యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు  

   తాను యూదులకు వ్యతిరేకం కాదని, యూదు దురహంకారానికి, పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను నిరసిస్తున్నట్లు  న్యూయార్క్‌ నగర మేయర్‌ జోహ్రాన్‌ మందానీ మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. భారతీయులైన మహమ్మద్‌ మందానీ, మీరా నాయర్‌ల సంతానమైన 35 ఏండ్ల జోహ్రాన్‌ న్యూయార్క్‌ నగరానికి 112వ, తొలి ముస్లిం సామాజిక తరగతికి చెందిన మేయర్‌. వామపక్ష భావజాలం కలిగి ఉన్నందుకు కమ్యూనిస్టు అని ముద్రవేసినప్పటికీ నగర పౌరులు పట్టించుకోకుండా ఎన్నుకున్నారు. తాజాగా మరోసారి అమెరికా మీడియాలో వార్తలకు ఎక్కారు.  ఆదివారం నాడు నగరంలో జరిగిన వార్షిక ఇజ్రాయెల్‌ దినోత్సవాన్ని బహిష్కరించారు. ఇజ్రాయెల్‌ అనుకూల ఏ కార్యక్రమమంలో కూడా భాగస్వామిని అయ్యేది లేదని ఎన్నికల సమయంలోనే కరాఖండితంగా చెప్పానని కూడా గుర్తు చేశారు. తాను యూదుల జీవన శైలికి వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పాడు. వారం రోజుల ముందే విలేకర్లతో మాట్లాడిన మందానీ తాను పాల్గ్గొనకపోయినా ఆ రోజు జరిగే కార్యక్రమానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్లుగానే అసాధారణ రీతిలో పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు జరగకుండా చూశారు. ఇజ్రాయెల్‌ ఉనికిలోకి వచ్చిన తరువాత 1964 నుంచి ప్రతి ఏటా జరుగుతున్న ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ విధిగా పాల్గొనాలని గతంలో నిర్ణయించారు.ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మేయర్లందరూ పాల్గొన్నారు, దాన్ని తిరస్కరించిన తొలి వ్యక్తిగా జోహ్రాన్‌ మందానీ చరిత్రకెక్కారు.  ఈ ఉదంతం గురించి  ప్రపంచ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు, విశ్లేషణలు వెలువడ్డాయి.డెమోక్రటిక్‌ పార్టీలో సోషలిస్టు వర్గంగా ఉన్నవారిలో మందానీ ఒకడు.అతను కార్యక్రమాన్ని బహిష్కరించినప్పటికీ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన అనేక మంది  భాగస్వాములయ్యారు. మందానీతో ఏకీభవించిన వారు కూడా దూరంగా ఉన్నారు. యూదు సామాజిక తరగతికి చెందిన వారంతా దురహంకారులు కాదు అన్నది మేయర్‌ ఎన్నికల సమయంలోనే రుజువైంది.న్యూయార్క్‌ నగరంలో యూదు సామాజిక తరగతికి చెందిన వారు గణనీయంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో గాజాలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం జరిపిన మారణకాండను తీవ్రంగా వ్యతిరేకించటం, ఆ ప్రభుత్వాన్ని విమర్శించటంలో జోహ్రాన్‌ మందాని ఎంతో స్పష్టంగా ఉన్నారు. మారణకాండకు బాధ్యుడైన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వస్తే  అంతర్జాతీయ న్యాయస్థాన వారంట్‌ ప్రకారం అరెస్టు చేయిస్తానని కూడా చెప్పినంగతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి.       

ఆదివారం నాటి ఇజ్రాయెల్‌ దినోత్సవంలో ఆ దేశానికి చెందిన ముగ్గురు దురహంకారులైన మంత్రులు ప్రతినిధులుగా పాల్గొన్నందున అది ఆ దేశ కార్యక్రమంగానే చూశారు. అలాంటి వారితో తాము గళం కలపటం ఏమిటని మందానీతో సహా అనేక మంది డెమోక్రాట్లు ప్రశ్నించారు. అంతే కాదు న్యూయార్క్‌ మాజీ కంప్‌ట్రోలర్‌, నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి సిద్దమౌతున్న బ్రాడ్‌ లాండర్‌, జాతి, ఆర్థిక న్యాయాల కోసం పోరాడుతున్న యూదుల సంస్థకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇజ్రాయెల్‌ దినోత్సవం రోజున ప్రదర్శనల్లో పాల్గొన్న ఇజ్రాయెలీ రాజకీయనేతలు పాలస్తీనియన్ల ఊచకోతకు హర్షాతిరేకాలు వెల్లడించటమేకాదు, మారణకాండకు పాల్పడిన ప్రభుత్వంలో భాగస్వాములు. ఇజ్రాయెల్‌  ఉత్సవాలు యూదుల ఉనికి లేదా వారికి గర్వకారణం కాదంటూ ఇది న్యూయార్క్‌ నగరమేయర్‌కు తెలుసని ఉత్సవంలో భాగస్వాములు గాకపోవటం తమకు ఎంతో ఆనందంగా ఉందని యూదుల సంస్థ ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. అయితే ప్రదర్శనలో పాల్గొనకూడదన్నది మేయర్‌ నిర్ణయమని తాను గర్వంతో హాజరవుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌, యూదు సామాజిక తరగతికి చెందిన జెస్సికా టిచ్‌ ప్రకటించారు. ప్రతి ఏడాది ఈ రోజు ఎంతో ఆనందకరమైనదని అమె వర్ణించారు. మొదటి నుంచీ మందానీని వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌ అనుకూలురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి కుదరక రాకపోవటం కాదని, భావజాలపరమైన, అవమానకర నిర్ణయమని వ్యాఖ్యానించారు. మీడియా రారాజుగా పేరున్న రూపర్ట్‌ మర్డోచ్‌ నిర్వహణలోని న్యూయార్క్‌ పోస్ట్‌ పత్రిక మొదటి పేజీలో మోటార్‌ సైకిల్‌ మీద తిరుగుతున్న మందానీ ఫొటో వేసి విద్వేష సైకిల్‌ , జో ఇజ్రాయెల్‌ పరేడ్‌ను అవమానిస్తూ సైకిల్‌ మీద తిరుగుతున్నాడు అంటూ వ్యాఖ్యానించింది.     

మేయర్‌కు మద్దతు ఇచ్చినవారి వాదనేమిటో చూద్దాం. న్యూయార్క్‌ ప్రదర్శనకు వచ్చిన వారిలో ఒకడైన బెజాలెల్‌ మోట్రిచ్‌ ఇజ్రాయెల్‌ ఆర్థిక మంత్రి, పాలస్తీనియన్ల మారణకాండను బహిరంగంగా సమర్ధించిన ఒక యూదు జాతీయ ఉన్మాది అని పేర్కొన్నారు. గత సంవత్సరం అమెరికా వచ్చి వెళ్లిన రెండువారాల తరువాత తనను ఆరెస్టు చేసేందుకు అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రయత్నిస్తున్నదని ఆరోపించాడు.అతను యూదు మత పార్టీనేత, అధికారిక అతిధుల జాబితాలో తొలుత అతని పేరు లేదు.చివరికి హాజరయ్యాడు. ఇలాంటి వాడితో కలసి ప్రదర్శనలో పాల్గ్గొనటం అనేక మంది డెమోక్రాట్లకు ఇబ్బందికరంగా తోచింది. అతను 2023లో మాట్లాడుతూ పాలస్తీనా వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతంలోని హవారా అనే పాలస్తీనియన్ల గ్రామాన్ని ప్రభుత్వమే నాశనం చేయాలని పిలుపునిచ్చాడు. ఆ వెంటనే ఉన్మాదులైన యూదులు పాలస్తీనియన్లను ఊచకోత కోశారు.అతని రెచ్చగొట్టే వ్యాఖ్యలను చివరికి అమెరికా కూడా ఖండించింది. గాజా నుంచి పాలస్తీనియన్లను తరిమికొట్టాలని, వెస్ట్‌ బ్యాంకు ప్రాంతాన్ని యూదులతో నింపాలని మోట్రిచ్‌ పిలుపునిచ్చాడు. మరొకడు ఇజ్రాయెల్‌ వలస వ్యవహారాల మంత్రి ఆఫిర్‌ సోఫెర్‌. వీడు మరింతగా రెచ్చిపోయాడు. ఇజ్రాయెల్‌కు వలస వస్తున్న యూదులందరూ సనాతనుల ప్రమాణాలను పాటించేవారు కాదని, లౌకిక, సంస్కరణ వాదులైన వారు, పాక్షిక వారసత్వం ఉన్న యూదులకు ఇక్కడ చోటు ఇవ్వరాదన్నాడు. మరొక మంత్రి అండ్‌ ఎలియాహు, గాజా మీద అణుబాంబు వేయాలని, వెస్ట్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. ఇలాంటి వారి సరసన మందానీ పాల్గ్గొంటాడా !       

   తాను ఇజ్రాయెల్‌ ఉనికి ప్రశ్నించటం లేదని, యూదులకు ఉన్నట్లే ఇతరులకూ హక్కులు ఉంటాయని గుర్తించాలని చెప్పాడు. న్యూయార్క్‌ నగరంలో యూదు వ్యతిరేక ధోరణులు పెరగకుండా చూసేందుకు ఉన్న సంస్థకు నిధుల పెంపుదలకు కూడా చర్యలు తీసుకున్నాడు. జోహ్రాన్‌ మందానీ సిద్దాంతాల వలన వివాదం తలెత్తింది తప్ప మోట్రిచ్‌ వంటి ఫాసిస్టు శక్తులతో కలసి డెమోక్రాట్లు భాగస్వాములైనందుకు కాదని బరాక్‌ ఒబామా ఏలుబడిలో భద్రతా సలహాదారుగా పని చేసిన బెన్‌ రోడ్స్‌ వ్యాఖ్యానించాడు.మోట్రిచ్‌ పచ్చిమితవాద వాచాలత్వం విలువలకు కట్టుబడిన న్యూయార్క్‌ వాసులంగా ఉన్న తమకు వ్యతిరేకమైనదని, అతని భాగస్వామ్యం యూదు సామాజికులకు గర్వకారణం కానందున తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ముస్లిం వ్యతిరేకతకు నగరంలో స్థానం లేదని మరికొందరు స్పందించారు. ఏడు లక్షల మంది పాలస్తీనియన్లను వెళ్లగొట్టి 1948లో ఇజ్రాయెల్‌ను ఉనికిలోకి తెచ్చారంటూ ఈ ప్రదర్శనకు కొద్ది రోజుల ముందు ఒక వీడియోను విడుదల చేశారు.తాను తొమ్మిదేండ్ల బాలికగా ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని, అప్పటి నుంచి వివిధ ప్రాంతాలలో ప్రవాసంలోనే గడుపుతున్నానని ప్రతిచోటా వెలుపలి మనిషిగానే చూశారని ఇనియా బుష్‌నాక్‌ ఆ వీడియోలో చెప్పిన మాటలు ఉన్నాయి.       

   తాజా వివాదం న్యూయార్క్‌ నగరం, అమెరికాలో మారుతున్న యూదుల ఆలోచనా సరళిని ప్రతిబింబించింది. న్యూయార్క్‌ నగరంలో సామాజిక పరంగా చూస్తే ఎక్కువ మంది యూదులు ఉన్నారు. మేయర్లుగా గతంలో పని చేసినవారందరూ ఇజ్రాయెల్‌ను సమర్ధించినవారు, తరచూ ఆ దేశాన్ని సందర్శించినవారే. జోహ్రాన్‌ మందానీ ఆ బాటలో నడవని ఒకే ఒక్కడు అంటే అతిశయోక్తి కాదు. ఏప్రిల్‌ నెలలో పూ పరిశోధనా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి పదిమందిలో ఆరుగురు అమెరికన్లు గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండను విమర్శించారు. ఇలాంటి వ్యతిరేకత 2022 నుంచి 20 పాయింట్లు పెరిగింది.ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఇజ్రాయెల్‌ దినోత్సవ ప్రదర్శన జరిపారు.    యూదు ఓటర్ల కేంద్రం ఈ వారంలో ఒక సర్వే వివరాలను వెల్లడించింది.అమెరికా యూదుల్లో 35 ఏండ్ల లోపు వారు సగం మంది ఇజ్రాయెల్‌ాపాలస్తీనా దేశాలు ఉండాలన్న ప్రశ్నకు మద్దతు ఇచ్చారు. సనాతనులు కాని వారు 51శాతం మద్దతు ఇచ్చారు. ఇదేదో వామపక్ష సంస్థ జరిపిన సర్వే అనుకుంటే పొరబాటు. ఉత్తర అమెరికా యూదు ఫెడరేషన్‌ జరిపిన సర్వేలో కేవలం 37శాతం మంది  అమెరికన్‌ యూదులు మాత్రమే మత సంబంధ గుర్తింపును చెప్పుకున్నారు. మత వ్యతిరేకం, మతంతో సంబంధం లేదని చెప్పుకున్న వారు 18 నుంచి 34 ఏండ్ల వయస్సు వారు మూడో వంతు ఉండటం విశేషం. నెతన్యాహు అనుసరిస్తున్న విధానాల పర్యవసానాల ఫలితంగా అమెరికా యువ యూదుల్లో అసంతృప్తి పెరుగుతున్నదని పరిశీలకులు ఈ సర్వే తీరుపై వ్యాఖ్యానించారు. 

    ప్రదర్శనకు దూరంగా ఉండి మందానీ యూదులనుంచి దూరం కాలేదా అన్న ప్రశ్నకు  ఇలాంటి మంత్రులను ఆహ్వానించిన వారే మెజారిటీ యూదుల నుంచి దూరమైనట్లు సమర్ధకులు తిప్పికొట్టారు.      హమస్‌ సాయుధ బృందాలు 2023 అక్టోబరు ఏడవ తేదీన ఇజ్రాయెల్‌పై దాడి చేసి అనేక మందిని చంపి, కొందరిని బందీలుగా పట్టుకుపోయిన తరువాత రోజు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ హమస్‌ను మట్టుబెట్టే పేరుతో గాజా ప్రాంతంలో 70వేల మంది సాధారణ పౌరులను హత్యచేసింది. వారిలో 70శాతం మంది మహిళలు, పిల్లలే. లక్షలాది గృహాలను నేలమట్టం కావించింది. ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనియన్లను గాజా నుంచి తరమివేసి పర్యాటక ప్రాంతంగా మార్చాలని అమెరికా ట్రంప్‌, నెతన్యాహు చెబుతున్నారు.పాలస్తీనాలోని మరొక ప్రాంతమైన వెస్ట్‌ బ్యాంకులో నిరంతరం యూదులను రప్పించి స్థిరనివాసాలను ఏర్పాటు చేసి యూదు మెజారిటీ ప్రాంతాలుగా చిత్రించి ఇజ్రాయెల్‌లో కలిపేందుకు లేదా వివాదాస్పద ప్రాంతాలుగా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. పాలస్తీనాకు రాజధానిగా ఉండాల్సిన తూర్పు జెరూసలెంను ఆక్రమించేందుకు చూస్తున్నారు.ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించేవారు అమెరికాలో నానాటికీ పెరుగుతున్నారని ముందే చెప్పుకున్నాం. గాజాలో మారణకాండకు పాల్పడినట్లు ఐరాస కమిషన్‌,ఇజ్రాయెలీ మరియు అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు సైతం దాన్ని నిర్ధారించటంతో సామాన్య అమెరికన్లు కళ్లు తెరుస్తున్నారు.ఇజ్రాయెల్‌ను తొత్తుగా చేసుకున్న అమెరికా తన ప్రయోజనాల కోసం చేస్తున్న దుర్మార్గాలతో సామాన్య యూదులపై కూడా వ్యతిరేకత పెరుగుతున్నది. అయితే వారు తాము దురహంకారులం కాదని, పాలస్తీనియన్లకు వ్యతిరేకం కాదంటూ జోహ్రాన్‌ మందానీ వంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తూ యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు.దేశ దేశాల్లో ఉన్న ఫాసిస్టు, మతశక్తులను దూరం పెట్టేందుకు ఆయా దేశాల పౌరులు జాగరూకులు కావాల్సిన తరుణం అసన్నమైంది !               

చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

మంగళవారం నాడు ఢిల్లీలో నాలుగుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. మహాభారతంలో నలుగురిని దుష్ట చతుష్టయం అని పిలిచారు.వారు దుర్మార్గానికి పాల్పడ్డారు గనుక దుష్ట అని విశేషణాన్ని చేర్చారు. అమెరికా,భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలు ఒక కూటమిగా భద్రత చర్చలు జరపాలని నిర్ణయించుకున్నందున చతుర్భుజ భద్రతా సంప్రదింపులు(క్వాడ్రలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌-క్వాడ్‌) అని పేరు పెట్టారు.పదే పదే అంత పెద్ద పేరుతో పలకలేం గనుక చతుష్టయం అందాం. మన విదేశాంగమంత్రి జై శంకర్‌ ఆహ్వానం మేరకు చతుష్టయ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఎందుకు జరిగిందయ్యా అంటే చైనాకు చెక్‌(అడ్డుకొనేందుకు) పెట్టేందుకు అని కొన్ని మీడియా సంస్థలు శీర్షికలు పెట్టాయి. పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన అది సాధుజంతువుగా ఉంటుందా ? కొన్ని దేశాలు సమావేశమైనపుడు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం,సంపదల సృష్టికి సహకారం, మద్దతు ఇవ్వాలి తప్ప మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు అంటూ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా కుట్రలకు తెరతీయటం, కూటమిగా సంఘర్షణకు పూనుకోవటాన్ని చైనా వ్యతిరేకిస్తుందని ఆమె చెప్పారు. లోపల ఏం మాట్లాడుకున్నారో పైకి ఏం చెప్పారన్నదాని గురించి పెద్దగా బుర్రలు బద్దలు చేసుకోనవసరం లేదు. ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నందున ఎదుటివారికి చెప్పేందుకే ఉన్న నీతి సూత్రాలకు కొదవ ఉండదు.ముందుగా ఈ సమావేశం గురించి పెద్దగా చర్చలు కూడా జరగలేదు గనుక సాదాసీదా సమావేశంగానే మీడియా భావించిందని చెప్పాలి. ఈ భేటీకి పది రోజుల ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా యాత్ర చేసిన తరువాత నిజంగానే ఆ ఏముంటుందిలే అని పెద్దగా పట్టించుకోలేదు. పైకి ఏమి చెప్పినా దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకారవాణా జరగాలన్నది ఈ కూటమి అజెండాలో ఒకటి. ప్రపంచాన్ని పక్కదారి పట్టించేందుకు లేని సమస్యను ఉన్నట్లుగా చూపే ఒక మైండ్‌ గేమ్‌. సోవియట్‌ యూనియన్‌తో ఐరోపాకు ముప్పు పొంచి ఉందంటూ నాటో కూటమిని ఏర్పాటు చేసినట్లుగానే ఆ ప్రాంతంలో చైనా ముప్పు గురించి ప్రచారం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే ఎవరైతే ఈ డిమాండ్‌ చేస్తున్నారో ఆ దేశాల్లో ఒకటైన అమెరికా తన ఇరుగూ కాదు పొరుగూ కాదు, ఖండమూ కాదు, పదివేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హార్ముజ్‌ జలసంధిలో ఆయుధాలను చూపి నౌకల దిగ్బంధాన్ని అమలు జరుపుతూ మరోవైపు చైనా పెరటితోట వంటి దక్షిణ చైనా సముద్రం గురించి తేల్చాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.ఇంతవరకు చైనా ఏ ఒక్క నౌకనూ అడ్డుకున్న ఉదంతం లేదు.ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నౌకా రవాణాకు సంబంధించి నిఘావేసేందుకు నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

నిజానికి చతుష్టయ కూటమి ఏర్పాటలో దేశాల మధ్య అవగాహన తప్ప ఎలాంటి ఒప్పందమూ లేదు. తొలుత 2002 భారత్‌ మినహా మూడు దేశాలు త్రిపక్ష కూటమిగా ఏర్పడ్డాయి.తరువాత ఐదేండ్లకు భారత్‌ చేరింది.దీన్ని మరికొన్ని దేశాలను కలుపుకొని విస్తరించాలని చూసినప్పటికీ ఏ దేశమూ ముందుకు రాలేదు. తరువాత పదేండ్ల పాటు దాన్ని గురించిపెద్దగా పట్టించుకోలేదు. 2017 నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు, ప్రకటనలు చేస్తున్నారు.2021 నుంచి ఏటా ఒక సభ్యదేశంలో కూటమి అగ్రనేతల సమావేశాలు, దానికి ముందు విదేశాంగ మంత్రుల సన్నాహక సంప్రదింపులు జరుపుతున్నారు. ఆరుసార్లు అధినాయక సభలు జరగ్గా రెండుసార్లు వీడియో కాన్ఫరెన్సులు, రెండుసార్లు జపాన్‌లో, మరో రెండుసార్లు అమెరికాలో జరిగాయి.2024జూన్‌30 నుంచి జూలై రెండవ తేదీ వరకు కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్‌డిసిలో జరిగింది.డోనాల్డ్‌ ట్రంప్‌ మనతో సహా అనేక దేశాలపై పన్నుల యుద్ధం ప్రకటించటంతో గతేడాది సమావేశం జరగలేదు. తనకు వ్యతిరేకంగా జతకట్టడటంగా చైనా పరిగణిస్తుండగా, ఆసియా నాటో కూటమి అని రష్యా అంటున్నది,ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. పైకి ఎవరు ఏమి చెప్పినప్పటికీ చైనాను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం. దక్షిణ చైనా సముద్రంలోనికొన్ని దీవుల గురించి జపాన్‌, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. అయితే ఏ ఒక్క దేశపు నౌకనూ చైనా మలేసి(అడ్డుకున్న)న ఉదంతం లేదు. అయినప్పటికీ స్వేచ్చా రవాణా పేరుతో అమెరికా నాటకం ఆడుతోంది.ఇతర దేశాలను కూడగట్టేందుకు చూస్తోంది.ఆసియా-పసిఫిక్‌ లేదా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ పెత్తనం సాగాలన్నది దాని అసలు లక్ష్యం. ఇరాన్‌-అమెరికా మధ్య తలెత్తిన పోరు నేపధ్యంలో సంధి గురించి చర్చలు ఒకవైపు మరోవైపు విదేశాంగ మంత్రుల సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. అమెరికా మంత్రి మార్కో రూబియో, జపాన్‌ మంత్రి టోషిమిట్సు మోటెగీ, పెనీ వాంగ్‌(ఆస్ట్రేలియా) పాల్గంటుండగా జై శంకర్‌ అధ్యక్షత వహించారు.

నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన రూబియో ఇండో -పసిఫిక్‌ ప్రాంతం స్వేచ్చగా, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పాడు. ఇలాంటి సమావేశాలను భావసారూప్యత కలిగిన దేశాలతో ఏదో మొక్కుబడిగా జరపటం కాకుండా అనేక అంశాల్లో భాగస్వాములుగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.నౌకా రవాణా, కీలకమైన ఖనిజాలు,లోహాల వంటి అంశాలపై నిర్దిష్ట కార్యాచరణకు పూనుకుంటామని రూబియో అన్నాడు.ఈ ఏడాది ముగిసేలోగా నలుగురు అగ్రనేతల భేటీ ఉంటుందన్నాడు. గతేడాది వాషింగ్టన్‌లో జరిగిన సమావేశ చర్చల కొనసాగింపు ఉంటుందని మన విదేశాంగశాఖ ఢిల్లీ సమావేశం గురించి చెప్పింది. చతుష్టయ కూటమి లక్ష్యాలుగా ప్రజాస్వామ్యం, మానవహక్కులు,చట్టబద్దమైన పాలన వంటి కబుర్లు చెబుతున్నది. వీటన్నింటినీ అమెరికా ఉల్లంఘిస్తున్నది. చట్టబద్దంగా ఎన్నికైన వెనెజులా అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్‌ చేసి తమ దేశానికి తీసుకుపోయి తప్పుడు కేసులతో విచారణ జరుపుతున్నది. అక్కడ ఉన్న చమురు సంపదలన్నింటినీ తన దేశ కంపెనీలకు అప్పగించింది.ఇరాన్‌లో ఉన్న ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించి వేరే పాలకులను ఏర్పాటు చేస్తామని వాషింగ్టన్‌ బహిరంగంగా ప్రకటించటమేగాక దానిలో భాగంగా సుప్రీం నేత ఖమేనీ, ఇతర అనేక మందిని చంపివేయటంతో పాటు దాడులు కూడా చేసిన సంగతి తెలిసిందే. గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని బరితెగించి సమర్ధించిన అమెరికా మానవహక్కుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలను వల్లించినట్లే.ఇది సైనిక కూటమి కాదని చెప్పినప్పటికీ మన దేశ ఆధ్యర్యంలో నాలుగు దేశాల మిలిటరీ మలబార్‌ సైనిక విన్యాసాలు జరిపాయి.

చైనాను కట్టడి చేయాలని నాలుగుదేశాల నేతలకూ ఉన్నప్పటికీ పిల్లిమెడలో గంటకట్టేదెవరన్న సమస్య ఉంది.ఆర్థిక రంగాల్లో సహకరించుకొనేందుకు అనేక వేదికలు ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నారు.ఒక వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయాయి. ఆర్థిక, మిలిటరీ రంగాలలో ఏ ఒక్క దేశానికీ పోలిక లేదు అసమానతలు ఉన్నాయి.చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకుపోయి తెగేంతవరకు లాగేందుకు ఎవరూ సిద్దంగా లేరు ప్రత్యేకించి భారత్‌, ఆస్ట్రేలియాలు అలాంటి వైఖరిని కనపరిచాయి. ఆర్థిక రంగంలో మిగిలిన మూడు దేశాలను నమ్ముకున్న భారత్‌కు ఆశించిన మేరకు పెట్టుబడులు రాలేదు. దీంతో గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత ఐదు సంవత్సరాల పాటు నామ మాత్ర సంబంధాలను మాత్రమే కొనసాగించిన మనదేశం ఇప్పుడు పెట్టుబడులకు ఆహ్వానం పలకటంతో సహా సాధారణ సంబంధాలను పునరుద్దరించుకుంది. అటువంటపుడు చైనా వ్యతిరేకత అనే ఎర్రగీతను దాటి ముందుకు పోయే స్థితి లేదు. తక్షణం పరిష్కరించాలని భావిస్తున్న ప్రాంతీయ సమస్యల తీవ్రతను తగ్గించే అవకాశాలు కూడా లేవని ఇన్ని సంవత్సరాల అనుభవం నేర్పింది.పశ్చిమాసియాలో ఇరాన్‌పై దాడి చేసి దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక అమెరికా గిలగిలా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే.అమెరికాకు ఏ ఒక్క దేశమూ మద్దతుగా నిలవకపోగా ఇరాన్‌కు మద్దతుగా చైనా వ్యవహరిస్తున్నది, భద్రతా మండలిలో దాన్ని కాపాడిన తీరు తెలిసిందే.

చతుర్భుజ భద్రతా చర్చల పేరుతో వ్యవహరిస్తున్నవారు ఇప్పుడు ఇతర అంశాల మీద కేంద్రీకరించటాన్ని బట్టి ఈ కూటమి దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత వెల్లడి అవుతున్నది. కొందరు సాధువులు రాత్రికి ఒక చోట చేరి ప్రతి రోజూ గంజాయిదమ్ము కొట్టేవారు. అది తలకు ఎక్కగానే తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలి, ఈ బతుకు ఎంతకాలం అంటూ ప్రగల్భాలు పలికేవారట. తెల్లారేసరికి దమ్ముదిగి ఎవరి కర్రా బుర్రా తీసుకొని వారు ఊరు మీదకు వెళ్లేవారు. చైనా పేరు పెట్టకుండా దాన్ని ఉద్దేశించి ఆర్ధికబలవంతం, ధరల తిమ్మినిబమ్మిని,సరఫరా వ్యవస్థల విచ్చిన్నం, అక్రమ మార్కెట్‌ పద్దతులు, కీలకమైన ఖనిజాల ఉత్పత్తి మీద కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్న దేశాలంటూ ధ్వజమెత్తుతూ ప్రతి సమావేశంలో మాట్లాడుతుంటారు. నాలుగుదేశాల నేతలు సమావేశమైనపుడు పరోక్షంగా చైనా మీద మాటలదాడిలో ఎవరూ తక్కువ తినటం లేదన్నది గతసమావేశాల తీరుతెన్నులు స్పష్టం చేశాయి. చైనా నుంచి తలెత్తిన ముప్పు పేరుతో చేస్తున్న ప్రచారానికి దానితో సంబంధాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. అలాంటి దేశంతో లావాదేవీలు తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకొనేందుకు ప్రతిదేశమూ విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నది. ఉదాహరణకు 2014లో మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో చైనా 38 బిలియన్‌ డాలర్ల మేరకు మిగులు ఉండగా 2026నాటికి 116 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా వస్తువుల దిగుమతుల్లో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నారు.గతేడాది ట్రంప్‌ మనపై పన్నుల దాడి ప్రారంభించినపుడు నరేంద్రమోడీ చైనా పర్యటనలో షీ జింపింగ్‌, పుతిన్‌తో కలసి అవసరమైతే తాము ఏకమౌతామనే సంకేతాన్ని ఇచ్చిన సంగతిని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. చైనాను మింగేస్తాం, నలిపేస్తాం అంటూ కొండంత రాగం తీసిన ట్రంప్‌ ఈ నెలలోనే పెద్ద సంఖ్యలో తన కార్పొరేట్‌ అధిపతులను బీజింగ్‌ పర్యటనకు తీసుకువెళ్లి సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. అది వాణిజ్య పర్యటన తప్ప మరొకటి కాదు. విలువైన ఖనిజాల ఉత్పత్తులను చైనా బంద్‌ చేయటంతో తిరిగి కాళ్లబేరానికి రావటాన్ని చూశాము. గతేడాది ఆస్ట్రేలియాలో లోవీ సంస్థ నిర్వహించిన సర్వేలో చైనా తమకు ఆర్థిక భాగస్వామితప్ప ముప్పుదేశం కాదని మెజారిటీ అభిప్రాయపడినట్లు తేలింది. చైనా అనేక దేశాలతో వాణిజ్య మిగులుతో ఉంటే ఆస్ట్రేలియా అదే చైనాతో 2025లో 4.21 బిలియన్‌ డాలర్లు మిగులులో ఉంది. అందువలన అది చైనాతో తగాదాకు ఏమాత్రం సిద్దపడటం లేదు. ఉత్తర కొరియాను చూసి జపాన్‌ భయపడుతున్నది తప్ప చైనాతో వాణిజ్యాన్ని వదులుకొనేందుకు సిద్దంగా లేదు. అమెరికా కనుసన్నలలో నడిచే దక్షిణ కారియా పరిస్థితి అంతే. ఢిల్లీ సమావేశంకోసం వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌కు ఎంత చమురు కావాలంటే అంత సరఫరా చేస్తామంటూ బిస్కెట్‌ వేశారు.మన అవసరాలకు ప్రతిదేశం నుంచి చమురు కొనుగోలు చేయాల్సి ఉంది.అలాగాక అమెరికాను నమ్మి మిగిలిన దేశాలను వదలివేస్తే పరిస్థితి తారుమారైతే అమెరికన్లు మన జట్టుపట్టుకుంటారు, తమ కాళ్ల ముందు పడేట్లు చేసుకుంటారు. రూబియో ఢిల్లీలో మాట్లాడుతూ విలువైన లేదా కీలక లోహాలపై ఒక ఏర్పాటును ప్రకటిస్తామని, పరస్పర సహకారం, పెట్టుబడులు సరఫరాలను సమన్వయం చేసుకుంటామని చెప్పాడు. ఇండో-పసిఫిక్‌ ఇంథన భద్రతను కూడా పటిష్టపరుస్తామన్నాడు. ఇంకా ఇండో-పసిఫిక్‌ నౌకా నిఘాసహకారం పెంచుకుంటామని చెప్పాడు. ఇలాంటి సాధారణ విషయాలు తప్ప ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామమేదీ ఢిల్లీ సమావేశంలో జరగలేదు !

అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

ఇప్పటి వరకు బొద్దింకలను చూసి కొంత మంది ఎలా భయపడతారో చూశాం గానీ ఇప్పుడు ఆ పేరును చూసి కళవళపడుతున్న రాజకీయ పార్టీలను చూస్తున్నాం. ఇలాంటి రోజు వస్తుందని ఎవరైనా ఊహించారా ! ఫాసిజం మరోమారు తలెత్తుతున్నదంటే హిట్లర్‌, ముస్సోలినీ, టోజో వంటి దుర్మార్గులే తిరిగి జన్మించారని కాదు. వారి వారసులు ప్రజాస్వామ్య వేషాలతో మనమధ్య తిరిగేవారే ఆపని చేస్తున్నారు.లేకపోతే బొద్దింకల జనతా పార్టీ (సిజెపి) ఎక్స్‌ ఖాతా నిలిపివేయటం ఏమిటి ! దాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఖరాబు చేశారు, చివరికి వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఆ పేజీని కూడా కనపడకుండా చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో దీన్ని కూడా అంతే. ఇలాంటి చేష్టలతో యువతను మరింతగా రెచ్చగొట్టటం, సిజెపికి మద్దతుదార్లను పెంచటం తప్ప మరొకటి కాదు. ఇది నిరంకుశ చర్య అని ఉద్యమాన్ని ప్రారంభించిన అభిజిత్‌ డిప్కే వ్యాఖ్యానించాడు. సామాజిక ఉద్యమనినాదం రూపంలో ఉన్న ఆ పార్టీ ముందుకు తెచ్చిన ఐదు అంశాలు దేశంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయట, ఆ విషయాన్ని కేంద్ర ఇంటిలిజెన్స్‌ బ్యూరో (ఐబి) ప్రభుత్వానికి నివేదించిందట,దేశ రక్షణ కోసం సదరు సిజెపి సామాజిక మాధ్యమ ఎక్స్‌ ఖాతాను మోడీ సర్కార్‌ నిలిపివేయించిందట. నేపాల్లో అధికారంలో ఉన్న పార్టీ సామాజిక మాధ్యమాలపై విధించిన ఆంక్షలే తమకు నష్టం అని భావించిన పాలకపార్టీ ఆంక్షలు పెట్టింది, దానిపై యువత ఎలా స్పందించిందో చివరికి అధికార మార్పిడికి దారితీయటాన్ని ప్రపంచం చూసింది. చరిత్రలో మోడీ మరొక పేజీకి నాంది పలికారా ? భారత్‌లో నిషేధాలు, ఇతర చర్యలతో సిజెపి పేజీలను అడ్డుకోవచ్చు, కానీ విదేశాల్లో చేరే అనుచరులను మోడీ అడ్డుకోగలరా ? ప్రపంచవ్యాపితంగా మోడీ పలుకుబడి గురించి బిజెపి గొప్పలు చెప్పుకుంటుంది. అలాంటి మోడీ పాలనలో యువత గురించి దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ చేసిన వ్యాఖ్యలు, దేశంలో ఉన్న స్థితిగతుల గురించి విదేశాల్లో ఉన్నవారికి ఆసక్తి కలిగినట్లు ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఇదీ ఒకందుకు మంచిదే. మోడీ ప్రజాస్వామ్య బండారం ప్రపంచానికి తెలుస్తుంది. విమర్శకుల సంగతి సరే, మోడీని అభిమానించే వారందరూ మతోన్మాదులు లేదా మరొకరో అనుకోనవసరం లేదు. ప్రజాస్వామిక ప్రియులకు ఈ వార్త వీనుల విందుగా ఉందా ? ఈ పరిణామాలను జీర్ణించుకోగలుగుతున్నారా !!

ఇంతకూ సిజెపి తన అజెండాలో ప్రకటించిన అంశాలేమిటి ? పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను రాజ్యసభకు పంపకూడదు, తొలగించిన ఓట్లకు గాను ఉపా చట్టం కింద కేంద్ర ఎన్నికల కమిషన్‌పై విచారణ, మహిళలకు 55శాతం రిజర్వేషన్లు, ఓట్ల తొలగింపును ఎన్నికల కమిషన్‌ నిర్ణీత వ్యవధిలో జరపాలి, భారతీయ యువతకు రాజకీయ విద్యగరపాలి.పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని దీర్ఘకాలం ఎన్నికల్లో పాల్గ్గొననివ్వకూడదు. ఆసక్తి కలిగిన వారు ఆ పార్టీ వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తే లేదా వేరే రూపంలో తిరిగి ప్రారంభమైతే ఈ అంశాల మీద వారి వివరణను చదువుకోవచ్చు.ఈ అజెండాను ఎవరైనా అందరూ ఆమోదించాలనేమీ లేమీ లేదు, అది వారికి ఉన్న హక్కు. అలాగే సమర్ధించటానికీ హక్కు ఉంది. దానిలో రెచ్చగొట్టే అంశాలేమున్నాయి, వాటితో దేశ భద్రతకు వచ్చిన ముప్పేమిటి ? వెంపలి చెట్లకు నిచ్చెనవేసుకు ఎక్కేవారు పుడతారన్నట్లుగా పోతులూరి వీరబ్రహ్మం చెప్పారని ప్రచారంలో ఉంది. అది నిజమో కాదో తెలియదు గానీ కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఏ నివేదిక కావాలంటే దాన్ని క్షణాల్లో తెప్పించుకోవచ్చు, ఇడి, ఐటి, సిబిఐతో పాటు దేశ భక్తిని గుత్తకు తీసుకున్నామని చెప్పేవారి దాడులు కూడా ఎవరిమీదైనా ఎప్పుడైనా జరగవచ్చు.

సిజెపి సృష్టికర్త అభిజిత్‌ దిప్కే గురించి టీవీ చర్చల్లో, సామాజిక మాధ్యమాల్లో బిజెపివారు ధ్వజమెత్తుతున్నారు. మూడు పదుల వయస్సున్న ఆ యువకుడి వెనుక బిజెపిని వ్యతిరేకించే అన్ని పార్టీలు, శక్తులు ఉన్నాయని, కుట్ర చేశాయని బిజెపి నేతలు దేశభక్తి గీతాలాపన ప్రారంభించారు. పండుగాడి దెబ్బ తగిలి మైండ్‌ బ్లాంక్‌ అయినవారు తప్ప మరొకరు ఇలా మాట్లాడరు.సిజెపి ఎక్స్‌ ఖాతాను అనుసరించేవారు కోట్లలో ఉండటంతో బిజెపి తట్టుకోలేకపోయింది.భారత్‌ను వ్యతిరేకించే దేశాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో అనుసరించుతున్నారని, వారంతా భారతీయులు కాదని ఇదంతా కుట్రలో భాగంగా జరుగుతోందని బిజెపి ప్రతినిధులు టీవీ చర్చల్లో చెబుతున్నారు.బోడి గుండుకు మోకాలికి ముడిపెట్ట గల సమర్ధులకు మాత్రమే ఇలా మాట్లాడటం సాధ్యం. తమ నేత, పార్టీకి విదేశాల్లో కూడా అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారని కాషాయ నేతలు గొప్పలు చెప్పుకోవటాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సామాజిక మాధ్యమ ఖాతా అంటే ఒక బ్యాంకు ఖాతా వంటిది కాదు. ప్రపంచంలో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నవారెవరైనా ఎక్కడి నుంచైనా చేరవచ్చు. ఉచితం ఉన్నాయి, డబ్బు వసూలు చేసేవీ ఉన్నాయి.కుట్ర అంటే చేతివేళ్ల మీద లెక్కించదగిన వారు చేసేది తప్ప కోట్లాది మంది భాగస్వాములు అవుతారా ? మోడీ, బిజెపి, కాంగ్రెస్‌ సామాజిక మాధ్యమ ఖాతాను అనుసరించేవారిలో ఎక్కువ మంది నకిలీలే అనే అభిప్రాయం ఉంది, గొప్పలు చెప్పుకొనేందుకు పార్టీలు, వ్యక్తులు అలాంటి చర్యలకు పాల్పడతారు.లోకోభిన్న రుచి అన్నట్లుగా సినిమాతారలు, ఇతర ప్రముఖులను అనుసరించేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉండే సంగతి తెలిసిందే.

అసలు మే 15వ తేదీ ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ వివాదాస్పద బొద్దింకలు, పరాన్న జీవుల వ్యాఖ్యలు చేయటం, మరుసటి రోజునే అభిజిత్‌ బొద్దింకల జనతా పార్టీ అంటూ వ్యంగ్యాస్త్రంతో సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టటం, లక్షల నుంచి కోట్ల సంఖ్యలో అనుచరులు చేరటం అంతా మూడు నాలుగు రోజుల్లోనే జరిగిపోయింది. బిజెపి వారు చెప్పేదాన్ని బట్టి కుట్ర ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకు ముందే రూపొంది ఉండాలి.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయటం కూడా కుట్రలో భాగం అయి ఉండాలి. లేకపోతే ఎలా సాధ్యం. ఒక నేత ఫలానా రోజు ఫలానా ప్రాంతంలో పర్యటిస్తారని ముందే ప్రకటిస్తారు గనుక తెలుస్తుంది తప్ప ఏ సెలవిస్తారో ఊహించగలరా ? ఆ రోజు ఫలానే కేసు విచారణకు వస్తుందని తెలియవచ్చు ప్రధాన న్యాయమూర్తి అలాంటి వివాదాస్పద మాటలు మాట్లాడతారని కుట్రదారులకు ముందే తెలుసా ? బొద్దింకల జనతా పార్టీ పోస్టులను పెట్టగానే అనుచరులుగా మారండని కోట్లాది మందికి ముందుగానే వర్తమానాలు పంపుతారా ? ఆరోపణలు చేసే ముందు తర్కానికి అవి నిలిచేవిగా ఉండాలి. వారు చెప్పేదాని ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తి కూడా బిజెపి వ్యతిరేక కుట్రలో భాగమే అనుకోవాలి.తల మీద మెదడు ఉన్నవారెవరూ ఇలా చెప్పరు. నిజంగా కుట్ర జరిగిందని నమ్మితే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి నిజా నిజాలను నిగ్గుతేల్చాలి. ఆపని చేయలేదు. తాను అలాంటి వ్యాఖ్యలను యువతమొత్తాన్ని ఉద్దేశించి చేయలేదని ప్రధాన న్యాయమూర్తి వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఎవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన అంతరంగంలోంచి వచ్చిన అవాంఛనీయ వ్యాఖ్యలుగానే చూస్తున్నారు.ఎందుకంటే ఫిబ్రవరి నెలలో కార్మిక సంఘాలను కూడా ఆయన ఇదే విధంగా తూలనాడారు. ఇటీవలి కాలంలో హైకోర్టు, సుప్రీం కోర్టులలో అనేక మంది న్యాయమూర్తులు తీర్పులతో సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో సంచలనాలకు కారకులౌతున్నారు.గతంలో ఇలా ఉండేవారు కాదు. తాము నిరుద్యోగులుగా ఉన్నందున శారీరకంగా సోమరిపోతులం తప్ప మెదళ్లు పనిచేస్తూనే ఉన్నాయని కూడా సిజెపి వ్యంగ్యాస్త్రం విసిరింది. ఇది ఎంత మంది పెద్దలకు అర్ధం అవుతుందో తెలియదు.

