• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక వున్మాదం ఎందుకు ?

28 Sunday May 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Bernie Sanders, communist, Indonesian Communist Party (PKI).

ఎం కోటేశ్వరరావు

అమెరికాతో సహా అనేక దేశాలలో మరోసారి ఇప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇందుకు గాను గతంలో చెప్పిన వాటికి భిన్నమైన కారణాలను చూపుతున్నప్పటికీ పూసల్లో దారంలా వున్న ఏకైక అంశం కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకోవటమే. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యాలో తొలి శ్రామిక రాజ్య ఆవిర్భావం, రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ హిట్లర్‌ను కమ్యూనిస్టులు మట్టి కరిపించటం, వలసరాజ్యాలకు జాతీయోద్యమాలు మంగళం పాడటం, చైనాతో సహా సోషలిస్టు శిబిర విస్తరణ వంటి పరిణామాలు అమెరికా నాయకత్వాన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి నాంది పలికాయి. స్వయంకృత వైఫల్యాలు కొన్ని వున్నప్పటికీ పాతికేండ్ల క్రితం తొలి సోషలిస్టు రాజ్యం, దాని అండతో ఏర్పడిన తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలను సామ్రాజ్యవాదులు పతనం కావించారు. సోషలిజం, కమ్యూనిజం వెనుక పట్టు పట్టిందనే వాతావరణం ఎల్లెడలా ఏర్పడింది. తాము విజయం సాధించామని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రకటించుకున్నారు. అయినా సరే ప్రస్తుతం ప్రపంచంలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. ఎందుకు ?

కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రజాప్రతినిధుల సభ కమ్యూనిస్టులు ప్రభుత్వ వుద్యోగాలలో చేరటంపై వున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అది ఎగువ సభ ఆమోదం పొందితే అది అమలులోకి వస్తుందని వచ్చిన వార్తలపై రాసిన ఒక విశ్లేషణను మీరు చదివారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభ్యుడిపై వచ్చిన తీవ్ర వత్తిడి కారణంగా ఎగువ సభ ఆమోదానికి పెట్టకుండానే దానిని వుపసంహరించుకున్నాడు.1950 దశకంలో ఒక అసెంబ్లీలో అలాంటి నిబంధనకు వ్యతిరేకంగా మాట్లాడటమే అనూహ్యం, అలాంటిది 2017లో ఒక ప్రముఖ రాష్ట్రంలో డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడైన రోబ్‌ బంటా ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టటం తీవ్ర చర్చ, వాదోపవాదాల మధ్య అది ఆమోదం పొందటమే ఆశ్చర్యం. విజయం కమ్యూనిస్టు శక్తులకు వుత్తేజం కలిగించినప్పటికీ దాంతో అంతా అయిపోయిందని, కమ్యూనిస్టు వ్యతిరేకత అంతరించిందని ఎవరూ భావించలేదు, కనుకనే బిల్లు వుపసంహరణ నిరుత్సాహకారణం కాలేదు.

తీర్మానం పెట్టినందుకు నన్ను కమ్యూనిస్టు అన్నారు, చైనా వెళ్లమన్నారు, హత్య చేస్తామని బెదిరించారు. ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేదని భావించి నేను ఇప్పటికీ భావిస్తున్నప్పటికీ ఈ సమస్య లేవనెత్తిన మనోభావాల కారణంగా ఆ ప్రతిపాదనతో ముందుకు పోరాదని నిర్ణయించుకున్నానని రోబ్‌ చెప్పాడు. నిజానికి అవి ప్రధాన కారణాలుగా కనిపించటం లేదు. గతేడాది ఎన్నికలలో తాను సోషలిస్టును అని బహిరంగంగా చెప్పుకున్న బెర్నీశాండర్స్‌కు పెద్ద ఎత్తున యువత మద్దతు తెలపటం, అమెరికా ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందని, కొంత మంది రష్యాతో కుమ్మక్కయ్యారంటూ రోజూ వస్తున్న వార్తా కథనాలు, అక్కడ కూడా పెట్టుబడిదారీవిధానమే వున్నప్పటికీ ప్రచ్చన్న యుద్ధకాలం నాటి మనోభావాలు ఇంకా అమెరికన్లలో బలంగానే వున్న కారణంగా రోబ్‌పై వత్తిడి అధికమైందని చెప్పవచ్చు.

నిజానికి కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయాలన్న ప్రతిపాదన ఇదే మొదటిది కాదు. అన్ని రాష్ట్రాలూ ఏదో ఒక రూపంలో కమ్యూనిస్టు వ్యతిరేక చట్టాలను చేశాయి. అయితే సుప్రీం కోర్టు అలాంటివి చెల్లవు అని చెప్పటంతో అమలు చేయకుండా అలాగే వుంచేశారు. అరిజోనా రాష్ట్రంలో వున్న చట్టాన్ని 2003లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడను కాను అని ప్రమాణం చేయటానికి బదులు ఏ వుగ్రవాద సంస్ధలోనూ సభ్యుడను కాను అని సవరించారు. కొన్ని చోట్ల విధేయత ప్రమాణాన్ని స్వచ్చందం చేశారు. అదే కాలిఫోర్నియా రాష్ట్రంలో 2008లో అలాంటి తీర్మానం లేదా బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆ రాష్ట్ర గవర్నర్‌గా వున్న సినీ నటుడు ష్కావర్జ్‌నెగ్గర్‌ దానిని వీటో చేశాడు. ‘చట్టాన్ని మార్చాల్సినంత తప్పనిసరి కారణం నాకు కనిపించటం లేదు, అమెరికా లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసే కమ్యూనిస్టు కార్యకలాపాలకు ప్రభుత్వ వనరులను వినియోగించరాదన్న చట్టాన్ని కొనసాగించాల్సి వుంది ‘ అని కారణం చెప్పాడు. 2012 నుంచి ఇప్పటికి మూడు సార్లు జో ఇట్జ్‌గిబ్బన్‌ అనే డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి అలాంటి చట్టాన్ని సవరించాలని వాషింగ్టన్‌లో ప్రయత్నించి రిపబ్లికన్ల వ్యతిరేకత కారణంగా విఫలమయ్యాడు. అయితే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వుంటానని, రిపబ్లికన్లు తమ వైఖరిని మార్చుకోవాలని, వారి రష్యన్‌ స్నేహితులతో సంప్రదింపులు జరుపుకోవచ్చని జో చెప్పాడు.

అమెరికా ఇలా జరుగుతోంటే దాని కుట్రలో భాగంగా కమ్యూనిస్టులను వూచకోత కోసిన ఇండోనేషియాలో అక్కడి పాలకవర్గం తన నీడను తానే నమ్మలేనంతగా అదిగో కమ్యూనిస్టుల పునరుజ్జీవనం, ఇదిగో కమ్యూనిస్టు చిహ్నం అంటూ వులికి పడుతోంది. ఇండోనేషియాలో కమ్యూనిజ పునరుద్ధరణ గురించి భయపడాల్సిందేమీ లేదంటూనే ఈ సమస్యను అధిగమించాల్సి వుందని ఇండోనేషియా మంత్రి లుహుట్‌ పాండ్‌ జైతాన్‌ తన గోల్కార్‌ పార్టీ జాతీయ నాయకుల సమావేశంలో చెప్పారు.’ సిద్దాంతాన్ని మనం పాతి పెట్టలేము, అది వునికిలోనే వుంటుంది, అయితే దేశ సిద్ధాంతమైన పంచశీలను మార్చేందుకు ప్రయత్నించే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించే వారిని మనం ఎదుర్కోవాలి, ఈ సమస్యను పరిష్కరించేందుకు గోల్కార్‌ పార్టీ సభ్యులందరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి, కమ్యూనిజం పెరగటానికి వీలు లేకుండా చూడాలి అని లుహుట్‌ చెప్పాడు. సుత్తీ, కొడవలి చిహ్నాలున్న టీ షర్టులు అమ్మేవారిని, వేసుకొనే వారిని కమ్యూనిస్టులుగా అనుమానించి అరెస్టులు చేస్తోంది. అక్కడి పాలకవర్గం ఎంతగా వులిక్కి పడుతోందంటే ఇండోనేషియా రిజర్వుబ్యాంకు నకిలీ నోట్లను గుర్తించేందుకు వీలుగా కాపీ చేయటానికి వీల్లేకుండా కొత్తగా ముద్రించిన నోట్లలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన లోగో కమ్యూనిస్టు చిహ్నాలను పోలి వుందంటూ అక్కడి ముస్లింమతోన్మాద శక్తులు నానా యాగీ చేశాయి. దాంతో అదేమీ లేదని బ్యాంకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఆ రాణీ ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు ఇవి కాదోయ్‌ చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . తర తరాలుగా దోపిడీదార్లపై జరిగిన ప్రజా ప్రతిఘటనలో ధీరోదాత్తుల కథలు వుత్తేజాన్ని కలిగిస్తాయి. చారిత్రాత్మక తెలంగాణా ప్రజాప్రతిఘటనలో విసునూరు దేశముఖ్‌ రామచంద్రారెడ్డి గడీ, నైజాం నవాబు రాజ్యం ఎలా ధ్వంసమైందీ ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచే విధంగా జనం చెప్పుకుంటారు. కానీ ఆ దేశముఖ్‌, నిజాం వారసులు ఇప్పుడు వచ్చి కమ్యూనిస్టుల చేతిలో తమ కుటుంబాలు బాధపడిన చరిత్రను నమోదు చేయాలని, తమ ప్రతిఘటనను వీరోచితంగా చిత్రించాలని కోరితే ఎలా వుంటుంది? తూర్పు ఐరోపాలో అదే జరుగుతోంది. సోషలిస్టు వ్యవస్దలను కూల్చివేసిన తూర్పు ఐరోపా దేశాలలో జనాన్ని సంతృప్తి పరచటంలో విఫలమైన పాలకవర్గం రెచ్చగొట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకతను సజీవంగా వుంచేందుకు నానా గడ్డీ కరుస్తోంది. సోషలిస్టు వ్యవస్ధ ఏర్పాటు సమయంలో తిరుగుబాటు చేసిన భూస్వామిక, పెట్టుబడిదారీ, వాణిజ్యవేత్తల కుటుంబాలకు చెందిన వారి కథలతో దోపిడీ వర్గ చరిత్రను సమాజంపై రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక చోట్ల కమ్యూనిస్టు వ్యతిరేక చిహ్నాల ఏర్పాటు, అణచివేతకు గురైన వారి పేరుతో స్మారక కేంద్రాల నిర్మాణాలు చేస్తున్నారు.

ఇలాంటి చరిత్రకు గతంలో స్ధానం ఇవ్వలేదు, భవిష్యత్‌లో వుండదన్నది వేరే చెప్పనవసరం లేదు. ఎక్కడ సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలం వ్యాపించినా అమెరికాలో అందుకు స్ధానం లేదన్నది అనేక మంది భావన. ఎవరి నమ్మకం వారిది, వారి విశ్వాసాన్ని అంగీకరించకపోయినా భావ స్వాతంత్య్రంలో భాగంగా గౌరవిద్దాం. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను సంఘర్షించనివ్వండి. అంతా అయిపోయింది, ఇక భవిష్యత్‌ లేదు అని మెజారిటీ అనుకుంటున్న సమయంలో కమ్యూనిజం గురించి భయపడేవారు వున్నారనే విషయం కూడా ఆ మెజారిటీకి తెలియటం అవసరం. అమెరికాలోని పాలకవర్గ డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ అనే ఒక ఎంపీ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించుకొని ఆ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధిగా ఎన్నుకోవాలని పోటీకి దిగి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అమెరికాలోని క్రిస్టియన్‌ లీగల్‌ సొసైటీ అనే ఒక సంస్ధ సిఇఓ డేవిడ్‌ నమో అనే పెద్దమనిషి నేషనల్‌ రివ్యూ అనే పత్రిక మార్చినెల సంచికలో ఒక వ్యాసం రాసి అమెరికా భవిష్యత్‌కు సోషలిస్టు భావజాలం ముప్పు తెస్తున్నది గమనించండి అంటూ మొర పెట్టుకున్నాడు. ఓ సర్వే ప్రకారం పది మందిలో నలుగురు పెట్టుబడిదారీ విధానానికి బదులు సోషలిజానికి ప్రాధాన్యత ఇస్త్నుట్లు తేలిందని హెచ్చరించాడు. బెర్నీ శాండర్సు పలుకుబడి వలన ఈ వుద్యమం ఆదరణ పొందిందని భావించటం గాక అసలు వుద్యమానికి అదొక సూచికగా పరిగణించాలని పేర్కొన్నాడు. అంటే శాండర్స్‌ గాక పోతే మరొకరిని ఆ వుద్యమం ముందుకు తెచ్చేది. సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్నది అందుకే.అనేక అనుభవాల తరువాత దోపిడీ వర్గంతో పాటు దానిని వ్యతిరేకించే వారు కూడా తమ ఎత్తుగడలు, భాషకు నగిషీ పెడుతున్నారు. దోపిడీ వర్గం తన అధికారాన్ని కాపాడుకొనేందుకు సాయుధ శక్తులను నిరంతరం పెంచిపోషిస్తుంది. ఏ దేశ చరిత్ర చూసినా పోలీసు, పారామిలిటరీ, మిలిటరీ దోపిడీ వర్గాల ప్రతినిధిగా పని చేయటం తప్ప వారికి వ్యతిరేకంగా ఒక్క వుదంతంలో కూడా వ్యతిరేకంగా వ్యవహరించిన వుదంతం మనకు కనపడదు. దోపిడీ, దోపిడీ శక్తులను ఎదుర్కోవటానికి కార్మికవర్గం శాంతియుత మార్గాన్నే ఎంచుకుంటుంది, అనివార్యమైతేనే ఆయుధాల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది.ఈ విషయాన్ని కమ్యూనిస్టులు ఎన్నడూ దాచుకోలేదు. తుపాకీ గొట్టం ద్వారానే ఆధికారం తప్ప ఇతర పద్దతులలో రాదంటూ కొందరు హింసాత్మక పద్దతులతో సోషలిజాన్ని సాధిస్తామని పిలుపులు ఇవ్వటం, శ్రామికవర్గ నియంతృత్వాన్ని అమలు చేస్తామనే పదజాలాన్ని వినియోగించటం, అన్ని దేశాలలో దోపిడీ శక్తుల నిర్మూలనకు ఆయుధాలు పట్టిన వుదంతాలను చూపి కమ్యూనిస్టు వ్యతిరేకులు చేయని తప్పుడు ప్రచారం లేదు.

నైజాం నవాబు, అతగాడికి వెన్నుదన్నుగా వున్న దేశముఖులు, జాగీర్దార్లు కోరిన వెంటనే వెట్టి చాకిరీ రద్దు, భూములను దున్నేవారికే అప్పగించి వుంటే తెలంగాణా రైతాంగం ఆయుధాలను పట్టాల్సిన అవసరం వచ్చేదే కాదు. నిర్బంధం పెరిగిన కొద్దీ వడిసెలలతో ప్రారంభించిన దళాలు తుపాకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కోరిన వెంటనే బ్రిటీషు వారు స్వాతంత్య్రం ఇచ్చి వుంటే భగత్‌ సింగుకు బాంబులతో, సుభాష్‌ చంద్రబోస్‌కు విముక్తి దళాల నిర్మాణం అవసరమయ్యేది కాదు. వినతి పత్రాలతో ప్రారంభమైన స్వాతంత్య్ర వుద్యమం అల్లూరి సీతారామరాజు కాలం నాటికి విల్లంబులు, తుపాకులు పట్టాల్సి వచ్చింది. స్వపరిపాలన, సంపూర్ణ స్వాతంత్య్రం వంటి నినాదాలను క్రమంగా ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రారంభంలో విద్యావంతులైన భారతీయులకు ప్రభుత్వంలో మరింత భాగస్వామ్యం కల్పించాలని మాత్రమే కోరింది.

ప్రస్తుతం అమెరికాలో సోషలిస్టులుగా సగర్వంగా చెప్పుకుంటున్న బెర్నీ శాండర్స్‌ వంటి వారు ప్రజాస్వామిక సోషలిజం గురించి మాట్లాడుతున్నారు తప్ప అమెరికా దోపిడీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామనో, సాయుధపోరాటం చేస్తామనో చెప్పటం లేదు. ఆర్ధిక సంక్షోభం, అసమానతలు, దారిద్య్రం, సంక్షేమ పధకాలకు కోత వంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు తప్ప మరొకటి కాదు. వారు కూడా తుపాకి గొట్టం ద్వారానే అధికారం వంటి నినాదాలు ఇచ్చి వుంటే అణచివేత సులభమై వుండేది. తాము కోరుతున్న ప్రజాస్వామిక సోషలిజాన్ని, సంక్షేమ చర్యలను అమలు జరిపేందుకు నిరాకరించినపుడు ఏం చేయాలో అమెరికన్లే నిర్ణయించుకుంటారు. కమ్యూనిస్టు వ్యతిరేకులు భయపడుతున్న అంశమిదే.అందుకే మొగ్గలోనే సోషలిజం కోరుకొనే వారిని తుంచి వేయాలని కోరటంలో అంతరార్ధమిదే. అమెరికాలో కమ్యూ నిస్టు పార్టీ వున్నప్పటికీ ప్రజాస్వామిక సోషలిస్టు పార్టీ(డిఎస్‌ఏ) కూడా ఎన్నో దశాబ్దాల నుంచి నామ మాత్రంగా వుంది. అలాంటి పార్టీలో గతేడాది ఎన్నికల నాటికి 8,500 సభ్యత్వం వుంటే మే నాటికి 21వేలకు చేరిందని అఫింగ్టన్‌ పోస్టు పత్రిక తాజాగా రాసింది. దశాబ్దాలుగా సోషలిజం అనే పదం గిట్టనివారు నేడు దాన్ని వదిలించుకుంటున్నారన్నది స్పష్టం. ఎందుకు ?

అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్ధాయిలో యువత విద్యకోసం తీసుకున్న అప్పులపాలై వున్నారు. రానున్న రెండు దశాబ్దాలలో మరింత యాంత్రీకరణ కారణంగా అమెరికాలో ప్రభుత్వ వుద్యోగాలతో సహా మొత్తం యాభై శాతం వుద్యోగాలు రద్దవుతాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. తమ తలిదండ్రుల కంటే దుర్భర పరిస్థితులను అనుభవించే తొలి తరంగా యువత జీవనం గడపబోతున్నది. పర్యావరణ ముప్పు సరేసరి. ఇంతకాలం తాము బలపరిచిన పెట్టుబడిదారీ విధానం ఇంతకంటే తమకు మెరుగైన జీవితాన్ని ఇవ్వదనే విషయాన్ని యువత క్రమంగా గ్రహిస్తున్నది. అందుకే దాని బదులు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు.

గతంలో సోషలిజం ఆకర్షణీయంగా వుండటం కారణమైతే, ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభంలో పడటం, అనేక భ్రమలతో సోషలిజాన్ని వదులుకున్న దేశాలు పెట్టుబడిదారీ విధానం గురించి పునరాలోచించటం, అంతకు మించి సోషలిస్టు విధానంలో వున్న వాటి కంటే పరిస్ధితులు దిగజారటం గురించి జనంలో చర్చ జరగటం, ప్రపంచ ఆర్ధిక సంక్షోభం చైనా తదితర సోషలిస్టు దేశాలను అంతగా ప్రభావితం చేయకపోవటం వంటి కారణాలు మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు, జనం ఆ వైపు ఆలోచించకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది.

ఇంటర్నెట్‌ యుగంలో సమాచారాన్ని వక్రీకరించవచ్చు తప్ప వాస్తవ సమాచారాన్ని కోరుకొనే వారిని నిరోధించటం సాధ్యం కాదు. సోషలిజం, కమ్యూనిజం గురించి గతంలో మాదిరి కట్టుకధలు చెబితే యువత బుర్ర ఆడించే పరిస్ధితి లేదు. ఆస్ట్రేలియాలో ఒక హైస్కూలు విద్యార్ధిని ఆ స్కూలు నిరంకుశ యాజమాన్యం రెచ్చగొట్టి దేనికి పురికొల్పిందో చూడండి.

స్వేచ్చా ప్రపంచంగా వర్ణితమయ్యే దేశాలలో ఆస్ట్రేలియా ఒకటి. మేనెల ఏడవ తేదీన సిడ్నీ నగరంలో జరిగిన ఒక మేడే ప్రదర్శనకు జస్సీ అనే 16 సంవత్సరాల హైస్కూలు విద్యార్ధి హాజరయ్యాడు. అది అతనికి తొలి మేడే ప్రదర్శన. అదే రోజు అతని స్కూలు స్ధాపకుడి సంస్మరణార్దం నిర్వహించే కార్యక్రమానికి వెళ్లకుండా జెస్సీ మేడే ప్రదర్శనకు వెళ్లాడు. అందుకు గాను శనివారం నిర్బంధ శిక్ష విధించినట్లు స్కూలు యాజమాన్యం తెలిపింది. తలిదండ్రులకు పంపిన లేఖలో స్కూలు కార్యక్రమానికి బదులు మేడే ప్రదర్శనకు వెళ్లినట్లు, శనివారపు శిక్షలు ఎక్కువగా వుంటే స్కూలు నుంచి బయటకు పంపే విషయాన్ని ఆలోచించాల్సి వుంటుందని హెచ్చరించారు.

గతేడాది స్కూలు స్ధాపకుడి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లిన తనకు అక్కడి తంతు విసుగు పుట్టించిందని జెస్సీ చెప్పాడు. మరి మేడే ప్రదర్శనకు ఎందుకు వెళ్లావు అనిఅడిగితే మేడే గురించి ట్విటర్‌లో అమెరికన్ల మరియు ప్రపంచమంతటి నుంచీ జరిగిన రచ్చ గురించి నేను ఎంతో తెలుసుకున్నాను. హాజరైతే ఎలా వుంటుందో తెలుసుకోవాలనే వుబలాటంతో వెళితే నిజంగానే ఎంతో వుద్వేగం కలిగింది అని చెప్పాడు. శనివారం నాడు విధించిన శిక్షా సమయంలో మౌనంగా వుండకుండా స్కూలు చర్యను నిరసిస్తూ అణచివేత గురించి తాను రాసుకు వచ్చిన మార్క్సిజం విశ్లేషణను చదివాడు. వచ్చే ఏడాది మేడే ప్రదర్శనకు హాజరయ్యేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తాను. ఒక వేళ ఇవ్వకపోతే ఎలాగైనా సరే మేడే ప్రదర్శనకు వెళతా. స్కూలు విధించే శిక్ష నన్ను నిరసన తెలపకుండా ఆపలేదు అని చెప్పాడు. అంతే కాదు ఆరోజు స్కూలు ప్రారంభానికి ముందు వుదయం, స్కూలు తరువాత సాయంత్రం రెండు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నాడు జెస్సీ. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత తెలిసిందే. అమెరికా, ఇతర దాని వుపగ్రహ దేశాల పాలకవర్గ కమ్యూనిస్టు వ్యతిరేకత కూడా చివరికి దానికే దారి తీస్తుందా ? అవును అని చెప్పటానికి సందేహించనవసరం లేదు, చరిత్ర చెప్పిన సత్యమది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాణిజ్య లోటులో మూడేండ్ల మోడీ సరికొత్త రికార్డు !

