• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: NATIONAL NEWS

అసలు ధర్మం అనేది వుంటే కదా రక్షించటానికి ?

20 Saturday Feb 2016

Posted by raomk in AP NEWS, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

budda, Dharma, Hinduism, Hinduthwa, vedas

కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.

ఎం కోటేశ్వరరావు

      ధర్మాన్ని రక్షించటం అంటే ? అనే శీర్షికతో రిటైర్డ్‌ డిజిపి కె అరవిందరావు తన వ్యాసపరంపరలో భాగంగా ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. ఆయన ప్రస్తావించిన విషయాల మంచి చెడ్డలను పరిశీలించబోయే ముందు ధర్మాన్ని రక్షించటానికి ముగింపులో ఆయన చెప్పిన మార్గంతో ప్రారంభిద్దాం. దళిత, బలహీన వర్గాలను ప్రత్యేకంగా చూసి వారిని సమాజం నుంచి వేరు చేయటం కాకుండా వారితో అగ్రవర్ణాలు తమ సంస్కారాన్ని పంచుకోవాలని దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు చెప్పారని, అందరికీ వుపనయనం చేయాలని, గాయత్రీ మంత్రం నేర్పాలని ఆయన చెప్పిన మాట హాస్యాస్పదంగా కనపడవచ్చు కానీ లోతుగా ఆలోచించాల్సిస విషయం.పైన చెప్పిన వర్గాల వారికి మేలు చేస్తున్నామనే భావంతో వారిని వుద్యమాల్లోకి దింపి మన దేశాన్నీ, సంస్కృతిని ద్వేషించేట్లు చేసేవారిని అడ్డుకోవటానికి ఇదొక మార్గం అని అరవిందరావు గారు సూక్ష్మంలో ధర్మాన్ని రక్షించే మోక్ష మార్గం చెప్పారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య వంటి మహానుభావులు ఆనాటికి తమకు తోచిన దానిని నిజాయితీగానే చెప్పారు. మన సమాజం ఎంతగా చీలిపోయి వుందంటే కులాల ప్రస్తావన లేని క్రైస్తవ మతంలో అనేక మంది స్వాతంత్య్రానికి పూర్వమే చేరారు. వారిలో అన్ని కులాల వారూ వున్నారు. ఇప్పుడు చూస్తే మతం మారినా వారి కులాల్లో మార్పులు లేవు. కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు వివాహాలు వారి కులాల్లోనే జరుగుతున్నాయి. అలాగే ఆ మహానుభావుడు చెప్పినట్లు అందరికీ వుపనయనాలు జరిపి, గాయత్రీ మంత్రం వుపదేశించినా అదే జరిగి వుండేది. కనుక అది పరిష్కారం కాదన్నది స్పష్టం.

      ఇక అరవిందరావుగారు ఆరోపించినట్లుగా మొదటి విషయం ఈ దేశంలో పుట్టిన వారెవరూ దేశాన్ని ద్వేషించటం లేదు. పుట్టుక అనేది ఒక ప్రమాదం వంటిది. ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎందుకు తెలియదు. యాదృచ్చికంగా ఒక కుటుంబంలో పుడితే అగ్రకులమని, మరొక కులంలో పుడితే అధమ కులమని వెంటనే ముద్రవేసే కుసంస్కృతిని, సామాజిక దుష్టత్వాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అలాంటి కులాల అంతరాలను తరతరాలుగా కాపాడుతూ, అనుమతిస్తున్న ‘మను’ సంస్కృతిని కాపాడాలి అని ఎవరైనా అంటే ఏడునిలువులలోతున పాతి వేయాలంటూ దానిని ద్వేషిస్తున్న వారు మెజారిటీగా వున్నారు. సంస్కృతి పేరుతో ఇక్ష్వాకుల కాలం నాటి అడ్డగోలు వ్యవహారాలను రుద్దాలంటే కుదరదు. పనికిరానిదానిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఆరోగ్యకరమైన దానిని ప్రోత్సహించటమే మానవ సంస్కృతి. దేన్నయినా మూసిపెడితే పాచిపోతుంది. ప్రతిదాని మంచి చెడ్డలను విశ్లేషించినట్లే సంస్కృతిపై కూడా నిరంతరం చర్చ జరగాలి. నవీకరణ జరగాలి. కానీ అరవిందరావు గారు కొన్ని విశ్వవిద్యాలయాలూ, మీడియాలోనూ జరుగుతున్న చర్చను అసత్య ప్రచారంగా చిత్రిస్తున్నారు. విమర్శలకు రెండు కారణాలంటూ ఒకటి మన దేశాన్ని బలహీన పరచాలనే వ్యూహంలో భాగంగా వస్తున్న వుద్యమాలు, రెండోది నిజంగానే మన వ్యవస్ధలో రావాల్సిన మార్పు. మొదటి అంశాన్ని ఇక్కడ చర్చించటం లేదు, కొంత మంది వేదాలు చదవటానికి అనర్హులు అని గీత గీసినట్లు రెండవది మన పీఠాలు, ఆచార్యుల పరిధిలోది అని చెప్పేశారు.

      పోలీసు వ్యవస్ధలో దీర్ఘకాలం పనిచేసిన అరవిందరావు వంటి వారికి విశ్వవిద్యాలయాలూ, మీడియాలో జరుగుతున్న చర్చలు దేశాన్ని బలహీనపరచాలనే వుద్యమాలుగా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. ఒక ఆరోపణ చేసి వాటిని ఇక్కడ చర్చించటం లేదు అని తప్పుకుంటే కుదరదు. మీ ఆరోపణ కూడా ఒక మీడియా వేదికలో చేసిందే అని గమనించండి. మీ దగ్గర ఆ చర్చలకు సరైన సమాధానం లేదని అనుకోవాల్సి వస్తుంది. రెండోది మన వ్యవస్ధలో రావాల్సిన మార్పులు పీఠాలు, ఆచార్యుల పరిధిలోనివి అన్నారు. ప్రపంచ మతాల చరిత్రలో ఏ పీఠం లేదా ఆచార్యులు కూడా మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మనకు ఎక్కడా కనపడదు. వారిపై తిరుగుబాటు చేసిన వారికి ప్రతి దేశం,ప్రతికాలంలోనూ సామాన్య జనం మద్దతు ఇచ్చారు. మన దేశంలో స్థూలంగా హిందూ మతం అని పిలిచేదానిపై తిరుగుబాటుగానే బౌద్దం,జైనం అవతరించాయి. ఆ హిందూ మతంలో భిన్న భావజాలంతో వున్న శైవ, వైష్ణవ శాఖలు ఎలా కొట్టుకున్నాయో, ఒకదానినొకటి అంతం చేసుకోవటానికి ఎంత రక్తపాతానికి పాల్పడ్డాయో, అవే రాజీపడి బౌద్ధ,జైనాలను, అసలు మతాలనే సవాలు చేసే చార్వాకులు, లోకాయతులను, వారి గ్రంధాలను ఎలా నాశనం చేశాయో చరిత్రలో నమోదయ్యే వుంది. అనేక బౌద్ధ,జైనాలయాలను శివాలయాలుగా మార్చిన చరిత్ర ఆంధ్రదేశంలో అడుగడుగునా కనిపిస్తుంది. అందువలన ఇసు నుంచి తైలాన్ని తీయవచ్చుగానీ పీఠాధిపతుల నుంచి సంస్కరణలు ఆశించటమా? ఇంతకు ముందు జరగలేదు, ఇక ముందు జరగవు. మొత్తంగా చెప్పాలంటే సంస్కృతి మంచి చెడ్డల గురించి చర్చించటానికి, మార్చుకోవటానికి అరవిందరావు వంటి వారు సిద్ధం కాదు.

     ‘ప్రస్తుతం ఎలాంటి ఘటన జరిగినా దాన్ని మన సంస్కృతితో ముడిపెట్టటం, హిందూమతం అంటేనే బ్రాహ్మణిజం అనీ, బ్రాహ్మణిజం అంటే కులతత్వం అనీ, కులతత్వం అంటే అణచివేత అనే ప్రచారాన్ని చూస్తున్నాం. దీన్ని కేవలం మన దేశంలోనే కాకుండా అనేక పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో కూడా చర్చించటం, అందుకు మన సమాజం మౌనం వహించటం ప్రమాదకరం.’ అని అరవిందరావుగారు వాపోయారు. పురాతన కాలంలో తక్షశిల, పాటలీ పుత్రవంటి మన విశ్వవిద్యాలయాలకు విదేశాల నుంచి విద్యార్ధులు వచ్చే వారని గర్వంగా చెప్పుకుంటాం. ప్రస్తుతం అంతకంటే విస్తృతమైన ప్రపంచీకరణ యుగంలో వున్నాము. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా విమర్శలు సరైనవా కావా అన్నది పాయింటు. అనేక తూర్పు ఆసియా దేశాలలో హిందూమతం, ఆచారాలు వ్యాపించాయి. వర్తమానంలో అనేక దేశాలలో మన దేశం నుంచి వలస వెళ్లిన వారు అక్కడ స్ధిరపడుతున్నారు, దేవాలయాలు నిర్మిస్తున్నారు, మతాచారాలను మరింతగా రెచ్చిపోయి పాటిస్తున్నారు. అందువలన ఎవరు ఎక్కడ చర్చించాలో చర్చించకూడదో గీతలు గీయటం సంకుచితం.

    ప్రతిదానికీ సంస్కృతితో ఎవరు ముడిపెడుతున్నారు? మతం వేరు సంస్కృతి వేరు. అన్ని మతాలు,అలవాట్లు, ఆచారాలను సహించటం మన సంస్కృతి. దాన్ని తిరస్కరించటం మత సంస్కృతి.దానిలో భాగంగానే అది ఏమతమైనా ఎవరేం తినాలో, దుస్తులు ఎలా ధరించాలో, ఎలా కూర్చోవాలో, ఎలా పరుగెత్తాలో కూడా నిర్దేశించేందుకు పూనుకున్నారు. మీరే చెప్పినట్లు భారతీయ మూల సిద్ధాంతంలోనే సహనశీలత, విశాల భావాలు వున్నాయనేది నిర్వివాదాంశం అయినపుడు చర్చలపై సమాజం మౌనం వహిస్తున్నదంటే వాటిని అంగీకరించినట్లే, మీ కెందుకు అంత దుగ్ద, లేదూ మీరు మౌనం వీడి చర్చలు, విమర్శలు ఎలా సరైనవికాదో విమర్శించండి. ఇస్లాం పుట్ట ముందే భారత దేశంలో బ్రాహ్మణులు లేత గోమాంసాన్ని లొట్టలు వేసుకుంటూ తినటం గురించి రాసింది వాస్తవమా కాదా? గోవులు, కోడె దూడల మాంసం తినటం గురించి వేదాల్లో వుందా లేదా ? అలాంటపుడు గోవును హిందూ సంస్కృతికి ముడిపెట్టి గోవధ చేసిన వారిని చంపివేయాలని వేదాలు చెప్పాయని తప్పుడు వ్యాఖ్యానాలు చేసే వారి గురించి అరవిందరావు ఏమంటారు ? భారత్‌లో పురాతన కాలంలోనే హిందూ మత భావజాలాన్ని అనేక మంది సవాలు చేశారు. దాన్ని మన సమాజం అంగీకరించింది. అరవిందరావుగారే చెప్పినట్లు వైదిక సంప్రదాయంలోనే శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు ఒకరి సిద్దాంతాన్ని ఒకరు విమర్శించుకున్నారు. అలాంటిది వీరందరి సిద్ధాంతాలను కమ్యూనిస్టులో మరొకరో ఎవరైనా విమర్శిస్తే ఎక్కడలేని అసహనం ఎందుకు వెల్లడి అవుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా మన దేశం వివిధ మతాల, మతరహిత భావజాలాల కేంద్రంగా వుంది. అలాంటి దానిలో జాతీయత అంటే హిందూయిజమే, హిందూయిజమే జాతీయత అన్న తమ భావాన్ని రుద్దేందుకు కాషాయ తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు.వాదనలో తమతో ఏకీభవించని వారిని అంతం చేసేందుకు కూడా వీరశైవులు వెనకాడలేదని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు అది మరో రూపంలో పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది.

    పురాణాలు, ఇతిహాసాలపై విశ్వాసం వున్న వారి ప్రకారం నాలుగు యుగాలున్నాయి. వాటిలో మొదటిదైన సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచిందట. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా సమాజం వున్నప్పటికీ ఎవరికి ఎవరూ తీసిపోయేవారు కాదని, ఎవరి వృత్తి వారికి గొప్పదని, అందరికీ దేవుడు ఒక్కడేనని, ఆయనను ,స్వర్గం చేరుకోవటానికి ప్రతి ఒక్కరికి తపస్సు చేసుకోవటానికి అవకాశం వుందని చెబుతారు.ఈ యుగాలు, సామాజిక తరగతుల గురించి ఎవరికి వారు తమవైన వ్యాఖ్యానాలు చేస్తున్నందున వాటిలో ఒకదానిని నేను ప్రస్తావించాను.త్రేతాయుగం నాటికి ధర్మం మూడు పాదాలు, ద్వాపర యుగంలో రెండు పాదాలు, కలియుగంలో ఒక పాదంతో నడుస్తుందని చెబుతారు. ఇది కలియుగ అంతం కనుక అసలు ఏకపాద ధర్మం అయినా వుందో లేదో తెలియటం లేదని బాధ పడేవారు కూడా లేకపోలేదు. అరవిందరావు వంటి వారు కలియుగ అంతంలో అసలు ధర్మం ఏమిటో అంత స్పష్టంగా తెలియని స్ధితిలో గడిచిపోయిన యుగాలలోని ధర్మాలను ఇప్పుడు అమలు జరపాలని చెబుతున్నారా అనిపిస్తోంది. ఎలా సాధ్యం ? మాతృగర్భం నుంచి ఒకసారి బిడ్డ బయటికి వచ్చిన తరువాత తిరిగి అమ్మకడుపులోకి వెళ్లటం ఎంత అసాధ్యమో గడచిపోయినట్లు చెబుతున్న యుగ ధర్మాలను ఇప్పుడు అమలు జరపటం అంత కష్టం.

     సత్యయుగంలో అందరూ సమానమే అని చెబుతూనే శూద్రులు మిగతా తరగతులైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవలు చేయాలని కూడా చెప్పారు. ఇదొక వైరుధ్యం. సత్యయుగంలో శూద్రులు కూడా తపస్సు చేయవచ్చని చెప్పారు. కానీ త్రేతాయుగం వచ్చే నాటికి శూద్రులు తపస్సు చేయటం ధర్మవిరుద్ధంగా మారిపోయింది. వాల్మీకి రామాయణంలోని వుత్తరకాండలో రాసినదాని ప్రకారం ఒక రోజు ఒక బ్రాహ్మణుడు మరణించిన తన కుమారుడి శవాన్ని తీసుకొని శ్రీరాముడి వద్దకు వస్తాడు. నీవు కచ్చితంగా పాపం చేసిన కారణంగానే తన బిడ్డ మరణించాడని లేకుంటే బతికేవాడని ఆరోపిస్తాడు. ఆ సమయానికి ప్రత్యక్షమైన నారదుడు అసలు విషయం రాముడి పాపం కాదని ఒక శూద్రుడు తపస్సు చేస్తున్న కారణంగానే బ్రాహ్మణ బాలుడు మరణించాడని చెబుతాడు. వెంటనే రాముడు తనిఖీకి బయలు దేరి వెళ్లగా శంబుకుడు కనిపిస్తాడు. రామా నేను బొందితో కైలాసానికి వెళ్లటానికి ఈ తపస్సు చేస్తున్నానని చెబుతాడు.అది అధర్మం అంటూ శంబుకుడిని రాముడు వధిస్తాడు. తన కంటే ముందున్న సత్య యుగంలో శూద్రులు కూడా తపస్సు చేయటానికి అవకాశం వున్న విషయాన్ని రాముడెందుకు గ్రహించలేకపోయాడు. అప్పుడు కానిది తరువాత అధర్మం ఎందుకు అయింది అని ధర్మ చర్చకు ఎందుకు పెద్దలను సమావేశ పరచలేకపోయాడు? నియంతల పాలనలో మాదిరి అంతా రామరాజ్యంలో కూడా ఏకపక్షంగా నడిచినట్లు కనిపించటం లేదూ?అసలు శూద్రులు తపస్సు చేయటం ఎందుకు నిషిద్ధం ? అరవిందరావు వంటి వారు చెబుతున్నట్లుగా వేదాలలో చేసిన వృత్తులు బట్టి వర్ణాలు వచ్చాయంటున్నారే, రాముడి కాలంలో ఆ వేదాలలో చెప్పిన దాని ప్రకారం శూద్రులు తపస్సు చేయటం ఎలా అధర్మం అవుతుంది? అంటే వేదాల స్ఫూర్తిని రాముడి కాలంలోనే తోసిపుచ్చారా ? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవచేయటానికి శూద్రులు కట్టుబడి వుండాలి తప్ప ఇతరత్రా పనులు చేస్తే ఇదే జరుగుతుందని శంబుక వధతో రాముడు మిగతా శూద్రులను హెచ్చరించాడా ? నేటి దృష్టితో నాడు జరిగిన వాటిని ప్రశ్నించటం సమంజసమా అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. నిజమే ! అది ప్రశ్నించేవారికే కాదు, నాటి ఆదర్శాలను నేటికీ వల్లె వేస్తున్నవారికి అమలు జరపాలని చూస్తున్న వర్తించదా ?

     బ్రాహ్మలు కాని వారు పూజా పునస్కారాలు, పౌరోహిత్యం చేయటం వల్ల, కమ్యూనిస్టులు వేదమంత్రాలతో పనిలేకుండా వివాహాలు చేయటం వలన బ్రాహ్మలకు కష్టకాలం వచ్చిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నారద మునీంద్రుల వంటి వారు నిజమే అని చెబితే ఏ ముఖ్యమంత్రి అయినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారా ? తనపైన ప్రశ్నించే మరొకరు లేరనే కదా ఎవడో ఏదో అన్నాడని శ్రీరాముడు గర్భిణీ అని కూడా చూడకుండా సీతను అడవులలో వదలి పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా నేను రాముడిని అనుసరిస్తున్నాను, నా భార్య శీలం గురించి ఎవరో ఏదో అన్నారు కనుక నేను ఆమెను వదలి వేస్తున్నాను అంటే చెల్లుతుందా? లేదా నేను కృష్ణ భక్తుడిని ఆయన మాదిరి బహు వివాహాలు చేసుకుంటుంటే నిత్య పెళ్లి కొడుకు అని పోలీసులు జైల్లో పెట్టి నా మనోభావాలను గాయపరిచారు అని అంటే కుదురుతుందా ?

