• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Religious Intolarence

కమ్యూనిస్టు చైనా-కాథలిక్‌ మతం మధ్య చారిత్రాత్మక ఒప్పందం !

27 Thursday Sep 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

agreement between china and vatican, china and vatican, Chinese Catholics, historic agreement between china and vatican, Pope Francis

Image result for historic agreement between china and vatican

ఎం కోటేశ్వరరావు

ఒకవైపు వాటికన్‌తో చర్చలు మరోవైపు బుల్‌డోజర్లతో చైనా క్రైస్తవాన్ని అదుపు చేయాలని చూస్తున్నదనే శీర్షికతో న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రెచ్చగొట్టే ఒక విశ్లేషణ ప్రచురించింది. చైనాలో బిషప్పుల నియామకం గురించి అక్కడి ప్రభుత్వం-వాటికన్‌ చర్చి మధ్య సెప్టెంబరు 22న కుదిరిన తాత్కాలిక ఒప్పందం గురించి ప్రపంచ మీడియాలో, క్రైస్తవ మతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానిలో భాగమే ఇది. దేవుడు లేడని నమ్మే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంతో వున్నట్లు విశ్వసించే వాటికన్‌ ఒప్పందం చేసుకోవటం ఏమిటని అటు కమ్యూనిస్టులుగా వున్నవారు, ఇటు మతాన్ని పాటించే వారు దిగమింగలేకుండా వున్నారు. ఇదే సమయంలో ఆమోదించిన వారే ఎక్కువ అనేందుకు అసలు ఆ ఒప్పందం కుదరటమే నిదర్శనం. దాని ప్రకారం చైనాలో వాటికన్‌తో నిమిత్తం లేకుండా పని చేస్తున్న బిషప్పులను పోప్‌ ఆమోదిస్తారు. చైనా ప్రభుత్వ ఆమోదం లేని అనధికార బిషప్పులు కొందరు రాజీనామా చేస్తారు. ఇరు పక్షాలు కలసి రాబోయే రోజుల్లో కొత్త బిషప్పులను నియమిస్తాయి.

కొన్ని చోట్ల క్రైస్తవం కావచ్చు, మరికొన్ని చోట్ల ఇస్లాం, ఇతర మతాలు కావచ్చు. కాలక్రమంలో అంతరించాల్సిన మతాన్ని నిషేధాలు, అణచివేతల ద్వారా తెల్లవారే సరికి పరిష్కరించటం జరిగేది కాదు. సోషలిస్టు, కమ్యూనిస్టు వున్నత మానవాళి అవతరించినపుడే అది సాధ్యం. ఈ నేపధ్యంలో మతంతో సంబంధాలు అనేవి ప్రపంచ సోషలిస్టు, కమ్యూనిస్టు వుద్యమానికి ఎదురైన ఒక వాస్తవిక, పరిష్కారం కావాల్సిన సవాలు. దీనిని కమ్యూనిస్టు వుద్యమం విస్మరించజాలదు. సర్వేజనా సుఖినో భవంతు అన్న ఆశయాన్ని కమ్యూనిజం పుట్టక ముందే ప్రకటించారు. అది అమలు జరగలేదు గనుక ప్రకటించిన వారిని తప్పు పడతామా? సోషలిస్టు భావన కూడా అదే అయినప్పటికీ, అమలుకు ఒక కార్యాచరణను ప్రకటించటమే దాని ప్రత్యేకత. అందువలన దాని అమలులో తలెత్తే సమస్యలను పరిష్కరించటం వాస్తవికత.

ప్రపంచంలో అనేక చోట్ల మతాన్ని ఒక ఆయుధంగా చేసుకొని తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు దోపిడీ శక్తులు తీవ్రంగా ప్రయత్నించటాన్ని మనం చూస్తున్నాం. దానిలో భాగమే మతవిద్వేషాలను రెచ్చగొట్టటం. చైనా-వాటికన్‌ మధ్య ఒక ఒప్పందం కుదిరింది అంటే అర్ధం అక్కడ మత సమస్య పరిష్కారమైందని కాదు. సోషలిస్టు వ్యవస్ద నిర్మాణబాటలో ఎదురయ్యే అనేక ఆటంకాలను తొలగించుకుంటూ పోవటం తప్ప దగ్గరదారి లేదు.దానిలో భాగమే ఇది అని చెప్పవచ్చు. ఇది సరైనదా కాదా అన్న విషయం మీద ఇప్పటికిప్పుడు తీర్పు చెప్పటం సాధ్యం కాదు. సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించేందుకు, దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా కమ్యూనిస్టులు అలాంటి శక్తులను సహించరు. చైనా కమ్యూనిస్టు పార్టీ అందుకు మినహాయింపు అనుకోజాలం.

చైనాలో క్రైస్తవం మైనారిటీ మతం. ఎంత మంది దాన్ని అవలంభిస్తున్నారన్నది స్పష్టంగా తెలియదు. మీడియాలో వచ్చే అంకెలు పొంతన లేకుండా వున్నాయి. ఒప్పందం గురించి సహజంగానే ఎవరికి వారు ఏమి చెప్పుకున్నప్పటికీ చైనాలోని చర్చ్‌లపై వాటికన్‌ పోప్‌ అధికారాన్ని పరిమితంగానే అయినా కమ్యూనిస్టు ప్రభుత్వం గుర్తించటం, మత వ్యవహారాలలో ప్రభుత్వాల పాత్రను అంగీకరించం అనే వాటికన్‌ తన వైఖరిని సడలించుకోవటం ఒక చారిత్రక ముందడుగు. క్రైస్తవంతో సహా ఏమతమైనా సామాన్యుల బాధలు, గాధల పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చింది తప్ప వాటిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోరాడేవారిని నిర్వీర్యం చేసేందుకు మతాన్ని ఒక మత్తు మందుగా పాలకవర్గాలు ప్రయోగించాయి. ప్రధమ శ్రామికవర్గ రాజ్యం సోవియట్‌లో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని, ప్రపంచం మొత్తంగా కమ్యూనిస్టు భావజాలాన్ని క్రైస్తవం వ్యతిరేకించింది. సామ్రాజ్యవాదంతో చేతులు కలిపింది. అందువల్లనే సోవియట్‌ యూనియన్‌ వునికిలో వున్నంత కాలం వాటికన్‌తో అధికారిక సంబంధాలు లేవు. అదొక అపరిష్కృత సమస్యగానే వుండిపోయింది.

క్రైస్తవంలో తలెత్తిన సంస్కరణ, ఇతర వుద్యమాల కారణంగా అనేక మొత్తం మీద ఏసును ప్రభువుగా గుర్తిస్తూనే మత కర్మకాండల విషయంలో భిన్న ధోరణులు, పలు చర్చి సమూహాలు వునికిలోకి వచ్చాయి. వాటికి పాలకవర్గాల మద్దతు లభించింది తప్ప ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఎవరికి ఇష్టమైన చర్చిని వారు అనుసరించారు. దేవుడి వునికిని అంగీకరించని, రాజ్యానికి మతానికి సంబంధం వుండకూడదని కోరుకొనే కమ్యూనిస్టులు పాలకులుగా వచ్చిన తరువాత సరికొత్త సమస్య తలెత్తింది. అప్పటి వరకు తమలో తాము ఎంతగా కుమ్ములాడుకున్నప్పటికీ కమ్యూనిజం తమ వునికినే వ్యతిరేకిస్తున్న కారణంగా ముందుగా దాన్ని వ్యతిరేకించాలంటూ అన్ని రకాల చర్చ్‌లు ఏకమయ్యాయి. వాటి కుట్రలను ఎదుర్కొంటూనే సోషలిస్టు దేశాలన్నీ తమ పౌరులకు మత స్వేచ్చను ఇచ్చాయి. సోషలిస్టు వ్యవస్ధను కూల్చేందుకు ప్రయత్నించే ఇతర శక్తులతో సమంగా మతశక్తులనూ చూశాయి, చూస్తున్నాయి. కమ్యూనిస్టులు బిషప్పుల నియామకంలో వాటికన్‌ ఏకపక్ష పెత్తనం చైనా గడ్డమీద చెల్లదని ప్రభుత్వం రుజువు చేసిందని, రహస్య కార్యకలాపాలను నిర్వహించే అనధికార చర్చ్‌లను మూసివేయటానికి తోడ్పడుతుందని మరోవాదన.ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొందరు బిషప్పులను బాధ్యతల నుంచి తొలగించేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఈ ఒప్పందం చేసుకున్నప్పటికీ దానికి చైనా నాయకత్వం పెద్ద ప్రచారం కల్పించదలచలేదు, ఒక సాదాసీదా వ్యవహారంగానే చూడాలని నిర్ణయించినట్లు అధికార మీడియాలో క్లుప్తంగా వార్తలు ఇచ్చిన తీరే నిదర్శనం.

కొన్ని నెలల క్రితం చైనా లక్షణాలతో కూడిన మత కార్యకలాపాలు వుండాలనే ప్రచారానికి చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ శ్రీకారం చుట్టారు. చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్దను నిర్మించాలనే లక్ష్యం కలిగిన చైనా రాజ్యాంగానికి కట్టుబడే అన్ని మతకార్యకలాపాలుండాలని నిబంధనలు చెబుతున్నాయి.దానికి భిన్న మైన వైఖరి వ్యక్తమైన చోట్ల సరి చేసేందుకు, చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు వెనుకాడటం లేదు. దీన్ని వ్యతిరేకించే శక్తులు వాటిని చిలవలు పలవలుగా పెంచి ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఇలాంటి ఒప్పందం కుదుర్చుకొనేందుకు సముఖత వ్యక్తమైనప్పటి నుంచీ గత మూడు సంవత్సరాలుగా పని గట్టుకొని ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముస్లింలను లక్షలాది మందిని శిబిరాలలోకి చేర్చి బలవంతంగా పందిమాంసం తినిపిస్తున్నారని, సాంప్రదాయ దుస్తులు వేసుకోరాదని, బురఖాలు, గడ్డాలను తీసివేయాలని వత్తిడి చేస్తున్నారని, క్రైస్తవ చర్చ్‌లను కూల్చివేస్తున్నారని, శిలువల ప్రదర్శనలను అనుమతించటం లేదని, మత కేంద్రాలలో పార్టీ పెత్తనాన్ని ఆమోదించాలని, కమ్యూనిస్టు నాయకుల ఫొటోలు పెట్టాలని వత్తిడిచేస్తున్నారంటూ రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయా దేశాల వారు చైనాను ప్రశ్నించరేమని రెచ్చగొడుతున్నారు. మన దేశంలో నిత్యం ఇస్లాం, క్రైస్తవ మతాల మీద విద్వేషం రెచ్చగొట్టి, దాడులకు పాల్పడే శక్తులు కూడా మొసలి కన్నీరు కారుస్తూ తమ చైనా వ్యతిరేక ప్రచారానికి దీన్ని వాడుకుంటున్నాయి. టిబెట్‌ బౌద్ధ మతాధికారి దలైలామా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటు చేసి పారిపోయి మన దేశంలో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తించేందుకు నిరాకరిస్తున్న దలైలామా సామ్రాజ్యవాదుల చేతిలో పావుగా మారి చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. మన ప్రభుత్వం టిబెట్‌ను చైనా అంతర్బాగÛంగా గుర్తిస్తున్నప్పటికీ దలైలామాకు ఆశ్రయం ఇవ్వటం గమనించాల్సిన అంశం. దలైలామా నియమించే మతాధికారులకు చైనాలో గుర్తింపు లేదు. దలైలామా కూడా చైనా రాజ్యాంగాన్ని ఆమోదించి, టిబెట్‌ను అంతర్భాంగా అంగీకరిస్తే తిరిగి చైనాలో ప్రవేశించేందుకు అభ్యంతరం వుండకపోవచ్చు.నేరాలేమైనా వుంటే రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.

Image result for historic agreement between china and vatican

‘ నేడు పోప్‌ ప్రతినిధి సింహద్వారం నుంచే బీజింగ్‌ వెళ్ల వచ్చు. రహస్య సంప్రదింపులు ఇంకేమాత్రం అవసరం లేదు. అయితే అధికారిక ఒప్పందం పోప్‌ను, చైనా కాథలిజం గౌరవాన్ని గుర్తించిందని’ వాటికన్‌తో దగ్గరి సంబంధాలున్న ఇటలీ మాజీ మంత్రి ఆండ్రియా రికార్డీ ఒప్పందం గురించి వ్యాఖ్యానించాడు. దీంతో చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు ఇంతకాలం ఒక దేశంగా వాటికన్‌ ఇచ్చిన గుర్తింపు రద్దయినట్లే. ఈ ఒప్పందం గురించి పశ్చిమ దేశాలలో చైనా వ్యతిరేక మీడియా ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. అరెస్టులు, నిర్బంధాలకు గురై రహస్యంగా మతకార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని ఫణంగా పెట్టి ఈ ఒప్పందం ద్వారా చైనా ప్రభుత్వానికి వాటికన్‌ అమ్ముడు పోయిందని, తోడేళ్లకు మేకలను బలిపెట్టినట్లయిందని హాంకాంగ్‌ మాజీ కార్డినల్‌ జోసెఫ్‌ జెన్‌ విషంగక్కాడు. చైనాలో ఎంత మంది బిషప్పులున్నారన్నది ఒక సమస్య. వాటికన్‌ లెక్క ప్రకారం 145 మంది వుండగా, చైనా లెక్కలో 96 వున్నట్లు హాంకాంగ్‌లోని ఒక సంస్ధ పేర్కొన్నది.

చైనా ప్రభుత్వ గుర్తింపుతో పని చేస్తున్న కాథలిక్‌ సంస్ధలు ఒప్పందాన్ని స్వాగతించాయి. దేశాన్ని, మతాన్ని ప్రేమించే సాంప్రదాయానికి తాము కట్టుబడి వున్నామని దానికి సోషలిస్టు సమాజమే మార్గమని, స్వతంత్రంగా పని చేయాలనే సూత్రాన్ని పాటిస్తామని చైనీస్‌ పేట్రియాటిక్‌ కాథలిక్‌ అసోసియేషన్‌(సిపిసిఏ), బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ కాథలిక్‌ చర్చ్‌ ఇన్‌ చైనా( బిసిసిసిసి) తమ ప్రకటనల్లో పేర్కొన్నాయి. మొదటి సంస్ధ 1957లో ఏర్పడగా, రెండవ సంస్ధ సాంస్కృతిక విప్లవం తరువాత 1980లో ఏర్పడింది. ఆ కాలంలో అన్ని మతాలను రద్దు చేయాలనే విపరీత ధోరణి కొందరు నేతల్లో వ్యక్తమైన విషయం తెలిసినదే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం బహిరంగంగా మతకార్యకలాపాలు నిర్వహించటం, కట్టడాలు నిర్మించటం, సాహిత్యం అమ్మటం తదితర అంశాలపై కొన్ని ఆంక్షలున్నాయి. వాటి మేరకు అనుమతి లేని చర్చ్‌లను కూల్చివేయటాన్ని మొత్తం చర్చ్‌లు కూల్చివేయటంగా పశ్చిమ దేశాల మీడియా వక్రీకరించింది.

ఈ ఒప్పందం గురించి కాథలిక్‌ న్యూస్‌ సర్వీస్‌ ప్రకటించిన విశ్లేషణలోని అంశాలు ఇలా వున్నాయి. ఇప్పుడు కావలసింది ఐక్యత, విశ్వాసం, ఒక నూతన ప్రేరణ. గతంలో వున్న అపోహలు, ఇటీవలి వుద్రిక్తతలతో సహా గతంలో తలెత్తిన వాటిని అధిగమించాలని వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పారోలిన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. బిషప్పుల నియామకం, పని వాటికన్‌-చైనా సంబంధాలలో ఒక ముఖ్యమైన ఆటంకం. బిషప్పులను పోప్‌ నియమించాలని వాటికన్‌ పట్టుబడుతుండగా, అలా చేయటం తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని చైనా భావించింది. ప్రభుత్వం ఆమోదించిన మత సంస్ధలు నియమించిన బిషప్పులను అనుసరించటానికి కొందరు కాథలిక్కులు తిరస్కరించారు. అనేక మందిని స్ధానికంగానే ఎన్నుకున్నారు,అయినప్పటికీ వారు పోప్‌కు విధేయత ప్ర కటించారు. చైనాలో బిషప్పుల నియామకం పూర్తిగా తమ అదుపులోనే వుండాలని తాము ఆశించటం లేదని, ముందు అక్కడి వారికి స్వేచ్చ, భద్రత కోరుకుంటున్నామని వాటికన్‌ అధికారులు ఎల్లపుడూ చెబుతూనే వున్నారు.

తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం బిషప్పుల నియామక ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఒప్పంద ప్రతిని వాటికన్‌ విడుదల చేయలేదు. ఒప్పందానికి ముందు వచ్చిన వార్తల ప్రకారం బిషప్పుల నియామకానికి ఒక ప్రక్రియను రూపొందిస్తారు. భవిష్యత్‌లో జరిగే నియామకాలకు సబంధించి డయోసిస్‌ పరిధిలోని వారితో ప్రజాస్వామిక ఎన్నికల పద్దతి ద్వారా బిషప్పులను ఎన్నుకుంటారు. ఫలితాలను పరిశీలనకు ప్రభుత్వానికి అంద చేస్తారు, వాటి నుంచి జాబితాను అధికారికంగా పోప్‌కు పంపుతారు. ప్రభుత్వం, పోప్‌ కూడా జాబితాలోని వారిని వీటో చేయవచ్చు. ఎన్నిక సక్రమంగా జరిగిందా లేదా అన్నది పోప్‌ దర్యాప్తు చేయవచ్చునని జెసూట్‌లు నడిపే అమెరికన్‌ మాగజైన్‌ తెలిపింది. వీటో జరిగినపుడు చైనా-వాటికన్‌ ప్రతినిధులు సంప్రదింపుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నిస్తారు, సాధ్యం కానపుడు చైనా మరోపేరును ప్రతిపాదిస్తుంది. అంతిమ నిర్ణయం పోప్‌దిగానే వుంటుంది. ఈనెల 20వ తేదీన ఒప్పందంపై సంతకాలకు ముందు కార్డినల్‌ పారోలిన్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఇది ఒక ముందుడుగు అని భావిస్తున్నాం ఇక నుంచి అంతా సులభంగా జరిగిపోతుందని అనుకోవటం లేదు, అయితే ఇది మాకు సరైనదారి అనిపించింది అన్నారు. ఇది మతపరమైనది తప్ప రాజకీయమైంది కాదని ఒప్పందం గురించి వాటికన్‌ మీడియా డైరెక్టర్‌ గ్రెగ్‌ బుర్కే వ్యాఖ్యానించారు.

ఏ దేశంలో ఏ మత చరిత్ర చూసినా అది పాలకవర్గాల ఆయుధంగా వుంది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవోద్యమం కొనసాగిన కాలంలో మెజారిటీ చర్చి అధికారులు దానికి వ్యతిరేకంగా వున్నారు, వ్యతిరేకులతో చేతులు కలిపారు, విదేశాలకు వెళ్లిపోయారు తప్ప సామాన్య జన పక్షాన లేరు, దోపిడీ నుంచి వారు విముక్తికావాలని కోరుకోలేదు. అందువలన సహజంగానే కమ్యూనిస్టు పార్టీ కూడా దానికి అనుగుణ్యంగానే వ్యవహరించింది. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిగతా సామ్రాజ్యవాదుల మాదిరే వాటికన్‌ కూడా ఆ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంది. శత్రువులతో చేతులు కలిపిన అనేక మంది విదేశీ చర్చి ప్రతినిధులను చైనా దేశం నుంచి పంపివేసింది. స్ధానికంగా వున్న వారిని కొంత మంది మీద విచారణ జరిపి దోషులుగా చేరిన వారి మీద చర్య తీసుకుంది. తరువాత అక్కడి మతాభిమానులు చైనా దేశభక్త కాధలిక్‌ అసోసియేషన్‌ పేరుతో బిషప్పులతో సహా పూజారులను నియమించుకొని కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. మతంపై కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదు, కొందరు ప్రచారం చేసినట్లు ఒక్క చర్చిని కూడా కూల్చలేదు. ఈ పూర్వరంగంలో ఏడు దశాబ్దాల తరువాత చైనా-వాటికన్‌ మధ్య ఒప్పందం కుదరటం చారిత్రాత్మకమే.

ఈ ఒప్పందం గురించి కరడుగట్టిన మతవాదులు, అలాగే కొందరు విపరీత అభ్యుదయ వాదులు కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయటం సహజమే. వందలు, వేల సంవత్సరాలుగా వేళ్లూనుకున్న మత భావనలను తెల్లవారే సరికి పోగొట్టగలమని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. మతం మత్తు మందు అని నమ్మేకమ్యూనిస్టులు ఒక మతంతో రాజీ పడటం ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కమ్యూనిస్టులు చైతన్యంతో ఒక అడుగు ముందుండాలే తప్ప జనాన్ని వదలి దూరంగా వుంటే లాభం లేదు. మతం మత్తు మందు అని తాము నమ్మితే చాలదు, ఇంకా దాని మత్తులో వున్న విస్తార జనంలో దాన్ని వదిలించాలి. అంతిమ లక్ష్యమైన సోషలిస్టు సమాజ నిర్మాణానికి వర్గశత్రువుతో ఎలాగూ పోరాటం చేయక తప్పదు. మతాన్ని నమ్మిన సామాన్యులందరూ సోషలిజానికి శత్రువులు కాదు. ప్రతి దేశంలో ఏదో ఒక మతాన్ని అనుసరించే శ్రమజీవులే కదా కమ్యూనిస్టుల నాయకత్వాన విప్లవాలను జయప్రదం చేసింది. సామాన్యులందరూ మతోన్మాదులే అయితే ఇది సాధ్యమయ్యేదా? ఆ లక్ష్యాన్ని దెబ్బతీయటానికి మతాన్ని ఆయుధంగా చేసుకొనేశక్తులను అనుమతించకుండా, సామాన్యులను శత్రువులుగా చేసుకోకుండా ఎత్తుగడగా అయినా కొంత కాలం మతంతో రాజీపడటం వాస్తవానికి దగ్గరగా వుంటుంది. రాజీ వేరు లంగిపోవటం వేరు. హేతు, భౌతిక వాదాన్ని ఫణంగా పెట్టి మతాన్ని సంతృప్తి పరచటం వేరు. చైనా సర్కార్‌ చర్యలో అలాంటిదేమీ కనిపించటం లేదు. మతానికి సంబంధించి తన విధానాన్ని నవీకరించుకున్న తరువాతే ఈ పరిణామం జరిగింది.

రాజీ, సర్దుబాటు అన్నది అటు కమ్యూనిస్టు చైనాకు, ఇటు క్రైస్తవ వాటికన్‌కు రెండింటికీ అవసరం అయ్యాయనవచ్చు. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ వర్గంతో కలసి క్రైస్తవులను సోషలిజం, కమ్యూనిస్టు వ్యవస్దలకు వ్యతిరేకంగా నిలబెట్టేందుకు చర్చి నిరంతరం ప్రయత్నిస్తున్నది. తూర్పు ఐరోపా, సోవియట్‌ వ్యవస్ధల కూల్చివేతలకు పోప్‌ రెండవ జాన్‌ పాల్‌ సామ్రాజ్యవాదులతో చేతులు కలిపారన్నది బహిరంగ రహస్యం. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతలో ఇతర అనేక అంశాలతో పాటు కాథలిక్‌ చర్చి జోక్యం ముఖ్యంగా పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి బయటకు తెలిసినదాని కంటే చైనా కమ్యూనిస్టుపార్టీకి ఇంకా వివరంగా తెలుసన్నది వేరే చెప్పనవసరం లేదు.

తదనంతరం కాలంలో పశ్చిమ దేశాల మీడియా చైనాలో క్రైస్తవులను అణచివేస్తున్నారని, దాంతో రహస్యంగా ప్రార్ధనలు చేసే వారు పెరుగుతున్నారని పశ్చిమ దేశాల మీడియాలో ఒక పధకం ప్ర కారం ప్రచారం ఎక్కువైంది.కమ్యూనిస్టులు మతాన్ని నిషేధించరు, అణచివేయరు, స్వేచ్చను ఆటంక పరచరు అని లోకానికి తెలియటం అవసరం. తైవాన్‌ను ఒంటరి చేయాలంటే వాటికన్‌తో దౌత్య సంబంధాలను పునరుద్దరించుకోవటం ఒక మార్గం. ఈ పూర్వరంగంలో తెలివైన వారెవరైనా ప్రధాన అంశాల మీద కేంద్రీకరించి, మిగతావాటి మీద సర్దుబాటుకు ప్రయత్నిస్తారు. చైనా నాయకత్వం కూడా అదే చేసినట్లు కనిపిస్తోంది. తాను ఒక మెట్టుదిగి చైనా సర్కార్‌ ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే లాభం లేదని వాటికన్‌ కూడా అనుభవంలో తెలుసుకుంది. ఏదో ఒక పరిష్కారం కుదుర్చుకొనేందుకు చొరవ చూపాలనే వత్తిడి కూడా క్రమంగా పెరిగింది. ఇదీ నేపధ్యం. ఈ ఒప్పందం కుదరటానికి పశ్చిమ దేశాల మీడియా లేదా మరికొందరు వర్ణిస్తున్నట్లు కమ్యూనిస్టు పోప్‌ ఫ్రాన్సిస్‌ కారణం అనుకుంటే పొరపాటు. ఆయన హయాంలో ప్రయత్నాలు వేగవంతం అయితే అయి వుండవచ్చుగానీ సర్దుబాటు లేదా రాజీకి పునాది పోప్‌ బెనెడిక్ట్‌-16 హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఒక అంగీకారానికి రావటం ఇరు పక్షాలకూ కత్తిమీద సాము వంటిదే. పోప్‌ 16వ బెనెడిక్ట్‌ హయాంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వాటికన్‌ విదేశాంగశాఖ మంత్రిగా వున్న ఆర్చిబిషప్‌ పిట్రో పారోలిన్‌ 2009లోనే తన ప్రయత్నాలను ప్రారంభించారని, చైనాతో ఒక అవగాహనకు వచ్చారని మిలన్‌ కాథలిక్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ అగొస్టినో జివాంగ్నోలీ చెప్పారు. ఆ ఏడాదే పారోలిన్‌ వెనెజులాకు వాటికన్‌ ప్రతినిధిగా వెళ్లారు.అయితే తరువాత ఎలాంటి పురోగతి లేదు. 2013లో పోప్‌ ప్రాన్సిస్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే అధ్యక్షుడిగా ఎన్నికైన జింపింగ్‌కు అభినందనలు పంపారు. తరువాత ఒక పోప్‌ ప్రయాణించే విమానాన్ని తొలిసారిగా తన భూభాగం మీదుగా అనుమతించి పోప్‌ ఫ్రాన్సిస్‌ దక్షిణ కొరియా పర్యటనకు చైనా అవకాశమిచ్చింది. ఆ వెంటనే అర్జెంటీనా రాజకీయవేత్త రికార్డో రోమనో ద్వారా ఒక లేఖ పంపిన పోప్‌ తాను చైనా నాయకుడితో చర్చలకు ఆహ్వానం పంపారు. ఆ తరువాత చైనా నూతన సంవత్సరం సందర్భంగా జీకి శుభాకాంక్షలు పంపారు. మెక్సికో నుంచి రోమ్‌ వెళుతూ విమానంలో విలేకర్లతో మాట్లాడిన పోప్‌ తాను చైనా సందర్శనను నిజంగా ప్రేమిస్తానని బహిరంగంగా చెప్పారు.2014లో రోమ్‌లో వుభయ ప్రతినిధులు సమావేశమయ్యారు. చైనాతో చర్చలు కొనసాగించి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని పోప్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఒక అధికారి రెండు సంవత్సరాల క్రితమే రాయిటర్స్‌ వార్తా సంస్ధకు చెప్పారు. ఆ తరువాత ప్రతినిధి వర్గాల సమావేశాలు, తాజా ఒప్పందానికి దారి తీశాయి.

