• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

03 Wednesday Jun 2026

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Gaza Deaths, Israel, Leftist Zohran Mamdani, Anti Zionism, Israel Day

ఎం కోటేశ్వరరావు  

   తాను యూదులకు వ్యతిరేకం కాదని, యూదు దురహంకారానికి, పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను నిరసిస్తున్నట్లు  న్యూయార్క్‌ నగర మేయర్‌ జోహ్రాన్‌ మందానీ మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. భారతీయులైన మహమ్మద్‌ మందానీ, మీరా నాయర్‌ల సంతానమైన 35 ఏండ్ల జోహ్రాన్‌ న్యూయార్క్‌ నగరానికి 112వ, తొలి ముస్లిం సామాజిక తరగతికి చెందిన మేయర్‌. వామపక్ష భావజాలం కలిగి ఉన్నందుకు కమ్యూనిస్టు అని ముద్రవేసినప్పటికీ నగర పౌరులు పట్టించుకోకుండా ఎన్నుకున్నారు. తాజాగా మరోసారి అమెరికా మీడియాలో వార్తలకు ఎక్కారు.  ఆదివారం నాడు నగరంలో జరిగిన వార్షిక ఇజ్రాయెల్‌ దినోత్సవాన్ని బహిష్కరించారు. ఇజ్రాయెల్‌ అనుకూల ఏ కార్యక్రమమంలో కూడా భాగస్వామిని అయ్యేది లేదని ఎన్నికల సమయంలోనే కరాఖండితంగా చెప్పానని కూడా గుర్తు చేశారు. తాను యూదుల జీవన శైలికి వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పాడు. వారం రోజుల ముందే విలేకర్లతో మాట్లాడిన మందానీ తాను పాల్గ్గొనకపోయినా ఆ రోజు జరిగే కార్యక్రమానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్లుగానే అసాధారణ రీతిలో పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు జరగకుండా చూశారు. ఇజ్రాయెల్‌ ఉనికిలోకి వచ్చిన తరువాత 1964 నుంచి ప్రతి ఏటా జరుగుతున్న ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ విధిగా పాల్గొనాలని గతంలో నిర్ణయించారు.ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మేయర్లందరూ పాల్గొన్నారు, దాన్ని తిరస్కరించిన తొలి వ్యక్తిగా జోహ్రాన్‌ మందానీ చరిత్రకెక్కారు.  ఈ ఉదంతం గురించి  ప్రపంచ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు, విశ్లేషణలు వెలువడ్డాయి.డెమోక్రటిక్‌ పార్టీలో సోషలిస్టు వర్గంగా ఉన్నవారిలో మందానీ ఒకడు.అతను కార్యక్రమాన్ని బహిష్కరించినప్పటికీ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన అనేక మంది  భాగస్వాములయ్యారు. మందానీతో ఏకీభవించిన వారు కూడా దూరంగా ఉన్నారు. యూదు సామాజిక తరగతికి చెందిన వారంతా దురహంకారులు కాదు అన్నది మేయర్‌ ఎన్నికల సమయంలోనే రుజువైంది.న్యూయార్క్‌ నగరంలో యూదు సామాజిక తరగతికి చెందిన వారు గణనీయంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో గాజాలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం జరిపిన మారణకాండను తీవ్రంగా వ్యతిరేకించటం, ఆ ప్రభుత్వాన్ని విమర్శించటంలో జోహ్రాన్‌ మందాని ఎంతో స్పష్టంగా ఉన్నారు. మారణకాండకు బాధ్యుడైన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వస్తే  అంతర్జాతీయ న్యాయస్థాన వారంట్‌ ప్రకారం అరెస్టు చేయిస్తానని కూడా చెప్పినంగతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి.       

ఆదివారం నాటి ఇజ్రాయెల్‌ దినోత్సవంలో ఆ దేశానికి చెందిన ముగ్గురు దురహంకారులైన మంత్రులు ప్రతినిధులుగా పాల్గొన్నందున అది ఆ దేశ కార్యక్రమంగానే చూశారు. అలాంటి వారితో తాము గళం కలపటం ఏమిటని మందానీతో సహా అనేక మంది డెమోక్రాట్లు ప్రశ్నించారు. అంతే కాదు న్యూయార్క్‌ మాజీ కంప్‌ట్రోలర్‌, నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి సిద్దమౌతున్న బ్రాడ్‌ లాండర్‌, జాతి, ఆర్థిక న్యాయాల కోసం పోరాడుతున్న యూదుల సంస్థకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇజ్రాయెల్‌ దినోత్సవం రోజున ప్రదర్శనల్లో పాల్గొన్న ఇజ్రాయెలీ రాజకీయనేతలు పాలస్తీనియన్ల ఊచకోతకు హర్షాతిరేకాలు వెల్లడించటమేకాదు, మారణకాండకు పాల్పడిన ప్రభుత్వంలో భాగస్వాములు. ఇజ్రాయెల్‌  ఉత్సవాలు యూదుల ఉనికి లేదా వారికి గర్వకారణం కాదంటూ ఇది న్యూయార్క్‌ నగరమేయర్‌కు తెలుసని ఉత్సవంలో భాగస్వాములు గాకపోవటం తమకు ఎంతో ఆనందంగా ఉందని యూదుల సంస్థ ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. అయితే ప్రదర్శనలో పాల్గొనకూడదన్నది మేయర్‌ నిర్ణయమని తాను గర్వంతో హాజరవుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌, యూదు సామాజిక తరగతికి చెందిన జెస్సికా టిచ్‌ ప్రకటించారు. ప్రతి ఏడాది ఈ రోజు ఎంతో ఆనందకరమైనదని అమె వర్ణించారు. మొదటి నుంచీ మందానీని వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌ అనుకూలురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి కుదరక రాకపోవటం కాదని, భావజాలపరమైన, అవమానకర నిర్ణయమని వ్యాఖ్యానించారు. మీడియా రారాజుగా పేరున్న రూపర్ట్‌ మర్డోచ్‌ నిర్వహణలోని న్యూయార్క్‌ పోస్ట్‌ పత్రిక మొదటి పేజీలో మోటార్‌ సైకిల్‌ మీద తిరుగుతున్న మందానీ ఫొటో వేసి విద్వేష సైకిల్‌ , జో ఇజ్రాయెల్‌ పరేడ్‌ను అవమానిస్తూ సైకిల్‌ మీద తిరుగుతున్నాడు అంటూ వ్యాఖ్యానించింది.     

మేయర్‌కు మద్దతు ఇచ్చినవారి వాదనేమిటో చూద్దాం. న్యూయార్క్‌ ప్రదర్శనకు వచ్చిన వారిలో ఒకడైన బెజాలెల్‌ మోట్రిచ్‌ ఇజ్రాయెల్‌ ఆర్థిక మంత్రి, పాలస్తీనియన్ల మారణకాండను బహిరంగంగా సమర్ధించిన ఒక యూదు జాతీయ ఉన్మాది అని పేర్కొన్నారు. గత సంవత్సరం అమెరికా వచ్చి వెళ్లిన రెండువారాల తరువాత తనను ఆరెస్టు చేసేందుకు అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రయత్నిస్తున్నదని ఆరోపించాడు.అతను యూదు మత పార్టీనేత, అధికారిక అతిధుల జాబితాలో తొలుత అతని పేరు లేదు.చివరికి హాజరయ్యాడు. ఇలాంటి వాడితో కలసి ప్రదర్శనలో పాల్గ్గొనటం అనేక మంది డెమోక్రాట్లకు ఇబ్బందికరంగా తోచింది. అతను 2023లో మాట్లాడుతూ పాలస్తీనా వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతంలోని హవారా అనే పాలస్తీనియన్ల గ్రామాన్ని ప్రభుత్వమే నాశనం చేయాలని పిలుపునిచ్చాడు. ఆ వెంటనే ఉన్మాదులైన యూదులు పాలస్తీనియన్లను ఊచకోత కోశారు.అతని రెచ్చగొట్టే వ్యాఖ్యలను చివరికి అమెరికా కూడా ఖండించింది. గాజా నుంచి పాలస్తీనియన్లను తరిమికొట్టాలని, వెస్ట్‌ బ్యాంకు ప్రాంతాన్ని యూదులతో నింపాలని మోట్రిచ్‌ పిలుపునిచ్చాడు. మరొకడు ఇజ్రాయెల్‌ వలస వ్యవహారాల మంత్రి ఆఫిర్‌ సోఫెర్‌. వీడు మరింతగా రెచ్చిపోయాడు. ఇజ్రాయెల్‌కు వలస వస్తున్న యూదులందరూ సనాతనుల ప్రమాణాలను పాటించేవారు కాదని, లౌకిక, సంస్కరణ వాదులైన వారు, పాక్షిక వారసత్వం ఉన్న యూదులకు ఇక్కడ చోటు ఇవ్వరాదన్నాడు. మరొక మంత్రి అండ్‌ ఎలియాహు, గాజా మీద అణుబాంబు వేయాలని, వెస్ట్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. ఇలాంటి వారి సరసన మందానీ పాల్గ్గొంటాడా !       

   తాను ఇజ్రాయెల్‌ ఉనికి ప్రశ్నించటం లేదని, యూదులకు ఉన్నట్లే ఇతరులకూ హక్కులు ఉంటాయని గుర్తించాలని చెప్పాడు. న్యూయార్క్‌ నగరంలో యూదు వ్యతిరేక ధోరణులు పెరగకుండా చూసేందుకు ఉన్న సంస్థకు నిధుల పెంపుదలకు కూడా చర్యలు తీసుకున్నాడు. జోహ్రాన్‌ మందానీ సిద్దాంతాల వలన వివాదం తలెత్తింది తప్ప మోట్రిచ్‌ వంటి ఫాసిస్టు శక్తులతో కలసి డెమోక్రాట్లు భాగస్వాములైనందుకు కాదని బరాక్‌ ఒబామా ఏలుబడిలో భద్రతా సలహాదారుగా పని చేసిన బెన్‌ రోడ్స్‌ వ్యాఖ్యానించాడు.మోట్రిచ్‌ పచ్చిమితవాద వాచాలత్వం విలువలకు కట్టుబడిన న్యూయార్క్‌ వాసులంగా ఉన్న తమకు వ్యతిరేకమైనదని, అతని భాగస్వామ్యం యూదు సామాజికులకు గర్వకారణం కానందున తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ముస్లిం వ్యతిరేకతకు నగరంలో స్థానం లేదని మరికొందరు స్పందించారు. ఏడు లక్షల మంది పాలస్తీనియన్లను వెళ్లగొట్టి 1948లో ఇజ్రాయెల్‌ను ఉనికిలోకి తెచ్చారంటూ ఈ ప్రదర్శనకు కొద్ది రోజుల ముందు ఒక వీడియోను విడుదల చేశారు.తాను తొమ్మిదేండ్ల బాలికగా ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని, అప్పటి నుంచి వివిధ ప్రాంతాలలో ప్రవాసంలోనే గడుపుతున్నానని ప్రతిచోటా వెలుపలి మనిషిగానే చూశారని ఇనియా బుష్‌నాక్‌ ఆ వీడియోలో చెప్పిన మాటలు ఉన్నాయి.       

   తాజా వివాదం న్యూయార్క్‌ నగరం, అమెరికాలో మారుతున్న యూదుల ఆలోచనా సరళిని ప్రతిబింబించింది. న్యూయార్క్‌ నగరంలో సామాజిక పరంగా చూస్తే ఎక్కువ మంది యూదులు ఉన్నారు. మేయర్లుగా గతంలో పని చేసినవారందరూ ఇజ్రాయెల్‌ను సమర్ధించినవారు, తరచూ ఆ దేశాన్ని సందర్శించినవారే. జోహ్రాన్‌ మందానీ ఆ బాటలో నడవని ఒకే ఒక్కడు అంటే అతిశయోక్తి కాదు. ఏప్రిల్‌ నెలలో పూ పరిశోధనా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి పదిమందిలో ఆరుగురు అమెరికన్లు గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండను విమర్శించారు. ఇలాంటి వ్యతిరేకత 2022 నుంచి 20 పాయింట్లు పెరిగింది.ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఇజ్రాయెల్‌ దినోత్సవ ప్రదర్శన జరిపారు.    యూదు ఓటర్ల కేంద్రం ఈ వారంలో ఒక సర్వే వివరాలను వెల్లడించింది.అమెరికా యూదుల్లో 35 ఏండ్ల లోపు వారు సగం మంది ఇజ్రాయెల్‌ాపాలస్తీనా దేశాలు ఉండాలన్న ప్రశ్నకు మద్దతు ఇచ్చారు. సనాతనులు కాని వారు 51శాతం మద్దతు ఇచ్చారు. ఇదేదో వామపక్ష సంస్థ జరిపిన సర్వే అనుకుంటే పొరబాటు. ఉత్తర అమెరికా యూదు ఫెడరేషన్‌ జరిపిన సర్వేలో కేవలం 37శాతం మంది  అమెరికన్‌ యూదులు మాత్రమే మత సంబంధ గుర్తింపును చెప్పుకున్నారు. మత వ్యతిరేకం, మతంతో సంబంధం లేదని చెప్పుకున్న వారు 18 నుంచి 34 ఏండ్ల వయస్సు వారు మూడో వంతు ఉండటం విశేషం. నెతన్యాహు అనుసరిస్తున్న విధానాల పర్యవసానాల ఫలితంగా అమెరికా యువ యూదుల్లో అసంతృప్తి పెరుగుతున్నదని పరిశీలకులు ఈ సర్వే తీరుపై వ్యాఖ్యానించారు. 

    ప్రదర్శనకు దూరంగా ఉండి మందానీ యూదులనుంచి దూరం కాలేదా అన్న ప్రశ్నకు  ఇలాంటి మంత్రులను ఆహ్వానించిన వారే మెజారిటీ యూదుల నుంచి దూరమైనట్లు సమర్ధకులు తిప్పికొట్టారు.      హమస్‌ సాయుధ బృందాలు 2023 అక్టోబరు ఏడవ తేదీన ఇజ్రాయెల్‌పై దాడి చేసి అనేక మందిని చంపి, కొందరిని బందీలుగా పట్టుకుపోయిన తరువాత రోజు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ మిలిటరీ హమస్‌ను మట్టుబెట్టే పేరుతో గాజా ప్రాంతంలో 70వేల మంది సాధారణ పౌరులను హత్యచేసింది. వారిలో 70శాతం మంది మహిళలు, పిల్లలే. లక్షలాది గృహాలను నేలమట్టం కావించింది. ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనియన్లను గాజా నుంచి తరమివేసి పర్యాటక ప్రాంతంగా మార్చాలని అమెరికా ట్రంప్‌, నెతన్యాహు చెబుతున్నారు.పాలస్తీనాలోని మరొక ప్రాంతమైన వెస్ట్‌ బ్యాంకులో నిరంతరం యూదులను రప్పించి స్థిరనివాసాలను ఏర్పాటు చేసి యూదు మెజారిటీ ప్రాంతాలుగా చిత్రించి ఇజ్రాయెల్‌లో కలిపేందుకు లేదా వివాదాస్పద ప్రాంతాలుగా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. పాలస్తీనాకు రాజధానిగా ఉండాల్సిన తూర్పు జెరూసలెంను ఆక్రమించేందుకు చూస్తున్నారు.ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించేవారు అమెరికాలో నానాటికీ పెరుగుతున్నారని ముందే చెప్పుకున్నాం. గాజాలో మారణకాండకు పాల్పడినట్లు ఐరాస కమిషన్‌,ఇజ్రాయెలీ మరియు అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు సైతం దాన్ని నిర్ధారించటంతో సామాన్య అమెరికన్లు కళ్లు తెరుస్తున్నారు.ఇజ్రాయెల్‌ను తొత్తుగా చేసుకున్న అమెరికా తన ప్రయోజనాల కోసం చేస్తున్న దుర్మార్గాలతో సామాన్య యూదులపై కూడా వ్యతిరేకత పెరుగుతున్నది. అయితే వారు తాము దురహంకారులం కాదని, పాలస్తీనియన్లకు వ్యతిరేకం కాదంటూ జోహ్రాన్‌ మందానీ వంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తూ యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు.దేశ దేశాల్లో ఉన్న ఫాసిస్టు, మతశక్తులను దూరం పెట్టేందుకు ఆయా దేశాల పౌరులు జాగరూకులు కావాల్సిన తరుణం అసన్నమైంది !               

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

27 Wednesday May 2026

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

anti china, Asia NATO, Donald trump, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue, Qusd 2026 Delhi meet, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

మంగళవారం నాడు ఢిల్లీలో నాలుగుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. మహాభారతంలో నలుగురిని దుష్ట చతుష్టయం అని పిలిచారు.వారు దుర్మార్గానికి పాల్పడ్డారు గనుక దుష్ట అని విశేషణాన్ని చేర్చారు. అమెరికా,భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలు ఒక కూటమిగా భద్రత చర్చలు జరపాలని నిర్ణయించుకున్నందున చతుర్భుజ భద్రతా సంప్రదింపులు(క్వాడ్రలేటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌-క్వాడ్‌) అని పేరు పెట్టారు.పదే పదే అంత పెద్ద పేరుతో పలకలేం గనుక చతుష్టయం అందాం. మన విదేశాంగమంత్రి జై శంకర్‌ ఆహ్వానం మేరకు చతుష్టయ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఎందుకు జరిగిందయ్యా అంటే చైనాకు చెక్‌(అడ్డుకొనేందుకు) పెట్టేందుకు అని కొన్ని మీడియా సంస్థలు శీర్షికలు పెట్టాయి. పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన అది సాధుజంతువుగా ఉంటుందా ? కొన్ని దేశాలు సమావేశమైనపుడు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం,సంపదల సృష్టికి సహకారం, మద్దతు ఇవ్వాలి తప్ప మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోకూడదు అంటూ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా కుట్రలకు తెరతీయటం, కూటమిగా సంఘర్షణకు పూనుకోవటాన్ని చైనా వ్యతిరేకిస్తుందని ఆమె చెప్పారు. లోపల ఏం మాట్లాడుకున్నారో పైకి ఏం చెప్పారన్నదాని గురించి పెద్దగా బుర్రలు బద్దలు చేసుకోనవసరం లేదు. ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నందున ఎదుటివారికి చెప్పేందుకే ఉన్న నీతి సూత్రాలకు కొదవ ఉండదు.ముందుగా ఈ సమావేశం గురించి పెద్దగా చర్చలు కూడా జరగలేదు గనుక సాదాసీదా సమావేశంగానే మీడియా భావించిందని చెప్పాలి. ఈ భేటీకి పది రోజుల ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా యాత్ర చేసిన తరువాత నిజంగానే ఆ ఏముంటుందిలే అని పెద్దగా పట్టించుకోలేదు. పైకి ఏమి చెప్పినా దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకారవాణా జరగాలన్నది ఈ కూటమి అజెండాలో ఒకటి. ప్రపంచాన్ని పక్కదారి పట్టించేందుకు లేని సమస్యను ఉన్నట్లుగా చూపే ఒక మైండ్‌ గేమ్‌. సోవియట్‌ యూనియన్‌తో ఐరోపాకు ముప్పు పొంచి ఉందంటూ నాటో కూటమిని ఏర్పాటు చేసినట్లుగానే ఆ ప్రాంతంలో చైనా ముప్పు గురించి ప్రచారం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే ఎవరైతే ఈ డిమాండ్‌ చేస్తున్నారో ఆ దేశాల్లో ఒకటైన అమెరికా తన ఇరుగూ కాదు పొరుగూ కాదు, ఖండమూ కాదు, పదివేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హార్ముజ్‌ జలసంధిలో ఆయుధాలను చూపి నౌకల దిగ్బంధాన్ని అమలు జరుపుతూ మరోవైపు చైనా పెరటితోట వంటి దక్షిణ చైనా సముద్రం గురించి తేల్చాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.ఇంతవరకు చైనా ఏ ఒక్క నౌకనూ అడ్డుకున్న ఉదంతం లేదు.ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నౌకా రవాణాకు సంబంధించి నిఘావేసేందుకు నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు.

నిజానికి చతుష్టయ కూటమి ఏర్పాటలో దేశాల మధ్య అవగాహన తప్ప ఎలాంటి ఒప్పందమూ లేదు. తొలుత 2002 భారత్‌ మినహా మూడు దేశాలు త్రిపక్ష కూటమిగా ఏర్పడ్డాయి.తరువాత ఐదేండ్లకు భారత్‌ చేరింది.దీన్ని మరికొన్ని దేశాలను కలుపుకొని విస్తరించాలని చూసినప్పటికీ ఏ దేశమూ ముందుకు రాలేదు. తరువాత పదేండ్ల పాటు దాన్ని గురించిపెద్దగా పట్టించుకోలేదు. 2017 నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు, ప్రకటనలు చేస్తున్నారు.2021 నుంచి ఏటా ఒక సభ్యదేశంలో కూటమి అగ్రనేతల సమావేశాలు, దానికి ముందు విదేశాంగ మంత్రుల సన్నాహక సంప్రదింపులు జరుపుతున్నారు. ఆరుసార్లు అధినాయక సభలు జరగ్గా రెండుసార్లు వీడియో కాన్ఫరెన్సులు, రెండుసార్లు జపాన్‌లో, మరో రెండుసార్లు అమెరికాలో జరిగాయి.2024జూన్‌30 నుంచి జూలై రెండవ తేదీ వరకు కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్‌డిసిలో జరిగింది.డోనాల్డ్‌ ట్రంప్‌ మనతో సహా అనేక దేశాలపై పన్నుల యుద్ధం ప్రకటించటంతో గతేడాది సమావేశం జరగలేదు. తనకు వ్యతిరేకంగా జతకట్టడటంగా చైనా పరిగణిస్తుండగా, ఆసియా నాటో కూటమి అని రష్యా అంటున్నది,ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. పైకి ఎవరు ఏమి చెప్పినప్పటికీ చైనాను అడ్డుకొనేందుకే అన్నది స్పష్టం. దక్షిణ చైనా సముద్రంలోనికొన్ని దీవుల గురించి జపాన్‌, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. అయితే ఏ ఒక్క దేశపు నౌకనూ చైనా మలేసి(అడ్డుకున్న)న ఉదంతం లేదు. అయినప్పటికీ స్వేచ్చా రవాణా పేరుతో అమెరికా నాటకం ఆడుతోంది.ఇతర దేశాలను కూడగట్టేందుకు చూస్తోంది.ఆసియా-పసిఫిక్‌ లేదా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తమ పెత్తనం సాగాలన్నది దాని అసలు లక్ష్యం. ఇరాన్‌-అమెరికా మధ్య తలెత్తిన పోరు నేపధ్యంలో సంధి గురించి చర్చలు ఒకవైపు మరోవైపు విదేశాంగ మంత్రుల సమావేశాలు ఢిల్లీలో జరిగాయి. అమెరికా మంత్రి మార్కో రూబియో, జపాన్‌ మంత్రి టోషిమిట్సు మోటెగీ, పెనీ వాంగ్‌(ఆస్ట్రేలియా) పాల్గంటుండగా జై శంకర్‌ అధ్యక్షత వహించారు.

