Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అరవై రోజుల పాటు దాడుల విరమణకు ఒప్పందం చేసుకొని శాశ్వత అవగాహనకు రావాలని నిర్ణయించిన డోనాల్డ్ ట్రంప్ మరోమారు ఉల్లంఘనకు పాల్పడ్డాడు. జూలై నెలలో పదమÖడు రోజుల పాటు ఇరాన్‌పై భీకరదాడులు జరిపాడు.శుక్రవారం నుంచి నిలిపివేశాడు. ఇరాన్‌తో “ మంచి స్నేహపూర్వక మాటలు ” మాట్లాడుతున్నట్లు సోమవారం నాడు చెప్పాడు. అయితే సంప్రదింపులు దీర్ఘకాలం సాగటం తనకు ఇష్టం లేదన్నాడు. పోరు నుంచి బయట పడేందుకు అమెరికా నానా తిప్పలు పడుతోందని టెహరాన్ వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం నాడు వాషింగ్టన్ చేరుకున్నాడు. నెతన్యాహు సోమవారం నాడు ఇజ్రాయెల్ యుద్ధ మంత్రుల కమిటీతో సమావేశం జరుపుతాడని, అమెరికాతో కలసి ఇరాన్‌పై దాడులు చేయటంలో కీలక పాత్రపోషించాడని, ఇరాన్ అణు, ఖండాంతర క్షిపణుల కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు పట్టుబడతాడని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆదివారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇరాన్‌తో సాగుతున్న పోరే ట్రంప్‌తో ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. ఇరాన్ మద్దతు ఉన్న ఎమెన్‌లోని హౌతీలు`సౌదీ అరేబియా మధ్య దాడులు జరుగుతున్నాయి. తమ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు జరిగినట్లు రియాద్ ప్రకటించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల గురించి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ వివరాలు నమోదు చేసింది.అంతర్జాతీయ న్యాయ చట్టాలను ఉల్లంఘించినట్లు, వాటిలో కొన్ని యుద్ద నేరాలతో సమానమని మానవహక్కుల కమిషనర్ వాకర్ టర్క్ వర్ణించాడు. ఇదిలా ఉండగా పశ్చిమాసియా సంక్షోభంలో మరణించిన, గాయపడిన అమెరికన్ సైనికులు ఎందరన్నది వివాదంగా మారింది. గత మంగళవారం నాడు ట్రంప్ చేసిన ప్రకటనలో 18 మంది మరణించినట్లు పేర్కొనగా మరుసటి రోజు రక్షణ శాఖ 14గా పేర్కొన్నది, అదే విధంగా గాయపడిన వారి సంఖ్యను కూడా తగ్గించి చూపింది. దీని గురించి అడిగితే పొంతనలేని సమాధానాలు వచ్చాయి. ఇరాన్ మీద దాడులు ఆపకూడదు, కొనసాగించాలంటూ వత్తిడి తెస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మంగళవారం నాడు అమెరికా పర్యటనకు వచ్చాడు. ఈ పర్యటన ఖరారైన తరువాతే దాడులకు అమెరికా విరామం ఇచ్చింది. ట్రంప్ ఎన్నెన్నో ప్రగల్భాలు పలికాడు, ఇంక మాటల్లేవ్ చేతలే సమాధానం అన్నాడు. సలహదారుల నివేదికల తరువాత గురువారం నుంచే ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చి శుక్రవారం నుంచి దాడులు ఆపివేయించాడు. ఎందుకు అంటే చర్చలకు అవకాశం ఇవ్వాలని అంటున్నాడు.చర్చించేదేమీ లేదు, అమెరికా ఎన్ని రోజులు దాడులు అపితే మేం కూడా అదే విధంగా స్పందిస్తామని ఇరాన్ కూడా ప్రకటించింది. ఈ విరామం ఎన్ని రోజులు ఉంటుందో, ఏమి చర్చలు చేస్తారో ఇది రాసిన సమయానికి ఎలాంటి స్పష్టత లేదు.


