• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: UK

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !!

08 Sunday Aug 2021

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, Uncategorized

≈ 1 Comment

Tags

75th anniversary of India's Independence, Azadi Ka Amrit Mahotsav, BJP, India independence @75, Indian national Congress, Mahatama Gandhi, Narendra Modi Failures, Nathuram Godse, RSS


ఎం కోటేశ్వరరావు


” ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం- నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం,
తారీఖులు దస్తావేజులు ఇవి కాదోయి చరిత్ర సారం ” అన్న శ్రీశ్రీని మనం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు తెచ్చుకోవటం అవసరం. స్వాతంత్య్రానికి ముందు పుట్టి తరువాత దేశాన్ని చూసిన వారి కలలు కల్లలయ్యాయి. తరువాత పుట్టిన వారు ఈ దేశం మాకేమిచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్ధితి. బిడ్డ పుట్టి పెరిగే క్రమంలో జరిగే పరిణామాల మాదిరే స్వాతంత్య్ర తరువాత దేశంలో కూడా మార్పులు వచ్చాయి. పుట్టిన బిడ్డ ఆరోగ్యంతోనా లేక ఈసురో మంటూ ఎదిగినట్లా అన్నదే అసలు సమస్య. స్వాతంత్య్ర దేశాన్ని కూడా అలాగే చూడాలి.


కాలం గడిచే కొద్దీ మెరుగు పరచాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్ధలకు తూట్లు పొడుస్తున్నారు. విపరీత అర్ధాలు చెబుతున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటి హరించుకుపోతున్నాయి లేదా కదలా మెదల్లేని బంధనాల్లో ఇరుక్కు పోతున్నాయి. మనకు నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా ? స్వాతంత్య్రం అంటే ఇదా, ఇలాంటిది మనకు అవసరమా అనే ప్రశ్నలు అనేక మందిలో ఉన్నాయి. ఇంతకాలం తరువాత ఇలాంటి ఆలోచనలు కలగటం విచార, విషాదకర స్దితి. ప్రస్తుత తీరు తెన్నులు చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్దితి ఇంకా దిగజారుతుందా అన్న ఆందోళన తలెత్తుతోంది. సాగు, నిత్య పర్యవేక్షణ లేకపోతే పంట భూముల్లో కలుపు మొక్కలు పుట్టినట్లు లేదా కబ్జాకు గురైనట్లుగానే అనేక దేశాల్లో ఇలాంటి పరిస్ధితులు తలెత్తినపుడు నియంతలు ముందుకు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. ఎవడొస్తే మనకేంలే మన మీద భారాలు, మనకు బాధలు తప్పవు అని జనం నిర్లిప్తతకు లోనవుతారు.


డెబ్బయి అయిదేళ్ల స్వాతంత్య్ర సందర్భాన్ని ఏమని పిలవాలి అన్నది ఒక మీమాంస. వజ్రోత్సవం లేదా ప్లాటినం వాటి నిర్వచనాలకు సరిపోదు. నూటయాభయ్యవ సంవత్సరాన్ని ఆంగ్లంలో సెస్‌కో సెంటెనియల్‌ అన్నారు. దీనికి తెలుగులో తగిన పదం లేదని గూగుల్తల్లి నిఘంటువు సమాధానం చెప్పింది. తెలిసిన వారెవరైనా సూచిస్తే దాన్నే ఉపయోగిద్దాం. డెబ్బయి అయిదు అంటే నూటయాభైలో సగం కనుక సెమీ సెస్‌కో సెంటినియల్‌ అనాలన్నారు. మన ప్రధాని నరేంద్రమోడీ గారు అమృత మహౌత్సవ్‌ అన్నారు. పేరులోనేమున్నది పెన్నిధి. వదిలేద్దాం. దానితో ఎవరికీ పేచీ లేదు.
జూలై ఒకటిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలైన సందర్భంగా వారు ఎంత గొప్పగా ఆ ఉత్సవాన్ని జరుపుకున్నారో, కమ్యూనిస్టు ఆశయాలకు ఎలా పునరంకితమయ్యారో యావత్‌ ప్రపంచం చూసింది. మనకంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా అక్కడ కష్టజీవుల ప్రభుత్వం ఏర్పడింది, 75 ఏండ్ల ఉత్సవాన్ని వారెలా జరుపుకుంటారో తరువాత చూద్దాం. మోడీ గారు ఏడేళ్ల క్రితం అనేక మాటలు చెప్పారు. తరువాత చెప్పిన మాట చెప్పకుండా చేసేది చెప్పకుండా చెప్పింది చెయ్యకుండా అసాధారణ ప్రతిభతో ” నిత్య నూతనత్వంతో ” గడుపుకు వస్తున్నారు. నిజంగా మనం ఇప్పుడు అమృత మహౌత్సవం జరుపుకొనే స్ధితిలో ఉన్నామా హాలాహలం మింగాల్సిన దుస్దితిలో ఉన్నామో తెలియటం లేదు. అచ్చేదిన్‌ (మంచి రోజులు) తెస్తామని వాగ్దానం చేసిన ప్రస్తుత కేంద్ర పాలకులు జనం చేత దేన్ని మింగిస్తారో అర్ధం కావటం లేదు.


ప్రతి ఏడాదీ పంద్రాగస్టు పండగ జరుపుకుంటున్నాం. అదొక తంతులా మారిపోయిందని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సిన పని లేదు. అంతకు మించి జరుగుతున్నదేమీ లేనపుడు ఎవరైనా అలాగే అనుకుంటారు మరి. పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు అన్నట్లుగా మార్చివేశారు. ఉదయాన్నే దేశభక్తి గీతాలు, పాటలను వినిపించటం, మూడు రంగుల జండా ఎగురవేయటం, ప్రతిజ్ఞలు, పప్పు బెల్లాల స్ధానంలో ఏదో ఒకటి తిని మిగిలిన రోజంతా సెలవుగా గడిపేయటానికి అలవాటు పడ్డాము. స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్దగా ఉన్న కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా మార్చి వేశారు. ఆ ఉద్యమం ఏ లక్ష్యాలనైతే ముందుకు తెచ్చిందో వాటిని ఆ పార్టీ 1947 ఆగస్టు 16 నుంచే మరచి పోయింది. దాన్ని నీరుగార్చే, ముప్పు తెచ్చే, జనానికి విశ్వాసం కోల్పోయే చర్యలకు పాల్పడింది. చరిత్ర దాస్తే దాగేది కాదు. విజేతలే చరిత్రను రాస్తారు అన్నది తెలిసిందే. అందువలన అది వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు జనం కూడా చరిత్రను రాస్తున్నారు. అందువలన దానిలో ఎలాంటి వివక్ష, పక్షపాతం ఉండదు. చరిత్ర నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఉపయోగించుకొనేందుకు స్వాతంత్య్ర ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేకపోవటమే కాదు బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన వారి వారసులతో నిండిన బిజెపి రంగంలోకి దిగింది. బ్రిటీష్‌ పాలన నుంచి దేశ విముక్తి అన్న నినాదాన్ని కాపీ కొట్టి కాంగ్రెస్‌ విముక్త భారత్‌ అనే పేరుతో జనం ముందు మాట్లాడింది. కాంగ్రెస్‌ విధానాలనే వేగంగా అమలు చేస్తూ దేశం మరింత దిగజారే విధంగా ఏలుబడి సాగిస్తోంది.


ఎందుకీ పరిస్ధితి తలెత్తింది ? దీక్షా దినంగా పాటించాల్సిన స్వాతంత్య్ర దినాన్ని సెలవుగా మార్చినపుడే ఆ మహౌద్యమాన్ని జనం మరచి పోవాలన్న అంశం దానిలో ఇమిడి ఉంది. చివరకు అది ఎంతవరకు వచ్చిందంటే స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలకు ముప్పు వచ్చిందని చెబుతున్నవారిని ఇప్పుడు జనం అపహాస్యం చేస్తున్నారు. అవి ఉంటేనేం లేకపోతేనే అంటున్నారు. పంద్రాగస్టు పండగకు 75 వారాల ముందే ప్రధాని నరేంద్రమోడీ మార్చి 12న గుజరాత్‌లో అజాదీ కా అమృతమహౌత్సవాన్ని ప్రారంభించారు. 2022 ఆగస్టు 15న నాటికి డెబ్బయిఅయిదు సంవత్సరాలు నిండి 76వ ఏట ప్రవేశిస్తాము. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. ఇది రాసిన సమయానికి వాటిని ఖరారు చేయలేదు. అమృతమహౌత్సవాన్ని ప్రజాఉద్యమంగా నిర్వహించాలని దాని అమలుకు హౌమ్‌ మంత్రి అమిత్‌ షా నాయకత్వాన ఒక జాతీయ కమిటీ ఉంటుందని చెప్పారు. వారేమి చేస్తారో, అవెలా ఉంటాయో మరో సందర్భంగా చర్చించుకుందాం.


స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు అందరూ ఒకే పార్టీలో లేరు, అనేక పార్టీలలో చేరారు. మెజారిటీ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందున తామే దేశాన్ని విముక్తి చేశామని వారు చెప్పుకుంటారు. అలాంటి కాంగ్రెస్‌ దేశానికి శనిలా దాపురించిందని దాన్నుంచి ముక్తి కలిగిస్తామంటూ కాంగ్రెస్‌ ముక్త భారత్‌గా మారుస్తామని బిజెపి ప్రకటించుకుంది. దేశ రాజ్యాంగం ప్రకారం నాలుగు ఉన్నత పదవుల్లో అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, ముందే చెప్పుకున్నట్లు బ్రిటీష్‌ వారికి లొంగిపోయిన వారి రాజకీయ వారసులు ఇప్పుడు అధిష్టించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ప్రధాని,లోక్‌సభ స్పీకర్లుగా సంఘపరివార్‌ రాజకీయ విభాగమైన బిజెపికి చెందిన వారే ఉన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరామ్‌ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి, హత్య సమయంలో అతను తమ సంస్ధలో లేడని వారు చెబుతారు గానీ గాడ్సే కుటుంబసభ్యులు సంఘపరివార్‌లోనే ఉన్నట్లు చెప్పారు. అది తేలేది కాదు గనుక ఆ వివాదాన్ని పక్కన పెడదాం. గాంధీని నేనెందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనలను పుస్తకరూపంలో ప్రచురించి ప్రచారం చేస్తున్నవారు, సామాజిక మాధ్యమంలో అవే వాదనలను చేస్తున్న వారెవరో మనకు తెలుసు, అయితే అదంతా అనధికారికంగానే అనుకోండి. అలాంటి వారికి స్వాతంత్య్రం , దాని లక్ష్యాల మీద , ప్రజాస్వామిక వ్యవస్ధల పట్ల గౌరవం ఉంటుందా ? ఒకవైపు గాంధీకి నివాళులు అర్పిస్తూ మరోవైపు గాడ్సేను ఆరాధించే వారు పెరుగుతున్నారు, వారు ఎంతకైనా తెగిస్తారు. ఇంతకంటే ఆందోళనకరమైన అంశం ఏముంటుంది ?


జనాభాలో సగ భాగం గురించి ఇన్నేండ్లుగా కబుర్లు చెప్పటమే తప్ప ఫ్యూడల్‌ భావజాలం నుంచి ఇంకా బయటపడలేని స్ధితి ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక దేశాల చట్ట సభల్లో మహిళలు సగం మంది ఉన్నారు. తాజాగా చిలీ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. మన దేశంలో చట్టసభల్లో 33శాతం గురించి ఎప్పటి నుంచో చర్చ. తమకు సంపూర్ణ మెజారిటీ ఉంటే అమలు జరుపుతామని బిజెపి చెప్పింది. ఇప్పుడు పార్లమెంట్‌ ఉభయ సభల్లో వారికి, వారిని బలపరిచే మిత్రపక్షాలతో కలిపి అవసరమైన మెజారిటీ ఉంది. మెజారిటీ రాష్ట్రాలూ వారివే. అయినా దాని గురించి ఎప్పుడైనా ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రస్తావన చేశారా అంటే లేదు.


మన దేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందింది అని చెబుతుంటాం, నిజమే. కానీ అది జనానికి ఏ మేరకు ఉపయోగపడిందన్నదే గీటురాయి. వేల కోట్ల రూపాయలను పెట్టి రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేయటానికి, అవసరం లేకపోయినా కొత్త పార్లమెంట్‌ భవనం కట్టేందుకు నిధుల కొరత లేదు. కరోనా మహమ్మారి పోరు గురించి కబుర్లకూ అంతకంటే కొదవ లేదు. అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధించి రాకెట్లను ఎగరేశాం గానీ చాలా చౌకగా లభించే ఆక్సిజన్‌ ఇవ్వలేకపోయారు. అనేక మంది కరోనా పీడితులు ఆ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆనందయ్య ఆకుల పసరు ఆక్సిజన్‌ అందిస్తుందంటే, పచ్చడి కరోనాను అరికడుతుందంటే నిజమని జనం నమ్మారు. దీన్ని ఎలా చూడాలి ? కరోనా నిరోధం కోసం లాక్‌డౌన్‌ పెట్టినపుడు రెక్కాడితే తప్ప డొక్కాడని వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లేందుకు అయ్యే రైలు ఖర్చులను కేంద్రం – రాష్ట్రాలు ఎవరు భరించాలి అని వివాదపడిన అపర మానవతా వాదులను మనం తప్ప మరేదేశమూ చూడలేకపోయింది.

పది లక్షల కోట్ల రూపాయల పారుబాకీలను వేళ్ల మీద లెక్కించదగిన బడాబాబులకు రద్దు చేయటానికి ఉదారంగా నిర్ణయాలు చేసిన పాలకులకు వాక్సిన్లు వేయటానికి చేతులు రాలేదు. తాము స్వయంగా చెప్పిన ఉచితవాక్సిన్లు వేసేందుకు మధ్యలో ఠలాయించి సగం భారం రాష్ట్రాల మీద మోపేందుకు, చివరకు సుప్రీం కోర్టు వాక్సిన్ల పేరుతో కేటాయించిన సొమ్ముకు లెక్కలు చెప్పండని నిలదీస్తే తప్ప లొంగని నేతలు ఇప్పుడున్నారు. కరోనాను ప్రపంచ విపత్తుగా ప్రకటించారు. మనం దేశంలో విపత్తు సహాయ చట్టం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారు. కరోనా జాతీయ విపత్తుగా పరిగణించినపుడు నష్టపరిహారం ఎందుకు ఇవ్వరు. ఎవరి జేబులో డబ్బు ఇస్తున్నారు ? ఎవరు ఎవరికి జవాబుదారులుగా ఉన్నారు, ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు ? రెండు విడతలుగా ఇరవై ఆరులక్షల కోట్ల ఆత్మనిర్భర తాయిలాలను అందించిన కేంద్ర పెద్దలు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు వాయిదాల కరువు భత్యం చెల్లింపునకు ఎసరు పెట్టారు. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. అనేక దేశాలలో కరోనా సహాయ చర్యలకు గాను ప్రభుత్వాలు కార్పొరేట్ల మీద ప్రత్యేక పన్ను విధించి నిధులు సమకూర్చుకున్నారు. మన దేశంలో అలాంటిదేమీ లేకపోగా ఉద్యోగుల పొట్టగొట్టేందుకు పూనుకున్నారు. నిలిపివేసిన కరవు భత్యాన్ని వాయిదాల రూపంలో లేదా పిఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నా అదొక దారి, ఎగ్గొట్టటం ఏమిటి ?
(రెండవ భాగంలో ముగింపు https://vedikaa.com/2021/08/09/india-independence-75-what-is-happening-part-two/ )

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రాణాలు తీస్తున్న అధిక పని గంటలు -పనిలేక నిరుద్యోగుల ఆత్మహత్యలు !

18 Sunday Jul 2021

Posted by raomk in Current Affairs, Economics, employees, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, Women

≈ 1 Comment

Tags

#workers Health, extreme work weeks, ILO, Long working hours, Occupational diseases, overwork in India, WHO


ఎం కోటేశ్వరరావు


పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయాలు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని అనూహ్య పద్దతులలో ఎలా గాయపరుస్తాయో తాజా సమాచారం వెల్లడించిందని పేర్కొన్నది. దాని సారాంశం ఇలా ఉంది. తీవ్ర వడగాడ్పులు సంభవించినపుడు పెద్ద సంఖ్యలో వడదెబ్బలే కాదు పడిపోవటం, యంత్రాలను సరిగా పనిచేయించలేకపోవటం, వాహనాల మధ్య ఇరుక్కుపోవటం వంటివి కూడా గణనీయంగా ఉంటున్నాయి. పని స్ధలాల్లో ఇతర కారణాలతో తగిలే గాయాలకు కాలిఫోర్నియాలోనే అదనంగా ప్రతి సంవత్సరం వడదెబ్బ గాయాలు ఇరవై వేలు తోడవుతున్నాయి. వీటి వలన పని మీద కేంద్రీకరించటం కష్టం అవుతోంది. పశ్చిమ అమెరికా, బ్రిటీష్‌ కొలంబియాలో ఇటీవలి వడగాడ్పులకు 800 మంది మరణించారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు ఉత్పాదక యంత్రాలు, గోడవున్లలో పని చేసే వారికి కూడా వడగాడ్పులు ముప్పు తెస్తున్నాయి. వడగాడ్పు గాయాల వలన వేతనాలను కోల్పోవటం, వైద్య ఖర్చు పెరగటం, ఉష్ట్రోగ్రతలు పెరిగే కొద్దీ వేతన వ్యత్యాసం కూడా పెరుగుతోంది. 2001 నుంచి 2018వరకు కాలిఫోర్నియాలో గాయాలకు పరిహారం చెల్లించిన కోటీ పదిలక్షల నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. తేదీలు, పని ప్రాంతాలు, వడగాడ్పుల తీవ్రత, గాయాల సంఖ్య తీరుతెన్నులను విశ్లేషించగా వేడి ఎక్కువగా ఉన్నపుడు గాయాలు ఎక్కువగా నమోదైనట్లు తేలింది. అధికారికంగా సగటున 850 గాయాలైనట్లు నివేదికలు చూపాయి. అయితే వాస్తవ గాయాలతో పోల్చితే ఇవి చాలా తక్కువ. అరవై డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉన్నపుడు తగిలిన గాయాలతో పోల్చితే 85-90 డిగ్రీలు ఉన్నపుడు ఐదు నుంచి ఏడుశాతం, వంద డిగ్రీలకు పెరిగినపుడు పది నుంచి 15శాతం పెరిగాయి. వడ దెబ్బ గాయాలు గరిష్ట వేతనాలు పొందే వారితో పోల్చితే కనిష్ట వేతనాలు పొందే కార్మికులకు ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాయి.వడదెబ్బ తగల కుండా కొన్ని చర్యలు తీసుకున్న తరువాత కేసులు సంఖ్య తగ్గింది తప్ప తీరుతెన్నులు మాత్రం అలాగే ఉన్నాయి.


మనది ఉష్టమండల ప్రాంతం. ఉష్ణోగ్రతలు అమెరికా కంటే ఎక్కువ నమోదౌతున్నాయి.వేసవిలో 110-115 మధ్య ఉన్న సందర్భాలు ఎన్నో. రికార్డు స్ధాయిలో రాజస్దాన్‌లో 124 కూడా నమోదైంది. అధిక ఉష్ణోగ్రత నమోదైనపుడు వడదెబ్బ తగలకుండా నివారణ చర్యలు తీసుకున్న సంస్దలు ఎన్ని ఉన్నాయన్నది ప్రశ్నార్దకం. అమెరికా మాదిరి మన దేశంలో కూడా పరిశోధన చేస్తే తప్ప తీవ్రత బయటకు రాదు. వడదెబ్బ ఒక్కటే కాదు కష్టజీవుల జీవితాలను దెబ్బతీస్తున్న వృత్తి రుగ్మత అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఓవర్‌టైమ్‌ కూడా ఒకటి.ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్‌ఓ) తొలిసారిగా అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ)తో కలసి దీర్ఘపని గంటల మీద నిర్వహించిన సర్వే ప్రకారం ఏడాదికి ఆ కారణంగా మరణిస్తున్నవారు 7,45,000 మంది(ఇది 2016 సంఖ్య) ఉన్నారట. గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులు దీనికి కారణం. ఆగేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత దేశాలలోని కార్మికులు ఎక్కువగా ప్రభావితులౌతున్నారు.ఆసియాలో గుండెపోటు ముప్పు మామూలుగానే ఎక్కువ, దీనికి అధిక పని గంటల సమస్య మరింత పెంచుతోంది. వారానికి 35-40 గంటల పాటు పని చేసేవారితో పోల్చితే 55 గంటలు, అంతకు మించి పని చేసే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు 35శాతం, గుండె సంబంధ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయే ముప్పు 17శాతం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతులు మధ్యవయస్కులు లేదా వృద్దులు ఎక్కువగా ఉన్నారు. రోజుకు ఎక్కువ గంటలు పని చేసిన వారిలో ఇది పని మానేసిన తదుపరి జీవితంలో, కొన్ని సందర్భాలలో దశాబ్దాల తరువాత కూడా ప్రభావం చూపుతోంది. అధిక పని గంటలు అంటే భౌతిక శ్రమే చేయనవసరం లేదు, ఇతరత్రా పనిలో ఎక్కువ గంటలు ఉన్నా ముప్పు ఉంటుంది.పిల్లలతో సహా అధిక గంటలు పని చేస్తున్నవారు ప్రపంచ జనాభాలో తొమ్మిదిశాతం ఉన్నారు.2000 సంవత్సరం తరువాత వీరి సంఖ్య పెరుగుతోంది.


వృత్తిపరంగా తలెత్తే రుగ్మతలకు కారణాలు అనేక వాటిలో సింహభాగం అధిక పని గంటలే అని తేలింది. ఎక్కువ సేపు భౌతిక శ్రమ చేయటం ముప్పు కారణమైతే, అది లేకుండా ఇతరంగా ఎక్కువ గంటలు పని చేసే వారు మద్యం, పొగాకు వినియోగం, తక్కువ సేపు నిద్రపోవటం, వ్యాయామం లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వంటి అంశాలు కూడా ముప్పును పెంచుతున్నాయి. దీర్ఘకాలం పనిచేసే వారి సంఖ్య ప్రపంచ వ్యాపితంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి సమయంలో అది మరింత పెరిగింది. అధికపని చేసినందుకు ప్రతిఫలం కూడా అన్ని సందర్భాలలో ఉండటం లేదు. ఇంటి నుంచి పని చేసే వారు సగటున 3.6 గంటలు ఎక్కువ సేపు విధి నిర్వహణలో ఉంటున్నారని తేలింది. యజమానులు వృత్తి రుగ్మతలను పరిగణనలోకి తీసుకోవాలని, తక్కువ పని గంటలు ఉంటే ఉత్పత్తి ఎక్కువ వస్తుందని గ్రహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్ద పేర్కొన్నది. అప్పగించిన ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులోగా పూర్తికావాలనే లక్ష్యాలు నిర్ణయిస్తున్నందున వాటికోసం ఇంట్లో లేదా పని స్ధలాల్లో ఎక్కువ సేపు పని చేయటంతో పాటు వత్తిడి సమస్య కూడా తలెత్తుతోంది. అధిక పని గంటల కారణంగా గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతుల మందికి గుండెకు రక్త ప్రసరణ తగ్గిన కారణంగా తలెత్తే ఇస్కీమిక్‌ హృదయ వ్యాధి మూలం అని తేలింది. దీనికి వత్తిడి, అధికరక్తపోటు కారణం.ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 15శాతం మంది కార్మికులకు మాత్రమే వృత్తిపరమైన రుగ్మతల చికిత్స ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని తిర్పూరు-కోయంబత్తూరు ప్రాంతంలోని నూలు, వస్త్ర, దుస్తుల పరిశ్రమలో వెలువడే పత్తి ధూళి కారణంగా కార్మికుల్లో బ్రోంకైటిస్‌, టీవి, బరువు తగ్గటం, వినికిడి శక్తి నష్టపోవటం వంటి రుగ్మతలు తలెత్తుతున్నాయని విశ్లేషణలో తేలింది. ఈ పరిశ్రమల్లో పని చేసే వారి జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. ఎన్‌ఎస్‌ఎస్‌ 2018 సర్వే ప్రకారం 83శాతం మంది కార్మికులకు ఆరోగ్య బీమా లేదు.


