• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

లెనిన్‌ దేవదూత, బైబిల్‌ నుంచే కమ్యూనిజం :పుతిన్‌

17 Wednesday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, Bible, communist manifesto, Democratic party, Lenin a saint, Pavel Grudinin, russian elections, Soviet communist ideas, v.i.lenin, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు

గత వారంలో కమ్యూనిస్టులకు, ఇతరులకు ఆసక్తి కలిగించే రెండు వుదంతాలు జరిగాయి. ఒకటి మార్చి18న జరిగే ఎన్నికలలో మరోసారి పీఠం ఎక్కేందుకు పోటీ పడుతున్న రష్యన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ కమ్యూనిస్టు భావజాలం బైబిల్‌ నుంచే వచ్చిందని, లెనిన్‌ దేవదూత వంటి వ్యక్తి అని చెప్పాడు. అమెరికాలోని అమీ హరోవిట్జ్‌ అనే ఒక మితవాద వీడియో గ్రాఫర్‌ న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధులకు చదివి వినిపించిన నాలుగు ప్రకటనలు ఎవరివి అంటే కమ్యూనిస్టులవి అనే దిమ్మతిరిగే సమాధానం రావటం రెండో వుదంతం.

న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం వుదారవాద భావాల నిలయంగా ప్రసిద్ధి. హారోవిట్జ్‌ తాను నాలుగు వాక్యాలను చదివి వినిపిస్తానని అవి కమ్యూనిస్టులవో డెమోక్రటిక్‌ పార్టీవో చెప్పాలని విద్యార్ధులను కోరాడు. మొదటిది ‘మేము సామాజిక మార్పునే పురికొల్పుతాము’. సమాధానం చెప్పిన నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టోలో భాగం అని ఏక కంఠంతో చెప్పారు. ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అది ఎక్కువగా కమ్యూనిస్టు ప్రకటనగానే కనిపిస్తోంది అని చెప్పగా ఒక్కరు మాత్రమే డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటన అని సరిగా చెప్పారు.

‘మేము నూతన వర్గాలను, అణచివేత నూతన పరిస్దితులను, పాతవాటిని తొలగించేందుకు నూతన పోరాట పద్దతులను పాదుకొల్పాము’ అనే ప్రకటన డెమోక్రటిక్‌ పార్టీదే అని అందరూ సమాధానం చెబుతారని నేను అనుకొంటున్నాను అని ఒక యువతి చెప్పగా ఇద్దరిలో ఒకరు అది కమ్యూనిస్టుమానిఫెస్టోలో భాగం అని చెప్పారు.

‘ ప్రజలపట్ల వివక్షను చూపే విధానాల ఫలితమే జాతి, సంపద, ఆదాయ అసమానతలు ‘ అన్న ప్రకటన డెమోక్రటిక్‌ పార్టీది అని ముగ్గురిలో ఇద్దరు సరిగానే చెప్పారు. అయితే కొందరు ఇది నిజంగా కమ్యూనిస్టు పార్టీ ప్రకటన కాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘స్వేచ్చామార్కెట్‌ పద్దతుల ద్వారా సంపద అసమానతలను పరిష్కరించలేము’ ఈ ప్రకటనపై నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టో చెప్పిన అంశ మే అన్నారు. ఇది డెమోక్రటిక్‌ పార్టీ ప్రకటనలో భాగం. చిత్రంగా వుందే అది కమ్యూనిస్టు మానిఫెస్టో అంశం మాదిరి ధ్వనిస్తోందే అని ఆశ్చర్యపోయారు ఒకరు.

‘ఈ వ్యవస్ధ పని చేయటం లేదు, ఆర్ధికానికి బంధనాలు వేశాము’ అన్న వ్యాక్యం డెమోక్రటిక్‌ పార్టీది అని ఇద్దరిలో ఒకరు చెప్పారు. అమెరికన్‌ విద్యార్ధులు కమ్యూనిస్టు ప్రణాళిక-డెమొక్రటిక్‌ పార్టీ 2016 ఎన్నికలలో చెప్పినదానికి తేడాను గుర్తించటంలో ఎందుకు గందరగోళపడుతున్నారు అన్నది ఒక ప్రశ్న. అమెరికా పరిణామాలను గమనిస్తున్న వారికి ఇది సహజంగా కనిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, తరువాత కాలంలో అమెరికాలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు ప్రణాళిక-డెమోక్రటిక్‌ పార్టీ చెబుతున్న అంశాలకు తేడాను జనం గుర్తించలేని కారణంగా, డెమోక్రటిక్‌ పార్టీని ఒక తీవ్రవాద వామపక్ష సంస్ధగా పరిగణించినందున 2010 నుంచి ఇప్పటి వఅసరకు రాష్ట్రాలు, కేంద్రంలోని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు వెయ్యింటిలో, మెజారిటీ రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోయిందని ఒక విశ్లేషణ తెలిపింది. బరాక్‌ ఒబామా పదవిలో వున్న ఎనిమిది సంవత్సరాల పాటూ అతనొక కమ్యూనిస్టు అనే ప్రచారం సాగుతూనే వుంది. డెమోక్రటిక్‌ పార్టీని కొందరు కమ్యూనిస్టు లేదా తీవ్రవాద వామపక్ష సంస్ధగా చిత్రించటాన్నీ చూశాము. 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా కార్మికవర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న స్ధితి, అమెరికాను, యావత్‌ పెట్టుబడిదారీ వ్యవస్ధను కుదిపిన 2011 సెప్టెంబరు వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం వంటి పరిణామాల పూర్వరంగంలో డెమోక్రటిక్‌ పార్టీ నినాదాలు, నాయకుల ప్రసంగాలలో పెద్ద మార్పు వచ్చింది. దానికి పరాకాష్టంగా అవును నేను సోషలిస్టును అంటూ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యుడు బెర్నీ శాండర్స్‌ ఆర్ధిక అసమానతల గురించి ఎండగట్టిన తీరు, సోషలిస్టును నన్ను బలపరచండి అంటూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వంకోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీపడి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తీరును చూశాము. లక్షలాది మంది యువత శాండర్స్‌తో గొంతు కలుపుతూ అవును మేమూ సోషలిస్టులటే అంటూ ప్రచారం చేసిందీ విదితమే. అందుకే నేడు అమెరికాలో సోషలిజం అంటే తిట్టుపదం కాదు. డెమోక్రటిక్‌ పార్టీ అస్ధిత్వరాజకీయాలు ఆ పార్టీని రాడికల్‌ నినాదాలు చేయిస్తున్నాయి. అయితే దాని స్వభావం అది కాదని సదా గుర్తుంచుకోవాలి. రెండు ప్రధాన పార్టీలలో ఏది ఎక్కువ హానికరమైనది అని ఎంచుకోవాల్సి వచ్చినపుడు డెమోక్రటిక్‌ పార్టీ కూడా కార్పొరేట్లకే అనుకూలం అయినప్పటికీ ఇంతవరకూ కార్మికవర్గం, నల్లజాతీయుల మొగ్గు ఆ పార్టీవైపే వుంది. అలాంటి వారంతా రోజువారీ, ఆందోళనల సందర్భంగా కమ్యూనిస్టులు మాట్లాడినట్లే దోపిడీ,జాతి వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతుంటారు. అందువలన యువత డెమోక్రటిక్‌ పార్టీ – కమ్యూనిస్టు ప్రణాళిక చెప్పిన అంశాల గురించి గందరగోళపడుతున్నారు. ఇది ఒక విధంగా మంచిదే. కమ్యూనిస్టు వ్యతిరేకత నరనరానికి ఎక్కి వున్న స్ధితిలో దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా ఎంతవరకు కలసి అంత మేరకు వామపక్ష భావజాలం వ్యాప్తి చెందినట్లే, సోషలిజం, కమ్యూనిజాలకు ఆమేరకు వ్యతిరేకత తగ్గుతుంది.

అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ రాడికల్‌ నినాదాల కారణంగా సోషలిస్టు, కమ్యూనిస్టు పదజాలం యువతకు పరిచయం కావటం అక్కడి పాలకవర్గానికి ఆందోళన కలిగించే అంశం. రష్యాలో పాతిక సంవత్సరాల క్రితం కూల్చివేసిన సోషలిస్టు వ్యవస్ధ గురించి 56శాతం మందిలో బెంగ తలెత్తిందని ఒక సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే స్టాలిన్‌, లెనిన్‌ పట్ల జనంలో క్రమంగా సానుకూల అభిప్రాయాలూ పెరుగుతున్నాయని కూడా సర్వేలు తెలుపుతున్నాయి. మార్చినెలలో జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవికి కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టిన పార్టీ సభ్యుడు కాని లెనిన్‌ వ్యవసాయ క్షేత్ర అధిపతి పావెల్‌ గ్రడినిన్‌ దేశవ్యాపితంగా ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పుతిన్‌ మినహా మరొకరెవరూ గెలిచే అవకాశం లేదని ఎన్నికల పట్ల నిరాసక్తతతో వున్న వారిలో కూడా వుత్సాహం నింపుతున్నట్లు, నెల రోజుల క్రితంతో పోల్చితే మద్దతు ఇచ్చేవారు రెట్టింపు అయినట్లు మీడియా పేర్కొన్నది. ప్రజల సొమ్ము తస్కరించటాన్ని ఆపండి, జనం మంచిజీవితాలను గడుపుతున్నారనే అబద్దాలకు సమాధికట్టండి, విద్య, వైద్యం వుచితంగా అందచేయాలని, పెన్షనర్లు గౌరవ ప్రద జీవితం గడపాలని కోరుతున్న రష్యన్‌ రాజ్యాంగాన్ని అమలు చేయటం ప్రారంభించండి అని వుపన్యాసాలలో అడుగుతున్న గ్రడినిన్‌ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది.ఆయన వుపన్యాసం తరువాత తన ఆధ్వర్యంలోని లెనిన్‌ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారి జీవన పరిస్ధితులపై రూపొందించిన వీడియోను ప్రదర్శి ంచి రష్యన్లందరికీ అలాంటి పరిస్థితులు వుండాలని, తనకు అవకాశం ఇస్తే అమలు చేస్తానని చేస్తున్న ప్రచారతీరు కొత్తగా వుంది. గతంలో సహకార వ్యవసాయ క్షేత్రంగా వున్నదానిని ప్ర యివేటీకరించిన సమయంలో దానిలో పనిచేస్తున్న గ్రడినిన్‌ 1995లో దాదాపు సగం వాటాలను కొనుగోలు చేశారు. గతేడాది నాలుగువందల కోట్ల రూబుళ్ల మేర స్ట్రాబెర్రీ ఇతర తాజా పండ్లను మాస్కో మార్కెట్లో విక్రయించారు. వచ్చిన లాభాలలో ఎక్కువ భాగం తిరిగిదానిలోనే పెట్టుబడి పెట్టటం, కార్మికుల సంక్షేమ చర్యలకు వినియోగిస్తూ ఎడారిలో ఒయాసిస్‌ మాదిరి సోషలిజాన్ని కాలదన్నుకున్న రష్యాలో సోషలిస్టు పద్దతులలో క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆధునిక నివాస గృహాలతో పాటు వుచిత పాఠశాలలు, ఆరోగ్య, ప్రసూతి కేంద్రాల నిర్వహణ, పెన్షన్‌ సదుపాయాలను కలిగిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా కార్మికులకు సంక్షేమ చర్యలు అమలు జరపటం సాధ్యమే అని నిరూపించారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమపధకాల కంటే ఎక్కువ లబ్ది చేకూరుతోంది. వ్యవసాయక్షేత్రంలో పని చేసే కార్మికులకు రష్యన్‌ సగటు కంటే రెట్టింపుగా 78వేల రూబుళ్ల మేరకు నెలవారీ వేతనం ఇస్తున్నారు. అక్కడ పనిచేసే డ్రైవర్లు నివశించే భవనంలోనే గ్రడినిన్‌ కూడా వుంటున్నారు. మీరు ఇలా ఎందుకు నిర్వహిస్తున్నారు అని తరచూ అనేక మంది నన్ను అడుగుతూ వుంటారు. రష్యాలో అందరూ ఇలానే వుండాలని నేను కోరుకుంటున్నాను, అది సాధ్యమే అని చెబుతాను అని గ్రడినిన్‌ చెప్పారు. ఆయన మీసాలు, జుట్టు, రూపు రేఖలు స్టాలిన్‌ను పోలివుండటంతో కొంత మంది ఆయనలో స్టాలిన్‌ను చూస్తున్నారని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యా నించింది. యజమానిగా ఆయన వేతనం లెనిన్‌ క్షేత్రంలో పనిచేసే ట్రాక్టర్‌ డ్రైవర్ల కంటే 26రెట్లు ఎక్కువ అని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాలు వెల్లడించినట్లు ఆ పత్రిక తెలిపింది.

గ్రడినిన్‌ పట్ల ఓటర్లలో ఆసక్తి జనించిన పూర్వరంగంలో లెనిన్‌ ఒక దేవదూత అని, బైబిల్‌ నుంచే సోవియట్‌ కమ్యూనిస్టు భావన వచ్చిందని పుతిన్‌ చెప్పటం దానిని ప్రభుత్వరంగంలోని టీవీ ప్రసారం చేయటం ఎన్నికల ప్రచారంలో భాగమే అని చెప్పవచ్చు. ఫిన్లండ్‌ సరిహద్దులోని వాలమ్‌ మొనాస్టరీ పునరుద్దరణ సందర్భంగా తీసిన డాక్యుమెంటరీ కోసం పుతిన్‌ మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. గతంలో పుతిన్‌ అనేక సందర్భాలలో చర్చిని సమర్దించారు. ‘కమ్యూనిజం-క్రైస్తవం భావనలు ఒకదానికి ఒకటి పొసగదు అని నేను నమ్మటం లేదు. నేను చెబుతున్నది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కానీ నేను అనుకుంటున్నది నేను చెబుతాను’ అన్నారు. ‘ముందుగా ఒకటి చెప్పాలి, ఎల్లవేళలా విశ్వాసం మనతోనే వుంటోంది. మన దేశ ప్రజలకు కష్టాలు వచ్చినపుడు అది బలపడింది.ఆ చర్యలు ఎంతో కఠినంగా వున్నాయి. దేవునితో యుద్ధం చేసిన సంవత్సరాలలో చర్చ్‌లను నాశనం అయ్యాయి, పూజారులను లేకుండా చేశారు. అయితే అదే సమయంలో సోవియట్‌లు ఒక నూతన మతాన్ని సృష్టించాయి.నిజంగానే కమ్యూనిస్టు భావజాలం క్రైస్తవానికి చాలా దగ్గర పోలిక వుంది. క్రైస్తవం, కమ్యూనిజం రెండూ కూడా స్వేచ్చ, సోదరత్వం, సమానత్వాన్ని ప్రబోధించాయి. లెనిన్‌ భౌతిక కాయ్యాన్ని మసోలియంలో వుంచారు. ఆర్ధడాక్స్‌ లేదా క్రైస్తవుల దేవదూతల అవశేషాలకూ దానికి తేడా ఏముంది’ అని పుతిన్‌ డాక్యుమెంటరీ నిర్వాహకులతో ప్రశ్నించారు.

రష్యాలో లెనిన్‌, స్టాలిన్‌, సోషలిజం, కమ్యూనిజాల పట్ల ఇప్పటికీ అక్కడి జనంలో వున్న అభిమానాల పూర్వరంగంలో వాటిపై మొరటుగా దాడిచేస్తే ఫలితం లేదని గ్రహించిన వ్యక్తిగా ఓటర్లలో గందరగోళం కలిగించేందుకు, తాను లెనిన్‌, కమ్యూనిజాలను వ్యతిరేకించినప్పటికీ వాటిపట్ల గౌరవం వుందని చెప్పుకొనేందుకు చేసిన ఒక ప్రయత్నంగా చెప్పవచ్చు. తాను అధికారంలో వున్నంత వరకు లెనిన్‌ భౌతిక కాయాన్ని మసోలియంలోనే వుంచుతానని గతంలో చెప్పాడు. ఎన్నికల సమయం గనుక లెనిన్‌ గురించి సానుకూలంగా మాట్లాడి దానిని ప్రచారంలోకి పెట్టారు. గతంలో అనేక సందర్భాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను వ్యక్తం చేసిన పుతిన్‌ ఒక బూర్జువారాజకీయవేత్త. అవసరం కొద్ది అలాంటి వారు ఏమైనా చెబుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ మేథావా, మెంటలా ? ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు ?

11 Thursday Jan 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, Donald trump one year rule, genius, insane, US failures

ఎం కోటేశ్వరరావు

అధ్యక్ష పదవికి ఎన్నికైన వెంటనే డోనాల్డ్‌ ట్రంప్‌ ఇలా చెప్పాడు.’ దివంగత మహానుభావుడు అబ్రహాం లింకన్‌ తప్ప ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసిన వారందరికంటే నేను మెరుగైన అధ్యక్షుడిగా వుండగలనని మీకు చెప్పగలను’ అన్నాడు. ఏడాది తరువాత ట్రంప్‌ మానసిక స్ధితిపై జాతీయ స్ధాయిలో చర్చ జరగకుండా చూడటం ఎలా అని అధ్యక్షభవనం మల్లగుల్లాలు పడుతూ తలలు పట్టుకుంటోందని అమెరికాలోని ప్రముఖ పత్రిక వాషింగ్టన్‌ పోస్టు ఒక వార్తకు శీర్షికగా పెట్టింది. ట్రంప్‌ పాలన ప్రారంభమై ఈనెల 20తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ తరుణంలో ప్రపంచ అగ్రరాజ్య అధిపతి గురించి ఇలాంటి విశ్లేషణ రావటానికి కారణం ఏమిటి ?

‘రగలటం మరియు కోపావేశం’ పేరుతో ట్రంప్‌ ఎన్నికల ప్రచారం, గతేడాది కాలంలో అధ్యక్ష భవనంలో వ్యవహరించిన తీరు తెన్నులపై అంతరంగిక కధనాలతో మైఖేల్‌ వూల్ఫ్‌ అనే రచయిత ఒక పుస్తకం రాశాడు. దీనిపై స్పందిస్తూ తాను నిజంగానే తగిన శక్తి సామర్ధ్యాలు, స్ధిరమైన మేథావిగా వున్నానని ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ముసలోడు దెబ్బలాటకు సిద్ధం అన్నట్లుగా వున్నప్పటికీ ఆయన సహాయకులు మాత్రం అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారట. నిజానికి ట్రంప్‌ మానసిక స్ధితి గురించి ఎన్నికలకు ముందే చర్చ ప్రారంభమైంది. దాని గురించి ఇప్పుడు పుస్తకం కూడా వెలువడటంతో బహిరంగ చర్చకు నాంది పలికినట్లు కావటంతో అధ్యక్ష భవనం కూడా ఏదో ఒకటి చేయాల్సింది వుంది. చెత్త పుస్తకం రాసిన చెత్త రచయిత అని వ్యాఖ్యానించిన ట్రంప్‌ సలహాదారుడు తమనేత గొప్ప రాజకీయ మేథావి అని వర్ణించాడు. విమర్శకుల నోరు మూయించటం, ట్రంప్‌ గురించి పొగడ్తలకు దిగటం సహాకులకు మామూలే. కొందరు విమర్శకులు చెబుతున్నట్లు ట్రంప్‌ మానసిక స్ధితి నిజంగానే బాగా లేదా ?