నాలుగు రోజుల పర్యటనకు వచ్చిన రూబియో ఇండో -పసిఫిక్‌ ప్రాంతం స్వేచ్చగా, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పాడు. ఇలాంటి సమావేశాలను భావసారూప్యత కలిగిన దేశాలతో ఏదో మొక్కుబడిగా జరపటం కాకుండా అనేక అంశాల్లో భాగస్వాములుగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.నౌకా రవాణా, కీలకమైన ఖనిజాలు,లోహాల వంటి అంశాలపై నిర్దిష్ట కార్యాచరణకు పూనుకుంటామని రూబియో అన్నాడు.ఈ ఏడాది ముగిసేలోగా నలుగురు అగ్రనేతల భేటీ ఉంటుందన్నాడు. గతేడాది వాషింగ్టన్‌లో జరిగిన సమావేశ చర్చల కొనసాగింపు ఉంటుందని మన విదేశాంగశాఖ ఢిల్లీ సమావేశం గురించి చెప్పింది. చతుష్టయ కూటమి లక్ష్యాలుగా ప్రజాస్వామ్యం, మానవహక్కులు,చట్టబద్దమైన పాలన వంటి కబుర్లు చెబుతున్నది. వీటన్నింటినీ అమెరికా ఉల్లంఘిస్తున్నది. చట్టబద్దంగా ఎన్నికైన వెనెజులా అధ్యక్షుడు మదురోను అమెరికా కిడ్నాప్‌ చేసి తమ దేశానికి తీసుకుపోయి తప్పుడు కేసులతో విచారణ జరుపుతున్నది. అక్కడ ఉన్న చమురు సంపదలన్నింటినీ తన దేశ కంపెనీలకు అప్పగించింది.ఇరాన్‌లో ఉన్న ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించి వేరే పాలకులను ఏర్పాటు చేస్తామని వాషింగ్టన్‌ బహిరంగంగా ప్రకటించటమేగాక దానిలో భాగంగా సుప్రీం నేత ఖమేనీ, ఇతర అనేక మందిని చంపివేయటంతో పాటు దాడులు కూడా చేసిన సంగతి తెలిసిందే. గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని బరితెగించి సమర్ధించిన అమెరికా మానవహక్కుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలను వల్లించినట్లే.ఇది సైనిక కూటమి కాదని చెప్పినప్పటికీ మన దేశ ఆధ్యర్యంలో నాలుగు దేశాల మిలిటరీ మలబార్‌ సైనిక విన్యాసాలు జరిపాయి.

చైనాను కట్టడి చేయాలని నాలుగుదేశాల నేతలకూ ఉన్నప్పటికీ పిల్లిమెడలో గంటకట్టేదెవరన్న సమస్య ఉంది.ఆర్థిక రంగాల్లో సహకరించుకొనేందుకు అనేక వేదికలు ఉన్నప్పటికీ ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నారు.ఒక వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయాయి. ఆర్థిక, మిలిటరీ రంగాలలో ఏ ఒక్క దేశానికీ పోలిక లేదు అసమానతలు ఉన్నాయి.చైనా వ్యతిరేకతను ముందుకు తీసుకుపోయి తెగేంతవరకు లాగేందుకు ఎవరూ సిద్దంగా లేరు ప్రత్యేకించి భారత్‌, ఆస్ట్రేలియాలు అలాంటి వైఖరిని కనపరిచాయి. ఆర్థిక రంగంలో మిగిలిన మూడు దేశాలను నమ్ముకున్న భారత్‌కు ఆశించిన మేరకు పెట్టుబడులు రాలేదు. దీంతో గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత ఐదు సంవత్సరాల పాటు నామ మాత్ర సంబంధాలను మాత్రమే కొనసాగించిన మనదేశం ఇప్పుడు పెట్టుబడులకు ఆహ్వానం పలకటంతో సహా సాధారణ సంబంధాలను పునరుద్దరించుకుంది. అటువంటపుడు చైనా వ్యతిరేకత అనే ఎర్రగీతను దాటి ముందుకు పోయే స్థితి లేదు. తక్షణం పరిష్కరించాలని భావిస్తున్న ప్రాంతీయ సమస్యల తీవ్రతను తగ్గించే అవకాశాలు కూడా లేవని ఇన్ని సంవత్సరాల అనుభవం నేర్పింది.పశ్చిమాసియాలో ఇరాన్‌పై దాడి చేసి దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక అమెరికా గిలగిలా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే.అమెరికాకు ఏ ఒక్క దేశమూ మద్దతుగా నిలవకపోగా ఇరాన్‌కు మద్దతుగా చైనా వ్యవహరిస్తున్నది, భద్రతా మండలిలో దాన్ని కాపాడిన తీరు తెలిసిందే.

చతుర్భుజ భద్రతా చర్చల పేరుతో వ్యవహరిస్తున్నవారు ఇప్పుడు ఇతర అంశాల మీద కేంద్రీకరించటాన్ని బట్టి ఈ కూటమి దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత వెల్లడి అవుతున్నది. కొందరు సాధువులు రాత్రికి ఒక చోట చేరి ప్రతి రోజూ గంజాయిదమ్ము కొట్టేవారు. అది తలకు ఎక్కగానే తెల్లవారిన తరువాత అది చేయాలి ఇది చేయాలి, ఈ బతుకు ఎంతకాలం అంటూ ప్రగల్భాలు పలికేవారట. తెల్లారేసరికి దమ్ముదిగి ఎవరి కర్రా బుర్రా తీసుకొని వారు ఊరు మీదకు వెళ్లేవారు. చైనా పేరు పెట్టకుండా దాన్ని ఉద్దేశించి ఆర్ధికబలవంతం, ధరల తిమ్మినిబమ్మిని,సరఫరా వ్యవస్థల విచ్చిన్నం, అక్రమ మార్కెట్‌ పద్దతులు, కీలకమైన ఖనిజాల ఉత్పత్తి మీద కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్న దేశాలంటూ ధ్వజమెత్తుతూ ప్రతి సమావేశంలో మాట్లాడుతుంటారు. నాలుగుదేశాల నేతలు సమావేశమైనపుడు పరోక్షంగా చైనా మీద మాటలదాడిలో ఎవరూ తక్కువ తినటం లేదన్నది గతసమావేశాల తీరుతెన్నులు స్పష్టం చేశాయి. చైనా నుంచి తలెత్తిన ముప్పు పేరుతో చేస్తున్న ప్రచారానికి దానితో సంబంధాలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. అలాంటి దేశంతో లావాదేవీలు తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకొనేందుకు ప్రతిదేశమూ విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నది. ఉదాహరణకు 2014లో మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో చైనా 38 బిలియన్‌ డాలర్ల మేరకు మిగులు ఉండగా 2026నాటికి 116 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా వస్తువుల దిగుమతుల్లో నరేంద్రమోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నారు.గతేడాది ట్రంప్‌ మనపై పన్నుల దాడి ప్రారంభించినపుడు నరేంద్రమోడీ చైనా పర్యటనలో షీ జింపింగ్‌, పుతిన్‌తో కలసి అవసరమైతే తాము ఏకమౌతామనే సంకేతాన్ని ఇచ్చిన సంగతిని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. చైనాను మింగేస్తాం, నలిపేస్తాం అంటూ కొండంత రాగం తీసిన ట్రంప్‌ ఈ నెలలోనే పెద్ద సంఖ్యలో తన కార్పొరేట్‌ అధిపతులను బీజింగ్‌ పర్యటనకు తీసుకువెళ్లి సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. అది వాణిజ్య పర్యటన తప్ప మరొకటి కాదు. విలువైన ఖనిజాల ఉత్పత్తులను చైనా బంద్‌ చేయటంతో తిరిగి కాళ్లబేరానికి రావటాన్ని చూశాము. గతేడాది ఆస్ట్రేలియాలో లోవీ సంస్థ నిర్వహించిన సర్వేలో చైనా తమకు ఆర్థిక భాగస్వామితప్ప ముప్పుదేశం కాదని మెజారిటీ అభిప్రాయపడినట్లు తేలింది. చైనా అనేక దేశాలతో వాణిజ్య మిగులుతో ఉంటే ఆస్ట్రేలియా అదే చైనాతో 2025లో 4.21 బిలియన్‌ డాలర్లు మిగులులో ఉంది. అందువలన అది చైనాతో తగాదాకు ఏమాత్రం సిద్దపడటం లేదు. ఉత్తర కొరియాను చూసి జపాన్‌ భయపడుతున్నది తప్ప చైనాతో వాణిజ్యాన్ని వదులుకొనేందుకు సిద్దంగా లేదు. అమెరికా కనుసన్నలలో నడిచే దక్షిణ కారియా పరిస్థితి అంతే. ఢిల్లీ సమావేశంకోసం వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌కు ఎంత చమురు కావాలంటే అంత సరఫరా చేస్తామంటూ బిస్కెట్‌ వేశారు.మన అవసరాలకు ప్రతిదేశం నుంచి చమురు కొనుగోలు చేయాల్సి ఉంది.అలాగాక అమెరికాను నమ్మి మిగిలిన దేశాలను వదలివేస్తే పరిస్థితి తారుమారైతే అమెరికన్లు మన జట్టుపట్టుకుంటారు, తమ కాళ్ల ముందు పడేట్లు చేసుకుంటారు. రూబియో ఢిల్లీలో మాట్లాడుతూ విలువైన లేదా కీలక లోహాలపై ఒక ఏర్పాటును ప్రకటిస్తామని, పరస్పర సహకారం, పెట్టుబడులు సరఫరాలను సమన్వయం చేసుకుంటామని చెప్పాడు. ఇండో-పసిఫిక్‌ ఇంథన భద్రతను కూడా పటిష్టపరుస్తామన్నాడు. ఇంకా ఇండో-పసిఫిక్‌ నౌకా నిఘాసహకారం పెంచుకుంటామని చెప్పాడు. ఇలాంటి సాధారణ విషయాలు తప్ప ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామమేదీ ఢిల్లీ సమావేశంలో జరగలేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

20 Wednesday May 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Narendra Modi Failures, Taiwan Matters, Trump China 2026 Trip, US attack Iran, West Asia Crisis, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

కతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వినతి మేరకు ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అంతకు ముందు రెండు మూడు రోజుల్లో ఒప్పందానికి రాకపోతే యుద్దాన్ని తిరిగి ప్రారంభిస్తానని చెప్పాడు. పార్లమెంటు ఆమోదం పొందకపోతే ఇరాన్‌పై సాగిస్తున్న దాడులను నిలిపివేయాలంటూ అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తూ మంగళవారం నాడు అమెరికా సెనేట్‌ 50-47తో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతకు ముందు ఏడు సార్లు డెమోక్రటిక్‌ పార్టీ ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. నలుగురు అధికార రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు చేతులు కలపటంతో నెగ్గింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక దేశం మీద యుద్ధం చేయాలంటే పార్లమెంటు తీర్మానం అవసరం. అయితే అధ్యక్షుడికి ఉన్న అధికారాల గురించి 1973లో పార్లమెంటు చేసిన తీర్మానం మేరకు అరవై రోజులకు మించి సైనిక చర్యకు ఆదేశిస్తే పార్లమెంటు ఆమోదం విధిగా పొందాల్సి ఉంది. ఈ కారణంగానే అసలు తాము ఇరాన్‌ మీద యుద్దం చేయటం లేదని, మిలిటరీ చర్య మాత్రమే అని బుకాయించాడు, అంతేకాదు ఫిబ్రవరి 28న దాడులను ప్రారంభించిన ట్రంప్‌ ఏప్రిల్‌ 7న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాడు. అప్పటి నుంచి అదిరింపులు బెదిరింపులతో కాలం గడుపుతున్నాడు. అమెరికా చేసిన దాడులనుంచి తాము అనేక విషయాలను నేర్చుకున్నామని, మరోసారి దాడులకు పాల్పడితే ఊహించని విధంగా దెబ్బతీస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి ప్రకటించాడు. తిరుగులేనిదని చెప్పుకున్న ఎఫ్‌-35 యుద్ధ విమానాన్నే కూల్చివేశామని, మరో 42 ఇతర విమానాలు, శక్తివంతమైన డ్రోన్లను కూడా తాము కూల్చివేసినట్లు అమెరికన్‌ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు కూడా ఇరాన్‌ ప్రకటించింది.యుఏయి అణువిద్యుత్‌ కేంద్రంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడిచేసింది.దానికేమీ నష్టం జరగనప్పటికీ అవసరమైతే క్షిపణులతో ధ్వంసం చేయగలమని సందేశాన్ని ఇరాన్‌ పంపింది.

మే నెల 14,15 తేదీలలో ప్రపంచంలో ఇద్దరు శక్తివంతులైన నేతలు చైనా రాజధాని బీజింగ్‌లో భేటీ అయ్యారు. సహజంగానే ఈ కలయిక ఫలితాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతోంది.అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవసారి చైనా సందర్శించాడు. పర్యటనకు ముందు, తరువాత కూడా ఈ ఉదంతం గురించి పెద్ద ఎత్తున విశ్లేషణలు వెలువడ్డాయి. డ్రాగన్‌ దేశ సందర్శన విఫలమైందని,వాణిజ్య పోరు ఎదురుతన్నిందని,అమెరికన్‌ కార్పొరేట్లు నిరాశాపూర్వక ప్రయత్నాలు చేసినట్లు, ఇంకా అనేక అంశాల గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యలు, వివరణలు వెలువడ్డాయి. విజయవంతమైందనే మాట ఎక్కడా వినిపించలేదు. సాధారణంగా దేశాధినేతల పర్యటనలు ఇతర దేశాల ఆహ్వానం మేరకే జరుగుతాయి. ట్రంప్‌ తాజా పర్యటనకు చైనా నుంచి అలాంటి ఆహ్వానం లేదు. మీ ఇంటికి ఒకసారి రావాలని కొందరు అంటారని తెలిసిందే, అలాగే ట్రంప్‌ తన వాంఛను వెలిబుచ్చిన తరువాత అంతకంటేనా అని బీజింగ్‌ స్పందించింది.అలాగని మర్యాదలకు లోటు చేయలేదు.ట్రంప్‌ పరివారానికి హెచ్చరికలతో పాటు అనేక బహుమతులు కూడా ఇచ్చిపంపారు. అయితే వాటిలో దొంగచెవులు, నిఘా కెమెరాలను అమర్చారంటూ స్వదేశానికి తీసుకుపోకుండా ఒక చెత్తబుట్టలో వేసి చూపి మరీ ట్రంప్‌ బృందం చైనాను అవమానించింది అనటం కంటే తన చౌకబారు తనాన్ని వెల్లడించుకుంది. గతంలో కూడా అమెరికన్లు గుట్టుచప్పుడు కాకుండా అదేపని చేసేవారని వార్తలు వచ్చాయి. ఈ చర్య ద్వారా షీ జింపింగ్‌ యంత్రాంగం తమ బుట్టలో పడలేదనే ఉక్రోషం ప్రదర్శితమైంది.చైనాను వత్తిడి చేయటంలో విఫలం కావటాన్ని వాణిజ్య యుద్దంలో ట్రంప్‌ ఓటమిగా కొందరు వర్ణించారు.ఆ పెద్ద మనిషి అంతగా కోరి మరీ ఎందుకు చైనా వెళ్లాడంటే ముక్తసరి సమాధానం అమెరికా ఆర్థిక పరిస్థితి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందనే సమాధానం వచ్చింది. చైనా పర్యటన సమయంలో ట్రంప్‌ రేటింగ్‌ 34 శాతానికి దిగజారింది.రుణ భారం జిడిపికి వందశాతం దాటింది. పులిమీద పుట్రలా ఇరాన్‌పై దాడి చేసి మరింత లోతుగా కూరుకుపోయింది.గౌరవ ప్రదమైన విధంగా ఇరాన్‌తో రాజీకుదర్చాలనే అజెండా తెరవెనుక ఉందని చెబుతున్నారు.వ్రతం చెడ్దా ఫలం దక్కలేదు.చైనా పైచేయిగా ఉందని వాషింగ్టన్‌ మేథో సంస్థ విదేశీ వ్యవహారాల మండలి(సిఎఫ్‌ ఆర్‌) వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఏమిటో వేరే చెప్పనవసరం లేదు.అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాటి వెనుక టెస్లా కంపెనీ యజమాని ప్రపంచ ధనికుడు ఎలన్‌మస్క్‌, అందరికీ సుపరిచితమైన ఆపిల్‌, బ్లాక్‌రాక్‌, ఎన్‌విడియా, బోయింగ్‌, జిఇ, మైక్రాన్‌ ఇలా అనేక కంపెనీల అధిపతులు ఉంటారు.ఎవరు మంత్రులు కావాలో, ఏ విధానాలను అనుసరించాలో కూడా నిర్దేశించేది వారే.

ఈ బృందం ఆశాభంగం చెందటానికి కారణాలు ఏమిటి ? గతంలో చైనాకు అవసరమైన చిప్స్‌ను సరఫరా చేయటంలో ఎన్‌విడియా కంపెనీ వాటా 95 శాతం ఉండగా ఇప్పుడు సున్నా శాతానికి పడిపోయింది.చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను సరఫరా చేయకూడదన్న ఆదేశాలకు సదరు కంపెనీ తలొగ్గింది. సవాలుగా తీసుకున్న చైనా తన స్వంత కంపెనీలను ప్రోత్సహించి చిప్స్‌ను అభివృద్ధి చేసుకుంటున్నది. విధిలేక నిషేధం ఎత్తివేసిన తరువాత చూద్దాం, అవసరమైనపుడు మేమే సంప్రదిస్తాం అన్నట్లుగా చైనా అటువైపే చూడలేదు.అందుకే ఆ కంపెనీ యజమాని ట్రంప్‌తో పాటు బీజింగ్‌ వెళ్లాడు. నూటనలభై కోట్ల జనాభాలో 2027 నాటికి 120 కోట్ల మంది మధ్య తరగతిలో ఉంటారని అంచనా. ప్రపంచంలో వీరి వాటా 25శాతం. ఇంత మంది వినియోగదారుల మార్కెట్‌ను అమెరికా కార్పొరేట్లు వదులు కుంటాయా ? వాటికి కావాల్సింది లాభాలు, వాటికోసం రాజకీయాలు చేస్తాయి, అవి తమకు ఆటంకంగా మారినపుడు ప్లేటు ఫిరాయిస్తాయి.

సంస్కరణలు అంటే మన మాదిరి విదేశాలకు ఏకపక్షంగా తలుపులు బార్లా తెరవటం కాదు.మనం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ నిర్దేశిత విధానాల చట్రంలో చేస్తే దానికి భిన్నంగా టెక్నాలజీ అందిస్తే మార్కెట్‌లో అవకాశమిస్తాం అనే షరతు మీద చైనా కమ్యూనిస్టులు వ్యవహరించారు.ఈ కీలకమైన అంశాన్ని వదలి వారు నియంతలు, మనది ప్రజాస్వామ్యం అందుకే చైనాతో పోల్చుకోవద్దు అంటూ కొందరు సొల్లు కబుర్లు చెబుతారు. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి.చైనా తనకు పోటీగా రాదని భావించినంత కాలం అమెరికన్లు ఎలాంటి యాగీ చేయలేదు. తరువాతే అక్కడ మానవహక్కులు లేవని, కరెన్సీ విలువను తగ్గించి ఉంచుతున్నారని, సబ్సిడీలతో సరకులను తక్కువ ధరలకు ఎగుమతి చేస్తున్నారని ఇలా రకరకాల సాకులను ముందుకు తెచ్చారు. ట్రంప్‌ తొలిసారి అధికారానికి వచ్చినపుడు 2018లో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించాడు. పెద్ద మొత్తంలో అమెరికా పెట్టుబడులు తగ్గించాడు, వాణిజ్యమూ తగ్గింది. అయినా గడచిన ఎనిమిది సంవత్సరాల్లో చైనాకు స్వల్ప సమస్యలు తప్ప అదేమీ కుప్పకూలి పోలేదు. వాణిజ్యం తరువాత చిప్‌ వార్‌ను ప్రారంభించాడు.దాన్ని కూడా సవాలుగా తీసుకొని మీ చిప్స్‌ మాకు అవసరం లేదనట్లుగా ఇప్పుడు చైనా ఉంది. దాంతో చైనా పట్ల వైఖరిని మార్చుకోవాలని కొన్ని పెద్ద కార్పొరేట్‌ కంపెనీలు వత్తిడి తెచ్చిన కారణంగానే పిలవక పోయినా పెద్ద సంఖ్యలో వాటి యజమానులను వెంటేసుకొని ట్రంప్‌ బీజింగ్‌ వెళ్లాడు. చైనా కనీసం ఐదు వందల విమానాలను కొనుగోలు చేస్తుందని కొందరు జోశ్యం చెప్పారు.అన్నిగాకున్నా రెండు వందలు అమ్ముదామని ట్రంప్‌ చెప్పాడు. చివరికి దీని గురించి అడిగితే చైనా ప్రతినిధి సమాధాన్ని దాటవేయటంతో బోయింగ్‌: కంపెనీ వాటాల ధరలు నాలుగుశాతం పడిపోయాయి. ఎన్‌విడియా చిప్స్‌ కంపెనీకి సైతం ఇదే ఆశాభంగం ఎదురైందని వార్తలు. బీజింగ్‌ తన ప్రయోజనాలను ఫణంగా పెట్టుకొని తమకు రాయితీలు ఇస్తుందని ట్రంప్‌ ఎలా ఆశించాడు, ఆలోచించాడన్నది ఒక చిక్కు ప్రశ్నగా మారింది.కొన్ని దేశాల్లో దళారీ బూర్జువా శక్తులు వ్యక్తిగతంగా తాము లబ్డిపొంది దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా, ఇతర ధనిక దేశాలకు సహకరించినట్లుగానే చైనా కమ్యూనిస్టులు చేస్తారని ఆశించి భంగపడ్డారని వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్‌ నుంచి తనకు చమురు అందకుండా చేసేందుకు అమెరికా కుట్రలు తెలిసిందే. అదే ఇరాన్‌ మీద దాడులు చేస్తూ సంక్షోభ పరిష్కారానికి ఇరాన్ను దారికి తేవాలని కోరటం కూడా ట్రంప్‌ దురాశే.

