Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

బుధవారం నాడు జరుగుతాయని భావిస్తున్న రెండవ దఫా అమెరికా-ఇరాన్‌ చర్చలు నిరవధికంగా వాయిదా పడినట్లు వార్తలు. మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌ వినతి మేరకు కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు మంగళవారం నాడు ట్రంప్‌ ప్రకటించాడు. అయితే తమ దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. నిర్ణీత వ్యవధిని పేర్కొనలేదు గనుక నిరవధికం అనుకుంటున్నారు. మాటమార్చి మరోసారి ఏ చెబుతాడో తెలియదు. చర్చలంటూనే వివిధ దేశాల్లో ఉన్న 14 మంది ఇరానియన్లు, సంస్థలపై కొత్తగా ఆంక్షలను ప్రకటించాడు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలతో ఇరాన్ను దారికి తేవాలని చూస్తే కుదిరేది కాదని చెప్పవచ్చు. ఇస్లామాబాద్‌ ప్రయాణ సన్నాహాలు చేసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వాయిదా వేసుకున్నాడు.బుధవారం నాడు చర్చలు జరుగుతాయనే అంచనాతోనే వేలాది మంది సిబ్బందితో పాక్‌ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. తమ మెడమీద కత్తి పెట్టి చర్చలంటే కుదిరేది కాదని టెహరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా గొంతెమ్మ కోరికలను ముందుకు తెస్తోందని, ఇలాంటి స్థితిలో చర్చలంటే సమయం వృధాతప్ప మరొకటి కాదంటూ చర్చలుకు వచ్చేది లేదని చెప్పకనే చెప్పింది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతంలో అమెరికా దిగ్బంధనం ముగిసేవరకు మాటల్లేవని అన్నది. కాల్పుల విరమణ పొడిగింపు గురించి గురువారం ఉదయం వరకు ఇరాన్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ పేరుతో అమెరికా బలగాలను కూడగట్టుకుంటున్నదని గతంలోనే అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి మిలిటరీకి అనుకూలంగా టెహరాన్‌లో జనం వీధుల్లోకి వచ్చారు, ఈ సందర్భంగా ఒక ఆధునిక ఖండాంతర క్షిపణి ప్రయోగ వాహనాన్ని ప్రదర్శించారు. ఇరాన్‌ వద్ద దాడులకు ఉపయోగించే డ్రోన్లు, క్షిపణులు ఇప్పటికీ వేలాదిగా ఉన్నాయని అమెరికా రక్షణశాఖ గూఢచార నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.మరోవైపు ప్రత్యర్ధుల క్షిపణులను కూల్చివేసే అమెరికా పేట్రియాట్‌ వ్యవస్థలు సగం ఖర్చయినట్లు చెబుతున్నారు.

మంగళవారం రాత్రి వరకు జరిగిన పరిణామాలను ఒకసారి నెమరు వేసుకుందాం. గడువు ముగిసేలోగా తాము చెప్పినట్లు ఒప్పందం జరగకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్‌ మరోమారు బెదిరించాడు.తాను విజయం సాధించినట్లు కూడా చెప్పుకున్నాడు.గడువు పొడిగించేది లేదన్నాడు.తాము ఇప్పటికే 27 నౌకలను వెనక్కు తిప్పి పంపినట్లు అమెరికా మిలిటరీ చెప్పుకుంది.దీని వలన ఇరాన్‌ రోజుకు 50కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నదని ట్రంప్‌ చెప్పాడు.ఉభయ దేశాలూ కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు అమెరికన్‌ మిలిటరీ సెంట్రల్‌ కమాండ్‌ మాజీ అధిపతి డేవిడ్‌ పెట్రాస్‌ చెప్పాడు. ఒప్పందం కుదిరేట్లయితే స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే వచ్చి సంతకాలు చేస్తాడని లేదా వీడియో సమావేశంలో పాల్గ్గొంటారని మరోవైపు రాయిటర్స్‌ పేర్కొన్నది.