చైనా కమ్యూనిస్టు పార్టీ హేతువాద, భౌతికవాద దృక్పధం కలిగింది. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం అధికారయుతంగానే బౌద్ధం,తావో, ఇస్లాం, క్రైస్తవంలో ప్రొటెస్టెంట్‌, కాథలిక్‌ మతాలను గుర్తించి రాజ్యాంగ పరిధిలో మతారాధన, అవలంబన స్వేచ్చ హక్కులను ఇచ్చింది. మతం పేరుతో తమ దేశంలోని వారిని విదేశాలలో వున్న వారు అదుపు చేసే లేదా మార్గదర్శనం చేయటాన్ని అంగీకరించటం అంటే అదొక ముప్పుగా భావించింది. అందుకే కొన్ని పరిమితులు, పరిధిని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో వున్న మతాలలో ఒక్క కాథలిక్‌ మతానికే ప్రపంచ కేంద్రం వుంది. అందువలన దాన్ని అవలంభించేవారు దాని ఆదేశాలు, మార్గదర్శనం కోసం ఎదురు చూస్తారు. మతపరంగా దానికే విధేయులై వుంటారు. చైనా విప్లవ కాలం, కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత వాటికన్‌ నియమించిన మతాధికారులు మొత్తం మీద కమ్యూనిస్టుల వునికి, విప్లవం, ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించారు. సోవియట్‌ యూనియన్‌లోని కొన్ని రిపబ్లిక్‌లలోని అతి పెద్దదైన రష్యా, ఇతర చోట్ల కాథలిక్‌ చర్చి ఆధిపత్యాన్ని అంగీకరించని ఆర్ధొడాక్‌ చర్చ్‌ ప్రభావం ఎక్కువ. అది కూడా సోషలిజాన్ని వ్యతిరేకించింది, తరువాత రాజీపడి కొనసాగింది. 1989లో సోవియట్‌ చివరి రోజులలో గోర్బచెవ్‌ నాటి పోప్‌ను తొలిసారిగా సోవియట్‌ నేత హోదాలో కలిశారు. తరువాత రెండు సంవత్సరాలకే దాన్ని కూల్చివేశారు.

వాటికన్‌తో ఒప్పందం విషయంలో చైనా నాయకత్వంలో కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. పద్దెనిమిది సంవత్సరాల క్రితం హాంకాంగ్‌, మకావో దీవులు చైనాలో విలీనమయ్యాయి. ప్రజాస్వామ్యం పేరుతో హాంగాంగ్‌లో నిర్వహిస్తున్న చైనా వ్యతిరేక ఆందోళనలో స్దానిక కాథలిక్‌ అధికారులు, ఇతర విదేశీ మిషనరీల పాత్ర సుపరిచతం. చర్చలు ప్రారంభమైన తరువాత కూడా హాంకాంగ్‌ మాజీ బిషప్‌ జోసెఫ్‌ జెన్‌ వంటి వారు తమ చైనా వ్యతిరేకతను దాచుకోలేదు. అందువలన పోప్‌ను నమ్మవచ్చా, ఒప్పందం కుదిరిన తరువాత చైనా అంతర్గత వ్యవహారాలలో వాటికన్‌ జోక్యం చేసుకోకుండా వుంటుందా? మతభావనలు మరింతగా పెరిగే అవకాశాలేమైనా వుంటాయా; అప్పుడేమి చెయ్యాలి? అనే తర్జన భర్జనలు జరగకపోలేదు. వాటన్నింటి తరువాతే ఒప్పందం కుదిరింది. విదేశీ పెట్టుబడులకు,సంస్థలకు ద్వారాలు తెరిచినపుడు సంస్కరణలకు ఆద్యుడు డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. గాలి కోసం కిటికీ తెరిచినపుడు దానితో పాటు హాని కలిగించే క్రిమి కీటకాలు కూడా ప్రవేశిస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో తెలుసు అన్నారు. ఇప్పుడు వాటికన్‌తో ఒప్పందం విషయంలో కూడా అదే జాగ్రత్తలతో చైనా నాయకత్వం వుంటుందని ఎందుకు అనుకోకూడదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మాజీ ప్రధాని వాజ్‌పేయిపై మీడియాలో అతిశయోక్తులు !

20 Monday Aug 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

AB Vajpayee, BJP, RSS

Image result for ab vajpayee, govindacharya

ఎం కోటేశ్వరరావు

మాజీ ప్రధాని ఏబి వాజ్‌పేయి దేశ రాజకీయ చరిత్రలో ఏ రకంగా చూసినప్పటికీ ఒక ప్రముఖుడనటం నిర్వివివాదాంశం. స్ధానిక, జాతీయ మీడియా సహజంగానే, అందునా కేంద్రంలో, రాష్ట్రాలలో వున్న ప్రభుత్వాలకు భయపడి లేదా భక్తితో గానీ భారీగానే ఆయన మరణవార్తలకు చోటు కల్పించింది. కేంద్ర సర్కార్‌ తీసుకున్న చర్యల వలన తన ఆదాయం రెట్టింపు అయిందని చత్తీస్‌ ఘర్‌ రాష్ట్ర రైతు మహిళ ఒకరు చెప్పిన అంశాన్ని నరేంద్రమోడీ పెద్ద ఎత్తున తన ప్రచారానికి వినియోగించుకున్నారు. అదెంత బూటకమో బయట పెట్టిన ఎబిపి న్యూస్‌ ఛానల్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌, మరొక జర్నలిస్టులను రాజీనామా చేసి బయటకు పోయే విధంగా యాజమాన్యం వత్తిడి తెచ్చింది. దీని వెనుక కేంద్ర అధికార పార్టీ పెద్దల బెదిరింపులున్నాయన్నది బహిరంగ రహస్యం. తమ నేత వాజ్‌పేయి మృతికి తగినంత చోటు కల్పించలేదని ఆ పెద్దలు కినుక వహిస్తే… ఎందుకులే తంటా అని గావచ్చు లేదా వాజ్‌పేయి అంటే మీడియా యాజమాన్యాలకు వున్న భక్తి కావచ్చు.

వాజ్‌పేయి ఒక మాజీ ప్రధాని, అటువంటి వ్యక్తి మరణించినపుడు రాజకీయాలతో నిమిత్తం లేకుండా విచారం వెలిబుచ్చటం, నివాళి అర్పించటం ఒక సంస్కారం. అలా చేయటమంటే ఆయన రాజకీయాలను, ఇతర అంశాలన్నింటితో ఏకీభవించటం అని కానే కాదు. కమ్యూనిస్టు పార్టీలు సంతాప ప్రకటనలు చేయటాన్ని సామాజిక మాధ్యమంలో తప్పుపడుతూ, వ్యంగోక్తులు విసురుతూ కొందరు వ్యాఖ్యానాలు చేశారు. వాజ్‌పేయి రాజకీయ జీవితంలో వున్న ప్రతికూలతల కారణంగా ఆయన మరణానికి విచారం ప్రకటించకపోవటం ఒక విప్లవ చర్య అనే అర్ధం వచ్చేట్లుగా కొందరి తీరు వుంది. అలా అయితే హిట్లర్‌ మరణానికి కూడా సంతాపం ప్రకటించాలి కదా అనే తీరులో స్పందించారు కొందరు. దాని గురించి వదిలేద్దాం. వాజ్‌పేయికి సంతాపం ప్రకటించిన సిపిఐ(ఎం) ప్రకటన పూర్తి పాఠం ఇలా వుంది.(The Polit Bureau of the Communist Party of India (Marxist) expresses its grief at the death of former Prime Minister Shri Atal Behari Vajpayee.Shri Vajpayee had a distinguished political career in parliament, in government and as Prime Minister of India.As a political leader he commanded respect of all sections.) ‘మాజీ ప్రధాని శ్రీ అతల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. ప్రధానిగా ప్రభుత్వంలోనూ, పార్లమెంటులోనూ వాజ్‌పేయి విలక్షణ రాజకీయ వురవడి కలిగినవారు. ఒక రాజకీయవేత్తగా అన్ని తరగతుల మెప్పు పొందారు.’ ఈ మాత్రపు ప్రకటన కూడా చేయకూడదని ఎవరైనా అనుకుంటే వారి అది వారికున్న స్వేచ్చ.

దేశ రాజకీయాలలో వాజ్‌పేయి పాత్ర గురించి మరణించిన సమయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం గురించి సామాజిక మాధ్యమంలో కొంతమంది పరివార్‌ అభిమానులు, కానివారు కూడా అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బతికి వున్నపుడు, చురుకుగా రాజకీయాల్లో వున్నపుడు కూడా ఆయన గురించి తీవ్ర విమర్శలు చేసినపుడు కూడా ‘అభిమానులు’ పై మాదిరే వ్యవహరించారు.బిజెపికి వాజ్‌పేయి ఒక ముసుగు అని వర్ణించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత వేత్త కెఎన్‌ గోవిందాచార్య గురించి తెలిసిందే. వాజ్‌పేయి మరణం సందర్భంగా దాని గురించి మాట్లాడుతూ తాను చెప్పిన మాటను ఒక తరగతి మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. బిజెపిలో వాజ్‌పేయి బహుళ ఆదరణ కలిగిన వారు, అత్యధికులు ఆమోదించే ముఖ రూపసి అని చెప్పానని అయితే ముఖ రూపసి బదులు ముసుగుగా మార్చారని గోవిందాచార్య అన్నారు. ఆ వుదంతంతో గోవిందాచార్య బిజెపి, రాజకీయాలలో కూడా చోటును కోల్పోయారు.
చరిత్రలో హిట్లర్‌ను కూడా నిస్సిగ్గుగా సమర్ధించేవారున్నారు. చరిత్రలో బతికి వున్నపుడు, మరణించిన తరువాత తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొనని రాజకీయనేతలు బహు కొద్ది మంది. అలాంటి వారిలో వాజ్‌పేయి లేరు. కొంత మంది తమ అభిమాన రాజకీయ నేతల విషయంలో అతిశయోక్తులను ముందుకు తెస్తారు. పని గట్టుకొని ప్రచారం చేస్తారు. వాజ్‌పేయి విషయంలోనూ అదే జరుగుతోందా ?

ఆగస్టు 17వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికలో 1942.. ఏ లవ్‌ స్టోరీ పేరుతో ఒక వార్త వచ్చింది. దాని సారాంశం ఇలా వుంది. 1942లో గ్వాలియర్‌ విక్టోరియా కాలేజీలో వాజ్‌పేయి తన సహాధ్యాయిని ప్రేమించి దాన్ని బహిరంగంగా చెప్పలేక ప్రేమలేఖ రాసి పుస్తకంలో పెట్టి ఆమెకు ఇచ్చారు. రెండు మూడు రోజులు గడిచినా ఏ స్పందనా లేకపోవటంతో తన లేఖను ఆమె చూడలేదని అనుకున్నారు. అయితే ఆమె కూడా అంగీకరిస్తూ రాసిన లేఖను అదే పుస్తకంలో పెట్టి వాజ్‌పేయికి ఇద్దామనుకున్నారు. ఆ సమయంలో వ్యక్తిగత కారణాలతో వాజ్‌పేయి ఢిల్లీ వెళ్లినందున ఆ లేఖ ఆయనకు చేరలేదు. తమ ప్రేమ గురించి రాజకుమారి తలిదండ్రులకు చెప్పినా శాఖాబేధం కారణంగా వారు అంగీకరించలేదు. ఆమెకు 1947లో ఢిల్లీలో హడావుడిగా నిశ్చితార్ధం చేయించి ఆ తరువాత గ్వాలియర్‌ తీసుకువచ్చి పెళ్లి చేశారు. ప్రేమ విఫలం కావటంతో వాజ్‌పేయి పెళ్లి చేసుకోకుండా రాజకీయాలకు అంకితమై పోయారు. కొన్నాళ్ల తరువాత ఢిల్లీలో వాజ్‌పేయి అమెని కలిశారు. తరువాత వారింటికి తరచూ వెళ్లే వారు. భర్త చనిపోయిన తరువాత రాజకుమారి ఆయన అధికార నివాసానికి మకాం మార్చారు. వాజ్‌పేయితోనే వుండిపోయారు.’

అనేక మంది రాజకీయ నేతల మాదిరే వారి సంబంధం గురించి అనేక కధనాలు గతంలోనే వెలువడ్డాయి. వాటి మీద వాజ్‌పేయి స్పందించిందీ లేనిదీ తెలియదు. నాకు ఎక్కడా దొరకలేదు. ఆగస్టు 19నాటి ఈనాడు పత్రికలో వాజ్‌పేయీ స్వీయ నిర్బంధం ! అనే శీర్షికతో ఒక వార్తను బాక్సు కట్టీ మరీ ప్రచురించారు. దాని సారాంశం ఇలా వుంది. పెళ్లి అనే రెండు అక్షరాలకూ వాజ్‌పేయి బహుదూరం. వివాహానికి దూరంగా వుండిపోతే జీవితాన్ని జాతికి అంకితం చేసే వీలుంటుందన్నదే వాజ్‌పేయి అభిమతం అని ఆయన సన్నిహిత మిత్రుడు దివంగత గోరేలాల్‌ త్రిపాఠీ తనయుడైన విజయ ప్రకాష్‌ చెప్పారు. తొలి నుంచీ బ్రహ్మచర్య జీవితాన్నే ఇష్టపడేవారు. ఆయన పీజీ చేసే రోజులలో తలిదండ్రులు ఆయన వివాహం గురించి అనుకోవటం ఆయన చెవిన పడింది. కల్యాణమంటే విరక్తి పెంచుకున్న వాజ్‌పేయి కాన్పూర్‌లోని మిత్రుడి ఇంటిలో ఒక గదిలోకి వెళ్లి మూడు రోజులు తనను తాను బంధించుకున్నంత పని చేశారు.’

ఆంధ్రజ్యోతి వార్త ప్రకారం వాజ్‌పేయి ఒక భగ్న ప్రేమికుడు. ప్రేమికురాలు రాజకుమారి భర్త చనిపోయిన తరువాత ఆమె తన నివాసాన్ని వాజ్‌పేయి ఇంటికి మార్చి నాలుగు సంవత్సరాల క్రితం మరణించే వరకు అక్కడే వున్నారు. అందువలన పై రెండు వార్తలనూ పక్కపక్కనే పెట్టుకొని చదివితే పాఠకుడు గందరగోళంలో పడిపోతాడు. వాజ్‌పేయి గురించి ఈనాడు అతిశయోక్తులు రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వాజ్‌పేయి గురించి గతంలో పత్రికల్లో, మరణించిన తరువాత సామాజిక మాధ్యమంలో జరిగిన చర్చలో 1942లో క్విట్‌ ఇండియా వుద్యమంలో అరెస్టయి అప్రూవర్‌గా మారి చెప్పిన సాక్ష్యంతో కొంత మందికి శిక్షలు పడ్డాయనే అంశం. ఆయన మరణించిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించటం ఏమిటి? ఆయన బతికి వుండగా విమర్శిస్తే సమాధానం చెప్పటమో, సరిదిద్దుకోవటమో చేసే వారు కదా అని కొంత మంది సామాజిక మాధ్యమ చర్చల్లో అభిప్రాయపడ్డారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్ర వుద్యమానికి దూరం. అలాంటి సంస్ధలో 1939లోనే చేరిన వాజ్‌పేయి 1942లో క్విట్‌ ఇండియా వుద్యమంలో ఎలా పాల్గొన్నారు. ద్రోహం చేసినట్లు, కోర్టులో అంగీకరించిన ప్రకటన వలన ఆయన బయటపడినా కొందరికి శిక్షలు పడటం గురించి నిజా నిజాలేమిటి? దీనికి సంబంధించి ఫ్రంట్‌లైన్‌ పక్షపత్రిక 1998 ఫిబ్రవరి 7-20వ తేదీ సంచికలో ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. వాజ్‌పేయిని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తెచ్చే క్రమంలో ఆయనకు స్వాతంత్య్రవుద్యమంలో పాల్గన్న నేపధ్యం వుంది అని చెప్పేందుకు గాను సంఘపరివార్‌, బిజెపి తాపత్రయ పడింది, వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారని ప్రచారం చేశారు. చివరికి వాజ్‌పేయి కూడా స్వయంగా తాను క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొన్నట్లు చెప్పుకున్నారు. ఇక్కడే చిక్కువచ్చింది. ఇరవై ఒక్క రోజులు జైలులో వున్న తరువాత ఒక పత్రం రాసి ఇచ్చి బయటపడ్డారు. అయితే తాను ఎలాంటి పత్రం రాయలేదని, బ్రిటీష్‌ వారికి లొంగిపోలేదని వాదించారు. చివరకు మీడియా పరిశోధనలో వెల్లడైన అంశాల కారణంగా తాను పత్రంపై సంతకం చేసిన మాట నిజమే అని ఫ్రంట్‌లైన్‌ ప్రతినిధులతో అంగీకరించారు. 1942 సెప్టెంబరు ఒకటవ తేదీన ఆగ్రా జిల్లా సెకెండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు వుర్దూలో రాసిన పత్రంపై వాజ్‌పేయి ఆంగ్లంలో సంతకం చేశారు. దాదాపు అలాంటిదానినే ఆయన సోదరుడు ప్రేమ్‌ బిహారీ వాజ్‌పేయి కూడా మెజిస్ట్రేట్‌కు అంద చేశారు. ఇంతకీ ఎబి వాజ్‌పేయి రాసిచ్చిన పత్రంలో ఏముంది?

నా పేరు : అతల్‌ బిహారీ , తండ్రిపేరు : గౌరీ శంకర్‌, నా కులం: బ్రాహ్మణ, వయస్సు : 20, వృత్తి : విద్యార్ధి గ్వాలియర్‌ కాలేజి, చిరునామా : బాతేష్వర్‌, పిఎస్‌ బా, జిల్లా ఆగ్రా

మీరు దహనకాండకు పాల్పడ్డారని, నష్టపరిచారని చెబుతున్నారు, దీనికి సంబంధించి మీరేమి చెబుతారు. అన్న న్యాయూర్తి ప్రశ్నకు ‘ 1942 ఆగస్టు 27న బాతేష్వర్‌ బజార్‌లో ఆలా గానం నిర్వహిస్తున్నారు. సాయంత్రం రెండు గంటల సమయంలో కకువా అనే లీలాధర్‌ మరియు మహువా ఆలా దగ్గరకు వచ్చి ఒక వుపన్యాసం ఇచ్చి అటవీ చట్టాలను వుల్లంఘించాలని కోరారు. రెండువందల మంది జనం ఫారెస్ట్‌ ఆఫీసుకు వెళ్లారు, నేను నా సోదరుడు జనాన్ని అనుసరించాము బటేష్వర్‌ అటవీ కార్యాలయానికి చేరుకున్నాము. నా సోదరుడు, నేను కిందనే వున్నాము, జనం పైకి వెళ్లారు. నాకు కకువా మరియు మహువా తప్ప అక్కడున్నవారిలో మరే ఇతర వ్యక్తి పేరూ తెలియదు. ఇటుకలు కిందికి పడుతున్నట్లు నాకు కనిపించింది. గోడను ఎవరు పడగొడుతున్నారో తెలియదు కానీ గోడ ఇటుకలు మాత్రం పడుతున్నాయి. నేను నా సోదరుడితో కలసి మెయిపురా వెళ్లేందుకు బయలుదేరాము, జనం మా వెనుక వస్తున్నారు.పైన పేర్కొన్న వ్యక్తులు పశువుల శాల నుంచి మేకలను బలవంతంగా బిచికోలీ వైపు మళ్లించారు. అటవీ కార్యాలయంలో పది పన్నెండు మంది వున్నారు. నేను వంద అడుగుల దూరంలో వున్నాను. ప్రభుత్వ భవనాన్ని పడగొట్టటానికి నేను ఎలాంటి సాయం చేయలేదు. ఆ తరువాత మేము ఇండ్లకు వెళ్లాము.’

ఈ పత్రంపై అతల్‌ బిహారీ వాజ్‌పేయితో పాటు మెజిస్ట్రేట్‌ ఎస్‌ హసన్‌ కూడా సంతకాలు చేశారు. శిక్షా స్మృతి సెక్షన్‌ 164కింద ఈ ప్రకటనను నమోదు చేశారు. ఆ పత్రం మీద మెజిస్ట్రేట్‌ చేత్తో కింది విధంగా రాసి సంతకం చేశారు.

అతనెలాంటి తప్పు చేయలేదని గౌరీశంకర్‌ కుమారుడైన అతల్‌ బిహారీకి నేను వివరించాను, ఒకవేళ చేసి వుంటే ఏ తప్పయినా చేస్తే దానిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యంగా పరిగణిస్తామని చెప్పాను. ఈ విషయాలు అతను స్వచ్చందంగా వెల్లడించినట్లు నేను నమ్ముతున్నాను.ఇది నా సమక్షములో తీసుకున్నది, అతల్‌ బిహారికి చదివి వినిపించబడినది, దానిలో తాను చెప్పిన అంశాలే పూర్తిగా వున్నాయని, సరైనవే అని అతను అంగీకరించాడు.

కోర్టులో చేసిన ఈ ప్రకటనను బట్టి వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొనలేదు. ఆందోళనకారుల వెనుక వున్నందున ఆయనను కూడా అరెస్టు చేశారు. ఆ రోజు జరిగినదానితో తనకేమీ సంబంధం లేదని స్పష్టంగా చెప్పినందున తరువాత కేసు నుంచి ఆయన బయట పడ్డారు. నిజమైన స్వాతంత్య్ర సమర యోధులందరూ పోలీసులు, కోర్టుల ముందు తాము బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పాల్గొన్నట్లు వీరోచితంగా ప్రకటనలు చేసి చెరసాలలు, వురికొయ్యలకు తమ జీవితాలను అంకితం చేశారు. జైలు జీవితాలు, చిత్రహింసలను భరించలేని సావర్కర్‌ వంటి వారు లొంగిపోయి బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటామని, విధేయతతో వుంటామని లేఖలు రాసి బయట పడ్డారు. ఇక వాజ్‌పేయి కోర్టులో చేసిన ప్రకటనలో తన పేరు ప్రస్తావించినందున సాక్ష్యంగా చెప్పకపోయినా తన శిక్షకు కారణం అది కూడా ఒకటని కకువా అనే లీలాధర్‌ అభిప్రాయపడ్డారు. దాన్నే కాంగ్రెస్‌ నాయకులు ప్రచారంలో పెట్టి వాజ్‌పేయి లొంగుబాటు కారణంగా స్వాతంత్య్ర సమర యోధులకు శిక్షలు పడ్డాయని ప్రకటనలు చేశారు. చాలా కాలం పాటు వాజ్‌పేయి క్విట్‌ ఇండియా వుద్యమంలో పాల్గొన్న సమర యోధుడని చేసిన ప్రచారం అవాస్తవమని తేలింది. తాను పాల్గొనలేదని, జరిగినదానితో జరిగినదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా కోర్టులో ప్రకటన చేశారు. వాజ్‌పేయి గానీ మరొక నేత గానీ ఎవరి గురించి అయినా అతిశయోక్తులు ప్రచారం చేసుకోవటానికి కొందిరికి ఎలా స్వేచ్చ వుంటుందో విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించటానికి కూడా ఎవరికైనా అలాంటి స్వేచ్చే వుంటుంది. ఎవరూ చరిత్ర విశ్లేషణలు, విమర్శలకు అతీతులు కాదు. అది సభ్య సమాజం ఆమోదించిన పరిమితులకు లోబడి వుండాలి. సానుకూలంగా లేదా ప్రతికూలంగా చేసే విమర్శలు లేదా ఆరోపణలకు ఆధారాలు చూపగలిగి వుండాలి. మేం చెప్పింది మా నమ్మకం, విశ్వాసం, ఇతరులు మా మనోభావాలను దెబ్బతీస్తున్నారంటే కుదరదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రేమతో ఆవుల బహుమతి: నరేంద్రమోడీ ర్వాండా గో మాంస ప్రియుల సంతుష్టీకరణ దౌత్యం !

