• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

ముస్లిం వ్యతిరేకత, వుగ్రవాదం-ప్రపంచ సంక్షోభం !

20 Wednesday Mar 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

Hindu Fundamentalism, islamophobia, islamophobia is a global crisis, Origin of Terrorism, saffron talibans, talibans, terrorism

Image result for islamophobia is a global crisis

ఎం కోటేశ్వరరావు

గత శుక్రవారం నాడు న్యూజిలాండ్‌లోని క్రీస్టు చర్చ్‌ పట్టణంలోని రెండు మసీదుల మీద జరిగిన వుగ్రదాడి ప్రపంచాన్ని వులిక్కిపడేట్లు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన 28ఏండ్ల బ్రెంటన్‌ హారిసన్‌ టారంట్‌ అనే శ్వేతజాతి వుగ్రవాది జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు, పదకొండు మంది చావుబతుకుల మధ్య వున్నారు, అనేక మంది గాయపడ్డారు. ప్రపంచంలో ఇస్లాం, ముస్లింల పట్ల పెరుగుతున్న విద్వేషం, తప్పుడు ప్రచారం ప్రపంచ వ్యాపితంగా వుందని ఈ వుదంతం స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌ జనాభా మొత్తం 50లక్షలకు అటూ ఇటూగా వారిలో ముస్లింలు 50వేల వరకు వున్నారు. వారిలో కొందరు మతం మారిన వారు. మన దేశంలో హిందువుల వునికికే ముప్పుగా ఇస్లాం, క్రైస్తవం తయారయ్యాయని మతోన్మాదశక్తులు ఎలా నిరంతరం ప్రచారం చేస్తున్నాయో, ఈ టారంట్‌ అనే వాడు కూడా ప్రపంచంలో శ్వేత జాతికి ముస్లింలు ముప్పుగా తయారయ్యారనే వున్మాదానికి లోనయ్యాడు. తనకు బ్రిటీష్‌ ఫాసిస్టు ఓస్వాల్డ్‌ మోస్లే, నార్వీజియన్‌ హంతకుడు ఆండ్రెస్‌ బ్రెవిక్‌ వంటి వారు స్పూర్తి నిచ్చారని, ప్రపంచంలో శ్వేతజాతి గుర్తింపునకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నూతన ప్రతీక, తనకు వుత్తేజమిచ్చిన వాడని అని మసీదులపై దాడులకు ముందు ఇంటర్నెట్‌లో పెట్టిన 74పేజీల పత్రంలో పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌ వుదంతం ప్రపంచ సంక్షోభానికి ఒక తార్కాణంగా అనేక మంది వర్ణించారు. అనేక దేశాలు, మీడియాలో ముస్లిం వ్యతిరేకత ఒక సాధారణ అంశంగా తయారైందంటే అతిశయోక్తి కాదు. ముస్లింలందరిని వుగ్రవాదులు అనం, అనకూడదు గానీ వుగ్రవాదులందరూ ముస్లింలుగానే కనిపిస్తున్నారు కదా అనే ఒక గడుసరి ప్రచారంతో అనేక మంది నిజమే కదా అనుకుంటున్నారు.సంప్రదాయ మీడియాలో, సామాజిక మీడియాలో అనేక కధనాలను వండి వారుస్తున్నారు. ఎక్కడ వుగ్రవాద దాడి జరిగినా ఖండిస్తామంటూ పుల్వామా వుదంతాన్ని తీవ్రంగా ఖండించిన ట్రంప్‌ న్యూజిలాండ్‌లోని క్రీస్తు చర్చ్‌ మసీదుల వుదంతాల విషయానికి వచ్చేసరికి శ్వేతజాతి జాతీయవాదం( దురహంకారం) నుంచి ఎలాంటి ముప్పు లేదని వెంటనే ప్రకటించాడు.అదే ట్రంప్‌తో సహా అమెరికా నేతలెవరూ తమ ఖండన ప్రకటనల్లో ముస్లిం అనే పదం లేకుండా జాగ్రత్తపడటం విశేషం.

ఇటీవలి కాలంలో అమెరికా, ఐరోపాలోని ప్రభుత్వాలు ముస్లిం వ్యతిరేక చర్యలు తీసుకున్నాయి. ముస్లిం దేశాల నుంచి వలసలపై అనేక ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల బురఖాలపై ఆంక్షలు పెడితే మరికొన్ని చోట్ల ముఖాన్ని పూర్తిగా కప్పుకోవటానికి వీల్లేదని ఆదేశించారు. తమ మత విశ్వాసాల ప్రకారం స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో కరచాలనం చేయకూడదంటూ అందుకు తిరస్కరించిన ఒక ముస్లిం జంటకు స్విడ్జర్లాండ్‌ పౌరసత్వాన్ని నిరాకరించింది. అమెరికాలోని అనేక రాష్ట్రాలలో షరియా వ్యతిరేక చట్టాలు చేశారు. ఇస్లాం మనలను ద్వేషిస్తుంది, ముస్లిం వలసలపై నిషేధం విధించాలని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఈ దేశాలన్నింటా ముస్లిం వలసలను అనుమతిస్తే శ్వేతజాతీయులు మైనారిటీలుగా మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరిగింది. మొత్తం ముస్లిం మతావలంబకులు ప్రస్తుతం ప్రపంచవ్యాపితంగా వున్నది కేవలం 24శాతం మందే. వారంతా వలస వచ్చినా ఎక్కడా మెజారిటీగా మారే అవకాశం లేదు, అసలది జరిగేది కాదు. కానీ అనేక మంది ఈ ప్రచారాన్ని తలకెక్కించుకొని వున్మాదులుగా మారి అనేక చోట్ల హత్యలకు సైతం పాల్పడ్డారు. ఇప్పటికీ పాల్పడుతున్నారు.

Image result for islamophobia is a global crisis

మీడియాలో వుగ్రవాదం ఎలా వుందో చూద్దాం. యాభై మందిని చంపిన క్రీస్తు చర్చి హంతకుడిని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక గన్‌ మన్‌(తుపాకితో వున్న వ్యక్తి) అని శీర్షికలో పెడితే కాశ్మీర్‌లో ఒక మహిళా పోలీసు అధికారిని చంపిన వాడిని టెర్రరిస్టు అని అదే పత్రిక శీర్షిలో పెట్టింది. అంతే కాదు ఆవులను వధిస్తున్నారనే పేరుతో దాడులు చేసే వారిని గోరక్షకులు అని లేదా ఫలానా సంఘకార్యకర్తలని ముద్దుపేర్లతో మీడియా రాయటం, చూపటం తప్ప వారిని హిందూ తీవ్రవాదులు అనేందుకు నోరు రాదు. అదే పశ్చిమ దేశాల్లో ఒక శ్వేతజాతీయుడు హత్యాకాండకు పాల్పడితే వాడిని మతిస్థిమితం లేనివాడిగా ముద్రవేస్తారు తప్ప జాత్యహంకార వున్మాది, వుగ్రవాది అని ఎక్కడా పేర్కొనరు. వారిని వుత్తేజపరుస్తున్నదేమిటో, ప్రేరేపిస్తున్నదేమిటో అసలు చర్చించరు.

ముస్లింలు, ఇస్లామ్‌కు సంబంధించి ప్రపంచవ్యాపితంగా అనేక ముస్లిమేతర దేశాలలో వ్యతిరేకత పుంఖాను పుంఖాలుగా కనిపిస్తుంది. అమెరికాలో అది 80శాతం, బ్రిటన్‌లో 70శాతం వున్నట్లు పరిశోధనల్లో తేలింది. పత్రికల్లో కాలమిస్టులు, టీవీలలో యాంకర్లు, రేడియోల్లో జాకీలు అనేక మంది తమ వ్యతిరేకతను వెల్లడించుకున్నారు.2015లో అమెరికాలో ఇద్దరు తీవ్రవాదులు దాడి చేసి వారి ఇంటి నుంచి పారిపోయారు. ఆ ఇంటిని సందర్శించిన అనేక మీడియా సంస్ధల జర్నలిస్టులు అక్కడ వున్న ఖురాన్‌, నమాజు చేసే దుప్పటి, ఇతర ప్రార్ధనా సంబంధమైన వాటిని చూపుతూ వుగ్రవాదులు తమ ఆయుధాలుగా వీటిని కూడా వుపయోగించవచ్చని చెప్పారు. న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్యకేంద్ర స్ధలం పక్కనే మసీదు నిర్మాణాన్ని ఒక ఛానల్‌లో కార్యక్రమాన్ని నిర్వహించిన జర్నలిస్టు తీవ్రంగా వ్యతిరేకించాడు. అక్కడ మసీదును అనుమతించటం పశ్చిమ దేశాల వుదారత్వంతో పాటు పిరికితనానికి నిదర్శనమని రెచ్చగొట్టాడు.

Image result for islamophobia india

ముస్లింలతో అమెరికాకు ముప్పు ఏర్పడిందని ట్రంప్‌తో సహా అనేక మంది గతంలో రెచ్చగొట్టారు. తీవ్రవాద ముస్లిం వుగ్రవాదుల నుంచి అమెరికన్లను రక్షించేందుంటూ ఏడు ముస్లిం దేశాల నుంచి జనాన్ని అమెరికాలో ప్రవేశించేందుకు వీల్లేకుండా డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2008-2016 మధ్య అమెరికాలో 201 వుగ్రవాద చర్యలు చోటు చేసుకుంటే వాటిలో ట్రంప్‌ నిషేధించిన దేశాలైన ఇరాన్‌, లిబియా,సోమాలియా, సూడాన్‌,సిరియా, ఎమెన్లకు చెందిన వారు పాల్గొన్న లేదా ప్రేరేపించిన వుదంతాలు కేవలం మూడే. అమెరికాలో ట్రంప్‌ హయాంలో, అంతకు ముందూ జరిగిన హత్యాకాండను చూస్తే అత్యధిక సంఘటనల్లో నేరగాండ్లు శ్వేతజాతీయులే వున్నారు. వారి చేతుల్లోనే ఎక్కువ మంది మరణించారు. వారెవరికీ ముస్లిం తీవ్రవాద సంస్ధలతో లేదా విదేశీయులతో సంబంధాలు లేవు, ఇస్లాం నుంచి వుత్తేజాన్ని పొందిన వారు కాదు. ప్రపంచ జనాభాలో ముస్లింలు 24శాతం కాగా 1970 నుంచి ఇటీవలి వరకు జరిగిన అన్ని వుగ్రవాద దాడుల్లో ముస్లింలు జరిపినవి 10.3శాతమే అని ఇటీవల కొంత పెరిగినా జనాభా నిష్పత్తికంటే తక్కువని తేలింది. ముస్లిం తీవ్రవాదుల దాడులకు బలైన వారిలో మెజారిటీ బలైంది కూడా ముస్లింలే అని విశ్లేషకులు చెబుతున్నారు.

Image result for islamophobia is a global crisis

ప్రపంచంలో కేవలం ముస్లిం తీవ్రవాద సంస్ధలే వున్నట్లు మీడియా చిత్రిస్తున్నది. వుగాండాలో లార్డ్స్‌ రెసిస్టెన్స్‌ ఆర్టీ(ప్రభు ప్రతిఘటన సైన్యం) పేరిట క్రైస్తవ తీవ్రవాదులు లక్ష మందిని హత్య చేశారు.టెన్‌ కమాండ్‌మెంట్స్‌ ప్రాతిపదికన క్రైస్తవ మతరాజ్యాన్ని ఏర్పరచాలన్నది దాని లక్ష్యం. అమెరికాలో ఆర్మీ ఆఫ్‌ గాడ్‌(దేవుని సైన్యం) పేరుతో వున్న తీవ్రవాదులు అబార్షన్లకు వ్యతిరేకంగా హింసాకాండకు పాల్పడుతున్నారు. వీరికీ ఇస్లామిక్‌ దేశాలలోని ఆల్‌ఖైదా, తాలిబాన్లకు తేడా ఏముంది? అమెరికాలో, ఇతర ఐరోపా దేశాల్లో శ్వేతజాతీయులతో కూడిన వుగ్రవాద బృందాలు అనేక నేరాలకు పాల్పడుతున్నాయి. మీడియా తీరు తెన్నుల విషయానికి వస్తే ముస్లిం తీవ్రవాదులు ఒక సంఘటనకు పాల్పడినపుడు మీడియాలో 105పతాక శీర్షికల్లో అది చోటు చేసుకుంటే అదే ముస్లిమేతర వుగ్రవాదులు పాల్పడిన ఘటనకు కేవలం 15పతాక శీర్షికలే వుంటున్నట్లు అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయం జరిపిన విశ్లేషణలో తేలింది. అమెరికాలో 2006-2015 మధ్య జరిగిన శ్వేతజాతి మరియు మితవాద వుగ్రవాదులు జరిపిన దాడుల కంటే ముస్లింలు జరిపిన దాడులకు అమెరికన్‌ మీడియాలో రెట్టింపు ప్రచారం చోటు చేసుకుందని తేలింది. ప్రపంచమంతటికీ ఇస్లామిక్‌ తీవ్రవాదులు, తీవ్రవాదంతో ముప్పు ఏర్పడిందన్నది ఒక తప్పుడు ప్రచారం.

వుగ్రవాద మూలాల విషయానికి వస్తే ఎంతో వివరించాల్సి వుంటుంది. సామాజిక చరిత్రలో కొత్త తత్వశాస్త్రం(మతం) వునికిలోకి వచ్చినపుడల్లా గతమెంతో ఘనమంటూ పాతరోతను నిలబెట్టేందుకు తిరోగమన వాదులు, కొత్తదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు పురోగమన వాదులు వుగ్రవాదం వైపు మళ్లిన చరిత్ర మనకు కనిపిస్తుంది. నిజానికి వుగ్రవాదం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు ప్రపంచవ్యాపితంగా అంగీకరించిన అర్ధం ఇంతవరకు లేదు. మధ్య ప్రాచ్యంలో రోమన్లను కూలదోసేందుకు యూదులు కొందరు వుగ్రవాదులుగా మారారు. క్రీస్తు శకం తొలి శతాబ్దిలో సికారి అనే యూదు సంస్ధ ఏర్పాటయింది.దానికి ముందు జాకబ్‌, సైమన్‌ అనే యూదునేతలు దేవుడు తప్ప యూదులను మరొకరు పాలించటానికి లేదని అవసరమైతే సాయుధ ప్రతిఘటన చేయాలని వుద్బోధించారు.సికారి సంస్ధకు చెందిన వారు ఇంకొక అడుగు ముందుకు వేసిన సాయుధ ప్రతిఘటనతో పాటు రోమన్లతో సయోధ్య కోరుకున్న యూదులను కూడా హతమార్చాలని పిలుపునిచ్చింది. అందుకు గాను వారు జన సమూహాల్లో కలసిపోయి తమ దగ్గర దాచుకున్న కత్తులతో శత్రువులుగా ఎంచుకున్నవారిని హతమార్చే వారు. తరువాత వారు ఇతరులతో కలసి మరణించిన వారికోసం ఏడుపులు పెడబొబ్బలు పెట్టి తప్పించుకొనే వారట.పదిహేడవ శతాబ్దిలో స్పెయిన్‌లో కాథలిక్‌ రాజ్యాన్ని స్ధాపించేందుకు గై ఫాకెస్‌ నాయకత్వంలో మత వుగ్రవాదులు విఫల తిరుగుబాటు చేశారు. తరువాత ఫ్రెంచి విప్లవ సమయంలో తమ మాట వినని వారిని నిర్ధాక్షిణ్యంగా అధికారంలో వున్నవారే చంపి రాజ్య వుగ్రవాదానికి తెరలేపారు.

Image result for islamophobia is a global crisis

హంగరీలో ముస్లింలు ఒకశాతం మంది కూడా లేరు, అయినా సరే అక్కడి ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌ హంగేరియన్‌ పిల్లలను కనేందుకు దేశంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వలసలను అంగీకరించటం అంటే మనం లొంగిపోవటమే అని కొద్ది రోజుల క్రితం రెచ్చగొట్టాడు. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగకపోతే లండన్‌ నగరం ఫ్రెంచి పెట్టుబడిదారులకు బదులు టర్కీ ముస్లింలతో నిండిపోతుందని బ్రెక్సిట్‌ అనుకూల వాదులు ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం కారణంగా అమెరికాలో 17శాతం మంది ముస్లింలు వున్నారని మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సర్వేలో అమెరికన్లు చెప్పారు. నిజానికి అక్కడ ఒకశాతానికి దగ్గరగా వున్నారు.ఫ్రాన్స్‌లో కూడా వున్నదాని కంటే నాలుగు రెట్లు వున్నారనే ప్రచారానికి అక్కడి వారు లోనయ్యారు. అనేక ముస్లిం దేశాలలోని ఛాందసులు కూడా ఇలాంటి ప్రచారంతోనే అక్కడి సమాజాలను రెచ్చగొడుతున్నారు. మత వుగ్రవాదులను తయారు చేస్తున్నారు ‘ హిందూస్ధాన్‌కు హిందూ సంస్కృతి జీవనాడి. అందువలన హిందూస్ధాన్‌ను రక్షించుకోవాలంటే ముందుగా మనం హిందూ సంస్కృతిని పెంచి పోషించుకోవాలన్నది స్పష్టం. హిందుస్ధాన్‌లోనే హిందూ సంస్కృతి నాశనమైతే, హిందూ సమాజం వునికి కోల్పోతే……. కాబట్టి తనకు చేతనైనంత వరకు హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం ప్రతి హిందువు విధి………మన యువత మెదళ్లను అంతిమంగా ఆ దిశగా మలచటం సంఘ్‌ ప్రధాన లక్ష్యం’ అని సంఘపరివార్‌గా పరిచితమైన ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం గురించి దాని స్ధాపకుడు డాక్టర్‌ కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ చెప్పిన మాటలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌ తెరవగానే మనకు కనిపిస్తాయి. మతోన్మాదం తలకెక్కితే ఏ మతం వారైనా ఒకటే. మన దేశంలో ముస్లింలు, క్రైస్తవుల సంఖ్యను పెంచేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని, దాన్ని వమ్ముచేసేందుకు హిందువులు కూడా పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని చెప్పిన కాషాయ తాలిబాన్లను చూశాము. న్యూజిలాండ్‌లో ముస్లింలను హతమార్చిన క్రైస్తవ వుగ్రవాది ఏమన్నాడో చూడండి.’ మన భూముల నుంచి ఒక వేళ రేపు మనం ఐరోపాయేతరులందరినీ( వారిలో భారతీయ హిందువులు కూడా వుంటారని మరచిపోవద్దు) బయటకు పంపివేసినా యూరోపియన్ల సంఖ్య నశించి చివరకు అంతమౌతుంది.చివరికి తిరిగి మనం ప్రజననశక్తిని పెంచుకోవాలి లేకపోతే అది మనల్ని చంపివేస్తుంది.’ ఇస్లామిక్‌, కాషాయ తాలిబాన్లకు, వీడికి తేడా ఏముంది? ఇలాంటి వారు ఎంతకైనా తెగిస్తారు, అందుకే వుగ్రవాదం ప్రపంచ సంక్షోభానికి చిహ్నం. గతంలో మతం కోసం వుగ్రవాదులు తయారైతే ఇప్పుడు సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలలో భాగంగా మత వుగ్రవాదులను తయారు చేస్తున్నారు. అదే నాటికీ నేటికీ తేడా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుగ్రవాద వ్యతిరేక మద్దతు నటన – ఆర్ధికంగా దెబ్బతీసే ఆచరణ, ఇదీ అమెరికా నిజరూపం !

16 Saturday Mar 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

GSP notification, GSP privileges to India, US Trade War Aginst India

Image result for trump real face against india

ఎం కోటేశ్వరరావు

కాశ్మీర్‌లోని పుల్వామా వద్ద సిఆర్‌పిఎఫ్‌ వాహన శ్రేణిపై వుగ్రవాదులు జరిపిన దాడి తరువాత మన దేశానికి మద్దతుగా పాకిస్ధాన్‌ మీద వత్తిడి తెస్తున్నట్లు అమెరికా పెద్ద ఫోజు పెట్టింది. దానికి పరాకాష్టగా ఐక్యరాజ్యసమితిలో జైషే మహమ్మద్‌ సంస్ధ నేత మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా ప్రకటించాలనే తీర్మానం గురించి కొద్ది రోజులు వూదరగొట్టింది. ప్రధాన స్రవంతి మీడియా దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. పాకిస్ధాన్‌లో వుగ్రవాద మూకలకు అన్ని విధాలుగా శిక్షణ ఇప్పించి మన మీదకు వుసిగొల్పి వారిని పోషించటానికి ఆర్ధికంగా దశాబ్దాలపాటు సాయపడి వెన్నుదన్నుగా వున్నది అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న లోకోక్తి తెలిసిందే. వుగ్రవాదులను తొలుత పెంచి పోషించినా,తరువాత వారి మీద చర్యలు తీసుకున్నా లేదా తీసుకున్నట్లు నటించినా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. ఒకవైపు వుగ్రవాదానికి వ్యతిరేకంగా మనకు టన్నుల కొద్దీ సానుభూతి ప్రకటనలు తప్ప ఆచరణలో అంతకు మించిమరేమీ లేదు. మరోవైపు మనలను ఆర్ధికంగా దెబ్బతీసే నిర్ధిష్ట చర్యలకు అమెరికా తెరతీసింది. ఇండో-అమెరికా భాయీ భాయీ అన్నట్లుగా నరేంద్రమోడీ-డోనాల్డ్‌ ట్రంప్‌ కౌగిలింతల దౌత్యం వికటించిందా ?

కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను బట్టి చైనా మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించవచ్చనే అభిప్రాయాన్ని పలువురు వెల్లడిస్తున్నారు. నిజంగా అది జరుగుతుందా లేదా అన్నది పెద్ద సందేహం. దాని గురించి తలబద్దలు కొట్టుకోనవసరం లేదు. అమెరికాకు తన ప్రయోజనాలు తప్ప మరొకటేదీ పట్టదు. అందువలన ఒక చోట రాజీపడినా మరొక రంగం మీద అది దృష్టి సారిస్తుంది. నీతి అయోగ్‌ వుపాధ్యక్షుడిగా పనిచేసిన అరవింద్‌ పనగారియా మార్చి13న రాసిన ఒక వ్యాఖ్యానంలో వాణిజ్య యుద్ధంలో ట్రంప్‌ తదుపరి లక్ష్యం భారత్‌ అని పేర్కొన్నారు. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాల పర్యవసానంగా కొన్ని దశాబ్దాలుగా మన దేశానికి అమెరికా వర్తింప చేస్తున్న సాధారణ సానుకూల ప్రాధాన్యతను(జిఎస్‌పి) రద్దు చేయాలని ఆలోచిస్తున్నట్లు మార్చినెల నాలుగవ తేదీన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. తమ వస్తువుల దిగుమతులను అడ్డుకుంటున్న పన్నులను భారత్‌ తగ్గించటం లేదని, ఇతర విధాలుగా అడ్డుకుంటోందని ట్రంప్‌ ఆగ్రహం వెలిబుచ్చాడు. ఒకవేళ ఆ సౌకర్యం రద్దయినా మనకు పెద్దగా నష్టం లేదని, మనం కూడా అమెరికా మీద ప్రతిచర్యలు తీసుకుంటామన్న వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రస్తుతం మన దేశం అమెరికాతో 21బిలియన్‌ డాలర్ల వాణిజ్య మిగులులో వుంది. దీన్ని సమం చేసేంత వరకు అమెరికా ఇలాంటి బెదిరింపులు చేస్తూనే వుంటుంది.

Image result for trump real face against india

అసలే మన ఎగుమతులు పడిపోతూ వివిధ దేశాలతో వాణిజ్యలోటులో వున్నాం. మునిగిపోయే స్ధితిలో వున్న నావ గడ్డిపోచను కూడా భరించలేదన్న విషయం తెలిసిందే. కొందరు వర్ణిస్తున్నట్లు అమెరికా చర్య గడ్డిపోచ వంటిదే అనుకోవటానికి లేదు. నయానో భయానో మన మార్కెట్‌ను తన వస్తువులతో నింపి తమ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలన్నది అమెరికా లక్ష్యం. సదరు జిఎస్‌పి జాబితాలోని ఎగుమతులు ఒక స్ధాయి దాటిన తరువాత వర్తించే రాయితీలు రద్దవుతాయి. అందువలన అనేక అంశాలను పరిశీలించినపుడు మనకు చేసే హెచ్చరిక ఒక సాకు తప్ప దాని వెనుక పెద్ద అజెండాయే వుందని చెప్పవచ్చు. అమెరికా ప్రకటించిన జిఎస్‌పి ఒక్క మన దేశానికే ఇచ్చిన ప్రాధాన్యత కాదు, అనేక వర్ధమాన దేశాలకు వేసిన ఎర అది. ప్రపంచంలో అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నాయి, దీనికి మన దేశం మినహాయింపు కాదు, అవసరం కూడా. అవి లేకపోతే మన పరిస్ధితి మరింతగా దిగజారి వుండేది. అమెరికా అనుకున్న విధంగా మనదేశం దిగుమతి పన్నులను తగ్గించి మార్కెట్‌ను తెరవలేదు. అందుకే ట్రంప్‌ మన దేశాన్ని పన్నుల రాజు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఇటీవలి మనదేశ నిర్ణయాలు అంటే సమాచారాన్ని స్ధానికంగానే అంటే భారత్‌లోనే భద్రపరచాలి, ఆన్‌లైన్‌ వాణిజ్య వుత్పత్తుల అమ్మకాలపై ఆంక్షల వంటి చర్యలు అమెజాన్‌, వాల్‌మార్ట్‌ వంటి కంపెనీలకు అంగీకారం కాదు.హెచ్‌1బి వీసాలు, పని అనుమతుల మీద అమెరికా ఆంక్షలు, విదేశాల నుంచి వచ్చే అల్యూమినియం, వుక్కు దిగుమతులపై ఆంక్షల వంటి చర్యలను అమెరికా తీసుకుంది. ఇవన్నీ మనకు నష్టం కలిగించేవే. దీనికి ప్రతిగా అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకొనే వస్తువులు, సరకులపై దిగుమతి పన్నులు పెంచుతామని మన దేశం హెచ్చరించింది. అందుకుగాను ఏప్రిల్‌ ఒకటవ తేదీని గడువుగా ప్రకటించింది.జిఎస్‌పి సౌకర్యాన్ని భారత్‌కు వుపసంహరిస్తే ఆ జాబితాలోని వస్తువులు సరఫరా చేయటానికి చైనా సిద్దంగా వుంది.వుదాహరణకు 25,50కిలోల పాకింగ్‌ సంచులు, షాపింగ్‌, కారీబ్యాగ్‌లు తయారు చేసే పరిశ్రమలు అమెరికాలో లేవు. వాటిని మనవంటి ఇతర దేశాల నుంచి చౌకగా పన్నులు లేకుండా దిగుమతి చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని తయారు చేసే చిన్న పరిశ్రమలు గత మూడు సంవత్సరాలుగా మన దేశంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

అమెరికా తన వాణిజ్య, రాజకీయ ప్రయోజనాల కోసం మనవంటి దేశాలను తన పాటకు అనుగుణ్యంగా నృత్యం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.ఇరాన్‌, రష్యాల మీద అది విధించిన ఆంక్షలను మూడోపక్ష దేశాలు కూడా అమలు జరపాలని వత్తిడి చేస్తోంది. దానిలో భాగంగానే మన దేశం వెనెజులా, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదు, రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదు అని శాసిస్తోంది. దానికి తలగ్గిన మోడీ సర్కార్‌ ఇరాన్‌ నుంచి గణనీయంగా చమురు దిగుమతులను తగ్గించింది. అయినా అమెరికాకు సంతృప్తి లేదు. సరిగ్గా ఎన్నికల సమయాన్ని ఎంచుకొని మన దేశం మీద వత్తిడి చేయటం వెనుక బ్లాక్‌మెయిలింగ్‌ కనిపిస్తోంది. జిఎస్‌పి రద్దు చేస్తామని అనటం అంటే మన దేశం మీద మరిన్ని చర్యలు వుంటాయని బెదిరించటమే. ఎన్నికల వేళ తీసుకొనే నిర్ణయాల పర్యవసానాలు ఎలా వుంటాయో అన్న సంశయం వుంటుంది కనుక కొత్త లోక్‌సభ కొలువు తీరే వరకు ఎలాంటి చర్యలు వుండకపోవచ్చు. ఒక వేళ అనూహ్యంగా నరేంద్రమోడీ తిరిగి అధికారానికి వచ్చినా, లేక బిజెపిఏతర సర్కార్‌ వచ్చినా మెడమీద కత్తిలా బెదిరింపు వేలాడుతూ వుంటుంది. తద్వారా తన షరతులకు లంగతీసుకోవచ్చు లేదా వాణిజ్య యుద్ధానికి శంఖం పూరించవచ్చు అన్నది స్పష్టమే. జిఎస్‌పి మనకు ఎలా లాభమో చూద్దాం. 2017లో మన దేశం చేసిన 49బిలియన్‌ డాలర్ల ఎగుమతులలో జిఎస్‌పి వస్తువుల వాటా 5.6బిలియన్‌లు, అంటే పదకొండుశాతం. అంటే ఆ మేరకు మన వస్తువులను అమ్ముకోవటం కష్టం అవుతుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి తయారీదార్లు నష్టపోతారు. ఆమేరకు అమెరికా కూడా నష్టపోతుంది. అంతే కాదు మన దేశం విధించే ప్రతికూల పన్నులతో దాని పదిబిలియన్‌ డాలర్ల ఎగుమతులు కూడా దెబ్బతింటాయి.