అమెరికా అధ్యక్ష భవనంలో ఎవరు కొలువుతీరారన్నది పెద్దగా ప్రాముఖ్యత కలిగిన విషయం కాదు. వ్యక్తులుగా ప్రవర్తనలో మంచిచెడ్డలు విధానాలపై ప్రభావం పెద్దగా చూపవు.పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణ్యంగా జాతీయ, అంతర్జాతీయ విధానాలు వుంటాయి. ఎవర, ఏ పార్టీ నేత పీఠంపై వున్నా దోపిడీ, ప్రపంచాధిపత్యం, యుద్ధోన్మాదం కనిపిస్తూనే వుంటుంది. అయితే ఏడు పదులు దాటిన ట్రంప్‌ ముదిమది తప్పి వ్యవహరిస్తున్నట్లుగా కొన్ని సందర్భాలలో అనిపించటం లేదా ? ఒక సందర్భంలో జర్నలిస్టులను లేపేయాలని తన మనసులోని మాటను వెల్లడించిన ట్రంప్‌ మరో సందర్భంలో నకిలీ వార్తల గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అత్యంత విస్వసనీయతలేని, అవినీతి మీడియా అవార్డులను ఈ ఏడాదికి ప్రకటించబోతున్నట్లు చెప్పాడు. అదే ట్రంప్‌ తాజాగా మీడియా అంతిమంగా తనను బలపరచకతప్పదని లేకపోతే టిఆర్‌పి రేటింగ్‌ పడిపోతుందని ఎద్దేవా చేశాడు. ఇలాంటి ప్రవర్తన చూసినపుడు మతితప్పి వ్యవహరిస్తున్నట్లే అనిపించవచ్చుగానీ వాస్తవం కాదు. అమెరికా ఇంటా బయటా ఎదుర్కొంటున్న వైఫల్యాలు, తీవ్ర సమస్యల మధ్య నాయకత్వం ఎదుర్కొంటున్న తలనొప్పులను వ్యక్తీకరించటంలో సమతూకం తప్పటం తప్పటం తప్ప మరొకటి కాదు. అది స్ధానిక మీడియా కావచ్చు వుత్తర కొరియా అధ్యక్షుడి గురించి కావచ్చు, అన్నింటా అది కనిపిస్తుంది.

అంతర్గతంగా గతేడాది కాలంలో ట్రంప్‌ సర్కార్‌ ఏ విధంగా వ్యవహరించిందో చూద్దాం. ట్రంప్‌ పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే ఇండియానా పోలీసు ప్రాంతంలో జరిపిన పర్యటన గురించి పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసింది. అక్కడి ఒక వుక్కు కర్మాగారంలో తాను పదకొండు వందల పర్మనెంటు వుద్యోగాలను రక్షించానని చెప్పుకున్న గొప్పలను అక్కడి కార్మికనేత అంతసీన్‌ లేదని, చాలా తక్కువ అని గాలితీశాడు. నా పరువు తీస్తావా అంటూ సదరు నేతపై ట్రంప్‌ ట్విటర్‌ దాడి చేశాడు. అదే పెద్దమనిషి ఏడాది తరువాత తానొక స్ధిరమైన మేథావినని డబ్బా కొట్టుకున్నాడు. ట్రంప్‌ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన పదవీ స్వీకారం జరిగిన వెంటనే జరిపిన భారీ మహిళా ప్రదర్శన తరువాత గతేడాది కాలంలో జరిగిన ప్రదర్శనల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గంటున్నారు. మేకలకు తోడేళ్లను సంరక్షకులుగా నియమించినట్లు ఒక పెద్ద ఫాస్ట్‌ ఫుడ్‌ కంపెనీ యజమాని ఆండ్రూపుడెర్‌ను కార్మికశాఖ మంత్రిగా నియమించటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటంతో వుపసంహరించకతప్పలేదు. అనేక మంది పేదలకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఒబామా ఆరోగ్యసేవల పధకంగా పిలిచిన దానికి తూట్లు పొడిచేందుకు ట్రంప్‌ చేసిన యత్నాన్ని తాత్కాలికంగా అయినా కార్మికులు అడ్డుకోగలిగారు. ఒకవైపు కార్మికుల సంక్షేమ చర్యలను నీరు గార్చేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు రాబోయే పది సంవత్సరాల కాలంలో ధనికులు, కార్పొరేట్లకు లక్షన్నరకోట్ల డాలర్ల మేర పన్ను రాయితీలు ఇచ్చేందుకు చేసిన నిర్ణయాన్ని కార్మికులు అడ్డుకోలేకపోయారు. కార్మిక వ్యతిరేక చట్టాలకు అనుమతి, వుద్యోగ భద్రత రక్షణ, ఆరోగ్య రక్షణ వుపసంహరణ, ఆర్ధిక పరమైన రక్షణలకు మంగళం పాడే అనేక నిర్ణయాలకు అనుమతినిచ్చాడు. జాతీయ కార్మిక సంబంధాల బోర్డుతో సహా అనేక కమిటీలు, బోర్డులను కార్మిక వ్యతిరేకులతో నింపివేశారు.పర్యవసానంగా మూడు కార్మిక అనుకూల తీర్పులను తిరస్కరించారు. ట్రంప్‌ ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాలలో వున్న విబేధాలు కూడా ట్రంప్‌ కార్మిక వ్యతిరేకచర్యలను వేగవంతంగావిస్తున్నాయి.

ఒబామా సర్కార్‌ హయాంలోనే మంచివేతనాలతో కూడిన వుద్యోగాల సంఖ్య తగ్గి,వేతన మొత్తాలు తక్కువగా వుండే వుపాధి పెరుగుదల ప్రారంభమైంది. అది ట్రంప్‌ ఏడాది కాలంలో మరింతగా పెరిగింది. అందువలన నిరుద్యోగం తగ్గినట్లు కనిపించినా ఆరోగ్య సంరక్షణ, బార్లు, హోటళ్లలో పనిచేసే వారి సంఖ్య పెరిగింది. పర్యవసానంగా వేతన ఆదాయం తగ్గటంతో యూనియన్లలో చేరే కార్మికుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోతోంది. దీంతో రాష్ట్రాలలలో కార్మిక వ్యతిరేక చట్టాలకు ప్రతిఘటన కూడా తగ్గిపోయింది.

అంతర్జాతీయ వ్యవహారాలలో డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారశైలి మిగతావారి కంటే భిన్నంగా కనిపించినప్పటికీ ఎక్కడన్నా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లు అమెరికా పాలకవర్గ మౌలిక ప్రయోజనాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీలేకుండా మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే మీడియాతో వ్యవహరించేతీరులో, ట్విటర్‌ వ్యాఖ్యల విషయంలో అందరూ అనుకొంటున్నట్లుగా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగానే వుంది. అమెరికాలో పెరుగుతున్న ఆర్ధిక అంతరాలు, ఆర్ధికరంగంలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న సంక్షోభం, ఇరాక్‌, ఆఫ్ఘ్‌నిస్తాలో తగిలిన ఎదురు దెబ్బలు, చైనాతో పెరుగుతున్న వాణిజ్యలోటు, లాటిన్‌ అమెరికాలో ప్రతిఘటన వంటి అనేక కారణాలు అంతర్జాతీయ రంగంలో అమెరికాను గుక్కతిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తన సంక్షోభాన్ని ఎక్కడో ఒక చోట యుద్ధంద్వారానో మరో విధంగానో ఇతరులపై రుద్ధేందుకు ట్రంప్‌ యంత్రాంగం కూడా చేయని యత్నం లేదు. వుత్తర కొరియా అణు,క్షిపణి పరీక్షలను సాకుగా చూపి కాలుదువ్వటం దానిలో భాగమే. ఈ పూర్వరంగంలో ట్రంప్‌ ప్రభుత్వ వైఖరి భారత వుపఖండంలో ఎలా వుందో చూడటం అవసరం.

పాకిస్ధాన్‌ వుగ్రవాదులకు మద్దతు ఇస్తున్న కారణంగా అందచేస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ సర్కార్‌ గొప్పగా చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల సృష్టిలో, మన దేశంలో పంజాబ్‌, కాశ్మీరుల్లో వుగ్రవాదులకు అవసరమైన శిక్షణ, ఆయుధాల అందచేతలో అమెరికా ప్రయోజనాలకు అనుగుణ్యంగా పాకిస్ధాన్‌ వ్యవహరించిన తీరు లోకవిదితం.ఇంతకాలం తాము చేసిన సాయాన్ని తీసుకొని తమకు అబద్దాలు చెప్పటం, మోసం చేయటం తప్ప పాకిస్ధాన్‌ మాకు చేసిందేమీ లేదని అమెరికా ఆరోపించింది. ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధంలో వైఫల్యాలకు అమెరికా తమను బలిపశువులుగా చేస్తోందని పాక్‌ రక్షణ మంత్రి ఖుర్రమ్‌ దస్తగిర్‌ ఖాన్‌ ప్రతి విమర్శ చేశాడు. ఇప్పుడు అమెరికా సాయం నిలిపివేసినందున తమకు వచ్చే నష్టమేమీ లేదని పాక్‌ తిప్పికొట్టింది. చైనా తరువాత అతి పెద్దదిగా వున్న భారత మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు అమెరికా సామ,దాన,భేద,దండోపాయాలను అనుసరించింది. వుగ్రవాదులకు సాయం, ప్రోత్సాహం దానిలో భాగమే. ఇప్పటికీ అమెరికా మనపై వత్తిడి తెస్తూనే వుంది. వాణిజ్యం విషయంలో మన దేశంలోని కార్పొరేట్‌శక్తులు అటు సోవియట్‌ను ఇటు అమెరికా, ఇతర ఐరోపా ధనికదేశాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నించిన అనుభవాలున్నాయి. సోవియట్‌ అంతరించిన తరువాత చైనాకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌, మన దేశాన్ని కూడా తన గుప్పెటలో వుంచుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే దానికి భిన్నంగా జరిగిన పరిణామాలలో గత పాతిక సంవత్సరాలలో ఒక్కొక్క అడుగు మన దేశం అమెరికాకు దగ్గర అవటం, అదే సమయంలో చైనాకు పాకిస్ధాన్‌ దగ్గరయింది. దీంతో పాకిస్ధాన్‌కు సాయం నిలిపివేసి మన దేశానికి ఏదో మేలు చేస్తున్నట్లు ట్రంప్‌ ఫోజు పెడుతున్నాడు. నరేంద్రమోడీని, మన దేశాన్ని పొగుడుతూ మునగ చెట్టిక్కించటంతప్ప ఇంత వరకు ఏ ఒక్క విషయంలోనూ సానుకూల వైఖరిని అనుసరించలేదు. వీసాల విషయంలో లక్షలాది మంది భారత కార్మికులు, వుద్యోగులను భయకంపితులను గావించటంలో ఇప్పటివరకు అమెరికా అధ్య క్షులలో ట్రంప్‌ తరువాతే ఎవరైనా. ప్రపంచ రాజకీయాలలో మన దేశాన్ని జూనియర్‌ భాగస్వామిగా చేసుకొనేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రపంచ వేదికమీద భారత్‌కు విశ్వసనీయమైన భాగస్వామి కావాలి…… ఆ భాగస్వామి అమెరికానే, అది నూరేళ్ల బంధం ‘ అని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిలర్సన్‌ మనల్ని ఎక్కడికో తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు. పెరుగుతున్న చైనా ప్రాభవాన్ని అడ్డుకొనేందుకు అమెరికా పెద్ద వ్యూహం పన్నింది. దానిలో మన దేశాన్ని నిలిపేందుకు పూనుకుంది. వాణిజ్యం విషయంలో మనపై అమెరికా తెస్తున్న వత్తిడిని దేశీయ కార్పొరేట్‌ శక్తులు ప్రతిఘటిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్ధలతో చేతులు కలిపి తాము కూడా లాభాలను పంచుకోవాలనుకుంటున్నాయి తప్ప తమ లాభాలను ఫణంగా పెట్టి అంతర్జాతీయ సంస్ధలకు లొంగిపోవాలని అవి కోరుకోవటం లేదు. అందువలన మన దేశం తనకు లొంగకపోతే మరోసారి పాకిస్ధాన్‌ను దగ్గరకు తీసుకొని మనపై దానిని ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. పాకిస్ధాన్‌కు తాత్కాలికంగా సాయం నిలిపివేత ప్రచార ఆర్బాటం మనకు ఎర తప్ప చిత్తశుద్ధితో కాదు. పాక్‌తో పూర్తి సంబంధాలు తెగతెంపులు చేసుకొంటే అమెరికన్లకు ఎంత నష్టమో తెలియంది కాదు. అందువలన ట్రంప్‌ మెచ్చుకోళ్లకు మురిసిపోతే మనం వూబిలో దిగినట్లే. తనకు మాలిన ధర్మానికి పాల్పడినట్లు అమెరికా చరిత్రలో ఒక్కటంటే ఒక్క వుదంతం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా ఎన్నికలలో పశ్చిమ దేశాల జోక్యం !

04 Thursday Jan 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Communist Party of the Russian Federation, russian elections, Vladimir Putin, western countries intervention, western countries intervention in russian elections

ఎం కోటేశ్వరరావు

మార్చి 18న జరిగే రష్యా ఏడవ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం మొదలైంది. నామినేషన్లు దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్ధులు తమ అర్హత పత్రాలను ఈనెల ఏడు, పార్టీల అభ్యర్ధులు పన్నెండవ తేదీలో సమర్పించాల్సి వుంది. ఎన్నికల ప్రచారం అధికారికంగా డిసెంబరు18న ప్రారంభమైంది. అప్పటి నుంచి 25 రోజుల లోగా అంటే జనవరి పదహారవ తేదీలోపు తాము ఫలానా వారిని అభ్యర్ధులుగా నియమించినట్లు పార్టీలు సమావేశాలలో అధికారికంగా చేసిన తీర్మానాలను ఎన్నికల కమిషన్‌కు అందచేయాలి. అధ్యక్ష పదవికి ఎన్నికవ్వాలంటే యాభైశాతంపైగా ఓట్లు తెచ్చుకోవాలి. ఎవరికీ ఆమేరకు రానట్లయితే మూడు వారాల్లోపు మొదటి రెండు స్ధానాలలో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ నిర్వహించాల్సి వుంది.

అధ్యక్ష పదవికోసం మరోసారి పోటీ పడుతున్న వ్లదిమిర్‌ పుతిన్‌, కమ్యూనిస్టుపార్టీ అభ్యర్ధిగా లెనిన్‌ వ్యవసాయ కంపెనీ పారిశ్రామికవేత్త పావెల్‌ గ్రడినిన్‌, ఇతర పార్టీల తరఫున వ్లదిమిర్‌ జిరినోవస్కీ, గ్రిగొరీ యెవలిన్‌స్కీ,సెనియా సోబ్‌చెక్‌ తదితరులు వున్నారు. రష్యా నిబంధనల ప్రకారం పార్టీల అభ్యర్ధులుగా పార్టీ సభ్యులు కాని వారిని కూడా నియమించవచ్చు.దానికి అనుగుణ్యంగానే కమ్యూనిస్టు పార్టీ తొలిసారిగా పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా ఎంపిక చేసింది. ప్రస్తుతం రష్యాలో నమోదైన పార్టీలు 69 వున్నాయి. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలంటే మూడులక్షల సంతకాలను సేకరించాల్సి వుంది, అయితే ఏ ఒక్క రాష్ట్రంలోనూ అవి ఏడున్నరవేలకు మించకూడదు. అంటే దేశమంతటా పలుకుబడి కలిగిన వారే పోటీకి అర్హులు అవుతారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేని పార్టీల అభ్యర్ధులు లక్ష సంతకాలను సమీకరించాల్సి వుంది. ఏరాష్ట్రంలోనూ అవి రెండున్నరవేలకు మించకూడదు.ఒక ఓటరు ఒక అభ్యర్ధికి మాత్రమే మద్దతుగా సంతకం చేయాలి. ఫిిబ్రవరి మొదటి వారంలో నామినేషన్ల పరిశీలన, ఖరారు చేస్తారు.

పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వున్న కమ్యూనిస్టు పార్టీ తొలిసారిగా పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని అధ్యక్షపదవికి అభ్యర్ధిగా నిర్ణయించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. డిసెంబరు 23న కమ్యూనిస్టు పార్టీ వార్షిక ప్లీనరీ సమావేశంలో పావెల్‌ గ్రడినిన్‌ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీ అధినేత జుగనోవ్‌ అభ్యర్ధి గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు.’ ఆయనొక శక్తి వంతుడు, అనుభవశాలి. సోషలిస్టు పద్దతులలో తన సంస్ధను నిర్మించారు. గ్రడినిన్‌ను బలపరిస్తే ఈ అనుభవాన్ని ప్రతిచోటా వ్యాపింపచేయవచ్చు. ఆయన వ్యాపారే, మాటలు చెప్పరు, వ్యాపారాన్ని జాతీయ దృక్పధంతో చేస్తున్నారు. సోవియట్‌ విలువలకు మద్దతు ఇస్తారు. ఆయన సంస్ధ అత్యుత సాంకేతిక పరిజ్ఞానంతో కూడి వుంది. ఒక బ్యాంకు చైర్మన్‌ మాదిరి గాక ఒక కమ్యూనిస్టు డైరెక్టర్‌లా వ్యవహరిస్తారు. నిరంకుశుడు కాదు, జన సేవకుడు. రష్యన్‌ ప్రభుత్వం అన్నింటినీ వదిలించుకోవాలనే కార్యక్రమం కలిగి వుంది. ఆ సవాలును దేశభక్తులు స్వీకరించారు. వారి ప్రధాన లక్ష్యం జనం గురించిన ఆందోళనే. సొమ్మును దోచుకోలేదు, విదేశాల్లో దాచుకోలేదు,పెట్టుబడులు పెట్టాడు. ప్రజల మనిషిగా అన్ని పరీక్షలు నెగ్గాడు. పార్టీ మద్దతు, దేశభక్తుల విశాల కూటమితో పనిచేశాడు. గ్రామీణ సామాజిక జీవనాన్ని పటిష్టం గావించారు. మార్కెట్‌ శక్తులు, దోపిడీదారులు, అవినీతి పరుల మధ్య పోటీలో ఒక స్ధిరమైన సంస్ధను నిర్మించారు. ఆయనకు వుత్పత్తి ఎలా చేయాలో మాత్రమే కాదు గౌరవ ప్రదమైన వేతనాలు, పెన్షన్లు ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. గరిష్ట వేతనాలు, సిబ్బంది సంరక్షణ చూశారు.వుచిత గృహవసతి, విద్య, వైద్యం కల్పించారు. సోవియట్‌ కాలం నాటి కార్మిక నిబంధనలన్నీ పాటించారు. పార్టీ మొత్తంగా ఆయన విజయానికి పని చేయాలి.మన అభ్యర్ధి ఒక మంచి, విలువైన వ్యక్తి అని మనం రుజువు చేయాలి, ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా ఆయన విజయానికి కృషి చేయాలి.’ అని జుగనోవ్‌ చెప్పారు.

యాభైఏడు సంవత్సరాల గ్రడినిన్‌ మెకానికల్‌ ఇంజనీరు, మాస్కో సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో 1990 దశకం నుంచి పనిచేస్తున్నారు.ఆయన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించగానే రష్యన్‌ మీడియా ఆసక్తితో పాటు దాడులు కూడా ప్రారంభించింది. కమ్యూనిస్టు పార్టీ తన పలుకుబడిని పెంచుకొనేందుకు పార్టీ సభ్యుడు కాని వ్యక్తిని పోటీకి నిలిపినట్లు అనేక మంది వ్యాఖ్యానించారు.జుగనోవ్‌ ఇతర కమ్యూనిస్టు పార్టీ నేతలతో కలసి వేసిన నామినేషన్‌ కార్యక్రమానికి పెద్ద ప్రచారం కల్పించారు.

