• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RELIGION

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

30 Tuesday May 2017

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION, Social Inclusion

≈ Leave a comment

Tags

Ambedkar, Buddha, Dalit, manuvadis, mental slavery, soaps, Yogi Adityanath

అంబేద్కర్‌, బుద్ద సబ్బులతో మానసిక బానిసత్వ శుద్ధి !

అసంగ్‌ వాంఖడే

ఇదిగో నా నైవేద్యం

మనువు నన్ను మలినం గావించాడు

మీ అసహ్యబుద్ది

మాకు దుర్గంధం వంటి కులనామాన్నిచ్చి వెలివేసింది

గాయాల వాసనతోనే నేను ప్రకాశించాను

నాపై వున్నది అణచివేత జాడలు తప్ప మీ దుర్గంధం కాదు

మీ దేవుడి ప్రసన్నం కొరకు

ఈ రోజు నాకు షాంపూ, సబ్బులు ఇచ్చారు

మైనారిటీల హింస, మానభంగాలను వల్లించే

మీ కంపునోళ్లను కడిగేందుకు వాటినెప్పుడైనా వాడారా

మనువాదం, వర్ణాశ్రమ ధర్మం అని ప్రవచించే

బుద్ధి శుద్ధికి పుపయోగించారా

మీ కానుకలతో

మీరు నా మాన మర్యాదలను మంటగలిపారు

నా నైవేద్యంతో

మీ అహంభావ, గర్వాలను అసహ్యించుకుంటున్నా

మా బాబా సాహెబ్‌ చర్యలు

నా క్షణభంగురమైన వాసనలను శుద్ధి చేస్తాయి

నా కుల అణచివేత, వెలి గాయాలను సబ్బులు మరింత మండిస్తాయి

నాకు మీ సానుభూతి అవసరం లేదు

నాకు మీపై ద్వేషం కావాలి

నిరసన కేకల మధ్య

నా ఆత్మప్రతిష్ట గానం వినిపిస్తాను

అదే నాకు ఆత్మగౌరం, స్వాతంత్య్రాలను,

రణానికి స్వేచ్చ నిస్తుంది.

రెండు సార్ల తిండి కోసం

నేను నీ మలమూత్రాలను మోస్తాను

లేదంటే ఈ సర్వసత్తాక రాజ్యంలో

నేను ఆకలితో నిద్రపోవాలి

సబ్బులు, షాంపులు మీ అజా&క్షన ఆకలిని తప్ప

మా కడుపులను నింపవు

దేశ వెలుగుల ప్రసరణ కోసమే మీ ప్రభువు ఇక్కడున్నాడు

ఆయన ఆహ్లాదం కోసం మమ్మల్ని శుద్ధి చేశారు

భజనపరుల మాదిరి చిరునవ్వులు చిందించమన్నారు

మా అంతరంగం తన మౌనాన్ని వీడితే ఎలాంటి కంపనలు వస్తాయో తెలుసా ?

ఓ దేవుడా మా ఇంటిని చూసేందుకు దయచేయి

అది మీ కాషాయ అంగవస్త్రం కంటే శుభ్రంగా వుంటుంది

అయితే నీ అంతరంగం పరిశుద్ధంగా వున్నపుడు మాత్రమే మాట్లాడు

మనువును తగులబెట్టిపుడు మాత్రమే నవ్వు

నీ హృదయంలో నృత్యం చెయ్యి

నా నిశ్శబ్దం బద్దలు కాబోతున్నది

ఇప్పటికే వుషోదయమైంది

మీరు వెనుదిరిగి వెళ్లే ముందు ఇదే నా నైవేద్యం

నేను అంబేద్కర్‌, బుద్దుడు అనే సబ్బులను అర్పిస్తున్నాను

వెళ్లి మీ మానసిక బానిసత్వాన్ని శుద్ధి చేసుకోండి

మీ తాత్వికతలో మనువు చొప్పించిన కులాన్ని అంతం చేయండి

మీ కాషాయ అంగవస్త్రాన్ని తెల్లగా చేయండి

మా వైపు ఇద్దరు సూర్యులు వుండ కూడదు

మిమ్మల్ని భస్మం చేసేందుకు మా స్వంత సూర్యుడున్నాడు

కొద్ది రోజుల క్రితం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధుడు ఒక గ్రామానికి వెళ్లారు. ఆ సందర్భంగా దళితులకు సబ్బులు, షాంపూలు ఇచ్చి యోగి దర్శనానికి శుభ్రంగా స్నానం చేసి రమ్మని ఆదేశించారు. దానిపై న్యాయవాది, కవి అయిన అసంగ్‌ వాంఖడే స్పందనే ఈ కవిత. అనువాదం ఎం కోటేశ్వరరావు. నేను స్వతహాగా కవిని కాదు కనుక అనువాదంలో ఆ ఆవేశం వుండదు కనుక విమర్శకులు మన్నించాలి. అందువలన ఆంగ్ల మూలాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను.

Here is my offer
Manu made me unclean.
Your prejudiced mind makes me
reek of caste names and exclusion
I glow with the fragrance of sores,
I stink of oppression and not your shit.

To please your lord, you offered me
soap and shampoo today.
Have you ever used them to clean
those foul smelling tongues,
which talk of raping minorities and violence?
Or used them to clean those brains,
that preach Manuvād and varnashramadharma?

With your offer,
you have abused my dignity.
With my offer,
I am abusing your conceit.

Appropriators of my Babasaheb
act as my ephemeral cleansers.
Soap exacerbates my wounds
of caste oppression and exclusion,
I don’t want your sympathy,
I want your detestation.
I play the song of assertion
in the cries of protests;
It gives me dignity and freedom,
a freedom to fight for.

For two meals
I carry your faeces!
If I don’t, I will sleep
hungry in this Republic.
Soap and shampoo only feed your ignorance,
not my stomach.

Your lord is here to capture the nation’s spotlight
We are bleached, to look presentable;
We are told to cheer like minions,
What will tremble when my insides break their silence?

Oh Lord, come see my home!
It is cleaner than your bhagwa drape.
But talk only when your consciousness is clean;
Smile only when you burn the Manu
dancing in your heart.
For my silence is about to break,
It is dawn already.

Before you turn your back
here is my offer.
I offer you my soaps, Ambedkar and Buddha.
Go clean your mental slavery,
Go annihilate caste and the Manu infused in your reason,
bleach your bhagwa to white.
There cannot be two Suns on this side, and
We have our own, to incinerate yours.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బాబరీ విధ్వంస కుట్ర కేసు విచారణ మధ్యంతర ఎన్నికలకు బాట వేయనుందా ?

19 Wednesday Apr 2017

Posted by raomk in AP, BJP, Communalism, Congress, Current Affairs, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

Guajarat., LOK SABHA, lok sabha midterm poles, Narendra Modi, Trial in Babri Masjid Case

Image result for babri masjid demolition

ఎం కోటేశ్వరరావు

గడువు ప్రకారం 2019లో జరగాల్సిన మన లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందే జరుగుతాయా ? అన్న వూహాగానాలు చెలరేగుతున్న తరుణంలో బాబరీ మసీదు కూల్చివేత కుట్రకేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన కీలకమమైన తీర్పు మధ్యంతర ఎన్నికలను మరింత వేగిరం చేయనున్నాయా ? దీనికి తోడు బాబరీ మసీదు కూల్చివేత లో కుట్రపూరిత నేరారోపణ నుంచి ఎవరికీ మినహాయింపు ఇవ్వనవసరం లేదని, రెండు సంవత్సరాలలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అందువలన దాన్నింక వాయిదా వేయటానికి వీలులేదు. ఇప్పుడున్న స్ధితిలో ఆ కేసులో వచ్చే తీర్పు ఎలా వుంటుందనేదాని కంటే బిజెపి అగ్రనాయకులపై విచారణ జరపాలని కోర్టు చెప్పటమే రాజకీయంగా బిజెపికి తొలి చెంపపెట్టు. కరసేవపేరుతో బాబరీ మసీదు కూల్చివేత వాస్తవం. అందుకు పధకం రూపొందించిన వారి బండారాన్ని బయట పెట్టటం, కూల్చివేసిన వారిని శిక్షించటం రాజ్యధర్మం. వీటన్నింటి పూర్వరంగంలో తమ విధానాలను మరింత గట్టిగా అమలు జరపాలంటే మరింత బలం కావాలని, స్పష్టమైన తీర్పు ఇవ్వాలనో మరొక సాకుతోనో కమల దళపతులు కొత్త పల్లవి అందుకోనున్నారా ?

1971 పార్లమెంట్‌ ఎన్నికలలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావటంతో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయాటానికి అనర్హురాలని 1975 జూన్‌ 12న అలహాబాద్‌ కోర్టు తీర్పు అదే నెల 26న దేశంలో అత్యవసర పరిస్ధితి విధింపునకు దారి తీసిన విషయం తెలిసిందే. బాబరీ మసీదు కూల్చివేత కుట్ర కేసు అలాంటి పరిణామానికి దారితీసే అవకాశం లేదు. అయితే సరిగ్గా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు గనుక కోర్టు తీర్పు వెలువడితే, అది బిజెపి నేతలను నిందితులుగా నిర్దారిస్తే పరిణామాలు ఎలా వుంటుంది అన్నది ఆసక్తికరం. దాని కంటే ముందు ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేస్తానని చెప్పే నరేంద్రమోడీ తన రాజధర్మాన్ని ఎలా పాటిస్తారు అన్నది తేల నుంది. ఒక కేసులో నిందితులుగా విచారణ ఎదుర్కొనేవారు అధికార పదవులలో కొనసాగవచ్చా ? కేంద్ర మంత్రి వుమా భారతిని మంత్రిగా వుంచుతారా లేక తొలగిస్తారా ? ఒక వేళ కొనసాగిస్తే అలాంటి ఇతరుల గురించి బిజెపి నోరు మూతపడాల్సి వుంటుంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రచారంలోకి వచ్చిన లేదా తెచ్చిన అద్వానీకి కోర్టు నిర్ణయం పిడుగువంటిదే. బాబరీ మసీదు కూల్చివేత ఘటనతో తాత్కాలికంగా అయినా మధ్యతరగతిలో అనేక మంది బిజెపికి దూరమయ్యారు. పాతిక సంవత్సరాల తరువాత కేసు తీర్పు కుట్రను నిర్ధారిస్తే అదే పునరావృతం అవుతుందా అన్నది ప్రశ్న. అదే మధ్యతరగతి ఇటీవలి కాలంలో మోడీ మోజుతో తిరిగి బిజెపి వైపు చేరింది. కుట్ర నిజమే అని ఒక వేళ కోర్టు నిర్ధారిస్తే ఇప్పుడున్న స్ధితిలో హిందూత్వ శక్తులు మరింతగా రెచ్చిపోవచ్చు. లేదని వస్తే చూశారా మేము ఎలాంటి కుట్ర చేయలేదు, ప్రజలే కూల్చి వేశారని అమాయకపు ఫోజు పెట్టవచ్చు. కాంగ్రెస్‌తో సహా అన్ని పాలకవర్గ పార్టీలు ఓట్ల కోసం మతోన్మాదంపై అంత కరకుగా వుండటం లేదు. బిజెపి మాదిరి మెజారిటీ, మైనారిటీ మత ప్రభావిత ఓట్ల కోసం సంతుష్ట రాజకీయాలకు పాల్పడుతున్నాయి. బిజెపికి బీ టీములుగా తయారవుతున్నాయి.అయితే దేశ వ్యాపితంగా తమ పాలన సాగాలని కోరుకుంటున్న బిజెపి కోర్టు తీర్పు ఎలా వచ్చినా నిండా మునిగిన తమకు ఇంకా చలేమిటనే వైఖరితో రిస్కు తీసుకుంటుందా ? అది చెప్పే హిందూత్వలో ఇమడలేని వారు మన దేశంలో మైనారిటీలు, దళితులు, గిరిజనులు 40 కోట్ల మంది వరకు వున్నారు. అంత మంది ఓట్లు లేకుండా ఏ పార్టీ అయినా దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాలలో అధికారాన్ని ఎలా సాధించగలుగుతుంది.

రాజకీయ నాయకుల మాటలకు అరా&థలే వేరులే అని బ్రిటన్‌ ప్రధాని థెరేసా మే రుజువు చేశారు. 2020 వరకు గడువున్న తమ పార్లమెంట్‌ను రద్దు చేయాల్సిన అగత్యం లేదంటూ నమ్మబలికిన థెరెస్సా మే ఆకస్మికంగా జూన్‌ ఎనిమిదిన ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నిర్ణీత గడువులోపల పార్లమెంట్‌ను రద్దు చేయటానికి వీలులేదు. ఏదో ఒక ప్రభుత్వం కొనసాగాల్సిందే. అయితేనేం చట్టమన్నతరువాత లొసుగు లేకుండా వుండదన్నట్లు మూడింట రెండు వంతుల మంది ఎంపీల మద్దతు వుంటే రద్దు చేయవచ్చన్న అవకాశాన్ని వుపయోగించుకొని ఆమేరకు పార్లమెంట్‌లో ఒక తీర్మానం చేయనున్నారు. పోయేదేముంది అవకాశం వుస్తుందేమో అని ఎదురు చూసే ప్రతిపక్షం లేబర్‌ పార్టీ కూడా అందుకు సై అంది. అందువలన లాంఛనంగా పార్లమెంట్‌ రద్దు, ఎన్నికలు జరగాల్సి వుంది. నిజానికి బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ ప్రభుత్వానికి ఆకస్మికంగా వచ్చిన ముప్పేమీ లేదు, నాయకత్వాన్ని సవాలు చేసే వారు కూడా లేరు. బ్రెక్సిట్‌ కారణంగా తన విధానాలను పక్కాగా అమలు జరపాలంటే తాజా ప్రజాతీర్పు కోరటం అవసరమని ప్రధాని థెరెస్సా ప్రకటించారు. ఏ వంకా లేకపోతే డొంకట్టుకు ఏడ్చారన్న సామెత వూరికే పుట్టలేదు. బ్రిటన్‌ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్ధితినుంచి తప్పించుకొనేందుకు ఇదొక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఆమె ఏ విధానాలను అమలు జరిపినా మద్దతు ఇచ్చే పాలక పార్టీకి సంపూర్ణ మద్దతు వున్నప్పటికీ ఎన్నికలకు తెరతీశారు.

మన దేశంలో కూడా గడువు ప్రకారమే ఎన్నికలంటూ గంభీరంగా నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా అధికారంలో వున్న పార్టీలలో కనిపిస్తున్న పరిణామాలు, ఇతర అంశాలను చూస్తే జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏ అంశాలు ఇటువంటి వూహాగానాలకు తావిస్తున్నాయో చూద్దాం. తెలంగాణాలో చంద్రశేఖర రావు వివిధ కార్పొరేషన్లకు, ఇతర పదవులను తన పార్టీవారితో నింపటం, వివిధ కులాల వారిని బుజ్జగించేందుకు తాయిలాలు ప్రకటించటం, రిజర్వేషన్ల పెంపుదలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశ నిర్వహణ, ప్రత్యర్ధి రాజకీయపార్టీలపై అధికారపక్ష దాడి తీవ్రతరం వంటి వన్నీ కొన్ని సూచనలు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది దెప్పి పొడుస్తున్నట్లుగా జయంతికి, వర్ధంతికి కూడా ఇంకా తేడా తెలియని కుమారుడికి చంద్రబాబు నాయుడు అమాత్యపదవి కట్టబెట్టటం, మంత్రివర్గ విస్తరణ ఎన్నికల కోసమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఇటీవలనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి.వాటిలో బిజెపి, దాని మిత్రపక్షం అకాలీదళ్‌ పంజాబ్‌లో ఘోరపరాజయాన్ని చవిచూశాయి. గోవాలో అధికారంలో వున్న బిజెపి ఓడిపోయింది. వుత్తరాఖండ్‌లో మాత్రమే బిజెపి విజయం సాధించింది. వుత్తర ప్రదేశ్‌లో విజయం సాధించింది, మణిపూర్‌లో ఓడిపోయింది. సాంకేతికంగా 2017లో గడువు ముగిసే అసెంబ్లీలు లేనప్పటికీ 2018లో ఏడు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాల్సి వుంది. వాటిలో హిమచల్‌ ప్రదేశ్‌లో జనవరి ఏడు, గుజరాత్‌లో జనవరి 22, మేఘాలయలో మార్చి ఆరు, నాగాలాండ్‌లో మార్చి 13, త్రిపురలో మార్చి 14, మిజోరంలో మార్చి 15, కర్ణాటకలో మే 28వ తేదీతో అసెంబ్లీల గడువు ముగుస్తుంది కనుక ముందుగానే ఎన్నికలు జరగాలి. మరుసటి ఏడాది లోక్‌సభ ఎన్నికలు, మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ పూర్వరంగంలో అన్ని రాష్ట్రాల అధికారంలో పాగావేయాలన్నది బిజెపి ఎత్తుగడ. అయితే గత ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలను చూసినపుడు బిజెపి పరిస్థితి నల్లేరు మీద బండిలా సాగుతుందా అన్నది చూడాల్సి వుంది.

దేశ ఆర్ధిక స్ధితిని చూస్తే మోడీ సర్కార్‌ మూడు సంవత్సరాలలో సాధించినదాని గురించి అధికార, ప్రయివేటు మీడియా దన్నుతో సంబరాలు చేసుకోవచ్చుగాని సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసిన ఒక్క అంశం కూడా లేదన్నది విశ్లేకుల అభిప్రాయం. ధరల పెరుగుదలలో మార్పు లేదు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో పురోగతి లేదు, ఎగుమతులు పడిపోయాయి, దిగుమతులు పెరిగాయి. సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్‌ అన్నట్లు గత మూడు సంవత్సరాలుగా కేంద్రీకరించిన వస్తు, సేవల పన్ను చట్టం జూలై నుంచి అమలులోకి రానుంది. దాంతో మొదట ధరలు పెరుగుతాయని, తరువాత జనానికి ఫలితాలు అందుతాయని పాలకపార్టీతో పాటు, దాని సమర్ధకులు వూదరగొడుతున్నారు. అంటే మొరటుగా చెప్పాలంటే ముందు నీ గోచి పాతను కూడా పోగొట్టుకుంటావు తరువాత పట్టుపంచలు పొందుతావు అన్నట్లుగా వుంది. ముందు ధరలు పెరగటం ఏమిటో తరువాత తగ్గటం ఏమిటో, ఇది ఏ పాఠశాల ఆర్ధశాస్త్రపాఠమో ఎవరూ చెప్పరు. ఒకసారి పెరగటం ఎందుకు తరువాత తగ్గటం ఎందుకు ? మానవ జాతి చరిత్రలో ఏ దేశంలో అయినా ఒకసారి పెరిగిన ధరలు తగ్గిన వుదాహరణ వుందా ? అందువలన అధికారం తప్ప మరొకటి పట్టని బిజెపి పెరిగిన ధరల మధ్య మోడీ పాలనలో దేశం వెలిగిపోతోంది అని చెప్పుకోజాలదు. కనుక ధరల సెగ జనానికి పూర్తిగా సోకక ముందే మరోసారి నాకు ఓటేస్తే ఇంకా మంచి రోజులు తెస్తానని గడువుకు ముందే ఎన్నికల ప్రకటన చేసి నరేంద్రమోడీ జనం ముందుకు వెళతారన్నది ఒక విశ్లేషణ.