19 Friday May 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

3 years of narendra modi rule, BJP, BJP-led NDA, failure Modi, India employment, India trade gap, Narendra Modi, Narendra Modi Failures, NDA

ఎం కోటేశ్వరరావు

నరేంద్రమోడీ మూడు సంవత్సరాల విజయాల గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో విజయగాధలు ప్రారంభమయ్యాయి. విమర్శనాత్మకంగా విశ్లేషించే వారి రాతలు, వ్యాఖ్యలు కనిపించకుండా, వినిపించకుండా సాధ్యమైన మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఎలాగైతేనేం విజయం సాధించారా లేదా అనేది ముఖ్యం అన్నట్లుగా పరిస్థితి వుంది. ఈ నేపధ్యంలోనే కొందరైనా మీడియాలో ఏదో విధంగా నిజాలు చెప్పేందుకు తపన పడుతున్నారు. ప్రధానికి నొప్పి తగల కుండా పొగడుతూనే కొన్ని నగ్న సత్యాలను వెల్లడిస్తూ అమెరికా పత్రిక అఫింగ్టన్‌ పోస్టులో ఒక విశ్లేషణ మొదటి భాగం ఇలా సాగింది.’ మోడీ ప్రభుత్వం అధికారంలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఓటర్లలో దాని పలుకుబడి ఆశ్చర్యంగా వుంది. అత్యధిక ప్రభుత్వాల విషయంలో మూడో సంవత్సరంలో విసుగు పుట్టటం ప్రారంభమౌతుంది. దాన్నే ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభం కావటం అంటారు. మోడీ ప్రభుత్వ విషయంలో కూడా అదే జరుగుతుంది. మావోయిస్టులు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లను చంపివేస్తూనే వున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా కాశ్మీర్‌ పరిస్థితి దిగజారుతోంది, నిరుద్యోగ అంకెలు భయ పెడుతున్నాయి. దళితులు, ముస్లింలు, మహిళలపై హింసాకాండ ఇప్పటికే మామూలుగానే వుంది.మరో విధంగా చెప్పాలంటే కొద్దిగా కూడా మార్పు లేదు. మోడీ నూతన భారతంలో కొత్తదేమీ లేదు. సర్జికల్‌ దాడులు జరిగినప్పటికీ సైనికులను వధించటం పాకిస్థాన్‌ కానసాగిస్తూనే వుంది. వాస్తవాధీన రేఖ ఇప్పటికీ మండుతూనే వుంది.ఒక భారతీయుడిని వురి తీస్తామని పాకిస్థాన్‌ బెదిరిస్తోంది. దౌత్యపరంగా పాకిస్థాన్‌ను ఒంటరిపాటు చేయటం ప్రభుత్వ వ్యూహంగా వుంది. అయినప్పటికీ భారతే వేరుపడుతున్నట్లు కనిపిస్తోంది. తరువాత కళ్లెం లేని మోడీ రాజకీయ విజయం ఏమి వివరిస్తున్నది? చివరికి మున్సిపల్‌ ఎన్నికలలో కూడా మోడీ పేరుతో ఎదుర్కొంటున్నారు. 2014 కంటే నేడు మోడీ మరింత ప్రజాదరణ పొందారని అది తెలియ చేస్తున్నది.’ తరువాత వ్యాసమంతా విజయపరంపరకు మోడీ రహస్యమేమిటో వివరించారనుకోండి. ఇక్కడ సమస్య ఏమంటే మూడేండ్లలో ఎలాంటి మార్పు లేదని చెప్పిన తరువాత మోడీ విజయం సాధిస్తున్నారని చెప్పటంలోనే అసలు మర్మం దాగుంది. ఓట్ల చీలిక కారణంగా నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపికి వచ్చిన ఓట్ల శాతం కంటే ఎక్కువగా సీట్లు రావటానికి కారణాలేమిటో ప్రాధమిక గణితం చెబుతుంది. కానీ దానికి రాజకీయ వ్యూహం, ఎత్తుగడలంటూ లేని వాటిని ఆపాదించటమే విశేషం. నిజంగా అవి వుంటే గోవా, పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయినట్లు ?

నరేంద్రమోడీ వైఫల్యాల గురించి చెప్పేంత నిజాయితీ ప్రస్తుతం మన ప్రధాన స్రవంతి మీడియాకు లేదు.ఎందుకంటే అవన్నీ వాణిజ్యం కోసం పని చేస్తున్నవి కనుక ఆదాయాన్ని కోల్పోయేంత త్యాగం చేయవు.http://www.tradingeconomics.com/india/balance-of-trade ఈ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం గత మూడు సంవత్సరాలలో నరేంద్రమోడీ ప్రభుత్వ నిర్వాకం వలన మన దేశ వాణిజ్య లోటు పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 173.5లోటు పెరిగింది. దాని తీవ్రత ఎలా వుందంటే మార్కెట్‌ అంచనా 12.79 బిలియన్‌ డాలర్లయితే వాస్తవంగా 13.25 బిలియన్లు వుంది. ఇది 2014 నవంబరు తరువాత అత్యధికంగా ఒక రికార్డు నమోదు చేసింది. సర్కారు ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు . ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా వున్న కారణంగా మనకు విదేశీ మారక ద్రవ్యం ఎంతో విలువైనది. చమురు వినియోగాన్ని కూడా పరిమితం చేయవచ్చు పోనీ సాధ్యం కాదనుకుంటే దిగుమతులు తప్పవు. బంగారం లేకపోతే మనకు రోజు గడవదా ? గతేడాది మొత్తంచమురు దిగుమతులు 49.1 శాతం పెరిగితే వాటిలో చమురు వాటా 30.1 కాగా బంగారం 211.4 శాతం పెరిగాయి. విలువైన రంగురాళ్లతో సహా మన దిగుమతుల్లో చమురు తరువాత 13శాతం అవే ఆక్రమిస్తున్నాయి. ధనికులు మాత్రమే తినే పండ్లు, కూరగాయల దిగుమతులకు కూడా దేశం మొత్తానికి చెందిన విదేశీమారక ద్రవ్యాన్ని వినియోగిస్తున్నారు. ఇలా చెప్పుకోవాల్సినవి ఇంకా వున్నాయి.

ఇదెక్కడి చోద్యం ! రైల్వే స్టేషన్లో టీ అమ్మానని చెప్పుకున్న మోడీకి ఈ దేశంలోని సామాన్యులకు ఏమి అవసరమో తెలియదా ? రంగురాళ్లు, బంగారం దిగుమతి చేయాలని ఏ చాయ్‌ వాలా అడిగాడు. గతంలో రాజులు రంగప్పలు తమ గొప్పను చూపించుకొనేందుకు, రాజకుటుంబాల ఆడంబరాన్ని ప్రదర్శించుకొనేందుకు ఇలాంటి పనులు చేశారు తప్ప సామాన్యుల గురించి ఆలోచించేవారెవరైనా చేస్తారా ? గుజరాత్‌ నమూనా పాలన ఇదేనా ? ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే ఆ అనందాన్ని కూడా అనుభవించనివ్వకుండా అదే మోడీ సర్కార్‌ పన్నులు పెంచి మన జేబుల నుంచి డబ్బు కొల్లగొడుతోంది. మన ఆర్ధిక రంగంలోని ఒక ముఖ్యమైన ఎగుమతులు, దిగుమతుల తీరు ఇలా వుంది.

మోడీ, ఆయన అనుయాయులు చేసిన అనేక వాగ్దానాలలో వుపాధి కల్పన ముఖ్యమైనది. నైపుణ్య శిక్షణ అనో మరొకదాని గురించో ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ వుపాధి కల్పనలో ఘోరవైఫల్యం చెందింది. ఇదే సమయంలో చైనా కంటే అభివృద్ధి రేటు ఎక్కువగా వుందన్న ప్రచారం సాగుతోంది. ఒక వేళ అది నిజమనుకున్నా ఆ మేరకు వుపాధి ఎక్కడ పెరిగిందో వారే చెప్పాలి. యాభయ్యవ పడిలో వున్నవారికి నేను పెద్దగా చేయలేను గాని కొత్తగా వుపాధి కోరుకొనే రెండు పదుల ప్రాయంలో వున్నవారి జీవితాల రూపు రేఖలను మార్చివేయాలనుకుంటున్నాను అని నరేంద్రమోడీ అనేక సందర్బాలలో ఓట్లడుక్కుంటున్న సమయంలో చెప్పారు. ప్రభుత్వ గణాంకాలు, విశ్లేషణల ప్రకారం 2009-11 మధ్య 8.5శాతం అభివృద్ధి రేటు వుండగా ఏటా 9.5లక్షల నూతన వుద్యోగాలు వచ్చినప్పటికీ దానిని కూడా వుపాధి రహిత అభివృద్దిగా పేర్కొన్నారు.మోడీ హయాంలో 2015,16లో అంతకు ముందుతో పోల్చితే రెండు లక్షల వుద్యోగాలు తగ్గిపోయాయి. అంటే నాలుగో వంతు పడిపోయాయి. అయితే ప్రభుత్వం అసలు విషయాల జోలికి పోకుండా లెక్కలు వేయటంలో ఏదో తప్పుంది, లెక్కల పద్దతిని మార్చాలని నిర్ణయించింది. జిడిపి వృద్ధి రేటు లెక్కింపు విధానాన్ని కూడా మార్చిన విషయం తెలిసిందే. సంఘటిత రంగానికి, సేవా రంగాన్ని కూడా జోడించటంతో 2015తో పోల్చితే 2016లో కొద్దిగా వుద్యోగాలు పెరిగినట్లు కనిపించినా, అంతకు ముందుతో పోల్చితే తక్కువే. నోట్ల రద్దు కారణంగా వుపాధికి ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం ఒకటే మాట మీద వుంది. కానీ ఆ మూడునెలల కాలంలో ఎంత మందికి వుపాధి పోయిందో అందరికీ తెలిసిందే. మన దేశంలో కచ్చితంగా లెక్కలు తీసే యంత్రాంగం లేని కారణంగా ప్రభుత్వం అడ్డంగా వాదిస్తోంది.

పోలిక కాస్త కటువుగానే వుండవచ్చు. వయసు మీద పడిన తరువాత పురాతన వృత్తిలోకి నెట్టబడిన అభాగినుల పరిస్ధితి ఎంత దయనీయంగా వుంటుంతో నేడు ఐటి పరిశ్రమలో వయస్సు పైబడిన వారి పరిస్ధితి కూడా అగమ్యగోచరంగా వుండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటి, దాని అనుబంధ సంస్ధలలో ప్రస్తుతం వున్న 40లక్షల మంది వుద్యోగులలో 60శాతం మంది ప్రస్తుతం వున్న వారి నైపుణ్య స్ధాయిని బట్టి వుద్యోగాలకు పనికి రారని, వారికి శిక్షణ ఇచ్చినా ఏ మేరకు పనికి వస్తారన్నది ప్రశ్నార్ధకమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటికే వుపాధి తగ్గిపోయిన స్ధితిలో ఈ విద్యావంతులైన వారు కూడా నిరుద్యోగ సైన్యంలో చేరితే పరిస్థితి ఎలా వుంటుందో వూహించుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ లేబరు బ్యూరో సమాచారం ప్రకారం ఇటీవలి సంవత్సరాలలో వుపాధి కల్పన ఇలా వుంది

డిసెంబరు నుంచి 2009 – డిసెంబరు 10 వరకు 8.70 లక్షలు

డిసెంబరు నుంచి 2010 – డిసెంబరు 11 వరకు 9.29

డిసెంబరు నుంచి 2011 – డిసెంబరు 12 వరకు 3.21

డిసెంబరు నుంచి 2012 – డిసెంబరు 13 వరకు 4.19

డిసెంబరు నుంచి 2013 – డిసెంబరు 14 వరకు 4.21

డిసెంబరు నుంచి 2014 – డిసెంబరు 15 వరకు 1.35

డిసెంబరు నుంచి 2015 – డిసెంబరు 16 వరకు 1.35

అన్నం వుడికిందో లేదో చూడటానికి ఒక మెతుకును చూస్తే చాలు అన్నట్లుగా నరేంద్రమోడీ సాధించిన విజయాల తీరు తెన్ను గురించి ఈ రెండు ముఖ్యమైన అంశాలు వెల్లడిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పొట్టి హిట్లర్‌ బాటలో పొడుగు జనాల సృష్టికి ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నం !

18 Thursday May 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Arogya Bharati, ‘customised’ babies, best off- springs, Garbh Vigyan Sanskar, Hitler, Nazi Racist project, RSS, RSS ‘customised’ babies, samarth Bharat, uttam santati

ఎం కోటేశ్వరరావు

‘పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నపుడు ది ఎలవెన్‌ కాజెస్‌ ఫర్ది డీ జెనరేషన్‌ ఆఫ్‌ ఇండియా గురించి మూడు ఘంటలు ఒక్కబిగిని లెక్చర్‌ ఇచ్చేప్పటికి ప్రొఫెసర్లు డంగై పోయినారు. మొన్న బంగాళీ వాడు ఈ వూళ్లో లెక్చర్‌ ఇచ్చినపుడు ఒక్కడికైనా నోరు పెగిలిందీ ! మన వాళ్లు వట్టి వెధవాయ్‌లోయ్‌ ‘ అన్న గురజాడ గిరీశాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదో, ఏది దేశ భక్తి ఏది కాదో , ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదో చెప్పే వారు , వినకపోతే బలవంతంగా తన్ని మరీ చేయించే వారు నానాటికీ పెరిగిపోవటాన్ని చూస్తున్నాం. బహుశా ప్రశ్నించటానికి ముందుకు రాని వారి గురించే వెధవాయ్‌లోయ్‌ అని మహాకవి గురజాడ వ్యంగ్యాస్త్రం వదిలాడనిపిస్తోంది.

అన్నీ వేదాల్లోనే వున్నాయ్‌ ! శాస్త్రకారుడు అలా చెప్పాడు !! అంటే నోరు మూసుకొని చెప్పింది చేస్తున్నాం. మానవ జాతి మనుగడ, నూతన ఆవిష్కరణలకు మూలమైన ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వేయటాన్ని మనం ఎప్పుడైతే మరచిపోయామో అప్పుడే మన జాతి పురోగతి ఆగిపోయింది. ఎవరైనా అలా ప్రశ్నిస్తే నీకు తెలియదని నోర్మూయిస్తున్నాం. ఈ మధ్య ప్రశ్నించటాన్ని దేశద్రోహంగా, గొర్రెల మాదిరి చెప్పింది వినటం, చేయటమే దేశభక్తిగా భాష్యం చెప్పేవారు తయారయ్యారు. ఈ నయా దేశ భక్తులు చివరకు పరిశుద్ధులైన పిల్లలను పుట్టించేందుకు ఇప్పుడు పడకగదులలో కూడా జోక్యం చేసుకొనేందుకు తయారయ్యారంటే అతిశయోక్తి కాదు.

ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా పిలుపు ద్వారా ఇక్కడ వస్తువులను వుత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయాలని చెప్పారు. ప్రధాని మాతృ సంస్ధ వుత్తమ సంతతిని పుట్టించి లేదా వుత్పత్తి చేసి పటిష్ట (స్మార్టు ) భారత దేశాన్ని తయారు చేస్తామని చెబుతోంది. ఎలా ? ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధల ప్రతినిధులు ఇచ్చిన ఇంటర్వ్యూ లేదా సమాచారాన్ని బట్టి ఎలా చేస్తారో తరువాత చూద్దాం. అంతకంటే ముందు వారి ఆరాధ్యదైవం హిట్లర్‌ ఎలా ప్రయత్నించారో చూడకపోతే దానికి సమగ్రత రాదు. కావాలంటే ఏం చేశాడో ఈ లింక్‌లో చదవండి.http://historacle.org/hitlers_supermen.html తాను నికార్సయిన ఆర్య జాతికి చెందిన వాడినని చెప్పుకున్న హిట్లర్‌ 5 అడుగుల ఎనిమిది అంగుళాల పొట్టి వాడు. తన కంటే పొడవైన, బలిష్ఠులైన శుద్దమైన ఆర్యజాతిని శుద్ధి చేసే, కొత్తగా పుట్టించే కార్యక్రమంలో భాగంగానే దాదాపు అరవైలక్షల మంది యూదులను, భారతీయ మూలాలున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పే ఐదు లక్షల మంది ‘రోమా’ సంచార తెగవారిని వూచకోత కోయించాడు. నాశిరకం పిల్లలను కనకుండా నాలుగు లక్షల మంది జర్మన్లకు ఆపరేషన్లు చేయించాడు. 1932లో వుత్తమ సంతతి కార్య క్రమాన్ని ప్రారంభించాడు. దానిలో భాగంగా పిల్లల వుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాడు. వాటిలో పరిపూర్ణమైన మహిళలను, పురుషులను నాజీ పార్టీ ఎస్‌ఎస్‌ సైనికుల ద్వారా చేర్చారు. వారు 1750 నుంచి జాతి పరంగా ఎలాంటి కల్తీకి గురై వుండకూడదని షరతు పెట్టారు. హిట్లర్‌ చచ్చేంత వరకు ఆ కార్యక్రమం కొనసాగి 42వేల మంది పిల్లలను పుట్టించారు. అంతే కాదు, హిట్లర్‌ ఆక్రమణకు గురైన దేశాలలో ఆర్య సంతతికి చెందిన వారిగా భావించిన మహిళలను, పిల్లలను జర్మన్‌ సైన్యం కిడ్నాప్‌ చేసింది. ఒక్క పోలాండ్‌లోనే రెండు లక్షల మంది అలాంటి వారున్నారంటే ఎంత పెద్ద స్ధాయిలో జరిగిందో చూడవచ్చు. అది జర్మనీకే పరిమితం కాలేదు, 1974లో అక్కడి సుప్రీం కోర్టు రద్దు చేసే వరకు అమెరికాలో కూడా అరవై వేల మంది మహిళలకు అలాంటి ఆపరేషన్లే చేశారని, అమెరికా వలస విధానంలో ఐరిష్‌, తూర్పు ఐరోపా యూదులు, ఆసియన్లు, ఆఫ్రికన్లు నీచజాతుల వారని వర్ణించినట్లు ప్రముఖ విశ్లేషకుడు ప్రబీర్‌ పురకాయస్ధ తన విశ్లేషణలో పేర్కొన్నారు.http://newsclick.in/rss-marketing-illegal-mumbo-jumbo-science-making-superbabies

అలాంటి కార్యక్రమ ప్రారంభం గుజరాతులో జరిగింది.ఆరోగ్య భారతి పేరుతో గత పది సంవత్సరాలుగా అక్కడ ప్రయోగాలు జరుపుతూ 2015 నుంచి దేశమంతటికీ విస్తరించాలని నిర&ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను విద్యాభారతి అనే సంస&ధ ద్వారా సమకూర్చుతున్నారు. గుజరాతు, మధ్యప్రదేశ్‌లో పది కేంద్రాలు ఏర్పాటు చేశారు, వుత్తర ప్రదేశ్‌, బెంగాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీరు ఇలాంటి ‘సంస్కారం ద్వారా 450 మంది వున్నత లక్షణాలు గల పిల్లలను పుట్టించారు. 2020 నాటికి పతి రాష్ట్రంలో ఇలాంటి వారిని పుట్టించేందుకు ‘గర్భ విజా&క్షన అనుసంధాన కేంద్రాలను’ ఏర్పాటు చేయనున్నారు. వీరంతా ఎవరు ? ఇంకెవరు ఆర్‌ఎస్‌ఎస్‌ వారే. వారు నడిపే అనేక సంస్ధలలో ఒకటి ఆరోగ్యభారతి. దానికీ వారికి వున్న సంబంధం గురించి దిగువ లింక్‌లో వున్న సమాచారాన్ని ఆసక్తి వున్న వారు చదువుకోవచ్చు.https://www.altnews.in/link-arogya-bharati-promises-genius-babies-rashtriya-swayamsevak-sangh-rss-opindia-couldnt-find/ సైన్సు పేరుతో చేస్తున్న ఈ కార్యకలాపాలను ప్రశ్నించకపోతే ఏం జరుగుతుంది? ఈ శక్తులు ఆరాధించే హిట్లర్‌ జర్మనీలో ఏం చేయించాడో తెలుసుకున్న తరువాత అయినా ప్రశ్నిస్తారా ? గిరీశం చెప్పిన దాన్ని నిజం చేస్తారా ?

ప్రస్తుతం ఆధునిక ఆవిష్కరణలుగా పరిగణిస్తున్న టెస్టు ట్యూబ్‌ బేబీల మొదలు పెట్రోలుతో పని లేకుండా ఎటు కావాలంటే అటు తిరిగే, ఎంత మంది ఎక్కినా ఒకరికి ఖాళీ వుండే ఖండాంతర విమానాలు, ఆయుధాల సమాచారం అంతా వేదాల్లోనే అన్నీ వున్నాయష అని చెప్పటమే తప్ప ఎందుకు వెలికి తీయలేదు అన్న హేతువాదుల ప్రశ్నకు సమాధానమా అన్నట్లు వాటి బదులు ‘నమ్మకం తప్ప’ ఆధారాలు చూపనవసరం లేని వుత్తమ పిల్లలను పుట్టించే ప్రయత్నాలు వున్నాయి. అయితే ఇవి నాజీల బాటలో వున్నాయి. దానికి భారతీయత రంగు అద్దే క్రమంలో ఆయుర్వేదం, పురాతన విజా&క్షనం ఆధారం అని చెబుతున్నారు. బిజెపి నేత తరుణ్‌ విజయ్‌ నల్లగా వుండే దక్షిణ భారతీయులతో మేము సామరస్యంగా కలసి వుండటం లేదా అంటూ ఆఫ్రికన్లపై న్యూఢిల్లీ సమీపంలో జరిగిన దాడి సందర్భంగా తన అంతరంగాన్ని వెల్లడించారు.బహుశా అలా ఎక్కువ కాలం కలసి జీవించలేరు కనుకనే ముందుగా పొడవైన, తెల్ల పిల్లల కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయోగాలు చేపట్టింది అనుకోవాలి.

మే నెల ఆరు, ఏడు తేదీలలో ఆరోగ్యభారతి కొల్‌కతాలో గర్భ సంస్కార కార్యక్రమాన్ని తలపెట్టింది. దాన్ని అభ్యంతర పెట్టిన ఆ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ వినతిని స్వీకరించిన హైకోర్టు ఆ కార్యక్రమాన్ని వుపన్యాసాలకే పరిమితం చేసి వాటిని వీడియో తీసి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మిగతా విషయాలను తరువాత విచారిస్తామని తెలిపింది. ఆరోగ్య భారతి సంస్ధ కార్యకలాపాలు, ప్రచారం చట్టవిరుద్దమైనవి. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ ద్వారా కూడా గర్భసంస్కారం చేయవచ్చని చెబుతూ తాము చెబుతున్న దానికి శాస్త్రీయ ముసుగువేసుకొనే ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. ‘ కొడుకు పుట్టాల ‘ అని కోరుకొనే వారు తామర తంపరగా వున్న మన దేశంలో ఆ వ్యామోహం లేదా బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించే యత్నం జరుగుతోంది. ఆరోగ్యభారతి ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అలాంటి కోరికలు వున్నవారిని ప్రోత్సహించటం తప్ప ఇది మరొకటి కాదు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఒకసారి ప్రయత్నం చేసి చూస్తే పోలా పోయేదేముంది అనే తత్వం మన నరనరాన జీర్ణించి వుంది. అందుకే రోడ్డు మీద పోయే వారు కనిపించిన ప్రతి రాయికీ ఒక నమస్కారం పడవేసి పోతుంటారు. మేము పక్కా లోకల్‌ అని చెప్పుకొనే వారు ప్రతిదానికీ ఏదో ఒక పశ్చిమ దేశాన్నో, వ్యక్తులనో వుదాహరిస్తుంటారు. దానికీ ఒక లాజిక్కు వుంది. మన వేద, శాస్త్రవిజా&క్షనాన్ని పశ్చిమ దేశాల వారు ముఖ్యంగా జర్మన్లు గ్రహించారని చెబుతుంటారు. గర్భ సంస్కారానికి కూడా అదే చెబుతున్నారు.

