నరేంద్రమోడీ గడ్డం దీక్ష వికటించి రెండవ దశలో కరోనా రెచ్చిపోతోందా ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు కరోనా వైరస్‌ మన దేశ పౌరుల మీద యుద్దం చేస్తోంది. దాన్ని ఎదుర్కోవాల్సింది కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలే . రాష్ట్రాలకు (రాజకీయ ) మార్గదర్శనం (కాదు) చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఆ పని చేయటంలో విఫలమైన ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చే సంఘపరివార్‌, పాలకులకూ-పరివార్‌ కొమ్ముకాస్తున్న ప్రధాన స్రవంతి మీడియా (జనం ఏదని భావిస్తే అది ) మరోవైపు తీవ్ర ప్రచార యుద్దం ప్రారంభించింది. సామాజిక మాధ్యమంలో దాడి సంగతి సరేసరి ! స్వయంగా గోబెల్స్‌ స్వర్గం నుంచి రంగంలోకి ( దాని మీద నమ్మకం ఉన్న వారి మనోభావాల ప్రకారం) దిగి పర్యవేక్షిస్తున్నాడా ? ఇప్పటికే వాట్సప్‌ విశ్వవిద్యాలయ పండితులు వండి వారుస్తున్న సరకుతో రాబోయే రోజుల్లో మరింతగా జనం మెదళ్లను నింపబోతున్నారు. వాటిలో ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. దానిలోని కొన్ని అంశాల మంచి చెడ్డలను చూద్దాం ! ఇలాంటి అంశాల మీద జనంలో అనుమానాలు తలెత్తటం ప్రారంభమైంది. దాంతో తమ పోస్టులోని అంశాలు సాధికారికంగా చెబుతున్నట్లు నమ్మించేందుకు కొన్ని పత్రికలలో వచ్చిన వార్తల లింకులను కూడా దీనికి జతచేశారు.

మెదళ్లతో వేస్తున్న ప్రశ్నలేనా ?

” కోవిడ్‌ -2 వేవ్‌ ఒక ప్లానెడ్‌ బయోలాజికల్‌ యుద్ధం ? భారత ఉపఖండం మొత్తం మీద ఒక్క భారత్‌ లోనే ఇలా ఎందుకు అవుతున్నది ? బంగ్లాదేశ్‌ , పాకిస్థాన్‌, నేపాల్‌ , శ్రీలంక, భూటాన్‌ దేశాలలో ఎందుకు లేదు ? అంటే భారత్‌ ప్రజలు మిగతా ఉపఖండ దేశాల ప్రజల కంటే క్రమశిక్షణ లేని వారా ? అమెరికా ,చైనా లు కలిసి ఎకానమీ,ఫార్మా రంగాలని కాపాడుకోవడానికే ఇదంతా చేశారా ? ”
పధకం ప్రకారం జరుపుతున్న బయలాజికల్‌ యుద్దం అదీ చైనా మీద చేస్తున్న ఆరోపణ రోత పుట్టించే పాచిపాటే. పధకం ప్రకారం జరుగుతున్నదనుకుంటే మోడీ సర్కార్‌ నిఘా యంత్రాంగం, అసలు సిసలు జేమ్స్‌ బాండ్‌ అని చెబుతున్న అజిత్‌ దోవల్‌ ఏమి చేస్తున్నట్లు ? అధికారికంగా ప్రభుత్వం ప్రకటించి ఎందుకు జనాన్ని అప్రమత్తం చేయలేదు. మిగతా దేశాలకు రానందుకు సంతోషించాల్సింది పోయి ఎందుకు రాలేదు అని ప్రశ్నించేవారి మానసిక స్ధితి ఏమిటి ? పైన పేర్కొన్న దేశాల్లోనే కాదు ఇంకా అనేక దేశాల్లో రాలేదు. అలా ఎందుకు జరిగిందో చూసి ఇక్కడ కూడా నివారించాలని కోరకుండా ఫలానా చోట ఎందుకు రాలేదు అనే వారు మెదడుతోనా మరోదానితో ప్రశ్నిస్తున్నట్లా ? భారత ప్రజలు క్రమశిక్షణ లేని వారని ఎవరన్నారు ! వారిలో కొందరికి లేదు మచ్చుకు గోమాంసం, గోసంరక్షణ పేరుతో మైనారిటీల మీద దాడి చేసే వారు, వాలెంటైన్స్‌ డే రోజున పార్కుల వెంట తిరిగే బాపతు, మసీదులు, దేవాలయాల్లో, సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రచారాలు, కుట్రలు చేసే సకల కళా పారంగతులు, కాశ్మీరులో మాదిరి అత్యాచారం చేసిన వారికి మద్దతుగా ప్రదర్శనలు చేసిన రాజకీయ పార్టీలు, లాయర్ల వంటి వారు, వారికి మద్దతు ఇచ్చే పెద్దలు క్రమశిక్షణ లేనివారు తప్ప వాటితో నిమిత్తం లేని సామాన్య జనం క్రమశిక్షణ లేని వారని ఎలా అంటాం ? చైనా మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్దం గురించి తెలిసి కూడా తెలియనట్లు నటించే వారు మాత్రమే ఆ రెండు దేశాలూ కలసి ఆర్ధిక, ఔషధ రంగాలను కాపాడుకోవాలని చేశాయని చెప్పగలరు. బుర్రతక్కువ ప్రచారం గాకపోతే రెండూ కలిస్తే అమెరికాలో కరోనా ఎందుకు పుచ్చిపోతుంది, చైనాలో అదుపులోకి వచ్చి ఆర్ధికరంగం ఎందుకు పురోగమిస్తోంది. ఇలాంటి అంశాలను ముందుకు తెస్తున్న వారు జనాలకు మెదళ్లు లేవన్న జనం అంటే గౌరవం లేని వారే అని ఎందుకు అనుకోగూడదు ?

దీన్నే ఎదురు దాడి అంటారు !

” డొనాల్డ్‌ ట్రంఫ్‌ లాగా మోడీ గ్లోబల్‌ ఆయుధ, ఫార్మా,ఆయిల్‌ లాబీలకి లొంగకుండా ముందుకు వెళ్తునందుకె ఇదంతా జరుగుతున్నదా ? ”
నరేంద్రమోడీ మహానుభావుడు లొంగలేదని ఎలా చెబుతారు. అమెరికా ఆదేశిస్తే జీ సార్‌ అంటూ చేతులు కట్టుకొని ఇరాన్‌ నుంచి చమురు కొనటం మాని అమెరికా దగ్గర కొంటున్నారు. అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలు సరేసరి. సర్వం అర్పించుకుంటాం అన్నట్లుగా తయారైన కారణంగానే మోడీ రాక ముందు పాకిస్ధాన్‌తో లాహిరి లాహిరిలో అన్నట్లున్న అమెరికా ఇప్పుడు దాన్ని తెరచాటుకు పంపి మన దేశంతో సయ్యాటలాడుతోంది. చతుష్టయం పేరుతో మనలకు ముగ్గులాగిందా లేదా ? అది లొంగుబాటు కాదా ! నూట ముప్పయి కోట్ల జనాభాకు వాక్సిన్‌ వేయాలంటే రెండు కంపెనీలకే ఎందుకు అనుమతి ఇచ్చారు ? ఏ లాబీ దీని వెనుక ఉంది. అత్యవసర వినియోగానికి ఆ రెండింటికీ అనుమతి ఇచ్చినట్లుగానే ఇతర వాక్సిన్లకు అనుమతి ఇవ్వకపోవటం సకాలంలో వాక్సిన్లు వేయకుండా జనాలను చావుదాకా నెట్టటం వెనుక ఫార్మా లాబీ హస్తం లేదా, దానికి మోడీ సర్కార్‌ తలొగ్గలేదా ? నరేంద్రమోడీ సర్కార్‌ మూడు వేల కోట్ల రూపాయలు సీరం సంస్ధకు ఎలాంటి హామీలు లేకుండా ఇస్తే ఆ సొమ్ముతో బ్రిటన్‌లో తయారీ కేంద్రం పెడుతున్నట్లు అదర్‌పూనావాలా ప్రకటించిన విషయం తెలియదా ? దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరించటం అంటే ! నిజానికి మోడీకి విదేశీ ఫార్మాలాబీని దెబ్బతీయాలంటే 56 అంగుళాల ఛాతీ ఉంటే రెమిడెసివిర్‌, వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సులు ఇచ్చి మన దేశంలో చౌకధరలకు ఎందుకు తయారు చేయించరు ? ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించి ఫార్మారంగం మీద నియంత్రణ ఎందుకు పెట్టరు ? అమెరికా నుంచి చమురుకొనుగోలు నిలిపివేసి తిరిగి ఇరాన్‌ నుంచి ఎందుకు కొనుగోలు చేయరు ? జనాలకు ఎల్లకాలం చెవుల్లో పూలు పెట్టలేరు !

డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఇంత సానుభూతి, ప్రేమ ఎందుకు ?

” ముందు డొనాల్డ్‌ ట్రంఫ్‌ ఓటమి వెనక ఉన్న వాస్తవాలు ఏమిటో చూద్దాము. నాటో దేశాల రక్షణ అమెరికా బాధ్యత కాదు అన్నాడు అంటే నాటో దేశాల కంటే నాటో కూటమిలో ఉన్న అమెరికా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నది. యూరోప్‌ అంతటా మిలటరీ బేస్‌ లు పెట్టి అమెరికన్‌ సైనికులని అక్కడ మోహరించి ఉంచడం చాలా ఖర్చుతో కూడుకొని ఉంది. అందుకే నాటో కూటమి నుండి అమెరికా వైదొలుగుతుంది అని చెప్పేశాడు మళ్ళీ అధికారం లోకి వస్తే ఆ పని చేసేవాడు ఇది అమెరికన్‌ ఆయుధ లాబీ కి అస్సలు నచ్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక చోట ఉద్రిక్తతలు ఉండాలి అక్కడ అమెరికా సైన్యం వెళ్ళాలి ఆయుధాలు అమ్ముడుపోవాలి కానీ ట్రంఫ్‌ ఉంటే ఇవన్నీ జరగవు. ”
ఇదొక బుర్ర తక్కువ వాదన. ఐరోపా దేశాలను బెదిరించేందుకు, వారి నుంచి డబ్బు గుంజేందుకు, ఉపయోగించే అవసరం లేకపోయినా ఆయుధాలు కొనిపించేందుకు నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ చెప్పాడు తప్ప మరొకటి కాదు. నాటో నుంచి వైదొలుగుతాం అన్న ట్రంప్‌ ఆసియాలో దక్షిణ చైనా సముద్రంలో చిచ్చు పెట్టేందుకు ఆసియా నాటో అని పిలుస్తున్న చతుష్టయం(క్వాడ్‌)లో జపాన్‌, ఆస్ట్రేలియాలతో పాటు మన జుట్టుకూడా ముడివేసింది వాస్తవం కాదా ? నాటో నుంచి వైదొలిగే వాడికి ఇక్కడ ఈ కూటమి ఎందుకు అని నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించలేకపోయినట్లు ? మన దేశం ఆయుధాలు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నది ట్రంప్‌ హయాంలోనే కదా ?
” ఇక బ్లాక్స్‌ ఓన్లీ లివ్‌ (బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌ )నినాదం తో ట్రంఫ్‌ మీద విపరీతమయిన దుష్ప్రచారం చేశారు. ప్రతి ఒక పోలీసుని ఏ దేశ ప్రధాని కావచ్చు లేదా అధ్యక్షుడు కానీ నీయంత్రించ లేరు కానీ అది ట్రంఫ్‌కి అంటగట్టారు విజయవంతంగా ! అప్పటికి నల్లజాతి వాళ్ళ మీద అదే మొదటి దాడి జరిగినది అనే విధంగా ! ఆయుధ లాబీ పాచిక పారింది. ట్రంఫ్‌ ఓటమికి ఏవైతొ శక్తులు వెనక ఉండి ప్లాన్‌ చేసాయో అవే ఇప్పుడు మోడీ మీద ప్రయోగిస్తున్నాయి. ”
బోడి గుండుకూ మోకాలికి ముడి పెట్టటం అంటే ఇదే ! నల్జజాతీయుల జీవిత సమస్య (బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌ ) అనేది 2013లో ప్రారంభమైన ఒక సామాజిక మాధ్యమ, సామాజిక, రాజకీయ ఉద్యమం. అప్పటికే వారి మీద జరుగుతున్నదాడుల తీవ్రతతో అది ఉనికిలోకి వచ్చింది. ట్రంప్‌ హయాంలో నల్లజాతి, ఆసియా, ఇతర రంగుజాతి వ్యతిరేక చర్యలు పెచ్చుమీరాయి. అందువలన ఎన్నికల ప్రచారంలో అది ఒక సమస్యగాకుండా ఎలా ఉంటుంది. రిపబ్లికన్‌ పార్టీ ట్రంప్‌ పుట్టక ముందే పుట్టింది, అది శ్వేత జాతి దురహంకార పార్టీ అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్‌ ఎంత వదరుబోతో, ఎంత అబద్దాలకోరో అక్కడి మీడియా లెక్కలు వేసి మరీ చూపింది.ట్రంప్‌ నల్లజాతి విద్వేషి అయితే మోడీ ముస్లిం, క్రైస్తవ మతాల మీద నిరంతరం విద్వేషం, దాడులకు పాల్పడే శక్తులకు కాపు కాస్తున్న పెద్దమనిషి. అందుకే ఒక దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకో కూడదన్న విధానాన్ని పక్కన పెట్టి మన నరేంద్రమోడీ అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని అమెరికా వెళ్లి కౌగిలింతలతో మరీ పిలుపునిచ్చి వచ్చారు. ఒకటి మాత్రం స్పష్టం. కరోనా నిర్లక్ష్యం చేసి లక్షలాది మందిని చంపి జనాగ్రహానికి గురైన ట్రంప్‌ మీద ఎంత సానుభూతి ! ఎంత గాఢమైన అనురాగం. దీనికి కారణం లేకపోలేదు. ట్రంప్‌ నల్లజాతి వ్యతిరేకి – నరేంద్రమోడీ మైనారిటీల వ్యతిరేకి. అందుకే ఇద్దరికీ రాగి-బంగారం మాదిరి కలిసింది. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ కూడా కరోనాను నిర్లక్ష్యం చేసి చివరికి ఆక్సిజన్‌ కూడా అందించలేకపోతోంది. అందువలన అవకాశం వచ్చినపుడు జనం ట్రంప్‌కు చేసిన సత్కారాన్ని మోడీ లేదా ఆయన పార్టీకి చేస్తారు !

ఈ ”చావు ” తెలివితేటలే కొంప ముంచుతున్నాయి !

” కోవిడ్‌ మొదటి దశ ని విజయవంతంగా దాటడం అనేది భారత దేశ చరిత్రలో అతి పెద్ద విజయం. గత 2020 జనవరి నెలలో వెస్ట్‌ దేశాలు జోస్యం చెప్పింది ఏమిటంటే భారత్‌ లో హీన పక్షం వొ రెండు కోట్ల మంది కోవిడ్‌ వల్ల చనిపోతారు కానీ వాళ్ళు జోస్యం నిజం కాలేదు సరికదా మరణాల సంఖ్య రెండు లక్షల లోపే జరిగినది. పైగా హైడ్రాక్లోరో క్వీన్‌ ని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయగలిగింది. నిజానికి 2020 లో ఇదే సమయానికి అమెరికా,యూరోపు తో సహా మిగతా ప్రపంచదేశాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి కానీ భారత్‌ మాత్రం పెద్దగా నష్టం లేకుండానే బయటపడగలింది. చివరకి చైనా తొత్తు అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు కూడా భారత్‌ ని చూసి మిగతా దేశాలు నేర్చుకోవాలి కోవిడ్‌ ని ఎలా ఎదుర్కోవాలో అంటూ ఒక ప్రకటన చేశాడు గతి లేక. ”
ఈ చావు తెలివితేటలు, విజయగానాలే దేశాన్ని ఇప్పుడీ దుస్తితికి తెచ్చాయి. స్పానిష్‌ ప్లూ మహమ్మారి అనుభవంతో భారత్‌ వంటి పెద్ద దేశంలో విస్తరిస్తే మరణాలు ఎక్కువ ఉంటాయని ఎవరైనా అంచనా వేస్తే వేసి ఉండవచ్చు గానీ ప్రపంచ ఆరోగ్య సంస్ద అలాంటి జోశ్యాలు చెప్పలేదు. రెండవ దశ కరోనా గురించి నిర్లక్ష్యానికి నరేంద్రమోడీని బోనులో నిలబెడుతుండటంతో దానికి సమాధానం చెప్పలేక విజయగానాల గురించి మొదలు పెట్టారు. జ్యోతిష్కులు చెప్పిన సొల్లు కబుర్ల మీద ఉన్న విశ్వాసం శాస్త్రవేత్తలు చెప్పిన లేదా ప్రపంచ అనుభవాల మీద పాలకులకు లేకపోవటమే ఈ దుస్దితికి కారణం. మార్చి 30 నుంచి దేశంలో కరోనా ప్రభావం ఉండదని, మే 11 తరువాత ప్రపంచంలోనే కరోనా అంతరిస్తుందని ఇలా ఎవడికి తోచిన చెత్తను వారు చెప్పారు. ఒక్కడంటే ఒక్క జ్యోతిష్కుడు కూడా రెండవ దశ ఇంత తీవ్రంగా వస్తుందని ఎందుకు చెప్పలేకపోయాడు. ఒక పక్క మార్చినెలలో కరోనా రెండవ దశ తీవ్రంగా వ్యాపిస్తుండటాన్ని చూసి కూడా గంగలో మునిగితే వైరస్‌ అంటదని బిజెపి అగ్రనేతలు చెప్పారంటే కళ్ల ముందున్నదానిని చూడలేని, వినలేని, శాస్త్రవేత్తలు చెప్పిన దానిని విశ్వసించలేని మూఢత్వంలోకి వారు జారి దేశాన్ని నెట్టారని ఎవరైనా అంటే తప్పేముంది ? ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా తొత్తు అయితే దాన్నుంచి మన దేశం ఎందుకు బయటకు రాలేదు ?

అవాస్తవాలు -జనం చెవుల్లో పూలు !

”ఇక వాక్సిన్‌ విషయంలో అన్నీ దేశాల కంటే ముందే ఉత్పత్తి ప్రారంభం చేసి వాక్సిన్‌ ఇవ్వడం మొదలు పెట్టింది భారత్‌. సరిగ్గా ఇక్కడే గ్లోబల్‌ ఫార్మా లాబీకి కష్టం అనిపించింది. ప్రతి సంవత్సరం గ్లోబల్‌ ఫార్మా చేసే వ్యాపార విలువ 4 నుండి 6 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుంది ఇక వాక్సిన్‌ వ్యాపారం అయితే 1.25 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా కానీ భారత్‌ బయో టెక్‌ కోవాక్సిన్‌, లైసెన్స్‌ తీసుకొని తయారు చేస్తున్న కొవీషీల్డ్‌ ఉత్పత్తి రేటు మిగతా దేశాలకంటే ఎక్కువ. పైగా ధర విషయంలో మిగతా దేశాలకంటే 60% తక్కువగా ఉండడం పశ్చిమ దేశాలకి మింగుడు పడడం లేదు ఇదే మోడీ పట్ల ద్వేష భావం నెలకొనడానికి కారణం అయ్యింది. చివరకి జర్మనీ ఛాన్సేల్లర్‌ అంజేల మోర్కెల్‌ అయితే భారత్‌ ఫార్మా రంగ హబ్‌ అవడం మనం చేసిన తప్పు అంటూ బహిరంగంగా ప్రకటించింది అంటే ఎంత అక్కసు ఉందో తెలిసిపోయింది. ఇక్కడ ప్రధానం గా ఆస్ట్రా జెనీక వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల మరణాలు సంభవించాయి యూరోపులో. ఇదే సమయంలో అదే లైసెన్స్‌ తీసుకొని భారత్‌ లో తయారుచేసిన కొవీషీల్డ్‌ వల్ల అలాంటి దుష్ప్రభావాలు కలిగినట్లు ఎక్కడా ఫిర్యాదులు లేవు. ”
జనం చెవుల్లో కమలం పూలు పెట్టుకున్నారన్నది ఇది రాసిన వారి గట్టి విశ్వాసంగా కనిపిస్తోంది.ప్రపంచ ఫార్మామార్కెట్‌ 2019లో 324 బిలియన్‌ డాలర్లు, 2020లో 405, 2027లో 908 బిలియన్‌ డాలర్లు (ఒకబిలియన్‌ వంద కోట్లు )ఉంటుందనే అంచనా వార్తలను గూగుల్తల్లిని ప్రార్ధించి ఎవరైనా తెలుసుకోవచ్చు. నాలుగు వందల బిలియన్లెక్కడ ? రాసిన వారు చెప్పిన నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల డాలర్లెక్కడ ? గ్లోబల్‌ ఫార్మా లాబీకి కష్టం అట. ఆస్ట్రాజెనెకా వల్ల రక్తం గడ్డకట్టి మరణాలు సంభవించాయట. మన దేశంలో సీరం సంస్ధ కోవిషీల్డు పేరుతో తయారు చేస్తున్నది అదే విదేశీ ఆస్ట్రాజెనెకా కంపెనీ ఆధ్వర్యాన ఆక్ప్‌ఫర్డ్‌ తయారు చేసిందని తెలియదా ? అందుకే కదా మన దేశంలో కోవిషీల్డు వద్దు కోవాగ్జిన్‌ కావాలని అనేక మంది కోరుతున్నది.

” గ్లోబల్‌ ఫార్మా రంగం ఆశించింది అసలు జరగలేదు….. అన్నీ మన దేశంలో నే తయారు చేసుకున్నాము. రెండు వాక్సిన్లు భారత్లోనే తయారు చేసుకోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగలేదు. బిడెన్‌ అధికారంలోకి రాగానే ఫార్మా లాబీ భారత్‌ కి వాక్సిన్‌ తయారీ కోసం వాడే ముడి పదార్ధాల మీద నిషేధం విధించమని తీవ్ర ఒత్తిడి తెచ్చి విజయం సాధించాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాక్సిన్‌ కోసం ముందే రా మెటీరీయల్‌ బుక్‌ చేసుకుంది. ముందు ఇచ్చిన ఆర్డర్‌ లు డెలివరీ అయ్యాకే మనకి ఇస్తాయి అమెరికన్‌ సంస్థలు అంటే హీన పక్షం మరో మూడు నెలల వరకు మనకి రా మెటీరీయల్‌ దొరికే అవకాశం లేదు.”
ఇది రాసిన పెద్దలే మన అజిత్‌ దోవల్‌ అమెరికాకు వారి భాషలోనే మాట్లాడి ముడిపదార్దాల సరఫరాకు దిగివచ్చేట్లు చేశారని కూడా రాశారు. దానికి ఆధారాలు లేవు. ట్రంపు అంటే కౌగిలింతల మిత్రుడు బిడెన్‌ కాదు కదా అయినా నరేంద్రమోడీకి నోరు ఎందుకు రావటం లేదు. అమెరికాతో అవసరం అయితే తెగతెంపులు చేసుకుంటామని బహిరంగ హెచ్చరిక ఎందుకు చేయలేదు ?

ఇది రాసిన వారికి తెలిసిన మాత్రం కూడా తెలియకుండా మోడీ, బిజెపి నేతలు బెంగాల్‌ వెళ్లారా !

” ఇక ఇంత హఠాత్తుగా 2 వేవ్‌ విజ ంభించడానికి కారణాలు సుస్పష్టం. ప్రస్తుతం విజ ంభిస్తున్న కోవిడ్‌ రెండు సార్లు మార్పు చెందినట్లు పరీక్షలలో తేలింది అంటే ఇది ప్రత్యేకంగా పని కట్టుకొని వ్యాప్తి చేసినట్లు కనపడుతున్నది దీనికి కారణం వేస్ట్‌ బెంగాల్‌ లో ఉన్న చికెన్‌ నెక్‌ ప్రాంతం ప్రధానం గా చెప్తున్నారు. ఈ చికెన్‌ నెక్‌ ప్రాంతం నుండే డుబుల్‌ మ్యూటేషన్‌ చేసిన వైరస్‌ ని వదిలినట్లు అనుమానిస్తున్నారు ఎందుకంటే బెంగాల్‌ లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరికీ అనుమానం రాదు కానీ ఒకేసారి డబుల్‌ మ్యూటేషన్‌ ఎలా జరుగుతుంది ? ఇది ఖచ్చితంగా బయో వార్‌ మన మీద. లేకపోతే కేవలం భారత దేశంలోనే ఇది విజ ంభిస్తున్నది ? పోయిన సంవత్సరం కూడా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్నప్పుడే చైనా సరిహద్దుల్లో తిష్ట వేసింది అలాగే ఇప్పుడు 2వ వేవ్‌ ఉధ తంగా ఉన్న సమయంలో మళ్ళీ సవాల్‌ విసురుతున్నది. ”
తాము ఏమి రాసినా బుర్రను ఉపయోగించకుండా నమ్మే జనం ఉన్నారన్న గట్టి నమ్మకంతో అల్లిన కధ ఇది. కోడి మెడ మాదిరి ఉండే ప్రాంతాన్ని చికెన్‌ నెక్‌ అంటున్నారు. ఇది పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం. ఆ ప్రాంతం పక్కనే భూటాన్‌,నేపాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులు ఉన్నాయి. అక్కడ వదలిన వైరస్‌ ముక్కుసూటిగా అటూ ఇటూ చూడకుండా పొరుగుదేశాలకు వెళ్లకుండా పశ్చిమ బెంగాల్‌కు వచ్చిందని చెబుతున్నారు. మరి కర్ణాటకలో ఎందుకు పెరుగుతోంది. బెంగాల్‌కు కర్ణాటకకు, మహారాష్ట్రకు చాలా దూరం ఉంది. పక్కనే ఉన్న బీహార్‌కు, ఝార్కండ్‌, ఒడిషా, వాటి మీదుగా ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఎందుకు వ్యాపించలేదు. ఇలాంటి కట్టుకధలతో జనాన్ని ఎంతకాలం మభ్యపెడతారు ? ఇక్కడ చిన్న తర్కం మరచిపోయారు. చికెన్‌ నెక్‌ ప్రాంతానికి వైరస్‌ను తీసుకురావాలంటే భూటాన్‌, నేపాల్‌ దేశాలను దాటి చైనా వారు రావాలి. కానీ లడఖ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కింలకు కొన్ని అడుగుల దూరంలోనే మన సరిహద్దు ఉన్నపుడు అక్కడ వదల కుండా దేశాలు దాటి వచ్చి చికెన్‌ నెక్‌ ప్రాంతంలో ఎందుకు వదలినట్లు ? నిజంగా బయోవార్‌ అయితే దేశం మొత్తాన్ని లక్ష్యం చేసుకుంటారు తప్ప ఒక్క పశ్చిమ బెంగాల్‌నే ఎందుకు ఎంచుకుంటారు? బయోవార్‌ కథలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలేమిటి ? దాన్ని గుర్తించేందుకు మోడీ సర్కార్‌ ఇచ్చిన ప్రత్యేక శిక్షణ ఏమిటి ? సొల్లు కబుర్లంటే ఇవే. కాస్త బుర్ర ఉపయోగిద్దాం. నిజానికి బయోవార్‌ మొదలు పెడితే లడఖ్‌ ప్రాంతంలో మన సైన్యం మీదే చైనా వారు వైరస్‌ను వదలి ఉండేవారు. లడఖ్‌ సైనికులు కరోనా బారిన పడ్డారన్న వార్తలేమీ ఇంతవరకు లేవే ! ఎందుకీ బుర్రతక్కువ రాతలు ?