ఇరాన్‌పై దాడులతో అమెరికా, ఇజ్రాయెల్ ఏమి సాధించాయో ఊకదంపుడు ప్రకటనలు తప్ప నిర్దిష్టంగా ఎవరూ ఏమీ చెప్పటం లేదు. అయితే ఆర్థిక భారాలకు సంబంధించి కొన్ని తాత్కాలిక అంచనాలు, వివరాలు మాత్రమే ఇప్పటివరకు వెల్లడయ్యాయి.అమెరికాకు 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. అదనంగా అత్యవసర నిధులు 67 నుంచి 90 బిలియన్ డాలర్ల వరకు కావాలని ట్రంప్ యంత్రాంగం పార్లమెంటును కోరింది.అయితే రోజుకు ఒక బిలియన్ డాలర్లు ఖర్చు అవుతున్నట్లు స్వతంత్ర విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, దీర్ఘకాలంలో మొత్తం ఖర్చు లక్ష కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. అమెరికా 56వేల మంది సైనికులను ఇరాన్‌పై దాడులు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నదని, ఆయుధాలు, ఇతర మిలిటరీ సంబంధ వస్తువులను పెద్ద ఎత్తున కొత్తగా చేర్చినట్లు చెబుతున్నారు. అమెరికాలో నెలవారీ వినియోగదారుల ఇంథన ఖర్చు 21.2శాతం పెరిగింది.దీంతో వినియోగదారుల ధరల సూచీ 3.3శాతానికి పెరిగింది.ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఐరోపా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి.అరబ్ గల్ఫ్ దేశాల్లో ఆహార ధరలు 40 నుంచి 120శాతం పెరిగాయి. చమురు నౌకలు సుదూరం ప్రయాణించాల్సి రావటంతో దిగుమతి దేశాలకు రవాణా, బీమా ఖర్చులు పెరిగాయి.ఇరాన్ చమురు ఎగుమతుల పతనం, ఇతర దేశాల్లో జనాల మీద పడిన భారాలు ఎంతో ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేని స్థితి.


అయితే వాషింగ్టన్ మరోసారి ఎందుకు దాడులకు తెగబడింది, తిరిగి చర్చలంటూ ఎందుకు నిలిపివేసిందన్నదే అసలు సమస్య. ఇరాన్ చేస్తున్నది ఆత్మరక్షణ ఎదురుదాడులు తప్ప మరొకటి కాదు గనుక అది ఎందుకు ఆపిందో అందరికీ విదితమే. అమెరికాకు ఏమైంది ! వస్తున్న వార్తలను బట్టి చెప్పుకోరాని చోట తగులుతున్న దెబ్బలే అనిచెప్పవచ్చు. టెహరాన్ మీద ఎన్ని దాడులు చేసినా చేతి చమురు వదలటం తప్ప సాధించేదేమీ లేదు అని పెంటగన్ అధికారులు కుండబద్దలు కొట్టి చెబుతున్నట్లు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. మరోవైపు మిలిటరీ సిబ్బంది మరణాలు, గాయపడిన వారి సంఖ్య పెరగటం, గల్ఫ్ దేశాలు తెస్తున్న వత్తిడి కూడా ట్రంప్‌కు ఏం చేయాలో దిక్కుతోచకుండా చేస్తున్నాయి. ఇరాన్ దాడుల్లో గాయపడిన అనేక మందిని జర్మనీలోని అమెరికా మిలిటరీ ఆసుపత్రిలో చికిత్సకోసం తరలించినట్లు ఒక అధికారి చెప్పటాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఉటంకించింది. జూలై నెలలో జరిగిన దాడుల్లో దాదాపు వంద మంది గాయపడ్డారని వారిలో ఒక్క జోర్డాన్ సైనిక స్థావరాల్లోనే 50 మంది ఉన్నట్లు అధికారి చెప్పాడట.మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరంలో ముగ్గురు సైనికులు మరణించారు.