ఎన్నికల ప్రచారం లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ ఇంకా వూపందుకోలేదు.పోలింగ్‌కు సరిగ్గా నెల రోజు ముందు మీడియాలో అభ్యర్ధుల ప్రచారం ప్రారంభం అవుతుంది. గతంలో జరిగిన ఎన్నికలపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సారి ఎలా జరుగుతాయో వూహించటం కష్టం కాదు. 2016 అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందన్న తీవ్ర విమర్శలు, ఆరోపణల నేపధ్యంలో ఈ సారి దానికి పోటీగా అమెరికా జోక్యం చేసుకుంటుందా అన్నది ప్రశ్న.ప్రస్తుతం వెల్లడవుతున్న అభిప్రాయాల ప్రకారం పుతిన్‌ తిరిగి విజయం సాధించటం ఖాయం అనే వాతావరణం వుంది. డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారనే విమర్శల నేపధ్యంలో ఇపుడు రష్యా ఎన్నికలలో జోక్యం అనే వార్తలు వస్తున్నాయి. అవినీతి కేసులలో శిక్షపడిన అలెక్సీ నవాల్నే పోటీకి అనర్హుడని ప్రకటించటంతో రష్యన్‌ ఎన్నికలను బహిష్కరించాలని అతడు పిలుపునిచ్చాడు. తను రంగంలో వుంటే పుతిన్‌ అవకాశాలు దెబ్బతింటాయనే కారణంతోనే తనను తప్పించారని చేసిన ఆరోపణను అమెరికన్‌ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. ఆ చర్య తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని పుతిన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఖండించారు. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేయటమే తమ ముఖ్య లక్ష్యంగా ఎంచుకున్న సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికన్లు తదుపరి పర్యవసానాలను పూర్తిగా అంచనా వేయలేకపోయారా అన్నది ఒక అంశం. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత రష్యా కూడా ఐరోపాలోని ఇతర దేశాల మాదిరి తనకు లొంగి వుంటుందని అమెరికన్లు భావించి వుండవచ్చు. కానీ ఆచరణలో అది కూడా పోటీదారుగా మారుతుందని, ప్రపంచ రాజకీయాలలో తన పట్టు పెంచుకొనేందుకు ముందుకు వస్తుందని సామ్రాజ్యవాద దేశాలు అంచనా వేసి వుంటే పరిణామాలు కచ్చితంగా మరో విధంగా వుండేవి. మార్కెట్ల వేట పోటీలో సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసికొత్తగా ముందుకు వచ్చిన రష్యా సహజంగానే తన వాటాను డిమాండ్‌ చేయటమే మిగతా పశ్చిమ దేశాలు, దానికి వున్న వివాదం.

దీనిలో పశ్చిమ దేశాలను సవాలు చేసేంతగా రోజు రోజుకూ అన్ని రకాలుగా బలం పెంచుకుంటున్న సోషలిస్టు చైనా అనేక అంశాలలో రష్యాతో చేయి కలుపుతోంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, సైనిక సమీకరణలు లేకపోవటం వుభయులకు ప్రయోజనకరమైన అంశం. అందువల్లనే అమెరికా, దాని మిత్ర దేశాలతో ఆసియాలో, ఐరోపాలో రష్యన్లు ఏకు మేకై కూర్చున్నారు. రష్యా పక్కనే వున్న వుక్రెయిన్‌లో పాగా వేసేందుకు నాటో కూటమి నిరంతరం ప్రయత్నిస్తున్నది.రష్యా అడ్డుకుంటున్నది. క్రిమియా ప్రాంతాన్ని తనలో కలిపివేసుకోవటం ద్వారా ఆ ప్రాంతంలో తమకు ఎదురులేదని రష్యా లోకానికి చాటింది. ఆ పేరుతోనే వుక్రెయిన్‌లో పాగా వేసేందుకు పశ్చిమ దేశాలు పావులు కదుపుతున్నాయి, పోటీ పడుతున్నాయి. వుక్రెయిన్‌ పరిరక్షణకు తాము టాంకులను ధ్వంసం చేసే క్షిపణులతో సహా అధునాతన మారణాయుధాలు అందచేసేందుకు సిద్దంగా వున్నామని తొలిసారిగా కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రకటించింది రష్యా. వాటిని ఆత్మరక్షణ కోసమే వాడతాం తప్ప ఎదురుదాడికి కాదని వుక్రెయిన్‌ చెబుతున్నది. అమెరికా ప్రకటనను తప్పు పడుతున్న జర్మనీ అదనపు ఆయుధ విక్రయాల గురించి ప్రశ్నిస్తున్నది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయుధాలతో పనేముంది వేరే మార్గం వుందన్నట్లుగా జర్మనీ రంగంలోకి దిగింది. ఎన్నికలలోపే వుక్రెయిన్‌లో ఐరాస శాంతి దళాలను ఏర్పాటు చేయాలని బుధవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రి వుక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో కోరటం దానిలో భాగమే. వుక్రెయిన్‌లో ఐరాస దళాల ఏర్పాటుకు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ఫ్రాన్స్‌తో కలసి జర్మనీ ప్రయత్నిస్తోంది. రష్యా ఎన్నికలను సాకుగా చూపరాదని కోరుతోంది. వుక్రెయిన్‌ విషయంలో తనకు పెద్దన్న పాత్ర వుండాలని అమెరికా కోరుకుంటుండగా అటువంటి అవకాశం ఇవ్వరాదని జర్మనీ, ఫ్రాన్స్‌ సహజంగానే కోరుకుంటాయి. ఐరోపా సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, ఇతరుల పాత్ర వుండరాదని అవి చెబుతున్నాయి. ఈ రెండు పరిణామాలు పరోక్షంగా రష్యన్‌ ఎన్నికలలో జోక్యం చేసుకోవటమే అవుతుంది. తమకు కొరకరాని కొయ్యగా తయారైన పుతిన్‌ మీద పశ్చిమ దేశాలకు సానుకూల వైఖరి వుండదు. అయితే తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించగల బలమైన మరొక నాయకుడు, శక్తి పశ్చిమ దేశాలకు దొరకటం లేదు. అధికారపక్ష బలంతో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ గత పాతిక సంవత్సరాలుగా అక్కడ కమ్యూనిస్టుపార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా వుంటోంది. వర్గ స్వభావ రీత్యా పశ్చిమ దేశాలు కమ్యూనిస్టులను బలపరిచే సమస్యే లేదు. ఇదొక విచిత్ర పరిస్ధితి. ఇతర పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌ దేశాలలో పశ్చిమ దేశాలు తమకు అనుకూలమైన శక్తులను సంపాదించటంలో కొంత మేరకు జయప్రదమయ్యాయి. అనేక సందర్భాలలో రష్యాను వ్యతిరేకించే, పశ్చిమ దేశాల అనుకూల శక్తులే ఎన్నికలలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

నిజానికి పుతిన్‌ అధికార రాజకీయాలలో తలపండిన వ్యక్తి. తన ఎన్నికకు మార్గం సుగమం చేసుకొనేందుకు గత ఏడాది కాలంగా ఇంటా బయటా అనేక చర్యలు తీసుకున్నాడు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తారనే అనుమానం వున్న గవర్నర్లను తొలగించటం,బదిలీ చేయటం వంటి వాటిని కొద్దినెలల ముందుగానే పూర్తి చేశాడు.విదేశాలలో సొమ్ము దాచుకున్నవారిపై కఠిన చర్యలంటూ ఆర్భాటం చేసినప్పటికీ ఎన్నికల నేపధ్యంలో వారికి అనుకూలమైన చర్యలు తీసుకున్నాడు. ఆర్ధికశాఖ నిషేధజాబితాలో వున్న దేశాలలో తప్ప ఇతర దేశాలలో దాచుకున్న సొమ్మును రష్యా తీసుకురానవసరం లేదని, పన్నులు చెల్లించక్కరలేదని లెక్కలు ప్రకటిస్తే చాలనే వెసులుబాటు కల్పించాడు. నిధుల వివరాలు వెల్లడించిన వారి మీద ఒకటి రెండుశాతం పన్ను విధించి క్షమించి వదలి వేయాలనే ఆలోచన వున్నట్లు వార్తలు రాయించారు. జనవరి ఒకటి నూతన సంవత్సరాది సందర్భంగా చిన్న సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ పుతిన్‌ పలు చర్యలు ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల అక్రమాలు తప్ప మరొకటి కాదు.

అంతర్జాతీయంగా రష్యా తన పట్టునిలుపుకొనే క్రమంలో అమెరికాను వ్యతిరేకిస్తున్నప్పటికీ దాని ఆర్ధిక పరిస్ధితి అంత సజావుగా లేదు. ఇతర ధనిక దేశాల మాదిరే ఆర్ధిక సంక్షోభప్రభావం తీవ్రంగా పడింది. గత కొంత కాలంగా దాని అభివృద్ధి రేటు గిడసబారింది. గతేడాది అభివృద్ధి రేటు 1.8-2.2శాతం మధ్య వుండవచ్చని డిసెంబరు మధ్యలో రష్యన్‌ సెంట్రల్‌ బ్యాంకు ప్రకటించింది. దాని అంచనా ప్రకారం 2018లో 1.5-2శాతం మధ్య వుంటుందని పేర్కొన్నది. రానున్న పది సంవత్సరాలలో రష్యా ఆర్ధిక పరిస్ధితి నిరాశాజనకమే అని బ్లూమ్‌బెర్గ్‌ విశ్లేషించింది. 2021నాటికి చమురు పీపా ధర 20డాలర్లకు పడిపోతుందని, రష్యన్‌ప్రభుత్వం బడ్జెట్‌ సమస్యలతో పాటు కార్మికుల సమ్మెలతో తలెత్తే పరిస్ధితిని ఎదుర్కోవాల్సి వుంటుందని పేర్కొన్నది.2024నాటికి చమురు ధర పదిడాలర్లకు పడిపోతుందని,2028నాటికి రాజకీయ రంగం నుంచి పుతిన్‌ కనుమరుగవుతారని జోస్యం చెప్పింది.ఈ జోస్యం ఫలించినా లేదా ఇప్పుడున్న ఆర్ధిక మాంద్యం కొనసాగినా పుతిన్‌కు ఇవే చివరి ఎన్నికలైనా ఆశ్చర్యం లేదు. గతంతో పోలిస్తే చమురు ధరలో పెద్దగా పెరుగుదల లేకపోయినా దివాలాకోరు ఆర్ధిక విధానాల కారణంగా రష్యన్‌ ఆర్ధిక వ్యవస్ధకున్న పరిమితులు వెల్లడయ్యాయి.

ఈ పూర్వరంగంలో జరుగుతున్న ఎన్నికలను ఆర్ధిక స్ధితి పెద్దగా ప్రభావితం చేయబోదని పుతిన్‌ విజయం సాధిస్తారని మీడియా పండితులు చెబుతున్నారు. ఆర్ధిక పరిస్ధితి ఇలాగే కొనసాగితే రష్యన్‌ సమాజంలో ఎలాంటి అసంతృప్తి తలెత్తుతుందనేది ఇప్పుడే జోస్యం చెప్పలేము. అయితే సోషలిజాన్ని పోగొట్టుకున్న పాతికేండ్ల తరువాత సాధించిందేమిటి అని నెమరువేసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బోల్షివిక్‌ విప్లవం జరిగి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 58శాతం మంది సోవియట్‌ను కోల్పోయినందుకు విచారం వెలిబుచ్చుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. గతం మాదిరే చరిత్ర పునరావృతం కాదుగాని ముందుకే పోతుంది, అది పురోగమనం వైపే అన్నది చరిత్ర చెప్పిన సత్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా-హొండురాస్‌లో మరోసారి ప్రజాస్వామ్యం ఖూనీ !

06 Wednesday Dec 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Honduras, Honduras democracy hijaked, Salvador Nasralla, Tegucigalpa, yankees

ఎం కోటేశ్వరరావు

ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయటాన్ని అంగీకరించబోమన్న హొండురాన్లపై పాలకులు వుక్కుపాదాన్ని మోపేందుకు పూనుకున్నారు. దేశమంతటా పది రోజుల పాటు కర్ఫ్యూ ప్రకటించి రక్తాన్ని కండ్ల చూస్తున్నారు. తెలియందేముంది, మేమున్నాం అంటూ సకల అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇచ్చే అమెరికన్లు తాజా దుండగానికీ మద్దతు ఇస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. రాజకీయ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం నాటి వరకు 11మంది మరణించినట్లు మానవహక్కుల సంఘం ప్రకటించింది. మరోవైపు పోలీసు బలగాలు తాము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదని తిరుగుబాటును ప్రకటించాయి. కర్ఫ్యూను వుల్లంఘించి ప్రదర్శనలు జరుపుతున్న వారిపై బల ప్రయోగానికి నిరాకరించాయి. ప్రదర్శనల్లో పాల్గొన్నవారిని సురక్షితంగా ఇండ్లకు చేర్చేందుకు ముందుకు వస్తున్నాయి. అనేక చోట్ల పోలీసులు కూడా ప్రదర్శకులతో కలసి అధ్యక్షుడు హెర్నాండెజ్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దక్షిణ అమెరికా ఖండంలోని మధ్య అమెరికాగా పిలిచే కరీబియన్‌ దేశాలలో ఒకటైన హొండురాస్‌కు ఈశాన్యంలో నికరాగువా, నైరుతిలో ఎల్‌ సాల్వెడార్‌, పశ్చిమాన గౌతమాలా, దక్షిణాన పసిఫిక్‌, వుత్తరాన కరీబియన్‌ సముద్రాల మధ్యలో తొంభైలక్షల మంది జనాభా వున్న దేశమది.నవంబరు 26న ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు మితవాది జువాన్‌ ఆర్లొండో హెర్నాండెజ్‌ తిరిగి ఎన్నికౌతాడని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు బలపరిచిన టీవీ జర్నలిస్టు సాల్వెడార్‌ నసరల్లా విజయం సాధించే దిశగా వున్నట్లు ఓట్ల లెక్కింపు సరళి వెల్లడించింది. పోలైన ఓట్లలో 58శాతం లెక్కించిన సమయానికి ఐదుశాతం మెజారిటీతో నసరల్లా ముందున్నారు. అయితే సాంకేతిక కారణాలు చూపి ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. రెండు రోజుల తరువాత ప్రారంభించగా నాటకీయంగా నసరల్లా మెజారిటీ తగ్గిపోయి హెర్నాండెజ్‌ స్వల్పమెజారిటీకి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపును నిలిపివేయగానే ఓటర్ల తీర్పును వమ్ము చేయనున్నారని గ్రహించిన నసరల్లా ఎన్నికలలో తాను గెలిచానని, తీర్పును వమ్ముచేసేందుకు పూనుకున్నందున నిరసన తెలపాలని తన మద్దతదార్లకు పిలుపునిచ్చారు.

టీవీ జర్నలిస్టు సాల్వెడార్‌ నసరల్లా

ఇదే సమయంలోే ఎన్నికల పరిశీలకురాలిగా వున్న అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్‌) హొండూరాస్‌ ప్రతినిధి బృందం నాయకుడు జార్జ్‌ క్విరోగా ఒక ప్రకటన చేస్తూ ఓట్ల లెక్కింపులో అక్రమాలు, తప్పిదాలు, వ్యవస్ధా పరమైన సమస్యలున్నందున ఫలితాన్ని గురించి చెప్పలేమని, తిరిగి లెక్కింపు జరపాలని ప్రకటించారు. ఈ పూర్వరంగంలో అనుమానాలున్న వెయ్యి పోలింగ్‌ కేంద్రాల ఓట్లను తిరిగి లెక్కించిన తరువాత మొత్తం 99.98శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని, హెర్నాండెజ్‌ 42.98, నసరల్లా 41.39 శాతం చొప్పున పొందినట్లు సోమవారం నాడు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. అయితే విజేత ప్రకటన చేయలేదు. శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూ ప్రకటించి ఈ ఓట్ల లెక్కింపు తతంగం జరిపారు. తాజా ఓటింగ్‌ ఫలితాన్ని ప్రకటించకముందే వాటిని తాము అంగీకరించేది లేదని అన్ని పోలింగ్‌ కేంద్రాల ఓట్లను తిరిగి పార్టీల ప్రతినిధుల, పరిశీలకుల సమక్షంలో జరపాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాపితంగా జనం ప్రదర్శనలకు దిగారు. భద్రతా దళాలు వారిపై భాష్పవాయు, నీటి ఫిరంగులను ప్రయోగించాయి.కొన్ని చోట్ల కాల్పులు జరిపాయి. దేశంలోని మొత్తం 5,179 పోలింగ్‌ బూత్‌ల ఓట్లను తిరిగి లెక్కించాలని, లేనట్లయితే నిరసన తెలుపుతామని నసరల్లా నాయకత్వంలోని అలయన్స్‌ పార్టీ ప్రకటించింది.

రాజధాని టెగు(టెగుసియాగల్పా)తో సహా ఎక్కడా పోలీసులు ప్రస్తుత అధ్యక్షుడు ప్రకటించిన కర్ఫ్యూ ఆజ్ఞలను అమలు జరపరని, రాజకీయ సంక్షోభం పరిష్కారమయ్యే వరకు తాము యూనిట్లకే పరిమితం అవుతామని పోలీసు ప్రతినిధి ప్రకటించారు.’ మాకు రాజకీయ సిద్ధాంతాలు లేవు, మేము శాంతిని కోరుకుంటున్నాము, మేము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదు, ఈ విషయంలో మేము అలసిపోయాము.మేము జనంతో ఘర్షణ కొనసాగించలేము, అణచివేతను కోరుకోవటం లేదు, దేశ ప్రజల మానవహక్కులను వుల్లంఘించజాలం’ అని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ప్రతినిధి ప్ర కటించాడు. అంతకు ముందు కొట్లాటల నిరోధ కోబ్రా దళ సభ్యుడు మాట్లాడుతూ ‘ఇదేమీ సమ్మె కాదు, వేతనాలు లేదా డబ్బు గురించి కాదు, మా విధి దేశ ప్రజలకు శాంతి, భద్రత కల్పించటం, వారిని అణచివేయటం కాదు, దేశ ప్రజలందరూ సురక్షితంగా వుండాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ ప్రకటనల పరంపర కొనసాగుతుండగానే మరో పోలీసు ప్రతినిధి ఒక టీవీలో మాట్లాడుతూ కొంత మంది పోలీసులు నిరాహారదీక్షకు పూనుకుంటారని ప్రకటించారు. ‘మేము మానవహక్కుల వుల్లంఘనలో భాగస్వాముల కాబోం, మేమా పని చేస్తే త్వరలోనో తరువాతో అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుంది. వాస్తవానికి గతంలో మా వున్నతాధికారుల హక్కుల వుల్లంఘన కారణంగా మేము ఇప్పటికే పరిహారం చెల్లిస్తున్నాము.యూనిఫాంలో వున్న సిబ్బంది మెరుగైన పని పరిస్ధితులు వుండాలని కోరుతున్నారు, వాటిని మా డిప్యూటీ డైరెక్టర్‌ తిరస్కరించారు. మాకు కావాల్సింది యజమానులు కాదు, నాయకులు, మా కమిషనర్‌ నాయకుల కోవకు చెందుతారు. వీధులలో గస్తీ తిరిగే సిబ్బందికి నిరాకరించి అనుబంధంగా వుండే వారికి మాత్రమే వేతనాలు ఎందుకు పెంచారు.ఇది సరైనది కాదు. అని చెబుతూ తమ డిమాండ్లు ఇవి అని టీవీలో ఒక ప్రకటన చదివారు. మరోవైపు భద్రతా దళాలు అనేక మంది విదేశీ జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని స్వదేశాకు పంపివేయటం ప్రారంభించాయి.