” దాదాపు 15 కోట్ల మంది బంగ్లాదేశీయులు , రోహింగ్యా లు వెస్ట్‌ బెంగాల్‌ లో అస్సాం లో ఉన్నారు. మమత బేగం తో పాటు కాంగ్రెస్‌ వీళ్ళకి ఆధార్‌ కార్డులు ఇచ్చింది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు వీళ్ళకి ప్రధానం అందుకే వీటి కోసం ఏం చేయడానికయినా వెనుకాడరు. ”
బంగ్లాదేశ్‌ మొత్తం జనాభా పదహారున్నర కోట్లు, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం జనాభా మొత్తం పద్నాలుగు లక్షలు. పదిహేను కోట్ల మంది మన దేశం వస్తే బంగ్లాదేశ్‌ మొత్తం ఖాళీ అయినట్లా ?

అమెరికన్లు చైనాకు మద్దతిస్తే చతుష్టయంలో చేరి మనం చేసేది ఏమిటి ?

” ఇప్పుడు జో బిడెన్‌ మంత్రి వర్గంలోని అధికారులు అందరూ దాదాపుగా లెఫ్ట్‌ వింగ్‌ ని సమర్ధించేవాళ్లే కాబట్టి కనపడకుండా చైనాకే మద్దతు ఇస్తారు , తీసుకుంటారు. మోడీ ప్రధాన మంత్రిగా ఉంటే అటు ఫార్మా లాబీ తో పాటు ఆయుధ లాబీ కూడా నష్టపోతుంది. నల్ల జాతీయుడు ఒక అమెరికన్‌ పోలీసు చేతిలో హత్యమవ్వడం దానిని ఎన్నికల ప్రచార ప్రధాన అస్త్రంగా వాడుకొని లెఫ్ట్‌ వింగ్‌ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదే లాబీ చైనా , కాంగ్రెస్‌ మద్దతుతో కోవిడ్‌ ని భూతంగా చూపించి దానికి మోడీ నే బాధ్యుడుగా చిత్రీకరిస్తున్నది. మోడీ ఉన్నంత కాలం డిఆర్‌డిఓ చాలా వేగంగా పనిచేస్తుంది కాబట్టి అది తమకి నష్టదాయకం. మోడీని ఏదో విధంగా దించాలి. ఈ కుట్రలని ఛేదించుకొని మోడీ మనగలరా ? లేక ట్రంఫ్‌ లాగా బలి అవుతారా అన్నది మనమీదే ఆధారపడి ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ”
ఒకవైపు అజిత్‌ దోవల్‌ జేమ్స్‌ బాండ్‌లో బైడెన్‌ మెడలు వచ్చి వాక్సిన్‌ ముడిపదార్దాల దిగుమతులు సాధించారంటారు. మరోవైపు అదే బైడెన్‌ మన నరేంద్రమోడీని దించుతారని చెబుతారు. అమెరికన్లు చైనాకు మద్దతు ఇస్తే, మన మోడీని దించేందుకు ప్రయత్నిస్తుంటే చతుష్టయం నుంచి వెంటనే బయటకు రావాలి, అమెరికాతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలి కదా ? కరోనా వైఫల్యంతో మోడీ కనుక కొనసాగితే అసలు మొదటికే మోసం వస్తుందనే భయం సంఘపరివార్‌లో ప్రారంభమైందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా మరో బొమ్మను రంగంలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు. ట్రంప్‌ బలి స్వయంకృతం, జనం గద్దె దించారు. ట్రంపు జిగినీదోస్తు నరేంద్రమోడీ, ఆయన సౌభాగ్యం ఎలా ఉంటుందో నోస్ట్రోడోమస్‌ ఎక్కడా చెప్పినట్లు లేదు.

నరేంద్రమోడీ గడ్డం దీక్ష వికటించి కరోనా పెరిగిందా ?

ప్రధాని నరేంద్రమోడీ గడ్డం పెంచటం గురించి ఇంతవరకు ఎవరూ ఏమీ చెప్పటం లేదు. గడ్డం, జులపాలు పెంచుకోవటమా లేదా అనేది వ్యక్తిగతమైనదే. కానీ మన దేశంలో కొంత మంది ఆకస్మికంగా పెంచితే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. కొందరు భార్య గర్భవతి అయితే గడ్డం తీయరు. అలాగే దేవతలకు మొక్కో, దీక్ష్లో మరొక ప్రత్యేక కారణమో ఉంటుంది. కుర్రకారుకు సరదా ! మరి నరేంద్రమోడీ ఏ తరగతికి చెందుతారు. గడ్డం పెంచటం అనేది అస్తిత్వ రాజకీయాలకు, పురుషాధిక్యత ప్రదర్శనలో భాగం అనే తాత్పర్యాలు చెప్పేవారు కూడా ఉన్నారు. రామాలయ నిర్మాణ దీక్షలో భాగంగా గడ్డం పెంచారని పెజావర మఠం స్వామి చెప్పారు. మోడీ గడ్డం తప్ప దేశ ఆర్ధికస్ధితి పెరగటం లేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కొన్ని పత్రికలు కూడా గడ్డం గురించి రాశాయి. అయినా మోడీ తనదైన శైలిలో తన గడ్డం గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేకమైన మన్నాత్‌ క్రతువులో భాగంగా రహస్య పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారని అందుకే గడ్డం పెంచుతున్నారని 2020 సెప్టెంబరు 27న డక్కన్‌ క్రానికల్‌ పత్రిక రాసింది. దీన్ని చూస్తుంటే కరోనా బారి నుంచి దేశాన్ని రక్షించేందుకు భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు అనిపిస్తోందని కూడా పేర్కొన్నది. అదే నిజమైతే ఆ పూజలు, ప్రార్ధనలు వికటించి ఇప్పుడు ఇంత విపత్తును తెచ్చి పెట్టాయా ?

కేరళలో బిజెపి ఓట్లు పెరిగాయా ? తరిగాయా ? ఫలితాల తీరు తెన్నులేమిటి ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


కిందపడ్డా విజయం మాదే అని ప్రచారం చేసుకోవటంలో కాషాయ దళాల తరువాతనే ఎవరైనా అనేందుకు మరో ఉదాహరణ కేరళ ఎన్నికల ఫలితాలే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి 10.6శాతం ఓట్లు, 2021లో 11.3శాతం తెచ్చుకుంది. అంటే గతం కంటే అదనంగా ఓట్లు తెచ్చుకున్నట్లే కదా అని బిజెపి చెబుతోంది. దీనిలో నిజము – వక్రీకరణ ఉంది. కేరళ అగ్రశ్రేణి మీడియా సంస్ధ మళయాల మనోరమ నివేదించినదాని ప్రకారం 2016 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి కూటమి ఓట్లు 14.96శాతం, 2019 లోక్‌సభ ఎన్నికలలో వచ్చినవి 15.53, 2021లో వచ్చినవి 12.47 శాతం, అంటే రెండు సంవత్సరాలలో దాని ఓట్లు 3.06శాతం తగ్గాయి. మరి బిజెపి ఓట్లు పెరిగాయనటంలో నిజం ఏమిటి ? 2016 ఎన్నికలలో అది 140కి గాను 98 చోట్ల పోటీ చేసి 10.6శాతం తెచ్చుకుంది, తాజా ఎన్నికలలో 113 చోట్ల పోటీ చేసి తెచ్చుకున్నది 11.3శాతం. అది ఎక్కువ సీట్లలో పోటీ చేసింది, దాని మిత్రపక్షాలు తక్కువగా పోటీ చేశాయి. రెండు చోట్ల నామినేషన్‌ పత్రాలు సరిగా వేయటం చేతగాక పోటీలో లేదు తప్ప 138 చోట్ల ఎన్‌డిఏ పక్షాలు పోటీ చేశాయి. వాటన్నింటికీ కలిపి గత ఎన్నికల కంటే 2.49 శాతం తగ్గిపోయాయి. బిజెపి పోటీ చేసిన స్ధానాల్లో గత ఎన్నికల కంటే ఐదు చోట్ల అదనంగా ఓట్లు తెచ్చుకుంది. ఈ అంకెలను బట్టి బిజెపి చెబుతున్నదానిలో నిజం ఏమిటో వక్రీకరణ ఏమిటో అంతిమంగా ఏం జరిగిందో పాఠకులే అర్ధం చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా వంటి అగ్రనేతలు పర్యటించిన చోట్ల కూడా కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఓట్ల వ్యాపారం జరిగి బిజెపికి ఓట్లు తగ్గాయని, దీని మీద ఆ పార్టీ విచారణ కమిటీని వేస్తే మంచిదని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చమత్కరించారు.

బిజెపి విషయానికి వస్తే నరేంద్రమోడీ పలుకుబడి-శబరిమల అయ్యప్ప దేవాలయ ప్రవేశ సమస్యల మీద పెట్టుకున్న ఆశలు నిరాశలయ్యాయని చెప్పవచ్చు. 2014లో కేంద్రంలో బిజెపి విజయం తరువాత 2015లో జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికల్లో ఆ పార్టీకి 13.3శాతం, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 14.96 శాతం, 2019లోక్‌సభ ఎన్నికల్లో 15.64 శాతం ఓట్లు రావటాన్ని చూపి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదే అని ప్రచారం చేసుకున్నారు. అయితే 2020 స్ధానిక సంస్ధల ఎన్నికల్లో దాని బలం 14.5శాతానికి తగ్గింది. అసెంబ్లీ ఎన్నికలలో 12.47కు పడిపోయింది. అధికార యావలో ఈ సారి క్రైస్తవుల ఓట్ల కోసం బిషప్పుల బంగ్లాల చుట్టూ బిజెపి నేతలు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. 2016లో ఆ పార్టీ ఏడు నియోజకవర్గాలలో రెండవ స్ధానంలో వచ్చింది. ఈ సారి మరొక స్ధానంతో, నీమమ్‌తో తొమ్మిదికిి చేరాయి. అంతకు మించి పెరగలేదు. ఆ ఏడు చోట్లా ఈసారి విజయం సాధిస్తామని గట్టిగా ఆశలు పెట్టుకుంది. వాటిలో నాలుగు చోట్ల గతం కంటే స్వల్పంగా ఓట్లు పెంచుకోగా నీమమ్‌తో సహా నాలుగు చోట్ల రెండవ స్ధానాన్ని కాపాడుకున్నప్పటికీ బలం కోల్పోయింది. 2016 ఎన్నికల్లో 15శాతం పైగా ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాలు 54, ఇరవైశాతం తెచ్చుకున్నవి మరో 24 ఉన్నాయి. వాటిని చూసి ఈ సారి తమదే అధికారం అని ఆ పార్టీ పేరాశలు పెంచుకుంది.ఆ నియోజకవర్గాలు ఇప్పుడు 34-16కు తగ్గిపోయాయి. ఎజవా సామాజిక తరగతి కేరళలో ఎంతో ప్రభావం కలిగి ఉంటుంది. ఆ ఓట్లను రాబట్టేందుకు భారత ధర్మ జనసేన పేరుతో ఉన్న పార్టీని బిజెపి కలుపుకుంది. గత ఎన్నికల్లో అనేక చోట్ల ఆ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించినా ఈసారి ఘోరంగా విఫలమైంది. దాని ప్రభావం ఎన్‌డిఏ కూటమి ఓట్ల శాతం మొత్తంగా తగ్గింది. బిజెపి రాష్ట్రనేతలు పోటీ చేసిన చోట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ పోటీ చేసిన రెండింటిలో ఒక చోట స్వల్పంగా ఓట్లశాతం పెరిగింది, శబరిమల ఆలయం ఉన్న నియోజకవర్గంలో బాగా తగ్గాయి, మిగతా అగ్రనేతలు పోటీ చేసిన చోట్ల కూడా ఓట్లశాతాలు తగ్గాయి. మెట్రోమాన్‌ శ్రీధరన్‌, సినీ హీరో సురేష్‌ గోపి పోటీ చేసిన చోట ఓట్లశాతాలు పెరిగాయి. గిరిజన నాయకురాలిగా పేరున్న సికె జాను పోటీ చేసిన నియోజకవర్గంలో గతంలో 16.35 శాతం ఓట్లు తెచ్చుకోగా ఈసారి 9.08 శాతం మాత్రమే వచ్చాయి. నరేంద్రమోడీ పలుకుబడి పని చేయక, అయ్యప్ప స్వామి వివాదం ఓట్లు రాల్చక బిజెపి పరిస్దితి అగమ్య గోచరంగా తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


నోట మాటరాని బిజెపి నాయకత్వం – ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసిందన్న బిడిజెఎస్‌ !


ముప్పై ఐదు స్ధానాలు వస్తాయని, వాటితోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన బిజెపి నేతలు ఇప్పుడు ఎన్నికలలో తలెత్తిన పరిస్ధితిని కార్యకర్తలకు వివరించలేని స్ధితిలో ఉన్నారు. ఉన్న ఒక్క స్ధానం పోయి ఖాతా రద్దయింది. దానికి తోడు కూటమి ఓట్లశాతం తగ్గటం పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి మింగుడుపడటం లేదు.గతంలో గెలిచిన నీమమ్‌ నియోజకవర్గంలో బిజెపికి మద్దతు ఇచ్చిన వెనుకబడిన తరగతుల ఓట్లు సిపిఎంకు పడ్డాయని భావిస్తున్నారు. బిజెపి తమను మోసం చేసిందని బిజెపితో కలసి 21 సీట్లలో పోటీ చేసిన బిడిజెఎస్‌ పార్టీ ఫలితాల తరువాత గగ్గోలు పెడుతోంది. స్ధానిక సంస్ధలు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసపోయామని అలాంటి పార్టీతో ఇలా అయితే కలసి పనిచేయలేమని ఆ పార్టీ నేతలు వాపోతున్నారని వార్తలు. ఉత్తరాదిలో అనుసరించిన వ్యూహం కేరళలో పని చేస్తుందనుకోవటం తెలివితక్కువ తనమని బిజెపి సీనియర్‌ నేత సికె పద్మనాభన్‌ విమర్శించారు. గతంలో ఒకే పార్టీకి వరుసగా రెండవ సారి అధికారమిచ్చిన ఉదంతం లేనప్పటికీ విజయన్‌ ప్రభుత్వం కొనసాగాలని కోరుకున్నారు, దాన్ని మనం అంగీకరించాలని తమ పార్టీ నేతలను ఉద్దేశించి చెప్పారు. పొరపాట్లను సరిచేయకపోతే పార్టీ పెరిగే అవకాశం లేదన్నారు. విజయోత్సవ సభల్లో సిపిఎం దాని మిత్ర పక్షాలు నాయర్‌ సర్వీస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) మీద విమర్శలు చేస్తున్నాయని దాన్ని తాము సహించేది లేదని కేంద్ర మంత్రి, బిజెపి నేత వి మురళీధరన్‌ చెప్పారు. ఇతరుల మాదిరే ఎన్‌ఎస్‌ఎస్‌ నేత సుకుమారన్‌కూ తన రాజకీయ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉందన్నారు. ఏప్రిల్‌ ఆరున ఉదయమే ఓటు వేసేందుకు వచ్చిన సురేంద్రన్‌ అంతకు ముందు చెప్పిన తటస్ధ వైఖరికి విరుద్దంగా ప్రభుత్వ మార్పుకోసం ఓటు వేయాలని ఎల్‌డిఎఫ్‌ వ్యతిరేక ప్రకటన చేశారు.


ఎల్‌డిఎఫ్‌ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి ?


కేరళలో వామపక్షాలు గతంలో ఎన్నడూ సాధించని రీతిలో 97 స్దానాలు తెచ్చుకొని గత యుడిఎఫ్‌ రికార్డును సమం చేశాయి, ఘనవిజయం సాధించాయి, రాజకీయ సంప్రదాయానికి భిన్నంగా ఓటర్లు వరుసగా రెండవ సారి అధికారపక్షానికి పట్టం గట్టి చరిత్రను తిరగరాశారు. సంతోషించాల్సిందే. కానీ మరోవైపు పరిస్ధితి ఏమిటి ? కేరళలో ఎల్‌డిఎఫ్‌కు వచ్చిన ఓట్లు 45.43 శాతం, దాన్ని వ్యతిరేకించే పార్టీలకు వేసిన ఓటర్లు యుడిఎఫ్‌కు వచ్చిన 39.47, బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏకు వచ్చిన 12.47శాతం కలుపు కుంటే 51.94 శాతం ఉన్నారు. ఇలా చెప్పటం అలాంటి కలయిక వెంటనే ఏర్పడుతుందని కాదు, ఒకవేళ అదే జరిగినా ఆ పార్టీల వెనుక ఉన్న సామాన్య ఓటర్లు అలాగే స్దిరపడిపోతారనీ కాదు. ఆ పార్టీల వెనుక ఉన్నవారందరూ కమ్యూనిస్టు లేదా ప్రజావ్యతిరేకులు కారు. వీరిలో గణనీయమైన భాగాన్ని ఎల్‌డిఎఫ్‌లోకి ఆకర్షించాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు నొక్కి చెప్పాయి. వివిధ తరగతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి ఎల్‌డిఎఫ్‌ వెలుపల ఉన్న ప్రజాతంత్రశక్తులను ఎలా కూడగట్టాలో ఆ కూటమి నాయకత్వం ఆలోచించాలి. మనోరమ విశ్లేషణ ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు 2.67, లోక్‌సభ కంటే 10.73శాతం ఈసారి అదనంగా వచ్చాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 0.66శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని వికీపీడియా విశ్లేషణ పేర్కొంటే 0.78 అని, పార్లమెంట్‌ ఎన్నికలతో పోల్చితే 7.87 తగ్గినట్లు మనోరమ విశ్లేషణ తెలిపింది. (స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ ధోరణిని గమనించాలి).

కాంగ్రెస్‌కు ఓట్లు అమ్ముకున్న బిజెపి !


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విలేకర్లతో చెప్పిన అంశాల ప్రకారం 140కి గాను 90 చోట్ల కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఓట్ల వ్యాపారం జరిగిందన్నారు. కొన్ని చోట్ల దీన్ని అధిగమించి ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధులు విజయం సాధించారని అన్నారు. ఈ వ్యాపారం అగ్రనాయకుల మధ్యనే జరిగిందని విమర్శించారు. విజయన్‌ చెప్పిన కొన్ని నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్‌ బతరేలో బిజెపికి 12,458 ఓట్లు తగ్గాయి, కాంగ్రెస్‌ అభ్యర్ధి 11,822 మెజారిటీతో నెగ్గారు.పెరుంబవూరులో యుడిఎఫ్‌ 2,889 తేడాతో నెగ్గగా బిజెపికి 4,596 తగ్గాయి, ఓడిపోయిన సిపిఎం నాయకురాలు, ఏకైక మంత్రి మెర్సికుట్టి అమ్మ 4,452 ఓట్ల తేడాతో ఓడిపోగా అక్కడ బిజెపి ఓట్లు 14,160 తగ్గాయి. త్రిపురినితురలో సిపిఎం ఎంఎల్‌ఏ మీద గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్ధి మెజారిటీ 992 కాగా అక్కడ బిజెపికి 6,087 తగ్గాయి. చలక్కుడిలో కాంగ్రెస్‌ 1,057 ఓట్లతో గెలవగా బిజెపికి అక్కడ కూడా 6,087 తగ్గాయి. తిరువనంతపురంలోని కోవలం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ 11,562 మెజారిటీతో నెగ్గగా బిజెపికి 12,323 తగ్గాయి. పాల నియోజకవర్గంలో కేరళ కాంగ్రెస్‌(ఎం) అధ్యక్షుడు జోస్‌కె మణిని ఓడించేందుకు యుడిఎఫ్‌-బిజెపి కుమ్మక్కయ్యాయి. గెలిచిన మణి సికప్పన్‌కు 15,378 మెజారిటీ రాగా బిజెపికి 13,952 తగ్గాయి. కడుత్తురత్తిలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధి 4,251 ఓట్ల తేడాతో ఓడిపోగా బిజెపికి 5,866 తగ్గాయి. ఒక ఎన్నిక తరువాత మరొక ఎన్నికలో తమ బలం పెరుగుతోందని చెప్పిన బిజెపి ఈ తగ్గుదలను ఎలా సమర్ధించుకుంటుందో చెప్పాలని విజయన్‌ ప్రశ్నించారు. నీమమ్‌ నియోజకవర్గంలో ఈ సారి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధికి ఓట్లశాతం పెరగటాన్ని గతంలో ఆమేరకు బిజెపికి ఓట్లు బదిలీ అయి అక్కడ బిజెపి గెలిచిందని, ఈ సారి కాంగ్రెస్‌ పోటీలో ఉండటంతో బిజెపి ఖాతా మూతపడిందన్నారు. రెండు రెళ్లు నాలుగు అవుతాయని కాంగ్రెస్‌-బిజెపి భావించాయని అయితే ఓటర్లు భిన్నంగా ఆలోచించి ఎల్‌డిఎఫ్‌కు ఘనవిజయం చేకూర్చారన్నారు.


కాంగ్రెస్‌ ఎదురుదాడి – బిజెపి ఓటమి బాధ్యత తనదే అన్న సురేంద్రన్‌ !


ముఖ్యమంత్రి విజయన్‌ చేసిన విమర్శలతో దిక్కుతోచని కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. ఆ పార్టీ నేత రమేష్‌ చెన్నితల ఆరోపణల పర్వానికి తెరలేపారు. సిపిఎం-బిజెపి 69 నియోజకవర్గాలలో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బిజెపి చెబుతున్న కాంగ్రెస్‌ ముక్తభారత్‌లో భాగంగానే రెండు పార్టీలు కుమ్మక్కై తమను దెబ్బతీశాయన్నారు. బిజెపికి తగ్గిన ఓట్లన్నీ సిపిఎంకు పడ్డాయన్నారు. మరోవైపు బిజెపి ఓటమికి ప్రాధమిక బాధ్యత తనదే అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సురేంద్రన్‌ ప్రకటించారు. ఓటమి కారణాలను పార్టీకి వివరించానని పార్టీ ఏ చర్య తీసుకున్నా తాను సిద్దమే అని విలేకర్లతో చెప్పారు. కాంగ్రెస్‌ -సిపిఎం కుమ్మక్కయినట్లు ఆరోపించారు. ఎన్నికలకు ముందే ముస్లిం ఓట్ల సమీకరణ జరిగిందని, ముస్లింలీగ్‌ లేని చోట్ల ఎస్‌డిపిఐ పార్టీతో సహా అనేక బృందాల ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడ్డాయన్నారు.మతశక్తులైన ముస్లింలీగ్‌, జమాతే ఇస్లామీ ఓట్లను సిపిఎం పొందిందని చెప్పుకున్నారు. కేరళ విద్యుత్‌ శాఖ మంత్రి మణిపై ఓడిపోయిన యుడిఎఫ్‌ అభ్యర్ది అగస్తీ ముందుగా ప్రకటించినట్లుగా ఓడిపోయినందుకు గుండు గీయించుకున్నారు. ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ దానిపై మనం మాట నిలుపుకోవాలని శీర్షికగా పెట్టారు.


నీమమ్‌లో జరిగిందేమిటి ?


కేరళ రాజకీయ చరిత్రలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన బిజెపి ఉన్న ఒక్క సీటు నీమమ్‌ను కోల్పోయి ఖాతాను నిలబెట్టుకోలేకపోయింది. యుడిఎఫ్‌లోని ఒక చిన్న పార్టీ అభ్యర్ధిని నిలిపిన కాంగ్రెస్‌ నేతలు బిజెపితో కుమ్మక్కై తమ ఓట్లను బదలాయించి సీనియర్‌ బిజెపి నేత ఓ రాజగోపాల్‌ను గెలిపించారు. అది తీవ్ర విమర్శలకు దారి తీయటంతో అలాంటి తెరచాటు బాగోతం లేదని నమ్మించేందుకు కాంగ్రెస్‌ అక్కడ తన అభ్యర్ధినే నిలిపింది. అనేక మంది సీనియర్‌ నేతలను అక్కడ నిలిపేందుకు ప్రయత్నించి విఫలమైంది. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీని నిలపాలని ఆయన మీద వత్తిడి తెచ్చారు. అయితే చాందీ పుతుపల్లిని వదిలితే తాము ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఆయన నివాసం వద్ద బెదిరింపులకు దిగారు. నీమమ్‌లో గతంలో మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ ప్రాతినిధ్యం వహించి ఉన్నందున ఆ పేరుతో ఆయన కుమారుడు, ఎంపీ అయిన కె మురళీధరన్‌ను నిలిపారు.
గతంలో బిజెపి సీనియర్‌ నేత రాజగోపాల్‌కు అక్కడ 67,813 రాగా ఈ సారి కుమనం రాజశేఖరన్‌కు 51,888 వచ్చాయి. యుడిఎఫ్‌కు గతంలో 13,860 రాగా ఈ సారి 36,524 వచ్చాయి. సిపిఎం అభ్యర్ధి, తిరువనంతపురం మాజీ మేయర్‌ అయిన వి శివన్‌కుట్టికి గత ఎన్నికల్లో 55,837 రాగా ఈ సారి 59,142 వచ్చాయి. గతంలో కుమ్మక్కులో భాగంగా బిజెపికి పడిన ఓట్లు ఈ సారి కాంగ్రెస్‌కు తిరిగి వచ్చాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది.


వెలుగు దివ్వెలతో ఏడవ తేదీన ఇండ్లలోనే విజయోత్సవాలు : ఎల్‌డిఎఫ్‌


కరోనా దృష్యా ఏడవ తేదీన ఇండ్లలోనే విజయోత్సవాలు జరుపుకోవాలని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్‌ కోరారు. ఏడవ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్ర వ్యాపితంగా ఒకేసారి మద్దతుదారులందరూ దివ్వెలను వెలిగించి ఇండ్లలోనే విజయోత్సవాలు జరుపుకోవాలని ఎల్‌డిఎఫ్‌ నిర్ణయించినట్లు విజయరాఘవన్‌ చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రిగా అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న కె కె శైలజ టీచర్‌ పదిహేనవ అసెంబ్లీ స్పీకర్‌ పదవిని అధిష్టించనున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే నూతన సభలో అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డుతో పాటు కేరళ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా మరో రికార్డు సృష్టిస్తారు. గతంలో ముగ్గురు మహిళలు ఉపసభాపతులుగా పని చేశారు.

కుంభమేళా, ఎన్నికల గురించి మాట్లాడితే నా తల తీసేయవచ్చు – అదర్‌ పూనా వాలా !

Tags

,

ఎం కోటేశ్వరరావు


ఒక తప్పుడు వార్తను ప్రసారం చేసి శివసేన పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించిన ఇండియా టుడే న్యూస్‌ డైరెక్టర్‌ రాహుల్‌ కన్వాల్‌ చెంపలు వేసుకున్నారు. మే రెండవ తేదీ ఆదివారం నాటి ప్రసారంలో తాను చేసిన వ్యాఖ్యలపై సోమవారం నాడు సామాజిక మాధ్యమంలో ట్విటర్‌ ద్వారా విచారం ప్రకటించారు. సీరం సంస్ధ అదర్‌ పూనావాలాను బెదిరించింది స్వాభిమాని షేత్కారి సంఘటన నేత రాజు షెట్టి, అతని అనుచరులు తప్ప శివసేనకు సంబంధం లేదని చెప్పారు. అయితే కన్వాల్‌ టీవీ ప్రసారం ద్వారా క్షమాపణలు చెప్పాలి తప్ప కేవలం ట్విటర్‌లో విచారం ప్రకటిస్తే చాలదని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. రాజు షెట్టి గతంలో శరద్‌ జోషి షేత్కారి సంఘటనలో పని చేశారు. తరువాత స్వాభిమాన షేత్కారి సంఘటన పేరుతో స్వంత దుకాణం, ఒక పార్టీ పెట్టారు. బిజెపి మద్దతుతో 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు. గతేడాది ఎన్‌సిపితో సంబంధాలకు ప్రయత్నించినా స్వంత పార్టీలో విబేధాల కారణంగా దానికి దగ్గర కాలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు వాక్సిన్‌ సరఫరాలను పెంచాలని లేనట్లయితే ఇతర రాష్ట్రాలకు సీరం సంస్ద సరఫరా చేస్తున్న వాక్సిన్‌ వాహనాలను తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని బెదిరిస్తూ మాట్లాడినట్లు వీడియోలో ఉంది.