26 Thursday Jul 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ Leave a comment

Tags

cows, Girinka, Girinka Programme, Modi, Modi gifts 200 cows, Rwanda

ఎం కోటేశ్వరరావు

విదేశీ పర్యటనల సమయంలో లేదా విదేశీ అతిధులు మన దేశాన్ని సందర్శించినపుడు మన ప్రధాని నరేంద్రమోడీ అందచేసే బహుమతుల గురించి ఒక పెద్ద పరిశోధనే చేయవచ్చునంటే అతిశయోక్తి కాదు. ఆయన రూటే వేరు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ఆవులతో కూడా దౌత్యనీతిని ప్రదర్శించవచ్చని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన రాజనీతిజ్ఞుడిగా కూడా చరిత్రకెక్కారు. దేశంలో మోడీ మాతృసంస్ధ సంఘపరివార్‌, దాని అనుబంధ రాజకీయ, ఇతర సంస్ధల కార్యకర్తలందరూ ‘గోరక్షణ కర్తవ్యం పేరుతో’ ముస్లింలపై మూకదాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. గోరక్షణకు కంకణం కట్టుకున్నానని నమ్మబలుకుతున్న నరేంద్రమోడీ దేశ ప్రజల అదృష్టం లేదా ఖర్మకొద్దీ ప్రధానిగా వున్నందున ప్రస్తుతానికి గోరక్షణ కార్యక్రమాలలో పాల్గనే అవకాశాలు లేవు. విదేశీ అతిధులు మన దేశానికి వచ్చినా, నరేంద్రమోడీ విదేశీ పర్యటనలు జరిపినా పురుష నేతల భుజాలపై చేతులు వేయటం లేదా కౌగలించుకొని ఎంతో ఆత్మీయతను ప్రదర్శించటం తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశంలో పాల్గనేందుకు దక్షిణాఫ్రికా వెళుతూ దానితో పాటు కోటీ 20లక్షల జనాభా వున్న ర్వాండా అనే దేశాన్ని సందర్శించిన మోడీ అక్కడి వారికి 200 ఆవులను బహుమతిగా ఇచ్చి ఇటు జాతీయంగా ప్రతిపక్షాల వారిని అటు అంతర్జాతీయంగా తామే తిరుగులేని తలపండిన పెద్ద దౌత్యవేత్తలమని విర్రవీగుతున్న వారిని కూడా ఆశ్చర్యపరుస్తూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పకతప్పదు. ర్వాండా అధ్యక్షుడికి గోవుల పంపిణీ ఇష్టమని మనసెరిగి గోపాలుడి అవతారమెత్తిన నరేంద్రమోడీ ఒక గ్రామానికి ప్రత్యేకంగా వెళ్లి కార్యక్రమంలో పాల్గని ఆ దేశాధ్యక్షుడిని పడేశారు.

మోడీ ప్రయాణించే విమానంలో మన దేశం నుంచి గోవులను రవాణా చేయటం కుదరదు, ఇక్కడి హిందూ గోమాతలు ఆఫ్రికా వాతావరణానికి సరిపడతాయో లేదో తెలియదు, అన్నింటికీ మించి అక్కడి క్రైస్తవ, ముస్లిం ఆచార వ్యవహారాలతో సరిపడక వాటి మనోభావాలు దెబ్బతినవచ్చు. సంకరంతో వ్రతం చెడవచ్చు. అందువలన ఎవరి మనోభావాలకు దెబ్బతగుల కుండా స్ధానికంగా దొరికే మెజారిటీ క్రైస్తవ గోమాతలనే కొనుగోలు చేయించి వాటిని అక్కడి వారికి బహుమతిగా ఇచ్చి ర్వాండాతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు ప్రయత్నించారు. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్రకెక్కారు.

ర్వాండా పేదల సంక్షేమ పధకాలలో భాగంగా గిరింకా పేరుతో అధ్యక్షుడు పాల్‌ కగామే ఆవుల పంపిణీ పధకం చేపట్టినట్లు మోడీ సర్కార్‌ తెలుసుకుంది. అందువలన దానికి సంబంధించిన బహుమతి ఇచ్చి అక్కడి ప్రభుత్వాన్ని ఆకట్టుకోవచ్చని మోడీ సలహాదారులు భావించి వుండాలి.ఆవుల పంపిణీ కార్యక్రమంపై ర్వాండా అధ్యక్షుకి స్వయంగా ఆసక్తి వున్నందున దానిలో మన దేశం కూడా భాగస్వామి కావటం ప్రాముఖ్యత సంతరించుకుందని విదేశీ వ్యవహారాల ఆర్ధిక సంబంధాల కార్యదర్శి టిఎస్‌ తిరుమూర్తి విలేకర్లతో స్వయంగా చెప్పారు. దాని ఫలితమే ఆవుల బహుమతి. ర్వాండాతో సోదర, సౌహార్ధ్ర సంబంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

గిరింకా పధకం ప్రకారం ప్రభుత్వం పేదలకు ఆవులను బహుమతిగా ఇస్తుంది. వాటిని పొందిన వారు సదరు ఆవులకు పెయ్య దూడలు పుడితే వాటిని పొరుగు పేదలకు బహుమతిగా ఇవ్వాలి. ఇలా మూడున్నరలక్షల ఆవులను పంపిణీ చేయాలని అధ్యక్షుడు నిర్ణయించాడు. ఆవుల పధకంతో కుటుంబాలకు అవసరమైన పాలతో పాటు వ్యవసాయానికి కావాల్సిన ఎరువు సమకూరుతుంది, వట్టిపోయిన తరువాత ఆవులను, కోడెదూడలను మాంసానికి వినియోగిస్తారు కావున పోషకాహారలేమితో బాధపడుతున్న దేశంలోని పిల్లలకు దానిని సరఫరా చేయాలన్నది ఆ పధక లక్ష్యం. ర్వాండా జనాభాలో అత్యధికులు క్రైస్తవులు. వారి ఆహారంలో గొడ్డు మాంసం ముఖ్యమైనది. మనకు ప్రతి వూరిలో హోటల్‌లో ఇడ్లీ, దోసె దొరికినట్లుగా అక్కడ అది దొరుకుతుంది.

గో గూండాలు మరోమారు విజృంభించి మరొకరి ప్రాణం తీసిన వుదంతం మీడియాలో ప్రముఖంగా వచ్చిన తరుణంలోనే మోడీ గో దౌత్యం గురించి కూడా ఆ వార్తలతో పాటు దీన్ని చదువుకున్నాం గోవధను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నిషేధించారు, దేశమంతటా అమలు చేయాలని హిందూత్వ శక్తులు పట్టుబడుతున్న తరుణంలో దానికి అనుగుణంగానే గో గూండాలు చెలరేగుతున్నారు. మూక హత్యలు పెరిగిపోతున్నాయి. అలాంటి దేశానికి అసలు సిసలైన ప్రతినిధిని అని చెప్పుకుంటున్న మోడీ గొడ్డు మాంసం లేనిదే ముద్ద దిగని దేశంలో ఆవులను బహుమతిగా ఇవ్వటంపై గో అభిమానులే పరిహాసాలాడుతున్నారు.కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు అన్నట్లు పేటెంట్‌ కలిగి వుండకపోయినా గోవుల స్వంతదారుల మాదిరి ప్రవర్తిస్తున్నవారు ఏం చేసినా తప్పులేదని ఎవరైనా వాదించినా ఆశ్చర్యం లేదు.

‘ బుగెసెరాలో ఏర్పాటవుతున్న అతి పెద్ద గోమాంస(పరిశ్రమ) కబేళాకు ప్రేమతో 200 గోవులను బహుమతిగా ఇచ్చిన నరేంద్రమోడీ ‘ అన్నది వాటిలో ఒకటి. పన్నెండు వేల ఎకరాల విస్తీర్ణంలో గోవులు, ఇతర పశుసంపదను పెంచి, వాటి నుంచి మాంసం వుత్పత్తి చేసేందుకు ఒక పెద్ద పరిశ్రమ బుగెసెరా అనే చోట దశలవారీ ఏర్పాటు అవుతున్నది. దానికి దేశాధ్యక్షుడు పాల్‌ కగామే అనుమతి ఇచ్చారు. ఏటా 1200 గోవులతో ప్రారంభమై 2018నాటికి మూడువేల స్ధాయికి పెంచనున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఒక్కో ఆవు నుంచి 160కిలోల మాంసం తయారవుతుంది. దేశం మొత్తంలో 2015లో 86వేల టన్నులుగా వున్న వుత్పత్తిని 2018 నాటికి 2,30,000 టన్నులకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రతి పశువును 120 రోజులు బాగా మేపి తరువాత కబేళాకు తరలిస్తారు. గో మాంస ఎగుమతులకు బుగెసెరాలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా వినియోగించుకుంటారు. గోవులను పెంచేందుకు, కబేళాల ఏర్పాటుకు ప్రభుత్వమే భూములను కౌలుకు ఇస్తుంది.

‘ మోడీ ర్వాండాకు 200 గోవులను బహుమతిగా ఇవ్వటం కొంత గందరగోళం కలిగిస్తోంది. ఆ దేశంలో ప్రతి చోటా ఆవులు వుండాలని ఆరు కోరుకుంటారు, ప్రత్యేకించి భోజన బల్లల మీద, త్వరిత గతిన దూకే గోరక్షక దళాన్ని ఏర్పాటు చేయాల్సి రావచ్చు, వారిని తెల్లవారే సరికి పారా చూట్ల ద్వారా దించటాన్ని నేను చూడగలను’

‘ గోరక్షకులందరికీ సామూహిక అప్రమత్త సందేశం, ర్వాండాలో ఈ ఆవులను రక్షించేందుకు దయచేసి వెళ్లండి, వెళ్లండి, ఇప్పుడే వెళ్లండి’ ‘ ర్వాండాకు రెండువందల ఆవులను తరలిస్తున్న స్మగ్లర్‌ కనిపించాడు.’ ‘ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రెండు ఆవులను తరలిస్తున్న ఒక వ్యక్తిని వధించారు, మరొక వ్యక్తి 200 ఆవులను భారత్‌ నుంచి ర్వాండాకు తరలిస్తున్నట్లు నేను ఇప్పుడే విన్నాను. అయితే అతనికేమీ కాకూడదని ఆశిస్తున్నాను, అతని కోసం నేను ప్రార్ధిస్తాను.’ ‘200 ఆవులను ర్వాండాకు స్మగ్లింగ్‌ చేస్తున్నందుకు యునెస్కో మోడీకి అతి పెద్ద ఆవుల స్మగ్లర్‌ అనే అవార్డు ఇచ్చింది. వావ్‌ మోడీ వావ్‌, ప్రియమైన భక్తులారా మన ప్రధానిని వధించవద్దు, ఎందుకంటే ఆయన భాగీదారు తప్ప చౌకీదారు కాదు ‘

మాంసం కోసం లేత ఆవులు, కోడె దూడలను వధించటం, అతిధులకు దానిని వడ్డించటం ఒక మర్యాదగా మన దేశంలో ఒకప్పుడు విలసిల్లింది. మా మనోభావాలను గాయపరిచారనే పేరుతో పుక్కిటి పురాణ పాత్రలను విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఆవు పేరుతో ఎలాంటి తప్పు చేయని ఒక మనిషిని మూకదాడిలో చంపితే తోటి మనుషుల మనోభావాలు దెబ్బతినకపోగా మరింతగా జరగాలని ప్రోత్సహిస్తున్నవాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇది సామూహిక వున్మాదం తప్ప వ్యక్తిపరమైన సమస్య కాదు.వ్యక్తికి, ఇంటికి పరిమితం చేయాల్సిన దేవుడు, దేవతలను ఓట్లకోసం వీధుల్లోకి తెచ్చారు. దాని కొనసాగింపుగానే ఆవును గోమాతను, దేవతను చేశారు. ఓట్ల కోసం మన దేశంలో ఆహారం కోసం గోవును వధించకూడదని నానా రాద్దాంతం చేస్తున్న వారు, మరో దేశంలో మార్కెట్‌, పెట్టుబడుల కోసం పడుతున్న పాట్లలో భాగంగా అక్కడ గోవులను తింటారని, ఆ దేశాధ్యక్షుడికి గోపంపిణీ అంటే ప్రీతి అని తెలిసి గోవులనే బహమతులుగా ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ మనోభావాలు ఏమైనట్లు? ప్రతిదానికీ మా మనోభావాలు గాయపడ్డాయంటూ నానా యాగీ చేస్తున్న వారు ఇప్పుడేమంటారు? ఇప్పుడేం చేస్తారు? ప్రాణ, విత్త, మానభంగములందు ఆడి తప్పవచ్చు అని మినహాయింపులిచ్చినట్లుగానే పెట్టుబడిదారులు, వ్యాపారుల లాభాల కోసం వధిస్తారని తెలిసీ నరేంద్రమోడీ గోవులను బహుమతిగా ఇచ్చినపుడు, జీవనోపాధికోసం తప్ప వధించటానికి కాదు మేము గోవులను కొనేదీ అమ్మేదీ అని నెత్తీ నోరు కొట్టుకుంటున్న ముస్లింల గోడును ఆయన అనుయాయులు, మద్దతుదారులు ఎందుకు పట్టించుకోరు? మోడీ మాదిరి మనోభావాలకు అతీతంగా వ్యవహరించలేరా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

శూద్ర కులాలను రామాయణం ఎందుకు అవమానించింది ?

09 Monday Jul 2018

Posted by raomk in Communalism, Current Affairs, INDIA, Literature., Opinion, RELIGION

≈ Leave a comment

Tags

Ramayana epic, shudras, why ramayana epic insults shudras

Image result for why ramayana epic insults shudras

డాక్టర్‌ కదిరె కృష్ణ

ఈనెల 7వ తేదీన ప్రముఖ రచయిత వనం జ్వాలా నరసింహారావు ”వాల్మీకి బోయవాడేనా?” అన్న శీర్షికతో నవ తెలంగాణలో అచ్చయిన నా వ్యాసానికి స్పందిస్తూ ”వాల్మీకి రామాయణంలో ఏముంది?” శీర్షికన మరో వ్యాసం రాశారు. వాల్మీకిని బోయవాడుగా ఎందుకు చేశారు? అనే నా ప్రశ్నకి సమాధానం అన్నట్టు రామాయణం రాసినవాడు బోయవాడా? బ్రాహ్మణుడా అనే కంటే ఆయన రామాయణంలో ఏముంది? అది ఎందుకు అవశ్యపఠనీయం? అనే దృష్టితో పటిస్తేకానీ దానిలోని తత్వం బోధపడదు అంటూ సెలవిచ్చారు. దరిమిలా రామాయణాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేశాను. నా అజ్ఞానాన్ని మరోసారి రామాయణ పారాయణంతో కడిగేసుకుందామనీ కృషిచేసాను. లాభంలేకపోయింది! తిరిగేసి మర్రేసి చదివినా నరసింహరావుగారు అన్న మంత్ర పూతం, ఉపనిషత్‌ సారం, అంత:కరణ శుద్ది మహత్వం ఏమీ కనిపించలేదు. పైగా రామాయణం చదివినంతసేపు మనోవేదనకు గురియ్యాను. ఈ కావ్యం శూద్రాతి శూద్ర కులాలను/జాతులను ఘోరంగా అవమానించింది. బాలకాండ మొదలుకొని యుద్దకాండ వరకు (పూర్వ ఉత్తరాకాండ సహా) బ్రాహ్మణాధిక్యత, ఆర్య రాజ్య విస్తరణ తప్ప మరో శాస్త్ర మర్మం నాకు ఇందులో కనిపించలేదు.
రామాయణం, వర్ణ ధర్మాన్ని కాపాడటానికి వ్రాయబడ్డదని ఇప్పటికే మహాత్మాపూలే, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, పెరియార్‌ ఇ.వి. రామస్వామి సవివరణాత్మకంగా నిరూపించారు. అయినా వీరి వాధనలతో తృప్తి చెందకనే రామాయణం సభక్తితో పఠిస్తుంటే భక్తిరసం భగమై జాతి వివక్ష, అకారణ హింస నా జాతి కడగండ్లు కండ్లముందు సాక్షాత్కారమై కన్నీటి పర్యంతమయ్యాను. నా నోట ”మానిషాద…” శ్లోకం రాలేదు, నా శోకమూ ఆరలేదు. రామాయణంలోని బాలకాండ ప్రథమ సర్గలో వాల్మీకి ఫలశ్రుతిని ఇలా చెప్పారు ”పఠన్‌ ద్విజో వాగృష భత్వమీయాత్‌/ స్యాత్‌ క్షత్రియో భూమిపతిత్వ మీయాత్‌/వణిగ్జన: పణ్యఫలత్వ మీయాత్‌/ జనశ్చశూద్రో2పి మహత్వమీయాత్‌” అనగా ”రామాయణం పఠించిన ద్విజులు వేదవేదాంగముల యందును, శాస్త్రములలోనూ పండితులగుదురు. క్షత్రియులు, రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపార లాభము కలుగును.
శూద్రులు పై వారికి సేవ చేసిన మహత్వమును పొందుదురు”. వివిక్ష ఎంత స్పష్టంగా ఉందో పై శ్లోకమే రూఢి చేస్తుంది. రామాయణం పఠించినా శూద్రుడు పండితుడు కాలేడు. రాజ్యాధికార ప్రసక్తి లేనేలేదని పై వాక్యాలు స్పష్టంగానే ప్రవచిస్తున్నాయి. అందరికీ రామాయణం ఒకే ఫలాన్ని ఎందుకు ఇవ్వడంలేదు? ఆ కావ్యానికి ఆ వాల్మీకికి ఎందుకింత వివిక్ష శూద్రులమీద ఈ విషయాలేమీ తెలుసుకోలేక ప్రస్తుతం శూద్రులే (బి.సి.లు) ఈ రామాయణాన్ని, ఆ దేవుడ్ని భుజాలు కాయలు కాసేలా మోస్తున్నారు. వాస్తవాన్ని జాతికి తెలియజేయాల్సిన అవసరం
ఉన్నదనేదే నా వ్యాస ఫలశృతి. జ్వాలా నరసింహారావుకి చివరికి ఇందులో గాయత్రి మంత్ర మహత్వం గోచరించింది. ఆయన ఈ విషయాన్ని తన వ్యాసంలో వివరించారు. వనం వారిది ఆర్య బ్రాహ్మణ దృష్టి. మసి పూసి మారేడుకాయలు చేసే జంతర్‌మంతర వాదన. శూద్రునికి ఇలాంటి గతి ఎందుకు పట్టింది అని ఆలోచించే బదులు గాయత్రి చివరి అక్షరంతో ముగించాడని పై శ్లోకానికి పవిత్రత, ఆధ్యాత్మికత జోడించే ప్రయత్నం చేశాడు. ఇదే మనువాదం, మయావాదం. ఇంకా వనం వారికి జ్ఞానోదయం కలిగించే శ్లోకం అదే సర్గ నుండి ”చాతుర్వర్ణ్యం చ లోకే 2 అస్మిన్‌ స్వేస్వే ధర్మే నియోక్ష్యతి” అంటే చాతుర్వర్ణ్యాలను సధర్మంగా నడపడమే రామాయణపు అంతిమ లక్ష్యం. రాముడు, బ్రాహ్మణులకు ఎందుకింత ప్రీతిపాత్రుడయ్యాడు? అతనికి ఎందుకంతగా దైవకత్వాన్ని ఆపాదించారు. ఈ ప్రశ్నకు బాలకాండలోనే మళ్ళీ సమాధానం దొరుకుతుంది. ”గవాం కోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధి పూర్వకమ్‌/ అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశా:” దీనిర్ధం కోట్లాది గోవులను అపరిమితమైన ధనధాన్యములను రాముడు, బ్రాహ్మణులకు దానిమిచ్చును. కేవలం ఆర్యుడైనందుకేకాదు బ్రాహ్మణులకు సంతర్పణలు సజావుగా సాగించినందుకు ఆయన దైవత్వాన్ని పొందాడు.
అసలు బ్రాహ్మణ రక్షణార్దమే జన్మించానని శ్రీరాముడు ప్రకటించినందుకు ఆయన్ని దేవుణ్ణి ఆ కావ్యాన్ని మహత్వం గల రచనగా వృద్ది చేసి ప్రచారం చేసి కట్టుకథలకు రంగులు పూసిన ఘటికులు ఈ ఆర్య బ్రాహ్మణులు. రాముడు పితృవాక్య పాలకుడు అంటారు. అంటే బ్రాహ్మణులను నెత్తికెత్తుకొనేవాడని అసలు రహస్యం. బయటకు చెప్పేది అంతగా సరిపోయేలాలేదనడానికి ఈ కావ్యంలోనే సాక్ష్యాలున్నాయి. కోసలను పరిపాలించిన దశరధుడు అతని రాజధాని అయోద్య, ఆయన పాలనలోని ప్రజా వర్ణన మనకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. అయోధ్యను ఎవరు నిర్మించారు? ”అయోధ్య నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా/ మనునా మానవేంద్రేణయాపురీ నిర్మితా స్వయమ్‌” మనువు నిర్మించాడని రామాయణం చెబుతుంది. మనువు నిర్మించిన నగరంలో మూలవాసి బహుజనులకు ఏ స్థానం ఉంటుందో గ్రహించడం పెద్ద కష్టమేమీకాదు. ఇంతటి కుల వివక్షకు భారతీయ సమాజ విధ్వంసానికి కారకుడైన మనవు నిర్మించిన పట్టణంలో శూద్రుల పరిస్థితిని సులభంగానే పసిగట్టగలం. ఆ నగరంలోని బ్రాహ్మణులు మహా పండితులట. క్షత్రియులు, బ్రాహ్మణుల యెడల గౌరవము కలిగి ఉండేవారట. వర్ణ సంకరులు లేనేలేరట (కశ్చిదాసీ దయోధ్యాయాం న చ నిర్వృత్త సంకర:) అంటే వర్ణ వ్యవస్థను చాలా భద్రంగా కాపాడుకున్నరాజు దశరధుడు. వర్ణ సంకరం తప్పా? తప్పనే చెబుతుంది రామాయణం. అంతటి మహాపట్టణంలో నా ప్రజలు ఎంతటి గౌరవాన్ని పొందారోనని మరింత కుతూహలంతో ఇంకా శ్రద్దగా చదివాను. అయ్యో! గుండె లక్షముక్కలయ్యింది. ఇప్పుడు కన్నీళ్ళ బదులు నెత్తురు కారే వాతావరణం నెలకొన్నది. ”శూద్రా: స్వధర్మనిరతా: త్రీన్‌ వర్ణానుపచారిణ:” అంటూ శ్లోకం తగలనే తగిలింది. ప్రొ|| కంచె ఐలయ్య చెప్పినట్టు ”స్వయం గౌరవంలేని జీవితాలనే మాకు తగిలించారు తప్ప వృత్తి గౌరవంగానీ సామాజిక గౌరవంగానీ ఈ జాతులకు కల్పించే ఔదార్యం ఈ బ్రాహ్మణ గ్రంధాలకు గానీ, బ్రాహ్మణ రచయితలకుగానీ లేదు”. ఇంతకీ పై పద్యానికి అర్ధం ఏమిటంటే అయోధ్యనగరంలోని శూద్రులు తమ తమ ధర్మములను ఆచరించుచూ, పై మూడు వర్ణముల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వారిని సేవించిచుండెడివారు. ఈ శ్లోకార్ధం బోధపడ్డాక మనస్సు కకలావికలంకాక మరేమవుతుంది. నెత్తురు సలసలకాగింది. కడలి కల్లోలం అయ్యింది.
వనం వారు ఈ ఆక్రోశాన్ని, ఆవేదనను, తీవ్రవాదమో, నాస్తికవాదమో, చాదస్తమోనని కొట్టిపారేస్తారేమో!? విషయానికొస్తే దశరధుడు ఏ విధంగానైతే వర్ణ ధర్మాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తూ వర్ణ ధర్మాన్ని అతిక్రమించే ప్రశ్నేలేని శిక్షలు విధిస్తూ రాజ్య పాలన చేశాడో, రాముడు కూడా అలాగే నూటికి నూరు పాలు ఆచరించి చూపాడు. అందుకే ఆయన పితృవాక్య పాలకుడయ్యాడు. నా వాదానికి బలమైన సాక్ష్యాన్ని రామాయణంలో బాలకాండ నుండే గ్రహించాను. రాముడు, తాటకను సంహరించే సందర్భంలో ”గో బ్రాహ్మణ హితార్ధాయ దేశస్యాస్య సుఖాయచ / తవ చైవా ప్రమేయస్య వచనం కర్తు ముద్యత:” అంటాడు. ఈ శ్లోక భావము ఏమంటే గో రక్షణము, బ్రాహ్మణుల హితము… కొరకు మీ వచనమును (మాటలను) పాటించుచూ ఈ తాటకను చంపుటకు పూనుకొనుచున్నాను అని రాముడు విశ్వామిత్రుడితో చెప్తాడు. ఇదే పితృవాక్య పాలన అంటే. (పితుర్వచన నిర్దేశాత్‌, పితుర్వచన గౌరవాత్‌). ఇంకా స్పష్టత కావాలంటారా వనం నరసింహారావు పండితోత్తమా!? ఈ దేశ మూలవాసి మహారాణి, నేటి శూద్రాతిశూద్ర కులాల ప్రతినిధి అయిన తాటకిని చంపడం పితృవాక్య పాలనేనా? అంటే స్త్రీలను చంపటం, మాతృస్వామ్య రాజ్యాలను ద్వంసం చేయడం పితృవాక్యపాలనన్నమాట. అలాగే మాతృస్వామ్య వ్యవస్థ నిర్మాతలైన మూలవాసీ భారతీయ తత్త్వ విరోధి, విద్వంశకుడు, పితృస్వామ్య పాలకుడు ఈ దేశ స్త్రీలకు ఎలా దైవంగా మారాడే నేటి మహిళా మేధావులకు ఇంకా బోధపడకపోవడానికి కారణం? అలాగే ఇహపర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి రామాయణ పఠనమే అవశ్యకర్తవ్యమని ప్రబోధించాడు మహానుభావుడు వనం జ్వాలా నర్సింహారావు. ఈలోకంలోనే ఇలా వెట్టి చాకిరీతో సుఖపెట్టిన శూద్రాతి శూద్ర జాతులను పరలోకంలో ఎంత సుఖపెడతారో చాలానే అర్దమవుతుంది. దశరధుని రాజ్యంలో బ్రాహ్మణుల భోగలాలసత్వానికి, ధనధాన్యాలకు, గోదానాలకు, కొదవేలేదు. బ్రాహ్మణుల ఆదిక్యతను తెలిపే కథను ఒకదాన్ని రామాయణ బాలకాండ వివరిస్తుంది. అది ”రుష్యశృంగుని కథ” పూర్వం అంగరాజ్యాన్ని రోమపాదుడు పాలించే క్రమంలో అతడు ధర్మం తప్పాడట. ధర్మం తప్పడం అంటే బ్రాహ్మణులను తృప్తిపరచకపోవడం, వర్ణ ధర్మాన్ని పాటించకపోవడం. బహుశా రోమపాదుడు సమానత్వం, ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి చూపెట్టి ఉంటాడు. అయితే కొంతకాలానికి వర్షాలు లేక కరువు వచ్చిందట. దానికి కారణం వర్ణ ధర్మాన్ని విస్మరించడమేనని బ్రాహ్మణులు ప్రచారం చేశారు. రోమపాదుడు బుద్దిష్ట్‌ లేదా జైనమతస్తుడై ఉంటాడు. ఆ ప్రచారంతో రాజ్యంలో కలకలం రేగేలా చేశారు. దానికి పరిష్కారం బ్రాహ్మణుడు, యజ్ఞకర్మల్లో నిష్ణాతుడైన రుష్యశృంగున్ని ఆహ్వానించి యజ్ఞం చేయించడమేనని నమ్మబలికారు.
చివరికి రోమపాదుడు బ్రాహ్మణ తంత్రానికి తలొగ్గక తప్పలేదు. రుష్యశృంగుడు రాజ్యంలో అడుగు పెట్టగానే వర్షం భీకరంగా కురిసిందట. దానికి రాజు తృప్తిపడి విపరీత దానాలతో పాటు కూతురునిచ్చి వివాహం చేశాడట. ఈ మోసపూరిత కథ ద్వారా వారిచ్చే సందేశం ఏమంటే బ్రాహ్మణులు పరమ పవిత్రులని. వారు రాజ్యంలో ఉంటే రాజ్యంలో వర్షాలు కురవడం, సుభిక్షంగా ఉండటం. ఇక్కడ రెండు ప్రశ్నలు 1) వర్ణ సంకరాన్ని వ్యతిరేకించే రామాయణం, బ్రాహ్మణుడైన రుష్య శృంగునికి క్షత్రియుడైన రోమపాదుడు కూతురునిచ్చి వివాహం చేయడాన్ని ఎలా సమర్ధించింది? 2) వర్ణ సంకరమే రుచించని దశరధుడు, వర్ణ సంకరానికి పాల్పడిన రుష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్ర కామేష్టి యాగం ఎలా చేశాడు? అప్పుడు దశరధుని గురించి రామాయణం చెప్పింది శుద్ద తప్పు కదా? ఈ కథను ప్రచారం చేసి మొత్తం రాజ్యంలోని బ్రాహ్మణులు తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. ఇలాంటి ఉన్నత స్థానం బ్రాహ్మణులకిచ్చి నీచస్థానం శూద్రులకిచ్చిన రామాయణం నరసింహారావుగారు అన్నట్టు నా చాలా సందేహాలను నివృత్తి చేసింది. రామాయణం ద్వారా ఆర్యులు సాధించదలచుకున్న ప్రయోజనాలు చాల ానే
ఉన్నాయి. మాతృస్వామ్యాన్ని నాశనం చేయడం, క్షత్రియులపైన స్థానాన్ని ఆక్రమించుకోవడం (క్షత్రియుల స్థానాన్ని దిగువకు నెట్టివేయడం రామాయణంలో చాలా చోట్ల కన్పిస్తుంది)” మరో ముఖ్యమైన ప్రయోజనం మూలవాసి చక్రవర్తులను హతమార్చి ధర్మ పరిరక్షకులుగా కీర్తించబడటం. డా|| ఎస్‌.వి. రారు ”సింధూ నాగరికతకు ప్రధానమైన మొహెంజోదారోను జయించడానికి ఆర్యులు చేసిన యుద్దం చుట్టూ రామకథను అల్లారు” అంటాడు. అంతేగాక దక్షిణ భారతదేశంలోకి ఆర్య సంస్కృతిని, ఆర్యుల దురాక్రమణను పరోక్ష రూపంలో వనవాసం పేరుతో దండయాత్రగా సాగించాడు రాముడు. అందుకు వాల్మీకి రామాయణంలోని బాలకాండనే ప్రత్యక్షసాక్ష్యం. రాముడు తనసహచరి సీతతో, లక్ష్మణుని కలుపుకుని దండకారణ్యంలోకి ప్రవేశించాడు. నేటి దండకారణ్యమే ఆనాటిది కూడా. ఆ దండకారణ్యంలోకి రాముడు ఎందుకు ప్రవేశిస్తాడు. ఆరాజ్యం రాముడిది కాదు.
పరాయి రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించే అర్హత మరో రాజుకు ఉంటుందా? ఇది రాజనీతి అవుతుందా? మూల వాసీ చక్రవర్తి రావణుడు ఆ రాజ్యాధిపతి. అందుకు ఈ శ్లోకమే నిర్ధారణ. ”తేన తత్రైవ వసతా జనస్థాన వాసినీ” (బాలకాండ 1వ సర్గ 46వ శ్లోకం) దండకారణ్యంలో జనస్థానమనే ప్రాంతం ఉంది. అది రావణుని రాజ్యంలో భాగం.
ఆ రాజ్యానికి శూర్పణఖ రక్షకాధిపతి. ఆ ప్రాంతంలో ఆర్యులు అక్రమంగా ఆశ్రమాల నెపంతో దురాక్రమణ చేస్తుంటే సహజంగానే శూర్పణఖ వారిని తరిమి కొడుతుంది. ఇది ఏరాజైనా, రాణైనా చేసే రాజనీతి. ఆర్యులు వెంటనే దండకారణ్య సమీపంలోని రామున్ని దర్శించారు. రెచ్చగొట్టారు. రాముడు దండకార్యాన్ని ఆక్రమించి ఆ ప్రాంతం నుండి రక్షసులను (రాక్షసులనేది వారి భాష) ఆ ప్రాంతం నుండి తరిమి వేస్తానని ప్రతినబూనాడు. దండకారణ్యంలోకి ప్రవేశించాడు. అంతే సహజంగా రక్షసులు వీరి ప్రవేశాన్ని ఎదిరించారు. వరుసగా అడ్డుకున్నవారందరిని హతమార్చాడు రాముడు. క్రూరాతిక్రూరంగా రాజనీతికి, యుద్ధ నీతికి వ్యతిరేకంగా ఈ హింసాకాండ జరుగుతున్న తీరుకు సీత చలించిపోయింది. ఎంతైనా తల్లి హృదయం కదా! ఆమె, రాముణ్ణి నివారించే ప్రయత్నం చేసింది. అకారణంగా ఈ అటవీ రక్షకులను సంహరించడం అన్యాయం అని అర్దించింది. ఈ సందర్భంలో సీతామాత పలికిన దయార్ద్ర వచనములు రామునికి చెవికెక్కలేదు. ”ప్రతిజ్ఞా తస్త్వయా, వీర! దండకారణ్య వాసినామ్‌/ ఋషీణాం రక్షణార్ధాయా వధస్సంయతి రక్షసామ్‌” ఇది దండకారణ్యమ్‌ ఇది వారి నివాస స్థలం (రాక్షసులు). వారు ఇక్కడ నివసించడమే ధర్మం. వారి ప్రాంతంలోనికి అనధికారికంగా ప్రవేశించి వారినే సంహరించడం అధర్మం. ఏ వైర భావం లేకున్నను వీరిని హతమార్చుట తగునా? అని ప్రశ్నించడమే పై శ్లోకం. సీత మరింత లోతుగా న్యాయాన్యాయ వివేచన, ధర్మాధర్మ ఆచరణ నిబద్దతను స్పృశించింది. ”క్వచ శస్త్రం క్వచ వనం క్వచక్షాత్రం తప: క్వచ/ వ్యావిద్దమిదమ స్మాభి: దేశ ధర్మస్తు పూజ్యతామ్‌” (అరణ్యకాండ తొమ్మిదో సర్గ 27వ శ్లోకం). అంటే మనమిప్పుడు వనవాసంలో ఉన్నాం. వన జీవన ధర్మమగు తప: వృత్తిని ఆచరించాలి. అలా కాక అస్త్రము ధరించి ఇలా హత్యా కాండకు పూనుకొనడం సరికాదు. శస్త్రదారణమెక్కడీ వనవాసమెక్కడీ క్షత్రియ ధర్మమెక్కడీ తపో వృత్తి యెక్కడీ ఇవి పరస్పర విరుద్దములు. కావాలంటే అయోధ్య చేరిన తరువాత వనవాసం ముగిసిన వెంటనే మీ క్షత్రియ ధర్మమైన యుద్దాన్ని కొనసాగించండి అంటూ మరోసారి ధర్మ పరిశీలన చేసింది.
ఈ మాటలు రాముడికి వంటబట్టలేదు. బ్రాహ్మణులకు మాట యిచ్చాను. ఏదిఏమైనా ఈ రాక్షసులను హతమార్చి తీరుతాను అంటూ ఆమె నోరు మూయించాడు. దండకారణ్య ప్రవేశాన్ని వ్యతిరేకించినందుకే రాముడు, శూర్పణఖ ముక్కు, చెవులు కోయించాడు. కామరూపత అనేది వట్టి శాకు. పిచ్చికుక్కను చేసి చంపే కుట్ర ఇందులో దాగి ఉంది. అంతేకాదు ఆ దండకారణ్య సైనాన్ని శ్రీరాముడు ఊచకోత కోశాడు.
(బాలకాండ 1వ సర్గ శ్లోకం 48) ”వనే తస్మిన్‌ నివసతా జనస్థాన నివాసినామ్‌ / రక్షసాం నిహతాన్యాసన్‌ సహస్రాణి చతుర్ధశ”. అనగా ఖరుడు, ధూషణుడు, త్రిశరుడు మొ|| వీర యోధులను దాదాపు 14 వేల మంది సైనాన్ని హతమార్చారు రామ లక్ష్మణులు. అక్రమంగా తమ రాజ్యంలోనికి ప్రవేశించి తమ సోదరి ముక్కు చెవులు కోసి 14 వేల మంది తమ సైన్యాన్ని నెత్తుటి యేరులో ముంచి నరమేదం సృష్టించినా రావణుడికి కోపం రాకూడదా? ఇప్పుడు పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఆ దేశం చేస్తున్న కవ్వింపు చర్యలే ఆనాటి ఆర్యులు చేసిన ఉదంతం ఇది. కాదంటారా నరసింహారావు తత్వ వివేచకా?! దీన్ని మాబోటి శూద్రులు ఏ దృష్టితో పారాయణం చేయమంటారు? ఈ నరమేధాన్ని ఎలా అర్ధం చేసుకోమంటారు? తప్పొప్పులను ఏ మర్మాలతో అంచనా కట్టమంటారు.
దీనికి కారణం ఏ వాల్మీక దృక్ఫధం నిర్వచిస్తుంది. చివరగా వాల్మీకి బోయవాడా? కాదా? తేల్చేందుకు నరసింహారావు ఒక కథను ఉటంకించారు. అందులో ఋషులకు ఎదురైన వాల్మీకిని నీచ బ్రాహ్మణుడా? అంటూ సంభోదిస్తారు. బోయవాని వేషంలో ఉన్న వాల్మీకిని బోయవాడా అని సంబోధించక బ్రాహ్మణుడా అని సంబోధించడంలోని మర్మమేమంటారు జ్వాలాగారు? ఇకనైనా చరిత్రలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని శూద్రాతి శూద్రులకు ఈ ఆర్య గ్రంధాలు చేసిన అపరాదాన్ని నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాలి. ఈ గ్రంధాల్లోని కుట్రలను గ్రహించి బహుజనులు ఏకమై రాజ్యాధికారం దిశగా సాగాలి. ఇదే పరిష్కారం.

