సంపదలన్నింటినీ కొంతమంది పెద్దలు కొట్టేశారు. అమెరికా నయా ఉదారవాద పెట్టుబడిదారీ మేధావులు ఇచ్చిన సలహాల మేరకు ఇది జరిగింది. పుతిన్ ఇతర నేతలు వారి సలహాను పాటించారు గనుక రష్యా పోటీకి రాకుండా ఉండేందుకు ధనికదేశాల్లో ఒకటిగా పరిగణించి రాజీమార్గంగా జి7 కూటమిని జి8గా కూడా మార్చారు. అయితే ఆ ప్రయోగం వికటించింది. ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్న దేశాలలో ఇప్పుడు రష్యా ఒకటి. ఇక గల్ఫ్ దేశాలలో ఐక్య అరబ్ రిపబ్లిక్(యుఏయి) అసమానతలు విపరీతంగా ఉన్న సమాజం. దాని జనాభాలో కేవలం 13శాతం మంది మాత్రమే పౌరులు, మిగిలిన వారంతా వలస కూలీలే. ఆధునిక బానిసదేశంగా దాన్ని పరిగణిస్తారు. సంపదల అసమానతల గురించి ఫ్రెంచి ఆర్థికవేత్త గాబ్రియెల్ జక్‌మాన్ చేసిన విశ్లేషణ ప్రకారం అమెరికాలో కేవలం 19 మంది ధనికుల వద్ద 14శాతం వరకు జాతీయ ఆదాయం పోగుపడింది. దాని చరిత్రలో ఎన్నడూ సంపద ఇలా కేంద్రీకతం కాలేదు.

పదిశాతం ధనికుల వద్ద 50 శాతం ఆదాయ వృద్ధి ఉండగా దిగువ 50శాతం మంది వద్ద 15 నుంచి 20శాతమే ఉన్నట్లు కూడా జక్‌మాన్ చెప్పాడు.అమెరికా ఆర్థిక వ్యవస్థ వినిమయ ఖర్చు మీద ఆధారపడేట్లు చేశారు. పదిశాతం మంది ధనికులు యాభై శాతం ఖర్చు చేస్తుండగా ఇటీవలి కాలంలో దిగువ 60శాతం వాటా తగ్గిపోతున్నట్లు తేలింది.పారిశ్రామిక వద్ధి తగ్గటం, దిగుమతుల మీద ఆధారపడటం, కార్మికులకు వేతనాల పెరుగుదల మందగించటంతో రాబడి తగ్గటం వంటి కారణాలు అత్యధికుల్లో వినిమయం పడిపోవటానికి దారి తీస్తున్నది.1950 దశకంలో అమెరికా జీడీపీలో ఉత్పాదకరంగం వాటా 25శాతం ఉండగా ఇప్పుడు పదిశాతానికి పడిపోయింది.ఫైర్ రంగం అంటే ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియలెస్టేట్ వాటా 1947లో పదిశాతం ఉండగా ఇప్పుడు 21శాతానికి చేరింది. ఈ రంగం వృద్ధి కార్పొరేట్ కంపెనీలు, వాటిలో పని చేసే నిపుణులకు తప్ప సాధారణ కార్మికులకు రాబడి పెరగదు. తలసరి జీడీపీ పెరగవచ్చుగానీ జనాల జీవన ప్రమాణాలు ఆమేరకు పెరగటం లేదు.

ప్రపంచ ఇనీక్వాలిటీ లాబ్ (అసమానతల ప్రయోగశాల) సమాచారం ప్రకారం ప్రస్తుతం మన దేశంలో ఒక శాతం మంది చేతుల్లో 40.1శాతం సంపద పోగుపడగా రాబడిలో వారి వాటా 22.6శాతం ఉంది.(కొందరి అంచనా మేరకు 2022లో 25శాతం ఉంది) బ్రిటీష్ వారి ఏలుబడిలో 1922 నుంచి 1947 వరకు రాబడిలో ఎగువ ఒకశాతం వాటా 20-21శాతం మధ్య ఉందని అంచనా. అది స్వాతంత్య్రం తరువాత 1961నాటికి 13శాతానికి తగ్గింది.1991 నుంచి అమలు చేసిన నూతన ఆర్థిక విధానాల ఫలితంగా బ్రిటీష్ కాలం నాటి కంటే సంపద, రాబడి కేంద్రీకరణ ఎక్కువైంది. అమెరికాలో పాతకాలం నాటి రాక్‌ఫెల్లర్, ఫోర్డ్, జెపి మోర్గాన్ వంటి వారిని వెనక్కు నెట్టి ఇప్పుడు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బెర్గ్ వంటివారు ఎలా ముందుకు వచ్చారో మనదేశంలో టాటా, బిర్లా, గోయంకాలను దాటి అంబానీలు, అదానీలు దూసుకుపోవటాన్ని మనం చూడవచ్చు. ప్రపంచంలో ఆదాయ అసమానతల పెరుగుదల గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అమెరికాలో 2025 వివరాలను చూసినపుడు ఒక కంపెనీ సిఇఓ-కార్మికుడి వేతన వ్యత్యాసం ఆకాశానికి అంటినట్లు తేలింది. టెస్లా కంపెనీలో ఒక కార్మికుడి మధ్యగత ఆదాయం కంటే దాని అధిపతి ఎలన్ మస్క్‌కు 25లక్షల రెట్లు ఉందన్నది నమ్మలేని నిజం.

అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య ఎఎఫ్‌ఎల్-సిఐఓ వార్షిక వేతన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. స్టాండర్డ్ అండ్ పూర్ 500 కంపెనీల జాబితాను పరిశీలించినపుడు మధ్యగత వేతనంతో పోల్చితే ఉన్నతాధికారులకు 285రెట్లు అదనంగా ఇస్తున్నారు. ఇదే కంపెనీల సిఇఓల వేతనం 1,700శాతం ఎక్కువ. ఈ వ్యత్యాసం అన్ని రంగాలలో ఒకే విధంగా లేదు. ఉత్పాదకరంగంలో ఏడాదికి సగటున ఒక సిఇఓ 69.6 కోట్ల డాలర్లు పొందుతుండగా కార్మికుడు 93వేల డాలర్లు మాత్రమే తీసుకుంటున్నాడు.అధ్యక్షుడు ట్రంప్ రెండవసారి అధికారానికి రావటానికి ముందు కంటే గతేడాది అతగాడి రాబడి 254 రెట్లు పెరిగింది. వరల్డ్ లిబర్టీ ఫైనాన్సియల్ ట్రంప్ కుటుంబ క్రిప్టో కరెన్సీ కంపెనీ, దాన్నుంచి గతేడాది 220 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందాడు. ఈ మొత్తం ఒక సాధారణ అమెరికన్ కార్మికుడి రాబడితో పోల్చితే 43,154 రెట్లు ఎక్కువ. స్టాక్‌మార్కెట్‌లో మన కార్పొరేట్, పెద్ద కంపెనీల సిఇఓల వేతనం సాధారణ కార్మికుడి మధ్యగత వేతనం కంటే రెండువందల రెట్లు ఎక్కువ, అమెరికా తరువాత అంత తేడా ఉన్న ఘనత మనదే, ఎటువైపు పయనిస్తున్నట్లు!

కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Tags

, , ,

డాక్టర్ కొల్లా రాజమోహన్,

 ‘ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం’గా పేరుపొందిన కృష్ణా డెల్టా నేడు తీవ్రమైన సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో (El Niño) ప్రభావం మరియు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో “ఈ సీజన్‌లో వరి పంట వేయవద్దు” అని ప్రభుత్వం జారీ చేసే సూచనలు డెల్టా రైతాంగాన్ని తీవ్రమైన దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి.2003 సంవత్సరంలో కృష్ణా డెల్టా లో రైతులు తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొన్నారు.సాగు నీటి కోసం ఉద్యమం సాగించారు.ప్రకాశం బ్యారేజి పైన అతి పెద్ద ధర్నా నిర్వహంచారు.అతి తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధించారు. అప్పటికి పులిచింతల నిర్మించలేదు. పులిచింతల నిర్మించిన తరువాత కూడా కృష్ణా డెల్టా లో వరి పంట సాగుచేయవద్దనటం విచిత్రం గా వుంది.

1. కృష్ణా డెల్టా ప్రత్యేక పరిస్ధితులు వరి వైపే రైతుల మొగ్గు ఎందుకు?

డెల్టా ప్రాంతంలో ప్రత్యామ్నాయ పంటలు వేయమని ప్రభుత్వం చెప్పడం కాగితం మీద సులువుగానే కనిపించినా, క్షేత్రస్థాయిలో ఉన్న భౌగోళిక పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి:

డెల్టా నేలలు ఎక్కువగా నల్లరేగడి నేలలు మరియు బంకమన్నునేలలు. ఈ ప్రత్యేక స్వభావం  వలన  భూమి నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుంటుంది. వరిపొలాలలో  నీరు నిల్వ వుండటంకోసం, పొలాలను గట్టులతో మడిగా ఏర్పాటు చేస్తారు., మడి లోనుండి మురుగు నీరు బయటకు మురుగు కాలువ లోనికి పంపటానికి వీలుగా ఏర్పాటు జరుగుతుంది.

 డ్రెయినేజ్ (మురుగు నీటి పారుదల) వ్యవస్ధ నిర్వహణ లోపం కారణంగా, కాలక్రమేణా కాలువలు, డ్రెయిన్లు పూడిపోవడం వల్ల సరైన నీటి పారుదల వ్యవస్థ లేదు. చిన్న వర్షం పడినా లేదా చిన్నపాటి తుఫాను వచ్చినా మాగాణి పొలాల్లో నీరు నిలిచిపోతుంది.

ప్రభుత్వం సూచించినట్లుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయటంవలన  నష్టం అపారంగా వుంటుంది. మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము వంటి ఆరుతడి పంటలు వేసినప్పుడు పొలంలో నీరు నిలిస్తే, వేరు కుళ్ళు తెగులు వచ్చి పంట క్షణాల్లో నాశనమవుతుంది. అందుకే రైతులు నీటిని తట్టుకునే వరి పైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది.

2. ప్రభుత్వాల వద్ద ఉన్న అవకాశాలు & నీటి మేనేజ్మెంట్

ఎల్ నీనో ప్రభావం వలన తీవ్రమయిన వర్షాభావ పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. కొన్నిచోట్ల అసలు వర్షాలు పడవు. మరి కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడుతున్నాయి. క్రిష్ణానది పరీవాహక ప్రాంతం చాలా పెద్దది. పరీవాహక ప్రాంతంలో కురుసిన వర్షపు నీటిని సద్వినియోగ పరచటంలోనే నిపుణుల యొక్క నైపుణ్యం, పరిపాలకుల సామర్ధ్యం ఇమిడి వుంటుది.

ఎగువన వర్షాలు లేకపోయినా, డెల్టాను ఆదుకోవడానికి అందుబాటులో ఉన్న ఇతర వనరులను సమర్థవంతంగా నిర్వహించాలనేది రైతుల ప్రధాన డిమాండ్:

పులిచింతల ప్రాజెక్టులో  లో 45 టీ యమ్ సీ ల నీటిని నిల్వచేయవచ్చని ప్రభుత్వం  చెప్తున్నది. పులిచింతల నిర్మాణం చేసేది, కృష్ణా డెల్టాలోని పంటల రక్షణ కోసమన్నారు. అదే ఉద్దేశ్యంతో కృష్ణా డెల్టాలోని ప్రజలు, రైతు నాయకులు పులిచింతల కోసం పోరాడి సాధించుకున్నారు. ప్రతికూల పరిస్ధితులలో, పులిచింతల నీటిని క్రిష్ణా డెల్టా పంటల రక్షణకుయోగిస్తామని పులిచింతల నిర్మాణం సమయంలో ప్రభుత్వాధినేతలు శెలవిచ్చారు. ఇపుడు మాటమార్చి, తాగునీటికోసం పులిచింతల అంటున్నారు. గతంలో లాగానే, తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువులు నింపాలి.  మొట్టమొదట కట్టిన ప్రాజెక్టులకు వున్న (RIPARIAN RIGHTS ని ఉపయోగించుకోవాలి.  ఫైనుండి ప్రవహించినపుడు, నదీ తీర వాసులకు నీటిని వాడుకోవటానికి వున్న హక్కును ఉపయోగించుకోవాలి.  పూర్తి నీటి సామర్ధ్యం వరకు పులిచింతలలో నీటిని నింపి, అవసరమయినపుడు  క్రిష్ణా డెల్టా పంటల రక్షణకు ఉపయోగించుకోవాలి.అవసరమైతే వారబందీ పధతి ద్వారా లేక రేషన్ పధతి ద్వారా నీటిని అందించవచ్చు.

 గోదావరి నీటి సమర్థవంతంగా వినియోగించాలి. పట్టిసీమ ద్వారా గోదావరి నదిలో వరద నీరు ఉధృతంగా ఉన్నప్పుడు కృష్ణా డెల్టాకు నీటిని మళ్ళించి ప్రకాశం బ్యారేజీ ఆయకట్టును స్థిరీకరించవచ్చు.