సిజెపిని ముందుకు తెచ్చిన అభిజిత్‌ అమెరికాలో ఉండి ఇదంతా చేస్తున్నాడని, గతంలో ఆమ్‌ ఆద్మీపార్టీలో పని చేశాడని బిజెపి నేతలు ధ్వజమెత్తుతున్నారు.ఎక్కడ ఉండి చేశారు, చేస్తున్నారని కాదు, ఏం చేశారనేదే ముఖ్యం. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ అమెరికాలో విద్యార్థిగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడే 1923లో అమెరికా హిందూస్థాన్‌ అసోసియేషన్‌ సభకు అధ్యక్షత వహించాడు. తరువాత ఆరేండ్లకు భారత్‌ వచ్చి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గ్గొన్నారు. సంఘపరివార్‌ ఆరాధించే విడి సావర్కర్‌ లండన్‌లో చదువుకొనేందుకు వెళ్లి అక్కడ రాజకీయాల్లో పాల్గొన్నారు. ఇలా చెప్పుకుంటే ఎందరో. అభిజిత్‌ దిప్కే వయస్సు మూడు పదులు, 2023లో చదుకొనేందుకు అమెరికా వెళ్లాడు,అక్కడి నుంచే స్పందించాడు. తప్పేముంది, భారత్‌ను యావత్‌ ప్రపంచానికి విశ్వగురువుగా మారుస్తామని బిజెపి నేతలు చెబుతారు. ప్రపంచ కుగ్రామంలో అతను అమెరికా అనే పేటలో ఉండటం నేరం కాదు. అలా అనుకుంటే అనేక మంది అమెరికా, ఇతర దేశాల్లో ప్రవాస భారతీయులు హిందూ సంస్థలు, సంఘపరివార్‌ సంస్థలను ఏర్పాటు చేసి కోట్లాది డాలర్లను బిజెపికి అందిస్తున్నారు. వారంతా స్వదేశం వచ్చి ఆ పని చేయాలని బిజెపి వారు అడగటం లేదేం ? దళితులు, రిజర్వేషన్ల సమస్యల గురించి ఒక నెటిజన్‌ అభిజిత్‌ను ప్రశ్నిస్తే తానే ఒక దళితుడనని చెప్పాడు. ఇంకేముంది ప్రతిభకు పట్టం గట్టటాన్ని వ్యతిరేకిస్తారని, దళితకార్డు వాడుకుంటున్నారంటూ కొందరు ధ్వజమెత్తుతున్నారు.బరాబర్‌ హిందూమతం కోసం పని చేస్తాం, కరడు గట్టిన సనాతన వాదులం అంటూ వీరంగం వేస్తున్నమాదిరి అతన తన సామాజిక తరగతిని ముందుగా వెల్లడించలేదు. అన్నింటికీ మించి అతనేమీ రిజర్వేషన్‌ సౌకర్యంతో అమెరికా వెళ్లలేదు. తెలివితేటలు ఎవడబ్బ సొమ్ము కాదు, బలహీనవర్గాలకు తెలివితేటలు ఉండవా ! స్వయంకృషితో ఎదిగిన అంబేద్కర్‌ జన్మించిన గడ్డ మీద అభిజిత్‌ పుట్టాడు. ఒక మేథావి, సంస్కరణవాదిగా, మనుధర్మ వ్యతిరేకిగా అనేక మందికి అంబేద్కర్‌ స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. దళితులను సామాజికంగా ఎలా వేధిస్తున్నారో నిత్యం చూస్తున్నాం, అలాంటి వారి భావజాల వారసులు ఇప్పుడు అభిజిత్‌ను కూడా అవమానించేందుకు పూనుకున్నారు. ఇది మనువాదులకు మరింత మంది వ్యతిరేకులను తయారు చేస్తుంది, తెలిసో తెలియకో వారిని అనుసరిస్తున్న దళితులు, అణచివేతకు గురైన గిరిజనులు, ఇతర బలహీనవర్గాలు కూడా తామెటు ఉండాలో నిర్ణయించుకొనేట్లు చేస్తుంది, ఇప్పటికిప్పుడు మార్పురాకపోవచ్చు, ఆలోచన మొదలైతే చాలు ఆచరణ ఎలా ఉండాలో తెలుస్తుంది. సిజెపిని వదలి బిజెపిలో చేరాలని లేకపోతే నీ తలిదండ్రులు ఎక్కడ ఉన్నారో కూడా తెలుసు అంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.ఇది అనూహ్యమేమీ కాదు. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించటం, ప్రశ్నించటాన్ని దేశద్రోహంగా చిత్రించి దాడులు చేయటం తెలిసిందే, అభిజిత్‌ భారత్‌కు తిరిగి వస్తే అదే జరుగుతుందా ? చూద్దాం !

దేశంలో సమస్యలు, సంక్షోభం తలెత్తినపుడు యువత స్పందిస్తూనే ఉంది.కాంగ్రెస్‌ పార్టీలో చీలిక వచ్చిన తరువాత జరిగిన 1971లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ నాయకత్వంలోని పార్టీ 352 సీట్లతో అఖండ మెజారిటీ సాధించింది, అప్పుడు సిపిఐ(ఎం) 25 సీట్లతో పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఎన్నికైంది. వాజ్‌పాయి నాయకత్వంలోని భారతీయ జనసంఘం 35 సీట్ల నుంచి 22కు పడిపోయింది. ఆ ఎన్నికల్లోనే ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే కేసు రుజువు కావటంతో 1975లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రెండు సంవత్సరాల ముందు, గుజరాత్‌, బీహార్‌లో ధరల పెరుగుదల, కాంగ్రెస్‌ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమై ఇందిరాగాంధీని ఇరుకున పెట్టాయి.1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ కూడా ఎన్నికల్లో ఓడిపోయి జనతా పార్టీ అధికారానికి వచ్చింది. ఆ సమయంలో యువకులుగా రంగంలోకి వచ్చిన అనేక మంది తరువాత కాలంలో వివిధ పార్టీల నేతలుగా ఎదిగారు. బొద్దింకల జనతా పార్టీ ప్రస్తుతానికి సామాజిక మాధ్యమ ఉద్యమంలో భాగం తప్ప భౌతిక ఉనికిలో లేదు. పార్టీని నమోదు చేస్తారో లేదో తెలియదు. ఒక సంచలనం. గతంలో ఎన్‌టి రామారావు ఆంధ్ర ప్రదేశ్‌లో, తాజాగా విజరు తమిళనాడులో సృష్టించిన ప్రభంజనంలో యువత ప్రముఖ పాత్రపోషించిన సంగతి తెలిసిందే.యువత మార్పును కోరుతున్నారు. సాంప్రదాయ పార్టీలు చేసిన మోసాలు, వాగ్దాన భంగాలతో విసిగిపోయి ఉన్నారు.తీవ్రమైన రాజకీయ, సామాజిక అంశాలను వ్యంగ్యంగా ముందుకు తెచ్చినట్లు కొందరు తప్పుపడుతున్నారు. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి. జనం దృష్టిని ఆకర్షించటంలో నవరసాలు ఉంటాయి, వాటిలో హాస్యం, వ్యంగ్యం ఒకటి.కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యల గురించి చెబితే జనంలో ఎలాంటి స్పందన ఉండటం లేదు. అందుకని ఏ రూపాన్ని ఎంచుకున్నారన్నది కాదు, యువత, ఇతర తరగతులను కదిలించాడా లేదా అన్నదే గీటురాయిగా ఉండాలి. ఇదేదో కొంపముంచేట్లుంది చూడండయ్యా అన్నట్లుగా కేంద్ర మంత్రివర్గ సమావేశాలో నరేంద్రమోడీ చివాట్లు వేశారన్న వార్తలు వచ్చాయి, యాభైఆరు అంగుళాల ఛాతికి ఏదో జరగకుండా అది జరుగుతుందా ! కాంగ్రెస్‌, బిజెపి, వాటిని ఆదరించిన డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలు విజరు దెబ్బను చవిచూశాయి. అందుకే ఇప్పటివరకు సినిమాలో పండుగాడి దెబ్బతో పోలిక బదులు ఇప్పుడు దేశవ్యాపితంగా రాజకీయంగా అభిషేక్‌ దెబ్బ గురించి చెప్పుకోవాల్సి వస్తోంది !

ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

కతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వినతి మేరకు ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అంతకు ముందు రెండు మూడు రోజుల్లో ఒప్పందానికి రాకపోతే యుద్దాన్ని తిరిగి ప్రారంభిస్తానని చెప్పాడు. పార్లమెంటు ఆమోదం పొందకపోతే ఇరాన్‌పై సాగిస్తున్న దాడులను నిలిపివేయాలంటూ అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తూ మంగళవారం నాడు అమెరికా సెనేట్‌ 50-47తో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతకు ముందు ఏడు సార్లు డెమోక్రటిక్‌ పార్టీ ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. నలుగురు అధికార రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు చేతులు కలపటంతో నెగ్గింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక దేశం మీద యుద్ధం చేయాలంటే పార్లమెంటు తీర్మానం అవసరం. అయితే అధ్యక్షుడికి ఉన్న అధికారాల గురించి 1973లో పార్లమెంటు చేసిన తీర్మానం మేరకు అరవై రోజులకు మించి సైనిక చర్యకు ఆదేశిస్తే పార్లమెంటు ఆమోదం విధిగా పొందాల్సి ఉంది. ఈ కారణంగానే అసలు తాము ఇరాన్‌ మీద యుద్దం చేయటం లేదని, మిలిటరీ చర్య మాత్రమే అని బుకాయించాడు, అంతేకాదు ఫిబ్రవరి 28న దాడులను ప్రారంభించిన ట్రంప్‌ ఏప్రిల్‌ 7న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాడు. అప్పటి నుంచి అదిరింపులు బెదిరింపులతో కాలం గడుపుతున్నాడు. అమెరికా చేసిన దాడులనుంచి తాము అనేక విషయాలను నేర్చుకున్నామని, మరోసారి దాడులకు పాల్పడితే ఊహించని విధంగా దెబ్బతీస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి ప్రకటించాడు. తిరుగులేనిదని చెప్పుకున్న ఎఫ్‌-35 యుద్ధ విమానాన్నే కూల్చివేశామని, మరో 42 ఇతర విమానాలు, శక్తివంతమైన డ్రోన్లను కూడా తాము కూల్చివేసినట్లు అమెరికన్‌ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు కూడా ఇరాన్‌ ప్రకటించింది.యుఏయి అణువిద్యుత్‌ కేంద్రంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడిచేసింది.దానికేమీ నష్టం జరగనప్పటికీ అవసరమైతే క్షిపణులతో ధ్వంసం చేయగలమని సందేశాన్ని ఇరాన్‌ పంపింది.

మే నెల 14,15 తేదీలలో ప్రపంచంలో ఇద్దరు శక్తివంతులైన నేతలు చైనా రాజధాని బీజింగ్‌లో భేటీ అయ్యారు. సహజంగానే ఈ కలయిక ఫలితాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతోంది.అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవసారి చైనా సందర్శించాడు. పర్యటనకు ముందు, తరువాత కూడా ఈ ఉదంతం గురించి పెద్ద ఎత్తున విశ్లేషణలు వెలువడ్డాయి. డ్రాగన్‌ దేశ సందర్శన విఫలమైందని,వాణిజ్య పోరు ఎదురుతన్నిందని,అమెరికన్‌ కార్పొరేట్లు నిరాశాపూర్వక ప్రయత్నాలు చేసినట్లు, ఇంకా అనేక అంశాల గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యలు, వివరణలు వెలువడ్డాయి. విజయవంతమైందనే మాట ఎక్కడా వినిపించలేదు. సాధారణంగా దేశాధినేతల పర్యటనలు ఇతర దేశాల ఆహ్వానం మేరకే జరుగుతాయి. ట్రంప్‌ తాజా పర్యటనకు చైనా నుంచి అలాంటి ఆహ్వానం లేదు. మీ ఇంటికి ఒకసారి రావాలని కొందరు అంటారని తెలిసిందే, అలాగే ట్రంప్‌ తన వాంఛను వెలిబుచ్చిన తరువాత అంతకంటేనా అని బీజింగ్‌ స్పందించింది.అలాగని మర్యాదలకు లోటు చేయలేదు.ట్రంప్‌ పరివారానికి హెచ్చరికలతో పాటు అనేక బహుమతులు కూడా ఇచ్చిపంపారు. అయితే వాటిలో దొంగచెవులు, నిఘా కెమెరాలను అమర్చారంటూ స్వదేశానికి తీసుకుపోకుండా ఒక చెత్తబుట్టలో వేసి చూపి మరీ ట్రంప్‌ బృందం చైనాను అవమానించింది అనటం కంటే తన చౌకబారు తనాన్ని వెల్లడించుకుంది. గతంలో కూడా అమెరికన్లు గుట్టుచప్పుడు కాకుండా అదేపని చేసేవారని వార్తలు వచ్చాయి. ఈ చర్య ద్వారా షీ జింపింగ్‌ యంత్రాంగం తమ బుట్టలో పడలేదనే ఉక్రోషం ప్రదర్శితమైంది.చైనాను వత్తిడి చేయటంలో విఫలం కావటాన్ని వాణిజ్య యుద్దంలో ట్రంప్‌ ఓటమిగా కొందరు వర్ణించారు.ఆ పెద్ద మనిషి అంతగా కోరి మరీ ఎందుకు చైనా వెళ్లాడంటే ముక్తసరి సమాధానం అమెరికా ఆర్థిక పరిస్థితి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందనే సమాధానం వచ్చింది. చైనా పర్యటన సమయంలో ట్రంప్‌ రేటింగ్‌ 34 శాతానికి దిగజారింది.రుణ భారం జిడిపికి వందశాతం దాటింది. పులిమీద పుట్రలా ఇరాన్‌పై దాడి చేసి మరింత లోతుగా కూరుకుపోయింది.గౌరవ ప్రదమైన విధంగా ఇరాన్‌తో రాజీకుదర్చాలనే అజెండా తెరవెనుక ఉందని చెబుతున్నారు.వ్రతం చెడ్దా ఫలం దక్కలేదు.చైనా పైచేయిగా ఉందని వాషింగ్టన్‌ మేథో సంస్థ విదేశీ వ్యవహారాల మండలి(సిఎఫ్‌ ఆర్‌) వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఏమిటో వేరే చెప్పనవసరం లేదు.అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాటి వెనుక టెస్లా కంపెనీ యజమాని ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్‌, అందరికీ సుపరిచితమైన ఆపిల్‌, బ్లాక్‌రాక్‌, ఎన్‌విడియా, బోయింగ్‌, జిఇ, మైక్రాన్‌ ఇలా అనేక కంపెనీల అధిపతులు ఉంటారు.ఎవరు మంత్రులు కావాలో, ఏ విధానాలను అనుసరించాలో కూడా నిర్దేశించేది వారే.

ఈ బృందం ఆశాభంగం చెందటానికి కారణాలు ఏమిటి ? గతంలో చైనాకు అవసరమైన చిప్స్‌ను సరఫరా చేయటంలో ఎన్‌విడియా కంపెనీ వాటా 95 శాతం ఉండగా ఇప్పుడు సున్నా శాతానికి పడిపోయింది.చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను సరఫరా చేయకూడదన్న ఆదేశాలకు సదరు కంపెనీ తలొగ్గింది. సవాలుగా తీసుకున్న చైనా తన స్వంత కంపెనీలను ప్రోత్సహించి చిప్స్‌ను అభివృద్ధి చేసుకుంటున్నది. విధిలేక నిషేధం ఎత్తివేసిన తరువాత చూద్దాం, అవసరమైనపుడు మేమే సంప్రదిస్తాం అన్నట్లుగా చైనా అటువైపే చూడలేదు.అందుకే ఆ కంపెనీ యజమాని ట్రంప్‌తో పాటు బీజింగ్‌ వెళ్లాడు. నూటనలభై కోట్ల జనాభాలో 2027 నాటికి 120 కోట్ల మంది మధ్య తరగతిలో ఉంటారని అంచనా. ప్రపంచంలో వీరి వాటా 25శాతం. ఇంత మంది వినియోగదారుల మార్కెట్‌ను అమెరికా కార్పొరేట్లు వదులు కుంటాయా ? వాటికి కావాల్సింది లాభాలు, వాటికోసం రాజకీయాలు చేస్తాయి, అవి తమకు ఆటంకంగా మారినపుడు ప్లేటు ఫిరాయిస్తాయి.

సంస్కరణలు అంటే మన మాదిరి విదేశాలకు ఏకపక్షంగా తలుపులు బార్లా తెరవటం కాదు.మనం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ నిర్దేశిత విధానాల చట్రంలో చేస్తే దానికి భిన్నంగా టెక్నాలజీ అందిస్తే మార్కెట్‌లో అవకాశమిస్తాం అనే షరతు మీద చైనా కమ్యూనిస్టులు వ్యవహరించారు.ఈ కీలకమైన అంశాన్ని వదలి వారు నియంతలు, మనది ప్రజాస్వామ్యం అందుకే చైనాతో పోల్చుకోవద్దు అంటూ కొందరు సొల్లు కబుర్లు చెబుతారు. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి.చైనా తనకు పోటీగా రాదని భావించినంత కాలం అమెరికన్లు ఎలాంటి యాగీ చేయలేదు. తరువాతే అక్కడ మానవహక్కులు లేవని, కరెన్సీ విలువను తగ్గించి ఉంచుతున్నారని, సబ్సిడీలతో సరకులను తక్కువ ధరలకు ఎగుమతి చేస్తున్నారని ఇలా రకరకాల సాకులను ముందుకు తెచ్చారు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు 2018లో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించాడు. పెద్ద మొత్తంలో అమెరికా పెట్టుబడులు తగ్గించాడు, వాణిజ్యమూ తగ్గింది. అయినా గడచిన ఎనిమిది సంవత్సరాల్లో చైనాకు స్వల్ప సమస్యలు తప్ప అదేమీ కుప్పకూలి పోలేదు. వాణిజ్యం తరువాత చిప్‌ వార్‌ను ప్రారంభించాడు.దాన్ని కూడా సవాలుగా తీసుకొని మీ చిప్స్‌ మాకు అవసరం లేదనట్లుగా ఇప్పుడు చైనా ఉంది. దాంతో చైనా పట్ల వైఖరిని మార్చుకోవాలని కొన్ని పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు వత్తిడి తెచ్చిన కారణంగానే పిలవక పోయినా పెద్ద సంఖ్యలో వాటి యజమానులను వెంటేసుకొని ట్రంప్‌ బీజింగ్‌ వెళ్లాడు. చైనా కనీసం ఐదు వందల విమానాలను కొనుగోలు చేస్తుందని కొందరు జోశ్యం చెప్పారు.అన్నిగాకున్నా రెండు వందలు అమ్ముదామని ట్రంప్‌ చెప్పాడు. చివరికి దీని గురించి అడిగితే చైనా ప్రతినిధి సమాధాన్ని దాటవేయటంతో బోయింగ్‌: కంపెనీ వాటాల ధరలు నాలుగుశాతం పడిపోయాయి. ఎన్‌విడియా చిప్స్‌ కంపెనీకి సైతం ఇదే ఆశాభంగం ఎదురైందని వార్తలు. బీజింగ్‌ తన ప్రయోజనాలను ఫణంగా పెట్టుకొని తమకు రాయితీలు ఇస్తుందని ట్రంప్‌ ఎలా ఆశించాడు, ఆలోచించాడన్నది ఒక చిక్కు ప్రశ్నగా మారింది.కొన్ని దేశాల్లో దళారీ బూర్జువా శక్తులు వ్యక్తిగతంగా తాము లబ్డిపొంది దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా, ఇతర ధనిక దేశాలకు సహకరించినట్లుగానే చైనా కమ్యూనిస్టులు చేస్తారని ఆశించి భంగపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌ నుంచి తనకు చమురు అందకుండా చేసేందుకు అమెరికా కుట్రలు తెలిసిందే. అదే ఇరాన్‌ మీద దాడులు చేస్తూ సంక్షోభ పరిష్కారానికి ఇరాన్ను దారికి తేవాలని కోరటం కూడా ట్రంప్‌ దురాశే.

ఇప్పుడు చైనా అమ్ములపొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి. ఏడాది క్రితం చైనా వస్తువులపై 145శాతం పన్నులు విధిస్తా అంటే తాము కూడా అదే మర్యాద చేస్తామని ట్రంప్‌కు చెప్పారు. తన దగ్గర తిరుగులేని అస్త్రాలు ఉన్నాయని, చైనాను నాశనం చేస్తానని చెప్పటం తప్ప వాషింగ్టన్‌ ఇంతవరకు బయటకు తీసిందేమీ లేదు.చైనా ప్రతి సుంకాలు విధిస్తే మనకు నష్టమా అని ప్రశ్నిస్తే వారు పెద్ద తప్పు చేశారు, మనం దిగుమతి చేసుకొనే వస్తువుల్లో ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం గనుక నష్టపోయేదే వారే అని అమెరికా విత్త మంత్రి స్కాట్‌ బెసెంట్‌ గొప్పలు చెప్పాడు. అటువంటపుడు ట్రంప్‌ చైనా ఎందుకు వెళ్లినట్లు ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తే వాటి తయారీకి అవసరమైన విలువైన ఖనిజాల ఉత్పత్తులను నిలిపివేసి డ్రాగన్‌ వాషింగ్టన్‌లో రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. సముద్రంలో నీరున్నా తాగేందుకు పనికి రాదన్నట్లు అమెరికా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాలను చూసుకొనే స్థితి లేదని గగ్గోలు పెడుతున్నారు. ఒంటరిగా చేయలేమని భావించి పాక్స్‌ సిలికా పేరుతో కొన్ని దేశాలతో కూటమి గట్టింది, వాటి ప్రయత్నాలు ఫలించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంతవరకు ఆగలేమంటూ కార్పొరేట్లు ట్రంప్‌ మీద వత్తిడి తెస్తున్నాయి. చైనాను దెబ్బతీయటంతో పాటు దానికి ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలను తయారు చేసే ఎత్తుగడతో గత పది సంవత్సరాలుగా అక్కడి నుంచి కంపెనీలను తరలించాలని శ్వేత సౌధం వత్తిడి చేస్తున్నది.ఆమేరకు యాపిల్‌ కంపెనీ మనదేశానికి వచ్చినప్పటికీ దానికి ఎదురైన సమస్యలను చూసి మిగిలిన సంస్థలు సాహసించటం లేదు.ఎలన్‌ మస్క్‌ టెస్లా కంపెనీ తయారు చేస్తున్న విద్యుత్‌ కార్లలో సగం చైనాలోనే ఉన్నాయి, అయినప్పటికీ అమెరికా పరిశ్రమను బీజింగ్‌ నాశనం చేయనుందని, గగ్గోలు పెడితే జో బైడెన్‌ సర్కార్‌ 2024లో చైనా కార్లపై వందశాతం దిగుమతి సుంకం విధించింది.అయినా చైనా తగ్గలేదు.