డాక్టర్‌ కదిరె కృష్ణ పేస్‌ బుక్‌ పోస్టు సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More
Like Loading...

370 ఆర్టికల్‌పై కాషాయ సేన అబద్ద ప్రచారాలు- వాస్తవాలు !

09 Monday Jul 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

370 article, Article 370, BJP, Indian constitution, saffron trolls lies- facts

Image result for 370 article,saffron trolls

-కె ఎల్‌ కాంతారావు

ఈ మధ్యన భారత రాజ్యాంగం లోని 370వ ఆర్టికల్‌కు సంబంధించి అనేక అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాలను, వాటికి సంబంధిం చిన వాస్తవాలను తెలుసుకుందాం.

మొదటి అబద్ధం : ఆర్టికల్‌ 370 నెహ్రూ-షేక్‌ అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం.
వాస్తవం : ఆర్టికల్‌ 370 రాజ్యాంగం రచనా కాలంలోనే దానిలో పొందుపర్చబడి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుండి, అంటే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది.

రెండవ అబద్ధం : భారత దేశంలోని ఏ రాష్ట్రానికీ లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ఈ ఆర్టికల్‌ జమ్మూ-కాశ్మీర్‌కు కల్పిస్తుంది. ఉదాహరణకు ఈ ఆర్టికల్‌ ప్రకారం జమ్మూ-కాశ్మీర్‌లో, భారత దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు, స్థలాలు కొనడం, అమ్మడం చేయరాదు.
వాస్తవం : రాజ్యాంగం ప్రకారం ఒక ప్రాంతానికి లేక రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అనేది ఒక జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికే పరిమితం కాదు. అలాంటి సదుపాయా లు ఆర్టికల్‌ 371 ద్వారా అనేక రాష్ట్రాలకు కల్పించారు. ఈ ఆర్టికల్‌ ప్రకారం మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడాల్లోను, గుజరాత్‌ లోని కచ్‌ ప్రాంతంలోను ప్రత్యేక అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు ఆ ప్రాంతాలలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన వాటా ఇచ్చే ప్రత్యేక అధికారాలు వుంటాయి. అలాగే 371-బి అస్సాంకు, 371-సి మణిపూర్‌ కు, 371-ఎఫ్‌ సిక్కింకు, 371-హెచ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌కు, 371-ఐ గోవాకు ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది.
ఇక స్థలాల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఆర్టికల్‌ 370 జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయం కల్పించినట్లే, ఆర్టికల్‌ 371-ఎ నాగాలాండ్‌కు, 371-జి మిజోరాంకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఆర్టికల్‌ 371ఎ, ఆర్టికల్‌ 371-జి ప్రకారం నాగాలాండ్‌, మిజోరాం లో కూడా ఆయా రాష్ట్రాలకు చెందని వారు అక్కడి భూములు కొనగూడదు. అమ్మకూడదు.ఈ విషయాలలో భారత పార్లమెంటు చేసే చట్టాలు కూడా ఆ రాష్ట్రాలకు వర్తించవు. అంతెందుకు? ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో కూడా 1/70 చట్టం అమలులో వుంది. ఆ చట్టం ప్రకారం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలుగా ప్రకటించబడ్డ ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే భూములు కొనాలి. అమ్మాలి. గిరిజనేతర ప్రజలు, వారు భారతీయులైనా సరే ఆ ప్రాంతాలలో భూములు కొనరాదు. అమ్మరాదు. ఇలా 370, 371-ఎ, 371-జి, 1/70 చట్టాలను రాజ్యాంగం లో ఎందుకు పొందుపరచారు? ఎందుకు అమలు చేస్తున్నారు? ఎందుకంటే ఆయా ప్రాంతాలు తీవ్రంగా వెనుకబడి వున్నాయి. అక్కడ కొనుగోళ్లకు భారతీయుల లోనే వేరే ప్రాంతాల వారికి అవకాశమిస్తే, వెనుకబడిన ఆయా ప్రాంతాల వాళ్లను వేరే ప్రాంతాల వాళ్లు మోసం చేస్తారనే సందేహంతో, ఆ ప్రాంతాల వారి ఆస్తులకు ప్రత్యేక రక్షణ నిమిత్తం రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్‌లు, కొన్ని ప్రత్యేక చట్టాలు చేశారు. వాస్తవం ఇది కాగా, ఆర్టికల్‌ 370 ఒకటే ప్రమాదకరమనీ, దానిని ఎత్తివేయాలనీ ప్రచారం చేయడం వాస్తవాన్ని వక్రీకరించడమే.

అబద్ధం 3 : ఆర్టికల్‌ 370 మూలంగా జమ్మూ-కాశ్మీర్‌ ప్రజలు భారత దేశ సార్వభౌమాధి కారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా, ఎటువంటి నేరమూ కాదు.
వాస్తవం : ఇది శుద్ధ అబద్ధం. ఆర్టికల్‌ 370 లో అలాంటి అంశమే పేర్కొనలేదు. అలాంటి అంశం ఉందని చెప్పడం స్వాతంత్య్ర సమర యోధులైన రాజ్యాంగ నిర్మాతలందరినీ అవమానించడమే. స్వాతంత్య్ర పోరాట వీరులైన రాజ్యాంగ నిర్మాతలు తమ జాతీయ పతాకాన్ని అవమానిస్తే నేరం కాదని రాజ్యాంగం లోని ఒక ఆర్టికల్‌లో రాశారని ప్రచారం చేయడం అబద్ధాలకు పరాకాష్ట!

అబద్ధం 4 : సుప్రీం కోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పని చేయవు.
వాస్తవం : ఇదో పెద్ద అబద్ధం. ఉదాహరణకు 2016లో ‘జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం ఆర్టికల్‌ 370 కారణంగా సర్వసత్తాక అధికారాలు కలిగిన రాష్ట్రం’ అని ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంటే దానిని 2016 డిసెంబరులో సుప్రీం కోర్టు కొట్టివేసింది. జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రం సర్వసత్తాక దేశమైన ఇండియాలో ఒక భాగమని పేర్కొన్నది. ఆ తీర్పును జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్ర హైకోర్టు గానీ, ప్రభుత్వం గానీ వ్యతిరేకించలేదు. సుప్రీం కోర్టు తీర్పులే కాదు, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఈ రాష్ట్రంలో వర్తిస్తున్నాయి. ఉదాహరణకు 11-2-56, 19-2-94ల మధ్య జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి 47 ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది.

అబద్ధం 5 : జమ్మూ-కాశ్మీర్‌లో ఉండే కాశ్మీర్‌ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది. అదే, పాకిస్తాన్‌ యువకుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం, పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరీ పౌరసత్వం లభిస్తుంది.
వాస్తవం : ఈ ప్రచారం కూడా అబద్ధమే. ఇలాంటి అంశమేదీ ఆర్టికల్‌ -370లో లేదు. కాకపోతే రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డరు ప్రకారం 35-ఎ ఆర్టికల్‌ అమలులోకి వచ్చింది. దానికి అనుగుణంగా జమ్మూ-కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం చేసింది. దాని ప్రకారం ఆ రాష్ట్రంలోని పురుషుడు వేరే రాష్ట్ర యువతిని పెళ్లి చేసుకుంటే, వారి సంతానానికి వారసత్వ హక్కులు లభిస్తాయి. అదే కాశ్మీర్‌ యువతి వేరే రాష్ట్రానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటే, వారి సంతనానికి ఆ రాష్ట్ర పౌర హక్కులు, వారసత్వ హక్కులూ లభించవు. అంతేకాని, పాకిస్తాన్‌ పౌరుడిని పెళ్లి చేసుకుంటే, ఆమె భర్తకు కాశ్మీర్‌ పౌరహక్కులు లభిస్తాయనడం పూర్తిగా తప్పుడు ప్రచారం.

అబద్ధం 6 : కాశ్మీర్‌లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్ధులు) రాజ్యాంగ బద్ధంగా రావలసిన 16 శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదు.
వాస్తవం : ఇది కూడా అబద్ధ ప్రచారమే. రాజ్యాంగం భారత దేశం మొత్తంలోను కొందరిని మైనారిటీలుగా నిర్ణయించింది. వారు ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు). అంతేకాని, ప్రతి రాష్ట్రానికీ వేరు వేరుగా మైనారిటీలు నిర్ణయించ బడలేదు. పంజాబ్‌లో సిక్కులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీ. నాగాలాండ్‌, మిజోరాం, లక్షద్వీప్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌లో క్రైస్తవులు సంఖ్యలో మెజారిటీ, హిందువులు మైనారిటీగా ఉంటున్నారు. కాని రాజ్యాంగం దేశానికంతటికీ మాత్రమే మైనారిటీలను నిర్ణయించిన కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా పైన చెప్పిన ఆరు మతాల వారు మాత్రమే, మైనారిటీ లుగా పరిగణించబడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్‌లో సిక్కులు మెజారిటీ సంఖ్యలో ఉన్నా, రాజ్యాంగం ఆ రాష్ట్రంలో కూడా సిక్కులను మైనారిటీగానే గుర్తిస్తోంది. అలాగే జమ్మూ-కాశ్మీర్‌ లోని కాశ్మీర్‌ ప్రాంతంలో ముస్లింలు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా, లెహ్ ప్రాంతంలో బౌద్ధులు సంఖ్యలో మెజారిటీగా ఉన్నా రాజ్యాంగం ఆ రాష్ట్రంలో ఆ రెండు మతాల వారినీ మైనారిటీలు గానే గుర్తిస్తోంది. ఇదీ వాస్తవం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అంకూర్‌ శర్మ అనే న్యాయవాది జమ్మూ-కాశ్మీర్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తించమని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిల్‌ వేస్తే, సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేసింది. అదేమిటంటే, ‘జమ్మూ-కాశ్మీర్‌లో హిందువులను మైనారిటీలుగా గుర్తిస్తారా?’ అని. దానికి ఆ రాష్ట్రంలోని పిడిపి- బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ‘హిందువులను మైనారిటీ లుగా గుర్తించం’ అని స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సమాధానమే ఇవ్వలేదు. దానిపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు రూ.15 వేల జరిమానా వేసింది. అయినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మౌనం గానే ఉంది (ది పయనీర్‌ 7-2-17). ఇంత స్పష్టంగా ఆ రాష్ట్ర వైఖరీ, మౌనాన్ని ఆశ్రయించిన కేంద్ర వైఖరీ వుంటే, రాజ్యాంగ బద్ధంగా రావలసిన రిజర్వేషన్లు జమ్మూ-కాశ్మీర్‌లోని హిందువులకు అందడం లేదనే ప్రచారం ఎంత మోసపూరితం?

ఇలా ఆర్టికల్‌-370 ద్వారా హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ అబద్ధ ప్రచారాలు చేసి, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తోన్న వారి పట్ల దేశ భక్తులందరూ అప్రమత్తంగా ఉండి, వారి విద్వేష ప్రచారాన్ని, విద్రోహ చర్యలను అరికట్టడమే నేటి తక్షణ కర్తవ్యం.

కెఎల్‌ కాంతారావు పేస్‌ బుక్‌ పోస్టు సౌజన్యంతో

Share this:

  • Tweet
  • More
Like Loading...

నేనెందుకు బిజెపి నుంచి రాజీనామా చేస్తున్నాను ? ఒక మేథావి ఆత్మశోధన

19 Tuesday Jun 2018

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, BJP activist, BJP leaders lies, Naredra Modi, Shivam Shankar Singh, Shivam Shankar Singh Political Consultant

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌, శివం శంకర్‌ సింగ్‌

శివం శంకర్‌ సింగ్‌

(బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ నాయకత్వంలోని బృందంలో అనేక ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో శివం శంకర్‌ సింగ్‌ పని చేశారు. రచయిత, ఇండియా ఫౌండేషన్‌లో సీనియర్‌ పరిశోధకుడు అయిన సింగ్‌ బిజెపి రాజకీయ ప్రచారాల సమాచార విశ్లేషకుడిగా పనిచేశారు. అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్‌. ఒక పార్లమెంట్‌ సభ్యుని వద్ద సహాయకునిగా కూడా పని చేశారు )

దేశంలో రాజకీయ చర్చ, కనీసం నా జీవిత సమయంలో అత్యంత నీచమైన స్ధానంలో వుంది.భాగస్వామ్యం అనూహ్యం. తమ పక్షాన వున్న రుజువు ఏమిటి అనేదానితో నిమిత్తం లేకుండా జనాలు మద్దతు కొనసాగిస్తున్నారు. తాము కుహనా వార్తలను వ్యాపింప చేస్తునాసషశ్రీతీయత్నీమని రుజువు అయిన తరువాత కూడా వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించటం లేదు. ఇది ప్రతివారిలో వుంది, పార్టీలు మరియు ఓటర్లు లేదా మద్దతుదార్లందరూ దీనికి బాధ్యులే అని చెప్పాల్సి వుంది. నమ్మశక్యం గాని విధంగా అత్యంత శక్తివంతమైన ప్రచారం ద్వారా కొన్ని ప్రత్యేక సందేశాలను వ్యాపింప చేయటంలో భారతీయజనతా పార్టీ ఎంతో చేసింది. ఆ పార్టీకి ఇంకేమాత్రం మద్దతు ఇవ్వకూడదని నేను నిర్ణయించుకోవటానికి ప్రాధమిక కారణాలు ఆ సందేశాలే. అయితే అవేమిటి అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఏ పార్టీ కూడా పూర్తిగా మంచిదీ కాదు పూర్తిగా చెడ్డదీ కాదు అని అర్ధం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాలన్నీ ఎంతో కొంత మంచి చేశాయి, కొన్ని రంగాలలో మురికిగా వ్యవహరించాయి.ఈ ప్రభుత్వం దీనికి మినహాయింపేమీ కాదు.

