• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

కల్పిత వార్తలు- కట్టు కధలతో హిల్లరీకి దెబ్బ- మోడీకి లబ్ది

11 Sunday Dec 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA

≈ Leave a comment

Tags

Comet Ping Pong, fake news, Hillary Clinton, Narendra Modi, photos, Pizza Gate, Pizza Gate Fake News

 

Image result for  Hillary Clinton ,pizzagate

సత్య

    ప్రస్తుతం ప్రతిదీ నకిలీ, కల్పిత మయం. దీంతో ఏది నిజమో కాదో, ఎవరు నిజాయితీ పరులో కాదో తెలుసుకోవటం ఎంతో కష్టంగా మారుతోంది. నిజాన్ని నిగ్గు తేల్చే ఓపిక, వనరులు అందుబాటులో లేకపోవటంతో అనేక మంది అనుమానం వచ్చినా కాదని ఖండించలేని, విశ్వసించలేని పరిసి&థతి అయితే ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న తీరు తెన్నులను చూస్తే అత్యధికులు నమ్ముతున్నారు. ఈ బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు నకిలీ, కల్పితాంశాలను సాంప్రదాయక, సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ముందుకు తెస్తున్నారు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ప్రపంచంలో అనేక చోట్ల కట్టుకథలను ప్రచారంలో పెట్టి సొమ్ము చేసుకుంటున్నవారు వున్నారన్నది నమ్మలేని నిజం. ప్రత్యర్ధులను దెబ్బతీయటానికి కొందరు వీటిని ఆశ్రయిస్తే తమ నేతలను గొప్పవారిగా చిత్రించేందుకు కొందరు వుపయోగించుకుంటున్నారు. ఈ రెండింటికీ హిల్లరీ క్లింటన్‌, నరేంద్రమోడీని వుదాహరణగా చెప్పవచ్చు.

   మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం డిసెంబరు నాలుగవ తేదీన వాషింగ్టన్‌ డిసిలోని కామెట్‌ పింగ్‌ పాంగ్‌ అనే ఒక పీజా దుకాణానికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూనే తన చేతిలో వున్న తుపాకితో ఢాం ఢాం మ్మని కాల్పులు జరిపాడు. అమెరికాలో అలా వచ్చి ఇలా కాల్పులు జరిపి కొంత మందిని చంపి, తనను తాను కాల్చుకొని లేదా భద్రతా దళాలకు దొరికి పోవటం సాధారణ విషయం. అయితే పింగ్‌ పాంగ్‌లో జరిపిన కాల్పులలో ఎవరూ గాయపడలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి తాపీగా తన ఆయుధాన్ని అప్పగించి పోలీసులకు లొంగిపోయాడు అది అమెరికా చరిత్రలో ఎనిమిదవ వింత !

    మన పాత తెలుగు సినిమాలలో మాదిరి గిర్రున తిరుగుతూ వెనక్కు వెళితే తప్ప ఈ అసాధారణ వరిణామం గురించి అర్ధం కాదు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ‘పిజాగేట్‌ ‘ పేరుతో ఒక వార్త అమెరికన్లను వూపివేసింది. అదేమిటంటే పైన పేర్కొన్న పింగ్‌ పాంగ్‌ రెస్టారెంట్‌లోని సెల్లార్‌లో చిన్న పిల్లలతో సెక్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని దాని వెనుక డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌ ఆమె ప్రచార బాధ్యతలు చూసే మేనేజర్‌ జాన్‌ పొడేస్టా వున్నారని ఒక వార్త వచ్చింది. అది పిజా దుకాణం కనుక దానికి పిజాగేట్‌ అని పేరు పెట్టారు. ఆ వార్తలో ఆ దుకాణ చిరునామా, ఆ భవనంలోని ఏభాగంలో సెక్స్‌ నిర్వహిస్తున్నారో స్పష్టంగా పేర్కొన్నారు. తట్టి మరీ లేపి ఈ వార్త విన్నారా అని అడిగినట్లుగా ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు ఆ వార్త తెలియని వారికి కూడా తెలిసే విధంగా చేయాల్సిందంతా చేశారు. ఇంకే మంది అనేక మంది ఆ షాప్‌ యజమాని, దానిలో పని చేసే సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అవి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అంతర్జాతీయ పత్రికలలో కూడా వార్తలయ్యాయి.బాబోయ్‌ ఈ బెదిరింపులు, అసలు కుట్రవార్త గురించి దర్యాప్తు చేసి నిగ్గుదేల్చండని పిజా షాప్‌ యాజమాన్యం ఎఫ్‌బిఐని, సామాజిక మీడియా కంపెనీలను కోరింది.అయినా సరే ప్రచారం ఆగలేదు. షాపు యజమాని, క్లింటన్‌ మేనేజర్‌ మధ్య జరిగిన ఇమెయిల్‌ వుత్తర ప్రత్యుత్తరాలంటూ ఒక వెబ్‌సైట్‌ బయట పెట్టటంతో అందరూ పీజా గేట్‌ నిజమే అనుకున్నారు. దానిలో పేర్కొన్న పీజా షాపులోని ఆహార పదార్ధాల పేర్లను సంకేత భాష అంటూ అర్ధాలు తీసి వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులను భరించలేక షాప్‌ మేనేజర్‌ వుద్యోగానికి రాజీనామా చేయాలని అతని భార్య పోరు పెట్టింది.

    చిత్రం ఏమిటంటే పీజాగేట్‌ కుంభకోణం నిజమని గానీ, కాదని గానీ ఎఫ్‌బిఐ ప్రకటించలేదు. హిల్లరీ క్లింటన్‌ స్వయంగా పిల్లలను హత్య చేసింది అనే ఒక వీడియో రంగంలోకి వచ్చింది. తరువాత దానిని వుపసంహరించుకున్నారు. అయితే అప్పటికే అది చేయాల్సిన హాని చేసింది.నాలుగులక్షల 20వేల మంది దానిని కాపీ చేసుకున్నారని తేలింది. న్యూయార్క్‌ పోలీసు వర్గాల కధనం పేరుతో వార్తలు వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌ ఇంటిపై దాడి జరిగిందనే బ్రేకింగ్‌ న్యూస్‌లు వచ్చాయి. వాటి మీద సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానాల గురించి ఇంక చెప్పేదేముంది. ఎన్నికలైపోయాయి.హిల్లరీ క్లింటన్‌కు జరగాల్సిన నష్టం, ట్రంప్‌కు లాభం కలిగింది.

    మరోసారి గిర్రున తిరిగి వర్తమానంలోకి వస్తే వుత్తర కరోలినా నివాసి 28ఏండ్ల ఎడ్గార్‌ మాడిసన్‌ వాల్చ్‌ అనే యువకుడు పిల్లలను రక్షించేందుకంటూ తుపాకితో రెస్టారెంట్‌కు వచ్చాడు. పిల్లలతో సెక్స్‌ రాకెట్‌ నడిచిందన్న సెల్లార్‌ కోసం చూశాడు. అసలు ఆ భవనానికి సెల్లారే లేదని తేలింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా పీజా గేట్‌ అనేది ఒక కట్టుకధ అని తెలుసుకొని గాలిలోకి కాల్పులు జరిపి తన ఆయుధాన్ని అక్కడి సిబ్బందికి అప్పగించి తానెందుకు వచ్చిందీ చెప్పాడట. మా రెస్టారెంట్‌లో గనుక సెల్లార్‌ వుండి వుంటే ఏం జరిగి వుండేదో, కట్టుకధలు ఎలాంటి పరిస్ధితులను తెస్తాయో ఈ రోజు మీరు చూశారు. ఇక ముందైనా ఇలాంటి వాటిని నమ్మకండని యజమాని వేడుకున్నాడు. అయితే ఈ వుదంతాన్ని కూడా కొంత మంది కట్టుకథగా కొట్టి పేస్తున్నవారు లేకపోలేదు. కొందరైతే పోలీసులు ఆడించిన నాటకంగా కూడా చెప్పారు. ఏది ఏమైనా క్లింటన్‌ ఓటమికి ఇది కూడా తన వంతుగా తోడ్పడిందని చెప్పవచ్చు.

     ఇక కట్టుకధలతో లబ్ది పొందిన వారిలో మన ప్రధాని నరేంద్రమోడీ ఒకరని చెప్పవచ్చు. ఆయన గురించి సామాజిక మీడియాలో ఎన్నికల సందర్భంగా వ్యాపింప చేసిన కథలు ఎన్నో. వాటిలో ఒకటి మోడీ యువకుడిగా వున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల సందర్భంగా గదులను వూడ్చిన నిరాడంబరుడు అంటూ సామాజిక మాధ్యమాలలో తిప్పిన ఫొటో ఒకటి. అసలూ, దానికి నకిలీని దిగువ చూడవచ్చు.

Image result for narendra modi fake news, fake photos

ఈ ఫొటో గురించి ఫేస్‌బుక్‌ దర్యాప్తు బృందం కొన్ని విషయాలను బయట పెట్టింది. చాలా మంది ఇప్పటికీ నరేంద్రమోడీ నిరాడంబరతకు ఆ చిత్రాన్ని వుదాహరణగా చూపుతున్నారు. అంతగా జనంలోకి వెళ్లింది. అసలు ఆ ఫొటో స్వాతంత్య్రానికి ముందు 1946లో అసోసియేటెడ్‌ ప్రెస్‌ తీసిన ఫొటో అని అది ఇ బే నుంచి స్వీకరించారని తేలింది. అంటే అప్పటికి అసలు నరేంద్రమోడీ పుట్టలేదు. ఆ ఫొటో ఎలా సంపాదించారనేది ఇంకా రహస్యంగానే వుంది. దొంగలు తమకు తెలియకుండానే కొన్ని ఆనవాళ్లను వదులుతారని పోలీసు చెబుతారు. ఈ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. అది 1988 నాటిదని దానిలో పేర్కొన్నారు. ఆ సమయంలో నరేంద్రమోడీకి అలాంటి గడ్డం లేకుండా వున్నారని కొందరు 1980దశకంలో ఎల్‌కె అద్వానీతో కలసి వున్న ఒక ఫొటోను వుదహరించారు. దాన్ని పక్కన పెడితే మహారాష్ట్ర బిజెపి మీడియా విభాగపు సహ కన్వీనర్‌గా వున్న ప్రీతీ గాంధీ ఆ చిత్రం నరేంద్రమోడీదే అంటూ 2013జూలై 12 తెల్లవారు ఝామున రూపా పంజారియాకు ట్వీట్‌ చేశారు. ఈ విషయాలు కావాలంటే దిగువ లింక్‌లో వున్నాయి చూసుకోవచ్చు.http://fbinvestigations.blogspot.in/2014/04/modi-fake-vs-real.html

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచీకరణకు అనుకూలమెవరు, వ్యతిరేకమెవరు ? ఎందుకు ?

01 Tuesday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Economics, Environment, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Others, UK, USA

≈ Leave a comment

Tags

anti globalisation, anti globalization movement, anti-neoliberal, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ పర్యవసానాలు-2

     ప్రపంచీకరణ గురించి రెండు అభిప్రాయాలు వున్నాయి. అది ప్రపంచానికి మంచి చేస్తుందని కొందరంటే చెడు చేస్తుందని మరికొందరు చెబుతారు. చరిత్రలో వర్గాలు లేనటు వంటి ఆదిమ సమాజాన్ని( దాన్నే ఆదిమ కమ్యూనిస్టు సమాజం అని కూడా పిలుస్తారు) మినహాయిస్తే సమాజంలో వర్గ విభజన జరిగినప్పటి నుంచి ప్రతి కొత్త దశలోనూ దాని మంచి చెడ్డలపై రెండు అభిప్రాయాలు వెలువడుతూనే వున్నాయి. బానిస, అర్ధబానిస లేదా ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ వ్యవస్థలన్నింటా ఒక వర్గానికి మేలు జరుగుతూనే వుంది. అలాంటి వారంతా దానిని కాపాడుకొనేందుకు అవసరమైన సాహిత్యం, మూఢనమ్మకాలు, నమ్మకాలు, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేశారు. నష్టపోయిన వర్గం ఆ వ్యవస్ధలను కూల్చివేసేందుకు, జనాన్ని కూడగట్టేందుకు తనదైన సాహిత్యం, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం చర్చనీయాంశంగా వున్న ప్రపంచీకరణ భావన, పద్దతుల గురించి కూడా ఇదే విధమైన రెండు రకాల సాహిత్యాలు వెలువడుతున్నాయి. ఒక గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పుకు దారితీయాలంటే అందుకు అనువైన పరిస్థితులు తయారు కావాలి. ఆవిరి రావాలంటే నీరు వంద డిగ్రీల వుష్ణోగ్రత వరకు మరగాల్సిందే. ఆలోగా కుండ లేదా పాత్ర లోని నీటిలో అనేక మార్పులు జరుగుతాయి తప్ప అవి మనకు కనిపించవు. అందరూ ఇష్టపడే అందమైన సీతాకోక చిలుక అవతరించటానికి ముందు అది అసహ్యించుకొనే గొంగళి పురుగు రూపంలో వుంటుంది. ప్రపంచీకరణ అన్నది పెట్టుబడిదారీ వర్గం రూపొందించిన తాజా అధునాతన దోపిడీ అస్త్రం.కార్మికవర్గం గుర్తించలేనంత సమ్మోహనంగా వుండి, వారి మద్దతు కూడా పొందేంత అంటే అతిశయోక్తికాదు. తెలిసో తెలియకో కార్మికవర్గం మద్దతు లేదా వుపేక్ష కారణంగానే అదింకా బతికి బట్టగలుగుతోంది. బానిస, ఫ్యూడల్‌ వ్యవస్ధలను అదుపు చేసిన వర్గాలు అవి కూలిపోయేంత వరకు శాశ్వతమనే భ్రమించాయి,భావించాయి. జనంలో చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఆ వ్యవస్ధలలో కూడా పాలకవర్గం సంస్కరణలు ప్రవేశపెట్టకపోలేదు. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్ధ కూడా అదే భావంతో, అదే బాటలో వుంది. సహజం.

     ప్రపంచీకరణను వ్యతిరేకించే వారు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారా ? కానే కాదు, ముందటి సమాజాలు, తరతరాల అనుభవసారం నుంచి దానిని గ్రహించారు.ఒక విధానం మంచిదా కాదా అని నిర్ధారించటానికి ఎంత కాలం కావాలి? ప్రాతిపదికలేమిటి ? ప్రపంచీకరణ పేరుతో తీసుకున్న లేదా ఇంకా ప్రతిపాదిస్తున్న చర్యలన్నీ సామాన్య జనానికి తక్షణం హాని చేసేవి, అయితే శరీరంలో దెబ్బతిన్న భాగాన్ని తొలగించాలంటే శస్త్ర చికిత్స చేయాలి, తొలుత బాధగానే వున్నప్పటికీ తరువాత జీవితాంతం సుఖం అనుభవిస్తారు కనుక తాత్కాలిక బాధను భరించాలని ప్రపంచీకరణ వాదులు నమ్మబలుకుతారు.చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచీకరణ కోరుకున్న వారే భిన్న స్వరాలు వినిపిస్తున్నారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/world-faces-long-period-of-stagnation-ahead  సత్యజిత్‌ దాస్‌ అనే ఒక బ్యాంకరు ‘ నిండుకున్న ప్రపంచ అమ్ముల పొది’ అనే పేరుతో బ్లూమ్‌బెర్గ్‌ వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం రాశారు. ‘ పురోభివృద్ధిని పునరుద్దరించేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తాము చేయగలిగినవి ఇంకా ఎన్నో వున్నాయని చెబుతూనే వున్న ప్రపంచ విధాన రూపకల్పనవేత్తలు ఎవరూ కూడా ఓటమిని అంగీకరించటానికి సిద్ధ పడటం లేదు. రెండు కాళ్లూ పొగొట్టుకొని దారిలో పడివున్న మల్లయ్య నేను లేస్తే మనిషిని కాను అని విజయం సాధించిన వారిని బెదిరించే మాదిరి వారి తీరు వుంది. వాస్తవం ఏమిటంటే ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకుల దగ్గర ఇంక ఆయుధాలేమీ మిగల్లేదు.’ ఇలా ప్రారంభమైంది.

     ‘ ప్రపంచవ్యాపితంగా డిమాండ్‌ మందగించటం, అనేక పరిశ్రమలు సామర్ధానికి మించి వుండటం వంటి పర్యవసానాలతో పెట్టుబడి నలిగిపోతోంది. కొన్ని బ్యాంకుల దగ్గర కొండల మాదిరి కారుచౌకగా దొరికే డబ్బు పేరుకుపోతున్నప్పటికీ రుణాలు తీసుకొనే వారు ముందుకు రావటం లేదు. ధన చలన వేగం చాలా తక్కువగా వుంది. తక్కువ లేదా ప్రతికూల వడ్డీ రేట్ల కారణంగా నిధులు సమకూర్చటం, బ్యాంకుల లాభాలు దెబ్బతింటున్నాయి. తమ పొదుపును మరోచోటికి బదలాయించుకోవటం, నగదుగా మార్చుకోవటం వంటి చర్యలను ప్రభుత్వాలు నిషేధించటం వంటి చర్యలు చేపడితే తప్ప వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు వాటిని ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు. పెన్షన్‌ నిధులు, వుద్యోగ విరమణ తరువాత ఇచ్చే లబ్ది గురించి చేసుకున్న ఒప్పందాలు, బీమా కంపెనీల సామర్ధ్యాలను ఇప్పటికే ప్రతికూల వడ్డీ రేట్లు ప్రశ్నిస్తున్నాయి. అనేక ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లు, చివరికి కంపెనీల వాటాలను కూడా కొనుగోలు చేయటం ద్వారా విత్త మార్కెట్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ జపాన్‌ రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఆ పని చేసింది.ఆర్ధిక వ్యవస్ధపై ప్రభుత్వ పట్టు పూర్తిగా వుండేందుకు లెనిన్‌ హయాంలో సోవియట్‌ యూనియన్లో జరిగిన మాదిరి రిజర్వుబ్యాంకులు తమ అధికార కత్తులను ఝళిపించటం పెరిగిందన్నది నిజం. ఇదే సమయంలో ఈ విధానాల పరిమితులన్నీ అయిపోతున్నట్లు అందరికీ కనిపిస్తోంది. జపాన్‌, ఐరోపా దేశాల రిజర్వు బ్యాంకులకు కొనుగోలు చేసేందుకు తగిన బాండ్లు కనిపించటం లేదు. అంతా అనివార్యమని చెప్పలేముగాని వడ్డీ రేట్ల మరింత తగ్గింపు, పరిమాణాత్మక ఆంక్షలు మరింత సడలింపు మార్కెట్‌ రేట్లు, ఆస్థుల ధరలు లేదా నగదు విలువలపై పెద్ద ప్రభావమే చూపుతాయి.

     ఈ పరిస్ధితి మాంద్యంగా వున్న వాటికి ప్రభుత్వాలు ఆర్ధిక వుద్దీపనలు కలిగించటం అనే ఒక నూతన ఏకాభిప్రాయాన్ని పురికొల్పింది. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు లోటుతో నడుస్తున్నాయి.కొన్ని వ్యవస్ధాగతమైన లోపాలతో వున్నాయి. వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు అదనంగా ఖర్చు చేస్తే తరువాత అది ప్రభావశీలంగా వుండాలంటే తరువాత కూడా కొనసాగించాల్సిందే. మౌలిక వసతుల వంటి వాటికి పెట్టుబడులు పెడితే తరువాత ప్రాజెక్టును బట్టి దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి. ఎందుకంటే ప్రభుత్వాలు కృత్రిమంగా తక్కువ వడ్డీ రేటు లేదా ప్రతికూల వడ్డీ రేట్లతో డబ్బు తీసుకు వచ్చి ఖర్చు చేయటం అంటే దాని అర్ధం ప్రతిఫలం లభిస్తుందని కాదు. పెద్దగా ప్రయోజనం లేని ఆస్థులపై పెట్టిన పెట్టుబడిగా మారే ప్రమాదం వుంది.’

      ప్రపంచీకరణ వెనక్కు నడుస్తోంది అనే పేరుతో మరొక సమర్ధకుడు ఒక విశ్లేషణ చేశారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/globalization-goes-into-reverse ఇది కూడా ఆసక్తి కలిగించేదే. నోవా స్మిత్‌ అనే రచయిత తన విశ్లేషణను ఇలా ప్రారంభించాడు.’ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అనేక పశ్చిమ దేశాలలో ప్రతి క్రియ జరుగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం, వలసలకు సంబంధించి అమెరికన్లు ఇప్పటికీ సానుకూల అంశాల గురించి చెప్పవచ్చు, రాజకీయ అభ్యర్ధులైన ట్రంప్‌, బెర్నీ శాండర్స్‌ వంటివారు ఒక దశాబ్దం క్రితం వూహించటానికే అవకాశం లేని ఈ రెండింటిని వ్యతిరేకించే వారిని నుంచి ఒక పరిధి మేర ఎంతో మద్దతు పొందుతున్నారు. వాణిజ్య లావాదేవీలలో అంతగా తెలియని పసిఫిక్‌ సముద్ర రాజ్యాల భాగస్వామ్య (టిపిపి) ఒప్పందం ప్రమాదంలో పడింది. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులు తీసుకోవటాన్ని కూడా ప్రపంచీకరణకు తిరస్కరణే అన్నది ఏక కంఠంతో చెప్పిన భాష్యం. కానీ నేటి ప్రపంచీకరణ వ్యతిరేక యుద్ధ వీరులు నిన్నటి యుద్ధం గురించి పోరాడుతున్నారు. ఏ విధంగా చూసినప్పటికీ 2008 సంక్షోభం నాటి నుంచి ప్రపంచీకరణ పూర్తి తిరోగమనంలో వుంది. మొదటిది వాణిజ్య విషయానికి వస్తే 2008 వరకు ఆరోగ్యకరంగా పెరిగింది. సంక్షోభం, మాంద్యం తరువాత ఇంతవరకు పూర్వపు స్థాయికి చేరుకోలేదు. రెండవది వలసల విషయానికి వస్తే ప్రపంచవ్యాపితంగా నెమ్మదిగా వలసలు పెరుగుతున్నాయి. అమెరికాకు అనూహ్య పెరుగుదల ఆగిపోయింది. మెక్సికో నుంచి అమెరికాకు వలసలు ఒక పెద్ద రాజకీయ వివాదంగా వుండేవి కాస్తా ఆ సమస్య ఇప్పుడు అటుదిటు అయింది. 2008 నుంచి 2014 వరకు అమెరికాలో నివశించే మెక్సికన్ల జనాభా పదిలక్షల మంది తగ్గిపోయారు.కారణం, అధికారికంగా నమోదు కానటువంటి మెక్సికన్‌ వలసదారులు పెద్ద సంఖ్యలో తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. తరువాత ఆర్ధికం గురించి, సంక్షోభానికి ముందు వున్న స్ధాయితో పోల్చితే అంతర సరిహద్దుల మధ్య జరిగే నగదు బదిలీలు తగ్గినట్లు యుబిఎస్‌ బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రపంచీకరణ అనూహ్య పెరుగుదల ఇరవయ్యవ శతాబ్ది చివరి నాటికే అంతమైంది. ఇరవై ఒకట శతాబ్ది ప్రారంభం ముగిసింది, ప్రపంచీకరణ చుట్ట విడిపోవటం ప్రారంభం కూడా కావచ్చు. పది సంవత్సరాల ఆలస్యంగా ప్రపంచీకరణ అపస్మారకం గురించి ఆందోళన పడుతున్నట్లుగా వుంది.’