ఉభయ పక్షాలు తమ తమ ఎత్తుగడలతో కొనసాగుతున్నాయి. ఆదివారం తమ నౌకను దిగ్బంధించటం ఓడదొంగల దుశ్చర్య వంటిదేనని ఇరాన్‌ పేర్కొన్నది.ఆ నౌకలో క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు చైనా నుంచి వచ్చాయని మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ పార్లమెంటు సభ్యురాలు నికీ హేలీ ఆరోపించారు.నిజమే నిజమే చాలా ప్రమాదకరంగా చైనా వ్యవహరిస్తోందంటూ అమెరికా అనుకూల మీడియా వ్యాఖ్యాతలు భజన ప్రారంభించారు. ఆ కంటెయినర్‌ నౌకతో తమకు సంబంధం లేదని అతిశయోక్తులు ప్రచారం చేస్తున్నారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఖండించాడు.ఒక వైపు అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండగానే ఇరాన్‌ నౌక ఒకటి హార్ముజ్‌ జలసంధి నుంచి ఓమన్‌ గల్ఫ్‌ వైపు ప్రయాణించినట్లు వార్తలు, మరో రెండు నౌకలు కూడా దాటినట్లు చెబుతున్నా, అవి ఏ దేశానివో స్పష్టం కాలేదు.

పశ్చిమాసియా సంక్షోభం బుధవారం నాటికి 54వ రోజులో ప్రవేశించింది. నాలుగు నుంచి ఆరువారాల్లో ఇరాన్ను నాశనం చేసి తమ లక్ష్యాలను సాధిస్తానని ప్రగల్భాలు పలికిన డోనాల్డ్‌ట్రంప్‌ పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అన్నట్లుగా ఉందంటే అతిశయోక్తి కాదు.శుద్ది చేసిన యురేనియం బాంబుల తయారీకి దగ్గరలో ఉందని ఒకసారి చెబుతారు.దాన్ని తమకు స్వాధీనం చేయాల్సిందే అంటారు. గతేడాది తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌ అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయని ఇప్పుడు వాటి నుంచి యురేనియాన్ని సేకరించటం చాలా కష్టం, దీర్ఘకాలం పడుతుందని సోమవారం నాడు ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ఇంతకు ముందు చైనా నుంచి భారీ విమానాల్లో ఆయుధాలు దిగాయని చీకట్లో బాణాలు వేసినట్లు ప్రచారం చేశారు.దానికి ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇప్పుడు క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు పంపుతున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నారు.నిజం ఏమిటి ? అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకలో ఏమున్నాయో తెలియదు. అమెరికన్లు చెప్పిన ప్రతిమాటను నమ్మాల్సిన అవసరం లేదు. అయితే బీజింగ్‌ నుంచి టెహరాన్‌కు రసాయనాలు పంపటం కొత్త కాదు, రహస్యమూ కాదు.మనతో సహా అనేక దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి,మనమూ కొన్ని రసాయనాలను ఎగుమతి చేస్తున్నాము. వాటిని దేనికి వినియోగించుకోవాలనే షరతులేమీ దిగుమతి చేసుకొనే దేశాలకు ఉండవు.ఉదాహరణకు అమెరికా కంపెనీలు చిప్స్‌ను ఎగుమతి చేస్తున్నాయి. వాటిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించవచ్చు, ఆయుధాల తయారీలో చొప్పించవచ్చు.చైనా సరఫరా చేస్తున్నదని చెబుతున్న రసాయనాలు కూడా అలాంటివే.ఉదాహరణకు చైనా నుంచి అమెరికాకు నచ్చని లేదా వ్యతిరేకించే దేశం చాకులను దిగుమతి చేసుకుంటే తమను పొడవటానికే అని నికీ హేలీ వంటి వారు గుండెలు బాదుకుంటారు. ఇదంతా అమెరికా ఆడించే నాటకంలో భాగం తప్ప మరొకటి కాదు.

