• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Fuel Price in India

పెట్రో బాదుడుకు రంగం సిద్దం చేసిన ” మోడీ బాబా ” ! పొదుపు చేయని వారు దేశభక్తులు కాదా !!

13 Wednesday May 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP, WAR

≈ Leave a comment

Tags

#Fuel Prices India, BJP, BJP u turn on Fuel prices, fuel politics, Fuel Price in India, Mody Hyderabad call, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు పొదుపోపదేశం చేశారు. ఇంకేముంది పొలోమంటూ కాన్వారులను తగ్గించుకుంటున్నట్లు అనేక మంది ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారు సరేసరి. ప్రధానికి ఇంత ఆకస్మికంగా జ్ఞానోదయం ఎందుకు కలిగినట్లు అని ”దేశంకోసం-దర్మం కోసం ” ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. విదేశీ మారకద్రవ్యం, ఇతర అంశాల సమస్యలు ఇప్పటికిప్పుడు తలెత్తాయా ? నిజం అయితే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందని ఎందుకు ప్రకటించటం లేదు. ముందు జాగ్రత్త అని బిజెపి నేతల ముక్తాయింపు.జనాల్లో అదెప్పుడూ ఉంటుంది. విడ్డూరం గాకపోతే వారు చెబితేనే జాగ్రత్తపడతరా ! ఇక చమురు ధరలను పెంచకతప్పదని కేంద్ర చమురుశాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ మంగళవారం నాడు చెప్పకనే చెప్పారు. బుధవారం నాడు మరోసారి మోడీ సందేశం. నిజానికి అది మంత్రులకు కాదు, జనానికే. అనివార్యమై ధరలను పెంచామని చెప్పబోతున్నారు. నిర్ణీత వంద కొరడా దెబ్బలను ఒకేసారి తింటారా దశలవారీనా అన్నది తేల్చుకోవాలని జనాలకు అవకాశం ఇస్తున్నారు తప్ప నూరు వాతలు తప్పవు.ఇప్పటికే ఆమేరకు మీడియాకు తాజా లీకులు వదిలారు. పెట్రోలు మీద లీటరుకు రు.14, డీజిల్‌ మీద రు.42, గృహవినియోగ ఎల్‌పిజి సిలిండరు మీద రు.674 నష్టం వస్తున్నదన్నది వాటి సారం. చమురు, గ్యాస్‌ సబ్సిడీలను ఎత్తివేసినందున ఏదో ఒక రూపంలో జనాలు ఈ మేరకు భరించటానికి సిద్దపడాలనే సందేశం ఇప్పటికే చేరవేశారు. వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్‌ ధరలను ఎలా పెంచిందీ చూశాము. రోజుకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చమురు కంపెనీలకు నష్టం వస్తున్నదనిపూరీ చెప్పారు. ధరల పెంపుదల గురించి అడగ్గా మీకు తెలియనిదేముంది ప్రధాని నరేంద్రమోడీ ”భవిష్యత్‌ దార్శనికుడు ” అన్నట్లుగా చెప్పారు. అంటే ఆదివారం నాడు (2026 మే 10) హైదరాబాదులో చేసిన ఒక విలక్షణ ప్రసంగంలో మోడీ యమలీలను గుర్తు చేశారు. ఎప్పుడూ చేసే రాజకీయాలను వదల్లేదు గానీ ఇతర విషయాలే మీడియాలో పతాకశీర్షికలయ్యాయి,విశ్లేషణలు వెలువడ్డాయి.మన్‌కీ బాత్‌ పేరుతో 2014 అక్టోబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు రేడియోలో నెలకు ఒకసారి చొప్పున 113సార్లు మోడీ ప్రసంగించారు. ఎంతమంది ఎన్నింటిని విన్నారో ఎవరికి వారు లెక్కవేసుకోవాల్సిందే. ఒక సర్వే ప్రకారం ఐదుశాతం మంది శ్రోతలు మాత్రమే ఆలకించినట్లు తేలింది. అలాంటి ప్రసంగమే హైదరాబాద్‌లో చేశారని చెప్పవచ్చు. దానిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసిన సమీక్షల సారం ఏమిటంటే ఇంథన ధరలను పెంచకతప్పదనే మహత్తర సందేశాన్ని ప్రధాని దేశానికి అందించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే పెంచుతారని ఊరూవాడా భావించారు. అయితే వెంటనే ఆ ప్రకటన వెలువడలేదు. కారణం ఏమిటంటే అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి కుదిరి సాధారణ పరిస్థితి ఏర్పడుతుందనే వార్తలు రావటం ఒకటి. నిజంగా అది జరిగితే ధరలు ఎందుకు పెంచారని జనం ప్రశ్నిస్తారు. రెండవది ప్రతిపక్షాలు చెప్పింది వాస్తవమే అని నిర్ధారించుకుంటారు. ఇప్పుడు ఏ పేరుతో పెంచాలా అని మధనపడుతున్నారు.ఊహించని విధంగా పశ్చిమాసియా సంక్షోభం కొనసాగటం మోడీ పరివారానికి అవకాశమిస్తున్నదని చెప్పవచ్చు.

ఇజ్రాయెల్‌ నెతన్యాహు, అమెరికా డోనాల్డ్‌ ట్రంప్‌ మాటలను నమ్మి వారం రోజుల్లో ఇరాన్‌ పని అయిపోతుంది లెమ్మని కేంద్రంలోని పెద్దలు తడిబట్ట వేసుకొని పడుకున్నారని సంక్షోభ ప్రారంభంలో వారి తీరుతెన్నులే స్పష్టం చేశాయి. ఏ రోజు తిరిగి దాడులు మొదలౌతాయో తెలియని స్థితి. ఆందోళనలో ఉన్న వారికి బిపి పెరుగుతూ తగ్గుతూ ఉండే మాదిరి యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ మార్కెట్‌ చమురు ధరలు ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో మన స్టాక్‌ మార్కెట్‌ ఈ కారణంగానే భారీగా పతనమైంది. ఇప్పటికే చమురు కంపెనీలకు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ వార్తలను రాయిస్తున్నారు. గతంలో ప్రత్యేక పన్నులు, సెస్‌ల రూపంలో బాదిన బాదుడుకు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లలో రాబడి పెరిగినపుడు ఏ మీడియా కూడా ఆ వార్తలను ప్రముఖంగా రాయలేదు గతంలో లాల్‌బహుదూర్‌ శాస్త్రి పాక్‌తో యుద్దం వచ్చినపుడు ఇచ్చిన పిలుపు మాదిరే ఇప్పుడు తమ మోడీ దేశ పౌరులకు పొదుపు విజ్ఞప్తి చేశారు తప్ప బలవంతం చేయటం లేదని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు.నాడు యుద్ధం వచ్చింది గనుక శాస్త్రి ఆ పిలుపు ఇచ్చారు, ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కూడా లేవు, అంతా సజావుగానే ఉందని చెబుతూ ఆ పిలుపు ఇవ్వటం ఏమిటి ? మచ్చుకు మోడీ ప్రవచించిన పది సుభాషితాల్లో కొన్నింటిని చూద్దాం. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్న లోకోక్తి తెలిసిందే.

” దేశం కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు, దేశం కోసం బతకడం,దేశ కర్తవ్యం కోసం పాటు పడటమూ దేశభక్తే ” అని మోడీ చెప్పారు. పొదుపును కూడా దేశభక్తికి ముడిపెట్టారు.ఇదే ప్రమాదకరం. పొదుపు పాటించనివారు దేశభక్తులు కాదనే భావాన్ని చెప్పకనే చెప్పారు. కడుపునిండా తినటానికి తిండిలేదనే కదా ఎనభై కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఐదేసి కిలోల ఉచిత బియ్యం లేదా గోధుమలను ఇస్తోంది.వారిని పొదుపు చేయమంటే ఆ ఉచితాన్ని వదులుకోవాలి మరి. వంట నూనె వాడకం తగ్గించటం కూడా దేశభక్తే అన్నారు. పొదుపు గురించి దేశ పౌరులకు మోడీ చెప్పాల్సినపని లేదు.మన జీన్స్‌లోనే ఉంది.అవసరమైన మేరకే వస్తువులను వాడతారు. ” సాధ్యమైన మేరకు ఇంటి నుంచే పని చేసే పద్దతి అనుసరించండి, అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు, ఇంథనాన్ని పొదుపుగా వాడండి ” మోడీ సుభాషితాల్లో ఒకటి. ఈ చర్యకు ప్రధానే స్వయంగా శ్రీకారం చుట్టి ఉంటే బాగుండేది. హైదరాబాదు వచ్చి ఎక్కడో జరిగే పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసే బదులు అదేదో ఢిల్లీ నుంచే చేయవచ్చు, గతంలో అనేక సార్లు అలా చేశారు.వేలాది మంది పోలీసులు, ఇతర ఏర్పాట్లకు అనవసర ఖర్చు, ఆయాసమూ తప్పేది, ట్రాఫిక్‌ ఆంక్షల వలన అదనపు దూరం ప్రయాణించిన వాహనదారులకు అదనపు పెట్రోలు, డీజిలు కలసి వచ్చేది.మోడీ స్వయంగా చెప్పినట్లు దేశం ఇంతటి ఇబ్బందుల్లో ఉన్నపుడు లక్షల మంది జనాన్ని తెలంగాణా అంతటి నుంచి ఎండల్లో రప్పించటానికి వాహనాలకు పెద్దమొత్తంలో ఇంథనం ఖర్చు చేయటం అవసరమా ? అందువలన పొదుపు గురించి ఇతరులకు చెప్పేముందు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా ? మధ్య ప్రదేశ్‌లో బిజెపి రాజకీయ నిరుద్యోగి సౌభాగ్య సింగ్‌ ఠాకూర్‌కు పాఠ్యపుస్తకాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారు.దానికి ప్రమాణస్వీకారం కోసం డజన్లకొద్దీ వాహనాలతో ఉజ్జయని నుంచి భోపాల్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరం అనుయాయులతో అట్టహాసంగా వెళ్లారు. బిజెపి నేతల పొదుపు ఇలా ఉంటుంది. హైదరాబాద్‌ ఉపన్యాసంపై తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత మోడీ తన కాన్వారును గణనీయంగా తగ్గించుకున్నట్లు చెబుతున్నారు.కొత్తగా కొనుగోలు చేయకుండా విద్యుత్‌ వాహనాలను వినియోగించాలని చెప్పినట్లు వార్త. ఇదంతా పౌరుల మీద భారం మోపే ప్రచార ఎత్తుగడే.విదేశీ ప్రయాణాలు వద్దంటూ చెప్పిన మోడీ వారం రోజుల పాటు ఐదు దేశాల కార్యక్రమం పెట్టుకున్నారు. గతంలో నెహ్రూ 44సార్లు విదేశీ పర్యటనలు చేస్తే మోడీ సెంచరీ కొట్టారు.

ఏడాది పాటు బంగారం కొనవద్దంటూ మరో సలహా ! తరువాత కొనుగోలు చేయవచ్చా ? ధరలు ఇప్పటికిప్పుడే పెరగలేదే ! ఏడాది పాటు మారుటోరియం ఎందుకు సూచించారు. రూపాయి విలువను కాపాడలేని కేంద్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగా డాలర్లకు కొరత ఏర్పడుతోంది.మన స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసిన విదేశీయులందరూ వాటాలను అమ్మివేసి డాలర్లలో తమ దేశాలకు తరలించుకుపోతున్నారు. 2025 ఏడాది మొత్తంలో 2.4లక్షల కోట్ల రూపాయలను తరలిస్తే ఈ ఏడాది మే 11వ తేదీ నాటికే 2.28లక్షల కోట్లు దాటాయని వార్తలు.మే ఒకటవ తేదీతో ముగిసిన వారంలో 7.794 బిలియన్‌ డాలర్లు మన విదేశీ మారకద్రవ్యంలో తగ్గి 690.693 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత, ఎగుమతి ప్రోత్సాహ పథకాల వంటి ఎన్ని కబుర్లు చెప్పినా, రాయితీలు ఇచ్చినా దిగుమతులు పెరుగుతున్నాయి తప్ప ఎగుమతులు పెరగటం లేదు. అయినా విదేశీ వస్తువులు వాడవద్దని ప్రధాని చెబుతారు, దిగుమతులకు ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ఏటా మన దేశం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నది.ముడి చమురు తరువాత బంగారానికే ఎక్కువగా విదేశీమారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది.బంగారంతో నగలు చేయించేందుకు కొంత మందికి పని కల్పించవచ్చు తప్ప నిజానికి అది ఉత్పాదతకు పనికి వచ్చేది కాదు. గత కొద్ది సంవత్సరాలుగా పసిడి ధర పెరుగుతూనే ఉన్నప్పటికీ మోడీ మాట్లాడ లేదు. గతంలో బంగారం దిగుమతులపై పన్ను ఎక్కువగా ఉన్న కారణంగా దొంగరవాణా పెరిగిందని తగ్గించారు. తాజాగా దిగుమతి పన్ను, సెస్‌లు కలిపి ఆరు నుంచి 15శాతానికి పెంచారు. నిరంతరం దిగుమతులు తప్ప ఎగుమతులు పెరగటం లేదు. ఒకదశ దాటిన తరువాత చెల్లింపుల సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు చేయవద్దని, వివాహాలు విదేశాల్లో చేయవద్దని చెప్పారు. విదేశాలు లేదా పొరుగు రాష్ట్రాల్లోని విలాసవంతమైన ప్రాంతాల్లో వివాహాలు చేసేవారందరూ శతకోటీశ్వరులు తప్ప సామాన్యులు కాదు.మోడీ తన పాలనా కాలంలో కోటీశ్వరులు, శతకోటీశ్వరులను పెంచారు తప్ప తగ్గించలేదు.తాను అధికారానికి వచ్చినపుడు కేవలం 70మంది బిలియనీర్లు ఉంటే 2026నాటికి 308పెరిగారు.కోటీశ్వరుల గురించి చెప్పాల్సిందేముంది ! సామాన్యుల వద్ద ఉన్న సంపదశాతం తగ్గుతున్నదని అనేక విశ్లేషణలు వెల్లడించిన సంగతి తెలిసిందే.వారంతా సొమ్మును విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు చేయక ఏం చేస్తారు !

స్వదేశీ ఉత్పత్తి పెరగాలంటారు. దిగుమతి చేసుకున్న చమురు భారంగా మారుతున్నదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మోడీ అధికారానికి వచ్చినపుడు, ఇప్పుడు కూడా ఆయన పలుకుబడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా ధర ఒక డాలర్‌గానే ఉంది అనుకుందాం. నాడు అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోయేది, ఇప్పుడు అదే డాలరుకు 95చెల్లించాల్సి వస్తోంది.ఈ నిర్వాకానికి బాధ్యత ఎవరిది ? యుపిఏ పాలనలో రూపాయి పతనం చెందినపుడు అసమర్ధ మన్మోహన్‌ సింగ్‌ కారణం అన్నారు కదా ! ఇప్పుడు ” సమర్ధ ” నరేంద్రమోడీ ఏం చేస్తున్నట్లు ? దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచలేదదని గతంలో తీవ్రవిమర్శలు చేశారు.పన్నేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకాన్ని చూస్తే 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం 25.6మిలియన్‌ టన్నులే.తాజాగా చమురు ఉత్పత్తి సంస్థలు చెల్లించాల్సిన రాయల్టీ తగ్గించి ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.

మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు.2025-26లో రు.2.07 లక్షల కోట్ల మేర రాబడి వచ్చింది.పెట్రోలు మీద కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సయిజ్‌ పన్ను లీటరుకు రు.1.40, ఇదిగాక ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.13, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో రు.2.50, రోడ్ల పేరుతో రు.5 వంతున మొత్తం రు.20.50 ఇటీవలి వరకు వసూలు చేశారు. (అంతకు ముందు రు.30కి పెంచి తరువాత తగ్గించారు). ఇప్పుడు పెట్రోలు మీద ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ రు.3 పైన పేర్కొన్న రెండు సెస్‌లు కలిపి రు.8.50, డీజిలుపై సెస్‌ రు.6 కొనసాగుతోంది.ఇప్పుడు మార్కెటింగ్‌ కంపెనీలకు నెలకు లక్ష కోట్ల నష్టం వస్తుందని గుండెలు బాదుకుంటున్న మంత్రి పూరీ ఇన్నేండ్లుగా మోడీ ఏలుబడిలో వినియోగదారుల నుంచి కేంద్ర ప్రభుత్వం అంతకుముందున్నదాని కంటే అదనంగా వసూలు చేసిన రు.16.5లక్షల కోట్ల ప్రత్యేక ఎక్సయిజ్‌ పన్ను సంగతి మాట్లాడరేం.