ఇప్పుడు చైనా అమ్ములపొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి. ఏడాది క్రితం చైనా వస్తువులపై 145శాతం పన్నులు విధిస్తా అంటే తాము కూడా అదే మర్యాద చేస్తామని ట్రంప్‌కు చెప్పారు. తన దగ్గర తిరుగులేని అస్త్రాలు ఉన్నాయని, చైనాను నాశనం చేస్తానని చెప్పటం తప్ప వాషింగ్టన్‌ ఇంతవరకు బయటకు తీసిందేమీ లేదు.చైనా ప్రతి సుంకాలు విధిస్తే మనకు నష్టమా అని ప్రశ్నిస్తే వారు పెద్ద తప్పు చేశారు, మనం దిగుమతి చేసుకొనే వస్తువుల్లో ఐదోవంతు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం గనుక నష్టపోయేదే వారే అని అమెరికా విత్త మంత్రి స్కాట్‌ బెసెంట్‌ గొప్పలు చెప్పాడు. అటువంటపుడు ట్రంప్‌ చైనా ఎందుకు వెళ్లినట్లు ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తే వాటి తయారీకి అవసరమైన విలువైన ఖనిజాల ఉత్పత్తులను నిలిపివేసి డ్రాగన్‌ వాషింగ్టన్‌లో రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. సముద్రంలో నీరున్నా తాగేందుకు పనికి రాదన్నట్లు అమెరికా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాలను చూసుకొనే స్థితి లేదని గగ్గోలు పెడుతున్నారు. ఒంటరిగా చేయలేమని భావించి పాక్స్‌ సిలికా పేరుతో కొన్ని దేశాలతో కూటమి గట్టింది, వాటి ప్రయత్నాలు ఫలించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంతవరకు ఆగలేమంటూ కార్పొరేట్లు ట్రంప్‌ మీద వత్తిడి తెస్తున్నాయి. చైనాను దెబ్బతీయటంతో పాటు దానికి ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలను తయారు చేసే ఎత్తుగడతో గత పది సంవత్సరాలుగా అక్కడి నుంచి కంపెనీలను తరలించాలని శ్వేత సౌధం వత్తిడి చేస్తున్నది.ఆమేరకు యాపిల్‌ కంపెనీ మనదేశానికి వచ్చినప్పటికీ దానికి ఎదురైన సమస్యలను చూసి మిగిలిన సంస్థలు సాహసించటం లేదు.ఎలన్‌ మస్క్‌ టెస్లా కంపెనీ తయారు చేస్తున్న విద్యుత్‌ కార్లలో సగం చైనాలోనే ఉన్నాయి, అయినప్పటికీ అమెరికా పరిశ్రమను బీజింగ్‌ నాశనం చేయనుందని, గగ్గోలు పెడితే జో బైడెన్‌ సర్కార్‌ 2024లో చైనా కార్లపై వందశాతం దిగుమతి సుంకం విధించింది.అయినా చైనా తగ్గలేదు.

వాణిజ్య అంశాల్లో పరిస్థితి ఇలా ఉంటే రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణ జరిగిన నాటి నుంచీ తైవాన్‌ అంశం నలుగుతూనే ఉంది. ఆ ప్రాంతం చైనాలో అంతర్భాగమని గుర్తిస్తూనే విడదీసి ప్రత్యేక దేశంగా మార్చాలనే కుట్రలకు అమెరికా తెరతీసింది, టిబెట్‌ను మరోదేశంగా మార్చాలనే ఎత్తుగడతో దలైలామా పేరుతో తిరుగుబాటుకు తోడ్పాటునిచ్చిన సంగతి తెలిసిందే.చైనాకు కేవలం 59 మైళ్ల దూరంలో ఉన్న తైవాన్‌ రక్షణకు 9,500 మైళ్ల దూరం నుంచి వచ్చి యుద్దం ఎలా చేయగలమని ట్రంప్‌ ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌ జర్నలిస్టులను ప్రశ్నించాడు. ఇలాంటి స్పందన గతంలో ఏ అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి రాలేదు. అమెరికన్లు ఎందుకు తైవాన్‌ గురించి ఆందోళన చెందుతున్నారంటే అక్కడి చైనా జాతీయుల గురించి కాదు, ఆధునిక చిప్స్‌ తయారీ ఫ్యాక్టరీల పైనే కన్ను. ఒక వేళ చైనా గనుక బలవంతంగా విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను నాశనం చేస్తామని గతంలో అమెరికా బెదిరించింది.తైవాన్‌ అంశం గురించి చైనా ముందుకు తెస్తే ట్రంప్‌ ఇరాన్‌ గురించి ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి.అమెరికా అధ్యక్ష భవనం విడుదల చేసిన ప్రకటనలో కేవలం 163 పదాలే ఉన్నాయి.హార్ముజ్‌ జలసంధి గురించిన ప్రస్తావన మూడుసార్లు ఉంది.చైనా విడుదల చేసిన ప్రకటనలో అసలు ఇరాన్‌ ప్రస్తావనే లేదు, కేవలం మధ్య ప్రాచ్య పరిస్థితి అనే మాటమాత్రమే ఉంది.

ఇరాన్‌పై విజేతగా బీజింగ్‌ అడుగుపెట్టేందుకు కలలు గన్న ట్రంప్‌కు ఆశాభంగం ఎదురైంది. రెండు రోజుల ట్రంప్‌ పర్యటన తరువాత జరిగిన పరిణామాలను చూస్తే పశ్చిమాసియా సంక్షోభంలో ఎలాంటి సానుకూల పరిణామాలు లేవు. గతంలో మాదిరే ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. పెద్ద ఎత్తున దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కథనాలను వండి వారుస్తున్నారు.మరో నెల రోజుల పాటు సముద్రంలో ఉన్న నౌకలనుంచి రష్యన్‌ ముడి చమురు కొనుక్కొనేందుకు భారత్‌తో సహా కొన్ని దేశాలకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుమతిని పొడిగించాడు.బ్రెంట్‌ రకం ముడిచమురు ధర మంగళవారం నాడు రెండు డాలర్లు తగ్గి 110 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి అమెరికా చమురు వినియోగదారులపై 45 బిలియన్‌ డాలర్ల మేర అదనపు భారం పడింది.అందువలన అనిశ్చితి ఇంకా కొనసాగితే మరింత పెరిగి నవంబరులో జరిగే ఎన్నికల్లో ఓటర్లు ట్రంప్‌కు చుక్కలు చూపించే అవకాశం ఉంది. అనేక దేశాలకు ఎరువుల సరఫరాతో పాటు, వాటి ఉత్పత్తికి అవసరమైన గ్యాస్‌ లభ్యత కూడా తీవ్రంగా మారే అవకాశం ఉంది, ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగాయి. మరికొద్ది వారాల్లో మనదేశంలో ఖరీఫ్‌ తరుణం ప్రారంభం కానుంది.ఎరువులను కేంద్ర ప్రభుత్వం ఎలా అందించనుందో చూడాల్సి ఉంది.యావత్‌ దేశాన్ని కలవర పెడుతున్న అమెరికా దాడులను ఖండించే ధైర్యం లేకపోయినా కనీసం ఆపమని ట్రంప్‌ను నరేంద్రమోడీ ఎందుకు వేడుకోరన్న ప్రశ్నకు జవాబు దొరకటం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రో బాదుడుకు రంగం సిద్దం చేసిన ” మోడీ బాబా ” ! పొదుపు చేయని వారు దేశభక్తులు కాదా !!

13 Wednesday May 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP, WAR

≈ Leave a comment

Tags

#Fuel Prices India, BJP, BJP u turn on Fuel prices, fuel politics, Fuel Price in India, Mody Hyderabad call, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు పొదుపోపదేశం చేశారు. ఇంకేముంది పొలోమంటూ కాన్వారులను తగ్గించుకుంటున్నట్లు అనేక మంది ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారు సరేసరి. ప్రధానికి ఇంత ఆకస్మికంగా జ్ఞానోదయం ఎందుకు కలిగినట్లు అని ”దేశంకోసం-దర్మం కోసం ” ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. విదేశీ మారకద్రవ్యం, ఇతర అంశాల సమస్యలు ఇప్పటికిప్పుడు తలెత్తాయా ? నిజం అయితే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని ఎందుకు ప్రకటించటం లేదు. ముందు జాగ్రత్త అని బిజెపి నేతల ముక్తాయింపు.జనాల్లో అదెప్పుడూ ఉంటుంది. విడ్డూరం గాకపోతే వారు చెబితేనే జాగ్రత్తపడతరా ! ఇక చమురు ధరలను పెంచకతప్పదని కేంద్ర చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు చెప్పకనే చెప్పారు. బుధవారం నాడు మరోసారి మోడీ సందేశం. నిజానికి అది మంత్రులకు కాదు, జనానికే. అనివార్యమై ధరలను పెంచామని చెప్పబోతున్నారు. నిర్ణీత వంద కొరడా దెబ్బలను ఒకేసారి తింటారా దశలవారీనా అన్నది తేల్చుకోవాలని జనాలకు అవకాశం ఇస్తున్నారు తప్ప నూరు వాతలు తప్పవు.ఇప్పటికే ఆమేరకు మీడియాకు తాజా లీకులు వదిలారు. పెట్రోలు మీద లీటరుకు రు.14, డీజిల్‌ మీద రు.42, గృహవినియోగ ఎల్‌పిజి సిలిండరు మీద రు.674 నష్టం వస్తున్నదన్నది వాటి సారం. చమురు, గ్యాస్‌ సబ్సిడీలను ఎత్తివేసినందున ఏదో ఒక రూపంలో జనాలు ఈ మేరకు భరించటానికి సిద్దపడాలనే సందేశం ఇప్పటికే చేరవేశారు. వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్‌ ధరలను ఎలా పెంచిందీ చూశాము. రోజుకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చమురు కంపెనీలకు నష్టం వస్తున్నదనిపూరీ చెప్పారు. ధరల పెంపుదల గురించి అడగ్గా మీకు తెలియనిదేముంది ప్రధాని నరేంద్రమోడీ ”భవిష్యత్‌ దార్శనికుడు ” అన్నట్లుగా చెప్పారు. అంటే ఆదివారం నాడు (2026 మే 10) హైదరాబాదులో చేసిన ఒక విలక్షణ ప్రసంగంలో మోడీ యమలీలను గుర్తు చేశారు. ఎప్పుడూ చేసే రాజకీయాలను వదల్లేదు గానీ ఇతర విషయాలే మీడియాలో పతాకశీర్షికలయ్యాయి,విశ్లేషణలు వెలువడ్డాయి.మన్‌కీ బాత్‌ పేరుతో 2014 అక్టోబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రేడియోలో నెలకు ఒకసారి చొప్పున 113సార్లు మోడీ ప్రసంగించారు. ఎంతమంది ఎన్నింటిని విన్నారో ఎవరికి వారు లెక్కవేసుకోవాల్సిందే. ఒక సర్వే ప్రకారం ఐదుశాతం మంది శ్రోతలు మాత్రమే ఆలకించినట్లు తేలింది. అలాంటి ప్రసంగమే హైదరాబాద్‌లో చేశారని చెప్పవచ్చు. దానిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసిన సమీక్షల సారం ఏమిటంటే ఇంథన ధరలను పెంచకతప్పదనే మహత్తర సందేశాన్ని ప్రధాని దేశానికి అందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే పెంచుతారని ఊరూవాడా భావించారు. అయితే వెంటనే ఆ ప్రకటన వెలువడలేదు. కారణం ఏమిటంటే అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి కుదిరి సాధారణ పరిస్థితి ఏర్పడుతుందనే వార్తలు రావటం ఒకటి. నిజంగా అది జరిగితే ధరలు ఎందుకు పెంచారని జనం ప్రశ్నిస్తారు. రెండవది ప్రతిపక్షాలు చెప్పింది వాస్తవమే అని నిర్ధారించుకుంటారు. ఇప్పుడు ఏ పేరుతో పెంచాలా అని మధనపడుతున్నారు.ఊహించని విధంగా పశ్చిమాసియా సంక్షోభం కొనసాగటం మోడీ పరివారానికి అవకాశమిస్తున్నదని చెప్పవచ్చు.

ఇజ్రాయెల్‌ నెతన్యాహు, అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ మాటలను నమ్మి వారం రోజుల్లో ఇరాన్‌ పని అయిపోతుంది లెమ్మని కేంద్రంలోని పెద్దలు తడిబట్ట వేసుకొని పడుకున్నారని సంక్షోభ ప్రారంభంలో వారి తీరుతెన్నులే స్పష్టం చేశాయి. ఏ రోజు తిరిగి దాడులు మొదలౌతాయో తెలియని స్థితి. ఆందోళనలో ఉన్న వారికి బిపి పెరుగుతూ తగ్గుతూ ఉండే మాదిరి యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ మార్కెట్‌ చమురు ధరలు ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో మన స్టాక్‌ మార్కెట్‌ ఈ కారణంగానే భారీగా పతనమైంది. ఇప్పటికే చమురు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ వార్తలను రాయిస్తున్నారు. గతంలో ప్రత్యేక పన్నులు, సెస్‌ల రూపంలో బాదిన బాదుడుకు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లలో రాబడి పెరిగినపుడు ఏ మీడియా కూడా ఆ వార్తలను ప్రముఖంగా రాయలేదు గతంలో లాల్‌బహుదూర్‌ శాస్త్రి పాక్‌తో యుద్దం వచ్చినపుడు ఇచ్చిన పిలుపు మాదిరే ఇప్పుడు తమ మోడీ దేశ పౌరులకు పొదుపు విజ్ఞప్తి చేశారు తప్ప బలవంతం చేయటం లేదని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు.నాడు యుద్ధం వచ్చింది గనుక శాస్త్రి ఆ పిలుపు ఇచ్చారు, ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కూడా లేవు, అంతా సజావుగానే ఉందని చెబుతూ ఆ పిలుపు ఇవ్వటం ఏమిటి ? మచ్చుకు మోడీ ప్రవచించిన పది సుభాషితాల్లో కొన్నింటిని చూద్దాం. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్న లోకోక్తి తెలిసిందే.

” దేశం కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు, దేశం కోసం బతకడం,దేశ కర్తవ్యం కోసం పాటు పడటమూ దేశభక్తే ” అని మోడీ చెప్పారు. పొదుపును కూడా దేశభక్తికి ముడిపెట్టారు.ఇదే ప్రమాదకరం. పొదుపు పాటించనివారు దేశభక్తులు కాదనే భావాన్ని చెప్పకనే చెప్పారు. కడుపునిండా తినటానికి తిండిలేదనే కదా ఎనభై కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఐదేసి కిలోల ఉచిత బియ్యం లేదా గోధుమలను ఇస్తోంది.వారిని పొదుపు చేయమంటే ఆ ఉచితాన్ని వదులుకోవాలి మరి. వంట నూనె వాడకం తగ్గించటం కూడా దేశభక్తే అన్నారు. పొదుపు గురించి దేశ పౌరులకు మోడీ చెప్పాల్సినపని లేదు.మన జీన్స్‌లోనే ఉంది.అవసరమైన మేరకే వస్తువులను వాడతారు. ” సాధ్యమైన మేరకు ఇంటి నుంచే పని చేసే పద్దతి అనుసరించండి, అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు, ఇంథనాన్ని పొదుపుగా వాడండి ” మోడీ సుభాషితాల్లో ఒకటి. ఈ చర్యకు ప్రధానే స్వయంగా శ్రీకారం చుట్టి ఉంటే బాగుండేది. హైదరాబాదు వచ్చి ఎక్కడో జరిగే పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసే బదులు అదేదో ఢిల్లీ నుంచే చేయవచ్చు, గతంలో అనేక సార్లు అలా చేశారు.వేలాది మంది పోలీసులు, ఇతర ఏర్పాట్లకు అనవసర ఖర్చు, ఆయాసమూ తప్పేది, ట్రాఫిక్‌ ఆంక్షల వలన అదనపు దూరం ప్రయాణించిన వాహనదారులకు అదనపు పెట్రోలు, డీజిలు కలసి వచ్చేది.మోడీ స్వయంగా చెప్పినట్లు దేశం ఇంతటి ఇబ్బందుల్లో ఉన్నపుడు లక్షల మంది జనాన్ని తెలంగాణా అంతటి నుంచి ఎండల్లో రప్పించటానికి వాహనాలకు పెద్దమొత్తంలో ఇంథనం ఖర్చు చేయటం అవసరమా ? అందువలన పొదుపు గురించి ఇతరులకు చెప్పేముందు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా ? మధ్య ప్రదేశ్‌లో బిజెపి రాజకీయ నిరుద్యోగి సౌభాగ్య సింగ్‌ ఠాకూర్‌కు పాఠ్యపుస్తకాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు.దానికి ప్రమాణస్వీకారం కోసం డజన్లకొద్దీ వాహనాలతో ఉజ్జయని నుంచి భోపాల్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరం అనుయాయులతో అట్టహాసంగా వెళ్లారు. బిజెపి నేతల పొదుపు ఇలా ఉంటుంది. హైదరాబాద్‌ ఉపన్యాసంపై తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత మోడీ తన కాన్వారును గణనీయంగా తగ్గించుకున్నట్లు చెబుతున్నారు.కొత్తగా కొనుగోలు చేయకుండా విద్యుత్‌ వాహనాలను వినియోగించాలని చెప్పినట్లు వార్త. ఇదంతా పౌరుల మీద భారం మోపే ప్రచార ఎత్తుగడే.విదేశీ ప్రయాణాలు వద్దంటూ చెప్పిన మోడీ వారం రోజుల పాటు ఐదు దేశాల కార్యక్రమం పెట్టుకున్నారు. గతంలో నెహ్రూ 44సార్లు విదేశీ పర్యటనలు చేస్తే మోడీ సెంచరీ కొట్టారు.

ఏడాది పాటు బంగారం కొనవద్దంటూ మరో సలహా ! తరువాత కొనుగోలు చేయవచ్చా ? ధరలు ఇప్పటికిప్పుడే పెరగలేదే ! ఏడాది పాటు మారుటోరియం ఎందుకు సూచించారు. రూపాయి విలువను కాపాడలేని కేంద్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా డాలర్లకు కొరత ఏర్పడుతోంది.మన స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసిన విదేశీయులందరూ వాటాలను అమ్మివేసి డాలర్లలో తమ దేశాలకు తరలించుకుపోతున్నారు. 2025 ఏడాది మొత్తంలో 2.4లక్షల కోట్ల రూపాయలను తరలిస్తే ఈ ఏడాది మే 11వ తేదీ నాటికే 2.28లక్షల కోట్లు దాటాయని వార్తలు.మే ఒకటవ తేదీతో ముగిసిన వారంలో 7.794 బిలియన్‌ డాలర్లు మన విదేశీ మారకద్రవ్యంలో తగ్గి 690.693 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతి ప్రోత్సాహ పథకాల వంటి ఎన్ని కబుర్లు చెప్పినా, రాయితీలు ఇచ్చినా దిగుమతులు పెరుగుతున్నాయి తప్ప ఎగుమతులు పెరగటం లేదు. అయినా విదేశీ వస్తువులు వాడవద్దని ప్రధాని చెబుతారు, దిగుమతులకు ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ఏటా మన దేశం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నది.ముడి చమురు తరువాత బంగారానికే ఎక్కువగా విదేశీమారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది.బంగారంతో నగలు చేయించేందుకు కొంత మందికి పని కల్పించవచ్చు తప్ప నిజానికి అది ఉత్పాదతకు పనికి వచ్చేది కాదు. గత కొద్ది సంవత్సరాలుగా పసిడి ధర పెరుగుతూనే ఉన్నప్పటికీ మోడీ మాట్లాడ లేదు. గతంలో బంగారం దిగుమతులపై పన్ను ఎక్కువగా ఉన్న కారణంగా దొంగరవాణా పెరిగిందని తగ్గించారు. తాజాగా దిగుమతి పన్ను, సెస్‌లు కలిపి ఆరు నుంచి 15శాతానికి పెంచారు. నిరంతరం దిగుమతులు తప్ప ఎగుమతులు పెరగటం లేదు. ఒకదశ దాటిన తరువాత చెల్లింపుల సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయవద్దని, వివాహాలు విదేశాల్లో చేయవద్దని చెప్పారు. విదేశాలు లేదా పొరుగు రాష్ట్రాల్లోని విలాసవంతమైన ప్రాంతాల్లో వివాహాలు చేసేవారందరూ శతకోటీశ్వరులు తప్ప సామాన్యులు కాదు.మోడీ తన పాలనా కాలంలో కోటీశ్వరులు, శతకోటీశ్వరులను పెంచారు తప్ప తగ్గించలేదు.తాను అధికారానికి వచ్చినపుడు కేవలం 70మంది బిలియనీర్లు ఉంటే 2026నాటికి 308పెరిగారు.కోటీశ్వరుల గురించి చెప్పాల్సిందేముంది ! సామాన్యుల వద్ద ఉన్న సంపదశాతం తగ్గుతున్నదని అనేక విశ్లేషణలు వెల్లడించిన సంగతి తెలిసిందే.వారంతా సొమ్మును విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేయక ఏం చేస్తారు !

స్వదేశీ ఉత్పత్తి పెరగాలంటారు. దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా ఆయన పలుకుబడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 95చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ ఏం చేస్తున్నట్లు ? దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకాన్ని చూస్తే 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే.తాజాగా చమురు ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సిన రాయల్టీ తగ్గించి ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.

మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26లో రు.2.07 లక్షల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40, ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 ఇటీవలి వరకు వసూలు చేశారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు పెట్రోలు మీద ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.3 పైన పేర్కొన్న రెండు సెస్‌లు కలిపి రు.8.50, డీజిలుపై సెస్‌ రు.6 కొనసాగుతోంది.ఇప్పుడు మార్కెటింగ్‌ కంపెనీలకు నెలకు లక్ష కోట్ల నష్టం వస్తుందని గుండెలు బాదుకుంటున్న మంత్రి పూరీ ఇన్నేండ్లుగా మోడీ ఏలుబడిలో వినియోగదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం అంతకుముందున్నదాని కంటే అదనంగా వసూలు చేసిన రు.16.5లక్షల కోట్ల ప్రత్యేక ఎక్సయిజ్‌ పన్ను సంగతి మాట్లాడరేం.

పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు నంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంథనంపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బాబాల మాదిరి పొదుపు గురించి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు.గణనీయంగా తగ్గించాల్సిందిపోయి పెంచకపోవటం తమ ఘనత అని చెప్పుకుంటున్నారు.ఇది గోబెల్స్‌ పద్దతి. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత ధర పెరుగుతున్నది. మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర మార్చినెల 25వ తేదీ వరకు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఏప్రిల్‌లో 114.48, మే పన్నెండవ తేదీవరకు 105.09 డాలర్లు, అంటే నాలుగేండ్ల నాటి స్థాయికి చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం ఇది.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఇరాన్‌పై దాడులు ప్రారంభం ఫిబ్రవరి 28న కాగా అంతకు ముందు 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. జనం జేబులు కొట్టాలనుకున్నపుడు మాత్రం ఈ విధానం గుర్తుకు రాదు, కేంద్రానికి సెగ తగలగానే మళ్లీ మొదలు పెడతారా ? చావు తెలివితేటలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌కు చెప్పుకోరాని చోట తగిలిన దెబ్బ: ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌పై ఇరాన్‌ దాడి ఆంతర్యం ?

08 Friday May 2026

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

2026 US Attack Iran, China, Donald trump, Hormuz mission, Narendra Modi, West Asia Crisis, West Asia Peace Talks

ఎం కోటేశ్వరరావు

తాజాగా ఇరాన్‌-అమెరికా మధ్య జరిగిన కాల్పులు ప్రేమతో జరుపుకున్నవే అని డోనాల్డ్‌ ట్రంప్‌ గురువారం నాడు వ్యాఖ్యానించాడు.(రోడ్దు మీద ఒక వాహనాన్ని మరొక వాహనం కొట్టినపుడు పెద్దగా నష్టం జరగకపోతే రెండూ ముద్దు పెట్టుకున్నాయని సరదాగా చెప్పుకోవటం వంటిది) రెండు దేశాల మధ్య శాంతి చర్చలు దోబూచులాడుతున్న సమయంలో ఇలా మాట్లాడటం గమనించదగిందే అయినా ట్రంప్‌ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులను ప్రారంభించటమైతే చేసింది గానీ, ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి అమెరికా నానా ఇబ్బందులు పడుతున్నది.ఇరాన్‌ దాడుల్లో జరిగిన నష్టం గురించి ట్రంప్‌ చెప్పుకోలేడు, అలాగని దాచుకోలేడు.చెప్పకపోతే ప్రాణం పోతుంది చెప్పుకుంటే పరువుపోతుంది..గల్ఫ్‌లోని పదిహేను అమెరికా మిలిటరీ కేంద్రాలలో 228 కట్టడాలు, ధ్వంసమైన పరికరాలకు సంబంధించి ఇటీవల ఇరాన్‌ కొన్ని చిత్రాలను విడుదల చేసింది.వాటిలో విమానాలను నిలిపే ప్రాంతాలు, చమురు డిపోలు,విమానాలు, రాడార్లు, సమాచార వ్యవస్థల వంటివి ఉన్నాయి. ఆ చిత్రాలు నిజమైనవా లేక కృత్రిమ సృష్టి అని చెప్పలేక అమెరికా ఏవేవో చెబుతున్నది.ఎవరెన్ని చెప్పినా ఇరాన్‌ గురిచూసి దెబ్బతీసింది.ట్రంప్‌ చెప్పినట్లుగా మరిన్ని దాడులకు పాల్పడితే ఇదే మాదిరి పరాభవం ఎదురుకావచ్చనే హెచ్చరికలే భూతల దాడులకు దిగకుండా అమెరికా మిలిటరీ జాగ్రత్తపడుతున్నదని చెప్పవచ్చు.గల్ఫ్‌లోని కొన్ని మిలిటరీ కేంద్రాలు దాడులకు పనికి రాకుండా పోయినట్లు చెబుతున్నారు. ఇరాన్‌పై దాడులతో తమకు 25బిలియన్‌ డాలర్ల మేర నష్టం వచ్చినట్లు రక్షణశాఖ కబుర్లు చెప్పినప్పటికీ 50బిలియన్‌ డాలర్లకు పైమాటే ఉంటుంది.పశ్చిమాసియా, మధ్య ప్రాచ్య ప్రాంతంలో జరిగిన నష్టాలకు సంబంధించిన చిత్రాలను విడుదల చేయవద్దని వాణిజ్య ఉపగ్రహ కంపెనీలను ట్రంప్‌ యంత్రాంగం ఆదేశించిందంటేనే అది ఎంతగా మూసిపెడుతోందో తెలుస్తోంది. ఇరాన్‌ విడుదల చేసిన చిత్రాలు చైనా, రష్యా ఉపగ్రహాలు తీసినవని వేరే చెప్పనవసరం లేదు. గురిచూసి అమెరికా లక్ష్యాలను దెబ్బతీయటం కూడా ఆయా దేశాలు అందించిన సమాచారం, ఐరోపా సంస్థలు విడుదల చేసిన సమాచారం, చిత్రాలతోనే సాధ్యమైంది.

ఏప్రిల్‌ ఎనిమిది నుంచి ఇరాన్‌-అమెరికా మధ్య కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది.రెండు దేశాల మధ్య పరస్పర దాడులు నిలిచిపోయాయి.అమెరికా కారణంగా ఇస్లామాబాద్‌లో తొలి చర్చలు విఫలమైన తరువాత ఇంతవరకు దోబూచులాట తప్ప మలి చర్చలు ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా సోమవారం నాడు తమపై ఇరాన్‌ 15ఖండాంతర,మూడు క్రూయిజ్‌ క్షిపణులు,నాలుగు డ్రోన్లతో దాడులు చేసిందని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆరోపించింది. (యుఏయి-దుబాయి అంటే అందరికీ బాగా తెలుస్తుంది.దుబారు, షార్జా, అబూదాబీ వంటి ఏడు ప్రాంతాలు కలసి ఉన్నదేశాన్ని ఐక్య అరబ్‌ ఎమిరేట్స్‌గా వ్యవహరిస్తారు, 1971లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది, రాజధాని అబూదాబీ, కోటి పది లక్షల మంది జనాభా ఉండగా దుబారు పెద్ద నగరం) కాల్పుల విరమణ అవగాహన తరువాత ఇదే పెద్ద దాడి.దుబారు చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఫుజాయిరా రేవుపై జరిగినదాడిలో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని వార్తలు. ముగ్గురు భారతీయ కార్మికులు గాయపడ్డారు.హార్ముజ్‌ జలసంధితో నిమిత్తం లేకుండా వేరే మార్గంలో చమురు ఎగుమతులు చేసేందుకు ఈ రేవు అనువుగా ఉంది. జలసంధి వెలుపల తిష్టవేసిన అమెరికా ప్రతి రోజూ ఇరాన్ను రెచ్చగొట్టేందుకు చూస్తున్నది, బలవంతంగా జలాల్లో ప్రవేశించేందుకు పూనుకుంది. అందువల్లనే ఇది పధకం ప్రకారం చేసిన దాడి కాదని, ”అమెరికా మిలిటరీ దుస్సాహసానికి ” ప్రతి స్పందన అని ఇరాన్‌ వర్ణించింది.ఇప్పటి వరకు హార్ముజ్‌ జలసంధి వెలుపలనే తిష్టవేసిన అమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలోకి చొరబడేందుకు చూసినపుడు తాము దాడి చేసినట్లు ఇరాన్‌ ప్రకటించగా అబ్బే అలాంటిదేమీ లేదని ట్రంప్‌ చెప్పుకున్నాడు. ఇరాన్‌ దాడి వెనుక అనేక అర్ధాలు, అంశాలు ఉన్నాయి.గల్ఫ్‌ దేశాల మధ్య ఉన్న విబేధాల కారణంగా ఎమిరేట్స్‌ను ఒంటరి పాటు చేసేందుకు ఇరాన్‌ పూనుకుందని చెప్పవచ్చు. దుబాయిపై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్లు మోడీ సర్కార్‌ స్పందించింది. రుణాలు చెల్లించాలని పాకిస్తాన్‌పై రుణాల చెల్లింపుకు ఎమిరేట్స్‌ వత్తిడి చేయటం వెనుక మనదేశం కూడా ఉందని వ్యాఖ్యలు వెలువడిన పూర్వరంగంలో కృతజ్ఞతగా ఇలా స్పందించిందని చెప్పవచ్చు. తరువాత ఎలాంటి పరిణామాలు జరగలేదు గనుక ఒక వ్యూహంలో భాగంగా ఇరాన్‌ దాడిని చెప్పవచ్చు.

పశ్చిమాసియా పరిణామాల్లో గల్ఫ్‌ దేశాల పాత్ర గురించి మీడియా అంతగా కేంద్రీకరించకపోవటానికి కారణం వార్తా సంస్థలను పశ్చిమదేశాలు నియంత్రించటమే.చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల బృందం(ఒపెక్‌) నుంచి దుబాయి ఎందుకు ఆకస్మికంగా బయటకు వచ్చింది ?దాని వెనుక ఉన్న కథేంటి అన్నదితెలుసుకోవాలి.గల్ఫ్‌ దేశాల్లో గతంలోనే విబేధాలు ఉన్నప్పటికీ అవి ఈ సందర్భంగా మరింతగా బయటకు వచ్చాయి. తాము పధకం ప్రకారం దాడి చేయలేదని, నియంత్రణల్లో ఉన్న హార్ముజ్‌ జలసంధి నుంచి నౌకలకు దారి కల్పించేందుకు అమెరికా చేసిన మిలిటరీ దుస్సాహసానికి స్పందనకు ఫలితమని ఇరాన్‌ అధికారి చెప్పాడు. అంతకు ముందు నౌకలకు దారి కల్పిస్తామని అమెరికా ప్రకటించింది.ఈ క్రమంలో ఒక యుద్ధ నౌకపై ఇరాన్‌ రెండు క్షిపణులను ప్రయోగించింది. తాము వేగంగా వచ్చి దాడులు చేసే ఆరు ఇరాన్‌ నౌకలపై కాల్పులు జరిపామని, వాటిని ముంచివేశామని, ఇరాన్‌ దాడిలో దెబ్బతిన్నది దక్షిణ కొరియా నౌక తప్ప తమది కాదని అమెరికా చెప్పుకుంది.ఎమిరేట్స్‌పై దాడి పెద్ద విషయం కాదని,చర్చల్లో ఇరాన్‌ ఎంతో నయంగా ఉందనికూడా ట్రంప్‌ వ్యాఖ్యానించాడు.

ఇరాన్‌ మీద దాడి చేసిన ఇజ్రాయెల్‌కు యుఏయి ఎంతో సన్నిహితంగా ఉంది.లాంఛనంగా రక్షణ ఒప్పందం లేకున్నప్పటికీ అదే మాదిరి రెండు దేశాలూ వ్యవహరిస్తున్నాయి.ఇరాన్‌ దాడుల నుంచి రక్షణకు గగనతల వ్యవస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసింది.టెహరాన్‌పై ఇజ్రాయెల్‌ దుష్ట పథకాలకు ఎమిరేట్స్‌ ఎప్పటి నుంచో సాయపడుతున్నది. అమెరికా స్థావరాలకు చోటు కల్పించటమేగాక దాడులకు సైతం తమ వైమానిక స్థావరాల సౌకర్యాలను వినియోగించుకొనేందుకు ఎమిరేట్స్‌ సహకరించిందని,ఒమన్‌, మరొక దేశం మీద ఇజ్రాయెలే దాడిచేసి తాము చేసినట్లుగా చిత్రించేందుకు కూడా తోడ్పడినట్లు ఇరాన్‌ నిర్ధారించుకున్నది.తమ గురించి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు అవసరమైన ఏఐ మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చినట్లు టెహరాన్‌ భావిస్తున్నది.అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జయెద్‌(ఎంబిజెడ్‌) ఇజ్రాయెల్‌ మొసాద్‌, అమెరికా సిఐఏలతో కలసి పశ్చిమాసియా-మధ్య ప్రాచ్య ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నాడు.ఈజిప్టులోతొలిసారిగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్‌ మొర్సీ ప్రభుత్వాన్ని కూలదోయటం, అరబ్బు విప్లవాలను పక్కదారి పట్టించేందుకు నిధులు అందచేయటం వంటి తప్పుడు పనులకు పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి.వాటిలో భాగంగా ట్యునీసియా,లిబియా, సూడాన్‌, ఎమెన్‌లలో జోక్యం చేసుకోవటం, నేరగాండ్లు, కిరాయి సాయుధులను సమకూర్చి అంతర్యుద్దాలకు దోహదం చేయటం వంటి దుర్మార్గాలకు మద్దతు ఇచ్చాడు.ఈ కారణంగా లక్షలాది మంది అరబ్బులు మరణించటం, ఇబ్బందులకు గురయ్యారు. తన సరిహద్దులను విస్తరించేందుకు ఇజ్రాయెల్‌ ఎలా దుర్మార్గాలకు పాల్పడుతున్నదో అదేమాదిరి ఎమిరేట్స్‌ విస్తరణకు పథకాలు వేశాడని కూడా చెబుతారు.పశ్చిమ దేశాలలో విద్యను అభ్యసించిన ఎంబిజె అమెరికాలో తన పలుకుబడిని పెంచుకొనేందుకు అప్పటి వరకు ప్రపంచానికి అంతగా తెలియని సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్ను అమెరికన్లకు పరిచయం చేశాడు. తరువాత రియాద్‌లో ఉన్న ప్రముఖులను సిఐఏ ఏజంట్లుగా మార్చేందుకు సహకరించాడు. ఎమెన్‌లో ఇరాన్‌ ప్రయోజనాలను దెబ్బతీసేందుకు అక్కడి వేర్పాటువాదులను తొలుత ఎమిరేట్స్‌ ప్రోత్సహించింది, తరువాత ఆ బాధ్యతను చేపట్టేట్లుగా సౌదీ అరేబియాను ప్రయోగించింది. తరువాత ప్రత్యర్ధులుగా మారారు. ఇప్పుడు సూడాన్‌, లిబియా, ఎమెన్లలో ఉన్న ఎమిరేట్స్‌ మద్దతు ఉన్న సాయుధులను అడ్డుకొనేందుకు సౌదీ అరేబియా, ఈజిప్టు చూస్తున్నాయి.

అమెరికా ఎత్తుగడలో భాగంగా ఒపెక్‌ కూటమి నుంచి ఎమిరేట్స్‌ వైదొలుగుతూ గతవారంలో నిర్ణయం తీసుకుంది.చమురు ఉత్పత్తి కోటాలతో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పింది. ఆరుదశాబ్దాలుగా ఒపెక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సౌదీని, ఇరాన్ను దెబ్బతీసేందుకే ఈ మేరకు పావులు కదిపినట్లు చెబుతున్నారు. రియాద్‌-అబూదాబీల మధ్య శాశ్వత వైరుధ్యం ఏర్పడినట్లు అల్జీరియా అధ్యక్షుడు అబ్దుల్‌మాదిజిద్‌ తెబ్బోనే వ్యాఖ్యానించాడు, ఎమిరేట్స్‌ వైదొలగటాన్ని తాను పట్టించుకోవటం లేదన్నాడు. ఎమిరేట్స్‌పై ఇరాన్‌ దాడి చేస్తే సౌదీ ఉష్ట్రపక్షిలా ఉందంటూ అబుదాబీ వ్యాఖ్యాతలు రెచ్చిపోయారు.అయితే ఎమిరేట్స్‌ వైదొలిగినందున అది నష్టపోయే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. వలస కార్మికులు, కిరాయి సాయుధ మూకలు, చిన్న సైన్యం మాత్రమే కలిగి ఉన్నందున ప్రత్యర్ధులను ఎలా ఎదుర్కొంటుందనేది ప్రశ్న.ఇజ్రాయెల్‌, అమెరికాలు ఆదుకుంటాయనే ఆశ మాత్రమే ఉంది. ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లు, క్షిపణులను పసిగట్టే లేజర్‌ వ్యవస్థలను ఇజ్రాయెల్‌ సమకూర్చి, వాటి నిర్వహణకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. వీటితో పాటు అబుదాబీ, దుబారు నగరాలకు ఐరన్‌ డ్రోమ్‌ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసింది. ఇరాన్‌ వీటన్నింటినీ గమనించిన కారణంగానే సోమవారం నాడు ఎమిరేట్స్‌ మీద క్షిపణి ప్రయోగం చేసింది.లెబనాన్‌లోని తన మద్దతుదారులైన హిజబుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.దుబారు పథకాలపై ఒక్క టెహరానే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న సౌదీ, ఒమన్‌,కతార్‌, పాకిస్తాన్‌, టర్కీ కూడా ప్రేక్షకులుగా ఉండజాలవు. ఉమ్మడి శత్రువైన ఇజ్రాయెల్‌తో పాటు దానికి సహకరించే ఏ దేశాన్నీ కూడా అవి వదలవు.

ఇటీవలి దాడులతో ఇరాన్‌ పట్ల గల్ఫ్‌ దేశాలు గుర్రుగా ఉన్నప్పటికీ అమెరికాతో కలసి దాడులకు పూనుకోలేదు. సోమవారం నాడు ఎమిరేట్స్‌పై దాడి గురించి ముందుగానే సౌదీ అరేబియా,ఒమెన్‌లకు ఇరాన్‌ చెప్పినట్లు గత గురువారం నాడే అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రాయటం గమనించాలి.అయితే ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పిందీ ఆ పత్రిక వెల్లడించలేదు. ఇరాన్‌ చర్యలపై ఆగ్రహం ప్రకటించినప్పటికీ సౌదీ మంత్రులు టెహరాన్‌తో సంబంధాల్లోనే ఉన్నారు. ఎమిరేట్స్‌ మద్దతుదార్లను వ్యతిరేకించే శక్తులకు పాకిస్తాన్‌లో సౌదీ కొనుగోలు చేసిన ఆయుధాలను మార్చినెలలో లిబియాకు తరలించారు.ఇక గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ జరిపిన దాడులకు సంబంధించి ఎమిరేట్స్‌ మీద ప్రత్యేకంగా కేంద్రీకరించినట్లు వివరాలు వెల్లడి అవుతున్నాయి. కాల్పుల విరమణకు ముందు రెండు వేల ఖండాంతర క్షిపణులు, డ్రోన్లను టెహరాన్‌ సంధించింది.మిగతా దేశాలతో పోలిస్తే ఎమిరేట్స్‌ వైఖరి ఒకటైతే అంతర్జాతీయంగా వత్తిడి తెచ్చేందుకు కూడా దానిపై దాడులను కేంద్రీకరించిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా, లక్షలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా దుబారు, తదితర నగరాలకు రావటం కూడా ఒక ప్రధాన కారణం. దాడుల్లో ఎవరైనా విదేశీయులకు హాని జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంది, పర్యాటకులు, వ్యాపారుల రాక తగ్గి ఆర్థికంగా ఎమిరేట్స్‌ నష్టపోతుందనే ఎత్తుగడ కూడా ఉంది.అది భావించినట్లుగానే అనేక హౌటళ్ల గదులు జనాలు లేక ఖాళీగా ఉంటున్నాయి. ఇదే అదునుగా అవసరమైన మరమ్మతులకు వాటిని మూసినట్లు కూడా చెబుతున్నారు. అమెరికా దాడులకు సౌదీ సహకరించినప్పటికీ చర్చలకూ చొరవ చూపిందని చెబుతుండగా దాడులను కొనసాగించాల్సిందేనని ఎమిరేట్స్‌ పట్టుబడుతున్నదని, తొమ్మిదినెలల వరకు దాడులు జరిగినా తట్టుకుంటామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మధ్యవర్తిగా ముందుకు వచ్చిన పాకిస్తాన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించి విఫలమై ఎమిరేట్స్‌ తమ రుణాలను వెంటనే తీర్చాలని మెడమీద కత్తి పెట్టినట్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీనికి రెండు ప్రధాన కారణాలను చెబుతున్నారు. సౌదీతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవటం, ఇరాన్‌ దాడులను ఖండించాలన్న డిమాండ్‌కు అంగీకరించకపోవటం, పాక్‌ను దెబ్బతీసేందుకు భారత్‌ తెచ్చిన వత్తిడి ఉన్నట్లు భావిస్తున్నారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ పరిశోధనల్లో నిర్లక్ష్యం – అడుగడుగునా రైతులకు అన్యాయం ! వేదాల్లో అన్నీ లేవని మోడీ పరివారానికి ఏ భాషలో చెప్పాలి !!

03 Sunday May 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Environment, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Science, USA

≈ Leave a comment

Tags

Agricultural research and Development, BJP, china agriculture, FAO, Farmers matters, Narendra Modi Failures, pseudoscience, R & D in India, RSS discipline hypocrisy exposed, Saffron gang hypocrisy

ఎం కోటేశ్వరరావు

పంటల మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలా లేదా అన్న అంశంపై నాలుగేండ్ల నాడు వేసిన కమిషన్‌ ఏం చేస్తోందో తెలియదు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే మద్దతు ధరలతో పాటు దిగుబడి పెంపుదల, సాగు ఖర్చుల తగ్గింపు గురించి అనేక మంది చెప్పటం తెలిసిందే. పోనీ దానికైనా గడచిన పన్నెండేళ్లలో మోడీ సర్కార్‌ ఏమైనా చేసిందా ? వ్యవసాయ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి తీరుతెన్నులు, ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు గురించి రోమ్‌ నగరంలో ఉన్న ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) ఏప్రిల్‌ 30వ తేదీన ఒక నివేదికను విడుదల చేసింది. సభ్యదేశాల ప్రభుత్వాలు అందచేసే సమాచారం మేరకు 2023వరకు ఉన్న వివరాల ప్రకారం రూపొందించిన నివేదిక. గడచిన రెండు దశాబ్దాలలో ఏటా 1.8శాతం చొప్పున పరిశోధనకు ఖర్చు పెరుగుతూ 50.4 బిలియన్‌ డాలర్లకు చేరింది.వర్తమాన సహస్రాబ్ది తొలి పదేండ్లలో విస్తరణ మందకొడిగా ఉందని, 2009తరువాత పెరిగిందని గమనించారు.రైతే రాజు, దేశానికి వెన్నెముక, రైతులేనిదే రాజ్యం లేదు వంటి మాటలు ఎన్నో విన్నాం. ఏం జరిగింది, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ రిసర్చ్‌(ఐజెఓఇఏఆర్‌) 2026 మార్చినెల సంచిక, పేజీ 126లో దిగువ వివరాలు ఉన్నాయి. పంట ఉత్పత్తి అంకెలను మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా, దిగుబడి హెక్టారుకు టన్నులుగా గమనించాలి.చైనాలో మనకంటే సాగుభూమి తక్కువ, అయినా మొత్తం 69.కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంటే మనం 35.4కోట్ల టన్నులు చేసి చైనా కంటే మన జనాభా అదనంగా ఉన్నప్పటికీ అవసరానికి మించి పండిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాం.