వాణిజ్య అంశాల్లో పరిస్థితి ఇలా ఉంటే రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణ జరిగిన నాటి నుంచీ తైవాన్‌ అంశం నలుగుతూనే ఉంది. ఆ ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తిస్తూనే విడదీసి ప్రత్యేక దేశంగా మార్చాలనే కుట్రలకు అమెరికా తెరతీసింది, టిబెట్‌ను మరోదేశంగా మార్చాలనే ఎత్తుగడతో దలైలామా పేరుతో తిరుగుబాటుకు తోడ్పాటునిచ్చిన సంగతి తెలిసిందే.చైనాకు కేవలం 59 మైళ్ల దూరంలో ఉన్న తైవాన్‌ రక్షణకు 9,500 మైళ్ల దూరం నుంచి వచ్చి యుద్దం ఎలా చేయగలమని ట్రంప్‌ ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌ జర్నలిస్టులను ప్రశ్నించాడు. ఇలాంటి స్పందన గతంలో ఏ అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి రాలేదు. అమెరికన్లు ఎందుకు తైవాన్‌ గురించి ఆందోళన చెందుతున్నారంటే అక్కడి చైనా జాతీయుల గురించి కాదు, ఆధునిక చిప్స్‌ తయారీ ఫ్యాక్టరీల పైనే కన్ను. ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను నాశనం చేస్తామని గతంలో అమెరికా బెదిరించింది.తైవాన్‌ అంశం గురించి చైనా ముందుకు తెస్తే ట్రంప్‌ ఇరాన్‌ గురించి ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి.అమెరికా అధ్యక్ష భవనం విడుదల చేసిన ప్రకటనలో కేవలం 163 పదాలే ఉన్నాయి.హార్ముజ్‌ జలసంధి గురించిన ప్రస్తావన మూడుసార్లు ఉంది.చైనా విడుదల చేసిన ప్రకటనలో అసలు ఇరాన్‌ ప్రస్తావనే లేదు, కేవలం మధ్య ప్రాచ్య పరిస్థితి అనే మాటమాత్రమే ఉంది.

ఇరాన్‌పై విజేతగా బీజింగ్‌ అడుగుపెట్టేందుకు కలలు గన్న ట్రంప్‌కు ఆశాభంగం ఎదురైంది. రెండు రోజుల ట్రంప్‌ పర్యటన తరువాత జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమాసియా సంక్షోభంలో ఎలాంటి సానుకూల పరిణామాలు లేవు. గతంలో మాదిరే ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. పెద్ద ఎత్తున దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కథనాలను వండి వారుస్తున్నారు.మరో నెల రోజుల పాటు సముద్రంలో ఉన్న నౌకలనుంచి రష్యన్‌ ముడి చమురు కొనుక్కొనేందుకు భారత్‌తో సహా కొన్ని దేశాలకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుమతిని పొడిగించాడు.బ్రెంట్‌ రకం ముడిచమురు ధర మంగళవారం నాడు రెండు డాలర్లు తగ్గి 110 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి అమెరికా చమురు వినియోగదారులపై 45 బిలియన్‌ డాలర్ల మేర అదనపు భారం పడింది.అందువలన అనిశ్చితి ఇంకా కొనసాగితే మరింత పెరిగి నవంబరులో జరిగే ఎన్నికల్లో ఓటర్లు ట్రంప్‌కు చుక్కలు చూపించే అవకాశం ఉంది. అనేక దేశాలకు ఎరువుల సరఫరాతో పాటు, వాటి ఉత్పత్తికి అవసరమైన గ్యాస్‌ లభ్యత కూడా తీవ్రంగా మారే అవకాశం ఉంది, ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగాయి. మరికొద్ది వారాల్లో మనదేశంలో ఖరీఫ్‌ తరుణం ప్రారంభం కానుంది.ఎరువులను కేంద్ర ప్రభుత్వం ఎలా అందించనుందో చూడాల్సి ఉంది.యావత్‌ దేశాన్ని కలవర పెడుతున్న అమెరికా దాడులను ఖండించే ధైర్యం లేకపోయినా కనీసం ఆపమని ట్రంప్‌ను నరేంద్రమోడీ ఎందుకు వేడుకోరన్న ప్రశ్నకు జవాబు దొరకటం లేదు !

కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ ఆహ్వానం మేరకు గురు, శుక్రవారాల్లో చైనా పర్యటన జరిపేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం నాడు బీజింగ్‌ చేరుకున్నాడు. అన్ని రోడ్లూ రోమ్‌కే దారి తీసినట్లు ఈ పర్యటన గురించి పెద్ద ఎత్తున ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. పరిణామాలు, పర్యవసానాల గురించి విశ్లేషణలు వెలువడ్డాయి. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్‌ పంపిన తాజా ప్రతిపాదనలను ట్రంప్‌ తిరస్కరించాడు. అదొక చెత్తకాగితమని, దాన్నసలు పూర్తిగా చదవలేదంటూ తాత్కాలిక శాంతి అవగాహన వెంటిలేటర్‌ మీద ఉందని వ్యాఖ్యానించాడు. మరోసారి ఇరాన్‌పై దాడులకు తెగబడేందుకు అమెరికా సిద్దపడుతున్నదని వార్తలు వస్తున్న పూర్వరంగంలో ట్రంప్‌ చైనా పర్యటన జరగనుంది. ఎన్ని బెదిరింపులు చేసినప్పటికీ ఈ యాత్ర ముగిసేవరకు ఎలాంటి దాడులు జరిపే అవకాశం లేదని చెప్పవచ్చు. ఇప్పటికే చైనాతో బేరసారాల్లో బలహీనపడిన అమెరికా మరోసారి దుస్సాహసానికి వడిగడితే మరింతగా చులకనకావచ్చు. నిజానికి ట్రంప్‌ యాత్ర మార్చి 31, ఏప్రిల్‌ రెండవ తేదీలలో జరగాల్సి ఉంది. ముందస్తు పథకం ప్రకారం ఇరాన్‌ మీద దాడి చేసి తన ఆయుధశక్తి, పాటవంతో దాన్ని లొంగదీసుకొని చైనా నేతల ముందు ప్రదర్శించాలని 78 ఏండ్ల ట్రంప్‌ కలలు కన్నాడు.అయితే అనుకున్నదొకటి అయింది ఒకటి బోల్తాపడ్డావులే బుల్‌బుల్‌ పిట్టా అన్నట్లుగా పరిస్థితిమారింది. పులిలా బీజింగ్‌లో అడుగుపెట్టాలనుకొని పిల్లిలా వెళ్లనున్నాడని చెప్పవచ్చు. ఒకేసారి రెండు ప్రధాన అంశాలపై కేంద్రీకరించలేకనే గత పర్యటన వాయిదా వేసుకున్నాడు.ట్రంప్‌ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. తన బీజింగ్‌ పర్యటన భీబత్సంగా (ఆంగ్లంలో వైల్డ్‌ అనే పదం వాడాడు. దీనికి అనేక అర్ధాలు ఉన్నాయి) ఉంటుందని కొంతమంది ప్రపంచ నేతలతో ఫిబ్రవరి నెలలో వర్ణించాడు. ఇరాన్‌తో పంచాయతీ కారణంగా మార్చినెలలో పర్యటనను వాయిదా వేసుకున్నాడు, అది ఇప్పటికీ ఇంకా తెగలేదు అయినప్పటికీ బీజింగ్‌ వెళ్లిరాక తప్పదన్నట్లుగా పరివారంతో బయలు దేరాడు.తనతో పాటు పదహారు లేదా 17 మంది వాణిజ్య, పారిశ్రామిక దిగ్గజాలను బీజింగ్‌ తీసుకుపోతున్నాడు.తొలిసారి అధికారానికి వచ్చిన తరువాత 2017లో ట్రంప్‌ పర్యటన తరువాత మరొక అమెరికా అధినేత డ్రాగన్‌ గడ్డమీద అడుగుపెట్టలేదు. ఆ పర్యటన తరువాత మరుసటి ఏడాది బస్తీమే సవాల్‌ అన్నట్లుగా చైనా మీద ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.అయినప్పటికీ అంతమంది వాణిజ్యవేత్తలతో అడుగుపెడుతున్నాడంటే పైకి ఏమి చెప్పినప్పటికీ చైనాతో వాణిజ్య సంబంధాలను వదులుకొనేందుకు అమెరికన్‌ బహుళజాతి గుత్త సంస్థలు సిద్దంగా లేవన్న సందేశాన్ని ఇచ్చినట్లే. ఇరాన్‌తో వివాదం తెగేంతవరకు ఆగలేమంటూ, ఆలశ్యం చేస్తే బేరసారాల్లో ఇంకా బలహీనపడతామంటూ వారు ట్రంప్‌పై వత్తిడి తెచ్చినట్లు కనిపిస్తోంది. చైనాతో పెట్టుబడులు, వాణిజ్య ఏర్పాట్లపై చర్చకు ట్రంప్‌ పర్యటన జరగనుందని కొందరి విశ్లేషణ.

ఈ సందర్భంగా వాణిజ్యంతో పాటు ఇరాన్‌, తైవాన్‌, పన్నులు, కంప్యూటర్‌ చిప్స్‌,విలువైన ఖనిజాలు ఇతర సమస్యలు కూడా చర్చకు రావచ్చని చెబుతున్నారు.వీటిపై బీజింగ్‌ ధృడమైన వైఖరితో ఉంది.తన విదేశాంగ విధానం విజయవంతమైందని నవంబరులో జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల ముందు ప్రదర్శించుకొనేందుకు కూడా ట్రంప్‌ చూస్తున్నాడు.లక్ష కోట్ల డాలర్ల మేర చైనా పెట్టుబడులు, వాణిజ్య విమానాల కొనుగోలు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అమెరికా కోరుకుంటోంది.వారు గనుక లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులతో అమెరికాలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తాయని జనవరిలో డెట్రాయిట్‌ ఎకనమిక్‌ క్లబ్‌ సమావేశంలో ట్రంప్‌ చెప్పాడు.అయితే ఇప్పుడు పెట్టుబడులపై ఒప్పందం కుదరకపోవచ్చని, ఇరాన్‌ అంశం ట్రంప్‌ స్థితిని బలహీనపరిచిందని, అమెరికా మిలిటరీ బలహీనతలు ఏమిటో వెల్లడైనందున గతంలో మాదిరి పొగరుగా మాట్లాడటం కుదరదని చెబుతున్నారు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత కూడా అంతకు ముందు మాదిరే దూకుడును ప్రదర్శించాడు. అయితే చైనా ఏమాత్రం వెనక్కు తగ్గకపోవటంతో బీజింగ్‌ను సంతుష్టీకరించేందుకు కొన్ని బిస్కెట్లు కూడా వేశాడు.చైనా విద్యార్థుల వీసాలకు అనుకూలంగా నిర్ణయం,ఆధునిక ఏఐ చిప్స్‌ను ఎగుమతి చేసేందుకు అంగీకరించటం, తైవాన్‌కు ఆయుధసరఫరా పాకేజ్‌ల నిలిపివేత, చైనాలో మానవహక్కులు లేవన్న ఆరోపణలపై మౌనం,చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై ధ్వజమెత్తే మంత్రుల నోళ్ల కట్టడి, షీ జింపింగ్‌ మంచి స్నేహితుడని, అద్భుతమైన సంబంధాలను కలిగి ఉన్నామని పదే పదే స్వయంగా చెప్పటం వంటి అంశాలున్నాయి. తాను ఈసారి అక్కడకు వెళ్లినపుడు తనను షీ జింపింగ్‌ గట్టిగా హత్తుకుంటాడని కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించాడు. అయితే చైనా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు, పొగడ్తలకు పొంగిపోలేదు. గతేడాది దక్షిణ కొరియాలో ట్రంప్‌-షీ జింపింగ్‌ భేటీలో వాణిజ్య పోరు మీద రాజీకుదిరింది. ట్రంప్‌ జరిపే పర్యటన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత చెడగొట్టకుండా ఉంటే చాలు అని కూడా కొందరు అమెరికన్లు భావిస్తున్నారు.ఇరాన్‌ వ్యవహారంలో తప్పుడు లెక్కలు వేసుకున్నట్లుగా బీజింగ్‌తో వ్యవహరిస్తే ప్రమాదకరమని కూడా హెచ్చరిస్తున్నారు. గతంలో తమను ఉపయోగించుకొని చైనా, ఇతర దేశాలు ఎంతగానో లాభపడ్డాయని, ఇక ముందు అలా జరగటానికి వీల్లేదని చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు చైనా విషయంలో మాట మార్చాడు. పన్నులు, విలువైన ఖనిజాలు, కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాల్లో తలెత్తిన ఉద్రిక్తతలను పెద్దవేమీ కాదన్నట్లుగా మాట్లాడటమే కాదు, చైనాతో ఎంతో వాణిజ్యం చేస్తూ లబ్ది పొందినట్లు చెప్పాడు.

ఇటీవలి కాలంలో తలెత్తిన విబేధాలతో ఎవరికి వారు ప్రత్యామ్నాయాలను చూసుకుంటూనే ఉన్నారు. తైవాన్‌తో సంబంధాలు కలిగిన ఒక్క దేశంతో తప్ప మిగిలిన అన్ని ఆఫ్రికా దేశాల నుంచి చేసుకొనే దిగుమతులపై ఎలాంటి పన్నులు ఉండవని చైనా తాజాగా ప్రకటించింది.ఈ చర్య తన వస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచుతుందని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా గణాంకశాఖ సమాచారం ప్రకారం 2022లో చైనా దిగుమతుల కంటే గతేడాది 50 బిలియన్‌ డాలర్ల మేరకు తక్కువ ఉన్నాయి. సోయాబీన్స్‌ కొనుగోలును చైనా నిలిపివేసింది.గతేడాది చైనా వాణిజ్య మిగులు 202బిలియన్‌ డాలర్లు ఉంది, తమ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసి లోటును తగ్గించాలని అమెరికా కోరుతోంది.మరోవైపు చైనా బదులు తైవాన్‌ ప్రాంతం నుంచి ఎక్కువగా కంప్యూటర్‌ చిప్స్‌, సర్వర్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది.మూడవ దేశాల ద్వారా చైనా వస్తువులను ఎగుమతులు చేస్తోంది. చైనా నుంచి 2017లో అమెరికా దిగుమతి చేసుకున్న వస్తువుల వాటా 22శాతం ఉండగా ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో కేవలం 7.5శాతం మాత్రమే ఉన్నాయి.వాషింగ్టన్‌ వస్తు దిగుమతులను ఆయుధంగా మార్చటం ఇది సూచిస్తున్నది.చైనాతో ఒప్పందం కుదుర్చుకోక ముందు దిగుమతి పన్ను 145శాతం విధిస్తూ ట్రంప్‌ కత్తి గట్టిన సంగతి తెలిసిందే.

జరుగుతున్న పరిణామాలను చూస్తున్నపుడు రెండుదేశాల మధ్య ప్రచ్చన్న యుద్దం జరుగుతున్నట్లు వేరే చెప్పనవసరం లేదు.కమ్యూనిస్టు చైనాను మొగ్గలోనే తుంచివేసేందుకు అసలు ఐరాసలో సభ్యత్వమే లేకుండా చేసేందుకు తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్నే అసలైన చైనాగా 1970దశకం వరకు గుర్తించిన సంగతి తెలిసిందే.తరువాత బీజింగ్‌ చేపట్టిన సంస్కరణలను అవకాశంగా తీసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టి చౌకగా వస్తువులను తయారు చేసి వాటిని దిగుమతి చేసుకొని అమెరికా, ఇతర ధనిక దేశాలు లబ్దిపొందాయి.ఎప్పుడైతే చైనా బలపడి తమకు సవాలు విసురుతోందని గ్రహించిందో అమెరికా అప్పటి నుంచి కట్టడి చేసేందుకు పూనుకుంది. దాన్ని సవాలుగా తీసుకున్న చైనా అనేక విజయాలతో ముందుకు పోతున్నది. వర్తమానానికి వస్తే చైనాకు అవసరమైన చమురు, గ్యాస్‌ను ఆయుధాలుగా చేసుకొని అమెరికా తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తోంది.మరోవైపున కృత్రిమ మేథ, చిప్స్‌తో వాణిజ్య సమతూకాన్ని సాధించాలని పావులు కదుపుతున్నది.దాన్లో భాగంగానే చిప్స్‌ను ఎగుమతి చేయరాదని, వాటి తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాలను సరఫరా చేయకుండా ఆంక్షలు విధించింది. ఆ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తున్న బీజింగ్‌ ఎలక్ట్రానిక్స్‌ పరికరాలకు అవసరమైన విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తులపై పట్టుసాధించటంతో పాటు విద్యుత్‌ వాహనాలు, సౌరపలకల వంటి రంగాల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. గతేడాది చైనా తయారీ మోటారు వాహనాలు ప్రపంచ ఎగుమతుల్లో 21శాతానికి చేరాయి.అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ఐరోపా దేశాల కంటే చౌకగా విద్యుత్‌ వాహనాలను చైనా విక్రయిస్తోంది. చమురు అందకుండా చేయాలన్న అమెరికా ఎత్తుగడకు ప్రతిగా ప్రత్యామ్నాయంగా సౌరవిద్యుత్‌ తయారీకి అవసరమైన ఏర్పాట్లతో పాటు పలకలను తయారు చేసి ఇతర దేశాలకు సైతం పెద్ద ఎత్తున ఎగుమతి చేసేదిగా చైనా తయారైంది.ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం దాని సౌరపలకల ఎగుమతులకు అనుకోని వరంలా మారింది.ప్రత్యామ్నాయ, హరిత ఇంథన వనరుల అభివృద్ధికి పూనుకున్న దేశాలన్నీ వాటిని దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికాకు జపాన్‌, చైనా ఇస్తున్న అప్పుల సంగతి తెలిసిందే.ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు పెట్టాలంటే వాషింగ్టన్‌ వద్ద పెట్టుబడులు లేవు, అందుకే పన్నులను ఆయుధాలుగా చేసుకొని తమ దేశంలో పరిశ్రమలు పెడితే రాయితీలు ఇస్తానని షరతులు పెడుతున్నాడు.

చైనాతో వైరం వలన తమకు వచ్చే లాభం లేదని అమెరికన్‌ కార్పొరేట్లు ఒక నిర్ణయానికి రాకుండా ఇంత మంది కట్టుగట్టుకొని ట్రంప్‌తో పాటు పొలోమంటూ బయలు దేరరు. అమెరికా ఎదురుదాడి చేస్తే ప్రతిఘటిస్తున్న ఇరాన్‌ మాదిరి చైనా కూడా అవసరమైన మేర ఆర్థిక రంగంలో ప్రతిఘటిస్తున్నది తప్ప తానే దాడి చేసేందుకు పూనుకోవటం లేదు, అవసరమూ లేదు. సంఘర్షణ రెండు దేశాలకూ నష్టమే. దాన్ని నివారించాలంటే ప్రధాన బాధ్యత అమెరికాదే అవుతుంది. యావత్‌ ప్రపంచాన్ని చాపచుట్టలా తన చంకలో పెట్టుకోవాలన్న దురాలోచనకు అది స్వస్థి పలికితే అనేక సమస్యలు సులభంగా పరిష్కారమౌతాయి. ప్రపంచ పెత్తనం సాధ్యం కాదని ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా దానికి అర్ధం కావటం లేదు. రెండు దేశాల మధ్య ప్రధాన వివాదం తైవాన్‌ విలీనం. ఏదో ఒకసాకుతో దాన్ని అడ్డుకొని స్వతంత్ర దేశంగా మార్చి చైనా పక్కలో బల్లెంగా తయారయ్యేందుకు అమెరికా చూస్తున్నది. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వమిచ్చి రష్యా ముంగిట తన ఆయుధాలను మోహరించాలని పన్నిన ఎత్తుగడ వికటించినా వాషింగ్టన్‌కు బుద్ధి రావటం లేదు. ఐరాస, చివరికి అమెరికా కూడా తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తించిన తరువాత కూడా విలీనాన్ని అడ్డుకుంటే చైనా చూస్తూ ఊరుకోజాలదు, అయితే వెంటనే అది జరగకపోయినా ఇబ్బంది లేదు గనుక తమాయిస్తున్నది. తెగేదాకా లాగితే స్వాధీనం పెద్ద కష్టమేమీ కాదు. తాజా పర్యటనలో ట్రంప్‌ దీనితో పాటు ఇతర వివాదాలపై చైనాతో సఖ్యతకు ప్రయత్నిస్తాడా, గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడా, చూద్దాం !

పెట్రో బాదుడుకు రంగం సిద్దం చేసిన ” మోడీ బాబా ” ! పొదుపు చేయని వారు దేశభక్తులు కాదా !!