మన మీద డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆగ్రహం కలగటానికి కారణం ఏమిటి? ట్రంప్‌ ఆంక్షలను తిరస్కరించి రష్యా నుంచి మనం మూడు బిలియన్‌ డాలర్ల అణుశక్తి అకుల జలాంతర్గామిని అద్దెకు తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నాం, ఏడు బిలియన్‌ డాలర్ల విలువగల ఎస్‌-400 క్షిపణి మరియు రక్షణ వ్యవస్ధలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాము. అమేథీలో ఏడున్నర లక్షల ఏకె-203 రైఫిళ్లతయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రష్యాతో సంయుక్త ఒప్పందం చేసుకున్నాము. గత పది సంవత్సరాల కాలంలో రష్యా సహకారంతో 170 మిలిటరీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నాము. అమెరికా నుంచి మనకు లేనివి రష్యా నుంచి మనకు రెండు సానుకూలతలు వున్నాయని మాజీ సైనికాధికారి, ప్రస్తుతం రక్షణ వ్యవహారాలను ప్రచురించే పత్రిక సంపాదకుడిగా వున్న ప్రవీణ్‌ స్వామి పేర్కొన్నారు. అమెరికా కంటే రష్యా మరింత టెక్నాలజీ అందచేస్తుంది, పుతిన్‌ చెప్పేదానిని గ్జీ జింపింగ్‌ వింటారు, చైనా నుంచి వ్యూహాత్మక రక్షణను రష్యా ఇస్తుంది అన్నారు. గత పది సంవత్సరాలలో అమెరికాతో భారత్‌ జరిపిన లావాదేవీల విలువకు సమంగా ఆరెనెలల్లో రష్యాతో భారత్‌ ఒప్పందాలు చేసుకుందని రష్యన్‌ పత్రిక స్పుత్నిక్‌ వ్యాఖ్యానించింది. ఎగుమతి అనుమతులతో నిమిత్తం లేకుండా నేరుగా మనదేశానికి రక్షణ వుత్పత్తులను విక్రయించేందుకు 14 రష్యన్‌ బడా ఆయుధ తయారీ సంస్ధల దేశాధ్యక్షుడి అనుమతులను పొందాయి. సిప్రి అనే సంస్ధ విడుదల చేసిన ఆయుధ విక్రయ లావాదేవీల సమాచారం ప్రకారం ప్రపంచం దిగుమతి చేసుకుంటున్న ప్రతి వంద ఆయుధాల్లో మన వాటా 9.5కాగా వాటిలో 2014-18 మధ్య 58శాతం రష్యా నుంచే వున్నాయి.21 మిగ్‌ 29,సుఖోయ్‌ విమానాల కొనుగోలు చర్చలు,పాతవాటి నవీకరణ చర్చలు జరుగుతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణం. మన మిలిటరీని అమెరికా ఆయుధాలతో నింపాలని సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన గత 28సంవత్సరాల నుంచి చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు సఫలం కాకపోవటంతో అసహనంతో వున్నాడు.

Image result for trump real face

రక్షణ వుత్పత్తులను తన శత్రుదేశం రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేయటం ఒకటైతే హార్లే డేవిడ్సన్‌ మోటారు సైకిళ్లపై విధిస్తున్న అధిక దిగుమతి పన్నుల నుంచి అనేక వస్తువులపై మన ఆంక్షలను అమెరికా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా వైద్య పరికరాలు, పాల వుత్పత్తుల పరిశ్రమల వారు ట్రంప్‌ మీద పెద్ద ఎత్తున వత్తిడి తెచ్చారు. గుండెకు అమర్చే స్టెంట్స్‌, మోకాలి చిప్పలుగా అమర్చే పరికరాల వుత్పత్తుల ధరలను మన దేశం తగ్గించటాన్ని, మరికొన్నింటిని తగ్గించే ఆలోచనలను వైద్యపరికరాల తయారీదారులు అభ్యంతర పెడుతున్నారు. మన దేశం దిగుమతి చేసుకొనే పాలవుత్పత్తులపై ఒక ఆంక్ష వుంది.అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వుండగా కేంద్రప్రభుత్వం చేసిన నిర్ణయం ప్రకారం పాలు ఇచ్చే పశువులు తినే దాణాలో రక్తం,ఇతర జంతు అంతర్గత అవవయాలకు సంబంధించినవేవీ కలవ కూడదు. తమ వుత్పత్తుల్లో అలాంటివి లేవని ఎగుమతి చేసే సంస్ధలు హామీ పత్రాలు ఇవ్వాలి. ఇలాంటి అశాస్త్రీయమైన హామీలను తామెలా ఇస్తామని, నమ్మకం ఆధారంగా లావాదేవీలు జరగాలని అమెరికన్లు అంటున్నారు. గతంలో తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ నిబంధనను తామే ఎత్తివేస్తే రాజకీయంగా నష్టం కలుగుతుందని నరేంద్రమోడీ సర్కార్‌ వీటి గురించి ఎలాంటి సంప్రదింపులు జరిపేది లేదని స్పష్టం చేసింది.

పైన పేర్కొన్న అంశాల పూర్వరంగంలో ట్రంప్‌ సర్కార్‌ ఏడాది కాలంగా జిఎస్‌పి రద్దు, ఇతర అంశాల గురించి మనకు హెచ్చరికలు పంపుతూనే వుంది. మార్చినెల మొదటి వారంలో ట్రంప్‌ జిఎస్‌పి వుపసంహరణ గురించి ప్రకటన చేశారు. దీని మీద నోటీసు ఇచ్చిన తరువాత రెండు నెలల్లో అది రద్దవుతుంది. ఇప్పుడు ఆ దశలోనే వుంది. ఇప్పటికైనా భారత్‌ సరైన ప్రతిపాదనలు చేస్తే తమ నిర్ణయాన్ని సమీక్షిస్తామని అమెరికా తాజాగా ప్రకటించింది. ఎన్నికల్లో లేదా ఎన్నికలు ముగిసిన వెంటనే అయినా ఏదో ఒకటి తేల్చాలని పట్టుపడుతోంది. రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు పూర్తవుతాయి గనుక తరువాత చూద్దాం లెమ్మని మోడీ సర్కార్‌ భావిస్తోంది. ఫలితాలు ఎలా వుంటాయి, కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా ట్రంప్‌ బెదిరింపులకు తలొగ్గుతారా, ఎదిరిస్తారా అన్నది వూహాజనిత ప్రశ్నలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నెహ్రూపై అరుణ్‌ జెట్లీ వక్రీకరణలు – వాస్తవాలు !

15 Friday Mar 2019

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Jaitley blames Nehru, original sinner, UNSC Seat

ఎం కోటేశ్వరరావు

భీష్ముడు మరణించిన తరువాత కౌరవ సేనాధిపతిగా ద్రోణుడు వచ్చాడు.కుమారుడు అశ్వద్ధామ అంటే ద్రోణుడికి చచ్చేంత ప్రేమ. ద్రోణుడిని ఓడించటం కష్టమని తెలిసిన శ్రీకృష్ణుడు అందుకు ఒక కుయుక్తిని ప్రయోగించాడు అదే ద్రోణుడిని నిర్వీర్యం చేయటం. అందుకు గాను అశ్వద్ధామ అనే పేరున్న ఏనుగును చంపమని భీముడికి చెప్పాడు. భీముడు ఆపని చేసి తాను అశ్వద్ధామను చంపినట్లు యుద్ధరంగంలో ప్రకటించాడు. దానిని నమ్మని ద్రోణుడు అబద్దం చెప్పడని పేరున్న ధర్మరాజు  దగ్గరకు వెళ్లి అశ్వద్ధామను చంపామని చెప్పారు నిజమేనా అని అడిగాడు. దానికి అవును అశ్వద్ధామను చంపారు అని బిగ్గరగా చెప్పి అయితే అది మనిషో ఏనుగో నాకు తెలియదు అని వినిపించీ వినిపించకుండా గొణిగాడు. దాంతో ద్రోణుడు కుప్పకూలాడు. తరువాత పాండవులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలో లోక్‌సభ ఎన్నికల పోరు ప్రారంభమైంది. దీన్ని గెలిచేందుకు రాజకీయ పార్టీలు వేయని ఎత్తులు, చేయని మోసాలు లేవు. వాటిలో ఒకటి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గురువారం నాడు చేసిన పెద్ద వక్రీకరణ. ఇలాంటి సమయాలలో ఒక అబద్దం, వక్రీకరణను వదిలితే అది రేసు గుర్రంలా పరుగుతీస్తుంది, నిజం తాబేలు మాదిరి వేగంతో కూడా జనం దగ్గరకు వెళ్లదు.

జైషే మహమ్మద్‌ అధిపతి మసూద్‌ అజహర్‌ను ప్రపంచ వుగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానాన్ని భద్రతామండలిలో చైనా  వీటో చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం గురించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానిస్తూ చైనాకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదని, మోడీ బలహీనుడు, చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అంటే భయం అన్నారు.  దాన్ని తిప్పి కొడుతూ కాశ్మీర్‌, చైనాల మీద అసలు పాపం చేసింది జవహర్‌లాల్‌ నెహ్రూ అని, భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్ధానం కల్పిస్తామంటే చైనా వంటి గొప్పదేశానికి ఇవ్వాలని నెహ్రూ చెప్పారని, అదే విషయాన్ని 1955లో ముఖ్య మంత్రులకు లేఖలో కూడా రాశారని జెట్లీ ఎదురుదాడి చేశారు. భద్రతా మండలిలో ఆంక్షల కమిటి ప్రతిపాదించిన 1267వ తీర్మాన ఫలితంతో ఆశాభంగం చెందామని మన విదేశాంగశాఖ తన తొలి స్పందనలో వ్యాఖ్యానించింది. తీర్మానాన్ని ప్రతిపాదించిన వారికి, మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. తీర్మానాన్ని వీటో చేసిన చైనా గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. చైనా ఈ తీర్మానాన్ని వీటో చేయటం ఇదే మొదటిసారి కాదు, ఇంతకు ముందు మూడుసార్లు అదే చేసింది. భారత్‌-పాకిస్ధాన్‌ విబేధాలు పరిష్కారం కావటానికి ఇలాంటి తీర్మానాలు దోహదం చేయవని, మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు తగినన్ని ఆధారాలు లేవని గతంలోనూ ఈ సందర్భంగానూ చైనా పేర్కొన్నది. చైనా వైఖరి గురించి తెలిసినప్పటికీ ఈ ఐదు సంవత్సరాలలో ఆ దేశంతో మన ఆర్ధిక, ప్రభుత్వ సంబంధాలు ఇంకా బలపడ్డాయి, వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రిమోట్‌ కంట్రోలర్‌ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధలు ఏదో ఒక అవకాశాన్ని సాకుగా చూపి చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తూనే వున్నాయి, అవి ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తే అంతగా వాణిజ్యం పెరుగుతోందన్నది చేదు నిజం.

2013ా14లో చైనా నుంచి మన దిగుమతులు 51బిలియన్‌ డాలర్ల విలువ  కలవి కాగా ఎగుమతులు 14.82బిలియన్ల్‌, మన వాణిజ్యలోటు 36బిలియన్లు వుంది.2017ా18 తొలి తొమ్మిది నెలల కాలంలో మన ఎగుమతులు పది బిలియన్‌డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు ఇదే కాలానికి 63బిలియన్‌ డాలర్లకు, వాణిజ్య లోటు 53బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలోనే చైనా మూడుసార్లు భద్రతామండలిలో మసూద్‌ టెర్రరిస్టు తీర్మానాన్ని వీటో చేసింది. దీన్ని బట్టి నరేంద్రమోడీ సర్కార్‌ రాజకీయాలను, ఆర్ధిక లావాదేవీలను విడివిడిగా చూస్తున్నదన్నది స్పష్టం. రాజకీయంగా చైనాను ఏమీ అనలేని స్ధితిలో వున్న అరుణ్‌ జెట్లీ తన అక్కసును నెహ్రూ మీద తీర్చుకున్నారని, బిజెపి ప్రచార కమిటీ నేతగా  తమ క్యాడర్‌కు ఒక అస్త్రాన్ని అందించారన్నది స్పష్టం. అయితే ప్రతి అస్త్రం నిర్ధేశిత లక్ష్యాన్ని తాకుతుందా అంటే అనుమానమే. ఈ పూర్వరంగంలో నెహ్రూ గురించి చేసిన వాఖ్యల గురించి చూద్దాం.

మొదటిది. జైట్లీ చేసిన వక్రీకరణ కొత్తది కాదు. వాస్తవమూ కాదు. వివేక్‌ అగ్నిహోత్రి అనే ఒక సినిమా రంగానికి చెందిన కాషాయదళ వ్యక్తి 1965 యుద్ధంలో ఎదురుదాడి చేద్దామన్న తన మిత్రుడైన సైనికదళాల ప్రధాన అధికారి జనరల్‌ చౌదరిని రాజీనామా చేస్తావా తొలగించమంటావా అని నాటి ప్రధాని నెహ్రూ వత్తిడి చేశారని కొద్ది రోజుల క్రితం ట్వీట్‌ చేశాడు. జనరల్‌ చౌదరి 1966లో పదవీ విరమణ చేసిన ఏడు సంవత్సరా తరువాత పుట్టిన అగ్నిహోత్రి సదరు అధికారి తన స్నేహితుడని చెప్పుకుంటే కాషాయ మరుగుజ్జులు ఆ ట్వీట్‌ను గుడ్డిగా షేర్‌ చేశారు. అన్నింటి కంటే పచ్చి నిజం ఏమంటే జవహర్‌లాల్‌ నెహ్రూ 1964మేనెలలో మరణించారన్న కనీస పరిజ్ఞానం కూడా అతనికి లేదు. 1965 యుద్ద సమయంలో ప్రధానిగా లాల్‌బహదూర్‌ శాస్త్రి వున్నారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే మాకు వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారన్న అరుణ్‌జెట్లీ ట్వీట్‌ కూడా ఇలాంటిదే.  రెండవ ప్రపంచ యుద్ధం నాటికి చైనా ఒక స్వతంత్ర రాజ్యం. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంగ్‌ మార్చ్‌ పురోగతిలో వుంది. అనేక విజయాలను కమ్యూనిస్టులు సాధించారు. కొమింటాంగ్‌ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ కూటమికి వ్యతిరేకంగా మిత్రరాజ్య కూటమిలో భాగంగా పాల్గన్నది.1939లో రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమైంది. దాన్ని నివారించటంలో నానాజాతి సమితి విఫలమైంది. ఈ పూర్వరంగంలో కొత్త ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన అమెరికా విదేశాంగ శాఖ ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు 1941డిసెంబరు చివరిలో ఒక ముసాయిదాను తయారు చేస్తే దానికి సోవియట్‌ యూనియన్‌ కొన్ని సవరణలు చేసింది. అమెరికా, సోవియట్‌ యూనియన్‌, బ్రిటన్‌, చైనాలు దాని మీద సంతకాలు చేశాయి. ఆ సమయంలో ఫ్రాన్స్‌ హిట్లర్‌ మూకల దురాక్రమణలో వుంది. 1945 అక్టోబరు 24 ఐక్యరాజ్యసమితి వునికిలోకి వచ్చింది. ఆ తరువాత ఫ్రాన్స్‌ రిపబ్లిక్‌గా ఏర్పడిన తరువాత భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. రెండవ ప్రపంచ యుద్దంలో విజేతలుగా వున్నందున ఐదు దేశాలకు శాశ్వత భద్రతా మండలి సభ్యత్వంతో పాటు వీటో హక్కు కల్పించారు. తరువాత అవి అణుశక్తి దేశాలుగా కూడా మారాయి. అందువలన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. అసలు ఆ సమయానికి మనకు స్వాతంత్య్రం రాలేదు, నెహ్రూ అసలు ప్రధాని కాలేదు.

అయితే నెహ్రూ మీద ఇలాంటి ప్రచారం ఎందుకు జరిగినట్లు? నిప్పులేకుండా పొగరాదు కదా అని ఎవరైనా అనుకోవచ్చు.దీని గురించి జరిగిన ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని 1955లోనే పార్లమెంటులో ఒక ప్రశ్నకు నెహ్రూ సమాధానం చెప్పారు. అయినా అరుణ్‌ జెట్లీ అదే ఏడాది ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నెహ్రూ స్వయంగా అంగీకరించారని ఆరోపించారు. దీని గురించి 2002లోనే ప్రముఖ పరిశోధకుడు ఏజి నూరాని తన విశ్లేషణను ప్రచురించి వాస్తవాలను తెలియచేశారు. అయినా నెహ్రూ వ్యతిరేక శక్తులు తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూనే వున్నాయి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్న గోబెల్స్‌ వారుసులు తప్ప మరొకరు వీటిని నమ్మరు. 2015లో ఆంటన్‌ హార్డన్‌ అనే ఒక పరిశోధకుడు రాసిన వ్యాసాన్ని విల్సన్‌ సెంటర్‌ ప్రచురించింది. దాన్ని 2016 ఆగస్టులో వైర్‌ వెబ్‌సైట్‌ తిరిగి ప్రచురించింది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన రెండు సంవత్సరాలకు మనకు స్వాతంత్య్రం వచ్చింది, మూడు సంవత్సరాలకు చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌(గతంలో ఫార్మోజా దీవి)కు కొమింటాంగ్‌ సేనలు చేరి అక్కడి నుంచి తామే చైనా అధికారంలో వున్నట్లు ప్రకటించుకున్నాయి. అప్పటికే వారి ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో వున్నారు. అమెరికా వత్తిడితో దాన్నే అసలైన చైనాగా పరిగణించటం మినహా సోవియట్‌తో సహా మిగతా దేశాలకు మరొక మార్గం లేకపోయింది. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల సంఖ్యను విస్తరించాలంటే ఏకాభిప్రాయం అవసరం. కమ్యూనిస్టు చైనానే అసలైనా చైనా గుర్తించాలని సోవియట్‌ కోరినా అమెరికన్లు వీటో చేస్తే చెల్లదు. ఆ పరిస్ధితి 1971వరకు కొనసాగింది. తరువాత అమెరికా చొరవతో తైవాన్‌కు బదులు కమ్యూ నిస్టు చైనాను గుర్తించారు.

ఆ మధ్యకాలంలో జరిగిన రాజకీయాన్ని అర్ధం చేసుకుంటే తప్ప నెహ్రూ ఏమి చేశారన్నది మనకు అవగతం కాదు. మన దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత తమ రాజకీయ పలుకుబడి కిందకు తెచ్చుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. బెదిరించి లంగతీసుకోవాలన్న  దాని తప్పుడు ఎత్తుగడలు మన దేశాన్ని సోవియట్‌వైపు నెట్టాయి. 1948లో చైనాలో అధికారానికి వచ్చిన కమ్యూ నిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా, బ్రిటన్‌ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాయి. అంతర్గతంగా తిరుగుబాట్లను రెచ్చగొట్టటం, బర్మా (ప్రస్తుత మయన్మార్‌) కేంద్రంగా కొమింటాంగ్‌ సైనికులు, ఇతర విద్రోహకులకు ఆయుధాలిచ్చి చైనాలో దాడులు చేయించటం వంటి వన్నీ దాదాపు పది సంవత్సరాలు సాగాయి. అప్పటికిగానీ మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు నిలదొక్కుకోలేకపోయారు.టిబెట్‌లోని 14వ దలైలామా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చిన చైనా ప్రభుత్వం టిబెట్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు అంగీకరించింది. ఒప్పందం మీద సంతకం చేసిన తరువాత సామ్రాజ్యవాదుల కుట్రల కారణంగా 1959లో తిరుగుబాటు చేసిన దలైలామా స్వాతంత్య్ర ప్రకటన చేశాడు. దాన్ని చైనా అణచివేయటంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ గుండా పారి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొంది ప్రవాస ప్ర భుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. ఇది ఒకటైతే కమ్యూనిస్టులు అధికారాన్ని సుస్ధిరం చేసుకున్న తరువాత ఎప్పటికైనా కమ్యూ నిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యంగా గుర్తించక తప్పదని అమెరికన్లకు మొదటి నుంచి ఒక అంచనా వుంది. అయితే దాన్ని బయటపడనివ్వకుండా రాజకీయం చేశారు.

చైనా తరువాత అతి పెద్ద దేశమైన భారత్‌కు  భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సి వుందంటూ చైనాను సాధారణ అసెంబ్లీకి పరిమితం చేసి ఐదవ శాశ్వత సభ్యురాలిగా భారత్‌కు మద్దతు ఇస్తామని అమెరికన్లు నెహ్రూకు రాయబేరం పంపారు. కమ్యూ నిస్టు చైనాను దెబ్బతీయటం, భారత్‌ను తమ శిబిరంలోకి చేర్చుకోవటం అనే ఒకే దెబ్బకు రెండు పిట్టలనే ఎత్తుగడ దీనిలో వుంది. తమకు శాశ్వత సభ్యదేశ హోదా అర్హత వుందని, అయితే చైనాను పక్కన పెట్టి తమకు దాన్ని ఇవ్వటం అంటే చైనా-తమ మధ్య విబేధాలను పెంచే ఎత్తుగడ తప్ప వేరు కాదని అందువలన దాన్ని మినహాయించి తమకు ఆ స్ధానాన్ని ఇస్తామనే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని నెహ్రూ సర్కార్‌ నాడు అమెరికాకు చెప్పింది. ఇదే విషయాలను నెహ్రూ తన లేఖలో రాశారు. జెట్లీ వంటి వారు ఆ లేఖను పట్టుకొని రామునితోక పివరుండు ఇట్లనియే అన్నట్లు పదే పదే ప్రచారం చేస్తున్నారు. కాశ్మీర్‌ విషయంలోనూ అదే చేస్తున్నారు. నిజానికి భద్రతా మండలిని విస్తరించాలని, దానిలో వున్న ప్రజాస్వామ్య వ్యతిరేక అంశాలను సంస్కరించాలని అనేక మంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సులు తమ ప్రయోజనాలు, అజెండాకు అనుగుణంగా ఆయా దేశాలను రెచ్చగొట్టటం, తాము ప్రతిపాదిస్తుంటే ఇతరులు అడ్డుకుంటున్నారని సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది మసూద్‌ అజార్‌ కావచ్చు మరొకటి కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ సబ్సిడీల అవసరం – అంతర్జాతీయ అనుభవాలు !

12 Tuesday Mar 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Agri subsidies, agricultural subsidies, Agriculture, India Farm Subsidies

Image result for agriculture india

ఎం కోటేశ్వరరావు

ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకోవాలనే నిర్ణయం, ప్రతికూల వాతావరణం కారణంగా భవిష్యత్‌ అయోమయంగా మారటంతో బ్రిటన్‌ రైతాంగానికి ఆత్మహత్యల ముప్పు తలెత్తిందని గార్డియన్‌ పత్రిక మార్చినెల మూడవ తేదీన ఒక వార్త ప్రచురించింది. మన దేశంలో నిత్యం ఏదో ఒక మూల రైతాంగ ఆత్మహత్యల వార్తలను వింటున్న నేపధ్యంలో పెద్ద మొత్తంలో సబ్సిడీలు పొందుతున్న బ్రిటన్‌ రైతులు కూడా ఇలాంటి పరిస్ధితిలో వున్నారా అన్నది నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే. ఐరోపా యూనియన్‌లో గణనీయంగా వ్యవసాయానికి సబ్సిడీలు ఇస్తున్న దేశాలలో బ్రిటన్‌ ఐదవ స్ధానంలో వుంది.అలాంటి చోట సగటున వారానికి ఒకరి కంటే ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంగ్లండ్‌, వేల్స్‌ ప్రాంతాలలో ఎక్కువగా వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మన దగ్గర ప్రమాదాలు జరిగినపుడు, వైద్యసాయం కోసం 108 సేవలు వున్నట్లే బ్రిటన్‌లో కూడా ఇబ్బందుల్లో వున్న జనం ఫోన్ల ద్వారా కొన్ని సంస్ధలకు తెలియచేస్తారు.ఇటీవల అలాంటి ఫోన్లు డజన్ల కొద్దీ వస్తున్నాయని, కొందరిని ఆత్మహత్యల నివారణ నిఘాలో వుంచినట్లు జాతీయ రైతు సంఘం(ఎన్‌ఎఫ్‌యు) తెలిపింది. మంచుతుపాన్లు, కరవు పరిస్థితులను ఎదుర్కొన్న రైతాంగం ఇప్పుడు ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వెళ్లాలనే(బ్రెక్సిట్‌) నిర్ణయంతో మరింత అయోమయానికి గురైనట్లు పేర్కొన్నది. పలటానికి సిద్దం అవుతున్న టైం బాంబులా బ్రెక్సిట్‌ వుందని కొందరు వర్ణించారు. అదే జరిగితే ఒక్కొక్క గొర్రె లేదా మేకకు 25-30 పౌండ్లు( ఒక్కొక్క పౌండు విలువ 93-94 రూపాయల మధ్య వుంటుంది) నష్టపోతారని, రైతాంగాన్ని ఆదుకొనేందుకు సబ్సిడీలు తప్ప మరొక మార్గం లేదని వార్తలు వచ్చాయి.