అధిక గంటలు పని చేస్తున్న వారు ఆసియాలో ఎక్కువగానూ ఐరోపాలో తక్కువగానూ ఉన్నారు. తగిన ప్రతిఫలం లేదా ఆదాయం లేని కారణంగా ఆసియాలోని అనేక ప్రాంతాలలో రోజుకు ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తున్నవారెందరో. పని గంటల పరిమితులు ఉన్నప్పటికీ వాటికి వక్రభాష్యాలు, మరొక కారణమో చెప్పి ఎక్కువ పని గంటలు చేయిస్తున్నారు. అదొక లాభసాటి వ్యవహారంగా కూడా ఉంటోంది. ఒకరిని అదనంగా నియమించుకొని పని చేయించుకోవటం కంటే ఆ మేరకు ఇద్దరో ముగ్గురి చేతో ఓవర్‌ టైమ్‌ చేయించుకోవటం యజమానికి లాభం కనుకనే ఆ పని చేస్తున్నారు.


పని చేయటంలో జపనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కొంత మంది చెబుతారు. అక్కడి కార్మికులు నిరసన తెలియచేయాలంటే సమ్మెల కంటే అదనంగా ఉత్పత్తి చేసి యజమానుల మీద వత్తిడి చేస్తారనే కథలు కూడా బాగానే వినిపిస్తారు.సెలవులు తీసుకోవాలంటే సిగ్గుపడతారని ఆకాశానికి ఎత్తుతారు. 1970దశకంలో చమురు సంక్షోభం తలెత్తినపుడు అక్కడి కార్మికవర్గం మీద పెట్టుబడిదారులు 70గంటల పనిని రుద్దారు.అలా పని చేయటం గర్వకారణం, జపనీయుల దేశభక్తికి నిదర్శనం అన్నట్లు ప్రచారం చేసి సాధారణం కావించారు. ఇప్పుడు అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం అదే చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ కార్మిక సంస్ధ చేసిన సర్వే అంశాలవే. అయితే జపాన్‌లో 70గంటల పని రుద్దుడు పర్యవసానం ఏమిటి ? అక్కడి పని సంస్కృతికి మరోపేరు ” కరోషి ” అంటే అధికపనితో చావు. ఇలాంటి చావులు పెరిగిన కారణంగా పని గంటల గురించి అక్కడ పునరాలోచన ప్రారంభమైంది. అనేక మంది కార్మికులు పని వత్తిడి తట్టుకోలేక కార్యాలయాల మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారు. ఇదొక సామాజిక సమస్యగా మారింది. ప్రతి ఏటా కరోషీ బాధితులు పెరుగుతున్నారు. ఏటా పదివేల మంది మరణిస్తున్నారని అంచనా. కానీ ప్రభుత్వ లెక్కల్లో రెండు వందలు మాత్రమే ఉంటున్నాయి. మరీ ఎక్కువ వత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుందని లేదా పరిహారం చెల్లించాల్సిన కారణాల వలన గానీ ఇటీవలి కాలంలో కొందరు యజమానులు తమ సిబ్బందికి బలవంతంగా సెలవులను ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. సెలవులకు వేతనాలు పొందుతున్న కార్మికులు 2018లో 52.4శాతం మందే ఉన్నారు. సెలవు తీసుకుంటే వేతనం ఇవ్వరు గనుక అనేక మంది వాటి జోలికి పోరు. చూశారా జపాను వారు సెలవులు కూడా తీసుకోకుండా పని చేస్తారని బయటి ప్రపంచం సుద్దులు చెబుతుంది.


ఆర్ధిక సహకార మరియు అభివృద్ది సంస్ధ (ఓయిసిడి) సభ్య దేశాలలో పదకొండు చోట్ల వారానికి 50 గంటల కంటే ఎక్కువే పని చేస్తున్నారు.నాలుగు దేశాల్లో అధిక గంటలు పని చేసే వారు టర్కీలో 33, మెక్సికోలో 29, కొలంబియాలో 26.6, దక్షిణ కొరియాలో 25.2, జపాన్‌లో 17.9శాతం మంది ఉన్నారని ఓయిసిడి చెబుతోంది.పని-కుటుంబం, వ్యక్తిగత జీవితాలను సమన్యయ పరచుకోవటంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది లాభాలు తప్ప మరొకటి పట్టని పెట్టుబడిదారీ వ్యవస్ధ సృష్టించిన సమస్య తప్ప మరొకటి కాదు.


తాజాగా మాన్‌పవర్‌ గ్రూప్‌ సంస్ధ జరిపిన సర్వే ప్రకారం అధిక గంటలు పని చేసే దేశాల్లో మనం ప్రధమ స్దానంలో ఉన్నాం.1981-1996 మధ్య కాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్‌ అంటున్నారు.వీరు మన దేశంలో 52, చైనాలో 48, అమెరికాలో 45, బ్రిటన్‌లో 41 గంటలు పని చేస్తున్నారని సర్వేలో తేలింది. తీవ్ర పోటీ, పని చేయకపోతే ఉద్యోగం ఊడుతుందన్న భయం వంటి అంశాలు రోజుకు పది గంటల కంటే ఎక్కువ సేపు పనిలో ఉండేట్లు చేస్తున్నాయి. ఫోర్డ్‌ కంపెనీ చేసిన సర్వే ప్రకారం వారానికి 12 గంటలు ఉద్యోగులు వాహనాలు నడపటానికి వెచ్చిస్తున్నారు. అంటే పని గంటలకు ఇది అదనం. ఉదాహరణకు 52 పని గంటలైతే అందుకోసం మరోపన్నెండు గంటల పాటు ప్రయాణంలో వెచ్చించాల్సి వస్తోంది.


మన దేశంలో సంభవిస్తున్న ఆత్మహత్యలలో పదిశాతం నిరుద్యోగం, దారిద్య్రం, దివాలా వంటి కారణాలతో జరుగుతున్నాయి. ఒకవైపు అధిక గంటలు పని చేసే వారు అత్యధికులుండగా మరో వైపు అసలు పనే లేని నిరుద్యోగులు కనిపిస్తారు. అధిక గంటలు పనిచేసే దేశాలలో మనది ఐదవ స్ధానమని ఐఎల్‌ఓ తెలిపింది. 2020-21 ప్రపంచ వేతన నివేదికలో అతి తక్కువ కనీస వేతనాలు చెల్లిస్తున్న దేశాల్లో మనది ఒకటని కూడా వెల్లడించింది. 2019 మన జాతీయ గణాంక సంస్ద సర్వే ప్రకారం రోజులో పదో వంతు కూడా దేశ ప్రజలు తీరుబడి కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కార్మికశక్తిలో మహిళల శాతం తగ్గిపోతున్నదని ప్రపంచబ్యాంకు పేర్కొన్నది, గత సంవత్సరం 20.3శాతమే ఉన్నారని, అంతకు ముందుకంటే గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. మన దేశంలో వారానికి నాలుగు దినాలు, రోజుకు పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది యజమానుల లబ్ది కోసం తప్ప మరొకటి కాదు. ఓవర్‌టైమ్‌కు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయటమే ఇది. అధిక పని గంటలు, వృత్తి రుగ్మతల కారణంగా తలెత్తే పర్యవసానాల గురించి మన దేశంలో సమగ్రమైన చట్టాలు చేయాల్సి ఉంది. ఉన్న చట్టాలనే నీరుగార్చేందుకు పూనుకుంటున్న పాలకుల హయాంలో అది జరిగేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆమెరికా నాయకత్వాన ఆయుధ, చైనా చొరవతో అభివృద్ది చతుష్టయ ప్రతిపాదన !

09 Friday Jul 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

Africa Quad, Quad, Quadrilateral Security Dialogue


మన చుట్టూ జరుగుతున్నదేమిటి -6

ఎం కోటేశ్వరరావు


జర్మనీ, ఫ్రాన్స్‌తో కలసి ఆఫ్రికా అభివృద్దికి పనిచేసేందుకు చైనా సిద్దంగా ఉందని చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ప్రతిపాదించినట్లు జపాన్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.చైనాకు వ్యతిరేకంగా సమీకృతం అవుతున్న అమెరికా నాయకత్వంలోని చతుష్టయ కూటమి సమావేశాలు అక్టోబరులో జరగనున్నట్లు వార్త. ఒక వైపు అమెరికా దూకుడును అడ్డుకొనేందుకు చైనా కూడా పావులు కదుపుతున్నట్లు ఈ పరిణామం వెల్లడిస్తున్నది. జర్మనీ, ఫ్రాన్స్‌ గతంలో ఆఫ్రికాలోని కొన్ని దేశాలను వలసలుగా చేసుకున్న విషయం తెలిసిందే. గ్జీ చేసిన ప్రతిపాదన మీద రెండు దేశాల నుంచి స్పందన వెలువడలేదు. అయితే ఫ్రెంచి అధ్యక్ష భవనం చేసిన ప్రకటనలో చతుష్టయ ప్రతిపాదనను ప్రస్తావించనప్పటికీ అవసరమైన దేశాలకు రుణాల పునర్వ్యవస్తీకరణ చేసేందుకు చైనా ముందుకు రావటాన్ని ఫ్రాన్స్‌,జర్మనీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.బ్రిటన్‌లో జరిగిన బి3డబ్ల్యు ప్రకటన తరువాత చైనా వైపు నుంచి ఈ ప్రతిపాదన వెలువడింది.


అమెరికా నాయకత్వంలోని చతుష్టయ కూటమి, ఐరోపా యూనియన్‌ ఇంకా కలసి వచ్చే దేశాలతో చైనాను దెబ్బతీయాలన్న ఆలోచన బహిరంగంగానే సాగుతోంది. ఎవరూ దాచుకోవటం లేదు. కానీ అదే అమెరికా మాటను మనం మాత్రం అది గీసిన గీతను జవదాటకుండా ఆర్‌సిఇపికి దూరంగా ఉన్నాము. జపాన్‌,ఆస్ట్రేలియా దేశాలు ఖాతరు చేయలేదు, తోటి సభ్యురాలైన మన దేశానికి విలువ ఇవ్వలేదు. చైనా భాగస్వామిగా ఉన్న ఆర్‌సిఇపి(ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం)కూటమిలో చేరాయి. మనం చెబుతున్న ఇండో-పసిఫిక్‌ మరియు మన దేశ ఈశాన్య ప్రాంత అభివృద్దికి వాటి చర్య విఘాతం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం అమెరికా మోజుల్లో ఖాతరు చేయటం లేదు. ఒకవైపు అమెరికాతో కలసి చైనాకు వ్యతిరేకంగా మిలిటరీ ప్రతిఘటనకు ఆ రెండు దేశాలు సిద్దం అంటున్నాయి, మరోవైపు చైనాతో కలసి వ్యాపారాన్ని చేస్తామని చెబుతున్నాయి. ఒకేసారి ఇది ఎలా సాధ్యం ? మనమేమో చైనాతో వ్యాపారం చేయం, దాని సంగతి చూస్తామన్నట్లుగా మాట్లాడుతున్నాం. ఇది జరిగేదేనా ? అమెరికా తోక పట్టుకొని గంగానదిని ఈదగలమా ? అమెరికాను నమ్మి ఆర్‌సిఇపికి దూరంగా ఉన్నాం. పోనీ దానికి బదులు ప్రపంచ వాణిజ్య సంస్ధలో మనకు వ్యతిరేకంగా అమెరికా వేసిన కేసులు తప్ప ఇతర ” ప్రయోజనాలేమైనా ” పొందామా ? గతంలో మనకు ఇచ్చిన రాయితీలను కూడా రద్దు చేశారు. ఒకవైపు స్వేచ్చా వాణిజ్యం గురించి నరేంద్రమోడీ చెబుతారు. మరోవైపు ప్రపంచంలో అతి పెద్ద స్వేేచ్చావాణిజ్య కూటమి ప్రపంచ జిడిపిలో 30,జనాభాలో 30శాతం కలిగిన దేశాలకు మనం దూరం అంటారు. ఆ కూటమిలో చేరితే మనకు దెబ్బ అన్న పెద్దలు దాని బదులు సాధించిందేమిటి ?


చైనా ఉన్న కూటమిలో చేరితే దాని వస్తువులను మనం కొనాల్సి ఉంటుంది అంటారు. నిజమే, ఇప్పుడు కొనటం లేదా ? కరోనాకు ముందు 2019-20లో మన దేశ మొత్తం వాణిజ్య లోటు 161 బిలియన్‌ డాలర్లు, కరోనా కారణంగా మరుసటి ఏడాది 98బి.డాలర్లకు తగ్గిందనుకోండి. ఈలోటులో చైనా వాటా 55-60 బి.డాలర్ల మధ్య ఉంటోంది. మరి మిగతా లోటు సంగతి ఏమిటి ? మన పరిశ్రమలు, వ్యవసాయానికి రక్షణ కల్పించాల్సిందే. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏడు సంవత్సరాల నుంచి మేకిన్‌ ఇండియా పేరుతో మన దేశాన్ని కూడా చైనాకు పోటీగా ప్రపంచ ఫ్యాక్టరీగా తయారు చేయాలని నరేంద్రమోడీ పిలుపు నిచ్చారు. ఇప్పుడు చైనాతో పోటీ పడేందుకు భయపడుతున్నామంటే వైఫల్యాన్ని అంగీకరించినట్లే కదా ?సమీప భవిష్యత్‌లో కూడా చైనాతో పోటీపడలేమని చెప్పినట్లే కదా ? మన దేశ వస్తూత్పత్తికి అవసరమైన యంత్రాలను కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకోకుండా గడవని స్ధితి.


ఆర్‌సిఇపి ఒప్పందానికి అమెరికా దూరంగా ఉంది. దాని అనుయాయి దేశాలు కూడా ఇప్పుడు చైనాకు దగ్గర అవుతున్నాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికాయే విశ్లేషణలో వాపోయింది. మన కోడి కూయకపోతే తెల్లవారదు అనుకున్న అమెరిన్లకు జ్ఞానోదయం అవుతున్నట్లా ? పదిహేను దేశాల ఈ కూటమి ఒప్పందం అమలుకు ఇప్పటికే చైనా, జపాన్‌ ఆమోదం తెలిపాయి.మరో నాలుగు ఆసియన్‌, ఒక ఆసియనేతర దేశ చట్టసభలు ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. ఒకసారి అంగీకరించిన తరువాత వెనుకో ముందో అది జరుగుతుంది. లేదూ అమెరికా అడ్డుపడితే ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. ఆర్‌సిఇపికి పోటీగా లేదా ప్రత్యామ్నాయంగా చైనా లేకుండా పసిఫిక్‌ దేశాల భాగస్వామ్య ఒప్పందం(టిపిపి) చేసుకోవాలంటూ చర్చలు ప్రారంభించిన అమెరికాయే దాన్నుంచి వైదొలిగింది. దాంతో ఆర్‌సిఇపి ముందుకు సాగింది. దాని అనుయాయి దేశాల్లో విశ్వాసం సన్నగిల్లింది. ఆర్‌సిఇపిలో చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనవసరంగా అమెరికా భయపడిందనే అభిప్రాయం ఇప్పుడు కొంత మంది అమెరికన్లలోనే వెల్లడి అవుతోంది.తమ దేశంలో టిపిపికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కాగా ఆర్‌సిఇపిని ఎవరూ వ్యతిరేకించలేదని న్యూజిలాండర్స్‌ చెప్పారు. అమెరికా తమకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అయినప్పటికీ ప్రపంచంలో ఉన్నాం గనుక ఆర్‌సిఇపిలో చేరటం తమకు ముఖ్యమని ఆస్ట్రేలియన్‌ ఎంపీ చెప్పాడు.


అంతర్జాతీయ వాణిజ్యంలో భారత నష్టాలు చైనాకు లాభాలుగా మారుతున్నాయని మన దేశానికి చెందిన విశ్లేషకులు కొందరు చెబుతున్నారు.మనకు చిరకాలంగా మిత్ర దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ ఇప్పుడు చైనాకు దగ్గర అవుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నూరు సంవత్సరాల ఉత్సవం సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం చైనా మీద రెండు నాణాలను విడుదల చేసింది. మరి మోడీ గారు ఏమి చేస్తున్నట్లు ? ఇరాన్‌ మరింత స్పష్టమైన ఉదాహరణ. మన రూపాయిని ప్రపంచంలో స్వీకరించే వేళ్ల మీద లెక్కించే దేశాలలో ఇరాన్‌ ఒకటి. అమెరికా బెదిరింపులకు లొంగి మనం దాన్నుంచి చమురు కొనుగోలు చేయటం మాని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దాంతో ఇరాన్‌ సహజంగానే చైనాకు మరింత దగ్గరైంది. చాబహార్‌ రేవు అభివృద్ది పధకాన్ని మనం కోల్పోయాము, చైనా చేపట్టింది. రష్యా-అమెరికా మధ్య వివాదం ముదురుతుండటంతో రష్యన్లు చైనాకు దగ్గర అవుతున్నారు. భారత ఉపఖండ దేశాల మీద దీని ప్రభావం పడకుండా ఉండదు.


ప్రపంచంలో అమెరికా ఆర్ధికంగా అగ్రరాజ్యం అన్నది తెలిసిందే. అక్కడ రోడ్లు ఊడ్చేవారు కూడా సూటూ బూటూ వేసుకొని కార్లలో వచ్చి ఊడ్చిపోతారని దాన్ని అభిమానించే వారు లొట్టలు వేసుకుంటూ చెబుతారు, అక్కడి ఇండ్లలో మరుగుదొడ్లు మన పడక గదుల్లా ఉంటాయని చెప్పిన పెద్దలు ఉన్నారు. అలాంటి అమెరికాను చూసి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా ? అంతటి ధనిక దేశం కూడా కరోనాతో కకావికలైంది.ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఈ ఏడాది మూడువేల డాలర్ల మేరకు సాయం చేయాలని జో బైడెన్‌ సర్కార్‌ నిర్ణయించింది. మన ప్రధాని మూడు వేలు కాదు కదా ఈ ఏడాది పైసా కూడా ఇచ్చేది లేదని చెప్పేశారు. ఈ నెల 15 నుంచి అమెరికాలో ఆ పధకం అమలు చేయనున్నారు. కనీసంగా మూడువేల డాలర్లు , కొందరికి 3,600 డాలర్లు కూడా లభిస్తాయని వార్తలు. ఏడాదికి భార్యాభర్తకు లక్షా 50వేల డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే వారు, ఒంటరిగా ఉన్నట్లయితే లక్షా 12వేల ఐదు వందల డాలర్లకంటే తక్కువగా వచ్చేవారు ఈ సాయం పొందేందుకు అర్హులు. వారికి ఆరు నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ప్రతి నెలా 250 డాలర్ల చొప్పున ఆరునెలల పాటు ఇస్తారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలుంటే మూడు వందల డాలర్లు ఇస్తారు. ఇంతే కాదు వారికి ప్రతి బిడ్డకు వచ్చే ఏడాది 1,500 నుంచి 1,800 డాలర్ల పన్ను రాయితీ కూడా ఇవ్వనున్నారు. ఇదంతా అక్కడ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకే, మరి మన దేశంలో జనం దగ్గర డబ్బు లేకుండా వస్తువులు ఎలా అమ్ముడు పోతాయి. ఆర్ధిక వ్యవస్ధ ఎలా ముందుకు పోతుంది. అందుకే భారత పరిశ్రమల సమాఖ్య వారు అవసరమైతే నోట్లను అదనంగా అచ్చువేసి మూడు లక్షల కోట్ల రూపాయల మేర జనానికి డబ్బు పంచాలని చెప్పారు. వారేమీ కమ్యూనిస్టులు కాదు. వారు తయారు చేసే వస్తువులను జనం కొంటేనే కదా పరిశ్రమలు నడిచేది. నరేంద్రమోడీకి ఈ మాత్రం ఆలోచన కూడా తట్టలేదా ?


బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా జరిపిన సర్వేలో మన దేశంలో 77శాతం మంది కార్మికులు ఉద్యోగం పోయింది లేదా ఆదాయానికి కోత పడిందని చెప్పారు, ఇరవైశాతం మంది ఉద్యోగాలు కోల్పోతే 57శాతానికి వేతనాల కోత పడింది. పరిస్ధితి ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. కార్పొరేట్లకు ఆత్మనిర్భరత – కష్టజీవులకు బతుకు దుర్భరత అన్నట్లుగా తయారైంది. చైనాకు సమంగా జనాభా మన దేశంలో ఉంది. గతేడాది మన దేశంలో ఎలక్ట్రానిక్‌ వాణిజ్య విలువ 38 బిలియన్‌ డాలర్లని రెడ్‌సీర్‌ విశ్లేషణ పేర్కొన్నది. అదే చైనాలో 1.8లక్షల కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. అందువలన మన దేశంలో ఉన్న ఉపాధి, వాటి మీద వస్తున్న ఆదాయం ఎంత తక్కువో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. అందువలన మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు ఏమి చూసి ముందువస్తారు ? కార్పొరేట్లకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో కట్టబెడుతోంది కనుక ఆర్ధిక కార్యకలాపాలు లేకపోయినా కంపెనీల లాభాలను పంచుకొనేందుకు విదేశీ సంస్ధలు మన కంపెనీల వాటాలను కొనేందుకు ముందుకు వస్తున్నాయి తప్ప ప్రత్యక్ష పెట్టుబడులకు కాదు.