ఆరోగ్య భారతి జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ హితేష్‌ జానీ చెప్పినదాని ప్రకారం తలిదండ్రులకు ఐక్యూ (తెలివితేటలు) తక్కువగా వున్నా, చదువు సంధ్యలు లేకపోయినా గర్భ శుద్ధి చేయించుకుంటే పొట్టిగా, నల్లగా వున్న తలిదండ్రులకు కూడా తెల్లగా, పొడవుగా వుండే పిల్లలు పుడతారు. ఈ ప్రక్రియను హిందూ శాస్త్రాలు చెప్పాయి. రెండు దశలలో తలిదండ్రులు కాదలచుకున్న వారిని శుద్ధీకరణ చేస్తారు. వుత్తమ సంతతిని పుట్టించే ఈ పధకానికి జాతీయ కన్వీనర్‌గా వున్న డాక్టర్‌ కరీష్మా నర్వానీ చెప్పినదాని ప్రకారం ఇప్పటికే అలాంటి పిల్లలను పుట్టించేందుకు విశాఖ, విజయవాడలలో కూడా కార్యక్రమాలను నిర్వహించారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీలో ఈ ఆయుర్వేద పద్దతి ద్వారా వుత్తమ సంతతిని పుట్టిస్తున్నారు. హోమియో పతి వైద్యాన్ని తొలుత ప్రతిపాదించిందీ లేదా దాని గురించి రాసింది జర్మన్‌ భాషలో, రోమ్‌ సామ్రాజ్యంలో, ప్రస్తుతం జర్మనీలో భాగంగా వున్న శాగ్జనీ ప్రాంతంలోనే హోమియో పతికి మారుపేరైన హనిమన్‌ పుట్టాడు, వైద్యం చేశాడు. అయినప్పటికీ జర్మన్లు మన ఆయుర్వేదంతో వుత్తేజం పొందారని ప్రచారకులు చెప్పిందాన్ని మనం నమ్మాలి. సహజ పద్దతులలో జోక్యం చేసుకోవటంగా గర్భశుద్ధిని పరిగణించరాదని, ఆయుర్వేద పద్దతి ప్రకారం దాన్ని చేస్తున్నామని, మనకు కావలసిన బలిష్టులైన, తెలివి తేటలు గల పిల్లలను ఎలా పుట్టించవచ్చో ఆయుర్వేదంలో వుందంటూ, ఆరో నెలలో ఐక్యూ (తెలివితేటలు) అభివృద్ధి అవుతుందని, అయితే అందుకు తల్లులు నిర్ధేశిత పద్దతి ప్రకారం చెప్పిన దాని ప్రకారం తినటం, వినటం, చదవటం వంటివి చేయాలని కరిష్మా చెప్పారు. ఇలా చేస్తే జన్యుపరమైన లోపాలను మరమ్మతు చేసి బిడ్డలకు రాకుండా చేయవచ్చట. దానికి గాను మూడు నెలల్లో శుద్ధి ప్రక్రియను రెండు దశలలో చేయాలట. ఒకటి నాడీ శుద్ధి, రెండవది దేహశుద్ధి. వాటి ప్రకారం పురుషుడి వీర్యం, స్త్రీ అండాన్ని ముందుగా శుద్ధి చేసి జన్యుపరమైన లోపాలేమైనా వుంటే సరి చేసి బిడ్డకు రాకుండా చేస్తారు. తరువాత శాస్త్రాలలో పేర్కొన్నదాని ప్రకారం జాతకాలు, గ్రహాల స్ధితి గతులను బట్టి భార్యా భర్తలు ఏ సమయంలో కలవాలో వుత్తమ సంతతి ప్రాజెక్టు వైద్యులు నిర్ణయిస్తారట. దాని ప్రకారం వారు కలవాలి. గర్భధారణ నిర్ధారణ అయిన తరువాత ఏ ఆహారం తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో నిర్ధేశిస్తారు. ఆ ప్రకారం చేస్తే ఆ మహిళ వుత్తమ సంతితికి జన్మనిస్తుంది. అశోక్‌ కుమార్‌ వర్షనే అనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకుడు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినదాని ప్రకారం గర్భ సమయంలో మహిళ శ్లోకాలు, మంత్రాలను జపిస్తే అది బిడ్డ మానసిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆమె అలాంటి జీవితాన్ని ఆ సమయంలో గడిపిత పిల్లలు అదనంగా మూడు వందల గ్రాములు పెరుగుతారు, పురుటి నొప్పులు రాకుండా ప్రసతవం అవుతుందట. ఇంతకూ ఈ ప్రక్రియ ఎలా వెలుగులోకి వచ్చిందీ ?. గర్భ సంస్కారాన్ని నలభై సంవత్సరాల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్ధాంత వేత్త ఒకరు జర్మనీ మాతృమూర్తిగా పరిగణించబడే ఒక మహిళను కలసినపుడు ఆమె వివరించిందట.మీరు భారత్‌ నుంచి వచ్చారు కదా అభిమన్యుడి గురించి వినలేదా అని అడిగి తమ దేశంలోని నూతన తరం గర్భ సంస్కారం ద్వారా పుట్టిన కారణంగానే తమ దేశం ఇంతగా అభివృద్ధి చెందిందని చెప్పిందట. అయితే ఆమె ఎవరో లేదా ఆమెను కలిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడి పేరు అశోక్‌ కుమార్‌ చెప్పలేదు. గర్భంలో వుండగానే అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించటం గురించి వినటానికి కారణం గర్భ సంస్కారమే అని అందువలన దానిని పాటిస్తే పుట్టక ముందే పిల్లలకు ముందే అన్నీ నేర్పవచ్చన్నది అంతరార్ధం.ఈ విషయం సదరు ప్రచారకుడికి జర్మనీ వెళితే కాని ‘జ్ఞానోదయం’ కాలేదన్నమాట!

బుర్ర శుద్ధి చేసుకుంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. హిందువుగా పుట్టు హిందువుగా జీవించు అన్న నినాదం ఇటుకల గోడలతో పాటు ఫేస్‌బుక్‌ గోడల నిండా సంఘపరివార్‌ సంస్ధలు చెడరాశాయి. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గర్భ శుద్ధి కార్యక్రమం ఒక్క హిందువులకేనా, ఇతర మతాల వారికి కూడా విస్తరిస్తారా ? శ్లోకాలు, మంత్రాలు పలకటం రాని వారి సంగతి ఏమిటి ? హిందువులలోనే తమ కులం, గోత్రం కాని వారితో వివాహాలు చేసుకుంటే అమ్మాయిలు, అబ్బాయిలను పట్టుకొని హతమారుస్తున్న పరిస్ధితులు వున్నపుడు తమ కంటే తక్కువ అని భావించే కులాల వారికి కూడా వుత్తమ సంతతిని పుట్టించటాన్ని అగ్రకులాలనుకొనే వారు సహిస్తారా ? ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ సంస్ధ అయిన పూర్వపు జన సంఘం, తరువాత జనతా పార్టీలో విలీనమైన ఆ భాగం, తరువాత దాని నుంచి బయటకు వచ్చి బిజెపిగా ఏర్పడిన వారు కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేయాలని చెబుతున్నారు. తామే అసలు సిసలు అయిన దేశ భక్తులమని నొక్కివక్కాణిస్తున్నారు. తమది నిర్మాణాత్మక కార్యక్రమం అని కూడా చెప్పుకుంటారు. అలాంటి వారికి వుత్తమ సంతతి ద్వారా జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అభివృద్ధి చెందిన విషయం 40 ఏండ్ల నాడే తెలిసినపుడు వెంటనే ఎందుకు ప్రారంభించలేదు? ప్రారంభించి వుంటే ఇప్పటికి నలభై సంవత్సరాల వయస్సున్న వారందరిలో కనీసం సగం మంది అయినా వుత్తమ సంతతిగా తయారై దేశానికి ఎంతో మేలు జరిగి వుండేది. ప్రపంచంలో అగ్రస్ధానంలో వుండే అవకాశాలను ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు దెబ్బతీశారు.తమ స్వంత పాలకుడు ప్రధాని అయిన తరువాతనే తమ వద్ద వున్న పురాతన పరిజ్ఞానాన్ని బయటకు తీయాలనే సంకుచిత ధోరణులకు గురైనట్లు కనిపిస్తోంది. జపాన్‌ కూడా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఎలక్ట్రానిక్స్‌, ఆటో, నిర్మాణం వంటి అనేక రంగాలలో అభివృద్ధి చెందింది. మరి వారు ఏ ప్రక్రియతో వుత్తమ సంతతిని పుట్టించారు. ఐటిని అభివృద్ధి చేసిన అమెరికన్లు వుత్తమ సంతతిని ఎలా పొందారు. ఆర్ధికంగా రెండో స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టటానికి చైనీయులు ప్రత్యేకంగా వుత్తమ సంతతిని పుట్టించినట్లు మనం ఎక్కడా చదవలేదు.

చరిత్రలో ఏ దేశం కూడా పటిష్టంగా వుండటానికి ఇలాంటి వుత్తమ సంతతిని పుట్టించే కార్యక్రమం చేపట్ట లేదు. అలాంటపుడు ఇదేమి వెర్రి ! గర్భ సంస్కారం ద్వారా వున్నత సంతతిని పుట్టిస్తామని చెప్పటమే ఆశాస్త్రీయం. మన పురాతన గ్రంధాలలో వున్నదానినే తాము బయటకు తీస్తున్నామని చెప్పే నకిలీ శాస్త్రవేత్తల బండారాన్ని శాస్త్రీయ జ్ఞానంపై ఆధారపడిన వారు బయటపెట్టాల్సిన అవసరం వుందో లేక గిరీశం తరగతిలో చేరిపోవాలో తేల్చుకోవాలి. ఆమెగానో అతడిగానో వుండాలి తప్ప దాన్నీ నమ్ముతాము, దీన్నీ నమ్ముతాము అంటూ అటూ ఇటూ గాకుండా వుంటే ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడేండ్ల పాలన-తగ్గుతున్న మోజు !

16 Tuesday May 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP-led NDA, cotton farmers, Modi’s 3 years rule, Narendra Modi, Narendra Modi’s 3 years performance, NDA

ఎం కోటేశ్వరరావు

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న ఆసక్తి జనాలలో కలగటంపై సామాజిక మీడియాలో కొందరు వ్యంగ్యంతో సహా తమకు నచ్చిన రూపాలలో స్పందించారు. ఈ రెండు అంశాలూ చైతన్య సూచికకు సంబంధించినవి. నిరాశా జీవికి గ్లాసులో నీళ్లు సగమే అనిపిస్తాయి. ఆశాజీవికి ఆ సగమే ధైర్యాన్నిస్తాయి. కట్టప్ప-బాహుబలికి సంబంధించి రాజమౌళి ఆసక్తి రేపి దాన్ని సొమ్ము చేసుకోవటంలో కొత్త రికార్డు సాధించాడు. మూడు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ అంతకంటే పెద్ద ప్రచార వ్యూహంతో, కట్టుకధలతో న్యూఢిల్లీ బాహుబలి బిగినింగు (ప్రారంభం) విజయం సాధించింది. మైనారిటీ ఓట్లా మెజారిటీ ఓట్లతోనా అన్న విషయాన్ని పక్కన పెడితే మైనారిటీ ఓట్లతోనే అయినప్పటికీ గత మూడు దశాబ్దాల దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ స్వంతంగా లోక్‌సభలో మెజారిటీ సాధించింది బిజెపి, దానికి సారధిగా మోడీ అన్నది తెలిసిందే. రాజమౌళి రెండో భాగాన్ని కూడా విజయవంతం చేశారు. ఒక కల్పిత కథతో నిర్మించిన సినిమా గురించి ఇంత ఆసక్తి పెంచుకున్న జనాలు తమ జీవితాలను ప్రభావితం చేస్తున్న వాస్తవ అంశాలపై ఎందుకు ఆసక్తి చూపటం లేదు అన్నది కాస్త బుర్రలో గుంజు వున్నవారికి కలగటం సహజం. వారికి ఒక దండవేస్తే అలాంటి ఆలోచనలను దరిదాపులలోకి రానివ్వని వారికి వంద దండలు వేద్దాం. తన సినిమా గురించి ఆసక్తి కలిగించటానికి రాజమౌళికి మీడియా ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయన కూడా తనవంతు చేయాల్సింది చేశారు. న్యూఢిల్లీ బాహుబలి ఏం చేస్తున్నారు అని జనాలు ఆలోచించకుండా ఆసక్తిని వేరే వైపు మళ్లించటానికి మీడియా చేయాల్సిందంతా చేస్తోంది. అందుకు ఎన్నో రెట్ల ప్రతిఫలం కూడా అందుకుంటోంది. అదే రాజమౌళి-నరేంద్రమోడీకి వున్న తేడా అనిపిస్తోంది. మోడీ బాహుబలి కంక్లూషన్‌( ముగింపు) ఎలా వుండబోతోంది అన్నది ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో పాలకులు మీడియాను నయానో భయానో తమ చేతుల్లోకి తీసుకున్నారు. స్త్రోత్ర పాఠాలు, విజయగానాలు తప్ప మరొకటి వినిపించటం లేదు.

మోడీ మూడు సంవత్సరాల పాలన గురించి సర్వేలు వెలువడుతున్నాయి.చరిత్రలో హిట్లర్‌ను ఇప్పటికీ అభిమానించే వారు, అసహ్యించుకొనే వారు ఎలా వుంటారో చరిత్రలో పేరుమోసిన ప్రతివారికీ అభిమానులు, వ్యతిరేకులు ఎప్పుడూ వుంటారు.తన తండ్రిని స్మగ్లర్‌గా, అధోజగత్తు నేతగా చిత్రిస్తూ సినిమా తీస్తే వూరుకోబోనని, అటువంటి కార్యకలాపాలకు ఏ కోర్టూ అతనిని శిక్షించలేదని గుర్తు చేస్తూ హాజీ మస్తాన్‌ అనే మస్తాన్‌ మీర్జా పెంపుడు కొడుకుగా చెప్పుకున్న ఒక వ్యక్తి రజనీకాంత్‌ను హెచ్చరిస్తూ లేఖ రాసిన వార్తలను చదివాం. గుజరాత్‌ మారణకాండకు నరేంద్రమోడీ కారకుడని వూరూ వాడా కోడై కూసిన విషయం, అమెరికా తన గడ్డమీద అడుగు పెట్టనివ్వని విషయం తెలిసిందే. హాజీ మస్తాన్‌ కొడుకు మాదిరే తాము మోడీ పెంపుడు కొడుకులం అని చెప్పుకోకపోయినా సరిగ్గా ఇదే మాదిరి నరేంద్రమోడీని ఏ కోర్టూ తప్పు పట్టలేదు కనుక గుజరాత్‌ మారణకాండకు బాధ్యుడు అంటే సహించబోమని సామాజిక మీడియాలో ఇప్పటికీ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. అంటే చట్టం-అభిమానుల దృష్టిలో ఇద్దరూ మచ్చ లేనివారే !

మూడు సంవత్సరాల క్రితం అటు కేంద్రంలో నరేంద్రమోడీ, ఇటు తెలుగురాష్ట్రాలలో ఇద్దరు చంద్రులు అల్లావుద్దీను కంటే ఎక్కువగా రాజకీయ రంగంలో అద్బుతాలు చూపుతామని వాగ్దానాలు చేశారు. అవేమయ్యాయి, వారు దీపాన్ని రుద్దినట్లు జనం ముందు చూపటం తప్ప అద్బుతాలు కనిపించటం లేదు. నిజం మాట్లాడాల్సి వస్తే అసలు అద్బుతాలు చూపమని వారిని ఎవరు అడిగారు. చెప్పారు పో, ఎందుకు చూపటం లేదని అడిగేందుకు ముందుకు రాలేనంతగా మన జనం ఎందుకు నీరసించి పోతున్నారు అన్నది ఒక ప్రశ్న. దానికి ఈ మధ్య కొందరు చెబుతున్న సమాధానం ఏమంటే మన దేశంలో ‘వుత్తమ సంతతి’ తగ్గిపోయింది, అందువలన అలాంటి వారిని పుట్టించేందుకు ‘గర్భ సంస్కారం’ చేయాలి అంటూ కొందరు తయారయ్యారు, మనల్నందరినీ పనికిరాని వారిగా చిత్రిస్తున్న వారి గురించి తరువాత చూద్దాం.

మోడీ హయాంలో జనాన్ని బాగా ఆకట్టుకున్నదీ, అతి పెద్ద సంస్కరణగా చిత్రించినదీ, చర్చ జరిగిన అంశం పెద్ద నోట్ల రద్దు. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దు ద్వారా దేశంలో అవినీతిని అరికడతామని, నల్లధనాన్ని బయట పెడతామని చెప్పారు. నల్లధనం రద్దుతో పాటు ధరలు తగ్గుతాయి, కార్డులను గీకటం ద్వారా పన్ను వసూలు పెరుగుతుంది, కాశ్మీరులో రాళ్లు వేయటం ఆగిపోయింది, నక్సలైట్లకు డబ్లు ఇచ్చే మార్గాలు బందు అయిపోయాయి. అన్ని రకాల వుగ్రదాడులు తగ్గుతాయి వంటి కబుర్లన్నీ విన్నత తరువాత పాఠశాల రోజుల్లో అశోకుడి చెట్లు, ఆవు-ప్రయోజనాలేమిటి అంటే టీచర్లను మెప్పించేందుకు ఠావుల కొద్దీ రాసిన వ్యాసాలు మరోసారి గుర్తుకు వచ్చాయి. ఇవేమీ జరగవు, నోట్ల రద్దు వలన జనానికి ఇబ్బందులు, కొత్త నోట్ల ముద్రణకు చేతి చమురు వదలటం తప్ప ఒరిగేదేమీ వుండదు అని చెప్పిన వారిని నల్ల ధన కుబేరులకు మద్దతు పలికేవారుగానూ, నల్లధనంతో లబ్ది పోతోందనే వుక్రోషంతో చెబుతున్న మాటలుగానో చెప్పటంతో పాటు నోట్ల రద్దుకు మద్దతు ఇవ్వటం దేశ భక్తి అని చెప్పారు.

ఇంకేముంది బ్యాంకుల ముందు క్యూలలో నిలబడుతూ పొరపాటున ఎవరైనా నోట్ల రద్దును తప్పుపడితే వారిపై జనం విరుచుకుపడ్డారు. ఏం కొద్ది రోజులు ఇబ్బంది పడలేరా, ఓపిక పట్టలేరా అంటూ మందలించారు. అయినా తప్పన్న వారిని ఎయిడ్స్‌ వ్యాధి వచ్చిన వారి మాదిరి చీదరించుకున్నారు. సినిమాలో మంచి వాడనుకున్న బాహుబలిని కట్టప్ప చంపాడు. నిజ జీవితంలో వెంకయ్య నాయుడి మాటల్లో చెప్పాలంటే భారతీయుల బతుకులు బాగు చేసేందుకు వచ్చిన దేవదూత నరేంద్రమోడీ అనే బాహుబలి పెద్ద నోట్లు అనే శత్రువును సంహరించి దేశానికి దీపావళిని తెచ్చాడు. మంచిదే !

పాత నోట్ల మార్పిడి గడువు వరకు వాటి ప్రయోజనాల గురించి మాట్లాడిన మోడీ తరువాత ఒక్క మాట చెబితే ఒట్టు ! ఎందుకు మాట్లాడటం లేదు? రిజర్వుబ్యాంకు దగ్గరకు వచ్చిన పాత నోట్ల విలువ ఎంత? నల్లధనం ఎంత బయట పడింది? దానిని ఏ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు? కొత్త నోట్ల ముద్రణ ఎంతకాలం పడుతుంది? నోట్ల రద్దుకు ముందు మాదిరి ఎటిఎంలలో సరిపడా నోట్లు పెట్టటానికి ఎంతకాలం పడుతుంది? ఇవేవీ జాతీయ లేదా ప్రాంతీయ మీడియాకు పట్టలేదు.అసలేమీ జరగనట్లే, అంతా బాగున్నట్లే అన్నట్లుగా మోడీ భజనలో మునిగిపోయింది. నవంబరులో జరిగే నోట్ల రద్దు తొలి వార్షికోత్సవం నాటికి అవసరమైన నోట్లు అందుబాటులో వుంటాయని సం’ తృప్తి చెందుదాం. తెలివయ్య అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు అన్నట్లుగా ప్రధాని చర్యను చూద్దాం !

రైతే రాజు, దేశానికి వెన్నెముక అనే నినాదాలు పాత బడ్డాయి. ఎందుకంటే రైతుల వెన్నెముకలు విరిగాయని గత ఏడు దశాబ్దాలలో తేలిపోయింది. అందువలన 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని నరేంద్రమోడీ కొత్త పల్లవి అందుకున్నారు. గుడ్డి కంటే మెల్ల ఎన్నో రెట్లు అన్న వేదాంతులం మనం. గత సంవత్సరాల గుడ్డి కంటే ముగిసిన పత్తి సీజన్‌లో ధరలు కొంత మెరుగ్గా వున్నాయని రైతులు సంతోషం వెలిబుచ్చారు. అయితే ఆ మేరకు మిర్చి రైతులకు ఆత్మహత్యల దారి చూపారనుకోండి. పత్తి ధర విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం 2010-11 జె 4 అనే పొట్టి పింజరకం వార్షిక సగటు క్వింటాలు రు.5,771 వుంటే తెలుగు రాష్ట్రాలలో సాగు చేసే పొడవు పింజరకాలకు సమానమైన ఎస్‌ 6 రు.5,271 వుంది. అప్పటికీ ఇప్పటికీ పెరిగిన ఖర్చులు, రైతాంగ అవసరాలను చూసుకుంటే కనీసం ఏడెనిమిది వేల రూపాయలైనా రావాల్సి వుంది. అయితే సీజన్‌లో బాగా తగ్గి తరువాత ఐదున్నరవేలకు పెరిగి కొంత మంది రైతులను సంతోష పెట్టి తరువాత తగ్గిందనుకోండి. ఇంకాస్త పెరగటానికి వున్న అవకాశాలను నరేంద్రమోడీ సర్కార్‌ దెబ్బతీసింది అనే విషయం మన రైతు బిడ్డలు వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు మనకు చెప్పటం లేదు. దేశంలో పత్తి ధరలు పెరుగుతున్నప్పడల్లా దిగుమతులకు అనుమతించి రైతులను ఏడిపించి, మిల్లర్లను సంతోషపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు నరేంద్రమోడీ సర్కార్‌ ఎంత గుండెలు తీసిన బంటు అంటే పత్తి దిగుమతులలో గత వాజ్‌పేయి సర్కార్‌ 2001-02లో 25లక్షల బేళ్లతో రికార్డు దిగుమతులు చేసుకుంది. ఇప్పుడు 30లక్షలతో నరేంద్రమోడీ తన గురువు రికార్డును బద్దలు కొట్టారు.ఎవరికైనా అనుమానం వుంటే దిగువ లింక్‌లోని వార్త చదవండి.http://www.yarnsandfibers.com/news/textile-news/cotton-imports-touch-all-time-high-30-lakh-bales-season#.WRpwfcYlE2w అందువలన రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని అంటే నమ్మాలో లేదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

లోకల్‌ సర్కిల్స్‌ అనే ఒక వేదిక రెండు లక్షల మంది ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయ సేకరణ ఫలితాలంటూ ఒక నివేదికను నరేంద్రమోడీ మూడు సంవత్సరాల పాలనపై తాజాగా విడుదల చేసింది. దానికి ఎలాంటి దురుద్ధేశ్యాలను, సదుద్ధేశ్యాలను అంట కట్టటం లేదు. ఇంకా ఇలాంటివి ఎన్నో రావచ్చు. దాని వివరాల ప్రకారం జనం ఎలా వున్నారో చూద్దాం. ద్రవ్యోల్బణం మూడుశాతానికి తగ్గినప్పటికీ ధరలు పెరుగుతున్నాయని 66శాతం మంది చెప్పారు, గతేడాది కంటే 11శాతం వీరి సంఖ్య పెరిగింది. వుపాధి కల్పన గురించి అసంతృప్తి చెందిన వారి సంఖ్య 43నుంచి 63శాతానికి పెరిగింది. అవునని చెప్పిన వారు 35 నుంచి కేవలం 21శాతానికి తగ్గారు. నోట్ల రద్దు వలన అవినీతి తగ్గిందని చెప్పిన వారు 39శాతం కాగా, సరైన చర్య అని చెప్పిన వారు 51శాతం మాత్రమే వున్నారు. మోడీ హయాంలో ప్రపంచంలో భారత ప్రతిష్ట పెరిగింది అని నమ్మిన వారు 90 నుంచి 81కి తగ్గగా లేదు, చెప్పలేము అన్నవారు 10 నుంచి 19శాతానికి పెరిగారు.పాకిస్ధాన్‌తో వ్యహరించిన తీరు బాగుంది అన్న వారు గతేడాది 34శాతం కాగా సర్జికల్‌ దాడుల తరువాత ప్రస్తుతం ఆ సంఖ్య 64శాతానికి పెరిగింది.దేశంలో అసహనం పెరుగుతోందా అన్న ప్రశ్నకు గతేడాది లేదని చెప్పిన 74శాతం తాజాగా 69కు పడిపోయింది. మొత్తం మీద 61శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆశాభంగం చెందిన వారి సంఖ్య గతేడాదితో పోల్చితే 36 నుంచి 39కి పెరిగింది. వాగ్దానాలను నెరవేర్చగలరని నమ్ముతున్నవారు 59శాతం వున్నారు.

