• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

వేగంగా పెరుగుతున్న జపాన్‌ మిలిటరీ బడ్జెట్‌ !

23 Wednesday Dec 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

#japan military, East Asia, Japan, Japan military, Japan record military budget


ఎం కోటేశ్వరరావు


ఐక్యరాజ్యసమితి నిబంధనావళి ప్రకారం ప్రతిదేశమూ రక్షణ హక్కు కలిగి ఉంటుంది. అయితే రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీ, జపాన్‌ మిలిటరీ దుర్మార్గాలను చూసిన తరువాత ఆ రెండు దేశాల మిలిటరీలను రద్దు చేస్తూ యుద్ద విజేతలు శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటికి ఆత్మరక్షణ భద్రతా వ్యవస్ధలు తప్ప సాధారణ మిలిటరీ లేదు. ఆ కారణంగా పొదుపు అయిన సొమ్మును ఆ రెండు దేశాలూ పరిశోధనా-అభివృద్ధి రంగానికి మరల్చి పారిశ్రామిక రంగాలలో ఎన్నో విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అవి ప్రపంచ మార్కెట్ల కోసం ఇతర ధనిక దేశాలతో పోటీకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాటి మిలిటరీ బడ్జెట్ల పెరుగుదల, ఆయుధ పోటీ ఎక్కడకు దారితీస్తుందో అన్న ఆందోళన కలిగిస్తోంది.


వరుసగా తొమ్మిదవ సంవత్సరం జపాన్‌ తన మిలిటరీ బడ్జెట్‌ను పెంచింది. 2021 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుదల 52బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికాతో రక్షణ ఒప్పందం ఉండి, ఆత్మరక్షణకు మాత్రమే పరిమిత ఆయుధాలు, ఏర్పాట్లు కలిగి ఉండాల్సిన జపాన్‌ పూర్తి స్ధాయిలో యుద్దానికి వినియోగించే జెట్‌ బాంబర్లు, దీర్ఘశ్రేణి క్షిపణులను, యుద్ద నౌకలు, విమానవాహక యుద్ద నౌకలను సమకూర్చుకుంటున్నది. ఆత్మ రక్షణకు రక్షణ పేరుతో జరుగుతున్న ఈ చర్యలు ఆ ప్రాంతంలోని రష్యా, చైనాలను రెచ్చగొట్టేందుకు, ఆయుధ పోటీకి దారితీయవచ్చని భావిస్తున్నారు. తాజా పెంపుదలతో ప్రపంచంలో మిలిటరీ బడ్జెట్‌ అగ్రదేశాలలో జపాన్‌ పదవ స్దానానికి చేరింది.
అమెరికా ఆయుధాలను విక్రయిస్తున్నప్పటికీ తన ఆధునిక యుద్దవిమానాలను జపాన్‌కు అందచేయటాన్ని నిషేధించింది. వాటి నిర్మాణ రహస్యాలను జపనీయులు తెలుసుకొని తమకు పోటీకి వస్తారన్నదే దాని భయం. ఈ కారణంగానే రానున్న పదిహేను సంవత్సరాలలో తన స్వంత యుద్ద విమానాలను రూపొందించేందుకు మిత్సుబిషి సంస్దకు జపాన్‌ ప్రభుత్వం 40బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టును అప్పగించింది. 2030 నాటికి విమానాన్ని రూపొందించి, 2035నాటికి మిలిటరీకి అందచేయాలన్నది లక్ష్యం. దీనిలో అమెరికా యుద్ద విమానాల కార్పొరేట్‌ సంస్ధ లాక్‌హీడ్‌ మార్టిన్‌ సహకారం కూడా తీసుకుంటున్నారు. అప్పటి వరకు ఆ కంపెనీ ఉత్పత్తి ఎఫ్‌-35ఆరు బాంబర్లను జపాన్‌ కొనుగోలు చేయనుంది.

రెండవ ప్రపంచ యుద్దంలో మిత్రరాజ్యాల చేతుల్లో ఓడిపోయిన జపాన్‌ మరోసారి మిలిటరీ శక్తిగా ఎదగకుండా చూసేందుకు మిలిటరీని రద్దు చేస్తూ పోట్స్‌డామ్‌ సమావేశం నిర్ణయించింది. శాంతి ఒప్పందం ప్రకారం జపాన్‌ ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకోవచ్చు, ఆత్మరక్షణ చర్యలు తీసుకోవచ్చు. అయితే తరువాత అమెరికా తన షరతుల మేరకు జపాన్‌తో రక్షణ ఒప్పందాన్ని రుద్దింది. ఒక ఏడాది ముందు తెలియచేసి ఎవరైనా ఒప్పందం నుంచి వైదొలగవచ్చనే ఒక నిబంధన ఉన్నప్పటికీ ఒక విధంగా జపాన్‌ సార్వభౌమత్వాన్ని అమెరికా తన తాకట్టులో ఉంచుకుంది. 1951 సెప్టెంబరు ఎనిమిదిన కుదిరిన ఈ ఒప్పందం మరుసటి ఏడాది ఏప్రిల్‌ 28నుంచి అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం అమెరికా సైనిక స్ధావరం ఏర్పాటుకు జపాన్‌ తన గడ్డపై భూమిని కేటాయించాల్సి ఉంది. అమెరికా అనుమతి లేకుండా ఇతర దేశాలతో ఎలాంటి రక్షణ ఒప్పందాలు లేదా మిలిటరీ స్దావరాల ఏర్పాటుకు హక్కులు ఇవ్వరాదు. తన స్వంత ఖర్చుతో జపాన్‌లో మిలిటరీ స్దావరాలను నిర్వహించటమే గాక రక్షణ కల్పించాలి. ఆ మేరకు జపాన్‌లో అమెరికా మిలటరీ తిష్టవేసింది.
అయితే ఇంతవరకు ఏ దేశమూ జపాన్‌ మీద దాడి చేయలేదు, అలాంటి సూచికలు కూడా లేవు. సోవియట్‌ యూనియన్‌ లేదా దాన్ని కూల్చివేసిన తరువాత రష్యా వైపు నుంచి లేదా ఒక నాడు జపాన్‌ ఆక్రమణకు గురైన చైనా నుంచి ఎలాంటి ముప్పు తలెత్తిన దాఖలాలు లేవు. అయినా గత కొద్ది సంవత్సరాలు జపాన్‌ తన మిలటరీ శక్తిని పెంచుకుంటూ వస్తోంది. అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకొని స్వతంత్ర మిలిటరీ శక్తిగా ఎదగాలనే డిమాండ్‌ కార్పొరేట్‌ శక్తుల నుంచి పెరుగుతోంది. ఇదే సమయంలో తన కంటే మెరుగైన ఆర్ధిక స్దితిలో ఉన్న జపాన్‌ను ఒక వైపు తమ అదుపులో ఉంచుకుంటూనే దానికి తమ ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఎత్తుగడను అమెరికా యుద్ద పరిశ్రమ ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే అదునుగా భావించి ఆయుధాల కొనుగోలుతో పాటు స్వంతంగా ఆయుధాల తయారీకి జపాన్‌ శ్రీకారం చుట్టింది. గతంలో వాణిజ్యం విషయంలో వివాద పడి సర్దుబాటు చేసుకున్న ఈ రెండు దేశాల మధ్య మిలిటరీ చర్యలు ఏ పర్యవసానాలకు దారి తీస్తాయో చూడాలి. అయితే జపాన్‌ సాయుధం కావటం తూర్పు ఆసియాలో శాంతికి ముప్పు కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

జపాన్‌-రష్యాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న కొన్ని దీవుల వివాదం పరిష్కారం కాలేదు. పసిఫిక్‌ సముద్రంలోని కురిల్‌, సఖాలిన్‌ దీవులు ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్నాయి. అవి తమవని జపాన్‌ చెబుతోంది. ఈ కారణంగానే రెండవ ప్రపంచ యుద్దం నాటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ద శాంతి ఒప్పందం మీద సంతకాలు జరగలేదు. అయినప్పటికీ గత ఏడుదశాబ్దాలలో పూర్వపు సోవియట్‌ లేదా ఇప్పటి రష్యా-జపాన్‌ ఎలాంటి వివాదానికి దిగలేదు. ఆ పేరుతో ఆయుధాల మోహరింపు మాత్రం జరుగుతోంది. ఈ దీవులలో రష్యా ఇటీవలనే ఆధునిక రక్షణ వ్యవస్ధలను ఏర్పాటు చేసింది. వాటిలో స్వల్ప శ్రేణి క్షిపణులు, ఫైటర్‌ జెట్‌లు, నౌకల మీద ప్రయోగించే క్షిపణులు ఉన్నాయి. చైనాతో రష్యా సంబంధాలు సజావుగానే ఉన్నందున ఇవి తమకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టినవే అని జపాన్‌, అమెరికా చిత్రిస్తున్నాయి.


మరోవైపు జపాన్‌లో అమెరికా మోహరిస్తున్న మధ్యశ్రేణి క్షిపణులు, వాటికి తోడుగా జపాన్‌ క్షిపణి వ్యవస్ధలు ఎవరికి వ్యతిరేకంగా అన్న ప్రశ్న సహజంగానే ముందుకు వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ దీవులకు సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా నౌక, యుద్ద విమానాల కదలికలు కనిపించాయి. జపాన్‌ విమానాలు ఈ ఏడాది కాలంలో తమ ప్రాంతాల సమీపంలో మూడు వందల సార్లు, చైనా సరిహద్దులో ఆరువందల చక్కర్లు కొట్టాయని రష్యా చెబుతోంది. కొరియా సమీపంలోని కొన్ని దీవులు కూడా తమవే అని జపాన్‌ వివాద పడుతోంది. ఆసియాలో సామ్రాజ్యవాదశక్తిగా గతంలో చైనా, కొరియా, ఇండోచైనా ప్రాంతాలను జపాన్‌ ఆక్రమించుకుంది. విధిలేని పరిస్ధితుల్లో వాటి నుంచి ఖాళీచేసినప్పటికీ కొన్ని దీవులు తమవే అని గిల్లికజ్జాలకు దిగుతోంది. ఆ పేరుతో ఆయుధీకరణకు పూనుకుంది.కరోనా వైరస్‌ కారణంగా ఆర్ధిక వ్యవస్ధ మీద పడిన ప్రతికూల ప్రభావం ఎంతో ఇంకా తేలనప్పటికీ మిలిటరీ ఖర్చు పెంచేందుకు పాలకులు వెనకాడటం లేదు. కరోనా కట్టడిలో జపాన్‌ మిగతా ధనిక దేశాలకంటే మెరుగ్గా పని చేసినప్పటికీ ఆర్ధిక వ్యవస్ధ 2027వరకు కోలుకొనే అవకాశం లేదని, అయినా మిలిటరీ ఖర్చు పెంచటం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.


అమెరికా నాయకత్వాన ఆస్ట్రేలియా, భారత్‌తో కలసి చతుష్టయం పేరుతో జపాన్‌ ఒక మిలిటరీ కూటమి ఏర్పాటుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మిలిటరీ బడ్జెట్‌ పెంపు దీనిలో భాగమే అని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వద్ద నుంచి క్షిపణులు, విమానాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ స్దానికంగానే తయారీకి కూడా ప్రాజెక్టులను ప్రారంభించింది. జలాంతర్గాములపై దాడి చేసే ఫ్రైగేట్స్‌, ఇతర వేగంగా ప్రయాణించే చిన్న నౌకలను కూడా సేకరిస్తున్నది.
కొద్ది మంది సిబ్బందితో దాడులు చేయగలిగిన రెండు యుద్ద నావల తయారీకి 91 కోట్ల డాలర్లను బడ్జెట్‌లో కేటాయించారు. క్షిపణుల తయారీ లేదా కొనుగోలు ఇతర దేశాల మీద దాడులకు ఉద్దేశించినవి, ఆత్మరక్షణ విధానానికి అనుకూలమైన రాజ్యాంగానికి వ్యతిరేకమైన పరిణామాలని జపాన్‌ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశ నైరుతి దీవుల చుట్టూ చైనా నౌకా దళ కార్యకలాపాలకు స్పందనగా, దేశ ఆత్మరక్షణ దళాల రక్షణ కోసం క్షిపణులు కీలకమని రక్షణ మంత్రి నోబు కిషి సమర్దించుకున్నారు. ఐదు సంవత్సరాలలో యుద్ద నావల నిర్మాణం, క్షిపణి పరిశోధనలు పూర్తవుతాయని, ఇప్పటికే 900 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను తాకే వాటిని అభివృద్ది చేసినట్లు చెబుతున్నారు. తమ గగనతలపై ఎగిరే సూపర్‌సోనిక్‌ విమానాలను పసిగట్టేందుకు అవసరమైన టెలిస్కోప్‌లు, పర్యవేక్షణ వ్యవస్ధల పరిశోధనలకు నిధులు కేటాయించారు. తమ దేశ మిలిటరీ బడ్జెట్‌ వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతీయ శక్తులకు ధీటుగా ఉంటుందని టోకియోలోని ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ నాగీ చెప్పారు. రెండువేల సంవత్సరం నుంచి చైనా మిలిటరీ బడ్జెట్‌ పెరుగుతున్న కారణంగా జపాన్‌ కూడా పెంచకతప్పటం లేదని సమర్ధించారు. టోకియోలోని టకుషోకు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ హెయిగో నాగీ మాట్లాడుతూ స్వయం రక్షణకు జపాన్‌ మరింత బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వత్తిడి కూడా మిలిటరీ బడ్జెట్‌ పెంపుదలకు ఒక కారణం అన్నారు. రక్షణ బడ్జెట్‌ పెంచకూడదనే రోజులు పోయాయన్నారు.


నాటో కూటమి ఖర్చులో ఎక్కువ మొత్తాన్ని ఐరోపా దేశాలు భరించాలని వత్తిడి చేసినట్లే జపాన్‌తో రక్షణ ఒప్పందం ఉన్నప్పటికీ రక్షణ బడ్జెట్‌ పెంపుదల వత్తిడి వెనుక అమెరికా యుద్ద పరిశ్రమల వత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది.జపాన్‌కు వంద ఎఫ్‌-35 రకం యుద్ద విమానాలను విక్రయించాలని జూలై నెలలో నిర్ణయించారు. అమెరికా ఆయుధ పరిశ్రమలైన లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌,నార్త్‌రోప్‌గ్రుమాన్‌, బ్రిటన్‌కు చెందిన బియేయి సిస్టమ్స్‌, రోల్స్‌ రాయిస్‌ కంపెనీలు జపాన్‌ ఆయుధ తయారీలో భాగస్వాములు కావాలని చూస్తున్నాయి. కరోనాకు ముందే అమెరికా ఆర్ధిక వ్యవస్ద సమస్యలను ఎదుర్కొంటుండగా కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నదని అందువలన తూర్పు ఆసియాలో తన తరఫున ప్రాంతీయ భద్రతా పెంపుదల చర్యలకు జపాన్‌ ఎక్కువగా ఖర్చు చేయాలనే వత్తిడి పెంచుతున్నట్లు భావిస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత గణనీయంగా పుంజుకున్నప్పటి నుంచి తిరిగి ప్రపంచ రాజకీయాల్లో పాత్ర పోషించటం ద్వారా తమ మార్కెట్‌ను పెంచుకోవాలని జపాన్‌ చూస్తోంది. దానికి మిలిటరీ శక్తి ఒక సాధనం అన్నది తెలిసిందే. దానిలో భాగంగానే కార్పొరేట్లు రాజ్యాంగాన్ని సవరించి పూర్తి స్ధాయి మిలిటరీని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. అయితే రక్షణ ఒప్పందం పేరుతో తన గుప్పెట్లో ఉన్న జపాన్‌ మరోసారి తనకు పోటీనిచ్చే మిలిటరీ శక్తిగా ఎదగాలని అమెరికా కోరుకోవటం లేదు. ఆసియాలో తన అనుయాయిగా ఉంచుకొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో ఒక సామ్రాజ్యశక్తిగా పెత్తనం చేసినపుడు లబ్దిపొందిన కార్పొరేట్లు అమెరికా, ఇతర దేశాలనుంచి ఆయుధాల కొనుగోలుకు బదులు తామే వాటిని తయారు చేసి లబ్ది పొందాలని చూస్తున్నాయి. ఇప్పుడు చైనా, ఉత్తర కొరియాలను బూచిగా చూపి తమ మిలిటరీ బడ్జెట్‌ను పెంచుకుంటున్నాయి. ఒక వైపు అమెరికా మరోవైపు స్వంత కార్పొరేట్ల వత్తిడిని అక్కడి పాలకవర్గం ఏ విధంగా సమన్వయ పరుస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు అమెరికాను తోసిరాజనే స్ధితి లేనప్పటికీ దానికి బాటలు వేస్తోందన్నది బడ్జెట్‌ కేటాయింపులే చెబుతున్నాయి. అమెరికా బలహీనత ఏమంటే అనూహ్యరీతిలో చైనా ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా పెరగటంతో దానికి గతం కంటే ఆర్దిక భారాన్ని ఎక్కువగా పంచుకొనే మిత్ర రాజ్యాలు అవసరం పెరిగింది. దాన్ని గ్రహించి జపాన్‌, జర్మనీలు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాకు వ్యతిరేకంగా నాడు కరోనా వైరస్,‌ నేడు వాక్సిన్‌ రాజకీయాలు !

18 Friday Dec 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

China's vaccine diplomacy, COVAX, COVID-19 vaccine, Sinovac vaccines


ఎం కోటేశ్వరరావు


కరోనా వైరస్‌ను కట్టడి చేయటంలో విఫలమైన దేశాలూ, సఫలమైనవీ ఇప్పుడు వ్యాక్సిన్‌ గురించి కేంద్రీకరించాయి. ప్రపంచ వ్యాపితంగా ఇప్పుడు కరోనా వెనక్కు పోయి వాక్సిన్‌ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. దాని ఖర్చు , తయారీ, ఎంత వేగంగా సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది అన్నది ప్రధాన అంశం. బీహార్‌లో గెలిపిస్తే ఉచితంగా అందచేస్తామని బిజెపి ప్రకటించిన విషయం తెలిసిందే. మరికొన్ని కొన్ని రాష్ట్రాలూ ప్రకటించాయి. అయితే ఆ ఖర్చును కేంద్రం భరిస్తుందా రాష్ట్రాల మీదనే మోపుతుందా, లేక కొంత వాటా భరిస్తుందా అన్నది ఇప్పటికీ స్పష్టం కాలేదు.


ప్రస్తుతం తయారు చేస్తున్న వాక్సిన్‌ ఖర్చు ఒక డోసుకు ఎంత అంటే మూడు డాలర్ల నుంచి 37 డాలర్లవరకు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పశ్చిమ దేశాలకు ఒక రేటు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక రేటుకు కొన్ని కంపెనీలు అందచేస్తాయన్నది మరొక వార్త. ఇప్పటికే కొన్ని చోట్ల అత్యవసర ప్రాతిపదికన వాక్సిన్‌ వేయటం ప్రారంభించి జనాల్లో ఆశలు, విశ్వాసం కల్పించారు. ఇదే సమయంలో కరోనా తగ్గిన ప్రాంతాల్లో మనకు అవసరం లేదనే అభిప్రాయం జనాల్లో వస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. జనం చస్తుంటే పట్టించుకోని మతాలు ఇప్పుడు వాక్సిన్‌ విషయంలో రంగ ప్రవేశం చేస్తున్నాయి. ప్రత్యేక పరిస్ధితిగా పరిగణించి మతస్తులు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని అమెరికా బిషప్పులు ప్రకటించారు.
ముందుగా ఒక విషయాన్ని గుర్తు చేయాలి. కరోనా వైరస్‌ను కృత్రిమంగా రూపొందించి ప్రపంచం మీదకు వదలిందని, ధన సంపాదనకు దాని నివారణకు అవసరమైన వాక్సిన్‌ కూడా సిద్దం చేసుకుందనే నిందలు చైనా మీద వేసిన తీరు, వాటిని ఇప్పటికీ నమ్ముతున్న వారి గురించి తెలిసిందే. వాస్తం ఏమిటి ? ఇప్పుడు మిగతా అనేక దేశాలతో పాటే చైనా వాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తోంది తప్ప ముందుగా రాలేదు, ఆరోపించినట్లు దాన్ని సొమ్ము చేసుకోనూ లేదు. అయినా ఇప్పుడు కూడా చైనా లక్ష్యంగా పశ్చిమ దేశాలు మరో దాడి జరుగుతోంది. దీర్ఘకాలంలో లబ్ది పొందేందుకు చైనా కరోనా దౌత్యం చేస్తోందని చెబుతున్నాయి.


చిత్రం ఏమంటే ప్రపంచ జనాలందరికీ సమంగా వాక్సిన్‌ పంపిణీ చేయాలని ఒప్పందం మీద సంతకాలు చేసిన 189దేశాల కోవాక్స్‌ కూటమిలో చైనా చేరింది తప్ప అమెరికా లేదు. అమెరికా, ఇతర దేశాలలో తయారు చేసే కంపెనీలు సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాయి. చైనా వంద కోట్ల డోసుల తయారీకి ఏర్పాట్లు చేస్తోంది. బ్రెజిల్‌, మొరాకో, ఇండోనేషియా వంటి చోట్ల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అనేక చోట్ల వాక్సిన్‌ నిల్వ సౌకర్యాల ఏర్పాటుకూ పూనుకుంది. కొన్ని దేశాలు వాక్సిన్‌ కొనుగోలుకు అవసరమైన రుణం కూడా ఇస్తోంది. వీటిని వాక్సిన్‌ సిల్క్‌ రోడ్‌ అని కొందరు వర్ణిస్తున్నారు. ఇదే పని భారత్‌తో సహా ఇతర దేశాలు చేయటాన్ని, నిజంగా లబ్ది ఉంటే పొందటాన్ని ఎవరు అడ్డుకున్నారు ? చైనా రంగంలో లేక ముందు పేద, వర్దమాన దేశాలన్నింటినీ అదుపులో ఉంచుకున్నది ధనిక దేశాలే కదా ? వాటిని వదలించుకొని అవి ఇప్పుడు చైనా వైపు ఎందుకు చూస్తున్నాయి ? వీటిలో కొన్ని గతంలో చైనా మీద తీవ్ర ఆరోపణలు చేసినవి కూడా ఉన్నాయి.
గతంలో కరోనా సమాచారాన్ని సకాలంలో వెల్లడించలేదని ఆరోపించారు. ఇప్పుడు చైనా తయారు చేస్తున్న వాక్సిన్ల సామర్ధ్యం లేదా రక్షణకు సంబంధించిన సమాచారాన్ని బయటకు రానివ్వటం లేదని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. వాటి మీద నమ్మకం లేని వారు దూరంగా ఉండవచ్చు, బలవంతం ఏమీ లేదు కదా ? వివరాలన్నీ బయట పెట్టిన కంపెనీల తయారీనే వినియోగించవచ్చు. గతంలో చైనా వస్తువులు నాణ్యత లేనివి అని ప్రచారం చేశారు. ఆచరణలో వాటినే కొనుగోలు చేశారు, ఇప్పుడు వాక్సిన్‌ కూడా అంతేనా ? అసలు పశ్చిమ దేశాల సమస్య ఏమిటి ? కరోనా సమయంలో ఉద్దీపనల పేరుతో లబ్ది పొందిన కార్పొరేట్లు ఇప్పుడు వాక్సిన్నుంచి లాభాలు పిండుకోవాలని చూస్తున్నాయి. తమ కంపెనీలు తయారు చేసిన వాక్సిన్‌ను తమకు మిత్ర దేశాలా, శత్రుదేశాలా అనేదానితో నిమిత్తం లేకుండా తీసుకొనేందుకు సిద్దపడే అన్ని దేశాలతో లాభాలను ఆశించకుండా పంచుకొనేందుకు చైనా సిద్దపడుతోంది. తద్వారా తమ లాభాలకు అడ్డుపడుతోందన్నదే పశ్చిమ దేశాల అసలు దుగ్ద.

అమెరికా మిత్ర దేశం ఫిలీప్పీన్స్‌, దాని అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టే మాటల్లో ” ఇతర దేశాల మాదిరి చైనా వాక్సిన్‌ సరఫరాకు ముందుగా కొంత సొమ్ము చెల్లించమని అడగటం లేదు, అదే పశ్చిమ దేశాలు అడ్వాన్సు చెల్లించమని అడుగుతున్నాయి, అలా అయితే మేమంతా చావక తప్పదు.” అన్నాడు. ఐరోపా యూనియన్‌లోని హంగరీ పరిస్ధితి కూడా అదే. కరోనా కారణంగా అనేక వర్ధమాన దేశాలు నిధులకు కటకటలాడుతున్న విషయం తెలిసిందే. చైనా వాక్సిన్‌కు సంబంధించిన సమాచారం విడుదల చేయకపోయినా దాదాపు వంద దేశాలు తమకు కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే అనేక దేశాలు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. అత్యవసర పరిస్ధితిగా పరిగణించి చైనా కంపెనీలు తయారు చేసిన వాక్సిన్ను అక్కడ ఈ ఏడాది జూలై నుంచే వినియోగిస్తున్నారు. పది లక్షల మంది ప్రయోగాత్మకంగా తీసుకున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైనా జాతీయ ఔషధ కంపెనీ(సినోఫార్మ) ప్రకటించింది. ఈ కంపెనీ వాక్సిన్‌ కొనుగోలు చేస్తున్నట్లు డిసెంబరు తొమ్మిదిన యుఏయి వెల్లడించింది. అది 86శాతం గుణం చూపినట్లు మూడవ దశ ప్రయోగాల్లో వెల్లడి అయినట్లు పేర్కొన్నది. ఇతర కంపెనీలు 94,95శాతం సామర్ద్యం చూపినట్లు చెప్పాయి. యుఏయి తరువాత బహరెయిన్‌, ఈజిప్టు, ఇండోనేషియా కొనుగోలు చేసింది. బ్రెజిల్‌ కూడా చైనా వాక్సిన్‌ వినియోగానికి నిర్ణయించింది.


చైనా వాక్సిన్‌ గురించి కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పోలియో చుక్కలను ఇచ్చే మాదిరి పరిజ్ఞానాన్నే చైనా వినియోగిస్తున్నది. సినోఫార్మ వాక్సిన్‌ 42వేల మంది మీద ప్రయోగించారు. ఇంత సంఖ్యలో ప్రయోగించినందున ప్రతికూల, ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే కనుగొనేందుకు అవకాశం ఉంటుంది అని నాన్‌జింగ్‌ విశ్వవిద్యాలయ ప్రజారోగ్య పరిశోధనా కేంద్ర డైరెక్టర్‌ డాక్టర్‌ ఉ ఝీవెరు చెప్పారు. వైరస్‌కు వ్యతిరేకంగా ప్రజాపోరు అనే దేశభక్తి పూరితమైన అవగాహనతో వ్యాక్సిన్‌ రూపకల్పన, ప్రయోగాలు జరుగుతున్నాయని లండన్‌ విశ్వవిద్యాలయ చైనా సంస్ధ డైరెక్టర్‌ స్టీవ్‌ శాంగ్‌ చెప్పారు. వివిధ సర్వేలలో వెల్లడైన అంశాల మేరకు చైనాలో తమ ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు వాక్సిన్‌ తీసుకొనేందుకు సిద్దపడిన వారు 80శాతం ఉండగా, మిగిలిన దేశాలలో చాలా తక్కువ శాతాలలో ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా కుట్ర సిద్దాంతాల ప్రచారం, ప్రభావం ఎక్కువగా ఉన్న చోట ఈ పరిస్దితి ఉంది.


చైనా మీద విశ్వాసం ఉన్న దేశాలు తగిన సమాచారం లేనప్పటికీ వాక్సిన్‌ కొనుగోలుకు ముందుకు వస్తున్నాయి. మిగతా దేశాల వాటితో పోల్చితే చైనా వాక్సిన్‌ నిల్వ,రవాణా సులభం. ముఖ్యంగా పేద, వర్ధమాన దేశాలకు ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఫైజర్‌ వాక్సిన్‌ అత్యంత శీతల పరిస్ధితిలో మాత్రమే నిల్వ ఉంటుంది. గత అనుభవాలను చూసినపుడు వ్యాప్తి చెందే వైరస్‌ నివారణ అన్ని దేశాలలో జరిగినపుడే ఉపయోగం ఉంటుంది. అవసరాన్ని బట్టి తప్ప సంపదల ప్రకారం వ్యాక్సిన్‌ పంపిణీ ఉండకూడదు.


చైనాలో తయారవుతున్న వాక్సిన్‌లో అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ డైవాక్స్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యం కూడా ఉంది. చైనాకు చెందిన ఊహాన్‌ బయెలాజికల్‌ ప్రోడక్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా ఈ పధకంలో భాగస్వామి. చైనా వాక్సిన్‌కు సంబంధించిన ప్రయోగ ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అవి విడుదలైన తరువాత మరికొన్ని దేశాలు కూడా ముందుకు వస్తాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా, ఐరోపాలోని కార్పొరేట్‌ కంపెనీల పట్టుకూడా సడలే అవకాశాలు లేకపోలేదు.


కొన్ని వాక్సిన్లు గర్భవిచ్చిత్తి కణాలతో రూపొందించినప్పటికీ అత్యవసరం, అందరి మంచి కోసం నైతిక బాధ్యతగా క్రైస్తవులు వాక్సిన్లు తీసుకోవచ్చని అమెరికా బిషప్పుల సభ పేర్కొన్నది. ఆస్ట్రాజెనికా కంటే మోడెర్నా, ఫైజర్‌ వాక్సిన్లు నైతికంగా ఆమోదకరమైనవని, తప్పనిసరి అయితే దాన్ని కూడా తీసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అయితే తప్పనిసరై వినియోగించినప్పటికీ గర్భవిచ్చిత్తికి వ్యతిరేకతను బలహీనపరచకూడదని కూడా పేర్కొన్నది.1972లో నెదర్లాండ్స్‌లో గర్భవిచ్చిత్తి జరిగిన ఉదంతంలో ఆడశిశువు మూత్రపిండాల నుంచి సేకరించిన కణాలతో ఒక వాక్సిన్ను రూపొందించారు. అప్పటి నుంచి కొన్ని కంపెనీలు అదే పద్దతిని అనుసరిస్తున్నాయి. దానికి భిన్నంగా ఫైజర్‌, మోడెర్నా వాక్సిన్లు తయారవుతున్నట్లు బిషప్పులు పేర్కొన్నారు.


మొత్తం మీద చూస్తే వాక్సిన్‌ గురించి విపరీత ప్రచారం జరుగుతోంది.ఎన్నికల లబ్దికి వాక్సిన్ను వాడుకోవాలని చూసి భంగపడిన డోనాల్డ్‌ ట్రంప్‌ను చూశాము. ఆయన జిగినీ దోస్తు నరేంద్రమోడీ తానేే స్వయంగా పర్యవేక్షించి తయారు చేయిస్తున్నట్లు జనానికి కనిపించే యత్నం చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ దేశాలూ, మీడియా వాక్సిన్‌ దౌత్యం, రాజకీయాలలో నిమగమయ్యాయి. వాక్సిన్‌ ప్రజోపయోగ ఔషధంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు పూనుకోవాలని, అందుకు తాము సహకరిస్తామని చైనా నాయకత్వం తొలి నుంచీ చెబుతోంది. దాన్ని అమెరికా ఇతర దేశాలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ధనబలంతో చిన్న దేశాలను ఆకర్షిస్తున్న చైనా ఇప్పుడు వాక్సిన్‌తో తన పలుకుబడి పెంచుకోవాలని చూస్తోందని చెబుతున్నాయి. వందల సంవత్సరాల పాటు అలాంటి చర్యలను అమలు జరిపి ప్రపంచాన్ని ఆక్రమించిన దేశాల వారికి ప్రతిదీ అలాగే కనిపించటం, అనిపించటంలో ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతుల ఆందోళన – వెనక్కు తగ్గేది లేదంటున్న బిజెపి !