మంచి పనులు

1.గతంతో పోలిస్తే రోడ్ల నిర్మాణం వేగంగా వుంది. రోడ్డు పొడవును లెక్కించే పద్దతిలో తేడా వుంది, దానిలో కారణాంకనాలున్నప్పటికీ అది వేగంగానే జరిగినట్లు కనిపిస్తుంది.

2.విద్యుత్‌ కనెక్షన్లు పెరిగాయి. అన్ని గ్రామాలు విద్యుదీకరించబడ్డాయి, జనానికి ఎక్కువ గంటలు విద్యుత్‌ లభిస్తోంది.( కాంగ్రెస్‌ ఐదులక్షల గ్రామాలను విద్యుదీకరించింది. చివరి 18వేలకు పైగా వున్న గ్రామాలను మోడీ పూర్తి చేశారు. ఈ సాధనను మీరు కోరుకున్న విధంగా పరిగణించవచ్చు. ఇదే విధంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ విద్యుత్‌ సరఫరా పెరుగుతూనే వుంది, కానీ మనకు బిజెపి హయాంలోనే పెద్ద పెరుగుదల వున్నట్లు మనం చూడవచ్చు) 3. వున్నత స్ధాయిలో అవినీతి తగ్గింది- ఇప్పటి వరకు మంత్రుల స్ధాయిలో పెద్ద కేసులేమీ లేవు( అయితే యుపిఏ ఒకటి హయాంలో కూడా ఇలాగే వున్నమాట నిజం. దిగువ స్ధాయిలో అలాగే వున్నాయి, చెల్లించాల్సిన మొత్తాలు పెరిగాయి, పోలీసులు, పట్వారీలు తదితరుల ను అదుపు చేయగలవారెవరూ కనిపించటం లేదు.) 4. స్వచ్చభారత్‌ కార్యక్రమం నిస్సందేహంగా విజయవంతమైంది. గతం కంటే ఎక్కువగా మరుగుదొడ్లు నిర్మించారు ఇప్పుడు జనాల మనస్సులో స్వచ్చత భావన నెలకొన్నది. 5. వుజ్వల యోజన ఒక గొప్ప చొరవ అయితే రెండవ సిలిండర్‌ను ఎంత మంది కొన్నారో చూడాల్సి వుంది. మొదటిది, స్టవ్‌ వుచితం, అయితే జనాలు ఇప్పుడు వాటికి డబ్బు చెల్లించాల్సి వుంది, ప్రభుత్వం కార్య క్రమం చేపట్టినప్పటి నుంచి సిలిండర్‌ ఖర్చు రెట్టింపైంది, ఇప్పుడు ఒక్కొక్కటి ఎనిమిది రూపాయలకంటే ఎక్కువ వుంది. 6. ఈశాన్య భారత్‌తో సంబంధాలు నిస్సందేహంగా పెరిగాయి. రైళ్లు, రోడ్లు, విమానాలు పెరిగాయి. అన్నింటికంటే ముఖ్యమైనదేమంటే ప్రధాన స్రవంతి న్యూస్‌ ఛానళ్లలో ఈ ప్రాంతం గురించి చర్చ జరుగుతోంది. 7. ప్రాంతీయ పార్టీల పాలనతో పోలిస్తే శాంతి భద్రతల పరిస్ధితి మెరుగ్గా వుంది.

చెడ్డ పనులు

జాతులు, వ్యవస్ధలను నిర్మించాలంటే దశాబ్దాలు, శతాబ్దాలు పడుతుంది. బిజెపి పాలనలో నేను చూసిన అతి పెద్ద వైఫల్యం ఏమంటే చాలా దుర్బలమైన కారణాలను చూపి కొన్ని గొప్పవాటిని నాశనం చేయటం.

1. ఎలక్ట్రరల్‌ బాండ్లు ా ఇది అవినీతిని చట్టబద్దం చేస్తుంది, మన రాజకీయపార్టీలను కొనుగోలు చేసేందుకు కార్పొరేట్లు, విదేశీశక్తులకు అవకాశమిస్తుంది. ఈ బాండ్లు అజ్ఞాతమైనవి. కాబట్టి ఒక కార్పొరేట్‌ సంస్ధ మీరు గనుక ఒక నిర్ణీత విధానాన్ని ఆమోదిస్తే వెయ్యి కోట్ల విలువైన ఎలక్ట్రొరల్‌ బాండ్లు ఇస్తాను చెబుతుంది, దానిని శిక్షించేవారుండరు. దీని వలన ఒక అజ్ఞాత సాధనం ద్వారా నీకిది నాకది అని నిరూపించే అవకాశం వుండదు. ఇది మంత్రిత్వస్ధాయికి అవినీతిని ఎలా దించిందో కూడా వివరిస్తోంది. దీనికి ఫైలు లేదా వుత్తరువులతో పని లేదు. ఇది అమెరికాలో మాదిరి విధాన స్ధాయిలోనే జరుగుతోంది. 2. ప్రణాళికా సంఘ నివేదికలు :సమాచార ప్రధాన వనరులుగా వీటిని వినియోగించుకోవచ్చు.ప్రభుత్వ పధకాలను అవి ఆడిట్‌ చేస్తాయి, ఎలా జరుగుతున్నదీ చెబుతాయి. అది పోయిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని నమ్మటం తప్ప మరొక మార్గం లేదు.(కాగ్‌ నివేదికలు చాలా కాలం తరువాత వస్తాయి) నీతి అయోగ్‌కు ఈ బాధ్యత లేదు, అది మౌలికంగా సలహాలిచ్చే మేథావులతో నిండిన, ప్రజా సంబంధాల సంస్ధ మాత్రమే. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయకుండానే ప్రణాళిక లేదా ప్రణాళికేతరానికి తేడా లేకుండా చేయవచ్చు.3. సిబిఐ, ఇడిల దుర్వినియోగం: నేను చూసినంత వరకు వీటిని రాజకీయ ప్రయోజనాల కొరకు వినియోగిస్తున్నారు. ఒక వేళ అలాంటిదేమీ లేదనుకుంటే మోడీ లేదా అమిత్‌ షాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఈ సంస్ధల ద్వారా వారిమీద దాడిచేయిస్తారనే భయం వున్న మాట నిజం. ప్రజాస్వామ్యంలో అంతర్భాగమైన భిన్నాభిప్రాయాన్ని హతం చేయటానికి ఇది చాలు. 4. కాలిఖో పాల్‌ ఆత్మహత్య నోట్‌, జడ్జి లోయా మరణం, సొహ్రబుద్దీన్‌ హత్యల దర్యాప్తులో విఫలం, వున్నావోలో ఒక రేప్‌ కేసులో నిందితుడైన ఎంఎల్‌ఏను వెనకేసుకురావటం, అతని బంధువు ఆ బాలిక తండ్రిని హత్యకేసులో నిందితుడు కావటం, ఒక ఏడాది పాటు ఎఫ్‌ఐర్‌ నమోదు చేయకపోవటం.5. పెద్ద నోట్ల రద్దు: ఇది విఫలమైంది, అంతకంటే దారుణం ఏమంటే ఆ వైఫల్యాన్ని బిజెపి అంగీకరించలేకపోవటం. ఈ చర్య ద్వారా వుగ్రవాదులకు నిధులు నిలిచిపోతాయని, నగదు లావాదేవీలు తగ్గుతాయని, అవినీతి అంతమౌతుందని చేసిన ప్రచారమంతా అసంబద్దమైనది. ఇది వాణిజ్యాన్ని అంతం చేసింది. 6. జిఎస్‌టి అమలు: దీన్ని హడావుడిగా అమలు జరిపారు, వ్యాపారానికి హాని చేసింది. వ్యవస్ధను సంక్లిష్టం గావించింది. వివిధ వస్తువుల మీద అనేక రేట్లు, పన్నుల దాఖలులో సంక్లిష్టత. కొంత వ్యవధిలో స్ధిరపడుతుందని అనుకున్నారు, కానీ అది హాని చేసింది. ఈ వైఫల్యాన్ని అంగీకరించేందుకు బిజెపి ఎంతో దురహంకారంతో వ్యవహరించింది.7.కేవలం చప్పట్లు కొట్టించుకొనేందుకు విదేశాంగ విధానాన్ని గందరగోళపరచటం: శ్రీలంకలో చైనాకు ఒక రేవు వుంది, బంగ్లాదేశ్‌, పాకిస్ధాన్లలో పెద్ద ప్రయోజనాలున్నాయీభారత్‌ను చుట్టుముడుతోంది, మాల్దీవులలో వైఫల్యం( భారత విదేశాంగ విధాన వైఫల్యం కారణంగా అక్కడ ఇంకే మాత్రం భారతీయ కార్మికులకు వీసాలు దొరికే అవకాశం లేదు) మోడీగారు విదేశాలు తిరుగుతూ 2014కు ముందు విదేశాలలో భారతీయులంటే గౌరవం లేదని ఇప్పుడు ఎంతగానో గౌరవిస్తున్నారని చెబుతున్నారు.( ఇదొక చెత్త మన ఆర్ధిక వ్యవస్ధ మరియు ఐటి రంగంలో పురోగమనం కారణంగా విదేశాలలో భారత్‌కు గౌరవం ప్రత్యక్ష ఫలితం, మోడీ కారణంగా అది ఒక్క ఔన్సు కూడా మెరుగుపడలేదు, బీఫ్‌ పేరుతో వధించటాలు, జర్నలిస్టులకు బెదిరింపుల వంటి వాటితో అదింకా దిగజారి వుండవచ్చు) 8. పధకాల వైఫల్యం, వాటిని గుర్తించటంలో లేదా సరిచేయటంలో వైఫల్యం : సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన, మేకిన్‌ ఇండియా, నైపుణ్య అభివృద్ధి, ఫసల్‌ భీమా( తిరిగి చెల్లింపులను చూస్తే బీమా కంపెనీల జేబులు నింపటం కనిపిస్తుంది.) నిరుద్యోగం, రైతాంగ సంక్షోభాలను గుర్తించటంలో వైఫల్యం, ప్రతి వాస్తవ సమస్యను ప్రతిపక్ష నాటకంగా వర్ణించటం. 9. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల : కాంగ్రెస్‌ అధికారంలో వుండగా మోడీ, బిజెపి మంత్రులు మరియు మద్దతుదార్లందరూ వాటి ధరలు ఎక్కువగా వున్నాయని విమర్శించారు. అప్పటితో పోలిస్తే అప్పుడు ముడిచమురు ధర తక్కువగా వున్నప్పటికీ ఎక్కువగా ధరలు వుండటాన్ని ఇప్పుడు సమర్ధిస్తున్నారు. ఇదేమాత్రం ఆమోదయోగ్యమైనది కాదు. 10. అత్యధిక మౌలిక సమస్యల విషయాలపై పని చేయటంలో వైఫల్యం : విద్య, ఆరోగ్య సంరక్షణ. విద్యారంగంలో చేసిందేమీ లేదు, జాతీయంగా అది అతి పెద్ద వైఫల్యం.దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల నాణ్యత తగ్గిపోయింది(ఎఎస్‌ఇఆర్‌ నివేదికలు) ఎలాంటి చర్య తీసుకోలేదు. గత నాలుగు సంవత్సరాలుగా ఆరోగ్య సంరక్షణకు వారు చేసిందేమీ లేదు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రకటించారు. చేసిందేమీ లేకపోగా ఆ పధకం నన్ను మరింత భయపెడుతోంది.బీమా పధకాలు భయంకర బాటలో నడుస్తున్నాయి అవి అమెరికా బాటలో నడుస్తున్నాయి.అది ఆరోగ్య రక్షణలో భయంకరమైన గమ్యం(మైఖేల్‌ మూర్‌ సినిమా సికో చూడండి)

మీరు కొన్నింటిని జోడించవచ్చు, సమస్యను మీ స్వంత అవగాహన మేరకు మరికొన్నింటిని తీసివేయవచ్చు, కానీ ఇది నా మదింపు. ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ సమస్య పెద్దది, సుప్రీం కోర్టు దానిని రద్దు చేయవచ్చని అనుకుంటున్నాను. ప్రతి ప్రభుత్వానికి కొన్ని వైఫల్యాలు, కొన్ని చెడులు వుండవచ్చు గానీ అన్నింటికంటే పెద్ద సమస్య నైతికవిలువలకు మించి లేదు.

వికారమైనది

ఈ ప్రభుత్వ నిజమైన ప్రతికూలత ఏమంటే ఎంతో యోచించిన పధకం ప్రకారం జాతీయ చర్చను అది ఎలా దెబ్బతీసిందనేదే. ఇది వైఫల్యం కాదు, ఇదొక పధకం.

1. ఇది మీడియాను నమ్మరానిదిగా చేసింది. దాంతో ఇప్పుడు ప్రతి విమర్శ వెనుక ఒక జర్నలిస్టు బిజెపి లేదా కాంగ్రెస్‌ నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు చిత్రితమౌతున్నది. అనేక మంది జర్నలిస్టుల విషయంలో అది వాస్తవం కాదని నాకు తెలుసు. అంతకంటే ముఖ్య మైన అంశమేమంటే ఏ ఒక్కరూ ఆరోపణలు లేదా ఫిర్యాదుల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు కేవలం సమస్యను ముందుకు తెచ్చి వ్యక్తుల మీద దాడిచేయటం, తరువాత సమస్యను కూడా విస్మరిస్తున్నారు. 2.గత డెబ్బయి సంవత్సరాలలో ఏమీ జరగలేదనే ఒక అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దారు. ఇది పూర్తిగా అనుచితం, ఫలితంగా తలెత్తే మానసిక ప్రవృత్తి దేశానికి హానికరం. ప్రభుత్వం ప్రకటనల మీద నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, ఇప్పుడది ఒక ధోరణిగా మారింది. చిన్న పనులు చేసినా పెద్దగా ప్రచారం చేసుకోవటం. మొదటిసారిగా రోడ్లను మోడీ నిర్మించలేదు. మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ల మానసపుత్రికల వంటి పధకాల ద్వారా నిర్మించిన కొన్ని మంచి రోడ్ల మీద నేను ప్రయాణించాను. 1990 దశకం నుంచి భారత్‌ ఐటి శక్తి కేంద్రంగా మారింది. నేడున్న పరిస్ధితులను బట్టి గత పని తీరును అంచనా వేస్తూ గత నాయకులను దూషించటం సులభం. వుదాహరణకు ఎవరైనా కాంగ్రెస్‌ 70 సంవత్సరాలుగా మరుగుదొడ్లను ఎందుకు నిర్మించలేదని అడగవచ్చు. వారు కొన్ని మౌలికమైనవి కూడా చేయలేకపోయారు. ఈ వాదన ఎంతో తర్కబద్దంగా వినిపించవచ్చు, దేశ చరిత్రను చదవటం ప్రారంభించే వరకు నేను కూడా నమ్మాను. 1947లో మనం స్వాతంత్య్రం సంపాదించుకొనే నాటికి మనది చాలా పేద దేశం. మనకు ఒక రాజధాని లేదు మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన వనరులు లేవు. దీన్ని అధిగమించేందుకు నెహ్రూ సోషలిస్టు మార్గం పట్టి ప్రభుత్వరంగ సంస్ధలను ఏర్పాటు చేశారు. మనకు వుక్కు ఫ్యాక్టరీ నిర్మించుకొనే సామర్ధ్యం లేకపోతే రష్యన్ల సాయం తీసుకున్నారు. దేశంలో యంత్రాలు, వుక్కు తయారీకి రాంచీలో హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఇవి లేకుండా మనకు వుక్కు వుండేది కాదు, ఇతర మౌలిక సదుపాయాలూ వుండేవి కావు. మనకు ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కరవులు వచ్చేవి,పెద్ద సంఖ్యలో జనం మరణించేవారు. జనానికి తిండి పెట్టటం ప్రాధాన్యత, అప్పుడు మరుగుదొడ్లు విలాసం దానికోసం ఎవరూ చూడలేదు. హరిత విప్లవం వచ్చి 1990దశకం నాటికి ఆహార కొరత అదృశ్యమైంది. ఇప్పుడు మనం మిగులు సమస్యను ఎదుర్కొంటున్నాము. మరుగుదొడ్ల మాదిరే పాతికేండ్ల తరువాత నరేంద్రమోడీ అన్ని ఇండ్లకు ఎసి ఎందుకు పెట్టించలేదని అడుగుతారు. అది ఈ రోజు ఒక విలాసంగా కనిపించినట్లే ఒక రోజు మరుగుదొడ్లు కూడా విలాసమే. ఈ పరిణామం త్వరలో జరగవచ్చు లేదా పదిపదిహేనేండ్ల క్రితమే జరిగి వుండవచ్చు. కానీ 70ఏండ్లలో ఏమీ జరగలేదని చెప్పటం బలవంతంగా రుద్దే ఒక భయంకరమైన అవాస్తవం. 3. కుహనా వార్తల వ్యాప్తి, వాటిపై ఆధారపడటం : బిజెపి వ్యతిరేక కుహనా వార్తలు కూడా కొన్ని వున్నాయి, కానీ బిజెపి అనుకూల, ప్రతి పక్ష వ్యతిరేక కుహనా వార్తలు జనానికి చేరటంలో మైళ్ల దూరం ముందున్నాయి. వాటిలో కొన్ని మద్దతుదార్లవి, అయితే ఎక్కువ భాగం పార్టీ నుంచే వస్తున్నాయి. తరచూ అవి విద్వేషపూరితంగానూ జన సమీకరణ వైఖరి అంతకంటే నీచమైనవిగా కూడా తయారవుతున్నాయి. ఈ ప్రభుత్వ మద్దతు వున్న ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ మనకు తెలిసినదాని కంటే సమాజానికి ఎక్కువ హాని చేస్తున్నాయి. 4. హిందూయిజం ప్రమాదంలో వుంది: హిందువులు, హిందూయిజం ప్రమాదంలో వుందనే భావనను, మనల్ని రక్షించాలంటే మోడీ మాత్రమే దిక్కు అని జనాల బుర్రలోకి నూరిపోశారు. వాస్తవంలో జనాల భావంలో మార్పు తప్ప ఈ ప్రభుత్వం రాకముందు హిందువులు ఎలా జీవిస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే వున్నారు, మారిందేమీ లేదు. హిందువులమైన మనం 2007లో ప్రమాదంలో పడ్డామా? నావరకైతే దాని గురించి రోజూ వినలేదు, మరింత భయం, విద్వేషం తప్ప హిందువుల స్ధితిగతులలో నాకైతే మెరుగుదల కనిపించలేదు. 5. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు దేశవ్యతిరేకులు, ఇటీవలి కాలంలో హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ఈ విధమైన ముద్రవేయటం ద్వారా న్యాయమైన విమర్శను బయటకు రాకుండా చేస్తున్నారు. మీ జాతీయతను రుజువు చేసుకోండి, ప్రతిచోటా వందేమాతరం పాడండి( బిజెపి నేతలకు దానిలో వుండే పదాలేమిటో కూడా తెలియనప్పటికీ దానిని పాడాలని మిమ్మల్ని బలవంతం చేస్తారు.) నేను జాతీయవాదిగా గర్వపడతాను, అయితే దాన్ని బహిరంగంగా ప్రదర్శించమని ఏవరైనా బలవంతం చేయటాన్ని నా జాతీయవాదం అనుమతించదు. అవసరమైనపుడు లేదా నాకు పాడాలని అనిపించినపుడు జాతీయ గీతాన్ని జాతీయ పాటను నేను పాడతాను. అయితే ఇతరుల వెర్రులకు అనుగుణ్యంగా పాడాలని ఎవరైనా బలవంతం చేస్తే నేను పాడను.6. బిజెపి నేతలు నిర్వహిస్తున్న వార్తా ఛానళ్ల ఏకైక కార్యక్రమం హిందూ-ముస్లిం, జాతీయవాదం-జాతి వ్యతిరేకులు, భారత్‌-పాకిస్ధాన్‌, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే, విడిపోయే సమీకరణలను రెచ్చగొట్టే చర్చలు మాత్రమే. అవి ఏవో మీ అందరికీ తెలుసు, నీచమైన ప్రచారాన్ని వెదజల్లే చర్చలు జరిపేవారికి నజరానాలు అందచేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. 7. సమీకరణ : అభివృద్ధి సందేశం గతించింది. వచ్చే సాధారణ ఎన్నికలకు బిజెపి వ్యూహం ఏమిటంటే విభజించే సమీకరణలను, కుహనా జాతీయవాదాన్ని రెచ్చగొట్టటం. మోడీగారు స్వయంగా తన ప్రసంగాల్లో చెప్పారు. జిన్నా, నెహ్రూ, భగత్‌ సింగ్‌ జైల్లో వున్నపుడు కాంగ్రెస్‌ నేతలు ఆయనను పరామర్శించలేదు( ఆ నకిలీ వార్త స్వయంగా ప్రధాని నోటి నుంచి వెలువడింది). గుజరాత్‌లో మోడీని ఓడించేందుకు కాంగ్రెస్‌ నేతలు పాకిస్ధాన్‌లో సమావేశమయ్యారు. అక్బర్‌ కంటే మహారాణా ప్రతాప్‌ గొప్పవాడని అని యోగి గారు చెబుతారు. జెన్‌యు విద్యార్ధులు జాతి వ్యతిరేకులు, వారు దేశాన్ని ముక్కలు చేస్తారు. ఈ ప్రచారమంతా విడదీయండి, ఎన్నికల్లో గెలవండి అనే ఒక ప్రత్యేక లక్ష్యంతో రూపొందించినది. ఇటువంటి దానిని మా నేతల నుంచి వినాలని కోరుకోవటం లేదు, రాజకీయ ప్రయోజనాల కోసం కొట్లాటలతో దేశం తగుల బడాలని కోరుకొనే ఎవరినైనా అనుసరించేందుకు నేను వ్యతిరేకిస్తాను.

జాతీయ చర్చను ఒక చీకటి కోణంలోకి బిజెపి ఎలా నెడుతోందో చెప్పేందుకు కొన్ని వుదాహరణలు మాత్రమే ఇవి. దీని కోసం నేను బిజెపిలో చేరలేదు, వీటన్నింటికీ నేను మద్దతు ఇవ్వలేను, అందుకే నేను బిజెపి నుంచి రాజీనామా చేస్తున్నా.

గమనిక: భారత ఆశాకిరణం మాదిరి నరేంద్రమోడీ గారు కనిపించటంతో నేను 2013 నుంచి  బిజెపిలో పని చేస్తున్నాను, అభివృద్ధి  సందేశాన్ని నమ్మాను. ఆ సందేశం, ఆశ ఇప్పుడు పూర్తిగా పోయాయి. నావరకైతే నరేంద్రమోడీ మరియు అమిత్‌ షా ప్రభుత్వంలోని సానుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా వున్నాయి.అయితే ప్రతి ఓటరు స్వంతంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. వాస్తవాన్ని, చరిత్రను ఎలా సంక్లిష్టం గావిస్తున్నారో తెలుసుకోండి. ప్రచారాన్ని తేలికగా తీసుకోవటం, ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఆరాధించటం హీనమైన అంశాలు. ఇది ఈ దేశం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనవి.

ఎన్నికలు దగ్గరపడుతున్నందున మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. దాంతో మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఏ భావజాలాన్ని లేదా ఏ పార్టీ అని కాదు, అది మెరుగైన, బలమైన, దారిద్య్రం లేని, అభివృద్ధి చెందిన భారత్‌ను నడిపించేదిగా వుండేదానికి మనం మద్దతు ఇవ్వాలి. నా ఏకైక ఆశ ఏమంటే మనమందరం సామరస్యతతో పని చేస్తామన్నదే. రెండు వైపులా మంచి వారుంటారని ఎల్లవేళలా గుర్తుంచుకోండి. వారు భిన్న పార్టీలలో వున్నప్పటికీ వారికి ఓటరు మద్దతు, వారి మద్దతు ఓటర్లకు వుండాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాక్‌ ఎన్నికలు-కమ్యూనిస్టుల పునరుజ్జీవనం !

02 Saturday Jun 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, USA

≈ Leave a comment

Tags

IRAQ ELECTIONS, Iraqi Communist Party, Muqtada al-Sadr, non-religious parties, Sadrist-Communist alliance, Sairoun Alliance, Shi’ite cleric Muqtada al-Sadr

టీచర్‌, మహిళా హక్కుల కార్యకర్త అయిన సుహాద్‌ అల్‌ ఖతీబ్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా నజఫ్‌ నియోజక వర్గం నుంచి ఎన్నికైన తొలి పార్లమెంట్‌ సభ్యురాలు

ఎం కోటేశ్వరరావు

ఇరాక్‌లో అంతరించి పోయిందనుకున్న కమ్యూనిస్టు పార్టీ పునరుజ్జీవనం పొందిందా? అవునంటే సహజంగానే కమ్యూనిస్టులకు వుత్సాహం కలిగించే అంశమైతే, వ్యతిరేకులకు దడపుట్టించే పరిణామమే. అన్నింటికీ మించి అసలు కమ్యూనిస్టులేమిటి ఒక మత నాయకుడి ఆధ్వర్యంలోని పార్టీతో జతకట్టటం ఏమిటి, అధికారంలో కూడా పాలుపంచుకొనేందుకు సిద్దపడటం ఏమిటి అని అనేక మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతేనా, తాజా ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ తరఫున అదీ ఒక మహిళ, షియా ముస్లింల ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించబడే నజఫ్‌ పట్టణ నియోజకవర్గం నుంచి విజయం సాధించటమేమిటి? ముస్లిం ఛాందసులు కమ్యూనిజం మీద వ్యతిరేకత వదులుకున్నారా అని ఆశ్చర్యంతో తలమునకలు అవుతున్నవారు కూడా లేకపోలేదు. ఇంతకీ అసలక్కడేం జరిగింది. దాని గురించి పరిశీలకులేమంటున్నారు?