పూర్వసామెత ప్రకారం ఆరునెలలు సాము గరిడీలు చేసి కనీసం ఓటి కుండలు పగలగొట్టిన ‘ప్రతిభావంతుల’ గురించి మాత్రమే విన్నాం. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పిన నరేంద్రమోడీ ఆరునెలలు గడిచిపోతున్నా రద్దు చేసిన పెద్ద నోట్లలో ఎంత మొత్తం తిరిగి వచ్చిందీ, ఎంత డబ్బు రాలేదు, ప్రభుత్వానికి ఎంత లబ్ది కలిగిందీ అన్న విషయాలేవీ ఇంతవరకు చెప్పలేదు. నరేంద్రమోడీకి నల్లధనం తేలు కుట్టింది కనుక మిన్నకున్నారా ? పెద్ద నోట్ల రద్దుతో కాశ్మీరుతో సహా దేశమంతటా తీవ్రవాద వెన్ను విరిచామని చెప్పారు. రాళ్లు విసురుతున్న ఘటనలు ఆ కారణంగానే తగ్గాయన్నారు. అన్ని చెప్పిన ఐదు నెలల తరువాత తమ రక్షణ వలయంగా ఒక యువకుడిని జీపుకు కట్టి వీధులలో రక్షణ పొందిన మిలిటరీ వుదంతం గతంలో ఎన్నడూ లేదంటే బిజెపి విధానాలు విజయవంతమైనట్లా కాశ్మీరులో పరిస్థితులను మరింత దిగజార్చి నట్లా ? ఎన్నికలలో చెప్పిన గుజరాతు నమూనా పాలన, ప్రగతి ఇలా చెప్పుకోవాలంటే ఎన్నో వున్నాయి. ఇవి జనంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయక ముందే ఓట్లను కొల్లగొట్టే పని పూర్తి చేసుకోబోతున్నారా ?

పార్లమెంటు ఎన్నికల తరువాత ఢిల్లీ, బీహారులో సంభవించిన పరాభవం తరువాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి బిజెపి ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చు. 2012 పంజాబు అసెంబ్లీ ఎన్నికలలో అకాలీదళ్‌-బిజెపి కూటమికి 34.59,7.15 చొప్పున మొత్తం 41.64 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెసుకు 39.92 శాతం వచ్చాయి. 2014 పార్లమెంటు ఎన్నికలలో అకాలీ-బిజెపి కూటమికి 26.3, కాంగ్రెసుకు 33.1, కొత్తగా వచ్చిన ఆమాద్మీ పార్టీకి 24.4 శాతం వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీలకు వరుసగా 25.2, 38.5, 23.7 శాతం చొప్పున వచ్చాయి. మోడీ మాయలు, మంత్రాలు ఇక్కడ పని చేయలేదు.

ఘనవిజయం సాధించామని చెప్పుకుంటున్న వుత్తర ప్రదేశ్‌ వివరాలు చూద్దాము. 2012 ఎన్నికలలో అధికారానికి వచ్చిన సమాజవాది పార్టీకి 29.15, రెండో స్ధానంలో వున్న బిఎస్‌పికి 25.91, బిజెపికి 15, కాంగ్రెస్‌కు 11.63 శాతం ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికలలో వరుసగా ఈ పార్టీలకు 22.2, 19.6, 42.3, 7.5 చొప్పున వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిపి ఎస్‌పి కూటమికి 28, బిఎస్‌పి 22.2, బిజెపి కూటమికి 41.4శాతం వచ్చాయి. ప్రతిపక్ష ఓట్ల చీలిక కారణంగా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. నిజంగా దేశంలో మోడీ గాలి వీస్తుంటే పెద్ద నోట్ల రద్దు వంటి ప్రయోగం అంతగా విజయవంతమైతే బిజెపి ఓట్లెందుకు తగ్గినట్లు ? గోవాలో బిజెపి అధికారంలో వుండి ఓడిపోయింది. తనపై గెలిచిన కొందరు ఎంఎల్‌ఏలకు ఎర చూపి తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటం వేరే విషయం. అక్కడ ఎంజిపితో కలసి 2012లో పోటీ చేసిన బిజెపి కూటమికి 41.7 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 30.78 శాతం ఓట్లు వచ్చాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం 32.5, కాంగ్రెస్‌ ఓట్లు 28.4 శాతానికి తగ్గినా బిజెపి సీట్లు కోల్పోగా కాంగ్రెస్‌ పెంచుకుంది. విడిగా పోటీ చేసి పదకొండుశాతం ఓట్లు తెచ్చుకున్న ఎంజిపికి మూడు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు ఎంఎల్‌ఏలను ఫిరాయింప చేసి మిగిలిన చిన్న పార్టీలన్నింటినీ కూడగట్టి బిజెపి అడ్డదారిలో అధికారాన్ని పొందింది.

అందువలన పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా ఓట్ల లెక్కలు బిజెపికి అనుకూలంగా లేవన్నది స్పష్టం. ఈ ఏడాది చివరిలో జరగాల్సిన గుజరాత్‌ ఎన్నికలు బిజెపికి ఒక పరీక్ష వంటివి. ఎందుకంటే అక్కడ ఓట్లు చీలే అవకాశం లేదు. మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత అక్కడ జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికలలో పట్టణాలలో బిజెపి గెలిచినా గ్రామీణ జిల్లా పంచాయతీలలో బోర్లా పడింది. కాంగ్రెస్‌ అనేక విజయాలు సాధించింది. అందువలన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా లేక ఇప్పుడున్నదాని కంటే సీట్లు తగ్గినా నరేంద్రమోడీ గాలి తుస్సుమనటం ఖాయం. అందువలన గుజరాత్‌తో పాటే లోక్‌సభ ఎన్నికలను రుద్దే అవకాశాలే ఎక్కువగా వున్నాయి.

బిజెపి సర్కార్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మేకిన్‌ ఇండియా, ఐదు సంవత్సరాలలో రైతుల ఆదాయాల రెట్టింపు వంటివి నినాదాలుగానే మిగిలిపోయాయి. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురు దెబ్బలు తప్ప సానుకూల పరిణామాలు లేని స్ధితిలో ఐదేండ్లూ కొనసాగితే ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అని వార్యం. అందుకే ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలను దేశం మీద రుద్దనున్నారనే అభిప్రాయం కలుగుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

29 Wednesday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics, RELIGION

≈ Leave a comment

Tags

ban oncow slaughter, beef, cow, cow slaughter, Cow Vigilante Groups, dalits, Gau Rakshaks, Muslims

Image result for Gau Rakshaks, and their apologists

వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ అక్రమ పశువధ శాలలను మూసివేయిస్తానంటూ ప్రకటించి మారోసారి బీఫ్‌ లేదా పశుమాంసం, గో సంరక్షణ సమస్యను ముందుకు తెచ్చారు. దీన్ని కావాలని తెచ్చారా లేక ఆయన సహజత్వానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నదాని గురించి చర్చించనవసరం లేదు. చర్చ ఎటు తిరిగి ఎటు ముగిసినా పర్యవసానం ఒకటే.ఈ పూర్వరంగంలో పర్హాన్‌ రహమాన్‌ ఆనే వ్యక్తి తన ఫేస్‌ బుక్‌ పేజీలో గో సంరక్షకులకు వారి సమర్ధకులకు ఒక బహిరంగ లేఖ రాశారు. దానిలో ఆసక్తి కలిగించే అంశాలు వున్నందున పాఠకుల కోసం అనువాదాన్ని దిగువ అందచేస్తున్నాం.ఈ లేఖలోని అంశాలలో అసంబద్ధత, వక్రీకరణలువుంటే ఎవరైనా వాటిని చర్చకు పెట్టవలసిందిగా కోరుతున్నాము.

గోరక్షకులు మరియు వారి సమర్ధకులకు బహిరంగ లేఖ

మార్చి 28,2017

ప్రియమైన గోరక్షకులకు

2014లో పాలకులలో వచ్చిన మార్పుతో ధైర్య భావనతో వున్న మీరు ప్రస్తుతం అధికార అలలపె సవారి చేయటాన్ని నేను అర్ధం చేసుకోగలను.ఈ ఆకస్మిక పరిణామం తెల్లవారేసరికి తయారైన రాజకీయ వాక్సూరత్వ వుత్పాదనకాదని, దీర్ఘకాలంగా అణచిపెట్టిన భావోద్వేగాల ఫలితమని కూడా నేను అర్ధం చేసుకోగలను.అనేక దశాబ్దాలుగా మీ పవిత్రమైన గోవును అపవిత్రం గావించిన, దూషించిన, హింసపెట్టిన వారిపై ప్రతీకారం చేయాలని మీరు వాంఛిస్తారు. ఇప్పటి వరకు రాజ్య రక్షణ పొందినవారికి ఒక గుణపాఠం చెప్పాలంటే ప్రతీకారం తీర్చుకోవాలనే వైపుగా వున్న మీ చర్యను నేను అర్ధం చేసుకోగలను.

మీకు బోధ చేయాలని గానీ లేదా మీ చర్యలు తగినవి కాదని గానీ చెప్పటానికి నేనీ లేఖ రాయటం లేదు.లేదా కపటత్వంతో కూడిన మీ చర్యలను హేళన చేయటానికి గానీ కాదు.అదేమంటే గోవధ సమస్యపై ఒకవైపున మీరు ముస్లింలు, దళితులపై దాడులు చేస్తున్నారు. మరోవైపు గొడ్డు మాంస ఎగుమతులలో ప్రపంచంలో విజయవంతంగా భారత్‌ను అగ్రస్ధానంలో నిలపాలని చూస్తున్న కొత్తగా వచ్చిన ప్రభుత్వం (దానికి మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధమై వున్నారు) గులాబి విప్లవాన్ని ప్రోత్సహిస్తున్నది. మీరు కూడా నా మాదిరి వినమ్రులైన వ్యక్తులే. వుద్రేకం హేతువుపై ఆధిపత్యం చెలాయించటం ప్రారంభించినపుడు భావోద్వేగాలకు లోనవుతాము.మన శక్తిని సరైనదారిలో వుపయోగించగలిగితే అది మీకు అదే విధంగా దేశానికి ఎంతో ప్రయోజనకారి అవుతుంది.శక్తి పనిచేస్తే వుద్రేకంపై హేతువుది పైచేయి కావాలి.

Image result for Gau Rakshaks, and their apologists

నాలేఖలో కొన్ని ప్రశ్నలు వున్నాయి. వాటికి మీరు నాకు సమాధానం చెప్పనవసరం లేదుకానీ మీకు మీరు చెప్పుకోవాలి. మీ చర్యలు సరైనదారిలో వున్నాయా లేక తమ భౌతిక ప్రయోజనాల కోసం రాజకీయ, ఆర్ధిక రంగాల పెద్దలు దుర్వినియోగం చేస్తున్నారా అని మీకు మీరు హేతుబద్దంగా అలోచించండి.

మీ రోజువారీ కార్యకలాపాలతో ప్రారంభించనివ్వండి.

1.వుదయం లేవగానే మీరు వుపయోగించే టూత్‌ పేస్టు పవిత్రమైన ఆవు కొవ్వు నుంచి తీసిన గ్లిజరీన్‌తో తయారు చేసింది కాకూడదని మీరు కోరుకుంటారు. అవును గ్లిజరీన్‌ కొవ్వు నుంచి తీస్తారు. కాల్గేట్‌, క్లోజ్‌అప్‌ మరియు పియర్స్‌( లేదా ఈ విషయానికి వస్తే ఏ బ్రాండ్‌ అయినా) కేవలం మీ విశ్వాసాన్ని గౌరవించేందుకు కూరగాయ వనరులైన సోయాబీన్‌ లేదా ఆయిల్‌పామ్‌ నుంచి గ్లిజరీన్‌ తయారు చేసినట్లు చెప్పుకుంటాయి. మాంస వనరునుంచి తయారు చేసే దాని కంటే శాఖాహార వనరుల నుంచి తయారు చేసే గ్లిజరీన్‌ ఎంతో ఖర్చుతో కూడుకున్నదని మీరు నిజంగా నమ్ముతారా?

2.మీరు వుపయోగించే షేవింగ్‌ క్రీమ్‌, సబ్బు,హెయిర్‌ క్రీమ్‌, షాంపూలు, కండిషనర్లు, మాయిశ్చరైజర్‌ తదితరాలను పవిత్రమైన ఆవు నుంచి సేకరించినవి కాదని మీరెప్పుడైనా తనిఖీ చేశారా ?పాంథనోల్‌ అమినో యాసిడ్స్‌ లేదా విటమిన్‌ బిలను జంతు లేదా చెట్ల వనరుల నుంచి సేకరిస్తారు.వాటిని వుపయోగించబోయే ముందు దయచేసి తనిఖీ చేయండి. వస్త్రాలను సాపు చేసేందుకు వుపయోగించే వాటిలో డీహైడ్రోజనేట్‌ చేసిన కొవ్వు నుంచి తీసే డై మిథైల్‌ అమోనియం క్లోరైడ్‌ వుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది?

3.మీ దంతాలను తోముకుంటారా? ఒక కప్పు టీ తాగుతారా ? అయితే కాస్త ఆగండి, మీరు వుపయోగించే పంచదారను తెల్లగా చేయటానికి ఆవు ఎముకలను వుపయోగించలేదని నిర్ధారించుకోండి.

4.మనం పొద్దునే వుపాహారం తీసుకుంటాం, ఏం కావాలని మీరు కోరుకుంటారు ?చోలేతో పూరీ, చపాతీయేనా ? మీరు వుపయోగించే అదానీ తయారు చేసే ఖాద్య తైలాలలో గొడ్డు కొవ్వు కలవలేదని నిర్ధారించుకోండి. మీ సమాచారనిమిత్తం తెలియచేస్తున్నదేమంటే కూరగాయల నుంచి ఖాద్యతైలం వనస్పతిని తయారు చేస్తున్న కంపెనీలు గొడ్డు కొవ్వును వినియోగిస్తున్నట్లు బయటపడిన తరువాత 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం గొడ్డు కొవ్వు వినియోగంపై విధించిన నిషేధాన్ని 32 సంవత్సరాల తరువాత మీరు ఎన్నుకున్న దేశభక్త ప్రభుత్వం మోసపూరితంగా తొలగించింది.

5. సరే దీన్నుంచి బయటకు వద్దాం. మీకు కారు, మోటార్‌ సైకిళ్లలో దేనిని ఎంచుకుంటారు ? దయచేసి టైర్లను తనిఖీ చేయండి. గాలి వత్తిడి ఎంతవుందో చూసేందుకు కాదు. వుపరితల రాపిడిని తట్టుకొని ఆకృతి మారకుండా వుండేందుకు రబ్బరుకు సహాయపడే జంతు సంబంధిత స్టెయరిక్‌ యాసిడ్‌ను టైర్ల తయారీదార్లు వుపయోగించారో లేదో చూడండి.

6. దేన్నయినా అంటించాలనుకుంటున్నారా ? జిగురును వుపయోగించండి. అయితే మరగపెట్టిన జంతు ఎముకలు, సంధాన కణజాలము, లేదా పశువుల చర్మాల నుంచి దానిని తయారు చేయలేదని దయచేసి నిర్ధారించుకోండి. ఫెవికాల్‌ అంత గట్టిగా వుంటుంది, తెగదు.

7.ఇప్పుడు షాపింగ్‌కు వెళదాం. అయితే ప్లాస్టిక్‌ సంచులను వినియోగానికి దూరంగా వుండండి. ఎందుకని? షాపింగ్‌ బ్యాగ్స్‌తో సహా అనేక ప్లాస్టిక్స్‌ పదార్ధాలలో వత్తిడిని తగ్గించే స్లిప్‌ ఏజంట్స్‌ వుంటాయి.వాటిని దేని నుంచి తయారు చేస్తారు ? జంతు కొవ్వు నుంచి అని చెప్పనవసరం లేదనుకోండి.చమురును వుపయోగించి పోలిమర్స్‌ను తయారు చేసినప్పటికీ పదార్ధ గుణాలు, ధర్మాలను మెరుగు పరిచేందుకు జంతుసంబంధితమైన వాటిని ప్లాస్టిక్స్‌ తయారీదారులు తరచూ వుపయోగిస్తారు మరియు ముడి పోలిమర్స్‌ను ప్రాసెస్‌ చేసేందుకు కూడా వుపయోగిస్తారు.

8.దళితులు, ఆవు వ్యాపారులైన ముస్లింలపై దాడి చేసే మీ ప్రాధమిక పని గురించి చూద్దాం.దయచేసి ఆ కొట్లాటలో మీరు గాయపడకుండా చూసుకోండి. ఒకవేళ జరిగితే దయచేసి కాప్సూల్స్‌ కాకుండా టాబ్లెట్లు ఇవ్వమని డాక్టర్‌ను అడగండి. ఎందుకంటే కాప్సూల్‌ కవర్‌ మళ్లీ జంతు ప్రొటీన్‌ నుంచే తయారు చేస్తారు. మీకు కుట్లు వేయాల్సి వస్తే అందుకు వుపయోగించే దారాలు దేనితో తయారు చేసినవో దయచేసి డాక్టర్‌ను అడగండి. సాధారణంగా వాటిని పవిత్రమైన ఆవు పేగుల నుంచి తయారు చేస్తారు.

9.ఆశాభంగం చెందారా ? ఒకే ఐపిఎల్‌ మాచ్‌ చూద్దాం. అయితే ఆగండి. పరుగెట్టిస్తూ మిమ్మల్ని కట్టిపడవేసే ఆ క్రీడలో ఆవు ప్రమేయం వుందని మీకు తెలుసా ? పవిత్రమైన ఆవు. క్రికెట్‌లో వినియోగించే బంతిని కప్పి వుంచే తోలు ఆవు దూడ చర్మం నుంచి తీసిందే.

10.సరే.చలిగా వుంది. ఒక దమ్ము కొడదాం. అయితే సిగిరెట్‌ కూడా నాన్‌ వెజిటేరియన్‌ అయిపోయిందే. సిగిరెట్‌ బడ్‌లో పంది రక్తం కలుస్తుంది. అయితే ముస్లింలకు పంది అంటే ఇష్టం వుండదని తెలుసు కదా ? మీకు దానితో ఎలాంటి సమస్య లేదు. గుట్కా సంగతేమిటి? పశు చర్మాల శుద్ది తరువాత మిగిలిపోయే వక్క నుంచి సేకరించేదే గుట్కాలోని వక్క అని మీకు తెలుసా ?రెండు రూపాయల ఖరీదు చేసే పాకెట్‌ నుంచి మీరేమి ఆశిస్తారు? తాజా వక్కలా ? స్వయంగా పరిశీలించుకోండి, తయారీదారు చిరునామా కాన్పూరు, తోళ్ల పరిశ్రమ కేంద్రం, గ్రహించారా? కావాలంటే గూగుల్‌లో స్వయంగా తెలుసుకోండి.