నోట్లను ముద్రించి ప్రభుత్వానికి నగదు ఇవ్వటం రిజర్వుబ్యాంకుల పని అని నైజీరియా రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఎంఫిలీ చెప్పాడు.(మన దేశంలో దేశమంతటికీ చెందిన రిజర్వుబ్యాంకు లాభాలను కేంద్రం తన ఖాతాకు మరలించుకొని లోటును పూడ్చుకుంటున్నది) నైజీరియా రిజర్వుబ్యాంకు ముద్రించిన 60బిలియన్‌ నైరాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంచటంపై వచ్చిన విమర్శలను ఎంఫిలీ తిప్పి కొట్టారు. నోట్ల ముద్రణకు తిరస్కరించటం బాధ్యతా రాహిత్యం అన్నాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వందేండ్ల చైనా కమ్యూనిస్టు పార్టీ విజయాల ప్రాధాన్యత !

29 Tuesday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

100 Years of CPC, china communist party, People's Republic of China (PRC)


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అనేక పార్టీలు పుట్టాయి, గిట్టాయి. అది పెద్ద విషయం కాదు, వంద పార్టీ జనాలకు ఏమి చేసిందనేదే గీటురాయి. ఈ నేపధ్యంలో జూలై ఒకటవ తేదీన వందవ వార్షికోత్సవం చేసుకోనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) గురించి అందరూ తెలుసుకోవటం అవసరం. వందేళ్ల చరిత్ర, విజయాలు, అనుభవాల వివరణకు పెద్ద గ్రంధమే అవసరం. చైనా సాధించిన విజయాల నుంచి జనాల దృష్టి మళ్లించేందుకు నిరంతరం కమ్యూనిస్టు వ్యతిరేకులు చేస్తున్న ప్రయత్నాలు ఈ సందర్భంగా మరీ ఎక్కువయ్యాయి.అక్కడ మానవ హక్కులు లేవు, ఏక పార్టీ నియంతృత్వం, ప్రశ్నిస్తే సహించరు. సోషలిస్టు వ్యవస్ధ కూలిపోతుంది, అభివృద్ది అంకెల గారడీ తప్ప నిజం కాదు అని చెబుతారు. అలాంటపుడు అలా చెప్పే దేశాలు, శక్తులు కూలిపోయేంతవరకు వేచి చూస్తే పోయేదానికి ఆందోళన ఎందుకు ? చతుష్టయ కూటములెందుకు, జి7 సమావేశాలెందుకు, చైనాను అడ్డుకోవాలనే సంకల్పాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ?


1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇలాంటి కబుర్లు చెబుతూనే ఉన్నారు. వాటిని ఒక చెవితో వింటూ ఒక కంట కనిపెడుతూనే చైనా తన పని తాను చేసుకుపోతూ అనేక విజయాలు సాధించింది. దీని అర్ధం చైనాకు ఎలాంటి సమస్యలూ లేవని కాదు. ఒక్కొక్క మెట్టూ అధిగమిస్తూ ముందుకు పోతున్నది. ఆ తీరు సామ్రాజ్యవాదులను బెంబేలెత్తిస్తున్నది. పూర్వపు సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా రాజ్యాల అనుభవాలు, గుణపాఠాలు తీసుకున్న సిపిసి నాయకత్వం తమవైన లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నది. కూల్చివేతకు గురైన సోషలిస్టు దేశాలలోని జనం తమ స్ధితిని పెట్టుబడిదారీ దేశాలలో ఉన్న పరిస్ధితినీ పోల్చుకున్నారు గనుకనే కమ్యూనిస్టు వ్యతిరేకుల పని సులభమై ఆ వ్యవస్ధలను కూలదోశారు. అయితే చైనీయులు కూడా పోల్చుకోవటం సహజం. తాము ఉత్పత్తి చేసిన సరకుల మీద అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఆధారపడ్డాయని, ఆ ఎగుమతులు తమ జీవితాలను మెరుగుపరిచాయని కూడా వారికి తెలుసు. ఇలాంటి అనుభవం సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల వారికి లేదు. అప్పుడు సోషలిజం విఫలమైందనే ప్రచారం అమెరికాలో జరిగితే ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది. తాము సాధిస్తున్న విజయాలు పశ్చిమ దేశాల మీద మిగిలి ఉన్న భ్రమలను చైనీయుల్లో క్రమంగా తొలగిస్తున్నాయి.


మొదటి ప్రపంచ యుద్దంలో సామ్రాజ్యవాదుల పట్ల చైనా ప్రభుత్వ మెతక వైఖరికి నిరసనగా 1919లో విద్యార్ధులు, మేథావులు తీవ్రంగా స్పందించారు. చైనాలోని కొన్ని ప్రాంతాలను జపాన్‌ ఆధీనంలో ఉంచేందుకు అంగీకరించటం ఆగ్రహం కలిగించిది. దానికి నిరసనగా మే నాలుగవ తేదీన ప్రదర్శనలు నిర్వహించారు. రష్యాలో బోల్సివిక్‌ విప్లవం, ప్రధమ శ్రామిక రాజ్యం ఏర్పడటం వంటి పరిణామాలు కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు పురికొల్పాయి. మే నాలుగు ఉద్యమంలో భాగస్వాములైన మేథావులు ప్రపంచ విప్లవం, మార్క్సిజం భావజాలంతో స్పూర్తి పొందారు. రష్యన్‌ కమ్యూనిస్టు ఓటిన్‌స్కీ 1920 ఏప్రిల్‌ నెలలో చైనా వచ్చి అక్కడి మేథావులను కలిసి చర్చలు జరిపారు. షాంఘైలో దూర ప్రాచ్య కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ శాఖను ఏర్పాటు చేశారు. దాని ఫలితమే షాంఘై రివల్యూషనరీ బ్యూరో లేదా కమ్యూనిస్టు గ్రూప్‌ ఏర్పాటు, అధ్యయన తరగతులు నిర్వహించారు.1921 జూలై 1న చైనా కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. తరువాత జూలై 23-31వ తేదీల మధ్య పార్టీ వ్యవస్దాపక మహాసభ జరిగింది.

కేవలం యాభై మంది సభ్యులతో ప్రారంభమైన పార్టీ ప్రధమ మహాసభకు మావో జెడాంగ్‌తో సహా ప్రతినిధులు పన్నెండు మంది మాత్రమే. అది కూడా షాంఘైలోని ఫ్రాన్స్‌ భూభాగంలో ఒక ఇంట్లో జరిగింది. దాన్ని పసిగట్టిన ఫ్రెంచి పోలీసులు సభను అడ్డుకోవటంతో పక్కనే ఉన్న ఒక నదిలో విహార యాత్రీకుల పడవలోకి మార్చారు. అయితే ఆ సమావేశానికి అప్పటికే ప్రముఖ కమ్యూనిస్టు మేధావిగా, చైనా లెనిన్‌గా పేరు గాంచిన చెన్‌ డూక్సీ హాజరు కాలేకపోయినప్పటికీ పార్టీ కార్యదర్శిగా ఎన్నికైయ్యారు.1927వరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. చైనా జాతియోద్యమనేత సన్‌యేట్‌ సేన్‌ కమ్యూనిస్టు కాకపోయినప్పటికీ కమ్యూనిస్టు భావజాలానికి అనుకూలం. చైనా కమ్యూనిస్టులు ఆయన నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీతో కలసి పని చేయటమే గాకుండా జాతీయవాదులను కమ్యూనిస్టులుగా మార్చేందుకు పని చేశారు. ఒక దశలో ఆ పార్టీకి కమ్యూనిస్టులే నాయకత్వం వహిస్తారా అన్న స్దితిలో 1925లో సన్‌ఏట్‌ సేన్‌ మరణించారు. తరువాత చాంగ్‌కై షేక్‌ కొమింటాంగ్‌ పార్టీ, ప్రభుత్వ అధినేతగా ఎన్నికయ్యాడు. సన్‌యేట్‌ సేన్‌ మరణించేంతవరకు తన కమ్యూనిస్టు వ్యతిరేకతను దాచుకున్న చాంగ్‌ పార్టీనేతగా మారగానే కమ్యూనిస్టులను పక్కన పెట్టటం ప్రారంభించాడు. పశ్చిమదేశాలకు దగ్గరయ్యాడు.1927 నాటికి కమ్యూనిస్టుల అణచివేతకు పూనుకున్నాడు.


చైనా విప్లవం ఏ పంధాలో నడవాలనే అంశంపై 1925లోనే పార్టీలో చర్చ జరిగింది. కార్మికవర్గ నాయకత్వాన జరగాలని చెన్‌ డూక్సీ ప్రతిపాదించగా చైనాలో ఉన్న పరిస్ధితిని బట్టి రైతాంగం ఆధ్వర్యాన జరగాలని మావో ప్రతిపాదించాడు. కొమింటాంగ్‌ పార్టీతో ఎలా వ్యవహరించాలనే అంశంపై కూడా చెన్‌ వైఖరి వ్యతిరేకంగా ఉంది. చాంగ్‌కై షేక్‌ కమ్యూనిస్టులను వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీలోని అనేక మంది కమ్యూనిస్టులతో సఖ్యతగా ఉన్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం చెన్‌ వైఖరిని తప్పు పట్టింది. చివరికి 1929లో పార్టీ నుంచి బహిష్కరణకు గురై తరువాత ట్రాట్సీయిస్టుగా మారిపోయాడు. చాంగ్‌కై షేక్‌ను ప్రతిఘటించే క్రమంలోనే కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌ తరువాత 1948లో అధికార హస్తగతం తెలిసిందే.
దారిద్య్రం నుంచి 77 కోట్ల మందిని బయట పడవేయటం 50 కోట్ల మంది మధ్యతరగతి జనాల వినియోగశక్తిని పెంచటం చైనా కమ్యూనిస్టు పార్టీ సాధించిన పెద్ద విజయం. కమ్యూనిజం మీద వ్యతిరేకత ఉన్నా, దాన్ని కూల్చివేయాలని కోరుతున్నా బహుళజాతి సంస్ధలన్నీ చైనాలో పెట్టుబడులు పెట్టటం, వాణిజ్యానికి ముందుకు రావటం వెనుక ఉన్న కారణం అదే. వీటికి తలుపులు తెరిచే సమయంలోనే సంస్కరణలకు ఆద్యుడిగా ఉన్న డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. కిటికీలు తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయి, అయితే వాటిని ఎలా నిరోధించాలో కూడా మాకు తెలుసు అన్నారు.


గత పద్దెనిమిది నెలలుగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపి వేస్తుండగా దాన్ని అరికట్టటం, కొద్ది నెలల్లోనే తిరిగి సాధారణ ఆర్ధిక, సామాజిక జీవనాన్ని పునరుద్దరించటం చైనా కమ్యూనిస్టు పార్టీ సాధించిన అతి పెద్ద విజయం. మన దేశంలో కరోనా సోకిన వారు ఆసుపత్రులపాలై ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఎలాంటి సామాజిక సంక్షోభంతో సతమతమౌతున్నారో మనం నిత్యం చూస్తున్నాం. సమర్ధవంతమైన చర్యల ద్వారా చైనీయులకు అటువంటి పరిస్ధితి నుంచి కమ్యూనిస్టు పార్టీ కాపాడింది. అందుకే అంతర్జాతీయ సంస్ధలు జరిపిన సర్వేలో 95శాతం మందికిపైగా జనం కమ్యూనిస్టు పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నూటపది కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయటం చిన్న విషయం కాదు. ఈ విజయాలు సాధించటం వెనుక 9.2 కోట్ల మంది సిపిసి సభ్యుల పాత్ర ఉంది.2008లో ధనిక దేశాలలో ప్రారంభమైన సంక్షోభం చైనా మీద ప్రభావం చూపింది. అయితే దాన్ని అధిగమించేందుకు మౌలిక సదుపాయాలు, శాస్త్ర, సాంకేతిక, మానవ వనరుల రంగాలలో పెద్ద ఎత్తున చైనా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి త్వరలోనే దాన్ని అధిగమించింది. ఆ పెట్టుబడులు ఇప్పుడు వివిధ రంగాలలో చైనా విజయాలను ప్రపంచానికి వెల్లడించుతున్నాయి. టెలికాం రంగంలో 5జి, మొబైల్‌ చెల్లింపులు, ఇ కామర్స్‌, కృత్రిమ మేథ, రోబోటిక్స్‌, రోబో కార్లు,హైస్పీడ్‌ రైల్వేలు, అంతరిక్ష రంగం, అధునాతన ఆయుధాల తయారీలో నేడు చైనా కొత్త వరవడిని సృష్టిస్తోందంటే దాని వెనుక చోదకశక్తి చైనా కమ్యూనిస్టు పార్టీ తప్ప మరొకటి కాదు.

చైనా తొలి పంచవర్ష ప్రణాళిక 1953లో ప్రారంభమైంది. సోవియట్‌ యూనియన్ను చూసి ఈ విధానాన్ని ప్రారంభించిన చైనా త్వరలోనే దానిలో ఉన్న లోపాలు, పొరపాట్లను గమనించింది. చైనాకు తగిన విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేసింది.1981-90 మధ్య జిడిపిని రెట్టింపు, తరువాత పది సంవత్సరాలో దానికి రెట్టింపు లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ప్రవేశించకుండా ఆర్ధిక కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశాలు లేవని గుర్తించారు. దాంతో అంతకు ముందు అనుసరించిన ప్రణాళికాబద్ద విధానంతో పాటు కొద్ది మార్పులు చేసి సోషలిస్టు మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధగా మార్చి 2001లో ప్రవేశం పొందారు. 2049 నాటికి అంటే సోషలిస్టు వ్యవస్ధ వందవ సంవత్సరంలో ప్రవేశించే నాటికి ఆధునిక సోషలిస్టు రాజ్యంగా రూపొందాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. చైనా సాధించిన వృద్ధి ఏదో ఒక ఏడాదిలో వచ్చింది కాదు. సంస్కరణలు ప్రారంభించిన పది సంవత్సరాల తరువాతనే ఫలితాలనివ్వటం ప్రారంభమైంది.
1960లో ప్రపంచ జిడిపిలో చైనా వాటా 4.4శాతం, 1970లో 3.1, 1980లో 1.7, 1990లో 1.6, 2000లో 3.6, 2010లో 9.2, 2020లో 18.34శాతం ఉంది.సంస్కరణల్లో భాగంగా తలుపులు తెరిచినపుడు కమ్యూనిస్టు పార్టీలోనే ప్రతిఘటన ఎదురైంది. ఇవి చివరకు పెట్టుబడిదారీ విధానం వైపు దారి తీస్తాయోమో అన్నదే దాని వెనుక ఉన్న ఆందోళన. 1982లో షెంజన్‌లోని షెకావ్‌ పారిశ్రామిక ప్రాంతంలో విదేశీయుడిని వాణిజ్య మేనేజర్‌గా నియమించేందుకు తీసుకున్న నిర్ణయం మీద తీవ్ర విమర్శ వచ్చింది. వెంటనే డెంగ్‌సియావో పింగ్‌ జోక్యం చేసుకొని దాన్ని సమర్ధించారు,అదేమీ దేశద్రోహ వైఖరి కాదు అన్నారు. చైనా అమలు జరిపిన విధానాలను చూసి పశ్చిమ దేశాల వారు, కొందరు వామపక్ష అభిమానులు కూడా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అని ప్రచారం చేశారు. నిజానికి అది పెట్టుబడిదారీ విధానమే అయితే నేడు ఇతర పెట్టుబడిదారీ దేశాలు మన వంటి దేశాలను కూడా కలుపుకొని కలసికట్టుగా వారి మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది ?

గత ఆరు దశాబ్దాలలో చైనాలో వచ్చిన మార్పును వివిధ దేశాల జిడిపితో పోల్చినపుడు ఎలా ఉందో దిగువ చూడవచ్చు. విలువ బిలియన్‌ డాలర్లలో.
దేశం ××× 1960×× 1970×× 1980××× 1990××× 2000×××× 2010×××× 2020
చైనా ××× 59.7 ×× 92.6×× 191.1×××360.9×××1211.3 ×× 6,087.2 ××16,640
జపాన్‌ ×××44.3××212.6 ××1,105.4××3,132.8××4,887.5 ×× 5,700.1 ×× 5,378
బ్రిటన్‌ ××× 73.2××130.7 ××564.9 ××1,093.2 ××1,657.8×× 2,475.2 ×× 3,120
అమెరికా ××543.3 ×1,073.3××2,857.3××5,963.5××10,252.3××14,992.1××22,680


జపాన్‌ అభివృద్ది గురించి లొట్టలు వేసుకుంటూ వర్ణించినంత ఆనందంగా చైనా గురించి మీడియా గానీ మరొకరు గానీ చెప్పలేదు. కారణం ఏమంటారు ? కరోనా రెచ్చిపోయిన 2020 సంవత్సరంలో చైనా గురించి ఎవరెన్ని కథలు చెప్పినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే వారు పొలోమంటూ చైనాకే వెళ్లారు. చైనాకు 163 బిలియన్‌ డాలర్లు రాగా అమెరికాకు 134 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. తరువాత పరిస్దితి మెరుగుపడితే తిరిగి అమెరికాయే మొదటి స్ధానానికి చేరవచ్చు. తొలి రోజుల్లో జనానికి అవసరమైన ఉపాధి, ఆహారం, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం గురించి చైనా కమ్యూనిస్టుపార్టీ తొలి రోజుల్లో కేంద్రీకరించింది. ఇప్పుడు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం మీద కేంద్రీకరించింది. అమెరికా వంటి ధనిక దేశాలకు అదే కంటగింపుగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన చుట్టూ జరుగుతున్నదేమిటి – 2 ఇతరుల భుజాల మీద తుపాకితో చైనాను కాల్చాలని చూస్తున్న అమెరికా – జి7 47వ శిఖరాగ్ర సభ, !

14 Monday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

47th G7 Summit, China, G7, G7-India, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


ఏడు ధనిక దేశాల (జి7) బృంద 47వ వార్షిక సమావేశం జూన్‌ 11-13 తేదీలలో బ్రిటన్‌లోని ఇంగ్లండ్‌ సముద్రతీరంలోని కారన్‌వాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి భారత్‌,ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాను ఆహ్వానించారు. ప్రతి ఏటా చేస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా అనేక అంశాల మీద తీర్మానాలు చేశారు, సంకల్పాలు చెప్పుకున్నారు. హడావుడి చేశారు. చైనా మీద జబ్బ చరచటం ఈ సమావేశాల ప్రత్యేకత. జి7కు భారత్‌ సహజ మిత్రదేశమని మన ప్రధాని నరేంద్రమోడీ అంతర్జాలంద్వారా చేసిన ప్రసంగంలో చెప్పటం ద్వారా తామెటు ఉన్నదీ మరోసారి స్పష్టం చేశారు.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత ధనిక దేశాల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు( ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ) తమ ప్రయోజనాలను సక్రమంగా నెరవేర్చటం లేదనే అసంతృప్తి వాటిని ఏర్పాటు చేసిన దేశాల్లోనే తలెత్తింది. దాంతో వాటిని కొనసాగిస్తూనే తమ ప్రయత్నాలు తాము చేయాలనే లక్ష్యంతో 1973లో అమెరికా చొరవతో సన్నాహక సమావేశం జరిగింది. దానిలో అమెరికా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఆర్ధిక మంత్రులు పాల్గొన్నారు.మీకు అభ్యంతరం లేకపోతే జపాన్ను కూడా కలుపుకుందాం అన్న అమెరికా ప్రతిపాదనకు మిగతా దేశాలు అంగీకరించటంతో జి5గా ప్రారంభమైంది.1975లో తొలిశిఖరాగ్ర సమావేశానికి ఇటలీని కూడా ఆహ్వానించారు.మరుసటి ఏడాది సమావేశంలో బృందంలో ఆంగ్లం మాట్లాడేవారు మరొకరు ఉంటే బాగుంటుందంటూ కెనడాను కూడా ఆహ్వానించాలని అమెరికా ప్రతిపాదించటంతో 1976 నాటికి జి7గా మారింది. ఈ బృంద సమావేశాలకు ఐరోపా యూనియన్ను శాశ్వత ఆహ్వానితురాలిగా నిర్ణయించారు. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత 1997లో రష్యాను జి7లోకి ఆహ్వానించి, జి8గా మార్చారు. 2014వరకు సభ్యురాలిగా కొనసాగింది. ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించటంతో అదే ఏడాది దాన్ని సస్పెండ్‌ చేశారు. 2018లో ఈ బృందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. అయితే 2020లో అమెరికా, ఇటలీ రెండు దేశాలూ తిరిగి రష్యాను చేర్చుకోవాలని చేసిన ప్రతిపాదనను మిగిలిన దేశాలు తిరస్కరించాయి. తమకసలు చేరాలనే ఆసక్తి లేదని రష్యా చెప్పేసింది. ఏ దేశంలో సమావేశం జరిగితే ఆ దేశం ఎవరిని కోరుకుంటే వారిని ఆహ్వానితులుగా పిలుస్తారు. మన దేశం పెద్ద మార్కెట్‌ గనుక ప్రతి దేశమూ ప్రతిసారీ మనలను ఆహ్వానిస్తున్నది.


జి7 మౌలికంగా సామ్రాజ్యవాద దేశాల కూటమి. వలసలుగా చేసుకోవటం ఇంకేమాత్రం కుదిరే అవకాశం లేకపోవటంతో రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఈ కూటమి దేశాలన్నీ రాజీకి వచ్చి దేశాలకు బదులు మార్కెట్‌ను పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాటి మధ్య విబేధాలున్నప్పటికీ తాత్కాలికంగా పక్కన పెట్టాయి. అయితే రష్యా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారి రంగంలోకి వచ్చిన తరువాత అది కూడా తన వాటా సంగతేమిటని డిమాండ్‌ చేసింది. ద్వితీయ శ్రేణి పాత్ర పోషించేందుకు సిద్దం కాదని ప్రధమ స్ధానంలో ఉండాలని కోరింది కనుకనే జి7 మొత్తంగా దాని మీద దాడికి దిగాయి. దాన్నుంచి తట్టుకొనేందుకు వర్గరీత్యా ఒకటి కాకున్నా ప్రస్తుతానికైతే చైనాతో కలసి ఎదిరించాలని రష్యా నిర్ణయించుకుంది. ఈ కూటమి దేశాలు మన దేశాన్ని కూడా వినియోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప తమ భాగస్వామిగా చేసుకొనేందుకు సిద్దం కావటం లేదు. బ్రెజిల్‌ పరిస్ధితీ అదే.

జి7 47వ సమావేశం ఆమోదించిన అంశాలను క్లుప్తంగా చూద్దాం. వీటిలో రెండు రకాలు, ఒకటి రాజకీయ పరమైనవి, రెండవది ఆర్ధిక, ఇతర అంశాలు. మొదటిదాని సారం ఏమంటే అన్ని దేశాలు కలసి చైనా మెడలు వంచాలి, కాళ్లదగ్గరకు తెచ్చుకోవాలి. గ్జిన్‌ జియాంగ్‌, హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు, తైవాన్ను బెదిరిస్తున్నట్లు ప్రచారం చేయాలి, వత్తిడి తేవాలి. అర్ధిక అంశాలలో తప్పుడు పద్దతులకు పాల్పడుతున్నని ఊదరగొట్టాలి. రెండవ తరగతిలో కంపెనీలు పన్ను ఎగ్గొట్టేందుకు పన్నుల స్వర్గాలుగా ఉన్న ప్రాంతాలకు తరలిపోతున్నందున కార్పొరేట్‌ పన్ను కనీసంగా 15శాతం విధించాలని పేర్కొన్నాయి. పేద దేశాలకు వందకోట్ల డోసుల కరోనా వాక్సిన్‌ అందించాలి. అభివృద్ది చెందుతున్న దేశాల అభివృద్ధికి తోడ్పడాలి.దానిలో భాగంగా బి3డబ్యు పధకాన్ని అమలు చేయాలి.