ఈ సర్వే వెల్లడించిన అంశాలను మొత్తంగా చూస్తే నరేంద్రమోడీ మీద ఇంకా విశ్వాసం వున్న వారు గణనీయంగా వున్నారు. ఇదే సమయంలో భ్రమలు కోల్పోతున్నవారు పెరుగుతున్నారు.అందుకు వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో సీట్లు దండిగా వచ్చినప్పటికీ ఓట్లు 2014 కంటే తక్కువ రావటం, గోవా, పంజాబులలో వున్న అధికారాన్ని కోల్పోవటం ఒక రుజువు. పైన పేర్కొన్న సర్వే ప్రకారం పాకనతో వ్యవహరిస్తున్న తీరును జనం మెచ్చుకుంటున్నారని తేలింది.అందువలన మిగతా రంగాలలో వైఫల్యాలు లేదా ముందుకు పోలేని స్ధితిలో పాకిస్ధాన్‌, కాశ్మీరు పరిస్ధితులను ముందుకు తెచ్చి మధ్యంతర ఎన్నికలలో ఓట్లను కొల్లగొట్టే పధకం వేస్తున్నట్లు కొందరు పరిశీలకులు ఇలాంటి సర్వేల వివరాలు వెల్లడి కాక ముందే అంచనావేశారు. పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. పాక్‌ రెచ్చగొట్టే చర్యలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాలనటం, తగిన బుద్ధి చెప్పాలనటంలో రెండో మాట లేదు.అదే సందర్భంలో వారి మాదిరి మన విశ్వహిందూ పరిషత్‌ తొగాడియా లాంటి వారు రెచ్చగొట్టే ప్రసంగాలు పరిస్థితిని మరింతగా దిగజార్చుతాయి తప్ప మెరుగుపరచవు. ఏదేశంతో అయినా సరిహద్దులలో ప్రశాంతత నెల కొల్పటంలోనే అసలైన రాజనీతి వుంటుంది. తగాదాలు పెట్టుకోవటం ఎంతసేపో పట్టదు. గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని చూపి ఓట్లను కొల్లగొట్టిన అనుభవంతో అలాంటి వాటినే పునరావృతం చేయాలనే తప్పుడు ఎత్తుగడలకు ఎవరైనా పాల్పడితే అది దేశ ద్రోహం అవుతుంది తప్ప దేశ భక్తి కాదు. సరిహద్దులలో వుద్రిక్తతలు కొనసాగితే నష్టపోయేది మన సైన్యం, పంజాబ్‌, కాశ్మీరు పౌరులు, అమెరికా నుంచి కొనే ఆయుధాలకు ఖజానా ఖాళీ తప్ప తొగాడియాలు, సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయే వారు కాదు. మన దగ్గర వున్న మాదిరే అణ్వాయుధాలు, క్షిపణులు వారి దగ్గరా పుష్కలంగా వున్నాయి. ఏ పొరుగుదేశాన్నీ ఆయుధాలను చూపి, ప్రయోగించి అదుపు చేయలేరన్నది మన కంటే ఎన్నో రెట్లు పెద్దదైన అమెరికా అనుభవం.

పెద్ద నోట్ల సందర్భంగా వుగ్రవాదులు అంటే కాశ్మీరులో, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు వాదులు, మిగతా చోట్ల నక్సల్‌ వుగ్రవాదుల చర్యలు తగ్గకపోగా అంతకు ముందు మాదిరిగానే జరుగుతున్నాయి. కాశ్మీరులో నోట్ల రద్దుకు ముందు కాలేజీ విద్యార్ధులే రాళ్లు విసిరితే ఇప్పుడు హైస్కూలు పిల్లలు కూడా అదే పని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. భద్రతా దళాలు తమ జీపు మీద ఒక యువకుడిని కట్టివేసి అతనిని రక్షణగా చేసుకొని ప్రయాణించిన వీడియోను ప్రపంచం యావత్తూ చూసింది. బహుశా ఎక్కడా ఇలాంటివి జరిగి వుండవు. వుగ్రవాద చర్యలు తగ్గిన దాఖలాలేమీ లేవు. ఎక్కడ అణచివేత పెరుగుతుందో అక్కడి జనం అంతగా వేరు పడిపోతారు, స్వార్దపరశక్తుల చేతులలో పావులుగా మారతారు. ఆఫ్‌ఘనిస్తాన్‌ అనుభవం అదే చెబుతోంది.తాలిబాన్లను అణచే పేరుతో అమెరికా, పాక్‌ దళాలు సామాన్య జనంపై దాడులు చేసిన కారణంగా అక్కడ తాలిబాన్లు తగ్గకపోగా పెరిగారు. విదేశాలకు విస్తరిస్తున్నారు.

నోట్ల రద్దుకు-వుగ్రవాదులకు సంబంధం లేదు, మోడీ బుర్ర నుంచి పుట్టింది తప్ప ఏ దేశంలోనూ అలా చెప్పలేదు. మోడీ చెప్పినట్లు డబ్బు అందటం ఆగిపోతే వారి కార్యకలాపాలన్నీ ఎలా సాగుతున్నాయి, పరిస్థితి మరింతగా ఎందుకు దిగజారింది అనే ప్రశ్నలు అడగలా వద్దా ? మన్‌కీ బాతంటూ తాను చెప్పదలచుకున్నదేదో చెప్పటం తప్ప దమ్మున్న కొద్ది మంది విలేకరులు అయినా అడిగేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రధాని పత్రికా గోష్టులు ఎందుకు పెట్టటం లేదు? నిజానికి వుగ్రవాద కార్యకలపాలు జరగటానికి పాలకులు కల్పించిన అనువైన పరిస్థితులే సగం వూతమిస్తున్నాయి. వాటిని విదేశాలు, విచ్చిన్న శక్తులు వుపయోగించుకుంటున్నాయి. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటును కోరుతున్నవారందరినీ వుగ్రవాద శక్తుల కింద జమకట్టి బలప్రయోగం చేస్తే ఫలితం కంటే జరిగే నష్టమే ఎక్కువ.రాళ్లు వేసే ప్రతివారూ దేశ ద్రోహులు అనుకుంటే అంతకంటే పిచ్చిపని మరొకటి లేదు.చేతులారా వుగ్రవాదాన్ని, వుగ్రవాదాన్ని పెంచి పోషించటం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా వుగ్రవాద ప్రభావ ప్రాంతాలలో జనాన్ని విశ్వాసంలోకి తీసుకొని వుగ్రవాదుల నిజస్వరూపాన్ని ఎండగట్టాలి. త్రిపురలో వామపక్ష ప్రభుత్వం అక్కడి వేర్పాటు, వుగ్రవాదులను శాంతి భద్రతల సమస్యగా చూడకుండా రాజకీయ వైఖరితో తీసుకున్న చర్యలు వారిని అదుపులోకి తెచ్చాయన్నది తెలిసిందే. అటువంటి చర్యలు మిగతా ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, కాశ్మీరులో లేని కారణంగానే అవాంఛనీయ శక్తులు చెలరేగుతున్నాయి.అమాయక యువత బలౌతోంది.

పైన పేర్కొన్న సర్వే వెలుగులో చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో విజయాలు చెప్పుకొనేందుకేమీ కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతసేపూ నూతన రాజధాని నిర్మాణం, పోలవరం చుట్టూ, తెలంగాణాలో మిషన్‌ కాకతీయ, భగీరధో అంటూ ప్రాజక్టుల అంచనాలు పెంచటం తప్ప మరొకటి పట్టలేదు. ఇవన్నీ కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల మధ్య పంపకాలకు తెరతీసే మెగా ప్రాజక్టులు తప్ప వేరు కాదు. ఐటి రంగంలో దాదాపు అన్ని కంపెనీలు వయసుపై బడిన వుద్యోగులను వూడబెరికే పనిలో పడినట్లు, రానున్న రోజుల్లో అది మరింతగా పెరగనున్నదని వార్తలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఐటి కంపెనీల సృష్టి జరుగుతోందన్నట్లు , దానికి చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడు లోకేష్‌ నడుం కట్టినట్లు చూపేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతోంది. లక్షల కోట్ల మేరకు కుదుర్చుకున్నట్లు చెబుతున్న అవగాహనా ఒప్పందాలేమయ్యాయో, వుద్యోగాలెక్కడున్నాయో తెలియదు. వాటన్నింటి గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో అమెరికా పర్యటనలో తెలుసుకున్న సరికొత్త సాంకేతిక అంశాల గురించి జనానికి చెబుతున్నారు. అవి ఆయన కొత్తగా తెలుసుకున్నారేమో తప్ప జనానికి పాతవే. అవన్నీ వుపాధి రహిత వుత్పిత్తికి తోడ్పడేవే.ఆ కారణంగానే అమెరికాలో ట్రంప్‌ కొత్త వుద్యోగాలు ఇవ్వలేక విదేశీయుల రాకపై ఆంక్షలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడికి మూడవ సంవత్సర కానుకగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జగన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీని బిజెపి ఇచ్చింది. నరేంద్రమోడీ ఎవరు ఎపుడు అడిగినా ఇంటర్వ్యూలు ఇస్తూ వున్నట్లయితే దానికి పెద్ద ప్రాధాన్యత వుండేది కాదు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో ఒక సంచలనం. అది ఎటువైపు పయనిస్తుందన్నది చూడాల్సి వుంది. పైకి ఏమి చెప్పినా ప్రధాన రాజకీయపార్టీలన్నీ రాజకీయ లాభ నష్టాల లెక్కలలో వున్నాయి. అవి ఒక కొలిక్కి వస్తే రాజకీయాలలో కిక్కు ఎక్కుతుంది.

తెలంగాణా విషయానికి వస్తే గత ప్రభుత్వాలు లేదా అనుకూల పరిస్ధితుల కారణంగా హైదరాబాదులో అభివృద్ధి చెందిన ఐటి, ఐటి అనుబంధ పరిశ్రమలు, సహజంగానే వున్న అభివృద్ధి చెందిన ఫార్మా, ఇతర పరిశ్రమల కారణంగా చంద్రశేఖరరావు సర్కారు గత మూడు సంవత్సరాలుగా నెట్టుకు వచ్చింది. చేసిన వాగ్దానాలు గాలికిపోయాయి. దళితులకు భూమి, రెండు పడకగదుల ఇళ్లు, ప్రాజక్టుల నిర్మాణం, నీళ్లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వున్నాయి.వుద్యోగాల విషయానికి వస్తే మూడు నోటిఫికేషన్ల విడుదల ఆరునోటిఫికేషన్ల రద్దు మాదిరి వుంది. మిర్చి ధర పతనం గురించి ఆందోళనకు దిగిన రైతుల చేతికి బేడీలు వేసి నిరసన తెలిపిన వారికి ఇదే గతి అన్నట్లుగా అవమానకరంగా పోలీసులు వీధులలో తిప్పిన వుదంతం చంద్రశేఖరరావు సర్కార్‌ రైతులకు చేసిన వాగ్దానలన్నింటినీ తుడిచిపెట్టింది. ఇదేమని అన్యాయం అని అడగటానికి, నోరెత్తటానికి వీలు లేకుండా ఇందిరా పార్కువద్ద వున్న ఏర్పాటు చేసిన ధర్నా చౌక్‌ను ఎత్తివేసి నిరసన గళం విప్పటానికి వీలు లేకుండా చేసేందుకు ఆంక్షలు జారీ చేశారు. ధర్నా చౌకు తమకు ఆటంకంగా వుందంటూ కాలనీ వాసుల పేరుతో ఒక మహిళా సిఐ, కానిస్టేబుళ్లతో సాధారణ దుస్తులు వేయించి పోటీ ధర్నా చేయించటం గమనించాల్సిన అంశం. నగర పోలీసు అధికారులు అంత బుర్రతక్కువ పధకాలు ఎలా వేసినట్లు ? అసలు ధర్నాలకు అనుమతి ఇవ్వని పోలీసులు పోటీ ధర్నాను ఎందుకు అనుమతించినట్లు ? రాజకీయంగా టిఆర్‌ఎస్‌ నాయకత్వం సంతృప్తి చెందే అంశం ప్రతిపక్షాలలో చీలిక. తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు పూనుకున్న బిజెపి పెద్దన్న పాత్ర వహించి అనుచర పార్టీగా తెలుగుదేశం పార్టీని తయారు చేసుకోవచ్చు.ఈ క్రమంలోనే కేంద్రంలో బిజెపికి దగ్గర కావాలని చూస్తున్న తెరాసను దరి చేరనివ్వటం లేదు. పోయిన ప్రాభవాన్ని తెచ్చుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించవచ్చు. కాన్ని ప్రాంతాలకు పరిమితమైన వామపక్షాలు తమ బలాన్ని కాపాడుకొనేందుకు పూనుకుంటే మైనారిటీ ఓట్లతో తిరిగి అధికారానికి రాగలమన్నది తెరాస ధీమా. అందుకే ఆ పార్టీ చుట్టూ రాజకీయ తూనీగలు చేరుతున్నాయి. రెండు రాష్ట్రాలలోనూ ప్రజాందోళనలను అణచటం ఒకే విధంగా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడ వామపక్షాలు, వైఎస్‌ఆర్‌సిపి నేతలను ముందుగానే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దానికి ఎలాంటి కారణాలు వుండటం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇతర మంత్రులను డమ్మీలుగా చేసి తమ కుమారులను యువరాజుల మాదిరి తిప్పుతున్నారు. ఒక పధకం ప్రకారం వారి ప్రతిష్టను పెంచేందుకు పూనుకున్నారు. కేంద్రంలోని బిజెపికి రాజకీయంగా లొంగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

జిఎస్‌టితో ప్రారంభంలో రేట్లు పెరుగుతాయని ముందే చెబుతున్నారు. మేకిన్‌ ఇండియా, వుపాధి కల్పన, నోట్ల రద్దు బండారం వంటి అన్ని అంశాలు మరింత వేగంగా బహిర్గతం గాక తప్పదు. నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ఇద్దరు చంద్రుల మూడు సంవత్సరాల పాలనను మొత్తంగా చూస్తే భ్రమలు కోల్పోయే రేటు వేగం అందుకునే స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే అంతటా మధ్యంతర ఎన్నికల ఎత్తులు, జిత్తులతో పాలకులు, పార్టీల నేతలూ వున్నారు.

గమనిక : ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాసిన వ్యాసమిది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాలిఫోర్నియా ప్రభుత్వ వుద్యోగాలలో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేత !

14 Sunday May 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Anti communist, California state, California state assembly, Communists, Oakland Democrat Rob Bonta, The first Red Scare

ఎం కోటేశ్వరరావు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రభుత్వ వుద్యోగాలలో కమ్యూనిస్టులు పని చేయటంపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ మేనెల ఎనిమిదవ తేదీన ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తదుపరి శాసన మండలి ఆమోదం పొందితే అది అమలులోకి వస్తుంది. కమ్యూనిస్టులకు ఇది సంతోషకరమైన వార్త అయితే మింగుడుపడని వ్యతిరేకులు గుండెలు బాదుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచాన్ని కమ్యూనిజం ఆవహిస్తోందంటూ భయపడిన అమెరికన్‌ పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక, నిషేధ చట్టాలను చేసింది. వుద్యోగం, వుపాధి, కార్మిక, కళా ఇలా ఒకటేమిటి అన్ని జీవన రంగాలలో అనేక లక్షల మందిని కమ్యూనిస్టులు అన్న అనుమానాలతో వెంటాడి వేధించింది. ఇప్పటికీ వేధిస్తోంది, న్యూయార్క్‌ నగరంలో ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమ్యూనిస్టు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణతో అక్కడి విద్యాశాఖ విచారణ చేపట్టిన విషయం, దానిని ఆపాలని కోరితే కోర్టు తిరస్కరించిన వుదంతం ఇదే సమయంలో జరిగింది.

మరోవైపున అమెరికాలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు తమ ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా ఫ్రీడం ఫెస్టివల్‌ పేరుతో జరిపే కార్యక్రమాలలో భాగంగా ఈ ఏడాది ‘వందేళ్ల భావజాల పోరులో పెట్టుబడిదారీ విధానమా ? మ్యూనిజమా ఎవరు గెలిచారు?’ అనేపేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తూర్పు ఐరోపా, సోవియట్‌లో సోషలిజాన్ని కూల్చివేసిన సమయంలో రాబర్ట్‌ హెయిల్‌బర్టన్‌ అనే అమెరికన్‌ ఆర్ధికవేత్త న్యూయార్కర్‌ అనే పత్రికలో రాసిన వ్యాసంలో ‘పెట్టుబడిదారీ విధానం-సోషలిజం మధ్య యుద్ధం ముగిసింది. సోషలిజం విఫలమైంది, పెట్టుబడిదారీ విధానం విజయం సాధించింది. దీంతో చరిత్ర ముగసింది ‘ అని రాశాడు. ఆ పెద్దమనిషి 2005లో 85 ఏండ్ల వయస్సులో వృద్ధాప్యంతో మరణించాడు. ఇన్ని సంవత్సరాల తరువాత ఎవరు విజయం సాధించారు అనే చర్చకు ఆ పెద్దమనిషి వారసులైన కమ్యూనిస్టు వ్యతిరేకులు తెరతీశారంటే అనుకున్న, ఆశించిన దానికి భిన్నంగా జరుగుతోందనే అనుమానం వారిలో తలెత్తినట్లే !

కాలిఫోర్నియా అసెంబ్లీలోని డెమోక్రటిక్‌ పార్టీ సభ్యుడు రోబ్‌ బోంటా గతేడాది డిసెంబరులో కమ్యూనిస్టులపై నిషేధం ఎత్తివేయాలనే బిల్లును ప్రవేశపెట్టాడు. కమ్యూనిస్టు అనే ముద్ర పాతదైన పుక్కిటి పురాణ ప్రస్తావన వంటిది. దానిని దుర్వినియోగం చేసే అవకాశం వుంది, నిర్మొగమాటంగా చెప్పాలంటే గతంలో మన చరిత్రలోని కొన్ని చీకటి అధ్యాయాలలో అది జరిగింది, అందువలన సాంకేతికంగా దానిని తీసివేయాల్సి వుంది అని తన బిల్లు వుద్దేశ్యాన్ని వివరించాడు. ఈ సవరణ ప్రకారం కమ్యూనిస్టు పార్టీ సభ్యులు అనే పదాన్ని మాత్రమే తొలగిస్తారు. హింసా మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసే ఏ సంస్ధ సభ్యుల నైనా ప్రభుత్వ వుద్యోగాల నుంచి తొలగించ వచ్చు అనే నిబంధన ఇక ముందు కూడా కొనసాగుతుంది. కమ్యూనిస్టుల నుంచి ఇప్పటికీ ముప్పు వుందని ఆ పదాన్ని తొలగించటం మొత్తం కాలిఫోర్నియన్లను అవమానించటమే అని రెచ్చగొట్టే విధంగా కొందరు రిపబ్లికన్‌ సభ్యులు వ్యాఖ్యానించారు.