పంటపేరు×× భారత ఉత్పత్తి××చైనా ఉత్పత్తి×××భారత దిగుబడి××చైనా దిగుబడి

వరి ×××××× 147-150 ×× 145 ××× 4.3 ×× 7.1

గోధుమ ×× 113-117 ×× 140 ××× 3.5 ×× 5.5

మొక్కజన్న × 35 ×× 280-290 ××× 3.2 ×× 6.1

సోయాబీన్‌×× 12-13 ×× 20 ××× 1.2 ×× 1.9

బం.దుంప×× 60 ×× 95 ××× 24 ×× 33

పిండికొద్దీ రొట్టె అన్న పెద్దలే కుండలో కూడు కుండలోనే ఉండాలి పిల్లాడు దుడ్డులా పెరగాలంటే కుదరదని కూడా చెప్పారు. జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచటంతో పాటు రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే దిగుబడులను కూడా అధికంగా సాధించాలి. అందుకు పెట్టుబడి, శాస్త్రవేత్తలు కావాలి. ప్రపంచంలో 2004లో 2,04,000 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటే 2023నాటికి 3,16,000కు పెరిగారు. మనదేశంలో పరిస్థితి ఏమిటి ? పూర్తికాలం పని చేసే పరిశోధకుల సంఖ్య రెండువేల సంవత్సరంలో 11,154 మంది ఉంటే 2018లో 11,372 మంది ఉన్నారు. అదే చైనాలో ప్రస్తుతం 43వేల మంది పని చేస్తున్నారు.శాస్త్రవేత్తల సంఖ్యను బట్టే వారి మీద పరిశోధన ఖర్చుకూడా ఉంటుంది. అది అధిక దిగుబడి వంగడాలు, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పండించటం మీద కూడా ప్రభావం చూపుతుంది.పారిశ్రామిక, ఐటి రంగాలకు అవసరమైన చౌక (కార్మికులు) ఇంజనీర్ల సృష్టి మీద చూపిన శ్రద్ధ అధికారంలో ఎవరున్నా వ్యవసాయం మీద పెట్టలేదు. ఎందుకంటే కోట్లాది మంది రైతుల కంటే లక్షల మంది పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మీద ఉన్న శ్రద్ద ఎక్కువ. అందుకే వ్యవసాయ రంగం ఇలా దిగజారిపోతున్నది, వ్యవసాయం గిట్టుబాటుగాక, అప్పులపాలైన రైతాంగ ఆత్మహత్యల గురించి వింటున్నాం.ఇతర రంగాల్లో అలాంటి పరిస్థితి లేనందుకు సంతోషమే గానీ ఇంకా ఎంతమంది రైతాంగాన్ని బలిపెట్టాలన్నదే ప్రశ్న.

దేశంలో జరిగిన అనర్దాలన్నింటికీ గాంధీ, నెహ్రూలే కారణం అని కాషాయ దళాలు నిరంతరం దుమ్మెత్తి పోస్తుంటాయి.వారి పూర్వీకులు బ్రిటీష్‌ వారి సేవకు బదులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గ్గొని నాయకత్వ స్థానాలకు వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది కదా, ఎందుకు ఆ పని చేయలేదో చెప్పగలరా ? పోనీ వాజ్‌పాయి, ఇప్పుడు నరేంద్రమోడీ ఏలుబడిలో పరిశోధన అభివృద్ది రంగాలకు నిధులు ఎందుకు కేటాయించలేదు, ఇతర దేశాలతో ఎందుకు పోటీపడటం లేదో అయినా చెప్పాలి.ఎవరు అడ్డుకున్నారు.వేదాల్లోనే అన్నీ ఉన్నాయిష అని లొట్టలు వేసుకుంటూ చెప్పుకొనేవారి ఒళ్లో కూర్చుని రెండువేల సంవత్సరాల నాడే భారత్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, వినాయకుడికి ఏనుగు తల అమర్చటం దానికి నిదర్శనమని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన సంగతి తెలిసిందే. అదే బాటలో గోమూత్రం తాగితే కాన్సర్‌ నయమౌతుందని బిజెపి ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ సెలవిచ్చినదాన్నీ దేశం చూసింది. ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉన్న నాగేశ్వరరావు ఇంకా ముందుకు పోయి మహాభారత కాలంలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ పరిజ్ఞానంతో 100 మంది కౌరవులు ఒకేతల్లికి జన్మించారని కూడా చెప్పారు. అదే నిజమైతే పాండవులు వేర్వేరు తండ్రులకు ఎలా పుట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకులని చిత్రిస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నవారు శాస్త్రపరిశోధనలను ప్రోత్సహిస్తారా ? అమెరికాలోని లోవా విశ్వవిద్యాలయం చెప్పిన కొన్ని అంశాలను చూద్దాం.ఓయిసిడి సమాచారం(2022) ప్రకారం 2000-2002 మధ్య వ్యవసాయ పరిశోధనలకు అమెరికా, భారత్‌,బ్రెజిల్‌ దేశాలలో ఒక బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ప్రభుత్వాలు ఖర్చు చేశాయి.అదే 2019-21నాటికి చైనా ఖర్చు ఏడాదికి 1.3 నుంచి 6.6బిలియన్లకు పెరిగింది. అమెరికా,భారత్‌,బ్రెజిల్‌ చేసిన మొత్తం ఖర్చు కంటే చైనాలో ఎక్కువగా ఉంది.

దశాబ్దాల పాటు కొనసాగిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి తన అజెండాకు అనుగుణంగా వ్యవహరించేందుకు నీతి అయోగ్‌ను నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కేటాయిస్తే గాంధీ, నెహ్రూలు అడ్డుకొని ధర్నాలకు దిగిన ఉదంతాలేమీ లేవు.నీతి అయోగ్‌ 2025లో విడుదల చేసిన పదకొండవ పత్రంలో ఏం చెప్పిందో తెలుసా ! 1995-96లో కేంద్ర ప్రభుత్వం జిడిపిలో అన్ని రకాల పరిశోధనలకు కేటాయించిన మొత్తం 0.61 శాతం కాగా 2005-06లో అది 0.81కి పెరిగింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015-16లో 0.69శాతం, 2020-21లో 0.64శాతానికి పతనమైంది.వ్యవసాయ పరిశోధనలకూ ఇదే గతి అని వేరే చెప్పనవసరం లేదు.జిడిపిలో కనీసం రెండు శాతం కేటాయించాలని గతంలో ప్రణాళికా సంఘం సిఫార్సు చేసింది.దీని గురించి మోడీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రూపంలో అయినా ఎందుకు మాట్లాడటం లేదు ? ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2020లో తలసరి పరిశోధన పెట్టుబడి ఇజ్రాయెల్‌ 2,438 డాలర్లతో ప్రపంచంలో అగ్రగామిగా ఉండగా, తరువాత 2,192 డాలర్లతో అమెరికా,తొమ్మిదవ స్థానంలో ఉన్న చైనా 250, పద్నాలుగవ స్థానంలో 13 డాలర్లతో మనం ఉన్నాం. వీటినే అదే ప్రపంచ బ్యాంకు మరోవిధంగా చెప్పింది. జిడిపిలో ఇజ్రాయెల్‌ 5.4, అమెరికా 3.5శాతం కేటాయించగా చైనా 2.4, మనదేశం 0.7శాతం కేటాయించింది.అంతేనా ప్రభుత్వ రంగంలో మొత్తం పరిశోధనా సంస్థలు అమెరికా 727, చైనాలో 353, భారత్‌లో 18 ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక అంశాలను నీతి అయోగ్‌ తన పత్రంలో పేర్కొన్నది. ఇంత దరిద్రంగా ఉంటే మన పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు ఎలా పెరుగుతాయి, నాణ్యతలో ప్రపంచంలో ఎలా పోటీపడతాయి ? మోడీ విధానాలతో 2047నాటికి దేశం ఎక్కడికో పోతుందని నమ్మే వారు దేశంకోసం-ధర్మం కోసం బుర్రలు పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదా ! నరేంద్రమోడీ ఇజ్రాయెల్‌ పర్యటన జరిపి ఏం నేర్చుకొని వచ్చారు.ఇజ్రాయెల్‌ పితృస్వామికం, మనది మాతృస్వామికం అని చెప్పారు.దీని మీద సామాజిక మాధ్యమాల్లో జనాలు ఎంతగా అపహాస్య చేశారో తెలిసిందే. అక్కడి నుంచి నేర్చుకున్నది ఏమిటి అంటే పాలస్తీనా ప్రాంతాలలో ఇజ్రాయెల్‌ యూదులను ఎలా ప్రవేశ పెట్టి జనాభా నిష్పత్తిని ఎలా మార్చివేసిందో, కాశ్మీరులో కూడా అలాగే చేయాలని ప్రయోగాలు చేసింది.పెగాసెస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకు వచ్చి విమర్శనాత్మకంగా ఉండే మీడియా, రాజకీయంగా విబేధించే పార్టీల నేతల సమాచారాన్ని దొంగచెవులతో వినేందుకు చూసింది, వివిధ దేశాల్లో హంతక దళాలతో హత్యలు ఎలా చేయించవచ్చో నేర్చుకున్నది తప్ప మరొకటి కాదు.

చరిత్రలో నరేంద్రమోడీ ఏ ప్రధానీ వెళ్లనన్ని సార్లు చైనా వెళ్లారు, దాని నేతలతో భేటీ అయ్యారు.పోనీ చైనా నుంచి అయినా నేర్చుకున్నారా అదీ లేదు. ఓయిసిడి నివేదిక ప్రకారం 2019-21 సంవత్సరాలలో చైనా వ్యవసాయ ఉత్పత్తుల విలువ 1.6లక్షల కోట్ల డాలర్లు, అమెరికాలో 0.4,భారత్‌ విలువ 0.2లక్షల కోట్ల డాలర్లు మాత్రమే.మనదేశంతో పోలిస్తే చైనా విస్తీర్ణం చాలా ఎక్కువ, దానిలో 10.6శాతం 1.02మిలియన్ల చదరపు కిలోమీటర్లలో మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. అదే మనదేశంలో 52.8శాతం భూమి 1.69మిలియన్‌ చదరపు కిలోమీర్లలో సాగు చేస్తున్నాం.అయినా మన ఉత్పత్తి విలువ తక్కువగా ఎందుకుందో చైనాలో ఎక్కువ ఎందుకో ఎప్పుడైనా మోడీ తెలుసుకున్నారా ! ప్రపంచం మొత్తంలో ఉన్న భూమిలో 11.6శాతం మాత్రమే సాగులో ఉంది,భారత్‌ అగ్రస్థానంలో ఉండగా అమెరికాలో 17.1, రష్యాలో 7.4శాతంలో వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ప్రభుత్వ రంగం చేస్తున్న ఖర్చు గురించే మాట్లాడుకున్నాం. ప్రైవేటు రంగం కూడా ఇటీవలి సంవత్సరాల్లో పరిశోధనలకు ఖర్చు చేస్తున్నది.అది గుత్త సంస్థలకు మాత్రమే లాభాలు చేకూర్చుతున్నది తప్ప అందరికీ కాదు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం వ్యవసాయ పరిశోధనల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటుంది.అక్కడ ప్రభుత్వ ఖర్చు తగ్గుతున్నది. చైనాలో ప్రైవేటు పరిశోధనలు దాదాపు లేవు.భారత్‌,బ్రెజిల్‌, ఐరోపా యూనియన్‌లో పెరుగుతున్నాయి.. ప్రైవేటు రంగం కేంద్రీకరణ అంతా మార్కెట్లో గిరాకీ, లాభం ఉన్నవాటి మీదే ఉంటుంది. ప్రభుత్వ పెట్టుబడులు తగ్గటం వలన టిఎఫ్‌పి(టోటల్‌ ఫ్యాక్టర్‌ ప్రొడక్టివిటీ) సూచిక అమెరికాలో ఇటీవలి కాలంలో ఆరుశాతం తగ్గింది.దీని అర్ధం ఏమిటంటే పదేండ్ల కాలంలో ఉత్పాదకత అమెరికాలో లాభసాటిగా లేదు.అందుకే పెద్ద ఎత్తున ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి అక్కడి ఉత్పత్తులను ఇతర దేశాల మార్కెట్లలో గుమ్మరించేందుకు అదిరింపులు, బెదరింపులు చేస్తున్నది.

మనువాదులు, సనాతనులుగా చెప్పుకొనేందుకు గర్వపడుతున్నవారు ఇటీవలి కాలంలో వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే వాదనలను ముందుకు తెస్తున్నారు.జర్మన్‌ హిట్లర్‌తో సహా పలువురు విదేశీయులు వివిధ రూపాల్లో వచ్చి మన పురాణాలు, వేదాలను తమ దేశాలకు తీసుకుపోయి వాటిలో ఉన్న విజ్ఞానాన్ని తస్కరించి తమవిగా చెప్పుకొని అనేక ఆవిష్కరణలు చేశారని చెప్పేవారి సంగతి తెలిసిందే. అదే నిజమైతే మనం ఆ విజ్ఞానాన్ని ఆవిష్కరించటానికి బదులు సమాజానికి అజ్ఞానాన్ని ఎందుకు పంచినట్లు ?ఆంగ్లేయులు ఇతర ఐరోపావారు మనదేశానికి రాకముందే ఐరోపాలో పారిశ్రామిక విప్లవం వచ్చింది, తరువాతే వారి అదనపు ఉత్పత్తులను అమ్ముకొనేందుకు మనతో సహా ప్రపంచాన్ని ఆక్రమించుకున్నారు. పురాణాల్లో ఉన్న కొన్నింటికి ఆధునిక గణిత, శాస్త్రసిద్దాంతాలను అంటగడుతూ ఇవన్నీ గతంలోనే మనవారికి తెలుసని గతం గురించి గొప్పలు చెప్పుకుంటాయి కాషాయ దళాలు, వాటి తప్పుడు ప్రచారాన్ని తలకు ఎక్కించుకున్నవారు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఏక పార్టీ నియంతృత్వం, దాని విధానాలు మనకు పనికి రావు, చైనీయులు కాపీ కొడతారు అని సొల్లు కబుర్లు చెబుతారు.కమ్యూనిస్టు సిద్దాంతాన్ని, సోషలిస్టు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు చెబుతున్నమాట నిజం. కానీ ఉత్పత్తులు ఎలా చేయాలో, పంటలు ఎలా పండించాలో నేర్చుకొనేందుకు ఆడలేక మద్దెల ఓటిగా ఉందని సాకుచెప్పినట్లుగా సిద్దాంతాలతో పనేముంది ?అన్నీ అందరికీ తెలియవని మన పురాణాలే చెబుతున్నాయి. కుమారిల భట్టు వేదపండితుడే అయినప్పటికీ మిగతా అంశాల గురించి తెలియదు. బౌద్దం, జైనుల తత్వశాస్త్రం గురించి అధ్యయనం చేయటానికి వారి ఆశ్రమాలకు మారువేషంలో వెళ్లి అధ్యయనం చేసి తరువాత వాదించాడని చెబుతారు.ఆదిశంకరుడు సైతం పరకాయ ప్రవేశ విద్య ద్వారా కామకళా శాస్త్రాన్ని నేర్చుకొని ఉభయ భారతీదేవితో వాదించి ఆమె భర్త మండన మిశ్రుని శృంగేరి మొదటి పీఠాధిపతిగా నియమించినట్లు చెబుతారు. ఇక్కడ సమస్య ఏమంటే మన ఘనాపాటీలు, సంస్కృత పండితులు ఇంతవరకు వాటిలో ఉందని చెబుతున్న విజ్ఞానాన్ని బయటకు తీయలేదు, నూతన ఆవిష్కరణలు చేయలేదు.ఇప్పటికైనా ఆదిశంకరుల మాదిరి పరకాయ ప్రవేశం చేసిన చైనా, ఇతర దేశాల నుంచి దేశం కోసం-ధర్మం కోసం దేశభక్తులుగా మారి ఆధునిక యుద్ద విమానాల సాంకేతిక పరిజ్ఞానాలను సేకరిస్తారా ? పారిశ్రామిక,వ్యవసాయ రంగంలో వృద్ధికి తోడ్పడతారా ? పడక కుర్చీల కాలక్షేపపు కబుర్లు చెబుతూనే ఉంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమిరా బాలరాజూ…… బంగ్లాదేశ్‌ కంటే వెనుక బడిన జిడిపి ! కాషాయ దళాలు వీరంగం వేస్తే కుదరదు !! యుపిఏ చివరి రోజులు తిరిగి వస్తున్నాయా ?

23 Thursday Apr 2026

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Bangladesh Per capita GDP, BJP, Fuel prices freezing, IMF on GDP, India GDP, Modinomics a farce, Narendra Modi Failures, RSS, Saffron gang

ఎం కోటేశ్వరరావు

వికసిత్‌ భారత్‌ పేరుతో దేశ జిడిపిని 2047 మూడో, రెండో స్థానానికో తీసుకుపోతారని జనమంతా ఎందురు చూస్తున్నారు. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జిడిపిలో భారత్‌ ఆరోస్థానానికి పడిపోయింది.తలసరి జిడిపి మనది 2.81వేల డాలర్లు కాగా బంగ్లాదేశ్‌ 2.91వేలతో ఎగువన ఉంది. చైనా 14.87వేలతో ఇంకా ముందుంది.బంగ్లాదేశ్‌తో పోలుస్తారా అంటూ కాషాయ దళాలు వీధుల్లో వీరంగం వేస్తే కుదరదు.చేదు నిజాలను అంగీకరించకతప్పదు మరి.ఇది ఐఎంఎఫ్‌ చెప్పిన సమాచారం. 1980 నుంచి 2000 వరకు రెండు దేశాల మధ్య స్వల్పతేడా ఉంది.మోడీ అధికారానికి వచ్చిన సమయంలో మనకంటే బంగ్లాదేశ్‌ వెనుకబడి ఉంది.పన్నెండేళ్ల మోడీనోమిక్స్‌ అభివృద్ధి పథంలో దేశం నడిచిందని చెప్పిన తరువాత ఇప్పుడు మనం వెనుకబడిపోయాం.ఎంత చెట్టుకు అంతగాలి అంటారు గానీ, బంగ్లాదేశ్‌ చిన్న చెట్టు నుంచి ఎక్కువగా వస్తోంది.మొత్తం జిడిపిని జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి, ఇది వేదగణితంలో కూడా మారదు మరి. దీన్ని చూస్తుంటే ఒక సినిమాలో ఏమిరా బాలరాజూ నీవలన దేశానికి ఉపయోగం ఏమిటి అన్న మాట గుర్తుకు వస్తున్నది. ఇరాన్‌మీద జరుగుతున్న యుద్దంతో మనకేం సంబంధం లేదు, మన మీద ఎలాంటి ప్రభావం పడదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న తరుణంలో ఐఎంఎఫ్‌ నివేదిక వెలువడింది. ఒక్కసారిగా నాలుగో స్థానం నుంచి ఆరుకు దిగజారిందంటే మన వృద్ధి ఎంత బలహీనంగా ఉందో ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆర్థిక స్థితి గురించి ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌ నెలలో వేసిన అంచనాలు పరిస్థితిని వెల్లడించాయి. అయితే నాలుగు లేదా ఆరులో ఉన్నప్పటికీ సమీప దేశాలతో పోలిస్తే తేడాలు పెద్దగా లేవు. ఉదాహరణకు వంద నాలుగో స్థానం అనుకుంటే 101ఐదో స్థానం మాదిరిగా చెప్పుకోవచ్చు.తాజా ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం అమెరికా 32.38,చైనా 20.85,జర్మనీ 5.5, జపాన్‌ 4.38, బ్రిటన్‌ 4.26, భారత్‌ 4.15, ఫ్రాన్సు 3.27లక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగి ఉన్నాయి. అందువలన నాలుగు నుంచి ఆరు స్థానాల వరకు ఉన్న దేశాల్లో ఏ చిన్న మార్పు వచ్చినా వరుస మారుతున్నది.మన స్థానం ఎందుకు తగ్గుతున్నట్లు ? పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ఎన్ని స్టెరాయిడ్లు ఇచ్చినా ఫలితం ఎందుకు రావటం లేదు !