   ఇంత త్వరగా ప్రపంచీకరణపై పెట్టుబడిదారీ మేథావులలో భ్రమలు వైదొలగటం ప్రారంభం అవుతుందని ఎవరూ వూహించలేదంటే అతిశయోక్తి కాదు.మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన సంక్షోభాలు, తీవ్ర ఆర్ధిక మాంద్యం కారణంగా అనేక దేశాలు తమ పరిశ్రమలు, వాణిజ్య రక్షణ చర్యలను తీవ్రతరం చేశాయి.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి చిన్నా, చితకా దేశాలు తప్ప వలసలు పూర్తిగా అంతరించటంతో యుద్ధ సమయంలోనే అమెరికా-బ్రిటన్‌లు యుద్ధం ముగిసిన తరువాత వాణిజ్య ఏర్పాటు ఎలా వుండాలో చర్చలు ప్రారంభించాయి. వాటి ఫలితమే 1947 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు జెనీవాలో 23 దేశాల చర్చలు ఫలించి ప్రపంచీకరణకు తెరతీసిన పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (గాట్‌) కుదిరింది. అక్కడే అత్యంత సానుకూల దేశ హోదా కూడా పురుడు పోసుకుంది. ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు సభ్య దేశాల వస్తువులకు పన్నులు, ఇతర ఆటంకాలను తగ్గించటం, ఎత్తివేయటమే గాట్‌లోని కీలకాంశం. తరువాత 2000 సంవత్సరం నుంచి దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్య సంస్ద రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

    ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన ధనిక దేశాల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలకు భిన్నంగా, వివిధ దేశాల మధ్య అసమాన ప్రయోజనాలు వస్తున్నాయని అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. చైనాను చూసి ప్రయివేటు పెట్టుబడులు అక్కడ పొందుతున్న లబ్దిని చూసి భారత్‌ సంస్కరణలు మొదలు పెట్టిందా లేక సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పెట్టుబడిదారీ ధనిక దేశాలతో అంటకాగితే ప్రయోజనం వుంటుందని పాలకవర్గం భావించి సంస్కరణలకు శ్రీకారం చుట్టిందా అన్నది ఒక చర్చ నీయాంశం. సోవియట్‌ కూలిపోక ముందే 1988లో ప్రధాని రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన జరపటం ఒక కీలకాంశం. నూతన ఆర్ధిక విధానం పేరుతో రాజీవ్‌ గాంధీ మాట్లాడిన పూర్వరంగం సంస్కరణలలో భాగమే. తరువాత సోవియట్‌, తూర్పు ఐరోపా రాజ్యాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత పీవీ నరసింహారావు రూపంలో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను తెరిచేందుకు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్కరణలు ఏ దేశానికి ఎక్కువ ప్రయోజనం కలిగించాయో తెలిసిందే. జపాన్‌కు చెందిన ‘రీతి’ సంస్ధ పరిశోధన ప్ర కారం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో మన వ్యవస్థను ముడివేసిన కారణంగా మన పరిశ్రమలు లబ్ది పొందటంతో పాటు వుపాధి అవకాశాలు కూడా పెరిగాయి. http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html అయితే అవి చైనాతో పోల్చుకుంటే చాలా పరిమితం. ఈ రెండింటితో పాటు మరికొన్ని దేశాలు లబ్ది పొందితే ఆ మేరకు ధనిక దేశాలు నష్టపోయాయి. 1995-2011 మధ్య కాలంలో ప్రపంచ విలువ గొలుసులో భారత పరిశ్రమలు చేసిన వుత్పత్తిలో తమ ఆదాయ వాటాను దాదాపు రెట్టింపు చేసుకున్నాయి. అందువలన మిగతా పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయని వేరే చెప్పనవసరం లేదు.ఈ విషయంలో మన పరిశ్రమలు రెండు నుంచి నాలుగుకు పెరిగితే చైనా నాలుగు నుంచి 16కు ఎదిగింది. ఇదే సమయంలో కేవలం విదేశాల కోసం చేసిన వుత్పత్తి విలువ మన దేశంలో 18 నుంచి 28కి పెరిగితే చైనాలో 35 నుంచి 42కు మాత్రమే పెరిగింది. అంటే చైనా కంటే విదేశాల కోసం తయారు చేసే సరకుల విషయంలో మన దేశం ఎంతో ముందుకు పోయింది. ఈ కారణంగానే మన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు మేకిన్‌ ఇండియా, మేకిన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో భారత్‌లో సరకులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోండి మంచి అవకాశాలు కల్పిస్తామని వెంపర్లాడుతున్నారు. రాయితీలు ప్రకటిస్తున్నారు. కేవలం ఎగుమతుల మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్థలను నిర్మించుకోవటం మంచిది కాదని లాటిన్‌ అమెరికా అనుభవం గ్రహించిన చైనా 2008 సంక్షోభం తరువాత తన అంతర్గత డిమాండ్‌ను పెంచటంపై కేంద్రీకరించింది. ఈ కారణంగానే సంక్షోభ ప్రభావం దాని ఆర్ధిక వ్యవస్ధపై పరిమితంగా పడిందన్నది కొందరి విశ్లేషణ.

     వస్తూత్పత్తి రంగంలో నానాటికీ నిపుణులైన కార్మికుల అవసరం పెరుగుతోంది. ఈ విషయంలో కూడా మనం చైనాతో పోల్చుకోవటానికి లేదు. 1995-2011 మధ్య మన దేశంలో వున్నత నిపుణులైన కార్మికులు 106.8శాతం పెరిగితే చైనాలో 211.2 శాతం పెరిగారు, పరిమిత నిపుణులైన వారు చైనాలో 35.6, భారత్‌లో 49.4 శాతం పెరిగారు. నైపుణ్యం లేని కార్మికుల శాతాలు 6.3, 4.4 శాతం చొప్పున మాత్రమే పెరిగారు. మన దేశంలో మధ్య తరగతి, చివరికి కార్మికవర్గంలో కూడా ప్రపంచీకరణకు అనుకూలత వ్యక్తం చేయటానికి ఈ పరిణామం కూడా దోహదం చేసినట్లుగా కనిపిస్తున్నది. మిగతావారితో పోల్చితే నిపుణులైన కార్మికులకు వేతనాలు సహజంగానే ఎక్కువ వుంటాయి కనుక, అవి ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను ప్రపంచ వ్యవస్ధతో ముడిపెట్టిన కారణంగానే వచ్చాయి కనుక ఆ విధానాలకు ఆకర్షితులు అవుతున్నారు. 1991-2014 మధ్య మన దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు పని చేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. నైపుణ్యం లేని కార్మికులు పని చేసే పరిశ్రమలు అంతకంటే ఎక్కువగా తగ్గిపోయాయి.

Image result for globalisation: why do people are opposing and supporting ?

    ఇదే సమయంలో ధనిక దేశాలలో పరిస్థితి ఏమిటి ? అమెరికాలో వున్నత నైపుణ్యం, పరిమిత నైపుణ్యం, నైపుణ్యం లేని కార్మికుల సంఖ్య స్ధిరంగా కూడా లేకపోగా 9.6,32.6,46.6 శాతాల చొప్పున, జపాన్‌లో 7.7, 29.8, 65.7 శాతాల చొప్పున తగ్గారు. ‘రీతి’ సర్వే చేసిన దేశాలలో ఒక్క చైనా, భారత్‌లో తప్ప మిగతా ప్రధాన దేశాలైన దక్షిణ కొరియాలో 66.5, తైవాన్‌లో 36.7, జర్మనీలో 17.7, ఇండోనేషియాలో 12.3 శాతం చొప్పున తగ్గారు. అందువలన సహజంగానే అక్కడి పౌరులలో ప్రపంచీకరణ వుత్పత్తి విధానం పట్ల తద్వారా ఆదాయాలు తగ్గటం వలన ప్రపంచీకరణ వ్యతిరేకత పెరుగుతోందన్నది స్పష్టం. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన అక్కడ ఆర్ధిక అసమానతలు వున్నప్పటికీ కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. అక్కడ పెరుగుతున్న వేతనాలను చూస్తే http://money.cnn.com/2016/03/17/news/economy/china-cheap-labor-productivity/ అనుకున్నంత చౌక కాదని అమెరికన్లే చెబుతున్నారు. అమెరికాతో పోల్చితే నాలుగు శాతమే తక్కువని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ చెప్పిన విషయాన్ని నిర్ధారించుకోవాల్సి వుంది. చైనాతో పోల్చితే మన దేశంలో అత్యంత నిపుణులైన కార్మికులకు కూడా వేతనాలు తక్కువే అన్నది తెలిసిందే. ఇది కూడా మోడీ వంటి వారిని మేకిన్‌ ఇండియా నినాదాలకు పురికొల్పింది. ఒకవైపు ఇది పారిశ్రామికవేత్తలను వుత్సాహపరుస్తుంటే మరోవైపు ప్రపంచీకరణ ఫలితాలు కొంత మంది చెప్పినట్లు ఊట మాదిరి దిగువకు దిగటంలేదు. అందుకే ఆర్ధిక అసమానతలు తీవ్రం అవుతున్నాయి.నైపుణ్యం లేని, పరిమిత నైపుణ్యం గల కార్మికులందరూ కాంట్రాక్టు వుద్యోగులుగా, తక్కువ వేతనాలకు పని చేసే అసంఘటి పని వారిగా మారిపోతున్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌ కొద్ది మంది కార్మికులతో నడిచేవి తప్ప ఎక్కువ మందితో అవసరం వుండదు. అందువలన అంకెలలో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ అది వుపాధి రహితంగా వుంటోంది. రానున్న రోజుల్లో ఈ ధోరణిని మరింతగా పెంచాలని, వున్న కార్మిక చట్టాలను కూడా క్రమంగా ఎత్తివేయాలన్నది పాలకుల లక్ష్యంగా వుంది.

    సరళీకరణ, ప్రపంచీకరణ వలన కలిగే లాభాలను ఎలా చూడాలి ? తాజ్‌ మహల్‌ కట్టించిందెవరు అని కాదు, దానికి రాళ్లెత్తిన కూలీల గురించి చూడాలని శ్రీశ్రీ చెప్పినట్లుగా మన దేశంలో ఏటేటా పెరుగుతున్న ధనికుల గురించి వార్తలను లొట్టలు వేసుకుంటూ చదువుతున్నాం, చూస్తున్నాం తప్ప అందుకు దోహదం చేసిన స్ధితి గురించి ఎందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఎంత లాభం, నష్టం వచ్చిందని చూడటం సాధ్యం కాని మాట నిజమే. ఈ విధానాలకు అనుగుణ్యంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు, మినహాయింపులు ఇస్తున్నాయి. ప్రస్తుతం అవి ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయలు దాటాయి. విద్య, వైద్యం వంటి సేవలకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను చూస్తే మనకు పరిస్ధితి అర్ధం అవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం విద్యార్ధినులకు కూడా అన్ని చోట్లా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోతే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇవ్వాల్సిన దుస్ధితి ఈ సంస్కరణల కాలంలోనే జరిగింది.http://www.freshwateraction.net/content/all-govt-schools-must-have-toilet-november-end-supreme-court-india నిజానికి ఇతర సబ్సిడీలను కలుపు కుంటే అంతకంటే ఎక్కువే వుంటాయి.అన్నింటి కంటే దారుణం ఏమంటే కార్పొరేట్‌ కంపెనీలు సకల రాయితీలు పొందుతూనే చెల్లించాల్సిన పన్నులను కూడా ఏదో ఒక రూపంలో ఎగవేస్తున్నాయి.http://timesofindia.indiatimes.com/budget-2016/union-budget-2016/Budget-2016-Tax-forgone-gets-a-fancy-name-but-still-a-burden/articleshow/51202028.cms కార్పొరేట్‌ పన్ను 32.45 శాతం చెల్లించాల్సి వుండగా కేవలం 24.67 శాతమే చెల్లిస్తున్నాయని 2014-15 సంవత్సరం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అంటే దయామయులైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రాయితీలు పొంది, పన్నులు పూర్తిగా చెల్లించటం లేదన్నది స్పష్టం. ధనికులకు మరిన్ని రాయితీలిచ్చేందుకు చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు కల్పించేందుకు కూడా ప్రభుత్వాలకు లేకపోయిందంటే ప్రపంచీకరణ ఎవరికోసం ? ఎవరికి వుపయోగపడినట్లు ?  ధనిక దేశాలలో ప్రపంచీకరణ వ్యతిరేకత ఏ రూపాలలో వ్యక్తమౌతోంది ? వచ్చే భాగంలో చదవండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెక్కల గుర్రాలు ఎక్కి చుక్కల లోకాలు చూద్దాం !

16 Sunday Oct 2016

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

China, economic reforms, INDIA, Indian economy, Riding on flying horses

Image result for narendra modi on flying horse

సత్య

   రెక్కల గుర్రాలు ఎక్కి చుక్కల లోకాలు చూసే బాల్యం నాటి వూహలు, కథలు జీవితాంతం గుర్తుంటాయి. మన పూర్వీకులు పెట్రోలు, పైలట్లతో పని లేకుండా ఒక లోకం నుంచి మరో లోకానికి, పైకీ, కిందికీ, ఎటుబడితే అటు తిప్పుతూ ఎంత మంది ఎక్కినా మరొకరికి సీటు వుండే విమానాలలో తిరిగే వారని వయస్సు వచ్చిన వారికి, అందునా చదువుకున్న వారికి చెప్పటమే కాదు, వారి చేత నమ్మింప చేస్తున్న రోజులి. ఇక ప్రతిదానినీ ముందుగానే వూహించి చెప్పారంటున్న పోతులూరి వీరబ్రహ్మంగారి ప్రవచనాలను మనకు సరికొత్తగా అందించే మహానుభావుల సంగతి సరే సరి. ఈ కారణంగానే మన నిఘంటువులో అసాధ్యం అనే దానికి ఒక్క వుదాహరణ కూడా దొరకని తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాం.దీనికి తోడు సామాజిక మాధ్యమం వచ్చిన తరువాత అది సంక్షోభ స్థాయికి చేరింది.

    లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్నది తెలుగు సామెత. ఒక పేదవాడు పండుగకో, పబ్బానికో అని కొనుక్కున్న దుస్తుల మీద ఏదైనా పడితే మరకగా మారుతుందేమోనని ఎంత కంగారు పడిపోతాడో తెలిసిందే. ఆత్మగౌరవం గల వ్యక్తులు తమ వ్యక్తిత్వాల మీద ఒక మరక పడితే తల్లడిల్లి పోతారని పాత పుస్తకాల్లో చదువుకున్నాం. అంతరించి పోతున్న అలాంటి వారు ఎక్కడన్నా కనపడతారేమోనని పాతాళభైరవి దురి&భిణి వేసి చూసినా కనిపించటం లేదు . ఇక ‘బ్రహ్మం గారు చెప్పినట్లు ‘ అధికారం రుచి మరిగిన మన రాజకీయ నాయకుల గురించి ఇక చెప్పుకోనవసరం లేదు. ఎన్ని మరకలు పడితే అంతగా మార్కెట్లో డిమాండు వుంటుందనే సత్యాన్ని బోధి చెట్టు కింద కూర్చోకుండానే తెలుసుకున్న అపర జ్ఞానులు. ఎదుటి వారి మీద మరకలు వేయటం, తాము వేయించుకోవటంలో ఆరితేరిన వారు. ఒక వ్యాపారి ‘మరకు మంచిదే ‘ అంటూ తన వుత్పత్తులను అమ్ముకోవటానికి ఒక మరక నినాదాన్ని సృష్టించి నిజంగా మరక పడటం మంచిదే అని జనం అనుకునేట్లుగా వాణిజ్య ప్రకటనలను తయారు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ వ్యాపారులు కూడా అలాంటి ఎక్కువ మరకలున్నవారి కోసం నిత్యం ఎదురు చూస్తూ కొనుగోలుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సరకులకు ‘నియోజక వర్గ అభివృద్ధికోసం, కార్యకర్తల అభీష్టం మేరకు, మా నేత అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు, స్వగృహ ప్రవేశం ‘ వంటి ఎన్నో ట్యాగులను కూడా రూపొందించిన మేథావులు.

    1848లో కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రాసిన కమ్యూనిస్టు మానిఫెస్టోను కమ్యూనిస్టు పార్టీలు అనేక ముద్రణలు, ప్రపంచ భాషలన్నింటిలోనూ తర్జుమా చేయటం మామూలు విషయం. ఈ విషయంలో బైబిల్‌తో పోటీ పడేది ఏదైనా గ్రంధం వుందంటే అది ముమ్మాటికీ కమ్యూనిస్టు మానిఫెస్టో ఒక్కటే. కార్మికుల శ్రమ శక్తి నుంచి లాభాలను పిండుకోవటం గురించి తేటతెల్లం చేసిన ఆగ్రంధాన్ని, అది వ్యాపింపచేసిన భావజాలం కమ్యూనిజాన్ని వ్యతిరేకించని పెట్టుబడిదారుడు, బడా వ్యాపారి వుండడు అంటే అతిశయోక్తి కాదు. కానీ అదే పెట్టుబడిదారులు, వ్యాపారులు ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోకు మార్కెట్‌లో వున్న గిరాకీని బట్టి దానిని ముద్రించి లాభాలు ఆర్జించటమే అసాధారణం. ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పుకుంటున్న ఇండోనేషియాలో ఈనెలలోనే ఒక పుస్తక ప్రదర్శనలో కమ్యూనిస్టు మానిఫెస్టో గ్రంధాన్ని చూసిన మిలిటరీ గూఢచారులు ఇంకేముంది ఇండోనేషియాలో కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తున్నారంటూ పుస్తకాలు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి గంటల కొద్దీ విచారణ పేరుతో నిర్బంధించారు. దానిని ప్రచురించిన వారు అబ్బే మాకు కమ్యూనిజం ఏమిటి, దాన్ని వ్యాపింప చేయట ఏమిటి, అమ్ముడు పోయే పుస్తకాలన్నీ ప్రచురించటం, అమ్ముకోవటం తప్ప మాకేమీ తెలియదని చెప్పిన తరువాత వారిని వదలి వేశారు. తమకు లాభదాయకం అనిపించింది కనుకనే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు కమ్యూనిస్టు వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించి లాభపడ్డారు. అదే సామ్రాజ్యవాదులు కమ్యూనిజాన్ని కూడా సొమ్ము చేసుకోవచ్చు అని గ్రహించి చైనాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే లాభం వస్తే వ్యాపారి అవసరమైతే తనను తానే అమ్ముకోవటానికి కూడా వెనుతీయని ‘త్యాగశీలి’.

   పెట్టుబడిదారులు, వ్యాపారులు లాభాల కోసమే కదా ఇండియాకు సముద్రమార్గం కనుగొనమని కొలంబస్‌ను పురికొల్పారు. దారి తెలియనపుడే అంతగా తహతహలాడిన వారు ఇప్పుడు ఎక్కడ లాభం వస్తుందో స్పష్టంగా తెలిసిన తరువాత అక్కడ వాలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది? లాభానికి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ఎప్పుడూ దేశ భక్తి వుండదు. లాభం వస్తే ప్రాణాలు హరించే వరదల్లో కూడా వెళ్లేందుకు సిద్దపడే వ్యాపారులు మన మార్కెట్లో ప్రవేశించేందుకు సామ,దాన,బేధో పాయాలను ప్రయోగించారు. వివిధ ప్రాంతాలలో వేర్పాటు, వుగ్రవాద శక్తులు వాటిలో భాగమే. కమ్యూనిజం అని మడి కట్టుకు కూర్చుంటే లాభాలు వస్తాయా మీ పిచ్చిగానీ అని అవగతం చేసుకున్న వారు ప్రపంచంలో అతి పెద్ద ఎగుమతి, దిగుమతి మార్కెట్టు కమ్యూనిస్టు చైనాను వదులుకుంటారా ? అలా వదులు కున్న వారు నిజంగా దేశ భక్తులే ! కుందేటి కొమ్మును సాధించ వచ్చు గాని అలాంటి వారిని ఎవరినైనా ఒక్కరిని చూపగలరా ? అమెరికా వ్యాపారులు పాతాళ భైరవిలోని దుష్ట గురువుల వంటి వారైతే, భారత వ్యాపారులు ఆ గురువు శిష్యుని వంటి వారు. అందుకే కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే దేశ భక్తికి గీటు రాయి అని వూరూ వాడా ప్రచారం చేసిన సంఘపరివారం తీరా తాము అధికారానికి వచ్చిన తరువాత అదే చైనాతో భాయీ భాయీ అన్నట్లుగా వాజపేయి హయాంలో వున్నారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా దగ్గరయ్యారు. గతంలో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన వారు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారేమిటి అని ఎవరైనా అడుగుతారేమోనన్న భయంతో అనధికారికంగా చైనా వ్యతిరేకతను వ్యాపింప చేయటంలో కూడా వారే ముందుంటున్నారు. ముఖ్యంగా సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ఆపని చేస్తున్నారు. వారి ద్వంద్వ ప్రవత్తికి అది పెద్ద తార్కాణం.

   ఇటీవలి కాలంలో మీడియాలో, సామాజిక మీడియాలో దేశాలు, వ్యాపారం, వస్తువులు, దేశభక్తి గురించి చర్చ పొంగి పొర్లుతోంది. అయితే ఒకటి మాత్రం నిజం మనుస్మృతి, బైబిల్‌,ఖురాన్‌లో చెప్పిందానికి తిరుగులేదు చర్చ లేకుండా పప్పుసుద్దల్లా పడి వుండటం, తలాడించాలని చెప్పే అపర వ్యాఖ్యాతలు, నిర్ధేశకుల నిరంకుశ భావజాలం కంటే ఏదో ఒక చర్చ జరపటం మంచిదే. మరకలు పడినా, కావాలని సిరాలు చల్లినా చర్చంటూ జరిగితే కదా తెలియని విషయాలు బయటికి వచ్చేది. మూఢ భక్తులు తమ మూఢ గురువు ముందు ఎవరైనా ప్రశ్నిస్తే సహించరు, సామాజిక మీడియాలో వారికి ఇష్టం లేకపోయినా భిన్న వాదనలు, ప్రశ్నలు ఎదురవుతాయి. అవి వారిని మార్చకపోయినా ఎదుటి వారి వాదనలను కూడా వినాలనే సహనం గల ఆలోచనా పరులకు వుపయోగం కనుక ఆ చర్చలో ప్రతివారూ పాల్గొనాలి.

    ఈ నేపధ్యంలో కొన్ని అంశాలను చూద్దాం. మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లూ అంతే దూరంలో వుంటుంది అన్న సూక్ష్మ విషయం కూడా తెలియని వారు కొద్ది రోజుల పాటు చైనా వస్తువులను కొనకుండా, అమ్మకుండా, వుపయోగించకుండా వుంటే చైనా మన కాళ్ల దగ్గరకు వస్తుందన్నంతగా కొంత మంది సూచనలు చేస్తున్నారు. ఇది నిజానికి కొత్త అయిడియా కాదు, అరువు తెచ్చుకున్నదే. మన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ పేరుతో ఒక పెద్ద అధ్యాయమే వుంది. దాన్నుంచి వచ్చిన ఆలోచన ఇది. ఆ వుద్యమానికి నాయకత్వం వహించిన ఆ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే విదేశీ వస్తువుల వరదకు తలుపులు తెరిచారు.స్వదేశీ జాగరణ మంచ్‌పేరుతో ఒకవైపు కాస్త హడావుడి చేసినా ఆ విధానాన్ని బిజెపి పెద్దలు పూర్తిగా బలపరిచారు.తమకు అధికారం వచ్చిన తరువాత ఆ స్వదేశీ జాగరణ మంచ్‌ ఏమైందో తెలియదు. కాంగ్రెస్‌ను తలదన్నేలా మరిన్ని సంస్కరణల పేరుతో విదేశీ వస్తువుల సునామీకి తెరతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Image result for Riding on flying horsesIndia

    భరత్‌ ఝన్‌ఝన్‌ వాలా  పెట్టుబడిదారీ విధాన సమర్ధకుడు. ఆయన చేసిన వ్యాఖ్యలే కనుక ఏ రాజకీయ పార్టీనేతో, అభ్యుదయ భావాలు వున్నవారో చేసి వుంటే ఈ పాటికి దేశ ద్రోహుల, చైనా అనుకూల జాబితా పెరిగి పోయి వుండేది. భిన్నాభి ప్రాయాన్ని వ్యక్తం చేయకుండా వుండటం కోసం అలాంటి ముద్రలు వేయటం ఒక పదునైన ఆయుధం. ‘ చైనాకు మన ఎగుమతులు తక్కువగా వుండటమనేది సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు తగ్గిపోవటమే అసలు సమస్య. ఎగుమతుల నుంచి మనం తక్కువ ఆర్జిస్తున్నాము. వాషింగ్టన్‌ ఆపిల్స్‌, స్విస్‌ చాకొలెట్స్‌ దిగుమతులకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నాము. చైనా వారి పద్దతి పూర్తిగా భిన్నమైనది. చైనా రైతు పొలాలకు నీటిని తీసుకు వచ్చే కాలువలలో నీరు సదా నిండుగా వుంటుంది.ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన దుర్గతి అతనికి లేదు. మన రైతులతో పోల్చితే చైనా రైతు వుత్పత్తి వ్యయం తక్కువ. అలాగే చైనా మన దేశంలో తన వుత్పత్తులను కుమ్మరించటం కూడా ఈ వాణిజ్యలోటుకు కారణం కానే కాదు. ఆర్జిస్తున్నదాని కంటే ఎక్కువగా వినియోగం చేసేలా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అప్పు చేసి పప్పుకూడు తినమంటున్నది. వాణిజ్య లోటుకు చైనాను తప్పు పట్టటం మాని మన అసమర్ధతను అంతర్గతంగా ఎదుర్కోవాలి.’ ప్రస్తుత పరిస్థితులలో ఇలా చెప్పటం నిజంగా పెద్ద తెగింపే. ఇష్టంలేని వారు చెప్పింది ఇనుప రింగులతో , ఇష్టం వున్నవారు వుంగరాల చేతో మొట్టినట్లుగా వుంటుంది.