కేవలం ఆరునెలల క్రితమే పని చేయటం ప్రారంభించిన కువాయిట్‌లోని అహమద్ అల్ జబర్ వైమానిక స్థావర రాడార్ వ్యవస్థ నాశనమైంది. ఇలా అనేక చోట్ల అమెరికా నష్టపోయినట్లు వార్తలు. ఎంత మంది అమెరికా సైనికులు గాయపడిందీ, మరణించిందీ కూడా వివరాలను వెల్లడించేందుకు సిద్దపడటం లేదనే వార్తలు రావటాన్ని బట్టి ఈ పరిణామం కూడా దాడుల నిలిపివేతకు కారణం కావచ్చు. సమాచారాన్ని దాచిపెడుతున్నారన్న విమర్శల నేపధ్యంలో రక్షణ శాఖ సమాచార వ్యవస్థలో శుక్రవారం నాటికి వెల్లడించిన వివరాల ప్రకారం అంతకు ముందువారంలో అదనంగా 140 మంది సైనికులు గాయపడినట్లు, నలుగురు మరణించినట్లు పేర్కొన్నారు. డిఫెన్స్ కాజువాలిటీ అనాలసిస్ సిస్టమ్(డిసిఎఎస్) అంటే మిలిటరీ మరణాల విశ్లేషణ వ్యవస్థలో జూలై ఏడు నుంచి విదేశీ కార్యకలాపాల్లో మరణించిన లేదా గాయపడిన వారి గురించి విశ్లేషించారు. పెంటగన్ తాజా సమాచారం ప్రకారం ఇరాన్ మీద ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫురీలో 18 మంది అమెరికా సైనికులు మరణించగా 624 మంది గాయపడ్డారు.సిఎనఎన్ విశ్లేషణ ప్రకారం గతవారంలోనే గరిష్టంగా 482 మంది గాయపడ్డారు. రక్షణశాఖ మీడియాకు అందచేస్తున్న వివరాలు, డిసిఎఎస్ వ్యవస్థలో గాయపడిన లేదా మరణించిన వారి సంఖ్యను తగ్గించి చూపుతున్నారని దీనికి కారణాలు ఏమిటని పార్లమెంట్‌లోని సెనెట్ సాయుధ దళాల కమిటీలోని 12 మంది ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులు రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్‌కు ఒక లేఖ రాశారు. సమాచారానికి సంబంధించి తాత్కాలికంగా తలెత్తిన సమస్యల కారణంగా డిసిఎఎస్ వెబ్‌సైట్‌లో తేడాలు కనిపిస్తున్నాయని రక్షణ శాఖ మీడియా ప్రతినిధి జోయల్ వాల్‌డెజ్ సమర్ధించుకున్నాడు. తాజా వివరాలు కావాలని సిఎనఎన్ ఛానల్ రక్షణశాఖను కోరగా శనివారం నాటికి కూడా ఉలుకూలేదు పలుకూలేదు. నిమిష నిమిషానికీ సమాచారాన్ని సవరించే డిసిఏఎస్ జూలై ఏడు నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. అదే రోజున ఇరాన్‌తో నూతన పోరు ప్రారంభమౌతుందని ట్రంప్ ప్రకటించాడు.


అధ్యక్షుడికి ఉన్న అసాధారణ అధికారాల ప్రకారం పార్లమెంటు అనుమతి లేకుండా 60 రోజుల పాటు మిలిటరీ చర్యకు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆ విధంగా ఫిబ్రవరి 28నాటి ఆదేశాలు మే ఒకటవ తేదీతో ముగిశాయి. దీన్ని సాకుగా చూపి మరోసారి కొత్తగా ఆదేశాలు జారీ చేసినట్లు, దానికీ దీనికీ సంబంధం లేదని ట్రంప్ యంత్రాంగం భాష్యం చెబుతోంది. ట్రంప్ చర్యలు రాజ్యాంగవిరుద్దమని అధికార, ప్రతిపక్షానికి చెందిన ఎంపీలు కొందరు విమర్శించారు. ఇరాన్‌పై దాడుల ప్రభావం పరిమితమే, ఇంతకు మించి చేసేదేమీ లేదని, ఆయుధాలు కూడా నిండుకుంటున్నాయని అమెరికా ఉన్నత మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇరాన్‌పై జరుపుతున్న దాడుల ప్రభావానికి పరిమితులు ఏర్పడ్డాయని,హార్ముజ్ ప్రాంతంలో ప్రత్యేకించి వైమానిక దాడుల కొనసాగింపువలన ఫలితం లేదని మధ్య ప్రాచ్యంలో అమెరికా మిలిటరీ అధికారి అడ్మిరల్ బ్రాడ్లే కూపర్ సిఫార్సు చేసినట్లు ఆదివారం నాడు వార్తలు వచ్చాయి. ట్రంప్ పౌర, మిలిటరీ సలహాదారులు కూడా దీన్ని బలపరిచినట్లు చెబుతున్నకారణంగానే ట్రంప్ దాడులు నిలిపివేయించాడు.