కొంత మంది మేథావులు ఇటీవలి కాలంలో సబ్సిడీలు కోరేవారిని, మద్దతు ఇచ్చే వారిని చిన్న చూపుచూస్తున్నారు. దయాదాక్షిణ్యాలతో బిచ్చం వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇది తప్పుడు అవగాహన. వ్యవసాయం, పరిశ్రమలు లేదా సేవలకు సబ్సిడీలు లేకుండా నడిచే అవకాశాలను చూపి వ్యతిరేకిస్తే అర్ధం వుంది. అయితే ఇక్కడ ఒక సందేహం తలెత్తుతుంది. కార్పొరేట్‌ పద్దతుల్లో లేదా ఎగుమతి వాణిజ్యం కోసం పంటల సాగు చేసే వ్యవసాయదారులకు, తన కుటుంబం, దేశ అవసరాల కోసం సాగు చేసే వారి పట్ల ఒకే విధమైన వైఖరి అనుసరించాలా? కచ్చితంగా వుండకూడదు, తేడా వుండాలి.

Image result for agriculture india

అసలు ఈ సబ్సిడీలు లేదా రాయితీలు అనే డిమాండ్‌ లేదా విధానం ఎందుకు అమల్లోకి వచ్చింది ? ఆయా దేశాల్లో తలెత్తిన సంక్షోభం, అవసరాలు వాటిని ముందుకు తెచ్చాయి. రాబోయే రోజుల్లో తెస్తాయి. తాను చేసిన వాగ్దానం మేరకు రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా మద్దతు ధరలను నిర్ణయించినట్లు మన ప్రధాని నరేంద్రమోడీ కొద్ది నెలల క్రితం వూదరగొట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బిజెపి పాలిత రాష్ట్రాలలోని ఇతర జనంతో పాటు రైతాంగం ఆ పార్టీని సాగనంపారు. దీంతో దిమ్మెరపోయిన నరేంద్రమోడీ చిన్న రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయల నగదు సాయం అందించే పధకాన్ని ఎన్నికల మొక్కుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ అనుభవాన్ని చూస్తే విదేశాల నుంచి వచ్చే చౌక దిగుమతులనుంచి తమ రైతాంగాన్ని రక్షించేందుకు, ప్రపంచ మార్కెట్లో పోటీకి తగిన విధంగా తయారు చేసేందుకు, ఇతర కారణాలతో సబ్సిడీలు ఇవ్వటం తెలిసిందే. తాజాగా వాణిజ్య యుద్ధంలో ఎదుటి దేశం మీద దాడి చేసేందుకు కూడా సబ్సిడీలను ఆయుధంగా ప్రయోగించవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొత్తగా ప్రపంచానికి చాటాడు.

ముందుగా ప్రపంచంలో వ్యవసాయ రంగం ద్వారా ఆయా దేశాల్లో ఎంతశాతం మందికి వుపాధి లభిస్తోందో చూద్దాం. ప్రపంచ బ్యాంకు రూపొందించిన వివరాల మేరకు 2017లో సగటున ప్రపంచ వ్యాపితంగా 181 దేశాలలో 26.81శాతం మంది వుపాధి పొందుతున్నారు. అత్యధికంగా ఆఫ్రికాలోని బురుండీలో 91.44శాతం కాగా ఆసియాలోని సింగపూర్‌లో అత్యల్పంగా 0.12శాతం మంది వున్నారు. సగటు కంటే ఎక్కువ మంది ఆధారపడుతున్న దేశాలు 72 వున్నాయి. 26-27శాతం మధ్య ఈక్వెడార్‌, శ్రీలంక, కాంబోడియా, కిర్కిజిస్తాన్‌, బోట్సవానా వున్నాయి. మనది ఎగువ 72లో 42.74శాతమందితో 43వ స్ధానంలో వుండగా 42.02శాతంతో పాకిస్ధాన్‌ 44వదిగాను, బంగ్లాదేశ్‌ 39.07శాతంతో 52వ స్ధానంలో వుంది. మన పొరుగునే వున్న చైనా 17.51శాతంతో 94వ స్ధానంలో వుంది. అమెరికా 1.66 శాతంతో 167వ స్ధానంలో వుంది. దీన్ని బట్టి మనకు తేలుతున్నదేమంటే సగటు కంటే ఎక్కువ మంది వ్యవసాయంమీద వుపాధి పొందుతున్న ప్రతి దేశంలోనూ వ్యవసాయ సబ్సిడీలు అంటే అర్ధం కేవలం పంటల సాగుకు మాత్రమే కాదు, వుపాధికి కూడా ఇస్తున్నట్లుగా భావించాలి. సబ్సిడీలు ఇంకా ఇతర అనేక అంశాల మీద ఆధారపడి ఇస్తున్నారు. స్ధలాభావం రీత్యా ప్రతి దేశం గురించి చర్చించటం ఇక్కడ సాధ్యం కాదు కనుక కొన్ని దేశాల గురించి చూద్దాం.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయానికి బ్రిటన్‌ లేదా దాని వలసలుగా వున్న కొన్ని దేశాలకు అవసరమైన ముడిసరకులు సరఫరా చేసే దేశంగా మాత్రమే వుంది. మన జనానికి సరిపడా ఆహార ధాన్యాలు పండే పరిస్ధితి కూడా లేదు. బెంగాల్‌ కరవుతో సహా అనేక కరవు పరిస్ధితులు అందుకు నిదర్శనం. స్వాతంత్య్రం తరువాత ఆకలి, మన అవసరాలను అవకాశంగా తీసుకొని కొన్ని ధనిక దేశాలు మనల్ని లంగదీసుకొనేందుకు ప్రయత్నించాయి. అమెరికాలో చేసిన పబ్లిక్‌ లా 480(పిఎల్‌ 480)ని ఆధారం చేసుకొని అక్కడి నుంచి ఆహార ధాన్యాలను మన దేశ మార్కెట్లో కుమ్మరించారు. ప్రచ్చన్న యుద్దంలో సోవియట్‌ యూనియన్‌వైపు మొగ్గుచూపిన మన దేశాన్ని తనవైపు తిప్పుకోవటం కూడా దీని తెరవెనుక లక్ష్యం. ఈ పూర్వరంగంలో అమెరికా మీద ఆధారపడకుండా వుండేందుకు మన ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి లక్ష్యంగా మన ప్రభుత్వం 1960 దశకంలో హరిత విప్లవానికి చర్యలు తీసుకుంది. అందరికీ తెలిసిన ఎంఎస్‌ స్వామినాధన్‌ చొరవతో అధిక దిగుబడి గోధుమ వంగడాల తయారీకి శ్రీకారం చుట్టారు. దానిలో భాగమే జై కిసాన్‌, జై జవాన్‌ నినాదం.

అమెరికా నుంచి చౌకగా వచ్చే ఆహార ధాన్యాల గురించి సంతృప్తి లేదా భ్రమలు కావచ్చు. నాటి విధాన నిర్ణేతలు స్వాతంత్య్రం తరువాత తొలి ప్రాధాన్యత పారిశ్రామికీకరణకు ఇచ్చారు.1956 నాటి అమెరికా పిఎల్‌ 480 చట్టం కింద చౌక ధరలకు ధాన్యం దిగుమతి కారణంగా మన దేశంలో ధరలు పడిపోవటం లేదా వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా ఆదాయం రాకపోవటం వంటి సమస్యలతో గ్రామీణ భారతంలో అసంతృప్తి ప్రారంభమైంది. అది వ్యవసాయ వుత్పత్తి పడిపోవటం లేదా ఎదుగుదల నిలిచిపోవటానికి దారి తీసింది. రెండవది రాజకీయంగా ప్రచ్చన్న యుద్దంలో అమెరికా వత్తిడి పెరగటం వంటి కారణాలు కూడా తోడై 1950దశకం చివరిలో వ్యవసాయ రంగం మీద కేంద్రీకరణతో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా రాయితీ ధరలకు సంకరజాతి విత్తనాల సరఫరా, విద్యుత్‌, ఎరువుల రాయితీలు, విస్తరణ సేవల వంటి వాటికి తెరతీశారు.

అమెరికాలో కూడా పారిశ్రామిక విప్లవంతో తయారైన వస్తువులకు మార్కెట్‌ను కల్పించేందుకు భూమి లేని వారికి భూమి ఇచ్చి ఆదాయం కల్పించేందుకు అనేక చర్యలలో భాగమే పెద్ద ఎత్తున ఇస్తున్న సబ్సిడీలు. అమెరికాలో భూ గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసే క్రమంలో 1862లో అనేక మందికి ప్రభుత్వం భూమి కేటాయించింది. అలా భూమి పొందిన వారికి అవసరమైన పెట్టుబడులు, ఇతర అవసరాల కోసం రుణాలు ఇచ్చేందుకు, విస్తరణ సేవలు అందించేందుకు తీసుకున్న చర్యలు కూడా సాగు సబ్సిడీలలో భాగమే. తెలుగు రాష్ట్రాలలో కూడా 1970దశకంలో భూమి అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా అమెరికా వ్యవసాయ రంగం కూడా కుదేలైంది.1929లో ధరల పతనాన్ని నివారించేందుకు వ్యవసాయ మార్కెటింగ్‌ చట్టాన్ని చేశారు. పంటల సాగును తగ్గించాలని రైతులను కోరారు. ప్రభుత్వమే వుత్పత్తులను కొనుగోలు చేసి నిల్వచేసింది. తరువాత అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ న్యూ డీల్‌ పేరుతో అనేక చర్యలను ప్రకటించి మహా సంక్షోభం నుంచి గట్టెంకించేందుకు ప్రయత్నించాడు. దానిలో భాగంగా వ్యవసాయ సబ్సిడీలను అమలులోకి తెచ్చాడు. అవి రూపాలను మార్చుకున్నప్పటికీ ఇప్పటికీ ఏదో రూపంలో కొనసాగుతున్నాయి. 1999 నాటికి వ్యవసాయ సబ్సిడీలు రికార్డు స్దాయికి 22 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 1995-2010 మధ్య ఏడాదికి అన్ని రకాల వ్యవసాయ సబ్సిడీలు 52బిలియన్‌ డాలర్లకు చేరాయి.ఇటీవలి సంవత్సరాలలో అమెరికాలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభంలో చిన్న రైతాంగం దెబ్బతిన్నారు. ఒబామా సర్కార్‌ వ్యవసాయ, ఆహార సబ్సిడీలకు కోత పెట్టేందుకు ప్రతిపాదించి ఆమేరకు తగ్గించివేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ రానున్న పది సంవత్సరాలలో ఆహార, వ్యవసాయ పరిశోధనలు, సబ్సిడీలకు 867బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాలని గతేడాది నిర్ణయించింది. చైనాతో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించిన ట్రంప్‌ దాని వలన జరిగే నష్టాన్ని భరించేందుకు రైతాంగానికి 12బిలియన్‌ డాలర్ల ప్రత్యేక సబ్సిడీలు ఇస్తున్న విషయం తెలిసిందే.

అమెరికాలో వ్యవసాయ సబ్సిడీలను వ్యతిరేకించేవారు లేకపోలేదు. వారు చేస్తున్న కొన్ని వాదనలను చూద్దాం. పంటల బీమా పధకం కారణంగా రెతులు అనావృష్టికి తట్టుకోలేని పంటల విత్తనాలను నాటి పరిహారాన్ని పొందేందుకు మొగ్గు చూపుతున్నారు తప్ప అనావృష్టిని తట్టుకొనే రకాల సాగువైపు మొగ్గటం లేదు. కరవు ప్రాంతాల్లో సాగు వలన భూగర్భ జలాలను విపరీతంగాఆ రైతులు వాడుతున్నారు, ఇప్పుడున్న మాదిరి నీటి వెలికితీత కొనసాగితే ఈ శతాబ్ది అంతానికి అనేక జలాశయాలు ఎండిపోతాయి. ఇప్పటికే కొన్ని ఆ దశలో వున్నాయి. వాటిని తిరిగి వర్షపు నీటితో నింపాలంటే ఆరువేల సంవత్సరాలు పడుతుంది. మొక్కజన్న రైతాంగాన్ని నిరుత్సాహపరచాలి, 40శాతం వుత్పత్తి పశుదాణాకు మరలుతోంది. సబ్సిడీల కారణంగా ఎథనాల్‌ తయారీ కోసం కూడా రైతులు మొక్కజన్న సాగు చేస్తున్నారు. ఎథనాల్‌ తయారు చేసేందుకు ఏడాదికి 120బిలియన్‌ గ్యాలన్ల నీరు వృధా అవుతోంది. టెక్సాస్‌ రాష్ట్రంలో పత్తి రైతులకు ఏటా మూడు బిలియన్‌ డాలర్ల సబ్సిడీ ఇస్తున్నారు. దాన్ని చైనాకు ఎగుమతి చేసి అక్కడ చౌకగా తయారయ్యే దుస్తులను తిరిగి దిగుమతి చేసుకుంటున్నారు. ఆహార ధాన్యాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్న కారణంగా కూరగాయలు, పండ్లకంటే చౌకగా లభిస్తున్నందున అమెరికన్ల సగటు ఆహారంలో నాలుగో వంతు ధాన్యాలే ఆక్రమిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు పదిశాతం కంటే తక్కువగా వున్నాయి. వ్యవసాయ సబ్సిడీల్లో ఆరుశాతం వూబకాయాలను పెంచే ఆహారానికి మరలుతున్నది.సబ్సిడీలు గ్రామీణ అమెరికాలో భూముల ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ఖర్చులను తగ్గించే ఆలోచనలకు రైతులను దూరం చేస్తున్నాయి. కొన్ని పంటలకు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు.అమెరికా రైతులకు రాయితీలు అవసరం లేదు, ఎందుకంటే అత్యంత అనుకూలమైన ప్రాంతాలు అక్కడ వున్నాయి. కావలసినంత సారవంతమైన భూమి, నీరు అందుబాటులో వుంది. ఇతర పరిశ్రమల మాదిరే వ్యవసాయం కూడా సమస్యలను ఎదుర్కొంటోంది తప్ప వేరే కాదు కనుక దానికి ప్రాధాన్యత పెద్ద పీట వేయనవసరం లేదు. నాలుగు వందల మంది అత్యంత ధనవంతుల్లో 50 మంది వ్యవసాయ రాయితీలు పొందారు, 62శాతం సాగుదార్లకు అసలు రాయితీలు లేవు. ఎగువన వున్న ఒకశాతం మంది 26శాతం సబ్సిడీలు పొందారు. అమెరికా సబ్సిడీల వివాదం కారణంగానే దోహా దఫా చర్చలు, ఇతర వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి.

1930లో అమెరికా జనాభాలో 25శాతం అంటే మూడు కోట్ల మంది 65లక్షల కమతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి వున్నారు.అందువలన వారి ఆర్దిక స్ధితిని స్ధిరపరచటానికి సబ్సిడీలను ఒక మార్గంగా ఎంచుకున్నారు. 2012నాటికి కమతాలు 21లక్షలకు, వ్యవసాయం మీద ఆధారపడే జనాభా ముప్పైలక్షలకు తగ్గిపోయింది. తరువాత సంవత్సరాల్లో మరింత తగ్గుతుందని అంచనా. ఇంత తక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే వారు వున్నా సాగు గిట్టుబాటు కావటం లేదని, సబ్సిడీలు అవసరమని చెబుతున్నారు.2011లో వ్యవసాయ రంగం నుంచి నిఖర ఆదాయం 94.7 బిలియన్లు అయితే 2018లో అది 59.5 బిలియన్లకు తగ్గిపోతుందని అంచనా. అమెరికా సబ్సిడీ మొత్తాలలో 15శాతం పెద్ద వ్యవసాయ వాణిజ్య సంస్దలు 85శాతం సబ్సిడీలను పొందుతున్నాయని కాటో సంస్ధ పేర్కొన్నది.1995-2016 మధ్య ఏడు రాష్ట్రాలు 45శాతం మేరకు సబ్సిడీలను పొందాయని పర్యావరణ బృందం పేర్కొన్నది. సబ్సిడీలు చిన్న రైతుల కంటే పెద్ద రైతులు అదీ పత్తి, సోయా, మొక్కజన్న, గోధుమ, వరి పండించే వారే ఎక్కువ భాగం పొందారని తెలిపింది. 2014లో చేసిన చట్టం ప్రకారం చురుకుగా సాగులో నిమగ్నమయ్యే ఒక రైతు గరిష్టంగా ఏడాదికి లక్షా 25వేల డాలర్లు మాత్రమే (మన రూపాయల్లో 88లక్షల రూపాయలు) పొందటానికి అర్హుడని విధించిన నిబంధనను తుంగలో తొక్కుతున్నారని కూడా వెల్లడించింది.

సబ్సిడీలు కొనసాగాలనే వారి వాదన ఎలా వుందంటే అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఇస్తున్న రాయితీల వలన అక్కడి రైతులు వాణిజ్యపరంగా అన్యాయమైన రీతిలో ప్రయోజనం పొందుతున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ రాయితీల మొత్తాన్ని తగ్గిస్తున్న కారణంగా ధనిక దేశాల నుంచి ప్రపంచ ధాన్య నిల్వలకు తోడయ్యే మొత్తం తగ్గిపోతుంది. ఆహార లభ్యత తగ్గి ఆహార ధరలు తీవ్ర వడిదుడుకులకు గురవుతాయి.తుపాన్లు, అనావృష్టి, యుద్ధాలు, మాంద్యాల వంటి వాటి నుంచి రైతులను ఆదుకోవాలి, ఇతర వాణిజ్య వుత్పత్తుల కంటే ఆహారం ముఖ్యం. డాలరు విలువ పెరిగితే ఇతర దేశస్ధులు కొనేందుకు ముందుకు రారు.

ప్రభుత్వ రంగ సంస్ధలను ఆధారం చేసుకొని ఎదిగిన పెట్టుబడిదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్దలు అవసరం లేదు మేమే అన్ని పరిశ్రమలు నెలకొల్పుతాం, సబ్సిడీలు మాకే ఇవ్వండని మన దేశంలో చెబుతున్న విషయం తెలిసిందే. అలాగే వ్యవసాయ సబ్సిడీలకు కూడా వ్యతిరేకమైన వాదనలు ముందుకు తెస్తున్నారు. దీని వెనుక అంతర్జాతీయ కార్పొరేట్ల హస్తం వుంది. సబ్సిడీ విధానాలు వనరులను సక్రమంగా వినియోగించటానికి అవకాశం లేకుండా చేస్తున్నాయి. మారుతున్న మధ్యతరగతి ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుతం ఆహారంలో కూరగాయలు, మాంసవుత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది. ధాన్య డిమాండ్‌ తగ్గుతోంది. ప్రస్తుత విధానాలు దీనికి అనుగుణంగా లేవు. వరి, గోధుమ పంటలు సాగు భూమిలో నాలుగింట మూడు వంతులు, మొత్తం విలువలో 85శాతం ఆక్రమిస్తున్నాయి. ఈ పంటలు ఇప్పటికే మిగులుగా వున్నాయి, రైతులకు ఇతర పంటలకు ప్రోత్సాహం లేనందున వీటిని కొనుగోలు చేసే హామీ వున్నంత కాలం ఇవే కొనసాగుతాయి. మార్కెట్‌ డిమాండ్లకు అనుగుణంగా వుత్పత్తిదారులు స్పందించే విధంగా ప్రస్తుత విధానాలను మార్చాల్సి వుంది. వనరులను అధికంగా వినియోగించటం ద్వారా పర్యావరణ సమస్యలు కూడా వస్తున్నాయి. భూమిలో చేరే నీటి కంటే రెండు రెట్లు దాని నుంచి తీసుకుంటున్నారు.నీటి లభ్యత తగ్గిపోయే కొద్దీ బోర్లను లోతుగా వేస్తూ విద్యుత్‌ అధిక వినియోగ సమస్యను పెంచుతున్నారు. రసాయన ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు.

వివిధ దేశాలు లేదా కూటముల మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందాలు కొత్త సమస్యలను, సబ్సిడీలను ముందుకు తెస్తున్నాయి. వుదాహరణకు పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్య (టిపిపి) వాణిజ్య ఒప్పంద ప్రకారం కిలో పందిమాసం లేదా పంది వారుపై జపాన్‌లో విధిస్తున్న 482ఎన్‌లను పదిహేను సంవత్సరాల వ్యవధిలో 50ఎన్‌లకు తగ్గించాల్సి వుంది. దీనివలన పన్ను తగ్గేకొద్దీ విదేశీ మాంసం జపాన్‌లో ప్రవేశించి స్ధానిక పందుల పెంపక రైతులకు ఆదాయాల మీద ప్రభావం చూపుతుంది. అందువలన జపాన్‌ సర్కార్‌ వారికి సబ్సిడీలను పెంచేందుకు పూనుకుంది. గతంలో 1994-2001 మధ్య వురుగ్వే దఫా ఒప్పందం వలన జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు 6.1లక్షల ఎన్‌లను సబ్సిడీగా జపాన్‌ అందచేసింది. నలభై దేశాలకు సంబంధించి గత రెండు దశాబ్దాలలో సబ్సిడీల గురించి విశ్లేషించిన ఒక అమెరికన్‌ జర్నలిస్టు చెబుతున్నదాని ప్రకారం సగటున ఒక శాతం విదేశీ దిగుమతులు పెరిగితే 0.2శాతం మేరకు సబ్సిడీల కోసం ప్రభుత్వ ఖర్చు పెరుగుతోంది. అయితే దీనికి భిన్నంగా విదేశీ దిగుమతులపై పన్ను పెంపు కారణంగా ట్రంప్‌ సర్కార్‌ దానికి పరిహారంగా రైతులకు సబ్సిడీ అందిస్తున్నది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయాపై చైనా 20శాతం పన్నులను పెంచటంతో అమెరికా మార్కెట్లో 20శాతం మేరకు ధరలు పడిపోయాయి. దీని ప్రభావం వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల మీద పడకుండా చూసేందుకు ట్రంప్‌ కొత్త సబ్సిడీలను ముందుకు తెచ్చారు. సబ్సిడీలను రాజకీయవేత్తలు తమ రాజకీయ ప్రయోజనాలకు కూడా వినియోగించుకోవటం అంటే ఇదే.గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా గ్రామీణ రైతాంగ వ్యవసాయ ఆదాయాలు తిరోగమనంలో వున్నాయి. ఫలితంగా రైతుల రుణ భారం అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 13.8బిలియన్లు పెరిగి 406.9 బిలియన్‌ డాలర్లకు చేరింది.2019లో తమ పరిస్ధితి మెరుగుపడుతుందనే ఆశాభావం వెలిబుచ్చిన వారు 22శాతం మందే వున్నారు. గత పది సంవత్సరాలలో దివాలా తీస్తున్న రైతుల సంఖ్య వున్నతస్ధాయికి చేరింది. 2013లో నిఖర వ్యవసాయ ఆదాయం 134.8 బిలియన్‌ డాలర్లుండగా 2018లో 66.3కు పడిపోయింది. రానున్న ఐదు సంవత్సరాలలో కూడా సగటున 77.3బిలియన్లకు మించదని అంచనా వేస్తున్నారు.

ఐరోపా యూనియన్‌(ఇయు)లో 2021-2027 మధ్య వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలని నిర్ణయించారు. యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలుగుతున్న కారణంగా అక్కడి నుంచి వచ్చే నిధులు ఆగిపోనున్న పూర్వరంగంలో ఈ మేరకు ప్రతిపాదించారు. అయితే బ్రిటన్‌ వాటా కూడా రద్దవుతున్న కారణంగా సబ్సిడీల మొత్తం కూడా తగ్గే అవకాశం కూడా వుంది. వుమ్మడి వ్యవసాయ విధానంలో భాగంగా ఇయు సభ్య దేశాలకు సబ్సిడీ మొత్తాలను కేటాయిస్తారు. ప్రస్తుతం 365బిలియన్‌ యూరోలను ప్రతిపాదించారు. ఎంత మేరకు కోత పెడతారనేది ఎలాంటి ఒప్పందం లేకుండా ఇయు నుంచి బ్రిటన్‌ తప్పుకోవటమా లేదా అన్నది తేలిన తరువాత వెల్లడి కావచ్చు. గరిష్టంగా లక్ష యూరోలకు పరిమితం చేయాలని, అరవై వేల యూరోలకు మించిన వాటిమీద ఎంత మేరకు కోత పెట్టాలనేది నిర్ణయిస్తారు. చిన్న, మధ్యతరగతి రైతాంగానికి ఎక్కువ మొత్తం చెల్లించాలనే ఆదేశాన్ని నిబంధనల్లో చేర్చాలని ప్రతిపాదించారు.

Image result for andhra pradesh agriculture

ఐరోపా యూనియన్‌లో ఆహార పంటలకే కాదు ద్రాక్ష సారా(వైన్‌)కు కూడా సబ్సిడీలు ఇస్తున్నారనే అంశం చాలా మందికి తెలియదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ప్రపంచమంతటా వుంది. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే ఐరోపాలో దాన్ని దెబ్బతీసే ద్రాక్షసారాకు సబ్సిడీలు ఇవ్వటం వెనుక లాభాలు తప్ప ఆరోగ్యం కాదన్నది స్పష్టం. రెండు రకాల పద్దుల కింద ఈ సబ్సిడీలు ఇస్తున్నారు. కారణం ఏమిటయ్యా అంటే ఐరోపా వైన్‌ వుత్పత్తిదారులు ఇతరులతో మార్కెటింగ్‌ పోటీలో నిలవాలన్నదే. అంటే పోటీబడి తాగుబోతులకు సరఫరా చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ సబ్సిడీ మొత్తాలు పెరుగుతున్నాయి. ఈ నిధులలో 90శాతం స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ వుత్పత్తిదార్లకే చేరుతున్నాయి. 2014-18 మధ్య ఆరు బిలియన్ల యూరోలు సబ్సిడీ ఇచ్చారు.2007-13 సంవత్సరాలలో క్యాన్సర్‌పై పరిశోధనలకు కేటాయించిన మొత్తం 150 కోట్ల యూరోలు మాత్రమే. 2009-15 మధ్య వైన్‌ ఎగుమతులలో పెరుగుదల ద్వారా 67.1కోట్ల యూరోల ఆదాయం వచ్చింది. ఇందుకోసం చేసిన ఖర్చు 69.2బిలియన్‌ యూరోలు. దీన్ని సులభంగా అర్దమయ్యేట్లు చెప్పాలంటే కంపెనీల 97యూరోల సంపాదనకు జనం సొమ్ము 100 యూరోలు ఖర్చు చేశారు.టర్కీలో పశుసంవర్ధన, వ్యవసాయదార్లకు అంతకు ముందున్న మొత్తంపై 2018లో 15శాతం పెంచుతూ సబ్సిడీ బడ్జెట్‌ను ఆమోదించారు. రైతులు వాడే పెట్రోలు, డీజిల్‌ ఖర్చులో సగం మొత్తాన్ని సబ్సిడీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అమెరికన్లు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా వ్యవసాయ సబ్సిడీ ఇస్తూనే మరోవైపు ఇతర దేశాల మీద ఎదురుదాడి చేస్తున్నారు. దోహా చర్చలు విఫలం కావటానికి ఇదొక కారణం. మన దేశంలో మద్దతు ధరలు ఎక్కువగా వున్నాయంటూ ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో) లో ఫిర్యాదు చేసిన అమెరికా మన పొరుగు దేశం చైనాను కూడా వదల్లేదు. అందువల్లనే సబ్సిడీల గురించి వుమ్మడిగా పోరాడాలని రెండు దేశాలు నిర్ణయించాయి. డబ్ల్యుటివోలో అంగీకరించిన మొత్తం కంటే చైనా ధాన్య రైతులకు ఎక్కువ సబ్సిడీ ఇస్తోందని అమెరికా ఫిర్యాదు చేసింది. చైనా తీసుకున్న ఈ చర్యల వలన అమెరికన్‌ రైతులు తమ ప్రపంచ స్ధాయి వుత్పత్తులను చైనాకు ఎగుమతి చేయలేకపోతున్నారన్నది దాని సారాంశం. 2015లో దిగుమతి చేసుకున్న మొక్కజన్నల కంటే తమ రైతాంగానికి 40శాతం అదనంగా ఇచ్చిందని 2016లో అది 50శాతానికి చేరినట్లు విశ్లేషకులు రాశారు.