రాహుల్‌ కన్వాల్‌ చేసిన తప్పుడు ప్రకటన తప్ప గతవారంలో ఇద్దరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు లేదా ప్రకటనలకు మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడదు.( అన్ని టీవీ ఛానల్స్‌ చూడటం, అన్ని పత్రికలు చదవటం సాధ్యం కాదు కనుక నా పరిశీలనలో లోపం ఉంటే సరి చేసుకుంటాను.) ఒకటి పూనాలోని సీరం సంస్ధ అదర్‌ పూనావాలా తనకు రక్షణ లేని కారణంగానే లండన్‌ వచ్చి అక్కడే ఉండిపోయానని, త్వరలో భారత్‌ వెళతానని ప్రముఖ పత్రిక టైమ్స్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. భారతకు వాక్సిన్‌ ఫార్ములా ఇవ్వకూడదని ప్రపంచ ప్రముఖుడు బిల్‌ గేట్స్‌ ప్రకటించారన్నది మరొక వార్త. ఇవి రెండూ తీవ్రమైనవే.


ఇంతకీ పూనా వాలాను బెదిరించింది ఎవరు, దాని స్వభావం ఏమిటి ? ఫలానా వారు బెదిరించారని టైమ్స్‌ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఇండియా టుడే జర్నలిస్టు రాహుల్‌ కన్వాల్‌ సంచలనాత్మక విషయంగా పూనావాలకు బెదరింపులు వచ్చాయని అవి చేసింది ఎవరో కాదు శివసేన నుంచి అని ఆరోపించారు. మేనెల రెండవ తేదీన ఎన్నికల ఫలితాల గురించి ప్రసారం చేస్తుండగా కన్వాల్‌ ఈ ప్రత్యేక ప్రస్తావన చేశారు. తాను ఆ వీడియోలను చూశానని వాటిలో బూతులు తిడుతున్న స్ధానికులు కనిపించారని చెప్పారు. వాక్సిన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తన ఫ్యాక్టరీని ఘెరావ్‌ చేసిన శివసేన గూండాలంటూ కొన్ని వీడియోలను తనకు పూనావాలా పంపారని పేర్కొన్నారు. అది తప్పుడు వార్తని అందుకు గాను కన్వాల్‌ క్షమాపణ చెప్పాలని, జనవరిలో తప్పుడు వార్తను ప్రసారం చేసినందుకు ఇదే సంస్ద యాజమాన్యం రాజదీప్‌ సర్దేశారుపై తీసుకున్న మాదిరి చర్య తీసుకోవాలని శివసేన ఇండియా టుడే యాజమాన్యానికి రాసిన లేఖలో డిమాండ్‌ చేసింది. ఒకవైపు కరోనా విజృంభణ, మరోవైపున ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా జనాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్‌ కన్వాల్‌ కావాలనే తప్పుడు వార్తలను ప్రసారం చేశారని అన్నారు. శివసేన మీద పని గట్టుకొని నిందా ప్రచారం చేస్తున్నారని దానికి నిదర్శనంగా ఇదే గ్రూపుకు చెందిన మరొక ఛానల్‌ ఆజ్‌తక్‌లో ముఖ్యమంత్రి కుమారుడు, కాబినెట్‌ మంత్రి అయిన ఆదిత్య థాకరేను శివసేన రాహుల్‌ గాంధీ అని వర్ణించినట్లు శివసేన తన లేఖలో తెలిపింది.


అదర్‌ పూనావాలాకు నిజంగా బెదిరింపులు వచ్చాయా లేక ఇతర కారణాలతో చిన్న ఉదంతాన్ని పెద్దది చేసి చూపారా ? అవి చిన్నవైనా పెద్దవైనా ముంబైలోనో మరొకచోటో వెల్లడించకుండా పూనాలో కేసులు నమోదు చేయకుండా లండన్‌ వెళ్లి ఎందుకు చెప్పాల్సి వచ్చింది. రైతు ఉద్యమం గురించి విదేశీయులు మన వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారాలు చేశారని, వారికి మన దేశంలోని ప్రభుత్వ, దేశ వ్యతిరేకులు సహకరించారని ఎంత పెద్ద లొల్లి చేశారో, ఎన్ని కేసులు పెట్టారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. పూనా వాలా చేసిన ప్రకటనతో ప్రపంచంలో మన దేశ పరువు ఏమైందో అసలు సిసలు దేశభక్తులం మేమే అని డబ్బా కొట్టుకొనే వారు ఆలోచించారా ? మీడియాలో అయితే కనిపించలేదు. బిజెపి ఎలాంటి ప్రకటనా చేసినట్లు లేదు, ఎవరు బెదరించారో వెల్లడించాలని కాంగ్రెస్‌, శివసేన కోరాయి.
ఇంతకీ పూనా వాలా చెప్పిందేమిటి ? వివిధ మీడియాల్లో వచ్చిన సమాచారం మేరకు వాటి సారాంశం ఇలా ఉంది. వాక్సిన్‌ కోసం భారత్‌లో బెదరింపులు వస్తున్న కారణంగా నేను, నా కుటుంబం దేశం విడిచి లండన్‌ వచ్చాము.అసాధారణ బెదిరింపులు వచ్చాయి, వారు ఏమైనా చేయవచ్చు. ఇటు వంటి పరిస్ధితుల్లో లండన్‌లో మరికొంత కాలం ఉంటాము. భారత్‌లో నా పని నేను చేసుకుంటున్నాను ఎక్స్‌, వై లేదా జడ్‌ల అవసరాలకు అనుగుణ్యంగా వాక్సిన్లను సరఫరా చేయలేను. వారేం చేయబోతున్నారో ఊహించలేము. అంతా నా భుజాల మీద వేస్తే నేను ఒక్కడినే చేయలేను.ఆకాంక్షలు, వత్తిడి అసాధారణంగా ఉంది. ప్రతివారూ తమకు వాక్సిన్‌ ఇవ్వాలంటున్నారు. ఇతరుల కంటే వారికే ఎందుకివ్వాలో అర్ధం కాదు. వారు చెప్పినట్లు ఇవ్వకపోతే ఏమైనా చేయవచ్చు అన్నట్లుగా బెదరింపుల స్వభావం ఉంది.వారు అలాంటి భాష ఉపయోగించలేదు గానీ ధోరణి, పర్యవసానం అలా ఉంది. తాము కోరింది ఇవ్వకపోతే మేమున్న చోటు నుంచి వెళ్లనిచ్చేది లేదని చుట్టుముట్టారు. వాక్సిన్‌ ఇవ్వకపోతే బాగుండదని వారు చెబుతున్నారు.


టైమ్స్‌ పత్రిక విలేకరి అడిగిన ప్రశ్నలకు పూనా వాలా స్పందన కూడా ముఖ్యమైనదే. కరోనా పెరుగుదలకు కారణంగా భావిస్తున్న కుంభమేళా- అసెంబ్లీ ఎన్నికల గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు ” నేను గనుక సరైన సమాధానం చెప్పినా లేదా ఏ సమాధానం చెప్పినా వారు నా తల తీసేస్తారు. నేను ఎన్నికల మీద లేదా కుంభమేళా గురించి వ్యాఖ్యానించను, అది ఎంతో సున్నితమైనది. (కరోనా పరిస్ధితి ) ఇంతలా దిగజారిపోతుందని బహుశా దేవుడు కూడా ఊహించి ఉండలేదేమో అనుకుంటున్నా అన్నారు.


ఇండియా టుడే తప్పుడు ప్రచారంతో బిజెపి కిరాయి మీడియా వెంటనే గుండెలు బాదుకోవటం ప్రారంభించింది. శివసేన గురించి దుమ్మెత్తి పోసింది. ఇప్పుడు ఇండియా టుడే తన ప్రకటనను వెనక్కు తీసుకొని విచారం ప్రకటించిన నేపధ్యంలో కనీసం ఆ మాత్రం విచారం లేదా చెంపలు వేసుకుంటుందా ? ఎక్కడైనా ఎవరైనా బెదరింపులు, మరొక నేరపూరితమైన చర్యకు పాల్పడితే వెంటనే సంబంధిత వ్యక్తుల మీద పోలీసు ఫిర్యాదు ఇవ్వాలి. కానీ అదేమీ చేయకుండా ఏప్రిల్‌ 16వ తేదీన పూనాలోని సీరం సంస్ద ప్రతినిధి ప్రకాష్‌ కుమార్‌ సింగ్‌ కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాసి అదర్‌ పూనావాలకు రక్షణ కల్పించాలని కోరారు. వెంటనే వై తరగతి భద్రతను కల్పించింది. అంటే పూనావాలా దేశంలో ఉన్నపుడు ఆయనకు రక్షణగా ఎనిమిది మంది సాయుధ సిబ్బంది రక్షణగా ఉంటారు. ఒకరిద్దరు కమాండోలు కూడా ఉండవచ్చు.


చీకట్లో బాణం వేసినట్లుగా అదర్‌ పూనావాలా సంచలనాత్మక ప్రకటన చేశారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు. వత్తిడి చేసి లేదా ప్రలోభంతో డామన్‌లోని ఒక సంస్ధ నుంచి వేలాది రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకొని దొరికిపోయిన ఉదంతంలో ఉన్నది బిజెపి వారే. అందువలన దీనిలో కూడా వారు లేరని చెప్పగలమా ? కేంద్రం, రాష్ట్రాలు, ప్రయివేటు ఆసుపత్రులకు ఒక్కో రేటు నిర్ణయిస్తూ తయారీ సంస్ధలు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు పూనా వాలా ఇలాంటి ప్రకటన చేశారా ? లేక విదేశాల్లో తయారు చేసి అధిక ధరలకు అమ్ముకొనేందుకు నేపధ్యాన్ని సృష్టించారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.ఒక వేళ నిజంగానే బెదరింపులు వస్తే ఇది తీవ్రమైన అంశం. దానికి కారకులు ఎవరంటే వేలు కేంద్ర ప్రభుత్వం వైపే చూపకతప్పదు. బీహార్‌ ఎన్నికల సమయంలో తమను ఎన్నుకుంటే ఉచితంగా వేస్తామని చెప్పి వాక్సిన్‌ రాజకీయాన్ని ప్రారంభించింది బిజెపి-జెడియు కూటమి. ఆ ప్రకటన వివాదాస్పదం కావటంతో దేశమంతటా ఉచితంగా వేస్తామని కేంద్ర మంత్రులు ప్రకటించారు. తీరా 45 ఏండ్లు దాటిన వారికే తాము ఉచితంగా వేస్తామని, మిగిలిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా కొనివేసుకోవాలని లేదా ప్రయివేటు ఆసుపత్రుల్లో అధిక ధరలకు కొనుక్కోవాలని కేంద్రం ప్రకటించింది. తాను బాధ్యతల నుంచి తప్పుకొని రాష్ట్రాల మీద భారం మోపేందుకు వేసిన ఎత్తుగడ తప్ప ఇది మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వాక్సిన్లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతనుంచి తప్పుకోవటమే ఇది. అందువలన ఈ విధానమే బెదిరింపులకు తెరలేపేందుకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు. వాక్సిన్‌ రాజకీయంలో లబ్దిపొందేందుకు ముందుగా తామే కొనుగోలు చేసి ప్రజల ముందు గొప్పలు చెప్పుకొనేందుకు ఎవరైనా అవాంఛనీయ చర్యలకు పాల్పడ్డారా ? అంతటి ధైర్యం కేంద్రంలో ఉన్న అధికారపార్టీ వారికి తప్ప ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులకు ఉండే అవకాశాలు లేవు.


లండన్‌ ఒక అంతర్జాతీయ కేంద్రం. అక్కడి ప్రముఖ పత్రికకు ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వటం వెనుక బెదిరింపులు కారణం కావచ్చు. పూనావాల ప్రకటన తరువాత నరేంద్రమోడీని నమ్మి ఏ విదేశీ సంస్ధ పెట్టుబడులు పెడుతుంది, పరిశ్రమలు స్దాపించేందుకు ముందుకు వస్తుంది? అలాంటిదేమీ లేదని నిర్ధారించేందుకు కేంద్రం ఎందుకు ముందుకు రాలేదు ? పూనా వాలా తనకు ఎదురైన బెదిరింపుల గురించి మాత్రమే చెప్పలేదు. ఎన్నికల ప్రచారం ద్వారా, కుంభమేళా ద్వారా కరోనాను వ్యాపింప చేశారని విమర్శచేసినా తన తలతీస్తారని కూడా చెప్పారు. హిందూత్వశక్తులు తప్ప మరొకరు అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. కుంభమేళాకు అనుమతులు ఇవ్వవద్దన్న వారు హిందూమతానికి వ్యతిరేకమని ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్లివచ్చిన వారిమీద అనేక రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. వారిలో 99శాతం మందికి కరోనా వచ్చిందని టైమ్స్‌ నౌ ఛానల్‌ వార్త పేర్కొన్నది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ అంశాలన్నీ తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. ఇప్పుడు పూనావాలా దేశంలో పెరుగుతున్న అసహనం, విమర్శను సహించలేని తనాన్ని చెప్పకనే చెప్పినట్లు లేదూ ? అంతటి ప్రముఖుడే స్వేచ్చగా మాట్లాడేందుకు భయపడుతుంటే ఇంక సామాన్యుల సంగతి చెప్పాలా ?

కేరళలో ఎర్ర సునామీ : బలపడిన ఎల్‌డిఎఫ్‌, కుంగిన యుడిఎఫ్‌, కొట్టుకుపోయిన బిజెపి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు
అవును సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ కూటమి నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాసింది. ఒకసారి ఎల్‌డిఎఫ్‌ను ఎన్నుకుంటే మరోసారి యుడిఎఫ్‌ను ఎన్నుకొనే కేరళీయులు అధికారాన్ని తమకు అప్పనంగా కట్టపెడతారని ఆశపడ్డ కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఈ ఎన్నికలలో తమకు స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యలో సీట్లు రాకపోయినా వచ్చే కొన్ని సీట్లతో చక్రం తిప్పుతామని, అన్నీ అనుకూలిస్తే అధికారం తమను వరిస్తుందని పగటి కలలు కన్న బిజెపికి ఉన్న ఒక్కసీటును లేకుండా చేసి ఖాతాను మూసివేశారు. ఎల్లవేళలా జన సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం ఆపత్కాలంలో తమను ఎలా అదుకున్నదో చూసిన జనం తమ మనోభావాన్ని గతేడాది చివరిలో జరిగిన స్ధానిక సంస్దల ఎన్నికలలోనే ఎల్‌డిఎఫ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చి వెల్లడించారు. ఏప్రిల్‌ ఆరవ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మరింత స్పష్టంగా తమకు కావాల్సిన వారెవరో ఎంచుకున్నారు. ఎన్ని అభాండాలు, ఎన్ని అవాస్తవాలు, ఎన్ని తప్పుడు ప్రచారాలు, ఎన్ని ఆటంకాలు అన్నింటిని మేము కాచుకుంటామంటూ జనం ముందుకు వచ్చారు.


ప్రజలు మమ్మల్ని విశ్వసించారు, యుడిఎఫ్‌ను తిరస్కరించారు, బిజెకి బుద్ది చెప్పారు అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఫలితాలపై తొలి స్పందనలో పేర్కొన్నారు. వామపక్ష ప్రజాతంత్ర సంఘటన మాత్రమే లౌకిక వాదాన్ని పరిరక్షించగలదని, సామాజిక న్యాయం చేకూర్చగలదని నమ్మారని ఇది ప్రజావిజయం అన్నారు. ఎన్నికల సమయంలో యుడిఎఫ్‌ లేవనెత్తిన అంశాలన్నింటినీ జనం తిరస్కరించారని అన్నారు. ఉన్న ఒక్క సీటును పొగొట్టుకున్న బిజెపి గురించి మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాలలో జిమ్మిక్కులు చేయగలదేమో గానీ ఇక్కడ పని చేయవని కేరళ గడ్డ మీద మతత్వానికి తావులేదన్నారు. గతంలో కాంగ్రెస్‌ నేత ఏకె ఆంటోని నాయకత్వంలో 2001లో యుడిఎఫ్‌ 99 స్ధానాలను సాధించి అప్పటికి ఒక రికార్డు నెలకొల్పింది. దాన్ని పినరయి విజయన్‌ సమం చేశారు. ఓట్లశాతాలు, తీర్పు ఇతర వివరాలను మరో సందర్భంలో వివరంగా సమీక్షించుదాం. రెండు ఫ్రంట్లలో పార్టీల వారీగా సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.


ఎల్‌డిఎఫ్‌ ×× సీట్లు ×××× యుడిఎఫ్‌××××× సీట్లు
సిపిఎం ×××× 68 ×××× కాంగ్రెస్‌ ×××× 22
సిపిఐ –×××× 17 ×××× ముస్లింలీగ్‌ ×××× 14
కెసి(ఎం) ×××× 5 ××××కేరళకాంగ్రెస్‌ ×××× 2
జెడిఎస్‌ ×××× 2 ×××× కెసిజె ×××× 1
ఎన్‌సిపి ×××× 2 ×××× ఎన్‌సికె ×××× 1


ఎల్‌డిఎఫ్‌లోని మరో ఐదు చిన్న పార్టీలకు ఒక్కొక్క స్దానం చొప్పున వచ్చాయి. యుడిఎఫ్‌లోని మూడు పార్టీలకు బిజెపి మిత్రపక్షాలు మూడింటికి, ఇతర పార్టీలు నాలిగింటికి ఒక్క స్దానమూ రాలేదు. గత ఎన్నికలలో స్వతంత్ర అభ్యరిగా గెలిచిన సభ్యుడు ఈ సారి ఎల్‌డిఎఫ్‌ చేతిలో ఓడిపోయారు.


వివిధ జిల్లాలో ఫలితాల తీరుతెన్నులను ఒక్కసారి చూద్దాం. పద్నాలుగు జిల్లాల్లోని 140 స్ధానాల్లో ఇది రాసిన సమయానికి విజయాలను ఖరారు చేసినవి, ఆధిక్యతలో ఉండి అధికారికంగా ప్రకటించని స్ధానాలు దిగువ విధంగా ఉన్నాయి.


జిల్లా పేరు ×××× 2016 ఎన్నికలు×××××× 2021 ఎన్నికలు
××××××××ఎల్‌డిఎఫ్‌××యుడిఎఫ్‌ ××× ఎల్‌డిఎఫ్‌ ×××× యుడిఎఫ్‌
తిరువనంతపురం ×× 9 ×× 4 ×× 13 ×××× 1
కాసరగోడ్‌ ××××× 3 ×× 2 ××× 3 ×××× 2
వయనాడ్‌ ××××× 2 ×× 1 ××× 2 ×××× 1
కన్నూరు ××××× 8 ×× 3 ××× 13 ×××× 1
కోజికోడ్‌ ××××× 11 ×× 2 ××× 11 ×××× 2
మలప్పురం ××× 4 ×× 12 ××× 4 ×××× 12
పాలక్కాడ్‌ ××××× 9 ×× 3 ××× 10 ×××× 2
త్రిసూర్‌ ××××× 12 ×× 1 ××× 12 ×××× 1
ఎర్నాకుళం ××××× 5 ×× 9 ××× 5 ×××× 9
ఇడుక్కి ××××× 3 ×× 2 ××× 4 ×××× 1
కొట్టాయం ××××× 2 ×× 6 ××× 5 ×××× 4
అలప్పూజ ××××× 8 ×× 1 ××× 8 ×××× 1
పత్తానంతిట్ట ××××× 4 ×× 1 ××× 5 ×××× 0
కొల్లం ××××× 11 ×× 0 ××× 9 ×××× 2

ఇలా అనుకోలేదు, ఓటమిని అంగీకరిస్తున్నాం, ఆత్మశోధన చేసుకుంటాం : కాంగ్రెస్‌


ఇలాంటి ఫలితాలు వస్తాయని మేము అనుకోలేదు. విజయన్‌ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశాము. వారు విజయం సాధించినంత మాత్రాన అవన్నీ కొట్టుకుపోవు. పరాజయాన్ని ఆత్మశోధన చేసుకుంటాం అని హరిపాద నియోజకవర్గంలో విజయం సాధించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల చెప్పారు.రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ పుతుపల్లి నియోజకవర్గం నుంచి పన్నెండవ సారి విజయం సాధించి గతంలో ఉన్న దివంగత కెఎం మణి రికార్డుతో సమం చేశారు. గత ఎన్నికలలో ఇరవై వేలకు పైగా మెజారిటీ తెచ్చుకున్న చాందీ ఈ సారి ఎనిమిదివేలతో సరిపెట్టుకున్నారు. ఒక విద్యార్ది నేత మీద ఇంత తక్కువ మెజారిటీ తెచ్చుకోవటం ఏమిటని కాంగ్రెస్‌ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. పరాజయాన్ని సవాలుగా తీసుకొని పని చేస్తామని చాందీ అన్నారు.


కరుణాకరన్‌ బిడ్డలు : అన్నకు మూడో స్ధానం – చెల్లికి రెండో స్దానం !


ఓడిపోయిన వారిలో మంత్రి, సిపిఎం సీనియర్‌ నేత మెర్సికుట్టి అమ్మ ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ రెండు సీట్లలో పోటీ చేశారు. శబరిమల ఆలయం ఉన్న కొన్ని నియోజకవర్గంలో సిపిఎం చేతిలో, మరో నియోజకవర్గంలో యుడిఎఫ్‌ ముస్లింలీగ్‌ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికలలో మంజేశ్వరమ్‌లో కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయిన సురేంద్రన్‌ ఈ సారి 1,143 తేడాతో పరాజయం పొందారు. కొన్ని నియోజకవర్గంలోని శబరిమల వివాదాన్ని రెచ్చగొట్టి గెలవాలని చూసి అక్కడ కూడా పరాజయం పాలయ్యారు. రెండు చోట్ల పోటీ చేయటం, ప్రచారానికి హెలికాప్టర్‌ను ఉపయోగించటం వంటి చర్యలు మంజేశ్వరమ్‌లో పరాజయానికి కారణమని మీడియా వ్యాఖ్యానించింది. కేరళ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని బిజెపి తొలిసారిగా తిరువనంతపురం నగరంలోని నీమమ్‌ నియోజకవర్గంలో గత ఎన్నికలలో కాంగ్రెస్‌ పరోక్ష మద్దతుతో గెలిచి ప్రాతినిధ్యం పొందింది. ఈసారి సిపిఎం చేతిలో ఓడిపోయింది. బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ గవర్నర్‌ అయిన కుమనం రాజశేఖరన్‌ ఇక్కడ పోటీ చేశారు. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ కుమారుడైన లోక్‌సభ సభ్యుడు మురళీధరన్‌ను అక్కడ నిలిపింది. ఆయన మూడవ స్దానంలో నిలిచారు. తన రాకతో బిజెపికి పెద్ద ఊపు వచ్చిందని, తానే ముఖ్యమంత్రి అభ్యర్ధిని అని చెప్పుకున్న మెట్రోమాన్‌ శ్రీధరన్‌ పాలక్కాడ్‌లో యుడిఎఫ్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి షఫీ పరంబిల్‌ చేతిలో ఓడిపోయారు. ఇక్కడ గత ఎన్నికలలో కూడా బిజెపి రెండవ స్దానంలో నిలిచింది. పాలక్కాడ్‌ మున్సిపాలిటీలో బిజెపి విజయం సాధించింది. పట్టణ ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో ఉన్న శ్రీధరన్‌ గ్రామీణ ప్రాంతంలోకి వచ్చే సరికి వెనుకబడిపోయారు. సినీహీరో సురేష్‌ గోపి బిజెపి అభ్యర్ధిగా త్రిసూర్‌లో పోటీ చేసి మూడవ స్ధానంలో వచ్చారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కె కరుణాకరన్‌ కుమార్తె పద్మజా వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్దిగా పోటీ చేశారు. ఆమెపై సిపిఐ అభ్యర్ధి పి బాలచంద్రన్‌ విజయం సాధించారు. పాల నియోజకవర్గంలో కేరళ కాంగ్రెస్‌ (ఎం) జోస్‌కె మణి పరాజయం పొందటం ఎల్‌డిఎఫ్‌ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. మణి ఎల్‌డిఎఫ్‌లో చేరటంతో అంతకు ముందు ఉప ఎన్నికలో గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌సిపి సభ్యుడు మణి సి కప్పన్‌కు వేరే చోట సీటు ఇస్తామని చెప్పినప్పటికీ అదే సీటు కావాలని పట్టుబట్టటం, ఎల్‌డిఎఫ్‌ తిరస్కరించటంతో కప్పన్‌ యుడిఎఫ్‌లో చేరి అదే సీటులో పోటీ చేసి పదివేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.


జయహౌ శైలజ టీచర్‌ – అయ్యప్పకు ఆగ్రహం !


ఎల్‌డిఎఫ్‌ను రెండవ సారి అధికారానికి తీసుకురావటంలో పినరయి విజయన్‌ ఒక రికార్డు స్దాపిస్తే, ఈ ఎన్నికలో ఆరోగ్యశాఖ మంత్రి సిపిఎం అభ్యర్ధిగా కెకె శైలజ రికార్డు స్ధాయిలో 61వేలకు పైగా ఓట్లతో కన్నూరు జిల్లాలో విజయం సాధించారు. గత ఎన్నికలలో ఇక్కడ సిపిఎం నేత ఇపి జయరాజన్‌ 43,381 ఓట్ల మెజారిటీ ఒక రికార్డు కాగా శైలజ దాన్ని బద్దలు కొట్టారు.
వయస్సులో ఉన్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశ సమస్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు జరిపినందుకు ప్రభుత్వంపై ధ్వజమెత్తి శాంతి భద్రతల సమస్యను సృష్టించిన కాంగ్రెస్‌, బిజెపిలకు ఈ ఎన్నికల్లో శృంగభంగమైంది. ఆ సమస్య సుప్రీం కోర్టు పునర్విచారణలో ఉన్నందున కోర్టు ధిక్కారమని తెలిసినప్పటికీ ఆ సమస్యను ప్రచారం చేశారు. తాము అధికారానికి వస్తే ప్రత్యేక చట్టం చేస్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. శబరిమల ఆలయ ప్రాంతం, పరిసరాలలో ఉన్న నియోజకవర్గాలలో ఎల్‌డిఎఫ్‌ అభ్యర్దులు విజయం సాధించారు. తనను అనవసరంగా వివాదంలోకి లాగినందుకు ఆ రెండు పార్టీల మీద అయ్యప్ప ఆగ్రహం పూనారా అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. తాము రాజకీయాలకు తటస్ధం అని ప్రకటించిన నాయర్‌ సర్వీసు సొసైటీ పోలింగ్‌ ప్రారంభమైన తొలిగంటలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సంస్ధ నేత ప్రకటించి తామెవరి పక్షమో వెల్లడించారు. కాంగ్రెస్‌ ఈ విషయంలో బిజెపికి కార్బన్‌ కాపీ మాదిరిగా వ్యవహరించింది. ఎల్‌డిఎఫ్‌ మాత్రమే ఏకైక లౌకికశక్తిగా జనం చూశారు. మైనారిటీలు అనేక ప్రాంతాలలో ఎల్‌డిఎఫ్‌ వైపు మొగ్గారని మధ్య, దక్షిణ కేరళ ఫలితాలు వెల్లడించాయి. తమ అభ్యర్ధి మెట్రోమాన్‌ శ్రీధరన్‌ను ఓడించేందుకు సిపిఎం మద్దతుదారులైన ముస్లింలు యుడిఎఫ్‌ అభ్యర్ధికి ఓటువేసి ఓడించారని, అనేక చోట్ల తమకు వ్యతిరేకంగా ఇదే చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. తాము 35 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సురేంద్రన్‌ ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఓటమితో గుండు కొట్టించుకోవద్దని ప్రత్యర్ధికి సలహా ఇచ్చిన మంత్రి !