    భరత్‌ ఝన్‌ఝున్‌ వాలా రాసిన పై వ్యాసంతో పాటు ఆంధ్రజ్యోతిలో వి.శ్రీనివాస్‌ అనే రచయిత మరొక వ్యాసం కూడా దీని గురించే రాశారు. ‘ ‘దేైశభక్త రాజకీయాలతో ‘ సంబంధం వున్న ప్రతి నేతా ఇప్పుడు పాకిస్తాన్‌ అంతు చూడటం, చైనాకు బుద్ధి చెప్పటం గురించే మాట్లాడుతున్నారు. భారతీయులు నిష్టగా ‘చైనా వస్తు బహిష్కరణ వ్రతం ‘ ఒక్క నెల రోజులు పాటించినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలటం ఖాయమంటూ సోషల్‌ మీడియాలో గణాంకాలు షికార్లు చేస్తున్నాయి. ఈ దీపావళికి చైనా టపాసులను ముట్టుకోబోమని ప్రతి భారతీయుడు ప్రతిజ్ఞ చేయాలన్న ప్రబోధాలు వినవస్తున్నాయి. చైనాను దారిలోకి తెచ్చుకొనేందుకు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించే వ్యూహంలో భారత్‌ వున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. చైనా వస్తువుల క్రయ విక్రయాల్లో భారీ లాభాలు మూట కట్టుకుంటున్న దేశీయ వ్యాపార కూటముల మాటేమిటి ? ఎవరి లాబీయింగ్‌ దేశీ మార్కెట్లో చైనా సరకులకు బాట వేసింది ? ఎవరి లాభ కాంక్ష దేశీయ చిన్న పరిశ్రమల వుసురు తీసింది. ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న అసమతౌల్యం ఆర్ధిక రంగానికి విఘాతంగా మారుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదు? చైనా ధోరణి అంతర్జాతీయ వేదికలపై భారత ప్రయోజనాలను దెబ్బతీసేట్లుగా వున్నప్పటికీ వాణిజ్య బంధం సడల కుండా ఎందుకు పోషిస్తోంది? మనం కొన్ని వస్తువులను బహిష్కరిస్తే మనకు అత్యవసరమైన కొన్ని వస్తువుల దిగుమతులను నిలిపివేయట ద్వారా చైనా వుల్టా మనపై వత్తిడి చేయగల పరిస్ధితి ఇప్పుడు వుంది.’ ఇలా సాగింది. దీని అర్ధం ఏమిటో ఎవరికి వారు తీసుకోవచ్చు. ఎందుకంటే సూటిగా చెబితే ఇక్కడా దేశ భక్తి ముద్ర వేయటానికి కొందరు సిద్దంగా వుంటారు.

   దీనంతటికీ కారణం ఏమిటి అంటే పాచిపోయిన రోత పుట్టించే సమాధానం అది కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ అని కూడా చెబుతారన్నది తెలిసిందే. వసుధైక కుటుంబమనే విశాల భావన మనది అని చెప్పుకుంటూనే ఇరుగు పొరుగు దేశాలపై కాలు దువ్వే వారి సంగతి పక్కన పెడితే కాసేపు చైనా సంగతి వదిలేద్దాం. మన పరిశ్రమలను, మన రైతులను కాపాడు కోవద్దని లేదా దెబ్బతీయమని మన ప్రజాస్వామ్య వ్యవస్ధ చెప్పిందా లేదే ! దీనికంతటికీ కారకులు కాంగ్రెస్‌ నేతలే అని వెంకయ్య తన భాషా చాతుర్యాన్ని వుపయోగించి ప్రాసతో సహా చెప్పగలరు. మన దేశ పరిశ్రమలు, రైతులను దెబ్బతీసే దిగుమతులను నిరోధించటానికి అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఇవ్వాల్సింది నరేంద్రమోడీ సర్కారే కదా ? ఎందుకు నిలిపివేయలేదు ? దేశ భక్తి ఎక్కడికి పోయింది. ఝన్‌ఝన్‌ వాలా చెప్పినట్లు విలువైన విదేశీ మారక ద్రవ్యంతో వాషింగ్టన్‌ ఆపిల్స్‌, స్విస్‌ చాకొలేట్లు దిగుమతి చేసుకోకపోతే మనకు రోజు గడవదా ? నరేంద్రమోడీకి తెలియదు అనుకుంటే అన్నీ ఎక్కువగా వున్న అపర కౌటిల్యుడు సుబ్రమణ్యస్వామి, ఎప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటికి తగిన విధంగా చక్రం తిప్పే చంద్రబాబు నాయుడి వంటివారి సేవలను ఎందుకు వుపయోగించుకోవటం లేదు ?

   ప్రియమైన పాఠకులారా ఇవేవీ నరేంద్రమోడీతో సహా ఎందరో మహానుభావులు ఎవరికీ తెలియకుండా జరుగుతున్నవి కాదు, అంత అమాయకులెవరూ లేరని ముందుగా మనం తెలుసుకోవాలి. ఆరు వందల సంవత్సరాల నాటి పెట్టుబడిదారీ మేథావులు తమ యజమానుల లాభాలకు కొత్త మార్కెట్ల కోసం కొలంబస్‌లను పంపించారు. ఆధునిక పెట్టుబడిదారీ మేథావులు అంతకంటే తెలివి గల వారు కనుక లాభాల వేటకు హైటెక్‌ పద్దతులను కనిపెట్టారు. గ్రామాలలో ధనిక రైతులు వ్యవసాయాలు మానేసి తమ పొలాలను కౌలుకు ఇస్తున్నారంటే అర్ధం ఏమిటి ? సూటిగా చెప్పాలంటే పంట పండించకుండానే ఫలితాన్ని పొందటమే కదా ? స్వంతంగా వ్యసాయం చేస్తే ఎంత మిగులుతుంతో తెలియదు, కౌలుకు ఇస్తే వ్యవసాయం ఏమయినా, కైలు రైతు మట్టి కొట్టుకుపోయినా ఆ మొత్తం గ్యారంటీగా భూ యజమానికి వస్తుంది. అలాగే ఇంతకాలం లాభాలు సంపాదించి కవిలె కట్టలు గుట్టలుగా పెట్టుకున్న పెట్టుబడిదారులు ధనిక రైతులు లేదా భూస్వాముల కంటే మరింత మెరుగైన పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టకుండా, వ్యాపార సంస్ధలు ఏర్పాటు చేయకుండానే కొత్త పద్దతుల్లో ప్రపంచంలో ఎక్కడ అవకాశం వుంటే అక్కడ లాభాలు పిండుకుంటున్నారు. అందుకు అనేక కొత్త పద్దతులు కనుగొన్నారు. నూతన ప్రపంచాన్ని కనుగొన్న ఆ కొలంబసే కనుక ఇప్పుడు తిరిగి వస్తే పెద్ద షాపింగ్‌ మాల్లో ఏం చేయాలో తెలియని పల్లెటూరి అమాయకుడిలా నోరెళ్ల బెట్టటం తప్ప జరుగుతున్నదేమిటో అర్ధం చేసుకోలేడంటే అతిశయోక్తి కాదు.

    అమెరికాలో ఒక కార్మికుడు ఒక గంట పని చేస్తే కనీస వేతనంగా ఏడు నుంచి పది డాలర్ల వరకు వుంది. ఒక డాలరు విలువ 67,68 రూపాయలు. అంటే రోజుకు ఎనిమిది గంటలు అంటే ఎనభై డాలర్లు సంపాదిస్తారు, దాదాపు ఐదు వేల రూపాయలు. కనీసంగా గంటకు 15 డాలర్లను సాధించుకోవాలని అక్కడి కార్మిక వర్గం పోరాటాలు చేస్తోంది. కొన్ని చోట్ల అంగీకరించారు. ఆ స్ధితిలో అమెరికా పెట్టుబడిదారులు రోజుకు కనీస వేతనంగా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఒక కార్మికుడితో పని చేయించుకోవటం కంటే చౌకగా శ్రమశక్తి దొరికే చోట నెల మొత్తానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పనిచేయించుకున్నారనుకున్నా ఒక్కొక్క కార్మికుడి మీదే నెలకు యాభైవేల రూపాయలు మిగులుతాయి. జపాన్‌ వారు మన దేశంలో మారుతీకార్ల తయారీ (కూర్పు) కేంద్రాలు, కొరియా వారు శాంసంగ్‌ టీవీలు, ఫోన్ల తయారు చేసినా లాజిక్‌- మాజిక్‌ ఇదే. యుద్దనపూడి సులోచనా రాణి నవలల్లోని ఆరడుగుల అందగాడు ఒయ్యారాలు ఒలికించే ఇంపాలా కారులో దిగాడని ఒకపుడు మనం చదువు కున్నాం. ఇప్పుడు వాటి తాతలను మన దేశంలోనే తయారు చేయగల పరిస్థితి వుంది. కార్లు, టీవీలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల విడిభాగాలను మన దేశానికి తీసుకువచ్చి తెల్లవారే సరికి వాటిని బిగించి మన దేశంలో అమ్మటంతో పాటు విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాము.

   వీళ్లు కాకుండా మరికొందరున్నారు. వారు ఇప్పటికే మన వంటి దేశాలలో వున్న పరిశ్రమలు, వ్యాపార సంస్ధల వాటాలను స్టాక్‌ మార్కెట్లో కొంటారు. తెలుగు సినిమాల్లో విలన్లు చివరికి మనకు కనిపిస్తారు. వీరసలు ఎలా వుంటారో కూడా తెలియదు. మన విజయ మాల్య మాదిరి రోజుకు ఒక కిరాయి భామను పక్కనే పెట్టుకొని ఎక్కడో ఒక విహార కేంద్రంలో కూర్చొని కంప్యూటర్ల ద్వారా వుదయం పూట షేర్లు కొని గోలు చేసి లాభం వస్తే సాయంత్రానికి అమ్మి సొమ్ము చేసుకుంటారు. ముంబైలో లాభాలు రాలేదనుకోండి మరుసటి రోజు ఏ దక్షిణాఫ్రికాలోనో లేక ఏ బ్రెజిల్‌లోనో కొని అమ్ముతారు.

   ఇంకా కొందరు వున్నారు. విజయవాడ-హైదరాబాదు మధ్య కార్లు సర్రున దూసుకుపోయే రోడ్లు వేయటానికి మన దేశంలోని జిఎంఆర్‌ వంటి కంపెనీలకు డబ్బు పెట్టుబడిపెడతారు. వాటి చేత మన దగ్గర టో(తో) లు వలిచి పన్ను వసూలు చేయిస్తారు. వాటిలో తమ వాటా తాము పట్టుకుపోతారు. మరి కొందరున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారి చేత తక్షణమే విద్యుత్‌ వుత్పత్తి కేంద్రాలు పెట్టకపోతే అంధకారం అలుముకుంటుందని పెద్ద ఎత్తున వూదరగొట్టిస్తారు. గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్యాస్‌ విద్యుత్‌ కేంద్రాలు అలా పెట్టినవే. గ్యాస్‌ లేక అవి పనిచేయకపోయినప్పటికీ, ఒక్క యూనిట్‌ విద్యుత్‌ వుత్పత్తి చేయకపోయినా స్ధిర ఖర్చు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించిన విషయం తెలిసిందే. అధిక ధరలను చూపి నిర్మాణ ఖర్చును రెట్టింపుగా చూపుతారు. విదేశాలలోని తమ కంపెనీల నుంచే బొగ్గు దిగుమతి చేయించి సముద్రతీరంలోని ఏ నెల్లూరు దగ్గరో శ్రీకాకుళంలోనో విద్యుత్‌ కేంద్రాలన్నింటినీ పెట్టిస్తారు. కాలుష్యాన్ని జనానికి వెదజల్లి లాభాలను మాత్రం పట్టుకుపోతారు. వాటికి అవసరమయ్యే యంత్రాలను కూడా విదేశాలలోని తమ కంపెనీలు లేదా ఏజంట్ల నుంచే తెప్పిస్తారు. మొత్తానికి వుత్పత్తి ప్రారంభించకుండానే తమ ఖర్చును రాబట్టుకుంటారు.వాటంగా వుంటే కొంతకాలం వుంటారు లేకపోతే ఎవరో ఒకరికి విక్రయించి తప్పుకుంటారు.

   1948 నుంచి 1970 దశకం వరకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాలు పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందకుండా కమ్యూనిస్టు చైనాను అడ్డుకున్నాయి. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీతో విబేధాల కారణంగా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రంగా వున్న హాంకాంగ్‌, మకావో దీవుల కౌలు గడువు తీరిన తరువాత 2000 సంవత్సరం నుంచి ప్రధాన భూభాగం చైనాలో విలీనం అవుతాయని ముందే నిర్ణయం అయింది. అక్కడ వున్న సంస్ధల పెట్టుబడులు, చైనీయుల పెట్టుబడుల గురించి ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించాల్సిన పూర్వరంగంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఆకర్షణ, ప్రవాస చైనీయుల పెట్టుబడుల ఆకర్షణ, ఇతర పెట్టుబడిదారీ దేశాల నూంచి కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్దిక వ్యవస్ధను పరిమితంగా విదేశీ సంస్థలకు తెరిచేందుకు సంస్కరణలను రూపొందించింది. తద్వారా కలిగే ఫలితాన్ని జనానికి చేరే విధంగా ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు, ఇతర వ్యాపారాల నిర్వహణ వంటి విధానాలను రూపొందించింది. హాంకాంగ్‌ కేంద్రంగా వున్న పెట్టుబడులు చెదరకుండా వుండేందుకు 2050 వరకు ఒకే దేశం రెండు ఆర్ధిక వ్యవస్ధల పేరుతో ప్రధాన భూభాగంలో సోషలిస్టు విధానం, హాంకాంగ్‌, మకావుల్లో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించేందుకు పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. దాంతో ప్రవాస చైనీయులు పెట్టుబడులతో పాటు, భారీ ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకు వచ్చారు. ప్రభుత్వం పరిశోధన-అభివృద్ధికి భారీ ఎత్తున ఖర్చు చేసింది. ఇలా బహుముఖ చర్యలతో చైనా అనూహ్య అభివృద్దిని సాధించింది. అది కింది వరకు వూట మాదిరి కింది వరకు దిగే విధానాలు అనుసరించింది. ఈ కారణాలన్నింటితో చైనా నుంచి బుల్లెట్‌ రైళ్ల నుంచి బుల్లి బుల్లి దీపావళి చిచ్చు బుడ్ల వరకు మన వంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశంలోని బడా వ్యాపారులు తెల్లవారేసరికి లాభాలు కావాలంటే వాటిని దిగుమతి చేసుకొని సాయంత్రానికి అమ్మి రాత్రికి లాభాల లెక్కలు వేసుకోవచ్చు. ఫ్యాక్టరీలు పెట్టి, తయారు చేసి వాటిని అమ్ముకోవటం కంటే ఏది లాభం ? దీనికి మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ వంటి వారు పురచేయి అడ్డుపెడితే ఆగేవారు ఎవరైనా వుంటారా ? కావాలంటే వారిని ఎత్తి గోడవతల పారవేసి నోర్మూసుకొని చూస్తుండేవారిని గద్దెపై కూర్చో పెడతారు.

   అమెరికా,ఐరోపాలోని ధనిక దేశాలలోని వ్యాపారులు కూడా చైనా నుంచి సరకులు దిగుమతి చేసుకోవటం ద్వారా తమ లాభాలకు ఎలాంటి ఢోకా వుండదని గ్రహించి దానికే మొగ్గు చూపటంతో అటు చైనా ఇటు ధనిక దేశాలలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు లాభపడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు చైనాలో పెట్టుబడులు పెట్టటానికి వీలు కలిగింది. ఎగుమతులపై ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థలతో తలెత్తే చిక్కులేమిటో లాటిన్‌ అమెరికా అనుభవం నుంచి నేర్చుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం దేశీయంగా వినిమయాన్ని పెంచేందుకు వీలుగా పౌరుల ఆదాయాలను కూడా క్రమంగా పెంచుతూ వచ్చింది. ఈ కారణంగానే 2008లో ప్రారంభమైన పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధల సంక్షోభం పరిమితంగానే చైనాపై ప్రభావం చూపింది. బయటి దేశాల పరిశీలకులు ఈ కోణాన్ని చూడకుండా 2008 కంటే ముందున్న వేగం తగ్గింది కదా అని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఇప్పటికీ చైనాలో సమస్యలు వున్నట్లు చైనా నాయకత్వమే చెబుతోంది.వారేమీ దాచుకోవటం లేదు. ఇంకా తమది వర్ధమాన దేశమే అని చెప్పటంలో అర్ధం అదే. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా మన సంస్కరణలకు, చైనా సంస్కరణల విధానాలకు ఎంతో తేడా వుంది. భరత్‌ ఝన్‌ఝన్‌ వాలా చెప్పినట్లు చైనాను తప్పు పట్టటం మాని మన అసమర్ధతను అంతర్గతంగా ఎదుర్కోవాలి, రెక్కల గుర్రం ఎక్కి చుక్కలు లోకం చూడొద్దని అంటే నన్ను దేశ భక్తి లేనివాడిగానో, చైనా అనుకూల వాదిగానో చిత్రీకరించరు కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుగ్రవాదంపై పోరు : వేయి ఆలోచనలను వినండి !

01 Saturday Oct 2016

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Afghanistan, IS, Let a thousand ideas be heard, talibans, terrorism, war on terrorism

ఎం కోటేశ్వరరావు

     కౌరవ సభలో ద్రౌపదిని అవమానించవద్దన్న విదురుని నీతి వాక్యాలు పని చేసి వుంటే మహాభారత యుద్దమే వుండేది కాదన్నది కొందరి అభిప్రాయం. యుద్ధ చరిత్రలను చూసినపుడు దానిని అంగీకరించలేము. పాండవులకు రాజ్యభాగాన్ని ఇవ్వకుండా వుండేందుకు కౌరవులు మరొక సాకును వెతికి వుండేవారన్నది స్పష్టం. మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. అందువలన ఎవరైనా తమంతట తాముగా లేదా ఎవరి తరఫున అయినా యుద్ధం లేదా దానికి సమానమైన వుగ్రవాద దాడులు చేయాలనుకుంటే వారికి ద్రౌపదితో పని లేదు తోడేలు న్యాయం ఎలాగూ వుంటుంది. తెరవెనుక వున్న అమెరికా వైఖరిలో మార్పు వచ్చేంత వరకు ఏదో ఒక రూపంలో ప్రపంచవ్యాపితంగా వుగ్రవాదులు పుడుతూనే వుంటారు, లేదా అమెరికన్లు వారికి తొత్తులుగా వుండే పాకిస్తాన్‌ వంటి దేశాలు వుగ్రవాదులను తయారు చేస్తూనే వుంటాయి. మన దేశంపైకి వుసి కొల్పుతూనే వుంటారు. మనం నిరంతరం జాగరూకులుగా వుండాలి. దొరికినపుడు చావు దెబ్బతీయాలి.

  పొరుగు దేశం జరిపే ప్రత్యక్ష దాడులను ఎదుర్కోవటానికి, పొరుగుదేశం తయారు చేసిన వుగ్రవాదులను ఎదుర్కొనటానికి వున్న తేడాను అర్ధం చేసుకోవాలి. యురి వుదంతం తరువాత మన దేశంలో సహజంగానే వుగ్రవాద, పాకిస్తాన్‌ వ్యతిరేకత బాగా పెరిగింది.మన ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాలనే వైఖరితో వున్నట్లు చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.ఈ దశలో ప్రతీకార చర్యల గురించి ఎవరైనా భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తే అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించే పరిస్థితి కూడా వుంది. మనోభావాలు, ప్రతీకారేఛ్చ ఎక్కువగా వుండటం సహజం. అయితే వుద్రేకం, ఆగ్రహంలో వివేచనను మరచి పోకూడదు. ఎవరైనా తమ మనోభావాలకు భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తే వారి మీద ఆగ్రహించితే ప్రయోజనం లేదు. ఏడుగురు అంధులు-ఏనుగు వర్ణణ కథ తెలిసిందే. దాని నీతి ఏమిటి ఎవరి స్పర్శ, అనుభవంలోకి వచ్చిన దానిని బట్టి వారు ఏనుగెలా వుంటుందో వర్ణించారు. అలాగే సమాజంలో వున్న భిన్న వ్యక్తులు తమ అనుభవాలు, అధ్యయనంలో కలిగిన భావాలకు అనుగుణంగా పరిష్కార మార్గాలను సూచించవచ్చు,పరిష్కారాలు చెప్పవచ్చు. అంత మాత్రాన వారిపై ఆగ్రహం చూపకూడదు.

    వస్తాదుల మాదిరి వుగ్రవాదులను తయారు చేసినపుడు వారికి పని కల్పించకపోయినా, ఏకారణంతో అయినా వారికి ఎదురు చెప్పినా శిక్షణ ఇచ్చిన వారి మీదే తారసిల్లుతారు. మనకు పక్కనే వున్న శ్రీలంకలోని తమిళ వుగ్రవాదులకు మన దేశంలో శిక్షణ శిబిరాలు నిర్వహించి, ఆయుధాలు, డబ్బు సమకూర్చిన విషయం బహిరంగ రహస్యం. అలాంటి వారిని అణచివేసేందుకు మన కేంద్రమే సైన్యాన్ని పంపిన కారణంగా ఆ తీవ్రవాదులే మన ప్రధాని రాజీవ్‌ గాంధీని బలిగొన్న విషయం కూడా విదితమే. అలాగే పంజాబ్‌లో అకాలీదళ్‌ స్ధానే కాంగ్రెస్‌ను బలపరచాలనే లక్ష్యంతో ఖలిస్తాన్‌ తీవ్రవాది భింద్రన్‌ వాలేను పెంచి పోషించిన ఇందిరా గాంధీ ఆ సిక్కు తీవ్రవాదానికే బలి అయిన విషయమూ తెలిసిందే.

     తాలిబాన్లను పెంచి పోషించిన ఇప్పుడు అమెరికా,పాకిస్థాన్ల పరిస్థితి కూడా అలాగే వుంది. అందుకు మనమేమీ వారి మీద జాలి చూపాల్సిన అవసరం లేదు. తాము తయారు చేసిన ఐఎస్‌, తాలిబాన్లు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తారో తెలియక అవి కొట్టుమిట్డాడుతున్నాయి. తాలిబాన్లపై యుద్ధం ప్రకటించి ఆఫ్ఘనిస్తాన్‌కు సైన్యాలను నడిపిన అమెరికా 2001నుంచి ఇప్పటి వరకు సాధించిందేమిటి ? తాలిబాన్లపై దాడి చేయటానికి ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు అనేక దేశాల నుంచి సైన్యాన్ని రప్పించారు. జరిగిందేమిటి. తాలిబాన్ల సంఖ్య తామర తంపరగా పెరుగుతూనే వుంది. అప్పటి వరకు ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌కే పరిమితంగా వున్న వారు ప్రపంచ వ్యాపితంగా విస్తరించారు.