ఎగుమతి మార్కెట్లో అందరికీ సమాన అవకాశాలను కల్పించే లక్ష్యంతో ప్రపంచ వాణిజ్య సంస్ధను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. నిజానికి అది ధనిక దేశాల ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసింది. ఈ కారణంగానే 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు ఇంతవరకు కొలిక్కి రాలేదు. ధనిక దేశాల ఆటలను సాగకుండా వర్ధమాన దేశాలు పతిఘటించటం, ధనిక దేశాలైన ఐరోపా-అమెరికా మధ్య విబేధాలు తలెత్తటం దీనికి కారణం. ఇంతవరకు గతంలో ధనిక దేశాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు అవి సబ్సిడీలను తగ్గించలేదు. మరోవైపు తమ ఆధిపత్యాన్ని వుపయోగించుకొని సభ్య దేశాలో ద్వైపాక్షిక ఒప్పందాలను రుద్దేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. సబ్సిడీ నిబంధనలకు వక్రభాష్యాలు చెబుతున్నాయి. మన దేశంలో కనీస మద్దతు ధరల ప్రకటన కూడా సబ్సిడీగానే పరిగణిస్తున్నది. ప్రపంచ ధరలు అత్యంత కనిష్ట స్ధాయిలో వున్న 1986-88నాటి మార్కెట్‌ ధరల ప్రాతిపదికన ఇప్పుడు అంటే 30సంవత్సరాల తరువాత సబ్సిడీలను లెక్కించటం తప్పుడు లెక్కలు తప్ప మరొకటి కాదు. ఈ విధానం సహజంగానే సబ్సిడీ ఎక్కువ వున్నట్లు చూపుతుంది.వర్తమాన విలువ ప్రకారం చూస్తే సగటున ఒక రైతుకు ఏడాదికి డాలర్లలో ఇస్తున్న మొత్తాలు ఇలా వున్నాయి.అమెరికా 68,910, జపాన్‌ 14,136, ఐరోపాయూనియన్‌ 12,384, బ్రెజిల్‌ 468, చైనా 348, భారత్‌ 228, ఇండోనేషియా 73 డాలర్లు ఇస్తున్నది. మన వంటి దేశాలకు వస్తువిలువలో పదిశాతం వరకు రాయితీలు ఇచ్చేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు అనుమతిస్తున్నాయి. భారత్‌, చైనా, ఇండోనేషియా,ఈజిప్పు వంటి దేశాలు ఇంకా ఆ స్ధాయికి చేరుకోలేదు అంటే ఇంకా రాయితీలు ఇవ్వవచ్చు. అయినా అమెరికా మన మీద, చైనా మీద డబ్ల్యుటిఓలో ఫిర్యాదు చేసిందని ముందే చెప్పుకున్నాము. ధనిక దేశాలు తమ వద్ద వున్న మిగులును మనవంటి దేశాల మీద కుమ్మరించేందుకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తుంటే వర్ధమాన దేశాలు వున్న వుత్పత్తిని నిలబెట్టుకొనేందుకు, అవసరాలకు సరిపడా పెంచుకొనేందుకు రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నాయి. ఇదే తేడా, దీన్ని గమనించకుండా సబ్సిడీలంటే సబ్సిడీలే ఎవరు ఇస్తున్నా ఎత్తివేయాల్సిందే అని వితండ వాదనలు చేసే వారిని ఏ బాపతు కింద జమకట్టాలో రైతాంగమే నిర్ణయించుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ వాదం అంటే నాడు వుత్తేజం, నేడు వున్మాదం !

10 Sunday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, Uncategorized

≈ Leave a comment

Tags

370 article, Aricle 370 myths and facts, article 35A, Hindutva nationalism, Kashmir problem, nationalism then and now, nationalism then inspiration now frenzy

Image result for nationalism india

ఎం కోటేశ్వరరావు

అడవారి మాటలకు అర్ధాలే వేరులే అని సినీ కవి చెప్పిన సందర్భం ఏదైనా కావచ్చు, మహిళలకు ఆ లక్షణాన్ని ఆపాదించటం గౌరవం ఇచ్చే వర్ణన కాదు. అయితే అలా అన్నవారి మీద మహిళలు వుడుక్కున్నారేమోగాని ఎక్కడా దాడులు జరిపినట్లు తెలియదు. ఇప్పుడు దేశంలో అనేక పదాలకు అర్దాలనే మార్చివేస్తున్నారు.కాదన్నవారిని వాదనల్లో ఖండించటం ఒక పద్దతి, భౌతిక దాడులకు తెగబడటమే ప్రమాదకరం. యుద్దం వద్దు అనటం, ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యం కోరుకోవటం దేశద్రోహం, యుద్ధం కోరుకోవటం, రెచ్చగొట్టటం దేశభక్తి. పరమతం వారి మీద ద్వేషం వెలిబుచ్చటం దేశభక్తి, ప్రేమించకపోతే మానే వారి మానాన వారిని వుండనివ్వమనటం దేశద్రోహం. హిందుత్వమే ఇండియా, ఇండియా అంటే హిందుత్వమే కాదన్నవారి సంగతి చూస్తాం అనే బెదిరింపులు. ఒక నాడు జాతీయ వాది అంటే వుత్తేజానికి మారుపేరు. నేడు జాతీయ వాది అంటే వున్మాదానికి చిరునామా ! 1947ఆగస్టు 15 ముందు, తరువాతకు ఎంత తేడా ! కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారు జాతీయవాదులు, సమర్ధించిన వారు దేశద్రోహులు. అంటే ఎప్పటి నుంచో వున్న ప్రత్యేక రక్షణలు, సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు కోరి మన దేశంలో విలీనానికి కారకుడైన షేక్‌ అబ్దుల్లా ఇప్పటి నిర్వచనం ప్రకారం దేశద్రోహి. కాశ్మీర్‌ విలీనాన్ని వ్యతిరేకించి, స్వతంత్రరాజ్యంగా వుంటామని ప్రకటించిన నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌(తరువాత తప్పనిసరై అంగీకరించటం వేరే విషయం), ఆయనకు మద్దతు తెలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌ వారు దేశభక్తులు. చరిత్ర తెలియకపోతే కొత్త తరాలు ఇదే నిజమనుకొనే ప్రమాదం వుంది.

భారత్‌ విభజనకు నిర్ణయం జరిగిపోయింది. ఆ సమయానికి జమ్మూ కాశ్మీర్‌ బ్రిటీష్‌ వారి సార్వభౌమత్వానికి లోబడిన ఒక స్వయంప్రతిపత్తి కలిగిన ఒక సంస్ధానం.షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ కాశ్మీర్‌ సంస్ధానం భారత్‌లో విలీనం కావాలని కోరింది. రాజు హరిసింగ్‌ స్వతంత్రంగా వుంటామని ప్రకటించాడు. 1947 నవంబరులో ఏర్పడిన ఆల్‌జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పార్టీ ( అంతకు ముందు ఆల్‌జమ్ము అండ్‌ కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ పేరుతో పని చేశారు) రాజు హరిసింగ్‌ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తాము మద్దతుగా వుంటామని ప్రకటించింది. అంటే కాశ్మీరు వేర్పాటు వాదానికి సై అన్నట్లే కదా ! ఈ పార్టీని ఏర్పాటు చేసిన అపర దేశభక్తులు ఎవరంటే ఇంకెవరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ మహాశయుడే. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన జనసంఘ్‌తో అది వారే వీరుగా కలసి పని చేసింది, చివరకు 1963లో విలీనమైంది. నాటి కాంగ్రెస్‌ నాయకత్వం మన దేశంలో కాశ్మీర్‌ విలీనానికి అనుకూలంగా వున్న షేక్‌ అబ్దుల్లాతో మాట్లాడటం అంటే అబ్దుల్లా ఆ రాష్ట్రంలో అధికారానికి రావటమే కనుక అది ఆమోదంగాని ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘం మొదటి నుంచి కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చటానికి మొదటి నుంచి వ్యతిరేకించింది తప్ప వేరే ఇతర కారణాలేమీ లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ షేక్‌ అబ్దుల్లాను వ్యతిరేకించటం వెనుక ముస్లిం విద్వేషంతో పాటు అది భూస్వాముల పక్షంలో వుండటం కూడా ఒక కారణం. కాశ్మీర్‌ సంస్ధానంలో భూస్వాములలో అత్యధికులు హిందువులే. షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు భూసంస్కరణలు అమలు జరపాలని కూడా కోరింది. అదేగనుక అధికారంలోకి వస్తే తమ భూములు ఎక్కడ పోతాయోనని భూస్వాములకు ప్రాతినిధ్యం వహించే కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ స్వతంత్రరాజ్యంగా వుంటామని చెప్పిన రాజు హరిసింగ్‌కు మద్దతు ఇచ్చింది. పాకిస్దాన్‌ గిరిజనుల ముసుగులో కాశ్మీర్‌ ఆక్రమణకు ఎప్పుడైతే పూనుకుందో అప్పుడు విధిలేని స్ధితిలో రాజు హరిసింగ్‌ కేంద్ర ప్రభుత్వ సాయం కోరాడు. దానికి అనుగుణంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా తన వైఖరి మార్చుకుంది. అయితే భారత్‌లో పూర్తిగా విలీనం కావటానికి మద్దతు ఇస్తాం తప్ప కమ్యూనిస్టులు ఎక్కువగా వున్న షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని డోగ్రా(హిందువులు) వ్యతిరేక ప్రభుత్వానికి తాము వ్యతిరేకమని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ అన్నాడు. దానికి అనుగుణ్యంగానే షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 1949లో కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ ఆందోళనలు చేపట్టింది.ఎలాంటి షరతలు లేకుండా కాశ్మీరును దేశంలో విలీనం చేయాలని కోరింది. 1951లో ఏర్పాటయిన జనసంఘ్‌కు కాశ్మీరులో ప్ర జాపరిషత్‌ అనుబంధం అయింది. దాని డిమాండ్‌ మేరకు జనసంఘం కూడా కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ప్రారంభం నుంచీ వ్యతిరేకించింది. దాని వారసురాలు బిజెపి కనుక అదే డిమాండ్‌ను వదలకుండా పట్టుకుంది. 1963వరకు కాశ్మీర్‌లో జనసంఘం శాఖను ఏర్పాటు చేయలేదు. కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పేరుతోనే కధ నడిపించారు.

కాశ్మీర్‌కు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే ఏమౌతుంది అని ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం, దాని ప్రచారాన్ని వెనుకా ముందు ఆలోచించకుండా బుర్రకు ఎక్కించుకున్న అమాయకంగా ప్రశ్నిస్తారు. వారికి ఒకటే సూటి ప్రశ్న వుంటే జరిగే నష్టం ఏమిటి, వున్నందువలన దేశానికి జరిగిన ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏమిటి అంటే వారివద్ద కుంటిసాకులు తప్ప సరైన సమాధానం లేదు. రాజ్యాంగంలో కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టికల్స్‌, రక్షణలు కేవలం కాశ్మీర్‌కు మాత్రమే వున్నాయా ?

కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్‌ 35ఏ అమలును సవాలు చేస్తూ చారు వాలి ఖన్నా అనే మహిళ పిటీషన్‌ దాఖలు చేశారు. తాను రాష్ట్ర నివాసినే అయినప్పటికీ తన పిల్లలు జమ్మూకాశ్మీరులో ఇల్లు కొనుక్కోవటానికి అవకాశం లేదని, ఇది కాశ్మీర్‌ మహిళల పట్ల వివక్ష కాదా అన్నది ఆమె ప్రశ్న. కాశ్మీరీ పండిట్‌ అయిన చారు వాలి ఖన్నా సుప్రీం కోర్టులో న్యాయవాది.కాశ్మీరేతర వ్యక్తిని వివాహం చేసుకొని ఢిల్లీలో స్ధిరపడ్డారు. తాను కాశ్మీరులోనే జన్మించినప్పటికి ఇప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టిందని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు విరుద్దమని వాదిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అమలులో వున్న ఆర్టికల్‌ 35ఏ ప్రకారం శాశ్వత నివాసుల జాబితాలో వున్నవారే ప్రభుత్వ వుద్యోగాలు చేయటానికి, ప్రభుత్వ లేదా ప్రభుత్వ సాయం పొందే విద్యా సంస్ధలలో చేరటానికి, భూమి, ఇతర ఆస్ధులను కొనుగోలు చేయటానికి అర్హులు. 1954రాష్ట్రపతి వుత్తరువుల ద్వారా ఇతరులకు హక్కులను నిషేధించారు. శాశ్వత నివాసి అయిన కాశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుంటే ఆమె శాశ్వత నివాస అర్హత రద్దవుతుంది. కాశ్మీరీ పురుషుడిని వేరే రాష్ట్ర మహిళ వివాహం చేసుకుంటే ఆమెకు శాశ్వత నివాసి అర్హత వస్తుంది. మాజీ ముఖ్య మంత్రి ఫరూక్‌ అబ్దులా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా కాశ్మీరేతరులను వివాహం చేసుకున్నారు. వారి భార్యలకు శాశ ్వత నివాస అర్హత వచ్చింది. అదే ఫరూక్‌ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లా కాంగ్రెస్‌ నేత రాజస్ధాన్‌కు చెందిన సచిన్‌ పైలట్‌ను వివాహం చేసుకొని అర్హతను కోల్పోయారు.

చారు వాలీ ఖన్నా, మరికొందరు ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లను అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. 35ఏ ఆర్టికల్‌ను సమర్ధిస్తున్న వారు మహిళా వ్యతిరేకులని, వివక్షను సమర్ధిస్తున్నారంటూ సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు దాడి చేస్తున్నారు. ఈశక్తులకు నిజంగా మహిళా హక్కుల పట్ల అంతశ్రద్దే వుంటే చట్టసభలో మహిళకు మూడోవంతు రిజర్వేషన్ల గురించి గత ఐదు సంవత్సరాలలో ఎందుకు చర్యలు తీసుకోలేదు. అర్టికల్‌ 35ఏ సెక్షన్‌ రద్దు చేస్తామని బిజెపి వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఇలాంటి ఆంక్షలు, రక్షణలు అనేక రాష్ట్రాలలో వున్న అంశాన్ని వీరు విస్మరిస్తున్నారు. ఒక రాజకీయ అజెండాతో కేవలం ఈ అంశాన్నే ముందుకు తెస్తున్నారు. వుదాహరణకు 1-70 చట్టం పేరుతో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమోదించినదాని ప్రకారం ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో షెడ్యూలు గిరిజన ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల గిరిజనేతరులు భూములు, ఇతర స్ధిర ఆస్ధులు కొనుగోలు చేయటానికి లేదు. చట్టం రాకముందు వున్న ఆస్ధులను అమ్ముకోవాలంటే గిరిజనులకు మాత్రమే విక్రయించాలి. ఆప్రాంతాలలోని గిరిజన యువతులు బయటి వారిని వివాహం చేసుకుంటే వారికి ఇతరులకు వర్తించే హక్కులు వర్తిస్తాయి. కానీ గిరిజన యువతులను వివాహం చేసుకున్న గిరిజనేతరులకు ఆ ప్రాంతాలలో అలాంటి హక్కులుండవు. ఇలాంటి పరిమితులే హిమచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాలలో వున్నాయి. వాటి గురించి బిజెపి, సంఘపరివార్‌ మాట్లాడదేం. ఇదే విధంగా ప్రభుత్వ వుద్యోగాలు కూడా రాష్ట్రానికి సంబంధించిన వాటికి స్ధానికులే అర్హులు లేదా వారికి స్ధానికత అర్హత వచ్చిన తరువాతే అర్హులు అవుతారు.

హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేయబోయే ముందు హైదరాబాద్‌ రాష్ట్రానికి చెందిన వారు తమ ప్రాంతానికి రక్షణ కల్పించాలని కోరలేదా, ఆ మేరకు కల్పించిన విషయం తెలిసినదే.తమ ప్రాంతం వారు వెనుకబడి వున్నందున ముందున్న ఆంధ్రప్రాంతం వారు వుద్యోగాలను ఎక్కువగా పొందే అవకాశం వున్నందున రక్షణ కల్పించాలని కోరారు. దానికి అనుగుణంగా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయని 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అయినపుడు చెప్పారు. ముల్కీ నిబంధనల ప్రకారం పన్నెండు సంవత్సరాలు తెలంగాణాలో నివాసం వుంటే వారు స్ధానికులుగా మారిపోతారు. ఆ మేరకు 1968 నాటికి ముల్కీ నిబంధనలు రద్దయ్యే పరిస్ధితి ఏర్పడింది. తమ వారికి జరగాల్సిన న్యాయం జరగలేదని, ముల్కి నిబంధనలు రద్దవుతున్నందున న్యాయం జరగదంటూ తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఆందోళన ప్రారంభమైంది. ముల్కీ నిబంధనలు చెల్లుతాయని కోర్టు తీర్పు వచ్చిన తరువాత స్వంత రాష్ట్రంలో పరాయివారిగా వుండటమేమిటి ప్రత్యేక ఆంధ్రను ఏర్పాటు చేయాలంటూ 1972లో జై ఆంధ్ర ఆందోళన ప్రారంభమైంది. ప్రస్తుతం వుపరాష్ట్రపతిగా వున్న వెంకయ్య నాయుడు దాని నాయకులలో ఒకరు, రాజకీయ జీవితం దానితోనే ప్రారంభించారనే విషయం విదితమే. వుమ్మడి రాష్ట్రంలో స్ధానికులకు న్యాయం చేకూర్చేందుకు రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి వుత్తరువులతో ఆర్టికల్‌ 371డి ప్రకారం వుమ్మ డి రాష్ట్రంలో రక్షణ కల్పించి జోనల్‌ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత స్ధానికత సమస్య మరో రూపంలో ముందుకు వచ్చింది. జోనల్‌ వ్యవస్ధను రద్దు చేయాలనే ఆలోచన చేశారు. అంతకు ముందు ఆంధ్రప్రాంతం వారు తమ అవకాశాలను కొట్టివేస్తున్నారని చేసిన వాదన తెలంగాణాలో మరో రూపంలో ముందుకు వచ్చింది. అభివృద్ధి చెందిన హైదరాబాదు,వరంగల్‌,నల్లగొండ, ఖమ్మం జిల్లాల వారు వెనుకబడిన ప్రాంతాలలోని వుద్యోగావకాశాలను తన్నుకుపోయే అవకాశం వుందనే వాదనలు బయలు దేరటంతో జోనల్‌ వ్యవస్ధను కొనసాగించక తప్పలేదు.

ముల్కీ నిబంధనలను నైజాం నవాబు 1919లో అమలులోకి తెచ్చారు. దాని ప్రకారం నాటి హైదరాబాదు సంస్ధానంలో స్ధానికులకు రక్షణ కల్పించటమే లక్ష్యం. వుర్దూలో ముల్క్‌ అంటే ఒక దేశం. ఆ దేశ పౌరులు ముల్కీలు అవుతారు. సంస్ధానం వెలుపల నుంచి వచ్చేవారి కారణంగా స్ధానికుల్లో తలెత్తిన అసంతృప్తిని తగ్గించేందుకు నవాబు ఈ ఏర్పాటు చేశాడు. ఎవరైనా హైదరాబాదు సంస్ధానంలో 15సంవత్సరాల ప్రభుత్వ సేవ పూర్తి చేస్తే వారికి జన్మి ంచేవారికి పుట్టుకతోనే సంస్ధాన పౌరసత్వం వస్తుంది. లేదా ఎవరైనా 15సంవత్సరాలు నివశించి వుంటే వారు కూడా స్ధానికులు అవుతారు. ముల్కీ అయిన వ్యక్తిని వివాహం చేసుకొంటే ఆమెకూడా ముల్కీ అవుతుంది. పదిహేను హైదరాబాదులో నివాసం వున్న వారు పర్మనెంటు ముల్కీ కావాలంటే తన స్వస్ధాలకు తిరిగి వెళ్లాలనే వాంఛను వదులు కొంటున్నట్లు అఫిడవిట్‌ కూడా ఇవ్వాల్సి వుంది. అప్పుడే ముల్కీ సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. అలాంటి ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీం కోర్టు 1972లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇదే మాదిరి 1927కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ స్ధానికులకు రక్షణ కల్పిస్తూ చేసిన చట్టాన్ని కొనసాగింపుగా భారత్‌లో విలీనం అయిన తరువాత కొనసాగించాలన్నది సంప్రదింపుల్లో అంగీకరించారు. నాడు హరిసింగ్‌ ఆస్దానంలో కాశ్మీరీ పండిట్లు, డోగ్రాలదే ఆధిపత్యం. తమకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పోటీని నివారించేందుకు రాజు చేత 35ఏలో వున్న నిబంధనలను చట్టంగా చేయించారు. అప్పుడు అంగీకరించిన పండిట్లు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు ? నైజాం నవాబు ముల్కీ నిబంధనలను సమర్ధించిన సుప్రీం కోర్టు అదే పద్దతుల్లో కాశ్మీర్‌ రాజు కల్పించిన రక్షణలను ఏ ప్రాతిపదికన రద్దు చేస్తుంది.

ఇలాంటి వాటిని రద్దు చేస్తే పోలా అనే వారికి ఒక ప్రశ్న. చేయాల్సి వస్తే ఒక్క కాశ్మీర్‌ అంశాలనే ఎందుకు రద్దు చేయాలి? వుద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కూడా అలాంటివే. పదేండ్లకోసం చేసిన వాటిని వాటి లక్ష్యం ఇంకానెరవేరలేదనే కారణంగా ఇంకా కొనసాగిస్తున్నాము కదా, వీటిని కూడా అలాగే ఎందుకు పరిగణించకూడదు. చిత్తశుద్ధి వుంటే ఇలాంటి వాటన్నింటినీ కలిపి ఒక చర్చ పెడితే, వాటిమీద ఏకాభిప్రాయం వస్తే రాజ్యాంగ బద్దంగానే చేయవచ్చు. అలా జరగటం లేదే ! ఇప్పుడున్న పరిస్ధితుల్లో అది సాధ్యం అవుతుందా? వుదాహరణకు 1975 మే 16వరకు ప్రస్తుతం మన రాష్ట్రాలలో ఒకటిగా వున్న సిక్కిం ఒక రాజ్యంగా మన రక్షణలో వుంది. అక్కడి జనం రాజరికాన్ని కాదని మన దేశంలో విలీనం కావాలని కోరుకున్నారు. అందుకు అంగీకరించాము. దానికి ఒక షరతు ఏమంటే అప్పటి వరకు సిక్కింలో వున్న ప్రత్యేక రక్షణలను తరువాత కూడా కొనసాగించాలి. వాటిని ఆర్టికల్‌ 371ఎఫ్‌లో చేర్చి రాజ్యాంగాన్ని సవరించారు. ఇప్పుడు కళ్లు తెరిచిన వారు వాటిని అంగీకరించం, రద్దు చేయాలంటే ఎలా? దేశం సమగ్రంగా వుంటుందా ? ఆర్టికల్‌ 370ని సవరించి ఇప్పటికే నీరుగార్చారన్న విమర్శలున్నాయి. దానిని మరింతగా నీరుగార్చటం అంటే కాశ్మీరీల్లో అనుమానాలు, అభద్రతా భావాన్ని మరింత పెంచటమే. దాన్ని రద్దు చేసే అవకాశం లేదని తెలిసి కూడా బిజెపి నిరంతరం వ్యతిరేకంగా ప్రచారం చేయటం రెచ్చగొట్టే వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఈ అర్టికల్‌ను రద్దు చేయాలన్న ఆలోచన తమకు ఇప్పుడు లేదని ఎందుకంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని రాజ్యసభలో ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిజానికి అంత మెజారిటీ వున్నప్పటికీ ఏ పార్టీ ప్రభుత్వానికి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పింది రాజ్యాంగ పరిషత్‌. అది ఇప్పుడు లేదు. అందువల్లనే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. అందుకోసం అసలు రాజ్యాంగాన్నే రద్దు చేసి కొత్త రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేస్తే అన్న వూహాజనిత ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. అటు వంటి పనికి బిజెపితో సహా ఏ పార్టీ పూనుకొనే అవకాశం లేదు.

Image result for nationalism india

కాశ్మీర్‌ గురించి అనేక వక్రీకరణలు ప్రచారంలో వున్నాయి. వాటిలో కొన్నింటి తీరుతెన్నులను చూద్దాం.

ద్వంద్వ పౌరసత్వం: ఇది వాస్తవం కాదు, ముందే చెప్పుకున్నట్లు 35ఏ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రత్యేక రక్షణల కోసం శాశ్వత నివాసులు అని కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు తప్ప అది పౌరసత్వం కాదు.వారు కూడా భారత పాస్‌పోర్టులనే కలిగి వుంటారు.

ప్రత్యేక రాజ్యాంగం: ఇది పాక్షిక సత్యం, ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు చేసుకోవటానికి ఆర్టికల్‌ 370 అనుమతించింది. అందువలన రక్షణ, విదేశీవ్యవహారాలు, సమాచార రంగాలను వర్తింప చేయటానికి ఆ రాష్ట్ర అనుమతి అవసరం లేదు. మిగిలిన అంశాలను వర్తింప చేయాలంటే రాష్ట్రశాసనసభ అనుమతి అవసరం. మన రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్ర అధికారాలతో పాటు వుమ్మడి జాబితా కూడా వున్న విషయం తెలిసిందే. రాష్ట్రాల అధికారాలకు సంబంధించి దేనికది ప్రత్యేక చట్టాలు చేసుకొనేందుకు ఏరాష్ట్రానికి అయినా హక్కుంది. వుమ్మడి అంశాలపై రాష్ట్రాల ఆమోదం అవసరం అన్న విషయం తెలిసిందే.

ప్రత్యేక, రాజ్యాంగం, జెండా : నిజమే, ఆర్టికల్‌ 370 ప్రకారం ప్రత్యేక రాజ్యాంగాన్నే ఏర్పాటు చేసుకొనే హక్కు దానికి వుంది.అది భారత రాజ్యాంగపరిధిలోనే వుంటుంది. ఆ రాష్ట్ర శాసనసభ కాలపరిమితి ఆరు సంవత్సరాలు, 1972లో ప్రత్యేక జండాను అధికారికంగానే ఏర్పాటు చేశారు. దేశంలో అనధికారికంగా సిక్కిం, కర్ణాటలకు ప్రత్యేక జండాలు వున్నాయి. ఒక దేశంలో వుంటూ ప్రత్యేక రాజ్యాంగాలను కలిగి వుండటమంటే అర్ధం స్వతంత్ర దేశాలని కాదు. బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత తిరిగి చైనాలో విలీనమైన హాంకాంగ్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని అనుమతించారు. అలాగే పోర్చుగీసు కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనమైన మకావో దీవులకు కూడా ప్రత్యేక పాలనా మండలి వుంది. చైనాలో విలీనమైనా చైనా చట్టాలు అక్కడ వర్తించవు. మన దేశంలో సిక్కిం విలీన సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఏ రాష్ట్రంలోనూ లేని ప్రత్యేక రక్షణలు కల్పించారు. అక్కడ అసెంబ్లీలో 32 స్ధానాలున్నప్పటికీ ప్రాదేశికంగా 32వ నియోజకవర్గం లేదు. సంఘ పేరుతో వున్న దానిలో సిక్కింలోని బౌద్ధ ఆరామాలలో వున్న సాధువులు దాని ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆర్టికల్‌ 371ఎఫ్‌ ప్రకారం భుటియా, లెపాచా వంటి గిరిజన సామాజిక తరగతులకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లను కేటాయించారు. ఏ తరగతికి కేటాయించిన సీట్లలో వారే పోటీ చేయాల్సి వుంటుంది. మిగతా రాష్ట్రాలలో ఎక్కడా ఫలానా సామాజిక తరగతికి మాత్రమే ఆయా సీట్లలో పోటీకి అర్హత అనేది లేదు. వుదాహరణకు షెడ్యూలు కులాలు, తరగతులకు ఇన్ని సీట్లు, ఏఏ సీట్లు అనేది నిర్ణయం అవుతుంది తప్ప, వాటిలో ఏ కులం వారు పోటీ చేయాలనే అంశం లేదు.

జాతీయ చిహ్నాలను అవమానించటం నేరం కాదు: ఇదొక అవాస్తవం, 1971లో పార్లమెంట్‌ చేసిన చట్ట ప్రకారం జాతీయ చిహ్నాలైన జెండా, జాతీయ గీతం, రాజ్యాంగాన్ని దేశంలో, దేశం వెలుపల భారతీయ పౌరులు అవమానించటం నేరపూరితం. ఏ దైనా ఒక చట్టం కాశ్మీర్‌కు వర్తించనట్లయితే దాని పీఠికలోనే ముందుగా జమ్మూ కాశ్మీర్‌ మినహా అని వుంటుంది. పైన పేర్కొన్న చట్టానికి అలాంటిది లేదు. అలాగే సుప్రీం కోర్టు, కాగ్‌ పరిధి ఆ రాష్ట్రానికి వర్తించదు అనేది కూడా వాస్తవం కాదు.

బయటి వారు భూములు కొనుగోలు చేయకూడదు : ఇంతకు ముందే చెప్పినట్లు దేశంలో అనేక చోట్ల అలాంటి ఆంక్షలు వున్నాయి.1846లో జమ్మూకు చెందిన డోగ్రా రాజు గులాబ్‌ సింగ్‌ బ్రిటీష్‌ వారితో చేసుకున్న అమృతసర్‌ ఒప్పందం ప్రకారం అక్కడి భూమిని బయటి వారెవరూ కొనుగోలు చేయకూడు. భారత్‌లో విలీన సమయంలో అంతకు ముందు ఆ ప్రాంతాలలో వున్న చట్టాలను కొనసాగించాలన్నది షరతు. ఆ మేరకు ఇప్పుడు కూడా బయటి వారెవరూ భూములు కొనుగోలు చేయటానికి లేదు.

బయటి పెట్టుబడులను 370 ఆర్టికల్‌ అడ్డుకుంటున్నది: 1927 ఏప్రిల్‌26న కాశ్మీర్‌ రాజు జారీ చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్రానికి ఆర్ధిక లబ్ది చేకూరేట్లయితే దీనికి మినహాయింపు వుంటుందని పేర్కొనటం పెట్టుబడులకు అవకాశం కల్పించటమే కదా ! భూముల కొనుగోలుకు సంబంధించి అసోంలోని కొండ ప్రాంతాల్లో నిషేధాలు వున్నాయి. నాగాలాండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్‌ 371ఏ, అరుణాచల్‌ ప్రదేశ్‌కు ఇచ్చిన 371హెచ్‌, సిక్కింకు 371ఎఫ్‌, మిజోరాంకు 371జి ప్రకారం ప్రత్యేక హోదా రక్షణలు వున్నాయి. బిజెపి వాటన్నింటినీ ప్రస్తావించకుండా కాశ్మీర్‌నే ఎందుకు ముందుకు తెస్తున్నది. ముస్లింలు మెజారిటీ వున్నారనా ?

పాకీస్తానీని వివాహం చేసుకుంటే : కాశ్మీరీ శాశ్వత నివాసి అయిన ఒక యువతి వేరే రాష్ట్రానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే శాశ్వత నివాస హక్కు రద్దవుతుంది, అదే పాకిస్తానీని చేసుకుంటే కాదు అన్నది ఒక తప్పుడు ప్రచారం. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం లేదు. పాక్‌ యువకుడు కాశ్మీర్‌ లేదా ఇతర భారత రాష్ట్రాల యువతులను వివాహం చేసుకుంటే వారికి పాక్‌ సౌత్వం వస్తుంది తప్ప పాక్‌ యువకులకు మన పౌరసత్వం రాదు. చట్టంలో శాశ్వత నివాసి అన్న పదానికి స్త్రీ, పురుష తేడా లేదు. అయితే పాలనాపరమైన నిబంధనల ప్రకారం మహిళలకు వివాహమయ్యేంత వరకు వుంటుంది. కాశ్మీరీనే వివాహం చేసుకుంటే శాశ్వతనివాస హోదా కొనసాగుతుంది.అదే వేరే రాష్ట్రాల వారిని చేసుకుంటే రద్దవుతుంది. అయితే 2004లో అలా రద్దు కావటానికి ఎలాంటి చట్టబద్దత లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని చెల్లకుండా చేసేందుకు కాశ్మీర్‌ అసెంబ్లీ అదే ఏడాది ఒక బిల్లును ఆమోదించింది. అయితే వివిధ కారణాలతో అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు.

కాశ్మీర్‌ మహిళలు షరియత్‌ చట్టం కింద వున్నారు: ఇది వాస్తవం కాదు, కాశ్మీరీ ముస్లిం మహిళలే కాదు దేశంలోని యావత్తు మహిళలు ఆయా మతాల వ్యక్తిగత చట్టాల కిందనే వున్నారు.

హిందు, సిక్కు మైనారిటీలకు రిజర్వేషన్‌ లేదు:2011 జనాభా లెక్కల ప్రకారం కాశ్మీర్‌లో 68.31శాతం ముస్లింలు, 28.43శాతం హిందువులు ఇతరులందరూ 3.26శాతం వున్నారు. హిందువులను మైనారిటీలుగా ఎక్కడా గుర్తించలేదు.2005 రాష్ట్ర రిజర్వేషన్‌ చట్టం ప్రకారం వెనుబడిన ప్రాంతాల(తరగతులు కాదు) వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలకు 8, మాజీ సైనికులకు 6, వికలాంగులు 3, వాస్తవాధీన రేఖ సమీపంలో వుండే వారికి 3, వెనుకబడిన తరగతులకు 2 శాతం చొప్పున రిజర్వేషన్లు వున్నాయి. మత ప్రాతికన ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్న వారు కాశ్మీర్‌లో హిందువులు, సిక్కులకు మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ లేదనటం గమనించాల్సిన అంశం. దేశంలో ఎక్కడా లేని విధంగా వెనుకబడిన ప్రాంతాల వారికి అంటే కుల మత ప్రసక్తి లేకుండా రిజర్వేషన్‌ కలిగించటం ఇక్కడ మాత్రమే వుంది.

మన మాపుల్లో చూపుతున్న ప్రాంతాలన్నీ మన ఆధీనంలో లేవు. కాశ్మీర్‌లోని కొంత భాగం పాకిస్ధాన్‌ ఆక్రమణలో వుంది, మరికొంత ప్రాంతం చైనా కింద వుంది. అరుణాచల్‌ తమదే అని చైనా అంటున్నది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాల్సి వుంది. ఇప్పుడున్న ఆర్టికల్‌ 370ను తొలగిస్తే తలెత్తే చట్టపరమైన సమస్యలు, సంక్లిష్టతల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలకు కారణమైన విషయం తెలిసిందే. అది అసోం ఒప్పందాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అందువలన గతంలో ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను విస్మరించి కేవలం ఓట్ల దృష్టితో బిజెపి తన నిర్ణయాన్ని రుద్దేవందుకు పూనుకుంది. వ్యతిరేకతను గమనించి ఆ బిల్లును మురిగిపోయేట్లు చేసింది. అందువలన కాశ్మీర్‌తో సహా ఈ పూర్వరంగంలో ఇప్పటి పీటముడులను విప్పటమే ఒక సమస్యగా మన ముందున్నపుడు వాటిని మరింతగా బిగిసేట్లు, కొత్త ముడులు వేసేందుకు ప్రయత్నించటం నిజమైన దేశభక్తులు, జాతీయ వాదులు చేయాల్సిన పని కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అధికార రహస్యాల చట్టం ముసుగులో మీడియా నోరు నొక్కే యత్నం !

08 Friday Mar 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Attorney General KK Venugopal, ‘Stolen’ Rafale documents, Official Secrets Act, Rafale fighter jet, The Hindu

Image result for Under Official Secrets Act government is threatening media

ఎం కోటేశ్వరరావు

అటు కేంద్రంలోనూ, ఇటు కొన్ని రాష్ట్రాలలోనూ జరుగుతున్న పరిణామాలను చూస్తే పాలకులు తాము ప్రమాణం చేసిన మాదిరి అధికారిక రహస్యాలను కాపాడటం కంటే అవి మీడియాలో రాకుండా ఎలా చూడాలా, అందుకు మీడియాను ఎలా కట్టడి చేయాలి అన్నదాని మీదే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకు తాజా వుదాహరణ రాఫెల్‌ విమానాల కొనుగోలు లావాదేవీల అక్రమాలపై పునర్విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌ కె వేణుగోపాల్‌ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అటార్నీ జనరల్‌ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, ఆయన నోటి నుంచి వెలువడిన ప్రతి మాటా ప్రభుత్వ ఆలోచన, కార్యాచరణకు ప్రతిబింబమే.

రాఫెల్‌ విమానకొనుగోళ్ల లావాదేవీలపై విచారణ జరపనవసరం లేదని గతేడాది డిసెంబరులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దానిని పున:సమీక్షించాలని కొందరు పిటీషన్లు దాఖలు చేశారు. వాటిపై ఈనెల ఆరున సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌, న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్‌, కెఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్‌ విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభిస్తూ ఇప్పటికే రికార్డులలో వున్న అంశాల మీదనే పిటీషనర్లు పునర్విచారణ జరపాలని కోరాలని, దీనికి సంబంధించి ఇటీవల మీడియా ప్రచురించిన అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోదని ప్రకటించారు. ఆ సందర్భంగా జరిగిన వాదోపవాదాల సారాంశం ఇలా వుంది.

పిటీషనర్‌ ప్రశాంత భూషణ్‌ : మేము కోరిన సహాయ స్వభావాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. నా పిటీషన్‌లో లావాదేవీని రద్దు చేయమని కోరలేదు, అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని మాత్రమే కోరుతున్నా. తీర్పు సమయంలో కోర్టు అనేక దోష పూరితమైన అంశాల మీద ఆధారపడింది. సీల్డుకవర్‌ నోట్స్‌ద్వారా దోషపూరితమైన అంశాలను ప్రభుత్వం సరఫరా చేసినందున అలా చేసి వుండవచ్చు. ఆర్ధిక నష్టం గురించి తెలిసి కూడా తప్పుడు అంశాలను కోర్టుకు నివేదించిన ప్రభుత్వ అధికారులను కూడా రప్పించాలి.

అటార్నీ జనరల్‌ కె వేణుగోపాల్‌ : పిటీషనర్లు మరియు ది హిందూ పత్రిక రక్షణ మంత్రిత్వశాఖ నుంచి అపహరించిన పత్రాల మీద ఆధారపడ్డారు. దీని గురించి అధికారిక రహస్యాల చట్టం మేరకు దర్యాప్తుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రభుత్వ పత్రాలను ప్రచురించిన రెండు ప త్రికలు, ఒక సీనియర్‌ న్యాయవాది మీద చర్యను మేము పరిశీలిస్తున్నాము. ఈ అంశం జాతీయ భద్రతకు సంబంధించినది, పిటీషన్‌పై విచారణ జరపక ముందే కోర్టును ప్రభావితం చేసేందుకు వార్తా పత్రికలు ముద్రించాయి. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది.

ప్రశాంత భూషణ్‌: కోర్టుకు వాస్తవాలను నివేదించకుండా పిటీషనర్లను అడ్డుకొనే ప్రయత్నంగా ఎజి ప్రకటనలు వున్నాయి. అటువంటి చర్యల ద్వారా ఎజియే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు.

ఏజి: (సమాచార హక్కు చట్టంలోని అంశాలను చదువుతూ ) రాఫెల్‌ గురించి రక్షణ పత్రాలను బహిర్గత పరచటాన్ని ఈ చట్టం మినహాయిస్తున్నది.(హిందూ పత్రిక ప్రచురించిన అంశాలను చదువుతూ) ఈ పత్రాల మీద రహస్యం అని రాసి వుంది, అవి బహిరంగపరచటానికి వుద్దేశించినవి కాదు. ఈ పత్రాలను ప్రపంచం మొత్తానికి ప్రచురించారు. అదెంత నష్టం చేకూర్చిందో చూడండి. ఎఫ్‌ 16విమానాలకు ప్రతిగా రాఫెల్‌జెట్‌ విమానాలు మన దేశ రక్షణకు అవసరం,ఈ విమానాలను నడిపేందుకు అవసరమైన శిక్షణ కోసం పైలట్లను ఇప్పటికే పారిస్‌ పంపారు.

పధాన న్యాయమూర్తి : పునర్విచారణ పిటీషన్‌కు పరిమితం కండి పరిశీలించాల్సిందానిని మేమేదైనా వదలి వుంటే చూస్తాము.

జస్టిస్‌ కెఎం జోసెఫ్‌ : ఇక్కడ జాతీయ భద్రత అంశం వుత్పన్నం కాదు.దర్యాప్తు చేయాలా వద్దా అన్నది కోర్టు ముందున్న అంశం. అందుకోసం అపహరణకు గురైన సాక్ష్యాలను కూడా కోర్టు పరిశీలిస్తుంది. సాక్ష్య చట్టంలో దీని గురించి స్పష్టంగా వుంది. ఒక వేళ అవినీతి జరిగి వుంటే అధికారిక రహస్యాల చట్టం కింద ప్రభుత్వం రక్షణ పొంద కూడదు.

ఎజి:(న్యాయమూర్తి జోసెఫ్‌తో విబేధిస్తూ) పత్రాలు ఎక్కడి నుంచి సేకరించారన్నది ముఖ్యం, విశేషాధికారం వున్న రక్షణ మంత్రిత్వశాఖ నుంచి పిటీషనర్లు వాటిని ఎలా సంపాదించారు? అధికారిక రహస్యాల చట్టాన్ని వుల్లంఘించారు అనే ప్రాతిపదికన పునర్విచారణ పిటీషన్ను కొట్టివేయాల్సిందిగా కోరుతున్నాను.

ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ : ఒక నిందితుడు అపహరణకు గురైన పత్రం అనేదాని ప్రాతిపదికన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే కోర్టు దానిని విస్మరించాలా ?

ఎజి:భారత్‌లో వున్న చట్టం ప్రకారం వనరు ముఖ్యం !

ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ : వనరు ముఖ్యం అనే సాధికారతను మాకు చూపండి.

ఏజి: 2004లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి పశ్యంత్‌ వెల్లడించిన తీర్పులో చట్టవిరుద్ద పద్దతుల్లో సేకరించిన సాక్ష్యం మీద ఆధారపడకూడదని పేర్కొన్నారు.

ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ : ఒక వ్యక్తి రహస్య పత్రాలను సంపాదించటం నేరపూరితమైన శిక్షకు అర్హునిగా అధికారిక రహస్యాల చట్టం పేర్కొన్నది. అటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోండి, అయితే ఆ పత్రం చెల్లకుండా పోతుందా ?

ఏజి: కోర్టు అలాంటి పత్రాలను పట్టించుకోకూడదు.

న్యాయమూర్తి కెఎం జోసెఫ్‌ :ఏజి మన ముందుంచిన సూత్రాన్ని బోఫోర్స్‌ కేసుకు కూడా వర్తింపచేయాలా? ఆ కేసును కూడా అపివేయాలా ?

న్యాయమూర్తి ఎస్‌కె కౌల్‌ : ఆ పత్రాలు మా ముందుకు వచ్చాయి, మేము వాటిని పరిశీలించకూడదని మీరు చెప్పుకూడదు.

ఎజి: శత్రువుకు వ్యతిరేకంగా ఈ దేశం బతికి బట్టకట్టాలంటే ఈ కొనుగోళ్లు తప్పని సరి.

న్యాయమూర్తి కౌల్‌ : ఏజి వాదనలను అంగీకరించినప్పటికీ, ఒక వేళ కోర్టు వివేకాన్ని దెబ్బతీసేవిగా వుంటే కొన్ని అంశాలు వినటానికి తగినవే.

ఏజి: ఈ సమస్యకు రాజకీయ కోణం వుంది. పార్లమెంటు ముందు ఇప్పటికే కాగ్‌ నివేదికనుంచారు. అది ఈ సమస్యను పరిశీలిస్తుంది. అపహరించిన పత్రాల నుంచి కొన్ని భాగాలను ప్రచురించిన పత్రికల వార్తల ప్రాతిపదిన సుప్రీం కోర్టు సిబిఐ విచారణకు ఆదేశిస్తే విదేశాలకు చెడు సంకేతాలిచ్చినట్లు అవుతుంది.భవిష్యత్‌లో విదేశీ కంపెనీలు రక్షణ కొనుగోలు లావాదేవీల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి, లావాదేవీలు పార్లమెంట్‌, టీవీ ఛానల్స్‌, వార్తా పత్రికలు పరిశీలించిన తరువాత కోర్టులు చూస్తాయని అనుకుంటారు.భారతీయ వాయుసేనకు అత్యవసరంగా అవసరమైన జట్‌ విమానాల సేకరణ ఆలస్యం అవుతుంది.

ఈ కేసు తదుపరి విచారణ మార్చి 14కు సుప్రీం బెంచ్‌ వాయిదా వేసింది. కోర్టులో తాను చేసిన వ్యాఖ్యలు దుమారం లేపటంతో న్యాయవాదులు, జర్నలిస్టుల మీద దర్యాప్తు, చర్యలు తీసుకోవటం లేదని తరువాత అటార్నీ జనరల్‌ వివరణ ఇచ్చినట్లు ఎడిటర్స్‌ గిల్డ్‌ తన ప్రకటనలో పేర్కొన్నది. అయినప్పటికీ ఇటువంటి బెదిరింపులతో తీవ్ర కలత చెందినట్లు, వాటిని ఖండిస్తున్నట్లు తెలిపింది.

Image result for Under Official Secrets Act government is threatening media

గతంలో కుహనా వార్తలను అదుపు చేసే పేరుతో జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటామని అక్రిడిటేషన్లను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం బెదరించింది. ఇప్పుడు 1923లో బ్రిటీష్‌ ప్రభుత్వం చేసిన అధికారిక రహస్యాల చట్టాన్ని ముందుకు తెచ్చి దాని ప్రాతిపదికన చర్యతీసుకుంటామని బెదిరించారు. ఇది దేశ భద్రత కంటే అధికారంలో వున్న వారి అవినీతి, లావాదేవీలలోని అక్రమాలు బయటకు రాకుండా చూసే యత్నంగా వుంది. నిజానికి ఈ చట్టం 2005లో చేసిన సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నది. ప్రభుత్వానికి లేదా అధికారంలో వున్నవారికి ఇబ్బంది కలిగించే ప్రతి సమాచారాన్ని దేశ భద్రత పేరుతో తొక్కిపెట్టేందుకు వీలు కల్పిస్తున్నది. రెండు చట్టాల మధ్య ఏదైనా ఘర్షణ వస్తే ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. 1998లో ప్రభుత్వ పెట్టుబడుల వుపసంహరణకు సంబంధించిన కేంద్రకాబినెట్‌ నోట్‌లోని అంశాలను ఒక జర్నలిస్టు బయటపెట్టినందుకు కేసు పెట్టారు. 2006లో ఒక కాశ్మీరు జర్నలిస్టు మిలిటరీ సమాచారాన్ని మిలిటెంట్లకు అందచేస్తున్నాడని అరోపించి కేసు పెట్టారు. తీరా విచారణలో ఆ సమాచారం బహిరంగంగా అందరికీ అందుబాటులో వున్నట్లు తేలింది. బోఫోర్సు నుంచి 2జి స్ప్రెక్ట్రమ్‌ కుంభకోణాల వరకు జర్నలిస్టులు బయటపెట్టినవే తప్ప ప్రభుత్వం వెల్లడించేందుకు ముందుకు రాలేదు. ఆ సమాచారం బయటకు వచ్చినందున దేశ భద్రతకు వాటిల్లిన ముప్పేమీ లేదు. రాఫెల్‌ కేసు కూడా అలాంటిదే. ప్రభుత్వం కొన్ని అంశాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నది. ఫ్రెంచి కంపెనీ అమ్ముతున్నది మనం కొనుగోలు చేస్తున్నాం, ఎన్నికొనుగోలు చేస్తున్నదీ బహిరంగమే. తేడా అల్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎక్కువ ధర చెల్లిస్తున్నారని, ప్రభుత్వ కంపెనీని పక్కన పెట్టి ప్రయివేటు కంపెనీ ప్రయోజనం కోసం నిబంధనలను మార్చారని. దీనిలో దేశభద్రతకు వచ్చిన ముప్పేమిటో తెలియదు.

Image result for Under Official Secrets Act government is threatening media

అటార్నీ జనరల్‌ చేసిన వాదన పర్యవసానాలు ఎలా వుంటాయో చూద్దాం. ఒక కేసు విచారణలో ఒక వ్యక్తి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనే సాక్ష్యాలను కోర్టు ముందుంచటంలో విఫలమయ్యాడు. వున్న ఆధారాల మేరకు అతను నేరం చేశాడని కోర్టు మరణశిక్ష విధిస్తుంది. అది అమలు గాక ముందే సదరు వ్యక్తికి చెందిన వారు నిందితుడిని నిర్దోషిగా నిరూపించే అధికారిక సాక్ష్యాన్ని అక్రమ పద్దతుల్లో సంపాదించి కోర్టు ముందు పెడితే అక్రమంగా సాక్ష్యాలను తెచ్చారు గనుక వినేది లేదు వురి వేయాల్సిందే అని కోర్టు చెప్పాల్సి వుంటుంది. రాఫెల్‌ లావాదేవీలను ఆసరా చేసుకొని ప్రతిపక్షాలు తమ ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇప్పటి వరకు బిజెపి ఆరోపిస్తున్నది. ఇప్పుడు ఏజి ద్వారా మీడియా రహస్య పత్రాలను అపహరించిందంటూ నిందలు వేస్తూ బెదిరింపులకు పూనుకుంది. ఈ వైఖరిని అడ్డుకోకపోతే ఈ ప్రభుత్వం లేదా రాబోయే పాలకులు మరొకరు ఈ నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మరింతగా అమలు జరిపే ప్రమాదం పొంచి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చౌకీదారుగా నరేంద్రమోడీ – సిఇఓగా చంద్రబాబు విఫలం !

07 Thursday Mar 2019

Posted by raomk in AP, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP, CEO chandrababu naidu, chandrababu naidu, chowkidar narendra modi, Data Theft, Narendra Modi, trs, ysrcp

Image result for as chowkidar narendra modi

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం పెద్ద రాజకీయ వ్యాపారం నడుస్తోంది. దీనికి నేరపూరిత అంశాలు తోడవుతున్నాయి. నేను దేశానికి పెద్ద కాపలాదారును అని ప్రధాని నరేంద్రమోడీ పదే పదే చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి అని పిలిపించుకోవటం కంటే సిఇఓ అంటేనే నాకు పెద్ద కిక్కబ్బా అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పుకొని ఎంతో తృప్తి పొందారు. ఇప్పుడు ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు అని చెప్పక తప్పదు. పెద్ద కాపలాదారు సంరక్షణలో వున్న రాఫెల్‌ విమానాల లావాదేవీలు, చర్చల పత్రాలు చోరీకి గురైనట్లు మార్చి ఆరవతేదీన అటార్నీ జనరల్‌ కె వేణుగోపాల్‌ సుప్రీం కోర్టుకు తెలిపారు. రెండు దశాబ్దాలకుపైగా తాము నిల్వచేసిన తమ పార్టీ సమాచారం చోరీకి గురైందని తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణా పోలీసులు, మరికొందరి మీద గుంటూరు జిల్లాలో ఫిర్యాదు చేశారు. అతి పెద్ద కాపలాదారు రక్షణలో వున్న రక్షణ శాఖ పత్రాల చోరీ గురించి ఎలాంటి ఫిర్యాదు లేదా కేసు నమోదు లేకుండానే ఏకంగా వున్నత న్యాయ స్ధానానికి తెలియచేయటం సరికొత్త వ్యవహారశైలికి నిదర్శనం. సమాచార చౌర్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో చర్యలు, చర్చ మొదలైన వారం రోజులకు తమ సమాచారం పోయిందని తెలుగుదేశం గొల్లు మంటూ కేసు దాఖలు చేసింది. సామాన్యులు ఈ పరిణామాలను ఒక పట్టాన అర్ధం చేసుకోవటంలో విఫలమైతే జుట్టుపీక్కోవటం తప్ప ఏమీ చేయలేరు.

రెండు అంశాలు స్పష్టం. రాఫెల్‌ పత్రాలు చోరీకి గురైనట్లు మోడీ సర్కార్‌ కోర్టుకు నివేదించటం అంటే హిందూ పత్రిక వెల్లడించినవి వాస్తవమే అని నిర్ధారించటం. రెండవది చేయాల్సిన పని చేయనందుకు పెద్ద కాపలాదారు మీద ముందు కేసు నమోదు చేసి వుద్యోగం నుంచి వూడగొట్టాలి. ఏండ్ల తరబడి సేకరించిన సమాచారాన్ని నిర్లక్ష్యంగా చోరీ చేసేందుకు వీలుగా వుంచి కాపాడుకోవటంలో విఫలమైన తెలుగుదేశం కంపెనీ సిఇవో లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని బాధ్యతల్లో కొనసాగించటమా లేదా అన్నది సదరు కంపెనీ లేదా పార్టీకి వదిలివేద్దాం. దొంగలు దోచుకుపోయిన తరువాత ఇంటికి తాళాలు వేసినట్లు తెలుగుదేశం వెబ్‌సైట్‌ను మూసివేశారు. ఎందుకాపని చేశారంటే మిగిలిన సమాచారాన్ని కాపాడుకొనేందుకు అంటున్నారు. రాఫెల్‌ విమానాల కొనుగోలు ధర ఎక్కువా, తక్కువా, ఎంతో అనుభం వున్న ప్రభుత్వ రంగ సంస్ధను పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని రిలయన్స్‌ కంపెనీకి కట్టబెట్టారా లేదా అన్న చర్చ జరుగుతోంది, వున్నత న్యాయస్ధానంలో విచారణలో వుంది. వాటిని పక్కన పెడితే రాఫెల్‌ విమానాలో మరొకటో మన వాయుసేనకు అవసరం అనేదానిలో ఎలాంటి తేడాలు లేవు. రాఫెల్‌గాక పోతే మరోకంపెనీ లావాదేవీలు లేదా ప్రభుత్వం చెబుతున్నట్లు అత్యంత రహస్య సమాచారాన్ని నరేంద్రమోడీ సర్కారు జాగ్రత్త పరచలేదు అన్నది తేలిపోయింది. సదరు పత్రాలు హిందూ పత్రిక చోరీ చేసిందని కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఆరోపించింది.

ప్రపంచంలో ఇలా అధికారిక పత్రాలు బహిర్గతం కావటం కొత్తేమీ కాదు. అమెరికా ప్రభుత్వం అత్యంత రహస్యంగా వుంచే సమాచారాన్ని జూలియన్‌ అసాంజే అనే పెద్ద మనిషి బహిర్గతం చేసిన వాటిని సంవత్సరాల బడి చదువుతూనే వున్నా ఇంకా తరగటం లేదు. కళ్ల ముందు జరిగే ఒక దుర్మార్గం లేదా ఒక అక్రమాన్ని సహించలేని వారో లేదా సదరు లావాదేవీ పోటీలో వెనుక బడి తోటి కంపెనీ అక్రమాలకు బలైన వారో ఇలాంటి పత్రాలను స్వయంగా మీడియాకు తెచ్చి ఇవ్వటం బహిరంగ రహస్యం. అలాంటి వనరు ఏదో ఒకటి లేకుండా మీడియా వ్యక్తులు దొంగతనం చేసి సంపాదించిన దాఖలా లేదా అలాంటి వుదంతాలలో శిక్షలు పడిన వుదంతాలు నాకైతే కనపడలేదు. అదే హిందూ పత్రిక గతంలో బోఫోర్సు పత్రాలను, బిజెపి నేత మాజీ మంత్రి అయిన అరుణ్‌శౌరీ జర్నలిస్టుగా వున్న సమయంలో అనేక కుంభకోణాలను బయట పెట్టారు. కానీ అప్పుడెవరూ ప్రభుత్వ పత్రాలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేయలేదు. జర్నలిస్టులను దొంగలుగా చిత్రించి కేసులు నమోదు చేస్తే ఈ దేశంలో, ప్రపంచంలో కేసులు వుండని జర్నలిస్టులు, మీడియా సంస్ధలు వుండవు.

రాఫెల్‌ లావాదేవీల అక్రమాల గురించి హిందూ పత్రిక ప్రకటించిన వెంటనే ఫిబ్రవరి ఎనిమిదిన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారు. దానిలో చోరీ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. నెల రోజుల తరువాత చోరీ జరిగిందని అధికార రహస్యాల వెల్లడి చట్టం కింద వాటిని బయట పెట్టిన రెండు పత్రికల మీద విచారణ, చర్యను పరిశీలిస్తున్నట్లు అటార్నీ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు. అది కూడా ఈ లావాదేవీలపై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలన్న పిటీషన్లపై విచారణ ప్రారంభమైన తరుణంలో అన్నది గమనించాలి. కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు కోర్టులో చేసిన వాదనను చూస్తే అధికార రహస్యాల చట్ట వుల్లంఘన అనే కత్తిని మీడియా మీద ప్రయోగించేందుకు పూనుకుందన్నది స్పష్టం. దాన్నే రక్షణగా చేసుకొని పునర్విచారణను అడ్డుకోవాలని చూస్తోంది. పునర్విచారణ పిటీషన్‌ విచారణకు ముందే వార్తా పత్రికలు సంబంధిత అంశాలను ప్రచురించటం కోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకే అని అందువలన ఇది కోర్టు ధిక్కారం కూడా అని ఏజి వాదించారు. దీనికి ప్రతిగా పిటీషన్‌దారైన ప్రశాంత భూషణ్‌ కోర్టుకు వాస్తవాలను వివరించే పిటిషనర్లను అడ్డుకొనే ప్రయత్నమే ఏజి ప్రకటనలని నిజానికి అవే కోర్టు ధిక్కరణకిందికి వస్తాయన్నారు.

ప్రపంచంలో ప్రజాస్వామ్యం వున్న ఏదేశంలోనూ ఒక వార్త మీడియాకు ఎలా వచ్చిందో చెప్పాలని ఆదేశించే హక్కు ఏ కోర్టుకూ లేదు. మీడియాకు అనేక వనరుల నుంచి వార్తలు వస్తాయి. వాటిని బయటకు వెల్లడించబోమనే ఎలాంటి రాతకోతలు లేని హామీతోనే స్వీకరిస్తాయి, ప్రచురిస్తాయి.అలాంటి విశ్వసనీయతను మీడియా కాపాడుకొంటూ వస్తోంది. ఈ వుదంతంలో హిందూ పత్రిక ప్రచురించిన వాటి గురించి పత్రిక చైర్మన్‌, స్వయంగా రాఫెల్‌ పత్రాలను బయట పెట్టిన ఎన్‌ రామ్‌ ఈ విషయాలనే స్పష్టంగా చెప్పారు. ఈ అంశాలు కోర్టు విచారణలోనూ వస్తాయి కనుక వాటి గురించి మరోసారి పరిశీలిద్దాం.

Image result for as ceo  chandrababu naidu failed

తెలుగుదేశం- వైసిపి మధ్యలో తెరాస !

రెండవ అంశం ఆంధ్రప్రదేశ్‌, తెలుగుదేశం పార్టీ సమాచార చోరీ వివాదం.సమాచార చోరీ చాలా సంక్లిష్టమైనది. దానికి ముందే చెప్పుకున్న జూలియన్‌ అసాంజే వికీలీక్స్‌ వెల్లడించిన సమాచార వుదంతం చక్కటి వుదాహరణ. అసాంజే ఆస్ట్రేలియా కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌. అమెరికాకు చెందిన ఆఫ్ఘన్‌, ఇరాక్‌ యుద్ధాలు, సిఐఏ, అమెరికా రాయబారులు పంపే ప్రయివేటు సమాచారం లక్షల ఫైళ్లను ప్రపంచానికి విడుదల చేశాడు. అతని మీద నేరుగా చర్యలు తీసుకొనే అవకాశం లేక లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలపై స్వీడన్‌ అరెస్టు చేసి విచారణ జరిపింది, తేలిందేమీ లేదు. స్వీడన్‌తో అమెరికాకు వున్న ఒప్పందం కారణంగా రహస్యాలను బయట పెట్టిన కేసులో అమెరికాకు అప్పగిస్తామని స్వీడన్‌ ప్రకటించింది. దాంతో అతను బ్రిటన్‌ పోలీసులకు లంగిపోయాడు. పదిరోజుల పాటు విచారించి బెయిలు మీద విడుదలయ్యాడు. బ్రిటన్‌ కూడా అమెరికాకు పంపే యత్నాలను గమనించి బ్రిటన్‌ పోలీసుల కళ్లుగప్పి లండన్లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్ర యం పొందాడు. 2017లో ఈక్వెడార్‌ పౌరసత్వం కూడా పొంది అక్కడే వుంటున్నాడు. అంతర్జాతీయ రాజకీయాలు అర్దమైతే తప్ప ఇలా ఎందుకు జరుగుతోంది అనేది అర్ధం కాదు.

స్వాతంత్య్రం తరువాత అనేక రాష్ట్రాలను చీల్చి కొత్త వాటిని ఏర్పాటు చేశారు. బహుశా ఎక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ అధికార పార్టీల మధ్య రాజకీయ వివాదాలు చోటు చేసుకోవటం ఒక విధంగా భారత రాజకీయ రంగం మీద కొత్త అంకం అనుకోవాల్సి వుంటుంది. తెలుగు వారు గణనీయ సంఖ్యలో వున్న కర్ణాటకలో తెలుగుదేశం, తెలంగాణా రాష్ట్రసమితి(తెరాస) మధ్య మొదలైన తెరవెనుక రాజకీయ పోరు గతేడాది జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తెరమీదకు వస్తే, ఇప్పుడు అది కత్తులు దూసుకొనే స్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ఒకదానినొకటి దెబ్బతీసుకోవాలి అని అనుకోవాలేగానీ అవకాశాలు, సాకులు బోలెడన్ని.మనకు సినిమా పరిజ్ఞానం ఎక్కువ గనుక చిక్కడు-దొరకడు, రేచుక్క-పగటి చుక్క, ఎత్తుకు పై ఎత్తు, దొరికితే దొంగలు, జగత్‌ కిలాడీలు, జగత్‌ జెంత్రీలు వంటి సినిమాలను చూసి తెలుగువారు చాల మెళకువలను నేర్చుకున్నారు. తాజాగా వచ్చిన ఎఫ్‌టు అనే తెలుగు సినిమాలో ఒక అధికారి తాను తెలంగాణా లేదా ఆంధ్రకు చెందిన వాడిని అని చెబితే ఎక్కడ తేడా వస్తుందోనని కేంద్ర పాలిత ప్రాంతం యానం అని చెబుతాడు. ఇప్పుడు వర్తమానానికి వస్తే సమాచార చౌర్యం. సమస్య తెలుగుదేశం-వైసిపి వ్యవహారంలా వున్నప్పటికీ బిజెపి, తెలంగాణా రాష్ట్ర సమితి పాత్రకూడా తక్కువేమీ కాదు. దీనిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన వారు, ఫిర్యాదులు చేసిన వారందరూ సామాన్య జనాన్ని గందరగోళపరుస్తున్నారు. హైదరాబాదుకు చెందిన ఐటి గ్రిడ్స్‌ ఇండియా అనే ఒక కంపెనీ తెలుగుదేశం పార్టీకోసం సేవా మిత్ర అనే ఒక యాప్‌ను తయారు చేసిందని, దానిలో వుపయోగించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ పధకాల లబ్దిదారులు, ఓటర్ల వివరాలను తస్కరించారని హైదరాబాద్‌కు చెందిన టి లోకేశ్వర్‌ రెడ్డి అనే సమాచార విశ్లేషకుడు మార్చినెల రెండవ తేదీన హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సమాచార చోరీ వివాదం ప్రారంభమై సినిమాల్లో మాదిరి మలుపులు తిరుగుతోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటిగ్రిడ్‌ కంపెనీలో సోదాలు జరిపి సిబ్బందిని ప్రశ్నించారు. యజమాని ప్రస్తుతం పరారీలో వున్నట్లు పోలీసులు ప్రకటించారు. అతను అమరావతిలో అంటే విజయవాడలో ఏపి పోలీసుల రక్షణలో వున్నాడన్నది బిజెపి, తెరాస ఆరోపణ. దాని గురించి తెలుగు దేశం పార్టీ వారు అవుననీ, కాదనీ ఏమీ మాట్లాడరు. మార్చి మూడవ తేదీన ఏపి పోలీసులు హైదరాబాదు వచ్చి సమాచార చోరీ ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డి ఇంటి మీద దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. అతనేమీ సమాచార దొంగకాదు. ఐటి గ్రిడ్‌ సిబ్బందిని నిర్బంధించారన్న అరోపణలతో కోర్టుకు ఫిర్యాదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా తమను ప్రశ్నించారు తప్ప నిర్బంధించలేదని కోర్టుకు తెలపటంతో కోర్టు పిటీషన్‌ను కొట్టివేసింది. ఐటి గ్రిడ్‌ కంపెనీని వేధిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించటంతో సమాచార చౌర్యం కేసు రాజకీయ రంగు పులుము కుంది.

ఈ లోగా హైదరాబాద్‌కు చెందిన దశరధరామి రెడ్డి అనే మరోవ్యక్తి హైదరాబాద్‌ పోలీసులకు మరో ఫిర్యాదు చేశాడు. హైదరాబాదులో తాత్కాలికంగా నివాసం వుంటున్న వారి వివరాలను సేకరించి ఆంధ్రప్రదేశ్‌లోని వారి స్వస్ధలాలలో ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారన్నది దాని సారాంశం. ఫిర్యాదుదారు హైదరాబాదులో వుండటంతో తాము ఇక్కడ కేసు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. సమాచార తస్కరణ కేసు సత్వర విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు హైదరాబాదు పోలీసులు ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో గుంటూరులో తెలుగు దేశం పార్టీ నేతలు అక్కడి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలంగాణాకు చెందిన పోలీసులు, కొందరితో కుమ్మక్కై తమ పార్టీ సమాచారాన్ని అపహరించారని పేర్కొన్నారు. తెలంగాణా పోలీసులు సత్వర విచారణకంటూ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తే , దానికి పోటీగా ఏపి సర్కార్‌ రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఒకటి తెలుగుదేశ ం పార్టీ సమాచార చౌర్యం మీద అయితే రెండవది ఫారం ఏడుతో అక్రమంగా ఓటర్లను తొలగించేందుకు దరఖాస్తు చేసిన వారి మీద చర్యతీసుకొనేందుకు అని ప్రకటించారు.

చట్టపరమైన అంశాలు, కేసులు ఏమౌతాయి అన్న అంశాలను కాసేపు పక్కన పెడితే ఈ వివాదం ఎందుకు మొదలైందన్నది ఆసక్తి కలిగించే అంశం. తమ వస్తువులను అమ్ముకొనేందుకు అవసరమైన మార్కెటింగ్‌ వ్యూహాలను రచించుకొనేందుకు ప్రపంచవ్యాపితంగా కార్పొరేట్‌ కంపెనీలు జన ఆమోదంతో నిమిత్తం లేకుండా మభ్య, ప్రలోభపరచి లేదా సాధ్యంగాక తస్కరించి సమాచార సేకరణ,దాయటం అందరికీ తెలిసినదే. ఇప్పుడిది కార్పొరేట్‌ రాజకీయ పార్టీలకు పాకింది. పార్టీ కార్యకర్తల, సభ్యుల పేరుతో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో సమాచార సేకరణ, ఎన్నికల సమయంలో దాన్ని వుపయోగించుకోవటం ఎప్పటి నుంచో జరుగుతోంది.గతంలో ముఖ్య మంత్రి పేరుతో ప్రతి ఇంటికీ లేఖలు రాస్తే ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వ పధకాల లబ్దిదారులను కూడా చేర్చి తమ ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవటం అసలు వివాదానికి మూలం. విచారణలో ఏ విషయాలు బయటపడతాయో లేక ఓటుకు నోటు కేసు మాదిరి తెరవెనుకకు పోతాయో మనకు తెలియదు. ఒకటి జరిగి వుండాలి. ఇది వూహ మాత్రమే. తెలుగుదేశం పార్టీ తాను సేకరించిన సమాచారంతో పాటు ప్రభుత్వ పధకాల లబ్దిదారుల సమాచారాన్ని కూడా ఐటి గ్రిడ్‌కు అప్పగించి తన యాప్‌ ద్వారా ఓటర్లకు చేరువ అయ్యేందుకు నిర్ణయించి వుండాలి. అది తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సిపి తెలంగాణాలో తన మిత్రపక్ష సహకారంతో ఆ సమాచారాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రతి వ్యూహం రచించి వుండాలి. దానిలో భాగంగానే తస్కరణ ఫిర్యాదులు, ఐటి గ్రిడ్‌పై పోలీసుల విచారణ,సమాచార కాపీ, దాన్ని వైఎస్‌ఆర్‌సిపికి అందచేసి వుండాలి. దీనిలో మరొక అంశం ఏమంటే తమకు ఓటు వేసే అవకాశం లేదు అనుకొనే వారి ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు లక్షల సంఖ్యలో ఓటర్లకు తెలియకుండానే కొందరు కుట్ర చేసి దరఖాస్తులు చేయటం, వాటిని అధికారం యంత్రాంగం తెలిసీ లేదా తెలియనట్లు నటించిగానీ దరఖాస్తులో కోరిన మేరకు ఓటర్ల జాబితా నుంచి తొలగించటం జరుగుతోంది. ఇలాంటి చర్యలకు తెలుగుదేశం-వైసిపి రెండు పార్టీలూ పాల్పడ్డాయన్నది అందరినోటా వినిపిస్తున్న అంశం. ఎవరు సమాచారాన్ని దొంగిలించారు లేదా ఎవరు ఐటి గ్రిడ్‌కు అప్పగించారు, దాని దగ్గర నుంచి టిఆర్‌ఎస్‌ సర్కార్‌ సాయంతో వైసిపికి అందచేశారా అనేది ఒకటైతే ఆ సమాచారం అంతా అసలు మన దేశంతోనే సంబంధం లేని అమెజాన్‌, గూగుల్‌ కంపెనీల సర్వర్లకు చేరిందన్నది మరొక అంశం. మరి అదెలా జరిగినట్లు ?

నిజానికి ఇలాంటి అక్రమాలు గతంలో కూడా జరిగాయిగానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు ఎందుకు అంటే రెండు పార్టీలు అధికారం కోసం ఎంతకైనా తెగించేందుకు పూనుకున్నాయి. ఏ పార్టీ గెలిచినా రెండో పార్టీ దుకాణం ఖాళీ అవుతుంది. గత ఎన్నికలలో తెలుగు దేశం సీట్ల పరంగా ఎక్కువ పొందినా ఓట్ల పరంగా పెద్దగా రాబట్టలేదు. రెండు పార్టీల మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే అన్నది తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మరికొన్ని రాష్ట్రాలలో నెలకొన్న పరిస్ధితులను చూస్తే ఏ పార్టీ అయినా అధికారానికి వస్తేనే అది ఐదు సంవత్సరాలూ నిలుస్తుంది. ఏదో ఒకసాకుతో ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఇతర ప్రజాప్రతినిధులను టోకుగా లేదా చిల్లరగా కొనుగోలు చేస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీ తన బలాన్ని పెంచుకొంటోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం వున్నప్పటికీ స్పీకర్ల అండ, చట్టంలోని లసుగులను వుపయోగించుకొని ఫిరాయింపుదార్లను రక్షిస్తున్నారు. పార్టీ మారకుండానే మంత్రిపదవులను సైతం కట్టబెట్టిన విపరీతాన్ని చూశాము. అందువలన ఎలాగైనా సరే అధికారాన్ని పొందాలన్నదే ఏకైక సూత్రంగా ఇప్పుడు అధికారపార్టీలు పని చేస్తున్నాయి.

ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎన్నికల తాయిలాలు, డబ్బులు పంచటం, కులాన్ని రంగంలోకి తీసుకురావటం పాత పద్దతులు. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలుగా వున్న వారి వ్యాపారాలు, ఇతర లావాదేవీలను దెబ్బతీస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం ద్వారా తమవైపు తిప్పుకోవటం అధికారపార్టీలు కొత్తగా ప్రారంభించిన ప్రమాదకరక్రీడ. ఎవరు అధికారంలో వుంటే వారు దీన్ని ఆడుతున్నారు. ఇది రాష్ట్రాలను దాటింది. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి తన లేదా తన మిత్రపక్ష రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్ధలను వుపయోగించుతోందన్నది ఒక విమర్శ. హైదరాబాదులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులుగా వున్న వారు బహిరంగంగానే ఆరోపించిన అంశం తెలిసిందే. వైఎస్‌ఆర్‌సిపికి లబ్ది చేకూర్చేందుకు తెలంగాణా వున్న టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం ఈ పని చేస్తోందన్నది ఆరోపణ. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో ఏపికి చెందిన చంద్రబాబు నాయుడు జోక్య ం చేసుకొని తమను ఓడించేందుకు ప్రయత్నించినదానికి ఇది బదులు తీర్చుకోవటంగా కనిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ సమాచార చోరీ జరిగిందన్న ఫిర్యాదుకు, తమ సమాచారాన్ని చోరీ చేశారన్న ఆరోపణకు రెండింటికీ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వుంది. అధికారంలో వున్న పార్టీగా అధికారిక సమాచార చోరీ నివారణకు, చివరకు స్వంత సమాచార చోరీని అడ్డుకోవటంలో ఎందుకు విఫలమైంది అన్నదానికి జవాబు చెప్పాల్సింది వారే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు జోక్యం చేసుకున్నాడని, సామాజిక మీడియాను వుపయోగించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన ఆరోపణలు మనకు తెలిసిందే. అమెరికా ఎన్నికల్లో కూడా జాబితా తయారీలోనే ఓటర్లకు ప్రలోభాలు, తమకు ఓట్లు పడవు అనుకున్న ప్రాంతాలలో ఓటర్లజాబితాల్లో అక్రమాలు, కుంటి సాకులు చూపి ఓటర్లను అడ్డుకోవటం బహిరంగ రహస్యం.

ఇప్పుడు ఓటర్ల జాబితాల్లో తొలగింపుల గురించి తెలుగుదేశాంవైసిపి పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చూస్తే రేపు ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాకపోతే రెండోవారిని నిందించటానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనుకోవాలి.ఓట్ల తొలగింపు గురించి సాధారణంగా ఎన్నికల రోజు, లేదా తరువాత ఆరోపణ,ప్రత్యారోపణులు వస్తాయి.అలాంటివి ఇప్పుడు ముందే వస్తున్నాయంటే అర్ధం అదే. ఈ పూర్వరంగంలో ఎన్నికల సంస్కరణలు లేదా నిబంధనల సవరణ అంశం ముందుకు వస్తోంది. నిర్ణీత గడువులోగా ఓటర్లుగా నమోదుకు అవకాశం ఇచ్చినట్లే, రద్దు దరఖాస్తుల ప్రకారం ఏ ఓటర్లను తొలగిస్తున్నదీ, అభ్యంతరాలుంటే తెలియచేయాల్సిందిగా కోరుతూ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందచేస్తే తప్పుడు దరఖాస్తులా నిజమైనవా అన్నది తేలుతుంది. కనీసం తొలగింపు ఓటర్లను బూత్‌ల వారీ ఎలక్ట్రానిక్‌ జాబితాలను అయినా పార్టీలు, ఓటర్లకు అందుబాటులో వుంచి సరిచూసుకొనేందుకు వీలు కల్పించాలి. బోగస్‌ దరఖాస్తులుగా తేలిన వాటిని దరఖాస్తుదారులను, వాటిని విచారణ చేయకుండా ఆమోదించి ఓట్లను తొలగించిన సిబ్బంది మీద క్రిమినల్‌ చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో అటువంటివి పునరావృతం కాకుండా వుంటాయి. ఒకసారి ఓటు హక్కు వచ్చిన తరువాత ఓటరు స్వయంగా కోరితే లేదా మరణిస్తే తప్ప జాబితా నుంచి రద్దయితే దానికి జాబితా తయారు చేసినవారిని బాధ్యులుగా చేయాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా డెమోక్రాట్‌ అధ్యక్ష అభ్యర్ధి బరిలో శాండర్స్‌ !

07 Thursday Mar 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, Politics, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, 2020 US Elections, Berni sanders, Bernie Sanders 2020, Bernie Sanders To Run As A Democrat

ఎం కోటేశ్వరరావు

2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు అవకాశమివ్వాల్సిందిగా కోరుతూ డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీ శాండర్స్‌ తన జన్మస్ధలం న్యూయార్క్‌ నగరంలోని బ్రూక్లిన్‌లో మార్చినెల రెండవ తేదీన ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. పోలాండ్‌ నుంచి వలస వచ్చిన కుటుంబంలో జన్మించిన శాండర్స్‌ చిన్నతనంలో ఎలాంటి ఇబ్బందులను అనుభవించిందీ నేటి దిగువతరగతివారితో పోల్చుకొని గతాన్ని గుర్తు చేసుకున్నారు. మీ అందరి మద్దతుతో నేను పార్టీ అభ్యర్ధిత్వపోటీలో విజయం సాధించటమే కాదు ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకార అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ను కూడా ఓడించబోతున్నామని చెప్పాడు. ఆకాశ హర్మ్యాలు, జూదశాలలు, క్లబ్బులు నిర్మించేందుకు మిలియన్ల కొద్దీ డబ్బు ఇచ్చే తండ్రి నాకు లేడు, మూడు సంవత్సరాల వయస్సులో ఏడాదికి రెండులక్షల డాలర్లు ఇచ్చే కుటుంబం నుంచి నేను రాలేదు అంటూ ట్రంప్‌ను వుద్దేశించి వ్యాఖ్యానించారు. మీ అండతో ఈ దేశాన్ని మార్చబోతున్నాం, అంతిమంగా కేవలం ఒకశాతం మంది కోసం కాకుండాఆ మనందరికోసం పని చేసే ప్రభుత్వం మరియు ఆర్ధిక వ్యవస్దను సృష్టించబోతున్నామని పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతనుద్దేశించి చెప్పారు.

పార్టీ అభ్యర్దిగా ప్రచారం ప్రారంభించిన మూడు రోజుల తరువాత తాను డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దిగా మాత్రమే పోటీ చేస్తానంటూ శాండర్స్‌ ఒక ప్రమాణ పత్రం మీద సంతకం చేశారు. గత ఎన్నికలలో హిల్లరీ క్లింటన్‌తో పోటీ బడిన శాండర్స్‌ ఒక వేళ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం దక్కకపోతే మూడవ పక్ష లేదా స్వతంత్ర అభ్యర్ధిగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారంటూ ఆయన ప్రత్యర్దులు ప్రచారం చేశారు. అలాంటిదేమీ లేకపోగా హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా ఎన్నికలలో ప్రచారం చేశారు. అయితే 2024 జరిగే వెర్‌మౌంట్‌ సెనెటర్‌ ఎన్నికలలో తాను స్వతంత్ర అభ్యర్దిగా బరిలో వుంటానని ప్రకటించటంతో అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడేవారు పార్టీ సభ్యులై వుండాలని, పార్టీ అభ్యర్ధిగా మాత్రమే పోటీ చేస్తాననే ప్రమాణం చేయాలనే నిబంధనను గట్టిగా అమలు జరపాలని పార్టీలో ఆయన ప్రత్యర్ధులు వత్తిడి చేశారు. ఆ మేరకు తాజాగా శాండర్స్‌ ప్రమాణం చేశారు. రాష్ట్రాలలో పార్టీ ప్రతినిధులతో నిమిత్తం లేకుండా 1984లో ప్రవేశ పెట్టిన సూపర్‌ డెలిగేట్స్‌ అంటే పార్టీలో సీనియారిటీ,చేసిన సేవ, నిధుల వసూలులో పెద్ద చేయిగా వుండటం వంటి అంశాల ప్రాతిపదికన కొంత మందిని ప్రత్యేక ప్రతినిధులుగా కేంద్ర పార్టీ ఎంపిక చేస్తుంది. వారు అంతిమంగా పార్టీ అభ్యర్ధిని ఎంచుకొనే ప్రక్రియలో తమకు ఇష్టమైన వారికి ఓటు వేయవచ్చు అనే అవకాశం కల్పించారు. సహజంగా అలాంటి ప్రత్యేక ప్రతినిధులు తమను ఎంపిక చేసిన కమిటీ ఎటు మొగ్గితే అటే ఓటు వేస్తారన్నది గత అనుభవం, 2016 ఎన్నికలలో కూడా పార్టీ హిల్లరీ క్లింటన్‌ వైపు మొగ్గటంతో రాష్ట్రాలలో ఎంత మెజారిటీ తెచ్చుకున్నప్పటికీ బెర్నీ శాండర్స్‌ చివరికి ఈ ప్రత్యేక ప్రతినిధుల కారణంగా ఓడిపోయారు. ఈ అనుభవంతో అభ్యర్ధి ఎన్నికలో వారి ప్రమేయాన్ని తొలగించాలని శాండర్స్‌, తదితరులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తాజా ఎన్నికలలో వారి ప్రమేయాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అది ఎంతవరకు అన్నది ఇప్పుడే చెప్పలేము. అయితే నైతికంగా ఇది శాండర్స్‌ సాధించిన విజయం.