ప్రియమైన స్నేహితుడా ఎన్నికల్లో ఓటమిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నియోజకవర్గంలో పరిస్ధితికి అనుగుణ్యంగా ఓటు వేశారని కేరళ విద్యుత్‌శాఖ మంత్రి ఎం ఎం మణి కాంగ్రెస్‌ అభ్యర్ధి ఇఎం అగస్తీకి సలహా ఇచ్చారు. తాను ఓడిపోతే గుండు గీయించుకుంటానని ఒక టీవీ ఛానల్లో అగస్తి శపధం చేశారు. ఇడుక్కి జిల్లాలోని ఉడుంబాలోంచా నియోజకవర్గంలో 38,305 పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన మంత్రి తన విజయానికి దోహదం చేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భోళామనిషిగా పేరున్న మంత్రి ప్రత్యర్ధుల మీద పంచ్‌లు వేయటంలో ఆయనకు ఆయనే సాటి.

మరోసారి మీడియా, కాషాయ దళాల చైనా వ్యతిరేక ప్రచారం- వాస్తవాలు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మరోసారి మీడియా – కాషాయ దళాలు ప్రచారదాడితో రెచ్చిపోతున్నాయి. ఎవరెంత సమర్దవంతంగా జనాన్ని పక్కదారి పట్టించగలమో చూద్దాం అన్నట్లుగా మిత్రులుగా పోటీ పడుతున్నాయి. నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ప్రతిసారీ వాటికి ఏదో ఒక అంశం, బకరాలు కావాలి. కరోనా రెండవ దశను ఊహించటంలో వైఫల్యం, అలక్ష్యం, అసమర్ధ నిర్వహణ ఒకటేమిటి ? వందకు ఒకటైనా ప్రతికూల వార్తకు చోటు కల్పించకపోతే ” చాల బాగోదు ” కనుక బాధ్యత ఎవరిది అనే అంశాన్ని తెలివిగా పక్కన పెట్టి సమస్య తీవ్రతను ప్రతిబింబించక మీడియాకు తప్పని స్ధితి. కాషాయ దళాల ఆరాధ్య దైవం గోబెల్స్‌. రాముడికైనా విరామం ఇస్తారేమో గానీ ఆయనకు రోజూ అబద్దాల నైవేద్యం పెట్టటం మానరు. ఎవరైనా నిజాలు చెప్పటంలో పోటీ పడితే మంచిదే. కానీ జరుగుతోందేమిటి ?


వద్దంటున్నా అనుమతించిన ఉత్తరాఖండ్‌ కుంభమేళా ( మనం పుష్కరాలు అంటాం) గంగలో మునిగిన వారు కరోనాను ఎలా వ్యాప్తి చేస్తున్నారన్నదాన్ని గురించి చెప్పటంలో వాటి మధ్య పోటీ లేదు. గతంలో తబ్లిగీ సమావేశాల సందర్భంగా చేసిన రచ్చ ఊసేలేకుండా జాగ్రత్త పడుతున్నాయి. జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 వరకు 91లక్షల మంది గంగలో మునిగారని, ఒక్క ఏప్రిల్లోనే 60లక్షల మందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరాఖండ్‌లో మార్చి 31న కేవలం 1,862 కేసులుండగా ఏప్రిల్‌ 24 నాటికి 33,330 పెరిగినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎంత మందికి అంటించారో తెలియదు. దేశాన్ని వస్తు ఉత్పత్తి కేంద్రంగా మార్చి యావత్‌ ప్రపంచానికే ఎగుమతులు చేస్తామని చెప్పిన వారు స్వంత జన ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పిత్తి, పంపిణీ చేయటంలో కూడా ఎందుకు విఫలమయ్యారో, విదేశీ సాయం కోసం ఎదురు చూడాల్సిన అగత్యం గురించి చెప్పటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం రంకు-భారతం బొంకు అన్న ఇతిహాసాలలోని అధ్యాయాలను మించిపోతాయి. రాబోయే రోజుల్లో వాటి గురించి ఎలాగూ చెప్పుకుంటాం గనుక అసలు విషయానికి వద్దాం.

ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెల వంటి జీవులు ఆహారం దొరకగానే ఆబగా కొద్దిగా నమిలి తింటాయి. తరువాత తీరికగా నోట్లోకి తెచ్చుకొని పూర్తిగా నమిలి మింగుతాయి, దీన్నే నెమరు వేసుకోవటం అంటారు. మనుషులు అలా చేసేందుకు అవకాశం లేదు గానీ జరిగిన అంశాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని నెమరు వేసుకోవచ్చు. గత రెండు నెలల కాలంలో జరిగిన కొన్ని ముఖ్య పరిణామాల గురించి ఒక్కసారి చూద్దాం. ఏప్రిల్‌ 28నాటికి అమెరికాలో పది కోట్ల మందికి పూర్తిగా వాక్సిన్‌ వేశారు, మరో 23 కోట్ల మందికి ఒక డోసు వేశారు.వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అమెరికాలో 80 కోట్ల డోసులు అందుబాటులోకి రానుంది. జనాభా అంతటికీ వేసిన తరువాత కూడా పది కోట్ల డోసుల వరకు అదనంగా ఉంటుంది. అయినా అదేమిటో డబ్బు చెల్లిస్తామురా నా ప్రియమైన ఒకే మంచం ఒకే కంచం దోస్తూ అని మన దేశం రెండు నెలల నుంచి మొత్తుకుంటున్నా కోవిషీల్డ్‌ వాక్సిన్‌ తయారీకి అవసరమైన 37 రకాల ముడి పదార్దాలు, పరికరాలను విక్రయించేందుకు కొద్ది రోజుల క్రితం అంగీకరించాం అన్న ప్రకటన తప్ప ఇంతవరకు (మే 1 ) పంపిన దాఖలా లేదు. ఇది కూడా పాక్షిక సడలింపు మాత్రమే అని చెబుతున్నారు.


గతేడాది జరిగిన పరిణామాల నేపధ్యంలో మొత్తంగా మీడియా లేదా పూర్తిగా కాషాయ దళాలుగానీ చైనాను దోస్తుగా పరిగణించటం లేదు. యాప్‌లను నిషేధించారు, అక్కడి నుంచి పెట్టుబడులను ఆపేశారు. వస్తువుల దిగుమతి నిలిపివేసి కాళ్ల దగ్గరకు వచ్చేలా చేసుకుంటామని చెప్పారు. చైనా వస్తువులు నాశిరకం అన్నారు. వాటిని బహిష్కరించాలని పెద్ద హడావుడి చేశారు. ఇదిగో చూడండి మన దిగుమతులు తగ్గిపోయాయని అంకెలు చెప్పారు. అక్కడ తయారు చేసిన వాక్సిన్‌లో పసలేదని రాశారు. ఔషధాల నాణ్యత ప్రశ్నార్దకం అన్నారు. గతేడాది నవంబరు నుంచి రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలు, వీసాల జారీలేదు. సరిహద్దు వివాదం గురించి ఎడతెగని చర్చలు సాగుతున్నాయి, ఎటూ తేలటం లేదు. అవి ఎప్పుడు పూర్తవుతాయో లడఖ్‌ కొండలెక్కించిన మన సైనికులను కిందికి ఎప్పుడు దింపుతారో తెలియదు. ఏ విధంగా చూసినా చైనాను శత్రువుగానే పరిగణిస్తున్నారు. చైనా ప్రభుత్వ సిచువాన్‌ విమాన సంస్ధ పదిహేను రోజుల పాటు వస్తురవాణా విమానాల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించింది. తరువాత వెంటనే తిరిగి అనుమతిస్తామని, అవసరాన్ని బట్టి కొత్త షెడ్యూలును ప్రకటిస్తామని చెప్పింది. ఈలోగా ఇంకే ముంది సాయం చేస్తామని మోసం చేసింది, సరఫరాలను అడ్డుకుంటున్నది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే గతేడాది నవంబరు నుంచి ప్రయాణీకుల విమానాల రాకపోకలు లేకున్నా మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చైనా నుంచి సిచువాన్‌ సంస్ధ వస్తురవాణా విమానాలను నడుపుతూనే ఉంది.సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. భారత్‌తో కరోనా విపరీతంగా పెరిగిన కారణంగా పదిహేను రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఏప్రిల్‌ చివరి వారంలో ప్రకటించింది. అంటే అప్పటి వరకు అటు నుంచి ఇటు నుంచి అటు సరకు రవాణా జరుగుతూనే ఉంది. కాషాయ దళాలు చెప్పినట్లు చైనా వస్తువుల బహిష్కరణ లేదు, పాడూ లేదు. తమకు అనేక దేశాల నుంచి ఆర్డర్లు ఉన్నాయని, వాటి తయారీలో తలమునకలుగా ఉన్నామని, అందువలన భారత ప్రభుత్వం తమకు ఏమి కావాలో స్పష్టంగా చెబితే దానికి అనుగుణ్యంగా చర్య తీసుకుంటామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. మన దేశం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ లోగా కాషాయ దళం రంగంలోకి దిగింది. చైనా ప్రకటనపై మోడీ సర్కార్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఇంతవరకు అధికారికంగా స్పందన లేదు. మీడియా, కాషాయ దళాలు రచ్చ చేస్తున్నాయి. దక్షిణాసియా దేశాలలో కరోనా నిరోధం గురించి చర్చించేందుకు చైనా విదేశాంగ మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి మన దేశం డుమ్మాకొట్టింది.


ముడిసరకులపై నిషేధం ఎత్తివేసేందుకు నిరాకరించి వాక్సిన్‌ తయారీకి ఆటంకం కలిగేందుకు కారణమైన అమెరికా గురించి పల్తెత్తు మాట మాట్లాడని వారు చైనా పదిహేను రోజుల పాటు విమానాలను నిలిపివేస్తామని ప్రకటించగానే ఇంకేముంది నమ్మక ద్రోహం చేసింది, దాని బుద్ది బయటపెట్టుకుంది అంటూ రెచ్చిపోవటం ఏమిటి ? అప్రకటన చేసే ముందు రోజు వరకు మనకు అవసరమైన అత్యవసర సరఫరాలన్నింటినీ చైనా నుంచి తెచ్చుకున్నది వాస్తవం కాదా ? నేరుగా చైనా నుంచి గాకుండా ఇతర దేశాల మార్గాల ద్వారా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది, ప్రభుత్వ కంపెనీ గాకుండా ఉన్న మరో విమాన కంపెనీ ఎలాంటి నిషేధం విధించలేదు, దాని ద్వారా తెచ్చుకోవచ్చు. నిజానికి మనలను ఇబ్బంది పెట్టదలచుకుంటే అమెరికా మాదిరి నిషేధమే విధించవచ్చు కదా ! మనకు ఎగుమతి చేసే వాటి మీద మన నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద భారీ ఎత్తున పన్నులు విధించిందన్నది మరొక తప్పుడు ప్రచారం. నిజంగా ఆ పని చేస్తే దాపరికం ఏముంది ? గతంలో జిగినీ దోస్తు అమెరికా ట్రంపు అదేపని చేసినపుడు మీడియాలో వార్తలు వచ్చాయిగా, నిజంగా చైనా ఆ పని చేస్తే ఏ మీడియా కూడా ఎందుకు వార్తలు ఇవ్వలేదు.మన దేశం కూడా చైనా వస్తువుల మీద అదే మాదిరి పన్నులు ఎందుకు విధించకూడదు.

సిచువాన్‌ విమానాలను రద్దుచేసినట్లు ప్రకటించిన తరువాత హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి చైనాకు చెందిన 800 ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు వచ్చినట్లు, వారంలో మరో పదివేలు పంపుతున్నట్లు కొలంబోలో చైనా రాయబారి ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో 26వేల వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ జనరేటర్లు పంపినట్లు చైనా విదేశాంగ మంత్రి ప్రకటించారు. చైనా నుంచి నేరుగా అవకాశం లేకపోతే సింగపూర్‌, ఇతర ప్రాంతాల మీదుగా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది.ఏప్రిల్‌ ఒకటి నుంచి 25వ తేదీ వరకు చైనా నుంచి ప్రతి రోజూ మన దేశానికి సగటున ఐదు విమానాలు నడిచాయి. వాటిలో సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు కూడా ఉన్నాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ సినిమా నటుడు చైనా తీసుకున్న నిర్ణయం కారణంగా తాను ఆర్డరు పెట్టిన ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు ఆగిపోయాయని ఢిల్లీలోని చైనా రాయబారికి పంపిన ట్వీట్‌లో పేర్కొన్నారు. దాని మీద స్పందించిన రాయబారి ట్వీట్లద్వారా సమాధానం పంపుతూ రెండు దేశాల మధ్య సరకు రవాణా విమానాలు మామూలుగానే తిరుగుతున్నాయని, గత రెండు వారాల్లో 61 విమానాలు తిరిగాయని వెల్లడించారు. అనుమానాలుంటే ఎవరైనా తీర్చుకోవచ్చు, సమస్యలుంటే పరిష్కరించాలని కోరవచ్చు.
అందువలన నిజాలేమిటో, సమస్య ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి తీవ్ర విమర్శలు చేయటం తగనిపని, మనకే నష్టం. కొద్ది రోజులుగా పద్దెనిమిది వేల ఆక్సిజన్‌ యంత్రాలకు మన దేశం నుంచి వివిధ సంస్ధలు ఆర్డరు చేశాయని చైనాలోని పెద్ద మెడికల్‌ కంపెనీ జియాంగ్‌సు యు మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తెలిపింది. భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఉన్న కారణంగా వెంటనే సరఫరా చేయలేమని, నెల రోజులు కూడా పట్టవచ్చని, భారత మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చైనా సంస్దలు చెబుతున్నాయి.


గతేడాది చైనాతో తలెత్తిన సరిహద్దు వివాద నేపధ్యంలో మోడీ సర్కార్‌ వైఖరిలో అస్పష్టమైన మార్పు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే చైనా నుంచి అత్యవసర వస్తువులను కొనుగోలు చేస్తున్నాము. భారత్‌ నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు 25వేల ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లను సరఫరా చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నామని భారత్‌లో చైనా రాయబారి సన్‌ వెయిడోంగ్‌ నిర్ధారించారు. వాటిని సరఫరా చేసేందుకు అసరమైన సరకు రవాణా విమానాలను సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.చైనా నుంచి వస్తువులను తీసుకుంటున్నామని భావనా పరమైన సమస్యలేవీ లేవని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు మీడియా-కాషాయ దళాలు ఎందుకు రచ్చ చేస్తున్నాయి ?


లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్‌ఫినిటీ అనే సంస్ధ సేకరించిన సమాచారం ప్రకారం మార్చినెలాఖరుకు 16.4 కోట్ల కరోనా వాక్సిన్‌ డోసులను అమెరికా ఉత్పత్తి చేసింది. ఒక్కడోసు కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయలేదు. ఐరోపా యూనియన్‌ పదకొండు కోట్ల డోసులు ఉత్పత్తి చేయగా 42శాతం ఎగుమతి జరిపింది. చైనాలో తయారైన సినోవాక్‌, సినోఫామ్‌ 20 కోట్ల డోసులను ఎగుమతి చేశారు. అమెరికా మీద తీవ్రమైన వత్తిడి రావటంతో రాబోయే రోజుల్లో ఆరుకోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌ ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. ఇది గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం వంటిదే. ఈ వాక్సిన్‌ వినియోగానికి అమెరికాలో అనుమతి ఇవ్వాలో లేదో నిర్ణయించక ముందేే కొనుగోలు చేశారు. తరువాత అనుమతి ఇవ్వలేదు. అందువలన దాన్ని వదిలించుకొనేందుకు ముందుకు వచ్చింది. లేనట్లయితే అది నిరుపయోగంగా అక్కడే ఉండిపోతుంది.


వాక్సిన్‌ తయారీలో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికా సంస్దలదే గుత్తాధిపత్యం.అక్కడి ఫైజర్‌ కంపెనీకి అవసరమైన ముడిపదార్దాల సరఫరా తద్వారా దాని లాభాలను ఇబ్బడి ముబ్బడి చేసేందుకు వాటి మీద నిషేధం విధించినట్లు చెబుతున్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమెరికా, ఐరోపా స్వంతం కావటంతో వేగంగా పెద్ద మొత్తంలో తయారు చేసి సొమ్ము చేసుకొనేందుకు వాక్సిన్‌ తయారీని ఒక్కోదశలో ఒక్కో దేశానికి అప్పగించారు. మోడెర్నా వాక్సిన్‌ స్విడ్జర్లాండ్‌లో తయారు చేసి దాన్ని సీసాల్లో నింపేందుకు స్పెయిన్‌కు పంపుతారు. బ్రిటన్‌ కంపెనీ క్రోడా వాక్సిన్‌ తయారు చేసి సీసాల్లో నింపేందుకు నార్మండీ, ఫ్రాన్స్‌ పంపుతున్నారు. ఒక వేళ తమ కంపెనీ వాక్సిన్‌ వికటించి వినియోగించిన వారికి పరిహారం చెల్లించాల్సి వస్తే కోర్టు దావాల నుంచి ఔషధ కంపెనీలకు రక్షణ కల్పించేందుకు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇతర దేశాలు ప్రభుత్వ ఆస్తులను, రిజర్వుబ్యాంకుల నిధులు, మిలిటరీ కేంద్రాల వంటి వాటిని తాకట్టుపెట్టాలని ఫైజర్‌ కంపెనీ వత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇదేంట్రాబాబూ తొలి రోజుల్లోనే బిడెన్‌ పెద్దమనిషి ట్రంప్‌ కంటే దారుణంగా తయారయ్యాడు అని ఎక్కడ అనుకుంటారో, అమెరికా వ్యతిరేకత ఎక్కడ పెరుగుతుందో అనే భయం – బిడియంతో వాక్సిన్‌ తయారీ వస్తువులపై నిషేధాన్ని కాస్త సడలించేందుకు నిర్ణయించుకున్నట్లుగా గత కొద్ది రోజుల పరిణామాలు స్పష్టం చేశాయి.

అజిత్‌ దోవల్‌ ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్పి దారికి తెస్తారని, అమెరికాను అదే విధంగా హెచ్చరించి మనకు సరఫరాలు చేసేందుకు అంగీకరింప చేయించారని కాషాయ దళాలు ప్రచారం ప్రారంభించాయి. మరి అదే అజిత్‌ దోవల్‌ చైనా విషయంలో కూడా అదే విధంగా ఎందుకు వ్యవహరించలేదు, అమెరికా కంటే బలహీనమైన చైనాను కాషాయ దళాల భాషలో చెప్పాలంటే ఎందుకు మన కాళ్లదగ్గరకు తేలేదు ? చివరికి బలహీన పాకిస్దాన్‌న్ను ఎందుకు అంకెకు తేలేకపోయారు ? మన ఇరుగు పొరుగుదేశాలను మన వైపు ఎందుకు తిప్పలేకపోయారు. అజిత్‌ దోవల్‌కు అంతసీన్‌ లేదు ! నరేంద్రమోడీ కంటే బలవంతుడా ! అందరికీ చెడ్డాం, చివరికి మీరు కూడా ఇలా చేస్తే మా మోడీ పరువు, పనేంగాను అని సాష్టాంగపడ్డారేమో ? చరిత్రలో ఇలాంటివారిని అమెరికన్లు ఎందరినో చూశారు. తిరిగే చక్రం మీద కూర్చున్న ఈగ దాన్ని తానే తిప్పుతున్నట్లు భావిస్తున్నట్లుగా ఈ ప్రచారం ఉంది. ఇలాంటి పోసుకోలు కబుర్లతో నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పిపుచ్చగలరా ? తోకపట్టుకొని పోవటం తప్ప మరొక విధంగా వ్యవహరించలేని రీతిలో మనం అమెరికా చేతిలో చిక్కాము. దాన్ని నమ్మి రెచ్చి పోయి చైనా, పాకిస్దాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకున్నాం, వాటన్నింటినీ చైనాకు దగ్గర చేశాము. రెండునెలలుగా ససేమిరా అని మొరాయిస్తుంటే అజిత్‌ దోవల్‌ గానీ నరేంద్రమోడీ గానీ చేసిందేమీ లేదు. మిత్రదేశం అని చెప్పిన భారత్‌ను అమెరికన్లు ఎలా నిర్లక్ష్యం చేశారో చూడండి అంటూ చైనా మీడియాలో వ్యాఖ్యలు, ఇతర దేశాల నుంచి విమర్శలు, వత్తిడి, అన్నింటికీ మించి మన దేశంలో అమెరికా వ్యతిరేకత పెరిగితే తమకూ, అనుయాయి నరేంద్రమోడీకి నష్టం అని లెక్కలు వేసుకున్న తరువాతనే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది.


శ్రీరాముడంతటి శక్తివంతుడే రావణుడిపై పోరుకు ఉడత సాయం తీసుకున్నారని గొప్పగా చెప్పుకుంటారు. రాముడి అడుగుజాడల్లో నడుస్తున్నామని చెబుతున్నవారు పాక్‌ నుంచి సాయం తీసుకొనేందుకు తిరస్కరించటం శ్రీరాముడి పట్ల అపచారం చేసినట్లు కాదా ?వెంటిలేటర్లతో సహా కొన్ని ఇతర వైద్య సామగ్రిని పంపుతామని పాకిస్ధాన్‌ ప్రకటించింది. అయితే దాన్ని స్వీకరిస్తామని గానీ తిరస్కరిస్తున్నట్లుగానీ మోడీ సర్కార్‌ ప్రకటించలేదు. స్వీకరించటం తమ స్ధాయికి భంగకరమని, తలెత్తే ప్రశ్నలు, విమర్శలకు సమాధానాలు చెప్పలేమని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.పాకిస్ధాన్‌తో సయోధ్య కుదిరినట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పటికీ ఈ వైఖరితో వ్యవహరించటం గమనించాల్సిన అంశం. పదహారు సంవత్సరాల క్రితం విదేశీ సాయం తీసుకోవటంపై మన్మోహన్‌ సింగ్‌ హయాంలో స్వయంగా విధించుకున్న ఆంక్షలను గుట్టుచప్పుడు కాకుండా నరేంద్రమోడీ ఎత్తివేసింది. చైనా నుంచి ప్రాణావసర ఔషధాలు, ఆక్సిజన్‌, సంబంధిత పరికరాలను తీసుకొనేందుకు భావనా పరమైన సమస్యల్లేవని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొన్నది. అయితే పాకిస్ధాన్‌ నుంచి స్వీకరించే విషయంలో ఏం చేయాలనేది స్పష్టం చేయలేదు. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం విదేశాల నుంచి బహుమతులు, విరాళాలను స్వీకరించాల్సి వస్తే వాటిని రెడ్‌ క్రాస్‌ సంస్ధకు మాత్రమే అందచేయాలి, దాని ద్వారానే పంపిణీ చేయాలి.ప్రభుత్వాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవాటికి వెల చెల్లించి మాత్రమే తీసుకోవాలి. గత కొద్ది రోజులుగా అమెరికాతో సహా వివిధ దేశాల నుంచి ప్రకటిస్తున్న సాయమంతా డబ్బు చెల్లించి కొనుగోలు చేసేదే అని గ్రహించాలి. విధాన సడలింపుల తరువాత వచ్చే సాయంలో కొంత విరాళం కొంత నగదు చెల్లింపులు ఉండే అవకాశం ఉంది. ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలు, ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తున్న నేపధ్యంలో ఈ మార్పు చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేరుగా తమకు అవసరమైన వాటిని విదేశాల నుంచి సేకరించుకోవచ్చని కేంద్రం సూచించింది.

అంతకు ముందు ఉత్తరా ఖండ్‌ భూకంపం(1991) లాతూర్‌ భూకంపం(1993) గుజరాత్‌ భూకంపం(2001) బెంగాల్‌ తుపాను(2002) బీహార్‌ వరదలు(2004) సంభవించిన సమయాలలో విదేశీ సాయం తీసుకున్నాము.2004లో సునామీ తరువాత పరిస్ధితిని మనకు మనమే ఎదుర్కోగలమంటూ విదేశీ విరాళాలను తీసుకోవద్దని, అవసరమైతే వారి సాయం తీసుకుందామని నిర్ణయించారు. దీనికి అనుగుణ్యంగా 2005లో కాశ్మీరులో భూకంపం, అక్కడే 2014లో వరదల సమయాలో, 2013లో ఉత్తరా ఖండ్‌ వరదల సమయంలో విదేశీ విరాళాన్ని తీసుకొనేందుకు ప్రభుత్వ నిరాకరించింది.తాజా విషయానికి వస్తే లక్షలాది మంది మళయాలీలు పని చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం 2018లో కేరళ వరదల సమయంలో 700 కోట్ల రూపాయల విరాళం అందచేస్తామని ముందుకు వచ్చినపుడు కేంద్రం తిరస్కరించింది. ఆ మేరకు కేంద్రం సాయం ఇవ్వకపోవటం తీవ్ర విమర్శలు రావటం అది వేరే విషయం. కానీ అదే ప్రభుత్వం పిఎం కేర్‌ నిధికి ఎవరు విరాళం ఇచ్చినా తీసుకోవాలని గతేడాది నిర్ణయించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే స్వీకరించనుంది. అయితే ఈ అంశాన్ని బహిరంగంగా ప్రకటించలేదని, ఇదే సమయంలో సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం ఎలాంటి వినతులు చేయలేదని, ప్రభుత్వాలు లేదా ప్రయివేటు సంస్ధలు ఏవైనా బహుమతిగా విరాళం ఇస్తే కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరిస్తామని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది. గతంలో మన ప్రభుత్వం ఇతర దేశాలకు విరాళంగా ఇచ్చిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ నుంచి వాక్సిన్లకు ప్రతిగా ఇలాంటి విరాళాలు వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఇప్పుడు కావాల్సింది ఏమిటి ? ప్రపంచ లేదా ప్రాంతీయ రాజకీయాలు, శత్రుత్వమా ? ప్రజల రక్షణా ఏది ముఖ్యం. నిజమైన రాజనీతి ప్రాధాన్యత జన సంక్షేమం అన్నది స్పష్టం. గతంలో అన్ని దేశాలూ రాజకీయాలు చేశాయి. ఒకదానిని ఒకటి దెబ్బతీసుకొనేందుకు ప్రయత్నించాయి. మనం తప్ప మిగతావన్నీ అదే చేశాయనే కాషాయ ప్రచారాన్ని ఎవరైనా నమ్మితే తప్పుదారి పట్టినట్లే. చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో చతుష్టయం పేరుతో కలిశాము. అయినా దానిని పక్కన పెట్టి చైనీయులు మనకు అవసరమైన వాటిని విక్రయిస్తున్నారు. ఎలాంటి నిషేధం పెట్టలేదు. మిత్రదేశం అనుకున్న అమెరికా ఆ పని చేసింది. మనకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ -చైనా దగ్గరయ్యాయి. అమెరికాకు అనుకూలంగా మనం ఇరాన్‌ను దూరం చేసుకున్నాము. అమెరికాకు వ్యతిరేకంగా అది చైనాకు దగ్గరైంది. ఇతర ఇరుగుపొరుగు దేశాలు కూడా అమెరికాతో మన సంబంధాల కారణంగా చైనా వైపు మొగ్గుచూపుతున్నాయన్నది స్పష్టం. ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు, దేనితో ఎలా తేల్చుకోవాలో తరువాత నిర్ణయించుకోవచ్చు. సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో స్నేహం చేశాము, ఇప్పటికీ ఎగుమతి-దిగుమతి కొనసాగుతూనే ఉంది. పాకిస్ధాన్‌తో వైరం ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు వాణిజ్యంలో అత్యంత సానుకూల హౌదా ఇచ్చాము. ఒకవైపు మిత్ర రాజ్యం అంటూనే మరోవైపున మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దలో ఫిర్యాదులు చేస్తున్నది, మన వస్తువుల దిగుమతులపై ఉన్న పన్ను రాయితీలను రద్దు చేసింది, కొత్తగా దిగుమతి పన్నులు వేసింది. మాకు మా దేశ పౌరులు తప్ప మిగతావారి గురించి పట్టించుకోము అంటూ వాక్సిన్‌ ముడిసరకులు, పరికరాలపై నిషేధం విధించినా అమెరికాతో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే విధానం చైనా, పాకిస్దాన్‌తో ఎందుకు అనుసరించకూడదో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వివాదాలు, విబేధాలతో రాజీపడాలని, లొంగిపోవాలని ఎవరూ చెప్పటం లేదు. ప్రజానుకూలంగా విధానాలుండాలని చెప్పటం తప్పుకాదు. అలాంటి వైఖరి, విదేశాల సాయం లేకుండా కరోనా బారి నుంచి మన జనాన్ని మన ప్రభుత్వం కాపాడగలదా ?

