జై శంకర్‌ వాషింగ్టన్‌ పర్యటన : పేరు వ్యాక్సిన్‌, అసలు లక్ష్యం అమెరికాకు బాసట !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” జైశంకర్‌ అమెరికా పర్యటనలో వాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం ”
” అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్‌తో వాణిజ్యం, వాక్సిన్లు, చతుష్టయం, ఇండోఫసిఫిక్‌ అంశాలపై జైశంకర్‌ చర్చ ”
” చతుష్టయం, ఆఫ్ఘనిస్తాన్‌, వాక్సిన్‌ తదితరాలపై భారత్‌-అమెరికా ద్వౌపాక్షిక చర్చ ”
” ట్విటర్‌, వాట్సాప్‌ గురించి అమెరికా పర్యటనలో జైశంకర్‌ చర్చ”
” జైశంకర్‌ అమెరికా పర్యటనలో తొలి చర్చనీయాంశం చైనా ”
” చతుష్టయ కూటమికి వెన్నుదన్నుగా భారత్‌ ”


మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మే 24 నుంచి 28 వరకు జరిపిన అమెరికా పర్యటనకు ముందు, ఆ సమయంలో వచ్చిన కొన్ని వార్తల శీర్షికలు ఇవి. ఇటీవలి కాలంలో కరోనా కారణంగా అన్నీ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా జరుగుతుంటే స్వయంగా వెళ్లటం అంటే ముఖాముఖీ తేల్చుకునేవి ఉండి ఉంటాయని జనం అనుకున్నారు. ఎందుకు వెళ్లారు, ఏం మాట్లాడారు, ఏమి సాధించారు అని మన దేశం తిరిగి వచ్చిన తరువాత ఎవరైనా అడిగితే ఏం చెబుతారో తరువాత చూద్దాం.
జైశంకర్‌ పర్యటనకు ముందు వివిధ మీడియా సంస్ధలు పర్యటన లక్ష్యం, ఉద్దేశ్యాల గురించి కథనాలు రాశాయి. పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నట్లుగా పరిపరి విధాలుగా అవి ఉన్నాయి. జేమ్స్‌బాండ్‌గా మోడీ అభిమానులు వర్ణించే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అమెరికన్లతో ఫోన్లో మాట్లాడి దెబ్బకు దిగివచ్చేట్లు చేశారు చూడండి అంటూ ఏప్రిల్‌ నాలుగవ వారంలో కాషాయ దళాలు ఊదరగొట్టాయి. ఇంకేముంది ఫోను పెట్టేలోగానే వాక్సిన్‌ తయారీ ముడి పదార్ధాలతో అమెరికా విమానాలు గుంపులు గుంపులుగా ఎగురుకుంటూ బయలు దేరాయి చూడండి అన్నట్లుగా వాట్సాప్‌లో తెగ ప్రచారం చేశారు. ట్రంప్‌ బెదిరించగానే నిషేధం ఎత్తివేసి ఎందుకంత ఆగ్రహం జీహుజూర్‌ అంటూ మనం హైడ్రోక్సీక్లోరోక్విన్‌ మాత్రలు పంపిన మాదిరి మనకు వాక్సిన్‌ ముడి పదార్దాలను పంపటానికి అక్కడున్నది నరేంద్రమోడీ కాదని గత ఐదు వారాల్లో రుజువైంది.


వచ్చిన వార్తలను బట్టి అమెరికాలో వినియోగానికి అనుమతి ఇవ్వకుండానే కొనుగోలు చేసిన ఆరు కోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా వాక్సిన్లను, మరో రెండు కోట్ల ఇతర కంపెనీల వాక్సిన్లను మనకు విక్రయించటానికి లేదా దానంగా ఇవ్వటానికి మాత్రమే అమెరికా సుముఖంగా ఉంది. బోలెడు సానుభూతి కబుర్లు తప్ప వాక్సిన్‌ ముడి పదార్ధాల సరఫరా గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఒక వైపు ప్రాణాలు పోతున్నా, అక్కడి వాడని వాటి మీద కూడా నెలల తరబడి అమెరికా నిర్ణయం తీసుకోలేదని గమనించాలి. అమెరికా దానం చేసే వాక్సిన్ల కోసం, ముడి పదార్దాలు విక్రయించండి మహా ప్రభో అని స్వయంగా వెళ్లి ఐదు రోజులు ఉండాల్సి అవసరం ఉందా ? కేవలం వాటికోసమే అయితే అవసరం లేదు.


మనకు కరోనా వాక్సిన్‌ ముడి పదార్దాలను అమెరికా ఇవ్వదా ? ఎందుకివ్వదు, ఇస్తుంది. ఎప్పుడు ? ఉద్రిక్తలను మరింతగా పెంచకుండా, దెబ్బలాటలకుదిగకుండా లడఖ్‌ సరిహద్దుల్లో ఉన్న సైన్యాల ఉపసంహరణ గురించి మనం చైనాతో జరుపుతున్న చర్చలు జోబైడెన్‌ సర్కార్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయా ? చైనా విషయంలో భారత్‌ రాజీపడుతున్నదనే అనుమానం అమెరికాలో తలెత్తిందా ? కరోనా కారణంగా మన దేశంలో తలెత్తిన విపత్కర పరిస్ధితిని వినియోగించుకొని మనల్ని మరింతగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టేందుకు వాక్సిన్‌ ముడిపదార్దాల సరఫరాను ఎరగా వేస్తున్నదా ? మన దేశం దానికి లొంగిపోతున్నదా ? ఇలా ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి.

హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు మలేరియా చికిత్సలో వినియోగిస్తారు. అవి కరోనా నివారణకు కూడా పనికి వస్తాయోమో అన్న ఆలోచన రాగానే మన దేశం వాటిపై నిషేధం విధించింది. తన ఎన్నికలు ముందున్నాయి, అమెరికాలో కరోనా పుచ్చిపోతోంది, భారత్‌ సదరు ఔషధం మీద నిషేధం విధించిందంటే నిజంగానే అది పని చేస్తుందేమో అన్న ఆశతో డోనాల్డ్‌ ట్రంప్‌ తనకు కౌగిలింతల సన్నిహితుడు అని కూడా చూడకుండా బహిరంగ బెదిరింపులతో నరేంద్రమోడీని అవమానించాడు. ఇప్పుడు వాక్సిన్లు తప్ప మరొక చికిత్సలేదు అని తేలిపోయింది, అవి అందుబాటులోకి వచ్చాయి గనుక వాటితో రాజకీయం చేసేందుకు అమెరికా నిర్ణయించుకుంది. ముందు చూపులేని కారణంగా మోడీ సర్కార్‌ జనాన్ని బలిచేస్తున్నది. ముతక సామెత చెప్పినట్లు మంచమిరిగినా……అన్నట్లు కరోనా మహమ్మారిని కూడా సామ్రాజ్యవాదం తన ఎత్తుగడలకు అనుగుణ్యంగా వినియోగించుకుంటుంది అన్నది తేలిపోయింది.


నిజానికి మన సర్కార్‌తో లెక్కలు తేలిఉంటే జైశంకర్‌ పర్యటన సమయంలోనే వాక్సిన్‌ ముడిపదార్దాల సరఫరా గురించి నిర్దిష్టమైన ప్రకటన అమెరికా వైపు నుంచి వెలువడి ఉండేది. జో బైడెన్‌ జనవరిలో అధికారాన్ని స్వీకరించిన తరువాత మన కేంద్ర మంత్రి ఒకరు అమెరికాలో పర్యటించటం ఇదే ప్రధమం. ప్రపంచ పరిణామాల గురించి ఎవరి దృష్టి వారికి ఉంటుంది, మన వైఖరి ఏమిటో కూడా వారు వినాలి కదా అని జైశంకర్‌ చెప్పారు. తన పర్యటనలో ప్రతి సమావేశంలోనూ కరోనా మీద పోరు, వాక్సిన్‌ సరఫరాలు, ఉత్పత్తి గురించి ప్రముఖంగా ప్రస్తావించినట్లు చెప్పారు. అయినా అమెరికా వైపు నుంచి నిర్ధిష్ట ప్రకటన లేదా సూచన లేదు. అంటే ఇంకా మన నుంచి ఏదో ఆశిస్తున్నది. ఇటీవలి అనుభవాల తరువాత అమెరికాతో పూర్తిగా అంటకాగితే లాభం కంటే నష్టమే ఎక్కువన్నది స్పష్టమైంది. బహుశా దీనికి సూచికగానే తమ దేశ ప్రయోజనాలు, ప్రాధాన్యతలకు అనుగుణ్యంగానే విదేశాంగ విధానం కొనసాగుతుందని అమెరికా పర్యటనకు ముందు ఒక సమావేశంలో జైశంకర్‌ చెప్పారు. ఇలాంటి వైఖరి అమెరికన్లకు నచ్చదు. వారు ఆడించినట్లు ఆడే కీలుబొమ్మలుగా ఉండాలి.

తాము కూడా ప్రపంచ స్ధాయి కార్పొరేట్లుగా ఎదగాలనుకుంటున్న మన దేశీయ కార్పొరేట్లకు అలాంటి లొంగుబాటు నష్టదాయకం కనుక అలాంటి వైఖరిని పూర్తిగా అంగీకరించరన్నది గత అనుభవం. ఉదాహరణకు అమెరికాకు చెందిన అమెజాన్‌ కంపెనీ యజమాని మన దేశం వచ్చినపుడు ఎక్కడ ముఖేష్‌ అంబానీకి కోపం వస్తుందో అని నరేంద్రమోడీ కనీసం దర్శనానికి అనుమతి కూడా ఇవ్వలేదు. అమెజాన్‌ వాణిజ్య విస్తరణను అడుగడుగునా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. తమకు వ్యతిరేకంగా భారత్‌ను మరింతగా ముందుకు తోసేందుకే వాక్సిన్‌ను ఆయుధంగా చేసుకొని అమెరికా ఇలా చేస్తున్నదని, సాయం చేసినా షరతులతో కూడినదే అవుతుందని చైనా పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాదు కరోనా రెండవ తరంగం విషయంలో వైఫల్యంతో తలెత్తిన జనాగ్రహాన్ని చల్లార్చేందుకు మోడీ సర్కార్‌ దౌత్యపరమైన బహిరంగ తమాషాకు పాల్పడిందని కూడా ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. అందుకే జైశంకర్‌ పర్యటన సాధించింది ఏమిటనే ప్రశ్నకు ప్రాధాన్యత ఏర్పడింది.


ఒకవైపు చైనా పెద్ద ఎత్తున వివిధ దేశాలకు వాక్సిన్‌ సరఫరా చేస్తున్న నేపధ్యం, మా వాక్సిన్‌ మాకే అన్న అమెరికా మీద ప్రపంచం అంతటి నుంచి వస్తున్న వత్తిడిని తట్టుకోలేక తమకు పనికిరాని దానిని గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు ఇతర షరతులను తగిలించి దానం పేరుతో ఆరుకోట్ల ఆస్ట్రాజెనెకా, మరో కోట్ల ఇతర వాక్సిన్లు కలిపి ఎనిమిది కోట్ల డోసులను ఇతర దేశాలకు ఇస్తామని ప్రకటించింది. దానిలో మన దేశానికి ఎన్నో ఇంతవరకు తేల్చలేదు. ఇంతవరకు మనకు వచ్చిందేమైనా ఉంటే మిగతా దేశాల మాదిరి ఆక్సిజన్‌ కానసెంట్రేటర్లు, ఇతర చిన్న చిన్న పరికరాలు తప్ప కీలకమైన వాక్సిన్‌ ముడిసరకుల సరఫరాలు లేవు. ఎప్పటిలోగా ఇచ్చేది కూడా ఇంతవరకు చెప్పలేదు.

అమెరికా ప్రతినిధులతో వ్యూహాత్మక మరియు రక్షణ భాగస్వామ్యం గురించి కూడా సమగ్రమైన సంభాషణ జరిగిందని, అభిప్రాయాల మార్పిడి జరిగిందని జైశంకర్‌ చెప్పారు. చతుష్టయం పేరుతో అమెరికా ఏర్పాటు చేసిన జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా కూటమిలో సభ్యత్వం గురించి తమకు స్పష్టత ఉందని చైనా చర్యల నేపధ్యంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఒక ముఖ్యమైన అంతరాన్ని పూడ్చిన కూటమితో నిబంధనలకు అనుగుణ్యమైన వ్యవస్ధకు తాము మద్దతు ఇస్తున్నట్లు వాషింగ్టన్‌ సమావేశాల తరువాత జైశంకర్‌ చెప్పారు. చతుష్టయ కూటమి ఆలోచన ఇప్పటిది కాదు.2007లోనే రూపుదిద్దుకుంది తప్ప ముందుకు సాగలేదు. మరుసటి ఏడాదే దేశ రాజకీయ అంతర్గత విబేధాల కారణంగా ఆస్ట్రేలియా కూటమి నుంచి తప్పుకుంది. తిరిగి 2017లో చేరింది. చైనా-భారత్‌ల మధ్య సరిహద్దు ఘర్షణల నేపధ్యం, ట్రంప్‌ అధికారాన్ని కోల్పోవటంతో చతుష్టయంలో కొనసాగినా చురుకుగా ఉండకపోవచ్చని మన దేశాన్ని అమెరికా అనుమానించింది. అలాంటిదేమీ లేదు, పూర్తి స్ధాయిలో పని చేస్తామని ఈ పర్యటన సమయంలో జైశంకర్‌ స్పష్టం చేసినట్లు ఈ పర్యటనమీద వెల్లడైన విశ్లేషణలు, వ్యాఖ్యలు వెల్లడించాయి. ” సభ్యులంగా దేనికైనా సిద్దపడాలి, దాని గురించి మాకు చాలా స్పష్టత ఉంది. లేనట్లయితే మేము సభ్యులుగా ఉండజాలము. ఇప్పటి వరకు ఈ కూటమి సముద్ర ప్రయాణ భద్రత, సంబంధాల గురించే చర్చించేదిగా ఉంది, ఇటీవలి సంవత్సరాలలో అది సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సరఫరా వ్యవస్దలు, వాక్సిన్ల ఉత్పత్తి గురించి కూడా చర్చిస్తున్నది, అంటే అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాల గురించి ఆందోళన ఉంది. పెద్ద దేశాలు చేయగలిగింది ఎక్కువ, పెద్ద సంబంధాలు దానికి తోడౌతాయి, అయితే చివరికి ఒక బృందంగా కొన్ని దేశాలు కూర్చుని కలసి పని చేస్తేనే అనేక పనులు జరుగుతాయి. మా అందరికీ ఒకే విధమైన స్దానం, ప్రయోజనాలు ఉన్నాయి, అలాంటపుడు అందరం కూర్చొని ఎందుకు సమస్యలను చర్చించకూడదు ” అని జైశంకర్‌ విలేకర్లను ప్రశ్నించారు. కొద్ది రోజులు గడచిన తరువాత గానీ కేంద్ర మంత్రి పర్యటన వివరాలు, పర్యవసానాలు వెల్లడయ్యే అవకాశం లేదు.

పెరుగుతున్న చైనా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసేందుకు అమెరికాతో కలసి పని చేస్తే మనకు ఒరిగేదేమీ లేదని గత ఏడు సంవత్సరాల అనుభవం నేర్పుతున్నా, మోడీ సర్కార్‌ వైఖరిలో పునరాలోచన ఉన్నట్లు కనపడదు. మరోవైపు చైనా నుంచి తనకు ఎదురవుతున్న సవాలును ఒంటరిగా ఎదుర్కోగలిగినప్పటికీ అర్ధికంగా లాభదాయకం కాదు గనుక మనవంటి దేశాలను అమెరికా తన వ్యూహంలోకి లాగుతున్నది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని, దాని లక్ష్యాలపట్ల ఏమాత్రం గౌరవం లేని శక్తులు నేడు కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్‌లో కూడా తరాలు మారి నయవుదారవాద విధానాల పట్ల మోజు పెరిగింది కనుకనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వాటిని అమలు జరిపారు. రాష్ట్రాల హక్కుల సమస్యల మీద ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు కూడా నయాఉదారవాద విధానాలకు అనుకూలమే గనుక వాటికి అధికారం తప్ప కాంగ్రెసా-బిజెపినా అనే తేడా పెద్దగా ఉండదు.


ఎండమావులను చూసి నీటి సరస్సులుగా భావించినట్లు అమెరికా, పశ్చిమ దేశాలను చూసి మన దేశం వాటితో జతకట్టి లబ్దిపొందాలని చూస్తున్నది. ఇప్పటికే అమెరికా -ఐరోపా ధనిక దేశాల మధ్య మిత్రవైరుధ్యం ఉంది. తమకు పోటీగా మనవంటి మరొక దేశాన్ని ఎదగనిస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. అనూహ్యంగా తమను సవాలు చేస్తున్న చైనాను దెబ్బతీసేందుకు పొరుగునే దానికి చికాకు కలిగించే శక్తివారికి కావాలి. గతంలో మనలను లొంగదీసుకొనేందుకు పాకిస్ధాన్‌ను అమెరికా, పశ్చిమ దేశాలు ప్రయోగించినట్లే ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా మనలను నిలబెట్టాలన్నది బహిరంగ రహస్యం. పాకిస్ధాన్‌ బావుకున్నదేమీ లేదు.మనకూ అదే మర్యాద జరగబోతున్నది.


గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ ఢకొీన్న సమయంలో పరిస్ధితి వేరు, ఇప్పుడు వేరు. సోవియట్‌ స్ధానంలో చైనాను దెబ్బతీయాలని చూస్తున్నారు. మొదటి విషయం చైనా నాటి సోవియట్‌ కాదు. నాడు సోవియట్‌కు వ్యతిరేకంగా యావత్‌ ఐరోపా ధనిక దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. తరువాత ఏం జరుగుతుందో తెలియదు గానీ ఇప్పుడు చైనాను ఉపయోగించుకొని లబ్దిపొందాలని అవి చూస్తున్నందున గతంలో మాదిరి అమెరికా ఏమి చెబితే అది నడవదు. ఈ తేడాను గమనించకుండా మన దేశం అమెరికాకు తోకగా మారితే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.

ఐఎంఏ అధ్యక్షుడికి మత ముద్ర వేసిన కాషాయ దళం- రామ్‌దేవ్‌ బాబాకు జూన్‌ ఒకటిన వైద్యుల నిరసన !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అల్లోపతి వైద్యాన్ని కించపరుస్తూ మాట్లాడిన రామ్‌దేవ్‌ బాబా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వాక్సినేషన్‌ కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడినందున ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్‌ ఒకటవ తేదీన దేశవ్యాపితంగా నిరసన దినం పాటించాలని రెసిడెంట్‌ డాక్టర్ల ఫోరం పిలుపు నిచ్చింది. దీంతో ఇష్టవచ్చినట్లుగా బాబా మీద, మద్దతు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా ఎండగట్టే ఎండగట్టే అవకాశం ఉంది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలి లేదా వెయ్యి కోట్ల జరిమానా దావాను ఎదుర్కోవాలని అందుకు పదిహేను రోజుల గడువు ఇస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఎ) ఇచ్చిన నోటీసులో పేర్కొన్నది. అందువలన ఆ గడువులోగా క్షమాపణ చెబుతారా, కేసును ఎదుర్కొంటారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శల తుపానుతో గుక్కతిప్పుకోలేని మోడీ సర్కార్‌కు అటు వైద్యులను సమర్ధించాలా లేకా విశ్వాసపాత్రుడైన రామ్‌దేవ్‌ను సమర్ధించాలా అన్న కొత్త తలనొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్‌ రామ్‌దేవ్‌ బాబా పతంజలి కరోనిల్‌ టూల్‌కిట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంచాలని నిర్ణయించటాన్ని బట్టి బాబాకు మద్దతు ఇస్తున్నదెవరో స్పష్టమౌతోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఏదో ఒకసాకుతో కొనుగోలు చేస్తాయా ?


వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని కొందరు పండితులు చెప్పారు, ప్రచారం చేశారు తప్ప ప్రపంచంలో ఇంతవరకు ఏ వైద్య విధానమూ సర్వరోగ నివారిణులను కనుగొన్నాము అని ప్రకటించలేదు. అల్లోపతి కూడా చెప్పలేదు. కానీ కరోనా వైరస్‌ను సొమ్ము చేసుకోవాలని చూసిన రామ్‌దేవ్‌ బాబా వంటి వారు ఢిల్లీ పెద్దల అండచూసుకొని రెచ్చిపోతున్నారు. ప్రశ్నల పేరుతో అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఇప్పటికీ అనేక వ్యాధులకు సరైన ఔషధాలు, చికిత్స లేదు. అలాంటపుడు రామ్‌దేవ్‌ వంటి వారు ఒక్క అల్లోపతినే ఎందుకు ప్రశ్నించాలి, మిగతా విధానాలకు ఈ ప్రశ్నలను ఎందుకు వేయటం లేదు.


ఎందుకంటే ఆయుర్వేదం పేరుతో సొమ్ము చేసుకోవటం సులభం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం అల్లోపతి ఔషధాలకు మాత్రమే పరీక్షల నిర్దారణ నిబంధనలు ఉన్నాయి. సంప్రదాయ వైద్య పద్దతులను ప్రోత్సహించే పేరుతో ఆయుర్వేద, సిద్ద, యునానీ పేరుతో తయారు చేసే ఔషధాలకు వాటి నుంచి మినహాయింపులు ఇచ్చారు. ఆనందయ్య లాంటి వారు ఊరికొకరు మందుల పేరుతో పుట్టుకు వస్తున్నారు. ఈ లోపం కారణంగానే రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలి తాము కరోనాను అరికట్టే కరోనిల్‌ అనే ఔషధాన్ని తయారు చేసినట్లు ప్రకటించుకుంది. దాన్ని విడుదల చేసిన సభలో స్వయంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ పాల్గొన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా సొమ్ము చేసుకోవటం కంటే జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నందున ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అలా చెప్పుకోవటాన్ని సవాలు చేసింది. కనుకనే బాబా గారికి అల్లోపతి వైద్యం, వైద్యుల మీద కోపం వచ్చింది. అందుకే నోటికి ఏది తోస్తే దాన్ని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. చివరికి అది వివాదానికి దారితీయటంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని అల్లోపతి వైద్యం మీద చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సలహా వంటి హెచ్చరిక చేయటంతో వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించిన బాబాగారికి ఉక్రోషం ఆగలేదు. ఐఎంఎగానీ దాని బాబు గాన్ని నన్ను అరెస్టు చేయించలేరు అని నోరుపారవేసుకున్నారు. దాని కొనసాగింపుగా వాక్సిన్‌ తీసుకున్నా పది వేల మంది వైద్యులు కరోనాతో మరణించారని అబద్దాలు ప్రచారం చేశారు. తన పాతిక ప్రశ్నలకు అల్లోపతి వైద్యవిధానాన్ని సమర్ధిస్తున్న వారు సమాధానం చెప్పాలంటూ సవాలు విసిరారు.