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు పొదుపోపదేశం చేశారు. ఇంకేముంది పొలోమంటూ కాన్వారులను తగ్గించుకుంటున్నట్లు అనేక మంది ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారు సరేసరి. ప్రధానికి ఇంత ఆకస్మికంగా జ్ఞానోదయం ఎందుకు కలిగినట్లు అని ”దేశంకోసం-దర్మం కోసం ” ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. విదేశీ మారకద్రవ్యం, ఇతర అంశాల సమస్యలు ఇప్పటికిప్పుడు తలెత్తాయా ? నిజం అయితే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని ఎందుకు ప్రకటించటం లేదు. ముందు జాగ్రత్త అని బిజెపి నేతల ముక్తాయింపు.జనాల్లో అదెప్పుడూ ఉంటుంది. విడ్డూరం గాకపోతే వారు చెబితేనే జాగ్రత్తపడతరా ! ఇక చమురు ధరలను పెంచకతప్పదని కేంద్ర చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు చెప్పకనే చెప్పారు. బుధవారం నాడు మరోసారి మోడీ సందేశం. నిజానికి అది మంత్రులకు కాదు, జనానికే. అనివార్యమై ధరలను పెంచామని చెప్పబోతున్నారు. నిర్ణీత వంద కొరడా దెబ్బలను ఒకేసారి తింటారా దశలవారీనా అన్నది తేల్చుకోవాలని జనాలకు అవకాశం ఇస్తున్నారు తప్ప నూరు వాతలు తప్పవు.ఇప్పటికే ఆమేరకు మీడియాకు తాజా లీకులు వదిలారు. పెట్రోలు మీద లీటరుకు రు.14, డీజిల్‌ మీద రు.42, గృహవినియోగ ఎల్‌పిజి సిలిండరు మీద రు.674 నష్టం వస్తున్నదన్నది వాటి సారం. చమురు, గ్యాస్‌ సబ్సిడీలను ఎత్తివేసినందున ఏదో ఒక రూపంలో జనాలు ఈ మేరకు భరించటానికి సిద్దపడాలనే సందేశం ఇప్పటికే చేరవేశారు. వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్‌ ధరలను ఎలా పెంచిందీ చూశాము. రోజుకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చమురు కంపెనీలకు నష్టం వస్తున్నదనిపూరీ చెప్పారు. ధరల పెంపుదల గురించి అడగ్గా మీకు తెలియనిదేముంది ప్రధాని నరేంద్రమోడీ ”భవిష్యత్‌ దార్శనికుడు ” అన్నట్లుగా చెప్పారు. అంటే ఆదివారం నాడు (2026 మే 10) హైదరాబాదులో చేసిన ఒక విలక్షణ ప్రసంగంలో మోడీ యమలీలను గుర్తు చేశారు. ఎప్పుడూ చేసే రాజకీయాలను వదల్లేదు గానీ ఇతర విషయాలే మీడియాలో పతాకశీర్షికలయ్యాయి,విశ్లేషణలు వెలువడ్డాయి.మన్‌కీ బాత్‌ పేరుతో 2014 అక్టోబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రేడియోలో నెలకు ఒకసారి చొప్పున 113సార్లు మోడీ ప్రసంగించారు. ఎంతమంది ఎన్నింటిని విన్నారో ఎవరికి వారు లెక్కవేసుకోవాల్సిందే. ఒక సర్వే ప్రకారం ఐదుశాతం మంది శ్రోతలు మాత్రమే ఆలకించినట్లు తేలింది. అలాంటి ప్రసంగమే హైదరాబాద్‌లో చేశారని చెప్పవచ్చు. దానిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసిన సమీక్షల సారం ఏమిటంటే ఇంథన ధరలను పెంచకతప్పదనే మహత్తర సందేశాన్ని ప్రధాని దేశానికి అందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే పెంచుతారని ఊరూవాడా భావించారు. అయితే వెంటనే ఆ ప్రకటన వెలువడలేదు. కారణం ఏమిటంటే అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి కుదిరి సాధారణ పరిస్థితి ఏర్పడుతుందనే వార్తలు రావటం ఒకటి. నిజంగా అది జరిగితే ధరలు ఎందుకు పెంచారని జనం ప్రశ్నిస్తారు. రెండవది ప్రతిపక్షాలు చెప్పింది వాస్తవమే అని నిర్ధారించుకుంటారు. ఇప్పుడు ఏ పేరుతో పెంచాలా అని మధనపడుతున్నారు.ఊహించని విధంగా పశ్చిమాసియా సంక్షోభం కొనసాగటం మోడీ పరివారానికి అవకాశమిస్తున్నదని చెప్పవచ్చు.

ఇజ్రాయెల్‌ నెతన్యాహు, అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ మాటలను నమ్మి వారం రోజుల్లో ఇరాన్‌ పని అయిపోతుంది లెమ్మని కేంద్రంలోని పెద్దలు తడిబట్ట వేసుకొని పడుకున్నారని సంక్షోభ ప్రారంభంలో వారి తీరుతెన్నులే స్పష్టం చేశాయి. ఏ రోజు తిరిగి దాడులు మొదలౌతాయో తెలియని స్థితి. ఆందోళనలో ఉన్న వారికి బిపి పెరుగుతూ తగ్గుతూ ఉండే మాదిరి యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ మార్కెట్‌ చమురు ధరలు ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో మన స్టాక్‌ మార్కెట్‌ ఈ కారణంగానే భారీగా పతనమైంది. ఇప్పటికే చమురు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ వార్తలను రాయిస్తున్నారు. గతంలో ప్రత్యేక పన్నులు, సెస్‌ల రూపంలో బాదిన బాదుడుకు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లలో రాబడి పెరిగినపుడు ఏ మీడియా కూడా ఆ వార్తలను ప్రముఖంగా రాయలేదు గతంలో లాల్‌బహుదూర్‌ శాస్త్రి పాక్‌తో యుద్దం వచ్చినపుడు ఇచ్చిన పిలుపు మాదిరే ఇప్పుడు తమ మోడీ దేశ పౌరులకు పొదుపు విజ్ఞప్తి చేశారు తప్ప బలవంతం చేయటం లేదని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు.నాడు యుద్ధం వచ్చింది గనుక శాస్త్రి ఆ పిలుపు ఇచ్చారు, ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కూడా లేవు, అంతా సజావుగానే ఉందని చెబుతూ ఆ పిలుపు ఇవ్వటం ఏమిటి ? మచ్చుకు మోడీ ప్రవచించిన పది సుభాషితాల్లో కొన్నింటిని చూద్దాం. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్న లోకోక్తి తెలిసిందే.

” దేశం కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు, దేశం కోసం బతకడం,దేశ కర్తవ్యం కోసం పాటు పడటమూ దేశభక్తే ” అని మోడీ చెప్పారు. పొదుపును కూడా దేశభక్తికి ముడిపెట్టారు.ఇదే ప్రమాదకరం. పొదుపు పాటించనివారు దేశభక్తులు కాదనే భావాన్ని చెప్పకనే చెప్పారు. కడుపునిండా తినటానికి తిండిలేదనే కదా ఎనభై కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఐదేసి కిలోల ఉచిత బియ్యం లేదా గోధుమలను ఇస్తోంది.వారిని పొదుపు చేయమంటే ఆ ఉచితాన్ని వదులుకోవాలి మరి. వంట నూనె వాడకం తగ్గించటం కూడా దేశభక్తే అన్నారు. పొదుపు గురించి దేశ పౌరులకు మోడీ చెప్పాల్సినపని లేదు.మన జీన్స్‌లోనే ఉంది.అవసరమైన మేరకే వస్తువులను వాడతారు. ” సాధ్యమైన మేరకు ఇంటి నుంచే పని చేసే పద్దతి అనుసరించండి, అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు, ఇంథనాన్ని పొదుపుగా వాడండి ” మోడీ సుభాషితాల్లో ఒకటి. ఈ చర్యకు ప్రధానే స్వయంగా శ్రీకారం చుట్టి ఉంటే బాగుండేది. హైదరాబాదు వచ్చి ఎక్కడో జరిగే పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసే బదులు అదేదో ఢిల్లీ నుంచే చేయవచ్చు, గతంలో అనేక సార్లు అలా చేశారు.వేలాది మంది పోలీసులు, ఇతర ఏర్పాట్లకు అనవసర ఖర్చు, ఆయాసమూ తప్పేది, ట్రాఫిక్‌ ఆంక్షల వలన అదనపు దూరం ప్రయాణించిన వాహనదారులకు అదనపు పెట్రోలు, డీజిలు కలసి వచ్చేది.మోడీ స్వయంగా చెప్పినట్లు దేశం ఇంతటి ఇబ్బందుల్లో ఉన్నపుడు లక్షల మంది జనాన్ని తెలంగాణా అంతటి నుంచి ఎండల్లో రప్పించటానికి వాహనాలకు పెద్దమొత్తంలో ఇంథనం ఖర్చు చేయటం అవసరమా ? అందువలన పొదుపు గురించి ఇతరులకు చెప్పేముందు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా ? మధ్య ప్రదేశ్‌లో బిజెపి రాజకీయ నిరుద్యోగి సౌభాగ్య సింగ్‌ ఠాకూర్‌కు పాఠ్యపుస్తకాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు.దానికి ప్రమాణస్వీకారం కోసం డజన్లకొద్దీ వాహనాలతో ఉజ్జయని నుంచి భోపాల్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరం అనుయాయులతో అట్టహాసంగా వెళ్లారు. బిజెపి నేతల పొదుపు ఇలా ఉంటుంది. హైదరాబాద్‌ ఉపన్యాసంపై తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత మోడీ తన కాన్వారును గణనీయంగా తగ్గించుకున్నట్లు చెబుతున్నారు.కొత్తగా కొనుగోలు చేయకుండా విద్యుత్‌ వాహనాలను వినియోగించాలని చెప్పినట్లు వార్త. ఇదంతా పౌరుల మీద భారం మోపే ప్రచార ఎత్తుగడే.విదేశీ ప్రయాణాలు వద్దంటూ చెప్పిన మోడీ వారం రోజుల పాటు ఐదు దేశాల కార్యక్రమం పెట్టుకున్నారు. గతంలో నెహ్రూ 44సార్లు విదేశీ పర్యటనలు చేస్తే మోడీ సెంచరీ కొట్టారు.

ఏడాది పాటు బంగారం కొనవద్దంటూ మరో సలహా ! తరువాత కొనుగోలు చేయవచ్చా ? ధరలు ఇప్పటికిప్పుడే పెరగలేదే ! ఏడాది పాటు మారుటోరియం ఎందుకు సూచించారు. రూపాయి విలువను కాపాడలేని కేంద్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా డాలర్లకు కొరత ఏర్పడుతోంది.మన స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసిన విదేశీయులందరూ వాటాలను అమ్మివేసి డాలర్లలో తమ దేశాలకు తరలించుకుపోతున్నారు. 2025 ఏడాది మొత్తంలో 2.4లక్షల కోట్ల రూపాయలను తరలిస్తే ఈ ఏడాది మే 11వ తేదీ నాటికే 2.28లక్షల కోట్లు దాటాయని వార్తలు.మే ఒకటవ తేదీతో ముగిసిన వారంలో 7.794 బిలియన్‌ డాలర్లు మన విదేశీ మారకద్రవ్యంలో తగ్గి 690.693 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతి ప్రోత్సాహ పథకాల వంటి ఎన్ని కబుర్లు చెప్పినా, రాయితీలు ఇచ్చినా దిగుమతులు పెరుగుతున్నాయి తప్ప ఎగుమతులు పెరగటం లేదు. అయినా విదేశీ వస్తువులు వాడవద్దని ప్రధాని చెబుతారు, దిగుమతులకు ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ఏటా మన దేశం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నది.ముడి చమురు తరువాత బంగారానికే ఎక్కువగా విదేశీమారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది.బంగారంతో నగలు చేయించేందుకు కొంత మందికి పని కల్పించవచ్చు తప్ప నిజానికి అది ఉత్పాదతకు పనికి వచ్చేది కాదు. గత కొద్ది సంవత్సరాలుగా పసిడి ధర పెరుగుతూనే ఉన్నప్పటికీ మోడీ మాట్లాడ లేదు. గతంలో బంగారం దిగుమతులపై పన్ను ఎక్కువగా ఉన్న కారణంగా దొంగరవాణా పెరిగిందని తగ్గించారు. తాజాగా దిగుమతి పన్ను, సెస్‌లు కలిపి ఆరు నుంచి 15శాతానికి పెంచారు. నిరంతరం దిగుమతులు తప్ప ఎగుమతులు పెరగటం లేదు. ఒకదశ దాటిన తరువాత చెల్లింపుల సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయవద్దని, వివాహాలు విదేశాల్లో చేయవద్దని చెప్పారు. విదేశాలు లేదా పొరుగు రాష్ట్రాల్లోని విలాసవంతమైన ప్రాంతాల్లో వివాహాలు చేసేవారందరూ శతకోటీశ్వరులు తప్ప సామాన్యులు కాదు.మోడీ తన పాలనా కాలంలో కోటీశ్వరులు, శతకోటీశ్వరులను పెంచారు తప్ప తగ్గించలేదు.తాను అధికారానికి వచ్చినపుడు కేవలం 70మంది బిలియనీర్లు ఉంటే 2026నాటికి 308పెరిగారు.కోటీశ్వరుల గురించి చెప్పాల్సిందేముంది ! సామాన్యుల వద్ద ఉన్న సంపదశాతం తగ్గుతున్నదని అనేక విశ్లేషణలు వెల్లడించిన సంగతి తెలిసిందే.వారంతా సొమ్మును విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేయక ఏం చేస్తారు !

స్వదేశీ ఉత్పత్తి పెరగాలంటారు. దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా ఆయన పలుకుబడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 95చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ ఏం చేస్తున్నట్లు ? దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకాన్ని చూస్తే 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే.తాజాగా చమురు ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సిన రాయల్టీ తగ్గించి ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.

మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26లో రు.2.07 లక్షల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40, ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 ఇటీవలి వరకు వసూలు చేశారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు పెట్రోలు మీద ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.3 పైన పేర్కొన్న రెండు సెస్‌లు కలిపి రు.8.50, డీజిలుపై సెస్‌ రు.6 కొనసాగుతోంది.ఇప్పుడు మార్కెటింగ్‌ కంపెనీలకు నెలకు లక్ష కోట్ల నష్టం వస్తుందని గుండెలు బాదుకుంటున్న మంత్రి పూరీ ఇన్నేండ్లుగా మోడీ ఏలుబడిలో వినియోగదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం అంతకుముందున్నదాని కంటే అదనంగా వసూలు చేసిన రు.16.5లక్షల కోట్ల ప్రత్యేక ఎక్సయిజ్‌ పన్ను సంగతి మాట్లాడరేం.

పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు నంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంథనంపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బాబాల మాదిరి పొదుపు గురించి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు.గణనీయంగా తగ్గించాల్సిందిపోయి పెంచకపోవటం తమ ఘనత అని చెప్పుకుంటున్నారు.ఇది గోబెల్స్‌ పద్దతి. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత ధర పెరుగుతున్నది. మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర మార్చినెల 25వ తేదీ వరకు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఏప్రిల్‌లో 114.48, మే పన్నెండవ తేదీవరకు 105.09 డాలర్లు, అంటే నాలుగేండ్ల నాటి స్థాయికి చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం ఇది.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఇరాన్‌పై దాడులు ప్రారంభం ఫిబ్రవరి 28న కాగా అంతకు ముందు 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. జనం జేబులు కొట్టాలనుకున్నపుడు మాత్రం ఈ విధానం గుర్తుకు రాదు, కేంద్రానికి సెగ తగలగానే మళ్లీ మొదలు పెడతారా ? చావు తెలివితేటలు !

ట్రంప్‌కు చెప్పుకోరాని చోట తగిలిన దెబ్బ: ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌పై ఇరాన్‌ దాడి ఆంతర్యం ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

తాజాగా ఇరాన్‌-అమెరికా మధ్య జరిగిన కాల్పులు ప్రేమతో జరుపుకున్నవే అని డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం నాడు వ్యాఖ్యానించాడు.(రోడ్దు మీద ఒక వాహనాన్ని మరొక వాహనం కొట్టినపుడు పెద్దగా నష్టం జరగకపోతే రెండూ ముద్దు పెట్టుకున్నాయని సరదాగా చెప్పుకోవటం వంటిది) రెండు దేశాల మధ్య శాంతి చర్చలు దోబూచులాడుతున్న సమయంలో ఇలా మాట్లాడటం గమనించదగిందే అయినా ట్రంప్‌ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులను ప్రారంభించటమైతే చేసింది గానీ, ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి అమెరికా నానా ఇబ్బందులు పడుతున్నది.ఇరాన్‌ దాడుల్లో జరిగిన నష్టం గురించి ట్రంప్‌ చెప్పుకోలేడు, అలాగని దాచుకోలేడు.చెప్పకపోతే ప్రాణం పోతుంది చెప్పుకుంటే పరువుపోతుంది..గల్ఫ్‌లోని పదిహేను అమెరికా మిలిటరీ కేంద్రాలలో 228 కట్టడాలు, ధ్వంసమైన పరికరాలకు సంబంధించి ఇటీవల ఇరాన్‌ కొన్ని చిత్రాలను విడుదల చేసింది.వాటిలో విమానాలను నిలిపే ప్రాంతాలు, చమురు డిపోలు,విమానాలు, రాడార్లు, సమాచార వ్యవస్థల వంటివి ఉన్నాయి. ఆ చిత్రాలు నిజమైనవా లేక కృత్రిమ సృష్టి అని చెప్పలేక అమెరికా ఏవేవో చెబుతున్నది.ఎవరెన్ని చెప్పినా ఇరాన్‌ గురిచూసి దెబ్బతీసింది.ట్రంప్‌ చెప్పినట్లుగా మరిన్ని దాడులకు పాల్పడితే ఇదే మాదిరి పరాభవం ఎదురుకావచ్చనే హెచ్చరికలే భూతల దాడులకు దిగకుండా అమెరికా మిలిటరీ జాగ్రత్తపడుతున్నదని చెప్పవచ్చు.గల్ఫ్‌లోని కొన్ని మిలిటరీ కేంద్రాలు దాడులకు పనికి రాకుండా పోయినట్లు చెబుతున్నారు. ఇరాన్‌పై దాడులతో తమకు 25బిలియన్‌ డాలర్ల మేర నష్టం వచ్చినట్లు రక్షణశాఖ కబుర్లు చెప్పినప్పటికీ 50బిలియన్‌ డాలర్లకు పైమాటే ఉంటుంది.పశ్చిమాసియా, మధ్య ప్రాచ్య ప్రాంతంలో జరిగిన నష్టాలకు సంబంధించిన చిత్రాలను విడుదల చేయవద్దని వాణిజ్య ఉపగ్రహ కంపెనీలను ట్రంప్‌ యంత్రాంగం ఆదేశించిందంటేనే అది ఎంతగా మూసిపెడుతోందో తెలుస్తోంది. ఇరాన్‌ విడుదల చేసిన చిత్రాలు చైనా, రష్యా ఉపగ్రహాలు తీసినవని వేరే చెప్పనవసరం లేదు. గురిచూసి అమెరికా లక్ష్యాలను దెబ్బతీయటం కూడా ఆయా దేశాలు అందించిన సమాచారం, ఐరోపా సంస్థలు విడుదల చేసిన సమాచారం, చిత్రాలతోనే సాధ్యమైంది.

ఏప్రిల్‌ ఎనిమిది నుంచి ఇరాన్‌-అమెరికా మధ్య కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది.రెండు దేశాల మధ్య పరస్పర దాడులు నిలిచిపోయాయి.అమెరికా కారణంగా ఇస్లామాబాద్‌లో తొలి చర్చలు విఫలమైన తరువాత ఇంతవరకు దోబూచులాట తప్ప మలి చర్చలు ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం నాడు తమపై ఇరాన్‌ 15ఖండాంతర,మూడు క్రూయిజ్‌ క్షిపణులు,నాలుగు డ్రోన్లతో దాడులు చేసిందని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆరోపించింది. (యుఏయి-దుబాయి అంటే అందరికీ బాగా తెలుస్తుంది.దుబారు, షార్జా, అబూదాబీ వంటి ఏడు ప్రాంతాలు కలసి ఉన్నదేశాన్ని ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌గా వ్యవహరిస్తారు, 1971లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది, రాజధాని అబూదాబీ, కోటి పది లక్షల మంది జనాభా ఉండగా దుబారు పెద్ద నగరం) కాల్పుల విరమణ అవగాహన తరువాత ఇదే పెద్ద దాడి.దుబారు చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఫుజాయిరా రేవుపై జరిగినదాడిలో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని వార్తలు. ముగ్గురు భారతీయ కార్మికులు గాయపడ్డారు.హార్ముజ్‌ జలసంధితో నిమిత్తం లేకుండా వేరే మార్గంలో చమురు ఎగుమతులు చేసేందుకు ఈ రేవు అనువుగా ఉంది. జలసంధి వెలుపల తిష్టవేసిన అమెరికా ప్రతి రోజూ ఇరాన్ను రెచ్చగొట్టేందుకు చూస్తున్నది, బలవంతంగా జలాల్లో ప్రవేశించేందుకు పూనుకుంది. అందువల్లనే ఇది పధకం ప్రకారం చేసిన దాడి కాదని, ”అమెరికా మిలిటరీ దుస్సాహసానికి ” ప్రతి స్పందన అని ఇరాన్‌ వర్ణించింది.ఇప్పటి వరకు హార్ముజ్‌ జలసంధి వెలుపలనే తిష్టవేసిన అమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలోకి చొరబడేందుకు చూసినపుడు తాము దాడి చేసినట్లు ఇరాన్‌ ప్రకటించగా అబ్బే అలాంటిదేమీ లేదని ట్రంప్‌ చెప్పుకున్నాడు. ఇరాన్‌ దాడి వెనుక అనేక అర్ధాలు, అంశాలు ఉన్నాయి.గల్ఫ్‌ దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా ఎమిరేట్స్‌ను ఒంటరి పాటు చేసేందుకు ఇరాన్‌ పూనుకుందని చెప్పవచ్చు. దుబాయిపై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్లు మోడీ సర్కార్‌ స్పందించింది. రుణాలు చెల్లించాలని పాకిస్తాన్‌పై రుణాల చెల్లింపుకు ఎమిరేట్స్‌ వత్తిడి చేయటం వెనుక మనదేశం కూడా ఉందని వ్యాఖ్యలు వెలువడిన పూర్వరంగంలో కృతజ్ఞతగా ఇలా స్పందించిందని చెప్పవచ్చు. తరువాత ఎలాంటి పరిణామాలు జరగలేదు గనుక ఒక వ్యూహంలో భాగంగా ఇరాన్‌ దాడిని చెప్పవచ్చు.

