• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Left politics

హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాల విలీనాలు-భిన్న వైఖరులు ఎందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి !

17 Thursday Sep 2020

Posted by raomk in AP, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP hypocrisy, Hyderabad liberation day, Razakars (Hyderabad), RSS - Hyderabad’s liberation, TRS government


ఎం కోటేశ్వరరావు


చరిత్ర నిర్మాతలు ప్రజలు. కానీ చరిత్రను ఎలా రాయాలో నిర్దేశించేది విజేతలు లేదా పాలకులు అన్నది ఒక అభిప్రాయం. ప్రతి దానికీ కొన్ని మినహాయింపులు ఉన్నట్లుగానే చరిత్ర నమోదులో కూడా అలాంటివి ఉండవచ్చు. చరిత్రలో మనకు నిరంకుశులు – ప్రజాస్వామ్య వాదులు, శ్రామికజన పక్షపాతులు – శ్రామిక జన వ్యతిరేకులు కనిపిస్తారు. ఆ రాణీ ప్రేమ పురాణం ఈ ముట్టడి కైన ఖర్చులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అందువలన చరిత్రను చూసే, రాసేవారి ఆసక్తి వెనుక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి వ్యక్తిగతం కావచ్చు, భావజాల పరంగానూ ఉంటాయి.


చరిత్రను వర్గదృష్టితో పరిశీలిస్తే ఒక మాదిరి, కులం – మతం- ప్రాంతీయం వంటి కళ్లద్దాలతో చూస్తే మరొక విధంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమం, సంస్కరణ, అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలతో ప్రభావితులైన తరం రాసిన చరిత్రలో ఆ భావజాల ప్రభావాలు కనిపిస్తాయి. అలాంటి శక్తులు పాలకులుగా ఉన్నారు కనుక దాన్ని వివాదాస్పదం కావించలేదు. ఆ చరిత్రకు ఆమోదం లభించింది. అయితే ఆ చరిత్ర మొత్తాన్ని కమ్యూనిస్టులు రాసిన చరిత్రగా వక్రీకరిస్తూ మన దేశంలోని మత శక్తులు ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు ఎప్పటి నుంచో చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు. వారి చరిత్ర మత ప్రాతిపదికగానే ఉంటుంది. ఆ ప్రాతిపదికతో జనాల మధ్య విభజన గోడలు కట్టాలనే ఎత్తుగడదాగి ఉంది. ఆ గోడలతో వారేమి చేసుకుంటారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న.


ఏ కులం, ఏ ప్రాంతం, మతం వారైనా కష్టజీవులుగా తాము దోపిడీకి గురవుతున్నామా లేదా అనే ప్రాతిపదికన ఆలోచించాలని కమ్యూనిస్టులు చెబుతారు. దానికి భిన్నంగా కులం, ప్రాంతం, మత ప్రాతిపదికన సమీకృతం కావాలన్నది ఆ శక్తుల వాంఛ. అదే జరిగితే నష్టపోయేది శ్రామికులు, లబ్ది పొందేది దోపిడీదార్లు. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా పాలకులు, మతం మధ్య సఖ్యత, ఒకదాన్ని ఒకటి బలపరుచుకోవటం ముఖ్యంగా ఫ్యూడల్‌ సమాజాలలో కనిపిస్తుంది. దోపిడీదార్లకు మతం ఆటంకంగా మారినపుడు దాని పెత్తనాన్ని బద్దలు కొట్టి పక్కన పెట్టటాన్ని ఐరోపా పరిణామాల్లో చూస్తాము.


ఆసియా, ఆఫ్రికా వంటి వెనుకబడిన ఇంకా ఫ్యూడల్‌ వ్యవస్ధ బలంగా ఉన్న చోట్ల మతం ప్రభావితం చేస్తూనే ఉంది. మన దేశానికి వస్తే పెట్టుబడిదార్లు మతంతో, ఫ్యూడల్‌ వ్యవస్దతో రాజీపడటం కనిపిస్తుంది. బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం చేయటం (వారి పేర్లతో దేవాలయాలను పిలవటం-హైదరాబాద్‌ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బిర్లా మందిర్‌ అనే పిలుస్తారు.) మతంతో రాజీ, దాన్ని ఉపయోగించుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. అలాగే ఇతర మతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు మసీదు, చర్చ్‌లు కట్టించినా లక్ష్యం ఒకటే.
బ్రిటీష్‌ వారి పాలనలో సంస్ధానాలు తిరుగుబాటు చేసిన చోట విలీనం చేసుకున్నారు. రాజీపడిన చోట సామంత రాజ్యాలుగా లేకా ప్రత్యేక అధికారాలు, రక్షణతో కొనసాగాయి. చరిత్రను మత ప్రాతిపదికన చూడటం ఎలా జరుగుతోందో చూద్దాం. స్వతంత్ర భారత్‌లో కలిసేందుకు హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాలు వ్యతిరేకించి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు పన్నిన వ్యూహంలో భాగంగా స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని ప్రకటించాయి. నిజానికి అవెన్నడూ స్వతంత్ర రాజ్యాలు కాదు, బ్రిటీష్‌ ఇండియాకు సామంత రాజ్యాలుగానే ఉన్నాయి. అవి స్వతంత్ర దేశాలుగా అవతరించటం అంటే మన తల మీద ఒక సామ్రాజ్యవాద తొత్తును, గుండెల మీద మరొకతొత్తును ప్రతిష్టించుకోవటం తప్ప వేరు కాదు. ఈ కుట్రను ఛేదిస్తూ నాటి కేంద్ర ప్రభుత్వం సంస్ధాలను విలీనం చేసుకున్నది.
హైదరాబాదులో సంస్ధానాధీశుడు ముస్లిం, మెజారిటీ జనాభా హిందువులు. కాశ్మీరులో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందువు. నిజాం నవాబు లొంగిపోయి ఒప్పందం చేసుకోవటాన్ని ముస్లిం పాలకుల నుంచి హిందువులు విమోచన పొందినట్లుగా బిజెపి, దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణిస్తుంది. కాశ్మీరు స్వతంత్ర రాజ్యంగా ఉండాలనటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్దించింది. దాని వాంఛలకు భిన్నంగా కాశ్మీరు విలీనంగాక తప్ప లేదు. మరి దీన్నేమనాలి ? హిందూపాలకుల నుంచి ముస్లింలు విముక్తి పొందినట్లా ?


1921లో కేరళలోని మలబారు ప్రాంతంలో జరిగిన మోప్లా తిరుగుబాటును కూడా మత కోణంతో బిజెపి చూస్తోంది. బ్రిటీష్‌ వారు, స్ధానిక భూస్వాముల మీద ఆ ప్రాంతంలో గణనీయంగా ఉన్న ముస్లింలు, ఇతరులు జరిపిన తిరుగుబాటును హిందువుల మీద జరిగిన దాడులుగా చిత్రించి దాన్ని స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నిరాకరిస్తూ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేందుకు నిర్ణయించింది.


ఆపరేషన్‌ పోలో పేరుతో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్దానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసుకున్న రోజు. నాలుగు రోజుల్లోనే యూనియన్‌ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం నవాబు సైన్యం చేతులెత్తేసింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తిలక్‌ వంటి వారు జనాన్ని సమీకరించేందుకు నాటి ముంబై ప్రావిన్సులో వినాయకచవితి పండుగలను ప్రోత్సహించారు. అలాగే నిజాం రాజు సంఘం పేరుతో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రారంభమైన పోరుతో తన అధికారానికి ఎసరు రావటాన్ని గమనించి మతం పేరుతో సంస్ధానంలో ఉన్న ముస్లింలను ఆ ఉద్యమానికి దూరం చేసేందుకు, అణచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రయివేటు మిలిటెంట్లను ప్రోత్సహించాడు. ఆ శక్తులు మతోన్మాదంతో ఉత్తేజం పొందినవి కావటంతో వారి చర్యల్లో ఎక్కడైనా కొన్ని మత ప్రాతిపదికన జరిగి ఉండవచ్చు తప్ప రజాకార్లు నాటి హిందూ, ముస్లిం మతాలకు చెందిన జాగీర్దార్లు, దేశముఖుల రక్షణకోసమే పని చేశారు. వారిని వ్యతిరేకించిన వారిలో ఎందరో సామాన్య ముస్లింలు ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాటానికి నాంది అయిన భూ సమస్యలో దేశముఖ్‌కు వ్యతిరేకంగా చట్టబద్దమైన పోరు సాగించిన సామాన్య ముస్లిం రైతు బందగీ కోర్టులో విజయం సాధించిన తరువాత హత్యకు గురికావటం ఉద్యమానికి నిప్పురవ్వను రగిలించిన ఉదంతం కాదా ?


నిజాం రాచరికపు దౌర్జన్యాలను ఎండగట్టిన కలం యోధుడు షోయబుల్లాఖాన్‌. నిజాం రజాకార్‌ మూకల దాడిలోనే కన్నుమూసిన వీరుడు. రాచరికపు నిర్బంధాన్ని లెక్కచేయక, 1938లోనే ఔరంగాబాద్‌లో శ్రామిక మహాసభలో పాల్గొని మఖ్దూం మొహియుద్దీన్‌, హబీబ్‌లు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా 1939లో హైదరాబాద్‌లో కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ప్రారంభించిన వారిలో ఆలం ఖుంద్‌మిరీ ఒకరు. ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ తొలి అధ్యక్షుడు మఖ్దూం మొహియుద్దీన్‌. 1947 ఆగస్టు 15న ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగురవేశారు. నిజాం కాలేజీలో విద్యార్థి నాయకుడు రఫీ అహ్మద్‌ కూడా జాతీయ పతాకం ఆవిష్కరించారు. వీరంతా ఎవరు ?


విసునూరు దేశ్‌ ముఖ్‌ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ భూమి రక్షణ కోసం జరిగిన పోరాటం రైతాంగానికి స్ఫూర్తి నిచ్చింది. 1946, జూలై 4న దొడ్డి కొమరయ్య నేలకొరగటంతో రైతాంగం తిరుగుబాటు ప్రారంభమైంది. పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే 1947, ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. అప్పటికే చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగుతున్న లాంగ్‌ మార్చ్‌ అనేక ప్రాంతాలను విముక్తి చేసింది. తెలంగాణాలో కమ్యూనిస్టులు నిజాం సైన్యాలు, రజాకార్లను చావు దెబ్బతీస్తున్నారు. అక్కడ కూడా కమ్యూనిస్టులు ఆధిపత్యం వహిస్తే నైజాం సంస్ధానం మరో ఏనాన్‌గా మారుతుందేమో అని అమెరికా,బ్రిటన్‌ పాలకులు భయపడి దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అణచివేయాలని నెహ్రూ ప్రభుత్వాన్ని కోరారు.


కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు సంఘటితంగా ముందుకు సాగటం తట్టుకోలేని భూస్వాముల పెద్దలైన బూర్గుల రామక్రిష్ణారావు, కెవి రంగారెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి అక్కడ నెహ్రూ, పటేల్‌ తదితర పెద్దలకు మొరపెట్టుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజంటు కె యం మున్షీ ని వివరాలు కోరారు. ఆయన ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పాడు. నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లోకి నైజాం పోలీసులు కానీ, రజాకారు మూకలు గానీ పోలేకపోతున్నాయి. ఇంతకుముందు గ్రామాల మీదే కేంద్రీకరించే వాళ్ళు, ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలపై కూడా కేంద్రీకరిస్తున్నారు. వాళ్ళకు ప్రజామద్దతు రోజరోజుకు పెరిగిపోతోంది. ఇదంతా బెజవాడ కేంద్రంగా కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్న పట్టు అని రిపోర్టు ఇచ్చాడు. అసలే హైదరాబాద్‌ దేశానికి నడిబొడ్డున ఉంది. ఇది ఇలాగే ఉంటే కమ్యూనిస్టుల చేతికిపోతే మొత్తం దక్షిణ భారత దేశంపై దీని ప్రభావం పడుతుంది. ఆ తరువాత దేశం మొత్తానికి విస్తరించినా విస్తరించవచ్చు. ఇక మనం ఉపేక్షించటం మంచిది కాదని భావించిన కేంద్రం వెంటనే సైనికచర్యకు ఉపక్రమించింది. దానికే ఆపరేషన్‌ పోలో అని పేరు పెట్టారు. ఆ కారణంగానే కాశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాకిస్ధాన్‌పై దాడి కంటే నెజాం సంస్ధాన విలీనానికి ఎక్కువ మంది మిలిటరీని దించారు. జనరల్‌ జెయన్‌ ఛౌదరి నాయకత్వలో సైన్యాలు వచ్చాయి. సెప్టెంబర్‌ 13న వచ్చాయి. 17కల్లా ఆపరేషన్‌ క్లోజ్‌ అయింది.


తెలంగాణలో కమ్యూనిస్టు నాయకత్వంలో రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్‌ రైతాంగం కూడా షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా రైతాంగం కాశ్మీరు రాజు సైన్యం, తరువాత పాకిస్థాన్‌ సైన్యాలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కాశ్మీర్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది.
రెండు చోట్లా ప్రజాపోరాటాలు ముందుకు తెచ్చిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కొత్త సమస్యలు తలెత్తాయి. వాటిని పక్కన పెట్టి తెలంగాణా బీజేపీ, ఆరెస్సెస్‌ పరివారం విలీనమా? విమోచనమా? అన్న చర్చను ముందుకు తెస్తున్నది. విలీనం ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిం రాజు నుంచి హిందువుల విమోచనగా వక్రీకరిస్తున్నారు. కాశ్మీరు విలీనానికి అంగీకరించిన ప్రత్యేక రక్షణలను తొలగించటమే కాదు చివరకు ఆ రాష్ట్రాన్నే బిజెపి రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసింది. హైదరాబాద్‌ రాజ్యం గానీ, కాశ్మీర్‌ సంస్థానం గానీ ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో విలీనమైన విషయం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడదు. మెజారిటీ మత సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఈ అంశాల మీద ఆ పార్టీ వ్యవహరిస్తోంది అని చెప్పవచ్చు.


హైదరాబాద్‌, కాశ్మీర్‌ రాచరికాలను కూలదోయటం గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ రెండు ప్రాంతాలలోనూ రైతాంగ పోరాటాలతో సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలే, స్వాతంత్య్రోద్యమ సంప్రదాయాల ఫలితంగా ఏర్పడిన ఇండియన్‌ యూనియన్‌లో విలీనానికి పునాది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం సరైనదా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే దాని ప్రకారం హిందువుల విముక్తి కోసం పోరాడే చిత్తశుద్ది దానికి నిజంగా ఉంటే బ్రిటీష్‌ ఇండియాలో ముస్లిం పాలకుడి పాలనలో అణచివేతకు గురైన మెజారిటీ హిందువులున్న హైదరాబాదు సంస్దానంవైపు అది ఎందుకు చూడలేదు. దానిలో 85శాతం హిందువులు, 12శాతమే ముస్లింలు ఉన్నారు. దేశ సగటు కంటే ఎక్కువ మంది హిందువులున్న ప్రాంతం. తెలంగాణా ఫ్యూడల్‌ శక్తుల వ్యతిరేక పోరాటంతో అణుమాత్రం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు. కాశ్మీర్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావద్దనీ, రాచరికమే కొనసాగాలనీ చెప్పిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. అంతే కాదు అక్కడి భూమిలో ఎక్కువ భాగం హిందూ భూస్వాముల చేతుల్లో ఉంది. ఆ భూమి కోసం పోరాటం నిర్వహించిన షేక్‌ అబ్దుల్లాను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించి భూస్వాముల కొమ్ము కాచింది. అటు స్వాతంత్య్రోద్యమంతోనూ సంబంధం లేకపోగా తెల్లదొరల సేవలో తరించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. మెజారిటీ పౌరులు ముస్లింలు, పాలకుడు, భూస్వాములు హిందువులు కావటంతో వారికి మద్దతుగా కాశ్మీరులో తన శాఖలను ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేకంగా ప్రయత్నించింది. ప్రజాపరిషత్‌ అనే సంస్ధ ముసుగులో భూస్వాముల తరఫున పని చేసింది. అదే హైదరాబాదు సంస్ధానంలో రాజు ముస్లిం, 95శాతంపైగా భూస్వాములు హిందువులు, వారంతా రాజు మద్దతుదారులుగా ఉన్నందున ఆ ప్రాంతంలో తన మత రాజకీయాలకు చోటు ఉండదు,అన్నింటికీ మించి రాజు – భూస్వాములు కలసే జనాన్ని దోపిడీ చేస్తున్నందున భూస్వాములకు ప్రత్యేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం కలగలేదు కనుకనే కేంద్రీకరించలేదని చెప్పవచ్చు.మహాత్మా గాంధీ హత్య కారణంగా నిషేధానికి గురైన ఈ సంస్ద భవిష్యత్‌లో రాజకీయాల్లో పొల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా కొనసాగుతామని కేంద్ర ప్రభుత్వానికి హామీ పత్రం రాసి ఇచ్చింది. దాంతో రాజకీయ రంగంలో కార్యకలాపాల కోసం 1950దశకంలో జనసంఫ్‌ు అనే రాజకీయ పార్టీని ముందుకు తెచ్చింది.


” భారత రాజ్యాంగ సభలో చేరేందుకు తిరస్కరించిన సంస్థానాలలో కాశ్మీరు ఒకటి. మంత్రివర్గ పధకం కింద ఏర్పాటైన ఆ సభ 1946 డిసెంబరు నుంచి పని చేస్తున్నది. ఏ రాష్ట్రమైనా అలా తిరస్కరిస్తే దాన్ని శత్రుపూరిత చర్యగా పరిగణించాల్సి ఉంటుందని తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడిగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ హెచ్చరించినప్పటికీ మహరాజు తిరస్కరించారు. సంస్థానాధీశులకు స్వతంత్రంగా ఉండే హక్కుకు నిర్ద్వంద్వంగా ముస్లిం లీగు మద్దతు ప్రకటించటం రాజ్యాంగ సభలో చేరకూడదనే రాజు మూర్ఖత్వాన్ని మరింత బలపరించింది.1947 జూన్‌ 17న ముస్లింలీగ్‌ నేత మహమ్మదాలీ జిన్నా ఈ మేరకు ప్రకటించారు. జమ్ము -కాశ్మీరు గనుక స్వతంత్ర దేశంగా ఉండదలచుకుంటే పాకిస్తాన్‌ స్వాగతిస్తుందని, స్నేహపూరిత ఒప్పందాలు చేసుకుంటుందని 1947 జూలై 11న మరింత స్పష్టంగా వెల్లడించారు.


విడిపోవటం ఖాయమని స్పష్టమైన తరువాత మహరాజు(కాశ్మీర్‌) భారత్‌లో చేరే మానసిక స్థితిలో లేరు. జమ్ము మరియు కాశ్మీర్‌ పేర్కొంటున్నదానిని హిందూ రాజ్యంగా ఉంచాలని, లౌకిక భారత్‌గా గుర్తింపు ఉండకూడదని, విలీనం చేయకూడదని రాజుకు విధేయులుగా ఉన్న జమ్మూలోని హిందూ నేతలు రాజుకు మద్దతు ఇచ్చారు.ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ (ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పూర్వ అవతారము) 1947 మే నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహారాజు పట్ల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ విలీనం గురించి ఇప్పుడు చేస్తున్నదానికి తరువాత చేయాల్సినదానికి తమ మద్దతు ఉంటుందని దానిలో పేర్కొన్నారు.1947 మే నెలలోనే ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు చౌదరి హమీదుల్లా ఖాన్‌ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తక్షణమే కాశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించాలని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని మహరాజును కోరారు. దీనికి ముస్లింలంతా సహకరిస్తారని, స్వతంత్ర మరియు ప్రజాస్వామిక కాశ్మీర్‌ దేశానికి తొలి రాజ్యాంగబద్ద పాలకుడిగా మహరాజుకు మద్దతు ఇస్తామని హామీని ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్‌ ప్రభుత్వం కాశ్మీర్‌ మీద దాడికి వస్తే దేశంలోని ముస్లింలు దానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపడతారు, అవసరమైతే భారత్‌ సాయం కూడా కోరతామని చెప్పారు. నాతో సహా భారత్‌కు అనుకూలంగా గళమెత్తిన వారందరినీ హిందూ వ్యతిరేకులు, ద్రోహులు అని హిందూ దురహంకారులు ఖండించారు.భారత్‌లో విలీనం కావాలని, షేక్‌ అబ్దుల్లాను విడుదల చేయాలని ముల్కరాజ్‌ సరాఫ్‌ సంపాదకత్వంలోని జమ్మూ దినపత్రిక రణవీర్‌ రాసినందుకు 1947 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.”
ఈ వివరాలను ఎపిలోగ్‌ అనే పత్రిక 2010 నవంబరు సంచికలో ప్రత్యక్ష సాక్షి అనే శీర్షికతో 2005లో పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న, జమ్మూకు చెందిన ప్రముఖ జర్నలిస్టు బలరాజ్‌ పూరీ రాశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ వాదుల నిజస్వరూపం. ఇప్పుడు వారు దేశ సమగ్రత గురించి జనాలకు సుభాషితాలు చెబుతున్నారు. ఈ విద్రోహకర పాత్ర దాస్తే దాగేది కాదు. నేటి తరాలకు చరిత్రపట్ల ఆసక్తి లేదనే భావంతో పచ్చి అవాస్తవాలు, ద్రోహాన్ని కప్పి పుచ్చుకొనేందుకు దేశంలో మరింతగా సామాజిక విభజనను రెచ్చగొట్టేందుకు విషపు బీజాలు నాటారు. అవి ఇప్పుడు వృక్షాలుగా మారి విషఫలాలను ఇస్తున్నాయి.


సెప్టెంబర్‌ 17ను కొందరు విద్రోహ దినోత్సవం అంటు న్నారు. కొందరు విమోచన దినోత్సవం అంటున్నారు. కొందరు విలీన దినోత్సవం అంటున్నారు. దీనిని ఎలా చూడాలి? నైజాం వ్యతిరేక పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంస్దాన విలీనం జరిగింది. నిజాం వ్యతిరేక పోరుకు నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో కొందరు యూనియన్‌ సైన్యాలు వచ్చినందున నెహ్రూ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుంది కనుక సాయుధ పోరాటాన్ని విరమించాలని చెప్పటమే కాదు, ఆయుధాలు పారవేశారు. అయితే కొద్ది రోజుల్లోనే నెహ్రు ప్రభుత్వ వర్గనైజం బయట పడింది. సాధించిన విజయాల రక్షణకు మరికొన్ని సంవత్సరాలు పోరు జరపాల్సి వచ్చింది.


నైజాం రాజు స్వాతంత్య్ర వ్యతిరేకి. విలీనానికి ముందు ఒక ఫర్మానా జారీ చేశాడు. ఎవ్వరూ ఎక్కడా సంస్ధానంలో త్రివర్ణ పతాకం ఎగురవేయగూడదనేది ఆ హుకుం. ఏ వ్యక్తి అయినా జాతీయ జండా ఎగురవేస్తే ఇతర దేశాల జండా ఎగరేసినట్టే. అందుకు 3ఏండ్లు జైలుశిక్ష గానీ, జరిమానా కానీ లేదా ఆ రెండూ కానీ అమలు చేస్తామనేది ఆ ఫర్మానా సారాంశం. కమ్యూనిస్టులు, యువత, విద్యార్ధులు ఈ ఫర్మానాను ధిక్కరించి ముందుకురికారు. హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకుడు రఫీ అహ్మద్‌ నిజాం కాలేజీలో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. సుల్తాన్‌బజార్‌లో కాంగ్రెస్‌ నాయకుడు స్వామి రామానంద తీర్థ జాతీయ జెండా ఎగరేశాడు. బ్రిజ్‌రాణీ గౌర్‌ కోఠీ మహిళా మండలిలో జండా ఎగరేశారు. ఇలా అనేక చోట్ల పతాకావిష్కరణలు జరిగాయి. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం, నైజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతధస్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ ఎగ్రిమెంట్‌) 1947 నవంబర్‌ 29న చేసుకుంది.


ప్రజల మీద సాగించిన దాడులు, హత్యాకాండకు నిజాం రాజు, రజాకార్‌ మూకలు, వారికి మద్దతుగా ఉన్న దేశ ముఖ్‌లు, జాగిర్దార్లను విచారణ జరిపి శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిజాంను విలీనం తరువాత రాజప్రముఖ్‌గా నియమించింది. అపార ఆస్తులు వదిలేశారు. ఆ రోజుల్లో సంవత్సరానికి 50లక్షల జీతం ఇచ్చారు. 1951 అక్టోబర్‌ 31వరకూ ఆయనను ఆ పదవిలో కొనసాగించారు. రాజాభరణాలు ఇచ్చారు. నవాబుకే కాకుండా, జమిందార్లు, జాగీర్‌దార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి పరిహారం చెల్లించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ నవాబ్‌ ఫర్మానా జారీ చేశాడు. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు వరకు అంటే 1950 జనవరి 26 వరకు నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్‌ రాష్ట్రంలో పరిపాలన సాగింది. 1950 జనవరి 26న ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించడం నైజాం చేతులమీదుగానే సాగింది.


యూనియన్‌ మిలిటరీ రావటంతో అంతకు ముందు గ్రామాల నుంచి పారిపోయిన జాగీర్దార్లు, దేశముఖులు తిరిగి గ్రామాలకు వచ్చి రైతాంగం చేతుల్లోని భూములను లాక్కోవటం ప్రారంభించారు. వాటిని రక్షించుకొనేందుకు కమ్యూనిస్టులు 1951వరకు సాయుధపోరాటాన్ని కొనసాగించారు. యూనియన్‌ సైన్యాలు రైతాంగం మీద విరుచుకుపడ్డాయి. నిజాం ప్రభుత్వ దాడిలో మరణించింది 1500మంది కాగా, నెహ్రూ సైన్యాలు 2500 మందిని పొట్టన పెట్టుకున్నాయి. అందువలన కమ్యూనిస్టులలో కొందరు సెప్టెంబరు 17ను విద్రోహదినంగా పరిగణించారు. ఇప్పటికీ అదే భావంతో ఉన్నవారు కూడా ఉన్నారు.
భూసంస్కరణలకు, కౌలుదార్ల హక్కులు కాపాడేందుకు కేంద్రం ఒప్పుకోవటంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం విరమించారు. దీన్ని తరువాత నక్సల్స్‌గా మారిన వారు రివిజనిజంగా, తెలంగాణా రైతాంగానికి చేసిన ద్రోహంగా పరిగణించటమే కాకుండా పోరాటాన్ని కొనసాగించి ఉండాల్సిందని సూత్రీకరించారు. కొనసాగించి ఉంటే చైనాలో మాదిరి దేశంలో విప్లవానికి దారితీసేదన్నది వారి భావం.

సెప్టెంబరు 17ను తెలంగాణా విమోచన పేరుతో బిజెపి, సమైక్యతా దినంగా తెలంగాణా ప్రభుత్వం పాటిస్తున్నది. తెలంగాణా రైతాంగం సాధించుకున్న హక్కులను హరించిన విద్రోహ దినంగా పరిగణించిన కమ్యూనిస్టులు బిజెపి ఇతర కొన్ని శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్న పూర్వరంగంలో వారు కూడా ఈ సందర్భంగా సభలు జరిపి జనాన్ని చైతన్య పరిచేందుకు, నైజాం సంస్థాన విలీనంలో చెరగని కమ్యూనిస్టుల పాత్రను వివరించేందుకు నిర్ణయించారు.