ఇదిలా వుండగా హొండురాస్‌లో ఎన్నికల కమిషన్‌ క్రమపద్దతిలో ఓట్ల లెక్కింపు జరిపిందని అమెరికా వున్నతాధికారి ఒకరు కితాబునిచ్చారు.హెర్నాండెజ్‌ అమెరికాకు అత్యంత సన్నిహితుడు. ఈక్రమంలోనే అతగాడిని రక్షించేందుకు పూనుకుంది.హొండురాస్‌ సర్కార్‌ అవినీతి వ్యతిరేకత పోరాటం, మానవ హక్కుల పరిరక్షణకు మద్దతు ఇస్తోందంటూ అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రక ప్రకటనలో పేర్కొన్నది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ఇలాంటి శక్తులకు మద్దతు ఇవ్వకపోతేనే ఆశ్చర్యం. లాటిన్‌ అమెరికాలో నియంతలకు వ్యతిరేకంగా అనేక దేశాలలో పోరాడిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి రావటాన్ని అమెరికా తొలి రోజుల్లో అడ్డుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో చట్టబద్దమైన కుట్రలకు తెరతీసి అనేక దేశాలలో మితవాదులకు పెద్దపీట వేసి తన మద్దతుదార్లుగా మారుస్తున్నది. హొండురాస్‌లో కూడా అదే పునరావృతం అవుతోంది.

అటు వుత్తర అమెరికా ఖండానికి ఇటు దక్షిణ అమెరికా ఖండానికి మధ్యలో కీలకమైన ప్రాంతంలో వున్న హొండూరాస్‌లో ప్రజాస్వామ్యం ఒక మేడి పండు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగంలోని ప్రతి వ్యవస్ధ ఆమోద ముద్రవేయాల్సిందే. అది నందంటే నంది పందంటే పంది. రాజ్యాంగాన్ని సవరించటం అన్నది అప్రజాస్వామికమని ఇంతవరకు ఏ కోర్టూ చెప్పలేదు.2009లో నాటి అధ్యక్షుడు మాన్యువల్‌ జెలయా రాజ్యాంగసవరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు నిర్ణయించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపటం రాజ్యాంగ బద్దమేనని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలిపివేసింది తప్ప రాజ్యాంగ సవరణ రాజ్యాంగ బద్దమా కాదా అన్న విషయం చెప్పలేదు. ఈ లోగా పార్లమెంట్‌, అటార్నీ జనరల్‌, ఎన్నికల సంఘం జెలయా నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని ప్రకటించాయి.వాటిని ఖాతరు చేయని జెలయా బ్యాలట్‌ పత్రాలు, బాక్సులను పోలింగ్‌ కేంద్రాలకు తరలించాలని జారీ చేసిన ఆదేశాన్ని మిలిటరీ అధిపతి తిరస్కరించాడు. ఈ సమయంలో తమ ఆదేశాన్ని పాటించలేదనే పేరుతో జెలయాను పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మిలిటరీ ఆయనను నిదుర మంచం మీద నుంచి తీసుకు పోయి పక్కనే వున్న కోస్టారికా దేశంలో విడిచి వచ్చింది. ఒక దేశ పౌరుడిని మరొక దేశంలో అక్రమంగా వదలి రావటం ఏ చట్టం ప్రకారం సమర్ధనీయమో, మిలిటరీ చేసిన పని తప్పోకాదో కూడా సుప్రీం కోర్టు విచారించలేదంటే ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో చూడవచ్చు. జెలయా, కుటుంబ సభ్యులు కోస్టారికా నుంచి బయలు దేరి రహస్యంగా కాలినడకన తిరిగి హొండూరాస్‌ చేరుకొని బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. తరువాత ఆయన మీద కేసులు ఎత్తివేసి దేశంలో కొనసాగనిచ్చారు.

రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి పదవీ బాధ్యతలలో వున్న తరువాత రెండసారి అధ్యక్షపదవికి పోటీ చేయటానికి అర్హత లేదు. ఆ రీత్యా చూసినపుడు తాజా ఎన్నికలలో అధికారంలో వున్న అధ్యక్షుడు హెర్నాండెజ్‌ పోటీ చేయటానికి లేదు.అయినా కేంద్ర ఎన్నికల సంఘం మూడింట రెండు ఓట్ల మెజారిటీతో ఆమోదం తెలపటంతో పోటీ చేసినా సుప్రీం కోర్టు, ఇతర రాజ్యాంగ సంస్ధలు నోరు మెదపలేదు. అనుకున్నదొకటీ అయింది ఒకటి అన్నట్లుగా సులభంగా విజయం సాధిస్తాడని అనుకున్న హెర్నాండెజ్‌ వెనుకబడటంతో ఆయన నియమించిన ఎన్నికల సంఘం సాంకేతిక సమస్యలు తలెత్తాయనే సాకు చూపి ఓట్ల లెక్కింపును రెండు రోజుల పాటు నిలిపివేసి మెజారిటీతో వున్న ప్రతిపక్ష అభ్యర్ధికంటే హెర్నాండెజ్‌కు స్వల్ప మెజార్టీ వచ్చిందని ప్రకటించి ఎన్నికలను బూటకంగా మార్చివేసింది. ప్రస్తుతం మెజారిటీ ఓట్లు సాధించి విజయం సాధించిన ప్రతిపక్ష అభ్యర్ధి జర్నలిస్టు అయిన సాల్వెడార్‌ నసరల్లా ఓ ప్రజాస్వామికవాది, గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజామద్దతు పొందిన వ్యక్తి. ఆయనను మాజీ అధ్యక్షుడు, వామపక్షాలతో సహా పురోగామి పార్టీలు, శక్తులు బలపరిచాయి. నసరుల్లాకు వున్న అనర్హత ఏమంటే అమెరికాకు బంటుగా పనిచేస్తాడనే హమీ లేకపోవటమే. అందుకే ఓట్ల లెక్కింపు మధ్యలోనే ఫలితాన్ని తారుమారు చేశారు. అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా ?ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగినందున మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలి లేదా ఎన్నికను రద్దు చేసి తిరిగి జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధి సాల్వెడార్‌ నసరల్లా డిమాండ్‌ చేశారు. గురు, శుక్రవారాలలో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం వుందని వార్తలు వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఎన్నికను తొత్తడం గావించి, మరింతగా అణచివేతకు పూనుకుంటే పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జర్మనీలో అనిశ్చితిపై ఐరోపాలో ఆందోళన !

30 Thursday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Angela Merkel, European Union, German elections, Germany

Image result for germany political uncertainty

ఎం కోటేశ్వరరావు

జర్మనీ, ఐరోపాయూనియన్‌ అనే ఒక రైలు బండికి ఇంజను వంటిది. గత రెండు నెలలుగా అది ఆగిపోయి ముందుకు కదలటం లేదు. దాన్ని తిరిగి ఎలా నడుపుతారో ప్రస్తుతానికైతే తోచటం లేదు. బండి ప్రయాణించకపోతే జర్మన్లకే కాదు, మొత్తం ఐరోపా ప్రయాణీకులందరికీ ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. కొందరు విశ్లేషకులు పేర్కొన్నట్లు జర్మనీ రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎరుగనంత రాజకీయ అనిశ్చితి, సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నది. సెప్టెంబరు 24న ఎన్నికలు జరిగాయి. ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా పచ్చిమితవాదులు పన్నెండుశాతంపైగా ఓట్లతో మూడవ పెద్ద పార్టీగా పార్లమెంటులో ప్రవేశించారు. క్రిస్మస్‌ నాటికి ఒక కొలిక్కి రానట్లయితే మహాసంఘటన చర్చలు విఫలమైనట్లుగా భావించాలని ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ తరువాతే మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుంది. రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కనుక తన రాజకీయ సంక్షోభాన్ని జర్మనీ ఎలా పరిష్కరించుకుంటుందనేదే ఆసక్తికరం. మొత్తం ఐరోపా పధకాలే గందరగోళంలో పడతాయని బ్రస్సెల్స్‌(ఐరోపా యూనియను ప్రధాన కేంద్రం) భయంకరమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.ఐరోపా యూనియను సముద్రంలో వుంది, దాన్ని ఆదుకొనే పెద్ద స్నేహితుడు మధ్య ఐరోపాలో మనకు లేడు అంటూ ఐరోపా ప్రపంచం అనే పత్రిక ప్రచురణకర్త చేసిన వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుంది. అమెరికా ట్రంప్‌ తప్పుడు అంతర్జాతీయ విధానాల ఫలితంగా భద్రత మరియు విదేశీ వ్యవహారాలలో ఐరోపా యూనియను కలసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం వుంది, అందుకు గాను ఇంజను వంటి బలమైన జర్మనీ అవసరం అని భావిస్తున్నారు. అలాంటి జర్మనీలో ప్రభుత్వం ఏర్పడుతుందో లేదో తిరిగి ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని స్ధితి ఏర్పడింది. మరోవైపు యూనియన్‌ నుంచి విడిపోయేందుకు 50బిలియన్‌ పౌండ్లు చెల్లించేందుకు సిద్ధపడి బ్రిటన్‌ తనదారి తాను చూసుకుంటున్నది.ఐరోపా అంతటా పచ్చి మితవాద, నయా ఫాసిస్టు, నాజీ శక్తులు తలెత్తటం ఐరోపా యూనియన్‌ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. సహజంగానే ఈ పరిస్ధితి అమెరికన్లకు సంతోషం కలిగిస్తుంది.

తమ విధానాలకు ప్రత్యామ్నాయం లేదని విర్రవీగిన పెట్టుబడిదారీ కావలి బంట్లలో ఏంజెలా మెర్కెల్‌ ఒకరు. వరుసగా మూడు సార్లు ఛాన్సలర్‌గా ప్రభుత్వాలను నడిపిన ఆమెకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఆమె ప్రభుత్వంలో పన్నెండు సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాలు భాగస్వామిగా చేరిన సోషలిస్టులం అనిచెప్పుకొనే సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి వెన్నుదన్నుగా వుండే కార్మికులు ఈ ఎన్నికలలో దూరం, కావటం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతి తక్కువ ఓట్లు తెచ్చుకోవటం శరాఘాతం వంటిది. మెర్కెల్‌తో జతకడితే రానున్న రోజుల్లో వున్న ఓట్లుకూడా పోతాయోమోననే భయం ఆ పార్టీని వెన్నాడుతున్నది. అయితే తాజా వార్తలను బట్టి వారు సంకీర్ణ సంప్రదింపులకు తలుపులను పూర్తిగా మూసివేయలేదు. అదే సమయంలో 20శాతం బలంతో వందశాతం డిమాండ్లు పెడితే అంగీకరించేది లేని మెర్కెల్‌ శిబిరం హెచ్చరికలు జారీ చేసింది. ఈ పూర్వరంగంలో ఎవరు ఎంత మేరకు రాజీపడినప్పటికీ కార్మికవర్గానికి జరిగే మేలు ఏమిటన్నది అసలు సమస్య.

ఆల్‌ ఈజ్‌ వెల్‌(అంతా మంచిగా వుంది) అనుకుంటున్న జర్మనీలో ఎన్నికలు అధికార కూటమిని అనూహ్యకుదుపునకు గురిచేశాయి.నిజానికి జర్మనీలో ఒక విధంగా చెప్పాలంటే ఒక్క వామపక్షపార్టీ తప్ప మిగిలినవన్నీ అవి తెచ్చుకొనే సీట్లను బట్టి, అక్కడి పాలకవర్గ వాంఛలను బట్టి అధికార-ప్రతిపక్ష పాత్రలను పోషిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో 2013లో రెండు పెద్ద పార్టీలైన క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌(సిడియు), దానితో కలసి వుండే క్రిస్టియన్‌ సోషలిస్టు యూనియన్‌ అనే ఒక ప్రాంతీయ పార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డిపి) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా ఎన్నికలలో రెండు పార్టీలకు దిమ్మదిరిగే విధంగా గతంలో ఎన్నడూరానన్ని తక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయి. పార్లమెంట్‌లోని 709 స్థానాలకు గాను మెజారిటీ 355కాగా ఈ మూడు పార్టీలకు 399 వచ్చినప్పటికీ తాము ప్రతిపక్షంలో వుంటామని 143 సీట్లు తెచ్చుకున్న ఎస్‌డిపి ప్రకటించటం జర్మనీలో రాజకీయ అనిశ్చితికి దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పార్లమెంట్‌కు 18సార్లు ఎన్నికలు జరిగాయి.ఇరవై అయిదు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వీటిలో అత్యధికం సిడియు, దాని మిత్రపక్ష ప్రభుత్వాలు. ఎస్‌పిడి దాని మిత్రపక్షాలతో కలసి అధికారానికి వచ్చింది. ఈ రెండు పార్టీలు కలసి ఐదుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర వుంది.

ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీతో కలసి మరోసారి అధికారాన్ని పంచుకొనేందుకు తొలి స్పందనగా ససేమిరా అని పేర్కొన్నది. ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం పదవ సంవత్సరంలోకి ప్రవేశించనుంది. దాని దెబ్బకు ఐరోపాలోని మితవాద పార్టీలతో పాటు సోషలిస్టులుగా వున్నవారు కూడా ఎన్నికలలో చావు దెబ్బలు తింటున్నారు. ఒకసారి అధికారానికి వచ్చిన వారు మరోసారి మట్టికరుస్తున్నారు.జర్మనీలో మితవాద సిడియు, వామపక్షంగా చెప్పుకొనే ఎస్‌డియు రెండూ గత నాలుగు సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగా రెండుపార్టీల ఓట్లు, సీట్లు పడిపోయాయి.1998లో గరిష్టంగా 40.9శాతం ఓట్లు తెచ్చుకున్న ఎస్‌పిడి తరువాత అధికారానికి వచ్చి ఇప్పుడు 20.5శాతానికి పడిపోయింది. అందువలన మరోసారి సిడియుతో జతకట్టవద్దని ఆ పార్టీలో పైనుంచి కింది వరకు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఐరోపాలోని మిగతా ధనిక దేశాలతో పోల్చితే జర్మనీ ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగ్గా వున్నప్పటికీ సాంఘిక సంక్షేమ పధకాలకు కోతపెట్టటంలో రెండుపార్టీలు ఏకాభిప్రాయంతో వ్యవహరించాయి. ఈ అసంతృప్తి కార్మికవర్గంలో వుంది. అందుకే వెంటనే తాము ప్రతిపక్షంలో వుంటామని చెప్పింది. అయితే అది కూడా ఒక బూర్జువాపార్టీయే గనుక కార్పొరేట్‌ శక్తుల వత్తిళ్లకు లంగి సంకీర్ణం గురించి చర్చించేందుకు సిద్ధం అంటున్నది.తొలిసారిగా ముస్లిం, వలసకార్మికుల వ్యతిరేక నినాదాలతో ఎన్నికలలో పోటీచేసి మూడవ పెద్ద పార్టీగా ఆవిర్భవించిన జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని బూచిగా చూపి మరోసారి మెర్కెల్‌తో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోలేదు.

పార్లమెంట్‌లోని 709 స్ధానాలకు గాను 299 సీట్లకు ప్రత్యక్ష పద్దతిలో 410 సీట్లకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. వివిధ పార్టీలు దిగువ విధంగా సీట్లు సంపాదించాయి.(బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికలలో సాధించిన సీట్లు) క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ(సిడియు),క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌(సిఎస్‌యు) 246(311), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డిపి) 153(193), జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎడి) 94(కొత్త పార్టీ), ఫ్రీ డెమోక్రటిక్‌ పార్టీ 80(0), వామపక్ష పార్టీ 69(64), గ్రీన్‌ పార్టీ 67(63). మిగతా ఐరోపా దేశాలలో మాదిరే జర్మనీలో కూడా ఈ ఎన్నికలలో తొలిసారిగా పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నా పార్టీ మూడవ పెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష,గ్రీన్‌ పార్టీలు గతం కంటే కొద్దిగా సీట్లు పెంచుకున్నా ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవటంలో విఫలమయ్యాయి.

మెర్కెల్‌ నాయకత్వంలోని సిడియుతో జతకట్టేందుకు ఎస్‌డిపి తిరస్కరించటంతో ఒక సంక్లిష్ట పరిస్ధితి ఏర్పడింది. ఎస్‌పిడి,వామపక్ష,గ్రీన్‌ పార్టీలతో కూటమి ఏర్పడినా మెజారిటీ సాధించే అవకాశం లేదు. సిడియు పరిస్ధితి కూడా అంతే పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని, ఫ్రీడెమోక్రటిక్‌ పార్టీని కలుపుకుంటే తప్ప మెజారిటీ సాధించే పరిస్ధితి లేదు.ఆ మూడు కలిసే అవకాశం లేదు. అయితే జర్మనీ పాలకవర్గం సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీల మీద వత్తిడి చేస్తోంది. మరోసారి ఎన్నికలు జరిపినా పరిస్ధితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేకపోగా సిడియు పరిస్ధితి మరింత దిగజారినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్ధితుల్లో ఏకైక పెద్ద పార్టీగా సిడియు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మినహా మరొక మార్గం లేదు. అందుకు సిద్దపడటం కంటే తిరిగి ప్రజాతీర్పు కోరటం మేలనే వైఖరితో మెర్కెల్‌ వున్నారు. అయితే అందుకు ఆ పార్టీనాయకత్వం అంగీకరిస్తుందా, లేక ఆమెను పక్కకు నెట్టి కొత్తనేతతో సంకీర్ణ లేదా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది వచ్చే ఏడాది జనవరిలో గానీ స్పష్టం అయ్యే అవకాశం లేదు.ఎస్‌డిపితో కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సుమఖత తెలియచేస్తూ సిడియు తీర్మానించింది. మరోవైపు ఎస్‌డిపి యువజన విభాగం కూడా ఒక తీర్మానం చేసి మహా సంఘటన ఏర్పాటుకు ప్రయత్నించటం కంటే ప్రతిపక్షంలోని పార్టీలతో సంకీర్ణానికి ప్రయత్నించాలని తీర్మానించి పార్టీ నాయకత్వంపై వత్తిడి తెచ్చింది.