     ధర్మం నిర్వచనాన్ని ఎప్పుటి కప్పుడు పున:పరిశీలించాలి, మత పెద్దలు తప్ప మరెవరు చెప్పినా దీనికి ప్రామాణ్యం వుండదు అని అరవిందరావు అభిప్రాయపడ్డారు. అది జరిగేదేనా ? మత రాజ్యాలలోనే అలా జరగలేదు. అనేక మంది రాజులు మతాలు మారారు లేదా ఇతర మతాలను అనుమతించారు. ఇప్పుడు అది అసలు కుదిరేది కాదు.మత ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు రాజ్యాంగాన్నే ధిక్కరిస్తూ మా విశ్వాసంలో న్యాయస్ధానాలు జోక్యం చేసుకోకూడదు, మా మనోభావాలు దెబ్బతినకూడదు అంటున్నారు.ఇటువంటి స్ధితిలో ధర్మాన్ని ఎవరు నిర్ణయించాలి శైవులా, వైష్ణవులా ఇతర శాఖల వారా ?పోనీ వీరంతా రాజీ పడినా, ఇతర మతాల వారి ధర్మాన్ని అంగీకరించే పరిస్ధితి వుందా ?

     చివరిగా అరవిందరావు గారి మరో ఆవేదన గురించి చూద్దాం. ‘ధర్మం గురించీ, మత సిద్ధాంతాల గురించీ ఎప్పుడు విమర్శలు వచ్చినా ఆ విమర్శలను ఎప్పటి కపుడు మన ఆచార్యులు ఎదుర్కొన్నారు…..ఎదుటి వాడి సిద్దాంతాన్ని సమీక్షించి తమ సిద్దాంతాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించారు. ఈ సంప్రదాయం గత నాలుగైదు శతాబ్దాలుగా పూర్తిగా లోపించటం, విమర్శలు వచ్చినా మన పండితులు, మత పెద్దలు స్దబ్దంగా వుండటం చాలా ఆశ్చర్యకరం ‘ అని వాపోయారు. మన మతం గురించి విదేశీ విశ్వవిద్యాలయాలలో చర్చించటాన్ని తప్పుపట్టిన అరవిందరావు ఈ విషయంలో పాశ్చాత్యులు కూడా వేలెత్తి చూపారని తన వాదనకు సమర్ధనగా తీసుకున్నారు. ఇది అన్యాయం కదా ? షెల్డన్‌ పోలాక్‌ అనే రచయిత ‘పదహారవ శతాబ్దం వరకు వున్న వాడి, వేడి మన పండిత లోకంలో నశించిందని ఆయన అభిప్రాయం. ఆయన చేసిన మిగతా విమర్శలు ఎలా వున్నా ఈ వ్యాఖ్యలో మాత్రం సత్యముంది అని ముక్తాయింపు నిచ్చారు.

     ‘ఈ కాలమందు మత త్రయము వారు( అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మత శాఖల్ని ప్రచారం చేసిన శంకర-రామానుజ- మధ్వాచార్వుల గురించి ) తమ తమ మత వ్యాప్తికై పరస్పర హింసా దూషణములతో వివాదపడి హిందూ రాజ్యముల దుర్బలతకు, తుదకు వినాశనమునకు బాగుగా తోడ్పడిరి. విజయనగర సామ్రాజ్య పతనమునదేకు, తర్వాతి యరాజక స్ధితికి దేశము య్కె అత్యంత దయనీయ స్ధితికి ఈ మతత్రయము వారెంత బాధ్యులో, ఎంత గొప్ప భాగస్వాములో నిరూపించుటకు ప్రత్యేక గ్రంధమవసరమగును’ అని సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంధంలో రాశారు. విజయనగరం, కాకతీయ సామ్రాజ్యపతనాలకు ఈ మతాల చిచ్చు ఒక కారణంగా చెబుతారు. అవి పతనమైన తరువాత వాటి స్దానాన్ని నవాబులు, ఆంగ్లేయులు ఆక్రమించిన చరిత్ర తెలిసిందే. ఈ కాలంలో మత కొట్లాటలలతో లాభం లేదని ఆదరించే వారు వుండరని గ్రహించి ఒకరు కొకరు రాజీపడి కొత్త పాలకులను కొలవటానికి, బోగలాలసతకు అలవాటు పడిన మత పెద్దలు, పండిత లోకం వాడి,వేడిగా తిట్టుకోవాల్సిన అవసరం ఏముంది?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎందుకు మారుతున్నారో ! ఏం చేస్తారో చెప్పండి ప్లీజ్‌ !!

20 Saturday Feb 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, anti defection, CHANDRABABU, defections, tdp

గత ఎన్నికలలో తాము వ్యక్తిత్వంతో, ఒక విజన్‌తో, వైఎస్‌ఆర్‌ కుటుంబంపై అభిమానంతో పోటీచేసి గెలిచామని భూమా చెప్పారు. జనం వీటిని నమ్ముతారా ? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేవారు ఇంతకు ముందు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో తమ ప్రాతినిధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటి? ఇంకా ఏమి మిగిలి పోయి వున్నాయి? వాటిని పూర్తి చేయటానికి పార్టీ మారితే ఎలా అవకాశాలు వస్తాయో శ్వేత పత్రం విడుదల చేయటం అవసరం.

ఎం కోటేశ్వరరావు

     ఓకే, భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ ఇతర సపరివార బంధు మిత్రులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి లేదా ఫిరాయించటానికి సర్వహక్కులూ వున్నాయి.భూమాకు పార్టీలు మారటం కొత్తేమీ కాదు, కొట్టిన పిండే గనుక మార్గాల గురించి వేరే చెప్పనవసరం లేదు. అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకుంటాం, మా సహనాన్ని పరీక్షించవద్దు అని వైఎస్‌ఆర్‌సిపికి ముందే తెలుగుదేశం నాయకులు చెప్పారు, ఆ వెంటనే భూమా పార్టీ మారటం గురించి వార్తలు వచ్చాయి. ఎన్నికలలో ఓట్ల లెక్కింపు పూర్తి కాక ముందే తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయని చెప్పారు తప్ప వాటిని ఆయన పూర్తిగా ఖండించనూ లేదు తిరస్కరించనూ లేదు. తెలంగాణాలో జరిగిన పరిణామాలను చూసిన తరువాత ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. లెక్కలు తేల్చుకోవటాన్ని బట్టి వుంటుంది. పార్టీ మారితే భూమా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారా అనో, లేకపోతే వైసిపి నాయకుడు జగన్‌ పనితీరు నచ్చలేదనో ఏదో ఒక కారణం చెప్పవచ్చు. ఏ కారణం చెప్పినా తన అనుచరులతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రతివారూ సమర్ధించుకుంటారు. దీనిలో పెద్ద కిక్కుండటం లేదు. మన రాజ్యాంగంలో ఓటర్లను సంప్రదించాలి లేదా వారి అంగీకారం తీసుకోవాలనే నిబంధనలేమీ లేవు గనుక ఫిరాయించటం సులభం. తిరిగి గెలుస్తామనే ధైర్యం వుంటే ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు పడినా తిరిగి ఎన్నికలలో నిలబడవచ్చు. ఈలోపల ఎంఎల్‌ఏ కాకున్నా ఆరునెలల పాటు మంత్రి పదవిలో వుండవచ్చు కనుక మంత్రిగా ఎన్నికలలో తిరిగి పోటీ చేయవచ్చు. లేదా తెలంగాణాలో మాదిరి వేరే పార్టీలో వుంటూ కూడా మంత్రివర్గంలో చేరవచ్చునని కొత్త మార్గాన్ని ఏర్పరిచారు. స్పీకర్‌ను బట్టి అది వుంటుంది. కోర్టులు కూడా ఏమీ చేయలేవు. లేదా తేలే లోపల ఐదు సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఇంకా ఇలాంటివి చాలా చూశాము గనుక పెద్దగా చర్చించాల్సినపని లేదు.

     గత ఎన్నికలలో తాము వ్యక్తిత్వంతో, ఒక విజన్‌తో, వైఎస్‌ఆర్‌ కుటుంబంపై అభిమానంతో పోటీచేసి గెలిచామని భూమా చెప్పారు. జనం వీటిని నమ్ముతారా ? అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని చెప్పేవారు ఇంతకు ముందు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలలో తమ ప్రాతినిధ్య కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటి? ఇంకా ఏమి మిగిలి పోయి వున్నాయి? వాటిని పూర్తి చేయటానికి పార్టీ మారితే ఎలా అవకాశాలు వస్తాయో శ్వేత పత్రం విడుదల చేయటం అవసరం. దీని వలన అనుచరులే కాదు సామాన్య ఓటర్లను కూడా చైతన్య వంతులను చేసిన వారౌతారు. ఓటు వేసిన వారికి కాస్త సంతృప్తి అయినా మిగులుతుంది. పార్టీ మారే వారే కాదు, వారిని చేర్చుకొనే అధికార పార్టీ లేదా ప్రతిపక్షం ఎందుకంటే జగన్‌ కూడా తనతో టిడిపి ఎంఎల్‌ఏలు టచ్‌లో వున్నారని చెబుతున్నారు గనుక వారు కూడా ఆ నియోజకవర్గాల ఓటర్లకు శ్వేతపత్రం వెల్లడించాలి. ఫలానా నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి ఇది, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి తమ పార్టీలో వుండి వుంటే అభివృద్ది ఇంకా ఏమి జరిగి వుండేదో, చేర్చుకుంటే ఏమేమి చేయాలనుకుంటున్నామో అని అధికార పార్టీ కూడా ప్రకటించాలి. లేదా అధికార పార్టీ నుంచి ఎవరైనా ప్రతిపక్షంలోకి ఫిరాయిస్తే తమ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా కుంటుపడిందో, పార్టీ మారి దాన్ని ఎలా పట్టాలపైకి ఎక్కించాలనుకుంటున్నారో ప్రతిపక్షపార్టీ అయినా ఓటర్లకు తెలపాలి.

   ఏదో ఒక పద్దతి పాటించాలి. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరింది, తరువాత వైఎస్‌ఆర్‌సిపిలో చేరింది. ఆ కుటుంబ సభ్యులు మధ్యలో కొంతకాలం తప్ప ఎక్కువ భాగం ప్రజాప్రతినిధులుగానే వున్నారు. అందువలన ఒకవేళ పార్టీ మారితే గీరితే ఇంతవరకు తాము ప్రాతినిధ్యం వహించిన కాలంలో సాధించిన అభివృద్ధి ఏమిటో, పార్టీ మారి ఇంకా ఏమి చేయబోతున్నారో చెబితే ఆ కుటుంబంపై వున్న గౌరవం ఇంకా ఇనుమడిస్తుంది. పార్టీలు మారే వారికి ఒక కొత్త ఆదర్శాన్ని చూపినవారు అవుతారు. అభివృద్ధి అయినా మరొక కారణం చెప్పినా నైతిక బాధ్యత ఒకటి వుంటుంది. కలియుగంలో నీతి నియమాలేమిటి తూనా బొడ్డుబాలు అనుకుంటే వేరే విషయం. లేదు కేవలం అధికారం కోసమే పార్టీ మారుతున్నాం అని నిజం చెప్పినా అదీ ఒక నిజాయితీయే ఈ రోజుల్లో, ఏం చెబుతారో చూద్ధాం. రాయలసీమలో ముఠాకక్షలలో ఎన్నోమార్పులు జరుగుతున్నాయి. వారిలో కూడా పాతకాలపు మొరటు పద్దతులు పోయి ఆధునిక సర్దుబాటు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. మా ప్రయోజనాలకు మీరు అడ్డురావద్దు, మీకు మేము అడ్డురాము అనే సహనం,సహజీవనం పెరుగుతోంది. ఈ పూర్వరంగంలోనే కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. కొంత కాలం క్రితం అక్రమంగా తిన్నవాడెవడో చెప్పాలని నిలదీసిన జనం ఈ రోజు అసలు తినని వాడెవడో చెప్పండని దబాయిస్తున్న రోజులివి.జనం ఇలాంటి ఫిరాయింపులు, అనైతిక వ్యవహారాలను సహించినంత కాలం ఏం జరిగినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముదిమది తప్పిందా? వుమ్మెత్త కాయలు తిన్నారా ?

19 Friday Feb 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Politics

≈ Leave a comment

Tags

defections, tdp, telangana tdp, telugudesam

రాష్ట్ర విభజనతో తనకేమీ సంబంధం లేనట్లు, వేరే ఎవరో తీరని నష్టం చేసినట్లు చెబుతున్నారు.ఇంతకీ రెండు కళ్ల సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్ధితుల్లో తీసుకు వస్తా, ఇంటికి ఒక వుద్యోగం ఇస్తా , రాష్ట్రాన్ని సింగపూర్‌, మలేసియాలా మారుస్తా అని చెప్పిన చంద్రబాబూ ఈయనా ఒకరేనా ?

ఎం కోటేశ్వరరావు

     సరైన దర్శకుడు, మాటల రచయిత లేకపోతే ఈ రోజుల్లో సినిమాలు బాక్స్‌ ఆఫీస్‌ వద్ద హిట్‌కు బదులు ఫట్‌ అవుతున్నాయి. ఒక మహానటుడు పెట్టిన పార్టీకి ఈ రోజు సరైన దర్శకులు, పదునైన డైలాగులు రాసే మాటల రచయితలే కరవయ్యారా ? హత విధీ ఏమి ఖర్మ పట్టినది ? సమర్ధులైన నటులు రంగస్ధలం మీద వున్నపుడు తోటి నటీనటులు తమ డైలాగులు మరిచిపోతే దాన్ని కనిపించకుండా నాటకాన్ని రక్తి కట్టించిన ఎందరో నటుల గురించి మనకు తెలుసు. కానీ తెలుగు దేశం డ్రామాలో ఏ నటుడేం మాట్లాడుతున్నారో, దానికి అర్ధం తెలిసి పలుకుతున్నారా ? వెనుక నుంచి ప్రాంప్టింగ్‌ సరిగా లేక ఒకటి చెప్పబోయి మరొకటి చెబుతున్నారా ?

     ఏమిటిది ? ఎన్ని ఇబ్బందులెదురైతే మాత్రం ఈ మాటలేమిటి ? రాజకీయాలు, విలువలు, ఫిరాయింపు నిరోధక చట్టం, ఫిరాయింపులు, నైతిక విలువలను పాటించాలను కొనే వారంతా రాజకీయాలకు పనికిరారని ఎప్పుడో తేలిపోయింది. అందువలన అ విలువల వలువలు విప్పిన వారు కూడా మరీ ఇంతగా బరితెగిస్తారా అని ఎవరైనా అనుకోవచ్చు. అధికార రాజకీయాలలో ఇలాంటివి సహజం. మహాను భావులు అయారాం గయారాంలు ఎప్పుడో వీటికి ప్రాతిపదిక వేశారు. అందుకే అలాంటి చర్చను రానివ్వకూడదని పాలకపార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందుకే వాటి గురించి ఎవరూ మాట్లాడరు.

     విషాద నాటకాలు, సినిమాలలో కూడా హాస్యాన్ని పండించే దృశ్యాలు వుంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని తెలుగుదేశం పార్టీలో కూడా అదే జరుగుతోందా అనిపిస్తోంది. ఏదైనా అకాల వైపరీత్యాలు సంభవించి ఏరులు వరదలై పారినపుడు ప్రాజెక్టుల గేట్లు తెరవండి అని ఆదేశించటం తెలుసు. కానీ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించేందుకు గేట్లు తెరవండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ మంత్రులతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. చదివేవారికి, వినే వారికి, చూసే వారికి బుర్రల్లేవనుకుంటేనే ఇలాంటి వార్తలను వండి వడ్డిస్తారు. అసలు తెలుగుదేశం ఇతర పార్టీల నుంచి వలసల నిరోధానికి తెరిచిన గేట్లను మూసిందెప్పుడు? అయినా ఈ వార్తలను ఖండించలేదు కనుక నిజమే అనుకోవాలి. ప్రతిదాన్నీ ఎక్కడ ఖండిస్తాం మా ముఖ్యమంత్రి ఆ మాట అన్నట్లు ఆధారాలున్నాయా అంటే ఎవరైనా ఏం చెబుతారు. మీడియాకు లీకులు ఇవ్వటంలో, అవసరమైనపుడు కధలు రాయించుకోవటంలో అందెవేసిన చేయి ఎవరిదో ఎవరికి తెలియనిది. 1950,60,70 దశకాలలో జనం సినిమాల గురించి ముఖ్యంగా పల్లెటూళ్లలో గుంపులు గుంపులుగా చెప్పుకొనే వారు. ఎవరైనా ఒక సినిమా చూసి వస్తే దానిలోని కథను సచిత్రంగా వర్ణిస్తుంటే అబ్బ ఎంత బాగా చెప్పిండు అన్నట్లుగా వినేవారు, సంతృప్తి చెందేవారు. ఇప్పుడు కూడా కొన్ని పత్రికలు, టీవీ ఛానల్సు కూడా అంతకంటే గొప్పగా కధలు చెబుతున్నాయి. మంత్రివర్గ సమావేశాలలో సైతం పక్కనే కూర్చుని విన్నట్లు, స్వయంగా చూసినట్లు తమ ప్రతిభా పాటవాలను ఆ విలేకరులు ప్రదర్శిస్తున్నారు.అయితే ఫిరాయింపుల గురించి చంద్రబాబు నిజంగానే చెప్పి వుంటారనేందుకు ఆస్కారం వుంది. ఎందుకంటే తెలంగాణాలో తగిలిన షాక్‌ నుంచి ఇంకా ఆయన తేరుకోలేదు.అపర చాణుక్యుడనని తనకు తాను అనుకుంటారో లేదో తెలియదు గానీ తన మీద అనుయాయులకు వున్న అలాంటి విశ్వాసం తగ్గకుండా వుండాలంటే ఏదో ఒకటి చేయాలి కదా ! ఏ మాటకామాటే చెప్పుకోవాలి .చంద్రబాబు తన అనుయాయులకు కన్నుగీటటంలో ఆయన స్టైలే వేరు.