రైతాంగం, వృత్తుల వారిని అణచేందుకు హిందూ జమీందార్లూ, ముస్లిం రాజూ ఏకమయ్యారు. రైతాంగానికీ, జమీందార్లకు మధ్య సాగిన వర్గపోరాటం అది. ఈ వర్గ ఐక్యతను మరుగుపరచేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పోరాటంతో ఏ సంబంధమూలేని ఆ పార్టీ దీనిని హిందువుల విమోచనా దినోత్సవంగా జరపాలని అంటున్నది. 1947 అక్టోబరు 26న విలీనమైన కాశ్మీర్‌ దినోత్సవం లేదా సెప్టెంబరు 15న విలీనమైన జునాగఢ్‌ దినోత్సవాలను గానీ జరపాలని ఆ పార్టీ ఎన్నడూ చెప్పలేదు. సెప్టెంబర్‌ 17న నైజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసింది వాస్తవం. ఈ నేపధ్యంలో విలీనాన్ని ఉత్సవంగా జరపాలా లేక ఆ రోజును స్మరించుకుంటూ కర్తవ్యాలను నిర్ణయించుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.

గమనిక : 2020 సెప్టెంబరు 17న రాసిన ఈ విశ్లేషణను నవీకరించి తిరిగి పాఠకులకు అందించటమైంది

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్ర సిద్దాంతాల హల్‌చల్‌ : నాడు కమ్యూనిజం-నిన్న సోవియట్‌-నేడు చైనా బూచి !

10 Thursday Sep 2020

Posted by raomk in BJP, CHINA, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China Threat, conspiracy theories, Pentagon on China military


ఎం కోటేశ్వరరావు
మానవాళి చరిత్రలో రాజ్యము – అధికారము ఉనికిలోకి వచ్చిన తరువాత కుట్రలు, కుట్ర సిద్దాంతాలు వాటి వెన్నంటే తలెత్తాయి. అధికారం లేని వారు లేదా బలహీనులు కుట్ర సిద్ధాంత ఆశ్రయం పొందుతారు అన్నది కొందరి అభిప్రాయం. దీనికి విస్తృత అర్ధం, భిన్న భాష్యాలు చెప్పవచ్చు. వాటితో అందరూ ఏకీభవించాలని లేదు. ప్రపంచంలో నిరంతరం కుట్ర సిద్దాంతాలు పుడుతూ జనారణ్యంలో కలియ తిరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో అంశం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరోవిధంగా చెప్పాలంటేే వాటితో లబ్ది పొందాలనుకొనే బలమైన శక్తులు వాటిని ముందుకు తెస్తాయి.


కమ్యూనిజం ప్రపంచాన్ని ఆక్రమిస్తోంది, ప్రజాస్వామ్యాన్ని హరిస్తోంది కనుక దాన్ని అడ్డుకోవాలన్న కుట్ర సిద్దాంతాన్ని ముందుకు తీసుకువచ్చింది బలవంతులైన సామ్రాజ్యవాదులే. అది వాస్తవం కాదని గ్రహించలేని వారు దాన్ని నిజమే అని నమ్మి ఆ సిద్దాంతానికి ఊతమివ్వటాన్ని చూస్తున్నాము. తరువాత కాలంలో సోషలిస్టు సోవియట్‌ను బూచిగా చూపి భయపెట్టటం ఎరిగిందే. ప్రాంతీయంగా పశ్చిమాసియాలో ఇరాక్‌ అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను మారణాయుధాలను గుట్టలుగా పోసిన బూచాడిగా చూపిన వైనం మన కళ్ల ముందే జరిగింది. ఇప్పుడు చైనా బూచిని ముందుకు తెచ్చారు. దాన్ని అర్దం చేసుకోలేని వారు ఆశ్రయం ఇస్తున్నారు. కుట్ర సిద్దాంత వైరస్‌ ఒకసారి ఎవరిలో అయినా ప్రవేశించిందంటే అది కరోనా కంటే ప్రమాదకరంగా వ్యాపిస్తుంది. భౌతిక దూరాన్ని పాటిస్తే కరోనా మన దరిచేరదు. కానీ కుట్ర సిద్దాంత వైరస్‌కు అలాంటివేమీ ఉండదు. ఒకరి వాట్సాప్‌లో ప్రవేశించినా, చెవి అప్పగించినా చాలు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.


ప్రస్తుతం మన దేశంలో బిజెపి వంటి సంఘపరివార్‌ సంస్ధలు. మీడియా, సామాజిక మాధ్యమం చైనా బూచిని జనాల మెదళ్లకు ఎక్కిస్తున్నదా ? తమ అనుభవంలోకి వచ్చిన దాని బట్టి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. చైనా నుంచి ముప్పు వస్తోందంటూ అనేక దేశాలను రెచ్చగొడుతూ, కూడగడుతూ అంతర్జాతీయంగా అమెరికా అటువంటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చైనా అణ్వాయుధాలు ప్రపంచానికి ఆటంకంగా ఉన్నాయని, నౌకా దళంలో చైనా తమను మించి పోయిందని అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగన్‌ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇవి చైనా మిలిటరీ ముప్పు అనే కుట్ర సిద్ధాంత అంశాలే.
ఇలాంటి ప్రచారం అమెరికా ఉత్తిపుణ్యానికే చేయదు. రక్షణ ఖర్చును ఇబ్బడి ముబ్బడి చేసేందుకు దేశీయంగా పార్లమెంట్‌ మీద వత్తిడి తేవటం, ముప్పును ఎదుర్కోవాలంటే ఆయుధాలు సమకూర్చుకోవాలి, అంటే యుద్ద పరిశ్రమల కార్పొరేట్లకు జనం సొమ్మును కట్టబెట్టేందుకు మానసికంగా జనాన్ని ఒప్పించే ఎత్తుగడ దీనిలో ఉంది. మిలిటరీ రీత్యా చైనా విజయవంతంగా ఎన్నో మార్పులు చేసిందని పొగడటం అంటే అమెరికాలోని సామాన్యులను భయపెట్టటమే. ఇవన్నీ నిజానికి పాతబడిన విద్యలే. అమెరికన్లను బురిడీ కొట్టించేందుకు తమను తాము నిందించుకొనేందుకు సైతం సిద్ద పడతారు. దానితో వారికి పోయేదేమీ లేదు. ఉదాహరణకు అమెరికా నిద్రపోతుంటే చైనా ఆయుధాలతో ఎదిగిపోయింది అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో చేసిన వ్యాఖ్య దానిలో భాగమే. వాస్తవానికి అది అతిశయోక్తి తప్ప వేరు కాదు. రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు, తామే కాదు తమ స్నేహితులు కూడా నిద్రపోయారని చెప్పాడు. అదే సమయంలో అమెరికా స్నేహితులు, అనుయాయులు కలిస్తే చైనా కంటే ఎంతో బలం కలిగి ఉన్నామని పాంపియో చెప్పాడు.ఇది చైనాను బెదిరించటం.


ఇటీవలి కాలంలో తాను నాయకత్వం వహిస్తున్న నాటో కూటమి ఖర్చును రక్షణ పొందుతున్న దేశాలే ఎక్కువ భాగం భరించాలని ట్రంప్‌ బహిరంగంగా వత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. తాము 70శాతం ఖర్చు చేస్తుంటే మొత్తం ఐరోపా సభ్యదేశాలు 30శాతమే చెల్లిస్తున్నాయని ట్రంప్‌ రుసురుసలాడాడు. అయితే ఖర్చు ఎక్కువ భాగం అమెరికన్‌ సిబ్బందికి, ఆయుధాలకే ఖర్చు అవుతున్నందున తాము అదనంగా చెల్లించాల్సిన పనిలేదని నాటో దేశాలు బదులిచ్చాయి. ఇప్పుడు చైనా బూచిని చూపటం అంటే ఆసియాలోని దేశాలకు రక్షణ కల్పిస్తున్న తమ ఖర్చులో సింహభాగాన్ని భరించాలని అమెరికన్లు కోరటమే.


ఖండాంతర, నియంత్రిత క్షిపణులను చైనా మిలిటరీ తయారు చేసిందని, అవి అమెరికాకు ముప్పు తెస్తాయని, రాబోయే పది సంవత్సరాలలో ఇప్పుడున్న రెండువందల అణ్వాయుధాలు రెట్టింపు అవుతాయని పెంటగన్‌ పేర్కొన్నది. నిజానికి ఏ దేశం దగ్గరైనా అలాంటి ఆయుధాలు ఎన్ని ఉన్నాయో మిలిటరీ ఉన్నతాధికారులందరికీ కూడా తెలియదు. ఊహాగానాలు తప్ప సంఖ్యను ఎన్నడూ బయట పెట్టరు. ఇలాంటి అంకెలన్నీ చీకట్లో బాణాలు వేయటం తప్ప మరొకటి కాదు. ” గతంలో చైనాకు క్షిపణులు ఎక్కువ అవసరం ఉండేది కాదు. కానీ చైనాను తన వ్యూహాత్మక పోటీదారుగా అమెరికా పరిగణిస్తున్నది. ఈ నేపధ్యంలో తగినన్ని ఆయుధాలను సమకూర్చుకోని పక్షంలో చైనా ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని ” పెంటగన్‌ నివేదిక గురించి చైనా రక్షణ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గమనించాల్సిన అంశం ఏమంటే తనకు అవసరం అనుకుంటే చైనా అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే అణ్వాయుధాలను తయారు చేయగల స్ధితిలో ఉంది. అయితే తన 140 కోట్ల జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచే మహత్తర కృషికి అది ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప వనరులను ఆయుధాల కోసం దుర్వినియోగం చేయటం లేదు.


క్షిపణులు లేదా రాకెట్ల ద్వారా ప్రయోగించే ఆయుధాల సంఖ్య ఎంత అన్నదాన్ని బట్టి ఒక దేశ సైనిక పాటవాన్ని లెక్కించటం ఒక పద్దతి. చైనా మరో రెండువందలను తయారు చేయనుంది గనుక తమకు ముప్పు అని అమెరికా చెబుతున్నది. కానీ తన దగ్గర దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న ఆయుధాలను యావత్‌ ప్రపంచానికి ముప్పుగానా లేక శాంతి కోసం తయారు చేసిందా ? స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) 2020 వార్షిక నివేదిక అమెరికా మోహరించిన అణ్వాయుధాలు 1,750, ఇతరంగా 4,050, అమ్ముల పొదిలో మరో 5,800 ఉన్నాయని పేర్కొన్నది. రష్యాతో ఒప్పందంలో భాగంగా కొన్ని మధ్యంతర శ్రేణి ఆయుధాలను ఉపసంహరించిన తరువాత పరిస్ధితి ఇది. 2019లో అమెరికా స్వయంగా చెప్పినదాని ప్రకారం దాని దగ్గర మొత్తం 6,185 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిలో 2,385 వినియోగానికి స్వస్తి చెప్పారు లేదా నాశనం చేశారు. మోహరించిన ఆయుధాలు 1365. వీటిని చూపే అమెరికా ప్రపంచాన్ని భయపెడుతోంది. బయటకు వెల్లడించనివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వాటి ముందు చైనా వద్ద ఉన్న ఆయుధాలెన్ని, అది తెచ్చే ముప్పు ఎంత ?


నిజానికి ఒక దేశం దగ్గర ఎన్ని అణ్వాయుధాలున్నా ఎదుటి దేశం మీద ప్రయోగిస్తే సర్వనాశనం తప్ప ఏ దేశమూ మిగలదు. చైనా దగ్గర కూడా గణనీయంగా అణ్వాయుధాలు ఉన్నాయి గనుకనే అమెరికా దూకుడు తగ్గిందన్నది వాస్తవం, అయితే మానసిక ప్రచారదాడి కొనసాగుతూనే ఉంటుంది.1980 దశకం నుంచీ చైనా వద్ద రెండువందలకు మించి అణ్వాయుధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. వాటి సంఖ్యను పెంచటం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం స్టాక్‌ హౌం సంస్ధ సిప్రి మరియు అమెరికన్‌ సైంటిస్ట్స్‌ ఫెడరేషన్‌ 320 ఉన్నట్లు జోశ్యం చెప్పాయి. కనుక పెంటగన్‌ కొత్తగా కనుగొన్నదేమీ లేదన్నది స్పష్టం.గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా ఒక్కటే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని చెప్పిన దేశం. అంతే కాదు అణ్వాయుధాలు లేని దేశాల మీద వాటిని ప్రయోగించబోమని, బెదిరించబోమని కూడా ప్రకటించింది.


పెంటగన్‌ అంచనా ప్రకారం భూమి మీద నుంచి ఖండాంతరాలకు ప్రయోగించే క్షిపణులు చైనా వద్ద 1250కు పైగా ఉన్నాయి. అవి 500 నుంచి 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని చెబుతోంది. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ప్రకారం అమెరికా మధ్యంతర శ్రేణి క్షిపణుల తయారీ నిలిపివేసింది. చైనా బూచిని చూపి ట్రంప్‌ సర్కార్‌ ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి కొత్త క్షిపణులను పరీక్షిస్తోంది. ఈ చర్య మరింతగా ఆయుధ పోటీని పెంచేదే తప్ప తగ్గించేది కాదు. రాడార్లు పసి గట్టకుండా, ధ్వని లేకుండా వేగంగా ప్రయాణించే అమెరికన్‌ బాంబర్లను కూడా కూల్చివేయగల రష్యా ఎస్‌-400 దీర్ఘ శ్రేణి ఆయుధం అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయనుంది. చైనా త్వరలో వీటన్నింటినీ అధిగమించే ఆయుధాలను రూపొందిస్తున్నదని పెంటగన్‌ నివేదిక పేర్కొన్నది.


చైనా నౌకాదళంలో 350 యుద్ద ఓడలు, జలాంతర్గాములున్నాయని, సంఖ్యరీత్యా ప్రపంచంలో పెద్దదని, కొన్ని రంగాలలో తమకంటే ముందున్నదని, తమ వద్ద 293 మాత్రమే ఉన్నాయని పెంటగన్‌ పేర్కొన్నది. ఇది కూడా మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. అమెరికా వద్ద ఉన్న ఆధునిక యుద్ద ఓడలతో పోల్చితే చైనా బలం తక్కువే. అమెరికా వద్ద భారీ అణ్వాయుధాలను ప్రయోగించే పదకొండు బడా యుద్ద నౌకలు ఉన్నాయి. ఒక్కొక్కదాని మీద 80 యుద్ద విమానాలను ఉంచేంత పెద్దవి ఉన్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా నౌకాదళం విస్తరించినప్పటికీ అణ్వాయుధేతర విమానవాహక నౌకలు రెండు మాత్రమే ఉన్నాయి. వాటిలో క్షిపణులును కూల్చివేసే విధ్వంసక క్షిపణులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చైనా నిర్మిస్తున్న నౌకలు అమెరికా వద్ద ఉన్నవాటి కంటే పెద్దవిగా ఉండబోతున్నాయని పశ్చిమ దేశాలు జోశ్యాలు చెబుతున్నాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని ఇప్పటికే చైనా అనేక రంగాలలో నిరూపించింది.


అమెరికా కనుసన్నలలో పని చేసే జపాన్‌, దక్షిణ కొరియా ఇటీవలి కాలంలో విమానవాహక నౌకలతో సహా అనేక భారీ యుద్ద నావలను రంగంలోకి దించాయి. చైనా దగ్గర ఉన్న చిన్న తరహా యుద్ద నావలు కలిగించే భారీ నష్టాన్ని పెంటగన్‌ పరిగణనలోకి తీసుకోవటం లేదని ఒక విశ్లేషకుడు వాపోయాడు, అమెరికాను హెచ్చరించాడు. వెయ్యి అంతకు పైగా టన్నుల సామర్ధ్యం ఉన్న తీర రక్షక గస్తీ నౌకలు చైనాలో గత పది సంవత్సరాలలో 60 నుంచి 130కి పెరిగితే అమెరికా వద్ద 70 మాత్రమే ఉన్నాయని,రెండు నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్న సైనీకీకరణ గావించిన చేపల పడవలను తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నాడు.
పెంటగన్‌ నివేదిక వచ్చిన సమయంలోనే చైనా విమాన వాహక రెండవ యుద్ద నౌక షాండోంగ్‌ శిక్షణ విన్యాసాలను ప్రారంభించింది. ఇది గత ఏడాది డిసెంబరులో నౌకాదళంలో చేరింది. తొలి నౌక లయనింగ్‌ కూడా పచ్చ సముద్రంలో సంచరిస్తున్నది. ఒకేసారి రెండు యుద్ద నౌకలు విన్యాసాలు జరపటం ఇదే తొలిసారి. తైవాన్‌ నుంచి అమెరికా పిచ్చిపనులు చేసేట్లయితే సమన్వయంతో వాటిని అరికట్టేందుకు వీలుకలుగుతుందని వార్తలు వచ్చాయి. ఈ రెండు నౌకల సంచారం ఎందుకనే విషయాన్ని చైనా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే జోశ్యాలు వెలువడ్డాయి. షాండోంగ్‌ యుద్ద విమానాలతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, లయనింగ్‌ తన రేవు నుంచి ఎక్కువ దూరం ప్రయాణించనందున సాధారణ శిక్షణ కార్యక్రమాలకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. రెండు నౌకలు సమీపం నుంచి అదే విధంగా దూరం నుంచి సమన్వయం చేసుకోవటం గురించి కూడా పరీక్షలు జరుపుతాయి.


జాతీయ వాదం ప్రపంచానికి ఎంతటి చేటు తెచ్చిందో అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్ధాలతో మానవాళి చవి చూసింది. అందువలన జాతీయ వాదానికి గురైన ఏ జాతీ ప్రశాంతంగా లేదు, ప్రపంచాన్ని శాంతంగా ఉండనివ్వలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. జాతీయ వాదం వేరు దేశభక్తి వేరు. జాతీయవాదాన్నే దేశభక్తిగా చిత్రించి జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న రోజులివి.


బ్రిటీష్‌ వారి పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే నాడు జాతీయవాదం-దేశ భక్తి. నేడు అసలు సిసలు దేశభక్తులుగా చెప్పుకుంటున్న సంఘపరివార్‌కు నాడు అవి పట్టలేదు. ఒక దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత జాతీయవాదం ముందుకు వస్తే దాని స్వభావం భిన్నంగా ఉంటుంది. జర్మనీలో ముందుకు తెచ్చిన జాతీయవాదాన్ని నాజీలు దేశభక్తిగా ప్రచారం చేశారు. ఐరోపాలో ఉన్న జర్మన్‌లు, జర్మనిక్‌ భాష మాట్లాడేవారందరూ ఒకే దేశంగా ఉండాలి. జర్మన్‌ జాతి ఔన్నత్యాన్ని నెలకొల్పాలి. యూదులు, పోల్స్‌, రుమేనియన్లు అల్పజాతి వారు కనుక వారిని జర్మన్‌ గడ్డ నుంచి పంపివేయాలి. ఇదే నాజీల దేశభక్తి. దీన్ని ఆమోదించిన వారు జాతీయవాదులు, దేశభక్తులు.ఈ వాదాన్ని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు, జర్మనీలో వారికి చోటు లేదు, ఇదీ తీరు. హిట్లర్‌ జాతీయ వాదాన్ని సమర్ధించిన వారు దేశభక్తులు, వ్యతిరేకించిన కమ్యూనిస్టులను జర్మన్‌ ద్రోహులని ఆరోజు చిత్రహింసల పాలు చేశారు.


చైనాతో మన సరిహద్దును బ్రిటీష్‌ వారి హయాంలో వివిధ సందర్భాలలో అధికారులు ఇష్టమొచ్చినట్లు గీశారు. ఒకరు గీసినదానిలో ఆక్సారుచిన్‌ చైనా ప్రాంతంగా మరొక దానిలో మనదిగా ఉంది. అదే విధంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను టిబెట్‌ అంతర్భాగంగా, బ్రిటీష్‌ ఇండియా భాగంగా పేర్కొన్న సందర్భాలున్నాయి. స్వాతంత్య్రానికి ముందు ఆ ప్రాంతాన్ని బ్రిటీష్‌ ఇండియా సర్కార్‌ ఆధీనంలో ఉన్నదానిని టిబెట్‌ స్వాధీనం చేసుకున్న సందర్భాలున్నాయి. బ్రిటీష్‌ వారితో టిబెట్‌ పాలకులు చేసుకున్న ఒప్పందాలను వేటినీ చైనా పాలకులు అంగీకరించలేదు. తమ సామంత రాజ్యానికి అలాంటి హక్కులేదని వాదించారు. ఒప్పందాలు అమలు కూడా కాలేదు. సరిహద్దులను ఖరారు చేసుకోవాలని నాడు చైనా గానీ బ్రిటీష్‌ ఇండియా గానీ పూనుకోలేదు.


అంతెందుకు మన దేశంలో ఆశ్రయం పొందిన 14 దలైలామా 1959లో తిరుగుబాటు చేసి మన దేశానికి పారిపోయి రావటానికి ముందు అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగమే అని చెప్పాడు. ఆ తరువాత 2003లో కూడా వాస్తవానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌కు చెందిందని చెప్పాడు.


1947లో మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది, 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. తరువాత కాలంలో సరిహద్దుల సమస్య ముందుకు వచ్చింది. రెండు దేశాలూ తమ వైఖరే సరైనదే అనే విధంగా వ్యవహరించాయి. దానికి తోడు దలైలామా సమస్య తోడై అది యుద్దానికి దారి తీసింది. వివాదం తెగలేదు. అయితే పరిష్కారం కావాలి, రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలి. అందుకు సంప్రదింపులు పరిష్కారం తప్ప ఆయుధాలు మార్గం కాదు. 1962లో యుద్ద సమయంలో అన్ని పార్టీలు జాతీయవాదానికి గురై చైనాను దురాక్రమణదారుగా పేర్కొని యుద్దాన్ని సమర్ధించాయి. సిపిఐ జాతీయ నాయకత్వం దీని గురించి ఒక వైఖరి తీసుకోవాల్సివచ్చింది. ఆ సమయంలో జరిగిన చర్చలలో కొందరు సరిహద్దు వివాదాన్ని సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించాలనే వైఖరిని పార్టీ ప్రకటించాలని ప్రతిపాదించారు. మిగిలిన వారు యుద్దాన్ని సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే వైఖరి తీసుకున్నారు. అప్పటికి సైద్దాంతిక విభేదాల గురించి చర్చ తప్ప పార్టీలో చీలిక లేదు. సంప్రదింపులతో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన పార్టీనేతలను, ఆ అభిప్రాయాన్ని బలపరిచిన వారిని దేశ వ్యాపితంగా నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైలుపాలు చేసింది. తరువాత వారంతా సిపిఎంగా ఏర్పడ్డారు.


దేశభక్తి పేరుతో రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ విభాగం జనసంఫ్‌ు, ఇతర సంస్దలు చైనా వ్యతిరేక వైఖరిని తీసుకొని, యుద్దాన్ని వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించాయి. కానీ తరువాత కాంగ్రెస్‌ పాలకులు, జనతా పార్టీలో చేరి అధికారంలో భాగస్వాములైన జనసంఘనేతలు, తరువాత బిజెపిగా అధికారానికి వచ్చిన వారూ చేసిందేమిటి ? సరిహద్దు సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, రెండు వైపులా తుపాకులు పేల కూడదని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు కారణాలు ఏమైనా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మరోసారి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ఇతర సంస్ధల నేతలు చైనా వ్యతిరేక ప్రచారాన్ని పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. దానికి మీడియా తోడైంది సరే. 1962లో యుద్దాన్ని సమర్దించి జాతీయవాదానికి గురైన సిపిఐ ఇప్పుడు ఆ వైఖరిని సవరించుకున్నది. సిపిఎం మాదిరే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే వైఖరినే తీసుకున్నది.
అనేక దేశాలలో కమ్యూనిస్టులు ఇలాంటి సమస్యలు వచ్చినపుడు జాతీయవాదానికి లోను కాకుండా ఒక సూత్రబద్ద వైఖరిని తీసుకున్నారు. పాలస్తీనాను ఆక్రమించి స్వతంత్ర దేశంగా ఏర్పడకుండా అడ్డుకుంటున్న పాలకుల వైఖరిని ఇజ్రాయెల్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తున్నది. అక్కడి యూదుదురహంకారులు కమ్యూనిస్టులను దేశద్రోహులని నిందిస్తున్నా, దాడులకు పాల్పడినా కమ్యూనిస్టులు తమ వైఖరిని మార్చుకోలేదు.


చైనాతో సరిహద్దు వివాద పరిష్కారానికి శాంతియుత చర్చలు-ఇచ్చిపుచ్చుకోవటాలు తప్ప మరొక పరిష్కారం అసాధ్యం. ఈ విషయం ప్రతిపార్టీకీ తెలుసు. అయినప్పటికీ పైకి జాతీయవాదాన్ని ముందుకు తెస్తున్నాయి. మే, జూన్‌ మాసాలలో కొత్తగా చైనా వారు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారని చెప్పారు. తీరా మన ప్రధాని అఖిలపక్ష సమావేశంలో అబ్బే అలాంటిదేమీ లేదు అని ప్రకటించారు. తాజాగా మన ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు వస్తున్న చైనా వారిని పసిగట్టిన మన మిలిటరీయే చొరవ తీసుకొని కొన్ని కొండలను ఆధీనంలోకి తెచ్చుకుందని ప్రకటించారు. అసలేం జరుగుతోంది అన్నది తెలియటం లేదు.


యుద్దం వద్దు అన్న వారిని మన మిలిటరీ సత్తాను అవమానించే వారిగా చిత్రిస్తూ దాడి చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ శక్తి అమెరికా. అలాంటి దేశం జరిపిన యుద్దాలలో ఎక్కడైనా విజయం సాధించిందా ? అలాంటపుడు చైనా మనలను గానీ, మనం చైనాను గానీ యుద్ధంలో ఓడించి సమస్యలను పరిష్కరించుకోగలమా ? మన దగ్గర ఉన్న నాలుగు రూకలను అటు అమెరికా లేదా రష్యా మరొక దేశం నుంచో కొనుగోలు చేసే ఆయుధాలకు సమర్పించుకోవటం తప్ప మరొకటేమైనా జరుగుతుందా ? మన ప్రాంతాలను చైనాకు అప్పగించాలని ఎవరూ కోరటం లేదు. గతంలో లేదు భవిష్యత్‌లో కూడా ఉండదు. దేశభక్తి గురించి ఏ పార్టీ మరొక పార్టీకి బోధలు చేయాల్సిన,నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భిన్న అభిప్రాయం వ్యక్తం చేసినంత మాత్రాన ఎవరూ దేశద్రోహులు కాదు. ఉద్రేకాలకు లోనుకాకుండా ఆలోచించాల్సిన సమయమిది. గతంలో ప్రపంచంలో జరిపిన అనేక యుద్దాలు ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించేందుకు లేదా జాతీయ దురహంకారంతో చేసినవే. అలాంటి వైఖరికి జనం మూల్యం చెల్లించాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుత్తీ, కొడవలి, నక్షత్రాలుంటే బ్రెజిల్లో 15 ఏండ్ల జైలు !

08 Tuesday Sep 2020

Posted by raomk in Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Brazil, Brazill Communists, equate communist symbols with Nazi ones, Jail time for hammer and sickle, Jair Bolsonaro


ఎం కోటేశ్వరరావు
పారిశ్రామిక విప్లవ కాలంలో యజమానులు ప్రవేశపెట్టిన యాంత్రిక మగ్గాలు తమ ఉపాధిని హరించటంతో పాటు, ప్రాధాన్యతను తగ్గిస్తాయని, వాటి మీద పని చేసే నైపుణ్యంలేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారని బ్రిటన్‌లోని నిపుణులైన చేనేత కార్మికులు భావించారు. వాటిని విధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని నిర్ధారణకు వచ్చి అదే పని చేశారు. చరిత్రలో యంత్రవిధ్వంసక కార్మికులుగా మిగిలిపోయారు. పెట్టుబడిదారీ విధానాన్ని సరిగా అర్ధం చేసుకోలేని తొలి రోజుల్లో అది జరిగింది.