దేశ జనాభాలో గణనీయ భాగం 2000 సంవత్సరంలో సంపాదించిన ఆదాయ మొత్తంలో సగం కూడా ఇప్పుడు పొందటం లేదని విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఇటువంటి స్ధితిలో వామపక్షాలు ప్రత్యామ్నాయంగా లేకపోతే జనం పచ్చిమితవాద, నయా ఫాసిస్టు శక్తులవైపు మొగ్గుతారని జర్మనీతో సహా అన్ని ఐరోపా దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి. ఇవి వామపక్ష, కమ్యూనిస్టు పార్టీలకు కూడా మేలుకొలుపు వంటివే. పెట్టుబడిదారీ వ్యవస్ధ జరుపుతున్నదాడులు, నయావుదారవాద విధానాలను నిఖరంగ ఎదిరించే మొనగాళ్లుగా వామపక్షాలు జనానికి కనిపించకపోతే మితవాదులే మెరుగని జనం భావిస్తారు. తాజా ఎన్నికలలో పూర్వపు పశ్చిమ జర్మనీ ప్రాంతంలో వామపక్ష పార్టీ కొంత మేరకు ఓట్లు పెంచుకుందిగానీ, తూర్పు జర్మనీలో ఆరుశాతం కోల్పోయింది, ఆ ఓట్లు ఎడి పార్టీకి పడ్డాయి. స్వల్పంగా ఓట్లు, సీట్లు పెంచుకున్నప్పటికీ మిగతాపార్టీలకంటే తాము భిన్నం అనే గుర్తింపును జనంలో తెచ్చుకోలేకపోయింది. కొన్ని రాష్ట్రాలలో సమతూక బడ్జెట్‌ పేరుతో కోతలకు, రోడ్ల ప్రయివేటీకరణకు అంగీకరించటం వంటి చర్యలు అందుకు నిదర్శనం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్క్సిజానికి క్రైస్తవం వ్యతిరేకమా, అనుకూలమా ?

16 Thursday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RELIGION, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, bible teachings, Bolshevik Revolution, communism, communist manifesto, Pope Francis

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-5

ఎం కోటేశ్వరరావు

మతాలన్నీ ఏదో ఒక తత్వశాస్త్ర ప్రాతిపదికన ఏర్పడినవే. చరిత్రలో ప్రతి మతం అంతకు ముందున్నది సామాన్య జనం నుంచి దూరమైనపుడు దాని మీద తిరుగుబాటుగా వుద్భవించిందే. అందువల్లనే ప్రతిదీ ప్రారంభంలో ప్రజల పక్షమే,పురోగామి వైఖరినే కలిగి వుంటుంది. కాల క్రమంలో దోపిడీ వర్గం ప్రతిమతాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటం కనిపిస్తుంది. అందువల్లనే ప్రతి మతం ఆయా సమాజాలలో వున్న దోపిడీ వర్గానికే మద్దతుపలికిందన్నది చరిత్ర సారం. ఆ దోపిడీ సమాజాన్ని అంతం చేసేందుకు శాస్త్రీయ అవగాహనతో ముందుకు వచ్చిందే మార్క్సిస్టు తత్వశాస్త్రం. మతాలకు దీనికి వున్న ప్రధాన తేడా ఏమంటే ప్రతికొత్త మతం అంతకు ముందున్న ఏదో ఒక మతంపై తిరుగుబాటుగా వస్తే మార్క్సిస్టు తత్వశాస్త్రం అన్ని మతాలను ఒకేగాటన కట్టి ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. మతం జనం పాలిట మత్తు మందు అని సాధారణ సూత్రీకరణ చేసింది. సహజంగానే దోపిడీ శక్తులకు కొమ్ముగాసే మతం, మతాలకు వెన్నుదన్నుగా నిలిచే దోపిడీశక్తులు పరస్పరం ఆధారపడటం, సహకరించుకోవటం జగమెరిగిన సత్యం. ఆందువల్లనే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్స్‌,170 సంవత్సరాల నాడు వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక, 150 సంవత్సరాల నాడు జనానికి అందుబాటులోకి వచ్చిన కాపిటల్‌ గ్రంధం మొదటి భాగాలపై దోపిడీవర్గం, అన్ని రకాల మతశక్తులు దాడులు చేస్తూనే వున్నాయి.

కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి చివరిలో 23పేజీల పుస్తకంగా జర్మన్‌ భాషలో లండన్‌లోని బిషప్స్‌ గేట్‌లో వెలువడింది. దానిని రహస్యంగా వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ప్రచురించింది. బ్రిటన్‌లోని జర్మన్‌ల కోసం ప్రచురితమయ్యే డచ్‌ లండనర్‌ జీటుంగ్‌ పత్రిక సీరియల్‌గా ప్రచురణలో తొలి భాగాన్ని మార్చినెల మూడవ తేదీన అచ్చువేసింది. మరుసటి రోజే బెల్జియంలో వున్న మార్క్స్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 20నాటికి దానిని మూడుసార్లు అచ్చువేశారు. వాటిలో వెయ్యి కాపీలు ఏప్రిల్‌ మొదటి వారానికి పారిస్‌ చేరాయి, అక్కడి నుంచి జర్మనీ చేర్చారు. ఏప్రిల్‌- మే మాసాలలో ఆ పుస్తకంలోని అచ్చుతప్పులను సరిదిద్దారు. తరువాత అది 30పేజీలకు పెరిగింది. సంచలనం కలిగించించిన ఈ పరిణామంతో చర్చ్‌ వులిక్కి పడింది. మరుసటి ఏడాది 1849 డిసెంబరు ఎనిమిదిన నాటి పోప్‌ తొమ్మిదవ పయస్‌ ఇటాలియన్‌ ద్వీపకల్పంలోని తన పాలిత దేశాలైన ఇటలీ, వాటికన్‌ సిటీ, ఇటలీ ఆధీనంలోని శాన్‌మారినోలో వున్న ఆర్చిబిషప్‌లు, బిషప్‌లకు పంపిన సర్క్యులర్‌లో సోషలిజం, కమ్యూనిజాల గురించి తొలి హెచ్చరిక చేశారు. సోషలిజం, కమ్యూనిజాలనే నూతన సిద్ధాంతాల పేరుతో మత విశ్వాసులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాథలిక్‌ చర్చ్‌ ఐహిక అధికారాన్ని కూలదోసేందుకు విప్లవకారులు, హేతువాదులు పన్నుతున్న కుట్రలు,కూహకాలను గమనించాలని కోరారు. మత వ్యవహారాలలో నిరాసక్తతగా వుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటాలియన్లు తమ న్యాయబద్దమైన రాజకీయ అధికారులకు బద్దులై వుండాలని నిజమైన స్వేచ్చ, సమానత్వాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని, అందువలన విప్లవాలు పనికిమాలినవని పోప్‌ పయస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆస్ట్రియా సామ్రాజ్యం నుంచి ఇటలీ స్వాతంత్య్రం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. తరువాత వెయ్యి సంవత్సరాల పోప్‌ ఆధిపత్యాన్ని అంతం చేస్తూ 1861 రెండవ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇటలీ రాజుగా ప్రకటించుకున్నాడు. అందువలన పోప్‌ అధికారాన్ని తొలిసారిగా సవాలు చేసింది రాజరికం తప్ప కమ్యూనిస్టులు కాదని గుర్తించటం అవసరం.

1917లో బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైన తరువాత రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చి అధికారులు పైకి కొన్ని సందర్భాలలో తటస్ధంగా వుంటున్నట్లు ప్రకటించినా 1922 వరకు విప్లవ వ్యతిరేకులు జరిపిన తిరుగుబాటులో అభ్యుదయగాములుగా వున్న కొద్ది మంది చర్చ్‌ అధికారులు మినహా అత్యధికులు బోల్షివిక్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టులు 31శాతం ఓట్లు సాధించారు. అనేక దేశాలలో విప్లవ, జాతీయోద్యమాలు వూపందుకొని విజయాలు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే కుట్రలో భాగంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదులు కాథలిక్‌ చర్చిని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. దానిలో భాగంగా పోప్‌ పన్నెండవ పయస్‌ 1949లో ఒక ప్రకటన చేస్తూ కమ్యూనిజాన్ని బోధించిన వారిని మత వ్యతిరేక తిరుగుబాటుదారులుగా పరిగణించి మతం నుంచి వెలివేయాలని ఆదేశించి కమ్యూనిజంపై ప్రత్యక్ష దాడికి నాంది పలికారు.

ప్రచ్చన్న యుద్ధం పేరుతో అమెరికా సాగించిన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలలో ఎక్కడ ఏమతం పెద్దదిగా వుందో అక్కడదానిని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వినియోగించారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీ వున్నారు కనుక అక్కడ ఇస్లామిక్‌ మతోన్మాదులను రంగంలోకి దించి మిలిటరీతో జతకట్టించి పదిలక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోయించిన విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలో రోనాల్డ్‌ రీగన్‌ పాలనా కాలంలో సోషలిస్టు దేశాలలో తిరుగుబాట్లు, కూల్చివేతలకు తెరతీసిన కుట్రలో సిఐఏ, పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి తెలిసిందే. సాలిడారిటీ పేరుతో జరిపిన సమీకరణల వెనుక సిఐఏ నిధులు, వాటికన్‌ బ్యాంకు నిధులు, చర్చి అధికారుల మద్దతు బహిరంగ రహస్యం.

తూర్పు ఐరోపా, సోవియట్‌లో అమలు జరిపిన కుట్రకంటే ముందు చర్చిద్వారా కమ్యూనిజం, కమ్యూనిస్టులపై ప్రపంచవ్యాపితంగా దాడి చేసేందుకు జరిపిన ఒక ప్రయత్న వివరాలను గతనెల(అక్టోబరు) 25న లైఫ్‌ సైట్‌ న్యూస్‌ తొలిసారిగా ఆంగ్ల తర్జుమాను ప్రచురించింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత మారిన పరిస్ధితులలో చర్చి పాత్ర, సంస్కరణల గురించి, గడచిన వంద సంవత్సరాలలో తలెత్తిన మత సంబంధ సిద్ధాంతాల పరిష్కారానికి రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ అవసరమని 1959లో భావించారు. ఆమేరకు అది 1962 నుంచి 1965వరకు కొనసాగింది.

లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనంలోని అంశాలు ఇలా వున్నాయి. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌లో ఇతర విషయాలతో పాటు కమ్యూనిస్టులు, కమ్యూనిజానికి దండనా విధి నిర్ణయానికి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసేందుకు కొందరు నిర్ణయించారు. తరువాత దానిని పక్కన పెట్టారు. మార్క్సిజం, కమ్యూనిజం ప్రభావానికి ప్రతిగా, వాటి తెంపరితనాన్ని బహిర్గతపరిచేందుకు, ఓడించేందుకు ప్రపంచవ్యాపితంగా ఎలా సమన్వయంతో వ్యవహరించాలో పెద్ద ప్రణాళికను రూపొందించారు. అయితే కౌన్సిల్‌ కమిషన్లను రైన్‌ గ్రూప్‌ (రైన్‌ నదీ పరివాహక దేశాల)బిషప్పులు ఆక్రమించటంతో కమ్యూనిజం, మార్క్సిజాలను నేరుగా ఖండించాలనే ప్రయత్నాలన్నింటినీ వారు తిరస్కరించి పక్కన పెట్టారు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ ముగిసిన తరువాత ఆ పత్రాలన్నీ అధికారిక తయారీ పత్రాల రికార్డు రూముకు చేరాయి. లాటిన్‌(స్పానిష్‌)భాషలో రాసిన ఆపత్రాలకు గత కొన్ని దశాబ్దాలుగా దుమ్ముపట్టింది.

వాటిలో మూడు రకాల ప్రకటనలను రూపొందించారు.మార్క్సిజం తీవ్రమైన, ప్రపంచవ్యాపిత ప్రమాదం, కమ్యూనిజం దేవుడితో నిమిత్తం లేని ఒక మతం వంటిది, క్రైస్తవ నాగరికతల పునాదుల కూల్చివేతను కోరుకొంటుంది. ఇలాంటి కమ్యూనిజం నుంచి మానవాళిని రక్షించేందుకు వున్నత స్ధాయిలో ప్రపంచవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది.ఈ అంశాలతో కూడిన పత్రాలను వుదారవాదులైన రైన్‌ గ్రూప్‌ బిషప్పులు కౌన్సిల్‌ తొలి నెలల్లోనే తిరస్కరించి పక్కన పెట్టారని లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనం పేర్కొన్నది.

క్రైస్తవ మతంలో కొందరు మార్క్సిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేందుకు అమెరికా సిఐఏ, ఇతర గూఢచార, వాటి ముసుగు సంస్ధలతో చేతులు కలిపారు. అదే సమయంలో లాటిన్‌ అమెరికాలో కొందరు క్రైస్తవ మతాధికారులు దారిద్య్రం, సామాజిక సమస్యలను మతవ్యవహారాలతో సమన్వయంచేసి విముక్తి వాదం లేదా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అలాంటి వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాలంటూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారిని ప్రతిఘటించారు కూడా. అలాంటి వారిలో ఒకరే కమ్యూనిస్టు పోప్‌గా కొందరు చిత్రించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.అర్జెంటీనాకు చెందిన ఆయన 2013 నుంచి వాటికన్‌ అధిపతిగా కొనసాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఆయనను ఇలా అడిగారు.’ కాబట్టి మీరు సమానత్వానికి పెద్ద పీటవేసే సమాజం కావాలని కాంక్షిస్తున్నారు. అది మీకు తెలిసినదే మార్క్సిస్టు సోషలిజం తరువాత కమ్యూనిజపు కార్యక్రమం. కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దానికి పోప్‌ ఇలా సమాధానం చెప్పారు.’ దీని గురించి అనేకసార్లు చెప్పాను, నా స్పందన ఎల్లవేళలా అదే, ఏదైనా వుంటే కమ్యూనిస్టులు కూడా క్రైస్తవుల మాదిరే ఆలోచిస్తారు’ అని చెప్పారు.మార్క్సిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ మార్క్సిస్టు సిద్దాంతం తప్పు, అయితే నా జీవితంలో అనేక మంది ఎంతో మంచివారైన మార్క్సిస్టులను ఎరుగుదును, కనుక నేను తప్పుచేసినట్లుగా భావించటం లేదు’ అని పోప్‌గా ఎన్నికైన కొత్తలోనే చెప్పారు. మార్క్సిజానికి తాను వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పేందుకు గాను బలీవియాలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ నుంచి సుత్తీ,కొడవలి చిహ్నంగా వున్న శిలువను బహుమతిగా స్వీకరించటం తెలిసిందే. ఆయన జారీచేసిన లాడాటో సి సర్క్యులర్‌ తయారీకి మార్క్సిజంతో స్ఫూర్తి పొందిన విముక్త మత సిద్ధాంత వాదిగా పేరుబడిన లియోనార్డో బోఫ్‌ వంటి వారితోడ్పాటును స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఇటీవల కొత్త సుపీరియర్‌ జనరల్‌గా ఎన్నికైన వెనెజులాకు చెందిన ఆర్ధరో సోసా అబాస్కల్‌ మార్క్సిజంతో క్రైస్తవం సమాధానపడాలని బహిరంగంగా చెప్పారు.

మన దగ్గర దేవాలయాల కింద వేలాది ఎకరాల భూములు వున్నట్లుగానే పశ్చిమ దేశాలలో చర్చ్‌లకు అంతకంటే ఎక్కువ ఆస్ధులున్నాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిన కారణంగా వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్న ఎన్‌టి రామారావు పెద్ద దైవభక్తుడు, కమ్యూనిస్టు కాదు. రష్యా, ఐరోపాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత పెద్ద మొత్తాలలో వున్న చర్చి ఆస్ధులను ప్రజల పరం చేశారు. అంతే తప్ప చారిత్రక ప్రాధాన్యత వున్న ఏ ఒక్క చర్చిని కూల్చివేయలేదు. కమ్యూనిస్టులు అధికారంలో వున్నంత కాలం వాటిని కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఆయా దేశాలలోని చర్చ్‌లకు ఎలాంటి హాని జరగలేదని తేలిపోయిన తరువాత వారంతా తేలు కుట్టిన దొంగల మాదిరి మిన్నకుండిపోయారు.ఇప్పుడు చైనాలో బైబిల్‌ పఠించిన కారణంగా శిక్షలు వేస్తున్నట్లు కొందరు క్రైస్తవులతో పాటు నిత్యం క్రైస్తవులను ద్వేషించే మనువాదులు కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.చైనా చట్టాల ప్రకారం దేవుడిని ఇంటికే పరిమితం చేయాలి తప్ప వీధులకు ఎక్కించకూడదు. వీధులలో బైబిలే కాదు, ఏ మత గ్రంధ పఠనాన్ని ప్రోత్సహించినా, పఠించినా, అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలను నిర్మించినా అది నేరమే.దానికి అనుగుణంగానే శిక్షలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు.దీనిలో మనోభావాల సమస్య వుత్పన్నం కాదు. మన దేశంలో తెల్లవారే సరికి నడిరోడ్లమీద, వివాదాస్పద స్ధలాల్లో దేవుళ్లు, దేవతలు వెలుస్తుంటారు. చైనా వంటి చోట్ల అది కుదరదు. మెజారిటీ, మైనారిటీ ఎవరైనా అలాంటి పనులు చేస్తే కటకటాల వెనక్కు పోవాల్సిందే.

కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన ప్రారంభంలో వెల్లడైన వ్యతిరేకతకు, నేటికి వచ్చిన మార్పులను చూస్తే క్రైస్తవ మతాన్ని కూడా సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా పాలకవర్గాలు ఎలా వుపయోగించుకోచూశాయో చూశాము. తొలుత ఒక సిద్ధాంతంగా పనికిరాదని విమర్శ చేశారు. తరువాత బోల్షివిక్‌ విప్లవ సమయంలో రష్యాలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక తిరుగుబాటులో భాగస్వాములయ్యారు. తరువాత ప్రచ్చన్న యుద్ధంలో తమ వంతు పాత్రను మరింతగా పోషించేందుకు కమ్యూనిజం మతానికి వ్యతిరేకమని ప్రకటించటమే కాదు, సోవియట్‌, తూర్పు ఐరోపాలో జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. ఇప్పటికీ అనేక చోట్ల అటువంటి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవమతంలో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేందుకు నిరాకరించేశక్తులు కూడా వున్నాయని స్పష్టమైంది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే మతాధిపతులు చెప్పిన భాష్యాలకు ఏ బైబిల్‌ అంశాలు ఆధారమయ్యాయో అదే గ్రంధంలోని అంశాలను మార్క్సిజంతో మతాన్ని సఖ్యత పరిచేందుకు కమ్యూనిజపు సానుభూతిపరులైన మతాధిపతులు కూడా తమ భాష్యాలకు వుపయోగించారు. మొదటి వారు మారణకాండను ప్రోత్సహించిన వారి తరఫున వుంటే రెండో తరగతివారు మానవ కల్యాణాన్ని కోరుకున్న వారి పక్షాన నిలిచారు. మరి మనం ఎటు వుండాలి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ గూండాయిజం-అమెరికాను విస్మరించిన ఆసియన్‌ నాయకత్వం !

14 Tuesday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

asean summit, Donald trump, Donald trump asia tour, donald trump's act of political vandalism, US leadership

ఎం. కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు ఆసియాను అవమానించారా? అవును, పన్నెండు మంది దేశాధినేతలు హాజరైన తూర్పు ఆసియా సభ ప్రారంభం కావటం రెండు గంటల పాటు ఆలస్యమైందంటూ చిందులు వేస్తూ సభను బహిష్కరించి విమానమెక్కి స్వదేశానికి చెక్కేయటం, వాషింగ్టన్‌ వెళ్లిన తరువాత తాను ఒక ప్రకటన చేస్తానని చెప్పటం అవమానం గాక మరేమిటి? ఆసియా పర్యటన చేస్తూ తూర్పు ఆసియా సభలో పాల్గనకపోతే ఆసియా పట్ల అమెరికన్లకు ఆసక్తి లేదనే విమర్శలు వస్తాయనే కారణంతో ఈకార్యక్రమాన్ని కూడా చివరిలో పర్యటనలో చేర్చారు.చివరికి ఆలస్యం సాకు చూపి సభను బహిష్కరించారు.నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందుగానే ట్రంప్‌ విమానం ఫిలిప్పైన్స్‌నుంచి బయలుదేరింది.