రూపాయి పతనం గురించి మోడీ, ఇతర బిజెపి నేతలు మన్మోహన్‌ హయాంలో చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకుంటే ఆడపిల్లలకంటే ఎక్కువగా సిగ్గుపడిపోతారు గనుక ఇప్పుడు మాట్లాడటం లేదు, కిందపడినా గెలుపు మాదే అన్నట్లుగా ఉన్నారు. గతంలో రూపాయి పతనమైతే మన్మోహన్‌ సింగ్‌ చేతగాని తనం, అవినీతి అన్నారు.ఇప్పుడు మరోవిధంగా మాట్లాడుతున్నారు. నరం లేని నాలుకల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది.వ్యవస్థా సంబంధిత సమస్యల కంటే రూపాయి మార్పులే జిడిపి స్థానం పడిపోవటానికి కారణమని, రానున్న సంవత్సరాలో భారత్‌ పుంజుకుంటుందని ఐఎంఎఫ్‌ చెప్పింది.జోతిష్కాలన్నీ అలాగే ఉంటాయి. ప్రపంచ జిడిపి లెక్కలన్నీ అమెరికా డాలర్లలోనే ఉంటాయి.అందువలన డాలర్‌తో ప్రతిదేశ కరెన్సీ విలువను బట్టి పరిస్థితి మారుతూ ఉంటుంది.మనదేశంలో ఉత్పత్తి ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే విలువ పడిపోతుంది. గడిచిన ఏడాది కాలంలో రు.80లలో ఉన్న మారకం రు.90లోకి పతనమైంది.అందుకే డాలర్ల లెక్కలో మన జిడిపి తగ్గింది.ఇటీవల జరిగిన పరిణామాలన్నీ మన రూపాయి పాపాయి మీద వత్తిడిని మరింతగా పెంచాయి. ముడిచమురు ఉత్పత్తిలో మోడీ అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో 37.4మిలియన్‌ టన్నుల నుంచి ప్రస్తుతం 25మి.టన్నులకు పడిపోయింది, సహజవాయు ఉత్పత్తి కూడా తగ్గింది.ఈ మేరకు విదేశీ దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తున్నది.దీనికి గాను డాలర్లు కావాలి, వాటిని కొనుగోలు చేయాలంటే మన రూపాయి విలువ పతనం అవుతున్నది. ఇటీవలి కాలంలో మన స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు పెద్ద మొత్తంలో లాభాలు దండుకొని వెనక్కు తీసుకోవటం కూడా డాలర్లు తరలిపోవటానికి ఒక కారణం. తన డాలరు పెత్తనాన్ని కాపాడుకొనేందుకు ఇరాన్‌ వంటి దేశాలనే తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు చూస్తున్న అమెరికా తన కరెన్సీ విలువ పతనం కాకుండా చూస్తున్నది. భారత ఆర్థిక సంవత్సరం 2025-26లో మన వృద్ధి రేటు 6.5శాతం ఉన్నప్పటికీ కరెన్సీ విలువ పదకొండుశాతం పతనం కాగా జపాన్‌ ఎన్‌ 10, బ్రిటన్‌ పౌండ్‌ రెండు శాతాల చొప్పున పెరిగాయి. అందుకే స్వల్పంగానే అయినప్పటికీ అవి రెండు మనలను వెనక్కు నెట్టి పైకి వెళ్లాయి. మన జిడిపి లెక్కింపు ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చిన కారణంగా తగ్గిపోయినట్లు కొందరు చెబుతున్నారు, అదే వాస్తవం అయితే అంతకు ముందు పాత ప్రాతిపదిక సంవత్సరాన్ని తీసుకొని ఎక్కువగా చూపి జనాన్ని మభ్యపెట్టారని అనుకోవాల్సి ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం వలన మనకెలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భరోసా ఇస్తున్నారు. అలా జరగాలనే జనం కోరుకుంటున్నారు.అది నిజమా !ఇల్లు కట్టేటపుడు, పెళ్లి కుదిరిన తరువాత వాటిని పూర్తి చేసేందుకు అవసరమైతే ఎక్కడబడితే అక్కడ అప్పు తెచ్చి ముగించటం తెలిసిందే. తరువాతే అసలు కథ మొదలౌతుంది.యుద్ధ ప్రభావం కూడా అంతే.మనకు అవసరమైన ముడి చమురు దిగుమతులను తగ్గించటంలో మోడీ సర్కార్‌ విఫలమైంది.అవసరాలు పెరుగుతున్నపుడు దిగుమతులు కూడా పెరగాలి కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆత్మనిర్భరత నినాద కాలంలో మన స్వదేశీ ఉత్పత్తి 2014 38మిలియన్‌ టన్నులు ఉండగా ఇప్పుడు 25మి.టన్నులకు పడిపోయింది.అందువలన 88శాతం మేరకు దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది.రోజుకు సగటున 50లక్షల పీపాలను కొనుగోలు చేస్తున్నాం.ఈ మొత్తంలో 40శాతం హార్ముజ్‌ జలసంధి ద్వారా రవాణా అవుతుంది.వంటగ్యాస్‌ను 91శాతం గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.ఇప్పుడు దీనికీ ఆటంకం ఏర్పడింది.విదేశాల్లో ఉన్న భారతీయులు వందమంది అనుకుంటే 50మంది గల్ఫ్‌ దేశాల్లోనే ఉన్నారు. వారు ప్రతిఏటా 50బిలియన్‌ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు.ఇప్పుడు ఎంత తగ్గిందో లెక్కలు తేలిన తరువాత మాత్రమే తెలుస్తుంది.యుద్దానికి ముందు మనం సగటున 67డాలర్లకు ఒక పీపా దిగుమతి చేసుకుంటే అది 110 డాలర్లకు పెరిగింది. 2022 నుంచి దిగుమతి ధర తగ్గినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి తగ్గుదల లేకుండా గోళ్లూడగొట్టి అధికమొత్తాలను వసూలు చేశారు.అందుకే తేలుకుట్టిన దొంగల మాదిరి ఏమీ మాట్లాడటంలేదు, అయితే తాత్కాలికమే.

పవర్‌ పెట్రోలు, పారిశ్రామిక అవసరాలకు వాడే డీజిల్‌ ధరలను మాత్రమే పెంచారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత మొత్తం చమురు, గ్యాస్‌ ధరలను పెంచుతారా లేదా అన్నది పెద్ద ప్రశ్న.ఎందుకంటే నరేంద్రమోడీ జిగినీదోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడప్పుడే సంక్షోభాన్ని ముగించేట్లు లేడు. యుద్దానికి ముందు రోజుకు 33.5కోట్ల డాలర్లను దిగుమతులకు ఖర్చు చేస్తుంటే ఆ మొత్తం ఇప్పుడు 55 కోట్ల డాలర్లకు పెరిగింది.నలభై ఐదు రోజుల యుద్ద కాలంలో పెరిగిన అదనపు చమురు బిల్లు 970 కోట్ల డాలర్లు.ఇది మన కరెన్సీ 92వేలకోట్లకు సమానం.ముడి చమురు ధర ఒక పీపాకు పదిడాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతా లోటు జిడిపిలో 0.4 నుంచి 0.5శాతం పెరుగుతుంది. గల్ఫ్‌ దేశాల నుంచి చమురు దిగుమతి చేసే టాంకర్ల బీమా ధరలు 400శాతం పెరిగాయి, రూపాయి విలువ నష్టం గురించి ముందే చెప్పుకున్నాం.చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో 40శాతం పెరిగాయి, మన రూపాయి విలువ 11శాతం తగ్గింది. దీంతో ప్రతి పీపాకు మనం చెల్లించాల్సిన మొత్తం 55శాతం పెరిగిందని అంచనా. మరింత సులభంగా చెప్పాలంటే యుద్దానికి ముందు ఒక పీపాను మన రూపాయల్లో రు.5,695కు తెచ్చుకుంటే ఇప్పుడు రు.9,500 చెల్లించాల్సి వస్తోంది.ఈ మొత్తం జనాలు లేదా ప్రభుత్వం భరించాల్సిందే. మోడీ జనం మీద దయచూపుతారా ? పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ కారణాలతో మన విదేశీమారక ద్రవ్యం100 బిలియన్‌ డాలర్లు తగ్గింది. యుద్దం కారణంగా వంటగ్యాస్‌ దిగుమతులు వెంటనే 30శాతం తగ్గాయి. దాంతో ఆందోళనకు గురైన ప్రభుత్వం చమురుశుద్ది కేంద్రాలలో ఉప ఉత్పత్తులైన ప్రొపేన్‌ మరియు బుటేన్‌లను వంటగ్యాస్‌ తయారీకి మళ్లించాలని ఆదేశించింది, దాంతో 25శాతం మాత్రమే అదనంగా అందుబాటులోకి వచ్చింది. ఈ కారణంగా ఇప్పటికీ గ్యాస్‌ సరఫరా ఆలశ్యం అవుతున్నది. గ్యాస్‌ ధర రు.60 పెంచారు, సబ్సిడీ రు.40 రద్దు చేశారు, అంటే వంద రూపాయలు వడ్డించారు.మన భూగర్భ నిల్వల సామర్ద్యం 1.4లక్షల టన్నులే,రోజుకు 80వేల టన్నులు కావాలి గనుక రెండు రోజులకూ సరిపోదు. అందుకే వెంటనే కొరత ఏర్పడింది.

ఈ సంక్షోభం కారణంగా దాదాపు పన్నెండు బిలియన్‌ డాలర్ల మేర వ్యవసాయ ఉత్పత్తులు ముప్పులో పడినట్లు గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(జిటిఆర్‌ఐ) అంచనా వేసింది.నాలుగు లక్షల టన్నుల బాస్మతి బియ్యం రేవుల్లో నిలిచిపోయింది.కాండ్లా రేవులో అరటి పండ్లు పనికిరాకుండా పోయాయి.తేయాకు ఇరవైశాతం ఎగుమతులు ఆగిపోయాయి.ఇదే విధంగా మనం దిగుమతి చేసుకొనే ఆపిల్‌,ఇతర ఉత్పత్తులు కూడా ఆగిపోయాయి.దిగుమతి చేసుకొనే ఎరువులు నెల రోజులు ఆలశ్యం అవుతాయని, ఇప్పటికే 20శాతం ధరలు పెరిగినట్లు చెబుతున్నారు.విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రతి ఏటా 50 బిలియన్‌ డాలర్లు మాతృదేశానికి పంపుతున్నారు.ఈ మొత్తంలో మధ్య ప్రాచ్య దేశాల నుంచి 15బిలియన్‌ డాలర్లు వస్తున్నాయి.తాజా సంక్షోభంతో ఈ మొత్తాల మీద ప్రతికూల ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడే తెలియదు.పశ్చిమాసియా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఢోకా ఉండదని తొలిరోజుల్లో మాట్లాడిన అధికారపక్ష నేతలు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.నీతి ఆయోగ్‌ తాజా నివేదికలో దేశవాణిజ్యం, ఆర్థిక స్థిరత్వం గురించి చెబుతూ కరెంట్‌ ఖాతా లోటు పెరగనుందని చెప్పింది.దేశ ఎగుమతులు, దిగుమతుల్లో గల్ఫ్‌ ప్రాంత వాటా పన్నెండుశాతం ఉంది.యుఏయికి సరకులను పంపి అక్కడి నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తిరిగి ఎగుమతి చేస్తారు.ఇప్పుడు వాటికీ ముప్పు ఏర్పడింది.ఈ ప్రాంతం నుంచి మన ఎరువుల అవసరాల్లో 36శాతం, విలువైన రాళ్లు,లోహాలలో 32శాతం దిగుమతి చేసుకుంటున్నాము.మూడవ త్రైమాస కాలంలో యుద్దంతో నిమిత్తం లేని సమయంలో మన వస్తు ఎగుమతులు కేవలం 1.6శాతం పెరగ్గా దిగుమతులు 7.9పెరిగాయి.

ముడి చమురు ధరలు పెరగటం, కొరతల కారణంగా వృద్ధి రేటు తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు ఉందని ఏప్రిల్‌ ఎనిమిదిన ఆర్‌బిఐ గవర్నర్‌ సంజరు మల్హోత్రా విధాన ప్రకటనలో పేర్కొన్నారు.ద్రవ్యోల్బణ లక్ష్యం నాలుగుశాతం కాగా 4.6శాతానికి పెరగవచ్చని ఆర్‌బిఐ పేర్కొన్నది.నెల రోజుల పాటు రష్యన్‌ చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ” అనుమతి ” ఇచ్చింది. అయితే గతంలో ట్రంప్‌ బెదిరించిన కారణంగా మనం దిగుమతులు తగ్గించిన కారణం కావచ్చు,మార్కెట్‌లో డిమాండ్‌ ఇతర కారణాలతో గతంలో రష్యా ఇచ్చిన రాయితీలు ఇప్పుడు లేకపోగా అదనంగా చెల్లించి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.ప్రపంచ మార్కెట్‌ కంటే పీపాకు పదిహేను నుంచి ఇరవై డాలర్లు తక్కువగా రాయితీ ధరలకు రష్యా ముడిచమురును అందచేస్తే దాన్నుంచి ఉత్పత్తులు తయారు చేసి అంబానీ,నయారా కంపెనీలు విదేశాలకు లాభాలకు అమ్ముకున్నాయి తప్ప మన వినియోగదారులకు ఒక్క పైసా కూడా తగ్గించలేదు.ఇప్పుడు గతరాయితీలు పోగొట్టుకొని ప్రామాణిక బ్రెంట్‌ రకం కంటే రెండు నుంచి నాలుగు డాలర్లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది.అమెరికా పాటలకు అనుగుణ్యంగా డాన్సులు చేస్తే ఇలాగే ఉంటుంది మరి.అతి తెలివి ప్రదర్శిస్తే వ్రతమూ చెడుతుంది, ఫలితమూ దక్కదు ! మొత్తంగా పన్నెండేళ్ల పాలన తీరు తెన్నులను చూస్తే మన్మోహన్‌ సింగ్‌ హయాంలో యుపిఏ ఎదుర్కొన్న తీవ్ర పరిస్థితులు తిరిగి వస్తున్నాయా ? 2029లో మోడీ, బిజెపి పాలనకు తెరపడుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మాహుతిదళ బుడిబుడి రాగాలు – భారత మహిళలకు దొంగనక్క క్షమాపణలు !

19 Sunday Apr 2026

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, TDP, Women, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Delimitation bill 2026 India, Donald trump, Emotional blackmail, Narendra Modi Failures, pavan kalyan, RSS, women reservation, YS jagan

!ఎం కోటేశ్వరరావు

దేశంలో సరికొత్త నాటక రాజకీయాలు అదీ మరోసారి మహిళల పేరుతో మొదలయ్యాయి.ప్రతిపక్షాల మద్దతు లేకుండా వీగిపోతుందని తెలుసు. వేదగణితం ప్రకారం కూడా మూడింట రెండువంతుల మెజారిటీ పాలక కూటమికి లేదు. అయినా కనీసం మాటమాత్రంగా సంప్రదింపులు జరపని అపర ప్రజాస్వామిక వాదులతో కూడిన ఎన్‌డిఏ పక్షాల కారణంగా నారీశక్తి ముసుగులో ప్రవేశపెట్టిన రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయింది.నారీ బిల్లు వీగిపోయిందని కొన్ని మీడియా సంస్థలు శీర్షికలు పెట్టాయి. మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టమై గజెట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల అయింది. ఓడిపోయింది మోడీ మరియు మద్దతు ఇచ్చిన ఆత్మాహుతి దళానికి చెందిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, జగన్‌మోహనరెడ్డి బిల్లు మాత్రమే.కిందపడ్డా నాదే పైచేయి అన్నట్లు జగన్‌మోహనరెడ్డి మాట్లాడుతున్నారు.బిల్లును ఓడించిన పార్టీలు తాము ఏమి సాధించామో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మోడీకి మద్దతు ఇచ్చి వ్రతం చెడినా ఫలం దగ్గని ఆ పెద్దమనిషి తానేమి సాధించారో చెప్పాలి. పచ్చి అబద్దాలతో ప్రకటన చేశారు. కేంద్రం ప్రతిపాదించిన 50శాతం పెంపుదలను ఆమోదించి ఉంటే అన్నారు. బిల్లులో అలాంటి పదజాలం ఉందో లేదో కూడా సరిచూసుకోకుండా జనాన్ని, తన గణాలను తప్పుదారి పట్టించారు. బిల్లును ఓడించారంటూ బుడిబుడి రాగాలు తీస్తున్న తెలుగుదేశం, జనసేన, బిజెపి నేతలతో కలసి వైసిపి నాయకులు కూడా సామూహిక రోదన కార్యక్రమాల్లో పాల్గ్గొని ఉంటే జగన్‌ వ్రతం సంపూర్ణం అయి ఉండేది.దీన్లో కూడా ఎటూ కాకుండా పోయారు.నిడదవోలులో మూడు పార్టీల కూటమి దుకాణం పెడితే దానికి దగ్గరలో అయినా మోడీ ఓదార్పు యాత్రను జగన్‌ చేపట్టి ఉంటే సార్ధకనామధేయుడై ఉండేవారు. దక్షిణాది, కుటుంబనియంత్రణ పాటించిన ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అడ్డుకోవటమే ప్రతిపక్షాలు సాధించిన అంశం. ఇది కూడా అర్ధంగాక పోతే ఎక్కడైనా చికిత్సకు చేర్చటం మంచిది.

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకోవటం, మెప్పు పొందటంలో దేశంలో చంద్రబాబు నాయుడిని మించిన వారు లేరని చెప్పవచ్చు. ఎదుటివారికి కన్ను కొడుతూ వేరే వారితో సంబంధాలు నెరపటంలో దిట్ట. నిడదవోలు ప్రసంగంలో యుపిఏ పాలనలో మహిళా రిజర్వేషన్‌ గురించి పట్టించుకోలేదని చెప్పారు, సరే, 2014 నుంచి 2023వరకు తొమ్మిదేండ్లు నరేంద్రమోడీ ఏం చేశారన్న ఒక్క ముక్క నోటి నుంచి రాలేదు.రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిన తరువాత కూడా గురువారం రాత్రి వరకు నోటిఫికేషన్‌ జారీ చేయని నిర్వాకం గురించి ప్రశ్నించలేదు. ”నోటిఫికేషన్‌” ప్రాధాన్యత ఏమిటో అమరావతి గురించి చూసిన తరువాత చంద్రబాబుకు చెప్పాల్సిన పనిలేదు.తెలుగుదేశం ఉప్పు తిని విశ్వాసంగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారిలో జర్నలిస్టు ఆర్‌కె జగమెరిగిన బ్రాహ్మణుడు. ఏం చేద్దాం బ్రదర్‌ అని చంద్రబాబు అడిగి ఉంటే ఏ సలహా చెప్పేవారో ఆదివారం నాటి కొత్త పలుకు చూసిన తరువాత అర్ధం అవుతుంది.” కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామి అని అందరూ భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి కూడా సదరు బిల్లులో ఏముందో తెలియని స్థితి ” అని రాశారు. చంద్రబాబు నాయుడిని చూసి జగన్‌మోహనరెడ్డి సానుభూతి చూపాల్సిన దుస్థితి. అవున్లే బాబుకే తెలియకపోతే దేనికైనా మద్దతు అని ప్రకటించిన వైసిపి నేతలను కనీసం ఈ విషయంలో అయినా తండ్రీ కొడుకులు ఓదార్చి ఉండాల్సింది. తనతో సంప్రదింంచకుండా మోడీ ఏపనీ చేయరనే ధీమాతో ఉన్న చంద్రబాబు ”కేంద్రమంత్రులకు ఫోన్లు చేసి అన్ని రాష్ట్రాలలో 50శాతం సీట్లు పెంచబోతున్న విషయం తెలుసుకున్నారు ” అని ఆర్‌కె ముక్తాయించారు. ఆ ముక్క అసలు బిల్లులో పెట్టలేదని తన పత్రికలోనే రాసిన విషయం తెలియదని అనుకోవాలా ? చంద్రబాబుకు సైతం తెలియదని రాయటం వెనుక ఉన్న అంతరంగం ఏమిటి ? తెలిసి ఉంటే బాబుగారు జాగ్రత్తపడి ఉండేవారు అని భజన చేయటం కావచ్చు.లేకపోతే మీ మద్దతు తీసుకోవటం తప్ప మీరంటే మోడీకి లెక్కలేదు అని ఇరుకునపెట్టటానికి రాసి ఉండవచ్చు. తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చన్న సంభాషణను గుర్తుకు తెచ్చుకోవాలి. కలానికి, కత్తికి రెండు రకాల పదను, ప్రయోజనం దాగి ఉంటుంది.ఆర్‌కె ఏ లక్ష్యంతో రాసినప్పటికీ అది ప్రచురితంగాక ముందు మోడీని బలపరిచిన తెలుగుదేశం, జనసేన వీరాభిమానులందరూ చదివిన తరువాత తమ నేత పలుకుబడిని చూసి నీరులేని బావులను చూసుకొని ఉండి ఉండాలి. ఆత్మగౌరవం, అన్న ఎన్‌టిఆర్‌ అని జపం చేసే వారందరూ ఆర్‌కె వ్యాఖ్యానం చదివిన తరువాత కూడా మామూలుగానే భజన కొనసాగిస్తుంటే చంద్రబాబు నాయుడి మాదిరి ” స్థితప్రజ్ఞత ” సంతరించుకొని ఉండాలి.చంద్రబాబు నాయుడు కూడా బ్యూరోక్రాట్‌ మాదిరి వ్యవహరించారని ప్రవచించిన ఆర్‌కెకు అంతకు మించిన పెద్ద బ్యూరోక్రాట్‌ మోడీ గురించి తెలియదనుకోవాలా ? తమను బలపరచటం తప్ప బాబుకు మరోదారి లేదన్నదే మోడీ ధీమా ! గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం మొత్తాన్ని మింగివేసిన మోడీకి ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పక్షాన్ని స్వాహా చేయటం చిటికెలో పని. చంద్రబాబు అండ్‌కోకు మోడీ ఏం చేసినా బలపరచటం తప్ప మరో మార్గం లేదు. అందుకే అన్నీ తెలిసి రాజ్యాంగసవరణ బిల్లును బలపరచి తన కాళ్లను తానే నరుక్కొనేందుకు కూడా సిద్దపడక తప్పలేదు.