ప్రపంచంలో సోషలిజం, కమ్యూనిజం గురించి గత రెండు శతాబ్దాలుగా తెలిసినప్పటికీ వాటిని వ్యతిరేకించే నిరంకుశ శక్తుల ఆలోచన యంత్రవిధ్వంసకుల స్ధాయినిదాటలేదని జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఆ కార్మికులకు దిక్కుతోచక యంత్ర విధ్వంసం చేస్తే ప్రస్తుతం కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దిక్కుతోచక చిహ్నాల నిషేధానికి పాల్పడుతున్నారా ?
కమ్యూనిస్టు చిహ్నాలుగా పరిగణిస్తున్న సుత్తీ, కొడవలి, నక్షత్రం కమ్యూనిస్టు భావజాలం పురుడు పోసుకోక ముందే ఉన్నాయి. సుత్తీ, కొడవలిని కార్మిక-కర్షక మైత్రికి, నక్షత్రాన్ని ఐదు భూ ఖండాలకు గుర్తుగా కార్మికవర్గంపై జరిపినదాడిలో పారిన రక్తానికి చిహ్నంగా ఎర్రజెండాను కమ్యూనిస్టులు స్వీకరించారు. వాటిమీద కమ్యూనిస్టులకేమీ పేటెంట్‌ హక్కు లేదు. అయితే ఆ చిహ్నాలను వినియోగించిన వారికి పది నుంచి పదిహేనేండ్ల పాటు జైలు శిక్ష విధించాలని కోరుతూ సెప్టెంబరు రెండవ తేదీన బ్రెజిల్‌ పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో కుమారుడు, పార్లమెంట్‌ సభ్యుడు అయిన ఎడ్వర్డ్‌ బోల్జానో దాన్ని ప్రతిపాదించాడు. వాటిని తయారు చేసినా, విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షార్హంగా పరిగణిస్తూ చట్టసవరణకు నిర్ణయించారు. నాజీలు, తరువాత కమ్యూనిస్టులు పోలాండ్‌ను ఆక్రమించారని అందువలన వారిని హంతకులుగా పరిగణించాలని, వారి చిహ్నాలను ఉపయోగించిన వారిని శిక్షించాలని బోల్జానో చెప్పాడు. అది పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందా? లేదా, పొందితే తదుపరి కమ్యూనిస్టుల మీద నిషేధం విధిస్తారా ? ఏమైనా జరగొచ్చు.


పచ్చి మితవాదులైన తండ్రీ కొడుకులు తాము కమ్యూనిస్టు వ్యతిరేకులమని బహిరంగంగానే గతంలో ప్రకటించుకున్న నేపధ్యంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం ఆశ్చర్యమేమీ కాదు. కమ్యూనిస్టులు, నాజీలు ఒకటే అనేందుకు రుజువులు ఇవిగో అంటూ నాటి సోవియట్‌లోని ఉక్రెయిన్‌లో కమ్యూనిస్టులు కరవుకు కారకులయ్యారని ఒక చిత్రాన్ని, నాజీల చిత్రహింసలకు సంబంధించి ఒక చిత్రాన్ని ట్వీట్‌ చేశాడు. అయితే కరవు అని చెప్పిన చిత్రం బ్రిటీష్‌ ఇండియాలోని బెంగాల్‌ కరవుకు సంబంధించింది. కొందరు ఆ విషయాన్ని చెప్పినప్పటికీ ఎడ్వర్డ్‌ వెనక్కు తీసుకొనేందుకు నిరాకరించాడు. కరోనా వైరస్‌కు కారణం చైనాయే అంటూ గతంలో ప్రకటించి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కూడా కారకుడయ్యాడు.


కమ్యూనిస్టు సంబంధిత లేదా కమ్యూనిస్టు నేతల పేర్లతో ఉన్న బహిరంగ స్ధలాలు, సంస్ధలు, కట్టడాల పేర్లు కూడా మార్చాలని బ్రెజిల్‌ పాలకులు ఆలోచిస్తున్నారు. పాలకపక్ష చర్యను బ్రెజిల్‌ కమ్యూనిస్టు యువజన సంఘం ఖండించింది. గతంలో నిరంకుశ పాలకులు ఇదే విధంగా తమ సంస్ధను, కమ్యూనిస్టు పార్టీని పని చేయనివ్వకుండా చేశారని తిరిగి అదే చర్యకు ఒడిగట్టారని పేర్కొన్నది. తూర్పు ఐరోపాలోని పోలాండ్‌, హంగరీ వంటి దేశాలలో చేస్తున్న మాదిరే ఇక్కడ కూడా చేస్తున్నారని పేర్కొన్నది. కమ్యూనిజం-నాజీజాలను ఒకే గాటన కడుతున్న ఐరోపా యూనియన్‌ వైఖరినే బ్రెజిల్‌ పాలకులు అనుసరిస్తున్నారని ఇది చరిత్రను వక్రీకరించటం తప్ప వేరు కాదని విమర్శించింది. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీలను ఓడించేందుకు సోవియట్‌ కమ్యూనిస్టులు తమ రక్తాన్ని ధారపోశారన్న నిజం దాస్తే దాగేది కాదని పేర్కొన్నది.


తమ భావజాలాన్ని వ్యక్తపరిచేందుకు విధించే ఈచర్యలను తాము సహించబోమని, ప్రజల్లో తమ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తామని స్పష్టం చేసింది.ఇవి బ్రెజిల్‌ ప్రజాస్వామిక స్వేచ్చ, సామాజిక ఉద్యమాల మీద దాడి తప్ప మరొకటి కాదన్నది. కమ్యూనిస్టులను అరెస్టులు చేయాలని, హతమార్చాలని తండ్రీ కొడుకులు, వారితో కుమ్మక్కయిన జనరల్‌ హామిల్టన్‌ మౌరో చూస్తున్నారని వారి ఆటలను అరికట్టేందుకు ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని కమ్యూనిస్టు యువజన సంఘం పేర్కొన్నది.
ఉక్రెయిన్‌,మరికొన్ని తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత అధికారానికి వచ్చిన నియంతలు, ఫాసిస్టు శక్తులు కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించారు. కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు పెట్టారు.తాను ఉక్రెయిన్‌ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించాలని బిల్లును ప్రతిపాదించినట్లు ఎడ్వర్డ్‌ బోల్జానో చెప్పాడు.

బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు పార్టీ(పిసిడిఓబి)కి ఎనిమిది మంది సభ్యులున్నారు, 27కు గాను ఒక రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది, అనేక మున్సిపల్‌, కార్పొరేషన్లలో పార్టీ అధికారంలో ఉంది. కమ్యూనిస్టు చిహ్నాల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తరువాత కమ్యూనిస్టు, ఇతర పురోగామి శక్తుల కార్యకలాపాలను నిషేధించినా ఆశ్చర్యం లేదు. కరోనా వైరస్‌ నివారణలో వైఫల్యం, కార్మికుల హక్కులపై దాడి, ఆర్ధిక రంగంలో తిరోగమనం వంటి సమస్యలతో బోల్సనారో ప్ర భుత్వం నానాటికీ ప్రజావ్యతిరేకంగా మారుతున్నది. కమ్యూనిస్టు పార్టీ ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ప్రజా ఉద్యమాలకు పిలుపు ఇచ్చింది.
గత ఎన్నికలలో మితవాద బోల్సనారో అధికారానికి వచ్చిన తరువాత విదేశాంగ విధానాలలో ప్రభుత్వం గుడ్డిగా అమెరికాను అనుసరిస్తున్నది. దానిలో భాగంగానే బ్రిక్స్‌ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మరో భాగస్వామి అయిన చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. మంత్రులు బహిరంగంగానే చైనా వ్యతిరేక ప్రకటనలు చేస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 11న బ్రెజిల్‌-అమెరికా సంబంధాలను కాపాడాలనే పేరుతో ఎడ్వర్డ్‌ బోల్జానో ఒక ఉపన్యాసం చేశాడు. ఒక దేశాన్ని ఎలా నాశనం చేయవచ్చు అనే పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెనెజులా గురించి అభూత కల్పనలతో సంక్షేమ చర్యలకు వ్యతిరేకంగా వక్తలు ఉపన్యాసాలు చేశారు. అంతకు ముందు గ్లోబలిజం-కమ్యూనిజం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంకా ఇలాంటివే క్యూబాకు వ్యతిరేకంగా కూడా నిర్వహించారు.


కమ్యూనిస్టు వ్యతిరేకతకే బ్రెజిల్‌ ప్రభుత్వం పరిమితం కాలేదు. క్రైస్తవ విలువల పేరుతో అబార్షన్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలను ఇప్పించారు. విదేశాంగ విధానంలో లాటిన్‌ అమెరికన్‌ దేశాల ఐక్యత, రక్షణ అనే వైఖరికి బ్రెజిల్‌ దూరం అవుతున్నది. అంతర్జాతీయ విధానాలకు సంబంధించి రాజ్యాంగం రూపొందించిన విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నది.
ఇటీవలి కాలంలో ఐరోపా, అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులు రెచ్చిపోతున్నాయి. అనేక దేశాల్లో మితవాద శక్తుల పట్టు పెరుగుతోంది. గతేడాది సెప్టెంబరులో ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో కమ్యూనిస్టు వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించటాన్ని చూస్తే ఒక వ్యవస్ధగానే కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రోత్సహిస్తోంది. రెండవ యుద్ద ప్రారంభంలో సోవియట్‌ యూనియన్‌ ఒక ఎత్తుగడగా జర్మనీతో చేసుకున్న ఒప్పందాన్ని సాకుగా చూపుతూ నాజీలు – కమ్యూనిస్టులూ ఒకటే అనే పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్నాయి. నాజీలు సోవియట్‌ మీద జరిపిన దాడి, కమ్యూనిస్టుల చేతుల్లోనే నాజీలు నాశనమైన చరిత్రను దాచేందుకు ప్రయత్నిస్తున్నారు.


అమెరికా ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో బ్రెజిల్‌ పార్లమెంట్‌లో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించాలనే బిల్లు ప్రతిపాదనను చూడాల్సి ఉంది. అధ్యక్ష , ఉపాధ్యక్షులుగా జో బిడెన్‌, కమలాహారిస్‌ ఎన్నికైతే అమెరికా కమ్యూనిజం వైపుకు పోయినట్లే అని గత పది రోజులుగా రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌ వంటి డెమోక్రటిక్‌ సోషలిజం గురించి మాట్లాడేవారు, ఎలిజబెత్‌ వారెన్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌, కమలా హారిస్‌ వంటి ఉదారవాదులను కమ్యూనిస్టులుగా చిత్రించి రిపబ్లికన్‌ పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకత ఉన్న అమెరికన్ల ఓట్లకోసం నానా గడ్డీ కరుస్తున్నది. మన దేశంలో ఇందిరా గాంధీని కూడా సోషలిస్టుగా పశ్చిమ దేశాల మీడియా చిత్రించిన విషయం తెలిసిందే. అందువలన వారి పరిభాషలో సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా చిత్రించిన వారందరూ కమ్యూనిస్టులు కాదు. కొన్ని అంశాలలో మితవాదులతో విబేధించే పరిమిత పురోగామి భావాలు కలిగిన వారిగానే చూడాల్సి ఉంది.


బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో పారిశ్రామిక విప్లవకాలంలో యంత్రాలను విధ్వంసం చేసినంత మాత్రాన ఆ క్రమం ఆగలేదు, పెట్టుబడిదారీ విధానం మరింతగా యాంత్రిక విధానాలతో ముందుకు పోతున్నది. ఐరోపా లేదా బ్రెజిల్‌ మరొక దేశంలో కమ్యూనిస్టు చిహ్నాల మీద నిషేధం విధించినంత మాత్రాన, వాటిని వినియోగించే పార్టీలను ఎన్నికలకు దూరం చేసినంతనే పురోగామి శక్తుల రధచక్రాలు ఆగిపోతాయనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి ఉండదు. మహత్తర తెలంగాణా సాయుధ పోరాట ప్రారంభంలో వడిసెలతో శత్రువులను ఎదుర్కొన్న యోధులకు తుపాకులు సమకూర్చుకోవటం పెద్ద సమస్యగా మారలేదు. శిక్షణ పొందిన మిలిటరీతో సమంగా తమకు తామే ప్రాధమిక పరిజ్ఞానంతో తుపాకులు పేల్చిన సామాన్యులు కిరాయి మూకలు, సైన్యాన్ని ఎలా ఎదిరించారో చూశాము. అవసరాలు అన్నింటినీ సంపాదించుకొనే మార్గాలను కూడా చూపుతాయి.


బ్రెజిల్‌, ఇండోనేషియా, ఐరోపా మరొక చోట ఎక్కడైనా దోపిడీ శక్తులను హతమార్చక తప్పదు, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించుకోవాలనే నిశ్చయానికి కార్మికవర్గం, రైతులు రావాలే గాని సుత్తీ, కొడవలి, నక్షత్రం, ఎర్రజెండాగాక పోతే మరో గుర్తులు, పతాకంతో సంఘటితం అవుతారు. లాటిన్‌ అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాలలో విప్లవాన్ని సాధించిన పార్టీలన్నీ తొలుత కార్మిక మరొక పేరుతో ప్రారంభమయ్యాయి తప్ప కమ్యూనిస్టు పార్టీలుగా కాదన్నది చరిత్రలో ఉంది. వియత్నాం కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ వియత్నాం వర్కర్స్‌ పార్టీ ప్రధమ కార్యదర్శిగా పని చేశారు. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రోతొలుత క్యూబా ప్రజా పార్టీలో చేరారు. వివిధ ఉద్యమాల పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు.పాపులర్‌ సోషలిస్టు పార్టీ పేరుతో ఉన్న కమ్యూనిస్టులతో అంతర్గతంగా సంబంధాలు పెట్టుకున్నారు తప్ప బహిరంగంగా పార్టీతో కలవలేదు. కమ్యూనిస్టుల గురించి జరిగిన తప్పుడు ప్రచార నేపధ్యంలో నియంతలను వ్యతిరేకించే వారిని సమీకరించేందుకు ఆ పని చేశారు. అధికారానికి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత తాను కమ్యూనిస్టును అని కాస్ట్రో ప్రకటించారు. కమ్యూనిస్టుల మీద నిషేధం విధించిన పూర్వరంగంలో కమ్యూనిస్టులు వివిధ దేశాలలో అనేక మారు పేర్లతో పని చేశారు. మన దేశంలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ పేరుతో కమ్యూనిస్టులు పని చేసిన విషయం తెలిసినదే. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది. ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం. పార్టీ చిహ్నాలు, జెండాలు వేరుగావచ్చు, అధికారాన్ని శ్రామికవర్గ రాజ్య నిర్మాణానికి ఉపయోగిస్తున్నాయా లేదా అన్నదే గీటు రాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వామపక్ష శక్తుల నిర్మూలనకు అమెరికా పెట్టిన పేరే ” జకర్తా పద్దతి ” !

17 Wednesday Jun 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

annihilation of communists Jakarta Method, Indonesian Communist Party (PKI)., Jakarta Method, US anti communism


జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న మీడియా సంస్ద అల్‌ బవాబా డాట్‌ కామ్‌ లండన్‌ ప్రతినిధి నికోలస్‌ ప్రిట్‌చర్డ్‌ ఇటీవల అమెరికన్‌ జర్నలిస్టు విన్సెంట్‌ బెవిన్స్‌తో ఇంటర్వ్యూ చేశాడు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు , వామపక్ష శక్తుల నిర్మూలనకు అమెరికా, దాని అండతో వివిధ దేశాలు అనుసరించిన దుర్మార్గ పద్దతుల గురించి వర్తమాన తరాలకు ఆసక్తి కలగించే అంశాలను వెల్లడించారు.1960దశకంలో ఇండోనేషియాలో నియంత సుహార్తో అమెరికన్ల అండతో దాదాపు పదిలక్షల మంది కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టులని అనుమానించిన వారిని ఎలా చంపివేశారో విన్సెంట్‌ బెవిన్స్‌ అధ్యయనం చేశాడు. ఇండోనేషియాలో పరిమితంగానే బయలు పరచిన నాటి రహస్య పత్రాలను పరిశీలించాడు. అంతకు ముందు తరువాత అనేక దేశాలలో జకర్తా పద్దతి పేరుతో అమలు జరిపిన మారణకాండ గురించి ఈ క్లుప్త ఇంటర్వ్యూలో వివరించాడు.(జకర్తా మెథడ్‌ : వాషింగ్టన్స్‌ యాంటీ కమ్యూనిస్టు క్రూసేడ్‌ అండ్‌ ద మాస్‌ మార్డర్‌ ప్రోగ్రామ్‌ దట్‌ షేప్‌డ్‌ అవర్‌ వరల్డ్‌ ” అనే పేరుతో విన్సెంట్‌ బెవిన్స్‌ రాసిన పుస్తకాన్ని మే నెలలో పబ్లిక్‌ ఎఫైర్స్‌ అనే సంస్ధ ప్రచురించింది. ఈ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూను జూన్‌ పదకొండున అల్‌ బవాబా ప్రచురించింది.) 2017లో పత్రాలను విడుదల చేసిన సమయంలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ అనువాదకుడు రాసిన వ్యాసపు లింక్‌ చివరిలో ఉంది.

నికొలస్‌ ప్రిచర్డ్‌ : జకర్తా పద్దతి అంటే ఏమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌: వామపక్ష వాదులు లేదా వామపక్ష వాదులని ముద్రవేసిన అమాయక పౌరులను కావాలని సామూహికంగా హతమార్చటమే జకర్తా పద్దతి. ప్రచ్చన్న యుద్ద సమయంలో ఈ ఎత్తుగడను వినియోగించారు. ఇది ముఖ్యమైన మూలమలుపు. అమెరికా మరియు ప్రపంచ వ్యవస్దను రూపొందించాలని చూసిన వారి వైపు నుంచి చూస్తే పెద్ద విజయం, అంతిమంగా విజయం సాధించింది. ఈ విజయం రూఢి అయింది కాబట్టే అమెరికా దాని అనుయాయి దేశాలు ఈ పద్దతిని కాపీ చేయటం ప్రారంభించాయి.1970దశకం ప్రారంభంలో చిలీ, బ్రెజిల్‌లో తమకు ముప్పుగా పరిణమిస్తారు లేదా అనిపించిన అమాయకులను హతమార్చేందుకు ఈ పద్దతిని అనుసరించారు. సామూహిక హత్యలని అర్ధమిచ్చే విధంగా జకర్తా పదాన్ని వినియోగించారు. అయితే ప్రతి దేశం ఆ పదాన్ని వినియోగించలేదు గానీ ఇరవైకి పైగా అమెరికా అనుయాయి దేశాల్లో నిరాయుధులైన వామపక్ష శక్తులను సామూహికంగా హతమార్చటానికి ప్రభుత్వాలు జకర్తా పద్దతి పధకాలను అమలు జరపటాన్ని గమనించాను.

హొనికొలస్‌ ప్రిచర్డ్‌ :వలసల అనంతర స్వాతంత్య్ర దేశాలను పురికొల్పిందేమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌: ప్రచ్చన్న యుద్ద సందర్భంలో తృతీయ ప్రపంచ దేశాల ఆవిర్భావం జరిగింది. ఇప్పుడు ఈ పదాన్ని తరచూ నీచ అర్ధంలో వాడుతున్నారు. కానీ ఆ సమయంలో అది పూర్తిగా సానుకూల మరియు ఆశావాదంతో ఉండేది. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ఈ ఉద్యమ స్ధాపక ప్రముఖులు, దార్శనికులలో ఒకరు.1955లో ఆసియా, ఆఫ్రికా దేశాలను దగ్గరకు చేర్చారు.వాషింగ్టన్‌(అమెరికా)కు ఇది ఒక సమస్యగా మారింది.

నికొలస్‌ ప్రిచర్డ్‌: అనేక తృతీయ ప్రపంచ దేశాలు అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య సమతూకాన్ని పాటించేందుకు ప్రయత్నించాయి. కానీ సుకర్నో అమెరికా శత్రువు అయ్యాడు, అప్పుడు ఏమైంది?
విన్సెంట్‌ బెవిన్స్‌: అంతకు ముందు ఉనికిలో లేని ఒక పెద్ద అగ్రరాజ్యంతో దెబ్బలాడేందుకు ఎలాంటి కారణం లేదు. వలస అనంతర కమ్యూనిస్టులలో కొందరు అమెరికాతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించారు.1945లో ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం ప్రకటించిన సమయంలో వియత్నాం నేత హౌచిమిన్‌ అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను ప్రస్తావించారు. సుకర్నో కూడా అమెరికా విమోచన యుద్ద వారసత్వ పరిధిలోనే 1955 సభ నిర్వహించారు.అయితే చివరికి అమెరికా పరిష్కరించాల్సిన సమస్యలు లేదా ఇతర కారణాలతో శత్రువులుగా తేలారు.అది విషాదకర ఫలితాలకు దారి తీసింది.

నికొలస్‌ ప్రిచర్డ్‌: ఇండోనేషియాలో మిలిటరీకి మద్దతుగా అమెరికా నిలిచేందుకు దారి తీసిన కీలక విధాన నిర్ణయాలేమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌: ప్రచ్చన్న యుద్దం తొలి రోజులలో అమెరికా తీసుకున్న వైఖరి గురించి మాట్లాడుకున్నట్లయితే తటస్ధంగా ఉన్నప్పటికీ ప్రతి తృతీయ ప్రపంచ దేశాన్ని అది వ్యతిరేకించింది. దానికి రెండు విరుద్ద వివరణలు ఉన్నాయి. ఒకటేమి చెబుతుందంటే కమ్యూనిజం, జాతీయ భావనలతో ఉన్న దేశాలతో తమకు ముప్పు అనే తీవ్ర మానసిక వ్యాధికి అమెరికా గురైంది. ప్రపంచంలో దోపిడీ చేస్తున్న దేశాలను కుదురుగా ఉంచాలంటే ప్రపంచ వ్యవస్దలో హింసాత్మక ఆధిపత్యం చలాయించే స్దితిని అమెరికా వారసత్వంగా పొందింది అని రెండో వివరణ చెప్పింది. వందల సంవత్సరాలుగా ఐరోపా దేశాలు చేస్తున్న మాదిరి విధానాలను కొనసాగించేందుకు ఒక సాకుగా కమ్యూనిస్టు వ్యతిరేకత పని చేసింది. నేనయితే ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉందనుకోను. ఒకదానినొకటి పరస్పరం బలపరుచుకుంటాయి.
ఇండోనేషియా విషయానికి వస్తే అమెరికా తీసుకున్న ఈ వైఖరి అత్యంత భయంకర పర్యవసానాలకు దారితీసింది. అంతకు ముందు దశాబ్దకాలంగా ” ఒక సమస్యను ” పరిష్కరించాలని చూస్తున్న అమెరికా చివరి యత్నంగా సామూహిక వధే పరిష్కారం అని నిర్ణయించుకుంది. తొలి యత్నంగా ఎన్నికల్లో ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ విజయాన్ని అడ్డుకుంటుంది అనే ఆశతో 1955లో ఒక మితవాద ముస్లిం పార్టీని స్ధాపించేందుకు సిఐఏ నిధులు ఇవ్వటం ప్రారంభించింది. అది పని చేయలేదు. రెండవ యత్నంగా ఇండోనేషియా దీవులపై బాంబులు వేస్తూ సిఐఏ పైలట్లు దొరికి పోయారు. మూడవ యత్నంగా వాషింగ్టన్‌ తన బలం మొత్తాన్ని ఒక హింసాత్మక పరిష్కారానికి అందించింది.

నికొలస్‌ ప్రిచర్డ్‌: అమెరికా ఏమి చేసింది ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ, మితవాద మిలిటరీ మధ్య ఘర్షణలు సృష్టించేందుకు 1964-05లో సిఐఏ, ఎం16 రహస్యంగా పని చేశాయి. వివాదం తలెత్తగానే కమ్యూనిస్టులను అణచివేయటానికి అది సరైన సమయం అని అమెరికా రాయబారి గుర్తించాడు. అది వాస్తవం కాదని తెలిసినా కమ్యూనిస్టులు కుట్రపన్నారంటూ అమెరికా తనశక్తికొద్దీ ప్రచారం చేసింది. ఇండోనేషియా మిలిటరీకి కావాల్సిన వాటన్నింటినీ అందించింది. బ్యాంకాక్‌లో ఉన్న సిఐఏ కేంద్రం నుంచి ఆయుధాలను అందచేసేందుకు అనుమతించింది. సమాచార వ్యవస్ధకు అవసరమైన పరికరాలను అందచేసింది.
హత్యాకాండ ప్రారంభం కాగానే అమెరికా అధికారులు నిరంతరం నివేదికలు తెప్పించుకున్నారు. జరుగుతున్నదాని పట్ల తాము సంతోషంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. మరిన్ని హత్యలను ప్రోత్సహించారు.హత్య చేయాల్సిన వారి జాబితాలను అందచేశారు. ఒక ఉద్యోగి జాబితాల్లోని వారిని అంతం చేశారా లేదా అని సరి చూసేవాడు. అది ఎంత భయంకరంగా ఉండేదో మీరు ఊహించుకోవాల్సిందే. అయితే ఇలా చేయటం ఇదే తొలిసారి కాదు. అంతకు ముందు నుంచీ జరుగుతోందనే ఆధారాలు మనకు ఉన్నాయి.1954లో గౌతమాలాలో, సిఐఏ మద్దతుతో ఇరాక్‌లోని బాత్‌ పార్టీ తిరుగుబాటు సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలో, ఇతర వామపక్ష కార్యకర్తల్లో హతమార్చవలసిన వారి జాబితాలను 1963లో అమెరికా అధికారులు అందచేశారు.

నికొలస్‌ ప్రిచర్డ్‌: ఇండోనేషియాలో ఎంత మందిని చంపారు ?
విన్సెంట్‌ బెవిన్స్‌: షుమారు పది లక్షల మంది ఉంటారని నేను చెబుతున్నా. అనేక మంది నిపుణులు ఐదు నుంచి పదిలక్షల మంది ఉన్నారని చెప్పారు. తాజాగా జరిగిన సంచలనాత్మక అధ్యయనం ప్రకారం దాదాపుగా పది లక్షల మంది అని చెప్పారు.ఈ అనిశ్చితికి కారణం లేకపోలేదు.విచారణల్లో సరైన సంఖ్య ఇంతవరకు రాకపోవటానికి ఇప్పటికీ అమెరికా మద్దతు ఉన్న మిలిటరీ ఎంతో పట్టుకలిగి ఉండటమే కారణం. అసలేమి జరిగింది అని తెలుసుకొనే ఆసక్తి ఇండోనేషియా ప్రభుత్వంలో కూడా ఎన్నడూ లేదు.దీనికి తోడు ఏమి జరిగిందో వెలికి తీయాలంటూ ప్రభుత్వం మీద అంతర్జాతీయంగా తగిన వత్తిడి కూడా రాలేదు.