రామ్‌దేవ్‌ బాబా సవాలుకు తాము జవాబు చెబుతామని, తాము కూడా కొన్ని ప్రశ్నలు వేస్తామని ఆ చర్చను మీడియా సమక్షంలో నిర్వహించి ప్రత్యక్ష ప్రసారం చేయాలని, పతంజలి యోగ పీఠం నుంచి ముగ్గురు ఆయుర్వేదాచార్యులను నియమించాలని, కావాలంటే రామ్‌దేవ్‌ బాబా,ఆయన అనుచరుడు మరో భాగస్వామి బాలకృష్ణ కూడా చర్చలో ప్రేక్షకులుగా ఉండవచ్చునని ఐఎంఎ ప్రతిసవాలు విసిరింది. ఆయుర్వేదంలో వారిద్దరి అర్హతలేమిటో వెల్లడించాలని తాము గతంలోనే మూడు సార్లు కోరినప్పటికీ ఇంతవరకు జవాబు లేదని, అర్హత లేనివారితో చర్చించటం పద్దతి కాదు కనుక వారు తమ నిపుణులను నియమించాలని స్పష్టం చేసింది. అల్లోపతి వైద్య సామర్ద్యాన్ని ప్రశిస్తూ రామ్‌దేవ్‌ ప్రశ్నలు ఉన్నాయి.
ఈ వివాదంలో బిజెపి బీహార్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సంజరు జైస్వాల్‌ అల్లోపతి వైద్యులకు మద్దతు ఇచ్చారు. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో స్పందిస్తూ రామ్‌దేవ్‌ ఒక యోగా గురువు మాత్రమే, దానిలో ఆయన సమర్దతను ఎవరూ ప్రశ్నించరు. పానీయాలకు కోకా కోలా ఎంత ప్రాచుర్యం తెచ్చిందో యోగాకు ఆయన అలా చేశారు.భారతీయులు పురాతన కాలం నుంచీ షికంజీ, తండారు వంటి పానీయాలను తాగుతున్నారు. కోకా కోలా వచ్చిన తరువాత అదే జనాలు పెప్సీ, కోక్‌లను ఇండ్లలో నిలవచేసుకుంటున్నారు. రామ్‌దేవ్‌ యోగి కాదు, ఎందుకంటే యోగులు తమ మెదళ్లు, స్పృహలను అదుపులో ఉంచుకుంటారని అన్నారు. అల్లోపతి వైద్యులు పనికిమాలిన చర్చల్లో తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దని పవిత్రమైన వృత్తి మీద కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. వ్యాధులను దూరంగా ఉంచినంత వరకు ముఖ్యమైనదే గాని యోగా వైద్యవిధానం కాదు, ప్రతి వైద్యవిధానానికి దేనికి ఉండే పరిమితులు దానికి ఉంటాయి, యోగా మనలను జాడ్యానికి దూరంగా ఉంచవచ్చు కానీ ఉన్న రోగాలకు చికిత్సగా చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి అన్నారు.


ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి డాక్టర్‌ సహజానంద కుమార్‌ సింగ్‌ ఒక ప్రకటన చేస్తూ రామ్‌దేవ్‌ తన యోగా, పతంజలి ఉత్పత్తులకు పరిమితం కావాలి, కరోనా సమయంలో అవసరమైన చికిత్స చేస్తున్న వైద్యులను నిరుత్సాహపరచ కూడదన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ పదివేల మంది వైద్యులు మరణించారంటూ పుకార్లు వ్యాపింప చేస్తున్నందుకు, కరోనా మీద ప్రభుత్వ చికిత్సా విధానాలను సవాలు చేయటం దేశద్రోహంగా పరిగణించి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసినట్లు తెలిపారు. అలాంటి చర్యలు జనాన్ని వాక్సిన్లు తీసుకోకుండా చేసేందుకు ప్రోత్సహిస్తాయని, ఇది జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని, ఇంతకంటే దేశద్రోహం ఏముంటుందని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌ ఐఎంఎ శాఖ వెయ్యి కోట్ల పరువు నష్టం దావా నోటీసు పంపిందన్నారు.


కరోనిల్‌ గురించి పతంజలి తప్పుడు ప్రచారం చేసి రోగులను తప్పుదారి పట్టించేందుకు పూనుకోవటంతో దాని సామర్ధ్యం గురించి ఐఎంఎ సవాలు చేసింది. అయితే తాము 46 మంది రోగుల మీద పరీక్షలు జరిపామని సమర్ధించుకొనేందుకు చూసినప్పటికీ కుదరకపోవటంతో అది చికిత్సకు సహాయకారి అని ప్రకటించాల్సి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ సంస్ధ కూడా అలాంటిదిగానే పరిగణించి అనుమతి ఇచ్చినప్పటికీ ఏకంగా కరోనా నిరోధం అని ప్రచారం చేశారు. దీంతో ఐఎంఎ మీద అక్కసుతో అల్లోపతి వైద్యం బుద్ది తక్కువ శాస్త్రం అని రామ్‌దేవ్‌ అంటే పతంజలి సంస్ధ సారధుల్లో ఒకరైన ఆచార్య బాలకృష్ణ సమస్యకు మతం రంగు పులిమి కుట్ర కోణాన్ని ముందుకు తెచ్చి పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. బిజెపి అనుకూల మీడియా కూడా దాన్ని భుజానవేసుకొని మతకోణాన్ని ముందుకు తీసుకు వచ్చిదాడి చేస్తోంది. సహజంగానే ఆ దాడికి గురైన నెటిజన్లు అదే పాటపాడుతున్నారు.


యావత్‌ దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగా ఆయుర్వేదంపై బురద జల్లేందుకు లక్ష్యంగా చేసుకున్నారు, గాఢనిద్రలో ఉన్న దేశప్రజలు మేలుకోనట్లయితే రాబోవు తరాలు మిమ్మల్ని క్షమించవు అని బాలకృష్ణ ప్రజలను కూడా అవమానిస్తూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. దీని వెనుక అసలు కారణంగా కరోనిల్‌ మీద అదే విధంగా అల్లోపతిని అవమానిస్తూ వ్యాఖ్యానించిన రామ్‌దేవ్‌ మీద చర్యకు డిమాండ్‌ చేసిన ఐఎంఏకు ప్రస్తుతం అధ్యక్షుడిగా డాక్టర్‌ జాన్‌ రోజ్‌ జయలాల్‌ చురుకుగా వ్యవహరించటమే. తన పదవిని ఉపయోగించుకొని జాన్‌ రోజ్‌ జనాన్ని క్రైస్తవులుగా మార్చేందుకు పూనుకున్నారని గర్హనీయ, హాస్యాస్పదమైన ఆరోపణలకు దిగారు.


ప్రతిదానికీ ఆయుర్వేదంలో చికిత్స ఉంది, ఔషధాలున్నాయని చెప్పే వారు ప్రత్యామ్నాయ చికిత్సా విధానం కోసం ఎదురు చూస్తున్న జనం బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు దేన్నీ వదలటం లేదు.మూడు సంవత్సరాల క్రితం కేరళలో వచ్చిన నీఫా వైరస్‌ వ్యాప్తి సమయంలో కూడా ఆయుర్వేదంలో కషాయ చికిత్స ఉందంటూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకున్న సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. అప్పుడు కూడా ఐఎంఎ రంగంలోకి దిగి జనాన్ని హెచ్చరిస్తూ అలాంటి ప్రచారాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించింది.నిజానికి నీఫా వైరస్‌ 1990 దశకంలోనూ, తరువాత కూడా మన దేశంలో వ్యాపించింది, దేశంలో కేరళ ఆయుర్వేద ప్రాచుర్యం గురించి తెలిసిందే, అయినప్పటికీ ఆ వైద్య విధానం లేదా ఆరంగంలో పని చేస్తున్న వారు గానీ ఔషధాన్ని తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఎలాంటి అర్హతలు, నైపుణ్యంలేని ఆనందయ్య కరోనాకు తాను మందు తయారు చేశానని చెబితే సమర్ధించే ఆయుర్వేద వైద్యులందరూ తమ పట్టాలను పక్కన పడేసి కల్వాలు-గూటాలు తీసుకొని ఆనందయ్య అనుచరులుగా మారిపోవటం మంచిది. ఆనందయ్యను సమర్ధించే పాలకులు ఆయుర్వేద కాలేజీలు, ఆసుపత్రులను అల్లోపతికి మార్చివేయాల్సి ఉంటుంది.


తన పదవిని ఉపయోగించుకొని జనాన్ని క్రైస్తవంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న తప్పుడు వార్తలను పట్టుకొని ఢిల్లీకి చెందిన ఒక లాయర్‌ ఐఎంఎ అధ్యక్షుడు జాన్‌ రోజ్‌ జయలాల్‌ మీద ఒక క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. రామ్‌దేవ్‌పై ఐఎంఎ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఇది దాఖలు కావటం గమనించాల్సిన అంశం. సామాజిక మాధ్యమంలో ప్రకటనలు చేయటం ద్వారా మత బృందాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని లాయర్‌ ఆరోపించారు. తాను ఒక టీవీ చర్చను చూశానని, దానిలో బాబా రామ్‌దేవ్‌ను దూషిస్తూ, దుర్భాషలాడారని, బెదిరించారని, తాను యోగా గురువు భక్తుడిని కనుక మానసికంగా గాయపడ్డానని పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ” కుష్టు, కలరా, ఇతర మహమ్మారులు ప్రపంచంలో నష్టం కలిగించినపుడు వాటికి వ్యతిరేకంగా క్రైస్తవ వైద్యులు, చర్చ్‌లు పని చేశారని, క్రైస్తవ కరుణ చూపించారని ” చెప్పారని అది క్రైస్తవంలోకి మార్చే ప్రయత్నమని ఆరోపించారు.


ఒక కులం లేదా మతంలో పుట్టటం అనేది ఎంపిక ప్రకారం జరిగేది కాదు.అనేక మంది హిందూ, ముస్లిం, సిక్కు తదితర మతాల కుటుంబాలలో పుట్టినట్లుగానే డాక్టర్‌ జాన్‌ రోజ్‌ క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. అతని మీద చేస్తున్న ఆరోపణల స్వభావం ఏమిటి ? అతను హగ్గారు ఇంటర్నేషనల్‌ అనే క్రైస్తవ సంస్ద సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రతి దేశాన్ని ఏసు క్రీస్తు సువార్తతో మార్చివేయాలన్న లక్ష్యం మాది అని సదరు సంస్ధ ప్రకటించుకుంది. ఐఎంఎ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆ సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆధ్యాత్మిక జీవితంలో వైద్య వృత్తిలో సువార్త స్ఫూర్తిని నింపుకొని పని చేస్తానని, దేవుడికి సజీవ సాక్షిగా జీవించాలని గాఢంగా భావిస్తున్నాను. తమ వ్యక్తిగత రక్షకుడిగా ఏసును స్వీకరించాలని యువ వైద్య విద్యార్ధులు, వైద్యులను ప్రోత్సహిస్తాను, నేను పని చేస్తున్న ఒక లౌకిక సంస్ధలో దేవుడికోసం ఒక సాక్షిగా పని చేస్తాను అని చెప్పారు. సంఘపరివార్‌ శక్తులు ఈ మాటలను పట్టుకొని వాటికి చిలవలు పలవలు అల్లి తమ భాష్యాన్ని జోడించి నానా యాగీ చేశాయి. సదరు హగ్గీ సంస్ద ప్రకటించుకున్న లక్ష్యాలకు జాన్‌ రోజ్‌ ఎలా బాధ్యుడు అవుతారు?


లౌకిక రాజ్యాన్ని హిందూత్వ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించిన ఆర్‌ఎస్‌ఎస్‌లోని వారే నేడు దేశాన్ని ఏలుతున్నారు. నిత్యం అందుకోసమే ఎన్ని ఎత్తులు, ఎన్ని జిత్తులు,ఎంతగా ప్రచారం చేస్తున్నారో తెలుసు. అలాంటివి ఇంకా అనేక సంస్ధలు ఉన్నాయి. వాటి సమావేశాల్లో పాల్గొన్నవారు అనేక మంది వివిధ అధికారిక సంస్దలు, పదవుల్లో ఉన్నారు. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అలాంటిది కాదు, వైద్య వృత్తిదారుల సంస్ధ. దాని నిబంధనావళికి లోబడి అర్హతలు ఉన్న ఎవరైనా చేరవచ్చు, పదవులకు ఎన్నిక కావచ్చు. వివిధ మతాలకు చెందిన వైద్యులు దాని సభ్యులుగా ఉండి తమ మత సంస్ధల సమావేశాలు, ప్రార్ధనా స్ధలాలకు వెళ్లటమా లేదా అనేది వారిష్టం. అదేమీ అనర్హత కాదు కనుకనే జాన్‌ రోజ్‌ జయలాల్‌ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న అనేక మంది తమ మతవిశ్వాసాలకు అనుగుణ్యంగా గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. అంతమాత్రాన లౌకిక రాజ్యాంగం ప్రకారం పదవిని పొందిన వారిని వాటికి వెళ్లవద్దని ఎవరూ చెప్పటం లేదు. అది వారికి సంబంధించిన వ్యక్తిగత అంశం. విధి నిర్వహణలో తమ మతాన్ని, కులాన్ని తీసుకురావటం చట్టవిరుద్దం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. జాన్‌ రోజ్‌ ఎన్నికైన తరువాత ఏ వైద్య విద్యార్ధులు లేదా వైద్యులను ఐఎంఎ అధ్యక్షుడి హౌదాలో సమావేశ పరచి క్రైస్తవాన్ని పుచ్చుకోమని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు సర్కార్‌ పుష్కర స్ధానాలు చేస్తే పుణ్యం వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బిజెపి ముఖ్యమంత్రులు, మంత్రులు కుంభమేళాలో పాల్గొని గంగలో మునగాలని ప్రోత్సహించారు, తమ అధికార పదవులను దుర్వినియోగం చేశారు.


ఇక జాన్‌ రోజ్‌ హిందూయిజాన్ని, పురాతన భారత సంస్కృతిని ద్వేషించారు అన్న ఆరోపణ. ఏ సందర్భంలో ద్వేషించారో లేదో కాషాయ దళాల రాతలను బట్టి నిర్ధారణలకు రాలేము. లేదూ ఒకవేళ ద్వేషించారే అనుకుందాం. అలాంటి అభిప్రాయాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. లేదూ మతవిద్వేషాలు రెచ్చగొట్టిన నేపధ్యం ఏమైనా ఉందా ? ఒక అభిప్రాయం కలిగి ఉండటం దేశద్రోహమా, రాజ్యాంగ విరుద్దమా ? కులము-హిందూయిజం రెండింటికీ తేడాలేదని ద్వేషించిన తరువాతనే కదా అంబేద్కర్‌ రాజ్యాంగ రచనకు అధ్యక్షత వహించలేదా, కేంద్రమంత్రిగా పని చేయలేదా.
ఒక ఇంటర్వ్యూలో ” వారు దేశాన్ని ఒకటిగా, వైద్య పద్దతిని ఒకటే ఉండాలని కోరుకుంటున్నారు, రేపు ఒకే మతం ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా సంస్కృత భాష ప్రాతిపదికన, అది ఎల్లవేళలా హిందూ సిద్దాంతాలతోనే ఉంటుంది.ఇది పరోక్ష పద్దతిలో సంస్కృతం పేరుతో జనం మెదళ్లలో హిందూత్వను నింపాలని చూస్తున్నారు ” అని కూడా జాన్‌ రోజ్‌ చెప్పారట. దానిలో అభ్యంతరం ఏముంది, గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నది అదే కదా ?


ప్రాణాయామం చేయటం ద్వారా, గాయత్రీ మంత్రాన్ని పఠించి కరోనాను పోగొట్టవచ్చా అని పరీక్షలు చేయాలని కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ నిర్ణయించటాన్ని, రెండు వారాల పాట్లు క్లినికల్‌ ప్రయోగాలు చేయాలని ఆదేశించటాన్ని ఏమనాలి, దాన్ని చదివి, విన్న వారికి కలిగే అభిప్రాయం ఏమిటి ? హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలను ప్రోత్సహించటమా కాదా ? ముస్లిం, క్రైస్తవ ఇతర మతాల ప్రార్ధనలతో కూడా కరోనాను పోగొట్టవచ్చేమో పరీక్షించాలని గాయత్రీ మంత్రంతో పాటు ఎందుకు జత చేయలేదు. దీనితో పోల్చుకుంటే చర్చిల్లోంచి పరిశుద్ద జలం తెచ్చి వాటిని తాగితే లేదా చల్లుకుంటే కరోనా పోతుందని జాన్‌ రోజ్‌ చెప్పలేదు. తాను చెప్పిన వాటిని వక్రీకరించారని డాక్టర్‌ జయలాల్‌ చెప్పారు, ఆయన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఐఎంఎం స్వయంగా ఖండించింది. తమ విధానాలు, వైఖరిని విమర్శించిన ప్రతివారి మీద మతం ముద్రవేయటం ద్వారా తమ దాడిని సమర్ధించుకొనే యత్నం తప్ప ఇది మరొకటి కాదు.

మోడీ భక్తులూ గుండె నిబ్బరం చేసుకోండి – అఘాయిత్యాలకు పాల్పడకండి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఏడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మీద విమర్శల ధాటికి బిజెపి వారు ఉత్సవాలు జరుపుకోలేకపోయారు(ఆన్‌లైన్‌లోనే లెండి). చైనా లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో రెండు దేశాల మిలిటరీ మధ్య విచారకర ఉదంతం జరిగి ఏడాది గడిచిపోయింది. ఈ సందర్భంగా మోడీ గారిని ఒక విషయంలో అభినందించాల్సి వస్తోంది. విదేశీ పెట్టుబడుల ద్వారా మన జనానికి ఉపాధి, ఎగుమతులు పెంచుతామనే కదా తొలిరోజుల్లో గాలిమోటారెక్కి(విమానాలు) అనేక దేశాలు చుట్టివచ్చారు. గాల్వాన్‌లోయ ఉదంతాల నేపధ్యంలో కాషాయ అభిమానుల, వారి ప్రచారదాడికి గురైన వారి మనోభావాలకు అనుగుణ్యంగా చైనా యాప్‌లను నిషేధించారు. అక్కడి నుంచి వస్తున్న పెట్టుబడులను అడ్డుకున్నారు. కొన్ని దిగుమతులను కూడా తగ్గించినట్లు చెప్పారు. యాప్‌లను పక్కన పెడితే పెట్టుబడులను వదులుకోవటం అంటే మనకు కొన్ని ఉద్యోగాలు రాకుండా చేశారు.ఉద్యోగాల కంటే దేశభక్తి ముఖ్యం అని భావించిన వారు నిజంగానే ఆ చర్యలను సమర్ధించారు. కాని నరేంద్రమోడీ వారికి ఒక విపత్కర పరిస్ధితిని తెచ్చిపెట్టారు. ఇరకాటంలోకి నెట్టారు. అదేమంటే చైనాలో మరింత ఉపాధి పెంచే విధంగా రికార్డు స్ధాయిలో అక్కడి నుంచి వస్తు దిగుమతులు చేసుకున్నారు. ఈ వివరాలను వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులు గానీ, పాకేజ్‌ల మీడియాతో సహా మోడీ భక్తులు గానీ ఎక్కడా ప్రచారం చేయరు.తేలు కుట్టిన దొంగలంటే ఇలాంటి వారే.


ట్రేడింగ్‌ ఎకనోమిక్స్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం 1991 నుంచి 2021 వరకు సగటున ఏడాదికి 136.71 బిలియన్‌ (వంద కోట్లు ) రూపాయల విలువగల దిగుమతులు చేసుకున్నాము. 1991ఏప్రిల్‌ నెలలో రు.0.01బిలియన్‌లు కాగా 2021 మార్చినెలలో ఆల్‌టైమ్‌ రికార్డు రు.498.29 బిలియన్ల మేరకు దిగుమతులు ఉన్నాయి. మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా పధకాల ద్వారా దేశాన్ని ప్రపంచ ఫ్యాక్టరీగా మార్చి ఎగుమతులు చేసి ఇబ్బడి ముబ్బడిగా చేయలేనంత ఉపాధి కల్పిస్తామని చెప్పిన వారి హయాంలోనే ఇది జరిగింది. సెన్సెస్‌ అండ్‌ ఎకనమిక్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (సిఇఐసి) విశ్లేషణ ప్రకారం 2002 నుంచి 2021వరకు సగటున ఏటా రు. 222 బిలియన్ల మేరకు దిగుమతులు చేసుకున్నాము. ఈ ఏడాది ఫిబ్రవరిలో 459.6 బిలియన్‌ రూపాయల మేర దిగుమతులు చేసుకున్నాము. ఇవేవీ కమ్యూనిస్టులో, దేశద్రోహులో నిర్వహిస్తున్న సంస్దలు కాదు. లేదా మోడీని వ్యతిరేకించిన వారు తయారు చేసిన టూల్‌కిట్ల సమాచారమూ కాదు.

మరి ఈ వార్త తెలిస్తే చైనా వస్తువులను దిగుమతులు చేయవద్దు, నిషేధించండి, దిగుమతులు ఆపివేసి చైనాను మన కాళ్ల దగ్గర పడేట్లు చేయండి అని వీరంగం వేసిన వారందరికీ కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ రాదు గానీ గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. నరేంద్రమోడీ రుషిగా మారే క్రమంలో ఉన్నారు కనుక ఆయనకేమీ కాదు, నమ్ముకున్న వారంతా ఆత్మలను నిర్భరంగా ఉంచుకోవాలి, గుండెలను దిటవు చేసుకోవాలి. అనుకున్నదొకటీ అవుతున్నదొకటి అని అవమానాన్ని తట్టుకోలేక ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా నిజాలను తెలుసుకోవటం ప్రారంభించాలి. భజనే చేయాలనుకుంటే మోడీ గారు గాకపోతే మరొకరు. బ్రతుకు ముఖ్యం కదా ! భక్తులు శత్రుదేశం అని ప్రచారం చేస్తున్నా ఖాతరు చేయకుండా దిగుమతుల్లో రికార్డు సాధించినందుకు మోడీని ”అభినందించక” తప్పదు. విశ్వగురువా మజాకానా ! ఎవరైనా ఇది కమ్యూనిస్టు లేదా మోడీ వ్యతిరేక ప్రచారం అని నిరూపిస్తే సవరించుకుంటానని సవినయంగా మనవి చేస్తున్నా.


భారత-చైనా ఎగుమతులు, దిగుమతుల తీరుతెన్నులు చూసినపుడు చైనాకు మనం వలస దేశంగా మారుతున్నామా అని ప్రశ్నిస్తూ ది ప్రింట్‌ పోర్టల్‌ 2021 ఏప్రిల్‌ ఒకటిన ఒక విశ్లేషణను ప్రచురించింది. తమను వెర్రి వెంగళప్పలను చేయటానికి ఈ పని చేశారని లేదా రాశారని మోడీ భక్తులు ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. వారి స్వర్గంలో వారిని ఉండనిద్దాం. మన దేశం చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులతో పోలిస్తే ఎగుమతులు ఐదో వంతు మాత్రమే ఉన్నాయి.2019-20తో ముగిసిన ఆరు సంవత్సరాలలో మన దేశ ఎగుమతులు సగటున 13 బిలియన్‌ డాలర్లు ఉండగా దిగుమతులు 66 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో చైనాకు మన ఎగుమతులు పెరిగిన తరువాతనే ఈ పరిస్ధితి ఉంది. ఈ వివరాలు చెబుతున్నామంటే చైనాను పొగడటంగానో మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారో అని ఎవరైనా అనుకుంటే వారికి కృష్ణ పట్నం ఆనందయ్య మందుతోనో లేక గుజరాత్‌లో మాదిరి గోమూత్రం, ఆవు పేడ పులిమిగాని చికిత్స చేయాల్సిందే.


స్వాతంత్య్రానికి ముందు మన దేశం బ్రిటన్‌కు ముడిసరకులు ఎగుమతి చేసేదిగాను అక్కడి నుంచి పారిశ్రామిక ఉత్పత్తులు, పెట్టుబడులను దిగుమతి చేసేదిగానూ ఉండేదన్న విషయం తెలిసిందే. అదే ధోరణి ప్రస్తుతం చైనాతో మన లావాదేవీలు ఉన్నందున ప్రింట్‌ విశ్లేషకులు మనం చైనాకు వలసదేశంగా ఉంటున్నామా అని ప్రశ్నించాల్సి వచ్చింది. గతంలో జాతీయ వాదులు వలస నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు. మనమే పరిశ్రమలు స్ధాపించాలని కలలు కన్నారు. అసలు సిసలు జాతీయ వాదుల వారసులం అని చెప్పుకున్న కాంగ్రెస్‌ వారు గానీ, మేమే అసలైన జాతీయవాదులం అని చెప్పుకుంటున్న కాషాయ వాదులు గానీ చైనా నుంచి దిగుమతి చేసుకున్నవస్తువులతో మన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పొందుతున్న లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాంగ్రెస్‌ వారిని విమర్శించి గద్దెనెక్కిన బిజెపి గత ఏడు సంవత్సరాలలో ఈ ధోరణిని మార్చేందుకు చేసిన ప్రయత్నాలేమిటో ఎవరైనా చెప్పాలి.

2020 జనవరి నుంచి డిసెంబరు వరకు మన దేశం చైనా నుంచి 58.71 బిలియన్‌ డాలర్ల మేరకు వస్తువులను దిగుమతి చేసుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఈ ఏడాది మార్చి 17న లోక్‌సభకు చెప్పారు. చైనా తరువాత అమెరికా నుంచి 26.89, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి 23.96, సౌదీ అరేబియా నుంచి 17.73, ఇరాక్‌ నుంచి 16.26 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు చేసుకున్నాము.


ప్రపంచానికి ఎదురయ్యే అఘాతాలు, వత్తిళ్లను తట్టుకొనే స్ధితి స్ధాపకత ఉన్నట్లు చైనా సరఫరా వ్యవస్ధలు రుజువు చేశాయని అమెరికాలోని ఆర్కాన్సాస్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కె జెంగ్‌ ఈస్ట్‌ ఆసియా ఫోరమ్‌లో తాజాగా రాశారు. చైనా అంతర్గత మార్కెట్‌లో సొమ్ముచేసుకొనేందుకు, తమ దేశాలలో ఉత్పాదక ఖర్చులను మిగుల్చుకొనేందుకు బహుళజాతి గుత్త సంస్దలు భారీ ఎత్తున చైనాలో పెట్టుబడులు పెట్టాయి, ప్రపంచ ఫ్యాక్టరీగా, ప్రపంచ సరఫరా వ్యవస్ధ కేంద్రంగా చైనాను మార్చాయి. అమెరికా – చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్దం, కరోనా మహమ్మారి సంక్లిష్టమైన ప్రపంచ సరఫరా వ్యవస్ధ భేద్యతను వెల్లడించాయి. ఇటీవలి సంవత్సరాలలో చైనా అధిక విలువను జతచేసే పారిశ్రామిక ఉన్నతీకరణ, విలువ వ్యవస్దలో పెరుగుదల వైపు పయనించింది. వాణిజ్య యుద్దం, మహమ్మారి గానీ చైనా కేంద్రంగా ఉన్న సరఫరా వ్యవస్దను ఏమేరకు ప్రభావితం చేశాయో ఇంకా తెలియదు గానీ ప్రాధమిక రుజువులను బట్టి ప్రభావం అన్ని రకాల పరిశ్రమల మీద ఒకే విధంగా లేనప్పటికీ మొత్తం మీద స్వదేశీ విదేశీ మార్పులకు అనుగుణ్యంగా వత్తిళ్లను తట్టుకొనే విధంగా తగిన వ్యూహాలను రూపొందించుకొన్నాయని సదరు ప్రొఫెసర్‌ పేర్కొన్నారు. మన సంస్కృత ఘనాపాటీలు ఎలాంటి పాఠాలు చెబుతారో తెలియదు.

భారీ పరిశ్రమలుగా వర్గీకరించిన చైనా పరిశ్రమల లాభాలు గతేడాదితో పోలిస్తే ఏప్రిల్‌ నెలలో 57శాతం పెరిగాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో గతేడాదితో పోలిస్తే లాభాలు గనుల రంగంలో 1.06 రెట్లు, ముడిపదార్ధాల తయారీ రంగంలో 3.66 రెట్లు పెరిగాయని జాతీయ గణాంక సంస్ద వెల్లడించింది. ఇటీవల రెండు సంవత్సరాల సగటు లాభాలు 29.2శాతం ఉండగా ఫార్మా రంగంలో ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 80.2శాతం పెరిగాయి. దుస్తులు, వస్త్రాలు, ముద్రణ పరిశ్రమల్లో గత రెండు సంవత్సరాల్లో లాభాలు గణనీయంగా పడిపోయాయి, అయితే ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో మెరుగు పడి తేడా తగ్గినట్లు గణాంక సంస్ద వెల్లడించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో చైనా జిడిపి 18.3శాతం పెరగ్గా దక్షిణ కొరియా 1.8, ఫ్రాన్స్‌ 1.5, అమెరికాలో 0.4శాతం వృద్ది రేటు నమోదు కాగా జపాన్‌ 1.8, జర్మనీ 3.1, ఇటలీ 4.8, బ్రిటన్‌లో 6.1శాతం తిరోగమన వృద్ధి నమోదైంది.

ఏ నేతకైనా వైఫల్యాలు సహజం. ఒక మత గ్రంధంలో పాప ప్రక్షాళన చేసుకుంటే పరలోక ప్రాప్తి అని ఉంది తప్ప పుణ్య ప్రస్తావన లేదంటారు.అలాగే నరేంద్రమోడీ నిఘంటువులో వైఫల్యాలకు అర్ధమే లేదు.ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో సహా ఇంతవరకు అన్నీ విజయాలే అన్నారు తప్ప ఒక్క వైఫల్యం గురించి కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ మోడీ ఎంతగా అపహాస్యం పాలయ్యారంటే కొద్ది రోజుల క్రితం బహుళజాతి గుత్త సంస్ద అమెజాన్‌లో ఒక పుస్తకాన్ని ఉచితంగా పొందండి అంటూ ప్రచారం సాగింది. దాని పేరు ఆంగ్లంలో ”మాస్టర్‌ స్రోక్‌ ” ( తిరుగులేని దెబ్బ లేదా తిరుగులేని యుక్తి ) రచయిత పేరు బెరోజ్‌గార్‌ భక్త్‌, అట్టమీద ప్రధాని నరేంద్రమోడీ బొమ్మ వేసి భారత్‌లో ఉపాధి వృద్ధికి గాను ప్రధానికి తోడ్పడిన 420 రహస్యాలు అని రాసి ఉంది. తీరా 56 పేజీల ఆ పుస్తకాన్ని తీసుకున్నవారు తెరిస్తే అంతా ఖాళీగా దర్శనమివ్వటాన్ని బట్టి నరేంద్రమోడీ మీద విసిరిన ఒక మాస్టర్‌ ్టస్టోక్‌ అని చెప్పవచ్చు. అది వైరల్‌ అయిన తరువాత అమెజాన్‌ దాన్ని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. బెరోజ్‌గార్‌ భక్త్‌ అంటే తెలుగులో పనిపాటా లేని భక్తుడు అని అర్ధం. ఇక 420 అంటే ఏ సందర్భంలో వాడతారో తెలిసిందే. ఉపాధి పోగొట్టటం తప్ప ఉపాధి కల్పనలో ఘోరవైఫల్యం గురించి ఒకవైపు చర్చ నడుస్తున్ననేపధ్యంలో మరోవైపు మీడియా, ఇతరంగా నరేంద్రమోడీ దేశానికి అందించిన అద్భుతమైన సేవ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో మోడీకి తోడ్పడిన 420 రహస్యాలు అంటే మోసాలు అని అర్ధం. మోడీ ఏలుబడిలో పెద్ద లేదా సానుకూలమైనవి ఏవీ లేవని చెప్పటమే.

చైనాతో పోటీ పడి మన దేశాన్ని వృద్ధి చేయవద్దని ఎవరూ చెప్పలేదు. చైనాకు వ్యతిరేకంగా మనల్ని నిలిపేందుకు పధకం వేసిన అమెరికన్లు, జపనీయులు చెప్పిన మాటలు నమ్మిన మన నేతల పరిస్ధితి సినిమాల్లో హాస్యగాళ్లలా తయారైంది. ఇంకే ముంది వెంటనే చైనా నుంచి వెయ్యి కంపెనీలు వస్తున్నాయి, అందుకొనేందుకు సిద్దంగా ఉండండి అని చెప్పగానే నిజమే అని హడావుడి చేశారు. ఏడాదైంది, ఏమైందో ఎవరైనా చెప్పారా ? ఎందుకని చైనా నుంచి అమెరికా సంస్ధలు మన దేశానికి రావటం లేదు. సరిహద్దుల్లో వాటిని అడ్డుకున్నారా ? గతేడాది మోడీ గారు చెప్పిందేమిటి ? ” రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఒక నూతన ప్రపంచ వ్యవస్ధ ఏర్పడటాన్ని మనం చూశాము. కోవిడ్‌-19 తరువాత అలాంటిదే జరగ నుంది. ఈ సారి ఉత్పాదక బస్‌ను భారత్‌ నడపనుంది, ప్రపంచ సరఫరా వ్యవస్ధలతో అనుసంధానం కానుంది. మనకు ప్రజాస్వామ్యం, జనాభా సంఖ్య, గిరాకీ రూపంలో నిర్దిష్టమైన అనుకూలతలు ఉన్నాయి.” అని 3డి సినిమా చూపారు. దాని కొనసాగింపుగా ముఖ్యమంత్రులందరూ పరిశ్రమలను అందుకొనేందుకు ఎర్రతివాచీలు పరిచి సిద్దంగా ఉండాలన్నట్లు మాట్లాడారనుకోండి.


నిజానికి చైనా నుంచి కంపెనీలు ఎన్ని బయటకు పోతున్నాయనేది పక్కన పెడితే అంతకు ముందే కొన్ని బయటకు వచ్చాయి. 2019 అక్టోబరు వరకు 56 కంపెనీలు బయటకు వస్తే వాటిలో మూడంటే మూడే మన దేశం వచ్చాయి, 26 వియత్నాం, 11 తైవాన్‌, 8 థారులాండ్‌ వెళ్లాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ ఎగుమతి సబ్సిడీలను వ్యతిరేకిస్తున్న కారణంగా దానికి పేరు మార్చి మన ప్రభుత్వం విదేశీ కంపెనీలకు ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకాన్ని ప్రవేశ పెట్టింది. దాని ద్వారా పదిలక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని మాదిరి గ్రాఫిక్స్‌ చూపింది.2020-21 సంవత్సరంలో కొన్ని లక్ష్యాలను నిర్ణయించింది. పదహారు కంపెనీలు ఆసక్తి చూపగా పదిహేను విఫలమయ్యాయి. ఒక్క శాంసంగ్‌ మాత్రమే పూర్తి చేసింది. దాంతో మరొక ఏడాది పాటు వ్యవధిని పొడిగించి 2021-22లో చేసిన ఉత్పత్తిని తొలి ఏడాది లక్ష్యంగా పరిగణించాలని ఆలోచన చేస్తోంది. సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు మొదటి ఏడాది నాలుగువేల కోట్ల మేరకు రెండవ ఏడాది ఎనిమిదివేల కోట్ల మేరకు ఉత్పత్తిని పెంచితే దాన్ని బట్టి రాయితీలు చెల్లిస్తారు.ఇలాంటివి గతంలో ఎగుమతుల పేరుతో ఉన్నా ప్రయోజనం కలగలేదు.


చైనా నుంచి లేదా ఇతర దేశాల నుంచి మన దేశానికి కంపెనీలు ఎందుకు రావటం లేదు. ఒకటి చైనా కంటే పన్ను ఎక్కువ. రెండవది ఇతర సౌకర్యాలకు పట్టే వ్యవధి, భూమి లభ్యతలోనూ సమస్యలుండటం వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. అన్నింటికంటే మన కరెన్సీ విలువలో స్ధిరత్వం లేకపోవటం కూడా సమస్యగానే ఉంది. 2000 జనవరిలో చైనా కరెన్సీ మారకం ఒక డాలరుకు 8.27 ఉంది. గతేడాది అక్టోబరు నాటికి 6.69 యువాన్లకు పెరిగింది. ఇదే కాలంలో మన కరెన్సీ విలువ 43.55 నుంచి 74.54కు తగ్గింది. చైనా కరెన్సీ రెండు దశాబ్దాలలో 19శాతం బలపడగా మన కరెన్సీ 71శాతం బలహీనపడింది.కరెన్సీ విలువలో ఇంతటి ఒడిదుడుకులు ఉంటే కంపెనీలకు రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. డాలర్లలో పెట్టుబడి పెట్టిన వారికి వాటి విలువ తగ్గిపోతుంది. లాభాలు తీసుకుంటాయి తప్ప కంపెనీలు ముప్పుకు ఎందుకు సిద్దపడతాయి. అయితే మన దేశానికి కరెన్సీతో ఉన్న సమస్య ఏమిటి ? అది బలపడితే మన ఎగుమతులు తగ్గుతాయి, బలహీనపడితే పెరుగుతాయి, మనకు విదేశీ చెల్లింపులకు డాలర్లు కావాలి కనుక రూపాయి విలువను తగ్గించి ఎగుమతులు పెరిగేట్లు చూస్తున్నాం. మరోవైపు కనిపించే చిత్రం ఏమిటి ? దిగుమతి చేసుకొనే వస్తువుల ధర ఎక్కువగా ఉంటే మన ప్రభుత్వాలకు పన్ను రూపంలో ఆదాయం ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు చమురు ధరలు పెరిగితే రాష్ట్రాలకు దాని మీద వచ్చే పన్ను ఆదాయం దామాషా ప్రకారం పెరుగుతుంది. దాన్ని జిఎస్‌టి పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు తగ్గే ఆదాయాన్ని చెల్లించే స్ధితిలో కేంద్రం లేదు. ఎవరి గోల వారిది.


మన దేశంలో మధ్య తరగతి, ధనికులు గణనీయంగా ఉన్నారనే అంచనాతో అనేక కంపెనీలు వినియోగవస్తువులను మన మార్కెట్లో నింపేందుకు చూస్తున్నాయి. అయితే కరోనా సమయంలో నరేంద్రమోడీ ఒకందుకు చేసుకున్న ప్రచారం మరొక విధంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, పప్పులు ఇచ్చామని, ఇలాంటి కార్యక్రమం మానవ జాతి చరిత్రలో మరొకటి లేదని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. నూట ముప్పై కోట్ల జనాభాలో ఇంత మంది పేదలు ఉన్న దేశంలో ఖరీదైన వస్తువులను తయారు చేస్తే ఎవరు కొంటారు, పెట్టుబడులు దండగ అవుతాయోమో అని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు వెనకడుగు వేస్తున్నాయని చెబుతున్నారు. విదేశీ కంపెనీలకు కావాల్సింది పెద్ద సంఖ్యలో జనం కాదు, తమ వస్తువుల కొనుగోలు శక్తి ముఖ్యం. ఇదే సమయంలో నూటనలభై కోట్ల జనాభా ఉన్న చైనాలో 80 కోట్ల మంది మధ్యతరగతి, అధిక ఆదాయం కలవారు ఉన్నారు కనుక దానికి ప్రాధాన్యత ఇస్తారు తప్ప మనవైపు చూడరు.చైనాతో పోలిస్తే మన దేశంలో కొనుగోలు శక్తి కేవలం 20శాతమే. 1990 దశకం వరకు రెండు దేశాల తలసరి జిడిపి పోటా పోటీగా ఉంది. 2021 నాటికి నామినల్‌ పద్దతిలో మన కంటే చైనా తలసరి జిడిపి 5.4రెట్లు, పిపిపి పద్దతిలో 2.58 రెట్లు ఎక్కువ. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఎందుకంటే మన తలసరి ఆదాయం 2019లో 2104 డాలర్లు ఉంటే 2020లో 1965 డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో చైనాలో 10,261 నుంచి 10,484కు పెరిగింది. కనుకనే చైనా ఉత్పత్తి చేయటంలోనే కాదు, వినియోగించటంలోనూ మనకంటే ముందుంది.

ఈ నేపధ్యంలో అమెరికన్‌ లేదా జపాన్‌ కంపెనీ అయినా అక్కడ ఉండేందుకే ప్రయత్నిస్తాయి తప్ప మన దేశానికి వచ్చేందుకు, చేతులు కాల్చుకొనేందుకు ఎందుకు పూనుకుంటాయి. ఒకవేళ బయటకు పోవాల్సి వస్తే మనకంటే రిస్కు తక్కువ ఉన్న దేశాలకే పోతాయి. కరోనాలో మన దిగజారుడు చూసిన తరువాత కనీసం అలాంటి ఆలోచన కూడా చేయరు. గిరాకీ మన నేతల ప్రకటనల్లో తప్ప వాస్తవంలో ఎక్కడుంది. అమెరికన్లు చైనాతో పోట్లాడతారు అక్కడే ఉంటారని ట్రంప్‌ పాలనా కాలం నిరూపించింది. మన దేశాన్ని వినియోగించుకుంటారని వారి చమురును మనకు అంటగట్టి వారు లబ్దిపొందటాన్ని కూడా ఇదే కాలంలో చూశాము. చైనాకు వ్యాపారం, మనకు కౌగిలింతలు ఇచ్చారు. హౌడీ మోడీ-నమస్తే ట్రంప్‌ వంటి జిమ్మిక్కులు చేసి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. అమెరికా వైట్‌హౌస్‌లో ఎవరు కూర్చున్నా జరిగేది ఇదే.


అంతర్జాతీయ రాజకీయాల్లో అనుసరించే విధానాలు కూడా వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కలసి చతుష్టయం పేరుతో మన దేశం చైనాకు వ్యతిరేకంగా పని చేయటం బహిరంగ రహస్యం. ఇదే సమయంలో చైనా తన అవసరాల కోసం పాకిస్దాన్ను దగ్గరకు తీస్తున్నది. మన పంచదార వ్యాపారులు పాకిస్ధాన్‌ కంటే పంచదారను టన్ను 40 డాలర్లకు తక్కువ ఇస్తామన్నప్పటికీ పాక్‌ నుంచి దిగుమతి చేసుకొనేందుకు చైనా మొగ్గుచూపింది. మన దేశం ఔషధ పరిశ్రమ చైనా మీద ఎంతగా ఆధారపడిందంటే అక్కడి నుంచి అవసరమైన పదార్ధాల దిగుమతి ఆగిపోతే పెన్సిలిన్‌ వంటి వాటిని మనం తయారు చేసుకోలేనంతగా అని చెప్పాలి. ఇక రాజకీయాల విషయానికి వస్తే మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేసి వారిని లొంగదీసుకుంటున్నట్లు కాషాయ మరుగుజ్జులు ప్రచారం చేస్తారు. ఇది జనాన్ని మోసం చేయటమే. మనం నిజంగా చేయాల్సింది మొత్తంగా దిగుమతులను నిలిపివేసి స్వయంగా తయారు చేసుకోవటం. కానీ జరుగుతోందేమిటి ? గతంలో మనం 2015లో చైనా నుంచి 2.8 బిలియన్‌ డాలర్ల మేర ఉక్కు దిగుమతులు చేసుకున్నాం ఇప్పుడు ఒక బిలియన్‌కు పడిపోయింది. ఎందుకు ? చైనా నుంచి దిగుమతి చేసుకోవాలంటే పదిహేనుశాతం ధర ఎక్కువగా ఉంది. దక్షిణ కొరియా తాను ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా మనకు ఎలాంటి పన్నులు లేని ఉక్కును సరఫరా చేస్తున్నందున చౌకగా దొరుకుతోంది గనుక అక్కడి నుంచి కొంటున్నాం. ఇలా అనేక అంశాల మీద జనాన్ని తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతోంది. కనుక బిజెపి లేదా మరొక పార్టీ ఏది చెప్పినా దేన్నీ గుడ్డిగా నమ్మవద్దు, ఏ దేశం మీదా గుడ్డి ద్వేషాలను పెంచుకోవద్దు.