పశ్చిమాసియా సంక్షోభం ముగిసిన తరువాత తిరిగి అదనపు ఎక్సయిజ్‌ పన్నుబాదుడు ద్వారా పూడ్చుకోవచ్చు నంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు ఇంథనంపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్షించి ధరల నిర్ణయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్‌ కేంద్ర బోర్డు అధ్యక్షుడు వివేక్‌ చతుర్వేది విలేకర్లతో మాట్లాడుతూ ” మీరు ఊహించుకొనే విధంగా పరిస్థితి లేదని, మనం కష్టకాలంలో ఉన్నామని ” చెప్పారు. నరేంద్రమోడీ గారేమో అంతా సజావుగా ఉందని చాలా రోజుల పాటు చెప్పించి, కరోనా మాదిరి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని పార్లమెంటులో మాట్లాడి జనాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు బాబాల మాదిరి పొదుపు గురించి చెప్పారు. ప్రత్యేక అదనపు ఎక్సయిజ్‌ డ్యూటీ పది రూపాయలు తగ్గించిన కారణంగా ప్రతి పదిహేను రోజులకు ఏడువేల కోట్ల రూపాయల మేర కేంద్ర ప్రభుత్వం రాబడిని కోల్పుతున్నదని వివేక్‌ చెప్పారు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితే వినియోగదారులకు తగ్గిస్తాం, పెరిగితే పెంచుతాం అని చెప్పిన వారు 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ధరలను సవరించటం నిలిపివేశారు.గణనీయంగా తగ్గించాల్సిందిపోయి పెంచకపోవటం తమ ఘనత అని చెప్పుకుంటున్నారు.ఇది గోబెల్స్‌ పద్దతి. ఆ ఏడాది ఏప్రిల్‌, మే,జూన్‌,జూలై నాలుగు నెలల్లో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు ధర సగటున 108.5 డాలర్లు. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.2022-23 ఏడాది సగటు ధర 93 డాలర్లు. ఇక 2025 ఏప్రిల్‌ నుంచి 2026ఫిబ్రవరి వరకు పదకొండు నెలల సగటు ధర 66.53 డాలర్లు, అంటే నాలుగేండ్లలో ఇంతగా తగ్గినప్పటికీ వినియోగదారులకు పైసా తగ్గించలేదు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తరువాత ధర పెరుగుతున్నది. మనం కొనుగోలు చేసే ముడి చమురు ధర మార్చినెల 25వ తేదీ వరకు సగటు ధర 123 డాలర్లకు చేరింది. ఏప్రిల్‌లో 114.48, మే పన్నెండవ తేదీవరకు 105.09 డాలర్లు, అంటే నాలుగేండ్ల నాటి స్థాయికి చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్‌ మరియు అనాలిసిస్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం ఇది.ఆయిల్‌ ప్రైస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఇరాన్‌పై దాడులు ప్రారంభం ఫిబ్రవరి 28న కాగా అంతకు ముందు 25న మనదేశం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 70.25 డాలర్లు ఉంటే మార్చినెల 23న 157డాలర్లకు చేరింది. ఈ కారణంగానే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలను సమీక్షిస్తామని కేంద్రం చెప్పింది. జనం జేబులు కొట్టాలనుకున్నపుడు మాత్రం ఈ విధానం గుర్తుకు రాదు, కేంద్రానికి సెగ తగలగానే మళ్లీ మొదలు పెడతారా ? చావు తెలివితేటలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత పరువు తీస్తున్నదెవరు : ఇప్పటికైనా ఆత్మగౌరవాన్ని మోడీ పునరుద్దరిస్తారా ? అసెంబ్లీ ఎన్నికల తరువాత రోజుకు రు.2,400 కోట్ల వడ్డింపు !

03 Friday Apr 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

attack against Iran, BJP, Donald trump, Fuel Price in India, Iran Oil, Narendra Modi Failures, RSS, Russian oil

ఎం కోటేశ్వరరావు

కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నది ఒక లోకోక్తి. తనకు ఎదురులేదన్నట్లుగా నల్లేరు మీద బండిలా నడుస్తున్న నరేంద్రమోడీ పరిస్థితి అలాగే ఉందా ? కాలవైపరీత్యం గాకపోతే పొగిడిన మీడియా నోళ్లే అపహాస్యపు శీర్షికలు పెడతాయని ఎవరైనా ఊహించారా ! తాజాగా ఒక వార్త శీర్షిక ఇలా ఉంది. ” ఇరాన్‌ యుద్ధ పరిహాసం : ఏడు సంవత్సరాల్లో తొలిసారిగా టెహరాన్‌ నుంచి చమురు తెచ్చుకోనున్న భారత్‌ ”. ఆంగ్లలో ఐరనీ అనే పదానికి పరిహాసం, ఎగతాళి, గేలి ఇలా పర్యాయపదాలు ఎన్నో ఉన్నాయి. మీడియా ఇలాంటి శీర్షిక పెట్టటానికి కారకులు ఎవరు ? కచ్చితంగా నరేంద్రమోడీ తప్ప మరొకరు కాదు. అమెరికాను పక్కన పెట్టి హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు ఐరోపాలోని ధనిక దేశాలు ప్రారంభించిన ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌ కోరిక మేరకు 60దేశాల జాబితాలో మనం కూడా చేరాము. ఇది డోనాల్డ్‌ ట్రంప్‌కు కోపం తెప్పిస్తుందో ఏం పాడో, లేకపోతే ”అనుమతి” ఇచ్చాడా, ఏదైనా జరిగి ఉండవచ్చు, ఇంకా ఇలాంటి వాటిని ఎన్ని చూడాల్సి వస్తుందో ! ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత జరిగిన పరిణామాలను కాషాయదళాలు మింగా కక్కలేకుండా ఉన్నాయి. కడుపులో ఉన్న ఇరాన్‌ వ్యతిరేకతను వెల్లడించలేరు, ఇజ్రాయెల్‌, అమెరికా అనుకూలతను దాచుకోలేని ఒక మానసిక స్థితి,దీనికి చికిత్స లేదు.

ఒక నాడు మన దిగుమతుల్లో ఇరాన్‌ చమురు అగ్రభాగాన ఉంది. అలాంటిది 2019 నుంచి కొనుగోలు నిలిపివేశాము.మనకు ఎక్కడ లబ్ది ఉంటే అక్కడ కొనుక్కుంటాము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో పోల్చితే ఇరాన్‌ చమురు ధర పెరిగిందనా, నాణ్యత పడిపోయిందనా ? ఎందుకు నిలిపివేసినట్లు, తిరిగి ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లు ? జవాబుదారీ తనంలో ” ఘనత ” వహించిన పెద్దలు నోరు, మెదపరు, ఎందుకంటే దేశం కోసం-ధర్మం కోసం మౌనంగా ఉన్నాం అంటారు. ఏం జరిగినా నోర్మూసుకొని ఉండాలని ఏ సనాతన ధర్మం, ఏ పురాణాలు, ఇతిహాసాలు చెప్పాయి. పాండవులకు అన్యాయం జరిగితే శ్రీకృష్ణుడి రాయబారం, సీతను తిరిగి తనవద్దకు పంపి యుద్ధాన్ని నివారించాలని వాలి కుమారుడు అంగదుడిని శాంతి సందేశంతో రావణుడి వద్దకు పంపిన రాముడు (ఇప్పుడు ఇరాన్‌ యుద్దంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తామన్న పాకిస్తాన్ను బ్రోకర్‌ అని చౌకబారుగా వర్ణించిన పెద్దలు ఇతిహాసాల్లో జరిగిందాన్ని కూడా అలాగే అంటారేమో ఖర్మ) గురించి చదువుకున్నాం.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు మనలను ఎవరూ నమ్మని కారణంగా ఎవరూ పిలవటం లేదు, పెద్దరికం వహించాలని కోరటం లేదు గనుక దళారీ అని కసి తీర్చుకున్నాం. ఇప్పుడు మరి 60దేశాల చొరవలో మన పాత్రను ఎలా వర్ణిస్తారో తెలియదు.

డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరిస్తే మనం మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి అమెరికాను ”సంతుష్టీకరించేందుకు ” ప్రయత్నించాం. ఇప్పుడు అదే అమెరికా కావాలంటే ఇరాన్‌ చమురు కొనుక్కోవచ్చు అని చెప్పగానే ఉరుకులు పరుగులతో ఎగబడ్డాం.రెండూ మోడీ ఏలుబడిలోనే జరిగాయి.ఎంత ఆత్మగౌరవం ! ఇరాన్‌ నుంచి పింగ్‌ షన్‌ అనే చమురు టాంకరు ఆరులక్షల పీపాల చమురుతో బయలుదేరి గుజరాత్‌లోని వాడినర్‌ రేవుకు చేరనుందని వార్తలు.మన తీరుతెన్నులు చూస్తున్న ఇరాన్‌, ఇతర దేశాల దగ్గర మన గౌరవం పెరిగిందా తరిగినట్లా ? రష్యా చమురు సంగతి కూడా అంతే అనుకోండి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకోలేదా అని అడ్డు సవాళ్లు విసిరే వారు టెహరాన్‌ నుంచి ఎందుకు నిలిపివేశారో చెప్పాలి. మతకోణం ఉందంటే ఉలిక్కిపడతారా ? అమెరికా ఆడించినట్లు ఆడి 145 కోట్ల దేశం పరువు ఎవరు తీశారు ? ఇరాన్‌ విషయంలో అమెరికా తన లక్ష్యాలను గుట్టుచప్పుడు కాకుండా మార్చుకుంది, హార్ముజ్‌ జలసంధి నుంచి మీ చమురు మీరు తెచ్చుకోండి మేం చేసేదేమీ లేదని చేతులెత్తేశాడు ట్రంప్‌. మనం మాత్రం అతగాడి తోకపట్టుకు నడిచి ఇప్పుడు వ్రతం చెడ్దా ఫలం దక్కని స్థితిలో పడ్డాం.ఏం గతంలో వద్దన్నారుగా ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని ఇరాన్‌ అనలేదు గనుక సరిపోయిందిగాని, అని ఉంటే ? అమెరికా మబ్బులను చూసి చేతిలోని ముంతలో నీరు పారపోసుకోకూడదని గ్రహిస్తారా ! అమెరికా మీద వ్యతిరేకతతో ఎత్తుగడగా భారత్‌ పట్ల ఇరాన్‌ అనుకూలంగా వ్యవహరించిందని, పోరు ముగిసిన తరువాత కూడా అదే విధంగా ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ఏప్రిల్‌ నాలుగవ తేదీన గుజరాత్‌ వాడినార్‌ రేవుకు చేరనుందని చెప్పిన ఇరాన్‌ నౌక మూడు రోజులుగా ప్రయాణ దిశ మార్చుకొని చైనా వైపు పయనిస్తున్నదని శుక్రవారం నాడు నౌకల కదలికలను నమోదు చేసే కెప్లర్‌ సంస్థ పేర్కొన్నది. అయితే వాణిజ్య నౌకలు ఎప్పుడు దిశమార్చుకుంటాయో తెలియదని నౌకనుంచి అందుతున్న సంకేతాలను బట్టి చివరకు అది ఎక్కడకు చేరేది చెప్పలేమని కూడా తెలిపింది. ఎందుకు ఇలా జరిగింది అన్న ప్రశ్నకు రిటోలియా అనే సంస్థ చెప్పినదాని ప్రకారం గతంలో 30 నుంచి 60 రోజుల వరకు చెల్లింపులకు గడువు ఇచ్చేవారని, ఆ చమురును అమ్మింది ఎవరో, కొనుగోలు చేసింది ఎవరో కూడా వెల్లడి కాలేదని, ఇప్పుడు ఆ షరతులను కఠినతరం గావించటం కారణం కావచ్చంటున్నారు. చెల్లింపుల సమస్య పరిష్కారమైతే తిరిగి భారత్‌ వైపు ప్రయాణించవచ్చని కూడా రిటోలియా పేర్కొన్నది.వాడినార్‌లో రష్యా కంపెనీ రోస్‌నెఫ్ట్‌కు చెందిన నయారాఎనర్జీ సంస్థ ఏడాదికి రెండు కోట్ల టన్నుల సామర్ధ్యం గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది.

తన రాజకీయ ప్రయోజనం, ఆధిపత్యం, ఇరాన్‌ చమురును కొల్లగొట్టేందుకు, ఇజ్రాయెల్‌ కోసం చేసే రాజకీయాల్లో భాగంగా టెహరాన్‌పై ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసే వారి తాటవలుస్తామని ట్రంప్‌ బెదిరించాడు.చైనా మరికొన్ని దేశాలు ఖాతరు చేయకుండా దిగుమతులు చేసుకున్నాయి. అంతకు ముందు 2018-19లో మన దిగుమతి అవసరాల్లో 10-12శాతం అంటే 23-24 మిలియన్‌ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం. ట్రంప్‌ 2019లో ఆంక్షలు విధించటంతో ఆ ఏడాది మే నెల నుంచి క్రమంగా తగ్గించి 2019-20లో రెండు మిలియన్‌ టన్నులకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిలిపివేశాం. అంతకు ముందు మనదేశానికి రాయితీలతో పాటు అప్పుకూడా ఇచ్చింది. వాటినే నరేంద్రమోడీ యుపిఏ ప్రభుత్వం చేసిన చమురు అప్పును తాను తీర్చాల్సి వచ్చిందని ప్రచారం చేయటమే గాక ఆ పేరుతో సెస్సులు, ఇతర భారాలను మోపిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తరువాత రష్యా నుంచి కొనుగోలు చేశాము, దాని మీద కూడా ఆంక్షలు విధించటంతో గరిష్టంగా రోజుకు 20లక్షల పీపాల దిగుమతిని ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సగానికి తగ్గించుకున్నాం. ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ట్రంప్‌ రష్యా , ఇరాన్‌ నుంచి చమురు తెచ్చుకోవచ్చు అంటూ మనకు ”అనుమతి” ఇచ్చాడు. ఇప్పుడు గతంలో ఇచ్చిన రాయితీని మనం కోల్పోయాము, మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.ఎందుకీ దుస్థితి ?

యుద్దం కారణంగా ఇప్పటికే జనం మీద భారాలు మోపటం ప్రారంభించారు,పవర్‌ పెట్రోల్‌, పరిశ్రమల్లో వాడే డీజిల్‌, ఇథనాల్‌ లేని పెట్రోలు, గృహ, వాణిజ్య గ్యాస్‌ ధరలను పెంచారు.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇప్పటికి ఇప్పుడు ఇరాన్‌ పోరు ముగిసినప్పటికీ ఇంథన ధరలు తగ్గే అవకాశం లేదని ఐరోపా యూనియన్‌ హెచ్చరించింది. బ్రెంట్‌ రకం చమురు పీపా ధర 70 నుంచి 120 డాలర్ల వరకు పెరిగింది.మనం కొనుగోలు చేసే ముడి చమురు కూడా ఇదేవిధంగా పెరిగింది. సంక్షోభం ముగిసిన తరువాత పూర్వపు స్థితికి ధరలు దిగివస్తాయా ? జనం మీద భారం మోపటం లేదంటూనే మానసికంగా సిద్దం చేస్తున్నారు. చమురు మార్కెట్‌ కంపెనీలకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఎక్సయిజ్‌ పన్ను రద్దు చేశామని చెప్పారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) ద్వారా మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగు వారాల్లో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 75శాతం పెరిగాయని తెలిపారు. అయినా కొనుగోలు ధరలకంటే తక్కువకే కంపెనీలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయని, పెట్రోలు మీద లీటరుకు రు.26, డీజిలు మీద 81.90 నష్టం వస్తున్నదని, రెండూ కలిపితే రోజుకు రు.2,400 కోట్ల మేర వాటికి నష్టం వస్తున్నదని పేర్కొన్నారు. ఆసియాలో 30 నుంచి 50, ఉత్తర అమెరికాలో 20, ఐరోపాలో 30శాతం ఇంథన ధరలు పెరిగినట్లు పెట్రోలియం శాఖా మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి భారీగా ధరలు పెంచటం రెండవది నష్టాలను ప్రభుత్వం భరించటం అంటూ రెండోదానికే ప్రధాని నిర్ణయించినట్లు చెప్పారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గ్యాస్‌ మీద నామమాత్ర సబ్సిడీ తప్ప పెట్రోలు, డీజిలు మీద సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు. సెస్సుల పేరుతో లక్షల కోట్ల భారం మోపారు. 2022కు ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆమేరకు పెంపు తగ్గితే తగ్గింపు అన్న విధానాన్ని అమలు చేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా వినియోగదారులకు తగ్గించలేదు.ముందే చెప్పుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికల తరువాత అసలు రంగు బయటపడుతుంది.ప్రతి రోజుకు వస్తున్న రు.2,400 కోట్లను ప్రభుత్వం భరించాలంటే నెలకు 72వేల కోట్లు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు పెరిగాయని దిగుమతులు నిలిపివేసి రైతులను ఇబ్బంది పెట్టిన పాలకులను ఎవరైనా నమ్ముతారా ? గత పది సంవత్సరాల్లో దాదాపు 25లక్షల కోట్ల రూపాయలను అదనపు ఎక్సయిజ్‌, సెస్సుల రూపంలో వినియోగదారుల నుంచి పిండుకున్న ఘనత మరచిపోగలమా ?