నికొలస్‌ ప్రిచర్డ్‌: హత్యల మీద అమెరికాలో స్పందన ఏమిటి ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : ఉల్లాసం. విధాన నిర్ణేతలు, మరియు జర్నలిస్టులు స్వీకరించిన తీరు అమెరికాలో ఎంతో ఉల్లాసంగా ఉంది. బాబీ కెన్నడీ మాత్రమే ప్రముఖుల్లో వ్యతిరేకంగా గళం విప్పారు. సంతోషం, సంబరాల సముద్రంలో అది గులకరాయి విసిరినట్లుగా ఉంది. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో ఒక ప్రముఖ ఉదారవాది ఆసియాలో మిణుగురు వెలుగు పేరుతో రాసిన దాన్ని నేను నా రచనలో ఉటంకించాను. అత్యంత అనారోగ్య పద్దతిలో వారికి సరైనదే. వారికి అది విజయం. భౌగోళిక రాజనీతి ప్రాధాన్యతల ప్రకారం 1960దశకంలో వియత్నాం కంటే వారికి ఇండోనేషియా ముఖ్యం. పశ్చిమదేశాల ప్రవాహంలో ఇండోనేషియా పడితే వియత్నాంను నిలువరించటం ప్రాధాన్యత సంతరించుకుంటుందని రాబర్డ్‌ మెక్‌నమారా తన జ్ఞాపకాల్లో రాశాడు. ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ పతనం వియత్నాంలో అమెరికాకు ముప్పును ఎంతగానో తగ్గించింది, ఇప్పుడు ఇంకా కొన్ని పాచికలు మాత్రమే ఉన్నాయి అవి సులభంగానే పడిపోయేట్లు కనిపిస్తున్నాయి అని కూడా మెక్‌నమారా రాశాడు. సోవియట్‌ యూనియన్‌ ఊచకోతను ఆపేందుకు ప్రయత్నించలేదు లేదా వాస్తవానికి ఖండించలేదు. మౌలికంగా చూస్తే నిరాయుధ ఇండోనేషియన్‌ కమ్యూనిస్టు పార్టీని అంతం చేయటాన్ని అంతర్జాతీయ సమాజం పట్టించుకోలేదు.

హొనికొలస్‌ ప్రిచర్డ్‌: జకర్తా పద్దతిని ఇరాక్‌లో ఎలా ఉపయోగించారు ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : జవహర్‌లాల్‌ నెహ్రూ, గమాల్‌ అబ్దుల్‌ నాజర్‌, సుకర్ణో వంటి వారి నాయకత్వాన తృతీయ ప్రపంచం ఒక్కటైనపుడు ఆఫ్రో-అసియన్‌ ప్రపంచంలో ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ(అధికారంలో లేని పార్టీలలో) మొదటి స్ధానంలో, ఇరాక్‌ పార్టీ రెండవ, సూడాన్‌ పార్టీ మూడవ స్ధానంలో ఉన్నాయి. ఈ మూడింటిని దాదాపుగా తుడిచిపెట్టారు.
1963లో బాత్‌ పార్టీ తిరుగుబాటు చేసింది, కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్ష శక్తులను అంతం చేసింది. నేను ఒక ప్రముఖ ఇరాకీ జర్నలిస్టును ఇంటర్వ్యూ చేశాను. ఇరాకీ వామపక్ష శక్తులను నిర్దాక్షిణ్యంగా అణచివేసిన సమయంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిన వారిలో ఒకడిగా సద్దామ్‌ హుసేన్‌ పేరు మోశాడు. ఎవరెవరిని అంతం చేయాలో సూచిస్తూ బాత్‌ పార్టీకి అమెరికా అధికారులు జాబితాలను అందచేశారు. తరువాత ఇండోనేషియాలో అదే పద్దతిని అమలు జరిపారు.

నికొలస్‌ ప్రిచర్డ్‌: ఈ ఉదంతాలలో విదేశాల్లో అమెరికా చేసిన దానికీ, స్వంత గడ్డమీద తలెత్తే ఘర్షణల పట్ల స్పందించటానికి ఏదైనా సంబంధం ఉందా ?
విన్సెంట్‌ బెవిన్స్‌ : ప్రపంచంలో తిరుగుబాట్లను అణచివేసేందుకు అనుసరించిన పద్దతులు, తన స్వంత పౌరుల పట్ల అనుసరించిన విధానాల గురించి ఎంతో ఆసక్తికరమైన పరిశోధనలు ఉన్నాయి. స్టువర్డ్‌ ష్క్రాడర్‌ రాసిన బాడ్జెస్‌ వితౌట్‌ బోర్డర్స్‌ అనే పుస్తకం ఉంది. విదేశాల్లో తిరుగుబాట్లను అణచివేసే అర్ధ సామ్రాజ్యవాద పోలీసుగా పనిచేసిన అమెరికా తన స్వంత జనంపైనే యుద్ధం చేసేదిగా ఎలా పరిణమించిందో దానిలో వెల్లడించారు.అమెరికా సెటిలర్‌ వలసవాదం, జాత్యహంకార నేపధ్యంలో తృతీయ ప్రపంచ దేశాలలో అమెరికా జోక్యాన్ని చూడాల్సి ఉంది. అది ఆఫ్రికా, అసియాల్లో అత్యాచారాలకు పాల్పడిన పూర్తి జాత్యహంకార ప్రభుత్వంగానే వ్యవహరించింది. అంతేకాదు ప్రపంచ కమ్యూనిస్టు వ్యతిరేక విధానాలు మరియు తిరుగుబాట్ల అణచివేత యుద్ధ చరిత్ర పరిధిలో వర్తమాన అమెరికా పోలీసు వ్యవస్ధ ఎలా పని చేస్తున్నదో చూడాల్సి ఉంది. ప్రపంచ మంతటా అదే పద్దతుల్లో వ్యవహరించిందో తన స్వంత గడ్డమీద కూడా అదే విధంగా ఉంది.
https://vedikaa.com/2017/10/19/us-hand-in-1960s-indonesia-anti-communist-massacre-revealed/
అనువాదం : ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వైరస్‌ కట్టడికి చైనా కమ్యూనిస్టులు చేసిందేమిటి !

09 Tuesday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

china communists action to fight against covid-19, China Covid-19, COVID-19 China white paper



ఎం కోటేశ్వరరావు
కరోనా వైరస్‌ను చైనాయే సృష్టించిందనో, దాని ప్రయోగాల్లో పొరపాటున బయటకు వచ్చిందనో రకరకాలుగా ఏదో విధంగా బాధ్యతను అంట కట్టి దోషిగా నిలిపేందుకు ఇప్పటికీ అమెరికా వంటి దేశాలూ, వాటి కనుసన్నలలో నడిచే మీడియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. మన దేశంతో సహా అనేక చోట్ల కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తమ ప్రభుత్వం కరోనా నిరోధానికి కఠినంగా వ్యవహరించినట్లు కొందరు తొలి రోజుల్లో భావించినా అమెరికా, ఐరోపా దేశాలు, బ్రెజిల్‌ తదితర దేశాల్లో పెరుగుతున్న కేసులు, మరణాలను చూసి తమ ప్రభుత్వం చేసింది సరైనదే అని పార్టీ, ప్రభుత్వం పట్ల మరింతగా చైనీయులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నివారించిన చైనా అనుభవాలను పరిగణనలోకి తీసుకోకపోతే నష్టం ఆయా దేశాల జనాలకే. మహమ్మారులు ప్రబలిన సమయంలో సుభాషితాలు చెప్పటం, చప్పట్లు కొట్టించటం, దీపాలు ఆర్పటం-హారతులు వెలిగించట కాదని, తమ సభ్యులను కదన రంగంలోకి దింపటం ముఖ్యమని చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కరోనాను ఎలా కట్టడి చేసిందీ వివరిస్తూ చైనా సమాచారశాఖ ఈనెల ఏడవ తేదీన ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. అరవై అయిదు పేజీలు ఆ పత్రంలోని అంశాల సారాంశం దిగువ విధంగా ఉంది.(పూర్తి పాఠం చదవాలని ఆసక్తి కనపరిచే వారి సౌకర్యం కోసం దాని లింక్‌ను చివరిలో చూడవచ్చు)
1949లో చైనా ప్రజారిపబ్లిక్‌ను స్ధాపించిన తరువాత కోవిడ్‌19 ఒక పెద్ద ప్రజారోగ్య అత్యవసర పరిస్దితిగా ముందుకు వచ్చింది. మరొకటేదీ ఇంత వేగంగా వ్యాపించలేదు, నిరోధించటం ఎంతో కష్టం అని రుజువు చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం దీనికి అగ్రశ్రేణి ప్రాధాన్యత ఇచ్చాయి.అది చైనీయుల విశ్వాసాన్ని పదిలపరచింది.బాధాకరమైన ప్రయత్నాలు, ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చినా చైనా తన పౌరులను రక్షించుకుంది. ఏ తేదీన ఏమి జరిగిందీ అని చైనా చెబుతున్నప్పటికీ అనేక మంది ఆ సమాచారాన్ని అనుమానంతో చూస్తున్నారు. మరి కొందరు చూస్తూనే ఉంటారు. గతంలో తాము సాధించిన అభివృద్ది గురించి చైనా ప్రకటిస్తే అదంతా అంకెల గారడీ అని చెప్పిన వారున్నారు. ఇప్పటికీ నమ్మని వారి సంగతి సరే సరి. తీరా నమ్మక తప్పని పరిస్ధితి వచ్చినపుడు ఆ అక్కడ కమ్యూనిస్టు నియంతృత్వం కనుక సాధ్యమైంది, మనది ప్రజాస్వామ్యం అని వైఫల్యాన్ని సమర్దించుకుంటున్నారు. కరోనా విషయంలో కూడా అదే జరుగుతోంది. వైరస్‌ కట్టడికి అక్కడి కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ఏ చర్యలను ఎలా అమలు జరిపిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోని కారణంగా అనేక దేశాల పాలకులు తమ పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఇప్పటికీ నేర్చుకొనేందుకు ముందుకు రావటం లేదు. అభివృద్ధి వైఫల్యాన్ని ప్రజాస్వామ్య ముసుగులో దాచి పెడుతున్న మేథావులమని చెప్పుకొనే వారు ప్రాణాలను బలి పెట్టకుండా మీరు చెప్పే నియంతృత్వ చైనాలో ఎలా కట్టడి చేశారో కనీసం తెలుసుకొనేందుకు పూనుకుంటారా ? మేథావులు అనేక మంది ప్రతిసారీ బస్సు మిస్సవుతున్నారు కనుక వారిని వదలి వేద్దాం. సామాన్యుల కోసం చైనా ప్రభుత్వం వెల్లడించిన శ్వేతపత్రంలోని అంశాల సారాంశం దిగువ విధంగా ఉంది.(స్ధలాభావం రీత్యా ఏ రోజు ఏమి జరిగిందీ అనే సమాచారాన్ని ఇవ్వటం లేదు. ఎలా అరికట్టారనే భాగానికే ఇది పరిమితం)
వైరస్‌ తొలుత బయటపడిన ఊహాన్‌ నగరంలోని 4.21 మిలియన్ల కుటుంబాలలో ఏ ఒక్కదానిని, కుటుంబంలో ఏ ఒక్కరినీ వదల కుండా వైరస్‌ పరీక్షలు చేశారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష వ్యవధిని రెండు రోజుల నుంచి 4-6 గంటలకు తగ్గించారు. తొలి రోజుల్లో రోజుకు 300 పరీక్షలు చేస్తే ఏప్రిల్‌ మధ్యనాటికి 50వేలకు చేరింది. నివాసులందరూ ప్రతి రోజూ ఆరోగ్య పరిస్ధితి ఎలా ఉందో అధికారులకు తెలియచేయాలని కోరారు. మరోవైపున సామాజిక కార్యకర్తలు ఆ సమాచారాన్ని నిర్ధారించుకొనేందుకు ఇంటింటికీ తిరిగారు. జ్వరాల ఆసుపత్రులలో పరీక్షలు చేసిన సమాచారాన్ని రెండు గంటల్లోగా ఉన్నతాధికారులకు చేరవేయాలని కోరారు. పరీక్షా ఫలితాలను పన్నెండు గంటలలో వెల్లడించారు. ఇరవైనాలుగు గంటలలో నిర్ధారిత పరీక్షలను పూర్తి చేసి రోగులను గుర్తించి ఆసుపత్రులకు తరలించారు.
ఉహాన్‌ నుంచి వచ్చిపోయే అన్ని రకాల దారులను పూర్తిగా మూసివేశారు.హువెరు రాష్ట్రం, వెలుపల ఉన్న ప్రాంతాలలో కేసుల తీవ్రతను బట్టి ఆంక్షలను అమలు జరిపారు. వైద్యపరమైన అత్యవసరాలకు మినహా గృహస్తులు ఇతర అవసరాలకు బయటకు రాకుండా కట్టడి చేశారు. సామాజిక కార్యకర్తలు వారికి అవసరమైన రోజు వారీ అవసరాలను తీర్చే ఏర్పాట్లు చేశారు. పరిమిత రాకపోకలను అనుమతించిన ఇతర ప్రాంతాలలో రాక-పోక సమయాల్లో శరీర ఉష్ణ్రోగ్రతలను విధిగా నమోదు చేశారు. దేశవ్యాపితంగా నిరోధ చర్యల్లో భాగంగా వీటితో పాటు ఇతర చర్యలను అమలు జరిపారు, అందుకు అవసరమైన వైద్య, ఇతర సదుపాయాలను అత్యవసర ప్రాతిపదికన మెరుగుపరిచారు.
దేశవ్యాపితంగా పదివేల ఆసుపత్రులను కోవిడ్‌-19 చికిత్సకు ప్రత్యేకించి అవసరమైన వసతులు కల్పించారు.ఆన్‌లైన్‌ ద్వారా అవసరమైన సాంకేతిక మద్దతు అందించారు. ప్రధాన కేంద్రమైన ఉహాన్‌లో 80శాతం కేసులు తీవ్రమైనవి కాదు. అయినా ఎటుపోయి ఎటు వస్తుందో అన్న ముందు జాగ్రత్తగా పద్నాలుగువేల పడకలతో స్టేడియాలు, ప్రదర్శన కేంద్రాలలో 16 తాత్కాలిక చికిత్స ఏర్పాట్లు చేశారు. నివారణలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. ఆరోగ్యవ్యవస్ధ మీద వత్తిడిని తగ్గించటంలో ఇవి కీలక పాత్ర పోషించినట్లు బ్రిటీష్‌ వైద్య పత్రిక లాన్‌సెట్‌ పేర్కొన్నది. రోగ నిర్ధారణ, చికిత్సలో సంప్రదాయ చైనా వైద్య పద్దతులు, ఔషధాలను, ఆధునిక వైద్య పద్దతులు, ఔషధాలను రెండింటినీ వినియోగించారు. కొన్ని సంప్రదాయ చైనా వైద్య ఆసుపత్రులలో పూర్తిగా రోగులకు చికిత్స చేశారు, దానితో పాటు ప్రతి ఆసుపత్రిలోనూ ఆ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచారు. తీవ్రత తక్కువ ఉన్న కేసులను ఈ ఆసుపత్రులలో చికిత్స చేసి తీవ్రమైన వారిని ఆధునిక వైద్య ఆసుపత్రులకు పంపారు. ఇందుకోసం ఈ రంగ వైద్య నిపుణులతో ఒక జాతీయ సమన్వయ సంస్ధను ఏర్పాటు చేశారు. తొంభై రెండుశాతం నిర్ధారిత కరోనా కేసులలో చైనా మూలికా ఔషధాలను వినియోగించారు. హుబెరు రాష్ట్రంలో చికిత్స పొందిన 90శాతం కేసులలో అవి సమర్దవంతంగా పని చేసినట్లు తేలింది.
కేంద్ర, రాష్ట్ర, స్ధానిక ప్రభుత్వాలన్నీ కలసి మే31 నాటికి 162.4 బిలియన్‌ యువాన్లు మహమ్మారి నివారణ, చికిత్సకు కేటాయించారు. బీమా కంపెనీలు పరిష్కరించిన యాభై ఎనిమిది వేల మంది ఆసుపత్రి చికిత్స బిల్లులను విశ్లేషించినపుడు సగటున ఒక్కొక్కరికి 23వేల యువాన్లు కాగా, తీవ్ర పరిస్ధితికి చేరిన వారికి లక్షా 50వేలు దాటింది. ఒక యువాను మన కరెన్సీలో పది రూపాయలకు పైగా విలువ కలిగి ఉంది. కొన్ని సంక్లిష్ట కేసులలో పది లక్షల యువాన్ల వరకు ఖర్చయింది. వ్యక్తులకు అయిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించింది.
మే 31వ తేదీనాటికి చైనా కేంద్ర సమాచార మండలి 161 పత్రికా సమావేశాలను ఏర్పాటు చేసింది. పద్నాలుగు వందల ప్రశ్నలకు 50శాఖల అధికారులు సమాధానాలు చెప్పారు. ఇవిగాక హుబెరు రాష్ట్రంలో 103 పత్రికా గోష్టులు ఏర్పాటు చేయగా ఇతర చోట్ల మరో 1050 నిర్వహించారు.మరోవైపు వాక్సిన్‌తో సహా కరోనా వైరస్‌కు సంబంధించి వివిధ అంశాలపై పరిశోధన మరియు అభివృద్దికి గాను కొత్తగా 83 కార్యక్రమాలను ప్రారంభించారు.
పౌరుల ప్రాణాలు, ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఆర్ధికంగా ఖర్చు గురించి ఆలోచించకుండా అనేక కఠిన చర్యలు తీసుకున్నది.” భారీ సామాజిక, ఆర్ధిక నష్టంతో చైనా విజయం వచ్చింది.ఆరోగ్యం మరియు ఆర్ధిక రక్షణ మధ్య ఉండాల్సిన సమతూకాన్ని సాధించేందుకు చైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది” అని లాన్‌సెట్‌ సంపాదకీయం పేర్కొన్నది. ఒకటిన్నర రోజు పసి గుడ్డు నుంచి వంద సంవత్సరాల పండు ముదుసలి వరకు ఖర్చు ఎంతైనా సరే ప్రాణాలను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది.చికిత్సకు, మరణాలను తగ్గించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది.కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు దేశంలోని నిపుణులైన వైద్యులు, సిబ్బందిని తరలించింది. ఊహాన్‌లో తీవ్ర స్ధితిలో ఉన్న 9,600 రోగులకు చికిత్స అందించారు.
బతికేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఖర్చుకు వెనుకాడకుండా వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. మే 31 నాటికి ఏడుగురు శతాధిక వృద్దులతో సహా 80 ఏండ్లు దాటిన మూడువేల మంది ప్రాణాలను రక్షించారు. వారిలో డెబ్బయి ఏండ్ల రోగి ఒకరికి పది మంది సిబ్బంది అనేక వారాల పాటు చికిత్సలో పాల్గొన్నారు. అందుకు పదిహేను లక్షల యువాన్లు ఖర్చు కాగా మొత్తం ప్రభుత్వమే భరించింది. వివిధ దేశాలలోని ప్రవాస చైనా విద్యార్ధులకు పదిలక్షల ఆరోగ్య కిట్లను చైనా పంపింది.
జనవరి 24 నుంచి మార్చి 8వ తేదీ వరకు హుబెరు రాష్ట్రంలోని ఊహాన్‌, మరో 16 పట్టణాలకు ఇతర ప్రాంతాలకు దేశమంతటి నుంచీ అన్ని రకాల వైద్య వనరులను సమీకరించారు, 346 జాతీయ వైద్య బృందాలలో 42,600 సిబ్బంది ఉన్నారు. వీరుగాక 900 మంది ప్రజారోగ్య నిపుణులు ఉన్నారు. చైనా ప్రజావిముక్త సైన్యం(పిఎల్‌ఏ) నుంచి నాలుగువేల మంది వైద్య సిబ్బందిని సమీకరించారు. ఆదేశాలిచ్చిన రెండు గంటల్లోనే బృందాలను ఏర్పాటు చేయటం, 24గంటల్లోగా నిర్దేశిత కేంద్రాలకు చేరటం ఏడు రోజులకు సరిపడా రక్షణ సామాగ్రితో వచ్చిన వెంటనే చికిత్స అందించటం ఆ బృందాల ప్రత్యేకత.
నలభైవేల మంది నిర్మాణ కార్మికులను రప్పించి వేయిపడకల ఆసుపత్రిని అన్ని రకాల పరికరాలతో పది రోజుల్లో, మరో 1600 పడకల ఆసుపత్రిని పన్నెండు రోజుల్లో నిర్మించారు.మరో 14వేల పడకల తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేశారు.పది రాష్ట్రాల నుంచి 45వేల ఎర్ర రక్తకణ యూనిట్లు, 1762 ప్లేట్‌లెట్స్‌ డోస్‌లు, 1370 లీటర్ల గడ్డకట్టించిన ప్లాస్మాను సిద్ధం చేశారు. ఏ రకమైన వైద్య పరికరాలు, ముఖతొడుగులు,ఔషధాలకు కొరత రాకుండా ఉత్పత్తికి ఏర్పాటు చేశారు. చికిత్సా సమయంలో 17రకాల, వాక్సిన్లు, ఔషధాలను(క్లినికల్‌ ట్రయల్స్‌, వినియోగం) వినియోగించేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. దేశవ్యాపితంగా నిరాటంకంగా ఎక్కడకు అవసరమైతే అక్కడకు తరలించే సమన్వయ వ్యవస్ధలను ఏర్పాటు చేశారు.
ఉహాన్‌ నగరంలో కోటి మంది, ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లో ఉన్న జనాలకు అవసరమైన ధాన్యం, కూరగాయలు, నూనెలు, పాలు, గుడ్లు, మాంసం తదితర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 500 సంస్దలతో సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
చైనా ప్రధాన భూభాగంలోనూ, తైవాన్‌, హాంకాంగ్‌, మకావు ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉన్న చైనీయులు పెద్ద ఎత్తున స్పందించి 38.93 బిలియన్‌ యువాన్లు, 990 మిలియన్ల వస్తువులను విరాళంగా అందచేశారు. లాక్‌డౌన్‌తో పాటే చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తల మీద భారాలు తగ్గించటం, ప్రభుత్వ సబ్సిడీల పెంపు, ఉపాధి స్ధిరీకరణ, ప్రభుత్వ సేవల మెరుగుదల వంటి అనేక చర్యలను తీసుకుంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత తమ పని స్ధలాలకు చేరేందుకు వలస కార్మికులకు ప్రత్యేక రైళ్లు, విమానాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ చివరి నాటికి ఏడాదికి రెండు కోట్ల యువాన్ల ఆదాయం వచ్చే కంపెనీలలో 99శాతం పనిలోకి వచ్చాయి. తీవ్రంగా ప్రభావితమైను హుబెరు రాష్ట్రంలో కూడా 98.2శాతం సంస్ధలు తిరిగి పని చేస్తుండగా 92.1శాతం కార్మికులు విధుల్లో చేరారు. ప్రజా రవాణా పూర్తిగా పునరుద్దరణ అయింది. యావత్‌ ప్రజాజీవనం సాధారణ స్ధాయికి చేరుకుంది.
హుబెరు రాష్ట్రంలోని 5,40,000 ఆరోగ్య కార్యకర్తలు, బయటి నుంచి వచ్చిన నలభైవేల మంది పౌర, మిలిటరీ వైద్య సిబ్బంది, మిలియన్ల కొలది ఆరోగ్య సిబ్బంది కరోనాను అడ్డుకొనేందుకు మరో గ్రేట్‌ వాల్‌ నిర్మించారు. పుట్టుకతో ఎవరూ వీరులు కాదు. ఈ పోరులో రెండువేల మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది, అనేక మంది మరణించారు. కరోనా పోరులో సామాన్య జనాన్ని సిద్దం చేసేందుకు, వారిని ఆదుకొనేందుకు 6,50,000 పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు, రోగులను గుర్తించేందుకు, పౌరుల రోజువారీ సమస్యల పరిష్కారానికి 40లక్షల మంది సామాజిక కార్యకర్తలు పని చేశారు. పద్దెనిమిది లక్షల మంది పారిశుధ్యకార్మికులు బహిరంగ స్ధలాలు, ముఖ్యమైన ప్రాంతాలను శుభ్రం చేయటంలోనూ, వైద్య, ఇతర చెత్తను సేకరించటంలోనూ పాలొన్నారు. పోలీసులు విధి నిర్వహణలో 130 మంది మరణించారు. వలంటీర్లుగా నమోదు చేసుకున్న 88లక్షల మంది 4,60,00 కార్యక్రమాల్లో 29కోట్ల గంటల పాటు సేవలు అందించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీలో 46లక్షలకు పైగా ప్రాధమిక శాఖలు ఉన్నాయి.మహమ్మారిని ఎదుర్కోవటం,జనాన్ని సమీకరించటం, వారికి సేవ చేయటంలోనూ అవి గట్టిగా పని చేశాయి. మూడు కోట్ల 90లక్షల మంది పార్టీ సభ్యులు అగ్రగామి దళంగా ఉన్నారు. కోటీ 30లక్షల మంది వలంటీర్లుగా సేవలందించారు. సేవారంగంలో ముందున్న వారిని ఉన్నత స్ధానాల్లోకి ప్రమోట్‌ చేశారు,బాధ్యతా రహితంగా ఉన్నవారిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఉత్పాతాల నుంచి కాపాడటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం అత్యంత విశ్వసనీయంగా ఉంటుందని లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత సాధారణ జనం ఎంతగానో గ్రహించారు, రాజకీయ వ్య వస్ధ మీద తమ విశ్వాసాన్ని ప్రకటించారు. 170దేశాల నేతలు, 50 ప్రపంచ, ప్రాంతీయ సంస్దల అధిపతులు, 300 విదేశీ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చైనాకు బాసటగా నిలిచాయి. డెబ్బరు ఏడు దేశాలు, పన్నెండు అంతర్జాతీయ సంస్ధలు అత్యవసర విరాళాలు అందచేశాయి.84దేశాల నుంచి వివిధ సంస్ధలు సాయాన్ని పంపాయి. బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు, ఏఐఐబి ఏడు,2.48బిలియన్‌ యువాన్ల చొప్పున అత్యవసర రుణాలు అందచేశాయి. నూటపది దేశాలకు చెందిన 240 పార్టీలతో కలసి చైనా కమ్యూనిస్టు పార్టీ సంయుక్త విజ్ఞాపనలు చేసింది. యాభై మంది నేతలు, అంతర్జాతీయ సంస్ధల అధిపతులతో దేశాధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ స్వయంగా మాట్లాడి చైనా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
శ్వేత పత్రంలోని ముఖ్యాంశాలను పైన చూశాము. గత నెలలో అమెరికా వ్యాపింప చేసిన 24 అబద్దాలను తిప్పి కొడుతూ చైనా ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఇప్పుడు కరోనాను ఎదుర్కొన్న తీరు తెన్నులను వివరిస్తూ శ్వేత పత్రాన్ని ప్రకటించింది. ఇంతవరకు ఏ దేశమూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. తాము తీసుకున్న చర్యలను అధికారికంగా విడుదల చేసి జనం ముందుంచటం కనీస బాధ్యత. వాటి మంచి చెడ్డలను జనం స్వయంగా తెలుసుకుంటారు. ప్రపంచంలో గతంలో అనేక మహమ్మారులు వచ్చాయి. అవి ముందుగా బయటపడిన దేశాలను అందుకు బాధ్యులుగా చేసి రచ్చ చేసిన ఉదంతం ఇదొక్కటే అని చెప్పవచ్చు. కరోనా వైరస్‌ దెబ్బలను ఎదుర్కొన్న ఒక బాధిత దేశంగా ఉన్న చైనా దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని తానేమిటో, తన రాజకీయ వ్యవస్ధ ఔన్నత్యం ఏమిటో నిరూపించుకుంది. సాధారణ కార్యకలాపాలతో తిరిగి ముందుకు పోతున్నది.చైనా తీసుకున్న చర్యలను కూడా ఎవరైనా సహేతుకంగా విమర్శించవచ్చు, లోపాలను ఎత్తిచూపవచ్చు. ఇదే సమయంలో ఏ దేశం, ఏ పాలకులు బాధ్యతా రహితంగా వ్యవహరించి తమ పౌరుల ప్రాణాల మీదకు తెచ్చారో తెలుసుకోవటం పౌరుల హక్కులలో ఒకటి. అందుకే మిగిలిన దేశాలు కూడా తామేమి చేసిందీ ప్రపంచ జన కోర్టుకు చెప్పాలి. చైనాతో పోటీ పడుతున్నామని చెప్పుకుంటున్న, చైనా తరువాత జనాభా రీత్యా రెండవ స్ధానంలో ఉన్న మన పాలకుల మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉందంటే ఏకీభవిస్తారా !
https://news.cgtn.com/news/2020-06-07/Full-Text-Fighting-COVID-19-China-in-Action-R7xr2aKsyA/index.html

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టుల సైద్ధాంతిక విబేధాల పరిష్కారం ఎలా ?