కుల, మతశక్తులతో కేరళ కాంగ్రెస్‌ కుమ్మక్కు బట్టబయలు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య ఫలితాలతో కేరళలోని ప్రతిపక్ష పార్టీలు, కుల, మత సంస్ధలు దిక్కుతోచని స్ధితిలో పడ్డాయి. తాము తటస్ధ వైఖరి అనుసరిస్తామని బహిరంగంగా ప్రకటించి నాయర్‌ సర్వీస్‌ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎన్‌) ప్రధాన కార్యదర్శి సుకుమారన్‌ నాయర్‌ ఎన్నికల రోజు ఎల్‌డిఎఫ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కుమ్ములాటలు, తర్జన భర్జనల మధ్య కొత్తగా కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న విడి సతీశన్‌ చేసిన వ్యాఖ్యలతో ఎన్‌ఎస్‌ఎస్‌ నేతకు ఎక్కడో కాలింది. కుల,మత సంఘాల నేతల అదుపాజ్ఞలలో పని చేసే తాబేదార్లుగా రాజకీయ నేతలు ఉండకూడదని సుద్దులు చెప్పారు. దీని మీద సుకుమారన్‌ నాయర్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతిపక్ష నేతగా పదవి ఖరారు అయిన తరువాత మత, కుల సంఘాల నేతలపై విమర్శలు ప్రారంభించారని అన్నారు. ఎన్నికలకు ముందు తమకు సహకరించాలని కోరుతూ తమ ప్రధాన కార్యాలయంలో గంట సేపు తమతో చర్చలు జరిపి తాలూకా, కింది శాఖల స్ధాయి వరకు తమకు సహకరించాలని కోరారని ఇప్పుడు కుల, మత సంస్ధల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీల వ్యవహారాలలో జోక్యం చేసుకొనే హక్కు కుల, మత సంస్ధలకు లేదని అయితే రాజకీయ పార్టీల గురించి సమీక్షించే, అభిప్రాయాలు వెల్లడించే హక్కు మాత్రం ఉందన్నారు. తమ సహకారం కోసం అన్ని పార్టీలు కోరాయని సుకుమారన్‌ నాయర్‌ పేర్కొన్నారు.


మీడియా మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది అన్న కాంగ్రెస్‌ నేత !


ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలోనూ, బయటా తాను చేసిన ఆరోపణలకు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించినా బూత్‌ కమిటీలు దాన్ని జనం దగ్గరకు తీసుకుపోలేక పోయాయని కేరళ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల అసెంబ్లీ ఎన్నికల పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ విచారణ కమిటీ ముందు చెప్పారు. అనేక బూత్‌ కమిటీలు అసమర్ధంగా ఉండటం పాలక కూటమికి తోడ్పడిందని, పోలింగు స్లిప్పులను కూడా ఓటర్లకు అందించలేదని, అయినప్పటికీ పరాజయానికి బాధ్యత తనదే అన్నారు.కరోనా, వరదల సమయంలో పాలక పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆహారకిట్‌, పెన్షన్‌ కూడా విజయానికి తోడ్పడిందన్నారు. పాలక పార్టీ తన కార్యక ఎన్నికల సమయంలో ప్రభుత్వ లోపాలను యుడిఎఫ్‌ ఎత్తిచూపలేకపోయిందని చెన్నితల చెప్పారు. అమిత్‌ షా సిఎఎ గురించి చేసిన ప్రకటన తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌ కంటే మైనారిటీల మనోభావం వామపక్షాలకు అనుకూలంగా ఉందని, ముస్లిం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయని అన్నారు.


స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌ పోటీ – బిజెపిలో నిధుల కుమ్ములాటలు !


అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్‌కు రెట్టింపు బలం ఉన్నప్పటికీ స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం ఎందుకు చేయాలన్న ఉక్రోషంతో ఆ పదవికోసం కాంగ్రెస్‌ పోటీ పడింది. సిపిఎం సభ్యుడు ఎంబి రాజేష్‌కు 96 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్ధి విష్ణునాధ్‌కు 46 వచ్చాయి. ఆరోగ్య సమస్యల కారణంగా ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. పది సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నప్పటికీ ఎంఎల్‌ఏగా తొలిసారి గెలిచి స్పీకర్‌ పదవి చేపట్టిన వారిలో రాజేష్‌ మూడవ వారు.
అధికారం తమదే అని గొప్పలకు పోయి ఉన్న ఒక్క సీటును, ఓట్లను పోగొట్టుకున్న బిజెపిలో ఇప్పుడు కుమ్ములాటలు సాగుతున్నాయి. ఎన్నికల కమిటీని పక్కన పెట్టి ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చుకున్నారని, ఆర్ధిక సంబంధమైన కమిటీని ఏర్పాటు చేయలేదని కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దాని మీద స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ సారి బిజెపికి నిధులు వచ్చాయని, విజయావకాల ప్రాతిపదికగా ఏ ప్లస్‌, ఎ,బి,సి తరగతులుగా నియోజకవర్గాలను విభజించి నిధులు పంపిణీ చేసినట్లు మలయాళ మనోరమ రాసింది. ఎన్నికల్లో 35 సీట్లు గెలుస్తామని చెప్పి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని, రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌కు అనుకూలంగా ఉన్నవారికి ఎక్కువ నిధులు ఇచ్చారని, ఇష్టం లేని వారికి తక్కువ పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఏ ప్లస్‌ తరగతి నియోజకవర్గాలలో సురేంద్రన్‌ అనుకూలురకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు, కాని వారికి రెండు కోట్లు, బి తరగతి నియోజక వర్గాలలో ఒకటి నుంచి ఒకటిన్నర కోట్లు ఇచ్చారని, ఇష్టంలేని వారికి 25లక్షలతో సరిపుచ్చారని అసమ్మతి నేతలుగా ఉన్న శోభాసురేంద్రన్‌, పికె కృష్ణదాస్‌ నాయకత్వంలోని అసమ్మతీయులు కేంద్ర పార్టీకి ఫిర్యాదు చేశారు.


కేసులు గణనీయంగా ఉన్న కేరళలో కరోనా మరణాలు తక్కువ !


కరోనా కేసులు కేరళలో గణనీయంగా నమోదు కావటానికి పెద్ద సంఖ్యలో చేస్తున్న పరీక్షలు అన్నది తెలిసిందే. అయితే మరణాల విషయంలో కేరళతో సహా 18 రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి. జాతీయ సగటు 1.14శాతం కాగా పంజాబ్‌లో 2.46, ఉత్తరా ఖండ్‌ 1.85, సిక్కిం 1.71 ఢిల్లీ 1.64, మహారాష్ట్ర 1.59, బీహార్‌ 1.54, గుజరాత్‌ 1.21,ఉత్తర ప్రదేశ్‌ 1.15శాతం కాగా కేరళలో 0.31శాతంగా ఉంది. కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే పరిస్ధితి లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు.

మోడీ కాకపోతే , నీ అమ్మా మొగుడా…?

Tags

, ,


శీర్షిక చూసి అపార్ధం చేసుకోకండి. ఒక సగటు భారతీయుడి ఆవేదన అర్ధం చేసుకోండి. సుమారు ఏడేళ్ళ క్రితం దేశం చాలా క్లిష్ట పరిస్దితుల్లో ఉంది అనుకునప్పుడు అందరిలాగే ‘మోడీ హై తో ముమ్కిన్‌ హై’ అని నమ్మిన వెర్రిబాగులోళ్లలో నేనూ ఒకడిని. పదేళ్ళ కాంగ్రెస్‌ పాలనతో విసుగు చెంది మార్పు కోరుకుంటున్న భారతీయుడికి అప్పటి ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ చూపించిన హీరో నరేంద్ర మోడీ. వారు ఎరగా చూపించిన గుజరాత్‌ మోడల్ని అందరిలాగే నేనూ నోరు వెళ్ళబెట్టుకు చూశాను. శంకర్‌ సినిమాల్లో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో చక చకా అభివద్ది చెందే ఊళ్ళలాగే మన ఊర్లని, జీవితాల్ని మంత్రదండంతో మోడీ చకచకా చక్కదిద్దేస్షాడని నమ్మాను. అందుకనే… కేవలం అందుకనే, మతతత్వ సిద్దాంతాలతో నిర్మితమైన పార్టీ అయినా సరే ఖాతరు చేయకుండా భాజపాని, బలపరుస్తున్న పార్టీలకు మద్దతు తెలిపాను, ఓటు వేశాను. గెలిచాడు…నన్నే కాదు అప్పటి భారతీయ ప్రజలందరి మనసులు గెలిచాడు. ఎలక్షన్లూ గెలిచాడు. ప్రమాణ స్వీకారం రోజు చేసిన వాగ్దానాలు, పలికిన ప్రగల్బాలు ఇంకా నా చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మర్చిపోయే శపథాలా అవి. అవన్నీ నిజమై ఉంటే ఇవాళ నేను ఇలా ఒక వ్యాసం రాయాల్సిన అవసరం వచ్చి ఉండేదే కాదు.


ఓపిక పట్టా గురూ…శానా ఓపిక పట్టా. నీ చేతకానితనాన్ని అమాయకత్వం అనుకున్న. మీడియాకు దొరక్కుండా మన్‌కీ బాత్‌ అంటే మూసుకుని విన్నా. నల్లడబ్బు అంతు చూస్షా అంటే నీతో వంత పాడి ఎటిఎం బయట క్యూల్లో నిల్చున్న. ఆ క్యూల్లో చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు దేశం సరిహద్దుల్లో నిల్చున్న సైనికుడిని చూపించా. మార్పు కోసం త్యాగాలు తప్పవు అని నీతులు చెప్పా, అవి బూతులని ఆనాడు తెలియలేదే. అకౌంట్లో పదిహేను లక్షలు వేస్షా అన్నావు. నాకు రాకున్నా ఫర్లేదు …బీద, శ్రామిక వర్గాల వాళ్లకు వెళ్తే సంతోషం అనుకున్నా. డబ్బుల విషయం పక్కనెట్టు వాళ్లు అసలు నీకంటికి ఏనాడైనా కనిపిస్తేగా! ఆకలి చావులు తగ్గలా! రైతుల ఆత్మహత్యలూ, వలసలూ ఆగలా! పరువు హత్యలూ ఆగలా! అయినా సరే ఓర్పుగా నీ విమర్శకులని ఎదుర్కొన్నా. డెబ్బయి ఏళ్ళ కుళ్లుని కడగడం చిన్న విషయమా అని వారినే నిలదీశాను కానీ నిన్నుఏ రోజూ పల్లెత్షు మాట అనలా. నీ మీద పెంచుకున్న గుడిి ్డప్రేమ అచంచలంగా, స్దిరంగా ఉన్న తరుణంలో వచ్చిన అతి గొప్ప ఆర్షిక సంస్కరణ జిఎస్‌టి. మధ్యతరగతి వాడి నడుము వంచి… వెన్ను విరిచి… డొక్క చీల్చి పన్ను వసూళ్లు మొదలెట్టావ్‌. ఆ మధ్యతరగతి వాడు ఎవడో అయితే నాకు పెద్ద తెలిసేది కాదేమో కాని అందులో నేనూ ఒకడిని అవవడం వలన కాబోలు గుండే,జేబూ చివుక్కు మన్నాయి.


ఎట్టెట్టా..! ఇల్లు కట్టుకునే ఇటుక మీద పన్ను, ఇసుక మీద పన్ను, ఇనుము మీద పన్ను, మళ్లీ మొత్తంగా ఇల్లు మీద పన్నా..? పళ్లు రాల కొట్టే వాడు లేక. అయినప్పటికీ ఆలోచన మందగించిన మెదడు కదా ! బూజు సరిగ్గా వదలక ఇంకా నిను ప్రేమించా. నీ విహారయాత్రలు, నీ కాస్టిలీ కళ్ళద్దాలు, హై ఫై బట్టలు, మైనారిటీల మీద గోరక్షణ పేరుతో అఘాయిత్యాలు, విద్యార్ధుల మీద దాడులు, జర్నలిస్టు హత్యలు, ప్రభుత్వం మీద నోరెత్షిన వారి అరెస్టులూ అన్నీ..అన్నీ..చూసి చూడనట్లు ఊరుకున్నా. పుల్వామా దాడి ప్రతి స్పందనను మెచ్చా. బాలాకోట్‌ దాడులని సమర్ధించా, ఐదేళ్ళ నర్వం మరిచా, మళ్లీ నీకే అధికారం ఇచ్చా.

నీ అంతటోడు లేడన్నా , నీ యాభై ఆరు అంగుళాల ఛాతి దేశానికే కంచుకోట అనుకున్నా, మొక్కవోని నీ సంకల్పంతో ఈ దఫా భారత దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్తానాల్లో నిలబెడతావ్‌ అని నమ్మా.నా నమ్మకాన్ని నిలబెట్టావ్‌. కోరోనా కేసుల్లో దేశాన్ని అగ్రస్దానంలో నిలబెట్టావ్‌. శభాష్‌ మోడీజీ శభాష్‌. మేము ఎదురు చూసిన అచ్చే దిన్‌ ఎలాగూ రాలేదు, కానీ ప్రజలు చచ్చే దిన్‌కి మాత్రం ముందుండి బాట వేశావు.

ప్రకతికి అందరూ ఒకటే! మోడీ అనా వాళ్ళ డాడీ అయినా . నీ వల్ల కరోనా వచ్చిందని చెప్పేటంత కుంచిత మనస్వత్వం కాదు, నిన్ను ఆడిపోసుకుంటే నాకు ఒరిగేదేమీ లేదు. కానీ ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆత్మ విమర్శ అనేది అవసరం. గడిచిన ఏడాది కాలంలో సగం పైన లాక్‌డౌన్‌ జీవితం గడిపిన ప్రతి సోదరుడూ ఏదో ఒక సందర్భంలో ఆత్మవిమర్శ చేసుకునే ఉంటాడు. మరి నువ్వే చేస్తున్నావ్‌ ప్రధానీ ? ఆత్మ విమర్శ పక్కన పెట్టు. కనీసం విమర్శని హుందాగా స్వీకరించగలవా నువ్వు..? ఏం చేస్షోంది నీ యంత్రాంగం గత ఏడాది మార్చి నుంచి.? మా చేత బత్తీలు వెలిగించావ్‌. చపట్లు కొట్టింంచావ్‌. నువ్వేం చేశావు..? పక్కనే ఉన్న చైనాలో విస్తతంగా విజంభిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని పట్టించుకోకపోవడం మొదటి తప్పు అయితే జనతా కర్ప్యూ అని మభ్యపెట్టి ఒకేసారి లాక్‌డౌన్‌ అమలు చేసి జనాలను భయాందోళనకు గురిచేశావ్‌. ఫలితం- కేసులు పెరుగుదల, వలస కూలీల ఇక్కట్లు,చావులూ. ప్రధానిగా నువ్వు కాకపోతే ఎవడు చెప్తాడు ఆ చావులకు సమాధానం..? ఆ క్లిష్ట సమయంలో తెగించి పని చేసిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేసిన డాక్టర్స్‌. సమాజంలో సాటి మనిషి తోడు లేకపోయి ఉంటే ఇవాళ నువ్వు భారత దేశానికి కాదు ఒక శ్మశానానికి ప్రధానిగా ఉండేవాడివి. ఆనాడు ఏమీ తెలియని సమయంలోనే తబ్లిగీ జమ్మత్‌ తప్పయితే ఈనాడు అంతా తెలిశాక కుంభమేళా ఏంటి..? దీనిని సమాధానం నువ్వు కాక ఇంకెవరు చెస్తారు మోడీ..? అమెరికా మెడలు వంచి వీసా వేయించుకున్న మొనగాడు, బాలాకోట్‌ను బెంబేలెత్తించటంలో సైన్యానికే సూచనలిచ్చిన వీరుడు, ఇస్రో శాస్త్రవేత్తలకు సలహాలు ఇవ్వగల గడుగ్గాయి. కరోనాకు మాత్రం బాధ్యత వహించట్లేిదు. ఇది కాదా ఈ దేశ దౌర్భాగ్యం?


సెకండ్‌ వేవ్‌ ఊపందుకుంటున్న సమయంలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ అన్నీ తుంగలో తొక్కి నిర్లజ్జగా నీ యంత్రాంగాన్ని మొత్తం బెంగాలుకు తీసుకెళ్లి బహిరంగ సభలు పెట్టింది నువ్వా నేనా ? మరి నిన్ను కాక ఇంకెవడిని అడగను..? ఓ విజనరీ మోడీ! జనవరి 2021 లోనే కదా ప్రపంచ ఫార్మా కేంద్రం ఇండియా అని ప్రగల్భాలు పలికావు, మనం ఇచ్చే స్ధాయిలో ఉన్నాం కానీ తీసుకునే పరిస్దితుల్లో లేమని తొడకాట్టావ్‌. డెబ్బె దేశాలకు పంపణీ చేసిన వాక్సిన్‌, గోమూత్రం ఆవు పిడకలంత కాకపోయినా ఓ మోస్తరుగా అయినా నీ దేశ ప్రజలకు పని చేయదా..? మరి వాక్సిన్‌ ఏది..? నిన్ను కాకపోతే పాకిస్దాన్‌ ప్రధానిని అడగనా ..? అమెరికా అధ్యక్షుడిని నిలదీయనా ..? ఆ వాక్సినే ఉంటే రెమిడెసివిర్‌ కోసం బారులు తీరిన బ్లాకు లైన్లలో నుంచునే ఇక్కట్లు తప్పుతాయి కదా ? ఆ వాక్సిన్‌ పంపిణీ సరిగ్గా జరిగి ఉంటే మిత్రులని, వారి సహచరులని, వారి ఆప్ష్తులని అందరినీ పోగొట్టుకునేవాళ్ళం కాదు కదా !

ఏం మోడీజీ మాట్లాడవే..? దేశం అట్టుడిపోతుంటే మాట్లాడవే..? వాక్సిన్లు లేవు, ఆక్జిజన్‌ సిలిండర్లు దొరకటల్లేదు, హాస్నిటల్లో జాయిన్‌ అవ్వాలంటే బెడ్లు లేవు, ఒకవేళ ఉన్నా జాయిన్‌ అయ్యే స్షోమత లేదు, ఆఖరికి అయిన వాళ్లు ఛస్తే బొంద పెట్టటానికి శ్మశానాలు కూడా లేవు. నీ చేతకానితనాన్ని ప్రజల నిర్లక్ష్యంగా చిత్రీకరించే నీకూ, నీ యంత్రాంగానికీ, నిన్ను సమర్ధించే నీ భక్తులకూ శ్మశానం బయట క్యూలో నుంచుని అయిన వారికి వీడ్కోలు చెప్పటానికి ఎదురు చూస్షున్న వారిని పలకరించే దమ్ముందా..? ఆ కన్పీళ్ళని తుడవడానికి మీ కర్చీఫులు సరిపోతాయా.? ఆ ఆక్రందనలని మీ ఆత్మ నిర్భర పాకేజీలు ఆపగలవా..?


ప్రపంచ దేశాలు మనల్ని చూసి నవ్వుతున్నందుకు బాధ లేదు. నా దేశంలో నన్ను పట్టించుకోవటం లేదనే నా బాధ అంతా. పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో అని టెలిఫోన్‌ సందేశాలు చెప్పించావ్‌. కానీ ఈ సారి మాత్రం యుద్ధం వ్యాధితో కాదు…మనల్ని పాలిస్తున్న ప్రభుత్వంతో అన్న తీరుకి పరిస్దితి దిగజారిపోయింది. మరి దీనికి నిన్ను కాక ఇంకెవరిని ప్రశ్నంచాలి.? నీతో నాకేం శతృత్వం లేదు. కానీ నీ చేతకానితనమంటేనే నాకు అసహ్యం. ఎందుకంటే దానికి మూల్యం చెల్లించాల్సింది నువ్వు, నీ భక్తులు కాదు. ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రజలూ వారి కుటుంబాలూ.
ఇపుటికీ నీ చెరగని చిరునవ్వుతో ఉండే స్టిక్కర్లు అంటించిన వాక్సిన్లూ, పులి హౌర పొట్లాలూ, మందులూ మాకు అందుబాటులోకి తెస్తే కళ్ళకు అద్ఱుకుని తీసుకుంటాం. మాకు వేరే దారి లేదే. కానీ ఏం జరిగినా నిన్నే నిగ్గదీసి అడుగుతాం, నిన్నే నిలదీస్షాం. ఎందుకంటే నిన్ను మేము ఎన్నుకున్నాం. నిన్ను ఎందుకు అడుగుతున్నావని ఎవడైనా నన్ను ప్రశ్నిస్తే మళ్లీ వాడిని తిరిగి నేను ప్రశ్నస్షా….సమాధానం చెప్పాల్సింది మోడీ కాకపోతే నీ అమ్మా మొగుడా..?
ఇట్లు
సగటు భారతీయుడు
18/05/2021

గమనిక. ఇది నా రచన కాదు, వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న పోస్టు. దీనిలో అంశాలు ఆలోచించతగినవిగా ఉన్నాయని భావించి నరేంద్రమోడీ ఏడు సంవత్సరాల ఏలుబడి పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠకుల కోసం పోస్టు చేస్తున్నా.
భవదీయుడు
ఎం కోటేశ్వరరావు

వామపక్ష శక్తులకు ఉత్సాహమిచ్చే అల్బేనియా, చిలీ ఎన్నికలు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


అల్బేనియా, టర్కీ మాదిరే అత్యధిక ముస్లిం జనాభాతో ఉన్న ఆగేయా ఐరోపా ఖండ దేశం. జనాభా 30లక్షలకు లోపుగానే ఉన్న లౌకిక రాజ్యం. తూర్పు ఐరోపా దేశాల మాదిరే మూడు దశాబ్దాల క్రితం సోషలిస్టు వ్యవస్ధలో ఉంది.1991 తరువాత బహుళ పార్టీ రాజకీయ వ్యవస్ధ ఉనికిలోకి వచ్చింది. మూడు దశాబ్దాలు గడచినా కమ్యూనిస్టు గతాన్ని సమూలంగా వదిలించుకోవటంలో విఫలమైందని రాజధాని టిరానా కేంద్రంగా పని చేస్తున్న ఒక స్వచ్చంద సంస్ధ పరిశోధకుడు అల్టిన్‌ జెటా తాజాగా రాసిన వ్యాసంలో వాపోయాడు. తూర్పు ఐరోపా దేశాలలో అనేక చోట్ల ప్రజాస్వామ్య ఖూనీ, కమ్యూనిస్టు పార్టీలపై నిషేధం, కమ్యూనిజం బాధితుల పేరుతో వ్యతిరేక ప్రచారం చేసే శక్తులు రెచ్చిపోతున్న తరుణంలో అల్బేనియా గురించి ఇలాంటి వ్యాఖ్య వెలువడటం ఒక చిన్న దేశం ఇస్తున్న పెద్ద సందేశంగా చెప్పవచ్చు. కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఎందుకీ కడుపు మంట ?

కమ్యూనిస్టు గతం నుంచి విడగొట్టుకోని ఏకైక పూర్వపు ఐరోపా సోషలిస్టు దేశం అని సదరు రచయితే చెప్పాడు. మూడు దశాబ్దాల క్రితం తూర్పు ఐరోపా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు వ్యవస్ధలను వ్యతిరేకిస్తూ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు, నాటి పోప్‌తో చేతులు కలిపిన ఉదంతాలను గుర్తుకు తెచ్చుకుంటే అలాంటి శక్తులు, వీధుల్లోకి వచ్చిన ఉదంతాలు లేని ఏకైక దేశం అల్బేనియా. అయినప్పటికీ అక్కడి పాలకవర్గం అనేక చర్యలు బహుళ పార్టీ వ్యవస్ధను ప్రవేశ పెడుతూ రాజ్యాంగ పరమైన మార్పులు చేసింది. పూర్వపు సోషలిస్టు వ్యవస్ధలోని యంత్రాంగం, పార్టీ రాజకీయాలు, ఇతర అనేక అంశాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న దేశం అయినప్పటికీ దీని ప్రభావం మిగిలిన పూర్వపు సోషలిస్టు దేశాల మీద పడుతుందన్నది సామ్రాజ్యవాదులు లేదా వారి ఏజంట్ల భయం. పూర్వపు సోషలిస్టు దేశాల్లో అధికారానికి వచ్చిన శక్తులు సోషలిస్టు వ్యవస్ధలు, కమ్యూనిజం మీద విషం కక్కుతుంటే అల్బేనియాలో అలాంటి పరిస్ధితి లేదు. కమ్యూనిస్టు అల్బేనియా దేశంలో అందరికీ ఓటింగ్‌ హక్కు కల్పించటం,ఉచిత విద్య, వైద్యం, ఇతర అభివృద్ధికి ఒక పురోగామి రాజ్యంగా పని చేసిందని పాఠశాల పుస్తకాల్లో ఇప్పటికీ పిల్లలకు బోధిస్తున్నారు. దీన్ని కొనసాగిస్తున్న కారణంగా కమ్యూనిస్టు గతాన్ని పూర్తిగా తుడిచివేయటం అసాధ్యంగా మారిందని అక్కసు వెళ్లగక్కుతున్నారు.


సదరు రచయిత అక్కసుకు తక్షణ ప్రేరేపణ గతనెలాఖరులో అక్కడ జరిగిన ఎన్నికల్లో పూర్వపు అల్వేనియా లేబర్‌ పార్టీ ( కమ్యూనిస్టు పార్టీ ) వారసురాలు అల్బేనియా సోషలిస్టు పార్టీ అధికారానికి రావటమే. అనేక దేశాలలో కార్మికుల పేరుతో ఏర్పడిన అనేక పార్టీలు తరువాత కాలంలో సోషలిస్టు లక్ష్యంతో, కమ్యూనిస్టు సిద్దాంతాలను అనుసరించినప్పటికీ పూర్వపు పేర్లతోనే కొనసాగాయి. వాటిలో అల్బేనియా పార్టీ ఒకటి. ఉత్తర కొరియాలో అధికారంలో ఉన్నది కమ్యూనిస్టులని అందరికీ అందరికీ తెలుసు. పార్టీ పేరు కొరియా వర్కర్స్‌ పార్టీ అనే ఉంది. అదే విధంగా క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ 1920దశకంలోనే ఏర్పడినప్పటికీ ఎన్నికల అవసరాల కోసం 1944లో ప్రజా సోషలిస్టు పార్టీగా పేరు మార్చుకుంది. అయితే నియంత బాటిస్టాను కూలదోసిన ఉద్యమానికి నాయకత్వం వహించిన ఫైడెల్‌ కాస్ట్రో ఆ సమయంలో కమ్యూనిస్టు కాదు.1955లో జూలై 26 ఉద్యమం పేరుతో ఏర్పడిన పార్టీ నేత.1959లో అధికారానికి వచ్చారు. రెండు సంవత్సరాల తరువాత విప్లవంలో భాగస్వాములైన మూడు పార్టీలు 1961లో విప్లవ సంస్ధగా ఐక్యమయ్యాయి. మరుసటి ఏడాది క్యూబన్‌ విప్లవ ఐక్య సోషలిస్టు పార్టీగా మారింది. మరో మూడు సంవత్సరాల తరువాత క్యూబా కమ్యూనిస్టు పార్టీ అయింది. 1976లో రాజ్యాంగ సవరణ చేసి దేశానికి మార్గదర్శిగా కమ్యూనిస్టు పార్టీని గుర్తించారు.

అయితే అల్బేనియా పార్టీ అలా ఉందని చెప్పలేముగాని ఒక వామపక్ష పార్టీగా పూర్వపు వారసత్వాన్ని కొనసాగిస్తోందని భావించవచ్చు. పూర్వపుసోషలిస్టు ప్రభుత్వంలో పని చేసిన వారు ఈ పార్టీలో కొనసాగుతున్నారు.యాభై ఆరు సంవత్సరాల ఎడి రామా పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఉన్నారు. కమ్యూనిస్టు నేపధ్యం గల కుటుంబంలో జన్మించిన రామా కమ్యూనిస్టు పార్టీలో పని చేయటం లేదా ప్రభుత్వ పదవుల్లో గానీ లేరు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలకు వ్యతిరేకంగా కుట్రలు జరిగిన 1990దశకంలో అల్బేనియాలో ప్రజాస్వామ్య వ్యవస్ధ కావాలని కోరిన వారిలో ఒకడు. డెమోక్రటిక్‌ పార్టీలో చేరి వెంటనే సైద్దాంతిక విబేధాలతో బయటికి వచ్చి సోషలిస్టు పార్టీలో చేరారు. టిరానా నగర మేయర్‌గా పోటీ చేసి గెలిచారు. ఆయన నాయకత్వంలో మూడు సార్లు పార్లమెంట్‌ ఎన్నికల్లో , రెండు మున్సిపల్‌ ఎన్నికలలో పార్టీ విజయం సాధించింది. ఐరోపా సోషలిస్టు పార్టీల కూటమిలో భాగస్వామిగా ఉంది.


తాజా విషయానికి వస్తే గతనెలాఖరులో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 140 స్ధానాలకు గాను 74 సాధించి అల్బేనియా సోషలిస్టు పార్టీ వరుసగా మూడవ సారి అధికారానికి వచ్చింది. 1992 నుంచి ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో ఒక సారి సంకీర్ణ మంత్రి వర్గానికి నాయకత్వం వహించింది, నాలుగుసార్లు స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నాలుగు సార్లు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ధనిక దేశాలలో తలెత్తిన 2008 ఆర్ధిక సంక్షోభ సమయంలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ 2013 నుంచి వరుసగా ఎన్నిక అవుతూనే ఉంది. మిగతా ఐరోపా దేశాలలో ఒక పాలకపార్టీ ఇలా వరుస విజయాలు సాధించటం ఇటీవలి కాలంలో అరుదు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికలోనూ ఓట్లశాతాన్ని పెంచుకుంటూ వస్తుండటం కూడా ఒక విశేషమే. ప్రతిపక్ష మితవాద డెమోక్రటిక్‌ పార్టీ ఎన్నికల ఫలితాలను గుర్తించటం లేదని ప్రకటించి తరువాత మౌనం దాల్చింది. అనివార్యమైన స్ధితిలో అమెరికా, ఐరోపా దేశాలు కూడా సోషలిస్టుల విజయాన్ని జీర్ణించుకోలేకపోయినా గుర్తించక తప్పలేదు.


ఇక అంతర్గత రాజకీయాల విషయానికి వస్తే 2017లో సోషలిస్టు పార్టీ మద్దతుతో ఎన్నికైన అధ్యక్షుడు లిర్‌ మెటా తరువాత ప్రభుత్వ వ్యతిరేకిగా మారాడు. తాజా ఎన్నికలలో సోషలిస్టు పార్టీకి గనుక 71 స్ధానాలు వస్తే తాను రాజీనామా చేస్తానని ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసి ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నించాడు. సోషలిస్టు పార్టీ విజయం సాధించిన తరువాత 2022లో తన పదవీ కాలం పూర్తయ్యే వరకు కొనసాగుతానని, రాజీనామా ప్రసక్తి లేదని ప్రకటించాడు. అయితే అధికారపార్టీకి చెందిన ఎంపీలు అధ్యక్షుడిని అభిశంసించేందుకు ఒక తీర్మానాన్ని అంద చేశారు, తనను తొలగించటం చట్టవిరుద్దమని మెటా వాదిస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్యలను తీసుకొనేందుకు ప్రభుత్వం పూనుకుంది.అల్బేనియా ఎన్నికల్లో సోషలిస్టుల విజయం ఐరోపాకే కాదు, యావత్‌ ప్రపంచ పురోగామి శక్తులకు ఉత్సాహానిచ్చే పరిణామమే.

చిలీలో మితవాదులకు చావు దెబ్బ

లాటిన్‌ అమెరికాలోని చిలీ పరిణామాలు కూడా ప్రపంచ వామపక్ష శక్తులకు ఉత్సాహాన్నిచ్చేవిగా ఉన్నాయి. నూతన రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసే రాజ్యాంగపరిషత్‌కు జరిగిన ఎన్నికలలో మితవాద శక్తులకు చావు దెబ్బ తగిలింది.మాజీ నియంత పినోచెట్‌ మద్దతుదారులు, సాంప్రదాయ పార్టీలు జనాగ్రహ సునామీలో కొట్టుకుపోయాయి. మే 16వ తేదీన నూటయాభై ఐదు స్ధానాలకు జరిగిన ఎన్నికలలో 77శాతం మంది వామపక్ష భావాలు కలిగిన వారు, నియంత పినోచెట్‌ విధానాలను వ్యతిరేకించిన వారు విజయం సాధించారు. అధికారంలో ఉన్న సోషలిస్టు సాల్వెడోర్‌ అలెండీని హత్య చేసిన పినోచెట్‌ 1973లో అధికారానికి వచ్చి 1990వరకు కొనసాగాడు. రాజ్యాంగ పరిషత్‌ ఎన్నికలలో మితవాద పార్టీల కూటమికి కేవలం 37 మాత్రమే వచ్చాయి.నిబంధనల ప్రకారం కొత్త రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్‌ ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. మితవాద శక్తులు గనుక 54 స్ధానాలు పొంది ఉంటే రాజ్యాంగ రచన చిక్కుల్లో పడి ఉండేది, అయితే ఓటర్లు అలాంటి అవకాశం లేకుండా 37 మాత్రమే ఇవ్వటంతో రాజ్యాంగ రచనలో మితవాద శక్తుల పప్పులు ఉడికే అవకాశాలు లేవు. రాజ్యాంగ సభలో 77 మంది మహిళలు, 78 మంది పురుషులు ఉన్నారు. నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ప్రక్రియ ప్రారంభమైంది. పెద్ద విజయాలు సాధించిన వారిలో 28 స్దానాలతో కమ్యూనిస్టులు ఉన్నారు, వామపక్షంగా ఉన్న మరొక పార్టీ 24 పొందింది.


2018లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన మితవాది, బిలియనీర్‌ సెబాస్టియన్‌ పినేరా విధానాలతో మరుసటి ఏడాదే దేశంలో వివిధ తరగతుల్లో ఆందోళన ప్రారంభమైంది. తరువాత అనేక ఉద్యమాలు నడిచాయి. గత మూడు సంవత్సరాలుగా పార్లమెంట్‌లోని మితవాదులు, పినేరా కూడా వైద్యరంగంలో ప్రజానుకూల సంస్కరణలకు అడ్డుతగిలారు. నయావుదారవాద విధానాలతో జనజీవితాలు అతలాకుతలం అయ్యాయి.సంపదలు దిగువ జనానికి చేరతాయని చెప్పిన ఊట సిద్దాంతం తిరగబడింది. కనీసం పదిలక్షల మంది జనం 2019లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన నేపధ్యంలో రాజ్యాంగపరిషత్‌ ఎన్నికలను చూడాలి. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం నయా ఉదారవాద విధానాలతో నియంత పినోచెట్‌ ఏర్పాటు చేశాడు. రాజ్యాంగ పరిషత్‌తో పాటు ప్రాంతీయ ప్రభుత్వాలు, స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావిస్తున్న డేనియెల్‌ జాడ్యు 66శాతం ఓట్లతో శాంటియాగోలోని రాజధాని ప్రాంత కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే విధంగా శాంటియాగో మేయర్‌గా చిలీ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త లిరాసీ హాస్లర్‌ ఎన్నికయ్యారు. ఆమె కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. కమ్యూనిస్టు పార్టీతో సహా వామపక్ష శక్తులు ఉన్న బ్రాడ్‌ ఫ్రంట్‌ (విశాల కూటమి) తరఫున పోటీచేసిన అనేక మంది స్ధానిక సంస్ధలలోనూ, రాజ్యాంగ పరిషత్‌లోనూ విజయాలు సాధించారు. మితవాద శక్తులకు సాంప్రదాయంగా ఓటు వేసే అనేక పట్టణాల్లో వారిని మూడవ స్ధానానికి నెట్టివేశారు. చిలీ జనాభా కోటీ 90లక్షలు కాగా శాంటియాగో పరిసరాల్లో 60లక్షల మంది ఉన్నారు. ఆప్రాంతంలోని 27 మేయర్‌ స్ధానాలను కమ్యూనిస్టు, వామపక్షశక్తులు, పదకొండు స్ధానాలను స్వతంత్రులు గెలుచుకోగా మితవాదులకు 14వచ్చాయి. ఎన్నికలు ముగిసిన ఏడాది లోపు నూతన రాజ్యాంగ రచన జరగాలి. ఆ తరువాత రెండు నెలల్లో మరోసారి దాని మీద ప్రజాభిప్రాయసేకరణ జరిపి ఆమోదానికి పెట్టాలి.


ప్రపంచ వ్యాపితంగా మితవాద, నయా ఫాసిస్టు శక్తులు పెరిగేందుకు అనువైన పరిస్దితులు ఉన్నాయి. అందుకే మన దేశంతో సహా అనేక చోట్ల అవి అధికార పీఠాలపై తిష్టవేశాయి.ఈ పరిణామాలను చూసి గుండెలు బాదుకోవాల్సిన పనిలేదు. ఇదేమీ ప్రపంచానికి కొత్త కాదు, వాటి పీచమణిచే ప్రజాశక్తి మొద్దుబారలేదు. అల్బేనియా, చిలీ పరిణామాలు దాన్నే సూచిస్తున్నాయి.

ఆనందయ్య అద్భుత మందు – తర్కం, కుతర్కం అసలు లక్ష్యం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


నిజం గడప దాటక ముందే ఒక అబద్దం ఊరంతా తిరిగి వచ్చి నిజానికే తన మీద తనకే అనుమానం వచ్చేట్లు చేస్తుంది. ఆనందయ్య మందు గురించి సామాజిక మాధ్యమంలో వస్తున్న తర్క-కుతర్కాల గురించి చూద్దాం.
గతంలో కూడా పసరు లేదా ఇతర నాటు మందులు, వాస్తు గురించి కూడా వాటిని సమర్దించే వారు, నమ్మేవారు పుష్కలంగా ఉన్నారు. తాజా ఆనందయ్య మందుకు హిందూ మతాన్ని జోడించటం ద్వారా మతోన్మాద శక్తులు దీన్ని కూడా వెంటనే వినియోగించుకున్నాయి.


వనమూలికలు, పసరు మందులు లేదా ఆయుర్వేదం సాంప్రదాయకమైనవి అని చెబుతున్నారు. ఇది కుతర్కం. అవి సాంప్రదాయకం కాదు. మానవ జాతి జీవన పోరాటంలో తమ అనుభవంలోకి వచ్చిన వాటితో గాయాలు, రుగ్మతలను రూపు మాపేందుకు ఎందరో చేసిన ప్రయోగాలే. జ్వరం, కడుపు, తలనొప్పులు వస్తే మా తాత, మానాన్న ఫలానా మూలికలు, ఆకుపసరులు ఇచ్చే వారు, నేను కూడా అదే కొనసాగిస్తున్నా అని చెప్పే వారు మనకు కనిపిస్తారు. నిజానికి వాటిలో వుండే శాస్త్రీయ లక్షణాలు తెలిసి ఇచ్చేవి కాదు. అవి పూర్తిగా పని చేస్తాయనే నిర్దారణతో ఇచ్చేవి కాదు. నిజానికి జనానికి పూర్తి విశ్వాసమే ఉంటే అన్ని రకాల గాయాలు, జబ్బులను నయం చేసే లక్షణం ఉంటే అల్లోపతి ఆసుపత్రులు ఇలా కిటకిటలాడుతుండేవా ? జనం వాటిని ఎందుకు విస్మరిస్తున్నారో సమర్ధకులు చెప్పాలి. రోడ్డు మీద పోతుంటే ఒక పూజలు చేసిన ఒక చెట్టో, పుట్టో, గుండ్రాయో కనిపించగానే కొందరు ఒక దండం పడేసి పోతారు. వస్తే సంపదలు వస్తాయి, దండంతో పోయేదేమీ లేదు కదా అన్నదే వారి ఆలోచన. ఒక పక్క ప్రాణాలు తీస్తున్న మహమ్మారికి సరైన మందు లేదన్న ప్రచార నేపధ్యంలో తెల్లవారేసరికి అలాంటి మందు ఉంది అని చెప్పగానే జనం ఎగబడటం మన సామాజిక రుగ్మతల్లో ఒకటి. వాటిని అర్ధం చేసుకోవాలే గానీ ఆగ్రహిస్తే ప్రయోజనం లేదు.


నమ్మకం లేకపోతే జనం ఎందుకు ఎగబడుతున్నారు ? జనం ఎగబడే వన్నీ సమర్దనీయమేనా ? కొన్ని సంవత్సరాల క్రితం గుంటూరు పక్కనే ఉండే పలకలూరు అనే గ్రామం(ఇప్పుడు సిటీలో కలసిపోయింది)లోని ఒక బావిలో నీరు తాగితే రోగాలు నయం అవుతున్నాయని ప్రచారం సాగి జనం ఎగబడ్డారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక హైదరాబాదు బత్తిన సోదరుల చేప మందు సంగతి తెలిసిందే. ఉబ్బసానికి – మృగశిర కార్తెకు సంబంధం ఏమిటి అని ఎవరైనా ఆలోచించారా ? 1845లో ఒక సాధువు తమ పూర్వీకుడికి మందు గురించి చెప్పారని అప్పటి నుంచి తమ కుటుంబం పంపిణీ చేస్తున్నదని ఆ సోదరులు చెప్పారు. ఇక్కడ ఒక ప్రశ్న వారి పూర్వీకులకు సాధువు ఇవ్వక ముందు ఉబ్బసం లేదా దానికి ఎవరు మందు ఇచ్చారు ? అది ప్రపంచవ్యాపిత జబ్బు. పుప్పొడి, బొద్దింకలు, దుమ్ము ప్రధాన కారణం అని నిర్ధారించారు. ఉబ్బసం అనేది సర్వకాలాల్లోనూ వస్తున్న వ్యాధి. దీనికి ఉపశమనం తప్ప ఇంతవరకు చికిత్సలేదు. జలుబు కూడా అంతే. ఇవి అందరికీ ఒకే కారణంతో రావాలని లేదు.ఎవరి కారణాలు వారికి ప్రత్యేకమే. ప్రపంచంలోని ప్రతి దేశంలో ఆస్తమా రోగులు ఉన్నారు. అయితే దానికి బలి అవుతున్నవారు ఎక్కువగా పేద, వర్ధమాన దేశాల వారే. ప్రపంచంలో ప్రతి పది మంది ఆస్తమా రోగుల్లో ఒకరు మన దేశంలో ఉంటున్నారు. వారి సంఖ్య ఒకటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఉంటోంది. బత్తిన సోదరులు తమ మందు లేదా ప్రసాదం తీసుకున్న వారి సంఖ్య ఆరున్నర లక్షలు. అతి అతిశయోక్తి అంతలేరు అనే వారున్నారు. పోలీసు లెక్కల్లో అది కనపడదు, పోనీ అంత మంది తీసుకున్నారనుకున్నా మిగతావారు ఏం చేస్తున్నట్లు, ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లే కదా. అందువలన మెడికల్‌ మాఫియాకు బత్తిన సోదరులు సవాలుగా తయారైందీ లేదు ఆసుపత్రుల వారు ఆందోళన చెందిందీ లేదు. ప్రతి మూఢనమ్మకాన్ని సొమ్ము చేసుకొనే వారే జనవిజ్ఞాన వేదికను చూసి ఆందోళన చెందారు. అందువలన ఇలాంటి వాటితో పాటు, మహమ్మారులు తలెత్తినపుడు, చికిత్సలేనపుడు సూక్ష్మంలో మోక్షం కోరుకున్నట్లుగా ఒకసారి వాడి చూద్దాం పని చేస్తే చేస్తుంది లేకుంటే ఏమీ కాదంట కదా అని జనం ఎగబడుతున్నారు తప్ప మరొకటి కాదు. వారికి అన్నీ తెలిసి ఎగబడుతున్నారని ఎవరైనా నిరూపించగలరా ?


1890దశకంలో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు నివారణ కోసం సిబ్బంది ఇండ్లకు వచ్చినపుడు మతం, ఆచారాల పేరుతో కనీసం లోపలికి ప్రవేశించేందుకు సైతం అంగీకరించకుండా అడ్డుకున్నారని చదువుకున్నాం. చివరికి మత పెద్దల సాయంతో సిబ్బంది ప్లేగు బాధితులను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే కొన్ని చోట్ల బ్రిటీష్‌ మిలిటరీ, పోలీసు, ఆరోగ్య యంత్రాంగం అలాంటి వారి మీద బల ప్రయోగం చేయాల్సి వచ్చిందని కూడా తెలిసిందే. ఇప్పుడు కూడా ఎవరికన్నా కరోనా ఉందని తెలిస్తే ఇంటి యజమానులు అద్దెకుండే వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్న ఉదంతాలెన్ని లేవు. అందువలన జనం చేసేవన్నీ మంచివే అనీ చెప్పలేం. ఇప్పుడు లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలు జరిపే పేరుతో పోలీసుల అతి చర్యలను కూడా చూస్తున్నాం-జనం కోసమే అయినా అలాంటి వాటిని సమర్ధిస్తామా ? ప్లేగు వ్యాధి నివారణకోసం నాటి నిజాం నవాబులు వేరే దిక్కుతోచక హైదరాబాద్‌లో చార్మినార్‌ను నిర్మించారన్నది తెలిసిందే. అదే సమయంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా వచ్చిందిగా, బిజెపి భాషలో చెప్పాలంటే మరి హిందూ పాలకులు అనేక మంది ఉన్నారు కదా చికిత్సకు వారేం చేశారు, వారెందుకు కట్టడాలు కట్టించలేదు అంటే ఏం సమాధానం చెబుతారు ? కుతర్కానికి జవాబులుండవు ?

వేదాల్లో అన్నీ ఉన్నాయి, ఆయుర్వేదంలో లేనిది లేదు అని చెబుతారు. నిజమే ఉన్నాయనుకుందాం, మనకు పోయేదేమీ లేదు. వాటన్నింటినీ బయటకు తీసి దేశంలో కోట్లాది మందిని బలితీసుకున్న ప్లేగు, మసూచి, కలరా, మలేరియా, కుష్టు వంటి వాటికి ఔషధాలను ఎందుకు తయారు చేయలేదు, ప్రపంచ దేశాలకు ఎందుకు ఎగుమతి చేయలేదు ? 1890లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం రష్యా నుంచి బాక్టీరియాలజిస్టు డాక్టర్‌ వాల్డమర్‌ హాఫికిన్‌ను రప్పించింది. ఆయన రూపొందించిన వాక్సిన్‌ తరువాత కాలంలో ఎన్నో ప్రాణాలను కాపాడింది. అదే శాస్త్రవేత్త కలరా నిరోధ వ్యాక్సిన్ను కూడా రూపొందించాడు. మరి వేల సంవత్సరాల ఆయుర్వేదం, దాన్ని ఔపోసన పట్టిన వారు, సంస్కృత గ్రంధాల్లో అన్నీ ఉన్నాయని చెప్పేవారు ఎందుకు కనిపెట్టలేకపోయారు ? ప్రతి దేశంలోనూ అభివృద్ది చెందిన స్ధానిక వైద్య పద్దతులు లేదా ఔషధాలకు చాదస్ధాలను తగిలించి అభివృద్ధి నిరోధకంగా తయారు చేశారు. ఈ పరిణామం అన్ని దేశాలలో తరతమ స్ధాయిల్లో జరిగింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం ముందు వాటికి ఆదరణ తగ్గింది. అల్లోపతితో పాటు స్ధానిక వైద్య విజ్ఞానాన్ని అభివృద్ది చేస్తే ఎవరు అడ్డుకున్నారు ? ఆయుర్వేదం గురించి భారతీయులకు మాత్రమే తెలుసు, కొంత మందిలో విశ్వాసం ఉంది. ఔషధాలకు ప్రపంచ మార్కెట్‌లేదు, కనుకనే ఆ రంగంలో పరిశోధనకు ఎవరూ ముందుకు రావటం లేదు. అందువలన దానికి, అల్లోపతి వైద్యానికి పోటీ పెట్టి ఇది విదేశీ అని ఆయుర్వేదం హిందూ వైద్యం కనుక అణచివేస్తున్నారని ప్రచారం చేయటం ఉన్మాదం ముదరటం తప్ప మరొకటి కాదు. ఆయుర్వేదంలో బిపికి, మధుమేహానికి మహా గొప్ప మందులు ఉన్నాయి, వాటిని మెడికల్‌ మాఫియా బయటకు రానివ్వటం లేదన్నది ఒక ప్రచారం. ఆడలేక మద్దెల ఓడని ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటారు. భారతీయ పద్దతులను పరిరక్షించేవారు, వెలికి తీసేవారే కదా గత ఏడు సంవత్సరాలుగా కేంద్రంలో, ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. వారంతా ఏమి చేస్తున్నట్లు ? సొల్లు కబ్లురు తప్పితే, చైనా అంత పెద్ద దేశాన్నే లొంగదీసుకొని చర్చలకు రప్పించామని చెప్పుకొంటున్న 56 అంగుళాల ఛాతీ గల నేతలు మెడికల్‌ మాఫియాను అదుపు చేయలేరా ?

ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ది క్రమంలో ఏవరైనా ఒక ఔషధాన్ని తయారు చేశామని ప్రకటిస్తే దానికి రుజువులు చూపాలని, సామర్ద్యం సంగతి తేల్చాలని కోరుతున్నారు గనుకనే అనేక ఔషధాలు, వాక్సిన్లపై సంవత్సరాల తరబడి ప్రయోగాలు చేస్తున్నారు. అల్లోపతి ఔషధాలను ఎవరూ ప్రశ్నించటం లేదనేది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. దానికి చట్టాలే ఉన్నాయి. ఆయుర్వేద వైద్యానికి శిక్షణా కళాశాలలు, విద్యార్ధులకు సిలబస్‌, పరీక్షల వంటివి అన్నీ ఉన్నాయి. కానీ ఆనందయ్య వంటి వారు ఆయుర్వేదం పేరుతో ఏ అర్హతలతో వైద్యం చేస్తున్నారు, తయారు చేసిన పసరు మందులు ఇస్తున్నారు ? కొందరు అలాంటి వారిని ప్రోత్సహించటం ఏమిటి ? ప్రశ్నించిన వారిని హిందూ ద్రోహులుగా చిత్రిస్తారా ? అల్లోపతి ఆసుపత్రుల్లో జరిగే వాటిని ప్రశ్నించరు అని ఒక ప్రచారం. ఈ ప్రశ ్న అడిగేవారు వేదికలను ఏర్పాటు చేసుకొని ఆ పని ఎందుకు చేయరు ? ఈ దేశంలో ఒక చట్టం, ఒక విధానం అన్నీ ఉన్నాయి. ఒక వేళ ఆనందయ్య లాంటి వారు ఆయుర్వేద వైద్యం చేయటానికి అర్హతలు ఉన్నాయనుకుంటే వారికి డిగ్రీలు ప్రదానం చేసి చట్టబద్దంగానే చేయించండి, ఎవరు వద్దన్నారు. కల్వరి తైలం గురించి శాస్త్రీయ నిరూపణ చేయాలని ఎవరూ అడగలేదు ఎందుకు అని ఒక ప్రశ్న. కల్వరి అయినా మరొకటి అయినా ఔషధం అని ప్రచారం చేస్తే జనవిజ్ఞానవేదికో మరొకటో రంగంలోకి వస్తాయి. లేదూ రాలేదు అనుకోండి ఈ ప్రశ్న వేస్తున్నవారు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు? వారికి బాధ్యత లేదా ? గుళ్లూ గోపురాల్లో ప్రసాదం పేరుతో పెట్టేవాటిలో, పవిత్ర తీర్ధంలో , చర్చ్‌లలో బాప్తిజం, ఇతర సందర్భాలలో పవిత్ర జలంలో ఏముంది అని ఏ జనవిజ్ఞాన వేదిక కార్యకర్త అయినా ఎప్పుడైనా ప్రశ్నించిన ఉదంతం ఉదంతం ఉందా ? ఎందుకంటే వాటిని వారు ఔషధాలుగా ప్రచారం చేసుకోవటం లేదు. అడ్డగోలు తర్కాలకు అంతు ఉండదు.


ఉచితంగా ఇస్తున్న మందు గురించి ఇన్ని విచారణలా ? లక్షలు తీసుకుంటున్న ఆసుపత్రులను ఎందుకు పట్టించుకోరు ? ఈ దేశంలో ఒక చట్టం ఉంది. దాని ప్రకారం ఎవరైనా తెల్లవారే సరికి ఒక మందు ఇస్తున్నామంటూ ముందుకు వస్తే దానికి అనుమతి ఉందా , ఎక్కడ తయారైంది, ఇతర వివరాలన్నీ ముద్రించిన సమాచారం ఉండాలి. రామర్‌ పిళ్లే పెట్రోలు తయారీ, ఆనందయ్య మరొక వెంకయ్య గానీ వివరాలు, అనుమతుల్లేని మందు గురించి చెబితే ఈ సమస్యలన్నీ ముందుకు వస్తాయి. ఈ ప్రశ్న వేసే వారు చట్టాన్ని గౌరవిస్తున్నట్లా లేక అడ్డగోలు తనాన్ని ప్రోత్సహిస్తున్నట్లా ? విచారణ చట్టబద్దంగా జరుగుతోందా, విరుద్దంగా జరుగుతోందా ? ఒక మహిళకు పుట్టిన బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక మగవాడు ప్రకటిస్తే డిఎన్‌ఏ పరీక్షలు చేసి నిర్ధారిస్తున్నారా లేదా అదే విధంగా ఆనందయ్య తయారు చేసినట్లు చెబుతున్న మందును ఎవరైనా ప్రశ్నించినా లేక వార్తలు తెలిసి తనంతటతానే అయినా ప్రభుత్వాలు, సంబంధిత సంస్దలు విచారణ జరుపుతాయి. అదే విధంగా ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిగ్గుతేల్చాలి. విచారణ సక్రమంగా జరగలేదు అంటే అది వేరే విషయం.

జనవిజ్ఞాన వేదిక లక్ష్యం ఈ దేశ అనాది సంస్కృతుల్ని విజ్ఞానం పేర నాశనం చేసి చైనాకు బానిసలుగా చేయటం అని ఒక ముక్తాయింపు. సంస్కృతి, సాంప్రదాయాల పేరిట అసలు ప్రశ్నించే తత్వాన్నే నాశనం చేసింది, నగుబాట్ల పాలు చేస్తున్నదీ జనవిజ్ఞానవేదిక లేదా అలాంటి మరొక సంస్ధ కాదు. విదేశీ పాలకులు వారు పశ్చిమ, మధ్య ఆసియా నుంచి వచ్చినా ఐరోపా నుంచి వచ్చినా ప్రతిఘటించకుండా జనాన్ని దద్దమ్మలుగా తయారు చేసింది, ఈ దేశంలో పుట్టి పెరిగిన బౌద్ధమతాన్ని విదేశాలకు తరిమి వేసింది ఎవరు ? ప్రపంచంలో ఎక్కడా లేని అంటరాని తనాన్ని పెంచి పోషించింది హిందూమతం లేదా గొప్పదని చెప్పుకుంటున్న హిందూ సంస్కృతా లేక జన విజ్ఞానవేదికలా ?


ఔషధ కంపెనీల మాఫియా లేదా వత్తిడి అని ఒక ప్రచారం. నిజమే మాఫియా లేదా వారి మాయాజాలం ఉన్న మాట నిజమే. అది ఉండబట్టే కదా భారత్‌ బయోటెక్‌, సీరం సంస్దల వాక్సిన్లు తప్ప నెలల తరబడి మరొక వాక్సిన్‌ రాకుండా మన నరేంద్రమోడీ సర్కార్‌ ఏదో ఒకసాకుతో మోకాలడ్డి జనం ప్రాణాల మీదకు తెచ్చింది. కాదంటారా ? నిజంగా జనం ప్రాణాలు కాపాడటం ముఖ్యం అనుకుంటే వాటికి అనుమతి ఇచ్చినట్లుగానే అత్యవసర ప్రాతిపదికన ఇతర వాక్సిన్లకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు ? ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేక ఆనందయ్యను అడ్డుపెట్టుకొని కాషాయ తాలిబాన్లు ఔషధ మాఫియా పేరుతో జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. లేదూ నిజంగానే ఔషధ మాఫియా పని చేస్తోందని అనుకుందాం. కొత్తగా ఆనందయ్య మందుతో వారు ముందుకు రాలేదుగా, ప్రధాని, మంత్రులు, వారందరికీ మార్గదర్శనం చేస్తున్న సంఘపరివార్‌ మేథావులు ఏడు సంవత్సరాలుగా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? యాభై ఏండ్లలో కాంగ్రెస్‌ చేయలేనిదానిని ఐదేండ్లలో చేశామని చెప్పుకున్న గొంతులు మాట్లాడవేం. కంపల్సరీ లైసన్సులు ఇచ్చి ప్రాణావసర ఔషధాలు, వాక్సిన్లు తయారు చేయించి మెడికల్‌ మాఫియాను దునుమాడితే ఎవరు వద్దన్నారు ?


ఇప్పుడు కొంత మంది కోవిడ్‌ -19ను చైనా వైరస్‌ అని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగానే బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో మన దేశంలో తలెత్తిన కలరాను ఐరోపా, అమెరికా ఖండాలలో ఆసియా లేదా ఇండియన్‌ కలరా అని వర్ణించారు. తమ ప్రాంతంలో వచ్చిన కలరా కూడా దీని వలనే నిందించారు. బహుశా కరోనా గురించి చైనా మీద మన టీవీ యాంకర్లు, వాట్సప్‌ యూనివర్సిడీ పండితులు రెెచ్చి పోవటానికి ప్రేరణ ఇదే అయి ఉండవచ్చు. భారత్‌లోని హరిద్వార్‌, పూరీ, పండరిపూర్‌, పశ్చిమాసియాలోని మక్కా, మదీనా వంటి చోట్ల జరిగే మతకార్యక్రమాలకు హాజరయ్యే జనాలు దీనికి ఒక కారణమని నాటి బ్రిటీష్‌ పాలకులు భావించారు. 1892లో ఒక అమెరికన్‌ భారత్‌లో పారిశుధ్య నిబంధనలు అమలు చేయాలంటే ప్రతి యాత్రీకుడికి ఇద్దరు సిపాయిలు అవసరమని రాశాడు. భారత్‌లో హిందూ భక్తులు, ఈజిప్టులో ముస్లిం భక్తులు కొనసాగినంత కాలం ఐరోపా, అమెరికాలకు ముప్పుకొనసాగుతూనే ఉంటుందన్నాడు. ఒక మతం వారు, మరొక మతంలోని కొన్ని సామాజిక తరగతుల వారు పరిశుభ్రత పాటించరంటూ ఇప్పటికీ ప్రచారం చేసే వారు దీన్ని గమనంలో ఉంచుకోవాలి.

పూరీ జగన్నాధ రధయాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తులు కలరా వ్యాప్తికి ప్రధాన కారకులౌతున్నారనే అభిప్రాయంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలని బ్రిటీష్‌ పాలకులు ఒక దశలో ఆలోచించి, జనం నుంచి వచ్చే వ్యతిరేకతకు భయపడి పోతే పోనివ్వండి పోయేది వారేగా అన్నట్లు అలాంటి నిషేధాన్ని మానుకున్నారని చరిత్రకారులు రాశారు.బొంబాయి ప్లేగు, కలరా ఉదంతాలు 150 సంవత్సరాల క్రితం జరిగాయి. మహమ్మారుల గురించి ఎంతో పరిజ్ఞానం, విజ్ఞానం వచ్చిందనుకుంటున్న సమయంలో హిందూత్వశక్తుల అజ్ఞానం ఏ స్ధాయిలో ఉందో వారిని నమ్మి జనం ఎలా ప్రవర్తించారో చూశాము. గంగలో మునిగితే వైరస్‌ అంటుకోదని ప్రచారం చేశారా లేదా ! కుంభమేళాలో అంత మంది గుమికూడటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా బిజెపి ముఖ్యమంత్రులు, నేతలు దానికి అనుమతి ఇవ్వాల్సిందే అని వాదించి జనాన్ని గంగలో మునకలేయించారు కదా ! కొందరు అఖారాలు మరణించటం, వ్యాధి ప్రబలటంతో ప్రధాని నరేంద్రమోడీ జోక్యం చేసుకొని మధ్యలోనే నిలిపివేశారు. ఎందుకు అనుమతించారో, ఎందుకు నిలిపివేయించారో, హిందూ భక్తుల మనోభావాలు ఏమయ్యాయో ఎవరైనా చెప్పగలరా ?


ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలలో ఎబోలా మహమ్మారి తలెత్తినపుడు జనం ఎలా ప్రవర్తించారో మనం చూశాము. వాటిని సమర్ధిస్తామా ? ఎబోలా చికిత్స కేంద్రాలకు జనం వెళితే కొన్ని శరీర భాగాలను అపహరిస్తారని కొందరు, తమ సాంప్రదాయాలు, ఆచారాలకు భంగం వాటిల్లుతుందని ముందుకు రాని వారు, వ్యతిరేకించిన వారు ఉన్నారు. అందువలన జనం పేరు చెప్పి మూఢవిశ్వాసాలను పెంచి పోషించే వారు పెద్ద దేశద్రోహులు. దాన్ని ప్రశ్నించారా,దీన్ని ప్రశ్నించారా అంటూ అనేక మంది ఇప్పుడు అడ్డుసవాళ్లు విసురుతున్నారు. ఆనందయ్య మందును కొందరు ప్రశ్నించారు గనుక వీరంతా రంగంలోకి దిగారు. ఆ మందు లేనపుడు కూడా వీరు చెబుతున్న అంశాలు ఉన్నాయి కదా వీరెందుకు స్పందించలేదు. అంటే వీరి ప్రశ్నలు,ప్రచార అసలు లక్ష్యం హిందూత్వతో సహా దేన్నీ ప్రశ్నించకూడదు. అది కుదిరేది, జరిగేది కాదు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎందరు అడ్డుకున్నా సమాజాన్ని వెనక్కు నడపాలని గతంలో ప్రయత్నించినా కుదరలేదు, ఇక ముందు కుదరదు !

కరోనా మరణాలపై నరేంద్రమోడీ రోదన – మొసలి కన్నీరు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఎంతలో ఎంత మార్పు ! రోజులు ఎలా మారిపోయాయి !! కరోనా వైరస్‌ మన జీవితాలనే మార్చివేసింది. మనలో భాగమైన ప్రధాని నరేంద్రమోడీని ప్రభావితం చేయకుండా ఉంటుందా ? కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేశారనే విమర్శల నేపధ్యంలో ఆయనను గుడ్డిగా నమ్మే జనంలో ఏదో తేడా కొడుతోంది అన్న ఆలోచన అంకురించింది. నమ్మకాన్ని తప్పు పట్టలేం – గుడ్డి నమ్మకాన్ని ఏ మాత్రం అంగీకరించకూడదు. మోడీని విమర్శించిన వారి మీద గతంలో మాదిరి దాడి చేసే స్దితిలో బిజెపి లేదా దానికి మద్దతు ఇచ్చే మీడియా ఆయుధాలు పనికి రావటం లేదు. గతంలో మాదిరి ఎవరైనా విరుచుకుపడితే సహించే రోజులకు కాలం చెల్లుతోంది అని చెప్పవచ్చు.


గుజరాత్‌ ముఖ్యమంత్రి నుంచి ఢిల్లీ గద్దెనెక్కే వరకు, తరువాత కూడా నరేంద్రమోడీ బహిరంగ సభల్లో మాట్లాడే తీరు, ప్రదర్శించే హావభావాల గురించి చర్చ ఇప్పటిది కాదు. ఒక విషయాన్ని -అది ఎలాంటిది అనేది వేరే అంశం- జనం ముందుకు తేవటం, మెదళ్లకు ఎక్కించటంలో మోడీని అనుసరించాలని కార్పొరేట్‌ శక్తులే తమ సిబ్బందికి నూరిపోశాయి. వినియోగదారులకు తమ ఉత్పత్తుల మీద విశ్వాసం కలిగించేందుకు మోడీ మాదిరి మాటలు చెప్పాలని, హావభావాలు ప్రదర్శించాలని సూచనలు ఇచ్చిన అంశాల గురించి గూగుల్తల్లిని అడిగితే పుంఖాను పుంఖాలుగా -వస్త్రాల షాపులో మన ముందు చీరలు పడవేసినట్లు- పడవేసి ఎంచుకోమని చెబుతుంది. అందువలన వర్తమానంలో ఈ విషయంలో నరేంద్రమోడీని మించిన వారు లేరని అంగీకరించేందుకు ఇబ్బంది పడాల్సిందేమీ లేదు.

ఎంత కఠినాత్ముడికైనా ఒకానొక సమయంలో కంట నీరు రాకపోదని పెద్దలు చెబుతారు. మోడీ అలాంటి వారా అంటే అవునని-కాదని రెండు అభిప్రాయాలూ ఉన్నాయి. ఏనుగు గురించి ఏడుగురు అంధులను అడిగితే ఎవరు తడిమినదాన్ని బట్టి వారు ఏనుగు రూపాన్ని వర్ణించినట్లుగా అనుభవాన్ని బట్టి ఒక వ్యక్తి లేదా వ్యవస్ధ మీద అభిప్రాయాలను ఏర్పరుచుకోవచ్చు. హిట్లర్‌ ముందుకు తెచ్చిన జర్మన్‌ జాతీయవాదానికి ప్రభావితులైన వారు, జర్మన్‌ జాతిని శుద్ది చేస్తానంటే నిజమే అని భ్రమించిన వారు నెత్తికెక్కించుకున్నారు-అతగాడి మారణ కాండకు గురైన యూదులు, ఇతర దేశాలు ఎంతగా ద్వేషించాయో చూశాము.


కరోనా మరణాల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగానికి గురైనట్లుగా కంటతడి పెట్టినట్లు కొందరికి కనిపిస్తే మొసలి కన్నీరు అని కొందరికి అనిపించింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ వైద్యులతో మాట్లాడుతున్న సందర్భంగా నరేంద్రమోడీ కంటతడి పెట్టుకున్నట్లుగా వీడియో దృశ్యాలు, వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిని చూసి మోడీ అంతటి వ్యక్తే కన్నీరు పెట్టుకున్నారంటూ బాధపడిపోయి కన్నీరు పెట్టుకున్నవారు – మోడీలో జనం గోడు పట్టని దిగంబర రాజును చూసిన గుజరాతీ కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ వంటి వారు కూడా ఎందరో ఉంటారు. అయితే ఒక రాజకీయ నేత వ్యాఖ్యానిస్తే….. అదంతా వట్టిదే వాక్సిన్ల కొరత, పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు, దిగజారి పోయిన జిడిపి విషయాలను పక్కదారి పట్టించటానికి మోడీ మొసలి కన్నీరు కార్చారని కాంగ్రెస్‌ నేత రాహులు గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా వ్యాఖ్యానిస్తూ నరేంద్రమోడీ సినిమాల్లో అయితే నటనతో బాగా రాణిస్తారు అని వ్యాఖ్యానించారు. ఆర్‌జెడి కూడా మొసలి కన్నీరు అని వ్యాఖ్యానించింది. జనం చస్తుంటే నరేంద్రమోడీ ఎన్నికల సభల మీద కేంద్రీకరించి ఇప్పుడు కన్నీరు పెట్టుకోవటం మోసం కాదా అని ప్రశ్నించింది. దీని మీద బిజెపి నేతలు, మోడీ భక్తులు వెంటనే స్పందించలేకపోయారు.