     పదమూడు సంవత్సరాల రెండు నెలల 21 రోజుల యుద్ధంలో అమెరికా నాయకత్వంలో అంతర్జాతీయ దేశాల కూటమి జరిపిన దాడులలో ఎందరు తాలిబాన్లు మరణించారు, ఎన్ని శిబిరాలను ధ్వంసం చేశారో ఇప్పటికీ ఇదమిద్దంగా తెలియదంటే నమ్మక తప్పదు.http://www.voanews.com/a/despite-massive-taliban-death-toll-no-drop-in-insurgency/1866009.html  సగటున రోజుకు  12 మంది తాలిబాన్లను మట్టు పెట్టినట్లు ఆఫ్ఘన్‌ పోలీసులు, మిలిటరీ చెప్పింది. ఆ లెక్కన 4,830 రోజులలో 57,960 మంది తాలిబాన్లను అంతం చేసినట్లు. ఇంత జరిగాక కూడా అప్పటికి ఇంకా 60 వేల మంది తాలిబాన్లు వున్నట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో వార్తలో పేర్కొన్నారు. ఇదే సమయంలో తాలిబాన్ల చేతులలో హతమైన వారు లేరా ? వారెందరు ? ఆప్ఘన్‌ సైనికులు 21,950,అమెరికా సైనికులు 2,356 మందితో సహా మిగతా దేశాల సైనికులు 3,456 కిరాయి సైనికులు( కాంట్ట్రార్లు )1500, గాయపడిన వారు ఆఫ్ఘన్‌ సైనికులెందరో తెలియదు, అమెరికన్లు 19,950 మందితో సహా విదేశీ సైనికులు 22,773, కిరాయి సైనికులు 15000 మంది వున్నారు. వుభయుల చేతిలో మరణించిన సామాన్య పౌరులు మరికొన్ని వేల మంది వున్నారు. ఇంత చేసి సాధించిందేమిటి ? ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు యధాతధంగా వున్నారు, అక్కడి అమెరికా తొత్తు ప్రభుత్వం, వారికి మద్దతుగా కొనసాగుతున్న పరిమిత సంఖ్యలో వున్న అమెరికా సైనికులు, పక్కనే వున్న పాకిస్థాన్‌పై తాలిబాన్లు నిరంతరం దాడులు జరుపుతూనే వున్నారు.

     ప్రస్తుతం తాలిబాన్లపై మూడున్నర లక్షల మంది ఆఫ్ఘన్‌ సైనికులు, 9,800 మంది అమెరికన్లతో సహా 40దేశాలకు చెందిన 13,000 మంది సైనికులు, దాదాపు 26వేల మంది కిరాయి సైనికులు దాడులు జరుపుతున్నారు. అయినప్పటికీ 30 నుంచి 60వేల మంది తాలిబాన్లు, వెయ్యి నుంచి మూడువేల మంది ఐఎస్‌ వుగ్రవాదులు, వారి మద్దతుదార్లు మరో పదివేల మంది వున్నారని అంచనా.తాలిబాన్లు ప్రస్తుతం తమ దేశంలో వున్న అమెరికా, తమ సైన్యం, జనం మీదనే గాక గతంలో నారు వేసి నీరు పోసిన పాకిస్థాన్‌పై నిరంతరం దాడులు జరుపుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకు పాకిస్థాన్‌లో జరిపిన దాడులలో 262 మంది సామాన్యులు మరణించారు.ఈ పూర్వరంగంలో సర్జికల్‌ దాడులకు బదులు సరిహద్దులలోని వుగ్రవాద శిబిరాలపై ప్రత్యక్ష దాడులే జరిపిందనుకుందాం వుగ్రవాదులు, వుగ్రవాదం పూర్తిగా అంతం అవుతుందా ? మన కంటే ఎన్నో రెట్లు బలమైన అమెరికన్లు ఎందుకు విఫలమయ్యారు. ఇప్పుడు సిరియాలో ఐఎస్‌ తీవ్రవాదులను అంతం చేసేందుకు అటు సిరియా సైన్యం, రష్యన్‌ వైమానిక దళం ఎంతగా శ్రమిస్తున్నదో చూస్తున్నాం. ఇరాక్‌లో ఐఎస్‌ తీవ్రవాదులు కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అందువలన వివేచనతో ఆలోచించాలి. వుగ్రవాద అంతానికి కొత్త మార్గాలను కనుగొనాలి. పిచ్చి మొక్కలు మొలకెత్త కుండా వుండాలంటే పొలాన్ని నిరంతరం సాగు చేస్తుండాలి. ఎయిడ్స్‌ వ్యాధిని నిరోధించటానికి ప్రయత్నిస్తూనే చికిత్స చేయటానికి అవసరమైన ఔషధాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుత పరిస్థితులలో వుగ్రవాదం కూడా అలాంటిదే. వుగ్రవాదులను అంత మొందించేందుకు ఎంతగా ప్రయత్నించాలో వారు తయారు కాకుండా చూసేందుకు అంతకంటే ఎక్కువగా ప్రయత్నించాలి. దానికి అనేక మంది అనేక మార్గాలు చెబుతున్నారు. నూరు పూవులు పూయనివ్వండి వేయి ఆలోచనలు వికసించనివ్వండి అన్నట్లు వాటిని స్వాగతించండి. ప్రతి ఒక్కరూ ఇతరులతో ఆలోచనలు పంచుకోండి. అంతే కాని మరోమాట వినం అనే స్థితికి పోవద్దని మనవి.

   ఈ పూర్వరంగంలో మన సైన్యం సర్జికల్‌ దాడులు జరిపి మన సత్తా ఏమిటో పాకిస్థాన్‌కు, వుగ్రవాదులకు చూపటం అభినందనీయం. ఇదే సమయంలో మన దేశంలో సరిహద్దులలోని పది కిలోమీటర్ల లోపు జనం గ్రామాలను వదలి వెళ్లిపోతున్నారని వార్తలు వచ్చాయి. నాలుగు రోజులు హైదరబాదులోని లోతట్టు ప్రాంతాలు, వాటిలో కట్టిన అపార్ట్‌మెంట్లు వర్షాలకు మునిగితే ఖాళీ చేయటానికి పడిన, పదిరోజుల తరువాత కూడా పడుతున్న ఇబ్బందుల గురించి మీడియా కథనాలను చూస్తున్నాము. అందువలన యుద్ధం అంటే ప్రాణాలకు తెగించాల్సింది వీర జవాన్లు, సరిహద్దులలోని లక్షల మంది సామాన్య జనం. ధనికులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతారు.సామాన్యులకు ఎలాంటి సౌకర్యాలు వుండని స్కూళ్లు, ప్రభుత్వ భవనాలే గతి. అందువలన ఎవరైనా యుద్ధం మినహా ఇతర పరిష్కార మార్గాలను చూడమని చెబితే వారిని దేశద్రోహులుగా చూడాల్సిన అవసరం లేదు. వారేమీ పాకిస్తాన్‌ మీద, వుగ్రవాదుల మీద ప్రతీకారం తీర్చుకోవద్దని చెప్పటం లేదు.

   పాక్‌ వుగ్రవాద ప్రోత్సాహం ఈ నాటిది కాదు, దశాబ్దాల తరబడి సాగుతున్నది, మన దేశం ఎంతో నష్ట పోయింది. అలాంటి పాకిస్థాన్‌ను దెబ్బతీయటానికి సింధు నది మీద మన దేశంలో ప్రాజెక్టులు కట్టి ప్రతీకారం తీర్చుకోవచ్చన్న సూచనలు వచ్చాయి. అలాంటి వాటిని నిర్మించమనండి దేశ ప్రజలందరూ అవసరమైతే ఒక రోజు శ్రమదానం చేయటానికి సిద్ధంగా వున్నారు. లేదూ యురి సైనిక శిబిరంలో గడ్డి పెరిగి పోయిన కారణంగా వుగ్రవాదులు నది దాటి వచ్చి గడ్డిలో దాక్కొని దాడి చేశారని చెప్పారు. గడ్డి తొలగించటానికి కావాలంటే ఎంత విరాళం కావాలంటే అంత ఇచ్చేందుకు జనం సిద్దంగా వుంటారు. లేదూ పీకమంటే రావటానికి సిద్ధం. అలాగే నది గట్లపై ముళ్ల కంచెలు వేసి వుగ్రవాదులు, శత్రు సైనికులు చొరబడకుండా చూడమనండి అందరూ తలా ఒక చేయి వేస్తారు.

    యుద్ధం అంటే ముందుగా నిజం సమాధి అవుతుంది. అనేక కట్టుకధలు ప్రచారంలోకి వస్తాయి. అనేక మంది సామాజిక మీడియాలో తాజా పరిస్థితిలో రాజకీయాలు వద్దని చెబుతున్నారు. వారి అభిప్రాయం సరైనదే. కానీ రాజకీయాలు చేస్తున్నది ఎవరు ? సర్జికల్‌ దాడుల ఖ్యాతి ఆయనకు పూర్తిగా కట్టపెట్టటానికి ప్రతిపక్షాలు ముందుకు రావటం లేదు అని ఒక పత్రిక రాసింది. ఒకవైపు మరణించి సైనికుల కుటుంబాలు ఇంకా ఆవేదన నుంచి బయటకు రాలేదు. అప్పుడే ఖ్యాతి కట్టబెట్టటం గురించి మీడియాలో వ్యాఖ్యలు చేసే వారు నిజమైన దేశద్రోహులు అనాల్సి వుంటుంది. అదంతా సైన్యం గొప్పతనమే అన్నట్లు గా ప్రతిపక్షాల వారు వ్యాఖ్యానిస్తున్నారట. గతంలో కార్గిల్‌ యుద్ధం కారణంగా బిజెపి విజయం సాధించినట్లే ఇప్పుడు సర్జికల్‌ దాడుల కారణంగా వుత్తర ప్రదేశ ఎన్నికలలో బిజెపి విజయం సాధించనున్నదని పరిశీలకులు భావిస్తున్నారట. అంటే ఒక వైపు సైన్యం అప్రమత్తంగా వుంది, మరోవైపు దాడులు జరిగితే ప్రాణాలు కాపాడుకోవాలని సరిహద్దు పౌరులు సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని దేశమంతా వుగ్గపట్టుకొని కూర్చున్నది. ఈ స్థితిలో రాజకీయ పరిశీలకుల పేరుతో ఎన్నికల లాభాల గురించి పత్రికలు రాయటాన్ని ఏమనాలి. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకునే వారికంటే నీచమిది.ఇలాంటి వ్యాఖ్యల కారణంగా రాబోయే గుజరాత్‌, వుత్తర ప్రదేశ్‌ మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల కోసమే మోడీ నాయకత్వం సర్జికల్‌ దాడులకు తెరతీసింది అనుకోవాలా ? నిజంగా వుగ్రవాద నిర్మూలన కోరుకునే వారు చేయాల్సిన పనేనా ఇది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికన్లకు జలుబు చేస్తే భారత్‌లో ముక్కులు చీదాలా ?

27 Tuesday Sep 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Americans, cold, Farmers, indians, runny nose, wheat import

Image result for  cold to one runny nose to another one cartoon

ఎం కోటేశ్వరరావు

    రష్యాలో వాన పడితే భారత్‌లో గొడుగులు పడతారని గతంలో కమ్యూనిస్టుల మీద ఒక ఆరోపణ వుండేది. కమ్యూనిస్టులు అంతర్జాతీయ వాదులు కనుక సోవియట్‌ సోషలిజాన్ని దెబ్బతీసేందుకు జరిగే ప్రతి ప్రయత్నాన్ని విమర్శించేవారు కనుక కమ్యూనిస్టు వ్యతిరేకులు అలా వ్యాఖ్యానించే వారు. పోనీయండి ఇప్పుడా సోవియట్‌ లేదు, కమ్యూనిస్టులు ఎవరికీ గొడుగులు పట్టటం లేదు. నిజానికి బ్రిటీష్‌ రాణి కుటుంబంలో ఎవరైనా సమర్తాడితే మన దేశంలో బంతులు పెట్టిన వారి వారసులే అలాంటి విమర&శలు చేశారు. ఇప్పుడా బ్రిటీష్‌ వారూ పోయారు గనుక దాన్నీ వదిలేద్దాం. అమెరికన్లకు జలుబు చేస్తే మన దేశంలో ముక్కులు తుడుకుంటున్నవారి గురించి ఇప్పుడు మన ఆలోచించాలి.గొడుగులు పట్టినా,సమర్త బంతులు పెట్టినా మరొకరికి పెద్దగా హాని వుండదు. కానీ జలుబు అంటే అదొక అంటు వ్యాధి ఒక పట్టాన వదలదు, ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుందని తెలిసిందే. అందుకే అమెరికా జలుబుకు ఇక్కడ ముక్కులు చీదుతున్నవారి గురించి జర జాగ్రత్త !

      అమెరికాలో గాడిద పార్టీ (డెమోక్రాట్స్‌ )తరఫున హిల్లరీ క్లింటన్‌, ఏనుగు (రిపబ్లికన్‌ ) పార్టీ తరఫున డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరూ ఇద్దరే నవంబరు వారు వరకు ఒక రోజు హిల్లరీ గెలుస్తుందని వార్తలు వస్తాయి, మరొక రోజు ట్రంప్‌ గెలుస్తాడని వార్తలు రాస్తారు, సోమవారం నాడు ట్రంప్‌ది పైచేయిగా వుందన్న వార్తలు రావటంతో చూసి మన దేశంతో సహా ప్రపంచంలో బంగారం ధరలు తగ్గాయని, స్టాక్‌ మార్కెట్ల సూచీలు పడిపోయాయని, చమరు ధరలు పెరిగాయని వార్తలు వచ్చాయి.ఓకే ట్రంప్‌ పచ్చి మితవాది కనుక అతగాడు వైట్‌ హౌస్‌లో అడుగుపెడితే తమకు కలసి రాదని అమెరికన్లు అనుకుంటే అక్కడి వ్యాపారాలపై దాని ప్రభావం పడాలి. డెమోక్రాట్ల నేత ఒబామా గత ఎనిమిది సంవత్సరాలుగా చేసిన మంచేమిటి ? ఏమీ లేకపోబట్టే కదా అమెరికన్లు ట్రంప్‌కు ఓటేస్తే ఏమిటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు .ఎక్కడో 14వేల కిలోమీటర్ల దూరంలో వున్న మన మీద దాని ప్రభావం పడటం ఏమిటి ? ఆకాశంలో తిరుగుతూ నిత్యం మనల్ని కాపాడుతున్న మన దేవతలు ఏం చేస్తున్నట్లు ? పోనీ మన ప్రధాని నరేంద్రమోడీ విదేశాల్లో తిరుగుతూ ఇక్కడి వ్యవహారాలను విస్మరిస్తున్నారా ? మన సమాచార, ప్రసార, ప్రచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడి నోటి వెంట ఎప్పుడూ మంచి వార్తలే వినిపిస్తున్నాయి, మంచి రోజులనే చూపుతున్నారు కదా !

     మన రిజర్వుబ్యాంకు వడ్డీ రేట్ల సవరణ గురించి ఆలోచిస్తున్నదంటే మన కంపెనీల స్టాక్‌ రేట్లపై ప్రభావం పడుతున్నదంటే అర్దం వుంది. అమెరికా రిజర్వుబ్యాంకు(ఫెడరల్‌ రిజర్వు) సమీక్షించబోతున్నది అనగానే మన స్టాక్‌ మార్కెట్‌లన్నీ రెండు మూడు రోజులు గందరగోళపడిపోతాయి. మన రూపాయి పాపాయి లబలబలాడి పోతుంది. ఏమిటీ దానికీ మనకు వున్న బాదరాయణ సంబంధం, ఆ లంకెను తెగగొట్టటానికి గతంలో వున్న కాంగ్రెస్‌ పాలకులు ప్రయత్నించలేదు, లేదా వారికి చేతకాలేదు అనుకుందాం సమర్ధ ప్రధాని నరేంద్రమోడీ పాలనలో కూడా ఈ పరిస్థితి ఏమిటి ? అమెరికాతో లంకె మనకు లాభం చేస్తున్నదా నష్టం తెస్తున్నదా ? నరేంద్రమోడీ అధికారానికి వచ్చినప్పటి నుంచి మన రూపాయి పతనమైనా మన ఎగుమతులు పెరగలేదు, పరిశ్రమలు పూర్తిగా వుత్పత్తి చేయటం లేదు. మేకిన్‌ ఇండియా పిలుపు మేరకు ఎన్ని పరిశ్రమలు మన దేశానికి వచ్చి వస్తూత్పత్తి చేసి ఎంత మేరకు ఎగుమతులు చేస్తున్నాయో ఎవరూ చెప్పరు.రెండున్నర సంవత్సరాలు కావస్తోంది, మంచి రోజులంటే ఇంకెన్నాళ్లు ? అమెరికా ఎన్నికలు మనల్ని మరికొద్ది వారాల పాటు నిదురపోనివ్వన్నమాట. ప్రతివారం ఏదో ఒక దేశం పర్యటించి మన ప్రధాని నరేంద్రమోడీ మనకు పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తున్నట్లు చెబుతున్నారు కదా. మన పరిశ్రమలు, మన వ్యాపారాలు బాగుంటే మన కంపెనీల వాటాలు పడిపోవటం ఏమిటి? మనల్ని అమెరికన్లకు తోకలుగా మార్చారా ? లేకపోతే అక్కడేదో జరిగితే ఇక్కడ తోకలు వూగటం ఏమిటి ?

    మన దేశానికి ఆహార ధాన్యాల కొరత లేదు, ఇప్పటికే గోదాముల్లో బియ్యం, గోధుమల నిల్వలు పెరిగాయి, వాటిని అమ్మి వేస్తామని బిజెపి వారు చెప్పారు. కొనేందుకు డబ్బు లేక మన దేశంలో ఆహారధాన్యాలు నిల్వ వుండిపోతున్నాయి తప్ప ఎక్కువై కాదన్నది సత్యం. ఇప్పటికే రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావటం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ స్థితిలో విదేశాల నుంచి చౌకగా వచ్చే ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటే ఇక్కడి రైతుల పరిస్థితి ఏమిటో బిజెపి సర్కార్‌ ఆలోచిస్తోందా ? అనుమానమే ! ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి మన వ్యాపారులు 25వేల టన్నుల గోధుమలు దిగుమతికి కొనుగోళ్లు చేశారన్నది నేటి వార్త. ఎందుకట ! ఇప్పటి వరకు వున్న దిగుమతి పన్ను 25శాతాన్ని గత శుక్రవారం నాడు పదిశాతానికి తగ్గించారు. విదేశీ గోధుమలను దిగుమతి చేసుకుంటే మన దేశంలో గోధుమలను పండించే రైతులేం కావాలి. వారి వుత్పత్తులకు ధరలు పడిపోవా ? అదే జరిగితే నరేంద్రమోడీ వాగ్దానం చేసినట్లు 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు ఎలా అవుతాయి ? ఎవరైనా గట్టిగా అడిగితే వారు దేశ భక్తులా కాదా అని పోలీసులు రికార్డులు తిరగేస్తారు, సంఘపరివార్‌ సంస్ధల వారు దాడులకు పూనుకుంటారు?రోజూ భయంతో చస్తూ బతికే కంటే ఒక రోజు ధైర్యంతో పోతేనే జనం గుర్తు పెట్టుకుంటారు.గోధుమల దిగుమతి అవసరం మనకు వుందా ? జూన్‌ 16వ తేదీన మన కేంద్రమంత్రి పాశ్వాన్‌ గారు మన దేశంలో నిల్వలు పెరిగిపోతున్నాయని, చౌక దిగుమతులను అరికట్టేందుకు 25శాతం పన్ను విధింపును పొడిగిస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. అంత పన్ను వున్నప్పటికీ అపర దేశ భక్తులైన మన వ్యాపారులు వినియోగదారుల సేవకోసం అప్పటికే ఈ ఏడాదిలో పదిలక్షల టన్నులకు పైగా దిగుమతి చేసుకున్నారు. జూలై ఒకటి నాటికి ఎన్ని గోధుమలు నిల్వ వుండాలో మన నరేంద్రమోడీ సర్కార్‌ ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. దానికి మించి కోటీ ఇరవై లక్షల టన్నులు అదనంగా వున్నాయని, మొత్తం నిల్వలు 4కోట్ల టన్నులకు చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. మరి సెప్టెంబరు కూడా పూర్తి గాక ముందే పన్ను శాతాన్ని పదికి ఎందుకు తగ్గించినట్లు ? నిల్వలు తగ్గిపోయాయా ? జనానికి అదనంగా అందచేయాలని సర్కార్‌ నిర్ణయించిందా ? అలాంటి ప్రకటనలేమీ లేవు. అసలు విషయం ఏమంటే గోధుమలు పండే వుత్తరాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి దక్షిణాది రాష్ట్రాల పిండి మిల్లులకు తరలించే గోధుమల ధర కంటే కొన్నివేల మైళ్ల దూరాన వున్న ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల నుంచి ఓడల్లో దిగుమతులు చేసుకోవటం చౌకగా వుండటమే. అయితే దానికి మన దేశంలోని గోధుమలలో ప్రొటీన్లు తక్కువగా వుంటాయని, పీజాలు, పాస్టాలు తయారు చేయటానికి పనికి రావని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు.ఈ దిగుమతులు పదేళ్ల నాటి రికార్డును అధిగమిస్తాయని ఒక కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఘనత రికార్డును కూడా నరేంద్రమోడీ ఖాతాలోనే వేయాలి మరి. పన్ను తగ్గింపు వెనుక ఏమైనా జాతీయ-అంతర్జాతీయ గోధుమ వ్యాపారుల ముడుపులు వుండి వుంటాయా ? ఏమో ! గత ఎన్నికలలో పెట్టిన పెట్టుబడి మీద అసలు, లాభం సంపాదించుకోవాలి, వచ్చే ఎన్నికలకు పెట్టుబడులు సమకూర్చుకోవాలి కదా ! ఏడాది కేడాది ఓట్ల ధరలు మండిపోతున్న రోజులివి. దీపం వుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, రైతులు ఎలా పోతేనేం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆఫ్ఘనిస్తాన్‌కు మిలిటరీ సాయం అంటే తాలిబాన్లకు ఆహ్వానమే !

18 Sunday Sep 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

Afghanistan, INDIA, military supplies, Narendra Modi, talibans

Image result for MI-24/25 attack helicopters

అమెరికా వుచ్చులోకి దేశాన్ని నెడుతున్న నరేంద్రమోడీ ప్రమాదకర క్రీడ

సత్య

     అమెరికాతోనూ, వుగ్రవాదులతో జట్టు కట్టి బాగుపడిన దేశం గానీ, ముప్పును తప్పించుకున్న నేతలు గానీ అరుదుగా కనిపిస్తారు. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు భింద్రన్‌ వాలే అనే ఖలిస్తాన్‌ వుగ్రవాదిని పెంచి పెద్ద చేసి ఇందిరా గాంధీ, ఒక దశలో తమిళ ఎల్‌టిటియి వుగ్రవాదులకు ఆయుధాలు ఇచ్చి తరువాత మారిన పరిస్థితుల్లో వారిని అణచివేతకు సైన్యాన్ని పంపి రాజివ్ గాంధీ వారి చేతుల్లోనే బలైన వుదంతం మన కళ్ల ముందే జరిగింది. తాలిబాన్లను తయారు చేసి చివరకు వారి చేతుల్లో చావు దెబ్బలు తిని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనలను వుపసంహరించుకున్న అమెరికా నిర్వాకాన్ని చూశాము. ఇంత జరిగాక వాటి నుంచి గుణపాఠాలేమీ తీసుకోకుండా నరేంద్రమోడీ సరికొత్త ప్రమాదకర క్రీడ మొదలు పెట్టారు. ఇప్పటివరకు మన దేశం అనుసరించిన విదేశాంగ విధానానికి భిన్నంగా స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవటం లేదా ఏర్పరుచుకోవటానికి బదులు ఇరుగు పొరుగు దేశాలతో గిల్లి కజ్ఞాలకు దిగి కొత్త ప్రమాదాలను కొని తెచ్చుకొనే విధంగా ఎన్‌డిఏకు మార్గదర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ దేశాన్ని ప్రమాదకర స్ధితిలోకి నెడుతోంది.

    కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఆప్ఘనిస్తాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల సాయం చేయటానికి నిర్ణయించుకకుంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ న్యూఢిల్లీ పర్యటన సందర్బంగా ఆ మొత్తాన్ని ప్రకటించారు .అందుకు గాను వెంటనే అమెరికా సర్కార్‌ మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తల వరదలో ముంచెత్తింది. సాయం ప్రకటించింది మన దేశం, లబ్ది పొందేది ఆఫ్ఘనిస్తాన్‌. మధ్యలో అమెరికా పొగడ్తలు ఎందుకు ? వాటిని చూసి మీడియాలోని మోడీ భక్తులు కొందరికి ఒంటి మీద బట్టలు ఎందుకు నిలవటం లేదు. అష్రాఫ్‌ మన దేశ పర్యటనకు ముందు తాలిబాన్లు ఒక ప్రకటన చేస్తూ తమను అణచేందుకు ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి భారత్‌ మిలిటరీ సాయం అందచేస్తున్నదని దానిని నిలిపివేయాలని వినతితో కూడిన హెచ్చరిక చేశారు.

     మన అవసరాల కోసం మనమే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ఎవరిస్తామంటే వారి దగ్గర అందిన కాడికి అప్పు చేస్తున్నాం కదా ? అటువంటపుడు మనం మరొక దేశానికి సాయం చేయటం ఏమిటి ? మనమే విదేశాల నుంచి మిలిటరీ ఆయుధాలు కొంటున్నాం కదా వాటిలో కొన్నింటిని ఆఫ్ఘనిస్తాన్‌కు ఇవ్వటం ఏమిటి ? ఈ ఏడాది మార్చి నెలాఖరుకు మన విదేశీ అప్పు 485.6 బిలియన్‌ డాలర్లు. దానిలోంచి లేదా మనం చేయి చాపి తెచ్చుకున్న మొత్తంలోంచి ఒక బిలియన్‌ డాలర్లు ఆఫ్ఘనిస్తాన్‌కు సాయంగా ఇస్తున్నాం. అంటే దాదాపు ప్రతి ఒక్కరం తలకు 60 రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు. తాజా వందకోట్లతో కలిసి ఇంతవరకు మొత్తం సాయం 200 కోట్ల డాలర్లకు చేరుకోనుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి, విద్య, వైద్య సాయం అందించటానికి అవసరమైన సాయం ఏ దేశానికి అందించినా ఎవరూ తప్పు పట్టరు. అయితే ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైట్‌ వెలిగినట్లు ఇలాంటి సాయాలను ఏ దేశం కూడా చివరికి చైనా వంటి సోషలిస్టు దేశాలు సైతం వుత్తి పుణ్యానికే చేయవు. ఏదో ఒక ప్రతిఫలం ఇంకా చెప్పాలంటే తనకు అవసరమైన వాటి కోసమో లేదా తన దగ్గరవున్న వస్తువులకు మార్కెట్‌ కోసమో, రాజకీయ ప్రయోజనం కోసమో ఏదో ఒక లక్ష్యం లేకుండా వుండదు. ఆప్ఘనిస్తాన్‌తో మనకు సరిహద్దు సంబంధాలు లేవు, పొరుగు దేశం కాదు, మధ్యలో పాకిస్తాన్‌ వుంది.ఈ నేపధ్యంలో మోడీ సర్కార్‌ ఆర్ధిక సాయానికే పరిమితం కాకుండా మిలిటరీ ఆయుధాలు ఎందుకు అందిస్తున్నట్లు ? ఎవరికైనా సందేహం కలగక తప్పదు. పోనీ ఆర్ధిక, మిలిటరీ సాయం అందించటం ద్వారా మనం ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి ? మన్‌కీ బాత్‌తో సహా ఎక్కడా మనకు చెప్పలేదు.

    మన దేశం గురించి చెప్పుకోవాలంటే గత రెండు దశాబ్దాలుగా చైనా తరువాత అత్యధిక సగటు వృద్ధి రేటుతో ముందుకు పోతున్న ఏకైక దేశం. అభివృద్ధి ఫలం అంతా కొద్ది మంది బిలియనీర్ల చేతుల్లోకి పోతున్నది. గత పది సంవత్సరాలలో ప్రపంచంలో బిలియనీర్లు సగటున 68శాతం వృద్ధి చెందితే మన దేశంలో 330 శాతం వుంది. ఇంత వేగంగా కొంత మంది చేతుల్లోకి డబ్బు చేరుతున్నది కనుకనే వారిని చూసి ప్రతివారూ ఏదో విధంగా తాము కూడా ఇలా చూసి అలా తిరిగే లోపల కోటీశ్వరులు కావాలనుకుంటున్నారు. మన దగ్గర అణ్వాయుధాలున్నాయి వాటిని వుపయోగించలేము కనుక ఇతర ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాము. అంతరిక్ష రంగంలో కూడా అనేక విజయాలు సాధించాము. పెద్ద మిలిటరీ, వైమానిక దళం వుంది. అయినా ధనిక దేశాల ముందు చేయి చాపుతున్నాం, మనకు వచ్చిన మొత్తంలో లేదా అప్పు చేసి కొంత మొత్తాన్ని మన దగ్గర చేయి చాచే వారికి ఇస్తున్నామన్న విషయం ‘నయా దేశ భక్తులతో’ సహా కొంత మందికి మింగుడు పడకపోవచ్చు. ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 2011లో మన దేశం చేయి చాస్తున్న వరుసలో ఆరవ స్ధానంలో వున్నాం. మనం 2011లో 3.2, 2012లో 1.6, 2013లో 2.4 బిలియన్‌ డాలర్లు తీసుకున్నాంhttps://thelogicalindian.com/story-feed/exclusive/know-everything-about-how-much-india-receives-and-donates-foreign-aid/  మన కంటే దరిద్రపు దేశాలకు ఇచ్చేందుకు 2015-16లో మన బడ్జెట్‌లో 1.6 బిలియన్‌ డాలర్లు కేటాయించాం.మనం చేస్తున్న సాయంలో భూటాన్‌కు గణనీయ మొత్తం ఇచ్చాం. ముందే చెప్పుకున్నట్లు ఎలాంటి ప్రయోజనం లేకుండా కాదు సుమా ! మన సాయంతో వారు హిమాలయ పర్వత ప్రాంతాలలో జల విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మిస్తారు, 2020 నాటికి మన దేశం వారి నుంచి పదివేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాం. భూటాన్‌ నుంచి విద్యుత్‌ తెచ్చుకుంటున్నాం, తెచ్చుకుంటాం మరి ఆప్ఘనిస్తాన్‌ నుంచి మోడీగారు ఏం తెస్తారు ? వుగ్రవాదాన్ని, తాలిబాన్లనా ?

   ఆఫ్ఘనిస్తాన్‌ అంటే చాలా మందికి తెలిసినట్లు వుండి వివరాలు లోతుగా తెలియని దేశం. రాబందులు ఆకాశంలో తిరుగుతుంటాయి, ఎక్కడ కళేబరం కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ప్రపంచంలో మిలిటరీ, ఆర్ధిక, రాజకీయంగా కీలక ప్రాంతాలుగా వున్న వాటిని తమ ఆధీనం చేసుకొనేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు కూడా నిత్యం అలాగే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌లో పాగావేసేందుకు పూనుకున్న సమయంలో దానిని పసిగట్టిన మిలిటరీలోని అభ్యుదయ వాదులైన అధికారులు తిరుగుబాటు చేసి దేశాధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ి పొరుగునే వున్న నాటి సోవియట్‌ యూనియన్‌ మద్దతు ఇవ్వటమే కాదు, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు, దానిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న శక్తులను అణచివేసేందుకు వారి ఆహ్వానం మేరకు మిలిటరీ సాయాన్ని కూడా పంపింది. ఆ ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రలో భాగంగానే అధికారంలో వున్న వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేశారు. అయితే మిలిటరీ అధికారులు కమ్యూనిజం పట్ల అభిమానం వున్నవారు నుక తాము కమ్యూనిస్టులం కాదని ఖండించలేదు. కమ్యూనిస్టుల కారణంగా ఇస్లాం మతానికి ముప్పు ఏర్పడింది, దానిని కాపాడుకోవాలంటే తాలిబాన్లుగా మారి ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అమెరికన్లు ఒక పధకం ప్రకారం రెచ్చగొట్టారు. అందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌కు అలాంటి వారిని తరలించి అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి సాయుధులను చేసి పంపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ముసుగులో తిష్ట వేయటానికి అమెరికా పూనుకుందన్న విషయం గ్రహించగానే మరో పొరుగు దేశం ఇరాన్‌ కూడా తన మద్దతుదారులను అక్కడ వుంచేందుకు అది కూడా తాలిబాన్లను తయారు చేసింది. మొత్తం మీద వారూ వీరూ తయారు చేసిన వారు అక్కడి వామపక్ష ప్రభుత్వానికి, వారికి సాయంగా వచ్చిన సోవియట్‌ సేనల మీద దాడులు, వత్తిడి తెచ్చి చివరకు వుపసంహరించుకొనే విధంగా, వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయటంలో జయప్రదం అయ్యారు. తరువాత ఆ తాలిబాన్లే అమెరికా, పాకిస్థాన్‌కు ఏకు మేకయ్యారు. వారిని నాశనం చేయటానికి అమెరికా సైన్యాన్ని దించి చావు దెబ్బలు తిన్నది, దేశాన్ని సర్వనాశనం చేసింది, చివరకు తాలిబాన్లను అదుపు చేయలేక ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సేనలను వుపసంహరించుకుంది. వుగ్రవాదులను గానీ, మరొక సంఘవ్యతిరేక శక్తుల అణచివేత గానీ ఆయా దేశాల అంతర్గత వ్యవహారం మాత్రమే. పొరుగువారు వెళ్లి ఆ పని చేయటం తగని పని. తమకు హాని చేసే వుగ్రవాదాన్ని రూపుమాపే శక్తి ఆ సమాజాలకు అంతర్గతంగానే వుంటుంది. కానీ అమెరికా ఆ పేరుతో అనేక దేశాలలో జోక్యం చేసుకొంటోంది, చావు దెబ్బలు తింటోంది. ఇప్పుడు వుగ్రవాద వ్యతిరేక పోరు, ఆప్ఘనిస్తాన్‌ పునరుద్దరణ పేరుతో అక్కడే తిష్టవేసింది. తాలిబాన్లను అణచివేసేందుకు తమతో పాటు ఇతర దేశాలు కూడా అన్ని రకాలుగా భాగం పంచుకోవాలని వత్తిడి తెస్తూ తన భారాన్ని తగ్గించుకుంటున్నది. ఆ వుచ్చులోకి భారత్‌ను లాగుతున్నది. నరేంద్రమోడీ సర్కార్‌ ఎలాంటి ముందు వెనుకలు చూడకుండా ఆ బాటలో ముందుకు పోతున్నది.

     ఆప్ఘనిస్తాన్‌ను అన్ని విధాలుగా నాశనం చేసింది అమెరికా, తామరతంపరగా తాలిబాన్లను సృష్టించి ప్రపంచంలో అనేక దేశాలకు వారిని ఎగుమతి చేసింది అమెరికా, గతంలో దేశ భక్తులుగా ప్రచారం చేసిన వారిని ఇప్పుడు టెర్రరిస్టులుగా చిత్రిస్తూ వారిపై పోరు, అభివృద్ధి పేరుతో జరిగే ఖర్చును ప్రపంచ దేశాలన్నీ పంచుకోవాలని వత్తిడి తెస్తోంది అమెరికా. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తాలిబాన్ల చేతిలో నాశనమైన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించేందుకు అంగీకరించి నిర్మించింది. దానిని నరేంద్రమోడీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పుడు మరొక వంద కోట్ల డాలర్ల సాయం ప్రకటించారు. ఇది కాకుండా ఇప్పటికే రష్యా తయారీ ఎంఐ-25 గన్‌షిప్‌ హెలికాప్టర్లను మూడింటిని పంపారు. మరొకదానిని పంపనున్నారు. తమకు మరిన్ని మారణాయుధాలు,ఎంఐ-35 గన్‌షిప్‌ హెలికాప్టర్లు కూడా కావాలని అక్కడి ప్రభుత్వం కోరుతున్నది. ఇలా ఆయుధాలు ఇవ్వటం ఇప్పటివరకు అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి భిన్నం. అమెరికా ఆదేశాల మేరకు తాలిబాన్లను తయారు చేసిన పాకిస్తాన్‌ తరువాత కాలంలో అమెరికా ఆదేశాల మేరకు ఆ తాలిబాన్లనే అణచివేయటం ప్రారంభించింది. తమ దేశంలో తలదాచుకున్న ఒసామాబిన్‌ లాడెన్‌ను హతమార్చటానికి అమెరికాకు తోడ్పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇప్పుడు ఐఎస్‌ వుగ్రవాదులు, తాలిబాన్లు కలిసి పాకిస్థాన్‌పై దాదాపు ప్రతి రోజూ దాడులు చేస్తున్నారు.దానికి తోడు ఆఫ్ఘన్‌లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితి. చాలా ప్రాంతాలపై ప్రభుత్వానికి అదుపు లేదు. తాలిబాన్లదే పెత్తనం. తెగల వారీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిది ఆధిపత్యం. కాబూల్‌ గద్దెపై ఎవరుంటే ఆ తెగవారు చూసీ చూడనట్లు వుంటారు తప్ప మిగతావారు శత్రువులే. తమ అణచివేతకు తోడ్పడుతున్న పశ్చిమ దేశాలలో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులు దాడులకు పాల్పడటాన్ని చూస్తున్నాము. ఇప్పటికే పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులతో నిత్యం కాశ్మీర్‌ రావణకాష్టంలా మండుతున్నది. ఇప్పుడు తాలిబాన్‌ -ఐఎస్‌ తీవ్రవాదులను కూడా మోడీ సర్కార్‌ ఆహ్వానించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. మనదైన స్వతంత్ర విదేశాంగ విధానం మనకు వుండాలి తప్ప మరొక దేశం అది అమెరికా లేదా మరేదైనా దాని ప్రయోజనాలకు, ఎత్తుగడలకు అనుగుణంగా వుంటే నష్టపోయేది మనమే. ఇప్పటికైనా మించి పోయింది లేదు. మేలుకోవటం మంచిది. మొండిగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు ఎన్‌డిఏదే బాధ్యత అవుతుంది.

  చైనా ప్రభుత్వం సాయం చేస్తున్నదంటే అది ప్రభుత్వ రంగ కంపెనీలకు ఆర్డర్లు సంపాదించుకుంటున్నది. దాని ద్వారా వచ్చే లాభం, ప్రయోజనం ప్రజలకు చెందుతుంది. బిల్‌ గేట్స్‌ వంటి కార్పొరేట్లు అంద చేసే సాయం వారి కంపెనీలకు ఆర్డర్లకోసం వుపయోగపడుతుంది. అమెరికా,జపాన్‌, బ్రిటన్‌ ప్రభుత్వాలు చేసే సాయం ఆ దేశాలలోని కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు లంకె వుంటుంది. నరేంద్రమోడీ సర్కార్‌ వున్న ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం లేదా మూసివేతలకు పూనుకుంది. పెట్టుబడులు పెడుతున్నది ప్రయివేటు కార్పొరేట్‌ కంపెనీలే అంటే సాయం పేరుతో ఏటా బడ్జెట్‌ నుంచి కేటాయించే 160 కోట్ల డాలర్ల సాయంలో ఎక్కువ విదేశాలలో పెట్టుబడులు పెట్టే భారతీయ కార్పొరేట్లకు అందచేస్తున్న సబ్సిడీ అవుతుంది తప్ప మరొకటి కాదు. మన జనానికి సబ్సిడీలలో కోత, కార్పొరేట్లకు మోత !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పార్లమెంటరీ, మీడియా కుట్రలతో ప్రభుత్వాల కూల్చివేత !

13 Tuesday Sep 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ 1 Comment

Tags

Brazil, elected governments, Honduras, parliamentary and media coup, Parliamentary coup, Prague, Turkey

Image result for parliamentary and media coup against elected governments

సత్య

     గత కొద్ది వారాలుగా వివిధ ఖండాలలోని కొన్ని దేశాలలో జరిగిన పరిణామాలను పరిశీలించినపుడు పార్లమెంటరీ వ్యవస్ధలు, మీడియా సంస్ధలు, వ్యక్తుల పాత్రలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థలు పరిహాసం పాలౌతున్నాయి, కుట్రలకు నిలయాలుగా మారుతున్నాయి. మీడియా ‘స్వతంత్ర’ సూచిక వేగంగా పడిపోతున్నది. ఏదో ఒక పక్షాన చేరి తారసిల్లటానికే యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. చాలా కాలంగా కప్పుకున్న మేకతోళ్లను తీసి అవతల పడవేస్తున్నాయి. అందుకే గతంలో పత్రికలు పెట్టుబడిదారులకు పుట్టిన విష పుత్రికలు అని వర్ణించినపుడు విపరీత వ్యాఖ్యానంగా భావించిన వారు మీడియా పోకడలను చూసి ఇప్పుడు నిజమే అన్న నిర్ధారణలకు వస్తున్నారు. వర్గ సమాజంలో అటో ఇటో చేరకుండా తటస్థంగా వుండటం అసాధ్యమని, అదొక ముసుగు మాత్రమే అని కమ్యూనిస్టులు ఎప్పుడో చెప్పారు. ఎవరైనా తాము అటూ ఇటూ కాదు అని చెప్పారంటే మార్పును వ్యతిరేకించి వున్న వ్యవస్ధను వున్నట్లుగా వుంచాలని చెప్పటమే. పర్యవసానం ఆ వ్యవస్ధను కాపాడాలని కోరుకొనే వారికి మద్దతు ఇవ్వటమే. ముందే కూసిన కోయిల కూతలను పరిగణనలోకి తీసుకోనట్లే ఆ కమ్యూనిస్టులు అన్నీ ఇలాగే చెబుతారు అని తోసిపుచ్చిన వారు ఇప్పుడేమంటారో తెలియదు. ఏమన్నా అనకున్నా వాస్తవాలను ఎల్లకాలం దాయటం కష్టం.

      జూలై 15న ఐరోపాలోని టర్కీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు మిలిటరీలోని ఒక వర్గం విఫల తిరుగుబాటు చేసింది. కుట్రలో జర్నలిస్టులు కూడా వున్నట్లు తేలటంతో టర్కీ ప్రభుత్వం అనేక మంది ఇతర కుట్రదారులతో పాటు వంద మంది జర్నలిస్టులను కూడా అరెస్టు చేసింది. అమెరికాలో తిష్టవేసిన టర్కీ ముస్లిం ఇమాం ఫతుల్లా గులెన్‌ సిఐఏతో కలసి రూపొందించిన కుట్ర మేరకు సైనికాధికారులు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారన్న విషయం తెలిసిందే. కుట్రను విఫలం చేసిన తరువాత గులెన్‌కు మద్దతు ఇస్తున్న 130 మీడియా సంస్ధలు మూతపడ్డాయి. వందమంది వరకు జర్నలిస్టులను అరెస్టు చేశారు. కొందరు విదేశాలకు పారిపోయారు. ఆగస్టు నెలాఖరులో బ్రెజిల్‌ పార్లమెంట్‌ అభిశంసన తీర్మానం ద్వారా ఆ దేశపు వామపక్ష వర్కర్స్‌ పార్టీ (పిటి)నేత అయిన దిల్మా రౌసెఫ్‌ను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీన్ని ప్రజాస్వామిక కుట్రగా కొంత మంది వర్ణించారు. కుట్రల జాబితాలోకి కొత్త పదం చేరింది. ఈ ప్రజాస్వామిక కుట్రలో స్వతంత్ర పాత్ర పోషిస్తున్నామని చెప్పుకొనే మీడియా ఒక ముఖ్యపాత్ర వహించిందన్న విమర్శలు కూడా గట్టిగానే వచ్చాయి. దీంతో ప్రభుత్వాల కూల్చివేత కుట్రదారుల్లో మీడియా అధిపతులు కూడా వుంటారని చేర్చాల్సి వుంది. ఈ వార్తలు చదువుతున్న సమయంలోనే బంగ్లాదేశ్‌లో వంగ బంధు ముజబుర్‌ రహ్మాన్‌ హత్య, ప్రభుత్వ కూల్చివేతలో భాగస్వామి అయ్యారనే నేరారోపణపై విచారణకు గురై వురి శిక్ష పడిన ఒక మీడియా అధిపతి మీర్‌ ఖాసిం అలీని 1971లో చేసిన నేరాలకు గాను సెప్టెంబరు మొదటి వారంలో వురి తీశారు. నేరం చేసి సమయంలో పాకిస్థాన్‌ అనుకూల విద్యార్ధి సంఘనేతగా వున్నప్పటికీ తరువాత కాలంలో ఒక పెద్ద వాణిజ్య, మీడియా అధిపతిగా ఎదిగాడు.

   అధికార రాజకీయాలు- ప్రభుత్వాలపై మీడియా అధిపతులు లేదా సంస్ధల ప్రమేయం లేదా పెత్తనం, ప్రభావం ఎలాంటిదో తెలుగువారికి చెప్పనవసరం లేదు. ఒక పార్టీకి వ్యతిరేకంగానో అనుకూలంగానో మాత్రమే కాదు, పార్టీ అంతర్గత విబేధాలలో కూడా జోక్యం చేసుకోవటాన్ని ఎన్‌టిరామారావుపై తెలుగుదేశంలో తిరుగుబాటు సందర్భంగా అందరూ చూశారు. కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండు పత్రికలపై బహిరంగంగానే విమర్శలు చేయగా తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ఒక పత్రిక, ఛానల్‌ విలేకర్లను తమ పార్టీ సమావేశాలకు రావద్దని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక నేత లేదా పార్టీని కొన్ని పత్రికలు ఎలా పెంచి పెద్ద చేయవచ్చో, నచ్చనపుడు సదరు నేతను వ్యతిరేకించి ఎలా బదనాం చేయవచ్చో, అదే పార్టీలో అంతకంటే ఎక్కువగా తమకు వుపయోగపడతారనుకున్నపుడు ఇతర నేతలు, పార్టీలను ఎలా ప్రోత్సహిస్తారో ప్రత్యక్షంగా చూశారు, చూస్తున్నారు, భవిష్యత్‌లో కూడా చూస్తారు. మీడియా ఏకపక్షంగా వ్యవహరించినా లేక ఒక పక్షం వహించిందని జనం భావించినా ఏం జరుగుతుందో కాశ్మీర్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలు, అక్కడి పరిస్థితిని జాతీయ మీడియా సంస్ధలు వక్రీకరిస్తున్నాయి లేదా వాస్తవాల ప్రాతిపదికన వార్తలను అందించటం లేదన్న విమర్శలు ఇటీవలికాలంలో పెరిగిపోయాయి. పార్లమెంటరీ అఖిలపక్ష బృందం పర్యటన సందర్భంగా కాశ్మీర్‌లోయలో కర్ప్యూను సడలించారు. ఆ సమయంలో ప్రెస్‌ అని స్టిక్కర్‌ పెట్టుకున్న వాహదారులపై అక్కడి నిరసనకారులు దాడులకు పాల్పడిన ఘటనలు జరిగాయి. కొంత మంది విలేకర్లు తాము జాతీయ మీడియాకు చెందినవారం కాదు, స్దానిక సంస్ధలలో పని చేస్తున్నామని చెప్పినా జర్నలిస్టులంటే జర్నలిస్టులే తప్పుడు రాతలు రాస్తారు, తప్పుడు దృశ్యాలను చూపుతారు అంటూ వరసపెట్టి దాడి చేసిన వుదంతాలు వున్నాయి. ఇది కాశ్మీర్‌కే పరిమితం కాదు, కొన్ని ఛానల్స్‌ లేదా పత్రికలకే పరిమితం కాబోదు. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆ సంస్థలలో పని చేసే జర్నలిస్టులకు రాబోయే రోజుల్లో తలెత్తనున్న ముప్పును ఇవి సూచిస్తున్నాయి.