06 Wednesday May 2020

Posted by raomk in CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

communist ideological differences, communist ideological differences in India, Communist Party, Communists, CPI, CPI()M

Long live Marxism-Leninism and Mao Zedong thought! | Communist ...

ఎం కోటేశ్వరరావు
కారల్‌ మార్క్స్‌ 202వ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమంలో వచ్చిన ఒక పోస్టు దిగువ విధంగా ఉంది. ఒక జర్నలిస్టు తన వాల్‌ మీద షేర్‌ చేస్తే దాని నుంచి నేను తీసుకున్నాను. అభిమాని-కార్యకర్త మధ్య సంభాషణగా దీన్ని రాశారు, రచయిత పేరు తెలియదు. ఏ సందర్భంగా రాసినప్పటికీ దీనిలోని అంశాలు అనేక మందిలో ఉన్నాయనేది ఒక వాస్తవం. ఒక జర్నలిస్టుగా, పరిశీలకుడిగా కొన్ని అభిప్రాయాలను చర్చ కోసం పాఠకుల ముందు ఉంచుతున్నాను. నేను కమ్యూనిస్టు సిద్దాంత పండితుడిని కాదు కనుక పొరపాటు అభిప్రాయాలు వెల్లడిస్తే ఎవరైనా సరిచేయవచ్చు. ఇది సమగ్రం అని కూడా చెప్పలేను, ఒక అభిప్రాయం మాత్రమే.
పురోగామి, కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధి కోసం నూరు పూవులు పూయనివ్వండి నూరు ఆలోచనలను వికసించనివ్వండి అనే ఆలోచనతో ఏకీభావం ఉన్న వ్యక్తిగా చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని మనవి. అసలు పోస్టు ఏమిటో తెలియకుండా దాని మీద వ్యాఖ్యలు చేయటం వలన పాఠకులకు ఇబ్బందిగా ఉంటుంది కనుక ఆ పోస్టును ముందుగా ఉన్నది ఉన్నట్లుగా ఇస్తున్నాను. తరువాత అభిమాని ప్రశ్నలను అలాగే ఉంచి లేవనెత్తిన అంశాలకు మరో కార్యకర్త వివరణ రూపంలో నా అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు గమనించాలని మనవి. బుల్లెట్ల రూపంలో చిట్టి పొట్టి వివరణలు ఇచ్చి సందేహాలను తీరిస్తే మంచిదే కానీ, అన్ని వేళలా అది సాధ్యం కాదు. సాధ్యమై ఉంటే కాపిటల్‌ గ్రంధాన్ని అంత వివరంగా మార్క్స్‌ రాసి ఉండేవారు కాదు. దీన్ని కూడా చదివే ఓపికలేని అభిమానులు, కార్యకర్తల వలన ప్రయోజనం లేదు. కనుక ఓపిక, ఆసక్తి ఉన్నవారు మొత్తం చదవాలని మనవి. లేనట్లయితే ఇక్కడితోనే ముగించి మరింత ఉపయోగకరమైన విషయాలను చదువుకోవచ్చు.
(దిగువ ఉన్నది నేను స్వీకరించిన పోస్టు)
అభిమాని – కార్యకర్త – మధ్యలో మార్క్స్‌
అభిమాని: మన దేశంలో మార్క్స్‌ వారసులు ఎవరు?
కార్యకర్త: పదుల సంఖ్యలో ఉన్న అన్ని కమ్యూనిస్టు పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, సానుభూతిపరులు.
అభిమాని: మరి మార్క్స్‌ వారసులు ఇన్ని పార్టీల్లో ఎందుకున్నారు?
కార్యకర్త: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు ఉన్నాయి కాబట్టి.
అభిమాని: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు అంటే ఏమిటి?
కార్యకర్త: అవి తీవ్రమైనవి కాబట్టి, అంత సులభంగా అందరికీ అర్థం అయ్యేలాగా చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు వివరించడం అస్సలు సాధ్యం కాదు.
అభిమాని: ఈ తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు మార్క్స్‌ మౌలిక రచనల్లో ఏమైనా సమాధానాలు దొరుకుతాయా?
కార్యకర్త: మార్క్స్‌ మౌలిక రచనలు అంటే ఏమిటి?
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చాలా ఉన్నాయి. పోనీ ఇప్పటి వరకూ మీకు తెలిసిన, మీరు చదివిన మార్క్స్‌ రచనలు ఏంటో చెప్పండి?
కార్యకర్త: ఏంగెల్స్‌ తో కలిసి రాసిన కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో చదివాను. మార్క్స్‌ రాసిన ‘పెట్టుబడి’ గ్రంథాన్ని చూశాను, దాని గురించి విన్నాను, పూర్తిగా చదవలేదు. పెట్టుబడి గ్రంథంలోని మూడు వాల్యూమ్స్‌ బహుశా మా నాయకులు కూడా చదివి ఉండరు. మిగిలిన మౌలిక రచనల గురించి పెద్దగా తెలియదు.
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చదవకుండా, మార్స్కిస్టులమని చెప్పుకోవడం, మార్క్స్‌ కి జేజేలు పలకడం సబబేనా?
కార్యకర్త: రాముడిని నమ్మేవాళ్ళంతా రామాయణాన్ని చదవలేదు కదా!
అభిమాని: అది మతం, నమ్మేవారు భక్తులు. కానీ మార్క్సిజం ఒక శాస్త్రమని చెబుతున్నప్పుడు, మార్క్సిస్టులు భక్తులు కాదు కదా!
కార్యకర్త: ఇది ఆలోచించాల్సిన విషయమే అయినా, మరీ ఆ పోలికేంటి?
అభిమాని: మరైతే మౌలిక రచనల్ని చదవడం ప్రారంభిస్తే, వాటిలోనే ఈ సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు సమాధానం దొరుకుతుందేమో పరిశీలించండి.
కార్యకర్త: ఈరోజు మార్క్స్‌ జయంతి సందర్భంగా మా పార్టీ కూడా కొన్ని కార్యక్రమాల్ని రూపొందించింది. అవన్నీ పూర్తయ్యాక, మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను.
(పై పోస్టు మీద నా అభిప్రాయాలు దిగువ ఇస్తున్నాను)

అభిమాని – కార్యకర్తల సమన్వయమే మార్క్స్‌
అభిమాని: మన దేశంలో మార్క్స్‌ వారసులు ఎవరు?
కార్యకర్త: ఎక్కడైనా దోపిడీ సమాజాన్ని రూపు మాపాలని చిత్తశుద్దితో పని చేసే వారు, కోరుకొనే వారందరూ వారసులే, వారంతా కమ్యూనిస్టు పార్టీల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అందుకు ఉదాహరణకు లాటిన్‌ అమెరికా దేశాలు, అమెరికాలో, ఇతర చోట్ల మార్పుకోరుకొనే కమ్యూనిస్టేతర వామపక్ష శక్తులు కూడా వారసులే. మార్క్స్‌ వారసత్వానికి పేటెంట్‌ లెప్ట్‌ తప్ప రైట్‌ లేదు.
అభిమాని: మరి మార్క్స్‌ వారసులు ఇన్ని పార్టీల్లో ఎందుకున్నారు?
కార్యకర్త: ఈ ప్రశ్న గురించి చర్చించే ముందు ఒక ప్రశ్న. మార్క్స్‌ను అభిమానించే వారిలో కొందరే కార్యకర్తలుగా, ఎక్కువ మంది అభిమానులుగా ఎందుకు ఉన్నారో ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాలని మనవి. సమాజాన్ని స్ధూలంగా దోపిడీదారులు-దోపిడీకి గురయ్యేవారు అని చూస్తే దోపిడీదారులందరూ ఒకే పార్టీలో ఎందుకు లేరో కూడా ఆలోచించాలి. మార్క్సిజం పిడివాదం కాదు. అది నిరంతరం నవీకరణకు గురయ్యే ఒక శాస్త్రం. అది చెప్పినట్లు దోపిడీ సమాజం అంతం కావటం అనివార్యం తప్ప అది అన్ని చోట్లా ఒకే విధంగా ఒకే సారి జరుగుతుందని ఎక్కడా చెప్పలేదు. అలాంటి జోశ్యాలు కొన్ని తప్పాయి. కమ్యూనిస్టు ప్రణాళికను రాయటానికి ముందే జర్మనీలో, ఇతర దేశాల్లో కమ్యూనిస్టులు ఉన్నారు. అది రాసిన లేదా రాస్తున్న సమయంలోనే జర్మనీతో సహా అనేక ఐరోపా దేశాలలో తిరుగుబాట్లు జరిగాయి. వాటిలో కమ్యూనిస్టులు పాల్గొన్నారు గానీ నాయకత్వ పాత్రలో లేరు. జర్మన్‌ కమ్యూనిస్టు లీగ్‌ రెండు భావాల, సంస్ధల సమ్మిళితంగా ఏర్పడిన పార్టీ. ఆ మాటకొస్తే ప్రతి పార్టీ చరిత్రా అదే, స్థూలంగా కొన్ని అంశాలతో ఏకీభవించే వారు దగ్గరయ్యారు. విబేధాలు తలెత్తినపుడు విడిపోయారు. 1836 లో లీగ్‌ ఆఫ్‌ జస్ట్‌ పేరుతో పని ఏర్పడిన క్రైస్తవ కమ్యూనిజం, ఊహావాద కమ్యూనిజం భావాలతో ఉన్న జర్మన్‌ కార్మిక నేత కారల్‌ ష్కాప్పర్‌ నాయకత్వంలో దేవుని రాజ్యం ఏర్పాటు చేయాలనే సత్ససంకల్పంతో పారిస్‌లో ఏర్పడి పని చేసింది. ఈ సంస్ధతో కారల్‌ మార్క్స్‌ మరియు ఎంగెల్స్‌ ప్రధాన పాత్రధారులుగా ఉంటూ బెల్జియంలోని బ్రసెల్స్‌లో పని చేసిన కమ్యూనిస్టు కరస్పాండెన్స్‌ కమిటీ విలీనమై 1847లో కమ్యూనిస్టు లీగ్‌గా మారాయి. హైదరాబాద్‌ ఎలా వెళ్లాలి అని ఎవరినైనా అడిగిత నాలుగు దిక్కుల్లో ఉన్నవారు నాలుగు విధాలుగా చెబుతారు. బస్సుల గురించి తెలిసిన వారు బస్సుద్వారానే వెళ్లాలని చెబుతారు. అలాగే రైళ్లు, విమానాల వారు తమ పద్దతులను చెబుతారు. జర్మన్‌ కమ్యూనిస్టు లీగ్‌ ఏర్పడిన తరువాతే కమ్యూనిస్టు ప్రణాళిక రచన జరిగింది. అందువలన భిన్న ఆలోచనలు, భిన్న మార్గాలతో సమసమాజాన్ని స్ధాపించాలని ఐక్యమైన వారిలో ఎలా సాధించాలి అనే అంశంపై భిన్న అభిప్రాయాలు తలెత్తటం సహజం. అనేక పార్టీలు ఏర్పడటానికి ఇదే మూలం. ఈ మౌలిక అంశాన్ని ఎవరూ విస్మరించలేరు. ఎవరి మార్గం సరైనది అన్నది ఎక్కడికక్కడ ఆచరణలో తేలాల్సి ఉంది. అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఒకే సమయంలో ఉనికిలోకి వచ్చినా అన్ని చోట్లా విప్లవాలు జయప్రదం కాలేదు. అంతెందుకు నిజాం సంస్ధానంలో తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాలు ఉన్నాయి. నిజాం దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలుగా ఉన్న ప్రాంతంలోనే సాయుధ పోరాటం ఎందుకు పారంభమైంది. తెలంగాణాలో ఇతర చోట్లకు, మిగిలిన కన్నడ, మరాఠా ప్రాంతాలకు ఎందుకు విస్తరించలేదు. వారికి నిజాంపాలనపై ఎందుకు ఆగ్రహం రాలేదు. ఇలాంటి అంశాలన్నీ అధ్యయనం చేయాల్సినవి. పాఠాలు తీసుకోవాల్సినవి. కమ్యూనిస్టు పార్టీలు కానివన్నీ దోపిడీని కోరుకొనేవే. అలాంటపుడు ఇన్ని రకాల పార్టీలుగా వారంతా ఎందుకు ఉన్నారు ? దోపిడీని అంతం చేయటం ఎలా అన్న అంశంపై కమ్యూనిస్టు పార్టీలలో తేడాలు తెస్తే దోపిడీ చేయటం ఎలా అన్న విషయంలో మిగతా పార్టీల మధ్య అధికార కుమ్ములాటలే అన్ని పార్టీలుగా ఏర్పడటానికి కారణం.

Kisan Long March has given hope to comrades that they can rise ...

అభిమాని: తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు అంటే ఏమిటి?
కార్యకర్త: వాటిని అర్ధం చేసుకోవటం అంతకష్టమేమీ కాదు, సమాధానం చెప్పలేకపోతే కుత్తుకలను ఉత్తరించే అపూర్వ చింతామణి ప్రశ్న అసలే కాదు. అమెరికాలో ఉన్న కార్మికవర్గానికి- ఆదిలాబాద్‌ అడవుల్లో ఉన్న కార్మికవర్గ స్ధాయి, అవగాహన ఒకే విధంగా ఉండదు. మన నిచ్చెన మెట్ల సమాజంలో దళిత కార్మికుడి ఆలోచన, దళితేతర కార్మికుల ఆలోచన ఒకే విధంగా ఉండదు. ఇద్దరూ ఒకే ఫ్యాక్టరీలో పని చేస్తూ ఒకే దోపిడీకి గురవుతున్నా, దళితుడికి ప్రత్యేకమైన సామాజిక అణచివేత అదనపు సమస్యగా ఉంటుంది. ఏ దోపిడీని ముందు అంతం చేయాలన్న అంశపై ఏకాభిప్రాయం లేకపోవటమే ఒక సైద్దాంతిక విబేధం.ఇలా అనేక వాస్తవిక అంశాల మీద సమస్యలు తలెత్తాయి. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌కు వ్యతిరేకంగా సోవియట్‌ యూనియన్‌ నిలిచింది. దాని సరసనే బ్రిటన్‌ కూడా పోరాడింది. బ్రిటీష్‌ వారితో విబేధాలున్నా తొలి కార్మిక రాజ్యంతో కలసి పోరాడుతోంది, హిట్లర్‌ ముట్టడి సోవియట్‌ గురైంది కనుక బ్రిటీష్‌ వారికి మద్దతు ఇస్తే అది సోవియట్‌కు బలం చేకూర్చుతుందనే అభిప్రాయంతో క్విట్‌ ఇండియా పిలుపు సమయంలో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారు. ఇది ఒక సైద్దాంతిక సమస్య విబేధం. తరువాత కాలంలో అలా చేయటం తప్పని పాఠం నేర్చుకున్నారు. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో కొన్ని తేడాలున్నా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, సోషలిస్టులు మొత్తం మీద ఐక్యంగానే ఉన్నారు. తరువాత దేశంలో ఎలాంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలన్నదాని మీద ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ కాంగ్రెస్‌ వారే బ్రిటీష్‌ వారి పెట్టుబడులు, కంపెనీలకు రక్షణ కల్పించారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరి తీసుకోవాలి అన్న అంశం మీద కమ్యూనిస్టుల్లో భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఇవి అర్ధం చేసుకోలేనంతటి తీవ్రమైనవి కాదు. కాస్త పురోగమన భావాలతో అధికారంలో ఉన్నవారికి మరికాస్త ఊపునిస్తే వారే సోషలిజం తెస్తారన్న భ్రమలకు కొందరు లోనై చివరికి వారితోనే కలసిపోయారు. కాదు జనంలో అసంతృప్తి ఉంది, ఒక దగ్గర అంటిస్తే తాటాకు మంట మాదిరి విప్లవం వ్యాపించి అధికారానికి రావచ్చని కొందరు తుపాకి పడితే విప్లవం బదులు పొగ మాత్రమే వచ్చింది. ఈ రెండు ధోరణులతో జనానికి విశ్వాసం తగ్గిపోయింది, రెండు మార్గాలు కాదు మూడో మార్గంలో విప్లవం తేవాలని చెప్పిన వారు ఒక పెద్ద పార్టీగా ప్రత్యామ్నాయం చూపుతున్నా వారి మీద జనంలో విశ్వాసం కలగటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో అధ్యయనం చేయాలి. ఏనుగు ఎలా ఉందని అడిగితే ఏడుగురు అంధులు తాము తడిమిన ఏనుగు అవయవాలను బట్టి దాన్ని భిన్నంగా వర్ణించారు. వారు చెప్పింది వాస్తవమే అయినా ఏనుగు సమగ్ర రూపం కాదు. వివిధ ప్రాంతాలు, పరిస్ధితుల్లోని విప్లవకారుల అవగాహన కూడా అలాంటిదే. అయితే తాము చెప్పిందే ఏనుగు రూపం అని ఎవరికి వారు భీష్మించుకుంటే సమస్య పరిష్కారం కాదు, కలబోసుకొని అవగాహనకు రావాలి.

US govt report says Indian Maoists are world's sixth largest ...
అభిమాని: ఈ తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు మార్క్స్‌ మౌలిక రచనల్లో ఏమైనా సమాధానాలు దొరుకుతాయా?
కార్యకర్త: మార్క్స్‌ ఎంగెల్స్‌లు తమ కాలంలో పరిస్ధితులను అధ్యయనం చేసి కొన్ని రచనలు చేశారు. వాటిలో ఏవైనా ఇప్పటి పరిస్ధితులకు అన్వయించలేము అనుకుంటే వాటిని పక్కన పెట్టవచ్చు. ఆ రచనల్లో సూచన ప్రాయంగా ప్రస్తావించిన అంశాలు కొన్ని ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వారి తరువాత కాలంలో సామ్రాజ్యవాదం మరికొన్ని పాఠాలు నేర్పింది, రష్యా, చైనా విప్లవాలు, మన దేశంలో మూడు చోట్ల కమ్యూ నిస్టుల నాయకత్వంలో ప్రభుత్వాల ఏర్పాటు నుంచి తాజా లాటిన్‌ అమెరికా పరిణామాల వరకు ప్రతిదీ ఒక కొత్త పాఠాన్ని నేర్పేవే. ఒక నాడు హిందూమత దేశంగా ప్రకటించుకున్న నేపాల్‌లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఇస్లామిక్‌ రాజ్యాలుగా ప్రకటించుకున్న చోట అలాంటి పరిణామం జరగలేదు. మన దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చే యత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాలకు చెందిన వారిని సమీకరించటం ఎలా, వీటిలో కొన్ని సమాధానాలు ఇస్తుంటే మరికొన్నింటికి వెతకాలి. కావాల్సింది ఓపిక, ఎటిఎం కార్డు పెడితే మిషన్‌ నుంచి డబ్బువచ్చినట్లుగా సమాధానాలు దొరకవు. ఒక మిషన్‌లో ఏ నోట్లు ఎన్ని పెట్టాలో ముందే నిర్ణయం అయి వుంటుంది, నోట్లు కూడా ముందే ముద్రించి పెడతారు. సమస్యలు, వాటికి సమాధానాలు అలాంటివి కాదు. వీటిని కార్యకర్తలే కాదు అభిమానులు కూడా చర్చించవచ్చు, పరిష్కారాలను సూచించవచ్చు. అభిమానులకు ఆ వెసులు బాటు ఇంకా ఎక్కువ.
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చాలా ఉన్నాయి. పోనీ ఇప్పటి వరకూ మీకు తెలిసిన, మీరు చదివిన మార్క్స్‌ రచనలు ఏంటో చెప్పండి?
కార్యకర్త: ఒక కార్యకర్తగా అన్ని మౌలిక రచనలను పూర్తిగా చదవటం సాధ్యం గాకపోవచ్చు. మార్క్స్‌ మౌలిక రచనలు చదివితేనే చాలదు. వాటికి అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. వాటిలో కొన్ని తప్పుదారి పట్టించేవి కూడా ఉంటాయి. మార్క్సిజాన్ని ఒక దేశ పరిస్ధితులకు నిర్దిష్టంగా అన్వయించటం ఒక ఎత్తయితే దాన్ని అమలు జరిపే పార్టీ నిర్మాణం కావాలి. లాటిన్‌ అమెరికాలో మార్క్సిస్టు మేథావులు అలాంటి ఎత్తుగడలను రూపొందించి వామపక్ష శక్తులు అధికారానికి రావటానికి తోడ్పడ్డారు. కానీ ఆ విజయాలను పటిష్ట పరచుకొనేందుకు విప్లవాన్ని తీసుకు వచ్చేందుకు అవసరమైన పార్టీ నిర్మాణాలు జరగనందున అనేక ఎదురు దెబ్బలు తిన్నారు. అదొక లోపం. మార్క్సిజానికి సంబంధించి అనేక మౌలిక గ్రంధాలు ఉన్నాయి. ప్రతి సభ్యుడు, అభిమాని వాటిని చదివిన తరువాత కార్యాచరణ మొదలు పెట్టాలంటే జీవిత కాలాలు చాలవు. ఏది ముందు జరగాలి ? అధ్యయనమా ? కార్యాచరణా ? అని తర్కించుకుంటూ కూర్చునే వారు కుర్చీలకే పరిమితం అవుతారు. రెండూ కలగలిపి జరపాలి. పని చేసే క్రమంలో తలెత్తే సమస్యలకు పరిశీలన, అధ్యయనం చేయాలి. పని మాత్రమే చేసి మౌలిక అంశాలను అధ్యయనం చేయకపోతే విబేధాలు, కొత్త సమస్యలు,సవాళ్లు తలెత్తినపుడు గందరగోళపడి రెండింటికీ దూరమౌతారు.

In Defense of Communism: Kisan March
అభిమాని: మార్క్స్‌ మౌలిక రచనలు చదవకుండా, మార్స్కిస్టులమని చెప్పుకోవడం, మార్క్స్‌ కి జేజేలు పలకడం సబబేనా?
కార్యకర్త: ఇది పడక కుర్చీ వాదులు ముందుకు తెచ్చే వాదన. మార్క్సిస్టులం అని ఎవరైనా చెప్పుకుంటున్నారంటే దాని అర్ధం స్దూలంగా దోపిడీని నిర్మూలించాలనే ఆ సిద్దాంతాన్ని అంగీకరిస్తున్నామని. ఏమీ తెలియని ఒక కార్మికుడు, మహిళ పార్టీలోకి రావాలంటే కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ , ఇతర గ్రంధాలను చదవాలనే షరతు పెట్టటం అర్ధం లేని విషయం. నిరక్షరాస్యులు, అక్షర జ్ఞానం ఉన్నా, సాధారణ పుస్తకాలు కూడా చదవలేని వారెందరో ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో అనేక మంది నిరక్షరాస్యులు కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు సాయుధ దళాల్లో చేరి తరువాత చదువు నేర్చుకున్న వారు, మరింత పదును పెట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడైనా అనేక మంది కనీస నిబంధనలను అంగీకరించి సభ్యులుగా చేరిన వారు ఎందరో సైద్దాంతిక అంశాలను అధ్యయనం చేశారు. దేవాలయాలకు వెళ్లే వారందరూ భగవద్దీతను, సమాజు చేసే వారు ఖురాన్‌, చర్చ్‌లకు వెళ్లేవారందరూ బైబిల్‌ను పూర్తిగా చదవటం లేదు.
అభిమాని: అది మతం, నమ్మేవారు భక్తులు. కానీ మార్క్సిజం ఒక శాస్త్రమని చెబుతున్నప్పుడు, మార్క్సిస్టులు భక్తులు కాదు కదా!
కార్యకర్త: కచ్చితంగా కాదు. పార్టీలో సభ్యులుగా చేరే వారికి ఆయా ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటం అనర్హత కాదు. ఒకసారి పార్టీ సభ్యుడు అయిన తరువాత మతం, దేవుడు, దేవత విశ్వాసాల గురించి అధ్యయనం చేయించి వారిని హేతువాదులుగా, భౌతికవాదులుగా మార్చాలి, శాస్త్రీయ ఆలోచనతో పని చేసేట్లు చూడాలి. ఎక్కడైనా విఫలమైతే అది ఆయా స్ధాయిలో ఉన్న కార్యకర్తల, నాయకత్వ లోపం తప్ప పార్టీలోపం కాదు.
అభిమాని: మరైతే మౌలిక రచనల్ని చదవడం ప్రారంభిస్తే, వాటిలోనే ఈ సైద్ధాంతిక, రాజకీయ విభేదాలకు సమాధానం దొరుకుతుందేమో పరిశీలించండి.
కార్యకర్త: మౌలిక రచనల్లో అన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పలేము. అవి సాధారణ సూత్రీకరణలు వాటిని ఆయా దేశాలు, సమాజాలకు అన్వయించుకోవటంలోనే సమస్యలు వస్తున్నాయి. ముందే చెప్పుకున్నట్లు మన దేశంలో కుల వివక్ష, ఇతర సామాజిక అంశాల గురించి మౌలిక సిద్ధాంతాలలో పరిష్కారం దొరకదు. సైద్ధాంతిక భిన్నాభిప్రాయాలు ఉండటం ఒక మంచి లక్షణం. అంతర్గతంగా కొన్ని అంశాల మీద విబేధించినా కాల క్రమంలో వాటి గురించి అధ్యయనం చేయాలి. ఆచరణలో ఎవరి వైఖరి సరైనదో తేల్చుకుంటారు. అయితే ఒక అంశం మీద విబేధం ఉంది అది పరిష్కారం కాకుండా ముందుకు కదలటానికి వీల్లేదంటే కుదరదు. అది సైద్ధాంతిక సమస్య అయినా, ఎత్తుగడలకు సంబంధించింది అయినా మెజారిటీ అభిప్రాయాన్ని మైనారిటీ అంగీకరించి అమలు జరపాలి. కొన్ని సందర్భాలలో మెజారిటీ కూడా పొరపాటు పడవచ్చు. గుడ్డిగా అనుసరించటం హానికరం. పార్టీలు వేరైనా ఏకీభావం ఉన్న అంశాల మీద కలసి పని చేస్తున్నాం. వాటికి సైద్ధాంతిక సమస్యలను అడ్డంకిగా తేగూడదని భావిస్తున్నాం. ఆ క్రమంలో వాటిని పరిష్కరించుకుంటాం. సైద్ధాంతికంగా విబేధిస్తే వాటిని తర్కం ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ మీరు ద్రోహులు అని ముద్రవేసి ఇతరుల మీద సాయుధదాడులు చేయటం, హతమార్చటం కమ్యూనిస్టుల లక్షణం కాదు. అది వర్గశత్రువుకు ప్రయోజనం, కనుక అలాంటి వారితో చేతులు కలపటం సాధ్యం కాదు.

