• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

సోషలిజంపై చిత్త భ్రమణ తంత్ర విద్య ప్రయోగం !

06 Monday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Bolshevik Revolution, CAPITALISM, capitalist crisis, China, communist, Communist Revolution, Mind Games, new American socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -2

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కొన్ని సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన తీవ్ర ఎదురుదెబ్బలు ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇదే సమయంలో విద్య, సమాచార వ్యవస్ధ కొత్త పుంతలు తొక్కి అరచేతిలోకి అందుబాటులోకి రావటం వంటి పరిణామాలతో కమ్యూనిస్టు సిద్ధాంతంపై దాడి కగతం కంటే తీవ్రంగా జరుగుతోంది. కొత్త ఎత్తుగడలు అనుసరించటాన్ని అన్ని రంగాలలో చూడవచ్చు. గతంలో మాదిరి కమ్యూనిజాన్ని నేరుగా వ్యతిరేకిస్తే లాభం వుండదని గత వంద సంవత్సరాల అనుభవాలు దోపిడీ వర్గానికి నేర్పాయి. అంటే దొంగ దెబ్బలకు పూనుకున్నాయి, దీంతో కమ్యూనిస్టుల పనిని మరింత సంక్లిష్టం గావించాయని చెప్పాలి. శత్రువును చంపదలచుకుంటే ప్రత్యక్ష పోరాటంలో ఎంతో కష్టపడాలి, అదే తీపి మాటలతో వెన్నుపోటు పొడిచి అంతం చేయటం ఎంతో సులభం. ఈ కుటిల నీతిని కమ్యూనిస్టు వ్యతిరేకులు బాగా ప్రయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో నవతరం సోషలిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితులు కావటం గతం మాదిరి సులభం కాదు. అయితే దోపిడీ వ్యవస్ధ ఎప్పటికపుడు తనకు తెలియకుండానే యువతరాన్ని ఆవైపు నెడుతోంది. పీడితులు కూడా తమ ఆయుధాలను సన్నద్దం చేసుకోవటం అనివార్యం.

అమెరికాలోని కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ అనే సంస్ధ తన వార్షిక నివేదికలో భాగంగా యు గవ్‌ అంటే మీ ప్రభుత్వం అనే ఒక పరిశోధనా సంస్ధతో కలసి అక్టోబరు చివరి వారంలో ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సంస్ధ ప్రమేయంతో ఇలాంటి నివేదికల తయారీకి రూపొందించే ప్రశ్నావళి స్వభావం,లక్ష్యం ఎలా వుంటుందో తెలిసిందే. వెన్నుపోటు ఎత్తుగడలో ఇదొక భాగం. ఈ సర్వే సెప్టెంబరు 28 అక్టోబరు 5 మధ్య జరిగింది. అమెరికా ప్రధాన మీడియా అంతటా ఆ సమయంలో అమెరికా దృష్టిలో ధూర్త దేశంగా వున్న సోషలిస్టు-కమ్యూనిస్టు వుత్తర కొరియా జపాన్‌ మీదుగా, అమెరికా తీరంలోని దీవులలో కూడా పడే ఖండాంతర క్షిపణి ప్రయోగాలను జరిపిందని, అమెరికన్లకు ముప్పు తెచ్చిందంటూ ముమ్మరంగా ప్రచార దాడి జరిపిన సమయమది. సర్వేపై దాని ప్రభావం పడకుండా ఎలా వుంటుంది. అందువలన దానికి వుండే పరిమితులను గమనంలో వుంచుకోవాలి. ఈ నివేదికలో కొన్ని అసంబద్దతలు, తర్కానికి నిలబడని అంశాలున్నాయి.

ప్రపంచానికి కమ్యూనిజం ఇప్పటికీ ఒక సమస్యగానే వుందని నమ్ముతున్న అమెరికన్లు 75శాతం వున్నారని, గతేడాది కంటే ఐదుశాతం ఎక్కువంటూ సర్వే తొలి అంశంగా ఆ నివేదిక ప్రారంభమైంది. ప్రతి పదిమందిలో ఏడుగురు అమెరికన్లకు కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకపోవటం లేదా తప్పుగా గుర్తించారట. ఇదే సమయంలో నూతన సహస్రాబ్ది యువతరంగా పరిగణించబడేవారిలో సోషలిజం పట్ల సానుకూలత పెరుగుతోంది. జనాభా మొత్తంగా చూసినపుడు 63శాతం పెట్టుబడిదారీ, నాలుగు శాతం ఫాసిస్టు దేశంలో జీవించాలన్న అభిలాషను వ్యక్తం చేయగా సోషలిస్టు-కమ్యూనిస్టు దేశంలో నివశించాలన్న కోర్కె 37 శాతం మందిలో వ్యక్తమైంది. ఇదే సహస్రాబ్ది యువతలో 49, 51శాతం వున్నారు. ప్రస్తుతం అమెరికా జనాభాలో సహస్రాబ్దితరంగా పరిగణించబడేవారు ఎక్కువగా వున్నారు. నివేదిక మొత్తంలో కమ్యూనిస్టు వ్యతిరేకతనే ప్రధానంగా చూపినప్పటికీ ఈ ఒక్క అంశంపై కమ్యూనిస్టు వ్యతిరేకులు కలవర పడుతున్నారు. గతంలో విదేశాలలో పెరుగుతున్న సోషలిస్టు అభిమానులను చూసి భయపడిన అమెరికన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులు ఇప్పుడు తమ యువతను చూసి తామే భయపడుతున్నారన్నమాట. ఎంతలో ఎంత మార్పు? సహస్రాబ్ది యువతలో ఇటువంటి భావాలు ఏర్పడటానికి కారణం 53శాతం మంది అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అభిప్రాయం పడటం కావచ్చని సర్వే రచయితలు వ్యాఖ్యానించారు.

‘ ప్రస్తుతం అమెరికాలో సహస్రాబ్ది తరం అతి పెద్ద సమూహంగా వుంది. ఆందోళన కలిగించే కొన్ని ధోరణులు తీవ్ర ఆందోళన కలిగించటాన్ని చూస్తున్నాం. సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు మళ్లటం పెరుగుతోంది, చివరికి కమ్యూనిజం కూడా ఆచరణీయ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు’ అని కమ్యూనిజం బాధితుల స్మార ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.ఇదే సమయంలో 1946-64 మధ్య పుట్టిన వారు ఎక్కువగా పెట్టుబడిదారీ విధానానికి,26శాతం మందే సోషలిజానికి మద్దతు ఇస్తున్నారు. అమెరికాలో స్టాలిన్‌ను ప్రతి ఐదుగురిలో ఒకరు హీరోగా భావిస్తుండగా, లెనిన్‌, వుత్తరకొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌లను అభిమానించే వారు ప్రతి నలుగురిలో ఒకరు వున్నారని తేలింది. సోషలిజం, కమ్యూనిజాలకు తేడాతో పాటు అసలు వాటి గురించి తెలియని కారణం, కమ్యూనిస్టు పాలిత దేశాలలో చంపివేయబడిన జనం గురించి తక్కువ అంచనా వేయటం వల్లనే యువత ఈ బాటలో వున్నారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు ‘ఎర్ర శతాబ్దం’ పేరుతో రాసిన సానుకూల వ్యాసాలు కూడా కమ్యూనిజం వెనుక వున్న నిజాన్ని పట్టించుకోకుండా చేశాయని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు.’ సోషలిజం, కమ్యూనిజాల విషయంలో అమెరికన్‌ సమాజంలో చారిత్రక పాండిత్యం ఎంత తక్కువగా వుందో అలజడి వైపు తిప్పుతున్న ఈ పరిణామం వెలుగులోకి తెస్తోంది.వంద సంవత్సరాల క్రితం జరిగిన బోల్షివిక్‌ విప్లవం తరువాత కమ్యూనిజం కారణంగా జరిగిన మారణహోమం, వినాశనం, దుఖం గురించి విద్యార్ధులకు బోధించటంలో వ్యవస్ధ వైఫల్యం గురించి కూడా ఇది వెల్లడించింది.’ అని కూడా మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.

కమ్యూనిస్టుల పాలనలో రోమన్‌ కాధలిక్‌ మతగురువులతో సహా చంపిన వారి సంఖ్య పది లక్షలలోపే అని సర్వేలో పాల్గన్నవారిలో పదిశాతం, 1-250లక్షలని 21, 250-500లక్షలని 15, 500-750లక్షలని 12, 750-1000లక్షలని 11, పది కోట్లకు పైగా అని31శాతం చొప్పున నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ అంకెలకు ఎలాంటి ఆధారాలు లేవు. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా వీటిని తిప్పుతున్నారు. ఈ అతిశయోక్తులను మొత్తంగా 69శాతం మంది తక్కువ చేసి చూశారు. సహస్రాబ్ధి యువతలో గతేడాది మాదిరే తప్ప మార్పు లేదు. గత కొద్ది కాలంగా ముఖ్యంగా 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం తరువాత అమెరికన్‌ యువతలో సోషలిజం, కమ్యూనిజం గురించి సానుకూల వైఖరి వ్యక్తమౌతోంది. అందువలన వారిని గందరగోళంలో పడేయటానికి ఇలాంటి సర్వేలతో ఒకవైపు వారిలో తలెత్తిన మార్పును చెబుతూనే మరోవైపు వెనక్కు లాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు మనం చూడవచ్చు. అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయి? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం, బకెట్లతో సముద్రనీటిని తోడటం ఎలా సాధ్యం కాదో భావజాల వ్యాప్తిని, అసంతృప్తిని అణచివేయటం, పక్కదారి పట్టించటం కూడా అలాంటిదే.

సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం నిజానికి ఒక ప్రయోగం. దాని ఫలితాలు ప్రపంచానికి తెలియవు. అందువలన నిర్మాణంలో ఏవైనా లోపాలుంటే వాటిని స్నేహపూర్వకంగా లేదా సైద్ధాంతికంగా చెప్పటం వేరు. గతంలో సోవియట్‌ యూనియన్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదంగా వర్ణించిన నక్సల్స్‌ తాము కూడా కమ్యూనిస్టులమే అని చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు చైనా అనుసరిస్తున్న విధానాలపై కూడా కొంతమంది అదే రకమైన దాడి చేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సామ్రాజ్యవాదులుగా మారినవి వున్నాయి. అదే విధంగా పెట్టుబడిదారీ పంధాలో పయనిస్తూ అభివృద్ధిలో బాగా వెనుకబడిన దేశాలూ వున్నాయి. అటువంటి దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలు వస్తే ఎంతకాలం అనేది ఎవరూ చెప్పలేకపోవచ్చుగాని కొంత కాలం అదే మాదిరి తేడాలు లేకుండా ఎలా వుంటాయి? చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ అనేది బూటకం, పేరుకే కమ్యూనిస్టు పార్టీ, అక్కడ ఆర్ధిక అంతరాలు చాలా ఎక్కువగా వున్నాయి, ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా దాడి జరుగుతోంది. ఇక్కడ సోషలిజం పట్ల కారుస్తున్న మొసలి కన్నీరును కడవలతో కొలవజాలం. నిజమైన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణ జరగటం లేదని తీవ్ర విచార ప్రదర్శన. ఇదంతా కమ్యూనిస్టు వ్యతిరేకులు, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు కూడా కొందరు చేస్తున్నారు. ఇదంతా సమాజంలోని ఒక భాగం లేదా వ్యక్తులను మానసికంగా తిమ్మినిబమ్మిని చేసి ఇబ్బందులకు గురిచేసే చిత్త భ్రమణ తంత్ర విద్యలో భాగమే.

Image result for US youth, socialism

బ్రెజిల్‌కు చెందిన లూయీస్‌ కార్లోస్‌ బ్రెస్సెర్‌ పెరీరా అనే సామాజిక, ఆర్ధికవేత్త పెట్టుబడిదారీ విధానంలో ఐదు నమూనాలు వున్నాయని విశ్లేషించారు. ఆయనతో ఏకీభవించాలనేమీ లేదు. ధనిక దేశాలలో వుదారవాద ప్రజాస్వామిక లేదా ఆంగ్లో-శాగ్జన్‌ నమూనా, సామాజిక లేదా ఐరోపా, అంతర్జన్య లేదా జపాన్‌, వర్ధమాన దేశాలలో వుదారవాద ఆధారిత నమూనాలు ఆసియాలో ఒక విధంగా, బ్రెజిల్‌తో సహా ఇతర దేశాల నమూనాలు భిన్నంగా వుంటాయని ఆయన చెప్పారు. ఇదే సూత్రం సోషలిస్టు దేశాలకు మాత్రం ఎందుకు వర్తించదు? అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గ నాయకత్వాన విప్లవాలు జయప్రదమౌతాయని మార్క్స్‌-ఎంగెల్స్‌ అంచనా వేశారు. ఆ తరువాత బోల్షివిప్లవానికి ముందు సైద్ధాంతిక చర్చ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం గురించి తప్ప నమూనా, విప్లవ మార్గం గురించి పెద్ద సమస్యలు ముందుకు రాలేదు. బోల్షివిక్‌ విప్లవం తరువాతే ఆచరణలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ తెల్లవారే సరికి పరిష్కారిస్తామని, పరిష్కారమౌతాయని గానీ ఏ కమ్యూనిస్టూ చెప్పజాలరు. వాటిని కూడా దోపిడీ శక్తులు తమ కమ్యూనిస్టు వ్యతిరేక భావజాల అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. పద్దతులను కూడా మార్చుకున్నాయి. గతంలో మాదిరి సోవియట్‌ను వ్యతిరేకించినట్లుగా నేడు చైనాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగేందుకు ముందుకు రావటం లేదు. ఎందుకంటే గతంలో సోవియట్‌ తయారీ వస్తువులతో పాశ్చాత్య దేశాల మార్కెట్లను నింపలేదు, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మేడిన్‌ చైనా దర్శనమిస్తోంది.అయితే అదే సమయంలో సోవియట్‌ను తొక్కివేసేందుకు, కూల్చివేసేందుకు చేసిన కుట్రలకు ఏమాత్రం తీసిపోకుండా చైనాకు వ్యతిరేకంగా చేయాల్సినవి చేస్తున్నాయని మర్చిపోరాదు. అధికారికంగా సంబంధాలు, అనధికారికంగా చైనా, కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిజం మీద విషపూరిత దాడి జరుగుతోంది.

గత వంద సంవత్సరాలలో ఫాసిస్టు శక్తులను అణచివేయటంలో కమ్యూనిస్టులు ఎంతటి త్యాగాలకు పాల్పడతారో, ఎలా సన్నద్దమౌతారో లోకానికి తెలియ చెప్పటంలో సోవియట్‌ యూనియన్‌ జయప్రదమైంది. సోషలిజాన్ని కాపాడుకుంటూ అచిర కాలంలోనే ఒక నూతన అభివృద్ది నమూనాను ప్రపంచం ముందుంచటంలో చైనా జయప్రదమైంది. చైనాలో సమస్యలేమీ లేవా అంటే కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమల వంటివి కూడా జరబడతాయని వాటిని అదుపు చేయాల్సి వుంటుందని కూడా తమకు తెలుసునని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ చెప్పారు. సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఇప్పుడు అధికారికంగా వారే చెబుతున్నపుడు లేవని ఎవరంటారు? అన్ని పెట్టుబడిదారీ దేశాలూ ఒకే విధంగా అభివృద్ధి ఎందుకు చెందలేదు, అన్ని ఖండాలలో ఒకేసారి పారిశ్రామిక విప్లవం ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలకు సమాధానంలోనే సోషలిజానికి కూడా జవాబు దొరుకుతుంది.

చైనాలో వున్నది పెట్టుబడిదారీ విధానం అనే వాదనలతో విబేధిస్తున్నవారు ముందుకు తెస్తున్న అంశాలేమిటో చూద్దాం.పెట్టుబడిదారీ పాలనా విధానంలో అప్రయత్న పూర్వకమైన సంబంధాలతో వస్తూత్పత్తి లాభాల కోసం జరుగుతుంది.లాభాల రేటు పెట్టుబడుల వర్తులాను నిర్దేశించటంతో పాటు ఆర్ధిక సంక్షోభ ఆవర్తనాలను కూడా వుత్పత్తి చేస్తుంది. ఇది చైనాకు ఇంతవరకు వర్తించలేదు. ప్రణాళిక, ప్రభుత్వరంగంలో వుత్పత్తిపై యాజమాన్య పద్దతే ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ అధికార పునాదివేళ్లు ప్రజాయాజమాన్యంలోనే వున్నాయి.పెట్టుబడిదారీ తరహా వుత్పత్తి పద్దతి లేకుండానే చైనా ఆర్ధికంగా ఎదుగుదలను సాధించింది. కీలకమైన 102 ప్రభుత్వ రంగ సంస్దల విలువ ఏడున్నరలక్షల కోట్ల డాలర్లు. వీటిని ప్రయివేటీకరిస్తారని ఎవరైనా ఆశపడుతుంటే అలాంటిదేమీ వుండదని పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రధానమైన ప్రజాయాజమాన్య స్ధితి, ప్రభుత్వ రంగ ఆర్ధిక వ్యవస్ధ నాయకత్వ పాత్రపై ఎలాంటి డోలాయమానం వుండదని అధ్యక్షుడు గీ జింగ్‌ పింగ్‌ గతేడాది స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల వారు గత మూడున్నర దశాబ్దాలుగా చైనా ఆ బాటను వీడి స్వేచ్చా మార్కెట్‌,ప్రయివేటు రంగం నాయకత్వ పాత్ర వహించాలని కోరుతూనే వున్నారు.లాభాపేక్షలేని ప్రణాళికా బద్దమైన ప్రభుత్వరంగ పాత్ర నాయకత్వంలో తలెత్తే సమస్యలను పెద్దవిగా చూపుతూ వాటిని అవకాశంగా మార్చుకోవాలని కంటున్న కలలు ఇంతవరకు కల్లలుగానే మిగిలిపోయాయి. సామాజిక-ఆర్ధిక అంశాల రూపకల్పన, జయప్రదంగా అమలు చేయటంపై నిజానికి చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నది.

2008లో పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత కూడా చైనా అభివృద్ధి రేటు ఏడుశాతం కొనసాగుతున్నది. తమ తరువాత సంక్షోభంలోకి కూరుకుపోవటం చైనా వంతు అని చెప్పిన వారి జోస్యం వాస్తవం కాదని తేలిపోయింది. కొన్ని వడిదుడుకులు తప్ప గత పదిసంవత్సరాలుగా సజావుగా పురోగమిస్తోంది. ఇది కమ్యూనిస్టుపార్టీ, సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత. ఇప్పుడు పెట్టుబడిదారీ ధనిక దేశాలలోని యువతను ఆకర్షించే అంశం ఇది. ఏ స్టోర్‌లో చూసినా చైనా వస్తువులే, పశ్చిమ దేశాల వుద్యోగాలను హరించి చైనా తన వారికి పని కలిపిస్తున్నదన్న వార్తలు ఏదో ఒక రూపంలో వారిని చేరుతూనే వున్నాయి. ఈ నేపధ్యంలో పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అనేదే గీటు రాయి అనుకుంటే ఇప్పటి వరకు పెట్టుబడిదారీ విధానం ఒరగబెట్టిందేమీ లేదు, రాబోయే రోజుల్లో ఏదో చేస్తుందనే ఆశ కనిపించటం లేదు, అందువలన సోషలిజమే మెరుగు, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్న ఆలోచన తలెత్తుతోంది. సోషలిస్టు భావన వునికిలోకి వచ్చిన తరువాత సాధించిన పెద్ద విజయాలలో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ సిద్ధాంత వేత్తలు సోషలిస్టు వ్యవస్ధల వైఫల్యాలను బూతద్దంలో పెట్టి చూపటం,అవాస్తవాలను ప్రచారం చేసి సోషలిజం గురించి చిత్త భ్రమణ తంత్ర విద్యను( మైండ్‌ గేమ్‌ ఆడటం) ప్రయోగించి తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు తప్ప పెట్టుబడిదారీ విధానం ఎలా మెరుగైనదో దానికి పోతుగడ్డ అంటున్న అమెరికా యువతకు చెప్పలేకపోతున్నారు. అదే పెద్ద బలహీనత. దీన్ని దెబ్బకొట్టి యువతను సోషలిజం వైపు మళ్లించటమే కమ్యూనిస్టుల ముందున్న పెద్ద సవాలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకర్షణ తగ్గని సోషలిజం, కమ్యూనిజం !

05 Sunday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Aurora, Bolshevik Revolution, Bolshevik Revolution warship, Lenin, Russia’s 1917 Bolshevik Revolution, winter palace

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -1

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఏడు, ప్రపంచవ్యాపితంగా ఎందరో విప్లవదీక్షకు పునరంకితమయ్యే రోజు. విప్లవాలకు దారితీస్తాయని భావించిన, భయపడిన వుద్యమాలను ఏడు నిలువుల లోతున పాతివేయాలన్న దోపిడీదార్ల కసిని మరింతగా పెంచే రోజు. అంతకు ముందు కూడా పెట్టుబడిదారీ వర్గం అణచివేతకు పాల్పడినప్పటికీ అక్టోబరు విప్లవం తరువాత మరింత అప్రమత్తమై గత వంద సంవత్సరాలుగా దాడిని మరింతగా పెంచుతోంది. కమ్యూనిస్టు తత్వశాస్త్రానికి ఒక స్పష్టమైన శాస్త్రీయ భాష్యం చెప్పిన మార్క్స్‌-ఎంగెల్స్‌ ద్వయంలో కారల్‌ మార్క్స్‌ ద్విశత జయంతి,(మార్క్స్‌పేరు నుంచి విడదీయజాలని ఆయన స్నేహితుడు, వుద్యమ సహచరుడు ఎంగెల్స్‌కు వయస్సులో తేడా రెండున్నర సంవత్సరాలే) మార్క్స్‌ రచన కాపిటల్‌ మొదటి సంపుటి వెలువడి 150, సంవత్సరాలు, దానిని ఆచరణలోకి తెచ్చి తొలి సోషలిస్టు రాజ్య స్ధాపనకు నాంది పలికిన రష్యన్‌ బోల్షివిక్‌ విప్లవానికి వంద సంవత్సరాలు నిండాయి. దాన్ని కూల్చివేయటంలో సామ్రాజ్యవాదుల కుట్ర,హస్తం వున్నప్పటికీ, అంతర్గత కారణాలు కూడా వున్నందున వందేండ్ల వార్షికోత్సవం అనటం సముచితంగా అనిపించటం లేదు. అందుకే సింహావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది. బోల్షివిక్‌ విప్లవం వునికిలోకి తెచ్చిన ప్రధమ సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ప్రగతిశీల వాదులు, కమ్యూనిస్టులు సహజంగానే తమ సిద్ధాంతం, ఆచరణ, అనుభవాల గురించి మదింపు వేసుకొని పునరంకిత మయ్యేందుకు ఈ సందర్భాలను వినియోగించుకుంటున్నారు. మరోవైపు తమ దోపిడీని అంతమొందించే కమ్యూనిస్టు తత్వశాస్త్రాన్ని అణగదొక్కేందుకు దోపిడీదార్లు తమ ఆయుధాలకు మరింతగా పదునుపెట్టుకుంటున్న తరుణమిది. తమ లక్ష్యాలను సాధించుకొనేందుకు ఏం చెయ్యాలి? ఎక్కడ మొదలు పెట్టాలి అనే తర్జన భర్జన రెండు వర్గాలలోనూ జరుగుతోంది.