11.సరే, వాటిని వదిలేయండి,ఎందుకంటే అవి ఆరోగ్యానికి హానికరం. అయితే మీరు ఎప్పుడైనా ఒకసారి పిల్లలకోసం ఇంటికి తీసుకు వెళ్లే జెల్లీ బీన్స్‌, కాండీ కూడా మాంసాహారమే. వాటిని జంతు ఎముకల నుంచి తయారు చేస్తారు. ఆరుద్ర పురుగుల నుంచి తయారు చేసే అద్దకపు ఎరుపు రంగుతో పాటు మహిళలు వుపయోగించే లిప్‌స్టిక్‌ కూడా జంతు కొవ్వు నుంచి తయారు చేసిందే.యగ్‌హర్టు(పెరుగు వంటి పుల్లటి తినే పదార్ధం) ఐస్‌క్రీమ్‌, కనుపాపలను తీర్చిదిద్దే క్రీములో కూడా అది వుంటుంది.

ఇలాంటి వందల వుత్పత్తుల గురించి నేను వివరించగలను.(నిజాయితీగా చెప్పాలంటే వీటిపై పరిశోధన చేసేందుకు అవసరమైన వుత్సాహ హేతువును మీరు నాకు అందించారు) కానీ నేను ఒక అంశాన్ని స్పష్టం చేయకతప్పదు. అదేమంటే మీ విశ్వాసాలను నాశనం చేస్తున్నది దళితులు, ముస్లింలు కాదు. కార్పొరేట్‌ ప్రపంచం మీ విశ్వాస వ్యవస్ధలు విముక్తి పొందలేనంత గట్టిగా బిగించి వేసింది. అందువలన కొద్దిపాటి మొత్తాలు వచ్చే సొమ్ముతో సర్దుబాటు చేసుకొని జీవించేందుకు ఆ జంతువులతో వ్యాపారం చేస్తున్నవారి మీద మీరు దాడులు చేయటం ఎందుకు ? నిజమైన వ్యాపారం చేస్తున్నది కార్పొరేట్స్‌, వారి మీద దాడి చేయటానికి మీకు ధైర్యమున్నదా ?

సరే మీరు గొడ్డు మాంసం తినటానికి వ్యతిరేకం. మీ నిత్య జీవితంలో వుపయోగించే వస్తువుల తయారీకి వుపయోగించే జంతువుల ఎముకలు, కొవ్వు, చర్మాలు తదితరాలను మీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? కాబట్టి మీరు జీవించండి, ఇతరులను జీవించనివ్వండి. అందరికీ అవకాశం వుంది. మీ మతావేశంతో ఎప్పటి నుంచో వున్న బంధాలను నాశనం చేస్తున్నారు. దేనికోసమిది?

Image result for Gau Rakshaks, and their apologists

కలసిమెలసి జీవించండి. వాక్శూరనాయకుల చేతిలో బొమ్మలుగా మారకండి.మిమ్మల్ని సైనికులుగా వాడుకొనే వారు తమ రాజకీయలక్ష్యం తీరగానే చచ్చిన ఆవును పారవేసినట్లుగానే మిమ్మల్ని కూడా వదలివేస్తారు. ఎప్పటి నుంచో వున్న బంధాలను పున:జీవింపచేయండి.మీ ఇరుగుపొరుగు లేదా మీ స్నేహితులతో సంతోషంగా వుండండి, వారు మీ సామాజికతరగతికి చెందినవారే అయి వుండనవసరం లేదు. మీ దేశ ప్రజలను ప్రేమించండి. అయితే బాణసంచాపేల్చకండి.కాలుష్యం కావాలని ఎవరూ కోరుకోరు.బాణ సంచాలో అల్యూమినియం, ఇనుము వంటి లోహాల పౌడర్‌కు కోటింగ్‌ వేసేందుకు స్టియారిక్‌ ఆసిడ్‌ను ఎక్కువగా వాడతారు. అదిఆమ్లజనీకరణను నిరోధిస్తుంది.అందుకుదోహదం చేసేవాటిని దీర్ఘకాలం నిలువవుంచుతుంది.స్టియారిక్‌ యాసిడ్‌ను దేని నుంచి తయారు చేస్తారో ఎవరైనా వూహించారా?

పర్హాన్‌ రహమాన్‌

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆత్మవంచన మాని బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా !

27 Monday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

BJP, BJP values, Casinos, Goa, Goa BJP, Goa Casinos, RSS, RSS Duplicity, The hippocratic BJP, UP News, Yogi Adityanath

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ఎంకెఆర్‌

యోగులైనా, భోగులైనా తమ తమ మఠాలు, మందిరాలకు పరిమితమైనంత వరకే వారి చర్యలు ప్రయివేటు వ్యవహారాలు. గీత దాటి బహిరంగ జీవితంలోకి వస్తే వారి చర్యల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకైనా సభ్య సమాజానికి హక్కు, అవకాశం వుంటుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న, తలెత్తుతున్న చర్చలు, అభిప్రాయాలపై కొన్ని శక్తులు తమ అసహనాన్ని వెళ్ల గక్కుతున్నాయి. వాటిపై ప్రతి వ్యాఖ్య, విమర్శ వేరు, అవి చేయలేక అసహనం వ్యక్తం చేయటం మరో తీరు. గతంలో ఎన్నో నీతులు, రీతులు బోధించిన బిజెపి ఇప్పుడు వాటిని తానే దిగమింగి వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినవారిపై ఆ పార్టీ అనుచరగణం విరుచుకుపడిపోతున్నది. మిత్ర సూచనలు, హెచ్చరికలను కూడా ‘సహించ ‘టం లేదు. ఇది కచ్చితంగా భారతీయ సంస్కృతి కాదు.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ఎంపిక చేసిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్‌. అయోధ్యలో బాబరీ మసీదును కూలదోసి దాని స్ధానంలో రామమందిరం కట్టాలన్న హిందూత్వ వాదుల నాయకత్వాన్ని చూసి వుత్తేజితుడై తన జీవితాన్ని రామమందిరం, హిందూత్వకోసం అంకితం చేయాలని చిన్నతనంలోనే నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇష్టం, దానిలో భాగంగానే ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు, ఇతరనేరపూరిత చర్యలకు పాల్పడిన కారణంగా కేసులు నమోదు చేసినా వెనక్కు తగ్గలేదు. చట్టం ఇంకా తనపని తాను చేయలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హిందూత్వకు ప్రతీక, హిందూత్వను అమలు జరపటానికే బిజెపి, దాని మార్గదర్శ సంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంపిక చేసిందని కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై యోగి అనుయాయులు భజరంగ భళీ-బలి అంటున్నారు. వారు ఆత్మవంచనకు పాల్పడుతున్నారని ఎవరైనా అంటే తప్పేముంది.

ప్రజాసేవకోసం చిన్నతనంలోనే దేశ సేవకు, బ్రిటీష్‌ వారిని ఎదిరించేందుకు అంకితమైన అల్లూరి, భగత్‌సింగ్‌, సుందరయ్య వంటి వారి గురించి ఎన్నో విన్నాం. సామాన్యజనం వారిని విప్లవకారులని పిలిచినందుకు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకున్నవారేమీ అభ్యంతర పెట్టలేదు, అసహనం వ్యక్తం చేయలేదు. వారి చర్యలతో తమకు ప్రమాదం అని భావించిన శక్తులు వాటికి ప్రాతినిధ్యం వహించిన నాటి ప్రభుత్వాలు వారిని సమాజంలో అశాంతిరేపేవారుగా చిత్రించి ఆరోపణలు చేయటాన్ని జనం అంగీకరించలేదు. అనేక మంది వారి బాటలో నడిచారు, ఇప్పటికీ నడుస్తున్నారు.

Image result for BJP, hippocracy, values cartoons

అలాగే ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించే వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి జైలు జీవితాన్ని తట్టుకోలేక అదే బ్రిటీష్‌ ప్రభుత్వానికి లొంగిపోయి లేఖలు రాసి తన రాణీగారీ భక్తిని ప్రదర్శించుకున్న విడి సావర్కర్‌ గురించి కూడా మనకు తెలుసు. ఆయనొక ఎత్తుగడలో భాగంగా ఆ లేఖలు రాశారని అందువలన ఆయన దేశభక్తుడే అన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ వారి వ్యాఖ్యానం. దాన్ని సమాజం అంగీకరించిన దాఖలాలు లేవు. కానీ ఆ తరువాత స్వాతంత్య్రపోరాటంలోకి దూకిన భగత్‌ సింగ్‌కు అలాంటి తెలివితేటలు, ఎత్తుగడలు లేవు, చిరునవ్వుతో ప్రాణాలు అర్పించటం తప్ప మరొకటి తెలియని అసలు సిసలు దేశ భక్తుడు. బ్రిటీష్‌ వారికి విధేయుడిగా వుంటానని లేఖ రాసిన సావర్కర్‌ ఆ తరువాత ఎక్కడా బ్రిటీష్‌ వ్యతిరేకపోరాటంలో కనపడరు. వారికి మరో రూపంలో సాయం చేసేందుకు హిందూత్వను ముందుకు తెచ్చారు. ఆయన రాసిన లేఖ బయటపడిన తరువాత కూడా సావర్కర్‌ను దేశభక్తుడిగా సమర్ధించేందుకు, భగత్‌ సింగ్‌ కంటే పెద్ద త్యాగధనుడిగా చిత్రించేందుకు, ఆయన ముందుకు తెచ్చిన హిందూత్వకు వారసులుగా చెప్పుకోవటానికి అనేక మందికి ఎలాంటి అభ్యంతరం వుండటం లేదు. అలాంటపుడు యోగి ఆదిత్యనాధ్‌ హిందూత్వవాది గురించి ఆయనను వ్యతిరేకించేవారు ఏమి అన్నప్పటికీ సరైన బాటలోనే నడుస్తున్నారని భావించే ఆయన అభిమానులు సంతోషంతో పులకించి పోవటానికి బదులు హిందూత్వ ప్రతినిధి అని వ్యాఖ్యానించిన వారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది. అలా చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారా ?

కాంగ్రెస్‌ తాను ప్రవచించిన ఆదర్శాలను ఎప్పుడో వదలి పెట్టింది. అందుకు తగిన ఫలితాలు అనుభవిస్తున్నది. దానికి భిన్నమైన పార్టీ అని కదా బిజెపి చెప్పుకున్నది. మాంసం దగ్గర మంచోడి సంగతి తెలుస్తుందన్నది ఒక సామెత. ఇప్పుడు బిజెపికి అది చక్కగా వర్తిస్తుంది. దాని నిజరూపం వామపక్ష శక్తులు, ప్రజాతంత్ర శక్తులలో కొంత భాగానికి ముందే తెలిసినా సామాన్య జనానికి అర్ధం కావటం ఇప్పుడే ప్రారంభమైంది. ఆ పార్టీ ఆత్మవంచన, పరవంచన గురించి మచ్చుకు రెండు అంశాలను చూద్దాం.

Image result for yogi adityanath sabka sath,sabka eek cartoons

హాజ్‌యాత్రకు సబ్సిడీ లేదా రాయితీ ఇచ్చి ముస్లింలను సంతృప్తి పరచి ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ఇతర పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్ధలైన బిజెపి వంటివి ఎన్నో ఏళ్లుగా నానా యాగీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రాయితీని క్రమంగా తగ్గించి 2022 నాటికి పూర్తిగా రద్దు చేయాలని 2012లో సుప్రీం కోర్టు ఆదేశించింది. చిత్రం ఏమంటే మానస సరోవర యాత్ర చేసేందుకు హిందువులకు లక్ష రూపాయల వరకు ఇవ్వటానికి నిర్ణయించినట్లు యోగి ఆదిత్యనాధ్‌ ప్రకటించారు. ముస్లింలకు హాజ్‌ హౌస్‌లు నిర్మించినట్లుగానే మానస సరోవర్‌ యాత్రీకులకూ ఢిల్లీ సమీపంలో భవనాలు నిర్మించనున్నట్లు కూడా ప్రకటించారు. ఇదేమిటి? ఒక మత యాత్రకు అభ్యంతరం తెలిపిన వారు మరొక మత యాత్రకు సబ్సిడీలు ఇవ్వటం ప్రారంభించటాన్ని ఏమనాలి? మైనారిటీ మత సంతుష్టీకరణ మాత్రమే తప్పు మెజారిటీది ఒప్పు అంటారా ?

ఇక బీఫ్‌ గురించి చూద్దాం. రీడ్‌ ఇండియా రైట్‌ ( ఇండియా మితవాదులు చెప్పేది చదవండి) అని టాగ్‌లైన్‌ పెట్టుకున్న పత్రిక ‘స్వరాజ్య ‘. దాని సారధి ఆర్‌ జగన్నాథన్‌. అక్రమంగా వున్న కబేళాల మూసివేతకు యోగి ఆదిత్యనాథ్‌ తొందర పడితే జరిగే మంచికంటే నష్టమే ఎక్కువ అనే శీర్షికతో ఆయనొక విశ్లేషణ రాశారు. ఇంకేముంది ఆ పత్రికను చదివే మితవాదులు అతగాడొక కమ్యూనిస్టు అని, వుద్యోగం నుంచి తొలగించాలంటూ దాడికి దిగారు. ఎన్నికలలో మెజారిటీ సంపాదించటం వేరు ప్రభుత్వాలు అందరికోసం పని చేయాలి. యోగి తొలి చర్యలు చూస్తుంటే సబ్‌కాసాత్‌ సబ్‌కా ఏక్‌ ను సాధించే అవకాశమే లేదని, పెద్ద సంఖ్యలో మైనారీటీల మనసులను విరిచివేస్తాయని జగన్నాధన్‌ వ్యాఖ్యానించారు.గోవధనిషేధం అంటే ఆవు ఆర్ధిక విలువ పడిపోవటమేనని, దున్న లేక బర్రె మాంసానికి డిమాండ్‌ పెరుగుతున్న కారణంగా ఆవుల రాష్ట్రాలుగా వున్న ప్రాంతాలలో వాటి స్ధానంలో గేదెలు పెరుగుతున్నాయని,2007 లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం పశు సంపదలో గేదెలశాతం 34.6కాగా హర్యానాలో 79.3, పంజాబ్‌లో 74, వుత్తర ప్రదేశ్‌లో 55.8, ఆంధ్రప్రదేశ్‌లో 54.2, గుజరాత్‌లో 52.4, రాజస్తాన్‌లో 47.8, బీహార్‌లో 34.8శాతం వున్నాయి. గేదెల శాతం అతి తక్కువగా వున్న కేరళ 3.2, బెంగాల్‌ 3.8, ఈశాన్య రాష్ట్రాలలో 4.6శాతం కాగా అక్కడ గోవధ లేదా గొడ్డు మాంసం విక్రయాలపై నిషేధం లేదని జగన్నాధన్‌ పేర్కొన్నారు.అవు ప్రాంతాల హిందువులు తమ పార్టీకి ఓటు వేసిన చోట గేదెల కంటే తక్కువ ఆర్ధిక విలువ కారణంగా ఆవులను వదిలించుకుంటున్న విషయాన్ని యోగి ఆదిత్యనాధ్‌ గమనించవచ్చని ఈ నేపధ్యంలో పశువధ శాలలపై నిషేధం గురించి పునరాలోచించాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఆవు మరియు దున్న-గేదె మాంసానికి తేడాను సులభంగా తెలుసుకోలేని స్ధితిలో అత్యధిక నిఘా బృందాలు వున్న కారణంగా యోగి ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని ముగించారు.

దేశం నుంచి జరుగుతున్న దున్న-గేదె మాంస ఎగుమతుల్లో సగం వుత్తర ప్రదేశ్‌ నుంచే వున్నాయి. అనధికార కబేళాల మూసివేత పేరుతో తీసుకుంటున్న చర్యల వలన జరిగే ఆర్ధిక, వుపాధి నష్టాలను పూడ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు లేకుండా మొరటుగా ముందుకు పోయినట్లయితే జరిగే నష్టం ముస్లింలకే కాదు, వాటిపై ఆధారపడిన ఇతర వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అనుమతి వున్న కబేళాల జోలికి తాను పోవటం లేదని, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు అనధికారికంగా నడుపుతున్నవాటి మీదే చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌ సమర్ధనలు జగన్నాధన్‌ వంటి బిజెపి భక్తులకు తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యానం చేసి వుంటారని అనుకోగలమా ? ఎన్నికల తరువాత ఇలా మాట్లాడుతున్న జగన్నాధన్‌ వంటి వారు బీఫ్‌ లేదా గొడ్డు మాంసాన్ని వివాదాస్పదం చేసి ఓట్ల లబ్ది పొందేందుకు చూస్తున్నపుడు ఎందుకు మౌనంగా వున్నట్లు ?

అనధికార కబేళాలను ఎవరూ సమర్ధించరు, అదే సమయంలో వాటివలన జరిగే నష్టమూ లేదు. సదుద్ధేశ్యంతో వాటిని క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకొని వుంటే అక్కడి మాంసం వ్యాపారులు సమ్మెకు దిగి వుండేవారు కాదు. బీఫ్‌ తినేవారు, తయారు చేసేవారు కేవలం ముస్లింలే కాదు ఇతరులు కూడా వున్నారని గ్రహిస్తే మంచిది. పురాణాల ప్రకారం ఆవులతో పాటు దున్నలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవే. యముడి వాహనం దున్న. ఆవు పవిత్రత దున్నలు-గేదెలకు లేదా?ఎందుకీ ఆత్మవంచన?

ఎన్నో నీతులు చెప్పే బిజెపి ఏటా ఎన్నో కుటుంబాలలో చిచ్చు రేపుతున్న, జేబులను గుల్ల చేస్తున్న జూదశాలలను నిషేధించాలని గతంలో డిమాండ్‌ చేసింది. జూదం మనదే కాదు, ఏ సభ్య సమాజ సంస్కృతీ కాదు. కానీ మన సంస్కృతిని పరిరక్షించే ఏకైక రక్షకురాలిని అని చెప్పుకొనే బిజెపి గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో వున్న గోవాలో అక్కడి జూదశాలలపై ఎలాంటి నిషేధం విధించలేదు. గోవా ఆర్ధిక వనరులను పెంచే పేరుతో గతంలో కాంగ్రెస్‌ పాలకులు జూదశాలలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు గోవా గడ్డమీద, మాండవీ నది మీద కలిపి దాదాపు ఇరవై జూదశాలలున్నాయి. బిజెపి వాటిని కొనసాగించింది. ఈ ఐదు సంవత్సరాలలో గోవాలో ‘ఎంజాయ్‌’ చేసే వారి సంఖ్య పెరగటం తప్ప తగ్గిన దాఖలాలు లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారి భారతీయ సంస్కృతి పరిరక్షణ లక్ష్యం ఏమైనట్లు ? అక్కడ జరిగే పర్యావరణ హాని గురించి వారికి పట్టదు.గోవాలో అనధికారికంగా నడుస్తున్న జూదశాలల గురించి తెలిసినప్పటికీ వాటి గురించి పట్టించుకోలేదు.అదేమి చిత్రమో దేశమంతటా సంస్కృతి పరిరక్షణ పేరుతో ఏ పార్కులో ఏ ప్రేమికులున్నారో వెతికేందుకు, వారిపై దాడులు చేసేందుకు వివిధ సంస్ధల ముసుగులో వుత్సాహం చూపే ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ వాలాలు, గోవాలో మనకు ఎక్కడా కనపడరు.