పశ్చిమాసియా పరిణామాల్లో గల్ఫ్‌ దేశాల పాత్ర గురించి మీడియా అంతగా కేంద్రీకరించకపోవటానికి కారణం వార్తా సంస్థలను పశ్చిమదేశాలు నియంత్రించటమే.చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల బృందం(ఒపెక్‌) నుంచి దుబాయి ఎందుకు ఆకస్మికంగా బయటకు వచ్చింది ?దాని వెనుక ఉన్న కథేంటి అన్నదితెలుసుకోవాలి.గల్ఫ్‌ దేశాల్లో గతంలోనే విబేధాలు ఉన్నప్పటికీ అవి ఈ సందర్భంగా మరింతగా బయటకు వచ్చాయి. తాము పధకం ప్రకారం దాడి చేయలేదని, నియంత్రణల్లో ఉన్న హార్ముజ్‌ జలసంధి నుంచి నౌకలకు దారి కల్పించేందుకు అమెరికా చేసిన మిలిటరీ దుస్సాహసానికి స్పందనకు ఫలితమని ఇరాన్‌ అధికారి చెప్పాడు. అంతకు ముందు నౌకలకు దారి కల్పిస్తామని అమెరికా ప్రకటించింది.ఈ క్రమంలో ఒక యుద్ధ నౌకపై ఇరాన్‌ రెండు క్షిపణులను ప్రయోగించింది. తాము వేగంగా వచ్చి దాడులు చేసే ఆరు ఇరాన్‌ నౌకలపై కాల్పులు జరిపామని, వాటిని ముంచివేశామని, ఇరాన్‌ దాడిలో దెబ్బతిన్నది దక్షిణ కొరియా నౌక తప్ప తమది కాదని అమెరికా చెప్పుకుంది.ఎమిరేట్స్‌పై దాడి పెద్ద విషయం కాదని,చర్చల్లో ఇరాన్‌ ఎంతో నయంగా ఉందనికూడా ట్రంప్‌ వ్యాఖ్యానించాడు.

ఇరాన్‌ మీద దాడి చేసిన ఇజ్రాయెల్‌కు యుఏయి ఎంతో సన్నిహితంగా ఉంది.లాంఛనంగా రక్షణ ఒప్పందం లేకున్నప్పటికీ అదే మాదిరి రెండు దేశాలూ వ్యవహరిస్తున్నాయి.ఇరాన్‌ దాడుల నుంచి రక్షణకు గగనతల వ్యవస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసింది.టెహరాన్‌పై ఇజ్రాయెల్‌ దుష్ట పథకాలకు ఎమిరేట్స్‌ ఎప్పటి నుంచో సాయపడుతున్నది. అమెరికా స్థావరాలకు చోటు కల్పించటమేగాక దాడులకు సైతం తమ వైమానిక స్థావరాల సౌకర్యాలను వినియోగించుకొనేందుకు ఎమిరేట్స్‌ సహకరించిందని,ఒమన్‌, మరొక దేశం మీద ఇజ్రాయెలే దాడిచేసి తాము చేసినట్లుగా చిత్రించేందుకు కూడా తోడ్పడినట్లు ఇరాన్‌ నిర్ధారించుకున్నది.తమ గురించి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు అవసరమైన ఏఐ మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చినట్లు టెహరాన్‌ భావిస్తున్నది.అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జయెద్‌(ఎంబిజెడ్‌) ఇజ్రాయెల్‌ మొసాద్‌, అమెరికా సిఐఏలతో కలసి పశ్చిమాసియా-మధ్య ప్రాచ్య ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నాడు.ఈజిప్టులోతొలిసారిగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్‌ మొర్సీ ప్రభుత్వాన్ని కూలదోయటం, అరబ్బు విప్లవాలను పక్కదారి పట్టించేందుకు నిధులు అందచేయటం వంటి తప్పుడు పనులకు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి.వాటిలో భాగంగా ట్యునీసియా,లిబియా, సూడాన్‌, ఎమెన్‌లలో జోక్యం చేసుకోవటం, నేరగాండ్లు, కిరాయి సాయుధులను సమకూర్చి అంతర్యుద్దాలకు దోహదం చేయటం వంటి దుర్మార్గాలకు మద్దతు ఇచ్చాడు.ఈ కారణంగా లక్షలాది మంది అరబ్బులు మరణించటం, ఇబ్బందులకు గురయ్యారు. తన సరిహద్దులను విస్తరించేందుకు ఇజ్రాయెల్‌ ఎలా దుర్మార్గాలకు పాల్పడుతున్నదో అదేమాదిరి ఎమిరేట్స్‌ విస్తరణకు పథకాలు వేశాడని కూడా చెబుతారు.పశ్చిమ దేశాలలో విద్యను అభ్యసించిన ఎంబిజె అమెరికాలో తన పలుకుబడిని పెంచుకొనేందుకు అప్పటి వరకు ప్రపంచానికి అంతగా తెలియని సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ను అమెరికన్లకు పరిచయం చేశాడు. తరువాత రియాద్‌లో ఉన్న ప్రముఖులను సిఐఏ ఏజంట్లుగా మార్చేందుకు సహకరించాడు. ఎమెన్‌లో ఇరాన్‌ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు అక్కడి వేర్పాటువాదులను తొలుత ఎమిరేట్స్‌ ప్రోత్సహించింది, తరువాత ఆ బాధ్యతను చేపట్టేట్లుగా సౌదీ అరేబియాను ప్రయోగించింది. తరువాత ప్రత్యర్ధులుగా మారారు. ఇప్పుడు సూడాన్‌, లిబియా, ఎమెన్లలో ఉన్న ఎమిరేట్స్‌ మద్దతు ఉన్న సాయుధులను అడ్డుకొనేందుకు సౌదీ అరేబియా, ఈజిప్టు చూస్తున్నాయి.

అమెరికా ఎత్తుగడలో భాగంగా ఒపెక్‌ కూటమి నుంచి ఎమిరేట్స్‌ వైదొలుగుతూ గతవారంలో నిర్ణయం తీసుకుంది.చమురు ఉత్పత్తి కోటాలతో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పింది. ఆరుదశాబ్దాలుగా ఒపెక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సౌదీని, ఇరాన్ను దెబ్బతీసేందుకే ఈ మేరకు పావులు కదిపినట్లు చెబుతున్నారు. రియాద్‌-అబూదాబీల మధ్య శాశ్వత వైరుధ్యం ఏర్పడినట్లు అల్జీరియా అధ్యక్షుడు అబ్దుల్‌మాదిజిద్‌ తెబ్బోనే వ్యాఖ్యానించాడు, ఎమిరేట్స్‌ వైదొలగటాన్ని తాను పట్టించుకోవటం లేదన్నాడు. ఎమిరేట్స్‌పై ఇరాన్‌ దాడి చేస్తే సౌదీ ఉష్ట్రపక్షిలా ఉందంటూ అబుదాబీ వ్యాఖ్యాతలు రెచ్చిపోయారు.అయితే ఎమిరేట్స్‌ వైదొలిగినందున అది నష్టపోయే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. వలస కార్మికులు, కిరాయి సాయుధ మూకలు, చిన్న సైన్యం మాత్రమే కలిగి ఉన్నందున ప్రత్యర్ధులను ఎలా ఎదుర్కొంటుందనేది ప్రశ్న.ఇజ్రాయెల్‌, అమెరికాలు ఆదుకుంటాయనే ఆశ మాత్రమే ఉంది. ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లు, క్షిపణులను పసిగట్టే లేజర్‌ వ్యవస్థలను ఇజ్రాయెల్‌ సమకూర్చి, వాటి నిర్వహణకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. వీటితో పాటు అబుదాబీ, దుబారు నగరాలకు ఐరన్‌ డ్రోమ్‌ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది. ఇరాన్‌ వీటన్నింటినీ గమనించిన కారణంగానే సోమవారం నాడు ఎమిరేట్స్‌ మీద క్షిపణి ప్రయోగం చేసింది.లెబనాన్‌లోని తన మద్దతుదారులైన హిజబుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.దుబారు పథకాలపై ఒక్క టెహరానే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న సౌదీ, ఒమన్‌,కతార్‌, పాకిస్తాన్‌, టర్కీ కూడా ప్రేక్షకులుగా ఉండజాలవు. ఉమ్మడి శత్రువైన ఇజ్రాయెల్‌తో పాటు దానికి సహకరించే ఏ దేశాన్నీ కూడా అవి వదలవు.

ఇటీవలి దాడులతో ఇరాన్‌ పట్ల గల్ఫ్‌ దేశాలు గుర్రుగా ఉన్నప్పటికీ అమెరికాతో కలసి దాడులకు పూనుకోలేదు. సోమవారం నాడు ఎమిరేట్స్‌పై దాడి గురించి ముందుగానే సౌదీ అరేబియా,ఒమెన్‌లకు ఇరాన్‌ చెప్పినట్లు గత గురువారం నాడే అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రాయటం గమనించాలి.అయితే ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పిందీ ఆ పత్రిక వెల్లడించలేదు. ఇరాన్‌ చర్యలపై ఆగ్రహం ప్రకటించినప్పటికీ సౌదీ మంత్రులు టెహరాన్‌తో సంబంధాల్లోనే ఉన్నారు. ఎమిరేట్స్‌ మద్దతుదార్లను వ్యతిరేకించే శక్తులకు పాకిస్తాన్‌లో సౌదీ కొనుగోలు చేసిన ఆయుధాలను మార్చినెలలో లిబియాకు తరలించారు.ఇక గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ జరిపిన దాడులకు సంబంధించి ఎమిరేట్స్‌ మీద ప్రత్యేకంగా కేంద్రీకరించినట్లు వివరాలు వెల్లడి అవుతున్నాయి. కాల్పుల విరమణకు ముందు రెండు వేల ఖండాంతర క్షిపణులు, డ్రోన్లను టెహరాన్‌ సంధించింది.మిగతా దేశాలతో పోలిస్తే ఎమిరేట్స్‌ వైఖరి ఒకటైతే అంతర్జాతీయంగా వత్తిడి తెచ్చేందుకు కూడా దానిపై దాడులను కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా, లక్షలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా దుబారు, తదితర నగరాలకు రావటం కూడా ఒక ప్రధాన కారణం. దాడుల్లో ఎవరైనా విదేశీయులకు హాని జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంది, పర్యాటకులు, వ్యాపారుల రాక తగ్గి ఆర్థికంగా ఎమిరేట్స్‌ నష్టపోతుందనే ఎత్తుగడ కూడా ఉంది.అది భావించినట్లుగానే అనేక హౌటళ్ల గదులు జనాలు లేక ఖాళీగా ఉంటున్నాయి. ఇదే అదునుగా అవసరమైన మరమ్మతులకు వాటిని మూసినట్లు కూడా చెబుతున్నారు. అమెరికా దాడులకు సౌదీ సహకరించినప్పటికీ చర్చలకూ చొరవ చూపిందని చెబుతుండగా దాడులను కొనసాగించాల్సిందేనని ఎమిరేట్స్‌ పట్టుబడుతున్నదని, తొమ్మిదినెలల వరకు దాడులు జరిగినా తట్టుకుంటామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మధ్యవర్తిగా ముందుకు వచ్చిన పాకిస్తాన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించి విఫలమై ఎమిరేట్స్‌ తమ రుణాలను వెంటనే తీర్చాలని మెడమీద కత్తి పెట్టినట్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీనికి రెండు ప్రధాన కారణాలను చెబుతున్నారు. సౌదీతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవటం, ఇరాన్‌ దాడులను ఖండించాలన్న డిమాండ్‌కు అంగీకరించకపోవటం, పాక్‌ను దెబ్బతీసేందుకు భారత్‌ తెచ్చిన వత్తిడి ఉన్నట్లు భావిస్తున్నారు !

వ్యవసాయ పరిశోధనల్లో నిర్లక్ష్యం – అడుగడుగునా రైతులకు అన్యాయం ! వేదాల్లో అన్నీ లేవని మోడీ పరివారానికి ఏ భాషలో చెప్పాలి !!

Tags

, , , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలా లేదా అన్న అంశంపై నాలుగేండ్ల నాడు వేసిన కమిషన్‌ ఏం చేస్తోందో తెలియదు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మద్దతు ధరలతో పాటు దిగుబడి పెంపుదల, సాగు ఖర్చుల తగ్గింపు గురించి అనేక మంది చెప్పటం తెలిసిందే. పోనీ దానికైనా గడచిన పన్నెండేళ్లలో మోడీ సర్కార్‌ ఏమైనా చేసిందా ? వ్యవసాయ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి తీరుతెన్నులు, ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు గురించి రోమ్‌ నగరంలో ఉన్న ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) ఏప్రిల్‌ 30వ తేదీన ఒక నివేదికను విడుదల చేసింది. సభ్యదేశాల ప్రభుత్వాలు అందచేసే సమాచారం మేరకు 2023వరకు ఉన్న వివరాల ప్రకారం రూపొందించిన నివేదిక. గడచిన రెండు దశాబ్దాలలో ఏటా 1.8శాతం చొప్పున పరిశోధనకు ఖర్చు పెరుగుతూ 50.4 బిలియన్‌ డాలర్లకు చేరింది.వర్తమాన సహస్రాబ్ది తొలి పదేండ్లలో విస్తరణ మందకొడిగా ఉందని, 2009తరువాత పెరిగిందని గమనించారు.రైతే రాజు, దేశానికి వెన్నెముక, రైతులేనిదే రాజ్యం లేదు వంటి మాటలు ఎన్నో విన్నాం. ఏం జరిగింది, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ రిసర్చ్‌(ఐజెఓఇఏఆర్‌) 2026 మార్చినెల సంచిక, పేజీ 126లో దిగువ వివరాలు ఉన్నాయి. పంట ఉత్పత్తి అంకెలను మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా, దిగుబడి హెక్టారుకు టన్నులుగా గమనించాలి.చైనాలో మనకంటే సాగుభూమి తక్కువ, అయినా మొత్తం 69.కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంటే మనం 35.4కోట్ల టన్నులు చేసి చైనా కంటే మన జనాభా అదనంగా ఉన్నప్పటికీ అవసరానికి మించి పండిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాం.

పంటపేరు×× భారత ఉత్పత్తి××చైనా ఉత్పత్తి×××భారత దిగుబడి××చైనా దిగుబడి

వరి ×××××× 147-150 ×× 145 ××× 4.3 ×× 7.1

గోధుమ ×× 113-117 ×× 140 ××× 3.5 ×× 5.5

మొక్కజన్న × 35 ×× 280-290 ××× 3.2 ×× 6.1

సోయాబీన్‌×× 12-13 ×× 20 ××× 1.2 ×× 1.9

బం.దుంప×× 60 ×× 95 ××× 24 ×× 33

పిండికొద్దీ రొట్టె అన్న పెద్దలే కుండలో కూడు కుండలోనే ఉండాలి పిల్లాడు దుడ్డులా పెరగాలంటే కుదరదని కూడా చెప్పారు. జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచటంతో పాటు రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే దిగుబడులను కూడా అధికంగా సాధించాలి. అందుకు పెట్టుబడి, శాస్త్రవేత్తలు కావాలి. ప్రపంచంలో 2004లో 2,04,000 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటే 2023నాటికి 3,16,000కు పెరిగారు. మనదేశంలో పరిస్థితి ఏమిటి ? పూర్తికాలం పని చేసే పరిశోధకుల సంఖ్య రెండువేల సంవత్సరంలో 11,154 మంది ఉంటే 2018లో 11,372 మంది ఉన్నారు. అదే చైనాలో ప్రస్తుతం 43వేల మంది పని చేస్తున్నారు.శాస్త్రవేత్తల సంఖ్యను బట్టే వారి మీద పరిశోధన ఖర్చుకూడా ఉంటుంది. అది అధిక దిగుబడి వంగడాలు, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పండించటం మీద కూడా ప్రభావం చూపుతుంది.పారిశ్రామిక, ఐటి రంగాలకు అవసరమైన చౌక (కార్మికులు) ఇంజనీర్ల సృష్టి మీద చూపిన శ్రద్ధ అధికారంలో ఎవరున్నా వ్యవసాయం మీద పెట్టలేదు. ఎందుకంటే కోట్లాది మంది రైతుల కంటే లక్షల మంది పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మీద ఉన్న శ్రద్ద ఎక్కువ. అందుకే వ్యవసాయ రంగం ఇలా దిగజారిపోతున్నది, వ్యవసాయం గిట్టుబాటుగాక, అప్పులపాలైన రైతాంగ ఆత్మహత్యల గురించి వింటున్నాం.ఇతర రంగాల్లో అలాంటి పరిస్థితి లేనందుకు సంతోషమే గానీ ఇంకా ఎంతమంది రైతాంగాన్ని బలిపెట్టాలన్నదే ప్రశ్న.

దేశంలో జరిగిన అనర్దాలన్నింటికీ గాంధీ, నెహ్రూలే కారణం అని కాషాయ దళాలు నిరంతరం దుమ్మెత్తి పోస్తుంటాయి.వారి పూర్వీకులు బ్రిటీష్‌ వారి సేవకు బదులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గ్గొని నాయకత్వ స్థానాలకు వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా, ఎందుకు ఆ పని చేయలేదో చెప్పగలరా ? పోనీ వాజ్‌పాయి, ఇప్పుడు నరేంద్రమోడీ ఏలుబడిలో పరిశోధన అభివృద్ది రంగాలకు నిధులు ఎందుకు కేటాయించలేదు, ఇతర దేశాలతో ఎందుకు పోటీపడటం లేదో అయినా చెప్పాలి.ఎవరు అడ్డుకున్నారు.వేదాల్లోనే అన్నీ ఉన్నాయిష అని లొట్టలు వేసుకుంటూ చెప్పుకొనేవారి ఒళ్లో కూర్చుని రెండువేల సంవత్సరాల నాడే భారత్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, వినాయకుడికి ఏనుగు తల అమర్చటం దానికి నిదర్శనమని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన సంగతి తెలిసిందే. అదే బాటలో గోమూత్రం తాగితే కాన్సర్‌ నయమౌతుందని బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ సెలవిచ్చినదాన్నీ దేశం చూసింది. ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉన్న నాగేశ్వరరావు ఇంకా ముందుకు పోయి మహాభారత కాలంలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ పరిజ్ఞానంతో 100 మంది కౌరవులు ఒకేతల్లికి జన్మించారని కూడా చెప్పారు. అదే నిజమైతే పాండవులు వేర్వేరు తండ్రులకు ఎలా పుట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకులని చిత్రిస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నవారు శాస్త్రపరిశోధనలను ప్రోత్సహిస్తారా ? అమెరికాలోని లోవా విశ్వవిద్యాలయం చెప్పిన కొన్ని అంశాలను చూద్దాం.ఓయిసిడి సమాచారం(2022) ప్రకారం 2000-2002 మధ్య వ్యవసాయ పరిశోధనలకు అమెరికా, భారత్‌,బ్రెజిల్‌ దేశాలలో ఒక బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ప్రభుత్వాలు ఖర్చు చేశాయి.అదే 2019-21నాటికి చైనా ఖర్చు ఏడాదికి 1.3 నుంచి 6.6బిలియన్లకు పెరిగింది. అమెరికా,భారత్‌,బ్రెజిల్‌ చేసిన మొత్తం ఖర్చు కంటే చైనాలో ఎక్కువగా ఉంది.

దశాబ్దాల పాటు కొనసాగిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి తన అజెండాకు అనుగుణంగా వ్యవహరించేందుకు నీతి అయోగ్‌ను నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కేటాయిస్తే గాంధీ, నెహ్రూలు అడ్డుకొని ధర్నాలకు దిగిన ఉదంతాలేమీ లేవు.నీతి అయోగ్‌ 2025లో విడుదల చేసిన పదకొండవ పత్రంలో ఏం చెప్పిందో తెలుసా ! 1995-96లో కేంద్ర ప్రభుత్వం జిడిపిలో అన్ని రకాల పరిశోధనలకు కేటాయించిన మొత్తం 0.61 శాతం కాగా 2005-06లో అది 0.81కి పెరిగింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015-16లో 0.69శాతం, 2020-21లో 0.64శాతానికి పతనమైంది.వ్యవసాయ పరిశోధనలకూ ఇదే గతి అని వేరే చెప్పనవసరం లేదు.జిడిపిలో కనీసం రెండు శాతం కేటాయించాలని గతంలో ప్రణాళికా సంఘం సిఫార్సు చేసింది.దీని గురించి మోడీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రూపంలో అయినా ఎందుకు మాట్లాడటం లేదు ? ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2020లో తలసరి పరిశోధన పెట్టుబడి ఇజ్రాయెల్‌ 2,438 డాలర్లతో ప్రపంచంలో అగ్రగామిగా ఉండగా, తరువాత 2,192 డాలర్లతో అమెరికా,తొమ్మిదవ స్థానంలో ఉన్న చైనా 250, పద్నాలుగవ స్థానంలో 13 డాలర్లతో మనం ఉన్నాం. వీటినే అదే ప్రపంచ బ్యాంకు మరోవిధంగా చెప్పింది. జిడిపిలో ఇజ్రాయెల్‌ 5.4, అమెరికా 3.5శాతం కేటాయించగా చైనా 2.4, మనదేశం 0.7శాతం కేటాయించింది.అంతేనా ప్రభుత్వ రంగంలో మొత్తం పరిశోధనా సంస్థలు అమెరికా 727, చైనాలో 353, భారత్‌లో 18 ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక అంశాలను నీతి అయోగ్‌ తన పత్రంలో పేర్కొన్నది. ఇంత దరిద్రంగా ఉంటే మన పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు ఎలా పెరుగుతాయి, నాణ్యతలో ప్రపంచంలో ఎలా పోటీపడతాయి ? మోడీ విధానాలతో 2047నాటికి దేశం ఎక్కడికో పోతుందని నమ్మే వారు దేశంకోసం-ధర్మం కోసం బుర్రలు పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదా ! నరేంద్రమోడీ ఇజ్రాయెల్‌ పర్యటన జరిపి ఏం నేర్చుకొని వచ్చారు.ఇజ్రాయెల్‌ పితృస్వామికం, మనది మాతృస్వామికం అని చెప్పారు.దీని మీద సామాజిక మాధ్యమాల్లో జనాలు ఎంతగా అపహాస్య చేశారో తెలిసిందే. అక్కడి నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే పాలస్తీనా ప్రాంతాలలో ఇజ్రాయెల్‌ యూదులను ఎలా ప్రవేశ పెట్టి జనాభా నిష్పత్తిని ఎలా మార్చివేసిందో, కాశ్మీరులో కూడా అలాగే చేయాలని ప్రయోగాలు చేసింది.పెగాసెస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకు వచ్చి విమర్శనాత్మకంగా ఉండే మీడియా, రాజకీయంగా విబేధించే పార్టీల నేతల సమాచారాన్ని దొంగచెవులతో వినేందుకు చూసింది, వివిధ దేశాల్లో హంతక దళాలతో హత్యలు ఎలా చేయించవచ్చో నేర్చుకున్నది తప్ప మరొకటి కాదు.