అది బానిస సమాజమైనా, ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ సమాజంలో కూడా దోపిడీ నిరాఘాటంగా కొనసాగటానికి ఆ వర్గాలు ఎన్నో ఆయుధాలను కనుగొన్నాయి, నవీకరించుకున్నాయి. ఇదే సమయంలో ప్రతి చోటా సర్వేజనా సుఖినోభవంతు అని సర్వజన సంక్షేమాన్ని కోరుకున్నవారెందరో వుద్భవించారు. వారంతా సంస్కర్తలుగానే మిగిలిపోయారు. ఆ క్రమంలోనే మరెందరో దోపిడీ వ్యతిరేక పోరులో తమ ప్రాణాలనే అర్పించారు.తమ కాలపు దోపిడీ నగ్న స్వరూపాన్ని గమనించి, సమ సమాజమార్పును తమ ముందుతరాల వారి తత్వం,భావజాలం, త్యాగనిరతిని ఆపోసన పట్టిన వారిలో ఒక రైన మార్క్స్‌ వర్గాల వేల సంవత్సరాలుగా దోపిడీకి గురవుతున్న వర్గానికి దీనిలో జయాపజయాలు ఎవరివి?

అది 1917 అక్టోబరు 25 రాత్రి, సెంట్‌పీటర్స్‌బర్గ్‌లోని రష్యా అధికార కేంద్రమైన వింటర్‌ పాలెస్‌. ఎప్పుడేం జరుగుతుందో, ఒకవైపు కెరెన్క్సీ ప్రభుత్వ నాయకత్వంలోని జార్‌ సేనలు, మరోవైపు బోల్షివిక్‌ తిరుగుబాటుదారులు వుత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సాయంత్రమే అందాల్సిన సంకేతం రాక బోల్షివిక్‌లలో క్షణ క్షణానికి పెరుగుతున్న ఆతృత…. సరిగ్గా 9.45 బాల్టిక్‌ సముద్రతీరంలోని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ రేవులో మరమ్మతుల కోసం లంగరు వేసిన అరోరా యుద్ధ నౌక నుంచి ఫిరంగి పేలుడు. ఏ రష్యన్‌ సామ్రాజ్యవాదుల తరఫున జపాన్‌ సామ్రాజ్యవాదులపై దాడి జరిపిందో అదే యుద్ద నౌకలోని నావికులు తిరుగుబాటు చేసి శ్రామికుల పక్షాన అదే ఫిరంగి పేల్చారు.(పెట్టుబడిదారులు తమకు లాభాలను చేకూర్చే కార్మికులతో పాటు తమ దోపిడీని అంతం చేసే శ్రామికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేయటం అంటే ఇదే. విప్లవ పరిస్ధితులే వస్తే శ్రామికవర్గం ఆయుధాల కోసం తడుముకోనవసరం లేదు) అంతే బోల్షివిక్‌ యోధులు దాడి ప్రారంభించారు. తెల్లవారు ఝామున అంటే 26వ తేదీ వుదయం రెండు గంటలకు వింటర్‌ పాలెస్‌ పూర్తిగా కమ్యూనిస్టుల వశమైంది. ఎర్రజెండా రెపరెపలాడింది. తిరుగబాటు సైరన్‌ మోగిన అక్టోబరు 25 తరువాత కాలంలో సవరించిన రష్యన్‌ కాలండర్‌ ప్రకారం నవంబరు ఏడవ తేదీ అయింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే అక్టోబరు విప్లవం, నవంబరు విప్లవం అన్నా రెండూ ఒకటే.(పదకొండు సంవత్సరాల క్రితం ఈ వ్యాస రచయితకు వింటర్‌ పాలెస్‌ పరసరాలు, అరోరా నౌక, నెవా నది తదితర ప్రాంతాలను సందర్శించే అవకాశం వచ్చిందని తెలపటానికి సంతోషంగా వుంది)

పెద్ద కుదుపుతో చరిత్ర గతిని మరో మలుపు తిప్పిన సందర్భమది. అందుకే ప్రఖ్యాత అమెరికన్‌ జర్నలిస్టు జాన్‌ రీడ్‌ ఆ సమయంలో ప్రత్యక్షంగా చూసిన పరిణామాలను వర్ణిస్తూ ‘ప్రపంచాన్ని కుదిపివేసిన పది రోజులు’ అనే పేరుతో గ్రంధస్థం చేశారు. దోపిడీని శాశ్వతం చేసుకొనేందుకు దోపిడీదార్లకు ఆ వర్గం నేర్పిన పాఠాలు అపారం. దోపిడీకి మతం, కులం, ప్రాంతం, భాష, రంగు, ఆడమగా తేడా లేదు. అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే. కానీ దోపిడీదార్లను, దోపిడీని అంతం చేసే శ్రామికవర్గ ఐక్యతను దెబ్బతీసేందుకు పైన చెప్పుకున్న సకల అవకాశాలనూ వాడుకోవటాన్ని మనం గమనించవచ్చు. కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడక ముందే మన దేశంలో ప్రవేశించిన ఆంగ్లేయ పెట్టుబడిదారులు, పాలకులు, వారిని అనుసరించిన స్వదేశీ పెట్టుబడిదారులు పైన చెప్పుకున్న అంశాలన్నింటినీ వినియోగించుకున్నారు. ఇప్పటికీ వాటిని ప్రయోగిస్తున్నారు. అందువల్లనే శ్రామికుల మధ్య ఐక్యమత్యం సాధించటానికి, తామంతా ఒక్కటే అనే చైతన్యం కలిగించటానికి ఎంత సమయం పడుతుందో, ఆ తరుణం కోసం ఎంతకాలం వేచి చూడాలో ఎవరు జోస్యం చెప్పగలరు. అందులోనూ అనేక కులాలు,భాషలు, సంప్రదాయాలు, సామాజిక అసమానతలు, వివక్షతో కూడిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ వేల సంవత్సరాలుగా వేళ్లూనుకొని నర నరాన జీర్ణించుకుపోయిన మన దేశంలో శ్రామికవర్గ ఐక్యతను సాధించటానికి ఇంకా ఎక్కువ శ్రమపడటం తప్ప దగ్గరదారులు లేవు.

మొత్తం సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతానికి తీవ్ర ఎదురు దెబ్బలు తగిలి, పురోగమనానికి అనేక ఆటంకాలు ఏర్పడిన సమయమిది. అందువలన పురోగామి వాదులు తలా ఒక చేయి వేసి ఈ మహోద్యామాన్ని ముందుకు తీసుకుపోయేందుకు పూనుకోవాల్సిన అవసరం వుంది. కమ్యూనిజం అంతమైంది, తిరిగి లేవకుండా దాన్ని పూడ్చిపెట్టాం, చరిత్ర ముగిసింది అని చెప్పినవారికి గతంలో లేని కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వంద సంవత్సరాలకు ముందు ముందు వరకు పెట్టుబడిదారీ, భూస్వామిక వ్యవస్ధ కంటే వూహాజనితమైన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్ధలు ఎలా మెరుగ్గా వుంటాయో చెప్పి జనాన్ని ఒప్పించేందుకు కమ్యూనిస్టులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఈ వందసంవత్సరాలలో సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలు విఫలమైనప్పటికీ అచిర కాలంలోనే అవిసాధించిన విజయాలను అంతసులభంగా తుడిచిపెట్టలేరని తేలిపోయింది. కొంత కాలం సోషలిస్టు వ్యవస్ధలో జీవనం గడిపి, తిరిగి పెట్టుబడిదారీ వ్యవస్ధలోకి పోయిన చోట్ల కొంత మంది అయినా సోషలిస్టు వ్యవస్ధ గురించి బెంగ పెట్టుకున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అదే పెట్టుబడిదారీ విధానం గురించి దోపిడీ శక్తులు తప్ప సామాన్యులు బెంగపెట్టుకున్నట్లు మనకు ఎక్కడా కనపడదు. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్ధలో పునరావృతం అవుతున్న సంక్షోభాలు పూర్వం వచ్చిన వాటికంటే తీవ్రంగా వుండటంతో పాటు, అనేక తీవ్ర సమస్యలను ముందుకు తెస్తున్నాయి. కొత్త సమాజం గురించి ఆశలేకపోయినా వున్న సమాజం ఎంత త్వరగా పోతే అంత మంచిదని ప్రతి పెట్టుబడిదారీ దేశంలోని శ్రామికులు భావిస్తున్నారు. వంద సంవత్సరాలకు ముందు ఒక్క పెట్టుబడిదారీ సమాజం తప్ప దానితో పోల్చుకొనేందుకు మరొక వ్యవస్ధ లేదు. పెట్టుబడిదారీ వ్యవస్ధలతో పోల్చినపుడు సోషలిస్టు వ్యవస్ధలు తక్కువకాలంలోనే అభివృద్ది చెందుతాయి అనటానికి విఫలమైనప్పటికీ గతంలో సోవియట్‌ యూనియన్‌, వర్తమానంలో చైనా మన కళ్ల ముందున్నాయి. అందువలన ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్ధలతో పాటు, ఎక్కడేం జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా తెలుసుకోగలిగిన ఆధునిక సమాచార వ్యవస్ధ అందుబాటులోకి వచ్చింది.

రొడీషియా పేరుతో గుర్తింపు లేని బ్రిటీష్‌ వారి స్వయం పాలిత వలస రాజ్యంగా వున్న ఆఫ్రికా ఖండంలోని నేటి జింబాబ్వేలో తొలిసారిగా ఈ ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. అనేక కమ్యూనిస్టుపార్టీల మాదిరే అది దక్షిణాఫ్రికాలోని జింబాబ్వే ప్రవాస కార్మికులతో అది ఏర్పడింది.గతంలో రొడీషియా వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు కూడా భాగస్వాములుగా వున్నారు.1940వ దశకంలో ఏర్పడిన కమ్యూనిస్టుపార్టీని నాటి పాలకులు నిషేధించారు. దాంతో కమ్యూనిస్టులు జాతీయోద్యమానికి ప్రాతినిధ్యం వహించిన రెండు పార్టీలలో భాగస్వాములుగా పని చేశారు.1980లో స్వతంత్ర జింబాబ్వే ఏర్పడిన తరువాత ప్రజాస్వామిక మార్పు కొరకు వుద్యమం( మువ్‌మెంట్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ ఛేంజ్‌(ఎండిసి) పేరుతో సాగిన సంస్ధలో పని చేశారు.

అనేక అనుభవాల తరువాత ఎండిసి, ప్రవాసంలో దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీలోసభ్యులుగా వున్న జింబాబ్వియన్లు తాజాగా కమ్యూనిస్టుపార్టీని ఏర్పాటు చేశారు.అదింకా బాల్యావస్ధలోనే వుంది. వచ్చే ఏడాది అక్కడ జరిగే ఎన్నికలలో తాము పాల్గనటం లేదని, ఇతర ప్రతిపక్షపార్టీల మాదిరి అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబేను గద్దెదింపే లక్ష్యం తమ ముందు లేదని, గత కొద్ది సంవత్సరాలుగా గిడసబారిపోయిన దేశ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించి ప్రజలకోసం వుపయోగపడే విధంగా చేసే అంశాలను చర్చకు పెడతామని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నకబుతో మహెబినా ప్రకటించారు. ప్రపంచంలో తాజాగా ఏర్పడిన కమ్యూనిస్టుపార్టీ ఇదని చెప్పవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన తరువాత కూడా కార్మికులను విముక్తి చేయగలిగేది కమ్యూనిజం ఒక్కటే అనే విశ్వాసం ప్రపంచంలో ప్రతి మూలా నిత్యం వ్యక్తమౌతుందటం.

ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిజాన్ని అంతం చేస్తామంటూ కత్తి పట్టుకు తిరుగుతున్న అమెరికాలోనే నూతన సహస్రాబ్ది యువతలో 42శాతం మంది సోషలిస్టు వ్యవస్తే సురక్షితంగా వుంటుందని నమ్ముతుండగా, ఏడుశాతం మంది ఎలాంటి శషభిషలు లేకుండా తాము సోషలిస్టు వ్యవస్ధలోనే జీవించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేసినట్లు తాజాగా జరిగిన సర్వేలో వెల్లడైందని ఒక సంస్ధ వెల్లడించింది. అమెరికా యువతలో ఇలాంటి ధోరణులు వెల్లడి కావటం పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించేదైతే, అభ్యుదయ వాదులకు అంతకంటే ఆనందం కలిగించేదేముంటుంది? వివరాల కొరకు వచ్చే భాగం వరకు వేచి చూడండి.

(గమనిక:సోషలిస్టు దేశాలలో సంభవిస్తున్న మార్పులు, అనుభవాలు, గుణపాఠాల గురించి తద్దినం మాదిరి ఆరోజుకు స్మరించుకొని మరుసటి రోజు నుంచి మరచి పోవటం కాకుండా నిరంతర మధనం కొనసాగించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా తరువాయి భాగాలలో మరికొన్ని అంశాలను రేఖా మాత్రంగా అయినా ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తాను.)

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కనుసన్నలలో ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోత !

19 Thursday Oct 2017

Posted by raomk in Communalism, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ 1 Comment

Tags

Anti-Communist Massacre, cia, Indonesian Communist Party (PKI)., PKI, Suharto’s Purge, Sukarno, US hand in 1960s Indonesia Anti-Communist Massacre

ఎం కోటేశ్వరరావు

పీడకుల నుంచి పీడితులను కాపాడి సమసమాజాన్ని స్ధాపించే మహత్తర కృషిలో కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు అభిమానులు ప్రపంచంలోని అనేక దేశాలలో చిందించిన రక్తం, చేసిన ప్రాణత్యాగాలు మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిలో ఇండోనేషియా కమ్యూనిస్టులకరు. దేశంలో అంతర్యుద్ధం చెలరేగి కమ్యూనిస్టులు ఆయుధాలు చేపట్టి పీడకులపై పోరు సల్పినపుడు వారిని చంపివేశామని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రకటించుకుంటే దాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు.ఎలాంటి తిరుగుబాటు, పోరు లేకుండానే యాభై రెండు సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు పదిలక్షల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, వారి కుటుంబసభ్యులు, సానుభూతిపరులని అనుమానం వున్న వారిని అక్కడి సైన్యం వూచకోత కోసింది. సైన్యానికి మహమ్మదీయ పేరుతో వున్న ఒక సంస్ధను కూడా తోడు చేసి వారికి ఆయుధాలిచ్చి హత్యాకాండకు కమ్యూనిస్టులను గుర్తించటం, హత్య చేయటానికి వుపయోగించుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద మానవహక్కుల పరిరక్షకులమని చెప్పుకొనే అమెరికన్లకు ఈ దారుణ మారణకాండ వారి ఎరుకలోనే జరిగిందని, హత్యాకాండ పట్ల హర్హం వ్యక్తం చేస్తూ నివేదికలు పంపిన విషయాన్ని మంగళవారం నాడు అమెరికా ప్రభుత్వమే స్వయంగా వెల్లడించిన పత్రాలు తెలిపాయి. ఆ వూచకోతలో అమెరికా, దాని మద్దతుదారుగా వున్న బ్రిటన్‌ వూచకోతను సాగించేందుకు ఇచ్చిన తోడ్పాటును ఈ పత్రాలు నిర్ధారించాయి. ఇవి అమెరికాకు ఇబ్బందిలేని రీతిలో జాగ్రత్తగా ఎంపిక చేసి బహిర్గతపరచినవని గమనించాలి. పూర్తి సమాచారం తెలియాలంటే సిఐఏతో సహా మిగిలిన అన్ని పత్రాలను విడుదల చేయాల్సి వుంది. ఆ సమయంలో కమ్యూనిస్టుల తిరుగుబాటు, అధ్యక్షుడిగా వున్న ఇండోనేషియా జాతీయవాది సుకర్ణో ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్లు జరిపిన తప్పుడు ప్రచార బండారాన్ని ఇవి బయట పెట్టాయి. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే పధకంలో భాగంగా అమెరికా కనుసన్నలలో జరిగిన కుట్రలో మిలిటరీ జనరల్‌ సుహార్తో నాయకత్వంలో సుకర్ణోను బందీని చేసి ఆయన పేరుతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

1965ా66 సంవత్సరాలలో జరిపిన ఈ వూచకోతకు సంబంధించి జకర్తాలోని అమెరికా రాయబారకార్యాలయంలో వున్న 39 రహస్య పత్రాలను విడుదల చేశారు. ఇండోనేషియా వూచకోత వాస్తవాలను వెల్లడించాలని అక్కడి పౌరహక్కుల సంస్దలు, చరిత్రకారులు గతకొద్ది సంవత్సరాలుగా చేస్తున్న డిమాండ్‌కు ఇవి కొంత మేరకు వుపయోగపడతాయి. అసలైన నిందితులను బోనులో నిలబెట్టేందుకు ఇంకా ఎంతో చేయాల్సి వుంటుంది. తన ప్రయోజనాలకు హానిలేవు అనుకున్న పత్రాలను మాత్రమే అమెరికా విడుదల చేస్తుంది అనే విషయాన్ని సదా గమనంలో వుంచుకోవాలి. నేషనల్‌ సెక్యూరిటీ అర్కైవ్స్‌ పేరుతో వున్న ఒక సంస్ధ ద్వారా ఇలాంటి పత్రాలను విడుదల చేస్తారు.

‘1965ా66లో ఇండోనేషియాలో జరిగిన సామూహిక హత్యల గురించి అమెరికా అధికారులకు వివరంగా తెలుసునని కొత్తగా విడుదల చేసిన పత్రాలు స్పష్టం చేశాయి. ‘ ఇది 20శతాబ్దంలో జరిగిన ఒక దారుణమైన కిరాతకాన్ని చరిత్రగా నమోదు చేయటానికే కాదు, ఎప్పుడో జరగాల్సిన బాధితుల బాధానివారణ దిశగా కూడా అన్ని పత్రాలను విడుదల చేయాలని’ నేషనల్‌ సెక్యూరిటీ సంస్ధ ఆసియా డిప్యూటీ డైరెక్టర్‌ ఫెలిమ్‌ కినే వ్యాఖ్యానించారు. 1965 నుంచి 1968 వరకు జరిగిన పరిణామాలకు సంబందించి దాదాపు 30వేల పేజీలున్న 39 పత్రాలను విడుదల చేశారు. వాటిలో టెలిగ్రాములు, లేఖలు, రహస్య వర్తమానాలు, పరిస్ధితి గురించి మదింపు నివేదికల వంటివి వున్నాయి.

గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా నియంత సుహార్తో మరణించిన తరువాత అక్కడ పౌర ప్రభుత్వాలు ఏర్పడి నప్పటి నుంచి కమ్యూనిస్టులపై జరిపిన మారణకాండ వివరాలను బయటపెట్టాలని ఏదో ఒక రూపంలో అక్కడ ఆందోళన కొనసాగుతున్నది. అదే సమయంలో ఆవివరాలను ఏమైనా సరే బయటపెట్టకూడదని మిలిటరీ తీవ్ర వత్తిడి తెస్తున్నది. సుహార్తో మరణానంతరం పౌరపాలకులే అధికారంలో వున్నప్పటికీ తెరవెనుక మిలిటరీదే అధికారం. నిషేధిత కమ్యూనిస్టు పార్టీని తిరిగి పునరుద్దరించే యత్నాలు జరుపుతున్నారనే పేరుతో మిలిటరీ ప్రోద్బలంతో గతం నుంచి మిలిటరీతో సంబంధాలున్న మహమ్మదీయ సంస్ధ వారసులు కొత్త పేరుతో ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఎర్రరంగు టీ షర్టు వేసుకున్నా కమ్యూనిస్టు అనే అనుమానంతో పోలీసులు పట్టుకొని విచారణ జరుపుతున్నారు. కమ్యూనిస్టు సాహిత్యం అమ్మేవారిని కూడా పోలీసు స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. నాటి వూచకోతకు సంబంధించి బంధువులకు న్యాయ సహాయం అందించేందుకు ఒక హాలులో ఏర్పాటు చేసిన సమావేశం కమ్యూనిస్టుల మీటింగ్‌ అంటూ ముస్లిం మతోన్మాదులతో దానిపై దాడి చేయించారు. అదే విధంగా కమ్యూనిస్టుపార్టీని పునరుద్దరించకూడదనే పేరుతో తలపెట్టిన ప్రదర్శనలో జనం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పాతికవేల మంది వరకు పోలీసులు రక్షణగా పాల్గన్నారు. యువతరానికి చరిత్రను తెలియ చెప్పాలనే పేరుతో కమ్యూనిస్టులను హత్యచేయటాన్ని సమర్ధిస్తూ మిలిటరీ తరఫున తీసిన చిత్రాన్ని ప్రతిఏటా సెప్టెంబరు 30 టీవీలు, ఇతర చోట్ల ప్రదర్శించేవిధంగా మిలిటరీ చర్యలు తీసుకొంటోంది. వాస్తవాలను చెప్పే డాక్యుమెంటరీల ప్రదర్శనలను అడ్డుకుంటోంది. ఈ పూర్వరంగంలో పరిమితమైన సమాచారాన్నే వెల్లడించినప్పటికీ ఈ పత్రాల విడుదల హక్కుల వుద్యమానికి మరింత వూపు తెస్తాయి. ఇప్పటికీ కమ్యూనిస్టులను హతమార్చటాన్ని అధికారికంగా సమర్ధిస్తూనే వున్నారు. మరణించిన వారు కనీసంగా ఐదు నుంచి పదిలక్షల మంది వరకు వుంటారని అంచనా. ఇంతకాలం గడిచినా తమవారి అదృశ్యం గురించి ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులకు రక్షణ లేదు.ఇండోనేషియాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తిరుగుబాటులో భాగంగా 1965 సెప్టెంబరు 30న ఆరుగురు మిలిటరీ జనరల్స్‌ను కమ్యూనిస్టులు హత్య చేశారనే ఆరోపణతో మిలిటరీ మారణకాండకు పాల్పడింది. నిజానికి ఆ జనరల్స్‌ను కుట్రలో భాగంగా సుహార్తోయే చంపించారన్నది బహిరంగ రహస్యం. వారు కమ్యూనిస్టు అనుకూల మిలిటరీ అధికారులనే అభిప్రాయం కూడా వుంది.