ఆండ్రూ మిల్లర్‌ అనే వ్యాఖ్యాత ఒక పత్రికలో ఇలా గగ్గోలు పెట్టాడు. ‘1991లో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయినపుడు అమెరికా విశ్వవిద్యాలయాలలో తప్ప ప్రతి చోటా మార్క్సిజం చచ్చిపోయింది అని కొంత మంది జోకు వేశారు. ఇరవైఆరు సంవత్సరాల తరువాత విద్యావేత్తల వలయం నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. కాలిఫోర్నియా సెనెట్‌(మన శాసనమండలి మాదిరి)లో ఈ బిల్లు విజయవంతంగా ఆమోదించబడుతుందా లేదా అన్నది తార్కికాంశం. ఒక వాస్తవం ఏమంటే త్వరలో కమ్యూనిస్టులు త్వరలో అధికారానికి వస్తారా అన్నది రాజకీయాలలో గొప్ప ప్రాధాన్యత వున్న అంశం కాదు. ఎన్నికలలో మార్క్సిజాన్ని కూడా సాధ్యమైన అంశంగానే పరిగణిచాలని నమ్మేంత వరకు అమెరికా సంస్కృతి రావటమే భయంగొలుపుతున్న వాస్తవం. 2006లో జరిగిన ఒక సర్వే ప్రకారం అమెరికన్‌ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లలో మూడు శాతం మంది స్వయంగా తాము మార్క్సిస్టులమని చెప్పుకున్నారు. హ్యుమానిటీస్‌ ప్రొఫెసర్లలో ఐదుశాతం, సామాజిక శాస్త్రాల వారిలో 18శాతం వున్నారు. మితవాదులతో పోల్చితే ఒక సామాజిక శాస్త్ర ప్రొఫెసర్‌ తాను మార్క్సిస్టును అని మూడు రెట్లు ఎక్కువగా స్పష్టంగా చెబుతారని ఈ సర్వేలో తేలింది.2011లో రాస్‌ముసేన్‌ నివేదిక ప్రకారం వర్తమాన అమెరికా రాజకీయ, ఆర్ధిక వ్యవస్ధల కంటే నైతికంగా కమ్యూనిజం వున్నతమైందని అమెరికన్‌ ఓటర్లలో 11శాతం మంది భావించటం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదు………..అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌ దిగువ సభ)లో 14శాతం మంది అభ్యుదయగామి సభ్యులున్నారని డెమోక్రటిక్‌ సోషలిస్టులు కనుగొన్నారు. మార్క్సిజం మరణించలేదు అనటానికి ఇది పెరుగుతున్న సాక్ష్యం. అది అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో సజీవంగా వుంది సమాజంలోని ఇతర చోట్లకు విస్తరిస్తోంది…..1960 దశకపు ‘నూతన వామపక్ష విద్యార్ధి విప్లవకారులు’ ఇప్పుడు ఆధునిక డెమోక్రటిక్‌ పార్టీ నాయకులుగా వున్నారు. కాలిఫోర్నియాలోని అలంకార ప్రాయమైన రాజకీయ నేతల గురించే మనం మాట్లాడటం లేదు. ఈ విప్లవ నాయకులు నూతన సహ్రాబ్ది యువతరాన్ని ఆకర్షించేందుకు తమ పార్టీని మరింతగా వామపక్షం వైపునకు తీసుకుపోతున్నారు. ఈ సంఖ్య ఎక్కువగా డెమోక్రటిక్‌ మరియు చివరికి సోషలిస్టులవైపు మొగ్గితే ఈ వ్యూహం చివరికి పౌర అశాంతి మరియు హింసాత్మక విప్లవానికి దారితీస్తుంది.’అని మిల్లర్‌ హెచ్చరిక చేశాడు.https://www.thetrumpet.com/15791-california-mulls-communists-in-government

మరో కమ్యూనిస్టు వ్యతిరేకి మార్క్‌ స్కౌసెన్‌ ‘మ్యూనిజం ఎందుకు పని చేయదు, అయినా ఇప్పటికీ ఆకర్షిస్తోంది’ అనే శీర్షికతో ఒక పత్రికలో వ్యాసం రాశాడు. తాను మార్క్సిజం గురించి జీవిత కాలంలో ఎక్కువగా చదివానని చెప్పుకున్న ఆ పెద్దమనిషి తన తండ్రి కమ్యూనిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే ఎఫ్‌బిఐ ఏజంట్‌ లియోరీ స్కౌసెన్‌ అని, పినతండ్రి ది నేకెడ్‌ కమ్యూనిస్టు అనే పుస్తకం రాసిన క్లియోన్‌ స్కౌసెన్‌ అని స్వయంగా చెప్పుకున్నాడు కనుక అతనేమిటో చెప్పనవసరం లేదు. అనేక విషయాలను ఏకరువు పెడుతూ అయినప్పటికీ ఇంకా విప్లవకారులు ఆకర్షణీయంగానే వున్నారని అనేక విశ్వవిద్యాలయాలలో &ద్యార్ధులు చే గువేరా టీ షర్టులు ధరించటం, ప్రొఫెసర్లు మార్క్సిజం గురించి చెబుతున్నారని వాపోయాడు. ఫ్లోరిడాలోని రోలిన్స్‌ కాలేజీకి వెళ్లినపుడు ఎదురైన తన స్వంత అనుభవాన్ని ఇలా వివరించాడు. అక్కడి ఒక మార్క్సిస్టు ప్రొఫెసర్‌ను గుర్తించి నేను నీకు 1883 నాటి ఒక వెండి డాలర్‌ ఇస్తాను, అయితే దానిని ముద్రించిన సంవత్సరంలో మరణించిన ఒక ఆర్ధికవేత్త పేరు చెప్పాలి అని షరతు పెట్టాడట. వెంటనే ఓ అదెంతో సులభం, ఆయన కారల్‌ మార్క్స్‌ అని జవాబు వచ్చిందట. సరైనదే, ఎప్పుడూ మరచి పోవద్దు ఆయన మరణించాడు అన్నాడట.దానికి ఠకీమని ఆ ప్రొఫెసర్‌ ఇలా జవాబు చెప్పాడట.’ అవును మీరు చెప్పింది కరేక్టే, ఆయన మరణించాడు కానీ నేను బతికి వున్నాను, మార్క్సిజం లోని శక్తి, ప్రభావం వంటి గురించి మీ విద్యార్దులకు నేను బోధిస్తున్నాను ‘ అన్నాడట. అడిగిన పెద్దమనిషికి ఏమై వుంటుందో చెప్పనవసరం లేదు. వ్యక్తులు మరణించినంత మాత్రాన శాస్త్రీయ భావజాలాలు మరణిస్తాయి, వుద్యమాలు అంతరిస్తాయని భ్రమపడే చరిత్ర జ్ఞానం లేని లేదా తెలిసీ అడ్డంగా వాదించే వారికి ఇంతకంటే జవాబు అనవసరం.

మార్క్‌ స్కౌసెన్‌ ఇంకా ఇలా రాశాడు.’ పిల్లలకు కమ్యూనిజం’ పేరుతో రాసిన ఒక చిన్న పుస్తకాన్ని ఇటీవలే మిట్‌ ప్రెస్‌ ముద్రించటాన్ని చూశాను. అది రాసిన ఓ జర్మన్‌ కమ్యూనిస్టు పెట్టుబడిదారీ విధాన లోపాలను మాత్రమే చూశారు, కమ్యూనిజం లోపాల గురించి ఏమీ చెప్పలేదు.అది ఇరవయ్య శతాబద్దంలో పదికోట్ల మందిని చంపింది, ఇప్పటికీ కోట్ల మందికి క్యూబా,వెనెజులా, వుత్తర కొరియాలో జీవితం, స్వేచ్చ,ఆస్ధిని మరియు సంతోషంగా వుండటాన్ని నిరాకరిస్తోంది. ఈ రోజు విద్యార్ధులు మరియు అనేక మంది పౌరులు కమ్యూనిస్టు లేదా సోషలిస్టు తత్వశాస్త్ర ప్రయోజనాలకు ఆకర్షితులౌతున్నారు, ప్రత్యేకించి విద్య, వైద్యం మరియు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు వుచితంగా అందచేయాలనే దానికి ఆకర్షితులౌతున్నారు.’

అతి సర్వత్ర వర్జయేత్‌ అని పెద్దలు చెప్పారు, ఎంత ఎత్తు పెరిగితే అంత త్వరగా కూలిపోయే అవకాశం వుంటుంది. బొల్లు బొల్లరా ఎంకన్నా అంటే మా వూళ్లో మిరియాలు తాటికాయలంత వుంటాయి దొరా అన్నట్లు కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి అతిశయోక్తులతో ఎంతో చెత్తరాశారు. ఇప్పటికీ కిరాయి రచయితలు రాస్తూనే వున్నారు. చైనాలో చర్చిలను కూల్చివేస్తున్నారని, క్రైస్తవుల సమావేశాలను అడ్డుకుంటున్నారని మీడియాలో ప్రతి రోజూ ఒక పధకం ప్రకారం వార్తలు వస్తుంటాయి. గతంలో సోవియట్‌లో చర్చిలన్నింటినీ కూల్చివేశారని చేసిన ప్రచారం తెలిసిందే. నిజానికి ఏ ఒక్క చర్చిని కూడా కూల్చివేయలేదు. యథాతధంగా వున్నాయని ఇప్పుడందరూ చెబుతున్నారు. చైనాలోని హోనాన్‌ రాష్ట్రంలో మావో పుట్టారు. ఆయన పెరిగిన చాంగ్‌షా పరిసరాలన్నీ క్రైస్తవులు ఎక్కువగా వుండేవి. అక్కడే స్కూలులో మావో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్నాడు. అలాంటి పట్టణంలో మావో విగ్రహం కంటే ఎత్తైన 260 అడుగుల చర్చి భవనాన్ని నిర్మిస్తున్నారని, దానికి ప్రభుత్వ సబ్సిడీ కూడా వుందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. మావో కమ్యూనిస్టు పాఠాలు నేర్చుకున్న చోట చర్చికి అనుమతించటం, దానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటం ఏమిటని కొందరు అభ్యంతర పెట్టినప్పటికీ ప్రభుత్వం అనుమతించింది.అయితే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే మతశక్తులు ఎవరైనా అలాంటి వారిపై చైనా సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. అంతే తప్ప మత స్వేచ్చను అణచటం లేదు.http://www.gospelherald.com/articles/70424/20170511/massive-church-being-built-city-where-mao-zedong-first-embraced.htm  కమ్యూనిస్టు వ్యతిరేకత గురించి నూరిపోసిన వారి మాటలకు ఇప్పుడు విశ్వసనీయత సమస్య ఎదురవుతోంది. పెట్టుబడిదారీ దేశాలలో తలెత్తిన తీవ్ర సమస్యలు, సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసి పెట్టుబడిదారీ వ్యవస్దలను తిరిగి రుద్దిన చోట జనం అనుభవిస్తున్న జీవితాన్ని చూసిన తరువాత కమ్యూనిస్టు వ్యతిరేకత ఇప్పుడు పశ్చిమ దేశాలలో అంత ఆకర్షణీయంగా లేదు. అయినా చరిత్రను వెనక్కు తిప్పాలని చూసే తిరోగమన వాదులు తమ ప్రయత్నాలను మానుకోవటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పత్రికా స్వేచ్చలో నరేంద్రమోడీ ర్యాంకు పతనం

14 Sunday May 2017

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

Free press, India press freedom, Indian media, media bias, press, press freedom, world press freedom day

ఎం కోటేశ్వరరావు

కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ప్రపంచ మీడియా స్వేచ్చలో మన దేశ ర్యాంకు అంతకు ముందున్న 140 స్ధానం నుంచి మెరుగు పడి 136కు వచ్చిందని ప్రకటించగానే అనేక మంది దానికి కారణం నరేంద్రమోడీయే అని అనేక మంది తమ జబ్బలను తామే చరుచుకున్నారు. మరుసటి ఏడాది 133కు పెరగటంతో ఆహా ఓహో అంటూ వీరంగం వేశారు. తాజాగా మే మొదటి వారంలో మన ర్యాంకు 136కు పతనం కావటంతో నరేంద్రమోడీకేమీ సంబంధం లేనట్లు, అది పెద్ద వార్త కానట్లుగా దాదాపు విస్మరించారు. రాజుగారి విజయాలను స్తుతించటానికే వంది మాగధులు తప్ప పరాజయాలకు వుండరన్న విషయం తెలిసిందే.

ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి నేర్పింది మేమే అని చెప్పుకొనే బ్రిటన్‌, స్వేచ్చ అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందే అనే అమెరికా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చంకలు కొట్టుకొనే మన దేశం కూడా ఈ ఏడాది ర్యాంకులు, పాయింట్లలో దిగజారాయి. అనేక ఐరోపా దేశాల ర్యాంకులు కూడా పతనమయ్యాయి.అమెరికా 41 నుంచి 43కు, బ్రిటన్‌ 40 నుంచి 38కి పడిపోయింది. ‘మీడియా స్వేచ్చకు భద్రత లేకపోతే ఇతర స్వేచ్చలకు ఎలాంటి హామీ వుండదు అని భావించే వారికి ప్రజాస్వామిక వ్యవస్ధలుగా భావించే చోట పడిపోతున్న పాయింట్లు ఆందోళన కలిగిస్తున్నాయని, అధోముఖానికి మనల్ని తీసుకుపోతున్నాయని సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ (రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌-ఆర్‌ఎస్‌ఎఫ్‌) సెక్రటరీ జనరల్‌ క్రిస్టోఫీ డెలోయిర్‌ వ్యాఖ్యానించారు.

‘ప్రజాస్వామ్య క్షయంతో బలహీనపడిన జర్నలిజం’ అనే పేరుతో ఆర్‌ఎస్‌ఎఫ్‌ సంస్ధ 2017 నివేదికను విడుదల చేసింది. ప్రతి ఏటా మే మూడవ తేదీన ప్రపంచ పత్రికా పరిరక్షణ దినం సందర్భంగా అంతకు ముందు ఏప్రిల్‌ చివరిలో విడుదల చేసే ఈ నివేదికలలో అంతకు ముందు సంవత్సరాలలో జరిగిన పరిణామాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అందువలన 2017 ర్యాంకు అంటే 2016 పరిస్ధితికి అద్దం పడుతుంది. ఈ రీత్యా చూసినపుడు 2002,03,04 సంవత్సరాలలో బిజెపి ఏలుబడిలో మన ర్యాంకులు వరుసగా 80,128,120గా వున్నాయి. తరువాత 2005-2012 మధ్య 106-131 మధ్య కదలాడి 2013,14లో మాత్రం 140కి పతనమైంది. 2015లో 136కు పెరిగి, 133కు పెరిగి, తిరిగి ఈ ఏడాది 136కు పతనమైంది. అందువలన ప్రతి ఒక్కరూ గతాన్ని ఒక్కసారి నెమరువేసుకోవటం అవసరం.

ఈ నివేదికను రూపొంచిన ఆర్‌ఎస్‌ఎఫ్‌ ‘అటువంటి జాతీయ వాదులు జాతీయ వ్యతిరేకమైన వనే పేరుతో వ్యక్తమౌతున్న అభిప్రాయాలన్నింటినీ జాతీయ చర్చ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని’ పేర్కొన్నది. ఇక్కడ వారిని హిందూ జాతీయ వాదులు అని వర్ణించింది. హిందుస్తాన్‌ టైమ్స్‌ అసోసియేటెడ్‌ ఎడిటర్‌ జతిన్‌ గాంధీ ఈస్ట్రన్‌ ఐ అనే పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ‘ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) నుంచి హింసాకాండ బెదిరింపులు చిత్రంగా వుంటాయి. వాటిని టిటర్‌ ఇతర సామాజిక మీడియా వేదికల నుంచి పంపుతారు. బిజెపి అధికారానికి వచ్చిన తరువాత చాలా ఎక్కువగా పెరిగాయి. తాము జీర్ణించుకోలేని గుర్తించిన వార్తలు రాసినందుకు లేదా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారికి భూతాల వంటి మరుగుజ్జు సేనలు(ట్రోల్స్‌) వున్నాయి. ఆ పని చేసినందుకు కొందరికి డబ్బు చెల్లిస్తారు. మరి కొందరు వారి భావజాలంతో ప్రభావితమై చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొద్ది రోజులైనా జర్నలిస్టుల జీవితాలను దుఖ:పూరితం చేస్తారు. అంతకు ముందు ప్రభుత్వ హయాంలో వారు లేరని నేను చెప్పలేను, అయితే మితవాద హిందూ మతశక్తులు అధికారంలో వున్న పార్టీ మద్దతు పొందారు. కాబట్టే వారు అధికారంలో వున్న వారు తమకు మద్దతు ఇస్తున్నారనే ధైర్యం తెచ్చుకున్నారు.’ అన్నారు.

ఒకవైపు భూతాల మరుగుజ్జుసేనలను నిర్వహించే ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడైన నరేంద్రమోడీ మరోవెపు ప్రధానిగా ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినం సందర్బంగా విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు.’ఈ రోజు మరియు కాలంలో సామాజిక మీడియా ఒక చురుకైన మాధ్యమంగా ముందుకు వచ్చి పని చేస్తోంది.పత్రికా స్వేచ్చకు మరింత పరిపుష్టిని చేకూర్చింది. ప్రపంచ పత్రికా స్వేచ్చ దినం సందర్భంగా ఎలాంటి వూగిసలాటలు లేని మద్దతును పునరుద్ఘాటిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి అత్యవసరం’ అని పేర్కొన్నారు.

నివేదిక వివరాల ప్రకారం ఒక ఏడాది కాలంలో ఏ దేశాలలో అయితే మీడియా పరిస్ధితి మెరుగు లేదా మొత్తం మీద మెరుగ్గా వుంది అన్న తరగతి దేశాలలో 2.3 శాతం పడిపోయింది.ఈ సంస్ధ పరిగణనలోకి తీసుకున్న 180 దేశాలలో కెనడా, పోలాండ్‌, న్యూజిలాండ్‌, నమీబియా వరుసగా 4,7,8,7 పాయింట్ల చొప్పున గతేడాది కంటే పతనమయ్యాయి.వుత్తర ఐరోపా, వుత్తర అట్లాంటిక్‌ ప్రాంతంలో వుండి నార్డిక్‌ లేదా స్కాండినేవియా దేశాలుగా పిలువబడేవి మీడియా స్వేచ్చలో ప్రధమ స్ధానాలలో వుంటున్నాయి. చివరికి అలాంటి చోట్ల కూడా స్వేచ్చకు భంగం వాటిల్లి కొన్ని పాయింట్లు పతనమయ్యాయి.గత ఆరు సంవత్సరాలలో ఫిన్లండ్‌ తన ప్రధమ స్ధానాన్ని తొలిసారిగా కోల్పోయింది, నెదర్లాండ్స్‌ రెండు పాయింట్లు పతనమైంది.

ఈ నివేదికను చూస్తే నరేంద్రమోడీని అభిమానించే వారు ఆశాభంగానికి గురిగాక తప్పదు. ఎందుకంటే వారికి వారికి పాకిస్ధాన్‌ జపం చేయకుండా రోజు గడవదు. పత్రికా స్వేచ్చ విషయంలో గత మూడు సంవత్సరాలలో తన స్దానాన్ని అదెంతో మెరుగుపరుచుకుంది. ఏకంగా 159 నుంచి 139కు పెంచుకొని మనకంటే రెండు దేశాల దిగువనే వుంది. ఆర్‌ఎస్‌ఎఫ్‌ను పాకిస్ధాన్‌ పాలకులు మేనేజ్‌ చేశారేమో అని ఎవరైనా అనే ప్రమాదం లేకపోలేదు. అది నిజమే అనుకుంటే అంతర్జాతీయ మీడియాను కూడా మేనేజ్‌ చేయగల మన నరేంద్రమోడీ, చంద్రబాబు, వెంకయ్య వంటి వారు విఫలమైనట్లు అంగీకరించటమే.

ప్రపంచానికి ప్రజాస్వామ్యం నేర్పామని చెప్పుకొనే బ్రిటన్‌లో గతేడాది ఒక సిరియన్‌ జర్నలిస్టు పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. బ్రిటన్‌ చరిత్రలో పరిశోధనాత్మక జర్నలిజానికి సమాధి కట్టే నిఘా చట్టాన్ని అమోదించారు. అంతకంటే దారుణం ఏమంటే ఎవరైనా ఒక జర్నలిస్టును గూఢచర్య చట్టం కింద ఒక జర్నలిస్టు లీకు చేసిన సమాచారాన్ని సేకరిస్తే అతడు లేదా ఆమెకు 14 సంవత్సరాల జైలు శిక్షను విధించవచ్చు.ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై నియంతృత్వ చర్యలు అమలు జరపటమే బ్రిటన్‌ ర్యాంకు పతనానికి కారణమని లండన్‌ విశ్వవిద్యాలయ జర్నలిజం ప్రొఫెసర్‌ రాయ్‌ గ్రీన్‌ స్లేడ్‌ వ్యాఖ్యానించారు. ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలనే ప్రజాభిప్రాయ సేకరణ(బ్రెక్సిట్‌) సందర్భంగా మీడియాపై జరిగిన దూషణ భూషణలు, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు కూడా అక్కడి పత్రికా స్వేచ్చను దిగజార్చాయి.

విషపూరితమైన ప్రచారం, ఇతర రాజకీయ వతిళ్లు అనే శీర్షికతో అమెరికా గురించి నివేదికలో అక్కడి పరిణామాలను విశ్లేషించారు. భూమ్మీద అత్యంత నీతి నిజాయితీలు లేని వారెవరైనా వున్నారంటే జర్నలిస్టులే అని, మీడియా నకిలీ వార్తలను అందిస్తోందని స్వయంగా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించిన అంశాన్ని ప్రస్తావించి, ట్రంప్‌ చేసిన ఈ దాడితో ప్రపంచ వ్యాపితంగా చివరికి ప్రజాస్వామిక దేశాలుగా పరిగణించబడేచోట్ల కూడా మీడియాపై దాడులు పెరిగాయని తెలిపింది. భావప్రకటనా స్వేచ్చను కాపాడే అమెరికా సంప్రదాయంతో ట్రంప్‌ యంత్రాంగం రాజీపడిందని కూడా పేర్కొన్నది.

ట్రంప్‌ తన తొలి వందరోజుల పాలనా ప్రదర్శన సందర్భంగా పెన్సిల్వేనియాలో మాట్లాడుతూ మీడియా నకిలీ వార్తలను అందిస్తోందని మరోసారి ఆరోపిస్తూ వార్తల పరీక్షలో మీడియా తప్పిందని అన్నాడు. అధ్యక్ష భవన మీడియా ప్రతి ఏటా ఇచ్చే వార్షిక విందును బహిష్కరించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్రకెక్కాడు.

ఇండియా స్వేచ్చ నివేదిక

ప్రపంచ మీడియా స్వేచ్చా దినం సందర్భంగా ఇండియా స్వేచ్చ నివేదిక పేరుతో సెవంతీ నైనన్‌, గీతా శేషు, శిల్పి గోయల్‌ విడుదల చేసిన నివేదిక హూట్‌ అనే వెబ్‌సైట్‌ ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. గత పదహారు నెలల కాలంలో పత్రికా స్వేచ్చ, భావ ప్రకటనా స్వేచ్చ, ఆన్‌లైన్‌ స్వేచ్చ, వ్యక్తిగత స్వేచ్చ సమస్యల విషయానికి వస్తే ఇటీవల ఎన్నడూ లేని విధంగా మొత్తం మీద తగ్గుతున్న భావన కలుగుతోంది. కుంగి పోతున్న సమాచార, ఇంటర్నెట్‌, భావ ప్రకటనా స్వేచ్చ హక్కులు లేకుండా మీడియా నిజమైన స్వేచ్చతో వుండలేదు. నివేదిక కాలంలో దేశంలోని మీడియాలో ప్రచురితమై హుట్‌ వెబ్‌సైట్‌ సేకరించిన వివరాల ప్రకారం దేశవ్యాపితంగా 54 దాడులు జరిగాయి. వాస్తవంగా ఇంకా పెద్ద సంఖ్యలోనే దాడులు జరిగి వుంటాయి. ఎందుకంటే 2014-15లో జర్నలిస్టులపై 142 దాడులు జరిగినట్లు హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్‌ అహిర్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయితే వారి హత్యలకు జర్నలిజమే అనే సహేతుకమైన కారణం కేవలం ఒక్క కేసులోనే లభ్యమైంది. ప్రతి దాడి వెనుక వున్న కథనాలను చూస్తే ఒక స్పష్టమైన, స్ధిరనిశ్చయమైన పద్దతి కనిపిస్తోంది. అదేమంటే పరిశోధనాత్మక జర్నలిజం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. జర్నలిస్టులు ఎవరైనా ఏ కథనం కోసమైనా పరిశోధనకు పూనుకుంటే అది ఇసుక తవ్వకం, రాళ్ల గనులు, అక్రమ నిర్మాణాలు, పోలీసు దౌర్జన్యాలు, వైద్యపరమైన నిర్లక్ష్యం, దేని నుంచైనా తొలగించే ప్రయత్నం, ఎన్నికల ప్రచారం లేదా పౌరపాలనా యంత్రాంగ అవినీతి ఏదైనా దాడులకు గురవుతున్నారు.