చరిత్రలో నరేంద్రమోడీ ఏ ప్రధానీ వెళ్లనన్ని సార్లు చైనా వెళ్లారు, దాని నేతలతో భేటీ అయ్యారు.పోనీ చైనా నుంచి అయినా నేర్చుకున్నారా అదీ లేదు. ఓయిసిడి నివేదిక ప్రకారం 2019-21 సంవత్సరాలలో చైనా వ్యవసాయ ఉత్పత్తుల విలువ 1.6లక్షల కోట్ల డాలర్లు, అమెరికాలో 0.4,భారత్‌ విలువ 0.2లక్షల కోట్ల డాలర్లు మాత్రమే.మనదేశంతో పోలిస్తే చైనా విస్తీర్ణం చాలా ఎక్కువ, దానిలో 10.6శాతం 1.02మిలియన్ల చదరపు కిలోమీటర్లలో మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. అదే మనదేశంలో 52.8శాతం భూమి 1.69మిలియన్‌ చదరపు కిలోమీర్లలో సాగు చేస్తున్నాం.అయినా మన ఉత్పత్తి విలువ తక్కువగా ఎందుకుందో చైనాలో ఎక్కువ ఎందుకో ఎప్పుడైనా మోడీ తెలుసుకున్నారా ! ప్రపంచం మొత్తంలో ఉన్న భూమిలో 11.6శాతం మాత్రమే సాగులో ఉంది,భారత్‌ అగ్రస్థానంలో ఉండగా అమెరికాలో 17.1, రష్యాలో 7.4శాతంలో వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ప్రభుత్వ రంగం చేస్తున్న ఖర్చు గురించే మాట్లాడుకున్నాం. ప్రైవేటు రంగం కూడా ఇటీవలి సంవత్సరాల్లో పరిశోధనలకు ఖర్చు చేస్తున్నది.అది గుత్త సంస్థలకు మాత్రమే లాభాలు చేకూర్చుతున్నది తప్ప అందరికీ కాదు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం వ్యవసాయ పరిశోధనల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటుంది.అక్కడ ప్రభుత్వ ఖర్చు తగ్గుతున్నది. చైనాలో ప్రైవేటు పరిశోధనలు దాదాపు లేవు.భారత్‌,బ్రెజిల్‌, ఐరోపా యూనియన్‌లో పెరుగుతున్నాయి.. ప్రైవేటు రంగం కేంద్రీకరణ అంతా మార్కెట్లో గిరాకీ, లాభం ఉన్నవాటి మీదే ఉంటుంది. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గటం వలన టిఎఫ్‌పి(టోటల్‌ ఫ్యాక్టర్‌ ప్రొడక్టివిటీ) సూచిక అమెరికాలో ఇటీవలి కాలంలో ఆరుశాతం తగ్గింది.దీని అర్ధం ఏమిటంటే పదేండ్ల కాలంలో ఉత్పాదకత అమెరికాలో లాభసాటిగా లేదు.అందుకే పెద్ద ఎత్తున ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి అక్కడి ఉత్పత్తులను ఇతర దేశాల మార్కెట్లలో గుమ్మరించేందుకు అదిరింపులు, బెదరింపులు చేస్తున్నది.

మనువాదులు, సనాతనులుగా చెప్పుకొనేందుకు గర్వపడుతున్నవారు ఇటీవలి కాలంలో వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే వాదనలను ముందుకు తెస్తున్నారు.జర్మన్‌ హిట్లర్‌తో సహా పలువురు విదేశీయులు వివిధ రూపాల్లో వచ్చి మన పురాణాలు, వేదాలను తమ దేశాలకు తీసుకుపోయి వాటిలో ఉన్న విజ్ఞానాన్ని తస్కరించి తమవిగా చెప్పుకొని అనేక ఆవిష్కరణలు చేశారని చెప్పేవారి సంగతి తెలిసిందే. అదే నిజమైతే మనం ఆ విజ్ఞానాన్ని ఆవిష్కరించటానికి బదులు సమాజానికి అజ్ఞానాన్ని ఎందుకు పంచినట్లు ?ఆంగ్లేయులు ఇతర ఐరోపావారు మనదేశానికి రాకముందే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం వచ్చింది, తరువాతే వారి అదనపు ఉత్పత్తులను అమ్ముకొనేందుకు మనతో సహా ప్రపంచాన్ని ఆక్రమించుకున్నారు. పురాణాల్లో ఉన్న కొన్నింటికి ఆధునిక గణిత, శాస్త్రసిద్దాంతాలను అంటగడుతూ ఇవన్నీ గతంలోనే మనవారికి తెలుసని గతం గురించి గొప్పలు చెప్పుకుంటాయి కాషాయ దళాలు, వాటి తప్పుడు ప్రచారాన్ని తలకు ఎక్కించుకున్నవారు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఏక పార్టీ నియంతృత్వం, దాని విధానాలు మనకు పనికి రావు, చైనీయులు కాపీ కొడతారు అని సొల్లు కబుర్లు చెబుతారు.కమ్యూనిస్టు సిద్దాంతాన్ని, సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు చెబుతున్నమాట నిజం. కానీ ఉత్పత్తులు ఎలా చేయాలో, పంటలు ఎలా పండించాలో నేర్చుకొనేందుకు ఆడలేక మద్దెల ఓటిగా ఉందని సాకుచెప్పినట్లుగా సిద్దాంతాలతో పనేముంది ?అన్నీ అందరికీ తెలియవని మన పురాణాలే చెబుతున్నాయి. కుమారిల భట్టు వేదపండితుడే అయినప్పటికీ మిగతా అంశాల గురించి తెలియదు. బౌద్దం, జైనుల తత్వశాస్త్రం గురించి అధ్యయనం చేయటానికి వారి ఆశ్రమాలకు మారువేషంలో వెళ్లి అధ్యయనం చేసి తరువాత వాదించాడని చెబుతారు.ఆదిశంకరుడు సైతం పరకాయ ప్రవేశ విద్య ద్వారా కామకళా శాస్త్రాన్ని నేర్చుకొని ఉభయ భారతీదేవితో వాదించి ఆమె భర్త మండన మిశ్రుని శృంగేరి మొదటి పీఠాధిపతిగా నియమించినట్లు చెబుతారు. ఇక్కడ సమస్య ఏమంటే మన ఘనాపాటీలు, సంస్కృత పండితులు ఇంతవరకు వాటిలో ఉందని చెబుతున్న విజ్ఞానాన్ని బయటకు తీయలేదు, నూతన ఆవిష్కరణలు చేయలేదు.ఇప్పటికైనా ఆదిశంకరుల మాదిరి పరకాయ ప్రవేశం చేసిన చైనా, ఇతర దేశాల నుంచి దేశం కోసం-ధర్మం కోసం దేశభక్తులుగా మారి ఆధునిక యుద్ద విమానాల సాంకేతిక పరిజ్ఞానాలను సేకరిస్తారా ? పారిశ్రామిక,వ్యవసాయ రంగంలో వృద్ధికి తోడ్పడతారా ? పడక కుర్చీల కాలక్షేపపు కబుర్లు చెబుతూనే ఉంటారా ?

మూడు ఇరాన్‌ ప్రతిపాదనలకు ట్రంప్‌ తిరస్కరణ : ఊబిలో కూరుకుపోవద్దని హెచ్చరించిన జర్మనీ !

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ప్రతిష్ఠంభనలో ఉన్న కాల్పుల విరమణ చర్చలు ఫలప్రదమయ్యేందుకు తాజాగా ఇరాన్‌ ముందుకు తెచ్చిన మూడు ప్రతిపాదనలను డోనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించినట్లుగా వార్తలు.హార్ముజ్‌ జలసంధికి మరోవైపున ఉన్న ఓమన్‌, రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌తో చర్చించిన తరువాత టెహరాన్‌ తన ప్రతిపాదనలను పాకిస్తాన్‌కు అందచేసింది.వాటి మీద తమ నేత సంతోషంగా లేరని అధ్యక్ష భవనపు మీడియా అధికారిణి కరోలిన్‌ వెల్లడించారు.సోమవారం నాడు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అర్గాచీ సెంట్‌ పీటర్స్‌బర్డ్‌లో భేటీ తరువాత ఇరాన్‌, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల ప్రయోజనాలకు తద్వారా సాధ్యమైనంత త్వరలో మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనేందుకు తాము చేయాల్సిందంతా చేస్తామని పుతిన్‌ హామీ ఇచ్చాడు.తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే వెంటనే చర్చలకు సిద్దమే అని ఇరాన్‌ ప్రకటించింది.వాటి గురించి లెబనాన్‌, ఇతర మీడియాల్లో వచ్చిన వార్తలను బట్టి మూడు ప్రతిపాదనల సారాంశం ఇలా ఉంది. ఇరాన్‌, లెబనాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి, భద్రతకు హామీ ఉండాలి.ఇది జరగకుండా ఈ దశలో చర్చలకు ఇరాన్‌ సిద్దం కాదు.ఈ మొదటి దశ మీద అంగీకారం కుదిరిన తరువాత రెండవ దశలో హార్ముజ్‌ జలసంధి నిర్వహణ గురించి చర్చలు ముందుకు పోతాయి, ఓమన్‌తో సమన్వయం చేసుకొని నూతన చట్టపరమైన పరిధి గురించి ఇరాన్‌ ముందుకు పోయే అంశం గురించి చర్చలు జరుగుతాయి. ఆ తరువాత అణుశుద్ది, సంబంధిత సమస్యలపై చర్చకు ఇరాన్‌ ముందుకు వస్తుంది. దీని అర్ధాన్ని సూటిగా చెప్పుకోవాలంటే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆగిపోవాలి, హార్ముజ్‌ జలసంధిని చెరపట్టిన అమెరికా విరమించాలి.ఈ ప్రతిపాదనలపై ట్రంప్‌ పెదవి విరిచినట్లు వార్తలు రావటంతో చమురు మార్కెట్‌లో బ్రెంట్‌ రకం ధర 111డాలర్లకు అటూ ఇటూగా పెరిగింది.అంతకు ముందు జరిగిన పరిణామాల్లో రెండవసారి చర్చలకు ఇస్లామాబాద్‌ వచ్చిన ఇరాన్‌ ప్రతినిధి వర్గం అమెరికన్ల కోసం ఎదురు చూడకుండా వెనుదిరిగివెళ్లిపోయింది.దాంతో అమెరికా ప్రతినిధులు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.రెండవ సారి చర్చలు జరగాలంటే జలసంధి దిగ్గంధనాన్ని ట్రంప్‌ విరమించాలని ఇరాన్‌ పదే పదే చెప్పింది. ఇప్పటి వరకు తాము 38 నౌకలను వెనక్కు తిప్పి పంపినట్లు అమెరికా మిలిటరీ కేంద్రం సోమవారం ఉదయం పేర్కొన్నది. మార్చినెల 2 నుంచి ఇజ్రాయెల్‌ దాడుల్లో 2,521 మంది తమ పౌరులు మరణించారని, 7,804 మంది గాయపడినట్లు లెబనాన్‌ తెలిపింది. ఏప్రిల్‌ 17న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించినా ఇజ్రాయెల్‌ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతూనే ఉంది. అక్కడ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్న హిజబుల్లా ఆ ఒప్పందాన్ని అంగీకరించటం లేదని ప్రకటించింది.రక్షణ శాఖ ట్రంప్‌ను తప్పుదారి పట్టిస్తున్నదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ అనుమానిస్తున్నట్లు వార్తలు.

బలహీనత ఏమిటో తెలిసిన తరువాత ఐరోపా దేశాలు డోనాల్డ్‌ ట్రంప్‌ను, అమెరికాను ఒక ఆట ఆడుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.ఇప్పటి వరకు నోటి దురుసుతనంతో ట్రంప్‌ అనేక విధాలుగా నాటో కూటమి దేశాలను అవమానించాడు, బెదిరించాడు.ఇప్పటివరకు లోపలదాచుకున్నదంతా ఐరోపా నేతలు బయటకు వెళ్లగక్కుతున్నారు. రానున్న రోజుల్లో సంబంధాల గురించి సంయమనం పాటిస్తున్నారు. అమెరికా-ఐరోపా మిత్రుల మధ్య ఉన్న విభజన మరింత పెరగటం కనిపిస్తున్నది.దానికి నిదర్శనమే జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ సోమవారం నాడు అసాధారణంగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు.ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో మాదిరి ఊబిలో దిగేట్లుగా వాషింగ్టన్‌ వైఖరి ఉన్నదని, ఎలాంటి వ్యూహం లేకుండా దాడులకు దిగిందని, అదే ఇప్పుడు పరిస్థితిని సంక్లిష్టం గావించిందని చెప్పటం మూమూలు విషయం కాదు.ఇరాన్‌ పైచేయి సాధిస్తున్నదని, యావత్‌ ఐరోపా ఆర్థికంగా ప్రతికూలతను ఎదుర్కొంటున్నదని కూడా మెర్జ్‌ చెప్పాడు. అందరూ అనుకున్నదాని కంటే ఇరాన్‌ బలంగా ఉందని, దాని నాయకత్వం అమెరికాను అవమానించిందని కూడా మొహమాటం లేకుండా చెప్పాడు.మిత్రదేశాలు ప్రైవేటు వ్యవహారంగా ఎంతో కాలం ఇబ్బందులను మూసిపెట్టుకోలేవని ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ నేత చెప్పాడు. వివాదాల్లో దిగటం కాదు, దాన్నుంచి బయటకు కూడా రావాలి, సంఘర్షణలతో తలెత్తే సమస్యలు ఇలాగే ఉంటాయి, ఎంతో బాధాకరంగా ఇరవై ఏండ్లు ఆఫ్ఘనిస్తాన్‌లో, ఇరాక్‌లో కూడా చూశామని మార్స్‌బెర్గ్‌ అనే పట్టణంలో విద్యార్ధుల సమావేశంలో చెప్పాడు. ఇరానియన్లు ఎంతో నైపుణ్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు లేకపోతే ఎంతో సమర్ధవంతంగా చర్చలు జరపటం లేదని కూడా వర్ణించవచ్చు.అమెరికన్లను ఇస్లామాబాద్‌కు రప్పిస్తున్నారు, ఎలాంటి ఫలితాలు లేకుండానే వెనక్కు పంపిస్తున్నారు,ప్రత్యేకించి ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ అని పిలిపించుకొనే వారు యావత్‌ అమెరికాను అవమానపరిచారని ఆరోపించాడు. జలసంధిలో అమర్చిన మందుపాతరలను తొలగించేందుకు జర్మనీ సహాయం చేస్తుందని అయితే అది పోరు ముగిసిన తరువాత మాత్రమే జరుగుతుందని కూడా చెప్పాడు. నిజానికి ఇరాన్‌ తన సత్తాను చాటుకుంది తప్ప అమెరికాను అవమానించలేదు. ఎదురులేని ప్రపంచ రారాజునని విర్రవీగుతున్న అమెరికా పరిమితులను తాజా పరిణామం స్పష్టం చేసింది. మీ పరువు మీరే తీసుకున్నారు, అనుభవించండి అని చెప్పాలనుకున్న జర్మనీ బయటకు మాట్లాడలేక ఇరాన్‌ పేరుతో ఆ వ్యాఖ్య చేసిందని చెప్పవచ్చు. ఐరోపా దేశాలను ట్రంప్‌ ఈ వివాదం సందర్భంగా ఎంతగా అవమానించిదీ తెలిసిందే.

జరుగుతున్న దాడుల పరిణామాలతీరు,ఆర్థిక నష్టాల గురించి ఐరోపాలో అంతర్గతంగా ఉన్న ఉక్కిరిబిక్కిరి పరిస్థితిని మెర్జ్‌ వెల్లడించినట్లు చెప్పవచ్చు, జర్మనీ వినియోగదారుల తీరు తెన్నుల సూచిక మే నెలలో 33.3 పాయింట్ల తిరోగమనంలో ఉండవచ్చని చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన 2022 నుంచి నెలవారీ ఇంథన పరిస్థితి ఇంతగా దిగజారలేదు.వాణిజ్య సూచిక 2020లోని బలహీన స్థాయికి పడిపోయింది.పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరు రెండు యూరోలు (రు.221) దాటింది.దీంతో వాటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.ధరలు పెరిగినా సరఫరాలో అనిశ్చితి కూడా ఐరోపాలో ఆందోళనకు దారితీస్తోంది.ఇంథన ధరలు విపరీతంగా పెరిగిపోవంటంతో ఫ్రాన్సులోని ట్రాన్స్‌వియా కంపెనీ మే, జూన్‌లో కొన్ని విమానాల ప్రయాణాలను రద్దు చేసింది. ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి సొమ్ము తిరిగి చెల్లిస్తామని లేదా తరువాత తిరిగి ప్రయాణించటానికి అవకాశం ఇస్తామని చెప్పింది.హార్ముజ్‌ జలసంధి రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో పెట్రోకెమికల్స్‌ కొరత ఏర్పడిందని దాంతో కండోమ్‌(గర్భనిరోధం లేదా సురక్షిత శృంగారం కోసం) ధరలను 30శాతం పెంచుతున్నట్లు ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న కారెక్స్‌ కంపెనీ ప్రకటించింది. ఏటా 500 కోట్ల కండోమ్‌లను ఈ కంపెనీ తయారు చేస్తున్నది,ప్రపంచ మార్కెట్‌లో 20శాతం వాటా కలిగి ఉంది. ఆర్థిక అనిశ్చితి ఉన్నపుడు కండోమ్‌లను ఎక్కువగా వాడతారని,ఈ ఏడాది 30శాతం డిమాండ్‌ అదనంగా ఉంటుందని, ధరలను పెంచకతప్పటం లేదని మలేసియాకు చెందిన ఈ కంపెనీ ప్రకటించింది.

ఇరాన్‌పై దాడులతో అమెరికా ఆయుధ నిల్వలు ముఖ్యంగా క్షిపణుల సంఖ్య బాగా తగ్గిపోయినట్లు వచ్చిన వార్తలను తాను నమ్మటం లేదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ అంటున్నట్లు మీడియా పేర్కొన్నది.వాన్స్‌ ఈ పరిస్థితిని చూసి ఆందోళనపడినట్లు చెబుతుండగా ఆయుధాలకేమీ కొదవ లేదని ట్రంప్‌ యంత్రాంగం చెబుతున్నది. ఇరాన్‌పై దాడుల గురించి అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ చెబుతున్న అంశాలను వాన్స్‌ పదే పదే ప్రశ్నిస్తున్నాడు.చెబుతున్నది నిజమేనా అని పలువురితో మాట్లాడి ఆరా తీస్తున్నాడు. ఇరాన్‌పై దాడులకు దక్షిణ కొరియా నుంచి క్షిపణులను తరలించినపుడు తమ సంగతేమిటని ఆ దేశ అధ్యక్షుడు బహిరంగంగానే ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో, చైనా మీద ప్రయోగించేందుకు తైవాన్‌లో, రష్యాను అదుపు చేసేందుకు అంటూ ఐరోపాలో అమెరికా పెద్ద ఎత్తున ఆయుదాలను నిల్వచేసింది. వీటిలో ఏవైనా లోటు ఏర్పడితే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందంటూ వాన్స్‌ భయాన్ని వ్యక్తపరిచినట్లు అట్లాంటిక్‌ పత్రిక రాసింది. ఎనిమిదివారాల దాడిలో ఇరాన్‌కు భారీగా నష్టం కలిగించామని ఆయుధాలకు ఎలాంటి లోటు లేదని రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ సైనిక ఉన్నతాధికారుల సమావేశంలో బహిరంగంగా చెప్పాడు.

మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ అమెరికాకు ఆగ్రహం తెప్పించే నిర్ణయం తీసుకుంది. మూడవ దేశం నుంచి ఇరాన్‌ వెళ్లాల్సిన వస్తువులను తమ భూభాగం ద్వారా చేరవేసేందుకు ఆరు మార్గాలను ప్రకటించింది.బలూచిస్తాన్‌లో సరిహద్దుల్లో వస్తుమార్పిడి కోసం కరాచీ, ఖాసిం, గద్వార్‌ రేవుల నుంచి ఏర్పాటు చేసింది.అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది.ఇరాన్‌ తన ఆహార అవసరాలకోసం దిగుమతుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నది.హార్ముజ్‌ జలసంధిలో అమెరికా అడ్డుకోవటంతో అది తన అవసరాలను కాస్పియన్‌ సముద్రం ద్వారా తెచ్చుకొనేందుకు పూనుకుంది. అందువలన ఇరాన్‌ చమురు రవాణాను అమెరికా అడ్డుకోగలదు తప్ప ఇతర ఇరాన్‌ దిగుమతులను నిరోధించలేదని చెప్పవచ్చు.వాటిని కూడా అడ్డుకొనేందుకు తెగబడితే సంక్షోభ స్వరూపమే మారిపోతుంది. చమురు ధరలు పెరగటంతో ప్రత్యామ్నాయ ఇంథనం గురించి వెతుకులాట ఎక్కువైంది.ఇది చైనాకు వరంగా మారినట్లు కనిపిస్తోంది.హరిత ఇంథన ఉత్పత్తులైన సోలార్‌ పలకలు, విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.ఫిబ్రవరితో పోలిస్తే 30శాతం విలువ పెరిగి మార్చినెలలో 25.77 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గతేడాది మార్చినెలతో పోలిస్తే విదేశాల్లో వాటి అమ్మకాలు 50శాతం పెరిగాయి. సోలార్‌ పలకల ఎగుమతి ఫిబ్రవరితో పోల్చితే మార్చినెలలో రికార్డు స్థాయిలో 68గిగావాట్లకు పెరిగాయి.దీనికి ప్రపంచమంతటా పెరిగిన చమురు ధరలతో పాటు చైనా పన్ను రాయితీల్లో చేసిన మార్పులు కూడా కారణమయ్యాయి.