   టర్కీలో కుట్ర నుంచి తప్పించుకున్న ఎర్డోగన్‌కు గతంలో మద్దతు ఇచ్చిన శక్తులే వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ మాదిరి టర్కీ, ఇరాక్‌, సిరియా తదితర దేశాలను చీల్చి ఆ ప్రాంతంలో కుర్దిస్ధాన్‌ ఏర్పాటు చేయాలన్న పధకాన్ని అమలు జరిపేందుకు అమెరికా పూనుకుందన్న వార్తలతో రష్యన్లు ముందుగానే టర్కీని హెచ్చరించటంతో కుట్రను జయప్రదంగా తిప్పి కొట్టగలిగినట్లు చెబుతున్నారు. కుట్రకు పాల్పడిన వారిలో సైనికాధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులను టర్కీ ప్రభుత్వం అరెస్టు చేసి రానున్న రోజుల్లో విచారణ జరిపి శిక్షలు విధించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అందువలన మీడియా పాత్ర ఏమిటనే చర్చ రాబోయే రోజుల్లో పెద్దగా జరగటం అనివార్యం.

   ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవటమా లేదా అన్న సమస్యపై జరిగిన ప్రజాభి ప్రాయసేకరణలో మీడియా ఎలా వ్యవహరించిందో చూశాము. చివరకు ప్రభుత్వ నిధులతో నడిచే బిబిసి కూడా ఒకవైపు మొగ్గింది. నిజానికి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో వర్గ సమస్య లేదు. కార్పొరేట్‌ శక్తుల లాభనష్టాల విషయంలో తలెత్తిన విభేధాలతో కొన్ని సంస్ధలు విడిపోవటానికి అనుకూలిస్తే మరికొన్ని వ్యతిరేకించాయి. నవంబరు నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అధికార డెమోక్రటిక్‌ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీల అభ్యర్ధుల ఎన్నిక ప్రక్రియలో మీడియా సంస్ధలు ఎలా జోక్యం చేసుకున్నాయో, ఇప్పుడు అభ్యర్ధులు ఖరారైన తరువాత మొత్తంగా మీడియా రెండు శిబిరాలుగా చీలిపోవటాన్ని చూడవచ్చు. అసలు ఆ ఎన్నికలే కొంత మంది దృష్టిలో పెద్ద ప్రహసనం అయితే దానిలో మీడియా జోక్యం చేసుకొని తిమ్మినిబమ్మిని చేయటం, ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయటం కనిపిస్తుంది. లాటిన్‌ అమెరికాలో జరిగిన పరిణామాలలో మీడియా పాత్రను మరింత అధ్యయనం చేయాల్సి వుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలలో అనేక మంది నియంతలను రంగంలోకి తెచ్చి తమ కార్పొరేట్‌ అనుకూల వ్యవస్ధలను ఏర్పాటు చేశారు. లాటిన్‌ అమెరికాలో దాదాపు ప్రతి దేశం సైనిక తిరుగుబాట్లు, నియంతల పాలనలో మగ్గటమే గాక ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధల విధానాలైన నయావుదారవాద ప్రయోగశాలగా మార్చి వేశారు. ఈ క్రమాన్ని అక్కడి మీడియా మొత్తంగా బలపరచటమేగాక, నియంతలు, అభివృద్ధి నిరోధకులను సోపానాలుగా చేసుకొని ప్రతి దేశంలో మీడియా రంగంలో గుత్తాధిపతులు తయారయ్యారు. నీకిది నాకది అన్నట్లుగా నియంతలు, కార్పొరేట్లు, మీడియా అధిపతులు కుమ్మక్కై పంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారందరూ ఒకరి ప్రయోజనాలను ఒకరు కాపాడుకొనేందుకు ఏకం అవుతారని కూడా వేరే చెప్పనవసరం లేదు.

   నయావుదారవాద విధానాలు, నియంతలకు వ్యతిరేకంగా ప్రతి దేశంలోనూ సాయుధ, ప్రజా పోరాటాలు చెలరేగాయి. దాంతో నియంతలతో ఎల్లకాలం జనాన్ని అణచలేమని గ్రహించిన సామ్రాజ్యవాదం విధిలేని పరిస్థితుల్లో నియంతల స్ధానంలో ప్రజాస్వామ్య వ్యవస్ధల పునరుద్ధరణకు తలవంచక తప్పలేదు. దాంతో దాదాపు ప్రతి దేశంలోనూ ఎన్నికలు స్వేచ్చగా జరిగిన చోట నియంతలను వ్యతిరేకించిన, పోరాడిన శక్తులు అధికారానికి వచ్చాయి. వాటిలో కొన్ని చోట్ల వామపక్ష శక్తులున్నాయి. క్రమంగా అనేక దేశాలలో అవి ఎన్నికల విజయాలు సాధించటం, పౌరులకు వుపశమనం కలిగించే చర్యలు తీసుకొని ఒకటికి రెండు సార్లు వరుసగా అధికారానికి వస్తుండటం, రాజకీయంగా అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకోవటం, తమలో తాము సంఘటితం కావటానికి ప్రయత్నించటం వంటి పరిణామాలు అమెరికన్లకు నచ్చలేదు. దీంతో తిరిగి కుట్రలకు తెరలేపింది. గతంలో లేని విధంగా పార్లమెంటరీ కుట్ర, ప్రజాస్వామ్య ఖూనీలకు పాల్పడింది. వాటికి మీడియా సంస్ధలు వెన్నుదన్నుగా కత్తి చేయలేని పనిని కలంతో పూర్తి చేస్తున్నాయి.

Image result for parliamentary and media coup against elected manual zelaya

హొండురాస్‌ అధ్యక్షుడిని పక్కదేశం కోస్టారికాలో పడేశారు

     హొండూరాస్‌లో జోస్‌ మాన్యుయల్‌ జెలయా రోసాలెస్‌ దేశాధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యాడు. మితవాద వేదిక నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ మిగతా లాటిన్‌ అమెరికా దేశాల ప్రభావంతో విదేశాంగ విధానంలో వెనెజులా, బ్రెజిల్‌,అర్జెంటీనాలతో కలసి అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకొని లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల కూటమిలో చేరాలని నిర్ణయించాడు. మితవాద కూటమి నుంచి వామపక్ష వైఖరి తీసుకోవటం హొండురాస్‌ మితవాద రాజకీయ శక్తులతో పాటు వాణిజ్య, పారిశ్రామిక, మీడియా శక్తులకు అసలు మింగుడు పడలేదు. విదేశాంగ విధానంతో పాటు అందరికీ వుచిత విద్య, చిన్న రైతులకు సబ్సిడీలు, వడ్డీరేటు తగ్గింపు, కనీసం వేతనం 80శాతం పెంపు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, దారిద్య్ర నిర్మూలన వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయివేటు మీడియా ప్రభుత్వ కార్యకలాపాలను దాదాపు బహిష్కరించింది.అసలేం జరుగుతోందో కూడా జనానికి తెలియకుండా అడ్డుకుంది. దాంతో రోజుకు రెండు గంటల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి టీవీ, రేడియో ప్రసారం చేయాలనే వుత్తరువులను జెలయా జారీ చేశాడు. ప్రతిపక్షం దీనిని నిరంకుశ చర్యగా అభివర్ణించింది. దేశంలో హత్యల రేటు మూడు శాతం తగ్గిన సమయంలో పెరిగిపోయినట్లు మీడియా ప్రచారం చేసింది. జెలయాను దెబ్బతీసే కుట్రలో భాగంగా ఆయనను తీవ్రంగా విమర్శించే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దానిని అవకాశంగా తీసుకొని ఇంకే ముంది జెలయానే ఆ పని చేయించాడు, జర్నలిస్టులకు రక్షణ లేదనే ప్రచారం మొదలు పెట్టారు. 2010లో జరిగే ఎన్నికలలో అధ్యక్ష, పార్లమెంట్‌, స్దానిక సంస్ధలతో పాటు దేశ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఓటింగ్‌ నిర్వహించాలని జెలయా 2009లో ప్రతిపాదించాడు. ఇంతకంటే ప్రజాస్వామిక ప్రతిపాదన మరొకటి వుండదు. కానీ జెలయా తన పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ సవరణలు చేయరాదనే నిషేధాన్ని వుల్లంఘించినందున పదవికి అనర్హుడు అంటూ అభిశంశస ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.నిజానికి పార్లమెంట్‌లో మెజారిటీ వుంటే అధ్యక్షుడు రాజ్యాంగాన్ని సవరించటానికి వీలుంది. రెండవది అధ్యక్షపదవికి ఎన్నిక జరిపే సమయంలోనే రాజ్యాంగాన్ని సవరించటానికి జనం ఆమోదం కోసం ఓటింగ్‌ జరపాలని పెట్టినందున ఆ ఎన్నికలో ఓడిపోతే ఇంటికి పోవాలి, గెలిస్తే కొనసాగవచ్చు, రాజ్యాంగ సవరణ ద్వారా కొనసాగే సమస్యే అక్కడ తలెత్తలేదు.

    రాజ్యాంగ సవరణపై ప్రజాభిప్రాయ సేకరణతో సహా ప్రతిపోలింగ్‌ కేంద్రానికి నాలుగు బ్యాలట్‌ బాక్సులను తరలించేందుకు సహకరించాలని జెలయా మిలిటరీని కోరాడు. మిలిటరీ ప్రధాన అధికారి ధిక్కరించటంతో జెలయా అతడిని బర్తరఫ్‌ చేశాడు. మిలిటరీ అధికారికి మద్దతుగా రక్షణ మంత్రితో పాటు పలువురు మిలిటరీ అధికారులు రాజీనామా చేశారు. సైనికాధికారిని బర్తరఫ్‌ చేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పార్లమెంట్‌, సుప్రీం కోర్టు కూడా తీర్మానించాయి. అయితే బర్తరఫ్‌కు రెండు రోజుల ముందే కీలక ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించటం, బర్తరఫ్‌కు ముందు రోజే ఆ పని చేసినట్లు వార్తలు వ్యాపించటాన్ని బట్టి కుట్రలో భాగంగానే ప్రధాన అధికారి ధిక్కరణ కూడా వుందని వెల్లడైంది. సైనిక దళాల ప్రధాన అధికారిని బర్తరఫ్‌ చేసిన మరుసటి రోజు జెలయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించటం, వెంటనే సైన్యం ఆపని చేసింది. నిదుర మంచం మీద వున్న జెలయాను అరెస్టు చేసి పక్కనే వున్న కోస్టారికాలో పడేసి వచ్చారు. హింసాకాండ చెలరేగే ప్రమాదం వుందనే కారణంగా అధ్యక్షుడిని బర్తరఫ్‌ చేసినట్లు సాకు చెప్పారు. తరువాత జెలయా రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తున్నట్లు పార్లమెంట్‌ తీర్మానించింది. నిజానికి జెలయా ఎలాంటి రాజీనామా పత్రంపై సంతకం చేయలేదు. ఐక్యరాజ్యసమితో సహా అంతర్జాతీయ సంస్థలు అనేకం ఖండించాయి, చివరకు కుట్ర సూత్రధారి ఒబామా కూడా తొలగింపు చట్టబద్దం కాదని ప్రకటించాల్సి వచ్చింది.తరువాత జరిగిన ఎన్నికలలో అనేక అక్రమాలు జరిగాయి. తొలుత 60శాతం ఓట్లు పోలయ్యాయని, 55శాతం ఓట్లతో కొత్త అధ్యక్షుడు ఎన్నికైనట్లు ప్రకటించారు, ఆ తరువాత అసలు పోలైంది 49శాతమే అని పేర్కొన్నారు. ఈ అక్రమాన్ని మీడియా బయటపెట్టకపోగా సక్రమమే అని చిత్రించి మద్దతు ఇచ్చాంది.

Image result for parliamentary  coup against elected governments

పరాగ్వేలో పేదల పక్షాన పనిచేయటమే తప్పిదమైంది

      రోమన్‌ కాథలిక్‌ బిషప్‌గా పని చేసిన ఫెర్నాండో అరిమిందో ల్యూగో మెండెజ్‌ పరాగ్వే అధ్యక్షుడిగా 2008-12 సంవత్సరాలలో పని చేశారు. చిన్నతనంలో రోడ్లపై తినుబండారాలను విక్రయించిన ల్యూగో కుటుంబానికి నియంతలను ఎదిరించిన చరిత్ర వుంది. దాంతో ల్యూగో సాధారణ విద్యనభ్యసించి ఒక గ్రామీణ ప్రాంతంలో టీచర్‌గా పని చేశారు. ఆ సందర్భంగా వచ్చిన అనుభవంతో ఆయన క్రైస్తవ ఫాదర్‌గా మారారు. ల్యూగోను ఈక్వెడార్‌లో పనిచేయటానికి పంపారు. అక్కడ పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో పేదల విముక్తి సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. అది గమనించిన పరాగ్వే పోలీసులు 1982లో స్వదేశానికి తిరిగి వచ్చిన ల్యూగోను దేశం నుంచి వెలుపలికి పంపి వేయాలని చర్చి అధికారులపై వత్తిడి తెచ్చారు. దాంతో ఐదు సంవత్సరాల పాటు రోమ్‌లో చదువుకోసం పంపారు. 1994లో బిషప్‌గా బాధ్మతలు స్వీకరించారు. ఎన్నికలలో పోటీ చేయటానికి వీలుగా తనను మతాధికారి బాధ్యతల నుంచి విడుదల చేసి కొంత కాలం సెలవు ఇవ్వాలని 2005లో కోరారు. చర్చి నిరాకరించింది, తరువాత పోటీ చేసి గెలిచిన తరువాత సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ఆయన భూ పోరాటాలను బలపరిచారు. అప్పటికే పేదల బిషప్పుగా పేరు తెచ్చుకున్న ల్యూగోను అంతం చేస్తామని బెదిరించినప్పటికీ లొంగలేదు. ఆయన తండ్రి నిరంకుశ పాలకులను ఎదిరించి 20 సార్లు జైలుకు వెళ్లటాన్ని ఆయన చూసి వున్నాడు. 2008లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.తాను వేతనం తీసుకోనని ప్రకటించాడు.తొలిసారిగా గిరిజన తెగల నుంచి ఒకరిని వారి వ్యవహారాల మంత్రిగా నియమించారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న మాదిరి అవినీతి నిరోధం, భూ సంస్కరణల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదలకు ఇండ్ల నిర్మాణం, నగదు బదిలీ కార్యక్రమాలు చేపట్టారు.

    పేదలకు మద్దతు ఇచ్చి భూసంస్కరణలకు పూనుకున్న ల్యూగోను పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరిగింది. దానిలో భాగంగా భూ ఆక్రమణ చేసిన పేదలను తొలగించేందుకు పోలీసులు కాల్పులు జరిపి 17 మందిని బలిగొన్నారు.ఈ వుదంతం దేశంలో అభద్రతకు చిహ్నం అని ప్రచారం ప్రారంభించిన పార్లమెంట్‌ సభ్యులు ప్రజలకు భద్రత కల్పించాలంటే దేశాధ్యక్షుడిని తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. వారం రోజుల్లో పార్లమెంట్‌ వుభయ సభల్లో తీర్మానాలు చేసి తొలగించారు. వున్నత న్యాయ స్ధానం కూడా దానిని సమర్ధించింది. అక్కడి మీడియాకు దీనిలో ఎలాంటి తప్పు కనిపించలేదు.

   ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన బ్రెజిల్‌ వామపక్ష అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ ప్రజాస్వామ్య బద్దంగా పని చేయకపోవటమనే ఒక నేరాన్ని ఆపాదించి అభిశంసన ప్రక్రియ ద్వారా పదవి నుంచి తొలగించారు. ప్రపంచంలో, లాటిన్‌ అమెరికా పరిణామాలలో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది.మిలిటరీ కుట్ర, మరొక కుట్ర గురించి చరిత్రలో వుందిగానీ ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్య, మీడియా కుట్ర ‘ తోడు కావటం ఈ పరిణామంలో గమనించాల్సిన అంశం. అధ్యక్షురాలిపై ఎలాంటి అవినీతి, అక్రమాల కేసులు లేవు. అయినప్పటికీ అక్కడి మీడియా ఆమెను అవినీతిపరురాలిగా చిత్రించి జనాన్ని నమ్మేట్లు చేసింది. అభిమానించిన జనమే అనుమానించేట్లు చేయటాన్ని చూసి శకుని సైతం సిగ్గు పడేట్లు, తనకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని తలపట్టుకునేట్లు చేసింది. ఎన్నికలను తొత్తడాన్ని చూశాము, ఎన్నికైన ప్రభుత్వాలను ఎంత సులభంగా కూలదోయవచ్చో చూస్తున్నాము. బ్రెజిల్‌ అధ్యక్షురాలిపై బాధ్యతా నిర్వహణలో వైఫల్యమనే నేరాన్ని ఆరోపించి పదవి నుంచి తొలగించటం ప్రజాస్వామ్యం, ప్రజాతీర్పును పరిహసించటమే. పార్లమెంట్‌ అనుమతి లేకుండా దిల్మా రౌసెఫ్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. గతంలో అనేక సందర్భాలలో అలా ఖర్చు చేయటం తరువాత పార్లమెంట్‌ ఆమోదం పొందటం అన్నది అన్ని చోట్లా జరిగినట్లే అక్కడా జరిగింది. అటువంటి పద్దతులను నివారించాలంటే అవసరమైన నిబంధనలను సవరించుకోవచ్చు, రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు. అసలు లక్ష్యం వామపక్ష అధ్యక్షురాలిని పదవి నుంచి తొలగించటం కనుక ఏదో ఒక సాకుతో ఆపని చేశారు. దొంగే దొంగ అని అరచి నట్లుగా అనేక అవినీతి కేసులలో ఇరుక్కున్నవారే అధ్యక్షురాలిపై కుట్ర చేసి పార్లమెంట్‌, కోర్టులను వుపయోగించుకొని పదవి నుంచి తొలగించారు.ఈ క్రమం ప్రారంభమైనపుడే అనేక మంది అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిశంసనకు ఎలాంటి ఆధారమూ లేదని ప్రకటించారు. అయినా జరిగిపోయింది.పాండవ పక్షపాతి కృష్ణుడికి ముందుగా వచ్చిన ధుర్యోదనుడిని తప్పించుకోవటానికి ముందుగ వచ్చితీవు, మున్ముందుకు అర్జును జూచితి అన్నట్లుగా దిల్మా రౌసెఫ్‌కు వ్యతిరేకంగా ఓటు చేసిన వారందరూ దాదాపు ఏదో ఒక అవినీతి కుంభకోణం కేసులలో వున్నవారే అయినా మీడియాకు అదేమీ కనిపించలేదు.

  వామపక్ష శక్తులు శక్తివంతమైన మీడియాతో ప్రారంభం నుంచి సర్దుకు పోయేందుకు ప్రయత్నించాయి. దాంతో తొలి రోజుల్లో ఇష్టంలేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా వున్న పత్రికలు అవకాశం దొరికనపుడల్లా వామపక్షాలపై ఒకరాయి విసురుతూ పని చేశాయి. లాటిన్‌ అమెరికాలోని కార్పొరేట్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదులు వామపక్ష శక్తులను అదికారం నుంచి తొలగించాలనుకున్నతరువాత మీడియా పూర్తిగా వాటితో చేతులు కలిపింది.మచ్చుకు బ్రెజిల్‌ మీడియా సంస్ధల నేపధ్యాన్ని చూస్తే అవి వామపక్షాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్‌ అమెరికాలోని మీడియా సంస్ధలన్నీ దాదాపు కుటుంబ సంస్థలే. బ్రెజిల్‌లోని రెడె గ్లోబో మీడియా సంస్ధ రాబర్ట్‌ మారినిహో కుటుంబం చేతుల్లో వుంది. 1980 దశకం నాటికే అధికారంలో వున్న మిలిటరీ నియంతల ప్రాపకంతో 75శాతం వీక్షకులు, చదువరులపై ఆధిపత్యం సాధించింది. నియంతల పాలన అంతరించిన తరువాత 1989లో జరిగిన తొలి ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలో పిటి పార్టీ నేత లూలా డిసిల్వాను ఓడించిన ఫెర్నాండో కాలర్‌కు ఈ సంస్ధకు చెందిన టీవీ గ్లోబో బహిరంగంగా మద్దతు ఇచ్చింది. 1990దశకంలో కొత్త సంస్ధలకు అవకాశ ం ఇచ్చినప్పటికీ దాని పట్టు తగ్గలేదు. వామపక్ష పిటి పార్టీ అధికారానికి వచ్చిన తరువాత కూడా 2005లో బ్రెజిల్‌ ప్రకటనల బడ్జెట్‌లో సగం మొత్తం దానికే వెళ్లింది. అయినప్పటికీ మీడియా తన కార్పొరేట్‌, సామ్రాజ్యవాద అనుకూల వైఖరులను ప్రదర్శించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ పూర్వరంగంలో మీడియా రంగాన్ని ప్రజాస్వామీకరించాలన్న అభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చుతుండగా, గుత్త సంస్ధలుగా ఎదగకుండా ఆంక్షలు విధించాలని మరికొందరు చెబుతున్నారు. వర్గ వ్యవస్ధలో దోపిడీదారులకు ఒక ఆయుధంగా మీడియా వుపయోగపడుతున్నందున ప్రత్యామ్నాయ మీడియాను కూడా రూపొందించాలనే అభిప్రాయం కూడా వెల్లడి అవుతోంది. అయితే ఈ ప్రతిపాదనలేవీ నిర్ధిష్ట రూపం తీసుకోవటం లేదు.

గమనిక ఈ వ్యాసం ‘వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి ‘ మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కాలేజీల్లో అగ్రస్థానంలో ‘కమ్యూనిస్టు ప్రణాళిక ‘

03 Saturday Sep 2016

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Anti communist, Che Guevara, communist manifesto, HONG KONG ELECTIONS, Kapernick, Karl Marx, lavish banquets, National Anthem Controversy, Norman Bethune

Image result for Original Communist Manifesto

ఎంకెఆర్‌

   అమెరికా పాలకవర్గం కమ్యూనిజాన్ని అంతం చేయాలని చూస్తున్నది. కానీ ప్రస్తుతం అక్కడి కళాశాలలోని ఆర్ధిక శాస్త్ర విద్యార్ధులు అధ్యయనం చేయాల్సిన పుస్తకాలంటూ సిఫార్సు చేసిన వాటిలో కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధం అగ్రస్థానంలో వుంది. ఆ గ్రంధాన్ని మార్క్స్‌-ఎంగెల్స్‌ 1848లో రాసిన విషయం తెలిసిందే. ఓపెన్‌ సిలబస్‌ ప్రాజెక్టు(ఒపిఎస్‌) కింద నూతన సిలబస్‌ సమాచారాన్ని సేకరించగా ఈ విషయం వెల్లడైందని మార్కెట్‌ వాచ్‌ డాట్‌ కాంలో ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నారు. వివిధ వెబ్‌సైట్లు, సమాచారాన్నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రతి ప్రచురణకు పాయింట్లను కేటాయించారు. ఒక పుస్తకం పేరు ఎన్నిసార్లు ప్రస్తావనకు వచ్చింది, దానిని ఎన్నిసార్లు బోధించారు అనే లెక్కలను తీశారు. వాటి ప్రకారం కమ్యూనిస్టు ప్రణాళిక సంఖ్య 3,189 కాగా బోధనా పాయింట్లు 99.7 వచ్చాయి.మిగతా పుస్తకాలకంటే ఇవి రెండు, నాలుగు రెట్లు ఎక్కువ. కమ్యూనిస్టు ఆర్ధిక, సామాజిక బోధనల తరువాత కీనిసియన్‌ సిద్ధాంతాల ప్రచురణలు ఎక్కువగా వున్నాయి.ఆర్ధిక, ద్రవ్య విషయాలకు సంబంధించి అగ్రస్ధానంలో వున్న పది హేను పుస్తకాలలో పది కీనిసియన్‌ లేదా కమ్యూనిస్టు సిద్ధాంతానికి చెందినవే వున్నాయి. స్వేచ్చా మార్కెట్‌ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు అగ్రస్థానంలో రెండు మాత్రమే వున్నాయి. వాటిలో ఒక వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌ అనే ఆడమ్‌ స్మిత్‌ రచన రెండవ స్ధానంలో, పెట్టుబడిదారీ విధానం మరియు స్వేచ్ఛ అనే మిల్టన్‌ ఫ్రైడ్‌ మాన్‌ గ్రంధం ఐదవ స్ధానంలో వుంది.http://www.marketwatch.com/story/communist-manifesto-among-top-three-books-assigned-in-college-2016-01-27

imrs.php

విలాస విందులు-చైనా కమ్యూనిస్టు పార్టీ ఆంక్షలు

   అవినీతి, అక్రమాలపై దృష్టి సారించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు విలాసవంతమైన విందులకు సభ్యులు దూరంగా వుండాలని ఆంక్షలు విధించింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు విందు ఆహ్వానాలను అందుకున్నపుడు వాటికి ఎవరు సొమ్ము ఖర్చు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారో,ఎక్కడ జరుగుతోందో ముందుగా తెలుసుకోవాలని సూచించింది. పార్టీ సభ్యులు, అధికారులు ఎలాంటి విందులకు హాజరు కాకూడదో తెలిపింది.అధికారులు ప్రయివేటు క్లబ్బులలో జరిగే విందులకు వెళ్లటాన్ని, ఇతరులను ఆహ్వానించటంపై నిషేధం విధించింది. అలాంటి 20 రకాల విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదని తెలిపింది.వివాహాలు, దినాలను విలాసవంతంగా నిర్వహించకూడదని సూచించింది. గ్జీ జింగ్‌ పింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి గత మూడు సంవత్సరాలుగా అవినీతిపై కేంద్రీకరించారు. ఇప్పుడు విలాసాలపై దృష్టి సారించారు. పార్టీ కార్యకర్తలు, అధికారులు దిగువ సూచనలు పాటించాలని ఆదేశించారు.