అనధికారికంగా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నవారందరూ అక్రమాలకు పాల్పడుతున్నవారిగా జమకడితే అంతకంటే అన్యాయం మరొకటి వుండదు. కానీ యోగి గారు అదే తన ప్రాధాన్యత అంటున్నారు. ఇదే సమయంలో అదే పార్టీకి చెందిన గోవా పాలకులు ఎన్నో కుటుంబాలను బలితీసుకొనే, ఎందరో మహిళల జీవితాలను అతలాకుతలం గావించే అక్కడి జూదశాలలను మాత్రం అరికట్టరు. మాదక ద్రవ్యాలకు, అత్యాచారాలు, హత్యలు, అన్ని రకాల వ్యభిచారాలకు నిలయం గోవా అన్నది జగమెరిగిన సత్యం. అందుకే దేశ విదేశాల నుంచి వీటన్నింటినీ అనుభవించటానికి( ఎంజాయ్‌ చేయటానికి) వచ్చే వారికి మాత్రం టూరిజం పేరుతో సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు.ఒకే పార్టీ ! ఎందుకీ ఆత్మవంచన?

Image result for goa bjp,casinos cartoons

అభివృద్ధి నినాదాన్ని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి, దాని మిత్రులైన చంద్రబాబు నాయుడి వంటి వారు టూరిజం అభివృద్ధి పేరుతో జూదశాలలకు తెరతీయటానికి ప్రయత్నిస్తున్నారు. సంస్కృతి పరిరక్షకులుగా ఫోజు పెడుతున్న మనువాదులు, నయా జాతీయ వాదులు, వారి మద్దతుదారులు జూదాన్ని ఎంత నాజూకుగా సమర్ధిస్తున్నారో ‘స్వరాజ్య’ పత్రికలో వెల్లడైన అభిప్రాయాలు చదివితే మతిపోతుంది. పశువధ నిషేధం ద్వారా యోగి ఆదిత్యనాధ్‌ చర్యలతో మంచికంటే చెడే ఎక్కువ వుంటుంది అని చెప్పిన జగన్నాధన్‌ను విమర్శించిన స్వరాజ్య పత్రిక పాఠకులు కొందరు గోవాలో జూదశాలల గురించి సమర్ధనకు పూనుకున్నారు. వేదాలలోనే జూదం గురించి వుందట. బలి ప్రతిపాద, లక్ష్మీపూజ అంటే ద్యూత క్రీడ అని టీకాతాత్పర్యాలు చెబుతున్నారు. బెట్టింగ్‌, నగదు అక్రమలావాదేవీలను అరికట్టాలంటే బ్రిటన్‌ మాదిరి జూదశాలలను అనుమతించాలని కొందరు, ఆదాయపన్ను కట్టేవారినే అలాంటి వాటిలో అనుమతించాలని మరికొందరు సూచించారు. కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో వేశ్యావృత్తిని పూర్తిగా నిషేధించకుండా క్రమబద్దీకరించాలని మాత్రమే చెప్పాడని కొందరు సమర్ధించారు. ఎవరేమి చెప్పినా నీవు చేయాల్సిందాని గురించి తప్ప పర్యవసానాలపై నీ అదుపు వుండదని శ్రీకృష్ణుడు చెప్పారంటూ మద్దతు. ఇలాంటి వాదనలు దోపిడీదారులు లేదా దోపిడీ సమాజం వున్నదాన్ని వున్నట్లు వుంచాలని కోరుకొనే వారు చేసే వుద్ధేశ్యపూర్వక ప్రచారంలో భాగం లేదా వాటిని ఎందుకు అనే ప్రశ్న వేసుకోకుండా నమ్మి ప్రచారం చేసే వారు మరికొందరు. హానిలేని పశువధ శాలల మూసివేతకు వుత్తర ప్రదేశ్‌లో ఆతృపడుతున్న బిజెపి గోవాలో గత ఐదు సంవత్సరాలలో అధికారంలో వుండి, తాజాగా అడ్డదారిలో పాగావేసి జన జీవితాలను నాశనం చేసే జూదశాలల అనుమతుల రద్దుకు, అనుమతి లేని ఇతర అక్రమ చర్యల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోదు ? పశ్చిమ దేశాలు ఆత్మవంచన చేసుకుంటున్నాయని విమర్శించే బిజెపి తన కింది నలుపును చూసుకుంటుందా ? జనాన్ని మభ్యపెట్టటం మానుకుంటుందా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

యుపి ముఖ్య మంత్రిగా ‘చెడ్డ పిల్లాడు’ ఆదిత్యనాథ్‌ !

22 Wednesday Mar 2017

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

Anti Muslim, BJP, Hinduthwa, naughty boy, UP CM, YogiAdityanath

Image result for yogi adityanath

ఎం కోటేశ్వరరావు


ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. వుద్రేకాలు, వుద్వేగాలు, అధికార రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించాల్సిన సమయమిది. ప్రజాస్వామ్యాన్ని వమ్ము చేయటంలో కాంగ్రెస్‌ కంటే తామేమీ వెనుకపడలేదని, తమకూ ఆ సత్తా వుందని బాల్యంలోనే బిజెపి నిరూపించుకుంది. ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ఈ క్రీడలో మాకు మేమే సాటి, బస్తీమే సవాల్‌ అంటూ తొడగొడుతున్న బిజెపిని ప్రస్తుతానికి ఎవరేమీ చేయలేరనే వాతావరణం అంతటా ఆవరించి వుంది. కాంగ్రెస్‌ అప్రజాస్వామిక, నియంతృత్వ రూపం బయట పడటానికి దేశానికి 28 సంవత్సరాలు పట్టింది.(1975 అత్యవసర పరిస్ధితి) మీడియా ఎంతగా మూసిపెట్టాలని చూసినా బిజెపి గురించి తెలుసుకోవటానికి అంత వ్యవధి అవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమం అనే ఒక ప్రజాతంత్ర ప్రవాహం నుంచి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు అందుకు విరుద్దమైన మారుమనసు పుచ్చుకోవటానికి మూడు దశాబ్దాలు పట్టింది. బిజెపి పూర్తిగా తన సంఖ్యాబలంపై ఆధారపడి అధికారానికి వచ్చిన మూడు సంవత్సరాలు కూడా పూర్తిగాక ముందే తానేమిటో బహిర్గతం చేయటం ప్రారంభించింది. పురాణాల ప్రకారం నరకుడనే రాక్షసుడు విష్ణుమూర్తి-భూదేవికి పుట్టినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రారంభమే వివాదాస్పదం, భయానికి నాంది పలికింది. అందువలన ఇప్పుడు బిజెపికి మద్దతు ఇస్తున్నవారందరూ దాని గతాన్ని అంగీకరించి ఆ పని చేస్తున్నారని అనుకోలేము.నరకుడిని భరించలేని స్ధితిలో విష్ణువు మరో రూపంలో తల్లిచేతనే సంహరింపచేసిన దీపావళి కథ తెలిసిందే. చరిత్రలో ఇలాంటి పనులు చేసిన వ్యక్తులు, శక్తులు చివరికి ఏమయ్యాయో కూడా చూస్తూనే వున్నాం.

మన గొప్పతనం గురించి మాత్రమే కాదు, మన బలహీనతల గురించి కూడా వ్యాఖ్యానించే స్వేచ్చ మనకు వుండాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు చోట్ల బిజెపి ఓడిపోయింది. రెండు చోట్ల గెలిచింది. నాలుగు చోట్ల మంత్రి వర్గాలను ఏర్పాటు చేసింది. ఇదెలా సాధ్యమైంది అని ప్రశ్నించేవారు లోకం పోకడ పట్టించుకోని, ఈ కాలానికి తగని వారు అనుకోవటం తప్ప మరొక విధంగా చెప్పలేం. అన్నయ్యా వాలిని, రావణుడిని రాముడు చంపా డాలేదా అని తప్ప ఎలా అన్నది ముఖ్యం కాదు అన్నట్లు, ప్రస్తుత పరిస్ధితుల్లో మనం ఆవు అంటే వీపులు పగులగొట్టే వారు సిద్ధంగా వున్నారు కనుక మరో విధంగా చెప్పుకుందాం. మన గేదె లేక బర్రె ఏ దొడ్లో కట్టింది అని కాదు మన దొడ్లో ఈనిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లు అనుకున్న విజయం సాధించారా లేదా ఎలా అన్నది ముఖ్యం కాదంటూ దానిని కీర్తించేవారే ఎక్కువగా వున్నారు. మన సమాజ బలహీనత ఇది.

2014లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం యూపీలో 42.3 నుంచి 39.7కు, వుత్తరాఖండ్‌లో 55.3 నుంచి 46.5కు పడిపోయింది. వీటికోసం నానా గడ్డీ కరిచిన తరువాత వచ్చిన ఫలితమిది. దీన్ని మద్దతు పెరగటంగా చెప్పటమంటే జనాన్ని చెవిలో పూలు పెట్టుకున్నవారిగా జమకట్టటమే. ఈ రీతిలో పెరుగుతున్న ‘మద్దతుతో ‘ రెండు సంవత్సరాల తరువాత జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో మరోసారి మోడీ విజయం సాధించబోతున్నారనే ‘ప్రచారదాడికి ‘ నాంది పలికారు. మీడియాను ఆక్రమించిన కార్పొరేట్లు తమ లాభాలకు ఎవరు తోడ్పడతారో వారి ప్రచార కార్యకర్తలుగా మారటాన్ని చూశాము. అందువలన విజయగానాలకు కొదవేముంటుంది. ప్రతిపక్షం చీలికలు పేలికలు, జనం కులాలు, మతాలు, ప్రజావ్యతిరేకుల పట్ల వుపేక్ష వహిస్తే 2014 పునరావృతం కూడా కావచ్చేమో !

హిట్లర్‌ హయాంలో జన మెదళ్లను గందరగోళ పరచే ప్రచారదాడికి రూపకల్పన చేసిన గోబెల్స్‌ కనుక స్వర్గం లేదా నరకం నుంచో మన వేద లేద పురాణ కాల పుష్పక విమానమెక్కి మన దేశంలో దిగి చూస్తే తనకంటే ఎన్నో రెట్లు పెద్దవారిగా కనిపించే మీడియా గోబెల్స్‌ను చూసి ఇంత విపరీతమా అని సిగ్గుపడిపోతాడు. పెద్ద నోట్ల రద్దును జనం సమర్ధించారని చెప్పుకొనేందుకు రెండు రాష్ట్రాల ఫలితాను చూపుతున్నారు. గెలిచిన యూపిలో 60శాతం వ్యతిరేకంగా జనం ఓటు చేయటం సమర్ధించటమా? ఓడిపోయిన మూడు రాష్ట్రాల సంగతేమిటి? పోనీ గెలిచిన చోటయినా గతం కంటే ఓట్లెందుకు తగ్గాయి ? పెద్ద నోట్ల రద్దు వలన సాధించిందేమిటి ? అసలు ఎన్ని నోట్లు రిజర్వుబ్యాంకుకు తిరిగి వచ్చాయి? ఎన్నికలు ముగిసిన తరువాత కూడా దాని గురించి చెప్పరెందుకని, చన్నయ్‌ శేఖర రెడ్డి వంటి వారికి కొత్త రెండువేల నోట్ల రూపాయలకట్టలను నేరుగా అందించిన వున్నతాధికారులపై తీసుకున్న చర్యలేమిటి ? ఇలాంటి ప్రశ్నలన్నీ విజయగానాల ముందు వినిపించవు, మీడియాలో కనిపించవు.

నిప్పు, పట్టుకోవద్దు, కాలుతుంది అని చెబుతాం. ప్రశ్నించటం పిల్లల లక్షణం కనుక నీకెలా తెలుసు అని ఠకీమని అడగటం సహజం. వారితో పాటు వున్న వారు లేదు మీకు నిప్పంటే మొదటి నుంచి సదభిప్రాయం లేదు, అందుకే అలా చెబుతున్నారు అన్నారనుకోండి కాలేది పిల్లలకే, వారికి కాదు. డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వస్తే అమెరికాలోనే కాదు, ప్రపంచమంతటా అల్లకల్లోలం తలెత్తుతుంది అని అతగాడి గురించి తెలిసిన వారు చెప్పారు. అయినా సరే అమెరికా సామాన్యుల కంటే ఆంగ్లం బాగా చదివి, రాయగలిగిన అక్షరాస్యులైన ప్రవాస భారతీయులతో సహా అనేక మంది తన్మయత్వంతో ఓటేసి గెలిపించారు. ఇప్పుడు ఏం జరుగుతోందో చూస్తున్నాము. అక్కడి జాత్యహంకార దాడికి బలైన తెలుగువాడు కూచిభొట్ల శ్రీనివాస్‌ అంత్యక్రియలలో ట్రంప్‌ వ్యతిరేక నినాదాల హోరులో వేదమంత్రాలు వినిపించలేదన్న వార్తలు చదువుకున్నాం. అందువలన జనం ఎల్లకాలం ఒకేలా వుంటారని అనుకోనవసరం లేదు. ఏ కమ్యూనిస్టులు ప్రేరేపిస్తే అంత్యక్రియలలో ట్రంప్‌ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ? ఎవరి కాళ్ల కిందకు నీరు వస్తే గాని వారికి తెలియదు.

కనుక కేంద్రంలోని బిజెపి తన అధికారాన్ని మరింతగా విస్తరించుకోవటానికి గోవా, మణిపూర్‌ వంటి చోట్ల అప్రజాస్వామిక పద్దతులకు పాల్పడి ప్రజాతీర్పును వమ్ము చేసినా, గతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని తమ విధానాలకు మద్దతు పెరిగిందని పెద్ద నోళ్లు వేసుకొని అరిచినా, నోరు తెరిస్తే మతోన్మాదం, పరమత విద్వేషం, హంతక భాష తప్ప మరొకటి పలకటం రాని ‘యోగి ‘ ఆదిత్యనాథ్‌ను వుత్తర ప్రదేశ్‌ పీఠంపై కూర్చో బెట్టినా ముందే చెప్పినట్లు చరిత్ర తనపని తాను చేస్తుంది. విదేశీ దండయాత్రలను, ఆక్రమణను సమైక్యంగా అడ్డుకోలేకపోయిన కారణంగా మన దేశం అనుభవిస్తున్న పర్యవసానాలను చూస్తున్నాము. విదేశీయులు సోమనాధ దేవాలయాన్ని కొల్లగొట్టి దానిని నాశనం చేయటం తప్పని చెబుతున్న స్వదేశీయులు ఆయోధ్యలో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఏమనాలి? చరిత్రనుంచి మనం ఏ పాఠాలు నేర్చుకున్నట్లు ?

మనం చరిత్రలో, పురాణాలు, ఇతిహాసాలలో అనేక మంది యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినుల గురించి చదివాం. కొంత మంది దృష్టిలో హిందూత్వను పునరుద్దరించే కారణ జన్ములుగా స్ధానం వున్న ఇలాంటి యోగులు ఎవరి వారసులో, ఎలా పుట్టుకు వచ్చారో, వారిని సమర్ధించేవారు అడ్డగోలుగా కాకుండా ఆధారాలతో చెప్పాలి. కులాల పరిభాషలో చెప్పాలంటే వెనుకబడిన తరగతుల మంత్రం జపించే బిజెపి ఒక వేళ ఒక యోగినే ఎంచుకోదలచుకుంటే క్షత్రియడు తప్ప వివాదాస్పదం కాని వెనుకబడిన తరగతుల యోగి దొరకలేదా ?

యోగి ఆదిత్యనాధ్‌ గురించి లోకానికి తెలిసిందానితో పాటు తానేమిటో తనపై వున్న నేరపూర్తి కేసులేమిటో పార్లమెంట్‌ ఎన్నికల నామినేషన్‌ పత్రాలలోనే స్వయంగా రాసుకున్నారు. మత రాజ్యాలుగా ప్రకటించుకున్న పాకిస్తాన్‌ వంటి దేశాల గురించి విమర్శలు తెలిసిందే. మరి వుత్తర ప్రదేశ్‌ సంగతేమిటి ? హిందూ మతానికి చెందిన గోరఖనాధ్‌ మఠాధిపతి అయిన ఆదిత్యనాధ్‌ దాన్ని వదులుకోకుండానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దీన్నేమనాలి ? మత రాజ్యం గాక పోతే మత రాష్ట్రం. ఒక చోట అధికారికంగా మతాన్ని రుద్దుతారు మరోచోట అనధికారికంగా అదే పని చేస్తారు. ఇలాంటి విపరీత పరిస్ధితిని మన లౌకిక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ వూహించి వుండరు.

యుపి ముఖ్యమంత్రిగా వివాదాస్పద యోగిని ఎంపిక చేయటాన్ని సమర్ధించుకోవటానికి బిజెపికి అడ్డగోలు వాదనలు తప్ప తర్కానికి నిలిచే మాటలు చెప్పటం లేదు. రాజ్యాంగం ప్రకారం మెజారిటీ వచ్చిన పార్టీ తమ నేతగా ఎవరిని నియమించుకోవాలన్నది ఆ పార్టీ ఇష్టం, ఒక ఎత్తుగడగానే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించలేదు ఇలాంటి సారం లేని వాదనలు తప్ప తమ యోగికి వున్న అర్హతల సమర్ధించుకొంటూ మాట్లాడకపోవటం దాని బలహీనతను సూచిస్తోంది. ఎవరిని ఎంచుకోవాలన్నది మీ ఇష్టమైతే ముఖ్యమంత్రి ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తారు కనుక ఆ ఎంపికపై విమర్శలు చేసే అధికారం ప్రతిపక్షాలకు, ప్రజలందరికీ వుంటుంది. చెప్పుకొనేందుకేమీ లేకపోగా వివాదాస్పద నేపధ్యం వున్న కారణంగానే యోగికి ఒక అవకాశమిస్తే తప్పేమిటి, ఇటీవలి ఎన్నికలలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టలేదు కదా, ముఖ్యమంత్రి పాత్రలో ఎలా వుంటారో చూడకుండానే విమర్శలా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరికొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రధాని నరేంద్రమోడీ తన మంత్ర దండంతో ఇలాంటి వారందరినీ అదుపులో వుంచుతాడు అంటూ భరోసా ఇస్తున్నారు. రంజాన్‌ సమయంలో పూర్తి విద్యుత్‌ ఇచ్చారు, దీపావళికి కోతలు విధించారంటూ స్వయంగా సదరు మోడీయే యుపీ గల్లీలలో రెచ్చగొట్టే ప్రచారం చేసి ఓట్లడుక్కున్న దిగజారుడు తనం దాస్తే దాగుతుందా ? తానే మత భావనలను రెచ్చగొట్టే భాష మాట్లాడకుండా తమాయించుకోలేని వ్యక్తి ఆదిత్యనాధ్‌ వంటి యోగులను నియంత్రిస్తారంటే నమ్మటం ఎలా ? సదరు పెద్దమనిషి గత చరిత్ర చూస్తే బిజెపియే తన బాటలో నడవాలి తప్ప తాను నడవాల్సిన అవసరం లేదని చెప్పటమే కాదు, తన మత అజెండాను అమలు జరిపేందుకు ఒక సంస్ధనే ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ తేడా ఏమంటే మాంసం తినండి గానీ ఎముకలు మెడలో వేసుకొని తిరగవద్దని బిజెపి చెబితే మాంసమంటూ తింటున్న తరువాత ఎముకలు వేసుకు తిరిగితేనే కదా జనానికి మనమీద నమ్మకం కలిగేదన్నది యోగి తీరు.