విమానంలో విలేకర్లతో మాట్లాడుతూ మధ్యాహ్నభోజన సమయంలో చివరిగా తాను చెప్పదలచుకున్న అభిప్రాయాలను చెప్పేశానని, తన బదులు విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాల్గంటారని తెలిపారు.మనం పడ్డ కష్టానికి మంచి ఫలితాలే రానున్నాయని, 300బిలియన్‌ డాలర్ల మేరకు పరికరాలు, ఇతరాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని, త్వరలో లక్షకోట్ల డాలర్లకు పెరుగుతాయని చెప్పారు. తూర్పు ఆసియా సమ్మేళనంలో పాల్గనకపోవటం ట్రంప్‌ రాజకీయ గూండాయిజంగా మారుతుందని ప్రొఫెసర్‌ కార్ల్‌ థయర్‌ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా అధికారం తగ్గిపోవటానికి,ఆసియన్‌ నేతలు ఆ స్ధానాన్ని భర్తీ చేయటానికి ఈ పర్యటన కీలకమైనదిగా చరిత్రకారులు ఈతేదీని నమోదు చేస్తారని మరో ప్రొఫెసర్‌ అనెలైస్‌ రైల్స్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ అధికారంలోకి రాగానే చేపట్టిన తొలి చర్యలలో భాగంగా పసిఫిక్‌ ఇరుసులో వున్న దేశాలతో వాణిజ్య ఒప్పందాన్ని వదలివేశారని, అమెరికా ప్రమేయం లేకుండా శనివారం నాడు ఆసియన్‌ నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె చెప్పారు. పెద్ద ఒప్పందాలు మన చేతులను కట్టివేస్తాయని, ఏ దేశానికి ఆదేశంతో ఒప్పందాలు చేసుకోవటంపై తాను కేంద్రీకరిస్తానని అదేరోజు ట్రంప్‌ ప్రకటించారు. ఫసిపిక్‌ భాగస్వామ్య దేశాల ఒప్పందాన్ని వమ్ము చేసే ట్రంప్‌ యంత్రాంగ యత్నాలను ఆసియన్‌ నాయకులు పట్టించుకోలేదని, తాము స్వంతంగా ముందుకు పోవాలని నిర్ణయించారని, ట్రంప్‌కు ఘనస్వాగతం చెప్పినప్పటికీ ఆయన అజెండాను మొత్తంగా పట్టించుకోలేదని రైల్స్‌ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడేమిటి? ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని అనేక మంది ముక్కుమీద వేలేసుకున్నారు. గత అధ్యక్షులందరినీ అధిగమించి డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నెండు రోజుల గత రికార్డును బద్దలు కొట్టి 13రోజులతో కొత్త ఆసియా పర్యటన రికార్డును స్ధాపించాడు. నవంబరు ఐదున జపాన్‌తో మొదలై 14వ తేదీన ఫిలిప్పీన్స్‌లో ముగిసింది. మధ్యలో చైనా, దక్షిణ కొరియా, వియత్నాం పర్యటించారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లు అమెరికా అధ్యక్షులు మన ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాదిరి ఏదో ఒక సాకుతో విదేశీ పర్యటనలు చేయరు. రాజకీయ, ఆర్ధిక, మిలిటరీ వంటి అనేక అంశాలుంటాయి. అయితే ఈ పర్యటనలో సాధించినదాని కంటే పొగొట్టుకున్న పరువే ఎక్కువగా వుందని చెప్పవచ్చు.

ఆతిధ్యం ఇచ్చేవారు పెట్టింది తిని, మర్యాదలను స్వీకరించటం సంస్కారం. కొంత మంది మా పిల్లలు అది తినరు తినరు అనిముందే చెప్పి ఇబ్బంది పెడతారు. అలవాటైన ఆహారం తప్ప కొత్తదానిని రుచిచూసేందుకు ఇచ్చగించని తరహా మనిషి ట్రంప్‌. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం జపాన్‌ వచ్చిన ట్రంప్‌ అక్కడ వడ్డించిన చేపను చూసి అది వద్దంటూ బర్గర్‌ కావాలని మరీ మారాం చేసి తెప్పించుకుతిన్నాడంటూ ఈ సందర్భంగా వార్తలు వచ్చాయంటేనేే ట్రంప్‌కు పెద్ద అవమానం. ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఆయా దేశాల వారు వడ్డించిందా లేక మరేం తింటారు అంటూ ఐరోపా, జపాన్‌ మీడియాలో కథనాలు రాశాయి. మా వృద్ధ ట్రంప్‌ బర్గర్‌ తప్ప మరొకటి తినడు అని అధికారులుప్పందించారేమో జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన ప్రారంభంలోనే వారి సాంప్రదాయ వంటకాల బదులు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న బీఫ్‌తో తయారు చేసిన బర్గర్‌నే మధ్యాహ్న విందుగా వడ్డించే ఏర్పాటు చేయాల్సి వచ్చిందట.

ట్రంప్‌ అభిరుచులు, అలవాట్లు వ్యక్తిగతం. గొడ్డు, పంది మాంసంతో తయారు చేసే హాంబర్గర్‌లు ఎన్ని తిన్నా ప్రపంచానికేమీ ఇబ్బంది లేదు. ఆ పెద్దమనిషి పర్యటనలో ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ వారు పెట్టింది తినకపోవటం, దక్షిణ కొరియాలో పెట్టింది తినటం రెండూ వివాదాస్పదం కావటం విశేషం. జపాన్‌-దక్షిణ కొరియాల మధ్య వివాదాస్పదంగా వున్న దీవుల జలాల నుంచి తెప్పించిన రొయ్యలతో సహా దక్షిణ కొరియా వంటకాలు వడ్డించటం, వాటిని లట్టలు వేసుకుంటూ ట్రంప్‌ తినటం అంటే ఆ దీవులపై దక్షిణ కొరియా హక్కును అమెరికా గుర్తించినట్లే, ఇది జపాన్‌ వ్యతిరేకమైనది అని జపాన్‌ మీడియా వ్యాఖ్యానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కొరియాను ఆక్రమించిన జపాన్‌ తన సైనికుల కోసం దక్షిణ కొరియా యువతులను చెరపట్టి అప్పగించారు. అలాంటి వారిలో ఒకరైన 88 సంవత్సరాల లీ యాంగ్‌ సూ ట్రంప్‌ విందు ఆహ్వానితుల జాబితాలో ఒకరుగా ప్రకటించటం తమను నేరగాళ్లుగా పరిగణించటమే అని జపనీస్‌ ప్రభుత్వం భావించింది. దౌత్య పద్దతులలో అమెరికాకు ఆ మేరకు నిరసన తెలిపినట్లు, వుత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా పని చేస్తున్న తరుణంలో ఇలాంటి పనులు తగవని పేర్కొన్నట్లు వెల్లడైంది. మీరు మా ఇంటికొచ్చినా, మేం మీ ఇంటికొచ్చినా మాకు కావాల్సిందే తేవాలి, పెట్టాలి అనే అమెరికా సామ్రాజ్యవాదంతోనే అసలు సమస్య. అందువలన ట్రంప్‌కు ఏం పెట్టారు, ఏ తిన్నారు అనేది కూడా రాజకీయాలు, ఆర్ధికాంశాలతో ముడి పడి వుంటాన్నాయన్నది గమనించాల్సి వుంది.

డెమోక్రటిక్‌ పార్టీ అధినేత బరాక్‌ ఒబామా హయాంలో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం ట్రంప్‌, తరువాత ఎందరు అధ్యక్షులు వచ్చిం తరువాత పరిష్కారం అవుతుందో వారికే తెలియని స్ధితి.రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం మాదిరి ప్రపంచ మార్కెట్‌ను చాపచుట్టినట్లుగా తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పరిస్ధితి పీకసన్నం-బానకడుపులా వుంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా వుంటాయో జోస్యం చెప్పలేము గాని, గతం మాదిరి ఏకఛత్రాధిపత్యం వహించటం సాధ్యం కాని పరిస్థితి నేడు నెలకొంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర మాత్రం కాదన్నట్లు సామ్రాజ్యవాదులు మొత్తంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు, దేశాలకు వ్యతిరేకత విషయంలో ఐక్యంగా వుంటున్నారు, ప్రపంచ మార్కెట్‌ను పంచుకోవటంలో విబేధాలను దాచుకోవటం లేదు.

ఐదు ఆసియా దేశాల పర్యటనలో తొలి పాదం మోపిన జపాన్‌లో ప్రధాని షింజో అబేతో గోల్ఫ్‌ ఆడటానికి వెళ్లబోయే ముందు యోకోటా వైమానికస్ధావరంలో అమెరికన్‌ సైనికులతో మాట్లాడారు. పరోక్షంగా వుత్తర కొరియాను వుద్దేశించి మాట్లాడుతూ అమెరికా సంకల్పాన్ని ఎవ్వరూ, ఏ నియంత, ఏ ప్రభుత్వమైనా తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరికలు జారీ చేశాడు. గతంలో తమను తక్కువ అంచనా వేసిన ఎవరికీ అది సంతోషకరంగా లేదు, మేము లంగలేదు, ఎలాంటి సడలింపులు లేవు అన్నాడు. తరువాత దక్షిణ కొరియా పార్లమెంట్‌ సభ్యుల నుద్ధేశించి మాట్లాడుతూ ట్రంప్‌ ఇదే మాదిరి హెచ్చరికలు జారీ చేయటమే కాదు, అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి తయారీ కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే మిలిటరీ చర్య తీసుకుంటామని సోషలిస్టు కొరియాపై బెదిరింపులకు దిగాడు.

రాజధాని టోకియోలో వుభయ దేశాల వాణిజ్యవేత్తల సమావేశంలో మాట్లాడుతూ జపాన్‌ అక్రమ వ్యాపార పద్దతులను అనుసరిస్తోందని ట్రంప్‌ విమర్శలు గుప్పించాడు.’ గత కొన్ని దశాబ్దాలుగా జపాన్‌ విజయం సాధిస్తోందని మీరు తెలుసుకోవాలి, ప్రస్తుతం జపాన్‌తో మా వ్యాపారం న్యాయబద్దంగా లేదు, మాకు మార్కెట్‌ను తెరవలేదు. మీరు ఇక్కడి నుంచి కార్లను షిప్పుల్లో రవాణా చేయటం కాదు, అమెరికాలో తయారు చేసేందుకు ప్రయత్నించండి, అలా అడగటం మొరటుగా వుందా’ అని ప్రశ్నించాడు. చైనా తరువాత అమెరికన్ల వాణిజ్యలోటు కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతుల కారణంగా జపాన్‌తోనే ఎక్కువగా వుంది. రాజకీయంగా అమెరికాతో వున్న బంధం కారణంగా జపాన్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. నిజానికి రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య విబేధాలు కొత్తవి కాదు. అమెరికాలో అమ్ముడౌతున్న జపాన్‌ బ్రాండ్‌ కార్లలలో 75శాతం అమెరికాలోనే తయారు చేస్తున్నామని కార్ల తయారీ వాణిజ్య సంస్ధల అసోసియేషన్‌ తెలిపింది. పసిఫిక్‌ సముద్ర ప్రాంత దేశాల స్వేచ్చా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్‌ నిర్ణయించారు, కొనసాగాలని జపాన్‌ కోరుతోంది. రెండు దేశాల మధ్య పన్నుల విషయంలో విబేధాలు ఎడతెగటం లేదు. అమెరికన్‌ కార్ల అమ్మకాలపై జపాన్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని, ఘనీభవింపచేసిన గొడ్డు మాంసం, వ్యవసాయ వుత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

గతేడాది అమెరికా ఎన్నికల ప్రచారంలో చైనా శత్రువు అని చెప్పిన ట్రంప్‌ చైనా పర్యటనలో పొగడ్తలు కురిపించాడు. గ్రేట్‌ హాల్‌లో మాట్లాడుతూ రెండు పెద్ద దేశాల మధ్య పెద్ద వాణిజ్యంలో తమకు న్యాయం జరగలేదని అయితే దానికిి చైనా తప్పేమీ లేదని, తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పర్యటన సందర్భంగా 25వేల కోట్ల డాలర్ల మేరకు ఆర్ధికలావాదేవీలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ట్రంప్‌ పర్యటన లేకపోయినా రెండు దేశాల మధ్య అది జరిగి వుండేదని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

చైనాతో వాణిజ్యం గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆసియా పర్యటనలో ఇంతవరకు చేసిన పెద్ద తప్పిదం, సిగ్గు చేటు, అమెరికా, ఆ ప్రాంత కార్మికులకు ఇది భయంకర వర్తమానం, డెమోక్రాట్లకు ఇది మాంస విందు అవుతుంది అని అమెరికాలోని చైనా అధ్యయనాల సంస్ధ నిపుణుడు ఎలీ రాట్నర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో వాణిజ్యలోటుకు తమ గతపాలకులదే బాధ్యత అని చైనాలో చెప్పిన ట్రంప్‌ తరువాత అపెక్‌ సమావేశంలో నాలుకను మరోవైపు తిప్పాడు.చైనా పేరు ప్రస్తావించకుండా ఈ ప్రాంత దేశాలు అనుచిత వ్యాపార పద్దతులు అనుసరిస్తున్నాయని, ఇక ముందు తమతో అలా కుదరదు అన్నాడు. దుర్విధి అనే నరకంలో పడకుండా తప్పించేందుకు అమెరికన్లు మతి తప్పిన ముసలి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని తమపై చేసిన వ్యాఖ్యలపై వుత్తర కొరియా వ్యాఖ్యానించింది. ఈ పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు నిజంగానే దాన్ని నిర్ధారిస్తున్నాయి. వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ కొవ్వుబలిసిన పొట్టోడంటూ అవమానకరవ్యాఖ్యలు చేసిన నోటితోనే కొద్ది గంటల తరువాత భవిష్యత్‌లో ఇరువురం స్నేహితులుగా వుండవచ్చు అన్నాడు. వియత్నాంలో మానవహక్కులకు భంగం కలిగిస్తున్నారని దుమ్మెత్తి పోసిన ట్రంప్‌ తాజా పర్యటనలో ప్రపంచంలోని గొప్ప అద్భుతాలలో వియత్నాం ఒకటి అని పేర్కొన్నాడు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకోలేదని అధ్యక్షుడు పుతిన్‌ చెప్పిన మాటలను నేను నమ్ముతున్నాను అని గతంలో చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు మాట మార్చాడు. రిపబ్లికన్‌ పార్టీకి(ట్రంప్‌కు) అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారని సిఐఏ నివేదించిన విషయం తెలిసిందే. అమెరికా గూఢచార, దర్యాప్తు సంస్ధల నివేదికలను నేను విశ్వసిస్తానా లేదా అన్నది సమస్యకాదు, వాటికినేను కట్టుబడి వున్నాను, ప్రత్యేకించి ప్రస్తుతం పని చేస్తున్న సంస్ధలు మంచివారిని కలిగి వున్నాయి అని చెప్పాడు. ట్రంప్‌ పర్యటన అన్నింటిలో అమెరికాకు ప్రధమ స్ధానం అన్నలక్ష్యంతో సాగిందా లేక ఆ స్ధానంలో చైనాను ప్రవేశ పెట్టేందుకు వచ్చారా అన్నది అర్ధం కావటం లేదన్న వ్యాఖ్య కూడా వెలువడింది.ఆసియా పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అనేక మంది పరిశీలకులు తలలు పట్టుకుంటున్నారు.అనేక మందికి ఆశించిన కిక్కు రాలేదు. తన తీరుతెన్నులను తప్పుపడితే ట్రంప్‌కు కోపం, పొగిడితే జనాల్లో పలుచన. కార్పొరేట్‌ మీడియాకు ఇరకాటమే మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మాస్కోలో వైఫల్యం-బీజింగ్‌లో విజయం !

14 Tuesday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, china communist party, communist, Donald trump, Socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-4

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఏడవ తేదీ సందర్భంగా వంద సంవత్సరాల బోల్షివిక్‌ విప్లవం గురించి ముందుగానే మొదలైన చర్చ తరువాత కూడా ప్రపంచ మీడియాలో సాగుతోంది. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా బోల్షివిక్‌ విప్లవం గురించి వెలువడే వ్యతిరేక,సానుకూల అంశాలన్నింటిపై మధనం జరగవలసిందే. పాత, కొత్త తరాలు వాటి మంచి చెడ్డలను గ్రహించాలి. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ విధానాలదే పైచేయిగా వున్నప్పటికీ ప్రస్తుతం వాటికి ప్రాతినిధ్యం వహించే దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తమ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వాటికి దిక్కు తోచటం లేదు. మొత్తంగా చూసినపుడు సోషలిస్టు దేశాలు-పెట్టుబడిదారీ దేశాల మధ్య వైరుధ్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు తమ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో వాటి మధ్య విబేధాలు కూడా కొనసాగుతూనే వున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలోకి రాక ముందు 1949 నుంచి 1994 వరకు ఏడు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందాలు జరిగాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు 16సంవత్సరాలు గడిచినా కొనసాగుతూనే వున్నాయి. సాగదీతలో ఇప్పటికి ఇదే ఒక రికార్డు అయితే ఇంకెంతకాలానికి ఒప్పందం కుదురుతుందో తెలియదు. అమెరికా-ఐరోపాయూనియన్‌ల మధ్య తలెత్తిన విబేధాలే దీనికి కారణం. ఎవరిదారి వారు చూసుకొనే క్రమంలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషలిస్టు దేశాలను ఒకవైపు దెబ్బతీయాలని చూస్తూనే మరోవైపు వాటితో సఖ్యతగా వుండే ద్వంద్వ వైఖరిని ధనిక దేశాలు అనుసరిస్తున్నాయి. రెండో వెసులుబాటు గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు వుండేది కాదు.

ఒక సైద్ధాంతిక ప్రత్యర్ధిగా భావించే చైనాను ఎదుర్కొనే క్రమంలో ప్రజాస్వామిక దేశాలు తమ వైఫల్యాలను గుర్తించాల్సి వుందని ఐరిష్‌ టైమ్స్‌ వాఖ్యాత మార్టిన్‌ వూల్ఫ్‌ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యాన సారాంశం ఇలా వుంది. నాటి రష్యానేతల కంటే చైనా గ్జీ మరింత జాగ్రత్తగా వున్నారు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నూతన యుగంలోకి ప్రవేశించిందని ఎంతో ధృడంగా చెప్పారు. తమ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకుంటూనే అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుకొనే ఇతర దేశాలకు చైనా కొత్త అవకాశాలను కల్పిస్తోంది. లెనినిస్టు రాజకీయ వ్యవస్ధ చరిత్ర అవశేషాలనుంచి వుద్భవించింది కాదు, ఇంకా అదొక నమూనాగా వుంది. సోవియట్‌ పారిశ్రామికీకరణ నాజీ సైన్యాలను ఓడించటానికి తోడ్పడింది. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ, ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అదే పెద్ద అసాధారణ రాజకీయ పరిణామం. ఇదిలా వుండగా అత్యంత ముఖ్యమైన ఆర్ధిక పరిణామం దారిద్య్రం నుంచి మధ్యతరగతి ఆర్ధిక స్ధాయికి చైనా ఎదుగుదల. అందుకే గ్జీ చైనాను ఒక నమూనాగా చెప్పగలుగుతున్నారు. మాస్కోలో విఫలమైన వ్యవస్ధ బీజింగ్‌లో ఎలా విజయవంతం అయిందన్నది ఇంకా తెలియాల్సి వుంది. రెండింటికి మధ్య వున్న పెద్ద తేడా ఏమంటే మావో తరువాత లెనినిస్టు రాజకీయ వ్యవస్ధను అట్టేపెట్టిన డెంగ్‌ సియావో పింగ్‌ సూక్ష్మబుద్ధితో కూడిన నిర్ణయాలు. అన్నింటికీ మించి ఆర్ధిక వ్యవస్ధను బయటివారికి తెరుస్తూనేే పార్టీ ఆధిపత్యపాత్రను కొనసాగించటం. చైనీయులు వర్ణించే జూన్‌ నాలుగవ తేదీ సంఘటన,పశ్చిమ దేశాలు 1989 మారణకాండగా పిలిచిన వుదంతం సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ అదుపు గురించి ఎంత పట్టుదలగా వున్నారో తెలియచేశాయి. ఆర్ధిక సంస్కరణల కొనసాగింపులో ఎన్నడూ తడబడలేదు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి.