భవిష్యత్‌లో కూడా జనాభా ప్రాతిపదికన అది 2011 అయినా 2027 లెక్కల ప్రకారమైనా లోక్‌సభ సీట్లను కేటాయించాలని చూస్తే మరోసారి ఇదే సమస్య పునరావృతం అవుతుంది.కుటుంబనియంత్రణ పథకాన్ని అమలు చేసిన తరువాత 1961-71 జనాభాలెక్కల్లో వెల్లడైన వ్యత్యాసాన్ని గమనించి ఇందిరాగాంధీ ముందు చూపుతో రాజ్యాంగ సవరణద్వారా 25 సంవత్సరాల పాటు లోక్‌సభ సీట్ల పెంపుదలను స్థంభింప చేశారు. ఎందుకంటే హిందీని బలవంతంగా రుద్దేందుకు చేసి మూర్ఖపు చర్యతో అంతకు ముందు తమిళనాట తలెత్తిన నిరసన ఏమిటో ఆమెకు అవగతం అయింది.తరువాత వాజ్‌పాయి కూడా ఇతర పార్టీల మద్దతు మీద ఆధారపడిన కారణంగా ఆ కందిరీగల తుట్టెను కదిపేందుకు సాహసించలేదు. మరోసారి పాతిక సంవత్సరాల స్థంభన విధించారు.తన రూటే సపరేటు(ఇతరుల మార్గంలో నడవను) అన్నట్లుగా మోడీ వ్యవహరించారు.ఇరాన్‌తో వ్యవహారంలో జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ అతితెలివి తీరును చూస్తున్నాం.బిజెపి నేతలు కూడా అదే చేశారు. మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చింది.దాన్ని ఎవరూ మార్చలేరు. అయినా సవరణ బిల్లు పేరుతో కొన్ని రాష్ట్రాలకు అన్యాయం, కొన్నింటికి విపరీత లబ్దికలిగే పద్దతిలో సంఖ్య పెంచి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లంకెపెట్టటమే అసలు వివాదానికి కారణమైంది. మహిళల పేరు చెప్పి భావోద్వేగపూరిత బెదిరింపులకు(ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌)పూనుకున్నారు. మీరు గనుక మేం చెప్పినట్లు ఆమోదించకపోతే మాకే లాభం అన్నారంటేే అర్ధం ఏమిటి ? మీ గురించి వ్యతిరేకతను రెచ్చగొడతాం అని చెప్పటమే.చిత్తశుద్ది ఉన్నవారెవరైనా అలాంటి పరిస్థితే వస్తుందనుకుంటే వేరే పదజాలాన్ని ఉపయోగిస్తారు. పెంచిన 50శాతం సీట్లను రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్ల దామాషా ప్రకారం కేటాయిస్తామంటే గుడ్డిలో మెల్లమాదిరి అన్ని పార్టీలూ అంగీకరించి ఉండేవి.

అసలు రాజ్యాంగ సవరణ ప్రతిపాదన లేక ముందు అమిత్‌షా మొదలు బిజెపి గల్లీ లీడరు వరకు అన్ని రాష్ట్రాలకు అలాగే పంచుతామని చెప్పారు. తీరా బిల్లులో ఆ ప్రస్తావనే లేదు.రెండు రోజులు పాటు పార్లమెంటులోపలా వెలుపలా ప్రభుత్వ ప్రతిపాదనతో కొన్ని రాష్ట్రాలకు గలిగే నష్టం, లబ్ది గురించి వివరంగా చర్చ జరిగింది. అయినప్పటికీ ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకుండా సరిగ్గా ఓటింగ్‌కు వెళ్లే ముందు(తొలుత సాయంత్రం నాలుగు అన్నారు, తరువాత ఆరు, మరోసారి ఏడు అన్నారు) అమిత్‌షా ప్రతిపక్షాలను తీవ్రంగా దుయ్యబట్టి మీరు గనుక మా షరతుకు అంగీకరిస్తే 50శాతం చేరుస్తామని అన్నారు. అంతకు ముందు బిజెపి నేతలు ఇరవై నాలుగు గంటలపాటు అలాంటి లీకులు ఇచ్చారు, చివరికి తమ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ అందిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలకు అదే చెప్పారు.అయినా బిల్లులో ఎలాంటి మార్పులు చేయకుండా నాటకమాడారు. మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలుకు 2023 నుంచి గజెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకుండా గురువారం రాత్రి ప్రకటించారు. స్వంత మిత్రులనే తప్పుదారి పట్టించి మోసం చేసిన బిజెపి మంత్రుల మాటలను ఎవరు నమ్ముతారు.చివరికి అదే జరిగింది.బిల్లు ఓడిపోయింది. అలాంటి పరిణామం జరుగుతుందని ముందే తెలుసుగనుకనే వారు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసే నినాదాలతో కూడిన ప్లకార్డులను సిద్దం చేసుకొని పార్లమెంటు ప్రాంగణంలో దాచబట్టే వెంటనే నిరసనపేరుతో వీధుల్లో ఊరేగారు. ఇప్పటికైనా నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాలకు వదలివేసి 543 స్థానాల్లో 33శాతం రిజర్వేషన్‌ అమలుకు పూనుకోవాలి.2023 చట్టంలో తదుపరి జనాభా లెక్కల తరువాత అమలు అని లంకె పెట్టినందున దాన్ని సవరించేందుకు ఇప్పుడు జరుగుతున్న జనాభాలెక్కల ప్రాతిపదికన పార్లమెంటు సీట్ల సంఖ్యను మార్చకుండా పునర్విభజన చేసేందుకు చట్టసవరణ చేయాలి.అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు.మహిళలూ క్షమించండి అంటూ ప్రకటించిన మోడీ చిత్తశుద్దికి ఇప్పుడు పరీక్ష ఎదురుకానుంది, వచ్చే పార్లమెంటు ఎన్నికలకు చాలా ముందుగానే జన సంఖ్య ఎక్కడ ఎంత అనేది స్పష్టం అవుతుంది గనుక దానికి అనుగుణంగా లోక్‌సభ, రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి ఆటంకం ఉండదు.

ఇక నరేంద్రమోడీ క్షమాపణల చిత్తశుద్ది బండారం గురించి చెప్పుకోకపోతే సంపూర్ణం కాదు. ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో సాగిన రైతాంగ పోరాటానికి తలొగ్గిన నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.ఆ ఉద్యమం ముందుకు తెచ్చిన అంశాలలో ఒకటి కనీస మద్దతు ధరలకు చట్టబద్దత.మోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు ఆ డిమాండ్‌ను ముందుకు తెచ్చినప్పటికీ తాను ప్రధాని పదవి స్వీకరించిన తరువాత మిగతా వాగ్దానాల మాదిరే దాన్ని కూడా విస్మరించారు.అయితే రైతుల ఆందోళనను చల్లార్చేందుకు మద్దతుధరల చట్టబద్దత పరిశీలన పేరుతో 2021నవంబరు 19న ఒక కమిటీని ప్రకటించారు.దానికి 2022 జూలై 22న సభ్యులను ఎంపిక చేశారు.త్వరలో నాలుగో వార్షికోత్సవం జరుపుకోనుంది.అసలా కమిటీ ఏమి చేస్తున్నదో, సమావేశాల పేరుతో కాలక్షేపం, టిఏ, డిఏలు తీసుకుంటున్నది తప్ప చేసిందేమీ లేదు. జరిగిన ప్రతి సమావేశమూ అసంపూర్ణమే, 35 ఉపసంఘాల సమావేశాలు జరిగాయి.చివరి సమావేశం చాలా కాలం తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కమిటీలో ఉన్న అధికారగణ సభ్యులు మార్కెట్‌ కమిటీల వెలుపల జరిగే లావాదేవీలలో కనీస మద్దతు ధరలను అమలు జరపటానికి విముఖత చూపటంతో ఇతర కమిటీ సభ్యులు తీవ్రంగా విబేధించినట్లు నిర్దారణగాని వార్తలు. కనీస మద్దతు ధర ఎక్కడైనా రైతులకు దక్కాల్సిందేనని ఐదుగురు సభ్యులు కమిటీ చైర్మన్‌ మీద వత్తిడి తెచ్చినప్పటికీ ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. నివేదిక ఇవ్వాలని మోడీ సర్కార్‌ అడగలేదు, అసలా కమిటీకి ఒక నిర్ణీత గడువును కూడా నిర్ణయించలేదు.రైతుల్లో మహిళలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.రిజర్వేషన్లు, కనీస మద్దతు ధరలకు పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. చట్టసభల్లో రిజర్వేషన్లతో వారి ప్రాతినిధ్యం పెరుగుతుంది తప్ప ఆర్థికంగా ఒరిగేదేమీ లేదు. అదే పంటల కనీస మద్దతు ధరలకు హామీ ఇస్తే కోట్లాది మంది మహిళా రైతుల జీవితాలు కాస్త మెరుగుపడతాయి.ఈ విషయంలో చిత్తశుద్దిలేని మోడీ సర్కార్‌ ఇప్పుడు చట్టసభల రిజర్వేషన్లను ఎలా అమలు జరుపుతుందో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సూక్ష్మంలో మోక్షం : అచ్చేదిన్‌ అర్ధం ఏమిటి శిష్యా ! ” మోడీ గోవు ” పాలు అదానీ, అంబానీలకు, పేడ, మూత్రం భక్త జనాలకు గురువా !!

11 Saturday Apr 2026

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Acche Din Modi, BJP, CHANDRABABU, India Super Rich, inequality, Narendra Modi Failures, RSS

ఎం కోటేశ్వరరావు

అదానీ, అంబానీ,గూగుల్‌, అమెజాన్‌లకు ప్రజల సొమ్మును రాయితీల రూపంలో ఇస్తే అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తున్నట్లు ఏడవకండి. ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా ప్రయోజనం లేదు. ఎప్పటికప్పుడు జనాన్ని ఏమార్చే ఊసరవెల్లులు రంగులనే కాదు, సిద్దాంతాలను కూడా మార్చివేస్తున్నారు. వాస్తవాలను తలకిందులుగా చూపితే కొందరు తమ మెదళ్లను అలాగే ఉంచుకొని నిజమే అంటారు. సంపద సృష్టికర్తలు జనం.కానీ కొందరు ముందు చెప్పుకున్న కంపెనీల వంటివే సృష్టికర్తలని చెబుతూ వాటికి సర్వం సమర్పించుకుంటున్నారు. దాన్ని సమర్ధించుకొనేందుకు ఊట సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు.ఈ సిద్దాంతం ఎప్పుడు వచ్చింది. దోపిడీ పెరిగిపోయి భరించలేని స్థితిలో కార్మికవర్గం, రైతాంగం తిరగబడి రష్యా,చైనా, మరికొన్ని దేశాలలో సోషలిస్టు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు.జనం వాటికి ఆకర్షితులు కావటాన్ని గమనించి 1960దశకంలో ఊట సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. సూక్ష్మంలో మోక్షంలా ఒక్క ముక్కలో చెప్పాలంటే సంపదలను పెరగనిస్తే వాటి ఫలాలు క్రమంగా ఊటనీరులా సమాజంలోకి దిగుతాయి.అందరికీ ఉపయోగం. దీన్ని ఎవరైతేనేం మహానుభావులు నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు,రాహుల్‌ గాంధీ, రేవంతరెడ్డి, కెసిఆర్‌, స్టాలిన్‌, అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి అండ్‌కో గట్టిగా బలపరుస్తారు. ఎవరెన్ని కబుర్లు చెప్పినా జరుగుతున్నది తద్విరుద్దంగా ఉంది.

తాజాగా ” భారత సంపదల గుర్తింపు నివేదిక 2026 ” (వెల్త్‌ ట్రాకర్‌ ఇండియా రిపోర్టు 2026) ప్రకారం మనదేశంలో సంపన్నుల్లో అగ్రభాగాన ఉన్న 1,688 మంది సంపద దేశ జిడిపిలో సగానికి సమానం. ఇంత అసమానత, కేంద్రీకరణ బ్రిటీష్‌ వారి కాలంలోనూ, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనూ లేదు.1980దశకం వరకు కూడా నేడున్నంత తీవ్రంగా లేవు. ఊట సిద్దాంతం చెప్పటం ప్రారంభించిన తరువాత కిందికి బదులు సంపద పైకి చేరుతున్నది.ఈ 1,688 మంది కలవారి మీద రెండు నుంచి ఆరుశాతం సంపద పన్ను విధిస్తే ఏటా పదిలక్షల కోట్ల రూపాయల వరకు రాబడి వస్తుందని, ఆ మొత్తాన్ని సంక్షేమానికి వినియోగించవచ్చని సెంటర్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ ఎకౌంటబులిటీ -సిఎఫ్‌ఏ (ఆర్థిక జవాబుదారీతన కేంద్రం) రూపొందించిన సదరు నివేదిక పేర్కొన్నది.ఎప్పటికైనా వామపక్షాలు అధికారానికి వచ్చి పిల్లిమెడలో గంట కట్టాల్సిందే తప్ప మిగిలినవారెవరూ అలాంటి ఆలోచన కూడా చేయరు. మరోవైపు నిధుల కొరత గురించి శ్రీరంగ నీతులు చెబుతారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు సవరించేందుకు ముందుకు రారు. గూగుల్‌ వంటి ధనిక సంస్థలకు వేల కోట్ల రూపాయలు రాయితీలుగా ఇచ్చేందుకు తాంబూలాలు ఇచ్చేశారు.రేవంత రెడ్డి బాట కూడా అదే. పన్నెండేండ్ల క్రితం నరేంద్రమోడీ చెప్పిన కబుర్లలో అచ్చేదిన్‌(మంచి రోజులు ) ఒకటి.దేశంలో మోడీని చూసి ఓట్లు వేసిన ఎవరికైనా ఐదు సంవత్సరాల్లో రాబడి 400 శాతం పెరిగిందా ? మోడీ మద్దతు ఉన్న అంబానీ, అదానీ, జిందాల్‌,శివనాడార్‌, సునీల్‌ మిట్టల్‌ వంటి వారికి 2019-25 సంవత్సరాలలో సంపదలు దాదాపు 400శాతం పెరిగాయి.వాటిలోంచి కొంత తీసి ఎన్నికల బాండ్ల రూపంలో వేలాది కోట్ల రూపాయలను బిజెపికి కట్టబెట్టారు.అనధికారికంగా సమర్పించుకున్న మొత్తాలకు లెక్కలేదు.ఎంత డబ్బు లేకపోతే కేరళలోని పాలక్కాడ్‌లో బిజెపి మద్దతుదారులు ఓటుకు ఐదువేల రూపాయలు ఎలా పంచగలిగారు ?

నూతన ఆర్థిక విధానాలకు ఆద్యులం మేమే అని కాంగ్రెస్‌ గొప్పగా చెప్పుకుంటుంది. వాటిని సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఖ్యాతి మాదే అని బిజెపి ఢంకా బజాయించి మరీ బాకాలూదుతున్నది.వందకోట్ల డాలర్ల సంపద కలిగిన శ్రీమంతుడు 1991దేశంలో ఒక్కరే, అలాంటిది ఇప్పుడు 358 మంది ఉన్నారు.నివేదికలో పేర్కొన్న 1,688 మంది సంపద విలువ 166లక్షల కోట్లు, ఇది మన జిడిపిలో దాదాపు సగం. దేశంలోని ఎగువ ఒక శాతం మంది సంపద 2019లో 36.5శాతం ఉండగా 2022 నాటికి 40.1శాతానికి పెరగ్గా ఇదే కాలంలో దిగువ 50శాతం మంది వాటా 6.8 నుంచి 6.4శాతానికి దిగజారింది. అచ్చే దిన్‌ ఎవరికి ? ఇక వెయ్యి కోట్లకు మించి ఆస్తులున్న వ్యక్తుల సంఖ్య 2019-25 మధ్య 77శాతం పెరగ్గా, వారి సంపద (31లక్షల కోట్ల నుంచి 88లక్షల కోట్లకు) 227శాతం పెరిగింది.వీరిలో అదానీ ఆస్తి 625, ముకేష్‌ అంబానీ సంపద 153శాతం పెరిగింది.కేంద్ర ప్రభుత్వం వారిపట్ల ఎలాంటి సానుకూలత, అభిమానం చూపకుండానే స్వంతంగా చెమటోడ్చి పెంచుకున్నారని చెవుల్లో పూలు పెట్టుకొని జనం నమ్మాలి.ఈ అపర కుబేరుల మీద పన్ను వేస్తే వచ్చే అదనపు రాబడితో విద్య, వైద్యం వంటి సేవలకు జిడిపిలో అదనంగా ప్రతి రంగానికి ఒక్కో శాతం ఖర్చు పెంచవచ్చు, వృద్దు లందరికీ నెల నెలా పన్నెండు వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వవచ్చు.మానవత్వం ఉట్టి పడే నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌ ఎంతో తెలుసా ? 80 ఏండ్ల లోపు వారికి నెలకు రు.200, ఆపైబడిన వారికి రు.500, వితంతువులకు రు.500, వికలాంగులకు రు.300-500 మాత్రమే. మోడీ ఏలుబడిలో ఒక్క పైసా కూడా పెంచలేదు. అంతకు ముందు యుపిఏ ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాలనే ఇస్తున్నారు. అంతకు మించి ఇస్తున్నారంటే అవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉదారత్వమే.ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్న నాలుగువేలు, తెలంగాణాలో ఉన్న రెండువేలల్లో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం రెండు, ఐదు వందలు మాత్రమే. అందుకే ఎప్పుడూ ఈ పెన్షన్లలో మా మోడీ గురించి చెప్పరేం అని ఏ ఒక్క బిజెపి నేతా డిమాండ్‌ చేయరు.

అపర కుబేరుల మీద సంపద పన్ను విధిస్తే ఏం చేయవచ్చో కూడా నివేదిక పేర్కొన్నది.అంబానీ నుంచి రెండుశాతం పన్ను వసూలు చేస్తే దేశంలో ఉన్న 185 లక్షల మంది పదవ తరగతి విద్యార్ధులకు మూడేసి లాప్‌టాప్‌లు ఉచితంగా ఇవ్వవచ్చు. లేదా 2.85కోట్ల మంది తల్లులకు రెండు సంవత్సరాల పాటు ఆర్థిక సాయం చేయవచ్చు.ఏడాదికి రు.18వేలు ఇస్తే అయ్యే ఖర్చు సంవత్సరానికి రు.51,300 కోట్లు.అదానీ నుంచి రెండుశాతం పన్ను వసూలు చేస్తే దేశమంతటా రెండు సంవత్సరాల పాటు ప్రాధమిక ఆరోగ్యానికి ఖర్చు చేయవచ్చు లేదా 87 కోట్ల గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇవ్వవచ్చు.లేదా ఎనిమిది కోట్ల కుటుంబాలకు చెడు గాలి నుంచి రక్షణకు శుద్ధి చేసే పరికరాలను ఉచితంగా అందించవచ్చు.సావిత్రీ జిందాల్‌ నుంచి వసూలు చేసే పన్నుతో దళితులు, గిరిజన విద్యార్ధులకు కొన్ని సంవత్సరాలపాటు స్కాలర్‌షిప్పులు ఇవ్వవచ్చు.లేదా పదివేల రూపాయల చొప్పున రెండున్నర కోట్ల మంది బాలికలు తమ విద్యను మెరుగుపరుచుకొనేందుకు ఇవ్వవచ్చు.కార్పొరేట్‌లు, వ్యక్తులకు పన్నుమినహాయింపులు ఇస్తున్న కారణంగా ఆ భారాన్ని సామాన్యులు భరిస్తున్నారు. గత పదకొండు సంవత్సరాల్లో కార్పొరేట్లకు రు.19.6లక్షల కోట్ల రుణాలను రద్దు చేశారు. అయితే రికార్డుల్లో వాటిని పారుబాకీలుగా చూపుతారు తప్ప రద్దు చేసినట్లు ఉండదు.మన దేశం జి 20 కూటమిలో భాగస్వామి. జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ అనే ఆర్థికవేత్త నాయకత్వంలో ప్రపంచ అసమానతల గురించి పరిశీలనకు ఒక కమిటీని వేశారు.అసమానతల పెరుగుదల విధానపరంగా ఎంచుకున్న అంశమని, సంపద పెరిగే కొద్దీ పన్ను మొత్తాలను పెంచే విధంగా ఆ విధానాన్ని మార్చాలని కమిటీ నివేదిక పేర్కొన్నది.కానీ మనదేశంలో జరుగుతున్నదేమిటి ? అసమానతలను తగ్గించాలని మన రాజ్యాంగమే చెప్పింది.అధికారంలో ఎవరున్నా దాన్ని తుంగలో తొక్కారు.చివరకు మోడీ సంపదపన్నునే రద్దు చేశారని సదరు నివేదిక వ్యాఖ్యానించింది.ఎందుకయ్యా అంటే వసూలు చేసే పన్ను కంటే అందుకయ్యే ఖర్చు ఎక్కువగా ఉందని చూపారు.చట్టంలో లోపాలు ఉన్నాయన్నారు.ఇంట్లో ఎలుకలు ఉన్నాయని వాటిని చంపటం కంటే ఇల్లుతగులబెట్టటమే లాభదాయకమని చెప్పినట్లుగా ఉంది.చట్టాల్లో ఉన్న అనేక లోపాలను సరిచేస్తున్నామని చెప్పిన వారు ఈ చట్టాన్ని ఎందుకు సరి చేయలేదు ? 1957 చట్టం ప్రకారం రు.30 లక్షల సంపద మీద ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.దాన్ని రద్దు చేసి ఒక కోటికి మించి రాబడి ఉన్నవారు చెల్లించే పన్ను మీద రెండుశాతం సర్‌ఛార్జి విధిస్తున్నారు. ఉదాహరణకు కోటి రూపాయల రాబడిలో మినహాయింపులన్నీ పోను 20లక్షలకు పన్ను చెల్లించాల్సి వస్తే దాని మీద రెండుశాతం విధిస్తారు. ధనికులకు ఎన్ని రాయితీలు కల్పిస్తున్నారో చూడండి.