ఈ బృందంలో ఒకటైన బ్రిటన్‌ మన దేశాన్ని వలసగా చేసుకొని మన మూల్గులను పీల్చింది. మనం ఎదగాల్సినంతగా ఎదగకపోవటానికి అది కూడా ఒక కారణం. అదే విధంగా మిగిలిన దేశాలు కూడా అలాంటి చరిత్ర కలిగినవే. అలాంటి వాటికి మన దేశం సహజ బంధువు అని చెప్పటం అసలు సిసలు దేశభక్తుడిని అని చెప్పుకొనే నరేంద్రమోడీ చెప్పటం విశేషం. మన స్వాతంత్య్ర స్ఫూర్తికి అది విరుద్దం. సంఘపరివార్‌ దానిలో భాగం కాదు కనుక ఆ స్ఫూర్తితో దానికి పనిలేదు. ఆ కూటమి దేశాలతో వాణిజ్య లావాదేవీలు జరపటం వేరు, వాటికి సహజ మిత్రులం అని చెప్పుకోవటం తగనిపని. అణచివేసినవారు-అణిచివేతకు గురైన వారు సంబంధీకులు ఎలా అవుతారు? జి7 కూటమి దేశాల పాలకవర్గాల చరిత్ర అంతా ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని అణచివేయటం లేదా అణచివేతకు మద్దతు ఇచ్చిందే తప్ప మరొకటి కాదు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యవారసుడైన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తాజా సమావేశాల్లో దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చైనా వంటి నియంతృత్వ దేశం కంటే తమ కూటమి పేద దేశాలకు మంచి స్నేహితురాలని చెప్పుకున్నారు. కమ్యూనిస్టు చైనా ఉనికిలో లేకముందు ఆ దేశాల చరిత్ర ఏమిటో లోకానికి తెలియదా ? పులిమేకతోలు కప్పుకున్నంత మాత్రాన సాధు జంతువు అవుతుందా ?

నలుగురు కూర్చుని ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో గతించాయని జి7 కూటమి గ్రహిస్తే మంచిదని చైనా తిప్పికొట్టింది.ఐక్యరాజ్యసమితి సూత్రాల ప్రాతిపదికన నిజమైన ఉమ్మడి లక్ష్యంతో మాత్రమే నిర్మాణం జరగాలని పేర్కొన్నది. దేశాలు చిన్నవా – పెద్దవా, బలమైనవా – బలహీనమైనవా పేద-ధనికా అన్నది కాదు అన్నీ సమానమైనవే, వ్యవహారాలన్నీ అన్ని దేశాలు సంప్రదింపులతో నిర్ణయం కావాల్సిందే. ఏదైనా ఒక పద్దతి అంటూ ఉంటే అది ఐరాస వ్యవస్ధ ప్రాతిపదికనే తప్ప కొన్ని దేశాలు నిర్ణయించేది కాదు అని స్పష్టం చేసింది. ధనిక దేశాల్లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించుకొనేందుకు ఏర్పాటు చేసుకున్న కూటమి ఇది. మరో మూడు సంవత్సరాల్లో ఐదు దశాబ్దాలు నిండనున్నాయి. ఈ కాలంలో ఈ కూటమి తన సమస్యలనే పరిష్కరించుకోలేకపోయింది, ఇక పేద దేశాల గురించి ఎక్కడ ఆలోచిస్తుంది? కరోనా విషయంలో ఇవన్నీ ఎంత ఘోరంగా విఫలమయ్యాయో ప్రత్యక్షంగా చూశాము. కరోనాను అదుపు చేయటమే గాక ఆర్ధికంగా పురోగమిస్తున్న చైనా మరింత బలపడుతుందన్న దుగ్ద, దాన్ని అడ్డుకోవాలన్నది తప్ప మరొకటి ఈ సమావేశాల్లో వ్యక్తం కాలేదు.


ఒక వైపు అమెరికాలో ఉన్న వాక్సిన్లు సకాలంలో వినియోగంచకు మురిగిపోతున్నాయనే వార్తలు మరోవైపు ప్రపంచాన్ని ఆదుకుంటామనే గంభీర ప్రకటనలు. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కడోసును కూడా అమెరికా ఇతర దేశాలకు ఇవ్వలేదు. వాటి తయారీకి అవసరమైన ముడిసరకులు, పరికరాల ఎగుమతులపై నిషేధం కొనసాగిస్తూనే ఉంది. చైనా బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ (బిఆర్‌ఐ) పేరుతో తలపెట్టిన ప్రాజెక్టుల అమలుకు ఇప్పటి వరకు వందకు పైగా దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2013లో ప్రారంభమైన ఈ పధకాన్ని 2049లో కమ్యూనిస్టు చైనా ఆవిర్భావ వందవ సంవత్సరం నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. నిజానికి ఇలాంటి పధకాలను ఏ దేశం లేదా కొన్ని దేశాల బృందం ప్రారంభించటానికి ఎలాంటి ఆటంకం లేదు. చైనా చెప్పేది అమలు జరిగేనే పెట్టేనా అని నిర్లక్ష్యం చేసిన దేశాలు దాని పురోగమనాన్నిచూసి ఎనిమిది సంవత్సరాల తరువాత దానికి పోటీగా ఇప్పుడు బి3డబ్ల్యు (బిల్డ్‌ బాక్‌ బెటర్‌ వరల్డ్‌ )పేరుతో ఒక పధకాన్ని అమలు జరపాలని ప్రతిపాదించాయి. మంచిదే, అభివృద్దిలో పోటీ పడటం కంటే కావాల్సింది ఏముంది.


బ్రిటన్‌ సమావేశాల్లో జి7 ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా ప్రస్తుతం చైనాతో యుద్దానికి సిద్దంగా లేదన్నది స్పష్టం. ఇతర దేశాల భుజాల మీద తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నది. అయితే మూడు దశాబ్దాల క్రితం ప్రచ్చన్న యుద్దం ముగిసింది, విజేతలం మేమే అని ప్రకటించుకున్న తరువాత ఇప్పటి వరకు అమెరికన్లు తమ మిలిటరీ మీద 19లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశారు. ఇదే కాలంలో చైనా ఖర్చు మూడులక్షల కోట్ల డాలర్లని అంచనా. అయినప్పటికీ అమెరికా యుద్దాన్ని కోరుకోవటం లేదని అనేక మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతవరకు అమెరికా ఏ ఒక్క యుద్దంలోనూ చిన్న దేశాల మీద కూడా విజయం సాధించలేదు, అలాంటిది చైనాతో తలపడే అవకాశాలు లేవన్నది వారి వాదన. అయితే ఉక్రోషం పట్టలేక తెగించి అలాంటి పిచ్చిపనికి పూనుకున్నా ఆశ్చర్యం లేదు. తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చైనా గనుక పూనుకుంటే అడ్డుపడే అమెరికా మిలిటరీని పనికిరాకుండా చేయగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతకాలం అమెరికా అనుసరించిన మిలిటరీ ఎత్తుగడలు దానికి పెద్ద భారంగా మారాయి.అందువల్లనే నాటో ఖర్చును ఐరోపా దేశాలే భరించాలని డోనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. చైనాకు పోటీగా భారత్‌ను తీర్చి దిద్దుతామనే బిస్కట్లు వేసి ముగ్గులోకి దించి మన దేశం కేంద్రంగా ఆసియా నాటో కూటమి ఏర్పాటు చేయాలన్నది అమెరికా ఎత్తుగడ. ఇన్ని దశాబ్దాల నాటో కూటమితో ఐరోపా బావుకున్నదేమిటో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అమెరికన్లు యుద్దాన్ని కూడా లాభనష్టాల లెక్కల్లో చూస్తారు. 1986లో అమెరికా దళాల చర్యలు, నిర్వహణకు పెంటగన్‌ (రక్షణ) బడ్జెట్‌లో 28శాతం ఖర్చు అయ్యేది, ఇప్పుడది 41శాతానికి పెరిగింది, ఆయుధాల కొనుగోలు కంటే ఇది రెండు రెట్లకంటే ఎక్కువ.

అమెరికా మిలిటరీ బడ్జెట్‌, ఆయుధాలతో పోలిస్తే చైనా బలం తక్కువే అని వేరే చెప్పనవసరం లేదు. వేల మైళ్ల దూరం నుంచి అమెరికా వచ్చి యుద్దం చేయాలన్నా లేదా దానికి ముందు చైనా చుట్టూ తన దళాలను మోహరించాలన్నా చాలా ఖర్చుతో కూడింది. కానీ చైనాకు అలాంటి అదనపు ఖర్చు, ప్రయాస ఉండదు. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ చేతులెత్తేసిన తరువాత అణుబాంబులు వేసి భయపెట్టింది అమెరికా. ఇప్పుడు పశ్చిమాసియాలో అమెరికాను ఎదిరించే ఇరాన్‌, సిరియా వంటి దేశాలు, సాయుధశక్తుల వద్ద ఉన్న ఆయుధాలు అంతగొప్పవేమీ కాదు, అలాంటి వారి మీద అమెరికా అత్యంత అధునాతన ఆయుధాలను ప్రయోగించి చూడండి మా ప్రతాపం అంటున్నది. అది చైనా విషయంలో కుదిరేది కాదు. నిజంగా చైనాతో యుద్దమంటూ వస్తే అది ఒక్క దక్షిణ చైనా సముద్రానికే పరిమితం కాదు.కరోనా నేపధ్యంలో వైరస్‌ పేరుతో అమెరికా, ఇతర దేశాలు చేస్తున్న ప్రచార యుద్దంతో జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటంలో విజయవంతం అయ్యారని చెప్పవచ్చు. అది వాస్తవ యుద్దంలో అంత తేలిక కాదు. సాధ్యమైన మేరకు అదిరించి బెదిరించి తన పబ్బంగడుపుకొనేందుకే అమెరికా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి.తాజా జి7 సమావేశాలను కూడా అందుకే వినియోగించుకుంది. అమెరికాను నమ్ముకొని తాయత్తులు కట్టుకొని ముందుకు దూకిన దేశాలకు చైనా చుక్కలు చూపుతుందని ఇప్పటికే కొన్ని ఉదంతాలు వెల్లడించాయి.మన దేశం వాస్తవ దృక్పధంతో ఆలోచిస్తుందా ? దుస్సాహసం, దుందుడుకు చర్యలకు మొగ్గుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరఫరాలు ఆపొద్దు, ధరలు పెంచొద్దని చైనాను కోరిన మోడీ సర్కార్‌ !

14 Friday May 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, Science, UK, USA

≈ 1 Comment

Tags

Big Pharma Vaccine Profits, BJP Propaganda, China's vaccine diplomacy, Narendra Modi Failures, vaccination Policy, Vaccine Nationalism, WHO


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో ఆక్సిజన్‌, ఇతర ఔషధాల ధరలు ముఖ్యంగా కరోనా చికిత్సలో వినియోగించే వాటి ధరలు ఎలా పెరుగుతున్నాయో, బ్లాక్‌ మార్కెట్‌ ఎలా ఉందో పదే పదే చెప్పనవసరం లేదు.బాధితులు, వారి బాధలు పంచుకున్నవారందరికీ అనుభవమే. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్దితిని విధించి ముఖ్యమైన ఔషధాలు,వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సింగ్‌ విధానం కింద అనుమతులు ఇచ్చి అవసరాల మేరకు ఉత్పత్తిని పెంచేందుకు, ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఇదేం పనయ్యా బాబూ అని ఎవరైనా ప్రశ్నిస్తే బిజెపి ప్రతినిధులు ఆరోగ్యం రాష్ట్రాలకు సంబంధించింది అని ఎదురుదాడులకు దిగుతున్నారు. మరోవైపున తొలి దశలో కరోనాను జయించింది తమ ప్రధాని మోడీ అని ఆయన లేకపోతే అదుపుఅయ్యేది కాదని, జనం ప్రాణాలు నిలిచేవి కాదంటూ పాడిన భజన గీతాల సంగతేమిటి, ఇప్పుడు ఇలా తాళం మార్చారేమిటి అని అడిగితే కష్ట కాలంలో సహకరించాల్సింది పోయి దెప్పి పొడుపులు, విమర్శలా అంటూ విరుచుకు పడుతున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు అంటూ సుమతీ శతకకారుడు బహుశా ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటాడు.

మన దేశంలో కరోనా వాక్సిన్‌ ధరల మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించలేదు. కేంద్రానికి ఇచ్చే వాక్సిన్లకు ఒక రేటు, రాష్ట్రాలకు ఇచ్చేదానికి ఒక రేటు, ప్రయివేటు ఆసుపత్రులకు అమ్మేది ఒక రేటు. ఒక వైపు సామాజిక మాధ్యమాలు, సాంప్రదాయ మాధ్యమాల్లో బిజెపి ప్రతినిధులు ఇప్పటికీ చైనా వైరస్‌ అంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ జనానికి తెలియాల్సిందేమంటే చైనా వస్తువులను బహిష్కరిస్తాం, చైనాకు బుద్ది చెబుతాం, కాళ్ల దగ్గరకు రప్పిస్తాం అని ఏడాది నుంచి ప్రగల్భాలు పలుకుతున్న వారు తేలు కుట్టిన దొంగల మాదిరి అదే చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతుల గురించి మాత్రం మాట్లాడటం లేదు. గుండెలు తీసిన బంట్ల సంగతేమోగానీ అలాంటి వారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం రవాణా విమానాలు ఆపేసి మనలను దెబ్బతీసిందంటూ చైనాను నిందించారు. ఆ సమస్య పరిష్కారం అయిన విషయం మాత్రం జనానికి చెప్పకుండా ఇంకా అదే అభిప్రాయంతో ఉండాలని కోరుకొనే వారు మాత్రమే దాన్ని మూసిపెడతారు.


తాజా విషయానికి వస్తే భారత్‌ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్రమోడీ విఫల ప్రధాని అంటే మింగుడు పడుతోందా ! ఇదీ అంతే !! నిజం త్వరగా ఎక్కదు. చైనా ప్రత్యేక ప్రాంతంగా ఉన్న హాంకాంగ్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ ప్రియాంక చౌహాన్‌ అక్కడి నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక విలేకరితో మాట్లాడారు.” చైనా సరఫరా వ్యవస్ద తెరిచే ఉండాలని, ఉత్పత్తుల ధరలు స్ధిరంగా ఉండాలన్నది ఈ దశలో మా ఆకాంక్ష. సరఫరా గిరాకి వత్తిడి కొంత పెరిగినప్పటికీ ఉత్పత్తుల ధరలు స్ధిరంగా, అంచనాకు అందేట్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ స్ధాయిలో కూడా మద్దతు, ప్రయత్నాలు అవసరం. అయితే ఈ విషయంలో చైనా ప్రభుత్వ పలుకుబడి ఎంత ఉంటుందో, ఏమి చేయగలదో నాకు సమాచారం లేదు, అయితే వారు చేయగలరు, అలా చేస్తే మేము స్వాగతిస్తాం ” అని ప్రియాంక చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. సూటిగా మన రాజకీయ నాయకత్వం అడిగేందుకు ముఖం చెల్లక తడిక రాయబారం చేశారన్నది స్పష్టం.


మనకు అవసరమైన ముఖ తొడుగులు, పిపిఇ కిట్లు అన్నీ మనమే తయారు చేసుకోగలుగుతున్నట్లు కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. మంచిదే, ఇంతకంటే కావాల్సింది ఏముంది ? మేకిన్‌ ఇండియా కింద గత ఏడు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా ప్రపంచానికే వస్తువులను ఎగుమతి చేస్తున్నాము కదా అని పగటి కలలు కంటున్న వారున్నారు. మే 14వ తేదీ హిందూ పత్రిక వార్త వారి కళ్లు తెరిపిస్తుందా ? దాని ప్రకారం మన దేశం చైనా కంపెనీలకు ఏప్రిల్‌ నుంచి 40వేల ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లకు ఆర్డరు పెడితే 21వేలు మనకు వచ్చాయి. వీటితో పాటు ఐదువేల వెంటిలేటర్లు, రెండు కోట్ల పది లక్షల ముఖతొడుగులు( మాస్కులు), 3,800 టన్నుల ఔషధాలు భారత్‌కు ఎగుమతి చేసినట్లు చైనా కస్టమ్స్‌శాఖలో నమోదైనట్లు దానిలో పేర్కొన్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని కొట్టి పారవేస్తే చేసేదేమీ లేదు. ప్రచారానికి – వాస్తవానికి ఉన్న తేడాను జనానికి చెప్పేందుకే ఈ విషయాలు తప్ప నరేంద్రమోడీని దెప్పాలని కాదు. ఇప్పటి వరకు విదేశీ పత్రికలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. ప్రభుత్వమే కనపడటం లేదని మన దేశానికి చెందిన అవుట్‌లుక్‌ పత్రిక తాజా ముఖచిత్రంగా ప్రచురించినందున మోడీని వెతికి తెచ్చి ఎక్కడికి పోయారని ప్రశ్నించాలి తప్ప దెప్పి ప్రయోజనం ఏముంది ? ఒక వేళ ప్రశ్నించినా నోరు విప్పుతారా ?

కరోనా మహమ్మారి నుంచి రక్షణకు వినియోగించే వాక్సిన్లకు కొంత కాలం పాటు పేటెంట్‌ హక్కుల అమలు నిలిపివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)లో దక్షిణాఫ్రికా, మన దేశం కూడా ప్రతిపాదించాయని, నరేంద్రమోడీ చొరవ ఎలాంటిదో చూడండి, చివరికి అగ్రరాజ్యం అమెరికా కూడా అంగీకరించింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.(మనకు అవసరమైన వాక్సిన్‌ ముడిపదార్దాలనే ఇచ్చేందుకు అంగీకరించని వారు పేటెంట్ల రద్దుకు అంగీకరిస్తారా ? ) దీనితో పాటు కంపల్సరీ లైసెన్సు విధానం కింద గతంలో నాట్కో కంపెనీకి కాన్సర్‌ ఔషధ తయారికి అనుమతి ఇచ్చినట్లుగా వాక్సిన్లకు సైతం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రజారోగ్య నిపుణులు, ఆ రంగంలో పని చేస్తున్నవారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన ప్రభుత్వం ప్రపంచ సంస్ధలో అలాంటి ప్రతిపాదన చేయటం మంచిదే, ఎవరు చేసినా అభినందించాల్సిందే. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరుగుతోంది. ఇదే నరేంద్రమోడీ సర్కార్‌ మే తొమ్మిదవ తేదీన సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దానికి విరుద్దమైన వాదన చేసింది. సుప్రీం కోర్టు సూచించిన విధంగా కంపల్సరీ లైసెన్సు నిబంధనను ఈ దశలో ఉపయోగిస్తే, మేథోసంపత్తి హక్కుల ఒప్పందానికి విరుద్దంగా చర్యలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాదించింది. ప్రచారం కోసం, జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రపంచ వాణిజ్య సంస్దలో ఒక వైఖరి, తన అధికారాన్ని వినియోగించాల్సి వచ్చే సరికి కార్పొరేట్‌ కంపెనీల అనుకూల వాదనలు. ఎంత దగా ! పోనీ ఇప్పటి వరకు సానుకూలంగా వ్యవహరించి నరేంద్రమోడీ సర్కార్‌ సాధించింది ఏమిటి ? కోవిషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, పరికరాల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించినపుడు దానికి రాని ప్రతికూల ఫలితాలు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పూనుకుంటే మనకు వస్తాయా ? ఒక వేళ వస్తే ఏమిటి ? మిన్ను విరిగి మీద పడుతుందా ? చైనాకు వ్యతిరేకంగా మనం చతుష్టయం పేరుతో అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్‌ అన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వారు మనకు అవసరమైన వాటిని అందచేస్తున్నారా లేదా ? అమెరికా ఒక వైపు తమ జనం కోసం యుద్దసమయాల్లో వినియోగించే చట్టాలకు దుమ్ముదులిపి అమలు జరుపుతుంటే దాని భాగస్వామి అని చెప్పుకొనే మనం మన సార్వభౌమ అధికారాన్ని వినియోగించలేనంత దుర్బలంగా ఉన్నామా ? అసలు నరేంద్రమోడీ గారి సమస్య ఏమిటి ? ఇంత విపత్తు వస్తే కనీసం ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశం వేసి పరిస్ధితిని వివరించి సలహాలను కోరేందుకు తీరికలేనంతగా ఏం చేస్తున్నట్లు ? కేంద్రం చెబుతున్నట్లు ఆరోగ్య సమస్య రాష్ట్రాలదే అయినపుడు కేంద్రంలో ప్రధాని, ఇతర మంత్రులకు గోళ్లు గిల్లు కుంటూ కూర్చోవటం తప్ప ఇప్పుడు మరొక పనేముంటుంది. తీవ్రత తక్కువ మొదటి దశలో మోడీ చేయించిన పళ్లాలు, గ్లాసుల మోత, దీపాలు వెలిగించటం వంటి చర్యలన్నింటినీ జనం పాటించారుగా, ఇప్పుడు ఆ చొరవ ఏమైనట్లు ? పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒకటి ఎందుకు చేయించటం లేదు ? ఏమీ లేదు, ఎంత హడావుడి చేస్తే అంతగా జనం కేంద్రం వైపు చూస్తారు. ఉచిత వాక్సిన్‌ సరఫరాకే చేతులెత్తేసి అధిక భారాన్ని రాష్ట్రాల మీద నెట్టింది. గతేడాది మాదిరి 27లక్షల కోట్ల ఆత్మనిర్భర వంటి బూటకపు ప్రకటనలు చేస్తే నమ్మే జనం లేరు. అందుకే ప్రజాస్వామ్యబద్దంగా రాష్ట్రాల నిర్ణయానికే వదిలేస్తున్నానంటూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు.