కొసమెరుపు : స్వతంత్ర దేశాల విధానాలు ఎలా ఉండాలో అమెరికా ఇంకేమాత్రం నిర్దేశించలేదని ఇరాన్‌ వ్యాఖ్యానించింది.తన చట్టవిరుద్దమైన, గొంతెమ్మ కోరికలను వదులు కోవాలని ఇరాన్‌ రక్షణశాఖ ఉపమంత్రిó రజా తలాయి నిక్‌ షాంఘై సహకార దేశాల ప్రతినిధులతో చెప్పాడు. ఇరాన్‌ చేసిన మూడు ప్రతిపాదనల గురించి అమెరికా సమీక్ష చేస్తున్నదని వార్తలు రాగా ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు, అణుకార్యక్రమం మీద రాజీపడకూడదని సలహాదారులతో అన్నట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. తాజా ప్రతిపాదనల తరువాత మంగళవారం నాడు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. విశ్వాసం సన్నగిల్లుతున్నదని, జలసంధిపై చర్చలతో పరిష్కారానికి రావాలని ఐరాస కోరింది, అందరి మాటలను పెడచెవిన పెడుతున్న ట్రంప్‌కు ఈ మాటలు రుచిస్తాయా !

దేశం కోసం- ధర్మం కోసం : ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి విలువలు, వలువలు – ఒక పరిశీలన !

Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

జనాలు వెర్రి వెంగళప్పలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌(రాష్ట్రీయ స్వయం సేవక్‌) మేథావుల ప్రగాఢవిశ్వాసం.కొన్ని సందర్భాల్లో కొందరి తీరు చూస్తే నిజమే అనిపించకపోదు. వాట్సాప్‌ యూనివర్సిటీని చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అలవోకగా అందమైన మాటలతో అబద్దాలు, నీటి జాడలు కనిపించని ఎడారుల్లో కూడా మహాసముద్రాలు ఉన్నాయని చెప్పగలరు. ఎవరైనా నిలదీస్తే పురాతన కాలంలో ఉండేవని చెప్పాం అంటారు.పరస్పర విరుద్దంగా మాట్లాడగల మాయల మరాఠీలు. ” ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలను ప్రధాని మోడీ అనుపమానంగా ప్రచారం చేస్తారు, ఉత్తమ ప్రతినిధి ” ఇది 2026 ఏప్రిల్‌ చివరి వారంలో అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌసబలే చెప్పినదానికి మీడియా పెట్టిన శీర్షిక. ఈ పెద్దమనిషి వాషింగ్టన్‌లోని హడ్సన్‌ ఇనిస్టిట్యూట్‌లో ప్రసంగాల్లో చెప్పిన అంశాలు, పిటిఐతో మాట్లాడినవి మీడియాలో వచ్చాయి. నాలుగు నెలలకు ముందు ” బిజెపి కళ్లద్దాలతో ఆర్‌ఎస్‌ఎస్‌ను చూడటం పెద్ద తప్పిదం ” 2025 డిసెంబరు చివరి వారంలో కొలకతాలో తమ సంస్థ శతవార్షికోత్సవాల ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చెప్పిన సుభాషితం.ఇద్దరూ ఆ సంస్థలో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్ననేతలే. అయినా రెండు నాలుకలతో ఎందుకు మాట్లాడినట్లు ? జనాలకు రెండింటినీ పోల్చుకొని చూసే తీరిక, అవకాశం ఉండదని వారికి తెలుసు గనుక.మోడీ ప్రభుత్వ నిర్వాకాలను తమకు అంటగట్టవద్దని ఒక నోటితో, తమ విలువలను మోడీ గొప్పగా ప్రచారం చేస్తున్నారని, తమకు ప్రతీక అని మరోమాట. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి తెలిసినవారందరికీ అది ఎన్ని నాలుకలతో మాట్లాడుతుందో తెలుసు. ఆ సంస్థలో అమాయకంగా చేరుతున్నవారు, అది చెబుతున్న మాటలే పరమ సత్యాలని నమ్ముతున్నవారు దేశం కోసం- ధర్మం కోసం ఒకసారి ఆత్మపరిశోధన చేసుకోవాల్సి ఉంది.ఇద్దరు అగ్రనేతలు రెండు విధాలుగా మాట్లాడటాన్ని రాజకీయ పరిభాషలో చెప్పాలంటే మోడీ వ్యతిరేక-అనుకూల ముఠాలకు ప్రతిబింబం.వారూ మానవమాత్రులేగా మరి ! నరేంద్రమోడీ తీరుతెన్నులను వ్యతిరేకిస్తున్నారనే కక్షతో 2005లో సంజరు జోషి అనే ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపినేత సెక్స్‌ కుంభకోణంలో ఉన్నారంటూ వీడియోలు పంపిణీ చేయించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఒక మహిళతో ఉన్న దృశ్యాలు నిజమే అయితే సంఘపరివార్‌ సంస్థనేతల బండారానికి, కాకుంటే వారు కూడా కుట్రలు, ప్రతికుట్రలకు అతీతులు కారనటానికి నిదర్శనం.ఆ ఉదంతం తరువాత 2005లో ప్రధాన కార్యదర్శిపదవికి రాజీనామా చేశారు. అయినా మోడీ కక్ష తీరలేదని చెబుతారు. 2012 జోషి గనుక పార్టీ జాతీయ కార్యవర్గంలో ఉంటే సమావేశాన్ని తాను బహిష్కరిస్తానని పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నితిన్‌ గడ్గరీని బెదిరించారని, దాంతో జోషీ రాజీనామా చేశారు, ఆ వార్త వెలువడిన రెండు గంటల్లోనే తాను సమావేశానికి హాజరువుతున్నట్లు మోడీ ప్రకటించారని నాడు వార్తలు. ఒక నాడు బిజెపిలో కొన్ని రాష్ట్రాలలో చక్రం తిప్పిన జోషి(64) ఇప్పుడు నరేంద్రమోడీ దెబ్బకు విలవిల్లాడుతూ ఎలాంటి పదవులు లేకుండా ఇంటి దగ్గరే పార్టీ కార్యకర్తలతో కాలక్షేపం చేస్తున్నారు.హౌసబలే చెప్పినట్లు నరేంద్రమోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలకు ప్రతీక అంటే ఎవరూ చేసేదేమీ లేదు !

ఈ వారంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల గురించి చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఒక పరామర్శలో వివరించటం సాధ్యం గాదు గనుక ఇద్దరు నేతల సుభాషితాలకే పరిమితం కావటం సముచితం. మేం మాట్లాడే భాషను, విలువలను తనదైన అనితర శైలిలో నరేంద్రమోడీ చెబుతారంటూ, మేము ఒక చెట్టునాటండి అంటే మోడీ అదే పదాలను ఉచ్చరించకపోవవచ్చు, తల్లిపేరుతో ఒక చెట్టు అంటారని హౌసబలే ఉదహరించారు.అనేక ప్రభుత్వ పథకాలు ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన మాదిరే ఉన్నాయని కూడా చెప్పారు.ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ విలువల గురించి చూద్దాం. సంఫ్‌ు ప్రచారక్‌లలో ఒకరైన నరేంద్రమోడీ కట్టుకున్న భార్యను వదలివేయటం గురించి దాచారు. అబద్దం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని అడిగేంత అమాయకులం అని కాషాయ దళాలు చెప్పుకుంటాయి. సినిమాల్లో, కథల్లో విలన్‌ తాను ఒంటరినని అమ్మాయిలను మోసం చేస్తాడు. మోడీ తనదైన శైలిలో తాను ఒంటరినని, అందువలన అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదంటూ ఎన్నికల సభల్లో చెప్పారు. నాలుగు అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలో భార్య గురించి నిజాలను దాచారు, కాంగ్రెస్‌ నేతలు మోడీ బండారం బయటపెట్టటంతో తరువాత రాయాల్సి వచ్చింది. ఆ తరువాత మరొక కత చెప్పారు. ఏమిటంటే మోడీకి తెలిసీ తెలియని వయస్సులోనే పెళ్లి చేశారని, వయస్సు వచ్చిన తరువాత దేశం కోసం-హిందూ ధర్మం కోసం భార్యను వదలివేశారని చెప్పారు.సనాతన ధర్మం ప్రకారం, ముఖ్యంగా దానికి కట్టుబడి ఉన్నామని, కాపాడలని ప్రవచించే వారు వివాహం ఎలా చేసుకున్నప్పటికీ భార్యను వదలివేయకూడదు. చిన్నతనంలో తెలియక పెళ్లి చేసుకున్నారనుకుందాం వయస్సు బుద్ధి వికసించిన తరువాత అయినా తిరిగి భార్యను చేరదీయాలా వద్దా ! అనేక మంది ప్రచారక్‌లు వయస్సు మీరిన తరువాత వివాహాలు చేసుకున్నారు.వారిని చూసి అయినా మోడీ తన భార్యను కాపురానికి తెచ్చుకోలేదు, కనీసం విడాకులు ఇచ్చి చట్టపరంగా తెగతెంపులు చేసుకోలేదు. ఇలాంటి వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలకు ప్రతీక అని చెబుతున్నారు, అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ విలువలు ఇలాగే ఉంటాయా అన్న ప్రశ్న ఎవరైనా అడిగితే …..!

సంఫ్‌ు చెబుతున్నమాదిరే ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటున్నాయని హౌసబలే తన భుజాన్ని తానే చరుచుకున్నారు.యుపిఏ పాలనా కాలంలో జాతీయ సామాజిక సహాయ పధకం(ఎన్‌ఎస్‌ఏపి) కేంద్రం ప్రారంభించింది.దీన్లో 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మొత్తం మూడు కోట్ల మందికి పైగా పెన్షన్‌ ఇస్తున్నారు.నరేంద్రమోడీలో ఎంత మానవత్వం ఉట్టిపడుతున్నదంటే ఆయన అధికారానికి వచ్చినపుడు ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపు 10,547 రూపాయలు,తాజా కేటాయింపులు రు.9,652 కోట్లు. కేంద్ర బడ్జెట్‌లో 0.58శాతం నుంచి 0.2కు దిగజారింది. దేశంలో ఏడాదికేడాది వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదని తెలుసు, వారికి నెలకు ఇచ్చే ముష్టి 200,300 రూపాయలు ఏమూలకు వస్తాయో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు చెప్పాలి. ఎలాంటి బడ్జెట్‌ కేటాయింపులు పెంచలేదు, ఈ పధకం కూడా తాము చెప్పినట్లే ఉందని వారు చంకలు కొట్టుకుంటున్నారా ? తమ మార్గదర్శకంలో నడుస్తున్న బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎంతెంత పెన్షన్లు ఇస్తున్నారో, అవి సరిపోతున్నాయో లేదో ఎప్పుడైనా వృద్దుల దగ్గరకు వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్‌ ” స్వచ్చంద సేవకులు ” యోగక్షేమాలు విచారించారా ? విచారించిన తరువాత కూడా ఈ మొత్తాలను పెంచాలని కేంద్రానికి సూచించాలని వారికి తట్టలేదా ?మార్గదర్శక్‌ మండల్‌ పేరుతో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి వారిని ఒక దగ్గర పెట్టారు, వారు కూడా వృద్దాప్య పెన్షన్‌ పెంచాలని మోడీకి సలహా ఇవ్వలేకపోయారు. ఇదే కాలంలో కార్పొరేట్లకు ఇచ్చిన సబ్సిడీలు ఏ విధంగా పెరిగాయో మానవత్వ ముఖాలు ఉన్నట్లు చెప్పుకుంటున్న వారికి తెలియదా ! వివిధ రాష్ట్రాలు దయాదాక్షిణ్యాలతో తమ బడ్జెట్ల నుంచి అదనపు మొత్తాలను పెన్షన్లు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగువేలు, తెలంగాణాలో రెండువేలు ఇస్తున్నారు.నెలకు రెండు వందలు, మూడు వందలు ముష్టిమాదిరి వేస్తున్న నరేంద్రమోడీ తమ బాటలో నడుస్తున్నారని చెప్పుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి జనాలు ఆలోచించుకోవాలి.మోడీకి కుటుంబం లేదు, తల్లిని ఆయన సోదరులే చూసుకుంటున్నారని విన్నాం. అటువంటి వారికి వృద్దులు, ఒంటరి మహిళల జీవితాలు ఎలా ఉంటాయో ఎలా తెలుస్తాయి ! ఆయనకు తెలియదు, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెప్పరు !!

మహిళా రిజర్వేషన్‌ గురించి నరేంద్రమోడీ నాయకత్వం ఆడిన గొప్ప నాటకం తమ రచనే అని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకుంటుందా ?వాజ్‌పాయి పాలనా కాలంలో అంతకు ముందు లోక్‌సభలో ప్రవేశపెట్టటం విఫలమైన చరిత్ర అందరికీ తెలిసిందే. 2014 నుంచి 2023వరకు మోడీ దాన్ని పట్టించుకోలేదు, ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్తు చేయలేదంటే వారికి తెలియకనా, కానే కాదు, 2024 ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్‌ అంశాన్ని ముందుకు తెచ్చి ఓట్లు దండుకొనేందుకు రూపొందించిన పెద్ద పథకం. తదుపరి జనాభా లెక్కల తరువాతనే అది అమల్లోకి వస్తుందనే షరతును దానికి తగిలించారు. అప్పటికి జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు,గతంలో విధించిన నియోజకవర్గాల పునర్‌వ్యవస్థకరణ అంశం గడువు 2026లో ముగుస్తుందనీ తెలుసు. కానీ మూడు సంవత్సరాల ముందే దాన్ని చేపట్టారంటే మరుసటి ఏడాది జరిగే ఎన్నికల కోసమే.ఈ అంశాన్ని మరోసారి 2029 ఎన్నికలకు వినియోగించుకోవాలనే మరో ఎత్తుగడకు తెరతీశారు.మహిళల పేరుతో తమకు అనుకూలంగా ఉండేట్లు ఉత్తరాదిలో సీట్లు పెంచాలని చూశారు. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లేదనీ తెలుసు. మోడీ అత్యంత ప్రజాస్వామికవాది అని చెబుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు అవసరమైన మెజారిటీ లేదని తెలిసి కూడా ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని ముందుగా చర్చించాలనే సలహా మోడికి ఇవ్వలేదా ? లేక ప్రతిపక్షాలను బ్లాక్‌మెయిల్‌ చేయాలనే దుష్టఆలోచన ఎవరి బుర్రలో పుట్టినట్లు ?కనీసం మోడీ ప్రభుత్వాన్ని నిలబెడుతున్న తెలుగుదేశం పార్టీకి కూడా రాజ్యాంగ సవరణ బిల్లులో ఏముందో చెప్పలేదు. అడుగడుగునా మహిళలను వంచించే ఎత్తుగడ, బుల్డోజ్‌ చేసే దుష్ట ఆలోచన తప్ప మరొకటి దీన్లో లేదు. ఇవన్నీ ఇలాంటి అతితెలివి ప్రదర్శన చేసిన వారి విలువలు, వలువలకు మచ్చుకు మాత్రమే.

బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ వేరు కాదు. అదే సంస్థచెందిన నాధూరామ్‌ గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేసినపుడు ఆ సంస్థ మీద నిషేధం విధించారు. దాంతో తాము ఒక సాంస్కృతిక సంస్థగా ఉంటామంటూ కేంద్రానికి లేఖ రాసి నాటి నెహ్రూ ప్రభుత్వంలో ఉన్న తమ అనుకూలురను రంగంలోకి దించి నిషేధాన్ని ఎత్తివేయించుకున్నారు. రాజకీయాలు చేసేందుకు 1951లో భారతీయ జనసంఘం అనే పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.అత్యవసర పరిస్థితి తరువాత 1977లో దాన్ని రద్దు చేసి జనతా పార్టీలో చేరారు.ఆ ప్రయోగం వికటించింది. పార్టీలో ఉన్న వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యులుగా ఉండకూడదనే అంశం వచ్చినపుడు కావాలంటే మేం విడిపోతాం తప్ప సంబంధాలు వదులుకొనేది లేదంటూ 1980లో బిజెపిని ఏర్పాటు చేశారు. దాని గురించి హౌసబలే ఏం చెప్పారంటే ” వారు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు.అదే జనతా పార్టీ నుంచి విడివడి మరొక రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముఖ్యకారణం. ఆ విదంగా ఉన్న బొడ్డుతాడు బంధాన్ని విచ్చిన్నం చేయలేరు.” అయినా రెండూ వేర్వేరు సంస్థలని జనాన్ని నమ్మించేందుకు బుకాయిస్తారు. హిందూ గుర్తింపు నాగరికతపరమైనది తప్ప మతం పరమైంది కాదు అని అమెరికన్లను నమ్మించేందుకు హౌసబలే ప్రయత్నించారు.తాము హిందువుల ఐక్యత,ఉద్దరణ కోసం పనిచేస్తున్నామని మరోవైపు చెబుతారు. భారతీయులనే మాట వారి నోట రాదు.ఈ దేశంలో కోట్లాది మంది ఇతర మతాలవారు ఉన్నారు. నిజంగా భారతీయుల కోసం పని చేసే వారు అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను జరుపుతారు, లేదా కమ్యూనిస్టుల మాదిరి ఏ మతాన్ని ప్రత్యేకించి భుజానవేసుకోకుండా దూరంగా ఉంటారు.మరి ఆర్‌ఎస్‌ఎస్‌ దానికి భిన్నంగా కేవలం హిందూమత సభలు, పండగల్లోనే మునిగితేలు తుంది. ఇలాంటి సంస్థ భారతీయ సమాజాన్ని ఐక్యంగా ఎలా ఉంచుతుంది ? మేకతోలు కప్పుకున్నంత మాత్రాన పులిచారలు కనిపించకపోవచ్చు తప్ప మాసిపోవు. ఈ గడ్డమీద భారతీయ సంస్కృతి తప్ప హిందూమతానికి మూలమైన వివక్ష, దుర్మార్గపూరితమైన మనుసంస్కృతికి స్థానం ఉండదు.

ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నవారందరూ నరేంద్రమోడీ వ్యవహారశైలితో ఏకీభవించటం లేదు గానీ విధిలేక అన్నివిధాలుగా మద్దతు ఇస్తారు.ఇప్పటికే దేశంలోని అన్ని రంగాలను ఆక్రమించాం, మంచితరుణం మించిపోతే రాదు అంటూ హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉన్మాదం బాగా తలకెక్కిన వారికి ఈ విషయంలో మోడీ తీరు నచ్చటం లేదు. ఆ పెద్దమనిషికి కార్పొరేట్ల సేవే ముఖ్యం,వారు లేకపోతే తనకు పదవి లేదని తెలుసు. మన కార్పొరేట్లు తమ లాభాల కోసం మతంతో సహా దేన్నయినా వినియోగించుకుంటారు, అయితే మతాన్ని పూర్తిగా రంగంలోకి దించి మతరాజ్యంగా మారితే నష్టమని వారికి తెలుసు. గనుక ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను పూర్తిగా అమలు జరిపేందుకు వారు సిద్దం కాదు. మరోవైపు సంఘపరివార్‌ పరిస్థితి ఏమిటి ? మోడీ లేకపోతే అధికారం లేదు, అది లేకపోతే తన అజెండాను ముందుకు తీసుకుపోలేదు. మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ అజండాకే లేదా దాని అదుపు ఆజ్ఞలకంటే అంతర్జాతీయంగా డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు, జాతీయంగా కార్పొరేట్‌ అజండాను తలకెత్తుకున్నారు.ఈ ప్రక్రియలో కొన్ని అంశాలను ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగా సమర్ధించలేదు, విబేధించనూలేదు. చెప్పరాని చోట తగిలిన దెబ్బ గురించి చెప్పుకోలేనట్లుగా దాని పరిస్ధితి ఉంది. కార్పొరేట్లను కాదంటే దాని పని ఖాళీ. మిత్ర వైరుధ్యం ఉంది. దానికి తోడు తనది సాధారణ మానవజన్మ కాదని, దైవ నిర్ణయం మేరకు అవని మీద అవతరించానని మోడీ బాబా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకే కడుపులో లేకున్నా కావలింతలను ప్రదర్శిస్తారు.ముందే చెప్పుకున్నట్లు ఇద్దరు సంఫ్‌ు జాతీయ నేతలు భిన్నంగా మాట్లాడారు.బిజెపికి జన్మనిచ్చిన సంస్థదే ఆధిపత్యం అని దాని నేతలు భావిస్తుంటే తమ రాజకీయాలతోనే బిజెపి అధికారానికి వచ్చింది, దాంతోనే ఆర్‌ఎస్‌ఎస్‌ బలపడింది తప్ప మీ గొప్పేమీ లేదని మోడీ, షా భావిస్తున్నారు.ఇరు పక్షాలకూ అహం సమస్య ఉంది.మోడీ చర్యలు నష్టదాయకమని భావించినపుడు పరోక్షంగా వాటితో తమకేమీ సంబంధం లేదని సంఘనేతలు చెప్పటం దైవాంశ సంభూతునికి సహజంగానే రుచించవు.తమది స్వతంత్ర సాంస్కృతిక సంస్థ అని మోహన్‌భగవత్‌ చెబితే అదే కుదురుకు చెందిన నరేంద్రమోడీ కాదు ప్రపంచంలో అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థ(ఎన్‌జిఓ) అని ఎర్రకోట ప్రసంగంలో చెప్పారు. భగవత్‌ హిందూత్వకు ప్రతీక అయితే మోడీని కొందరు హిందూ హృదయ సామ్రాట్‌ అని కీర్తిస్తున్నారు. రాముడు-హనుమంతుడి మాదిరి ఉండాలి తప్ప ఒకే గద్దెమీద ఇద్దరు దేవుళ్లకు అవకాశం ఉండదు. సమాజంలోని అన్ని అవలక్షణాలూ సంఫ్‌ు సభ్యులకూ ఉంటాయి, వారేమీ అతీతులు కాదు.బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన జెపి నడ్డా 2024 మే నెలలో ఒక సందర్భంగా మాట్లాడుతూ అతల్‌ బిహారీ వాజ్‌పాయి కాలం నాటికీ ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఉనికిలో మార్పు వచ్చిందన్నారు. ప్రారంభంలో మాకు అంత సామర్ధ్యం లేదు,చిన్న పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం ఉండేది.నేడు మేం పెరిగాం,సామర్ద్యం కలిగి ఉన్నాం.బిజెపి తనంతట తానే పని చేయగలదు, అదీ తేడా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతపరమైన రంగం, దాని పని అది చేస్తుంది అన్నారు. తాము కేవలం ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగం కాదు అని చెప్పటమే ఇది.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయి, మరోమారు చర్చిద్దాం !