క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతోందన్నది పక్కన పెడితే దానితో పోల్చుకుంటే కాస్త రక్షణ వుండే టివీ స్టూడియోలలో చర్చలునిర్వహించే లేదా సామాజిక మీడియాలో అభిప్రాయాలను వెల్లడించే వారు రకరకాల బెదిరింపులకు గురవుతున్నారు.ఈ వుదంతాల వెనుక వున్న వారిని చూస్తే రాజకీయవేత్తలు, నిఘా బృందాలు, పోలీసు మరియు భద్రతా దళాలు, లాయర్లు ( జెఎన్‌యు వుదంతం సందర్భంగా పాటియాల కోర్టు వుదంతమే గాక కేరళలో అనేక దాడులు చేశారు.) కొందరు బాలీవుడ్‌ హీరోలు, ఎక్కువగా అక్రమ వ్యాపారాలు, గనుల తవ్వకాలు సాగించే మాఫియాలు లేదా నేరగాళ్లు స్ధానిక రాజకీయ నేతలు, చట్టాన్ని అమలు చేసే సంస్ధల ఎరుకలోనే దాడులకు పాల్పడుతున్నారు. దాడులకు పాల్పడుతున్నవారెవరో స్పష్టంగా తెలిసినప్పటికీ వారు స్వేచ్చగా తిరుగుతున్నారు. హూట్‌ దగ్గర వున్న సమాచారం ప్రకారం దాడులలో చట్టాలను చేసే వారు, అమలు చేసే వారే ప్రధాన నిందితులుగా వున్నట్లు వెల్లడి అవుతోంది.

54 దాడుల వివరాలు

దాడులకు పాల్పడిన వారు సంఘటనలు

మాదకద్రవ్య స్మగ్లర్లు 1

సినిమా నటులు, సిబ్బంది 2

ఎబివిబి సభ్యులు 3

అక్రమ నిర్మాణదారులు 3

నిర్ధారణ కాని వుద్ధేశాలు 3

లిక్కర్‌ మాఫియా 2

గుజరాత్‌ దాడుల నేరగాడు సురేష్‌ 3

పోలీసులు 9

అవినీతి అధికారులు 2

రాజకీయనేతలు, మద్దతుదారులు 8

లాయర్లు 4

గోరక్షకులు 1

సైన్యం, పారామిలిటరీ 2

ఇసుక మాఫియా 1

వైద్యులు 1

మీడియా వార్తలను నిరసించిన వారు 9

విద్యార్ధులు 2

అక్రమ గనుల తవ్వకదారులు 1

జర్నలిస్టులను బెదిరించిన 25 వుదంతాలకు బాధ్యులు

రాజకీయనేతలు, సభ్యులు 6

మైనింగ్‌ మాఫియా 2

మిలిటెంట్స్‌ 1

పోలీసు 4

నిఘాబృందాలు 2

ట్విటర్‌ ట్రోల్స్‌ 5

ఎబివిపి 1

లాయర్లు 3

ఆధార్‌ 1

ప్రభుత్వం వివిధ స్థాయిలలో సెన్సార్‌షిప్‌ను అమలు జరిపే యత్నాలు చేస్తోంది, అదే మాదిరి ప్రయివేటు రంగ మీడియా యజమానులు కూడా చేస్తున్నారు. ఈ సమీక్షా కాలంలో మీడియా సెన్సార్‌షిప్‌, వార్తలను తొక్కిపెట్టటం, మరియు స్వయం నియంత్రణకు సంబంధించి కొన్ని కొట్టొచ్చినట్లు కనిపించే వుదంతాలను చూద్దాం. 2016 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాపుల ఆందోళనకు సంబంధించిన వార్తలను చూపిన తీరు తెన్నులపై సాక్షి మరియు నం 1 న్యూస్‌ ఛానల్స్‌ ప్రసారాలను కేబుల్‌ ఆపరేటర్లద్వారా నిలిపివేయించింది. మాజీ మంత్రి, కాపుల నాయకుడు ముద్రగడ పద్మనాభం తన డిమాండ్లకు మద్దతుగా నిరవధిక దీక్ష ప్రారంభించాడు, దాంతో కోస్తా ప్రాంతంలో వుద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఈ పరిణామాలను విస్తృతంగా చూపగా మిగతా ఛానల్స్‌ ఆచితూచి వ్యవహరించాయి. తరువాత ఆకస్మికంగా సాక్షి టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. తమ ఛానల్‌ ప్రసారాలను అడ్డుకున్నారని సాక్షి గ్రూపు పేర్కొన్నది.

బుర్హాన్‌ వనీ హత్య తరువాత కాశ్మీర్‌ మీడియా సెన్సార్‌షిప్‌ మరియు వేధింపులకు గురైంది. జూలై మాసంలో అక్కడి రెండు పెద్ద పత్రికల కార్యాలయాలపై దాడులు జరిగాయి, వాటి పత్రికలను స్వాధీనం చేసుకున్నారు, వారి ముద్రణా యంత్రాలను మూసివేశారు. ఆగస్టు నెలలో వివిధ ఆదిమ తెగల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ స్వతంత్ర జర్నలిస్టు నేహా దీక్షిత్‌, ఆమె పిల్లల అపహరణ గురించి ఆమెరాసిన వార్తను ప్రచురించిన అవుట్‌లుక్‌ పత్రిక ముద్రాపకుడు, సంపాదకులు అయిన ఇంద్రనీల్‌రాయ్‌, కృష్ణ ప్రసాద్‌లపై 2016 జూలై 29న క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు.

అక్టోబరు నెలలో కేత్రస్ధాయిలో జరుగుతున్న సమాచారాన్ని ప్రచురించి కాశ్మీర్‌ రీడర్‌ పత్రికను నిషేధించి చివరికి మూడునెలల పాటు అమలు జరిపారు. రాజ్యం ఎందుకు తమ పట్ల అసహనంతో వ్యవహరించిందో దాని సంపాదకుడు తెలిపారు. పఠాన్‌కోట్‌ దాడి సందర్భంగా సైనిక చర్య వ్యూహాత్మక సమాచారాన్ని వెల్లడించిందనే పేరుతో నవంబరు నెలలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఎన్‌డిటీవిపై ఒక రోజు నిషేధాన్ని విధించింది. సదరు ఛానల్‌ ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మంత్రిత్వశాఖ నిషేధాన్ని నిలిపివేసింది. డిసెంబరులో తమిళనాడు ముఖ్యమంత్రిగా వున్న జయలలిత మరణించినపుడు టీవీ ఛానల్స్‌ అ వార్తను సాయంత్రమే ప్రసారం చేయగా యాజమాన్యం ఏడుగంటలపాటు తొక్కి పెట్టింది.

పార్లమెంట్‌ సభ్యుడు, వాణిజ్యవేత్త అయిన రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రస్తావన రెండు వ్యాసాలను వెనక్కు తీసుకోవాలని బెంగలూరు కోర్టు ఏకపక్షంగా ది వైర్‌ న్యూస్‌ పోర్టల్‌ను ఆదేశించింది. ఇదెంతో ఆసక్తిని కలిగించింది, ఎందుకంటే ఆయన మద్దతు ఇచ్చే రాజకీయ సిద్ధాంతాలు, ఆయన స్వంతమైన మీడియా గురించి సంబంధాలను, లేదా మిలిటరీతో సంబంధాలు కలిగిన అతని వాణిజ్య ప్రయోజనాల గురించి, సాయుధ బలగాల కేంద్రంగా ఆయన బహిరంగ కార్యకలాపాల గురించి వెల్లడించిన తొలి వెబ్‌సైట్‌ అది కాదు.

ప్రపంచ వ్యాపితంగా 2016లో 102 మంది జర్నలిస్టుల హత్య

ప్రపంచ వ్యాపితంగా 2016లో కనీసం 102 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా వెల్లడించారు. ప్రపంచ మీడియా పరిరక్షణ దినం సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులను హత్య చేయటం ఏ మాత్రం అంగీకారం కాదని, ప్రపంచం వారికి రక్షణగా ముందుకు రావాలని కోరారు. శాంతి, న్యాయాలకు పత్రికా స్వేచ్చను పరిరక్షించుకోవాలని కోరారు. వాస్తవ, విమర్శనాత్మకమైన, సమగ్రంగా పరిశోధించిన జర్నలిజం కావాలని కోరారు. పౌర జర్నలిస్టులు జర్నలిజం సరిహద్దులను పున:నిర్ణయిస్తున్నారు, మీడియా జవాబుదారీతనం, విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతోంది,ఆన్‌లైన్‌ మీడియాలో ప్రకటనల సమాచారం, సంపాదక సమాచారానికి గీతలు చెరిగి పోతున్నాయి, నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని యునెస్కో డైరెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయమైన సమాచారానికి వనరుగా మాత్రమే గాక భిన్న గళాలకు వేదికగా వుండాలని, సహనం, చర్చలకు నూతన శక్తులను సమీకరించాలని కోరారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చల్లేవారు పార్టీ ప్రతినిధులు-రాసే వారు ప్రచారకర్తలు !

12 Friday May 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Gandhi Peace Foundation, Indian media, journalism, journalists, Kuldip Nayyar Award, ndtv, NDTV anchor Ravish Kumar, Ravish Kumar

‘సిరా’ వినియోగంపై సుప్రసిద్ధ జర్నలిస్టు రవీష్‌ కుమార్‌ వ్యంగ్యాస్త్రం

జర్నలిజంలో విశిష్ట స్ధానం సంపాదించిన ఎన్‌డిటివీ యాంకర్‌ రవీష్‌ కుమార్‌కు కులదీప్‌ నయ్యర్‌ జర్నలిజం అవార్డు ప్రదానం సందర్భంగా మార్చి 19న చేసిన ప్రసంగ అనువాదమిది. జర్నలిస్టులలో ఆలోచన పాదుకొల్పేదిగా వున్నందున పాఠకుల కోసం దీనిని అందచేస్తున్నాం

ప్రపంచ వ్యాపితంగా చులకనగా చూస్తున్న తరుణంలో సత్కారం పొందటం ఒక విధంగా వినోదంగా వుంది. అలారం కొట్టే గడియారాలు కొన్ని దశాబ్దాల క్రితమే మూగపోయినప్పటికీ ఇంకా అలారం కొడుతున్న గడియారాన్ని చూస్తున్నట్లుగా ఇది వుంది. అంటే మనం అప్పటి నుంచి మెల్లగా చేసే శబ్దాలను బట్టి సమయాన్ని గ్రహించే ఇంద్రియ సామర్ధ్యాన్ని మనం కోల్పోయాం. నుక మనం వర్తమాన కాల న్యాయా అన్యాయాలను మదింపు చేయటంలో కూడా విఫలమౌతున్నాం.ఈ రోజులు ఎలా వున్నాయనే భావన కలుగుతోందంటే మనం ఒక పరీక్ష హాలులో వున్నట్లు మనలో వున్న తప్ప చేసే వారిని ప్రత్యక్షంగా పట్టుకోవాలని పిలుస్తున్నట్లు, ధృడ నిశ్చయంతో దాడి చేసే నిఘా బృందాలు, ఆకస్మిక దాడుల దళాలు నిరంతరం దాడులు చేస్తున్నాయన్నట్లుగా వుంది. మనం పదే పదే శోధించబడుతున్నాం. ఎవరైతే తమ మనసులోని మాటలను స్వేచ్చగా వెల్లడిస్తామో వారిపై మరుగుజ్జు భూతాలు (ట్రోల్స్‌) తమ లక్ష్యంగా చేసుకుంటాయి.

కొత్త దాడి బృందం వచ్చి నపుడల్లా ‘పరీక్ష హాలులో ‘ వున్న వారి వెన్నులో వణుకుపుడుతోంది. ఏ నేరమూ చేయకుండానే భయం కొల్పుతున్నాయి. తప్పు చేసిన వారిని పట్టుకోవటం గాక అమాయకులను ఎక్కువగా భయకంపితులు గావిస్తున్నాయి. ఇది నకిలీ డిగ్రీలు-నిజమైన డిగ్రీల గురించి చర్చలు చేస్తున్న ఈ కాలంలో వివిధ రూపాలలో ధర్డ్‌ డిగ్రీ( సాధారణంగా పోలీసుల చిత్ర హింసలను ఆంగ్లంలో అలా సంబోధిస్తారు, టీవీ చర్చలు కూడా అంతే చిత్రహింసలు పెడుతున్నాయన్నది ప్రసంగకర్త విరుపు ) తిరిగి వచ్చింది. ఈ కాలంలో న్యూస్‌ యాంకర్‌ నూతన అధికార కేంద్రంగా మారారు. తాను కోరుకున్నదానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే హఠాత్తుగా విరుచుకుపడతారు. వ్యతిరేక అభిప్రాయం కలిగి వుండటం నేరం. ప్రత్యామ్నాయ అభిప్రాయం కలిగి వుండటం ఒక తీవ్రమైన నేరం, వాస్తవాలను ముందుంచటం అశ్లీల చర్య, నిజాయితీగా వుండటం పాపం. తొలుత టీవీలు మన సాయంత్రాలను మాత్రమే బందీలుగా చేశాయి. ఇప్పుడు ఈ ‘పోలీస్‌ స్టేషన్లు ‘ రోజంతా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మీరు తొలి అవార్డుకు ఒక న్యూస్‌ యాంకర్‌ను ఎంపిక చేశారు.అంటే ఇంకా బతికుండేందుకు మీరు సాహసం చేస్తున్నారనేందుకు ఈ రుజువు చాలు. వారి బ్రతుకు ఒక భ్రమ అయినప్పటికీ మరో ఓటమిని ఎదుర్కొనే సాహసం చేయటానికి సిద్ధంగా వుండే జనాలు ఇంకా వున్నారు. నేను కృతజ్ఞుడనై వున్నాను.

గాంధీ పీస్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు.ఈ అవార్డును చెమటోడ్చిన జర్నలిస్టులు ఏర్పాటు చేశారనే స్పృహ వున్న వాడిని. ఈ వృత్తిలో నాకంటే పెద్ద వారి నుంచి ఏది తీసుకున్నప్పటికీ దానినొక బహుమానంగా నేను భావిస్తాను. నా ప్రార్ధనలకు సమాధానం వంటిది. మన మందరం కులదీప్‌ నయ్యర్‌గారిని గౌరవిస్తాము. మీరు రాసిన వాటిని మిలియన్ల మంది చదివారు. ప్రతి రోజు ఎవరి పేరునైతే ద్వేషించారో, విషం చిమ్మారో వారి ఎల్లలలో మీరు జ్యోతులను వెలిగించారు. వాస్తవానికి మనలో ఎంత మందిమి కనీసం ప్రేమ గురించి మాట్లాడుతున్నాం, జనం ప్రేమ గురించి ఆలోచిస్తున్నారా అన్నది నాకు సందేహమే. మనం ఇంకేమాత్రం రోజూ వుషోదయాలతో లేవటం లేదు, దానికి బదులు వాట్సాప్‌లో మనకు శుభోదయాలు చెప్పారా అనే వెతుకులాటతో రోజును ప్రారంభిస్తున్నాం. దీనిని చూస్తుంటే వాట్సాప్‌లతో సూర్యుడు వుదయించటంతో ప్రపంచం ప్రారంభమౌతుందా అని పిస్తోంది. త్వరలో మనం గెలీలియోను మరోసారి శిక్షించబోతున్నాం, ఈ సారి దానిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తాం.

అవకాశాలను కనుగొనే దశ ఇది. నూతన, మిగిలిపోయిన అవకాశాలకోసం మనం నిరంతరం చూస్తున్నాము, ఆ నూతన ఆశలు, అవకాశాలను రక్షించే, పెంచి పోషించే జనం కోసం కూడా చూస్తున్నాము. అయినప్పటికీ ఈ ఆశలు, అవకాశాలు నేడు సన్నగిల్లుతున్నాయి. వీటి మధ్య మన ఆశలు ఏకాంతంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మనం ఎంతకాలం బతికి వుంటామనేది మనందరినీ వేధిస్తున్నది. మన చుట్టూ ఎలా వున్నప్పటికీ అర్ధవంతంగా ఎలా జీవించాలనే అంశాన్ని మనం మరచిపోయాము. ఇటువంటి పరిస్ధితిలో మన శక్తిని, ఆవేశాన్ని తిరిగి రగిలించుకోవాల్సి వుంది. మీ ప్రశ్నలను సానపెట్టండి, మీరు నమ్మిన రాజకీయ బృందాలను ప్రశ్నించండి. ఆ బృందాలు మన విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మీకు విశ్వాసం లేని వారిని కూడా ప్రశ్నించండి. మన సమాజంలో ఇతరులతో మాటా మంతీ పూర్తిగా నిలిచిపోయింది. నేడు సమాజం తన ఆశలన్నింటినీ మార్పు తెచ్చే రాజకీయ పార్టీలపై పెట్టుకుంది.రాజకీయంగా శక్తి వంతులైన వారు మాత్రమే ప్రమోదం లేదా ప్రమాదకరమైన మార్పులను గానీ తేగలరని సమాజానికి ఇప్పుడు తెలుసు. ఈ కారణంగానే రాజకీయపార్టీలపై పెట్టుకున్న ఆశలనుంచి వెనక్కు పోవటం లేదు. జనం ఈ సాహసం చేయటాన్ని కొనసాగిస్తారు. రాజకీయపార్టీలు ప్రతిసారీ వారిని విఫలం చేస్తాయి, అయినప్పటికీ మరోసారి వాటిపై నమ్మకం పెట్టుకుంటారు.

తమ సభ్యులు వివిధ మార్గాలను వెతుక్కొనేందుకు నిరంతరం తమ నుంచి వెళ్లిపోవటాన్ని రాజకీయపార్టీలు గమనించాయి. అలా వెళ్లేవారు సామాజిక మార్పునకు రాజకీయాలను ఒక సాధనంగా ఇంకే మాత్రం పరిగణించటం లేదు. అటువంటి వారు తగ్గిపోతున్న కారణంగా రాజకీయపార్టీలు నైతికంగా పతనం అవుతున్నాయి. రాజకీయ పార్టీలకు కొత్త రూపునిచ్చి పున:నిర్మాణం చేయాల్సి వుంది. దయచేసి మీ అంతర్గత వైరుధ్యాలను పక్కన పెట్టండి. గత 30,40 సంవత్సరాలుగా వాటిని చూస్తున్నాము. వామపక్షవాదులు, గాంధీవాదులు, అంబేద్కరిస్టులు మరియు సోషలిస్టులు వారి ప్రధాన రాజకీయ నిర్మాణాల నుంచి వైదొలిగారు. దీంతో ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయ రాజకీయాల ఆశయాలను కోల్పోయాయి. అటువంటి పార్టీలలోకి తిరిగి రండి, వాటి బాధ్యతలను స్వీకరించండి. గతాన్ని మరచిపోండి. నూతన రాజకీయాల కోసం కష్టపడండి. మన అసహాయత, పిరికితనాన్ని గుర్తించటానికి ఇది మంచి సమయం. మనల్ని మనం నిజాయితీతో విశ్లేషించుకోవటానికి ఈ చీకటి సమయాలు సరైన అవకాశం.

నా జర్నలిజం కారణంగా నాకు ఈ అవార్డునిచ్చారు. మీరు ఏదైనా వుందని ఆలోచిస్తున్నట్లయితే ఆ సంక్షోభం నేడు జర్నలిజంలో లేదని చెప్పటానికి ఇది నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. రాజధాని నుంచి చిన్న జిల్లా కేంద్రాల వరకు వున్న సంపాదకులందరూ ఒక రాజకీయపార్టీ సైద్ధాంతిక తుపానులో కొట్టుకుపోవటానికి సంతోషంగా వున్నారు. అయినప్పటికీ మనం వారిని విమర్శిస్తున్నాము. వారు ఎంతో సంతోషంగా వున్నారని మనం అంగీకరించాల్సి వుంది. తాము నేర్పుగల జర్నలిస్టులుగా వున్నామని ఈ కారణంగానే వారు భావించగలుగుతున్నారు. గత యాభై అరవై సంవత్సరాలుగా రాజకీయ వస్తువుతో మిళితం చేసేందుకు మీడియా నిరంతర ప్రయత్నాలు చేసింది. హోటళ్లు, దుకాణ సముదాయాలు, గనుల కౌలు మరియు ఇతర లైసన్సులు పొందటంద్వారా వారి ఆకలి తీరలేదు. వారి ఆత్మలింకా అసంతృతోనే వున్నాయి. ఇప్పుడు అవి శాంతిని పొందాయి. అంతిమంగా అధికార రాజకీయాలతో భాగంగా వుండాలన్న మీడియా కల నెరవేరింది.

భారతీయ మీడియా నేడు పారవశ్య స్ధితిలో వుంది. స్వర్గానికి చేరుకోవాలంటే మెట్లను కనుక్కోవాల్సి వుందని జనాలు మాట్లాడుకున్న రోజులున్నాయి. నేడు అలాంటి వారు భూమి మీదనే స్వర్గాన్ని కనుగొన్నారు.వారికి మెట్లదారి ఇంకేమాత్రం అవసరం లేదు. మీరు నా మాటలను విశ్వసించకపోయినట్లయితే మీరు ఏ వార్తా పత్రికనైనా చదవండి లేదా న్యూస్‌ ఛానల్‌ను అయినా చూడండి. ఒక ప్రత్యేక రాజకీయ అజెండాకు విశ్వాసపాత్రులుగా వుండేందుకు మీడియా తహతహలాడుతున్నట్లు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల నిరాశా నిస్పృల తరువాత మాత్రమే మీరు ఈ బ్రహ్మానందాన్ని చూడగలరు, ఎంతటి బాధనైనా తేలికగా తీసుకుంటారు. అలంకరించుకున్న ఈ యాంకర్లు మీకు ఇంతకు ముందెన్నడూ ఇంత అందంగా కనిపించి వుండరు. లేదా ఒక మహిళా యాంకర్‌ ప్రభుత్వాన్ని ఎంతో అందంగా పొగడటాన్ని చూసి వుండరు. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వుందో జర్నలిస్టులు కూడా అలాగే వున్నారు.

మీకు పోరాడాలని వుంటే వార్తా పత్రిక, టెలివిజన్‌తో పోరాడండి. మునిగిపోతున్న జర్నలిజం గురించి మీ ధృడ వైఖరిని కోల్పోకండి. జర్నలిస్టులు సైతం కాపాడాలని కోరుకోవటం లేదు. మిగిలి వున్న వారెవరైనా వుంటే వారిని కూడా సులభంగా తొలగించి వేస్తారు.ఏ ఒక్కరినైనా బతికిస్తే పరిస్ధితికి అది ఎలా తోడ్పడగలదు. సంస్ధలు మొత్తంగా మతపూరితం గావించబడ్డాయి. భారత్‌లో జర్నలిజం మతోన్మాదాన్ని వ్యాపింప చేస్తోంది.అది రక్తదాహంతో వుంది. ఏదో ఒక రోజు జాతి మొత్తాన్ని రక్తసిక్తం గావించనుంది. తన అజెండాను విజయవంతంగా ముందుకు తీసుకుపోయినట్లు ఈ రోజు కనిపించకపోవచ్చు. కానీ దాని ప్రయత్నాలను మనం విస్మరించకూడదు. అందువలన మనకు ఎదురైన వాటి గురించి ఎవరైనా, ప్రతివారూ దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్‌ రాజకీయ పార్టీల శాఖలుగా తయారయ్యాయి. రాజకీయ పార్టీల ప్రధాన కార్యదర్శుల కంటే యాంకర్లు ఇప్పుడు ఎక్కువ అధికారం కలిగి వున్నారు. ఈ నూతన నిర్మాణాలపై ప్రతి ఒక్కరూ పోరాడకుండా నూతన రాజకీయ ఆలోచనలు ఒక రూపం తీసుకోవు. జరుగుతున్న వాటిని నేనెందుకు ప్రశ్నించాలి అనే విధంగా ప్రతి వారి బుర్రలను తయారు చేసే విధంగా ఆధిపత్యం వహించటంలో వారు కృతకృత్యులయ్యారు. ఎవరైతే సిరా చల్లుతారో వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నారు. ఎవరైతే సిరాతో రాస్తారో వారు కేవలం ప్రచారంలో మాత్రమే పొల్గొంటున్నారు. వర్తమాన జర్నలిజం వర్తమాన ప్రచారంగా మారింది.