కోవిషీల్డు లేదా కోవాగ్జిన్‌కు గానీ ప్రయోగాలు పూర్తిగాక ముందే అత్యవసర వినియోగం పేరుతో ముందుగానే అనుమతి ఇచ్చారు. దాదాపు అన్ని దేశాలూ అదే చేశాయి. కోవిషీల్డు మన స్వంత తయారీ కాదు. దాని మాదిరే రష్యా స్పుత్నిక్‌ వాక్సిన్‌ ఉత్పత్తికి రెడ్డీలాబ్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ రెండింటితో పాటు దానికి, ఇతర వాక్సిన్లకు అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పుడు తలెత్తిన వాక్సిన్‌ గిరాకీని సులభంగా అధిగమించి ఉండేవారం కదా ? రెండు కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనం కాపాడేందుకు చూపిన శ్రద్ద వేగంగా వాక్సిన్‌ తయారీ మీద ఎందుకు లేకపోయింది. మొదటి డోసు తీసుకున్న తరువాత నెల రోజుల్లోగా రెండవ డోసు తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వమూ, నిపుణులే. ఇప్పుడున్న నెలన్నర – రెండు నెలల వ్యవధిని పొడిగించి మూడు నుంచి నాలుగు నెలల్లోపు కోవిషీల్డు తీసుకోవచ్చు అంటున్నారు. జనం దేన్ని నమ్మాలి ?
ప్రపంచంలో 184 వాక్సిన్లను జంతువుల మీద ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరోగ్యవంతులైన యువతీయువకుల మీద 32 వాక్సిన్లు మొదటి దశ ప్రయోగంలోనూ, 35 వాక్సిన్లు వివిధ తరగతుల మీద రెండవ దశ, 25వాక్సిన్ల ప్రభావం గురించి మూడవ దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. పద్నాలుగు వాక్సిన్లను వినియోగిస్తున్నారు. అవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొందినవే. ఎవరు ముందుకు వస్తే వాటి తయారీకి మన దేశం ఆహ్వానించి ఉంటే వెంటనే అన్ని వయస్సుల వారికి వాక్సిన్‌ పూర్తయ్యేది, రోజుకు నాలుగువేల మరణాలు తప్పి ఉండేవి కదా ? ఎందుకు ఇవ్వలేదు ?
ఔషధాల తయారీలో మన దేశం పురోగమించిన మాట వాస్తవం. అది చైనా కంటే ఎక్కువ అని కొందరు అనుకుంటారు, అనుకోనివ్వండి మనకు ఇబ్బంది లేదు. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకు పూర్తిగా లేదా పాక్షికంగా తయారైన వాటిని మన ఫార్మారంగం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్న పచ్చినిజం తెలిసిందే. ఇప్పుడు చైనా నుంచి మన దేశం అత్యవసర ఔషధాలను తెచ్చుకుంటున్నది దానికి లేని అభ్యంతరం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదించిన చైనా వాక్సిన్‌ తెచ్చుకొనేందుకు, జనం ప్రాణాలను కాపాడేందుకు ఇబ్బంది ఏమిటి ? చైనా వాక్సిన్లు అంతగా పని చేయవని ఆ దేశ నిపుణులే చెప్పారని కట్టుకధలు ప్రచారం చేశారు. చైనాలో ఏటా ఐదు వందల కోట్ల డోసులను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉంది. మన దేశంలో ఐసిఎంఆర్‌తో కలసి భారత బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ పూర్తిగా వినియోగ అనుమతి మన దేశంలోనే ఉంది. మరో 14 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతించారు. ఇదే సమయంలో చైనాలో తయారైన నాలుగు వాక్సిన్లలో ఒకటైన సినో ఫార్మ నాలుగు దేశాల్లో పూర్తి వినియోగం 50 దేశాల్లో అత్యవసర అనుమతి పొందింది. మరొకటి కరోనా వాక్సిన్‌ పూర్తి వినియోగం చైనాలో, మరో 35దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. మరో రెండు పరిమితంగా అనుమతి పొందాయి. అందువలన మన దేశం వాక్సిన్ల రంగంలో ముందుంది అని చెప్పుకోవటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.


నరేంద్రమోడీ ప్రపంచ ఫార్మా కంపెనీలను దెబ్బతీసినందున అవన్నీ కక్ష కట్టాయంటూ ఆయన భక్తులు మహిమలను అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్లు మన అవసరాలకే సరిపోని స్ధితి కళ్ల ముందు కనిపిస్తుంటే ఇలాంటి అతిశయోక్తులను చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. ఆపని చేసింది చైనా అన్నది పచ్చి నిజం. వాక్సిన్‌ మానవ హక్కు. ఎవరు జాతీయ వాదంతో సంకుచితంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో ప్రపంచం చూస్తూనే ఉంది. ఏప్రిల్‌ 25 నాటికి చైనా 41.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి 20 కోట్ల డోసులను ఎగుమతి చేసి మిగిలిన దాన్ని తన దగ్గర ఉంచుకుంది. అమెరికా 26.8 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం అంతర్గత వినియోగానికి ఉంచుకుంది. బ్రిటన్‌ కూడా అదే మాదిరి 2.3 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం ఉంచుకుంది. ఐరోపా యూనియన్‌ 22 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి తొమ్మిది కోట్ల డోసులు ఎగుమతి చేసి మిగిలింది తన సభ్య దేశాలకు వినియోగించింది. మన దేశం 19.6 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి పన్నెండున్నర కోట్ల డోసులు మన దేశంలో వినియోగించి మిగతాది ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఎవరు ప్రపంచ ఫార్మాను దెబ్బతీసినట్లు ? ఎవరు ప్రపంచాన్ని ఆదుకొనేందుకు ముందుకు వచ్చినట్లు ? నేడు ఆంగ్లో-శాక్జన్‌ (అమెరికా-బ్రిటన్‌) దేశాలు వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్దాలను దాచివేస్తున్నాయని కడుపు మండిన ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. మన ప్రధాని నరేంద్రమోడికి నోరు పెగల్లేదు.


చైనా వాక్సిన్‌ సినోఫార్మకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి ఇవ్వటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వాక్సిన్‌ పేద దేశాలకు అందేందుకు వీలు కలిగింది. త్వరలో చైనా మరో వాక్సిన్‌ సిన్‌వాక్‌ కూడా అనుమతి రాబోతున్నదని వార్తలు. మన కోవాగ్జిన్‌కు ఇంకా రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని సభ్య దేశాలలో 192 కోవాక్స్‌ పేరుతో వాక్సిన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రాంతాలకు 2021 చివరి నాటికి 200 కోట్ల డోసుల వాక్సిన్‌ అందించాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు కోవాక్స్‌ పధకంలో భాగంగా 5.4 కోట్ల డోసులను 121 దేశాలకు అందించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో వాక్సిన్ల ద్వారా ఫైజర్‌ కంపెనీ 350 కోట్ల డాలర్లు సంపాదించింది. మోడెర్నా కంపెనీ ఏడాదిలో 1900 కోట్ల డాలర్లను సంపాదించనుందని అంచనా. కార్పొరేట్‌ కంపెనీల లాభాల కోసం మహమ్మారిని దీర్ఘకాలం పొడిగిస్తున్నారా ? అంటూ ప్రపంచబ్యాంకు మాజీ అధిపతి, ఆర్ధికవేత్త జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ మరొకరితో కలసి రాసిన వ్యాసంలో ప్రశ్నించారు. ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు ఎంఆర్‌ఎన్‌ఏ వాక్సిన్ల తయారీలో గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. వాటి తయారీకి ఇతరులను అనుమతించటం లేదు. ఎంతకాలం వీలైతే అంతకాలం మహమ్మారిని పొడిగించి సొమ్ము చేసుకోవాలన్నది వాటి ఎత్తుగడ. వైరస్‌ కొత్త రూపం సంతరించుకుంటున్న కారణంగా వాటికి అవసరమైన వాక్సిన్ల కోసం తమ వనరులను పదిలపరచుకోవాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నది స్పష్టం. కోవాక్స్‌ పధకానికి కోటి డోసులు ఉచితంగా సమకూర్చుతామని చైనా ఇప్పటికే వాగ్దానం చేసింది. వాక్సిన్‌తో పని లేకుండానే వైరస్‌ను అదుపు చేసిన చైనా పెద్ద ఎత్తునవాక్సిన్‌ తయారు చేస్తూ అత్యవసరమైన ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. మరోవైపు తన జనానికి తాపీగా వాక్సిన్‌ వేస్తున్నది. మరోవైపు దాని ఉత్పత్తిలో సగం కంటే తక్కువ ఉన్న మనం దేశం చైనా కంటే వేగంగా వాక్సిన్‌ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది.


మన దేశంలో ఆగస్టు -డిసెంబరు నాటికి మొత్తం 216 కోట్ల డోసుల వాక్సిన్‌ అందుబాటులోకి రానున్నదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వికె పాల్‌ చెప్పారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీలు కూడ అత్యవసర వినియోగం కింద తయారీకి దరఖాస్తు చేసుకోవాలని కోరినట్లు పాల్‌ తెలిపారు. ఆయన చెప్పినట్లు, అనుకున్నట్లు సవ్యంగా జరిగితే డిసెంబరు నాటికి గాని మన జనాభాకు వాక్సిన్‌ వేసే అవకాశం లేదు. కొందరు చెబుతున్నట్లు ప్రతివారికీ బూస్టర్‌ మూడో డోసు వేయాల్సి వస్తే , మూడో తరంగంలో వస్తుందని చెబుతున్న కొత్త వైరస్‌కు పాత వాక్సిన్లు పనికి రాకపోతే పరిస్ధితి ఏమిటి ? చైనా వాక్సిన్‌ సిన్‌ఫార్మకు అనుమతి ఇస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన ప్రకటనలో చైనా మరో 15వాక్సిన్ల తయారీ పురోగమనంలో ఉన్నట్లు తెలిపింది. వాక్సిన్ల తయారీలో చైనా – రష్యా సహకరించుకోనున్నాయి. మరి మనం ఎక్కడ ? అది ఉత్పత్తి కావచ్చు, వాక్సిన్‌ దౌత్యం కావచ్చు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కూలిన చైనా రాకెట్‌ – పతనమైన అమెరికా స్కైలాబ్‌ !

12 Wednesday May 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Science, UK

≈ Leave a comment

Tags

Long March-5B Y2, NASA, skylab failure, US anti China Propaganda


ఎం కోటేశ్వరరావు


అదుపు తప్పిన చైనా రాకెట్‌ గురించి మీడియా వర్ణనలతో ఎవరికి వారు తమమీదే పడబోతోందని భయపడిపోయిన వారున్నారు. అలాంటిదేమీ లేకుండానే భూతలంలోకి రాగానే మండిపోగా మిగిలిన శకలాలు ఏమైనా ఉంటే మాల్దీవుల సమీపంలోని అరేబియా సముద్రంలో పడ్డాయి. జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు జరిపిన రాకెట్‌ ప్రయోగాలు విఫలమై కూలిపోయిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి చైనా రాకెట్‌. విఫలమైన రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తున్న చైనా శాస్త్రవేత్తలు చెప్పక ముందే అమెరికా వారు దాన్ని రచ్చ చేశారు. కూలిపోక ముందే ఫలానా చోట పడింది, ఇవిగో ఫొటోలంటూ కుహనా వార్తలను ప్రచారంలో పెట్టారు. చైనా బాధ్యతా రహితంగా వ్యవహరించిందని, శకలాలు ఎక్కడ పడతాయో ఏ ముప్పు సంభవిస్తుందో అన్నట్లుగా నానా యాగీ చేశారు. అసలే కోతి, పైగా కల్లుతాగింది అన్నట్లుగా రాకెట్‌ చైనాది, చెప్పింది అమెరికా, రెచ్చిపోవటానికి మన మీడియాకు అంతకంటే కావాల్సిందేముంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఆరుదశాబ్దాల అనుభవంలో రాకెట్లు కూలిన ఉదంతాలు అంత తీవ్రమైనవి కాదని తెలిసిన శాస్త్రవేత్తలు కూడా నోరు మూసుకొని తప్పుడు ప్రచారానికి ఊతమిచ్చారు.


తయాన్హీ అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో భాగంగా అవసరమైన పరికరాలను మోసుకు పోయి క్షక్ష్యలో ప్రవేశపెట్టే లాంగ్‌ మార్చ్‌-5బి వై2 వాహక నౌక(రాకెట్‌)ను ఏప్రిల్‌ 29న చైనా ప్రయోగించింది. దానికి అమర్చిన వాటిని నిర్ణీత సమయంలో కక్ష్యలో ప్రవేశపెట్టటాన్ని బట్టి దాని విస్వసనీయత సరైనదే అని రుజువైంది. తిరిగి వచ్చే క్రమంలో చోదన ( ప్రొపల్షన్‌ ) వ్యవస్ధ విఫలమైంది, దాన్నే అదుపు తప్పటంగా పరిగణించారు. దాని గమనం, అదే విధంగా ఎక్కడ భూమిని చేరనుందనే అంశాలకు సంబంధించి చైనా చెప్పినట్లుగానే మే తొమ్మిదవ తేదీ అది గాలిలో మండగా, అవశేషాలు సముద్రంలో పడ్డాయి.
సాధారణమైన అంశాన్ని అమెరికా ఎందుకు ఇంత రచ్చ చేసింది ? ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టేసి చైనా ప్రధమ స్ధానంలో ఉండబోతున్నది. అన్నింటికీ మించి ఆధునిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవటంలో వేగంగా దూసుకుపోతోంది. ఇలా చైనా ప్రతి అడుగునూ ప్రపంచానికి ముప్పుగా చూపేందుకు, కుట్ర సిద్దాంతాలను జనం మెదళ్లలో చొప్పించేందుకు అడుగడుగునా అమెరికా ప్రయత్నిస్తోంది. తాజా ఉదంతం దానిలో భాగమే అని చెప్పవచ్చు. ఇది ఒక్క చైనాకే అనుకుంటే పొరబాటు మన దేశం ఆ స్ధితిలో ఉన్నా అదే చేస్తుంది. రాకెట్లు భూ తలంలోకి వచ్చేటపుడు జరిగేదేమిటో సామాన్యులకంటే శాస్త్రవేత్తలకే బాగా తెలుసు. అమెరికన్లు తప్ప మిగిలిన అంతరిక్ష అగ్రరాజ్యాలేవీ రచ్చ చేయలేదు. అంతరిక్ష ప్రయోగశాలను చైనా నిర్మించటం అంటే ఆ రంగంలో అమెరికా, రష్యా సరసన చేరినట్లే. అందుకే నిష్పాక్షికంగా పరిశీలించే వారు పశ్చిమ దేశాలు ఈ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తున్నారు, ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నట్లు విమర్శిస్తున్నారు. శకలాలతో జరిగే హాని పెద్దగా ఉండదని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ దాన్ని బూతద్దంలో చూపి ఒక దోషిగా చూపేందుకు ప్రయత్నించారు. దీనికి నాసాతో పాటు అమెరికా రక్షణశాఖ, మీడియా అన్నీ కలసి ప్రచారదాడి చేశాయి.చైనా రాకెట్‌ శకలాలు ఐవరీ కోస్ట్‌లోని రెండు గ్రామాల మీద పడ్డాయని కొన్ని పత్రికలు రాశాయి. వాటి మీద చైనా గుర్తులున్నాయని కూడా పేర్కొన్నాయి. ఇవిగో ఫొటోలంటూ ప్రచురించాయి. అవన్నీ తప్పుడు కధనాలని తేలిపోయింది.


అంతరిక్ష ప్రయోగాల శకలాల సమస్య చైనా ఒక్కదానితోనే తలెత్తింది కాదు, ఆ రంగంలో ప్రయోగాలు నిర్వహించే ప్రతిదేశమూ ఎదుర్కొంటున్నదే. సాంకేతిక పరమైనదానిని రాజకీయం చేయటం, జనాన్ని భయపెట్టేందుకు వినియోగించటమే గర్హనీయం. ప్రతి రాకెట్‌ ప్రయోగంలోనూ విజయవంతం చేయటంతో పాటు విఫలమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ శాస్త్రవేత్తలు పాటిస్తారు. పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా సంస్ధ నాసా, మిలిటరీ చైనా రాకెట్‌ జాడను వెంబడించటం మిలిటరీ కోణాన్ని వెల్లడించింది. ఒక క్షిపణి వ్యతిరేక కార్యక్రమ శిక్షణగా అవి పరిగణించాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ రంగంలో ప్రావీణ్యత ఉన్న ఏదేశమైనా అదే చేస్తుంది.
తియాన్‌హి అంతరిక్ష కేంద్ర కేంద్ర నిర్మాణంలో తొలి కీలక పరికరాలను లాంగ్‌ మార్చ్‌ మోసుకుపోయింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం రానున్న రెండు సంవత్సరాలలో మరో పది రాకెట్‌ ప్రయోగాల ద్వారా అవసరమైన అన్నింటినీ సమకూర్చిన తరువాత 2022 నాటికి అది పని చేయటం ప్రారంభిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2024లో పని చాలించనుంది. ఆ తరువాత విదేశీ భాగస్వాములకు అవకాశమిచ్చే అంతరిక్ష కేంద్రం తియాన్‌హి అని భావిస్తున్నారు. అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాలకు ఈర్ష్య పుట్టిస్తున్న అంశమిదే. అంతరిక్ష రంగంలో చైనా అభివృద్ధిని అవి సహించలేకపోతున్నాయి.


ఇతర దేశాల రాకెట్లు కూలిపోలేదా ? చైనా రాకెట్‌ కూలిపోవటాన్ని ప్రమాదకరంగా వర్ణించిన వారు మార్చి నెల 26వ తేదీన కూలిపోయిన అమెరికా ఫాల్కన్‌ 9 రాకెట్‌ గురించి మాట్లాడలేదేం ? వాషింగ్టన్‌ రాష్ట్రంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో దాని శకలాలు పడ్డాయి. అది ఒక తోక చుక్క మాదిరి వెలుగులతో భూమిని తాకినట్లు ఎపి వార్తా సంస్ధ వర్ణించింది. కొందరికి అది ఎగిరే పళ్లాల మాదిరి అనిపించిందట. అదే జనావాసాల మీద పడి ఉంటే ఏమై ఉండేదన్న ఆందోళన, దానికి అనుగుణ్యమైన హెచ్చరికను కూడా అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించలేదు.

నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా అంతరిక్ష కేంద్రం స్కైలాబ్‌ పతనమై కూలిపోయిన ఉదంతాన్ని ఇక్కడ ప్రస్తావించటం అవసరం. దాని గురించి నాటి పత్రికల్లో అల్లిన కథనాలు చదివి తెలుగు జనాలు ఎంత ఆందోళనకు గురయ్యారో నాటి తరాలకు తెలిసిందే. అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే కొంత మంది తమ పిల్లలకు స్కైలాబ్‌ అని పేరు పెట్టుకున్నారు. సాధారణంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని గడువు మీరిపోయిన తరువాత తిరిగి భూమికి తెచ్చే విధంగా రూపొందిస్తారు. దీర్ఘకాలం అంతరిక్షంలో బరువు కోల్పోయే మానవ శరీరాల మీద పడే ప్రభావం వంటి అనేక అంశాలను పరిశోధించేందుకు 77 టన్నుల బరువుగల స్కైలాబ్‌ను రూపొందించారు. తొమ్మిది సంవత్సరాల పాటు పని చేయించాలని నిర్ణయించి 1973లో ఏర్పాటు చేశారు. అయితే 1978 చివరిలో లోపాలు తలెత్తాయి. ఇలాంటి పరిస్ధితుల్లో దాన్ని సురక్షితంగా కిందికి దించటం ఎలా అనే అంశాన్ని నాసా శాస్త్రవేత్తలు రూపొందించిన సమయంలోనే పట్టించుకోని కారణంగా అది పతనం అవుతోందని గ్రహించారు. అయితే జనం ఆందోళన చెందటంతో దాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాల పాటు తిరిగేట్లు చేస్తామని, తరువాత అది అలా తిరుగుతూనే ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే అదేమీ జరగలేదు. 1979 జూలై 11న దాని బూస్టర్‌ రాకెట్లను పేల్చివేసి కూలిపోయేట్లు చేశారు. ఆస్ట్రేలియా, హిందూ మహా సముద్ర ప్రాంతంలో కూలిపోవచ్చని ఊహించారు. దాంతో మీడియాలో అనేక కధనాలు వచ్చాయి. చివరకు అనేక భాగాలు సముద్రంలో పడిపోగా కొన్ని పశ్చిమ ఆస్ట్రేలియాలోని జనావాసాల్లో పడ్డాయి ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.
సరిగ్గా అదే సమయంలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ గిడసబారింది, చమురు సంక్షోభం తలెత్తింది. జనానికి ప్రభుత్వం, పార్లమెంట్‌ మీద విశ్వాసం సన్నగిల్లింది. స్కైలాబ్‌ కూలిపోనుందనే వార్తలు రావటంతో ప్రభుత్వాన్ని అపహాస్యం చేయటం ప్రారంభించారు. కొందరు దాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించారు. దేశమంతటా స్కైలాబ్‌ విందులు జరుపుకున్నారు. వాటిలో పాల్గొవారి మీద స్కైలాబ్‌ శకలాలు పడితే తలలు పగలకుండా గట్టి హెల్మెట్లు పెట్టుకురావాలని నిబంధనలు పెట్టారు. కొన్ని హౌటళ్లయితే ఇదిగో ఈ ప్రాంతంలోనే శకలాలు పడతాయంటూ ప్రత్యేకంగా గుర్తించి ఆ ప్రాంతం చుట్టూ విందులు ఏర్పాటు చేశాయి. టీషర్టులను అమ్మారు. కొన్ని పత్రికలయితే అపహాస్యం చేస్తూ స్కైలాబ్‌ బీమా గురించి ప్రకటించాయి. శకలాలు పడి ఎవరైనా గాయపడినా, మరణించినా 72 గంటల్లోగా చెబితే పదివేల డాలర్లు చెల్లిస్తామని ఒక పత్రిక ప్రకటించింది. శకలాలు ఎప్పుడు, ఎక్కడ పడతాయో నాసా చెప్పలేకపోయింది. ఆస్ట్రేలియా-హిందూ మహాసముద్రం మధ్య 7,400 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైనా పడవచ్చని పేర్కొన్నది. ఆ ప్రాంతం వెలుపల ఉన్న దేశాల వారు చివరికి ఐరోపా వారు కూడా ఎక్కడ తమ మీద పడతాయో అని అందోళన చెందారు. 1978లో సోవియట్‌ ఉపగ్రహం ఉత్తర కెనడా ప్రాంతంలో కూలిపోవటంతో స్కైలాబ్‌ కూడా ఇదే విధంగా కూలిపోనుందని జనం భయపడ్డారు.1979 జూలై పదకొండున స్కైలాబ్‌ కూలిపోనుందని ప్రకటించటంతో ఇంగ్లండ్‌లోని కొందరు డీవన్‌ ప్రాంతంలోని ఒక గుహలోకి వెళ్లి కూర్చున్నారు. బెల్జియంలో శకలాలు పడతాయనే భయంతో అక్కడి ప్రభుత్వం యుద్ద సమయంలో వైమానిక దాడుల గురించి హెచ్చరిస్తూ మోగించే 1250 సైరన్లను సిద్దం చేసుకుంది.