     చంద్రబాబు స్వయంగా చెప్పినట్లు తాను అభివృద్ధి చేసిన హైదరాబాదు నగరంలో పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్లుగా తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్క కార్పొరేటర్‌ స్ధానాన్ని గెలుచుకుంది. మావ తిట్టినందుకు కాదు తోడల్లుడు సానుభూతి పలికినందుకు ఎక్కడలేని బాధ అన్నట్లుగా తమకు ఒక్క సీటు రావటం కంటే తమదే పెద్ద పార్టీ అని బిజెపిని భాగస్వామిగా చేసుకొని పోటీ చేస్తే దానికి నాలుగు సీట్లు రావటం మరింత బాధ కలిగించింది. కంటి చూపు తప్ప నోట మాట రాలేదు. ఈ స్ధితిలో గోరుచుట్టు మీద రోకటి పోటు మాదిరి తెలంగాణాలో శాసనసభా పక్ష నాయకుడే ఫిరాయించటంతో వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో జనం దృష్టి మళ్లించేందుకు తెలుగుదేశం నేతలకు చంద్రబాబు కన్నుగీటినట్లుగా వుంది. వెంటనే కొందరు మంత్రులు వైఎస్‌ఆర్‌ సిపి నుంచి తమ పార్టీలోకి ఫిరాయించే ఎంఎల్‌ఏల గురించి చెప్పి చంద్రబాబును ఓదార్చే యత్నం చేశారు. కారణాలేమయినా ఒకరిద్దరు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాం తప్ప పార్టీ మారేందుకు కాదని చెప్పారు.ఎంతో ఆశించి, ఏదో జరుగుతుందని భ్రమపడిన వారు ఇంతకాలం అధికారానికి దూరంగా వుండటమే విశేషం. చివరికి తమ నాయకుడి మాదిరి తాము కూడా ఐదు సంవత్సరాల పాటు ఓదార్పు యాత్రలతోనే కాలం గడపాలా అని కొందరిలో ఆలోచన రావటంలో ఆశ్చర్యం ఏముంది. అదేమి చిత్రమో ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్‌వేర్‌లు, ప్రోగ్రామ్‌లు వస్తున్నా వైఎస్‌ఆర్‌సిపి ఇంకా పాతబడిన ఓదార్పు యాత్రలనే కొనసాగిస్తున్నది.

     ఇంత జరుగుతున్న తరువాత తాను మాట్లాడకుండా వుంటే తన శిబిరంలోని వారు ఆందోళన పడరా మరి, దాంతో తాను తలచుకుంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని పడగొడతానని వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి తొడగొట్టారు. 21 మంది తెలుగుదేశ పార్టీ ఎంఎల్‌ఏలు తనతో సంబంధాలలో వున్నారని అయితే వారి పేర్లు అవసరమైనపుడు చెబుతానని, చెప్పిన వెంటనే గంటలో ప్రభుత్వం పడిపోతుందని జగన్‌ చెప్పారు. మా వారు టిడిపిలోకి వెళ్లటం, వారు మాలోకి రావటం ఎందుకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెట్టమని కూడా జగన్‌ సవాల్‌ చేశారు. తాను లేస్తే మనిషిని కానని దారిన పొయ్యే వారిని బెదిరించిన కుంటి మల్లయ్య కధ కొందరికి గుర్తుకు వస్తే రావచ్చు.

    జగన్‌ తొడగొట్టడాన్ని సహించలేని తెలుగుదేశం మంత్రులు మా ప్రభుత్వాన్ని పడగొట్టటం కాదు, మీ వారి చేతే రాజీనామాలు చేయించి, ఎన్నికలు జరిపించి మీ సంఖ్యను మీరు నిలుపుకుంటే మేం దేనికైనా రెడీ అని సినిమా డైలాగులు చెప్పారు. అన్నింటికంటే విచిత్రం ఏమంటే మంత్రాలయం నియోజకవర్గ సభల్లో ప్రసంగించిన వుప ముఖ్యమంత్రి కెయి కృష్ణ మూర్తి ‘ ఓర్పు వున్నంత వరకు సహిస్తాం, ఓర్పు నశిస్తే వైసిపి ఎంఎల్‌ఏలను మా పార్టీలో చేర్చుకుంటాం, ఇక ఎవరూ మిగలరు జాగ్రత్త ! అడుగడునా అభివృద్ధికి అడ్డుపడితే వైసిపి నుంచి జంప్‌ చేయటానికి సిద్ధంగా వున్న 28 మంది ఎంఎల్‌ఏలను మా పార్టీలో చేర్చుకుంటాం ‘ అని హెచ్చరించారు. వైసిపితో సంబంధాలలో వున్న టిడిపి ఎంఎల్‌ఏల పేర్లు బహిర్గతం చేయాలని ఎంఎల్‌సి ముద్దుకృష్ణమ నాయుడు సవాల్‌ చేశారు. ఇతర మంత్రులు, నాయకులు ఇలాంటి కామెడీ డైలాగులు సభల్లో చెప్పి జనాన్ని నవ్వించారు. దీన్ని చూస్తే తెలుగుదేశం పార్టీలో తెరవెనుక వుండి మంచి డైలాగులు రాసేవారు, డైరెక్షన్‌ చేసే సమర్దులు వున్నట్లు కనిపించటం లేదు. అన్ని వారే చూసుకోవాలంటే చంద్రబాబు, లోకేష్‌ బాబుకు ఎక్కడ సాధ్యం అవుతుంది.

   ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా వుంటే తెలంగాణా నేతలు మరింత హాస్యం పండిస్తున్నారు. మొగుడు పోతేనేం పొన్నకాయలా గుండు నున్నగా బలే వుందే అన్న సామెత మాదిరి వుంది. టిఆర్‌ఎస్‌కు వందసీట్లు వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్‌ చేశా , అటువంటి పరిస్ధితి రాకుండా కాపాడి తనను రాజకీయాల్లో నిలబెట్టినందుకు కూకట్‌పల్లి వాసులకు కృతజ్ఞతలంటూ తెలంగాణా టిడిపి నేత రేవంతరెడ్డి సన్మానాలు చేయించుకొని మరీ నవ్వులు పండిస్తున్నారు. హైదరాబాదులో టిఆర్‌ఎస్‌కు వందసీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని రేవంతరెడ్డి ఎన్నికలకు ముందు సవాలు చేశారు. టిఆర్‌ఎస్‌కు 99 వచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఒకే ఒక్కరు గెలిచారు.ఈ ఒక్క సీటు రానందుకు కెసిఆర్‌ అసంతృప్తితో వున్నారు, గ్రేటర్‌ సవాల్‌లో నాదే విజయం అని చెప్పుకున్నారు. ఆ సభకు వచ్చిన అనేక మందికి దేనితో నవ్వాలో అర్ధం కాలేదట. ఇక మిగతా వుపన్యాస విషయానికి వస్తే టిడిపి నుంచి ఫిరాయించిన ఎమ్మేల్యేలది వెన్నెముక లేనిబతుకు అని వర్ణించారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌ టిడిపిలోకి వచ్చిన వారందరి పరిస్ధితీ అదే. రావటానికి సిద్ధంగా వున్నారని చెబుతున్నవారిదీ అదే స్ధితి అని రేవంత రెడ్డి చెప్పినట్లే.

    ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హైదరాబాదు లేకుంటే తెలంగాణాలో ఏముంది అని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే విభజనతో రాష్ట్రానికి తీరని నష్టం చేసిన వారే అసూయపడేలా రాజధానిని నిర్మించి తీరతామని చెప్పారు. విద్యార్ధులకు చరిత్ర పాఠాలు ఎందుకు దండగ అన్న చంద్రబాబు నాయుడికి నిజంగా ఎంతో ముందు చూపు వుంది. చరిత్రలో తన గురించి చదువుకోకుండా వుండేందుకే ముందు జాగ్రత్త చర్యగా అలా చేసి వుంటారు. అందుకనే రాష్ట్ర విభజనతో తనకేమీ సంబంధం లేనట్లు, వేరే ఎవరో తీరని నష్టం చేసినట్లు చెబుతున్నారు.ఇంతకీ రెండు కళ్ల సిద్ధాంతం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్ధితుల్లో తీసుకు వస్తా, ఇంటికి ఒక వుద్యోగం ఇస్తా , రాష్ట్రాన్ని సింగపూర్‌, మలేసియాలా మారుస్తా అని చెప్పిన చంద్రబాబూ ఈయనా ఒకరేనా ? నేను చరిత్ర విద్యార్ధిని కాదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

లాయర్లా ! ఫాసిస్టు శక్తులా !!

18 Thursday Feb 2016

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ABVP, JNU, JNU ROW, RSS

 

ఎం కోటేశ్వరరావు

      జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ? అని నేను రాసిన అంశంపై వచ్చిన విమర్శల సారాంశం ఏమంటే ఒకటి పూర్తిగా ‘ఎడమవైపు’నుంచే రాశారు, మావోయిజాన్ని విశ్వసించే డిఎస్‌యు అనే విద్యార్ధి సంస్ధ కాశ్మీరీ వేర్పాటు వాదులకు సానుభూతిగా సభ ఏర్పాటు చేయటం నిజమే కదా , అక్కడ జాతి వ్యతిరేక నినాదాలు చేశారు కదా అంటే దానర్ధం వారు కూడా మద్దతు ఇచ్చినట్లే అలాంటపుడు వారిపై చర్య తీసుకుంటే తప్పేమిటి అన్నది ఒక సమర్ధన. ఇవే కాదు, ఇంకా ఎవరైనా చేసే విమర్శలకు ఆహ్వానం. మన దేశంలో రెండువేల సంవత్సరాలకు పూర్వమే తర్క శాస్త్రాన్ని (వాద విద్య) అభివృద్ధి చేసిన వారిలో గౌతముడు ఒకరు.ఈ గౌతముడు పురాణాలలో కనిపించే సప్త రుషులలో ఒకరు గానీ, గౌతమ బుద్దుడు గానీ కాదని గమనించాలి. వేదాలు, వుపనిషత్తులు మొదలైన వాటిని చార్వాకులు, లోకాయతుల వంటి ఆది భౌతికవాదులు ప్రశ్నించటం ప్రారంభించినపుడు వాటికి సమర్ధనగా రూపొందించినదే తర్కశాస్త్రమని ఒక అభిప్రాయం. దానితో ఎవరైనా విబేధించవచ్చు అది వేరే విషయం. శంకరాచార్యుడి చివరి దినాలలో తమకేదైనా వుపదేశం చెయ్యమని శిష్యులు అడిగినపుడు చెప్పిన అనేక అంశాలలో ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే దానికి రంధ్రాన్వేషణ చేయకుండా తర్కబద్దమైన సమాధానం చెప్పాలని వుపదేశించినట్లుగా రాశారు. అందువలన అటువంటి చర్చలు ఎన్నయినా జరపవచ్చు. ఇందుకు ‘కుడి,ఎడమ’లు ఎవరికీ మినహాయింపు కాదు. ఇది మా విశ్వాసం, తర్కానికి, న్యాయశాస్త్రానికి అతీతం అందువలన దీనిపై తర్కించేదేమీ లేదు, మేము చెప్పింది వినాలి తప్ప మరొకటి కాదు, మరీ కాదంటే తంతాం, చంపుతాం అంటే కుదురుతుందా ? సహించాలా ?

     దేశద్రోహం ఆరోపణలతో అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్ధి సంఘ నాయకుడు కన్నయ్య కుమార్‌ను బుధవారం నాడు పాటియాల కోర్టుకు హాజరు పరిచే సమయంలో అతనిపై లాయర్ల ముసుగులో వున్న వ్యక్తులు గూండాల మాదిరి దాడి చేయటం లోకమంతా చూసింది. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు అది తోపులాటలా కనిపించింది కనుక ఆయనకు వైద్య పరీక్షలు చేయటం అవసరం. వారు లాయర్లా లేక నల్లకోట్లు వేసుకొని వచ్చిన సంఘపరివార్‌ కార్యకర్తలా లేక లాయర్లలో వున్న దేశభక్తులైన సంఘపరివార్‌ కార్యకర్తలా అన్నది దాచినా దాగదు. వారు ప్రవర్తించిన తీరు గురించి ప్రత్యక్షంగా చూసిన మరొక లాయర్‌ చెప్పిన కధనాన్ని ఫిబ్రవరి 18వ తేదీ పత్రికలో హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. అదేమీ కమ్యూనిస్టుల లేదా అభ్యుదయ వాదుల పత్రిక కాదు. ఆ లాయర్‌ పేరు రాస్తే ఆయన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందో అని పేరు రాయలేదు. దీన్ని ఎవరైనా కట్టుకధ అంటే చేసేదేమీ లేదు. ఫాసిస్టుశక్తులు, ఫాసిజం లక్షణాలు తప్ప ఇవి మరొకటి కాదు.

    ‘ బుధవారం నాడు వృత్తి చేస్తున్న ఒక లాయర్‌గా నా ప్రస్తానంలో అత్యంత ఆందోళనకరమైన వుదంతాన్ని చూశాను.అది సాయంత్రం ఒంటి గంట సమయం. పాటియాలా కోర్టుల ప్రాంగణంలో కన్నయ్య కుమార్‌ను చూసేందుకు రెండవ నంబరు గేటు దగ్గర వందలాది మంది లాయర్లు గుమికూడారు.పరిమితమైన సంఖ్యలో మాత్రమే కోర్టు లోపలికి అనుమతించనున్నట్లు ఒక పోలీసు ప్రకటన చేశాడు.అప్పుడు అంతా ప్రారంభమైంది. అందరు జర్నలిస్టులు మరియు జెఎన్‌యు విద్యార్ధులను బయటకు పంపాలని లాయర్లు డిమాండ్‌ చేయటానికి ఆ ప్రకటన ఒక సంకేతమైంది. కొంతమంది లాయర్ల బృందం బాల్కనీలో గుమికూడి వుంది. ఎవరైనా వీడియో తీస్తున్నారా అని వారు చూస్తున్నారు. ఆ తరువాత దేశభక్తి చర్యగా బాల్కనీ నుంచి ఒక లాయర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారత మాతాకీ జై అంటూ నినాదాలు ఇచ్చాడు. అతని పక్కనే వున్న మరొక లాయర్‌ కన్నయ్యను తీసుకురానివ్వండి వాడిని సజీవ దహనం చేస్తాము అని అరిచాడు. పోలీసుల పక్కనే వున్న కొంత మంది లాయర్లు దానితో వుత్సాహపడ్డారు. వారిలోని ఒక లాయర్‌ సెల్‌ఫోన్‌ తీసి నువ్వు కూడా రా ఒకరిద్దరు జెఎన్‌యు విద్యార్ధులను బాదవచ్చు అని చెప్పాడు.

      అది రెండున్నర గంటల సమయం. కన్నయ్య కుమార్‌ కోర్టు వద్దకు చేరాడు. అతనిని మరొక మార్గం ద్వారా లోపలికి తీసుకు వెళ్లారు. ఇది తెలిసిన లాయర్లు వెంటనే ఆ గేటువైపు వెళ్లి కన్నయ్యపై దాడి చేశారు. ఆ తరువాత గర్వంతో తిరిగి వస్తున్న లాయర్లను నేను చూశాను. వారిలో ఒకరు నేను రెండుసార్లు తన్నాను, ముఖంపై కొట్టాను అని చెప్పాడు. మా నల్లకోట్లు మేము ఒక విద్యావంతులైన తరగతికి చెందిన వారమని వెల్లడించేందుకు వుద్దేశించినవి, కానీ కొంత మంది లాయర్లు బార్‌ ప్రతిష్టకు మచ్చతెచ్చారు.’ అని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. కావాలంటే అలాంటి వారు నల్ల కోట్లు తీసి వేసి కాషాయ దుస్తులతోనే గూండాయిజం చేయవచ్చు. అప్పుడు సమాజమే వారి సంగతి తేల్చుకుంటుంది. అలాగాక వారు కోర్టులో కన్నయ్యకు వ్యతిరేకంగా తమ వాద విద్య పటిమను ప్రదర్శించి వుంటే దాని గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ వారు నల్లకోట్లు వేసుకొని శంకరాచార్యుడి వుపదేశాలకు విరుద్ధంగా గూండాయిజానికి పాల్పడ్డారు.ఇలాంటి ‘కుడి’ వారి గురించి ఏమని చెప్పాలి?

    మావోయిజాన్ని నమ్మే డిఎస్‌యు కాశ్మీర్‌ వేర్పాటు వాదులు, దేశద్రోహులతో కలసి సభ జరపటాన్ని ఎలా సమర్ధిస్తారన్నది. ముందుగా ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. మావోయిజం అంటే దేశ వ్యతిరేకం కాదు. మార్క్స్‌-ఎంగెల్స్‌ రూపొందించిన దానిని మార్క్సిజం అని పిలిచారు. తరువాత దానిని రష్యాకు అనువర్తింపచేసి విప్లవాన్ని ముందుకు నడిపించిన లెనిన్‌ అనుభవాలను జోడించి తరువాత కాలంలో మార్క్సిజం-లెనినిజం అన్నారు. ఈ రెండింటినీ మేళవించి ఆసియాలో భిన్నమైన పరిస్ధితులున్న చైనాలో దోపిడీ వ్యవస్ధను కూలదోసేందుకు అక్కడి కమ్యూనిస్టుపార్టీ మావో నాయకత్వంలో అభివృద్ధి చేసిన విధానాన్ని మావోయిజం అన్నారు. అన్నింటినీ కలిపి మార్క్సిజం-లెనినిజం- మావోయిజాల అనుభవాలన్నింటినీ తీసుకొని ఆ తరువాత కాలంలో అనేక దేశాలలో కమ్యూనిస్టులు తమకు అనువైన విధానాలు, ఎత్తుగడలు రూపొందించుకుంటున్నారు.ఈ క్రమంలో భారత్‌లో కొందరు కమ్యూనిస్టులు స్వతంత్ర కార్యాచరణ, ఎత్తుగడలను విస్మరించి తాము చైనా పంధాలో విప్లవాన్ని తీసుకువస్తామని చెప్పేందుకు తమది మావోయిస్టు పంధా అని చెప్పటమే కాక మావోయే మా చైర్మన్‌ అన్నంత దుందుడుకు వైఖరి తీసుకున్నారు. ఇదంతా ఐదు దశాబ్దాల నాటి చరిత్ర. ఆ వైఖరి విఫలం కావటమే కాక మావోయిజాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకొనేవారు చీలికలు పీలికలై పోయారు. ప్రతి ఆందోళనను విప్లవ మార్గంవైపు మార్చాలనే మావో సూత్రీకరణకు తప్పుడు భాష్యం చెప్పి కాశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్ధించేవరకు వారు పయనించారు. దానితో సిపిఎం, సిపిఐ ఏకీభవించటం లేదు. అలాంటి వారిని సమర్ధించిన వుదంతం చరిత్రలో ఒక్కటంటే ఒక్కటీ లేదు. మరైతే సమస్య ఎక్కడ ?

    జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం అరాచకవాదం నుంచి అన్ని రకాల భావజాలాలకు ప్రాతినిధ్యం వహించేవారు వున్న ఒక విద్యా సంస్ధ. ఎవరికి వారు తమ భావజాలాన్ని విద్యార్ధులలో ప్రచారం చేసుకోవటానికి సభలు, సమావేశాలు పెట్టుకోవటం ఎప్పటి నుంచో జరుగుతోంది. అందుకు అధికార యంత్రాంగం కూడా అనుమతిస్తోంది. కాశ్మీర్‌ సమస్య విషయంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు అక్కడ సమస్యను మరింత క్లిష్టతరం గావించాయన్నది తిరుగులేని వాస్తవం. దానిమీద అనేక తరగతులలో భిన్న అభిప్రాయాలు వున్నాయి. వాటిని చర్చించేందుకు వేదికలను ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగానే ఈనెల తొమ్మిదిన డిఎస్‌యు ఒక సభను ఏర్పాటు చేసింది. అదేమీ రహస్య సమావేశం కాదు, అధికార యంత్రాంగం కూడా అనుమతించింది. తీరా సభ జరగబోయే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ అఖిల భారత విద్యార్ధి పరిషత్‌(ఎబివిపి) రంగంలోకి దిగి సభకు అనుమతివ్వటంపై అభ్యంతరం తెలుపుతూ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ వత్తిడికి వారు లొంగారు. చివరి నిమిషంలో సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఎప్పటి నుంచో అలాంటి సభలు జరపటానికి లేని అభ్యంతరం ఇప్పుడు పెడుతున్నారని ఈ విషయంలో సభ జరుపుకొనేందుకు తమకు మద్దతు తెలపాలని డిఎస్‌యు అక్కడ వున్న విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య, ఇతర సంఘాలైన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్‌ వంటి సంఘాలను కోరారు తప్ప తమ భావజాలానికి మద్దతు ఇవ్వాలని వారు అడగలేదు. దాంతో అధికారులు సభ జరిగే ప్రాంతానికి కొంత మంది భద్రతా సిబ్బందిని పంపటంతో పాటు, మైకులు లేకుండా నిర్వహించుకోవాలని షరతు విధించారు. దానికి కూడా నిర్వాహకులు అంగీకరించారు. ఈ విషయం తెలిసిన ఎబివిపి ఎలాగైనా సరే ఆ సభను జరగనివ్వకూడదని తన మద్దతుదార్లను సమీకరించింది.ఆ సమయంలో కన్నయ్యతో సహా అనేక విద్యార్ధి సంఘాలకు చెందిన వారూ , ఏ సంఘాలకూ చెందని వారూ, డిఎస్‌యు లేదా వారితో ఏకీభవించే ఇతర సంఘాలకు చెందిన వారు వున్నారు. వారిలో వుగ్రవాద సంస్ధలతో సంబంధం వున్న వారు కూడా వున్నారని ఆ వుదంతం తరువాత వెల్లడైంది. సభ నిర్వాహకులు, దానికి హాజరయ్యేందుకు బయటి నుంచి వచ్చిన వారిలో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. అంతే తప్ప కన్నయ్య లేదా ఎఎఫ్‌ఐ ఇతర సంఘాలకు చెందిన వారు కాశ్మీర్‌ వేర్పాటు వాద లేక పాక్‌అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేయలేదు. కొందరు చేసిన నినాదాలను సాకుగా తీసుకొని అక్కడి వామపక్ష విద్యార్ధి కార్యకర్తలను వేధించటానికి, విశ్వవిద్యాలయంలో వున్న భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామిక వాతావరణాన్ని లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నది స్పష్టం.

      బయటి వ్యక్తులు లేదా అక్కడి కొంత మంది భారత వ్యతిరేక నినాదాలు చేసిన సమయంలో విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య మరికొందరు వున్న వీడియోలు తప్ప వ్యతిరేక నినాదాలు చేశారన్న సాక్ష్యాలు లేవు. తాము అ సమయంలో అక్కడ ఎందుకున్నదీ వారు స్పష్టం చెబుతున్నారు, లేరని బుకాయించటం లేదు. ఏబివిపి వత్తిడి, అభ్యంతరం పెట్టింది కనుక అధికారులు డిఎస్‌యు సభను రద్దు చేయాలని ప్రయత్నించారు. ఈ రోజు డిఎస్‌యు సభను అడ్డుకున్న వారు రేపు తమ సభను మాత్రం అడ్డుకోరన్న గ్యారంటీ ఏముంది? అందువలన ఆ సంగతేదో ఇక్కడే,ఇప్పుడే తేల్చుకోవాలని ఇతర సంఘాల వారు కూడా అక్కడే వున్నారు. దీనికి దేశద్రోహం అని పేరు పెట్టారు. ఆ సమయంలో ఎబిబివి ఆరోపణలను ఖండిస్తూ దేశభక్తి గురించి తాము ఎబివిపి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని కన్నయ్య చేసిన వుపన్యాసంలో కూడా విమర్శ తప్ప అభ్యంతరకర భాష, పదజాలం లేదు. అందువలన ఇప్పుడు జరుగుతున్న రచ్చ లేదా నిరసన, ఆందోళనలకు కారకులు ‘కుడి పక్షం’ తప్ప మరొకరు కాదు. అందుకే చివరికి ఎబివిపిలో కాస్త తర్కబద్దంగా ఆలోచిస్తున్నవారు కూడా దేశవ్యతిరేక నినాదాలు చేసిన వారిని తప్పుపడుతూనే చేయనివారి పట్ల అనుసరించిన వైఖరికి నిరసనగా ముగ్గురు ఎబివిపి కమిటీ నుంచి తప్పు కున్నారు. కేంద్ర ప్రభుత్వ అనుసరించిన వైఖరితో తాము విబేధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే వారు కూడా దేశద్రోహులను సమర్ధించినట్లా ?

     కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో ఢిల్లీ పోలీసు నడుస్తున్నదనటానికి జెఎన్‌యు విశ్వవిద్యాలయ విద్యార్ధుల గురించి ఎలాంటి నివేదిక ఇచ్చారో గురువారం నాటి పత్రికల్లో వచ్చింది. విద్యార్ధులు బీఫ్‌ పెట్టాలని కోరారని, కొందరు మహిషాసుర వర్ధంతి జరిపారని నివేదికలో ఆరోపించారంటే హిందూత్వ ఎలా తలకెక్కిందో అర్ధం అవుతోంది.అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ కనుసన్నలలో నడిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని బిజెపి ఏం చేసిందో దేశమంతా చూసింది. అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు గవర్నర్‌ చూపిన కారణాలలో రాజభవన్‌ ఎదుట గోవధ చేశారని కూడాపేర్కొన్నారు. ప్రతిదానికీ ఆవు కధకు లంకె పెడుతున్నారు. అంటే ఎవరు ఏమి తినాలో ఎవరిని అభిమానించాలో,పూజించాలో కూడా మనువాదులు చెప్పినట్లు జరగాలా ? కేంద్రంలోని బిజెపి సర్కార్‌, వారిని నిత్యం సమీక్షించి, మార్గదర్శనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘపరివార్‌ దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పక్కన పెట్టి వివాదాస్పద, ఏకపక్షంగా తమ మతభావజాలాన్ని రుద్దే క్రమంలో తెగేదాగా లాగేందుకే నిర్ణయించుకున్నట్లు అనేక పరిణామాల సందర్బంగా అనుసరిస్తున్న వైఖరి వెల్లడిస్తోంది. అందుకే గతంలో పేర్కొన్నదే అయినప్పటికీ మరోసారి హిట్లర్‌ హయాంలో బందీ అయిన ఒక పాస్టర్‌ మార్టిన్‌ నియోమిలర్‌ రాసిన మేలుకొలుపు అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. మార్పల్లా అక్కడ నాజీలు అయితే ఇక్కడ హిందూత్వవాదులను చేర్చుకోవటమే. దాన్ని నేటి పరిస్ధితులకు మారిస్తే ఇలా వుంటుంది.

తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు,

నేను కమ్యూనిస్టును కాదు కనుక మౌనం దాల్చాను.

తరువాత వారు ప్రజాస్వామిక వాదుల కోసం వచ్చారు,

ప్రజాస్వామ్యం అంటే నాకు విశ్వాసం పోయింది కనుక మిన్నకున్నాను.

తరువాత మహిళల కోసం వచ్చారు,

ఇంటి పట్టున వుండక ఫ్యాషన్లంటూ మగాళ్లను రెచ్చగొడుతున్నారు కనుక మంచిదే అనుకున్నాను.

ఆ వెంటనే ముస్లింల కోసం వచ్చారు,

నేను ముస్లింను కాదు గనుక పట్టించుకోలేదు.

తరువాత వారు దళితుల కోసం వచ్చారు,

వారు అంటరాని వారని మా పెద్దలు చెప్పారు గనుక ఆ ఛాయలకే పోలేదు.

తరువాత వారు బీసీల కోసం వచ్చారు,

నేను బీసి కాదు కనుక చూసీ చూడనట్లు వున్నాను.

చివరికి నా కోసం వచ్చారు,

అప్పుడు చూస్తే అసలు నా వెనుకెవరూ మిగల్లేదు.

చెన్నయ్‌ ఐఐటిలో,పూనా ఫిలిం ఇన్సిస్టిట్యూట్‌లో, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, కలుబుర్గి, గోవింద పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ల వుదంతాలలో ప్రజాస్వామిక వాదులు, భావప్రకటన స్వేచ్చను కోరుకొనే వారు, లౌకిక వాదులు తగినంతగా స్పందించి వుంటే ఇప్పుడు జెఎన్‌యు పరిణామాలు జరిగి వుండేవి కాదు. ఇప్పటి కైనా మేల్కొనకపోతే అన్ని జీవన రంగాలకు ఈ ధోరణి విస్తరిస్తుందని గమనించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

NO additional Railway lines  construction through extra budgetary resources in Andhra pradesh,Telangana             

18 Thursday Feb 2016

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

additional Railway lines, ANDHRA PRADESH, Indian Ralways, Railway lines, Telangana

 

The Cabinet Committee of Economic Affairs, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved construction of six Railway Lines and a Railway bridge to cater to both increased passenger and freight needs in various areas of the country. The proposals will cost over Rs.10,700 crore and most part of the expenditure will be met through extra budgetary resources (Institutional Financing). Details of the six approved projects are as follows:

1)   Doubling of Hubli-Chickajur railway line

Doubling of 190 km long Hubli-Chickajur broad gauge single railway line has been approved. The total estimated expenditure will be Rs.1294.13 crore. The project is likely to be completed in 4¼ years during 13th Plan period and will cover the areas of Chitradurga, Davangere, Haveri and Dharwad.

Entire route from Pune-Miraj-Hubli-Bengalore has been identified for doubling which will not only improve smooth flow of traffic but also boost overall development of the region.

This stretch is part of an important rail link of passenger trains between Mumbai and Bangalore and goods trains to the ports at Mangalore.  On this route, doubling between Bangalore-Tumkur and Arsikere-Chickajur have already been completed.  On balance portion, doubling work between Hubli-Londa part of Hubli-Londa-Vasco-da-Gama, is also in progress.

2)   Construction of Wardha (Sewagram) – Ballarshah 3rd railway line

Construction of Wardha (Sewagram) – Ballarshah 3rd railway line of 132 km will be taken up at an estimated completion cost of Rs.1443.32 crore.  The project is likely to be completed in five years during 13th Plan period and will be located in Wardha and Chandrapur districts.

The line capacity utilization of the section is saturated and running of additional Mail/Express and Goods traffic over the section cause detention to the trains.  Wardha (Sewagram) – Ballarshah section is very important from goods originating point of view of Nagpur Division where many collieries and many sidings are proposed on the section.

3)   Doubling of Ramna-Singrauli railway line

Doubling of 160 km long Ramna – Singarauli railway line has been approved at a cost Rs.2675.64 crore and is likely to be completed by 2019-20.   The project will cover the districts of Garhwa in Jharkhand, Singrauli in Madhya Pradesh andSonbhadra in Uttar Pradesh.

The Ramna-Singrauli section falls in Dhanbad Division of East Central Railway.  At present traffic utilization of the section is 105%, resulting in detention of trains and loss of revenue.  In order to attain the desired fluidity and increase in the sectional capacity, doubling of this single line section is very essential from operational point of view.  The project will serve the freight and passenger traffic needs in the jurisdiction of Northern Coal Fields and series of power plants and associated small scale industries in and around Anpara and Shaktinagar, namely Anpara Super Thermal Power Plant, RihandSuper Thermal Power Plant, Renusagar Hydro Power Plant,Singrauli Super Thermal Power Plant, Vidhyachal Super Thermal Power Plant.

4)   Construction of 3rd railway line between Anuppur-Katni

Construction of 165 km long 3rd railway line between Anuppur-Katni in Madhya Pradesh has also been apporved at a cost of Rs.1595.76 crore. The project is likely to be completed in 5 ¼ years spanning over 12th and 13th plan period.

The project would cover the districts of Anuppur, Shahdol, Umaria and Katni districts of Madhya Pradesh.

There has been tremendous surge in coal and one mining which has been geared up in the recent past and ambitious plans for an enormous leap forward in the ensuing years to tap these resources lying hitherto untapped.  As a result of the rapid industrialization, number of industrial townships have also grown up along the project line.  These developments have resulted in large demand for additional coaching services on the section.  With this anticipated increase of freight traffic, the capacity utilization will reach upto 175%.  Apart from this substantial additional coal traffic from IB valley, Korba area, East Corridor and Gevra Road – Pendra Road Project would be channelized through this route to the respective destinations. In order to meet the growth in the freight and passenger traffic, tripling of 3rd line between Anuppur-Katni is essential.

 

5)   Doubling of Katni-Singrauli railway line

Construction of doubling of 261 km long Katni – Singarauli railway at a cost of Rs.2084.90 crore has been approved. The project will be completed in 5 ¼ years.  The project would cover the districts of Katni, Shahdol, Sidhi and Singrauli in Madhya Pradesh.

Katni-Singrauli is a critical and busy section carrying coal from Northern Coal Fields towards Western and Northern thermal power plants.  This section intersects Allahabad-Mumbai route at Katni.  Provision of doubling between Katni-Singrauli section would provide the necessary line capacity for introduction of additional mail/express and passenger trains to serve the people of the area and transportation of coal from collieries.  This will also boost overall development of the region.

6)   Construction of additional Bridge and doubling project of Rampur Dumra-Tal-Rajendrapul

Construction of additional Bridge and doubling project of Rampur Dumra-Tal-Rajendrapul sector in Bihar at a cost of Rs.1700.24 crore has also got CCEA’s approval today.

The project is likely to be completed by 2019-20.  The project is located in Begusarai and Patna districts of Bihar.

The existing rail-cum-road bridge at Hathidah has single line track and doubling is not possible.  Present traffic utilization of the section is 123.5%.  At present this is the only railway bridge connecting both North and South Bihar.  Existing single line has resulted in heavy detention of goods and passenger traffic.

In order to streamline the operation of traffic in this single line section, it is very essential that one additional bridge and doubling of this section is undertaken.  By providing this facility, there will be ample fluidity in maintaining train operations as well as introduction of more passenger/goods trains in the section and it will augment line capacity too.  This will also facilitate in minimizing the running time of trains between Kiul-Barauni and Mokama-Barauni section and will ease out the existing operational constraints in this section.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జెఎన్‌యులో జరుగుతున్న ఘటనలకు మూలం ఏమిటి ?

17 Wednesday Feb 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

ABVP, Anti communist, ANTI NATIONAL, BJP, democracy, JNU, JNU ROW, RSS, students

ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో  సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి.