రానున్న రోజుల్లో ముడిచమురు ధరల గురించి రాయిటర్స్‌ మార్చినెలలో జరిపిన విశ్లేషణలో 2026లో బ్రెంట్‌ రకం ముడి చమురు సగటున 82.85 డాలర్లు ఉంటుదని పేర్కొన్నారు.ఫిబ్రవరిలో చెప్పిన 63.85 డాలర్లకంటే ఇది 30శాతం ఎక్కువ. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున ఈ అంచనాలు మారిపోవచ్చు.ఏప్రిల్‌ 11వరకు రష్యా చమురు కొనుగోలుకు ట్రంప్‌ ” అనుమతి ” గడువు ఉంది.తరువాత ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో తెలియదు. మార్కెట్‌ చరిత్రను చూస్తే 2008లో ముడి చమురు ధర గరిష్టంగా 145 డాలర్లకు చేరింది.ఇరాన్‌ పోరు ఇంకా కొనసాగితే ఆ రికార్డును అధిగమించవచ్చని జోస్యం చెబుతున్నారు.సంక్షోభం మే మొదటి పక్షం వరకు కొనసాగితే 150 డాలర్లకు చేరవచ్చని జెపి మోర్గాన్స్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ మూడవ తేదీన పేర్కొన్నది.(మరికొన్ని సంస్థలు రెండువందల డాలర్లు అన్నాయి) అంతకు ముందు రోజు బ్రెంట్‌ రకం ధర 109 డాలర్లు ఉండగా సమీప భవిష్యత్‌లో 120-130 డాలర్ల మధ్య ఉండవచ్చని మోర్గాన్స్‌ అంచనా వేసింది. ఎలాంటి షరతులు లేకుండా హార్ముజ్‌ జలసంధిని ఒక వేళ ఈ రోజు తెరిచినా సరఫరా వ్యవస్థ పునరుద్దరణకు మూడు నుంచి ఆరునెలలు పడుతుందని చమురు రంగ నిపుణులు అంటున్నారు.దాడుల్లో జరిగిన నష్టాల తీవ్రత వెల్లడైన తరువాత మరింత స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే అంతా అనిశ్చితే, అస్పష్టతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

యువతకు పట్టని దోపిడీ : జిఎస్‌టి తగ్గింపు సరే ముడి చమురు ధర పతనమైనా పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించరేం !

21 Sunday Sep 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

#Fuel Prices India, BJP, Fossil Fuel, Fuel Price in India, Fuel tax hike in India, GST on Fuel, Narendra Modi Failures, youth indifference

ఎం కోటేశ్వరరావు

ఈనెల 22 నుంచి నవరాత్రి కానుకగా తగ్గించే జిఎస్‌టి స్లాబులతో మీరు నేరుగా స్వర్గానికి భారతీయ పుష్పక విమానంలో పైసా ఖర్చు లేకుండా వెళ్లి రావచ్చన్నట్లుగా నరేంద్రమోడీ బొమ్మతో ప్రచారాన్ని ఊదరగొడుతున్నారు. అక్టోబరు లేదా నవంబరులో జరిగే బీహార్‌, తరువాత జరగాల్సిన మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్వరంగంలో ఈ ప్రచారం మోతమోగుతున్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు పొందుతూ నరేంద్రమోడీ బొమ్మ పెట్టటం లేదంటూ బిజెపి నేతలు విమర్శలు చేస్తారు .ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు. పన్నెండు, 28శాతం పన్ను విధించే శ్లాబులను రద్దు చేసి ఐదు, పద్దెనిమిది శాతంతో పండగ చేసుకోవాలని చెబుతున్నవారు ఒక్క మోడీ బొమ్మనేే ఎందుకు పెడుతున్నట్లు ? జిఎస్‌టి తగ్గింపు నష్టాన్ని కేంద్రం రాష్ట్రాలకు బదలాయిస్తే మోడీ చిత్రం పెట్టుకున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ అలా కాదే, సగం నష్టాన్ని భరించేది రాష్ట్రాలు,ఎనిమిది వేల కోట్ల నష్టమని చంద్రబాబు ఇంజన్‌ ధ్వనులు చేస్తోంది, ఆ పేరుతో దేనికి కోత పెడతారో అది వేరే అంశం. జిఎస్‌టి తగ్గింపు ఖ్యాతి మొత్తం మోడీ ఖాతాలో వేస్తున్నారు. వీటినే చావు తెలివి తేటలు అంటారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం 2018లో జిఎస్‌టి ద్వారా వచ్చిన రాబడి రు.11,77,380 కోట్లు. సగటున నెలకు రు.98వేల కోట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పెరుగుదల, కొన్ని వస్తువుల మీద పన్ను పెరుగుదల వంటి కారణాలు కూడా తోడై 2024లో రు.20,12,720 కోట్లకు అంటే సగటున రు.183వేల కోట్లకు పెరిగింది.

ఇంత భారీ మొత్తంలో పన్ను రాబడి పెరుగుదల మోడీ సర్కార్‌ ఘనత అని చెబుతారు. నిజం ఏమిటి ? వినియోగం, పదేండ్లలో జనాభా 127 కోట్ల నుంచి 146 కోట్లకు చేరింది. పదేండ్లలో ద్రవ్యోల్బణం ఏటా సగటున 5.94శాతం చొప్పున పదేండ్లలో 59.4శాతం మొత్తంగా పెరిగింది. దీనికి తోడు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను కూడా పెంచాయి. వీటన్నింటి కారణంగా జిఎస్‌టి కూడా ఆ మేరకు పెరిగింది. పన్ను ఎగవేతలను అరికట్టామన్నారు, నిజం ఏమిటో జనానికి తెలుసు ! జిఎస్‌టి తగ్గింపును దుకాణాల వారు ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు వార్తలు వచ్చాయి. దీపావళి నాటికి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సంస్కరణలను అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 15 ఎర్రకోట ప్రసంగంలో చెప్పారు. వివరాలు తెలియకుండానే జనం పండగ చేసుకుంటారని మీడియా పెద్ద ప్రచారం చేసింది. అమెరికా పన్నుల దాడి, రానున్న బీహార్‌ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని రాయిటర్స్‌ ఇచ్చిన వార్తకు కొన్ని పత్రికలు శీర్షికలు పెట్టాయి. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఓట్ల లాభం లేకుండా నరేంద్రమోడీ దేన్నీ తలపెట్టరు అని వేరే చెప్పనవసరం లేదు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నపుడు జిఎస్‌టి ప్రతిపాదనను బిజెపి వ్యతిరేకించింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2017 నుంచి అమలు చేసి తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నది.

ఏ కారుకు ఎంత, ఏ మోటార్‌ సైకిలుకు ఎంత, ఇలా పన్ను భారం తగ్గే వాటి గురించి ఇప్పటికే కంపెనీలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. గిరాకీ గిడసబారి లాభాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ఎక్కువగా కొనుగోలు చేసే విలాస వస్తువులపై 28 నుంచి 18శాతానికి పన్నుల తగ్గింపు వారికి ఊరటనిచ్చే మాట నిజం. పన్నెండు పన్ను జాబితాలో ఉన్నవాటిని ఐదుశాతానికి తగ్గించారు.గత లావాదేవీలపై జరిపిన విశ్లేషణ క్రిసిల్‌ నివేదిక ప్రకారం ప్రతి వంద రూపాయల జిఎస్‌టి రాబడిలో ఐదుశాతం ఉన్న వస్తువుల ద్వారా ఏడు రూపాయలు, పన్నెండు శాతం ఉన్నవాటితో ఐదు నుంచి ఆరు రూపాయలు, పద్దెనిమిదిశాతం వాటితో 70 నుంచి 75, విలాసవస్తువుల జాబితాలో ఉన్న 28శాతం నుంచి 13 నుంచి 15 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ముందే చెప్పుకున్నట్లు 28,12శాతాలు ఉండవు. అందువలన ప్రామాణిక పన్నుశ్లాబ్‌ నుంచి ఎంత అనేది కొద్ది నెలల తరువాత గానీ వెల్లడి కాదు. తాజా మార్పులు, ఆదాయపన్ను మినహాయింపులు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణతో మొత్తం నాలుగున్నరలక్షల కోట్ల రూపాయల మేర జనంలో కొనుగోలు శక్తి పెరిగేందుకు అవసరమైన సొమ్ము చేరుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని ఊరడిస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాత్రూముల్లో తప్ప బహిరంగంగా ఏడవటానికి కూడా అవకాశం లేదు, ఎవరి బాధలు వారివి.

జిఎస్‌టి తగ్గింపు వలన వస్తువుల ధరలు తగ్గి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు తప్ప కొనుగోలు శక్తి పెరగదు.డెలాయిట్‌ కంపెనీ చేసిన విశ్లేషణ ప్రకారం గత ఐదు సంవత్సరాలలో నిజవేతనాల పెరుగుదల మైనస్‌ 0.4 నుంచి ప్లస్‌ 3.9శాతం వరకు ఉందని పేర్కొన్నది. పైన చెప్పుకున్నట్లు సగటు ద్రవ్యోల్బణం 5.94 శాతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే నిజవేతనాలు ఎలా తగ్గిపోయాయో, పెరుగుదల ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇన్‌ డాట్‌ ఐకాలిక్యులేటర్‌ డాట్‌ కామ్‌ విశ్లేషణ ప్రకారం 2014లో రు.5,765.94 రూపాయల వేతనం ఇప్పుడు పదివేలకు సమానం.ఈ మొత్తంలో పన్నులు, ఇతర కోతలు పోను ఇంటికి తీసుకుపోయిన మొత్తం రు.4,793 కాగా ఇప్పుడు పదివేల రూపాయలు వస్తే చేతికి అందుతున్నది రు.8,222గా ఉంది. అందువలన తట్టలతో డబ్బు తీసుకుపోయి బుట్టలతో సరకులు కొనుగోలు చేసే రోజుల వైపు పయనిస్తున్నామని చెప్పుకుంటే అతిశయోక్తి కాదు. అత్యంత ధనిక దేశం అమెరికాలో జిఎస్‌టి లేదు. అమ్మకపు పన్ను మాత్రమే ఉంది. వివిధ రాష్ట్రాలలో కనిష్టంగా నాలుగు శాతం నుంచి పన్నెండు శాతం వరకు మాత్రమే ఉన్నాయి. మన పొరుగునే ఉన్న చైనాలో ప్రామాణిక జిఎస్‌టి శ్లాబ్‌ 13శాతం మాత్రమే, ఇదిగాక తొమ్మిది, ఆరుశాతం శ్లాబులు ఉన్నాయి. క్రిసిల్‌ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి నష్టం పెద్ద లెక్కలోనిది కాదు. అందువలన నూతన శ్లాబులు మీ జీవితాన్నే మార్చివేస్తుందన్న ప్రచారంలో నిజాలు కొద్ది నెలల తరువాత మాత్రమే వెల్లడవుతాయి.

ఉక్రెయిన్‌ – రష్యా పోరు మనదేశం, చైనాలకు ఎంతో మేలు చేస్తున్నది. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్‌ చమురు రాయితీ ధరలకు వస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మిగులుతున్నది. విపరీతంగా పెంచిన చమురు సెస్‌లను రద్దు చేస్తే వస్తుకొనుగోలు ఇంకా పెరుగుతుంది.సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉన్న యువత ఇలాంటి విషయాల మీద ఎందుకు కేంద్రీకరించటం లేదు ? జిఎస్‌టి తగ్గింపు ఏ మేరకు జనాలకు ఉపశమనం కలిగించినా మంచిదే. కానీ చమురు భారం సంగతేమిటి ? దాన్ని జిఎస్‌టిలో ఎందుకు చేర్చరు ? రాష్ట్రాల మీద నెపం వేస్తున్నారు.ఎందుకు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి ? వాటికి ఉన్న ఆదాయవనరులలో అమ్మకపు పన్ను రద్దుచేసి జిఎస్‌టి తెచ్చారు. నష్టం వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం పరిహారం చెల్లించింది. అదే విధంగా చమురు మీద వేస్తున్న వాట్‌ బదులు జిఎస్‌టికి మార్చి అదే విధంగా పరిహారాన్ని కేంద్రం ఎందుకు చెల్లించకూడదు ? అలా చెల్లిస్తే ఏ రాష్ట్రమైనా వ్యతిరేకత తెలుపుతుందా ? పోనీ వినియోగదారుల పట్ల ఏమైనా నిజాయితీగా ఉందా అంటే అదీ లేదు. దరిద్రం ఏమిటంటే దాని గురించి అడిగేవారేలేకపోయారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా చమురు ధరలను సవరిస్తామని ఒక విధానాన్ని అమలు జరిపిన ప్రభుత్వం 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి నిలిపివేసింది. అప్పటి నుంచి అంతర్జాతీయంగా ముడిచమురు ధర పడిపోయినా, రష్యా నుంచి రాయితీ ధరకు కొనుగోలు చేసినా ఆ మేరకు వినియోగదారుడికి తగ్గించలేదు. ప్రభుత్వమే అలా జనాల జేబులు కొట్టివేస్తున్నపుడు తగ్గించిన జిఎస్‌టి పన్ను మొత్తాలను ప్రయివేటు కంపెనీలు బదలాయిస్తాయంటే నమ్మేదెలా ? ధరల పెంపుదల మీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు.

2023వ సంవత్సరంలో మన చమురు దిగుమతి బిల్లు రు. 16,82,475కోట్లు, అది 2024లో రు.14,80,232 కోట్లకు తగ్గింది. అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు, అయినప్పటికీ ఒక్క పైసా కూడా డీజిలు, పెట్రోలు ధరలు తగ్గించలేదు. సామాజిక మాధ్యమాల మీద కొన్ని ఆంక్షలు పెట్టినందుకే నేపాల్‌ యువత ఎలా స్పందించిందో చూశాము.మనవారికి ఎందుకు పట్టటం లేదు. ఇవేమీ తెలియని అంశాలు కాదే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మనం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర.93.15 డాలర్లు. నాడు నిర్ణయించిన ధరలే నేడు అమలు జరుగుతున్నాయి. అయిల్‌ ప్రైస్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం 2025 జనవరి 17న మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా ధర 84.1డాలర్లు కాగా సెప్టెంబరు 18న 69.9 డాలర్లకు తగ్గింది. అయినా ఎందుకు ధరలు తగ్గించలేదు, ఎవరైనా సమాధానం చెప్పేవారున్నారా ? ఒక పీపా ముడిచమురు ధర పది డాలర్లు తగ్గితే దిగుమతి బిల్లులో లక్షా పదివేల కోట్లు మిగులుతాయి. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ధర 62 డాలర్లకు అటూ ఇటూగా ఉంది. మన అవసరాల్లో 2025 జూలై నెలలో 31శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాము. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వేసిన గణాంకాల ప్రకారం 2022 నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 1,260 కోట్ల డాలర్లు అంటే మన రూపాయల్లో లక్షా పదివేల కోట్లు మనదేశానికి మిగిలింది. గతంలో భారీ మొత్తాల్లో సెస్‌ విధించినపుడు ఒకసారి యుపిఏ ప్రభుత్వం చేసిన అప్పు తీర్చటానికి అని చెప్పారు. మరోసారి కరోనా వాక్సిన్‌ ఉచితంగా వేశారంటే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారనుకుంటున్నారు అని బుకాయించారు. ఇంకోసారి మనదేశ రక్షణకు అవసరమైన మిలిటరీ ఖర్చుల కోసం అని మరో కత చెప్పారు. ఒక వేళ నిజంగా వాక్సిన్‌ పేరుతో విధించి ఉంటే అవసరం తీరింది గనుక ఆ మొత్తాన్ని ఎందుకు రద్దు చేయలేదు ? కేంద్ర ప్రభుత్వ సంస్థ కంప్ట్రోలర్‌ మరియు ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) తాజా నివేదిక ప్రకారం 2023-24 నాటికి విద్య, వైద్యం, రోడ్లు, వ్యవసాయం,స్వచ్చ భారత్‌, చమురు పరిశ్రమ అభివృద్ది పేరుతో వసూలు చేస్తున్న సెస్‌ మొత్తాలను ఆ రంగాలకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రు.3.69లక్షల కోట్ల మొత్తాన్ని వాటికి బదలాయించకుండా ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాగ్‌ పేర్కొన్నది. సర్‌ఛార్జి, సెస్‌లో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు బదలాయించదు.

అసలు మనం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధర ఎంత దాన్నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులైన డీజిలు, పెట్రోలుకు ఎంత పడుతున్నది, ఎంత వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో 2025 జూన్‌ నెలలో ఉన్న ధరల ప్రకారం లీటరు పెట్రోలు రు.100గా ఉంది.దానిలో చమురుశుద్ధి కేంద్రాలు డీలర్ల వద్ద వసూలు చేసేది రు.45, కేంద్ర ప్రభుత్వ ఎక్సయిజ్‌, సెస్‌ల మొత్తం రు.32.90, ఢిల్లీ ప్రభుత్వం 30శాతం చొప్పున వ్యాట్‌ రు.23.25, డీలర్లకు ఇచ్చే కమిషన్‌ రు.1.85, అంటే అసలు ధర కంటే పన్నుల వాయింపు 56.20 ఉంది.అదే డీజిలు మీద 51.3శాతం పన్నులున్నాయి. ఇతర రాష్ట్రాలు కొన్నింటిలో ఇంకా ఎక్కువ మొత్తం వ్యాట్‌ ఉంది. బిజెపి లేదా దాన్ని భుజాన మోస్తున్న తెలుగుదేశం, జనసేన,వైసిపి వంటి పార్టీలు ఎలా సమర్ధించుకుంటాయి. ఐరోపా దేశాల్లో పన్నుల మొత్తాలు 70శాతం వరకు ఉన్నాయి కదా అని ఎవరైనా అనవచ్చు. అవన్నీ ధనిక దేశాలు, వాటికీ మనకు పోలిక ఎక్కడ ? ప్రతిదానికీ మనవారు పోలుస్తున్న చైనాలో 2015 నుంచి పెట్రోలు లీటరు మీద 1.52 చైనా యువాన్‌లు(రు.18.84),డీజిలు మీద 1.2(రు.14.87) విధిస్తున్నారు. మన దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్రాలు చమురు మీద వసూలు చేసిన మొత్తం రు.7.5లక్షల కోట్లు. ఇంత మొత్తం భారం మోపుతున్నప్పటికీ దాన్ని తగ్గించేందుకు మన దేశీయ ఉత్పత్తిని పెంచటం ఒక మార్గం. గడచిన పదేండ్లలో అంతకు ముందున్న దానికంటే ఉత్పత్తి తగ్గిందని చెప్పుకోవాలంటే పాలకులకు ఉండదు గానీ మనకు సిగ్గు వేస్తున్నది. యువత వీటిని ఎందుకు పట్టించుకోవటం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రోల్‌, డీజిల్‌ ధర రు.2 తగ్గింపు : నరేంద్రమోడీ కుడుములేస్తున్నారు పండగ చేసుకుందామా !