1995 జనవరి పదిహేనున రష్యా తయారు చేసిన ఒక ఉపగ్రహాన్ని జపాన్‌ రాకెట్‌తో అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.దానికి జర్మనీ సాంకేతిక పరికరాలను అందించింది. తీరా అది ఏమైందో తెలియకుండా పోయింది. అందరూ కక్ష్యలోకి వెళ్లిందనుకున్నారు. అది నిర్ధారణగాకపోవటంతో భూమీ మీద పడిందని భావించారు గాని ఎక్కడ పడిందో తెలియలేదు.తరువాత కొంత కాలానికి ఆఫ్రికాలోని ఘనాలో ఉపగ్రహంలోని కాప్సూల్‌ దొరికింది. దానికి అమర్చిన పారాచూట్‌తో కింద పడింది. దాన్నుంచి సంకేతాలు పంపినా ఎవరూ గ్రహించలేకపోయారు. ఒక స్కూలు టీచరు దాన్ని గుర్తు పట్టి ఒక రూములో భద్రపరిచాడు. కొన్ని నెలల తరువాత అది లండన్‌ చేరింది. 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన అమెరికా కు చెందిన కొలంబియా స్పేస్‌ షటిల్‌ కూలిపోయి ఏడుగురు వ్యోమగాములు మరణించారు. 1967 జనవరిలో అమెరికా ఉపగ్రహం అపోలో 1 పేలిపోయి ముగ్గురు వ్యోమగాములు మరణించారు.అదే ఏడాది ఏప్రిల్‌లో సోవియట్‌ తొలి వ్యోమగామి కొమరోవ్‌ భూమికి తిరిగి వస్తూ పారాచూట్‌ విఫలం కావటంతో మరణించాడు.1971 జూలైలో 24 రోజుల పాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో గడిపి తిరిగి వస్తూ ముగ్గురు సోవియట్‌ వ్యోమగాములు మరణించారు.1986 జనవరి 28న కేప్‌ కేనరవాల్‌ నుంచి ప్రయోగించిన 72 సెకండ్లలోనే ఛాలెంజర్‌ స్పేస్‌ షటిల్‌ పేలిపోయి ఒక స్కూలు టీచరుతో సహా ఏడుగురు వ్యోమగాములు మరణించారు.అదే ఏడాది ఏప్రిల్‌ 18న కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన ఒక మిలిటరీ ఉపగ్రహం పేలిపోయింది. మే మూడవ తేదీన కేప్‌ కేనరవాల్‌ నుంచి ప్రయోగించిన డెల్టా రాకెట్‌ పేలిపోయింది. 1990 ఫిబ్రవరి 22న పశ్చిమ ఐరోపాకు చెందిన ఏరియానె 36వ రాకెట్‌ ఫ్రెంచి గుయానాలో ప్రయోగించిన రెండు నిమిషాలకు పేలిపోయింది.ఇలా ఎన్నో ఉదంతాలను పేర్కొన వచ్చు.


ఈ సందర్భాలలో అవన్నీ ఆయా దేశాల బాధ్యతా రాహిత్యమూ, ప్రమాణాలను పాటించలేదు, ఎంత ప్రమాదమో చూడండంటూ చైనా రాకెట్‌ వైఫల్యం గురించి చిత్రించిన కధనాలు వెలువడలేదు, ఎందుకంటే అవన్నీ ప్రమాదాలు. ఫుకుషిమా అణు కేంద్రంలో జరిగిన ప్రమాదం కారణంగా కలుషితమైన జలాలను సముద్రంలోకి విడుదల చేయనున్నట్లు జపాన్‌ ప్రకటించగానే ప్రపంచం గగ్గోలు పెట్టింది. ఆ చర్యకు అమెరికా మద్దతు పలికిగింది. వివాదాస్పదమూ, ప్రమాదకరమైన ఆ చర్యను సమర్ధించటానికి కారణం జపాన్‌ మిత్రపక్షం. అలాంటి ప్రమాదాలేమీ లేని చైనా రాకెట్‌ పతనం గురించి పెడబొబ్బలు పెట్టటం చైనాతో ఉన్న శతృత్వం తప్ప మరొకటి కాదు. చైనాతో ఆరోగ్యకరమైన ఆర్ధిక విధానాలతో తలపడటానికి అమెరికాతో అన్ని దేశాలకు అవకాశాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి అక్కసుతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం ద్వారా ఎవరి నిజ స్వరూపం ఏమిటో, చిత్తశుద్ది ఏమిటో స్పష్టం అవుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా జీవ ఆయుధాలు : ” ఆస్ట్రేలియన్‌ ” అల్లిన కథ వాస్తవం ఏమిటి ?

11 Tuesday May 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

#China biological weapons, Anti China Propaganda, The Australian


ఎం కోటేశ్వరరావు


కరోనా వైరస్‌ పుట్టుక గురించి తేలక ప్రపంచం మల్లగుల్లాలు పడుతోంది. ఒకవైపు శాస్త్రవేత్తలు దాన్ని నివారించేందుకు యుద్దంతో పాటు, గుట్టు విప్పేందుకు భాష, ప్రాంతీయ తేడాలు లేకుండా శ్రమిస్తున్నారు. మరోవైపు మీడియా సంచలన కథనాలతో జనం మెదళ్లను ఖరాబు చేస్తోంది. దున్న ఈనిందనగానే దూడను గాటన కట్టివేయమన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. తాజాగా వెలువడిన ఆస్ట్రేలియన్‌ కధనాన్ని తెలుగు మీడియా కూడా సొమ్ము చేసుకుంది. కష్టకాలంలో ఉన్నపుడు కుట్ర సిద్దాంతాలకు జనం త్వరగా ఆకర్షితులౌతారు. మూడవ ప్రపంచ యుద్దం వస్తే అది జీవ ఆయుధాలతోనే జరుగుతుందని అందుకోసం వాటిని తయారు చేయటం గురించి చైనా మిలిటరీ శాస్త్రవేత్తలు చేసిన సమాలోచనల 2015 నాటి రహస్య పత్రం తమకు దొరికిందంటూ ”ది ఆస్ట్రేలియన్‌ ” అనే పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది.


జీవ ఆయుధాలకు సంబంధించిన కట్టుకథలు-పిట్టకథలతో పాటు వాస్తవాలు కూడా జనానికి అందుబాటులో ఉన్నాయి. కావాల్సింది కాస్త ఓపికగా తెలుసుకోవటమే. బ్రిటన్‌లోని సన్‌ పత్రిక పేర్కొన్నదాని ప్రకారం అమెరికా విదేశాంగ శాఖ నుంచి పత్రాలు తీసుకొని ఆస్ట్రేలియన్‌ చైనా జీవ ఆయుధ పరిశోధన కథ రాసింది. కోవిడ్‌-19 మూలాలను శోధించే క్రమంలో మిలిటరీ మరియు చైనా ప్రజారోగ్య అధికారులు రాసిన పత్రాలు తమకు దొరికాయని అమెరికా అధికారులు చెప్పారట. అమెరికా వైమానిక దళ కల్నల్‌ మైఖేల్‌ జె కఫ్‌ మూడవ ప్రపంచ యుద్దం జీవాయుధాలతో జరుగుతుందని చెప్పిన విశ్లేషణను పరిగణనలోకి తీసుకొని చైనా శాస్త్రవేత్తలు సార్స్‌ వైరస్‌తో జీవ ఆయుధాన్ని తయారు చేయటం గురించి చర్చించారట.2003లో చైనాలో సార్స్‌ వైరస్‌ వ్యాపించింది.


ఆస్ట్రేలియన్‌ పత్రిక కధనం చదివిన వారందరూ దాని మీద చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు చేశారు. పత్రిక పేర్కొన్న పత్రాలు నకిలీవి కాదని ఇంటర్నెట్‌ నిపుణులు చెప్పేశారు. రాజకీయ నేతలు గళం విప్పేశారు. మరికొందరు తెలివి తేటలు ఎక్కువగా ఉన్న వారు కరోనా వైరస్‌ మానవ కల్పితం అని చెప్పేందుకు, కావాలని చైనా బయటకు వదిలిందనేందుకూ ఆధారం లేదని చెబుతూనే ఊహాన్‌ రహస్య పరిశోధనాశాల నుంచి తప్పించుకొని వచ్చి ఉండవచ్చనే ఆనుమానాలను చొప్పిస్తున్నారు. అసలింతకీ ఆస్ట్రేలియన్‌ కధనానికి ఆధారం ఏమిటి ?


ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్‌ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్‌ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. దానిలో రహస్యాలు, కుట్ర ఆలోచనలు ఉంటే చైనా సర్కార్‌ అనుమతిస్తుందా ? అమెరికా విదేశాంగశాఖ పుస్తకంలోని అంశాలను రహస్య పత్రాలని చెప్పటం వాటిని గుడ్డిగా ఆస్ట్రేలియన్‌ పత్రిక సంపాదకులు నమ్మి నిజమే అని ప్రచురించారని అనుకోజాలం. అంత రహస్యం అయితే అమెరికా అధికారులు తమ పత్రికలకు ఇవ్వకుండా ఆస్ట్రేలియా పత్రికను ఎంచుకోవటం ఏమిటి ? అమెరికా ఏర్పాటు చేసిన చతుష్టయంలో అది భాగస్వామి, అమెరికా పెట్టిన చిచ్చుకారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్యపోరు సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాతో వాణిజ్య చర్చలను నిరవధికంగా వాయిదా వేసినట్లు చైనా ప్రకటించిన నేపధ్యంలోనే ఈ వార్తలు వెలువడ్డాయి. అంటే చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు, ఆస్ట్రేలియా భుజం మీద నుంచి తుపాకి కాల్చే అమెరికా ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. పధకం ప్రకారం రాసే పత్రికల నుంచి జర్నలిస్టు ప్రమాణాలను ఆశించలేము. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడించారన్నట్లుగా చైనా ప్రచురించిన పుస్తకంలోని అంశాలకు వక్రభాష్యాలు చెప్పి రాసిన కధనం అన్నది స్పష్టం. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్‌ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్‌ (ఇది కూడా కరోనా వైరస్‌ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్‌ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌, హునాన్‌ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు. ఇన్ని అంశాలుండగా వాటన్నింటినీ పక్కన పెట్టి చైనా శాస్త్రవేత్తలు చైనాలో సార్స్‌ నుంచి జీవ ఆయుధాల గురించి చర్చ చేశారంటూ ఆస్ట్రేలియన్‌ వర్ణించింది.


బిల్‌ మరియు మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్‌ గేట్స్‌ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్‌ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పారు.భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. బిల్‌గేట్స్‌ వ్యాఖ్యల మీద మీడియా ఎలా స్పందించిందో ఎవరికి వారు పరిశీలించుకోవచ్చు. 2015లో బిల్‌ గేట్స్‌ టెడ్‌ టాక్‌ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్‌ గేట్స్‌ మాటలను బట్టి గేట్స్‌ అప్పటికే మైక్రోచిప్‌ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్‌ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు. ఆస్ట్రేలియన్‌కు, అమెరికాకు దీనిలో ఎలాంటి కుట్ర కోణం కనిపించలేదా ?

వాక్సిన్లు మేధోసంపత్తి హక్కుకు సంబంధించినవి కాదు, లేదా ఖాళీగా పడి ఉన్న వాక్సిన్‌ కర్మాగారమూ కాదు. నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్‌ వంటి అభివృద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ చెప్పాడు. ప్రపంచ వ్యాపితంగా తక్కువ ఖర్చుతో కరోనా వాక్సిన్లు వేయాల్సిన అవసరం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్ద, ఇతర నిపుణులు సూచించినందున దాన్ని సొమ్ము చేసుకోవాలని కార్పొరేట్లు నిర్ణయించాయి. అనేక కంపెనీలలో వాటాదారుగా ఉన్న బిల్‌గేట్స్‌ నుంచి ఇలాంటి మాటలు గాక భిన్నంగా వస్తాయని ఎవరూ ఆశించరు.


రష్యా-చైనా సరిహద్దుల సమీపంలో అమెరికన్లు ప్రయోగశాలల్లో జీవ ఆయుధాలను అభివృద్ది చేస్తున్నారని, వాటి పరిసరాలలో తడపర (తట్టు) వంటి ప్రమాదకర అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయని దాని మీద విచారణ జరపాలని ఏప్రిల్‌ మొదటి వారంలో రష్యా కోరింది. దానికి ప్రతిగా కూడా ఆస్ట్రేలియన్‌ కధనాన్ని ప్రచురించి ఉండవచ్చు. ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్‌ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్‌ అనే ప్రాంతంలో ఫోర్డ్‌ డెట్రిక్‌ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్‌ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్‌, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

జనాలను కొంత మంది ఎలా బురిడీ కొట్టిస్తారో ఒక ఉదంతాన్ని చూద్దాం . అమెరికన్‌ రచయిత డీన్‌ కూన్జ్‌ ఎప్పుడో కరోనా గురించి జోశ్యం చెప్పారని కరోనా వైరస్‌ బయట పడిన కొత్తలో గత ఏడాదే వార్తలు వచ్చాయి. డీన్‌ 1981లో రాసిన ది ఐస్‌ ఆఫ్‌ది డార్క్‌నెస్‌ అనే నవలలో పాత్రధారులతో ఊహాన్‌ -400 అనే జీవ ఆయుధం, అది పనిచేసే తీరు, జనాలను ఎలా హతమారుస్తుందో, దాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పించాడు చూడండి అంటూ ఆయన అభిమానులు లేదా ఆ నవలను విక్రయించే అమెజాన్‌ కంపెనీకి చెందిన వారు గానీ 2008నాటి నవలా సమీక్ష చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఒక పేజీలో జీవ ఆయుధం గురించి మరొక పేజీలో నవల ముఖచిత్రం ఉంది. ఇంకేముంది పుస్తకం మన ముందు ఉంది కనుక వాస్తవమే అని చాలా మంది నమ్మారు. ఈ నవల పేజీ ప్రచారంలోకి వచ్చిన తరువాత ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. గూగుల్‌లో వెతికిన కొందరికి కొత్త అంశం కనిపించింది. అదే నవలలో అదే పాత్ర ధారులు రష్యన్‌లు గోర్కీ పట్టణంలో తయారు చేసిన గోర్కీ-400 జీవ ఆయుధం గురించి చర్చిస్తారు. ఆ పేజీ నవల 1981నాటి ముద్రణలో ఉంది. కానీ తరువాత గోర్కీ కాస్తా 2008 ముద్రణ నాటికి ఊహాన్‌గా మారిపోయింది. ఇదెలా జరిగింది? ఊహించటం కష్టమేమీ కాదు. అమెరికా, ఐరోపాలోని అనేక మంది రచయితలు, సినిమా దర్శకులు, కథకులు 1991 ముందు వరకు సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్దలను దుష్టమైనవిగా చిత్రించి సొమ్ము చేసుకోవటం పరిపాటి.అమెరికన్లు, సిఐఏ ఏజంట్లు అసాధారణ తెలివి తేటలు గలవారిగా, సోవియట్‌ ఏజంట్లను పిచ్చిపుల్లయ్యలుగా చిత్రించిన సినిమాలు అనేకం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సోవియట్‌, ఇతర సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అలాంటి వారు సొమ్ము చేసుకొనేందుకు కొత్త కథలను అల్లటం ప్రారంభించారు. అమెరికా ప్రధాన ప్రత్యర్ధిగా అనూహ్యంగా చైనా ముందుకు వచ్చింది.1991 తరువాత వచ్చిన సినిమాల్లో, రష్యన్ల బదులు చైనీయులు విలన్లుగా, అపహాస్యపు పాత్రధారులుగా మారిపోవటాన్ని చూడవచ్చు. దానిలో భాగంగానే కొత్త నవల రాయటం దండగ పేర్లు, స్ధలాలను మారిస్తే చాలని రచయిత, ప్రచురణకర్తలు భావించి ఆ మేరకు మార్చి ప్రచురించినట్లు స్పష్టమైంది.
జీవ ఆయుధాలు ప్రపంచంలో తయారు కావటం లేదా, ఏ ఏదేశాలకు సామర్థ్యం ఉంది, అసలు ఎప్పటి నుంచి వీటిని వినియోగిస్తున్నారు, ఎవరు వినియోగిస్తున్నారో చూద్దాం. యుద్ధోన్మాదులు, ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన వారు మాత్రమే వీటిని ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే వాటిని తయారు చేసే సత్తా చైనా, భారత్‌ వంటి దేశాలకు లేదా అంటే లేదని ఎవరూ చెప్పజాలరు. మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి.

చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్‌ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు అమ్మోరు పోసిన వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.

1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.

మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. జీవ ఆయుధాల తయారీ, ప్రయోగాలు నిర్వహించారు. 1980-88 మధ్య ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధంలో అమెరికా అందచేసిన శరీన్‌, ఇతర గ్యాస్‌లను ప్రయోగించినట్టు ఇరాక్‌పై విమర్శలు వచ్చాయి. తరువాత కాలంలో వాటి నిల్వలు ఇంకా ఇరాక్‌ వద్ద ఉన్నట్టు అనుమానించిన అమెరికా సద్దామ్‌ హుసేన్‌ మానవవినాశక ఆయుధాలను గుట్టలుగా నిల్వచేసినట్టు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాక్‌లో అమెరికన్లకు అలాంటివేమీ దొరకలేదని తరువాత వెల్లడైంది.

అమెరికాను ఆక్రమించుకొనే క్రమంలో గిరిజనుల నుంచి ఎదురైన ప్రతిఘటనను అణచివేసేందుకు బ్రిటిష్‌ పాలకులు పైన చెప్పుకున్నట్టు మసూచి(అమ్మోరు)వ్యాప్తిని ఒక ఆయుధంగా వాడుకున్న దుర్మార్గం గురించి చరిత్రలో నమోదైంది. అవి ఎలా పనిచేశాయో వివరిస్తూ సమాచారాన్ని బ్రిటిష్‌ సైనిక అధికారులు నమోదు చేశారు. పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఉదాహరణకు ఒక ప్రాణాంతక వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ తయారీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వాటికీ జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.

మొదటి ప్రపంచ యుద్దంలో రష్యా, రుమేనియాల్లో కలరా, ప్లేగు, అంత్రాక్స్‌ను వ్యాపింప చేసేందుకు నౌకల్లో అవి సోకిన గుర్రాలు, ఇతర పశువులను ఎగుమతి చేసేందుకు జర్మనీ పధకం వేసిందని వార్తలు వచ్చాయి. అయితే దాని మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. తరువాత రసాయనిక ఆయుధాలను రూపొందించకూడదని కోరుతూ 1925లో జెనీవా ఒప్పందం చేసుకున్నారు. అనేక దేశాలు సంతకాలు చేసినా 1975వరకు అమెరికా భాగస్వామి అయ్యేందుకు మొరాయించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కొరియాపై దాడి సమయంలో అమెరికా జీవ ఆయుధాలను ఉపయోగించిందనే విమర్శలు వచ్చాయి. అయితే తమ దగ్గర జీవ ఆయుధాలు ఉన్నాయి తప్ప వాటిని ఉపయోగించలేదని అమెరికన్లు బుకాయించారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. అందుకు ప్రత్యేక దళాన్నే ఏర్పాటు చేశారు. 1932 నుంచి 1942వరకు పరిశోధనలు చేసి రూపొందించారు. తొలుత ప్రయోగాల్లో భాగంగా తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా. అమెరికన్లు జపాన్‌ పెరల్‌ హార్బరు మీద దాడి చేసిన తరువాత పదిహేను కోట్ల ప్లేగు బాక్టీరియాను మోసుకుపోయే ఈగలు, ఎలుకలతో అమెరికా మీద దాడి చేయాలని జపాన్‌ ఏర్పాట్లు చేసుకుంది. అయితే కారణాలు ఏమైనా వాటిని మోసుకుపోయే బెలూన్‌ నిరీ?త స్థలాన్ని చేరలేదు. తరువాత దాడి చేయాలనుకున్న తేదీకి కొద్ది వారాల ముందే జపాన్‌ లొంగిపోయింది. దాంతో పన్నాగం నెరవేరలేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జరిపిన విచారణలో జీవ ఆయుధాల తయారీ బ ందం నేత షిరోషిని జపాన్‌ విడిచినా సోవియట్‌ విచారణలో 12మంది జపనీయులకు శిక్షలు తప్పలేదు.


జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే దొంగే దొంగ అన్నట్లు చైనా మీద తప్పుడు ప్రచారం చేస్తోంది. మీడియా దానికి సాధనంగా ఉపయోగపడుతోంది. ఆస్ట్రేలియన్‌ కధ దానిలో భాగమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ గడ్డం దీక్ష వికటించి రెండవ దశలో కరోనా రెచ్చిపోతోందా ?

06 Thursday May 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, UK, USA

≈ Leave a comment

Tags

China bio war, India’s COVID-19, Modi’s Beard, Narendra Modi, Propaganda War, RSS, RSS Propaganda War, Untruths


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు కరోనా వైరస్‌ మన దేశ పౌరుల మీద యుద్దం చేస్తోంది. దాన్ని ఎదుర్కోవాల్సింది కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలే . రాష్ట్రాలకు (రాజకీయ ) మార్గదర్శనం (కాదు) చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఆ పని చేయటంలో విఫలమైన ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చే సంఘపరివార్‌, పాలకులకూ-పరివార్‌ కొమ్ముకాస్తున్న ప్రధాన స్రవంతి మీడియా (జనం ఏదని భావిస్తే అది ) మరోవైపు తీవ్ర ప్రచార యుద్దం ప్రారంభించింది. సామాజిక మాధ్యమంలో దాడి సంగతి సరేసరి ! స్వయంగా గోబెల్స్‌ స్వర్గం నుంచి రంగంలోకి ( దాని మీద నమ్మకం ఉన్న వారి మనోభావాల ప్రకారం) దిగి పర్యవేక్షిస్తున్నాడా ? ఇప్పటికే వాట్సప్‌ విశ్వవిద్యాలయ పండితులు వండి వారుస్తున్న సరకుతో రాబోయే రోజుల్లో మరింతగా జనం మెదళ్లను నింపబోతున్నారు. వాటిలో ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. దానిలోని కొన్ని అంశాల మంచి చెడ్డలను చూద్దాం ! ఇలాంటి అంశాల మీద జనంలో అనుమానాలు తలెత్తటం ప్రారంభమైంది. దాంతో తమ పోస్టులోని అంశాలు సాధికారికంగా చెబుతున్నట్లు నమ్మించేందుకు కొన్ని పత్రికలలో వచ్చిన వార్తల లింకులను కూడా దీనికి జతచేశారు.

మెదళ్లతో వేస్తున్న ప్రశ్నలేనా ?