2011's most memorable images in China - China.org.cn
ఈ రోజు సైద్దాంతిక సమస్యలతో పాటు అసలు మొత్తంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్నే సవాలు చేసే పరిస్ధితులు మరోసారి వచ్చాయి. అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్ధకు ఎదురువుతున్న సవాళ్లకు పరిష్కారం మార్క్సిజంలో దొరుకుతుందా అని ఇంతకాలం ఆ వ్య వస్ధ మీద భ్రమలు ఉన్న వారు ఇప్పుడు మార్క్సిస్టు గ్రంధాల దుమ్ముదులుపుతున్నారు. అభిమానులుగా బయట ఉండి సలహాలు చెప్పటం మంచిదే. చెరువు గట్టు మీద ఉండి కబుర్లు చెప్పేవారికి దాని లోతు ఎంతో తెలియదు. కనుక చెప్పేది ఎక్కువ అయితే కొందరు బోధకులుగా మారతారు. మీరు కూడా కార్యకర్తగా ఒక్క అడుగు ముందుకు వేయండి, వాస్తవిక సమస్యలు అర్ధం అవుతాయి, విప్లవం మరింత ముందుకు పోతుంది. ఏ పార్టీ మంచిది ఏది సరైన దారి చూపుతుంది అని తేల్చుకొనేందుకు మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. ముందు కమ్యూనిస్టులు విబేధాలను పరిష్కరించుకురండి అప్పుడు ఆలోచిస్తాం అని కొందరు అభిమానులుగా చెప్పుకొనే వారు అంటారు. అది సానుకూలంగా చెప్పేవారు కొందరైతే ఆ పేరుతో తప్పించుకొనే వారు మరి కొందరున్నారని మాకు తెలుసు. కమ్యూనిస్టులు పోటీ చేసినపుడు అభిమానులం అని చెప్పుకొనే వారు కనీసం ఓటు కూడా వేయని వారిని చూస్తున్నాం. ప్రతికూల పరిస్ధితులు ఎదురైనపుడు తట్టుకొని నిలిచే వాడే కార్యకర్త. అభిమానులు కూడా అలాగే ఉండాలి. పార్టీ మంచి విజయాలు సాధిస్తే ఆహౌ ఓహౌ అనటం, ఎదురు దెబ్బలు తగిలితే మొహం చాటేయటం, నాయకులు ఏదో తప్పు చేశారని అనటం అభిమానుల లక్షణం కాకూడదు. మంచి చెడుల చర్చ ఆరోగ్యకర లక్షణం. అభిమానులు, కార్యకర్తలూ అందరికి అది ఉండాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కమ్యూనిస్టు భూతం – బెర్నీ శాండర్స్‌ !

26 Wednesday Feb 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

#BernieSanders 2020, 'Socialist' Bernie Sanders, 2020 US Elections, A specter is haunting US, Bernie Sanders 2020

Image result for communist specter
ఎం కోటేశ్వరరావు
”ఐరోపాను ఒక భూతం తరుముతోంది. అది కమ్యూనిస్టు భూతం. ఈ దయ్యాన్ని వదిలించుకొనేందుకు పాత ఐరోపాలోని అధికార శక్తులన్నీ ఒక పవిత్ర కూటమిగా ఏర్పడ్డాయి.పోప్‌, జార్‌, మెటర్‌నిచ్‌, గురుజోట్‌, ఫ్రెంచ్‌ రాడికల్స్‌,జర్మన్‌ పోలీసు గూఢచారుల వంటి అందరూ దానిలో ఉన్నారు. కమ్యూనిజాన్ని ఒక శక్తిగా ఐరోపా అధికార శక్తులన్నీ ఇప్పటికే గుర్తించాయి ” 1848 ఫిబ్రవరి21న తొలిసారిగా ప్రచురితమైన మార్క్స్‌-ఎంగెల్స్‌ కమ్యూనిస్టు (పార్టీ) ప్రణాళిక పైన పేర్కొన్న పదాలతో ప్రారంభం అవుతుంది. మతం, పాలకుల అండతో తర్జుమా, ముద్రితం అయిన బైబిల్‌ తరువాత ఆది నుంచీ మతం, పాలకుల వ్యతిరేకతను ఎదుర్కొని, కష్టజీవుల మద్దతుతో అత్యధిక భాషలలో తర్జుమా అయిన గ్రంధం కమ్యూనిస్టు ప్రణాళిక తప్ప మరొకటి లేదు. ఐదు అభ్యుదయ తెలుగు పుస్తక ప్రచురణ సంస్ధలు ఫిబ్రవరి 21రెడ్‌ బుక్స్‌ డే సందర్భంగా లక్ష కాపీలను ఉమ్మడిగా ప్రచురించి పాఠకుల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాయి. ఒకటి రెండు రోజుల్లోనే లక్ష కాపీలు అయిపోవటంతో మరో లక్ష ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచురణకర్తలు ప్రకటించారు.
కమ్యూనిస్టు భూతాన్ని అదుపు చేసి భూస్ధాపితం చేశామని మూడు దశాబ్దాల క్రితం సంబరపడిన కమ్యూనిస్టు వ్యతిరేకులందరినీ ఇది మరోసారి భయపెడుతోందంటే అతిశయోక్తి కాదు. అదెక్కడో కాదు, కమ్యూనిజంపై విజయం సాధించామని,ఏడు నిలువుల లోతున పాతి పెట్టామని సంబర పడుతూ ప్రకటించుకున్న అమెరికా గడ్డమీదే ప్రారంభమైంది.1848లో లండన్‌లోని బిషప్‌ గేట్‌ ప్రాంతంలో ప్రచురితమైన కమ్యూనిస్టు మానిఫెస్టో 1872లో 24 ఏండ్లకు గానీ ఆంగ్లంలో అమెరికాలో ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు అమెరికాలో లేదా మరోచోట ఏమి జరిగితే దాన్ని ప్రపంచమంతా చూసేందుకు, చదివేందుకు 24ఏండ్లు అవసరం లేదు. ఇరవై నాలుగు క్షణాలు చాలు. ఎవరి భాషలో వారు వెంటనే అనువదించుకొనే వెసులుబాటు కూడా అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో నేడు ఏమి జరిగితే రేపు ప్రపంచం దాన్ని అనుకరించుతుంది అని అనేక మంది చెబుతుంటారు. అలాంటపుడు అది సోషలిజం, కమ్యూనిజాలపై జరుగుతున్న మధనానికి ఎందుకు వర్తించదు ?
ఈ ఏడాది నవంబరు మూడవ తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. హిరణ్యకశ్యుపుడికి శ్రీహరి నామం వినపడితే తేళ్లూ జెర్రులు పాకినట్లు ఉండేదని, చివరికి కుమారుడు ప్రహ్లాదుడిని కూడా సహించలేదని పురాణాలు చెబుతాయి. అమెరికాలో గతశతాబ్దిలో సోషలిజం, కమ్యూనిజం పదాలు కూడా అలాంటివే. కార్పొరేట్ల కనుసన్నలలో మెలుగుతూ ప్రతిదాన్నీ డాలర్లతో సొమ్ము చేసుకొనే అక్కడి మీడియాకు ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా, వ్యతిరేకంగా అయినా ఆ పదాలను ఉచ్చరించకతప్పటం లేదు. అనేక మంది రచయితలు పరిణామాలు, పర్యవసానాలను మింగా కక్కలేకుండా ఉన్నారు. కమ్యూనిస్టు వ్యతిరేక ఇనుప తెరలను ఛేదించుకొని అమెరికా సమాజం బయట పడుతోందా ?
అమెరికా ఎన్నికల్లో ముందు పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం పన్నెండు మంది డెమోక్రటిక్‌ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. పార్టీకి చెందిన 3,979 మంది ప్రతినిధులలో ఒక అభ్యర్ధి ఎన్నిక కావాలంటే 1991 మంది మద్దతు అవసరం. ఒక వేళ ఎవరూ సాధించకపోతే సభ నిర్వహించి దాని ఓటింగ్‌ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. దీనిలో కూడా అవకతవకలకు ఎన్నో అవకాశాలుంటాయని వేరే చెప్పనవసరం లేదు. ఇది రాసిన సమయానికి యాభైకి గాను రెండు రాష్ట్రాలలో బెర్నీ శాండర్స్‌ విజయం సాధించారు. వంద మంది ప్రతినిధులు తమ ఓట్లు వేశారు. ఆరుగురు అభ్యర్ధులకు మాత్రమే ఓట్లు పడ్డాయి వారిలో బెర్నీశాండర్స్‌ 45,పేట్‌ బటిగెగ్‌ 25, జోబిడెన్‌ 15, ఎలిజబెత్‌ వారెన్‌ 8, ఆమీ కలుబుచర్‌ 7, తెచ్చుకున్నారు. ఒక్క ఓటూ తెచ్చుకోని న్యూయార్క్‌ నగర మాజీ మేయర్‌, కుబేరుల్లో ఒకడైన మైఖేల్‌ బ్లూమ్‌ బెర్గ్‌ తన అర్ధబలంతో అభ్యర్ధిగా నెగ్గాలని చూస్తున్నాడు. కార్పొరేట్‌ మీడియాను ఇప్పటికే పాకేజ్‌లతో కట్టడి చేశాడని స్పష్టమైంది.

Image result for bernie sanders 2020
టైమ్‌ మాగజైన్‌ విలేకరి చార్లెటీ ఆల్టర్‌ ఈ ఫలితాలను చూసిన తరువాత ఒక విశ్లేషణ చేస్తూ గత రెండు వారాలుగా 78ఏండ్ల సోషలిస్టు బెర్నీశాండర్స్‌కు అనేక మంది యువత ఎందుకు ఆకర్షితులౌతున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటూ కొన్ని అంశాలు రాశారు. వాటి సారాంశం ఇలా ఉంది.’ ప్రచ్చన్న యుద్ద సమయంలో (1991కి ముందు) పెరిగిన వారికి సోషలిజం జనాన్ని కమ్యూనిజానికి తీసుకుపోతుంది, కమ్యూనిజం అమెరికా స్వేచ్చకు ముప్పుగా పరిణమిస్తుంది అన్నట్లుగా కనిపించేది. అప్పుడు వారు సోషలిజం అంటే సోవియట్‌ యూనియన్‌, దాని నిర్బంధ శ్రామిక శిబిరాలు,లోపభూయిష్టమైన ఆర్ధిక వ్యవస్ద గురించి ఆలోచించేవారు. కానీ శాండర్స్‌ లేదా ఎలిజబెత్‌ వారెన్లకు మద్దతు పలుకుతున్న సహస్రాబ్ది యువతరం ఆ కథలతో పెరగలేదు. వారిలో పెద్ద వారు బెర్లిన్‌ గోడ కూల్చివేత సమయానికి ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్నారు. వారిలో అత్యధికులకు సోషలిజం అంటే ఐరోపాలోని అనేక ప్రాంతాలలో ఉన్న అందరికీ ఆరోగ్యం,శిశు సంరక్షణ,కళాశాల ఉచిత విద్య. నా వయస్సు వారికి సోషలిజం కాదు తిరోగమిస్తున్న పెట్టుబడిదారీ విధానం, జీవితాలను చితక్కొట్టిన ప్రభావం తెలుసు. 2008 ద్రవ్య సంక్షోభం సమయంలో వచ్చిన సహస్రాబ్ది యువతకు విద్యారుణాల భారం విపరీతంగా పెరిగింది, స్వంత ఇల్లు, కార్ల వంటి అనేక అంశాలకు తలిదండ్రులున్నారనే భరోసా లేదు.వాతావరణ సంక్షోభంతో సంఘర్షించారు, అది తమ పిల్లలు జీవించటానికి వీలులేని అనేక ప్రాంతాలను ప్రపంచంలో సృష్టించనుంది. అందుకే వారు వామపక్షం వైపు మొగ్గుతున్నారు. నేను ప్రజాస్వామ్య సోషలిజానికి అనుకూలంగా వాదించటం లేదు. ఒక జర్నలిస్టును, కార్యకర్తను కాదు. కానీ అనేక మంది ఈ ధోరణిని సంపూర్ణంగా అపార్ధం చేసుకున్నారు అని నాకు అర్ధమైంది.

Image result for bernie sanders : is really communist specter of america
సహస్రాబ్ది యువత తాము సోషలిస్టులమని చెప్పినపుడు దాని అర్ధం తాము ఎన్నుకున్న ప్రతినిధులు అందరికీ అందుబాటులో ఇండ్లు, ఆరోగ్య రక్షణ, కాలేజీ ట్యూషన్‌ ఫీజు, పర్యావరణ రక్షణకు గట్టిగా పాటుపడటం వంటి వాటిని నెరవేర్చేందుకు పని చేయాలని కోరుతున్నారని అర్ధం చేసుకోవాలి. ఇందుకోసం ధనికులపై అధిక పన్నులు వేయాలని కోరుతున్నారు. సామాజిక సమస్యల పరిష్కారం అమెరికా ప్రభుత్వం తాహతుకు మించినట్లుగా ఉందని చెబుతుంటారు. పురోగమన వాదులు కనీసవేతనాన్ని, ఆదాయపన్ను ప్రవేశ పెట్టారు, బాలకార్మిక వ్యవస్ధను నిర్మూలించారు. అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ సామాజిక భద్రతను ఏర్పాటు చేశారు, కోట్లాది మందిని రోడ్లు, వంతెనలు, పాఠశాలల నిర్మాణంలో నిమగం కావించారు. లిండన్‌ జాన్సన్‌ వృద్ధులకు ఆరోగ్య రక్షణ, పేదలకు వైద్యసాయం చేశారు. తప్పో వప్పో, ఇతర అమెరికన్ల మాదిరి మన వర్తమాన చరిత్రలో బెర్నీ శాండర్స్‌,ఎలిజబెత్‌ వారెన్‌ వంటి వారు పెద్ద సంస్ధాగత మార్పుల గురించి మాట్లాడుతున్నారు. మీకు వారు కోరుతున్నవాటిని అభిమానించకపోవచ్చు, కానీ, మంచి సమాజం కోసం పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు పెద్ద ఆలోచనలతో ఈ పురోగమనవాదులు కనీసం ప్రయత్నం చేస్తున్నారు.”
సోషలిజం పట్ల ప్రస్తుతం అమెరికన్‌ సమాజంలోని వృద్ధ తరాల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత మిగతా వారిలో లేదన్నది స్పష్టం. దీనర్ధం వారంతా సోషలిజానికి వెంటనే ఓటు వేస్తారని కాదు. సోవియట్‌ సోషలిస్టు విధానం గురించి వారు ఎన్నో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. అది అంతరించి పోయిన తరువాత పెట్టుబడిదారీ విధానం తమ జీవితాలను ఎలా అతలాకుతలం చేస్తున్నదో ప్రత్యక్షంగా చూశారు. అదింకేమాత్రం తమను అభివృద్ధి చేయలేదనే అభిప్రాయాన్ని కలిగిన వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. పెట్టుబడిదారీ విధాన సమర్దకులు వారిలో ఆ వ్యవస్ధ పట్ల విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నారు. అమెరికా పాలకవర్గం చైనా కమ్యూనిస్టు పార్టీ మీద ఒక వైపు సైద్ధాంతిక దాడి చేస్తున్నది. మరొక వైపు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోక తప్పని స్ధితిలోకి అమెరికాను నెట్టింది. గతంలో సోవియట్‌ కాలంలో ఇలాంటి పరిస్ధితి లేదు. ప్రతి వస్తువుకూ చైనాపై ఆధారపడుతూ అక్కడి సోషలిజం విఫలమైంది అంటే నమ్మేవారు లేరు. రోజు రోజుకూ అది తమతో పోటీపడగలిగిన బలమైన ఆర్ధిక వ్యవస్ధగా తయారు కావటాన్ని యువతరం, ఇతరులు గమనిస్తున్నారు. అమలులో లోపాలు లేకపోతే సోషలిస్టు వ్యవస్ధలో సంక్షేమ చర్యలను అమలు జరపవచ్చని నమ్ముతున్నారు. అందుకే మిగతా దేశాలలోని కమ్యూనిస్టుల మాదిరి వారు సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన ఎదురుదెబ్బల గురించి తల్లడిల్లటం లేదు. సోషలిజం పట్ల అభిమానం పెంచుకుంటున్నారు. అయితే అది కమ్యూనిస్టు పార్టీలు చెప్పే పద్దతుల్లోని వ్యవస్ధా ? అమెరికన్‌ పెట్టుబడిదారీ వర్గం ఆ భావజాల వ్యాప్తిని అనుమతిస్తుందా ? ఇలాంటి అనేక సందేహాలు బయటివారికి కలగటం సహజమే. మౌలిక వర్గ వ్యవస్ధకు ముప్పు కలగనంత వరకు ఏ దేశంలో అయినా పురోగామి శక్తులను పాలకవర్గాలు అనుమతించాయి. తరువాతే అణచివేతకు పూనుకున్నాయి. అమెరికా దానికి మినహాయింపు ఎలా అవుతుంది? తమ అనుభవాల నుంచి సోషలిజం పట్ల అభిమానం పెంచుకున్న వారు దానికి ప్రతిఘటన ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో, ముందుకు పోవాలో, సరైన దారిలో నడవకపోతే మార్పు గురించి ఆలోచించలేరా ? ప్రతి దేశంలో విప్లవాలు గానీ, సోషలిస్టు వ్యవస్ధల నిర్మాణాలు గానీ ఆయా దేశాల పరిస్ధితులను బట్టి ఉంటాయి తప్ప ఒక నమూనా లేదు. చైనా వంటి దేశాలలో తొలి రోజుల్లో సోషలిస్టు వ్యవస్ధ ఎదుర్కొన్న సవాళ్లు-అక్షరాస్యత, వైద్యం వంటి సమస్యలు – అమెరికా లేదా అభివృద్ధి చెందిన ఐరోపా సమాజాలకు ఎదురు కావు.

Image result for bernie sanders 2020
దాదాపు శతాబ్దం పాటు సోషలిజం, కమ్యూనిజాలను భూతాలుగా చూపుతూ భయపెట్టిన స్ధితిని ఛేదించుకొని నేడు అమెరికాలో సోషలిజం ప్రాచుర్యం పొందుతోంది.అన్ని జీవన రంగాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోశారు. మన దేశంలో చార్వాకులు, వారి సిద్ధాంతాలను అణచివేసి వారిని నిందించే క్రమంలో రాసిన వాటి ఆధారంగానే వారేమి చెప్పారనే అంశాలను ఒక చోటికి పేర్చి అర్ధం చేసుకున్నట్లుగా అమెరికాలో పురోగమన వాదుల గురించి వారేమి చెబుతున్నారనేదాని కంటే వారిని ఎలా దూషించారు అనే అంశాలకే మీడియా ప్రాధాన్యత ఇస్తోంది గనుక సమగ్ర సమాచారం పొందటంలో సమస్యలు ఎదురవుతున్నాయి. బెర్నీ శాండర్స్‌ చెప్పేది శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతానికి అనుగుణ్యంగా ఉందా మరొకటా అన్నదానిని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. సోషలిజాన్ని సాధించటానికి ఎన్నో దశలు ఉన్నట్లుగానే, సమాజంలోని వ్యక్తులు శాస్త్రీయ సోషలిస్టు పద్దతుల్లో తయారు కావటానికి కూడా ఎన్నో దశలు ఉంటాయి. ముందే ఫలానా విధంగా ఉంటేనే నిన్ను సోషలిస్టు శిబిరంలోకి రానిస్తాము, సోషలిస్టుగా పరిగణిస్తాము అంటే కుదరదు. మౌలికమైన అంశం దోపిడీని అంతం చేయాలి, సామాజిక న్యాయం సాధించాలి వంటి అంశాలతో ఏకీభావం వుందా వ్యతిరేకత ఉందా అన్నది గీటురాయిగా ఉండాలి. అమెరికాలో సోషలిస్టు అంటే ఎయిడ్స్‌ వచ్చిన వ్యక్తిగా చూస్తున్న దశలో నేను సోషలిస్టునే అని చెప్పుకొనేందుకు, పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, సోషలిస్టు వ్యవస్ధకు ఒకసారి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అంటూ యువత ముందుకు రావటాన్ని ఆహ్వానించాలా లేదా ?
బెర్నీ శాండర్స్‌ ఒక కమ్యూనిస్టు, ప్రచ్చన్న యుద్ద కాలంలో సోవియట్‌ యూనియన్‌తో ముడి వేసుకున్నాడు అని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ మీడియా ప్రచారం చేస్తోంది. ట్రంప్‌ పుట్టుకతోనే అబద్దాల కోరు, నేను కమ్యూనిస్టును కాదు, మాస్కోతో ముడివేసుకోలేదు,అయితే యరోస్లావల్‌ నగరంతో సోదర పట్టణ కార్యక్రమం కింద సోవియట్‌ యూనియన్‌ సందర్శించాను అక్కడ జరిగిన కార్యక్రమంలో అమెరికా విదేశాంగ, దేశీయ విధానాలను విమర్శించాను తప్ప మరేమీ లేదని శాండర్స్‌ వ్యాఖ్యానించాడు. ఒక వేళ మీరు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి అయితే నేను ప్రజాస్వామ్య సోషలిస్టును అని గర్వంగా చెప్పుకుంటాను అని గతంలో అన్న దానితోనే ప్రచారం చేస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించాడు. అనేక అంశాలను చూస్తే మనది ఇప్పటికే సోషలిస్టు సమాజం, మనకు పెద్ద బడ్జెట్‌ ఉంది, అన్ని రంగాలకు నిధులు ఖర్చు చేస్తున్నాము అని శాండర్స్‌ చెప్పాడు. దీనిలో అనేక తిరకాసులు లేకపోలేదు.అమెరికన్‌ మీడియా, డెమోక్రటిక్‌ పార్టీలోని ప్రత్యర్దులు శాండర్స్‌ నోటి వెంట సోషలిస్టును అనిపించాలని చూస్తున్నారు, అలా చెబితే ఎన్నికల్లో దాన్నొక అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దంగా ఉన్నారు. కొన్ని అంశాలలో పురోగామి వైఖరిని ప్రకటిస్తూ మరియు జనం కోరుతున్న డిమాండ్లను ముందుకు తెస్తున్న ఒక పురోగామి, సంస్కరణ వాది శాండర్స్‌ అని చెప్పవచ్చు. అమెరికా రాజకీయాల్లో అలాంటి వారు ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు రావటమే పెద్ద మార్పునకు సంకేతం.

Image result for bernie sanders : is really communist specter of america
శాండర్స్‌ గురించి అనేక మంది భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శాండర్స్‌ను కమ్యూనిస్టుగా వర్ణించటాన్ని ఆయన మద్దతుదారులు అంగీకరించటం లేదు, ఒక ప్రజాస్వామిక సోషలిస్టు, ఐరోపాలో అనేక మంది అర్ధం చేసుకుంటున్నట్లుగా శాండర్స్‌ వెనెజులా లేదా ప్రపంచంలోని ఇతర మరొక కమ్యూనిస్టు అనే కంటే స్వీడన్‌ సోషలిస్టులకు దగ్గరగా ఉంటారు అని న్యూస్‌ వీక్‌ పత్రికలో రాసిన జాసన్‌ లెమన్‌ అభిప్రాయ పడ్డారు. ఒక విధంగా ట్రంప్‌ చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం కావచ్చు. నోర్డిక్‌ తరహా సోషల్‌ డెమాక్రాట్‌ శాండర్స్‌ అనేది అబద్దం కనుక కమ్యూనిస్టు అని ట్రంప్‌ చెప్పి ఉండవచ్చు అని లెమన్‌ అంటారు.
శాండర్స్‌ తాను సోషల్‌ డెమోక్రాట్‌ కంటే డెమోక్రటిక్‌ సోషలిస్టును అని చెప్పుకుంటాడు. నోర్డిక్‌ సోషల్‌ డెమాక్రాట్స్‌ సంక్షేమ రాజ్యాన్ని కోరుకుంటారు, పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తారు. ప్రభుత్వ అదుపును వ్యతిరేకిస్తారు. శాండర్స్‌ విషయానికి వస్తే పెట్టుబడిదారీ విధానానికి స్వస్తి పలకాలనే అభిప్రాయాలను బలపరిచాడు. ప్రయివేటు ఆస్ధిని రద్దు చేయాలని, ఆర్ధిక వ్యవస్ధ మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండాలని చెబుతాడు. కమ్యూనిస్టు కాస్ట్రో, ఇతర నేతలను శాండర్స్‌ బలపరిచాడు, తాను మేయర్‌గా ఉన్న సమయంలో తన కార్యాలయంలో సుత్తీ కొడవలి ఉన్న ఎర్రజెండాను వేలాడతీశాడు.నాటి సోవియట్‌ యూనియన్‌ అసమ్మతివాదులను కలిసేందుకు నిరాకరించాడు. నోర్డిక్‌ సోషల్‌ డెమోక్రాట్స్‌ వ్యతిరేకించారు. ఇలాంటి అనేక అంశాలు ఉన్నందున శాండర్స్‌ను పూర్తిగా కొట్టి పారవేయటం వలన ప్రయోజనం లేదు. సోషలిస్టు మహాప్రస్తానంలో ఎవరు ఎంత వరకు వస్తే వారిని అంతవరకు కలుపుకుపోవాలి తప్ప, అన్నీ సక్రంమంగా ఉంటేనే అంగీకరిస్తామనటం విప్లవానికి తోడ్పడదు.
ఇప్పుడున్న పరిస్ధితుల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున శాండర్స్‌ అభ్యర్ధిగా ఎన్నిక అవుతారని అనేక మంది విశ్వసిస్తున్నారు. అది అంత తేలిక కాదు, ఎన్నో ఆటంకాలను అధిగమించాల్సి ఉంది. ఎవరూ భ్రమలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఒక వేళ నిజంగానే అభ్యర్ధిగా ఎంపిక అయితే అమెరికా చరిత్రలో అదొక అనూహ్యపరిణామమే అవుతుంది. అలాంటిది సాధ్యమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోషలిస్టు తాతయ్యకే మద్దతు అంటున్న అమెరికా మనవళ్లు !