తన నౌక ఎంవి టౌస్కాను ఓమన్‌ జలసంధిలో దిగ్బంధించిన తరువాత ఆ ఉదంతాన్ని విస్మరించి ఇరాన్‌ చర్చలకు వస్తుందని ఎవరూ భావించరు. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించే పరిస్థితి ఉండదు. అందుకే చర్చల తలుపులను పూర్తిగా మూసివేయకుండా ఎటూ తేల్చకుండా పరిణామాలను గమనిస్తున్నది. ఒప్పందం కుదిరితేనే ఇరాన్‌ నౌకలపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తానంటూ ట్రంప్‌ పదే పదే ప్రకటనలు చేస్తున్నాడు. ఉభయదేశాలూ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు భారతీయ కాలమానం ప్రకారం గురువారం ఉదయానికి ముగియనుండగా పొడిగిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అమెరికా స్వాధీనంలో ఉన్న నౌక గత ఆరువారాల్లో రెండు సార్లు ఇరాన్‌-చైనాల మధ్య రాకపోకలు సాగించినట్లు చెబుతున్నారు. అయితే నౌకల తీరుతెన్నులను గమనించినపుడు ఒక దేశ రేవు నుంచి బయలు దేరిన అక్కడ నింపిన సరకులను మధ్యలో దించి మరోనౌక నుంచి తెచ్చిన వాటిని రవాణా చేయటం సాధారణంగా జరిగేదే. సదరు వస్తువులపై వేరే దేశాల తయారీ అనే స్టిక్కర్లు కూడా వేస్తారు. అసలు ఎక్కడ తయారైందనే ఆనవాలు లేకుండా లేదా మరోదేశ తయారీ అని ముద్రలు వేస్తారు. ఇరాన్‌ నౌకను ఒమన్‌ జలసంధిలో అమెరికా యుద్ద నౌక నుంచి ఆరుగంటలపాటు చేసిన హెచ్చరికలను నౌకా సిబ్బంది ఖాతరు చేయలేదు, ఇరాన్‌వైపు నడిపేందుకు చూశారు. దాంతో అమెరికా నౌకాదళం కాల్పులు జరిపి ఇంజన్‌ గది నుంచి సిబ్బంది బయటకు రావాలని హెచ్చరించింది. సిబ్బంది ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడకపోవటంతో నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఒకవేళ అమెరికా గనుక తిరిగి దాడులకు పాల్పడితే తమ దగ్గర ఉన్న కొత్త అస్త్రాలను బయటకు తీస్తామని ఇరాన్‌ హెచ్చరించింది.

అమెరికా అనుసరించిన వైఖరితో హార్ముజ్‌ జలసంధి మీద ఇరాన్‌ పట్టుబిగిసిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నటికీ అణ్వాయుధాలను తయారు చేయకుండా చూడటమే తన లక్ష్యం అన్న ట్రంప్‌ గడచిన 54 రోజుల్లో రోజుకో కొత్త లక్ష్యాన్ని ప్రకటిస్తుండగా టెహరాన్‌ మొదటి నుంచి చెబుతున్నదానికే కట్టుబడి ఉంది.జలసంధి మీద ఇరాన్‌ అదుపు కలిగి ఉన్నప్పటికీ గతంలో దాన్ని ఒక ఆయుధంగా చేసుకోలేదు. అదే మాదిరి ఇప్పుడు కూడా ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్‌ వేసుకున్న అంచనాలు తప్పాయి.దాన్నే కాదు, ఎమెన్‌ జలసంధిని కూడా అవసరమైతే మూసివేయిస్తామని ఇరాన్‌ నేతలు ప్రకటించారు.అదే జరిగితే సూయజ్‌ కాలువ ద్వారా మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం ద్వారా హిందూమహా సముద్రంలోకి ప్రవేశించే రవాణా కూడా నిలిచిపోవటం అనివార్యం. ఇరాన్‌ వైఖరిని చూస్తుంటే రానున్న రోజుల్లో హార్ముజ్‌ను తన అదుపులో ఉంచుకొనేందుకు పూనుకున్నదని చెప్పవచ్చు.