 ఎగువ ప్రవాహాల సమన్వయం (Inflow Forecasting): మహారాష్ట్ర, కర్ణాటక (ఆల్మట్టి, నారాయణపూర్) ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినప్పుడు వచ్చే వరద నీటిని అంచనా వేసి, సాగర్ నుండి నీటి పంపిణీని ముందే ప్రణాళికాబద్ధంగా (Water Budgeting) నిర్వహించాలి.

 మౌలిక వసతుల పునరుద్ధరణ: ఇప్పటికిప్పుడు డ్రెయినేజ్ వ్యవస్థ మొత్తాన్ని ఆధునీకరించడం కష్టమే అయినా, ప్రధాన కాలువల్లో పూడికతీత, అడ్డంకుల తొలగింపు తక్షణమే చేపట్టడం ద్వారా మురుగు నీటి ముప్పును తగ్గించవచ్చు.

3). క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక మార్గాలు (మధ్యంతర పరిష్కారాలు)

ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకోవడానికి మరియు రైతులు పూర్తిగా నష్టపోకుండా ఉండటానికి సాంకేతిక, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న కొన్ని మార్గాలు:

1. వరి నేరుగా విత్తుట (Direct Seeded Rice – DSR):

 నారు పోసి, నీరు నిలబెట్టే సాంప్రదాయ పద్ధతికి స్వస్తి చెప్పి, డ్రమ్ సీడర్ లేదా గొర్రుతో నేరుగా విత్తుకోవడం.

 దీనివల్ల 30% వరకు నీరు, పెట్టుబడి వ్యయం ఆదా అవుతాయి.

2. స్వల్పకాలిక రకాల ఎంపిక:

 110-120 రోజుల్లో చేతికి వచ్చే తక్కువ నీటితో పండే వరి రకాలను సాగు చేయడం.

3. ఆరుతడి పంటలకు ఎత్తైన మడులు (Raised Bed Cultivation):

 మురుగు నీటి సౌకర్యం సరిగా లేని మాగాణుల్లో ఆరుతడి పంటలు వేయాల్సి వస్తే, బోదెలు (Raised Beds) చేసి పంటలు వేయడం ద్వారా నీరు నిలవకుండా కాపాడుకోవచ్చు.

4. సబ్సిడీ విత్తనాలు:& భీమా (Crop Insurance) అంశం

 రిస్క్ అనే ఆలోచన ఉన్నప్పటికీ, నీటి లభ్యత పై అనిశ్చితి స్ధితి కొనసాగుతున్నా వరి నారును సిధం చేస్తున్న రైతులను అభినందించాలి. ప్రోత్సహించాలి.అవసరమయిన అన్ని సహాయాలూ ప్రభుత్వం అందించాలి. .  భారీ రిస్క్ తీసుకుని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రీమియం కట్టి భీమా సౌకర్యాన్ని కలిగించాలి.. రైతులకు ఆర్థికంగా ఆ మాత్రం సహాయాన్ని ప్రభుత్వం చేయాలి. రైతు సేవా కేంద్రాల (RSK) ద్వారా డెల్టా భూములకు తగిన ఉచిత/సబ్సిడీ ప్రత్యామ్నాయ విత్తనాలను, సాంకేతిక సలహాలను ఉచితంగా అందించాలి.

5. దీర్ఘకాల ప్రణాలిక గా, వరద నీటిని  నిల్వ చేసుకునే ప్రయత్నాలను ముమ్మరంచేయాలి.అవనిగడ్డ ప్రాంతంలో రెండు చెక్ డామ్ లు కట్టటం ద్వారా 6.75 టీ.ఎమ్. సీ ల నీటిని నిల్వచేయటానికి అనుమతులు , ప్రణాళికలు సిధంగావున్నా ఆచణకు నోచుకోలేదు. పాలేరు, మున్నేరు పై రిజర్వాయర్ ల ద్వారా 5 టీ.ఎమ్. సీ ల నీటిని నిల్వచేయవచ్చని నిపుణులు సూచించినా ఆచరించలేదు.

ముగింపు

 పులిచింతల నీటిని క్రిష్ణా డెల్టా పంటల రక్షణకు వినియోగించాలి. మురుగు నీటి పారుదల వ్యవస్థ లోపాలు ఉన్నాయని తెలిసి పంట వద్దనడం కంటే,తక్షణ కాలువల పూడికతీత, మరియు తక్కువ నీటితో పండే నూతన సాగు పద్ధతులను ప్రోత్సహించడమే సరైన పరిష్కారం. గోదావరికృష్ణా జలాలను సరైన వాటర్ మేనేజ్ మెంట్ చేసి,సమన్వయంచేసి నీటిని రైతులకు అందించాలి. కృష్ణా డెల్టా రైతుకు సాగునీరు అనేది కేవలం వరి  పంట వేయాలా వద్దా అనే ప్రశ్న మాత్రమే కాదు, అది వారి జీవనాధారం. ఆంధ్ర ప్రజల ఆర్ధిక ప్రగతికి మూలాధారం. ప్రభుత్వం, రైతాంగం, రైతుసంఘాలు కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే డెల్టాలో నీటి సంక్షోభాన్ని అధిగమించవచ్చు.

‘మక్కా రక్షణ ఒప్పందం’ వెనుక మతలబేమిటి?

Tags

, , , , , ,

కోటేశ్వరరావు

పెద్ద ఆర్భాటం, ముందస్తు హడావుడి లేకుండా సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఆగస్టు ఏడున సౌదీ, టర్కీ, పాకిస్తాన్ దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీన్ని ‘మక్కా ఒప్పందం’ అని కూడా పిలుస్తున్నారు. దీని పరిణామాలు, పర్యవసానాల గురించి ప్రపంచంలో చర్చ మొదలైంది. రక్షణ కోసం అమెరికాను ఆశ్రయిస్తే ప్రయోజనం లేదనే భావం తాజా పరిణామాలతో బలపడటంతో ఈ కొత్త కూటమి పురుడు పోసుకున్నట్లు తొలి స్పందనలొచ్చాయి. నమ్ముకున్న దేశాలను నట్టేట ముంచి స్వంత ప్రయోజనాల కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుందన్న విషయం తెలిసిందే. ఇజ్రాయిల్‌తో కలసి ఇరాన్‌పై దాడులు చేయించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అటు అమెరికా ఇటు యావత్ ప్రపంచంలో అపహాస్యం పాలైనా బుద్ది మారలేదు. అలాంటి వాడిని మన ప్రధాని నరేంద్రమోడీ వంటివారు ఇంకా జిగినీ దోస్తుగానే పరిగణిస్తున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తే మన వస్తువుల దిగుమతిపై వందశాతం అపరాధ సుంకాలు విధించేందుకు అమెరికా పార్లమెంటు ఎగువసభ సెనేట్ ఇప్పటికే తీర్మానించింది, ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదం పొందితే అమల్లోకి రానుంది. అయినా మోడీ నుంచి ఉలుకూపలుకూ లేదు.

అదేమిటంటే మౌనం కూడా ఒక దౌత్యమే, అది మోడీకే స్వంతం అని భజనపరులు కీర్తిస్తున్నారు. ఇరాన్ మీద తాము దాడులు చేసినపుడు అనేకమంది మరణించారని, గాయపడ్డారని వారందరికీ ఇరాన్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తాజాగా డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దాడులతో తమకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని టెహరాన్ పట్టుబడుతున్న పూర్వరంగంలో ట్రంప్ ఎదురుదాడికి దిగాడు. నవంబరు మూడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల గడువు సమీపిస్తున్నది. ఓటర్లకు ఏం చెప్పాలో తెలియక, ఏం మాట్లాడితే పరువు మరింత దిగజారుతుందో అర్ధంగాక ఎరక్కపోయి ఇరుక్కు పోయినట్లుగా ట్రంప్ జుట్టుపీక్కుంటున్నాడంటే అతిశయోక్తి కాదు. గాజాలో శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని, అమెరికా ప్రతిపాదించిన పదిహేను అంశాలను అమలు చేస్తామని, అక్కడ అధికారంలో ఉన్న హమాస్ సాయుధశక్తి చెబుతుండగా… అంగీకరించేది లేదని, గాజా నుంచి వైదొలగబోమని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. ఎందుకంటే అక్టోబరు 27న ఇజ్రాయిల్‌ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు స్వే‌చ్ఛగా జరుగుతాయా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. నెతన్యాహు అనుకూల మూకలు ఓటర్లను బెదిరిస్తున్నాయి.

ఓటర్లుగా ఉన్న పాలస్తీనియన్లను ఓటింగ్‌కు రాకుండా అని ప్రయత్నాలూ చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారు వచ్చి నెతన్యాహుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతో ముందు, ఓటింగ్ రోజు అనేక విమానాలను కూడా రద్దు చేశారు. యూదు దురహంకారులను సంతుష్టీకరిం చేందుకు ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ప్రాంతంలో పాలస్తీనియన్లపై దాడులను ఉధృతం చేశారు, వామపక్షాలను పోటీలో లేకుండా చేసేందుకు కూడా చూస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగా టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ దేశాల ప్రతినిధులు మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. మూడింటిలో ఏ ఒక్కదేశం మీదైనా ఎవరైనా దాడిచేస్తే అందరి మీద చేసినట్లుగా పరిగణించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కూటమిని “ముస్లిం నాటో-సున్నీ నాటో” అని కొందరు వర్ణించారు. మూడూ ఇస్లామిక్ దేశాలు కావటం, మతరీత్యా ఆ దేశాల్లో సున్నీలు అత్యధికులుగా ఉన్నందున అలా చెప్పారు. ఈ ఒప్పందం ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. దీనివలన ఎలాంటి ఫలితం ఉండదని చెబుతున్నవారూ లేకపోలేదు. దీర్ఘకాలం సాగుతున్న విబేధాలు, ప్రాంతీయ యుద్ధాల పూర్వరంగంలో అమెరికా రక్షణను నమ్ముకోకూడదన్నది ఒక ప్రధాన అంశంగా చెబుతున్నారు.

తాజా పశ్చిమాసియా సంక్షోభంలో గల్ఫ్, మధ్య ప్రాచ్య ప్రాంతంలోని అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ చేస్తున్న దాడులతో ఆయా దేశాల్లో తలెత్తిన ఆందోళన, అనిశ్చితి వాషింగ్టన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు అనే భయం పట్టుకుంది. దీంతో యుద్ధాన్ని నిలిపివేయాలని ఆ దేశాలు ట్రంప్ యంత్రాంగం మీద వత్తిడి తెస్తున్న సంగతి కూడా తెలిసిందే. అత్యాధునిక ఆయుధాలున్న అమెరికా దాడుల్లో ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ అనేక విధాలుగా దెబ్బతిన్నది వాస్తవమే అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ప్రతిదాడులు చేయటం వెనుక ఉన్న మర్మం పండితులకు అంతుబట్టటం లేదు. తిరుగులేని నిఘా వ్యవస్థలుగా పేరున్న ఇజ్రాయిల్‌ మొసాద్, అమెరికా సిఐఏకు సైతం ఇరాన్ ఆయుధాలు, వాటిని ప్రయోగిస్తున్న కేంద్రాలు ఎక్క‌డున్నాయో తెలియటం లేదు. గతేడాది అణుకేంద్రాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించినా అదంతా ఉత్త ప్రచారమే అని తరువాత తేలిపోయింది. అందుకే ప్రాంతీయ ఏర్పాట్లు చేసుకోవాలనే ఆలోచనకు మక్కా ఒప్పందం ఒక ప్రతిరూపం అంటున్నారు. దీనిలో వెంటనే ఈజిప్టు చేరనుందని, తరువాత మరికొన్ని దేశాలు కూడా భాగస్వాములుగా చేరవచ్చని చెబుతున్నారు. దీని ఏర్పాటు వెనుక అమెరికా హస్తం ఉందని కూడా అను మానాలు వెల్లడవుతున్నాయి.తమ చేతికి మట్టి అంటకుండా ఇరాన్‌‌ను దెబ్బతీసేందుకు మరో ప్రయత్నంగా ఇది ఉన్నట్లు చెబుతున్నారు.

అది నిజమా కాదా అన్నది వెంటనే చెప్పలేము గానీ ఏం జరిగినా పోయేది అమెరికా ప్రతిష్ట, పెత్తనం అన్నది స్పష్టం. అమెరికా మీద అనేక దేశాలకు ఎందుకు విశ్వాసం సన్నగిల్లుతున్నది? ఇరాన్ అణుబాంబు తయారీ, క్షిపణి, నౌకాదళ సామర్ధ్యాలను దెబ్బతీసేందుకు ఇజ్రాయిల్‌తో కలసి దాడులు చేస్తున్నట్లు తొలుత అమెరికా చెప్పింది. వాటన్నింటినీ నాశనం చేసినట్లు ఏప్రిల్ ఎనిమిది పెంటగన్ ప్రకటించింది. వైమానిక రక్షణ వ్యవస్థలను సంవత్సరాల తరబడి పనికిరాకుండా చేయటంతో పాటు మిలిటరీ పారిశ్రామిక సామర్ద్యాన్ని కూడా దెబ్బతీసినట్లు చెప్పింది. ఇన్ని కబుర్ల తరువాత వెల్లడైన వివరాల మేరకు అమెరికా 113 బిలియన్ డాలర్ల మేర ఆర్థికంగా నష్టపోయింది. దాని విలువైన 42 విమానాలు కూడా కూలిపోయాయి. మరణించిన లేదా గాయపడిన అమెరికా సైనికుల సంఖ్య తొమ్మిది వందలు దాటింది. ఆ ప్రాంతంలో యాభై వేల మంది తమ సైనికులు ఉన్నట్లు వెల్లడించటమే గాక ఆ తరువాత కూడా దాడులు కొనసాగించింది. ఫిబ్రవరి 28కి కొన్ని వారాల ముందు కతార్‌లో బహుళజాతి గగనతల, క్షిపణి రక్షణ విభాగాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రారంభించింది. దాని ద్వారా ముప్పు గురించి ముందే హెచ్చరించటం, ఎదుర్కొనేందుకు తాత్కాలిక పథకాల రచన, సమాచార అందచేత వంటి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు.

ఏడు దేశాల మిలిటరీ ప్రతినిధులు దానిలో భాగస్వాములన్నారు. తీరాచూస్తే ఇరాన్ చేసిన దాడులతో అది పనికిరాకుండా పోయింది. అమెరికా మరోచోటుకు తన కమాండ్ కేంద్రాన్ని మార్చుకుంది. నిజానికి కతార్‌లో అంతకుముందున్న కమాండ్ కేంద్రం నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా ఇతర దేశాలలో అమెరికా అనేక కార్యకలాపాలు నిర్వహించింది. ఇరాన్ దాడులతో ఆ ప్రాంతంలోని 15 అమెరికా మిలిటరీ కేంద్రాలలో కనీసం 228 మిలిటరీ నిర్మాణాలు, వాటిలో ఉన్న విమానాలు, రాడార్, సమాచార పరికరాలు, చమురు సంబంధిత ఏర్పాట్లు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఎంతో ఖరీదైన పేట్రియాట్, థాడ్, తోమహాక్ రక్షణ వ్యవస్థలన్నీ ఇరాన్ దెబ్బతో కరిగిపోయాయి. చివరకు దక్షిణ కొరియాలో ఉంచిన వాటిని కూడా పశ్చిమాసియాకు తరలించాల్సి వచ్చింది. వెంటనే అలాంటి వాటిని ఉత్పత్తి చేయాలని రక్షణ కాంట్రాక్టర్లను పెంటగన్ కోరిందని, వెంటనే సరఫరా చేయటం సాధ్యం కాదని వారు చేతులు ఎత్తివేసినట్లు వార్తలొచ్చాయి. కొన్నేండ్ల పాటు ఉత్పత్తికి సమయం తీసుకోవచ్చని కూడా నిపుణులు చెప్పారు. వీటన్నింటిని చూసిన తరువాత అమెరికాను నమ్ముకొని ఏ దేశమైనా నిశ్చింతగా ఉండగలదా? నాటో కూటమిలో సభ్య దేశమైన టర్కీ రెండవ పెద్ద మిలిటరీని కలిగి ఉంది.

గల్ఫ్‌లో చమురుతో సౌదీ అరేబియా ఆపార సంపద, పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఈ మూడూ కలిస్తే ఒక బలమైన శక్తిగా రూపొందే అవకాశం ఉందనే ఆలోచన మక్కా ఒప్పందం వెనుక ఉందన్నది ఒక అభిప్రాయం. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అయితే నాటో కూటమి లక్షణాలు దీనికి ఉన్నాయా అంటే లేవు. అందుకే కొందరు ఇది సంతకాలకే పరిమితం అంటున్నారు. నాటో మాదిరి ఒక ఏకీకృత మిలిటరీ కమాండ్, ఒక ప్రణాళిక, నిర్దిష్ట లక్ష్యం లేదు. తక్షణమే అలాంటి వాటిని ఏర్పాటు చేసే అవకాశాలూ కనిపించటం లేదు. ఐక్యరాజ్యసమితి ఆర్టికల్ 51 ప్రకారం ఉమ్మడి ఆత్మరక్షణ ఒప్పందంగా టర్కీ వర్ణించింది. గతేడాది సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దానిలో చేరే అవకాశం గురించి చర్చిస్తున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ జనవరి 29న చెప్పాడు. రక్షణ అవసరాల కోసం వెలుపలి దేశాల మీద ఆధారపడుతూ కొనసాగటం కంటే ప్రాంతీయ ఏర్పాట్లు చేసుకోవటం మంచిదన్నదే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ప్రపంచ మిలిటరీ బలా బలాలను చూసినపుడు టర్కీ 9, పాకిస్తాన్ 14, సౌదీ 25వ స్థానాల్లో ఉన్నాయి. పందొమ్మిద వదిగా ఉన్న ఈజిప్టు కూడా కలిసే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలూ భిన్నదారుల్లో ప్రయాణిస్తున్నాయి.

అష్ట దరిద్రాలతో అల్లాడుతున్నప్పటికీ పాకిస్తాన్ అణుబాంబు లను తయారు చేసుకుంది తప్ప అన్న వస్త్రాలను జనాలకు సమకూర్చలేకపోతోంది. కీలకమైన ప్రాంతంలో ఉన్నందున భారత్, చైనాలకు వ్యతిరేకంగా ఒక స్థావరంగా ఉపయోగపడ నుందనే కుట్రలో భాగంగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలు దానికి అండగా ఉన్నాయి. ఇప్పుడు దాని ఆర్థిక ఇబ్బందులను సౌదీ తీరుస్తున్నది. పాకిస్తాన్ తన మిలిటరీ అవసరాల కోసం అత్యధికంగా చైనా మీద ఆధారపడుతున్నది. టర్కీ స్వంత మిలిటరీ పరిశ్రమలను కలిగి ఉంది. సౌదీ విషయానికి వస్తే అది పూర్తిగా అమెరికా మిలిటరీ ఉత్పత్తులపై ఆధార పడుతున్నది. ఐరోపా కేంద్రంగా పనిచేసే నాటో దేశాలు కొన్ని స్వయంగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తుండగా మరికొన్ని అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. నాటో రక్షణ బడ్జెట్ పెంచాలని ఇటీవలి కాలంలో అమెరికా వత్తిడి తెస్తున్నది. ఇస్లామిక్ నాటోగా వర్ణితమౌతున్న కూటమిలో రక్షణ బడ్జెట్‌ను పెంచేందుకు పాకిస్తాన్‌కు అవకాశం లేదు. ఒక వైపు నాటోలో కొనసాగుతూ మరోవైపు మక్కా కూటమిలో చేరిన టర్కీ ఎంతమేరకు బడ్జెట్ కేటాయిస్తుందన్నది అనుమానమే.ఈ కూటమి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున మన దేశం పెద్దగా స్పందించలేదు, వేచి చూస్తున్నట్లు మాత్రమే ముక్తసరిగా వ్యాఖ్యానించింది.

హైకోర్టు వ్యాఖ్య చెంపపెట్టు : గుజరాత్‌లో ఒక తల్లి విపరీత చర్య – మోడీ ఆదర్శ పాలన బండారం !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

“ ఆకలి ఒక తల్లి విపరీత చర్యకు పాల్పడేట్లు చేసింది, ఇది సామÖహిక వైఫల్యం ” ఈ వ్యాఖ్య చేసింది గుజరాత్ హైకోర్టు న్యాయమÖర్తి హెచ్‌డి సుతార్. ఆ తల్లిది పన్నెండు సంవత్సరాల క్రితం ఒక ఆదర్శంగా వర్ణించి, దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని అదే విధంగా మారుస్తానని వాగ్దానం చేసిన ప్రధాని నరేంద్రమోడీ స్వంతగడ్డ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 15 నుంచి 2014 మే 22వ తేదీ వరకు పని చేశారు. ఆ కాలాన్ని గుజరాత్ స్వర్ణయుగంగా కొందరు పరిగణిస్తారు. భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014లో మోడీ రాకతో వచ్చిందన్న బిజెపి ఎంపీ కంగన రనౌత్ చెప్పిందాని ప్రకారం గుజరాత్‌కు 2001లోనే వచ్చింది. మోడీ తరువాత అదే బిజెపి నేతల ఏలుబడిలో ఉంది. మోడీ కేంద్రంలో ప్రధానిగా రెండింజన్ల పాలన సాగిస్తున్నారు. అలాంటి చోట ఒక తల్లి తన రెండు సంవత్సరాల కుమార్తె (బేటీ పడావో, బేటీ బచావో నినాదం ఇచ్చిన తరువాత) ఆకలి తీర్చలేక పోయింది. అసహాయతకు లోనై ఏడుస్తున్న పసికందు నోరు మÖయించేందుకు ఒక దెబ్బవేసింది. అపస్మారకంలోకి పోవటంతో స్వయంగా ఆసుపత్రికి తీసుకుపోయింది.ఫలితం లేక ఆ బేటీ మరణించింది. కూతుర్ని చంపిన నేరానికి ఏడు నెలల గర్భిణిగా ఉన్న తల్లిని జైల్లో పెట్టారు. బెయిలు కోసం దరఖాస్తు చేస్తే గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు. ఆ కేసులో హైకోర్టు విచారణలో న్యాయమÖర్తి ఆ తల్లికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు మీడియాలో పెద్దగా ప్రచారంలోకి రాలేదు, ఎందుకంటే అవి మోడీకే తగులుతాయి గనుక మÖసిపెట్టారు.

తనను దూషించిన జెన్ జి తరం యువతీ యువకులను క్షమిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ గనుక అంత ఉదారత ప్రదర్శించారని దాన్ని కూడా ఆయన ప్రతిష్ట పెంచేందుకు ఉపయోగించిన వారిని దేశం చూసింది. అసలు క్షమాపణ చెప్పాల్సిన ప్రధానే క్షమించటం అనే విడ్డూరపు చర్యకు పాల్పడటం ఏమిటని కొందరు విమర్శించారు.కాసేపు దాని మంచి చెడ్డలను పక్కన పెడదాం. తన రాష్ట్రంలో ఒక తల్లి విపరీత చర్యకు పాల్పడిన పరిస్థితులను కల్పించిన తన పాలనతీరు తెన్నులకు ఆ తల్లి ఉదంతం మీద మోడీ ఎందుకు స్పందించలేదు అన్నది అసలు సమస్య. సామÖహిక వైఫల్యం అన్న న్యాయమÖర్తి వ్యాఖ్య ప్రకారం దానిలో నరేంద్రమోడీ భాగం లేదా ? ఫ్రధాని లేదా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర బిజెపి నేతలెవరూ ఏ మాత్రం స్పందించలేదు. జూలై 20న ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేసిన వారు నరేంద్రమోడీని వ్యక్తిగా దూషించటం తనను ఎంతో కలచివేసిందని చెప్పిన జనసేనాని పవన్ కల్యాణ్‌లో సైతం ఎలాంటి స్పందన లేదు. అవునులే మోడీ వేరు, సామాన్యులు వేరు. అసలు ఆ తల్లి అలాంటి చర్యకు ఎందుకు పాల్పడినట్లు ? మన సమాజంలో భార్య, తలిదండ్రులను గాలికి వదిలేసే పెద్ద మనుషులను, అసలు తమకు వివాహమైనట్లే తెలియకుండా దాచేవారిని చూస్తున్నాము. సూరత్ ప్రాంతానికి చెందిన లఖీ సోలంకి ఇద్దరు బిడ్డల తల్లి, ఏడు నెలల గర్భంతో ఉంది. భర్త సముద్రం మీద పని చేసేందుకంటూ ఆరునెలల క్రితం ఆమెకు ఎలాంటి ఆదరువు చూపకుండా వెళ్లిపోయాడు. అతడు తిరిగి వస్తాడో రాడో తెలియదు,కడుపుతో ఉన్న ఆమెకు అవసరమైన ఆర్థిక ఏర్పాట్లు కూడా లేవు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఇలాంటి స్థితిలో వివాహ బంధం లేకుండా మైత్రీ ఖరారు ఒప్పందంతో ఆమె ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఈ క్రమంలో ఆకలికి తాళలేక బిడ్డ ఈషా ఏడ్పులను తట్టుకోలేక 2026, మార్చినెల 19 తేదీన చేయిచేసుకుంది. ఈ ఉదంతం న్యాయమÖర్తి వ్యాఖ్యానించినట్లుగా దిక్కులేని కుటుంబాలు, వ్యక్తులు, వారి దారిద్య్రం, ఆకలి పట్ల సమాజ, ప్రభుత్వ చేతలు ఏమిటనే ప్రశ్నలను ముందుకు తెచ్చింది. ఏ ఇథియోపియానో, మరో ఆఫ్రికన్ దేశంలో ఈ ఉదంతం జరిగిందంటే అర్ధం చేసుకోవచ్చు.దేశం మొత్తం మీద సంపదలు కలిగిన ధనికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం గుజరాత్. విలువలు, వలువలు ఉన్నాయని చెప్పుకొనే సంఘపరివార్‌కు ఎంతో పట్టున్న ప్రాంతం.

లఖీ సోలంకి ఉదంతాన్ని ఒక వ్యక్తి విషాదంగా చూడటానికి లేదు. దుర్భరదారిద్య్రంలో నివసిస్తున్న వారి రక్షణకు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాల వ్యవస్థ వైఫల్యానికి ప్రతిబింబం అని కోర్టు వ్యాఖ్యానించింది. బిజెపి చెప్పే రెండింజన్ల పాలనలో ఉన్న గుజరాత్ ప్రభుత్వానికి ఈ వ్యాఖ్య చెంపపెట్టు. తల్లి కొట్టిన దెబ్బలకే రెండేండ్ల కూతురు మరణించినట్లు పోస్టు మార్టం నివేదికలో చెప్పినందున ఇది చాలా తీవ్రమైన నేరం అంటూ పోలీసులు లఖీకి బెయిలు ఇవ్వరాదని వాదించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆమే స్వయంగా అపస్మారకంతో ఉన్న తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకువెళ్లిందని, చంపాలనే ఉద్దేశ్యం ఆమెకు లేదని కోర్టు చెప్పింది. తన కుమార్తె ఆకలిని తీర్చలేక వత్తిడికిలోనై బాధ్యతారహితంగా వ్యవహరించిందని కూడా వ్యాఖ్యానించింది. ఆ కుటుంబం దీర్ఘకాలం పాటు దారిద్య్రం, ఆకలికి లోనైందని పేర్కొన్నది. ఇంకా ఇలా చెప్పింది. ఈ కేసును కేవలం ఒక నేర అంశంగా చూడకూడదు. పేదల పట్ల సమాజ బాధ్యతను గుర్తు చేసింది. పుట్టుకతోనే ఎవరూ నేరగాండ్లు కాదు.దారిద్య్రం, ఆకలి అలాంటి తీవ్ర పరిస్థితులవైపు నెట్టేధంగా పరిస్థితిని కల్పిస్తాయి.ఇది కేవలం ఒక వ్యక్తిది మాత్రమే కాదు సమాజ వైఫల్యం. సంక్షేమ పథకాల యంత్రాంగాల లోపాలు మరియు తీవ్ర కష్టాల్లో ఉన్న మహిళలు, పిల్లలను ఆదుకోవాల్సిన రాజ్యం యొక్క రాజ్యాంగ బాధ్యతలను కూడా ఎత్తి చూపింది.

ఈ సందర్భంగా న్యాయమÖర్తి సుతార్ ఆకలి, దారిద్య్రం, న్యాయం మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేందుకు అనేక సాహిత్య, తత్వశాస్త్రాలు,మత గ్రంధాలు చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ఆకలి తప్ప మానవుడు దుర్మార్గుడు కాదు అని సందేశమిచ్చిన గ్పుురాతీ రచయిత పన్నాలాల్ పటేల్ నవల, తన కుటుంబ ఆకలి తీర్చేందుకు ఒక వ్యక్తి రొట్టెను అపహరించిన ఇతివృత్తంతో రచన చేసిన విక్టర్ హ్యూగో, దుర్భర దారిద్య్రం జనాలను నేరాలవైపు ఎలా నెడుతుందో చెప్పిన చార్లెస్ డికెన్స్ రచనలను ప్రస్తావించారు. విప్లవాలు, నేరాలకు జన్మనిచ్చేది దారిద్య్రం అన్న గ్రీకు తత్వవేత్త అరిస్టోటిల్ చెప్పిన అంశాన్ని ఉటంకించారు.వివిధ మత గ్రంధాలు ఆకలిగొన్నవారికి అన్నం పెట్టాలనే నీతి బోధనలను కూడా ప్రస్తావించారు. తినే ముందు ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటే పాపాల నుంచి విముక్తి అవుతారని భగవద్ గీత, ఆకలితో ఉన్న నాకు ఆహారాన్ని ఇవ్వు అన్న బైబిల్‌లోని ఏసుక్రీస్తు మాటలు, పొరుగువారు ఆకలితో ఉండగా కడుపునిండా తిని పడుకుంటే అలాంటి వారు నిజమైన విశ్వాసులు కాదన్న ఇస్లామిక్ బోధనలను ఉటంకించారు. కొంత మంది ఆకలితో ఇబ్బంది పడుతుంటే అది కేవలం సామాజిక వైఫల్యం మాత్రమే కాదు నైతిక, ఆధ్యాత్మిక వైఫల్యం కూడా అవుతుందని జస్టిస్ సుతార్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 45లో పేర్కొన్నట్లుగా పసితనంలో పిల్లల సంరక్షణ, విద్య రాజ్యం బాధ్యత అని కూడా న్యాయమÖర్తి చెప్పారు. అవి పిల్లల ప్రాధమిక హక్కులన్నారు. పౌష్టికాహారం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటం రాజ్యాంగ బాధ్యత అని వాటిని నెరవేర్చటంలో వైఫల్యం చెందినట్లు లఖీ సోలంకి కేసు వెల్లడించిందన్నారు. ఆకలిగొన్న వ్యక్తి ముందు రొట్టెను కోరతారు తప్ప వేదాంతాన్ని కాదనే మాటతో న్యాయమÖర్తి బెయిల్ ఉత్తరువును ముగించారు.

ఈ కేసు రెండింజన్ల పాలన, గుజరాత్ ఆదర్శ రాష్ట్రం అనే ప్రచార బండారాన్ని బట్టబయలు చేసింది.బిజెపి ఏలుబడిలో నెలకొన్న పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం అవసరం.ప్రతి ఏటా దేశాల ఆకలి సూచికలను ప్రకటిస్తున్నారు.మన దేశానికి ఇస్తున్న సూచికలను మేం అంగీకరించం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది, పోనీ స్వంత సూచికలను వెల్లడిస్తున్నదా అదీ లేదు. ప్రపంచ ఆకలి సూచిక 2022లో మనదేశం 121 దేశాలలో 107వదిగా ఉంది. మనకంటే ఎగువన నైజీరియా 103, పాకిస్తాన్ 99వ స్థానంలో ఉంది. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్న నరేంద్రమోడీ సర్కార్ అంటూ డబ్బా కొట్టుకుంటున్న తరుణలో ఈ సూచిక వెలువడింది. తరువాత 2025లో 123 దేశాల్లో 102వదిగా ఉంది. అతల్ బిహారీ వాజ్‌పేయి ఏలుబడి 2000 సంవత్సరంలో నూటికి మన మార్కులు 38.1, తరువాత 2008లో 34.6, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2016లో 29.3, పదకొండు సంవత్సరాల పాలన తరువాత 2025లో 25.8 పాయింట్లు వచ్చాయి. ప్రపంచ సూచికల ప్రకారం 10 పాయింట్లలోపు ఉన్న దేశాల్లో తక్కువ ఆకలి, పది నుంచి ఇరవై పాయింట్ల మధ్య ఉంటే కాస్త మెరుగు, ఇరవై నుంచి 35 పాయింట్ల మధ్య ఉంటే తీవ్రం, 3550 మధ్య ఉంటే ఆందోళనకరం, అంతకు మించి ఉంటే మరింత ఆందోళనకర జాబితాలుగా దేశాలను వర్గీకరించారు. పన్నేండ్ల స్వర్ణయుగ పాలన తరువాత మనదేశం మÖడవ తరగతిలో అంటే తీవ్ర ఆకలి ఉన్న దేశంగా ఉంది.


హరిత విప్లవం తరువాత విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థితి నుంచి ఎగుమతి చేస్తున్నాం. అయితే జనం కడుపునిండా మÖడుపూటలా తింటే ఎగుమతికి అవకాశం ఉండదు. అలాంటి స్థితి లేని కారణంగానే మన దేశంలో “ కనిపించని ఆకలి ” ఉందని అనేక మంది వర్ణిస్తున్నారు. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నట్లు గొప్పగా చెప్పుకున్నప్పటికీ, పోషకాహార లేమిని అంగీకరిస్తూ పోషణ్ అభియాన్ పేరుతో కేంద్రం ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. అయినప్పటికీ మన దేశం 2025 ప్రపంచ ఆకలి సూచికలో 123 దేశాలకు గాను 102వదిగా ఉంది, మనకంటే మరో 21 ఇంకా దరిద్రంలో ఉన్నాయి. దున్నబోతే దూడల్లో మెయ్యటానికి వచ్చేసరికి ఎద్దుల్లో అన్నట్లుగా బిజెపి వ్యవహారం ఉంది. రాజకీయంగా మాకు తిరుగులేదు అని చెప్పుకొనేందుకు మెజారిటీ రాష్ట్రాలలో తాము లేదా మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయని, తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో కూడా తమదే ఆధిపత్యం అని బిజెపి చెప్పుకుంటుంది.మరి దాని పాలిత రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచికల్లో అధోగతిలో ఎందుకు ఉన్నట్లు ? పన్నేండేండ్ల మోడీ స్వర్ణయుగ పాలన తరువాత దేశంలో ఉన్న పరిస్థితుల గురించి చూద్దాం.


జనాభాయే మనకు పెద్ద పెట్టుబడి అని నేతలు కబుర్లు చెబుతారు.దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ ఎప్పుడో చెప్పారు. మన మనుషులు ఎలా ఉన్నారు ? ఉన్న సమాచారం, అంచనాల ప్రకారం పైన చెప్పిన ఉచిత ధాన్యం, పోషణ్ కార్యక్రమం అమలు తరువాత కూడా దేశంలో 12శాతం మంది అంటే 17.2 కోట్ల మందికి పోషకాహారం లేదు. భావి భారత పౌరులుగా ఉండాల్సిన పిల్లల్లో ఐదేండ్ల లోపువారిలో 35శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు పెరగటం లేదు, అంటే వారికి పోషకాహారం లేదు. ఎత్తుకు తగ్గ బరువులేని వారు 18.7శాతం మంది ఉన్నారు, ఇలాంటి వారు ఎక్కువగా ఉన్న దేశాలలో మనది ఒకటి. ఒకవైపు పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు అధిక బరువు, ఊబకాయం సమస్య కూడా పెరుగుతున్నది. ఆకలి జబ్బు కొందరికైతే అధిక తిండి మరో జబ్బు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే5 ప్రకారం పిల్లలు 67.1శాతం, 59.1శాతం మంది తరుణ వయస్సులో ఉన్న బాలికలు రక్తహీనతతో ఉన్నారు. పిల్లలను కనే వయస్సులో ఉన్న మహిళల్లో సగం మంది రక్తహీనతతో ఉన్నారు.ఇది కనిపించని ఆకలికి ఒక సూచిక అని చెప్పవచ్చు. ప్రపంచ ఆహార మరియు పోషకాహార ప్రపంచ స్థితి నివేదిక 2025లో చెప్పినదాని ప్రకారం మన దేశంలో 40.4శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి లేదు.అరవై శాతం మంది పట్టణ జనాభాకు ప్రొటీన్ల లోపం ఉంది. రెండు భారతాల దృశ్యం కనిపిస్తున్నది. ఒకటి పోషకాహారం లేని వారు, ఊబకాయం, అవసరానికి మించి బరువు పెరుగుల ఒక విచిత్రమైన స్థితి. మొత్తం మరణాల్లో అంటు వ్యాధులు కాని గుండె,మధుమేహం, కాన్సర్, శ్వాసకోశ సమస్యలతో మరణిస్తున్నవారు 6365శాతం మంది ఉన్నట్లు అంచనా.


నరేంద్రమోడీ ప్రత్యక్ష పాలనలో, ప్రధానిగా పని చేస్తున్న కాలంలోనే పైన చెప్పుకున్న లఖీ సోలంకి ఉదంతం జరిగింది. ఆమెకు సంక్షేమ పథకాలు అంది ఉంటే ఇంట్లో ఆహార సమస్య వచ్చి ఉండేది కాదు, బిడ్డను చేతులారా పొగొట్టుకొనేది కాదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర వనరుల నుంచి సేకరించిన సమాచారం మేరకు రాష్ట్రాల ఆకలి సూచికలను కూడా తయారు చేశారు. దేశాల సూచికల మాదిరే వంద మార్కులకు వచ్చిన వాటిని బట్టి వర్గీకరణ అదే మాదిరి చేశారు. దేశ జాతీయ సగటు మార్కులు 29 తీవ్ర ఆందోళనకరంగా ఆకలి ఉన్న రాష్ట్రాలు అంటే 35 కంటే ఎక్కువగా ఉన్నవాటిలో బీహార్,ఝార్కండ్, చత్తీస్‌ఘర్ ఉన్నాయి. ఇవి బిజెపి లేదా వారి మిత్రుడైన నితీష్ కుమార్ ఏలుబడిలో ఉన్నవే అని వేరే చెప్పనవసరం లేదు. దేశ సగటు 29 కంటే ఎక్కువ ఆకలి ఉన్నవాటిని ఆందోళనకర వర్గీకరణలో చేర్చారు, అవి గుజరాత్, ఉత్తర ప్రదేశ్, అసోం, ఒడిషా, మధ్య ప్రదేశ్, త్రిపుర, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్. ఒక మాదిరి అంటే 16 కంటే తక్కువ మార్కులు వచ్చిన సిక్కిం, పుదుచ్చేరి, కేరళ వంటివి ఉన్నాయి. తక్కువ ఆకలి ఉన్నది పన్నెండు కంటే తక్కువ వచ్చింది ఒక చండీఘర్ కేంద్ర పాలిత ప్రాంతమే. ఇలాంటి పరిస్థితి ఉన్నపుడు బిజెపి లేదా మోడీ దేశాన్ని పరుగులు పెట్టిస్తామంటే నమ్మేదెలా !

సోషలిజం దిశగా అమెరికన్ యువత, కార్మికవర్గం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


“ దేశభక్తి యుతంగా పెట్టుబడిదారీ విధానం పని చేస్తున్నదని సగం మంది కంటే తక్కువ మంది అమెరికన్లు అనుకుంటున్నారు, ప్రజాస్వామ్యానికి మద్దతు పడిపోయింది ” న్యూయార్క్ పోస్ట్.“ హౌస్ ప్రైమరీస్ (పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్ అభ్యర్ధిత్వం కోసం పార్టీలో జరిగే పోటీ)లో ఆకస్మికంగా డెమోక్రటిక్ సోషలిస్టులు ఎందుకు దూసుకుపోతున్నారు ” న్యూస్ వీక్. “ అంకెలు అబద్దాలు చెప్పవు. యువ అమెరికన్లు సోషలిజం ప్రేమలో పడుతున్నారు ” ఫాక్స్ న్యూస్. “ సోషలిజానికి పెరుగుతున్న యువత మద్దతు తొలి రోజుల అమెరికా పాఠాలను గుర్తుకు తెస్తున్నది ” కరోలినా జర్నల్. “ అమెరికాలో పెట్టుబడిదారీ విధానపు ప్రతిష్ట 54శాతానికి పడిపోయింది ” గాలప్ న్యూస్. “ యువ అమెరికన్లు సోషలిజాన్ని మరీ అతిగా అభిమానిస్తున్నారు.స్వేచ్చా వాదులు విధిగా అడ్డుకోవాల్సిన సమస్య ఇది” కాటో ఇనిస్టిట్యూట్. “ ముఫ్పైతొమ్మిది శాతం మంది అమెరికన్లు సోషలిజాన్ని ఆమోదిస్తున్నారన్న స్కాట్ బెసెంట్. వారు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టలేదు ” ఫార్చ్యూన్.పైన పేర్కొన్నవి అమెరికన్ మీడియాలో గత ఏడాది కాలంలో, ఇటీవల వచ్చిన కొన్ని వార్తా వ్యాఖ్యల శీర్షికలు. అక్కడి సమాజంలో వస్తున్న ఆలోచనా ధోరణులను ఇవి ప్రతిబింబిస్తున్నాయి. వీటిని చూసి డోనాల్డ్ ట్రంప్ వంటి నయా ఫాసిస్టులు తమ ఆందోళన, అక్కసులను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. దీన్ని బట్టి వెంటనే అమెరికాలో సోషలిస్టు వ్యవస్థ ఏర్పాటు కానుందని ఎవరూ నిర్దారణకు రానవసరం లేదు.అక్కడి పాలకవర్గం అంత తేలికగా తన అధికారాన్ని వదులుకోదు.


గత గురువారం నాడు వాషింగ్టన్ పోస్టు పత్రిక ఐసోస్ వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్టు అభ్యర్ధి రంగంలో ఉంటే ఓటు వేయటం గురించి ఆలోచిస్తామని నమోదైన ఓటర్లలో 40శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారు మÖడు పదుల వయస్సులోపు వారు 46శాతం మంది, డెమోక్రటిక్ పార్టీ మద్దతుదార్లలో 64శాతం ఉన్నట్లు కూడా సర్వే పేర్కొన్నది. ఈ పత్రిక అమెజాన్ కంపెనీ అధిపతి జెఫ్ బెజోస్ యాజమాన్యంలో నడుస్తున్నది. అలాంటి కార్పొరేట్ల పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో తెలిసిందే. అయితే సర్వేలను తిమ్మిని బమ్మిని చేస్తే కుదరదు గనుక ఇష్టం ఉన్నా లేకున్నా వివరాలను వెల్లడించకతప్పటం లేదు. అయితే ఈ సర్వే వార్తలోనే ఎక్కువ మంది అమెరికన్లు డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీ(డిఎస్‌పి) అభ్యర్ధికి మద్దతు ఇవ్వటం లేదని కూడా రాసింది. సిఎనఎన్ మీడియా సంస్థ కోసం ఎసఎసఆరఎస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో డెమోక్రాట్లు, ప్రజాస్వామిక భావాలకు మద్దతు ఇచ్చే వారిలో మÖడో వంతు మంది తాము డెమోక్రటిక్ సోషలిస్టులమని చెప్పుకున్నారని,వారిలో 45 ఏండ్ల లోపువారు 59శాతం మంది ఉన్నట్లు తేలింది. మÖడింట రెండు వంతుల మంది నవంబరు మÖడున జరిగే ఎన్నికల్లో కచ్చితంగా ఓటు వేస్తామని కూడా చెప్పారు. డెమోక్రటిక్ పార్టీలో తెల్లవారితో పోల్చితే ఆఫ్రోఅమెరికన్లు బాహాటంగా తాము డెమోక్రటిక్ సోషలిస్టుకే ఓటు వేస్తామని చెప్పారు. డెమోక్రటిక్ సోషలిస్టులుగా చెప్పుకున్న వారిలో 66 నుంచి 54శాతం మందికి డిగ్రీలు లేవు, వారి వార్షిక ఆదాయం 76 నుంచి 65శాతం మందికి లక్ష డాలర్ల లోపే ఉంది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే మన దేశంలో చెప్పుకొనే బడుగు బలహీన వర్గాలు అమెరికాలో సోషలిజానికి అనుకూలంగా ఉన్నాయి. డెమోక్రటిక్ సోషలిస్టుల్లో 48శాతం మంది గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం నిలిపివేయాలనే అభ్యర్ధికే మద్దతు ఇస్తామని చెప్పటం కూడా గమనించాల్సిన అంశం. అమెరికా సమాజం మొత్తంగానే ఇరాన్‌పై జరుపుతున్న యుద్దాన్ని వ్యతిరేకిస్తున్నారు. శ్వేత జాతీయుల్లో ఎగువ మధ్య తరగతి మాత్రమే సోషలిజానికి అనుకూలంగా ఉన్నట్లు మీడియాలో వచ్చే విశ్లేషణలు వాస్తవం కాదని కూడా సిఎనఎన్ సర్వే తేల్చింది. జీవిత అనుభవాల నుంచే జనాలు సోషలిజానికి మద్దతు ఇస్తారని ప్రపంచ వ్యాపితంగా వెల్లడైన సత్యం. దీనికి అమెరికన్లు మినహాయింపు ఎలా అవుతారు ! దోపిడీ స్వభావం కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం ఎంత ఎక్కువగా కనిపిస్తే అంతగా ప్రత్యామ్నాయ విధానాలవైపు జనాలు చూస్తారు.


పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్టులకు పెరుగుతున్న మద్దతు గురించి ఆ పార్టీలోని మితవాదులు కూడా ఆందోళన చెందుతున్నారు. జూలై నెలలో న్యూయార్క్, కొలరాడోలో అభ్యర్ధిత్వాలకు డెమోక్రటిక్ పార్టీలో జరిగిన ఎన్నికల్లో నాలుగు ప్రజాప్రతినిధుల స్థానాల్లో డిఎస్‌పి మద్దతు ఉన్న అభ్యర్ధులే గెలిచారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఓడించారు. మిచిగాన్ రాష్ట్ర సెనెట్ స్థానానికి అబ్దుల్ ఎల్ సsTÖద్ అనే వామపక్షవాది పోటీ పడుతున్నాడు. డెమోక్రటిక్ సోషలిస్టులందరూ మద్దతు ఇస్తుండగా ఇజ్రాయెల్ అనుకూల వాది అయిన ప్రస్తుత డెమోక్రటిక్ పార్టీ సెనెటర్ హాలే స్టీవెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్,ఇతరులు ప్రచారం చేస్తున్నారు. విస్కాన్సిన్ రాష్ట్ర గవర్నర్ పదవికి డిఎస్‌పి అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఈ పరిణామాన్ని చూసిన తరువాత రిపబ్లికన్లు ఆందోళనపడుతున్నారు. ఉదారవాదులు కమÖ్యనిజం గురించి ఆలోచించకుండా చూడాలంటూ ఆ పార్టీకి చెందిన వారు ఒక సమావేశంలో కోరారు. ఒక కార్యాచరణ పథకాన్ని కూడా రూపొందించారు. జూలై 20వ తేదీన రూపొందించిన ఒక పత్రంలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. “ సోషలిజం, మార్క్సిజం కంటే కమÖ్యనిజం మరింత ప్రమాదకరమని అమెరికన్లు ఇప్పటికీ భావిస్తున్నారు. ఈ మÖడు భావాలు తలెత్తటానికి ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థ యొక్క విషపూరిత చెట్టు ఫలాలే అవి గనుక, వారందరితో సంబంధాలు పెట్టుకొని వారిని దూరం చేయటం రిపబ్లికన్లకు ముఖ్యమైనది.” ఇటీవల సిఎన్‌బిసి చేసిన సర్వేలో డోనాల్డ్ నినాదమైన మాగా(అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలి) కంటే డెమోక్రటిక్ సోషలిజం నినాదమే బహళ ఆదరణ కలిగి ఉందని తేలింది. డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీ అభ్యర్ధులను చూపి భయపెట్టటాన్ని డెమోక్రటిక్ పార్టీ మానుకోవాలని కొందరు సలహా ఇచ్చారట. ఎందుకంటే ఎంతగా వ్యతిరేకిస్తే అంతగా ఆదరణ పొందుతున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలో జోహ్రాన్ మందానీ విజయం వెల్లడించింది. ఆ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులు కూడా రంగంలో ఉండి మందానిని ఓడించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం లేదా నరేంద్రమోడీ విధానాలను విమర్శించిన లేదా వ్యతిరేకించినవారినందరినీ దేశద్రోహులుగా, అర్బన్ నక్సల్స్, తుకడేతుకడే గ్యాంగ్ అని ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో తనను వ్యతిరేకించేవారందరికీ డోనాల్డ్ ట్రంప్ “ కమÖ్యనిస్టు ” ముద్రవేస్తున్నాడు. ఇది నష్టదాయకమని రిపబ్లికన్ మేథావులు వాపోతున్నారు. ప్రతివారినీ కమÖ్యనిస్టులని ముద్రవేస్తే సభల్లో చప్పట్లు కొట్టవచ్చు, ఈలలు వేయవచ్చు, ఒకటి రెండు సార్లు మధ్యంతర ఎన్నికల్లో ఓట్లు కూడా పడవచ్చు గానీ పదే పదే ప్రతివారినీ కమÖ్యనిస్టు అంటే అవును అయితే ఏమిటి అని యువతరం ప్రశ్నించే పరిస్థితి రావచ్చని హెచ్చరిస్తున్నారు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా అదే జరుగుతున్నది. పెట్టుబడిదారీ విధానం విఫలమైందని ఒకవైపు దాని సమర్ధకులే చెబుతుండగా మరోవైపు సోషలిస్టు చైనా సాధిస్తున్న అద్భుత విజయాలు, అమెరికాను సవాలు చేస్తున్న తీరును చూసి యువత సోషలిజం పట్ల సానుకూల వైఖరిని పెంచుకుంటున్నది. ట్రంప్ సర్కార్ కొన్ని స్వతంత్ర వాణిజ్య సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తున్నదని, కమÖ్యనిస్టులు అదే చేస్తారని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినందున ఇప్పుడు ట్రంప్ చేస్తున్న చర్యలను “ మాగా మావోయిజం ” అని వర్ణిస్తున్నారని, కమÖ్యనిస్టులను భూతాలుగా చూపి భయపెట్టే క్రమంలో ఉదారవాదులకు సైతం అలాంటి ముద్రవేస్తూ ట్రంప్ నష్టం చేస్తున్నారని, ఎన్నికల ముందు తెలివైన అమెరికన్ ఓటర్లు వీటన్నింటినీ గుర్తు చేసుకుంటారని రిపబిక్లన్ మేథావులు హెచ్చరిస్తున్నారు.


ఇదే సమయంలో కాల చక్రాన్ని వెనక్కు తిప్పాలని చూస్తున్న పచ్చి మితవాద రిపబ్లికన్లు కూడా ఉన్నారు.1950 దశకంలో మాదిరి కమÖ్యనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం తప్ప మరొక మార్గం లేదని భావిస్తున్నారు. వారి బుర్రలకు ఎక్కనిదేమంటే అప్పుడూ ఇప్పుడూ పరిస్థితి ఒకే విధంగా లేదు.నాడు సోషలిస్టు, కమÖ్యనిస్టు భావనలు యావత్ ప్రపంచాన్ని ఊపివేశాయి.ఇప్పుడు అలా లేదు. కమÖ్యనిజాన్ని అంతం చేశామని చెప్పుకున్నవారే ఇప్పుడు కమÖ్యనిస్టు బొమ్మ భూతాన్ని వీధుల్లోకి తీసుకువచ్చి గుండెలు బాదుకుంటూ భయాన్ని నటిస్త్తే జనాలు నవ్వుతారు తప్ప నమ్మరు.“ మాలాంటి తరం ప్రచ్చన్న యుద్దంలో కమÖ్యనిజం వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది.ఇప్పుడు మన గడ్డ మీద కమÖ్యనిజం పునరాగమనంలో ఉంది.అమెరికా ఉనికికే ముప్పుగా మారింది” అని జూలై మÖడవ తేదీన మౌంట్ రష్‌మోర్ సభలో ట్రంప్ చెప్పాడు.“ వాషింగ్టన్ లేదా మాస్కో, ఏదో ఒకటే రాజధానిగా ఉండాలి. స్వచ్చమైన,శుద్దమైన, తాజా గాలివీచే స్వేచ్చాయుత అమెరికా వాతావరణమే ఉండాలి లేదా చెడువాసనలు వచ్చే కమÖ్యనిస్టు రష్యా అయినా ఉండాలి ” అంటూ న్యూయార్క్ మాజీ గవర్నర్ అల్ స్మిత్ 1936లో కమÖ్యనిస్టు ఉన్మాదిగా చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ కూడా అలాంటి ఉపన్యాసాలే చేస్తున్నాడు. జూలై 21వ తేదీన అమెరికా విదేశాంగశాఖ “ క్యూబా : ఇరవై ఒకటవ శతాబ్దపు కమÖ్యనిజం రాజధాని ” అనే శీర్షికతో ఒక నివేదిక విడుదల చేసింది. దానిలో అనేక అవాకులు చవాకులు, వక్రీకరణల గురించి మనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. దానిలో కమÖ్యనిజం కంటే అమెరికాలో డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీ నేతలుగా ఉన్న జోహ్రాన్ మందానీ, జర్నలిస్టు ఆమీ గుడ్‌మాన్ వంటి ఎందరిమీదనో క్యూబా ప్రయాణీకులంటూ వక్రీకరణ దాడి చేశారు.


కమÖ్యనిజం వ్యతిరేకత అధికారిక మతం మాదిరి ఉన్న అమెరికాలో నిజంగానే యువత, కార్మికవర్గంలో సోషలిజం పట్ల, వామపక్ష భావజాలం వైపు మొగ్గటం అనేక మందికి మింగుడు పడటం లేదు. ప్రధాన స్రవంతి మీడియాలో గత కొన్ని దశాబ్దాలుగా చిలవలు పలవలుగా కమÖ్యనిస్టు, సోషలిస్టు వ్యతిరేక ప్రచారం తప్ప అనుకూల వ్యాఖ్యానాలు ఎక్కడా కనపడలేదు. అయినప్పటికీ అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అన్నట్లుగా ఎందుకిలా జరుగుతోందనే ఆలోచన వేధిస్తున్నది. మరోవైపు సోషలిజం భావజాలానికి జనం దూరమయ్యారని భావిస్తున్న అనేక మందికి ఎంతో ఊరట కలిగిస్తున్న పరిణామం. కొంత మంది డిఎస్‌పి నిజమైన సోషలిస్టు భావనలను ముందుకు తీసుకురావటం లేదని, సంస్కరణవాదంతో ఉందని విమర్శిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అసలు సోషలిజమంటేనే ఆమడదూరం వెళ్లే వాతావరణం నుంచి సానుకూలతవైపు మళ్లటమే పెద్ద మార్పు. సంస్కరణ వాదం వరకు వచ్చిన వారు అది పని చేయదు అనుకుంటే శాస్త్రీయ సోషలిస్టు భావనకు మారటం తధ్యం, అయితే దానికి ఎంత కాలం పడుతుందన్నది ఎవరూ చెప్పలేరు. సోవియట్, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్థలు కూలిపోయింతరువాత ఇలాంటి మార్పు వస్తుందని ఎవరైనా ఊహించారా ? ఏదైనా అంతే, పరిస్థితులే జనాలను ఎటువైపు నడింపించాలో నిర్దేశిస్తాయి !

ట్రంప్ ఉత్సాహాన్ని నీరుగార్చిన అమెరికా మిలిటరీ !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అరవై రోజుల పాటు దాడుల విరమణకు ఒప్పందం చేసుకొని శాశ్వత అవగాహనకు రావాలని నిర్ణయించిన డోనాల్డ్ ట్రంప్ మరోమారు ఉల్లంఘనకు పాల్పడ్డాడు. జూలై నెలలో పదమÖడు రోజుల పాటు ఇరాన్‌పై భీకరదాడులు జరిపాడు.శుక్రవారం నుంచి నిలిపివేశాడు. ఇరాన్‌తో “ మంచి స్నేహపూర్వక మాటలు ” మాట్లాడుతున్నట్లు సోమవారం నాడు చెప్పాడు. అయితే సంప్రదింపులు దీర్ఘకాలం సాగటం తనకు ఇష్టం లేదన్నాడు. పోరు నుంచి బయట పడేందుకు అమెరికా నానా తిప్పలు పడుతోందని టెహరాన్ వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం నాడు వాషింగ్టన్ చేరుకున్నాడు. నెతన్యాహు సోమవారం నాడు ఇజ్రాయెల్ యుద్ధ మంత్రుల కమిటీతో సమావేశం జరుపుతాడని, అమెరికాతో కలసి ఇరాన్‌పై దాడులు చేయటంలో కీలక పాత్రపోషించాడని, ఇరాన్ అణు, ఖండాంతర క్షిపణుల కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు పట్టుబడతాడని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆదివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇరాన్‌తో సాగుతున్న పోరే ట్రంప్‌తో ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న ఎమెన్‌లోని హౌతీలు`సౌదీ అరేబియా మధ్య దాడులు జరుగుతున్నాయి. తమ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు జరిగినట్లు రియాద్ ప్రకటించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల గురించి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ వివరాలు నమోదు చేసింది.అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘించినట్లు, వాటిలో కొన్ని యుద్ద నేరాలతో సమానమని మానవహక్కుల కమిషనర్ వాకర్ టర్క్ వర్ణించాడు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా సంక్షోభంలో మరణించిన, గాయపడిన అమెరికన్ సైనికులు ఎందరన్నది వివాదంగా మారింది. గత మంగళవారం నాడు ట్రంప్ చేసిన ప్రకటనలో 18 మంది మరణించినట్లు పేర్కొనగా మరుసటి రోజు రక్షణ శాఖ 14గా పేర్కొన్నది, అదే విధంగా గాయపడిన వారి సంఖ్యను కూడా తగ్గించి చూపింది. దీని గురించి అడిగితే పొంతనలేని సమాధానాలు వచ్చాయి. ఇరాన్ మీద దాడులు ఆపకూడదు, కొనసాగించాలంటూ వత్తిడి తెస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మంగళవారం నాడు అమెరికా పర్యటనకు వచ్చాడు. ఈ పర్యటన ఖరారైన తరువాతే దాడులకు అమెరికా విరామం ఇచ్చింది. ట్రంప్ ఎన్నెన్నో ప్రగల్భాలు పలికాడు, ఇంక మాటల్లేవ్ చేతలే సమాధానం అన్నాడు. సలహదారుల నివేదికల తరువాత గురువారం నుంచే ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చి శుక్రవారం నుంచి దాడులు ఆపివేయించాడు. ఎందుకు అంటే చర్చలకు అవకాశం ఇవ్వాలని అంటున్నాడు.చర్చించేదేమీ లేదు, అమెరికా ఎన్ని రోజులు దాడులు అపితే మేం కూడా అదే విధంగా స్పందిస్తామని ఇరాన్ కూడా ప్రకటించింది. ఈ విరామం ఎన్ని రోజులు ఉంటుందో, ఏమి చర్చలు చేస్తారో ఇది రాసిన సమయానికి ఎలాంటి స్పష్టత లేదు.


ఇరాన్‌పై దాడులతో అమెరికా, ఇజ్రాయెల్ ఏమి సాధించాయో ఊకదంపుడు ప్రకటనలు తప్ప నిర్దిష్టంగా ఎవరూ ఏమీ చెప్పటం లేదు. అయితే ఆర్థిక భారాలకు సంబంధించి కొన్ని తాత్కాలిక అంచనాలు, వివరాలు మాత్రమే ఇప్పటివరకు వెల్లడయ్యాయి.అమెరికాకు 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. అదనంగా అత్యవసర నిధులు 67 నుంచి 90 బిలియన్ డాలర్ల వరకు కావాలని ట్రంప్ యంత్రాంగం పార్లమెంటును కోరింది.అయితే రోజుకు ఒక బిలియన్ డాలర్లు ఖర్చు అవుతున్నట్లు స్వతంత్ర విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, దీర్ఘకాలంలో మొత్తం ఖర్చు లక్ష కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. అమెరికా 56వేల మంది సైనికులను ఇరాన్‌పై దాడులు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నదని, ఆయుధాలు, ఇతర మిలిటరీ సంబంధ వస్తువులను పెద్ద ఎత్తున కొత్తగా చేర్చినట్లు చెబుతున్నారు. అమెరికాలో నెలవారీ వినియోగదారుల ఇంథన ఖర్చు 21.2శాతం పెరిగింది.దీంతో వినియోగదారుల ధరల సూచీ 3.3శాతానికి పెరిగింది.ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఐరోపా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి.అరబ్ గల్ఫ్ దేశాల్లో ఆహార ధరలు 40 నుంచి 120శాతం పెరిగాయి. చమురు నౌకలు సుదూరం ప్రయాణించాల్సి రావటంతో దిగుమతి దేశాలకు రవాణా, బీమా ఖర్చులు పెరిగాయి.ఇరాన్ చమురు ఎగుమతుల పతనం, ఇతర దేశాల్లో జనాల మీద పడిన భారాలు ఎంతో ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేని స్థితి.


అయితే వాషింగ్టన్ మరోసారి ఎందుకు దాడులకు తెగబడింది, తిరిగి చర్చలంటూ ఎందుకు నిలిపివేసిందన్నదే అసలు సమస్య. ఇరాన్ చేస్తున్నది ఆత్మరక్షణ ఎదురుదాడులు తప్ప మరొకటి కాదు గనుక అది ఎందుకు ఆపిందో అందరికీ విదితమే. అమెరికాకు ఏమైంది ! వస్తున్న వార్తలను బట్టి చెప్పుకోరాని చోట తగులుతున్న దెబ్బలే అనిచెప్పవచ్చు. టెహరాన్ మీద ఎన్ని దాడులు చేసినా చేతి చమురు వదలటం తప్ప సాధించేదేమీ లేదు అని పెంటగన్ అధికారులు కుండబద్దలు కొట్టి చెబుతున్నట్లు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. మరోవైపు మిలిటరీ సిబ్బంది మరణాలు, గాయపడిన వారి సంఖ్య పెరగటం, గల్ఫ్ దేశాలు తెస్తున్న వత్తిడి కూడా ట్రంప్‌కు ఏం చేయాలో దిక్కుతోచకుండా చేస్తున్నాయి. ఇరాన్ దాడుల్లో గాయపడిన అనేక మందిని జర్మనీలోని అమెరికా మిలిటరీ ఆసుపత్రిలో చికిత్సకోసం తరలించినట్లు ఒక అధికారి చెప్పటాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఉటంకించింది. జూలై నెలలో జరిగిన దాడుల్లో దాదాపు వంద మంది గాయపడ్డారని వారిలో ఒక్క జోర్డాన్ సైనిక స్థావరాల్లోనే 50 మంది ఉన్నట్లు అధికారి చెప్పాడట.మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరంలో ముగ్గురు సైనికులు మరణించారు.కేవలం ఆరునెలల క్రితమే పని చేయటం ప్రారంభించిన కువాయిట్‌లోని అహమద్ అల్ జబర్ వైమానిక స్థావర రాడార్ వ్యవస్థ నాశనమైంది. ఇలా అనేక చోట్ల అమెరికా నష్టపోయినట్లు వార్తలు. ఎంత మంది అమెరికా సైనికులు గాయపడిందీ, మరణించిందీ కూడా వివరాలను వెల్లడించేందుకు సిద్దపడటం లేదనే వార్తలు రావటాన్ని బట్టి ఈ పరిణామం కూడా దాడుల నిలిపివేతకు కారణం కావచ్చు. సమాచారాన్ని దాచిపెడుతున్నారన్న విమర్శల నేపధ్యంలో రక్షణ శాఖ సమాచార వ్యవస్థలో శుక్రవారం నాటికి వెల్లడించిన వివరాల ప్రకారం అంతకు ముందువారంలో అదనంగా 140 మంది సైనికులు గాయపడినట్లు, నలుగురు మరణించినట్లు పేర్కొన్నారు. డిఫెన్స్ కాజువాలిటీ అనాలసిస్ సిస్టమ్(డిసిఎఎస్) అంటే మిలిటరీ మరణాల విశ్లేషణ వ్యవస్థలో జూలై ఏడు నుంచి విదేశీ కార్యకలాపాల్లో మరణించిన లేదా గాయపడిన వారి గురించి విశ్లేషించారు. పెంటగన్ తాజా సమాచారం ప్రకారం ఇరాన్ మీద ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫురీలో 18 మంది అమెరికా సైనికులు మరణించగా 624 మంది గాయపడ్డారు.సిఎనఎన్ విశ్లేషణ ప్రకారం గతవారంలోనే గరిష్టంగా 482 మంది గాయపడ్డారు. రక్షణశాఖ మీడియాకు అందచేస్తున్న వివరాలు, డిసిఎఎస్ వ్యవస్థలో గాయపడిన లేదా మరణించిన వారి సంఖ్యను తగ్గించి చూపుతున్నారని దీనికి కారణాలు ఏమిటని పార్లమెంట్‌లోని సెనెట్ సాయుధ దళాల కమిటీలోని 12 మంది ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్‌కు ఒక లేఖ రాశారు. సమాచారానికి సంబంధించి తాత్కాలికంగా తలెత్తిన సమస్యల కారణంగా డిసిఎఎస్ వెబ్‌సైట్‌లో తేడాలు కనిపిస్తున్నాయని రక్షణ శాఖ మీడియా ప్రతినిధి జోయల్ వాల్‌డెజ్ సమర్ధించుకున్నాడు. తాజా వివరాలు కావాలని సిఎనఎన్ ఛానల్ రక్షణశాఖను కోరగా శనివారం నాటికి కూడా ఉలుకూలేదు పలుకూలేదు. నిమిష నిమిషానికీ సమాచారాన్ని సవరించే డిసిఏఎస్ జూలై ఏడు నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. అదే రోజున ఇరాన్‌తో నూతన పోరు ప్రారంభమౌతుందని ట్రంప్ ప్రకటించాడు.