సిఐఏ ద్వారా పధకాన్ని రూపొందించటం ఐదువేల మంది ప్రముఖ కమ్యూనిస్టుల వివరాలు, మిలిటరీకి ఆయుధాలు,ముస్లింమతోన్మాదులకు శిక్షణ, నిధులు అందచేసిన అమెరికా ప్రభుత్వ పాత్ర వివరాలు ఇంకా బయటకు రావాల్సి వుంది. 1990లో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చిన అమెరికా రాయబారకార్యాలయం ఒక అధికారి తనంతటతానే ఒక జాబితాను రూపొందించి ఇచ్చినట్లు అంగీకరించింది. సామూహిక మారణకాండ గురించి నాటి అమెరికా అధికారులు ఎంత సంతోషంగా వర్తమానం పంపారో మచ్చుకు చూడవచ్చు.’ రెండున్నర వారాలలో లక్షమందిని నమ్మశక్యంగాని రీతిలో ఆమీట వూచకోత కోసింది’ అని జకర్తాలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రధమ కార్యదర్శి మారీ వాన్స్‌ ట్రెంట్‌ పంపిన వర్తమానంలో వుంది. 1966లో సిఐఏ అధికారి ఎడ్వర్డ్‌ మాస్టర్స్‌ ఒక వర్తమానంలో ‘బందీలుగా పట్టుకున్న కమ్యూనిస్టుల’ సమస్య గురించి చర్చించారు. ‘ కమ్యూనిస్టు ఖైదీలను వురితీయటం లేదా పట్టుకోక ముందే వారిని చంపివేయటం ద్వారా అనేక ప్రాంతాలు ఈ సమస్యను విజయవంతంగా అధిగమించాయి. దానిలో ముస్లిం యువజన బృందాల కర్తవ్యం ఏమంటే వారికి సహాయం అందచేయటం’ అని పేర్కొన్నాడు. నిజానికి ఈ పత్రాలను 2001లోనే సిద్ధం చేశారు గాని, 16 సంవత్సరాల తరువాత మంగళవారం నాడు విడుదల చేశారు. ‘ మాకు నిజంగా తెలియదు వాస్తవ సంఖ్య లక్షో పదిలక్షలో తెలియదని పేర్కొన్న 1966 ఏప్రిల్‌ నాటి ఒక వర్తమానం విడుదల చేసిన వాటిలో వుంది. సుకర్ణోను గద్దె దించితే ఇండోనేషియాకు అమెరికా సాయం అందచేస్తుంది అనే ఒక వర్తమాన పత్రం కూడా వీటిలో వుంది. మిలిటరీ నియంత సుహార్తో తన అధికారాన్ని సుస్ధిరం చేసుకున్నారని నిర్ధారించుకున్న తరువాత 1966 మార్చి నెల నుంచి అమెరికా సాయం ప్రారంభమైంది.

ఈ పత్రాలను విడుదల చేయాలంటూ 2015లో అమెరికా సెనెట్‌లో ఒక బిల్లును ప్రతిపాదించిన టామ్‌ వుడాల్‌ పత్రాల విడుదల గురించి వ్యాఖ్యానిస్తూ ‘ దారుణమైన నేరాలకు పాల్పడిన సమయంలో ఇండోనేషియా ప్రభుత్వానికి తోడ్పడిన తీరును కూడా ఎంతగానో ఇవి వెల్లడిస్తాయి. ఇండోనేషియాలో ఈ హత్యల వెనుక వున్న వారు అనేక మంది ఎలాంటి శిక్షలు లేకుండా ఇప్పటికీ జీవించి వున్నారు. బాధితులు, వారి వారసులను వెనక్కు నెట్టారు, గుర్తింపు లేకుండా పోయింది.దీనిలో అమెరికా తన పాత్ర గురించి ఘర్షణ పడాలి, దాన్ని అంగీకరించటం ద్వారానే భవిష్యత్‌ మానవహక్కుల రక్షణ గురించి గట్టిగా మాట్లాడగలం ‘ అన్నారు. మహమ్మదీయ సంస్ధ పేరుతో వ్యవహరించిన మతోన్మాదులు మిలిటరీతో చేతులు కలిసి మసీదులలో ప్రార్ధనల సందర్భంగా కమ్యూనిస్టులు దైవ ద్రోహులని వారిని ఎక్కడ బడితే అక్కడ కోడి మెడ కోసినట్లు కోసి చంపాలని పిలుపు ఇచ్చారంటూ అమెరికన్లు పంపిన వర్తమానాలలో వున్నాయి. ‘ మాకు ఈ విషయాల గురించి బాధితుల మౌఖిక సంభాషణల ద్వారా సాధారణంగా తెలుసు, కానీ ఇప్పుడు ఇప్పుడు విడుదల చేసిన సమాచారం మంచి చెడ్డలన్నింటినీ వెల్లడించటం గొప్ప విషయం అని బ్రిటీష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ చరిత్ర అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జాన్‌ రోజా వ్యాఖ్యానించారు.

నెదర్లాండ్స్‌ వలస రాజ్యంగా వున్న ఇండోనేషియా స్వాతంత్య్ర వుద్యమానికి నాయకత్వం వహించిన వారిలో సుకర్ణో ఒకరు. ఆయన జాతీయవాదులు, కమ్యూనిస్టుల అనుకూల వైఖరిని కలిగి వుండేవారు.1945లో ఏర్పడిన స్వతంత్ర ఇండోనేషియాకు ఆయన తొలి అధ్యక్షుడు. అలీనోద్యమ నేతల్లో ఒకరు. తొలిరోజుల్లో జాతీయవాదిగా వున్నప్పటికీ 1960 దశకం నాటికి ఆయన కమ్యూనిస్టుల పట్ల మరింత సానుకూల వైఖరిని తీసుకున్నారు. ఇది అమెరికాకు కంటగింపు అయింది. అప్పటికే అమెరికన్లు వియత్నాంపై దాడులు చేస్తూ మారణకాండ సాగిస్తున్నారు. ఇండోనేషియాలో అతి పెద్ద కమ్యూనిస్టుపార్టీ వుంది. ఇస్లామిక్‌ దేశాలలో పెద్దదైన ఇండోనేషియా ఏ క్షణంలో అయినా కమ్యూనిస్టు దేశంగా మారిపోయే అవకాశం వుందని అమెరికా భయపడింది. అదే అక్కడి కుట్రలకు నాంది. దానిలో భాగంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టేందుకు తెరలేపారు. దీనితో పాటు ఇతర విద్రోహ చర్యలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు రైతాంగ గెరిల్లాల వ్యవస్ధను కూడా తయారు చేసేందుకు పూనుకున్న తరుణంలో సిఐఏ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులసామూహిక హత్యాకాండకు పధకరచన సాగిందని, దాని గురించి సూచాయగా తెలిసినప్పటికీ అధ్యక్షుడు సుకర్ణో మద్దతు వున్నందున కమ్యూనిస్టులు తీవ్రతను వూహించలేక, తగిన సన్నద్దులు కాలేకపోయారని,కుట్రను తిప్పికొట్టలేకపోయారని కూడా ఒక అభిప్రాయం వుంది. సుకర్ణోకు కమ్యూనిస్టుల నుంచి ముప్పు ఏర్పడిందనే పేరుతో ఆయనను గృహనిర్బంధం చేసి మిలిటరీ జనరల్‌ సుహార్తో అధ్యడిగా ప్రకటించుకొని హత్యాకాండను సాగించాడు. 1970లో సుకర్ణో కిడ్నీ వ్యాధితో మరణించినట్లు ప్రకటించారు.

అమెరికా వెల్లడించిన పత్రాలలో సమాచారం వూచకోత దోషులను వెల్లడించకపోయినప్పటికీ అనేక విషయాలను అధికారికంగా నిర్ధారించింది. ఇండోనేషియా సామాజిక, రాజకీయ వ్యవస్ధలో సంభవించబోయే మార్పులను ఇవి ఎంతో కొంత మేరకు ప్రభావితం చేస్తాయి. మిలిటరీ, సామ్రాజ్యవాదుల పాత్ర గురించి వాస్తవాలను తెలుసుకొనే ఆసక్తిని కలుగచేస్తాయి. ప్రజాస్వామిక, ఇప్పటికీ రహస్యంగానే వున్న వామపక్ష శక్తులు మరింత చురుకుగా పని చేస్తాయనటం నిస్సందేహం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెరుగైన అవకాశాలు-తీవ్ర సవాళ్ల మధ్య చైనా: గీ జింపింగ్‌

18 Wednesday Oct 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China, chinese communist party, chinese communist party congress 2017, Xi Jinping

బుధవారం నాడు మహాసభను ప్రారంభిస్తున్న గీ జింపింగ్‌

చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ ప్రారంభం

ఎం కోటేశ్వరరావు

ప్రియమైన పాఠకులు ఈ వ్యాసం చదవటం ప్రారంభించే సమయానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరొక చారిత్రక అధ్యాయానికి చైనాలో తెరలేచింది. వారం రోజుల పాటు జరిగే చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ బుధవారం నాడు ప్రారంభమైంది. బీజింగ్‌లోని తియన్మెస్‌ స్క్వేర్‌లోని గ్రేట్‌ హాల్‌లో మహాసభ ప్రారంభం వుపన్యాసంలో రానున్న ఐదు సంవత్సరాల కార్యాచరణకు సంబంధించిన అంశాలను పార్టీ ప్రధాన కార్యదర్శి గీ జింపింగ్‌ ఆవిష్కరించారు.’ ప్రస్తుతం చైనా, ప్రపంచం కూడా తీవ్ర మరియు సంక్లిష మార్పుల మధ్య వుంది. వ్యూహాత్మక అభివృద్ధి అవకాశాల విషయంలో చైనా ఇప్పటికీ ఒక ముఖ్యమైన యుగంలోనే వుంది. అవకాశాలు మెరుగ్గా వున్నాయి, అదే సమయంలో తీవ్రమైన సవాళ్లు కూడా వున్నాయి.’ అని జింపింగ్‌ చెప్పారు.

ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహసభల గురించి అటు శత్రువులు, ఇటు స్నేహితులలోనూ సహజంగానే ఎంతో ఆసక్తి తలెత్తుతుంది. గతంలో జరిగిన మహాసభలకు ముందు ప్రపంచ మీడియాలో ఎన్నో కట్టుకథలు, పిట్టకథలు రాసేవారు. ఈ సారి కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా తన పాఠకులు, వీక్షకులకు అటువంటి వినోదాన్ని చాలా పరిమితం చేసి ఎందరినో నిరాశపరిచింది.

పురాతన చరిత్రలో ఎన్నో వైవిధ్యాలను నమోదు చేసిన చైనా వర్తమానంలో కూడా అదే బాటలో నడుస్తోంది. పెట్టుబడిదారీ దేశాలు, వ్యవస్ధలతో ఆర్ధిక సంబంధాలు కలిగి వున్న కారణంగా కొన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ ఏడాదికేడాది ఎన్నో విజయాలు సాధిస్తూ చైనా సోషలిస్టు వ్యవస్థ ముందుకు పోతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్ధకు పట్టిన జబ్బులు ఎప్పుడు వదులుతాయో, పక్షవాతం ఎన్నటికి నయమౌతుందో తెలియని స్ధితిలో చైనా గురించి అవాస్తవాలు రాసే మీడియా విశ్వసనీయత నానాటికీ పడిపోవటం వంటి కారణాలతో ఈ సభల సందర్భంగా వాటి జోలికి పోలేదా ? పది సంవత్సరాల క్రితం ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రం అమెరికాలో ప్రారంభమైన సంక్షోభానికి త్వరలో పదేండ్లు నిండబోతున్నాయి. తమతో పాటే చైనా కూడా మునిగిపోతుందని పిచ్చి కలలు కన్న వారిని చైనా కమ్యూనిస్టులు కొరడాతో కొట్టి లేపి మా విజయాలు చూడండి అని చూపుతున్న కారణంగానే 19వ మహాసభ సందర్భంగా వారు ఒళ్లు దగ్గర పెట్టుకున్నారా ?

కమ్యూనిస్టు పార్టీల మహాసభలు రెండు విధాలుగా జరుగుతాయి. అధికారంలో వున్న కమ్యూనిస్టు పార్టీలు సైద్దాంతిక సమస్యలతో పాటు తమ దేశ ఆర్ధిక వ్యవస్ధ, జనజీవన పరిస్ధితులను ఎలా మెరుగుపరచాలో సభలలో చర్చించి లక్ష్యాలను నిర్ణయించుకుంటాయి. ప్రస్తుతానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ముందు పెద్ద సైద్ధాంతిక సవాళ్లు లేవనే చెప్పాలి. అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ము చేసి, ప్రపంచ దేశాలతో సఖ్యత పెంచుకొని తన జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచి వర్తమానం నుంచి మరో సోషలిస్టు దశకు ఎలా చేరటమా అన్నదే వారి ముందున్న పెద్ద సవాలు . అధికారంలో లేని కమ్యూనిస్టు పార్టీలు జరిపే సభలలో సైద్ధాంతిక, రాజకీయ ఎత్తుగడల పంధా, జనజీవన పరిస్థితుల మెరుగుదలకు చేపట్టాల్సిన పోరాటాల వంటి సమస్యలు ప్రధాన అజెండాగా వుంటాయి.

2012లో జరిగిన 18వ మహాసభ తరువాత చైనా సాధించిన అభివృద్ధి గురించి జాతీయ గణాంకాల సంస్థ వివరాలను గత వారంలో విడుదల చేసింది. 2013ా16 సంవత్సరాల మధ్య ప్రపంచ సగటు వృద్ధి రేటు 2.6, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 4 వుంటే చైనాలో 7.2శాతం వుంది.ఈ ఏడాది తొలి త్రైమాసిక వృద్ధి రేటు 6.9శాతం. గతేడాది ప్రపంచ జిడిపి విలువలో చైనా వాటా 14.8శాతం(11.2లక్షల కోట్ల డాలర్లు).గత నాలుగు సంవత్సరాలలో 3.4శాతం పెరిగింది. ఇదే కాలంలో ప్రపంచ పురోభివృద్ధికి చైనా 30శాతం వాటా అందించింది.ఇది అమెరికా, జపాన్‌, యూరోజోన్‌ దేశాల మొత్తం కంటే ఎక్కువ. జిడిపిలో సేవారంగం వాటా 45.3 నుంచి 51.6కు పెరిగింది. పట్టణాలలో పని చేసే గ్రామీణుల వార్షిక పెరుగుదల రేటు 1.8శాతం. పట్టణాలలో శాశ్వతనివాసితుల శాతం 52.57 నుంచి 57.35కు పెరిగింది. ఏటా కోటీ 30లక్షల కొత్త వుద్యోగాలు కల్పిస్తున్నప్పటికీ 31 పెద్ద నగరాలలో నిరుద్యోగులు ఐదుశాతం వున్నారు.పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు 1.91నుంచి 2.11శాతానికి పెరిగింది. పేటెంట్‌ దరఖాస్తుల స్వీకరణ 69శాతం, మంజూరు 39.7శాతం పెరిగింది.కొత్త కంపెనీల నమోదు పెరుగుదల 30శాతం. జనం ఖర్చు చేయగలిగిన తలసరి ఆదాయం 7,311యువాన్ల నుంచి 23,821కి పెరిగింది.వార్షిక పెరుగుదల రేటు 7.4శాతం. అది గ్రామీణుల విషయంలో 10.7శాతం వుంది.

1921లో షాంఘై నగరంలో చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి మహాసభ జరిగింది.మావో సేటుంగ్‌తో సహా కేవలం 13 మంది మాత్రమే ప్రతినిధులు ఆ సభకు హాజరయ్యారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో కొన్ని డజన్ల మంది కార్యకర్తలు, నాయకులు మాత్రమే అసమయానికి వున్నారు.వారి నాయకత్వంలో కమ్యూనిస్టుపార్టీ 28 సంవత్సరాల తరువాత అనూహ్యరీతిలో చైనాలో అధికారాన్ని స్వీకరిస్తుందని వారు ఆ సమయంలో వూహించి వుండరు. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమ చరిత్రలో చైనాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అక్కడి భౌతిక పరిస్ధితులకు అనుగుణ్యంగానే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ’ నిర్మాణం చేపట్టాలని 1982లో పన్నెండవ మహాసభ నిర్ణయించింది. బీజింగ్‌లో జరుగుతున్న 19వ సభకు 8.9కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశమంతటి నుంచీ ఎన్నికైన 2,287 మంది ప్రతినిధులు హాజరుకావాల్సివుంది. ఈ సభలో ఇరవై అయిదు మందితో పొలిట్‌బ్యూరో, ఏడుగురితో పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ, 205 మందిని కేంద్రకమిటీ సభ్యులుగా మరి కొందరిని ప్రత్యామ్నాయ కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. కేంద్రకమిటీ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటుంది.

గతమహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గ్జీ జింపింగ్‌(64) తిరిగి ఆ బాధ్యతకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయని, పార్టీలో అంతర్గతంగా ఎలాంటి నాయకత్వ సమస్యలేదని, స్టాండింగ్‌ కమిటీలోని ఏడుగురిలో ఐదుగురు బాధ్యతల నుంచి తప్పుకొంటారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో చర్చించబోయే అంశాలను ముందుగానే గత మహాసభలో ఎన్నికైన కేంద్రకమిటీ ఖరారు చేస్తుంది.రాబోయే మహాసభ వరకు ఏమి చెయ్యాలో ముసాయిదా నివేదికలను రూపొందిస్తుంది. ఒక వేళ కేంద్రకమిటీలో తీవ్రమైన భిన్నాభిప్రాయాలుంటే పార్టీ అత్యున్నత విధాయక పార్టీ మహాసభకు నివేదిస్తుంది. అంగీకారమైతే వాటిని నివేదికలు లేదా తీర్మానాలలో చేర్చుతారు, లేదా సవరణ ప్రతిపాదనలను ఓటింగ్‌కు పెట్టి అంతిమ నిర్ణయం చేస్తారు.

ఈ మహాసభ సమయంలో పిట్టకథలేమీ లేవంటే అసలేమీ లేవని కాదు. అవి లేకపోతే మీడియాకు కిక్కు వుండదు కదా. బహిరంగంగా మాట్లాడే అసమ్మతి వాదులను మహాసభ సమయంలో బీజింగ్‌ వదలి వెళ్లమన్నారని, విదేశీ జర్నలిస్టులతో మాట్లాడవద్దన్నారని రాశారు. అధికారిక వార్తా సంస్ధ నుంచి వచ్చే కథనాలను తప్ప వేరే పుకార్లను వ్యాపింపచేయవద్దని, చోటివ్వవద్దని మీడియా సంస్ధలకు జారీ చేసిన రహస్య సెన్సార్‌ నిబంధనలలో పేర్కొన్నారని ఒక పత్రిక రాసింది. ఇవెంత హాస్యాస్పదమో వేరే చెప్పనవసరం లేదు. ఇవే నోళ్లు గతంలో అసమ్మతి వాదులను జైలు పాలు చేశాయని చెప్పి ఇప్పుడు నగరం విడిచి వెళ్లమని చెప్పాయని చెబుతున్నాయి. అధికార మీడియా సంస్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రహస్య సెన్సార్‌ నిబంధనలు అని చెప్పటం కట్టుకధగాక మరేమిటి? గత నాలుగు దశాబ్దాలుగా చెబుతున్న ఒక పిట్టకధ చైనీయులు చెప్పే అంకెలను నమ్మకూడదు. ఎవరు నమ్మమన్నారు? వివిధ దేశాలతో వాణిజ్య మిగులు కారణంగా ఏ దేశం వద్ద లేనన్ని డాలర్లు పోగుపడ్డాయా లేదా? చివరకు అమెరికాయే వారి నుంచి అప్పుతీసుకొంటోందా లేదా? అన్ని దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లి పరిశ్రమలు, వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారా లేదా ?