అయితే సాధ్యమయ్యేవాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులను మనం ఎలా విస్మరించగలం? ఈ అవకాశాలు చివరికి అంతరించుతాయి కానీ వారి వారసత్వ సొత్తు మాత్రం భవిష్యత్‌లో మనకు సాధికారతనిస్తుంది. ఈ జర్నలిస్టులు ఎప్పుడైతే ఇచ్చకాలమారితనంతో అలసి పోతారో లేదా వంచన ద్వారా ఓడిపోతారో అప్పుడు తమ గాఢనిద్ర నుంచి మేలుకుంటారు. ఈ అశాభావాలు మరియు అవకాశాలే వారిని రక్షిస్తాయి. అందుకే మన ఆశలను, అవకాశాలను కొనసాగించాలని నేను అంటాను. ఈ రోజులను ఇంద్ర ధనుస్సు వంటి ఆశలతోనో లేదా వైఫల్య దృష్టితోనో చూడవద్దు. మనం ఒక పెద్ద ఇంజను వస్తున్న రైల్వే లైనుపై వున్నాం, పారిపోవటానికి లేదా మనల్ని మనం రక్షించుకోవటానికి గాని సమయంలేని స్ధితిలో వున్నాము. ఆశ లేదా వైఫల్యానికి గాని అవకాశం లేదు. మనం స్వయంగా రంగంలోకి దిగాలి. మనకు సమయం తక్కువగా వుంది దాని వేగం ఎక్కువగా వుండాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎట్టకేలకు మోడీ మోక్ష స్వర్గ సోపానాల దగ్గర వైఎస్‌ జగన్‌ ?

11 Thursday May 2017

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi, tdp, YS jagan, ys jagan vs chandrababu, ysrcp

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్‌ బలంగా వున్నచోట దానిని దెబ్బతీసేందుకు ప్రాంతీయ పార్టీలతో జత కట్టిన బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతీయ పార్టీతో బంధం వుండగానే మరొక పార్టీకి కన్నుగీటుతూ సరికొత్త రాజకీయానికి తెరలేపిందా ? బ్రహ్మంగారు మరి ఈ విషయంలో ఏం చెప్పారో తెలియదు. నిజానికి వైఎస్‌ఆర్‌సిపి ఎందుకోసం ప్రధాన మంత్రి దర్శన భాగ్యం కోరిందో, ప్రధాని ఎందుకు జగన్‌ పరివారంతో కలిశారో అధికారికంగా తెలియదు. ప్రధానిని కలిసి బయటకు వచ్చిన తరువాత జగన్‌మోహనరెడ్డి బృందం ప్రధానికి ఇచ్చినట్లు చెప్పిన మెమోరాండం, మీడియాతో మాట్లాడినదాని ప్రకారమే ఎవరైనా వ్యాఖ్యానించగలరు. పరకాయ ప్రవేశ విద్యతో కథనాలు రాసే విలేకర్ల నుంచి ఇంకా ఏమీ వెలువడలేదు కనుక వాటిని నమ్ముకున్న పాఠకులు నిరాశ చెందివుంటారు. కొద్ది వారాల క్రితమే చంద్రబాబు నాయుడు ప్రధానిని కలసి ఆంధ్రప్రదేశ్‌లో మునిగినా తేలినా రెండు పార్టీలు కట్టకట్టుకు వుండాలని నిర్ణయించుకున్నట్లుగా పరకాయ విలేకర్లు వార్తలు రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలపరుస్తానంటే ఎవరైనా వద్దన్నారా అంటూ వెంకయ్య నాయుడు బిజెపిలో తలెత్తిన సందేహాలను తీర్చిన విషయం బహిరంగమే. దానిలో భాగంగానే విశాఖలో బిజెపి పెద్ద ఎత్తున సభ జరిపేందుకు పూనుకుందని వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఇపుడు జగన్‌ పరిణామాలను నిస్సందేహంగా మరో మలుపు తిప్పారు. బిత్తర పోయిన తెలుగు తమ్ముళ్లు కొందరు ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నాయుళ్లు విదేశాల్లో వున్న సమయంలో జగన్‌ ప్రధాన మంత్రిని కలిశారు అనేకంటే ప్రధాని కార్యాలయం అవకాశం కల్పించింది అని చెప్పటం సబబుగా వుంటుందేమో ?

ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నది పాత సామెత, పాత టెక్నాలజీ. ఇప్పుడు ఒక అర గురించి మరొక అరకు తెలియకుండా పక్క పక్కనే అనేక కత్తులకు స్ధానం కల్పించటం కొత్త టెక్నాలజీ. ఎన్ని సినిమాలలో చూడటం లేదూ ! పార్టీలో, ప్రత్యర్ధులలో ముఠాలుగా, ఒకరి పొడ మరొకరికి గిట్ట మట్టుపెట్టే వారిని కూడా పార్టీలోని ఒకే వరలో ఇమిడ్చే నేర్పు చంద్రబాబుకు – రెండు రెళ్లు నాలుగు అన్నట్లు శాస్త్రీయంగా చెప్పాలంటే పాలకవర్గ రాజకీయ పార్టీ ప్రతిదానికీ – వున్నట్లే రెండు పార్టీలను కూడా పక్క పక్కనే వుంచేందుకు , ఆంధ్రప్రదేశ్‌ పౌరులను కొత్త బాటలో నడిపించేందుకు బిజెపి నేతలు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి ఇప్పటికిప్పుడు అంత సీను లేదు కనుక తమకు మద్దతు విషయంలో ఎవరు ఎంతగా వంగి విధేయత చూపుతారా అన్నదే వారికి ఇప్పుడు ముఖ్యం. కాల క్రమంలో పరిణామాలు ఎలా వుంటాయన్నది ఇప్పుడే చెప్పలేము. కాంగ్రెస్‌ అయినా తెలుగుదేశం అయినా ఎవరు అధికారంలో వుంటే వారి పంచనచేరి తమ వాటాలను రాబట్టుకొనేందుకు రాయలసీమ మొరటు ప్రత్యర్ధి ఫ్యాక్షనిస్టులే ఒకే పార్టీలో సర్దుకుపోదాం అన్నట్లుగా వుండటం చూశాం, చూస్తున్నాం. అలాగే అనేక చోట్ల రింగురోడ్లు, విమానాశ్రయాలు అటూ ఇటూ, అక్కడా ఇక్కడా అని ప్రచారం చేసి చివరికి తమకు గరిష్ట ప్రయోజనం చేకూరే విధంగా వాటి నిర్మాణాలు చేయటాన్ని చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయబాట విషయంలో కూడా అదేవిధంగా జరగబోతోందా ? మేథావులు, వుడుకురక్తంతో వుండే యువతీ యువకులే అలాంటి తప్పుడు రాజకీయాలకు సలాం కొడుతుంటే ఇక సామాన్యుల సంగతి చెప్పనవసరం లేదు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే.

రాష్ట్రానికి వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ప్రత్యేక పాకేజీ పేరుతో మోసం చేసినా ఫర్లేదు, వాటి గురించి అడగకుండా వుంటాం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో మాత్రం ఎలాంటి రాజకీయ అనుబంధం పెట్టుకోకూడదని చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ,చాణక్యనీతిని వుపయోగించి ఇంతకాలం అడ్డుకున్నారన్నది ఒక అభిప్రాయం. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్దులెవరో తేలలేదు, నోటిఫికేషన్‌ ఇంకా వెలువడలేదు, మీడియాలో ఎలాంటి వూహాగానాలు రాయలేదు. ఆకస్మికంగా పిడుగులు పడినట్లుగా వైఎస్‌ఆర్‌సిపి ప్రతినిధి వర్గాన్ని కలుసుకొనేందుకు నరేంద్రమోడీ సిద్ధంగా వున్నారంటూ పిలుపు రావటం పొలోమంటూ జగన్‌ పరివారం ఢిల్లీ వెళ్లి కలవటం, రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ప్రకటించటం అంతా కల మాదిరి జరిగిపోయింది. అదీ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలను రప్పించేందుకు అమెరికా వీధులలో కాలి నడకన తిరుగుతున్న సమయంలో జరగటం అనేక మందికి మింగుడు పడని అంశం. చంద్రబాబు నాయుడే కాదు వెంకయ్య నాయుడు కూడా దేశంలో లేనపుడు అని ఎవరైనా ముక్తాయింపు ఇవ్వవచ్చు.

మిగతా పత్రికలు ఏమి రాసినా సాక్షి పత్రికలో వక్రీకరణకు అవకాశాలు వుండవు. అదేమి రాసిందో చూడండి

‘ మీడియా : ప్రధాన మంత్రి వద్ద ఏదైనా ప్రస్తావన వచ్చిందా ?

జగన్‌ : రాష్ట్రపతి ఎన్నికలలో వారు పెట్టే అభ్యర్ధికి సంపూర&ణ మద్దతు ఇస్తామని ప్రధాన మంత్రిగారికి చెప్పాం.వైఎసనఆరన కాంగ్రెసు నుంచి సంపూర&ణ మద్దతు వుంటుంది. మాటల సందర&భంలో వారు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు. మద్దతు కూడా ఇస్తాం. ఎలాగూ వాళ్లు పెట్టిన వ్యక్తే గెలుస్తారు. ఆ పదవికి పోటీ పెట్టడం కూడా తప్పే అని గట్టిగా నమ్ముతున్నాం. బిజెపికి సంబధించినంతవరకు మేం అన్ని వేళలా మద్దతు ఇచ్చాం. వారితో మాకు ఎప్పుడైనా వ్యతిరేకత వుందీ అంటే అది ప్రత్యేక హోదా విషయంలో, భూ సేకరణ బిల్లు విషయంలో మాత్రమే.అంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రతి విషయంలో అధికార పార్టీకి తోడుగా నిలిచాం. వుంటాం కూడా. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లు విషయంలోనే మేం బిజెపిని వ్యతిరేేకించాం. ‘

దీనిని చదివిన తరువాత తెలుగులో భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల గురించి మరోసారి వెనక్కు చూసుకోవాల్సి వచ్చింది. మాటల సందర్భంగా వారు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు, మేం ఇస్తాం అంటే భవిష్యత్‌లో అని అర్ధం. మరోవైపున మేం మద్దతు ఇస్తామని చెప్పాం అన్నారు. ప్రధానితో కలిసేందుకు వెళ్లగానే పాహిమాం అంటూ కాళ్లమీద పడినట్లు, విధేయులమై వుంటామని అడగకుండానే మద్దతు ప్రకటించారని అనుకోవాల్సి వస్తుంది. అయితే అది వారి అంతర్గత వ్యవహారం అనుకోండి. ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య ఏమంటే అనేక ఓదార్పు యాత్రలు చేసిన జగన్‌ ప్రత్యేక హోదా గురించి కంటి తుడుపు విమర్శలు తప్ప పొలో మంటూ జెపికి మద్దతు ప్రకటించి వచ్చారు. ఎలాగూ బిజెపి అభ్యర్ధి గెలుస్తారని చెబుతున్నారు. అంటే మీ మద్దతు ఆరోవేలు వంటిదే. మరో వైపు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ప్రధానికి విన్నవించిన వైసిపి పెద్దలు హోదా విషయంలో అడ్డంగా మాట తప్పి ఇచ్చేందుకు తిరస్కరించిన బిజెపి విషయంలో కనీసం తటస్థంగా వుంటామని చెప్పి వుంటే కాస్త బెట్టుగా వుండేది. కేసుల నుంచి బయట పడవేయించుకొనేందుకే ఆరాటపడ్డారనే విమర్శ వచ్చి వుండేది కాదు. అయినా బిజెపి అభ్యర్ధి రాష్ట్రపతి అయితే మన రాష్ట్రానికేమి ఒరుగుతుంది, దీనిలో బిజెపి మనకు చేసే మంచేమిటి ? హోదా బదులు ప్రకటించిన ప్యాకేజీ కూడా వట్టిస్తరి మంచినీళ్లే అని తేలిపోయింది. ఏ రకంగానూ మనకు ఒరిగేదేమీ లేనపుడు, గడచిన మూడు సంవత్సరాలలో చేసిందేమీ లేనపుడు, రాబోయే రోజుల్లో ఏం చేస్తారో తెలియనపుడు అడగకుండానే దాని అభ్యర్ధికి మద్దతు అని ప్రకటించటం ఎందుకు ?ఎవరిని మోసం చేద్దామని ? అలాగాక మేం బిజెపితో వూరేగదలచుకున్నాం, కేసుల మీద కేంద్ర సంస్ధలు చూసీచూడనట్లు, వీలైతే బయటపడవేయించమని కోరాం అని చెప్పి వుంటే నిజాయితీగా వుండేది. నరేంద్రమోడీ అంటే అంటరాని వ్యక్తి కాదని 2013లోనే జగన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తరువాత ఎక్కడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు లేవు. మోడీ-జగన్‌ కలయికపై తెలుగుదేశ వారి తొలి వ్యాఖ్యానాలు చూస్తే అనుకుంటున్నదొకటీ అయ్యింది ఒకటీ అన్నట్లుగా కనిపిస్తోంది. నూతన పరిస్థితిలో నూతన ఎత్తుగడలకు అగ్రనాయకత్వం బహుశా సమయం తీసుకోవచ్చు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని పక్కన పెట్టిన పెద్దలు- జగన్‌ దొందూ దొందే అయినపుడు ఒకరి గురించి మరొకరు విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది.

ఇక రాష్ట్ర రాజకీయ అవనిక ఎలా వుండబోతోందో చూద్దాం. హోదా, పాకేజీలంటూ ఆంధ్రప్రదేశ్‌ పౌరులను మోసం చేసిన తెలుగుదేశం-బిజెపి కూటమి ఇతర అన్ని రంగాలలో కూడా విఫలబాటలోనే నడుస్తోంది. చెప్పుకొనేందుకు పట్టుమని పది మంచి పధకాలు కూడా లేవు.అందువలన ఈ కూటమి సర్కారుపై జనంలో వ్యతిరేకత పెరగటం ఖాయం. 2014లో వారికి కలసి వచ్చిన సానుకూల అంశాలు వచ్చే ఎన్నికలలో వుండవు. అందువలన ఇప్పుడున్న రాజకీయాన్ని ఇలాగే కొనసాగిస్తే రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లు తెలుగుదేశంతో పాటు బిజెపి కూడా బంగాళాఖాతంలో కలవటం ఖాయం. అందుకే తాము స్వంతంగా బలపడాలనే ఆరాటం బిజెపిలో రోజు రోజుకూ పెరుగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ లోగా ఒంటరిగా బిజెపి స్వంతంగా పోటీచేసే సీన్‌ లేదు. జనంలో గబ్బు పడుతున్న తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్‌ఆర్‌సిపితో వెళితే ఎలా వుంటుంది అని నాడి పరీక్షించేందుకే తొలి చర్యగా జగన్‌కు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. జగన్‌తోనే వాటంగా వుంటే ఏదో ఒక రూపంలో తెలుగుదేశం పార్టీని ఒదిలించుకుంటుంది. రాజకీయ పార్టీలకు సాకులు దొరక్కపోవు. పార్లమెంట్‌ సీట్లు తాను తీసుకొని అసెంబ్లీలో మెజారిటీ జగన్‌కు వదల వచ్చు. వరుస కుదిరితే సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేయవచ్చు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి వంటి పార్టీలకు వాటి నేతల ప్రయోజనాలు తప్ప మిగతావన్నీ పట్టవు. ఒకవేళ బిజెపితో కలిస్తే వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు ఇచ్చిన దళితులు, ముస్లింలు ఎలా స్పందిస్తారన్నది ఒక ప్రశ్న. కొంత ఓటింగ్‌ను అనివార్యంగా కోల్పోవాల్సి వుంటుంది. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లుల విషయంలో బిజెపిని వ్యతిరేకిస్తున్నామని చెప్పిన జగన్‌ ఒక వేళ సయోధ్య కుదిరితే వాటిని తూనాబొడ్డుబాలు అనటం పెద్ద సమస్య కాదు. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదని తరువాత తమకు అర్ధమైందని తెలుగుదేశం సమర్ధించుకున్న మాదిరి జగన్‌ మాట మార్చలేరా ? భూ సేకరణ విషయంలో మడమ తిప్పలేరా ? ఎందరిని చూడలేదు !

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఒంటరిగా లోకేష్‌ నాయకత్వాన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. లోకేష్‌ను ముందు పెట్టి ఓడిపోతే చెప్పుకొనేందుకు వైసిపి రోజా చెప్పిన ముద్దపప్పు అనే ఒక సాకు అయినా వుంటుంది. అదే చంద్రబాబు నాయకత్వాన అయితే అలాంటిదేమీ వుండదు. బిజెపి-వైఎస్‌ఆర్‌సిపి అవకాశాలు కనిపిస్తే అసలు తెలుగుదేశంలో ఎందరు మిగులుతారనేది ఒక పెద్ద ప్రశ్న. ఆయారాం గయారాంలకు కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీలు పెద్ద పీట వేస్తున్నపుడు ఎవరేమనుకుంటే మాకేటి సిగ్గు అన్నట్లుగా చేరేవారు, చేర్చుకొనే వారూ ఎలాగూ వుంటారు. పార్టీ కార్యాలయాల ఆస్ధులను కబ్జా చేసేందుకు తెలుగుదేశం నామమాత్రంగా వుండవచ్చు.

అత్తారింటికి దారి చూసుకోవటంలో విజయం సాధించిన పవన కల్యాణ్‌ అధికారానికి దారి వెతుక్కోవటం అంత సులభం కాదు. సినిమా పేరును ముందుగా రిజిస్టరు చేసుకున్న మాదిరి పార్టీ పేరును నమోదు చేశారు తప్ప నిర్మాణం లేదు. జనతా మాదిరి అధికారానికి వచ్చిన తరువాత పార్టీ పెట్టిన లేదా, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చిన ఎన్టీరామారావు నాటి రోజులు కావివి. గత ఎన్నికల్లో కాంగ్రెసు తాట తీసినట్లుగా ఈ ఎన్నికల్లో గతంలో బిజెపితో కలిసిన లేదా వచ్చే ఎన్నికలలో ఏదైనా కొత్తగా కలిస్తే వాటి తాటతీయాలి. ఈ నేపధ్యంలో వున్నంతలో వామపక్షాలతో కలసి ఎన్నికలలో పోటీ చేయటం తప్ప మరొక దారి లేదు. లేదా ఏదో ఒక పార్టీతో ఒప్పందం చేసుకొని అందరూ అనుకుంటున్నట్లుగా దానికి లేదా వాటికి కాలీ&షట్లు ఇచ్చి ఎన్నికల ప్రచారంలో నటించాల్సి వుంటుంది. వామపక్షాల విషయానికి వస్తే అవి గతం మాదిరి జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. వివిధ తరగతుల ప్రయోజనాల కోసం అవి తప్ప మిగతా ఏ పార్టీలు గత మూడు సంవత్సరాలలో వుద్యమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా వుద్యమాలు ఆగలేదు. ఎన్నికలలో గెలవటానికి అవి మాత్రమే చాలవన్నది గత అనుభవం.గత ఎన్నికలలో వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అనే విమర్శలకు గురయ్యాయి. అందువలన అవి కొత్తగా పొగొట్టుకొనేదేమీ లేదు. కమ్యూనిస్టులకు దగ్గరదారులు లేవు, తెలియవు కనుక తమ సైద్ధాంతిక నిబద్దతకు కట్టుబడి, తమతో కలసి వచ్చే శక్తులు, వ్యక్తులతో కలసి మరోసారి ఒంటరి పోరాటం చేయటం తప్ప పెను మార్పులు వచ్చే సూచనలు ఇప్పటికైతే లేవు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫ్రెంచి నూతన అధ్యక్షుడి ముందు పెను సవాళ్లు !

08 Monday May 2017

Posted by raomk in Current Affairs, INTERNATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

emmanuel macron, french president, marine le pen, new french president

ఎం కోటేశ్వరరావు

పాలకవర్గాలు కోరుకున్న, పచ్చి మితవాద మారినె లీపెన్‌ ఓడిపోవాలంటే అని వార్యంగా ఓటు చేయటం తప్ప అక్కడి మితవాద వ్యతిరేక శక్తులకు మరొక ప్రత్యామ్నాయం లేని కారణంగా బాంకరు అయిన ఇమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ ఆదివారం నాడు జరిగిన తుది ఎన్నికలలో భారీ మెజారిటీతో ఫ్రెంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సాంప్రదాయ గాలిస్టు, సోషలిస్టు పార్టీలను పక్కన పెట్టి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా ఫ్రెంచి ఓటర్లు మూడో పార్టీకి అవకాశమిచ్చారు. నువ్వుగాకపోతే నేను, నేను గాకపోతే నువ్వు అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా నీకిది, నాకది అన్నట్లుగా పంచుకొనే రాజకీయాలకు కాలం చెల్లనుందా అనే ఆలోచనకు ఈ ఎన్నికలు తావిచ్చాయి. ఇదొక మంచి పరిణామమే తప్ప అలాంటిదేదో జరనుందని ముందే కోయిల రాగాలు కూయనవసరం లేదు.

ఫ్రాన్స్‌లో పచ్చి మితవాద నాజీశక్తులకు ప్రాతినిధ్యం వహించే మారినె లీపెన్‌ ఓడిపోయినంత మాత్రాన జనాకర్షక నినాదాలకు కాలం చెల్లినట్లు కాదు. గత ఆరునెలల్లో ఐరోపాలో జరిగిన ఎన్నికలలో పచ్చి మితవాదులుగా వర్ణితమైన శక్తులు ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌లో ఓడిపోయాయి. ఇది సంతోషకరమే అయినప్పటికీ అసలు అలాంటి శక్తులు అధికారానికి పోటీ పడేంతగా బలం ఎలా సంపాదించుకోగలిగాయి అన్నది ఆందోళన కలిగించే అంశం. అమెరికా నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కోవాలంటే వుమ్మడిగా వుండటం తప్ప మరొక మార్గం లేదనే ఆలోచన నుంచి పుట్టిందే ఐరోపా యూనియన్‌. దానిలో వుండి నలుగురితో లాభాలను పంచుకోవటం కంటే విడిగా వుండి ఎక్కువ లబ్ది పొందవచ్చనే అభిప్రాయం వున్న పాలకవర్గ శక్తులు తొలి నుంచీ ఏదో ఒక రూపంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే వున్నాయి. ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలా లేదా అనే అంశంపై బ్రిటన్‌లో ప్రజాభిప్రాయసేకరణ జరిపితే 52శాతం మంది అనుకూలంగా ఓటు చేసిన విషయం తెలిసిందే. సకలరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లుగా ఐరోపా యూనియన్‌తో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చేసిన ప్రచారం వాస్తవం కాదని తేలిపోయింది. ప్రపంచ ధనిక దేశాలలో 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం, గ్రీసు వంటి దేశాలు రుణ వూబిలో కూరుకుపోవటం, ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడాలంటే పొదుపు చర్యలే మార్గమనే పేరుతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న అనేక సంక్షేమ పధకాల కుదింపు, రద్దు, అదనపు భారాలను మోపటం వంటి చర్యలతో కార్మికవర్గానికి ఐరోపా యూనియన్‌ ప్రయోగంపై విశ్వాసం తగ్గటం ప్రారంభమైంది. యూనియన్‌ కొనసాగాలనే శక్తులు జనానికి భరోసా కల్పించే పరిస్ధితి లేదు.ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వచ్చింతరువాత మరింత సమర్ధవంతంగా తమ విధానాలను అమలు జరపాలంటే తిరిగి ప్రజల మద్దతు కోరటం అవసరమనే పేరుతో పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ వున్నప్పటికీ బ్రిటన్‌ మితవాద టోరీ పార్టీ మధ్యంతర ఎన్నికలకు గాను పార్లమెంట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పూర్వరంగంలోనే అనేక దేశాలలో ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావటమే తమ దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం అనే శక్తులు బలం పుంజుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా బలపడతాయనే ధోరణి వ్యక్తమౌతోంది.