16 Saturday Mar 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ 1 Comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


త్వరలో ప్రపంచ జిడిపిలో జపాన్‌, జర్మనీలను వెనక్కు నెట్టి మూడవ స్థానం ఆక్రమించే ధనిక దేశంగా మనలను నరేంద్రమోడీ ముందుకు తీసుకుపోతున్నారు. టీవీలు చూడండి రోజూ ఎన్ని గ్యారంటీలను ప్రకటిస్తున్నారో, రామరాజ్యాన్ని తెచ్చారు, రామాలయాన్ని నిర్మించారు, ప్రపంచంలో తలెత్తుకొనేట్లు చేశారు. ఓట్ల కోసం మోడీ ఏమీ చేయరని బరాబర్‌ చెబుతున్నాం అంటూ భక్తులు ఊరూరా తిరుగుతున్నారు. అదే నిజమైతే ”ధనికులైన” మన జనాలకు ముష్టి విదిల్చినట్లుగా తాజాగా పెట్రోలు, డీజిలు మీద లీటరుకు రు.2 తగ్గించటం అవమానించటం కాదా ? ఈ చర్యతో జనం పండగ చేసుకుంటున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. పూర్వం గ్రామాల్లో వృత్తుల వారికి పండుగల సందర్భంగా రైతులు తాము చేసుకున్న పిండివంటలు ఇస్తే ఎంతో సంతోషించేవారు(దీని అర్ధం వృత్తుల వారిని కించపరచటం కాదు, అలాంటి పరిస్థితి గతంలో ఉందని చెప్పటమే.ఇప్పుడు ఇంకా ఎక్కడైనా అలా ఉందేమో తెలియదు). దాన్నుంచి వచ్చిందే కుడుమేస్తే పండగ అనే లోకోక్తి. ఇప్పుడు ముష్టివిదిల్చినట్లుగా రెండు రూపాయలు , గ్యాస్‌ సిలిండర్‌కు వంద ఇచ్చి బిజెపి వారు జనాలను డూ ఫెస్టివల్‌ (పండగ చేస్కో) అంటున్నారు.2022 ఏప్రిల్‌ ఆరు నుంచి చమురు ధరలను స్థిరంగా ఉంచిన పెద్దలు ఓట్లు కొల్లగొట్టాలని తప్ప ఇప్పుడు ఇంత స్వల్పంగా తగ్గించటానికి ప్రాతిపదిక ఏమిటి ? ఈ మాత్రానికే పండగ చేసుకొని ఓట్లు వేస్తామని ఎవరైనా అంటే అది వారిష్టం.


అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గించే విధానం అమలు జరుపుతున్నట్లు ప్రతి రోజూ సుప్రభాతం మాదిరి ధరలను ప్రకటించే వారు. రెండు సంవత్సరాలుగా ఎందుకు నిలిపివేసినట్లు ? ఎన్నికల్లో మీట నొక్కిన తరువాత తిరిగి పెంచరనే గ్యారంటీ ఏముంది ? కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌లోని తాజా సమాచారం ప్రకారం పదేండ్ల యుపిఏ పాలనా కాలంలో 2004-05 నుంచి 2013-14 వరకు కేంద్ర ప్రభుత్వం లేదా చమురు ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీలు వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీల మొత్తం రు.8,88,024 కోట్లు. సగటున ఏటా 88.8వేల కోట్లు. తరువాత నరేంద్రమోడీ అచ్చేదిన్‌ పాలనలో ఈ మొత్తం రు.2,82653 కోట్లు మాత్రమే. సగటున 30.1వేల కోట్లు. వీటిలో ప్రజాపంపిణీ కిరోసిన్‌, ఉజ్వల గ్యాస్‌ సబ్సిడీ ఉన్నాయి. ఇది సబ్సీల కోత తీరు కాగా ఈ కాలంలో చమురు రంగంలో జనంపై మోపిన భారమెంతో చూద్దాం.తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మోడీ సర్కార్‌ పెంచిన పన్నులు, సెస్సులు,చమురు కంపెనీల నుంచి వచ్చిన రాబడుల మొత్తం రు.34,53,930 కోట్లు. అంటే సగటున రు.3.45లక్షల కోట్లు వచ్చింది. అధికారానికి వచ్చిన తొలి ఏడాది అంటే అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ విధించిన పన్నులు, ఇతర రాబడి రు.1.72లక్షల కోట్లు మాత్రమే. అది 2021-22లో గరిష్ట స్థాయికి రు.4.92లక్షల కోట్లకు పెరిగింది. ఈ ప్రాతిపదికన అంటే తొలి ఏడాది పన్నులే కొనసాగి ఉంటే పదేండ్లలో రు17.22 లక్షల కోట్లుగా ఉండేది, కానీ మొత్తం మీద చూసినపుడు రెట్టింపైంది. రద్దు చేసిన సబ్సిడీ, పెంచిన భారాలను కలుపు కుంటే 23లక్షల కోట్ల మేరకు భారం జనం భరించినట్లు లెక్క.


2020లో మనదేశంలో 88.2 బిలియన్‌ లీటర్ల డీజిల్‌,37.2 బిలియన్‌ లీటర్ల పెట్రోలు(స్టాటిస్టా సమాచారం) వినియోగం మొత్తం 125.4బిలియన్‌ లీటర్లు. ఇప్పుడు రెండు రూపాయల చొప్పున తగ్గించారు గనుక ఏడాది పాటు అమలు చేస్తే 250.8బిలియన్లు అంటే 25వేల కోట్లు జనానికి విదిల్చి ఓట్లు కొల్లగొట్టాలని పధకం వేశారు.మోపిన భారం ఎంత ? తగ్గించిన ధర ఎంత ? తరువాత వినియోగం పెరిగి ఉంటే ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరిగినట్లే తగ్గింపు మొత్తం కూడా అదే దామాషాలో పెరుగుతుంది. జనం మరీ ఇంత అమాయకంగా ఉన్నారని, కుడుమేస్తే పండగ చేసుకొనే వారి మాదిరి కనిపిస్తున్నారా ? పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు చమురు ఉత్పత్తుల మీద వచ్చిన పన్ను, ఇతర రాబడి రు.22,19,558 కోట్లు అంటే సగటున 2.3 లక్షల కోట్లు. పదేండ్ల క్రితం వార్షిక రాబడి 1.6లక్షల కోట్ల నుంచి 2.3లక్షల కోట్లకు తప్ప కేంద్రం మాదిరి రు.1.72లక్షల నుంచి 3.45లక్షల కోట్లకు పెరగలేదు. కేంద్రం నుంచి పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా సంగతేమిటని కొందరు ప్రశ్నించవచ్చు. ఎక్సైజ్‌, ఇతర పన్నులో రాష్ట్రాలకు వాటా ఉంటుంది తప్ప సెస్సుల పేరుతో మోపిన దానిలో ఒక్క పైసా కూడా రాదు. మోడీ మోపిందంతా సెస్సుల పేరుతోనే. ధరలు తగ్గించాలని ఒక వైపు డిమాండ్‌ చేసే వారు ప్రభుత్వం అదే చేస్తే సంతోషించకుండా విమర్శలెందుకు చేస్తారు అనే వారు ఉన్నారు.వారందరికీ ఒకటే సమాధానం పెంచాలని ఎవరూ కోరలేదు, వద్దంటున్నా విపరీతంగా పెంచి జేబులు కొల్లగొట్టారు.దానిలో ఓట్ల కోసం నామమాత్రం తగ్గిస్తే పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ తగ్గింపు నేతలకు భజన చేయాల్సినంత గొప్పదేమీ కాదు. రద్దు చేసిన సబ్సిడీలతో పోలిస్తే ఇచ్చిన రాయితీ మొత్తమెంతో ఈ ప్రశ్నలు వేసే వారు సమాధానం చెప్పాలి.యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో, రూపాయలలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం× ధర డాలర్లలో×× పెట్రోలు ×× డీజల్‌
2010-11××× 85.09 ×× 52.64 ×× 38.56
2011-12××× 111.89 ×× 64.71 ×× 40.26
2012-13××× 107.97 ×× 68.71 ×× 45.26
2013-14××× 105.52 ×× 73.70 ×× 51.90
2014-15××× 84.16 ×× 66.36 ×× 52.23
2015-16××× 46.17 ×× 68.71 ×× 45.26


2016-17లో మనదేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర 47.57 ,2017-18లో 56.43, 2018-19లో 69.88,2019-2020లో 60.57, 2020-21లో 44.82, 2021-22లో 79.18, 2022-23లో 93.15, 2023-24లో 82.41డాలర్లు ఉంది. 2022 ఏప్రిల్‌ ఆరున ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రు.105.41, డీజిల్‌ ధర రు.96.67 కాగా మే 22 నుంచి రు. 96.72, రు.89.62కు తగ్గించారు. అప్పటి నుంచి 2024 మార్చినెల 14వరకు అదే రేట్లు కొనసాగాయి. యుపిఏ పాలనలో 112 డాలర్లకు ముడి చమురు దిగుమతి చేసుకుంటే వినియోగదారుల నుంచి వసూలు చేసింది పెట్రోలు రు.64.71, డీజిల్‌కు రు.40.26 మాత్రమే. ఇప్పుడు తాజా రేటు పైన చెప్పుకున్నట్లు 82.41 డాలర్లు ఉంటే ఢిల్లీలో 96.67, 89.62గా ఎందుకు ఉన్నట్లు? తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు రేటు రు.109, 111 వంతున ఉన్నాయి, మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా వినియోగదారుల నుంచి ఇంతగా ధర వసూలుకు కారణమేమిటి అంటే విపరీతంగా సెస్సులను వడ్డించటం, రూపాయి మారకపు విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధతే తప్ప మరొక కాదు. వీటి గురించి నరేంద్రమోడీ దేశానికి ఇస్తున్న గ్యారంటీలు ఏమిటి అన్నది ప్రశ్న.


.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లించాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు 83కు అటూ ఇటూగా ఉంది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరుగుతుంది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల గురించి నిరంతరం ఊదరగొడుతుంటారు. 1995లో స్వదేశీ ముడిచమురు ఉత్పత్తి 32.2మిలియన్‌ టన్నులు. దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించుకోవాలి, స్వదేశీ ఉత్పత్తిని పెంచుకోవాలని రోజూ సుభాషితాలు చెబుతుంటారు.మోడీ ఏలుబడిలో 2022 నాటికి 28.4మిలియన్‌ టన్నులకు దిగజారింది. ఎంతో కీలకమైన ఈ రంగంలోనే మన ప్రతిభ ఇలా ఉంటే దేశాన్ని ముందుకు తీసుకుపోతాం, అగ్రస్థానానికి చేరుస్తాం అంటే ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతాం అన్నట్లుగా ఉంది.

కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి పతనంలో మరో రికార్డు – నరేంద్రమోడీ ” ఘనత ”కు చెల్లిస్తున్న మూల్యం ఎంతో తెలుసా !

13 Monday Jun 2022

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, WAR

≈ Leave a comment

Tags

BJP, Fuel Price in India, Narendra Modi Failures, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సాధించిన ఘనతలు లేదా విజయాలు అంటూ వాట్సాప్‌ పండితులు జనాలకు వండి వడ్డిస్తున్నారు. యజమానులు చెప్పినట్లుగా వారి పని వారు చేస్తున్నారు. వంటలు ఎంత కష్టపడి చేశారని కాదు, అవి తినేందుకు పనికి వస్తాయా లేదా అన్నది గీటురాయి. ఎనిమిదేండ్లుగా తిన్నవారికి అవెలాంటివో తెలియటం ఇప్పుడే ప్రారంభమైంది. ఎప్పటికీ రుచి పచీ తెలియని జనాలు కొందరుంటారు. వారికి సానుభూతి తెలుపుదాం. బిజెపి నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టిన అధికార ప్రతినిధి నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదం తరువాత వాట్సాప్‌ పండితులు నరేంద్రమోడీ గారి ” ఘనతల” గురించి ప్రచారం మొదలు పెట్టారు. వాటిలో చమురు గురించి కూడా ఉంది. వాటితో పాటు దాని కంటే ముందే చమురు రంగంలో” ఘనత ” గురించి గురించి చూద్దాం.


మన దేశం కొనుగోలు చేస్తున్న ముడి చమురు ధర పదేండ్ల నాటి స్థాయికి పెరిగిందన్న వార్తలను కొద్ది మందైనా చదివే ఉంటారు.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లిస్తున్నాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.


గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింప చేశారు. తరువాత పదిహేను రోజుల్లో 13సార్లు పెంచారు. తిరిగి ఏప్రిల్‌ ఆరు నుంచి ధరల స్థంభన కొనసాగుతోంది. ఏప్రిల్‌ నెలలో మన దేశం కొనుగోలు చేసిన ముడిచమురు సగటు ధర 102.97, మే నెలలో 109.51, జూన్‌ నెలలో పదవ తేదీ వరకు 118.34 డాలర్లుగా ఉంది. జూన్‌ 12న 122 డాలర్లుంది. అందువలన ఏ క్షణంలోనైనా తిరిగి ధరలు పెరగవచ్చు. గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ధరలను స్థంభింప చేస్తే శ్రీలంక పరిణామాలను చూసిన తరువాత ఇప్పుడు ధరల పెరుగుదలను అరికట్టేందుకుగాను కొంత మేర పన్ను తగ్గింపు, ధరల స్థంభన కానసాగిస్తున్నారు. ఇది మంచిదే కదా అని ఎవరైనా అనవచ్చు. ఎప్పుడు మంచిది అవుతుంది అంటే ఏప్రిల్‌ ఆరునుంచి పెరిగిన ధరల భారాన్ని ప్రభుత్వం భరిస్తే, అలాగాక తిరిగి ఆ మొత్తాన్ని జనం మోపితే పరిస్థితి ఏమిటి ? ఇప్పటికే ఎనిమిది సంవత్సరాల ద్రవ్యోల్బణ రికార్డును మోడీ సర్కార్‌ అధిగమించిన ఘనత సాధించింది.


2022-23 బడ్జెట్‌ను ముడిచమురు ధర 75 డాలర్లు ఉంటుందనే అంచనాతో రూపొందించారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో సగటున ఎంత ఉందో పైన చూశాము. ఆర్‌బిఐ, ఇతర సంస్థలు మన జిడిపి వృద్ధి గురించి వేసిన అంచనాలన్నిటినీ కుదింపులతో సవరిస్తున్నాయి. పెట్రోలు, డీజిలుకు కూరగాయల సాగుకు నేరుగా సంబంధం లేకున్నా రవాణా,సాగు, ఇతర ఖర్చు పెరిగి వాటి ధరలు కూడా పెరుగుతాయి. మే నెల మూడవ వారం ప్రారంభంలో ఉన్న ముడిచమురు ధరలను బట్టి డీజిలు ధర లీటరుకు రు. 3-4, పెట్రోలు ధర 2-3 వరకు పెంచవచ్చని ప్రభుత్వం లీకులు వదిలింది. మరోవైపు డీజిలు మీద 25-30, పెట్రోలు మీద పది వరకు నష్టాలు వస్తున్నట్లు కొందరు గుసగుసలాడుతున్నారు. చమురు దిగుమతి బిల్లు 2020-21లో ఏడాదికి 62.2బిలియన్‌ డాలర్లుంటే 2021-22కు అది 119.2 బి.డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ఎంత అవుతుందో చెప్పలేము.


చమురు రంగానికి సంబంధించి నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఉన్నాయి.2014తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మన దేశంలో ఉత్పత్తి చేసిన ముడిచమురు 35.9మిలియన్‌ టన్నులు. అది 2020-21కి 29.1కి, 2021-22లో ఖరారు కాని లెక్కల ప్రకారం 28.4మి.టన్నులని పిపిఏసి సమాచారం వెల్లడించింది. పరిస్థితి ఇది కాగా వాట్సాప్‌ పండితులు లేదా పండిత పుత్రులు తిప్పుతున్న ఒక పోస్టులో అంశాల గురించి చూద్దాం.