దేశంలో అసమానతల గురించి సిఎఫ్‌ఏ ప్రచార విభాగ డైరెక్టర్‌ అనిర్భన్‌ భట్టాచార్య మాట్లాడుతూ ” నేడు రెండు భారత్‌లు ఉన్నాయి.ఒక భారత్‌లో ఎగువన ఉన్న వేళ్లమీద లెక్కించదగిన కొద్ది మంది సంపదలు లక్షల కోట్లుగా పెరుగుతుంటే మరో భారత్‌ అప్పులపాలవుతున్నది ” అన్నారు. ” నోట్ల రద్దు మొదలు కరోనా మహమ్మారి వరకు గత పదేండ్లుగా బతకాలంటే ఎలాంటి ప్రశ్నలు వేయవద్దని జనాలకు చెప్పిన వారు ఇప్పుడు ఎల్‌పిజి-బొగ్గు గురించి కూడా అడగవద్దంటున్నారని” ధనికుల మీద పన్నువేయాలనే ప్రచార కర్త రాజశేఖర్‌ వ్యాఖ్యానించారు.కష్టపడే సామాన్యులు రోడ్ల మీద వరుసల్లో నిలుస్తుంటే దేశంలోని అపరకుబేరులకు దోపిడీ కొనసాగించేందుకు ఉచిత పాస్‌లు ఇస్తున్నారని కూడా అన్నారు. నివేదిక రూపకల్పనలో భాగస్వామి జాకబ్‌ జోషి మాట్లాడుతూ ఆందోళనకర స్థాయికి సంపద కేంద్రీకరణ పెరిగినప్పటికీ విధానపరమైన చర్చలో దాని ఊసే లేదన్నారు. అసమానతలు సాధారణం అయ్యాయని, సంపదపన్ను అద్భుతాలు చేస్తుందని కాదు గానీ పేదల మౌలిక హక్కుల అమలుకు కొంత మేర దోహదం చేస్తుందని కూడా చెప్పారు. అసమానతలు పెరిగితే ఏమౌతుంది ? మానవాభివృద్ది దిగజారిపోతుంది. ప్రపంచ జిడిపిలో పదవ స్థానంలో ఉన్నదానిని ఐదవదిగా తీసుకురావటం తమ ఘనత అని బిజెపి గొప్పలు చెప్పుకుంటుంది.కాసేపు అంగీకరిద్దాం.తలసరి జిడిపిలో సంగతేమిటి ? దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంది. ఐఎంఎఫ్‌ 2025 సమాచారం ప్రకారం చైనా 13,806 డాలర్లతో 99వదిగా ఉంది, మనదేశం 2,818 డాలర్లతో 166వదిగా ఉంది.మానవాభివృద్ది సూచికల్లో 2012లో 136వ స్థానం నుంచి మోడీ అధికారానికి వచ్చిన 2014లో 130వదిగా కాస్త పెరిగింది.సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ పాలనలో 2025లో కూడా 130వదిగానే ఉంది.సాధించిన అభివృద్ది ఏమిటి ? ఇంక మోడీ ప్రత్యేక ఏముంది ! కాషాయదళాలు చెప్పే ఆవు పాలు అంబానీ, అదానీలకు పేడ, మూత్రం జనాలకు పంచితే ఇదే జరుగుతుంది.మానవాభివృద్ది సూచికలో చైనా 0.797 పాయింట్లు కలిగి ఉంటే మనదేశం 0.685 దగ్గర ఉంది.అసమానతలు పెరిగే కొద్దీ ఆ సంఖ్య పెరగదు.మహాకవి గురజాడ చెప్పినట్లు దేశమంటే మట్టికాదోరు మనుషులోరు అన్నది నిజం కావాలంటే సంపదలు కేంద్రీకృతమైతే కుదరదు. పిండికొద్దీ రొట్టె అన్నట్లుగా ఆదాయం ఉంటేనే ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవనం సాధ్యం.సర్వేజనా సుఖినోభవంతు అంటే చాలదు, అందుకు కార్యాచరణ ముఖ్యం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌ చెప్పిందే నిజమా : అడ్డంతిరిగిన అమెరికా ! సందిగ్దంలో ఒప్పందం !

09 Thursday Apr 2026

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, Donald trump, Narendra Modi Failures, Netanyahu, US attack Iran, US-Iran Truce

ఎం కోటేశ్వరరావు

అమెరికా, డోనాల్డ్‌ ట్రంప్‌ నమ్మక ద్రోహులని ఇరాన్‌ మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది. రెండువారాల పాటు ఇరాన్‌పై దాడులను విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుఝామున ఈ ప్రకటన వెలువడింది. దానికి ప్రతిగా హార్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌ అంగీకరించింది.రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని తాను సమర్ధిస్తానని అయితే దానిలో లెబనాన్‌పై దాడులకు సంబంధించిన అంశం లేనందున దాడులు కొనసాగిస్తానని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇప్పుడు అదే ఒప్పందాన్ని సందిగ్దంలో పడవేసింది. ఇరాన్‌తో కుదిరిన అవగాహనలో లెబనాన్‌పై కాల్పుల విరమణ అంశం లేదని బుధవారం నాడు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ ప్రకటించాడు. దీంతో అమెరికా ఆడిన నాటకం బట్టబయలైంది. ట్రంప్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైంది. ఒప్పందానికి తూట్లు పొడిచి ఇరాన్‌ మీద నెపం మోపేందుకు ట్రంప్‌ యంత్రాంగం అతి తెలివి ప్రదర్శించింది. అమెరికాకు అందచేసిన పది అంశాల్లో ఒకటిగా లెబనాన్‌ మీద దాడుల నిలిపివేతను ఇరాన్‌ స్పష్టంగా పేర్కొన్నది.అదేమీ తెలియనట్లు జెడి వాన్స్‌ మాట్లాడటం మోసకారితనమే. ఒప్పందం జరిగిన రోజే లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌ వందలాది మందిని చంపింది. దీనికి ప్రతిగా తెరిచిన హార్ముజ్‌ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.రెండో రోజు గురువారం నాడు కూడా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగాయి.దానికి ప్రతిగా ఇరాన్‌, లెబనాన్‌లోని హిజబుల్లా కూడా దాడులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది రాసిన సమయానికి కుదిరిన ఒప్పందం విఫలమైనట్లే కనిపిస్తోంది. దానికి పూర్తి బాధ్యత ట్రంప్‌దే. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు అమెరికా కనుసన్నలలో పనిచేసే ఇజ్రాయెల్‌ దాడులకు వాషింగ్టన్‌ అనుమతి ఉందన్నది నిర్వివాదం.

తాజా అంశాలకు ముందు జరిగిన పరిణామాలను ఒక్కసారి నెమరువేసుకుందాం. పోరు ఇంకా ముగియలేదని తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్‌ మీదనే(తుపాకి గుండు బయటకు రావాలంటే నొక్కాల్సిన మీటను ట్రిగ్గర్‌ అంటారు) ఉన్నాయని ఇరాన్‌ ప్రకటించింది. ట్రంప్‌ ప్రకటన తరువాత రెండు వైపుల నుంచీ దాడుల వార్తలు లేవు.ఇరాన్‌ ప్రతిఘటనతో గుక్కతిప్పుకోలేని అమెరికా వ్యూహాత్మకంగా ఈ అవగాహనను అంగీకరించిందా ? ఈలోగా తన బలగాలను మరింతగా కూడదీసుకుంటుందా అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఏకపక్షంగా గడువులను ప్రకటించిన ట్రంప్‌ ఆ సమయంలో అన్ని రకాల దళాలను అదనంగా పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యానికి తరలించి భూతల దాడులకు సన్నాహాలు చేశాడు.ఒక్క రాత్రితో ఇరాన్‌ నాగరికతను నాశనం చేస్తానని మాట్లాడిన సంగతి తెలిసిందే.అమెరికా-ఇజ్రాయెల్‌ దుష్ట ఆలోచన గురించి ఎలాంటి భ్రమలు లేనప్పటికీ ఎంతో సంయమనం,దూరదృష్టితో ఇరాన్‌ ప్రతిఘటన నిలిపివేతకు అంగీకరించింది. మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌కు అమెరికా పదిహేను అంశాలు, ఇరాన్‌ పది ప్రతిపాదనలను అందచేశాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరువాత రెండువారాల వ్యవధిలో వీటి గురించి చర్చలు జరుగుతాయి. ఎవరు వేటిని అంగీకరిస్తారు, తిరస్కరిస్తారు అన్నది చర్చల ప్రారంభం తరువాత మాట్లాడుకోవాలి తప్ప ఊహాగానాల వలన ఎలాంటి ప్రయోజనం లేదు. నిజానికి ఈ అంశాలు ఎప్పటి నుంచో నలుగుతున్నవే.రెండు దేశాలూ వాటిని తిరస్కరించాయి.అందువలన ఇప్పుడేమి జరగనుందనే ఉత్కంఠ సహజంగానే ప్రపంచమంతటా తలెత్తింది.

అమెరికా 15ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. తక్షణమే నెల రోజుల కాల్పుల విరమణ జరగాలి, అన్ని చర్యలు నిలిపివేసి ముఖాముఖీ చర్చలు పాకిస్తాన్‌లో జరిపేందుకు అవకాశం కల్పించాలి.ఇరాన్‌లోని నాటంజ్‌, ఇష్‌ఫహాన్‌, ఫోర్డో అణుకేంద్రాలను శాశ్వతంగా ధ్వంసం చేయాలి. ఇరాన్‌ గడ్డమీద యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలి.శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని అంతర్జాతీయ అణు ఇంథన సంస్థ (ఐఏఇఏ) పర్యవేక్షణలో మరోదేశానికి తరలించాలి.ఇరాన్‌లోని అన్ని మిలిటరీ, పౌరకేంద్రాలు ఎక్కడ ఉన్నప్పటికీ ఎప్పుడు పడితే అప్పుడు ఐఏఇఏ నిరాటంక తనిఖీకి అనుమతించాలి.హార్ముజ్‌ జలసంధిని తటస్థ ప్రాంతంగా చేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్చగా నౌకా రవాణాకు అనుమతించాలి.బాలిస్టిక్‌ క్షిపణుల పరిధిని పరిమితం చేసి సంఖ్యను తగ్గించుకొని ఆత్మరక్షణకు మాత్రమే వినియోగించాలి.హిజబుల్లా, హౌతీల వంటి సాయుధ బృందాలకు నిధులు, ఆయుధాల అందచేత నిలిపివేయాలి. నిర్బంధంలో ఉన్న విదేశీ పౌరులందరకీ, ద్వంద్వ పౌరసత్వం ఉన్న అందరికీ స్వేచ్చ నివ్వాలి.అమెరికా ఆస్తులు మరియు పొరుగున ఉన్న గల్ఫ్‌ దేశాలను లక్ష్యంగా చేసుకోకుండా ఒక ఒప్పందానికి రావాలి.సమగ్రమైన ఆంక్షల నుంచి ఊరట, ప్రాధమిక,ఇతర ఆంక్షలు పూర్తిగా తొలగింపు.విదేశాల నుంచి సేకరించే ఇంధనంతో బుషేహర్‌లో ఉన్న అణువిద్యుత్‌ కేంద్రానికి అమెరికా మద్దతు.ఇరాన్‌ ఇంథన రంగంలో పశ్చిమదేశాల పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలి.ఒప్పందం కుదిరిన తరువాత ఆటోమేటిక్‌గా అమల్లోకి వచ్చే ఐరాస ఆంక్షల తొలగింపు.ప్రాంతీయ స్థిరత్వానికి చట్టపరమైన అంగీకారంతో శాశ్వత శాంతి ఒప్పందం.

ఇరాన్‌ ప్రతిపాదించిన పది అంశాలు ఇలా ఉన్నాయి.ఇరాన్‌ మీద ఇంకేమాత్రం దాడులు చేయకూడదు.అమెరికా, దాని అనుయాయి దేశాలు అన్ని రకాల దాడులను శాశ్వతంగా ఆపాలి.తాత్కాలిక విరమణ కాదు, శాశ్వత ఒప్పందం కుదరాలి.విదేశాల్లో స్థంభింపచేసిన ఇరాన్‌ ఆస్తులన్నింటినీ ఒప్పందంలో భాగంగా తిరిగి ఇవ్వాలి. లెబనాన్‌ మీద ఇజ్రాయెల్‌ దాడులను ఆపాలి.అన్ని రకాల అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలి.ఇరాన్‌ అనుయాయుల మీద ఇంకేమాత్రం దాడులు జరపకూడదు.హార్ముజ్‌ జలసంధిలో స్వేచ్చగా నౌకా రవాణాకు అనుమతి. ప్రయాణించే ప్రతి నౌకకూ ఇరవైలక్షల డాలర్ల ఫీజు చెల్లించాలి.ఈ ఫీజులో ఒమన్‌కూ వాటా ఇస్తాం.దాడుల కారణంగా దెబ్బతిన్న తమ ఆస్తుల పునరరుద్దరణకు ఈ ఫీజు ద్వారా సమకూడే సొమ్మును ఖర్చు చేస్తాం. అన్ని ఒప్పందాలకు ఐరాస భద్రతా మండలి తీర్మాన హామీ ఉండాలి. అయితే బుధవారం నాడు వచ్చిన కొన్ని వార్తల ప్రకారం అధికారిక పార్సీ భాషలో పేర్కొన్న ఒక కీలక అంశం విదేశీ మీడియా, ఇతరులకు ఆంగ్లంలో జారీ చేసిన ప్రతిపాదనల్లో లేదని చెబుతున్నారు. యురేనియంను శుద్ధి చేసుకొనే హక్కు తమకు ఉండాలన్న అంశం పార్సీలో ఉందని అంటున్నారు.. ఎన్నో ప్రగల్భాలు పలికిన ట్రంప్‌ పాకిస్తాన్‌ తడిక రాయబారానికి ఎందుకు అంగీకరించాడు అన్నది చర్చ.

డోనాల్డ్‌ ట్రంప్‌ హీన సంస్కృతికి ప్రతిబింబం.ు ముందు ఇరాన్‌పై దాడులకు తెగబడి దిక్కుతోచని ట్రంప్‌ సభ్యసమాజం నోటితో ఉచ్చరించలేని, సైగలద్వారా చూపలేని బూతు పదజాలంతో ఇరాన్‌పై దూషణలకు దిగాడు. స్వేచ్చ పేరుతో బూతులు మాట్లాడటం అమెరికాలో సర్వసాధారణం అని తెలిసిన వారికి ట్రంప్‌ బూతుపురాణం ఆశ్చర్యం కలిగించలేదు.అలాంటి వాడిని తన స్నేహితుడు, వ్యూహాత్మక భాగస్వామి అని 56 అంగుళాల ఛాతీ విరుచుకొని చెప్పుకున్నవారందరూ సిగ్గుపడతారా ? గర్వపడతారా ! జాలి చూపుదాం, వదిలేద్దాం. ఇరాన్‌లో పాలకులను గద్దె దింపుతాం అంటూ బయలు దేరిన ట్రంప్‌నే గద్దె దించాలని అమెరికాలో అధికార పార్టీకి చెందిన వారు కూడా కోరారు.దీన్నే విధి వైపరీత్యం అంటారు. ఒక్క లక్ష్యమూ నెరవేరలేదు. ఇరాన్‌ గెలిచింది అనటం కంటే అమెరికా ఓడిందని వర్ణించటం సరైనది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఎనిమిది గంటల లోగా తాను చెప్పినట్లుగా హార్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలను పేల్చివేస్తామని ట్రంప్‌ బెదిరించాడు. ఒక్క రోజులో ఇరాన్ను ఆక్రమించుకోగలమని చెప్పాడు. తమ విద్యుత్‌ కేంద్రాల చుట్టూ మానవకవచాలుగా ఏర్పడాలని కవులు, కళాకారులు, యువకులు,యావత్‌ పౌరులకు ఇరాన్‌ ప్రభుత్వం పిలుపునిచ్చింది. వేలాది మంది జాతీయ పతాకాలతోగుమికూడారు.అమెరికా, ఇజ్రాయెల్‌ దుర్మార్గాల చరిత్రను చూసినపుడు నిరాయుధులైన పిల్లలు,మహిళలు, ఆసుపత్రుల్లోని రోగులు, సహాయ కేంద్రాలకు చేరిన అభాగ్యులు ఎవరినీ వదలకుండా చంపివేసిన దుర్మార్గాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.ఇరాన్‌లో అని ప్రాంతాల మీద దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నందున ఎక్కడో మరణించేబదులు, దేశరక్షణ కోసం ప్రాణాలర్పించటానికి మానవ కవచాలుగా ఏర్పడటానికి ముందుకు వచ్చారు. వారిని చంపివేస్తారా ? భయపడి వెనక్కు తగ్గుతారా ? అన్న చర్చ జరిగింది, చివరకు ట్రంప్‌ తోకముడవక తప్పలేదు.

రాజ్యాగంలోని 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చింది.అయితే ఇది అంత తేలిక కాదు. అతగాడి చర్యల ద్వారా తమ ప్రయోజనాలకు ముప్పు వచ్చినట్లు పాలకవర్గం భావిస్తేమాత్రం ఎంతో సులువు. ఉక్రెయిన్‌ సంక్షోభం, గాజాలో మారణకాండ, తాజాగా ఇరాన్‌పై దాడులతో అమెరికాలోని చమురు, ఆయుధ కంపెనీలు, వ్యాపారులకు లాభాల పంట పంట పండుతున్నది. ఆయుధ కంపెనీల వాటాల ధరలు నెల రోజుల్లో 25శాతం పెరిగాయి.చమురు కంపెనీల సంగతి సరేసరి అమెరికాలో దొరికే ముడి చమురు ధర 60 నుంచి 110 డాలర్లకు పెరిగింది, వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ధరలు కూడా అలాగే పెరిగాయి. అందువలన ట్రంప్‌ను ఇప్పటికిప్పుడు తొలగించేందుకు పూనుకుంటే ఈ రంగంలోని కార్పొరేట్లు మౌనంగా ఉంటారా ? సమస్యే లేదు. ప్రపంచంతో వారికి పనిలేదు. నిజానికి ట్రంప్‌ను గద్దె దించాలన్న డిమాండ్‌ దాడులు ప్రారంభమైన నెల రోజుల వరకు ముందుకు రాలేదు.అమెరికాకు తగులుతున్న ఎదురుదెబ్బలు, ఇరాన్‌ లొంగే అవకాశం, అమెరికా గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన తరువాతే ప్రారంభమైంది.బహుశా తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని కార్పొరేట్‌ శక్తులు కూడా వత్తిడి తెచ్చి ఉంటాయి, జనంలో తలెత్తిన నిరసన తెలిసిందే. రెండు వారాల విరామ ఒప్పందం వెనుక సూత్రధారి చైనా, పాత్రధారి పాకిస్తాన్‌ అనే విశ్లేషణలు వెలువడ్డాయి. పాక్‌ మధ్యవర్తిత్వం గురించి వార్తలు వెలువడిన సమయంలో ఇస్లామాబాద్‌లో చర్చలకు తాము అంగీకరించేది లేదని కొద్ది రోజుల క్రితం ఇరాన్‌ ప్రకటించింది.పాకిస్తాన్‌ అమెరికా తొత్తు అన్న సంగతి తెలిసిందే. అటువంటి దాన్ని నమ్ముకొని చర్చలకు దిగితే ఏం జరిగేది చెప్పలేని స్థితిలో నాటకీయంగా కాల్పుల విరమణ అవగాహన ఎలా కుదిరిందన్న ప్రశ్న ముందుకు వచ్చింది.ట్రంప్‌ ప్రకటనకు ముందు జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా అవలోకనం చేసుకోవటం అవసరం. ఇరాన్‌ మీద దాడి చేసేందుకు అమెరికా భద్రతామండలి తీర్మానాన్ని ఆయుధంగా చేసుకొనేందుకు చూసింది. హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు అవసరమైతే బలప్రయోగం చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న తీర్మానం మండలి ముందుకు వచ్చినపుడు మంగళవారం నాడు చైనా, రష్యా వీటో చేసి ఇరాన్‌కు బాసటగా నిలిచాయి. అది అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ.ఆ తీర్మానం, ట్రంప్‌ విధించిన దాడుల గడువు మధ్య పది గంటల వ్యవధిలో చైనా రంగంలోకి దిగి తన మిత్రదేశమైన ఇరాన్ను ఒప్పించింది అని చెబుతున్నారు.ట్రంప్‌ను విలేకర్లు దీని గురించి అడగ్గా అవును నేను విన్నాను అని వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం.హార్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ను ఒప్పించటం అంటే అమెరికాకు లొంగిపొమ్మని కాదు. సంక్షోభ ముగింపుకు ఎక్కడో ఒక దగ్గర నాంది పలకాలి. ఇరాన్‌ ఎంత మిత్రదేశమో గల్ఫ్‌ దేశాలు కూడా చైనాకు అంతే దగ్గర. సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య సయోధ్య కుదిర్చిన సంగతిని మరచిపోరాదు.గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ జరుపుతున్నదాడులు వాంఛనీయం కాదన్నది తప్ప చైనా ఖండించలేదు.ఐరాస తీర్మాన సమయంలో చైనా, రష్యా తటస్థంగా ఉన్నాయి. అదే బలప్రయోగానికి పూనుకోవాలన్న తీర్మానం వచ్చినపుడు అవి రెండూ టెహరాన్‌ రక్షణకు నిలిచాయి.ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మార్గదర్శనం చేశాయంటే అతిశయోక్తి కాదు. నలభై రోజుల దాడుల సమయంలో ఈ రెండు దేశాలు ఎలాంటి హడావుడి, ఆర్భాటం లేకుండా మద్దతునిచ్చాయి.అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు, నావలు, విమానాల కదలికలకు సంబంధించిన ఉపగ్రహ,కృత్రిమ మేధ విశ్లేషణలు ఇరాన్‌కు అందచేసిన కారణంగానే నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేసి ట్రంప్‌కు ఊపిరి సలపకుండా చేశాయని అమెరికా పత్రికలే రాశాయి. ఒప్పందానికి ముందు తమ విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇరాన్‌,రష్యా, గల్ఫ్‌ దేశాలతో 26సార్లు ఫోన్‌ సంభాషణలు జరిపినట్లు చైనా ప్రతినిధి విలేకర్లతో చెప్పాడు. దాడుల సమయంలో చైనా మౌనం గురించి ” నీ శత్రువు తప్పు చేస్తున్నపుడు అస్సలు అంతరాయం కలిగించవద్దు ” అనే శీర్షికతో ఎకనమిస్ట్‌ పత్రిక ఒక విశ్లేషణ చేసింది.వచ్చే నెలలో డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా పర్యటనకు వెళ్లనున్న తరుణంలో ఈ ఒప్పందం కుదరటం గమనించాల్సిన అంశం. కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం గురించి ప్రధాని షెహబాజ్‌, ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్‌ పాత్ర గురించి ట్రంప్‌ పేర్కొన్నాడు. చిత్రం ఏమిటంటే ఈ ఒప్పందాన్ని హర్షించిన ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌ ప్రస్తావన చేయలేదు.అందుకే అందని ద్రాక్ష పుల్లన అన్నారు, అసలు సంగతేమంటే విశ్వగురువును పిలిచినవారెవరూ లేరు ! ఎక్కడో ఏదో జరిగితే మనకెందుకు మన సంగతి మనం చూసుకోవాలని తమ ఆరాధ్య దైవం మౌనంపై భక్తులు సమర్ధనకు దిగారు. ఒప్పందం కుదరగానే హర్షం వెలిబుచ్చుతూ ప్రభుత్వం ఎందుకు స్పందించింది ? ఇరాన్‌ మీద ఏకపక్షంగా అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులకు తెగబడినపుడు ఎందుకు మౌనం దాల్చినట్లు ? నరం లేని నాలుకలు ఏమైనా మాట్లాడతాయి మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d