” కోవిడ్‌ -2 వేవ్‌ ఒక ప్లానెడ్‌ బయోలాజికల్‌ యుద్ధం ? భారత ఉపఖండం మొత్తం మీద ఒక్క భారత్‌ లోనే ఇలా ఎందుకు అవుతున్నది ? బంగ్లాదేశ్‌ , పాకిస్థాన్‌, నేపాల్‌ , శ్రీలంక, భూటాన్‌ దేశాలలో ఎందుకు లేదు ? అంటే భారత్‌ ప్రజలు మిగతా ఉపఖండ దేశాల ప్రజల కంటే క్రమశిక్షణ లేని వారా ? అమెరికా ,చైనా లు కలిసి ఎకానమీ,ఫార్మా రంగాలని కాపాడుకోవడానికే ఇదంతా చేశారా ? ”
పధకం ప్రకారం జరుపుతున్న బయలాజికల్‌ యుద్దం అదీ చైనా మీద చేస్తున్న ఆరోపణ రోత పుట్టించే పాచిపాటే. పధకం ప్రకారం జరుగుతున్నదనుకుంటే మోడీ సర్కార్‌ నిఘా యంత్రాంగం, అసలు సిసలు జేమ్స్‌ బాండ్‌ అని చెబుతున్న అజిత్‌ దోవల్‌ ఏమి చేస్తున్నట్లు ? అధికారికంగా ప్రభుత్వం ప్రకటించి ఎందుకు జనాన్ని అప్రమత్తం చేయలేదు. మిగతా దేశాలకు రానందుకు సంతోషించాల్సింది పోయి ఎందుకు రాలేదు అని ప్రశ్నించేవారి మానసిక స్ధితి ఏమిటి ? పైన పేర్కొన్న దేశాల్లోనే కాదు ఇంకా అనేక దేశాల్లో రాలేదు. అలా ఎందుకు జరిగిందో చూసి ఇక్కడ కూడా నివారించాలని కోరకుండా ఫలానా చోట ఎందుకు రాలేదు అనే వారు మెదడుతోనా మరోదానితో ప్రశ్నిస్తున్నట్లా ? భారత ప్రజలు క్రమశిక్షణ లేని వారని ఎవరన్నారు ! వారిలో కొందరికి లేదు మచ్చుకు గోమాంసం, గోసంరక్షణ పేరుతో మైనారిటీల మీద దాడి చేసే వారు, వాలెంటైన్స్‌ డే రోజున పార్కుల వెంట తిరిగే బాపతు, మసీదులు, దేవాలయాల్లో, సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రచారాలు, కుట్రలు చేసే సకల కళా పారంగతులు, కాశ్మీరులో మాదిరి అత్యాచారం చేసిన వారికి మద్దతుగా ప్రదర్శనలు చేసిన రాజకీయ పార్టీలు, లాయర్ల వంటి వారు, వారికి మద్దతు ఇచ్చే పెద్దలు క్రమశిక్షణ లేనివారు తప్ప వాటితో నిమిత్తం లేని సామాన్య జనం క్రమశిక్షణ లేని వారని ఎలా అంటాం ? చైనా మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్దం గురించి తెలిసి కూడా తెలియనట్లు నటించే వారు మాత్రమే ఆ రెండు దేశాలూ కలసి ఆర్ధిక, ఔషధ రంగాలను కాపాడుకోవాలని చేశాయని చెప్పగలరు. బుర్రతక్కువ ప్రచారం గాకపోతే రెండూ కలిస్తే అమెరికాలో కరోనా ఎందుకు పుచ్చిపోతుంది, చైనాలో అదుపులోకి వచ్చి ఆర్ధికరంగం ఎందుకు పురోగమిస్తోంది. ఇలాంటి అంశాలను ముందుకు తెస్తున్న వారు జనాలకు మెదళ్లు లేవన్న జనం అంటే గౌరవం లేని వారే అని ఎందుకు అనుకోగూడదు ?

దీన్నే ఎదురు దాడి అంటారు !

” డొనాల్డ్‌ ట్రంఫ్‌ లాగా మోడీ గ్లోబల్‌ ఆయుధ, ఫార్మా,ఆయిల్‌ లాబీలకి లొంగకుండా ముందుకు వెళ్తునందుకె ఇదంతా జరుగుతున్నదా ? ”
నరేంద్రమోడీ మహానుభావుడు లొంగలేదని ఎలా చెబుతారు. అమెరికా ఆదేశిస్తే జీ సార్‌ అంటూ చేతులు కట్టుకొని ఇరాన్‌ నుంచి చమురు కొనటం మాని అమెరికా దగ్గర కొంటున్నారు. అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలు సరేసరి. సర్వం అర్పించుకుంటాం అన్నట్లుగా తయారైన కారణంగానే మోడీ రాక ముందు పాకిస్ధాన్‌తో లాహిరి లాహిరిలో అన్నట్లున్న అమెరికా ఇప్పుడు దాన్ని తెరచాటుకు పంపి మన దేశంతో సయ్యాటలాడుతోంది. చతుష్టయం పేరుతో మనలకు ముగ్గులాగిందా లేదా ? అది లొంగుబాటు కాదా ! నూట ముప్పయి కోట్ల జనాభాకు వాక్సిన్‌ వేయాలంటే రెండు కంపెనీలకే ఎందుకు అనుమతి ఇచ్చారు ? ఏ లాబీ దీని వెనుక ఉంది. అత్యవసర వినియోగానికి ఆ రెండింటికీ అనుమతి ఇచ్చినట్లుగానే ఇతర వాక్సిన్లకు అనుమతి ఇవ్వకపోవటం సకాలంలో వాక్సిన్లు వేయకుండా జనాలను చావుదాకా నెట్టటం వెనుక ఫార్మా లాబీ హస్తం లేదా, దానికి మోడీ సర్కార్‌ తలొగ్గలేదా ? నరేంద్రమోడీ సర్కార్‌ మూడు వేల కోట్ల రూపాయలు సీరం సంస్ధకు ఎలాంటి హామీలు లేకుండా ఇస్తే ఆ సొమ్ముతో బ్రిటన్‌లో తయారీ కేంద్రం పెడుతున్నట్లు అదర్‌పూనావాలా ప్రకటించిన విషయం తెలియదా ? దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరించటం అంటే ! నిజానికి మోడీకి విదేశీ ఫార్మాలాబీని దెబ్బతీయాలంటే 56 అంగుళాల ఛాతీ ఉంటే రెమిడెసివిర్‌, వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సులు ఇచ్చి మన దేశంలో చౌకధరలకు ఎందుకు తయారు చేయించరు ? ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించి ఫార్మారంగం మీద నియంత్రణ ఎందుకు పెట్టరు ? అమెరికా నుంచి చమురుకొనుగోలు నిలిపివేసి తిరిగి ఇరాన్‌ నుంచి ఎందుకు కొనుగోలు చేయరు ? జనాలకు ఎల్లకాలం చెవుల్లో పూలు పెట్టలేరు !

డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఇంత సానుభూతి, ప్రేమ ఎందుకు ?

” ముందు డొనాల్డ్‌ ట్రంఫ్‌ ఓటమి వెనక ఉన్న వాస్తవాలు ఏమిటో చూద్దాము. నాటో దేశాల రక్షణ అమెరికా బాధ్యత కాదు అన్నాడు అంటే నాటో దేశాల కంటే నాటో కూటమిలో ఉన్న అమెరికా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నది. యూరోప్‌ అంతటా మిలటరీ బేస్‌ లు పెట్టి అమెరికన్‌ సైనికులని అక్కడ మోహరించి ఉంచడం చాలా ఖర్చుతో కూడుకొని ఉంది. అందుకే నాటో కూటమి నుండి అమెరికా వైదొలుగుతుంది అని చెప్పేశాడు మళ్ళీ అధికారం లోకి వస్తే ఆ పని చేసేవాడు ఇది అమెరికన్‌ ఆయుధ లాబీ కి అస్సలు నచ్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక చోట ఉద్రిక్తతలు ఉండాలి అక్కడ అమెరికా సైన్యం వెళ్ళాలి ఆయుధాలు అమ్ముడుపోవాలి కానీ ట్రంఫ్‌ ఉంటే ఇవన్నీ జరగవు. ”
ఇదొక బుర్ర తక్కువ వాదన. ఐరోపా దేశాలను బెదిరించేందుకు, వారి నుంచి డబ్బు గుంజేందుకు, ఉపయోగించే అవసరం లేకపోయినా ఆయుధాలు కొనిపించేందుకు నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ చెప్పాడు తప్ప మరొకటి కాదు. నాటో నుంచి వైదొలుగుతాం అన్న ట్రంప్‌ ఆసియాలో దక్షిణ చైనా సముద్రంలో చిచ్చు పెట్టేందుకు ఆసియా నాటో అని పిలుస్తున్న చతుష్టయం(క్వాడ్‌)లో జపాన్‌, ఆస్ట్రేలియాలతో పాటు మన జుట్టుకూడా ముడివేసింది వాస్తవం కాదా ? నాటో నుంచి వైదొలిగే వాడికి ఇక్కడ ఈ కూటమి ఎందుకు అని నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించలేకపోయినట్లు ? మన దేశం ఆయుధాలు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నది ట్రంప్‌ హయాంలోనే కదా ?
” ఇక బ్లాక్స్‌ ఓన్లీ లివ్‌ (బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌ )నినాదం తో ట్రంఫ్‌ మీద విపరీతమయిన దుష్ప్రచారం చేశారు. ప్రతి ఒక పోలీసుని ఏ దేశ ప్రధాని కావచ్చు లేదా అధ్యక్షుడు కానీ నీయంత్రించ లేరు కానీ అది ట్రంఫ్‌కి అంటగట్టారు విజయవంతంగా ! అప్పటికి నల్లజాతి వాళ్ళ మీద అదే మొదటి దాడి జరిగినది అనే విధంగా ! ఆయుధ లాబీ పాచిక పారింది. ట్రంఫ్‌ ఓటమికి ఏవైతొ శక్తులు వెనక ఉండి ప్లాన్‌ చేసాయో అవే ఇప్పుడు మోడీ మీద ప్రయోగిస్తున్నాయి. ”
బోడి గుండుకూ మోకాలికి ముడి పెట్టటం అంటే ఇదే ! నల్జజాతీయుల జీవిత సమస్య (బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌ ) అనేది 2013లో ప్రారంభమైన ఒక సామాజిక మాధ్యమ, సామాజిక, రాజకీయ ఉద్యమం. అప్పటికే వారి మీద జరుగుతున్నదాడుల తీవ్రతతో అది ఉనికిలోకి వచ్చింది. ట్రంప్‌ హయాంలో నల్లజాతి, ఆసియా, ఇతర రంగుజాతి వ్యతిరేక చర్యలు పెచ్చుమీరాయి. అందువలన ఎన్నికల ప్రచారంలో అది ఒక సమస్యగాకుండా ఎలా ఉంటుంది. రిపబ్లికన్‌ పార్టీ ట్రంప్‌ పుట్టక ముందే పుట్టింది, అది శ్వేత జాతి దురహంకార పార్టీ అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్‌ ఎంత వదరుబోతో, ఎంత అబద్దాలకోరో అక్కడి మీడియా లెక్కలు వేసి మరీ చూపింది.ట్రంప్‌ నల్లజాతి విద్వేషి అయితే మోడీ ముస్లిం, క్రైస్తవ మతాల మీద నిరంతరం విద్వేషం, దాడులకు పాల్పడే శక్తులకు కాపు కాస్తున్న పెద్దమనిషి. అందుకే ఒక దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకో కూడదన్న విధానాన్ని పక్కన పెట్టి మన నరేంద్రమోడీ అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని అమెరికా వెళ్లి కౌగిలింతలతో మరీ పిలుపునిచ్చి వచ్చారు. ఒకటి మాత్రం స్పష్టం. కరోనా నిర్లక్ష్యం చేసి లక్షలాది మందిని చంపి జనాగ్రహానికి గురైన ట్రంప్‌ మీద ఎంత సానుభూతి ! ఎంత గాఢమైన అనురాగం. దీనికి కారణం లేకపోలేదు. ట్రంప్‌ నల్లజాతి వ్యతిరేకి – నరేంద్రమోడీ మైనారిటీల వ్యతిరేకి. అందుకే ఇద్దరికీ రాగి-బంగారం మాదిరి కలిసింది. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ కూడా కరోనాను నిర్లక్ష్యం చేసి చివరికి ఆక్సిజన్‌ కూడా అందించలేకపోతోంది. అందువలన అవకాశం వచ్చినపుడు జనం ట్రంప్‌కు చేసిన సత్కారాన్ని మోడీ లేదా ఆయన పార్టీకి చేస్తారు !

ఈ ”చావు ” తెలివితేటలే కొంప ముంచుతున్నాయి !

” కోవిడ్‌ మొదటి దశ ని విజయవంతంగా దాటడం అనేది భారత దేశ చరిత్రలో అతి పెద్ద విజయం. గత 2020 జనవరి నెలలో వెస్ట్‌ దేశాలు జోస్యం చెప్పింది ఏమిటంటే భారత్‌ లో హీన పక్షం వొ రెండు కోట్ల మంది కోవిడ్‌ వల్ల చనిపోతారు కానీ వాళ్ళు జోస్యం నిజం కాలేదు సరికదా మరణాల సంఖ్య రెండు లక్షల లోపే జరిగినది. పైగా హైడ్రాక్లోరో క్వీన్‌ ని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయగలిగింది. నిజానికి 2020 లో ఇదే సమయానికి అమెరికా,యూరోపు తో సహా మిగతా ప్రపంచదేశాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి కానీ భారత్‌ మాత్రం పెద్దగా నష్టం లేకుండానే బయటపడగలింది. చివరకి చైనా తొత్తు అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు కూడా భారత్‌ ని చూసి మిగతా దేశాలు నేర్చుకోవాలి కోవిడ్‌ ని ఎలా ఎదుర్కోవాలో అంటూ ఒక ప్రకటన చేశాడు గతి లేక. ”
ఈ చావు తెలివితేటలు, విజయగానాలే దేశాన్ని ఇప్పుడీ దుస్తితికి తెచ్చాయి. స్పానిష్‌ ప్లూ మహమ్మారి అనుభవంతో భారత్‌ వంటి పెద్ద దేశంలో విస్తరిస్తే మరణాలు ఎక్కువ ఉంటాయని ఎవరైనా అంచనా వేస్తే వేసి ఉండవచ్చు గానీ ప్రపంచ ఆరోగ్య సంస్ద అలాంటి జోశ్యాలు చెప్పలేదు. రెండవ దశ కరోనా గురించి నిర్లక్ష్యానికి నరేంద్రమోడీని బోనులో నిలబెడుతుండటంతో దానికి సమాధానం చెప్పలేక విజయగానాల గురించి మొదలు పెట్టారు. జ్యోతిష్కులు చెప్పిన సొల్లు కబుర్ల మీద ఉన్న విశ్వాసం శాస్త్రవేత్తలు చెప్పిన లేదా ప్రపంచ అనుభవాల మీద పాలకులకు లేకపోవటమే ఈ దుస్దితికి కారణం. మార్చి 30 నుంచి దేశంలో కరోనా ప్రభావం ఉండదని, మే 11 తరువాత ప్రపంచంలోనే కరోనా అంతరిస్తుందని ఇలా ఎవడికి తోచిన చెత్తను వారు చెప్పారు. ఒక్కడంటే ఒక్క జ్యోతిష్కుడు కూడా రెండవ దశ ఇంత తీవ్రంగా వస్తుందని ఎందుకు చెప్పలేకపోయాడు. ఒక పక్క మార్చినెలలో కరోనా రెండవ దశ తీవ్రంగా వ్యాపిస్తుండటాన్ని చూసి కూడా గంగలో మునిగితే వైరస్‌ అంటదని బిజెపి అగ్రనేతలు చెప్పారంటే కళ్ల ముందున్నదానిని చూడలేని, వినలేని, శాస్త్రవేత్తలు చెప్పిన దానిని విశ్వసించలేని మూఢత్వంలోకి వారు జారి దేశాన్ని నెట్టారని ఎవరైనా అంటే తప్పేముంది ? ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా తొత్తు అయితే దాన్నుంచి మన దేశం ఎందుకు బయటకు రాలేదు ?

అవాస్తవాలు -జనం చెవుల్లో పూలు !

”ఇక వాక్సిన్‌ విషయంలో అన్నీ దేశాల కంటే ముందే ఉత్పత్తి ప్రారంభం చేసి వాక్సిన్‌ ఇవ్వడం మొదలు పెట్టింది భారత్‌. సరిగ్గా ఇక్కడే గ్లోబల్‌ ఫార్మా లాబీకి కష్టం అనిపించింది. ప్రతి సంవత్సరం గ్లోబల్‌ ఫార్మా చేసే వ్యాపార విలువ 4 నుండి 6 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుంది ఇక వాక్సిన్‌ వ్యాపారం అయితే 1.25 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా కానీ భారత్‌ బయో టెక్‌ కోవాక్సిన్‌, లైసెన్స్‌ తీసుకొని తయారు చేస్తున్న కొవీషీల్డ్‌ ఉత్పత్తి రేటు మిగతా దేశాలకంటే ఎక్కువ. పైగా ధర విషయంలో మిగతా దేశాలకంటే 60% తక్కువగా ఉండడం పశ్చిమ దేశాలకి మింగుడు పడడం లేదు ఇదే మోడీ పట్ల ద్వేష భావం నెలకొనడానికి కారణం అయ్యింది. చివరకి జర్మనీ ఛాన్సేల్లర్‌ అంజేల మోర్కెల్‌ అయితే భారత్‌ ఫార్మా రంగ హబ్‌ అవడం మనం చేసిన తప్పు అంటూ బహిరంగంగా ప్రకటించింది అంటే ఎంత అక్కసు ఉందో తెలిసిపోయింది. ఇక్కడ ప్రధానం గా ఆస్ట్రా జెనీక వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల మరణాలు సంభవించాయి యూరోపులో. ఇదే సమయంలో అదే లైసెన్స్‌ తీసుకొని భారత్‌ లో తయారుచేసిన కొవీషీల్డ్‌ వల్ల అలాంటి దుష్ప్రభావాలు కలిగినట్లు ఎక్కడా ఫిర్యాదులు లేవు. ”
జనం చెవుల్లో కమలం పూలు పెట్టుకున్నారన్నది ఇది రాసిన వారి గట్టి విశ్వాసంగా కనిపిస్తోంది.ప్రపంచ ఫార్మామార్కెట్‌ 2019లో 324 బిలియన్‌ డాలర్లు, 2020లో 405, 2027లో 908 బిలియన్‌ డాలర్లు (ఒకబిలియన్‌ వంద కోట్లు )ఉంటుందనే అంచనా వార్తలను గూగుల్తల్లిని ప్రార్ధించి ఎవరైనా తెలుసుకోవచ్చు. నాలుగు వందల బిలియన్లెక్కడ ? రాసిన వారు చెప్పిన నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల డాలర్లెక్కడ ? గ్లోబల్‌ ఫార్మా లాబీకి కష్టం అట. ఆస్ట్రాజెనెకా వల్ల రక్తం గడ్డకట్టి మరణాలు సంభవించాయట. మన దేశంలో సీరం సంస్ధ కోవిషీల్డు పేరుతో తయారు చేస్తున్నది అదే విదేశీ ఆస్ట్రాజెనెకా కంపెనీ ఆధ్వర్యాన ఆక్ప్‌ఫర్డ్‌ తయారు చేసిందని తెలియదా ? అందుకే కదా మన దేశంలో కోవిషీల్డు వద్దు కోవాగ్జిన్‌ కావాలని అనేక మంది కోరుతున్నది.

” గ్లోబల్‌ ఫార్మా రంగం ఆశించింది అసలు జరగలేదు….. అన్నీ మన దేశంలో నే తయారు చేసుకున్నాము. రెండు వాక్సిన్లు భారత్లోనే తయారు చేసుకోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగలేదు. బిడెన్‌ అధికారంలోకి రాగానే ఫార్మా లాబీ భారత్‌ కి వాక్సిన్‌ తయారీ కోసం వాడే ముడి పదార్ధాల మీద నిషేధం విధించమని తీవ్ర ఒత్తిడి తెచ్చి విజయం సాధించాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాక్సిన్‌ కోసం ముందే రా మెటీరీయల్‌ బుక్‌ చేసుకుంది. ముందు ఇచ్చిన ఆర్డర్‌ లు డెలివరీ అయ్యాకే మనకి ఇస్తాయి అమెరికన్‌ సంస్థలు అంటే హీన పక్షం మరో మూడు నెలల వరకు మనకి రా మెటీరీయల్‌ దొరికే అవకాశం లేదు.”
ఇది రాసిన పెద్దలే మన అజిత్‌ దోవల్‌ అమెరికాకు వారి భాషలోనే మాట్లాడి ముడిపదార్దాల సరఫరాకు దిగివచ్చేట్లు చేశారని కూడా రాశారు. దానికి ఆధారాలు లేవు. ట్రంపు అంటే కౌగిలింతల మిత్రుడు బిడెన్‌ కాదు కదా అయినా నరేంద్రమోడీకి నోరు ఎందుకు రావటం లేదు. అమెరికాతో అవసరం అయితే తెగతెంపులు చేసుకుంటామని బహిరంగ హెచ్చరిక ఎందుకు చేయలేదు ?

ఇది రాసిన వారికి తెలిసిన మాత్రం కూడా తెలియకుండా మోడీ, బిజెపి నేతలు బెంగాల్‌ వెళ్లారా !

” ఇక ఇంత హఠాత్తుగా 2 వేవ్‌ విజ ంభించడానికి కారణాలు సుస్పష్టం. ప్రస్తుతం విజ ంభిస్తున్న కోవిడ్‌ రెండు సార్లు మార్పు చెందినట్లు పరీక్షలలో తేలింది అంటే ఇది ప్రత్యేకంగా పని కట్టుకొని వ్యాప్తి చేసినట్లు కనపడుతున్నది దీనికి కారణం వేస్ట్‌ బెంగాల్‌ లో ఉన్న చికెన్‌ నెక్‌ ప్రాంతం ప్రధానం గా చెప్తున్నారు. ఈ చికెన్‌ నెక్‌ ప్రాంతం నుండే డుబుల్‌ మ్యూటేషన్‌ చేసిన వైరస్‌ ని వదిలినట్లు అనుమానిస్తున్నారు ఎందుకంటే బెంగాల్‌ లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరికీ అనుమానం రాదు కానీ ఒకేసారి డబుల్‌ మ్యూటేషన్‌ ఎలా జరుగుతుంది ? ఇది ఖచ్చితంగా బయో వార్‌ మన మీద. లేకపోతే కేవలం భారత దేశంలోనే ఇది విజ ంభిస్తున్నది ? పోయిన సంవత్సరం కూడా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్నప్పుడే చైనా సరిహద్దుల్లో తిష్ట వేసింది అలాగే ఇప్పుడు 2వ వేవ్‌ ఉధ తంగా ఉన్న సమయంలో మళ్ళీ సవాల్‌ విసురుతున్నది. ”
తాము ఏమి రాసినా బుర్రను ఉపయోగించకుండా నమ్మే జనం ఉన్నారన్న గట్టి నమ్మకంతో అల్లిన కధ ఇది. కోడి మెడ మాదిరి ఉండే ప్రాంతాన్ని చికెన్‌ నెక్‌ అంటున్నారు. ఇది పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం. ఆ ప్రాంతం పక్కనే భూటాన్‌,నేపాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులు ఉన్నాయి. అక్కడ వదలిన వైరస్‌ ముక్కుసూటిగా అటూ ఇటూ చూడకుండా పొరుగుదేశాలకు వెళ్లకుండా పశ్చిమ బెంగాల్‌కు వచ్చిందని చెబుతున్నారు. మరి కర్ణాటకలో ఎందుకు పెరుగుతోంది. బెంగాల్‌కు కర్ణాటకకు, మహారాష్ట్రకు చాలా దూరం ఉంది. పక్కనే ఉన్న బీహార్‌కు, ఝార్కండ్‌, ఒడిషా, వాటి మీదుగా ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఎందుకు వ్యాపించలేదు. ఇలాంటి కట్టుకధలతో జనాన్ని ఎంతకాలం మభ్యపెడతారు ? ఇక్కడ చిన్న తర్కం మరచిపోయారు. చికెన్‌ నెక్‌ ప్రాంతానికి వైరస్‌ను తీసుకురావాలంటే భూటాన్‌, నేపాల్‌ దేశాలను దాటి చైనా వారు రావాలి. కానీ లడఖ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కింలకు కొన్ని అడుగుల దూరంలోనే మన సరిహద్దు ఉన్నపుడు అక్కడ వదల కుండా దేశాలు దాటి వచ్చి చికెన్‌ నెక్‌ ప్రాంతంలో ఎందుకు వదలినట్లు ? నిజంగా బయోవార్‌ అయితే దేశం మొత్తాన్ని లక్ష్యం చేసుకుంటారు తప్ప ఒక్క పశ్చిమ బెంగాల్‌నే ఎందుకు ఎంచుకుంటారు? బయోవార్‌ కథలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలేమిటి ? దాన్ని గుర్తించేందుకు మోడీ సర్కార్‌ ఇచ్చిన ప్రత్యేక శిక్షణ ఏమిటి ? సొల్లు కబుర్లంటే ఇవే. కాస్త బుర్ర ఉపయోగిద్దాం. నిజానికి బయోవార్‌ మొదలు పెడితే లడఖ్‌ ప్రాంతంలో మన సైన్యం మీదే చైనా వారు వైరస్‌ను వదలి ఉండేవారు. లడఖ్‌ సైనికులు కరోనా బారిన పడ్డారన్న వార్తలేమీ ఇంతవరకు లేవే ! ఎందుకీ బుర్రతక్కువ రాతలు ?