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఇతర దేశాలపై నెట్టేందుకు, ఇతర దేశాల మార్కెట్లను ఆక్రమించుకొని ఇబ్బందుల నుంచి తాము బయట పడాలని పెట్టుబడిదారీ వర్గం చేయని ప్రయత్నం లేదు. వారికి కంటగింపుగా వున్న తమను వేయి కళ్లతో చూస్తున్నాయని చైనా నాయకత్వానికి తెలియంది కాదు. గత మూడు దశాబ్దాలుగా విపరీత వేగంతో జరిగిన అభివృద్ది వారికి కొత్త సమస్యలను తెచ్చింది. ఆర్ధికరీత్యా తమతో సంబంధాలు కలిగి వున్నప్పటికీ సోషలిస్టు వ్యవస్థను కూల్చేందుకు, మిలిటరీ రీత్యా దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. వీటిని ఎదుర్కొంటూనే, అంతర్గతంగా సామాజికంగా తలెత్తుతున్న సమస్యల నుంచి తమ వ్యవస్ధను మెరుగుపరుచుకోవటం అనే ద్వంద్వ సవాళ్లను ప్రస్తుతం చైనా నాయకత్వం ఎదుర్కొంటున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ ప్రపంచంలో వున్న వైరుధ్యాలను ప్రస్తుతానికి అది వుపయోగించుకోగలుగుతోంది. ఈ రోజు చైనా సాధిస్తున్న పురోగతి, దాని నుంచి ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి లబ్ది పొందకుండా మనకు మనమే గిరిగీసుకోవద్దని ఆస్ట్రేలియా-చైనా వాణిజ్య మండలి మాజీ సిఇవో లారీ పెర్సీ ‘ఆస్ట్రేలియన్‌’ పత్రికలో చైనా కమ్యూనిస్టుపార్టీ మహాసభ సందర్భంగా రాసిన వ్యాసంలో సలహా ఇచ్చారు. నలభై అయిదు సంవత్సరాల క్రితం 1971లో ఆస్ట్రేలియా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు విట్‌లామన్‌ చైనా సందర్శించారు. అది జరిగిన మూడు రోజుల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ రహస్యంగా చైనా వెళ్లి నిక్సన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసి వచ్చాడు. ఆ పర్యటనను నాడు అధికారంలో వున్న ఆస్ట్రేలియా సంకీర్ణ కూటమి దాన్ని బుద్దిలేని వ్యవహారంగా చూసిందని ఆ వుదంతాన్ని పేర్కొంటూ అమెరికాయే చైనాతో సంబంధాలు పెట్టుకొని లబ్ది పొందుతున్నపుడు మనం కూడా చైనా నుంచి ఎందుకు లబ్ది పొందకూడదని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఇది ఒక్క ఆస్ట్రేలియా కార్పొరేట్ల వైఖరే కాదు. గత పది సంవత్సరాలుగా ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న మన దేశంతో సహా అన్ని పెట్టుబడిదారీ దేశాల కార్పొరేట్ల ఆలోచనకు అది ప్రతిబింబం. అందువలనే బయట వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గాంగ్‌ చైనా వ్యతిరేక ప్రచారం చేసి ఇంతకాలం తాము తయారు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేకులను సంతృప్తి పరుస్తుంటే అధికారంలో వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చైనాతో వాణిజ్యం, పెట్టుబడులతో కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. ఇది వారి ద్వంద్వ స్వభావం అనేకంటే మోసకారి తనం అనాలి.

చైనా కమ్యూనిస్టు పార్టీ విజయాల వెనుక ఎంతో పకడ్పందీగా పధకం రూపొందించటం, ఆచరణ గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అంగీకరిస్తారు. బ్రిటీష్‌ వారి కౌలుకింద వున్న హాంకాంగ్‌ ప్రపంచంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రాలలో ఒకటిగా మారింది. తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ కూడా అదేమాదిరి అభివృద్ధి చెందింది. వాటితో పోల్చుకుంటే ప్రధాన భూభాగం ఎంతో వెనుక బడి వుంది. కౌలు గడువు తీరి హాంకాంగ్‌ చైనాలో విలీనమైంది. అక్కడ వున్న పెట్టుబడుల అవసరం చైనాకు వుంది. అందువలననే సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి భంగం కలగకుండానే ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానం కింద 2050వరకు హాంకాంగ్‌ ఆర్ధిక వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఒక ఒప్పందం చేసుకొని అక్కడి పెట్టుబడిదారులకు స్పష్టమైన హామీనిచ్చింది.

చైనాలో సంస్కరణలు మొత్తం మీద ఎంతో అభివృద్దికి దోహదం చేసినప్పటికీ ఆదాయ, ప్రాంతాల మధ్య అసమాన అభివృద్ధి అసమానతలు, అవినీతి పెరుగుదల వంటి సమస్యలతో పాటు, సామాజికంగా మత ప్రభావం పెరుగుదల వంటి కొత్త సమస్యలను చైనా ఎదుర్కొంటోంది. వాటిని తక్కువగా చూడనవసరం లేదు. వాటిని పరిష్కరించటంలో చైనా నూతన నాయకత్వం ఎలాంటి చర్యలను చేపడుతుందన్నదే ఆసక్తికరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిజంపై ఓ అమెరికా సైనికుడి ఆత్మవిశ్వాసం !

04 Wednesday Oct 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, Che Guevara, communism will win, pro-communist statements, spenser rapone, West Point cadet

ఎం కోటేశ్వరరావు

‘కమ్యూనిజం విజయం సాధిస్తుంది ‘ ‘ నిన్ను ఏదైనా సందేహం తొలుస్తూ వుంటే విజయం సాధించే వరకూ ముందుకు సాగిపో ‘ సెప్టెంబరు 24,25 తేదీలలో ఒక అమెరికన్‌ సైనికుడు చేసిన ట్వీట్లివి. అతడే సెకెండ్‌ లెప్టినెంట్‌ కల్నల్‌ స్పెన్సర్‌ రపోనే. మొదటిది రపోనే ఆత్మవిశ్వాసం, రెండవది ప్రముఖ విప్లవకారుడు చే గువేరా సుప్రసిద్ద నినాదం. రపానే అల్లరిచిల్లరి యువకుడు కాదు. అమెరికాలోని ప్రతిష్టాత్మక మిలిటరీ శిక్షణా కేంద్రం వెస్ట్‌పాయింట్‌లో గతేడాది అతను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. అక్కడ ప్రవేశం దొరకాలంటే ఎంతో ప్రతిభవుంటే తప్ప అసాధ్యం.

అమెరికాలో ఎవరినైనా వేధించాలనుకుంటే కమ్యూనిస్టు అని ముద్ర వేయటం పరిపాటి. ఇంటి చుట్టుపక్కల వారు కూడా ఆ ముద్రపడిన వారిని దగ్గరకు రానివ్వరు. అంతగా అక్కడి పాలకులు కమ్యూనిజం, కమ్యూనిస్టుల గురించి వ్యతిరేకత నూరి పోశారు. అలాంటి అప్రజాస్వామిక, దుర్మార్గపు దేశంలో స్పెన్సర్‌ రపోనే చే గువేరా అభిమానినని, కమ్యూనిజం విజయం సాధిస్తుందని ప్రకటించటం అమెరికా యువతలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలంపై పెరుగుతున్న ఆసక్తి, అవును నేను సోషలిస్టును, కమ్యూనిస్టునే ఏం చేస్తారో చేసుకోండి అనే తెగింపు ధోరణికి ఒక చిహ్నంగా చెప్పవచ్చు. దీనర్ధం తెల్లవారేసరికి అక్కడేతో పెద్ద మార్పు జరుగుతోందని కాదు. ప్రతి సంఘటన పెను మార్పులకు దారితీయదు, అదే విధంగా సంభవించిన ప్రతి పెనుమార్పు చిన్న ఘటనగానే ప్రారంభం అవుతుందని చెప్పటమే ఇక్కడ వుద్దేశ్యం.

మొదటి ప్రపంచయుద్ధానికి ముందు జర్మన్‌ సామాజికవేత్త వెర్నర్‌ సోమ్‌బార్ట్‌ రాసిన ఒక వ్యాసానికి అమెరికాలో సోషలిస్టులు ఎందుకు లేరు అని శీర్షిక పెట్టారని, ఇప్పుడు దాన్నే మరోవిధంగా అమెరికాలో సోషలిస్టులు ఎందుకు తయారవుతున్నారని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందని హరాల్డ్‌ మేయర్సన్‌ అనే ఒక జర్నలిస్టు గతేడాది రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యమా లేక ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత తప్పుడు ప్రచారం చేసినా సోషలిజం పట్ల జనంలో వున్న సానుకూల దృక్పధానికి చిహ్నమా ? యువతరం ఆలోచించాలి. ఏదైనా ఒక వ్యవస్ధ విఫలమై ఆటంకంగా మారితేనే దానికంటే మెరుగైన ప్రత్యామ్నాయం గురించి జనం ఆలోచిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం.

బెర్నీ శాండర్స్‌ అనే డెమోక్రటిక్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు స్వయంగా తాను సోషలిస్టును అని ప్రకటించుకున్నాడు. అతగాడి ప్రకటనపై అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారు. అమెరికా వంటి చోట్ల ఎవరైనా అలా ప్రకటించుకుంటే అనుమానించటం సహజమే. అయితే శాండర్స్‌ రాజకీయ ప్రస్తానాన్ని చూసినపుడు మిగతా డెమోక్రాట్ల కంటే భిన్నంగా కనిపిస్తాడు. ఎవరి నిజాయితీ అయినా ఆచరణే గీటురాయి. అలా చూసుకున్నపుడు కమ్యూనిస్టులు, సోషలిస్టులు అంటే కత్తులు విసిరే చోట ఎంపీ స్ధాయిలో వున్న వ్యక్తి అమెరికాలో అలా ప్రకటించుకొని బావుకునేదేమీ వుండదు. మన దేశంలో రాజకీయ ప్రత్యర్ధుల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్థలను పాలకులు ఎలా వాడుకుంటున్నదీ చూస్తున్నాము. అమెరికాలో అంతకంటే ఎక్కువగానే వేధిస్తారు. అలాంటపుడు శాండర్స్‌ తాను సోషలిస్టును అని చెప్పుకోవటం ఏమిటి? అతనికి మద్దతుగా డెమోక్రటిక్‌ పార్టీ ప్రచారంలో లక్షలాది మంది యువతీ యువకులు మేమూ సోషలిస్టులమే అంటూ మద్దతు ఇవ్వటానికి ముందుకు రావటాన్ని గతేడాది అధ్యక్ష ఎన్నికల సందర్బంగా చూశాము. అమెరికాలో ఇలాంటి మార్పును ఎవరైనా వూహించారా ? వారెలాంటి సోషలిజాన్ని కోరుకుంటున్నారు అనేది తరువాత, ఒక సోషలిస్టును అభ్యర్ధిగా నిలపాలంటూ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావటమే గొప్ప మార్పు. కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కంటే ముందే ఎందరో సోషలిజం గురించి కలలు కన్నారు, ఆ దిశగా పనిచేశారు. దాన్ని ఆచరణలో పెట్టేందుకు కమ్యూనిస్టు ప్రణాళికతో నిర్ధిష్ట కార్యాచరణకు పూనుకున్నారు. నేడు అనేక సోషలిస్టు భావనలు, మార్గాలు ప్రచారంలో వున్నందున తమకు ఏది సరైనదో అమెరికన్లు నిర్ణయించుకుంటారు.

న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక 2015 నవంబరులో నిర్వహించిన ఒక పోల్‌లో 56శాతం మంది డెమోక్రాటిక్‌ పార్టీ ఓటర్లు సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారు.ప్యూ సంస్ధ 2011లో జరిపిన సర్వేలో 30 ఏండ్లలోపు వయస్సున్న 49శాతం మంది యువత సోషలిజం పట్ల సానుకూలత, 47శాతం పెట్టుబడిదారీ విధానం పట్ల మొగ్గు చూపినట్లు ప్రకటించారు. ఈ సర్వేలన్నీ ఎవరు కోరుకుంటే చేశారు? చేసిన వారెవరూ సోషలిజం మీద అభిమానం వున్నవారు కాదు. అంత మంది యువతీ యువకులను సోషలిజంవైపునకు ఎవరు నెట్టారు. అమెరికా సమాజంలో పెరుగుతున్న అసమానతలపై వ్యక్తమైన నిరసనే వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం, తరువాత ప్రఖ్యాత ఫ్రెంచి ఆర్ధికవేత్త పికెటీ వెలువరించిన అసమానతల తీరు తెన్నులు, కనీసవేతనంగా గంటకు పదిహేను డాలర్ల వేతనం కోసం దేశవ్యాపితంగా జరుగుతున్న వుద్యమాలన్నీ అమెరికా సమాజంలో జరుగుతున్న మధనానికి సూచికలు. అనేక పరిమితులున్నప్పటికీ అమెరికన్ల ఆలోచనలో వస్తున్న మార్పులను అక్కడి సర్వేలు ప్రతిబింబిస్తున్నాయి. పూ సంస్ధ సర్వే ప్రకారం 2000 సంవత్సరంలో తాము వుదారవాదులమని చెప్పుకున్న డెమోక్రాట్లు 27శాతం వుండగా 2015నాటికి యువతరంలో 42శాతానికి పెరిగింది. తాము సోషలిస్టులం అని చెప్పుకున్నవారు 2004లో 37శాతం వుండగా 2015 నాటికి 49శాతం అయ్యారు. బ్లూమ్‌బెర్గ్‌ పోల్‌ ప్రకారం దక్షిణ కరోలినా డెమోక్రాట్లలో 39 మంది సోషలిస్టులమని,74శాతం పురోగామివాదులమని, 68శాతం వుదారవాదులమని తమను తాము వర్ణించుకున్నారు. అమెరికా అంతటా ఇదే విధంగా వుందని చెప్పలేము. కొన్ని చోట్ల అయినా వచ్చిన మార్పునకు ఇది సూచిక. దీనికి ప్రధాన కారణం అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్ధ పనిచేయకపోవటాన్ని గతంలో ఎన్నటి కంటే ఎక్కువగా అమెరికన్లు గుర్తించటమే. పై సర్వేలు జరిగిన తరువాత జరిగిన పరిణామాలు అలాంటి ధోరణులు మరింతగా పెరిగేందుకు తోడ్పడేవే తప్ప వెనక్కు పోయేవి కాదు.

మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు అమెరికాలో సోషలిస్టులు లేకపోవటానికి గల కారణాలను జర్మన్‌ సామాజికవేత్త వెర్నర్‌ సోంబార్ట్‌ వివరించారు.అమెరికాకు వలస వచ్చిన కార్మికులకు తమ దేశాలలో తాము అనుభవించినదానికంటే అమెరికాలో పరిస్ధితులు మెరుగ్గా వున్నందున సోషలిస్టులుగా మారాల్సిన అవసరం నాడు లేదనుకున్నారు. ఇతర ఐరోపా దేశాలలో కంటే తమ పని పరిస్థితులు దారుణంగా వున్నందున అమెరికా కార్మికవర్గం, యువతలో నేడు సోషలిస్టు ఆలోచనలు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఒక అంశాన్ని గమనంలో వుంచుకోవాలి. ఐరోపాలో కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవటానికి, నిపుణులైన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి చోట్లకు వలస పోకుండా నిరోధించేందుకు ఐరోపా పాలకవర్గం కొన్ని సంక్షేమ చర్యలను అమలు జరిపింది. ఇప్పుడు తమ దేశంలో కూడా అలాంటి వాటిని అమలు జరపాలని అమెరికా యువత కోరుకుంటున్నారు. ఇప్పుడు అదే ఐరోపాలో ఆ సంక్షేమ చర్యలకు తిలోదకాలివ్వటాన్ని అక్కడి కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నది. అమెరికా కార్మికవర్గం ఈ అనుభవాలను గమనంలోకి తీసుకొని తన స్వంత మార్గాన్ని నిర్ణయించుకోవటం అనివార్యం.

అమెరికాలో జరుగుతున్న సైద్ధాంతిక, కార్యాచరణ మధనానికిి ప్రతిబింబమే స్పెన్సర్‌ రపోనే స్పందన. అతనిప్పుడు అక్కడి మీడియాలో ఒక సంచలన వార్తగా మారాడు. సోషలిజం, కమ్యూనిజం ఎంతో ఆకర్షణీయంగా వున్నపుడు యువత వుత్జేజితులు కావటంలో విశేషమేమీ లేదు. దానికి అనేక ఎదురు దెబ్బలు తగిలి, శత్రుదాడి తీవ్రంగా వుందిపుడు. హరినామ స్మరణం కూడా వినిపించటానికి వీల్లేదన్నచోట ఓ ప్రహ్లాదుడు పుట్టినట్లుగా ఆమెరికాలో ఒక సైనికుడు బహిరంగంగా కమ్యూనిజం పట్ల విశ్వాస ప్రకటన చేయటం నిజంగా విశేషమే. దేనికైనా సిద్దపడిన వాడే సైనికుడు. అతడు కమ్యూనిస్టు యోధుడు కావచ్చు, మరొకరు కావచ్చు.

న్యూయార్క్‌ నగరానికి 80కిలోమీటర్ల దూరంలోని వెస్ట్‌పాయింట్‌ అనే ప్రాంతంలో వున్న ప్రతిష్ఠాత్మక అమెరికా మిలిటరీ అకాడమీలో నాలుగేళ్ల డిగ్రీకోర్సును గతేడాది పూర్తి చేసిన పాతికేండ్ల యువకుడు స్పెన్సర్‌ రపోనే. డెమోక్రటిక్‌ సోషలిస్ట్సు ఆఫ్‌ అమెరికా(డిఎస్‌ఏ) పార్టీలో సభ్యుడినని స్వయంగా చెప్పుకున్నాడు. గతేడాది డెమోక్రటిక్‌ పార్టీలో దేశాధ్యక్షపదవికి పార్టీ అభ్యర్ధిగా నిలిచేందుకు హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడిన బెర్నీశాండర్స్‌కు మద్దతు తెలిపిన లక్షలాది మంది యువతీ యువకులు తాము ఆ పార్టీకి చెందిన వారమేనని, సోషలిస్టుల మని బహిరంగంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.

ఒక యువకుడిగా ప్రపంచంలో ఒక పెద్ద భావజాలంగా వున్న కమ్యూనిజం గురించి, దానితో వుత్తేజితుడైన చే గువేరా గురించి సానుకూలంగా స్పందించటం తప్ప రపోనే చేసిన తప్పేమీ లేదు. అయితే ఇది అమెరికా విలువలు, లక్షణాలకు వ్యతిరేకమని కొందరు గగ్గోలు పెడుతున్నారు. తమ సంస్ధ లేదా అమెరికా మిలిటరీ విలువలకు అతని వ్యాఖ్యలకు ఎలాంటి సంబధమూ లేదని వెస్ట్‌పాయింట్‌ సంస్ధ వివరణ ఇచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో రపోనే ట్రంప్‌ మీద కూడా వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ ప్రసంగంతో అతనొక ఫాసిస్టు అనే ఒక నీచమైన అనుమానాన్ని ట్రంప్‌ నివృత్తి చేశాడు.’ అని గత జూలైలో పేర్కొన్నాడు.

గత నెలలో కొందరు ఫుట్‌బాల్‌ క్రీడాకారులు అమెరికా జాతీయ గీతాలపన సందర్బంగా తమ మోకాళ్ల మీద నిలబడి అమెరికాలో వున్న జాతివివక్ష, అమెరికా పోలీసులలో వున్న హింసా ప్రవృత్తిని నిరసన తెలిపారు. దానిపై అధ్యక్షుడు ట్రంప్‌ ఒక ప్రకటన చేస్తూ జాతీయ గీతాలాపన సందర్భంగా నిలబడకపోవటాన్ని విమర్శించారు. కొన్ని జట్లకు చెందిన వారు జాతీయ గీతాలాపన సమయానికి అసలు మైదానానికే రాలేదు. క్రీడాకారులు మోకాళ్ల మీద నిలబడటం జాతీయ గీతాన్ని అవమానించటం కాదని అనేక మంది క్రీడాకారుల చర్యను సమర్ధించారు. ఈ సందర్భంలోనే లెప్టినెంట్‌ కల్నల్‌ రపోనే తన ట్వీట్లను చేశాడు.

రపోనేపై మిలిటరీ ఎలాంటి చర్య తీసుకుంటుందో తెలియదు గానీ వెస్ట్‌పాయింట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ రషీద్‌ హుస్సేన్‌ను సంస్ధ యాజమాన్యం సెలవుపై పంపింది. అతను రపోనే చదువు సంధ్యల మార్గదర్శకుడిగా వ్యవహరించారు.తాను రపోనేతో ఎంతో సన్నిహితంగా వున్న మాట నిజమే అని రషీద్‌ నిర్ధారించారు. గతేడాది రపోనే డిగ్రీ తీసుకున్న సమయంలో తీసిన 56 ఫొటోలను అతని సోదరి తన ఫేస్‌బుక్‌ ఆల్బంలో పోస్టు చేసింది. వాటిలో రపోనే తన టోపీ లోపలి భాగంలో కమ్యూనిజం విజయం సాధిస్తుంది అనే నినాదాన్ని చూపుతూ బిగించిన పిడికిలి చూపిన, అదే విధంగా తన యూనిఫారం కింద వేసుకున్న చే గువేరా బమ్మ వున్న టీ షర్టును చూపుతున్న చిత్రాలున్నాయి. ఇప్పుడు అవి సామాజిక మాధ్యమం, మీడియాలో వైరల్‌ అయ్యాయి. ప్రొఫెసర్‌ రషీద్‌తో కలసి అధ్యయనంలో భాగంగా ‘స్టాఫ్‌ రైడ్‌ ‘ అనే కార్యక్రమంలో పాల్గనేందుకు 2014లో మన దేశ సందర్శన సందర్భంగా దిగిన ఫొటోలు కూడా వున్నాయి. రషీద్‌తో ఒక విద్యార్ధిగా రపోనే సాన్నిహిత్యంలో ముస్లిం, కమ్యూనిస్టు అనుకూల, అమెరికా ప్రభుత్వ వ్యతిరేక భావాలు పెంపొంది వుంటాయని కొంత మంది కోడి గుడ్డు మీద ఈకలను వెతికే మాదిరి వ్యాఖ్యలు చేస్తున్నారు. మిలిటరీ శిక్షణలో వుండగానే అమెరికా ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత కలిగి వున్న రపోనే అభిప్రాయాలను గమనించిన అకాడమీ అధికారులు అతనికి లాంఛనంగా హితవు చెప్పారు తప్ప అకాడమీ నుంచి తొలగించలేదని మీడియాలో కధనం వచ్చింది. రపోనే వెల్లడించిన అనేక అభిప్రాయాలను సహాధ్యాయులు అనేక మంది పట్టించుకోకపోవటమో లేదా కొందరు సమర్ధించటమో చేసినట్లు ఇప్పుడు కొందరు చెబుతున్నారు. రపోనే అమెరికా వుపాధ్యక్షుడు, రక్షణ మంత్రిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా తాజా ట్వీట్లకు జత చేస్తున్నారు. విశేషం ఏమంటే వ్యక్తిగతంగా వారిపై చేసిన వ్యాఖ్యల కంటే సిద్ధాంతపరంగా కమ్యూనిజం, చేగువేరాలను సమర్ధించటం అమెరికా అధికార యంత్రాంగానికి తీవ్రమైన తప్పిదంగా కనిపిస్తోంది. అంటే అమెరికా పెట్టుబడిదారీ విధానం, దాని కమ్యూనిస్టు వ్యతిరేకత, యుద్ధకాంక్షలను విమర్శించటాన్ని మాత్రం సహించదని స్పష్టం అవుతున్నది.’ స్పెన్సర్‌ నా కుమారుడు, అతనిని నేను ఎంతగానో ప్రేమిస్తాను, అయినప్పటికీ అతని అభిప్రాయాలు, ప్రవర్తనను అభిమానించటం లేదా ఖండించటంగానీ చేయను, ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లి వచ్చినప్పటి నుంచి అతని రాజకీయ అభిప్రాయాలలో గమనించదగిన మార్పు కనిపిస్తోంది’ అని తండ్రి రిచర్డ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నాడు. అయితే తరువాత వాటిని తొలగించాడు.గతంలో బ్రాడ్లే మానింగ్‌గా మిలిటరీలో పని చేస్తూ వికీలీక్స్‌కు సమాచారం అందించాడనే ఆరోపణపై జైలు శిక్షకు గురైన వ్యక్తి మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా క్షమాభిక్షతో విడుదల చేసిన విషయం తెలిసిందే. అతడు లింగమార్పిడి చేయించుకొని చాలేసియా మానింగ్‌గా మారింది. గతంలో స్పెన్సర్‌ రపోనే న్యూయార్క్‌లో ఇన్‌ఫాంట్రీ ఆఫీసర్‌గా పని చేసినపుడు ఒక పోస్టులో ఇలా రాశాడు.’ ఒక కమ్యూనిస్టుగా ఈ సంస్ధలో పనిచేస్తూ ప్రతి రోజూ వైరుధ్యాల గురించి ఆలోచిస్తాను. ఇలాంటి సంస్ధలలో దీర్ఘకాలం కొనసాగటానికి ఆమె(చాలేసియా మానింగ్‌) ధైర్యం,పట్టుదల నాకు ఎంతో శక్తినిస్తున్నాయి.’ అని పేర్కొన్నాడు. ఈ ఏడాది జనవరిలో మరో పోస్టులో చేగువేరా గెరిల్లా యుద్దతంత్రం గురించి చదివానని, గెరిల్లా పోరాటం గురించి మావో చెప్పింది కూడా చదవాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. తన అభిప్రాయాలను ఇంత సూటిగా వెల్లడించిన స్పెన్సర్‌పై చర్య తీసుకొనేందుకు తొందర పడవద్దని కొందరు పత్రికా వ్యాఖ్యతలు మిలిటరీకి హితవు పలికారు. పట్టించుకుంటుందా, మొరటుగా ముందుకు పోతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచాన్ని వదలని కమ్యూనిస్టు బూచి !

23 Saturday Sep 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

Anti communist, communist, communist manifesto, Indonesian Communist Party (PKI)., specter of communism, Suharto’s Purge

ఎంకెఆర్‌

‘ఒక భూతం ఐరోపాను తరుముతోంది, అదే కమ్యూనిస్టు భూతం’ అంటూ కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు 1848 ఫిబ్రవరిలో వెలువరించిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది. అంటే కమ్యూనిస్టు ప్రణాళికకు ముందే కమ్యూనిజం గురించి ఐరోపా పాలకవర్గం భయపడటం ప్రారంభమైతే ఇప్పుడు అది ప్రపంచం వ్యాపితంగా పాలకవర్గాలను వణికిస్తోంది. కమ్యూనిజాన్ని భూస్తాపితం చేశాం, అదింక పైకి లేవదు అని పాతికేండ్ల క్రితం ప్రగల్బాలు పలికిన వారే తమ నీడను చూసి తామే భయపడుతున్నారు. సోషలిజం, కమ్యూనిజాల వ్యాప్తి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు కంకణం కట్టుకొని బరిలోకి దిగామని జబ్బలు చరుచుకుంటున్న అమెరికాలోనే మూల మూలల నుంచి అవును నేను సోషలిస్టును అని సగర్వంగా రొమ్ము విరుచుకుంటూ ముందుకు వస్తున్న వారిని చూసి ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. సోషలిజం, కమ్యూనిజం మంచిదే కానీ వాటిని అమలు జరిపే కమ్యూనిస్టులు ఈ రోజుల్లో లేరు అనే వారు ఎందరో అయితే అమెరికన్ల ప్రచార ప్రభావంతో ప్రపంచానికి కమ్యూనిజం పనికిరాదు అని చెప్పేవారు కూడా వున్నారు.

సెప్టెంబరు 18వ తేదీన జకర్తాలోని ఒక భవనంలో నిషేధిత కమ్యూనిస్టు పార్టీని పునరుద్ధరించేందుకు సభ జరుపుతున్నారంటూ వందలాది మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు గుమికూడి దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. ఇంతకూ ఏమిటా సమావేశం ? ఐదు దశాబ్దాల క్రితం ఇండోనేషియా మిలిటరీ లక్షలాది మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను, అనుమానం వచ్చిన వారిని హత్య చేసింది. వారి కుటుంబవారసులు, మానవ హక్కుల కార్యకర్తలు నాటి హత్యాకాండ గురించి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, నేరస్థులను శిక్షించాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అలాంటి బాధిత కుటుంబాలకు న్యాయ సలహాలను అందచేసేందుకు జరుగుతున్న సమావేశమది. దాన్ని పాలకపార్టీ, మిలిటరీ కనుసన్నలలో పనిచేసే ఇస్లామిక్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పేరుతో వున్న శక్తులు కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ సభగా చిత్రించి దాడికి ప్రయత్నించాయి. వారిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ వుత్తుత్తి కేసులతో జరిపే ఒక తతంగం తప్ప వేరు కాదు.

కమ్యూనిస్టులను వూచకోత కోసి, పార్టీని సిషేధించి నామ రూపాలు లేకుండా చేసి ఐదు దశాబ్దాలు గడిచినా ఇండోనేషియా పాలకవర్గాన్ని కమ్యూనిస్టు బూచి వదలటం లేదు. ఎప్పుడు ఏ వైపు నుంచి కమ్యూనిస్టులు తిరిగి రంగంలోకి వస్తారో అన్న భయం వారిని నిదురపోనివ్వటం లేదు. అక్కడ పేరుకు పౌర పాలన అయినప్పటికీ పెత్తనమంతా వుక్కు పాదాలదే. అడుగడుగునా వారి పాద ముద్రలు కనిపిస్తుంటాయి. వీధుల్లో ఎవరైనా ఎర్రరంగు చొక్కా ధరించి కనిపిస్తే మ్యూనిస్టుకిందే లెక్క. మిలిటరీ పోలీసులు నిర్ధారించుకొని కానీ వదలరు. ‘కమ్యూనిస్టుల విద్రోహం’ పేరుతో నిర్మించిన ప్రచార సినిమా ప్రదర్శనలు ఈనెల 30న దేశమంతటా జరిగేట్లు చూడాలని మిలిటరీ ఆదేశాలిచ్చిందంటే అక్కడ వున్నది ఏ తరహా పాలనో అర్ధం చేసుకోవచ్చు. భారీ ఖర్చుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చాలా కాలం క్రితం నిర్మించిన ఆ సినిమాను ప్రతి ఏటా 30వ తేదీన టీవీలో ప్రసారం చేస్తారు. కమ్యూనిస్టులను హతమార్చేందుకు అమెరికా సిఐఏ భాగస్వామ్యంతో ఇండోనేషియా మిలిటరీ జరిపిన కుట్రలో భాగంగా 1965 సెప్టెంబరు 30న కొంతమంది మిలిటరీ అధికారులను హత్య చేసి వారిని తిరుగుబాటు చేసిన కమ్యూనిస్టులు చంపివేశారని ప్రచారం చేశారు. దాన్ని సాకుగా చూపి లక్షలాది మంది కమ్యూనిస్టులు, అభిమానులు, కమ్యూనిస్టులనే పేరుతో అనేక మంది చైనా జాతీయులను వూచకోత కోశారు.

వర్తమాన తరాలకు సరైన చరిత్రను తెలిపేందుకు ఆ సినిమాను విధిగా ప్రదర్శించేట్లు చూడాలని కోరిన మాట నిజమే అని సైనికాధికారులు నిర్ధారించారు. దానిలో కమ్యూనిస్టులు దేవుడిపై విశ్వాసం లేని దుష్టులని, అందుకే వారు సైనికాధికారులను చంపివేశారని, కనుక వారి మీద నిషేధం విధించటం సరైనదేనని చెప్పేందుకు ఆ చిత్రాన్ని నిర్మించారు.

నాటి హత్యా కాండ గురించి బహిరంగంగా చర్చించటాన్ని అధికారికంగా నిషేధించారు. సోమవారం నాటి సమావేశంలో బాధిత కుటుంబాలకు న్యాయ సహాయం అందచేసే అంశం గురించి చర్చించారు. అక్కడి నిబంధనంల ప్రకారం మూడు వందలు అంతకు మించి ఎక్కువ మంది గుమి కూడా సమావేశాలకు మాత్రమే అనుమతి తీసుకోవాలి. ఈ సమావేశానికి 50 మంది వరకు మాత్రమే హాజరయ్యారు. అయినపప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ జరపతలపెట్టిన ఒక సమావేశాన్ని కూడా అంతకు ముందు జరగనివ్వలేదు. ప్రభత్వం ఎంతగా అణచివేతలకు పాల్పడుతున్నప్పటికీ అక్కడ వున్నది పౌర ప్రభుత్వం కనుక విధిలేని పరిస్ధితులలో పరిమితంగా అయినా కొంత చర్చకు అవకాశం కల్పించక తప్పటం లేదు. 2012,14 సంవత్సరాలలో హత్యాకాండపై రెండు డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించారు, 2016లో ప్రభుత్వమే బాధితులు, వారి కుటుంబాల అభిప్రాయాలను వినేందుకు రెండు రోజుల పాటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సామూహికంగా ఖననం చేసినట్లు పేర్కొన్న ప్రాంతాలలో నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది కంటితుడుపు చర్యగానే మిగిలి పోయింది. తాజా పరిణాలను చూసినపుడు దేశంలో భావ ప్రకటనా స్వేచ్చకు అవకాశం లేదని, నియంత సుహార్తో రోజులను గుర్తుకు తెస్తున్నారని ఇండోనేషియన్‌ ఇండిపెండెంట్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ ప్రతినిధి అరిఫ్‌ బంబానీ వ్యాఖ్యానించారు. గతేడాది కాలంలో జర్నలిస్టులపై దాడులు రెట్టింపయ్యాయని చెప్పారు.

మలేషియా ప్రచురణ సంస్ధ తకుల్‌ సెటాక్‌ జకర్తాలో గతేడాది అక్టోబరులో నిర్వహించిన ఒక పుస్తక ప్రదర్శనలో కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకం వుండటంపై మిలిటరీ, పోలీసు అధికారులు ఏడు గంటల పాటు నిర్వాహకులను ప్రశ్నించారు. మ్యూనిస్టు సాహిత్యం విక్రయించటాన్ని ఇండోనేషియాలో కమ్యూనిజాన్ని ప్రచారం చేయటంగా పరిగణించి శిక్షలు విధిస్తారు.

తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత సోషలిస్టు, కమ్యూనిస్టు చిహ్నాలను కూడా జన జీవితం నుంచి తొలగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధకు ప్రత్యామ్నాయంగా తిరిగి పునరుద్ధరించిన పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నకొద్దీ దాని నుంచి దృష్టి మళ్లించేందుకు సైద్ధాంతిక దాడితో పాటు, గత చిహ్నాలను కూడా అంతర్ధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వూహించని పరిణామం కాదు. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంగా తూర్పు ఐరోపాలోని అల్బేనియాను తొలుత ఇటాలియన్‌ ఫాసిస్టులు, తరువాత నాజీలు అక్రమించేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని ఎదుర్కొనేందుకు నడుం కట్టిన కమ్యూనిస్టుపార్టీ ఇతర జాతీయవాదులను కూడా ప్రతిఘటనలో భాగస్వాములను చేసేందుకు 1942 సెప్టెంబరు 16న ఒక సమావేశాన్ని పెజా అనే గ్రామంలోని మైస్లిం పెజా అనే వ్యక్తి ఇంట్లో జరిగింది. చరిత్రలో దానిని పెజా సమావేశం అని పిలిచారు.అల్బేనియా విముక్తిలో అదొక చారిత్రాత్మక ఘట్టం. దీనిని పురస్కరించుకొని ఈ ఏడాది ఆరోజున జరిగిన ఒక కార్యక్రమంలో పిల్లలు ఆ సమావేశంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు నేత ఎన్వెర్‌ హోక్సా చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమం గురించి విన్న ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ నేత లుజిమ్‌ భాషా గత కమ్యూనిస్టు ప్రభుత్వ చిహ్నాలన్నింటినీ నిషేధించాలని అందుకు గాను జర్మనీ, ఇతర దేశాలలో మాదిరి ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశాడు. దేశంలో కొంత మంది ఇప్పటికీ ఎన్వెర్‌ హోక్సా, కమ్యూనిస్టు పాలన గురించి బెంగతో వున్నారని, ఈ జబ్బు నయం చేయటానికి పైపూతలు చాలవని పేర్కొన్నాడు. ప్రభుత్వ నిధులతో కమ్యూనిస్టుల హయాంలో జరిగిన నేరాల పరిశోధన పేరుతో ఏర్పాటు చేసిన సంస్ధ కమ్యూనిస్టుల పాలనలో నిర్మించిన సినిమాల ప్రదర్శన నిషేధం గురించి ఒక ముసాయిదా బిల్లు తయారు చేసే పనిలో వుంది. ఒక్కసారిగా అన్నింటిపై నిషేధం అంటే ఎదురుతన్నే అవకాశం వుందని అందువలన సినిమాకు ముందు దాని గురించి చెబుతూ పెద్ద ఆర్భాటాలు లేకుండా చూడాలని సంస్ధ నిర్వాహకుడు చెప్పాడు. అయితే ఈ ప్రతిపాదనలు బహిర్గతం కాగానే కమ్యూనిజంతో విబేధించే వారు కూడా గత చరిత్రను తుడిచి వేయటాన్ని అంగీకరించబోమని కొందరు పేర్కొన్నారు. గతేడాది జరిపిన ఒక సర్వేలో 42శాతం మంది కమ్యూనిస్టు నేత ఎన్వెర్‌ హోక్సా గురించి సానుకూలంగా స్పందించారు.

పూర్వపు సోషలిస్టు దేశాలలో కమ్యూనిస్టుచిహ్నాలను పూర్తిగా చెరిపివేయాలన్నది ఒక వివాదాస్పద అంశంగా మారింది. ఆ పని చేస్తే ప్రస్తుతం అధికారంలో వున్న పాలకుల ప్రజాస్వామ్య వ్యతిరేకలక్షణాన్ని స్వయంగా బయట పెట్టుకున్నట్లు అవుతుందని తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తే యువతరంలో కమ్యూనిజం గురించి ఆసక్తి పెరిగే ప్రమాదం వుందన్న కోణం నుంచి పూర్తిగా చెరిపి వేయాలనటాన్ని వ్యతిరేకిస్తున్నారు కొందరు. తూర్పు ఐరోపా దేశాలన్నీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినవే. కమ్యూనిస్టుపార్టీ చిహ్నాలను లేకుండా చేయటం అంటే ఆ ఘనచరిత్రను తుడిచి వేయటమే. వుక్రెయిన్‌లో 2015లో చేసిన రెండు చట్టాల ప్రకారం కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించటమే గాక, ఎవరైనా కమ్యూనిస్టు పాలకులు చేసిన పనులను నేరాలుగా ఎలా చెబుతారని ప్రశ్నించటాన్ని కూడా నేరంగా ఆ చట్టంలో పొందుపరిచారు. హంగరీలో 2000 సంవత్సరంలో కమ్యూనిస్టు, ఫాసిస్టు చిహ్నాలను నిషేధించటంపై కోర్టులలో అనేక సార్లు సవాలు చేసిన వుదంతాలున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తూటాలు గౌరీ లంకేష్‌ దేహాన్నే కానీ భావాలను తాకలేవు !

13 Wednesday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, Left politics, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

attack on journalists, BJP's social media, dissent, Gouri lankesh, RSS

ఎం కోటేశ్వరరావు

మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాల వ్యతిరేక పోరులో హేతువాద, వామపక్ష వాదిగా గళమెత్తి, కలంతో కదనరంగంలోకి దూకిన షీరో(వీర నారి) జర్నలిస్టు గౌరీ లంకేష్‌. తన ప్రాణాలను తృణపాయంగా అర్పించింది. తనను ఎప్పుడైనా మతోన్మాదులు అంతం చేస్తారని తెలిసినా ఏనాడూ వెన్ను చూపని ధీశాలి. దుండగుల తూటాలు ఆమె దేహాన్ని చీల్చాయి తప్ప భావాలను కాదని దేశవ్యాపితంగా వెల్లడైన నిరసన వెల్లడించింది. నేనూ గౌరినే ఏం చేస్తారో చేయండి అంటూ ఎలుగెత్తి చాటారు. గౌరి నివాసం ముందున్న సిసిటీవీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సెప్టెంబరు ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో తన కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన ఆమెపై మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగుడు తుపాకితో కాల్చిచంపాడు. సమీపంలో ఇంకా ఎవరైనా వున్నారా అన్నది విచారణలో తేలాల్సి వుంది. మతోన్మాద వ్యతిరేక, హేతువాద, సంస్కరణవాదం, వామపక్ష భావాల నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలుబుర్గి సరసన గౌరి చేరింది. అభ్యుదయం, హేతువాదం, ప్రజానుకూల జర్నలిస్టు కలం, గళం పరంపరలో దేశంలో మతోన్మాదుల తూటాలకు బలైన తొలి మహిళగా చెప్పవచ్చు. తన ప్రాణాలకు ఏక్షణంలో అయినా ముప్పు వుందని, కొద్ది రోజులుగా ఎవరో వెంటాడుతున్నారని పసిగట్టినప్పటికి ప్రభుత్వంవైపు నుంచి ఎలాంటి సాయం ఆమె కోరలేదు. అలాంటి రక్షణలు ప్రాణాలను కాపాడలేవు అనే లోకానుభవంతో ఆమె ఆ నిర్ణయానికి వచ్చి వుండవచ్చు.

కాషాయ పరివారం, వారితో అంటకాగుతున్న పార్టీలు, శక్తులు, వ్యక్తులు తప్ప గౌరి హత్యపై దేశవ్యాపితంగా జర్నలిస్టు, ప్రజా సంఘాలు, వామపక్ష, అభ్యుదయ పార్టీలు, సంస్ధలు, శక్తులు తీవ్రనిరసన తెలిపాయి. నిందితులను గట్టిగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి. అనేక మంది సీనియర్‌ జర్నలిస్టులు దేశంలో నెలకొన్న పరిస్ధితుల తీరుతెన్నుల పట్ల నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జర్నలిస్టుల ప్రాణాలు తీయటం కొత్త కాదు. మన దేశంలో కూడా అనేక మంది బలయ్యారు.రాజకీయ నేతల, గూండాల, మాఫియాల అవినీతి అక్రమాలను బయట పెట్టే క్రమంలో జర్నలిస్టులు ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితిలో గడుపుతున్నారు. గత నాలుగు సంవత్సరాలలో (2013 నుంచి) ఇప్పటి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాలలో 22 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.అనేక మందిపై హత్యాయత్నం జరిగింది. దేశమంతా గౌరీ లంకేష్‌ హత్యకు నిరసన తెలుపుతున్న సమయంలోనే బీహార్‌లో పంకజ్‌ మిశ్రా అనే జర్నలిస్టుపై అధికారపక్ష ఎంఎల్‌ఏ అనుచరులు తుపాకులతో కాల్పులు జరిపారు.

జర్నలిస్టులపై జరిగిన దాడుల కేసులను పరిశీలిస్తే అవి కాంగ్రెస్‌, బిజెపి,జెడియు, ఎస్‌పి,టిడిపి మరొకటా అన్నది పక్కన పెడితే ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ దుండగులు చెలరేగిపోతున్నారు. వత్తిడి కారణంగా కేసులు నమోదు చేయటమే తప్ప వాటిలో ఎలాంటి పురోగతి వుండటం లేదు. డేరా బాబా గుర్మీత్‌ హత్య చేయించిన సిర్సా జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి కేసు పదిహేను సంవత్సరాలుగా నడుస్తూనే వుంది. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అనేక వుదంతాలలో చార్జిషీట్లు పెట్టటంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు సంవత్సరాల క్రితం కర్ణాటకలో మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురైన కలుబుర్గి కేసులో ఇంతవరకు నిందితులెవరో తేలలేదు, దబోల్కర్‌, గోవింద్‌ పన్సారే కేసులలో నిందితులు గోవా కేంద్రంగా పనిచేసే హిందూత్వ సనాతన సంస్ధకు చెందిన వారని సిబిఐ కేసులు దాఖలు చేసింది. ఇలాంటి వుదంతాలలో నేరగాళ్లకు శిక్షలు పడటం ఎంత అవసరమో అంతకంటే ఇటువంటి ధోరణులను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలు, శక్తులను ఎదుర్కోవటానికి సంఘటితం కావటం అంతకంటే ముఖ్యం. అసహనం, విమర్శలను తట్టుకోలేని ధోరణి, భిన్నాభిప్రాయాలను సహించకపోవటం దేశంలో క్రమంగా మరీ ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. అసమ్మతి, భిన్నాభిప్రాయాన్ని గౌరవించటం ప్రజాస్వామ్య లక్షణం. నిత్యం భావ ప్రకటనా స్వేచ్చ హక్కు గురించి పారాయణం చేసే వారు తమ దాకా వచ్చే సరికి హరిదాసు-ధర్మపత్ని-వుల్లిపాయ కథలో మాదిరి వ్యవహరిస్తున్నారు.నేతి బీరలో నెయ్యి మాదిరి తయారవుతున్నారు.

వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలహీనంగా వున్న కర్ణాటకను దక్షిణాదిలో మతోన్మాద శక్తులు ఒక ప్రయోగశాలగా చేసుకున్నాయి. అక్కడి ప్రాంతీయ పార్టీల అవకాశవాదం, అనేక హిందూ మతసంస్ధల మద్దతు కారణంగా కారణంగా బిజెపి ఆ రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పూర్వరంగంలో అనేక వివాదాస్పద, రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఆ పార్టీ రూపకల్పన చేసింది. ఈ పూర్వరంగంలో గౌరీ వంటి అనేక మంది మతోన్మాదశక్తులకు వ్యతిరేక గళం విప్పుతూ కంట్లో నలుసుగా మారారు. వాటన్నింటిని ఆమె తన పత్రికలో ఎప్పటి కప్పుడు రాస్తూ హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆమెను కొంత మంది అనుసరించారని, రాకపోకలను నిర్ధారించుకున్నారని ఆమె హత్య అనంతరం వెల్లడైన సమాచారాన్ని బట్టి సరిగ్గా ప్రముఖ రచయిత ఎంఎం కలుబర్గిని హత్య చేసిన రోజే గౌరిని కూడా చంపివేయాలని పధకం వేశారా అనిపిస్తోంది. సరిగ్గా రెండు సంవత్సరాల ఐదు రోజుల తరువాత వారి పధకం నెరవేరింది. ఇద్దరి హత్యలకు అనేక సామీప్యాలున్నాయి.కుటుంబ సమస్యల కారణంగా కలుబర్గిని హత్య చేశారని వెంటనే ప్రచారం జరిగింది. గౌరిని నక్సలైట్లు చేసి వుండవచ్చని ప్రచారం చేశారు.

అనేక ప్రాంతాలలోని కోర్టులలో తప్పుడు కేసులు బనాయించటం మతోన్మాద శక్తులు అనుసరించే ఎత్తుగడలలో ఒకటి. ఎవరైనా పదులకొద్దీ కేసులకు హాజరుకావటం మామూలు విషయం కాదు. అయితే కోర్టులున్న ప్రతిచోటా అలాంటి కేసులను వుచితంగా చేపట్టటానికి మతశక్తులకు లాయర్లు వున్నారు. లుబుర్గి హత్య జరిగే నాటికి ఆయనపై ఇరవై వరకు వివిధ ప్రాంతాలలో పరువు నష్టం కేసులు దాఖలై వున్నాయి. అదే విధంగా గౌరి మీద కూడా(15) వున్నాయని ఆమె న్యాయవాది వెంకటేష్‌ హూట్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె కోర్టు కేసులకు వెళ్లిన ప్రతి చోటా కోర్టు వెలుపల సభలు, సమావేశాలు జరపటానికి అ అవకాశాలను వినియోగించుకొనే వారని ఆయన తెలిపారు. గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌, కలుబర్గిని ఎలాంటి నాటు తుపాకితో కాల్చి చంపారో సరిగ్గా అలాంటిదానితోనే గౌరిని కూడా చంపారు.నాలుగు వుదంతాలలోనూ దుండగులు మోటారు సైకిళ్లనే వుపయోగించి దగ్గరినుంచి కాల్చారు.పన్సారే, దబోల్కర్‌ కేసులలో ముద్దాయిలుగా తేలి పరారీలో వున్న ఒకడు 2009 గోవా పేలుళ్ల వుదంతంలో కూడా వున్నాడు.పన్సారే కేసులో ప్రధాన నిందితుడిగా వున్న సమీర్‌ గైక్వాడ్‌ బాల్యస్నేహితుడైన రుద్రపాటిల్‌ కలుబుర్గి కేసులో అనుమానితుడు, పరారీలో వున్నాడు.

హిందూత్వ శక్తులు 2004 నుంచి గౌరిని బెదిరిస్తున్నాయి. కేసులు బనాయిస్తున్నాయి.2016 నవంబరు 28న హుబ్లి జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆమెకు పరువు నష్టం కేసులో ఆరునెలల జైలు, జరిమానా విధించారు. అదే రోజు ఆమె బెయిల్‌ తీసుకొని సెషన్స్‌ కోర్టుకు అప్పీలు చేయాలని నిర్ణయించారు. తప్పు చేస్తే జర్నలిస్టులైనా మరొకరైనా శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఇతర జర్నలిస్టులు దీనిని గమనంలో వుంచుకోవాలంటూ బిజెపి ఐటి విభాగ ప్రతినిధి జర్నలిస్టులను ఆ సందర్భంగా బెదిరించాడు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే 2008లో లంకేష్‌ పత్రికలో ప్రచురించిన ఒక వ్యాసం తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందంటూ సంపాదకురాలిపై ధార్వాడ బిజెపి ఎంపీగా వున్న ప్రహ్లాద్‌ జోషి, బిజెపి స్ధానిక నేత వుమేష్‌ దుషి క్రిమినల్‌ పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. కోర్టు తీరు తెన్నుల గురించి తాను ఎలాంటి ఆందోళనకు గురికాలేదని, ఆ కేసును బిజెపి నేతలు, మద్దతుదార్లు వుపయోగించుకున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందని గౌరీ వ్యాఖ్యానించారు. తాను జైలుకు పోతానని ఆశించిన వారందరికీ నిరాశ ఎదురైందని అన్నారు. ‘అదొక పెద్ద అంశమని నేను భావించలేదు, బిజెపి ఐటి విభాగం దీనినొక ఆయుధంగా చేసుకొని జర్నలిస్టులను బెదిరించటమే విభ్రాంతి కలిగించింది’ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్చ దేశంలో ఏ స్ధితిలో వున్నదో తన వుదంతం వెల్లడించిందన్నారు. అధికారంలో వున్న వారి భావజాలాన్ని వ్యతిరేకించిన లేదా విబేధించిన వారి నోరు నొక్కేందుకు చట్టాన్ని వినియోగించుకోవటం ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఈ ధోరణి ఎంఎం కలుబుర్గి హత్య అనంతరం పెరుగుతోందని చెప్పారు. ఈ హత్యను సమర్ధిస్తూ భజరంగ్‌ దళ్‌ కార్యకర్త భువిత్‌ షెట్టి హిందూయిజాన్ని విమర్శించిన వారు కుక్క చావు చస్తారంటూ ట్వీట్‌ చేశాడన్నారు. గతేడాది హరీష్‌ పూజారి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు, హరీష్‌ను ఒక ముస్లింగా పరిగణించి హత్య చేశారు.

గౌరీ లంకేష్‌పై కేసు వివరాల్లోకి వెళితే బిజెపి కార్యకర్తలు తనను మోసం చేశారంటూ ఒక నగల వ్యాపారి బిజెపి ఎంపీ జోషీ దగ్గరకు వెళ్లారు. ఆయన తమ కార్యకర్తలను సమర్ధించి న్యాయం చేయకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వ్యాపారి హెచ్చరించాడు. ప్రచురించిన వార్త సారాంశం ఇది. దీనిలో జోషి పరువుకు నష్టం కలిగించే అంశమేదీ లేదని, ఇదే వార్తను ఇతర పత్రికలు కూడా ప్రచురించాయని, అయినప్పటికీ తనను మాత్రమే లక్ష్యంగా చేసుకొని కేసు దాఖలు చేసినట్లు గౌరీ అన్నారు. తాను వార్తను ప్రచురించిన తరువాత జరిగిన ఎన్నికలలో జోషీ విజయం సాధించారని అలాంటపుడు పరువు పోవటం అనే ప్రశ్న ఎక్కడుందని అన్నారు. దుషీ విషయానికి వస్తే అతని మీద అనేక కేసులు దర్యాప్తులో వున్నాయని, పోవాల్సిన పరువేదో ఇప్పటికే పోయిందని, తమ పత్రికలో రాసిన వార్తతో అదనంగా పోయేదేమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.

అంతకు ముందు 1994లో హుబ్లీ ఈద్‌గాలో జాతీయ జెండాను ఎగురవేసి మతకొట్లాటలను రెచ్చగొట్టిన వుమాభారతిపై పెట్టిన కేసును వుపసంహరించేందుకు గౌరి తిరస్కరించారు.గత కొంత కాలంగా కర్ణాటకలో ఒక బలమైన సామాజిక తరగతిగా వున్న లింగాయత్‌లు తాము బసవన ధర్మాన్ని పాటించేవారం తప్ప హిందువులం కాదని, తమను ఒక ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానాలు చేసి సభలు జరుపుతున్నారు. గౌరి ఒక హేతువాది అయినప్పటికీ బసవన చెప్పిన అనేక అంశాలు తన భావాలకు దగ్గరగా వున్నందున తాను వారి అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ మత శక్తులకు కంటగింపుగా మారింది. కొన్ని పార్టీలను నిషేధించాలని కోరుతూ బిజెపి చలో మంగళూరు పేరుతో సెప్టెంబరు ఐదవ తేదీన ఒక రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టింది. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ కార్యక్రమాన్ని గౌరి తీవ్రంగా విమర్శించారు.(అదే రోజు ఆమెను దుండగులు బలిగొన్నారు) అంతకు ముందు నెలలోనే బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటకలో పర్యటించి వెళ్లారు.

రెండు సంవత్సరాల క్రితం కలుబర్గిని హత్య చేసిన తరువాత కర్ణాటకలోని అనేక మందికి అదే గతి పడుతుందనే బెదిరింపులు వచ్చాయి.ఆ సందర్భంగా గౌరి,మరికొందరు ఒక జాబితాను తయారు చేసి ఎవరెవరిపై ఎన్నిసార్లు మతశక్తులు విద్వేష ప్రచారం, దాడులు చేశాయో, ఎవరికి ప్రాణహాని వుందో వెల్లడించారు.వారిలో మొదటి వ్యక్తిగా హేతువాది కెఎస్‌ భగవాన్‌,రచయితలు యోగేష్‌ మాస్టర్‌,బంజగారే జయప్రకాష్‌, తాను నాలుగవదానినని వెల్లడించారు. మతశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు కర్ణాటక కోము సౌద్ర వేదికను ఏర్పాటు చేయటంలో గౌరి ముఖ్యపాత్ర పోషించారు.

నీ స్నేహితులను చూస్తే నువ్వు ఎలాంటి వాడివో చెప్పవచ్చన్నది ఒక నానుడి. దాన్ని కొద్దిగా మార్చి నువ్వు సామాజిక మీడియాలో ఎవరిని అనుసరిస్తున్నావో చూస్తే నీవెలాంటి వాడివో చెప్పవచ్చన్నది న్యూ నుడిగా చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న కొంత మంది ట్వీట్లు గౌరి హత్యను సమర్ధించేవారిగా వున్నట్లు తేలటంతో, అసలు నరేంద్రమోడీని అనుసరించటం మానివేయాలనే ప్రచారం ప్రారంభమైంది. అసలే అన్ని రంగాలలో నరేంద్రమోడీ సర్కార్‌ విఫలం అయినట్లు అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. మీరు కన్న కలలను నిజం చేసేందుకు చేపట్టిన ఈచర్యకు యాభై రోజులు ఓపిక పట్టండి, ఫలితాలు కద్దనిపించకపోతే నన్ను వురి తీయండి అని మోడీ చెప్పిన పెద్ద నోట్ల రద్దు ఘోరంగా విఫలమేగాక దేశానికి నష్టదాయకంగా మారిందని రుజువైంది. దాని గురించి తేలు కుట్టిన దొంగ మాదిరి ఇంతవరకు ఒక్క మాటా మాట్లాడలేదు. ఈలోగా నరేంద్రమోడీ ఎలాంటి వారిని అనుసరిస్తున్నదీ వెల్లడి అయింది. దాంతో నష్ట నివారణ చర్యగా బిజెపి ఐటి విభాగం రంగంలోకి దిగింది. మోడీ ఎవరినైనా అనుసరిస్తున్నారంటే అర్ధం వారందరి ప్రవర్తన సరైనదే అని నిర్ధారణ పత్రం ఇవ్వటంగా భావించరాదని, ఎవరేం చేస్తారో ముందుగా ఎవరు వూహిస్తారంటూ, అనేక అవినీతి ఆరోపణలున్న రాహుల్‌ గాంధీని కూడా మోడీ అనుసరిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. గౌరి హత్యను సమర్ధించేవారి వైఖరి తప్పని ఒక్క ముక్క కూడా ఆప్రకటనలో లేకపోవటం గమనించాల్సిన అంశం.

గౌరీ హత్య వార్త ఇంకా లోకానికి పూర్తిగా తెలియక ముందే దానితో తమకేమీ సంబంధం లేదని హత్య జరిగిన కొద్ది నిమిషాలలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. ఎవరు చంపారో తెలియకుండా హిందుత్వ సంస్ధలకు దానిని ఆపాదించవద్దని కొందరు ప్రచారం ప్రారంభించారు. కొందరు చేసిన పనులకు మొత్తం హిందువులకు ఆపాదించటం ఏమిటి అని మరి కొందరు, కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని హత్యచేసినపుడు ఈ మాదిరి స్పందన ఎందుకు వ్యక్తపరచరని మరి కొందరు, ఆ కోవకు చెందిన వారే నక్సలైట్ల అంతర్గత తగాదాలలో భాగంగా ఆమెను హత్య చేశారని, కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్య అవినీతిపై కథనాన్ని రూపొందిస్తున్న సమయంలో హత్యకు గురయ్యారని, ఇలాంటి ప్రచారం మొదలు పెట్టిన వారందరూ విషయాన్ని పక్కదారి పట్టించే యంత్రాంగంలో భాగం లేదా వారి వలలో పడ్డారన్నది స్పష్టం. ఏ ఆధారం లేదా నిర్ధారణ ప్రకారం నక్సలైట్లో, మరో కారణంతోనే హత్యచేసినట్లు కొందరు చెప్పినట్లు ? హిందూత్వ సంస్ధలు, చడ్డీవాలాలకు(ఆర్‌ఎస్‌ఎస్‌) వ్యతిరేకంగా ఆమె వ్యవహరించకుండా వుంటే ఇది జరిగేది కాదని, ఆమె నా సోదరి వంటిది కానీ ఆమె రాతలను తాను అంగీకరించనని బిజెపి మాజీ మంత్రి జీవరాజ్‌ చేసిన ప్రకటనకు అర్ధం ఏమిటి? హిందుత్వ అంటే హిందూమతోన్మాదులకు పర్యాయపదంగా వాడుతున్న పదం తప్ప మొత్తం హిందువుల గురించి చెబుతున్నది కాదు. దానిని మొత్తానికి ఆపాదిస్తున్నారని చెప్పటం వక్రీకరణ. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని హత్య చేసినపుడు ఎందుకు స్పందించరని ఆమాయకత్వం నటిస్తూ అడిగే ప్రశ్న ఒకటి. అక్కడ వారేమైనా తపస్సు చేసుకొనే మునుల్లా వున్నారా? పచ్చి గూండాల మాదిరి చేస్తున్న హత్యలు దాస్తే దాగేవా? ఎక్కడా లేనివిధంగా అక్కడే ఎందుకు హత్యకు గురవుతున్నారు అంటే కమ్యూనిస్టులను అడ్డుకొంటున్నందుకు అంటారు.పేరుకు సాంస్కృతిక సంస్ధ, కమ్యూనిస్టులు రాజ్యాంగబద్దంగా పనిచేస్తున్నారు, వారిని అడ్డుకోవాల్సిన కర్తవ్యం వారెందుకు భుజానవేసుకున్నట్లు? కమ్యూనిస్టుల మీద ఆర్‌ఎస్‌ఎస్‌వారు కత్తులు ఝళిపిస్తుంటే కమ్యూనిస్టులు గులాబీలు విసురుతారా ?

ఎవరేమన్నారు ?

కేంద్ర ప్రభుత్వ పరోక్ష మద్దతుతో మితవాద శక్తులు పెంచి పోషించిన విపరీత అసహన సంస్కృతికి మరో రుజువు గౌరీ లంకేష్‌ హత్య. నాలుగు హత్యలు ఒకే తీరునజరగటం అదే విధంగా వారి సారూప్యతను ఎవరూ చూడకుండా వుండలేరు. గోవింద పన్సారే ఒక కమ్యూనిస్టు, నరేంద్ర దబోల్కర్‌ ఒక హేతువాది, ఎంఎం కలుబుర్గి ఒక సంస్కరణవాది, గౌరీ లంకేష్‌ జంకు గొంకులేని ఒక జర్నలిస్టు, సామాజిక కార్యకర్త. భారత్‌లో మత ఫాసిస్టుల లక్ష్యం ఎవరో ఇది చూపుతున్నది. అయితే బెదిరింపులు లేదా హత్యలు స్ధిరచిత్తంతో వుండే వారి గళాలను, మార్పును కోరుకొనే వారిని నిలువరించలేవు. మన లౌకిక, సోషలిస్టు విలువలు, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను నులిపివేయాలని ప్రయత్నించే చీకటి శక్తులతో పోరాడాలనే మన నిర్ణయాన్ని ఇలాంటి ప్రతి పిరికి చర్య మరింత గట్టిపరుస్తుంది.

కె సచ్చిదానందన్‌

గౌరి హత్య ఒక వ్యక్తిని హత్య చేయటం కంటే పెద్దది, అది భావ ప్రకటనా స్వేచ్చ,విబేధించే హక్కు,ప్రజాస్వామిక పౌరసత్వాలపై జరిగిన దాడి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది భావజాలాల సంఘర్షణ. మా దారికి రాకపోతే నీ అంతం చూస్తామని చెప్పటమే ఈ హత్య. దేశ ప్రజాజీవనంలో ప్రముఖ పాత్రపోషించే మహిళలకు ఇదొక ప్రమాదకర హెచ్చరిక. ఆమెను తిరిగి తీసుకురాలేము కానీ విమర్శకులు, నిరసన వ్యక్తం చేసే వారిపై ప్రత్యక్ష హింసాకాండతో ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టాలని చూసే పాలకులకు ప్రతిఘటన,తిరస్కరణను రెట్టింపు చేస్తుంది.

అనన్య వాజ్‌పేయి

భారతీయ పౌరుల హత్యలను చూస్తూ వున్న మీరు ఏ దేశానికి చెందిన వారని కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలచుకున్నాను. ఈ రక్తపాతాన్ని ఆపుతారా లేక కొనసాగనిస్తారా? మీరు చర్య తీసుకొనేందుకు ఇంకా ఎన్ని శవాలు లేవాలి.ఈ దేశం మహాత్మాగాంధీది, ఆయన అంతేవాసులు, భావ ప్రకటనా స్వేచ్చకు హామీ ఇచ్చిన జవహర్‌లాల్‌ నెహ్రూది. చరిత్ర నుంచి వారి పేర్లను తుడిచి వేసే పనిలో మీరు తీరికలేకుండా వున్నారు, కానీ మీరు స్వేచ్చను హరించలేరు.

నయనతార సెహగల్‌

గౌరి దారుణ హత్యను బిజెపి ఖండిస్తున్నది. ఒక జర్నలిస్టు లేదా మావోయిస్టు మరియు నక్సలైట్ల హత్యలను ఖండించాల్సిందే, వాటికి వ్యతిరేకంగా గొంతెత్తి, గట్టిగా ఖండిస్తున్న నా వుదారవాద స్నేహితులందరూ కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా కేరళలో బిజెపి కార్యకర్తలను అనేక మందిని హత్య చేస్తుంటే ఎందుకు మౌనంగా వుంటున్నారని ప్రశ్నిస్తున్నా?

రవి శంకర్‌ ప్రసాద్‌, కేంద్ర మంత్రి

గౌరి హత్య వెనుక నక్సల్స్‌ హస్తం వుందని అనుమానిస్తున్నా. అది కావచ్చు, కాకపోనూ వచ్చు.ఆమె పూర్వరంగం దృష్ట్యా ఈ చర్య మితవాద వుగ్రవాదులదీ కావచ్చు లేదా మావోయిస్టులదీ కావచ్చు

ఇంద్రజిత్‌ లంకేష్‌( గౌరి సోదరుడు)

నక్సల్స్‌కు సంబంధం వుందని నేను అనుకోవటం లేదు. ఆమె భావజాలం మితవాదశక్తులకుతీవ్ర వ్యతిరేకమైనది కనుక వారి పనే అని నేను చెప్పదలచుకున్నాను. ఇది వ్యక్తిగతమైనది కాదని నాకు తెలుసు. ఇది మౌలికంగా ఒక ఆలోచనను హతమార్చటం. వారు ఒక ఆలోచన, ఒక వుద్యమాన్ని అంతం చేయాలని ఆలోచించారు.

కవితా లంకేష్‌( గౌరి సోదరి)

బెంగాల్‌లో హిందువులు మరియు కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు వధించబడుతుంటే ఆమె, ఆమె వంటి ధైర్యవంతమైన జర్నలిజం ఎక్కడా కనపడలేదు. ఆ లం…పట్ల ఏ మాత్రం సానుభూతి లేకుండా శరీరాన్ని చీల్చివేసి, ఆపార్ట్‌మెంట్‌ను కూడా కూల్చివేసి వుండాల్సి వుంది.ఆమె, ఆమె వంటి జర్నలిస్టులనబడే సాగరిక ఘోష్‌, శోభాడే, అరుంధతీరాయ్‌, కార్యకర్తలు కవితా కృష్ణన్‌,షీలా రషీద్‌, వుమర్‌ ఖాలిద్‌, కన్నయ్య కుమార్‌ వంటి వారికి ఇదే తగినది, వారిని లేపేయాల్సిన జాబితాలో పైన పెట్టాలి.

జర్నలిస్టులు, కార్యకర్తల ముసుగులో వున్న జాతి వ్యతిరేకులకు గౌరీ లంకేష్‌ కాల్చివేత ఒక వుదాహరణగా చేద్దాం. ఇటువంటి హత్య చివరిదని భావించటం లేదు, జాతి వ్యతిరేకులందరినీ వరుసగా లేపేసే కార్యక్రమం వుండాలి

( రెండు ఫేసుబుక్‌ పోస్టులలో విక్రమాదిత్య రానా పేరుతో వున్న అంశాలివి.హిందూత్వ శక్తులు సామాజిక మాధ్యమంలో పెడుతున్న పోస్టుల సారాంశమిదే. అలాంటి వారిని, వారి పోస్టులను నరేంద్రమోడీ అనుసరిస్తున్నారు)

నువ్వు అనుసరించేవారెవరో చూస్తే నువ్వేంటో తెలుస్తుంది

తమ భావజాలంతో విబేధించే వారిపై ద్వేషం ఎలా వెళ్లగక్కుతున్నారో, ఎలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారో దిగువ వుదాహరణ చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ‘అనేక మంది గౌరీ లంకేష్‌ గురించి వ్యతిరేకంగా సానుకూలంగా పోస్టులు పెట్టారు.నేను ఎన్నడూ గౌరీ లంకేష్‌ను కలుసుకోలేదు, ఆమె గురించి వినలేదు, ఈ ట్వీట్‌ చేసేంత వరకు నేను ఒక అనామకుడిని. కొంత మంది దీనికి రాజకీయ రంగు పులిమి వివాదాన్ని సృష్టించారు. ఇప్పుడు నాకు గుర్తు తెలియని ఫోన్లు వస్తున్నాయి, అభినందిస్తున్నవారు, నిందిస్తున్నవారూ వున్నారు ‘ అని చెప్పాడు సూరత్‌కు చెందిన 38 సంవత్సరాల బట్టల వ్యాపారి నిఖిల్‌ దధిచ్‌. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అతనితో మాట్లాడి వార్త ప్రచురించింది) కొద్ది రోజుల క్రితం తన ట్విటర్‌ ఖాతా వివరాలలో ఇతర విషయాలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ అనుసరించే గౌరవం పొందిన వ్యక్తిని అని రాసుకున్నాడు. గౌరీ గురించి ఏమీ తెలియకపోయినా కొంతమంది పెట్టిన పోస్టులను చూసి అతగాడు గుజరాతీలో పెట్టిన పోస్టులో ‘ ఒక లం…, ఒక కుక్క చచ్చింది, పందులు ముక్త కంఠంతో గోల చేస్తున్నాయి ‘ అని రాశాడు. ఇది ఒక సాధారణ ట్వీట్‌ అని కూడా ఎక్స్‌ప్రెస్‌ విలేకరితో చెప్పుకున్నాడు. పెళ్లాం, ఇద్దరు పిల్లలతో కుటుంబం వున్న ఒక వ్యక్తి సంస్కారం ఇది. ఒక వ్యక్తి గురించి తనకేమీ తెలియకపోయినా గుడ్డిగా తోటివారితో కలసి రాళ్లు వేసే ఇతగాడు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు, రోజూ శాఖలకు వెళుతుంటాడట. ఇలాంటివి చూసినపుడు నువ్వు మనిషివా ఆర్‌ఎస్‌ఎస్‌ వాడిగా అని ప్రశ్నించటం సహజం. సంఘపరివార్‌ నుంచి ఒక సందేశం ఏదైనా వెలువడితే దాని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా ప్రచారం చేయాలన్న ఆదేశం లేదా పధకం లేకపోతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది. ఏకత, శీలము అంటూ నేర్పేది, నేర్చుకుంటున్నది ఇలాంటివా? ఇంతటి ఘనకార్యం చేసిన ఇతగాడిని అనుసరించే వారు మూడు రోజుల్లో పెరిగారంటే దేశంలో ద్వేష పూరిత ధోరణులు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.ఈ ఘనుడిని ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్నాడని మీడియాలో గుప్పుమనటంతో తన వివరాల నుంచి ప్రధాని మోడీ అనుసరిస్తున్న గౌరవం పొందిన వాడిని అనే దానిని తొలగించి హిందూ జాతీయవాదని అని ప్రకటించుకున్నాడు. అంటే హిందూ జాతీయవాదులంటే ఎలాంటి వారో స్వయంగా ప్రకటించుకున్నాడు.

ఈ ఘనుడిని అనుసరించేవారిలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, వుత్తర గుజరాత్‌ బిజెపి మీడియా విభాగనేత పరాగ్‌ షేత్‌ కూడా వున్నారు. దధీచ్‌ ట్వీట్‌ గురించి అడిగిన ప్రశ్నకు పరాగ్‌ స్పందిస్తూ ‘ మీరు ట్వీట్‌ అనంతరం వెలువడిన వ్యాఖ్యలను దానికి జోడిస్తే అప్పుడు నేను అదొక అసహ్యకరమైన ట్వీట్‌ అని తీవ్రంగా ఖండించాలంటాను’ అన్నాడు. అయినప్పటికీ నేను ట్విటర్‌పై అతనిని అసుసరించటం మానుకోబోవటం లేదు. సామాజిక మీడియాలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అనుసరించటం అంటే రెండోవారి ప్రవర్తనపై సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు కాదు.సామాజిక మీడియాలో జరుగుతున్నదాని ప్రకారం ఒకసారి ఎవరైనా ఒకరిని అనుసరిస్తే తరువాత అనుసరించకపోవటం అంటూ వుండదు.’ అని సమర్ధించుకున్నాడు.

లాటిన్‌ అమెరికా అనుభవాలు

1970,80 దశకాలలో లాటిన్‌ అమెరికాలోని వామపక్ష భావజాలం, మానవహక్కుల వుద్యమకార్యకర్తలను పూర్తిగా నిర్మూలించేందుకు అమెరికా సిఐఏ ఆపరేషన్‌ కండోర్‌ పేరుతో పెద్ద హంతక కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఒక అంచనా ప్రకారం చిన్న పెద్ద నాయకులు అలాంటి వారు 50 వేల మంది అదృశ్యం లేదా హత్యలకు గురయ్యారు. ఇప్పటికీ ఎన్నో వేల మంది విషయం విడిపడని రహస్యంగానే వుంది. ఒక్క అర్జెంటీనాలోనే అలాంటి వారు ఏడు నుంచి 30వేల మంది వరకు వున్నారని అంచనా. మన దేశంలో కూడా అదే దశకాలలో తలెత్తిన వామపక్ష వుగ్రవాదులను అణచేందుకు పాలకులు బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేయించారు. అందుకు పాల్పడిన పోలీసులకు అవార్డులు, రివార్డులు ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తున్నారు. ఇదొక భాగమైతే తమ చేతికి మట్టి అంటకుండా తమ భావజాల వ్యతిరేకులను అంతం చేయించేందుకు కిరాయి మూకలను వినియోగించిన అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ పద్దతులను మన దేశంలో కూడా అమలు చేస్తున్నట్లు గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన కొన్ని వుదంతాలు స్పష్టం చేశాయి. జర్నలిస్టుల హత్యలకు కూడా అదే పద్దతిని ఆయాశక్తులు అనుసరించినట్లు చెప్పవచ్చు. లాటిన్‌ అమెరికా దేశాల్లో ఇలాంటి హత్యలకు పాల్పడిన శక్తులు వాటిని పెంచి పోషించిన పాలకుల పేర్లను ప్రస్తావించటానికి కూడా మీడియా ముందుకు రాలేదు. అత్యధిక సందర్భాలలో నియంతల, సిఐఏ కధనాలకే ప్రాధాన్యత ఇచ్చి జనం ముందు పెట్టాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లాటిన్‌ అమెరికాను తన పెరటి తోటగా మార్చుకొనేందుకు అమెరికా ఇంత దుర్మార్గానికి పాల్పడింది. ప్రస్తుతం మన దేశంలో తమ భావజాల వ్యతిరేకుల నోరు మూయించేందుకు మితవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి, వాటికి కేంద్రంలోని ప్రభుత్వమద్దతు వుందని ప్రతిపక్షాలు, అనేక మంది మేధావులు, సంస్ధలు విమర్శిస్తున్నాయి. అలాంటి వారిపై దాడులు, హత్యలు జరిగినపుడు పాలక పార్టీ లేదా దానికి మద్దతు ఇచ్చే సంస్ధల వాదనల తీరు వాటిని ఆ విమర్శలకు బలం చేకూర్చేవిగా వుంటున్నాయి. మీడియా మొత్తం మీద పాలకవర్గ ప్రయోజనాలకే తోడ్పడుతోంది. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలలో కమ్యూనిజం నుంచి రక్షించేందుకు తాము పూనుకున్నట్లు నియంతలు ప్రకటనలు చేశారు. ఇక్కడ కమ్యూనిస్టులు, అభ్యుదశక్తులు అంతపెద్ద శక్తిగా లేనందున అలాంటి ప్రకటనలు లేవుగానీ చాపకింద నీరులా తమ పని తాము చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందుత్వ పేరుతో హత్యపై సంబరాలు నీచం !

11 Monday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

attack on journalists, Gouri lankesh, Hindu supremacy, hindutva, Journo murder

                                                          వాడ్రేవు చిన వీర భద్రుడు

మృత్యువును చూసి కాదు నేను

జీవితాన్ని చూసి జంకుతున్నాను

హంతకుని కత్తి చూసి కాదు, కనుల ద్వేషం

చూసి జంకుతున్నాను

మనసులోని క్రౌర్యం చూసి జంకుతున్నాను

బైరాగి ( ఆగమగీతి:నాకు చావులేదు)

గౌరీ లంకేష్‌ హత్య ఒక విషయాన్ని చాలా బిగ్గరగా, మనం ఎక్కడ వినకుండా పోతామో అన్నంత బిగ్గరగా, మన చెవులు చిల్లులు పడేట్లుగా, భరించలేనంతగా ఘోషిస్తోంది. అదేమంటే: మనం రాజకీయంగా సరే, సాంస్కృతికంగా కూడా పతనం అంచులకు చేరుకున్నామని.

రెండవ ప్రపంచ యుద్ధం అయిన తరువాత ఇంటికి వస్తున్న జర్మన్‌ సైనికులకు( ఇంటికి తిరిగి రాగల అదృష్టం నోచుకున్నవాళ్లు) తమ పదజాలమంతా హఠాత్తుగా మాయమైనట్లు అనిపించిందట.’దేశం’, ‘కుటుంబం’, ‘మనిషి’, ‘ప్రేమ’, ‘మానవ సంబంధాలు’ ఈ మాటలకు అర్ధం లేదని అనిపించిందట.

గౌరిని హత్య చేసిన మర్నాడే హత్యను ఖండించకపోగా, మరణానికి చింతించకపోగా, ఈ అమానుషాన్ని ప్రతి ఒక్కరూ తమ మీద తీసుకొని ఎంతో కొంత ప్రాయచిత్తం ప్రకటించకపోగా, సోషల్‌ మీడియాలో నడచిన, నడుస్తున్న కొన్ని వ్యాఖ్యలు నన్ను బాధిస్తున్నాయి, భయపెడుతున్నాయి. మనం ఏ దేశంలో వున్నాం ? ఏ విలువల గురించి ఇంతకాలం గర్విస్తూ వచ్చాం? ప్రాచీన కాలం నుంచి ఎవరిని ఆదర్శాలుగా ప్రకటించుకుంటూ వచ్చాం? నిర్ధాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ చేసిన హత్యకన్నా, నిర్ధాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ మాట్లాడుతున్న ఈ మాటలు నన్నెక్కువ కలవరపెడుతున్నాయి.

దుర్మార్గమైన ఈ రాతలు చదివి ఎందరో యువతీ యువకులు, ముక్కుపచ్చలారని పిల్లలు తామేదో మహత్తర హిందూ సంస్కృకి వారసులమని, తమ మతానికి సంస్కృతికి ఏదో పెద్ద ప్రమాదం వాటిల్లుతోందని, అలాంటి ఒక ప్రమాదకరమైన మనిషిని చంపేస్తే వీళ్లంతా ఎందుకిట్లా ఖండిస్తున్నారని, దు:ఖిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఎవరు చెప్తారు వీళ్లకి ? ఈ రాజకీయ శక్తులు మాట్లాడుతున్న హిందుత్వానికి, అనాది కాలంగా ఈ దేశంలో కొనసాగుతున్న హిందూ జీవన విధానానికి సంబంధమే లేదని, అసలు ‘హిందుత్వం’ వేరు, హిందూ జీవన విధానం వేరని, అసలు హిందూ మతమంటూ ఒకటి లేనే లేదని, అసలు అటువంటి మతమంటూ ఒకటుందని అనుకున్నా ఇలాంటి అమానవీయ మిలిటెంట్‌ ధోరణుల్ని అది గతంలో ఇంత నిస్సిగ్గుగా చూపించి వుండలేదని, ఇప్పటి ఈ దుర్మార్గ స్వరూపం గ్లోబల్‌ పెట్టుబడికి, రాజకీయ కట్టుకథకి పుట్టిన విష పుత్రిక అని ఎప్పుడు గుర్తిస్తారు !

మరొక మాట కూడా చెప్పాలి. నేను కూడా హిందువునే, కానీ నా మతానికి బయటి మతాల వలన ప్రమాదం వుందని నాకెప్పుడూ అనిపించలేదు. ఏమతమైనా ఆ మతం పేరు చెప్పకుండా దాన్ని అనుసరించలేని ఆత్మవంచన వల్ల, కాలక్రమంలో సంతరించుకొనే దురాచారం వల్ల ప్రమాదంలో పడుతుంది తప్ప బయటివాళ్ల వల్ల కాదు. ఏమతాన్నయినా కాపాడగలిగేది ఆ మతం ప్రబోధించే మంచి విషయాల్ని అనుసరించగలిగే వాళ్లేతప్ప రాజకీయ నాయకులు, గూండాలు కాదు.

నేనీ మాటలు రాస్తే నేను ఎదుర్కోబోయే ప్రశ్నలేమిటో కూడా నాకు తెలుసు. అన్నింటికన్నా ముందు అడిగే ప్రశ్న: మరి వామపక్ష తీవ్రవాదులు అమాయకుల్ని చంపితే నువ్వెందుకు మాట్లాడలేదు అని, కేరళలోనో మరోచోటనో ఎవరో ఎవరినో చంపుతుంటే నువ్వెందుకు మాట్లాడలేదని. హింస ఎక్కడైనా హింసే, ఎవరు చేసినా హింసనే. కత్తితో కుడివైపు నుంచి పొడిచినా, ఎడమవైపు నుంచి పొడిచినా కారేది రక్తమే, దు:ఖమే. కానీ నేను ఈ దేశంలో ఇంతదాకా చూసిన హింసకి, ఈ హింసకీ పోలికనే లేదు. గతంలో ఎవరైనా ఎవరినైనా చంపితే ఎంతో కొంత పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేవారు, చివరికి గాడ్సే కూడా తన వాంజ్మూలంలో గాంధీ పట్ల ఎంతో కొంత సానుభూతి చూపకుండా వుండలేకపోయాడు. కానీ ఈ హత్యని ఇట్లా సెలబ్రేట్‌(పండుగ) చేసుకుంటున్న హీన సందర్భాన్ని ఇప్పుడే చూస్తున్నాను. అది కూడా హిందూత్వం పేరిట.

ఆమె హత్యను ఎవరు ఖండించారన్నది కాదు, ఎవరు ఖండించలేదన్నది నన్నెక్కువ బాధ పెడుతున్నది. బహుశ చిదానంద రాజఘట రాసుకున్న జ్ఞాపకాలు చదివి వుండకపోతే ఈ నాలుగు మాటలు మాట్లాడటానికి కూడా నా గొంతు పెగిలి వుండేది కాదు. మరీ ముఖ్యంగా ఈ వాక్యాలు ‘మరణం ఒక అనుకోని ఘటన. మంచి వ్యక్తులు చేసిన దానికి, వారు దేనికోసం నిలబడ్డారనేదానికి గౌరవం, ప్రేమ మరియు ప్రశంస ముఖ్యం. వామపక్షవాది, తీవ్రవాది, హిందుత్వ వ్యతిరేకి, లౌకిక వాది తదితర ముద్రలన్నింటినీ మరచిపోండి, నావరకైతే అబ్బురమైన కారుణ్యం, హుందాతనాల సారం’.

పిల్లలూ చదవండి, మీకు నచ్చని ప్రతి ఒక్కరినీ నిర్మూలించుకుంటూ పోనక్కరలేదని తెలుస్తుంది. విబేధాలతో విడిపోయినా, స్నేహితులుగా కొనసాగటమెలానో తెలుస్తుంది.మనుషులుగా మిగలటం అన్నింటికన్నా ముఖ్యమని తెలుస్తుంది.

(ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ సౌజన్యంతో)

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టులు-నాజీలు ఒకటే అయితే పాండవులు-కౌరవులనేమనాలి ?

04 Monday Sep 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, anti-communist fiesta, communist, Hitler, Joseph Stalin, Nazism, totalitarian regimes

ఎం కోటేశ్వరరావు

ఇప్పటి వరకు సమాజ చరిత్ర మొత్తం వర్గపోరాటాల మయమే అని కారల్‌ మార్క్స్‌ భాష్యం చెప్పారు. దాన్నే మహాకవి శ్రీశ్రీ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని మరింత సుబోధకంగా జనం ముందు పెట్టారు. విజేతలే ఎప్పుడూ చరిత్రను రాశారు. రెండు సంస్కృతులు సంఘర్షించినపుడు పరాజితులు రూపుమాసిపోతారు. విజేతలు తమ గొప్పతనాన్ని పెద్దదిగా చూపుతూ చరిత్ర పుస్తకాలు రాస్తారు, ఓడిపోయిన శత్రువు గురించి వాటిలో అగౌరవంగా చిత్రిస్తారు అని డాన్‌ బ్రౌన్‌ అనే పెద్దమనిషి చెప్పాడు.

ప్రపంచంలో దోపిడీ వ్యవస్ధ సంక్షోభానికి గురైనపుడల్లా మితవాద శక్తులు పెరిగాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా అన్నట్లుగా నాజీలైనా కమ్యూనిస్టులైనా ఒకటే ప్రాణాలు తీస్తారు, అలాంటపుడు నాజీలే మెరుగు అని జనం బుర్రల్లోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. దోపిడీ శక్తుల సమాచార యుద్ధంలో ఇదొక ప్రధాన ఆస్త్రం. నమ్మకం లేదా ప్రచారంలో వున్నదాని ప్రకారం పద్దెనిమిది రోజుల పాటు మహాభారత యుద్దం జరిగింది. దానిలో కౌరవులు, పాండవులూ కత్తులు దూశారు. యుధిష్టిరుడు నష్టాల గురించి ధృతరాష్ట్రుడికి చెప్పినదాని ప్రకారం ఇరువైపులా 166 కోట్ల 20వేల మంది మరణించగా, 2,45,165 మంది మాత్రమే మిగిలారు. ఇంత మందిని బలి తీసుకున్నప్పటికీ మన సమాజం ఆ యుద్ధంలో పాండవుల పాత్రను హర్షిస్తూ, కౌరవులను విమర్శిస్తున్నది. చెడుపై మంచి సాధించిన విజయంగా కీర్తిస్తున్నది. పెద్ద సంఖ్యలో జనం మరణించారు గనుక పాండవులు, కౌరవులు ఇద్దరిదీ తప్పే, ఇరు పక్షాలూ దుర్మార్గమైనవే అనటం లేదు. పాండవులు-కౌరవులను ఒకే గాటన కట్టకూడదన్నపుడు కమ్యూనిస్టులు-నాజీలను ఒకే గాటన ఎలా కడతారు.

1848లో వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళికతో దోపిడీ వర్గానికి సరికొత్త ప్రతిఘటన ప్రారంభమైంది. అది ఒక రాజుపై మరొక రాజు, ఒక అధికార(పాలకవర్గ) పార్టీపై మరొక పార్టీ మధ్య జరిగే పోరు, ప్రతిఘటన కాదిది. కనుకనే అప్పటి నుంచి చరిత్రను దోపిడీ వర్గమే కాదు, దోపిడీకి గురయ్యే వర్గం కూడా తన దృక్పధంతో సమాజం ముందుంచుతోంది. మార్క్స్‌కు ముందు, తరువాత చరిత్ర రచనలో వచ్చిన మౌలిక మార్పు ఇది. ప్రస్తుతం మన దేశంలో అధికార వ్యవస్ధలో పైచేయి సాధించిన కాషాయ దళాలు ఇప్పటి వరకు మన ముందుంచిన చరిత్రను నిరాకరిస్తూ తిరగరాసేందుకు, వాస్తవాల ప్రాతిపదికన కాకుండా మతం, విశ్వాసాల ఆధారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఏది వాస్తవానికి దగ్గరగా వుందన్నదే జనం తేల్చుకోవాల్సింది.

ఐరోపాను ఒక దయ్యం వణికిస్తోంది, అదే కమ్యూనిజం అని మార్క్స్‌-ఎంగెల్స్‌ 168 సంవత్సరాల క్రితం చెప్పారు. సోషలిజం-కమ్యూనిజాలపై విజయం సాధించాం, అదింక కోలుకోలేదు అని పాతిక సంవత్సరాల క్రితం పెట్టుబడిదారీవర్గం ప్రకటించుకుంది. అదే నిజమైతే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా కమ్యూనిస్టు భావజాలంపై దాడి, మ్యూనిస్టు వ్యతిరేక ప్రదర్శనలు, ప్రపంచ కమ్యూనిస్టు వ్యతరేక సమావేశాలు ఎందుకు జరుపుతున్నట్ల్లు ?

రెండవ ప్రపంచ యుద్ధం ముగస్తున్న దశలో ఐరోపా భవిత్యం గురించి 1945 ఫిబ్రవరి 4-11 తేదీలలో జరిగిన యాల్టా సమావేశంలో పొల్గొన్న చర్చిల్‌-రూజ్‌వెల్ట్‌- స్టాలిన్‌. నాజీజం-కమ్యూనిజం ఒకటే అయితే దానికి జర్మనీ నాజీ ప్రతినిధులను ఎందుకు పిలవలేదు ?

ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన నాజీజం, హిట్లర్‌ పీచమణిచి ఆ ముప్పు తప్పించిన శక్తులకు నాయకత్వం వహించింది స్టాలిన్‌. రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా నాటి సోవియట్‌ యూనియన్‌-హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ మధ్య 1939 ఆగస్టు 23న నిర్యుద్ధ సంధి జరిగింది.అది సోవియట్‌-జర్మనీ మధ్య ఆ ప్రాంత ఐరోపా దేశాలను విభజించుకొనేందుకు జరిగిన ఒక చీకటి ఒప్పందం, దాని వలన కోట్లాది మంది జనం ప్రాణాలు కోల్పోయారంటూ సోషలిజం-నాజీశక్తులను ఒకే గాటన కడుతున్నారు. దానిలో భాగంగానే ఆ సంధి వలన ప్రాణాలు కోల్పోయినవారు, బాధితులను స్మరించుకొనే పేరుతో 2009 ఏప్రిల్‌ రెండున ఐరోపా పార్లమెంట్‌ చేసిన నిరంకుశపాలన వ్యతిరేక తీర్మానం మేరకు ని ప్రతి ఏడాది ఆగస్టు 23న ఐరోపాలోని కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఎస్తోనియా రాజధాని తాలిన్‌లో కమ్యూనిస్టు పాలకుల నేరాల పేరుతో ఐరోపా దేశాల న్యాయశాఖల మంత్రుల సమావేశం జరిపారు. తమ దేశ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వున్నందున ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు గ్రీస్‌ మంత్రి ప్రకటించారు. ఐరోపా చారిత్రాత్మక జ్ఞాపకాన్ని అవమానించటం తప్ప మరొకటి కాదని ఐరోపా వామపక్ష పార్టీ పేర్కొన్నది. పూర్వపు సోషలిస్టు రిపబ్లిక్‌ అయిన ఎస్తోనియాను అటువంటి సమావేశానికి వేదికగా చేసుకోవటం సైద్ధాంతిక లక్ష్యం కోసమే అని పేర్కొన్నది. గ్రీకు మంత్రి బహిష్కరణ నిర్ణయాన్ని ఎస్తోనియా పార్లమెంట్‌ సభ్యురాలు వుడెక్కి లూనే సమర్ధిస్తూ ఒక లేఖ రాశారు. ఆ సమావేశాన్ని నిర్వహించటమంటే ప్రస్తుత ఎస్తోనియా రాజకీయాలు నాజీజాన్ని పరోక్షంగా సమర్ధించటమే అని పేర్కొన్నారు.రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ విజయాన్ని మేతొమ్మిదవ తేదీన జరపాలన్న తన నిర్ణయంపై అనేక మంది జర్నలిస్టులు, రాజకీయవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారని, అదే సమయంలో మద్దతు కూడా లభించిందని లూనే పేర్కొన్నారు.