ఆదిత్యనాథ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లుగా తనపై వున్న హత్యాయత్నం, నేరపూరిత బెదిరింపులు, కొట్లాటలు, భిన్నమతాల జనం మధ్య శతృత్వాన్ని పెంచే నేరాలకు సంబంధించిన కేసులను ఎలా ఎత్తివేయించుకుంటారన్నది ఆసక్తికరం. ఎన్నికల సభలలో నోరు పారవేసుకున్నందుకు ఎన్నికల కమిషన్‌ ఆయన్ను మందలించింది. ప్రధాని నరేంద్రమోడీ అపరభక్తురాలైన జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ ‘బూతులు, దుర్భాషలు మాట్లాడే వున్మత్తుడని’ ఒక సందర్భంలో వర్ణించారు. రెండు సంవత్సరాల క్రితం లష్కరే తాయెబా స్ధాపకుడు హఫీస్‌ సయిద్‌కు సినీనటుడు షారూఖ్‌ ఖాన్‌కు తేడాలేదని యోగి సెలవిచ్చారు. ఆ మాటలు సరికాదని, తమ పార్టీ లేదా ప్రధాని నరేంద్రమోడీ మూల విశ్వాసాలకు అవి ప్రతిబింబాలు కాదని బిజెపి అధికార ప్రతినిధి నలిన్‌ కోహ్లీ స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తిని దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రిని చేశారు. ఒక యోగిగా ఏం చేశాడన్నది పక్కన పెట్టి ముఖ్యమంత్రిగా ఏం చేస్తారో చూసేందుకు ఒక అవకాశం ఇచ్చి చూడండంటూ వంది మాగధులచేత మాట్లాడిస్తున్నారు. అదే సరైన ప్రాతిపదిక అయితే మాకూ ఒక అవకాశమిచ్చి చూడండి అని అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ మజ్లిస్‌ కూడా ఓటర్లను అడుగుతోంది. ఒకరు గాడ్సే భావజాలానికి, కార్యాచరణకు, మరొకరు రజాకార్ల భావజాలం, కార్యాచరణకు వారసులన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందువలన అవకాశమివ్వాల్సిన ‘అర్హతల’లో ఎవరు ఎవరికీ తీసిపోరు ! అవకాశం ఇచ్చి చూడాలనటం గురించి ఒక విశ్లేషకుడు పాఠకులకు ఒక ప్రశ్న వేశారు. పోటీగా వున్న ఒక స్కూలును తగులబెట్టి రమ్మని మీ పిల్లలు చదివే స్కూలు హెడ్మాస్టర్‌ ఒక పని అప్పగించారనుకోండి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు ఒక అవకాశం ఇచ్చి, వారి పనితీరు ఎలా వుంటుందో చూద్దామని అనుకుంటారా లేక ఆందోళన వ్యక్తం చేస్తారా ? అన్నదే ఆప్రశ్న.

ఐదుసార్లు ఎంపీగా గెలిచాడు, మీకు ఇష్టం లేకపోతే ఆరునెలల్లో అసెంబ్లీకి పోటీ చేయాలి గనుక అప్పుడు ఓడించండి అంటూ ఒక వుచిత సలహా. ఆ మాత్రం తెలియని అమాయకత్వంతో యోగిని విమర్శించే వారు వున్నారనుకుంటున్నారా ?

రాహుల్‌ గాంధీ కూడా మూడుసార్లు వరుసగా ఎన్నికైనప్పటికీ ఆయనకు పార్టీ నడిపే అర్హత లేదని బిజెపి విమర్శిస్తుంది. ఎన్నిక కావటమే అర్హత అయితే వుత్తర ప్రదేశ్‌లో ఆదిత్యనాధ్‌ కంటే పేరు మోసినవారు ఎందరో వున్నారు, వారికి ముందు అవకాశం ఇవ్వాలి. అక్కడ ఎన్నికైన ప్రతి నాలుగో ఎంఎల్‌ఏ మీద అత్యాచారం, హత్యల వంటి తీవ్ర నేరాల కేసులు వున్నాయి. కొత్త అసెంబ్లీకి నూట మూడు మంది ఎన్నికైనందున రొటేషన్‌ పద్దతులలో వారందరికీ ఒక్కో ఏడాది పాటు మంత్రి పదవుల అవకాశాలు ఇచ్చి కొత్త పాత్రను వారెలా పోషిస్తారో చూడాలి. బిజెపికి మాత్రమే అలాంటి అవకాశం అంటే ఆపార్టీలో వున్న 82 మందికి రెండున్నర సంవత్సరాల చొప్పున అవకాశం ఇవ్వాలి మరి. ముక్తార్‌ అన్సారీ అనే పేరుమోసిన కేసులున్న పెద్దమనిషి అదే యూపీలో తాజా ఎన్నికలతో సహా 1996 నుంచి ఆదిత్యనాధ్‌తో పాటు వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికౌతూనే వున్నాడు.అదీ నాలుగుసార్లు జైల్లో వుండే గెలిచాడు. మరో పెద్ద మనిషి వున్నాడు రాజా భయ్యాగా పేరుమోసిన రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌. మాజీ రాజకుటుంబానికి చెందిన ఆ పెద్దమనిషిపై కేసులు తక్కువేమీ లేవు.ఆదిత్యనాధ్‌ కంటే ముందునుంచి అంటే 1993 నుంచి వరుసగా ఎన్నికవుతూనే వున్నాడు.కేరళలో కెఎం మణి ఏకంగా 13 సార్లు వరుసగా ఎన్నికయ్యాడు. అందువలన ఈ రోజుల్లో ఐదుసార్లు ఎన్నికయ్యాడు కనుక సచ్చీలుడు అంటే కుదరదు. బిజెపి తరఫున తాజాగా ఎన్నికైన వారిలో నేరస్ధ నేపధ్యం వున్న ఇద్దరు మహిళలు కూడా ఎన్నికైన ఘనత ఆపార్టీ ఖాతాలో వుంది. అందులో ఒకరు ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరి గెలిచిన ఒక డాక్టర్‌ కూడా వున్నారు.

మా యోగి రాహుల్‌ గాంధీ మాదిరి కుటుంబ నేపధ్యం నుంచి రాలేదు అన్నది మరొక ముక్తాయింపు. నిజమే గోరఖ్‌ పూర్‌ మఠం ఒక మతానికి చెందినది. దాని అధిపతిగా వున్న మహంత్‌ అవైద్యనాధ్‌ మతాధికారిగా వుంటూనే రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన స్ధానంలో మతబాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాధ్‌ అదే మత పూర్వరంగంలో ఐదుసార్లు ఎన్నికయ్యారు. ఒకరికి కుటుంబం, మరొకరికి మత వారసత్వం ! తేడా ఏముంది? వారసత్వ పరంపరను కొనసాగిస్తున్న తెలుగుదేశం పార్టీ నలుపు మాత్రం బిజెపికి కనపడదు. నరేంద్రమోడీ ఒక ఎత్తుగడగా తన మత అజెండాను పక్కన పెట్టి గత ఎన్నికలలో అభివృద్ధి మంత్రం జపించారు. కానీ ఆదిత్యనాధ్‌ రికార్డులో నేరపూరిత, మతోన్మాదం తప్ప అభివృద్ధి జాడలు లేవు. తాజా ఎన్నికలలో అలాంటి ప్రసంగాలు, ప్రచారం చేసిన దాఖలాలు లేవు. అసలు ఆయనొక ప్రధాన ప్రచారకుడిగా కూడా లేరు. గతంలో ఆయన ప్రసంగాలన్నీ ముస్లింల చుట్టూ తిరిగాయి తప్ప అభివృద్ధి కాదు. చివరిగా ఒక ముక్క చెప్పాలి. ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ తనదైన శైలిలో ఆదిత్యనాధ్‌ను సమర్ధించారు. దొంగకు తాళాలిస్తే సొత్తుకు హామీ వుంటుందన్నట్లుగా ఒక తరగతిలో చెడు ప్రవర్తన కలిగిన పిల్లవాడిని తరగతి పర్యవేక్షకుడిగా చేస్తే మంచిగా ప్రవర్తించే మాదిరి యుపి ముఖ్య మంత్రిగా ఆదిత్యనాధ్‌ వ్యవహరిస్తారు అని కితాబునిస్తూ భగత్‌ ట్వీట్‌ చేశాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోబెల్స్‌ చెప్పులలో నరేంద్రమోడీ కాళ్లు ?

19 Wednesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

Goebbels, Joseph Goebbels, Narendra Modi, Nazi Joseph Goebbels, surgical strike

ఎంకెఆర్‌

   ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే నిజమౌతుందన్నది జర్మన్‌ నాజీ గోబెల్స్‌ ప్రచార సూత్రం. సర్జికల్‌ దాడుల గురించి ఏకంగా ప్రధాని, రక్షణ మంత్రే ఆ సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారని గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచార తీరు వెల్లడిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు మంగళవారం నాడు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మన విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్‌ జయశంకర్‌ మాట్లాడుతూ సర్జికల్‌ దాడులు కొత్తగా జరిపినవి కాదని, గతంలో జరిగిన వాటి గురించి సైన్యానికి మాత్రమే తెలుసునని, ఇటీవలి దాడుల గురించి తొలిసారిగా బహిరంగంగా వెల్లడించారని స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో హిమచల్‌ ప్రదేశ్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి దాడులను ఇజ్రాయిల్‌ మాత్రమే చేయగలదని విన్నామని ఇప్పుడు భారతీయ సైన్యం కూడా ఎవరికీ తీసిపోదని వెల్లడైందని అన్నారు. ఇలాంటి దాడులు తొలిసారిగా జరిగాయని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ చెప్పిన మాటలనే ప్రధాని మరొక రూపంలో చెప్పారు తప్ప అర్ధం ఒకటే.

     ఇక్కడ రెండు విషయాలు. సర్జికల్‌ దాడులు గతంలో కూడా జరిపామని విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పిన విషయం ప్రధాని నరేంద్రమోడీకి తెలియదు అనుకోవటం అమాయకత్వం. తెలిసి కూడా ఇలాంటి దాడులు చేయగల సత్తా ఇజ్రాయెల్‌కు మాత్రమే వుందని విన్నామని చెప్పటం మన మిలిటరీని అవమానించటం తప్ప మరొకటి కాదు. నిజంగా తెలియకపోతే ప్రధానిగా రెండున్నర సంవత్సరాలలో తెలుసుకొని వుండి వుండాలి. తరతమ తేడాలతో ప్రపంచంలో ప్రతి మిలిటరీకి వుంటుందన్నది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే ఇటీవల మన మిలిటరీ జరిపిన దాడుల సందర్భంగా మీడియాలో ఈ విషయాలన్నీ చర్చించారు. అలాంటిది ఇజ్రాయెల్‌కు మాత్రమే వుందని విన్నామని ప్రధాని స్వయంగా చెప్పటం అంటే మీడియా వార్తలు కూడా ప్రధానికి తెలియవా ? రెండవది ఇజ్రాయెల్‌ పేరు ప్రస్తావించటం అంటే దాని గొప్పతనాన్ని పొగడటం, దాని మిలిటరీతో మన మిలిటరీని పోల్చటం. ఇదింకా అవమానకరం .

    ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన వాటిలో ఇజ్రాయెల్‌ మిలిటరీ ఒకటి. పై నుంచి కింది వరకు దానిలో యూదు దురహంకారం, దురాక్రమణవాదాన్ని నింపారు. మన మిలిటరీ అందుకు పూర్తిగా విరుద్ధం. అరబ్బుల ప్రాంతాలను ఆక్రమించుకోవటంతోనే ఇజ్రాయెల్‌ పుట్టింది. ఆ తరువాత దాని పరిసరాలలో వున్న జోర్డాన్‌,లెబనాన్‌, సిరియా, ఈజిప్టు ప్రాంతాలను ఆక్రమించుకొని ఇప్పటికీ తిష్ట వేసింది.అంతర్గతంగా అరబ్బుల ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించుకొనేందుకు పూనుకున్న ఇజ్రాయెలీలకు రక్షణగా మిలిటరీ వ్యవహరించటం అందిరికీ తెలిసిందే. ఇజ్రాయెల్‌ దురాక్రమణను ఎదుర్కొనే క్రమంలో దాని సరిహద్దులలో అనేక దేశాల మిలిటరీ వుంటుంది. వాటిని నిరంతరం రెచ్చగొట్టటం, యుద్ధానికి కాలుదువ్వటం, అరబ్బు ప్రాంతాలలోని సాధారణ పౌరుల ప్రాంతాలపై రహస్య దాడులు జరపటం దాని నిరంతర కార్యక్రమాలలో భాగం. అందువలన అది చేసే సర్జికల్‌ దాడులు, మన మీద దాడులకు సిద్ధంగా వున్న ఆక్రమిత కాశ్మీర్‌లోని పాక్‌ ప్రేరేపిత వుగ్రవాద శిబిరాలపై మన సైన్యం దాడులు చేయటం ఒకటి కాదు. ఇజ్రాయెల్‌ చర్యలు యుద్ధోన్మాద కవ్వింపు అయితే మన సైన్యం చర్యలు ఆత్మరక్షణ, వుగ్రవాద నిరోధ చర్యలలో భాగం. ఇజ్రాయెల్‌ వంటి దుష్ట మిలిటరీ తప్ప మన సైన్యాన్ని పొగడటానికి, పోల్చటానికి మరొక మిలిటరీ దొరకలేదా ? పాలస్తీనా పౌరుల న్యాయమైన పోరాటానికి మద్దతు, ఇజ్రాయెల్‌ దాడులు, దురాక్రమణను వ్యతిరేకించే మన పశ్చిమాసియా విదేశాంగ విధాన కీలకాంశానికి విరుద్ధంగా ఇజ్రాయెల్‌ను పొగడటం తగని పని. ఒకవైపు పాలస్తీనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదంటూనే ఇజ్రాయెల్‌ను పొగడటం శకుని, శల్యసారధ్యాలను గుర్తుకు తెస్తోంది.

     గతంలో ఇలాంటి సర్జికల్‌ దాడులు జరగలేదని, జరిగినవి ఏవైనా వుంటే స్ధానికంగా చేసినవి తప్ప ప్రభుత్వ ప్రభుత్వ ప్రమేయంతో జరగలేదని ప్రకటించిన రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ తరువాత మరొక అడుగు ముందుకు వేసి ప్రధాని, తాను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వారం కనుకనే ఈ దాడులు జరిగాయని చెప్పి దాడుల ఖ్యాతిని ఆ సంస్థకు ఆపాదించేందుకు ప్రయత్నించారు. ఇదొక ప్రమాదకర పోకడ. పేరుకు సేవా, సాంస్కృతిక సంస్ధ అని చెప్పుకుంటూ అనేక వివాదాలు, మత ఘర్ణణలను రెచ్చగొట్టే సంస్ధగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌, దాని భావజాలంతో పని చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధాని, రక్షణ మంత్రి గాలిని విదేశాంగ కార్యదర్శి తీసినట్లయింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

CPI(M) supports the demand of Muslim women on triple talaq

18 Tuesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

communal forces, CPI(M), Muslim women, triple talaq, Uniform Civil Code

The Polit Bureau of the Communist Party of India (Marxist) has issued the following statement on October 18, 2016.
The CPI(M) supports the demand of Muslim women against the practice of arbitrary and instant triple talaq. This specific practice is not permitted in most Islamic countries. Acceptance of this demand will bring relief to affected women.
All personal laws including those for the majority community require reform.
In this context the claims being made by Government spokespersons that personal laws for Hindu women have already been reformed   shows that their interest is not in securing women’s equality but in targeting the  minority communities, particularly the Muslim minority.  Even now laws concerning, adoption, property rights and even the right to choose your own partner discriminate against Hindu women.
With the offensive of the communal forces on the very identity of minority communities, any move to push the agenda of Uniform Civil Code as is being done by the Government directly and through its institutions is counterproductive for the rights of women. Uniformity is not the guarantee for equality.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రజాస్వామ్యం -మిలిటరీ- ప్రశ్నించే హక్కు ?

12 Wednesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Congress party, dadri, dalali, democracy, Media, military, right to ask a question, surgical strike

ఎంకెఆర్‌

   సమాజంలో ఎప్పుడూ విరుద్ధ భావజాలాల మధ్య సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. అయితే అన్ని వేళలా అన్నీ ఒకే విధంగా సంఘర్షించుకోవు. ఎప్పుడూ ఒకటి ప్రధాన మైన సంఘర్షణగా వుంటుంది. దీని అర్ధం మిగతావి సంఘర్షించుకోవు అని కాదు. ఏ రెండింటి మధ్య జరిగేది ప్రధాన సంఘర్షణ అన్నది గుర్తించటం ముఖ్యం. అయితే వెంటనే దానితో అందరూ ఏకీభవించకపోవచ్చు.అసలు దానిని ఒక వైరుధ్యంగా కొందరు గుర్తించకపోవచ్చు కూడా. ఇప్పుడు దేశంలో అదే పరిస్ధితి వుందన్నది అనేక మంది అభిప్రాయం. కొంత మంది విభేదించినప్పటికీ అనేక దేశాలతో పోలిస్తే మనం మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్ధలో వున్నాం. భావ ప్రకటనా స్వేచ్చ మీద జరుగుతున్న తీవ్ర దాడిని సాధారణంగా మేథావి వర్గంగా భావించే వారందరూ వ్యతిరేకించకపోయినా గట్టిగా వ్యతిరేకించే వారు కూడా వున్నారు. కలుబుర్గి హత్యను ఖండించటానికి కేంద్ర సాహిత్య అకాడమీ తిరస్కరించటం మొదలు, ఎవరు ఏమితినాలి, తినకూడదు అని నిర్ధేశించిన దానిలో భాగంగా గొడ్డు మాంసంపై తలెత్తిన వివాదం, విశ్వవిద్యాలయాలలో భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకొనే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడిన వుదంతాలు, గో సంరక్షణ ముసుగులో ముస్లింలు, దళితులపై దాడులు, చివరికి తాజా సర్జికల్‌ దాడుల వరకు అనేక వుదంతాలలో తలెత్తిన ఘర్షణలను చూస్తే పూసల్లో దారంలో తిరోగామి భావజాలానికి ప్రాతినిధ్యం వహించే ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర మనువాద, మతశక్తులు అన్ని రంగాలలో, అంశాలలో తమ ఆధిపత్యాన్ని రుద్దేందుకు ప్రయత్నించటం చూస్తున్నాం. వారేమీ దాచుకోవటం లేదు, బాహాటంగానే తెగింపుతో ముందుకు వస్తున్నారు. చర్చను ప్రమాదకర పరిస్థితిల్లోకి నెడుతున్నారు. ఇది ఒక పధకం ప్రకారం జరుగుతున్నదా? యాదృచ్చికమా అన్న గుంజాటన వున్న వారు తీరికగా ఆలోచించి దానిని తేల్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ దాడులకు ప్రతిఘటన కూడా అలాగే వుంది. అనేక మంది ఇదేదో తేడాగా వుంది అని ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటి వారు పెరుగుతారు.అయితే ఈ శక్తుల ప్రయత్నాలన్నింటికీ తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఒక ఎత్తుగడగా అయినా వెనక్కు తగ్గి కొత్త దారులు వెతుకుతున్నారు.