అధ్యక్షుడికి ఉన్న అసాధారణ అధికారాల ప్రకారం పార్లమెంటు అనుమతి లేకుండా 60 రోజుల పాటు మిలిటరీ చర్యకు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆ విధంగా ఫిబ్రవరి 28నాటి ఆదేశాలు మే ఒకటవ తేదీతో ముగిశాయి. దీన్ని సాకుగా చూపి మరోసారి కొత్తగా ఆదేశాలు జారీ చేసినట్లు, దానికీ దీనికీ సంబంధం లేదని ట్రంప్ యంత్రాంగం భాష్యం చెబుతోంది. ట్రంప్ చర్యలు రాజ్యాంగవిరుద్దమని అధికార, ప్రతిపక్షానికి చెందిన ఎంపీలు కొందరు విమర్శించారు. ఇరాన్‌పై దాడుల ప్రభావం పరిమితమే, ఇంతకు మించి చేసేదేమీ లేదని, ఆయుధాలు కూడా నిండుకుంటున్నాయని అమెరికా ఉన్నత మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇరాన్‌పై జరుపుతున్న దాడుల ప్రభావానికి పరిమితులు ఏర్పడ్డాయని,హార్ముజ్ ప్రాంతంలో ప్రత్యేకించి వైమానిక దాడుల కొనసాగింపువలన ఫలితం లేదని మధ్య ప్రాచ్యంలో అమెరికా మిలిటరీ అధికారి అడ్మిరల్ బ్రాడ్లే కూపర్ సిఫార్సు చేసినట్లు ఆదివారం నాడు వార్తలు వచ్చాయి. ట్రంప్ పౌర, మిలిటరీ సలహాదారులు కూడా దీన్ని బలపరిచినట్లు చెబుతున్నకారణంగానే ట్రంప్ దాడులు నిలిపివేయించాడు.రెండువారాల దాడుల తరువాత నౌకల మీద దాడి చేసే శక్తిని ఇరాన్ కోల్పోయిందని అందువలన దాని లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తే కొత్తగా వచ్చే ప్రయోజనం లేదని కూపర్ నివేదించినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించేందుకు సెంట్రల్ కమాండ్ ప్రతినిధి తిరస్కరించాడు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాప్ చైర్మన్ జనరల్ డాన్ కెయినె కూడా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్, ట్రంప్‌తో మాట్లాడుతూ ఇరాన్‌వైపు నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకొనే పేట్రియాట్, తోమహాక్ క్షిపణుల వంటి వాయు రక్షణ ఆయుధాలకు కొరత ఏర్పడితే అమెరికా సైనికులు, ఆ ప్రాంతంలోని మద్దతుదారులైన గల్ఫ్ దేశాలను రక్షించటం కష్టం అవుతుందని చెప్పారని సమాచారం. కెయినే హెచ్చరికల గురించి సాక్షాత్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రికే ప్రకటించింది. దాని మీద వివరణ కోరగా అధ్యక్షుడికి ఇచ్చిన సలహా రహస్యం గనుక వ్యాఖ్యానించేది లేదని అధికార ప్రతినిధి స్పందించాడు. మరోసారి ఇరాన్‌పై దాడులు జరుపుతారా అన్న ప్రశ్నకు ఒక టీవీ కార్యక్రమంలో ఐరాసలో అమెరికా ప్రతినిధి మైక్ వాల్జ్ మాట్లాడుతూ దాని గురించి తాను ఎక్కువగా చెప్పలేనని, అధ్యక్షుడి ముందు అనిప్రతిపాదనలూ ఉన్నాయన్నాడు. ఇరాన్‌పై నిర్ణయించిన లక్ష్యాలలో 80శాతం సాధించామని, మిగిలిన 20శాతం కోసం ఇప్పటివరకు చేసినవాటి కంటే మరింత భారీ దాడులు చేయాల్సి ఉంటుందని, దీర్ఘకాలంతోపాటు, ముప్పు ఖర్చు కూడా ఎక్కువే గనుక కొనసాగించటం వలన ప్రయోజనం లేదన్నది ట్రంప్ సలహాదారులు చెప్పిన అంశాల సారం.అధికారికంగా ధృవీకరించనప్పటికీ తెరవెనుక అమెరికా ప్రతినిధులు ఇరాన్‌తో సంబంధాల్లో ఉన్నారు. మరోవైపు హార్ముజ్ జలసంధిపై అదుపు తమదేనని, రాకపోకలు సాగించే నౌకలు పన్ను చెల్లించాలని కోరుతున్న ఇరాన్ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నది. ఒప్పందం చేసుకొనేందుకు ఇరాన్ సిద్దంగా ఉందని తాను అనుకోవటం లేదని అయితే తాను వింటానని వైట్ హౌస్ విలేకర్ల విందులో ట్రంప్ వ్యాఖ్యానించాడు.అణు, క్షిపణుల నియంత్రణ మీద కేంద్రీకరించాలని ఇజ్రాయెల్ వత్తిడి చేస్తుండగా తమకు హార్ముజ్ జలసంధిని తెరిపించటమే ముఖ్యమని అమెరికా చెబుతోంది.మరోవైపున బ్రిటన్ నూతన ప్రధాని ఆండీ బర్నహన్ అమెరికాతో ఉన్నత స్థాయి చర్చలు జరిపి జలసంధిలో నౌకల రక్షణకు సంబంధించి ఒక కూటమిని ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. ఇరాన్‌పై దాడులు చేసేందుకు తమ వైమానిక స్థావరాన్ని వినియోగించుకొనేందుకు ఇప్పటివరకు అమెరికాకు బ్రిటన్ అనుమతి ఇవ్వలేదు.


గత నాలుగు దశాబ్దాలుగా ఇరాన్ను దెబ్బతీసి తమ అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా చేయని యత్నం లేదు.దానికి గల్ఫ్ దేశాలు, ఐరోపాలోని పెద్ద దేశాలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించాయి. అమెరికా ప్రకటించిన ఆంక్షలను అవి అమలు చేశాయి.తమ మిలిటరీ శక్తి, ఆంక్షలు, ఒంటరిపాటుతో టెహరాన్‌పై పట్టు సాధించాలన్న అమెరికా పథకం పారలేదు.ఇటీవలి దాడులతో దాని బలహీనతలు ఏమిటో ప్రపంచానికి వెల్లడయ్యాయి.అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులతో తమ పౌరులు, ఆస్తులు కూడా ప్రభావితం అవుతున్నప్పటికీ ఏ ఒక్క గల్ఫ్ దేశమÖ యుద్దంలోకి దిగలేదు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా సాగించిన అన్ని దుర్మార్గ చర్యలకూ మద్దతు లేదా స్వయంగా భాగస్వాములైన ఐరోపా, ఇతర మిత్రదేశాలు కూడా తాజా పరిణామాల్లో అమెరికాకు బాసటగా నిలిచేందుకు నిరాకరించటం ఒక పెద్ద పరిణామం.రానున్న రోజుల్లో ఇది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే !

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!

Tags

, , , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు


“ వీరు సోషల్ డెమోక్రాట్లు (సామాజిక ప్రజాస్వామిక వాదులు) కాదు, కరుడు గట్టిన దేవుడులేని కమÖ్యనిస్టులు, వారు అన్ని మతాల మీద దాడులు చేస్తారు, ప్రత్యేకించి క్రైస్తవం మీద, వారెప్పుడూ అదే చేస్తారు,అదొక పిచ్చి వంటిది, ఈ దేశంలో మీ చర్చీలన్నింటినీ మÖసివేస్తారు. మీ వారిని చంపివేస్తారు, ఏదనుకుంటే అది చేస్తారు. వారు మతాన్ని అంతం చేయాలనుకుంటున్నారు.మీకు బలమైన మతం ఉంటే వారి సిద్దాంతం పనిచేయదు గనుక వారు మతాన్ని అంతం చేయాలనుకుంటారు.రెండువందల యాభై సంవత్సరాల క్రితం మన దేశ స్థాపన జరిగిన తరువాత నా అభిప్రాయం ప్రకారం మనదేశానికి వచ్చిన ముప్పు ఇది.” ఈ మాటలు మాట్లాడింది అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్‌ట్రంప్ అనే ఒక కమÖ్యనిస్టు వ్యతిరేక ఉన్మాది. గతవారంలో దేశ ప్రజల నుద్దేశించి ఇరవై నిమిషాలపాటు టీవీలో చేసిన ప్రసంగంలో ఇలాంటి పాటు అనేక చెత్త మాటలు అతని నోటి నుంచి వచ్చాయి. ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కమÖ్యనిస్టులు గతంలో జోక్యం చేసుకున్నారని ఇప్పుడు మధ్యంతర ఎన్నికల్లో అదే పని చేస్తున్నారని ఆరోపించాడు. ఐతే ఐదు రోజుల తరువాత మంగళవారం నాడు మాట మార్చాడు. చైనా జోక్యం ఎంతో కాలం క్రితం జరిగింది, అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది. అయినా చైనా వారు ఏది చేస్తే మేమÖ అదే చేస్తున్నాం, ఇదేదో ఏకపక్షంగా జరుగుతున్నది కాదు అని ట్రంప్ అన్నాడు. ఆధారాలు లేని తీవ్ర ఆరోపణలు చేసినందున చైనా నుంచి వచ్చే ప్రతిస్పందనకు భయపడి ఈ పెద్దమనిషి వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. నోటికి ఏది వస్తే అది వాగటం తరువాత మరోవిధంగా మాట్లాడటంలో ప్రపంచ నేతల్లో ట్రంప్‌కు మరొకరు సాటి రారని ఇప్పటికే నిరూపించుకున్నాడు. నవంబరు మÖడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో జనం ఏ తీర్పు ఇస్తారో తెలియదుగానీ, అధికార రిపబ్లిన్లకు ఎదురుదెబ్బ తగిలి ఉభయ సభల్లో మెజారిటీ కోల్పోతే దానికి కారణం చైనీయులే అని చెప్పేందుకు ముందుగానే ఒక సాకు సిద్దం చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ ఎప్పటికైనా చైనాలో విలీనం కావాల్సిందే. అక్కడ ప్రత్యేక దేశమా, విలీనానికి అనుకూలమా అనే ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయి. ఒకే భాష, ఒకే జాతి అయిన అక్కడే అలాంటి పని చేయని చైనా ఎక్కడో సుదూరంగా ఉండి, తమ భాష అర్ధంగానీ అమెరికాలో డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏ భాషలో ప్రచారం చేస్తుంది ? అయినా చైనా చెప్పగానే అమెరికన్లు మారేట్లయితే ఏకంగా కమÖ్యనిస్టులనే ఎన్నుకోవాలని ప్రచారం చేయవచ్చు కదా ! చరిత్రలో మతోన్మాదులు తమ వ్యతిరేక మత కేంద్రాల మీద దాడులు చేశారు, కూలగొట్టిన చరిత్రను మÖటగట్టుకున్నారు.మన కళ్ల ముందే బాబరీ మసీదును కూల్చి అక్కడే రామాలయాన్ని నిర్మించారు. కమÖ్యనిస్టులు వస్తే ప్రార్ధనా మందిరాలను కూల్చివేస్తారన్నది తప్పుడు ప్రచారం. రష్యా, చైనా, తూర్పు ఐరోపా దేశాలలో ఒక్క చర్చీని కూడా కూల్చివేయలేదు. గతంలో, వర్తమానంలో చైనా అలాంటి జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. భవిష్యత్‌లో జరిగేందుకు ఆస్కారమÖ లేదు. అయినప్పటికీ ట్రంప్ అలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు !


అమెరికా ఎన్నికల్లో కమÖ్యనిస్టులు లేదా ఇతర పురోగామివాదులు ఒక పార్టీగా అక్కడ పాతుకుపోయిన రెండు ప్రధాన పార్టీలను దెబ్బకొట్టగలిగిన స్థితిలో లేరు అన్నది ఒక వాస్తవం.రెండవది, గత కొన్ని దశాబ్దాలుగా కమÖ్యనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టి జనాల బుర్రలను ఖరాబు చేసిన సంగతి కూడా తెలిసిందే. గతంతో పోలిస్తే కొంత మార్పు వచ్చిన్పటికీ అది చాలదు.మన దేశ స్వాతంత్య్ర ఉద్యమ దశ, దిశను మార్చేందుకు పురోగామి వాదులు అనేక మంది కాంగ్రెస్ సోషలిస్టులుగా ప్రత్యేకతను ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌లో అంతర్బాగంగానే పని చేసిన చరిత్ర తెలిసిందే.అమెరికాలో కూడా అదే జరుగుతున్నట్లు చెప్పవచ్చు. అయితే అక్కడి డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీలో ఉన్నవారందరూ సోషలిజానికి, కమÖ్యనిజానికి అనుకూలురని చెప్పలేము. ఆ భావజాలానికి కట్టుబడి పని చేయాలని కోరుకొనే వారు కూడా గణనీయంగా ఉన్నారు. చివరి వరకు ఎంత మంది నిఖరంగా నిలుస్తారు, నిలవరు అనేది చరిత్ర చెప్పాల్సిందే.సోషలిస్టు భావాలను కలిగిన రెండు సంస్థలు, కొందరు వ్యక్తులు 1982లో డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీగా(డిఎస్‌పి) ఏర్పడి డెమోక్రటిక్ పార్టీలోనే పని చేయటం ప్రారంభించారు.నాడు కొన్ని వందల మంది మాత్రమే సభ్యులుగా ఉండగా నేడు లక్షా పదివేల మంది వరకు ఉన్నట్లు అంచనా. సోషలిస్టులమని చెప్పుకొనేందుకే భయపడిన రోజుల నుంచి నేడు లక్షలాది మంది తామÖ అదే ఇస్టులమని గర్వంగా చెప్పుకొనేంతంగా ఆ ఉద్యమం ఎదిగింది. బెర్నీ శాండర్స్ సెనెటర్‌గా ఎన్నికతో ప్రారంభమైన ఆ పురోగమనం 2028ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల కోసం, మరో రెండు చోట్ల గట్టి పోటీ ఇచ్చేందుకు, అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున తమ భావజాలం ఉన్న వ్యక్తిని నిలిపేందుకు అడుగులు వేయటమే ట్రంప్ ఆందోళనకు అసలు కారణంగా చెప్పవచ్చు. అమెరికా కార్పొరేట్ల రాజధాని న్యూయార్క్ పీఠంపై ఇప్పటికే ట్రంప్ దృష్టిలో కమÖ్యనిస్టుగా ముద్రపడిన డిఎస్‌పి నేత జోహ్రాన్ మందానీ మేయర్‌గా ఉండగా, రాజకీయ అధికార కేంద్రం ఉన్న వాషింగ్టన్ డిసిలో అదే భావజాలం కలిగిన మహిళ మేయర్ కాబోతున్నారనే వార్తలు వచ్చాయి. న్యూయార్క్ నగరంలో మÖడు ఎంపీ స్థానాలుండగా వాటికి డెమోక్రాట్లలో డిఎస్‌పి అభ్యర్ధులే ముందువరుసలో ఉన్నారు. రాజకీయ సర్వే జరపాలని, సెప్టెంబరు 15 నాటికి నివేదిక సమర్పించాలని డిఎస్‌పి తన 250శాఖలకు పత్రాలను పంపింది. ఇదంతా అధ్యక్ష ఎన్నికలకు సన్నాహమే. ఆ పార్టీ సెనెటర్ బెర్నీ శాండర్స్ వయస్సు 84 సంవత్సరాలు కావటంతో వేరే వారిని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. కార్మిక నాయకురాలు, ప్రజాప్రతినిధుల సభ సభ్యురాలిగా ఉన్న అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వంకోసం పోటీపడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున తానే పోటీ చేయాలని డోనాల్డ్ ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.


జూలై 16న టీవీ ప్రసంగం తీరు చూసిన తరువాత తన పదవికోసం ట్రంప్ ఎంతకైనా తెగిస్తాడని అనేక మంది భావిస్తున్నారు.నవంబరు మÖడు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను బెదిరించేందుకు మిలిటరీని దించటంతో పాటు(ఇప్పటికే చికాగో, లాస్ ఏంజల్స్, వాషింగ్టన్ డిసి, తదితర నగరాల్లో ఉన్నాయి), ఓట్ల పెట్టెలను అపహరించటంతో సహా ఏ అక్రమానికైనా పాల్పడవచ్చని చెబుతున్నారు.రిపబ్లికన్లు ఓడిపోతే ఫలితాలను తిరస్కరించే అవకాశం కూడా ఉంది.2020 అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోతున్నట్లు గ్రహించి బ్యాలట్ బాక్సులను తారుమారు చేయాలని చూస్తే అతగాడి అధికార యంత్రాంగంలోని వారే అడ్డుపడటంతో వెనక్కు తగ్గాడు. తరువాత జోబైడెన్ ఎన్నికను గుర్తించకుండా తన అనుచరులతో అమెరికా అధ్యక్ష కేంద్రం మీద దాడి చేయించిన సంగతి తెలిసిందే.తన ప్రసంగంలో రహస్య పత్రాలంటూ కొన్నింటిని పేర్కొంటూ రష్యా, చైనా,ఇరాన్, ఉత్తర కొరియా దేశాల నుంచి, కొన్ని సంస్థలు ఎన్నికల్లో జోక్యం చేసుకొనేందుకు చూస్తున్నాయని ట్రంప్ ఆరోపించాడు.అయితే ఎలా అన్నది మాత్రం చెప్పలేదు.తెలుగునాట ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ల పట్ల వ్యవహరించిన తీరును చూశాము.ప్రజాస్వామ్యానికి, భావప్రకటనా స్వేచ్చకు నిలయమని ఊదరగొట్టే అమెరికాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఎవరి అజెండా వారికి వుంది.తనకు వ్యతిరేకంగా ఎబిసి మరియు ఎన్‌బిసి మీడియా సంస్థలు కుట్రలో భాగస్వాములని,తన ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయటం లేదని ట్రంప్ ఆరోపించాడు.వాటి లైసన్సు రద్దు చేస్తామని బెదిరించాడు. మధ్యంతర ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ ఇరాన్ను ఒక అంశంగా ఎంచుకున్నాడు. సోవియట్‌తో జరిగిన ప్రచ్చన్న యుద్దంలో అణుబూచిని చూపి ఓటర్లను ఆకట్టుకోవటం నాటి అజెండాలలో ఒకటి. టెహరాన్ విషయంలో అది తిరగబడింది.దాని బదుదలు అనూహ్యంగా హార్ముజ్ జలసంధిపై అదుపు ప్రతిష్టాత్మకంగా మార్చుకొని ఇరుక్కు పోయాడు.రెండవది పాతబడిన రోత ప్రచారం కమÖ్యనిస్టు వ్యతిరేకత, సోవియట్ లేదు గనుక దాని స్థానంలో చైనా కుట్ర అంటూ రెచ్చగొట్టటం.చిత్రం ఏమిటంటే అమెరికాలో కమÖ్యనిస్టు పార్టీ ఉన్నప్పటికీ అది అక్కడి పాలకపార్టీలను సవాలు చేసే స్థితిలో లేదు. అందుకే డెమోక్రటిక్ సోషలిస్టులను కమÖ్యనిస్టులుగా చిత్రించి ట్రంప్ దాడి చేస్తున్నాడు.అయితే వారంతా తమ కళ్ల ముందు కనిపించేవారు గనుక వారి నుంచి ముప్పు ఎలా వస్తుందో నమ్మించలేకపోతున్నాడు. నిజానికి సాధారణ అమెరికన్లకు ముప్పుగా మారింది “ దేవుడు లేని కమÖ్యనిస్టులు ” కాదు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ దళం(ఐసివి). వారిని చూస్తే జనాలు వణికిపోతారు.ఎవరిని అరెస్టు చేస్తారో, ఎవరిని చంపుతారో తెలియదు. హిట్లర్ నాటి రహస్య హంతక దళాలను అవి గుర్తుకు తెస్తాయి.రెండవసారి ట్రంప్ అధికారానికి వచ్చిన తరువాత ఐసిఇ లేదా సరిహద్దు నిఘా దళానికి చెందిన వారు బూటకపు ఎన్‌కౌంటర్లు చేసి పదకొండు మందిని చంపారు.వీరుగాక వలస వచ్చిన వారిని బంధించిన శిబిరాల్లో మరో 21మంది మరణించారు.


అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నట్లు చేసిన ఆరోపణలను చైనా గట్టిగా తిరస్కరించింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల చేతిలో ఓటమిని ఎదుర్కోలేక గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు తిప్పి కొట్టింది.ఇరవై రెండు కోట్ల మంది ఓటర్ల వివరాలను చైనా సంపాదించిందని, గతంలో అధికారానికి వచ్చినప్పటి నుంచీ అమెరికా మీడియాలో తనకు వ్యతిరేకంగా రాసేందుకు జర్నలిస్టులకు డబ్బు ఇస్తున్నదని, వాణిజ్యవేత్తలను తనకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నదని ట్రంప్ తాజా ప్రసంగంలో ఆరోపించాడు.చైనా వాణిజ్యాన్ని సవాలు చేసిన తొలి అధ్యక్షుడిగా తాను ఉన్నందుకు గాను 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా చైనా జోక్యం చేసుకున్నదని అదే ఏడాది భద్రతా మండలికి ట్రంప్ ఫిర్యాదు చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న చైనా ప్రతినిధి రుజువులు చూపాలంటూ సవాలు చేశాడు, ఎలాంటి ఆధారాలను అమెరికా చూపలేకపోయింది. మే నెలలో బీజింగ్ పర్యటనకు వెళ్లిన ట్రంప్ ఆహ్వానం మేరకు సెప్టెంబరులో చైనా నేత షీ జింపింగ్ అమెరికా పర్యటనకు వస్తారని చెబుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు ట్రంప్ నోటి నుంచి వెలువడటం అతగాడి సంస్కారాన్ని వెల్లడిస్తున్నది.


వామపక్షవాదాన్ని, దాన్ని అనుసరించేవారిని అణచివేసేందుకు అమెరికా పాలకులు ఎన్ని పద్దతులను అనుసరించారో దానికి ప్రతిగా వామపక్ష వాదులు కూడా పద్దతులను మార్చుకొని తమ భావజాలాన్ని విస్తరింప చేస్తున్నారు.దాన్ని అడ్డుకోవటం సాధ్యం కావటం లేదు. దేనికైనా పరిస్థితులు అనుకూలించాలి. సైద్దాంతిక విబేధాలు, భిన్నమైన భాష్యాలు చెప్పి ఉండవచ్చు తప్ప కమÖ్యనిజం విఫలమైందని గతంలో ఏ కమÖ్యనిస్టూ పార్టీ కూడా చెప్పలేదు. ఆ ఉద్యమం నుంచి దూరమైనవారు చెప్పేదాన్ని పట్టించుకోవనవసరం లేదు. దానికి భిన్నంగా పెట్టుబడిదారీ విధానం విఫలమైందని ఆ విధానాన్ని సమర్ధించేవారే చెప్పటం ఇటీవలి కాలంలో వచ్చిన మార్పు. ఇది మరోచర్చకు నాంది పలికింది. అనేక మంది కారల్ మార్క్స్`ఫ్రెడరిక్ ఎంగెల్స్ చేసిన కమÖ్యనిస్టు రచనలు, భాష్యాల గురించి అధ్యయనం చేసేందుకు పూనుకున్నారు. అమెరికాలో గతం మాదిరి కరడు గట్టిన సోషలిస్టు వ్యతిరేక భావనలు ఇప్పుడు లేవు. సోషలిజం, కమÖ్యనిజాలను సానుకూలంగా చూసే ఏ వాదమైనా వామపక్షభావజాలమే అవుతుంది.దాన్నే కమÖ్యనిజం అని ట్రంప్ వంటి వారు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. పుంఖాను పుంఖాలుగా రచనలు చేస్తూ భావజాల దాడులు చేస్తున్నారు.ఇటీవల ఒక అమెరికా పత్రిక “ సోషలిస్టులను చూసి భయపడవద్దు.వారిని తయారు చేసే పరిస్థితులను చూసి భయపడాలి ” అంటూ ఒక విశ్లేషణకు శీర్షిక పెట్టింది.చరిత్ర చెప్పిన సారం, కమÖ్యనిస్టులు చెప్పేది కూడా అదే.కమÖ్యనిస్టు వ్యతిరేకులు రకరకాల ముసుగులు వేసుకువస్తున్నారు.అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి ఆంధ్రా అల్లుడు, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ రెండు సంవత్సరాల క్రితం ఒక వ్యాఖ్య చేశాడు.“ గతంలో కమÖ్యనిస్టులు వీధుల్లో ఎర్రజెండాలు పట్టుకొని ప్రదర్శనలు చేశారు.ఈ రోజు వారు హెచ్ ఆర్, కళాశాలల ప్రాంగణాలలో ప్రదర్శనలు చేస్తున్నారు, మంచివారు, నిజాయితీపరులకు వ్యతిరేకంగా కోర్టు హాళ్లలో న్యాయపోరాటం చేస్తున్నారు.” అన్నాడు.తెలివితేటలు ఎవడబ్బ సొమ్ము కాదు, కమÖ్యనిస్టులు కూడా నూతన పద్దతులను నేర్చుకోవాల్సిన పరిస్థితులను దోపిడీ వర్గమే కల్పించింది !