Image result for 1991 soviet coup,lenin statue

సోవియట్‌ యూనియన్‌ కూడా అటువంటి బాటనే అనుసరించి వుండాల్సింది అనే చర్చ ప్రారంభమై వుండాల్సింది కానీ జరగలేదు. దీని ఫలితంగా శతాబ్దం క్రితం జరిగిన అక్టోబరు విప్లవాన్ని ఎలా గుర్తించాలి అనేది నేటి రష్యాకు తెలియకుండా పోయింది. లెనినిజం, మార్కెట్‌తో చైనా బంధపు పర్యవసానాలేమిటి? చైనా నిజంగానే పశ్చిమ దేశాల నుంచి ఆర్ధికశాస్త్రాన్ని నేర్చుకుంది.అయితే ఆధునిక పశ్చిమదేశాల రాజకీయాలను తిరస్కరించింది.చైనా అభివృద్ధి చెందే కొద్దీ లెనినిస్టు రాజకీయాలు, మార్కెట్‌ అర్ధికవిధానాల జమిలి వైఖరి పని చేస్తుందా? అంటే మనకు తెలియదనే సమాధానం చెప్పాలి. ఈ వ్యవస్ధ ఇప్పటి వరకు అద్భుతంగా పనిచేసింది. దీర్ఘకాలంలో పార్టీ మీద ఒక వ్యక్తి ఆధిపత్యం, చైనా మీద ఒక పార్టీ ఆధిపత్యం నిలబడదు. ఇదంతా దీర్ఘకాలంలో జరిగేది, తక్షణ స్ధితి సుస్పష్టం. ఏక వ్యక్తి నియంత్రించే లెనినిస్టు నిరంకుశపాలనలో చైనా ఒక ఆర్ధిక అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఎదుగుతున్న ఈశక్తి మిగతా ప్రపంచమంతా శాంతియుతంగా సహకరించటం తప్ప మరొక అవకాశం లేదు. వుదారవాద ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నవారందరూ ఆర్ధిక చైనాను మాత్రమే కాదు ప్రముఖ సైద్ధాంతిక ప్రత్యర్ధిగా కూడా గుర్తించాల్సిన అవసరం వుంది.ఒకటి, నిష్కారణంగా చైనాతో ప్రతికూల సంబంధాలను పెంచుకోకుండా పశ్చిమ దేశాలు తమ సాంకేతిక, అర్ధిక వున్నతిని కొనసాగించాలి. చైనా మన వ్యాపార భాగస్వామే తప్ప స్నేహితురాలు కాదు. రెండవది ఎంతో ముఖ్యమైనది, ఈరోజు మాదిరి దుర్బలంగా వున్న పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా కాకపోయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా తమ ఆర్ధిక యాజమాన్యం మరియు రాజకీయాలు సంతృప్తికరంగా లేవన్న వాస్తవాన్ని గుర్తించి, నేర్చుకోవాలి. పశ్చిమ దేశాలు తమ ద్రవ్యవ్యవస్ధను ఎటూ కదలని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయే విధంగా వదలివేశాయి.తమ భవిష్యత్‌కు చేసే ఖర్చు విషయంలో గుచ్చి గుచ్చి వ్యవహరించాయి. ముఖ్యంగా ఆర్ధికవిజేతలు-పరాజితుల మధ్య ప్రమాదకరమైన అఘాతం పెరగటాన్ని అమెరికా అనుమతించింది. తన రాజకీయాలలో అబద్దాలు, విద్వేషానికి తావిచ్చింది.

ఇంకా మరికొన్ని విషయాలు తన విశ్లేషణలో పేర్కొన్న మార్టిన్‌ వూల్ప్‌ కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి కలిగినవాడేమీ కాదు. చైనా సోషలిజం కూలిపోతుందని జోస్యం చెప్పాడు. విధిలేని పరిస్ధితుల్లో అవకాశం వచ్చేంత వరకు చైనాతో మంచిగా వుండి సమయంరాగానే దెబ్బతీయాలని పరోక్షంగా సూచించాడు. చైనా వ్యాపార భాగస్వామి తప్ప స్నేహితురాలు కాదనటంలో అంతరంగమిదే. సంక్షోభాన్నుంచి బయటపడేందుకు,లాభాల కోసం పెట్టుబడిదారీ వర్గం సోషలిస్టు దేశాలతో సఖ్యంగా వుండటం అన్నది 1980 దశకం తరువాతి ముఖ్యపరిణామం. అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలన్నీ గత కొద్ది దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానమిదే.

తాజా తొలి ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా, వియత్నాంల అభివృద్ధి గురించి పొగిడారు.చైనాతో వాణిజ్యలోటుకు తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పారు.మార్టిన్‌ చెప్పినట్లు ఆర్ధిక అవసరాల కోసం అలా చెప్పాడు తప్ప సైద్ధాంతికంగా కమ్యూనిస్టు వ్యతిరేక చర్యతోనే ఆ దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టటం ట్రంప్‌ వర్గనైజం. బోల్షివిక్‌ విప్లవానికి వందేండ్ల సందర్భంగా నవంబరు ఏడును ‘కమ్యూనిజం బాధితుల జాతీయ దినం ‘గా ప్రకటించి మరీ వచ్చాడు. వాస్తవానికి రోసెన్‌బర్గ్‌ దంపతులను వురితీయటంతో సహా అనేక మందిని వెంటాడి వేధించిన దుష్ట చరిత్ర వారిదే.కమ్యూనిజం గతించిందని, దానిని పాతిపెట్టామని, అంతిమ విజయం సాధించామని చెప్పుకున్న పాతికేండ్ల తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఇంకా భయపడుతున్నాయి.పోరులో ఒక రంగంలో ఓడిపోవచ్చు, అంతమాత్రాన యుద్ధం ఓడిపోయినట్లు కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ అనేక రంగాలలో విజేతగా వున్నాడు, సోవియట్‌ గడ్డపై జరిగిన నిర్ణయాత్మకపోరులో కమ్యూనిస్టుల చేతిలో ఓటమిపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా బోల్షివిక్‌ విప్లవాన్ని వమ్ముచేసినంత మాత్రాన దోపిడీ వర్గం అంతిమ విజయం సాధించినట్లు సంబరపడితే అది కార్మికవర్గాన్ని మరింతగా కర్తవ్యోన్ముఖులుగా మారుస్తుంది.

అక్టోబరు విప్లవం జయప్రదం అయిన తరువాత సోవియట్‌ను దెబ్బతీయటానికి పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. అంతర్గతంగా సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే శక్తుల విచ్చిన్న కార్యకలాపాలకు తోడు, బయట రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేవరకు ఇరుగుపొరుగు దేశాలతో సోవియట్‌ సంబంధాలు సజావుగా లేవు. ఏడు సంవత్సరాల తరువాత 1924లో మాత్రమే బ్రిటన్‌ సోషలిస్టు రష్యాను గుర్తించింది. ప్రతి దేశంతో ఏదో ఒక సమస్య, సహాయ నిరాకరణ. వీటన్నింటినీ తట్టుకొని స్టాలిన్‌ నాయకత్వంలో సోవియట్‌ బలపడింది.

సోషలిస్టు చైనాకు సైతం పాతిక సంవత్సరాల పాటు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో గుర్తించకుండా అడ్డుకున్నారు. ఇటువంటి స్ధితి చరిత్రలో మరేదేశానికీ వచ్చి వుండదు. మార్టిన్‌ పేర్కొన్నట్లు చైనాలో కమ్యూనిస్టు పార్టీ తన పట్టును పెంచుకున్న తరువాత డెంగ్‌ హయాంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర రాజకీయ నిర్ణయాలు నేటి చైనా అవతరణకు దోహదం చేశాయి. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను కూలదోసేందుకు జరిగిన ప్రయత్నాన్ని నిర్ణయాత్మకంగా ఎదుర్కొనటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర,దానికి జనామోదం లభించటానికి ఎంతో ముందు చూపుతో డెంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ ప్రారంభించిన సంస్కరణలతో తమ జీవితాలు మెరుగుపడుతున్నాయని జనం గ్రహించటం కూడా ఒక ప్రధానకారణం.చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోని ప్రజా మిలిటరీ తియన్మెన్‌ స్క్వేర్‌ కుట్రను మొగ్గలోనే తుంచి వేసింది. బహుశా దానిని గమనించే అమెరికా, ఇతరసామ్రాజ్యవాదులు సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలో కుట్రను ముందుకు, మరింత వేగంగా అమలు జరిపినట్లు కనిపిస్తోంది.తియన్మెన్‌ స్క్వేర్‌ ప్రదర్శనలుగా ప్రపంచానికి తెలిసిన ఘటనలు 1989 ఏప్రిల్‌ 15న ప్రారంభమై జూన్‌ నాలుగు వరకు జరిగాయి. తూర్పు ఐరోపాలో అదే ఏడాది నవంబరులో తూర్పు జర్మనీలో, తరువాత సోవియట్‌లో మొదలయ్యాయి. దానిని గుర్తించి అక్కడి కమ్యూనిస్టుపార్టీలు చైనా పార్టీ మాదిరి తమ పాత్రలను మలుచుకొని వుంటే చరిత్ర మరోవిధంగా వుండేది. !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నూటఅరవై కోట్ల మందిని బలితీసుకున్న పెట్టుబడిదారీ విధానం !

07 Tuesday Nov 2017

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, CAPITALISM, communist, mass murdering evil of capitalism, Nazism, revolution

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-3

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు విప్లవానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన జాతీయ, ప్రాంతీయ మీడియాతో పోల్చితే పశ్చిమదేశాల మీడియాలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. తరువాత కూడా అది ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. ధనిక దేశాలలో పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో పెట్టుబడిదారీ పండితులకు అంతుబట్టటం లేదు. దాదాపు ప్రతి దేశంలోనూ ఒకసారి ఎన్నికైన పార్టీ వెంటనే రెండోసారి అధికారంలో కొనసాగే పరిస్థితి లేదు. పాలకపార్టీల పేర్లు, కొన్ని అంశాలపై భిన్న వైఖరులు కలిగి వుండటం తప్ప అనుసరిస్తున్న విధానాలన్నీ ఒకే విధంగా వుంటున్నాయి. పళ్లూడగొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా జనం మీద భారాలు మోపటానికి, సంక్షేమ పధకాలకు కోత పెట్టటంలో ఏ పార్టీ అయినా ఒకే విధంగా వ్యవహరించటమే దీనికి కారణం.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దానికి వెన్నుదన్నుగా నిలిచిన కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో పెల్లుబికిన కమ్యూనిస్టు వుద్యమంపై మొదటి, రెండవ సాదారణ ఎన్నికల సందర్భంగా నాటి మీడియా ఎంత తప్పుడు ప్రచారం చేసిందో పాత తరాలకు, చరిత్ర కారులకు తెలిసిందే.అయితే పశ్చిమ దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా సాగుతూనే వుంది. దాని కొనసాగింపుగానే వందేండ్ల బోల్షివిక్‌ విప్లవం గురించి ఇప్పుడు కూడా చెడరాసిపారేస్తున్నారు. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల మానస పుత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక నవంబరు ఆరున వంద సంవత్సరాల కమ్యూనిజంలో వందమిలియన్ల మంది హత్య అంటూ ఒక శీర్షికతో ఒక వార్త, అంతకు మూడు రోజుల ముందు కమ్యూనిజపు రక్త శతాబ్దం పేరుతో మరొక వార్తను ప్రచురించింది. ఇంకా అనేక పత్రికలు గతంలో కూడా ఆ సమాచారాన్నే అటూ ఇటూ మార్చి గత కొద్ది సంవత్సరాలుగా పాఠకుల మీద రుద్దుతున్నాయి. వాటిని జనం పూర్తిగా నమ్మటం లేదని అక్టోబరులో అమెరికాకు చెందిన కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ విడుదల చేసిన ఒక సర్వేలో పేర్కొన్న విషయం తెలిసిందే.(అమెరికాలో అక్కడి ప్రభుత్వం కమ్యూనిస్టులను వేటాడి వేధించింది తప్ప కమ్యూనిస్టుల బాధితులు లేకపోయినా ఆ పేరుతో ఒక సంస్ధ ఏర్పాటు చేయటమే విడ్డూరం) ఈ ప్రచారం ఎంత హాస్యాస్పదం అంటే రష్యా, చైనాలలో సంభవించిన కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాలలో మరణించిన వారిని కూడా కమ్యూనిస్టులే చంపివేశారని చెబుతారు. అంతకంటే అత్యంత దుర్మార్గమైన ప్రచారం ఏమంటే ఫాసిస్టులు-నాజీలు, వారి పీచమణిచి ప్రపంచాన్ని రక్షించిన కమ్యూనిస్టులను ఒకేగాట కట్టి జనాన్ని చంపటంలో కమ్యూనిస్టులకు, ఫాసిస్టులకు తేడా లేదు. ఇద్దరూ మారణహోమానికి పాల్పడ్డారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా మొత్తంగా సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, వారికి వూడిగం చేసే వారి చేతుల్లో వుంది కనుక గోబెల్స్‌ మాదిరి పదే పదే ప్రచారం చేసి అనేక మంది బుర్రలను కలుషితం చేస్తున్నారు.

నరహంతకులు ధరాధిపతులైనారన్నట్లు లాభాల కోసం పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ప్రపంచంలో మానవాళిపై జరిపినన్ని దుర్మార్గాలు మరొకరు జరపలేదు. మానవత్వాన్నే పరిహసించారు. వారు హరించిన మానవ హక్కులకు అంతేలేదు. పెట్టుబడిదారీ విధానం, దానిని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్న పాలకులు జరిపిన దాడులు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో జనాన్ని గాలికి వదలి వేయటం వంటి బాధ్యతా రాహిత్యం వంటి సకల అనర్ధాలు వలన పెట్టుబడిదారీ విధానం నూట అరవై కోట్ల మందికిపైగా జనాల మరణాలకు కారణమైందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.https://prolecenter.wordpress.com/2017/08/21/1-6-billion-killed-by-capitalism/ కమ్యూనిస్టుల పాలనలో కరువులలో మరణించినా అందుకు వారే బాధ్యులంటున్న వారు ఆ ప్రాతిపదికను మిగతావారికి ఎందుకు వర్తింప చేయరు?

బ్రిటీష్‌ వారి ఆక్రమణ సమయంలో మన దేశంలో సంభవించిన బెంగాల్‌ కరవులో కోటి మంది, అంతకు ముందు సంభవించిన వాటిలో మూడు కోట్ల మంది మరణించారు. మన దేశాన్ని బ్రిటీష్‌ వారు ఆక్రమించే క్రమంలో జరిగిన యుద్ధాలు, దాడులు, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరో రెండు కోట్లు. ఇక ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు ఐరోపా ధనిక దేశాలు ఐరోపా ఖండంలో, ఇతర ఖండాలలో జరిపిన యుద్ధాలు, వాటిలో చిందిన రక్తం, పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరిది? రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వియత్నాం, కంపూచియా, లావోస్‌లతో కూడిన ఇండో చైనా ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు జపాన్‌,ఫ్రాన్స్‌, అమెరికా జరిపిన దాడుల్లో మరణించిన లేదా గాయపడిన వారు దాదాపు కోటి మంది వున్నారు. మారణాయుధాల గుట్టలను వెలికితీసే పేరుతో ఇరాక్‌పై అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు జరిపిన దాడులు, ఆంక్షల కారణంగా మరణించిన లక్షల మంది గురించి తెలిసిందే. ఇక రెండు ప్రపంచ యుద్ధాలకు కారకులు ప్రజాస్వామిక దేశాలుగా చెప్పుకొనే అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఫాసిస్టు, నాజీలు, నియంతలుగా పేరు పడిన జర్మనీ, జపాన్‌,ఇటలీ వారితో చేతులు కలిపిన వారు తప్ప కమ్యూనిస్టులు కాదే. ఆ యుద్ధాలలో జరిగిన ప్రాణ నష్టాలను ఎవరి ఖాతాలో వేయాలి? వియత్నాం యుద్ధంలో అమెరికన్లు ప్రయోగించిన రసాయనిక ఆయుధాల వలన యుద్ధం ముగిసిన నాలుగు దశాబ్దాల తరువాత కూడా అనేక ప్రాంతాలలో పంటలు పండకపోవటం, జనం రోగాల బారిన పడటం చూస్తున్నదే. జపాన్‌పై అమెరికా ప్రయోగించిన అణ్వాయుధ ప్రభావం డెబ్బయి సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అనుభవిస్తున్నారు. మ్యూనిజాన్ని అరికట్టేపేరుతో ఇండోనేషియాలో నియంత సుహార్తోను ప్రోత్సహించి దాదాపు పది లక్షల మంది మ్యూనిస్టులు,అభిమానులను హత్య చేయించటంలో అమెరికన్లకు పాత్ర వుందని ఇటీవలే బయటపడిన విషయం తెలిసిందే. పెట్టుబడిదారీ విధానంలో భాగంగా సంభవించిన ఆర్ధిక సంక్షోభాలలో చితికిపోయిన కుటుంబాలు, మరణాలకు బాధ్యత ఎవరిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు, దారుణాలకు పాల్పడిన దేశాలు, వారిని నడిపించిన పెట్టుబడిదారీ విధానం, ప్రజాస్వామ్యం మాటేమిటి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోషలిజంపై చిత్త భ్రమణ తంత్ర విద్య ప్రయోగం !