    కలుబుర్గి హత్యపై తలెత్తిన రచయితలు, కళాకారులు, మేథావుల నిరసనలతో ఖంగు తిన్న శక్తులు కేంద్ర సాహిత్య అకాడమీతో సంతాపం ప్రకటింపు చేయించి పరువు దక్కించుకొని బయట పడ్డాయి. ఆవు మాసం వివాదం చివరకు దళితులపై దాడులకు తెరతీయటంతో స్వయంగా ప్రధాని జోక్యం చేసుకొని లోపల ఎలా వున్నప్పటికీ దళితుల ఓట్ల కోసం గోసంరక్షకులపేరుతో దుకాణాలు తెరిచారని తీవ్ర విమర్శలు చేయాల్సి వచ్చింది. వురి శిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడిన, యాకుబ్‌ మెమెన్‌ వురి తీత సరైంది కాదని అభిప్రాయపడిన వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేసి హైదరాబాదులో రోహిత్‌ వేముల ఆత్మ హత్యకు కారకులు కావటం, జెన్‌యు విద్యార్ధులపై తప్పుడు ప్రచారం, తప్పుడు వీడియోలు, కేసులతో వేధించేందుకు పూనుకున్నారు. ఆ రెండు చోట్లా జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. ఈ విషయంలోనూ తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. తమకు రాజకీయంగా లాభం అనుకుంటే ఏ వివాదాన్ని అయినా రావణా కాష్టంలా రగిలిస్తూనే వుంటారు, తాత్కాలికంగా అయినా నష్టం అనుకుంటే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గుతారు.ఇప్పుడు సర్జికల్‌ దాడుల వివాద వుదంతాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి వుంది.

    ఒక్కొక్క అంశంపై తమ ఆధిపత్యాన్ని రుద్ధేందుకు ప్రయత్నిస్తున్న మత, తిరోగామి శక్తులు సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నించటం ఒకటైతే , తలెత్తిన పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవటం మరొకటి. అసహనం, దేశభక్తి, ఆవు నుంచి తాజా మిలిటరీ చర్యల వరకు నడుస్తున్న చర్చలో రెండు ఈ ధోరణులను మనం చూడవచ్చు. పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదుల అణచివేతలో భాగంగా మిలిటరీ చేపట్టిన సర్జికల్‌ దాడులను దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సమర్ధించాయి. ఎవరూ వాటిని వివాదం చేయలేదు. అయితే ఆ దాడులనుంచి రాజకీయ ప్రయోజనాలను పిండుకోవటానికి బిజెపి తెరతీయటం, అది తగదన్న అంశంపై తీవ్రమైన రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ముందు బోనులో నిలబెట్టాల్సింది మీడియాను అంటే అతిశయోక్తిగా కనిపించవచ్చు. సర్జికల్‌ దాడుల గురించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరించినపుడు వచ్చిన వార్తల తీరు తెన్నులను ఒక్కసారి నెమరు వేసుకోండి. దాడుల ఖ్యాతిని పూర్తిగా మిలిటరీకే ప్రతిపక్షాలు అప్పగిస్తున్నాయని, నరేంద్రమోడీకి దానిని పంచేందుకు నిరాకరించాయని రాయటాన్ని ఏమనాలి. మరణించింది సైనికులు, ప్రాణాలకు తెగించి ప్రతిదాడులు జరిపింది సైనికులు, దీనిలో రాజకీయ నాయకులు లేదా పార్టీలకు ఖ్యాతిని ఆపాదించటం ఏమిటి ? వుప్పు తిన్న విశ్వాసం లేదా కిరాయి రాతలని ఇలాంటి వాటినే అంటారు.

    మిలిటరీ చర్యలను, మిలిటరీని రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకున్న దేశాలలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన దేశాన్ని కూడా ఆ స్ధితిలోకి నెట్టదలచుకున్నారా ? కొందరి వుత్సాహం అలాగే కనిపిస్తోంది. కార్గిల్‌ యుద్ధాన్ని బిజెపి తన ఎన్నికల ప్రయోజనానికి వుపయోగించుకోవటం జగమెరిగిన సత్యం. ప్రతిపక్షం ఎంత బలహీనంగా వున్నప్పటికీ ఇది 1999 కాదు 2016 అని గుర్తించకుండా సర్జికల్‌ దాడులను కూడా అందుకు వినియోగించుకొనే ప్రయత్నం చేస్తే సహించే పరిస్థితి వుంటుందా ? మిలిటరీ చర్యలనుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించవద్దన్న అభిప్రాయాల వెల్లడి, ప్రకటనలు జాతీయ ఐక్యత ప్రదర్శించాల్సిన సమయంలో సైనికుల శౌర్య, పరాక్రమాలను అవమానించటమే అని చిత్రించటం అత్యంత ప్రమాదకర పోకడ. మొదటిది ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటనా స్వేచ్చకు ప్రతిబింబం అయితే రెండవది అందుకు విరుద్ధమైన అణచివేత వ్యవస్ధ లక్షణం.

    మన దేశంలో స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్‌ పార్టీ చేయని తప్పిదం లేదు. అత్యవసర పరిస్థితి విధించి నిరంకుశత్వాన్ని రుద్ధేందుకు ప్రయత్నించింది. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అనుసరించి సామాన్య జనజీవితాలను అతలాకుతలం చేసింది. మతోన్మాదులతో పోటీపడి ఓట్ల కక్కుర్తితో మతశక్తులతో రాజీపడి లౌకిక వ్యవస్ధకు హాని చేసింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం వేర్పాటు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చింది. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించి ఇప్పుడు ప్రతిపక్షంగా పార్లమెంట్‌లో గుర్తింపునకు తగిన సంఖ్యలో కూడా సీట్లను పొందలేకపోయింది. ఇంకా దాని తప్పిదాలు చాలా వున్నాయి.

    రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతలు జర్మనీ మిలిటరీపై నిషేధం విధించారు. అదే యుద్ధంలో జపాన్‌ను ఓడించి 1945-52 మధ్య కాలంలో తమ ఆక్రమణలో వుంచుకున్న అమెరికా ఆ దేశ రక్షణ బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు ఆ దేశంతో ఒక ఒప్పందం చేసుకొన్నది. రెగ్యులర్‌ మిలిటరీని నిషేధిస్తూ జపాన్‌ నూతన రాజ్యంగంలో ఒక అంశంగా చేర్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జర్మనీ, జపాన్‌లకు సైన్యం లేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ను బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ చిత్తుగా ఓడించింది. అంతే తప్ప కాంగ్రెస్‌ పార్టీని లేదా దాని హక్కులను గానీ జపాన్‌,జర్మనీ మిలిటరీల మాదిరి నిషేధించలేదు. అందువలన ఆ పార్టీ అయినా మరొకదానికి అయినా ఒక అంశం మీద అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్చను కలిగి వున్నాయి.

    ఆ విధంగా చూసినపుడు బిజెపి లేదా దాన్ని చూసి సమాజవాది పార్టీ గానీ రాజకీయ ప్రయోజనాల కోసం జరిపే ప్రచారంలో, పోస్టర్లలో సైన్యాన్ని వుపయోగించుకోకూడదని చెప్పేందుకు ఎవరికైనా హక్కుంది. ‘సర్జికల్‌ దాడులకు మా సంపూర్ణ మద్దతు వుందని నిర్ద్వంద్వంగా చెప్పాను. అయితే సైన్యాన్ని రాజకీయ పోస్టర్లు, ప్రచారానికి వినియోగించుకోవటాన్ని నేను సమర్ధించను ‘ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు రోజు కాస్త ఘాటుగా సైనికుల త్యాగాలను సొమ్ము చేసుకొనే దళారులుగా వ్యవహరించవద్దని విమర్శించారు. ఆ విమర్శ తమను గాక మిలిటరీని అన్నట్లే అంటూ బిజెపి విరుచుకుపడింది. సైనికుని బొమ్మను, మోడీ, బిజెపి నేతల బొమ్మలతో కలిపి ముద్రించి వుత్తర ప్రదేశ్‌లో బిజెపి ప్రచారం ప్రారంభించిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై చేసిన విమర్శలను మిలిటరీకి వర్తింప చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది.

  దళాలీ( తెలుగులో దళారీ ) అన్నది పార్లమెంటేతర భాష కాదు. భోఫోర్స్‌తో సహా అనేక కుంభకోణాలలో దళారుల పాత్ర ఏమిటో కాంగ్రెస్‌కు, బిజెపికి తెలిసినంతగా ఈ దేశంలో మరొక పార్టీకి తెలిసే అవకాశం లేదు. దానిలో భాగంగానే బిజెపి ‘ధరమ్‌ కీ దలాలీ(మతం), గాయ్‌ కీ దళాలీ( ఆవు ) గంగా కీ దళాలీ ( గంగా నది)ని వుపయోగించుకుంటున్నట్లుగానే సైనికుల త్యాగాలను కూడా వుపయోగించుకుంటున్నదని బిజెపి పోస్టర్లను వుటంకిస్తూ కాంగ్రెస్‌ ఎదురు దాడికి దిగింది. రాజకీయాలలో దళారీ పదం వాడటం వుచితమేనా అన్న ప్రశ్నకు రాజకీయాలకు తావు లేని చోట బిజెపి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నది, మోడీని రాముడిగా చిత్రిస్తూ పోస్టర్లు వేశారు, సర్జికల్‌ దాడులతో ఆయన ఛాతీ 56 అంగుళాల నుంచి వందకు పెరిగిందని చెప్పారు, జాంబవంతుడు చెప్పిన తరువాతే హనుమంతుడికి తన బలం గురించి తెలిసి వచ్చి ఒక్క వూపులో సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించినట్లుగా సర్జికల్‌ దాడుల తరువాత మన సైన్యానికి తన బలం ఏమిటో తెలిసి వచ్చిందన్నారు రక్షణ మంత్రి పరికర్‌. ఆయనను సన్మానించేందుకు సభలు జరుపుతున్నారు. బిజెపి ప్రతినిధి జివిఎల్‌ నరసింహారావు కూడా అదే రీతిలో తొలిసారిగా మిలిటరీకి తానంటే ఏమిటో తెలిసిందని మాట్లాడారు. నిజానికి ఇవి మిలిటరీని అవమానించే మాటలు. గతంలో చేసిన సర్జికల్‌ దాడులను విస్మరించటం, త్యాగాలను కించపరచటం తప్ప మరొకటి కాదు. దాడుల ఖ్యాతి పూర్తిగా సైనికులకే దక్కాలి. ఈ పూర్వరంగంలో ఒక పదం ముఖ్యం కాదు దాని వెనుక వున్న భావాన్ని అర్ధం చేసుకోవాలని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ వ్యాఖ్యానించారు. వుగ్రవాదులు పాకిస్తాన్‌ అనే వ్యాధి గ్రస్తు శరీరంలోని క్యాన్సర్‌ కణాల వంటి వారు, ప్రభుత్వం వాటిని అంతం చేయటానికి మద్దతు ఇస్తున్నాం, దానికి గుండెలు పొంగటం ఎందుకు, పోస్టర్ల ప్రచారం దేనికి, ఒక సర్జికల్‌ దాడితో వుగ్రవాదం అంతం కాదు, కానీ బిజెపి వుత్తర ప్రదేశ్‌లో ఆ పేరుతో ఓట్లు అడిగేందుకు ప్రచారం ప్రారంభించింది’ అని కూడా సిబాల్‌ చెప్పారు.

    ఆవు మాంసం కలిగివున్నారంటూ వుత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో ఒక ముస్లిం కుటుంబంపై సామాహిక దాడి చేసి కుటుంబ పెద్దను హత్య చేసిన కేసులోని ఒక నిందితుడు రవి శిశోదియా జైలులో చికున్‌ గున్యా వ్యాధితో మరణించాడు. అతని మృత దేహంపై బిజెపి నేతలు జాతీయ జండా కప్పటాన్ని ఏమనాలి. హిందూత్వ వాది కనుక కావాలంటే తమ బిజెపి జెండాను కప్పుకోవచ్చు, జాతీయ జెండాను కప్పటమంటే దానిని అవమానించటం తప్ప మరొకటి కాదు. బిజెపి ప్రవచించే జాతీయవాద నిజ స్వరూపం ఇదా ? దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల మృత దేహాలపై జాతీయ జెండా కప్పుతారు. మరి శిశోదియా ఏ త్యాగం చేశాడని ఇలా చేశారు ?

Image result for dadri lynching,sisodia, national flag

చికున్‌ గున్యాతో మరణించిన దాద్రి హత్య నిందితుడికి జాతీయ జెండా కప్పిన బిజెపి జాతీయవాదం

    సర్జికల్‌ దాడుల గురించి చర్చించ కూడదని బిజెపి నేతలు మనకు చెబుతున్నారు. అడిగితే అది పాక్‌ ప్రచార వలలో పడినట్లే నట ! సైనిక చర్యకూ జాతీయ వాదానికి ముడి పెడుతున్నారు. గో వధ నిషేధానికీ అదే ముద్ర, చివరికి గో సంరక్షకుల ముసుగులో చచ్చిన ఆవుల చర్మం తీసే, చచ్చిన ఆవులను తొలగించటానికి నిరాకరించిన దళితులపైనా దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. వారిని అలాగే వదలి వేస్తే చివరికి గో సంరక్షక్షుల దాడుల గురించి కూడా చర్చించటం కూడా దేశ ద్రోహమే అంటారేమో ? కొన్ని టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు, కాషాయ దళాల దృష్టిలో భిన్న, బేదాభి ప్రాయం వ్యక్తం చేసే వారందరూ ప్రమాదకారులు, దేశద్రోహుల కింద లెక్క. కనుక అంతిమంగా అలాంటి వారి నోరు మూయాలి లేకపోతే మూయించాలి, ఇదేగా ఇస్తున్న సందేశం ! ఇది ప్రారంభం మాత్రమే. మొగ్గలోనే ఇలాంటి ధోరణులను ఎదుర్కొనకపోతే చివరికి మానులై కూర్చుంటాయి.

   మిలిటరీని విమర్శించకూడదు ! న్యాయ వ్యవస్ధను విమర్శించకూడదు !! మిలిటరీ, న్యాయవ్యవస్ధలనేవి ఆకాశంలోంచి వూడి పడలేదు, కనుక విమర్శలకు అతీతం కాదు. ఏ దేశంలో అయినా మిలిటరీ చర్యలపై , న్యాయ వ్యవస్ధ తీర్పులపై విమర్శలు సహజం. వుద్రేకాలు, విద్వేషాలను అదుపులో వుంచుకొని ఆలోచించాల్సిన విషయాలు వున్నాయి. న్యాయమూర్తి స్ధానంలో కూర్చున్న వారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలన్నది ఒక విధి. తీర్పు రాకముందే లేదా తీర్పు వచ్చిన తరువాత వారికి దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ముందుగానే మరొక కోర్టులో తన కేసును విచారించాలని కోరే హక్కు ఎవరికైనా వుంది. అంత మాత్రాన సదరు న్యాయమూర్తిని అవమానించినట్లు కాదు. కొన్ని కేసుల విచారణలో న్యాయమూర్తులు స్వచ్చందంగా తప్పుకొంటున్న విషయం విదితమే. అయితే ఒక తీర్పు వెలువడిన తరువాత దాని మంచి చెడ్డలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికైనా వుంటుంది. అంతిమ తీర్పులో కూడా తమకు న్యాయం జరగలేదని ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. మిలిటరీ వ్యవహారం కూడా అంతే . దానిలో పని చేసే వారి చిత్త శుద్ధిని శంకించటం వేరు, మిలిటరీలో జరిగే, మిలిటరీ చేసే తప్పులను ఎత్తి చూపటం వేరు అని గమనించాలి.మిలిటరీకి అవసరమైన కొనుగోళ్లలో జరిగే అక్రమాల గురించి ఎన్నో విన్నాం.సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండా అవి జరగవు. మిలిటరీ గనుక అక్కడ ఏం జరిగినా విమర్శించకూడదు, మీడియాలో దాని గురించి చర్చించకూడదు అంటే ఎలా ? కార్గిల్‌ యుద్ధంలో వందల మంది సైనికులు ప్రాణాలర్పించారు. వారి భౌతిక కాయాలను తరలించేందుకు కొనుగోలులో అక్రమాలకు పాల్పడింది అపర దేశభక్తులుగా పేరుపొందిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలనలో అన్నది తెలిసిందే. మిలిటరీ కొనుగోళ్లు కనుక విమర్శించకూడదంటే ఆ వివరాలు బయటకు వచ్చేవా ? అదే అయితే భోపోర్సు ఆయుధాల కమిషన్‌ ముడుపులూ అంతే కదా ?

    పది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం మిలిటరీలో వున్న మైనారిటీల సంఖ్య ఎంత అనే సమాచారాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. ప్రతిపక్షంలో వున్న బిజెపి, మిలిటరీ అధికారులు, మరికొందరు దానిపై నానాయాగీ చేశారు. దాంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది. మిలిటరీ అంటే త్యాగం తప్ప రిజర్వేషన్లు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ భాష మాట్లాడతారు, కుల మతాల లెక్క కాదు అన్నారు. వివరాలు సేకరించాలన్నవారి కారణాలు వారికి వుంటే వ్యతిరేకించే వారికారణాలు వారికి వున్నాయి. అయితే మిలిటరీలో కుల, మత లేదా తెగల ప్రస్తావన లేదా, ముస్లింల సంఖ్యా వివరాలు లేవా అంటే వున్నాయి. అలాంటపుడు ఎందుకు వ్యతిరేకించినట్లు ? మన రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడు. అయితే అది గౌరవం తప్ప అధికారాలు లేవు. లెక్కలు తీయాలని కోరింది రక్షణ మంత్రిత్వశాఖ. అలా లెక్కలు తీయటం మిలిటరీలో మతతత్వ బీజాలు వేయటమే అవుతుంది కనుక ఆ ప్రక్రియను నిలిపివేయాలని మాజీ సైనికాధికారి ఆర్‌ఎస్‌ కడియన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వసైన్యాధ్యక్ష హోదాలో ఇలాంటి లెక్కలు తీయటాన్ని నిలిపివేసేందుకు రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్‌ చేసింది. మాజీ సైనికాధికారులు ధర్నాలు చేశారు. కార్గిల్‌ శవపేటికల కుంభకోణం ఫేం జార్జి ఫెర్నాండెజ్‌ సైన్యాన్ని మత పూరితం చేసే దేశ ద్రోహకర చర్య అని వర్ణించారు. 2004 జనవరి తొమ్మిదిన రక్షణ మంత్రిత్వ శాఖకు సైన్యం పంపిన ఒక నోట్‌లో పదకొండు లక్షల మంది సైనికులలో ముస్లింలు 29,093 మాత్రమే అని పేర్కొన్నారు. అంటే 13శాతం జనాభాకాగా సైనికులలో వారి శాతం 2.6 మాత్రమే. వారి శాతాన్ని పెంచమని కోరటం జాతి వ్యతిరేకం అవుతుందా ? గూర్ఖా, సిక్కు, రాజపుత్ర, డోగ్రా రెజిమెంట్లలలో ముస్లింలతో సహా ఆ తరగతులకు చెందని వారికి చాలా కాలం అసలు ప్రవేశం లేని విషయం తెలిసిందే. 1984లో అమృతసర్‌ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన వుగ్రవాదులను బయటకు గెంటి వేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ చర్య సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లో కొందరు సైనికులు తిరుగుబాటు చేసిన తరువాతే రెజిమెంట్లలో ఇతరులకు కూడా చోటు కల్పించి అఖిల భారత స్వభావం తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.