ఇరాక్‌ మరోసారి ప్రపంచ వార్తల్లోకి ఎక్కింది. గత నెల పన్నెండున అక్కడ జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో అల్‌ సదర్‌-కమ్యూనిస్టు పార్టీ కూటమి ‘సంస్కరణల కోసం పదండి మ ముందుకు ‘ అనే నినాదంతో అనూహ్యంగా పెద్ద కూటమిగా ఎన్నికైంది. తమతో కలసి వచ్చే పార్టీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు వారు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. సంక్లిష్టమైన తీర్పు రావటంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రాజ్యాంగం అనుమతించిన మూడునెలల వ్యవధిలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. కమ్యూనిస్టు పార్టీ ప్రాచుర్యంలోకి రావటం ఇష్టం లేని శక్తుల ప్రోద్బలంతో పార్టీ కార్యాలయం మీద బాంబు దాడి జరిగింది.ఎన్నికలకు ముందు ఇరాన్‌ మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయవేత్త అయిన అలీ అక్బర్‌ వెలాయతీ ఇరాక్‌ సందర్శనకు వచ్చి వుదారవాదులు, కమ్యూనిస్టులను ఇరాక్‌ పాలనకు తాము అనుమతించేది లేదని చేసిన ప్రకటన ఇరాన్‌ ప్రభుత్వ ఆలోచనా ధోరణికి ప్రతిబింబం. అమెరికా సరేసరి దాని గురించి చెప్పాల్సిన పని లేదు. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పెంపుడు చిలక. ‘పదండి ముందుకు’ పేరుతో ఎక్కువ స్ధానాలు సాధించిన కూటమి గురించి ఆ ఏముంది అవసాన దశలో వున్న కమ్యూనిస్టులు, సున్నీ వ్యాపారులు, ఆధ్యాత్మిక కార్యకర్తలతో కూడిన కూటమి అంటూ తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది. ఆ కూటమిలో ఆల్‌ సదర్‌ పార్టీతో పాటు, కమ్యూనిస్టుపార్టీ, మార్పుకోసం యువజనోద్యమ పార్టీ, పురోగామి మరియు సంస్కరణల పార్టీ, ఇరాకీ రిపబ్లికన్‌ గ్రూప్‌, జస్టిస్‌ పార్టీ వంటివి వున్నాయి. జనంలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిరూపంగా ఇరాక్‌లో జరుగుతున్న సమీకరణలకు ప్రతిబింబం ఈ ఎన్నికలని చెప్పవచ్చు. ఈ ఎన్నికల పట్ల ఓటర్లు పెద్దగా ఆసక్తి కనపరచలేదు, దేశవ్యాపితంగా 44శాతం మంది పాల్గంటే బాగ్దాద్‌లో అది 33శాతమే వుంది. ఈ నగరంలో సాదరిస్టు కూటమి 23శాతం ఓట్లు తెచ్చుకుంది. మిగతా పార్టీలలో దేనీకీ పదిశాతానికి మించి రాలేదు. ఎన్నికలు ముగిసి ఫలితాలు ప్రకటించిన పదిహేను రోజుల తరువాత కొన్నివేల పోలింగ్‌ కేంద్రాలలో అక్రమాలు జరిగాయని అక్కడి ఓటింగ్‌ను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన అక్కడేం జరుగుతుందో ఫలితాన్ని ఎటువైపుగా తిప్పుతారో తెలియదు.

ఇరాన్‌ాఇరాక్‌ యుద్ధం, ఇరాక్‌పై అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద దేశాల దాడి, దురాక్రమణ తరువాత, సద్దామ్‌ హుస్సేన్‌ హత్య అనంతరం ప్రపంచ వార్తల్లో ఇరాక్‌ వాటా బాగా తగ్గిపోయింది. అలాంటిది తాజా ఎన్నికలతో పశ్చిమ ఆసియా, పాశ్చాత్య దేశాల మీడియాలో ఈ ఎన్నికలు ఒక కుదుపు మాదిరి ఇరాక్‌ పరిణామాలు ముందుకు వచ్చాయి. ఇవి టీకప్పులో తుపానులా సమసిపోతాయా లేక సరికొత్త పరిణామాలకు నాంది అవుతాయా అన్నది చూడాల్సి వుంది.

మక్తాడా ఆల్‌ సదర్‌

ఎన్నికలలో గెలిచిందెవరన్నది సాధారణ వార్త, అయితే ‘ఇరాక్‌ ఎన్నికలలో ఓడిందెవరు? ఇరాన్‌ మరియు అమెరికా’ అనే శీర్షికతో ఒక వ్యాఖ్యానం వెలువడింది. ఇది అసాధారణం. గతంలో ఇరాన్‌కు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా వున్న ఒక మతాధికారి ఇరాక్‌ను స్వాతంత్య్రం వైపుగా నడిపించాలని కోరుకుంటున్నారు అని సారాంశాన్ని రాశారు. సద్దాం హుస్సేన్‌ను హతమార్చిన తరువాత ఇరాక్‌ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు 2003 నుంచి అమెరికాతో పాటు ఇరాన్‌కూడా చేయాల్సిందంతా చేసింది. ఆ రెండింటి మద్దతుదార్లను పక్కన పెట్టిన ఇరాకీ ఓటర్లు తమ అస్ధిత్వాన్ని, స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలనే ధోరణి వైపు మొగ్గుతున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాక్‌ పార్లమెంట్‌లో 329 స్ధానాలున్నాయి.వాటిలో షియా మతనాయకుడు మక్తాడా ఆల్‌ సదర్‌, కమ్యూనిస్టులతో కూడిన నాయకత్వంలోని రాజకీయ సంఘటన 54 స్ధానాలతో మొదటి స్ధానంలో వుంది. వీరిలో కమ్యూనిస్టులు ముగ్గురే అయినప్పటికీ రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన వుదంతంగా మారింది. ఇరాన్‌ అనుకూల షియా పార్టీల కూటమికి 47, అమెరికా అనుకూల ప్రధాని హైదర్‌ అల్‌ అబాదీ నాయకత్వంలోని కూటమికి 42 స్ధానాలు వచ్చాయి. మిగిలినవి అనేక చిన్న పార్టీలు, ప్రాంతీయ, మత, గిరిజన తెగలకు ప్రాతినిధ్యం వహించే వారికి దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 165 మంది మద్దతు కావాల్సి వుంది.కొన్ని పోలింగ్‌ కేంద్రాల ఓటింగ్‌ను రద్దు చేసి కొన్ని ఫలితాలను తారు మారు చేస్తారా, చేసినప్పటికీ బలాబలాల్లో పెద్ద మార్పు వుండే అవకాశం లేదు. సదర్‌ కూటమి లేకుండా ఇరాన్‌ అనుకూల ప్రభుత్వం ఏర్పడినా, సదర్‌ ప్రమేయంతో అమెరికా వ్యతిరేక కూటమి ప్రభుత్వం ఏర్పడినాఅమెరికాతో లడాయి తప్పుదు. రెండవది జరిగితే అది ఇరాన్‌ ప్రభావం, ప్రమేయాన్ని కూడా అంగీకరించే అవకాశం వుండదు.పశ్చిమాసియాలో కొత్త పరిణామాలకు దారితీస్తుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రభావం కలిగించే అనూహ్య పరిణామాలు జరిగినా ఆశ్చర్యం లేదు. అమెరికాతో సంబంధాలు బెడిసిన పూర్వరంగంలో తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇరాన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే జరిగితే అమెరికా చూస్తూ వూరుకుంటుందా? పశ్చిమాసియా రాజకీయాలలో అమెరికాతో జతకట్టిన సౌదీ అరేబియాలో ఆ ప్రాంతంలో ఇరాన్‌ పలుకుబడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అది సదర్‌ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏ ప్రభుత్వం ఏర్పడినా దాని సుస్ధిరత అన్నది ప్రశ్నార్ధకమే.

ఇరాక్‌, అక్కడి కమ్యూనిస్టు పార్టీ పరిణామాలను ఎలా అర్ధం చేసుకోవాలి? షియా తెగకు చెందిన మక్తాదర్‌ అల్‌ సదర్‌ నాయకత్వంలో ప్రారంభమైన ఇరాకీ జాతీయవాద వుద్యమం సున్నీ తెగవారిపై అమెరికా సైన్యం జరిపిన అత్యాచారాలకు వ్యతిరేకంగా సాయుధ చర్యలు కూడా జరిపింది. షియాల్లోని మితవాదులు,పేదలు కూడా ఇది ఇరాన్‌ అనుకూల వైఖరిగా పరిగణించారు. ఇప్పటివైఖరిని చూస్తే అమెరికా వ్యతిరేకత, ఇరాన్‌ వైఖరిని కూడా వ్యతిరేకించే ఒక జాతీయ రాజకీయ వుద్యమంగా అది మారింది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో సున్నీ అరబ్బులు కూడా నేడు గణనీయంగా సదర్‌కు మద్దతు ఇస్తున్నారని తాజా ఎన్నికలు వెల్లడించాయి. ఇరాక్‌ ప్రయోజనాలకే పెద్ద పీట, అమెరికా, ఇరాన్‌కు వ్యతిరేకం అనే నినాదంతో ఎన్నికలలో పోటీ చేశారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఇరాన్‌ పీడ వదిలింది, ఇరాక్‌ స్వేచ్చ పొందింది అని కూటమి మద్దతుదార్లు బాగ్దాద్‌ వీధుల్లో నినాదాలు చేశారు.

మత ప్రమేయం కలిగిన సదరిస్టులు, మతాన్ని అంగీకరించని కమ్యూనిస్టులు ఎందుకు కలిశారు అన్న ప్రశ్నలకు పరిశీలకులు చెబుతున్నదేమిటి? ముందు దేశంపై ఇరాన్‌ ప్రభావాన్ని అంతం చేయాలి అన్నది ఒకటి.దేశంలో అది ఇరాన్‌ లేదా అమెరికా అనుకూల ప్రభుత్వమైనా అవినీతిని పెంచి పోషించటంలో ఎలాంటి తేడా లేదు, అందువలన అవినీతి నిర్మూలనకు, అభివృద్ధికోసం పనిచేసేందుకన్నది మరొక కారణంగా చెబుతున్నారు. సదరిస్టులు షియా మతభావాలతో ప్రారంభమైనప్పటికీ షియా-సున్నీ తెగలలోని కార్మికులు, ఇతర పేదలను ఐక్యం చేయటంలో జయప్రదమయ్యారని పేదల వాణిగా మారారన్నది కొందరి అభిప్రాయం. కమ్యూనిస్టులు చేతులు కలపటానికి ఇదొక కారణంగా భావిస్తున్నారు. ప్రపంచమంతటా కమ్యూనిజానికి కాలం చెల్లిందన్న ప్రచారం బలంగా జరుగుతున్న కాలంలో, ముస్లింలు- కమ్యూనిజానికి చుక్కెదురు అని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మరొకవైపు జరుగుతున్న పూర్వరంగంలో ఇరాక్‌, ఇతర అరబ్బు దేశాలలో కమ్యూనిజానికి జనం ఆకర్షితులౌతారా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఛాతమ్‌ హౌస్‌ అనే ఒక సంస్ధలో పని చేస్తున్న డాక్టర్‌ నసైబా యూనిస్‌ ఒక మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.’ సద్దామ్‌ హుస్సేన్‌ (2003) అనంతర కాల రాజకీయాలను తిరస్కరించే వారికి ఒక వాహనంగా ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు పార్టీ తయారైంది. ప్రభుత్వాల అవినీతి, పేదల సంక్షేమాన్ని విస్మరణ కారణంగా అలసిపోయిన ఇరాకీలను ఒక విశాల సామాజిక న్యాయ అజెండాతో ఆకర్షించి మద్దతును కూడగట్టుకున్నది. కష్టజీవులకు సేవ చేయాలనే ఒక వుమ్మడి సైద్ధాంతికపరమైన కేంద్రీకరణ, యధాతధ స్ధితిని మార్చాలనే ఒక వుమ్మడి అభిప్రాయం సాదరిస్టులు మరియు కమ్యూనిస్టులకు వుంది. ఇదే సమయంలో నాయకత్వ స్ధాయిలలో వుదారవాదులైన సాదరిస్టులు వున్నప్పటికీ మత విలువలను రుద్దకుండా స్వేచ్చ, స్వాతంత్య్రాలకు సాదరిస్టులు ఎంత మేరకు కట్టుబడి వుంటారు ప్రత్యేకించి ఈ కూటమిలో కమ్యూనిస్టులు ఒక చిన్న భాగస్వామిగా గట్టిగా వున్నపుడు అన్న ఒక ఆతృత కూడా ఇరాకీ వామపక్ష శక్తులలో గణనీయంగా వుంది. మహిళల హక్కుల వంటి విషయాలలో పక్షపాతం లేని వైఖరిని, మద్దతును సాదరిస్టులు విస్తరించకపోవచ్చు ‘ అని నసీబా చెప్పారు.

జోయల్‌ వింగ్‌ అనే మరొక విశ్లేషకుడు ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ గురించి ఇలా చెప్పారు.’ ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ 1934లో ఏర్పడింది. సాంప్రదాయక మార్క్సిజం-లెనినిజాన్ని అనుసరిస్తుంది. సోవియట్‌ యూనియన్‌ వునికిలో వున్నపుడు దానికి అనుకూలంగా వుండేది. గతంలో మధ్యప్రాచ్యంలో కమ్యూనిస్టు పార్టీలు ఇతరులతో ప్రత్యేకించి అరబ్‌ ప్రాంతంలో విస్తరించిన పార్టీలైన నాజరైట్స్‌, బాతిస్టుల వంటివాటితో పోటీపడేవి. 1958 వరకు కమ్యూనిస్టులను రాజరికం నిరంతరం హింసించినప్పటికీ దేశంలోని కార్మికవర్గం, విద్యార్ధులలో కమ్యూనిస్టులు పునాదిని ఏర్పాటు చేసుకున్నారు. వారికి సైద్ధాంతిక మద్దతుదారులు వుండేవారు, వారిలో ప్రధానంగా జనరల్‌ అబ్దల్‌ కరీమ్‌ ఖాశిం తిరుగుబాటుద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత 1968లో బాత్‌పార్టీ నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఖాశిం ప్రభుత్వాన్ని కూలద్రోసి ఆయనను హత్య చేశారు. కమ్యూనిస్టుపార్టీని దాదాపు నాశనం చేశారు. తరువా వారు ఎక్కువ భాగం రహస్యంగా పని చేశారు. 2003 తరువాతనే పార్టీ చాలా పరిమితంగా పనిచేస్తూ బహిరంగ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.అయితే అది చాలా చిన్నది. వంతుల వారీ రాజకీయ అధికార పద్దతి, తెగలవారీ దామాషా పద్దతిలో పదవుల పంపిణీ విధానం, అవినీతికి వ్యతిరేకంగా పౌర సమాజ బృందాలు ఆందోళనకు వుపక్రమించినపుడు కమ్యూనిస్టు పార్టీ వారితో కలసి గత ఐదు సంవత్సరాలలో తిరిగి కమ్యూనిస్టు పార్టీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అవినీతి వ్యతిరేక నిరసనల ద్వారా సాదరిస్టులతో కమ్యూనిస్టుపార్టీ జతకట్టింది. అదే మే నెలలో సాదరిస్టు కూటమిలో భాగంగా పోటీ చేసేందుకు దారి తీసింది. రక్షణ కల్పిస్తామని సాదరిస్టులు చెప్పటం, ఇరాకీ రాజకీయ ప్రముఖులలో చేరేందుకు ఒక దారిగా కమ్యూనిస్టులు ఈ నిర్ణయానికి వచ్చారు. అయినప్పటికీ కమ్యూనిస్టు శ్రేణులలో ఒక అనిశ్చితి వుంది. తమకు నచ్చని విధానాలను సాదరిస్టులు రుద్దుతారా అని అనేక మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఆలోచిస్తున్నారు. సాదరిస్టు పార్టీ అధికారంలో చేరటాన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోవటం లేదు, ఒకవేళ అదే జరిగితే ఆ కూటమి నుంచి బయటపడాలని కొంత మంది ఆలోచిస్తున్నారు.’ అని జోయెల్‌ వింగ్‌ పేర్కొన్నారు.

‘ గత పదిహేను సంవత్సరాలుగా నడచిన ప్రభుత్వ వ్యవస్ధను తిరస్కరించటంలో, సంస్కరణ, అవినీతి, వంతుల వారీ అధికార స్వీకరణ విధానానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ప్రతిధ్వనించారు. అయితే ఇవి వైఖరులు తప్ప విధానాలు కాదు, వాస్తవ సంస్కరణల అజెండాలో అవెలా వాస్తవ రూపం దాల్చుతాయో తెలియదనుకోండి ‘ అని సింగపూర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుడు ఫనర్‌ హదాద్‌ పేర్కొన్నారు. వంతుల వారీ పద్దతిలో అధికారాన్ని పంచుకోవటం కంటే ప్రతిపక్షంలోనే వుండటం మేలని ఎన్నికల ఫలితాల అనంతరం సాదర్‌ కూటమిలోని కొన్ని పార్టీల నేతలు పేర్కొన్నారు. టీచర్‌, మహిళా హక్కుల కార్యకర్త అయిన సుహాద్‌ అల్‌ ఖతీబ్‌ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా అక్కడ ఎన్నికయ్యారు.

జాతీయవాది, కమ్యూనిస్టు అభిమాని అయిన మాజీ ప్రధాని జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం హయాంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికోసం బాగ్దాద్‌ శివార్లలో విప్లవ నగర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఆవాసం తరువాత కాలంలో సాదర్‌ నగరంగా మారింది. దాని జనాభా ప్రస్తుతం 35లక్షలు. బాగ్దాద్‌లో సగం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 1999లో షియా మతనాయకుడు అయాతుల్లా మహమ్మద్‌ సాదిక్‌ అల్‌ సదర్‌ను హత్య చేసిన తరువాత ఆ నగరం సాదర్‌ సిటీగాను, ప్రస్తుతం సాదర్‌ పార్టీ కేంద్రంగా మారింది.ఆయన కుమారుడే ప్రస్తుతం సాదరిస్టు పార్టీ నేత మక్తాదా అల్‌ సదర్‌. సాదర్‌ పార్టీ నాయకత్వంలోని సాయుధ విభాగం అమెరికా సైన్యాన్ని ఎదిరించటంలో ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకొని పోరాడిన చరిత్ర వుంది.

2003లో ఇరాక్‌ను ఆక్రమించినప్పటి నుంచి అమెరికా అధికారుల కనుసన్నలలో నడిచిన ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలను పట్టించుకోలేదు. వివిధ సేవలను అందించటానికి ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్లు అవినీతి అక్రమాలలో మునిగిపోయారు. 2010 వేసవిలో తీవ్ర ఎండలు, విద్యుత్‌ కోత కారణంగా జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. దాంతో జనం నిరసనలకు దిగారు. 2011 వసంత గర్జన పేరుతో మధ్యప్రాచ్యంలో ప్రారంభమైన నిరసనలు ఇరాక్‌ను కూడా తాకాయి.ఇరాకీ వసంత గర్జన పేరుతో వుద్యోగాలు, విద్యుత్‌ తదితర డిమాండ్లపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.ప్రభుత్వం అణచివేతకు దిగటంతో 45 మంది మరణించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం దేశమంతటా అనేక సమస్యలపై ప్రదర్శనలు జరగటం పరిపాటి అయింది. 2015 నుంచి మరింత సంఘటితంగా జరిగాయి. ఈ క్రమంలోనే సాదరిస్టులు, కమ్యూనిస్టులు దగ్గరయ్యారు. మత, తెగల ప్రాతిపదికన ప్రభుత్వంలో పదవుల పందేరాన్ని ఈ ప్రదర్శనల్లో నిరసించారు. ఇరాక్‌ పార్లమెంట్‌, ఇస్లామిక్‌ మత రాజ్యం ఒకే నాణెపు బమ్మా బరుసు వంటివని యువత బ్యానర్లు ప్రదర్శించేవారు.

సద్దామ్‌ హుస్సేన్‌ అమెరికాను వ్యతిరేకించి దాని కుట్రకు బలైన యోధుడిగా లోకం ముందు కనిపించేది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు కరడు గట్టిన కమ్యూనిస్టు, కార్మిక వ్యతిరేకత వుంది. అమెరికా సిఐఏతో చేతులు కలిపిన ఇరాక్‌ బాతిస్టు పార్టీనేతలు కమ్యూనిస్టు అనుకూల జనరల్‌ అబ్దుల్‌ కరీమ్‌ ఖాశిం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆయనను హతమార్చి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కుట్రలో సద్దామ్‌ హుస్సేన్‌ ఒక ప్రముఖుడు. బాతిస్టు పార్టీ, సద్దామ్‌ హయాంలో కమ్యూనిస్టులను అణచివేశారు.కార్మిక సంఘాల ఏర్పాటును కూడా నిషేధించారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇరాక్‌ను తయారు చేయటంలో అమెరికా పాత్ర అందరికీ తెలిసిందే. ఆ రెండు దేశాలూ యుద్ధానికి తలపడిన సమయంలో అమెరికా సద్దామ్‌ హుసేన్‌కు మద్దతు ఇచ్చింది. ఆయుధాలు కూడా అందచేసింది. తరువాత సద్దాం వ్యతిరేకిగా మారటంతో అదే అమెరికా చివరకు ఇరాక్‌ను ఆక్రమించి హతం చేసింది. సద్దాం మరణం తరువాతే విదేశాలలో, స్వదేశంలో వున్న ఇరాకీ కమ్యూనిస్టులు బహిరంగ కార్యకలాపాలలోకి వచ్చారు.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి వుంది. అమెరికా వ్యతిరేకిగా మారిన సద్దామ్‌ హుస్సేన్‌ను బయటి ప్రపంచంలోని కమ్యూనిస్టులు, వామపక్ష అభిమానులు గతంలో బలపరిచారు. ఇరాక్‌ దురాక్రమణను, సద్దాం వురిని కూడా నిరసించారు. సద్దామ్‌ అణచివేతకు గురైన ఇరాకీ కమ్యూనిస్టులు ఈ వైఖరిని ఆమోదించరనేది స్పష్టం. అలాగే ఇప్పుడు మన దేశంలో వున్న మతోన్మాదశక్తులు, అవి చెలరేగిపోతున్న పూర్వరంగంలో వాటికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న కమ్యూనిస్టులు, అభ్యుదయ వాదులకు ఇరాకీ కమ్యూనిస్టుల వైఖరి మింగుడుపడకపోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక మత నాయకుడి ఆధ్వర్యంలోని పార్టీతో ఎలా కలుస్తారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. మన దేశంలోని మతోన్మాదులు కమ్యూనిస్టులను శత్రువులుగా చూస్తున్నారు, కేరళ వంటి చోట్ల హతమార్చేందుకు వెనుకాడటం లేదు.ఇరాష్‌ షియా మతనాయకుడి ఆధ్వర్యంలోని పార్టీ సున్నీ తెగ ముస్లింల మద్దతు కూడా కూడగట్టుకున్నది. కమ్యూనిస్టుల విషయం తెలిసి కూడా అనేక పోరాటాలలో వారితో భుజం కలిపింది. అయితే అది శాశ్వతంగా అలాగే వుంటుందా? అధికారం వచ్చేంత వరకు కమ్యూనిస్టులను వుపయోగించుకొని తరువాత వ్యతిరేకిగా మారితే ఏమిటి అన్న సందేహాలు తలెత్తటం సహజం. తాము స్వయంగా అనేక ప్రపంచ అనుభవాలు చూసిన తరువాత ఇరాకీ కమ్యూనిస్టులు అంత గుడ్డిగా లేదా భ్రమలతో ఒక మత నేత సారధ్యంలోని పార్టీతో చేతులు కలుపుతారని అనుకోవాల్సిన అవసరం లేదు. పదండి ముందుకు పేరుతో ఏర్పాటు చేసిన కూటమి ఎన్నికల కార్యక్రమంలో మతపరమైన అంశాలు లేదా కమ్యూనిస్టులు చెప్పే సోషలిజం వంటి అంశాలేమీ లేవు. అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలు, ఇరాన్‌, అమెరికా జోక్యానికి వ్యతిరేకమైన ఒక జాతీయవాద అజెండాతో వారు జనం ముందుకు వెళ్లారు. అనూహ్యంగా ఒక వేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి అధికారానికి వచ్చి ఎన్నికల ప్రణాళికు భిన్నంగా ఏ పార్టీ వ్యవహరించినా మిగతా పార్టీలు వ్యతిరేకించి బయటకు వస్తాయి. కమ్యూనిస్టులు కూడా అదే చేస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక అంకెల ఆటలో బిజెపికి భంగపాటెందుకు కలిగింది !

19 Saturday May 2018

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ 1 Comment

Tags

BJP, Congress party, jds, karnataka votes 2018, karnataka votes facts, numbers game in karnataka, Yeddyurappa

Image result for Yeddyurappa

ఎం కోటేశ్వరరావు

కర్ణాటకలో అటు ప్రజా కోర్టులో ఇటు అసెంబ్లీ అంకెల ఆటలో బిజెపి భంగపడింది. కులం, ధన, పదవీ ప్రలోభాలు, బెదిరింపులు, బుజ్జగింపులతో తమకు లేని బలాన్ని తెచ్చుకొనేందుకు ప్రయత్నించటాన్ని యావత్‌ దేశం గమనించింది. దానిలో విఫలమై అవమానకరంగా రాజీనామా చేసిన తరువాత ఏ కోశానా లేని తమ నిజాయితీ గురించి తమకు తామే ఆ పార్టీ నేతలు కితాబునిచ్చుకుంటున్నారు. 117 సీట్లు, 56.8శాతం ఓట్లు తెచ్చుకున్న కూటమి కంటే ఓట్ల చీలిక కారణంగా 104 సీట్లు వచ్చినప్పటికీ వారికి వచ్చిన 36శాతం ఓట్లను దాచి పెద్ద పార్టీ అంటూ ఇంకా ఫోజు పెడుతున్నారు. వారెంతగా ఖంగుతిన్నారంటే బలనిరూపణకు సుప్రీం కోర్టు ఇచ్చిన అవకాశాన్ని వుపయోగించుకొని మరింత గబ్బుపట్టటం కంటే ముందే తప్పుకోవటం మంచిదని రాజీనామా చేయటం నష్ట నివారణ చర్యలో భాగం. తనకు అధికారం లేకపోయిన తరువాత ఇంకేంటి అన్నట్లుగా అసెంబ్లీలో ప్రసంగం ముగించి రాజీనామా ప్రకటించిన వెంటనే లేచి వెళ్లిపోయారు. జాతీయ గీతం గురించి పెద్ద సమస్య చేసిన ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో జాతీయగీతాలాపన ముగియ కుండానే లేచిపోవటం వారి నిజస్వరూపాన్ని వెల్లడి చేసింది. ఈ వుదంతంలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి విజయం సాధించింది అనటం కటే బిజెపి ఘోరంగా ఓడిపోయింది అని చెప్పాల్సి వుంటుంది.