06 Monday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Bolshevik Revolution, CAPITALISM, capitalist crisis, China, communist, Communist Revolution, Mind Games, new American socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -2

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కొన్ని సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన తీవ్ర ఎదురుదెబ్బలు ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇదే సమయంలో విద్య, సమాచార వ్యవస్ధ కొత్త పుంతలు తొక్కి అరచేతిలోకి అందుబాటులోకి రావటం వంటి పరిణామాలతో కమ్యూనిస్టు సిద్ధాంతంపై దాడి కగతం కంటే తీవ్రంగా జరుగుతోంది. కొత్త ఎత్తుగడలు అనుసరించటాన్ని అన్ని రంగాలలో చూడవచ్చు. గతంలో మాదిరి కమ్యూనిజాన్ని నేరుగా వ్యతిరేకిస్తే లాభం వుండదని గత వంద సంవత్సరాల అనుభవాలు దోపిడీ వర్గానికి నేర్పాయి. అంటే దొంగ దెబ్బలకు పూనుకున్నాయి, దీంతో కమ్యూనిస్టుల పనిని మరింత సంక్లిష్టం గావించాయని చెప్పాలి. శత్రువును చంపదలచుకుంటే ప్రత్యక్ష పోరాటంలో ఎంతో కష్టపడాలి, అదే తీపి మాటలతో వెన్నుపోటు పొడిచి అంతం చేయటం ఎంతో సులభం. ఈ కుటిల నీతిని కమ్యూనిస్టు వ్యతిరేకులు బాగా ప్రయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో నవతరం సోషలిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితులు కావటం గతం మాదిరి సులభం కాదు. అయితే దోపిడీ వ్యవస్ధ ఎప్పటికపుడు తనకు తెలియకుండానే యువతరాన్ని ఆవైపు నెడుతోంది. పీడితులు కూడా తమ ఆయుధాలను సన్నద్దం చేసుకోవటం అనివార్యం.

అమెరికాలోని కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ అనే సంస్ధ తన వార్షిక నివేదికలో భాగంగా యు గవ్‌ అంటే మీ ప్రభుత్వం అనే ఒక పరిశోధనా సంస్ధతో కలసి అక్టోబరు చివరి వారంలో ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సంస్ధ ప్రమేయంతో ఇలాంటి నివేదికల తయారీకి రూపొందించే ప్రశ్నావళి స్వభావం,లక్ష్యం ఎలా వుంటుందో తెలిసిందే. వెన్నుపోటు ఎత్తుగడలో ఇదొక భాగం. ఈ సర్వే సెప్టెంబరు 28 అక్టోబరు 5 మధ్య జరిగింది. అమెరికా ప్రధాన మీడియా అంతటా ఆ సమయంలో అమెరికా దృష్టిలో ధూర్త దేశంగా వున్న సోషలిస్టు-కమ్యూనిస్టు వుత్తర కొరియా జపాన్‌ మీదుగా, అమెరికా తీరంలోని దీవులలో కూడా పడే ఖండాంతర క్షిపణి ప్రయోగాలను జరిపిందని, అమెరికన్లకు ముప్పు తెచ్చిందంటూ ముమ్మరంగా ప్రచార దాడి జరిపిన సమయమది. సర్వేపై దాని ప్రభావం పడకుండా ఎలా వుంటుంది. అందువలన దానికి వుండే పరిమితులను గమనంలో వుంచుకోవాలి. ఈ నివేదికలో కొన్ని అసంబద్దతలు, తర్కానికి నిలబడని అంశాలున్నాయి.

ప్రపంచానికి కమ్యూనిజం ఇప్పటికీ ఒక సమస్యగానే వుందని నమ్ముతున్న అమెరికన్లు 75శాతం వున్నారని, గతేడాది కంటే ఐదుశాతం ఎక్కువంటూ సర్వే తొలి అంశంగా ఆ నివేదిక ప్రారంభమైంది. ప్రతి పదిమందిలో ఏడుగురు అమెరికన్లకు కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకపోవటం లేదా తప్పుగా గుర్తించారట. ఇదే సమయంలో నూతన సహస్రాబ్ది యువతరంగా పరిగణించబడేవారిలో సోషలిజం పట్ల సానుకూలత పెరుగుతోంది. జనాభా మొత్తంగా చూసినపుడు 63శాతం పెట్టుబడిదారీ, నాలుగు శాతం ఫాసిస్టు దేశంలో జీవించాలన్న అభిలాషను వ్యక్తం చేయగా సోషలిస్టు-కమ్యూనిస్టు దేశంలో నివశించాలన్న కోర్కె 37 శాతం మందిలో వ్యక్తమైంది. ఇదే సహస్రాబ్ది యువతలో 49, 51శాతం వున్నారు. ప్రస్తుతం అమెరికా జనాభాలో సహస్రాబ్దితరంగా పరిగణించబడేవారు ఎక్కువగా వున్నారు. నివేదిక మొత్తంలో కమ్యూనిస్టు వ్యతిరేకతనే ప్రధానంగా చూపినప్పటికీ ఈ ఒక్క అంశంపై కమ్యూనిస్టు వ్యతిరేకులు కలవర పడుతున్నారు. గతంలో విదేశాలలో పెరుగుతున్న సోషలిస్టు అభిమానులను చూసి భయపడిన అమెరికన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులు ఇప్పుడు తమ యువతను చూసి తామే భయపడుతున్నారన్నమాట. ఎంతలో ఎంత మార్పు? సహస్రాబ్ది యువతలో ఇటువంటి భావాలు ఏర్పడటానికి కారణం 53శాతం మంది అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అభిప్రాయం పడటం కావచ్చని సర్వే రచయితలు వ్యాఖ్యానించారు.

‘ ప్రస్తుతం అమెరికాలో సహస్రాబ్ది తరం అతి పెద్ద సమూహంగా వుంది. ఆందోళన కలిగించే కొన్ని ధోరణులు తీవ్ర ఆందోళన కలిగించటాన్ని చూస్తున్నాం. సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు మళ్లటం పెరుగుతోంది, చివరికి కమ్యూనిజం కూడా ఆచరణీయ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు’ అని కమ్యూనిజం బాధితుల స్మార ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.ఇదే సమయంలో 1946-64 మధ్య పుట్టిన వారు ఎక్కువగా పెట్టుబడిదారీ విధానానికి,26శాతం మందే సోషలిజానికి మద్దతు ఇస్తున్నారు. అమెరికాలో స్టాలిన్‌ను ప్రతి ఐదుగురిలో ఒకరు హీరోగా భావిస్తుండగా, లెనిన్‌, వుత్తరకొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌లను అభిమానించే వారు ప్రతి నలుగురిలో ఒకరు వున్నారని తేలింది. సోషలిజం, కమ్యూనిజాలకు తేడాతో పాటు అసలు వాటి గురించి తెలియని కారణం, కమ్యూనిస్టు పాలిత దేశాలలో చంపివేయబడిన జనం గురించి తక్కువ అంచనా వేయటం వల్లనే యువత ఈ బాటలో వున్నారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు ‘ఎర్ర శతాబ్దం’ పేరుతో రాసిన సానుకూల వ్యాసాలు కూడా కమ్యూనిజం వెనుక వున్న నిజాన్ని పట్టించుకోకుండా చేశాయని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు.’ సోషలిజం, కమ్యూనిజాల విషయంలో అమెరికన్‌ సమాజంలో చారిత్రక పాండిత్యం ఎంత తక్కువగా వుందో అలజడి వైపు తిప్పుతున్న ఈ పరిణామం వెలుగులోకి తెస్తోంది.వంద సంవత్సరాల క్రితం జరిగిన బోల్షివిక్‌ విప్లవం తరువాత కమ్యూనిజం కారణంగా జరిగిన మారణహోమం, వినాశనం, దుఖం గురించి విద్యార్ధులకు బోధించటంలో వ్యవస్ధ వైఫల్యం గురించి కూడా ఇది వెల్లడించింది.’ అని కూడా మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.

కమ్యూనిస్టుల పాలనలో రోమన్‌ కాధలిక్‌ మతగురువులతో సహా చంపిన వారి సంఖ్య పది లక్షలలోపే అని సర్వేలో పాల్గన్నవారిలో పదిశాతం, 1-250లక్షలని 21, 250-500లక్షలని 15, 500-750లక్షలని 12, 750-1000లక్షలని 11, పది కోట్లకు పైగా అని31శాతం చొప్పున నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ అంకెలకు ఎలాంటి ఆధారాలు లేవు. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా వీటిని తిప్పుతున్నారు. ఈ అతిశయోక్తులను మొత్తంగా 69శాతం మంది తక్కువ చేసి చూశారు. సహస్రాబ్ధి యువతలో గతేడాది మాదిరే తప్ప మార్పు లేదు. గత కొద్ది కాలంగా ముఖ్యంగా 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం తరువాత అమెరికన్‌ యువతలో సోషలిజం, కమ్యూనిజం గురించి సానుకూల వైఖరి వ్యక్తమౌతోంది. అందువలన వారిని గందరగోళంలో పడేయటానికి ఇలాంటి సర్వేలతో ఒకవైపు వారిలో తలెత్తిన మార్పును చెబుతూనే మరోవైపు వెనక్కు లాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు మనం చూడవచ్చు. అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయి? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం, బకెట్లతో సముద్రనీటిని తోడటం ఎలా సాధ్యం కాదో భావజాల వ్యాప్తిని, అసంతృప్తిని అణచివేయటం, పక్కదారి పట్టించటం కూడా అలాంటిదే.

సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం నిజానికి ఒక ప్రయోగం. దాని ఫలితాలు ప్రపంచానికి తెలియవు. అందువలన నిర్మాణంలో ఏవైనా లోపాలుంటే వాటిని స్నేహపూర్వకంగా లేదా సైద్ధాంతికంగా చెప్పటం వేరు. గతంలో సోవియట్‌ యూనియన్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదంగా వర్ణించిన నక్సల్స్‌ తాము కూడా కమ్యూనిస్టులమే అని చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు చైనా అనుసరిస్తున్న విధానాలపై కూడా కొంతమంది అదే రకమైన దాడి చేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సామ్రాజ్యవాదులుగా మారినవి వున్నాయి. అదే విధంగా పెట్టుబడిదారీ పంధాలో పయనిస్తూ అభివృద్ధిలో బాగా వెనుకబడిన దేశాలూ వున్నాయి. అటువంటి దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలు వస్తే ఎంతకాలం అనేది ఎవరూ చెప్పలేకపోవచ్చుగాని కొంత కాలం అదే మాదిరి తేడాలు లేకుండా ఎలా వుంటాయి? చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ అనేది బూటకం, పేరుకే కమ్యూనిస్టు పార్టీ, అక్కడ ఆర్ధిక అంతరాలు చాలా ఎక్కువగా వున్నాయి, ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా దాడి జరుగుతోంది. ఇక్కడ సోషలిజం పట్ల కారుస్తున్న మొసలి కన్నీరును కడవలతో కొలవజాలం. నిజమైన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణ జరగటం లేదని తీవ్ర విచార ప్రదర్శన. ఇదంతా కమ్యూనిస్టు వ్యతిరేకులు, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు కూడా కొందరు చేస్తున్నారు. ఇదంతా సమాజంలోని ఒక భాగం లేదా వ్యక్తులను మానసికంగా తిమ్మినిబమ్మిని చేసి ఇబ్బందులకు గురిచేసే చిత్త భ్రమణ తంత్ర విద్యలో భాగమే.

Image result for US youth, socialism

బ్రెజిల్‌కు చెందిన లూయీస్‌ కార్లోస్‌ బ్రెస్సెర్‌ పెరీరా అనే సామాజిక, ఆర్ధికవేత్త పెట్టుబడిదారీ విధానంలో ఐదు నమూనాలు వున్నాయని విశ్లేషించారు. ఆయనతో ఏకీభవించాలనేమీ లేదు. ధనిక దేశాలలో వుదారవాద ప్రజాస్వామిక లేదా ఆంగ్లో-శాగ్జన్‌ నమూనా, సామాజిక లేదా ఐరోపా, అంతర్జన్య లేదా జపాన్‌, వర్ధమాన దేశాలలో వుదారవాద ఆధారిత నమూనాలు ఆసియాలో ఒక విధంగా, బ్రెజిల్‌తో సహా ఇతర దేశాల నమూనాలు భిన్నంగా వుంటాయని ఆయన చెప్పారు. ఇదే సూత్రం సోషలిస్టు దేశాలకు మాత్రం ఎందుకు వర్తించదు? అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గ నాయకత్వాన విప్లవాలు జయప్రదమౌతాయని మార్క్స్‌-ఎంగెల్స్‌ అంచనా వేశారు. ఆ తరువాత బోల్షివిప్లవానికి ముందు సైద్ధాంతిక చర్చ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం గురించి తప్ప నమూనా, విప్లవ మార్గం గురించి పెద్ద సమస్యలు ముందుకు రాలేదు. బోల్షివిక్‌ విప్లవం తరువాతే ఆచరణలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ తెల్లవారే సరికి పరిష్కారిస్తామని, పరిష్కారమౌతాయని గానీ ఏ కమ్యూనిస్టూ చెప్పజాలరు. వాటిని కూడా దోపిడీ శక్తులు తమ కమ్యూనిస్టు వ్యతిరేక భావజాల అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. పద్దతులను కూడా మార్చుకున్నాయి. గతంలో మాదిరి సోవియట్‌ను వ్యతిరేకించినట్లుగా నేడు చైనాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగేందుకు ముందుకు రావటం లేదు. ఎందుకంటే గతంలో సోవియట్‌ తయారీ వస్తువులతో పాశ్చాత్య దేశాల మార్కెట్లను నింపలేదు, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మేడిన్‌ చైనా దర్శనమిస్తోంది.అయితే అదే సమయంలో సోవియట్‌ను తొక్కివేసేందుకు, కూల్చివేసేందుకు చేసిన కుట్రలకు ఏమాత్రం తీసిపోకుండా చైనాకు వ్యతిరేకంగా చేయాల్సినవి చేస్తున్నాయని మర్చిపోరాదు. అధికారికంగా సంబంధాలు, అనధికారికంగా చైనా, కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిజం మీద విషపూరిత దాడి జరుగుతోంది.

గత వంద సంవత్సరాలలో ఫాసిస్టు శక్తులను అణచివేయటంలో కమ్యూనిస్టులు ఎంతటి త్యాగాలకు పాల్పడతారో, ఎలా సన్నద్దమౌతారో లోకానికి తెలియ చెప్పటంలో సోవియట్‌ యూనియన్‌ జయప్రదమైంది. సోషలిజాన్ని కాపాడుకుంటూ అచిర కాలంలోనే ఒక నూతన అభివృద్ది నమూనాను ప్రపంచం ముందుంచటంలో చైనా జయప్రదమైంది. చైనాలో సమస్యలేమీ లేవా అంటే కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమల వంటివి కూడా జరబడతాయని వాటిని అదుపు చేయాల్సి వుంటుందని కూడా తమకు తెలుసునని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ చెప్పారు. సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఇప్పుడు అధికారికంగా వారే చెబుతున్నపుడు లేవని ఎవరంటారు? అన్ని పెట్టుబడిదారీ దేశాలూ ఒకే విధంగా అభివృద్ధి ఎందుకు చెందలేదు, అన్ని ఖండాలలో ఒకేసారి పారిశ్రామిక విప్లవం ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలకు సమాధానంలోనే సోషలిజానికి కూడా జవాబు దొరుకుతుంది.

చైనాలో వున్నది పెట్టుబడిదారీ విధానం అనే వాదనలతో విబేధిస్తున్నవారు ముందుకు తెస్తున్న అంశాలేమిటో చూద్దాం.పెట్టుబడిదారీ పాలనా విధానంలో అప్రయత్న పూర్వకమైన సంబంధాలతో వస్తూత్పత్తి లాభాల కోసం జరుగుతుంది.లాభాల రేటు పెట్టుబడుల వర్తులాను నిర్దేశించటంతో పాటు ఆర్ధిక సంక్షోభ ఆవర్తనాలను కూడా వుత్పత్తి చేస్తుంది. ఇది చైనాకు ఇంతవరకు వర్తించలేదు. ప్రణాళిక, ప్రభుత్వరంగంలో వుత్పత్తిపై యాజమాన్య పద్దతే ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ అధికార పునాదివేళ్లు ప్రజాయాజమాన్యంలోనే వున్నాయి.పెట్టుబడిదారీ తరహా వుత్పత్తి పద్దతి లేకుండానే చైనా ఆర్ధికంగా ఎదుగుదలను సాధించింది. కీలకమైన 102 ప్రభుత్వ రంగ సంస్దల విలువ ఏడున్నరలక్షల కోట్ల డాలర్లు. వీటిని ప్రయివేటీకరిస్తారని ఎవరైనా ఆశపడుతుంటే అలాంటిదేమీ వుండదని పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రధానమైన ప్రజాయాజమాన్య స్ధితి, ప్రభుత్వ రంగ ఆర్ధిక వ్యవస్ధ నాయకత్వ పాత్రపై ఎలాంటి డోలాయమానం వుండదని అధ్యక్షుడు గీ జింగ్‌ పింగ్‌ గతేడాది స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల వారు గత మూడున్నర దశాబ్దాలుగా చైనా ఆ బాటను వీడి స్వేచ్చా మార్కెట్‌,ప్రయివేటు రంగం నాయకత్వ పాత్ర వహించాలని కోరుతూనే వున్నారు.లాభాపేక్షలేని ప్రణాళికా బద్దమైన ప్రభుత్వరంగ పాత్ర నాయకత్వంలో తలెత్తే సమస్యలను పెద్దవిగా చూపుతూ వాటిని అవకాశంగా మార్చుకోవాలని కంటున్న కలలు ఇంతవరకు కల్లలుగానే మిగిలిపోయాయి. సామాజిక-ఆర్ధిక అంశాల రూపకల్పన, జయప్రదంగా అమలు చేయటంపై నిజానికి చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నది.

2008లో పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత కూడా చైనా అభివృద్ధి రేటు ఏడుశాతం కొనసాగుతున్నది. తమ తరువాత సంక్షోభంలోకి కూరుకుపోవటం చైనా వంతు అని చెప్పిన వారి జోస్యం వాస్తవం కాదని తేలిపోయింది. కొన్ని వడిదుడుకులు తప్ప గత పదిసంవత్సరాలుగా సజావుగా పురోగమిస్తోంది. ఇది కమ్యూనిస్టుపార్టీ, సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత. ఇప్పుడు పెట్టుబడిదారీ ధనిక దేశాలలోని యువతను ఆకర్షించే అంశం ఇది. ఏ స్టోర్‌లో చూసినా చైనా వస్తువులే, పశ్చిమ దేశాల వుద్యోగాలను హరించి చైనా తన వారికి పని కలిపిస్తున్నదన్న వార్తలు ఏదో ఒక రూపంలో వారిని చేరుతూనే వున్నాయి. ఈ నేపధ్యంలో పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అనేదే గీటు రాయి అనుకుంటే ఇప్పటి వరకు పెట్టుబడిదారీ విధానం ఒరగబెట్టిందేమీ లేదు, రాబోయే రోజుల్లో ఏదో చేస్తుందనే ఆశ కనిపించటం లేదు, అందువలన సోషలిజమే మెరుగు, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్న ఆలోచన తలెత్తుతోంది. సోషలిస్టు భావన వునికిలోకి వచ్చిన తరువాత సాధించిన పెద్ద విజయాలలో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ సిద్ధాంత వేత్తలు సోషలిస్టు వ్యవస్ధల వైఫల్యాలను బూతద్దంలో పెట్టి చూపటం,అవాస్తవాలను ప్రచారం చేసి సోషలిజం గురించి చిత్త భ్రమణ తంత్ర విద్యను( మైండ్‌ గేమ్‌ ఆడటం) ప్రయోగించి తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు తప్ప పెట్టుబడిదారీ విధానం ఎలా మెరుగైనదో దానికి పోతుగడ్డ అంటున్న అమెరికా యువతకు చెప్పలేకపోతున్నారు. అదే పెద్ద బలహీనత. దీన్ని దెబ్బకొట్టి యువతను సోషలిజం వైపు మళ్లించటమే కమ్యూనిస్టుల ముందున్న పెద్ద సవాలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d