పట్టుసాధించటమేగాక అమెరికా దాడులతో తమకు కలిగిన నష్టాలను పూడ్చుకొనేందుకు ఆ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి సుంకం వసూలు చేసి పునరుద్దరణకు వినియోగిస్తామని కూడా ప్రకటించింది.పీపాకు ఒక డాలర్‌ వంతున పన్ను విధిస్తే ఒక్కో టాంకర్‌ ద్వారా ఇరవైలక్షల డాలర్ల రాబడి వస్తుంది.సాధారణ సమయంలో రోజుకు 120 నుంచి 150 నౌకలు ఆ మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రపంచ వ్యాపితంగా వందల కోట్ల మంది జనాలను ఇబ్బందుల పాలు చేయటం తప్ప ఇంతవరకు అమెరికా సాధించిందేమీ లేదు.గతంలో అన్ని దుర్మార్గాల్లోనూ పాలుపంచుకున్న ఐరోపా మిత్రదేశాలు ఈసారి ముఖం చాటేశాయి.ఇరాన్‌ దాడులతో తాము కూడా నష్టపోతున్నప్పటికీ ప్రత్యక్ష పోరుకు దిగేందుకు గల్ఫ్‌ దేశాలు ఇప్పటి వరకు నిరాకరించాయి. రానున్న రోజుల్లో అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తే గల్ఫ్‌ దేశాలను కూడా ఎలా దెబ్బతీయగలదో ఇరాన్‌ నిరూపించింది.అది మరింత దూరం ప్రయాణించి దాడి చేసే క్షిపణులను రూపొందిస్తున్నది.ఈ రీత్యా కూడా పశ్చిమాసియాలో ఇరాన్‌ పట్టు పెరగనుంది.

పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తరువాత చైనా గురించి కూడా చర్చ జరుగుతున్నది.పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదంటూ ఆరోపణలు, ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు.అసలు కారకులైన అమెరికా, ఇజ్రాయెల్‌ను వదలి బీజింగ్‌పై కేంద్రీకరించటం ఒక ఎత్తుగడలో భాగమే. తన ఇంథన భద్రతా చర్యల్లో భాగంగా ఇరాన్‌, గల్ఫ్‌ దేశాలతో సఖ్యతతో ఉండటమే గాక పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతోంది.ఇరాన్‌-సౌదీ మధ్య ఉన్న దీర్ఘకాలిక విబేధాలను మధ్యవర్తిత్వంతో పరిష్కరించింది.అనేక దేశాలకు భరోసా ఇస్తున్నది. అమెరికా దుశ్చర్యలను ఖండిస్తున్నది తప్ప ఇరాన్‌ మీద పెద్దగా వత్తిడి తేవటం లేదు, భద్రతా మండలిలో దానికి అనుకూలంగా రష్యాతో కలసి వీటోను కూడా ప్రయోగించి రక్షించింది. తన ఇంథన భద్రతలో భాగం ఒకటో, రెండో దేశాలపై ఆధారపడటంలేదు. అమెరికా కుట్రలను ముందుగానే గ్రహించిన కారణంగా కొన్ని నెలల పాటు సరఫరా ఆగినా తట్టుకొనేందుకు అవసరమైన నిల్వలను చేసుకున్నది.ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత స్వల్పంగా చమురు ధరలను పెంచిన చైనా తాజాగా అంతకంటే ఎక్కువగా తగ్గించింది. మరోవైపు గల్ఫ్‌ దేశాలతో వాణిజ్య సంబంధాలను గణనీయంగా పెంచుకుంది. ఆ ప్రాంత దేశాలతో 2024లో 257 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను నిర్వహించింది. ఈ మొత్తం పశ్చిమదేశాలతో సాగించిన మొత్తం వాణిజ్యం కంటే ఎక్కువ. అమెరికా బెదిరింపులకు లొంగకుండా ఇరాన్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న తీరును చూసిన తరువాత పేద, వర్ధమాన దేశాల్లో చైనా పలుకుబడి పెరగటం, అమెరికా ప్రభావం తగ్గటం అనివార్యం !బ్‌ ూ్‌శీషసర