” దాదాపు 15 కోట్ల మంది బంగ్లాదేశీయులు , రోహింగ్యా లు వెస్ట్‌ బెంగాల్‌ లో అస్సాం లో ఉన్నారు. మమత బేగం తో పాటు కాంగ్రెస్‌ వీళ్ళకి ఆధార్‌ కార్డులు ఇచ్చింది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు వీళ్ళకి ప్రధానం అందుకే వీటి కోసం ఏం చేయడానికయినా వెనుకాడరు. ”
బంగ్లాదేశ్‌ మొత్తం జనాభా పదహారున్నర కోట్లు, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం జనాభా మొత్తం పద్నాలుగు లక్షలు. పదిహేను కోట్ల మంది మన దేశం వస్తే బంగ్లాదేశ్‌ మొత్తం ఖాళీ అయినట్లా ?

అమెరికన్లు చైనాకు మద్దతిస్తే చతుష్టయంలో చేరి మనం చేసేది ఏమిటి ?

” ఇప్పుడు జో బిడెన్‌ మంత్రి వర్గంలోని అధికారులు అందరూ దాదాపుగా లెఫ్ట్‌ వింగ్‌ ని సమర్ధించేవాళ్లే కాబట్టి కనపడకుండా చైనాకే మద్దతు ఇస్తారు , తీసుకుంటారు. మోడీ ప్రధాన మంత్రిగా ఉంటే అటు ఫార్మా లాబీ తో పాటు ఆయుధ లాబీ కూడా నష్టపోతుంది. నల్ల జాతీయుడు ఒక అమెరికన్‌ పోలీసు చేతిలో హత్యమవ్వడం దానిని ఎన్నికల ప్రచార ప్రధాన అస్త్రంగా వాడుకొని లెఫ్ట్‌ వింగ్‌ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదే లాబీ చైనా , కాంగ్రెస్‌ మద్దతుతో కోవిడ్‌ ని భూతంగా చూపించి దానికి మోడీ నే బాధ్యుడుగా చిత్రీకరిస్తున్నది. మోడీ ఉన్నంత కాలం డిఆర్‌డిఓ చాలా వేగంగా పనిచేస్తుంది కాబట్టి అది తమకి నష్టదాయకం. మోడీని ఏదో విధంగా దించాలి. ఈ కుట్రలని ఛేదించుకొని మోడీ మనగలరా ? లేక ట్రంఫ్‌ లాగా బలి అవుతారా అన్నది మనమీదే ఆధారపడి ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ”
ఒకవైపు అజిత్‌ దోవల్‌ జేమ్స్‌ బాండ్‌లో బైడెన్‌ మెడలు వచ్చి వాక్సిన్‌ ముడిపదార్దాల దిగుమతులు సాధించారంటారు. మరోవైపు అదే బైడెన్‌ మన నరేంద్రమోడీని దించుతారని చెబుతారు. అమెరికన్లు చైనాకు మద్దతు ఇస్తే, మన మోడీని దించేందుకు ప్రయత్నిస్తుంటే చతుష్టయం నుంచి వెంటనే బయటకు రావాలి, అమెరికాతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలి కదా ? కరోనా వైఫల్యంతో మోడీ కనుక కొనసాగితే అసలు మొదటికే మోసం వస్తుందనే భయం సంఘపరివార్‌లో ప్రారంభమైందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా మరో బొమ్మను రంగంలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు. ట్రంప్‌ బలి స్వయంకృతం, జనం గద్దె దించారు. ట్రంపు జిగినీదోస్తు నరేంద్రమోడీ, ఆయన సౌభాగ్యం ఎలా ఉంటుందో నోస్ట్రోడోమస్‌ ఎక్కడా చెప్పినట్లు లేదు.

నరేంద్రమోడీ గడ్డం దీక్ష వికటించి కరోనా పెరిగిందా ?

ప్రధాని నరేంద్రమోడీ గడ్డం పెంచటం గురించి ఇంతవరకు ఎవరూ ఏమీ చెప్పటం లేదు. గడ్డం, జులపాలు పెంచుకోవటమా లేదా అనేది వ్యక్తిగతమైనదే. కానీ మన దేశంలో కొంత మంది ఆకస్మికంగా పెంచితే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. కొందరు భార్య గర్భవతి అయితే గడ్డం తీయరు. అలాగే దేవతలకు మొక్కో, దీక్ష్లో మరొక ప్రత్యేక కారణమో ఉంటుంది. కుర్రకారుకు సరదా ! మరి నరేంద్రమోడీ ఏ తరగతికి చెందుతారు. గడ్డం పెంచటం అనేది అస్తిత్వ రాజకీయాలకు, పురుషాధిక్యత ప్రదర్శనలో భాగం అనే తాత్పర్యాలు చెప్పేవారు కూడా ఉన్నారు. రామాలయ నిర్మాణ దీక్షలో భాగంగా గడ్డం పెంచారని పెజావర మఠం స్వామి చెప్పారు. మోడీ గడ్డం తప్ప దేశ ఆర్ధికస్ధితి పెరగటం లేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కొన్ని పత్రికలు కూడా గడ్డం గురించి రాశాయి. అయినా మోడీ తనదైన శైలిలో తన గడ్డం గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేకమైన మన్నాత్‌ క్రతువులో భాగంగా రహస్య పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారని అందుకే గడ్డం పెంచుతున్నారని 2020 సెప్టెంబరు 27న డక్కన్‌ క్రానికల్‌ పత్రిక రాసింది. దీన్ని చూస్తుంటే కరోనా బారి నుంచి దేశాన్ని రక్షించేందుకు భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు అనిపిస్తోందని కూడా పేర్కొన్నది. అదే నిజమైతే ఆ పూజలు, ప్రార్ధనలు వికటించి ఇప్పుడు ఇంత విపత్తును తెచ్చి పెట్టాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుంభమేళా, ఎన్నికల గురించి మాట్లాడితే నా తల తీసేయవచ్చు – అదర్‌ పూనా వాలా !

04 Tuesday May 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, UK

≈ Leave a comment

Tags

Adar Poonawalla, vaccine controversy

ఎం కోటేశ్వరరావు


ఒక తప్పుడు వార్తను ప్రసారం చేసి శివసేన పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన ఇండియా టుడే న్యూస్‌ డైరెక్టర్‌ రాహుల్‌ కన్వాల్‌ చెంపలు వేసుకున్నారు. మే రెండవ తేదీ ఆదివారం నాటి ప్రసారంలో తాను చేసిన వ్యాఖ్యలపై సోమవారం నాడు సామాజిక మాధ్యమంలో ట్విటర్‌ ద్వారా విచారం ప్రకటించారు. సీరం సంస్ధ అదర్‌ పూనావాలాను బెదిరించింది స్వాభిమాని షేత్కారి సంఘటన నేత రాజు షెట్టి, అతని అనుచరులు తప్ప శివసేనకు సంబంధం లేదని చెప్పారు. అయితే కన్వాల్‌ టీవీ ప్రసారం ద్వారా క్షమాపణలు చెప్పాలి తప్ప కేవలం ట్విటర్‌లో విచారం ప్రకటిస్తే చాలదని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. రాజు షెట్టి గతంలో శరద్‌ జోషి షేత్కారి సంఘటనలో పని చేశారు. తరువాత స్వాభిమాన షేత్కారి సంఘటన పేరుతో స్వంత దుకాణం, ఒక పార్టీ పెట్టారు. బిజెపి మద్దతుతో 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు. గతేడాది ఎన్‌సిపితో సంబంధాలకు ప్రయత్నించినా స్వంత పార్టీలో విబేధాల కారణంగా దానికి దగ్గర కాలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు వాక్సిన్‌ సరఫరాలను పెంచాలని లేనట్లయితే ఇతర రాష్ట్రాలకు సీరం సంస్ద సరఫరా చేస్తున్న వాక్సిన్‌ వాహనాలను తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని బెదిరిస్తూ మాట్లాడినట్లు వీడియోలో ఉంది.


రాహుల్‌ కన్వాల్‌ చేసిన తప్పుడు ప్రకటన తప్ప గతవారంలో ఇద్దరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు లేదా ప్రకటనలకు మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడదు.( అన్ని టీవీ ఛానల్స్‌ చూడటం, అన్ని పత్రికలు చదవటం సాధ్యం కాదు కనుక నా పరిశీలనలో లోపం ఉంటే సరి చేసుకుంటాను.) ఒకటి పూనాలోని సీరం సంస్ధ అదర్‌ పూనావాలా తనకు రక్షణ లేని కారణంగానే లండన్‌ వచ్చి అక్కడే ఉండిపోయానని, త్వరలో భారత్‌ వెళతానని ప్రముఖ పత్రిక టైమ్స్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. భారతకు వాక్సిన్‌ ఫార్ములా ఇవ్వకూడదని ప్రపంచ ప్రముఖుడు బిల్‌ గేట్స్‌ ప్రకటించారన్నది మరొక వార్త. ఇవి రెండూ తీవ్రమైనవే.


ఇంతకీ పూనా వాలాను బెదిరించింది ఎవరు, దాని స్వభావం ఏమిటి ? ఫలానా వారు బెదిరించారని టైమ్స్‌ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఇండియా టుడే జర్నలిస్టు రాహుల్‌ కన్వాల్‌ సంచలనాత్మక విషయంగా పూనావాలకు బెదరింపులు వచ్చాయని అవి చేసింది ఎవరో కాదు శివసేన నుంచి అని ఆరోపించారు. మేనెల రెండవ తేదీన ఎన్నికల ఫలితాల గురించి ప్రసారం చేస్తుండగా కన్వాల్‌ ఈ ప్రత్యేక ప్రస్తావన చేశారు. తాను ఆ వీడియోలను చూశానని వాటిలో బూతులు తిడుతున్న స్ధానికులు కనిపించారని చెప్పారు. వాక్సిన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తన ఫ్యాక్టరీని ఘెరావ్‌ చేసిన శివసేన గూండాలంటూ కొన్ని వీడియోలను తనకు పూనావాలా పంపారని పేర్కొన్నారు. అది తప్పుడు వార్తని అందుకు గాను కన్వాల్‌ క్షమాపణ చెప్పాలని, జనవరిలో తప్పుడు వార్తను ప్రసారం చేసినందుకు ఇదే సంస్ద యాజమాన్యం రాజదీప్‌ సర్దేశారుపై తీసుకున్న మాదిరి చర్య తీసుకోవాలని శివసేన ఇండియా టుడే యాజమాన్యానికి రాసిన లేఖలో డిమాండ్‌ చేసింది. ఒకవైపు కరోనా విజృంభణ, మరోవైపున ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా జనాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్‌ కన్వాల్‌ కావాలనే తప్పుడు వార్తలను ప్రసారం చేశారని అన్నారు. శివసేన మీద పని గట్టుకొని నిందా ప్రచారం చేస్తున్నారని దానికి నిదర్శనంగా ఇదే గ్రూపుకు చెందిన మరొక ఛానల్‌ ఆజ్‌తక్‌లో ముఖ్యమంత్రి కుమారుడు, కాబినెట్‌ మంత్రి అయిన ఆదిత్య థాకరేను శివసేన రాహుల్‌ గాంధీ అని వర్ణించినట్లు శివసేన తన లేఖలో తెలిపింది.


అదర్‌ పూనావాలాకు నిజంగా బెదిరింపులు వచ్చాయా లేక ఇతర కారణాలతో చిన్న ఉదంతాన్ని పెద్దది చేసి చూపారా ? అవి చిన్నవైనా పెద్దవైనా ముంబైలోనో మరొకచోటో వెల్లడించకుండా పూనాలో కేసులు నమోదు చేయకుండా లండన్‌ వెళ్లి ఎందుకు చెప్పాల్సి వచ్చింది. రైతు ఉద్యమం గురించి విదేశీయులు మన వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారాలు చేశారని, వారికి మన దేశంలోని ప్రభుత్వ, దేశ వ్యతిరేకులు సహకరించారని ఎంత పెద్ద లొల్లి చేశారో, ఎన్ని కేసులు పెట్టారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. పూనా వాలా చేసిన ప్రకటనతో ప్రపంచంలో మన దేశ పరువు ఏమైందో అసలు సిసలు దేశభక్తులం మేమే అని డబ్బా కొట్టుకొనే వారు ఆలోచించారా ? మీడియాలో అయితే కనిపించలేదు. బిజెపి ఎలాంటి ప్రకటనా చేసినట్లు లేదు, ఎవరు బెదరించారో వెల్లడించాలని కాంగ్రెస్‌, శివసేన కోరాయి.
ఇంతకీ పూనా వాలా చెప్పిందేమిటి ? వివిధ మీడియాల్లో వచ్చిన సమాచారం మేరకు వాటి సారాంశం ఇలా ఉంది. వాక్సిన్‌ కోసం భారత్‌లో బెదరింపులు వస్తున్న కారణంగా నేను, నా కుటుంబం దేశం విడిచి లండన్‌ వచ్చాము.అసాధారణ బెదిరింపులు వచ్చాయి, వారు ఏమైనా చేయవచ్చు. ఇటు వంటి పరిస్ధితుల్లో లండన్‌లో మరికొంత కాలం ఉంటాము. భారత్‌లో నా పని నేను చేసుకుంటున్నాను ఎక్స్‌, వై లేదా జడ్‌ల అవసరాలకు అనుగుణ్యంగా వాక్సిన్లను సరఫరా చేయలేను. వారేం చేయబోతున్నారో ఊహించలేము. అంతా నా భుజాల మీద వేస్తే నేను ఒక్కడినే చేయలేను.ఆకాంక్షలు, వత్తిడి అసాధారణంగా ఉంది. ప్రతివారూ తమకు వాక్సిన్‌ ఇవ్వాలంటున్నారు. ఇతరుల కంటే వారికే ఎందుకివ్వాలో అర్ధం కాదు. వారు చెప్పినట్లు ఇవ్వకపోతే ఏమైనా చేయవచ్చు అన్నట్లుగా బెదరింపుల స్వభావం ఉంది.వారు అలాంటి భాష ఉపయోగించలేదు గానీ ధోరణి, పర్యవసానం అలా ఉంది. తాము కోరింది ఇవ్వకపోతే మేమున్న చోటు నుంచి వెళ్లనిచ్చేది లేదని చుట్టుముట్టారు. వాక్సిన్‌ ఇవ్వకపోతే బాగుండదని వారు చెబుతున్నారు.


టైమ్స్‌ పత్రిక విలేకరి అడిగిన ప్రశ్నలకు పూనా వాలా స్పందన కూడా ముఖ్యమైనదే. కరోనా పెరుగుదలకు కారణంగా భావిస్తున్న కుంభమేళా- అసెంబ్లీ ఎన్నికల గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు ” నేను గనుక సరైన సమాధానం చెప్పినా లేదా ఏ సమాధానం చెప్పినా వారు నా తల తీసేస్తారు. నేను ఎన్నికల మీద లేదా కుంభమేళా గురించి వ్యాఖ్యానించను, అది ఎంతో సున్నితమైనది. (కరోనా పరిస్ధితి ) ఇంతలా దిగజారిపోతుందని బహుశా దేవుడు కూడా ఊహించి ఉండలేదేమో అనుకుంటున్నా అన్నారు.


ఇండియా టుడే తప్పుడు ప్రచారంతో బిజెపి కిరాయి మీడియా వెంటనే గుండెలు బాదుకోవటం ప్రారంభించింది. శివసేన గురించి దుమ్మెత్తి పోసింది. ఇప్పుడు ఇండియా టుడే తన ప్రకటనను వెనక్కు తీసుకొని విచారం ప్రకటించిన నేపధ్యంలో కనీసం ఆ మాత్రం విచారం లేదా చెంపలు వేసుకుంటుందా ? ఎక్కడైనా ఎవరైనా బెదరింపులు, మరొక నేరపూరితమైన చర్యకు పాల్పడితే వెంటనే సంబంధిత వ్యక్తుల మీద పోలీసు ఫిర్యాదు ఇవ్వాలి. కానీ అదేమీ చేయకుండా ఏప్రిల్‌ 16వ తేదీన పూనాలోని సీరం సంస్ద ప్రతినిధి ప్రకాష్‌ కుమార్‌ సింగ్‌ కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసి అదర్‌ పూనావాలకు రక్షణ కల్పించాలని కోరారు. వెంటనే వై తరగతి భద్రతను కల్పించింది. అంటే పూనావాలా దేశంలో ఉన్నపుడు ఆయనకు రక్షణగా ఎనిమిది మంది సాయుధ సిబ్బంది రక్షణగా ఉంటారు. ఒకరిద్దరు కమాండోలు కూడా ఉండవచ్చు.


చీకట్లో బాణం వేసినట్లుగా అదర్‌ పూనావాలా సంచలనాత్మక ప్రకటన చేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు. వత్తిడి చేసి లేదా ప్రలోభంతో డామన్‌లోని ఒక సంస్ధ నుంచి వేలాది రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకొని దొరికిపోయిన ఉదంతంలో ఉన్నది బిజెపి వారే. అందువలన దీనిలో కూడా వారు లేరని చెప్పగలమా ? కేంద్రం, రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులకు ఒక్కో రేటు నిర్ణయిస్తూ తయారీ సంస్ధలు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు పూనా వాలా ఇలాంటి ప్రకటన చేశారా ? లేక విదేశాల్లో తయారు చేసి అధిక ధరలకు అమ్ముకొనేందుకు నేపధ్యాన్ని సృష్టించారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.ఒక వేళ నిజంగానే బెదరింపులు వస్తే ఇది తీవ్రమైన అంశం. దానికి కారకులు ఎవరంటే వేలు కేంద్ర ప్రభుత్వం వైపే చూపకతప్పదు. బీహార్‌ ఎన్నికల సమయంలో తమను ఎన్నుకుంటే ఉచితంగా వేస్తామని చెప్పి వాక్సిన్‌ రాజకీయాన్ని ప్రారంభించింది బిజెపి-జెడియు కూటమి. ఆ ప్రకటన వివాదాస్పదం కావటంతో దేశమంతటా ఉచితంగా వేస్తామని కేంద్ర మంత్రులు ప్రకటించారు. తీరా 45 ఏండ్లు దాటిన వారికే తాము ఉచితంగా వేస్తామని, మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా కొనివేసుకోవాలని లేదా ప్రయివేటు ఆసుపత్రుల్లో అధిక ధరలకు కొనుక్కోవాలని కేంద్రం ప్రకటించింది. తాను బాధ్యతల నుంచి తప్పుకొని రాష్ట్రాల మీద భారం మోపేందుకు వేసిన ఎత్తుగడ తప్ప ఇది మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతనుంచి తప్పుకోవటమే ఇది. అందువలన ఈ విధానమే బెదిరింపులకు తెరలేపేందుకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు. వాక్సిన్‌ రాజకీయంలో లబ్దిపొందేందుకు ముందుగా తామే కొనుగోలు చేసి ప్రజల ముందు గొప్పలు చెప్పుకొనేందుకు ఎవరైనా అవాంఛనీయ చర్యలకు పాల్పడ్డారా ? అంతటి ధైర్యం కేంద్రంలో ఉన్న అధికారపార్టీ వారికి తప్ప ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులకు ఉండే అవకాశాలు లేవు.


లండన్‌ ఒక అంతర్జాతీయ కేంద్రం. అక్కడి ప్రముఖ పత్రికకు ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వటం వెనుక బెదిరింపులు కారణం కావచ్చు. పూనావాల ప్రకటన తరువాత నరేంద్రమోడీని నమ్మి ఏ విదేశీ సంస్ధ పెట్టుబడులు పెడుతుంది, పరిశ్రమలు స్దాపించేందుకు ముందుకు వస్తుంది? అలాంటిదేమీ లేదని నిర్ధారించేందుకు కేంద్రం ఎందుకు ముందుకు రాలేదు ? పూనా వాలా తనకు ఎదురైన బెదిరింపుల గురించి మాత్రమే చెప్పలేదు. ఎన్నికల ప్రచారం ద్వారా, కుంభమేళా ద్వారా కరోనాను వ్యాపింప చేశారని విమర్శచేసినా తన తలతీస్తారని కూడా చెప్పారు. హిందూత్వశక్తులు తప్ప మరొకరు అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. కుంభమేళాకు అనుమతులు ఇవ్వవద్దన్న వారు హిందూమతానికి వ్యతిరేకమని ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్లివచ్చిన వారిమీద అనేక రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. వారిలో 99శాతం మందికి కరోనా వచ్చిందని టైమ్స్‌ నౌ ఛానల్‌ వార్త పేర్కొన్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ అంశాలన్నీ తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ఇప్పుడు పూనావాలా దేశంలో పెరుగుతున్న అసహనం, విమర్శను సహించలేని తనాన్ని చెప్పకనే చెప్పినట్లు లేదూ ? అంతటి ప్రముఖుడే స్వేచ్చగా మాట్లాడేందుకు భయపడుతుంటే ఇంక సామాన్యుల సంగతి చెప్పాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d