ఆపదలో ఆదుకుంటాయని నమ్మిన అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు ముఖం చాటేశాయి.మనలను చైనాకు వ్యతిరేకంగా ఉపయోగించుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత ఆదుకొనేందుకు ఇవ్వలేదని కరోనా నిరూపించింది. మార్చినెలలో జరిగిన తొలి చతుష్టయ సమావేశంలో ప్రపంచానికి వంద కోట్ల వాక్సిన్లు అందించాలని, వాటిని భారత్‌లో తయారు చేసేందుకు అవసరమైన సాయం చేయాలని కూటమి నిర్ణయించింది. ఇప్పుడు మన దేశమే వాక్సిన్ల కొరతను ఎదుర్కొంటుంటే మిగతా దేశాలు ముఖం చాటేస్తున్నాయి. ముడిపదార్దాల సరఫరాను అడ్డుకుంటున్నాయి. లక్షల సంఖ్యలో ఆక్సిజన్‌ జనరేటర్లు మనకు అవసరం కాగా కొన్ని వందలు పంపుతూ దాన్నే పెద్ద సాయంగా అమెరికా చిత్రిస్తున్నది. జపాన్‌ మౌనంగా ఉంది.మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెప్పే, గుండెలు బాదుకొనే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కరోనా వాక్సిన్ను మానవ హక్కుగా పరిగణించటం లేదు. అలాంటి వాటిని నమ్మి అలీన విధానానికి తిలోదకాలిచ్చి వాటి చంకనెక్కితే ప్రయోజనం లేదని తేలిపోయింది కనుక భేషజాలకు పోకుండా ఇప్పటికైనా మన విదేశాంగ విధానాన్ని పున:పరిశీలించుకోవటం అవసరం.
హొహొహొ

వాక్సిన్‌లను కంపల్సరీ లైసెన్సు క్రిందకు తేవాలి !

Tags

, ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

కరోనా మొదటి వేవ్‌ తోనే విలవిల్లాడిన ప్రజలు రెండవ సారి వచ్చిన కరోనా వేవ్‌ ను తట్టుకోలేకపోతున్నారు. తీవ్రమైన భయం, ఆందోళన తో జీవిస్తున్నారు. హాస్పిటల్‌ లో బెడ్స్‌ దొరకక, ఆక్సిజన్‌ లేక, మందులు అందుబాటులో లేక, హాస్పిటల్‌ ఖర్చులు, మందుల ధరలు భరించలేక సగం చచ్చిపోతున్నారు. మరణించినవారికి శ్మశానం లో కూడా చోటు దొరకటంలేదు. శ్మశాన వాటికలో ఖర్చులుకూడా పెరిగి బ్రోకర్లు చేరి పాకేజీలు ప్రవేశపెట్టారు.

కరోనా వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించిన కీలకమైన ముడిపదార్ధాల ఎగుమతులపై నిషేదాన్ని ఎత్తి వేయమని కోరిన సీరమ్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత అభ్యర్ధనను అమెరికా ఫ్రభుత్వం నిరాకరించింది. ” మా ప్రయోజనాలే మాకు ముఖ్యం. అమెరికా ప్రజల ప్రాణాలను కాపాడుకోవలసిన భాధ్యత మా ప్రభుత్వం పై వుంది.అమెరికా కంపెనీలు దేశీయ వినియోగానికి ప్రాధాన్యత నివ్వాలనేదే ఇక్కడి చట్టం ” అని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మీడియాతో చెప్పాడు. తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు పంపకపోతే….ప్రతీకారం …తీర్చుకుంటామని ఆనాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరించిన కొద్ది సేపటికే తీవ్ర ప్రభావిత దేశాలకు ఇనోక్షేన్‌ నివారణకోసం మాత్రలను అందచేస్తామని భారత్‌ ప్రకటించింది. మన దేశాన్ని బెదిరించి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను తీసుకు వెళ్లిన అమెరికా, మన కవసరమయిన కరోనావాక్సిన్‌ ముడిపదార్ధాలు ఇవ్వడానికి నిరాకరించింది. డెమోక్రాటిక్‌ పార్టీ లోని ఇండియన్‌ అమెరికన్ల ఒత్తిడి, ప్రపంచప్రజాభిప్రాయం తరువాత వాక్సిన్‌ ముడిపదార్ధాలను ఇవ్వటానికి అంగీకరించారు.

దేశంలో ఆరోగ్యం అత్యవసర పరిస్థితిని అధిగమించటానికి సార్వత్రిక, సామూహిక వ్యాక్సినాటిన్‌ కార్యక్రమం చేపట్టాలి. మసూచి,బీ సీ జీ, అన్ని టీకాలూ అందరికీ ఉచితంగా ఇవ్వటం ఇప్పటిదాకా అనుసరించిన మంచి విధానం. పోలియో, యం యం ఆర్‌, పెంటావేలేవుట్‌ వాక్సిన్‌ వరకూ అన్ని కేంద్రప్రభుత్వమే ఉచితంగా ఇచ్చేది. కరోనా వాక్సిన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకొని రాష్ట్ర ప్రభుత్వాలపై బాధ్యతను నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రజలను కొనుక్కోమని కూడా చెప్తున్నది.
తెలుగు ప్రజలు త్యాగంతో సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఔదార్యంతో ఆక్సిజెన్‌ ఇచ్చి అనేక రాష్టాల్లోని ప్రజల ప్రాణాలను నిలుపుతున్నది. ప్రాణాలను నిలిపేది సమాజ శ్రేయస్సు కోరేప్రభుత్వ సంస్థలేనని ఇప్పటికయినా ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వ మందుల కంపెనీలు ఐ డీ పీ యెల్‌ ఉంటే రెండేసివీర్‌ ఇంజక్షన్‌ అతి తక్కువ ధరకు లభ్యమయ్యేది. వేల రూపాయల్లో బ్లాక్‌ మార్కెట్‌ సాగే అవకాశం ఉండేదా?

కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా ప్రభుత్వం దగ్గర పేటెంట్‌ ఆర్డరు వేయించుకుని అంతులేని ధనార్జనకు పూనుకుంటున్నారు.. అంటే పేటెంటె తీసుకుంటారు. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకోంటున్నారు.

కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వాలి

డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు తెలిసో తెలియకో ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వటానికి అవకాశంవున్నది. 1970 పేటెంట్‌ చట్టం సెక్షన్‌ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్‌ లో అందుబాటులో లేకపోతే పెటెంట్‌ ఆఫీసర్‌ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్సను ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్‌ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. సెక్షన్‌ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చునని చట్టం లో ఉంది.. చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు పేటెంట్‌ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది.

సోరాఫెనిబ్‌ ( బ్రాండ్‌ నేమ్‌ ..నెక్సావార్‌) అనే లివర్‌ ,కిడ్నీకేన్సర్‌ మందును బేయర్‌ కంపెనీ తయారు చేసి మన దేశంలో అమ్ముతున్నది. అందుకు బేయర్‌ కంపెనీకి 1970 పేటెంటె చట్టం ప్రకారం హక్కులున్నాయి. ఆ కేన్సర్‌ మందును వేరెవరూ తయారుచేయకూడదు. అమ్మకూడదు . నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేల కు అమ్ముతున్నది. పేటెంటు చట్టం పేరున ప్రపంచ ప్రజలను పీక్కు తింటున్నారు. రీసర్చ్‌ ఖర్చులు ఒకటి రెండు సంవత్సరాలలోనే వసూలు చేసుకొంటున్నారు. మందు తయారీ ఖర్చుకు కొన్ని వేల రెట్లు అధికంగా 20 సంవత్సరాలు వసూలు చేస్తున్నారు. ఒక టన్ను ముడిసరుకును కొని మిల్లీ గ్రాముల పరిమాణంతో బిళ్ళలు , ఇంజక్షన్లు తయారుచేసి ఇష్టమొచ్చిన ధర కి అమ్ముకుంటున్నారు. 2012 మార్చినెలలో ఇండియన్‌ పెటెంట్‌ ఆఫీసర్‌ పీ హెచ్‌ కురియన్‌ ధైర్యంగా ప్రజలకు అనుకూలంగా తీర్పును ఇచ్చారు. మొదటిసారీ ఆఖరుసారీ ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్‌ ఆర్డరును ఇచ్చి కురియన్‌ చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే నెక్సావార్‌ కాన్సర్‌ మందును రూ.8800. కు అమ్మేటట్లుగానూ బేయర్‌ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్‌ పేటెంట్‌ యాక్ట్‌ 2005 క్రింద పేటెంట్‌ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది. నాట్కో కంపెనీకి అనుమతించింది, 50 ఏళ్ళ పేటెంట్‌ చట్టం చరిత్ర లో ప్రజల మేలుకోసం ఇచ్చిన తీర్పు ఇదే.
అత్యవసర పరిస్ధితులలో ” కంపల్సరీ లైసెన్సు ” ఇవ్వవచ్చు. కరోనా మహమ్మారి కిమించి అత్యవసర పరిస్ధితి ఏమున్నది.? ప్రభుత్వం, మందుల కంపెనీలు కంపల్సరీ లైసెన్సును తీసుకోవచ్చు కదా. పేటెంట్‌ చట్టం ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? రెండేసివర్‌ మందును, కావాక్సిన్‌, కోవిషిల్డ్‌ వాక్సిన్లను కంపల్సరీ లైసెన్స్‌ క్రిందకు తీసుకురావచ్చు. కరోనా బాధితు లందరికీ కరోనా మందులను, వాక్సిన్లను అందించి ప్రాణాలను కాపాడ వచ్చు. ఈ అవకాశాన్ని మందుల కంపెనీలు, ప్రభుత్వం ఉపయోగించుకుని ప్రజలను కరోనానుండి కాపాడే అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్‌-19 కి కాకపోయినా వైరస్‌ వ్యాధులైన సార్స్‌, మెర్స్‌, ఎబో లా, ఇన్‌ ఫ్లూయంజా. హెపటైటిస్‌-సీ, హెచ్‌.ఐ.వీ. వ్యాధుల కోసం అభివ ధిచేశారు. కోవిడ్‌-19 ని కట్టడి చేయటంలో ఆశించిన ఫలితాలు ఏ ఒక్కమందులోనూ లేవు. కొత్త మందులేవీ లేవు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు. పాత మందులకు కొత్త ఇండికేషన్స్‌, రీ పర్పస్‌ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి పాత మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది.

ఒక దశాబ్దం క్రితం కనిపెట్ట్టిన రెమిడెసివీర్‌ అనేమందును మొదట హెపటైటిస్‌ చికిత్సకు అభివృద్ది óచేశారు. ఆఫ్రికా లో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు, ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్‌లో దుష్పలితాలేమీ కలగనందున కోవిడ్‌-19 చికిత్స లో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలెట్టారు. అమెరికాకు చెందిన గిలియాడ్‌-బయోఫార్మస్యూటికల్స్‌ కంపెనీలకు రెమిడెసివిర్‌ పై పేటెంట్‌ హక్కులున్నాయి. ఎబోలావ్యాధి తగ్గకపోయానా, మందు పనిచేసినా చేయకపోయినా గిలియడ్‌ కి వున్న పేటేంట్‌ హక్కు పోలేదు. వీలైన చోట తయారు చేయించుకొనటానికి, ఇష్టమొచ్చిన రేటుకి ఎక్కడైనా అమ్ముకోవటానికి పేటెంటే చట్టం అవకాశ మిచ్చింది. రెమిడెస్విర్‌ జనరిక్‌ మందును తయారు చేయటానికి డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు.ఆ మందును తయారుచేయటానికి హైదరాబాద్‌ కు చెందిన హెటిరో , సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ కాడిలా కంపెనీలతో గిలియాడ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది .కోవిఫర్‌ బ్రాండ్‌ పేరున 100 మి.గ్రా.ఇంజెక్షన్గను ఒకరు విడుదలచేసారు. దీని ప్రకారం ఈ ఔషదాన్ని తయారుచేసి మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది.

రెమ్డెసీవీర్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా మరణాల రోటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్‌ లోడ్‌ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కరోనాకి మేజిక్‌ మందుకాకపోయినా, మ త్యువు నుండి కాపాడలేకపోయినా కొంత ప్రయోజనాన్ని సైంటిస్టులు గుర్తించారు. కోలుకోవడానికి సమయం తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. ఆసుపత్రి లో వుండవలసిన కాలం 15 రోజులనుండి 11 రోజులకు తగ్గింది. రెమిడెసివీర్‌ ఎవరికి ఎలా ఇవ్వాలి 1) కరోనా వ్యాధి వచ్చిన రోగి ఆసుపత్రిలో అత్యవసర విభాగం (ఐసీయూ) లో డాక్టర్ల పర్యవేక్షణలో వుండాలి. ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ 94 శాతం కన్నా తక్కువ వుండాలి. 2) ఆక్సిజన్‌ సహాయం పై సీరియస్‌ గా వున్న రోగులకు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ పై మందును ఇంట్రా వీనస్‌ ఇంజంక్షన్‌ గా ఇవ్వాలి.3) రెమిడెసివిర్‌ 100 మి.గ్రా.ల ఇంజెక్షన్‌ పొడిని ఐ వీ ఫ్లూయిడ్‌ ద్వారా నరానికి ఇవ్వాలి. మొదటి రోజు రెండు డోసులు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు రోజుకి ఒక్కసారి ఇవ్వాలంటున్నారు. వ్యాధి తీవ్రంగా వుంటే మరో ఐదు రోజులు అంటే మొత్తం 10 రోజులు ఇంజెక్షన్లు ఇవ్వాలి.

అయిదురోజుల చికిత్సకు రెమిడెసివీర్‌ మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్‌ మార్కెట్లో కొన్ని రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. వందల రూపాయలకు ఇవ్వవలసిన ఒక డోసు మందును రూ. 30,000 వేలనుండి లక్ష వరకూ అమ్ముతున్నారు.పేటెంట్‌ హక్కు ఉన్నగిలియాడ్‌ సైన్సెస్‌ అనే అమెరికన్‌ కంపెనీ ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్‌ మందులన్నీ అమెరికాకే ఫస్ట్‌ ఇవ్వాలని ట్రంప్‌ దురహంకారంతో ఆదేశించాడు. రెమిడెసీవీర్‌ మందును ఇంజెక్షన్‌ గా తయారుచేయటానికి 3 డాలర్లు ఖర్చవుతుంది. 3000 డాలర్లకు కంపెనీ అమ్ముతున్నది. ధనవంతులు విమానాలలో విదేశాలు తిరిగి మన దేశానికి వచ్చి కరోనా వ్యాధిని అందరికీ పంచారు. ధనవంతులు ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు. గతేడాది మార్చి 19 న డోనాల్డ్‌ ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను ”చాలా ప్రోత్సహకరమైనది” ,” చాలా శక్తివంతమైనది” మరియు ”గేమ్‌ ఛేంజర్‌” అని పత్రికా విలేఖరుల సమావేశంలో అభివరి?ంచారు. తరువాత ప్రపంచవ్యాపితంగా అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది. మార్చి 28 న యు.యస్‌.ఎఫ్‌.డీ.ఏ ఆమోదించింది. ఏప్రిల్‌ 24 న వైద్యుల పర్యవేక్షణ లేకుండా ట్రంప్‌ చెప్పిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను వాడటం ప్రమాదమని చెప్పింది.

అందరికీ వైద్యం, అందరికీ టీకాలు

స్పానిష్‌ ఫ్లూ తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్‌ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రా లను నేర్పి చైతన్యపరచింది. ఆ ఒరవడిలోనే క్యూబా పయనిస్తూ లాటిన్‌ అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ 1999 లో స్ధాపించి ప్రపంచ పేద విద్యార్ధలను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్నది. ఎక్కడ వైద్య కార్యకర్తలు అవసరమైతే అక్కడికి డాక్టర్లను పంపుతుంది.క్యూబా లాంటి సోషలిస్ట్‌ దేశాల్లో పరిశోధలనకు ప్రభుత్వమే నిధులను సమకూరుస్తుంది. బయోటెక్నాలజీ లో అధ్బుత విజయాలను సాధించి. ప్రపంచంలోమొదటిసారిగా మెనింజిటిస్‌ -బీ, మెదడు జబ్బుకి వాక్సిన్‌ తయారు చేసింది. ఎం ఎమ్‌ ఆర్‌ వాక్సిన్‌ ను క్యూబా తయారు చేసి భారతదేశం తో సహా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు అతి చౌకగా అందించిన ఘనత కాస్ట్రో ప్రభుత్వానికే దక్కింది. హవానా లోని ఫినిలే ఇన్స్టిట్యూట్‌లో 5 కరోనా వాక్సిన్ల అభివ ద్ధి లో పురోగతిని సాధించారు.

పేరులోకూడా ప్రతాపం
క్యూబా వాక్సిన్లకు పెట్టిన పేర్లు కూడా ప్రత్యేకమైనవే. మన దేశంలో వాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేని నరేంద్రమోడీ వాక్సినేషన్‌ సర్టిఫికెట్ల మీద తన బొమ్మను ముద్రించుకొని ప్రచార కండూతిని చాటుకుంటున్నారు. క్యూబాలో ఒక వాక్సిన్‌ పేరు ”సోబేరనా” అంటే అర్ధం ”సార్వాభౌమాధికారత ”. మరో వ్యాక్సిన్‌ పేరును క్యూబా విప్లవ వీరుడు జోస్‌ మార్తి రాసిన గేయం పేరున అబ్డాలా అని పెట్టారు. మామ్బిసా అని ముక్కు లో స్ప్రే ద్వారా ఇచ్చే వాక్సిన్‌ కు స్వాతంత్రం కోసం పోరాడిన గెరిల్లా పేరును పెట్టి వారి స్వాతంత్ర అభిలాష ను విప్లవ స్ఫూర్తిని చాటుకున్నారు. ఒక చిన్న దేశం తమ ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ ప్రపంచప్రజలకోసం అత్యంత ప్రేమతో దీక్ష తో క షి చేస్తున్నది. అమెరికా ఆంక్షలవలన క్యూబా ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రధాన పంట అయిన చక్కెర ను ఎవరూ కొనకుండాఆంక్షలు విధించి ఎగుమతిచేయనీయటంలేదు. మరొక ఆదాయ వనరు టూరిజం. టూరిస్టులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించి క్యూబా ఆదాయాన్ని దెబ్బతీస్తున్నది. అయినా ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం తమ వాక్సిన్లను పేటెంట్‌తో నిమిత్తం లేకుండా ఎవరైనా తయారు చేసి ఉపయోగించుకోవచ్చని ప్రకటించింది.

ప్రాణం విలువ ఏమిటో నిర్వచించారు.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుని మొత్తం ఆస్తి కన్నా ఒక ప్రాణం విలువైనది” అని క్యూబా వైద్య విధానాన్ని రూపొందించిన చే గువేరా అన్నారు. ప్రజల కోసం ప్రాణాలి చ్చే నాయకులు, సైంటిస్టులు ప్రపంచానికి కావాలి. లక్షలాది మంది పసిపిల్లలను పక్షవాతానికి గురిచేసే పోలియో జబ్బుకి వ్యాధినిరోధక మందును డాక్టర్‌ జోనాస్‌ సాల్క్‌ 1955 లో కనుగొన్నారు. తన పరిశోదనకు పేటెంట్‌ అడగ లేదు. 1955, ఏప్రిల్‌ 12 న పత్రికా విలేఖరి ముర్రో, ” పోలియో వాక్సిన్‌ పై పేటెంట్‌ ఎవరిది” అని డాక్టర్‌ సాల్క్‌ నిఅడిగితే ”ప్రజలది’ అని చెప్తూ ” సూర్యుని పేటెంట్‌ చేయగలమా” అన్నారు.
అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్‌ హెల్త్‌ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, చైనా, న్యూజిలాండ్‌,కేరళ లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు సైంటిస్టుల మాటలను విన్నారు. తూ చా తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు. అందువలననే క్యూబా, వియత్నాం లో. కేరళ రాష్టంలో ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు. కేరళలో ఇటీవల కేసులు పెరిగినా మరణాలు అత్యంత తక్కువగా ఉండటానికి వారు తీసుకున్న చర్యలు, ప్రజారోగ్యవ్యవస్ధకు ఇచ్చిన ప్రాధాన్యతే కారణం

కోవిడ్‌ -19 గురించి డిసెంబరు 30 న చైనా ప్రపంచ ఆరోగ్యసంస్ధ, పది రోజులలో కరోనా జెనిటిక్‌ మాప్‌ (జన్యు పటం) ని వాక్సిన్‌ పరిశోధన కొరకు ప్రపంచ సైంటిస్టులకు అందించింది. ఆ రోజు నుండీ సైంటిస్టులు వ్యాక్సిన్‌ కనుక్కొనటానికి అహౌరాత్రులు కష్టపడి అమెరికా, చైనా, రష్యా లలోవ్యాక్సిన్‌ కనుగొన్నారు.ఇంకా పరిశోధనలు దరుగుతూనేవున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ రానున్న మహా విపత్తును గూర్చిఅన్ని దేశాలనూ హెచ్చరించింది. విదేశీ ప్రయాణీకుల నియంత్రణ, క్వారంటైన్‌, వైద్య పరికరాలు, వైద్యులకు ఆధునిక రీతులపై శిక్షణ లపై ద ష్టి సారించవలసిన సమయం వ ధా అయ్యింది. 2020, ఫిబ్రవరి 24,25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ని ఆహ్వానించి లక్షలాదిమంది ప్రజలను ఒక చోట చేర్చి భారీ సభను నిర్వహించారు. కరోనాని ఆహ్వానించారు. మధ్యప్రదేష్‌ లో ప్రభుత్వాన్ని కూలదోసే రాచక్రీడ లో బిజీ గా వున్నారు.ప్రజా వ్యతిరేక చట్టాలను గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటూ 2020, మార్చ్‌ 22 న ప్రజా కరూా్య విధించి పళ్లాలు మోగించి కొవ్వొత్తులు వెలిగించి కరోనాని శపించారు. నాలుగు గంటల వ్యవధినిచ్చి , మార్చ్‌ 24 నుండీ లాక్‌ డౌన్‌ విధించారు. వలస కార్మికులు నిరుద్యోగులయి, తిండీ తిప్పలు లేకుండా కొన్ని వేల మైళ్ళు నడిచి ఆప్తబంధువులను కోల్పోయి పుట్టినఊరుకు జీవఛóవాేలుగా చేరారు. ఎన్నికలు, పదవులు, కుంభమేళాలు ప్రజల ప్రాణాలకన్నాముఖ్యమయ్యాయి.కరోనా వ్యాధిని అడ్డంపెట్టుకుని రైతువ్యతిరేక చట్టాలను ఆమోదింపచేసుకున్నారు. నిశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పూనుకున్నారు.

ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు. ప్రక తిని నాశనం చేసిన కార్పోరేట్‌ శక్తులు అంటువ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు. ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్‌ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా? రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ కరోనాని ఎదుర్కోవటానికి ప్రజలు, మీడియా పూనుకోవాలి. డబ్బులు లేకపోతే మందులు లేవు,బెడ్‌ లేదు, ఆక్సిజన్‌ లేదు, వ్యాక్సిన్‌ లేదు అనే వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్‌ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తేవాలి.ప్రజలందరికీ వైద్యం, వాక్సిన్లు అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.

వ్యాసకర్త ఢాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ నల్లమడ రైతు సంఘం నేత, గుంటూరు.

ట్వీట్లతో కంగనా రనౌత్‌ ప్రధాని నరేంద్రమోడీకి మేలు చేస్తున్నట్లా ! పరువు తీస్తున్నట్లా !!

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


సినిమా హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు కోపమొచ్చింది. రాదు మరీ పొగిడిన నోళ్లే రాజకీయ హీరో నరేంద్రమోడీని తెగుడుతుంటే కంగన వంటి వారికి ఆగ్రహం గాక ఆనందం కలుగుతుందా ! ఇంతకీ ఏమి జరిగిందీ దేశంలో కరోనాను ఎదుర్కోవటంలో వైఫల్యానికి మోడీదే బాధ్యత అంటూ విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలో ప్రధాని మోడీ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ విషయాన్ని మామూలుగా అయితే అభిమానులు మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. మోడీ సర్కార్‌ బండారం మరికొంత కాలం మరికొంత మందికి తెలియకుండా ఉంచేందుకు తిప్పలు పడతారు. ఈ చిన్న తర్కం కూడా తెలియకపోతే విమర్శించిన వారి గురించి రెచ్చిపోతే ఆ సమాచారం చూడని వారిని కూడా అరే ఇదేమిటి ఆశ్చర్యంగా ఉంది, మోడీ రాజీనామాను కోరటం ఏమిటి అన్న ఆసక్తిని కలిగిస్తుంది. కంగన వంటి వారికి ఈ చిన్న విషయం కూడా తెలిసినట్లు లేదు. సామాజిక మాధ్యమంలో ఉన్న వారందరికీ మొత్తం ఏమి జరుగుతోందో తెలియదు. అలాగే కేవలం పత్రికలు, టీవీలకే పరిమితమైన వారికి సామాజిక మాధ్యమంలో ఎలాంటి అభిప్రాయాలు వెల్లడౌతున్నాయో పట్టదు. కంగన ఆగ్రహం మీడియాలో రావటంతో అనేక మందికి ఆసక్తి ఏర్పడింది. ఇంతకీ కంగన అమ్మడు ఏమన్నది ?

” మోడీ గారికి ఎలా నడపాలో(దేశాన్ని) తెలియదు, కంగనకు ఎలా నటించాలో తెలియదు, సచిన్‌ టెండూల్కర్‌కు బ్యాటింగ్‌ ఎలా చేయాలో తెలియదు, లతామంగేష్కర్‌కు ఎలా పాడాలో రాదు గానీ ప్రమాణాల్లేని ఈ మరుగుజ్జులకు మాత్రం అన్నీ తెలుసు. మోడీ గారు మీరు రాజీనామా చేసి విష్ణు అవతారాలైన ఈ మరుగుజ్జుల్లో ఒకరిని తదుపరి ప్రధానిగా చేయండి ” అంటూ కంగన మండిపడింది. ఇంటా బయటా మీడియాలో నరేంద్రమోడీ వైఫల్యాల వార్తలు-వ్యాఖ్యలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో గుక్క తిప్పులోని స్ధితిలో పడిపోయారు. వేనోళ్ల పొగిడిన విదేశీ మీడియా ఇప్పుడు మోడై వైఫల్యాలను ఉతికి ఆరవేస్తోంది. బిజెపి వారు ప్రచారం చేసుకున్నట్లుగా ఇంటర్నెట్‌ను నరేంద్రమోడీయే జనానికి అందుబాటులోకి తెచ్చారని అంగీకరిద్దాం. దీని వలన జనానికి కలిగే నష్టం ఏముంది? దేశంలో ఇంటర్నెట్‌ రాకముందే ఇమెయిల్‌ ఉపయోగించానని, డిజిటల్‌ కెమెరా అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే వాటితో ఫొటో తీసి తమ నేత అద్వానీని ఆశ్చర్య పరిచినట్లు స్వయంగా మోడీ చెప్పుకున్నారు. వేల సంవత్సరాల నాడే మన దేశంలో పైకి కిందికి ఎటు పడితే అటు ఎక్కడబడితే అక్కడ దిగే, ఎంత మంది ఎక్కినా మరొకకి ఖాళీ ఉండే విమానాలున్నాయని, ప్లాస్టిక్‌ సర్జరీ చేసి వినాయకుడికి ఏనుగు తొండం అంటించారని, కుండల్లో కౌరవులను పుట్టించారని చెబుతుంటే నమ్మిన జనం మోడీ ఇమెయిల్‌, డిజిటల్‌ కెమెరా కధలను నమ్మకుండా ఉంటారా ! అలాంటి ఇంటర్నెట్‌, సామాజిక మాధ్యమంలో తొలిసారిగా నరేంద్రమోడీ రాజీనామా డిమాండ్‌ ముందుకు వస్తే కంగన వంటి వారికి మండటంలో, ఏం మాట్లాడితే జనం ఏమనుకుంటారో అన్న విచక్షణ మాయం అయితే ఆశ్చర్యం ఏముంది?


దేశంలో సామాజిక మాధ్యమాన్ని నరేంద్రమోడీ అండ్‌ కో ఉపయోగించుకున్నంతగా దాని ద్వారా లబ్ది పొందినంతగా మరొక పార్టీ లేదా రాజకీయ నేత లేరు అన్నది నిర్వివాదాంశం. అలాంటి నేతకు ఇప్పుడు ప్రతికూల వ్యాఖ్యల వేడి తగలటం ప్రారంభమైంది. సంప్రదాయ మీడియా పాకేజ్‌లకు అమ్ముడు పోవటం, ఫోర్త్‌ ఎస్టేట్‌ అనుకున్నది కాస్తా రియలెస్టేట్‌గా మారటం, ఇదే సమయంలో సామాజిక మాధ్యమం జనానికి అందుబాటులోకి వచ్చింది. మీడియా తమ భావాలను ప్రతిబించించటం లేదు అనుకున్న వారు సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకున్నారు. మీడియా మాదిరే సామాజిక మాధ్యమం కూడా కార్పొరేట్ల ఆధీనంలోనే కనుసన్నలలోనే నడుస్తున్నది. అయితే వారి వ్యాపారానికి లాభాలు సంపాదించి పెట్టేందుకు జీతం భత్యం లేకుండా పని చేసే వారు కావాలి, పెద్ద మార్కెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి గనుక యజమానులు జనానికి స్వేచ్చ కల్పించారు. అది తమకు లబ్ది చేకూర్చుతుందంటే అధికారంలో ఉన్నవారు ఉపయోగించుకుంటారు లేదంటే దాని మీద కూడా ఆంక్షలు పెడతారని ఇటీవల ట్విటర్లు, ఫేస్‌బుక్‌ వంటి మీద పెడుతున్న ఆంక్షలు, విమర్శలను తొలగించాలని ఆదేశించటాన్ని చూస్తున్నాము. కనుక రాజీనామా డిమాండ్‌ చేసిన వారి మీద కంగన మండిపడటం ద్వారా ఆ విషయం తెలియని వారికి కూడా మీడియా ద్వారా తెలిసిపోయింది, నిజమే కదా ఆక్సిజన్‌ కూడా సరఫరా చేయలేని వారు పదవిలో కొనసాగటమెందుకు అని ఒక్క క్షణం మనస్సులో అనుకుంటున్నారు. అయితే ఒకసారి మోజు పడినవారు అభిమానాన్ని వెంటనే మరల్చుకోలేరు. తప్పును తప్పని బయటకు చెప్పటానికి వారికి అహం అడ్డువస్తుంది.

బాధ్యతారహితంగా ట్వీట్లు చేయటంలో, ఎదుటి వారిని నిందించటంలో పేరు మోసిన కంగనకు నెటిజన్లు ఆమె గడ్డిని ఆమెకే తినిపిస్తున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్‌లో ఇలా సలహాయిచ్చారు.” ఆక్సిజన్‌ స్ధాయిలు తక్కువగా ఉన్న వారు ఇలా చేసి చూడండి.చెట్లు నాటటం శాశ్వత పరిష్కారం. మీరా పని చేయలేకపోతే కనీసం వాటిని నరకవద్దు. దుస్తులను తిరిగి ఉపయోగించండి, వేద ఆహారం తీసుకోండి, సహజమైన జీవితం గడపండి, ఇది తాత్కాలికమైన పరిష్కారం, ఇప్పటికైతే ఇది మీకు తోడ్పడుతుంది. జై శ్రీరామ్‌ ” దీని మీద బాజార్‌ చిత్ర దర్శకుడు గౌరవ్‌ కె చావ్లా అపహాస్యం చేస్తూ ” ఆక్సిజన్‌ వృధా మనిషి ” అని ఎద్దేవా చేశారు. దాని మీద కంగనా మండిపడుతూ ” మీ వంటి వారు పాలు సంచుల నుంచి వస్తాయనుకుంటారు.హ హ ఎంత బుద్దిహీనత, సిలిండర్లలోని ఆక్సిజన్‌ కూడా చెట్ల నుంచే తీసుకుంటారు. గాలిలో కాలుష్యం తక్కువ ఉంటే దానిలోని ఎక్కువ భాగం ఆక్సిజన్‌ను తీసుకొనే ఊపిరితిత్తులను కలిగి ఉంటారు, ఏదైతేనేం అమాయకత్వం ఆనందం కలిగించే అంశం, దానిలోనే జీవించండి ” అని పేర్కొన్నారు. నైట్రోజన్‌ నుంచి ఆక్సిజన్‌ను వేరు చేస్తారు అని పేర్కొన్న అంశాన్ని కంగనా షేర్‌ చేశారు.ఆక్సిజన్‌ గురించి కంగన్‌ ట్వీట్ల మీద నెటిజన్లు ఆమెను ఆటపట్టించారు. మీరు పూర్తిగా పిచ్చివారయ్యారు చికిత్స చేయించుకోండి అని సలహా ఇచ్చిన వారున్నారు. విద్య ఎంత అవసరమో పెద్దలు ఇందుకే చెప్పారంటూ మరొకరు ఎకసెక్కాలాడారు. వారినీ కంగన వదల్లేదు. ప్రకృతి ప్రకోపం గురించి శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇది శాస్త్రీయంగా రుజువైంది. చెట్లకూ బాధ,భావోద్వేగాలు ఉంటాయి. వాటిని విచక్షణా రహితంగా వినియోగిస్తూ నాశనం చేస్తున్నాము, ఈ రోజు గాలిపీల్చుకొనేందుకు ఇబ్బంది పడుతున్నాము, వాటిని బతకనివ్వండి అని ట్వీట్‌ చేశారు.

రైతు ఉద్యమం సందర్భంగా తాప్సీపన్ను మీద విరుచుకు పడిన కంగన మరోసారి బస్తీమే సవాల్‌ అంటూ ట్వీట్లతో వీధులకెక్కారు. తాప్పీ తనను అనుకరించిందని, చౌకబారు స్టార్‌, ఆడ పురుషుడు అంటూ నోరు పారవేసుకుంది. దాన్ని సమర్ధించుకుంటూ నీ తీక్షణమైన చూపులను చూస్తే అలాగే అనిపిస్తుంది, ఇది నీకు అభినందన తప్ప మరొకటి కాదు, ప్రతిదాన్ని ప్రతికూలంగా చూస్తావెందుకో నాకు అర్ధం కావటం లేదు అని మరో ట్వీట్‌లో తూలనాడింది. తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయటంలో కాషాయ దళాల తరువాతనే ఎవరైనా అన్నది తెలిసిందే. నకిలీ ట్వీట్లు చేసి ఇతరులను బదనామ్‌ చేయటం గురించి వేరే చెప్పనవసరంలేదు. ఆ దళానికి చెందిన కంగన స్వయంగా బాధితురాలైంది. తాను అటువంటి ట్వీట్‌ చేయలేదు నమ్మండి అంటూ లబోదిబో మంటోంది. ఆక్సిజను పీల్చి ఆక్సిజన్‌ వదిలే ఏకకై జంతువు ఆవు అని బిజెపి పెద్దలు సెలవిచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ఆక్సిజన్‌ సరఫరా చేయటంలో విఫలమైన మోడీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆక్సిజన్‌ స్ధాయి తక్కువగా ఉన్న వారు ఆవు ముక్కు దగ్గర ముక్కు పెట్టి పీల్చుకుంటే సరి, కావాల్సినంత ఆక్సిజన్‌ వస్తుంది, జై శ్రీరామ్‌ అని కంగన్‌ పేరుతో ఒక ట్వీట్‌ సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయింది. దానికి ఒక ఫొటోను కూడా తోడు చేశారు. అయితే ఫొటో నిజమే గానీ, ట్వీట్‌ ఫేక్‌ అని వెల్లడైంది. గుజరాత్‌కు చెందిన విజయ పరసానా అనే వ్యక్తి రోజూ ఉదయమే ఆవు పేడను ఉపాహరంగా తింటూ ఆవు మూత్రం తాగుతూ రాత్రుళ్లు ఆవులతో కలసి నిదురించే అలవాటు గురించి 2017లో బ్రిటన్‌ పత్రిక మెట్రో ఆవును ముద్దాడుతున్న దానితో పాటు మరికొన్ని చిత్రాలతో సహా వార్తను ప్రచురించింది. అయితే ఇలాంటి అశాస్త్రీయ పద్దతుల పట్ల ఆమెకు నమ్మకం ఉన్నట్లు ఒక మహిళ నోటితో గాలి పీల్చి ఆక్సిజన్‌ స్ధాయిలను పెంచుకోవచ్చంటూ చూపిన వీడియోను కంగన తన ట్వీట్‌తో పాటు షేర్‌ చేసింది.


తాప్పీ పన్ను ా కంగన మధ్య మరోసారి ట్వీట్ల పంచాయతీ నడచింది. కరోనా మహమ్మారికి సంబంధించి ఆక్సిజన్‌, ఔషధాల కొరత ఇతర ఇబ్బందుల గురించి అనేక మంది మాదిరే తాప్సీ కూడా తన ట్వీట్ల ద్వారా స్పందించింది. అనేక మంది ట్వీట్లను షేర్‌ చేసింది. వాటి మీద కంగన ద్వజమెత్తింది. ప్రతిగా తాప్పీ కూడా మండిపడుతూ ” దయచేసి …. మాదిరి నోర్మూసుకుంటావా, ఈ సమయంలో నువ్వేమైనా చెప్పదలచుకుంటే ఈ దేశం తిరిగి సజావుగా ఊపరిపీల్చుకొనేంతవరకు నోరు అదుపులో పెట్టుకో తరువాత నీ రోత పద్దతిలో తిరిగి రా, అప్పటి వరకు నీ చెత్త నాకు పంపవద్దు, నా పని నన్ను చేయనివ్వు” తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు నమ్మలేనంత మొత్తం సొమ్ము ఖర్చు చేస్తున్నారని కంగన మండిపడింది.ప్రతి పప్పుగాడు ఒక ఒంటరి యువతిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వ్యాఖ్యానించింది.కంగనా సోదరి రంగోలి చందేల్‌ కూడా రంగంలోకి దిగి సినిమా, రాజకీయ రంగ పప్పుగాళ్లందరూ ఒక యువతిని లక్ష్యంగా చేసుకున్నారు.వారందరికీ సమాధానం చెప్పేందుకు ఒక యువతి చాలు అని పేర్కొన్నది. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదంటారు. అలాగే కంగనా వంటి కంపు నోళ్లు దుర్వాసన వెదజల్ల కుండా ఉంటాయా ?

లాక్‌డౌన్‌పై నోరు జారిన బ్రిటన్‌ ప్రధాని, రాజీనామాకు డిమాండ్‌ !

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


రాజకీయ నేతలు ఎంత వత్తిడికి గురైనా సంయమనం కోల్పోతే అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చెప్పలేము. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గతేడాది అక్టోబరు 30న కాబినెట్‌ సమావేశంలో చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. వేలాది శవాలు గుట్టలుగా పడినా సరే రెండవసారి లాక్‌డౌన్‌ ప్రకటించే ప్రశ్నేలేదు అంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మాటలు మీడియా పతాక శీర్షికలకు ఎక్కటంతో రాజీనామా చేయాలన్న డిమాండ్‌ ముందుకు వచ్చింది. తానా మాటలు అనలేదని ప్రధాని ప్రకటించిన తరువాత కూడా వార్తలను రాసిన వారు అవి నిజమే అని ప్రకటించటంతో ఈ ఉదంతం ఏవైపు దారి తీస్తుందో చూడాల్సి ఉంది. ప్రధాన ప్రతిపక్షం లేబర్‌ పార్టీ ఇది రాస్తున్న సమయానికి రాజీనామా డిమాండ్‌ చేయలేదు. వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ రాజీనామా చేయాలని కోరింది.


2020 అక్టోబరు30 జరిగినట్లు చెబుతున్న ఉదంతం గురించి బిబిసి, ఐటివి, మెయిల్‌ ఆన్‌లైన్‌ తదితర మీడియా సంస్దలు పేర్కొన్న సమాచార సారం ఇలా ఉంది.కాబినెట్‌ మంత్రి మైఖేల్‌ గోవ్‌ మరోసారి ఇంగ్లండ్‌లో లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరాన్ని వివరిస్తూ కరోనా పీడితులు ఆసుపత్రులకు మిలిటరీ సిబ్బంది రక్షణగా ఉండటాన్ని మీరు చూడాలనుకుంటే తప్ప మరోసారి లాక్‌డౌన్‌ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది, జనం మనల్ని క్షమించరు, పార్టీ అధికారం నుంచి వైదొలగాల్సి ఉంటుంది అన్నారట. దాని మీద తీవ్ర అసహనంతో ఊగిపోయిన జాన్సన్‌ ”…..(వాడిన పదానికి బూతు పని-నష్టదాయకం అనే రెండు అర్దాలున్నాయి) లాక్‌డౌన్లు ఉండవు, వేలాది శవాలను గుట్టలుగా పడనివ్వండి ” అని వ్యాఖ్యానించారట. ఈ ఉదంతం అక్టోబరు 30న జరిగింది, మరుసటి రోజే లాక్‌డౌన్‌ ప్రకటించారు. మీడియాలో ఈ ఉదంతం గురించి వార్తలు రావటంతో పార్లమెంట్‌లో స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ నేత ఇయాన్‌ బ్లాక్‌ఫోర్డు ఒక ప్రకటన చేస్తూ ఈ మాటలు తీవ్ర అసహ్యంగా ఉన్నాయి, నిజమైతే వెంటనే ప్రధాని బోరిస్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో అనేక అబద్దాలు చెప్పి ఉన్నందున ప్రధాని ఈ మాట అనలేదు అంటే ఎవరూ నమ్మటం లేదని అదే పార్టీకి చెందిన మరో నాయకురాలు నికోలా స్టర్‌జియన్‌ పేర్కొన్నారు. మే ఆరవ తేదీన స్ధానిక సంస్ధల ఎన్నికల నేపధ్యంలో ఈ పరిణామం అధికార పార్టీని ఇరుకున పడవేసింది. టోరీ-లేబర్‌ పార్టీల మధ్య ఓటర్లు సరిసమానంగా ఉన్నట్లు సర్వేలు ప్రకటించాయి. తాజా వార్తలతో అది టోరీ పార్టీకి ప్రతికూలంగా పరిణమిస్తే బ్రిటన్‌ పరిణామాలు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.


ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ప్రభుత్వం ప్రకటించింది. మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటించాలా లేదా అని చర్చించేందుకు జరిగిన సమావేశంలో ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తనకు వినిపించలేదని మంత్రి మైఖేల్‌ గోవ్‌ చెప్పారు. మరోసారి లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రధాని అంగీకరిస్తూనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ సమయంలో అక్కడ ఉన్న ఒకరు పేర్కొన్నట్లు డైలీ మెయిల్‌ పత్రిక పేర్కొన్నది. ఐటివి రాజకీయ విలేకరి పెస్టన్‌ మాట్లాడుతూ అలాంటి వ్యాఖ్య చేసినట్లు ఇద్దరు సాక్షులు తనకు చెప్పారని, ఆ సమయంలో అక్కడ మరొకరు కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ విధించేందుకు అయిష్టంగా అంగీకరిస్తూనే కేకలు వేసిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు, ఆ సమయంలో గది తలుపులు తెరిచే ఉన్నందున అనేక మంది వినే అవకాశం ఉందన్నారు. తాను పేర్కొన్న అంశాన్ని మెయిల్‌ పత్రిక నిర్దారించింది. అయితే తనకు సమాచారం ఇచ్చిన వారు మెయిల్‌కు వెల్లడించలేదని చెప్పారని, అందువలన మరొకరు దానికి చెప్పి ఉంటారని పిస్టన్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ విధించే కంటే వేలాది శవాలు గుట్టలు పడినా తనకు లెక్కలేదని ప్రధాని అన్నట్లు డెయిలీ మెయిల్‌ ప్రధాన శీర్షికగా వార్త ప్రచురించింది.

తాను చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యల వెనుక తన మాజీ సలహాదారు డొమినిక్‌ కమ్మింగ్స్‌ హస్తం ఉన్నదని బోరిస్‌ జాన్సన్‌ స్వయంగా వార్తలను ప్రచురించిన సంపాదకులతో మాట్లాడుతూ చెప్పారని వార్తలు వచ్చాయి. లాక్‌డౌన్‌ ప్రకటించటం ఒకటి అయితే ఆ సమయంలో కొందరు ఆశ్రితులకు ప్రధాని లబ్దిచేకూర్చారనే అంశాలు వెలుగులోకి రావటం ముఖ్యమైన అంశం. బహుశా ఈ కారణంగానే ఆరునెలల క్రితం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో వచ్చాయని చెప్పవచ్చు.కమ్మింగ్స్‌ సలహాదారుగా పని చేసిన కాలంలో బోరిస్‌ జాన్సన్‌ సన్నిహితురాలు కారీ సైమండ్స్‌తో పెత్తనం గురించి వారి మధ్య పోరు నడిచింది. ఆ సమయంలో వాణిజ్యవేత్త సర్‌ జేమ్స్‌ డైసన్‌ లేవనెత్తిన కొత్త వెంటిలేటర్ల పన్ను సమస్యను పరిష్కరిస్తానంటూ ప్రధాని పంపిన వర్తమానం, అదే విధంగా సౌదీరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మధ్య నడిచిన వర్తమానాలు బయటకు రావటం వెనుక కమ్మింగ్స్‌ హస్తం ఉందని వార్తలు వచ్చాయి, అంతే కాదు ప్రధానిగా బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వ అధికారిక నివావసరలో ఉన్నప్పటికీ దాని మరమ్మతులకు ప్రయివేటుగా నిధులు సమకూర్చమని కోరినట్లుగా, అధికార టోరీ పార్టీకి వచ్చిన విరాళాల గురించి కమ్మింగ్స్‌ ఆరోపించటం వివాదాస్పదంగా మారింది. తన నివాసానికి చేసిన ఖర్చును ప్రధానే స్వయంగా చెల్లించారని ప్రభుత్వం చెబుతుంటే అధికార పార్టీ చెల్లించినట్లు వార్తలు వచ్చాయి.దీంతో అసలేం జరిగిందో విచారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాణిజ్యవేత్త డైసన్‌ జరిపిన సంభాషణలు బయటకు రావటానికి తనకూ సంబంధం లేదని అయితే బోరిస్‌ జాన్సన్‌ గురించి కొన్ని అంశాలను బయటపెడతానని కమ్మింగ్స్‌ ప్రకటించాడు. రెండవ సారి లాక్‌డౌన్‌ ప్రకటించే అంశాల గురించి ప్రధాని ముందుగానే తన సన్నిహితురాలు కారీ సైమండ్స్‌కు చెప్పారని దాని గురించి విచారణను ప్రధాని అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఈ వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణల నేపధ్యంలోనే ప్రధాని వ్యాఖ్యలు మీడియాలో దర్శనమిచ్చాయి. వచ్చేనెల 26న కమ్మింగ్స్‌ కామన్స్‌ సభ కమిటీ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది.


గతేడాది మే ఏడున జరగాల్సిన స్ధానిక సంస్దల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడి ఈ ఏడాది మే ఆరున జరగనున్నాయి. ఇది కూడా తాజా వివాదం, బోరిస్‌ వ్యాఖ్యల మీద దుమారానికి దోహదం చేసి ఉండవచ్చు. కమ్మింగ్స్‌ ఆరోపణలకు ముందు ఒక సంస్ధ జరిపిన సర్వేలో టోరీ పార్టీ మద్దతు ఐదుపాయింట్లు తగ్గినట్లు ప్రకటించారు. లేబర్‌ పార్టీతో పోల్చితే మూడు పాయింట్ల స్వల్ప ఆధికత్యతో 40శాతం మంది మంది మద్దతు టోరీకి ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు సంచలనాత్మక జాన్సన్‌ వ్యాఖ్యలు, కమ్మింగ్స్‌ చెబుతున్న అంశాలు కచ్చితంగా టోరీ పార్టీని ఇబ్బందుల్లో పడవేస్తాయి.
ఆరోపణలు కాదు, ప్రధాని ఆచరణ ముఖ్యం అంటూ కొన్ని పత్రికలు బోరిస్‌ జాన్సన్‌కు మద్దతుగా రంగంలోకి వచ్చాయి.ప్రధాని పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేయాలని, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేబర్‌ పార్టీ కోరింది. నలభైనాలుగు లక్షల మందికి వైరస్‌ సోకి 1,27,434 మరణాలతో ( మార్చి నెలాఖరుకు లక్షా 50వేల మంది మరణించినట్లుగా ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లు మరో వార్త ) ప్రపంచంలో ఏడవ స్ధానంలో ఐరోపాలో మూడవ దేశంగా బ్రిటన్‌ ఉంది. రెండవ దశలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయి.

గతేడాది సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో రెండవసారి లాక్‌డౌన్‌ విధించాలని అనేక మంది నిపుణులు, మంత్రులు సూచించారు. ప్రధాని వారి సలహాలను ఖాతరు చేయలేదు.రోజుకు రెండువేల కేసులు ఉన్నపుడు చేసిన ఈ సూచనకు నిరాకరించిన బోరిస్‌ ఆరువేలకు పెరిగిన తరువాత అక్టోబరు 31న లాక్‌డౌన్‌ ప్రకటించారు. అంతకు ముందు పదిరోజుల క్రితం పార్లమెంట్‌లో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఆలోచన మూఢత్వ ఉన్నత స్ధాయికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. అయితే అక్టోబరు 30వ తేదీన మంత్రి మైఖేల్‌ గోవ్‌ తీవ్రమైన హెచ్చరిక చేయటంతో ప్రధాని ఉక్రోషం పట్టలేక నోరు జారి ఉండవచ్చని బలంగా నమ్ముతున్నారు. మొదటి దశ కరోనా సమయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. రెండవ దశలోకి ప్రవేశించిన తరువాత కూడా కొత్త రకం వైరస్‌ను నవంబరు వరకు గుర్తించలేదు. మూడవ దశ కూడా రానున్నట్లు తాజాగా హెచ్చరికలు వెలువడ్డాయి. బ్రిటన్‌లో కరోనా విజృంభణ కారణంగానే మన రిపబ్లిక్‌ దినోత్సవానికి అతిధిగా రావాల్సిన బోరిస్‌ ప్రతిపక్ష విమర్శలను నివారించేందుకు పర్యటనను వాయిదా వేసుకున్నారు.మన దేశంలో కరోనా రెండవ దశ తీవ్ర స్ధాయిలో ఉన్న కారణంగా ఏప్రిల్‌ నెలలో జరగాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నారు.


మీడియాలో వచ్చిన వార్తలను ఖండించిన తరువాత బోరిస్‌ అబద్దాలకోరు అనే హాస్టాగ్‌తో పెద్ద ఎత్తున ట్విటరైట్లు స్పందిస్తున్నారు. ఈ వార్తలను చూసిన తరువాత మరణించిన వారి కుటుంబాలు ఎలా ఉంటాయో ఊహించుకోలేము, కుటుంబాలు తట్టుకోలేవు అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. సలహాదారులుగా ఉన్న వారు కక్షగడితే పాలకుల పరువు ఎలా తీయగలరో, తెరవెనుక జరిగిన బాగోతాలను ఎలా బయటపెడతారో ఈ ఉదంతం వెల్లడిస్తోంది. ఇది టీ కప్పులో తుపానులా సమసిపోతుందా లేక బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా వరకు దారి తీస్తుందా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఐరోపా యూనియన్‌ నుంచి తప్పుకున్న బ్రిటన్‌ నిర్ణయం వెనుక కమ్మింగ్స్‌ సలహాలే ప్రధానంగా పని చేశాయి. ఆ నిర్ణయం తరువాత ఆర్ధిక పరిస్ధితి కరోనాతో మరింతగా దిగజారింది. ఆర్ధిక పరిస్ధితి దిగజారినపుడు అనేక సందర్భాలలో రాజకీయ సంక్షోభాలకు దారి తీస్తుందని అనేక దేశాల అనుభవాలు నిరూపించాయి. బ్రిటన్‌లోనూ అదే జరగనుందా ?

స్లేట్‌ ద స్కూల్‌ అధిపతి వాసిరెడ్డి అమరనాధ్‌ ఫేస్బుక్‌ పోస్టు – ఒక పరిశీలన ! మేథావులు ఆత్మావలోకనం చేసుకోవాలి !!

Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు

ఆంగ్లంలో ఇంటలెక్చ్యువల్‌ – తెలుగులో బుద్ధి జీవి. బుద్ది జీవులు ఎవరు, వారి లక్షణాలు ఏమిటి అన్నది సామాన్యులకూ – బుద్ది జీవుల్లోను ఎడతెగని సమస్య. వాళ్లు అలా అనుకుంటున్నారు- వీళ్లు ఇలా అనుకుంటున్నారు అని చెప్పటమే మేథావి లక్షణం అయితే అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడివి అక్కడికి చేరవేసే వారందరూ, అలా అట ఇలా అట అంటూ చెవులు కొరికే వారూ మేధావులే. ప్రశ్నలను మాత్రమే రేకెత్తించి జవాబులు చెప్పని వారు మేథావులని ఒక అనుభవశాలి చెప్పాడు. జార్జి ఆర్వెల్‌ అనే కలం పేరుతో సుప్రసిద్దుడైన ఆంగ్ల రచయిత ఎరిక్‌ ఆర్ధర్‌ బ్లెయిర్‌ ” కొన్ని ఆలోచనలు ఎంత బుద్ది తక్కువగా ఉంటాయంటే బుద్ది జీవులు మాత్రమే వాటిని నమ్ముతారు ” అని చెప్పారు. జార్జి ఆర్వెల్‌ ప్రస్తుతం బీహార్‌లోని మోతీహరిలో జన్మించి స్వాతంత్య్రం తరువాత ఇంగ్లండ్‌ వెళ్లిపోయి 47 సంవత్సరాల వయస్సులోనే 1950లో మరణించాడు. ఇంటర్నెట్‌, వాట్సప్‌ రాక ముందే తనువు చాలించాడు గానీ లేకుంటేనా వాట్సప్‌ విశ్వవిద్యాలయ బుద్ది మంతుల గురించి ఎంత చెప్పి ఉండేవాడో కదా !

హైదరాబాదు, విజయవాడ, తిరుపతి నగరాల్లో స్లేట్‌ ద స్కూలు పేరుతో విద్యా సంస్ధలు నడుపుతూ వైద్యంతో సహా (ఫేస్బుక్‌ పోస్టులను బట్టి ) బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న వాసిరెడ్డి అమరనాధ్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. పేరు వినటమే తప్ప నాకు పరిచయం లేదు, పంచాయతీల్లేవు. అమరనాధ్‌ పోస్టు వాట్సప్‌ విశ్వవిద్యాలయంలో చూసిన తరువాత ఒక జర్నలిస్టుగా బుద్ది జీవుల గురించి రాయాలనిపించింది. ఆ పోస్టు అంశాలు ప్రస్తుతం సమాజంలో ఎందరో మేథావులు, విద్యావంతుల గందరగోళం- ఆలోచనకు ప్రతిబింబంగా ఉంది కనుక స్పందించాల్సి వస్తోంది. కనుక వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు. పోస్టులోని అంశాన్ని విమర్శించాలని లేదా సంవాదం ప్రారంభించాలని కాదు. నా అభిప్రాయాలతో ఏకీభవించటమా, వ్యతిరేకించటమా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు. రాగ ద్వేషాలకు అతీతంగా పరిశీలించి బుద్దికి పదును పెట్టమని కోరుతున్నాను. అమరనాధ్‌గారి పోస్టులోని అంశాలపై నా స్పందన ఇక్కడ ప్రస్తావిస్తాను.

” చైనాలో పుట్టిన ఆ వైరస్‌ ప్రపంచం నలుచెరుగులా ఉన్న 180 కి పైగా దేశాలకు వ్యాపించింది . కానీ చైనా లో మాత్రం ఒక్క నగరానికే పరిమితం . ప్రపంచమంతా ఒకటి.. రెండు .. మూడు అంటూ వేవ్‌ లు . అక్కడ మాత్రం మొదటి మూడు నాలుగు నెలలు .. ఒక నగరం .. 90 వేల కేసులు మాత్రమే . . దీని వెనుక ఉన్న ఇంద్ర జాల మహేంద్ర జాలం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు . పోనీ చైనా న్యూజిలాండ్‌ లాగా ఎక్కడో దూరంగా ఉన్న దేశమా అంటే .. కాదు . ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ! జన సాంద్రత ! ఆ వైరస్‌ ను ఏ అల్లాఉద్దీన్‌ అదుÄ్బత ద్వీపం సాయం తో కట్టడి చేసారో ఇప్పటి దాక ఒక్క శాస్త్రవేత్త కూడా వివరించ లేదు. ”

దీనిలో శాస్త్రవేత్తలు వివరించాల్సిందీ, వివరించనిదీ, తెలియనిదీ ఏమీ లేదు. వైరస్‌ చైనాలో పుట్టిందా మరోచోటనా అన్నది ఇంకా తెలియదు. చరిత్రలో స్పానిష్‌ ఫ్లూగా పరిచితమైనది తొలుత బయటపడింది అమెరికాలో, నింద మాత్రం స్పెయిన్‌కు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన సమయంలో దేశాలన్నింటా మీడియా మీద సెన్సార్‌ ఆంక్షలున్నాయి. స్పెయిన్‌ ఆ యుద్దంలో తటస్దంగా ఉంది. రాజు పదమూడవ ఆల్పోన్సోకు తీవ్ర సుస్తీ చేయటంతో అక్కడి మీడియాలో దాని గురించి రాశారు. అందరూ స్పానిష్‌ ఫ్లూ అన్నారు.
1977లో ఫ్లూ రష్యా, ఇతర దేశాలను వణికించింది. తొలుత ఇది ఉత్తర చైనాలో కనిపించింది. వ్యాప్తి ఎక్కువగా నాటి సోవియట్‌యూనియన్‌లో జరిగింది కనుక మీడియాలో దాన్ని రష్యా ప్లూ అన్నారు. తరువాత అమెరికా, ఇతర దేశాల్లో కూడా వ్యాపించింది. అప్పుడు చైనా-సోవియట్‌ సంబంధాలు సరిగా లేవు గనుక చైనా వారు లాబ్‌లో తయారు చేసి వదిలారని తప్పుడు ప్రచారం చేశారు.
2009లో ప్రపంచాన్ని వణికించిన హెచ్‌1ఎన్‌1 ప్లూ తొలుత మెక్సికోలో కనిపించినా దాన్ని మెక్సికో ఫ్లూ అని పిలువ లేదు. పందుల నుంచి వ్యాప్తి చెందినట్లు బయటపడినందున స్వైన్‌ ఫ్లూ అన్నారు. అయితే పంది మాంసం తినే దేశాలు ఈ పేరును అభ్యంతర పెట్టాయి. తరువాత ఇలాంటి వైరస్‌లకు ఒక దేశం, ప్రాంతం, భాష, జీవి పేరు పెట్టకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్ణయించింది. ఆ మేరకు కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. దాన్ని ఉల్లంఘిస్తూ చైనా వైరస్‌ అని ప్రచారం చేసి చైనా మీద ఉన్న కసిని అలా తీర్చుకున్నారు.

కరోనా వైరస్‌ తొలుత కనిపించిన ఊహాన్‌ నగరంలోని కోటి మంది జనాభా, పరిసరాలలో లాక్‌డౌన్‌ అమలు జరిపారు. అపార్ట్‌మెంట్లు, జనావాసాలను ఎక్కడిక్కడ కట్టడి చేశారు. రోగలక్షణాలతో నిమిత్తం లేకుండా దాదాపు ప్రతి ఇంటివారిని పరీక్షించి వైరస్‌ లక్షణాలున్న వారిని వేరు చేసి చికిత్స చేశారు. దేశంలోని ప్రజారోగ్య సిబ్బందినీ, వేలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా సమీకరించి ప్రతి నివాసం వద్ద ఉంచారు. ప్రతి ఇంటిలో ఎవరికేమి జరుగుతోందో పర్యవేక్షించారు. కావాల్సిన వాటిని అందచేశారు, జవాబుదారీతనంతో వ్యవహరించారు. అమరనాధ్‌ గారు స్లేట్‌ అనే ఒక కార్పొరేట్‌ స్కూలు అధిపతి గనుక స్కూలు పిల్లల గురించి చైనా తీసుకున్న జాగ్రత్తలను తెలుసుకోవాల్సింది. స్కూలు బస్సులకు ప్రత్యేక రోడ్ల కేటాయింపు, ఎక్కేటపుడు దిగేటపుడు జ్వరం ఉందా లేదా అని పరీక్షించటం వంటి చర్యలన్నీ తీసుకున్నారు.
ఇక్కడ కావాల్సింది చైనా మీద, అక్కడి వ్యవస్ధ మీద విశ్వాసం. అది లేని వారు అక్కడ ఏమి జరిగినా నమ్మరు. అందుకు ఒక్క ఉదాహరణ. చైనాలో జరిగిన ఆర్దిక అభివృద్ది గురించి చెప్పిందంతా అంకెల గారడీ అని ప్రచారం చేశారు. అవే నోళ్లు ఇప్పుడు తన ఆర్దికశక్తితో ప్రపంచాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు చైనా పూనుకుంది అని కొత్తబాణీ అందుకున్నాయి. చైనా, వైరస్‌ గురించి కుట్ర సిద్దాంతాలను ప్రచారం చేసేందుకు చూపిన శ్రద్ద వైరస్‌ నివారణకు మన దేశంతో సహా మిగతా దేశాలు చూపి ఉంటే ఇలాంటి తీవ్ర పరిస్ధితి ఉండేది కాదు. రెండవ తరంగం కరోనా వ్యాప్తి తీవ్రం అవటం ప్రారంభించిన తరువాతనే కదా లక్షలాది మంది రాసుకుంటూ పూసుకుంటూ తిరిగే కుంభమేళాకు అనుమతించింది. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి మూర్ఖ, మూఢత్వాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించాయా ? దీనిలో తెలియంది ఏముంది ? అమరనాధ్‌ లాంటి వారికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది, నిజంగా శ్రద్ద ఉండి తెలుసుకుంటే తెలియనిదేమీ లేదు. తెలుసుకోకుండా ఉంటారనీ అనుకోలేము.నిర్మొహమాటంగా చెప్పాలంటే చైనా సమాచారాన్ని విశ్వసించలేకపోవటమే అసలు సమస్య. దానికి సామాన్యుడైనా మేథావి అయినా ఒకటే.

” చైనా అమెరికా దేశంలోని అనేక యూనివర్సిటీ లకు సీక్రెట్‌ గా ఫండ్స్‌ ఇచ్చిందట . ఇదేదో అభియోగం కాదు. ట్రంప్‌ అధికారం లో వున్నప్పుడు దీని పై విచారణ జరిపి ఆయా యూనివర్సిటీ ల పై చర్య ల కు కూడా ఆదేశించాడు . యూనివర్సిటీ ల కు ఫండ్స్‌ ఇస్తే మంచే పనే కదా . దాన్ని గొప్పగా చెప్పుకోవాలి కదా ? . కానీ సీక్రెట్‌ గా దొంగ లాగా ఇవ్వడం ఏంటి ? అమెరికా మేధావులను తన అదుపులో పెట్టుకోవడం .. అమెరికన్‌ ల బ్రెయిన్‌ వాష్‌ .. మరో మాటలో చెప్పంటే మేధో దాడి అని కొంత మంది అంటారు . ”

చీమ చిటుక్కుమంటే కనిపెట్టగలిగిన అమెరికా గూఢచారి వ్యవస్ద గురించి తెలిసిన అమరనాధ్‌ గారు మీడియా ప్రచారదాడికి గురైయ్యారని పోస్టు పెట్టిన తీరు చెబుతోంది. ఇక్కడ కూడా అమెరికన్లు చెబుతున్న కుట్ర సిద్దాంతాన్ని నమ్మటమే. ముందే చెప్పినట్లు అక్కడ అలా అట ఇక్కడ ఇలా అట అని చెప్పటానికి అమరనాధ్‌ గారు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. మన దేశంలోని విశ్వవిద్యాలయాలలో అధ్యయన సంస్దల ఏర్పాటు వాటికి స్వదేశీ, విదేశీ సంస్ధలు నిధులు ఇవ్వటం రహస్యమేమీ కాదు. అలాగే అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో కన్పూషియస్‌ సిద్దాంతాల అధ్యయనం పేరుతో మరో పేరుతో చైనా అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి చైనా సంస్దల నుంచి, అమెరికా సంస్దల నుంచి కూడా నిధులు ఇచ్చారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా-చైనాల మధ్య సంబంధాలు, వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతున్నపుడు లేని సమాచారం ట్రంప్‌ హయాంలోనే బయటకు వచ్చిందా ? అంతకు ముందున్న పాలకులకు తెలియదా ? సిఐఏ, ఎఫ్‌బిఐ, జాతీయ దర్యాప్తు సంస్దలు వాటికి ఉన్న లక్షలాది మంది గూఢచారులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు ? నిజానికి అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందేమీ లేదు.

చైనాతో వివాదం పెట్టుకోవాలి, దాన్ని అదిరించి బెదిరించి తన వాణిజ్యలోటును తగ్గించుకోవాలి. అందుకోసం ఏదో ఒక సాకులు చెప్పి జనాన్ని నమ్మించాలి. ఆ ఎత్తుగడలో భాగమే విశ్వవిద్యాలయాలకు నిధులు, అమెరికన్ల బుద్ది శుద్ది ప్రచారం. మన దేశంలోని విద్యా సంస్ధలలో గత ఐదు దశాబ్దాలుగా వామపక్ష ఉగ్రవాద సానుభూతి పరులు ఉద్యోగాలు చేయటం, నక్సల్‌ పార్టీల అనుబంధ సంఘాలతో సంబంధాలు కలిగి ఉండటం తెలిసిందే. ఇదే సమయంలో తిరోగమన ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్నవారి సంఖ్యతో పోలిస్తే వీరు తక్కువే. అయినా అర్బన్‌ నక్సల్‌ అనే పదాన్ని ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ఎందుకు ప్రచారంలోకి తెచ్చారు? నిజానికి విశ్వవిద్యాలయాల్లో అలాంటి వారి సంఖ్య గతంతో పోల్చితే చాలా తగ్గింది. అధికార పార్టీలకు భజన చేసే బ్యాచి ఎక్కువైంది. అర్బన్‌ నక్సల్స్‌ పదం ప్రచారం ఎత్తుగడలో భాగం.

అమెరికాలో బుద్ది శుద్ది ఎవరు చేస్తున్నారు? చైనా కమ్యూనిస్టులు వచ్చి అక్కడేమీ రాజకీయ పాఠశాలలు పెట్టి కమ్యూనిస్టు పాఠాలు చెప్పటం లేదే ? గత మూడు దశాబ్దాల్లో అమెరికా విద్యావంతుల్లో వచ్చిన మార్పు ఏమిటి ? అంతకు ముందు కమ్యూనిజాన్ని బూచిగా చూపారు. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలను కూల్చివేసిన తరువాత కమ్యూనిజంపై విజయం సాధించామని ప్రకటించింది ఎవరు ? అమెరికన్లే కదా ! అక్కడే అమెరికా మేథావులు, యువతలో కొత్త ఆలోచనకు నాంది పడింది. దేశంలో దిగజారుతున్న పరిస్ధితి, దుకాణాలన్నీ చైనా వస్తువులతో నిత్యం దర్శనమివ్వటం, వాణిజ్య లోటు తగ్గించాలని అమెరికా నేతలు నిత్యం చైనీయులను కోరటం, అదే సమయంలో చైనా కమ్యూనిస్టు వ్యవస్ధలో మానవ హక్కులు లేవనే బ్లాక్‌మెయిల్‌ ప్రచారం వాస్తవమా, కాదా ? వీటికి తోడు పదేండ్లకొకసారి వస్తున్న ఆర్ధిక సంక్షోభాలు అమెరికా వంటి ధనిక దేశాలకు తప్ప చైనా దరిచేరకపోవటం అమెరికా మేథావులకు తెలియదా ? ఆందుకే మన దేశపు పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎందుకు విఫలమైంది, అంతకు ముందు విఫలమైంది అని చెప్పిన సోషలిస్టు వ్యవస్ధ చైనాలో ఎందుకు ముందుకు పోతోంది అనే ఆలోచన వారిని కాపిటల్‌ గ్రంధం దుమ్ముదులిపేందుకు ముందుకు నెట్టింది. ఇప్పుడు అమెరికా విద్యావంతుల్లో చర్చ పెట్టుబడిదారీ వ్యవస్ద వైఫల్యం గురించే నడుస్తున్నది. సోషలిస్టు అంటే ఎయిడ్స్‌ వచ్చిన వాడిని చూసినట్లు చూసే జనం ఒకప్పుడు ఉన్న అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతోంది. అవును నేను సోషలిస్టును బస్తీమే సవాల్‌ అంటూ బహిరంగంగా ప్రకటించుకున్న బెర్నీ శాండర్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కొరకు పోటీపడే స్ధితి ఏర్పడింది. ఆ పార్టీలోని అనేక మంది మీద కమ్యూనిస్టు ముద్ర ఉన్నా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మిలియన్ల మంది యువత మేమూ సోషలిస్టులమే అని ప్రకటించుకుంటున్నారు. ఇవేవీ అమరనాధ్‌ వంటి వారికి తెలియవా, తెలుసుకుంటే దొరకని వస్తువా ? మార్గం చూపాల్సిన మేథావులు అపని చేయకుండా, తాము ఏమనుకుంటున్నారో చెప్పకుండా అమెరికన్ల బ్రెయిన్‌ వాష్‌.. మరో మాటలో చెప్పాలంటే మేథోదాడి అని కొంత మంది అంటారు అని ఇతరుల మీద నెట్టటం ఏమిటి ?

” తొలిసారి ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పుడు ఒక ప్రచారం జరిగింది . రష్యా వివిధ పద్ధతుల్లో ట్రంప్‌ గెలవడానికి సాయ పడింది . ఆ విధంగా అమెరికా పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది అని . చైనా ప్రపంచం పై పట్టు సాధించడానికి చేయని ప్రయత్నం లేదనేది మేధావుల మాట . మొన్నటి అమెరికా ఎన్నికలు ముందు అమెరికా లో కేసులు విపరీతంగా పెరగడం తెలిసిందే . అప్పటికే దిగజారుతున్న ట్రంప్‌ పరపతి దీనితో ఇంకా పోయింది . ట్రంప్‌ , కరోనా విషయం లో సరిగా వ్యవహరించక పోవడం వల్లే ఇంత నష్టం జరిగింది అని చాలా మంది అమెరికన్‌ లు అనుకొన్నారు . ఫలితం .. ట్రంప్‌ ఓటమి . అమెరికన్‌ లు మాస్క్‌ పెట్టుకోకపోవడం వల్లే కేసులు పెరిగాయని ట్రంప్‌ మాస్క్‌ ల విషయం లో తప్పుదారి పట్టించేలా వ్యవహరించాడని చాలా మంది భావించారు . లేదు .. తన పై దాదాపుగా యుద్ధం ప్రకటించిన ట్రంప్‌ ను ఓడించాలని చైనా పంతం పట్టింది .. అమెరికా లో మేధావులు , మీడియా ఇప్పుడు చైనా గుప్పిట్లో వున్నారు . చైనా కావాలంటే కేసులు పెంచడం పెద్ద కష్టమా ? ఇందులో ఏదో కుట్ర వుంది అని భావించే వారున్నారు . ఇలా చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవనేది సత్యం . ఇలాంటి కుట్ర సిద్ధాంతాలు కేవలం కాలక్షేపానికి పనికి వస్తాయి అని చాలా మంది భావిస్తారు. ” అని అమరనాధ్‌గారు చెప్పారు.

వాట్సప్‌ యూనివర్సిటీ చేస్తోంది ఇదే. రుజువులు లేని సొల్లుకబుర్ల తయారీ కూడా ప్రచార దాడిలో భాగమే. జనాన్ని తప్పుదారి పట్టించేందుకు అవి బాగా ఉపయోగపడతాయి, రంజుగా ఉంటాయి. ఎలాంటి విమర్శనాత్మక దృష్టి లేకుండా మేథావులు వాటిని జనం ముందు ఉంచటమే విషాదం, విచారకరం, ఆక్షేపణీయం. ఆ పని చేయటంలో పోస్టుమాన్‌ పని తప్ప వారి బుద్ది కుశలత ఏముంది ? వాటి మీద బుద్ది జీవుల వైఖరి ఏమిటి ? ఒక టీవీ యాంకర్‌ అయితే దీని మీద వారలా అంటున్నారు, మీరేమంటున్నారు, దాని మీద వారలా అన్నా మీరేమంటారు అని అడగవచ్చు. అది మేథోలక్షణం కాదు. కొందరు యాంకర్లు తమకు నచ్చేవాటిని చెప్పేందుకు ఎక్కువ అవకాశమిస్తారు, భిన్నంగా మాట్లాడితే ఏదో ఒక పేరుతో వేరే అంశానికి మరలుతారు. మేథావులు అలా చేస్తే సహజంగానే అనుమానాలు వస్తాయి.

ప్రతి దేశం మరోదేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది అన్నది అందరికీ తెలిసిన పచ్చినిజం. మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా అమెరికా వెళ్లి అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా ప్రచారం చేసి వచ్చిన విషయం తెలియదా ? అంటే బైడెన్‌ను ఓడించాలనే కదా ! ఎవరైనా ఒకటే కదా మరి, మోడీ ఎందుకు ఆ పిలుపు ఇచ్చినట్లు ? పాకేజ్‌ ఏమైనా కుదుర్చుకున్నారా ? తన పెరటితోట అనుకుంటున్న లాటిన్‌ అమెరికాలో, ఇంకా అనేక దేశాల్లో అమెరికా జోక్యం చేసుకుంటూ ఎవరు గద్దెమీద ఉండాలో కూడదో నిర్దేశిస్తున్నది. ఎన్నుకున్న ప్రభుత్వాలను గుర్తించేందుకు నిరాకరిస్తున్నది. మేథావులకు ఇవేవీ పట్టవా ? కుట్ర సిద్దాంతాలను ఒక లక్ష్యం కోసం తప్ప కాలక్షేపం కోసం సృష్టించటం లేదు. అదేమీ చిన్న విషయం కాదు. సూటిగా చెప్పకుండా అనుమానాలు రేకెత్తించి జుట్టుపీక్కొనేట్లు చేసే నైపుణ్యం ఉంటేనే అలాంటి వాటి సృష్టి కర్తలకు నాలుగు డబ్బులు వస్తాయి. దేశంలో హిందువులను మైనారిటీలుగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఇస్లాం, క్రైస్తవ మతాల వారి మీద నిరంతరం ప్రచారం చేస్తున్నారు. దీన్ని కాలక్షేపానికి చేస్తున్నారని అనుకోవాలా ? కేంద్ర ప్రభుత్వ చర్యలను లేదా రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల చర్యలను విమర్శించిన మీడియా మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏకంగా దేశద్రోహంగా చిత్రిస్తున్నది. అదే విధంగా అమెరికా మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే దానికి చైనా మద్దతు, నిధులు అంటున్నారు. అమెరికా మీడియాలో ప్రధాన స్రవంతి సంస్ధలన్నీ కార్పొరేట్లవే. వాటి ప్రయోజనాలే మీడియాకు ముఖ్యం తప్ప చైనా కోసం పని చేస్తాయని చెప్పటం ప్రచారదాడిలో భాగమే.

” కొన్ని నెలల క్రితం ఒక యూట్యూబ్‌ లో ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ వీడియో చూసాను . ఆయన తెలుగు వాడే . పేరు గుర్తు రావడం లేదు . ఢిల్లీ స్థాయిలో మీడియా ను చైనా దేశం తరపున కొంత మంది బ్రోకర్‌ లు ఎలా మానిప్యులేట్‌ చేస్తున్నారో .. మీడియా లో చైనా వ్యతిరేక వార్తలు రాసిన జర్నల్లిస్ట్‌ ల ఉద్యోగాలు ఎలా ఊడి పోయాయో అయన ఆ వీడియో లో పేర్ల తో సహా వివరించాడు . అవునా ? మన దేశం లో కూడా చైనా కు నిజంగా అంత పట్టుందా అని నేను ఆశ్చర్య పోయాను. ”

ఇది ఆధారం, అర్దం లేని అంశం. సదరు సీనియర్‌ జర్నలిస్టు తెలుగువాడైనా మరొకరైనా చైనా వ్యతిరేక వార్తలు రాసి ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు. పత్రికలు, టీవీ ఛానళ్లు తమ రేటింగ్‌ను పెంచుకొనేందుకు చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రచారం అమరనాధ్‌ గారి దృష్టికి వచ్చి ఉంటే ఈ అతిశయోక్తి వార్తను నమ్మి పోస్టులో పెట్టి ఉండరు. చైనాతో మన సంబంధాల గురించి విమర్శనాత్మకంగా రాసిన వారెవరైనా ఉద్యోగాలు పోగొట్టుకొని ఉంటారు తప్ప మరొకటి కాదు. చైనీయులు అమెరికాను, మన దేశ మేథావులను కూడా అదుపులోకి తీసుకున్నారని అమరనాధ్‌ వంటి వారు నిజంగా నమ్ముతున్నారా ? మొత్తంగా ఎక్కడైనా అమ్ముడు పోతారా ? ఒక వైపు మీడియాను పూర్తిగా తనకు అనుకూలంగా వినియోగించుకుంటూ ఒకటీ అరావిమర్శనాత్మకంగా ఉంటే మీడియా మొత్తం కమ్యూనిస్టులు, దేశద్రోహులతో నిండిపోయిందని కాషాయ దళాలు నిరంతరం ప్రచారం చేస్తుంటాయి. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారు, భజన చేయని వారందరూ వారి దృష్టిలో కమ్యూనిస్టులే.

” ఫిబ్రవరి మూడవ వారం నుంచి కేసులు మన దేశం లో భారీగా పెరిగాయి . ఇలా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదు అనేది సత్యం . ఇప్పుడు అనేక వాట్సాప్‌ గ్రూప్‌లలో ఫేస్బుక్‌ పైన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత పెరగడం చూసాను . అమెరికా లో సఫలం అయిన ప్రయోగాన్ని ఇక్కడ కూడా చేయాలని చైనా చూస్తోందా ? అసలు అమెరికా లో చైనా ఆలా చేసింది అని చెప్పడానికే ఆధారాలు లేవు . ఇంకా ఇక్కడ దాన్ని ప్రయోగిస్తోంది అని అనుకోవడమేంటి ? పిచ్చి ఊహ కాదా ? అయిన చైనా ఆలా చెయ్యాలని ప్రయత్నిస్తే మన దేశం లో గూఢచారి సంస్థలు పసిగట్ట లేవా ? ఏమో .. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కన్నా మన సంస్థ లు గొప్పవా ? ఆబ్బె .. ఇది అతి గా ఆలోచించడం .. ”

ఇది వాట్సప్‌, బుర్ర ఉపయోగించకుండా దానిలో వచ్చిన వాటన్నింటినీ గుడ్డిగా నమ్మి ప్రచారం చేసిన దాని ప్రభావం అమరనాధ్‌ గారి మీద కూడా పడినట్లుంది. ఆయనే చెప్పినట్లు పిచ్చి ఊహల గురించి చెప్పుకోవటం పనిపాటా లేని వ్యవహారం. లేదా వాటిని చెప్పాల్సి వస్తే అలాంటి పనిపాటా లేని సరకు గురించి జనాన్ని హెచ్చరించాలి. అతిగా ఆలోచించటం అన్నారు తప్ప అమరనాధ్‌ పోస్టులో అలాంటి సూచనలేవీ లేవు. కరోనా కేసులు పెరుగుతాయని సామాన్యులు ఊహించలేకపోవచ్చు. కానీ ఎంతో అనుభవం, నిత్యం ప్రపంచ పరిణామాలను చూస్తున్న అధికార యంత్రాంగం, దాన్ని నడిపే రాజకీయనాయకత్వానికి ముందు చూపు లేకపోతే దేశం అధోగతి పాలవుతుంది. ఇరుగు పొరుగు దేశాలతో వస్తుందో రాదో తెలియని యుద్దం గురించి అంచనా వేసుకొని లక్షల కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాము. ఆ సమాచారం ఉంది ఈ సమాచారం ఉందని కథలు రాయిస్తుంటారు. కొన్న ఆయుధాలు పాతపడి పోగానే పక్కన పడేసి కొత్తవి కొంటున్నాము.

కరోనా మీద యుద్దం ముగిసిందని ఎవరు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అలాంటి సూచనలేమీ ఇవ్వలేదు. అనేక దేశాలలో తిరగబెట్టింది. కేంద్ర పాలకులు ఆ అనుభవాన్ని ఏమైనా పరిగణనలోకి తీసుకున్నారా ? పోనీ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న తరువాత కూడా కుంభమేళాకు ఎందుకు అనుమతిచ్చారు? అనేక మంది నిపుణులు చేసిన హెచ్చరికలను ఎందుకు పెడచెవిన పెట్టారు ? ఆక్సిజన్‌ అవసరం గురించి గతేడాదే అర్దం అయింది. దానికోసం 150 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని గతేడాదే నిర్ణయించారు. ఏడు నెలల పాటు టెండర్లు ఖరారు చేయలేదు, దీన్ని ఏమనాలి బాధ్యతా రాహిత్యమా , నేరపూరిత నిర్లక్ష్యమా ? ఫేస్బుక్‌లో జన స్పందన చూసేంతవరకు మీకు కేంద్ర వైఖరిలో ఎలాంటి తప్పు ఒప్పులు కనిపించలేదా ? సామాన్యులకు మీకు ఇంక తేడా ఏముంది. పరిజ్ఞానం కంటే ఊహ ముఖ్యమని ఐనిస్టీన్‌ చెప్పాడు. మెదడుతో చూడగలిగిన వాడే బుద్ది జీవి అని మరో పెద్దమనిషి సెలవిచ్చారు. అలాంటి వారు కొందరు హెచ్చరిస్తున్నా కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో యంత్రాంగం పట్టించుకోకపోవటమే ఇంతవరకు తెచ్చింది. మేథావులూ పట్టించుకోవటం లేదు.

” చైనా లో ఆ ఒక్క నగరం తప్పించి మిగతా చోట్లకు ఆ రోగం ఎందుకు విస్తరించలేదు ? ఆ నగరం పేరు పోస్ట్‌ చేసినా సోషల్‌ మీడియా ఎందుకు ఆ పోస్ట్‌ ను బ్లాక్‌ చేస్తోంది ? చైనా మిత్రం దేశం .. మన పొరుగున వున్న పాకిస్థాన్‌ . మన దేశం లో మాత్రం అటు ఉత్తరాంచల్‌ మొదలు ఇటు తమిళనాడు దాకా కేసులు పెరుగుతున్నాయి . సరే ఇక్కడ మాస్క్‌ లు పెట్టుకోలేదు .. జనాలు గుంపులు గుంపులుగా తిరిగారు అని చెప్పేవారు . మరి మన పొరుగునే వున్న పాకిస్థాన్‌ ? అక్కడ కొద్దీ పాటి కేసులు పెరిగినా ఇక్కడి లాగా ఇన్ని కేసులు రావడం లేదు . అక్కడ మాస్క్‌ లు భౌతిక దూరం సిద్ధాంతం పని చెయ్యదా ?
పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను కదా . అందుకే చెప్పా .. నా దగ్గర రుజువులు లేవండి . చదివే వారికి ఏదో సోది లాగా ఉంటుంది .. లేదా నేనేదో సంచలనం కోసం .. పబ్లిసిటీ పిచ్చితో ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది .. కాబట్టి నేను చెప్పను .. అవి నా మనసులో అనుమానాలే .. అది నాతోనే ఉండి పోనీ అని .. నిన్నటి నుంచి సర్‌ చెప్పండి చెప్పని అని మెసెంజర్‌ లో మెసేజ్‌ ల వెల్లువ . సరే పోస్ట్‌ చేశా . జస్ట్‌ చదివి మరచి పోండి. అయిదు నిముషాలు కాలక్షేపం అనుకోండి. ”

ఊహాన్‌ నగరం పేరు ఉన్న పోస్టును సోషల్‌ మీడియా బ్లాక్‌ చేస్తోందన్నారు. చాలా చిత్రంగా ఉంది. కాషాయ తాలిబాన్లు ఇలాంటి చిత్రాల గురించి పోస్టులు పెట్టటం నేను ఫేస్బుక్‌లో చూశాను. మన దేశంలో ఇంటర్నెట్‌ను నియంత్రించేది చైనా అనుకుంటున్నారా ? పక్కా నరేంద్రమోడీ సర్కార్‌. రైతు ఉద్యమం సందర్భంగా మీడియా కిట్ల గురించి ఎంత రచ్చ చేసిందో మీకు తెలియకుండా ఉంటుందా ? పబ్లిసిటీ పిచ్చికోసం ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది అన్నారు. మీకేమనిపించిందో స్కానింగ్‌చేసినా దొరకదు, కానీ మెసేజ్‌ల వెల్లువ కారణంగా పోస్టు చేయాల్సి వచ్చిందన్నారు. పర్యవసానం మీకు ఎంతో పబ్లిసిటీ వచ్చింది. మీకు కాలక్షేపం అనిపించవచ్చు గానీ, ఒక మేధావిగా ఇలాంటి పోస్టులు పెట్టటం తగదేమో ఆలోచించండి. దీని వలన ఏమి సాధించిందీ అవలోకించుకోండి. ఎవరిలో అయినా ఉన్న గందరగోళాన్ని తొలగించారా, ఇంకా గట్టిపరిచారా ? చైనా-అమెరికా-నరేంద్రమోడీ ఇంకా ఎవరైనా సరే వారి గురించి అమరనాధ్‌ గారయినా మరొక మేధావి అయినా ఒక స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండాలని మనవి. అవి వెల్లడించే ధైర్యం లేనపుడు మౌనంగా ఉండటం మేలు. అటూ ఇటూగాకుండా చెబితే ప్రయోజనం ఏముంది ? ఒక బుద్ది జీవిగా ఆలోచించండి. మేథావుల మౌనం దేశాలకు మంచిది కాదని ప్రపంచ చరిత్ర చెప్పింది.ప్రపంచంలో తటస్ధం అంటూ ఏదీ లేదు. నాకు రాజకీయాలు పట్టవు, నేను ఎవరికీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదు అని ఎవరైనా అంటే అధికారంలో ఉన్నవారిని కొనసాగించాలని కోరే పక్షానికే అది అనుకూలిస్తుంది. తెలియకుండానే అలాంటి వారు ఒక వైపు మద్దతు ఇచ్చినట్లే !

రూపాయి పాపాయి మీద అనుమానం, అమెరికా నిఘా : మోడీకి అడుగడుగునా అవమానాలు, భంగపాటు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ఎదుటి వారిలో ఏమీ లేకుండా మనం ఎగిరెగిరి కౌగలించుకున్నంత మాత్రాన ఒరిగిందేమీ లేకపోగా అడుగడుగునా అవమానాలు. విదేశీనేతలను ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ను మన నరేంద్రమోడీ కౌగిలించుకున్న తీరు తెన్నులు చూసి ఎబ్బెట్టుగా అనిపించి ఇదేమిటని విమర్శించిన వారు కొందరు ఉండవచ్చు. కానీ మోడీ ఏం చేసినా దేశం కోసమే అని నమ్మి సమర్ధించిన వారెందరో. ఒక్కొక్క నేతది ఒక్కో శైలి. అధికారంలో ట్రంపు ఉన్నా బైడెన్‌ వచ్చినా అమెరికా నుంచి అడుగడుగునా ఆటంకాలు, అవమానాలే. అన్నింటికీ మించి మనకు ఒరిగిందేమీ లేకపోగా నష్టాలే. వాటిని పదే పదే చెప్పుకున్నా అల్లు అర్జున్‌ ఒక సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు.


తాజా విషయానికి వస్తే అమెరికా మనల్ని మోసకారుల జాబితాలో చేర్చింది. కరెన్సీతో మోసాలకు పాల్పడుతూ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదంటూ కన్నేసి ఉంచాల్సిన దేశాల జాబితాలో మన పేరు చేర్చింది. తొలిసారి 2018లో చేర్చి మరుసటి ఏడాది తొలగించింది, మరోసారి గత డిసెంబరులో చేర్చింది. దాన్ని మరోసారి తాజా పరిచినట్లు గతవారంలో వార్తలు వచ్చాయి. అమెరికా ఆర్ధికశాఖ రూపొందించిన జాబితాలో చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఐర్లాండ్‌, ఇటలీ, ఇండియా, మలేషియా, సింగపూర్‌,థాయిలాండ్‌, మెక్సికో ఉంది. అమెరికాకు తన ప్రయోజనాలు తప్ప మిత్ర-శత్రుదేశాలనేవి లేవని ఈ జాబితా స్పష్టం చేస్తున్నది. డిసెంబరు జాబితాలో మెక్సికో, ఐర్లండ్‌లు లేవు. ఈ జాబితా లేదా ఈ దేశాల మీద ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసింది ఏ ప్రపంచ వాణిజ్య సంస్దో లేక ఐక్యరాజ్యసమితో అయితే అదోదారి. ఏదో ఒక అంతర్జాతీయ చట్టం కింద అనుకోవచ్చు. అదేమీ లేదు, 2015నాటి అమెరికా వాణిజ్య చట్టం ప్రకారం ఈ పని చేశారు. వారు దాడి చేయాలనుకున్నవారిని జాబితాలో పెడతారు, ఎత్తుగడగా వద్దనుకున్న వారిని మినహయిస్తారు. దానిలో భాగంగానే వియత్నాం, చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌, స్విడ్జర్లాండ్‌లను ఆరునెలల క్రితం ఈ జాబితాలో చేర్చారు. అయినప్పటికీ రాజకీయ కారణాలతో జాబితా నుంచి తొలగించి మిగతావాటితో పాటు ఓ కన్నేసి ఉంచాలని మాత్రమే నిర్ణయించారు.


ఒక దేశం కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించేందుకు అమెరికాకు ప్రాతిపదిక ఏమిటి? అమెరికాతో వాణిజ్యం చేసే దేశపు మిగులు ఏడాదిలో 20 బిలియన్‌ డాలర్లు ఉండటం, ఆయా దేశాల జిడిపిలో కరెంటు ఖాతా మిగులు మూడుశాతం వరకు ఉన్నపుడు, ఒక దేశం ఏడాది కాలంలో కొనుగోలు చేసిన విదేశీ కరెన్సీ దాని జిడిపిలో రెండుశాతం దాటితే అమెరికాను మోసం చేస్తున్నట్లు పరిగణిస్తారు. 2020 జనవరి నుంచి డిసెంబరు మధ్యకాలంలో వియత్నాం, స్విడ్జర్లాండ్‌, తైవాన్‌, భారత్‌, సింగపూర్‌ లావాదేవీల గురించి అమెరికాకు అనుమానం వచ్చినట్లు ఏప్రిల్‌ 16వ తేదీన విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. పైన పేర్కొన్న మూడు ప్రాతిపదికలలో మన దేశం రెండింటిలో గీత దాటినట్లు పేర్కొన్నది. 2020లో పన్నెండు నెలలకు గాను పదకొండు నెలల్లో భారత్‌ నిఖరంగా 131 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసింది, ఇది జిడిపిలో ఐదుశాతానికి సమానం. 2001,02,03 తరువాత 2020లో భారత కరెంటు ఖాతా మిగులు 1.3శాతం ఉంది. అదే ఏడాది అమెరికాతో భారత వాణిజ్య మిగులు 24 బిలియన్‌ డాలర్లు ఉంది, సేవల వాణిజ్యంలో కూడా ఎనిమిది బిలియన్‌ డాలర్ల మిగులు ఉంది. 2019తో పోల్చితే కరోనాతో ఆర్ధిక వ్యవస్ధ కుదేలయినా మన దేశ స్టాక్‌ మార్కెట్లోకి విదేశీ మదుపరులు పెద్ద మొత్తంలో ప్రవేశించారు. మన డాలర్ల నిల్వ పెరగటానికి అది కూడా ఒక కారణం. ఒక దేశ ఆర్ధిక మౌలిక అంశాలను ప్రతిబింబించే విధంగా కరెన్సీ మారకపు విలువ ఉండాలి. విదేశీ కరెన్సీ జోక్యం పరిమితంగా ఉండాలి, ఎక్కువగా నిలువ చేసుకోకూడదని అమెరికా ఆర్ధికశాఖ నివేదిక పేర్కొన్నది.


వారి జాబితా నుంచి తొలగించిన వాటిలో స్విడ్జర్లండ్‌ ఐరోపాలోని తటస్ధదేశం, అయినా గతంలో మోసకారుల జాబితాలో చేర్చి తాజాగా తొలగించింది. వియత్నాం సోషలిస్టు దేశం. దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల విషయంలో చైనాతో విబేధిస్తున్నది కనుక దాన్ని తనవైపు తిప్పుకోవాలంటే ఇలాంటి తాయిలం పెట్టాలన్నది ఒక ఎత్తుగడ. ఇక తైవాన్‌ విషయానికి వస్తే చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం, స్వంతంగా మిలిటరీని కలిగి ఉంది. అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది. దాన్ని కూడా అనుమానితుల జాబితాలో చేర్చితే అక్కడి జనంలో అమెరికా వ్యతిరేకత పెరుగుతుంది, దీనికి తోడు చైనాను రెచ్చగొట్టేందుకు తైవాన్‌ ఒక శిఖండిలా ఉపయోగపడుతోంది కనుక దానికీ అమెరికన్లు మినహాయింపు ఇచ్చారు. మనల్ని మిత్రదేశం అంటూనే మరింతగా లొంగదీసుకొనేందుకు మోసకారి ముద్రవేశారు.


అమెరికా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నది. స్వార్ధం, బెదిరింపు,లొంగదీసుకొనే ప్రక్రియలో భాగం తప్ప మరొకటి కాదు. దీనిలో కీలక అంశం కరెన్సీ విలువ. ప్రస్తుతం ప్రపంచంలో వివిధ దేశాల మధ్య టవమారకానికి డాలర్లను వినియోగిస్తున్నారు. కరెన్సీ విలువలను మోసపూరిత పద్దతుల్లో కృత్రిమంగా తగ్గించి లేదా పెంచి తమ కార్మికులను దెబ్బతీస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలని చెబితే బాగోదు కనుక కార్మికుల పేరుతో రాజకీయం చేస్తోంది. ఆయా దేశాలు తమ కరెన్సీ విలువలను కావాలని తగ్గిస్తున్నాయన్నది దాని ప్రధాన ఆరోపణ. చిత్రం ఏమంటే ట్రంప్‌ యంత్రాంగం చైనాను మోసకారి అని ప్రకటించగా, బైడెన్‌ యంత్రాంగం నిఘావేసి ఉంచాల్సిన మోసకారుల జాబితాలో మన దేశంతో పాటు చైనాను కూడా చేర్చింది, అంటే చైనా మీద దాడి తీవ్రతను తగ్గించింది. ఈ జాబితా రూపకల్పనలో ఎలాంటి ఆర్ధిక పరమైన తర్కం తనకు అర్ధం కావటం లేదని మన వాణిజ్యశాఖ కార్యదర్శి అనుప్‌ వాధ్వాన్‌ వ్యాఖ్యానించారు. పోనీ మోసకారులంటే ఏ ఒక్కరి మీద అమెరికా ఆంక్షలు ఎందుకు లేవు అన్నారు. మార్కెట్‌ శక్తుల ప్రాతిపదికగానే రిజర్వుబ్యాంకు వ్యవహరిస్తోందన్నారు.


ఇక అమెరికా ఆగ్రహం విషయానికి వస్తే మన రూపాయి పాపాయి బలపడుతోంది- చిక్కిపోతోంది. తాజాగా ఆసియాలో అత్యంత దారుణమైన పని తీరు కనపరుస్తున్న కరెన్సీగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలర్ల కొనుగోలు రూపాయి పెరుగుదలను నిరుత్సాహపరచేందుకు తీసుకున్న చర్యగా కొందరు చెబుతున్నారు. రూపాయి చిక్కితే ఎగుమతిదార్లకు లాభం- దిగుమతిదార్లకు నష్టం, బలపడితే ఎగుమతిదార్లకు నష్టం-దిగుమతిదార్లకు లాభం. మార్కెట్లోని ఈ రెండు శక్తులు తమకు అనువైన వాదనలను ముందుకు తెస్తూ వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి.మనతో వాణిజ్యం జరిపే దేశాల ప్రమేయం కూడా దీనిలో ఉంటుంది. తమ డాలరు విలువ తగ్గకుండానే తమ సరకులను అమ్ముకోవాలన్నది అమెరికా లక్ష్యం. కరెన్సీ విలువ ఎక్కువ-తక్కువలు ఒకే దేశంలో ఎగుమతి-దిగుమతిదార్లు ఇద్దరి మీద ప్రభావం చూపుతాయి. ఇలా ఇంటా బయటి వత్తిళ్లతో రూపాయి పరిస్ధితి అగమ్యగోచరంగా ఉంటుంది. గత ఏడు సంవత్సరాల కాలంలో చూసినపుడు రూపాయి 58 నుంచి 75కు దిగజారింది కనుక దీనిలో రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుపిఏ కంటే తన పాలనలో ఎగుమతులను పెంచి దేశాన్ని ముందుకు తీసుకుపోయానని చెప్పుకొనేందుకు మోడీ సర్కార్‌ రూపాయి విలువను దిగజార్చిందని చెప్పవచ్చు. అంతకు ముందు రూపాయి విలువ పడిపోతే ముఖ్యమంత్రిగా మోడీ, బిజెపి నేతలు ఎంత యాగీ చేశారో, ఎన్ని మాటలన్నారో తెలిసిందే. తమ దాకా వచ్చే సరికి ప్లేటు ఫిరాయించారు.నోరు మూసుకున్నారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.


2010 నుంచి 2019వరకు ఉన్న వివరాలను చూసినట్లయితే మన ఎగుమతులు జిడిపిలో 2010లో 22.4శాతం ఉండగా 2013 నాటికి 25.43శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి పడిపోతూ 2019నాటికి 18.41శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో దిగుమతులు కూడా తగ్గినప్పటికీ ఎగుమతుల కంటే ఎక్కుగానే ఉన్నాయి. 2010 -21 మధ్య డాలరుతో రూపాయి మారకపు విలువ 45 నుంచి 75కు పడిపోయింది (ఏప్రిల్‌ 24న 75.22). మే నెలలో 76.50వరకు పతనం కావచ్చని అంచనా. ఇదే కాలంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు రూపాయి విలువ అంతర్గతంగా 100 నుంచి 202.96(ఏప్రిల్‌ 24వ తేదీ)కు పడిపోయింది. అంటే ఒక వస్తువు ధర పదేండ్లలో ఆ స్ధాయిలో పెరిగింది అని చెప్పవచ్చు. ఒక దేశ కరెన్సీ విలువ డాలరుతో మారకపు ధర ఎంత తక్కువ ఉంటే అంతగా ఎగుమతి అవకాశాలు ఉంటాయన్నది సాధారణ సిద్దాంతం. దానికి మినహాయింపుగా మన దేశ పరిస్ధితి ఉన్నట్లు పై వివరాలు వెల్లడిస్తున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ ఏడు సంవత్సరాలుగా ఎగుమతుల గురించి కబుర్లు చెప్పటం తప్ప పెరగలేదంటే ఇతర దేశాల సామర్ధ్యం లేదా మన అసమర్ధత అయినా కావచ్చు. ఎగుమతుల మీద ఆధారపడిన ఆర్ధిక వ్యవస్దలను నిర్మించిన దేశాలన్నీ చైనా మాదిరి విజయవంతం కాలేదు.మనం అసలు పోటీలోకే ప్రవేశించ కుండా లేస్తే మనిషిని కాదు అన్న మల్లయ్య కథమాదిరి మాట్లాడుతున్నాము.


ప్రస్తుతం అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. ఇలాంటి పరిస్ధితి ఏ దేశంతో ఉన్నా అమెరికన్లకు నిదురపట్టదు.చైనాతో లోటు మరింత ఎక్కువగా ఉంది కనుక దానితో వాణిజ్య యుద్దానికి దిగింది.మనది పెద్ద మార్కెట్‌గా ఉన్నందున ఖరీదైన తన వస్తువులను మన మీద రుద్దాలని చూస్తున్నది. వాటికి మార్కెట్‌ ఉండదు కనుక దానికి మన దిగుమతిదారులు కూడా అంగీకరించరు. ఎక్కడ వస్తువుల ధరలు తక్కువగా ఉంటే అక్కడికే దారితీస్తారు. అందుకే కమ్యూనిజానికి నరేంద్రమోడీ బద్ద వ్యతిరేకి అయినప్పటికీ వాణిజ్యవేత్తల వత్తిడికి తలొగ్గి భారీ ఎత్తున దిగుమతులకు అనుమతించక తప్పలేదు. మరోవైపు అమెరికాను సంతృప్తి పరచేందుకు పెద్ద మొత్తంలో ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్నారు, మరో దేశం నుంచి దొరకని వైద్యపరికరాల వంటివాటిని కూడా దిగుమతి చేసుకుంటున్నాము. అయినా అమెరికన్లకు తృప్తి లేదు.


మన దేశ కరెంటు ఖాతా ఎప్పుడూ లోటులోనే ఉంటున్నది. గతేడాది కరోనా వలన కొనుగోలు చేసేవారు లేక దిగుమతులు పెద్ద ఎత్తున పడిపోయినందున మన వాణిజ్యం మిగుల్లో ఉంది తప్ప నిజానికి మన ఎగుమతులు పెరిగి కాదు. నికర వాణిజ్యలోటు నిరంతరం ఉండే మన వంటి దేశాలకు తగినన్ని డాలర్ల నిల్వలు లేనట్లయితే అసాధారణ రీతిలో చమురు ధరలు పెరిగితే చెల్లింపుల సమస్య తలెత్తుతుంది. అయితే నరేంద్రమోడీ అధికారానికి వచ్చినప్పటికీ ఆరు సంవత్సరాల కాలంలో చమురు ధరలు కనిష్టస్ధాయికి పడిపోయి విదేశీమారక ద్రవ్య నిల్వలు బాగా పెరిగాయి.కరోనా కారణంగా స్టాక్‌మార్కెట్‌ పడిపోయింది, దాంతో విదేశీమదుపుదార్లు వాటాలను అమ్ముకొని పెట్టుబడులు తరలించుకుపోయినపుడు రిజర్వుబ్యాంకు డాలర్లను కొనుగోలు చేసింది. అయితే మన ప్రభుత్వం కార్పొరేట్‌శక్తులకు పెద్దమొత్తంలో రాయితీలు ఇవ్వటంతో స్టాక్‌మార్కెట్‌లో వాటాలు ధరలు పెరిగినందున తిరిగి విదేశీ పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. గతేడాది ఏప్రిల్‌ 24న రూపాయి విలువ 76.22కు పడిపోయింది. తరువాత పెరిగి, స్వల్పంగా తగ్గినా 2021మార్చి 21న 72.32కు పెరిగింది. తిరిగి గత నెల రోజుల్లో ఏప్రిల్‌ 21న 75.22కు పతనమైంది. తరువాత అదే స్ధాయిలో కొనసాగుతోంది. ఇప్పుడు ముడిచమురు ధర 65 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నపుడు ఇలా ఉంటే విశ్లేషకులు చెబుతున్నట్లు 75డాలర్లకు పెరిగితే పతనం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఉన్న డాలర్లు కూడా హరించుకుపోతాయి గనుక డాలర్లను కొనుగోలు చేయకతప్పదు.


2020-21 ఆర్ధిక సంవత్సరంలో తొలి ఆరునెలల్లో మన వాణిజ్య మిగులు 15.1 బిలియన్‌ డాలర్లు ఉండగా, సెప్టెంబరు-డిసెంబరు కాలంలో 1.3 బిలియన్‌ డాలర్లలోటు నమోదైంది. తరువాత మూడు నెలల్లో అది 5-7 బిలియన్‌ డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఇప్పటి వరకు ఉన్న పరిస్ధితిని బట్టి రూపాయి విలువ 74.50 నుంచి 76 మధ్య కదలాడవచ్చని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఇంతకు మించి పతనం కాకుండా ఆర్‌బిఐ చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. అంతకు మించితే మన దిగుమతుల బిల్లు పెరిగి, పర్యవసానంగా జనం మీద మరింత భారం పడుతుంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి మార్కెట్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండేట్లు చూసే లక్ష్యంతో ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య రిజర్వుబ్యాంకు లక్ష కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా రూపాయి పతనాన్ని అరికట్టవచ్చని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం వీటి మీద ఎలా ఉంటుందో ఊహించలేని స్ధితి. ఇక్కడ సమస్య మనకు అవసరమైన డాలర్లు కొనుగోలు చేస్తే అమెరికాకు అభ్యంతరం ఎందుకు ఉండాలి ? తర్కబద్దంగా చెప్పాలంటే డాలరు విలువను నిర్ణయించేది మార్కెట్‌శక్తులైనపుడు మన రూపాయిని కూడా అవే శక్తులు నిర్ణయిస్తాయని ఎందుకు అనుకోకూడదు. అయితే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే ప్రతి దేశమూ తన అవసరాలకు అనుగుణ్యంగా కరెన్సీ విలువలను నియంత్రిస్తోంది. ఈ క్రీడలో అమెరికా లబ్ది పొందలేదా ? కరెన్సీని అదుపు చేస్తున్నదని చైనా మీద ఆరోపణలు చేసే అమెరికన్లు అదే చైనా కరెన్సీ రేటు తక్కువగా ఉన్నందునే అక్కడినుంచి పెద్ద ఎత్తున సరకులను దిగుమతి చేసుకున్నది వాస్తవం కాదా ? అంతేకాదు, ఉత్పత్తి ఖర్చు కూడా తక్కువగా ఉన్న కారణంగా తమ గడ్డమీద పరిశ్రమలను మూసి చైనాకు తరలించలేదా ? కొత్తగా చైనాలో పెట్టలేదా ?


గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య ప్రచ్చన్న యుద్దం సాగిన సమయంలో ఆ రెండు దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు లేవు. అందుకు విరుద్దంగా అమెరికా-చైనా సంబంధాలు ఉన్నాయి. చైనా తన మార్కెట్‌ను తెరిచిన తరువాతనే ప్రపంచ వాణిజ్య సంస్దలో చేరేందుకు అమెరికా అనుమతించింది. సోవియట్‌యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలను పతనం గావించి ప్రచ్చన్న యుద్దంలో తామే విజయం సాధించామని 1990 దశకంలో అమెరికా ప్రకటించుకుంది. అంతకు ముందు సోవియట్‌ – చైనా మధ్య ఉన్న విబేధాలను ఉపయోగించుకొనేందుకు, చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు అమెరికన్లు చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.వారు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సోవియట్‌ కూలిపోయిన తరువాత ప్రచ్చన్న యుద్దరంగాన్ని చైనాకు మార్చారు. గత మూడు దశాబ్దాలలో వాటి మధ్య వాణిజ్యంతో పాటు వైరమూ పెరిగింది. ఇలాంటి స్ధితి సోవియట్‌తో లేదు.


అలాంటి చైనాతో అమెరికన్లకు ఇప్పుడు వాణిజ్యలోటు చాలా ఎక్కువగా ఉంది. ట్రంపు నాలుగు సంవత్సరాల పాటు పరోక్షంగా, ప్రత్యక్షంగా చైనాతో వాణిజ్య యుద్దం చేశాడు.2019తో పోలిస్తే 2020లో తొమ్మిది శాతం తగ్గినా అమెరికాలోటు 310.8 బిలియన్‌ డాలర్లు ఉంది. అమెరికన్లు 124 బిలియన్‌ డాలర్ల సరకు, వస్తువులను ఎగుమతి చేయగా చైనా నుంచి 435.5 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి చేసుకున్నారు. అలాటి చైనా మీద తుపాకి పేల్చేందుకు మన భుజాన్ని వాడుకుంటున్నారు, చివరికి మనలను కూడా మోసకారుల జాబితాలో చేర్చారు.