ఎం కోటేశ్వరరావు

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అణచేపేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అణచివేత వైఖరి బంగారం లాంటి ఒక యువశాస్త్రవేత్త వేముల రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైంది.ఈ వుదంతంపై జరుగుతున్న ఆందోళన ఇంకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వుంది. ఒక వుదంతం జరిగితే దాన్నుంచి మంచో చెడో ఏదో ఒకటి నేర్చుకోవాలన్నది సమాజం నేర్పిన పాఠం. హైదరాబాదు వుదంతం నుంచి కేంద్రం ప్రభుత్వం ఏమి నేర్చుకున్నది? తన భావజాలానికి వ్యతిరేకులుగా వున్న వారిని అణచివేసేందుకే ముందుకు పోవాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దానిలో భాగమే న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో వామపక్ష భావజాలం వున్న విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలపై దేశద్రోహ ముద్రవేసి అరెస్టులకు పూనుకున్నది. దానిలో భాగంగానే విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ తదితరుల అరెస్టు. హైదరాబాదు వుదంతంలో స్ధానిక ఎంఎల్‌ఏ,ఎంఎల్‌సిలు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ లేఖలు, ఇతర రూపంలో విశ్వవిద్యాలయ అధికారులపై వత్తిడి, ఏబివిపి విద్యార్ధులతో అసత్య కేసుల నమోదు వంటి పనులు చేశారు. న్యూఢిల్లీలో ఏకంగా బిజెపి ఎంఎల్‌ఏ ఒపి శర్మ కోర్టుకు వచ్చిన విద్యార్ధులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై ఏకంగా పోలీసుల సమక్షంలో చేయి చేసుకున్నాడు. అంతే కాదు తనకు చిన్నప్పటి నుంచి జాతి వ్యతిరేకులుగా వున్నవారిపై దాడి చేయటం అలవాటని ఆ పెద్దమనిషి సమర్ధించుకున్నాడు.అంటే అధికార యంత్రాంగాన్ని వుపయోగించుకోవటమే కాదు, తమతో విబేధించేవారిపై సంఘపరివార్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగా గూండాగిరీ చేయటానికి కూడా సిద్ధం అవుతున్నారనుకోవాలా ? ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే సందర్బంగా భజరంగ్‌దల్‌, విశ్వహిందూ పరిషత్‌ ఇతర వారి అనుబంధ సంఘాల కార్యకర్తలు వీధులు, పార్కుల వెంట తిరిగి అనుమానం వచ్చిన యువతీ యువకులను కొట్టటాన్ని మాత్రమే చూశాము.ఇప్పుడు వారు విశ్వవిద్యాలయాల వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారు.జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్న విద్యార్ధులు, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రతి ప్రదర్శన చేశారు. అలాంటి వారికి కేంద్రంగా వుందంటూ పనిలో పనిగా అసలు ఆ విశ్వవిద్యాలయాన్నే మూసివేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

జెఎన్‌యులో ఏం జరిగింది? అసలు జాతి వ్యతిరేకత అంటే ఏమిటి? అన్నది ప్రతివారిలోనూ వస్తున్న సందేహం? విద్యార్ధులు ఏవైనా తప్పులు చేస్తే వారిని సరిదిద్దాలా లేక జాతి వ్యతిరేకులుగా ముద్రవేసి జైళ్లకు పంపాలా ? ‘ఫిబ్రవరి తొమ్మిది రాత్రి నిజంగా ఏం జరిగింది ?’ అనే శీర్షికతో హిందూస్ధాన్‌ టైమ్స్‌ పత్రిక ఫిబ్రవరి 16న ఒక విద్యార్ధి కధనాన్ని ప్రచురించింది. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో శిక్ష పడిన అప్జల్‌ గురు స్మారకార్ధం ‘ఏ కంట్రీ వితౌట్‌ పోస్టాఫీసు’ అనే పేరుతో ఒక విద్యార్ధి సంఘం ఒక మీటింగ్‌ ఏర్పాటు చేసింది. దాని గురించి హర్షిత్‌ అగర్వాల్‌ అనే విద్యార్ధి క్వోరా వెబ్‌సైట్‌లో రాసిన అంశాలను హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొన్నది.’ ఫిబ్రవరి తొమ్మిదిన డిఎస్‌యు అంటే డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పేరుతో వ్యవహరించే విద్యార్ధి సంఘం ఒక సాంస్కృతిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వారు పేర్కొన్నట్లుగా కాశ్మీరీ పౌరుల ప్రజాస్వామిక హక్కయిన స్వయంత్రిపత్తి పోరాటానికి మద్దతుగా మరియు న్యాయవ్యవస్ధ హత్యకు గురైన అప్జల్‌ గురు మరియు మక్బూల్‌ భట్ల సంస్మరణగా ఆ సభ జరిగింది. క్యాంపస్‌(జెఎన్‌యు)లోని మరియు వెలుపలి నుంచి పెద్ద సంఖ్యలో కాశ్మీరీ విద్యార్ధులు ఈ కార్యక్రమానికి వచ్చారు.’ డిఎస్‌యు మావోయిజాన్ని నమ్మే విద్యార్ధులతో కూడిన ఒక చిన్న వుగ్రవాద వామపక్ష సంస్ద. వారు ఏ అర్ధంలో చూసినా టెర్రరిస్టులు గానీ నక్సల్స్‌గానీ కాదు. నేను రెండు సంవత్సరాలకుపైగా కాంపస్‌లో వుంటున్నాను. వారు ఎప్పడూ టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడటం గురించి రాజ్యాన్ని కూలదోయటానికి ఒక రాయి వేయటం వంటివిగానీ నేను చూడలేదు. వారి మీటింగ్‌ ప్రారంభం కావటానికి 20 నిమిషాల ముందు అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్‌ అధికారయంత్రాంగానికి ఒక లేఖ రాసింది.కాంపస్‌ వాతావరణానికి హానికరం గనుక ఆ సమావేశానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరింది. ఘర్షణలు జరుగుతాయనే భయంతో అధికారయంత్రాంగం అనుమతి నిరాకరించింది. జెఎన్‌యు అన్ని రకాల గళాలను వినటానికి ఒక అనువైన ప్రజాస్వామిక భావనల కేంద్రం. భావాలు తీవ్రవాదంతో కూడినప్పటికీ వ్యక్తం చేయటాన్ని గౌరవిస్తారు. ఇపుడు ఎబివిపి అటువంటి దాన్ని అడ్డుకుంటోంది. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పద్దతుల్లో తమ సమావేశం జరుపుకొనే హక్కున్న తమకు సాయం చేయాలని జెఎన్‌యు విద్యార్ధి సంఘాన్ని, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ వంటి ఇతర వామపక్ష విద్యార్ధి సంఘాలను డిఎస్‌యు కోరింది. కాశ్మీర్‌పై తమ వైఖరిని లేదా తమ భావజాలానికి మద్దతు కోరటం కాదని మీరు గమనించాలి. ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక భావ వ్యక్తీకరణ చర్చ అవకాశాన్ని వమ్ముచేయటానికి పూనుకున్న ఎబివిపిని , యంత్రాంగాన్ని వదలి పెట్టకూడదని ఎట్టి పరిస్ధితుల్లోనూ సభజరిపి తీరాలని విద్యార్ధి యూనియన్‌ ఇతర విద్యార్ధి సంఘాలు నిర్ణయించి ముందుకు పోయాయి. సభజరగాల్సిన బ్యాడ్‌మింటన్‌ కోర్టు వద్దకు అధికార యంత్రాంగం భద్రతా సిబ్బందిని పంపింది. అయితే మైకులను వినియోగించటానికి మాత్రం అనుమతి నిరాకరించింది. అందుకు నిర్వాహకులు అంగీకరించి మైకులు లేకుండానే సభ జరుపుకోవాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఎబివిపి తన కార్యకర్తలను సమీకరించి హాజరైన విద్యార్ధులు, నిర్వాహకులను బెదిరించటం ప్రారంభించింది. ఏ కాశ్మీర్‌ హమారా హయ్‌, సారా కా సారా హయ్‌ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిస్పందనగా సభ నిర్వాహకులు హమ్‌ క్యా చాహతే అజాదీ అని నినాదాలు చేశారు.తరువాత తుమ్‌ కితనే అఫ్జల్‌ మారోగె, హర్‌ ఘర్‌ సె అఫ్జల్‌ నికేగా అని నినదించారు. జెఎన్‌యు బయటి నుంచి వచ్చిన కాశ్మీరీ విద్యార్ధుల బృందం ఒకటి సభకు వచ్చిన వారి మధ్యలో ఒక వలయంగా ఏర్పడ్డారు. నన్ను నమ్మండి వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారు లేరు. ఆ కార్యక్రమం సందర్బంగా నేను కొద్ది సేపు వున్నాను. వారిలో ఒక్కరు కూడా జెఎన్‌యు వారిని నేను గుర్తించలేదు. దశాబ్దాల తరబడి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట అణచివేతకు గురైన కాశ్మీరీ విద్యార్ధులు ఏబివిపి వారిని చూడగానే భారత వ్యతిరేక నినాదాలు చేశారు. నేను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా జెఎన్‌యులో వున్నాను. అటువంటి నినాదాలు నేను ఎక్కడా వినలేదు, డిఎస్‌యును మినహాయిస్తే ఏ వామపక్ష పార్టీ భావజాలానికి దగ్గరగా లేవు. పాకిస్ధాన్‌ జిందాబాద్‌ అనే నినాదానికి సంబంధించి అది వివాదాస్పాదం. నేను అక్కడ వున్నంత వరకు ఆ నినాదాన్ని వినలేదు. అటువంటి నినాదం చేసినట్లు ఒక వీడియో వుంది. అయితే అది స్పష్టంగా లేదు, కాశ్మీరీ విద్యార్ధులు చేశారా లేదా ఎబివిపి కుట్ర అన్నది తెలియటం లేదు.జెఎన్‌యు విద్యార్ధి సంఘనాయకుడు కనయ్య కుమార్‌ ఎలాంటి నినాదాలు చేయలేదు.అతను ఎఐఎస్‌ఎఫ్‌( సిపిఐ విద్యార్ధి విభాగం) సభ్యుడు మావోయిస్టు లేదా వేర్పాటు వాదానికి వారు వ్యతిరేకం’ అని అగర్వాల్‌ పేర్కొన్నాడు.

ఇక్కడ సమస్య ఏబివిపి అభ్యంతర పెట్టినా అడ్డుకున్నా ఆ సభ జరిగింది. సభ జరగటానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు సహకరించాయనే దుగ్డతో ఎలాగైనా నిరంకుశ,అణచివేత చర్యల ద్వారా వారిని బెదిరించాలి, విశ్వవిద్యాలయంలో తమ పలుకుబడిని పెంచుకోవాలన్నది తప్ప మరొకటి కనిపించటం లేదు. పోలీసులను వినియోగించి తప్పుడు కేసులు బనాయించటాన్ని దేశ, విదేశాలలో లోని అనేక మంది విద్యావేత్తలు, విద్యార్ధులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పలు సంస్ధలు దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేకం పేరుతో తమ వ్యతిరేకులను, ముఖ్యంగా వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. ప్రజాస్వామిక పద్దతులలో చర్చల ద్వారా ఒప్పించి తమ భావాలను ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, మద్దతుదార్లను కూడగట్టుకోవచ్చు. కానీ తమ వాదనలో పసలేనపుడు ఎదుటివారిపై భౌతికదాడులకు దిగి నోరు మూయించటం ప్రజాస్వామ్యమా ? ఫాసిజమా ? జెఎన్‌యు విద్యార్ధులకు మద్దతు ఇస్తున్నందుకు ఢిల్లీలోని సిపిఎం కేంద్రకార్యాలయంపై దాడికి ప్రయత్నించటం, తరువాత పాటియాల కోర్టు ఆవరణలో బిజెపి ఎంఎల్‌ఏ నాయకత్వంలో పరివార్‌ మద్దతుదారులైన న్యాయవాదులు కూడా నల్లకోట్లు వేసుకొని విద్యార్ధులు, అధ్యాపకులు, వార్తల సేకరణకు వచ్చిన జర్నలిస్టులపై దాడులు చేయటం, మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా దాడులకు దిగటం ప్రమాదకర పోకడలకు నిదర్శనం.

అఫ్జల్‌ గురువంటి వుగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేయటం ద్వారా వుగ్రవాదులపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను అవమానించటమే అని వారి త్యాగాలను అపహాస్యం చేయటమే అని మనోభావాలను రెచ్చగొడుతూ తమ తప్పుడు చర్యలను సమర్ధించుకొనేందుకు సంఘపరివార్‌ ప్రయత్నిస్తున్నది.పంజాబు, కాశ్మీరులలో అమెరికా కుట్రలో భాగంగా పాకిస్ధాన్‌ కేంద్రంగా వున్న వుగ్రవాదులు జరిపిన దాడులలో ఎందరో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీలలో వారిని ఎదుర్కొని ఎందరో నాయకులు, కార్యకర్తలను కోల్పోయిన సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు , అకాలీదళ్‌ తప్ప దేశభక్తి,దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పుకొనే బిజెపి , ఇతర పార్టీలకు చెందిన వారు ఎందరున్నారో చెప్పమనండి. బిజెపి కుహనా (నకిలీ) దేశభక్తి, వుగ్రవాద వ్యతిరేక పోరాట బండారం గురించి గతేడాది జూలైలో మన రిసర్చ్‌ మరియు ఎనాలసిస్‌ వింగ్‌( రా)లో పనిచేసిన మాజీ అధికారి ఎఎస్‌ దౌలత్‌ గతంలో బిజెపి అధికారంలో వున్నపుడు 1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ వుదంతంలో వ్యవహరించిన తీరు గురించి వివరించారు. వందలాది మంది పౌరుల, భద్రతా సిబ్బంది ప్రాణాలు తీసిన వుగ్రవాదులతో రాజీపడిన వాజ్‌పేయి సర్కార్‌ ముగ్గురు కరడు గట్టిన తీవ్రవాదులను విడుదల చేసింది. పోనీ విమాన ప్రయాణీకుల ప్రాణాలు కాపాడేందుకు ఆ పనిచేసిందని సరిపెట్టుకోవచ్చు.కానీ పాకిస్ధాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హిజబుల్‌ ముజహిదీన్‌ అధిపతి సయీద్‌ సలావుద్దీన్‌ కుమారుడికి 1999లో బిజెపి ప్రభుత్వం మనదేశంలోని ఒక మెడికల్‌ కాలేజీలో సీటు ఇప్పించటం దేశ భక్తా, వుగ్రవాదులతో కుమ్మక్కా? ఏ ప్రయోజనం ఆశించి చేసినట్లు ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం నోరు విప్పదు. ఆ విమాన హైజాక్‌ వుదంతంలో అది అమృతసర్‌ నుంచి బయలుదేరి వెళ్లటానికి అనుమతించటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అది అమృతసర్‌ నుంచి వెళ్లిన తరువాత వుగ్రవాదులది పైచేయి అయిందని రా మాజీ అధికారి వ్యాఖ్యానించారు. నాటి బిజెపి ప్రభుత్వం రాజీపడి మన జైళ్లలో వున్న ముగ్గురు వుగ్రవాదులను విడుదల చేసింది.

నినాదాలు చేయటం చట్ట ప్రకారం వ్యతిరేకం, అందుకు పాల్పడిన వారిని శిక్షించవచ్చు, కానీ కాశ్మీర్‌లో ప్రతిరోజూ అనేక కారణాలతో అక్కడి పౌరులు ఏదో ఒకచోట నిరసన తెలుపుతూ భారత వ్యతిరేక నినాదాలు చేస్తూనే వున్నారు. వారందరినీ దేశవ్యతిరేకులుగా పరిగణించి జైళ్లలో పెడితే సమస్య పరిష్కారం అవుతుందా ? లేదు కొందరు నినాదాలు చేసినంత మాత్రానే కాశ్మీర్‌ విడిపోయి వుంటే ఈ పాటికి అ పని ఎప్పుడో జరిగి వుండేది. కానీ బిజెపి అలాంటి వుదంతాలను సాకుగా చూపి నకిలీ దేశభక్తిని ప్రదర్శిస్తోంది. చరిత్రలోకి వెళ్లేట్లయితే అసలు కాశ్మీర్‌ భారత్‌లో విలీనం విషయంలో నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ తటపటాయింపులు, విలీనానికి ఒక దశలో విముఖత, దానికి నేటి బిజెపి, అంతకు ముందు జనసంఘరూపంలో వున్న, సంఘపరివార్‌కు చెందిన వారంతా రాజుకు మద్దతుగా విలీనానికి విముఖత తెలిపిన వారే అన్నది చరిత్రలో నమోదయ్యే వుంది. రాజుకు వ్యతిరేకంగా నాడు షేక్‌ అబ్దుల్లా పోరాడి కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు కారకుడయ్యాడు కనుకనే విలీనం తరువాత ప్రధానిగా షేక్‌ అబ్దుల్లాను నియమించమని నాటి రాజు హరిసింగ్‌ స్వయంగా బ్రిటీష్‌ ప్రభుత్వానికి రాశారు. నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, యువతలో నిరుద్యోగం, దారిద్య్రం వంటి కారణాలకు తోడు నిరంతరం పాకిస్ధాన్‌, అమెరికా తదితర సామ్రాజ్యవాదుల కుట్రకారణంగా కాశ్మీర్‌ వేరుపడి స్వతంత్ర రాజ్యం ఏర్పడాలనే భావనలు అక్కడ తలెత్తాయి. దానికి తోడు కాశ్మీర్‌కు రాజ్యాంగబద్దంగా కల్పించిన రక్షణలైన ఆర్టికల్‌ 370కు వ్యతిరేకంగా సంఘపరివార్‌ రాజకీయ రూపం ఎలా వున్నప్పటికీ నిరంతరం కాశ్మీరీయులకు వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో రెచ్చగొడుతూనే వున్న అపర దేశభక్తులు వారు. కాశ్మీర్‌లో తలెత్తిన వేర్పాటు వాద ధోరణులు, పాక్‌, అమెరికా సామ్రాజ్యవాదుల వుగ్రవాదుల కార్యకలాపాలను ఒకేగాటన గట్టిన కాంగ్రెస్‌, బిజెపి పాలకుల వైఖరి కారణంగా ఎవరు వేర్పాటు వాదో, ఎవరు వుగ్రవాదో తెలియని స్ధితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండుశక్తులను దగ్గరయ్యేట్లు చేశారు. అంతే కాదు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సోం, తదితర రాష్ట్రాలన్నింటా వేర్పాటు వాదశక్తులు తలెత్తి సాయుధ పోరాటాలను కూడా సాగించిన విషయంతెలిసిందే. ఆ రాష్ట్రాలలో వాటికి ప్రభావితులైన యువతరాన్ని దేశద్రోహులుగా పరిగణించి జైళ్లలో పెడితే ఈశాన్య ప్రాంతంలో పరిస్ధితులు వేరే విధంగా వుండేవి. అందువలన కొత్తబిచ్చగాడికి పంగనామాలెక్కువ అన్నట్లు అసలు ఏనాడూ దేశభక్తులుగా లేని సంఘపరివార్‌ శక్తులు ఈనాడు తాము చెప్పిందే దేశభక్తి దానికి భిన్నంగా వుండేవారందరూ దేశద్రోహులే అన్నట్లు మాట్లాడుతూ నానా యాగీ చేయటమే కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేసేందుకు పూనుకుంది.