ఫ్రాన్స్‌లో ఒక నాడు రాజకీయ పండితులు కొట్టిపారవేసిన నేషనల్‌ ఫ్రంట్‌ అనే పచ్చిమితవాద నాజీశక్తి అధ్యక్ష పదవికి పోటీపడటమే కాదు 34శాతం వరకు ఓట్లు తెచ్చుకొనే శక్తిగా ఎదిగింది. నాజీశక్తి అని ప్రచారం కావటం వలన ఓటర్లను అంతగా ఆకట్టుకోవటం లేదని గ్రహించి తాము మారామని చెప్పుకొనేందుకు ప్రయత్నించింది, దాని స్ధాపకుడైన మారిన్‌ లీపెన్‌ను ఆయన కుమార్తె అయిన మారినే స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించింది. ఆదివారం నాడు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ఓటమని అంగీకరిస్తూ నేషనల్‌ ఫ్రంట్‌ను మరింత బలమైన శక్తిగా తిరిగి రూపొందించేందుకు ప్రయత్నించాలని మద్దతుదార్లకు పిలుపు నిచ్చింది. అమెరికా, ఐరోపాలోని ధనిక దేశాలు ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం, తదితర సమస్యలకు వలస వస్తున్న కార్మికులు, ముస్లింలు కారణమనే ప్రచారం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది.

అనేక దేశాలలో పొదుపు, సంస్కరణల పేరుతో సంక్షేమ చర్యలకు కోత, కార్మికవర్గంపై భారాలను మోపుతున్న పూర్వరంగంలో అనేక దేశాలలో వామపక్ష శక్తులు ఐరోపా యూనియన్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. నేతి బీరలో నెయ్యి వంటి ఐరోపాలోని సోషలిస్టు పార్టీలు 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభ సమస్యలను పరిష్కరించటంలో మిగతా మితవాద పార్టీలకంటే తామేమీ ప్రత్యేకం కాదని రుజువు చేసుకున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌లో తుది విడత పోటీకే అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. గతేడాది హార్వర్డ్‌ కెన్నడీ స్కూలు వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం 1960 దశకంలో ఆరుశాతానికి అటూ ఇటూగా ఓట్లు తెచ్చుకున్న ఐరోపా జనాకర్షక నినాద మితవాద పార్టీలు వర్తమాన దశాబ్దంలో 13శాతానికి పెంచుకున్నాయి. ఇదే కాలంలో కొన్ని ఓట్లు తప్ప సీట్లు ఏమీ లేని వామపక్ష పార్టీలు దాదాపు పదిశాతం లోపుగా ఓట్లను పెంచుకున్నాయని పేర్కొన్నది. ఫ్రాన్స్‌ తొలివిడత పోటీలో వామపక్ష అభ్యర్ధి మెలంచన్‌ 20శాతం వరకు ఓట్లు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

నాది మితవాదం, వామపక్ష మార్గం కాదు మూడవ మార్గం అని చెప్పుకున్న ఇమ్మాన్యుయేలన మక్రాను ముందు తీవ్రమైన సవాళ్లే వున్నాయి. ఎవరికి వారు తమ దేశ ప్రయోజనాలకే పెద్ద పీట అనే ధోరణిలో ధనిక దేశాలన్నీ వ్యవహరిస్తున్నాయి. అందరికంటే పెద్దన్న అమెరికా అయితే ఐరోపాలో పెద్దన్న జర్మనీని దాటి ప్రపంచమార్కెట్లో ఫ్రెంచి కంపెనీలు తమ వాటా సంగతి తేల్చుకోవాల్సి వుంది. రాజకీయంగా అటు నాజీలు, సాంప్రదాయ మితవాదులు, ఆచరణలో వారి కంటే భిన్నమైన విధానాలు లేని సోషలిస్టు పార్టీ, వాటి రెండింటికీ ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న కమ్యూనిస్టు పార్టీతో కూడిన వామపక్ష సంఘటన నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంది.గతానికి భిన్నంగా తన మూడవ మార్గం ఏమిటో రుజువు చేసుకోవాలి. ఫ్రెంచి పాలకవర్గం ఎదుర్కొంటున్న సంక్షోభం వ్యవస్తాపరమైంది తప్ప కార్పొరేటు కంపెనీల అంతర్గత సమస్య కాదు.

పెట్టుబడిదారీ విధానం తన సంక్షోభాల నుంచి బయట పడేందుకు ఎప్పటికప్పుడు అనేక కొత్త మార్గాలను వెతుకుతోంది.ప్రస్తుతం నయా వుదారవాద విధానం అమలు చేస్తోంది. అది ఇంత త్వరగా విఫలం అవుతుందని ఎవరూ వూహించలేదు. ప్రత్యామ్నాయ మార్గాన్ని పెట్టుబడిదారులు ఇంకా తయారు చేసుకోలేదు, ప్రస్తుతం అదే వారి పెద్ద సమస్య. నూతన అధ్యక్షుడు, ఆయన ఏడాది వయస్సున్న ఎన్‌ మార్చ్‌, ఫార్వర్డు, ముందుకు పోదాం, ఆగే చలో పార్టీకి తొలి సవాలు వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలు. తుది విడత అధ్యక్ష ఎన్నికలలో 1969 తరువాత రికార్డు స్ధాయిలో నాలుగో వంతు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా దూరంగా వున్నారు. వీరుగాక ఖాళీ ఓట్లు, ఇద్దరికీ వేసి చెల్లకుండా చేసిన ఓట్లు మరో తొమ్మిది శాతం వున్నాయి. తొలి విడతలో ఇలాంటి ఓట్లు కేవలం రెండు శాతం మాత్రమే. అంటే మొత్తంగా చూస్తే ప్రతి ముగ్గురిలో ఒకరు మక్రాన్‌ లేదా మారీ లీపెన్‌ అంటే వ్యతిరేకత కలిగి వున్నట్లు చెప్పవచ్చు. వీరంతా పార్లమెంట్‌ ఎన్నికలలో ఎలా ప్రవర్తిస్తారో చూడాల్సి వుంది.

ఆదివారం నాటి వరకు అధికారంలో వున్న సోషలిస్టు పార్టీ ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలు సామాన్యమైనవి కాదు. లక్షా 20వేల ప్రభుత్వ రంగ వుద్యోగాల రద్దు, 70శాతం మంది వ్యతిరేకించిన కార్మిక చట్టాల సవరణ బిల్లు ప్రభుత్వం, పార్లమెంట్‌ ముందు వున్నాయి. పార్లమెంట్‌ ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా అధ్యక్షుడిగా తన అధికారాన్ని వుపయోగించి నిరంకుశంగా అమలు జరుపుతారా ఏం చేస్తారు అన్నది చూడాల్సి వుంది.

ఆర్ధిక మాంద్యాన్ని, పదిశాతం నిరుద్యోగులను గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా తెచ్చుకున్నారు. వుపాధి వున్నవారిలో 85శాతం మంది తాత్కాలిక వుద్యోగులే. యువతలో 23శాతం నిరుద్యోగులు. అన్నింటికీ మించి ప్రధాన ప్రత్యర్దిగా వున్న ఫాసిస్టు నేషనల్‌ ఫ్రంట్‌ రాబోయే రోజుల్లో మరింతగా రెచ్చిపోవటం ఖాయం. ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత అసంతృప్తికి గురైతే మరోసారి యువజన, విద్యార్ధి వుద్యమాలకు ఫ్రాన్స్‌ కేంద్రంగా మారనుంది. అవి ఏశక్తుల చేతుల్లోకి పోతాయనేది చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వివక్షను ప్రశ్నించిన మహిళా టీచర్‌పై కమ్యూనిస్టు ముద్ర !

07 Sunday May 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Brooklyn School, communist, Discrimination, Jill Bloomberg, Park Slope Collegiate, Principal Jill Bloomberg

ఎం కోటేశ్వరరావు

అపర ప్రజాస్వామిక దేశంగా, ఎలాంటి పరిమితులు లేని స్వేచ్ఛా ప్రపంచంగా కీర్తి ప్రతిష్టలతో అలరారుతోంది అమెరికా. తమకు నిధులు కేటాయించటంలో వివక్ష చూపారని ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వ్యాఖ్యానించటమే అక్కడ నేరమైంది.ఇంకే ముంది, రంగంలోకి దిగిన విద్యాశాఖ అబ్బే దానితో సంబంధం లేదు ఆమె కమ్యూనిస్టు కార్యకలాపాలలో పాల్గొన్నారా లేదా అనేది మాత్రమే విచారణ చేస్తున్నామని చెబుతోంది. అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా పని చేస్తోంది. దాని ప్రతినిధులు ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం వుంది. అయినా ఒక టీచరు రాజకీయ కార్యకలాపాల గురించి, అందునా ఆమె కమ్యూనిస్టు అని ఆరోపిస్తూ విచారణ జరపటం గమనించాల్సిన అంశం. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ? బ్రూక్లిన్‌ ప్రాంతంలోని పార్క్‌ స్లోప్‌ కాలేజియేట్‌ స్కూలు ప్రధానోపాధ్యుయురాలు జిల్‌ బ్లూమ్‌ బెర్గ్‌ ఆ విచారణను సవాలు చేస్తూ తన రాజకీయ కార్యకలాపాల గురించి ఎలాంటి రుజువులు లేవని, నిధుల కేటాయింపు గురించి తాను చేసిన బహిరంగ వ్యాఖ్యలకు కక్ష సాధింపు చర్యగా జరుపుతున్న విచారణను నిలిపివేయలసిందిగా ఆమె చేసిన విన్నపాన్ని న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ ప్రాంత కోర్టు ఈనెల మూడున తిరస్కరించింది.

మార్చినెల మొదటి వారంలో న్యూయార్క్‌ నగర విద్యాశాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగ ప్రతినిధి ఒకరు వచ్చి ప్రధానోపాధ్యాయురాలు బ్లూమ్‌బెర్గ్‌పై విచారణ జరుపుతున్నట్లు ఆమెకు తెలియచేశారు. ఏ అంశం గురించి విచారణ జరుపుతున్నదీ, వాటి స్వభావం గురించి కూడా తాము చెప్పకూడదని, సిబ్బందితో మాట్లాడాల్సి వుందని మాత్రమే తెలిపారు. ఆ తతంగం ముగిసిన తరువాత కమ్యూనిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపించి విచారణ జరుపుతున్నారని సిబ్బందిలో ఒకరు బ్లూమ్‌బెర్గ్‌కు తెలిపారు. పరిహాసానికి అలా చెప్పారేమోనని తొలుత భావించిన ఆమె తరువాత ఇలాంటిదేదో జరుగుతుందని తాను చాలాకాలంగా వూహిస్తున్నానని చెప్పారు.

న్యూయార్క్‌ నగర ప్రభుత్వ స్కూళ్ల తీరుతెన్నులు, విద్యాశాఖ వున్నతాధికారుల గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఆమె విమర్శనాత్మకంగా మాట్లాడటం, ఆ విషయాలు మీడియాలో రావటం బహిరంగ రహస్యమే. నల్లజాతీయులు, లాటినోల పిల్లల విషయంలో వివక్ష పాటిస్తున్నారని ఆమె విమర్శించేవారు. తమ పాఠశాల ప్రాంగణంలోనే నిర్వహిస్తున్న మరొక పాఠశాలలో ఆ ప్రాంతంలో మైనారిటీలుగా వున్న శ్వేతజాతీయుల పిల్లలు చదువుతున్నారు. క్రీడలకు నిధుల కేటాయింపులో ఒకే దగ్గర వున్న రెండు స్కూళ్లలో తమ స్కూలు పట్ల వివక్షతో తక్కువ నిధులు కేటాయించారన్నది ఆమె తాజా విమర్శ. ఇలాంటి వాటిపైనే గత కొంత కొన్ని సంవత్సరాలుగా ఆ స్కూలు విద్యార్ధులు, తలిదండ్రులు చేస్తున్న ఆందోళన, సమీకరణల పట్ల ఆమె సానుకూలంగా వుండటం అందరికీ తెలిసిన అంశమే.

విద్యాశాఖ దర్యాప్తు విషయం వెల్లడైన తరువాత తనపై తప్పుడు ఆరోపణలతో విచారణ జరుపుతున్నారని అది తన వ్యక్తిగత, భావ ప్రకటనా స్వేచ్చ, పౌరహక్కుల రక్షణ చట్టానికి విరుద్దం కనుక తాను దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు వెలువడే వరకు దర్యాప్తు నిలిపివేయాలని ఆమె కోర్టుకు విన్నవించారు. విచారణ నిలిపివేయలేమని కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా బ్లూమ్‌బెర్గ్‌పై దర్యాప్తు గురించి ఆమె న్యాయవాదికి విద్యాశాఖ ఆరోపణలను అందచేశారు. పాఠశాల పని వేళల్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించటం, ఎలాంటి నిధి వసూలు చేయటం నిషేధమని, అయితే ఆమె, మరో ఇద్దరు టీచర్లు ఒక కమ్యూనిస్టు సంస్ధ అయిన ప్రోగ్రెసివ్‌ లేబర్‌ పార్టీ కార్యకర్తలని, పార్టీ నిర్వహించే ప్రదర్శనలతో సహా దాని కార్యకలాపాలలో పాల్గొనేందుకు విద్యార్ధులను సమీకరిస్తున్నారని, ఆ పార్టీకి నిధులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

న్యూయార్క్‌లో టీచర్‌గా పనిచేయటానికి ముందు చికాగాలో పని చేసిన ఆమె 2004లో బ్రూక్లిన్‌ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా వచ్చారు. ఆ సమయంలో ఒక భవనంలో మూడు చిన్న హైస్కూళ్లు వున్నాయి. అందులో ఒక దానికి ఆమె ప్రధానోపాధ్యాయురాలు. ఆ భవనం ఎలా వుందంటే పై కప్పు నుంచి వర్షపునీరు కారుతుంది. మరుగుదొడ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. తరగతి గదుల గోడలు బూజుపట్టి వున్నాయి. తలుపులు, కిటికీలు మామూలుగా తెరుచుకొనే స్ధితిలో లేవు. ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసేందుకు పొమ్మునకుండానే పొగబెడుతున్న అమెరికా సర్కార్‌ నిధుల కేటాయింపులో వివక్ష పాటిస్తున్నట్లు ఆ సమయంలో ఆమెకు ఊహకు అందలేదు. అనేక మంది మాదిరి దాన్నే వున్నంతలో బాగు పరిచేందుకు పూనుకొని పని చేశారు. అయితే 2010లో జరిగిన పరిణామాలు ఆమె ఆలోచనలో మార్పు తెచ్చాయి. తమ భవనంలో వున్న స్కూళ్లకు తోడు అదనంగా తెల్లవారి పిల్లల కోసమంటూ ప్రత్యేకంగా ఒక స్కూలును ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. వున్న స్కూళ్లలో అదనంగా చేర్చేందుకు అవకాశం వుండగా కొత్త స్కూలు ఎందుకని ఆమె ఆమాయకంగా ప్రశ్నించారు. ఆ స్కూలును సదరు భవనంలో ఏర్పాటు చేస్తే శిధిలావస్తలో వున్న మిగతా స్కూళ్లకు కూడా నిధులు వస్తాయని నమ్మబలుకుతూనే అసలు విషయం చెప్పారు. తెల్లపిల్లలకు విడిగా స్కూలు ఏర్పాటు చేస్తే వారి ప్రతిభ, మరియు ప్రవర్తనను విడిగా పర్యవేక్షించటానికి అవకాశం వుంటుందని కూడా తెలిపారు. అది వివక్ష తప్ప మరొకటి కాదని ఆమెకు అప్పుడు అర్ధమైంది. కొత్త స్కూలు అయితే పెట్టారు గాని పాత స్కూళ్ల మెరుగుదలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. తెల్లవారి పిల్లలకు ఏర్పాటు చేసిన స్కూళ్లకు ఎలాంటి కొరత లేకుండా నిధులు మంజూరు చేస్తున్నపుడు తమ వరకు వచ్చే సరికి ఎలా లేకుండా పోతాయని ఆమె ప్రశ్నించటం ప్రారంభించారు. పిల్లలు, తలిదండ్రులు కూడా నిరసన తెలిపినా ఫలితం లేకపోయింది.

తమ పాఠశాలలో మెటల్‌ డిటెక్టర్‌ను ఏర్పాటు చేయాలన్న విద్యార్ధుల ఆందోళనకు బ్లూమ్‌బెర్గ్‌ మద్దతు తెలిపారు. స్కూలు అసెంబ్లీలో పోలీసుల హింస, వివక్ష, జాత్యహంకారంతో కూడిన విద్యాశాఖ విధానాల గురించి ఆమె మాట్లాడటమేగాక ఇతరులను ప్రోత్సహించారు. అదే స్కూలులోని కొందరు టీచర్లు ఈ ధోరణిని వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో ప్రధానోపాధ్యాయురాలిగా విద్యాశాఖకు ఒక మెయిల్‌ పంపారు. ఒకే భవనంలోని మిగతా స్కూళ్లలో వున్న క్రీడా బృందాల కంటే తక్కువ వున్న తెల్లవారి పిల్లల స్కూలుకు రెండింతలు ఎక్కువగా నిధులు మంజూరు చేయటాన్ని దానిలో అభ్యంతర పెట్టారు.మెయిల్‌ చేరిన వెంటనే దర్యాప్తు సిబ్బంది ఆమె స్కూలుకు వచ్చారు. టీచర్లలో విభజన ఏర్పడింది. వారిలోని కొంత మంది ఆమెను కమ్యూనిస్టుగా చిత్రిస్తూ ఫిర్యాదు చేసినట్లు కూడా తేలింది. బ్లూమ్‌బెర్గ్‌ భర్త నిర్వహించే ఒక సంస్ధ నిధుల సేకరణలో భాగంగా స్కూలులో ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారని, దానికి గాను ఒక్కొక్కరి నుంచి 20 డాలర్లు సేకరించారని, తద్వారా బ్లూమ్‌ బెర్గ్‌కు కూడా లబ్ది చేకూరిందని, ఈ కార్యక్రమానికి సిబ్బంది, విద్యార్దుల అంగీకారం తీసుకోలేదన్నది ఒక ఆరోపణ ప్రోగ్రెసివ్‌ లేబర్‌ పార్టీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నదాని ప్రకారం బ్లూమ్‌బెర్గ్‌ పని చేస్తున్న స్కూలులోని కొందరు విద్యార్ధులు ఆ పార్టీ నిర్వహించే అధ్యయన బృందాలలో చేరారని, వర్గ చైతన్యాన్ని కలిగించేందుకు సదరు స్కూలును వినియోగించుకుంటున్నారని, దానికి ఆమే కారణమని చేసిన ఆరోపణను బ్లూమ్‌బెర్గ్‌ తిరస్కరించారు. ఆ పార్టీ తమ పాఠశాలలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని, పిల్లలు లేదా వారి తలిదండ్రులు బయటి కార్యక్రమాలలో పొల్గొంటే తానెలా బాధ్యురాలినౌతానని ఆమె ప్రశ్నించారు.

తనపై జరుపుతున్న విచారణను నిలిపివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ విచారణ సందర్భంగా కొందరు టీచర్లు, ప్రస్తుత, పూర్వ విద్యార్ధులు, తలిదండ్రులు ఎందరో బ్లూమ్‌బెర్గ్‌కు మద్దతుగా కోర్టు హాలుకు వచ్చారు.విద్యాశాఖ విచారణ తన భావ ప్రకటనా స్వేచ్చకు ఎలా ఆటంకం కలిగించిందో స్పష్టం చేయలేకపోయారని జడ్డి వ్యాఖ్యానించారు. విచారణ తీరు, దానిలో వాడిన భాష కమ్యూనిస్టు వ్యతిరేక మెకార్ధీ కాలాన్ని గుర్తుకు తెస్తోందని న్యూయార్క్‌ సిటీ పౌరహక్కుల సంఘం డైరెక్టర్‌ డోనా లైబర్‌మన్‌ వ్యాఖ్యానించారు.

ప్రధానోపాధ్యాయురాలు కమ్యూనిస్టా లేక కమ్యూనిస్టు కార్యకలాపాలను ప్రోత్సహించారా లేదా అన్నది ఒక అంశం. తమ స్కూలులో అలాంటి కార్యకలాపాలేవీ నిర్వహించలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూళ్లలో అధికారికంగా కమ్యూనిస్టు వ్యతిరేక, అనుకూల కార్యకలాపాలతో బాటు, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదు. తమ స్కూలు పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ప్రధానోపాధ్యాయురాలిగా వ్యాఖ్యానించటం లేదా విమర్శించటం సమర్ధనీయమే. ఆ కారణంగానే ఆమెకు కమ్యూనిస్టు అని ముద్రవేయటం నిజంగా కమ్యూనిస్టులు గర్వించదగిన అంశం. వివక్ష, జాత్యహంకారం వంటి వాటిని ప్రశ్నించేవారందరినీ కమ్యూనిస్టులు అని పిలిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. కమ్యూనిజానికి దూరంగా వున్న వారిలో కనీసం ఒక్కరిని ఆ శిబిరంలోకి నెట్టేందుకు ఎవరు పూనుకున్నా వారందరూ అభినందనీయులే. న్యూయార్క్‌ నగర మేయర్‌గా వున్న డి బ్లాసియో డెమోక్రటిక్‌ పార్టీలోని వామపక్ష వాదిగా పేరుంది. అయినప్పటికీ యంత్రాంగం కమ్యూనిస్టు వ్యతిరేకులతో నిండి వున్నపుడు, ఆ పార్టీలో కూడా పుష్కలంగా కమ్యూనిస్టు వ్యతిరేకులు వున్నపుడు ఒక్క మేయర్‌ ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను అడ్డుకోలేరని ఈ వుదంతం స్పష్టం చేసింది. తన పెరటి తోటగా భావించే లాటిన్‌ అమెరికాలోనే వామపక్ష, సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తుల వ్యాప్తిని అడ్డుకోవటంలో విఫలమైన అమెరికా యంత్రాంగం తమ స్వంత దేశంలో అలాంటి ప్రతి ప్రయత్నంతో తమ ప్రజాస్వామ్య బండారాన్ని బయటపెట్టి ఆచరణలో మేడి పండు చూడ మేలిమై వుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్లుగా నిరూపించుకుంటోంది.

ప్రతి నిరంకుశ వ్యవస్ధ తనను నాశనం చేసే శక్తులను తానే చేసుకుంటుంది, బయటి నుంచి ఎవరూ రానవసరం లేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. అది అమెరికన్లకు ఎలా వర్తించకుండా వుంటుంది? వారేమైనా పరలోక జీవులా ? పవిత్ర మూర్తులా ? వంద డిగ్రీలు దాటి మరిగితేనే నీరు రూపం మార్చుకొని ఆవిరిగా మారుతుంది. దేనికైనా సమయం రావాలి. అమెరికాలోని సామాన్యులు పెట్టుబడిదారీ వ్యవస్ధ విఫలమైందనే విషయం గుర్తించటం నానాటికీ పెరుగుతోంది. దాని స్ధానంలో అంతకంటే మెరుగైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మొగ్గతొడగటం తదనంతర సహజ పరిణామం. అది సోషలిజమా మరొకటా అన్నది నిర్ణయించుకోవాల్సింది వారే.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d