19 Sunday Jan 2020

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, capitalism or socialism, chin peng, Nicolás Maduro, Pedro Sanchez, Venezuela, Young People Embracing Socialism

Image result for generation z and millennials support to bernie sanders
ఎం కోటేశ్వరరావు
ఐరోపాను కమ్యూనిస్టు భూతం భయపెడుతున్నదని కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో వ్యాఖ్యానించారు. కమ్యూనిజాన్ని అంతం చేసి విజయం సాధించామని అమెరికా ప్రకటించుకుంది. కానీ ఇప్పుడు అక్కడే కమ్యూనిస్టు భూతం భయపెడుతోందంటే అతిశయోక్తి కాదు. సోషలిస్టు వ్యవస్ధలకు, కమ్యూనిస్టు సిద్దాంతానికి తగిలిన ఎదురు దెబ్బలు అనేక మందిని నిరాశకు గురి చేశాయి. సమాజం పారే నది వంటిది అనుకుంటే కొత్త నీరు వచ్చి పాత నీటిని వెనక్కు నెట్టేస్తుంది. అనేక దేశాల్లో జరుగుతున్న పరిణామాలు నిరాశకు గురైన వారిలో ఆశలు చిగురింప చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. నాలుగు ఖండాలలోని కొన్ని దేశాలలో ఇటీవలి పరిణామాలను ఒక్కసారి అవలోకిద్దాం, ఆలోచనలకు పదును పెడదాం.
అమెరికా పాలకవర్గాన్ని, దాన్ని ఆశ్రయించి బతికే పరాన్న జీవులైన మేథావులకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఏమిటి? చైనాతో వాణిజ్య యుద్దంలో ఏమి చేయలేక ఆయాస పడటమా, ప్రపంచంలో తమ పలుకుబడి తగ్గి ప్రతిఘటన పెరుగుతోందనే ఆందోళనా, మరొకటా, మరకొటా ? ఇవేవీ కాదు, తమ యువతరంలో పెట్టుబడిదారీ విధానం పట్ల దిగజారుతున్న విశ్వాసం, సోషలిజం పట్ల పెరుగుతున్న మక్కువ అంటే అతిశయోక్తి కాదు. అఫ్‌ కోర్సు అమెరికా ప్రచారాన్ని నమ్మి దాన్నే మెదళ్లకు ఎక్కించుకున్న వారు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిని కొత్త నీరు వెనక్కు నెట్టేస్తుంది.
జనవరి రెండవ వారంలో బ్రిటీష్‌ మార్కెట్‌ పరిశోధనా సంస్ధ ”యుగవ్‌ ” నిర్వహించిన ఒక సర్వేలో 23-38 సంవత్సరాల యువతరం( మిలీనియనల్స్‌)లో ప్రతి ఇద్దరిలో ఒకరు సోషలిజానికి మద్దతు ఇస్తున్నారని తేలింది. అంతకంటే కమ్యూనిస్టు వ్యతిరేకులు గుండెలు బాదుకొనే అంశం ఏమంటే ఈ యువతలో 36శాతం మంది కమ్యూనిజానికి జై కొట్టడం. అమెరికన్లు ఏర్పాటు చేసిన అనేక సంస్ధలలో ‘కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌’ ఒకటి. దీని పనేమిటో చెప్పక్కర లేదు. ఆ సంస్ధ కార్యనిర్వాహక డైరెక్టర్‌ మరియాన్‌ స్మిత్‌ సర్వే వివరాల గురించి ఒక ప్రకటన చేశాడు.” సోషలిజం, కమ్యూనిజాల ప్రమాదాల గురించి చారిత్రాత్మక విస్మృతి ఈ నివేదికలో పూర్తిగా కనిపిస్తోంది. గత శతాబ్దిలో కమ్యూనిస్టు పాలకుల చేతుల్లో పది కోట్ల మంది బాధితులయ్యారనే చారిత్రాత్మక నిజం గురించి మన యువతరానికి తెలియ చెప్పనట్లయితే వారు మార్క్సిస్టు సిద్దాంతాలను అంగీకరిస్తే మనం ఆశ్చర్యపోనవసరం లేదు.” అన్నాడు. పది కోట్ల మందిని కమ్యూనిస్టులు చంపారనే తప్పుడు ప్రచారం నిత్యం ఇంటర్నెట్‌తో అనుబంధం ఉన్న యువతీ యువకులకు తెలియంది కాదు, అవన్నీ కట్టుకధలని కొట్టి పారవేస్తూ నేటి యువత సోషలిజం పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారనే చారిత్రక సత్యాన్ని గుర్తించ నిరాకరిస్తున్నారు.
ప్రయివేటు ఆస్ధులన్నింటినీ రద్దు చేస్తే సమాజం మెరుగ్గా ఉంటుందని మిలీనియల్స్‌లో 22శాతం మంది, ఉన్నత విద్య ఉచితంగా అందించాలని జడ్‌ తరం(1997-2012 మధ్యలో పుట్టిన వారు)లో 45శాతం మంది భావిస్తున్నారని కూడా తాజా సర్వే వెల్లడించింది. ఇరవయ్యవ శతాబ్దపు సోషలిస్టు ప్రయోగాలను చూసిన తరువాత కూడా ఆ సోషలిస్టు భావజాలం ఇంకా ఆకర్షిస్తూనే ఉండటం, ప్రభుత్వ పాఠశాలలు, మీడియా, సాధారణ సంస్కృతి కారణంగా పెద్ద ఎత్తున సామాజీకరణ పెరగటంతో ఈ భావజాలం విశాల ఆమోదం పొందింది, ఇప్పుడది రానున్న తరాలకు ఒక పటిష్టమైన ఓటు తరగతిగా మారుతోంది, గతంలో సోషలిస్టు ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు విరుచుకుపడినట్లుగా అదే పద్దతుల్లో అమెరికా ఇప్పుడు చేయలేదు అని సర్వేపై విశ్లేషణ చేసిన ఒక రచయిత పేర్కొన్నాడు.
అమెరికాలో 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిగా సెనెటర్‌, తాను సోషలిస్టు అని చెప్పుకున్న బెర్నీ శాండర్స్‌ పోటీ పడ్డారు. చివరకు హిల్లరీ క్లింటన్‌ వైపు ఆ పార్టీ మొగ్గింది. తిరిగి ఈ సారి కూడా 78 సంవత్సరాల బెర్నీ శాండర్స్‌ పోటీ పడుతున్నారు. చివరకు ఏమి జరుగనుందో తెలియదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే గత ఎన్నికల్లో బెర్నీ శాండర్స్‌ రంగంలో లేనందుకు యువత నిరాశ చెందలేదు, తరువాత జరిగిన అనేక సర్వేలలో సోషలిజం పట్ల ఆకర్షితులౌతున్నవారి శాతం పెరుగుతోందే తప్ప తగ్గలేదు. ఎందుకీ పరిణామం అంటే పెట్టుబడిదారీ విధాన వైఫల్యం, దాని పట్ల మోజు తగ్గటమే కారణం. అయితే నాలుగు పదులు దాటిన వారిలో అత్యధికులు పెట్టుబడిదారీ విదానం పట్ల ఇంకా మొగ్గు చూపుతూనే ఉన్నారు. చదువుకోసం చేసిన రుణాలు గుదిబండలుగా మారటం, వేతనాల స్థంభన ముఖ్యమైన కారణాలుగా చెబుతున్నారు.జడ్‌ తరం, మిలీనియల్స్‌లో అత్యధికులు తాము సోషలిస్టు అభ్యర్ధికే ఓటు వేస్తామని ఎటు తిప్పి ఎటు ప్రశ్నించినా ప్రతి సర్వేలో చెబుతున్నారు.
సూపర్‌ మనీ అనే సంస్ధ చేసిన విశ్లేషణ ప్రకారం 1974 నుంచి 2017 మధ్యకాలంలో 24-34 సంవత్సరాల వారికి ద్రవ్యోల్బణ సవరింపు తరువాత వార్షిక సగటు నిజవేతనాలు 35,426 నుంచి 35,455 డాలర్లకు అంటే కేవలం 29 డాలర్లు మాత్రమే పెరిగాయి. అదే కాలంలో 35-44 సంవత్సరాల వారికి 2,900 డాలర్లు, 45-54 వారికి 5,400 డాలర్లు పెరిగాయి. పెరుగుతున్న జీవన వ్యయంతో పోల్చితే వేతనాల పెరుగుదల అన్ని వయస్సుల వారిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ యువతరంలో మరింత ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్‌ లోన్‌ హీరో సంస్ధ విశ్లేషణ ప్రకారం అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ట్యూషన్‌ ఫీజు 1980 -2018 మధ్య కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 213, ప్రయివేటు కాలేజీల్లో 129శాతం పెరిగింది. విద్యకోసం చేసిన రుణాల మొత్తం 1.5లక్షల కోట్ల డాలర్లు, అంటే సగటున 29,800 డాలర్లు. అప్పుచేసి డిగ్రీ సంపాదించి ఉద్యోగం పొంది రుణం తీర్చుదామని వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయని సగం మంది మిలీనియల్స్‌ అభిప్రాయపడుతున్నారు. నలభై సంవత్సరాలలో ఇండ్ల ధరలు నలభైశాతం పెరిగాయి. వాయిదాలు చెల్లించలేమనే భయంతో ఇళ్లు కొనుక్కోవటాన్ని కూడా వారు వాయిదా వేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నవారిని చూసిన తరువాత అసలు తమకు పిల్లలు వద్దని 13శాతం అమెరికన్లు భావిస్తున్నట్లు గతేడాది న్యూయార్క్‌ టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అన్ని రకాల జీవన వ్యయం పెరగటం, అందుకు అనుగుణ్యంగా ఆదాయాలు పెరగకపోవటంతో ఓటర్లు వామపక్ష భావజాల అభ్యర్దులవైపు మొగ్గుతున్నారని వ్యాఖ్యాతలు నిర్ధారణకు వస్తున్నారు.
డెమోక్రటిక్‌ పార్టీనేత బెర్నీ శాండర్స్‌ తన ప్రచారంలో ఆర్ధిక అసమానతల తగ్గింపు, అందరికీ వైద్యం, ధనికులపై పన్ను పెంపు వంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. డెమోక్రటిక్‌ పార్టీ ఇతర నేతలు కూడా ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్య, విద్యార్ధి రుణాల రద్దు, పిల్లలందరికీ సామూహిక ఆరోగ్యబీమా వంటి అంశాలను ప్రస్తావించక తప్పటం లేదు. ట్రంప్‌ ప్రభుత్వం విద్యార్ధి రుణాల వ్యవస్ధను మౌలికంగా దెబ్బతీసిందని విమర్శిస్తూ ఆ విభాగంలో పని చేస్తున్న అధికారి ఏ వేయనె జాన్సన్‌ గతేడాది నవంబరులో రాజీనామా చేశాడు.
అమెరికా యువత సోషలిజం పట్ల మక్కువ చూపటానికి కారణం ఏమంటే కాలేజీల్లో ప్రొఫెసర్లలో ఎక్కువ మంది వామపక్ష భావాలు కలిగి ఉండటం అని కొంత మంది తడుముకోకుండా వెంటనే చెప్పేస్తారు. ఎక్కడైనా కొన్ని సంస్ధలలో ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు, యావత్‌ దేశమంతటా అదే పరిస్ధితి ఉందా ? స్వేచ్చా మార్కెట్‌ను సమర్ధించే ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ గ్లాసెర్‌ ఈ అభిప్రాయాన్ని పూర్వపక్షం చేశారు. అనేక విధాలుగా ఆధునిక అమెరికా ఆర్ధిక వ్యవస్ధ యువత సంక్షేమానికి అనుగుణ్యంగా పని చేయటం లేదు. అనేక ప్రభుత్వ విధానాలు ఉద్యోగం పొందాలంటే ఆటంకంగా ఉన్నాయి, డబ్బు పొదుపు చేసుకోవాలన్నా , ఇల్లు కొనుక్కోవాలన్నా కుదరకపోవటం యువతరాన్ని ఆదర్శభావజాలం గురించి ఆలోచింపచేస్తున్నది, ఒకసారి సోషలిజం ఎలా ఉంటుందో ఎందుకు ప్రయత్నించి చూడకూడదు అనుకుంటున్నారని గ్లాసెర్‌ అంటున్నారు. ప్రచ్చన్న యుద్ద సమయంలో సోషలిజం గురించి చర్చ ఉండేది కాదు, ఎందుకంటే దాన్ని ఒక దుష్ట ప్రభుత్వంగా చూసి వ్యతిరేకించాము. సోవియట్‌ యూనియన్‌లో పేదరికం, అణచివేత కారణంగా ఆ వ్యవస్ధ ఆచరణ సాధ్యం కాదని భావించాము. ఆ జ్ఞాపకాలు లేనివారికి, ప్రస్తుతం 30 సంవత్సరాల లోపు ఉన్న అందరికీ అలాంటిది లేదు అని గ్లాసెర్‌ వాపోయాడు.

Image result for Pedro Sanchez
” స్పెయిన్‌లో మార్క్సిస్టు కమ్యూనిజం పునర్జన్మించింది ”
కమ్యూనిస్టు వ్యతిరేకులు పురోగామి శక్తుల ఉనికిని సహించలేకుండా ఉన్నారు.” బెర్లిన్‌ గోడ కూల్చివేతతో నాశనం అయిందనుకున్న మార్క్సిస్టు కమ్యూనిజం తిరిగి ఆవిర్భవించింది, స్పెయిన్‌లో పాలన సాగించటం ఖాయం, నవంబరులో సంకీర్ణ కూటమి ఎన్నికైనపుడు అనుకున్న లేదా విశ్వసించిన దాని కంటే పరిస్ధితి ఇప్పుడు మరింత తీవ్రంగా ఉంది ” అని స్పానిష్‌ బిషప్పుల సంఘం ఉపాధ్యక్షుడు కార్డినల్‌ ఆంటోనియో కానిజారెస్‌ లొవెరా వ్యాఖ్యానించాడు. ఈనెల 11న మత వెబ్‌ సైట్‌లో పోస్టు చేసిన లేఖలో ఈ అభిప్రాయాలను వెల్లడించాడు. వెనిజులా వంటి లాటిన్‌ అమెరికా దేశాల తప్పుల తడకలతో ఉన్న సోషలిస్టు విధానాలను దాదాపుగా స్పెయిన్‌ కాపీ చేస్తున్నదని భావిస్తున్నారు. స్పెయిన్‌ను స్పెయిన్‌గా ఉంచకుండా ఒక ప్రయత్నం జరుగుతోందని ఎంతో బాధతో చెబుతున్నా మరియు హెచ్చరిస్తున్నా. అంతర్యుద్ధం తరువాత నియంత్రత్వం నుంచి ప్రజాస్వామ్యానికి మారాలన్న స్ఫూర్తి ఖాళీ అయింది, మరచిపోయారు. ఎల్లవేళలా విభజించే మరియు ఎన్నడూ ఐక్యం కానివ్వని భావజాలంతో నింపేస్తున్నారు అని ఆరోపించాడు. మరుసటి రోజు మరొక ఆర్చిబిషప్‌ జీసస్‌ శాంజ్‌ మాంటెస్‌ మరొక లేఖ రాస్తూ చరిత్రలో దేశం మరొక తీవ్ర పరిస్ధితిలోకి పోతున్నదని, వివిధ పద్దతుల్లో స్వేచ్చను పరిమితం చేస్తున్నారని ఆరోపించాడు.ఈ నెల ఎనిమిది పోడెమాస్‌తో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సోషలిస్టు పార్టీ నేత పెడ్రో శాంఛెజ్‌ ప్రధానిగా పదవీ స్వీకారం చేస్తూ సాంప్రదాయకమైన శిలువ, బైబిల్‌ మీద ప్రమాణం చేసేందుకు తిరస్కరించాడు. పాఠశాల విద్య పాఠ్యాంశాల నుంచి మతాన్ని తొలగించటంతో సహా లౌకిక విధానాల అజెండాను అమలు జరుపుతామని ప్రకటించాడు. అంతే కాదు, గతంలో అక్రమంగా చర్చ్‌లకు దఖలు పరచిన ఆస్తులను జాతీయం చేస్తామని, విద్యార్ధులకు లైంగిక విద్యను బోధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చర్యలు సహజంగానే చర్చ్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి సోషలిస్టు పార్టీ గతంలో కూడా అధికారంలోకి వచ్చింది. కొన్ని పురోగామి సంస్కరణలు తప్ప అదేమీ విప్లవకార్యాచరణను చేపట్టటం లేదు. అయినా మతం ఆగ్రహిస్తోంది.

Image result for chin peng
మలేసియాను భయపెట్టిన కమ్యూనిస్టు చితా భస్మం !
కమ్యూనిస్టు వ్యతిరేకులకు కమ్యూనిస్టులే కాదు చివరకు వారి చితా భస్మం కూడా భయపెడుతోందా ? అవును మలేషియాలో అదే జరిగింది. వృద్ధాప్యంతో మరణించిన పూర్వపు మలేషియా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్‌ పెంగ్‌ చివరి కోర్కె మేరకు ఆయన మరణించిన ఆరు సంవత్సరాల తరువాత థారులాండ్‌ నుంచి తెచ్చిన చితాభస్మాన్ని సముద్రంలోనూ, పెంగ్‌ సాయుధపోరాటం సాగించిన అడవుల్లోనూ గతేడాది సెప్టెంబరు 16న చల్లినట్లు ఒక వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఈ వార్తతో పాటు 1989లో సాయుధ పోరాటాన్ని విరమించి మూడు దశాబ్దాలు గడిచిన సందర్భంగా దానితో సంబంధం ఉన్న వారు, దాని గురించి తెలిసిన వారు మలేషియాలో కొన్ని చోట్ల సభలు జరిపారని మీడియా పేర్కొన్నది. వారిలో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంకే ముంది ఇవన్నీ మలేషియాలో తిరిగి కమ్యూనిస్టు పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని కఠినంగా అణచివేయాలని మాజీ పోలీసు, పారా మిలిటరీ అధికారుల సంఘాల నాయకత్వంలో ప్రదర్శనలు చేసి, చితాభస్మం తెచ్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే తొమ్మిది సంస్ధలకు చెందిన వారు ఆ సభలో పాల్గొన్నట్లు, వారి నుంచి పోలీసులు సంజాయిషీ కోరి నట్లు వార్తలు వచ్చాయి. బ్రిటీష్‌ పాలనలోని పూర్వపు మలయా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు. తరువాత స్వాతంత్య్రం వచ్చి మలయా, మలేషియాగా రెండు దేశాలు ఏర్పడిన తరువాత కమ్యూనిస్టులు మలేషియాలో విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 1968 నుంచి 1989వరకు పోరాడారు. ఆ ఏడాది మలేషియా సర్కార్‌తో పోరు విరమణకు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు పార్టీ నేత చిన్‌ పెంగ్‌ థారులాండ్‌లో ఆశ్రయం పొంది 2013లో అక్కడే 90 ఏండ్ల వయస్సులో మ రణించారు. ఒప్పందం మేరకు మలేషియాకు తిరిగి వచ్చేందుకు అనుమతించిన నేతలు తిరిగి పార్టీని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అండతోనే పోలీసులు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు.

(Reuters/edited by Ricardo Vaz for Venezuelanalysis.com)
పరువు పోగొట్టుకున్న వెనిజులా ప్రతిపక్ష నేత గుయడో !
గత సంవత్సరం లాటిన్‌ అమెరికా పరిణామాలను గుర్తుకు తెచ్చుకుంటే అరవైకి పైగా దేశాలు వెనిజులా అసలైన అధ్యక్షుడిగా గుర్తించిన జువాన్‌ గుయడో ఈనెల మొదటి వారంలో పరువు పోగొట్టుకొని అపహాస్యం పాలయ్యాడు. అధ్యక్షుడు మదురో ఎత్తుగడకు చిత్తయి గిలగిలా కొట్టుకుంటున్నాడు.2018 వెనిజులా ఎన్నికల్లో అధ్యక్షుడిగా సోషలిస్టు నికోలస్‌ మదురో ఎన్నికైనా, అంతకు ముందు పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లను తెచ్చుకోవటంలో సోషలిస్టు పార్టీ విఫలమైంది. దాంతో ప్రతిపనికీ ప్రతిపక్షం అడ్డం పడటంతో పాటు గతేడాది పార్లమెంట్‌ స్పీకర్‌గా ఉన్న ప్రతిపక్ష జువాన్‌ గుయడో తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. పొలో మంటూ అమెరికా కనుసన్నలలో నడిచే అరవైకిపైగా దేశాలు గుర్తింపును ప్రకటించాయి. మిలిటరీలో తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చేసిన యత్నం కూడా విఫలమైంది. ఇదే మరొక దేశంలో అయితే అందుకు పాల్పడిన వారిని కాల్చివేయటం లేదా కటకటాల వెనుక ఉంచుతారు. జనం, మిలిటరీ, పోలీసు, పారా మిలిటరీ మద్దతు ఉన్న సోషలిస్టు మదురో అలాంటి చర్యలకు పాల్పడకుండా అతడి వలన ప్రమాదం లేదనే అంచనా, ఇతర కారణాలతో గుయడోను స్వేచ్చగా తిరగనిస్తున్నారు.
అమెరికాతో సహా దాని మిత్ర దేశాలన్నీ మదురోను ఇప్పటికీ అధ్యక్షుడిగా గుర్తించటం లేదు గానీ పార్లమెంట్‌ను గుర్తిస్తున్నాయి.ఈనెల ఐదున పార్లమెంట్‌ స్పీకర్‌ ఎన్నిక జరిగి, దానికి తిరిగి గుయడో ఎన్నికైతేనే వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా అమెరికా కూటమి గుర్తింపు ఉంటుంది. గుయడోను తిరిగి ఎన్నుకొనే పరిస్ధితి లేదు. అయితే ఏదో ఒకసాకుతో పార్లమెంట్‌ను బహిష్కరిస్తే అధికారపక్షం నుంచి లేదా దాని మద్దతు ఉన్నవారు స్పీకర్‌ అవుతారు. గత ఏడాదిలో జరిగిన పరిణామాలలో ప్రతిపక్ష పార్టీలలో చీలిక వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని మదురో ప్రధాన ప్రతిపక్షాన్ని చావు దెబ్బతీశాడు. జనవరి ఐదో తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా భద్రతా దళాలు తనను పార్లమెంట్‌లో ప్రవేశించనివ్వకుండా అడ్డుకుంటున్నాయంటూ గుయడో కేకలు వేస్తూ తన మద్దతుదార్ల వీపుల మీద ఎక్కి పార్లమెంట్‌ గేట్‌ దూకుతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు ఫోజులిచ్చాడు. నిజానికి అతగాడి ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఎన్నికలో చీలిక పక్షనేతకు అధికారపక్షం మద్దతు ఇవ్వటంతో గుయడో ఓడిపోయాడు. తరువాత తన మద్దతుదారులతో తనకు వత్తాసు పలికే ఒక మీడియా కార్యాలయంలో స్పీకర్‌ ఎన్నిక తతంగాన్ని నిర్వహించి తిరిగి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నాడు. ఇది అమెరికాను కూడా ఇరకాటంలో పడేసింది. త్వరలో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొనాలా వద్దా అన్న మీమాంసలో ప్రతిపక్షాలు పడ్డాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పార్లమెంట్‌ ఎన్నికలకు దూరంగా ఉంటే సోషలిస్టులు దానిలో మెజారిటీ సాధించి మరింత బలపడతారు. విఫల తిరుగుబాట్ల నేపధ్యంలో పోటీ చేస్తే తిరిగి గెలుస్తామన్న ధైర్యమూ ప్రతిపక్షానికి లేదు.
పైన పేర్కొన్న పరిణామాలను చూస్తే దుష్ట పెట్టుబడిదారీ వ్యవస్ద దోపిడీ కొనసాగినంత కాలం, ఎదురు దెబ్బలు తగిలినా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు వాటిని తట్టుకొని ముందుకు పోతాయి, అంతకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నిరాశావాదులు అరగ్లాసు నీటిని చూసి అయ్యోపూర్తిగా నిండలేదే కూలబడితే, ఆశావాదులు సగం గ్లాసు నిండిందనే ధీమాతో ముందుకు పోతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కంటి చూపుతో కాషాయ తాలిబాన్లపై విరుచుకుపడ్డ హీరో దీపిక !

10 Friday Jan 2020

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

ABVP, Aishe Ghosh, Deepika Padukone, JNU violence, JNUSU President, saffron taliban, sfi, sound of silence

Image result for deepika padukone ,jnuఎం కోటేశ్వరరావు
దేశంలో ఒక్కొక్క ఉదంతం జరిగిన ప్రతిసారీ తామే పక్షంలో ఉండాలో తేల్చుకోవాలంటూ జనాన్ని కాషాయ తాలిబాన్లు ముందుకు తోస్తున్నారు. కాంగ్రెస్‌ తన ఐదు దశాబ్దాల పాలనలో చేయలేని ఈ సమీకరణ క్రమాన్ని గత ఐదు సంవత్సరాలలో వీరు వేగంగా ముందుకు తెచ్చారు. ఆ గట్టునుండాలో ఈ గట్టునుండాలో తేల్చుకోవాల్సింది ఇంక జనమే. అలాంటి తాజా ఉదంతం జనవరి ఐదవ తేదీ రాత్రి మూడు గంటల పాటు ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ముసుగులు ధరించిన కొందరు యువతులతో సహా గూండాలు విద్యార్ధులు, ప్రొఫెసర్ల మీద జరిపిన దాడి.
ఒక సినిమాలో ప్రముఖ హీరో బాలకృష్ణ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న మాటలు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. సుప్రసిద్ధ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ ఇప్పుడు ఒక్క దేశంలోనే కాదు,సకల భాషల్లోనూ, ప్రపంచంలోనూ ఉన్న కాషాయ తాలిబాన్లు, వారి సమర్ధకులమీద ‘కంటి చూపు’తో విరుచుకుపడ్డారు. ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భరించలేనిదిగా మారుతుంది. దీపికా పదుకోన్‌ చేసింది అదే. దాడికి గురైన వారిని మౌనంగా పరామర్శచేశారు తప్ప దాడి చేసిన వారి గురించి ఆ సమయంలో పల్లెత్తు మాట అనలేదు. అయినా సరే దాన్ని కూడా భరించలేని కాషాయ మూకలకు గంగవెర్రులెత్తి సామాజిక , సాంప్రదాయ మాధ్యమాల్లో ఆమెపై ధ్వజమెత్తుతున్నారు. ఆమె నిర్మించి, నటించిన ‘ఛపాక్‌’ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేశద్రోహులకు, దేశాన్ని ముక్కలు ముక్కలు(తుకడే తుకడే) చేసే గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినట్లు చిత్రించి నోరు మూయించేందుకు చూస్తున్నారు.
బేటీ బచావో బేటీ పఢావో అని ప్రధాని నరేంద్రమోడీ నాలుగేండ్ల క్రితం పిలుపునిచ్చినపుడు ఎందరో మంచి పని చేశారని అనుకున్నారు. ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని దాని అర్ధం. జామియా మిలియా విశ్వవిద్యాలయంలో పోలీసులే స్వయంగా అనుమతి లేకుండా దూరి ఆడమగ తేడా లేకుండా దాడులు చేశారు. ఆ తీరు మీద తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తన అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించి దాడులు చేశారని వైస్‌ ఛాన్సలర్‌ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో జెఎన్‌యు విశ్వవిద్యాలయంలో సరికొత్త దాడులకు తెరతీశారు. జామియా విద్యార్దులు సిఎఎ లేదా ఎన్‌ఆర్‌సి సమస్య మీద నిరసన తెలిపారు, అది వారి హక్కు, లేదా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు దేశద్రోహం కనుక పోలీసులు దాడి చేశారని కాసేపు అనుకుందాం. జెఎన్‌యులో అలాంటి ఆందోళన లేదే !
దాదాపు 50మంది ప్రొఫెసర్లు, 200 మంది విద్యార్దులు గత రెండు నెలలుగా చేస్తున్న ఫీజులు, ఇతర ఛార్జీల పెంపుదల ఆందోళన గురించి ఒక చోట చర్చించుకుంటుండగా వారి మీద, హాస్టల్‌ గదుల్లో వున్నవారి మీద జై శ్రీరామ్‌, తదితర నినాదాలతో మూడు గంటల పాటు కొందరు యువతులతో సహా 50 మందికిపైగా ముసుగులు ధరించిన గూండాలు ఎంపిక చేసుకున్న విద్యార్ధుల మీద హాస్టళ్లపైనా దాడులు చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు వచ్చిన వైద్యులను అడ్డుకున్నారు. దాడి సమయంలో వీధి లైట్లను ఆర్పివేశారు. ఒక పధకం ప్రకారం జరిగిన ఈ దాడిలో 36 మంది గాయపడ్డారు. పోలీసులు, యూనివర్సిటీ అధికారులు, ఎబివిపితో కుమ్మక్కయి ముసుగులతో వచ్చిన గూండాలు చదువుకుంటున్న ఆడపిల్లల మీద ఎలా దాడులు చేశారో చూసిన దేశం నివ్వెరపోయింది. ఎటు తిరిగి ఎటు చూసినా వాటి వెనుక ఉన్నది నరేంద్రమోడీ అనుచర గళం, అధికార యంత్రాంగం కావటాన్ని ఆయన అభిమానులు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి బిజెపి అగ్రనేత మురళీ మనోహర్‌ జోషి కూడా విసి జగదీష్‌ కుమార్‌(తెలుగువాడే అని చెప్పుకొనేందుకు చాలా మంది సిగ్గుపడుతున్నారు) రాజీనామా చేయాలని చెప్పాల్సి వచ్చింది. దాడులకు గురయిన వారి గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్ప ఇతరుల గురించి ఎందుకు ప్రకటనలు చేయరంటూ ఆయన ఎదురుదాడులకు దిగారు. దుండగులు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమించి దాడులు చేస్తుంటే అసలు విసి ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తూ రాజీనామా చేయాలని అందరూ డిమాండ్‌ చేస్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఎదురుదాడులు, దాడులకు గురైన వారి మీదనే తప్పుడు కేసులు పెట్టించిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయుధాలు ధరించి ముసుగులు వేసుకున్నవారిలో తమ వారున్నట్లు ఎబివిపి నేతలు అంగీకరించారు. వారి దాడులకు గురైన బాధితులను పరామర్శించేందుకు జెఎన్‌యుకు రావటమే దీపికా పదుకోన్‌ చేసిన ‘ నేరం, ఘోరం ‘. నిందితులపై ఇంతవరకు చర్యలు లేవు.
ఈ తరహాదాడి మన దేశంలో ఇదే ప్రధమం. దాడులలో తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించేందుకు విశ్వవిద్యాలయానికి వచ్చిన దీపిక ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే తన సానుభూతి, మద్దతు ప్రకటించి వెళ్లారు. ఈ వార్త బయటకు రాగానే కాషాయ తాలిబాన్లు సామాజిక మాధ్యమంలో రెచ్చిపోయారు. ఆమె తాజా చిత్రం ‘ఛపాక్‌’ను బహిష్కరించాలని, దేశ ద్రోహులతో చేతులు కలిపారంటూ ఏకత, శీలము, సంస్కారం, సంస్కృతి, మహిళలకు ఇవ్వాల్సిన మర్యాదల గురించి నిత్యం ప్రవచనాలు చెప్పేవారు వాటన్నింటినీ తీసి గట్టున పెట్టి నోరు బట్టని విధంగా ఆమెపై దాడి ప్రారంభించారు. తమ అసహ్య రూపాన్ని మరోసారి స్వయంగా బహిర్గతపరచుకున్నారు.
ముంబైలో మరికొందరు బాలీవుడ్‌ నటీ నటులు దాడులను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు ఖండించారు. వారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయని పెద్దలు దాడికి గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లిన బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ చర్యను తప్పు పడుతూ దేశద్రోహి అని నిందలు వేస్తున్నారు. ముసుగులు వేసుకున్న దుండగులు తాము లక్ష్యంగా చేసుకున్న చేసిన వారి మీద మాత్రమే దాడులు చేశారు. ముసుగుల్లేని బిజెపి నేతలు కూడా ఎంపిక చేసిన వారి మీద మాత్రమే విరుచుకుపడుతున్నారు. వారికీ వీరికీ ఒక్క ముసుగులు తప్ప తేడా ఏముంది?