సంఘపరివార్‌ నాయకులలో ఒకరైన వీర సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి సలాంగొట్టి వారికి విధేయుడిగా పనిచేస్తానని 1914లోనే రాసిన లేఖ వారి దేశభక్తికి పెద్ద నిదర్శనం. దానికి అనుగుణంగానే తరువాత ఎక్కడా సంఘపరివారెవరూ స్వాతంత్య్ర వుద్యమంలో మనకు కనపడరు. అయితే సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి రాసిన లేఖ బయటపడగానే ఈ దేశభక్తులు కొత్త పల్లవి అందుకున్నారు. చరిత్రలో చాలా మంది ఒక ఎత్తుగడగా తమ శ త్రువులకు లొంగిపోయినట్లు లేఖలు రాసినట్లుగానే సావర్కర్‌ కూడా బ్రిటీష్‌ వారికి లేఖ రాసిన మాట నిజమే అని హాస్యాస్పదమైన ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఈ కాషాయ దళం భాగస్వామి అయి వుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన గాడ్సే జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసి వుండేవాడు కాదు. గాంధీ హత్య జరిగిన రెండు దశాబ్దాల తరువాత సంఘపరివార్‌ అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో 1970 జనవరి 11 సంచిక సంపాదకీయంలో ఇలా రాశారు.’ పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూకు మద్దతుగా గాంధీజీ దీక్షకు దిగారు, ఈ క్రమంలోనే జనాగ్రహం స్వయంగా ఆయనపైకి మళ్లింది. కాబట్టే నాధూరామ్‌ గాడ్సే ‘ప్రజలకు’ ప్రాతినిధ్యం వహించాడు మరియు జనాగ్రహానికి స్పందన అన్నట్లుగా హత్యకు పాల్పడ్డాడు’ అని నిస్సిగ్గుగా గాడ్సేసు, గాంధీజీ హత్యను సమర్ధించారు.అంతకు ముందు 1961లో దీన దయాళ్‌ వుపాధ్యాయ ఇలా చెప్పారు.’ గాంధీజీపై అన్ని రకాల గౌరవభావంతో మనం ఆయనను జాతిపిత అని పిలవటం మానివేద్దాం. మనం జాతీయవాద పాత ప్రాతికను అర్ధం చేసుకుంటే అది హిందూయిజం తప్ప మరొకటి కాదని మనకు స్పష్టం అవుతుంది.’ అన్నారు. 1989 అక్టోబరు 17నాటి సంపాదకీయంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఇలా వ్యాఖ్యానించింది.’ శ్రీ అద్వానీ భారత మాతను ముందుకు తెస్తున్నారంటే ఇప్పటివరకు జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మాగాంధీని నిరాకరించటమే అవుతుంది’ అన్నది. గాడ్సేను కీర్తిస్తూ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు గోవాలో అధికారంలో వున్న బిజెపి నాయకుడు అంగీకరించటమే గాక, తాను అధ్యక్షుడిగా వున్న ప్రభుత్వానికి చెందిన రవీంద్ర భవన్‌ను వేదికగా కూడా ఇచ్చిన ఆ పెద్దమనిషి దేశభక్తుడు, దానిని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, తిమ్మినిబమ్మిని చేయటం అంటే ఇదే.ఈ లెక్కన బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏది చెబితే దాన్ని దేశ ప్రజలందరూ అంగీకరించాలి. అది హిందూయిజాన్ని జాతీయ వాదం అంటే అంగీకరించాలి, ఆ ప్రాతిపదికన దేశ భక్తులు ఎవరో ఎవరు కాదో నిర్ణయించేది వారే. వారి జాబితాలో వున్న గాడ్సే లాంటి వారందరూ దేశ భక్తులు, ఎవరైనా కాదంటే దేశద్రోహులు, కాదని గట్టిగా వాదిస్తే వారిపై దాడి చేసి ఒప్పిస్తారు. హైదరాబాదు కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది కనుక మంత్రులతో వత్తిడి చేయించి ఐదుగురు అంబేద్కరిస్టు దళిత విద్యార్ధులపై చర్య తీసుకొనేట్లు వత్తిడి చేశారు. జెఎన్‌యులో డిఎస్‌యు సభకు అధికారులే షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు కనుక తమ చేతిలో వున్న పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించారు.అరెస్టయిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువస్తున్న సందర్భంగా చూసేందుకు వచ్చిన విద్యార్ధులు, అద్యాపకులు, వార్తలు సేకరించేందుకు వచ్చిన జర్నలిస్టులపై బిజెపి ఎంఎల్‌ఏ, న్యాయవాదులుగా వున్న పరివార్‌ కార్యకర్తలు దాడికి దిగారు. బిజెపికి మార్కు ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీన్ని నోర్మూసుకుని జనం అంగీకరించాలా ? మధ్య యుగాలలో శైవులు, వైష్ణవులు తమ మతాలను అనుసరించని వారిని, వ్యతిరేకించిన జైన, బౌద్ధ మతాలవారిని, చార్వాకులు, లోకాయతులపై భౌతికంగా దాడి చేసి హతమార్చారని, జైన, బౌద్ధ కేంద్రాలను వీర శైవమతస్దులు శివాలయాలుగా మార్చివేశారని చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు తిరిగి బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్నదానికి గతంలో జరిగినదానికీ పెద్ద తేడా కనిపించటం లేదు. జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ యూదులు, కమ్యూనిస్టులపై వ్యతిరేకతను రెచ్చగొడితే మన దేశంలో సంఘపరివార్‌ ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులపై జనాన్ని వుసిగొల్పుతున్నది.అలాంటి శక్తులకు ఐరోపాలో, ప్రపంచంలో ఇతర చోట్ల ఏమి జరిగిందో మరోసారి చెప్పాల్సిన పనిలేదు.

సంఘపరివార్‌ ఇలాంటి దాడులకు ఎందుకు పూనుకున్నది, విశ్వవిద్యాలయాలను అది వేదికగా ఎందుకు చేసుకున్నది అన్నది అనేక మందిలో నలుగుతున్న సందేహం. విశ్వవిద్యాలయాలెప్పుడూ పురోగామి కేంద్రాలు తప్ప తిరోగాములకు ఆలవాలం కాదు. ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రతి భావాన్ని వ్యక్తం చేసే విశాల ప్రజాస్వామిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. సహజంగానే అవి వివిధ వామపక్ష, ప్రజాస్వామిక భావజాల కేంద్రాలుగా వున్నాయి. సంఘపరివార్‌కు చెందిన అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్‌ చరిత్రను వెనక్కు నడపాలని చూసే ఒక తిరోగామి శక్తి. సైద్ధాంతిక చర్చలో అది ప్రతి చోటా పాడిందే పాడరా అన్నట్లు సభ్య సమాజం ఎప్పుడో తిరస్కరించిన భావజాలాన్నే ముందుకు తెస్తోంది. సహజంగానే అది విద్యార్ధులలో తిరస్కరణకు గురి అవుతోంది. అందువలన వాటిని ఎలాగైనా తమ అదుపులోకి తెచ్చుకోవాలని, వాటిని కూడా మత కేంద్రాలుగా మార్చాలన్నది ఎప్పటి నుంచో వున్న దాని పధకం. ఇప్పుడు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వుంది కనుక అధికారిక సంస్ధలన్నింటినీ తన భావజాలంతో వున్నవారు లేదా వారి కనుసన్నలలో నడిచే వారితో నింపుతోంది. పూనా ఫిలిం సంస్ధ వంటి ప్రఖ్యాత అకేంద్రానికి మహాభారత్‌ సీరియల్‌లో గుడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర ధరించటం మినహా మరొక అర్హతలేని చిన్న నటుడిని అధిపతిగా నియమించటాన్ని అక్కడి విద్యార్ధులు వ్యతిరేకించి నెలల తరబడి ఆందోళన జరిపినా పోలీసు బలప్రయోగంతో అణచివేసింది తప్ప ప్రజాభిప్రాయాన్ని మన్నించలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఎంఎం కలుబర్గిని హిందూత్వ శక్తులు హత్య చేసిన కారణంగానే ఆ చర్యను ఖండించేందుకు అకాడమీ ముందుకు రాలేదన్నది తెలిసిందే. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో మెలిగే వ్యక్తిని వైస్‌ఛాన్సలర్‌గా నియమించిన వెంటనే మంత్రులు వత్తిడి చేయటం తదనంతర పరిణామాలో వేముల రోహిత్‌ అనే దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. దానిలో కూడా అతడు దళితుడు కాదు, బిసి అని తప్పుడు ప్రచారం చేసి సమస్యను పక్కదారి పట్టించాలిని చూశారు. దళితుడు కాకపోతే బిసి అయినా ఒక విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడేట్లు చేయటం ఏమిటి ? అసలు సమస్య అతను దళితుడా, బిసి అని కాదు, సంఘపరివార్‌ భావజాలాన్ని వ్యతిరేకించాడు అందుకే అంతటి కక్షగట్టారు. ఇటువంటి సంఘపరివార్‌ వ్యతిరేక, వామపక్ష భావజాలానికి కేంద్రంగా వున్న ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోనే తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకుంటే మిగతా విశ్వవిద్యాలయాలన్నీ తమ ఆధిపత్యంలోకి తెచ్చుకోవటం సులభం అని అక్కడ తమ పధకాన్ని అమలు జరుపుతున్నారు. అక్కడి పరిణామాలకు అదే మూలం. దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశమంతటా వేర్పాటు వాదానికి వ్యతిరేక ప్రచారం పేరుతో జాతీయవాదాన్ని ప్రచారం చేయాలని బిజెపి పధకం వేసింది.

అన్నింటి కంటే కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఏలుబడికి ఇరవై నెలలు నిండింది. రూపాయి విలువ దగ్గర నుంచి ఎగుమతుల వరకు అన్ని రంగాలలో ప్రతికూల పరిస్ధితులు ముసురుకుంటున్నాయి.స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. నరేంద్రమోడీ వచ్చిననాటికి సూచీలు పతనమయ్యాయి. ధరలు తగ్గటం లేదు, అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమైనా పన్నులు విధిస్తూ స్ధానికంగా ధరలు తగ్గకుండా చూస్తున్నారు. కొత్తగా పరిశ్రమలు రావటం లేదు, వున్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంకెల్లో చెబుతున్న అభివృద్ధి అంతా వుపాధి రహితమే. వేతన కమిషన్‌ సిఫార్సులపై వుద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారు. రైల్వే వంటి చోట్ల సమ్మె బ్యాలట్‌ తీసుకొనే వరకు వచ్చింది. మిగతా రంగాలలో కూడా ఆందోళనకు రంగం సిద్ధం అవుతోంది. స్వచ్ఛభారత్‌, మేకిన్‌ ఇండియా వంటి వన్నీ నినాదాలకే పరిమితం తప్ప మరొకటి కాదు. ఈ పూర్వరంగంలో ఒకవైపు సంఘపరివార్‌కు చెందిన భజరంగదళ్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు రామాలయ నిర్మాణ సమస్యను మరోసారి ముందుకు తెస్తున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి జనం దృష్టిని పక్కదారి పట్టించేవే. జెఎన్‌యు, ఇతర విశ్వవిద్యాలయాలలో రాజేసిన కాష్టం కూడా దానిలో భాగమే అంటే కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబు వలవల- వీర భక్తుల విలవిల

14 Sunday Feb 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

CHANDRABABU, Nara lokesh, tdp, telangana tdp

మనకు ఇప్పటి వరకు  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాల గురించే తెలుసు. తెలంగాణా తెలుగుదేశం నుంచి వలసలు చూసిన తరువాత జరిగిన సభలో ప్రసంగించిన నేతల తీరుతెన్నులు చూస్తే ఫిరాయింపు వైరాగ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. పార్టీ అన్న తరువాత ఇతర పార్టీల వారిని చేర్చుకోకుండా వుంటామా? వారు వచ్చినట్లే తిరిగి పోకుండా వుంటారా, ఈరోజు వారు రేపు మనం , ఎవరైనా పోయేది ఎక్కడ అధికారం వుంటే అక్కడికే కదా, అంతా పైవారి వినోదం, మనం నిమిత్త మాత్రులం అనుకోవాలేమో !

ఎం కోటేశ్వరరావు

      ధర్మాన్ని మీరు కాపాడండి-ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఈ మాట ఎక్కడో చూసినట్లు, విన్నట్లు వుంది కదూ ! చంద్రబాబు నాయుడు అనే గొప్ప సంస్క ర్త( ఇది నేను చెప్పింది కాదు, ఎవరూ ఎస్సీలుగా పుట్టాలనుకోరు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యకు ఆయన ఒక సంస్కర్తలా అనుగ్రహ భాషణం చేశారని ఆయన మద్దతుదార్లు ఇచ్చిన టీకా తాత్పర్యంలో భాగం) తెలంగాణాలో మీరు పార్టీని కాపాడండి-పార్టీ మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పిన మాటలు వినగానే గుర్తుకు వచ్చాయి. తీరా చూస్తే అనేక చోట్ల గోడల నిండా రాసి కూడా వున్నాయి. యుగ యుగాలుగా, తరతరాలుగా ఇలాంటి సంస్కర్తలు నాలుగు పాదాల నడిచిన ధర్మానికి ఇప్పుడు అసలు ఒక పాదం అయినా వుందో లేదో తెలియకుండా చేశారు. అదీ ధర్మాన్ని రక్షించే పేరుతోనే సుమా ! అయినా ధర్మం తనను తాను కాపాడుకోలేక పోవటమే కాదు ధర్మంగా వున్న వారిని కూడా కాపాడలేకపోయిందని ప్రతి యుగంలో, తరంలో ఏ రంగంలో చూసినా మనకు తెలుస్తూనే వుంది.

      అలాంటిది తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఎలా కాపాడగలుగుతారు? ఆయన కుమారుడు లోకేష్‌ అంటే పుట్టుకతో తెలుగుదేశం కనుక సిద్ధాంతాల గురించి మాట్లాడే నైతిక అర్హత వుంది.అయితే తెలుగు దేశం పార్టీ పుట్టిన తరువాత భూమ్మీదకు వచ్చిన లోకేష్‌ అంతకు ముందే పార్టీలోకి వచ్చిన నేతల కంటే ఎక్కడలేని అధికారం ఎలా చెలాయిస్తున్నట్లు అంటే సమాధానం కష్టం.(మన అదృష్టం కొద్దీ లోకేష్‌ ఇంకా సిద్ధాంతాల గురించి వాటి పవిత్రత, కాపాడటం గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే కొంత మంది అవతార పురుషులు, కారణ జన్ములు అవసరం వచ్చినపుడే నోరు విప్పుతారు మరి ! చంద్రబాబు నాయుడు పుట్టింది కాంగ్రెస్‌లో పెరిగింది కాంగ్రెస్‌లో, తొలి మంత్రి పదవి వెలగబెట్టింది కాంగ్రెస్‌లో కనుక ఆయన నీతి సూత్రాల గురించి మాట్లాడటం వినేవారికి కాస్త ఇబ్బందే. తెలుగుదేశం హైదరాబాదులో సరిగ్గా పనిచేయని కారణంగానే నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. నిజమే, నారా లోకేషే అన్నీ అయి పని చేశారు అన్నది అందరికీ తెలిసిందే.

     మనకు ఇప్పటి వరకు  ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యాల గురించే తెలుసు. తెలంగాణా తెలుగుదేశం నుంచి వలసలు చూసిన తరువాత జరిగిన సభలో ప్రసంగించిన నేతల తీరుతెన్నులు చూస్తే ఫిరాయింపు వైరాగ్యాన్ని కూడా ఆ జాబితాలో చేర్చుకోవాల్సి వుంటుందనిపిస్తోంది. పార్టీ అన్న తరువాత ఇతర పార్టీల వారిని చేర్చుకోకుండా వుంటామా? వారు వచ్చినట్లే తిరిగి పోకుండా వుంటారా, ఈరోజు వారు రేపు మనం , ఎవరైనా పోయేది ఎక్కడ అధికారం వుంటే అక్కడికే కదా, అంతా పైవారి వినోదం, మనం నిమిత్త మాత్రులం అనుకోవాలేమో ! ఏకంగా శాసనసభా పక్ష నాయకుడే ఫిరాయించిన తరువాత జరిగిన సంతాపసభలో (పోయిన వారికి అని వక్తలు చెప్పినప్పటికీ మిగిలి వున్న వారికి ధైర్యం చెప్పిన సంతాపసభ అది అనటం బాగుంటుందేమో ) పాల్గొన్న నారాయణపేట(మహబూబ్‌ నగర్‌ జిల్లా) ఎంఎల్‌ఏ రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ తన వంటి వారు హైదరాబాదు వచ్చి వెళితే శీలపరీక్ష చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరీక్షల అవసరం లేకుండా చేసుకొనేందుకు కాబోలు అలా మాట్లాడిన కొద్ది నిమిషాలలోనే ఏం జరిగింది. సమావేశానికి పసుపు సైకిల్‌పై వచ్చి వెళ్లేటపుడు గులాబీ కారులో వెళ్లారు. అందరికీ ఎడాపెడా శరీరాన్ని కోసి ఆపరేషన్లు చేసే వైద్యుడు తన కాలుకు ముల్లు గుచ్చుకోగానే విలవిల్లాడి పోతాడట. పాపం చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువే బాధపడి వుంటారు.ఎందుకుంటే ఆకర్ష… ఆకర్ష అని నిత్యం ఏదో ఒక పార్టీలోని వారికి గాలం వేసే వారు తన గేలానికి చిక్కిన చేపలే తప్పించుకుపోతుంటే నిజంగా ఎంత బాధగా వుంటుందో కదా ! అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన కంటే ఎక్కువగా వీరాభిమానులు విలవిలాడి పోతున్నారు. ఆ క్రమంలో తమ నాయకుడికి భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని కూడా చూడకుండా తెగ సుభాషితాలు చెబుతున్నారు. అలాంటి వాటిలో కొన్ని ఆణి ముత్యాలు ఇలా వున్నాయి. ‘పార్టీ మారటానికి ఒక విధానమంటూ వుంటుంది. మరీ ఇంత నిర్లజ్జగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంటుంది. ఎర్రబెల్లి దయాకరరావు ప్రభృతుల జంపింగ్‌ పట్ల ప్రజలెవ్వరూ ఆశ్చర్యపోలేదు.అయితే, ఈ సందర్బంగా వారు వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు మాత్రం ఔరా అనిపించేలా వున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలు తనవి కావని, పార్టీ నాయకత్వం ఇచ్చిన డైరెక్షన్‌తోనే ఆ విమర్శలు చేశానని ఎర్రబెల్లి దయాకరరావు చెప్పటం మాత్రం రోతగా వుంది.’అని ఒక పత్రికా వ్యాఖ్యాత వాపోయారు.

     గతంలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల వారిని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటానికి ఏ విధానాన్ని అనుసరించింది? ఏ లజ్జ ప్రకారం వచ్చిన వారు వచ్చారు, చేర్చుకున్నవారు ముద్ర వేశారు. మామూలుగా పార్టీ మారితే ఎవరు గుర్తిస్తారు, ఏ ప్రచార సాధనాలు పట్టించుకుంటాయి.ఇప్పుడు దేనికైనా ఒక కిక్కు కావాలి.అదే జరుగుతోంది. ఒక మహానటుడు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఎందరో రాజకీయ మహానటులు చేరారు. అందువలన అక్కడ జరిగేది కూడా అంతా నాటకీయమే, సినిమా ఫక్కీనే .తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చేరితే ఒక పద్దతి వున్నట్లు ఆ పార్టీ నుంచి బయటకుపోతే లజ్జలేనట్లా ?

    పార్టీ ఫిరాయించిన ఎర్రబెల్లి దయాకరరావు తాను టిఆర్‌ఎస్‌ నాయకత్వం గురించి అనుచితంగా మాట్లాడి వుంటే క్షమించాలని అదంతా అధినేత డైరెక్షన్‌ ప్రకారమే జరిగిందని చెప్పటంపై అభ్యంతరం ఎందుకు ? అసలు అలా మాట్లాడని వారెవరు? పార్టీ ఫిరాయించిన తరువాత అలా చెప్పని వారెవరు? ఎక్కడో ఒక్కడ మొదలు పెట్టాలి గనుక చంద్రబాబు నాయుడినే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో చంద్రబాబు నాయుడు తొలి ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసినపుడు ఎన్టీరామారావు మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేశారో కావాలంటే పాత పత్రికలు తిరగవేసుకోవచ్చు. ఎందుకు చేసినట్లు ? ఏ గూటి చిలక ఆగూటి పలుకులు పలికినట్లు అదే చంద్రబాబు తెలుగుదేశంలో చేరిన తరువాత కాంగ్రెస్‌ పార్టీని తిట్టని తిట్టు , చేయని విమర్శ వుందా ? ఎవరి డైరెక్షన్‌ ప్రకారం అదంతా జరిగింది? మైసూరా రెడ్డి కాంగ్రెస్‌లో వున్నపుడు విద్యుత్‌ చార్జీల వుద్యమం సందర్బంగా తెలుగుదేశం నాయకత్వంపై చేసిన విమర్శలేమిటి ? తరువాత అదే పెద్దమనిషి తెలుగుదేశంలో చేరినపుడు చెప్పిన మాటలు తియ్యగా అని పించలేదా ? అంతెందుకు ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యులుగా వున్నవారు, పార్టీలో ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు,ఎంపీలుగా వున్న వారు ఎక్కడి నుంచి వచ్చారు ? పూర్వపు పార్టీలలో వున్నపుడు చేసిన విమర్శలు తెలుగుదేశంలో చేరి తిరిగి తమ పాత పార్టీలపై చేస్తున్న విమర్శలు రోతగా అనిపించటం లేదా ? అంతెందుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నూతన శాసనసభా పక్ష నాయకుడిగా నియమితుడైన రేవంత రెడ్డి ఒకనాడు టిఆర్‌ఎస్‌లో వున్న పెద్ద మనిషే కదా ! అప్పుడు ఇతర పార్టీలను ఎందుకు తిట్టావంటే నాయకత్వ డైరెక్షన్‌ అనో పార్టీ విధానమనో గాక కొత్తగా ఇప్పుడేమి చెబుతారు ?

     ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మిగిలివున్న నేతలు, ఎంఎల్‌ఏలు కూడా ఆ పార్టీలో ఎంత కాలం వుంటారనేది ఒక ప్రశ్న. రేపు టిఆర్‌ఎస్‌తో రేవంత రెడ్డి సర్దుబాటుకు రారన్న గ్యారంటీ ఏమన్నా వుందా ? ఒకప్పుడు సిపిఎంలో వున్న సండ్రవెంకట వీరయ్య తెలుగుదేశంలోకి వెళ్లగలిగినపుడు మరో పార్టీలోకి వెళ్లటానికి అభ్యంతరం ఏముంటుంది? డొల్లుపుచ్చకాయలకు ఒక మార్గం, ఒక పద్దతి ఏముంటుంది?ఎటయినా దొర్లుతారు . ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన రేవంత రెడ్డి, ఇతరులు రేపు పార్టీ ఫిరాయించి దయాకరరావు మాదిరే తాము నాయకత్వ డైరెక్షన్‌ మేరకే ఆలా చేశాం, డబ్బు కూడా వారే సమకూర్చారు తప్ప మావరకు మేము పరిశుద్ధులమే అని అప్రూవర్‌లుగా మారరని గ్యారంటీ ఏముంది? తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలిగా రోజా కాంగ్రెస్‌ పార్టీని ఎలా తిట్టిందో తెలిసిందే. రేపు తిరిగి ఆమె మరో శుభముహూర్తాన స్వంత ఇంటికి రారని, వస్తే తిరస్కరిస్తారన్న గ్యారంటీ ఏమైనా వుందా ? నిత్యం వైఎస్‌ఆర్‌సిపి ప్రజాప్రతినిధులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న తెలుగు దేశం వారు తిట్టిన తిట్లు లేదా మర్యాదస్తుల భాషలో చెప్పాలంటే విమర్శలను పట్టించుకుంటుందా ? ఎందుకీ ఆత్మవంచన ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

Global Crude oil price of Indian Basket was US$ 26.95 per bbl on 11.02.2016

13 Saturday Feb 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

crude oil price of Indian Basket, PPAC

 

The international crude oil price of Indian Basket as computed/published today by Petroleum Planning and Analysis Cell (PPAC) under the Ministry of Petroleum and Natural Gas was US$ 26.95 per barrel (bbl) on 11.02.2016. This was lower than the price of US$ 27.72 per bbl on previous publishing day of 10.02.2016.

In rupee terms, the price of Indian Basket decreased to Rs 1833.30 per bbl on 11.02.2016 as compared to Rs 1881.77 per bbl on 10.02.2016. Rupee closed weaker at Rs 68.02 per US$ on 11.02.2016 as against Rs 67.88 per US$ on 10.02.2016.The table below gives details in this regard:

 

Particulars Unit Price on February 11, 2016(Previous trading day i.e. 10.02.2016) Pricing Fortnight for 01.02.2016

(14 Jan to 27 Jan, 2016)

Crude Oil (Indian Basket) ($/bbl) 26.95             (27.72) 26.05
(Rs/bbl 1833.30         (1881.77) 1763.06
Exchange Rate (Rs/$) 68.02             (67.88) 67.68

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

Quick Estimates of Index of Industrial Production and Use-Based Index for the Month of December, 2015 (Base 2004-05=100)

13 Saturday Feb 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

cso, DIPP, Index of India Industrial Production

 

The Quick Estimates of Index of Industrial Production (IIP) with base 2004-05 for the month of December 2015 have been released by the Central Statistics Office of the Ministry of Statistics and Programme Implementation. IIP is compiled using data received from 15 source agencies viz. Department of Industrial Policy & Promotion (DIPP); Indian Bureau of Mines; Central Electricity Authority; Joint Plant Committee, Ministry of Steel; Ministry of Petroleum & Natural Gas; Office of Textile Commissioner; Department of Chemicals & Petrochemicals; Directorate of Sugar & Vegetable Oils; Department of Fertilizers; Tea Board; Office of Jute Commissioner; Office of Coal Controller; Railway Board; Office of Salt Commissioner and Coffee Board.

  1. The General Index for the month of December 2015 stands at 183.4, which is 1.3 percent lower as compared to the level in the month of December 2014. The cumulative growth for the period April-December 2015 over the corresponding period of the previous year stands at 3.1 percent.
  2. The Indices of Industrial Production for the Mining, Manufacturing and Electricity sectors for the month of December 2015 stand at 137.5, 192.0 and 183.2 respectively, with the corresponding growth rates of 2.9 percent, (-) 2.4 percent and 3.2 percent as compared to December 2014 (Statement I). The cumulative growth in three sectors during April-December 2015 over the corresponding period of 2014 has been 2.3 percent, 3.1 percent and 4.5 percent respectively.
  3. In terms of industries, ten out of the twenty two industry groups (as per 2-digit NIC-2004) in the manufacturing sector have shown negative growth during the month of December 2015 as compared to the corresponding month of the previous year (Statement II). The industry group ‘Electrical machinery & apparatus n.e.c.’ has shown the highest negative growth of (-) 44.9 percent, followed by (-) 10.7 percent in ‘Publishing, printing & reproduction of recorded media’ and (-) 8.2 percent in ‘Tobacco Products’. On the other hand, the industry group ‘Radio, TV and communication equipment & apparatus’ has shown the highest positive growth of 82.0 percent, followed by 17.5 percent in ‘Office, accounting & computing machinery’ and 16.6 percent in ‘Furniture; manufacturing n.e.c.’.
  4. As per Use-based classification, the growth rates in December 2015 over December 2014 are 0.5 percent in Basic goods, (-) 19.7 percent in Capital goods and 0.9 percent in Intermediate goods (Statement III).  The Consumer durables and Consumer non-durables have recorded growth of 16.5 percent and (-) 3.2 percent respectively, with the overall growth in Consumer goods being 2.8 percent.
  5. Some important items showing high negative growth during the current month over the same month in previous year include ‘Cable, Rubber Insulated’            [(-) 85.2%], ‘Heat Exchangers’ [(-) 68.8%], ‘Cement Machinery’ [(-) 60.2%], ‘Soyabean oil’ [(-) 59.0%], ‘Polythene Bags including HDPE & LDPE Bags’          [(-) 53.9%], ‘Grinding Wheels’ [(-) 37.4%], ‘Ayurvedic Medicaments’ [(-) 24.4%], ‘Boilers’ [(-) 22.7%] and ‘Sponge Iron’ [(-) 22.5%].
  6. Some other important items that have registered high positive growth include ‘Woollen Carpets’ (184.1%), ‘Telephone Instruments including Mobile Phone and Accessories’ (141.1%), ‘Di Ammonium Phosphate (DAP)’ (46.8%), ‘Transformers (small)’ (38.8%), ‘Wood Furniture’ (36.9%), ‘Paraxylene’ (32.3%), ‘Commercial Vehicles’ (28.7%), ‘Gems and Jewellery’ (27.1%), ‘PVC Pipes and Tubes’ (24.6%) and  ‘Polypropylene (including co-polymer)’ (22.2%).
  7. However, growth rates in respect of individual items may not reflect their actual contribution in the overall growth rate of IIP. Taking into account the weights of different items, the overall growth rate of IIP can be decomposed into positive and negative contributions of different items. Such contributions of top five items with positive contribution and top five items with negative contribution are given below:
Item Group Weights (%) Contribution
High Negative Contributors
Cable, Rubber Insulated 0.12 -2.5736
sponge iron 0.99 -0.2854
Stainless/ alloy steel 0.64 -0.2197
Conductor, Aluminium 0.20 -0.1742
Heat Exchangers 0.10 -0.1655
High Positive Contributors
Telephone Instruments Including Mobile Phone And Accessories 0.22 0.7190
Commercial Vehicles 1.93 0.5224
Gems And Jewellery 1.77 0.3784
Electricity 10.32 0.3108
Mineral index 14.16 0.2971
  1. Along with the Quick Estimates of IIP for the month of December 2015, the indices for November 2015 have undergone the first revision and those for September 2015 have undergone the final revision in the light of the updated data received from the source agencies. It may be noted that these revised indices (first revision) in respect of November 2015 may undergo final (second) revision along with the release of IIP for the month of February 2016.
  2. Statements giving Quick Estimates of the Index of Industrial Production at Sectoral, 2-digit level of National Industrial Classification (NIC-2004) and by Use-based classification for the month of December 2015, along with the growth rates over the corresponding month of the previous year including the cumulative indices and growth rates are enclosed.

 

 

 

STATEMENT I: INDEX OF INDUSTRIAL PRODUCTION – SECTORAL
(Base : 2004-05=100)
Month Mining Manufacturing Electricity General
(141.57) (755.27) (103.16) (1000.00)
2014-15 2015-16 2014-15 2015-16 2014-15 2015-16 2014-15 2015-16
Apr 122.6 121.9 181.4 188.5 178.1 177.2 172.7 177.9
May 125.3 127.9 183.5 187.3 183.9 195.0 175.3 179.7
Jun 122.1 121.6 180.1 189.5 181.6 183.7 172.0 179.3
Jul 116.2 117.7 182.2 190.9 183.8 190.3 173.0 180.5
Aug 115.0 120.2 173.4 184.8 184.1 194.4 166.2 176.6
Sep 115.3 119.3 181.9 186.9 175.6 195.7 171.8 178.2
Oct 124.2 130.6 170.0 188.1 184.9 201.6 165.1 181.4
Nov 128.6 131.0 179.9 171.5 174.3 175.6 172.1 166.2
Dec* 133.6 137.5 196.8 192.0 177.6 183.2 185.9 183.4
Jan 136.7 200.7 176.7 189.2
Feb 129.6 192.7 166.0 181.0
Mar 149.0 210.3 176.4 198.1
Average
Apr-Dec 122.5 125.3 181.0 186.6 180.4 188.5 172.7 178.1
Growth over the corresponding period of previous year
Dec* -1.7 2.9 4.1 -2.4 4.8 3.2 3.6 -1.3
Apr-Dec 1.8 2.3 1.8 3.1 10.0 4.5 2.6 3.1
* Indices for Dec 2015 are Quick Estimates.
NOTE : Indices for the months of Sep’15 and Nov’15 incorporate updated production data.

 

 

STATEMENT II:  INDEX OF INDUSTRIAL PRODUCTION – (2-DIGIT LEVEL)
(Base: 2004-05=100)
Industry Description Weight       Index           Cumulative Index   Percentage growth
code     Dec’14 Dec’15 Apr-Dec Dec’15 Apr-Dec
          2014-15 2015-16   2015-16
15 Food products and beverages 72.76 231.2 223.4 157.2 149.1 -3.4 -5.2
16 Tobacco products 15.70 128.2 117.7 108.6 104.8 -8.2 -3.5
17 Textiles 61.64 154.6 162.8 151.0 154.7 5.3 2.5
18 Wearing apparel; dressing and dyeing of fur 27.82 223.5 224.8 170.4 185.3 0.6 8.7
19 Luggage, handbags, saddlery, harness & footwear; tanning and dressing of leather products 5.82 156.0 144.3 145.8 146.8 -7.5 0.7
20 Wood and products of wood & cork except furniture; articles of straw & plating materials 10.51 166.6 165.0 147.4 154.2 -1.0 4.6
21 Paper and paper products 9.99 143.2 147.2 142.1 146.5 2.8 3.1
22 Publishing, printing & reproduction of recorded media 10.78 183.0 163.5 176.7 161.2 -10.7 -8.8
23 Coke, refined petroleum products & nuclear fuel 67.15 155.5 160.2 143.0 149.7 3.0 4.7
24 Chemicals and chemical products 100.59 144.6 147.8 137.1 143.7 2.2 4.8
25 Rubber and plastics products 20.25 191.2 193.1 186.0 187.9 1.0 1.0
26 Other non-metallic mineral products 43.14 172.4 173.1 167.0 165.3 0.4 -1.0
27 Basic metals 113.35 231.1 218.9 219.1 223.0 -5.3 1.8
28 Fabricated metal products, except machinery & equipment 30.85 197.3 189.4 175.3 176.8 -4.0 0.9
29 Machinery and equipment n.e.c. 37.63 227.3 215.8 211.9 216.0 -5.1 1.9
30 Office, accounting & computing machinery 3.05 94.7 111.3 67.6 66.4 17.5 -1.8
31 Electrical machinery & apparatus n.e.c. 19.80 544.8 300.0 497.1 501.3 -44.9 0.8
32 Radio, TV and communication equipment & apparatus 9.89 164.6 299.5 353.7 349.5 82.0 -1.2
33 Medical, precision & optical instruments, watches and clocks 5.67 109.6 113.5 105.1 98.4 3.6 -6.4
34 Motor vehicles, trailers & semi-trailers 40.64 210.1 234.2 219.6 236.2 11.5 7.6
35 Other transport equipment 18.25 251.3 247.2 265.4 265.4 -1.6 0.0
36 Furniture; manufacturing n.e.c. 29.97 146.4 170.7 110.7 173.5 16.6 56.7
10 Mining & Quarrying 141.57 133.6 137.5 122.5 125.3 2.9 2.3
15-36 Manufacturing 755.27 196.8 192.0 181.0 186.6 -2.4 3.1
40 Electricity 103.16 177.6 183.2 180.4 188.5 3.2 4.5
General Index 1000 185.9 183.4 172.7 178.1 -1.3 3.1
n.e.c.: Not Elsewhere Classified
*Industry codes are as per National Industrial Classification 2004

 

STATEMENT III: INDEX OF INDUSTRIAL PRODUCTION – USE-BASED
(Base : 2004-05=100)
  Basic goods Capital goods Intermediate goods Consumer goods Consumer durables Consumer non-durables
Month (456.82) (88.25) (156.86) (298.08) (84.60) (213.47)
  2014-15 2015-16 2014-15 2015-16 2014-15 2015-16 2014-15 2015-16 2014-15 2015-16 2014-15 2015-16
Apr 163.0 167.3 235.0 248.0 149.7 153.2 181.5 186.5 255.4 258.7 152.2 157.9
May 167.1 177.4 228.0 234.9 155.5 157.4 182.7 178.7 262.7 252.4 151.0 149.5
Jun 163.5 171.9 270.7 265.4 151.2 153.1 166.9 179.0 211.9 246.1 149.0 152.4
Jul 162.8 171.6 263.2 289.9 155.4 158.5 171.3 173.2 220.9 244.2 151.7 145.1
Aug 164.0 170.0 220.6 267.5 151.9 156.2 161.1 170.8 218.8 256.0 138.3 137.0
Sep 161.3 168.0 260.9 287.2 151.3 154.0 172.4 174.5 241.5 262.0 145.0 139.8
Oct 167.9 175.0 239.2 278.3 145.5 154.8 149.0 176.4 191.8 272.9 132.0 138.2
Nov 168.2 167.0 252.1 190.3 151.4 149.4 165.1 166.8 201.6 226.8 150.6 143.0
Dec* 174.6 175.4 269.7 216.6 159.0 160.5 192.4 197.8 208.0 242.3 186.2 180.2
Jan 175.4 270.5 158.3 202.3 246.6 184.8
Feb 164.6 254.9 151.8 199.6 251.2 179.2
Mar 180.8 331.5 164.8 202.7 261.9 179.3
Average
Apr-Dec 165.8 171.5 248.8 253.1 152.3 155.2 171.4 178.2 223.6 251.3 150.7 149.2
Growth over the corresponding period of previous year
Dec* 5.9 0.5 6.1 -19.7 1.1 0.9 0.6 2.8 -9.2 16.5 5.6 -3.2
Apr-Dec 8.0 3.4 5.1 1.7 1.8 1.9 -4.9 4.0 -15.2 12.4 2.3 -1.0
 
* Indices for Dec 2015 are Quick Estimates.
NOTE : Indices for the months of Sep’15 and Nov’15 incorporate updated production data.