మన మిలిటరీ, న్యాయవ్యవస్ధ అయినా మన వైవిధ్య సమాజానికి ప్రతిబింబంగా వుండాలన్నదానితో ఎవరూ విబేధించనవసరం లేదు. అలా వుందా లేదా అన్నతి తెలియాలంటే వివరాలు వుండాలి, లోపం వుంటే అధిగమించేందుకు ప్రయత్నించాలి. మన దేశానికి వలస పాలన వారసత్వంగా అనేక అవలక్షణాలు వచ్చాయి. వాటిని వదలగొట్టుకోవాల్సి వుంది. వలస పాలకులు ఎందుకు అలా చేశారన్నది మరో సందర్భంలో చర్చించవచ్చు.మన సైన్యంలో సిక్కు, గూర్ఘా, జాట్‌, రాజపుత్ర, డోగ్రా,పంజాబ్‌, మద్రాస్‌, మరాఠా, బీహార్‌, ఇలా మరికొన్ని పేర్లతో రెజిమెంట్లు వున్నాయి. నిజానికి లౌకిక భారత్‌ లేదా స్వతంత్ర భారతంలో ఇలాంటివి ఇప్పటికీ కొనసాగటం ఆశ్చర్యకరమే. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తరువాత నాగా రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, దేశ రక్షణలో మరింత చురుకుగా పాల్గొనేందుకు తమ పేరుతో ఒక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని నాగాల ప్రతినిధులు కోరిన మేరకు 1970లో ఆ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. మేమెంతో మాకంత వాటా మాదిరి నినాదాలతో అస్థిత్వ భావనలు తీవ్రంగా వ్యాపించిన వర్తమాన పరిస్థితులలో ప్రత్యేక రెజిమెంట్ల ఏర్పాటు డిమాండ్‌ను ముందుకు తెచ్చేందుకు అవకాశం వుందా లేదా ?

   దేశ విభజనకు ముందు పాకిస్థాన్లో ఎంత మంది హిందువులున్నారు, ఇప్పుడు ఎంత మంది వున్నారో చూడండంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారు జనాన్ని తప్పుదారి పట్టించే లెక్కలు కొన్ని చెబుతుంటారు. మన రక్షణ శాఖ సహాయ శాఖ మంత్రిగా పని చేసిన మహావీర్‌ త్యాగి అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశ విభజనకు ముందు భారత సైన్యంలో ముస్లింలు 32శాతంగా వుండగా విభజన తరువాత రెండు శాతానికి పడిపోయింది. ఇది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, ఇతరుల శాతం ఎంత అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ? అయితే సచార్‌ కమిటీ సూచన ప్రకారం ముస్లింల సంఖ్య తెలుసుకోవాలనుకోవటంలో మైనారిటీల సంతుష్టీకరణ, దాన్ని వ్యతిరేకించటంలో మెజారిటీ సంతుష్టీకరణ కోణాలు కూడా లేకపోలేదు. అధికారంలో ఏ పార్టీ వున్నప్పటికీ రాజ్యాంగ బద్దంగా దళితులు, గిరిజనుల వుప ప్రణాళికలకు నిధులు కేటాయించాలన్నా, మత, భాషా మైనారిటీల సంక్షేమానికి చర్యలు, పధకాలను రూపొందించాలన్నా వారి సంఖ్యా, ఇతర పరిస్థితుల వివరాలు తెలియకుండా ఎలా సాధ్యం. వాటిని సేకరించటం ఆ తరగతుల సంతుష్టీకరణ అని ఇంతకాలం రాజకీయం చేసిన బిజెపి ఇప్పుడు కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో అధికారంలో వుంది. అవేమీ లేకుండానే వారికి పధకాలు రూపొందిస్తుందా? వున్న పధకాలను ఎత్తివేస్తుందా ? అమెరికా అంటే బిజెపి, సంఘపరివార్‌ శక్తులకు వల్లమాలిన అభిమానం అక్కడ వర్షం కురిస్తే ఇక్కడ గొడుగులు పడతారు. అమెరికా పర్యటన జరపాలని నరేంద్రమోడీ ఎంతగా తపించి పోయారో తెలిసిందే. అలాంటి అమెరికా సైన్యంలో ముస్లింలు, నల్లవారు, తెల్లవారు, ఇతర జాతుల వారు ఎందరున్నారో ప్రతి ఏటా సంఖ్యా వివరాలను ప్రకటిస్తారని తెలియదా ? మరి అక్కడ రాని పొరపొచ్చాలు మన దేశంలో ఎందుకు వస్తాయని భావిస్తున్నారు?

    పాకిస్తాన్‌ పాలనలో మిలిటరీ ఆధిపత్యం, ప్రభావం గురించి బహిరంగ రహస్యమే. ఆ మిలిటరీ చర్యలను కూడా అక్కడి మీడియా తప్పు పట్టి ప్రశ్నించిందన్న విషయాన్ని అంగీకరిస్తారా లేక పాక్‌ మీడియా కథలను ప్రచారం చేయటంగా కొట్టి పారవేస్తారా ?http://indiatoday.intoday.in/story/pakistan-miliatry-is-no-holy-cow/1/143245.html ఈ వ్యాసాన్ని మన భారతీయ పత్రిక ఇండియా టుడే ఐదు సంవత్సరాల క్రితం ప్రచురించింది. అందరూ చూస్తుండగానే ఇస్లామాబాద్‌లో సలీమ్‌ షహజాద్‌ అనే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు అపహరించి తరువాత చంపివేశారు.అది మిలిటరీ కనుసన్నలలో పని చేసే ఐఎస్‌ఐ పనే అని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ మిలిటరీ ఒక ప్రకటన చేసింది. వార్తలు వాస్తవం కాదని తోసి పుచ్చితే ఒక రకం, అలా కాకుండా వివరాలను వెల్లడిస్తే అది జాతీయ భద్రతకు ముప్పు వస్తుందని, సైనిక బలగాల నైతిక స్ధైర్యం దెబ్బతింటుందని పేర్కొనటమే కాదు, కస్టడీలోకి తీసుకున్న పౌరులను మిలిటరీ చిత్రహింసలు పెట్టదు, చంపదు అని, సలీమ్‌ సహజాదీ హత్యలో ఐఎస్‌ఐ ప్రమేయమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. దీనిపై పాక్‌ పత్రిక ఫ్రైడే టైమ్స్‌ పత్రిక సంపాదకుడు నజమ్‌ సేథీ వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యంలో విమర్శలకు అతీతమైవేవీ లేవు, మిలిటరీ కూడా అలాంటిదే అని రాశాడు. మరి మనది ప్రజాస్వామ్యం. కాశ్మీర్‌, ఈ శాన్య రాష్ట్రాలలో ప్రత్యేక అధికారాలు కలిగిన మిలిటరీపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. మిలిటరీ సైతిక స్ధైర్యం దెబ్బతిన కుండా వుండాలంటే ఆ చర్యలను విమర్శించకూడదా ? మిలిటరీ చర్యలతో దెబ్బతింటున్న సామాన్య పౌరుల మనో స్ధైర్యం నంగతేమిటి ?

    పౌరపాలకుల పర్యవేక్షణలో పని చేస్తున్న మిలిటరీ వ్యవస్ధలలో మనది ఒకటిగా గర్వించాల్సిందే. నిత్యం సరిహద్దులను కాపాడుతున్న వారి సామర్ధ్యం, త్యాగాలకు హారతి పట్టాల్సిందే. వారి విశ్వసనీయతను ప్రశ్నించకూడదన్నది కూడా నిజమే. సర్జికల్‌ దాడులకు మన దగ్గర సాక్ష్యాలు వున్నాయని బల్లగుద్ది మరీ చెప్పినపుడు అబ్బే అసలు దాడులే జరగలేదని పాక్‌ ప్రభుత్వం ఎత్తుగడగానే చెప్పి వుండవచ్చు, ఎందుకంటే తన పౌరులకూ అది సంజాయిషీ ఇచ్చుకోవాలి గనుక.ఈ వుదంతంలో ప్రపంచ దృష్టిలో ఎవరిది పైచేయిగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌ అసలు దాడులే జరగలేదనే వాదనకే కట్టుబడి వుంది. పరిస్థితులు సాధారణంగానే వున్నాయి చూడమంటూ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాలను చూపింది. దాడులు జరిగి వుంటే సాక్ష్యాలు వెల్లడించాలని సవాలు చేస్తున్నది. ఇది కూడా ప్రచార ఎత్తుగడే అనుకుందాం .

  మన దేశంలో జరిగిందేమిటి ? తాజా వివాదానికి అధికార రాజకీయ నేతల, మిలిటరీ వున్నతాధికారుల బాధ్యతేమీ లేదా ? సర్జికల్‌ దాడుల వివరాలతో సహా అనేక అంశాలు గోప్యంగా వుంచాల్సినవే అయినపుడు దాడులను తాము చిత్రీకరించామని, ద్రోణులను కూడా వుపయోగించామని చెప్పాల్సిన అవసరం ఏముంది. దాడులు చేశాం అని మాత్రమే చెప్పి వుంటే సరిపోయేది కదా ? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన మాదిరి కాళిదాసు కవిత్వానికి స్వంతపైత్యం జోడించి నట్లు మిలిటరీ వినియోగించిన రాత్రుళ్లు చూడగలిగే పరికరాలు మా మచిలీపట్నంలోని బెల్‌లో తయారు చేశారని, ఆ ఫ్యాక్టరీని మరింత విస్తరించేందుకు మా చంద్రబాబు నాయుడు నిమ్మలూరులో మరో ప్లాంట్‌ ఏర్పాటుకు చర్య తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు సర్జికల్‌ దాడుల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించలేదా ? సర్జికల్‌ దాడుల రీత్యా సరిహద్దులలో పాక్‌ మిలిటరీ చర్యకు పూనుకోవచ్చంటూ వందలాది గ్రామాల నుంచి పౌరులను ఖాళీ చేయించటానికి, తరువాత ఆ కార్యక్రమాన్ని వుపసంహరించుకోవటానికి బాధ్యత ఎవరిది? దాడుల గురించి గుండెలు వుప్పొంగించుకోనవసరం లేదని జబ్బలు చరుచుకోవనవసరం లేదని ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారంటూ వచ్చిన వార్తలు కూడా పాక్‌ సృష్టే అంటారా ? సర్జికల్‌ దాడుల ఖ్యాతి అంతా మోడీకే దక్కాలని రాసిన మీడియా పెద్దమనుషులే రొమ్ములు విరుచుకోవనసరం లేదని ప్రధాని చెప్పినట్లు కూడా రాయటం మోడీ వ్యక్తిత్వాన్ని పెంచటంలో భాగమని సంతోషించి వుండవచ్చు. కానీ అవి సర్జికల్‌ దాడుల తీవ్రతను తగ్గించే సందేశాన్ని కలిగి వున్నాయని గ్రహించారా ? ఎవరు ఎవరి వలలో పడ్డారు.ఈ మొత్తం వుదంతం ఎలాంటి సందేశం ఇస్తున్నది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబ్బ ! అపర ‘దేశ భక్తుల’కు దిమ్మ తిరిగే భలే తీర్పు చెప్పారు కదా !!

30 Friday Sep 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

ABVP, fitting tribute to Rohit Vemula, HCU, Rohith Vemula, sfi, so called 'nationalists", University of Hyderabad (UoH), UoH, Vemula Rohit

ఎం కోటేశ్వరరావు

   రోహిత్‌ వేముల ఆత్మహత్య నేపధ్యంలో సెప్టెంబరు 28న జరిగిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘ ఎన్నికలలో సంఘపరివార్‌ శక్తులు, వారికి వంత పాడిన మీడియా చిత్రించిన ‘దేశద్రోహులు’ ఘన విజయం సాధించారు. అపర’ దేశ భక్తులు ‘గా చెప్పుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ, ప్రసార మాధ్యమాల నీరాజనాలు అందుకున్న ఏబివిపి అభ్యర్ధులు అన్ని స్ధానాలలో పరాజయం పాలయ్యారు. ఢిల్లీలోని లోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కూడా ఇదే ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక పరిణామం లేదా వుదంతంపై ఎవరైనా మైనారిటీ అయినా మెజారిటీ అయినా భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం, అలాంటి వారికి చెప్పే అవకాశం ఇవ్వాలన్న ప్రజాస్వామిక డిమాండ్‌ను బలపరిచే వారిని కూడా దేశద్రోహులుగా చిత్రిస్తున్న నిరంకుశ, ఫాసిస్టు ధోరణులు వ్యక్తమౌతున్నాయి. దేశమంతటినీ ఆకర్షించిన ఈ రెండు విశ్వవిద్యాలయాల విద్యార్ధుల ఆందోళనల పూర్వరంగంలో వచ్చిన ఈ ఫలితాల తరువాత అయినా భిన్నాభి ప్రాయం వ్యక్తం చేసే వారిని దేశద్రోహులుగా చిత్రించటం, వేధించటం మానుకుంటారా ?

     మానుకోరు అని గట్టిగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఆ రెండు విశ్వవిద్యాలయాల సమస్య కాదు. అంతకంటే లోతైనది. విద్యారంగంలో మనువాద భావజాలాన్ని రుద్దాలన్న తీవ్ర ప్రయత్నంతో పాటు వామపక్ష, ప్రజాస్వామిక భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలన్న అంతకంటే తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది. అందుకు నిదర్శనం హర్యానా కేంద్రీయ విశ్వవిద్యాలయ వుదంతం. మహాశ్వేతాదేవి రాజకీయ అభిప్రాయాలు, వైఖరితో అందరూ ఏకీభవించాలని లేదు. ఆమె రచనలలోని వస్తువుతో కూడా ఎవరైనా విబేధించవచ్చు. ప్రముఖ రచయిత్రులలో ఒకరు అన్న అభిప్రాయంతో మాత్రం విబేధించాల్సిన అవసరం లేదు.ఆమె రాసిన ‘ద్రౌపది’ కథ ఆధారంగా రూపొందించిన ఒక నాటికను హర్యానా విశ్వవిద్యాలయంలోని ఆంగ్లం మరియు విదేశీ భాషల విభాగం వారు ప్రదర్శించారు. జూలై 28న మరణించిన మహాశ్వేతాదేవి సంస్మరణగా సెప్టెంబరు 21న ఆ విభాగంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్నేహస్థ రూపొందించిన నాటికను ప్రదర్శించారు. ఆ నాటిక ప్రదర్శన తరువాత దేశంలో కాశ్మీర్‌తో సహా అనేక రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లు, గిరిజన యువతులపై జరుగుతున్న అత్యాచారాలు, సైనికుల అనుచిత చర్యల వివరాలను డాక్టర్‌ స్నేహస్ధ చదివి వినిపించారు. ఈ విషయం స్ధానిక పత్రికలలో వార్తగా వచ్చింది.1970 దశకంలో ఒక ఆదివాసీ మహిళ ప్రత్యేక పోలీసుల కస్టడీలో అత్యాచారానికి గురి కావటం కథాంశం. గిరిజనోద్యమ నాయకుల గురించి వివరాలు వెల్లడించాలని పోలీసులు కోరితే నిరాకరించిన యువతిపై అత్యాచారం జరిపి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించటం. దీనిలో సైనికుల గౌరవానికి భంగం కలిగించేలా వుందంటూ కొందరు మాజీ సైనికులు అభ్యంతరం చెప్పారు, వెంటనే ఎబివిపి, మరో విద్యార్ధి సంస్ధ ఇండియన్‌ నేషనల్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ నిరసన తెలుపుతూ ప్రదర్శనలు చేశాయి. నాటికలో పల్గొన్నవారిపై చర్య తీసుకోవాలని విశ్వవిద్యాలయం ముందు నిరసన తెలిపారు. ఒక సంఘర్ష సమితిని ఏర్పాటు చేసి ఛాన్సలర్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ప్రతిదానిని సంచలనాత్మకం చేసేందుకు ఎదురు చూసే మీడియా దీన్ని కూడా జెఎన్‌యు వుదంతంతో పోల్చి నాటికను ప్రదర్శించిన వారికి ‘జాతి వ్యతిరేకం’ ముద్ర తగిలించింది.

    భావ ప్రకటనా స్వేచ్చను కాపాడాల్సిన,సమర్ధించాల్సిన విశ్వవిద్యాలయ అధికారులలో ఒకరైన రిజిస్ట్రారు సెప్టెంబరు 22వ తేదీన కొన్ని బృందాలు తెలుపుతున్న అభ్యంతరాలను వుటంకిస్తూ ర్‌ స్నేహస్థ సైన్యానికి వ్యతిరేకంగా చేసినట్లు చెబుతున్న ఆరోపణపై రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ ఒక లేఖ రాశారు.దీనిపై దర్యాప్తు చేసేందుకంటూ వైస్‌ ఛాన్సలర్‌ ఒక ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం కూడా విడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిటీష్‌ వారు 1876లోనే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా నాటకాలు ప్రదర్శిస్తే వాటిని సెన్సార్‌ లేదా నిషేధించేందుకు నాటక ప్రదర్శనల చట్టం చేశారు. ఇన్నేండ్ల తరువాత విశ్వవిద్యాలయ అధికారుల తీరు చూస్తే అదే చట్టం ఇంకా అమలులో వున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం ఒక్కటే ఇక్కడ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు అధికారులుగా వుండటం తప్ప వేరు కాదు. రోహిత్‌ వేముల ఆత్మహత్య సందర్భంగా సంతాపం తెలుపుతూ కొంత మంది విద్యార్ధు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టగా ఈ విశ్వవిద్యాలయంలోని ఏబివిపి సభ్యులు వారిపై దాడి చేశారు, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

     ద్రౌపది నాటిక విషయానికి వస్తే జెఎన్‌యు, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాదిరి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రచారం చేసేందుకే ఒక పెద్ద కుట్రలో భాగంగా మారుమూల గ్రామీణ ప్రాంతంలో వున్న ఈ విశ్వవిద్యాలయంలో నాటికను ప్రదర్శించారని హర్యానా ఏబివిపి నేత ప్రమోద్‌ శాస్త్రి ఆరోపించారు. విశ్వవిద్యాలయాలు శాస్త్రవిషయాలు, పరిశోధనల కోసం ఏర్పాటు అయ్యాయని అలాంటి చోట ప్రతి అంశంపై చర్చలు జరపవచ్చని నాటికను రూపొందించిన స్నేహస్ధ సమర్ధించారు.ఆమె రాసిన నాటిక ప్రదర్శనకు అధికార యంత్రాంగం అనుమతించిందని, దానిలో చేసిన విమర్శకు ఎవరైనా సైనికుల మనోభావాలు గాయపడి వుంటే క్షమించాలని ఆ వివాదానికి స్వస్థిపలికేందుకు ప్రయత్నించారు. అయితే యురిలో సైనిక శిబిరంపై పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు జరిపిన దాడి, సైనికుల మరణం నేపధ్యంలో ఎబివిపి దీనిని సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించింది.