” భాగస్వామ్య పద్దతిలో రష్యాతో కలిసి కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం ఒప్పందం చేసుకోవాల్సిందిగా ఓఎన్‌జిసితో పాటు ప్రభుత్వరంగ ఆయిల్‌ సంస్థలను కోరారు మోడీజీ.కొత్త్త ఆయిల్‌ బావుల అన్వేషణ భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం అవడంతో ప్రస్తుతం ఆ ఖర్చును రష్యా భరించే స్థితిలో లేకపోవటంతో కొత్త ఆయిల్‌ బావుల అన్వేషణ కోసం భారత్‌ను కోరింది రష్యా.” వెనుకటికి ఎవడో సన్యాసి నాకు పదివేల రూకలిస్తే మీకు బంగారం తయారు చేసే ఉపాయం చెబుతా అన్నాడట. వాడే బంగారాన్ని తయారు చేసుకొని కోట్లు సంపాదించవచ్చు కదా ! చమురు దిగుమతులను తగ్గించి విదేశీమారకద్రవ్యాన్ని ఆదా చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ గత ఎనిమిదేండ్లలో ఉన్న ఉత్పత్తిని కూడా కొనసాగించలేని స్థితిలోకి చమురు సంస్థలను నెట్టారు. ఐదులక్షల కోట్ల డాలర్లు కాకున్నా ఇప్పుడు జిడిపిలో రష్యా కంటే మెరుగైన స్థితిలో ఉన్న మన దేశం మన కొత్త బావుల సంగతి చూడకుండా రష్యా వెళ్లమని మోడీ కోరారట, వినేవారుంటే కథలు భలేచెప్తారు కదా ! ఈ రోజు రష్యా సమస్య – కొత్తవాటిని తవ్వటం గురించి కాదు, ఉన్న వాటి నుంచి తీసిన చమురును అమ్ముకోవటం ఎలా అన్నదే. మనతో నిమిత్తం లేకుండానే అది గతంలో బావులను తవ్వుకుంది. మనతో సమంగా దాని దగ్గర కూడా విదేశీమారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. చమురు కొనుగోలు చేసి మనమే ప్రతినెలా దానికి సమర్పించుకుంటున్నాము. నరేంద్రమోడీ గారికి గొప్పతనాన్ని ఆపాదించేందుకు ఇలాంటి కట్టుకథలను ప్రచారం చేస్తారు.


”మోడీజీ ఓఐసి(ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ దేశాలు) దేశాల నుంచి దిగుమతి చేసుకొనే క్రూడ్‌ ఆయిల్‌లో కోత విధించి దానిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలని ఆయిల్‌ కంపెనీలను కోరారు”. ఇది ఒక పచ్చి అబద్దం. నూపూర్‌ శర్మ చిల్లర మాటల వివాదానికి ముందు నుంచే తక్కువ ధరకు వస్తున్నందున రష్యా నుంచి దిగుమతిని భారీగా పెంచారు.
”ఇప్పటి వరకు అమెరికా రష్యానుంచి ముడిచమురు బారెల్‌కు 30డాలర్లు పెట్టి దిగుమతి చేసుకొని దానిని శుద్ది చేసి తిరిగి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది.ఇప్పుడు భారత్‌ కూడా తక్కువ రేటుకి రష్యా నుంచి కొని దాన్ని శుద్ది చేసి ఐరోపా దేశాలకు అమ్ముతున్నది. ఇది పరోక్షంగా గల్ఫ్‌ దేశాల ఆయిల్‌ వ్యాపారానికి చెంపదెబ్బ ” ఈ పోస్టును రచించిన వారికి ముందేమి రాస్తున్నామో వెనకేమి రాశామో అన్న ఆలోచన ఉన్నట్లు లేదు.పైన పేర్కొన్న రాతకు ఎగువన ఏం రాశారో తెలుసా ! ” మన దేశంలో ఉన్నట్లు ఇయు దేశాలలో భారీ రిఫైనరీలు లేవు. నేరుగా రష్యా నుంచి పెట్రోలును పైప్‌ లైన్‌ నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చాయి.” ఉక్రెయిను సంక్షోభానికి ముందు వరకు రష్యా నుంచి పెట్రోలు, డీజిలు, పెట్రోలియం ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకునేది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ పన్ను తగ్గింపు ఆవిరి – మరోసారి చమురు ధరల మోత !

31 Tuesday May 2022

Posted by raomk in BJP, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మంగళవారం నాడు (మే 31వ తేదీ) అంతర్జాతీయ చమురు మార్కెట్లో బ్రెంట్‌ రకం ధర మరోసారి 124 డాలర్లు దాటింది. 2020-21లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా సగటు ధర 44.82 డాలర్లు కాగా 2021-22లో అది 79.18 డాలర్లకు పెరిగింది.వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103 డాలర్లుంది. మే నెలలో 108.61డాలర్లకు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పాలనా కాలంలో ఒక లీటరు పెట్రోలు, ఒక లీటరు డీజిలు కొనుగోలు చేస్తే జనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్ను రు.9.48, రు.3.56 మొత్తం రు.13.04. నరేంద్రమోడీ అధికారానికి వచ్చి జనాలకు మంచి చేసేందుకు గాను దాన్ని రు.32.98, రు.31.83 మొత్తం రు.64.81కు పెంచారు. బిజెపికి చెడు రోజులు రాకుండా చూసుకొనేందుకు దీనిలో కేంద్ర ప్రభుత్వం 2021లో ఒకసారి, 2022లో తగ్గించిన మొత్తం రు.29. అంటే నిఖరంగా ” మంచిరోజుల కోసం ” ఇంకా రు.35.81 పిండుతూనే ఉన్నారు. నరేంద్రమోడీ ఏలుబడి మీద ఇంకా భ్రమలున్నవారికి, భజన చేస్తున్నవారికీ ఈ వివరణ కాస్త చిరాకు తెప్పించటం సహజమే. ఎందుకంటే శ్రీలంక పరిణామాలను గుర్తు చేస్తాయి మరి. గతంలో 137 రోజుల పాటు చమురు ధరలను స్థంభింపచేసిన మోడీ సర్కార్‌ ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి మరోసారి ధరల సవరణ నిలిపివేసింది. దీనివలన తమకు పెట్రోలు మీద లీటరుకు రు.13, డీజిలుకు రు.24 నష్టం వస్తోందని ప్రైవేటు కంపెనీలు చెబుతున్నాయి. గతంలో వచ్చిన నష్టాన్ని ధరలు పెంచి పూడ్చారు. ఇప్పుడు మరోసారి కొంత కాలం తరువాత అదేపని చేస్తారు. జనాలకు ఒరిగేదేమీ ఉండదు. మార్చినెల 21 వరకు 137 రోజుల పాటు స్థిరంగా ఉంచి ఢిల్లీలో లీటరు పెట్రోలు రు.95.41 ధరను ఏప్రిల్‌ ఆరు నాటికి రు.105.41కి, డీజిలు ధరను రు.86.67 నుంచి రు.96.67కు పెంచారు. అంతకు ముందు రెండింటి మీద కేంద్రం రు.15 పన్ను తగ్గించి, మార్చి-ఏప్రిల్‌ నెలల్లో రు.20 ధర పెంచింది. ఇటీవల రు.14 తగ్గించారు, తరువాత ఎంత పెంచుతారో వేచి చూడాల్సిందే.


ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. వాటిలో అమెరికా చమురు రాజకీయం కూడా ప్రధానమైనదే. ఆంక్షలు, అలకలు ఏదో ఒక కారణంతో ఐరోపా దేశాలు రష్యానుంచి ముడిచమురు కొనుగోలును తగ్గించేందుకు పూనుకున్నాయి. ఇదే సమయంలో చైనా, భారత్‌ రికార్డు స్థాయిలో దిగుమతులు పెంచాయని ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్‌ పేర్కొన్నది. మే నెలలో సముద్రాల మీద ప్రయాణంలో లేదా లంగరు వేసి ఉన్న ఓడల్లో 79 మిలియన్ల పీపాల రష్యా చమురు ఉంది. ఫిబ్రవరి నెలలో 27మిలియన్ల పీపాలుంది.ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందు రష్యా ప్రధానంగా ఐరోపాకే చమురు ఎగుమతి చేసేది. పశ్చిమ దేశాల ఆంక్షలను ఖాతరు చేసేది లేదంటూ చైనా, మన దేశం ఇప్పుడు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. మార్చినెలలో మన దేశానికి చమురు సరఫరా చేసిన దేశాలలో రష్యా పదవ స్థానంలో ఉండగా ఏప్రిల్లో నాలుగవ స్థానానికి చేరిందని చమురు టాంకర్ల సమాచారం వెల్లడించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. ఈ కారణంగానే ఆ దిగుమతులను నిలిపివేయాలంటూ మరోసారి మన మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా పూనుకుంది.ఆసియాలోని కొందర్ని రాజకీయవైఖరి కంటే ఆర్ధిక అంశాలే కొనుగోలుకు పురికొల్పినట్లు సింగపూర్‌లోని కెప్లర్‌ సీనియర్‌ విశ్లేషకుడు జేన్‌ షీ అన్నారు. గతంలో ఒకశాతంగా ఉన్న మన రష్యా దిగుమతులు ఇప్పుడు ఆరుశాతానికి చేరినట్లు, మార్చి నెలలో రోజుకు 66వేల పీపాల దిగుమతి మరుసటి నెలలో 2,77,000కు పెరిగినట్లు, మే నెలలో అది 4,87,500కు పెరుగుతుందని రాయిటర్స్‌ వార్త వెల్లడించింది. ఆఫ్రికా నుంచి మనదేశం చేసుకుంటున్న దిగుమతులు 14.5 నుంచి ఆరుశాతానికి తగ్గాయి, అమెరికా నుంచి మూడుశాతం తగ్గాయి.


రష్యాపై తాను విధించిన ఆంక్షలను అందరూ అనుసరించేట్లు చూడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించిన మేరకు మన దేశం మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా సహాయ మంత్రి ఎలిజబెత్‌ రోజెన్‌బర్గ్‌ ఢిల్లీ, ముంబాయి నగరాలకు రానున్నారు. రష్యామీద ఆంక్షలను మరింత కఠినతరంగావించనున్నారనే వార్తల నేపధ్యంలో అమెరికా వత్తిడి పెంచుతోంది. ఆసియా కొనుగోళ్లను అడ్డుకుంటే తప్ప ఆంక్షల వలన ఫలితం ఉండదని ఇప్పటికే తేలింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఇప్పటికీ ఆసియా ఓడలద్వారా ఎగుమతులు 50శాతం పెరిగాయి. జనవరిలో రోజుకు 15లక్షల పీపాలు పంపితే ఇప్పుడు 23లక్షలకు చేరింది. మొత్తం మీద ఫిబ్రవరి 24కు ముందు స్ధాయికి ఎగుమతులు చేరుకుంటున్నట్లు చెబుతున్నారు.


అంతర్జాతీయ చమురు మార్కెట్లో వచ్చిన మార్పులు, తాజా పరిణామాలు ఇప్పుడు అమెరికాకు లాభదాయకంగా మారాయి. చమురు ధరలను డాలర్లలో నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర కరెన్సీలతో కొనుగోలు చేయాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చూసినపుడు డాలరు విలువ ఎక్కువగా ఉంటే చమురు ధర తక్కువగానూ చమురు ధర పెరిగితే డాలరు విలువ తక్కువగానూ ఉండేది. అమెరికా గతంలో చమురును దిగుమతి చేసుకొనేది ఇప్పుడు షేల్‌ చమురు ఉత్పత్తితో ఎగుమతిదారుగా మారింది. ప్రపంచ ఉత్పత్తి దేశాల్లో ఒకటో స్ధానంలో ఉంది. గతంలో చమురు దిగుమతి చేసుకున్నపుడు ధర ఎక్కువగా ఉంటే ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు తానే ఎగుమతి చేస్తున్నందున ధర ఎక్కువగా ఉంటే ఆర్ధికంగా పెద్ద లబ్దిపొందుతోంది. చమురు ఉత్పత్తి మొత్తం ప్రయివేటు రంగంలోనే ఉన్నందున వారికి ఎంత ధర పెరిగితే అంతగా లాభాలు వస్తాయి. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోయటం ద్వారా రష్యాను దెబ్బతీసి ఐరోపా చమురు మార్కెట్‌ను తాను ఆక్రమించాలని చూస్తోంది. అది కొంత మేరకు ఇప్పటికే ఫలించింది. ఇటీవల ప్రపంచంలో చమురు ధరతో పాటు అమెరికా డాలరు విలువా పెరుగుతోంది. అమెరికా సరకులు కొనుగోలు చేయాలంటే దిగుమతి చేసుకొనే దేశాలకు భారం పెరుగుతుంది. కనుక నిత్యం ఎక్కడో ఒకచోట ఉద్రిక్తతలను రాజేసి ఆయుధాలను అమ్ముకొని లబ్దిపొందుతున్నది. అవి లేకపోతే దాని వాణిజ్యలోటు ఇంకా పెరుగుతుంది. చైనా, ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకు ఇతర సరకులను దిగుమతి చేసుకొని వాటి ద్వారా కూడా లబ్ది పొందుతున్నది. ఇదే సమయంలో ఖరీదైన తన వస్తువులను అంటగట్టేందుకు బెదిరింపులకు దిగుతోంది. అమెరికా చెలగాటం మన వంటి దేశాల జనాలకు ప్రాణసంకటం కలిగిస్తోంది.


గతంలో చమురు సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు అమెరికా కేంద్రంగా ఉండేవి. ఇప్పుడు అమెరికా ఎత్తుగడ కారణంగా ఐరోపా సంక్షోభ కేంద్రంగా మారింది. ఇప్పుడున్న స్థితిని బట్టి రానున్న రోజుల్లో బొగ్గు, చమురు, గాస్‌ ధరలు ఇంకా పెరుగుతాయని, సరఫరా కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీని వలన అమెరికా కంటే ప్రపంచ ఆర్ధికవృద్ది ఎక్కువగా దెబ్బతింటుందని భావిస్తున్నారు. మరోవైపు డాలరు విలువ పెరుగుతుందని కూడా జోశ్యం చెబుతున్నారు. అమెరికా ఫెడరల్‌ నిధుల నిల్వలను పెంచినపుడల్లా వడ్డీరేటు పెరుగుతుంది. డాలరును సురక్షితమైనదిగా భావిస్తున్నందున మిగతా కరెన్సీల కంటే డాలర్ల వైపే మొగ్గుచూపుతారు. మదుపుదార్లు అంతకు ముందు ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా అమెరికాలో వడ్డీ రేటు పెరుగుతుందని భావించగానే వాటిని అమెరికాకు తరలిస్తారు. అది అమెరికాకు లబ్ది చేకూరుస్తుంది. తనకు విదేశీ పెట్టుబడులు అవసరమైనపుడు కూడా వడ్డీ రేట్లను పెంచుతుంది. విదేశీ మదుపుదార్లు మన మార్కెట్‌ నుంచి తప్పుకుంటున్న కారణంగా రూపాయి విలువ పతనమైంది. దాన్ని నిలబెట్టేందుకు రిజర్వుబాంకు నానా కష్టాలు పడుతోంది. రూపాయి విలువ తగ్గితే ఎగుమతులు పెరుగుతాయి, చమురుతో సహా దిగుమతుల ధరలు పెరుగుతాయి.2021 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో మన వాణిజ్యలోటు 12.75బిలియన్‌ డాలర్లు, అది 2022 మార్చినెలతో ముగిసిన ఏడాదిలో 87.79బి.డాలర్లకు పెరిగింది. వర్తమాన సంవత్సరంలో అది వంద బిలియన్‌ డాలర్లకు పెరగవచ్చని అంచనా. రూపాయి విలువ పతనం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పుడున్నదానికంటే మరింతగా పడిపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. 2020-21లో మన చమురు దిగుమతి బిల్లు 62.2 బిలియన్‌ డాలర్లు కాగా 2021-22లో అది 119.2 బి.డాలర్లకు చేరింది.


ఇటీవల ఎడిపి(రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్స్‌ పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2022 అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం జీవన వ్యయం పెరుగుతున్న కారణంగా తమ వేతనాలను పెంచాలని తమ యజమానుల మీద వత్తిడి తెచ్చేందుకు 86శాతం మంది భారతీయ కార్మికులు సిద్దం అవుతున్నారని తేలింది. ఈ సంస్థ 17దేశాల్లో సర్వే చేసింది. ప్రపంచ వ్యాపితంగా వేతన పెంపుదలను కోరుతున్న వారు సగటున 76శాతం కాగా భారత్‌లో అది 86శాతం ఉంది.బిజెపి వారు పదే పదే చెబుతున్న ”80” శాతంలో ఉన్నవారు వీరిలో కూడా అదే దామాషాలో ఉంటారని, వారికి వేరే వెండి పళ్లాల్లో వడ్డించరని చెప్పనవసరం లేదు. కరోనా మహమ్మారి ముగిసిన తరువాత వేతనాలు పెంచుతారనే భావనలో ఉన్నారని ఎడిపి భారత విభాగం ఎండి రాహుల్‌ గోయల్‌ చెప్పారు.యజమానులు పట్టించుకోకపోతే కార్మికుల ఆగ్రహం ప్రభుత్వాల మీదకు మళ్లుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఏదో ఒక పేరుతో ఎలాంటి వేతనం లేకుండా అదనపు గంటలు పని చేయించుకోవటం పెరిగింది. 2020లో మన దేశంలో వారానికి సగటున 7.3 గంటలు పని చేస్తే 2021లో అది 8.5గంటలకు పెరిగింది. ప్రపంచ సగటు 9.2 గంటలు. ఈ దోపిడీకి ధరల పెరుగుదల తోడైతే బతుకు దుర్భరమే. ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్న కారణాల్లో చమురు ధర ఒకటి. అందువలన నరేంద్రమోడీ అచ్చేదిన్‌ ఏలుబడిలో ఉన్నామనే భ్రమలతో బతుకుతున్నవారు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కొసమెరుపు ఏమంటే రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలను మరింతగా పెంచాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించిన నేపధ్యంలో చమురు ధరలు 130 డాలర్లకు పెరగవచ్చని ఆ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా, ఐరోపా చమురు రాజకీయం – బలవుతున్న భారతీయులు !