ఎస్తోనియా అధ్యక్షతన రెండవ సారి జరిగిన కమ్యూనిస్టు వ్యతిరేక సమావేశాన్ని సిపిఎం, సిపిఐతో సహా 83కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు ఒక ప్రకటనలో ఖండించాయి. ఫాసిజాన్ని కమ్యూనిజంతో సమంచేసి చెప్పటం రెచ్చగొట్టటం, పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్ద గర్బంలో జన్మించిన ఫాసిజాన్ని నిర్దోషిగా ప్రకటించటం తప్ప మరొకటి కాదని, ఈ కారణంగానే కమ్యూనిస్టులను ఖండించటం, హింసించటం, అనేక ఐరోపా దేశాలలో పార్టీలపై నిషేధం విధిస్తున్నారని అదే సమయంలో నాజీలతో కుమ్మక్కైన వారు, వారి రాజకీయ వారసులకు పెన్షన్లు ఇస్తున్నారని కమ్యూనిస్టుపార్టీల ప్రకటన పేర్కొన్నది. కమ్యూనిస్టు వ్యతిరేక చిహ్నాలు పెరగటం అంటే ప్రజావ్యతిరేక చర్యలను తీవ్రతరం చేయటం, కార్మికుల హక్కులను పరిమితం చేయటం, సామ్రాజ్యవాదుల నూతన యుద్ధాలకు తెరతీయటమే అని హెచ్చరించింది. మహత్తర అక్టోబరు విప్లవానికి వందేండ్లు నిండిన సందర్భంగా నిజాలు వెలుగులోకి వస్తాయని, టన్నుల కొద్దీ మట్టి చల్లి సోషలిస్టు వ్యవస్ధ గొప్పతనాన్ని మూసిపెట్టటం సాధ్యం కాదని, సంపదలను సౄష్టించే కార్మికులు దానిని తమ పరం చేసే సమాజం కోసం పోరాటాలు జరిపి సోషలిజం నుంచి కమ్యూనిజానికి పయనిస్తారని పేర్కొన్నది.

హిట్లర్‌ తమ పార్లమెంట్‌ భవనాన్నే తగుల బెట్టించి ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై వేశాడు. ప్రజల హక్కులను హరించటంతో పాటు కమ్యూనిస్టులను అణచివేసేందుకు 1933లోనే ఆ దుర్మార్గానికి పాల్పడిన హిట్లర్‌ కమ్యూనిస్టు వ్యతిరేకత లోకవిదితం. తొలుత పక్కనే వున్న కమ్యూనిస్టు రష్యాను దెబ్బతీస్తే మిగతా ప్రపంచాన్ని చాపలా చుట్టి తన కింద వుంచుకోవచ్చని భావించిన హిట్లర్‌ అందుకు సన్నాహాలు చేసి సాకు, సమయం కోసం ఎదురుచూశాడు. ఆ తరుణంలో స్టాలిన్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ బలాబలాలను మదింపు వేసి, తగిన బలాన్ని సమకూర్చుకొనేందుకు, నాటి సామ్రాజ్యవాదుల మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొనేందుకు ఒక ఎత్తుగడగా హిట్లర్‌తో స్టాలిన్‌ నిర్యుద్ధ సంధి చేసుకుంది తప్ప ఐరోపాను పంచుకొనేందుకు కాదు. అదే హిట్లర్‌ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రెండు సంవత్సరాల తరువాత సంధిని వుల్లంఘించి గురించి సోవియట్‌పై దాడికి దిగటం, ఆ దాడిలోనే పరాజయం, ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే.అలాంటి హిట్లర్‌ – స్టాలిన్‌ను ఒకే గాటన కట్టటం దుర్మార్గం. ఐరోపాలోని బ్రిటన్‌, ఫ్రెంచి సామ్రాజ్యవాదులు ఒకవైపు జర్మన్‌ సామ్రాజ్యవాదంతో వివాద పడుతూనే కమ్యూనిస్టు రష్యాను కూల్చివేసేందుకు హిట్లర్‌కు ఏ విధంగా మద్దతు ఇచ్చిందీ తెలిసిందే. చివరకు తమకే ముప్పు రావటంతో చేతులు కలిపారు తప్ప కమ్యూనిస్టులపై ప్రేమతో కాదు. హిట్లర్‌, ముస్సోలినీ, టోజో వంటి నియంతలు,ఫాసిస్టులు తలెత్తటానికిి, బలపడటానికి అనుసరించిన విధానాల బాధ్యత నుంచి వారు తప్పించుకోలేరు. స్టాలిన్‌-హిట్లరూ ఇద్దరూ ఒకటే అయితే స్టాలిన్‌తో ఎందుకు చేతులు కలిపినట్లు? తొలుత జర్మనీలో, తరువాత హిట్లర్‌ ఆక్రమించుకున్న పోలాండ్‌ తదితర దేశాలలోనే యూదుల మారణకాండ జరిగింది తప్ప కమ్యూనిస్టుల ప్రాబల్యంలోకి వచ్చిన ప్రాంతాలలో అలాంటి వూచకోతలు జరగలేదు, దేశాలను ఆక్రమించుకోలేదు. అలాంటపుడు నాజీజం-సోషలిజం ఒకటే ఎలా అవుతాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు ఐరోపా దేశాలను నియంతృత్వశక్తుల చేతుల్లోకి నెట్టారన్నది ఇంకొక ఆరోపణ. కమ్యూనిస్టులను నియంతలుగా చిత్రించటం అంతకు ముందు జరిగిందీ తరువాత కొనసాగిస్తున్న పాత చింతకాయ పచ్చడి ప్రచారం తప్ప వాస్తవం కాదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు అసాధ్యం కావటంతో తన పెరటితోట వంటి దక్షిణ(లాటిన్‌) అమెరికాలోని ప్రతి దేశంలో, ఆసియాలో తన కనుసన్నలలో వున్న దక్షిణ కొరియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ వంటి చోట్ల మిలిటరీ నియంతలను నిలబెట్టి వాటిని దోచుకున్న అమెరికా చరిత్ర దాస్తే దాగుతుందా? ఆఫ్రికాలో అమెరికా మద్దతు లేని నియంత ఎవడైనా వున్నాడా ? గతంలో సోవియట్‌, తూర్పు ఐరోపా లేదా ఇప్పుడు చైనాగాని ఏ ఒక్క సైనిక నియంతకైనా మద్దతు ఇస్తున్న వుదంతం వుందా? అమెరికా, ఐరోపాలోని దాదాపు అన్ని దేశాలలో నయానాజీ శక్తులు తలెత్తుతున్నాయి, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి.

ఆగస్టు నెలలో అనేక అమెరికా నగరాలలో నయా నాజీ, ఫాసిస్టు శక్తులు రెచ్చిపోయి భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో జాత్యహంకారం, సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. వాటిని వ్యతిరేకించే శక్తులు కూడా వాటి ప్రచారం, ప్రదర్శనలకు పోటీగా వీధులలోకి వస్తున్నాయి. చార్లెటిసవిలేలో జరిగిన దానికి ఇరు వర్గాలూ బాధ్యులే అని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించి నయానాజీలను వెనకేసుకు వచ్చాడు. స్వేచ్చాభిప్రాయ వెల్లడికి అవాకాశం ఇవ్వాలని కోరుతూ బర్కిలీలో జాత్యహంకారులు చేసిన ఒక ప్రదర్శన సందర్బంగా జాత్యంహంకారులు కొందరిని వామపక్ష ప్రదర్శకులు కొట్టారని, చూడండి వామపక్ష మద్దతుదారులు ఎలా దాడులకు పాల్పడుతున్నారో అంటూ వాషింగ్టన్‌ పోస్టు వంటి పత్రిలు గోరంతను కొండంతగా చిత్రించాయి.ముందే చెప్పుకున్నట్లు ప్రచార యుద్దంలో ఇదొక భాగం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

లాటిన్‌ అమెరికాలో మరో కొత్త వామపక్ష పార్టీ !

23 Wednesday Aug 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion

≈ 1 Comment

Tags

colombia, FARC, Latin American left, Marxist-Leninist ideology, new left party

ఎం కోటేశ్వరరావు

ప్చ్‌ ! కమ్యూనిస్టుల పని అయిపోయింది, కమ్యూనిజానికి కాలం చెల్లింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు విన్న పాత తరంలో కొందరికి నిజమేనేమో అని పిస్తోంది. అసలు కమ్యూనిజం గురించి తెలియని కొత్త తరంలో కాస్త బుర్రవున్న వారికి అసలు కమ్యూనిజం అంటే ఏమిటి, అదేమి చెప్పింది అనే కొత్త ఆలోచన కలుగుతోంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపాలోని సోషలిస్టు దేశాలను కూల్చివేసిన తరువాతే కదా లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలలో, దక్షిణాఫ్రికా, నేపాల్‌లో వామపక్షాలు, కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ 2008 నుంచి తీవ్ర సంక్షోభంలో మునిగి ఎప్పుడు ఒడ్డుకు చేరుతుందో ఇంకా తెలియని స్ధితిలో చైనా సోషలిస్టు వ్యవస్ధకు అలాంటి దెబ్బ తగలలేదేం? నూరు పూవులు పూయనివ్వండి వేయి ఆలోచనలను వికసించనివ్వండి !

కమ్యూనిస్టులను అణగదొక్కాం, సోషలిజంపై విజయం సాధించాం అని చెప్పుకున్నది అమెరికా. కొలంబియా దాని వుపగ్రహ దేశంగా వుంది. తాము గతంలో అనుసరించింది, భవిష్యత్‌ మార్గదర్శి మార్క్సిజం అని బహిరంగంగా చెప్పుకొనే గెరిల్లా సంస్ధ కొలంబియాలోని ఎఫ్‌ఏఆర్‌సి. అలాంటి దానితో ప్రభుత్వం రాజీకి ఎందుకు వచ్చిందో ఎవరైనా చెప్పగలరా? ఐదు కోట్ల జనాభా వున్న ఆ దేశంలో గత ఐదున్నర దశాబ్దాలుగా సాయుధ పోరాట పంధాలో సాగిన కొలంబియా విప్లవ సాయుధ శక్తులు(ఎఫ్‌ఏఆర్‌సి) సెప్టెంబరు ఒకటవ తేదీన ‘కొలంబియా విప్లవ ప్రత్యామ్నాయ శక్తి ‘ పేరుతో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నాయి. ఇంతకాలం వారికి అనేక విధాలుగా మద్దతు ఇచ్చిన క్యూబా,వెనెజులా తదితర దేశాల మధ్యవర్తిత్వంలో కుదిరిన హవానా ఒప్పందం ప్రకారం కొలంబియా పార్లమెంట్‌ ఎఫ్‌ఏఆర్‌సిని ఒక రాజకీయ పార్టీగా గుర్తించటం, అదే సమయంలో ఆ సంస్ధ ఆయుధాలను విసర్జించి రాజకీయ రంగంలోకి రావటం ఒకేసారి జరిగాయి. గెరిల్లాలు తమ వద్ద వున్న ఆయుధాలను అప్పగించి గతవారంలో సాధారణ జీవితంలో ప్రవేశించారు. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో ఇలాంటి గెరిల్లా సంస్ధలు సాయుధబాటను వీడి పార్లమెంటరీ రాజకీయాలలో ప్రవేశించి అధికారానికి వచ్చిన పూర్వరంగంలో కొలంబియా పరిణామాలను చూడాల్సి వుంది.

ఇప్పటికీ లాటిన్‌ అమెరికాలో విప్లవశక్తులకు స్ఫూర్తినిస్తున్న సైమన్‌ బొలివర్‌ అవిభక్త స్వతంత్ర కొలంబియా తొలి అధ్యక్షుడు. స్పెయిన్‌ వలస పాలకుల నుంచి స్వాతంత్య్రం పొందేందుకు ఆయన నాయకత్వంలో సాగిన కృషి ఈనగాచి నక్కల పాలైనట్లు తరువాత కాలంలో మితవాద, మిలిటరీశక్తుల పరమైంది. అవి భక్త కొలంబియా నుంచి కొలంబియా, వెనెజులా, ఈక్వెడోర్‌, పెరు, పనామా ఏర్పడ్డాయి. కొలంబస్‌ కనుగొన్న ప్రాంతం కనుక కొలంబియా అని పిలిచారు. పోరు వారసత్వం కలిగిన కొలంబియాలో 1950 దశకంలో గ్రామీణ ప్రాంతాలలో రైతాంగాన్ని భూములనుంచి బలవంతంగా వెళ్లగొట్టి అమెరికన్‌ కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు పూనుకున్న ప్రభుత్వ, కార్పొరేట్‌ గూండాల దాడులను అడ్డుకున్నారు. అందుకోసం కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మరక్షణ దళ వ్యవస్ధ 1960 దశకంలో ఒక సంఘటిత సాయుధ గెరిల్లా దళ సంస్ధ ఎఫ్‌ఏఆర్‌సి ఆవిర్భావానికి దారితీసింది. అప్పటి నుంచి మిలిటరీ, మాదక ద్రవ్యాల మాఫియాలు, అన్ని రకాల సంఘవ్యతిరేకశక్తుల దాడుల నుంచి తట్టుకొని నిలవటమేగాక పటిష్టం కావటం, లాటిన్‌ అమెరికాలో ప్రజావ్యతిరేక మితవాద పాలకపార్టీలన్నీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పూర్వరంగంలో అక్కడి పాలకవర్గం విప్లవ సంస్ధతో రాజీకి అంగీకరించాల్సి వచ్చింది. అనివార్యమై ఆయుధాలు పట్టిన ఎఫ్‌ఏఆర్‌సి సాయుధ కార్యకలాపాలతో పాటు బహిరంగ రాజకీయ కార్యకలాపాలలో పాల్గనేందుకు గతంలో కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. మూడు దశాబ్దాల క్రితం ఆయుధాలను విసర్జించకుండానే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని దేశ భక్త ఫ్రంట్‌ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేసి చట్టబద్దంగా పని చేస్తున్న కమ్యూనిస్టుపార్టీతో 1984-87 మధ్య ఎన్నికలలో పాల్గని అనేక విజయాలు కూడా సాధించింది. అయితే బహిరంగ కార్యకలాపాలలో వున్న అనేక మంది కార్యకర్తలను ప్రభుత్వం, దాని కనుసన్నలలో మెలిగే మాఫియా శక్తులు హతమార్చటంతో ఆ విధానానికి స్వస్ది చెప్పి తిరిగి సాయుధ చర్యలను ప్రారంభించింది. క్యూబా, వెనెజులా వంటి దేశాలు, కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల మద్దతు వున్నప్పటికీ కొలంబియాలో వున్న పరిస్ధితుల నేపధ్యంలో సాయుధ పోరాట మార్గానికి స్వస్తి చెప్పాలని ఎఫ్‌ఏఆర్‌సి నాయకత్వంలో వచ్చిన ఆలోచన, పాలకవర్గాలు దిగివచ్చిన కారణంగానే గత నాలుగు సంవత్సరాలుగా సాగిన శాంతి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని చెప్పవచ్చు.

ఎఫ్‌ఏఆర్‌సి ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి ఎన్నికలలో పాల్గనేంతవరకు పార్లమెంట్‌ వుభయ సభలలో ఐదుగురి చొప్పున 2023వరకు ఎన్నికతో పని లేకుండా ఆ పార్టీ ప్రతినిధులు వుంటారు. ఆ లోగా జరిగే ఎన్నికలలో అంటే 2018లో అది సాధించుకొనే సీట్లు అదనం. త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు మహాసభను జరిపి లాంఛనంగా ‘కొలంబియన్‌ రివల్యూషనరీ ఆల్టర్‌నేటివ్‌ ఫోర్సెస్‌'(కొలంబియా ప్రత్యామ్నాయ విప్లవ శక్తి) అని పార్టీకి నామకరణం చేయనున్నట్లు శాంతి చర్చలలో ప్రధాన పాత్ర పోషించిన ఇవాన్‌ మార్క్వెజ్‌ ప్రకటించారు. గతంతో తాము తెగతెంపులు చేసుకోబోవటం లేదని, ఎల్లపుడూ విప్లవ శక్తులుగానే వుంటామని చెప్పారు.

కొద్ది రోజుల క్రితం జరిగిన కొలంబియా కమ్యూనిస్టుపార్టీ 22వ మహాసభలో అనేక మంది ఎఫ్‌ఏఆర్‌సి నేతలు పాల్గన్నారని, వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో రెండు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు టెలిసుర్‌ టీవీ వెల్లడించింది. దేశంలో శాంతిని పరిరక్షించే క్రమంలో వామపక్షాల తరఫున ఒక నియోజకవర్గంలో ఒకే అభ్యర్ధిని నిలుపుతామని కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు జైమే కేసెడో టురియాగో చెప్పినట్లు వార్తా సంస్ధలు పేర్కొన్నాయి.’ వామపక్షం విస్తరిస్తోంది, నూతన శక్తులు వునికిలోకి వస్తున్నందున మరింతగా విస్తరిస్తూనే వుంటుంది. దానిని మరింత విస్తరింప చేసి ఐక్యతా సృహను పెంచటమే మేము ఇప్పుడు చేయాల్సింది’ అని కెసెడో వ్యాఖ్యానించారు. మహాసభకు గెరిల్లా సంస్ధ ప్రతినిధులుతో పాటు అనేక సామాజిక వుద్యమాలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు. కొలంబియా కమ్యూనిస్టులు, గెరిల్లా సంస్ధలపై గత యాభై సంవత్సరాలలో స్ధానిక పాలకులు, అమెరికా కనుసన్నలలో పని చేసే మీడియా, అనేక సంస్ధలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశాయి. వారిని టెర్రరిస్టులుగా చిత్రించారు, పోలీసు, మిలిటరీ బలగాలతో పాటు మాదక ద్రవ్యాల మాఫియా, ఇతర సంఘవ్యతిరేక శక్తులు, కమ్యూనిస్టు వ్యతిరేకులను వుపయోగించుకొని దాడులు చేశారు. వేలాది మంది కార్యకర్తలు,నేతలను బలితీసుకున్నారు. మాఫియా సంస్ధలు చేసిన దాడులు,హత్యాకాండను కూడా గెరిల్లాలు, కమ్యూనిస్టులకు అంటగట్టారు. వేలాది కుటుంబాలు అనేక అగచాట్లకు గురయ్యాయి. ఈ పూర్వరంగంలో ఎఫ్‌ఏఆర్‌సితో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఓటింగ్‌లో పాల్గన్న సగం మంది శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారంటే అక్కడి ప్రజల్లో వున్న కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించే శక్తులు ఎఫ్‌ఏఆర్‌సిని రెచ్చగొట్టేందుకు శాంతి ఒప్పందం కుదిరిన నాటి నుంచి ఆయుధాలు అప్పగించే ముందు రోజు వరకు ఎనిమిది మంది గెరిల్లా దళ సభ్యులను హత్య చేశాయి. గెరిల్లాలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారు నిరాయుధులుగా బయటకు వస్తుండటంతో ఆ ప్రాంతాలకు మితవాద సాయుధ శక్తులు చేరుతున్నాయి. స్ధానిక కార్యకర్తలు, జనాలను భయభ్రాంతులకు గురిచేసి దాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ శక్తులకు గతంలో ప్రభుత్వమే గెరిల్లాలపై దాడులకు శిక్షణ ఇచ్చి పెంచి పోషించింది. అధికారిక గణాంకాల ప్రకారమే 2016 జనవరి నుంచి 2017 మార్చి ఒకటవ తేదీ వరకు 156 మంది సామాజిక, మానవ హక్కుల నేతలకు హత్యకు గురయ్యారు. గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాదిలో మే నెల వరకు 41 మంది హత్యకు గురికావటం ఎక్కువ, ఆందోళనకరం అని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంస్ధ పేర్కొన్నది. శాంతి ఒప్పందంలో పేర్కొన్న సదుద్ధేశ్యాలను ఆచరణలోకి తీసుకురావటం అతి పెద్ద సవాలని, దానిని ఎదుర్కోవటంలో విఫలమై సమర్ధవంతంగా అమలు జరపకపోతే ఒక దేశంగా కొలంబియా మనుగడే ప్రమాదంలో పడుతుందని ఎఫ్‌ఏఆర్‌సి సభ్యుడు లూకాస్‌ కార్వజెల్‌ చేసిన వ్యాఖ్యకు ఎంతో ప్రాధాన్యత వుంది.కొన్ని మీడియా సంస్ధల అధిపతులు, ప్రజాభిప్రాయాన్ని మలిచేవారిగా పాత్ర పోషిస్తున్న కొందయి తమకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని స్పష్టంగా గమనించవచ్చని లూకాస్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వ్యవసాయ అభివృద్ధి గురించి మేము చర్చ ప్రారంభిస్తే వెంటనే దేశంలో మీరే పెద్ద భూ ఆక్రమణదారులని చెబుతారు, మాదకద్రవ్యాల గురించి మాట్లాడితే మీరే ప్రధాన వుత్పత్తిదారులంటారన్నారు. ఈ పూర్వరంగంలో కొలంబియా శాంతి పరిణామాలు, పరిమితులను చూడాల్సి వుంది.

 

.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d