    ఢిల్లీ విశ్వవిద్యాలయ కాలేజీ లెక్చరర్‌ షైకత్‌ ఘోష్‌ హర్యానా విశ్వవిద్యాలయ వుదంతం గురించి వ్యాఖ్యానిస్తూ రెండు సంవత్సరాల క్రితం సంఘపరివార్‌ భావజాలాన్ని విమర్శిస్తూ తన దర్శకత్వంలో ‘వెల్‌కం టు మెషిన్‌ ‘ అనే నాటిక ప్రదర్శనను రెండు సంవత్సరాల క్రితం ఏబివిపి అడ్డుకున్నదని భావ ప్రకటనా స్వేచ్చను ఆటంకపరచటంలో భాగ మే ఇదన్నారు.

    ప్రజా వుద్యమాల అణచివేతలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరపటంలో పోలీసులు, పారా మిలిటరీ, సైనికుల తీరు తెన్నుల గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణా సాయుధ పోరాటం సందర్భంగా ఎందరో మానవతులను నిజాం పోలీసులు, రజాకార్లతో పాటు మలబార్‌ స్షెషల్‌ పోలీసులు, మిలిటరీ జరిపిన దారుణాలు చరిత్రలో నమోదయ్యే వున్నాయి. తరువాత కాలంలో కూడా అనేక వుద్యమాలు, ఆందోళనలు, పోరాటాల సందర్భంగా ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయి. వీటిని గురించి చెప్పటమంటే మొత్తం సైన్యం, పారామిలిటరీ, పోలీసులు అలాంటి వారని నిందించటం లేదా వారి సేవలను కించపరచటం కాదు. ప్రపంచంలో ప్రతిదేశంలో ప్రజా వుద్యమాలు, తిరుగుబాట్లను అణచటంలో పాలకవర్గానికి అత్యాచారం ఒక ఆయుధం. దానిని ప్రయోగించటంలో భారత పాలకవర్గమేమీ తక్కువ తినలేదు.

      చివరగా ఒక్క మాట ! ‘రోహిత్‌ చనిపోతే నేను వెళ్లలేదు… రకరకాల నేతలు పరామర్శకు వచ్చారు, నేను వెళ్లటం మంచిదా కాదా అన్న మీమాంసలో మౌనంగా వుండాల్సి వచ్చింది. ఏ సిఎం కూడా ఇలా జరగాలని కోరుకోడు’ :తమ పార్టీ అధికారానికి వస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కెసిఆర్‌  మాటలివి.

     అబ్బ ! భలే తెలివిగా చెప్పిండు కదా !! అని అప్పుడు ఆయన భక్తులెందరో ప్రశంసించారు. ఇప్పుడా రోహిత్‌ వేముల ఆత్మార్పణ అజెండాపైనే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బుధవారం నాడు జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో రోహిత్‌ వేముల అసలు దళితుడే కాదు, బిసి అంటూ సమస్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన సంఘపరివార్‌ శక్తులను మట్టి కరిపించి అక్కడి విద్యార్ధులు తిరుగులేని తీర్పు చెప్పారు. రోహిత్‌కు తగిన నివాళి ఇది. ఇప్పుడైనా రోహిత్‌ వేముల మరణం గురించి కెసిఆర్‌కు మీ మాంస తీరిందా? ఇంకా కొనసాగుతోందా? కొత్తది తలెత్తిందా ? అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా పాడు పొట్టకు అన్నమే వేతామురా , పోయినోడు ఎలాగూ పోయాడు, కేంద్రంలో బతికి వున్నవారితో తగాదా ఎందుకు ? పోనందుకు విమర్శలు ఎలాగూ రానే వచ్చాయి. నిండా మునిగిన వాడికి చలేమిటి ? అనుకుంటున్నారా !

     రోహిత్‌ మరణానికి కారకడని విద్యార్ధులు వేలెత్తి చూపుతున్న వైస్‌ ఛాన్సలర్‌, అతగాడిపై ఎస్‌సిఎస్‌టి అత్యాచారాల చట్టం కింద పెట్టిన కేసుపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోకపోవటానికి…. తస్సాదియ్యా ఇంకా పెద్దమ్మలా పట్టుకున్న మీ మాంస కొనసాగటమే కారణం కదా !

    నిజమే వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు మీద విద్యార్ధులు ఎస్‌ఎసిఎస్‌టి చట్టం కింద పెట్టిన కేసులో ముందుకు పోతే నరేంద్రమోడీతో ఒక పంచాయతీ, పోకపోతే విద్యార్ధులతో మరొక పంచాయతీ. మధ్యమానేరు నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ ఇళ్లు కట్టిస్తానని తెలియక వాగ్దానం చేశాను కనుక క్షమించమని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారు. రేపు మిగతా విషయాలలో కూడా ఇలాగే చెప్పి క్షమించమంటారేమో ? పాలకుల తెలివి తేటలకు కొదవలేదు, తవ్వినకొద్దీ వస్తూనే వుంటాయి ! పాలితులకే వెంటనే లైటు వెలగటం లేదా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్ర మోడీ ద్వంద్వ ముఖాలు

27 Saturday Aug 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

ancient science, his government works retrograde, India ancient science, Narendra Modi, narendra modi speaks forward, Science

కార్టూన్‌ హిందూ పత్రిక సౌజన్యంతో

ప్రధాని కబుర్లు 21వ శతాబ్దానివి, ప్రభుత్వ ఆచరణ వేద కాలానిది

ఎంకెఆర్‌

    పందొమ్మిదవ శతాబ్దపు యంత్రాంగ వ్యవస్ధ ద్వారా మనం 21వ శతాబ్దంలోకి పయనించజాలమని వర్తమాన భారత దార్శనికుడు ప్రధాని నరేంద్రమోడీ నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన ‘మారుతున్న భారత్‌ ‘ వుపన్యాసాల ప్రారంభసభలో చెప్పారు. అందుకు గాను చట్టాలతో పాటు, కాలయాపన పద్దతులను మార్చుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కోరారు. మార్పు విసురుతున్న సవాలును దేశం అధిగమించాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కితే చాలదు, పూర్తి రూపాంతరం చెందాలని కూడా చెప్పారు. దేశం వేగంగా మారాలి, అయితే ఆ అది ప్రభుత్వంలో మార్పు రాకుండా జరగదు, ఆలోచనా ధోరణిలో మార్పు రాకుండా ప్రభుత్వ తీరు మారదు, ఆలోచనా ధోరణిలో మార్పు రావాలంటే పరివర్తన ఆలోచనలు వుండాలని ప్రధాని చెప్పారు. ఇంకా ఇలాంటివే చాలా విషయాలను ప్రధాని తన వుపన్యాసంలో వుద్భోదించారు.

  మోడీ సర్కార్‌పై చేసే విమర్శలన్నీ దేశద్రోహం లేదా జాతి వ్యతిరేకం అని ఆయన భక్తులు ప్రకటించేయకుండా కాస్త నిదానించి వుపన్యాసాలలో ప్రబోధిస్తున్న అంశాలకు అనుగుణంగా ఆయన పాలన నడుస్తున్నదా అన్నది ఆలోచించుకోవాలి. నీతి అయోగ్‌ ఏర్పాటు చేసిన మారుతున్న భారత్‌ వుపన్యాస పరంపరలో తొలి వుపన్యాసం చేసిన సింగపూర్‌ వుప ప్రధాని షణ్ముగం చేసిన వ్యాఖ్యలు వింటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్ధితి.ఆయన చేసిన విమర్శలు గత పాలకుల పుణ్యమే అనటంలో ఎలాంటి సందేహం లేదు, కానీ నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో దానిని మార్చేందుకు చేసిందేమిటి అన్నదే కోటి రూకల లేదా మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అన్నం వుడికిందో లేదో చూడటానికి కుండలోని మెతుకులన్నింటినీ చూడనవసరం లేదు. నరేంద్రమోడీ అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ అమలు ఎంత హాస్యాస్పదంగా మారిందో చూశాము. ఆ పేరుతో వసూలు చేస్తున్న పన్ను ఏమౌతోందో తెలియదు, తొలి రోజుల్లో వీధులూడ్చిన అధికార పార్టీ, వివిధ రంగాల ప్రముఖులు రకరకాల ఫోజులతో తీయించుకున్న ఫొటోలు గోడలకు అలంకార ప్రాయంగా వేలాడటం తప్ప ఎక్కడా కనిపించటం లేదు. సింగపూర్‌ వుప ప్రధాని మాట్లాడుతూ పాఠశాల విద్య విషయంలో తూర్పు ఆసియా-భారత్‌ మధ్య చాలా పెద్ద అంతరం వుందని, నిజానికిదొక సంక్షోభం ఇదేమాత్రం సమర్ధనీయం కాదు, సమస్యను నిర్ధారించ వచ్చు, అయితే నిరంతరం బడ్జెట్లు పెంచుకుంటూ పోవటం ద్వారా కాకుండా మెరుగైన వ్యవస్ధ, సంస్కృతిని మనస్సులలో పట్టేట్లు చేయటం ద్వారా పరిష్కరించవచ్చన్నారు. ఇలాంటి విషయాలలో శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎంతగానో వుపయోగించుకోవచ్చు. మన దౌర్భాగ్యం ఏమంటే ఘనత వహించిన నరేంద్రమోడీగారి పాలనలో రెండు సంవత్సరాలుగా శాస్త్రీయ సలహా మండలి మూత పడిందంటే ఎన్ని కబుర్లు చెబితే మాత్రం వుపయోగం ఏముంది? దేశ ప్రగతి గురించి ఒంటరిగా తన నివాసంలో ప్రధాని ఒక్కరే కలలు కంటే సరిపోదు. మన ప్రధాని మంచి శాస్త్రీయ సలహాదారులను నియమించుకోవాలని ఈ ఏడాది జనవరిలో ప్రముఖ శాస్త్రవేత్త, భారత రత్న సిఎన్‌ఆర్‌ రావు సూచించారు. నరేంద్రమోడీకి ముందు మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా వుండగా శాస్త్రీయ సలహా మండలి అధిపతిగా ఆయన పని చేశారు.http://indianexpress.com/article/india/india-news-india/pm-modi-needs-good-scientific-advisers-cnr-rao/ మన జిడిపిలో కనీసం రెండు శాతం మొత్తాలను శాస్త్ర పరిశోధనలకు కేటాయించాలని ప్రధానులు సైన్స్‌ కాంగ్రెస్‌లలో చెప్పటం తప్ప 0.8 లేదా 0.9శాతానికి మించి కేటాయింపులు వుండటం లేదని రావు వేరే సందర్భంగా విమర్శించారు. నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ద్రవ్యోల్బణ రేటుకంటే తక్కువగానే కేటాయింపులను పెంచారు. ఆంటే నిజ విలువలో అంతకు ముందు కేటాయించిన మొత్తాలకంటే తగ్గిపోయాయి.

   పందొమ్మిదవ శతాబ్ది వ్యవస్ధ ద్వారా 21వ శతాబ్దంలోకి పయనించజాలమని మోడీ ఎంతో సముచితంగా చెప్పారు. అన్నీ వేదాల్లోనే వున్నాయష అనే కాలానికి చెందిన భావజాలానికి ప్రధానిగా మోడీ తొలిసారి మద్దతు ఇచ్చారు. ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా గణేషుడికి ఏనుగు తలను అతికించారని, తల్లి గర్బంతో నిమిత్తం లేకుండా కర్ణుడు పుట్టటాన్ని బట్టి వైద్యశాస్త్రం ఆ కాలంలోనే అంతగా అభివృద్ధి చెందినందుకు మనం గర్వపడాలని మోడీ చెప్పారు. అంతకు ముందు ముఖ్యమంత్రిగా వుండగా రాముడు తొలి విమానంలో ప్రయాణించాడని, మనకు పురాతన కాలంలోనే కణ శాస్త్రం తెలుసని స్కూలు పుస్తకాలకు రాసిన ముందుమాటలో రాశారు.

    ముంబైలో జరిగిన సైన్సు కాంగ్రెస్‌లో సంస్కృతంలో పురాతన శాస్త్ర విజ్ఞానం పేరుతో ఒక పూట మహారుషి భరద్వాజ వైమానిక శాస్త్రం గురించి, రైట్‌ సోదరుల కంటే ముందే మన పూర్వీకులు దేశ సరిహద్దులకు, ఖండాంతరాలకు ఎలా విమానాలు నడిపారు అనేదాని గురించి చర్చలు జరిపి కొంత మంది తమ జబ్బలను తామే చరుచుకున్నారు. పూర్వకాలంలో 40 ఇంజన్లున్న ఖండాంతర విమానాలను మన వారు నడిపారని, వేద కాలంలోనే వుపగ్రహాన్ని మన దేశం నుంచి నడిపారని, ఆ సమయంలో అక్కడ వదలి వచ్చిన ఒక హెల్మెట్‌ ఇప్పటికీ అక్కడే వున్నదని, అమెరికాలోని నాసా పరిశోధనలు కూడా దీనిని నిర్ధారించాయని, స్టార్‌ వార్స్‌ మన దేశంలో ఎప్పుడో జరిగాయని, శవాలు నీటిలో రోజుల తరబడి తేలియాడేవని, అవి వుబ్బిన తీరును బట్టి మరణించిన వారికి ఏం జరిగిందో కచ్చితంగా పూర్వీకులు చెప్పగలిగారని, అగస్త్య సంహితలో ఎలక్ట్రిక్‌ బ్యాటరీలను ఎలా తయారు చేసేవారో ప్రస్తావించారని వాటిని వేద బ్యాటరీలుగా పిలిచారని, ఆవు మూత్రంలో కొన్ని గింజలు, వేర్లను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని కాళ్లకు రాసుకొని తిరిగితే భూ గర్బ జలాలు ఎక్కడున్నాయో తెలిసేవని, రూపార్‌కాన రహస్య పేరుతో వున్న పరిజ్ఞానంతో రాడార్‌లు తయారు చేసేవారని, ఆహారాన్ని బంగారంగా మార్చే బాక్టీరియా గురించి తెలుసని, గణేషుడికి ఏనుగు తలను కుట్టటానికి బదులు పంచదార చల్లి అతికించారని ఇలాంటి అంశాలన్నింటినీ సైన్సు పేరుతో ముంబై సమావేశంలో నమ్మింప చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దాని కొనసాగింపుగా ఈ ఏడాది మైసూరులో జరిగిన సైన్సు కాంగ్రెస్‌లో మఢ్య ప్రదేశ్‌లో ప్రయివేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ కమిషన్‌ అధ్యక్షుడు అఖిలేష్‌ కె పాండే కైలాస పర్వతం మీద నుంచి శివుడు తన శక్తితో మానవాళికి స్వచ్ఛమైన నీటిని ఎలా సరఫరా చేస్తున్నారో చెబుతూ ఒక పత్రాన్ని సమర్పించారు. పర్యావరణ పరిరక్షణకు మన పూర్వీకులు ఎంతో కృషి చేశారని, దేవుడు శివుడి కుటుంబ సభ్యులు నెమలి, ఎలుక, ఎద్దులను ఎలా వాహనాలుగా వుపయోగించారో, వాటితో ఎలా సహజీవనం చేశారో నేటి తరాలకు వివరించే పయత్నం చేశారు.

   ఇదే సభలో కాన్పూరుకు చెందిన రాజీవ్‌ శర్మ ఒక పత్రం సమర్పించి శంఖువు వూదటం ద్వారా మానసిక, శారీరక రుగ్మతలను ఎలా నివారించ వచ్చో చూడండని చెప్పారు. ఇలాంటి పత్రాలన్నింటినీ సైన్సు కాంగ్రెస్‌ నిర్వాహకులు చర్చకు ఆమోదించటాన్ని బట్టి యథారాజా తధా అధికారగణ అన్నట్లుగా తయారైందని వేరే చెప్పనవసరం లేదు. సైన్సు కాంగ్రెస్‌ల ప్రహసనాన్ని చూసిన తరువాత నోబెల్‌ బహుమతి గ్రహీత వెంకట్రామన్‌ రామకృష్ణన్‌ మాట్లాడుతూ గతంలో జరిగిన సభలో ఒక రోజు నేను పాల్గొన్నాను, సైన్సు గురించి చాలా తక్కువగా మాట్లాడారు, అదంతా ఒక సర్కస్‌లా వుంది, మరోసారి నేను సైన్సు సభలకు రాను అని చెప్పారంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత సైన్సుకు పట్టిన గతేమిటో సుస్పష్టం. ఈ పూర్వరంగంలో శాస్త్ర పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించటం అనూహ్యం.

     గతంలోనే జ్యోతిష్యాన్ని ఒక కోర్సుగా ప్రవేశపెట్టారు, ఇప్పుడు వేదకాలంలో సైన్సు పేరుతో జనాన్ని నమ్మింప చూసే వారికి పెద్ద పీట వేస్తూ సంస్కృతంలో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ విశ్వవిద్యాలయాలను ముందుకు నడుపుతోంది. సంస్కృత గ్రంధాలు, పురాణాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా చరిత్రను తయారు చేసేందుకు సంఘపరివార్‌ కార్యకర్త యల్లా ప్రగడ సుదర్శనరావు నేతృత్వంలోని భారతీయ చరిత్ర పరిశోధన మండలి నిర్ణయించింది.ఒకవైపు ఇలాంటి తిరోగమన చర్యలకు శ్రీకారం చుట్టి మరోవైపు భవిష్యత్‌ గురించి మాట్లాడటం ఆత్మవంచన, పరవంచన తప్ప మరొకటి కాదు. అన్నీ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో వుంటే ఇతర దేశాలతో సాంకేతిక పరిజ్ఞానం గురించి ఒప్పందాలు చేసుకోవటమెందుకు ? ఆ టెక్నాలజీ వుపయోగించి పెద్ద ఎత్తున మేకిన్‌ ఇండియా కార్యక్రమం కింద తయారు చేసి అలా కనుమూసి ఇలా కనుతెరిచే లోపల పెట్రోలు, పైలెట్లు అవసరం లేని, ఎంత సరకు వేసి మరో టన్నుకు ఖాళీ వుండే వేద విమానాలలో ఖండాంతర దేశాలకు , పట్టణాలకు ఎక్కడకు కావాలంటే అక్కడకు వుచిత రవాణా చేసి మొత్తం ప్రపంచ మార్కెట్‌ను కొల్ల గొట్టకుండా ప్రధాని విదేశాలు తిరిగి పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టండి,ఎగుమతులు చేసుకోండి అని విదేశీయులను దేబిరించటమెందుకు ? ఇలా చేయటం మన ప్రాచీన భారత చరిత్ర, ఘనతకు అవమానమేమో ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d