06 Friday May 2022

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures, OPEC+, Ukraine-Russia crisis


ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. మే ఆరవ తేదీన ఇది రాసిన సమయంలో బ్రెంట్‌ రకం ధర 113.49 డాలర్లు ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యానుంచి ఇంథన దిగుమతులపై పూర్తి ఆంక్షలు విధించాలని ఐరోపా సంఘం(ఇయు) అధికారికంగా ప్రతిపాదించటంతో చమురు ధర పెరిగింది. ఈలోగా సభ్యదేశాలు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. దీన్ని బట్టి అమెరికా, ఐరోపా దేశాలు రష్యాతో అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్దపడుతున్నాయని భావించాల్సి వస్తోంది. ఉక్రెయిన్‌-రష్యా వివాదాన్ని ఆరనివ్వకుండా చూస్తారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.దీని పర్యవసానాలు ఎలా ఉండేదీ చెప్పలేము. కేంద్రం పన్నులు తగ్గించకపోతే మన దేశంలో మరింతగా చమురు ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరగటం ఖాయం.


కొన్ని దేశాలు పూర్తిగా దాని మీదే ఆధారపడి ఉన్నందున రష్యా ఇంథనంపై పూర్తి నిషేధం అంత సులభం కాదని తెలుసుకోవాలి, ఇదే తరుణంలో ప్రత్నామ్నాయం చూసుకోవాలని ఐరోపా కమిషన్‌ అధ్యక్షరాలు ఉజులా వాండర్‌ లెయన్‌ ఐరోపా పార్లమెంటులో చెప్పారు. సముద్రం ద్వారా, పైప్‌లైన్‌, ముడి లేదా శుద్ధి చేసినదీ ఏ రూపంలోనూ, ఏ విధంగానూ అక్కడి నుంచి దిగుమతి చేసుకోరాదని, ఆరునెలల్లో ముడి చమురు, ఏడాదికి చివరికి శుద్ది చేసిన సరకు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని తద్వారా రష్యాపై గరిష్టంగా వత్తిడి తేగలమన్నారు. పుతిన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుదన్నారు.ఐరోపా పార్లమెంటు నిర్ణయాన్ని సభ్యదేశాలు ఆమోదించాల్సి ఉంది. తమ వల్ల కాదని జపాన్‌ చెప్పేసింది. హంగరీ, స్లోవేకియా ఈ నిర్ణయాన్ని వీటో చేస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రష్యా నుంచి ఇంథన దిగుమతులను నిలిపివేసే అవకాశం లేదని జపాన్‌ పరిశ్రమల మంత్రి కొషి హగిఉదా తేల్చి చెప్పారు. అమెరికా ఇంథనశాఖ మంత్రితో భేటీలో దీనిప్రస్తావన వచ్చింది. ఇంథన భద్రత ఒక్కో దేశానికి ఒకో విధంగా ఉంటుందని, అమెరికాకు అనుగుణంగా తాము ఉండలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అవసరాల్లో నాలుగుశాతం చమురు, తొమ్మిది శాతం ఎల్‌ఎన్‌జిని జపాన్‌ దిగుమతి చేసుకుంటున్నది.


జర్మనీలో పెద్ద మొత్తంలో గాస్‌ దిగుమతి చేసుకొనే యునిపర్‌ సంస్ధ రష్యాకు రూబుళ్లలో చెల్లించాలని నిర్ణయించింది. తమ నుంచి ఇంథనాన్ని కొనుగోలు చేసే వారు రూబుళ్లలోనే చెల్లించాలని గత నెలలో పుతిన్‌ చేసిన ప్రకటనను అంగీకరించరాదని ఐరోపా కమిషన్‌ ప్రకటించినప్పటికీ జర్మన్‌ సంస్ధ దానికి భిన్నంగా పోతున్నది. రష్యా నిర్ణయం ప్రకారం దాని స్నేహితులు కాని దేశాల సంస్ధలు గాజ్‌ప్రోమ్‌ బాంకులో రెండు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒక ఖాతాలో తాము చెల్లించే విదేశీ కరెన్సీని జమచేస్తే దాన్ని బాంకు రూబుళ్లలోకి మార్చి బాంకు రూబుల్‌ ఖాతాకు బదిలీ చేస్తుంది. రూబుళ్లలో చెల్లించని పక్షంలో ఇంథన సరఫరా నిలిపివేస్తామని పోలాండ్‌, బల్గేరియాకు గాజ్‌ప్రోమ్‌ చెప్పేసింది.యునిపర్‌ చర్య ఆంక్షలను ఉల్లంఘించటమే అని ఐరోపా కమిషన్‌ చెప్పింది.
రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు,బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన కరెన్సీలో చెల్లింపుల గురించి సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో అమెరికా డాలరు వాటా 40శాతం ఉంది. 2021 డిసెంబరులో చైనా కరెన్సీ 2.7శాతం ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 3.2శాతానికి పెరిగింది. జపాన్‌ ఎన్‌ను వెనక్కు నెట్టి నాలుగవ స్ధానానికి ఎదిగింది. ఈ ఏడాది జనవరిలో ఇతర కరెన్సీల చెల్లింపులు 6.48శాతం తగ్గితే చైనా కరెన్సీ 11శాతం పెరిగినట్లు స్విఫ్ట్‌ వెల్లడించింది.2030నాటికి ప్రపంచంలో రిజర్వు కరెన్సీలో చైనా మూడవ స్దానంలో ఉంటుంది.


ఉక్రెయిన్‌ పరిణామాలతో అమెరికా పెద్దగా ప్రభావితం కాలేదు. కానీ అక్కడ మే ఐదవ తేదీన సహజవాయువు ధర (ఎంఎంబిటియు) 8.32 డాలర్లకు పెరిగింది. ఇది పదమూడు సంవత్సరాల నాటి రికార్డును అధిగమించింది. రానున్న కొద్ది వారాల్లో పది డాలర్లకు చేరవచ్చని భావిస్తున్నారు. 2008లో గరిష్టంగా 14డాలర్లు దాటింది.2020లో కనిష్టంగా 2.10 డాలర్లు నమోదైంది. పీపా చమురును 70 డాలర్లకంటే తక్కువకు సరఫరా చేయాలని మన దేశం రష్యాతో బేరమాడుతోందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది. రవాణా, ఆంక్షలు, నిధుల వంటి ఇబ్బందులను గమనంలో ఉంచుకొని రాయితీ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది. ఒప్పందం కుదిరితే మే నెలలో 15మిలియన్‌ పీపాలు దిగుమతి చేసుకోవచ్చని, ఇది భారత్‌ దిగుమతుల్లో పదిశాతానికి సమానమని కూడా వెల్లడించింది.
ఒకవైపు అమెరికా బెదిరిస్తున్నప్పటికీ మన దేశం రష్యా చమురు కోసం బేరసారాలాడటంలో ఆర్ధికాంశంతో పాటు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉన్నాయి.2013-14లో మన దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా సగటు ధర 105.52 డాలర్లు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలలో ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పిపిఏసి సమాచారం మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో సగటు ధర 103.10 డాలర్లు ఉంది.
సంవత్సరం×××× డాలర్లలో ధర
2014-15××× 84.16
2015-16××× 46.17
2016-17××× 47.56
2017-18××× 56.43
2018-19××× 69.88
2019-20××× 60.47
2020-21××× 44.82
2021-22××× 79.18
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడి చివరి సంవత్సరంలో ఉన్న స్ధాయి కంటే ఇప్పటికీ తక్కువగానే ఉన్నా సరే నరేంద్రమోడీ సర్కార్‌ అంతర్జాతీయంగా తగ్గిన మేరకు జనాలకు ధరలను తగ్గించలేదు. భారీ ఎత్తున సుంకాలు పెంచి ఆ మొత్తాలను కార్పొరేట్లకు రాయితీలకు మళ్లించటం, ఇతర అంశాలే దీనికి కారణం. వాటికి తోడు రూపాయి విలువ పతనం కూడా తోడైంది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ మన కరెన్సీ విలువ పతనాన్ని అరికట్టటంలో విఫలమైందని నరేంద్రమోడీ సహా అనేక మంది బిజెపి నేతలు గతంలో విమర్శించారు. అందువలన ఇప్పుడు వారి నిర్వాకం కూడా జనాలకు శాపంగా మారింది.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు ఐరోపా సంఘ(ఇయు) దేశాలు చమురు,గాస్‌, బొగ్గు దిగుమతులకు గాను రష్యాకు 50బిలియన్‌ డాలర్లు చెల్లించాయి. ఒపెక్‌ మరియు దానితో అనుసంధానం ఉన్న మొత్తం 23దేశాలు ప్రతి నెలా సమావేశమై మార్కెట్‌ను సమీక్షిస్తాయి. ఇవి 40శాతం చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా జరిపిన సమీక్షలో ఇంతకు ముందే నిర్ణయించిన మేరకు స్వల్పంగా తప్ప ఉత్పత్తిని పెంచరాదని తీర్మానించాయి. రోజుకు పది మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేసే రష్యా మీద ఆంక్షల కారణంగా సరఫరా తగ్గితే గిరాకీ మేరకు ధరలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఇదే జరిగితే మన వంటి దేశాల మీద భారం పెరుగుతుంది. ఒపెక్‌ దేశాలు రోజుకు 28మిలియన్ల పీపాల చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది మొత్తం ఉత్పత్తిలో 30శాతానికి సమానం.ఐరోపాలోని రష్యా మార్కెట్‌ను ఆక్రమించేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. తన దగ్గర ఉన్న నిల్వల నుంచి ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నది. అవి తగ్గిపోతున్నందున ఆమేరకు ఉత్పత్తిని పెంచాల్సి ఉంది.ఐరోపా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలంటే అందుకు పెట్టుబడులు, పరికరాలు, సిబ్బంది కూడా అవసరమే. తీరా ఆ మేరకు పెట్టుబడులు పెట్టిన తరువాత ఎగుమతి అవకాశాలు తగ్గితే ఎలా అన్న గుంజాటనలో అమెరికా కంపెనీలు ఉన్నాయి.


ఒపెక్‌, దానితో సమన్వయం చేసుకుంటున్న దేశాలు ఉత్పత్తి నియంత్రణ, ధరల పెంపుదలకు కుమ్మక్కు అవుతున్నాయని, అందువలన అలాంటి దేశాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పిస్తూ ఒక బిల్లును అమెరికా సెనెట్‌ న్యాయ కమిటీ ఆమోదించింది. దీనికి నోపెక్‌ (నో ఆయిల్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్‌ ఎక్స్‌పోర్టింగ్‌ కార్టెల్స్‌) అని పేరు పెట్టారు. దీన్ని పార్లమెంటు ఆమోదిస్తే తప్ప చట్టం కాదు. ఇలాంటి బిల్లు గురించి గత రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు వస్తున్నా పార్లమెంటులోల ప్రవేశపెట్టలేదు. అమెరికాలో కూడా చమురు ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదల నేపధ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రోలు ధరలు : రావణదేశంలో 89, సీత పుట్టింట్లో 100, రామరాజ్యంలో 120 !

28 Thursday Apr 2022

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


కేేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలుపై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఈ ప్రస్తావన చేశారు. దేశ ప్రయోజనాల కోసం పన్ను తగ్గించాలన్నారు. ఇలాంటి సుభాషితాలు చెప్పటానికి మోడీ గారికి సర్వహక్కులూ ఉన్నాయి. నీతులెందుకు గురువా అంటే ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా అన్నది తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాలు నవంబరులో తగ్గించాయి.ఆమ్‌ ఆద్మీ ఢిల్లీ సర్కార్‌ కొద్ది రోజుల తరువాత తగ్గించింది. ఇతర రాష్ట్రాలను అడిగేందుకు ఆరు నెలలుగా ప్రధానికి అవకాశమే దొరకలేదా ? దేశ ప్రయోజనాల కోసం ఒక రోజు లేదా ఒక గంట తీరిక చేసుకోలేని పరిస్దితి ఉందా అన్న సందేహం రావటం సహజం. పన్ను తగ్గించని రాష్ట్రాలు ప్రజలకు అన్యాయం, పొరుగు రాష్ట్రాలకు హాని కలిగించటమే అని, ఆరునెలలు గడిచింది ఇప్పటికైనా తగ్గించండి అంటూ జనంలో ప్రతిపక్ష పార్టీలపై వ్యతిరేకతను రేకెత్తించేందుకు ఒక రాజకీయ నేతగా తన చాణక్యాన్ని ప్రదర్శించారు. ఎనిమిది సంవత్సరాలుగా ఏదో ఒకసాకుతో వీరబాదుడు కొనసాగిస్తున్న ప్రధాని రాష్ట్రాల మీద ఎదురుదాడికి దిగారు.


ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం నామమాత్రంగా సెస్‌ను, కొన్ని రాష్ట్రాలు వాట్‌ తగ్గించటంతో పాటు చమురు కంపెనీలు 137 రోజులు చమురు ధరలను స్థంభింప చేశాయి. ఇవన్నీ దేశ లేదా ప్రజల కోసమే అనుకుందాం. ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న స్ధితిలో అవి మరింతగా పెరిగేంతగా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచినపుడు గుర్తులేని దేశ ప్రజలు ఇప్పుడు గుర్తుకు రావటం గమనించాల్సిన అంశం. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నెల నెలా ప్రభుత్వం విడుదల చేసే అశాస్త్రీయ గణాంకాలు కూడా పెరుగుదలను చూపుతున్నాయి. వాటిని కొంత మేరకైనా అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చమురుపై పన్నులను తగ్గించాలని ఆర్ధికవేత్తలు చెబుతున్న తరుణంలో నరేంద్రమోడీ దాన్ని ప్రస్తావించకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద పడ్డారు. ఏప్రిల్‌ 27వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక సమాచారం ప్రకారం ఆ రోజు బిజెపి ఏలుబడిలోని భోపాల్‌లో లీటరు పెట్రోలు రు.118.14, పాట్నాలో రు.116.23, బెంగలూరులో రు.111.09, లక్నోలో రు.105.25 ఉంది. ఒకే పార్టీ పాలిత ప్రాంతాల్లో ఇంత తేడా ఎందుకున్నట్లు ? ముందు వాటిని సరి చేస్తారా లేదా ? గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం పక్కనే ఉన్న రావణరాజ్యం శ్రీలంక ఆర్ధిక సంక్షోభంతో అతలాకుతలం అవుతున్నది. అక్కడ ఏప్రిల్‌ 25న పెట్రోలు రేటు రు.373, అదే మన కరెన్సీలోకిి మార్చితే రు.80.39.సీతాదేవి పుట్టిన నేపాల్లో రు.100 ఉంది.మన రామరాజ్యంలో రు.105 నుంచి 120 వరకు ఉంది. ఇక పాకిస్తాన్లో రు.61.41, బంగ్లాదేశ్‌లో రు.79.09 ఉందంటే ప్రజాప్రయోజనం గురించి మాట్లాడేవారికి ఆగ్రహం రావటం సహజం.


పన్నులు అసలే వద్దని ఎవరూ అనరు. గత ఎనిమిది సంవత్సరాల్లో కార్పొరేట్లకు పన్ను తగ్గింపు, రాయితీలు పెంపు. సామాన్యులకు సబ్సిడీల కోత-పన్నుల వాత తెలిసిందే. కాంగ్రెస్‌ ఏలుబడిలో చమురు సంస్ధలకు పెట్టిన బకాయిలను తీర్చేందుకు తాము పన్ను మొత్తాన్ని పెంచవలసి వచ్చిందని చెప్పారు. నిజం ఏమిటి ? ప్రభుత్వాలు బాండ్లను జారీ చేయటం ప్రపంచమంతటా జరుగుతున్నదే. వినియోగదారులకు ఎంత సబ్సిడీ ఇస్తే అంత మొత్తాన్ని చమురు కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాలను చెల్లించకుండా చమురు కంపెనీలకు ప్రభుత్వం ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వటాన్నే బాండ్లు అంటున్నారు. వడ్డీ కూడా చెల్లించాలి. ఈ మొత్తాలను పది నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో చెల్లించే అవకాశం ఉంది. దాని వలన చమురు కంపెనీలకు నష్టం ఉండదు, ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది.ఈ బాండ్లను చమురు కంపెనీలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు లేదా ఇతర సంస్ధలకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. చమురు బాండ్లను వాజ్‌పేయి సర్కార్‌ కూడా జారీ చేసింది ? జనానికి ఇచ్చిన దానికి ఏడుపెందుకు ?


