• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

కేరళలో బిజెపి ఓట్లు పెరిగాయా ? తరిగాయా ? ఫలితాల తీరు తెన్నులేమిటి ?

04 Tuesday May 2021

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, CPI(M), Kerala BJP, Kerala BJP vote Share, Kerala LDF, Kerala Mandate


ఎం కోటేశ్వరరావు


కిందపడ్డా విజయం మాదే అని ప్రచారం చేసుకోవటంలో కాషాయ దళాల తరువాతనే ఎవరైనా అనేందుకు మరో ఉదాహరణ కేరళ ఎన్నికల ఫలితాలే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి 10.6శాతం ఓట్లు, 2021లో 11.3శాతం తెచ్చుకుంది. అంటే గతం కంటే అదనంగా ఓట్లు తెచ్చుకున్నట్లే కదా అని బిజెపి చెబుతోంది. దీనిలో నిజము – వక్రీకరణ ఉంది. కేరళ అగ్రశ్రేణి మీడియా సంస్ధ మళయాల మనోరమ నివేదించినదాని ప్రకారం 2016 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కూటమి ఓట్లు 14.96శాతం, 2019 లోక్‌సభ ఎన్నికలలో వచ్చినవి 15.53, 2021లో వచ్చినవి 12.47 శాతం, అంటే రెండు సంవత్సరాలలో దాని ఓట్లు 3.06శాతం తగ్గాయి. మరి బిజెపి ఓట్లు పెరిగాయనటంలో నిజం ఏమిటి ? 2016 ఎన్నికలలో అది 140కి గాను 98 చోట్ల పోటీ చేసి 10.6శాతం తెచ్చుకుంది, తాజా ఎన్నికలలో 113 చోట్ల పోటీ చేసి తెచ్చుకున్నది 11.3శాతం. అది ఎక్కువ సీట్లలో పోటీ చేసింది, దాని మిత్రపక్షాలు తక్కువగా పోటీ చేశాయి. రెండు చోట్ల నామినేషన్‌ పత్రాలు సరిగా వేయటం చేతగాక పోటీలో లేదు తప్ప 138 చోట్ల ఎన్‌డిఏ పక్షాలు పోటీ చేశాయి. వాటన్నింటికీ కలిపి గత ఎన్నికల కంటే 2.49 శాతం తగ్గిపోయాయి. బిజెపి పోటీ చేసిన స్ధానాల్లో గత ఎన్నికల కంటే ఐదు చోట్ల అదనంగా ఓట్లు తెచ్చుకుంది. ఈ అంకెలను బట్టి బిజెపి చెబుతున్నదానిలో నిజం ఏమిటో వక్రీకరణ ఏమిటో అంతిమంగా ఏం జరిగిందో పాఠకులే అర్ధం చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా వంటి అగ్రనేతలు పర్యటించిన చోట్ల కూడా కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఓట్ల వ్యాపారం జరిగి బిజెపికి ఓట్లు తగ్గాయని, దీని మీద ఆ పార్టీ విచారణ కమిటీని వేస్తే మంచిదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చమత్కరించారు.

బిజెపి విషయానికి వస్తే నరేంద్రమోడీ పలుకుబడి-శబరిమల అయ్యప్ప దేవాలయ ప్రవేశ సమస్యల మీద పెట్టుకున్న ఆశలు నిరాశలయ్యాయని చెప్పవచ్చు. 2014లో కేంద్రంలో బిజెపి విజయం తరువాత 2015లో జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికల్లో ఆ పార్టీకి 13.3శాతం, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14.96 శాతం, 2019లోక్‌సభ ఎన్నికల్లో 15.64 శాతం ఓట్లు రావటాన్ని చూపి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అని ప్రచారం చేసుకున్నారు. అయితే 2020 స్ధానిక సంస్ధల ఎన్నికల్లో దాని బలం 14.5శాతానికి తగ్గింది. అసెంబ్లీ ఎన్నికలలో 12.47కు పడిపోయింది. అధికార యావలో ఈ సారి క్రైస్తవుల ఓట్ల కోసం బిషప్పుల బంగ్లాల చుట్టూ బిజెపి నేతలు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. 2016లో ఆ పార్టీ ఏడు నియోజకవర్గాలలో రెండవ స్ధానంలో వచ్చింది. ఈ సారి మరొక స్ధానంతో, నీమమ్‌తో తొమ్మిదికిి చేరాయి. అంతకు మించి పెరగలేదు. ఆ ఏడు చోట్లా ఈసారి విజయం సాధిస్తామని గట్టిగా ఆశలు పెట్టుకుంది. వాటిలో నాలుగు చోట్ల గతం కంటే స్వల్పంగా ఓట్లు పెంచుకోగా నీమమ్‌తో సహా నాలుగు చోట్ల రెండవ స్ధానాన్ని కాపాడుకున్నప్పటికీ బలం కోల్పోయింది. 2016 ఎన్నికల్లో 15శాతం పైగా ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాలు 54, ఇరవైశాతం తెచ్చుకున్నవి మరో 24 ఉన్నాయి. వాటిని చూసి ఈ సారి తమదే అధికారం అని ఆ పార్టీ పేరాశలు పెంచుకుంది.ఆ నియోజకవర్గాలు ఇప్పుడు 34-16కు తగ్గిపోయాయి. ఎజవా సామాజిక తరగతి కేరళలో ఎంతో ప్రభావం కలిగి ఉంటుంది. ఆ ఓట్లను రాబట్టేందుకు భారత ధర్మ జనసేన పేరుతో ఉన్న పార్టీని బిజెపి కలుపుకుంది. గత ఎన్నికల్లో అనేక చోట్ల ఆ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించినా ఈసారి ఘోరంగా విఫలమైంది. దాని ప్రభావం ఎన్‌డిఏ కూటమి ఓట్ల శాతం మొత్తంగా తగ్గింది. బిజెపి రాష్ట్రనేతలు పోటీ చేసిన చోట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ పోటీ చేసిన రెండింటిలో ఒక చోట స్వల్పంగా ఓట్లశాతం పెరిగింది, శబరిమల ఆలయం ఉన్న నియోజకవర్గంలో బాగా తగ్గాయి, మిగతా అగ్రనేతలు పోటీ చేసిన చోట్ల కూడా ఓట్లశాతాలు తగ్గాయి. మెట్రోమాన్‌ శ్రీధరన్‌, సినీ హీరో సురేష్‌ గోపి పోటీ చేసిన చోట ఓట్లశాతాలు పెరిగాయి. గిరిజన నాయకురాలిగా పేరున్న సికె జాను పోటీ చేసిన నియోజకవర్గంలో గతంలో 16.35 శాతం ఓట్లు తెచ్చుకోగా ఈసారి 9.08 శాతం మాత్రమే వచ్చాయి. నరేంద్రమోడీ పలుకుబడి పని చేయక, అయ్యప్ప స్వామి వివాదం ఓట్లు రాల్చక బిజెపి పరిస్దితి అగమ్య గోచరంగా తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


నోట మాటరాని బిజెపి నాయకత్వం – ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసిందన్న బిడిజెఎస్‌ !


ముప్పై ఐదు స్ధానాలు వస్తాయని, వాటితోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన బిజెపి నేతలు ఇప్పుడు ఎన్నికలలో తలెత్తిన పరిస్ధితిని కార్యకర్తలకు వివరించలేని స్ధితిలో ఉన్నారు. ఉన్న ఒక్క స్ధానం పోయి ఖాతా రద్దయింది. దానికి తోడు కూటమి ఓట్లశాతం తగ్గటం పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు.గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో బిజెపికి మద్దతు ఇచ్చిన వెనుకబడిన తరగతుల ఓట్లు సిపిఎంకు పడ్డాయని భావిస్తున్నారు. బిజెపి తమను మోసం చేసిందని బిజెపితో కలసి 21 సీట్లలో పోటీ చేసిన బిడిజెఎస్‌ పార్టీ ఫలితాల తరువాత గగ్గోలు పెడుతోంది. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసపోయామని అలాంటి పార్టీతో ఇలా అయితే కలసి పనిచేయలేమని ఆ పార్టీ నేతలు వాపోతున్నారని వార్తలు. ఉత్తరాదిలో అనుసరించిన వ్యూహం కేరళలో పని చేస్తుందనుకోవటం తెలివితక్కువ తనమని బిజెపి సీనియర్‌ నేత సికె పద్మనాభన్‌ విమర్శించారు. గతంలో ఒకే పార్టీకి వరుసగా రెండవ సారి అధికారమిచ్చిన ఉదంతం లేనప్పటికీ విజయన్‌ ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నారు, దాన్ని మనం అంగీకరించాలని తమ పార్టీ నేతలను ఉద్దేశించి చెప్పారు. పొరపాట్లను సరిచేయకపోతే పార్టీ పెరిగే అవకాశం లేదన్నారు. విజయోత్సవ సభల్లో సిపిఎం దాని మిత్ర పక్షాలు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) మీద విమర్శలు చేస్తున్నాయని దాన్ని తాము సహించేది లేదని కేంద్ర మంత్రి, బిజెపి నేత వి మురళీధరన్‌ చెప్పారు. ఇతరుల మాదిరే ఎన్‌ఎస్‌ఎస్‌ నేత సుకుమారన్‌కూ తన రాజకీయ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉందన్నారు. ఏప్రిల్‌ ఆరున ఉదయమే ఓటు వేసేందుకు వచ్చిన సురేంద్రన్‌ అంతకు ముందు చెప్పిన తటస్ధ వైఖరికి విరుద్దంగా ప్రభుత్వ మార్పుకోసం ఓటు వేయాలని ఎల్‌డిఎఫ్‌ వ్యతిరేక ప్రకటన చేశారు.


ఎల్‌డిఎఫ్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి ?


కేరళలో వామపక్షాలు గతంలో ఎన్నడూ సాధించని రీతిలో 97 స్దానాలు తెచ్చుకొని గత యుడిఎఫ్‌ రికార్డును సమం చేశాయి, ఘనవిజయం సాధించాయి, రాజకీయ సంప్రదాయానికి భిన్నంగా ఓటర్లు వరుసగా రెండవ సారి అధికారపక్షానికి పట్టం గట్టి చరిత్రను తిరగరాశారు. సంతోషించాల్సిందే. కానీ మరోవైపు పరిస్ధితి ఏమిటి ? కేరళలో ఎల్‌డిఎఫ్‌కు వచ్చిన ఓట్లు 45.43 శాతం, దాన్ని వ్యతిరేకించే పార్టీలకు వేసిన ఓటర్లు యుడిఎఫ్‌కు వచ్చిన 39.47, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏకు వచ్చిన 12.47శాతం కలుపు కుంటే 51.94 శాతం ఉన్నారు. ఇలా చెప్పటం అలాంటి కలయిక వెంటనే ఏర్పడుతుందని కాదు, ఒకవేళ అదే జరిగినా ఆ పార్టీల వెనుక ఉన్న సామాన్య ఓటర్లు అలాగే స్దిరపడిపోతారనీ కాదు. ఆ పార్టీల వెనుక ఉన్నవారందరూ కమ్యూనిస్టు లేదా ప్రజావ్యతిరేకులు కారు. వీరిలో గణనీయమైన భాగాన్ని ఎల్‌డిఎఫ్‌లోకి ఆకర్షించాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు నొక్కి చెప్పాయి. వివిధ తరగతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి ఎల్‌డిఎఫ్‌ వెలుపల ఉన్న ప్రజాతంత్రశక్తులను ఎలా కూడగట్టాలో ఆ కూటమి నాయకత్వం ఆలోచించాలి. మనోరమ విశ్లేషణ ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు 2.67, లోక్‌సభ కంటే 10.73శాతం ఈసారి అదనంగా వచ్చాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 0.66శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని వికీపీడియా విశ్లేషణ పేర్కొంటే 0.78 అని, పార్లమెంట్‌ ఎన్నికలతో పోల్చితే 7.87 తగ్గినట్లు మనోరమ విశ్లేషణ తెలిపింది. (స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ ధోరణిని గమనించాలి).

కాంగ్రెస్‌కు ఓట్లు అమ్ముకున్న బిజెపి !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విలేకర్లతో చెప్పిన అంశాల ప్రకారం 140కి గాను 90 చోట్ల కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఓట్ల వ్యాపారం జరిగిందన్నారు. కొన్ని చోట్ల దీన్ని అధిగమించి ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులు విజయం సాధించారని అన్నారు. ఈ వ్యాపారం అగ్రనాయకుల మధ్యనే జరిగిందని విమర్శించారు. విజయన్‌ చెప్పిన కొన్ని నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్‌ బతరేలో బిజెపికి 12,458 ఓట్లు తగ్గాయి, కాంగ్రెస్‌ అభ్యర్ధి 11,822 మెజారిటీతో నెగ్గారు.పెరుంబవూరులో యుడిఎఫ్‌ 2,889 తేడాతో నెగ్గగా బిజెపికి 4,596 తగ్గాయి, ఓడిపోయిన సిపిఎం నాయకురాలు, ఏకైక మంత్రి మెర్సికుట్టి అమ్మ 4,452 ఓట్ల తేడాతో ఓడిపోగా అక్కడ బిజెపి ఓట్లు 14,160 తగ్గాయి. త్రిపురినితురలో సిపిఎం ఎంఎల్‌ఏ మీద గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్ధి మెజారిటీ 992 కాగా అక్కడ బిజెపికి 6,087 తగ్గాయి. చలక్కుడిలో కాంగ్రెస్‌ 1,057 ఓట్లతో గెలవగా బిజెపికి అక్కడ కూడా 6,087 తగ్గాయి. తిరువనంతపురంలోని కోవలం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ 11,562 మెజారిటీతో నెగ్గగా బిజెపికి 12,323 తగ్గాయి. పాల నియోజకవర్గంలో కేరళ కాంగ్రెస్‌(ఎం) అధ్యక్షుడు జోస్‌కె మణిని ఓడించేందుకు యుడిఎఫ్‌-బిజెపి కుమ్మక్కయ్యాయి. గెలిచిన మణి సికప్పన్‌కు 15,378 మెజారిటీ రాగా బిజెపికి 13,952 తగ్గాయి. కడుత్తురత్తిలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి 4,251 ఓట్ల తేడాతో ఓడిపోగా బిజెపికి 5,866 తగ్గాయి. ఒక ఎన్నిక తరువాత మరొక ఎన్నికలో తమ బలం పెరుగుతోందని చెప్పిన బిజెపి ఈ తగ్గుదలను ఎలా సమర్ధించుకుంటుందో చెప్పాలని విజయన్‌ ప్రశ్నించారు. నీమమ్‌ నియోజకవర్గంలో ఈ సారి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధికి ఓట్లశాతం పెరగటాన్ని గతంలో ఆమేరకు బిజెపికి ఓట్లు బదిలీ అయి అక్కడ బిజెపి గెలిచిందని, ఈ సారి కాంగ్రెస్‌ పోటీలో ఉండటంతో బిజెపి ఖాతా మూతపడిందన్నారు. రెండు రెళ్లు నాలుగు అవుతాయని కాంగ్రెస్‌-బిజెపి భావించాయని అయితే ఓటర్లు భిన్నంగా ఆలోచించి ఎల్‌డిఎఫ్‌కు ఘనవిజయం చేకూర్చారన్నారు.


కాంగ్రెస్‌ ఎదురుదాడి – బిజెపి ఓటమి బాధ్యత తనదే అన్న సురేంద్రన్‌ !


ముఖ్యమంత్రి విజయన్‌ చేసిన విమర్శలతో దిక్కుతోచని కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. ఆ పార్టీ నేత రమేష్‌ చెన్నితల ఆరోపణల పర్వానికి తెరలేపారు. సిపిఎం-బిజెపి 69 నియోజకవర్గాలలో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బిజెపి చెబుతున్న కాంగ్రెస్‌ ముక్తభారత్‌లో భాగంగానే రెండు పార్టీలు కుమ్మక్కై తమను దెబ్బతీశాయన్నారు. బిజెపికి తగ్గిన ఓట్లన్నీ సిపిఎంకు పడ్డాయన్నారు. మరోవైపు బిజెపి ఓటమికి ప్రాధమిక బాధ్యత తనదే అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ ప్రకటించారు. ఓటమి కారణాలను పార్టీకి వివరించానని పార్టీ ఏ చర్య తీసుకున్నా తాను సిద్దమే అని విలేకర్లతో చెప్పారు. కాంగ్రెస్‌ -సిపిఎం కుమ్మక్కయినట్లు ఆరోపించారు. ఎన్నికలకు ముందే ముస్లిం ఓట్ల సమీకరణ జరిగిందని, ముస్లింలీగ్‌ లేని చోట్ల ఎస్‌డిపిఐ పార్టీతో సహా అనేక బృందాల ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయన్నారు.మతశక్తులైన ముస్లింలీగ్‌, జమాతే ఇస్లామీ ఓట్లను సిపిఎం పొందిందని చెప్పుకున్నారు. కేరళ విద్యుత్‌ శాఖ మంత్రి మణిపై ఓడిపోయిన యుడిఎఫ్‌ అభ్యర్ది అగస్తీ ముందుగా ప్రకటించినట్లుగా ఓడిపోయినందుకు గుండు గీయించుకున్నారు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ దానిపై మనం మాట నిలుపుకోవాలని శీర్షికగా పెట్టారు.


నీమమ్‌లో జరిగిందేమిటి ?


కేరళ రాజకీయ చరిత్రలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన బిజెపి ఉన్న ఒక్క సీటు నీమమ్‌ను కోల్పోయి ఖాతాను నిలబెట్టుకోలేకపోయింది. యుడిఎఫ్‌లోని ఒక చిన్న పార్టీ అభ్యర్ధిని నిలిపిన కాంగ్రెస్‌ నేతలు బిజెపితో కుమ్మక్కై తమ ఓట్లను బదలాయించి సీనియర్‌ బిజెపి నేత ఓ రాజగోపాల్‌ను గెలిపించారు. అది తీవ్ర విమర్శలకు దారి తీయటంతో అలాంటి తెరచాటు బాగోతం లేదని నమ్మించేందుకు కాంగ్రెస్‌ అక్కడ తన అభ్యర్ధినే నిలిపింది. అనేక మంది సీనియర్‌ నేతలను అక్కడ నిలిపేందుకు ప్రయత్నించి విఫలమైంది. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీని నిలపాలని ఆయన మీద వత్తిడి తెచ్చారు. అయితే చాందీ పుతుపల్లిని వదిలితే తాము ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఆయన నివాసం వద్ద బెదిరింపులకు దిగారు. నీమమ్‌లో గతంలో మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ ప్రాతినిధ్యం వహించి ఉన్నందున ఆ పేరుతో ఆయన కుమారుడు, ఎంపీ అయిన కె మురళీధరన్‌ను నిలిపారు.
గతంలో బిజెపి సీనియర్‌ నేత రాజగోపాల్‌కు అక్కడ 67,813 రాగా ఈ సారి కుమనం రాజశేఖరన్‌కు 51,888 వచ్చాయి. యుడిఎఫ్‌కు గతంలో 13,860 రాగా ఈ సారి 36,524 వచ్చాయి. సిపిఎం అభ్యర్ధి, తిరువనంతపురం మాజీ మేయర్‌ అయిన వి శివన్‌కుట్టికి గత ఎన్నికల్లో 55,837 రాగా ఈ సారి 59,142 వచ్చాయి. గతంలో కుమ్మక్కులో భాగంగా బిజెపికి పడిన ఓట్లు ఈ సారి కాంగ్రెస్‌కు తిరిగి వచ్చాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.


వెలుగు దివ్వెలతో ఏడవ తేదీన ఇండ్లలోనే విజయోత్సవాలు : ఎల్‌డిఎఫ్‌


కరోనా దృష్యా ఏడవ తేదీన ఇండ్లలోనే విజయోత్సవాలు జరుపుకోవాలని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ కోరారు. ఏడవ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్ర వ్యాపితంగా ఒకేసారి మద్దతుదారులందరూ దివ్వెలను వెలిగించి ఇండ్లలోనే విజయోత్సవాలు జరుపుకోవాలని ఎల్‌డిఎఫ్‌ నిర్ణయించినట్లు విజయరాఘవన్‌ చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రిగా అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న కె కె శైలజ టీచర్‌ పదిహేనవ అసెంబ్లీ స్పీకర్‌ పదవిని అధిష్టించనున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే నూతన సభలో అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డుతో పాటు కేరళ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా మరో రికార్డు సృష్టిస్తారు. గతంలో ముగ్గురు మహిళలు ఉపసభాపతులుగా పని చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుంభమేళా, ఎన్నికల గురించి మాట్లాడితే నా తల తీసేయవచ్చు – అదర్‌ పూనా వాలా !

04 Tuesday May 2021

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, UK

≈ Leave a comment

Tags

Adar Poonawalla, vaccine controversy

ఎం కోటేశ్వరరావు


ఒక తప్పుడు వార్తను ప్రసారం చేసి శివసేన పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన ఇండియా టుడే న్యూస్‌ డైరెక్టర్‌ రాహుల్‌ కన్వాల్‌ చెంపలు వేసుకున్నారు. మే రెండవ తేదీ ఆదివారం నాటి ప్రసారంలో తాను చేసిన వ్యాఖ్యలపై సోమవారం నాడు సామాజిక మాధ్యమంలో ట్విటర్‌ ద్వారా విచారం ప్రకటించారు. సీరం సంస్ధ అదర్‌ పూనావాలాను బెదిరించింది స్వాభిమాని షేత్కారి సంఘటన నేత రాజు షెట్టి, అతని అనుచరులు తప్ప శివసేనకు సంబంధం లేదని చెప్పారు. అయితే కన్వాల్‌ టీవీ ప్రసారం ద్వారా క్షమాపణలు చెప్పాలి తప్ప కేవలం ట్విటర్‌లో విచారం ప్రకటిస్తే చాలదని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. రాజు షెట్టి గతంలో శరద్‌ జోషి షేత్కారి సంఘటనలో పని చేశారు. తరువాత స్వాభిమాన షేత్కారి సంఘటన పేరుతో స్వంత దుకాణం, ఒక పార్టీ పెట్టారు. బిజెపి మద్దతుతో 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు. గతేడాది ఎన్‌సిపితో సంబంధాలకు ప్రయత్నించినా స్వంత పార్టీలో విబేధాల కారణంగా దానికి దగ్గర కాలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు వాక్సిన్‌ సరఫరాలను పెంచాలని లేనట్లయితే ఇతర రాష్ట్రాలకు సీరం సంస్ద సరఫరా చేస్తున్న వాక్సిన్‌ వాహనాలను తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని బెదిరిస్తూ మాట్లాడినట్లు వీడియోలో ఉంది.


రాహుల్‌ కన్వాల్‌ చేసిన తప్పుడు ప్రకటన తప్ప గతవారంలో ఇద్దరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు లేదా ప్రకటనలకు మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడదు.( అన్ని టీవీ ఛానల్స్‌ చూడటం, అన్ని పత్రికలు చదవటం సాధ్యం కాదు కనుక నా పరిశీలనలో లోపం ఉంటే సరి చేసుకుంటాను.) ఒకటి పూనాలోని సీరం సంస్ధ అదర్‌ పూనావాలా తనకు రక్షణ లేని కారణంగానే లండన్‌ వచ్చి అక్కడే ఉండిపోయానని, త్వరలో భారత్‌ వెళతానని ప్రముఖ పత్రిక టైమ్స్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. భారతకు వాక్సిన్‌ ఫార్ములా ఇవ్వకూడదని ప్రపంచ ప్రముఖుడు బిల్‌ గేట్స్‌ ప్రకటించారన్నది మరొక వార్త. ఇవి రెండూ తీవ్రమైనవే.


ఇంతకీ పూనా వాలాను బెదిరించింది ఎవరు, దాని స్వభావం ఏమిటి ? ఫలానా వారు బెదిరించారని టైమ్స్‌ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఇండియా టుడే జర్నలిస్టు రాహుల్‌ కన్వాల్‌ సంచలనాత్మక విషయంగా పూనావాలకు బెదరింపులు వచ్చాయని అవి చేసింది ఎవరో కాదు శివసేన నుంచి అని ఆరోపించారు. మేనెల రెండవ తేదీన ఎన్నికల ఫలితాల గురించి ప్రసారం చేస్తుండగా కన్వాల్‌ ఈ ప్రత్యేక ప్రస్తావన చేశారు. తాను ఆ వీడియోలను చూశానని వాటిలో బూతులు తిడుతున్న స్ధానికులు కనిపించారని చెప్పారు. వాక్సిన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తన ఫ్యాక్టరీని ఘెరావ్‌ చేసిన శివసేన గూండాలంటూ కొన్ని వీడియోలను తనకు పూనావాలా పంపారని పేర్కొన్నారు. అది తప్పుడు వార్తని అందుకు గాను కన్వాల్‌ క్షమాపణ చెప్పాలని, జనవరిలో తప్పుడు వార్తను ప్రసారం చేసినందుకు ఇదే సంస్ద యాజమాన్యం రాజదీప్‌ సర్దేశారుపై తీసుకున్న మాదిరి చర్య తీసుకోవాలని శివసేన ఇండియా టుడే యాజమాన్యానికి రాసిన లేఖలో డిమాండ్‌ చేసింది. ఒకవైపు కరోనా విజృంభణ, మరోవైపున ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా జనాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్‌ కన్వాల్‌ కావాలనే తప్పుడు వార్తలను ప్రసారం చేశారని అన్నారు. శివసేన మీద పని గట్టుకొని నిందా ప్రచారం చేస్తున్నారని దానికి నిదర్శనంగా ఇదే గ్రూపుకు చెందిన మరొక ఛానల్‌ ఆజ్‌తక్‌లో ముఖ్యమంత్రి కుమారుడు, కాబినెట్‌ మంత్రి అయిన ఆదిత్య థాకరేను శివసేన రాహుల్‌ గాంధీ అని వర్ణించినట్లు శివసేన తన లేఖలో తెలిపింది.


అదర్‌ పూనావాలాకు నిజంగా బెదిరింపులు వచ్చాయా లేక ఇతర కారణాలతో చిన్న ఉదంతాన్ని పెద్దది చేసి చూపారా ? అవి చిన్నవైనా పెద్దవైనా ముంబైలోనో మరొకచోటో వెల్లడించకుండా పూనాలో కేసులు నమోదు చేయకుండా లండన్‌ వెళ్లి ఎందుకు చెప్పాల్సి వచ్చింది. రైతు ఉద్యమం గురించి విదేశీయులు మన వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారాలు చేశారని, వారికి మన దేశంలోని ప్రభుత్వ, దేశ వ్యతిరేకులు సహకరించారని ఎంత పెద్ద లొల్లి చేశారో, ఎన్ని కేసులు పెట్టారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. పూనా వాలా చేసిన ప్రకటనతో ప్రపంచంలో మన దేశ పరువు ఏమైందో అసలు సిసలు దేశభక్తులం మేమే అని డబ్బా కొట్టుకొనే వారు ఆలోచించారా ? మీడియాలో అయితే కనిపించలేదు. బిజెపి ఎలాంటి ప్రకటనా చేసినట్లు లేదు, ఎవరు బెదరించారో వెల్లడించాలని కాంగ్రెస్‌, శివసేన కోరాయి.
ఇంతకీ పూనా వాలా చెప్పిందేమిటి ? వివిధ మీడియాల్లో వచ్చిన సమాచారం మేరకు వాటి సారాంశం ఇలా ఉంది. వాక్సిన్‌ కోసం భారత్‌లో బెదరింపులు వస్తున్న కారణంగా నేను, నా కుటుంబం దేశం విడిచి లండన్‌ వచ్చాము.అసాధారణ బెదిరింపులు వచ్చాయి, వారు ఏమైనా చేయవచ్చు. ఇటు వంటి పరిస్ధితుల్లో లండన్‌లో మరికొంత కాలం ఉంటాము. భారత్‌లో నా పని నేను చేసుకుంటున్నాను ఎక్స్‌, వై లేదా జడ్‌ల అవసరాలకు అనుగుణ్యంగా వాక్సిన్లను సరఫరా చేయలేను. వారేం చేయబోతున్నారో ఊహించలేము. అంతా నా భుజాల మీద వేస్తే నేను ఒక్కడినే చేయలేను.ఆకాంక్షలు, వత్తిడి అసాధారణంగా ఉంది. ప్రతివారూ తమకు వాక్సిన్‌ ఇవ్వాలంటున్నారు. ఇతరుల కంటే వారికే ఎందుకివ్వాలో అర్ధం కాదు. వారు చెప్పినట్లు ఇవ్వకపోతే ఏమైనా చేయవచ్చు అన్నట్లుగా బెదరింపుల స్వభావం ఉంది.వారు అలాంటి భాష ఉపయోగించలేదు గానీ ధోరణి, పర్యవసానం అలా ఉంది. తాము కోరింది ఇవ్వకపోతే మేమున్న చోటు నుంచి వెళ్లనిచ్చేది లేదని చుట్టుముట్టారు. వాక్సిన్‌ ఇవ్వకపోతే బాగుండదని వారు చెబుతున్నారు.


టైమ్స్‌ పత్రిక విలేకరి అడిగిన ప్రశ్నలకు పూనా వాలా స్పందన కూడా ముఖ్యమైనదే. కరోనా పెరుగుదలకు కారణంగా భావిస్తున్న కుంభమేళా- అసెంబ్లీ ఎన్నికల గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు ” నేను గనుక సరైన సమాధానం చెప్పినా లేదా ఏ సమాధానం చెప్పినా వారు నా తల తీసేస్తారు. నేను ఎన్నికల మీద లేదా కుంభమేళా గురించి వ్యాఖ్యానించను, అది ఎంతో సున్నితమైనది. (కరోనా పరిస్ధితి ) ఇంతలా దిగజారిపోతుందని బహుశా దేవుడు కూడా ఊహించి ఉండలేదేమో అనుకుంటున్నా అన్నారు.


ఇండియా టుడే తప్పుడు ప్రచారంతో బిజెపి కిరాయి మీడియా వెంటనే గుండెలు బాదుకోవటం ప్రారంభించింది. శివసేన గురించి దుమ్మెత్తి పోసింది. ఇప్పుడు ఇండియా టుడే తన ప్రకటనను వెనక్కు తీసుకొని విచారం ప్రకటించిన నేపధ్యంలో కనీసం ఆ మాత్రం విచారం లేదా చెంపలు వేసుకుంటుందా ? ఎక్కడైనా ఎవరైనా బెదరింపులు, మరొక నేరపూరితమైన చర్యకు పాల్పడితే వెంటనే సంబంధిత వ్యక్తుల మీద పోలీసు ఫిర్యాదు ఇవ్వాలి. కానీ అదేమీ చేయకుండా ఏప్రిల్‌ 16వ తేదీన పూనాలోని సీరం సంస్ద ప్రతినిధి ప్రకాష్‌ కుమార్‌ సింగ్‌ కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసి అదర్‌ పూనావాలకు రక్షణ కల్పించాలని కోరారు. వెంటనే వై తరగతి భద్రతను కల్పించింది. అంటే పూనావాలా దేశంలో ఉన్నపుడు ఆయనకు రక్షణగా ఎనిమిది మంది సాయుధ సిబ్బంది రక్షణగా ఉంటారు. ఒకరిద్దరు కమాండోలు కూడా ఉండవచ్చు.


చీకట్లో బాణం వేసినట్లుగా అదర్‌ పూనావాలా సంచలనాత్మక ప్రకటన చేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు. వత్తిడి చేసి లేదా ప్రలోభంతో డామన్‌లోని ఒక సంస్ధ నుంచి వేలాది రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకొని దొరికిపోయిన ఉదంతంలో ఉన్నది బిజెపి వారే. అందువలన దీనిలో కూడా వారు లేరని చెప్పగలమా ? కేంద్రం, రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులకు ఒక్కో రేటు నిర్ణయిస్తూ తయారీ సంస్ధలు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు పూనా వాలా ఇలాంటి ప్రకటన చేశారా ? లేక విదేశాల్లో తయారు చేసి అధిక ధరలకు అమ్ముకొనేందుకు నేపధ్యాన్ని సృష్టించారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.ఒక వేళ నిజంగానే బెదరింపులు వస్తే ఇది తీవ్రమైన అంశం. దానికి కారకులు ఎవరంటే వేలు కేంద్ర ప్రభుత్వం వైపే చూపకతప్పదు. బీహార్‌ ఎన్నికల సమయంలో తమను ఎన్నుకుంటే ఉచితంగా వేస్తామని చెప్పి వాక్సిన్‌ రాజకీయాన్ని ప్రారంభించింది బిజెపి-జెడియు కూటమి. ఆ ప్రకటన వివాదాస్పదం కావటంతో దేశమంతటా ఉచితంగా వేస్తామని కేంద్ర మంత్రులు ప్రకటించారు. తీరా 45 ఏండ్లు దాటిన వారికే తాము ఉచితంగా వేస్తామని, మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా కొనివేసుకోవాలని లేదా ప్రయివేటు ఆసుపత్రుల్లో అధిక ధరలకు కొనుక్కోవాలని కేంద్రం ప్రకటించింది. తాను బాధ్యతల నుంచి తప్పుకొని రాష్ట్రాల మీద భారం మోపేందుకు వేసిన ఎత్తుగడ తప్ప ఇది మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతనుంచి తప్పుకోవటమే ఇది. అందువలన ఈ విధానమే బెదిరింపులకు తెరలేపేందుకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు. వాక్సిన్‌ రాజకీయంలో లబ్దిపొందేందుకు ముందుగా తామే కొనుగోలు చేసి ప్రజల ముందు గొప్పలు చెప్పుకొనేందుకు ఎవరైనా అవాంఛనీయ చర్యలకు పాల్పడ్డారా ? అంతటి ధైర్యం కేంద్రంలో ఉన్న అధికారపార్టీ వారికి తప్ప ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులకు ఉండే అవకాశాలు లేవు.


లండన్‌ ఒక అంతర్జాతీయ కేంద్రం. అక్కడి ప్రముఖ పత్రికకు ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వటం వెనుక బెదిరింపులు కారణం కావచ్చు. పూనావాల ప్రకటన తరువాత నరేంద్రమోడీని నమ్మి ఏ విదేశీ సంస్ధ పెట్టుబడులు పెడుతుంది, పరిశ్రమలు స్దాపించేందుకు ముందుకు వస్తుంది? అలాంటిదేమీ లేదని నిర్ధారించేందుకు కేంద్రం ఎందుకు ముందుకు రాలేదు ? పూనా వాలా తనకు ఎదురైన బెదిరింపుల గురించి మాత్రమే చెప్పలేదు. ఎన్నికల ప్రచారం ద్వారా, కుంభమేళా ద్వారా కరోనాను వ్యాపింప చేశారని విమర్శచేసినా తన తలతీస్తారని కూడా చెప్పారు. హిందూత్వశక్తులు తప్ప మరొకరు అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. కుంభమేళాకు అనుమతులు ఇవ్వవద్దన్న వారు హిందూమతానికి వ్యతిరేకమని ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్లివచ్చిన వారిమీద అనేక రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. వారిలో 99శాతం మందికి కరోనా వచ్చిందని టైమ్స్‌ నౌ ఛానల్‌ వార్త పేర్కొన్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ అంశాలన్నీ తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ఇప్పుడు పూనావాలా దేశంలో పెరుగుతున్న అసహనం, విమర్శను సహించలేని తనాన్ని చెప్పకనే చెప్పినట్లు లేదూ ? అంతటి ప్రముఖుడే స్వేచ్చగా మాట్లాడేందుకు భయపడుతుంటే ఇంక సామాన్యుల సంగతి చెప్పాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళలో ఎర్ర సునామీ : బలపడిన ఎల్‌డిఎఫ్‌, కుంగిన యుడిఎఫ్‌, కొట్టుకుపోయిన బిజెపి !

02 Sunday May 2021

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), BJP-Kerala, Kerala 2021 Elections results, Kerala Assembly Elections 2021, Kerala LDF, UDF Kerala


ఎం కోటేశ్వరరావు
అవును సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాసింది. ఒకసారి ఎల్‌డిఎఫ్‌ను ఎన్నుకుంటే మరోసారి యుడిఎఫ్‌ను ఎన్నుకొనే కేరళీయులు అధికారాన్ని తమకు అప్పనంగా కట్టపెడతారని ఆశపడ్డ కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఈ ఎన్నికలలో తమకు స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యలో సీట్లు రాకపోయినా వచ్చే కొన్ని సీట్లతో చక్రం తిప్పుతామని, అన్నీ అనుకూలిస్తే అధికారం తమను వరిస్తుందని పగటి కలలు కన్న బిజెపికి ఉన్న ఒక్కసీటును లేకుండా చేసి ఖాతాను మూసివేశారు. ఎల్లవేళలా జన సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం ఆపత్కాలంలో తమను ఎలా అదుకున్నదో చూసిన జనం తమ మనోభావాన్ని గతేడాది చివరిలో జరిగిన స్ధానిక సంస్దల ఎన్నికలలోనే ఎల్‌డిఎఫ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి వెల్లడించారు. ఏప్రిల్‌ ఆరవ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మరింత స్పష్టంగా తమకు కావాల్సిన వారెవరో ఎంచుకున్నారు. ఎన్ని అభాండాలు, ఎన్ని అవాస్తవాలు, ఎన్ని తప్పుడు ప్రచారాలు, ఎన్ని ఆటంకాలు అన్నింటిని మేము కాచుకుంటామంటూ జనం ముందుకు వచ్చారు.


ప్రజలు మమ్మల్ని విశ్వసించారు, యుడిఎఫ్‌ను తిరస్కరించారు, బిజెకి బుద్ది చెప్పారు అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఫలితాలపై తొలి స్పందనలో పేర్కొన్నారు. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన మాత్రమే లౌకిక వాదాన్ని పరిరక్షించగలదని, సామాజిక న్యాయం చేకూర్చగలదని నమ్మారని ఇది ప్రజావిజయం అన్నారు. ఎన్నికల సమయంలో యుడిఎఫ్‌ లేవనెత్తిన అంశాలన్నింటినీ జనం తిరస్కరించారని అన్నారు. ఉన్న ఒక్క సీటును పొగొట్టుకున్న బిజెపి గురించి మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో జిమ్మిక్కులు చేయగలదేమో గానీ ఇక్కడ పని చేయవని కేరళ గడ్డ మీద మతత్వానికి తావులేదన్నారు. గతంలో కాంగ్రెస్‌ నేత ఏకె ఆంటోని నాయకత్వంలో 2001లో యుడిఎఫ్‌ 99 స్ధానాలను సాధించి అప్పటికి ఒక రికార్డు నెలకొల్పింది. దాన్ని పినరయి విజయన్‌ సమం చేశారు. ఓట్లశాతాలు, తీర్పు ఇతర వివరాలను మరో సందర్భంలో వివరంగా సమీక్షించుదాం. రెండు ఫ్రంట్లలో పార్టీల వారీగా సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.


ఎల్‌డిఎఫ్‌ ×× సీట్లు ×××× యుడిఎఫ్‌××××× సీట్లు
సిపిఎం ×××× 68 ×××× కాంగ్రెస్‌ ×××× 22
సిపిఐ –×××× 17 ×××× ముస్లింలీగ్‌ ×××× 14
కెసి(ఎం) ×××× 5 ××××కేరళకాంగ్రెస్‌ ×××× 2
జెడిఎస్‌ ×××× 2 ×××× కెసిజె ×××× 1
ఎన్‌సిపి ×××× 2 ×××× ఎన్‌సికె ×××× 1


ఎల్‌డిఎఫ్‌లోని మరో ఐదు చిన్న పార్టీలకు ఒక్కొక్క స్దానం చొప్పున వచ్చాయి. యుడిఎఫ్‌లోని మూడు పార్టీలకు బిజెపి మిత్రపక్షాలు మూడింటికి, ఇతర పార్టీలు నాలిగింటికి ఒక్క స్దానమూ రాలేదు. గత ఎన్నికలలో స్వతంత్ర అభ్యరిగా గెలిచిన సభ్యుడు ఈ సారి ఎల్‌డిఎఫ్‌ చేతిలో ఓడిపోయారు.


వివిధ జిల్లాలో ఫలితాల తీరుతెన్నులను ఒక్కసారి చూద్దాం. పద్నాలుగు జిల్లాల్లోని 140 స్ధానాల్లో ఇది రాసిన సమయానికి విజయాలను ఖరారు చేసినవి, ఆధిక్యతలో ఉండి అధికారికంగా ప్రకటించని స్ధానాలు దిగువ విధంగా ఉన్నాయి.


జిల్లా పేరు ×××× 2016 ఎన్నికలు×××××× 2021 ఎన్నికలు
××××××××ఎల్‌డిఎఫ్‌××యుడిఎఫ్‌ ××× ఎల్‌డిఎఫ్‌ ×××× యుడిఎఫ్‌
తిరువనంతపురం ×× 9 ×× 4 ×× 13 ×××× 1
కాసరగోడ్‌ ××××× 3 ×× 2 ××× 3 ×××× 2
వయనాడ్‌ ××××× 2 ×× 1 ××× 2 ×××× 1
కన్నూరు ××××× 8 ×× 3 ××× 13 ×××× 1
కోజికోడ్‌ ××××× 11 ×× 2 ××× 11 ×××× 2
మలప్పురం ××× 4 ×× 12 ××× 4 ×××× 12
పాలక్కాడ్‌ ××××× 9 ×× 3 ××× 10 ×××× 2
త్రిసూర్‌ ××××× 12 ×× 1 ××× 12 ×××× 1
ఎర్నాకుళం ××××× 5 ×× 9 ××× 5 ×××× 9
ఇడుక్కి ××××× 3 ×× 2 ××× 4 ×××× 1
కొట్టాయం ××××× 2 ×× 6 ××× 5 ×××× 4
అలప్పూజ ××××× 8 ×× 1 ××× 8 ×××× 1
పత్తానంతిట్ట ××××× 4 ×× 1 ××× 5 ×××× 0
కొల్లం ××××× 11 ×× 0 ××× 9 ×××× 2

ఇలా అనుకోలేదు, ఓటమిని అంగీకరిస్తున్నాం, ఆత్మశోధన చేసుకుంటాం : కాంగ్రెస్‌


ఇలాంటి ఫలితాలు వస్తాయని మేము అనుకోలేదు. విజయన్‌ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశాము. వారు విజయం సాధించినంత మాత్రాన అవన్నీ కొట్టుకుపోవు. పరాజయాన్ని ఆత్మశోధన చేసుకుంటాం అని హరిపాద నియోజకవర్గంలో విజయం సాధించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చెప్పారు.రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ పుతుపల్లి నియోజకవర్గం నుంచి పన్నెండవ సారి విజయం సాధించి గతంలో ఉన్న దివంగత కెఎం మణి రికార్డుతో సమం చేశారు. గత ఎన్నికలలో ఇరవై వేలకు పైగా మెజారిటీ తెచ్చుకున్న చాందీ ఈ సారి ఎనిమిదివేలతో సరిపెట్టుకున్నారు. ఒక విద్యార్ది నేత మీద ఇంత తక్కువ మెజారిటీ తెచ్చుకోవటం ఏమిటని కాంగ్రెస్‌ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. పరాజయాన్ని సవాలుగా తీసుకొని పని చేస్తామని చాందీ అన్నారు.


కరుణాకరన్‌ బిడ్డలు : అన్నకు మూడో స్ధానం – చెల్లికి రెండో స్దానం !


ఓడిపోయిన వారిలో మంత్రి, సిపిఎం సీనియర్‌ నేత మెర్సికుట్టి అమ్మ ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ రెండు సీట్లలో పోటీ చేశారు. శబరిమల ఆలయం ఉన్న కొన్ని నియోజకవర్గంలో సిపిఎం చేతిలో, మరో నియోజకవర్గంలో యుడిఎఫ్‌ ముస్లింలీగ్‌ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికలలో మంజేశ్వరమ్‌లో కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయిన సురేంద్రన్‌ ఈ సారి 1,143 తేడాతో పరాజయం పొందారు. కొన్ని నియోజకవర్గంలోని శబరిమల వివాదాన్ని రెచ్చగొట్టి గెలవాలని చూసి అక్కడ కూడా పరాజయం పాలయ్యారు. రెండు చోట్ల పోటీ చేయటం, ప్రచారానికి హెలికాప్టర్‌ను ఉపయోగించటం వంటి చర్యలు మంజేశ్వరమ్‌లో పరాజయానికి కారణమని మీడియా వ్యాఖ్యానించింది. కేరళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని బిజెపి తొలిసారిగా తిరువనంతపురం నగరంలోని నీమమ్‌ నియోజకవర్గంలో గత ఎన్నికలలో కాంగ్రెస్‌ పరోక్ష మద్దతుతో గెలిచి ప్రాతినిధ్యం పొందింది. ఈసారి సిపిఎం చేతిలో ఓడిపోయింది. బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ గవర్నర్‌ అయిన కుమనం రాజశేఖరన్‌ ఇక్కడ పోటీ చేశారు. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడైన లోక్‌సభ సభ్యుడు మురళీధరన్‌ను అక్కడ నిలిపింది. ఆయన మూడవ స్దానంలో నిలిచారు. తన రాకతో బిజెపికి పెద్ద ఊపు వచ్చిందని, తానే ముఖ్యమంత్రి అభ్యర్ధిని అని చెప్పుకున్న మెట్రోమాన్‌ శ్రీధరన్‌ పాలక్కాడ్‌లో యుడిఎఫ్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి షఫీ పరంబిల్‌ చేతిలో ఓడిపోయారు. ఇక్కడ గత ఎన్నికలలో కూడా బిజెపి రెండవ స్దానంలో నిలిచింది. పాలక్కాడ్‌ మున్సిపాలిటీలో బిజెపి విజయం సాధించింది. పట్టణ ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో ఉన్న శ్రీధరన్‌ గ్రామీణ ప్రాంతంలోకి వచ్చే సరికి వెనుకబడిపోయారు. సినీహీరో సురేష్‌ గోపి బిజెపి అభ్యర్ధిగా త్రిసూర్‌లో పోటీ చేసి మూడవ స్ధానంలో వచ్చారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ కుమార్తె పద్మజా వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్దిగా పోటీ చేశారు. ఆమెపై సిపిఐ అభ్యర్ధి పి బాలచంద్రన్‌ విజయం సాధించారు. పాల నియోజకవర్గంలో కేరళ కాంగ్రెస్‌ (ఎం) జోస్‌కె మణి పరాజయం పొందటం ఎల్‌డిఎఫ్‌ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. మణి ఎల్‌డిఎఫ్‌లో చేరటంతో అంతకు ముందు ఉప ఎన్నికలో గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌సిపి సభ్యుడు మణి సి కప్పన్‌కు వేరే చోట సీటు ఇస్తామని చెప్పినప్పటికీ అదే సీటు కావాలని పట్టుబట్టటం, ఎల్‌డిఎఫ్‌ తిరస్కరించటంతో కప్పన్‌ యుడిఎఫ్‌లో చేరి అదే సీటులో పోటీ చేసి పదివేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.


జయహౌ శైలజ టీచర్‌ – అయ్యప్పకు ఆగ్రహం !


ఎల్‌డిఎఫ్‌ను రెండవ సారి అధికారానికి తీసుకురావటంలో పినరయి విజయన్‌ ఒక రికార్డు స్దాపిస్తే, ఈ ఎన్నికలో ఆరోగ్యశాఖ మంత్రి సిపిఎం అభ్యర్ధిగా కెకె శైలజ రికార్డు స్ధాయిలో 61వేలకు పైగా ఓట్లతో కన్నూరు జిల్లాలో విజయం సాధించారు. గత ఎన్నికలలో ఇక్కడ సిపిఎం నేత ఇపి జయరాజన్‌ 43,381 ఓట్ల మెజారిటీ ఒక రికార్డు కాగా శైలజ దాన్ని బద్దలు కొట్టారు.
వయస్సులో ఉన్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశ సమస్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు జరిపినందుకు ప్రభుత్వంపై ధ్వజమెత్తి శాంతి భద్రతల సమస్యను సృష్టించిన కాంగ్రెస్‌, బిజెపిలకు ఈ ఎన్నికల్లో శృంగభంగమైంది. ఆ సమస్య సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్నందున కోర్టు ధిక్కారమని తెలిసినప్పటికీ ఆ సమస్యను ప్రచారం చేశారు. తాము అధికారానికి వస్తే ప్రత్యేక చట్టం చేస్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. శబరిమల ఆలయ ప్రాంతం, పరిసరాలలో ఉన్న నియోజకవర్గాలలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులు విజయం సాధించారు. తనను అనవసరంగా వివాదంలోకి లాగినందుకు ఆ రెండు పార్టీల మీద అయ్యప్ప ఆగ్రహం పూనారా అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. తాము రాజకీయాలకు తటస్ధం అని ప్రకటించిన నాయర్‌ సర్వీసు సొసైటీ పోలింగ్‌ ప్రారంభమైన తొలిగంటలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సంస్ధ నేత ప్రకటించి తామెవరి పక్షమో వెల్లడించారు. కాంగ్రెస్‌ ఈ విషయంలో బిజెపికి కార్బన్‌ కాపీ మాదిరిగా వ్యవహరించింది. ఎల్‌డిఎఫ్‌ మాత్రమే ఏకైక లౌకికశక్తిగా జనం చూశారు. మైనారిటీలు అనేక ప్రాంతాలలో ఎల్‌డిఎఫ్‌ వైపు మొగ్గారని మధ్య, దక్షిణ కేరళ ఫలితాలు వెల్లడించాయి. తమ అభ్యర్ధి మెట్రోమాన్‌ శ్రీధరన్‌ను ఓడించేందుకు సిపిఎం మద్దతుదారులైన ముస్లింలు యుడిఎఫ్‌ అభ్యర్ధికి ఓటువేసి ఓడించారని, అనేక చోట్ల తమకు వ్యతిరేకంగా ఇదే చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. తాము 35 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సురేంద్రన్‌ ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఓటమితో గుండు కొట్టించుకోవద్దని ప్రత్యర్ధికి సలహా ఇచ్చిన మంత్రి !


ప్రియమైన స్నేహితుడా ఎన్నికల్లో ఓటమిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నియోజకవర్గంలో పరిస్ధితికి అనుగుణ్యంగా ఓటు వేశారని కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎం ఎం మణి కాంగ్రెస్‌ అభ్యర్ధి ఇఎం అగస్తీకి సలహా ఇచ్చారు. తాను ఓడిపోతే గుండు గీయించుకుంటానని ఒక టీవీ ఛానల్లో అగస్తి శపధం చేశారు. ఇడుక్కి జిల్లాలోని ఉడుంబాలోంచా నియోజకవర్గంలో 38,305 పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన మంత్రి తన విజయానికి దోహదం చేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భోళామనిషిగా పేరున్న మంత్రి ప్రత్యర్ధుల మీద పంచ్‌లు వేయటంలో ఆయనకు ఆయనే సాటి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరోసారి మీడియా, కాషాయ దళాల చైనా వ్యతిరేక ప్రచారం- వాస్తవాలు !

01 Saturday May 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Narendra Modi Failures, RSS Outfits anti china, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


మరోసారి మీడియా – కాషాయ దళాలు ప్రచారదాడితో రెచ్చిపోతున్నాయి. ఎవరెంత సమర్దవంతంగా జనాన్ని పక్కదారి పట్టించగలమో చూద్దాం అన్నట్లుగా మిత్రులుగా పోటీ పడుతున్నాయి. నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ప్రతిసారీ వాటికి ఏదో ఒక అంశం, బకరాలు కావాలి. కరోనా రెండవ దశను ఊహించటంలో వైఫల్యం, అలక్ష్యం, అసమర్ధ నిర్వహణ ఒకటేమిటి ? వందకు ఒకటైనా ప్రతికూల వార్తకు చోటు కల్పించకపోతే ” చాల బాగోదు ” కనుక బాధ్యత ఎవరిది అనే అంశాన్ని తెలివిగా పక్కన పెట్టి సమస్య తీవ్రతను ప్రతిబింబించక మీడియాకు తప్పని స్ధితి. కాషాయ దళాల ఆరాధ్య దైవం గోబెల్స్‌. రాముడికైనా విరామం ఇస్తారేమో గానీ ఆయనకు రోజూ అబద్దాల నైవేద్యం పెట్టటం మానరు. ఎవరైనా నిజాలు చెప్పటంలో పోటీ పడితే మంచిదే. కానీ జరుగుతోందేమిటి ?


వద్దంటున్నా అనుమతించిన ఉత్తరాఖండ్‌ కుంభమేళా ( మనం పుష్కరాలు అంటాం) గంగలో మునిగిన వారు కరోనాను ఎలా వ్యాప్తి చేస్తున్నారన్నదాన్ని గురించి చెప్పటంలో వాటి మధ్య పోటీ లేదు. గతంలో తబ్లిగీ సమావేశాల సందర్భంగా చేసిన రచ్చ ఊసేలేకుండా జాగ్రత్త పడుతున్నాయి. జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 వరకు 91లక్షల మంది గంగలో మునిగారని, ఒక్క ఏప్రిల్లోనే 60లక్షల మందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరాఖండ్‌లో మార్చి 31న కేవలం 1,862 కేసులుండగా ఏప్రిల్‌ 24 నాటికి 33,330 పెరిగినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎంత మందికి అంటించారో తెలియదు. దేశాన్ని వస్తు ఉత్పత్తి కేంద్రంగా మార్చి యావత్‌ ప్రపంచానికే ఎగుమతులు చేస్తామని చెప్పిన వారు స్వంత జన ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పిత్తి, పంపిణీ చేయటంలో కూడా ఎందుకు విఫలమయ్యారో, విదేశీ సాయం కోసం ఎదురు చూడాల్సిన అగత్యం గురించి చెప్పటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం రంకు-భారతం బొంకు అన్న ఇతిహాసాలలోని అధ్యాయాలను మించిపోతాయి. రాబోయే రోజుల్లో వాటి గురించి ఎలాగూ చెప్పుకుంటాం గనుక అసలు విషయానికి వద్దాం.

ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెల వంటి జీవులు ఆహారం దొరకగానే ఆబగా కొద్దిగా నమిలి తింటాయి. తరువాత తీరికగా నోట్లోకి తెచ్చుకొని పూర్తిగా నమిలి మింగుతాయి, దీన్నే నెమరు వేసుకోవటం అంటారు. మనుషులు అలా చేసేందుకు అవకాశం లేదు గానీ జరిగిన అంశాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని నెమరు వేసుకోవచ్చు. గత రెండు నెలల కాలంలో జరిగిన కొన్ని ముఖ్య పరిణామాల గురించి ఒక్కసారి చూద్దాం. ఏప్రిల్‌ 28నాటికి అమెరికాలో పది కోట్ల మందికి పూర్తిగా వాక్సిన్‌ వేశారు, మరో 23 కోట్ల మందికి ఒక డోసు వేశారు.వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అమెరికాలో 80 కోట్ల డోసులు అందుబాటులోకి రానుంది. జనాభా అంతటికీ వేసిన తరువాత కూడా పది కోట్ల డోసుల వరకు అదనంగా ఉంటుంది. అయినా అదేమిటో డబ్బు చెల్లిస్తామురా నా ప్రియమైన ఒకే మంచం ఒకే కంచం దోస్తూ అని మన దేశం రెండు నెలల నుంచి మొత్తుకుంటున్నా కోవిషీల్డ్‌ వాక్సిన్‌ తయారీకి అవసరమైన 37 రకాల ముడి పదార్దాలు, పరికరాలను విక్రయించేందుకు కొద్ది రోజుల క్రితం అంగీకరించాం అన్న ప్రకటన తప్ప ఇంతవరకు (మే 1 ) పంపిన దాఖలా లేదు. ఇది కూడా పాక్షిక సడలింపు మాత్రమే అని చెబుతున్నారు.


గతేడాది జరిగిన పరిణామాల నేపధ్యంలో మొత్తంగా మీడియా లేదా పూర్తిగా కాషాయ దళాలుగానీ చైనాను దోస్తుగా పరిగణించటం లేదు. యాప్‌లను నిషేధించారు, అక్కడి నుంచి పెట్టుబడులను ఆపేశారు. వస్తువుల దిగుమతి నిలిపివేసి కాళ్ల దగ్గరకు వచ్చేలా చేసుకుంటామని చెప్పారు. చైనా వస్తువులు నాశిరకం అన్నారు. వాటిని బహిష్కరించాలని పెద్ద హడావుడి చేశారు. ఇదిగో చూడండి మన దిగుమతులు తగ్గిపోయాయని అంకెలు చెప్పారు. అక్కడ తయారు చేసిన వాక్సిన్‌లో పసలేదని రాశారు. ఔషధాల నాణ్యత ప్రశ్నార్దకం అన్నారు. గతేడాది నవంబరు నుంచి రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలు, వీసాల జారీలేదు. సరిహద్దు వివాదం గురించి ఎడతెగని చర్చలు సాగుతున్నాయి, ఎటూ తేలటం లేదు. అవి ఎప్పుడు పూర్తవుతాయో లడఖ్‌ కొండలెక్కించిన మన సైనికులను కిందికి ఎప్పుడు దింపుతారో తెలియదు. ఏ విధంగా చూసినా చైనాను శత్రువుగానే పరిగణిస్తున్నారు. చైనా ప్రభుత్వ సిచువాన్‌ విమాన సంస్ధ పదిహేను రోజుల పాటు వస్తురవాణా విమానాల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించింది. తరువాత వెంటనే తిరిగి అనుమతిస్తామని, అవసరాన్ని బట్టి కొత్త షెడ్యూలును ప్రకటిస్తామని చెప్పింది. ఈలోగా ఇంకే ముంది సాయం చేస్తామని మోసం చేసింది, సరఫరాలను అడ్డుకుంటున్నది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే గతేడాది నవంబరు నుంచి ప్రయాణీకుల విమానాల రాకపోకలు లేకున్నా మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చైనా నుంచి సిచువాన్‌ సంస్ధ వస్తురవాణా విమానాలను నడుపుతూనే ఉంది.సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. భారత్‌తో కరోనా విపరీతంగా పెరిగిన కారణంగా పదిహేను రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఏప్రిల్‌ చివరి వారంలో ప్రకటించింది. అంటే అప్పటి వరకు అటు నుంచి ఇటు నుంచి అటు సరకు రవాణా జరుగుతూనే ఉంది. కాషాయ దళాలు చెప్పినట్లు చైనా వస్తువుల బహిష్కరణ లేదు, పాడూ లేదు. తమకు అనేక దేశాల నుంచి ఆర్డర్లు ఉన్నాయని, వాటి తయారీలో తలమునకలుగా ఉన్నామని, అందువలన భారత ప్రభుత్వం తమకు ఏమి కావాలో స్పష్టంగా చెబితే దానికి అనుగుణ్యంగా చర్య తీసుకుంటామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. మన దేశం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ లోగా కాషాయ దళం రంగంలోకి దిగింది. చైనా ప్రకటనపై మోడీ సర్కార్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఇంతవరకు అధికారికంగా స్పందన లేదు. మీడియా, కాషాయ దళాలు రచ్చ చేస్తున్నాయి. దక్షిణాసియా దేశాలలో కరోనా నిరోధం గురించి చర్చించేందుకు చైనా విదేశాంగ మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి మన దేశం డుమ్మాకొట్టింది.


ముడిసరకులపై నిషేధం ఎత్తివేసేందుకు నిరాకరించి వాక్సిన్‌ తయారీకి ఆటంకం కలిగేందుకు కారణమైన అమెరికా గురించి పల్తెత్తు మాట మాట్లాడని వారు చైనా పదిహేను రోజుల పాటు విమానాలను నిలిపివేస్తామని ప్రకటించగానే ఇంకేముంది నమ్మక ద్రోహం చేసింది, దాని బుద్ది బయటపెట్టుకుంది అంటూ రెచ్చిపోవటం ఏమిటి ? అప్రకటన చేసే ముందు రోజు వరకు మనకు అవసరమైన అత్యవసర సరఫరాలన్నింటినీ చైనా నుంచి తెచ్చుకున్నది వాస్తవం కాదా ? నేరుగా చైనా నుంచి గాకుండా ఇతర దేశాల మార్గాల ద్వారా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది, ప్రభుత్వ కంపెనీ గాకుండా ఉన్న మరో విమాన కంపెనీ ఎలాంటి నిషేధం విధించలేదు, దాని ద్వారా తెచ్చుకోవచ్చు. నిజానికి మనలను ఇబ్బంది పెట్టదలచుకుంటే అమెరికా మాదిరి నిషేధమే విధించవచ్చు కదా ! మనకు ఎగుమతి చేసే వాటి మీద మన నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద భారీ ఎత్తున పన్నులు విధించిందన్నది మరొక తప్పుడు ప్రచారం. నిజంగా ఆ పని చేస్తే దాపరికం ఏముంది ? గతంలో జిగినీ దోస్తు అమెరికా ట్రంపు అదేపని చేసినపుడు మీడియాలో వార్తలు వచ్చాయిగా, నిజంగా చైనా ఆ పని చేస్తే ఏ మీడియా కూడా ఎందుకు వార్తలు ఇవ్వలేదు.మన దేశం కూడా చైనా వస్తువుల మీద అదే మాదిరి పన్నులు ఎందుకు విధించకూడదు.

సిచువాన్‌ విమానాలను రద్దుచేసినట్లు ప్రకటించిన తరువాత హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి చైనాకు చెందిన 800 ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు వచ్చినట్లు, వారంలో మరో పదివేలు పంపుతున్నట్లు కొలంబోలో చైనా రాయబారి ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో 26వేల వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ జనరేటర్లు పంపినట్లు చైనా విదేశాంగ మంత్రి ప్రకటించారు. చైనా నుంచి నేరుగా అవకాశం లేకపోతే సింగపూర్‌, ఇతర ప్రాంతాల మీదుగా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది.ఏప్రిల్‌ ఒకటి నుంచి 25వ తేదీ వరకు చైనా నుంచి ప్రతి రోజూ మన దేశానికి సగటున ఐదు విమానాలు నడిచాయి. వాటిలో సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు కూడా ఉన్నాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ సినిమా నటుడు చైనా తీసుకున్న నిర్ణయం కారణంగా తాను ఆర్డరు పెట్టిన ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు ఆగిపోయాయని ఢిల్లీలోని చైనా రాయబారికి పంపిన ట్వీట్‌లో పేర్కొన్నారు. దాని మీద స్పందించిన రాయబారి ట్వీట్లద్వారా సమాధానం పంపుతూ రెండు దేశాల మధ్య సరకు రవాణా విమానాలు మామూలుగానే తిరుగుతున్నాయని, గత రెండు వారాల్లో 61 విమానాలు తిరిగాయని వెల్లడించారు. అనుమానాలుంటే ఎవరైనా తీర్చుకోవచ్చు, సమస్యలుంటే పరిష్కరించాలని కోరవచ్చు.
అందువలన నిజాలేమిటో, సమస్య ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి తీవ్ర విమర్శలు చేయటం తగనిపని, మనకే నష్టం. కొద్ది రోజులుగా పద్దెనిమిది వేల ఆక్సిజన్‌ యంత్రాలకు మన దేశం నుంచి వివిధ సంస్ధలు ఆర్డరు చేశాయని చైనాలోని పెద్ద మెడికల్‌ కంపెనీ జియాంగ్‌సు యు మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తెలిపింది. భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఉన్న కారణంగా వెంటనే సరఫరా చేయలేమని, నెల రోజులు కూడా పట్టవచ్చని, భారత మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చైనా సంస్దలు చెబుతున్నాయి.


గతేడాది చైనాతో తలెత్తిన సరిహద్దు వివాద నేపధ్యంలో మోడీ సర్కార్‌ వైఖరిలో అస్పష్టమైన మార్పు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే చైనా నుంచి అత్యవసర వస్తువులను కొనుగోలు చేస్తున్నాము. భారత్‌ నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు 25వేల ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లను సరఫరా చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నామని భారత్‌లో చైనా రాయబారి సన్‌ వెయిడోంగ్‌ నిర్ధారించారు. వాటిని సరఫరా చేసేందుకు అసరమైన సరకు రవాణా విమానాలను సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.చైనా నుంచి వస్తువులను తీసుకుంటున్నామని భావనా పరమైన సమస్యలేవీ లేవని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు మీడియా-కాషాయ దళాలు ఎందుకు రచ్చ చేస్తున్నాయి ?


లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్‌ఫినిటీ అనే సంస్ధ సేకరించిన సమాచారం ప్రకారం మార్చినెలాఖరుకు 16.4 కోట్ల కరోనా వాక్సిన్‌ డోసులను అమెరికా ఉత్పత్తి చేసింది. ఒక్కడోసు కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయలేదు. ఐరోపా యూనియన్‌ పదకొండు కోట్ల డోసులు ఉత్పత్తి చేయగా 42శాతం ఎగుమతి జరిపింది. చైనాలో తయారైన సినోవాక్‌, సినోఫామ్‌ 20 కోట్ల డోసులను ఎగుమతి చేశారు. అమెరికా మీద తీవ్రమైన వత్తిడి రావటంతో రాబోయే రోజుల్లో ఆరుకోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌ ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. ఇది గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం వంటిదే. ఈ వాక్సిన్‌ వినియోగానికి అమెరికాలో అనుమతి ఇవ్వాలో లేదో నిర్ణయించక ముందేే కొనుగోలు చేశారు. తరువాత అనుమతి ఇవ్వలేదు. అందువలన దాన్ని వదిలించుకొనేందుకు ముందుకు వచ్చింది. లేనట్లయితే అది నిరుపయోగంగా అక్కడే ఉండిపోతుంది.


వాక్సిన్‌ తయారీలో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికా సంస్దలదే గుత్తాధిపత్యం.అక్కడి ఫైజర్‌ కంపెనీకి అవసరమైన ముడిపదార్దాల సరఫరా తద్వారా దాని లాభాలను ఇబ్బడి ముబ్బడి చేసేందుకు వాటి మీద నిషేధం విధించినట్లు చెబుతున్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమెరికా, ఐరోపా స్వంతం కావటంతో వేగంగా పెద్ద మొత్తంలో తయారు చేసి సొమ్ము చేసుకొనేందుకు వాక్సిన్‌ తయారీని ఒక్కోదశలో ఒక్కో దేశానికి అప్పగించారు. మోడెర్నా వాక్సిన్‌ స్విడ్జర్లాండ్‌లో తయారు చేసి దాన్ని సీసాల్లో నింపేందుకు స్పెయిన్‌కు పంపుతారు. బ్రిటన్‌ కంపెనీ క్రోడా వాక్సిన్‌ తయారు చేసి సీసాల్లో నింపేందుకు నార్మండీ, ఫ్రాన్స్‌ పంపుతున్నారు. ఒక వేళ తమ కంపెనీ వాక్సిన్‌ వికటించి వినియోగించిన వారికి పరిహారం చెల్లించాల్సి వస్తే కోర్టు దావాల నుంచి ఔషధ కంపెనీలకు రక్షణ కల్పించేందుకు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇతర దేశాలు ప్రభుత్వ ఆస్తులను, రిజర్వుబ్యాంకుల నిధులు, మిలిటరీ కేంద్రాల వంటి వాటిని తాకట్టుపెట్టాలని ఫైజర్‌ కంపెనీ వత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇదేంట్రాబాబూ తొలి రోజుల్లోనే బిడెన్‌ పెద్దమనిషి ట్రంప్‌ కంటే దారుణంగా తయారయ్యాడు అని ఎక్కడ అనుకుంటారో, అమెరికా వ్యతిరేకత ఎక్కడ పెరుగుతుందో అనే భయం – బిడియంతో వాక్సిన్‌ తయారీ వస్తువులపై నిషేధాన్ని కాస్త సడలించేందుకు నిర్ణయించుకున్నట్లుగా గత కొద్ది రోజుల పరిణామాలు స్పష్టం చేశాయి.

అజిత్‌ దోవల్‌ ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్పి దారికి తెస్తారని, అమెరికాను అదే విధంగా హెచ్చరించి మనకు సరఫరాలు చేసేందుకు అంగీకరింప చేయించారని కాషాయ దళాలు ప్రచారం ప్రారంభించాయి. మరి అదే అజిత్‌ దోవల్‌ చైనా విషయంలో కూడా అదే విధంగా ఎందుకు వ్యవహరించలేదు, అమెరికా కంటే బలహీనమైన చైనాను కాషాయ దళాల భాషలో చెప్పాలంటే ఎందుకు మన కాళ్లదగ్గరకు తేలేదు ? చివరికి బలహీన పాకిస్దాన్‌న్ను ఎందుకు అంకెకు తేలేకపోయారు ? మన ఇరుగు పొరుగుదేశాలను మన వైపు ఎందుకు తిప్పలేకపోయారు. అజిత్‌ దోవల్‌కు అంతసీన్‌ లేదు ! నరేంద్రమోడీ కంటే బలవంతుడా ! అందరికీ చెడ్డాం, చివరికి మీరు కూడా ఇలా చేస్తే మా మోడీ పరువు, పనేంగాను అని సాష్టాంగపడ్డారేమో ? చరిత్రలో ఇలాంటివారిని అమెరికన్లు ఎందరినో చూశారు. తిరిగే చక్రం మీద కూర్చున్న ఈగ దాన్ని తానే తిప్పుతున్నట్లు భావిస్తున్నట్లుగా ఈ ప్రచారం ఉంది. ఇలాంటి పోసుకోలు కబుర్లతో నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పిపుచ్చగలరా ? తోకపట్టుకొని పోవటం తప్ప మరొక విధంగా వ్యవహరించలేని రీతిలో మనం అమెరికా చేతిలో చిక్కాము. దాన్ని నమ్మి రెచ్చి పోయి చైనా, పాకిస్దాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకున్నాం, వాటన్నింటినీ చైనాకు దగ్గర చేశాము. రెండునెలలుగా ససేమిరా అని మొరాయిస్తుంటే అజిత్‌ దోవల్‌ గానీ నరేంద్రమోడీ గానీ చేసిందేమీ లేదు. మిత్రదేశం అని చెప్పిన భారత్‌ను అమెరికన్లు ఎలా నిర్లక్ష్యం చేశారో చూడండి అంటూ చైనా మీడియాలో వ్యాఖ్యలు, ఇతర దేశాల నుంచి విమర్శలు, వత్తిడి, అన్నింటికీ మించి మన దేశంలో అమెరికా వ్యతిరేకత పెరిగితే తమకూ, అనుయాయి నరేంద్రమోడీకి నష్టం అని లెక్కలు వేసుకున్న తరువాతనే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది.


శ్రీరాముడంతటి శక్తివంతుడే రావణుడిపై పోరుకు ఉడత సాయం తీసుకున్నారని గొప్పగా చెప్పుకుంటారు. రాముడి అడుగుజాడల్లో నడుస్తున్నామని చెబుతున్నవారు పాక్‌ నుంచి సాయం తీసుకొనేందుకు తిరస్కరించటం శ్రీరాముడి పట్ల అపచారం చేసినట్లు కాదా ?వెంటిలేటర్లతో సహా కొన్ని ఇతర వైద్య సామగ్రిని పంపుతామని పాకిస్ధాన్‌ ప్రకటించింది. అయితే దాన్ని స్వీకరిస్తామని గానీ తిరస్కరిస్తున్నట్లుగానీ మోడీ సర్కార్‌ ప్రకటించలేదు. స్వీకరించటం తమ స్ధాయికి భంగకరమని, తలెత్తే ప్రశ్నలు, విమర్శలకు సమాధానాలు చెప్పలేమని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.పాకిస్ధాన్‌తో సయోధ్య కుదిరినట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పటికీ ఈ వైఖరితో వ్యవహరించటం గమనించాల్సిన అంశం. పదహారు సంవత్సరాల క్రితం విదేశీ సాయం తీసుకోవటంపై మన్మోహన్‌ సింగ్‌ హయాంలో స్వయంగా విధించుకున్న ఆంక్షలను గుట్టుచప్పుడు కాకుండా నరేంద్రమోడీ ఎత్తివేసింది. చైనా నుంచి ప్రాణావసర ఔషధాలు, ఆక్సిజన్‌, సంబంధిత పరికరాలను తీసుకొనేందుకు భావనా పరమైన సమస్యల్లేవని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొన్నది. అయితే పాకిస్ధాన్‌ నుంచి స్వీకరించే విషయంలో ఏం చేయాలనేది స్పష్టం చేయలేదు. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం విదేశాల నుంచి బహుమతులు, విరాళాలను స్వీకరించాల్సి వస్తే వాటిని రెడ్‌ క్రాస్‌ సంస్ధకు మాత్రమే అందచేయాలి, దాని ద్వారానే పంపిణీ చేయాలి.ప్రభుత్వాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవాటికి వెల చెల్లించి మాత్రమే తీసుకోవాలి. గత కొద్ది రోజులుగా అమెరికాతో సహా వివిధ దేశాల నుంచి ప్రకటిస్తున్న సాయమంతా డబ్బు చెల్లించి కొనుగోలు చేసేదే అని గ్రహించాలి. విధాన సడలింపుల తరువాత వచ్చే సాయంలో కొంత విరాళం కొంత నగదు చెల్లింపులు ఉండే అవకాశం ఉంది. ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలు, ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తున్న నేపధ్యంలో ఈ మార్పు చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేరుగా తమకు అవసరమైన వాటిని విదేశాల నుంచి సేకరించుకోవచ్చని కేంద్రం సూచించింది.

అంతకు ముందు ఉత్తరా ఖండ్‌ భూకంపం(1991) లాతూర్‌ భూకంపం(1993) గుజరాత్‌ భూకంపం(2001) బెంగాల్‌ తుపాను(2002) బీహార్‌ వరదలు(2004) సంభవించిన సమయాలలో విదేశీ సాయం తీసుకున్నాము.2004లో సునామీ తరువాత పరిస్ధితిని మనకు మనమే ఎదుర్కోగలమంటూ విదేశీ విరాళాలను తీసుకోవద్దని, అవసరమైతే వారి సాయం తీసుకుందామని నిర్ణయించారు. దీనికి అనుగుణ్యంగా 2005లో కాశ్మీరులో భూకంపం, అక్కడే 2014లో వరదల సమయాలో, 2013లో ఉత్తరా ఖండ్‌ వరదల సమయంలో విదేశీ విరాళాన్ని తీసుకొనేందుకు ప్రభుత్వ నిరాకరించింది.తాజా విషయానికి వస్తే లక్షలాది మంది మళయాలీలు పని చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం 2018లో కేరళ వరదల సమయంలో 700 కోట్ల రూపాయల విరాళం అందచేస్తామని ముందుకు వచ్చినపుడు కేంద్రం తిరస్కరించింది. ఆ మేరకు కేంద్రం సాయం ఇవ్వకపోవటం తీవ్ర విమర్శలు రావటం అది వేరే విషయం. కానీ అదే ప్రభుత్వం పిఎం కేర్‌ నిధికి ఎవరు విరాళం ఇచ్చినా తీసుకోవాలని గతేడాది నిర్ణయించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే స్వీకరించనుంది. అయితే ఈ అంశాన్ని బహిరంగంగా ప్రకటించలేదని, ఇదే సమయంలో సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం ఎలాంటి వినతులు చేయలేదని, ప్రభుత్వాలు లేదా ప్రయివేటు సంస్ధలు ఏవైనా బహుమతిగా విరాళం ఇస్తే కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరిస్తామని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది. గతంలో మన ప్రభుత్వం ఇతర దేశాలకు విరాళంగా ఇచ్చిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ నుంచి వాక్సిన్లకు ప్రతిగా ఇలాంటి విరాళాలు వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఇప్పుడు కావాల్సింది ఏమిటి ? ప్రపంచ లేదా ప్రాంతీయ రాజకీయాలు, శత్రుత్వమా ? ప్రజల రక్షణా ఏది ముఖ్యం. నిజమైన రాజనీతి ప్రాధాన్యత జన సంక్షేమం అన్నది స్పష్టం. గతంలో అన్ని దేశాలూ రాజకీయాలు చేశాయి. ఒకదానిని ఒకటి దెబ్బతీసుకొనేందుకు ప్రయత్నించాయి. మనం తప్ప మిగతావన్నీ అదే చేశాయనే కాషాయ ప్రచారాన్ని ఎవరైనా నమ్మితే తప్పుదారి పట్టినట్లే. చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో చతుష్టయం పేరుతో కలిశాము. అయినా దానిని పక్కన పెట్టి చైనీయులు మనకు అవసరమైన వాటిని విక్రయిస్తున్నారు. ఎలాంటి నిషేధం పెట్టలేదు. మిత్రదేశం అనుకున్న అమెరికా ఆ పని చేసింది. మనకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ -చైనా దగ్గరయ్యాయి. అమెరికాకు అనుకూలంగా మనం ఇరాన్‌ను దూరం చేసుకున్నాము. అమెరికాకు వ్యతిరేకంగా అది చైనాకు దగ్గరైంది. ఇతర ఇరుగుపొరుగు దేశాలు కూడా అమెరికాతో మన సంబంధాల కారణంగా చైనా వైపు మొగ్గుచూపుతున్నాయన్నది స్పష్టం. ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు, దేనితో ఎలా తేల్చుకోవాలో తరువాత నిర్ణయించుకోవచ్చు. సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో స్నేహం చేశాము, ఇప్పటికీ ఎగుమతి-దిగుమతి కొనసాగుతూనే ఉంది. పాకిస్ధాన్‌తో వైరం ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు వాణిజ్యంలో అత్యంత సానుకూల హౌదా ఇచ్చాము. ఒకవైపు మిత్ర రాజ్యం అంటూనే మరోవైపున మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దలో ఫిర్యాదులు చేస్తున్నది, మన వస్తువుల దిగుమతులపై ఉన్న పన్ను రాయితీలను రద్దు చేసింది, కొత్తగా దిగుమతి పన్నులు వేసింది. మాకు మా దేశ పౌరులు తప్ప మిగతావారి గురించి పట్టించుకోము అంటూ వాక్సిన్‌ ముడిసరకులు, పరికరాలపై నిషేధం విధించినా అమెరికాతో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే విధానం చైనా, పాకిస్దాన్‌తో ఎందుకు అనుసరించకూడదో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వివాదాలు, విబేధాలతో రాజీపడాలని, లొంగిపోవాలని ఎవరూ చెప్పటం లేదు. ప్రజానుకూలంగా విధానాలుండాలని చెప్పటం తప్పుకాదు. అలాంటి వైఖరి, విదేశాల సాయం లేకుండా కరోనా బారి నుంచి మన జనాన్ని మన ప్రభుత్వం కాపాడగలదా ?

ఆపదలో ఆదుకుంటాయని నమ్మిన అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు ముఖం చాటేశాయి.మనలను చైనాకు వ్యతిరేకంగా ఉపయోగించుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత ఆదుకొనేందుకు ఇవ్వలేదని కరోనా నిరూపించింది. మార్చినెలలో జరిగిన తొలి చతుష్టయ సమావేశంలో ప్రపంచానికి వంద కోట్ల వాక్సిన్లు అందించాలని, వాటిని భారత్‌లో తయారు చేసేందుకు అవసరమైన సాయం చేయాలని కూటమి నిర్ణయించింది. ఇప్పుడు మన దేశమే వాక్సిన్ల కొరతను ఎదుర్కొంటుంటే మిగతా దేశాలు ముఖం చాటేస్తున్నాయి. ముడిపదార్దాల సరఫరాను అడ్డుకుంటున్నాయి. లక్షల సంఖ్యలో ఆక్సిజన్‌ జనరేటర్లు మనకు అవసరం కాగా కొన్ని వందలు పంపుతూ దాన్నే పెద్ద సాయంగా అమెరికా చిత్రిస్తున్నది. జపాన్‌ మౌనంగా ఉంది.మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెప్పే, గుండెలు బాదుకొనే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కరోనా వాక్సిన్ను మానవ హక్కుగా పరిగణించటం లేదు. అలాంటి వాటిని నమ్మి అలీన విధానానికి తిలోదకాలిచ్చి వాటి చంకనెక్కితే ప్రయోజనం లేదని తేలిపోయింది కనుక భేషజాలకు పోకుండా ఇప్పటికైనా మన విదేశాంగ విధానాన్ని పున:పరిశీలించుకోవటం అవసరం.
హొహొహొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆక్సిజన్‌, ప్రాణావసర ఔషధాల మీద జాతీయ విధానం ఉందా – సుప్రీం కోర్టు !

22 Thursday Apr 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ 1 Comment

Tags

Narendra Modi Failures, national plan on oxygen supply, Supreme Court Notice to GOVI, vaccination Policy


ఎం కోటేశ్వరరావు


డబ్బు ఊరికే రాదు అని ఒక బంగారు వాణిజ్యవేత్త టీవీ ప్రకటనల్లో ఊదరగొట్టటం చూడని వారు ఉండరు. దీని మాతృక ఊరకరారు మహాత్ములు అని మహాభాగవతంలో పోతన రాసిన ఒక పద్యం.
ఊరక రారు మహాత్ములు
వా రధముల ఇండ్లకడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక మాకు శుభంబు నిజము మహాత్మా


అన్నారు పోతన. అది వేరే సందర్భం అనుకోండి.మీవంటి మహాత్ములు మా ఇంటికి వచ్చారంటే ఊరికే కాదు, మీ రాక మాకు పుణ్యం అని అర్దం. దాన్ని పక్కన పెడదాం. మన పాలకులుగా వచ్చిన వారిని కూడా దేవదూతలు, మహాత్ములు అని కదా పొగుడుతున్నారు. పోతన గారు పుణ్యం గురించి చెప్పారు, వారితో శుభం కలుగుతుంది అన్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది ? ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ గురించి మరోసారి ప్రపంచం దృష్టి సారించింది. ప్రాణవాయువు, ప్రాణావసర ఔషధాలు, టీకాల మీద కేంద్రానికి ఒక జాతీయ విధానం ఉందా అని గురువారం నాడు సుప్రీం కోర్టు తనకు తాను కల్పించుకొని ప్రశ్నించాల్సి వచ్చింది. ఈ మేరకు కేంద్రానికి ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఇది ఒక రకంగా అభిశంసన తప్ప మరొకటి కాదు. కేంద్రం ఏం చెబుతుందన్నది పెద్ద విషయం కాదు, ఇప్పటి వరకు జనానికి చెప్పిన కబుర్లు కాకుండా ఉన్నత న్యాయస్దానానికి కొత్త విషయాలేమైనా వినిపిస్తారేమో చూద్దాం. మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకర్లతో చెప్పారు.అమెరికా కూడా అదే ప్రకటన చేసింది. సాయం తీసుకొనేందుకు కూడా ఒక పధకం ఉండాలి.


అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో కూడా మహాత్ములే అధికారంలో ఉన్నారు. మహాత్ములు కదా చిత్రాలు జరుగుతాయి, ఎన్నో చేస్తారు. అవి సామాన్యుల కంటికి కొన్ని ఘోరంగా ఉన్నా అలా రాసి పెట్టి ఉండబట్టే జరుగుతుందనుకోవాలి మరి. ఒక రోజులో అత్యధిక కరోనా కేసులు నమోదై మన దేశం అమెరికా రికార్డును బద్దలు కొట్టింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్దితి గురించి ఆలోచించటం లేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మహాత్ములు కనుక ఎక్కడో ఆలోచిస్తున్నట్లున్నారు, ఇంకా ఎంత మందిని బలిపెడతారో అన్న ఆందోళన కలుగుతోంది. ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఏమీ పట్టటం లేదు.కొంత మంది మూఢనమ్మకం లేదా మూర్ఖత్వానికి జనం బలి అవుతున్నారు. కుంభమేళాలో లక్షలాది మందిని అనుమతించిన కారణంగా ఉత్తరాఖండ్‌లో గురువారం నాడు నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ కార్యాలయాలను శుద్ధి చేసేందుకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.


కేంద్రం తీసుకున్న చర్యలు, విధానం గురించి తమకు సహాయం చేసేందుకు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వేను సుప్రీం కోర్టు నియమించింది. ఆక్సిజన్‌ – ప్రాణావసర ఔషధాల సరఫరా, వాక్సిన్‌ విధానం-పద్దతి, లాక్‌డౌన్లను విధించే అధికారం గురించి వివరించాలని కేంద్రానికి కోర్టు నోటీసు ఇచ్చింది. శుక్రవారం నాడు విచారణ జరపనుంది.ఆరు హైకోర్టులు కరోనాకు సంబంధించి విచారణ జరుపుతున్నాయని మంచి కోసం వాటి పరిధిలో వ్యవహరించటాన్ని తాము అభినందిస్తున్నామని అయితే గందరగోళం తలెత్తటం వనరులు పక్కదారి పడుతున్నందున వాటి గురించి కూడా విచారించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే వ్యాఖ్యానించారు.


సుప్రీం కోర్టు ఈ విధంగా జోక్యం చేసుకొనేందుకు ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రోద్బలం చేశాయని భావించవచ్చు. ” ఇక్కడేమీ మానవత్వం మిగిలి ఉన్నట్లు లేదు. అడుక్కుంటారో, అప్పు తెస్తారో, అపహరిస్తారో మాకనవసరం జనాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయాలి ” కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన ఢిల్లీ హైకోర్టు. ఆసుపత్రులకు కొరత లేకుండా ఆక్సిజన్‌ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటూ ప్రభుత్వ తీరు పట్ల న్యాయమూర్తులు మండి పడ్డారు. కొన్ని గంటల్లో అత్యవసరంగా ఆక్సిజన్‌ అందించకపోతే వందలాది మంది రోగుల పరిస్ధితి ఏమౌతుందో తెలియని స్ధితి ఇప్పుడు ఢిల్లీలో ఉంది. అనేక రాష్ట్రాల్లో కూడా అదే స్ధితి. పెట్రోలియం, ఉక్కు పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ వాయువును వైద్య అవసరాలకు ఎందుకు మళ్లించరు అని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దిగువ పేర్కొన్న కొన్ని ఉదంతాలు, వార్తలు కూడా సుప్రీం కోర్టును జోక్యానికి పురికొల్పి ఉండవచ్చు.


ఢిల్లీ నుంచి తమ రాష్ట్రంలోని ఫరీదాబాద్‌కు వస్తున్న ఆక్సిజన్‌ టాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం లూటీ చేసిందని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ ఆరోపించారు. దాంతో ఆక్సిజన్‌ వాహనాలకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించామన్నారు.
హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. అక్కడి నుంచి తమకు రావాల్సిన ఆక్సిజన్‌ టాంకర్లను ఆయా రాష్ట్రాల అధికారులు, పోలీసులు రానివ్వటం లేదు అని ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా విమర్శించారు. వారికి ఢిల్లీతో పంచాయతీ ఏమైనా ఉంటే తేల్చుకోవచ్చు, ఇది సమయం కాదు అన్నారు.


మధ్యప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రిక ఆక్సిజన్‌ సిలిండర్ల వాహనం రాగానే అప్పటికే కాచుకొని ఉన్న కరోనా రోగుల బంధువులు వాటిని లూటీ చేశారని తనకు సమాచారం అందిందని దమో జిల్లా కలెక్టర్‌ తరుణ్‌ రతి చెప్పారు. ఆ జిల్లాలోని ఒక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారం కోసం కరోనా పుచ్చిపోతున్నా మధ్య ప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి, స్వయంగా వైద్యుడై ఉండి కూడా నెల రోజుల పాటు ఏ ఒక్క సమావేశానికీ రాలేదు. తీరికగా ఏప్రిల్‌ 15న భోపాల్‌ వచ్చి కర్ఫ్యూను ఉల్లంఘించి అంబేద్కర్‌కు నివాళి అర్పించి 15వ తేదీన విలేకర్ల సమావేశంలో ఇబ్బందికర పరిస్ధితిని ఎదుర్కొన్నారు. జవాబుదారీ తనంలో తమకు మించిన వారెవరూ లేరని నరేంద్రమోడీ చెప్పుకుంటారు. ఆయన మాత్రం తక్కువ తిన్నారా, ఎన్నికల ప్రచారం మీద పెట్టిన శ్రద్దలో వెయ్యోవంతు ఆక్సిజన్‌ మీద పెట్టి ఉంటే ఈ పరిస్ధితి తలెత్తి ఉండేదా ?


దేశంలో వైద్య అవసరాలకు ఆక్సిజన్‌ సరిపడా ఉంది, సమస్య దాన్ని సరఫరా చేసేందుకు అవసరమైన వాహనాలు లేవని ముంబైకి చెందిన ఒక పెద్ద కంపెనీ ప్రతినిధి చెప్పినట్లు ఒక పత్రిక వార్త.


కరోనా వ్యాక్సిన్‌ ధర విషయంలో సీరం సంస్ధ అధిపతి బందిపోటు మాదిరిగా వ్యవహరిస్తున్నారని, అత్యవసర చట్టాన్ని విధించి వాక్సిన్‌, ఇతర ఔషధాలను ప్రభుత్వం మొత్తంగా స్వాధీనం చేసుకోవాలని ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌ బిజెపి ఎంఎల్‌ఏ మండి పడ్డారు. కరోనా వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు 45 ఏండ్లు పై బడిన వారికే మా బాధ్యత అని తప్పుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసు 150 రూపాయలకు ఇచ్చిన వాక్సిన్‌ కంపెనీలలో ఒకటైన సీరం సంస్ధ తాజాగా కొత్త ధరలను ప్రకటించింది. ప్రయివేటు ఆసుపత్రులకు ఆరువందలు, రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగు వందల రూపాయలుగా ధర నిర్ణయించింది. కేంద్రానికి ఒక రేటు రాష్ట్రాలకు ఒక రేటు ఏమిటంటూ జనంలో తీవ్ర ప్రతికూల స్పందన వెలువడింది. సుప్రీం కోర్టుకు కూడా ఇది తాకినట్లు భావించవచ్చు.


ఒక వైపున వాక్సిన్లకు కొరత ఉందనే వార్తలు. మరోవైపున 18శాతం వరకు వృధా చేసిన రాష్ట్రాలు ఉన్నట్లు నివేదికలు. మార్చినెల 17వ తేదీ వరకు నమోదైన సమాచారం మేరకు 6.5శాతం అంటే 44 లక్షల డోసుల వాక్సిన్‌ వృధా అయింది. ఒక సీసా మూత తీసిన తరువాత నాలుగు నుంచి ఆరు గంటలలోపు దాన్ని ఉపయోగించకపోతే అది పనికిరాదు. అందువలన వాక్సిన్‌ తెచ్చుకోవటమే కాదు, వినియోగించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.తెలంగాణాలో 17.6శాతంతో ప్రధమ స్దానంలో ఉంది. నెల రోజుల తరువాత 12శాతంతో తమిళనాడు వృధాలో అగ్రస్దానంలో ఉందని వార్తలు వచ్చాయి. ఏ మాత్రం వృధాచేయని రాష్ట్రాలలో కేరళ ప్రధమ స్దానంలో ఉంది.


దేశంలో ఆక్సిజన్‌ కొరత ఉందని గతేడాది సెప్టెంబరునెలలోనే కేంద్రానికి తెలుసు. నివారణకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించామని నాటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ప్రకటించారు. గత నెల రోజుల్లోనే రోజుకు 26వేల కేసుల నుంచి మూడులక్షల 15వేలకు పెరిగాయి. ఇల్లు తగులబడుతుంటే బావి తవ్వకం ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు గురించి హడావుడి చేస్తున్నది. నూట అరవై రెండు జిల్లా కేంద్ర ఆసుపత్రులలో వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే ఏప్రిల్‌ 19 నాటికి పదకొండు ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయితే కేవలం ఐదు మాత్రమే ఉత్పత్తిలోకి వచ్చాయని ఒక వార్త, కాదు 33 ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనా మొత్తమైతే ఏర్పాటు చేయలేదు కదా ! వీటికోసం ఏడు నెలలుగా టెండర్లు పిలుస్తూనే ఉన్నారు. డబ్బుకేమైనా కొరత ఉందా ? పిఎం కేర్స్‌ పేరుతో విరాళం ఇమ్మని కేంద్రం బచ్చె పట్టుకుంటే ఎన్నివేల కోట్లు వచ్చాయో తెలిసిందే. ఆ సొమ్మును ఉపయోగించి కనీసం ప్లాంట్లను ఏర్పాటు చేయలేని అసమర్ద పాలనకొనసాగుతోంది. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఖర్చెంత కేవలం రెండు వందల కోట్ల రూపాయలు. అవి సాధారణ సమయాల్లో కూడా ఉపయోగపడేవే తప్ప మరొకటి కాదు. ఇవిగాక మారుమూల ప్రాంతాల్లో మరో వంద ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు కోరాయి. సాధారణ రోజుల్లో 100-150 రూపాయలుండే సిలిండర్‌ ధర రెండువేల వరకు పెరిగిపోయింది.పట్టించుకొనే దిక్కులేదు. వెంటిలేటర్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దేశంలోనే తయారు చేయగలం అని చెప్పారు. తప్పులేదు, ముందు జాగ్రత్త ఉంటే వాటిని తగినన్ని సిద్దంగా ఉంచుకుంటే ఎన్నో ప్రాణాలు నిలిచేవన్నది వాస్తవం కాదా ? కరోనా పోయిన తరువాత వాటిని జిల్లా, తాలూకా ఆసుపత్రులకు అందచేయవచ్చు కదా ?


కరోనా చికిత్సలో రెమిడెసివర్‌ ఎంత ప్రభావం చూపుతుందో ఇప్పటికీ తేలలేదు. అయినా వేలం వెర్రిగా దాని కోసం జనం ఎగబడుతున్నారు. ” ఈ నీచ సమాజంలో భాగమైనందుకు సిగ్గుగా ఉంది ” అని బోంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడింది. గతంలో తాము ఆదేశించిన విధంగా నాగపూర్‌ ఆసుపత్రులకు పదివేల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను ఎందుకు సరఫరా చేయలేదని మండి పడింది. దాని గురించి అధికారులు చెప్పిన వాదనలను కోర్టు అంగీకరించలేదు. ముంబై, పరిసర జిల్లాలకు ఎక్కువ సరఫరా చేస్తున్నారు, నాగపూర్‌తో సహా మిగతా ప్రాంతాలను పట్టించుకోవటం లేదని కేసు దాఖలైంది. కోర్టు ఈ వ్యాఖ్యలకు ముందు మహారాష్ట్రలో జరిగిన ఒక ఉదంతం ఆసక్తి కలిగించటమే కాదు, చివరికి కరోనాను కూడా సొమ్ము చేసుకొనే బిజెపి పన్నాగాన్ని బయట పెట్టింది.


కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్‌లో ఫ్యాక్టరీ, గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న బ్రక్‌ ఫార్మా కంపెనీ అరవై వేల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తుండగా ముంబై పోలీసులు పట్టుకున్నారు. కంపెనీ డైరెక్టర్‌ను పోలీసులు విచారించారు. ఆ చర్యను నిరసిస్తూ బిజెపి నేత అయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తన అనుచరులతో వచ్చి ఆందోళనకు దిగారు. వాటిని బ్లాక్‌ మార్కెట్లో విక్రయించేందుకు తరలిస్తున్నారని పోలీసులు అనుమానించారు. ఎఫ్‌డిఏ అధికారుల అనుమతితో తామే వాటిని కొనుగోలు చేశామని బిజెపి నేతలు తొలుత బుకాయించారు. అలాంటి అనుమతి లేదని తేలిపోయింది. ఎగుమతి కోసం తయారు చేసిన వాటిని నిషేధం కారణంగా స్దానిక మార్కెట్లో విక్రయించేందుకు అనుమతి కోరుతూ కంపెనీ అధికారులు ఔషధ యంత్రాంగానికి దరఖాస్తు చేశారు. వాటిని రాష్ట్రప్రభుత్వానికి విక్రయించవచ్చని అనుమతి ఇచ్చారు తప్ప బిజెపికి ఇమ్మని ఎక్కడా లేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు దానంగా ఇచ్చేందుకు కొనుగోలు చేశాం తప్ప బ్లాక్‌ మార్కెట్లో విక్రయించటానికి కాదని మరొక కహానీ చెప్పారు.


ఇక్కడ తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు లేవు. అదే నిజమైతే ముందుగానే బహిరంగంగానే ప్రకటించవచ్చుగా, తమ వంతు విరాళం అని ప్రచారం చేసుకోవచ్చు, దానిలో దాపరికం ఎందుకు ? నిజంగా బిజెపికి అంత దాతృత్వం ఉంటే దేశ వ్యాపితంగా రెమిడెసివిర్‌కు డిమాండ్‌ ఉన్నపుడు దేశమంతటికీ కాకుండా మహారాష్ట్రకే ఎందుకు ఇవ్వాలి. అసలు ఒక రాజకీయ పార్టీకి ఔషధాన్ని అమ్మటానికి సదరు కంపెనీకి అధికారం ఎక్కడుంది? అంటే ఆ పార్టీ రాజకీయ ప్రచారానికి సదరు కంపెనీ మద్దతు ఇచ్చినట్లే ? ప్రభుత్వం చేయలేని పనిని మేం చేస్తున్నామని చెప్పుకొనే చౌకబారు రాజకీయ ప్రయోజనం కోసం బిజెపి వేసిన ఎత్తుగడ తప్ప దీనిలో మరొకటి కనిపించటం లేదు. అంత కక్కుర్తి అవసరమా ? దేశ చరిత్రలో ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా ? కమ్యూనిస్టులు వివిధ సందర్భాలలో బహిరంగంగానే ధన, వస్తు రూపంలో బాధితులకు విరాళాలు వసూలు చేశారు. క్యూబా, పాలస్తీనా వంటి దేశాలకు ప్రభుత్వాలతో సంప్రదించే విరాళంగా వచ్చిన సొమ్ముతో వారికి అవసరమైన వాటిని కొనుగోలు చేసి పంపారు తప్ప ఇలాంటి పనులు చేయలేదు.


జనం ముందుకు కొందరు మహాత్ములు ఊరకరారు- అదే విధంగా కొందరు పోయేటపుడు ఊరికే పోరు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఏం జరుగుతుందో చూడటం తప్ప సామాన్యులం చేయగలిగింది ఏముంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాక్సిన్‌ దౌత్యం : డోనాల్డ్‌ ట్రంప్‌ ధైర్యం నరేంద్రమోడీకి ఎందుకు లేకపోయింది ?

21 Wednesday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Corona vaccine, US Vaccine Diplomacy, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


నిజమే, అవసరం మనదైనపుడు తగ్గి ఉండాలని పెద్దలు చెప్పిన బుద్దులు- సుద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సిందే-కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని లొంగి పోవాలని పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు ఏవీ చెప్పలేదే ? మన గత చరిత్ర కూడా అది కాదు కదా ! కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించకపోతే ఎవరికైనా ఏం గౌరవం ఉంటుంది. అయితే అందుకు తగిన దమ్మూ-ధైర్యం ఉండాలి. మనమూ అమెరికా విడదీయలేనంతటి సహ భాగస్వాములమని చెప్పారు. నిజమే కామోసు, మన నరేంద్రమోడీ గారిని చూసి భయపడకపోయినా అమెరికా మారు మనసు పుచ్చుకుందేమో అనుకున్నారు ఎందరో ! కానీ జరుగుతోందేమిటి ? కరోనాతో ప్రాణాలు పోతున్నా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను మనకు అందచేసేందుకు – సొమ్ము తీసుకొనే సుమా – మన సహ భాగస్వామి అంగీకరించటం లేదు. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా అబ్బే మేము నిషేధం పెట్టలేదు ట్రంప్‌ హయాంలో దుమ్ముదులిపిన మా చట్టాన్నే అమలు జరుపుతున్నాం, దాని ప్రకారం ఎగుమతి చేసేందుకు అవకాశం లేకపోతే మేమేం చేయగలం, ఎగుమతుల మీద పని గట్టుకొని నిషేధం అయితే లేదబ్బా …. ఏవమ్మా కమలా హారిస్‌ మీ పూర్వీకుల దేశం వారు ఏదేదో అంటున్నారు నువ్వయినా చెప్పమ్మా అన్నట్లుగా జో బైడెన్‌ మాట్లాడుతున్నారు. మీ అవసరాలను గుర్తించాంగానీ ఇప్పటికైతే మా చేయి ఖాళీ లేదు, ఏమీ చేయలేం అంటున్నారు అధికారులు. ఏం చేయాలో పాలుపోక మన నరేంద్రమోడీ గారి నోట మాట రావటం లేదు.(మామూలుగానే మాట్లాడే అలవాటు లేదు, కరోనా కదా నోరు విప్పుతారేమో అనుకున్నవారికి ఆశాభంగం).

సరిగ్గా ఏడాది క్రితం మన ప్రధాని నరేంద్రమోడీ జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలో కరోనా వ్యాప్తిని అలక్ష్యం చేసి ఎందరి ప్రాణాలను ఎలా తీశాడో చూశాము. ఆ సమయంలో మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ కరోనాకు కూడా దివ్వ ఔషధంగా పని చేస్తుందని ఎవరో చెప్పగానే మన దేశం దాని ఎగుమతుల మీద నిషేధం విధించింది. అది నిజమా కాదా అని నిర్దారించుకోకుండా తక్షణమే మాకు సరఫరా చేయండి లేకపోతే మన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాదిరి మీ తాట వలుస్తా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన విషయమూ-యాభై ఆరు అంగుళాల ఛాతీ గల మనదేశం వెంటనే ఎందుకంత కోపం కావాలంటే పంపకుండా ఉంటామా అంటూ ఆఘమేఘాల మీద అందచేయటం తెలిసిందే. శ్రీశ్రీ అన్నట్లుగా తారీఖులు, దస్తావేజులను పక్కన పెడితే శనివారం నాడు మనం నిషేధం విధించాం, ఆదివారం నాడు మోడీతో ట్రంప్‌ ఫోన్లో మాట్లాడాడు. సోమవారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ ఔషధాన్ని పంపకపోతే ప్రతీకార చర్యలు తీసుకుంటామని బహిరంగంగా బెదిరించాడు. మంగళవారం నాడు ఆంక్షలను సడలించి అమెరికాకు ఎగుమతి చేశాము. ఇదీ ఏడాది క్రితం జరిగిన ఉదంతం.


ఇంతేనా జర్మనీకి రవాణా అవుతున్న లక్షలాది మాస్కులు, తొడుగులను మధ్యలోనే అడ్డుకొని తమ దేశానికి మళ్లించుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ అదరగొండితనం కూడా అదే సమయంలో జరిగిన సంగతి తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో తాము దేశీయంగా చేసుకున్న రక్షణ ఉత్పత్తి చట్టానికి పదును పెట్టామని, దాని ప్రకారం అవి ఎగుమతి నిషేధ జాబితాలో ఉన్నాయని, తమ కంపెనీలు తయారు చేసినందున వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని అమెరికా సమర్ధించుకుంది. ఇప్పుడు కరోనా వాక్సిన్‌ కోవీషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు, ఇతర వస్తువుల సరఫరా మీద కూడా అదే చట్టాన్ని ప్రయోగించి ఎగుమతుల మీద జోబైడెన్‌ సర్కార్‌ నిషేధం విధించింది. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా తమ అవసరాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమ సహజ భాగస్వాములుగా వర్ణించి, ఉబ్బేసిన మన విషయంలో ఇవ్వటం లేదని తేలిపోయింది. ఎక్కడైనా బావే గానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ముద్దులాట వ్యవహారం దగ్గర మొహమాటానికి సిద్దమే గాని వ్యాపారం దగ్గర కాదు అంటే ఇదే. మనం నొప్పిని తట్టుకోలేని-బయటకు చెప్పుకోలేని స్దితిలో పడిపోయామా ?

అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ముడి సరుకులు నిండుకొని వాక్సిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని పూనాలోని సీరం సంస్ధ మార్చి తొమ్మిదవ తేదీన ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన వాక్సిన్‌ తయారీదారుల సమవేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఆరువారాలు గడచిపోయాయి. తమ నేత ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారని చెబుతున్న మోడీ భక్తులు గానీ, బహుశా గడ్డాన్ని చూసి విశ్వగురువు అని వర్ణిస్తున్నవారు గానీ, చివరికి నరేంద్రమోడీ గానీ ఈ విషయంలో ఇంతవరకు చేసిందేమీ లేదు. భారత వినతిని పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని జో బైడెన్‌ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఎప్పుడు ? తాత చచ్చి అవ్వ వితంతువు అయిన తరువాతనా అని తెలుగులో ఒక సామెత ఉంది. కరోనా కాటుకు మన జనం బలైన తరువాతనా లేక అమెరికా సంస్దలు తయారు చేస్తున్న వాక్సిన్ను మనం అధిక ధరలకు కొనుగోలు ఒప్పందం కుదిరిన తరువాత అనా ?


గతేడాది పిపిఇ కిట్ల తయారీ నిర్ణయాన్ని తీసుకోవటంలో జరిగిన జాప్యం గురించి వచ్చిన విమర్శలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక దేశాల్లో రెండవ, మూడవ కరోనా తరంగం వచ్చిన విషయమూ తెలిసినా ఒకవేళ మన దగ్గర వస్తే ఏం చెయ్యాలన్న ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. మరోసారి లాక్‌డౌన్‌ విధించే పరిస్ధితులను తెచ్చుకోవద్దని ఘనమైన ప్రధాని నరేంద్రమోడీ గారు నెపాన్ని జనం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.కరోనా మీద విజయం సాధించామన్న స్వంతడబ్బా ప్రకటనలు తప్ప మరోసారి వస్తే అన్న ముందుచూపు లేకపోయింది. గతేడాది అనేక చోట్ల ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రోగులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇరవైఆరులక్షల కోట్ల ఆత్మనిర్బర పాకేజీ గురించి గొప్పలు చెప్పుకోవటం తప్ప అది అవసరమై ఆక్సిజన్‌ అందించి ప్రాణాలను నిలిపేందుకు ఉపయోగపడలేదు. గతేడాది అనుభవాన్ని చూసి ఇప్పటికే ఆక్సిజన్‌ సరఫరాకు కొత్త ప్లాంట్లకు అనుమతి ఇచ్చి సిద్దం చేసి ఉంటే అనేక రాష్ట్రాల్లో కొందరు రోగులు దిక్కులేని చావు చచ్చేవారా ? ఒక్క సిలిండరు ఉత్పత్తికి కూడా పనికి రాని లక్షల కోట్ల పాకేజ్‌లు ఎందుకు ? ఇల్లుకాలుతుండగా నీటికోసం బావులు తవ్వినట్లుగా ఇప్పుడు వంద ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్లు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. కేవలం రెండు వందల కోట్ల రూపాయలతో 150 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు ఎనిమిది నెలలు పట్టిందంటే మన కేంద్ర ప్రభుత్వ నిర్వాకం ఎలా ఉందో ఇంతకంటే చెప్పాలా ? ఇలాంటి స్దితికి విచారించాలా, బాధ్యతా రాహిత్యాన్ని గర్హించాలా ? యుద్దం వస్తుందో రాదో తెలియకపోయినా లక్షల కోట్ల రూపాయల ఆయుధాలను కొని పెట్టుకుంటున్నాం. అవి కొంత కాలానికి పనికి రావని తెలిసినా కొనుగోలు చేస్తున్నాం. అలాంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్సిజన్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలా లేదా ? డబ్బుల్లేక అడుక్కుంటే ఇచ్చే దాతలు ఎందరు సిద్దంగా లేరు ?

మార్చినెల 26వ తేదీ నుంచి దేశంలో కరోనా అనూహ్యంగా వ్యాపిస్తోన్న విషయం తెలిసినా, అంతకంటే ముందే తయారీదార్లు హెచ్చరించినా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరకులు మీద నిషేధం ఎత్తివేయించేందుకు అమెరికా మీద ఎలాంటి వత్తిడీ ఎందుకు తేలేదు. గత వారం వరకు మన కేంద్ర మంత్రులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అన్నీ తానై చూసుకుంటున్న ప్రధాని ఏమి చేస్తున్నట్లు ? ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యతలో వందో వంతైనా ఇచ్చి ఉంటే అమెరికా నుంచి వస్తాయో రావో ఎప్పుడో తేలిపోయి ఉండేది. ప్రపంచం గొడ్డుపోలేదుగా ! మరో దేశం నుంచి తెచ్చుకొనేందుకు ప్రయత్నం చేసినట్లు కూడా ఎవరూ చెప్పటం లేదు. అమెరికా కోడి కూయకపోతే ప్రపంచానికి తెల్లవారదా ? వాక్సిన్‌ తయారు చేస్తున్న దేశాల్లో చైనా ఒకటి. కావాలంటే ముడిసరకులు సరఫరా చేస్తామంటూ వారు ముందుకు వచ్చారు. అక్కడి నుంచి తెచ్చుకొనేందుకు ఇబ్బంది ఏమిటి ? గాల్వన్‌ ఉదంతానికి, సరిహద్దు ఉద్రిక్తతలు, సమస్యలకు ఇతర అంశాలను ముడి పెట్టవద్దని వారు చెబుతున్నారు. అలాంటపుడు అక్కడి నుంచి తెచ్చుకుంటే తప్పేముంది?


చైనా నుంచి తెచ్చుకోవచ్చుగానీ వారి సరకుల నాణ్యత గురించి సందేహాలున్నాయి అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, వాటి మీదే ఆధారపడి ఉన్నాము. వాటికి లేని నాణ్యత సమస్య వాక్సిన్‌ ముడి పదార్దాలు, వస్తువులకు మాత్రమే వచ్చిందా ? ఎందుకీ సాకులు, ప్రాణాలు పోతున్నా రాజకీయమేనా ? చైనాలో తయారైన వాక్సిన్ను ఇతర దేశాలు వినియోగించటం లేదా ? కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకత ఎక్కిన వ్యవహారం తప్పితే మరొకటి ఏదైనా ఉందా ? నువ్వు మిత్రుడు అనుకుంటున్న అమెరికా వాడు ఇవ్వడు-శత్రువు అంటున్న చైనా వారు ఇస్తానంటే జనం ప్రాణాలను పోగొట్టటానికైనా సిద్దం అవుతున్నాము తప్ప తెచ్చుకోవటానికి ముందుకు కదలటం లేదు. ఇదేమి జవాబుదారీతనం ! ఇదేమి రాజధర్మం !! ప్రపంచంలో ఏదేశమూ ఎదుర్కోని విధంగా మన దేశంలో కరోనా విజృంభిస్తోందన్న కఠోర సత్యాన్ని కేంద్ర పాలకులు గుర్తిస్తున్నట్లు లేదు. బతికుంటే కావాలంటే తరువాత చైనాతో సమస్యలను తేల్చుకోవచ్చు. 1962లో యుద్దం జరిగిన తరువాత వివాదం ఉండగానే సాధారణ సంబంధాలు నెలకొల్పుకోలేదా, వాణిజ్యం చేయలేదా ? గాల్వన్‌లో మరో వివాదం వచ్చింది, ఆ పేరుతో ప్రాణావసరాలను కూడా తెచ్చుకోకుండా మడికట్టుకు కూర్చుందామా ? ఉత్తరాఖండ్‌ కుంభమేళాకు అనుమతి ఇస్తే కరోనా పుచ్చిపోతుందని అనేక మంది హెచ్చరించారు. అయినా బిజెపి పెద్దలు ఖాతరు చేయలేదు.మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఏమైంది, కరోనాతో అనేక మంది మరణించిన తరువాత మధ్యలోనే విరమించాలని ప్రధాని చెప్పాల్సి వచ్చిందా లేదా ? వాయిదా కూడదు కూడదు అని చెప్పిన అఖాడాలు బతుకు జీవుడా అంటూ మూటా ముల్లె సర్దుకొని గుడారాలు ఎత్తివేశాయా లేదా ?

ముప్పు పేరుతో అమెరికా ఆయుధవ్యాపారులు చెప్పిన ఆయుధాలన్నీ కొంటున్నాము. సమాచారం ఇస్తామంటే దానికీ ఒప్పందాలు చేసుకున్నాము. ఇటు నుంచి అటుపోవటం తప్ప అటు నుంచి ఇటు వచ్చిందేమీ లేదు. చైనా మీద, అదే విధంగా పెరుగుతున్న చమురు ధరల మీద మన ఆయుధాలను ప్రయోగిస్తామని చెప్పారు.చైనా యాప్‌లను నిషేధించారు, కొన్ని పెట్టుబడులను అడ్డుకొని, ఆయుధాలు కొనుగోలు చేసి అమెరికాను సంతోష పెట్టారు తప్ప మనం సాధించింది ఏమిటి? అమెరికా నుంచి వాక్సిన్‌ ముడిసరకులను అప్పనంగా అడిగామా ? ఆపదలో ఆదుకోని మిత్రుడి గురించి వెంపర్లాడటం ఎందుకు ? చైనా వస్తువుల కొనుగోలు మానుకుంటే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని, మనం చెప్పినట్లు వింటారని ప్రచారం చేశారు. అలాంటి సూచనలేమీ లేవు, తొలి మూడు మాసాల్లో 18శాతం అభివృద్ది రేటు సాధించినట్లు వార్తలు వచ్చాయి. కీలకమైన లడఖ్‌ సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యాలు పూర్వపు స్ధానాలకు తగ్గాలంటే మనం పెడుతున్న ప్రతిపాదనలను అంగీకరించటం లేదు. అంటే మన వత్తిడిలో పసలేదని తేలిపోయింది. అమెరికా అండ చూసుకొని ఆయాసపడటం అవసరమా ? పోనీ చమురు ఎగుమతి దేశాల మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పినట్లు దిగుమతి ఆయుధ ప్రయోగంచేసి వత్తిడి తెచ్చి చమురు ధరలు తగ్గించామా అంటే అదీ లేదు. చివరకు చమురును కూడా అమెరికానుంచే కొనుగోలు చేస్తున్నాము. గల్ఫ్‌, పశ్చిమాసియా దేశాలను శత్రువులుగా చేసుకుంటున్నాము. చతుష్టయ కూటమి నుంచి తప్పుకుంటాము, ఆయుధాలు, చమురు కొనుగోలు నిలిపివేస్తాము అంటే అమెరికా దిగిరాదా ? జనం చస్తున్నా ఎందుకీ లొంగుబాటు ?ముడి పదార్దాల సరఫరా గురించి మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా మంత్రితో మాట్లాడామని చెప్పారు తప్ప ఫలితం ఏమిటో వెల్లడించలేదు. వాక్సిన్లకోసం ముడి సరకులు సజావుగా అందేందుకు అందుబాటులో ఉంచాలని పెద్ద దేశాలను కోరినట్లు జై శంకర్‌ చెప్పారు. అలాంటపుడు సూటిగానే చైనా నుంచి ముడిసరకులను ఎందుకు తీసుకోకూడదు ?

వాక్సిన్‌ రాజకీయాల్లో భాగంగా చతుష్టయ దేశాలైన అమెరికా, జపాన్‌, భారత్‌,ఆస్ట్రేలియా కూటమి వాక్సిన్‌ తయారీకి చర్యలు తీసుకొని చైనా పలుకుబడిని తగ్గించాలని నిర్ణయించాయి. దానిలో భాగంగా మన దేశానికి వాక్సిన్‌ ముడి పదార్దాలతో పాటు అమెరికా, జపాన్‌ నుంచి పెట్టుబడులూ వస్తాయని చెప్పారు. బ్రిటన్‌ ఆస్ట్రాజెనెకాతో పాటు సీరం సంస్ద అమెరికాకు చెందిన నోవాక్స్‌ వాక్సిన్‌ కూడా తయారీకి ఒప్పందం చేసుకుంది. పోనీలే రాజకీయం చేస్తే చేశారు, ఏదో ఒక పేరుతో వాక్సిన్‌ అందించేందుకు పూనుకున్నాయి అని సంతోషించిన వారికి ముడిసరకులను బ్లాక్‌చేసిన అమెరికా తానే మోకాలడ్డింది. దీంతో కోవిషీల్డ్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది, నోవాక్స్‌ ప్రారంభానికి నోచుకోలేదు.


తూర్పు చైనాలోని జియాంగ్‌సు రాష్ట్రంలో ఔషధాలు తయారు చేస్తున్న కంపెనీ ప్రతినిధి చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌తో మాట్లాడుతూ ఇప్పటికే తాము భారత్‌కు సరఫరా చేస్తున్న సోడియం క్లోరైడ్‌ను వైద్య అవసరాలకు వినియోగిస్తున్నారని, దానిలో కొంత వాక్సిన్లకూ ఉపయోగించవచ్చని చెప్పారు. ప్రస్తుతం తాము దేశీయ అవసరాలకోసమే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఇతర దేశాలు కోరితే వాటికీ అందచేసే సామర్ధ్యం తమకు ఉందని చెప్పారు. షాంగ్‌డోంగ్‌ రాష్ట్రానికి చెందిన మరో సంస్ధ ప్రతినిధి మాట్లాడుతూ ఔషధాలకు అవసరమైన సీసాల తయారికి వినియోగించే సిలికాన్‌ గ్లాస్‌ను తయారు చేస్తున్నామని, ఏటా ఐదు కోట్ల సీసాలు తయారు చేయగలమని అవసరమైతే విదేశాలకూ అందచేయగలమని చెప్పారు. క్యూబాలో వాక్సిన్‌ తయారు చేసినా దానిని సరఫరా చేసేందుకు అవసరమైన సీసాల తయారీ సమస్యగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి, అదే పరిస్ధితి మన దేశంతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఉంది.


మనకు అవసరమైన వాక్సిన్ల తయారీకి విదేశాల్లో కూడా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. మంచిదే ! మన పాలకులు చేయాల్సిందేమిటి ? ప్రయివేటు కంపెనీలను నమ్ముకొని మన ఐడిపిఎల్‌ను మూతపెట్టాము, వాక్సిన్‌ తయారీ కేంద్రాలలో చెట్లు మొలిపిస్తున్నాము.లాభాలే ధ్యేయంగా పని చేసే సీరం సంస్దలో ఉత్పత్తిని పెంచటానికి 1500 కోట్ల రూపాయల రుణాన్ని ఎలాంటి హామీలు లేకుండా ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తప్పులేదు, తమిళనాడులో ఆరువందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సమగ్ర వాక్సిన్‌ కేంద్రాన్ని ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారు ? ఇలాంటివే ఇంకా కొన్ని సంస్ధలు ఉన్నాయి. యుద్ద ప్రాతిపదికన వాటిని కరోనా వాక్సిన్ల తయారీకి ఎందుకు ఉపయోగించటం లేదు ? ఎవరి ప్రయోజనాలకోసమీ నిర్లక్ష్యం ? ఇంత పెద్ద దేశంలో ఎప్పుడే అవసరం ముంచుకు వస్తుందో తెలియదు. అవసరం తీరిన తరువాత ఇతర వాక్సిన్లను తయారు చేయవచ్చు, ఇతర దేశాలకు ఎగుమతికి ఉపయోగించవచ్చు. ప్రభుత్వ రంగంలో ఔషధతయారీని మూతపెట్టిన కారణంగా ఈ రోజు అవసరమైన డెమిసెవిర్‌ వంటి ఔషధాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు. మహారాష్ట్రలో అలా దొరికిపోయిన దొంగలకు మద్దతుగా ఆ రాష్ట్ర బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ధర్నాకు దిగారంటే ఏమనుకోవాలి. తీరా అసలు విషయం బయటపడిన తరువాత మహారాష్ట్ర కోసమే డామన్‌ కంపెనీ నుంచి తెప్పిస్తున్నట్లు మాట మార్చారు. అంటే అక్కడి శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం చేతగానిదైంది, మా పలుకు బడి ఉపయోగించి తెచ్చామనే చౌకబారు చావు రాజకీయం తప్ప దీనిలో ఏమైనా ఉందా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

హతవిధీ ! విమర్శించిన నెహ్రూ బాటలోనే నరేంద్రమోడీ !!

11 Sunday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti Dumping Duties, India Protectionism, Jawaharlal Nehru, Narendra Modi, Trade Protectionism, WTO


ఎం కోటేశ్వరరావు


జవహర్‌లాల్‌ నెహ్రూ, నరేంద్రమోడీ ఇద్దరూ పాలకవర్గాల సేవకులే అనటంలో మరో మాట లేదు. ఒకరు పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా అధికారంలో ఉంటే మరొకరు ఇప్పటి వరకు ఏడు, మరో మూడు సంవత్సరాలు ఉండబోతున్నారు. దేశం కోసం అనే పేరుతో ఇంకేదైనా చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. మనం అనేక రంగాలలో వెనుకబడి ఉండటానికి నెహ్రూ, తరువాత కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే కారణం అని సంఘపరివార్‌ అంశ నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ సందుదొరికినపుడల్లా దుమ్మెత్తి పోయటం తెలిసిందే. కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో సాధించలేని దానిని తాము ఐదేండ్లలో అమలు చేశామని చెప్పుకొనే వారు ఆ పాచిపాట ఇంకేమాత్రం పాడలేరు. దేశ అభివృద్దికి సంబంధించి నిరంతరం చర్చ జరగాల్సిందే. అధికారంలో ఉన్న ఎవరి విధానాలనైనా విమర్శనాత్మకంగా చూడాల్సిందే. చిత్రం ఏమిటంటే నెహ్రూ విధానాలను విమర్శించటం దేశభక్తి, నరేంద్రమోడీ ఏలుబడిని తప్పుపట్టటం దేశద్రోహంగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోంది ? తిరుగుతున్న చట్రంలో ఏ దేశం ఎక్కడ ఉంది ? వాటిలో మార్పుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, వాటి పర్యవసానాలేమిటి ? వీటి అంతరార్దం ఏమిటి ? కార్పొరేట్ల లాభాలుా, అందుకోసం రక్షణాత్మక చర్యలు. ధనిక దేశాలు, వాటిని అనుసరించాలని చూస్తున్న దేశాల విధానాల సారమిదే !

వాణిజ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో)ను ఏర్పాటు చేశారు. వివాదాలు తలెత్తితే విచారించి తీర్పు చెప్పేందుకు ఒక న్యాయస్ధానం ఉంటుంది. దానికి న్యాయమూర్తులను నియమించేందుకు అమెరికాలో అధికారంలో ఉన్న ట్రంప్‌ నిరాకరించాడు, ఇప్పుడు జో బైడెన్‌ అదే బాటలో నడుస్తున్నాడు. కనుక ఎవరైనా దానికి ఫిర్యాదు చేస్తే వెంటనే తేలదు. మనం అమెరికా, ఇతర విదేశీ కంపెనీలపై డిజిటల్‌ సర్వీసు టాక్సు(డిఎస్‌టి) వేశాము. దాని మీద డబ్ల్యుటిఓకు వెళితే వెంటనే తేలదు. అది తెలుసు గనుక దానితో నిమిత్తం లేకుండా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల మీద అమెరికా 25శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించింది.ఈ వివాదం ఎక్కడ తేలాలి ? తెలియదు !
చైనా నుంచి దిగుమతి చేసుకొనే సౌర విద్యుత్‌ పలకలు, సంబంధిత పరికరాలపై మన ప్రభుత్వం రక్షణ పేరుతో 2018లో విధించిన పన్ను గడువు ఈ ఏడాది జూలైలో తీరి పోనుంది. అందువలన సోలార్‌ ఫొటోఓల్టాయిక్‌ మోడ్యూల్స్‌(పివి) మీద 40శాతం, సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌ మీద 25శాతం చొప్పున దిగుమతి పన్నును 2022 ఏప్రిల్‌ నుంచి విధించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని డబ్ల్యుటివోలో సవాలు చేసినా వెంటనే తేలదు కనుక చైనా కూడా పోటీగా ప్రతీకార చర్య తీసుకుంటుంది. దానికీ అదే గతి, కనుక ఏం చేయాలి ? తెలియదు ! అలాంటపుడు జరిగేదేమిటి ? ఆయా దేశాల సామర్ధ్యం ముందుకు వస్తుంది. అది లేని దేశాలు మిగతావాటికి లొంగిపోతాయి. లేదూ తమకూ కొన్ని ప్రత్యేకతలు ఉంటే వాటిని తురుపుముక్కగా ఉపయోగించి రాజీకి వస్తాయి. మన దేశంలో సౌర విద్యుత్‌ తయారీకి అవసరమైన పరికరాకావచ్చు, మరొకటి కావచ్చు స్వంతంగా తయారు చేసుకుంటే ఎవరికీ లొంగాల్సిన, రాజీ పడాల్సిన పని లేదు.

ఇప్పుడున్న పరిస్దితి ఏమిటి ? ఈ ఏడాది మార్చి 24న అమెరికన్‌ ప్రాస్పెక్ట్‌ అనే పత్రిక ప్రచురించిన సమాచారం ప్రకారం సౌర విద్యుత్‌కు అవసరమైన నాలుగు పరికరాల విషయంలో ప్రపంచ సామర్ధ్యం ఇన్‌గాట్స్‌లో 95, వేఫర్స్‌లో 99,పివి సెల్స్‌ 80,పివి మోడ్యూల్స్‌లో 75శాతం చైనా వాటాగా ఉంది. ఈ రంగంలో చైనా తన సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకొంటోంది. దీనికి సాంకేతికపరిజ్ఞానంతో పాటు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం. ఇలాంటి పరిస్దితిలో అమెరికాను మెప్పించేందుకో మరొకందుకో చైనా దిగుమతుల మీద పన్నులు పెంచితే మనం దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవటం అనుమానాస్పదమే అనే వారిని దేశద్రోహులుగానో, స్వదేశీ పరిశ్రమ మీద ప్రేమ లేని వారుగానో ముద్రవేస్తారు. సంప్రదాయ విద్యుత్‌ బదులు ప్రత్యామ్నాయ సౌర విద్యుత్‌ మీద కేంద్రీకరించే దేశాలకు చైనా తన వస్తువులను ఎగుమతి చేస్తుంది. దానికి పోయేదేమీ లేదు. మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించుదాం !


మన దేశంలో సోలార్‌ పానల్స్‌ తయారీలో బోరోసిల్‌ అనే కంపెనీ ఉంది. అది తయారు చేసేవి మన అవసరాలకు చాలవు.దీనికి తోడు సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసే వారు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య మన దేశంలో తయారయ్యే పివి సెల్స్‌ తయారీదారులు చెప్పుకున్నమాదిరి సామర్ద్యం కలిగినవి కాదన్నది విమర్శ. నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే ప్రభుత్వ సంస్దలు లేని కారణంగా ఎవరిష్టం వచ్చినట్లు వారు తమ ఉత్పత్తుల గురించి చెప్పుకుంటున్నారు. అది ఆయా సంస్దల గిట్టుబాటును కూడా ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 32గిగావాట్లు కాగా మన సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి మూడు, మాడ్యుల్స్‌ ఉత్పత్తి ఐదు గిగావాట్లకే సరిపోతుంది. మిగిలినదంతా చైనా నుంచి దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఏడు సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ సారధిగా మారాలని చాలా మంది ఆశించగా వాస్తవ పరిస్ధితి ఇలా ఉంది. దేశభక్తి ప్రదర్శన కాదు, ఆచరణలో చూపాలి మరి. మన దేశంలో సోలార్‌ పానల్స్‌ తయారు చేస్తున్న కంపెనీకి దన్నుగా కేంద్రం దిగుమతి సుంకాలు విధించి రక్షిస్తోంది.

మన దేశ పరిశ్రమలను రక్షించుకోవాలనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వానికి వ్యాపారంతో పని లేదు అని చెబుతున్న పాలకులు నిత్యం వ్యాపారుల సేవలోనే మునిగితేలుతున్నారు.విశాఖ ఉక్కు వంటి వాటిని రక్షించుకొనేందుకు అవసరమైన చర్యలను నిరాకరిస్తున్న పాలకులు విదేశీ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టేందుకు పూనుకోవటం ఏమిటి ? ఇక్కడా చేస్తున్నది దేశానికి దివాలాకోరు-విదేశాలకు లాభాల వ్యాపారమే. ఒకవైపు స్వేచ్చా వాణిజ్యం అని చెబుతారు, సులభతర వాణిజ్యంలో మన స్దానం ఎంతో మెరుగుపడింది చూడమంటారు. కానీ ఆచరణలో ఎలా ఉన్నారు.మనం చైనా ఉత్పత్తుల మీద సుంకాలు విధిస్తున్నాం. చైనా మనకు ఎంత దూరమో మనమూ చైనాకు అంతే దూరంలో ఉంటాం. ఒకరు రాళ్లు వేస్తుంటే మరొకరు పూలు వేస్తారా ? మన భాగస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఏం చేస్తోందో చూశాము. శత్రుదేశం అంటూ నిత్యం కత్తులు దూస్తున్న చైనా ప్రతికార చర్యలకు పూనుకోకుండా ఎలా ఉంటుంది?


మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే దున్న-బర్రె మాసం, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల మీదచైనా ఆంక్షలు విధించింది. దాన్ని సవాలు చేస్తూ తాజాగా మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్దకు ఫిర్యాదు చేసింది. గాళ్లు లేదా గాలి కుంటు వ్యాధి ముప్పు కారణంగా దున్న-బర్రె మాంసాన్ని నిషేధిస్తున్నామని, అదే విధంగా రొయ్యల గురించి తగినంత సమాచారం లేనందున వాటినీ నిషేధిస్తున్నట్లు చైనా చెబుతోంది. రొయ్యల్లో ఉండే వైరస్‌ మానవులకు హాని కలిగించేది కాదనే నిర్ధారణ పత్రాలు కావాలని చైనా చెబుతోంది. అయితే కొత్త నిబంధనలను ముందుకు తెస్తూ అడ్డుకుంటున్నదని, ఆ మేరకు నిర్దారణ పత్రాలను మనం ఇవ్వలేమని మన దేశం వాదిస్తోంది. నిజం చెప్పుకోవాలంటే చైనాతో మన సర్కారు వివాదం, పెట్టుబడులపై ఆంక్షలు, దిగుమతులపై సుంకాల విధింపు అసలు కారణం అని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సరంలో మన దేశం 680కోట్ల డాలర్ల మేర సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయగా వాటిలో ఐదోవంతు చైనా 130 కోట్ల డాలర్ల సరకు దిగుమతి చేసుకుంది.2020-21లో దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. దున్న-బర్రె మాంసం పరిస్ధితి కూడా ఇంతే.

మనం నిత్యం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ సీసాలు, గ్లాసులను పోలిథిలిన్‌ టెరెఫాథలేట్‌(పెట్‌ రెసిన్‌) అనే పదార్ధంతో తయారు చేస్తారు.దీన్ని మన దేశంలో రిలయన్స్‌, ఇండో రమా కంపెనీలు ప్రధానంగా తయారు చేస్తాయి. వీటి వాటా 91శాతం ఉంది.అత్యధిక భాగం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ రెండు కంపెనీలు తమకు రక్షణ కల్పించాలని కోరిన మేరకు ఏడాది తరువాత నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే విధంగా రానున్న ఐదు సంవత్సరాల పాటు చైనా దిగుమతుల మీద నాణ్యతను బట్టి టన్నుకు 16.92 నుంచి 200.66 డాలర్ల మేరకు దిగుమతి పన్ను విధించాలని నిర్ణయించింది. పెట్‌తో శీతల పానీయాల, మంచినీటి సీసాలు, జాడీల వంటివి తయారు చేస్తారు. 2018లో చైనా నుంచి 88,247 టన్నులు దిగుమతి చేసుకోగా 2019లో అది 147,601 టన్నులకు పెరిగింది. దీంతో చైనా దిగుమతులపై పన్ను విధించాలని రిలయన్స్‌, ఇండోరమా కంపెనీలు డిమాండ్‌ చేశాయి. లడఖ్‌ వివాదానికి ముందే ఈ కంపెనీలు కేంద్రం ముందు వత్తిడి తెచ్చాయి. ఆ సాకుతో దానికి మోడీ సర్కార్‌ తలొగ్గింది. దీనికి ఆత్మనిర్భర ముసుగు తొడిగింది. రక్షణ చర్యల పేరుతో ప్రతి దేశం తమ కార్పొరేట్ల ప్రయోజనాలకు పూనుకుంటే స్వేచ్చా వాణిజ్యం, పోటీ తత్వం గురించి చెప్పే కబుర్లకు విలువ ఉండదు. చైనా వస్తువులపై 200 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి సుంకాలు విధించిన అమెరికా చర్యను ప్రపంచ వాణిజ్య సంస్ధ విమర్శించింది.


నిజానికి రక్షణ చర్యలు మన దేశానికి కొత్తేమీ కాదు. జవహర్‌లాల్‌ నెహ్రూ పాలన ప్రారంభమైన తరువాత అంతకు ముందు మాదిరి తమ వస్తువులకు మార్కెట్‌గా భారత్‌ను మార్చుకోవాలని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు భావించాయి. మన దేశంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందచేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రాలేదు. అప్పటికి మన పారిశ్రామికవేత్తలకు భారీ పెట్టుబడులు పెట్టగలిగిన సత్తా లేదు. అంతకు మించి పెట్టి లాభాలు సంపాదించగలమనే ధైర్యమూ లేదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, వాణిజ్యానికి నాటి ప్రభుత్వం పునాదులు వేసింది. వాటిని ఆధారం చేసుకొని అనేక మంది పెట్టుబడిదారులు లబ్ది పొందారు, తమ పరిశ్రమలకు వాటిని ఆలంబనగా చేసుకున్నారు. హైదరాబాదులోని ఐడిపిఎల్‌లో పని చేసిన అనుభవాన్ని ఔషధ రంగంలో పరిశ్రమల స్ధాపనకు వినియోగించుకొని నేడు ఆ రంగాన్ని శాసిస్తున్న రెడ్డీలాబ్స్‌ వంటి కంపెనీల యజమానుల గురించి చెప్పనవసరం లేదు. ప్రయివేటు రంగం ముందుకు వచ్చిన తరువాత ఐడిపిఎల్‌ను మూసివేయించారు. అన్ని రంగాల్లోనూ అదే జరుగుతోంది. నాడు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, దానికి ఆలంబనగా చేసేందుకు నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించారు. నేడు వాటి అవసరం తీరిపోయింది గనుక ఆ ప్రభుత్వ రంగ సంస్దలను ప్రయివేటు వారికి తెగనమ్మి లేదా మూసివేసి లబ్ది చేకూర్చేందుకు నరేంద్రమోడీ అదేపని చేస్తున్నారు.ఐడిపిఎల్‌ను మరింతగా విస్తరించి జనానికి చౌకగా ఔషధాలు అందించవచ్చు, కానీ ప్రభుత్వం వ్యాపారం చేయదనే పేరుతో వదిలించుకుంటున్నారు.
1991 నుంచి నూతన ఆర్ధిక విధానాల పేరుతో మన దేశం విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవాలన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ఈ పని చేశారు. అప్పటి నుంచి మూడు దశాబ్దాల కాలంలో పదమూడు సంవత్సరాలు అతల్‌ బిహారీ వాజ్‌పాయి, నరేంద్రమోడీ ఏలుబడే ఉన్నది. సాధించింది ఏమిటి ? 2014లో అధికారానికి వచ్చిన మోడీ దగ్గర మంత్రదండం ఉందని, అద్భుతాలు చేస్తారని దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ రంగం, దానికి వెన్నుదన్నుగా ఉండే మీడియా ఊదరగొట్టింది.అలాంటిదేమీ లేకపోగా తిరోగమనంలో నడుస్తోందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. పెద్ద దేశాలతో పోలిస్తే భారత్‌లోనే రక్షణ లేదా దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన సమయంలో తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. సంస్కరణలను మరింత వేగవంతం చేస్తానని మోడీ కూడా చెప్పారు.


కాంగ్రెస్‌ హయాంలో అయినా, మోడీ ఏలుబడిలో అయినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఆశించిన మేరకు రాలేదు. వాటికి బదులు మన దేశంలో ఉన్న పరిశ్రమలు, వాణిజ్యాల షేర్‌మార్కెట్లో వాటాల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టి లాభాలను తరలించుకుపోయే (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు, వడ్డీ వసూలు చేసుకొనే అప్పుల రూపంలో మాత్రమే ఎక్కువగా వచ్చాయి. మన దేశానికి రావటం గొప్ప అన్నట్లుగా పాలకులు, వారికి వంతపాడే అధికార యంత్రాంగం చెబుతోంది.మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, వాటిద్వారా వచ్చే లాభాల కోసం తప్ప మనకు మేలు చేసేందుకు కాదు అన్నది గమనించాలి.

నెహ్రూ హయాంలో అనుసరించిన విధానం అభివృద్ధికి దోహదం చేయలేదని కొంత మంది విమర్శిస్తారు. దాన్ని తప్పుపట్టనవసరం లేదు. వారు ప్రత్యామ్నాయంగా సూచించిన విధానాల పర్యవసానం ఏమిటి? 1990దశకానికి ముందు మన పారిశ్రామిక వస్తువులకు రక్షణగా దిగుమతుల మీద గరిష్టంగా విధించిన పన్ను మొత్తం 355శాతం ఉంటే సగటు 126శాతం. తరువాత 2010-11 నాటికి అవి 10-9.5శాతాలకు తగ్గాయి.2020-21లో 10-11.1శాతాలుగా ఉన్నాయి. నరేంద్రమోడీ హయాంలో తిరిగి రక్షణాత్మక చర్యలు ప్రారంభమయ్యాయి.2020జూన్‌ నాటికి వివిధ దేశాల్లో అమల్లో ఉన్న దిగుమతి వ్యతిరేక చర్యల వివరాలు ఇలా ఉన్నాయి.(ది.ని- దిగుమతి నిరోధ చర్యలు),ప్ర.వా.వా-ప్రపంచ వాణిజ్యంలో వాటాశాతం )
దేశం××× ది.ని ××× సుంకం×××× ప్ర.వా.వా
అమెరికా× 398 ××× 71 ×××× 13.3
భారత్‌ × 243 ××× 98 ×××× 2.5
చైనా × 156 ××× 4 ×××× 10.8
బ్రెజిల్‌ × 111 ××× 4 ×××× 1
ఆస్ట్రేలియా× 71 × 15 ×××× 1.2
గతంలో నెహ్రూ లేదా కాంగ్రెస్‌ హయాంలో రక్షణాత్మక చర్యలు ఎక్కువగా తీసుకున్నారు, వాణిజ్యానికి ఆటంకాలు ఎన్నో కలిగించారు. మేము వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్న బిజెపి పెద్దలు ఏ దేశంతో పోల్చుకొని చెబుతున్నట్లు ? ప్రపంచ వాణిజ్యంలో మనవాటా శాతంతో పోల్చితే అవి ఎక్కువగా తక్కువా అన్నది చెప్పాలి. 1990దశకానికి ముందు, తరువాత గణాంకాలను చూసినపుడు ఎగుమతులు-దిగుమతుల ధోరణి ఒకే విధంగా ఎందుకు ఉన్నట్లు ? గతంలో స్వావలంబన అని చెప్పినా, ఇప్పుడు మేకిన్‌ ఇండియా, స్ధానిక వస్తువులనే కొనండి, ఆత్మనిర్బర్‌ అని ఏ పేరు చెప్పినా దిగుమతులదే పై చేయి ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? యుపిఏ కాలంలో పెరిగిన ఎగుమతి-దిగుమతులు నరేంద్రమోడీ హయాంలో రెండూ ఎందుకు పడిపోయినట్లు ? ఉపాధి ఎందుకు పెరగటం లేదు, ఎందుకు తగ్గుతోంది ?
పెద్ద పరిశ్రమలను ప్రోత్సహించిన నెహ్రూ విధానంలో దుస్తులు, పాదరక్షలు,ఫర్నీచర్‌ వంటి వాటిని చిన్న లేదా కుటీర పరిశ్రమలుగా వర్గీకరించి వాటికి రక్షణ కల్పించారని, ఫలితంగా అవి గిడసబారి పోయినట్లు విమర్శ చేసే వారున్నారు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు బడా రంగం అది కూడా రక్షణ లేకపోతే విదేశీ దిగుమతుల దెబ్బకు విలవిల్లాడుతున్నాది. చిన్న పరిశ్రమల సంగతి సరేసరి మూతపడుతున్నవాటి సంఖ్యే అందుకు నిదర్శనం.చిన్న సన్నకారు పరిశ్రమల నుంచి ప్రభుత్వ రంగ సంస్ధలు కొనుగోలు చేయాలన్న రక్షణ విధానాలకు గతంలో అనుసరించిన వాటికి తేడా ఏమిటి ? కరోనా సమయంలో వాటికి ఇవ్వాల్సిన బకాయిలను కూడా మోడీ సర్కార్‌ చెల్లించలేకపోవటం వివాదంగా మారిన విషయం తెలిసినదే.

మన దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఘోరంగా విఫలమైంది. దిగుమతుల నిరోధానికి విధించే పన్ను శాతాలు పెరుగుతున్నాయి. మనం ఆ పని చేస్తే మన వస్తువులను దిగుమతి చేసుకొనే దేశాలూ అదే చేస్తాయా లేదా ? మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో మోడీ అండ్‌కో చెబుతారా ? ప్రభుత్వం వాణిజ్యం చేయకూడదంటూ విశాఖ ఉక్కు వంటి సంస్ధలను తెగనమ్మేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం అమలు జరిపే ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పధకం వంటి వాటి సంగతేమిటి ? విశాఖ ఉక్కు వంటి వాటికి ఈ పధకాన్ని ఎందుకు అమలు జరపరు ? ప్రయివేటు రంగం ముద్దు-ప్రభుత్వరంగం వద్దా ! భారీ పెట్టుబడులు-కార్మికులు తక్కువగా ఉండే ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు ఐదేండ్ల పాటు నాలుగు నుంచి ఆరుశాతం రాయితీలు ఇస్తామని ప్రకటించారు. పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలు తమ సంగతి తాము చూసుకుంటాయి కదా వాటికి జనం సొమ్ముతో రాయితీలు ఇవ్వటం ఏమిటి ? ఇది రక్షణాత్మక చర్య కాదా ? భారీ పెట్టుబడులు, ఆటోమేషన్‌తో పనిచేసే సంస్ధలే ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. వాటిలో ఉపాధి తక్కువ. అదే తక్కువ పెట్టుబడి, ఎక్కువ మంది కార్మికులు పని చేసే పరిశ్రమలు వాటితో పోటీ పడలేవు. అంటే బడా కంపెనీలకే ప్రోత్సాహకాలు ఇస్తే ఈ సంస్ధలేమి కావాలి ? విదేశాలు కూడా అదే పని చేస్తే మన ఉత్పత్తులు పోటీ పడతాయా ? నెహ్రూ విధానాలను విమర్శించేవారు తాము చేస్తున్నదేమిటి ?


నినాదాలు జనాన్ని ఆకర్షిస్తాయి తప్ప అమలు సందేహమే.అయితే చైనా అందుకు మినహాయింపుగా ఉంది. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారన్న లెనిన్‌ మాటలు తెలిసిందే. మన దేశంలో గరీబీ హటావో నినాదం అలాంటిదే.ఇప్పుడు ఆత్మనిర్భరత కూడా అలాంటిదే అని అనేక మంది అభిప్రాయం. మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచిన తరువాత వస్తున్న పోటీని స్ధానిక పరిశ్రమలు, వాణిజ్యం తట్టుకోలేకపోతోంది. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పుడు చేస్తున్నది అదే. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య(ఆర్‌సిఇపి) ఒప్పందంలో చేరకపోవటం కూడా రక్షణాత్మక చర్యల్లో భాగమే. దానిలో చేరితే మిగతాదేశాల సరకుల మీద దిగుమతి పన్నులు తగ్గించటంతో పాటు వాటిని అనుమతించాల్సి ఉంటుంది. మనకు ఎగుమతి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ సామర్ధ్యం లేని కారణంగా బలమైన వారే ఉట్టి కొడతారు. మన ఎగుమతి అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. గత ఐదు సంవత్సరాలలో టారిఫ్‌ కోడ్‌లో ఉన్న 5,500కు గాను 3,600 వస్తువుల విషయంలో దిగుమతి సుంకాలు పెరిగాయి. గత ఏడాది కాలంలోనే ఆరువందల వస్తువుల మీద పన్నులు పెరిగాయి. నెహ్రూను విమర్శించేవారు తాము కక్కిన దానిని తామే తినటం అంటే ఇదే. ఇప్పటికే ప్రయివేటు రంగం పరిశోధన-అభివృద్దికి చేస్తున్నదేమీ లేదు, ఇక వాటికి రక్షణ కల్పిస్తే రాయితీలు మింగి మరింతగా పెరుగుతాయి తప్ప వినియోగదారులకు ప్రయోజనం ఏముంటుంది ?

అద్భుతాలు సృష్టించిన దేశాలుగా పేరు పడిన వాటిలో దక్షిణ కొరియా ఒకటి. ఇప్పుడు ఆ దేశ పరిస్ధితి ఏమిటి ? ప్రభుత్వం ఇచ్చిన మద్దతుకారణంగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అది పురోగతి సాధించిన మాట వాస్తవం. అమెరికా రక్షణలో ఉన్న కారణంగా మిలిటరీ వ్యయం తక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం ప్రయివేటు రంగానికి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చింది. ఇప్పుడు దానికి చైనా రూపంలో పోటీ ఎదురైంది. అక్కడి సంస్ధలు కార్యకలాపాలను పరిమితం చేయటం, ఉత్పత్తులను నిలిపివేయటం వంటి చర్యలకు పూనుకున్నాయి.1998 తరువాత తొలిసారిగా 2019లో దాని జిడిపి ఒకశాతం తిరోగమనంలో ఉంది. కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేసేందుకు ప్రపంచ వ్యాపితంగా పెద్ద ఎత్తున కంప్యూటర్లు అవసరమై అక్కడి సంస్ధలు ఎగుమతులతో 2020లో నిలదొక్కుకున్నాయి గానీ లేకుంటే పరిస్ధితి ఏమిటి ? అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేస్తున్న వడ్డీ రేటు కేవలం 0.5(అర)శాతమే. అటువంటి రాయితీ ఇచ్చే స్ధితిలో మన దేశం లేదు. అలాంటపుడు బస్తీమే సవాల్‌ అన్నట్లుగా అమెరికా అండచూసుకొని మనకంటే బలవంతుల మీద మీసాలు మెలివేయటం తగనిపని. వాణిజ్య యుద్దంలో అమెరికా వారే కిందామీద పడుతుంటే మనం నిలవగలమా ? చైనా మాదిరి వస్తువులను ఎగుమతి చేయాలని, దాన్ని అనుకరించాలని నాలుగు దశాబ్దాల తరువాత చెబుతున్నారు. మరోవైపు అక్కడి నుంచి వస్తువుల దిగుమతులను నిలిపివేసి ఆర్ధికంగా దెబ్బతీస్తామని అసాధ్యమైన అంశాన్ని టాంటాం వేస్తున్నారు.


అమెరికా, ఐరోపా ధనిక దేశాల మాదిరి చౌకగా వచ్చే చైనా వస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందినట్లుగానే గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అదే పని చేస్తున్నారు.కొత్త ఆవిష్కరణలు చేసి తక్కువ ఖర్చుతో ఉత్పత్తిచేసేందుకు ముందుకు రావటం లేదు. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడిలో లైసన్సు విధానం ద్వారా కొన్ని పరిశ్రమలకు రక్షణ కల్పించారు. దాన్ని విమర్శిస్తున్న సంఘపరివార్‌ పెద్దలు ఇప్పుడు చేస్తున్నదేమిటి. అదే రక్షణ విధానంలో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే అనుమతి తీసుకోవాలని, విధించిన పన్నులను చెల్లించాలంటున్నారు. సబ్సిడీలు ఇస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేస్తే ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో తగ్గిస్తున్నారు. అసలు పూర్తిగా ఎగవేస్తే రద్దుచేస్తున్నారు. అలాంటపుడు పోటీ ఎలా ఉంటుంది ? చరిత్ర పునరావృతం అవుతుందంటారు. దాని అర్ధం గతం మాదిరే అని కాదు. విదేశీ పోటీ నుంచి రక్షణ కల్పిస్తున్నారు, గతంలో తెరిచిన ద్వారాలను మెల్లగా మూస్తున్నారు. స్వాతంత్య్రానంతరం విదేశీ మార్కెట్‌కు ద్వారాలు మూసినందుకు అమెరికా, ఐరోపా దేశాలు మనలను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. అవి వేర్పాటు, ఉగ్రవాదం రూపంలో ఎలా మనలను దెబ్బతీశాయో చూశాము. ఇప్పుడు ఒక వైపు ధనిక దేశాలతో రాజకీయంగా చేతులు కలుపుతూ మరోవైపు ఆర్ధిక విధానాల్లో దేశీయ కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తున్నారు.

అమెరికా బడా దిగ్గజం అమెజాన్‌కు పోటీగా మన దేశ కంపెనీ రిలయన్స్‌ ముందుకు వచ్చింది. రిలయన్స్‌కు దన్నుగా కేంద్ర ప్రభుత్వం ఉంది. అడుగడుగునా అమెజాన్ను అడ్డుకొనేందుకు ప్రభుత్వం పూనుకుంది. అదే విధంగా మెట్రో వంటి సంస్ధలను రిటెయిల్‌ రంగంలోకి రాకుండా ఆటంకం కలిగిస్తూ దేశీయ కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తోంది మోడీ సర్కార్‌. అందువలన విదేశాలు ముఖ్యంగా ధనికదేశాలు మనలను చూస్తూ అలాగే వదలి వేస్తాయనుకుంటే పొరపాటు. ముందే చెప్పినట్లు నెహ్రూ-మోడీ ఇద్దరూ కార్పొరేట్ల ప్రతినిధులే. ఒకరు ప్రయివేటురంగం నిలబడేందుకు ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేస్తే, ప్రయివేటు రంగం బలపడింది కనుక మరొకరు దాన్ని కారుచౌకగా ప్రయివేటు, విదేశీ కంపెనీలకు అప్పగిస్తున్నారు. ప్రయివేటు రంగానికి రక్షణ, రాయితీలు కల్పించటంలో సేమ్‌ టు సేమ్‌ ! ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తే తప్ప చైనా మాదిరి అభివృద్ది చెందే అవకాశం ఉండదు. కానీ ఆర్ధిక విధానాల విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ ఒకదాన్నే అనుసరిస్తున్నాయి. అంతర్గత వైరుధ్యాలు అప్పుడూ-ఇప్పుడూ ఉన్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!

10 Saturday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, F-16 jets, imperialism, imran khan, Narendramodi, US, yankees


ఎం కోటేశ్వరరావు


మరో ఆరు రాఫేల్‌ యుద్ద విమానాలు ఏప్రిల్‌ 28న మన దేశానికి రానున్నాయన్నది ఒక వార్త . తన వ్యూహాత్మక భాగస్వామి పాకిస్ధాన్‌కు ఎనిమిది ఎఫ్‌-16 జెట్‌ యుద్దవిమానాలను విక్రయించాలని నిర్ణయించిన అమెరికా ఆమేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. డోక్లాంతో సహా చైనా-భూటాన్‌ మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలూ మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన సంప్రదింపులలో రెండు దేశాలూ నిర్ణయించాయి.


విమానాల కొనుగోలు లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉన్న భారత ” దేశభక్తుడు ” సుషేన్‌ గుప్తా దొంగతనంగా మన సైన్యం వద్ద పత్రాలను దొంగిలించి అందచేసినందుకు బహుమతి పేరుతో గుప్తా, మరికొందరు మధ్యవర్తులకు రాఫేల్‌ కొన్ని మిలియన్ల యూరోలు సమర్పించుకుంది. మన పాలక దేశభక్తులు ఏం చేస్తారో తెలియదు. పాకిస్ధాన్‌కు ఎఫ్‌-16 యుద్ద విమానాలు అందచేయటం ‘ఉగ్రవాదం’ మీద జరిపే పోరుకు ఇబ్బంది అని నరేంద్రమోడీ ఎంత మొత్తుకున్నా -నిజంగా అలా చేశారో లేదో తెలియదు- అమెరికా ఖాతరు చేయలేదు. గెజిట్‌లో కూడా ప్రకటించాం తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది.
డోక్లాంలో చైనా సైన్యాన్ని అడ్డుకొనేందుకు మన మిలిటరీ భూటాన్‌ ఆహ్వానం మీద వెళ్లిందా లేదా చిన్న దేశం కనుక పక్కకు నెట్టి వ్యవహరించిందా అన్నది ఇప్పటికీ తేలని విషయమే. తాజాగా చైనా-భూటాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్వతంత్రంగానే భూటాన్‌ వ్యవహరించనున్నదని వార్తలు వచ్చాయి. అంటే మీకు చైనా ముప్పు ఉందంటూ మనం జోక్యం చేసుకొనేందుకు దారి మూసినట్లేనా ? అంతిమ ఒప్పందం కుదిరే వరకు రెండు దేశాల మధ్య శాంతి, సుస్ధిరతలను కాపాడాలని నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేకపోయినా ఈ ఒప్పందం కుదరటం విశేషం. భారత్‌ను దూరంగా ఉంచేందుకు చైనా వైపు నుంచి భూటాన్‌కు గణనీయంగా రాయితీలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. డోక్లాంకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో చైనీయులు భూటాన్‌ భూ భాగంలో ఒక గ్రామాన్ని నిర్మించారని మన పత్రికలు కట్టుకధలు రాసిన విషయం తెలిసిందే. అరుణాచల్‌లో కూడా అదే విధంగా గ్రామాలను నిర్మించినట్లు రాసిన విషయం తెలిసిందే.


నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికా, దాని మిత్రపక్షాలతో జతకట్టదలచుకుంటే సూటిగానే చెప్పవచ్చు. దాని మంచి చెడ్డలను సమయం వచ్చినపుడు జనం తేలుస్తారు. మేము ఏదైనా బస్తీమే సవాల్‌ అన్నట్లుగా చెప్పి చేస్తాము అని చెప్పుకుంటున్న మోడీ నాయకత్వం ఆచరణలో అలా ఉందా ? ప్రతిదేశం ప్రతి సమస్య, పరిణామం నుంచి తామెలా లబ్ది పొందాలన్న తాపత్రయంలోనే ఉంది.అందుకే ఎన్నో ఎత్తులు, జిత్తులూ దీనికి ఏ దేశమూ మినహాయింపు కాదు. వాటి వలన జనానికి లబ్ది చేకూరుతుందా, వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టి కార్పొరేట్లకు లాభాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్నదే గీటురాయి.ప్రపంచం వైరుధ్యాల మయం. అవి నిరంతరం ఉంటూనే ఉంటాయి. అయితే అన్నీ ఒకేసారి ముందుకు రావు. ఏదైనా ప్రధాన వైరుధ్యంగా ముందుకు వచ్చినపుడు వాటి పట్ల తీసుకొనే వైఖరి తరువాత వచ్చే వైరుధ్యాన్ని బట్టి మారిపోతూ ఉండవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మింగివేయాలన్నది అమెరికా దురాశ. అది సాధ్యం కాదని ఐరోపాలోని ధనిక దేశాలకు ఇంతకు ముందే తెలుసు కనుక వైరుధ్యాలను ఉపయోగించుకోవాలని అవి నిత్యం చూస్తుంటాయి.అమెరికా, ఐరోపా ధనిక దేశాలు తమ పధకంలో ఏ దేశాన్ని ఎక్కడ నిలిపి ఎలా లబ్ది పొందాలా అని నిరంతరాన్వేషణ సాగిస్తున్నాయి.
ఇప్పుడు ప్రపంచంలో ఇండోాపసిఫిక్‌ ప్రాంతం మీద కేంద్రీకరణ పెరిగింది. భూమి తన చుట్టుతాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రకృతి. అమెరికా అన్ని దేశాలనూ తన చుట్టూతిప్పుకోవాలనుకుంటుంది, అది వికృతి. తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని చైనా నిరూపించింది. అతి పెద్ద దేశంలో ప్రవేశించి అక్కడి మార్కెట్‌ను కొల్లగొట్టాలన్నది అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆకాంక్ష. తమ దగ్గర లేని సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను బయటి నుంచి తెచ్చుకొని తాము అభివృద్ధి చెందాలన్నది చైనా కమ్యూనిస్టుల లక్ష్యం. నాలుగుదశాబ్దాల ఈ పయనంలో చైనా కమ్యూనిస్టులే పైచేయి సాధించారు. ఎంతగా అంటే ఆర్ధికంగా అమెరికాను అధిగమించి పోయేంతగా అని వేరే చెప్పనవసరం లేదు. అందుకే దాన్ని అడ్డుకొనేందుకు ఎన్నో పధకాలు.


తన ఆర్ధిక, మిలిటరీ శక్తిని ఉపయోగించి మన దేశంతో సహా అనేక దేశాలను చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలన్నది దాని పధకం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచిన తరువాత అమెరికా కొంత మేరకు సఫలీకృతమైంది.దానిలో భాగమే గతేడాది జరిగిన లడఖ్‌, అంతకు ముందు సంభవించిన డోక్లాం పరిణామాలు. భూటాన్‌-చైనా మధ్య వివాదంగా ఉన్న ప్రాంతంలో చైనా రోడ్డు వేయకూడదని మన దేశం వెళ్లి అడ్డుకుంది. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పినప్పటికీ లడఖ్‌ ప్రాంతంలో రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి.చైనాకు వ్యతిరేకంగా చతుష్టయం పేరుతో అమెరికా-జపాన్‌-ఆస్ట్రేలియాలతో మన దేశం జట్టుకట్టి బస్తీమే సవాల్‌ అంటున్నాయి.ఈ గుంపులోకి ఐరోపా ధనిక దేశాలను కూడా లాగాలని చూస్తున్నాయి. పశ్చిమ దేశాలు అనుకున్న, వేసిన పధకం సఫలం కావాలంటే కాగితాల మీద గీతలు గీసినంత సులువు కాదు. ముందుగా చైనా వస్తువుల మీద ధనిక దేశాలు ఆధారపడటం మానుకోవాలి. అంటే వాటికి చౌకగా వస్తువులను తయారు చేసి సరఫరా చేసే ప్రత్యామ్నాయ దేశాలు కావాలి. మన దేశంలో చౌకగా దొరికే మానవశక్తి ఉంది, పశ్చిమ దేశాల వస్తువులకు అవసరమైన మార్కెట్టూ ఉంది. అందుకే మన దేశాన్ని, ఎవరు గద్దెమీద ఉంటే వారిని ఇంద్రుడూ చంద్రుడూ అంటూ పొగుడుతున్నాయి. సమీప భవిష్యత్‌లో మనం ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఎవరూ అనుకోవటం లేదు.


వివిధ పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే దారులన్నీ రోమ్‌కే అన్నట్లుగా ప్రస్తుతానికి ప్రయత్నాలన్నీ చైనాకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. గతంలో బ్రిటన్‌-జపాన్‌-ఫ్రాన్స్‌ -స్పెయిన్‌- ఇటలీ-జర్మనీ చరిత్రను చూసినపుడు ప్రపంచాన్ని పంచుకొనేందుకు వాటి మధ్య వచ్చిన పంచాయతీలే అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు దారి తీశాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కకు నెట్టి అమెరికా ముందుకు వచ్చి అదే చేస్తోంది.చైనా మార్కెట్లో వాటికి ప్రవేశం కల్పిస్తే, చైనా తమకు పోటీ ఇవ్వకుండా ఉంటే అసలు పేచీయే లేదు. అది జరగటం లేదు గనుకనే ఏదో ఒక గిల్లికజ్జా పెట్టుకుంటున్నాయి. చైనాకు పోటీగా మన దేశాన్ని వినియోగించుకోవాలని చూసిన పశ్చిమ దేశాలు తీవ్ర ఆశాభంగం చెందాయి. దాని దరిదాపుల్లో కూడా మనం లేకపోవటంతో చైనాతో విధిలేక ముద్దులాట-దెబ్బలాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన ప్రధాన బలహీనత జిడిపిలో 14శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 50శాతం మంది ఉపాధిపొందుతున్నారు.అరవైశాతంగా ఉన్న సేవారంగం 28శాతం మందికే ఉపాధి చూపగలుగుతోంది.

లాహిరి లాహిరిలో అన్నట్లుగా చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ా మన నరేంద్రమోడీ వ్యవహరించిన తీరును మనం చూశాము. అలాంటిది ఆకస్మికంగా గాల్వన్‌లోయ ఉదంతాలకు ఎందుకు దారి తీసింది ? చైనా మన ప్రాంతాలను ఆక్రమించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన తరువాత సరిహద్దుల్లో జరిగిన ఉదంతాల గురించి పరిపరి విధాల ఆలోచనలు ముందుకు వచ్చాయి. చైనాతో వచ్చిన లేదా తెచ్చుకున్న సరిహద్దు వివాద అసలు లక్ష్యం ఏమిటి ?తెరవెనుక పాత్రధారులు, వారేం చేస్తున్నదీ మనకు కనిపించదు,వినిపించదు. తెర ముందు జరిగే వాటిని బట్టి నిర్దారణకు వస్తే తప్పులో కాలేస్తాము. చైనాతో సరిహద్దు వివాదం రాజకీయంగా నరేంద్రమోడీ పుట్టక ముందునుంచీ ఉంది.1962 తరువాత కొత్తగా మన భూభాగం చైనా ఆధీనంలోకి వెళ్లలేదని మోడీ సర్కారే పార్లమెంటులో కూడా చెప్పింది. మన పాలకులు చెబుతున్నట్లుగా సరిహద్దుల్లో చైనా కవ్వించిందనే అనుకుందాం. చర్చల ద్వారా అనేక అంశాలను పరిష్కరించుకుంటున్న మనం ఆ మార్గాన్ని ఎందుకు ఎందుకు ఎంచుకోలేదు ? కాసేపు పక్కన పెడదాం.

ఇరాన్‌తో మనకు గోడ-నీడ పంచాయతీల్లేవే. (ఇష్టం లేకపోతే నీ స్ధలమే గావచ్చు గోడ ఎత్తుగా కట్టావు, దాని నీడ మా ఇంటి మీద పడుతోందని గిల్లికజ్జా) ఇప్పుడు ఇరాన్‌-చైనా మధ్య ఏర్పడిన బంధం మన దేశానికి తలనొప్పిగా మారిందని, కొత్త సవాళ్లను ముందుకు తెచ్చిందని సంఘపరివార్‌ పత్రిక ఆర్గనైజర్‌ మాజీ సంపాదకుడు శేషాద్రి చారి పేర్కొన్నారు. తలనొప్పి స్వయంగా నరేంద్రమోడీ తెచ్చింది తప్ప మరొకటి కాదు. శేషాద్రి ముందుకు తెచ్చిన అంశాల సారాంశాన్ని చూద్దాం. ఇరాన్‌ మీద విధించిన ఆంక్షలను తొలగించే చిన్నపాటి సూచనలు కూడా అమెరికా నుంచి వెలువడని సమయంలో పాతికేండ్ల పాటు అమల్లో ఉండే 400 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని ఇరాన్‌తో చైనా కుదుర్చుకుంది.హార్ముజ్‌ జలసంధిలో కీలక స్ధానంలో ఉన్న బందర్‌ అబ్బాస్‌ రేవు ద్వారానే మన దేశానికి గరిష్టంగా సరకు రవాణా జరుగుతోంది.అమెరికా ఆంక్షల కారణంగా మన దేశానికి దాన్ని మూసివేసినందున మన రవాణా ఖర్చులు అనేక రెట్లు పెరుగుతున్నాయి.చమురు సరఫరాలు నిలిచిపోయిన కారణంగా ధరలు పెరిగిపోయి వాణిజ్యలోటులో సమస్యలు వస్తున్నాయి. అరవై రోజుల వరకు అరువు సౌకర్యం, ఆకర్షణీయమైన రాయితీలు, రూపాయి చెల్లింపులను అంగీకరించటం వంటివి ఇరాన్‌తో మనకున్న సానుకూల అంశాలలో కొన్ని మాత్రమే. ఇవన్నీ పోవటం మన వ్యూహాత్మక, రక్షణ ప్రయోజనాలకు వ్యతిరేకం. మధ్య ఆసియా దేశాలతో మన వాణిజ్యానికి ఇరాన్‌ ముఖద్వారం. పాకిస్ధాన్‌తో నిమిత్తం లేకుండా చబ్బార్‌ రేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించేందుకు ఉపయోగపడుతుంది. తుర్కుమెనిస్దాన్‌-ఆఫ్ఘనిస్దాన్‌-పాకిస్దాన్‌-భారత్‌ చమురు పైప్‌లైన్‌ మన ఇంధన భద్రతకు అవసరం. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇరాన్‌ సహకారం లేకుండా సాధ్యం కాదు, అందువలన ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతకు మన దేశం అమెరికాను ఒప్పించాల్సి ఉందని శేషాద్రి చారి చెప్పారు. ఆ పెద్దమనిషి చైనా వ్యతిరేకి అని వేరే చెప్పనవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరిని ఎందుకు తప్పు పడుతున్నట్లు ? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.అమెరికాను నమ్ముకొని మోడీ ఇరుగు పొరుగు దేశాలను చైనా వైపు వెళ్లేట్లు నెడుతున్నారన్నది అసలు దుగ్ద. చైనాతో సరిహద్దు వివాదం ఉంది గనుక మన లడఖ్‌లో ప్రతాపం చూపాము అనుకుంటే అర్ధం ఉంది. మరి ఇరాన్‌ను ఎందుకు దూరం చేసుకుంటున్నాము ? అమెరికా కౌగిలింతలతో మునిగి తేలుతూ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు నిలిపివేశాము.


ఇరాన్‌తో చైనా ఒప్పందం కేవలం దానికి అవసరమైన చమురు కోసమే అనుకుంటే పొరపాటు. అమెరికా ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న ఇరాన్‌ ఆర్దిక వ్యవస్ధను ఆదుకోవటం కూడా దానిలో కీలక అంశం. ప్రపంచాన్ని ఆక్రమించాలని చూస్తున్న అమెరికాను కట్టడి చేసే మధ్య ప్రాచర్య వ్యూహంలో భాగం అది. ఇండో-పసిఫిక్‌ వ్యూహం పేరుతో చైనాను దెబ్బతీసేందుకు భారత్‌-జపాన్‌-ఆస్ట్రేలియాలను ఇప్పటికే అమెరికా ఒక దగ్గరకు చేర్చింది. దానికి ప్రతిగా చైనా తన ఎత్తుగడలను రూపొందించుకొంటోంది. రానున్న రోజుల్లో మధ్య ప్రాచ్యం అగ్రదేశాల అధికార పోరుకు వేదిక కానుందన్నది చైనా అంచనా.అందుకే ఆప్రాంతంతో పాటు ఆఫ్రికాలో కూడా చైనా వ్యూహాన్ని అమలు చేస్తూ అనేక దేశాలతో ఒప్పందాలతో ముందుకు పోతున్నది. పశ్చిమాసియాలో షియా-సున్నీ విభేదాలను ఉపయోగించుకొని అమెరికా రాజకీయం చేస్తుంటే చైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది.సున్నీలు మెజారిటీగా ఉన్న సౌదీ అరేబియా-షియాలు మెజారిటీగాఉన్న ఇరాన్‌తోనూ సత్సంబంధాలను కలిగి ఉంది. రెండు దేశాల నుంచీ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నది. అమెరికాను ఎదుర్కొనే ఎత్తుగడలో భాగంగా రష్యా కూడా తన పావులు కదుపుతున్నది. 2019లో చైనా-రష్యా-ఇరాన్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు అమెరికాకు ఒక హెచ్చరిక తప్ప మరొకటి కాదు.


వర్దమాన దేశాలు తమలో తాము సహకరించుకోవటం ద్వారా అభివృద్ధి పొందాలి తప్ప సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి బాగుపడదామనుకుంటే జరిగేది కాదన్నది ఇప్పటి వరకు ప్రపంచ అనుభవం. మన సంబంధాలు అమెరికా, జపాన్‌ వంటి దేశాలతో ఈ గీటురాయితోనే సరి చూసుకోవాలి. ఒకవైపు బ్రెజిల్‌, రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్‌) ఒక కూటమిగా సహకరించుకోవాలని సంకల్పం చెప్పుకున్నాయి. మరోవైపు మన దేశం చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జతకడుతుంది. అలాంటపుడు ఈ కూటమి దేశాల మధ్య విశ్వాసం ఎలా ఉంటుంది, సహకారానికి ఎలా దారి చూపుతుంది ? అందుకే ముందుకు పోవటం లేదు. చతుష్టయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపిన ఆస్ట్రేలియా, జపాన్‌ మరోవైపు అమెరికా వ్యతిరేకించే ఆర్‌సిఇపి కూటమిలో చైనాతో చేతులు కలుపుతాయి.అమెరికా బెదిరింపులను కూడా ఖాతరు చేయకుండా చైనాతో ఒప్పందాలు చేసుకున్న ఐరోపాధనిక దేశాలు మరోవైపున ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జట్టుకట్టేందుకు ఆసక్తి చూపుతాయి. అమెరికా రెచ్చగొట్టగానే చైనాతో తాడోపేడో తేల్చుకుంటామన్న మన నరేంద్రమోడీ సర్కార్‌ మరోవైపు దానితో చర్చల ప్రక్రియ సాగిస్తోంది.బాలాకోట్‌ దాడులతో పాక్‌ను దెబ్బతీశామని ప్రకటించిన మన దేశం తెరవెనుక వారితో 2018 నుంచే సంప్రదింపులు జరుపుతున్నట్లు బయటపడింది. రెండు దేశాలూ సఖ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలనే నాటకీయంగా ప్రకటన చేశాయి. ఆట మనకై మనమే ఆడుతున్నామా లేక ఎవరైనా ఆడించినట్లు ఆడుతున్నామా ?

ప్రపంచీకరణను ముందుకు తెచ్చింది అమెరికా, ఐరోపా అగ్రరాజ్యాలు. మనవంటి వర్ధమాన, పేద దేశాలను దానిలోకి లాగిందీ అవే. దశాబ్దాల పాటు చైనాను ప్రపంచీకరణలో భాగస్వామిని చేసేందుకు నిరాకరించాయి. తీరా ఇప్పుడు ప్రపంచీకరణకు భిన్నమైన చర్యలు తీసుకుంటున్నదీ దాన్ని ప్రారంభించిన దేశాలే. నిజమైన ప్రపంచీకరణ స్ఫూర్తిని పాటించాలని చైనా డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పరిణామాల్లో ఎంత మార్పు ? ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్ధ వంటి వాటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంటోంది. మనవంటి దేశాలను తన అజెండాకు అనుగుణ్యంగా నడవమంటోంది, బెదిరిస్తోంది.(ఇరాన్‌ చమురు కొనవద్దని ఆదేశించటం పక్కా నిదర్శనం). రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచీకరణ ద్వారా తన మార్కెట్‌ను పెంచుకోవాలన్నది ధనిక దేశాల ఎత్తుగడ. అవి అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి.


మనలను ప్రధాన భాగస్వామి అని చెబుతున్న అమెరికన్లు పాకిస్ధాన్‌కూ అదే చెబుతున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు గానీ అమెరికా చెరొక చంకలో ఇమ్రాన్‌ ఖాన్ను, నరేంద్రమోడీని ఎక్కించుకుంటున్నట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాను నమ్ముకొని చైనాతో శతృత్వం పెంచుకుంటే నష్టం మనకే. పశ్చిమాసియా, మధ్య ఆసియాలో అమెరికా ప్రయోజనాల రక్షణకు, ఇరాన్‌కు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ అవసరం. అందుకే మనలను మాయపుచ్చటానికి ఎన్ని కబుర్లు చెప్పినా చేయాల్సింది చేస్తోంది. పాక్‌తో సయోధ్యకు మన మెడలు వంచుతోంది. మనం లొంగిపోయామనే అంచనాకు వచ్చిన కారణంగానే వాణిజ్యం, దిగుమతుల విషయంలో సానుకూల ప్రకటన చేసిన పాకిస్ధాన్‌ మరుసటి రోజే అబ్బెబ్బె అదేం లేదంటూ మాట మార్చింది. ఎఫ్‌ -16 విమానాలను తెచ్చుకున్నాం గనుక తాడో పేడో తేల్చుకుందాం అన్నా ఆశ్చర్యం లేదు.


ఒక స్వతంత్ర విదేశాంగ విధానం లేనట్లయితే మనం ఎటువైపు ఉండాలో తేల్చుకోలేము.గతంలో నెహ్రూ, కాంగ్రెస్‌ హయాంలో సోవియట్‌కు అనుకూలంగా ఉండి భారీ పరిశ్రమలు, ఇప్పుడు అనేక విజయాలు సాధిస్తున్న అంతరిక్ష రంగానికి అవసరమైన వాటిని సాధించుకున్నాము. ఇప్పుడు అమెరికాకు అనుకూలంగా మారి చెప్పుకొనేందుకు సాధించింది ఏమైనా ఉందా ? లేకపోగా చుట్టుపక్కల వారినందరినీ దూరం చేసుకున్నాము. పాకిస్ధాన్‌, చైనాతో శతృత్వం పెంచుకుంటున్నాము. దాని ద్వారా ఆయుధాలు అమ్ముకుంటున్న అమెరికా తప్ప మనకు కలిగిన లబ్ది ఏమిటో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కరుడు గట్టిన నేరగాండ్లు, మాఫియా ముఠాలు కొత్త వారికి ఎరలు వేసి ఆకర్షిస్తారు. మెల్లగా వారికి తెలియకుండానే చిన్నపాటి నేరాలు చేయించి తమ బందీలుగా చేసుకుంటారు. తరువాత వారు చెప్పినట్లు చేయక తప్పని స్ధితిని కల్పిస్తారు. అమెరికా, ఇతర అగ్రదేశాలు కూడా అంతే ! ఈ అంశాన్ని మన పాలకులు గుర్తిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జడ్‌పి ఎన్నికలపై జగన్‌కు పెద్ద షాక్‌ – తిరుపతి ఎన్నిక పర్యవసానాలు !

06 Tuesday Apr 2021

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

AP BJP, AP ZP elections, chandrababu naidu, Jana Sena, pavan kalyan, Tirupati lok sabha by election, YS jagan


ఎం కోటేశ్వరరావు


మామూలుగా ఒక ఉప ఎన్నిక సాధారణ ఎన్నికల మాదిరి ప్రాధాన్యతను సంతరించుకోదు. అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే, లేదా అంతకు ముందు ఎన్నికలో మెజారిటీ స్వల్పంగా ఉంటే తప్ప ప్రతిపక్షం గెలిచే పరిస్ధితి ఉండదు. ఈ నేపధ్యంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను ఎలా చూడాలి ? దాని పర్యవసానాలు ఏమిటి ? ఏప్రిల్‌ 8న జరగాల్సిన జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల మీద రాష్ట్ర హైకోర్టు స్టే విధించటంతో తిరుపతి ఎన్నిక జరిగే 17వ తేదీ లోగా జరిగే అవకాశం లేదనే చెప్పవచ్చు. తిరుపతి ఎన్నికలోపు జరపాలనే అధికారపక్షానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోనరెడ్డి, నూతన ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి కోర్టులో పెద్ద ఎదురు దెబ్బతగిలింది. ఎన్నికల నిర్వహణ గురించి సవాలు చేస్తూ తెలుగుదేశం, జనసేన,బిజెపి, ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారించిన కోర్టు ఎన్నికలను వాయిదా వేసింది. కరోనా వైరస్‌ కారణంగా వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఈ పార్టీలు సవాలు చేశాయి. కమిషనర్‌ ప్రకటనకు ముందే ఎన్నికల తేదీల గురించి వార్తలు వచ్చాయని, సుప్రీం కోర్టు చెప్పినట్లుగా నాలుగు వారాల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పట్టించుకోలేదని అభ్యంతరం తెలిపాయి. దీన్ని విచారించిన కోర్టు ఈనెల 15వ తేదీన ఎన్నికల కమిషనరు కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. పిటీషన్లు దాఖలు చేసిన పార్టీలు కోరుతున్నట్లు కొత్త నోటిఫికేషన్‌కు హైకోర్టు అదేశించే అవకాశం లేదు. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు, నామినేషన్లు వేసిన వారు కోర్టుకు ఎక్కుతారు. మున్సిపల్‌ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎన్నికల కమిషనరు, వైసిపి లేదా మరొకరు ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లినా ఈ నెల 8న ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవు. కోర్టు స్టే ఎత్తివేసి ఎన్నికలకు దారి సుగమం చేసినా నెల రోజుల పాటు ప్రవర్తనా నియమావళిని అమలుకు ఆదేశిస్తే మే నెలలో మాత్రమే జరిగే అవకాశం ఉంది.అప్పటికి తిరుపతి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతాయి.


తిరుపతి నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగు నెల్లూరు జిల్లాలో, మూడు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని చోట్లా వైసిపి వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడింటిలో మూడు షెడ్యూలు కులాల రిజర్వుడు నియోజకవర్గాలు. మొత్తం ఓటర్లు 15,74,161. గత(2019) ఎన్నికలలో 13,16,473(79.76శాతం) పోలయ్యాయి. వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ ×××× ఓట్లు ×××× శాతం
వైసిపి ××× 7,22,877 ×× 55.03
టిడిపి ××× 4,94,501 ×× 37.65
నోటా ××× 25,781 ×× 1.96
కాంగ్రెస్‌ ×× 24,039 ×× 1.83
బిఎస్‌పి ×× 20,971 ×× 1.60
బిజెపి ×× 16,125 ×× 1.22
వైసిపి మెజారిటీ 2,28,376 కాగా, బిఎస్‌పిని జనసేన బలపరించింది. తాజా ఎన్నికలలో మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా గుర్తింపు పొందిన పార్టీలలో వైసిపి, తెదే, కాంగ్రెస్‌, బిజెపి, సిపిఎం పోటీచేస్తున్నాయి. మిగిలిన వారందరూ గుర్తింపు లేని పార్టీ, స్వతంత్ర అభ్యర్దులు.


గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలలో వైసిపి సాధించిన విజయం, దానికి వచ్చిన ఓట్ల ప్రాతిపదికన చూస్తే అసాధారణ పరిణామాలు సంభవిస్తే తప్ప తిరుపతి లోక్‌సభ స్ధానాన్ని తిరిగి అది గెలుచుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినందున ఏ పార్టీ ఎంత శాతం ఓటింగ్‌ వచ్చిందని చెప్పుకున్నా ప్రయోజనం లేదు. మున్సిపల్‌ ఎన్నికలలో వైసిపికి 52.63, తెలుగుదేశం పార్టీకి 30.73, జనసేనకు 4.67, బిజెపికి 2.41శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన 49.95 శాతంతో పోలిస్తే ఓటింగ్‌ పెద్దగా పెరిగినట్లు భావించలేము. నవరత్నాల గురించి ఆ పార్టీ చేసుకుంటున్న ప్రచారానికి ఓట్ల పెరుగుదలకు పొంతన కుదరటం లేదు. తిరుపతి ఎన్నికలో విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా వైసిపి తన యావత్‌ శక్తిని ఉపయోగించి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. గతం కంటే మెజారిటీ తెచ్చుకొని తమకు రాజకీయంగా రాష్ట్రంలో ఎదురు లేదని ప్రదర్శించుకోవటం, తద్వారా ప్రతిపక్ష తెలుగుదేశం శ్రేణులను నిరుత్సాహపరచటం, మతం పేరుతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కుట్రలు పన్నినా మీ ఆటలను సాగనివ్వం అని కేంద్రంలోని బిజెపి అగ్రనేతలకు సందేశం ఇవ్వటం కూడా ఈ ప్రయత్నాల వెనుక ఉంది.2019 ఎన్నికలలో వచ్చిన మెజారిటీకి రెట్టింపు తీసుకు రావాలని మంత్రులు, ఎంఎల్‌ఏలను జగన్‌మోహనరెడ్డి ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన ఓటింగ్‌ శాతం , మెజారిటీ తగ్గినా ఆ పార్టీ మీద వత్తిడి పెరగటం ఖాయం.


ఇక తెలుగు దేశం పార్టీ విషయానికి వస్తే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలలో దానికి తీవ్ర ఎదురు దెబ్బలు తగిలినా ఓటింగ్‌ శాతం గణనీయంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 39.17శాతం వస్తే మున్సిపల్‌ ఎన్నికలలో 30.73శాతం వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో అనేక చోట్ల వైసిపికి ఏకగ్రీవాలు అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ మేరకు ఓట్ల శాతం ఉండే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇదే బలం ఉంటుందని చెప్పవచ్చు. తిరుపతి ఎన్నిక ఆ పార్టీకి, ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడి ప్రతిష్టకు ప్రతీకగా భావించవచ్చు. విజయం సాధిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే గత ఎన్నికలలో వచ్చిన ఓట్లను నిలుపుకున్నా కార్యకర్తలను నిలుపుకోవచ్చు. రాజకీయ పోరు కొనసాగించవచ్చు. జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం అధినేత చేసిన నిర్ణయం దిగువ స్దాయిలో అంతగా జీర్ణం కాలేదు. తాజాగా హైకోర్టు స్టే ఇచ్చినందున ఏదో ఒకసాకుతో కార్యకర్తలను సంతృప్తి పరచేందుకు పునరాలోచన చేసినా ఆశ్చర్యం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చే ఓట్లను బట్టి కూడా ఆ నిర్ణయం ఉండవచ్చు.


జనసేన-బిజెపి కూటమి విషయానికి వస్తే బిజెపి కంటే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రతిష్టచుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతాయి. మున్సిపల్‌ ఎన్నికల ఓటింగ్‌ తీరు తెన్నుల ప్రకారం రెండు పార్టీలకు వచ్చిన 7.18 శాతం కంటే తిరుపతిలో ఎక్కువ వస్తేనే ఆ రెండు పార్టీల పరువు నిలుస్తుంది. లేనట్లయితే బిజెపికి కొత్తగా పోయే పరువేమీ ఉండదు కనుక పవన్‌ కల్యాణ్‌ ఏ విధంగా సమర్ధించుకుంటారన్న ప్రశ్న ముందుకు రానుంది. ప్రశ్నిస్తా అంటూ బయలు దేరిన పవన్‌ కల్యాణ్‌కు ప్రశ్నలేమీ లేకపోగా ఎదురు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక హౌదా, ఇతర అన్యాయాల గురించి మోసం చేసిన కేంద్రాన్ని ప్రశ్నించకుడా ఏమి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రయోజనం ఉండదు.


ఇక బిజెపి విషయానికి వస్తే పర్యవసానాలు తక్కువేమీ కాదు. పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఉన్నా ఓట్ల సంఖ్య పెరగపోతే దాని పరువు పోవటమే కాదు, జనసేనాని మద్దతు చిత్తశుద్ది గురించి అది సందేహాలను లేవనెత్తవచ్చు. తిరుపతి ఆపద మొక్కుల్లో భాగంగా జనసేనాని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించింది. అంతే కాదు భగవద్దీత పార్టీ కావాలా బైబిల్‌ పార్టీ కావాలా అనే ప్రచారాన్ని ముందుకు తెచ్చింది. ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా తిరుపతి వెంకటేశ్వరుడు అంతర్జాతీయ దేవుళ్లలో ఒకరు. అక్కడ హిందూమతానికి అపచారం, అన్యాయం జరుగుతోందని ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున చేసింది. ఇక్కడ డిపాజిట్లు రాకపోయినా, గణనీయంగా ఓట్లు సంపాదించకపోయినా ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు దాని మత రాజకీయాలకు గోరీ కట్టారనే అభిప్రాయం కలుగుతుంది. ఇది దేశ వ్యాపితంగా కూడా బిజెపి వ్యతిరేక పార్టీలకు ప్రచార అస్త్రంగా మారుతుందని వేరే చెప్పనవసరం లేదు.ఇప్పటికే కేరళలో శబరిమల వివాదంతో ఓట్లు పొందాలని చూసి గత లోక్‌సభ ఎన్నికల్లో భంగపడిన బిజెపికి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరగనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మిగిలిన అభ్యర్దులలో నవతరం పార్టీ పేరుతో పోటీ చేస్తున్న అభ్యర్ధికి గతంలో జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తు ఉన్న కారణంగా జనసేన మద్దతుదారులు సదరు అభ్యర్ధికి ఓటు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. బిజెపి-జనసేనలకు పోలింగ్‌ ముందకు వరకు ఇది ఒక సాకుగా ఉపయోగపడవచ్చు తప్ప ఓటర్ల విజ్ఞతను ప్ర శ్నించటమే అవుతుంది. నిజంగా జనసేన మద్దతుదారులు బిజెపికి మద్దతు ఇవ్వాలనుకుంటే అలాంటి ప్రశ్న ఉదయించదు. ఇష్టం లేని వారు గ్లాసు గుర్తుకు ఓటేయవచ్చు. ఇక్కడ సిపిఎం పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపుతుందని చెప్పలేము. తమ విధానాల ప్రచారం కోసమే ఈ పోటీ అని చెప్పవచ్చు. అనేక దళిత సంఘాలు మద్దతు ప్రకటించినప్పటికీ నైతికంగా ప్రచారం చేసుకొనేందుకు ఉపయోగపడుతుంది.2014 ఎన్నికలలో ఈ స్ధానంలో పోటీ చేసిన సిపిఎంకు 11,168 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ ఏదో విధంగా పరీక్ష పెడుతోంది, పర్యవసానాలకు సిద్దం కావాలని చెబుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ (కౌగిలింతల ) వ్రతం చెడ్డా ఫలం దక్కలే ! అమెరికాతో వాణిజ్య యుద్దానికి సిద్దమా !!

05 Monday Apr 2021

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Digital Service Tax, DST, Katherine Tai, Narendra Modi, Retaliatory tariffs on Indian goods, Trade Protectionism, USTR


ఎం కోటేశ్వరరావు


తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగున పడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి. చమురు ధరలు పెరిగితే కొనుక్కోలేము, తగ్గితే కొని నిలవ చేసుకొనేందుకు సౌకర్యాలు, స్వంత ఉత్పత్తిని పెంచుకోలేని మనం చమురు ఎగుమతి దేశాల మీద దాడి చేయటం ఏమిటి ? సౌదీ అరేబియా నుంచి కొనుగోళ్లను నిలిపివేసి లేదా బాగా తగ్గించి ఇతర మార్కెట్లలో ఏ రోజు ధర ఎంత ఉంటే అంతకు కొనుగోలు చేసి మన సత్తా ఏమిటో చూపాలన్నట్లుగా వార్తలు వచ్చాయి. మనది సర్వసత్తాక స్వతంత్ర భారత్‌ – స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం, వారసత్వం లేని కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు ఆ విషయం తెలుసో లేదో తెలియదు ( అయినా అమెరికా ఆదేశించింది గనుక మనమే ” స్వంత ” నిర్ణయం తీసుకొని ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. ఇరాక్‌ నుంచి గణనీయంగా తగ్గించాము.) ఇప్పుడు సౌదీ అరేబియా ( కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జులు నరేంద్రమోడీ మీద గౌరవంతో సౌదీ అరేబియా మనకు రాయితీధరలకు చమురు విక్రయించేందుకు అంగీకరించిందని ప్రచారం చేశారు ) మీద కారాలు మిరియాలు నూరుతున్నాము. వారు నందంటే నంది పందంటే పంది అని జనం కూడా మాట్లాడాలి మరి, లేకుంటే దేశభక్తి లేదని ముద్రవేస్తారు మరి !


అసలు విషయం ఏమిటి ? గత కొద్ది సంవత్సరాలుగా చమురు దిగుమతి చేసుకొనే దేశంగా ఉన్న అమెరికా ఇటీవలి కాలంలో షేల్‌ ఆయిల్‌ ఉత్పత్తి కారణంగా చమురు ఎగుమతి దేశంగా మారిపోయింది. అమెరికాతో మన వాణిజ్యం కొద్దిగా మిగులులో ఉంది.కనుక తమ కంపెనీల నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, ఆయుధాలతో పాటు చమురు కూడా కొంటారా లేదా అని వత్తిడి చేస్తోంది. పశ్చిమాసియా, గల్ఫ్‌దేశాలు మనకు ఎప్పుడూ మిత్రులుగానే ఉన్నాయి తప్ప శత్రువులు కాదు. గల్ఫ్‌ దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించి ఆమేరకు అమెరికా చమురు కొనాలంటే ఏదో ఒకసాకు కావాలి. సౌదీ అరేబియా ఇటీవల చమురు ఉత్పత్తిని తగ్గించిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. తగ్గినపుడు ఆ మేరకు మన జనానికి తగ్గించకుండా పన్నులు వేసి ఆ మొత్తాలను అదానీ, అంబానీల వంటి కార్పొరేట్లకు పన్నుల రాయితీల రూపంలో మూటగట్టి మరీ ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పుడు చమురు ధరలు పెరిగితే ప్రస్తుతం నరేంద్రమోడీ మత్తులో ఉన్న జనానికి అది వదిలిన తరువాత ఏం జరుగుతుందో అందరికంటే నరేంద్రమోడీకే బాగా తెలుసు గనుక చమురు ఎగుమతి దేశాల మీద రుసరుసలాడుతున్నారు. గతంలో మా దగ్గర కారుచౌకగా కొన్న చమురు ఉంది కదా ఆమేరకు మీ వినియోగదారులకు భారం తగ్గించండి అని సౌదీ అరేబియా సలహాయిచ్చింది.దాన్ని సాకుగా తీసుకొని వేరే మార్కెట్లలో కొనుగోలు చేయాలని మన చమురు కంపెనీలను కోరారు.


పోనీ ఆ వేరే మార్కెట్లలో మన లావు – పాత పోలిక వద్దు లెండి ఇప్పుడు గడ్డం పొడవు చూసి అనాలేమో ! తక్కువ ధరలకు ఏమైనా ఇస్తాయా ? ఒక్క సెంటు(మన ఏడు పైసలకు సమానం) కూడా తగ్గించవు. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారమే, డాలర్లు మరీ చెల్లించి మనం కొనుక్కోవాలి, మన పొరుగునే ఉన్న గల్ఫ్‌ నుంచి రవాణా ఖర్చులు తక్కువ, అదే అమెరికా నుంచి కొనుగోలు చేస్తే తడచిమోపెడంత అవుతాయి……తనది కాదు గనుక తాటిపట్టవేసి గోక్కోమన్నాడట వెనుకటికెవడో ! అలాగే కేంద్ర పెద్దలదేముంది, భరించేది మనమే కదా ఎంతైనా, ఎక్కడి నుంచైనా తెస్తారు ? చమురు కార్పొరేట్లతో వారి సంబంధాలు ముఖ్యం కదా ! మన ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్నేహం పట్టినప్పటి నుంచీ కొంత చమురును మన రూపాయల్లో కొనే వెసులుబాటు కల్పించిన ఇరాన్‌ను వదలి పెట్టి అమెరికన్లను మెప్పించేందుకు చమురు కొనుగోళ్లను ఎలా పెంచారో తెలుసా ?


2017-18లో రోజుకు 38వేల పీపాల చమురు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాము.2021 ఫిబ్రవరిలో ఆ మొత్తం 5,45,300 పీపాలకు పెరిగింది.ప్రస్తుతం 8,67,500 పీపాలతో మొదటి స్ధానంలో ఉన్న ఇరాక్‌ నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించి అమెరికా మీద అధికంగా ఆధారపడే విధంగా మోడీ వేగంగా ప్రయాణిస్తున్నారు. మన పశ్చిమాసియా మిత్ర దేశాలతో చమురు వైరుధ్యం తెచ్చుకొని ఆ దారులన్నీ మూసుకున్న తరువాత అమెరికా ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఎక్కడ, ఎలా నిలబడమంటే అలా నిలబడాల్సిన రోజు వచ్చినా ఆశ్చర్యం లేదు. మన చమురు ఆయుధాన్ని మనమీదే ప్రయోగిస్తే చేయగలిగిందేమీ లేదు.మనం ట్రంప్‌ హయాంలో కౌగిలింతల కోసం ఎంతగా లొంగిపోయామో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జో బైడెన్ను మరింతగా ఆకర్షించేందుకు నానా పాట్లు పడుతున్నాము. అయినా వారు చేస్తున్నదేమిటి ?
డోనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ ఎవడైతేనేం అమెరికన్‌ కార్పొరేట్ల చౌకీదార్లు. వారికోసం ఏ గడ్డికరవమన్నా కరుస్తారు. వాటంగా ఉంటే కౌగలించుకొని మత్తులో ముంచుతారు లేకపోతే కాటువేసి దెబ్బతీస్తారు. ఈ మధ్య కాలంలో నరేంద్రమోడీ డిజిటలైజేషన్‌ గురించి ఎన్నో కబుర్లు చెబుతున్నారు. ఆయన ప్రత్యేకత ఏమంటే అసలు మన దేశంలో ఇంటర్నెట్‌, డిజిటల్‌ కెమెరా రాకముందే వాటిని ఉపయోగించి అద్వానీగారినే ఆశ్చర్యపరిచిన ఘనత ఆయన సొంతం. స్వయంగా ఆయనే చెప్పుకున్న విషయం, దాని మంచిచెడ్డలు వదలివేద్దాం. విదేశాలకు చెందిన సంస్ధలు మన దేశంలో డిజిటల్‌ సేవలను అందించి వ్యాపారం చేస్తున్నపుడు దానికిగాను డిజిటల్‌ సర్వీసు టాక్సు(డిఎస్‌టి) చెల్లించాలని మన దేశం 2016లోనే అనేక దేశాలతో పాటు ఆదాయం మీద ఆరుశాతం పన్ను విధించాలని నిర్ణయించింది. అయితే అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల వత్తిడి మేరకు మోడీ సర్కార్‌ దాన్ని ఆన్‌లైన్‌ ప్రకటనల సేవలకు మాత్రమే పరిమితం చేసింది. తరువాత అన్ని రకాల డిజిటల్‌ సేవలకు గాను రెండు శాతం చెల్లించాలని గత ఏడాది మార్చినెలలో 2020 ఫైనాన్స్‌ చట్టం ద్వారా నిర్ణయించింది. అలాంటి సేవలందించే సంస్ధలలో అత్యధికభాగం అమెరికాకు చెందినవే. మన దేశం విధించిన పన్ను పరిధిలోకి వివిధ దేశాలకు చెందిన 119 సంస్ధలు వస్తాయి, వీటిలో కేవలం అమెరికా నుంచే 86 ఉన్నాయి. ఈ పన్ను అంతర్జాతీయ చట్టాలకు విరుద్దం, అమెరికా వాణిజ్య సంస్ధల పట్ల వివక్ష చూపటమే అని అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాపితంగా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధ శరవేగంగా అభివృద్ది చెందుతున్న దశలో ఏ దేశమూ దాని ద్వారా రావాల్సిన ఆదాయాన్ని వదులుకోజాలదు. మన దేశ వినియోగదారులతో విదేశీయులు జరిపే ప్రతిలావాదేవీకి ఈ పన్ను వర్తిస్తుంది.


అమెరికా వారు ఎంత అదరగొండి బాపతు అంటే వారికి అంతర్జాతీయ చట్టాలు పట్టవు. 1974వారు చేసిన అమెరికా వాణిజ్య చట్టంలోని 301 సెక్షన్‌ ప్రకారం ఏ దేశమైనా అమెరికా వాణిజ్యానికి వ్యతిరేకమైన చర్యలు తీసుకున్నదని భావిస్తే తమ స్వంత చట్టం ద్వారా విచారణ జరుపుతారట. ఆ మేరకు చర్యలు కూడా తీసుకుంటారు. మన దేశం విధించిన డిఎస్‌టి అమెరికా, తదితర విదేశీ డిజిటల్‌ సంస్ధలకు మాత్రమే వర్తింప చేస్తూ భారతీయ సంస్దలకు మినహాయింపు ఇవ్వటం వివక్ష కిందకు వస్తుందన్నది ఒక అభ్యంతరం.ఉదాహరణకు అమెజాన్‌,గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి వాటితో పాటు అంబానీ-అదానీ కంపెనీలు డిజిటల్‌ సేవలు అందించినా ఈ చట్టం ప్రకారం అదానీ-అంబానీలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రెండవది కొన్ని నాన్‌ డిజిటల్‌ సేవా సంస్దలు డిజిటల్‌ సేవల మాదిరి వాటిని అందచేసినా వాటికి మినహాయింపు ఇవ్వటం వివక్షా పూరితం అన్నది అమెరికా అభ్యంతరం. దీన్ని మన దేశం అంగీకరించలేదు. ఏ కంపెనీ అయినా మన దేశంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే దానికి మన దేశంలోని పన్ను చట్టాలు వర్తిస్తాయి గనుక వాటి మీద మరొక పన్ను విధించాల్సిన అవసరం లేదన్నది మన వాదన. అమెరికా సంస్ధలు ఏవైనా మన దేశంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే అదే సూత్రం వర్తిస్తుంది. మనకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా మన సేవల ద్వారా లాభాలు పొంది వాటిని తమ దేశాలకు తరలించుకుపోవాలన్నది విదేశీ కార్పొరేట్‌ శక్తుల ఎత్తుగడ. చైనా, భారత్‌ వంటి దేశాలలో పెద్ద ఎత్తున డిజిటల్‌ సేవలను విస్తరిస్తున్నందున వాటి నుంచి పన్ను ఆదాయం రాబట్టకుండా ఆర్ధిక వ్యవస్ధలు నడవవు.
అనేక దేశాలు వివిధ రూపాలలో వస్తు, సేవల మీద పన్నులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు చైనాలో డిఎస్‌టి లేదు. చైనాకు చెందిన అలీబాబా వంటి సంస్దలు డిజిటల్‌ సేవలు అందిస్తున్నాయి.చైనాలో ప్రస్తుతం 18 రకాల పన్నులు ఉన్నాయి. డిజిటల్‌ సేవల మీద కూడా పన్ను విధించాలనే ఆలోచన చేస్తున్నారు. అక్కడ కూడా అమలు చేస్తే ప్రస్తుతం సాగుతున్న వస్తు,సేవల వాణిజ్య యుద్దం డిజిటల్‌ సేవల వాణిజ్యానికి కూడా విస్తరించవచ్చు. మన దేశం విధించిన రెండుశాతం డిఎస్‌టికి ప్రతిగా కొన్ని భారతీయ వస్తువులపై 25శాతం దిగుమతి పన్ను విధించి బదులు తీర్చుకుంటామని మార్చినెల చివరి వారంలో అమెరికా నూతన వాణిజ్యప్రతినిధి కాథరీన్‌ తాయి బెదిరించారు.ఆస్ట్రియా, బ్రిటన్‌, ఇటలీ, టర్కీ, స్పెయిన్‌, ఇతర దేశాల మీద కూడా బస్తీమే సవాల్‌ అన్నారు. టర్కీ 7.5, ఆస్ట్రియా 5, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్సు మూడు శాతం చొప్పున, బ్రిటన్‌ రెండుశాతం డిఎస్‌టి విధిస్తామని ప్రకటించాయి, బ్రెజిల్‌ కూడా పన్ను విధింపు ఆలోచన చేస్తున్నది. ఒకవైపు డిజిటల్‌ సేవల పన్ను మీద ప్రపంచ ఒప్పందం చేసుకొనే అంశం గురించి చర్చించుదామని జో బైడెన్‌ మాట మాత్రంగా అంటున్నా, అది కుదిరే వరకు గతంలో ట్రంప్‌ ప్రతిపాదించిన ప్రతికూల చర్యలను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తారు ప్రకటన నిర్దారించింది.ఆమె ప్రకటనను అమెరికా ఇంటర్నెట్‌ అసోసియేషన్‌ అభినందించింది.

మన దేశం విధించిన డిఎస్‌టి ద్వారా ఏటా 5.5 కోట్ల డాలర్ల మేరకు పన్ను ఆదాయం వస్తుందని అంచనా. అంత మొత్తానికి సమంగా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై అమెరికా పన్ను విధించే ఆలోచన చేస్తున్నది. అదే గనుక జరిగితే మన రొయ్యలు, బాసుమతి బియ్యం, రంగురాళ్లు, వెదురు ఉత్పత్తులు, ఫర్నీచర్‌, బంగారు ఆభరణాలు మొదలైన వాటి మీద 25శాతం వరకు పన్నులు విధిస్తామని ప్రకటించింది. ఇంతకు ముందే మన ఎగుమతులకు ఇచ్చే రాయితీలను కొన్నింటిని ట్రంప్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఉన్నవి పోయాయి, ఇప్పుడు కొత్తవి తగులుకుంటాయి. అయితే అమెరికా చర్యలకు ప్రతీకారంగా అమెరికాను ప్రపంచ వాణిజ్య సంస్ద కోర్టులోకి లాగవచ్చు. అమెరికా నుంచి వస్తున్న ఆడియో-వీడియో ప్రసారాల మీద పన్ను వేయవచ్చు, అమెరికా క్రెడిట్‌ కార్డు కంపెనీలు, మెసేజింగ్‌ సేవలను నిలిపివేయవచ్చు. ఆ చర్యలు తీసుకొనే దమ్మూ ధైర్యం మన 56 అంగుళాల ప్రధానికి ఉందా ? బహుశా మరొక పద్దతిలో బైడెన్‌న్ను ప్రసన్నం చేసుకొనేందుకు సౌదీ బదులు మరింతగా అమెరికా నుంచి చమురు కొంటామనే సంకేతం పంపారా ? అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి బెదిరింపు-ఈ సంకేతం ఒకే సమయంలో వెలువడటాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d