10 Thursday Dec 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Farmers agitations, indian farmers


ఎం కోటేశ్వరరావు


పద్నాలుగు రోజుల పాటు ఉద్యమాన్ని అణచేందుకు, నీరుగార్చేందుకు ప్రయత్నించిన తరువాత ఇంటా బయటా వత్తిడి పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రైతుల ముందు రాతపూర్వక ప్రతిపాదనలు ఉంచింది.రైతు సంఘాలు వాటిని తిరస్కరించి సవరించిన చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలని, ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, దానిలో భాగంగా డిసెంబరు 12న టోల్‌ ప్లాజాల్లో, 14న ఉత్తరాది రాష్ట్రాల నుంచి చలో ఢిల్లీ, మిగిలిన చోట్ల జిల్లా కేంద్రాల్లో కొత్త ఆందోళనను ప్రకటించారు. ఎప్పుడు ఏమి జరగనుందనే ఆసక్తి పెరుగుతోంది. ముందు రైతుల పట్ల మోడీ సర్కార్‌ తీరుతెన్నులు, ప్రపంచంలో స్పందన అంశాలను చూద్దాం.

రాజనీతిజ్ఞుడి ప్రతిభ ఒక పెద్ద సమస్య వచ్చినపుడు వ్యవహరించేతీరు తెన్నుల మీద ఆధారపడి ఉంటుంది. దేశాధినేత ప్రధాని. రైతులు ఆందోళనకు దిగినపుడు దానిని పరిష్కరించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు, ఓకే. వారు దాన్ని ఏదో ఒక దరి చేర్చక ముందే ప్రధాని రైతులను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. వ్యూహకర్తలు సరిగా పని చేస్తున్నారా ? లెక్కచేయాల్సిన అవసరం లేదనే పెడసరపు ధోరణికి లోనయ్యారా అన్న అనుమానం వస్తున్నది. కొద్ది రోజుల క్రితం రైతుల ఉద్యమం వెనుక ఖలిస్తానీలు ఉన్నారన్న బిజెపి పెద్దలు ఇపుడు కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యమం వెనుక చైనా-పాక్‌ హస్తం ఉందని కేంద్ర మంత్రి రావు సాహెబ్‌ దనవే నిందించారు. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ని తప్పించి హౌ మంత్రి అమిత్‌ షాను రంగంలోకి దించారు. ఫలితం లేదు. తిరిగి రైతులకు విజ్ఞప్తి చేసేందుకు తోమర్‌ను నియమించారు. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది.


నవంబరు 27 నుంచి రైతులను ఢిల్లీ శివార్లలో నిలిపివేశారు. వారు నగరంలోకి రాకుండా శత్రుసేనలను ఎదుర్కొనే మాదిరి రోడ్ల మీద కందకాలు తవ్వారు, ఇతర ఆటంకాలను ఏర్పాటు చేశారు, భద్రతా దళాలను మోహరించారు. అనేక దేశాల్లో జనం వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమించారు గానీ ఎక్కడా ఇలా కందకాలు తవ్వటాన్ని చూడలేదని అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల నేతల నోళ్లలో నానటం నరేంద్రమోడీ పరువును పెంచుతుందా ?


చైనా అంతర్భాగమైన హాంకాంగ్‌లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రదర్శనల గురించి మన దేశం ఐక్యరాజ్యసమితి మానవహక్కుల వేదిక మీద ఆందోళన వ్యక్తం చేసింది.ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కాదా అంటే కాదు కాదు హాంకాంగ్‌లో భారతీయ పౌరులు ఉన్నారు గనుక అని మన ప్రతినిధులు సమర్ధించుకున్నారు. హాంకాంగ్‌ చైనాకు చెందినదే అయినప్పటికీ పూర్తిగా విలీనం అయ్యేందుకు 2049వరకు గడువు ఉంది. అక్కడ విదేశీయుల మీద ఎలాంటి దాడులు జరగలేదు. సంవత్సరాల తరబడి ప్రదర్శనలు చేస్తున్నా, రెచ్చగొడుతున్నా అక్కడి పోలీసులు రెచ్చి పోలేదు.అయినా మన దేశం ” ఆందోళన ” వ్యక్తం చేసింది.


కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ గురునానక్‌ జయంతి సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని మన ప్రభుత్వం ఆ దేశరాయబారిని పిలిచి నిరసన తెలిపింది. మన దేశంలోని 543 సభ్యులుండే లోక్‌సభలో పదమూడు మంది సిక్కు సామాజిక తరగతికి చెందిన వారు ఎంపీలుగా ఉన్నారు. అదే కెనడాలోని 338 మంది సభ్యులున్న దిగువ సభలో 18 మంది సభ్యులు, ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు.కెనడా-పంజాబ్‌-భారత్‌లోని సిక్కుల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి తెలిసిందే. ప్రస్తుత ఉద్యమంలో సిక్కులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున కెనడా ప్రధాని మౌనంగా ఉండగలరా ?

లక్షలాది మంది రోజుల తరబడి ఎముకలు కొరికే చలిలో రోడ్ల మీద ఆందోళన చేస్తున్న కారణంగానే రాజకీయాలతో నిమిత్తం లేని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేసుకొనేందుకు జనానికి హక్కు ఉన్నదని చెప్పారు.కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌, బ్రిటన్‌, అమెరికా ఎంపీలు అనేక మంది అప్పటికే రైతుల ఆందోళన గురించి ప్రస్తావించారు. వివిధ పార్టీలకు చెందిన 36 మంది బ్రిటన్‌ ఎంపీలు అదేశ విదేశాంగమంత్రి డొమినిక్‌ రాబ్‌కు లేఖ రాస్తూ తమ ఆందోళనను భారత ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని, ఆ ఆందోళన అనేక మంది బ్రిటీష్‌ సిక్కులు, పంజాబీలను ప్రభావితం చేస్తున్నదని పేర్కొన్నారు.

ఒక్క బ్రిటీష్‌ ఎంపీలే కాదు అమెరికన్లు కూడా ఉన్నారు. మరోసారి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ రాబోతున్నదంటూ ఎన్నికలలో నరేంద్రమోడీ మద్దతు పలికిన విషయం తెలిసిందే. సదరు ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ కాలిఫోర్నియా ఎంపీ డగ్‌ లామాలఫా, డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జోష్‌ హార్డర్‌ రైతులకు మద్దతు తెలిపారు. ఫలవంతమైన చర్చలు జరపాలని మోడీని కోరారు. మరికొందరు ఎంపీలు కూడా ఇదే హితవు చెప్పారు. ఆండీలెవిన్‌ వంటి వారు ఉద్యమం తమకు ఉత్తేజమిచ్చిందని చెప్పారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్లు రైతుల ఉద్యమం గురించి పెద్ద ఎత్తున వార్తలు, వ్యాఖ్యలు చేశాయి. ఏ దేశంలో అయినా లక్షలాది మంది ఉద్యమంలోకి దిగినపుడు మానవతా పూర్వకంగా ఆందోళన వ్యక్తం చేయటం, సమస్యలను పరిష్కరించాలని హితవు పలకటం జరుగుతున్నదే. అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో నరేంద్రమోడీ స్నేహితుడైన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయటానికి, దేశాధ్యక్షుడి మీద తిరుగుబాటు చేసేందుకు పోలీసులు, మిలిటరీని ఎలా ప్రోత్సహించిందీ తాజాగా బొలీవియాలో చూశాము. వెనెజులాలో ప్రతిపక్ష నేతను దేశాధినేతగా గుర్తించటం వంటి వ్యవహారాలకు – ఉద్యమాలకు మద్దతు ప్రకటించటానికి ఉన్న తేడాను గుర్తించాలి. రైతుల ఉద్యమం మోడీ సర్కార్‌ మీద తిరుగుబాటు కాదు, అలా మారే అవకాశాలూ లేవు.


అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదతర దేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులు రైతులకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. అమెరికాలోని ఓక్లాండ్‌ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్‌ కార్యాలయానికి ప్రదర్శన చేశారు. న్యూయార్క్‌, చికాగో, వాషింగ్టన్‌ డిసి వంటి ఇంకా అనేక చోట్ల చిన్నా, పెద్ద ప్రదర్శనలు జరిగాయి. లండన్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయం ముందు వేలాది మంది భారత ప్రభుత్వానికి నిరసన, రైతులకు మద్దతు తెలిపారు. ఈ ప్రదర్శనను భారత వ్యతిరేక వేర్పాటు వాదులు జరిపారని హైకమిషన్‌ ఆరోపించింది. కెనడాలోని టోరొంటోలో ఉన్న భారతకాన్సులేట్‌ కార్యాలయం ముందు వందలాది మంది ప్రదర్శన జరిపారు. ఇంకా ఇతర అనేక చోట్ల ప్రదర్శనలు, వాహన ర్యాలీలు జరిగాయి.ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్‌బెన్‌, కాన్‌బెర్రా తదితర పట్టణాల్లో ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల నుంచి ఆన్‌లైన్‌లో పిటీషన్ల మీద సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.


రైతాంగం పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసన తెలుపుతూ అనేక మంది క్రీడా ప్రముఖులు డిసెంబరు ఏడున రాష్ట్రపతి భవన్‌కు ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం మొండిగా ఉంటే తాము సాధించిన అవార్డులను తిరిగి ఇచ్చివేస్తామని హెచ్చరించారు. తమతో పాటు 35 అర్జున, ద్రోణాచార్య, పద్మశ్రీ, ధ్యానచంద్‌అవార్డులను వారు తీసుకు వెళ్లారు. ఇలాంటి పరిణామాలు రావటానికి కారకులు కేంద్ర పాలకులు.ఇప్పుడు రైతులు, రాబోయే రోజుల్లో తమను దెబ్బతీసే విధానాలను ముందుకు తెచ్చినందున వాటికి వ్యతిరేకంగా కార్మికులు కూడా రంగంలోకి రాబోతున్నారు. నవంబరు 26వ తేదీ సమ్మె దానికి ఒక హెచ్చరిక.


రైతులు ఆందోళన చేయటం ఇప్పుడే ప్రారంభమైందా ? ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరటం మన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక మన ప్రభుత్వం దాన్నుంచి వైదొలగాలని రైతు సంఘాలు, వామపక్షాలు, దాదాపు అన్ని పార్టీలు కోరాయి. అయినా ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. ఇదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్య వర్గాల నుంచి కూడా అనుకూలంగానూ వ్యతిరేకంగానూ తీవ్రమైన వత్తిడి వచ్చింది. ఊగిసలాటలో ఉన్న ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు 2019 నవంబరు నాలుగున రైతులు ప్రదర్శనలు కూడా చేశాయి. ఎవరి వత్తిడి ఎంత పని చేసిందీ అన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు వెనక్కు తగ్గింది, ఆమేరకు అందరూ హర్షించారు.
ఆర్‌సిఇపిలో చేరిక గురించి ఎనిమిది సంవత్సరాలు తర్జన భర్జన పడిన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ప్రతికూల మార్పులు తెస్తాయని భయపడుతున్న వ్యవసాయ చట్టాల మార్పుల గురించి మేథోమధనం చేయకుండా ఆర్డినెన్స్‌ రూపంలో తేవాల్సినంత అత్యవసరం ఏముంది ? పోనీ తెచ్చారు, బిల్లును పార్లమెంట్‌ కమిటీకి నివేదించాలన్న ప్రజాస్వామ్యయుతమైన డిమాండ్‌ను తోసి పుచ్చి చర్చలను ఒక ప్రహసనంగా మార్చి ఆమోద ముద్ర ఎందుకు వేయించుకున్నట్లు ? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కొన్ని మార్పులు చేస్తామని ఇప్పుడు చెబుతున్నారు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తే ప్రయోజనం ఏముంది? కరోనా వైరస్‌ నివారణకు పారాసిటమాల్‌ వేసుకుంటే సరిపోతుందని ఒక ముఖ్యమంత్రి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే చాలు అన్న మరొక ముఖ్యమంత్రి చిట్కాల మాదిరి రైతుల ముందు కేంద్రం ఉంచిన ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకే రైతులు తిరస్కరించారు.


చర్చలు కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి)కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటనల మీద ప్రకటనలు చేయటం తప్ప రైతుల డిమాండ్‌ను పట్టించుకోవటం లేదు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తూ, వాటి నిర్ణయానికి సమగ్ర వ్యవస్దను ఏర్పాటు చేయాలన్న న్యాయమైన కోర్కెను కేంద్రం ఎందుకు అంగీకరించటం లేదు అన్నది చాలా మందికి అంతుబట్టటం లేదు. అమలు జరుపుతామంటున్నారు కదా దాన్నే చట్టబద్దం చేస్తే పోయేదేమిటి అని హర్యానా బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న జననాయక్‌ జనతా పార్టీ(జెజెపి) నేతల హితవును కూడా పట్టించుకోలేదు. ఎంతసేపటికీ అమలు జరుపుతామని చెబుతున్నాం కదా అన్నదానికి మించి ఒక్క ముక్క చెప్పటం లేదు. వ్యవసాయ చట్టసవరణలకు-కనీస మద్దతు ధరలకు అసలు సంబంధం లేదని వాదిస్తున్నారు తప్ప చట్టబద్దం చేసేందుకు ఆటంకం, అభ్యంతరం ఏమిటో చెప్పరు.


డిసెంబరు తొమ్మిదిన కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌ ఒక లేఖ రూపంలో పంపిన ప్రభుత్వ ప్రతిపాదనలు రైతాంగాన్ని సంతృప్తిపరచేవిగా లేవని తిరస్కరించారు. వాటిలో ఉన్న అంశాలేమిటి ?1. ప్రస్తుతం ఉన్న ఎంఎస్‌పి వ్యవస్దను అలాగే కొనసాగిస్తాము, పంటల సేకరణ కూడా కొనసాగుతుంది. రైతులు ఏమంటున్నారు ? ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలి, రైతు ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మరింత శాస్త్రీయంగా ధరల నిర్ణాయక వ్యవస్ధను ఏర్పాటు చేసి సాధికారత, చట్టబద్దత కల్పించాలన్న రైతుల డిమాండ్‌కు దీనికి అసలు పొంతనే లేదు. 2. ప్రభుత్వ (నోటిఫైడ్‌) మార్కెట్‌-స్వేచ్చా మార్కెట్‌ అన్న తేడా లేకుండా పన్నులు, సెస్‌లను అన్నింటికీ ఒకే విధంగా వర్తింప చేస్తాము. రైతుల వాదన ఏమిటి ? మార్కెట్‌ యార్డుల పరిధులను కుదించి అసలు ఆ వ్యవస్ధనే నామమాత్రం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. అవి ఉపయోగం లేకుండా పోయిన తరువాత కార్పొరేట్‌ చేతుల్లో రైతులు ఇరుక్కుంటారు గనుక మార్కెట్‌ యార్డుల్లోనే ఎవరైనా కొనుగోళ్లు జరపాలి. 3.నియంత్రణలేని మార్కెట్లలో లావాదేవీలు జరిపేవారు నమోదు చేసుకొనే విధంగా సవరణలు తెస్తాము. రైతుల అభ్యంతరం ఏమిటి ? నియంత్రణలు లేని మార్కెట్లుంటేనే రైతులకు రక్షణ ఉండదు, నమోదు అన్నది నామమాత్రమే.కంటితుడుపే ! 4.నగదు బదిలీకి బదులు సబ్సిడీ వర్తించే విధంగా రైతులను విద్యుత్‌ బిల్లుల నుంచి మినహాయిస్తాము. రైతులు అంటున్నదేమిటి ? అసలు ఉచిత విద్యుత్‌ పధకాలను ఎత్తివేసే విధంగా, సబ్సిడీని గరిష్టంగా 20శాతానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదన అమలు జరిగితే ఉచిత విద్యుత్‌ పధకాలకు ఎసరు వస్తుంది. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి పారిశ్రామిక, వాణిజ్యవర్గాలకు మేలు చేకూర్చేందుకే ఈ ప్రయత్నాలు.


కనీస మద్దతు ధరల విధానాన్ని, భారత ఆహార వ్యవస్ధ కార్యకలాపాలను పరిమితం చేసి ధాన్య సేకరణ బాధ్యతను వదలించుకొనేందుకు కేంద్రం పావులు కదుపుతోందనే అనుమానాలు కూడా రైతులకు కలుగుతున్నాయి. వీటికి ఆధారాలు లేవా ? స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు జరుపుతున్నామని చెబుతున్న పాలకులు కీలకమైన వాటిని పక్కన పెట్టారు. ఉదాహరణకు మార్కెట్‌ యార్డులను మరింత పటిష్టపరచాలని చెబితే వాటిని పరిమితం చేసేందుకు చట్ట సవరణ చేశారు. కనీస మద్దతు ధరల నిర్ణాయక అంశాలలో భూమి కౌలును పరిగణనలోకి తీసుకోవటం లేదు.ఇంకా ఇలాంటివే ఉన్నాయి.

భారత ఆహార సంస్ధను నిర్వీర్యం చేస్తారా, సేకరణ మొత్తాలను తగ్గిస్తారా ? ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో) నిబంధనల ప్రకారం ఎఫ్‌సిఐ సేకరించిన బియ్యాన్ని అంతర్గత వినియోగానికి విక్రయించవచ్చు తప్ప విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు లేదు.ఈ ఏడాది సెప్టెంబరు ఒకటవ తేదీ నాటికి ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎఫ్‌సిఐ వద్ద బియ్యం నిల్వలు 135లక్షల టన్నులు ఉండాలి, వాస్తవ నిల్వలు 222లక్షల టన్నులు ఉన్నాయి. తరువాత సేకరణ తరుణం ప్రారంభం అయినందున నిల్వలు పెరిగి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం 2020-21లో 150లక్షల టన్నుల గోధుమలు, 50లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే 2015-16 నుంచి 2019-20 సంవత్సరాలలో గోధుమలు కనిష్టంగా 14.21లక్షల టన్నులు గరిష్టంగా 81.84 లక్షల టన్నులు, బియ్యం 4.9-17.77లక్షల టన్నులు మాత్రమే విక్రయించారు. బీహార్‌లో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉత్పత్తి అయ్యే కోటీ60లక్షల టన్నులలో కేవలం 30లక్షల టన్నులను మాత్రమే సేకరిస్తామని చెప్పింది. మిగిలిన ధాన్యాన్ని రైతులు కనీస మద్దతు ధరల కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఆర్టికల్‌ 13లోని సంధి నిబంధన ప్రకారం దేశీయంగా, ఎగుమతులకు సబ్సిడీలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే అది ఆయా దేశాల ఉత్పత్తి విలువలో పదిశాతం కంటే ఆ మొత్తాలు మించకూడదు. ఈ నిబంధన కూడా 2004 జనవరి ఒకటి నుంచి రద్దయింది. ఈ కారణంగానే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఇస్తున్న సబ్సిడీలను వర్ధమాన దేశాలు సవాలు చేసేందుకు వీలు కలిగింది. అదే ఇప్పుడు చర్చలు ప్రతిష్ఠంభనలో పడటానికి కారణం అయింది. అయితే 2013లో జరిగిన బాలి సమావేశంలో తాత్కాలిక సంధి నిబంధనను రూపొందించారు. దాని ప్రకారం అప్పటికి అమల్లో ఉన్న ఆహార భద్రత పధకాల కింద ఇస్తున్న సబ్సిడీలు నిర్ణీత పదిశాతానికి మించినా ఏ సభ్యదేశమూ సవాలు చేసేందుకు లేదు. తరువాత తెచ్చిన పధకాలకు సబ్సిడీలు ఇవ్వటానికి వీలులేదు. మన దేశం ఆహారభద్రతా చట్టాన్ని 2013లో తెచ్చారు కనుక సబ్సిడీలు కొనసాగించవచ్చు. అయితే ఈ నిబంధన ఎంతకాలం అన్నది స్పష్టత లేదు.2017నాటికి సంధి నిబంధనలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించారు. అయితే అప్పటికీ కుదరకపోతే కుదిరేంతవరకు తాత్కాలిక నిబంధన కానసాగుతుంది.2018-19లో ప్రపంచ వాణిజ్య సంస్దకు మన దేశం అందచేసిన సమాచారం ప్రకారం దేశంలో ఉత్పత్తి అయిన బియ్యం విలువ 43.67 బిలియన్‌ డాలర్లని, ఐదు బిలియన్‌ డాలర్లు సబ్సిడీగా ఇచ్చామని పేర్కొన్నది. ఈ మొత్తం పదిశాతం కంటే ఎక్కువ. సంధి నిబంధనలు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదు. ఎలా రూపొందిస్తారో స్పష్టత లేదు. సబ్సిడీలను తగ్గించాలని ఒక వైపు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, డబ్ల్యుటివో వత్తిడి తెస్తున్నాయి. ఈ కారణంగానే వ్యవసాయానికి ఇచ్చే ఎరువుల సబ్సిడీ గత ఏడు సంవత్సరాలుగా 70వేల కోట్ల రూపాయలకు అటూఇటూగా ఉంది. ఇది మినహా పెరిగిన ధరలను రైతులే భరించాల్సి వస్తోంది. ఇలాంటి పరిమితులనే విద్యుత్‌, ఆహార తదితర వ్యవసాయ సంబంధ సబ్సిడీలకు అమలు జరపబోతున్నారు.
మన దేశంలో ఉత్పత్తి అవుతున్న బియ్యం, గోధుమ ఎగుమతులకు అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఎదురవుతోంది. కొన్ని దశాబ్దాలలో తొలిసారిగా మన దేశం నుంచి చైనా తాజాగా బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నది అనే వార్తలు వచ్చాయి. నిజానికి 2006లో మన బియ్యం దిగుమతికి చైనా అనుమతి ఇచ్చినప్పటికీ నామ మాత్రంగా తప్ప పెద్ద మొత్తంలో దిగుమతి లేదు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ చైనా పదివేల టన్నుల దిగుమతికి నిర్ణయించింది. దీనిలో పక్కా వాణిజ్యం తప్ప ఎలాంటి రాజకీయాలు లేవు. థారులాండ్‌, వియత్నాంల నుంచి దిగుమతి చేసుకొనే బియ్యంతో పోల్చితే మన దేశం టన్నుకు వందడాలర్ల తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకు రావటమే కారణం. ధరలు పెంచినా, చైనాలో తిరిగి ఉత్పత్తి పెరిగినా ఎగుమతులు అనుమానమే.

భారత్‌ 25శాతం బియ్యం రకం టన్ను ధర 2019 నవంబరులో 357.4 డాలర్లు ఉంటే 2020 నవంబరులో 342.8లో ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్ధ సమాచారం వెల్లడించింది. ఇదే రకం థారు బియ్యం ధర 415.4 నుంచి 479.5డాలర్లకు, వియత్నాం బియ్యం 323.6 నుంచి 472.5 డాలర్లకు పెరిగింది. అయితే థారులాండ్‌, వియత్నాంలో సాగు సమస్యలతో బియ్యం ఉత్పత్తి తగ్గటంతో ఎగుమతుల మీద ఆంక్షలు కూడా ఉండటంతో చైనాకు మన బియ్యం ఎగుమతులకు అవకాశం వచ్చింది. మిగతా దేశాలకూ తక్కువ ధరలకే విక్రయిస్తున్నాం.


ప్రపంచ మార్కెట్లో పోటీ తట్టుకోవాలంటే మన దేశంలో ధాన్యం ధర తక్కువగా ఉండాలని, కనీస మద్దతు ధరలను పెంచుకుంటూ పోతే తమకు గిట్టుబాటు కాదనీ ఎగుమతి వ్యాపారులు వత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాలు, వాటి పర్యవసానాలను చూసిన తరువాత రైతాంగానికి ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పాలకుల మాటలు విశ్వసనీయత సమస్యను ముందుకు తెస్తున్నాయి. ఇప్పటి వరకు రైతాంగానికి-వినియోగదారులకు ఎదురైన అనుభవాలు చూస్తే అధికారంలో ఎవరున్నా బడా వ్యాపారులకు అనుకూలమైన విధానాలు తప్ప రైతులు-జనానికి ఉపయోగపడే చర్యలు లేవు. పాలకులు చెప్పిన అనేక మాటల నీటి మూటలయ్యాయి.మేక పిల్లల వంటి రైతాంగాన్ని తోడేళ్ల వంటి బడా సంస్దలకు అప్పగిస్తాము గానీ అవి తినకుండా రక్షణ చర్యలు తీసుకుంటామన్నట్లుగా కేంద్ర వైఖరి ఉంది. అసలు తోడేళ్లను రప్పించటం ఎందుకు అన్నది మేకల ప్రశ్న.


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శేకాదు, యావత్‌ ప్రపంచం ముక్త కంఠంతో రైతులకు మద్దతు తెలిపినా ఏమౌతుంది ? వారంతా ఢిల్లీ వచ్చి మా ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తారా ? చేయమనండి చూస్తాం ! ఇది ఒక బిజెపి మిత్రుడి ప్రయివేటు సంభాషణ సారం. నిజమే ! ఏమౌతుంది ? మహా అయితే ప్రపంచనేత అని భుజకీర్తులు తగిలించుకున్న నరేంద్రమోడీ పరువు పోతుంది, అంతకు మించి పోయేదేమీ ఉంటుంది ? ఇప్పటికే ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. రైతుల ఆందోళన గురించి అడిగితే సూటిగా సమాధానం చెప్పలేక అది భారత-పాక్‌ వ్యవహారం అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎంతకాలం తప్పించుకుంటారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాకమ్మ కథలు ఆపి నరేంద్రమోడీ ఇప్పటికైనా అభివృద్ధి చర్యలు తీసుకుంటారా ?

26 Thursday Nov 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China BRI, China goods boycott, narendra modi cock and bull stories, RCEP INDIA


ఎం కోటేశ్వరరావు


ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) నుంచి భారత్‌ వైదొలగటం సముచితమా కాదా అన్న చర్చ ఇప్పుడు ఇంటా బయటా ప్రారంభమైంది. జపాన్‌ తదితర దేశాలు కోరుతున్నట్లు దానిలో చేరితే ఒక సమస్య లేకపోతే మరొకటి కనుక ఆ గుంజాటనతో ఎంతకాలం గడుపుతారు ? అంతా నెహ్రూయే చేశారు అన్న సుప్రభాతం మాని నరేంద్రమోడీ సర్కార్‌ తాను చెప్పిన ముఖ్యంగా మేకిన్‌ ఇండియా లేదా ఆత్మనిర్భరత కార్యక్రమాలతో దేశాన్ని ఆర్ధికంగా ఎలా ముందుకు తీసుకుపోనుంది అన్నది కీలకం. మరో దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకో కూడదనే వ్రతం చెడి తాను మద్దతు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పరాజయం పాలయ్యాడు. అధికారానికి వచ్చిన జో బైడెన్‌ను సంతృప్తి పరచేందుకు లేదా ఆర్‌సిఇపి చర్చ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు గానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి చైనా ఆప్‌ల మీద డాడి చేసిందని భావించవచ్చు. రాబోయే రోజుల్లో మరికొన్నింటి మీద కూడా నిషేధం విధించవచ్చు. చైనా మీద వత్తిడి పెంచి బేరమాడే ఎత్తుగడ కానట్లయితే ఆప్‌లన్నింటినీ ఒకేసారి ఎందుకు నిషేధించటం లేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాటి వలన చైనాకు తగిలిన దెబ్బ-మనకు కలిగిన ప్రయోజనం ఏమిటన్నది వేరే అంశం. ఆర్దిక వ్యవస్ధ లావాదేవీలను ఆప్‌లు సులభతరం చేస్తాయి తప్ప సంపదలను సృష్టించవు. అందువలన నిషేధాలను పట్టించుకోకుండా కరోనా కారణంగా తగిలిన దెబ్బలను మాన్చుకొని చైనా ముందుకు పోతుంటే తగిలిన దెబ్బలు ఎంత లోతుగా ఉన్నాయో ఇంకా తేల్చుకోలేని స్ధితిలో మనం ఉన్నామంటే అతిశయోక్తి కాదు.


ఆర్‌సిఇపిలో చేరాలా వద్దా ?
ఆర్‌సిఇపి నుంచి వైదొలగటం సరైన నిర్ణయమని కొందరు చెబుతుంటే కాదని మరికొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. దీనిలో చేరితే భాగస్వామ్య దేశాల నుంచి పారిశ్రామిక, వ్యవసాయ, పాడి ఉత్పత్తులు వెల్లువెత్తి నష్టం కలిగిస్తాయని మన పారిశ్రామికవేత్తలు, రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ రంగాలలో తలెత్తిన తీవ్ర సమస్యల నేపధ్యంలో 2019లో ఒప్పందం నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మనం ఏ క్షణంలో అయినా చేరేందుకు అవకాశం కల్పిస్తూ మిగిలిన దేశాలన్నీ 2020 నవంబరులో సంతకాలు చేశాయి. ఏ ఒప్పందం అయినా అందరికీ ఖేదం, మోదం కలిగించదు. ఇప్పుడు ఖేదం అనుకున్న లాబీ చేరకపోవటం సరైనదే అని చెబుతున్నది. మోదం పొందాలనుకున్న వారు వచ్చిన అవకాశం జారిపోయిందే అని ఎంత తప్పు చేశామో అని వాదిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ మీద ఎవరి వత్తిడి ఎక్కువగా ఉంటే రాబోయే రోజుల్లో అది అమలు జరుగుతుంది. అందువలన ఈ అంతర్గత పోరు ఎలా సాగుతుందో చూడాల్సి ఉంది.
ఒప్పందంలో చేరకపోవటం ద్వారా తక్షణ ప్రమాద నివారణ జరిగిందే తప్ప ముప్పు తొలగలేదని గ్రహించాలి. ఒక వైపు ప్రపంచీకరణ, మరింత సరళీకరణ, సంస్కరణలు అంటూ నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికులు-కర్షకుల ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యలను రుద్దుతున్నది. విదేశాల నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతులను నివారించిందన్న సంతోషం రైతాంగంలో ఎక్కువ కాలం నిలిచేట్లు లేదు. సర్కార్‌ మరోవైపు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కనీస మద్దతుధరలు, సేకరణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు రైతాంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదలివేసే చర్యలకు సంస్కరణల ముసుగువేసి పార్లమెంట్‌లో చట్టసవరణలు చేసింది.


కబుర్లు కాదు, నిర్దిష్ట చర్యలేమిటి ?
చైనాతో సహా 15దేశాలు ఆర్‌సిఇపి ద్వారా ముందుకు పోతున్నాయి. లడఖ్‌ సరిహద్దు వివాదం జరగక ముందే ఆర్‌సిఇపి చైనాకు అనుకూలంగా ఉంటుంది, దాని వస్తువులన్నీ మరింతగా మన దేశానికి దిగుమతి అవుతాయి అన్న కారణంతో మనం దానిలో చేరలేదని ప్రభుత్వం చెబుతున్నది. దానితో ఎవరికీ పేచీ లేదు. అయితే ఎప్పుడూ ఆ కబుర్లే చెప్పుకుంటూ కూర్చోలేముగా ! చైనాతో పోటీ పడి మన దేశం ముందుకు పోయేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలేమిటి అన్నది సమస్య. మనం తయారు చేసే వస్తువులను వినియోగించే శక్తిని మన జనానికి కలిగించే చర్యలేమిటి ? విదేశాలకు ఎగుమతి చేసేందుకు వ్యూహం ఏమిటి ?
చైనాకు సానుకూల హౌదా ఎందుకు రద్దు చేయటం లేదు ?

లడక్‌ ప్రాంతం గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతం తరువాత చైనాకు బుద్ధి చెప్పాలి, ఆర్ధికంగా దెబ్బతీయాలన్నట్లుగా ప్రభుత్వ చర్యలు, నేతల మాటలు ఉన్నాయి. పుల్వామా దాడి ఉదంతం తరువాత పాకిస్ధాన్‌కు అత్యంత సానుకూల హౌదా(ఎంఎఫ్‌ఎన్‌)ను మోడీ సర్కార్‌ రద్దు చేసింది. అంతకంటే ఎక్కువగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా చైనాకు ఆ హౌదాను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మోడీ సర్కార్‌ చెప్పింది. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. చైనాతో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బ తగల కూడదు, అదే సమయంలో చైనా వ్యతిరేకతను రెచ్చ గొట్టి జనంలో మంచి పేరు కొట్టేయాలన్న యావ తప్ప మరేమిటి ?
ప్రాంతీయ అభివృద్ధి అవకాశాలకు దూరంగా గిరిగీసుకున్న భారత్‌ అనే శీర్షికతో ఈ నెల 23వ తేదీన, అంతకు ముందు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రెండు విశ్లేషణలను ప్రచురించింది. వాటితో ఏకీభవించటమా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టి వాటి సారాంశాన్ని చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మాసాల మధ్య భారత్‌ చేసుకున్న మొత్తం దిగుమతులలో చైనా ఉత్పత్తుల వాటా 18.3శాతం ఉందని, గతేడాది ఇదే కాలంలో 14.6శాతమే అని భారత వాణిజ్యశాఖ వివరాలు వెల్లడించాయి. ఆత్మనిర్బర పేరుతో చైనా నుంచి దిగుమతులను తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య నెలకొన్న వివాద నేపధ్యంలో ఇది జరిగింది.(చైనా వస్తుబహిష్కరణ వ్రతం ఏమైనట్లు ?) ఆర్‌సిఇపి నుంచి వైదొలిగిన భారత్‌ రక్షణాత్మక చర్యల నేపధ్యంలో అది సిపిటిపిపి లేదా అమెరికా, ఐరోపాలతో ఒప్పందాలు చేసుకోవటం ఇంకా కష్టతరం అవుతుంది. తనకు తాను గిరి గీసుకుంటున్న భారత్‌ భవిష్యత్‌లో అవకాశాలను జారవిడుచుకుంటుందని ఆ పత్రిక పేర్కొన్నది.


చైనా ఎఫ్‌డిఐ ఆంక్షల నుంచి మోడీ సర్కార్‌ వెనక్కు తగ్గుతోందా
ఇటీవల హౌం,వాణిజ్య, పరిశ్రమల శాఖల సంయుక్త బృందం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) నిబంధనలను సడలించాలని ప్రధాని నరేంద్రమోడీకి ఒక ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. మన దేశంతో భూ సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను కొన్ని రంగాలలో 26శాతం వరకు ప్రభుత్వ తనిఖీతో నిమిత్తం లేకుండా అనుమతించాలన్నదే దాని సారాంశం. అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఈ సడలింపు అమల్లోకి వస్తే చైనా నుంచి పెట్టుబడులను అడ్డుకొనేందుకు గతంలో కొండంత రాగం తీసి చేసిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటమే. ఈ ప్రతిపాదనను ఎందుకు చేసినట్లు ? ముందుచూపు లేదా పర్యవసానాల గురించి ఆలోచించకుండా జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నవారికి ఇది ఎదురు దెబ్బ అవుతుంది. చైనాను వ్యతిరేకిస్తే అమెరికా, ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తాయని కలలు కన్న, చైనా మీద వీరంగం వేసిన వారికి అవి కనుచూపు మేరలో కనిపించకపోవటమే అసలు కారణం. ఏటికి ఎదురీదాలని ఉత్సాహపడేే ఎవరైనా ముందు తమ సత్తా, పరిస్ధితులు ఏమిటో ఒకసారి పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత భారత-చైనా వాణిజ్యం బాగా పెరిగింది. చైనా నుంచి దిగుమతులతో పాటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆకస్మికంగా చైనా దిగుమతులను ఆపివేయలేని విధంగా మన పరిశ్రమలు చైనా మీద ఆధారపడ్డాయంటే అతిశయోక్తికాదు. రాజకీయ కారణాలతో ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికా, ఐరోపా ఇతర ఆసియా దేశాల నుంచి అధిక ధరలకు వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోతుండగా ఉత్పత్తి ఖర్చు మరింతగా పెరిగితే పరిస్ధితి ఇంకా దిగజారుతుంది. మన ఆర్ధిక పరిస్ధితి దిగజారుతున్న నేపధ్యంలో చైనాతో వివాదం ప్రారంభమైంది. దీన్ని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు సహిస్తారా ?


ప్రపంచీకరణ జపం ఆచరణలో ఆంక్షలు !
చైనా మాదిరి మన దేశం ఎగుమతి కేంద్రంగా మారాలంటే రక్షణాత్మక చర్యలను విరమించి స్వేచ్చా వాణిజ్య పద్దతులను అనుసరించాలన్నది ఒక వాదన. దాని సారాంశం ఏమిటో చూద్దాం. గతంలో విఫలమైన విధానాలను తిరిగి అమలు జరిపితే లక్ష్యాలను చేరుకోలేము.2014 నుంచీ మోడీ సర్కార్‌ అనేక మార్లు దిగుమతి ఆంక్షలు, సుంకాలను, లైసన్సులు తీసుకోవాల్సిన చర్యలను పెంచింది. ఇది తిరిగి లైసన్సు రాజ్యం వైపు వెళ్లటమే. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం గురించి ఒక వైపు చెబుతారు, మరోవైపు అది అమలుకు అడ్డుపడే చర్యలు తీసుకుంటారు. దీనికి అవసరమైన సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలను పెంచారు.కొన్ని ఐఫోన్ల ధరలను చూస్తే విమానాల్లో దుబారు వంటి చోట్లకు వెళ్లి అక్కడ కొనుగోలు చేసి తెచ్చుకోవటం చౌక అని చెబుతున్నారు. అనేక వస్తువుల దిగుమతికి లైసన్సు తీసుకోవాలని నిర్ణయించారు. రక్షణాత్మక చర్యల వలన మన వస్తువుల నాణ్యత పెంచేందుకు, చౌకగా అందించేందుకు మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు చర్యలు తీసుకోరు. పాత పద్దతులనే కొనసాగించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడూ అదే జరగబోతోంది. రూపాయి విలువను పడిపోయేట్లు చేయటం ద్వారా మన వినియోగదారులు దిగుమతి చేసుకొనే వస్తువుల ధరల పెరుగుదలకు, మన వస్తువులను విదేశీయులు చౌకగా పొందేందుకు వీలు కలిగిస్తున్నారు.
స్వయం సమృద్ధి లేదా మన కాళ్ల మీద మనం నిలిచే విధానాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. అందుకు అనువైన విధానాలను అనుసరించే చిత్త శుద్ది లేదనేదే విమర్శ. ప్రపంచానికి తన తలుపులు తెరిచే ఉంటాయని చైనా చెబుతోంది, అయితే అది తాను చెప్పినట్లు జరగాలని అది కోరుకుంటోంది అని తాజాగా అమెరికా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక వ్యాసశీర్షిక సారం. తన కాళ్ల మీద తాను నిలిచి ఇతరులు తమ మీద ఆధారపడేట్లు చేసుకొనే వ్యూహాన్ని చైనా అధినేత గ్జీ జింపింగ్‌ అనుసరిస్తున్నారని దానిలో పేర్కొన్నారు. అదే విధంగా ఇతర ఆర్ధిక వ్యవస్ధలతో సంబంధాలను తెంచుకోవటం లేదని గ్జీ చెబుతున్నారు గానీ చైనా అడుగులు చూస్తే అదే మార్గంలో పడుతున్నాయి అంటూ వ్యాసకర్తలు భాష్యంచెప్పారు. మన నరేంద్రమోడీ కూడా ఆ విధానాన్నే ఎందుకు అనుసరించరు ?


ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది !
ప్రతి దేశం ప్రపంచ రాజకీయాల్లో తన పాత్ర పోషిస్తోంది. అమెరికా, జపాన్‌, మన దేశంతో కలసి క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా కూటమి కడుతోంది. మరోవైపు అదే చైనాతో కలసి ఆర్‌సిఇపిలో భాగస్వామిగా చేతులు కలిపింది. చైనాతో వాణిజ్య మిగులులో ఉన్న ఆస్ట్రేలియన్లు మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో చైనా తన ఆయుధాలను బయటకు తీస్తోంది. వరుసగా బొగ్గు, మద్యం,బార్లీ, పత్తి వంటి ఉత్పత్తుల దిగుమతులను ఆస్ట్రేలియా నుంచి క్రమంగా తగ్గిస్తోంది. ఇది వత్తిడి పెంచి అమెరికా నుంచి విడగొట్టే ఎత్తుగడలో భాగమే అన్నది స్పష్టం. దీనికి ప్రధాన కారణం దాని ఆర్ధికశక్తే. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 38శాతం చైనాకే జరుగుతున్నాయి, అమెరికా వాటా నాలుగుశాతమే. మన దేశం చైనా నుంచి ఒక శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటుంటే మన ఎగుమతుల్లో మూడుశాతం చైనాకు ఉన్నాయి. అందువలన చైనాకు మన తలుపులు మూస్తే నష్టం ఎవరికో చెప్పనవసరం లేదు. ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది.
రక్షణాత్మక చర్యల ద్వారా మన ప్రగతికి మనమే అడ్డుపడటమే గాక ప్రపంచ భాగస్వామ్యాలను కూడా దెబ్బతీసినట్లు అవుతోందన్నది కొందరి అభిప్రాయం. ఇది విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పించాలనే లాబీల నుంచి కూడా వచ్చే మాట అన్నది స్పష్టం. పన్నుల విధింపు, నిబంధనలు ఎక్కువగా ఉండటం వంటి చర్యల వలన ప్రపంచంలో భారత్‌ తన ఆర్ధిక వ్యవస్ధను తెరవటం లేదనే అభిప్రాయానికి తావిస్తుందన్నది సారాంశం. నిజానికి అమెరికా సంస్ధలైన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ మన దేశంలోని ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్లో 70శాతం వాటాను చేజిక్కించుకున్నాయి.
ప్రతిష్ట, పలుకుబడి పెంచామన్నారు, ఫలితేమిటి ?
మేకిన్‌ ఇండియా పిలుపుతో ఆర్భాటం, ప్రపంచంలో దేశానికి ఎన్నడూ లేని ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని చెప్పటం తప్ప వాటితో గత ఆరున్నర సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించిందేమిటో, చేసిందేమిటో తెలియదు.ఆచరణలో కనిపించకపోతే గప్పాలు కొట్టుకోవటం అంటారు. ఆర్‌సిఇపిలో చేరకూడదని ఏడాది క్రితమే నిర్ణయించిన కేంద్రం మన సరకులకు విదేశీ మార్కెట్ల కోసం చేసిందేమీ లేదు. మరోవైపున ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత 26దేశాలు, వాణిజ్య కూటములతో చైనా 19 స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని తన వాణిజ్య విలువను 27 నుంచి 35శాతానికి పెంచుకుంది. దీన్ని విస్తరణవాదంగా చిత్రించి పబ్బంగడుపుతున్నారు. ఇలాంటి ఒప్పందాలు లేకుండా మన దేశంలో తయారు చేస్తామని చెబుతున్న సరకులను ఎక్కడికి ఎగుమతి చేస్తారు ? ఆర్‌సిఇపి ఒప్పందంలోని మిగిలిన 14భాగస్వామ్య దేశాలతో చైనా విదేశీ వాణిజ్యంలో 2019లో మూడోవంతు ఉంది, చైనాకు వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఆ దేశాల వాటా పదిశాతం ఉంది. ఈ దిశగా నరేంద్రమోడీ ఇంతవరకు చేసిందేమిటి ? మన ఇరుగుపొరుగు దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోలేదు, అవి చైనాతో సంబంధాలను పెంచుకున్నాయి.


మనం ప్రత్యామ్నాయ బిఆర్‌ఐని ఎందుకు రూపొందించలేదు ?
చైనా వాణిజ్య విస్తరణలో మరొక ప్రధాన అంశం బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బిఆర్‌ఐ). 2049లో (అప్పటికి చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చి వంద సంవత్సరాలు అవుతాయి) పూర్తయ్యే ఈ పధకం ద్వారా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో పెట్టుబడులు, వాణిజ్య విస్తరణకు చైనా పూనుకుంది. దీనిలో రోడ్డు, సముద్ర మార్గాలు ఉన్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలోనే ఇది రూపుదిద్దుకుంది. అదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న మోడీ ఇలాంటి పధకాన్ని ఎందుకు రూపొందించలేకపోయారు ? చైనా గ్జీ జింపింగ్‌కు ఉన్న తెలివితేటలు మోడీకి లేవా ? నెహ్రూ అలా చేశారు, ఇలా చేశారు అని రోజూ అంతర్గతంగా ఆడిపోసుకోవటం, ఆర్‌సిఇపి, బిఆర్‌ఐ వంటి చర్యల ద్వారా చైనా విస్తరించటాన్ని అడ్డుకోవాలంటూ అమెరికా ఇతర దేశాలతో చేతులు కలిపేందుకు తాపత్రయం తప్ప మన దేశమే అలాంటి పధకాలను రూపొందించాలనే దూరదృష్టి ఎందుకు కొరవడింది?
చైనా లేదా మరొకటి మరొక దేశాన్ని ఆక్రమించుకుంటే దాన్ని వ్యతిరేకించాల్సిందే, అందరూ కలసి అడ్డుకోవాల్సిందే. గతంలో అలా ఆక్రమించుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలన్నీ వెనక్కు తగ్గి స్వాతంత్య్రం ఇవ్వకతప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత వలసలు, ఆక్రమణలు లేవు. ఏదో ఒక సాకుతో అమెరికా, దానికి మద్దతు ఇస్తున్నదేశాలే ఇటీవలి కాలంలో ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌లను ఆక్రమించుకుని తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పరోక్షంగా పెత్తనం చేస్తున్నాయి తప్ప చైనా అలాంటి చర్యలకు ఎక్కడా పాల్పడలేదు. వాణిజ్యం, పెట్టుబడుల విషయానికి వస్తే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) 1995లో ఉనికిలోకి రాక ముందు 1948 నుంచి పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) అమల్లో ఉంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు దానిలోకి చైనాను ప్రవేశించనివ్వలేదు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే తమ ప్రాబల్యంలో ఉన్న ప్రపంచ మార్కెట్‌లోకి చైనా ప్రవేశించకుండా అడ్డుకున్నాయి.(1971వరకు అసలు చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపే ఇవ్వలేదు.చైనా తిరుగబాటు రాష్ట్రమైన తైవాన్‌లో ఉన్న తొత్తు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధి అని దానికే ప్రాతినిధ్యం కల్పించాయి) 2001లో సభ్యత్వమిచ్చాయి.
మనం గమనించాల్సిన అంశం ఏమంటే చైనా ప్రారంభించిన సంస్కరణల్లో భాగంగా అది తన అపార మార్కెట్‌ను తెరిచింది.దానిలో ప్రవేశించాలన్నా, లబ్ది పొందాలన్నా చైనాను డబ్ల్యుటిఓలో భాగస్వామిని చేయకుండా సాధ్యం కాదు. అందుకే గతంలో అడ్డుకున్న అమెరికా వంటి దేశాలే ఐరాసలో, డబ్ల్యుటిఓలో చేరనిచ్చాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకొని చైనా నేడు ఒక అగ్రశక్తిగా ఎదిగి ధనిక దేశాలను సవాలు చేస్తోంది. తమకు పోటీగా తయారైన చైనాను సహించలేని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన దేశం పోటీలో ఉండే విధంగా ప్రోత్సహిస్తాయా ? సహిస్తాయా ? చైనాను వ్యతిరేకిస్తే పశ్చిమ దేశాలు మనకేదో తవ్వితలకెత్తుతాయనే భ్రమల్లో ఉన్న మోడీ సర్కార్‌ అయినా ఎండమావుల వెంట పరుగెత్తినట్లుగా వాటిని నమ్ముకొని ఉంది తప్ప తాను చేయాల్సింది చేయటం లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అసలే లేదు.2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపిని సాధించటం లక్ష్యంగా చెప్పింది తప్ప దానికి అనువైన పరిస్దితుల కల్పనకు పూనుకోలేదు. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది.

గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ధి జాడెక్కడ ?
ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్దికవేత్తగా ఉన్న గీతా గోపీనాధ్‌ మరో ఆర్ధికవేత్త ఇక్బాల్‌ దహలీవాల్‌తో కలసి 2014 మేనెలలో దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఒక విశ్లేషణ చేశారు. ప్రస్తుతం భారత్‌ యవ్వనదశలో ఎదుగుతున్న మార్కెట్‌గా ఉంది. దీని అర్ధం రానున్న ఐదు సంవత్సరాలలో ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండానే అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. అదే జరిగింది, దానికి తోడు చమురు ధరలు పడిపోవటం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేకుండానే అభివృద్ధి జరిగింది. తదుపరి చర్యలు లేకపోవటంతో ఐదేండ్ల తరువాత దిగజారింది. జిడిపిలో పరిశ్రమల విలువ వాటా 25శాతం దగ్గర అప్పటికే ఆగిపోయింది. తనకు అధికారమిస్తే గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది దేశమంతటా అమలు చేస్తానని నరేంద్రమోడీ నమ్మబలికారు. ఐదు సంవత్సరాల తరువాత చూస్తే ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం పరిశ్రమల వాటా 24.88శాతానికి పడిపోయింది. ఈ కాలంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపిదే పాలన అన్న విషయం తెలిసిందే. ప్రయివేటు పెట్టుబడుల మీద ఆశలు పెట్టుకున్న సర్కార్‌కు కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో మూటలు కట్టుకోవటం తప్ప వాటిని పెట్టుబడులుగా పెట్టి పరిశ్రమలను స్ధాపించటం లేదు. విదేశీ మదుపుదార్లు మన కార్పొరేట్ల వాటాలను కొనుగోలు చేయటం తప్ప కొత్త పరిశ్రమలు పెట్టటం లేదు. అభివృద్ధి లేకపోవటానికి ఇదొక ప్రధాన కారణం.
చైనాలో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ సంస్ధలు ప్రత్యామ్నాయ ఉత్పాదక దేశాల కోసం చూస్తున్నాయని ఈ అవకాశాన్ని భారత్‌ వినియోగించుకుంటే పారిశ్రామిక వృద్ధి సాధించవచ్చని గీతా గోపినాధ్‌ చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆరు సంవత్సరాల తరువాత కూడా నరేంద్రమోడీ అండ్‌కో అదే కబుర్లు చెబుతూ చైనా నుంచి ఉత్పాదక కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెబుతున్నది, భ్రమలు కల్పిస్తున్నది. 2013లో సులభతర వాణిజ్య సూచికలో మన దేశం 134వ స్ధానంలో ఉండగా 2020లో 63కు ఎదిగినా చైనా నుంచి, మరొక దేశం నుంచి కంపెనీలు వస్తున్న సూచనలేమీ లేవు. ఇప్పటికైనా చైనా గాకపోతే మరొక దేశాన్ని చూసి అయినా అభివృద్ధికి బాట వేస్తారా ? కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం గడుపుతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా సైనికకూటములలో భారత్‌ చేరవద్దు !

20 Friday Nov 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Indo-China standoff, the Quad, US-India Military Alliance


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


”సామాజిక అభ్యున్నతి కార్యక్రమాల కంటే సైనిక రక్షణ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న దేశం ఆధ్యాత్మిక మరణానికి చేరుకుంటుంది” – మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌.
నవంబరు 6 న చుషుల్‌ లో జరిగిన 8 వ విడత కోర్‌ కమాండర్‌ స్ధాయి చర్చలలో, సరిహద్దులోని ఉద్రిక్తతలను తొలగించి, సైనిక ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు భారత-చైనా దేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. మరొక పక్క రెండో దఫా మలబార్‌ సైనిక విన్యాసాలు నవంబరు 17 నుండి జరుగుతున్నాయి. అమెరికా నాయకత్వాన జరుగుతున్న ఈ విన్యాసాలలో భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలు పాల్గొంటున్నాయి. జపాన్‌ కొన్ని దీవుల విషయంలో చైనాతో వివాద పడుతోంది. అయితే వాటికోసం యుద్దానికి దిగేస్థితి లేదు. మరోవైపు అమెరికా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రశక్తిగా ఎదిగేందుకు, మిలిటరీశక్తిగా, మారాలని చూస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అమెరికా అనుంగు దేశంగా మలబార్‌ సైనిక విన్యాసాలలో పాల్గొంటున్నది.

చైనాను చుట్టుముట్టాల
మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో చైనా కొత్త దారులను తొక్కి అమెరికా తో సహా ప్రపంచప్రజలందరికీ కావలసిన వినియోగ వస్తవులను, ఎలక్ట్రానిక్‌ సామానులనుతయారుచేసి తక్కువ ధరలకు అందిస్తున్నది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ ద్వారా రవాణాసౌకర్యాలను అభివ ధి చేసి ఆఫ్రికా, యూరప్‌ లతో తన వాణిజ్య వ్యాపారాలలో పైచేయిసాధింటానికి అమెరికా తో పోటీపడుతోంది. ప్రత్యర్ధి ఆర్ధిక శక్తిగానే కాక సైద్దాంతిక శత్రువుగా కూడా అమెరికా పరిగణిస్తున్నది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సైనికంగా దిగ్బంధించాలని ప్రయత్నం చేస్తున్నది. అందుకు మన దేశాన్ని క్రమేపీ సైనిక కూటమిలో చేర్చుకోవటానికి కుట్ర పన్న్నుతోంది. సైనిక విన్యాసాలని, వాతావరణ, ప్రదేశిక సమాచారాన్ని పంచుకు నే ” బెకా ”అని రకరకాల ఒప్పందాలలో ఇరికించే ప్రయత్నాలలో వుంది.
1998 లో భారత దేశం అణుపరీక్షలు నిర్వహించటం , అమెరికాకు కోపం తెప్పించింది, ఆర్ధిక ఆంక్షలను విధించింది. సంవత్సరాల చర్చలు, సర్దుబాట్లు, ఒప్పందాలు, లొంగుబాట్ల వలన 2005 సం,లోఆంక్షలను క్రమంగా సడలించారు. పది సంవత్సరాల రక్షణ వ్యవహార సంబంధాల వ్యూహానికి సంబంధించిన ఫ్రేమ్‌ వర్క్‌ ను భారత-అమెరికాలు ఏర్పరచుకొని 2013 లో రక్షణ వ్యవహారాల సహకారం పై సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. . 2015 లో రక్షణ వ్యవహారాల వ్యూహ ఫ్రేమ్‌ వర్క్‌ ను మరో పదేళ్ళు పొడిగించారు.
2000 సం లో 20 బిలియన్‌ డాలర్లున్న భారత- అమెరికా వాణిజ్యం 2018 నాటికి 140 బిలియన్లకు చేరుకుంది .2005 సం . వరకు రక్షణ పరికరాలు 400 మిలియన్‌ డాలర్ల నుండి 18 బిలియన్‌ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

సోవియట్‌ పతనంతో అంతరిస్తున్నఅలీన విధానం ,

భారత ప్రభుత్వం 1947 నుండి 1991 వరకు అలీన విధానం కొనసాగించింది. ఆసియా, ఆఫ్రికా దేశాల విముక్తిపోరాటాలకు అలీన ఉద్యమం సహాయాన్నందించింది.పంచవర్ష ప్రణాళికలకు సోవియట్‌ సహాయం అందించింది.భారీ పరిశ్రమలైన ఉక్కు ఫ్యాక్చరీలకు, భారత మందుల పరిశ్ఱమలకు నిస్వార్ధంగా సహాయాన్నిందించింది. 1971 లో ఇందిరా గాంధీ తోశాంతి, స్నేహం, సహకార ఒప్పందం చేసుకుని సోవియట్‌కు దగ్గరయింది. అలీన ఉద్యమం బలహీన పడటం, అలీనోద్యమ నాయకులైన నెహ్రూ, నాజర్‌, టిటో, కాస్ట్రో, సిరిమావో లు అంతరించటం అమెరికా అనుకూల భావజాలానికి అడ్డు తొలగింది. సోవియట్‌ రష్యాను విచ్చిన్నం చేయటంలో అమెరికా సఫలమయ్యింది. సాంకేతికంగా ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకున్న అమెరికా సైనిక బలంలోనూ తన అధిపత్యాన్ని నిరూపిస్తూ ఏకధ వ ప్రపంచానికి నాయకత్వం వహించింది. కార్పోరేట్‌ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే, ఆర్ధిక సంక్షోభాలను నివారించలేకపోయింది.అమెరికా దేశం అప్పులలో మునుగుతూంది. 906 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ ట్రెజరీ సెక్యూరిటీలు చైనా చేతిలో వున్నాయి., జపాన్‌ 877, ఆయిల్‌ ఎగుమతిదారులు213 బిలియన్‌ డాలర్ల ట్రెజరీ సెక్యూరిటీలనుస్వంతం చేసుకున్నారు.

సోషలిజం, కమ్యూనిజం చర్చలోకివచ్చింది

అమెరికాలో నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోవటంతో సోషలిజం, కమ్యూనిజం . సోషల్‌ డెమోక్రసీ చర్చలోకివచ్చింది.ఆర్ధిక సంక్షోభాల సుడిగుండాలనుండి బయటపడటానికి మార్కెట్ల కోసం వెతుకులాటలో వుంది. అమెరికా విదేశాంగ విధానం ముఖ్యంగా మిలిటరీ రీత్యా ఘోరంగా విఫలమయింది. ఇరాక్‌, ఆఫ్గనిస్ధాన్‌ లలో ఎదురైన పరాజయంతో ప్రత్యక్షయుద్ధానికి వెనుకాడుతోంది. జనవరి3, 2020 న ద్రోన్‌ ద్వారా ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిమ్‌ సొలేమాన్‌ని బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దొంగదెబ్బతీసి హతమార్చింది. భారతలాంటి దేశాలను తన వైపు చేర్చుకోవటానికి చైనాతో సరిహద్దు తగాదాను ఒక మంచి అవకాశంగా మలుచుకుంటున్నది. బిగుసుకుంటున్న బంధం ధ్రుతరాష్ట్ర కౌగిలి ని గుర్తుచేస్తున్నది. ప్రేమ నటిస్తూ దగ్గరకు తీసుకుంటూ ప్రాణాలుతీసే ప్రయత్నాన్ని ధ్రుతరాష్ట్ర కౌగిలి అంటారు.


ఇండో-పసిఫిక్‌ పాలసీ
ఇండో-పసిఫిక్‌ పాలసీ ని ముందుకు తెచ్చింది ట్రంప్‌ కాదు. ఒబామా , బిడెన్‌ అధికారంలో వుండగానే ఈ విధానాలకు శ్రీకారం చుట్టారు. చైనా ప్రభావాన్ని ఆసియా దేశాలపై నివారించటానికి 2015 లో ఢిల్లీలో ఒబామా భారత-అమెరికా ల విజన్‌ స్టేట్‌ మెంట్‌ పై సంతకం చేశారు. అదే విధానాలను ట్రంప్‌ కొనసాగించాడు.
నాటో సైనిక కూటమి మాదిరి క్వాడ్‌ సైనిక కూటమి
దక్షిణచైనా సముద్రాన్ని మరొక సైనిక కూటమికి కేంద్రంగా చేయాలని 1992 నుంచి కొనసాగుతున్న అమెరికా వ్యూహం ఫలించిందనే చెప్పాలి. ఆమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడాలంటే ఆయుధాలను అమ్ముకోవాలి. మలబార్‌ సైనిక విన్యాసాలు తొలిదశలో భారత-అమెరికా నౌకాదళాల శిక్షణాకార్యక్రమాలకు మాత్రమే పరిమితమని ప్రచారంచేశారు. 2015లో జపాన్‌ చేరింది. కొత్తగా ఆస్ట్రేలియాను భయపెట్టి, బతిమిలాడి చతుష్టయ కూటమిలోకి చేర్చుకొన్నారు. 2015 సం.లో జరిగిన మలబార్‌ విన్యాసాలకు భారత్‌ నౌకాదళం రెండు యుద్దనౌకలను మాత్రమే పంపింది, ఇపుడు 2020 లో విమానవాహక యుద్ద నౌక, సబ్‌ మెరైన్‌ లను కూడా పంపింది. బంగాళాఖాతంలో నవంబర్‌ 3న మలబార్‌ -2020 పేరున సైనిక విన్యాసాలు ప్రారంభించాయి.అరేబియా సముద్రంలో 17 వ తేదీనుండి 20వ తేదీ వరకు ఈ విన్యాసాలు జరిగాయి. చైనా ను చుట్టుముట్టి నిలవరించాలనే పధకం 2007లో నే మొదలయింది.అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ, అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబే ఈ పధకాన్ని ఆమోదించి ”చతుష్టయాన్ని” ఏర్పాటుకు ప్రయత్నం చేశారు. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని జాన్‌ హౌవర్డ్‌, భారత ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ దీనిని ఆమోదించారు.

ప్రశాంత సముద్రజలాలలో బలప్రదర్శనలు
చైనా ను నివారించ్చాలన్న అమెరికా ప్రయత్నాలకు మనం ఎందుకుసహకరించాలన్నదే ముఖ్యమైన అసలుప్రశ్న. చైనాలో ఆర్ధిక అభివ ద్ధి జరిగిన స్థాయి లో ఆ దేశ సైనిక ,భౌగోళిక, రాజకీయ శక్తీ పెరగలేదు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఇప్పటికీ అమెరికా దే పైచేయి. సైనిక బడ్జెట్‌, సైన్యం, అణ్వస్త్రాలు, విదేశాల్లో సైనికస్తావరాలు మొదలైన వాటిలో ఏ దేశమూ అమెరికా దరిదాపుల్లోకూడా లేదు. చైనా బలమైనఆర్ధిక శక్తిగా ఎదగడం, ఇరుగు పొరుగు దేశాలలో పలుకుబడి పెరగటంవలన ఆసియా-పసిఫిక్‌ లో అమెరికా అధిపత్యానికి భంగం కలిగింది.అమెరికా భధ్రతకు ముప్పు లేకపోయినా సవాలు మాత్రం ఎదురైంది. దక్షిణచైనా సముద్రంలో అమెరికాకు ఉపయోగపడే నిఘాకు భారతదేశం అంగీకరించింది. సైనిక వ్యూహంలో భాగంగా అండమాన్‌ నికోబార్‌ దీవులను కీలక మిలిటరీ కేంద్రంగా చేస్తున్నారు. చైనా సముద్ర వాణిజ్య మార్గంలో కీలకంగా వుండే మలక్కా జలసంధికి అండమాన్‌ దీవులు సమీపంలో వున్నాయి. చైనా వ్యతిరేక సైనిక వ్యూహంలోఅండమాన్‌ దీవులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.ప్రశాంత సముద్రజలాలలో బలప్రదర్శనలు చేయటానికి మనదేశం అంగీకరించినందువలన సైనిక కూటములలో ప్రత్యక్షభాగస్వాములౌతున్నాము.
సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవటానికి ఉన్నత రాజకీయ , దౌత్య స్ధాయిలో చైనా తో భారత ప్రభుత్వ చర్చలు కొనసాగించటం వలన దాదాపు 40 సంవత్సరాలు భారత-చైనా దేశాలు తమ అభివ ద్ధిపై కేంద్రీకరించగలిగాయి.భారత-చైనా దేశ ప్రజల విశాల ప్రయోజనాల ద ష్ట్యా ఇరు దేశాల నాయకులు ఉన్నత స్ధాయిలో రాజకీయ నిర్ణయాలు తీసుకుని సరిహద్దు సమస్యను పరిష్కరించాలి. బయటి వారెవరూ సైన్యాన్ని మనకు సహాయంగా పంపరు. ఆయుధాలను మనకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఆయుధపోటీని పెంచుతారు. అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ చెప్పినట్లుగా అమెరికాను మిలిటరీ – ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌ పరిపాలిస్తున్నది. అమెరికా లాగా మనం సైనిక-రక్షణ రంగ పరిశ్రమల (మిలిటరీ -ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌) పరిపాలనలోకి వెళ్ళరాదు. మిలిటరీ-ఇండిస్టియల్‌ కాంప్లెక్స వలన పెరుగుతున్నప్రమాదాల గురించి హెచ్చరించాడు.కానీ ఆయుధ రేసు ను నివారించలేకపోయాడు.

” తయారైన ప్రతి తుపాకీ, ప్రతి యుద్ధ నౌక, ప్రయోగించిన ప్రతి రాకెట్‌ -ఆకలి బాధతో ఉన్నవారినుండి దొంగిలించినవే. ధరించటానికి దుస్తులు లేనివారుండగా ఆయుధాలకు డబ్బు మాత్రమే ఖర్చు చేయటంలేదు. ఆయుధాల తయారీలో కార్మికుల చెమట, శాస్త్రవేత్తల మేధావితనంతోపాటు మన పిల్లల ఆశలు కూడా ఖర్చు చేస్తున్నాము.” అని ఐసెన్‌ హౌవర్‌ చెప్పాడు.

ఈ యుధాలు ఎవరికోసం ?
రక్షణ పరిశ్రమలు నడవటంకోసం యుద్ధాలుకావాలి. ఆధునిక ఆయుధాలను తయారు చేయటానికి ప్రపంచంలోని మేధావులను , సైంటిస్టులను అమెరికా ఆహ్వానించి ఆధునిక సౌకర్యాలను, అవకాశాలను, పని చెసే వాతావరణాన్ని స ష్టిస్తున్నది. కొత్తకొత్త ఆయుధాలను తయారుచేసి ఇరుపక్షాలకు ఆయుధాలను అమ్ముకుంటున్నది. సోవియట్‌ పతనం తరువాత అమెరికా కు కొత్త శత్రువు అవసరం వచ్చింది. ఆ వెతుకులాటలో ఇరాన్‌, ఇరాక్‌,లిబియా, సిరియా, ఆఫెనిస్ధాన్‌ లు కొంత పని కల్పించాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాన్ని తమ తదుపరి కార్యక్షేత్రంగా ఎంచుకుని పావులు కదుపుతున్నారు.

అమెరికాతో సైనిక ఒప్పందాలు
భారత్‌ దేశాన్ని అమెరికాకు రక్షణ భాగస్వామి గా చేసుకోవటం వలన భారత సైనిక స్ధావరాలను అమెరికా యుద్దవిమానాలు, యుద్దóనౌకలు వినియోగించుకోవచ్చు. అమెరికాలో ఆయుధాలు ఉత్పత్తి చేసే వారి నుండి భారత్‌ నేరుగా ఆయుధాలు కొనవచ్చు. అమెరికా తన రక్షణ భాగస్వాములతో నాలుగు ”ప్రాధమిక ” ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. ఈ ఒప్పందాలు ”భాగస్వామి-దేశాలతో సైనిక సహకారాన్ని పెంపొందించుకోడానికి అమెరికా ఉపయోగించే సాధారణ సాధనాలు” అని పెంటగాన్‌ అంటుంది. మనం ప్రాధమిక స్ధాయి ఒప్పందాలన్నీ చేసుకున్నాము.
ఈ నాలుగు ఒప్పందాలలో మొదటిది, జనరల్‌ సెక్యూరిటీ ఆఫ్‌ మిలిటరీ ఇన్ఫర్మేషన్‌ అగ్రిమెంట్‌, 2002 లో భారత అమెరికాలు సంతకం చేసిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సైనిక సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. రెండవ ఒప్పందం, లాజిస్టిక్స్‌ ఎక్సేóంజ్‌ మెమోరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌ , 2016 ఆగస్టు 29 న ఇరు దేశాలు సంతకం చేశాయి. పునఃసరఫరాలు చేయడానికి, మరమ్మతు చేయడానికీ ఇతరుల స్థావరాలను ఉపయోగించడానికి ఇరు దేశాల సైన్యానికి వీలు కలుగుతుంది.
మూడవ ఒప్పందం, కమ్యూనికేషన్స్‌ ఇంటర్‌ ఆపరబిలిటీ అండ్‌ సెక్యూరిటీ మెమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ చైనా మరియు పొరుగు ప్రాంతాలపై నిఘా ఉంచడానికి, అమెరికా మిలిటరీ పరికరాలను కొనటానికి, టెక్నాలజీని ఇవ్వటానికి , ఆయుధాలను భారతదేశానికి అమ్మటానికి ద్వైపాక్షిక సదస్సులో సంతకాలు చేసారు.
నాల్గవ ఒప్పందం బేసిక్‌ ఎక్సేóంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బీకా). ఇది జియోస్పేషియల్‌ ఉత్పత్తులు, టోపోగ్రాఫికల్‌, నాటికల్‌, ఏరోనాటికల్‌ డేటా, యుఎస్‌ నేషనల్‌ జియోస్పేషియల్‌-ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (ఎన్జిఎ) ఉత్పత్తులు సేవలను మార్పిడి చేయడానికి అనుమతిస్తుంది.

లండన్లోని కింగ్స్‌ కాలేజీలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్‌ హర్ష్‌ వి. పంత్‌ అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలో భారతదేశపు ప్రాముఖ్యతను ఎత్తిచూపాడు: ”ఇండో-పసిఫిక్‌ లో శక్తి సామర్ధ్యాల సమతుల్యతకు అమెరికాకు భారతదేశం కీలకం. వనరుల పరిమితంగా ఉన్న ఈ సమయంలో, చైనా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో తన విశ్వసనీయతను పెంచుకోడానికి అమెరికాకు భారతదేశం వంటి భాగస్వాములు అవసరం.” ఈ ఒప్పందాలన్నిటిలో భారత్‌ చేరింది. ఐరోపా లోని భాగస్వామ్యదేశాలన్నీ ఈ విధంగా సంతకాలు చేసి నాటో సైనిక కూటమి లో చేరి ఇరుక్కు పోయి తీవ్రంగా నష్టపోయాయని గ్రహించాలి.

చైనానుండి, చైనా కమ్యూనిస్టుపార్టీ దోపిడీ, అవినీతి నుండి దేశాల ప్రజల రక్షణ కోసం క్వాడ్‌ ఏర్పడిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ,టోక్యో లో బాహాటంగా ప్రకటించాడు. అమెరికా లో కమ్యూనిస్టువ్యతిరేకతను రెచ్చగొట్టిన ఘనత రిపబ్లికన పార్టీ సెనేటర్‌ మెకార్ధీకే దక్కుతుంది. ప్రభుత్వం లోవున్నప్రజాస్వామికవాదులందరినీ కమ్యూనిస్టులన్నాడు. సోవియట్‌ ఏజెంట్లు అంటూ వారందరిపై పై దాడి చేశాడు.వారిని పదవులనుండి తొలగించేదాకా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేశాడు. అమెరికన్‌ ప్రజలలో కమ్యూనిస్టలంటే భయాన్ని, వ్యతిరేకతలు స ష్టించాడు. అతను కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నిజమైన సాక్ష్యాలను చూపించటంలేదని అందరికూ తెలుసు. అయినా అతని అబద్ద ప్రచారాన్ని ఆపడానికి ఐసెన్‌ హౌవర్‌ లాంటి వారు కూడా భయపడ్డారు.” నేను ఆ వ్యక్తితో గొడవపడను” అని వెనక్కితగ్గాడు. 1950 లో ప్రారంభమయిన కమ్యూనిస్టు వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే వుంది. కమ్యూనిజాన్నినివారించాలనే పేరుతో కొరియా, వియత్నాం యుధాలనుండి ఇండో-పసిఫిక్‌ క్వాడ్‌ కూటమి వరకూ సైనిక కూటములను ఏర్పరుస్తున్నారు.
స్నేహంతో జీవించవలసిన ఇరుగు పొరుగు దేశాలమధ్య చిచ్చు పెట్టి ఇద్దరికీ ఆయుధాలను, ఫైటర్‌ విమానాలను, సబ్‌ మెరైన్లను అమ్ముకోవటమేకాకుండా ప్రపంచ ప్రజలనందరినీ పేదరికం లోకి నెట్టి అసమాన అభివ ద్ధిని స ష్టిస్తోంది. అమెరికా దేశం సంవత్సరానికి 732 బిలియన్‌ డాలర్లను , చైనా 261 బిలియన్‌ డాలర్లను, ఇండియా 71 బిలియన్‌ డాలర్లను మిలిటరీకి, ఆయుధాలకు ఖర్చు పెడుతున్నాయి.

చైనా మనను జయించలేదు. మనం చైనాను జయించలేము.
చైనా మనను జయించలేదు. మనం చైనాను జయించలేము. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో ఆయుధాలను ప్రయోగించి ,అత్యంత శక్తివంతమైన అమెరికా ఏదేశంలోనూ విజయం సాధించలేదు. 2001 సెప్టెంబరు 11 న ప్రపంచవాణిజ్యసంస్ధపై దాడి జరిగినప్పడినుండీ 20 సంవత్సరాలుగా , ఆసియాలో ప్రతీకారయుధాలను అమెరికా సాగిస్తుంది. ఈ యుధాలకు 6.4 లక్షల కోట్ల డాలర్లు ( 475 లక్షల కోట్ల రూపాయలు ) ఖర్చయిందని అంచనా. గత 20 సంవత్సరాలుగా అమెరికా సాగించిన యుధాలలో చనిపోయిన వారి సంఖ్య 8,01,000. అందులో 3,35,000 మంది నిరాయుధ పౌరులన్నది మరింత బాధాకరం. కొరియా, వియత్నాం లలో చావు దెబ్బతిన్న అమెరికా పాఠాలు నేర్చుకోకుండా మిలిటరీ -ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌ అడ్డుపడింది. ప్రత్యక్షంగా సైనికులను ఆకాశంనుండి క్యూబా లో దించి అవమానాల పాలయ్యింది.ఇరాక్‌ లో సద్దామ్‌ హుస్సేన్‌, చిలీ లో అలెండీ, లిబియాలో కల్నల్‌ గద్దాఫీ, ఇరాన్‌ జనరల్‌ క్వాసిమ్‌ సొలేమాన్‌ లను దారుణంగా హత్య చేసింది. క్యూబా అధినేత ఫిడేల్‌ కాస్ట్రోను చంపటానికి 638 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అటువంటి చరిత్ర కలిగిన అమెరికా ను నమ్ముకుని యుద్ధ కూటములలో చేరితే మన దేశం ఆర్ధికంగా నష్టపోయి అరబ్‌ దేశాలు, లాటిన్‌ అమెరికా, ఆసియా.ఆఫ్రికా దేశాలలోలాగా అభాసుపాలవుతాము. కుక్క తోక పట్ట్టుకుని గోదావరి ఈదటం సాధ్యంకాదు.
రాబోయే కాలానికి భారత-చైనా దేశాలే సాంకేతిక అభివ ధికి చిహ్నంగా వుంటాయని నిరూపించుకుంటున్నారు. అటువంటి సమయంలో సరిహద్దు ఘర్షణలు జరగటం అవాంఛనీయం. వలసరాజ్యాలువదిలి వెళ్ళిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించకోలేకపోవటం భారత – చైనాదేశాల రాజకీయ వైఫల్యం. భారత చైనాలు చిరకాలం శత్రుత్వంతో వుండలేవు. వేలాది సంవత్సరాల మైత్రిలో తగాదాపడిన కాలం చాలా తక్కువ. పరిష్కరించుకోలేని సమస్యలు లేవు. అతి పెద్ద దేశాలైన భారత- చైనా లతోనే ప్రపంచ ప్రజల సుస్ధిర శాంతి సౌభాగ్యాలు ముడిపడివున్నాయి. సైనిక కూటములలో చేరవలసిన అవసరం వున్నదా లేదా అని మనం ఆలోచించాలి. సైనిక కూటములలోచేరి చితికిపోయిన దేశాల చరిత్రను మరువరాదు. ఉన్నత స్ధాయిలో రాజకీయ నిర?యాలు తీసుకుని సరిహద్దు సమస్యను పరిష్కరించాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, భారత-చైనా మిత్రమండలి, ఆంధ్రప్రదేశ్‌, మాజీ అధ్యక్షుడు. (1982-1997)

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌సిఇపి ఒప్పందం – అమెరికాకు భంగపాటు !

17 Tuesday Nov 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

#RCEP, RCEP, RCEP China, RCEP INDIA, RCEP Trade Pact, Regional Comprehensive Economic Partnership (RCEP)


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల సంప్రదింపుల అనంతరం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని పదిహేను దేశాలు ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)పై నవంబరు 15వ తేదీన సంతకాలు చేశాయి. ఇదొక చారిత్రక పరిణామంగా భావిస్తున్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆయా దేశాల చట్ట సభలు ఆమోదం తెలిపిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ప్రపంచంలో దాదాపు సగం జనాభా, మూడోవంతు జిడిపి ఉన్న దేశాలు కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి నుంచి ఈ ఒప్పంద చర్చలలో ఉన్న భారత్‌ తాను వైదొలుగుతున్నట్లు గతేడాది నవంబరులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న ఏడాది కాలంలో అనేక అనూహ్య పరిణామాలు సంభవించాయి. ప్రపంచీకరణలో భాగంగా అనేక సంస్కరణలు చేపడతామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ మరోవైపు రక్షణాత్మక చర్యలు తీసుకోవటాన్ని మిగతా దేశాలు ఎలా చూస్తాయి ? అయితే భారత్‌ కోరుకుంటే ఎప్పుడైనా చేరవచ్చని, నిబంధనలను కూడా సడలిస్తామంటూ భాగస్వామ్య దేశాలు తలుపులు తెరిచే ఉంచాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల రక్షణ చర్యల్లో భాగంగా, ఇతర కారణాలతో మన దేశం ఈ ఒప్పందంలో చేరలేదు. చైనా కారణంగా దూరంగా ఉన్న అమెరికా కూడా దీనిలో చేరవచ్చనే ఆశాభావాన్ని జపాన్‌ వ్యక్తం చేసింది.