నరేంద్రమోడీ నిజంగా ఏడ్చారా ? అలా నటించారా అనే చర్చ కూడా సామాజిక మాధ్యమంలో జరుగుతోంది. ఏది నిజం అని తేల్చటం ఎంతో కష్టం. మొసలి కన్నీటి గురించిన నిజా నిజాలను ఎవరైనా ఎవరైనా శాస్త్రవేత్తలు తేల్చారా అంటే కొన్ని అభిప్రాయాలు వెల్లడించటం తప్ప నిర్దిష్టంగా తెలియదు. అందుబాటులో ఉండే మొసళ్ల సంగతే తేల్చలేని వారు నరేంద్రమోడీ గారి దగ్గరకు వెళ్లి మీరు నిజంగా రోదించారా లేదా అని అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది. మీడియాకు ఎలాగూ అలాంటి అవకాశం లేదు, మీరు ఏం చెప్తే అది రాసుకుంటాం, ఏం చూపిస్తే దాన్ని చూపుతాం అనే జీ హుజూరు మీడియా అలాంటి ప్రశ్నలు ఎలాగూ అడగదు. ఇతరులెవరైనా అలా చేస్తే ఇంకేమైనా ఉందా ! మొసలి కన్నీరు గురించి సమాచారం, కొన్ని భాష్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

జాన్‌ మండవిల్లే అనే బ్రిటీష్‌ యాత్రీకుడు తన యాత్రల అనుభవాలను (1300-71) అక్షర బద్దం చేశారు. ఆ రచనలో మొసళ్ల గురించి ప్రస్తావన ఉంది. ఆ దేశంలో మొసళ్లు మనుషులను తింటూ ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి అని రాసినట్లు ఒక ముక్క చదివాను. అప్పటికి మన దేశానికి సముద్రమార్గం కనిపెట్టలేదు, రవాణా సౌకర్యాలు లేవు గనుక మన దేశంలోని మొసళ్ల గురించైతే మాత్రం కాదని చెప్పవచ్చు. అయినా మొసళ్లు ఎక్కడైనా ఒకటే కదా ! ఏమాత్రం కనికరం లేకుండా మనుషులను మట్టుబెట్టే అనేక మంది ఎలా దొంగేడుపులు ఏడుస్తారో సినిమాల్లో చూడటం, అలాంటి చర్యలను మొసలి కన్నీరు కార్చటం అంటారని వినటం తప్ప ప్రత్యక్ష అనుభవం లేదు. మొసలి నోటితోనే కాదు తోకతో కూడా దాడి చేసి చంపివేస్తుంది. మొసళ్లకు దొరికితే ఏమాత్రం కనికరం చూపవు, వాటికి దొరికిన వాటిని తినేటపుడు కన్నీరు కారుస్త్తాయి, అయితే ఆ చర్యకు భావోద్వేగానికి సంబంధం లేదు. నీటి నుంచి బయటకు వచ్చినపుడు కండ్ల మీద పడే దుమ్ము, ధూళిని శుభ్రం చేసుకొనేందుకు ద్రవాన్ని విడుదల చేయటాన్ని చూడవచ్చని కొందరు పేర్కొన్నారు. అమెరికా ప్రాంతంలో, అదే విధంగా ఉప్పునీటిలో ఉండే మొసళ్లు తీసుకొనే ఆహారంలో అధికంగా ఉండే ఉప్పును బయటకు పంపేందుకు కండ్లద్వారా ద్రవరూపంలో విడుదల చేస్తాయని చెబుతారు. అదే విధంగా నీటి నుంచి బయటకు వచ్చేటపుడు కండ్ల నుంచి కారే నీటిని కన్నీరుగా భ్రమిస్తామని కూడా కొందరంటారు.


ప్రఖ్యాత నాటక రచయిత షేక్‌స్పియర్‌ తన రచనల్లో మొసలి కన్నీటిని చాలా సందర్భాలలో వాడుకున్నారు.తనను వంచిస్తున్న భార్య గురించి ఒథెల్లో అనే పాత్ర తనను తాను ఇలా సమాధానపరుచుకుంటుంది.” ఆ భూమి మీద మహిళల కన్నీరు పారితే, ఆమె కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక మొసలిగా రుజువు చేసుకుంటుంది.” అదే విధంగా దొంగ ఏడుపులు, సంతాపాలు ప్రకటించిన వారిని మొసలి కన్నీటితో వర్ణించాడు. అలాంటి వారి కళ్లు తడిబారితే అర్దం లేదంటాడు. ఇంకా అనేక మంది తమ రచనల్లో ఇలాంటి పోలికలను పేర్కొన్నారు. కొన్ని వందల సంవత్సరాల నాడే ఇలాంటి పోలికలను ముందుకు తెచ్చారంటే దానికి నాంది ఎక్కడో తెలుసుకోవటం నిజంగా కష్టమే. ఇది ఒక్క ప్రాంతానికో ఖండం, దేశానికో పరిమితం కాదు.

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మాల్కొం షానెర్‌, కెంట్‌ వెయిట్‌ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో 2006లో ఒక పరిశోధన చేశారు. మొసళ్లు కన్నీరు కారుస్తాయనే ప్రచారంలో నిజమెంతో తేల్చాలనుకున్నారు. మొసళ్ల జాతిలో ఉపజాతికి చెందిన భయంకర తొండలను అందుకు ఎంచుకున్నారు. సెయింట్‌ అగస్టీన్‌ మొసళ్ల పార్కులో ఏడు తొండలను ఎంచుకొని వాటికి పొడినేలపై ఆహారం అందచేశారు. వాటిలో ఐదు కన్నీరు కార్చటాన్ని చూశారు. ఆహారం తినేటపుడు వాటి గ్రంధులలో సంభవించే మార్పుల వలన కండ్లలోకి ద్రవాన్ని పంపినట్లుగా అదే రోదిస్తున్నట్లుగా కనిపిస్తుందని విశ్లేషించారు. మొసళ్లలో కూడా అదే విధంగా జరుగుతుండవచ్చని నిర్దారణకు వచ్చారు.


ఒక ఉదంతం జరిగితే దానికి చిలవలపలవలతో కువ్యాఖ్యానాలు, మార్పిడి చేసిన చిత్రాలతో ప్రత్యర్ధుల పరువు తీయటం లేదా కొందరికి లేని వాటిని ఆపాదించి మహానుభావులుగా ప్రచారం చేయటం తెలిసిందే. జవహర్‌ లాల్‌ నెహ్రూ, సోనియా గాంధీ ఇలా ఎందరో అలాంటి ప్రచారాలకు గురయ్యారు. వాటి వెనుక కాషాయ దళాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కమ్యూనిస్టు యోధుడు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన జ్యోతిబసు అమ్మాయిలతో కాబరే నృత్యాలు చేసినట్లు చిత్రాలను సృష్టించటం వెనుక నాటి కాంగ్రెస్‌ పెద్దలు ఉన్న విషయం తెలిసిందే. ఇక మన ప్రధాని నరేంద్రమోడీ గారి గొప్పతనాన్ని తెలియచెప్పే పధకంలో భాగంగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా జీవితం ప్రారంభించిన కొత్తలో ఆ సంస్ద సమావేశాలు జరిగినపుడు స్నానపు గదులు, మరుగుదొడ్లు కడిగిన సేవకుడిగా చిత్రిస్తూ ఫొటోలను సామాజిక మాధ్యమంలో పెట్టిన విషయం తెలిసిందే. వాటిని కించపరుస్తూ పెట్టినట్లు భావిస్తే వెంటనే తొలగించమని కోరి ఉండే వారు. అలాంటిదేమీ జరగలేదు గనుక వాటి వెనుక ఎవరున్నారో చెప్పనవసరం లేదు.

ఇక తాజా ఉదంతానికి వస్తే ఎవరి గడ్డిని వారిచేతే తినిపించినట్లుగా న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. ఆ పత్రిక సూర్యరశ్మితో సిరియాలో విద్యుత్‌ తయారీ గురించి రాసిన కథనానికి ఒక పెద్ద చిత్రాన్ని తోడు చేసింది. అయితే ఆ చిత్రం స్దానంలో కంటి నుంచి ద్రవాన్ని కారుస్తున్న ఒక మొసలి బొమ్మ పెట్టి పైన రోదించిన భారత ప్రధాని అనే శీర్షిక పెట్టారు. అంటే నరేంద్రమోడీ మొసలి కన్నీరు కార్చారు అనే అర్ధం వచ్చేట్లుగా తయారు చేసిన ఆ చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో వైరల్‌ చేశారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ దాన్ని ట్వీట్‌ చేసి నకిలీదని తేలటంతో వెనక్కు తీసుకున్నారు. అలాంటి హుందాతనాన్ని సంఘపరివార్‌ పెద్దలు ఎంత మంది పాటించారన్నది ప్రశ్న.


కొద్ది రోజుల క్రితం నరేంద్రమోడీని బదనామ్‌ చేయాలని సూచిస్తూ కాంగ్రెస్‌ ఒక టూల్‌కిట్‌ను తయారు చేసిందంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, సంబిత్‌ పాత్రా తదితరులు ఒక నకిలీ పత్రాన్ని పట్టుకొని సామాజిక మాధ్యమంలో పెద్ద ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తీరా అది కాంగ్రెస్‌ తయారు చేసిన డాక్యుమెంట్‌ అనేందుకు ఆధారాలు లేవని, కాషాయ దళాల పనితనం అని తేలిపోయింది. కాంగ్రెస్‌ పోలీసు కేసు దాఖలు చేయటంతో పాటు అదే విషయాన్ని ట్విటర్‌ కంపెనీకి కూడా ఫిర్యాదు చేసింది. దాంతో సదరు సంస్ద సంబిత్‌ పాత్రా టూల్‌ కిట్‌ ట్వీట్‌కు ఇది ”తిమ్మిని బమ్మిని చేసిన మాధ్యమం ” (మానిప్యులేటెడ్‌ మీడియా) అని తానే ముద్రవేసి ప్రచారంలో పెట్టింది. దీనికి మోసపూరిత మాధ్యమం అనే అర్ధం కూడా ఉంది. ఈ సమాచారాన్ని చూసిన వారు గుడ్డిగా నమ్మవద్దు అనే సందేశం దీని వెనుక ఉంది. ఇంతకంటే బిజెపి నేతలకు మరొక అవమానం అవసరం లేదు. అయితే ఇది బిజెపి పెద్దలకు కొత్తేమీ కాదు. ప్రపంచ వ్యాపితంగా ఇలాంటి తప్పుడు వార్తలు, ఫొటోలను వ్యాప్తి చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఉన్నంతలో అనుసరించే వారిని అప్రమత్తం గావించేందుకు ట్విటర్‌ తీసుకున్న చర్య ఇది. ఫిర్యాదులు వచ్చినప్పటికీ వాటిని తొలగించకుండా అనుమానం వచ్చిన వాటికి 2020 మార్చి నెల నుంచి ఇలాంటి ముద్రలు వేయటం ప్రారంభించింది. మన దేశంలో తొలిసారిగా అలాంటి ఘనతను దక్కించుకున్న వ్యక్తి బిజెపి జాతీయ ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయగారు. రైతు ఉద్యమం సందర్భంగా ప్రచారం-వాస్తవం అనే పేరుతో ఉన్న ఒక వీడియోను ఆ పెద్ద మనిషి షేర్‌ చేసి దాన్ని ఆధారం చేసుకొని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మీద అనుచిత వ్యాఖ్య చేశారు. దాంతో ఆ ట్వీట్‌కు మోసపూరిత మాధ్యమం అని ట్విటర్‌ ముద్రవేసింది.


ఒకటి మాత్రం స్పష్టం, మోడీ సర్కార్‌ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో మీడియాలో సానుకూల కథనాలు ఎక్కువ వచ్చేట్లు చూడాలని సంఘపరివార్‌ అపరిమిత సానుకూలత అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ కూడా దాని కార్యకర్తే గనుక జనంలో సానుకూలత కోసం నటించారా లేదా నిజంగానే రోదించారా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ముందే చెప్పుకున్నట్లు జనానికి దగ్గరయ్యేందుకు నరేంద్రమోడీ చేసే ఉపన్యాసాలు, ప్రదర్శించే హావభావాలే ఇప్పుడు ఆయన నిజం చెప్పినా నమ్మని స్ధితిని కల్పిస్తున్నాయా ? ఎవరైనా ఊహించారా ! ఎంతలో ఎంత మార్పు !!

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ : అప్పుల చెల్లింపు ఎక్కువ – అభివృద్ది వ్యయం తక్కువ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కరోనా కారణంగా ఒక రోజులోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 2021-22 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. గత రెండు సంవత్సరాలుగా సంక్షేమ పధకాలు తప్ప అభివృద్దిని పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. అయినా ఏమాత్రం ఖాతరు చేయకుండా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మూడవ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది.ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రశంస మామూలుగానే కొనసాగింది. చంద్రబాబు నాయుడి సర్కార్‌ మాదిరి అంకెల గారడీ కొనసాగించింది. సంక్షేమ పధకాలకు ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి పధకాలకు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో జరిగేదేమిటో చెప్పనవసరం లేదు. ప్రతి ఏటా బడ్జెట్‌ మీద కొండంత రాగం తీసి ఏడాది చివరిలో కీచుగొంతుతో కోత పెట్టటం ఈ ఏడాది కూడా కొనసాగింది. నవరత్నాల భజన కొనసాగుతోంది. పాడిందే పాడరా అన్నట్లు వాటి గురించి ఎన్నిసార్లు చెబుతారు, మిగతా వాటి గురించి మాట్లాడరా అని జనం అనుకుంటున్నారు.


గత రెండు సంవత్సరాలలో వరుసగా 2,27,975 – 2,24,79 కోట్లు ఈ ఏడాది 2,29,779కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. తొలి బడ్జెట్‌ను 1,74,160, రెండవ దానిని 1,85,136 కోట్లుగా సవరించిన అంచనాను పేర్కొన్నారు. వాస్తవంలో ఇంకా తగ్గవచ్చు. ఇదే బాటలో తాజా బడ్జెట్‌కు సైతం కోత పెడతారని వేరే చెప్పనవసరం లేదు. ఎందుకీ గారడి, ఎవరిని తప్పుదారి పట్టించాలనుకుంటున్నారు ? గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసిన దానినే పునరావృతం చేస్తున్నారు, జనం ఏమన్నా అనుకుంటారని పాలకులు ఆలోచించరా ? చంద్రబాబు సర్కార్‌ దిగిపోయే ముందు ఏడాది లక్షా 91వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించి ఏడాది చివరికి వచ్చేసరికి లక్షా 62వేల కోట్లకు (29వేల కోట్లు) కుదించింది. జగన్‌ ప్రభుత్వ మూడవ బడ్జెట్‌లో గత సంవత్సరాలను అనుసరిస్తే ఏడాది చివరికి యాభైవేలు కోత పెట్టి ఏ లక్షా 80వేల కోట్లకో కుదిస్తారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయక గ్రాంట్లుగా 2019-20లో రాష్ట్రానికి వచ్చిన మొత్తం రు.21,876 కోట్లు, గత ఏడాది వస్తుందని బడ్జెట్‌లో చూపిన మొత్తం రు. 53,175 కోట్లు, సవరించిన అంచనా రు.32,934 కోట్లు. తిరిగి ఈ ఏడాది రు.57,930 కోట్లు వస్తుందని చూపారు. పారు బాకీలను కూడా బ్యాంకులు తమ ఖాతాలలో చూపుతున్నట్లు ఎందుకిలా చేస్తున్నారు ? రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వస్తాయో రావో అమీతుమీ తేల్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ అడుగుతున్న మొత్తం మేము ఇవ్వాల్సిన పనిలేదు అని కేంద్రం చెప్పదు, ఎటూ తేల్చరు-ఇవ్వరు ఏమిటీ నాటకం అని అడిగే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ?


రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా వచ్చిన అప్పు 97వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు ఏలుబడిలో అది 2018-19 నాటికి రెండులక్షల 57వేల 509 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది మార్చి నెల నాటికి రాష్ట్ర రుణభారం రు.3,01,802 కోట్లు. అది ఈ ఏడాది మార్చి నాటికి రు.3,55,939 కోట్లకు చేరింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 3,87,125 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. ఇది ప్రభుత్వం పేరుతో తీసుకుంటున్న అప్పు, ఇదిగాక ప్రభుత్వం హామీదారుగా ఉండి వివిధ సంస్దలకు ఇప్పించిన అప్పు మరో 91,330 కోట్లు ఉంది. ద్రవ్య సంబంధ స్వయం క్రమశిక్షణ నిబంధనలో (ఎఫ్‌ఆర్‌బిఎం) భాగంగా విధించుకున్న పరిమితి దాటలేదు అని చెప్పుకొనేందుకు రెండవ అప్పును ప్రభుత్వ ఖాతాలో చూపరు. ఇది గతంలో అన్ని ప్రభుత్వాలు చేశాయి.


చంద్రబాబు నాయుడి ఏలుబడి చివరి ఏడాదిలో కొత్త – పాత అప్పుల మొత్తం రాష్ట్ర స్ధూల ఆదాయం(జిఎస్‌డిపి)లో 28.02శాతం ఉండగా జగన్‌ తొలి ఏడాది దాన్ని 31.02శాతానికి, రెండవ సంవత్సరంలో 35.23( సవరించిన అంచనా)గా చూపారు. ఈ ఏడాది అది 40శాతానికి చేరినా ఆశ్చర్యం లేదు. అందువలన గత పాలకులను విమర్శించే నైతిక హక్కు వైసిపికి ఉందా ? అప్పుల మీద వడ్డీ -అసలు చెల్లింపు పెరుగుతోంది, అభివృద్ది వ్యయం తగ్గటం ఒక ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది. 2018-19లో స్ధిర ఆస్దుల కొనుగోలు, కల్పనకు గాను చేసిన ఖర్చు రు.19,976 కోట్లు, అదే ఏడాది తెచ్చిన అప్పుల మీద, అసలు-వడ్డీ చెల్లింపులకు చేసిన ఖర్చు రు.28,877 కోట్లు. 2019-20లో అది రు.12,845 – 35,428 కోట్లుగానూ 2020-21లో రు.18,797-34,318 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 50వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు చేయాలని సంకల్పించారు. వడ్డీ 23,205 కోట్లని అంచనా. ఏటా తెస్తున్న అప్పులో అధికభాగం వడ్డీ చెల్లింపులకే పోతున్నది. ప్రాధాన్యతా రంగాలకు కేటాయిస్తున్న మొత్తాలను చూస్తే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ రంగాలలో జాతీయ సగటు కంటే తక్కువ కేటాయిస్తున్నది.


రాష్ట్రంలో సేవారంగం తరువాత వ్యవసాయం ప్రధానంగా ఉంది. దీనికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం గురించి చెప్పనవసరం లేదు. ఈ రంగానికి పెట్టుబడి వ్యయంగా అన్ని రకాల ప్రాజెక్టులకు కలిపి 10,647 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం 3,860 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తిరిగి 11,587 కోట్లు కేటాయించారు. మొత్తం అన్ని రకాల పెట్టుబడి వ్యయ ఖాతాలో 29,907 కోట్లు కేటాయింపు చూపి ఖర్చు చేసింది 18,797 కోట్లు మాత్రమే. తిరిగి ఈ ఏడాది 31,198 కోట్లు చూపారు. కరోనా కారణంగా ప్రజారోగ్య విభాగంలో ఖర్చు పెంచాల్సి ఉన్నప్పటికీ ఐదు వందల కోట్లకు పైగా గతేడాది కోత విధించారు. గృహనిర్మాణానికి గతేడాది 4,600 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 2,030 కోట్లు మాత్రమే. షెడ్యూలు కులాలు, తరగతులు, ఇతర వెనుక బడిన కులాల సంక్షేమానికి గత బడ్జెట్‌లో కేటాయింపు 41,162 కోట్లు ఖర్చు 23,253 మాత్రమే. ఈ ఏడాది కేటాయింపే 27,401 కోట్లకు తగ్గించారు, ఖర్చు ఎంత ఉంటుందో తెలియదు.


తన పాలనా కాలంలో దశల వారీ మద్య నిషేధాన్ని అమలు జరుపుతానని వాగ్దానం చేసిన వైసిపి ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ లేవు. దానికి నిదర్శనం దాన్నొక ఆదాయ వనరుగా మార్చుకోవటమే. 2019-20 సంవత్సరంలో బీరు మీద వచ్చిన డ్యూటీ(పన్ను) 187 కోట్లు, అది 2020-21లో 351 కోట్లని అంచనా వేయగా 805 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది ఆ మొత్తం వెయ్యి కోట్లు దాటనుందని అంచనా. ఇక మొత్తం మద్యం మీద ఆదాయ పెరుగుదల ఎలా ఉందో చూడండి. 2019-20లో మొత్తం ఆదాయం 6,914 కోట్లు కాగా గత ఏడాది లక్ష్యం 7,931 కోట్లని చెప్పి 11,575 కోట్లకు పెంచారు. ఈ ఏడాది పదిహేనువేల కోట్ల రూపాయల లక్ష్యం నిర్ణయించారు.ఈ మొత్తాన్ని మద్యం అమ్మకాల పెంపుదల లేదా మరింతగా పన్నుల బాదుడుతో మాత్రమే రాబట్టుకోవటం సాధ్యం. ఇంత మొత్తం ఆదాయాన్ని వదులుకొని మద్య నిషేధం అమలు జరుపుతామని ఇప్పటికీ కబుర్లు చెబితే నమ్మే జనాలుంటే చేయగలిగిందేమీ లేదు.


పెట్రోలియం ఉత్పత్తులపై వసూలు చేస్తున్న వ్యాట్‌, సెస్సులు తక్కువేమీ కాదు. పెట్రోలు, డీజిలు మీద లీటరుకు నాలుగు రూపాయలు స్ధిర వ్యాట్‌ , ధరను బట్టి మారే వ్యాట్‌ మరొకటి ఉంది. స్ధిర వ్యాట్‌ ఖాతా కింద గత ఏడాది రు.1,243 కోట్లు వసూలు చేస్తే వర్తమాన సంవత్సరంలో ఆ మొత్తం 2,648 కోట్లని పేర్కొన్నారు. ఇక ధరల పెరుగుదలను బట్టి మారే వ్యాట్‌ మొత్తం గత ఏడాది రు.4,810 కోట్లయితే ఈ ఏడాది 11,042 కోట్లుగా అంచనా వేశారు. ఇదిగాక రోడ్డు సెస్‌ పేరుతో పెట్రోల, డీజిలు మీద వసూలు చేస్తున్న మొత్తం 245 నుంచి 662 కోట్లకు చేరనుంది. వీటన్నింటినీ కలుపుకుంటే గత ఏడాదితో పోలిస్తే వర్తమాన సంవత్సరంలో ఈ ఖాతాలో బాదుడు రు.6,298 కోట్ల నుంచి రు.14,352 కోట్లకు చేర నుంది.


ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక కార్మికుల వినియోగధరల సూచి కంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికుల ధరల సూచి ఎక్కువగా ఉన్నట్లు సామాజిక, ఆర్ధిక సర్వే తెలిపింది. దేశవ్యాపితంగా పారిశ్రామిక కార్మికుల ధరల సూచికలో పెరుగుదల 4.98శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది 6.03గాను, వ్యవసాయ కార్మికుల సూచి దేశంలో 5.51శాతం ఉంటే ఏపిలో 6.15శాతంగా నమోదైంది. పెద్ద ప్రచార అస్త్రంగా ఉన్న రైతు భరోసా పధకంలో ఏడాదికి రు.13,500 ఇస్తున్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరువేల రూపాయలు కూడా కలసి ఉన్నాయి. ఇందుకు గాను కేంద్రం ఇచ్చే దానితో సహా ఇస్తున్న రు. 2,966 కోట్లతో సహా మొత్తం రు.6,928 కోట్లు. రాష్ట్రంలో 2019-20 సంవత్సరంలో (కరోనా లేదు) మధ్య,చిన్న, సన్నకారు పరిశ్రమల రంగంలో రు.2,980 కోట్ల పెట్టుబడితో ఏర్పడిన సంస్ధలలో 76,716 మందికి ఉపాధి కలిగింది.2020-21లో 2,154 కోట్లతో 3,710 సంస్ధలలో 35,029 మందికి ఉపాధి దొరికినట్లు తెలిపారు. 2019-20లో భారీ మరియు మెగా ప్రాజెక్టుల తరగతిలో 44 పారిశ్రామిక ప్రాజెక్టులలో రు.22,282 కోట్లతో 18,385 మందికి ఉపాధి కల్పించగా 2020-21లో అవి పన్నెండుకు తగ్గిపోయి రు.3,656 కోట్లతో 8,114 మందికి ఉపాధి కల్పించినట్లు సామాజిక సర్వేలో పేర్కొన్నారు.


ఒక రోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తెలుగుదేశం సభ్యులు, వీడియో ద్వారా విడిగా సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అయితే రెండు పార్టీలూ అనుసరిస్తున్న విధానాలలో పెద్ద తేడా లేదు. సంక్షేమం పేరుతో ప్రజాకర్షక పధకాలకు పెద్ద పీట వేస్తున్నందున అభివృద్ది గురించి నువ్వు మూస్కో నేను మూస్కుంటా అన్నట్లుగా ఎవరూ మాట్లాడరు. రాష్ట్రంలోని మేథావులకు సైతం ఈ అంశం పెద్దగా పట్టినట్లు లేదు, ఎవరికైనా పడితే వారికి మీడియాలో చోటు దొరకదు. పోనీ మీడియా అయినా విమర్శనాత్మకంగా వ్యవహరిస్తుందా అదీ లేదు.

విశ్వగురువులో దిగంబర రాజును చూసిన కవయిత్రి పారుల్‌ ఖక్కర్‌ !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


హిట్లర్‌, రెండవ ప్రపంచ యుద్దంలో ఓటమి పాలై అవమానం భరించలేక ఆత్మ హత్యకు పాల్పడి దిక్కులేని చావు చచ్చి ప్రపంచమంతా ద్వేషించిన జర్మన్‌ నాజీ పాలకుడు.
నరేంద్రమోడీ, దేశ రాజకీయ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించి గద్దెనెక్కి ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఏలిక.
మార్టిన్‌ నియోములర్‌, లూథరన్‌ క్రైస్తవ పూజారి, తొలి రోజుల్లో హిట్లర్‌ అభిమాని-కమ్యూనిస్టు వ్యతిరేకి.హిట్లర్‌ నిజస్వరూపం తెలుసుకొని వ్యతిరేకించినందుకు జైలు పాలైన వారిలో ఒకడు.
పారుల్‌ ఖక్కర్‌, నరేంద్రమోడీ అభిమాని, భవిష్యత్‌లో గుజరాతీ కవులకు ప్రతీకగా మారతారని సంఘపరివార్‌ ప్రశంసలు పొందిన కవయిత్రి. మోడీ పాలనా తీరును భరించలేక కవిత రాసినందుకు అదే పరివార్‌ బూతులతో అవమానాల పాలైన బాధిత మహిళ.
తొలుత వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు….. అనే పదాలతో ప్రారంభించి నాజీల తీరు తెన్నులు- సమాజ స్పందనను వర్ణించి దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువాదమైన కవితను జైలు గోడల మధ్య రాసిన రచయిత నియోములర్‌. హిట్లర్‌ను బలపరిచినందుకు పశ్చాత్తాప పడుతూ భవిష్యత్‌ తరాలను హెచ్చరిస్తూ చేసిన రచన అది.
అన్ని దేశాలలో, భాషలలో చెప్పుకొనే దిగంబర రాజు కథలో రాజుకు బట్టలు లేవంటూ అమాయకత్వం తప్ప అభం శుభం తెలియని ఒక పిల్లవాడు నిజం చెబుతాడు. గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయాలతో సంబంధం లేని భక్తి గీతాలు, భావ కవితలు రాసే అలవాటున్న ఖక్కర్‌ నరేంద్రమోడీ పాలన తీరు తెన్నులు చూసి భరించలేని పసిపిల్ల మాదిరి ఆవేదనతో అల్లిన కవిత. ఇప్పుడు దేశవ్యాపితంగా అన్ని భాషల్లో అనువాదమై వైరల్‌ అవుతోంది.
హిట్లర్‌ అంతమైన తరువాత మార్టిన్‌ నిములర్‌ను మిత్రరాజ్యాల సేనలు జైలు నుంచి విముక్తి చేశాయి.
కవిత రాసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు పారుల్‌ను నోరుబట్టని బూతులతో బిజెపి సంస్కృ(తి)త పండితులు నిందిస్తున్నారు. వారు నిత్యం ప్రవచించే ఏకత, శీలము, సంస్కారానికి అర్ధం ఇదా అని జనం విస్తుపోతున్నారు.


తన కవిత మీద తీవ్ర దుమారం, బెదిరింపులు, దూషణలు వెల్లడైనప్పటికీ తన రచనను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదని తానెలాంటి తప్పు చేయలేదని పారుల్‌ ఖక్కర్‌ చెప్పారు. నరేంద్రమోడీని ఆయన అంతరంగం అమిత్‌ షాను విమర్శించిన వారికి ఏ గతి పడుతుందో తెలియనంత ఎడారిలో, అడవిలో ఆమె లేరు. అందుకే ఒకే ఒక్కడు అన్నట్లుగా గుజరాత్‌లో మోడీని తప్పు పట్టిన ఆమెను ఒకే ఒక్కతె అనవచ్చు. కేవలం పద్నాలుగు పంక్తుల కవితతో విశ్వగురువు పీఠాన్ని, పరివారాన్ని గడగడలాడించిన ఆ రచనలోని ఆవేదనను అర్ధం చేసుకొని మరింతగా ప్రచారంలోకి తేవటమే ఆమెకు మనమిచ్చే ఘనమైన గౌరవం. మే పదకొండవ తేదీ వరకు కేవలం గుజరాత్‌కే తెలిసిన ఆమె నేడు దేశ వ్యాపితంగా ప్రాచుర్యం పొందారు. అన్నింటికీ మించి హమ్మయ్య చివరికి గుజరాత్‌లో కూడా స్పందించే వారు ఉన్నారంటూ అనేక మందికి ప్రాణం లేచి వచ్చేట్లు చేశారు.


ఎందరో పేరు ప్రఖ్యాతులున్న కవులు, కవయిత్రులు ఉన్నారు. కరోనాతో నిమిత్తం లేకుండానే గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో ఉన్న భావ ప్రకటన స్వేచ్చ పరి(దు)స్ధితిని చూసి మన కెందుకులే అని కలాలను, గళాలను మూసుకున్నవారే ఎక్కువ. ఆరోగ్యానికి హానికరం అని తెలిసీ దురలవాట్లను మానుకోని వారి మాదిరి వారంతా చెవులు కొరికే లక్షణంతో బాధపడుతున్నారన్నది స్పష్టం. గుడ్డికన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే. ఎక్కడైనా ఒకటో అరా విమర్శనాత్మక రచన చేసినా, గళం విప్పినా, శిరమెత్తినా వాటికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పుంఖాను పుంఖాలుగా వెలువడుతున్న బూతు పురాణాలను చూసి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఖక్కర్‌ కవితకు గుజరాత్‌లోని ప్రముఖ కవులు, కళాకారుల నుంచి మద్దతు రాలేదు. అయితే గుజారాతీ లేఖక్‌ మండల్‌ అనే సంస్ధ మాత్రం మద్దతు ప్రకటించింది. ఆమెను నిందించే బిజెపి మరుగుజ్జులను ఖండించింది.

గుజరాతీ రచయిత్రి, సినిమా దర్శకురాలు మెహుల్‌ దేవకళ పారుల్‌ ఖక్కర్‌ గురించి, తన అనుభవాన్ని వివరిస్తూ రాసిన వ్యాసాన్ని కొన్ని ఆంగ్ల మీడియా సంస్ధలు ప్రచురించాయి. దాని సారం ఇలా ఉంది. ” నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత తొలిసారిగా ఆయన మాతృభాష గుజరాతీలో మోడీని విమర్శించటమే గాక కరోనా రెండవ తరంగం గురించి సామాన్యుల ఆవేదనను వ్యక్త పరిచిన కవిత బహుశా ఇదేనేమో. శవవాహిని గంగ పేరుతో రాసిన కవిత దావాలనంలా వ్యాపించింది, గుజరాతీ సాహిత్యకారులు మొద్దుబారి పోయారు, ఎలా స్పందించకూడదో వారికి తెలుసు. అయితే సాహిత్యంతో పనిలేని సామాన్య గుజరాతీలు ఆ కవితలో తమ మనోభావాలు ప్రతిబింబించినట్లు భావించారు. విస్కృతంగా పంచుకున్నారు.యాభై ఒక్క సంవత్సరాల ఖక్కర్‌ భావ గీతాల కవయిత్రిగా పరిచయం. అమె గతంలో రాజకీయ అంశాలను సృజించలేదు.వివాహమై, పిల్లలు పుట్టి స్ధిరపడిన తరువాత ఆలస్యంగా అమె సాహితీ ప్రయాణం ప్రారంభించారు.త్వరలోనే సాహితీ బృందాలలో ఒక స్ధానం సంపాదించుకున్నారు. గృహిణిగానే ఉన్న ఆమెతో కలసి నేను అనేక సాహితీ సమావేశాలలో కవితా గానాలు చేశాను. ఆమె రాసిన తాజా కవిత మితవాద శక్తులకు పిడుగు పాటు వంటిది.ఆమె ఎన్నడూ ప్రభుత్వ వ్యతిరేకిగా లేరు, అలాంటి కవితలు ఆమె రాస్తారని అనుకోరు. అయితే ఆమె చుట్టూ ఉన్న పరిస్ధితులు, ప్రభుత్వ ఘోరవైఫల్యం ఆమెను అందుకు పురికొల్పాయి.నేను ఫోనులో మాట్లాడి ఫేస్‌బుక్‌ నుంచి కవితను తొలగించనందుకు ఆమెను అభినందించినపుడు నేనెందుకు దాన్ని తొలగించాలి, నేను చెప్పినదానిలో తప్పేముంది అంటూ సన్నగా నవ్వుతూనే ధృడంగా చెప్పారు.


ఆమెను దీర్ఘకాలంగా అభిమానిస్తున్నవారు ముఖం చాటేశారు, దూరం జరిగారు.తరువాత ఖక్కర్‌కు ఏమి జరుగుతుందో నేను చెప్పగలను. దేశంలో అసహన సంస్కృతి పెరుగుతున్న నేపధ్యంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఒక లేఖ రాయాలని 2015 అక్టోబరులో నేను నిర్ణయించుకున్నాను. గుజరాత్‌లోని అనేక మంది ప్రముఖ సాహితీ వేత్తలు, కళాకారులను కలసి దాని మీద సంతకం చేయాలని కోరాను.నైతికంగా మద్దతు తెలిపారు తప్ప సంతకాలు చేసేందుకు తిరస్కరించారు. నిజం చెబితే వచ్చే ముప్పును స్వీకరించేందుకు సిద్దపడలేదు. భయంతో గుసగులాడుకోవటాన్ని అలవాటు చేసుకున్నారు. నా లేఖపై సంతకాలు చేయని గుజరాతీ సాహిత్యకారుల గురించి మొద్దుబారిపోయారని ఒక జాతీయ పత్రిక మొదటి పేజీలో వ్యాఖ్యానించింది. ఆ లేఖ తరువాత సాహితీ సమావేశాల్లో , అవార్డులకు సిఫార్సుల్లో నా పేరును తొలగించారు. ఖక్కర్‌ కవిత తరువాత ప్రభుత్వ అనుకూల యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒక ప్రముఖ మహిళా కాలమిస్టు తన వ్యాసం మొత్తాన్ని ఖక్కర్‌కు కేటాయించి కవిత ఉద్ధేశ్యాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించటం ఒక ఫాషనై పోయింది అని ఆగ్రహించారు. కొందరు బిల్లా -రంగా, ఫిడేలు వంటి పదాలను ఉపయోగించటం ఏమిటని ప్రశ్నించారు. మరికొందరు కవితాత్మకంగా సమాధానాలిచ్చారు. మరొక రచయిత ఎవరూ ఖక్కర్‌ను అనుసరించి అలాంటి విమర్శనాత్మక కవితలు రాయకూడదన్నది వారి స్పష్టమైన ఉద్దేశ్యం. అనేక మంది రచయితలు, వ్యాసకర్తలు సామాజిక మాధ్యమంలో ప్రభుత్వానికి అనుకూలం వాదనలతో రంగంలోకి దిగారు. ఎక్కువ మంది గుజరాతీ కవులు మౌనం దాల్చారు.నేను సామాజిక మాధ్యమంలో రాసిన వాటిని చూసి వెనక్కు తగ్గమని తోటి గుజరాతీ రచయితలు నాకు ఫోన్లు చేస్తున్నారు. ఖక్కర్‌ పేరు వినని వారు కూడా ఆమె కవితకు మద్దతు ఇస్తున్నారు. అది ఇప్పుడు భాషా సరిహద్దులు దాటిపోయింది. చివరికి రచయిత్రితో సహా ఎవరూ కూడా దాని ప్రయాణాన్ని ఆపలేరు.” అని దేవకళ పేర్కొన్నారు.


1973-74లో గుజరాత్‌లో నవనిర్మాణ ఆందోళన పేరుతో ఏర్పడిన సంస్ధ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ముఖ్యమంత్రి చిమన్‌భారు పటేల్‌ ఉద్వాసనకు కారణమైంది. ఆ సంస్ద అధ్యక్షుడిగా పని చేసిన మానిషీ జానీ ప్రస్తుతం గుజరాతీ లేఖక్‌ మండల్‌ అధ్యక్షుడిగా ఒక ప్రకటన చేస్తూ ఈ కవితను పూర్తిగా సమర్ధించిన వారిలో ఉన్నారు. బిజెపి నిందా ప్రచారాన్ని ఖండించారు. సంస్ధ కార్యదర్శి మన్‌హర్‌ ఓజా కూడా సమర్ధించటమే గాక సామాజిక మాధ్యమంలో ప్రతి భారతీయుడు ఆమెకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.


తన కవిత వైరల్‌ అవుతున్న సమయంలో ఒక గృహిణిగా ఖక్కర్‌ ఇల్లు తుడుస్తూ లేదా చపాతీలు చేస్తూ ఉండి ఉంటుందని ఆమె బంధువు ఒకరు ది వైర్‌ పోర్టల్‌తో చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె భర్త ఒక బ్యాంకు ఉద్యోగి.తన భార్య కవితల పట్ల ఆయన గర్వపడతారు. అనేక మంది యువతుల మాదిరి కళాశాలలో చదువుతూ డిగ్రీ రెండవ సంవత్సరంలో మానివేసి వివాహం చేసుకొని గృహిణిగా స్ధిరపడ్డారు. అయితే ఆమెకు స్కూలు దశలోనే రాయటంపై మక్కువ ఏర్పడింది. పదవతరగతిలో ఉండగా 1984లో తొలి కవిత రాశారు. ఇందిరా గాంధీ మరణం, ఆమె వ్యక్తిత్వం గురించి దానిలో పేర్కొన్నారు. అయితే వివాహం తరువాత కవితలు రాయటం నిలిపివేశారు. 2011లో కుమారుడు ఆమెకు ఇంటర్నెట్‌ను, సామాజిక మాధ్యమాన్ని పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆమెలోని కవయిత్రి మేలుకున్నది. గజల్స్‌ ఇతర కవితలు రాసింది.తాను ఆధ్యాత్మికవాదినని, కవిత్వం తన జీవితానికి నిశ్శబ్దంగా మద్దతు ఇస్తుందని, కవితలంటే ఇష్టమని తన గురించి రాసుకున్నారు. ఆమె రాసిన అనేక భక్తి గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. విష్ణు పాండ్య అనే రాజకీయ చరిత్రకారుడు ఆర్‌ఎస్‌ఎస్‌ గుజరాతీ పత్రిక సాధనలో పని చేసేవ్యక్తి. నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాత పాండ్యకు పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది. పారుల్‌ ఖక్కర్‌ భవిష్యత్‌లో గుజరాతీ కవితకు పెద్ద ప్రతీకగా ఎదుగుతారని వర్ణించారు. శవగంగ పేరుతో కవిత రాసిన తరువాత బిజెపి మరుగుజ్జులు ఆమె పరిణితిలేనిది, హిందూ వ్యతిరేకి, నైతిక విలువలు లేనిది, బజారు మనిషి అంటూ బూతులు తిడుతూ పోస్టులు పెడుతుంటే ఆమెను అంతగా పొగిడిన ఆ పెద్దమనిషి ఖక్కర్‌ రక్షణకు రాలేదు. రాజకీయంగా ఆమె కుటుంబం బిజెపికి మద్దతు ఇస్తుంది, ఎప్పుడూ ఆ పార్టీని వ్యతిరేకించలేదు. ఖక్కర్‌ కవితను ఆమె ఫేస్‌బుక్‌ నుంచి తొలగించారని బిజెపి వారు ప్రచారం చేశారు. అయితే వారి దాడి నుంచి తట్టుకొనేందుకు తన ఫేస్‌బుక్‌కు తాళం వేశారు తప్ప కవితను తొలగించలేదు. ఆమె ఖాతాలోని స్నేహితులు తప్ప బయటి వారు చూడలేరు.


ప్రధాన స్రవంతి మీడియా గంగలో కొట్టుకు వస్తున్న శవాల గురించి అనివార్యమై పోటీ కారణంగా వార్తలు, చిత్రాలను ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది తప్ప వాటి మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి పారుల్‌ ఖక్కర్‌ కూడా రాజకీయ కోణంతో రాయలేదు. ఒక హిందువుగా గంగానదిని పవిత్రమైనదిగా భావించే కోవకు చెందిన సామాన్యురాలు ఆమె. కొట్టుకు వస్తున్న శవాల వార్తలు, వాటిని కుక్కలు పీక్కు తింటున్న దృశ్యాలను చూసిన తరువాత అలాంటి పవిత్ర భావనలను కుదిపివేయటంతో తట్టుకోలేక వెల్లడించిన స్పందన తప్ప మరొకటి కాదు. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కాదు గానీ దిగంబర రాజు, బిల్లా-రంగా వంటి పదాలను వాడినందుకు మోడీ భక్తులు ఆమె మీద దాడిచేస్తున్నారంటూ సమర్ధించేవారు వారు తయారయ్యారు.


ప్రభుత్వాన్ని విమర్శించిన వారి మీద వత్తిడి ఎలా ఉంటుందో అవుట్‌లుక్‌ పత్రిక ఉదంతమే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం కనిపించటం లేదు, కనుగొని చెప్పండి అంటూ తయారు చేసిన ముఖపత్రాన్ని ఆన్‌లైన్‌ నుంచి తొలగించింది. ఎందుకంటే ప్రచారం కోసం పెట్టాము, దాని పని అయిపోయింది కనుక తొలగించాం తప్ప ముద్రణలో పేజీ తొలగించలేదని వివరణ ఇచ్చింది. దీని వెనుక సదరు పత్రిక యాజమాన్యం రహేజా గ్రూప్‌పై కేంద్ర ప్రభుత్వ పెద్దల వత్తిడి అని వేరే చెప్పనవసరం లేదు.ముఖ చిత్రం గురించి ప్రపంచ వ్యాపితంగా తెలిసిపోయింది. అందువలన కొత్త ముఖచిత్రంతో పత్రిక ముద్రణ జరిగితే అది నరేంద్రమోడీ సర్కార్‌కు మరింత నష్టదాయకం. కరోనా సమయంలో దుకాణాల్లో పత్రిక కొనేవారి కంటే ఆన్‌లైన్లో చూసే వారు గణనీయంగా ఉంటారు. కనుక ఉన్నంతలో ప్రచారం, చర్చను నిలువరించేందుకు ఇలా చేశారన్నది స్పష్టం.

ప‌రుల్ క‌క్క‌ర్ (గుజ‌రాతీ క‌వ‌యిత్రి) శవవాహిని గంగ

అనువాదం : రాఘ‌వ‌శ‌ర్మ‌

భ‌య‌ప‌డ‌కు..ఆనంద‌ప‌డిపో..

ఒకే గొంతుతో శ‌వాలు మాట్లాడుతాయి

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వాలు గంగాన‌దిలో ప్ర‌వ‌హించ‌డం చూశాం

ఓ రాజా..అడ‌వి అంతా బూడిద‌య్యింది,ఆన‌వాళ్ళు లేవు, అంతా శ్మ‌శాన‌మైపోయింది,

ఓ రాజా..బ‌తికించే వాళ్ళు లేరు,

శ‌వాల‌ను మోసేవాళ్ళూ క‌నిపించ‌డం లేదు,

ధుఃఖితులు మాత్రం మిగిలారు.

అంతా కోల్పోయి మిగిలాం

మాట‌లు లేక‌ బ‌రువెక్కిన మా హృద‌యాలు శోక‌గీతాలైనాయి

ప్ర‌తి ఇంటిలో మృత్యుదేవ‌త ఎగిసిప‌డుతూ తాండ‌వ‌మాడుతోంది

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వ‌ గంగా ప్ర‌వాహ‌మైంది

ఓ రాజా..క‌రిగిపోతున్న పొగ‌గొట్టాలు క‌దిలిపోతున్నాయి, వైర‌స్ మ‌మ్మ‌ల్ని క‌బ‌ళించేస్తోంది

ఓ రాజా.. మా గాజులు ప‌గిలిపోయాయి, భార‌మైన మా హృద‌యాలు ముక్క‌ల‌య్యాయి

అత‌ను ఫిడేలు వాయిస్తున్న‌ప్పుడు మా న‌గ‌రం కాలిపోతోంది

బిల్లా రంగాల బ‌రిసెలు ర‌క్త‌ద‌ప్పిక గొన్నాయి

ఓ రాజా..నీ రామ రాజ్యంలో శ‌వ‌ గంగా ప్ర‌వాహ‌మైంది

ఓ రాజా..నీవు మెరిసిపోతున్న‌ట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు త‌ళుక్కుమ‌న‌డం లేదు

ఓ రాజా..ఈ న‌గ‌రమంతా చివ‌రిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి

ఇక‌ ప‌రిమితులు, మిన‌హాయింపులు లేవు నీ ద‌మ్ము చూపించు,

రా..బయిటికి రా.. గ‌ట్టిగా చెప్పు, పెద్ద‌గా అరువు,

దిగంబ‌ర రాజు అవిటివాడు, బ‌ల‌హీనుడు

ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండ‌లేన‌ని చెప్పు

కోపంతో ఊగిపోతున్న న‌గ‌రం మంట‌లు ఎగిసిప‌డుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి

,ఓ రాజా.. నీ రామ‌రాజ్యంలో శ‌వ‌గంగా ప్ర‌వాహాన్ని చూశావా?