తొలిసారిగా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌ సభ్యుడిగా 1990లో ఎన్నికయ్యారు. తరువాత వెర్‌మౌంట్‌ రాష్ట్రం నుంచి స్వతంత్ర సెనెటర్‌గా 2006 నుంచి కొనసాగుతున్నారు. పార్లమెంట్‌లో ఆయన డెమోక్రటిక్‌ పార్టీతోనే కలసి వ్యవహరిస్తారు. 2016లో జరిగిన ఎన్నికలలో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం కోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడ్డారు. ఒకప్పుడు వామపక్ష వాదిని అని చెప్పుకొనే పరిస్ధితులు లేని అమెరికాలో తాను సోషలిస్టును అని పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నానని బహిరంగంగా చెప్పుకొన్న శాండర్స్‌ వర్తమాన అమెరికా రాజకీయాలలో ఒక సంచలనానికి నాంది పలికారు. లక్షలాది మంది యువతీ యువకులు తాము కూడా సోషలిస్టులమే అంటూ గత ఎన్నికలలో ఆయనకు పెద్ద ఎత్తున బాసటగా నిలిచినప్పటికీ కార్పొరేట్‌లాబీ ఆయన అభ్యర్ధిత్వాన్ని అడ్డుకుంది. అయినప్పటికీ రెట్టించిన వుత్సాహంతో 77 సంవత్సరాల శాండర్స్‌ తిరిగి పోటీకి ముందుకు వచ్చారు. అందరికీ ఆరోగ్యం, గంటకు కనీసవేతనం 15డాలర్ల వంటి నినాదాలను ముందుకు తెచ్చారు. నేడు డెమోక్రటిక్‌ పార్టీలో ఆయనను వద్దనే వారు కూడా ఆ నినాదాలను వ్యతిరేకించే స్థితి లేదంటే డెమోక్రటిక్‌ పార్టీ మీద ఎంతటి ప్రభావం కలిగించారో చెప్పవచ్చు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడనున్నట్లు ప్రచారంలో వున్న వారిలో కమలా హారిస్‌, కోరీ బుకర్‌, ఎలిజబెత్‌ వారెన్‌ వంటి వారు కూడా అందరికీ ఆరోగ్యం అనే బిల్లును 2017లో ప్రతిపాదించిన వారిలో వున్నారు.

ఇటీవలి వరకు సోషలిజం అంటే ఆసక్తి చూపని వారు అమెరికాలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలను చూసి పునరాలోచన పడుతున్న స్ధితిలో బెర్నీ శాండర్స్‌ వంటి వారు ముందుకు తెస్తున్న డెమోక్రటిక్‌ సోషలిజం, ప్రజలు చెల్లించే పన్నులు కార్పొరేట్లకు కాదు, అందరికీ వుపయోగించాలి, ఎలాంటి నియంత్రణలు లేని పెట్టుబడిదారీ వ్యవస్ధ చెడ్డది వంటి అంశాలు యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. సోషలిజం భావన తమకు ఎంతో వుత్తేజం కలిగిస్తున్నదని, డెమోక్రటిక్‌ సోషలిస్టు భావనలు డెమోక్రటిక్‌ పార్టీకి కొత్త రూపునిస్తున్నాయని పలువురు ఆ పార్టీ వెలుపల వున్న వారు కూడా భావిస్తున్నారు.

Image result for bernie sanders

అమెరికా ఎన్నికలలో ప్రత్యర్ధుల మీద తప్పుడు ప్రచారం చేయటం సర్వసాధారణం. సోషల్‌ మీడియా దీనికి ప్రధాన వేదికగా వుంది. ఈ ఎన్నికలలో కూడా తాను తిరిగి రంగంలో వుంటానని శాండర్స్‌ ప్రకటించిన తరువాత అటువంటి ప్రచారం ప్రారంభమైంది.వాటిలో ఒకదాని సారాంశం ఇలా వుంది. శాండర్స్‌ ఒక్క వ్యాపారాన్ని కూడా ప్రారంభించలేదు, కొత్తగా కనుగొన్నదేమీ లేదు, స్ధిరమైన వుద్యోగం లేదు, 25సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా వుండి ఒక్క బిల్లునూ ప్రతిపాదించలేదు.ఎన్నిక అవటానికి ముందు ప్రభుత్వ భృతిమీద ఆధారపడ్డాడు. 74ఏండ్ల వృద్ధుడు ఆరోగ్య సంరక్షణ, ఆర్ధిక వ్యవస్ధలను సరిచేస్తానంటున్నాడు, అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడు. అతని హీరో కారల్‌ మార్క్స్‌ మాదిరి సాధించేదేమీ వుండదు. దీనిలో పేర్కొన్న మొదటి రెండు అంశాలు వాస్తవమే. శాండర్స్‌ అమెరికన్‌ పీపుల్స్‌ హిస్టారికల్‌ సొసైటీ పేరుతో ఒక ప్రభుత్వేతర సంస్ధను స్ధాపించి తక్కువ ఖర్చుతో వెర్‌మౌంట్‌, న్యూ ఇంగ్లండ్‌ ప్రాంతాల గురించి అక్కడి జనం, జరుగుతున్న పరిణామాల మీద లఘు చిత్రాలు నిర్మించాడు. దాన్ని వాణిజ్యంగా ఎవరూ భావించటం లేదు. వాణిజ్యం కలిగి వుండి యజమానులుగా వున్నవారే పోటీ చేయాలని రాజ్యాంగంలో లేదు. ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఎన్నికకు ముందు వాణిజ్యవేత్తలుగా వున్నది డోనాల్డ్‌ ట్రంప్‌తో సహా ఏడుగురు మాత్రమే.2017లో ఆయన ఆస్ధి విలువ 20లక్షల డాలర్లు.చికాగో విశ్వవిద్యాలయం నుంచి 1964లో డిగ్రీ తీసుకున్న తరువాత 1981లో బర్లింగ్టన్‌ మేయర్‌ అయ్యేంత వరకు అనేక చిన్న చిన్న వుద్యోగాలు చేశాడు. ఒక మానసిక చికిత్సాలయంలో సహాయకుడు, కార్పెంటర్‌, కిండర్‌గార్డెన్‌ టీచర్‌, పత్రికలకు వ్యాసాలు రాయటం వంటి పాక్షిక పనులు చేశాడు. ప్రజాప్రతినిధిగా ఒక్క బిల్లును కూడా ప్రతిపాదించలేదనటం కూడా సత్యదూరమే. శాండర్స్‌ ప్రతిపాదించిన ఏడు బిల్లులు ఆమోదం పొందినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఇలాంటి సాధారణ జీవితం గడిపిన నేపధ్యం కలిగి వున్న కారణంగానే అనేక మంది దిగువతరగతి జనం ఆయన మద్దతుదార్లుగా వున్నారు. శాండర్స్‌ ఆస్ధుల గురించి ఆధారం లేని వార్తలు అనేకం వ్యాపింప చేస్తున్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో పెట్టుబడిదారీ విధానం, సోషలిజం గురించి మధనం జరుగుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరుగుతున్న అసమానతలు చివరకు ఆ వ్యవస్దనే మార్చివేసేందుకు దారితీస్తాయని పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త ధామస్‌ పికెట్టీ హెచ్చరించిన తరువాత ఈ చర్చ ఇంకా ఎక్కువైంది. సోషలిజం వైపు మొగ్గు చూపుతున్న యువత రోజు రోజుకూ పెరుగుతోందన్నది ఇటీవలి కాలంలో అనేక సర్వేలు వెల్లడించాయి.అయితే మొత్తంగా అమెరికన్లు ఇప్పటికీ మెజారిటీ పెట్టుబడిదారీ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. యువతలో వచ్చిన మార్పు పాలకవర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. యువత ఎందుకు సోషలిజం వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రశ్నకు సోవియట్‌ యూనియన్‌ తరహా సోషలిజం గురించి వారికి తెలియదని, బెర్నీ శాండర్స్‌ ముందుకు తెచ్చిన డెమోక్రటిక్‌ సోషలిజం భావన ఆకర్షిస్తున్నదని సర్వే నిపుణులు చెబుతున్నారు.సర్వేల్లో వెల్లడౌతున్న ధోరణులను చూసి బెంబేలెత్తుతున్న కార్పొరేట్‌ మీడియా వాటిని వక్రీకరించేందుకు చేయని ప్రయత్నం లేదు. సోషలిస్టు అని పిలిపించుకోవటం ఎంతో మత్తెక్కిస్తున్నదని యువత అంగీకరిస్తున్నదంటూ ఇటీవల న్యూయార్క్‌ మాగజైన్‌ ఒక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. షిమన్‌ వాన్‌ జుయలెన్‌ వుడ్‌ రాసిన ఆ వ్యాసంలో డేటింగ్‌ కోరుకుంటున్న సోషలిస్టు యువత తమకలలకు తగిన మరొక సోషలిస్టును ఎంచుకొనేందుకు ఇప్పుడు సలహాలు తీసుకోవచ్చని, బ్రూక్లిన్‌లో ఇదొక కొత్త మార్గంగా మారిందని పేర్కొన్నారు. ఇందుకు తగిన విధంగా రెడ్‌ యెంటా పేరుతో ఒక యాప్‌ను కూడా తయారు చేశారు. దానిలో తమ రాజకీయ అభిప్రాయాలకు తగిన వారిని ఎంచుకొనే వీలు వున్నది. ఇటీవలి వరకు సోషలిజం అంటే ఎరుపు భయాన్ని కలిగించే విషం, అసంగతం, చరిత్ర చెత్తబుట్టలో వేసినటువంటి, కానీ 2016లో బెర్నీ శాండర్స్‌ అభ్యర్ధిత్వం అమెరికాలో డెమోక్రటిక్‌ సోషలిస్టులకు కొత్త ప్రజాదరణను తెచ్చింది. దేశవ్యాపితంగా 250 స్దానిక బృందాలలో 55వేల మంది సభ్యులున్నారు. న్యూయార్క్‌ డెమోక్రాట్‌ అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ అసాధారణ రీతిలో పార్లమెంటుకు ఎన్నికయ్యారని దానిలో పేర్కొన్నారు. యువతలో ప్రారంభమైన చర్చ సాధారణంగా మారుతున్నదని పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకతను పెంచుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 6.2కోట్ల మంది మిలినియల్‌ యువత ఓటర్లుగా వున్నారు. వీరిలో పెరుగుతున్న సోషలిస్టు అనుకూల భావనలు సహజంగానే పెట్టుబడిదారీ వర్గానికి కంగారు పుట్టిస్తాయి.

Image result for bernie sanders 2020

అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి వుంది. డెన్మార్క్‌, ఫిన్లండ్‌, స్వీడన్‌ వంటి నోర్డిక్‌ దేశాలు అమెరికాతో పోల్చితే మెరుగైన సామాజిక భద్రతా పధకాలతో మెరుగ్గా వున్నాయి. కొంత మంది వాటిని కూడా సోషలిస్టు వ్యవస్ధలుగా వర్ణించేవారు లేకపోలేదు. అందువలన కొందరు అమెరికా యువత అలాంటి సోషలిజమైనా మెరుగేకదా అనే వైఖరితో కూడా వున్నారని చెబుతున్నారు.అవన్నీ చిన్న దేశాలని అలాంటిది అమెరికాలో సాధ్యం కాదని చెబుతుంటే ఎందుకు కాదనే ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి, సోషలిజం గురించి మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తాజా గాలప్‌ సర్వే ప్రకారం డెమోక్రటిక్‌ పార్టీలో 57శాతం మంది సోషలిజం పట్ల సానుకూల వైఖరితో వున్నారని తేలింది. నిజమైన సోషలిజం అంటే సోవియట్‌యూనియన్‌, క్యూబా, వెనెజులాల్లో వుందని అక్కడ విఫలం చెందింది కనుక సోషలిస్టు భావన జోలికి పోవద్దని కొందరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వెనెజులాను ప్రస్తావించి అమెరికాలో సోషలిజానికి తావులేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒకవైపు సోషలిజం గురించి వక్రీకరిస్తున్నప్పటికీ అమెరికా యువతలో మొగ్గు నానాటికీ పెరుగుతున్నది, దానికి ప్రధాన కారణం అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం, జనంపై మోపుతున్న భారాలు నానాటికీ పెరగటమే.అందువల్లనే పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు ఎక్కువగా వెల్లడవుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం గురించి మీడియా సర్వేలు కేంద్రీకరించాయి.దానిలో బెర్నీ శాండర్స్‌ను అడ్డుకొనేందుకు ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం కనిపిస్తోంది. 45శాతం మంది సోషలిస్టు అభ్యర్దిని కోరుకుంటున్నారని 55శాతం మంది ఆరోగ్య రంగంలో ప్రధాన మార్పు లేదా ఆర్దిక అవకాశాలు కల్పించేవారు కావాలని, 42శాతం మంది చిన్న మార్పులు, పెద్ద ఖర్చు లేకుండా పరిమిత మార్పులు తెచ్చేవారు కావాలని, 40శాతం మంది ట్రంప్‌ను ఓడించేవారు చాలని కోరుకుంటున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. అమెరికన్లు ఇప్పుడు మూడు పూటలా తింటున్నారని, సోషలిజంలో అంతకంటే అదనంగా వచ్చేదేమిటని ఒక ప్రచారం. ప్రజాస్వామ్య అమెరికాలో ఎలాంటి కరవులు రాలేదని, గత శతాబ్దిలో సంభవించి పది పెద్ద కరవుల్లో ఆరు సోషలిస్టు దేశాల్లోనే వచ్చాయని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషలిజంలో భావ ప్రకటనా స్వేచ్చ వుండదనే పాతబడిన రోత ప్రచారం సరేసరి.

వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే లోపు అమెరికాలో మరోసారి సోషలిజం గురించి వక్రీకరణ ప్రచారం పెద్ద ఎత్తున జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలు, సంక్షోభం నుంచి తేరుకోలేని తీరులో సోషలిజం గురించి అమెరికా యువతలో సోషలిజం గురించి మరింతగా చర్చ జరగటం తప్ప మరొక మార్గం లేదు. దాని మీద వ్యతిరేకతను, వక్రీకరణలను ఎంతగా ప్రచారం చేస్తే అంతగా దాని మంచి చెడ్డలు, వాస్తవాల గురించి చర్చ జరుగుతుంది. అది సోషలిజానికి మేలు చేస్తుంది. నూరు పూవులు పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్టికల్‌ 370-వుగ్రవాదానికి లంకె బోడిగుండు మోకాలుకూ ముడి పెట్టడమే !

02 Saturday Mar 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Article 370 and Terrorism, Article 370 facts, link between article 370 and terrorism

Image result for article 370 and terrorism

ఎం కోటేశ్వరరావు

ఫిబ్రవరి 14న పుల్వామా వుగ్రదాడి పర్యవసానాలతో మీడియాలో చర్చలు, మిలిటరీ చర్యలు, పరిస్ధితిని ఓట్లు రాబట్టుకొనేందుకు వినియోగించుకొనే రాజకీయ ఎత్తుగడలను దేశం గమనిస్తోంది. మీడియా చర్చలు, రాతల్లో అనేక అంశాలను వుగ్రవాదానికి ముడిపెడుతున్నారు. దీనిలో రెండు రకాలు ప్రచారానికి ప్రభావితమైన వారు ఒక తరగతి అయితే వుద్ధేశ్యపూర్వకంగా లంకె పెట్టేవారు మరి కొందరు. వాటిలో ప్రధానమైవి అసలు జమ్మూ కాశ్మీర్‌కు 370, 35ఏ ఆర్టికల్స్‌ వంటి వాటిని వర్తింప చేసినందునే వుగ్రవాదం తలెత్తింది. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం మిలిటరీకి తొలిసారిగా పూర్తి అధికారాలను ఇచ్చింది, వాటిని సడలించకుండా కొనసాగించి అంతు తేల్చేయాలి. వుగ్రవాదం మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించకోకూడదు. జైషే మహమ్మద్‌ వుగ్రవాద సంస్ధ నేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా ప్రకటించేందుకు చైనా అడ్డుపడుతోంది. ఇలా సాగుతున్నాయి. వీటన్నింటినీ ఒక విశ్లేషణలో వివరించటం సాధ్యం కాదు గనుక ఆర్టికల్‌ 370, దాని సంబంధిత అంశాలను చూద్దాం. విద్వేషాలు, వుద్రేకాలును తగ్గించుకొని భిన్న కోణాలను పరిశీలించటం అవసరం. ఆర్టికల్‌ 370ని రద్దు చేయటం అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చటమే అవుతుంది. ఎంతకైనా తెగించి అనేక రాజ్యాంగ వ్యవస్ధలను దెబ్బతీయటం, నీరుగార్చటం, స్వప్రయోజనాలకు వుపయోగించుకుంటున్న స్ధితి. సదరు ఆర్టికల్‌ను రద్దు చేయటం అంటే దాని వుద్ధేశ్యాలను మరొక రూపంలో పరిరక్షించాలా వద్దా? రద్దు చేయాలనే వారు ఇంతవరకు దీనికి సంబంధించి ఎలాటి ప్రతిపాదనలు చేసినట్లు కనిపించదు. ప్రత్యామ్నాయం అదీకూడా కాశ్మీర్‌ను రక్షించుకోవటం కోసం అంతకంటే మెరుగైనదిగా వుంటేనే సమ్మతం అవుతుంది. ఆ దిశగా సంపూర్ణ మెజారిటీ వున్న బిజెపి ఎలాంటి చర్యలూ చేపట్టకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం నిరంతరం ప్రయత్నిస్తున్నది. కాశ్మీర్‌ సమస్యపై నిజంగా చిత్తశుద్ది వుంటే దాని మీద ఒక సమగ్ర శ్వేతపత్రాన్ని జనం ముందు పెట్టి మంచి చెడ్డలను తెలుసుకొనేందుకు అవకాశమివ్వాలి. అలాగాక నిరంకుశంగా ఆర్టికల్‌ రద్దుకు పూనుకుంటే అది అంతటితో ఆగదు. ఒక్క బాబరీ మసీదే కాదు ఇంకా అలాంటి అనేక మసీదులను కూల్చాల్సి వుందని సంఘపరివారం చెబుతున్నట్లుగా రాజ్యాంగంలోని అనేక అంశాల మీద విబేధాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. వుదాహరణకు తెలుగు రాష్ట్రాలలో వున్న 1-70 గిరిజన హక్కుల రక్షణ చట్టం తమకు సమ్మతం కాదని అనేక మంది డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.అలాగే ఎన్నో !

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రానికి దేశరాజ్యాంగానికి లోబడి కొన్ని అంశాలపై స్వయం ప్రతిపత్తి అధికారమిచ్చే 370 ఆర్టికల్‌ను రద్దు చేయాలన్నది బిజెపి ఎన్నికల వాగ్దానం. ఆ పార్టీ మాతృసంస్ధ అయిన జనసంఘం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. మధ్యలో అత్యవసర పరిస్ధితి అనంతరం జనసంఘాన్ని రద్దు చేసి జనతా పార్టీలో విలీనం చేసిన సమయంలో మినహా తిరిగి బిజెపి పేరుతో కొత్త దుకాణాన్ని తెరిచినప్పటి నుంచి పాత వ్యతిరేకతను కొనసాగిస్తోంది. ఈశక్తులతో పాటు అంబేద్కర్‌, మరికొందరు కూడా 370 ఆర్టికల్‌ను వ్యతిరేకించారు. ఇది దాస్తే దాగేది కాదు. జనసంఘం, బిజెపి రెండూ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన దాని రాజకీయ విభాగాలే అన్నది ముందుగా గ్రహించాలి. అలాగే సదరు ఆర్టికల్‌ను కొనసాగించాలని కోరే పార్టీలు అంతకంటే ఎక్కువగా వున్నాయి.

‘ హిందూస్ధాన్‌కు హిందూ సంస్కృతి జీవనాడి. అందువలన హిందూస్ధాన్‌ను రక్షించుకోవాలంటే ముందుగా మనం హిందూ సంస్కృతిని పెంచి పోషించుకోవాలన్నది స్పష్టం. హిందుస్ధాన్‌లోనే హిందూ సంస్కృతి నాశనమైతే, హిందూ సమాజం వునికి కోల్పోతే……. కాబట్టి తనకు చేతనైనంత వరకు హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం ప్రతి హిందువు విధి………మన యువత మెదళ్లను అంతిమంగా ఆ దిశగా మలచటం సంఘ్‌ ప్రధాన లక్ష్యం’ సంఘపరివార్‌గా పరిచితమైన ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం గురించి దాని స్ధాపకుడు డాక్టర్‌ కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ చెప్పిన మాటలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌ తెరవగానే మనకు కనిపిస్తాయి.

Image result for article 370 and terrorism

ఇలాంటి సంస్ధ ఏర్పాటు చేసిన బిజెపిపైకి ఏమి చెప్పినప్పటికీ దాని చర్యలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాన్ని నెరవేర్చేందుకే వుంటాయన్నది వేరే చెప్పనవసరం లేదు. అందుకోసం జనాన్ని మతపరంగా చీల్చేందుకు ప్రతిదానికి ఒకసాకును వెతుక్కుంటుంది.కాశ్మీర్‌కు 370 ఆర్టికల్‌ నుంచి కూడా అది సాధించదలచిన ప్రయోజనమదే. అందుకుగాను ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధలు, దాని భావజాలానికి ప్రభావితమైన వ్యక్తులు ఎంతకైనా తెగించి చేయాల్సిందంతా చేస్తాయి. ఆర్టికల్‌ 370 రాజ్యాంగబద్దమైనది కనుక దాన్ని సవాలు చేసే అవకాశం లేదు. అందువలన దాని సంబంధితమైన ఆర్టికల్‌ 35ఏ రాజ్యాంగబద్దతను సవాలు చేస్తూ ఢిల్లీకి చెందిన వుయ్‌ ద సిటిజన్స్‌ అనే ఒక సంస్ధ మరికొందరు వ్యక్తులుగా సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారని మీడియాలో వార్తలు వచ్చాయి. దాని మీద ఇప్పుడు విచారణ జరుపుతున్నది. ఇలాంటి ప్రజాసంబంధమైన అంశాలలో ఎవరైనా తమను కూడా ప్రతివాదులుగా చేర్చమని కోర్టును అభ్యర్దించి చేరేందుకు అవకాశం వుంది. ఆ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) చేరింది. ఇలాగే మరికొన్ని సంస్ధలు, వ్యక్తులు ఈ కేసులో ప్రతివాదులుగా చేరి జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వటాన్ని కూడా సవాలు చేస్తూ పిటీషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా మీడియా, సామాజిక మీడియాలో లేవనెత్తిన కొన్ని అంశాల తీరుతెన్నులు, వాస్తవ అవాస్తవాలను చూద్దాం.

ఆర్టికల్‌ 35ఏ ఆర్టికల్‌ 370లో భాగమా కాదా ?

ఆర్టికల్‌ 370 గురించి ప్రతిపాదనలు వచ్చినపుడు దాని అంశాలపై వివాదం అప్పుడే తలెత్తింది. రాజ్యాంగరచన కమిటీ అధ్యక్షుడిగా, ప్రధాన రచయితగా వున్న బిఆర్‌ అంబేద్కర్‌ సదరు ఆర్టికల్‌ను రూపొందించేందుకు తిరస్కరించారు. దాంతో కాశ్మీరు రాజు హరిసింగ్‌ వద్ద దివానుగా పనిచేసి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూ ప్రభుత్వంలో పోర్టుపోలియో లేని మంత్రిగా పని చేసిన గోపాలస్వామి అయ్యంగార్‌ రూపొందించి రాజ్యాంగంలో చేర్చే ప్రతిపాదన చేసి ఆమోదం పొందారు. ఈ ఆర్టికల్‌ రాజ్యాంగమౌలిక స్వరూపంలో భాగమే. ఒక వేళ 35ఏ ఆర్టికల్‌ను కోర్టు గనుక కొట్టివేస్తే అది దాని ఒక్కదానికే పరిమితం కాదు, ఆర్టికల్‌ 370తో పాటు 1950 నుంచి ఇప్పటి వరకు చేసిన అనేక అంశాల చెల్లుబాటు సమస్య తలెత్తుతుంది.అందువలన దాన్ని సవాలు చేయటం వెనుక వున్న ఎత్తుగడను అర్ధం చేసుకోవటం కష్టం కాదు. అనేక మంది నిపుణులు రెండు ఆర్టికల్స్‌ను విడదీసి చూడలేమని చెప్పారు. సమస్య సుప్రీం కోర్టు ముందు వుంది కనుక ఎవరి వాదన, అభిప్రాయాలు సరైనవో స్పష్టం కానుంది. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని శక్తులు అంగీకరిస్తాయా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి పిల్లల్ని కనేవయస్సు వున్న మహిళలు ప్రవేశించటాన్ని నిషేధించే ఆంక్షలను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వాటి అనుబంధ సంస్ధలు వ్యతిరేకిస్తూ వీధులకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కోర్టు విచారణ ఒకరోజులో జరిగింది కాదు, రహస్యమైంది కాదు. ఏ రోజూ కోర్టు కేసులో ప్రతివాదిగా చేరని శక్తులు తీర్పును అమలు జరపకూడదని వత్తిడి తేవటం తెలిసిందే. శనిసింగనాపూర్‌లోని శని ఆలయంలో మహిళలకు ఆలయ ప్రవేశంపై వున్న ఆంక్షలను కోర్టు కొట్టివేసినపుడు వీరు నోరు మెదపలేదు. శబరిమల కోర్టు తీర్పును అంగీకరించని, వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన సంఘపరివార్‌ శక్తులు అంతవరకే పరిమితం అవుతాయా ? ఎవరు చెప్పగలరు?

ఆర్టికల్‌ 35ఏ రద్దు వెనుక దానిని వ్యతిరేకించే ఆర్‌ఎస్‌ఎస్‌ అనుయాయుల లక్ష్యం ఏమిటి?

ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు పాలస్తీనాను రెండుగా విభజించి యూదులు ఎక్కువగా వున్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌గా ఏర్పాటు చేశారు. వెంటనే ఇజ్రాయెల్‌ తనకు కేటాయించిన భాగానికి పరిమితం కాకుండా పాలస్తీనా ప్రాంతాలను కూడా ఆక్రమించుకొని ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి, ఇజ్రాయెల్‌ నుంచి యూదులను రప్పించి పాలస్తీనా ప్రాంతాలలో అరబ్బులను మైనారిటీలుగా మార్చి వాటి స్వభావాన్నే మార్చేందుకు పూనుకున్న విషయాన్ని మనం చూశాము. కాశ్మీరులో కూడా అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి హిందువులను ప్రవేశపెట్టి అక్కడి జనాభా, సంస్కృతి, సంప్రదాయాలను మార్చివేయాలని అనేక మంది బహిరంగంగానే చెబుతున్న విషయం తెలిసిందే.

అసలు ఆర్టికల్‌ 35ఏ ప్రధాన అంశాలు ఏమిటి ?

1956 నవంబరు 17న ఆమోదించిన ‘జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగం ‘ ప్రకారం నిర్వచించిన శాశ్వత నివాసి(పర్మనెంటు రెసిడెంట్‌-పిఆర్‌)కి చెప్పిన వివరణ ప్రకారం 1954 మే 14వరకు వున్న రాష్ట్ర అంశాల ప్రకారం లేదా పది సంవత్సరాల పాటు రాష్ట్రంలో నివాసిగా వున్న వారు లేదా చట్టబద్దంగా స్ధిర ఆస్తులను సంపాదించుకున్నవారు గానీ జమ్మూ కాశ్మీరులో శాశ్వత నివాసులుగా పరిగణించబడతారు. శాశ్వత నివాసి నిర్వచనాన్ని మార్చే హక్కు ఆ రాష్ట్ర శాసనసభకు మాత్రమే వుంది, దాన్ని కూడా మూడింట రెండువంతుల మెజారిటీతో ఆమోదించి వుండాలి. ఆ రాష్ట్ర రాజ్యాంగం అంగీకరించిన విచక్షణాధికారాల ప్రకారం అక్కడి శాశ్వత నివాసులు మాత్రమే చట్టసభలకు పోటీ చేసేందుకు, ఓటు హక్కుకు అర్హులు. శాశ్వత నివాసులు కాని వారు స్వంత ఆస్ధులు కలిగి వుండటానికి,రాష్ట్ర ప్రభుత్వ వుద్యోగం పొందటానికి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన, లేదా ప్రభుత్వ నిధులు పొందిన వృత్తి విద్యాకాలేజీలలో చేరటానికి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వం-భారత ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పంద అవగాహన ప్రకారం ఈ రక్షణలు కల్పించారు.

ఇతర రాష్ట్రాలకు లేని ఈ ప్రత్యేక హక్కు జమ్మూ కాశ్మీర్‌కు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ?

పైన పేర్కొన్న ‘జమ్మూ కాశ్మీర్‌ రాజ్యాంగం ‘ భారత్‌లోని ఒక రాష్ట్రంగా కాశ్మీర్‌కు వర్తిస్తుంది. అది 1957 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. ఇలాంటిది మరొక రాష్ట్రానికి లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 కాశ్మీర్‌లో భారత పార్లమెంట్‌,కేంద్ర ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే వర్తిస్తాయి. ఇతర అంశాలన్నింటి విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో పేర్కొనని వాటిలో రాష్ట్ర శాసనసభ అనుమతి పొందిన ప్రభుత్వానికి మాత్రమే దఖలు పడతాయి. అంటే ఏ రాష్ట్రానికి లేని స్వయంప్రతిపత్తి దీనికి రాజ్యాంగం ఇచ్చింది. దానిలో భాగంగానే 1965 వరకు రాష్ట్ర గవర్నర్‌ను సదర్‌ ఏ రియాసత్‌ అని ముఖ్యమంత్రిని ప్రధాని అని పిలిచారు. దీనికి వున్న చారిత్రక నేపధ్యాన్ని దాచిపెట్టి ఇలాంటి అంశాలపై బిజెపి వంటి కొన్ని శక్తులు జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో రెండుగా విభజించి పాకిస్ధాన్‌ను ఏర్పాటు చేశారు.ఆ సమయంలో కాశ్మీర్‌ బ్రిటీష్‌ పాలనలో ఒక సంస్ధానంగా వుంది. హరిసింగ్‌ రాజుగా వున్నాడు. భారత్‌లో లేదా పాకిస్ధాన్‌లో దేనితో వుండాలో నిర్ణయించుకొనే హక్కు 1947నాటి స్వాతంత్య్ర చట్టం సంస్ధానాలకు ఇవ్వనప్పటికీ నాడు సామ్రాజ్యవాదులు చేసిన కుట్రలో భాగంగా ఏ దేశంలోనూ చేరబోనని, స్వతంత్ర రాజ్యంగా వుంటానని ప్రకటించాడు. బ్రిటీష్‌ వారు భారత్‌ను వదలి పోవాలని 1947ఆగస్టు15న స్వాతంత్య్రప్రకటన జరగాలని ముందే నిర్ణయం జరిగిపోయింది. అయితే బ్రిటన్‌ పాలకులు నూతన ఏర్పాట్లు జరిగేంత వరకు యథాతధ స్ధితి కొనసాగుతుందంటూ ఒక ఒప్పందాన్ని తయారు చేసి స్వతంత్ర భారత్‌,పాక్‌, ఇతర సంస్ధానాధీశులతో 1947 జూన్‌ మూడున ముసాయిదా ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అయితే అది కేవలం పాలనాపరమైన అంశాలకే పరిమితం చేస్తుందా అని జవహర్‌లాల్‌నెహ్రూ చర్చల సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు. మహమ్మదాలీ జిన్నా మాత్రం అలా అంగీకరించాల్సి వుందని చెప్పారు.దీనితో పాటు బ్రిటీష్‌ పాలకులు కొత్తగా ఏర్పడబోయే స్వతంత్ర భారత్‌,పాకిస్ధాన్లలో దేనితే జతకట్టేదీ తెలుపుతూ అంగీకార పత్రం మీద సంతకాలు చేయాలని మరొక మెలిక పెట్టారు. ఈ రెండింటినీ సంస్ధానాధీశుల ఛాంబర్‌ ముందు పెట్టారు. పది మంది సంస్ధానాధీశులు, పన్నెండు మంది మంత్రులతో సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. జూలై 31న ఆ కమిటీ ఆ పత్రాలను ఖరారు చేశారు. అయితే కొంత మంది సంస్ధానాధీశులు తాము యథాతధ స్ధితి ఒప్పందంపై సంతకాలు చేస్తాము తప్ప ఏ దేశంతో జతకట్టేదీ తేల్చుకొనేదానిపై ఆలోచించుకొనేందుకు సమయం కావాలని మెలికపెట్టారు. 1947 ఆగస్టు 15లోగా తమతో జతకట్టే సంస్ధానాధీశులతోనే యథాతధ స్దితి ఒప్పందంపై సంతకాలు చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. నాలుగు సంస్ధానాలు మినహా మిగిలిన వారందరూ సంతకాలు చేశారు.

వాటిలో నిజాం పాలనలోని హైదరాబాద్‌ రెండునెలల వ్యవధి కోరింది, గుజరాత్‌లో జునాఘడ్‌ దాని సామంత రాజ్యాలు సంస్ధానాలు రెండు వున్నాయి. జమ్మూకాశ్మీర్‌ తాము స్వతంత్రంగా వుంటామని ప్రకటించినప్పటికీ పాకిస్దాన్‌తో యథాతధ స్థితి ఒప్పందం చేసుకుంది. వెంటనే దానిని పాకిస్ధాన్‌ అంగీకరించింది. చర్చలు జరపాల్సి వుందని భారత్‌ ప్రకటించింది. బలూచిస్తాన్‌ సంస్ధానం తాము స్వతంత్రంగా వుంటూమంటూ యథాతధ స్ధితి ఒప్పందంపై పాక్‌తో సంతకాలు చేసింది.

యథాతధ స్థితి ఒప్పందంపై పాక్‌ సంతకాలు చేసినప్పటికీ కాశ్మీర్‌ ఆక్రమణకు కుట్రలకు తెరలేపింది. భరించలేని రాజు పన్నులకు వ్యతిరేకత పేరుతో ఆందోళనలను పురికొల్పింది. దానిలో భాగంగానే 1947 అక్టోబరు 6న పాకిస్ధాన్‌ ముస్లిం గిరిజనులను ముందు వారికి మద్దతుగా పాక్‌ సైన్యాన్ని పంపి కాశ్మీర్‌పై దాడి చేసి బలవంతంగా ఆక్రమించుకొనేందుకు పూనుకుంది. వెంటనే రాజు హరిసింగ్‌ తమకు సాయం చేయాలని భారత్‌ను కోరటం, చేరిక ఒప్పందాన్ని ఆమోదించాలన్న మన ప్రభుత్వ షరతుకు అంగీకరించి సంతకం చేయటం, మన సేనలు కాశ్మీర్‌ రక్షణకు పూనుకోవటం వెంటవెంటనే జరిగిపోయాయి. చేరిక ఒప్పందం(ఇనుస్ట్రుమెంట్‌ ఆఫ్‌ యాక్సెషన్‌-ఐఓఏ) ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వానికి కాశ్మీర్‌ విషయంలో విదేశీ, రక్షణ, సమాచార అంశాలలో మాత్రమే అధికారాలు వుంటాయి. మిగిలిన సంస్ధానాలన్నీ చేరిక ఒప్పందం మీదనేగాక స్వాతంత్య్రం తరువాత విలీన ఒప్పందం మీద కూడా సంతకాలు చేశాయి. కాశ్మీర్‌లో కొంత భాగాన్ని ఆక్రమించిన పాక్‌్‌ అక్కడ నెలకొల్పిన పాలనా వ్యవస్ధ కారణంగా మన ప్రభుత్వం కూడా మన ఆధీనంలోకి వచ్చిన కాశ్మీర్‌లో ప్రత్యేక పాలన చేయాల్సి వచ్చింది. విలీన ఒప్పందం జరగాలంటే అప్పటి వరకు వున్న తమ అంతర్గత చట్టాల కొనసాగింపుకు హామీ వుండాలని, స్వయంప్రతిపత్తి తదితర అంశాలు ముందుకు రావటంతో ఏ రాష్ట్రానికి లేని విధంగా జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం వచ్చింది.అది ఇప్పటికీ వునికిలో వుంది. ఆక్రమించిన కాశ్మీర్‌ ప్రాంతాన్ని ఒక ఎత్తుగడగా పాక్‌ సర్కార్‌ దానిని తమ దేశంలో విలీనం చేయకుండా ఒక స్వయంప్రతిపత్తి ప్రాంతంగా మార్చింది. దానికి ఒక అధ్యక్షుడు, ప్రధాని వుంటారు. కాశ్మీర్‌ను తమ దేశంలో విలీనం చేసుకోలేదని ప్రపంచానికి చాటేందుకు ఇప్పటికీ పార్లమెంట్‌లో ఆక్రమిత్‌ కాశ్మీర్‌కు ప్రాతినిధ్యం కూడా ఇవ్వలేదు. ఈ పూర్వరంగంలో షేక్‌ అబ్దుల్లా తదితర నాయకులతో జరిపిన సంప్రదింపులు, కాశ్మీరీల స్వయంప్రతిపత్తిని కాపాడుతామని హామీ ఇవ్వటంలో భాగంగా ఈ పూర్వరంగంలో 370 ఆర్టికల్‌ను చేర్చారు.

Image result for article 370 and terrorism

ఈ పరిస్ధితికి కారకులు ఎవరు ?

దీనికి కాంగ్రెస్‌ నెహ్రూ నాయకత్వమే కారణమని ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘం, బిజెపి పాడిందే పాడుతున్నాయి. అది వారి రాజకీయం. కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా, కాశ్మీర్‌ వ్యవహారాలలో పార్టీ ప్రయోజనాలకు పెద్ద పీటవేసి కాశ్మీర్‌ సమస్యను సంక్లిష్టంగా మార్చిన నేటి స్ధితిని చూసి గతంలో జరిగిన ఏర్పాటును విమర్శించటం, రాళ్లు వేయటం రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా వున్నవారికి, వారి ఎత్తుగడలను అర్ధం చేసుకోకుండా ప్రచార ప్రభావానికి లోనైన వారికి సులభమే. కాశ్మీర్‌ను ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసి ఇటు భారత్‌, అటు చైనా, సోవియట్‌ యూనియన్‌, పశ్చిమ, మధ్య ఆసియా మీద తమ పెత్తనాన్ని రుద్దాలని, మిలిటరీ వ్యూహాన్ని అమలు జరపాలని చూసిన బ్రిటీష్‌, అమెరికన్‌ సామ్రాజ్యవాదుల కుట్రను నాటి కేంద్రప్రభుత్వ నాయకత్వం వమ్ము చేసిందని మరచి పోరాదు. పశ్చిమాసియాలో సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్‌ ఆ ప్రాంతంలో సామ్రాజ్యవాదుల ‘గూండా’ గా ఎలాంటి పరిస్ధితికి కారణమైందో మనం చూస్తూనే వున్నాం. మన ఈశాన్య రాష్ట్రాలను విడదీసి ప్రత్యేక రాజ్యాలను ఏర్పాటు చేయాలన్నది కూడా సామ్రాజ్యవాదుల కుట్రలో భాగమే. ఈ రోజు కాశ్మీర్‌లో వుగ్రవాదులు చెలరేగిపోవటానికి ఆర్టికల్‌ 370, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక హక్కులు ఇవ్వటం అని సంఘపరివార్‌ ప్రచారం చేస్తున్నది. అనేక మంది నిజమే కదా అనుకుంటున్నారు. కాశ్మీర్‌ కంటే ముందుగా ఈశాన్య రాష్ట్రాలలో, పంజాబ్‌లో వేర్పాటు, తీవ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి, ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల పరిస్ధితి చక్కబడలేదు. వాటికేమీ ప్రత్యేక ఆర్టికల్‌, ప్రత్యేక ఏర్పాట్లు లేవు, అయినా వుగ్రవాదులు ఎందుకు తయారైనట్లు ? అందువలన 370 ఆర్టికల్‌కు కాశ్మీరులో వుగ్రవాదానికి లంకె పెట్టటం బోడిగుండుకు మోకాలికీ ముడివేసే ప్రయత్నం తప్ప వేరు కాదు. మన పక్కనే వున్న శ్రీలంకలో తమిళ ఈలం పేరుతో ప్రత్యేక రాజ్యాన్ని కోరిన ఎల్‌టిటిఇ ఇతర వుగ్రవాదులకు మన దేశంలో శిక్షణ, ఆయుధాలు అందించిన వాస్తవం తెలిసిందే. అది తప్పా ఒప్పా అంటే మన దేశ ప్రయోజనాలు, లక్ష్యాలు ఇమిడి వున్నాయి. మనం మద్దతు, శిక్షణ ఇచ్చిన వుగ్రవాదులు చివరికి మన దేశానికి కూడా ముప్పుగా తయారవుతున్నారని తేలగానే అదే వుగ్రవాదులను అణచేందుకు శాంతిపరిరక్షక దళాల పేరుతో మన సైన్యం శ్రీలంకకు వెళ్లిన విషయం, దానికి ప్రతీకారంగా వుగ్రవాదులు రాజీవ్‌ గాంధీని హత్య చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో అకాలీలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ భింద్రన్‌వాలే అనే వుగ్రవాదిని పెంచి పోషించిన విషయమూ విదితమే. చివరికి ఏకుమేకైన తరువాత వాడిని మట్టుపెట్టేందుకు స్వర్ణదేవాలయం మీదికి మిలిటరీని పంపాల్సి వచ్చింది. వీటన్నింటి వెనుక మన దేశాన్ని దెబ్బతీసే అమెరికా, ఐరోపా ధనిక దేశాల సామ్రాజ్యవాదుల హస్తం వుంది. ఆప్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసేందుకు ఆఫ్ఘన్‌ సర్కార్‌ ఆహ్వానం మేరకు గతంలో సోవియట్‌ యూనియన్‌ సైన్యాన్ని పంపింది. దానికి ప్రతిగా తాలిబాన్‌ వుగ్రవాదులను తయారు చేసిన అమెరికా సోవియట్‌ సేనల వుపసంహరణ వరకు మద్దతు ఇచ్చింది. తరువాత ఆ తాలిబాన్లే అమెరికానే సవాలు చేయటంతో అంతకు ముందు వారిని దేశభక్తులుగా చిత్రించిన అమెరికా వుగ్రవాదులంటూ వారిని అణచేందుకు దశాబ్దాల తరబడి అక్కడ తన సైన్యంతో దాడులు చేసింది. చివరకు వారిణి అణచలేక వారితో రాజీచేసుకొని తన సైన్యాన్ని వెనక్కు రప్పించేందుకు ఇప్పుడు చర్చలు జరుపుతున్నది. అందువలన వారి వలలో పడకుండా వుగ్రవాదాన్ని అంతం చేసేందుకు తగిన చర్యలను తీసుకోవాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సర్జికల్‌ దాడులు, పెద్ద నోట్ల రద్దుతో వుగ్రవాద చర్యలు తగ్గాయా !

26 Tuesday Feb 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

IAF jets, Indian Air Force, surgical strikes, Surgical Strikes 2.0, terror-related deaths in J-K

Image result for surgical strikes by india

ఎం కోటేశ్వరరావు

కాశ్మీరులోని పుల్వామాలో వుగ్రదాడిలో 40మంది సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన పన్నెండవ రోజు మన వాయుసేన ఆక్రమిత్‌ కాశ్మీర్‌లో 19నిమిషాలలో మూడు చోట్ల 12 మిరేజ్‌ జట్‌ ఫైటర్లతో నిర్ణీత లక్ష్యాలపై ఆకస్మిక (సర్జికల్‌) దాడి చేసింది. తెల్లవారు ఝామున మూడు నాలుగు గంటల మధ్య జరిపిన ఈ దాడిలో 200 నుంచి 300 వరకు మరణించినట్లు, అనేక వుగ్రవాద స్ధావరాలను ధ్వంసం చేసినట్లు మన అధికారులు ప్రకటించారు. దాడి జరిగిన మాట నిజమే కాని తమకు ఎలాంటి ఆస్ధి,ప్రాణ నష్టం జరగలేదని పాక్‌ ప్రకటించింది. ఒక పౌరుడు గాయపడినట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది. ఇది తొలి వార్తల సారాంశం.

శత్రుదేశాల మధ్య దాడులు, యుద్ధాలు జరిగినపుడు ముందుగా బలయ్యేది నిజం. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు అంత పెద్ద సంఖ్యలో వుగ్రవాదులు మరణించారా, వారిలో పౌరులు లేరా అని ఎవరైనా సందేహిస్తే దేశద్రోహుల కింద జమకట్టేస్తారు. పుల్వామా దాడికి పాల్పడిన వారి మీద, ప్రేరేపించిన వారి మీద చర్య తీసుకోవాలనటంలో ఎవరికీ ఎలాంటి శషభిషలు లేవు. ఎవరూ మరొకరి దేశభక్తిని ప్రశ్నించాల్సిన పని లేదు. ఒక వుదంతం మీద సందేహాలు వ్యక్తం చేయటాన్ని సహించకుండా అసలు ప్రశ్నించటమే తప్పన్నట్లు ప్రవర్తించేవారితోనే పేచీ. మంగళవారం తెల్లవారు ఝామున జరిగిన దాడి గురించి కాసేపు పక్కన పెడదాం.

2016సెప్టెంబరు 18న యురి సైనిక కేంద్రంపై జైషే మహమ్మద్‌ వుగ్రవాదులు జరిపిన దాడిలో 19మంది సైనికులు మరణించారు. దానికి ప్రతిగా పదకొండు రోజుల తరువాత మన బలగాలు సర్జికల్‌ దాడి జరిపాయి. దానిలో 35 నుంచి 70 మంది వుగ్రవాదులు మరణించినట్లు సైనికవర్గాల సమాచారం మేర మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే సర్జికల్‌ దాడి అసలు జరగలేదని పాకిస్ధాన్‌ ప్రకటించింది. అయితే సరిహద్దులో జరిగిన స్వల్పపోరులో తమ సైనికులు ఇద్దరు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారని, ఇదే సమయంలో ఎనిమిది మంది భారత సైనికులు మరణించారని, ఒకరిని బందీగా పట్టుకున్నట్లు పాక్‌ చెప్పుకుంది. ఈ వుదంతం జరిగి రెండున్నర సంవత్సరాలు గడిచినా వాస్తవం ఏమిటో ఇప్పటికీ తెలియదు. దాడి వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసినదే.

ఈ వుదంతం తరువాత 2016నవంబరు 8న ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించి మొత్తం దేశం మీద సర్జికల్‌ స్ట్రైక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇతర అంశాలతో పాటు నాడు చెప్పిందేమిటంటే వుగ్రవాదులకు నగదు అందకుండా అరికట్టటం అని కూడా ప్రధాని చెప్పిందాన్ని దేశమంతా నిజమే అని నమ్మిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు వలన కలిగిన ప్రయోజనం ఏమిటో ఇంతవరకు రద్దు చేసిన మోడీ అధికారికంగా ప్రకటించలేదు కనుక దాన్ని కూడా సర్జికల్‌ స్ట్రైక్‌ అనాల్సి వచ్చింది. వుగ్రవాదుల పీచమణచేందుకు తీసుకున్న ఈ చర్యతో ఫలితాలు వచ్చాయంటూ అధికార పార్టీ పెద్దలు పెద్దఎత్తున ప్రచారం చేసిన విషయం గుర్తు చేయటం దేశ ద్రోహం కాదేమో !

దారుణమైన వుదంతాలు జరిగినపుడు దేశ పౌరుల్లో ఆవేశకావేషాలు తలెత్తటం, దెబ్బకు దెబ్బతీయాలన్న వుద్రేకం కలగటాన్ని అర్ధం చేసుకోవచ్చు. వుగ్రవాదం మనకు కొత్త కాదు, ఈశాన్య రాష్ట్రాలలో మొదలై తరువాత కాశ్మీర్‌, పంజాబ్‌కు వ్యాపించింది. నక్సల్స్‌ తీవ్రవాదం గురించి తెలిసిందే.దాదాపు ఆరుదశాబ్దాల చరిత్ర, అనుభవం వుంది. అలాగే సర్జికల్‌ దాడులూ కొత్త కాదని మనవి. మయన్మార్‌లో శిబిరాలను ఏర్పాటు చేసుకున్న ఈశాన్య రాష్ట్రాల వుగ్రవాదులు మన భూభాగాలపై దాడులు చేసి మయన్మార్‌ పారిపోయే వారు. పెద్ద వుదంతాలు జరిగినపుడు గుట్టుచప్పుడు కాకుండా మన సైనికులు సర్జికల్‌ దాడులు జరిపి తిరిగి వచ్చేవారు. బయటకు ప్రకటించేవారే కాదు. ఇప్పుడు ప్రతిదాన్నీ ఓటుగా మార్చుకోవాలన్న ప్రచారకండూతి వైరస్‌ సోకిన కారణంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ కారణంగానే గతంలో జరిగిన సర్జికల్‌ దాడికి ఆధారాలు ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. తాజాగా జరిగిన దాడిని గురించి తెలిసిన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయటానికి బదులు రాజస్దాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గనిదాడి గురించి మాట్లాడటాన్ని ఏమనుకోవాలి.

మంగళవారం నాటి దాడి నిర్దిష్ట సమాచారంతో నిర్ధిష్ట వుగ్ర స్దావరాలపై జరిగిందని చెబుతున్నారు. మన వేగుల వ్యవస్ధ సమర్ధతను అనుమానించాల్సిన అవసరం లేదు. అదే వ్యవస్ధ వైఫల్యాన్ని కూడా గమనంలో వుంచుకోవాలి. దాని గురించి అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లేదు. సర్జికల్‌ దాడులను సమర్ధవంతంగా నిర్వహించినపుడు వుగ్రవాద కదలికలను, సైనిక స్ధావరాల మీద, ప్రయాణిస్తున్న పారామిలిటరీ బలగాల మీద జరిగిన దాడులను ఎలా పసిగట్టలేకపోయారు. ఇదే ప్రశ్నను వుత్తర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను ఒక విద్యార్ది అడిగితే ఇదే దేశసామాన్యులందరి మదిలో వుందంటూ బటబటా ఏడ్చినట్లు వార్తలు వచ్చాయి.

Image result for surgical strike  2019

పొలాన్ని దున్నకుండా, నేలను ఆరోగ్యంగా వుంచకపోతే పిచ్చి మొక్కలు మొలుస్తాయి. వుగ్రవాదం, వుగ్రవాదులు కూడా అలాంటి వారే. ఆ పిచ్చిమొక్కలను మొలవకుండా చూడాలి. ఒకసారి పీకివేస్తే తిరిగి మొలకెత్తే పిచ్చి, కలుపు మొక్కల వంటివే అవి. జమ్మూ కాశ్మీర్‌లో వుగ్రవాద చర్యలకు సంబంధించి 2014 నుంచి 2019 ఫిబ్రవరి 15వరకు దక్షిణాసియా వుగ్రవాద పోర్టల్‌ క్రోడీకరించిన సమాచార వివరాలు ఇలా వున్నాయి.2019 ఫిబ్రవరి 15వరకు.

సంవత్సరం హత్యోదంతాలు పౌరులు భద్రతాసిబ్బంది  వుగ్రవాదులు మొత్తం మరణాలు

2014            91        28         47            114          189

2015            86        19         41            115          175

2016           112        14         88            165          267

2017           163         54        83             220          357

2018           204         86        95              270         451

2019             16          2         43               29           74

మొత్తం           672        203      397             913         1513

ఈ పట్టికను చూసినపుడు మోడీ పాలనా కాలంలో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. అంతకు ముందు సంవత్సరాలలో ఈ సంఖ్యలు ఇంకా చాలా ఎక్కువగా వుండి యుపిఏ పాలన చివరి సంవత్సరాలలో గణనీయంగా తగ్గాయి. పెద్ద నోట్ల రద్దు, సర్జికల్‌స్రైక్‌లు, సామాజిక మీడియాలో కొన్ని తరగతుల మీద వ్యాపింప చేస్తున్న విద్వేష ప్రచారం, శాంతి భద్రతల సమస్యగా చూసి భద్రతా దళాలకు విచక్షణారహిత అధికారాలు ఇస్తే వుగ్రవాదం తగ్గుతుందన్నది ఒక తప్పుడు అభిప్రాయంగా రుజువు అవుతున్నది. ముందే చెప్పినట్లు వుగ్రవాదులనే పిచ్చి మ్కొలు పెరగకుండా, అదుపు తప్పి పోకుండా వుండాలంటే అందుకు అనువైన పరిస్ధితులను మార్చాలి తప్ప ఎంత పెద్ద కలుపు నివారణ మందులు వాడినా ఇతర కొత్త సమస్యలు తలెత్తుతాయి తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. ఇది ఒక్క కాశ్మీరు అంశం కాదు, మన దేశ, ప్రపంచ అనుభవం. ఇప్పటికైనా ఆయా ప్రాంతాల పౌరులను విశ్వాసంలోకి తీసుకొని వారిలో చైతన్యం కలిగించి వుగ్రవాద వ్యతిరేకపోరులో వారిని కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d