రెండువారాల దాడుల తరువాత నౌకల మీద దాడి చేసే శక్తిని ఇరాన్ కోల్పోయిందని అందువలన దాని లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తే కొత్తగా వచ్చే ప్రయోజనం లేదని కూపర్ నివేదించినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించేందుకు సెంట్రల్ కమాండ్ ప్రతినిధి తిరస్కరించాడు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాప్ చైర్మన్ జనరల్ డాన్ కెయినె కూడా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేత్, ట్రంప్‌తో మాట్లాడుతూ ఇరాన్‌వైపు నుంచి వస్తున్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకొనే పేట్రియాట్, తోమహాక్ క్షిపణుల వంటి వాయు రక్షణ ఆయుధాలకు కొరత ఏర్పడితే అమెరికా సైనికులు, ఆ ప్రాంతంలోని మద్దతుదారులైన గల్ఫ్ దేశాలను రక్షించటం కష్టం అవుతుందని చెప్పారని సమాచారం. కెయినే హెచ్చరికల గురించి సాక్షాత్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రికే ప్రకటించింది. దాని మీద వివరణ కోరగా అధ్యక్షుడికి ఇచ్చిన సలహా రహస్యం గనుక వ్యాఖ్యానించేది లేదని అధికార ప్రతినిధి స్పందించాడు. మరోసారి ఇరాన్‌పై దాడులు జరుపుతారా అన్న ప్రశ్నకు ఒక టీవీ కార్యక్రమంలో ఐరాసలో అమెరికా ప్రతినిధి మైక్ వాల్జ్ మాట్లాడుతూ దాని గురించి తాను ఎక్కువగా చెప్పలేనని, అధ్యక్షుడి ముందు అనిప్రతిపాదనలూ ఉన్నాయన్నాడు. ఇరాన్‌పై నిర్ణయించిన లక్ష్యాలలో 80శాతం సాధించామని, మిగిలిన 20శాతం కోసం ఇప్పటివరకు చేసినవాటి కంటే మరింత భారీ దాడులు చేయాల్సి ఉంటుందని, దీర్ఘకాలంతోపాటు, ముప్పు ఖర్చు కూడా ఎక్కువే గనుక కొనసాగించటం వలన ప్రయోజనం లేదన్నది ట్రంప్ సలహాదారులు చెప్పిన అంశాల సారం.అధికారికంగా ధృవీకరించనప్పటికీ తెరవెనుక అమెరికా ప్రతినిధులు ఇరాన్‌తో సంబంధాల్లో ఉన్నారు. మరోవైపు హార్ముజ్ జలసంధిపై అదుపు తమదేనని, రాకపోకలు సాగించే నౌకలు పన్ను చెల్లించాలని కోరుతున్న ఇరాన్ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నది. ఒప్పందం చేసుకొనేందుకు ఇరాన్ సిద్దంగా ఉందని తాను అనుకోవటం లేదని అయితే తాను వింటానని వైట్ హౌస్ విలేకర్ల విందులో ట్రంప్ వ్యాఖ్యానించాడు.అణు, క్షిపణుల నియంత్రణ మీద కేంద్రీకరించాలని ఇజ్రాయెల్ వత్తిడి చేస్తుండగా తమకు హార్ముజ్ జలసంధిని తెరిపించటమే ముఖ్యమని అమెరికా చెబుతోంది.మరోవైపున బ్రిటన్ నూతన ప్రధాని ఆండీ బర్నహన్ అమెరికాతో ఉన్నత స్థాయి చర్చలు జరిపి జలసంధిలో నౌకల రక్షణకు సంబంధించి ఒక కూటమిని ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. ఇరాన్‌పై దాడులు చేసేందుకు తమ వైమానిక స్థావరాన్ని వినియోగించుకొనేందుకు ఇప్పటివరకు అమెరికాకు బ్రిటన్ అనుమతి ఇవ్వలేదు.


గత నాలుగు దశాబ్దాలుగా ఇరాన్ను దెబ్బతీసి తమ అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా చేయని యత్నం లేదు.దానికి గల్ఫ్ దేశాలు, ఐరోపాలోని పెద్ద దేశాలన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించాయి. అమెరికా ప్రకటించిన ఆంక్షలను అవి అమలు చేశాయి.తమ మిలిటరీ శక్తి, ఆంక్షలు, ఒంటరిపాటుతో టెహరాన్‌పై పట్టు సాధించాలన్న అమెరికా పథకం పారలేదు.ఇటీవలి దాడులతో దాని బలహీనతలు ఏమిటో ప్రపంచానికి వెల్లడయ్యాయి.అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులతో తమ పౌరులు, ఆస్తులు కూడా ప్రభావితం అవుతున్నప్పటికీ ఏ ఒక్క గల్ఫ్ దేశమÖ యుద్దంలోకి దిగలేదు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా సాగించిన అన్ని దుర్మార్గ చర్యలకూ మద్దతు లేదా స్వయంగా భాగస్వాములైన ఐరోపా, ఇతర మిత్రదేశాలు కూడా తాజా పరిణామాల్లో అమెరికాకు బాసటగా నిలిచేందుకు నిరాకరించటం ఒక పెద్ద పరిణామం.రానున్న రోజుల్లో ఇది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే !