• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Left politics

ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

14 Thursday Jan 2021

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti-Communist, Anti-Communist Playbook, communism, communist-themed restaurant, Penang restaurant, specter of communism


ఎం కోటేశ్వరరావు


ఐరోపాను ఒక భూతం వెన్నాడుతున్నది. ఆ భూతమే కమ్యూనిజం అంటూ 1848లో కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ తొలిసారిగా వెలువరించిన కమ్యూనిస్టు ప్రణాళిక రచన ప్రారంభం అవుతుంది. ప్రచ్చన్న యుద్దంగా వర్ణించిన సమయంలో అది తీవ్రమైంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసినపుడు కమ్యూనిజంపై విజయం సాధించాం అని ప్రకటించారు. అలా చెప్పిన వారే ఇప్పుడు మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాల పుస్తకాల దుమ్ము దులిపి మరోసారి జనాన్ని భయపెట్టేందుకు పూనుకున్నారు. ఎరుపును భూతంగా చూపిన తొలి రోజుల్లోనే ఎరుపంటే భయం భయం కొందరికి-పసిపిల్లలు వారికన్నా నయం నయం అన్న కవిత్వం తెలుగునాట వచ్చింది. వర్తమానంలో కవులు ఎలా స్పందిస్తారో చూద్దాం.


ఇప్పుడు అమెరికాలో ఇంకా అనేక చోట్ల ప్రతిదీ ఎరుపుమయంగా కనిపిస్తోంది, అనేక మంది కలవరింతలతో ఉలిక్కిపడుతున్నారు. వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసి పుంఖాను పుంఖాలుగా సినిమాలు, సీరియల్స్‌, రచనలను జనం మీదకు వదులుతున్నారు. సామాజిక మాధ్యమం, వాట్సాప్‌ ఫేక్‌ యూనివర్సిటీ బోధన ఎలాగూ ఉంది.
అమెరికాలో తాజాగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన డెమోక్రటిక్‌ పార్టీని సోషలిస్టులు, కమ్యూనిస్టులు నడుపుతున్నారని ముద్రవేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అమెరికాను ఆక్రమించినట్లు చెబుతున్నారు. నూతన అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కమ్యూనిస్టులంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు వ్యతిరేకిగా ఉన్న డెమోక్రటిక్‌ పార్టీకీ ఇప్పటికీ అసలు పోలికే లేదని, ఆ పార్టీలో ఇప్పుడు సోషలిస్టులు, కమ్యూనిస్టులు నిండిపోయారని, దానిలో సోషలిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించిన బెర్నీశాండర్స్‌ చివరికి అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి పోటీ పడ్డారని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ డెవిన్‌ న్యూన్స్‌ ఒక రాజకీయ కరపత్రంలో పేర్కొన్నాడు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక చైనా నుంచి నిధులు పొందుతూ 2011 నుంచి నెలకు ఒక అనుబంధం ప్రచురిస్తున్నదని ( అది డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చే పత్రిక) ఆరోపించాడు. నల్లజాతీయుల విషయాల ఉద్యమానికి గతేడాది జూన్‌లో పది కోట్ల డాలర్లు విరాళంగా వచ్చాయని, వారి హింసాకాండలో ఎందరో మరణించగా వంద నుంచి రెండువందల కోట్ల డాలర్ల ఆస్ధి నష్టం జరిగిందన్నాడు. ఎన్నికలలో అక్రమాల గురించి ట్రంప్‌ చేసిన ఆరోపణలన్నింటినీ పునశ్చరణ కావించాడు. రిపబ్లికన్లు లేదా మితవాదులెవరూ ప్రధాన స్రవంతి మీడియాతో మాట్లాడవద్దన్నాడు. డెమోక్రాట్లు అధ్యక్ష భవనం, పార్లమెంట్‌ ఉభయసభలను అదుపులోకి తెచ్చుకున్నారని వాపోయాడు.


ఈనెలలో జార్జియా రాష్ట్ర సెనెట్‌కు జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా ఇద్దరూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులే ఎన్నికయ్యారు. దాంతో సెనెట్‌పై ఆధిపత్యం వహించి జో బైడెన్‌కు ఆటంకాలు కల్పించాలన్న ఆశలు అడియాసలయ్యాయి. కొత్తగా ఎన్నికైన సెనెటర్లిద్దరూ కమ్యూనిస్టులే అని సౌత్‌ డకోటా రాష్ట్ర గవర్నర్‌ క్రిస్టి నియోమ్‌ (రిపబ్లికన్‌) వర్ణించారు. గత 33 సంవత్సరాలుగా రిపబ్లికన్లు తప్ప మరొకరు అక్కడి నుంచి ఎన్నిక అవలేదు. జార్జియా నుంచి ఇద్దరు కమ్యూనిస్టులు సెనెట్‌కు ఎన్నిక అవుతారని ఊహించుకోవటమే పరిహాసాస్పదంగా ఉంది అని ఆమె ఒక వ్యాసంలో వాపోయింది.
అమెరికా మీడియాలో, రిపబ్లికన్‌ పార్టీలో, ఇతర మితవాద శక్తులలో ఈ ధోరణి పెరిగిపోయింది కనుకనే పార్లమెంట్‌, దేశ అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌పై దాడికి తన అనుచరులను డోనాల్డ్‌ ట్రంప్‌ పురికొల్పాడు. అలాంటి శక్తులు రేపు సైనిక తిరుగుబాటును ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు.


మలేసియాలో కమ్యూనిస్టు వ్యతిరేక ఉలికిపాటు !
మలేసియాలోని పదమూడింటిలో ఒక రాష్ట్రం పెనాంగ్‌, దాని జనాభా పద్దెనిమిది లక్షలు.ఆ దీవిలోని పులావ్‌ టైకుస్‌ మరియు జురు అనే రెండు చోట్ల ఓ 40 ఏండ్ల వ్యక్తి చిన్న రెస్టారెంట్లను ఏర్పాటు చేశాడు. వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్తగా ఏం చేయాలబ్బా అని ఆలోచించాడు. మలేసియా బహుళ జాతుల నిలయం. ఆ రెస్టారెంట్‌ యజమాని చైనా జాతీయుడు. ఆహార పదార్దాలకు హాస్యం పుట్టించే విధంగా చైనా పేర్లతో పాటు మావో, ఇతర కమ్యూనిస్టు బొమ్మలను కూడా వాల్‌ పేపర్ల మీద ముద్రించి అందంగా ఏర్పాటు చేశాడు. ఇంకేముంది మలేసియాలో తిరిగి కమ్యూనిస్టులు తలెత్తారు, లేకపోతే ఆ గుర్తులతో హౌటల్‌ ఎలా ఏర్పాటు చేస్తారంటూ కొందరు కమ్యూనిస్టు వ్యతిరేకులు గగ్గోలు పెట్టారు. జనవరి మొదటి వారంలో పోలీసులు దాని మీద దాడి చేసి పోస్టర్లన్నీ చింపివేశారు. కమ్యూనిజానికి-యజమానికి సంబంధం ఏమిటి ? దీని వెనుక కమ్యూనిస్టులున్నారా అంటూ పరిపరివిధాలా బుర్రలు చెడగొట్టుకుంటున్నారు. ఇక రాజకీయ నేతలు సరేసరి. పెనాంగ్‌లో కమ్యూనిస్టు ఉద్యమం ఉందనటానికి హౌటలే నిదర్శనం అని కమ్యూనిస్టు వ్యతిరేక ”ఉమనో ” గా పిలిచే ఒక పార్టీ నేత బహిరంగ ప్రకటన చేశాడు. చైనాతో మలేసియాకు సంబంధం ఉన్న కారణంగానే ఇది జరిగిందని ఆరోపించాడు. ఇది అత్యంత బాధ్యతా రహిత ప్రకటన అంటూ ప్రత్యర్ధి పార్టీలు రంగంలోకి దిగాయి. పోలీసులు దాడి చేసిన సమయంలో ఆ అలంకరణ చేసిన హౌటల్‌ యజమాని కరోనా కారణంగా క్వారంటైన్‌లో ఉన్నాడు. కమ్యూనిజమూ లేదు ఏమీ లేదు, అందంగా ఆకర్షణీయంగా ఉంటుందని అలా చేశానని మొత్తుకున్నాడు. అతడు చైనా జాతీయుడు కనుక ఇంత రచ్చ చేశారన్నది స్పష్టం.ఈ కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఎలా చెప్పగలుగుతున్నారన్న ప్రశ్న వస్తుంది. జనవరి 13వ తేదీన పోలీసులు రెస్టారెంట్ల యజమానిని విచారించగా తాను ఒక చోట రెండు సంవత్సరాల క్రితం మరోచోట నాలుగేండ్ల నుంచి ఆ అలంకరణలతో నడుపుతున్నానని అప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం పెట్టలేదు ఇప్పుడేమిటని అడిగాడట.


మలేసియా, సింగపూర్‌, ఇండోనేసియా వంటి దేశాలలో గణనీయ సంఖ్యలో చైనా జాతీయులున్నారు.ఉడిపి హౌటల్‌, ఆంధ్రా భోజన హౌటల్‌ పేరుతో తెలుగు ప్రాంతాల్లో ఉన్నట్లుగానే మావో జన్మించిన చైనాలోని హునాన్‌ రాష్ట్రంలో మావో జియా కారు లేదా మావో కుటుంబ వంటలు అంటే ఎంతో ప్రాచుర్యం ఉంది. ఆపేరుతో అనేక ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి.దానిలో భాగంగానే పెనాంగ్‌ రెస్టారెంట్‌ అన్నది స్పష్టం.దీన్ని వివాదాస్పదం చేసిన వారు బుద్ధిహీనులు అని అనేక మంది నిరసించారు.జపనీస్‌ రెస్టారెంట్లు ఉన్నంత మాత్రాన జపాన్‌ ఆక్రమణను ప్రోత్సహించినట్లు, పశ్చిమ దేశాల రెస్టారెంట్లు ఉన్నంత మాత్రాన ఆ దేశాల అలవాట్లను ప్రోత్సహిస్తున్నట్లా అని గడ్డి పెట్టారు. మలేసియాలో చైనా యాత్రీకులు మావో చిత్రం ఉన్న కరెన్సీ యువాన్లు ఇస్తే తీసుకోవటం లేదా ? అది కమ్యూనిజాన్ని ప్రోత్సహించినట్లా? దాడి చేయబోయే ముందు పోలీసులు ఇలాంటివన్నీ ఆలోచించరా అన్నవారూ లేకపోలేదు. హౌటల్‌ అలంకరణలో కమ్యూనిస్టు సిద్దాంతాలేవీ లేవని, ఒకవేళ ఉన్నా కూడా తప్పేమిటి, కమ్యూనిస్టు చైనా నుంచి అనేకం నేర్చుకోవటం లేదా దానితో వాణిజ్యం చేయటం లేదా అని ప్రశ్నించిన విశ్లేషకులూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కమ్యూనిజాన్ని ముందుకు తెచ్చే చౌకబారు ఎత్తుగడ అన్న వ్యాక్యానాలు వెలువడ్డాయి. 1930లో ఏర్పడిన మలయా కమ్యూనిస్టు పార్టీ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ దురాక్రమణకు,తరువాత బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేసింది.1957లో స్వాతంత్య్రం పొందిన తరువాత కూడా బ్రిటీష్‌ పాలనలో విధించిన నిషేధం కొనసాగటంతో సాయుధపోరాటాన్ని కొనసాగించింది.1989లో సాయుధ పోరాటాన్ని విరమించింది.ఈకాలంలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన నేపధ్యంలో రెస్టారెంట్‌ అలంకరణ వివాదాస్పదమైంది.


ఇండోనేసియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత !
కొద్ది సంవత్సరాల క్రితం ఎరుపు రంగు టీ షర్టులు అమ్ముతున్నవారిని కమ్యూనిస్టులని, కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నారని ఇండోనేసియాలో అరెస్టులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడి పశ్చిమ జావా ప్రాంతంలో సుత్తీ కొడవలి చిహ్నాలతో నిర్మించిన ఒక బస్టాప్‌ చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టుచేసి ఇంకే ముంది ఇండోనేసియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది జాగ్రత్త అంటూ హెచ్చరికలు చేశారు. తీరా చూస్తే ఇదే చిత్రాన్ని నాలుగు సంవత్సరాల క్రితం అనేక మంది సామాజిక మాధ్యమాల్లో తిప్పుతున్నారని తేలింది. అసలు విషయం ఏమంటే 2015లో కేరళలోని కొల్లం జిల్లాలో ఒక చోట ఏర్పాటు చేసిన బస్టాప్‌ చిత్రం అది. అంటే కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు వ్యతిరేకులు ప్రతి అవకాశాన్ని ఎంతగా ఎలా వినియోగించుకుంటున్నారో అర్దం చేసుకోవచ్చు. అంబేద్కర్‌ను ఎన్నికల్లో కమ్యూనిస్టులు పనిగట్టుకొని ఓడించారని కాషాయ దళాలు చేసే ప్రచారం ఇలాంటిదే. అంబేద్కర్‌ బొంబాయిలోని ఒక రిజర్వుడు-జనరల్‌ ద్వంద్వ లోక్‌సభ స్దానం నుంచి పోటీ చేశారు. జనరల్‌ సీటులో నాటి కమ్యూనిస్టు నేత ఎస్‌ఏ డాంగే, రిజర్వుడు సీటులో అంబేద్కర్‌ పోటీ చేశారు.

రైతులకు కమ్యూనిస్టు ముద్రవేసిన హర్యానా బిజెపి సిఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ !
రైతాంగ ఉద్యమం వెనుక కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఆరోపించారు. కిసాన్‌ మాహాపంచాయత్‌ పేరుతో కేంద్ర చట్టాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఒక సభలో ముఖ్యమంత్రి పాల్గనాల్సి ఉంది. అయితే రైతులు ఆ సభను వ్యతిరేకిస్తూ ప్రదర్శనగా వెళ్లి సభా స్ధలిని, హెలిపాడ్‌ను ఆక్రమించుకోవటంతో ఆ సభ రద్దయింది. దాంతో ముఖ్యమంత్రి ఆరోపణలకు దిగారు. నిజంగా రైతులు ఆ పని చేయరని వారి ముసుగులో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వారే చేశారన్నారు.


కాపిటల్‌ హిల్‌ దాడిలో కమ్యూనిస్టు వ్యతిరేకులు !
అమెరికా అధికార కేంద్రం వాషింగ్టన్‌ డిసిలోని కాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి చేసిన దుండగులందరూ పచ్చిమితవాద, కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులే.వారిలో కొందరు లాయర్లు,ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వారిలో ఒకడి పేరు మెకాల్‌ కాల్‌హౌన్‌. మూడు దశాబ్దాలుగా లాయర్‌గా పని చేస్తున్నాడు. అతగాడి ట్విటర్‌ వివరాల్లో తాను ఒక కమ్యూనిస్టు వ్యతిరేకిని అని చచ్చేంత వరకు డెమోక్రాట్‌ కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తా అని రాసుకున్నాడు. అమెరికా మీద ప్రేమతో తామీ చర్యకు పాల్పడ్డామని, దానిని దాడి అనకూడదు, అక్రమంగా ప్రవేశించటం అనాలి, నేను ఆ పని చేశాను అని చెప్పుకున్నాడు.


ఒక వస్తువును నాశనం చేయగలరు గానీ ఒక భావజాలాన్ని పాతిపెట్టి విజయం సాధించిన వారెవరూ లేరు. అది కష్టజీవులకు సంబంధించింది అయితే ఎంతగా అణచివేయాలని చూస్తే అంతగా తిరిగి లేస్తుంది.శక్తి రూపం మార్చగలం తప్ప నశింపచేయలేము. కమ్యూనిజమూ అంతే. ప్రచ్చన్న యుద్దంలో కమ్యూనిస్టులను ఓడించామని చెప్పిన తరువాత అమెరికాలో సోషలిజం పట్ల మక్కువ పెరిగింది. కమ్యూనిస్టులు లేదా సోషలిస్టులుగా ముద్రపడిన అనేక మంది స్ధానిక, జాతీయ ఎన్నికలలో విజయం సాధించారు. వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించగలిగినదే అయినప్పటికీ మరింత పెరుగుతుందేమో అని భయపడుతున్నారు. ఒక వైపు యువత కమ్యూనిస్టు పుస్తకాల దుమ్ముదులిపి అధ్యయం చేసేందుకు ఆసక్తి చూపుతుంటే మరోవైపు దానికి ప్రతిగా దోపిడీదారులు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార పుస్తకాల దుమ్ముదులుపుతున్నారు. 1996 తరువాత అమెరికాలో పుట్టిన వారిలో పెట్టుబడిదారీ విధానం మీద ఆసక్తి తగ్గిపోతుండగా సోషలిజం మీద పెరుగుతున్నది. గతంలో కమ్యూనిజం విఫలం అయిందనే మాటే వినిపించేది. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం వైఫల్యం చెందిందనే అభిప్రాయం పెరుగుతోంది. సోషలిస్టుచైనా ఆర్ధిక రంగంలో అనేక విజయాలు సాధిస్తుండగా అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎందుకు వెనుకబడుతున్నాయన్న మధనం ఆ సమాజాల్లో ప్రారంభం కావటం దోపిడీ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీరు ఎటు వైపో తేల్చుకోండి

10 Sunday Jan 2021

Posted by raomk in AP NEWS, Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Farmers agitations, Farmers Delhi agitation, indian farmers

డాక్టర్ కొల్లా రాజమోహన్

మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయమని సెప్టెంబరునుండి భారత దేశ రైతులు ఆందోళన చేస్తున్నారు. భారత దేశ రైతు ఉద్యమ చరిత్రలో దేశరాజధానిని లక్షలాదిమంది రైతులు ముట్టడించటం ఇదే ప్రధమం.

ఢిల్లీకి వచ్చి ధర్నాచేయాలనుకున్న రైతులను ఢిల్లీసరిహద్దులలోనే సైన్యం ఆపేసింది. ఢిల్లీలోకి ప్రవేశించకుండా పెద్ద బండరాళ్ళను రోడ్డుకి అడ్డంగా పెట్టారు. వాహనాలు ముందుకు వెళ్ళకుండా  రోడ్డ్డుకు గుంటలు తవ్వారు. ఇనుప కంచెలు వేశారు. బారికేడ్లు నిర్మించారు. బాష్పవాయువును  ప్రయోగించారు. చలిలో వణుకుతున్నప్రజలపై వాటర్ గన్స్ తో నీళ్ళను కొట్టారు. అయినా రైతులు వెనుకాడలేదు. ఎన్ని కష్టాలనైనా భరించి ఎన్నాళ్ళైనా వుండి తాడోపెడో తేల్చుకుంటామని ఏకైక దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

 దేశానికి అన్నంపెట్టే రైతులకు రోడ్డే ఇల్లయింది. ప్రభుత్వం -రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో, దశలవారీగా ఆందోళనను ఐక్యంగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా కలుస్తారేమో కానీ రైతులు మాత్రం ఐక్యం కారు అనే మాటను వమ్ము చేశారు . 500 రైతు సంఘాలు ఐక్యమయ్యాయి. లక్షలాదిమంది రైతులు రోడ్డెక్కారు. ఇదొక అపూర్వ  సంఘటన. ఈ ఉద్యమం భారత దేశ ప్రజలకు ఒక సవాలు విసిరింది. మీరు ఎటువైపో తేల్చకోమంది.

విశాల ప్రజల ప్రయోజనాలా లేక కొద్దిమంది ప్రయోజనాలా ,రైతు ప్రయోజనాలా లేక కార్పోరేటు కంపెననీల ప్రయోజనాలా తేల్చుకోమని రైతు ఉద్యమం కోరింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలన్నీ  ప్రస్తుతం అన్నదాతల నిరసనల కేంద్రాలయ్యాయి. ఢిల్లీ నగర ప్రవేశమార్గాలయిన సింఘూ. టిక్రీ,నోయిడా, పల్వల్ ప్రాంతాలలో లక్షలాదిమంది రైతాంగం భైఠాయించారు, ప్రపంచ ప్రసిధ వాల్ స్ట్రీట్ పోరాటాన్ని మించిపోయింది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా రైతులు సాగిస్తున్న ఉద్యమం  నెలరోజులకు మించింది. కాగా, ఈ చట్టాలు రద్దును కోరుతూ ఏడో దఫాకూడా  చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. కాగా, చట్టాల రద్దు చేయాలని రైతు సంఘాలన్నీ బలంగా కోరుతున్నారు. తమ ప్రతిపాదనలను అంగీకరిస్తేనే ఆందోళనలను విరమించుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉన్నది. చర్చలకు లాజిక్, రీజన్ తో రావాలని ప్రధాన మంత్రి చెబుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల బృందం…రైతులతో చర్చలు సాగిస్తోంది. కాగా, ఈ . 40 రైతు సంఘాల నేతలతో తోమర్‌ పాటు పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌ చర్చిస్తున్నారు. కాగా, చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు ఒకే మాటపై నిల్చున్నాయి.,ఢిల్లీ చుట్టుపక్కల గడ్డి కాల్చటం పై ఆర్డినెస్స్‌, 2020 విద్యుత్‌బిల్లు సవరణ,ఈ రెండు అంశాలపై ప్రభుత్వం సానుకూలం గా స్పందించింది. చర్చలు సాఫీగా జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులు కోరుతున్న వ్యవసాయ చట్టాల రద్దు సమస్యపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.

రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగమవుదామని బయల్దేరాం.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి రైతు సంఘాల ప్రతినిధులు 12 మంది ఢిల్లీ బయల్దేరాము. ఢిల్లీ సరిహద్దులలో నవంబరు 26 నుండి రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగ మయి, సంఘీభావం తెలపాలని బయలుదేరిన మా ప్రతినిధి వర్గానికి కొంతమంది రైతులు వీడ్కోలు పలికారు. మరో ఇద్దరు ఢిల్లీ లో కలిశారు. చారిత్రాత్మక రైతు ఉద్యమంలో భాగమయి పోరాడుతున్న రైతులను ఆంధ్ర ప్రదేష్ కు చెందిన 12 మంది రైతుసంఘాల ప్రతినిధులు మనసారా అభినందించారు. స్ఫూర్తి పొందారు.

 డిసెంబరు 27 ఉదయం ఢిల్లీ చేరిన వెంటనే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులైన హన్నన్ మొల్లా , ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు అశోక్ ధావలే లను, విజూ కృష్ణన్, ప్రసాద్ , వ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ ,సునీల్ చోప్రా గారిని కిసాన్ సభ కార్యాలయంలో కలిశాం. వారు ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతుల పోరాటాన్ని వివరించారు. ఈ పోరాటం ఈ శతాబ్దంలో అతి ముఖ్యమైన పోరాటం అన్నారు. స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద పోరాటం లేదన్నారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ పోరాటం పరాజయం చెందితే రైతాంగ వ్యతిరేక శక్తులు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు విజృంభిస్తాయి అన్నారు. ఈ రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులకు, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం ఉధృతం చేయటానికి అందరూ కృషి చేయాలని కోరారు.

అక్కడ నుండి ఢిల్లీ సింఘు సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాం. మాతో పాటుగావ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ గారు, ఢిల్లీలోని తెలుగు పత్రికా విలేకరులు వచ్చారు. వారి సహాయం విలువైనది. ఢిల్లీ లో ఉన్నన్ని రోజులూ మాకు బస కల్పించి వాహన సదుపాయాలు కల్పించిన ఉద్యమ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

పోరాట ప్రాంతానికి పయనం 

శోభనాద్రీశ్వరరావు గారి ఆరోగ్యం దృష్ట్యా పోరాట ప్రాంతానికి వారు వెళ్ళటం కష్టం అన్నారు. అయినా శోభనాద్రీశ్వరరావు గారు అంగీకరించకపోవడంతో వారితో పాటు అందరూ కలిసి వెళ్ళాం. పోలీసు సరిహద్దులను దాటుకొని పోరాట ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ చేరిన ప్రజల సమూహాన్ని చూస్తే మాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేసింది. అక్కడున్న వేదికకు చేరడానికి చాలా కష్టమైంది. ప్రజా సమూహం మధ్య దారి చేసుకుంటూ పదండి ముందుకు అనుకుంటూనడిచాము.శోభనాద్రీశ్వరరావు గారు నడవటం చాలా కష్టమైంది. అయినా ఆయన పట్టుదలతో ముందుకు సాగాడు. అంతలో టాపు లేని చెక్క రిక్షా ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఆ రిక్షా పై వారిని కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం. ఆ రిక్షాకూడా ఇకపై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. అంతలో కొంతమంది మిత్రులు ఒక మోటార్ సైకిల్ ని తీసుకొచ్చారు.. ఆ మోటార్ సైకిల్ పై కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం.

మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళటం మరీ కష్టమైంది. ప్రజల తోపులాటలో కింద పడే పరిస్థితి వచ్చింది.

ఎలాగోలా వేదిక వద్దకు చేరుకున్నాం.  మాలో కొంతమందిని వేదిక పైకి తీసుకుని వెళ్లారు. వేదికపై నుండి కొంతమంది మహిళలు ఉపన్యాసాలు చేస్తున్నారు. వేదిక ముందు, చూపు ఆనినంతవరకుతవరకు ప్రజలు కూర్చుని ఉన్నారు. ఎక్కువ  మంది మహిళలు పాల్గొన్నారు.

వేదిక వెనుక ఉన్న గుడారంలో ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కువ మంది యువకులు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. సినిమా నటులు హరిబీత్ సింఘ్, , ప్రసిద్ధ గాయకులు, ప్రసిధ క్రీడాకారులు మంగీ, జిలానీ జోహాల్ వంటివారు పత్రికా విలేకరుల సమావేశాలు జరిపి ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. 

ప్రెస్ మీట్ లో శోభనాద్రీశ్వరరావు గారు రామకృష్ణ గారు రైతు ఉద్యమం గురించి వివరంగా మాట్లాడారు. టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికా విలేఖరులు అత్యుత్సాహంతో తోపులాడుకుంటూ వార్తలు సేకరించారు.బిస్కెట్లు, రస్కులు, మంచినీటి సీసాలు , టీ, నిరంతరాయంగా సరఫరా జరుగుతుంది.  

కొన్ని వారాలుగా పోరాడుతున్నరైతు ఉద్యమానికి ,రు.10 లక్షల ఆంధ్ర ప్రజల ఆర్థిక సహాయాన్ని శ్రీ వడ్డే శోభనాద్రీశివరరావు గారి చేతుల మీదుగా ఎఐకేఎస్ సిసి నేత హన్నన్ మొల్లా, సంయుక్త కిసాన్ మోర్చానేత దర్శన్పాల్ లకు చెరొక రూ.ఐదు లక్షలనగదును అందించారు.

రోడ్ పై ఎలా బతుకుతున్నారు?

వేదిక నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం రోడ్డు మీద నడిచాం. కనిపించినంత వరకు లక్షలాదిమంది ప్రజా సమూహం కనబడుతుంది.వారిలో పిల్లల వద్ద నుండి వృద్ధుల వరకు ఉన్నారు. ఒక దృఢమైన నిశ్చయం వారి ముఖాలలో కనబడుతుంది. తీవ్రమైన చలి లో, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ గుడారాలలో నివసించుచున్న రైతుల పోరాటపటిమను భారత ప్రజలందరూ స్పూర్తిగా తీసుకోవాలని అనుకున్నాం.. ఎవరితో మాట్లాడి నా  రెండు విషయాలపై స్పష్టత కనిపిస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలు రైతులప్రయోజనాలకు వ్యతిరేకమయినవనీ, కార్పోరేటు కంపెనీలకు అనుకూలమయినవనీ  చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలందరూ చైతన్యంతో స్పషంగా కార్పోరేట్  రైతు  వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు పోరాడాలనటం వారి చైతన్యస్ధాయికి నిదర్శనం. ఇక్కడ ఎన్నాళ్ళు ఈ విధంగా ఉంటారు అని అడిగితే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు అయిందాకా అని అందరూ చెప్తున్నారు. మీరిక్కడ ఉంటే వ్యవసాయం ఎలా అని అడిగాను. నిజమే. పొలాలలో పనులున్నాయి. ఇంటివద్ద పశువులున్నాయి. నా భార్య బాధ్యతగా పని భారాన్ని భరిస్తున్నది. వ్యవసాయచట్టాలను రధ్దు చేసుకుని ఇంటికి రమ్మని భరోసా ఇచ్చిందన్నారు. ఊరిలో ఉన్న వాళ్ళు మా వ్యవసాయాన్ని కూడా చూస్తున్నారని ఆ రైతు చెప్పాడు. కార్పొరేటు అనుకూల చట్టాలు రద్దయిందాక ఇంటికి రావద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వం పోలీసులను సైన్యాన్ని ఉపయోగించి ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచి వేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశాము. మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. మాకు ఆదర్శం భగత్ సింగ్ అన్నారు.

వారి జీవన విధానాన్ని పరిశీలించాము. ట్రాక్టర్లు, ట్రాలీలు వాడకం చాలా ఎక్కువగా ఉంది, ట్రాక్టర్ ట్రాలీ లో కింద గడ్డి పరిచి దానిపై పడుకుంటున్నారు. కొన్నిచోట్ల పైన ప్లాస్టిక్ షీట్లు తో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. కిందనే గడ్డి వేసుకొని దానిపై పడుకుంటున్నారు.

దాదాపు యాభై కిలోమీటర్లు  గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. ముందు వచ్చిన వారు ఢిల్లీ నగరం దగ్గరగా రోడ్డుపై వుంటే, వెనక వచ్చినవారు వారి పక్కన గుడారాలు వేసుకుని నిరసన తెలియచేస్తూ జీవిస్తున్నారు. సింఘూప్రాంతంలో ఉంటే వెనక వచ్చిన వారు 50 కిలోమీటర్ల దూరంలో టెంట్ వేసుకుని ఉంటున్నారు. దేశప్రజలంతా ఈ రైతాంగపోరాటానికి  అండగా వుంటారన్నారు.

చలిని తట్టుకోవటానికి గుడారాలముందు చలిమంటలు వేసుకుంటున్నారు .ఎముకలు కొరికే చలిలో కొంతమంది చన్నీళ్ల స్నానం చేస్తున్నారు.

వర్షం నీళ్ళు పడటం వల్ల దుప్పట్లు, బట్టలు, తడిసిపోయాయని నిరసన వ్యక్తం చేసిన రైతు వీర్‌పాల్ సింగ్ తెలిపారు.  “వర్షపు నీరుతో కట్టెలు తడిసినందున మేము ఆహారాన్ని వండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.  మాకు ఎల్‌పిజి సిలిండర్ ఉంది, కానీ ఇక్కడ ప్రతిఒక్కరికీ అది లేదు, ”అన్నారాయన.

లంగరు సేవ

ఎక్కడికక్కడే  వంటలు చేసుకుంటున్నారు. వేలాది మంది భోజనాలు చేస్తున్నారు. లోటు లేదు.వంట చేసేవారికి కొదవ లేదు. గ్రామంలోని రైతులు కూరగాయలు,పళ్ళు , వంట సరుకులు తీసుకుని వస్తున్నారు. నెలలపాటు సరిపోయే ఆహారాన్ని వెంట తెచ్చుకున్నారు. వంట మనుషులు, వడ్డించే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు. రైతులతో పాటుగా చూడటానికి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగస్తులు అందరూ పని చేస్తున్నారు. వెల్లుల్లిపాయలు వలవటం దగ్గరనుండి, కూరగాయలు కోయటం వరకూ అన్ని పనులూ చేస్తున్నారు. పెద్దవాళ్లు కూడా నడుము వంచి వంటలు చేస్తున్నారు. వండేవారు, వడ్డించే వారు అంతా సేవకులే. సేవే పరమావధి గా భావిస్తున్న పంజాబీ ప్రజలు లంగర్ సేవ ధర్మంగా ఆచరిస్తున్నారు.లక్షలాది మంది ప్రజలకు భోజనం సరఫరా చేయడం చాలా కష్టమైన పని. లంగర్ సేవ ఆధారంగా ఈ సమస్యలు ఆందోళనకారులు పరిష్కరించారు. చూడటానికి పోయిన వారందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. సేవా దృక్పథంతో రోటి మేకర్ల ను కూడా తీసుకొచ్చి ప్రేమతో బహుమానంగా కొంతమంది ఇచ్చారు. అయినా చేతుల తోనే సులువుగా రొట్టెలు చేస్తున్నారు. రొట్టెలు పెద్ద పెద్ద పెనములపై కాలుస్తున్నారు.

కొన్ని ప్రాంతాలలో జిమ్‌లు, లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. పుస్తకాలు ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు. భగత్సింగ్ పుస్తకాలు , ఫొటోలు అన్నిచోట్లా ప్రదర్శిస్తున్నారు.

‘ట్రాలీటైమ్‌’ అనే వార్తా పత్రిక కూడా వస్తోంది. రైతుల ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో ఆందోళనకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు. ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో అనేకమంది రాసిన కథనాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆందోళనకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉద్యమానికి మద్దతుగా రైతులు, విద్యార్ధులు రాసిన కవితలు ప్రచురితమయ్యాయి.

మరికొంతమంది నిరశనకారులలో ఉత్సాహం నింపేందుకు సంగీత కచేరీలు నిర్వహిస్తూన్నారు.

మల మూత్ర విసర్జనకు టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన కనిపించలేదు. పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కావలసిన నీళ్లను టాంకుల ద్వారా తీసుకొచ్చి నిల్వ పెట్టుకుంటున్నారు.

ఉద్యమం ప్రారంభమైన కొద్ది సమయానికి అందరి సెల్లులకు  చార్జింగ్ అయిపోయింది.  చార్జింగ్ ఎలా అనే సమస్య ముందుకు వచ్చింది. ఎలక్ట్రిసిటీ లేదు. కరెంటు లేకుండా సెల్ ఛార్జింగ్ కాదు. వెంటనే సోలార్ ప్యానల్ తడికలను తీసుకొచ్చి బిగించారు.కరెంటు సమస్యను పరిష్కరించి వెలుగు ను ప్రసాదించారు.ఆధునిక అవసరాలలో అతి ముఖ్య అవసరమైన సెల్ చార్జింగ్ సమస్యను పరిష్కరించారు కొంతమంది టూత్ బ్రష్ లను పేస్ట్ లను అందిస్తున్నారు. 

వైద్య సహాయం చేయటానికి పంజాబ్, హర్యానా, ఢిల్లీ  నుండి డాక్టర్లు, నర్సులు స్వచ్ఛందంగా వచ్చారు. మందులను, పేస్ మాస్క్ లను ఉచితంగా ఇస్తున్నారు. 50 చోట్ల “లంగర్ మెడికల్ క్యాంపు” లను ఏర్పాటు చేశారు. పేరున్న స్పెషలిస్టులు కూడా వచ్చి మెరుగైన చికిత్సలను అంది స్తున్నారు. అందోళనకారుల లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలను, మానసిక  అందోళనను నివారించటానికి కౌన్సిలింగ్ సెంటర్ లను ఏర్పారిచారు. అత్యవసరం గా సీరియస్ కేసులను పంపటానికి అంబులెన్సులను రెడీ గా ఉంచారు.

చదువుకునేందుకు పుస్తకాలను కొన్ని స్వఛంద సంస్ధలు సరఫరా చేశాయి. 

కొందరు ఆఫీసులకు సెలవులు పెట్టి కుటుంబంతో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. “చరిత్రలో భాగం కావాలంటే రైతుల నిరసనల్లో ఒక్కసారైనా పాల్గొనాల్సిందే” అని అంటున్నారు. “మా కుటుంబం రైతు కుటుంబమని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక్కడి రైతుల డిమాండు న్యాయమైనది. ఈ వాతావరణం చూస్తుంటే వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ అయ్యేవరకు వీరు కదలకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నట్లుగా ఉంది” అని ఒక పెద్దాయన అన్నాడు.

అన్నం పెట్టే రైతన్నలకు సేవ చేయడానికి మించింది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. సందర్శించేందుకు పెద్ద మొత్తంలో వస్తున్న జన సందోహానికి కూడా కడుపు నింపుతున్న లంగర్ కార్యకర్తలు అభినందనీయులు.

“ ఈ వ్యవసాయ చట్టాలు వయసుడిగిన మాకు పెద్ద నష్టం కలిగించకపోవచ్చు కాని మా తరువాతి తరాన్ని మాత్రం తీవ్రంగా నష్ట పరుస్తాయి. అందుకే వీటిని ఉపసంహరించేంత వరకు పోరాడతాం. మా భూమిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు “ అంటున్నాడు ఒక వయస్సు మళ్లిన రైతు. 

యూపీ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన సెలూన్‌ పెట్టుకున్న ఓ వ్యక్తి కస్టమర్లకు షేవింగ్‌, కటింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.రైతుల ఆందోళన మొదలయ్యాకే ఆయన ఇక్కడ షాప్‌ తెరిచారు. ఆయనలాంటి మరికొందరు కూడా ఉద్యమం మొదలైన వారంలోనే ఇక్కడ షాపులు పెట్టారు.మరో దుకాణదారు రైతులకు చెప్పులు అమ్మతున్నారు. కొంత దూరంలో కొందరు చలికోట్లు అమ్ముతున్నారు. ఇక్కడ నిరసన స్థిర రూపం దాల్చింది. ఈ ప్రాంతం ఆందోళన చేసే ప్రాంతంగా మారింది.

నెల  రోజులకు పైగా నిరసనలు తెలపడం చరిత్ర సృష్టించడమే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత లక్షలాది నిరసనకారులు, లక్షలాది మద్దతుదారుల సంఘీభావంతో సుదీర్ఘకాలం నడుస్తున్న పోరాటం ఇది. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులలో నిరసనలు చేస్తోంది హర్యానా, పంజాబ్‌లకు చెందిన రైతులే కాదు; ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, బీహార్‌ల నుంచి తండోపతండాలుగా వచ్చి చేరుతున్నారు. 

షాజన్ పూర్ నిరశనప్రాంత సందర్శన.

చరిత్ర సృష్టించిన రైతాంగం

సోమవారం రైతు సంఘ ప్రతినిధులు హర్యానా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన షాజన్ పూర్ వద్ద జరుగుతున్నరైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపాము. అక్కడ ఉద్యమ నేతలు యోగేంద్రయాదవ్, అమ్రా రామ్, అజిత్ నవలీలను కలిసి మద్దతు తెలియజేశాం. అక్కడ చేరిన రైతులను ఉద్దేశించి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు అమలు అయితే భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి అవుతుందన్నారు. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావురావు గారి ప్రసంగాన్ని పంజాబీ భాష లోకి అనువదించారు. ప్రముఖ పంజాబీ టీవీలు డైరెక్ట్ గా రిలే చేశాయి. యోగేంద్ర యాదవ్ ఆంధ్ర ప్రజల ఈ సహకారాన్ని అభినందించారు. “లడేంగే-జీతేంగే”,  “కిసాన్ ఏక్తా-జిందాబాద్.” అని నినాదాలు చేశారు.

దూరంగా కన్పడుతున్న రైతులనందరినీ చూద్దామని కొంతదూరం నడిచాము. ఎంతదూరంనడిచినా చివరి గుడారాన్ని చేరుకోలేకపోయాం.కొన్ని మైళ్ళబారున రైతులు జీవిస్తున్నారు. కృతనిశ్చయంతో నిలబడ్డారు. మా బతుకు కోసం, మా భూమికోసం రోడ్డుమీదకు వచ్చామంటున్నారు.పెప్సీ లాంటి కార్పోరేట్ కంపెనీలతో చేసిన కాంట్రాక్టు వ్యవసాయం వలన రైతులకు లభించిన నష్ఠాలు ఆరైతులుఇంకా మరచిపోలేదంటున్నారు.ప్రభుత్వం ,ఈ పోరాటాన్ని ఖలిస్తాన్ వాదుల పోరాటం, టెర్రరిస్టుల పోరాటం,    నక్సలైట్ల పోరాటం, ప్రతిపక్ష పార్టీల పోరాటం, ఆర్ధియాస్ దళారీల పోరాటం గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నది. దేశం మొత్తంగా ప్రచార  దళాలను ఏర్పరిచారు. స్వయానా ప్రధాన మంత్రి గంగానది సాక్షిగా రైతుఉద్యమాన్ని కించపరిచారు. మన్ కీ బాత్ లో అవాస్తవాలను చిత్రీకరించారు. కానీ రైతులు వారి మాటలను నమ్మలేదు. పౌర సమాజం గమనిస్తోంది. రైతుల నిరసనలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచే దిశలో కదులుతోంది. 

రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు ప్రయోజనాలను బలిపెట్టేవేనంటూ రైతులు చేస్తున్న ఢిల్లీ ముట్టడి రెండోనెలలో ప్రవేశించింది. .అనవసర కాలయాపన చేస్తూ ప్రమాదకర ప్రతిష్టంబనను పొడిగించుతూ ప్రభుత్వం ప్రతిష్టకు పోతున్నది. ఢిల్లీలోకి రానివ్వకుండా సృషించిన అడ్డంకులను తొలగించుకుని రోడ్డులనే నివాసంగామార్చుకున్న రోజునే ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చర్చల లో పాల్గొన్న రైతునాయకులందరూ ఒకే మాటపై నిలబడి ఏకైక ఎజెండా గా నూతన చట్టాలను రద్దు చేయమని అడగటం రైతాంగ ఐక్యతకు చిహ్నం. 500 రైతు సంఘాలను , లక్షలాదిమంది రైతుల అపూర్వమైన ఐక్యత ను సాధించి  రైతులను ఏక  తాటి పై నిలబెట్టిన రైతు నాయకులందరూ  అభినందనీయులు. రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.

ఒకపక్క వర్షం కురుస్తున్నా మరోపక్క ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు నిరసనను కొనసాగిస్తున్నారు. తమతో పాటుగా ఆందోళన చేస్తున్న 50 మంది సహచరులు తమ ఎదురుగా మరణించినా మౌనంగా రోదిస్తున్నారు తప్ప , తమ ఆందోళన విరమించలేదు.

కిసాన్ ఏక్తా జిందాబాద్ ; కిసాన్ మజ్దాూర్ ఏక్తా జిందాబాద్ ; లడేంగే- జీతేంగే; “జబ్ తక్  కానూన్ వాపస్ నహీ – తబ్  తక్ ఘర్ వాపసు నహీ ” , నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతున్నది.

మీడియాలోమొక్కుబడి వార్తలు.

ముఖ్యంగా పెద్ద టీవీలు, ప్రధాన  మీడియా రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తూ, రైతుల ఆత్మ స్ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గ్రహించారు. కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు రైతుల పోరాటాన్ని కించపరిచాయి. రైతుల చైతన్యాన్ని ఎగతాళి చేశాయి. ప్రజలు తమ జీవిత అనుభవం నుండి జీవన పోరాటాన్ని సాగిస్తున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. జీవనోపాధికి ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులను ఉద్యమకారులు ఛేదిస్తున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. కానీ కార్పొరేట్ కబంధహస్తాల్లో బంధించబడిన మీడియాకు రైతు ఉద్యమo కనపడలేదు. ఆ లోటును సోషల్ మీడియా కొంతవరకు భర్తీ చేసింది. కిసాన్ ఏక్తా వార్తా సంస్ధను రైతులు ప్రారంభించారు. కొద్దికాలంలోనే అనన్య ప్రచారం, గుర్తింపు పొందింది.  

ఇప్పుడు, నిరసన, అసమ్మతి , సంఘీభావం తెలియజేయడానికి  ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పోరాట ప్రాంతం పుణ్యస్ధలమయింది. ఢిల్లీ నుండి వేలాదిమంది తీర్ధయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నారు. పోరాటం జయప్రదం  కావాలని మనసారా కాంక్షిస్తూ చదివింపులు చదివిస్తున్నారు. లంగర్ సేవలో పాలు పంచుకుంటున్నారు . పౌర సమాజంలో కొందరు  తమ హక్కుల గురించి పోరాడడమే కాకుండా తోటి ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా రైతుల ఉద్యమం పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు. రైతుల ఉద్యమం కేవలం కొద్దిమంది ఉద్యమకారుల గొంతుగా మిగిలిపోలేదు. సన్న, చిన్నకారు రైతులు,  భూమిలేని శ్రామికులు, ధనిక, మధ్య తరగతి రైతులు విశాల రైతాంగ ఉద్యమంలో భాగమయ్యారు. రోజురోజుకీ బలం పెరుగుతున్నది. గెలవగలమన్న ధైర్యం పెరుగుతున్నది. 

కార్పొరేట్ కంపెనీల పునాది కదులుతున్నది.

ఈ ఉద్యమ ప్రభావంతో అంబానీ ప్రకటన చేయక తప్పలేదు.

‘మా గ్రూప్‌ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం  వ్యవసాయ భూమిని కొనలేదు’ అని రిలయన్స్‌ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్‌ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను కొని అమ్ముతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్‌ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్‌ పేర్కొంది.

రైతుల ఆందోళనకు గల రాజకీయ ప్రాధాన్యం ఏమిటి? 

ప్రజాస్వామ్యం  అంటే ఎన్నికలు, పదవులేనని  పాలకవర్గ పార్టీలు  వ్యవహరిస్తున్నాయి. జనాభాలో సగం పైగా ఉన్న తమ జీవన విధానం అయిన వ్యవసాయ విధానం మెరుగ్గా సాగాలని, శ్రమకు ఫలితం దక్కాలని రైతులు కోరుకుంటున్నారు.

రైతులు ఆ విధముగా ఆలోచించి ప్రశ్నించటం మొదలెట్టారు. ప్రజాస్వామ్య మంటే  కార్పోరేట్ కంపెనీల సేవ కాదని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దులలో మకాం పెట్టి , ఒక నూతన పోరాట రూపాన్ని రూపొందించారు. కొన్ని లోపాలున్నప్పటికీ క్రియాశీలంగా వున్నారు. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.

ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మూగబోయినట్లుగా, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. అయినా ప్రజల పక్షాన మాట్లాడక తప్పటంలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నాయి. అధికారంలో లేని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు కూడా రైతుల పక్షాన నిలబడటానికి వెనకాడు తున్నాయి. వామపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయి.

ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అయితే,  మేధావులు ఇదొక ప్రయోగంగా భావిస్తున్నారు. చారిత్రాత్మకమైన రైతుల ఆందోళన ఒక ప్రయోగంలా కాకుండా చూడాలి.పౌర సమాజం మేధావులతో కలిసి చర్చించి, చైతన్యవంతం కావాలి. ప్రజలను చైతన్య పరచవలసిన  సమయం ఆసన్నమయ్యింది. 

ఇప్పుడు, ప్రజలు అసమ్మతి తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. 

కార్పొరేట్ శక్తులతో పోరాటం సామాన్యమైనది కాదు. రైతులు తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. రైతుల వైపా లేక కార్పొరేట్ శక్తుల వైపా అని అందరూ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్గత నిరాశావాదంతో పోరాటం  సులభంగా ఉండదు. పౌర సమాజం మరింత శక్తిని కూడగట్టుకుని పోరాటానికి సిద్ధం కావాలి.

సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు.

  1. జనవరి 6 నుండి 20 వరకు, జన జాగరన్ అభియాన్ జరగాలి. గ్రామాలలో రైతులను చైతన్యపరచాలి. జనవరి 13 న భోగి మంటల్లో చట్టాల కాపీలను దగ్ధం చేయటం,”జనవరి 18 న, మహిళా కిసాన్ దివాస్ జరగాలి.    4)  జనవరి 23 న, నేతాజీ సుభాష్   చంద్రబోస్ జన్మదినం సందర్భంగా, ఆజాద్ హింద్ కిసాన్దివాస్ జరుపుకోవాలి.   5) జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ట్రాక్టర్ పెరేడ్ ఊరేగింపు జరపాలి..

ఢిల్లీ  వెళ్లి వచ్చిన వారు 

వడ్డే శోభనాద్రీశ్వరరావు, AIKSCC ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్ , ఎర్నేని నాగేంద్రనాధ్, రైతుసంఘాల సమన్వయ సమాఖ్య, రామక్రిష్ణ, సీపీఐ నేత, రావుల వెంకయ్య, ఎఐకేఎస్ , జాతీయ ఉపాధ్యక్షులు, వై కేశవరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి,శ్రీమతి సింహాద్రిఝాన్సీ, ఏపీ రైతు కూలీ సంఘం,రాష్ట్రఅద్యక్షులు, జమలయ్య, ఏ పీ కౌలు రైతు సంఘం కార్యదర్శి. హరనాధ్ ,ఎఐకేఎం, రాష్ట్రకార్యదర్శి,  తోట ఆంజనేయులు, ఎఐకేఎం,  రాష్ట్రఅద్యక్షులు, కే విద్యాధరరావు, ఎఐకేఎస్.శ్రీమతి చల్లపల్లి విజయ, స్త్రీ విముక్తి సంఘటన,  జెట్టి. గుర్నాధరావు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్,డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

101 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎల్‌డిఎఫ్‌ ఆధిక్యత – వచ్చే ఎన్నికలలో నూతన అధ్యాయం !

20 Sunday Dec 2020

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Others, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

#Kerala CPI(M), #Pinarayi Vijayan, Kerala BJP, Kerala CPI(M), Kerala Local Body Election Results 2020, LDF, UDF


ఎం కోటేశ్వరరావు
కేరళ స్ధానిక సంస్దల ఎన్నికలలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అటు కాంగ్రెస్‌, ఇటు బిజెపి కూటములు రెండూ శబరిమల వివాదం, ప్రమాదవశాత్తూ ఏనుగు మృతి, బంగారం స్మగ్లింగ్‌ ఉదంతం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ కుమారులు కేసుల్లో ఇరుక్కొని అరెస్టు కావటాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, రాజకీయంగా సొమ్ము చేసుకొనేందుకు, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన నేపధ్యంలో సాధించిన విజయం సామాన్యమైంది కాదు.


ప్రాధమికంగా వెల్లడైన విశ్లేషణలను బట్టి కరోనా సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు జరిపిన ఆహార కార్యక్రమం, కరోనా చికిత్సలో చూపిన ప్రత్యేక శ్రద్ద, అవకాశవాద రాజకీయాలకు పాల్పడకుండా మత శక్తుల పట్ల అనుసరించిన సూత్రబద్దవైఖరి జనామోదం పొందింది కనుకనే ఎల్‌డిఎఫ్‌ విజయం సాధ్యమైంది.పైన పేర్కొన్న అంశాలతో పాటు యుడిఎఫ్‌ కూటమి నుంచి బయటకు వచ్చి ఎల్‌డిఎఫ్‌లో చేరిన కేరళ కాంగ్రెస్‌(ఎం) వర్గం కారణంగా దాని ప్రభావం కేరళ మధ్య జిల్లాల్లో విజయావకాశాలను పెంచింది. స్ధానిక సంస్ధల ఎన్నికలు కేరళలో సరికొత్త పరిణామాలకు తెరలేపినట్లు చెప్పవచ్చు. ప్రతిపక్షాలు చేసిన ప్రచారంతో ఊగిసలాడిన ఓటర్లు, గతంలో మద్దతుదార్లుగా ఉండి ఎల్‌డిఎఫ్‌కు దూరమైన వారు ఈ పరిణామంతో తిరిగి చేరువ కావచ్చు. ప్రజాభిప్రాయాన్ని మరింతగా కూడగట్టేందుకు వివిధ తరగతుల నుంచి సూచనలు పొందేందుకు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పదమూడు జిల్లాల పర్యటన ఖరారైంది. మరొక జిల్లా కార్యక్రమాన్ని రూపొందించవలసి ఉంది. రానున్న రోజుల్లో ఎల్‌డిఎఫ్‌ మరిన్ని కార్యక్రమాలను రూపొందించి, అందరికంటే ముందుగానే ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దం అవుతోంది.


గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఒక సారి ఎల్‌డిఎఫ్‌ కూటమి అధికారానికి వస్తే మరోసారి యుడిఎఫ్‌ రావటం ఒక ఆనవాయితీగా మారింది. వచ్చే ఎన్నికలలో ఓటర్లు దానికి మంగళం పాడతారని ఇప్పటికే కొందరు వ్యాఖ్యానించటం ప్రారంభించారు. ఎన్నికల నాటికి అసాధారణ పరిస్దితులు ఏర్పడితే తప్ప ఎల్‌డిఎఫ్‌ ఇదే విజయ పరంపరను కొనసాగించవచ్చని, వరుసగా రెండో సారి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారానికి రావచ్చని భావిస్తున్నారు. తాజా ఎన్నికలలో కొత్తగా కేరళ కాంగ్రెస్‌(ఎం) వచ్చి చేరింది. ఎల్‌డిఎఫ్‌లోని కొన్ని పార్టీలు తమ సీట్ల గురించి ఆందోళన చెంది కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలలో సీట్ల పంపిణీ, ఐక్యంగా పని చేయటంలో అదెక్కడా కనిపించలేదు. ఇదే సర్దుబాటు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రతిపక్ష యూడిఎఫ్‌లో కుమ్ములాటలు బజారున పడ్డాయి. ఫ్రంట్‌కు ఎవరు నాయకత్వం వహించాలో, ఏమి చేయాలో రెండవ భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌కు మార్గనిర్దేశనం చేయటం కాంగ్రెస్‌ దుస్దితిని తెలియ చేస్తోంది. మరోవైపు మత అజెండాను ముందుకు తెచ్చినా భంగపడిన బిజెపి తాను తిరిగి గెలుచుకున్న పాలక్కాడ్‌ మున్సిపల్‌ కార్యాలయంపై శ్రీరాముడి చిత్రం ముద్రించిన కాషాయ జెండాను ఎగురవేయటం, దానికి అభ్యంతరం తెలపటంపై అది చేస్తున్న వాదనల ద్వారా తన అజెండాను మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు నిర్ణయించిందన్నది స్పష్టం.

స్ధానిక సంస్ధల ఎన్నికలలో అత్యధిక చోట్ల పార్టీలు పూర్తి మెజారిటీ సాధించాయి. మరికొన్ని చోట్ల ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్ధితి ఏర్పడింది. ఎన్నికైన సభ్యులు పాలకవర్గాలను ఎన్నుకొనేందుకు ఈ నెల 21, 22 తేదీలలో సమావేశం కానున్నారు. కీలకంగా మారిన వార్డు సభ్యులు ఏ వైఖరి తీసుకుంటారనేదానిని బట్టి కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలపై ఎవరి ఆధిపత్యం ఏర్పడ నుందో తేలుతుంది. ఇప్పటి వరకు స్పష్టమైన మెజారిటీలు వచ్చిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి. రెండు కార్పొరేషన్లలో పెద్ద పక్షంగా ఎల్‌డిఎఫ్‌ ఉంది. కేరళ ఎన్నికల నిబంధనల ప్రకారం హంగ్‌ ఏర్పడినపుడు అవసరమైతే రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తొలుత సీట్లు సంపాదించిన పార్టీలన్నీ పోటీ చేయవచ్చు. సగం కంటే ఎక్కువ మెజారిటీ ఎవరికీ రాకపోతే మొదటి రెండు స్దానాలలో ఉన్న పార్టీలు రెండవ సారి పోటీ చేయాల్సి ఉంటుంది. పోటీలో లేని పార్టీలు ఓట్లు వేయవచ్చు లేదా ఓటింగ్‌కు దూరంగానూ ఉండవచ్చు. అప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికే పదవి దక్కుతుంది. కేరళలో ఉన్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో స్వతంత్రులు ఏ వైఖరి అయినా తీసుకోవచ్చు గానీ ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌, బిజెపి పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా మరొకర్ని బలపరిచే పరిస్ధితి లేదు. ఈ కారణంగానే రెండు కార్పొరేషన్లలో ఎల్‌డిఎఫ్‌ పెద్ద పక్షంగా అవతరించినందున అక్కడ కూడా వారే విజయం సాధిస్తారనే భావనతో మీడియాలో ఎల్‌డిఎఫ్‌ ఐదు మేయర్‌ స్దానాలను గెలుచుకున్నట్లు రాస్తున్నారు. జిల్లా పంచాయతీలలో ఒక చోట ఎల్‌డిఎఫ్‌ పెద్ద పార్టీగా అవతరించగా మరొక చోట రెండు కూటములకు సమానంగా స్ధానాలు వచ్చాయి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌×××యుడిఎఫ్‌×××ఎన్‌డిఏ×××ఇతరులు×××హంగ్‌××× మొత్తం
గ్రామపంచాయతీలు×× 514(-2) ×××321(-51) ××19(+5) ×× 23(+15) ×× 64 ××× 941
బ్లాక్‌ పంచాయతీలు×× 108(+20)××× 38(-24) ×× 0(0) ×× 0(-5) ×× 6 ××× 152
జిల్లా పంచాయతీలు×× 10(+3) ××× 2(-3) ×× 0(0) ×× 0(0) ×× 2 ××× 14
మున్సిపాలిటీలు ×××× 35 ××× 39 ×× 2(+1) ×× 3 ×× 7 ××× 86
కార్పొరేషన్లు ×××× 3 ××× 1 ×× 0(0) ×× 0 ×× 2 ××× 6
వివిధ స్ధానిక సంస్ధలలో వార్డుల వారీగా వచ్చిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న ప్లస్‌, మైనస్‌లు గత ఎన్నికల కంటే ఎక్కువ, తక్కువలుగా గమనించాలి.
స్ధానిక సంస్ధలు××××× ఎల్‌డిఎఫ్‌-××××యుడిఎఫ్‌×××××ఎన్‌డిఏ×××××ఇతరులు××× మొత్తం
గ్రామపంచాయతీలు×7,262(-361) ×5,893(-431) ×1,182(+249) ×1,620(+542) ×15,962
బ్లాక్‌ పంచాయతీలు ×1,266(+178) ××727(-190) ×× 37(+16) ×× 49(-4) ××× 2,080
జిల్లా పంచాయతీలు×× 212(+42) ××110(-35) ×× 2(-1) ××××× 6(+2) ×××× 331
మున్సిపాలిటీలు ××1,167(-96) ×× 1,173(-145) ×× 320(+84) ××416(+157) ××3,076
కార్పొరేషన్లు ××× 207(+11) ×× 120(-23 ×× 59(+8) ×× 27(+3) ××× 414
పై వివరాలను పరిశీలించినపుడు వెల్లడైన ధోరణులు ఇలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ రెండూ 792 స్ధానాలు కోల్పోగా వాటిలో ఇతరులు 542 సాధించగా బిజెపికి పెరిగింది 249, బ్లాక్‌ పంచాయతీలలో కాంగ్రెస్‌ కోల్పోయిన 190లో ఎల్‌డిఎఫ్‌ 178, బిజెపి 16 అదనంగా సాధించింది. మున్సిపల్‌ వార్డులలో ఎల్‌డిఎఫ్‌, యూడిఎఫ్‌ కోల్పోయిన 241 స్ధానాలలో ఇతరులు 157 పొందగా బిజెపి 84 అదనంగా సాధించింది. కార్పొరేషన్‌ వార్డులలో యుడిఎఫ్‌్‌ 23 కోల్పోగా ఎల్‌డిఎఫ్‌ 11, బిజెపి 8, ఇతరులకు మూడు అదనంగా వచ్చాయి. ఈ ఎన్నికలలో తిరువనంతపురం కార్పొరేషన్‌తో పాటు పది మున్సిపాలిటీలు, 40 గ్రామ పంచాయతీలలో విజయం సాధిస్తామని బిజెపి చెప్పుకున్నది. ఏమి జరిగిందో చూశాము. ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తామని చెప్పిన బిజెపి కంటే ఇతరులు ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లు కోల్పోయిన స్ధానాలను ఎక్కువగా పొందారు. శబరిమల ప్రాంతంలోని పండలం మున్సిపాలిటీని బిజెపి అదనంగా సంపాదించింది. స్ధానిక ఎన్నికలలో గతంలో గెలిచిన స్ధానాలను కొన్నింటిని పోగొట్టుకోవటం, కొత్తవాటిని సాధించిన ఉదంతాల గురించి ప్రతి పార్టీ పరిశీలన జరుపుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో లోటు పాట్లను సరి చేసుకొనేందుకు ప్రయత్నించటం సహజం.
గత 2015స్దానిక సంస్ధలు, 2016 అసెంబ్లీ, 2019లోక్‌సభ ఎన్నికలు, తాజా 2020 స్ధానిక సంస్ధల ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాల తీరు తెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం.
కూటమి××××× 2015 ×××× 2016×××× 2019×××× 2020
ఎల్‌డిఎఫ్‌×××× 37.4 ×××× 43.48 ××× 36.29 ××× 41.6
యుడిఎఫ్‌×××× 37.2 ×××× 38.81 ××× 47.48 ××× 37.1
బిజెపి ××× 13.3 ×××× 14.96 ××× 15.64 ××× 14.5
ఇతరులు ×××× 12.1 ×××× 2.75 ××× —– ××× 6.8
పైన పేర్కొన్న వివరాల ప్రకారం గత నాలుగు ఎన్నికలలో బిజెపి ఓట్లశాతాలలో పెద్ద మార్పు లేదు.(2011 అసెంబ్లీ ఎన్నికలలో 138 స్ధానాల్లో పోటీ చేసిన ఆ పార్టీకి 6.06శాతం ఓట్లు వచ్చాయి) అయినా స్ధానిక ఎన్నికలలో గతం కంటే అదనంగా వచ్చిన కొన్ని స్ధానాలను చూపి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పోటీ తమకు ఎల్‌డిఎఫ్‌కు మధ్యనే ఉంటుందని బిజెపి నేతలు చెప్పుకోవటం గమనించాల్సిన అంశం. శబరిమల ఉదంతం, బంగారం స్మగ్లింగ్‌ కేసులను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు అటు మతాన్ని, ఇటు కేంద్రంలోని అధికారాన్ని వినియోగించుకొని ఎల్‌డిఎఫ్‌పై బురద చల్లేందుకు చేసిన యత్నాలు బహిర్గతమే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాల గురించి ఈ ఎన్నికలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలలో కూటముల వారీ సాధించిన స్ధానాలు, 2019 లోక్‌ ఎన్నికలు, 2020 స్ధానిక ఎన్నికలలో వచ్చిన ఓట్లను బట్టి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరిది పై చేయిగా ఉందో దిగువ చూద్దాం. 2016 వివరాలలో బ్రాకెట్లలో ఉన్న అంకెలు అంతకు ముందు అసెంబ్లీ స్ధానాలతో పోల్చితే అదనంగా తెచ్చుకున్నవీ, కోల్పోయినవని గమనించాలి.
ఏడాది ××××××× ఎల్‌డిఎఫ్‌ ××××× యూడిఎఫ్‌×××××× బిజెపి
2016 ×××××× 91(+23) ×××××× 47(-25) ×××××× 1(+1)
2019××××××× 16 ×××××× 123 ×××××× 1
2020××××××× 101 ×××××× 38 ××××××× 1
గత లోక్‌ సభ ఎన్నికలలో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు చోట్ల బిజెపి రెండవ స్ధానంలో ఉంది, తాజా స్ధానిక ఎన్నికల్లో ఐదు చోట్ల రెండవ స్ధానంలో ఉంది.2016లో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఎంఎల్‌ఏగా గెలిచారు. లోక్‌సభ ఎన్నికలకూ ఇప్పటికీ పరిస్ధితిలో వచ్చిన మార్పును, కాంగ్రెస్‌కు తగిలిన పెద్ద ఎదురుదెబ్బనూ ఈ వివరాలు వెల్లడిస్తున్నాయి. 2015 స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి యుడిఎఫ్‌ అధికారంలో ఉంది. ప్రతిపక్ష ఎల్‌డిఎఫ్‌కు యుడిఎఫ్‌ మధ్య ఓట్ల తేడా అసెంబ్లీ ఎన్నికలలో యుడిఎఫ్‌ కంటే ఎల్‌డిఎఫ్‌ ఓట్ల శాతం కేవలం 0.2శాతమే ఎక్కువ. తాజా ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ అధికారంలో ఉండి, ప్రతిపక్షాలు ఎన్ని వ్యతిరేక ప్రచారాలు చేసినా యుడిఎఫ్‌ కంటే 4.5శాతం ఓట్లు ఎక్కువగా తెచ్చుకుంది. కనుకనే 101 అసెంబ్లీ సెగ్మెంట్లలో పై చేయి సాధించింది. ఇదే ఆదరణను ఎల్‌డిఎఫ్‌ నిలుపు కుంటే కొన్ని సీట్లు అటూ ఇటూ అయినా తిరిగి 2021 ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే కేరళలో ఎల్‌డిఎఫ్‌ కొత్త చరిత్రకు నాంది పలికినట్లే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పార్లమెంట్‌లోనూ ఆధిపత్యం- వెనెజులా సంక్షోభాన్ని మదురో నివారిస్తారా !

15 Tuesday Dec 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Nicolás Maduro, Socialists United of Venezuela (PSUV), Venezuela Elections 2020


ఎం కోటేశ్వరరావు


మూడు వందల మంది అంతర్జాతీయ పరిశీలకులు 34దేశాల నుంచి వచ్చారు, దేశీయంగా వివిధ పార్టీలు, సంస్ధలకు చెందిన వారు వెయ్యి మంది పరిశీలకులు ఉన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు. అయినా సరే డిసెంబరు ఆరున జరిగిన వెనెజులా పార్లమెంట్‌ ఎన్నికలను తాము గుర్తించేది లేదని అమెరికా, ఐరోపా ధనిక దేశాల నేతలు ప్రకటించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ వారసులు అంతకంటే ఏమి చెబుతారు ! వెనెజులా జాతీయ అసెంబ్లీ( పార్లమెంట్‌)లోని 277 సీట్లకు గాను దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురో నాయకత్వంలోని వామపక్ష కూటమి 253 స్ధానాలను గెలుచుకుంది. దీనిలో ఐక్య సోషలిస్టు పార్టీ ప్రధాన పక్షం కాగా మరో తొమ్మిది చిన్న పార్టీలు ఉన్నాయి. ఎన్నికలలో పాల్గొన్న ప్రతిపక్షాలకు 21, మరోమూడు స్ధానాలు స్ధానిక తెగలకు వచ్చాయి. ఈ ఫలితాలు అమెరికా కుట్ర విఫలం అయిందనేందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. గత ఎన్నికల వరకు అధికార సోషలిస్టు పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ తాజా ఎన్నికలలో విడిగా పోటీ చేసి 2.73శాతం ఓట్లు, ఒక స్ధానాన్ని పొందింది.ఈ ఎన్నికలలో 107 పార్టీలు, 14వేల మంది అభ్యర్దులు పాల్గొన్నారు. పోటీ చేసిన 107లో మదురోను వ్యతిరేకించే పార్టీలు 97 ఉన్నాయి.


మదురో నాయకత్వంలోని కూటమిని అధికారంలోకి రాకుండా చేసేందుకు గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా నాయకత్వంలోని శక్తులు చేయని కుట్ర లేదు. మదురో ప్రభుత్వాన్ని ఇప్పటికీ గుర్తించటం లేదన్న విషయం తెలిసిందే. అమెరికా మద్దతుతో ఉన్న ప్రతిపక్షం తాజా ఎన్నికలలో తమకు ఓటమి తప్పదని ముందే గ్రహించి ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.ఫలితాలను తాము గుర్తించేది లేదని చెప్పింది. డిసెంబరు తొమ్మిదిన అమెరికా దేశాల సంస్ద (ఓయేఎస్‌) సమావేశంలో వెనెజులా ఎన్నికలను గుర్తించరాదని బ్రెజిల్‌ ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా, కెనడా, చిలీ, ఈక్వెడోర్‌ తదితర దేశాలు సమర్దించగా అర్జెంటీనా, మెక్సికో, బొలీవియా దూరంగా ఉన్నాయి.
లాటిన్‌ అమెరికాలోని వెనెజులా, తదితర దేశాలలో వామపక్ష శక్తులు గత రెండు దశాబ్దాల కాలంలో సంక్షేమ చర్యలను అమలు జరిపి విజయాలతో పాటు వాటికి ఉన్న పరిమితుల కారణంగా తలెత్తే అసంతృప్తి వలన పరాజయాలను చవిచూస్తున్నాయి. తమ దోపిడీ నిరాఘాటంగా కొనసాగేందుకు అమెరికా తదితర ధనిక దేశాలు లాటిన్‌ అమెరికా సమాజాల మీద మిలిటరీ, నిరంకుశ శక్తులను రుద్దాయి. వాటికి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమాల్లో ఆ శక్తులను వ్యతిరేకించే కమ్యూనిస్టు, వామపక్ష, ఇతర శక్తులన్నీ ఏకమైన కారణంగానే అడ్డుకోగలిగాయి. ఆ క్రమంలోనే ఎన్నికల విజయాలు పొందాయి. జనానికి అనేక ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుస విజయాలు సాధించాయి. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులు, వామపక్ష శక్తుల హర్షామోదాలు పొందాయి. వాటిని కూడా అమెరికా ఇతర పెట్టుబడిదారీ దేశాల వెన్నుదన్ను ఉన్న కార్పొరేట్‌ శక్తులు సహించలేదు. అందుకే ఆ ప్రభుత్వాలను కూలదోసేందుకు చేయని యత్నం లేదు. ఆ క్రమంలో ఛావెజ్‌ వంటి వారు ఆ కుట్రలకు వ్యతిరేకంగాలాటిన్‌ అమెరికాలో కలసి వచ్చే శక్తులన్నింటినీ కూడగట్టేందుకు ప్రయత్నించి కొంత మేర సఫలం అయ్యారు.


అయితే ఛావెజ్‌ లేదా ఇతర దేశాల్లోని నాయకత్వం అమలు జరిపిన చర్యలన్నీ నయా ఉదారవాద విధానాల పునాదుల మీద నిర్మితమైన పెట్టుబడిదారీ వ్యవస్ధల పరిధిలోనే అన్నది గమనించాలి.వాటికి ఉన్న పరిమితుల కారణంగా జనంలో తలెత్తే అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు, దాని ప్రాతిపదికగా జనాన్ని రెచ్చగొట్టేందుకు అమెరికా పెద్ద ఎత్తున వామపక్ష వ్యతిరేకశక్తులకు అన్ని విధాలా సాయం అందించింది. గతంలో మాదిరి మిలిటరీ నియంతృత్వాన్ని రుద్దే అవకాశాలు లేకపోవటంతో అధికారానికి వచ్చిన మితవాదశక్తులు వామపక్ష, ప్రజాతంత్ర పాలకుల కంటే మెరుగైన చర్యలు తీసుకోవటంలో విఫలం కావటంతో అర్జెంటీనా వంటి చోట్ల తిరిగి వామపక్ష శక్తులు అధికారానికి రాగలిగాయి. బొలీవియాలో ఎన్నికైన సోషలిస్టు ఇవోమొరేల్స్‌ను పదవి చేపట్టకుండా అడ్డుకొని అంతం చేస్తామని బెదిరించి విదేశాలకు వెళ్లేట్లు చేశారు. అయితే అధికారాన్ని ఆక్రమించుకున్న శక్తులు ఏడాది పాలనలో మొరేల్స్‌ కంటే మెరుగైన పాలన అందించలేవని రుజువు కావటంతో జనం తిరిగి మొరేల్స్‌ నాయకత్వంలోని ‘మాస్‌’ పార్టీకి పట్టం కట్టారు.

వెనెజులాలో కూడా అదే జరిగినట్లు కనిపిస్తోంది. మదురో ఏలుబడిలో అనేక తీవ్ర సమస్యలను జనం ఎదుర్కొంటున్నా, ప్రతిపక్ష మితవాద శక్తులు అధికారానికి వస్తే తమపరిస్ధితి మరింత దిగజారుతుందనే భయం జనంలో ఉంది. గత ఎన్నికల్లో పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లు పొందిన ప్రతిపక్ష పార్టీ నేత జువాన్‌ గురుడో 2018లో జరిగిన ఎన్నికలలో విజేత అయిన మదురోను తాను గుర్తించనని, పార్లమెంట్‌ తననే అధ్యక్షుడిగా ఎన్నుకున్నదని 2019లో ప్రకటించుకున్నాడు. అతగాడి ప్రవాస ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా మరికొన్ని దేశాలు ప్రకటించాయి. అనేక రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడినా జనంలో ఎలాంటి మద్దతు కనిపించలేదు. మరింత పరాభవం తప్పదని గ్రహించిన కారణంగానే ఈ నెలలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేయకుండా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.


ఈ ఎన్నికలలో పోలింగ్‌ 30.5శాతం అని అధికారికంగా ప్రకటించారు. మదురో నాయకత్వంలోని సోషలిస్టు పార్టీ కూటమికి 277కు గాను 253, డెమోక్రటిక్‌ యాక్షన్‌ పార్టీకి 11, మరో రెండు పార్టీలకు మూడేసి చొప్పున ఒక పార్టీకి రెండు, కమ్యూనిస్టు పార్టీ, మరొక పక్షానికి ఒక్కొక్కటి వచ్చాయి.ఓటర్లు ఇంత తక్కువగా ఎందుకు పాల్గ్గొన్నారనేది ఒక ప్రశ్న. ఓటర్లలో ఉత్సాహం లేకపోవటానికి ఒక ప్రధాన కారణం ప్రతిపక్షం బహిష్కరణ ప్రకటనతో ఎలాగూ గెలిచేది అధికార పక్షమే అన్న నిర్లిప్తత ఒకటి. దీనితో పాటు మదురో సర్కార్‌ మీద అసంతృప్తి కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. అయితే దేశంలో పరిస్ధితి ఆర్ధికంగా దిగజారటంలో లక్షలాది మంది దేశం వదలి వెళ్లారు. వారి పేర్లు కూడా జాబితాలో ఉంటాయి. మొత్తంగా చూసినపుడు తాత్కాలికంగా అయినా సామ్రాజ్యవాదుల కుట్రలు విఫలం అయ్యాయి.అమెరికా కుట్రలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే మదురోను హత్య చేసిన వారికి 15మిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా సంస్ధలు ప్రకటించాయి. ఈ కారణంగా తాజా ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఆయన ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకొనేదీ రహస్యంగా ఉంచారు.

ఎన్నికలు సక్రమంగా జరగలేదనేందుకు ఓటర్లు తక్కువగా పొల్గొనటమే నిదర్శనమని సాకులు చెబుతున్నారు. వెనెజులా తరువాత రోజు జరిగిన ఎన్నికలలో రుమేనియాలో 33, ఇటీవలి కాలంలో ఇతర దేశాలలో ఈజిప్టులో 28, మాలీ 35, జమైకా 38, జోర్డాన్‌ 30, జార్జియాలో 26శాతం చొప్పున నమోదైంది. వీటికి లేని అభ్యంతరం వెనెజులాకు ఎందుకు ? 2005 వెనెజులా పార్లమెంట్‌ ఎన్నికల్లో కనిష్టంగా 25శాతమే నమోదైన రికార్డు ఉంది. అంతెందుకు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎన్నడూ నలభై శాతానికి అటూఇటూగానే ఉంటున్నది. వెనెజులాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉంటే 50లక్షల మంది(నాలుగోవంతు) జనం కనీస సౌకర్యాలు లేక విదేశాలకు వెళ్లారని గతంలో చెప్పారు. అది కూడా ఓటింగ్‌ తగ్గటానికి ఒక ప్రధాన కారణమే కదా !


ఈ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఎందుకు విడిగా పోటీ చేసిందన్న సందేహం సహజంగానే కలుగుతుంది. దాని మంచి చెడ్డల చర్చను పక్కన పెట్టి కమ్యూనిస్టు పార్టీ మాటల్లోనే కొన్ని అంశాలను చూద్దాం. డిసెంబరు 14వ తేదీ పార్టీ పత్రిక ” పాపులర్‌ ట్రిబ్యూన్‌ ”లో కొన్ని ముఖ్య అంశాల సారాంశం ఇలా ఉంది. వెనెజులాలో ప్రజాబాహుళ్య విప్లవ ప్రత్యామ్నాయ నిర్మాణ లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ, ఇతర రాజకీయ, సామాజిక శక్తులతో కలసి కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలలో పోటీ చేసింది. ప్రత్యామ్నాయ విధానాలను జనం ముందుంచటానికే ప్రాధాన్యత ఇచ్చింది.2018లో అధ్యక్ష ఎన్నికల సమయంలో మదురో నాయకత్వంలోని ఐక్య సోషలిస్టు పార్టీ-కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత ఒప్పందం జరిగింది. దాని ప్రకారం తదుపరి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఒక కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించి దాని ప్రాతిపదికగా పోటీ చేయాలన్నది సారాంశం. అయితే ఆ ఒప్పందంలోని అవగాహన అంశాలకు విరుద్దంగా మదురో ప్రభుత్వం వ్యవహరించింది. యజమానులతో కార్మికులు చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వ ఉత్తరువు ద్వారా రద్దు చేసింది. దాంతో కార్మికులు అనేక సంక్షేమ చర్యలను కోల్పోయారు. కార్మిక సంఘాలు నిరసన తెలిపటాన్ని నేరంగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నారు. అణచివేత చర్యలకు అనుమతించారు. ప్రయివేటీకరణలకు పెద్ద పీటవేశారు. భూములను యజమానులకు తిరిగి ఇచ్చివేశారు. రైతులను భూముల నుంచి తొలగించి యజమానులకు అనుకూలంగా కేసులలో ఇరికిస్తున్నారు. ఈ నేపధ్యంలో కార్మికులు-రైతాంగ ప్రయోజనాల రక్షణకు పోరాడేందుకుగాను పాలక సోషలిస్టు పార్టీ కూటమితో విడగొట్టుకొని కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేసింది.అనేక అననుకూలతలు, అధికార మీడియాలో తగిన అవకాశాలు ఇవ్వకపోవటం, ప్రయివేటు మీడియాలో, ఇతరంగా ప్రచారానికి నిధుల కొరత వంటి సమస్యలను కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొన్నది. పోలైన ఓట్లలో 2.73శాతం పొందింది. సీట్ల కోసమే కమ్యూనిస్టు పార్టీ పని చేసినట్లయితే సోషలిస్టు పార్టీ కూటమిలో ఉంటే ఎక్కువ సీట్లు పొంది ఉండేవారమని,వాటికోసం ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టదలచ లేదని కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. దామాషా ప్రాతికన సీట్లు కేటాయించే పద్దతి అవలంభించి ఉంటే 277 స్ధానాల్లో ఇప్పుడు వచ్చిన ఒకటికి బదులు తమకు ఏడు లేదా ఎనిమిది వచ్చి ఉండేవని, అధికార సోషలిస్టు పార్టీ 69శాతం ఓట్లు తెచ్చుకొని 91శాతం సీట్లు పొందిందని కమ్యూనిస్టు పార్టీ వ్యాఖ్యానించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫిగేరా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

పార్లమెంట్‌ ఎన్నికలను గుర్తించేది లేదని ప్రకటించిన అమెరికా, దాని నాయకత్వంలోని దుష్ట కూటమి రాబోయే రోజుల్లో ఎలాంటి కుట్రలకు తెరలేపనుందో చూడాల్సి ఉంది. అమెరికా దాని మిత్ర దేశాలు వెనెజులాను ఇబ్బందుల పాలు చేస్తున్నది వాస్తవం. దాని వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ కుట్రలను అధిగమించే క్రమంలో గత పార్లమెంటులో ప్రతిపక్షం మెజారిటీలో ఉండి అనేక చర్యలకు ఆటంకాలు కలిగించింది. ఇప్పుడు సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించినందున మదురో జనానికి ఉపశమనం కలిగించే చర్యలు ఏ మేరకు తీసుకుంటారు, పరిస్దితిని ఎలా చక్కదిద్దుతారు అన్నది ఆసక్తి కలిగించే అంశం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నవంబరు 26 సార్వత్రిక సమ్మె – దేశాన్ని మాంద్యంలోకి నెట్టిన నరేంద్రమోడీ సర్కార్‌ !

23 Monday Nov 2020

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

India recession, modinomics, November 26 India general strike 2020


ఎం. కోటేశ్వరరావు


ఒక వైపు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సంస్కరణల పేరుతో ప్రజావ్యతిరేక చర్యలను వేగిరపరచేందుకు, సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకుంది. మరోవైపు దానికి ప్రతిఘటన కూడా రూపుదిద్దుకుంటోంది. దానిలో భాగంగానే నవంబరు 26వ తేదీన దేశవ్యాపిత సమ్మెకు కార్మికులు-కర్షకులు సిద్దం అవుతున్నారు. దీనిలో ఎంత మంది పాల్గొంటారు, ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేదాని మీద ముందు లేదా తరువాత గానీ ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకోవచ్చు. ప్రజావ్యతిరేక చర్యలకు జనం నిరసన గళం ఎత్తుతున్నారా లేదా అన్నది ప్రధాన అంశం. మహానదులు సైతం ప్రారంభంలో పిల్లకాలువల మాదిరే ఉంటాయన్నది తెలిసిందే. ప్రజా ఉద్యమాలైనా అంతే. రెండు సీట్లు ఉన్న స్దాయి నుంచి దేశంలో అదికారాన్ని సంపాదించే స్దితికి ఎదిగామని బిజెపి చెబుతున్నది. దీనికి పరిస్ధితులు అనుకూలించటమే కారణం. కేంద్రంలో, రాష్ట్రాలలో అదే పార్టీ పాలనలో జన జీవనం దిగజారటం ఎక్కువ అవుతున్న కొద్దీ ఇదే సూత్రం ప్రజా ఉద్యమాలకు మాత్రం ఎందుకు వర్తించదు ?
సంస్కరణలతో దిగజారిన పరిస్ధితులను మెరుగుపరుస్తామని బిజెపి చెబుతోంది. అవి రెండు రకాలు, ఒకటి సామాన్యులకు అనుకూలమైనవి, రెండవది కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించేవి. ఇప్పటి వరకు అనుసరించిన విధానాలు జనానికి అనుకూలంగా లేవు కనుకనే కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందే దేశ అభివృద్ధి రేటు దిగజారింది, అంటే సామాన్యుల బతుకులు దెబ్బతిన్నాయి. జనం పేరుతో కార్పొరేట్లకు అనుకూల విధానాలను ఎంత త్వరగా గ్రహిస్తారన్నదాని మీద ప్రజా ఉద్యమాల ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.


నవంబరు 20వ తేదీ నాటికి విదేశీ సంస్ధాగత మదుపుదార్లు గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత ఎక్కువగా నవంబరు మాసంలో పెట్టుబడులు పెట్టారని విశ్లేషకులు ప్రకటించారు. ఇవి మన విదేశీమారక ద్రవ్య నిల్వలను గణనీయంగా పెంచుతాయి. చూశారా నరేంద్రమోడీ గారు విదేశాల్లో మన ప్రతిష్టను పెంచిన కారణంగానే ఇది సాధ్యమైందని మరుగుజ్జు సైన్యం(ట్రోల్స్‌) సామాజిక మాధ్యమంలో ప్రచారం మొదలు పెట్టవచ్చు. అభివృద్ధి లేకుండా డాలర్లు పెరగటం అది కూడా రూపాయి విలువ పతనం అవుతున్న స్ధితిలో అది వాపా బలమా అన్నదానితో వారికి నిమిత్తం ఉండదు.
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు ధన్యుడు సుమతీ అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో బిజెపి పెద్దల మాటలు, వారి మరుగుజ్జుల సామాజిక మాధ్యమ ప్రచారంలో కొన్ని పదాలు వినిపించటం లేదు. రైతుల ఆదాయాల రెట్టింపు, ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి వాటిలో కొన్ని. కరోనాను సమర్దవంతంగా ఎదుర్కొన్నామని చెప్పుకొనేందుకు ఎలాంటి వెనుకా ముందూ చూడటం లేదు. ఎవరితో పోల్చుకొని అలా మాట్లాడుతున్నారో, అసలు ఎదుర్కోవటం అంటే ఏమిటో ఎంత మంది ఆలోచిస్తున్నారు ?

కరోనా ఉద్దీపన 3.0 ప్రకటన తరువాత నవంబరు 12న ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లుగా మొత్తం ఉద్దీపనల విలువ రూ.29,87,641 కోట్లు. అంటే 30లక్షల కోట్లు అనుకుందాం. ఇది జిడిపిలో 15శాతం, ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన విలువే జిడిపిలో 9శాతం అన్నారు. అయితే అంతర్జాతీయ సంస్ధ స్టాటిస్టా డాట్‌కామ్‌ వెల్లడించిన సమాచారం వేరుగా ఉంది. అక్టోబరు 12 నాటికి జి20 దేశాలు ప్రకటించిన ఉద్దీపనలు జిడిపిశాతాల్లో 21.1శాతంతో జపాన్‌ అగ్రస్ధానంలో ఉంది. మన దేశ ఉద్దీపన 6.9, చైనా ఏడుశాతాలుగా ఉన్నట్లు అది పేర్కొన్నది. తరువాత ప్రకటించిన మూడవ విడత ఉద్దీపనను కూడా కలుపుకుంటే ఒకటో రెండోశాతం పెరగవచ్చు తప్ప 15శాతం అయి ఉండే అవకాశం లేదు. అందువలన ఇక్కడ ఉద్దీపన అంటే మన పాలకులు చెబుతున్న భాష్యానికి, అంతర్జాతీయ సంస్దలు చెబుతున్న, పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలు భిన్నంగా ఉన్నట్లు చెప్పవచ్చు.

మూడు సార్లు ఉద్దీపన ప్రకటించిన తరువాత ప్రపంచంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశంగా భారత్‌ ఉండనున్నదని ఆక్స్‌ ఫర్డ్‌ ఎకనమిక్స్‌ ప్రకటించటమే చర్చించాల్సిన అంశం.2020-25 సంవత్సరాల మధ్య ఆర్ధిక వ్యవస్ధ పురోగతి గతంలో వేసిన అంచనా 6.5శాతానికి బదులు 4.5శాతం ఉంటుందని తన జోశ్యాన్ని సవరించింది. గతంలో అంతర్జాతీయ అర్ధిక సంస్ధలు చెప్పిన అనేకం నిజం కాలేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద వర్తమాన సంవత్సరంలో మన ఆర్ధిక వ్యవస్ధలో 4.5శాతం తిరోగమనాన్ని అంచనా వేస్తే కొందరు 15శాతం అని చెప్పారు. అంతిమంగా ఎంత ఉంటుందో చూడాల్సి ఉంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో తిరోగమనం పదిశాతానికి అటూ ఇటూగా ఉండవచ్చని వివిధ తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. 2024 నాటికి మోడినోమిక్స్‌ ద్వారా భారత ఆర్ధిక వ్యవస్ధను ఐదులక్షల కోట్ల డాలర్ల స్ధాయికి తీసుకుపోతానని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగేనా ?


ఏడాదికి 11.6శాతం చొప్పున అభివృద్ధి రేటు ఉంటే 2021 నుంచి 2026-27 నాటికి ఐదులక్షల డాలర్ల స్ధాయికి జిడిపి చేరుతుందని కొందరు చెబుతున్నారు. దీనికి గాను ఈ కాలంలో 500లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం. మరి అక్స్‌ఫర్డ్‌ అంచనా 4.5శాతం ప్రకారం ఎప్పటికి చేరేను ? ఇలాంటి అంచనాలు కొన్ని అంశాలు స్ధిరంగా ఉంటాయనే భావనతో తయారవుతాయి. ఉదాహరణకు 2018-19 సంవత్సర అంచనా ప్రకారం దేశ జిడిపి 2.7లక్షల కోట్ల డాలర్లు. దీన్ని ఐదు సంవత్సరాలలో ఐదులక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. దీనికి గాను ఐదు సంవత్సరాలలో ఉత్పత్తి 84శాతం లేదా పదమూడు శాతం చొప్పున పెరగాల్సి ఉంటుంది.వార్షిక ధరల పెరుగుదల నాలుగుశాతం ఉంటుందని, వృద్ధి రేటు 9శాతం చొప్పున ఉండాలని పేర్కొన్నారు. అయితే అంతకు ముందు ఐదు సంవత్సరాలలో సగటు వృద్ధి రేటు 7.1శాతానికి మించలేదు. ఎన్నడూ తొమ్మిదిశాతానికి చేర లేదు. ఈ స్ధాయికి చేరాలంటే పొదుపు రేటు 39, పెట్టుబడి రేటు 41.2శాతం చొప్పున ఉండాలి. 1951-2019 మధ్య మన దేశ సగటు పొదుపు రేటు 18.6 శాతం. కనిష్టంగా 1954 మార్చినెలలో 7.9శాతం, గరిష్టంగా 2008లో 37.8శాతం ఉంది. 2018లో 32.4 శాతం ఉండగా మరుసటి ఏడాది 30.1శాతానికి పడిపోయింది. కరోనా కారణంగా ఈ ఏడాది ఎంతకు దిగజారుతుందో ఇప్పుడే చెప్పలేము. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్ధ 2025 వరకు సగటు వృద్ది రేటు 4.5శాతం ఉంటుందని చెప్పింది. అంతకంటే ఎక్కువ ఉన్న సమయంలోనే పొదుపు రేటు పడిపోయింది కనుక రాబోయే రోజుల్లో దిగజారటం తప్ప పెరిగే అవకాశం లేదు. ఈ అంచనా వెలువడిన తరువాత దాని మీద కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందనలూ వెలువడలేదు.


మన ఆర్ధిక వ్యవస్ధ ప్రయివేటు వినియోగం, పెట్టుబడుల మీద ఆధారపడి ఉంది. గత ఏడాది తొలి మూడు మాసాల్లో ఈ మొత్తం రూ.43లక్షల కోట్లు కాగా ఈ ఏడాది అదే కాలంలో 14లక్షల కోట్లకు పడిపోయింది. మరోవైపు ప్రభుత్వ ఖర్చు రూ.1.2లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. ఇది ఆర్ధిక వ్యవస్ధకు ఏ మాత్రం ఊతం ఇవ్వలేదు అన్నది వేరే చెప్పనవసరం లేదు. మన విదేశీమారక ద్రవ్యనిల్వలు రికార్డు స్ధాయికి పెరిగాయని కొందరు సంబర పడుతున్నారు. కరోనా కారణంగా మన ఎగుమతులతో పాటు ఎక్కువగా దిగుమతులు పెద్ద మొత్తంలో తగ్గాయి. ఈ కారణంగా కొంతమేర ఆదా జరిగి పెరిగినట్లు కనిపించవచ్చు.


విదేశీ సంస్ధాగత మదుపుదారులు నవంబరు మూడవ వారం నాటికి రికార్డు స్ధాయిలో రూ.43,732 కోట్ల రూపాయల విలువగల మన కంపెనీల వాటాలను స్టాక్‌ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఐరోపా ధనిక దేశాల్లో మరోసారి కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుండటం, అమెరికాలో ఎన్నికలు ముగియటం, ఏప్రిల్‌ నుంచి డాలరు బలహీనపడుతున్న నేపధ్యంలో ఇది జరిగిందని చెబుతున్నారు. అక్కడ పరిస్ధితి కుదుటపడిన తరువాత లేదా డాలరు విలువ పెరిగితే వారంతా పొలోమని వెనక్కు వెళ్లిపోతారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.
మన జిడిపి ఈ ఏడాది పదిశాతంపైగా తిరోగమనంలో ఉంటుందని రేటింగ్‌ సంస్దలు ప్రకటించాయి. వచ్చే ఐదేండ్ల వరకు సగటున 4.5శాతానికి మించి వృద్ధి రేటు ఉండదని ఆక్స్‌ఫర్డ్‌ చెప్పింది. అయినా విదేశీ మదుపుదార్లు ఎగబడి మన కంపెనీల వాటాలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు ? కరోనా కాలంలో మన కంపెనీలు ఎలా లాభాలు పొందాయో తెలుసుకుంటే అసలు కిటుకు అర్ధం అవుతుంది. సిఎంఐయి నివేదిక ప్రకారం సెప్టెంబరు నెలతో ముగిసిన త్రైమాస కాలంలో 1,897 కంపెనీలు రూ.1,33,200 కోట్ల రూపాయల మేరకు నిఖర లాభాలు ఆర్జించాయి. ఇవే కంపెనీలు 2019 జూన్‌తో ముగిసిన మూడు మాసాల కాలంలో ఆర్జించిన లాభాలు 1,06,600 కోట్లు మాత్రమే. ఈ ఏడాది మార్చి నెలతో ముగిసిన త్రైమాస కాలంలో రూ.32,000 కోట్లు, జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో 44,100 కోట్లు లాభాలను ఆర్జించగా గత నాలుగు త్రైమాస కాలాల్లో వాటి సగటు లాభం రూ.50,200 కోట్లు ఉంది. ఉద్దీపనల పేరుతో జనానికి ఏమూలకూ చాలని బియ్యం, కందిపప్పు, కొంత నగదు తప్ప మరేమీ లేదు. ఉపాధి కల్పన, ఆర్ధికవ్యవస్ధ పునరుద్దరణ వంటి అకర్షణీయమైన పేర్లతో ఉద్దీపనలన్నీ కార్పొరేటు సంస్దలకే ఇచ్చినందువల్లనే వాటికి ఆ లాభాలు వచ్చాయి. అందువలన తమ దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున విదేశీమదుపుదార్లు మన వాటాలు కొనుగోలు చేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వల గురించి జనానికి చెప్పటానికి, ప్రచారం చేసుకోవటానికి తప్ప ఆ మదుపు సొమ్ము పెట్టుబడులుగా పెట్టేందుకు పనికిరాదు. పెట్టుబడిదారులు ఎప్పుడు వాటాలు అమ్ముకుంటే అప్పుడు వారికి లాభాలతో సహా అసలు సొమ్మును మనం డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలో బిలియనీర్ల సంపద కరోనా కాలంలో 27.5శాతం పెరిగితే, మన దేశంలో అది 35శాతం ఉంది. అందుకే విదేశీ కంపెనీల ఆసక్తి అని వేరే చెప్పనవసరం లేదు.

ఈ ఏడాది తిరోగమనంలో ఉన్నప్పటికీ వచ్చే ఏడాది పరిస్ధితి మరింతగా మెరుగుపడనుందనే అంచనాలు వెలువడటం కూడా ఒక కారణం. లాభాలను చూసి విదేశీ మదుపుదార్లు పెట్టుబడులు పెడుతుంటే మరోవైపు స్వదేశీ మదుపుదార్లు తమ వాటాలను విక్రయించుకొని లాభాలు తీసుకుంటున్నారు. ఇదే కాలంలో వారు 32వేల కోట్ల రూపాయల విలువైన వాటాలను విక్రయించారు.
ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ను కార్యస్దానంగా ఎలా మార్చారో అదే మాదిరి కార్మిక సంస్కరణలకు రాజస్దాన్ను ఎంచుకున్నారు. సంస్కరణలకు ముందు, తరువాత ఏమి జరిగిందో చూడండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్ధి సర్వేలలో చెబుతున్నది. సరళీకృత కార్మిక చట్టాలు అమలు జరిగిన తరువాత, ముందు రాజస్ధాన్‌, సడలింపులు లేని రాష్ట్రాల తీరుతెన్నులను పోల్చి చూడమంటోంది. దాని ప్రకారం వంద మందికి పైగా సిబ్బంది ఉన్న ఫ్యాక్టరీలు రాజస్ధాన్‌లో 3.65 నుంచి 9.33శాతానికి పెరిగితే మిగతా దేశంలో 4.56 నుంచి 5.52శాతానికి పెరిగాయి. ఉత్పత్తి రాజస్ధాన్‌లో 3.13 నుంచి 12శాతానికి పెరిగితే దేశంలో 4.8 నుంచి 5.71శాతానికి పెరిగింది. కార్మికుల సంఖ్య విషయానికి వస్తే రాజస్ధాన్‌లో ఉండాల్సిన వారి కంటే 8.89 తక్కువ నుంచి 4.17శాతానికి పెరిగింది, దేశంలో అది 2.14 నుంచి 2.6 శాతానికి మాత్రమే పెరిగింది. అంటే రాజస్ధాన్‌లో కార్మిక చట్టాలను సరళీకరించినందువలన ఉపాధి 13.06శాతం పెరిగిందని చెబుతున్నారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.ఇది నిజమైతే, దీనికి కారణాలేమిటో పరిశీలించవచ్చు. దాని కంటే ముందు మరోవైపున ఏమి జరిగిందో చూద్దాం.

2017లో విడుదల అయిన అంతర్జాతీయ కార్మిక సంస్ద నివేదిక ప్రకారం ఉత్పాదక రంగంలో ఉత్పత్తి, జత అయిన విలువలో వేతనాల శాతం 1980-81లో ఉన్న 43.9నుంచి 2012-13 నాటికి 23.6శాతానికి పడిపోయింది.రాజస్ధాన్‌లో ఇది 23 నుంచి 14.4శాతంగా ఉంది. అంటే అక్కడ వేతనాలు సంస్కరణలకు ముందే ఎంత తక్కువగా ఉన్నాయో వెల్లడి అవుతోంది. 2014-15కు ముందు వేతనాల పెరుగుదల శాతం 14-15శాతం ఉన్నట్లు పరిశ్రమల వార్షిక సర్వే వెల్లడించింది. బిజెపి పాలకుల సంస్కరణల తరువాత 2014-15లో 11.5శాతం ఉండగా తరువాత రెండు సంవత్సరాలలో 6.1, 3.5శాతాలకు పడిపోయాయి. యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలి వేసి చట్టాలకు కోరలు లేకుండా చేయటంతో కార్మికులకు బేరమాడేశక్తి తగ్గిపోయినట్లు ఇది వెల్లడిస్తోంది. సంస్కరణల తరువాత కాంట్రాక్టు కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది, దీనర్ధం ఏమిటి శాశ్వత కార్మికుడికి ఇచ్చే వేతనంలో సగంతో కాంట్రాక్టు కార్మికులు దొరుగుతున్నారు. వారికి అలవెన్సులు, ఇఎస్‌ఐ వంటి పరిమిత రక్షణలు ఉండవు, యజమానులు చెల్లించాల్సిన అగత్యమూ లేదు. అందువలన కార్మికుల సంఖ్యను పెంచుకొని ఉత్పత్తినీ పెంచుకొనేందుకు యజమానులకు అన్ని అవకాశాలు కల్పించారు. ఇంతగా ఉపాధి అవకాశాలు పెరిగాయని చెబుతున్న రాజస్ధాన్‌లో దేశ సగటు కంటే నిరుద్యోగం ఎందుకు ఎక్కువగా ఉన్నట్లు ? సిఎంఐయి సమాచారం ప్రకారం 2019 జూలైలో దేశంలో 7.5శాతం ఉంటే రాజస్ధాన్‌లో 10.6శాతం నిరుద్యోగం ఉంది. అందువలన ఒక వైపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల సంపదలు పెరుగుతుండగా కార్మికులు వారిమీద ఆధారపడుతున్నవారి జీవితాలు దిగజారుతున్నాయి. కొనుగోలు శక్తి పడిపోయేందుకు ఇది కూడా ఒక కారణం. వినిమయం మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్ధలను అభివృద్ధి చేయాలని చూసే విధానంలో అంతర్గతంగా ఉన్న ఈ వైరుధ్యం కారణంగా కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది.

కరోనా పూర్తిగా అంతరించిన తరువాత కూడా పూర్వస్ధాయి కంటే ఉత్పత్తి 12శాతం తగ్గుతుందని మన దేశం గురించి ఆక్స్‌ఫర్డ్‌ అంచనా కట్టింది. మరోవైపు మన దేశం నవంబరు 27న ప్రకటించే వివరాలతో సాంకేతికంగా మాంద్యంలో ప్రవేశించనున్నట్లు రిజర్వుబ్యాంకు ముందే ప్రకటించింది. నిజానికి ఇప్పుడు మనం మాంద్యంలోనే ఉన్నాం. సరైన వివరాలు లేని కారణంగా తొలి, రెండవ త్రైమాస వృద్ధి వివరాలను సకాలంలో ప్రకటించటంలో మోడీ సర్కార్‌ విఫలమైంది. ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా ఆరునెలల పాటు తిరోగమన వృద్ధి నమోదు అయితే మాంద్యంలో ప్రవేశించినట్లు పరిగణిస్తారు. మూడవ త్రైమాసం కూడా డిసెంబరుతో ముగియనుంది.
వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం మోపే భారాలను మోసేందుకు సిద్దంగా ఉన్నారా లేక దిక్కుతోచక భరిస్తున్నారా ? పెట్రోలు, డీజిలు మీద పన్నులు, ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకుంది. గతంలో బిజెపి మరుగుజ్జులు కేంద్రం మోపుతున్న భారాల కంటే రాష్ట్రాలు మోపే పన్నుల భారం ఎక్కువ అని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి భారాలను సమర్ధించారు. 2014 మార్చి నుంచి 2020 సెప్టెంబరు మధ్య పెట్రోలు మీద పన్ను భారం లీటరుకు రూ.10.38 నుంచి రూ.32.98( రెండువందల శాతానికి పైగా), డీజిలు మీద ఇదే కాలంలో రూ.4.58 నుంచి రూ.31.83కు(ఆరువందల శాతంపైగా) పెంచినా దేశభక్తిగా భావించి చెల్లిస్తున్నాము. రాష్ట్రాల పెంపుదల్లో తేడాలు ఉండవచ్చు గానీ ఏ రాష్ట్రమూ ఇంత భారీగా పెంచలేదు. ఉదాహరణకు ఢిల్లీలో పెట్రోలు మీద 60, డీజిలు మీద 68శాతం వ్యాట్‌ పెరిగింది.

2014-15 నుంచి 2019-20వరకు చూస్తే పెట్రోలు, డీజిల్‌ మీద కేంద్ర ప్రభుత్వానికి ఎక్సయిజు పన్ను ఆదాయం రూ. 1,72,000 కోట్ల నుంచి రూ.3,34,300 కోట్లకు పెరిగింది. ఇదే సయయంలో రాష్ట్రాల ఆదాయం రూ.1,60,500 కోట్ల నుంచి రూ. 2,21,100 కోట్లకు పెరిగింది. ఈ కారణంగానే బిజెపి మరుగుజ్జులు ఇటీవలి కాలంలో దీని గురించి నోరుమూసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరను బట్టి రోజు వారీ వినియోగదారులకు సవరిస్తామని చెప్పిన కేంద్రం దానికి విరుద్దంగా ప్రస్తుతం పెంచటమే తగ్గించటం లేదు. వినిమయం తగ్గినా కంపెనీల లాభాలు, కేంద్ర, రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా చూసేందుకే ఈ పని చేస్తున్నారు. అయినా వినియోగదారులు కిమ్మనటం లేదు.


2017-18 నాటి వివరాల ప్రకారం దేశంలో ఒక వ్యక్తి రోజువారీ సగటు జిడిపిలో 25శాతం మొత్తాన్ని పెట్రోలు మీద ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఇది రాష్ట్రాలలో బీహార్‌లో 94శాతం, యుపిలో 50శాతం ఉండగా చైనాలో నాలుగు, వియత్నాంలో 8, పాకిస్ధాన్‌లో 17శాతం ఉంది. ఇది పెరిగే కొద్దీ వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆర్ధిక వ్యవస్ధ మీద ప్రతికూల ప్రభావం చూపి ఆర్ధిక వ్యవస్ధ పునరుద్దరణ మందగిస్తుంది. చమురు మీద పన్నును ప్రభుత్వం బంగారు బాతుగా పరిగణిస్తున్నది. ఎక్కువ గుడ్ల కోసం ప్రయత్నిస్తే ఏమౌతుందో తెలిసిందే.
నవంబరు 26వ తేదీ ఆందోళన నరేంద్రమోడీ ఆరున్నర సంవత్సరాల పాలనా కాలంలో ఐదవది. కష్టజీవులు ముందుకు తెచ్చిన అంశాలను నిర్లక్ష్యం చేసినకొద్దీ ఇలాంటి ఆందోళనలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవు. మోడీ సర్కార్‌ వాటిని నివారిస్తుందా ? మరింతగా పెంచుతుందో తేల్చుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బొలీవియా మాస్‌ విజయం 2.0 – ప్రభుత్వం ముందు పెను సవాళ్లు !

25 Sunday Oct 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Bolivia’s 2020 election, Evo Morales, Luis Arce, MAS-Bolivia


ఎం కోటేశ్వరరావు


అనేక అనుమానాలు, సందేహాలకు తెరదించుతూ శుక్రవారం(అక్టోబరు 23వ తేదీ) రాత్రి లాటిన్‌ అమెరికా దేశమైన బొలీవియా ఎన్నికల సంఘం అధ్యక్ష, పార్లమెంట్‌ ఉభయ సభల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దీంతో అక్కడి రాజకీయ పరిణామాలు మరోమలుపు తిరిగాయి. సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీనేత ఇవోమొరేల్స్‌ గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నిర్ధారణ అయింది. అమెరికా పన్నిన కుట్రలో భాగంగా నానా యాగీ, ఆరోపణలు చేసిన అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్‌) పరువుపోయింది. దాని ప్రధాన కార్యదర్శి ఆల్‌మాగ్రో రాజీనామా చేయాలనే వత్తిడి పెరిగింది. తమ మద్దతుదార్లను అడుగడుగునా రెచ్చగొట్టేందుకు అమెరికా పన్నిన వలలో చిక్కకుండా మాస్‌ పార్టీ నాయకత్వం సమర్ధవంతంగా తిప్పికొట్టింది. అనేక చోట్ల కార్యకర్తలు, నేతలపై దాడులు, తప్పుడు కేసులతో వేధించటం, ఆ పార్టీకి తిరుగులేని పట్టు ఉన్న ప్రాంతాలకు పెట్రోలియం ఉత్పత్తుల వంటి వాటిని సరిగా సరఫరా చేయకపోవటం వంటి అనేక అక్రమాలకు తాత్కాలిక ప్రభుత్వం పాల్పడింది.


మాస్‌ పట్ల జనంలో తిరుగులేని విశ్వాసం వ్యక్తం కావటం ప్రపంచంలోని యావత్‌ వామపక్ష శక్తులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది, బాధ్యతను మరింతగా పెంచింది. మాస్‌ పార్టీ అభ్యర్ధి లూయీస్‌ ఆర్‌సికి పోలైన ఓట్లలో 55.1శాతం, ప్రత్యర్ధి కార్లోస్‌ మెసాకు 28.83, మూడవ అభ్యర్ధి ఫెర్నాండో కామ్చోకు 14శాతం వచ్చాయి. పార్లమెంట్‌ దిగువ సభలోని 130 స్ధానాల్లో మాస్‌ పార్టీకి 73, మిగతా రెండు పార్టీలకు 41,16 చొప్పున వచ్చాయి. ఎగువ సభలోని 36 స్ధానాలలో మాస్‌కు 21, రెండు, మూడు స్ధానాల్లో ఉన్న పార్టీలకు 11,4 చొప్పున వచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చేనెల మధ్యలో ప్రమాణస్వీకారం చేయనుంది. దేశంలో 73లక్షల మంది ఓటర్లలో 60ఏండ్ల లోపు వారు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది, ఈసారి 88శాతం పోలింగ్‌ జరిగింది.


గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మితవాదశక్తులు హింసాకాండకు పాల్పడ్డాయి. అసలు గత ఏడాది ఎన్నికలు జరగ ముందే బొలీవియా ఎన్నికలను తాము గుర్తించబోమని, అవి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించటం లేదని అమెరికా, బ్రెజిల్‌, కొలంబియా మరికొన్ని దేశాల మితవాద పాలకులు ప్రచారం ప్రారంభించారు. అనివార్యమై జరిపిన ఈ ఎన్నికల్లో మితవాద శక్తులు ఒకే అభ్యర్ధిని నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నించాయి. అయితే వాటి మధ్య ఉన్న అధికార యావ కారణంగా సాధ్యం కాలేదు. మాస్‌ పార్టీ మెజారిటీ ఓట్లు సాధించనుందని సర్వేలు వెల్లడించినా తగినన్ని ఓట్లు రాక రెండవదఫా ఎన్నికల్లో పోటీలో నిలిచే మితవాద అభ్యర్ధి విజయం సాధిస్తాడనే అంచనాతో ఈ సారి ఆశక్తులు ఉన్నాయి. మరొక ప్రధాన కారణం తటస్ధ ఓటర్లకు ఆగ్రహం తెప్పించకుండా వారి ఓట్లను ఆకర్షించాలనే ఎత్తుగడ కూడా దాడులకు పాల్పడకుండా నిలువరించిందని చెబుతున్నారు. గత ఏడాది కుట్రదారులు గద్దెనెక్కిన తరువాత తమకు ప్రత్యర్ధులు అనుకున్నవారి మీద పెద్ద ఎత్తున దాడులు చేయటంతో భయవాతావరణం ఏర్పడి ఎన్నికల ముందు 20శాతం ఓటర్లు తామెవరికి ఓటు వేసేది నిర్ణయించుకోలేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దాడులను తప్పించుకొనేందుకే వారలా చెప్పారని, చడీచప్పుడు లేకుండా పోలింగ్‌లో తమ నిర్ణయాన్ని మాస్‌కు అనుకూలంగా తీసుకున్నారని నిర్ధారణ అయింది. ఎన్నికల్లో అనూహ్యంగా ఫలితాలు ఎదురుకావటంతో కొన్ని చోట్ల ఈ శక్తులు విధ్వంసకాండ సృష్టించేందుకు అక్రమాలు జరిగాయంటూ ప్రదర్శనలు చేశాయి. అయితే అమెరికా దేశాల సంస్ధ, ఇతర పరిశీలకులు అలాంటివేమీ లేవని ప్రకటించటంతో వెనక్కు తగ్గాయి. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయం సాధించినట్లు ప్రకటించగానే పోలీసు, మిలిటరీ కుట్రచేసి అక్రమాలు జరిగాయని జనాన్ని నమ్మించేందుకు అనేక చోట్ల బ్యాలట్‌ బాక్సులు, ఎన్నికల కార్యాలయాలను దగ్దం చేసి ఇవో మొరేల్స్‌ మీద అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నించారు. అది కుట్ర అని, మాస్‌ పార్టీకి జనంలో మద్దతు ఉందని ఈ ఎన్నికలు నిర్ధారించాయి. మితవాదులు వెనక్కు తగ్గటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.


దిగజారిన ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరుస్తామని మాస్‌ వాగ్దానం చేసింది. అయితే దాని ప్రత్యర్ధి పార్టీలు మెజారిటీగా ఉన్న రెడ్‌ ఇండియన్‌ తెగల పట్ల అనుసరించే దురహంకార ధోరణులు, ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలను ప్రకటించలేకపోవటం, శ్వేత జాతి, మిశ్రమ రంగు జాతీయుల ఓట్లకోసం వెంపర్లాడటం తప్ప మెజారిటీ జనాన్ని పట్టించుకోకపోవటం మితవాద శక్తుల ఓటమికి దోహదం చేసిన కారణాలలో కొన్ని. మితవాద పార్టీలు రెండూ అమెరికా అనుకూలశక్తులుగా జనం గుర్తించటం, అమెరికా,ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు పొందటం, ఇవోమొరేల్స్‌ ప్రభుత్వ కూల్చివేత కుట్ర వెనుక వారి హస్తం ఉందన్న అంశాలు కూడా మాస్‌ విజయానికి దోహదం చేశాయి. కరోనా కేసులు విపరీతంగా ఉండటం, ఆరోగ్యశాఖ మంత్రి మెర్సిలో వెంటిలేటర్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిదొరికిపోయి అరెస్టు కావటం వంటి పరిణామాలు కుట్రదారుల ప్రభుత్వం అంటే ఏమిటో జనానికి స్పష్టమైంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించటం తప్ప ఉపాధి కోల్పోయిన వారికి ఎలాంటి సాయం అందించకపోవటంతో కార్మికులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. బొలీవియా ఎదుర్కొంటున్న సమస్యలకు పెట్టుబడిదారీ, మితవాద శక్తుల దగ్గర ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, వారు అధికారానికి వస్తే ఉన్న సంక్షేమ చర్యలను కూడా తిరగదోడతారనే విషయం ఓటర్లకు స్పష్టమైంది.


కొత్త ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. కరోనాను అదుపు చేయటం వాటిలో ఒకటి. ఈ ఏడాది జిడిపి 6.2శాతం తిరోగమనంలో ఉంటుందని అంచనా. అందువలన దిగజారిన ఆర్దిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టటం, సామాన్యులకు ఉపశమనం కలిగించటం, జాత్యహంకార శ్వేతజాతి, పచ్చి మితవాద శక్తులను అదుపు చేయటం, అన్నింటికీ మించి అమెరికా కుట్రలను ఎదుర్కోవటం వంటి అంశాలున్నాయి. పద్నాలుగు సంవత్సరాల ఇవో మొరేల్స్‌ పాలనలో గ్యాస్‌, పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్‌, గనులను జాతీయం చేయటం వంటి చర్యలు చేపట్టినప్పటికీ ప్రయివేటు రంగానికి లోబడే చేశారు. ఈ పరిమిత చర్యల కారణంగా కూడా దేశ ఆదాయం పెరిగింది. ఇవో మొరేల్స్‌ అధికారానికి రాక ముందు ప్రయివేటు రంగంలోని పెట్రోలియం, గ్యాస్‌ క్షేత్రాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన వార్షిక ఆదాయం 73 కోట్ల డాలర్లు కాగా వాటిని జాతీయం చేసిన తరువాత 495 కోట్లకు పెరిగింది.దాంతో చేపట్టిన సంక్షేమ చర్యల కారణంగా 60శాతంగా ఉన్న పేదరికం 35కు తగ్గిపోయింది. ఇప్పుడు కరోనా కారణంగా తిరిగి పెరిగినట్లు వార్తలు వచ్చాయి. స్దానిక తెగల భాషలతో స్కూళ్లలో బోధన ప్రారంభించారు. బొలీవియాలో పండించే కోకాతో ఔషధాలతో పాటు కొకెయిన్‌ అనే మాదక ద్రవ్యాన్ని కూడా తయారు చేయవచ్చు. అయితే మాస్‌ ప్రభుత్వం రాక ముందు మాదక ద్రవ్యాల నిరోధం పేరుతో యంత్రాంగం కోకా రైతుల జీవితాలను నాశనం చేసింది. మొరేల్స్‌ అధికారానికి వచ్చాక కోకా సాగును చట్టబద్దం చేశాడు.మాదక ద్రవ్యాల నిరోధానికి తగుచర్యలు తీసుకున్నారు.


గత పదకొండు నెలల తాత్కాలిక ప్రభుత్వ పాలనలో ఆర్ధికరంగం దిగజారింది. నిరుద్యోగం 4.2 నుంచి 12శాతానికి చేరింది, నిర్మాణ రంగం వంటి వాటిలో 30శాతం ఉంది. ఉత్పత్తి 16శాతం పడిపోయింది. ద్రవ్యలోటు ఆరు నుంచి తొమ్మిది శాతానికి పెరిగింది. దారిద్య్రం, సంపద కేంద్రీకరణ పెరిగింది.ఇవో మొరేల్స్‌ ప్రభుత్వాన్ని కూలదోయటం వెనుకు బహుళజాతి కంపెనీల హస్తం ఉంది. మోటారు వాహనాలు, సెల్‌ఫోన్లలో వినియోగించే బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియం నిల్వలకు బొలీవియా కేంద్రం. ప్రపంచ మొత్తం నిల్వల్లో అక్కడ 25 నుంచి 45శాతం వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముడి ఖనిజాన్ని ఎగుమతి చేయటం కంటే బ్యాటరీలు తయారు చేసి ఎగుమతి చేయటం మరింత లాభసాటిగా ఉంటుందని, ఆ వచ్చే సొమ్ముతో దారిద్య్రనిర్మూలనతో పాటు సంక్షేమ చర్యలను అమలు జరపవచ్చని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. అక్కడ ఉన్న ఖనిజంతో ఏడాదికి నాలుగు లక్షల బ్యాటరీలను తయారు చేయవచ్చని అంచనా వేశారు. ఆమేరకు ప్రభుత్వ రంగ సంస్ధ ఒక ప్రకటన చేసిన తరువాత ఎన్నికలు జరగటం, ఇవోమొరేల్స్‌ ఘనవిజయం సాధించటం, కుట్ర చేసి తొలగించటం తెలిసిందే. అధికారానికి వచ్చిన అమెరికా అనుకూల కుట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలలో లిథియం శుద్దికి మొరేల్స్‌ సర్కార్‌ జర్మనీతో కుదుర్చుకున్న సంయుక్త పధకాన్ని రద్దుచేయటం ఒకటి.
లూయీస్‌ ఆర్‌సి నూతన ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆచితూచి ప్రకటన చేశారు. అయితే గత ఏడాది కాలంలో జరిగిన హింసాకాండ, హత్యలకు బాధ్యులైన వారి మీద ఏ చర్యలు తీసుకుంటారు? 36 మంది మరణించగా 800మందికి పైగా గాయపడ్డారు. మంత్రుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలను నిగ్గుతేలుస్తారా ? ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే మితవాదశక్తులు మరోసారి రెచ్చిపోయే అవకాశం ఉంది. దాన్నెలా ఎదుర్కొంటారు ? ఇవో మొరేల్స్‌ అర్జెంటీనా ప్రవాసం నుంచి ఎప్పుడు తిరిగి వస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.కుట్రదారులు మోపిన కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. కొత్త ప్రభుత్వం వాటిని రద్దు చేస్తుందా లేక విచారణ కొనసాగించి నిజం లేదని నిగ్గుతేలుస్తుందా అన్నది స్పష్టం కాలేదు.


ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులకు తాజా ఎన్నికల్లో విజయం లభించినప్పటికీ రాబోయే ఐదు సంవత్సరాలలో మాస్‌ ప్రభుత్వ నడక నల్లేరు మీద బండిలా ఉండే అవకాశం ఉంటుందని చెప్పలేము. పద్నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న మాస్‌ పార్టీ ఆర్ధిక రంగంలో లాటిన్‌ అమెరికాలోని మిగతా వామపక్ష పాలిత దేశాలలో మాదిరి నయాఉదారవాద పునాదులను కదిలించలేదు. కొన్ని సంక్షేమ చర్యలు తీసుకొని ఉపశమనం కలిగించటం తప్ప పెట్టుబడిదారీ వ్యవస్ధ ముందుకు తెచ్చిన అసమానత, దోపిడీలను అవి నివారించలేవు. వాటికి ఉన్న పరిమితులు కూడా ఏమిటో గత రెండు దశాబ్దాల అనుభవం వెల్లడించింది. అమెరికాతో కుమ్మక్కయిన పోలీసు, మిలిటరీ, మితవాద శక్తుల కుట్రలకు బొలీవియాలో తాత్కాలికంగా తెరపడింది. అవి తిరిగి మరోమారు తలెత్తలేవని చెప్పలేము. దానికి గాను పలు ఆటంకాలను అధిగమించాల్సి ఉంది.అయితే ఈ విజయంతో సంతృప్తి చెంది ఆదమరవకుండా అమెరికా కుట్రలను నిరంతరం కనిపెట్టటంతో పాటు విధానపరమైన మార్పులను చేపట్టి పురోగమించటం ఎలా అనే అతిపెద్ద సవాలు ఆ పార్టీ ముందు ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా కట్టడితో చైనాలో ఆనంద హేల – ముట్టడితో అమెరికాలో ఆరోపణల గోల !

03 Saturday Oct 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Blame game in US on Covid-19, Covid-19 two contrast scenarios, Revenge travel in China


ఎం కోటేశ్వరరావు


రెండు దృశ్యాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకచోట ఆనంద హేల ! మరో చోట ఆరోపణల గోల !! కరోనా వైరస్‌ను కట్టడి చేసిన చైనాలో అక్టోబరు ఒకటవ తేదీన ప్రతి ఏటా జరుపుకొనే అరుణపతాక ఆవిష్కరణ ఎంతో ఆర్భాటంగా జరిగింది. 1949 అక్టోబరు ఒకటవ తేదీన చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇదే సమయంలో శరత్కాల పండుగను కూడా జరుపుకుంటారు. అందువలన రెండింటికి కలిపి వారం రోజుల పాటు ఇచ్చే సెలవులు గడిపేందుకు దాదాపు 55 కోట్ల మంది వివిధ ప్రాంతాలకు పయనమై వెళ్లారు. కరోనాను కట్టడి చేసిన తరువాత చైనాలో సాధారణ జీవనం పునరుద్దరణ అయిందనేందుకు ఇది నిదర్శనం.


మరోవైపు కరోనా నిరోధాన్ని నిర్లక్ష్యం చేసి రెండు లక్షలకు పైగా ప్రాణాలు పోయేందుకు,75లక్షల మందికి కరోనా సోకేందుకు కారకుడైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన నేరం, వైఫల్య నెపాన్ని ఇతరుల మీద నెట్టేందుకు పూనుకున్నాడు. నిర్లక్ష్యంతో అధ్యక్షుడిగా యావత్‌ అమెరికా పౌరులను, చివరకు వ్యక్తిగతంగా తాను, సతీమణికి సైతం కరోనాను అంటించి క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిసారి జరిగిన అభ్యర్ధుల సంవాదంలో ట్రంప్‌ పచ్చి అబద్దాలు, అసత్యాలను పలికాడు. ప్రత్యర్ధి జో బిడెన్‌, మీడియా, ఇతరులు ట్రంప్‌ మీద విరుచుకు పడ్డారు. ఎన్నికలు జరిగే నాటికి కోటి మంది వరకు కరోనా బారిన పడే తీరులో వ్యాధి వ్యాపిస్తోంది. మరోవైపు చైనాలో అడపాదడపా కొన్ని కేసులు వెలుగు చూడటం -అదీ విదేశాల నుంచి దిగుమతి అయ్యేది – తప్ప మొత్తంగా వ్యాధి అదుపులో ఉంది.


మహమ్మారులను ఎదుర్కోవటం,కట్టడి చేయటంలో సోషలిస్టు ప్రభుత్వాల ప్రత్యేకతేమిటో చరిత్రలో తొలిసారిగా ప్రపంచం చూసింది. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వ్యాప్తి చెందిపెద్ద సంఖ్యలో జనం మరణించిన సమయానికి రష్యాలో బోల్షివిక్‌ ప్రభుత్వం పూర్తిగా నిలదొక్కుకోలేదు. కరోనా కేసులు తొలుత చైనాలో బయట పడిన కారణంగా అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ జీవ ఆయుధాల తయారీలో భాగంగా బయటకు వదిలారని, ప్రమాదవశాత్తూ బయల్పడిందని ఏ కారణం చెప్పినప్పటికీ చైనా మీద ఆరోపణలు చేసేందుకు, కమ్యూనిస్టు సిద్దాంతం మీద దాడి చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. కరోనా పేరుతో అన్ని విధాలుగా ఒంటరి పాటు చేసేందుకు, ఆ పేరుతో ఆర్ధిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన దేశాలు ఏవో చూశాము. వాటన్నింటినీ తట్టుకొని తన దైన శైలిలో ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని కరోనా నుంచి బయటపడింది.


కరోనా కేసులు తొలుత బయట పడిన ఊహాన్‌ నగరం, హుబెయి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు జరిపిన తీరు ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు, అన్నింటికీ మించి జనం ఎక్కడా చైనా, వియత్నాంలో మాదిరి సహకరించలేదు. మహమ్మారి నుంచి చైనా సమాజాన్ని బయటపడవేసేందుకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం తీసుకున్న చర్యల మీద జనం అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించారు. దీనికి గత నాలుగు దశాబ్దాలలో సంస్కరణలు అమలు జరిపి జనజీవితాలను మెరుగుపరచిన వాస్తవాన్ని స్వయంగా గమనించటమే కారణం. పదేండ్ల క్రితం ధనికదేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా తమ ఆర్ధిక వ్యవస్ధ కూడా ప్రభావితం అయినప్పటికీ జనాన్ని ఆదుకున్న తీరును, మిగిలిన దేశాల్లో జనజీవితాలు అస్తవ్యస్ధం కావటాన్ని చూశారు గనుకనే కరోనా మహమ్మారిని జయించేందుకు ప్రభుత్వంతో కలసి జనం పోరాడారు.
దాదాపు తొమ్మిది నెలల పాటు క్వారంటైన్‌, లాక్‌డౌన్‌, అనేక ఆంక్షలను అనుభవించిన జనం గత రెండు నెలలుగా కొత్తకేసులు లేకపోవటంతో పంజరాల నుంచి బయట పడిన పక్షులు స్వేచ్చగా ఎగిరే మాదిరి బయటకు వచ్చారు. పరిస్ధితులన్నీ బాగుపడ్డాయనే ధైర్యం వచ్చిన తరువాత కసిగా విహార యాత్రలకు వెళుతున్నారని విశ్లేషకులు వర్ణించారు. ఇది చైనా ఆర్ధిక వ్యవస్దకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. సెప్టెంబరు30వ తేదీన 12 కేసులు నమోదు కాగా అవి కూడా విదేశాల నుంచి వచ్చిన వారివే. ఎనిమిది రోజుల పాటు సెలవులను ప్రకటించటం ఏ దేశంలో అయినా జరుగుతుందా ? చైనాలో మాత్రమే చూడగలం. నూటనలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక్కసారిగా 55 కోట్ల మంది బయటకు వస్తే బహిరంగ స్ధలాలు ఎంత రద్దీ అవుతాయో ఊహించుకోవాల్సిందే. ప్రయాణ సాధనాల్లో, హౌటళ్లలో రిజర్వేషన్లు దొరక్క, ఒక రోజు ముందే వాహనరద్దీతో ఇండ్లకే పరిమితమైన వారెందరో. వాహనాలు నత్తనడక నడిచాయి. ఐదు వందలకు పైగా విహార కేంద్రాలలో ప్రవేశానికి రాయితీలు లేదా ఉచితంగా అనుమతిస్తూ ప్రకటించారు. అక్టోబరు ఒకటవ తేదీ ఒక్కరోజే 14,941 విమానాలు ఏర్పాటు చేశారు. రద్దీని తట్టుకొనేందుకు ప్రత్యేక విమానాలు కూడా సిద్దం చేశారు. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు ఎనిమిది వరకు రైల్వేశాఖ 10.8 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే చైనా సమాజం మీద ఆర్ధికంగా కరోనా ప్రభావం లేదా ? ఉంది కనుకనే గత ఏడాది 80 కోట్ల మంది ప్రయాణాలు చేస్తే ఈ ఏడాది 55 కోట్ల మందే చేస్తున్నారని వెల్లడైంది. గతేడాది 9.5బిలియన్‌ డాలర్ల మేరకు జనం ఖర్చు చేశారు. ఈ ఏడాది తగ్గనుంది.ఆగస్టు నుంచి సాధారణ వస్తుకొనుగోలు పెరిగింది.


కరోనా వైరస్‌ను అదుపు చేయటంలో ఒక్క చైనాయే కాదు, వియత్నాంతో పాటు సామ్రాజ్యవాదుల ఆంక్షల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న క్యూబా,వెనెజులా కూడా ప్రపంచానికి మార్గంచూపాయి. వియత్నాంలో కరోనాను కట్టడి చేశారు. అయితే అదే పద్దతిని ఇతర దేశాల్లో ఎందుకు అనుసరించటం లేదు ? ఇబ్బందులేమిటి ? అనే చర్చ జరిగింది. చైనాతో వియత్నాంకు సరిహద్దు ఉన్న విషయం తెలిసిందే. ఊహాన్‌ నుంచి వియత్నాం వచ్చిన ఒక చైనా పౌరుడు, అతని కుమారుడిలో జనవరి 30న ఆ వ్యాధి లక్షణాలు బయట పడ్డాయి. 2003లో చైనాలో బయటపడిన సార్స్‌ సోకిన తొలి దేశం వియత్నాం కావటం, గత అనుభవాలను గమనంలో ఉంచుకొని అక్కడి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం వెంటనే కరోనా నివారణకు కఠినమైన చర్యలు తీసుకుంది.వాటికి జనం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. వియత్నాంలో కేంద్రీకృత అధికార వ్యవస్ధ ఉండటం, వెంటనే నిర్ణయాలు తీసుకొనేందుకు, అమలు చేసేందుకు దోహదం చేసింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించటం, లాక్‌డౌన్‌ నిబంధనలను గట్టిగా అమలు జరపటం ఎంతో తోడ్పడింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీద నిఘావేసే చర్యలు తీసుకున్నారు.అనేక దేశాల్లో ప్రభుత్వాలకు అలాంటి అధికారం ఉన్నప్పటికీ జవాబుదారీతనం, తగినన్ని నిధులు లేని కారణంగా ఆ పని చేయలేదు.


ఉత్తర వియత్నాంపై అమెరికా దాడి చేసిన సమయంలో జనాన్ని సిద్దం చేసేందుకు అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన పద్దతులు ఎంతగానో అమెరికా వ్యతిరేకతను, దేశాన్ని రక్షించుకోవాల్సిన జాతీయ భావనలను జనంలో కలిగించటంలో జయప్రదమయ్యాయి. అమెరికన్లను అడ్డుకొనేందుకు ప్రతి పౌరుడు సాయుధుడు కావాలని ప్రతి ఇల్లు ప్రతిఘటన కేంద్రంగా మారాలని అప్పుడు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కరోనా మీద యుద్దాన్ని కూడా అదే పద్దతుల్లో చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. ఇది జనాన్ని కదిలించింది. జనం కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.ఇలాంటి పరిస్ధితి మరేదేశంలోనూ కనిపించదు. సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్ధితిని ప్రభుత్వం వివరించింది. మీడియా సరేసరి. మిలిటరీని కూడా రంగంలోకి దించి జనాన్ని అప్రమత్తం గావించింది. ఈ కసరత్తు అంతా జనానికి పరిస్ధితి తీవ్రతను తెలియ చేసేందుకు కరోనా పోరులో వారిని భాగస్వాములను చేసేందుకు అన్నింటికీ మించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేందుకు ఎంతగానో తోడ్పడింది. దీనికి సోషలిస్టు చైతన్య స్ఫూర్తి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే జాగ్రత్త అని వేరే చెప్పనవసరం లేదు. ఒక వైపు కరోనాను కట్టడి చేస్తూనే మరోవైపు ఆర్ధిక రంగంపై దాని ప్రభావం పడకుండా చూసిన కారణంగా ఈ ఏడాది ఎనిమిది నెలల్లో అమెరికాతో సహా అనేక దేశాలకు వియత్నాం ఎగుమతులు గత ఏడాది కంటే పెరిగాయి. అమెరికా ఖండ దేశాల నుంచి పెట్టుబడులు కూడా పెరిగాయి. దీనికి అమెరికా-చైనా మధ్య తలెత్తిన వివాదం కూడా తోడైంది.


క్యూబా మీద అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలకు ఆరుదశాబ్దాలు నిండాయి.1991లో సోవియట్‌ రిపబ్లిక్‌లను కూల్చివేసిన తరువాత కూడా అవి కొనసాగుతున్నాయి. అక్కడి కమ్యూనిస్టు పార్టీ జనానికి కలిగించిన చైతన్యం కారణంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలిచింది. అనేక ఆటంకాల మధ్య తనదైన శైలిలో వైద్య రంగంలో అనేక విజయాలను క్యూబా నమోదు చేసింది. కోటీ 15లక్షల జనాభా ఉన్న అక్కడ 90వేలకు పైగా వైద్యులు ఉన్నారు. అక్టోబరు రెండవ తేదీ నాటికి 5,670 కేసులు నమోదు కాగా 122 మంది మరణించారు, 626 మంది చికిత్సపొందుతుండగా తొమ్మిది మంది పరిస్దితి విషమ స్దితిలో ఉన్నారు.1981లో డెంగ్యూ జ్వరాలు ప్రబలిన సమయంలో నివారణకు తీసుకున్న చర్యల అనుభవం ఇప్పుడు కరోనా నివారణకు ఎంతగానో తోడ్పడింది.


అమెరికాలోని జార్జియా రాష్ట్ర జనాభా కూడా క్యూబాకు దగ్గరా కోటీ ఐదు లక్షల మంది. అక్కడ అక్టోబరు రెండవ తేదీనాటికి 3,19,334 కరోనా కేసులు నమోదు కాగా 7,063 మంది మరణించారు, 2,12,023 మంది చికిత్స పొందుతున్నారు. జనం పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వానికి లేని పాలకులకు, సోషలిస్టు వ్యవస్దకు, పెట్టుబడిదారీ సమాజానికి ఉన్న తేడా ఇది. తన జనాన్ని కాపాడుకోవటమే కాదు 45దేశాలకు అవసరమైన ఔషధాలను, వైద్యులు, సిబ్బందిని పంపింది. క్యూబా ఔషధంగా పేరుగాంచిన ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా2బి తయారీ 2003నుంచి చైనాలో జరుగుతోంది. అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతోంది.జనాన్ని చంపటానికైనా సిద్ధపడుతున్నాడు గానీ దాన్ని అమెరికాలో వినియోగించటానికి డోనాల్డ్‌ ట్రంప్‌కు అహం అడ్డువచ్చింది.


అనేక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పరీక్షలన్నీ క్యూబా ప్రభుత్వం ఉచితంగానే చేసింది.వైద్యం అనేక దేశాల్లో బీమా కంపెనీల ఆదాయవనరుగా, వ్యాపారంగా మారిందంటే అతిశయోక్తి కాదు. క్యూబాలో 1960దశకం నుంచి అభివృద్ది చేసిన ప్రజారోగ్య వ్యవస్ధ జనాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తక్కువ ఖర్చుతోనే వైద్యాన్ని కూడా అందించగలుగుతోంది. అమెరికాలో ఒక రోజు ఆసుపత్రిలో ఉంటే 1,900డాలర్లు ఖర్చయితే క్యూబాలో ఐదు డాలర్లు, బుడ్డ(హెర్నియా) ఆపరేషన్‌కు 12వేల డాలర్లు అయితే 14, తుంటి ఎముక ఆపరేషన్‌కు 14వేలు అయితే క్యూబాలో 72 డాలర్లు మాత్రమే అవుతుంది. అమెరికాలో 2018లో తలకు 8,300 డాలర్లు ఖర్చు చేస్తే క్యూబాలో 400 డాలర్లు చేశారు. దీనికి అనుగుణ్యంగానే అమెరికాలో వైద్యులకు ఇచ్చే వేతనాలు క్యూబాలో లేవు అన్నది కూడా నిజం. వైద్యులకు వేతనాల కంటే జనానికి వైద్య ఖర్చు తగ్గించటమే సోషలిస్టు క్యూబా ప్రత్యేకత. మిగతావారితో పాటు వైద్యులు కూడా ప్రభుత్వం నుంచి సామాజిక భద్రతను పొందుతారు.


క్యూబా వైద్య విధానాన్ని చూసి ప్రపంచం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వెనెజులాలో 20వేల మంది క్యూబన్‌ వైద్యులు,నర్సులు ఉన్నారు. స్ధానికులతో కలసి వారంతా ఇంటింటికీ తిరిగి కరోనా పరీక్షలు,చికిత్స, అవసరమైన సలహాలు అందించటం నిత్యకృత్యంగా చేస్తున్నారు.దేశంలో 15వేల క్లినిక్స్‌, 572 రోగనిర్దారణ పరీక్షా కేంద్రాలు, 586 చికిత్స కేంద్రాలు, 35 ఉన్నత సాంకేతిక వైద్య కేంద్రాలు గతంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిలో అత్యధిభాగాన్ని కరోనా నిరోధ కేంద్రాలుగా పని చేయిస్తున్నారు. మూడు కోట్ల జనాభా ఉన్న వెనెజులాలో అక్టోబరు రెండవ తేదీ నాటికి 76వేల కేసులు నమోదు కాగా 635 మంది మృత్యువాత పడ్డారు.పక్కనే ఉన్న కొలంబియాలో 8.35లక్షల కేసులు, 26వేల మరణాలు సంభవించాయి. వెనెజులా గురించి అక్కడి జనం పడుతున్న ఇబ్బందుల గురించి కట్టుకధలు చెప్పేవారు ఈ వివరాల గురించి ఏమంటారు? ఆమెరికా, ఇతర అనేక దేశాలు కల్పిస్తున్న ఇబ్బందులను తట్టుకుంటూ వెనెజులా జనాన్ని కరోనా బారిన పడకుండా కాపాడుతున్నది. అంతా సజావుగా ఉందని చెబుతున్న కొలంబియా సంగతి చూశాము. అదే ప్రాంతానికి చెందిన మరో దేశం బ్రెజిల్‌లో 48.5లక్షల కేసులు నమోదు కాగా 1.44లక్షల మంది మరణించారు.


కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన దేశాల్లో చైనా కూడా ఒకటి. వైరస్‌ను అక్కడే తయారు చేసి వదిలారు అని చెబుతున్నవారు మరి దీనికేమంటారు ? జనవరి-మార్చినెలల మధ్య జిడిపి 6.8శాతం తిరోగమనంలో పడగా ఎక్కడైతే మహమ్మారి ప్రారంభమైందో ఆ హుబెరు రాష్ట్రంలో నష్టం 39.2శాతం ఉంది. అయితే ఆ విపత్తును త్వరలోనే అధిగమించి ఏప్రిల్‌-జూన్‌ మాసాల్లో మూడశాతం పురోగమనాన్ని సాధించింది. ఫిబ్రవరి నాటికి 80వేలకు పైగా కేసులుండగా అక్టోబరు రెండున 85,424 కేసులు నమోద కాగా చికిత్స పొందుతున్న వారు 189 మంది, ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది, కొత్తకేసులు పది నమోదయ్యాయి. మే మొదటి వారానికే ఊహాన్‌తో సహా దేశమంతటా 80శాతం ఉత్పాదక కార్యకలాపాలు నమోదయ్యాయి. ఎక్కడికక్కడ పరీక్షలు చేస్తూ వైరస్‌ జాడను కనుగొన్నారు.


చైనాలో వైరస్‌ అదుపులోకి వచ్చిన మే మాసం నుంచి నామ మాత్రంగా కేసులు నమోదు కాగా అమెరికాలో పది లక్షల నుంచి అక్టోబరు రెండు నాటికి 75లక్షలకు పెరిగాయి.25లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కరోనాకు ముందు ఎక్కువ మంది ఆర్ధికవేత్తలు 2020లో చైనా ఆర్ధిక వ్యవస్ధ ఆరుశాతానికి అటూ ఇటూగా వృద్ది రేటుతో ఉంటుందని అంచనా వేశారు. 2021 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. నాటికి 2010లో ఉన్న జిడిపిని రెట్టింపు చేయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇచ్చింది. దాన్ని చేరుకోవాలంటే ఆరుశాతం వృద్ధి రేటు ఉంటే సాధ్యమే అని అనేక మంది భావించారు. కరోనాతో అది కష్టం కావచ్చని అయినప్పటికీ ఆ దిశగా పని చేయాలని అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ పిలుపునిచ్చారు. 2021నాటికి కాకున్నా ఆ ఏడాది చివరికి అయినా లక్ష్యాన్ని చేరాలనే పట్టుదలతో పని చేస్తున్నారు.


కరోనా కారణంగా ఉద్దీపన పధకాలకు అమెరికా 2.3లక్షల కోట్ల డాలర్లు కేటాయించింది. చైనా 50వేల కోట్ల డాలర్లు కేటాయించింది. అమెరికా అంత మొత్తం ప్రకటించినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ 2020లో 8శాతం తిరోగమనంలో ఉంటుందని, 2021లో 4.5శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ జూన్‌ అంచనాలో పేర్కొన్నది. అదే చైనా విషయానికి వస్తే ఒకటి, 8.2శాతాలుగా ఉంటుందని పేర్కొన్నది. ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే 2020లో పురోగమన వృద్ధి రేటుతో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా. కరోనా విషయంలోనే కాదు, ఆర్ధిక రంగంలో చైనా తన సోషలిస్టు వ్యవస్ధ విశిష్టతను ప్రదర్శిస్తోందన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాల విలీనాలు-భిన్న వైఖరులు ఎందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి !

17 Thursday Sep 2020

Posted by raomk in AP, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP hypocrisy, Hyderabad liberation day, Razakars (Hyderabad), RSS - Hyderabad’s liberation, TRS government


ఎం కోటేశ్వరరావు


చరిత్ర నిర్మాతలు ప్రజలు. కానీ చరిత్రను ఎలా రాయాలో నిర్దేశించేది విజేతలు లేదా పాలకులు అన్నది ఒక అభిప్రాయం. ప్రతి దానికీ కొన్ని మినహాయింపులు ఉన్నట్లుగానే చరిత్ర నమోదులో కూడా అలాంటివి ఉండవచ్చు. చరిత్రలో మనకు నిరంకుశులు – ప్రజాస్వామ్య వాదులు, శ్రామికజన పక్షపాతులు – శ్రామిక జన వ్యతిరేకులు కనిపిస్తారు. ఆ రాణీ ప్రేమ పురాణం ఈ ముట్టడి కైన ఖర్చులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అందువలన చరిత్రను చూసే, రాసేవారి ఆసక్తి వెనుక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి వ్యక్తిగతం కావచ్చు, భావజాల పరంగానూ ఉంటాయి.


చరిత్రను వర్గదృష్టితో పరిశీలిస్తే ఒక మాదిరి, కులం – మతం- ప్రాంతీయం వంటి కళ్లద్దాలతో చూస్తే మరొక విధంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమం, సంస్కరణ, అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలతో ప్రభావితులైన తరం రాసిన చరిత్రలో ఆ భావజాల ప్రభావాలు కనిపిస్తాయి. అలాంటి శక్తులు పాలకులుగా ఉన్నారు కనుక దాన్ని వివాదాస్పదం కావించలేదు. ఆ చరిత్రకు ఆమోదం లభించింది. అయితే ఆ చరిత్ర మొత్తాన్ని కమ్యూనిస్టులు రాసిన చరిత్రగా వక్రీకరిస్తూ మన దేశంలోని మత శక్తులు ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు ఎప్పటి నుంచో చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు. వారి చరిత్ర మత ప్రాతిపదికగానే ఉంటుంది. ఆ ప్రాతిపదికతో జనాల మధ్య విభజన గోడలు కట్టాలనే ఎత్తుగడదాగి ఉంది. ఆ గోడలతో వారేమి చేసుకుంటారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న.


ఏ కులం, ఏ ప్రాంతం, మతం వారైనా కష్టజీవులుగా తాము దోపిడీకి గురవుతున్నామా లేదా అనే ప్రాతిపదికన ఆలోచించాలని కమ్యూనిస్టులు చెబుతారు. దానికి భిన్నంగా కులం, ప్రాంతం, మత ప్రాతిపదికన సమీకృతం కావాలన్నది ఆ శక్తుల వాంఛ. అదే జరిగితే నష్టపోయేది శ్రామికులు, లబ్ది పొందేది దోపిడీదార్లు. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా పాలకులు, మతం మధ్య సఖ్యత, ఒకదాన్ని ఒకటి బలపరుచుకోవటం ముఖ్యంగా ఫ్యూడల్‌ సమాజాలలో కనిపిస్తుంది. దోపిడీదార్లకు మతం ఆటంకంగా మారినపుడు దాని పెత్తనాన్ని బద్దలు కొట్టి పక్కన పెట్టటాన్ని ఐరోపా పరిణామాల్లో చూస్తాము.


ఆసియా, ఆఫ్రికా వంటి వెనుకబడిన ఇంకా ఫ్యూడల్‌ వ్యవస్ధ బలంగా ఉన్న చోట్ల మతం ప్రభావితం చేస్తూనే ఉంది. మన దేశానికి వస్తే పెట్టుబడిదార్లు మతంతో, ఫ్యూడల్‌ వ్యవస్దతో రాజీపడటం కనిపిస్తుంది. బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం చేయటం (వారి పేర్లతో దేవాలయాలను పిలవటం-హైదరాబాద్‌ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బిర్లా మందిర్‌ అనే పిలుస్తారు.) మతంతో రాజీ, దాన్ని ఉపయోగించుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. అలాగే ఇతర మతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు మసీదు, చర్చ్‌లు కట్టించినా లక్ష్యం ఒకటే.
బ్రిటీష్‌ వారి పాలనలో సంస్ధానాలు తిరుగుబాటు చేసిన చోట విలీనం చేసుకున్నారు. రాజీపడిన చోట సామంత రాజ్యాలుగా లేకా ప్రత్యేక అధికారాలు, రక్షణతో కొనసాగాయి. చరిత్రను మత ప్రాతిపదికన చూడటం ఎలా జరుగుతోందో చూద్దాం. స్వతంత్ర భారత్‌లో కలిసేందుకు హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాలు వ్యతిరేకించి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు పన్నిన వ్యూహంలో భాగంగా స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని ప్రకటించాయి. నిజానికి అవెన్నడూ స్వతంత్ర రాజ్యాలు కాదు, బ్రిటీష్‌ ఇండియాకు సామంత రాజ్యాలుగానే ఉన్నాయి. అవి స్వతంత్ర దేశాలుగా అవతరించటం అంటే మన తల మీద ఒక సామ్రాజ్యవాద తొత్తును, గుండెల మీద మరొకతొత్తును ప్రతిష్టించుకోవటం తప్ప వేరు కాదు. ఈ కుట్రను ఛేదిస్తూ నాటి కేంద్ర ప్రభుత్వం సంస్ధాలను విలీనం చేసుకున్నది.
హైదరాబాదులో సంస్ధానాధీశుడు ముస్లిం, మెజారిటీ జనాభా హిందువులు. కాశ్మీరులో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందువు. నిజాం నవాబు లొంగిపోయి ఒప్పందం చేసుకోవటాన్ని ముస్లిం పాలకుల నుంచి హిందువులు విమోచన పొందినట్లుగా బిజెపి, దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణిస్తుంది. కాశ్మీరు స్వతంత్ర రాజ్యంగా ఉండాలనటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్దించింది. దాని వాంఛలకు భిన్నంగా కాశ్మీరు విలీనంగాక తప్ప లేదు. మరి దీన్నేమనాలి ? హిందూపాలకుల నుంచి ముస్లింలు విముక్తి పొందినట్లా ?


1921లో కేరళలోని మలబారు ప్రాంతంలో జరిగిన మోప్లా తిరుగుబాటును కూడా మత కోణంతో బిజెపి చూస్తోంది. బ్రిటీష్‌ వారు, స్ధానిక భూస్వాముల మీద ఆ ప్రాంతంలో గణనీయంగా ఉన్న ముస్లింలు, ఇతరులు జరిపిన తిరుగుబాటును హిందువుల మీద జరిగిన దాడులుగా చిత్రించి దాన్ని స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నిరాకరిస్తూ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేందుకు నిర్ణయించింది.


ఆపరేషన్‌ పోలో పేరుతో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్దానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసుకున్న రోజు. నాలుగు రోజుల్లోనే యూనియన్‌ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం నవాబు సైన్యం చేతులెత్తేసింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తిలక్‌ వంటి వారు జనాన్ని సమీకరించేందుకు నాటి ముంబై ప్రావిన్సులో వినాయకచవితి పండుగలను ప్రోత్సహించారు. అలాగే నిజాం రాజు సంఘం పేరుతో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రారంభమైన పోరుతో తన అధికారానికి ఎసరు రావటాన్ని గమనించి మతం పేరుతో సంస్ధానంలో ఉన్న ముస్లింలను ఆ ఉద్యమానికి దూరం చేసేందుకు, అణచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రయివేటు మిలిటెంట్లను ప్రోత్సహించాడు. ఆ శక్తులు మతోన్మాదంతో ఉత్తేజం పొందినవి కావటంతో వారి చర్యల్లో ఎక్కడైనా కొన్ని మత ప్రాతిపదికన జరిగి ఉండవచ్చు తప్ప రజాకార్లు నాటి హిందూ, ముస్లిం మతాలకు చెందిన జాగీర్దార్లు, దేశముఖుల రక్షణకోసమే పని చేశారు. వారిని వ్యతిరేకించిన వారిలో ఎందరో సామాన్య ముస్లింలు ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాటానికి నాంది అయిన భూ సమస్యలో దేశముఖ్‌కు వ్యతిరేకంగా చట్టబద్దమైన పోరు సాగించిన సామాన్య ముస్లిం రైతు బందగీ కోర్టులో విజయం సాధించిన తరువాత హత్యకు గురికావటం ఉద్యమానికి నిప్పురవ్వను రగిలించిన ఉదంతం కాదా ?


నిజాం రాచరికపు దౌర్జన్యాలను ఎండగట్టిన కలం యోధుడు షోయబుల్లాఖాన్‌. నిజాం రజాకార్‌ మూకల దాడిలోనే కన్నుమూసిన వీరుడు. రాచరికపు నిర్బంధాన్ని లెక్కచేయక, 1938లోనే ఔరంగాబాద్‌లో శ్రామిక మహాసభలో పాల్గొని మఖ్దూం మొహియుద్దీన్‌, హబీబ్‌లు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా 1939లో హైదరాబాద్‌లో కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ప్రారంభించిన వారిలో ఆలం ఖుంద్‌మిరీ ఒకరు. ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ తొలి అధ్యక్షుడు మఖ్దూం మొహియుద్దీన్‌. 1947 ఆగస్టు 15న ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగురవేశారు. నిజాం కాలేజీలో విద్యార్థి నాయకుడు రఫీ అహ్మద్‌ కూడా జాతీయ పతాకం ఆవిష్కరించారు. వీరంతా ఎవరు ?


విసునూరు దేశ్‌ ముఖ్‌ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ భూమి రక్షణ కోసం జరిగిన పోరాటం రైతాంగానికి స్ఫూర్తి నిచ్చింది. 1946, జూలై 4న దొడ్డి కొమరయ్య నేలకొరగటంతో రైతాంగం తిరుగుబాటు ప్రారంభమైంది. పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే 1947, ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. అప్పటికే చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగుతున్న లాంగ్‌ మార్చ్‌ అనేక ప్రాంతాలను విముక్తి చేసింది. తెలంగాణాలో కమ్యూనిస్టులు నిజాం సైన్యాలు, రజాకార్లను చావు దెబ్బతీస్తున్నారు. అక్కడ కూడా కమ్యూనిస్టులు ఆధిపత్యం వహిస్తే నైజాం సంస్ధానం మరో ఏనాన్‌గా మారుతుందేమో అని అమెరికా,బ్రిటన్‌ పాలకులు భయపడి దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అణచివేయాలని నెహ్రూ ప్రభుత్వాన్ని కోరారు.


కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు సంఘటితంగా ముందుకు సాగటం తట్టుకోలేని భూస్వాముల పెద్దలైన బూర్గుల రామక్రిష్ణారావు, కెవి రంగారెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి అక్కడ నెహ్రూ, పటేల్‌ తదితర పెద్దలకు మొరపెట్టుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజంటు కె యం మున్షీ ని వివరాలు కోరారు. ఆయన ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పాడు. నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లోకి నైజాం పోలీసులు కానీ, రజాకారు మూకలు గానీ పోలేకపోతున్నాయి. ఇంతకుముందు గ్రామాల మీదే కేంద్రీకరించే వాళ్ళు, ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలపై కూడా కేంద్రీకరిస్తున్నారు. వాళ్ళకు ప్రజామద్దతు రోజరోజుకు పెరిగిపోతోంది. ఇదంతా బెజవాడ కేంద్రంగా కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్న పట్టు అని రిపోర్టు ఇచ్చాడు. అసలే హైదరాబాద్‌ దేశానికి నడిబొడ్డున ఉంది. ఇది ఇలాగే ఉంటే కమ్యూనిస్టుల చేతికిపోతే మొత్తం దక్షిణ భారత దేశంపై దీని ప్రభావం పడుతుంది. ఆ తరువాత దేశం మొత్తానికి విస్తరించినా విస్తరించవచ్చు. ఇక మనం ఉపేక్షించటం మంచిది కాదని భావించిన కేంద్రం వెంటనే సైనికచర్యకు ఉపక్రమించింది. దానికే ఆపరేషన్‌ పోలో అని పేరు పెట్టారు. ఆ కారణంగానే కాశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాకిస్ధాన్‌పై దాడి కంటే నెజాం సంస్ధాన విలీనానికి ఎక్కువ మంది మిలిటరీని దించారు. జనరల్‌ జెయన్‌ ఛౌదరి నాయకత్వలో సైన్యాలు వచ్చాయి. సెప్టెంబర్‌ 13న వచ్చాయి. 17కల్లా ఆపరేషన్‌ క్లోజ్‌ అయింది.


తెలంగాణలో కమ్యూనిస్టు నాయకత్వంలో రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్‌ రైతాంగం కూడా షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా రైతాంగం కాశ్మీరు రాజు సైన్యం, తరువాత పాకిస్థాన్‌ సైన్యాలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కాశ్మీర్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది.
రెండు చోట్లా ప్రజాపోరాటాలు ముందుకు తెచ్చిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కొత్త సమస్యలు తలెత్తాయి. వాటిని పక్కన పెట్టి తెలంగాణా బీజేపీ, ఆరెస్సెస్‌ పరివారం విలీనమా? విమోచనమా? అన్న చర్చను ముందుకు తెస్తున్నది. విలీనం ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిం రాజు నుంచి హిందువుల విమోచనగా వక్రీకరిస్తున్నారు. కాశ్మీరు విలీనానికి అంగీకరించిన ప్రత్యేక రక్షణలను తొలగించటమే కాదు చివరకు ఆ రాష్ట్రాన్నే బిజెపి రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసింది. హైదరాబాద్‌ రాజ్యం గానీ, కాశ్మీర్‌ సంస్థానం గానీ ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో విలీనమైన విషయం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడదు. మెజారిటీ మత సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఈ అంశాల మీద ఆ పార్టీ వ్యవహరిస్తోంది అని చెప్పవచ్చు.


హైదరాబాద్‌, కాశ్మీర్‌ రాచరికాలను కూలదోయటం గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ రెండు ప్రాంతాలలోనూ రైతాంగ పోరాటాలతో సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలే, స్వాతంత్య్రోద్యమ సంప్రదాయాల ఫలితంగా ఏర్పడిన ఇండియన్‌ యూనియన్‌లో విలీనానికి పునాది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం సరైనదా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే దాని ప్రకారం హిందువుల విముక్తి కోసం పోరాడే చిత్తశుద్ది దానికి నిజంగా ఉంటే బ్రిటీష్‌ ఇండియాలో ముస్లిం పాలకుడి పాలనలో అణచివేతకు గురైన మెజారిటీ హిందువులున్న హైదరాబాదు సంస్దానంవైపు అది ఎందుకు చూడలేదు. దానిలో 85శాతం హిందువులు, 12శాతమే ముస్లింలు ఉన్నారు. దేశ సగటు కంటే ఎక్కువ మంది హిందువులున్న ప్రాంతం. తెలంగాణా ఫ్యూడల్‌ శక్తుల వ్యతిరేక పోరాటంతో అణుమాత్రం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు. కాశ్మీర్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావద్దనీ, రాచరికమే కొనసాగాలనీ చెప్పిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. అంతే కాదు అక్కడి భూమిలో ఎక్కువ భాగం హిందూ భూస్వాముల చేతుల్లో ఉంది. ఆ భూమి కోసం పోరాటం నిర్వహించిన షేక్‌ అబ్దుల్లాను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించి భూస్వాముల కొమ్ము కాచింది. అటు స్వాతంత్య్రోద్యమంతోనూ సంబంధం లేకపోగా తెల్లదొరల సేవలో తరించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. మెజారిటీ పౌరులు ముస్లింలు, పాలకుడు, భూస్వాములు హిందువులు కావటంతో వారికి మద్దతుగా కాశ్మీరులో తన శాఖలను ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేకంగా ప్రయత్నించింది. ప్రజాపరిషత్‌ అనే సంస్ధ ముసుగులో భూస్వాముల తరఫున పని చేసింది. అదే హైదరాబాదు సంస్ధానంలో రాజు ముస్లిం, 95శాతంపైగా భూస్వాములు హిందువులు, వారంతా రాజు మద్దతుదారులుగా ఉన్నందున ఆ ప్రాంతంలో తన మత రాజకీయాలకు చోటు ఉండదు,అన్నింటికీ మించి రాజు – భూస్వాములు కలసే జనాన్ని దోపిడీ చేస్తున్నందున భూస్వాములకు ప్రత్యేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం కలగలేదు కనుకనే కేంద్రీకరించలేదని చెప్పవచ్చు.మహాత్మా గాంధీ హత్య కారణంగా నిషేధానికి గురైన ఈ సంస్ద భవిష్యత్‌లో రాజకీయాల్లో పొల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా కొనసాగుతామని కేంద్ర ప్రభుత్వానికి హామీ పత్రం రాసి ఇచ్చింది. దాంతో రాజకీయ రంగంలో కార్యకలాపాల కోసం 1950దశకంలో జనసంఫ్‌ు అనే రాజకీయ పార్టీని ముందుకు తెచ్చింది.


” భారత రాజ్యాంగ సభలో చేరేందుకు తిరస్కరించిన సంస్థానాలలో కాశ్మీరు ఒకటి. మంత్రివర్గ పధకం కింద ఏర్పాటైన ఆ సభ 1946 డిసెంబరు నుంచి పని చేస్తున్నది. ఏ రాష్ట్రమైనా అలా తిరస్కరిస్తే దాన్ని శత్రుపూరిత చర్యగా పరిగణించాల్సి ఉంటుందని తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడిగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ హెచ్చరించినప్పటికీ మహరాజు తిరస్కరించారు. సంస్థానాధీశులకు స్వతంత్రంగా ఉండే హక్కుకు నిర్ద్వంద్వంగా ముస్లిం లీగు మద్దతు ప్రకటించటం రాజ్యాంగ సభలో చేరకూడదనే రాజు మూర్ఖత్వాన్ని మరింత బలపరించింది.1947 జూన్‌ 17న ముస్లింలీగ్‌ నేత మహమ్మదాలీ జిన్నా ఈ మేరకు ప్రకటించారు. జమ్ము -కాశ్మీరు గనుక స్వతంత్ర దేశంగా ఉండదలచుకుంటే పాకిస్తాన్‌ స్వాగతిస్తుందని, స్నేహపూరిత ఒప్పందాలు చేసుకుంటుందని 1947 జూలై 11న మరింత స్పష్టంగా వెల్లడించారు.


విడిపోవటం ఖాయమని స్పష్టమైన తరువాత మహరాజు(కాశ్మీర్‌) భారత్‌లో చేరే మానసిక స్థితిలో లేరు. జమ్ము మరియు కాశ్మీర్‌ పేర్కొంటున్నదానిని హిందూ రాజ్యంగా ఉంచాలని, లౌకిక భారత్‌గా గుర్తింపు ఉండకూడదని, విలీనం చేయకూడదని రాజుకు విధేయులుగా ఉన్న జమ్మూలోని హిందూ నేతలు రాజుకు మద్దతు ఇచ్చారు.ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ (ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పూర్వ అవతారము) 1947 మే నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహారాజు పట్ల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ విలీనం గురించి ఇప్పుడు చేస్తున్నదానికి తరువాత చేయాల్సినదానికి తమ మద్దతు ఉంటుందని దానిలో పేర్కొన్నారు.1947 మే నెలలోనే ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు చౌదరి హమీదుల్లా ఖాన్‌ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తక్షణమే కాశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించాలని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని మహరాజును కోరారు. దీనికి ముస్లింలంతా సహకరిస్తారని, స్వతంత్ర మరియు ప్రజాస్వామిక కాశ్మీర్‌ దేశానికి తొలి రాజ్యాంగబద్ద పాలకుడిగా మహరాజుకు మద్దతు ఇస్తామని హామీని ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్‌ ప్రభుత్వం కాశ్మీర్‌ మీద దాడికి వస్తే దేశంలోని ముస్లింలు దానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపడతారు, అవసరమైతే భారత్‌ సాయం కూడా కోరతామని చెప్పారు. నాతో సహా భారత్‌కు అనుకూలంగా గళమెత్తిన వారందరినీ హిందూ వ్యతిరేకులు, ద్రోహులు అని హిందూ దురహంకారులు ఖండించారు.భారత్‌లో విలీనం కావాలని, షేక్‌ అబ్దుల్లాను విడుదల చేయాలని ముల్కరాజ్‌ సరాఫ్‌ సంపాదకత్వంలోని జమ్మూ దినపత్రిక రణవీర్‌ రాసినందుకు 1947 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.”
ఈ వివరాలను ఎపిలోగ్‌ అనే పత్రిక 2010 నవంబరు సంచికలో ప్రత్యక్ష సాక్షి అనే శీర్షికతో 2005లో పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న, జమ్మూకు చెందిన ప్రముఖ జర్నలిస్టు బలరాజ్‌ పూరీ రాశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ వాదుల నిజస్వరూపం. ఇప్పుడు వారు దేశ సమగ్రత గురించి జనాలకు సుభాషితాలు చెబుతున్నారు. ఈ విద్రోహకర పాత్ర దాస్తే దాగేది కాదు. నేటి తరాలకు చరిత్రపట్ల ఆసక్తి లేదనే భావంతో పచ్చి అవాస్తవాలు, ద్రోహాన్ని కప్పి పుచ్చుకొనేందుకు దేశంలో మరింతగా సామాజిక విభజనను రెచ్చగొట్టేందుకు విషపు బీజాలు నాటారు. అవి ఇప్పుడు వృక్షాలుగా మారి విషఫలాలను ఇస్తున్నాయి.


సెప్టెంబర్‌ 17ను కొందరు విద్రోహ దినోత్సవం అంటు న్నారు. కొందరు విమోచన దినోత్సవం అంటున్నారు. కొందరు విలీన దినోత్సవం అంటున్నారు. దీనిని ఎలా చూడాలి? నైజాం వ్యతిరేక పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంస్దాన విలీనం జరిగింది. నిజాం వ్యతిరేక పోరుకు నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో కొందరు యూనియన్‌ సైన్యాలు వచ్చినందున నెహ్రూ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుంది కనుక సాయుధ పోరాటాన్ని విరమించాలని చెప్పటమే కాదు, ఆయుధాలు పారవేశారు. అయితే కొద్ది రోజుల్లోనే నెహ్రు ప్రభుత్వ వర్గనైజం బయట పడింది. సాధించిన విజయాల రక్షణకు మరికొన్ని సంవత్సరాలు పోరు జరపాల్సి వచ్చింది.


నైజాం రాజు స్వాతంత్య్ర వ్యతిరేకి. విలీనానికి ముందు ఒక ఫర్మానా జారీ చేశాడు. ఎవ్వరూ ఎక్కడా సంస్ధానంలో త్రివర్ణ పతాకం ఎగురవేయగూడదనేది ఆ హుకుం. ఏ వ్యక్తి అయినా జాతీయ జండా ఎగురవేస్తే ఇతర దేశాల జండా ఎగరేసినట్టే. అందుకు 3ఏండ్లు జైలుశిక్ష గానీ, జరిమానా కానీ లేదా ఆ రెండూ కానీ అమలు చేస్తామనేది ఆ ఫర్మానా సారాంశం. కమ్యూనిస్టులు, యువత, విద్యార్ధులు ఈ ఫర్మానాను ధిక్కరించి ముందుకురికారు. హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకుడు రఫీ అహ్మద్‌ నిజాం కాలేజీలో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. సుల్తాన్‌బజార్‌లో కాంగ్రెస్‌ నాయకుడు స్వామి రామానంద తీర్థ జాతీయ జెండా ఎగరేశాడు. బ్రిజ్‌రాణీ గౌర్‌ కోఠీ మహిళా మండలిలో జండా ఎగరేశారు. ఇలా అనేక చోట్ల పతాకావిష్కరణలు జరిగాయి. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం, నైజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతధస్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ ఎగ్రిమెంట్‌) 1947 నవంబర్‌ 29న చేసుకుంది.


ప్రజల మీద సాగించిన దాడులు, హత్యాకాండకు నిజాం రాజు, రజాకార్‌ మూకలు, వారికి మద్దతుగా ఉన్న దేశ ముఖ్‌లు, జాగిర్దార్లను విచారణ జరిపి శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిజాంను విలీనం తరువాత రాజప్రముఖ్‌గా నియమించింది. అపార ఆస్తులు వదిలేశారు. ఆ రోజుల్లో సంవత్సరానికి 50లక్షల జీతం ఇచ్చారు. 1951 అక్టోబర్‌ 31వరకూ ఆయనను ఆ పదవిలో కొనసాగించారు. రాజాభరణాలు ఇచ్చారు. నవాబుకే కాకుండా, జమిందార్లు, జాగీర్‌దార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి పరిహారం చెల్లించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ నవాబ్‌ ఫర్మానా జారీ చేశాడు. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు వరకు అంటే 1950 జనవరి 26 వరకు నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్‌ రాష్ట్రంలో పరిపాలన సాగింది. 1950 జనవరి 26న ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించడం నైజాం చేతులమీదుగానే సాగింది.


యూనియన్‌ మిలిటరీ రావటంతో అంతకు ముందు గ్రామాల నుంచి పారిపోయిన జాగీర్దార్లు, దేశముఖులు తిరిగి గ్రామాలకు వచ్చి రైతాంగం చేతుల్లోని భూములను లాక్కోవటం ప్రారంభించారు. వాటిని రక్షించుకొనేందుకు కమ్యూనిస్టులు 1951వరకు సాయుధపోరాటాన్ని కొనసాగించారు. యూనియన్‌ సైన్యాలు రైతాంగం మీద విరుచుకుపడ్డాయి. నిజాం ప్రభుత్వ దాడిలో మరణించింది 1500మంది కాగా, నెహ్రూ సైన్యాలు 2500 మందిని పొట్టన పెట్టుకున్నాయి. అందువలన కమ్యూనిస్టులలో కొందరు సెప్టెంబరు 17ను విద్రోహదినంగా పరిగణించారు. ఇప్పటికీ అదే భావంతో ఉన్నవారు కూడా ఉన్నారు.
భూసంస్కరణలకు, కౌలుదార్ల హక్కులు కాపాడేందుకు కేంద్రం ఒప్పుకోవటంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం విరమించారు. దీన్ని తరువాత నక్సల్స్‌గా మారిన వారు రివిజనిజంగా, తెలంగాణా రైతాంగానికి చేసిన ద్రోహంగా పరిగణించటమే కాకుండా పోరాటాన్ని కొనసాగించి ఉండాల్సిందని సూత్రీకరించారు. కొనసాగించి ఉంటే చైనాలో మాదిరి దేశంలో విప్లవానికి దారితీసేదన్నది వారి భావం.

సెప్టెంబరు 17ను తెలంగాణా విమోచన పేరుతో బిజెపి, సమైక్యతా దినంగా తెలంగాణా ప్రభుత్వం పాటిస్తున్నది. తెలంగాణా రైతాంగం సాధించుకున్న హక్కులను హరించిన విద్రోహ దినంగా పరిగణించిన కమ్యూనిస్టులు బిజెపి ఇతర కొన్ని శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్న పూర్వరంగంలో వారు కూడా ఈ సందర్భంగా సభలు జరిపి జనాన్ని చైతన్య పరిచేందుకు, నైజాం సంస్థాన విలీనంలో చెరగని కమ్యూనిస్టుల పాత్రను వివరించేందుకు నిర్ణయించారు.


రైతాంగం, వృత్తుల వారిని అణచేందుకు హిందూ జమీందార్లూ, ముస్లిం రాజూ ఏకమయ్యారు. రైతాంగానికీ, జమీందార్లకు మధ్య సాగిన వర్గపోరాటం అది. ఈ వర్గ ఐక్యతను మరుగుపరచేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పోరాటంతో ఏ సంబంధమూలేని ఆ పార్టీ దీనిని హిందువుల విమోచనా దినోత్సవంగా జరపాలని అంటున్నది. 1947 అక్టోబరు 26న విలీనమైన కాశ్మీర్‌ దినోత్సవం లేదా సెప్టెంబరు 15న విలీనమైన జునాగఢ్‌ దినోత్సవాలను గానీ జరపాలని ఆ పార్టీ ఎన్నడూ చెప్పలేదు. సెప్టెంబర్‌ 17న నైజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసింది వాస్తవం. ఈ నేపధ్యంలో విలీనాన్ని ఉత్సవంగా జరపాలా లేక ఆ రోజును స్మరించుకుంటూ కర్తవ్యాలను నిర్ణయించుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.

గమనిక : 2020 సెప్టెంబరు 17న రాసిన ఈ విశ్లేషణను నవీకరించి తిరిగి పాఠకులకు అందించటమైంది

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్ర సిద్దాంతాల హల్‌చల్‌ : నాడు కమ్యూనిజం-నిన్న సోవియట్‌-నేడు చైనా బూచి !

10 Thursday Sep 2020

Posted by raomk in BJP, CHINA, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China Threat, conspiracy theories, Pentagon on China military


ఎం కోటేశ్వరరావు
మానవాళి చరిత్రలో రాజ్యము – అధికారము ఉనికిలోకి వచ్చిన తరువాత కుట్రలు, కుట్ర సిద్దాంతాలు వాటి వెన్నంటే తలెత్తాయి. అధికారం లేని వారు లేదా బలహీనులు కుట్ర సిద్ధాంత ఆశ్రయం పొందుతారు అన్నది కొందరి అభిప్రాయం. దీనికి విస్తృత అర్ధం, భిన్న భాష్యాలు చెప్పవచ్చు. వాటితో అందరూ ఏకీభవించాలని లేదు. ప్రపంచంలో నిరంతరం కుట్ర సిద్దాంతాలు పుడుతూ జనారణ్యంలో కలియ తిరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అంశం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరోవిధంగా చెప్పాలంటేే వాటితో లబ్ది పొందాలనుకొనే బలమైన శక్తులు వాటిని ముందుకు తెస్తాయి.


కమ్యూనిజం ప్రపంచాన్ని ఆక్రమిస్తోంది, ప్రజాస్వామ్యాన్ని హరిస్తోంది కనుక దాన్ని అడ్డుకోవాలన్న కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తీసుకువచ్చింది బలవంతులైన సామ్రాజ్యవాదులే. అది వాస్తవం కాదని గ్రహించలేని వారు దాన్ని నిజమే అని నమ్మి ఆ సిద్దాంతానికి ఊతమివ్వటాన్ని చూస్తున్నాము. తరువాత కాలంలో సోషలిస్టు సోవియట్‌ను బూచిగా చూపి భయపెట్టటం ఎరిగిందే. ప్రాంతీయంగా పశ్చిమాసియాలో ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను మారణాయుధాలను గుట్టలుగా పోసిన బూచాడిగా చూపిన వైనం మన కళ్ల ముందే జరిగింది. ఇప్పుడు చైనా బూచిని ముందుకు తెచ్చారు. దాన్ని అర్దం చేసుకోలేని వారు ఆశ్రయం ఇస్తున్నారు. కుట్ర సిద్దాంత వైరస్‌ ఒకసారి ఎవరిలో అయినా ప్రవేశించిందంటే అది కరోనా కంటే ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. భౌతిక దూరాన్ని పాటిస్తే కరోనా మన దరిచేరదు. కానీ కుట్ర సిద్దాంత వైరస్‌కు అలాంటివేమీ ఉండదు. ఒకరి వాట్సాప్‌లో ప్రవేశించినా, చెవి అప్పగించినా చాలు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.


ప్రస్తుతం మన దేశంలో బిజెపి వంటి సంఘపరివార్‌ సంస్ధలు. మీడియా, సామాజిక మాధ్యమం చైనా బూచిని జనాల మెదళ్లకు ఎక్కిస్తున్నదా ? తమ అనుభవంలోకి వచ్చిన దాని బట్టి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. చైనా నుంచి ముప్పు వస్తోందంటూ అనేక దేశాలను రెచ్చగొడుతూ, కూడగడుతూ అంతర్జాతీయంగా అమెరికా అటువంటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చైనా అణ్వాయుధాలు ప్రపంచానికి ఆటంకంగా ఉన్నాయని, నౌకా దళంలో చైనా తమను మించి పోయిందని అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగన్‌ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇవి చైనా మిలిటరీ ముప్పు అనే కుట్ర సిద్ధాంత అంశాలే.
ఇలాంటి ప్రచారం అమెరికా ఉత్తిపుణ్యానికే చేయదు. రక్షణ ఖర్చును ఇబ్బడి ముబ్బడి చేసేందుకు దేశీయంగా పార్లమెంట్‌ మీద వత్తిడి తేవటం, ముప్పును ఎదుర్కోవాలంటే ఆయుధాలు సమకూర్చుకోవాలి, అంటే యుద్ద పరిశ్రమల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టేందుకు మానసికంగా జనాన్ని ఒప్పించే ఎత్తుగడ దీనిలో ఉంది. మిలిటరీ రీత్యా చైనా విజయవంతంగా ఎన్నో మార్పులు చేసిందని పొగడటం అంటే అమెరికాలోని సామాన్యులను భయపెట్టటమే. ఇవన్నీ నిజానికి పాతబడిన విద్యలే. అమెరికన్లను బురిడీ కొట్టించేందుకు తమను తాము నిందించుకొనేందుకు సైతం సిద్ద పడతారు. దానితో వారికి పోయేదేమీ లేదు. ఉదాహరణకు అమెరికా నిద్రపోతుంటే చైనా ఆయుధాలతో ఎదిగిపోయింది అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో చేసిన వ్యాఖ్య దానిలో భాగమే. వాస్తవానికి అది అతిశయోక్తి తప్ప వేరు కాదు. రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు, తామే కాదు తమ స్నేహితులు కూడా నిద్రపోయారని చెప్పాడు. అదే సమయంలో అమెరికా స్నేహితులు, అనుయాయులు కలిస్తే చైనా కంటే ఎంతో బలం కలిగి ఉన్నామని పాంపియో చెప్పాడు.ఇది చైనాను బెదిరించటం.


ఇటీవలి కాలంలో తాను నాయకత్వం వహిస్తున్న నాటో కూటమి ఖర్చును రక్షణ పొందుతున్న దేశాలే ఎక్కువ భాగం భరించాలని ట్రంప్‌ బహిరంగంగా వత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. తాము 70శాతం ఖర్చు చేస్తుంటే మొత్తం ఐరోపా సభ్యదేశాలు 30శాతమే చెల్లిస్తున్నాయని ట్రంప్‌ రుసురుసలాడాడు. అయితే ఖర్చు ఎక్కువ భాగం అమెరికన్‌ సిబ్బందికి, ఆయుధాలకే ఖర్చు అవుతున్నందున తాము అదనంగా చెల్లించాల్సిన పనిలేదని నాటో దేశాలు బదులిచ్చాయి. ఇప్పుడు చైనా బూచిని చూపటం అంటే ఆసియాలోని దేశాలకు రక్షణ కల్పిస్తున్న తమ ఖర్చులో సింహభాగాన్ని భరించాలని అమెరికన్లు కోరటమే.


ఖండాంతర, నియంత్రిత క్షిపణులను చైనా మిలిటరీ తయారు చేసిందని, అవి అమెరికాకు ముప్పు తెస్తాయని, రాబోయే పది సంవత్సరాలలో ఇప్పుడున్న రెండువందల అణ్వాయుధాలు రెట్టింపు అవుతాయని పెంటగన్‌ పేర్కొన్నది. నిజానికి ఏ దేశం దగ్గరైనా అలాంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయో మిలిటరీ ఉన్నతాధికారులందరికీ కూడా తెలియదు. ఊహాగానాలు తప్ప సంఖ్యను ఎన్నడూ బయట పెట్టరు. ఇలాంటి అంకెలన్నీ చీకట్లో బాణాలు వేయటం తప్ప మరొకటి కాదు. ” గతంలో చైనాకు క్షిపణులు ఎక్కువ అవసరం ఉండేది కాదు. కానీ చైనాను తన వ్యూహాత్మక పోటీదారుగా అమెరికా పరిగణిస్తున్నది. ఈ నేపధ్యంలో తగినన్ని ఆయుధాలను సమకూర్చుకోని పక్షంలో చైనా ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని ” పెంటగన్‌ నివేదిక గురించి చైనా రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గమనించాల్సిన అంశం ఏమంటే తనకు అవసరం అనుకుంటే చైనా అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే అణ్వాయుధాలను తయారు చేయగల స్ధితిలో ఉంది. అయితే తన 140 కోట్ల జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచే మహత్తర కృషికి అది ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప వనరులను ఆయుధాల కోసం దుర్వినియోగం చేయటం లేదు.


క్షిపణులు లేదా రాకెట్ల ద్వారా ప్రయోగించే ఆయుధాల సంఖ్య ఎంత అన్నదాన్ని బట్టి ఒక దేశ సైనిక పాటవాన్ని లెక్కించటం ఒక పద్దతి. చైనా మరో రెండువందలను తయారు చేయనుంది గనుక తమకు ముప్పు అని అమెరికా చెబుతున్నది. కానీ తన దగ్గర దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న ఆయుధాలను యావత్‌ ప్రపంచానికి ముప్పుగానా లేక శాంతి కోసం తయారు చేసిందా ? స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) 2020 వార్షిక నివేదిక అమెరికా మోహరించిన అణ్వాయుధాలు 1,750, ఇతరంగా 4,050, అమ్ముల పొదిలో మరో 5,800 ఉన్నాయని పేర్కొన్నది. రష్యాతో ఒప్పందంలో భాగంగా కొన్ని మధ్యంతర శ్రేణి ఆయుధాలను ఉపసంహరించిన తరువాత పరిస్ధితి ఇది. 2019లో అమెరికా స్వయంగా చెప్పినదాని ప్రకారం దాని దగ్గర మొత్తం 6,185 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 2,385 వినియోగానికి స్వస్తి చెప్పారు లేదా నాశనం చేశారు. మోహరించిన ఆయుధాలు 1365. వీటిని చూపే అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది. బయటకు వెల్లడించనివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వాటి ముందు చైనా వద్ద ఉన్న ఆయుధాలెన్ని, అది తెచ్చే ముప్పు ఎంత ?


నిజానికి ఒక దేశం దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నా ఎదుటి దేశం మీద ప్రయోగిస్తే సర్వనాశనం తప్ప ఏ దేశమూ మిగలదు. చైనా దగ్గర కూడా గణనీయంగా అణ్వాయుధాలు ఉన్నాయి గనుకనే అమెరికా దూకుడు తగ్గిందన్నది వాస్తవం, అయితే మానసిక ప్రచారదాడి కొనసాగుతూనే ఉంటుంది.1980 దశకం నుంచీ చైనా వద్ద రెండువందలకు మించి అణ్వాయుధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. వాటి సంఖ్యను పెంచటం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం స్టాక్‌ హౌం సంస్ధ సిప్రి మరియు అమెరికన్‌ సైంటిస్ట్స్‌ ఫెడరేషన్‌ 320 ఉన్నట్లు జోశ్యం చెప్పాయి. కనుక పెంటగన్‌ కొత్తగా కనుగొన్నదేమీ లేదన్నది స్పష్టం.గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా ఒక్కటే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని చెప్పిన దేశం. అంతే కాదు అణ్వాయుధాలు లేని దేశాల మీద వాటిని ప్రయోగించబోమని, బెదిరించబోమని కూడా ప్రకటించింది.


పెంటగన్‌ అంచనా ప్రకారం భూమి మీద నుంచి ఖండాంతరాలకు ప్రయోగించే క్షిపణులు చైనా వద్ద 1250కు పైగా ఉన్నాయి. అవి 500 నుంచి 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని చెబుతోంది. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ప్రకారం అమెరికా మధ్యంతర శ్రేణి క్షిపణుల తయారీ నిలిపివేసింది. చైనా బూచిని చూపి ట్రంప్‌ సర్కార్‌ ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి కొత్త క్షిపణులను పరీక్షిస్తోంది. ఈ చర్య మరింతగా ఆయుధ పోటీని పెంచేదే తప్ప తగ్గించేది కాదు. రాడార్లు పసి గట్టకుండా, ధ్వని లేకుండా వేగంగా ప్రయాణించే అమెరికన్‌ బాంబర్లను కూడా కూల్చివేయగల రష్యా ఎస్‌-400 దీర్ఘ శ్రేణి ఆయుధం అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయనుంది. చైనా త్వరలో వీటన్నింటినీ అధిగమించే ఆయుధాలను రూపొందిస్తున్నదని పెంటగన్‌ నివేదిక పేర్కొన్నది.


చైనా నౌకాదళంలో 350 యుద్ద ఓడలు, జలాంతర్గాములున్నాయని, సంఖ్యరీత్యా ప్రపంచంలో పెద్దదని, కొన్ని రంగాలలో తమకంటే ముందున్నదని, తమ వద్ద 293 మాత్రమే ఉన్నాయని పెంటగన్‌ పేర్కొన్నది. ఇది కూడా మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. అమెరికా వద్ద ఉన్న ఆధునిక యుద్ద ఓడలతో పోల్చితే చైనా బలం తక్కువే. అమెరికా వద్ద భారీ అణ్వాయుధాలను ప్రయోగించే పదకొండు బడా యుద్ద నౌకలు ఉన్నాయి. ఒక్కొక్కదాని మీద 80 యుద్ద విమానాలను ఉంచేంత పెద్దవి ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా నౌకాదళం విస్తరించినప్పటికీ అణ్వాయుధేతర విమానవాహక నౌకలు రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో క్షిపణులును కూల్చివేసే విధ్వంసక క్షిపణులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చైనా నిర్మిస్తున్న నౌకలు అమెరికా వద్ద ఉన్నవాటి కంటే పెద్దవిగా ఉండబోతున్నాయని పశ్చిమ దేశాలు జోశ్యాలు చెబుతున్నాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని ఇప్పటికే చైనా అనేక రంగాలలో నిరూపించింది.


అమెరికా కనుసన్నలలో పని చేసే జపాన్‌, దక్షిణ కొరియా ఇటీవలి కాలంలో విమానవాహక నౌకలతో సహా అనేక భారీ యుద్ద నావలను రంగంలోకి దించాయి. చైనా దగ్గర ఉన్న చిన్న తరహా యుద్ద నావలు కలిగించే భారీ నష్టాన్ని పెంటగన్‌ పరిగణనలోకి తీసుకోవటం లేదని ఒక విశ్లేషకుడు వాపోయాడు, అమెరికాను హెచ్చరించాడు. వెయ్యి అంతకు పైగా టన్నుల సామర్ధ్యం ఉన్న తీర రక్షక గస్తీ నౌకలు చైనాలో గత పది సంవత్సరాలలో 60 నుంచి 130కి పెరిగితే అమెరికా వద్ద 70 మాత్రమే ఉన్నాయని,రెండు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్న సైనీకీకరణ గావించిన చేపల పడవలను తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నాడు.
పెంటగన్‌ నివేదిక వచ్చిన సమయంలోనే చైనా విమాన వాహక రెండవ యుద్ద నౌక షాండోంగ్‌ శిక్షణ విన్యాసాలను ప్రారంభించింది. ఇది గత ఏడాది డిసెంబరులో నౌకాదళంలో చేరింది. తొలి నౌక లయనింగ్‌ కూడా పచ్చ సముద్రంలో సంచరిస్తున్నది. ఒకేసారి రెండు యుద్ద నౌకలు విన్యాసాలు జరపటం ఇదే తొలిసారి. తైవాన్‌ నుంచి అమెరికా పిచ్చిపనులు చేసేట్లయితే సమన్వయంతో వాటిని అరికట్టేందుకు వీలుకలుగుతుందని వార్తలు వచ్చాయి. ఈ రెండు నౌకల సంచారం ఎందుకనే విషయాన్ని చైనా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే జోశ్యాలు వెలువడ్డాయి. షాండోంగ్‌ యుద్ద విమానాలతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, లయనింగ్‌ తన రేవు నుంచి ఎక్కువ దూరం ప్రయాణించనందున సాధారణ శిక్షణ కార్యక్రమాలకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. రెండు నౌకలు సమీపం నుంచి అదే విధంగా దూరం నుంచి సమన్వయం చేసుకోవటం గురించి కూడా పరీక్షలు జరుపుతాయి.


జాతీయ వాదం ప్రపంచానికి ఎంతటి చేటు తెచ్చిందో అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్ధాలతో మానవాళి చవి చూసింది. అందువలన జాతీయ వాదానికి గురైన ఏ జాతీ ప్రశాంతంగా లేదు, ప్రపంచాన్ని శాంతంగా ఉండనివ్వలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. జాతీయ వాదం వేరు దేశభక్తి వేరు. జాతీయవాదాన్నే దేశభక్తిగా చిత్రించి జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న రోజులివి.


బ్రిటీష్‌ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే నాడు జాతీయవాదం-దేశ భక్తి. నేడు అసలు సిసలు దేశభక్తులుగా చెప్పుకుంటున్న సంఘపరివార్‌కు నాడు అవి పట్టలేదు. ఒక దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత జాతీయవాదం ముందుకు వస్తే దాని స్వభావం భిన్నంగా ఉంటుంది. జర్మనీలో ముందుకు తెచ్చిన జాతీయవాదాన్ని నాజీలు దేశభక్తిగా ప్రచారం చేశారు. ఐరోపాలో ఉన్న జర్మన్‌లు, జర్మనిక్‌ భాష మాట్లాడేవారందరూ ఒకే దేశంగా ఉండాలి. జర్మన్‌ జాతి ఔన్నత్యాన్ని నెలకొల్పాలి. యూదులు, పోల్స్‌, రుమేనియన్లు అల్పజాతి వారు కనుక వారిని జర్మన్‌ గడ్డ నుంచి పంపివేయాలి. ఇదే నాజీల దేశభక్తి. దీన్ని ఆమోదించిన వారు జాతీయవాదులు, దేశభక్తులు.ఈ వాదాన్ని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, జర్మనీలో వారికి చోటు లేదు, ఇదీ తీరు. హిట్లర్‌ జాతీయ వాదాన్ని సమర్ధించిన వారు దేశభక్తులు, వ్యతిరేకించిన కమ్యూనిస్టులను జర్మన్‌ ద్రోహులని ఆరోజు చిత్రహింసల పాలు చేశారు.


చైనాతో మన సరిహద్దును బ్రిటీష్‌ వారి హయాంలో వివిధ సందర్భాలలో అధికారులు ఇష్టమొచ్చినట్లు గీశారు. ఒకరు గీసినదానిలో ఆక్సారుచిన్‌ చైనా ప్రాంతంగా మరొక దానిలో మనదిగా ఉంది. అదే విధంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను టిబెట్‌ అంతర్భాగంగా, బ్రిటీష్‌ ఇండియా భాగంగా పేర్కొన్న సందర్భాలున్నాయి. స్వాతంత్య్రానికి ముందు ఆ ప్రాంతాన్ని బ్రిటీష్‌ ఇండియా సర్కార్‌ ఆధీనంలో ఉన్నదానిని టిబెట్‌ స్వాధీనం చేసుకున్న సందర్భాలున్నాయి. బ్రిటీష్‌ వారితో టిబెట్‌ పాలకులు చేసుకున్న ఒప్పందాలను వేటినీ చైనా పాలకులు అంగీకరించలేదు. తమ సామంత రాజ్యానికి అలాంటి హక్కులేదని వాదించారు. ఒప్పందాలు అమలు కూడా కాలేదు. సరిహద్దులను ఖరారు చేసుకోవాలని నాడు చైనా గానీ బ్రిటీష్‌ ఇండియా గానీ పూనుకోలేదు.


అంతెందుకు మన దేశంలో ఆశ్రయం పొందిన 14 దలైలామా 1959లో తిరుగుబాటు చేసి మన దేశానికి పారిపోయి రావటానికి ముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగమే అని చెప్పాడు. ఆ తరువాత 2003లో కూడా వాస్తవానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌కు చెందిందని చెప్పాడు.


1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది, 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. తరువాత కాలంలో సరిహద్దుల సమస్య ముందుకు వచ్చింది. రెండు దేశాలూ తమ వైఖరే సరైనదే అనే విధంగా వ్యవహరించాయి. దానికి తోడు దలైలామా సమస్య తోడై అది యుద్దానికి దారి తీసింది. వివాదం తెగలేదు. అయితే పరిష్కారం కావాలి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలి. అందుకు సంప్రదింపులు పరిష్కారం తప్ప ఆయుధాలు మార్గం కాదు. 1962లో యుద్ద సమయంలో అన్ని పార్టీలు జాతీయవాదానికి గురై చైనాను దురాక్రమణదారుగా పేర్కొని యుద్దాన్ని సమర్ధించాయి. సిపిఐ జాతీయ నాయకత్వం దీని గురించి ఒక వైఖరి తీసుకోవాల్సివచ్చింది. ఆ సమయంలో జరిగిన చర్చలలో కొందరు సరిహద్దు వివాదాన్ని సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించాలనే వైఖరిని పార్టీ ప్రకటించాలని ప్రతిపాదించారు. మిగిలిన వారు యుద్దాన్ని సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే వైఖరి తీసుకున్నారు. అప్పటికి సైద్దాంతిక విభేదాల గురించి చర్చ తప్ప పార్టీలో చీలిక లేదు. సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన పార్టీనేతలను, ఆ అభిప్రాయాన్ని బలపరిచిన వారిని దేశ వ్యాపితంగా నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసింది. తరువాత వారంతా సిపిఎంగా ఏర్పడ్డారు.


దేశభక్తి పేరుతో రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ విభాగం జనసంఫ్‌ు, ఇతర సంస్దలు చైనా వ్యతిరేక వైఖరిని తీసుకొని, యుద్దాన్ని వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించాయి. కానీ తరువాత కాంగ్రెస్‌ పాలకులు, జనతా పార్టీలో చేరి అధికారంలో భాగస్వాములైన జనసంఘనేతలు, తరువాత బిజెపిగా అధికారానికి వచ్చిన వారూ చేసిందేమిటి ? సరిహద్దు సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, రెండు వైపులా తుపాకులు పేల కూడదని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మరోసారి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ఇతర సంస్ధల నేతలు చైనా వ్యతిరేక ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. దానికి మీడియా తోడైంది సరే. 1962లో యుద్దాన్ని సమర్దించి జాతీయవాదానికి గురైన సిపిఐ ఇప్పుడు ఆ వైఖరిని సవరించుకున్నది. సిపిఎం మాదిరే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే వైఖరినే తీసుకున్నది.
అనేక దేశాలలో కమ్యూనిస్టులు ఇలాంటి సమస్యలు వచ్చినపుడు జాతీయవాదానికి లోను కాకుండా ఒక సూత్రబద్ద వైఖరిని తీసుకున్నారు. పాలస్తీనాను ఆక్రమించి స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా అడ్డుకుంటున్న పాలకుల వైఖరిని ఇజ్రాయెల్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తున్నది. అక్కడి యూదుదురహంకారులు కమ్యూనిస్టులను దేశద్రోహులని నిందిస్తున్నా, దాడులకు పాల్పడినా కమ్యూనిస్టులు తమ వైఖరిని మార్చుకోలేదు.


చైనాతో సరిహద్దు వివాద పరిష్కారానికి శాంతియుత చర్చలు-ఇచ్చిపుచ్చుకోవటాలు తప్ప మరొక పరిష్కారం అసాధ్యం. ఈ విషయం ప్రతిపార్టీకీ తెలుసు. అయినప్పటికీ పైకి జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నాయి. మే, జూన్‌ మాసాలలో కొత్తగా చైనా వారు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పారు. తీరా మన ప్రధాని అఖిలపక్ష సమావేశంలో అబ్బే అలాంటిదేమీ లేదు అని ప్రకటించారు. తాజాగా మన ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు వస్తున్న చైనా వారిని పసిగట్టిన మన మిలిటరీయే చొరవ తీసుకొని కొన్ని కొండలను ఆధీనంలోకి తెచ్చుకుందని ప్రకటించారు. అసలేం జరుగుతోంది అన్నది తెలియటం లేదు.


యుద్దం వద్దు అన్న వారిని మన మిలిటరీ సత్తాను అవమానించే వారిగా చిత్రిస్తూ దాడి చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ శక్తి అమెరికా. అలాంటి దేశం జరిపిన యుద్దాలలో ఎక్కడైనా విజయం సాధించిందా ? అలాంటపుడు చైనా మనలను గానీ, మనం చైనాను గానీ యుద్ధంలో ఓడించి సమస్యలను పరిష్కరించుకోగలమా ? మన దగ్గర ఉన్న నాలుగు రూకలను అటు అమెరికా లేదా రష్యా మరొక దేశం నుంచో కొనుగోలు చేసే ఆయుధాలకు సమర్పించుకోవటం తప్ప మరొకటేమైనా జరుగుతుందా ? మన ప్రాంతాలను చైనాకు అప్పగించాలని ఎవరూ కోరటం లేదు. గతంలో లేదు భవిష్యత్‌లో కూడా ఉండదు. దేశభక్తి గురించి ఏ పార్టీ మరొక పార్టీకి బోధలు చేయాల్సిన,నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భిన్న అభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రాన ఎవరూ దేశద్రోహులు కాదు. ఉద్రేకాలకు లోనుకాకుండా ఆలోచించాల్సిన సమయమిది. గతంలో ప్రపంచంలో జరిపిన అనేక యుద్దాలు ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు లేదా జాతీయ దురహంకారంతో చేసినవే. అలాంటి వైఖరికి జనం మూల్యం చెల్లించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుత్తీ, కొడవలి, నక్షత్రాలుంటే బ్రెజిల్లో 15 ఏండ్ల జైలు !

08 Tuesday Sep 2020

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Brazil, Brazill Communists, equate communist symbols with Nazi ones, Jail time for hammer and sickle, Jair Bolsonaro


ఎం కోటేశ్వరరావు
పారిశ్రామిక విప్లవ కాలంలో యజమానులు ప్రవేశపెట్టిన యాంత్రిక మగ్గాలు తమ ఉపాధిని హరించటంతో పాటు, ప్రాధాన్యతను తగ్గిస్తాయని, వాటి మీద పని చేసే నైపుణ్యంలేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారని బ్రిటన్‌లోని నిపుణులైన చేనేత కార్మికులు భావించారు. వాటిని విధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని నిర్ధారణకు వచ్చి అదే పని చేశారు. చరిత్రలో యంత్రవిధ్వంసక కార్మికులుగా మిగిలిపోయారు. పెట్టుబడిదారీ విధానాన్ని సరిగా అర్ధం చేసుకోలేని తొలి రోజుల్లో అది జరిగింది.


ప్రపంచంలో సోషలిజం, కమ్యూనిజం గురించి గత రెండు శతాబ్దాలుగా తెలిసినప్పటికీ వాటిని వ్యతిరేకించే నిరంకుశ శక్తుల ఆలోచన యంత్రవిధ్వంసకుల స్ధాయినిదాటలేదని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఆ కార్మికులకు దిక్కుతోచక యంత్ర విధ్వంసం చేస్తే ప్రస్తుతం కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దిక్కుతోచక చిహ్నాల నిషేధానికి పాల్పడుతున్నారా ?
కమ్యూనిస్టు చిహ్నాలుగా పరిగణిస్తున్న సుత్తీ, కొడవలి, నక్షత్రం కమ్యూనిస్టు భావజాలం పురుడు పోసుకోక ముందే ఉన్నాయి. సుత్తీ, కొడవలిని కార్మిక-కర్షక మైత్రికి, నక్షత్రాన్ని ఐదు భూ ఖండాలకు గుర్తుగా కార్మికవర్గంపై జరిపినదాడిలో పారిన రక్తానికి చిహ్నంగా ఎర్రజెండాను కమ్యూనిస్టులు స్వీకరించారు. వాటిమీద కమ్యూనిస్టులకేమీ పేటెంట్‌ హక్కు లేదు. అయితే ఆ చిహ్నాలను వినియోగించిన వారికి పది నుంచి పదిహేనేండ్ల పాటు జైలు శిక్ష విధించాలని కోరుతూ సెప్టెంబరు రెండవ తేదీన బ్రెజిల్‌ పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో కుమారుడు, పార్లమెంట్‌ సభ్యుడు అయిన ఎడ్వర్డ్‌ బోల్జానో దాన్ని ప్రతిపాదించాడు. వాటిని తయారు చేసినా, విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షార్హంగా పరిగణిస్తూ చట్టసవరణకు నిర్ణయించారు. నాజీలు, తరువాత కమ్యూనిస్టులు పోలాండ్‌ను ఆక్రమించారని అందువలన వారిని హంతకులుగా పరిగణించాలని, వారి చిహ్నాలను ఉపయోగించిన వారిని శిక్షించాలని బోల్జానో చెప్పాడు. అది పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందా? లేదా, పొందితే తదుపరి కమ్యూనిస్టుల మీద నిషేధం విధిస్తారా ? ఏమైనా జరగొచ్చు.


పచ్చి మితవాదులైన తండ్రీ కొడుకులు తాము కమ్యూనిస్టు వ్యతిరేకులమని బహిరంగంగానే గతంలో ప్రకటించుకున్న నేపధ్యంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం ఆశ్చర్యమేమీ కాదు. కమ్యూనిస్టులు, నాజీలు ఒకటే అనేందుకు రుజువులు ఇవిగో అంటూ నాటి సోవియట్‌లోని ఉక్రెయిన్‌లో కమ్యూనిస్టులు కరవుకు కారకులయ్యారని ఒక చిత్రాన్ని, నాజీల చిత్రహింసలకు సంబంధించి ఒక చిత్రాన్ని ట్వీట్‌ చేశాడు. అయితే కరవు అని చెప్పిన చిత్రం బ్రిటీష్‌ ఇండియాలోని బెంగాల్‌ కరవుకు సంబంధించింది. కొందరు ఆ విషయాన్ని చెప్పినప్పటికీ ఎడ్వర్డ్‌ వెనక్కు తీసుకొనేందుకు నిరాకరించాడు. కరోనా వైరస్‌కు కారణం చైనాయే అంటూ గతంలో ప్రకటించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కూడా కారకుడయ్యాడు.


కమ్యూనిస్టు సంబంధిత లేదా కమ్యూనిస్టు నేతల పేర్లతో ఉన్న బహిరంగ స్ధలాలు, సంస్ధలు, కట్టడాల పేర్లు కూడా మార్చాలని బ్రెజిల్‌ పాలకులు ఆలోచిస్తున్నారు. పాలకపక్ష చర్యను బ్రెజిల్‌ కమ్యూనిస్టు యువజన సంఘం ఖండించింది. గతంలో నిరంకుశ పాలకులు ఇదే విధంగా తమ సంస్ధను, కమ్యూనిస్టు పార్టీని పని చేయనివ్వకుండా చేశారని తిరిగి అదే చర్యకు ఒడిగట్టారని పేర్కొన్నది. తూర్పు ఐరోపాలోని పోలాండ్‌, హంగరీ వంటి దేశాలలో చేస్తున్న మాదిరే ఇక్కడ కూడా చేస్తున్నారని పేర్కొన్నది. కమ్యూనిజం-నాజీజాలను ఒకే గాటన కడుతున్న ఐరోపా యూనియన్‌ వైఖరినే బ్రెజిల్‌ పాలకులు అనుసరిస్తున్నారని ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప వేరు కాదని విమర్శించింది. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీలను ఓడించేందుకు సోవియట్‌ కమ్యూనిస్టులు తమ రక్తాన్ని ధారపోశారన్న నిజం దాస్తే దాగేది కాదని పేర్కొన్నది.


తమ భావజాలాన్ని వ్యక్తపరిచేందుకు విధించే ఈచర్యలను తాము సహించబోమని, ప్రజల్లో తమ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తామని స్పష్టం చేసింది.ఇవి బ్రెజిల్‌ ప్రజాస్వామిక స్వేచ్చ, సామాజిక ఉద్యమాల మీద దాడి తప్ప మరొకటి కాదన్నది. కమ్యూనిస్టులను అరెస్టులు చేయాలని, హతమార్చాలని తండ్రీ కొడుకులు, వారితో కుమ్మక్కయిన జనరల్‌ హామిల్టన్‌ మౌరో చూస్తున్నారని వారి ఆటలను అరికట్టేందుకు ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని కమ్యూనిస్టు యువజన సంఘం పేర్కొన్నది.
ఉక్రెయిన్‌,మరికొన్ని తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అధికారానికి వచ్చిన నియంతలు, ఫాసిస్టు శక్తులు కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించారు. కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు పెట్టారు.తాను ఉక్రెయిన్‌ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించాలని బిల్లును ప్రతిపాదించినట్లు ఎడ్వర్డ్‌ బోల్జానో చెప్పాడు.

బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు పార్టీ(పిసిడిఓబి)కి ఎనిమిది మంది సభ్యులున్నారు, 27కు గాను ఒక రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది, అనేక మున్సిపల్‌, కార్పొరేషన్లలో పార్టీ అధికారంలో ఉంది. కమ్యూనిస్టు చిహ్నాల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తరువాత కమ్యూనిస్టు, ఇతర పురోగామి శక్తుల కార్యకలాపాలను నిషేధించినా ఆశ్చర్యం లేదు. కరోనా వైరస్‌ నివారణలో వైఫల్యం, కార్మికుల హక్కులపై దాడి, ఆర్ధిక రంగంలో తిరోగమనం వంటి సమస్యలతో బోల్సనారో ప్ర భుత్వం నానాటికీ ప్రజావ్యతిరేకంగా మారుతున్నది. కమ్యూనిస్టు పార్టీ ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ప్రజా ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది.
గత ఎన్నికలలో మితవాద బోల్సనారో అధికారానికి వచ్చిన తరువాత విదేశాంగ విధానాలలో ప్రభుత్వం గుడ్డిగా అమెరికాను అనుసరిస్తున్నది. దానిలో భాగంగానే బ్రిక్స్‌ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మరో భాగస్వామి అయిన చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. మంత్రులు బహిరంగంగానే చైనా వ్యతిరేక ప్రకటనలు చేస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 11న బ్రెజిల్‌-అమెరికా సంబంధాలను కాపాడాలనే పేరుతో ఎడ్వర్డ్‌ బోల్జానో ఒక ఉపన్యాసం చేశాడు. ఒక దేశాన్ని ఎలా నాశనం చేయవచ్చు అనే పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెనెజులా గురించి అభూత కల్పనలతో సంక్షేమ చర్యలకు వ్యతిరేకంగా వక్తలు ఉపన్యాసాలు చేశారు. అంతకు ముందు గ్లోబలిజం-కమ్యూనిజం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంకా ఇలాంటివే క్యూబాకు వ్యతిరేకంగా కూడా నిర్వహించారు.


కమ్యూనిస్టు వ్యతిరేకతకే బ్రెజిల్‌ ప్రభుత్వం పరిమితం కాలేదు. క్రైస్తవ విలువల పేరుతో అబార్షన్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలను ఇప్పించారు. విదేశాంగ విధానంలో లాటిన్‌ అమెరికన్‌ దేశాల ఐక్యత, రక్షణ అనే వైఖరికి బ్రెజిల్‌ దూరం అవుతున్నది. అంతర్జాతీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగం రూపొందించిన విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నది.
ఇటీవలి కాలంలో ఐరోపా, అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు రెచ్చిపోతున్నాయి. అనేక దేశాల్లో మితవాద శక్తుల పట్టు పెరుగుతోంది. గతేడాది సెప్టెంబరులో ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించటాన్ని చూస్తే ఒక వ్యవస్ధగానే కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రోత్సహిస్తోంది. రెండవ యుద్ద ప్రారంభంలో సోవియట్‌ యూనియన్‌ ఒక ఎత్తుగడగా జర్మనీతో చేసుకున్న ఒప్పందాన్ని సాకుగా చూపుతూ నాజీలు – కమ్యూనిస్టులూ ఒకటే అనే పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్నాయి. నాజీలు సోవియట్‌ మీద జరిపిన దాడి, కమ్యూనిస్టుల చేతుల్లోనే నాజీలు నాశనమైన చరిత్రను దాచేందుకు ప్రయత్నిస్తున్నారు.


అమెరికా ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించాలనే బిల్లు ప్రతిపాదనను చూడాల్సి ఉంది. అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా జో బిడెన్‌, కమలాహారిస్‌ ఎన్నికైతే అమెరికా కమ్యూనిజం వైపుకు పోయినట్లే అని గత పది రోజులుగా రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ వంటి డెమోక్రటిక్‌ సోషలిజం గురించి మాట్లాడేవారు, ఎలిజబెత్‌ వారెన్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌, కమలా హారిస్‌ వంటి ఉదారవాదులను కమ్యూనిస్టులుగా చిత్రించి రిపబ్లికన్‌ పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్న అమెరికన్ల ఓట్లకోసం నానా గడ్డీ కరుస్తున్నది. మన దేశంలో ఇందిరా గాంధీని కూడా సోషలిస్టుగా పశ్చిమ దేశాల మీడియా చిత్రించిన విషయం తెలిసిందే. అందువలన వారి పరిభాషలో సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా చిత్రించిన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కొన్ని అంశాలలో మితవాదులతో విబేధించే పరిమిత పురోగామి భావాలు కలిగిన వారిగానే చూడాల్సి ఉంది.


బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో పారిశ్రామిక విప్లవకాలంలో యంత్రాలను విధ్వంసం చేసినంత మాత్రాన ఆ క్రమం ఆగలేదు, పెట్టుబడిదారీ విధానం మరింతగా యాంత్రిక విధానాలతో ముందుకు పోతున్నది. ఐరోపా లేదా బ్రెజిల్‌ మరొక దేశంలో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించినంత మాత్రాన, వాటిని వినియోగించే పార్టీలను ఎన్నికలకు దూరం చేసినంతనే పురోగామి శక్తుల రధచక్రాలు ఆగిపోతాయనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి ఉండదు. మహత్తర తెలంగాణా సాయుధ పోరాట ప్రారంభంలో వడిసెలతో శత్రువులను ఎదుర్కొన్న యోధులకు తుపాకులు సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారలేదు. శిక్షణ పొందిన మిలిటరీతో సమంగా తమకు తామే ప్రాధమిక పరిజ్ఞానంతో తుపాకులు పేల్చిన సామాన్యులు కిరాయి మూకలు, సైన్యాన్ని ఎలా ఎదిరించారో చూశాము. అవసరాలు అన్నింటినీ సంపాదించుకొనే మార్గాలను కూడా చూపుతాయి.


బ్రెజిల్‌, ఇండోనేషియా, ఐరోపా మరొక చోట ఎక్కడైనా దోపిడీ శక్తులను హతమార్చక తప్పదు, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకోవాలనే నిశ్చయానికి కార్మికవర్గం, రైతులు రావాలే గాని సుత్తీ, కొడవలి, నక్షత్రం, ఎర్రజెండాగాక పోతే మరో గుర్తులు, పతాకంతో సంఘటితం అవుతారు. లాటిన్‌ అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలలో విప్లవాన్ని సాధించిన పార్టీలన్నీ తొలుత కార్మిక మరొక పేరుతో ప్రారంభమయ్యాయి తప్ప కమ్యూనిస్టు పార్టీలుగా కాదన్నది చరిత్రలో ఉంది. వియత్నాం కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ వియత్నాం వర్కర్స్‌ పార్టీ ప్రధమ కార్యదర్శిగా పని చేశారు. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రోతొలుత క్యూబా ప్రజా పార్టీలో చేరారు. వివిధ ఉద్యమాల పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు.పాపులర్‌ సోషలిస్టు పార్టీ పేరుతో ఉన్న కమ్యూనిస్టులతో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకున్నారు తప్ప బహిరంగంగా పార్టీతో కలవలేదు. కమ్యూనిస్టుల గురించి జరిగిన తప్పుడు ప్రచార నేపధ్యంలో నియంతలను వ్యతిరేకించే వారిని సమీకరించేందుకు ఆ పని చేశారు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత తాను కమ్యూనిస్టును అని కాస్ట్రో ప్రకటించారు. కమ్యూనిస్టుల మీద నిషేధం విధించిన పూర్వరంగంలో కమ్యూనిస్టులు వివిధ దేశాలలో అనేక మారు పేర్లతో పని చేశారు. మన దేశంలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ పేరుతో కమ్యూనిస్టులు పని చేసిన విషయం తెలిసినదే. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది. ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం. పార్టీ చిహ్నాలు, జెండాలు వేరుగావచ్చు, అధికారాన్ని శ్రామికవర్గ రాజ్య నిర్మాణానికి ఉపయోగిస్తున్నాయా లేదా అన్నదే గీటు రాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d