2002-03 సంవత్సర బడ్జెట్‌ ప్రసంగంలో నాడు వాజ్‌పారు సర్కార్‌ ఆర్ధిక మంత్రిగా ఉన్న యశ్వంత సిన్హా ప్రభుత్వం చమురు బాండ్లను జారీ చేయనున్నదని చెప్పారు. 2014-15 సంవత్సర బడ్జెట్‌ పత్రాలలో పేర్కొన్నదాని ప్రకారం 2013-14 సంవత్సరం నాటికి చెల్లించాల్సిన బాండ్ల విలువ మొత్తం రు.1,34,423 కోట్లు. 2018లో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ” కాంగ్రెస్‌ హయాంలో కొనుగోలు చేసిన రు.1.44లక్షల కోట్ల రూపాయల చమురు బాండ్లు మాకు వారసత్వంగా వచ్చాయి. ఈ మొత్తమే కాదు, వీటికి గాను కేవలం 70వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించాము. రెండు లక్షల కోట్ల రూపాయలను చెల్లించటం ద్వారా మా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాము. చమురు ధరలు ఎక్కువగా ఉండటానికి చెల్లించాల్సిన చమురు బాండ్లు దోహదం చేశాయి ” అని చెప్పుకున్నారు. వడ్డీతో సహా ఈ మొత్తం వినియోగదారులకు ఇచ్చిన రాయితీ తప్ప మరొకటి కాదు. జనానికి ఇచ్చిన ఈ మొత్తం గురించి బిజెపి మంత్రి చెప్పిన తీరు జనం నుంచి వసూలు చేసే పన్ను భారాన్ని సమర్ధించుకొనేందుకు ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు.ఈ మొత్తాన్ని చెల్లించేశాము అని చెప్పటం పెద్ద అబద్దం. తొలుత కాంగ్రెస్‌ అప్పులను తీర్చటం కోసమే పన్నులు పెంచామన్నారు. తరువాత బాణీ మార్చి సరిహద్దులో చైనాతో వివాదం కారణంగా తలెత్తిన ఖర్చు జనం గాక ఎవరు భరించాలి ? అందుకే పన్నులను కొనసాగించక తప్పదు అని వాదించారు. ఇప్పుడు ఎందుకు కొనసాగిస్తున్నట్లు అంటే అభివృద్ది పనులకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే వారని చెప్పాల్సి వస్తోంది. మన భూభాగాన్ని చైనీయులు ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. అలాంటపుడు సరిహద్దుల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి అమెరికా,ఇజ్రాయెల్‌, రష్యా తదితర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి జనాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టినట్లు ? ఇప్పటి వరకు చెల్లించింది పోగా 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో మరో 26,150 కోట్లు, 2024 ఫిబ్రవరి-డిసెంబరు మాసాల మధ్య 37,306.33 కోట్లు, 2025లో 20,553.84 కోట్లు, చివరిగా 2026లో 36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది.


ఈ బాండ్ల పేరుతో పెంచిన పన్నులతో కేంద్రానికి వచ్చిన రాబడి ఎలా ఉందో చూడండి. 2014-15నుంచి 2021-22 వరకు కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన డివిడెండ్‌, ఆదాయపన్ను మొత్తం రు.4,07,190 కోట్లు. ఇవిగాక కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగం నుంచి వచ్చిన ఇతర పన్ను ఆదాయం రు.21,82,198 కోట్లు, రెండింటినీ కలిపితే రు.25,89,388 కోట్లు ? కాంగ్రెస్‌ ఏలుబడిలో జారీ చేసిన బాండ్ల మొత్తం ఎంత ? అ పేరుతో జనాన్ని బాదింది ఎంత ? గుండెలు తీసే బంట్లకు తప్ప ఇది మరొకరికి సాధ్యమా ?


ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఉంది.2014-15లో కేంద్ర ప్రభుత్వానికి చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రు.1,26,025 కోట్లు కాగా 2020-21కి అది రు.4,19,884 కోట్లకు చేరింది. ఖరారు కాని వివరాల ప్రకారం 2021-22లో అది రు.3,10,155 కోట్లు. దీనికి కేంద్రం తగ్గించిన సెస్‌ కారణం కావచ్చు. ప్రధాని కాంగ్రెసేతర రాష్ట్రాలను పన్ను తగ్గించాలని కోరారు. ఇక్కడ రాష్ట్రాలు రాష్ట్రాలే, బిజెపివా, ఇతర పార్టీలవా అని కాదు. కేంద్రం తగ్గించిన స్వల్ప మొత్తాల గురించి చెబుతున్నది తప్ప పెంచిన భారాన్ని తెలివిగా తెరవెనక్కు నెట్టాలని చూస్తున్నది. ఇదే కాలంలో రాష్ట్రాలన్నింటికి చమురు మీద వచ్చిన వాట్‌ మొత్తం రు.13,70,295 కోట్లు, అంటే కేంద్రానికి వస్తున్నదానిలో సగం.2014-15లో రాష్ట్రాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను ఆదాయం రు.1,60,526 కోట్లు కాగా కేంద్రానికి వచ్చింది రు.1,26,025 కోట్లు మాత్రమే. 2020-21కి రాష్ట్రాలకు రు.2,17, 221 కోట్లకు పెరగ్గా అదే కేంద్రానికి రు.4,19,884 కోట్లకు చేరింది. ఇవన్నీ ప్రతిపక్షాలు చెప్పిన అంకెలు కాదు, కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌(పిపిఏసి) విడుదల చేసినవే. కేంద్ర పన్నులలో 41శాతం తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నాము కదా అని బిజెపి నేతలు వాదిస్తారు. అది గతంలోనూ 32శాతం వాటా ఉందిగా. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు మోడీ సర్కారు పెట్టిన టోపీ ఏమిటంటే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన పన్ను కాకుండా ఇవ్వనవసరం లేని సెస్సులను పెంచి అన్యాయం చేశారు. బిజెపి పాలిత నేతలు నోరు మూసుకున్నారు. ఏప్రిల్‌ 27 నాటి సిఎంల సమావేశంలో ప్రధాని మోడీ పన్ను తగ్గించిన తమ పార్టీ పాలిత కర్ణాటకకు ఐదువేల కోట్లు గుజరాత్‌లకు 3,500-4,000 కోట్ల మేరకు ఆదాయం తగ్గిందని చెప్పారు.బిజెపి ఏతర పాలిత రాష్ట్రాలు తగ్గించకపోవటం వలన ప్రజలకు అన్యాయం, ఇతర రాష్ట్రాలకు హాని జరుగుతున్నదని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సెస్‌లో వాటా ఎగవేసి కేంద్రం కలిగించిన నష్టం గురించి కూడా చెబితే నిజాయితీగా ఉండేది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మీద దాడి ప్రారంభించి అసలు అంశాన్ని మరుగుపరచారు.


ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే సంస్ధల నుంచి చిల్లర ధరల కంటే ఎక్కువ వసూలు గురించి కేరళ హైకోర్టులో కేసు నడుస్తున్నది. అక్కడి ఆర్టీసికీ చిల్లర ధరలకే డీజిల్‌ సరఫరా చేయాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సవాలు చేశాయి. రెండు రకాల ధరలను వసూలు చేయటం వెనుక ఉన్న తర్కం, కారణాలను చెప్పాలని ఇద్దరు సభ్యులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగిన మేరకు సాధారణ జనానికి చిల్లర ధరలను పెంచితే అశాంతి ఏర్పడుతుందని తాము ఆ మేరకు పెంచలేదని, క్రమంగా పెంచుతామని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ఇక ధరల నిర్ణయానికి ప్రపంచ మార్కెట్‌ ధరలు, భవిష్యత్‌లో పెరిగే ముడి చమురు ధరలు,రవాణా ఖర్చులు, స్ధానిక పన్నుల వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపాయి. ధరల నిర్ణయం విధానపరమైనదని దాన్ని ప్రశ్నించరాదని వాదించాయి. ఆర్టీసికి వారి వద్దకు తీసుకుపోయి అందచేస్తామని, చిల్లర వినియోగదారులకు అలా కాదని, ఆర్టీసికి 45 రోజుల తరువాత డబ్బు చెల్లించే వెసులు బాటు ఇచ్చామని, ఈ ఏడాది జనవరి వరకు వారికి చిల్లర ధరకంటే తక్కువకే సరఫరా చేశామని, అప్పుడు మౌనంగా ఉండి పెంచిన తరువాత వివాదం చేస్తున్నారని పేర్కొన్నాయి. కేరళ ఆర్టీసి లేదా మరొక రాష్ట్ర సంస్ధకైనా, రిటైల్‌ డీలర్లకైనా చమురు కంపెనీలు ఒప్పందం ప్రకారం వాని వద్దకే తీసుకుపోయి సరఫరా చేస్తాయి. ఏదో ఒక పేరుతో జనాన్ని బాదటం తప్ప వేరు కాదు. ఏదైనా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దోహదం చేసేదే. పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న తమకు ధరలు పెంచినందున రోజుకు 85లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని,ప్రైవేటు బస్సులకు ఒక ధర, ఆర్‌టిసికి ఒక ధర వివక్ష చూపటమే అని కేరళ ఆర్‌టిసి వాదించింది. మిగతా రాష్ట్రాల ఆర్టీసిలకూ పెంచినప్పటికీ ఎక్కడా సవాలు చేయలేదు, డీజిలు పేరుతో ప్రయాణీకుల మీద అదనపు భారం మోపుతున్నారు. ఈ కేసులో చమురు సంస్ధలకు అనుకూల తీర్పు వస్తే అది ఆర్‌టిసీలన్నింటికీ పెనుభారమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : కార్పొరేట్ల కోసం సృష్టించిన యుద్దమిది, కాదంటారా !

26 Saturday Mar 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

corporate loves a good war, Fuel Price in India, profiting from war, Ukraine-Russia crisis, US imperialism, US military-industrial complex


ఎం కోటేశ్వరరావు


అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో సైనిక చర్య మొదలై నెల రోజులు దాటింది. అది ఉక్రెయిన్‌ పౌరులకు ప్రత్యక్షంగా నరకం చూపుతోంది. మూడున్నర మిలియన్ల మంది ఇరుగు పొరుగుదేశాలకు వెళ్లారు, దాదాపు కోటి మంది కొలువులు, నెలవులు తప్పినట్లు వార్తలు. మరోవైపు ప్రపంచ వ్యాపితంగా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నాటో కూటమి దేశాల్లోని వారు బావుకున్నదేమీ లేదు. అయినప్పటికీ వివాదాన్ని ఇంకా కొనసాగించాలని అమెరికా కూటమి చూస్తోంది. మే నెల తొమ్మిదవ తేదీ రెండవ ప్రపంచయుద్ధంలో జర్మనీపై విజయం సాధించిన రోజని అందువలన అప్పటిలోగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని రష్యా నేతలు ఆదేశించినట్లు ఉక్రెయిన్‌ మిలిటరీ ప్రతినిధులు చెప్పారు. అంటే అప్పటి వరకు పశ్చిమ దేశాలు ఈ వివాదాన్ని మరింతగా ఎగదోస్తూనే ఉంటాయా? ఉక్రెయిన్‌, ఇతర దేశాల పౌరులను యాతనలకు గురి చేస్తాయా ?


వాస్తవాల పత్రం పేరుతో మార్చి 16వ తేదీన అమెరికా ప్రభుత్వం ప్రకటించిన వివరాల మేరకు శాంతిని కోరుకుంటున్నట్లు, నిత్యం మానవహక్కుల గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్న అమెరికా కూటమిలోని 30దేశాలు అగ్నికి ఆజ్యం పోస్తూ మంటలను ఎగదోస్తున్నాయి. జో బైడెన్‌ తాజాగా ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయంతో బైడెన్‌ గత పనిహేను నెలల కాలంలో ఉక్రెయినుకు ఇచ్చినది రెండువందల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఇదంతా అమెరికా యుద్ద పరిశ్రమల వారికి కట్టబెట్టిన మొత్తమే. మూడో దేశం ద్వారా సరఫరా చేసిన వాటితో సహా ఏఏ ఆయుధాలు, ఎంత మందుగుండు సరఫరా చేసిందీ దానిలో ఉన్నాయి. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. లాభం లేకుండా పశ్చిమ దేశాలు భారీసాయం చేస్తే వాటికి వచ్చేదేముంటుంది ?
చైనా, పాకిస్తాన్లను బూచిగా చూపి మన దేశంతో ఆయుధాలకు ఎలా ఖర్చు పెట్టిస్తున్నదో తద్వారా అమెరికా ఎంతగా లాభపడుతున్నదో తెలిసిందే. ఇప్పుడు రష్యాను బూచిగా చూపుతూ నాటో దేశాలన్నింటితో తమ తమ ఆయుధాలను కొనిపిస్తున్నది. ఉక్రెయిను ఒక్కదానికే 350 కోట్లతో సహా తూర్పు ఐరోపా దేశాలకు 650 కోట్ల డాలర్లను ఆయుధాల కోసం బైడెన్‌ బడ్జెట్‌ కేటాయించాడు. ఐదుసార్లు ఇప్పటి వరకు ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. ఒప్పందం కుదిరితే, శాంతి నెలకొంటే ఈ బడ్జెట్‌ నిధులు అవసరం ఉండదు కనుక కనీసం వాటిని ఖర్చు చేసేంత వరకైనా వివాదం-దాడులు కొనసాగాలని అమెరికా కోరుకుంటున్నది. ఉక్రెయిన్నుంచి తరువాత ఆ మొత్తాన్ని ఏదో ఒక రూపంలో వసూలు చేస్తుంది, ఈలోగా తానే ఆయుధాలు కొని కార్పొరేట్ల ఆకలి తీరుస్తుంది.టాంకులను ధ్వంసం చేసే 2,600 జావెలిన్‌(ఈటె) క్షిపణులను ఉక్రెయిన్‌ మిలిటరీకి అమెరికా సరఫరా చేసింది. వాటిని తయారు చేసేది లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియన్‌ అనే కంపెనీలు. పెద్ద అలలు వచ్చినపుడు నౌకలన్నీపైకి లేస్తాయి అన్నట్లుగా ఇప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు పోటీ పడుతున్నాయి. మిలిటరీ మాజీ అధికారులే సలహాదారులు, మధ్యవర్తులుగా ఉంటారు.యుద్దాలు లేకపోతే ఈ కంపెనీలన్నీ మూతపడతాయి కదా !


రష్యాదాడులను సాకుగా చూపి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ తయారు చేసే ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లు 35 కొనుగోలు చేయాలని జర్మనీ నిర్ణయించింది. నాటో దేశాలన్నీ ఇదే బాటలో ఉండటంతో ఆయుధకంపెనీల వాటాల ధరలు ఈ ఏడాది ఇప్పటికే గణనీయంగా పెరుగుతున్నాయి. ఐరోపా, దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల కారణంగా తమ పంట పండుతున్నదని సిఇఓలు నిస్సిగ్గుగా చెబుతున్నారు. అనేక దేశాలు గతంలో కొనుగోలు చేసినవి ఉపయోగించకపోవటం లేదా పాతపడటంతో పనికిరానివిగా పక్కన పడేసి కొత్తవి కొంటున్నాయి. ఫ్రాన్స్‌,బ్రిటన్‌ వంటి దేశాల్లో కూడా ఆయుధకంపెనీలున్నా సింహభాగం అమెరికన్లకే పోతోంది. అందుకే నేషనల్‌ డిఫెన్స్‌ ఇండిస్టియల్‌ అసోసియెషన్‌ జనవరిలోనే అమెరికా పార్లమెంట్‌ సభ్యుల మీద వత్తిడి చేసింది.” రక్షణ ఖర్చు పద్దుల ఆమోదంలో వైఫల్యం ” ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ, తూర్పు ఆసియా, దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలకు ప్రతిచర్యలు తీసుకోవటంలో, సమర్దత, తీవ్రంగా పరిగణించకపోవటం ముప్పును సూచిస్తున్నదని ” పేర్కొన్నది.ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ రాజీకి సంసిద్దను ప్రకటించినా బైడెన్‌, ఇతర దేశాలు పడనీయకుండా సంక్షోభాన్ని కొనసాగించేందుకు పూనుకోవటం వెనుక ఎవరి వత్తిడి, లబ్ది ఉందో అరటితొక్క వలచి పండు పెట్టినట్లుగా చెప్పాల్సిన పని లేదేమో ! ఒక్క ఆయుధకంపెనీలేనా లబ్ది పొందుతున్నది ?


గత నెల రోజుల్లో అమెరికా ఇంధన కంపెనీల విలువ పదిశాతం పెరిగింది. ఆ మొత్తం 239 బిలియన్‌ డాలర్లని అంచనా. ఈ కాలంలో బ్రెంట్‌ రకం ముడిచమురు ధరలు 32శాతం పెరిగాయి. దానితో బాటే ఇతర రకాల ధరలూ పెరిగి కార్పొరేట్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక కంపెనీ యజమాని ప్రపంచంలోని ఐదువందల మంది ధనికుల జాబితాలో చేరాడు. హరోల్డ్‌ హామ్‌ అనే కాంటినెంటల్‌ రిసోర్సెస్‌ కంపెనీ కుబేరుడి ఆస్తి విలువ 19.5 బి.డాలర్లు కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికి కంపెనీ వాటాల ధరలు పెరిగి మూడు నెలలు కూడా గడవక ముందే 5.75బి.డాలర్లు(41.2శాతం) పెరిగింది. దీంతో బ్లూమ్‌బెర్గ్‌ ధనవంతుల జాబితాలో అతని స్దానం 84నుంచి 37కు పెరిగింది. జెఫ్రీ హిల్డెబ్రాండ్‌ సంపద విలువ ఇదే కాలంలో 6.63 బి.డాలర్లు (101శాతం) పెరిగి 13.2 బి.డాలర్లకు చేరింది. అందరి సంపదల్లో ఇలాంటి పెరుగుదల లేకున్నా మొత్తం మీద ఇంథన కంపెనీలన్నీ లబ్దిపొందాయి.


మన దేశంలో చమురు కంపెనీలన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. రిలయన్స్‌, బిపి వంటి కొన్ని కంపెనీలు రంగంలో ఉన్నా పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సినవి కాదు. ముడి చమురు ధరలు పెరిగినదానికి అనుగుణంగా ప్రభుత్వ కంపెనీలు నవంబరు నాలుగు నుంచి మార్చి 21వరకు ధరలను పెంచకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి లబ్దికి స్ధంభింప చేసిన సంగతి తెలిసిందే. దీంతో అపరదేశ భక్తులలైన అంబానీలు తమ బంకులను మూసివేశారు. వారికోసం, ప్రభుత్వ కంపెనీల నష్టాలు తగ్గించేందుకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వారికి డీజిలు ధరలను లీటరుకు రు. 25 వరకు పెంచిన సంగతి తెలిసిందే. దీని వెనుక మరొక ఎత్తుగడ కూడా ఉంది. ఆ మేరకు సాధారణ వినియోగదారులను కూడా భరించేందుకు మానసికంగా సిద్దం చేయటమే అది. కొత్త పద్దతులను కనుగొనటంలో బిజెపి సర్కార్‌ తీరు అనితరసాధ్యం. ఇప్పుడు ప్రతి రోజూ వడ్డించటం ప్రారంభించారు.జనం కూడా కిక్కురు మనకుండా ఇంకా దేశభక్తి మత్తులోనే ఉన్నందున కొనుగోలు చేస్తున్నారు. ఇహలోకంలో పరమ దరిద్రాన్ని అనుభవించి పుణ్యం చేసుకుంటే పరలోకంలో స్వర్గం ప్రాపిస్తుందని నమ్మే మనకు చమురు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల, ఇబ్బందులు పెట్టే ప్రభుత్వ విధానాలు ఒక లెక్కా ! ఏ జన్మలోనో చేసుకున్న పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం, మోడీ మాత్రం ఏం చేస్తారు, మనం వస్తువులను కొనకుండా ఉంటే పోయె, అంత ధరలకు కొనాలని మనల్నేమైనా వత్తిడి చేశారా అనే వేదాంతాన్ని జనం వల్లిస్తున్నారు.


అంతర్జాతీయ మార్కెట్లో మన దేశం కొనుగోలు చేసే ముడి చమురు ధర 2021నవంబరు నెల సగటు 81.51 డాలర్లు, మార్చి 24న 117.71 ఉంది. మార్చి 26వ తేదీన ఇది రాసిన సమయానికి ముడిచమురు బ్రెంట్‌ రకం ధర 120.65 డాలర్లు. మనం కొనుగోలు చేసేది దానికి ఒక డాలరు తక్కువగా ఉంటుంది. పీపా 81.51 డాలర్లు ఉన్నపుడు నిర్ణయించిన ధరల మీద ప్రతిరోజూ కొంత పెంచుతున్నారు. మొత్తం పాతిక రూపాయలా, ఇంకా ఎక్కువగా ఉంటుందా అన్నది చెప్పలేము. చమురు ధరల పెరుగుదల వృద్ది రేటును దెబ్బతీస్తుంది. నోట్ల ముమ్మరాన్ని(ద్రవ్యోల్బణం) పెంచుతుంది, అది ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దీన్నే స్టాగ్‌ఫ్లేషన్‌ అంటున్నారు. ఇది జనజీవితాలను అతలాకుతలం చేస్తుంది. జనాల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది, తద్వారా వృద్ధి రేటు మరింత పడిపోతుంది. అది వేతనాల మీద పడి కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఒకదాన్ని మరొకటి దెబ్బతీసే ఒక వలయం ఇది.

చమురుతో పాటు గృహావసరాలకు వాడే గాస్‌ ధరను రు.50 పెంచి వెయ్యిదాటించారు. ఇది 70శాతం గృహస్తులను ప్రభావితం చేస్తుంది. వీరిలో ఆమ్‌ ఆద్మీ నుంచి అంబానీల వరకు అందరూ ఉంటారు. సమస్య సామాన్యులకే స్వంత విమానాలను కలిగి ఉన్నవారికి ఏముంటుంది. సౌదీ ఆరామ్‌ కో కంపెనీ టన్ను గాస్‌ ధరను తాజాగా 729 నుంచి 769 డాలర్లకు పెంచింది. గతేడాది నవంబరులో ధర 376డాలర్లు మాత్రమే. అందువల్లనే అప్పటి నుంచి మన దేశంలో కూడా విపరీతంగా ధర పెరిగింది. గాస్‌ మీద ఇస్తున్న సబ్సిడీని రు.40కి తగ్గించి ఎంత పెరిగితే అంత వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. తాజాగా పెంచినప్పటికీ చమురు కంపెనీలకు ఒక్కో సిలిండరుకు ఇంకా రు.100-125 నష్టమే అని చెబుతున్నందున ఆ మేరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి కోసం పెట్రోలు, డీజిలు ధరలను స్ధంభింప చేసిన కారణంగా 137 రోజుల్లో మూడు చమురు సంస్ధలకు వచ్చిన నష్టమే రు.19,000 కోట్లని అంచనా, వాటికి రావాల్సిన లాభాలను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆ మొత్తాలను జనాల నుంచి వసూలు చేసేందుకు పూనుకున్నారు. ఎంత తెలివి ?


ధరల పెరుగుదలను ఆరుశాతంలోపుకు పరిమితం చేయాలన్నది రిజర్వుబాంకు లక్ష్యం. జనవరిలో 6.01గా ఉన్నది ఫిబ్రవరిలో 6.07శాతానికి పెరిగింది. ఫిబ్రవరితో ముగిసిన ఏడాదిలో పదకొండు నెలల పాటు రెండంకెలకు మించి టోకు ధరలు పెరిగి ఫిబ్రవరిలో 13.11శాతంగా నమోదైంది. కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా ద్రవ్యోల్బణం మదింపులోనే లోపం ఉందన్నది ఒకటైతే, వాటిని కూడా తొక్కి పెట్టి తక్కువగా చూపుతున్నారన్న విమర్శలున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో చెబుతారు. సంక్షోభానికి కారణంగా అమెరికా, నాటో కూటమి అనుసరించిన దేశాలే అన్నది అందరికీ తెలుసు. కానీ వారి వైఖరి తప్పని చెప్పటానికి మాత్రం నోరు రాదు. ఎందుకటా దేశ ప్రయోజనాల రీత్యా ఎవరినీ నొప్పించకూడదట. మరి ధరల పెరుగుదల సంగతేమిటి ? జన ప్రయోజనాలు ప్రభుత్వాలకు పట్టవా ? ఏమి రాజకీయం నడుస్తోందో మనం గమనిస్తున్నామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

దడ పుట్టిస్తున్న చమురు ధరలు – నరేంద్రమోడీ జనం గురించి పట్టించుకుంటారా ?

03 Thursday Mar 2022

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, crude oil price, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు గురువారం నాడు మరో మెట్టు ఎక్కాయి. ఇది రాసిన సమయానికి బ్రెంట్‌ రకం పీపా ధర 116.94 డాలర్లను తాకింది. వ్యూహాత్మక నిల్వల నుంచి 60మిలియన్ల పీపాల చమురును మార్కెట్లోకి విడుదల చేయాలని అంతర్జాతీ ఇంధన సంస్ధ(ఐఇఏ) మంత్రుల సమావేశం ప్రకటించిన తరువాత కూడా మార్కెట్లో ధరలు పెరిగాయి. ఈ మొత్తంలో తాము 30మిలియన్ల పీపాలు విడుదల చేస్తామని అమెరికా పేర్కొన్నది. అరవై మిలియన్ల పీపాలు ఐఇఏలోని 31 దేశాల నిల్వల్లో నాలుగుశాతం. ఈ దేశాల్లో 1.5బిలియన్ల పీపాలు ఉంటే ఒక్క అమెరికాలోనే 600మి. పీపాలుంది. మార్కెట్‌ ఇబ్బందుల్లో పడిన ప్రతికూల సందేశాన్ని సందేశాన్ని ఈ నిర్ణయం పంపిందని, అరవై మిలియన్లన్నది చమురు పీపాలో ఒకబొట్టు వంటిదని, ప్రపంచంలో ఒక రోజుకు అవసరమైన 100మి. పీపాల గిరాకీ కంటే తక్కువంటూ ఇది చమురు ధరలపై ప్రభావం ఎలా చూపుతుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆంక్షల కారణంగా మార్కెట్లోకి రష్యానుంచి రోజుకు ఏడు మిలియన్‌ పీపాల సరఫరా నిలిచిపోనుంది. ఆంక్షలున్నప్పటికీ తమ కొనుగోళ్లు కొనసాగుతూనే ఉంటాయని చైనా ప్రకటించింది. గోధుమల దిగుమతులపై గతంలో ఉన్న పరిమితులను కూడా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.


ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలతో నిమిత్తం లేకుండానే అమెరికాలో నాలుగుదశాబ్దాల రికార్డు స్ధాయిలో 7.5శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఇప్పుడు చమురు ధరల పెరుగుదల తోడైంది. కొందరి అంచనా ప్రకారం 125 డాలర్లకు పెరిగితే అమెరికా ఏకంగా మాంద్యంలోకి దిగజారుతుంది. ఐరోపా దేశాలకు చమురు, గాస్‌ అవసరం కనుక రష్యా నుంచి వాటి ఎగుమతులపై ఆంక్షలను మినహాయించారు, లేనట్లయితే ఐరోపాలో మరోరకం సంక్షోభం తలెత్తి ఉండేది.ఐరోపా దేశాలు మరిన్ని ఆంక్షలను విధించినట్లయితే తనకు మరింత నష్టమైనా రష్యా చమురు, గాస్‌ నిలిపివేత అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. ఈ కారణంగానే స్విఫ్ట్‌( అంతర్జాతీయ బాంకు లావాదేవీల వ్యవస్ధ) నుంచి ఏడు రష్యన్‌ బాంకులకు ఆంక్షల నుంచి పశ్చిమ దేశాలు మినహాయింపునిచ్చాయి. ఉక్రెయిన్‌ వివాదం వలన ఇంధన ధరలు పెరిగితే అది ద్రవ్యోల్బణానికి దారితీసి అమెరికా ఆర్ధిక పురోగతి, పౌరుల ఖర్చు తగ్గేందుకు దారి తీస్తుందని రిచ్‌మండ్‌ ఫెడరల్‌ రిజర్వు అధ్యక్షుడు టామ్‌ బార్కింగ్‌ హెచ్చరించాడు.ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ సగటున చమురు ధరలు వంద డాలర్లు ఉంటే అమెరికా ఆర్ధిక రంగం ఆరునెలల పాటు నిభాయించుకోగలదని, 125 డాలర్లకు పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందని, వృద్ధి ఆగుతుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జో బైడెన్‌ సైతం ఉక్రెయిన్‌ వివాదానికి అమెరికన్లు మూల్యం చెల్లించాల్సి రావచ్చని చెప్పిన అంశం తెలిసిందే.ఐరోపాలో గాస్‌ ధరలు 60శాతం పెరిగాయి. చలికాలంలో మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు. రష్యాకు వెసులుబాటు కల్పించేందుకు ఇరు దేశాల మధ్య తమ కరెన్సీలో చెల్లింపులకు చైనా ఏర్పాట్లు చేసింది.ఈ అనుభవం భవిష్యత్‌లో అంతర్జాతీయ మార్పిడి కరెన్సీగా డాలర్‌ను పక్కకు నెట్టేందుకు కూడా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం డాలర్‌ చెల్లింపులు 40శాతం ఉండగా చైనా కరెన్సీ రెన్‌మిన్‌బీ(యువాన్‌) రెండుశాతం జరుగుతున్నాయి.


2022-23 ఆర్ధిక సంవత్సరంలో ముడి చమురు పీపా ధర 70-75 డాలర్ల మధ్య ఉంటుందనే అంచనాతో కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. మార్చి నెలాఖరుతో ముగియనున్న ఆర్ధిక సంవత్సరంపై పెరిగిన చమురు ధరలు ప్రభావం చూపటం ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పెట్రోలు, డీజిలుపై సెస్‌లను ఐదు, పది చొప్పున తగ్గించటంతో పాటు నవంబరు నాలుగవ తేదీ నుంచి వాటి ధరలను స్ధంభింప చేశారు.ఈ నెల ఏడవ తేదీన చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత నుంచి చమురు ధరలు పెరగటం ఖాయం. రానున్న రోజుల్లో జిడిపి వృద్ధి తగ్గటంతో పాటు ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎంకి పెళ్లి సుబ్చి చావుకు వచ్చిందన్నట్లుగా ఉక్రెయిన్‌ – రష్యా వివాదంతో మనకు ప్రమేయం లేనప్పటికీ దాని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తోంది. మన దిగుమతుల బిల్లు తడిచి మోపెడు అవుతోంది.దీంతో మన కరెంటు ఖాతాలోటు పెరుగుతోంది. ముడిచమురు, ఎరువులు, ఖాద్య, ఖనిజతైలాలు, ఇతర దిగుమతుల ధరలు పెరుగుతున్నాయి. దిగుమతుల బిల్లు 2022లో 600బి. డాలర్లు దాటవచ్చని అంచనా. తక్షణం ద్రవ్యోల్బణం, దానితో పాటు వచ్చే ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం జరగవచ్చు. ఒక పీపా ధర ఐదు డాలర్లు పెరిగితే మన కరెంటు ఖాతాలోటు 6.6బి.డాలర్లు పెరుగుతుంది. ముడి చమురు ధర 105 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నప్పటి అంచనాల ప్రకారం మార్చి ఎనిమిది తరువాత చమురు కంపెనీలు పెట్రోలు, డీజిలు ధరలను పది రూపాయల వరకు పెంచవచ్చని అంచనా. ఇప్పుడు 117 డాలర్ల వరకు తాకింది. ఇది ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది. మన ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ ఏడాది తొలి ఆరునెలల పాటు చమురు ధరలు వంద డాలర్లకు ఎగువనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తంగా దేశ ప్రగతి నిస్తేజంగా ఉంటుందని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ విశ్లేషకులు చెప్పారు.


జాతీయ గణాంకాల సంస్ధ(ఎన్‌ఎస్‌ఓ) 2021-22లో వృద్ధి రేటు అంతకు ముందు సంవత్సరంలోని 7.3శాతం తిరోగమనాన్ని అధిగమించి 9.2శాతం పురోగమనం ఉంటుందని అంచనా వేసింది. తాజాగా తొమ్మిది నెలల తరువాత దాన్ని8.9శాతానికి తగ్గించింది. తొలి మూడు మాసాల్లో 20.3 శాతంవృద్ధి కాస్తా రెండవ త్రైమాసికంలో 8.4శాతానికి తగ్గింది.తదుపరి మూడు నెలల్లో 5.4శాతంగా ఉందని అంచనా వేశారు. చమురు ధరల పెరుగుదల గణనీయంగా ఉన్న జనవరి-మార్చి నెలల గణాంకాలు వెల్లడైతే స్పష్టమైన అంచనాలు తెలుస్తాయి. ఈ వృద్ధి కూడా గతేడాది తగ్గిన దాని ప్రాతిపదికన చెబుతున్న లెక్క కనుక వాస్తవ వృద్ధి రేటు అంత ఉండదు. అందుకే గతంలో ఉన్న జిడిపి స్దాయికి చేరాలంటే దీర్ఘకాలం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వుబాంకు వడ్డీ రేట్లను తక్కువగా ఉంచినప్పటికీ వృద్ది రేటు ఆందోళనకరంగా ఉంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగేట్లయితే వడ్డీ రేట్లు పెరుగుతాయి, అది మరొక సమస్యకు దారి తీస్తుంది.


వినియోగదారుల ధరల సూచిక (సిపిఐ) ప్రాతిపదికన ద్రవ్యోల్బణం ఆరుశాతం వరకు మనం భరించగలమని రిజర్వుబాంకు అన్నది. అంటే ఆ మేరకు ధరలు పెరుగుతాయని సిద్దంకమ్మని జనానికి చెప్పింది.డిసెంబరులో 5.59శాతం ఉన్నది జనవరిలో 6.01శాతానికి పెరిగింది. ఇదే తరుణంలో టోకు ధరల ద్రవ్యోల్బణం దాదాపు 13శాతంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక కూడా పదినెలల కనిష్టానికి పడిపోయింది. మన దేశంలో ప్రయివేటు వినియోగం 55శాతం ఉంది. ఇది కరోనాకు ముందున్న స్దాయికంటే తక్కువే. కరోనా మహమ్మారి జనాల పొదుపు మొత్తాలను, గణనీయంగా వేతనాలను హరించివేసినందున వినియోగం బలహీనంగా ఉంది. పులిమీద పుట్రలా దీనికి ఉక్రెయిన్‌ వివాదం మరింత ముప్పు తెచ్చింది. జనంపై పెరిగే భారాల గురించి ఏం చేద్దామన్న అంశాన్ని చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ పూనుకున్నారని గానీ, సమీక్షలు జరిపినట్లుగా ఎక్కడా వార్తలు లేవు. చేతులు కాలిన తరువాత ఆకలు పట్టుకున్నట్లు ఆపరేషన్‌ గంగ పేరుతో ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన మన విద్యార్దుల గురించి ఎక్కడలేని శ్రద్ద చూపుతున్నట్లు సమావేశాల మీద సమావేశాలు జరుపుతున్నట్లు ప్రకటిస్తున్నారు, మంచిదే, ఇవాళా రేపట్లో అది కూడా పూర్తి అవుతుంది. తరువాతనైనా జనం గురించి పట్టించుకుంటారా ?చమురు ధరలు తగ్గితే ఆ మేరకు జనానికి ఉపశమనం కలిగించకుండా వందల రెట్లు పన్ను, సెస్‌లు పెంచి ఖజానా నింపుకొనేందుకు చూపిన వేగం ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భారం తగ్గించేందుకు కనపరచరేం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!
  • కార్పొరేట్ల వత్తిడికి లొంగి ట్రంప్‌ చైనా పర్యటన !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d