     భారీ ఎత్తున జరిపే విందులకు పార్టీ కార్యకర్తలు హాజరు కాకూడదు. అధికార విధులతో సంబంధం లేని విందులు ఏర్పాటు చేయరాదు. అదే నగరం లేదా దేశంలోని ఇతర శాఖల వారిని ఆహ్వానించినపుడు ప్రజల సొమ్మును విందులకు ఖర్చు చేయరాదు.దిగువ స్ధాయి డిపార్ట్‌మెంట్లను విందులు ఏర్పాటు చేయమని అడగ కూడదు.అధికారిక విధులతో సంబంధం లేని విందులకు ఇతర నగరాలలో వెళ్లకూడదు. గ్రామశాఖలు ఏర్పాటు చేసే విందులను స్వీకరించరాదు. ప్రయివేటు కంపెనీలు ఏర్పాటు చేసే విందులకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్లాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును చెల్లించాలి. తమ భోజన ఖర్చు చెల్లించాలని ప్రయివేటు కంపెనీలను అడగ కూడదు. వాణిజ్య పర్యటనలలో ఇతర అధికారుల భోజనాలకు చెల్లించకూడదు. పొద్దు పోయిన తరువాత చేసే భోజనాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదు. స్వప్రయోజనాలు ఇమిడి వున్న వ్యక్తుల నుంచి వచ్చే విందు ఆహ్వానాన్ని తిరస్కరించాలి. అలాంటి వాటి పట్ల ఎల్ల వేళలా అప్రమత్తంగా వుండాలి. అధికారిక విధులకు అంతరాయం కలిగించే విందులకు వెళ్ల కూడదు. అధికారిక విధులతో నిమిత్తం లేని ఫంక్షన్లకు వచ్చిన అతిధులకు ప్రజల సొమ్మును వెచ్చించకూడదు. ప్రభుత్వ సంస్ధలు ఇచ్చే విందులకు ప్రయివేటు వ్యక్తులను పిలవ కూడదు, అలాంటి విందులలో విందు ఆడంబరంగా వుండకూడదు. ప్రయివేటు క్లబ్బులు, ఇతర ఖరీదైన ప్రాంతాలకు వెళ్లకూడదు. చిన్న బృందాలు, గ్యాంగులను ఏర్పాటు చేసేందుకు వుద్ధేశించిన విందులకు దూరంగా వుండాలి. నగదు బహుమతులు అందచేసే, అధికారులకు చెడ్డపేరు తెచ్చేందుకు అవకాశం వున్న విందులకు వెళ్లకూడదు.

Image result for Dr. Norman Bethune

నార్మన్‌ బెతూన్‌పై కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకుల కడుపు మంట

   ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజం అంతిరించి పోయిందంటూనే ఆదర్శ కమ్యూనిస్టుల గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు అంతగా భయపడుతున్నారు. ఎందుకంటే ఆదర్శవాదులు ధృవతారలుగా వెలుగుతూనే వుంటారు. చైనా విముక్తి, జపాన్‌ దురాక్రమణ వ్యతిరేకపోరాటంలో నిమగ్నమైన కమ్యూనిస్టులకు సాయపడేందుకు కెనడా నుంచి నార్మన్‌ బెతూన్‌, భారత్‌ నుంచి ద్వారకా నాధ్‌ శాంతారామ్‌ కొట్నీస్‌(డిఎన్‌ కొట్నిస్‌) వంటి ఎందరో ప్రాణాలకు తెగించి చైనా వెళ్లి సేవలు అందించారు.

   ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు ఆరు వరకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ చైనా పర్యటన జరుపుతున్నారు.ఆయన రాక సందర్భంగా చైనా ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నార్మన్‌ బెతూన్‌ మెడల్‌ను బహుకరించింది. ఇలాంటిదే 1973లో తన తండ్రికి బహుకరించారని జస్టిన్‌ తన ఇస్‌స్టాగ్రామ్‌ పేజీలో వ్యాఖ్యానించారు. ఇంకేముంది కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులకు అవకాశం దొరికినట్లయింది. మాజీ ప్రధాని పిరే ఇలియట్‌ ట్రుడెవ్‌ అడుగుజాడల్లో ఆయన కుమారుడు జస్టిన్‌ కూడా చైనా తో సంబంధాల విషయంలో వ్యవహరిస్తున్నాడని చైనాలో మానవ హక్కుల హరణం గురించి తెలుసుకోవాలంటూ కాగితాలు, ఇంటర్నెట్‌ను ఖరాబు చేస్తున్నారు. నార్మన్‌ బెతూన్‌ అంటే కెనడాలో అత్యధికులకు అసలు తెలియదు, చైనాలో మాత్రం జాతీయ వీరుడు, ప్రతి స్కూలు పిల్లవాడికీ బెతూన్‌ పేరు తెలుసు. వైద్యుడిగా జీవితం ప్రారంభించిన బెతూన్‌ కమ్యూనిస్టు కూడా. కెనడాలో వైద్యం వలన తన జీవితం ధన్యం కాదని గ్రహించిన ఆయన తొలుత స్పెయిన్‌ వెళ్లి అక్కడ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాగిన అంతరుద్ధ్యంలో పాల్గొన్నాడు. తరువాత 1938లో చైనా వెళ్లి కమ్యూనిస్టు గెరిల్లా దళాలలో చేరి వారికి వైద్య చికిత్స అందించారు. ఆ సమయంలోనే మావోతో పరిచయం ఏర్పడింది. అయితే 1939లో జరిగిన ఒక ప్రమాదంలో బెతూన్‌ మరణించారు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత అంతర్జాతీయ కమ్యూనిస్టు సౌహార్ధ్రతకు ఒక ఆదర్శంగా బెతూన్‌ సేవలను పరిగణించి ఆయన గురించి స్కూలు పాఠ్యాంశాలలో చేర్చటంతో ఆయన పేరు ప్రతి చైనీయుడికీ సుపరిచితం అవుతోంది.

   1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాను గుర్తించేందుకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద కూటమి తిరస్కరించింది. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా పరిగణించి ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం కలిగించింది. అయితే అలా కొనసాగటం సాధ్యం కాని స్ధితిలో అమెరికా దిగి వచ్చి కమ్యూనిస్టు చైనాను గుర్తించక తప్పలేదు. దాంతో అప్పటి వరకు అమెరికాను అనుసరించిన కెనడా కూడా చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకొంది. 1973లో కెనడా ప్రధాని పిరే చైనా పర్యటన జరిపి మావోతో భేటీ అయ్యారు. ఆ పర్యటన సందర్భంగా నార్మన్‌ బెతూన్‌కు చైనాలో వున్న ఆదరణ, వున్నత స్ధానాన్ని గమనించారు.బెతూన్‌ది కెనడా, మాదీ కెనడా అన్నట్లుగా సంబంధాలను కలుపుకున్నారు.అప్పటి నుంచి కెనడాలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ, కమ్యూనిస్టు వ్యతిరేకులైనా చైనాతో సంబంధాల విషయంలో నార్మన్‌ బెతూన్‌ పేరును వుపయోగించుకుంటూనే వున్నారు.

   జపాన్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు చైనాకు వెళ్లిన బెతూన్‌ కెనడా విలువలకు ద్రోహం చేశాడని అతడే మాత్రం ఆదర్శం కాదంటూ కెనడా కమ్యూనిస్టు వ్యతిరేకులు విషం చిమ్ముతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం టొరోంటో సన్‌ అనే పత్రిక అధిపతి పీటర్‌ వర్తింగ్టన్‌ ఒక వ్యాఖ్యానం రాస్తూ ‘ మానవత్వానికి సాయం చేసేందుకు బెతూన్‌ చైనా వెళ్లలేదు, అక్కడ మావో కమ్యూనిస్టు పార్టీ సైన్యానికి తోడ్పడేందుకు మాత్రమే వెళ్లారు, సాధారణ రోగులకు బదులు గాయపడిన కమ్యూనిస్టు గెరిల్లాలకు చికిత్స చేసేందుకు మాత్రమే వెళ్లారు అని రాసిన విషయాన్ని ఇప్పుడు వుటంకిస్తూ ఆ విషయాన్ని ప్రధాని జస్టిన్‌ మరిచిపోకూడదని కమ్యూనిస్టు వ్యతిరేక రచయితలు వుద్బోధించారు. మానవ హక్కుల వుల్లంఘనలకు పాల్పడుతున్న చైనాను ప్రధాని ఎలాగూ నిలదీయలేరు, కనీసం బెతూన్‌ను పొగిడుతూ నటించటం అయినా మానుకోవాలని కొందరు వ్యాఖ్యాతలు రాశారు.

కమ్యూనిస్టులు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తప్పేనా ?

    హాంకాంగ్‌ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు పోటీ చేయటం లేదంటూ అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు దానినొక సమస్యగా ఓటర్ల ముందుంచేందుకు పూనుకున్నారు. హాంకాంగ్‌ విషయానికి వస్తే దానిదొక ప్రత్యేక పరిస్థితి. బ్రిటీష్‌ వారి కౌలు 99 సంవత్సరాల కౌలు గడువు ముగిసిన తరువాత మాతృదేశం చైనాలో ప్రాంతమది. అంతర్జాతీయ నౌకాశ్రయంగా, పెట్టుబడులు, వాణిజ్య కేంద్రంగా బ్రిటీష్‌ వారి ఏలుబడిలో రూపొందింది. దానిని విలీనం చేసే సందర్భంగా 1997వ సంవత్సరంలో చైనా ఒక ఒప్పందం చేసుకుంది. అదే మంటే చైనాలో అంతర్భాగమైనప్పటికీ యాభై సంవత్సరాల పాటు అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగించేందుకు అంగీకరించింది. ఒకే దేశం రెండు వ్యవస్థలు అన్న విధానంగా దీనిని వర్ణించారు. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, హాంకాంగ్‌లో పెట్టుబడిదారీ వ్యవస్ధ.దానికి అనుగుణ్యంగానే హాంకాంగ్‌ పాలక మండలి నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహిస్తూ స్వయం పాలనా మండలికి అప్పగించింది.అయితే హాంకాంగ్‌ను ఎలాగైనా చైనా నుంచి విడదీయాలన్న దుర్బుద్ధితో సామ్రాజ్యవాదులు అనేక రకాలుగా అక్కడి పౌరులను రెచ్చగొడుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో విబేధించే శక్తులు పాలకులుగా ఎన్నికైనప్పటికీ చైనా ప్రభుత్వం వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించటం లేదు. ఆదివారం నాడు ఎన్నికలు జరిగే హాంకాంగ్‌లో 72లక్షల మంది జనాభా వున్నారు. దానికి ఎన్నికయ్యే పాలక మండలితో పాటు చైనా ప్రభుత్వం తరఫున పర్యవేక్షణ మండలి ప్రత్యేకంగా వుంటుంది. హాంకాంగ్‌ తరఫున చైనాలో అధికారిక ప్రతినిధిగా అదే వుంటుంది. రోజువారీ పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకులు దానిలోని సభ్యులందరూ కమ్యూనిస్టులే అని అయితే బయటికి అలా చెప్పుకోరు అని తప్పుడు ప్రచారం చేస్తారు. ఒప్పందానికి అనుగుణంగా హాంకాంగ్‌లోని సంస్ధలకు విశ్వాసం కలిగించేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేయటం లేదు.

కాస్ట్రోతో చేయి కలుపుతారు, ఆయన బొమ్మపై రాద్ధాంతం చేస్తారు

    అమెరికా పాలకులు క్యూబాను నాశనం చేయాలని, దాని అధినేత ఫిడెల్‌ కాస్ట్రోను అంతం చేయాలని ఎన్నో యత్నాలు చేసి సాధ్యంగాక చివరికి దిగి వచ్చి దౌత్య సంబంధాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే మరోవైపు కాస్ట్రో బొమ్మతో వున్న టీ షర్టులను ధరించిన వారిపై మాత్రం రాద్ధాంతం చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తాజాగా ఫుట్‌బాల్‌ ఆటగాడు కోలిన్‌ కయోపెర్నిక్‌ తెలిపిన నిరసన తీరుతెన్నులపై పెద్ద రగడ చేస్తున్నారు. నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షకు నిరసనగా ఒక ఫుట్‌బాల్‌ పోటీ సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తున్నపుడు లేచి నిలబడలేదు.దానిపై నెల రోజుల తరువాత చెలరేగిన వివాదం గురించి మాట్లాడేందుకు గత వారంలో విలేకర్లతో మాట్లాడాడు.ఆ సందర్భంగా ఫిడెల్‌ కాస్ట్రో, అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖులతో కూడి వున్న టీ షర్టును వేసుకన్నాడు. దానిపై ‘భావ సారూప్యం వున్నవారు ఒకే విధంగా ఆలోచిస్తారు ‘ అనే నినాదం రాసి వుంది.”Like Minds Think Alike.”)నల్ల, రంగు జాతీయులను అణచివేస్తున్నందుకు నిరసనగా తాను జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకుండా నిరసన తెలిపానని స్పష్టం చేశాడు. తనకు ఫుట్‌ బాల్‌ కంటే నిరసన ముఖ్యమని వేరే విధంగా ఆలోచిస్తే స్వార్ధం అవుతుందని అన్నాడు. విలేకర్ల సమావేశం సందర్భంగా వేసుకున్న టీషర్టుపై ఫిడెల్‌ కాస్ట్రో బొమ్మ వుందంటే కయో పెర్నిక్‌ ఒక కమ్యూనిస్టు నియంతను సమర్ధించినట్లేనని ఒక పత్రికలో రాశారు. క్యూబా నుంచి ప్రవాసం వచ్చిన క్యూబన్‌-అమెరికన్లు కయో పెర్నిక్‌పై మండి పడుతున్నారుె. ఎందుకలా చేశాడంటూ మీడియాలో నిరసన ఒక పెద్ద చర్చనీయాంశమైంది. కయో పెర్నిక్‌ తల్లి పేద కుటుంబానికి చెందిన శ్వేత జాతి యువతి కాగా తండ్రి నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్‌.

   అమెరికా జాతీయ గీతం జాతి వివక్షా పూరితమైనదనే విమర్శ ఎప్పటి నుంచో వుంది. దానిని రాసింది ఒక బానిస యజమాని. నల్లజాతి వారిని బానిసలుగా చేసి అమెరికా ఖండంలో వ్యాపారం చేసిన విషయం తెలిసినదే. ఆ గీతంపై గతంలో ఎందరో నిరసన తెలిపారు. అనేక మంది నల్లజాతి క్రీడాకారులు ఆ గీతాలాపన సందర్భంగా మాట్లాడుతూ వుండటమో, కాలో చేయో కదిలించటం, టోపీ తీయటం,పెట్టుకోవటం వంటి రూపాలలో నిరసన తెలపటం జరుగుతున్నది. తాను అమెరికా వ్యతిరేకిని కాదని, అమెరికా మరింత మెరుగ్గా తయారు కావటానికే ఈ నిరసన తెలిపినట్లు కయో పెర్నిక్‌ చెప్పాడు.తొలుత కూర్చుని నిరసన తెలిపిన అతను ఇప్పుడు మోకాళ్ల మీద నిలబడుతున్నాడు.1972లో జాకీ రాబిన్సన్‌ అనే బేస్‌బాల్‌ ఆటగాడు నిరసన తెలిపుతూ ‘నేను నిలబడను, జాతీయ గీతం పాడను, పతాకానికి వందనం చేయను, శ్వేతజాతి లోకంలో నేనొక నల్లజాతీయుడనని నాకు తెలుసు ‘ అని వ్యాఖ్యానించాడు.అంతకు ముందు ఇద్దరు నల్లజాతి ఒలింపిక్‌ రన్నర్లు జాతీయ గీతాలాపన సందర్భంగా నల్లజాతీయుల శక్తి చిహ్నంగా బిగించిన పిడికిలి చూపి నిరసన తెలిపారు.

చే గువేరాపై నోరు పారవేసుకున్న టర్కిష్‌ స్పీకర్‌

    ప్రముఖ విప్లవ కారుడు చే గువేరా ఒక హంతకుడు కనుక అతనినెవరూ అభిమానించకూడదని వ్యాఖ్యానించిన టర్కీ పార్లమెంట్‌ స్పీకర్‌ ఇస్మాయిల్‌ కర్మాన్‌ చర్యను ప్రపంచంలో అనేక మంది ఖండించారు.తమ ఆరాధ్యనేత అయిన చేగువేరాను అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని క్యూబా డిమాండ్‌ చేసింది. ఒక యువజన బృందాన్ని వుద్ధేశించి ఆయన మాట్లాడుతుండగా వారిలో కొందరు చేగువేరా బొమ్మలున్న టీ షర్టులు ధరించి కనిపించటంతో స్పీకర్‌కు పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతనొక గెరిల్లా, బందిపోటు ,39 సంవత్సరాల వయస్సులోనే వురి తీసి చంపాడు, అతను అదర్శం కాకూడదు అని మాట్లాడాడు. క్యూబా నిరసన తెలపటంతో టర్కీ ప్రభుత్వం సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. తమ స్పీకర్‌ మార్క్సిస్టు వ్యతిరేకి కాదని, ఒక జాతీయ వాదిగా తమ దేశంలో వున్న వేలాది మందిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప క్యూబా సోషలిస్టు విప్లవంలో భాగస్వామి అయిన వారిని కాదని చెప్పేందుకు ప్రయత్నించారని వివరణ ఇచ్చింది. స్పీకర్‌ వ్యాఖ్యలు చేగువేరా చరిత్రను వక్రీకరించాయని క్షమాపణ చెప్పాల్సిందేనని టర్కీలో క్యూబా రాయబారి డిమాండ్‌ చేశారు. టర్కీలోని వామపక్ష పార్టీల కార్యకర్తలు చే గువేరా టీషర్టులు ధరించి దేశమంతటా స్పీకర్‌ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశారు. పార్లమెంట్‌ ఎదుట చేసిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. టర్కీ పాలకపార్టీ ఏకెపి కమ్యూనిస్టు వ్యతిరేక, మతవాద పార్టీ అన్న విషయం తెలిసిందే. క్యూబాలో ఒక మసీదు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్న టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ అభ్యర్ధనను క్యూబా సర్కార్‌ గతంలో అంగీకరించలేదు. అమెరికాను 1492లో కొలంబస్‌ కనుగొనక ముందే ముస్లింలు కనుగొన్నారని ఎర్డోగన్‌ వాదిస్తారు. కొలంబస్‌ డైరీలలో ఒక కొండ పక్కన గుమ్మటాలతో కూడిన ఒక భవనం గురించి వర్ణణ వుందని అది అక్కడి మసీదు గురించే అని టర్కీలోని కొందరు చెబుతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో తగ్గుతున్న ఆరోగ్య భారం-భారత్‌లో పెరుగుతున్న రోగ రుణ భారం

23 Saturday Jul 2016

Posted by raomk in CHINA, Economics, Health, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

China, healthcare costs, healthy china, INDIA, world bank on china health

Image result for china healthcare

ఎం కోటేశ్వరరావు

   మన ప్రభుత్వాలు అమలు జరుపుతున్న దారిద్ర నిర్మూలన పధకాలు కాగితాల మీద దరిద్రుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఎంత ఆదాయం వస్తే, ఎంత ఖర్చు చేస్తే దారిద్య్రంతో వున్నట్లు అనే కొలబద్ద నిర్ణయంలోనే తిరకాసు వున్న విషయం తెలిసిందే. లెక్కలు చూపేందుకు పడుతున్న తాపత్రయం దారిద్య్ర నిర్మూలనలో లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే పాలకులు విధానాల కారణంగా అనారోగ్యం పాలైన పేద, మధ్యతరగతి కుటుంబాలన్నీ తట్టుకోలేని ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పుల పాలు కావలసి వస్తోందని ప్రతి కుటుంబ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా 6.3 కోట్ల మంది ఈ అప్పుల వూబిలో దిగుతున్నారు. తాజాగా జూలై 22వ తేదీన ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్ధ, చైనా ప్రభుత్వం హెల్తీ చైనా (ఆరోగ్యవంతమైన చైనా) పేరుతో ఒక పెద్ద విశ్లేషణాత్మక నివేదికను వెల్లడించాయి. దానిలో చైనాలో జరిగిన అభివృద్ధి కారణంగా తలెత్తిన సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలా అనే అంశాలను చర్చించారు. దానిలోని ముఖ్యాంశాలు ఇలా వున్నాయి.

  ప్రస్తుతం మొత్తం చైనా ఆరోగ్యఖర్చులో అక్కడి ఆసుపత్రుల వాటా 54శాతం వుండగా, ఓయిసిడి(ఐరోపా ఆర్ధిక, అభివృద్ధి సంస్ధ ) దేశాలలో అది 38 శాతంగా వుంది.

   1980-2000 సంవత్సరాల మధ్య చైనాలో ఆసుపత్రి పడకల సంఖ్య 1.19 నుంచి 2.17 మిలియన్లకు , తరువాత 13 సంవత్సరాలలో 2013 నాటికి 4.58 మిలియన్లకు పెరిగాయి. ఇదే సమయంలో అత్యధిక ఓయిసిడి దేశాలలో పడకలను కుదించారు, కొన్ని దేశాలలో అది 30శాతం వరకు వుంది.

   2002-2013 మధ్య టెరిటరీ, సెకండరీ ఆసుపత్రుల సంఖ్య 82,29శాతం చొప్పున పెరగ్గా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య ఆరుశాతం తగ్గింది.ఆసుపత్రులలో చేరటం 2003లో 4.7శాతం వుండగా 2013లో 14.1శాతానికి చేరింది.

    ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల నిపుణుల సంఖ్య 36శాతం తక్కువగా వుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలపై విశ్వాసం లేక అన్ని అర్హతలు కలిగిన ఆరోగ్య కార్యకర్తలు లేని కారణంగా గ్రామీణ ప్రాంత రోగులు వాటికి వెళ్లకుండా నేరుగా పై తరగతి ఆసుపత్రులకు వెళ్లటం ఎక్కువైంది.

  వైద్య రంగంలో వేతనాలు ఆకర్షణీయంగా లేని కారణంగా దాదాపు 40శాతం మంది మెడికల్‌ గ్రాడ్యుఏట్లు ఆసుపత్రులలో చేరకుండా ఔషధాలు, వైద్య పరికరాల పరిశ్రమలలో చేరుతున్నారు.