Image result for deepika padukone ,jnu
జనవరి పదవ తేదీన విడుదల కానున్న తన చిత్ర ప్రచారం కోసం దీపిక ఈ ఉదంతాన్ని వినియోగించుకున్నారని నిందించిన వారు లేకపోలేదు. బహుశా వారికి ఎన్నికల కోసం ఉగ్రవాదుల దాడులను ఉపయోగించుకున్న రాజకీయ పార్టీలు గుర్తుకు వచ్చి ఉంటాయి. కొన్ని రాజకీయ పార్టీలు రంగంలో ఉన్నపుడు మాత్రమే ఉగ్రవాదదాడులు జరుగుతాయని నమ్మే వారి గురించి తెలిసిందే. కాషాయ తాలిబాన్ల దాడి తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు కొందరు కాషాయ జర్నలిస్టులు దీపిక చర్యను దాడులను సమర్ధించేవారితో పాటు దాడులకు గురైన వారు కూడా విమర్శించారని చిత్రించారు. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండటాన్ని ఐషి ఘోష్‌ తప్పుపట్టినట్లుగా వ్యాఖ్యానించారు. పేరెన్నికగన్న బాలీవుడ్‌ బాద్‌షాలు కాషాయ తాలిబాన్ల నోటి దురుసుకు భయపడి అనేక అంశాల మీద నోరెత్తని స్ధితిని చూస్తున్నాము. బతికిన చేపలు ఏటికి ఎదురీదుతాయి, చచ్చిన చేపలు వాలునపడి కొట్టుకుపోతాయి. ఆమె చిత్ర ప్రచారం కోసమే అయితే ఇంకా అనేక మార్గాలున్నాయి. దీపిక మీద దాడులు జరగటం కొత్తేమీ కాదు. గతంలో పద్మావత్‌ సినిమా సందర్భంగా అటు బిజెపి ఇటు కాంగ్రెస్‌ వారు, సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూసే శక్తులన్నీ ఆమెమీద ఎలాంటి ప్రచారం చేసిందీ, భౌతికంగా దాడులు చేసేందుకు యత్నించిన తీరు చూశాము. బహుశా ఇది కూడా ఆమెను ప్రేరేపించి ఉంటుందని భావించవచ్చు. రెండు రోజుల తరువాత ఆజ్‌తక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిన తన జెఎన్‌యు పర్యటన గురించి నోరు విప్పారు.
విద్యార్ధుల మీద హింస తనను బాధించిందని, పద్మావత్‌ సినిమా సందర్భంగా తాను ఇదే పరిస్ధితిని ఎదుర్కొన్నానని, ఇలాంటివి సర్వసాధారణంగా మారకూడదని తాను ఆశాభావంతో ఉన్నట్లు దీపిక చెప్పారు. ” నేను చెప్పదలచుకున్నది ఏమంటే రెండు సంవత్సరాల క్రితం పద్మావత్‌ విడుదల సందర్భంగా నేను ఇదే చెప్పాను. ఈ రోజు నేను చూస్తున్నది నాకు ఎంతో బాధ కలిగించింది. ఇది సర్వసాధారణ అంశంగా మారకూడదని నేను ఆశిస్తున్నాను. నాకు భయమూ విచారమూ కలిగింది. మన దేశపునాది ఇది కాదు. జరుగుతున్న వాటి పట్ల నాకు ఆగ్రహంగా ఉంది, అయితే ఎలాంటి చర్య తీసుకోకపోవటం అది మరింతదారుణం ‘ అన్నారు.

విద్యార్ధులను దీపిక పరామర్శించిన వార్త తెలియగానే బిజెపి నేత తేజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ట్వీట్‌ చేస్తూ తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ మరియు అఫ్జల్‌ గ్యాంగ్‌లకు మద్దతు ఇచ్చినందుకు దీపికా పదుకొనే చిత్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. అనురాగ్‌ కాశ్యప్‌, తాప్సీ, విశాల్‌ భరద్వాజ్‌, అలీ ఫజల్‌, రిచా చద్దా, అనుభవ్‌ సిన్హా, జోయా అక్తర్‌, దియా మీర్జా, సౌరవ్‌ శుక్లా, సుధీర్‌ మిశ్రా, రాహుల్‌ బోస్‌, స్వానంద కిర్కరే, షబనా ఆజ్మీ వంటి వారు దాడులను నిరసిస్తూ జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Image result for deepika padukone ,jnu
పులి తన చారలను దాచుకొనేందుకు ఆవు మేకప్‌ వేసుకున్నంత మాత్రాన దాని స్వభావాన్ని దాచుకోగలుగుతుందా ? ఒక కేంద్ర మంత్రి జవదేవకర్‌ ఛపాక్‌ సినిమాను బహిష్కరించాలనటాన్ని తాను అంగీకరించనని చెబుతారు, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం దేశాన్ని విధ్వంసం చేసే వారితో దీపిక పదుకోన్‌ నిలిచిందని దాడి చేస్తారు. దేశంలో కాషాయ దళాలను అనుసరించే వారు, వారిని గుడ్డిగా నమ్మిన జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారు తప్ప అందరూ పెట్టుకోలేదని మంత్రులకు అర్ధం కావటం లేదు. ఎవరైనా ఏదైనా వార్త చదివితే తాము ఎవరికి మద్దతు ఇచ్చేందుకు పోతున్నామో తెలుసుకోవాలని స్మృతి గారు సెలవిచ్చారు. మరి ఈ దాడిని ఖండించిన కేంద్ర మంత్రులకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుందో లేదో ఆమె చెప్పాలి. వారిని కూడా దేశద్రోహులు అంటారా, ఒక వార్త వినగానే తాము ఎవరిని ఖండిస్తున్నామో తెలుసుకోవాలని వారికి చెబుతారా ? జెఎన్‌యులో ముసుగులు వేసుకొని గూండాయిజానికి పాల్పడింది ఎబివిపి వారే అని కొందరు, పోలీసులే ముసుగులతో దాడి చేశారని, బయటి వ్యక్తులను రప్పించి ముసుగులు తగిలించి ఎబివిపి వారు దగ్గరుండి కొట్టించారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముసుగుల్లో వచ్చి దాడి చేసింది తామే అని హిందూ రక్షక దళం పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఎటు తిప్పి ఎటు చూసినా కాషాయ తాలిబాన్లు, వారికి మద్దతుగా ఉన్న పోలీసులు ఈ దాడికి బాధ్యులు అన్నది స్పష్టం. ఈ దుండగాన్ని ఖండిస్తూ పారిశ్రామికవేత్తలు ఆనంద మహింద్రా, కిరణ్‌ షా మజుందార్‌, హర్షా మారివాలా కూడా ఖండించారు.

Image result for deepika padukone ,jnu
మన దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది మేథావులు నిరసన తెలిపారు. ఈ రోజు జెఎన్‌యులోని విద్యార్ధులను, వారికి మద్దతు తెలిపిన వారినీ పాలకపార్టీ పెద్దలు దేశ ద్రోహులుగా చిత్రిస్తోంది. ఇదొక ప్రమాదకర పోకడ, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం పాలకపార్టీకి భజన చేయకపోవటమే దేశద్రోహమా ? బ్రిటీష్‌ తెల్లజాతి పాలకులు కూడా అదే చేశారు. తమను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రించారు. అలాంటి వారిని సాగనంపిన జాతి మనది. మరి ఈ కాషాయ నల్లజాతి పాలకులు బ్రిటీష్‌ వారి చెప్పుల్లో కాళ్లు దూర్చి అణచివేతకు పూనుకుంటే, తమతో ఏకీభవించని వారిని దేశద్రోహులుగా పరిగణిస్తే ఏమి చేయాలి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్రతో బొలీవియా మొరేల్స్‌ నిష్క్రమణ-బ్రెజిల్‌ లూలా జైలు నుంచి విడుదల !

16 Saturday Nov 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Bolivia’s leader Evo Morales, Evo Morales, Former Brazilian President Luiz Inácio Lula da Silva, lula da silva

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail

ఎం కోటేశ ్వరరావు
గతవారంలో గమనించదగిన రెండు పరిణామాలు జరిగాయి. ఒకటి తప్పుడు కేసుల్లో ఇరికించిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా కుట్రలో భాగంగా బొలీవియా మిలిటరీ తిరుగుబాటు చేయటంతో అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నతరువాత మరోసారి ఎన్నికై రాజీనామా చేసి దేశం వదలి మెక్సికోలో రాజకీయ ఆశ్రయం పొందారు.
పౌరుల రక్తపు మరకలను అంటించుకోవద్దని బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ దేశ అధికారులను హెచ్చరించారు. మిలిటరీ కుట్ర కారణంగా పదవికి రాజీనామా చేసి సోమవారం నాడు మెక్సికో చేరిన మొరేల్స్‌ నూతన ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తున్న తన మద్దతుదారులకు బాసటగా ఈ ప్రకటన చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించుకున్న సెనేట్‌ డిప్యూటీ స్పీకర్‌ జీనైన్‌ ఆంజెను తాము గుర్తించటం లేదంటూ లాపాజ్‌ పట్టణంలో పెద్ద ఎత్తున మొరేల్స్‌ మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. మూలవాసీ(స్ధానిక రెడ్‌ ఇండియన్‌ తెగలు) పతాకాలను చేబూని నిరసన తెలుపుతున్న నిరసనకారులు పలు చోట్ల పోలీసులతో తలపడినట్లు వార్తలు వచ్చాయి. అంజె ప్రభుత్వాన్ని గుర్తించినట్లు అమెరికా ప్రకటించింది.ఈ చర్యను మెక్సికో సిటీలో ఉన్న ఇవో మొరేల్స్‌ ఖండించారు. శుక్రవారం నాడు మొరేల్స్‌ అనుకూల ప్రదర్శకులపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. మొరేల్స్‌ లేకుండానే మరోసారి ఎన్నికలు జరిపేందుకు నూతన పాలకులు తెరతీసినట్లు వార్తలు వచ్చాయి. బొలీవియాలో జరిపిన సైనిక కుట్రను డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారయుతంగా సమర్ధిస్తూ ఒక ప్రకటన చేశాడు.వెనెజులా, నికరాగువాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఇదొక హెచ్చరిక అని బెదిరించాడు.
మొరేల్స్‌ దేశం నుంచి పోయేట్లు చేసిన కుట్రలో శ్వేతజాతి దురహంకారి అయిన మితవాద ప్రతిపక్ష నేత లూయీస్‌ ఫెర్నాండో కమాచో పాత్ర కూడా ఉంది. మొరేల్స్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలను అతని మద్దతుదారులు నిర్వహించారు. వ్యవసాయ, సహజవాయు వాణిజ్యవేత్త అయిన కమాచో బొలీవియా అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు చూస్తున్నాడు. ఫాసిస్టు, క్రైస్తవ సంస్దలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. స్ధానిక తెగలను ద్వేషించటం, పురోగామి శక్తులు క్రైస్తవ మతవిరోధులని ప్రచారం చేయటంలో ముందున్నాడు.

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వాను సుప్రీం కోర్టు అనుమతి మేరకు ఏడాదిన్నర తరువాత జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి అక్రమాల కేసులో 2018 నుంచి పన్నెండు సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారంటూ తీర్పును సవాలు చేస్తూ పునర్విచారణకు దరఖాస్తు చేశారు. విచారణ పూర్తయ్యేంతవరకు నిందితుడు నిర్దోషే అని చెబుతున్న 1988నాటి రాజ్యాంగ నిబంధనను అంగీకరిస్తూ సుప్రీం కోర్టు తన గత తీర్పుకు భిన్నంగా నిర్ణయించటంతో లూలాను వెంటనే విడుదల చేశారు. లూలా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన మూడు సంవత్సరాల తరువాత తానున్న ఇంటి మరమ్మతులకు ఒక కంపెనీ నుంచి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిస సాయానికి అక్రమంగా మరమ్మతుల రూపంలో లంచం తీసుకున్నట్లు ఒక నేరగాడితో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. అసలు ఆ ఇల్లు లూలాది కాదు, అంతకు మించి మరమ్మతులు జరిగిన దాఖలాలు కూడా లేవని తేలింది. లూలా మీద చేసిన ఆరోపణల్లో ఇదొకటి. అమెరికా ప్రమేయంతో జరిగిన కుట్రలో సరిగ్గా గత ఎన్నికలకు ముందు లూలాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు కుట్ర చేశారు. ఫలితంగా చివరి నిమిషంలో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ నూతన అభ్యర్ధిని ప్రకటించాల్సి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయినా, పార్లమెంట్‌లో మెజారిటీ స్ధానాలు, రాష్ట్రాలలో మెజారిటీని దక్కించుకుంది.

Image result for evo morales disposed in a coup,
బొలీవియా విషయానికి వస్తే అక్కడ మరో కుట్రకు తెరలేపారు. అక్టోబరు 20న జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు వీధులకు ఎక్కాయి. అమెరికా దేశాల సంస్ధ ప్రతినిధులు గనుక అక్రమాలు జరిగినట్లు నివేదిక ఇస్తే మరోసారి ఎన్నిక జరిపేందుకు తాను సిద్దమే అని మొరేల్స్‌ ముందుకు వచ్చాడు. అమెరికా కనుసన్నలలో పని చేసే ఆ సంస్ధ అక్రమాలు జరిగినట్లు ఆ నివేదిక ఇచ్చింది. ఆ మేరకు తిరిగి ఎన్నికలు జరుపుతానని ప్రకటించాడు. అయితే పదవిని వదులుకోవాలంటూ పోలీసులు, మిలిటరీ తిరుగుబాటు చేశారు. ఈ నేపధ్యంలో ప్రాణ రక్షణకు ఆయన మెక్సికో వెళ్లి ఆశ్రయం పొందారు.
బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల వలస లేదా స్ధానికేతరుల పాలన తరువాత 2006లో తొలిసారిగా స్ధానిక గిరిజన తెగలకు చెందిన ఇవో మొరేల్స్‌ సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పేరుతో పనిచేస్తున్న పార్టీ తరఫున అధికారానికి వచ్చాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని, తాను గిరిజనుడిని, కార్మిక ఉద్యమ ఉద్యమ కార్యకర్తను, కోకా పండించే రైతును కావటమే తాను చేసిన పాపం అని రాజీనామా సందర్భంగా వ్యాఖ్యానించాడు. సోమవారం జరిగిన పరిణామాల్లో అధ్యక్ష భవన రక్షణ సిబ్బంది, పోలీసులు తమ విధులను బహిష్కరించారు. దేశంలో శాంతినెలకానాలంటే మొరేల్స్‌ గద్దె దిగాల్సిందేనని మిలిటరీ అధిపతి విలియమ్స్‌ కాలిమాన్‌ డిమాండ్‌ చేశాడు.
మొరేల్స్‌ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం గత పదమూడు సంవత్సరాలలో అక్కడి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాన్ని పైకి తెచ్చింది. గ్యాస్‌, ఖనిజాల ఎగుమతుల కారణంగా జిడిపి గణనీయంగా పెరిగింది. ప్రయివేటు రంగం చేతుల్లో ఉన్న సంపదలన్నింటినీ జాతీయం చేస్తానని ప్రకటించినప్పటికీ వాటి జోలికి పోలేదు.దేశ ంలోని సహజవనరులను వెలికి తీసి దారిద్య్ర నిర్మూలన వంటి సంక్షేమ చర్యలను సమర్ధవంతంగా అమలు జరిపింది. ఇటీవలి సంవత్సరాలలో వైద్యులు, గని కార్మికుల వంటి తరగతుల సమ్మెలు, ఇతర ఆందోళనల కారణంగా గతంలో ఆయనను బలపరచిన శక్తులు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దేశంలో పేదరిక నిర్మూలన, ఇతర సంక్షేమ చర్యలను తీసుకున్నప్పటికీ అంతకు ముందు ప్రారంభమైన నయా వుదారవాద విధానాలలో పెద్దగా మార్పులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి.

Image result for evo morales disposed in a coup, protests
ఇవో మొరేల్స్‌కు వ్య తిరేకంగా జరిగిన కుట్రను ప్రతిఘటించాలని ఇరుగుపొరుగు సంఘాల ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. మొరేల్స్‌ అధికారంలోకి రాకముందు జరిగిన పోరాటాలలో ఈ సంస్ధ ప్రముఖపాత్ర పోషించింది. ఆత్మరక్షణ దళాలను ఏర్పాటు చేయాలని, ఎక్కడి కక్కడ ప్రతిఘటనకు పూనుకోవాలని కోరింది. ఎల్‌ ఆల్టో పట్టణంలో ఇలాంటి దళాల నాయకత్వంలో అనేక పోలీసు కార్యాలయాలను ఆక్రమించుకొని కొన్నింటిని దగ్దం చేసినట్లు వార్తలు వచ్చాయి. 2005ఎన్నికలకు ముందు దేశంలో కార్పొరేట్‌ సంస్ధల ఆర్దిక ప్రయోజనాల రక్షణకు వాటి తరఫున పని చేసే రాజకీయ బృందాలు, సంస్ధలు ఉన్నాయి. అవి అవకాశవాద పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి. అవి ప్రజల సమస్యలను పట్టించుకొనేవి కాదు. ఈ పూర్వరంగంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడిన పౌర సంస్ధలు జరిపిన పోరాటాలు వాటితో మమేకం కావటం ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయానికి బాటలు వేసింది.మొరేల్స్‌ నాయకత్వంలోని సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీ అవకాశవాద రాజకీయాలు, పొత్తులకు వ్యతిరేకంగా పని చేసింది. ఎన్నికలలో అభ్యర్ధులుగా దిగువ స్ధాయి నుంచి ఉద్యమాలలో పాల్గన్నవారే ఉండటంతో ఘనవిజయాలు సాధించారు.
అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల బొలీవియా సహజవనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఇవో మొరేల్స్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహించలేని శక్తులే తాజా కుట్రవెనుక వున్నట్లు భావిస్తున్నారు. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మొరేల్స్‌ అధికారానికి వచ్చిన కొత్తలో విదేశీ కంపెనీల చేతుల్లో వున్న గ్యాస్‌, చమురు కంపెనీలను జాతీయం చేశారు. అయితే విదేశీ కంపెనీలే ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాటిని వెలికి తీస్తున్నాయి. విద్యుత్‌ కార్లు, స్మార్ట్‌ ఫోన్లలో వాడే బ్యాటరీల తయారీకి ఎంతో అవసరమైన లిథియం నిల్వలు బొలీవియాలో పుష్కలంగా ఉన్నాయి. వర్తమాన శతాబ్ది బంగారంగా ఈ ఖనిజాన్ని పరిగణిస్తున్నారు. కొద్ది సంవత్సరాలలో దీనికి డిమాండ్‌ మరింత పెరిగి కొరత ఏర్పడవచ్చని కార్పొరేట్‌ శక్తులు అంచనా వేశాయి. ప్రపంచంలో ఉన్న లిథియం నిల్వల్లో ఒక్క బలీవియాలోనే 25 నుంచి 45శాతం వరకు నిక్షిప్తమై ఉన్నట్లు అంచనా. దీన్ని ప్రభుత్వరంగంలో వెలికి తీసి వచ్చే ఆదాయంతో మరిన్ని సంక్షేమ చర్యలను చేపట్టాలని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. జర్మన్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం వలన జనానికి పెద్దగా ప్రయోజనం చేకూరదని స్ధానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో గతవారంలో ఒప్పందాన్ని మొరేల్స్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
లాటిన్‌ అమెరికాలో సహజవనరుల దోపిడీని అరికట్టి జనానికి లబ్ది కలిగించే చర్యలు తీసుకొనే ఏ ప్రభుత్వాన్ని అమెరికా,కెనడా తదితర దేశాలు అంగీకరించటం లేదు. వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోటా పచ్చిమితవాద శక్తులు వాటికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావటం వెనుక అమెరికా హస్తం ఉండటం బహిరంగ రహస్యం. బొలీవియాలో కూడా అదే జరిగింది. ధనికులు, మితవాద శక్తులు బలంగా ఉన్న శాంతా క్రజ్‌ ప్రాంతంలో ప్రతిపక్ష నేత ఫెర్నాండో కామాచో, ఇతరుల నాయకత్వంలో తాజా కుట్రకు తెరలేచింది. ఆదివారం నాడు మిలిటరీ, పోలీసు అధికారులు వారికి వంతపాడారు. మొరేల్స్‌ను గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.తొలుత కార్మికనేతగా ఎదిగిన చాపారే ప్రాంతానికి చేరుకున్న మొరేల్స్‌ అక్కడి నుంచి టీవీలో మాట్లాడుతూ నన్ను ఎన్నడూ వదలని నా జనం వద్దకు తిరిగి వచ్చాను, పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అంటూ తన రాజీనామాను ప్రకటించారు.
సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ పోలసీ రిసర్చ్‌ సంస్ద జరిపిన అధ్యయనం ప్రకారం మొరేల్స్‌ పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలన కార్యక్రమం విజయవంతమైందని తెలిపింది. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల ప్రాంతంలోని దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువగా బొలీవియా ఆర్ధిక ప్రగతి సాధించినట్లు పేర్కొన్నది. మొరేల్స్‌ అధికారానికి రాకముందు చమురు కంపెనీల నుంచి ఏటా 73.1కోట్ల డాలర్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. జాతీయం తరువాత అది 495 కోట్ల డాలర్లకు పెరిగింది.2018 నాటికి దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య 60 నుంచి 35శాతానికి తగ్గింది. దుర్భరదారిద్య్రంలో ఉన్న వారి సంఖ్య 38 నుంచి 15శాతానికి తగ్గింది. అయినప్పటికీ బలీవియా ఇప్పటికీ పేద దేశంగానే ఉంది. ఈ కారణంగా కొన్ని తరగతుల్లో కొన్ని అంశాలపై అసంతృప్తి తలెత్తింది. దానిని సొమ్ము చేసుకొనేందుకు మితవాద శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి.
అక్టోబరులో జరిగిన ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియక ముందే అమెరికా, లాటిన్‌ అమెరికాలోని ఇతర మితవాదశక్తుల నాయకత్వంలోని ప్రభుత్వాలు బొలీవియన్ల ఆకాంక్షలను ప్రతిబింబించని ఫలితాలను తాము గుర్తించబోమని ప్రకటించాయి. 2005కు ముందు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ప్రపంచ ఆర్ధిక సంస్ధలన్నీ మొరేల్స్‌ వ్యతిరేకులను బలపరిచాయి. సహజవనరులను జాతీయం చేయబోమని ప్రకటించిన శక్తులకు ప్రాతినిధ్యం వహించిన అధ్యక్షుడు కార్లోస్‌ మెసాకు మద్దతు ప్రకటించాయి. 2002లో ఇవో మొరేల్స్‌ అధ్యక్ష పదవికి పోటీచేసినపుడు మొరేల్స్‌ గెలిస్తే ఆర్ధిక సాయంలో కోత పెడతామని బెదిరించాయి. ఈ పూర్వరంగంలో మొరేల్స్‌కు వ్యతిరేకంగా ఎంతటి కుట్రకు తెరలేచిందో అర్దం చేసుకోవచ్చు.

Image result for evo morales disposed in a coup, protests
బొలీవియా పరిణామాల నేపధ్యంలో రాయిటర్స్‌ వార్తాసంస్ధ వెలువరించిన ఒక కథనాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది.బొలీవియా మాదిరి పరిణామాలు వెనెజులాలో పునరావృతం కావటానికి అక్కడి మిలిటరీ అడ్డుగా ఉందనే శీర్షికతో ఒక కథనాన్ని అందించింది. ఇవో మొరేల్స్‌ మాదిరి వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో రాజీనామా చేసేందుకు అక్కడి ప్రతిపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారని, అయితే ఒక కీలకాంశం దాన్ని కష్టతరం గావిస్తున్నదని ఆదివారనాడు బొలీవియా నిరసనకారుల పక్షాన మిలిటరీ చేరిన మాదిరి వెనెజులా మిలిటరీ వ్యవహరించటం లేదని పేర్కొన్నది. దేశంలో ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతున్నప్పటికీ 2014,17లో పెద్ద ఎత్తున నిరసన తలెత్తినా, 2018 ఎన్నికల్లో అక్కడి సోషలిస్టు పార్టీకి మిలటరీ మద్దతు ఇచ్చిందని రాయిటర్‌ పేర్కొన్నది.ఈ ఏడాది ఏప్రిల్‌ 30న అనేక మ ంది మిలిటరీ అధికారులు తిరుగుబాటు నేత గురుడోకు మద్దతు ఇచ్చారని అయితే ఉన్నతాధికారులు మదురోకు మద్దతు ఇవ్వటంతో తిరుగుబాటు విఫలమైందని తెలిపింది. వెనెజులా మిలిటరీలో తన వామపక్ష సైద్ధాంతిక భావజాలాన్ని మాజీ అధ్యక్షుడు ఛావెజ్‌ ఎక్కించారని బలీవియా మిలిటరీలో అలాంటి పరిస్ధితి లేదన్న ఒక ప్రొఫెసర్‌ అభిప్రాయాన్ని అది ఉటంకించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d