 

Click here to see pdf format:

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

Consumer Price Index Numbers on base 2012=100 for Rural, Urban and Combined for the Month of January 2016

13 Saturday Feb 2016

Posted by raomk in Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Prices

≈ Leave a comment

Tags

All India Consumer Price Indices, Consumer Food Price Index, Consumer Price Index, cso, Inflation

 

The Central Statistics Office (CSO), Ministry of Statistics and Programme Implementation has revised the Base Year of the Consumer Price Index (CPI) from 2010=100 to 2012=100 with effect from the release of indices for the month of January 2015.

  1. In this press note, the CPI (Rural, Urban, Combined) on Base 2012=100 is being released for the month of January 2016. In addition to this, Consumer Food Price Index (CFPI) for all India Rural, Urban and Combined are also being released for January 2016. Inflation rates (on point to point basis i.e. January 2016 over January 2015), based on General Indices and CFPIs are given as follows:

Inflation rates based on CPI (General) and CFPI

Indices  January 2016 (Prov.) December 2015 (Final) January 2015 (Final)
Rural Urban Combd. Rural Urban Combd. Rural Urban Combd.
CPI (General) 6.48 4.81 5.69 6.32 4.73 5.61 5.34 4.96 5.19
CFPI 6.93 6.50 6.85 6.41 6.31 6.40 5.78 7.05 6.14

Note: Prov.  – Provisional, Combd. – Combined

  1. Provisional indices for the month of January 2016 and also the final indices for December 2015 are being released with this note for all-India and for State/UTs. All-India provisional General (all- groups), Group and Sub-group level CPI and CFPI numbers for January 2016 for Rural, Urban and Combined are given in Annexure I. The General Indices (Provisional) for the month of January 2016 for Rural, Urban and Combined are 128.1, 124.2 and 126.3 respectively.  The CFPI for Rural, Urban and Combined for the same month are 131.1, 131.0 and 131.1 respectively. The inflation rates of important categories of items are given in Annexure II.
  2. State/UT-wise General provisional CPI numbers for Rural, Urban and Combined are given in Annexure III. Inflation rates of major States, having population more than 50 lakhs as per population Census 2011, are given in Annexure IV. State/UT–wise Group CPIs are available on the Ministry’s website (www.mospi.gov.in).
  3. Price data are collected from selected towns by the Field Operations Division of NSSO and from selected villages by the Department of Posts. Price data are received through web portals, maintained by the National Informatics Centre.

Next date of release:  14th March 2016 (Monday) for February 2016                    

Annexure I

All India Consumer Price Indices

(Base: 2012=100)

Group Code Sub-group Code Description Rural Urban Combined
Weights Dec. 15 Index
(Final)
Jan. 16 Index
(Prov.)
Weights Dec. 15 Index
(Final)
Jan. 16 Index
(Prov.)
Weights Dec. 15 Index
(Final)
Jan. 16 Index
(Prov.)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11) (12)
1.1.01 Cereals and products 12.35 126.3 126.8 6.59 124.3 124.7 9.67 125.7 126.1
1.1.02 Meat and fish 4.38 131.3 133.1 2.73 131.7 135.9 3.61 131.4 134.1
1.1.03 Egg 0.49 123.3 126.6 0.36 127.1 132.0 0.43 124.8 128.7
1.1.04 Milk and products 7.72 129.8 130.5 5.33 128.6 129.2 6.61 129.4 130.0
1.1.05 Oils and fats 4.21 118.3 118.8 2.81 110.0 109.6 3.56 115.3 115.4
1.1.06 Fruits 2.88 131.6 131.8 2.90 120.8 119.1 2.89 126.6 125.9
1.1.07 Vegetables 7.46 145.5 140.1 4.41 149.0 144.1 6.04 146.7 141.5
1.1.08 Pulses and products 2.95 162.1 163.9 1.73 190.1 184.1 2.38 171.5 170.7
1.1.09 Sugar and Confectionery 1.70 95.4 97.6 0.97 92.7 96.7 1.36 94.5 97.3
1.1.10 Spices 3.11 128.9 129.7 1.79 138.6 139.5 2.50 132.1 133.0
1.2.11 Non-alcoholic beverages 1.37 123.3 124.2 1.13 120.2 120.5 1.26 122.0 122.7
1.1.12 Prepared meals, snacks, sweets etc. 5.56 135.1 135.9 5.54 134.2 134.6 5.55 134.7 135.3
1   Food and beverages 54.18 131.4 131.4 36.29 131.5 131.2 45.86 131.4 131.3
2   Pan, tobacco and intoxicants 3.26 133.1 133.7 1.36 138.2 139.5 2.38 134.5 135.2
3.1.01 Clothing 6.32 132.5 133.2 4.72 125.4 125.8 5.58 129.7 130.3
3.1.02 Footwear 1.04 128.5 128.9 0.85 119.5 119.8 0.95 124.8 125.1
3   Clothing and footwear 7.36 131.9 132.6 5.57 124.5 124.9 6.53 129.0 129.5
4   Housing – – – 21.67 122.4 123.4 10.07 122.4 123.4
5   Fuel and light 7.94 125.7 126.3 5.58 116.0 116.9 6.84 122.0 122.7
6.1.01 Household goods and services 3.75 126.0 126.5 3.87 121.0 121.6 3.80 123.6 124.2
6.1.02 Health 6.83 123.1 123.7 4.81 118.6 119.1 5.89 121.4 122.0
6.1.03 Transport and communication 7.60 114.0 113.6 9.73 109.3 108.9 8.59 111.5 111.1
6.1.04 Recreation and amusement 1.37 121.6 121.8 2.04 118.1 118.4 1.68 119.6 119.9
6.1.05 Education 3.46 125.6 126.2 5.62 126.6 126.4 4.46 126.2 126.3
6.1.06 Personal care and effects 4.25 114.1 114.8 3.47 113.2 114.0 3.89 113.7 114.5
6   Miscellaneous 27.26 119.8 120.1 29.53 116.7 116.8 28.32 118.3 118.5
General Index (All Groups) 100.00 127.9 128.1 100.00 124.0 124.2 100.00 126.1 126.3
Consumer Food Price Index 47.25 131.2 131.1 29.62 131.4 131.0 39.06 131.3 131.1

Note:

  1. Prov.        : Provisional
  2. –               : CPI (Rural) for housing is not compiled.
  3. The weights are indicative to show relative importance of groups and sub-groups. However, all India indices have been compiled as weighted average of State indices.

Annexure II

All India annual inflation rates (%) for January 2016 (Provisional)

Group Code Sub-group Code Description Rural Urban Combined
Jan. 15 Index
(Final)
Jan. 16

Index
(Prov.)

InflationRate
(%)
Jan. 15 Index
(Final)
Jan. 16

Index
(Prov.)

InflationRate
(%)
Jan. 15 Index
(Final)
Jan. 16

Index
(Prov.)

InflationRate
(%)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11) (12)
1.1.01 Cereals and products 123.1 126.8 3.01 124.0 124.7 0.56 123.4 126.1 2.19
1.1.02 Meat and fish 123.1 133.1 8.12 125.5 135.9 8.29 123.9 134.1 8.23
1.1.03 Egg 122.1 126.6 3.69 126.6 132.0 4.27 123.8 128.7 3.96
1.1.04 Milk and products 124.9 130.5 4.48 125.2 129.2 3.19 125.0 130.0 4.00
1.1.05 Oils and fats 111.0 118.8 7.03 104.3 109.6 5.08 108.5 115.4 6.36
1.1.06 Fruits 130.4 131.8 1.07 121.3 119.1 -1.81 126.2 125.9 -0.24
1.1.07 Vegetables 132.3 140.1 5.90 134.4 144.1 7.22 133.0 141.5 6.39
1.1.08 Pulses and products 117.2 163.9 39.85 122.9 184.1 49.80 119.1 170.7 43.32
1.1.09 Sugar and Confectionery 100.5 97.6 -2.89 96.1 96.7 0.62 99.0 97.3 -1.72
1.1.10 Spices 117.2 129.7 10.67 126.6 139.5 10.19 120.3 133.0 10.56
1.2.11 Non-alcoholic beverages 117.9 124.2 5.34 116.5 120.5 3.43 117.3 122.7 4.60
1.1.12 Prepared meals, snacks, sweets etc. 125.6 135.9 8.20 128.0 134.6 5.16 126.7 135.3 6.79
1 Food and beverages 122.8 131.4 7.00 123.5 131.2 6.23 123.1 131.3 6.66
2 Pan, tobacco and intoxicants 122.7 133.7 8.96 127.4 139.5 9.50 124.0 135.2 9.03
3.1.01 Clothing 124.4 133.2 7.07 121.0 125.8 3.97 123.1 130.3 5.85
3.1.02 Footwear 121.6 128.9 6.00 116.1 119.8 3.19 119.3 125.1 4.86
3 Clothing and footwear 124.0 132.6 6.94 120.2 124.9 3.91 122.5 129.5 5.71
4 Housing – – – 117.3 123.4 5.20 117.3 123.4 5.20
5 Fuel and light 118.4 126.3 6.67 113.4 116.9 3.09 116.5 122.7 5.32
6.1.01 Household goods and services 118.9 126.5 6.39 117.2 121.6 3.75 118.1 124.2 5.17
6.1.02 Health 116.6 123.7 6.09 113.7 119.1 4.75 115.5 122.0 5.63
6.1.03 Transport and communication 111.0 113.6 2.34 107.9 108.9 0.93 109.4 111.1 1.55
6.1.04 Recreation and amusement 114.0 121.8 6.84 114.6 118.4 3.32 114.3 119.9 4.90
6.1.05 Education 118.2 126.2 6.77 120.8 126.4 4.64 119.7 126.3 5.51
6.1.06 Personal care and effects 110.2 114.8 4.17 111.4 114.0 2.33 110.7 114.5 3.43
6 Miscellaneous 114.5 120.1 4.89 113.4 116.8 3.00 114.0 118.5 3.95
General Index (All Groups) 120.3 128.1 6.48 118.5 124.2 4.81 119.5 126.3 5.69
Consumer Food Price Index 122.6 131.1 6.93 123.0 131.0 6.50 122.7 131.1 6.85                

 

Note:

  1. Prov.        : Provisional
  2. –               : CPI (Rural) for housing is not compiled.

Annexure III

State/UT wise General Consumer Price Indices

(Base 2012=100)

State/UT Code Name of the State/UT Rural Urban Combined
Weights Dec. 15 Index
(Final)
Jan. 16 Index
(Prov.)
Weights Dec. 15 Index
(Final)
Jan. 16 Index
(Prov.)
Weights Dec. 15 Index
(Final)
Jan. 16 Index
(Prov.)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11)
01 Jammu & Kashmir 1.14 125.8 126.0 0.72 121.9 121.6 0.94 124.4 124.4
02 Himachal Pradesh 1.03 126.4 126.5 0.26 118.9 118.6 0.67 125.0 125.1
03 Punjab 3.31 122.8 122.3 3.09 121.4 121.7 3.21 122.2 122.0
04 Chandigarh 0.02 131.3 131.1 0.34 120.9 121.0 0.17 121.5 121.6
05 Uttarakhand 1.06 122.8 122.4 0.73 117.7 117.4 0.91 120.9 120.5
06 Haryana 3.30 124.1 123.7 3.35 120.5 120.1 3.32 122.4 122.0
07 Delhi 0.28 121.2 122.8 5.64 122.5 123.6 2.77 122.4 123.6
08 Rajasthan 6.63 128.3 128.9 4.23 124.7 124.4 5.51 127.0 127.3
09 Uttar Pradesh 14.83 126.2 125.9 9.54 124.6 124.4 12.37 125.6 125.4
10 Bihar 8.21 130.0 130.2 1.62 124.1 123.5 5.14 129.1 129.2
11 Sikkim 0.06 125.9 134.1 0.03 127.1 126.5 0.05 126.3 131.6
12 Arunachal Pradesh 0.14 132.4 133.8 0.06 — — 0.10 — —
13 Nagaland 0.14 134.3 134.9 0.12 124.7 124.5 0.13 130.2 130.5
14 Manipur 0.23 115.6 115.4 0.12 120.7 121.0 0.18 117.2 117.2
15 Mizoram 0.07 134.5 131.2 0.13 123.2 122.8 0.10 127.6 126.1
16 Tripura 0.35 132.9 132.8 0.14 133.2 132.2 0.25 133.0 132.6
17 Meghalaya 0.28 139.5 139.7 0.15 121.1 121.9 0.22 133.8 134.2
18 Assam 2.63 126.2 124.8 0.79 123.7 123.2 1.77 125.7 124.5
19 West Bengal 6.99 125.5 126.3 7.20 123.0 124.1 7.09 124.3 125.3
20 Jharkhand 1.96 129.2 129.3 1.39 121.7 122.1 1.69 126.3 126.6
21 Odisha 2.93 132.9 132.7 1.31 123.0 123.1 2.18 130.1 130.0
22 Chhattisgarh 1.68 134.9 136.7 1.22 122.8 123.1 1.46 130.2 131.4
23 Madhya Pradesh 4.93 126.1 126.2 3.97 124.1 123.9 4.48 125.3 125.3
24 Gujarat 4.54 128.5 128.6 6.82 121.0 120.7 5.60 124.3 124.1
25 Daman & Diu 0.02 141.9 143.1 0.02 125.3 125.6 0.02 134.9 135.8
26 Dadra & Nagar Haveli 0.02 128.5 128.8 0.04 121.0 120.2 0.03 123.5 123.1
27 Maharashtra 8.25 128.6 128.3 18.86 120.9 120.9 13.18 123.5 123.4
28 Andhra Pradesh 5.40 132.5 133.6 3.64 128.2 128.4 4.58 130.9 131.7
29 Karnataka 5.09 131.6 132.5 6.81 130.4 131.2 5.89 131.0 131.8
30 Goa 0.14 134.7 135.9 0.25 123.3 124.4 0.19 127.7 128.9
31 Lakshadweep 0.01 128.3 128.8 0.01 113.0 115.4 0.01 120.5 122.0
32 Kerala 5.50 125.6 126.5 3.46 127.2 128.1 4.55 126.2 127.1
33 Tamil Nadu 5.55 129.3 129.7 9.20 128.9 128.7 7.25 129.1 129.1
34 Puducherry 0.08 136.0 136.8 0.27 128.5 127.8 0.17 130.4 130.1
35 Andaman & Nicobar Islands 0.05 132.0 130.4 0.07 120.7 119.5 0.06 126.3 124.9
36 Telangana 3.16 125.8 125.5 4.41 124.9 126.7 3.74 125.3 126.2
99 All India 100.00 127.9 128.1 100.00 124.0 124.2 100.00 126.1 126.3

Notes:

Prov.       :  Provisional.

—             :  indicates the receipt of price schedules is less than 80% of allocated schedules and therefore indices are not compiled.

 

 

Annexure IV

Major State/UT wise annual inflation rates (%) for January 2016 (Provisional)

(Base 2012=100)

State/UT Code Name of the State/UT Rural Urban Combined
Jan. 15 Index
(Final)
Jan. 16

Index
(Prov.)

InflationRate
(%)
Jan. 15 Index
(Final)
Jan. 16

Index
(Prov.)

InflationRate
(%)
Jan. 15 Index
(Final)
Jan. 16

Index
(Prov.)

InflationRate
(%)
(1) (2) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (11)
01 Jammu & Kashmir 119.6 126.0 5.35 117.9 121.6 3.14 119.0 124.4 4.54
02 Himachal Pradesh 121.4 126.5 4.20 115.8 118.6 2.42 120.4 125.1 3.90
03 Punjab 118.7 122.3 3.03 117.7 121.7 3.40 118.3 122.0 3.13
05 Uttarakhand 117.8 122.4 3.90 113.2 117.4 3.71 116.1 120.5 3.79
06 Haryana 118.4 123.7 4.48 116.1 120.1 3.45 117.3 122.0 4.01
07 Delhi 116.1 122.8 5.77 118.2 123.6 4.57 118.1 123.6 4.66
08 Rajasthan 121.4 128.9 6.18 117.7 124.4 5.69 120.1 127.3 6.00
09 Uttar Pradesh 119.0 125.9 5.80 118.4 124.4 5.07 118.8 125.4 5.56
10 Bihar 123.5 130.2 5.43 117.7 123.5 4.93 122.7 129.2 5.30
18 Assam 117.3 124.8 6.39 117.8 123.2 4.58 117.4 124.5 6.05
19 West Bengal 119.3 126.3 5.87 119.0 124.1 4.29 119.2 125.3 5.12
20 Jharkhand 119.2 129.3 8.47 116.8 122.1 4.54 118.3 126.6 7.02
21 Odisha 121.2 132.7 9.49 117.9 123.1 4.41 120.3 130.0 8.06
22 Chhattisgarh 123.1 136.7 11.05 117.3 123.1 4.94 120.9 131.4 8.68
23 Madhya Pradesh 120.6 126.2 4.64 118.9 123.9 4.21 119.9 125.3 4.50
24 Gujarat 119.4 128.6 7.71 116.4 120.7 3.69 117.7 124.1 5.44
27 Maharashtra 119.8 128.3 7.10 116.5 120.9 3.78 117.6 123.4 4.93
28 Andhra Pradesh 120.5 133.6 10.87 119.3 128.4 7.63 120.1 131.7 9.66
29 Karnataka 121.4 132.5 9.14 123.5 131.2 6.23 122.5 131.8 7.59
32 Kerala 122.0 126.5 3.69 121.7 128.1 5.26 121.9 127.1 4.27
33 Tamil Nadu 121.1 129.7 7.10 121.3 128.7 6.10 121.2 129.1 6.52
36 Telangana 117.5 125.5 6.81 118.6 126.7 6.83 118.1 126.2 6.86*
99 All India 120.3 128.1 6.48 118.5 124.2 4.81 119.5 126.3 5.69

Notes:

  1. Prov.               :  Provisional.
  2. *                      : More than those of Rural as well as Urban due to rounding.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d