  మెడికల్‌ గ్రాడ్యుయేట్ల సంఖ్య 2003-13 మధ్య రెట్టింపైంది. వారిలో నర్సింగ్‌ సిబ్బంది 108శాతం, ఫిజిషియన్స్‌లో 41 శాతం పెరుగుదల కనిపించింది.అయినప్పటికీ నర్సింగ్‌ సిబ్బంది, ఇతరుల కొరత ఇంకా ఎక్కువగానే వుంది.

    అవసరానికి మించి మందులు రాయటం ఒక ప్రధాన సమస్యగా వుంది.సగటున మూడు మందులు రాస్తున్నారు. ఇంజెన్ల రేటు 53శాతం వుంది, ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన సిఫార్సు కంటే ఇవి రెండు ఎక్కువే. రాస్తున్న మందులలో యాంటీబయటిక్స్‌ సగం వుంటున్నాయి.

  గ్రామీణ వైద్యులు కేవలం 26శాతం కేసులలో వ్యాధిని సరిగా నిర్ధారిస్తున్నారని ఒక సర్వేలో తేలింది.అవసరంలేని, హానికరమైన మందుల సిఫార్సు చేయటం 64శాతం కేసులలో కనిపించింది.

    వైద్య సేవలకు ఫీజు చెల్లించే ఏజన్సీ ఇస్తున్న ప్రోత్సాహకాలు, ఔషధాలపై ఇస్తున్న లాభాల కారణంగా ఆసుపత్రుల రంగంలో, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. స్థూలజాతీయాదాయం (జిడిపి) పెరుగుదల రేటు కంటే ఆరోగ్య ఖర్చుల పెరుగుదల రేటు ఎక్కువగా వుంది. ఏటా 8.4శాతంగా వుంది.జిడిపిలో ఆరోగ్య సంరక్షణ ఖర్చు 2015లో 5.6శాతం వుండగా 2035 నాటికి 9.1శాతం పెరగవచ్చని అంచనా.ఇది డాలర్లలో 467.2 మిలియన్ల నుంచి 2.4 బిలియన్లకు పెరుగుతుంది.

   ప్రపంచబ్యాంకు అంచనా ప్రకారం మెరుగైన వ్యాధుల యాజమాన్య పద్దతులను పాటిస్తే ఆరోగ్య ఖర్చు తగ్గి జిడిపిలో మూడు శాతం పొదుపు అవుతుంది. మరింత మెరుగైన ఆరోగ్య వ్యవస్ధ, సంరక్షణ,ఆరోగ్యం సమకూరే విధంగా సంస్కరణలు చైనాలో అమలు జరిగితే ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించినట్లు అవుతుంది.

    జీవితకాలం పెరిగిన కారణంగా ప్రస్తుతం 65 సంవత్సరాల వయసు దాటిన వారు చైనాలో 14 కోట్ల మంది వున్నారు.వీరి సంఖ్య 2030 నాటికి 23 కోట్లకు పెరుగుతుందని అంచనా.

  రెండు దశాబ్దాల క్రితం అప్పుడే అంటు వ్యాధులు, పుట్టిన పిల్లలకు వచ్చే వ్యాధులు, పౌష్టికాహారం,తల్లుల ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన వ్యాధులు 41శాతం వుండేవి. ఇప్పుడు ఓయిసిడి దేశాలలో మాదిరి చైనాలో దీర్ఘకాల, అంటు లక్షణం లేని వ్యాధుల కారణంగా 85 శాతం మంది మరణిస్తున్నారు. మొత్తం మరణాలలో మూడింట రెండువంతులకు హృదయ, క్యాన్సర్‌ వ్యాధులు కారణం అవుతున్నాయి. పెద్ద వారిలో అధిక బరువు సమస్య 1991-2009 మధ్య మూడు రెట్లు 11.8 నుంచి 29.2శాతానికి పెరిగింది. ఇది పురుషులలో ఎక్కువగా వుంది. నలభై తొమ్మిదిశాతం చైనా పురుషులు రోజూ పొగతాగుతున్నారు. ఇది ఓయిసిడి దేశాలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువ. మద్యం వినియోగం 2000-2010 మధ్య రెట్టింపైంది. సగటున తలకు 5.8లీటర్లు వుంది.

   2009లో చైనా పెద్ద ఎత్తున ఆరోగ్య సంస్కరణలు ప్రారంభించింది.నూట ముప్ఫై కోట్ల మందికి మూడు లక్షల కోట్ల యువాన్లను ఖర్చు చేయాలని తలపెట్టింది. ఫలితంగా దాదాపు నూటికి నూరుశాతం మందికి ఆరోగ్యబీమా సమకూరింది. దశాబ్దకాలంలో ఆరోగ్య సంరక్షణకు జేబులోంచి ఖర్చు చేయాల్సిన మొత్తం 60 నుంచి 30శాతానికి తగ్గింది. అయితే గ్రామీణ జనాభా మాత్రం మొత్తం ఖర్చులో సగం తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. మెరుగుదల అంతటా సమంగా లేదని ఇది వెల్లడిస్తోంది.

    వందల సంవత్సరాలుగా అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిలో ఎంతో ముందున్న ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అర్ధికంగా,రాజకీయ, సైనిక రంగాలలో ఎంతో ముందున్నా మొత్తం జనానికి ఆరోగ్యబీమా కల్పించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికీ మూడు కోట్ల మందికిపైగా (2014) 10.4 శాతం జనానికి ఆరోగ్యబీమా లేదు. వారికి జబ్బు చేస్తే మన దేశంలో సామాన్య, మధ్యతరగతి మాదిరి అప్పులపాలు కావాల్సిందే. బీమా లేని వారి సంఖ్య ఏటా ఏడుశాతం పెరుగుతున్నదని ఒకవైపు సర్వేలు తెలుపుతున్నాయి.2018 నాటికి బీమా సౌకర్యం లేనివారి సంఖ్యను 2.4కోట్లు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఆ సమస్య మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. వలస వచ్చిన వారిలో నమోదు కాని వారికి బీమా సౌకర్యం వర్తించదు, వారి సంఖ్య దీనికి అదనం. ఎంతన్నది అమెరికా ఎన్నడూ చెప్పదు. మన దేశంలో బీమా సౌకర్యం గురించి చెప్పుకోనవసరం లేదు. ప్రభుత్వ వుద్యోగులు, కొందరు ప్రయివేటు వుద్యోగులకు మినహా మిగతా సామాన్య జనంలో చాలా పరిమితంగానే బీమా పధకాలలో వున్నారు. వైద్యానికి జేబులోంచి ఖర్చు చేసే మొత్తం 85శాతం వరకు వుంటోంది.

   ఇక్కడ ఒక సమస్య గురించి ప్రస్తావించక తప్పదు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటాం. పీల్చటానికి కావాల్సినంత కాలుష్య గాలి, తాగటానికి తగినన్ని కాలుష్య జలాలు వుచితం తప్ప వాటి కారణంగా వచ్చే రోగాల బారిన పడితే అంతే సంగతులు. గాలి, నీటి కాలుష్యానికి పాల్పడేవారిని కాపాడటం తప్ప వారి బారిన పడేవారిని ఆదుకొనేందుకు ముందుకు రాని ప్రజాస్వామ్యం ! డబ్బు లేక కాదు సుమా, డబ్బు లేకపోతే ఏటా ఆరులక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్‌ సంస్ధలు, ధనికుల వజ్రవైఢూర్యాల దిగుమతులకు పన్ను రాయితీలివ్వటం ఎలా సాధ్యం? అడిగితే జవాబు చెప్పరు. మరి అత్యంత సంపద్వంతమైన భూతల స్వర్గం అమెరికాలో కూడా అందరికీ వైద్యం అందుబాటులో ఎందుకు లేకపోయింది ?

  మొత్తం 130 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సౌకర్యం అందించే స్ధితికి ఇంకా చైనా చేరుకోకపోయినప్పటికీ రోగాల కారణంగా జనం అప్పుల పాలు కావటం అక్కడ లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక బీమా ప్రతి ఒక్కరికీ వుంది.రెండువందల యాభై సంవత్సరాల స్వాతంత్య్రం, అభివృద్దిలో అమెరికా సాధించలేని విజయాన్ని చైనా అందులో నాలుగో వంతు కాలంలోనే సాధించటం ఎలా సాధ్యమైంది ? మనం ఆ బాటలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి వుంది. చైనా నిరంకుశ కమ్యూనిస్టు దేశం, మనది ప్రజాస్వామ్యం అన్న జవాబు వెంటనే సిద్దంగా వుంటుంది.చైనాలో సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడటం ముఖ్యం అన్నారు. అలాగే మంచి గాలి కోసం కిటికీ తెరిస్తే గాలితో పాటు ఈగలూ,దోమలూ కూడా వస్తాయి, వాటిని అరికట్టగలం అన్నారు. సంస్కరణలు అంటే విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానానికి చైనా మార్కెట్‌ను తెరవటం. అది జరిగింది. అభివృద్ధితో పాటు అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలూ పుష్కలంగానే ప్రవేశించినట్లు అక్కడ జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దానిని చైనీయులేమీ దాచుకోవటం లేదు.

    కౌలుగడువు తీరి వాటిని తనలో విలీనం చేసుకొనే సందర్భంగా హాంకాంగ్‌, మకావో దీవులలో 2050 వరకు పెట్టుబడిదారీ విధానాన్ని అనుమతిస్తామని  చైనా ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అంటే దాని ప్రకారం బిలియనీర్లను అనుమతించటంతో పాటు వారు పెరగటానికి కూడా కమ్యూనిస్టుపార్టీ అంగీకరించినట్లే. ఈ కారణంగానే 2050 వరకు తమ పెట్టుబడులకు ఎలాంటి ఢోకాలేదనే ధీమాతో చైనాలో పెట్టుబడులు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పెట్టటానికి ధైర్యంగా ముందుకు వచ్చి డబ్బు కుమ్మరించారు. దీనిని చూసి కొంత మంది చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్ధ కాదు, అది కమ్యూనిజం బాటలో పయనించటం లేదు అని విమర్శిస్తున్నారు. చైనా ప్రభుత్వ కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి, బిలియనీర్లు తయారయ్యేందుకు వీలు కల్పిస్తోంది కనుక అధికారిక పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశం అని వర్ణిస్తున్నవారూ లేకపోలేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తున్న దేశాల కంటే భిన్నంగా చైనాలో జీవన ప్రమాణాలు, ఆదాయాలూ పెరుగుతున్నాయా లేదా అంటే పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ దేశం అయితే అది ఎలా సాధ్యం ? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఐరోపాలోని ధనిక దేశాలు కూడా కొన్ని సంక్షేమ చర్యలు అమలు జరిపినంత మాత్రాన వాటిని సోషలిస్టు దేశాలు అనటం లేదు అలాగే అమలు జరుపుతున్న చైనాను మాత్రం సోషలిస్టు దేశంగా ఎలా అంగీకరిస్తాం అనే వారు లేకపోలేదు. సోషలిజం, కమ్యూనిజం భావనల వ్యాప్తిని అడ్డుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపాలోని ధనిక దేశాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపాయి. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా 2008 సంక్షోభం ప్రారంభమైన తరువాత వాటన్నింటినీ ఒక్కటొక్కటిగా రద్దు లేదా కోత పెడుతున్నాయి. ఇదే సమయంలో చైనాలో సంక్షేమ చర్యలు మరింతగా పెరుగుతున్నాయి తప్ప తగ్గుతున్నట్లు సమాచారం లేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అమలు జరుపుతున్న ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలన్నీ సంక్షోభం లేదా ఒకటి రెండు శాతం అభివృద్ధి రేటుతో మాత్రమే ముందుకు పోతుండగా చైనాలో గతంతో పోలిస్తే కొంత మేరకు తగ్గినా ఎనిమిదిశాతం వరకు అభివృద్ధి వుంది, ఇలా ఎందుకు జరుగుతోంది ?

    చివరిగా ఒక్క విషయం. మన కంటే సాగు భూమి తక్కువ, జనాభా ఎక్కువ వున్న దేశం చైనా. మనదేశంలో 65 ఏండ్లు దాటిన వృద్ధులు జనాభాలో 5.8 శాతం వుంటే అక్కడ 9.6 శాతం వున్నారు. అ ంటే వృద్దాప్య పెన్షన్లు, వారి సంక్షేమ ఖర్చూ ఎక్కువే. మన సగటు జీవన కాలం 67.8 అయితే అక్కడ 75.15 వుంది. మన పట్టణ జనాభా 31శాతం అయితే అక్కడ 50శాతం దాటింది.మన దేశంలో ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆసుపత్రి పడక వుంటే చైనాలో 3.8 వున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాతో పోల్చితే మనకు అనుకూలమైనవీ, ప్రతికూలమైన పరిస్ధితులూ వున్నాయి. చైనాలో అమలు జరుపుతున్న సంస్కరణలు అక్కడ సామాన్య జనజీవితాలను మెరుగు పరచటంతో పాటు ధనికులనూ పెంచుతున్నాయి.మన దేశంలో కేవలం ధనికులను మాత్రమే పెంచుతున్నాయి.

   చైనా తనదైన ప్రత్యేక శైలిలో సోషలిజాన్ని నిర్మిస్తున్నట్లు మొదటి నుంచి చెబుతోంది. సోషలిజాన్ని ఫలానా మార్గంలో సాధించాలని లేదా ఫలానా విధంగానే నిర్మించాలని మార్క్సిస్టు మహోపాధ్యులెవరూ నిర్ధేశించలేదు. కొన్ని అంచనాలు, జోశ్యాలు, ఊహలు మాత్రమే చేశారు. అత్యంత వెనుకబడిన ఆఫ్రికా దేశాలలో, ఎంతో పురోగతి సాధించిన అమెరికా ఖండ దేశాలలో భౌతిక పరిస్ధితులు భిన్నంగా వున్నపుడు రెండు చోట్లా ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధను సాధించటం ఎలా సాధ్యం. దేని మార్గం దానిదే. అందువలన చైనాలో జరుగుతున్నదానిని చూసి కొన్ని నిర్ధారణలకు రావాల్సిన అవసరం లేదు, చైనా అయినా మరొక కమ్యూనిస్టుపార్టీ గురించి అయినా విమర్శనాత్మక దృష్టితో చూడటం, సద్విమర్శలు చేయటంలో తప్పులేదు. ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన స్ధితిలో కమ్యూనిజాన్ని తెగనాడితే లబ్దిపొందేది కమ్యూనిస్టు వ్యతిరేకులు మాత్రమే.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోతలో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా

20 Wednesday Jul 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

1965 anti-communist purge, Australia, civil tribunal, Indonesia, Indonesian Communist Party (PKI)., PKI, UK, US

A Chinese student (centre) is pummelled by Indonesian youths who stormed the dormitory of a communist Chinese University ...

ఎంకెఆర్‌

     ఇండోనేషియాలో 1965-66 సంవత్సరాలలో ఐదు లక్షల మంది కమ్యూనిస్టుల వూచకోతలో అమెరికాతో పాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియా హస్తం కూడా వున్నట్లు నాటి ఘటనలపై విచారణ జరిపిన ప్రజాకోర్టు బుధవారం నాడు (జూలై 20న) విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొన్నది.ఇరవయ్యవ శతాబ్దిలో పేరు మోసిన నియంతగా చరిత్ర కెక్కినఇందోనేషియా సుహార్తో 2008 మరణించిన తరువాత నాటి మారణ కాండ నుంచి తప్పించుకొని సజీవులుగా వున్నవారు, మానవహక్కుల కార్యకర్తలు, కవులు, కళాకారులు తమ గళం ఎత్తి నాటి వుదంతాలపై వాస్తవాలను వెల్లడించాలని, మారణకాండకు పాల్పడిన వారిని శిక్షించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చిన విఫయం తెలిసిందే.నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో 2015 నవంబరులో ప్రజాకోర్టు విచారణ జరిగింది. దాని ముందు హాజరైన వారు, వుదంతానికి సంబంధించి 40 మందికిపైగా పరిశోధకులు అందించిన సమాచారాన్ని విశ్లేషించి అంతిమ నివేదికను విడుదల చేశారు. దీనిలో ఆస్ట్రేలియ, బ్రిటన్‌, అమెరికాకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

    ఇండోనేషియా కమ్యూనిస్టుపార్టీ నేతలు, సభ్యుల జాబితాలను అమెరికా అందించినట్లు, వాటి ఆధారంగా హత్య, జైళ్లపాలు చేసినట్లు ప్రజాకోర్టు ముందుకు వచ్చిన సమాచారం వెల్లడించింది.అమెరికా, ఇండోనేషియా మిలిటరీ సృష్టించిన కట్టుకధలను బ్రిటన్‌,ఆస్ట్రేలియా ప్రభుత్వాలు నిరంతరం ప్రచారంలో పెట్టాయి. విచక్షణారహితంగా మారణకాండ జరిగినట్లు స్పష్టంగా తెలిసిన తరువాత కూడా ఈ ప్రచారాన్ని కొనసాగించినట్లు తేలింది.తమ విచారణకు హాజరై వాదనలను వినిపించాలని చేసిన విజ్ఞప్తిని ఇండోనేషియా, అస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం విచారకరమని ప్రజాకోర్టు వ్యాఖ్యానించింది. జనరల్‌ సుహార్తో కమ్యూనిస్టుల వూచకోతలో నాయకత్వ పాత్ర వహించినట్లు తెలుపుతూ మరణించినవారు, బతికి బయట పడ్డవారికి, వారి కుటుంబాలకు ఇండోనేషియా సర్కార్‌ క్షమాపణ చెప్పాలని, మానవత్వంపైనే జరిపిన నేరాలకు పాల్పడిన వారిపై విచారణ జరపాలని కోర్టు పేర్కొన్నది. ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన అత్యంత దుర్మార్గ వూచకోతలలో ఒకదానిగా దీనిని పరిగణించాలని చెప్పింది.

    న్యాయమూర్తులలో ఒకరైన ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ హెలెన్‌ జార్విస్‌ మాట్లాడుతూ తమ నివేదిక ఇప్పటికే ఇండోనేషియాలో న్యాయం చేయాలని నినదిస్తున్నవారికి అదనపు గళం అవుతుందని, ఇప్పటికే తమ స్వంత మానవహక్కుల సంస్ధలు చేసిన సిఫార్సులు కూడా వున్నందున ఇండోనేషియా ప్రభుత్వం వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని బతికి వున్న బాధితులకు పునరావాసం కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు.ఈ నివేదిక గురించి ఇండోనేసియా న్యాయ, రాజకీయ, భద్రతా వ్యవహారాల సమస్వయ శాఖ మంత్రి లుహుత్‌ పాంజైటన్‌ మాట్లాడుతూ ఇండోనేసియాకు ఒక న్యాయ వ్యవస్ధ వుంది, ఏం చేయాలో ఈ దేశానికి మరొకరు నిర్దేశించాల్సిన అవసరం లేదు, విశ్వవ్యాప్త విలువలతో ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం, దీని గురించి మేము చాలా ధృఢంగా వున్నాం’ అని వ్యాఖ్యానించారు.అయితే నివేదిక తయారీలో ప్రముఖ పాత్ర వహించిన మానవహక్కుల న్యాయవాది టోడంగ్‌ మౌల్య లుబిస్‌ మాట్లాడుతూ తమ అంతిమ నివేదిక క్షమాపణలు, పునరావాసం, నష్టపూర్తి చర్యలకు తలుపులను తెరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది ప్రముఖులు ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. ‘ కమ్యూనిస్టుల నుంచి ముప్పు వచ్చిందని, వారిని చంపటం లేదా వారి చేతిలో చావటమో తేల్చుకోవాలని చెప్పారని’ ముస్లిం సంస్ధ నహదల్‌తుల్‌ వులమా చరిత్రకారుడు ఇమాన్‌ అజీజ్‌ ఇటీవల అన్నారు.అయితే అణచివేయాల్సినంత భయానక పరిస్ధితులు లేవని ప్రజాకోర్టు నివేదిక వెల్లడించిందని మోనాష్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ పుర్దే చెప్పారు. ఇది పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం ఆధారంగా జరిగిందని స్పష్టమైందని ఆమె అన్నారు. కౌసెన్‌దార్‌ అనే 83 ఏండ్ల వృద్ధుడు మాట్లాడుతూ ఎలాంటి విచారణ లేకుండా తనను 14 సంవత్సరాల పాటు బారు దీవిలోని జైలులో పెట్టారు. ఆయన నేరమల్లా ఒక కార్మిక సంఘంలో వున్న స్నేహితులను కలిగి వుండటమే.తన వంటి వారికి జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పాలా లేదా అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలన్నారు. స్వాధీనం చేసుకున్న మా ఆస్ధులు తిరిగి ఇవ్వాలి, రద్దు చేసిన మా పెన్షన్‌ హక్కులను పునరుద్దరించాలి, దేశం విడిచి పోయేట్లు చేసిన వారిని తిరిగి రప్పించాలి, మా డిమాండ్లేమే సంక్లిష్టమైనవి కాదు’ అన్నారు.

    ప్రజాకోర్టు నేపధ్యం విషయానికి వస్తే నెదర్లాండ్స్‌లోని హేగ్‌ నగరంలో నవంబరు 10-13 తేదీల మధ్య విచారణ జరిపింది. పలు వివరాలతో కూడిన ఆరువందల పేజీల నివేదికను తయారు చేసింది. బాధితులుగా వున్నవారు 20 మంది సాక్ష్యాలు చెప్పారు. హత్యలు,జైలు పాలు చేయటం, బానిసలుగా మార్చివేయటం, చిత్ర హింసలు, అత్యా చారాలు, మాయం చేయటం, విద్వేష ప్రచారం, ఇతర దేశాల జోక్యం వంటి అంశాలపై ఈ కోర్టు విచారించింది. నియంత సుహార్తో చచ్చేంత వరకు ఇండోనేషియాలో జరిగిన ఈ దురాగతం గురించి ప్రపంచానికి మిలిటరీ, దానికి మద్దతుగా వున్న అమెరికా తదితర దేశాలు ప్రచారంలో పెట్టిన కమ్యూనిస్టు వ్యతిరేక, ఏకపక్ష కధనాలు తప్ప వాస్తవాలను బయటకు రాకుండా తొక్కి పెట్టారు. ఎవరినీ నోరెత్తనివ్వలేదు, అయితే సుహార్తో చచ్చిన నాలుగు సంవత్సరాల తరువాత ‘హత్యాకాండ’ పేరుతో 2012లో జాషువా ఓపెన్‌హెయిమర్‌ తీసిన డాక్యుమెంటరీ చిత్రం ఆ నిశ్శబ్దాన్ని తొలుత భగ్నం చేసింది. 2013లో హేగ్‌లో దానిని ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చలో 35 మంది ప్రవాస ఇండోనేషియన్లు పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు, కొంత మంది సామాజిక కార్యకర్తలు, పరిశోధకులు కూడా హాజరయ్యారు.2012లోనే ఇండోనేషియా మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదికను కూడా అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు.దీంతో ఒక అంతర్జాతీయ ప్రజాకోర్టును ఏర్పాటు చేసి వాస్తవాలను వెలికి తీయాలని, వాటిపై ఒక నివేదికను రూపొందించాలన్న సూచన కార్యరూపం దాల్చింది. నూర్సియా బానీ కాట్‌జసంగ్‌కానా కన్వీనర్‌గా 2013 మార్చినెలలో తొలుత కొద్ది మందితో సమావేశం జరిపి విచారణ తీరుతెన్నులను చర్చించారు. జకర్తా, నెదర్లాండ్స్‌ (ఇండోనేషియా నెదర్లాండ్స్‌ వలస రాజ్యం అన్న విషయం తెలిసిందే) అంతర్జాతీయ ప్రజాకోర్టు( ఐపిటి) 1965 పేరుతో 2014 మార్చి 18న ఒక న్యాయ సంస్ధను రిజిస్టర్‌ చేసి 2015లో విచారణ జరిపేందుకు ముందుకు వచ్చే న్యాయమూర్తులను సంప్రదించారు.ఈ ప్రక్రియకు వందమందికి పైగా సహకరించారు. అనేక మంది ప్రవాస ఇండోనేషియా విద్యార్ధులు ముందుకు వచ్చారు. వారిని బెదిరింపులకు గురిచేసినప్పటికీ లొంగలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d