తమ పార్టీ కార్యకర్తగా మాదిరి వ్యవహరించే వ్యక్తి రాజభవన్‌లో గవర్నర్‌గా వున్నందున విచక్షణాధికారం పేరుతో ముందు అధికార పీఠాన్ని సంపాదిస్తే తరువాత గతంలో మాదిరి ఏదో విధంగా దాన్ని నిలబెట్టుకోవచ్చని బిజెపి వేసిన ఎత్తుగడలు అనూహ్యంగా చిత్తయ్యాయి. తమకున్న బలానికి మరికొందరు మద్దతిస్తారని లేఖ ఇవ్వటం తప్ప ఎవరు, ఎలా ఇస్తారో ఎడ్డియూరప్ప చెప్పలేదు. మరోవైపు తమకు 117 మంది మద్దతు వుందని సంతకాలతో సహా కాంగ్రెస్‌-జెడిఎస్‌ లేఖ అందచేసినప్పటికీ గవర్నర్‌కు నమ్మకం కుదరలేదని తిరస్కరించటంతోనే కుట్రకు తెరలేచింది. లేఖలో వారం రోజుల గడువు అడిగితే గవర్నరు పదిహేను రోజులు ఇవ్వటం కూడా బిజెపి వ్యూహంలో తరువాత వచ్చిన ఆలోచన పర్యవసానమే.

బిజెపి పధక రూపకర్తలు ఎక్కడ పప్పులో కాలేశారు. కాంగ్రెస్‌ కోర్టుకు వెళ్లనున్నదని తెలిసి కోర్డు సమయం ముగిసిన తరువాత గవర్నర్‌ కార్యాలయం నుంచి లేఖ తెప్పించుకోవటం, తిరిగి కోర్టు తెరిచే లోపల ప్రమాణ స్వీకార తతంగాన్ని ముగించి కోర్టు ఆటంకాన్ని తప్పించుకోవచ్చనేంత వరకు వారు తెలివిగానే వ్యవహరించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా అర్ధరాత్రి తలుపు తట్టిన కాంగ్రెస్‌ నేతల వినతిని మన్నించి అప్పటి కప్పుడు విచారణ బెంచిని ఏర్పాటు చేసి తెల్లవార్లూ విచారణ జరపటాన్ని మాత్రం వారు వూహించలేదు. తమకు వున్న మెజారిటీ గురించి గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొనకపోవటంతో ధర్మాసనం బలనిరూపణకు ఒక రోజు మాత్రమే ఇవ్వటంతో తీరికగా చేపలకు గాలాలు విసురుదామనుకున్న కమలనాధుల ఎత్తులు చిత్తయ్యాయి. బిజెపి నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఏడుగురిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవచ్చని కమలనాధులు భావించారు. అందుకే మీడియాకు అనధికారికంగా ఆ ఏడుగురు తమవైపే అన్న ధీమాతో వుప్పందించారు.

ఎంతకైనా తెగించే బిజెపి తీరుతెన్నుల గురించి జాగ్రత్తపడిన కాంగ్రెస్‌ాజెడిఎస్‌లు తమ సభ్యులను కాపాడుకొనేందుకు గట్టి చర్యలు తీసుకోవటంతో ఎడ్డి మడ్డి వ్యవహారం బెడిసి కొట్టింది. కర్ణాటకలో బిజెపి గతంలో అధికారం వెలగబెట్టినప్పటికీ ఇప్పుడే మొదటిసారి దక్షిణాదిన తమ పాదం మోపుతున్నామనే భ్రమ కలిగే విధంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు. దానికి మీడియాకూడా ఎలాంటి వెనుక ముందులు చూడకుండా నిజమే అన్నట్లు ప్రచారం చేసింది. ఇక్కడ బిజెపికి ఎదురైన సమస్యలేమిటి? 2008లో కాంగ్రెస్‌తో సంకీర్ణం నుంచి బయటకు వచ్చిన జెడిఎస్‌ను బిజెపి దగ్గరకు తీసి తనకు అధిక సీట్లు వున్నప్పటికీ జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసింది. అయితే బిజెపితో స్నేహం ధృతరాష్ట్ర కౌగిలి వంటిదని జెడిఎస్‌కు త్వరలోనే అర్ధమై బిజెపి నుంచి దూరం జరిగింది. ఈ ఎన్నికలలో కూడా అదే విధంగా బిజెపి పెద్ద పార్టీగా, కాంగ్రెస్‌, జెడిఎస్‌లు రెండు, మూడు స్ధానాలలో నిలిచాయి. దక్షిణాదిలో తమ పార్టీ విస్తరణలో భాగంగా ఎట్టి పరిస్ధితిలోనూ తమ పార్టీనేతనే ముఖ్యమంత్రిగా చేయాలని బిజెపి ఎప్పుడో నిర్ణయించుకుంది. అవసరమైతే జెడిఎస్‌ను తమ జూనియర్‌ భాగస్వామిగానే వుంచుకోవాలనుకుంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో దేవెగౌడమీద ఎక్కడ లేని గౌరవం ఒలకపోశాడు. అవసరమైతే ఈ సారి కూడా ముఖ్యమంత్రిగా కుమారస్వామిని చేయాలని, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తమ వారు లేకపోయినా ఇబ్బంది లేదు అని బిజెపి అనుకొని వుంటే పరిస్ధితులు భిన్నంగా వుండేవి. గతంలో కలిగిన అనుభవం దృష్టిలో వున్నప్పటికీ కాంగ్రెస్‌ వివేకం ప్రదర్శించి బేషరతుగా జెడిఎస్‌కు మద్దతు ప్రకటిస్తుందని బిజెపి వూహించలేకపోయింది. దాంతో ప్రలోభాల బాట పట్టింది, భంగపడింది.

మూడు పార్టీలలో అవకాశవాదులు, పదవీ వ్యామోహపరులకు కొదవేమీ లేదు . అధికారం ఎక్కడ వుంటే అక్కడకు చేరే వాతావరణం వున్న ఈ రోజుల్లో బిజెపి ప్రలోభాలకు కాంగ్రెస్‌,జెడిఎస్‌ కూటమిలోని ఎంఎల్‌ఏలు ఎందుకు ప్రభావితం కాలేదు అన్నది పెద్ద ప్రశ్న. ఇదే పరిస్ధితి ఒక ఏడాది ముందు వచ్చి వుంటే ప్రలోభాలు పని చేసి వుండేవన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పుడెందుకు పని చేయలేదు. కేంద్రంలో బిజెపి అన్ని రంగాలలో విఫలమైందని జనం గుర్తించటం ప్రారంభమైంది.గత లోక్‌సభ ఎన్నికలలో 17 సీట్లు, 43శాతం ఓట్లు, 130 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీ తెచ్చుకున్న బిజెపి ఈ సారి 104సీట్లకు, 36శాతం ఓట్లకే పరిమితం అయింది. అంటే నరేంద్రమోడీని చూసి జనం ఓట్లెయ్యరు అన్నది స్పష్టం. దీర్ఘకాలం ముఖ్య మంత్రిగా వున్న గుజరాత్‌లో నరేంద్రమోడీ చెమటోడ్చితిరిగినా చావు తప్పి కన్నులట్టపోయినట్లుగా బిజెపి బతికి బయటపడింది. వుత్తరాదిన ఆ పార్టీ గతంలో మాదిరి ఓట్లను అకర్షించే స్ధితిలో లేదని అనేక రాష్ట్రాల వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటం స్పష్టం చేసింది. 2014లో బిజెపి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన సీట్లు 282 తెచ్చుకున్నప్పటికీ దానికి వచ్చిన ఓట్లు 31.34 శాతమే, దాని మిత్రపక్షాలవి కలుపుకున్నా వచ్చినవి 38.5శాతమే. ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలిపోవటం కారణంగానే బిజెపి అన్ని సీట్లు తెచ్చుకుందన్నది స్పష్టం. ఈసారి బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ సర్దుబాటు చేసుకుంటాయన్న వాతావరణం రోజురోజుకూ బలపడుతోంది. పెద్ద రాష్ట్రమైన వుత్తర ప్రదేశ్‌లో వుప్పు-నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు రెండు లోక్‌సభ వుప ఎన్నికలలో ఐక్యంగా పోటీ ఇచ్చి బిజెపి అభ్యర్ధులను ఓడించాయి. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్‌డిఏ నుంచి బయటకపోయినవి తప్ప కొత్తగా ఒక్క పార్టీ కూడా చేరే పరిస్ధితి లేదన్నది స్పష్టం కావటం. ఆరు నెలల్లో రాజస్ధాన్‌,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు నరేంద్రమోడీ సన్నద్దమౌతున్నారన్నది స్పష్టంగా కనిపించటం. మోడీ భవితవ్యమే ఎలావుంటుందో తెలియనపుడు బిజెపితో జట్టుకడితే ఆరునెలల్లో పరిస్ధితి తారుమారైతే తమ పరిస్ధితి ఏమిటన్న దూరాలోచన కూడా అవకాశ వాదులలో తలెత్తి వుండవచ్చు. అందువలన తాత్కాలికంగా ప్రలోభాలకు లంగకపోయినప్పటికీ అవకాశవాదులతో ఆ ముప్పు ఎప్పుడూ మెడమీద కత్తిలా వేలాడుతూనే వుంటుంది.

ఈ ఎన్నికలు బిజెపి అవకాశవాదం,అప్రజాస్వామిక చర్యలను ఎంతగానో బయట పెట్టాయి. అనేక మంది ఆ పార్టీ అభిమానులుగా వున్నవారు పరస్పర విరుద్దమైన వాదనలు చేయటాన్ని సమర్ధించుకోలేని స్ధితిలో పడ్డారు. మెజారిటీ కూటమిని కాదని, మెజారిటీ లేని పార్టీ పెద్దది అనే పేరుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌ చర్యను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దాని మీద పదివారాల తరువాత విచారణకు చేపట్టనుంది. గతంలో వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులు వున్నప్పటికీ వాటికి తమదైన భాష్యాలు చెబుతూ గవర్నర్‌ విచక్షణాధికారాల పేరుతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ అవకాశవాదానికి పాల్పడుతున్నది. దీని మీద కూడా మరింత స్పష్టత వచ్చే విధంగా సుప్రీం తీర్పు వుండవచ్చని అనేక మంది ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకొని వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలు తరువాత కూటమి కట్టటం ఏమిటని బిజెపి ఒక వాదనను ముందుకు తెచ్చింది, దాని గురించి ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు గుండెలు బాదుకుంటున్నారు.

గోవా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలలో తలపడిన పార్టీలు, స్వతంత్రులతో జతకట్టిన బిజెపి, అదే కర్ణాటకలో జరిగితే తప్పుపట్టటం ఏమిటన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జెడియు, బిజెపి ఎంత హోరాహోరీగా పోటీ చేసింది, పరస్పరం ఎన్నిమాటల తూటాలను ప్రయోగించిందీ చూశాము. అలాంటి నితీష్‌ కుమార్‌కు మద్దతు ఇవ్వటానికి బిజెపికి, తీసుకోవటానికి నితీష్‌ కుమార్‌కు ఎలాంటి సమస్య ఎదురు కానపుడు కాంగ్రెస్‌-జెడిఎస్‌ను ఎందుకు తప్పుపడుతున్నట్లు ? ఇలాంటి విషయాలన్నీ అటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలోనూ, సామాజిక మాధ్యమంలోనూ పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఇంతకాలం కాంగ్రెస్‌ను విమర్శించిన బిజెపి ఆచరణలో అదేపని చేస్తున్నదనే అంశాన్ని ఈ సందర్భంగా అదనంగా మరికొంత మంది గ్రహించారు. ఇవన్నీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఏతర పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకొనేందుకు దాని అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు జాగరూకతతో వుండేందుకు ఈ వుదంతం తోడ్పడింది.

కొన్ని ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులను కూడా ఇది వెల్లడి చేసింది. పొరుగునే వున్న రాష్ట్రానికి వెళ్లి జెడిఎస్‌కు మద్దతు ప్రకటించి వచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు లేదా టిఆర్‌ఎస్‌ అక్కడి పరిణామాలపై మౌనం దాల్చటం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. లోపాయకారీగా బిజెపితో అవగాహన నిజమే అనేందుకు ఆస్కారం కలిగించింది.తాము మద్దతు ఇచ్చిన జెడిఎస్‌ నాయకుడే ముఖ్యమంత్రి అవుతున్నా టిఆర్‌ఎస్‌కు అది ఇబ్బంది కలిగించే అంశమే. ఎందుకంటే తెలంగాణాలో తమను సవాలు చేస్తున్నది కాంగ్రెస్‌ కావటం, ఆ పార్టీ మద్దతుతోనే కుమారస్వామి కర్ణాటక ముఖ్య మంత్రి కావటం టిఆర్‌ఎస్‌ వూహించిన పరిణామం కాదు. మరొక ఫ్రంటు అంటూ కెసిఆర్‌ చేస్తున్న యత్నాలకు ఇది చెప్పులో రాయిలా ఇబ్బంది పెట్టే అంశమే.

తమతో కలసి అధికారంలో భాగస్వాములౌతూనే వైఎస్‌ఆర్‌సిపితో కధనడుపుతున్న బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకొనేందుకు ప్రత్యేక రాష్ట్రహోదా కల్పనలో వాగ్దాన భంగాన్ని తెరమీదకు తెచ్చింది. కర్ణాటకలో ఒక వేళ బిజెపి గెలిస్తే తదుపరి తమను వేధిస్తారనే అనుమానం కలగటం లేదా అలాంటి సూచనలు కనపడటం వలనగానీ తెలుగుదేశం నేతలు కర్ణాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ను గెలిపించమని చెప్పలేదు గానీ బిజెపిని ఓడించమని ప్రచారం చేశారు. అంటే బిజెపి మీద ఎవరు గెలిచే సత్తా వుంటే వారిని గెలిపించమన్నదే దాని అంతరార్ధం. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అంతరం మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక చీలిక, సంక్షోభానికి తెరలేపనున్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. వుక్రోషంతో బిజెపి అందుకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అయితే అలాంటిదేదో జరగాలని తెలుగుదేశం కూడా అంతరంగంలో కోరుకుంటున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదాపై బిజెపి ద్రోహం చేసిందనే ప్రచారం చేస్తున్న ఆ పార్టీనేతలపై కొత్త కేసులు పెట్టినా పాత కేసులను తిరగదోడినా తమపై వేధింపులకు పూనుకుందంటూ బాధిత ఫోజు పెట్టి జనం ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. కర్ణాటకలో తమ గురించి గొప్పలు చెప్పుకుంటున్న బిజెపికి, ఇతర పార్టీలకు గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల, సీట్ల వివరాలు ఇలా వున్నాయి.పార్టీల వారీ వచ్చిన ఓట్ల శాతం,బ్రాకెట్లలోని అంకెలు వచ్చిన సీట్ల సంఖ్య)

సంవత్సరం బిజెపి            కాంగ్రెస్‌          జెడి(ఎస్‌)    ఇతరులు

2004    28.33(79) 35.27(65)   20.77(58) 15.3(22)

2008    33.86(110) 35.13(80)  19.44(28) 11.57(6)

2013     19.90(40) 36.60(122)  20.20(40) 24.40(22)

2018      36.20(104) 38.00(78)  18.40(38) 7.40 (2)

లోక్‌సభ ఎన్నికలు కర్ణాటక ఓట్లు సీట్ల వివరాలు

2009 41.63(19) 37.5(6) 13.57(3) 5.20(0)

2014 43.00(17) 40.80(9) 11.00(2) 5.20(0)

నరేంద్రమోడీ, అమిత్‌ షా మాజిక్‌ లేనపుడు, అసలు వారెవరో కర్ణాటక ఓటర్లకు తెలియనపుడే 2009లోక్‌సభ ఎన్నికలలో గరిష్టంగా ఆ పార్టీకి 41.63శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో 43శాతం ఓట్లు వచ్చాయి. అది ఇప్పుడు 36.2శాతానికి పడిపోయింది. నరేంద్రమోడీ, అమిత్‌ షాపర్యటన కారణంగా బిజెపి పెరిగిన ఓటింగ్‌ శాతమేమీ లేదు, అలాగని రాహుల్‌ గాంధీ ప్రచారం కారణంగా కాంగ్రెస్‌కు తగ్గిందేమీ లేదు. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలోనే ఎడ్డియూరప్ప, గాలి సోదరులు అండ్‌కో కలిసిన కారణంగా బిజెపి ఓటింగ్‌ 43శాతానికి పెరిగి ఈ అసెంబ్లీ ఎన్నికలలో 36.2శాతానికి తగ్గింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దళితుల ఇండ్లలో భోజనం చేస్తే వారు పునీతులు కారు అన్న వుమా భారతి

03 Thursday May 2018

Posted by raomk in BJP, Communalism, History, INDIA, NATIONAL NEWS, Opinion, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP motor mouths, Dalit, discrimination against dalits india, motormouths, Uma Bharti

Image result for Uma Bharti

ఎం కోటేశ్వరరావు

ఏదో అయింది, లేకపోతే నరేంద్రమోడీ అంతటి పెద్ద మనిషి వివాదాస్పద, మసాలా మాటలు మాట్లాడి పార్టీకి ఇబ్బంది తేవొద్దు అని హెచ్చరించిన తరువాత కూడా తమ నేతల నేతల నోళ్లు ఇంకా వాగుతూనే వున్నాయని కొందరైనా బిజెపి అభిమానులు అంతరంగంలో అయినా అనుకోకుండా వుండజాలరు. నేతల నోళ్లు పని చేస్తుండటమే కాదు, పార్టీ మరుగుజ్జు యోధుల సేన(ట్రోల్స్‌) తమ ఎత్తుగడలతో ఇంకా ముందుకు పోతూనే వుంది. మోడీ అంటే వీరికి లెక్క లేదా లేక మోడీ అదుపులో వీరు లేరా లేక నేను పెద్దమనిషిగా సుద్దులు చెబుతుంటాను మీరు చేసేది చేయండి అన్న మార్గదర్శక సూత్రాలేమైనా వున్నాయా అని అనుమానించక తప్పటం లేదు. ఒకటి మాత్రం స్పష్టం. పులినెక్కిన వారు ఆకస్మికంగా స్వారీని మధ్యలో ఆపలేరు. దాన్ని వారు అదుపులోకి తీసుకొని దిగాలి లేదా దానికి బలి కావాలి. బిజెపి మతోన్మాద, విద్వేష ప్రచార పులి స్వారీ చేస్తోంది. మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వుమా భారతి తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసిన తరువాత మోడీ సలహా నేపధ్యంలో బిజెపి వారెంత తెలివిగా తమ నోళ్లను వుపయోగిస్తున్నారో తెలుస్తోంది.

పిటిఐ అందచేసిన వార్త ఇలా వుంది. మంగళవారం నాడు కేంద్ర మంత్రి వుమా భారతి దళితులను అవమానించిన తీరు కొంతకాలంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దళితులను దువ్వేందుకు చేస్తున్న యత్నాలను గాలికిపోయేట్లు చేసిందంటే అతిశయోక్తి కాదు. వుమా భారతి మధ్య ప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌ సమీపంలో నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా దళితులతో సహపంక్తి భోజనానికి గైరు హాజరయ్యారు. వారితో కలసి భోంచేసి వారిని పునీతులను చేయటానికి తానేమీ భగవంతుడు రాముడిని కాదని వ్యాఖ్యానించారు. తరువాత ఆమె క్షమాపణలు చెప్పారు. వారితో కలసి భోజనం చేయాలనే విషయం తనకు తెలియదన్నారు. రెండు రోజుల క్రితం (మే ఒకటవ తేదీ) దాద్రి గ్రామంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ ‘ఇలాంటి కార్యక్రమాలను (షెడ్యూలు కులాల వారితో కలసి సహపంక్తి భోజనాలు చేయటం) నేను సమర్ధించినప్పటికీ దళితులతో కలసి భోజనం చేసేందుకు నేను వారి ఇండ్లకు వెళ్లను’ అని చెప్పారు. దానికి బదులు వారిని తానే తన ఇంటికి ఆహ్వానిస్తానని అన్నారు. ‘ నేను మీతో ఒక రహస్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను సహపంక్తి భోజనాలలో పాల్గనను, ఎందుకంటే ఎవరైతే శబరి ఇంటికి, దళితుల వద్దకు వారిని పునీతులను చేసేందుకు వెళ్లిన భగవంతుడు రాముడిని నేను అనుకోవటం లేదు. వారితో కలసి కూర్చోవటానికి, పునీతులను చేసేందుకు నేనేమీ భగవంతుడు రాముడిని కాదు. దానికి బదులు వారు మా ఇంటికి వచ్చి వంట ఇంట్లో కూర్చుంటే మేము పునీతులం అవుతాం. మా ఇంట్లో నా భోజన బల్లమీద దళితులకు నేను వడ్డిస్తే నా ఇల్లు, పాత్రలు కూడా పునీతం అవుతాయి. ఢిల్లీ రండి, మా మేనల్లుడి భార్య మీకు భోజనం తయారు చేస్తుంది. నేను మీకు వడ్డిస్తాను, మా మేనల్లుడు మీరు తిన్నతరువాత కంచాలను తీసి శుభ్రం చేస్తాడు. నేను మా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నేను మీతో కలిసి భోజనం చేయలేను, ఎందుకంటే ఇప్పటికే తిన్నాను, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నా, ఎల్లవేళలా మీతోనే వుంటా ‘ అన్నారు.

Image result for Uma Bharti

తరువాత ఒక ప్రకటన చేస్తూ తన అనుచరుడైన హర్షు మహరాజ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భోజనం చేయవలసిన అంశం వుందని నాకు తెలియదు అని వేదికమీదనే చెప్పాను. ఇక్కడి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో వున్న టికమ్‌ ఘర్‌ జిల్లా పాపోడాకు వెళ్లి అక్కడ విద్యాసాగర్‌ మహరాజ్‌ను కలవాల్సి వుందని, అందువలన వారితో కలసి భోజనం చేయలేనని వారికి క్షమాపణ చెప్పాను. సామరస్యత సాధించాలంటే దళితులతో కలసి భోజనం చేయాలన్న ఒకప్పటి కాలం గతించింది. దానికి బదులు వారిని రాజకీయంగా, సామాజికంగా, ప్రభుత్వంలోనూ, యంత్రాంగంలోనూ, ఇతర వాటిలోనూ సామరస్యత సాధించాలంటే వారిని సమానత్వంతో తీసుకుపోవాలి. రాజకీయాలలో దళితులు, వెనుకబడిన తరగతుల మధ్య సామరస్యం సాధించేందుకు ఇప్పుడు వివక్షను అధిగమించాలి. సామాజిక సామరస్యతను సాధించాలంటే ఆర్ధిక సాధికారత, సామాజిక గౌరవం, ప్రభుత్వంలో, అధికార యంత్రాంగంలో సమాన భాగస్వాములను చేయటం మాత్రమే మౌలిక అవసరాలు.’ అన్నారు. కార్యక్రమం తరువాత దళితులతో భోజనం చేయాలనుకోవటం లేదని చెప్పటం గురించి విలేకర్లు అడగటం ఆశ్చర్యంగా వుందని వ్యాఖ్యానించారు.

సామాజిక సామరస్యత, కుల తత్వానికి వ్యతిరేకంగా సహపంక్తి భోజనాలు, దళితుల ఇండ్లలో భోజనం చేయటం వంటి కార్యక్రమాలను గత కొద్ది నెలలుగా బిజెపి పెద్ద ఎత్తున ప్రచారంతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పూర్వరంగంలో ఒక కేంద్ర కాబినెట్‌ మంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా వుమా భారతి వ్యవహరించిన తీరు బిజెపి నేతల అంతరంగాన్ని తెలియచేస్తున్నది. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని బిజెపితో గట్టి స్నేహం చేసిన చంద్రబాబు నాయుడు గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సోమవారం నాడు వుత్తర ప్రదేశ్‌ మంత్రి సురేష్‌ రాణా అలీఘర్‌లోని ఒక దళితుని ఇంట బయటి నుంచి తెచ్చిన భోజనం చేసి విమర్శల పాలయ్యాడు.

విలేకర్లతో ప్రత్యక్షంగా మాట్లాడకూడదన్న దీక్షలో వున్నారు కనుక తమ పార్టీ నేతలునోటి తుత్తరను అదుపులో వుంచుకోవాలని మోడీ చెప్పటం వరకు బానే వుంది. కానీ ఇతర నేతలకు ఎలా సాధ్యం అవుతుంది. కాశ్మీరులో ఎనిమిదేండ్ల బాలిక అసిఫాపై జరిగిన అత్యాచారాన్ని లండన్‌ భారత సంతతి వారి సభలో ప్రధాని నరేంద్రమోడీ సూటిగా ఖండించకుండా కుండా అత్యాచారం అత్యాచారమే దాన్నెలా సహిస్తాం అని ఎదురు ప్రశ్నవేస్తూ రాజకీయం చేయవద్దని వ్యాఖ్యానించారు. అత్యాచార వుదంతం ప్రపంచవార్తగా తయారైంది. నిందితులపై కేసు నమోదు చేయవద్దని జమ్ము బార్‌ అసోసియేషన్‌ అడ్డుకుంది. నిందితులు నిర్దోషులంటూ హిందూ ఐక్య వేదిక పేరుతో జరిగిన సభలో ఇద్దరు కాశ్మీరు మంత్రులు, ఎంఎల్‌ఏలు పాల్గన్నారు. నష్ట నివారణ చర్యగా ఇద్దరు మంత్రులను రాజీనామా చేయాలని బిజెపి ఆదేశించింది. ఇంత జరిగాక ఆ సభలో పాల్గన్న ఒక ఎంఎల్‌ఏకు మంత్రి పదవి కట్టబెట్టారు. కవీందర్‌ గుప్తా అనే ఎంఎల్‌ఏను వుప ముఖ్యమంత్రిగా చేశారు. ఇంత జరిగిన తరువాత సదరు కవీందర్‌ అసిఫా హత్యాచార సంఘటన చాలా చిన్నదని వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. దోషులకు మద్దతుగా పాల్గన్న ఎంఎల్‌ఏకు మంత్రి పదవి ఇవ్వటం ఏమిటని అడిగితే అది ఇప్పటి నిర్ణయం కాదు, మూడు సంవత్సరాల నాడే మంత్రి వర్గమార్పులు చేయాలని నిర్ణయించినదానిలో భాగమే అని బిజెపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ సమర్ధించుకున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ అయితే నారదుడు ఇంటర్నెట్‌ గూగుల్‌ వంటి వాడని సెలవిచ్చారు. అంతకు ముందు మహాభారత కాలంలోనే ఇంటర్నెట్‌ వుండబట్టే సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ వార్తలను ఎప్పటికప్పుడు తెలియచేశాడని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ దేవ్‌ చెప్పిన విషయమూ తెలిసిందే. జ్ఞానపరంగా బిఆర్‌ అంబేద్కర్‌, నరేంద్రమోడీ ఇద్దరూ బ్రాహ్మలే అని గుజరాత్‌ స్పీకర్‌ రాజేంద్ర త్రివేదీ వర్ణించాడు. గుణాన్ని బట్టి కులం వుంటుందని, జ్ఞానం వున్న ప్రతి వారూ బ్రాహ్మలేనని శ్రీకృష్ణుడే చెప్పాడని, అందుకే తాను అంబేద్కర్‌, మోడీ ఇద్దరూ బ్రాహ్మలే అన్నానని సమర్ధించుకున్నాడు.

కేంద్ర మంత్రి అనంత కుమార హెగ్డే కర్ణాటక ఎన్నికల సభలో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ దేవాలయాలకు వెళ్లినపుడు కావి(కాషాయ) దుస్తులు, మఠాలకు పోయినపుడు రుద్రాక్షలు, కోడి ఈకలతో మసీదులకు, శిలువ ధరించి చర్చ్‌లకు వెళతాడు, ఇప్పుడు ఆయన శ్రావణ బెళగొళ వెళతాడు అంటూ ఎద్దేవా చేశాడు. ఎలాంటి దుస్తులు ధరించని జైన్‌ దిగంబర ఆలయం అది అన్న విషయం తెలిసిందే. తమ మనోభావాలను కేంద్ర మంత్రి కించపరిచాడంటూ జైనులు ఇప్పుడు నిరసన తెలుపుతున్నారనుకోండి. ఇలా నోరుపారవేసుకోకపోతే కార్యకర్తలకు కిక్కు ఎక్కదు, మీడియాలో ప్రచారం రాదని బిజెపి నేతలకు బాగా తెలుసు. అయితే ఇలాంటి వాటిని వుపయోగించుకొని పార్టీలో ప్రతీకారం తీర్చుకొనే అవకాశాలు కూడా లేకపోలేదు. కథువా(అసిఫా) అత్యాచారం వెనుక పాకిస్ధాన్‌ హస్తం వుందని వ్యాఖ్యానించిన బిజెపి మధ్యప్రదేశ్‌ అధ్యక్షుడు నంద కుమార్‌ సింగ్‌ చౌహాన్‌ పార్టీ వుద్యోగం పొగొట్టుకున్నాడు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన వుప ఎన్నికలలో బిజెపి ఓడిపోవటానికి ఎవరో ఒకరిని బలిపశువును చేయాలి కనుక ఈ వ్యాఖ్యలను చూపి ఇంటికి పంపించారనే వార్తలు కూడా వచ్చాయి. సదరు నేతకు నోరు పారవేసుకోవటం సాధారణం. రాజకీయ నేతలు నేరగాళ్లకు విధిగా మద్దతు ఇవ్వాలని గతంలో ప్రకటించాడు. తమ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా నాలుక కోస్తా అని బిజెపి ఎంఎల్‌ఏ చేసిన వ్యాఖ్యలు ఒక వుప ఎన్నికలో బిజెపిని దెబ్బతీశాయి. అదే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరీ శంకర్‌ బిసేన్‌ తమ గ్రామంలో తాగటానికి మంచి నీళ్లు లేవంటే అయితే మీకు బిస్లరీ వాటర్‌ సరఫరా చేస్తాంలే అని వ్యంగోక్తితో ఆగ్రహం తెప్పించాడు. ఫ్రెంచి విప్లవ సమయంలో తినటానికి రొట్టెలు దొరకటం లేదని జనం ఆగ్రహంతో వున్నారు మహరాణీ అంటే అయితే వారు కేకులు తినవచ్చు కదా అన్న మారీ అంటోనియెట్‌ను ఈ మంత్రి గుర్తుకు తెచ్చారు. తమకు ఓటు వేయని వారంతా పాకిస్తానీలే అని సహకారశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ నోరుపారవేసుకున్నాడు. రైతుల ఆత్మహత్యలు డబ్బుకోసం, ఒక ఫాషనైపోయింది అన్న వ్యాఖ్యలు చేసిన అనేక మంది గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి తమకు ఎదురు లేదనే అధికార దురహంకారం ఒక కారణమైతే, అడుగుజారుతున్న సమయంలో వ్యక్తమయ్యే అసహనానికి కూడా ఇవి చిహ్నమే. అంతేకాదు, వారి అంతరంగాన్ని కూడా ఇవి బయటపెడతాయి. మేకతోలు కప్పుకున్న పులులు, గోముఖ వ్యాఘ్రాలు కూడా ఇలాగే వుంటాయి.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేదాలను ప్రశ్నించిన మహాకవి వేమన కూడా జాతి వ్యతిరేకి, కమ్యూనిస్టేనా ?

02 Wednesday May 2018

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., Opinion, RELIGION

≈ 1 Comment

Tags

ANTI NATIONAL, communal forces, communalism, communist, everything lies in veda’s only, Religious Fundamentalists, vedas, Vemana

ఎం కోటేశ్వరరావు

వేదాల్లో అన్నీ వుంటే మన వారెందుకు విదేశాలకు పరుగులు తీస్తున్నట్లు అన్న శీర్షికతో నేను రాసిన వ్యాసంపై సామాజిక మాధ్యమంలోని ఫేస్బుక్‌లో సంస్కారయుతంగా స్పందించిన వారందరికీ ఒక దండం, అనాగరికంగా స్పందించిన వారికి వంద దండాలు. చర్చలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించటం కనీస ధర్మంగా భావిస్తున్నా.

‘వేదాలు ఎందరు చాడుతున్నారు కమ్మీ’

జ: దీనిలో చాడు ను వాడు గా అనుకున్నా కమ్మీ అనే తిట్టు తప్ప ప్రశ్న అర్ధం కాలేదు.

‘ అబ్బే అన్నీ దాస్‌ కాపిటల్‌ లోనే ఉన్నాయి పోయి చదువుకోండి.’

జ: అంత వుక్రోషం వద్దులే మిత్రమా ! ప్రపంచంలో వేదాలు చదువుతున్న వారి కంటే దాస్‌ కాపిటల్‌ చదివేవారే ఎక్కువ . గత పది సంవత్సరాలుగా ధనిక దేశాలలో వచ్చిన సంక్షోభం తరువాత మరీ ఎక్కువగా చదువుతున్నారని వార్తలు. ప్రపంచంలో దాస్‌ కాపిటల్‌ చదివి తిరుగుబాట్లు చేశారు. వేదాలు చదివిన వారు అగ్రహారాలకే పరిమితం అయ్యారు , వాటిని కూడా సంస్కరించుకోలేకపోయారు అన్నది అంగీకరించక తప్పదు మరి. ఇదే సమయంలో ఒక కాలపు సాహిత్యంగా చరిత్రలో వేదాలకు స్ధానం వుంది.

‘రిజర్వేషన్‌ వల్ల రా కమ్మి. నీ వయసు కి విలువ ఇవ్వాలంపియట్లేదు’

జ: రిజర్వేషన్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వేదాలు- మనువాదం రెండింటినీ విడదీయలేము. ప్రపంచంలో ఎక్కడా లేని రిజర్వేషన్ల విధానం రావటానికి జనాభాలో ఐదో వంతుగా వున్న దళిత, గిరిజనులను వేల సంవత్సరాలుగా అంటరాని వారిగా చూసినందువల్లనే ఇవి వచ్చాయి. ఆ దురాచారాన్ని రూపు మాపి వారిని కూడా తోటి మానవులుగా గుర్తించినపుడు రిజర్వేషన్లు వుండవు. కానీ ఇప్పుడు ఆధునిక మనువాదులు అంటరాని తనం వుండాలి, రిజర్వేషన్లు పోవాలి అంటున్నారు. ఇక నా వయస్సు, ఫేస్‌బుక్‌లో నేనే వివరాలు పెట్టాను, అందరికీ ఆధైర్యం వుండదు, అనేక మంది ఫేక్స్‌ వున్నారు. గురువు అద్వానీకే శిష్యుడు నరేంద్రమోడీ ఇచ్చిన విలువేమిటో చూశాము. వాదన, విషయంలో వున్నదానిని బట్టి విలువ ఇవ్వండి చాలు. కొంత మంది కుర్రవాళ్లు పేర్లకీ పుకార్లకీ నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. నేనైతే ఆ టైప్‌ కాదు. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా వుంది అని నమ్ముతా.

‘కమ్మీలకు స్వంత సిద్దాంతాల్లేక విదేశాలనుంచి ఎందుకు దిగుమతి చేసికొన్నారు?స్వంతంగా సిద్దాంతాలే తయారుచేసికోలేని అనామకులా కమ్మీలు?కాస్తైనా జ్ఞానంలేని మూర్ఖులైన కమ్మీలను ప్రజలెలా ఆదరిస్తారు?

జ: వసుధైక కుటుంబం అనే భావనలో నమ్మకం వున్న వాడిని. మన రాజ్యాంగంతో సహా అనేక అంశాలను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఇస్లాం, క్రైస్తవ మతాలను నిత్యం దుమ్మెత్తి పోసే వారు వారి దీనార్లు, డాలర్లు, ఇతర వస్తువులను తెచ్చుకోవటానికి, ఆ దేశాలకు వెళ్లి మరుగుదొడ్లు కడగటం నుంచి కంప్యూటర్ల వరకు ఏ పని అయినా చేయటానికి, కూలి డబ్బులు తెచ్చుకోవటానికి కోట్లాది మంది సిగ్గుపడటం లేదు. ఏం తెచ్చారో, ఎంత తెచ్చారో ఇంతవరకు తెలియకపోయినా నిత్యం నరేంద్రమోడీ విదేశాల నుంచి ఏదో ఒకటి తీసుకురావటానికే కేగా అందమైన సూట్లు వేసుకొని పైలా పచ్చీసుగా తిరుగుతోంది. భారతీయతకు ప్రతిబింబంగా కొందరు భావించే పిలక, పంచకట్టుతో ఎందుకు వెళ్లటం లేదు. ఇన్ని జరుగుతున్నపుడు, వాటికి అభ్యంతరం లేనపుడు కమ్యూనిస్టులు ఒక సిద్ధాంతాన్ని తమకు వర్తింప చేసుకుంటే తప్పేమిటట? బౌద్దం, ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతం ఒక చోట పుట్టి అనేక దేశాలకు విస్తరించింది. కమ్యూనిజం కూడా అంతే .వాటికి లేని అంటూ సొంటూ కమ్యూనిజానికికే ఎందుకు?

‘ మీ బతుకులు ఈ దేశ గొప్పదనం తక్కువ చేయడానికే. పంది బురద మెచ్చు, పన్నీరుమెచ్చునా విశ్వదాభిరామ…’

జ: నాకు తెలిసినంత వరకు ఏ కమ్యూనిస్టూ ఈ దేశ గొప్పతనాన్ని తక్కువ చేయలేదు. అలా చేసినట్లు ఒక్క వుదంతం వున్నా చూపాలని చేసిన సవాలుకు ఇంతవరకు ఎవరూ బదులివ్వలేదు. అనేక మతాలు వచ్చాయి, పెరిగాయి, తరిగాయి. మధ్య యుగాల నాటి మాదిరి భీకర మత యుద్ధాలు మహత్తరమైన భారత గడ్డమీద జరగలేదు గాని మత యుద్ధాలు మనకు కొత్త గాదు. శైవులు-వైష్ణవుల మధ్య పరిమితంగా అయినా యుద్ధాలు జరిగాయి. జైన, బౌద్ధ మతాలను, హేతువాద, భౌతిక వాదులైన చార్వాకులను హిందూ మతంగా చెప్పుకొనే వారు అణచివేచిన చరిత్ర వుంది. ఇప్పుడు క్రైస్తవం, ఇస్లాం మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న మెజారిటీ మతోన్మాదులు, దానికి స్పందిస్తున్న మైనారిటీ మతోన్మాదులు దొందూ దొందే. పందులు పన్నీరు మెచ్చకపోయినా నష్టం లేదు. మతోన్మాదులు ఎందరు మగువల కన్నీరు ఒలికించటానికి నీ పేరుతో ప్రయత్నిస్తున్నారో వీలైతే వారిని ఆపేట్లు చూడు రామా అని కమ్యూనిస్టులు కాని వారెందరో మొక్కుకుంటున్నారు.

‘విదేశాలకు పరుగులు తీయాలని కూడా వేదాల్లోనే ఉందట’

జ: అన్నీ వున్నాయష అన్నపడు పరుగుల గురించి ఎందుకుండదు

‘ వీళ్ళు వీళ్ళ పిచ్చ…వేదాలని ప్రశ్నిస్తే కమ్మీలు అంటారు,వాళ్లంటే అంత భయమేంటో, వాళ్ళ పేరే కలవరిస్తారు.’

జ: ఇది తరతరాలుగా వస్తున్న భయం, గంగిరెద్దుల్లా తలాడించటం, మన్ను దిన్న పాముల్లా జనం పడి వుండాలని కోరుకొనే వారికి ప్రశ్నించే ఒక్కడు కనపడినా భయమే. వేద ప్రామాణ్యాన్ని ప్రశ్నించటం ఈ రోజు కాదు, వాటిని రాసిన నాటి నుంచీ ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే వున్నారు. ఒక్క వేదాలే కాదు, గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటి ఏ మత గ్రంధమైనా, మరొకటైనా సమాజ పురోగతికి ఆటంకం కలిగించే ప్రతిదాన్నీ జనం ప్రశ్నిస్తారు. అలాంటి వారిని అణచివేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. దోపిడీ వర్గాన్ని సమర్ధించే వారే నాడు నేడు ఈ అణచివేతకు పాల్పడుతున్నారు.

‘ఎవడైనా సరుకున్నవాడినే రమ్మంటారు’

‘ వారికి నేర్పడానికి నాసా లో హిందువులేఎక్కువ ‘

జ: సరకున్నవాడినే ఎవరైనా రమ్మంటారన్నది కొంత వరకు నిజమే. తమకు అవసరమైన వాళ్లను కూడా రమ్మంటారు అని కూడా తెలుసుకోవాలి. అమెరికా, ఐరోపా వారు వస్తువులు తయారు చేసుకోలేకనా చివరకు …..తుడుచుకొనే కాగితంతో సహా చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నది. కాదు, వ్యాపారికి లాభం కావాలి. చైనాలో తయారయ్యేందుకు అయ్యే ఖర్చు కంటే అమెరికాలో ఎక్కువ చెల్లించాలి. అందుకే ఎక్కడ శ్రమశక్తి తక్కువుంటే అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు. అలాగే వైద్యులు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ ఇంజనీర్లు. అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలు వారిని తయారు చేసుకోలేక కాదు. ఒక వైద్యుడు తయారు కావాలంటే అమెరికాలో అయ్యే ఖర్చు కంటే ఇండియాలో తక్కువ. మిగతావారు కూడా అంతే. మన దేశంలో వున్నన్ని జబ్బుల గురించి అమెరికా, ఐరోపాలో తెలుసుకోవాలంటే కుదరదు, అక్కడన్ని లేవు గనుక. అందుకే విదేశాల నుంచి రమ్ముంటున్నారు తప్ప మన మీద ప్రేమ వుండి కాదు, మనమే గొప్పవారం అని కాదు. ప్రపంచంలో విదేశాలలో నివసించే చైనా జాతీయులు ఐదు కోట్ల మంది అయితే మన వారు మూడు కోట్లకు పైబడి వున్నారు. అమెరికాలో కూడా భారతీయుల కంటే చైనీయులే ఎక్కువ. అందువలన మన గురించి చెప్పుకోవచ్చు తప్ప అతిశయోక్తులు చెప్ప కూడదు. నాసాలో పని చేస్తున్న మన సైంటిస్టులందరూ హిందువులే అని చెప్పటం అతిశయోక్తి. అంటే హిందువులందరూ మన దేశ పరిశోధనలను వదలి పెట్టి అమెరికన్లకు వూడిగం చేస్తున్నారను కోవాలి. ఇదేమీ దేశభక్తి ?

‘ఎప్పుడూ పక్కదేశం బానిసలుగా బతికేవారికి ఆత్మవిశ్వాసం లోపించి మనలో ఏమీ లేదు అనుకునే పర్సనాలిటీ డిసార్డర్‌, ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్‌తో బ్రతికే మానసిక రోగులు మన కమ్యూనిస్టులు. ముందు మీ పూర్వీకుల ఘనతను తెలుసుకుని,ఎవరైనా సైకాలజిస్ట్‌ దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకోండి.

జ: కమ్యూనిస్టులు ఏ దేశం వారినైనా వారు దోపిడీ చేసేవారా, దోపిడీకి గురయ్యే వారా అని మాత్రమే చూస్తారు తప్ప మతం, కుల ప్రాతిపదికన చూడరు. పక్కన వున్న వాడికి ఒక కన్ను పోవాలనుకుంటే మనకు రెండూ పోతాయి. సమాజంలో కొంత మంది కంటే తాము గొప్ప వారమనే సుపీరియారిటీ రోగాన్ని పెంచిన మనువాదం మొత్తంగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధను ప్రోత్సహించి, నిర్మించి సమాజానికి చేసిన హాని అంతా ఇంతా కాదు. మహిళలను అణచివేసింది, వారికి విద్య, వివేకం లేకుండా చేసింది. పంచముల పేరుతో నాలుగోవంతు, ఇతర వృత్తుల పేరుతో మరి కొ ందరిని ఈ దేశం మాది అనుకొనే స్ధితి లేకుండా చేసింది. ఎందరు హిందూ రాజులు పాలించినా వేల సంవత్సరాలు అదే స్ధితి కొనసాగింది. అందువలన, విదేశీయులు, హూణులు, తరుష్కులు, యూరోపియన్లు ఎవరు దేశం మీద దాడులు చేసినా, మొత్తాన్ని ఆక్రమించుకున్నా మన బతుకులు మారేదేమీ వుండదని ఏం జరిగితే మనకెందుకు లెమ్మని మెజారిటీ జనం ప్రేక్షక పాత్ర పోషించబట్టే దేశం వందల సంవత్సరాలు పరాధీనమైంది. ఎక్కడ ఏమాత్రం గౌరవం, ఆదరణ, సాటి మనిషిగా గుర్తింపు వుంటుందని భావించినా అనేక మంది మతమార్పిడులకు సిద్దపడటానికి కూడా కారణమదే. ఇప్పటికీ అదే స్ధితి. అందుకు అంబేద్కరే ప్రత్యక్ష నిదర్శనం. అందువలన మన గత ఘనత గురించి మరీ ఎక్కువగా చెప్పుకొనే మానసిక రోగులకే ముందు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. బుర్రలను మరమ్మతు చేయాలి.

ౖ’వేదాలలలో అన్ని ఉన్నాయి విదేశీయులు వఛ్చి అన్ని వేదిలేసేం ఇప్పటి అమెరికా వైద్యం కన్నా మంచి వైద్యం మన దగ్గర ఉండేది ఎంసెట్‌ రాంక్‌ వఛ్చినవాడు ఎం బి బి ఎస్‌ చదువుతాడుకాని ఆయుర్వేదం చదవడుకదా జెర్మనీ వాడు మానవేదాలని ఉపయోగించుకుని ఆయుధాలు మందులు చేసుకుంటున్నాడు మన రాజమండ్రి ఆయనని అక్కడకి తీసుకునివెళ్ళి మరి ఆయుధాల విద్య నేర్చుకున్నారు మనకి మాత్రం అలుసు మన పూర్వులగురించి తెలియదు తెలుసుకోము విదేశీయులంటే మోజు అన్ని ఉన్న విజ్ఞానం మనది

జ: ఇలాంటి నమ్మకాలు వున్న వారు రెండు తరగతులు.లోతైన అధ్యయనం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎక్కడ అనే ప్రశ్నలు వేయకుండా గుడ్డిగా నమ్మి ప్ర చారం చేసేవారు. కావాలని దురహంకారాన్ని రెచ్చగొట్టే వారు. ఈ దేశంలో ఇప్పుడు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో వున్నది వేదాలలో అన్నీ వునాయష అని నమ్మే తిరోగమన భావజాలం వున్న వారే. దేశీయ వైద్యాన్ని అభివృద్ధి చేయటానికి వారికి ఎవరు అడ్డుపడ్డారు. కార్పొరేట్‌ ప్రయివేటు వైద్య విద్య, చికిత్సను ప్రోత్సహిస్తున్నారు. మన రాజమండ్రి ఆయనని తీసుకొనివెళ్లి జర్మన్లు ఆయుధాల విద్య నేర్చుకున్నారని చెప్పటం అమాయకత్వం తప్ప మరొకటి కాదు.

‘చదువుకున్నా చదువుకు సరైన ఉపాదిలభించక ఉపాధిని పొందడమే జీవిత లక్ష్యం

వేదాలలో …. నిర్వేదం ఉంది కాబట్టి

అవి శుద్ద దండగా అని నిరూపించడానికి……….

ఇప్పుడు అభివ ద్ధిలో ఉన్న దేశాలు కొన్ని ఒకప్పుడు భారతదేశానికి వచ్చి బాగు పడిపోయినవి.

డబ్బు కోసం తెల్లోని తొత్తులాయ్‌ మతం మరి సలాం కొట్టి గులాం గిరి చేసారు

వాడు వచ్చి మనని దోచి మన వేదాలను బూడిద చేసి మన దేవాలయాలను కూలగొట్టి

మన దేశం లో మనకే రాజు గామారి న తరవాత మనం ఇప్పుడు వాణి దెగ్గర గులాం చేయక ఎం చేస్తారు

అదే మన వేదాలను మన దెగ్గర భద్ర పరిస్తే ఈ పరిస్థితి ఉండేదా.

వేదాలు చదివిన ఘనాపాఠిలను చూసి వాళ్ళు ఏ కొత్త టెక్నా జీని ఆవిష్కరించలేక పోతున్నారని వారే విదేశీయ ఉత్పత్తుల కొరకు ఆరాటపడి పోతున్నారని నిర్ధారించుకొని విదేశాలకు పరుగులు పెడుతున్నారు. ఏ దేశంలో లేని ఖనిజ సంపద వనరులు కలిగిన మన మాత  భూమిని భారతదేశాన్ని కాలదన్ని విదేశీ మోజుతో వెళ్ళిపోతున్నారు.

వేదాల్లో అన్నీ ఉంటే వేదాలు చదివిన వేద పండితులు ప్రపంచానికి అవసరమైన ఆవిష్కరణలు చేసి భారత ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఎగరవేసేవారు. ప్రపంచ ప్రజలు .. ఇది భారత వేద పండితులచే కనిపెట్టబడినదని చెప్పుకొనే కనీసం ఒక వస్తువైనా ఉందా

జ: నా వ్యాసంలోను వీటి గురించి కొంత చర్చించి నందున కొన్నింటిపై వ్యాఖ్య అవసరం లేదని భావిస్తున్నాను. చివరగా ఒక మిత్రుడు ప్రశ్న వేదిక వేదాల గురించి వేమన ఎలా స్పందించిందీ చూడండి అంటూ రెండు పద్యాలు పంపారు.

వేద విద్యలెల్ల వేశ్యల వంటివి

భ్రమలు పెట్టి తేట పడగ నీవు

గుప్త విద్య యొకటె కులకాంత వంటిది

విశ్వదాభిరామ వినుర వేమ.

వేన వేలు చేరి వెర్రి కుక్కల వలె

అర్ధ హీన వేద మరచు చుంద్రు

కంఠ శోష కంటె కలిగెడి ఫలమేమి

విశ్వదాభిరామ వినుర వేమ!

మహాకవి వేమన హేతువాద భావజాలాన్ని అనుసరించే, ముందుకు తీసుకుపోయే అనేక మందిపై మతోన్మాదశక్తులు దాడులు చేస్తున్నాయి, ప్రాణాలు కూడా తీస్తున్నాయి. జనంలో ప్రతికూల స్పందన వస్తుందని భయపడిపోయి గానీ వేమనను కూడా కమ్యూనిస్టు , జాతి, హిందూ వ్యతిరేకి అని వున్మాదులు తిట్టి పోసే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదు. భిన్నాభిప్రాయాన్ని అణచివేయాలని చూస్తున్న శక్తుల పట్ల ఎవరు వుపేక్షించినా వారు తమంతట తమ నోటిని మూసుకోవటమే. తరువాత తెరవాలన్నా తెరవనీయరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d