ఆస్ట్రేలియా,బ్రూనే, కంపూచియా, చైనా, ఇండోనేషియా, జపాన్‌, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా,థారులాండ్‌,వియత్నాం సభ్యులుగా ఉన్న ఈ ఒప్పందం ద్వారా ప్రతిదేశమూ లబ్ది పొందటంతో పాటు ప్రపంచ జిడిపి పెరుగుదలకూ దోహదం చేస్తుందని భావిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా అవతరిస్తున్న చతుష్టయ కూటమిలో ఉన్న జపాన్‌, ఆస్ట్రేలియా దీనిలో భాగస్వాములు. దక్షిణ కొరియాతో సహా రాజకీయ అంశాలలో అవి అమెరికాకు మద్దతు ఇస్తూనే ఆర్ధిక రంగంలో చైనాతో సంబంధాలతో మరింత ముందుకు పోవాలనే నిర్ణయించాయంటే ఆర్ధిక అంశాలే ప్రధాన చోదకశక్తిగా ఉన్నాయన్నది స్పష్టం. ఈ ఒప్పందంతో చైనాకు ఎగుమతి అవుతున్న జపాన్‌ పారిశ్రామిక ఎగుమతులలో 86శాతం, దక్షిణ కొరియా నుంచి ఎగుమతి అవుతున్నవాటిలో 92శాతంపై పన్నులు రద్దువుతాయి. జపాన్‌ ఆటోవిడిభాగాల తయారీ పరిశ్రమ ప్రధానంగా లబ్ది పొందుతుంది. ఆస్ట్రేలియా కూడా ఇదే అంచనాతో ఒప్పందానికి సిద్దపడింది. చైనాతో వాణిజ్య సంబంధాలలో ఈ మూడు దేశాలూ మిగులులో ఉన్నాయి.


అనేక ఆసియన్‌ దేశాల వస్తూత్పత్తి చైనానుంచి చేసుకొనే కొన్ని వస్తువుల దిగుమతుల మీద ఆధారపడి ఉంది. ఒప్పందానికి అమెరికా, భారత్‌ దూరంగా ఉన్నాయి. చైనాను పక్కన పెట్టాలన్న అమెరికా ఆదేశాలు లేదా విధానాలకు అనుగుణ్యంగా నడవటానికి తాము సిద్దంగా లేమనే సందేశం ఈ ఒప్పందం పంపినట్లయింది. ఒక వైపు ప్రపంచీకరణ తమకు నష్టదాయకంగా మారిందని బహిరంగంగా చెప్పకపోయినా అమెరికాతో సహా అనేక పెట్టుబడిదారీ రాజ్యాలు రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుకుంటూ పోతున్నాయి. ప్రపంచవాణిజ్య సంస్ధతో నిమిత్తం లేకుండా ద్విపక్ష ఒప్పందాలు చేసుకుంటున్నాయి.ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలేని ఈ అతిపెద్ద ఒప్పందం కుదరకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ జరిగాయి.పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను చక్రబంధంలో బిగించాలని చూసిన ట్రంప్‌ యంత్రాంగానికి ఇది పెద్ద వైఫల్యం. అమెరికాకు అగ్రతాంబూలం అన్న వైఖరిని అనుసరిస్తున్న వైఖరితో ఆసియా దేశాల్లో తలెత్తిన అనుమానాల కారణంగా కూడా ఆర్‌సిఇపి ఉనికిలోకి రావటానికి దోహదం చేసింది.
కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ కుదేలవుతున్నాయి. ఇదే సమయంలో చైనా, తూర్పు ఆసియా దేశాలు అమెరికాాఐరోపాలతో పోల్చితే కరోనాను అదుపు చేశాయి. ఆర్దిక రంగంలో పురోగమనంలో ఉన్నాయి. మరోపది సంవత్సరాల వరకు వినిమయం ఎక్కువగా ఉండే మధ్యతరగతి ప్రజానీకం పెరుగుదల చైనా, ఆసియాలోనే ఉంటుందని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.ఆర్దికంగా పెద్ద రాజ్యాలలో ఒక్క చైనా వృద్ది మాత్రమే పురోగమనంలో ఉంది. అమెరికా, ఐరోపా దేశాలు కరోనా కట్టడితో పాటు ఆర్ధికంగా కూడా తీవ్ర సమస్యలతో ఉన్నాయి.

ఫసిపిక్‌ ప్రాంత దేశాల భాగస్వామ్యం(టిపిపి) పేరుతో అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిపాదనలో చైనాతో సహా అనేక ఆసియా దేశాలకు అవకాశం లేకుండా చూశారు. ఈ ఒప్పందంపై 2016లో సంతకాలు చేసిన అమెరికా మరుసటి ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి రాగానే ఉపసంహరించుకుంది. దాంతో అది అమల్లోకి రాలేదు. దీనికి ప్రతిగా చైనా, మరికొన్ని దేశాలు ముందుకు తెచ్చిందే ఆర్‌సిఇపి. దీనిలోపి టిపిపిలో ఉన్న ఆసియా దేశాలు భాగస్వాములయ్యాయి. అమెరికాను కూడా తమతో చేరాలని కోరాయి.టిపిపి వెనక్కు పోయిన తరువాత అమెరికా తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇండో-పసిఫిక్‌ వ్యూహం పేరుతో చైనాకు వ్యతిరేకంగా సరికొత్త సమీకరణకు పూనుకుంది. ఆర్‌సిఇపి నుంచి మన దేశం వైదొలగటానికి ఒక కారణం మన పారిశ్రామిక, వ్యవసాయ రంగాల నుంచి వెల్లడైన తీవ్ర వ్యతిరేకత అన్నది స్పష్టం. ఆ నష్టాల గురించి ప్రారంభం నుంచీ చర్చలలో ఉన్న మన ప్రతినిధులకు తెలియనివేమీ కాదు. అయినా ఆరు సంవత్సరాల పాటు ముందుకు పోయి 2019లో వెనక్కు తగ్గటానికి పైకి వెల్లడించని ఒక ప్రధాన కారణం ఈ కాలంలో అమెరికాతో పెనవేసుకున్న బంధం అన్నది స్పష్టమే. దానికి చక్కటి ఉదాహరణ ఇరాన్‌తో మనకు ఎలాంటి విబేధాలు లేవు. అయినా అమెరికా వత్తిడి మేరకు అక్కడి నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము.


ఆర్‌సిఇపిలోని 15దేశాలలో ప్రపంచంలోని 47.7శాతం మంది జనాభా, మూడోవంతు జిడిపి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 29.1, పెట్టుబడులలో 32.5శాతం వాటాను ఈ దేశాలు కలిగి ఉన్నాయి. ఇక దేశాల వారీగా చూస్తే కలిగే ప్రయోజనాలు కొన్ని ఇలా ఉన్నాయి. జిడిపి పెరుగుదల పసిఫిక్‌ ప్రాంతంలో 2.1, ప్రపంచంలో 1.4, చైనాకు 0.55, దక్షిణ కొరియాకు 0.41నుంచి 0.62, జపాన్‌కు 0.1శాతం చొప్పున పెరుగుదల ఉంటుందని అంచనా. చైనా వ్యవసాయ ఉత్పత్తులపై జపాన్‌ 56శాతం, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 49, ఇతర దేశాల ఉత్పత్తులపై 61శాతం పన్నులు తగ్గుతాయి. కొన్ని వస్తువుల విషయంలో వెంటనే పన్నులు తగ్గినా, మొత్తంగా ఒప్పందంలో అంగీకరించిన మేరకు తగ్గుదలకు పది సంవత్సరాలు పడుతుంది. ప్రాంతీయ సరఫరా వ్యవస్ధ స్దిరపడుతుంది. ఆయా దేశాలకు కలిగే ఆర్ధిక ప్రయోజనాలు ప్రపంచ రాజకీయాల్లో వాటి వైఖరుల మీద కూడా ప్రభావం చూపుతాయి. ఈ ఒప్పందంతో పాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియాల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.ఈ దిశగా మూడు దేశాలు పన్నులను తగ్గించేందుకు పూనుకోవచ్చు. చైనాాఅమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరు కారణంగా తలెత్తిన నష్టాలలో ఈ ఒప్పందం కారణంగా చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలకు 150 నుంచి 200 బిలియన్‌ డాలర్ల మేరకు తగ్గవచ్చని అంచనా. ఇది అమెరికా మీద వత్తిడి పెంచుతుంది.


ఒప్పందం కుదిరినంత మాత్రాన అంతా అయిపోయినట్లు భావించరాదు. దాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.ఈ ఒప్పందం బహుపక్ష వాదానికి చారిత్రక విజయం, ప్రాంతీయ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలకు పెద్ద సహాయకారి అవుతుందని భావిస్తున్నారు.టిపిపి నుంచి అమెరికా తప్పుకున్న తరువాత దీనిని పసిఫిక్‌ ప్రాంత సమగ్ర మరియు పురోగామి భాగస్వామ్య ఒప్పందంగా(సిపిటిపిపి) సవరించారు.టిపిపి ఒప్పందంలో వాణిజ్యానికి పెద్ద పీట వేస్తే దీనిలో పెట్టుబడుల వంటి వాటిని కూడా చేర్చారు.అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ఆర్‌సిఇపి ఒప్పందాన్ని అతిగా చూపి చైనా ముప్పు పేరుతో టిపిపిని మరోసారి ముందుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఇది అంత తేలిక, వెంటనే జరిగేది కాదు. సిపిటిపిపిలో చేరి దాన్ని ఆర్‌సిఇపికి వ్యతిరేకంగా తయారు చేసేందుకు పూనుకోవచ్చు.

మన దేశం విషయానికి నరేంద్రమోడీ యంత్రాంగం ఆలోచనా ధోరణులు ఇలా ఉన్నాయని చెప్పవచ్చు. ట్రంప్‌ రెండో సారి కచ్చితంగా అధికారానికి వస్తాడు(ఈ కారణంగానే ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వెళ్లి హౌడీమోడీ సభలో అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని ఎన్నికల ప్రచారం చేశారు). చైనాతో వాణిజ్య యుద్దాన్ని మరింత తీవ్రతరం చేస్తాడు. అది మేకిన్‌ ఇండియా కార్యక్రమం విజయవంతం కావటానికి దోహదం చేసే పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తుంది. చైనా నుంచి ఇతర దేశాల సంస్దలు మన దేశానికి తరలివస్తాయి. తద్వారా త్వరలో ఎగుమతుల్లో చైనాను అధిగమించవచ్చు. ఇలాంటి భ్రమలకు గురైన కారణంగానే అమెరికా కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని, ముఖ్యమంత్రులందరూ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు సిద్దంగా ఉండాలని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.
అమెరికా ఇచ్చిన ప్రోత్సాహంతో చైనా మీద ఆధారపడిన సరఫరా వ్యవస్దకు ప్రత్యామ్నాయంగా జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి నూతన వ్యవస్దను ఏర్పాటు చేయాలని మన దేశం ప్రతిపాదించి చర్చలు జరుపుతోంది. అవి ఒక కొలిక్కి రాకముందే ఆ చైనాతోనే వాటితో పాటు మరికొన్ని దేశాలు ఆర్‌సిపి ఒప్పందం చేసుకొని అమలుకు ముందుకు పోతున్నాయి. జపాన్‌ వంటి దేశాలు మనల్ని, రెండవ పెద్ద ఆర్దిక వ్యవస్ద ఉన్న చైనాను కూడా ఉపయోగించుకోవాలని చూస్తాయి తప్ప కేవలం మన మీదనే ఆధారపడే అవకాశాల్లేవని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.


ఏ నాయకత్వమైనా తమవైన స్వంత పద్దతులలో దేశాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకోవచ్చు. అవి విజయవంతమౌతాయా లేదా అన్నది వేరే అంశం. కానీ మరొక దేశం మీద ఆధారపడి అంచనాలు రూపొందించుకోవటం మబ్బులను చూసి ముంతలో నీరు ఒలకపోసుకోవటం, గాలిమేడలు కట్టటం తప్ప మరొకటి కాదు. అనూహ్యంగా కరోనా వైరస్‌ సమస్య వచ్చింది. ట్రంప్‌ ఓడిపోయాడు. బైడెన్‌ చైనాతో వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తాడో, రాజీపడతాడో తెలియదు. ట్రంప్‌ మాదిరి దూకుడు మాత్రం ఉండదు అంటున్నారు. అవి తేలేంతవరకు మేకిన్‌ ఇండియాను మన మోడీగారు ఏమి చేస్తారు ? వాయిదా వేస్తారా ? అనేక ఆసియా దేశాలు గతంలోనూ, ఇప్పుడు ఎగుమతి ఆధారిత విధానాలతోనే వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు ఆర్‌సిఇపి ద్వారా మన పొరుగునే ఒక పెద్ద స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఏర్పడింది. దాన్ని విస్మరించి రక్షణాత్మక చర్యలు తీసుకొంటున్న మన దేశం వైపు పెట్టుబడులు వస్తాయా ? వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా ? అసలు అమెరికా కూడా వాటిని అంగీకరిస్తుందా ? మన పారిశ్రామిక, వ్యవసాయ రంగ రక్షణ చర్యలు తీసుకోకపోతే పాలక పార్టీ పారిశ్రామికవేత్తలు, రైతాంగానికి దూరం అవుతుంది. వీటిని ఫణంగా పెట్టి ప్రపంచ కార్పొరేట్లు, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ద, ప్రపంచ వాణిజ్య సంస్ధలు వత్తిడి తెస్తున్న ప్రపంచీకరణ గొలుసుకు మన దేశాన్ని కట్టకపోతే వాటికి కోపం వస్తాయి ? నరేంద్రమోడీ ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత నావను నరేంద్ర మోడీ ఎటు నడిపిస్తున్నారు ? ఏమి కానుంది ?

02 Monday Nov 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BECA, BECA agreement, Narendra Modi, Quadrilateral Security Dialogue, R&D China and India


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ అత్యధికంగా అమెరికాను ఆరుసార్లు సందర్శిస్తే ఫ్రాన్స్‌,రష్యా, చైనా ఐదుసార్లు వెళ్లారు. చైనా అధినేత గ్జీ జింపింగ్‌ను పద్దెనిమిది సార్లు కలిసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు అదే చైనా తన ప్రధమ శత్రువు అన్నట్లుగా ఇంటా బయటా కనిపించేందుకు తాపత్రయ పడుతున్నారు. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తా వ్యాఖ్యలను చూస్తే దేశాన్ని మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. రాజకీయంగా భవిష్యత్‌ ఏమిటన్నది మోడీ, బిజెపికి సంబంధించిన అంశాలు. కానీ వాటితో యావత్‌ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టటమే ఆందోళన కలిగించే అంశం. కొందరికి మోడీ, బిజెపి చర్యల్లో ఆకాశమంత దేశభక్తి, వాటిని విమర్శించే వారిలో పాతాళమంత దేశద్రోహం కనిపించవచ్చు. సామాజిక మాధ్యమంలో కాషాయ తాలిబాన్లు, వారి ప్రచారానికి ప్రభావితులైన వారిలో యుద్దోన్మాదం కనిపిస్తోంది. చలి కాలం వచ్చింది గానీ లేకపోతేనా…. అన్నట్లు కబుర్లు చెబుతారు. చైనా, పాకిస్ధాన్‌ మీద ఒకేసారి పోరాడి విజయం సాధించగల సత్తాను నరేంద్రమోడీ దేశానికి సమకూర్చారన్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపధ్యంలో భావోద్వేగాలకు గురికాకుండా కొన్ని అంశాలను పరిశీలించుదాం.


సామాజిక మాధ్యమాల్లో కొంత మంది కౌటిల్యుడు లేదా చాణక్యుడు చెప్పాడంటూ కొన్ని అంశాలను చెబుతుంటారు. సన్‌ జు చైనా కౌటిల్యుడిగా పరిగణిస్తారు. ఎవరితో, ఎలా , ఎప్పుడు యుద్దం చేయాలి అన్న ప్రశ్నకు – ఇరు పక్షాలూ సమంగా ఉంటే మనం యుద్దానికి సై అనవచ్చు. మన సంఖ్య తక్కువగా ఉంటే శత్రువుకు దూరంగా ఉండాలి, ఏ విధంగా చూసినా తక్కువే అయితే మనం అతన్నుంచి దూరంగా పోవాలి. శత్రువు గురించి తెలిస్తే నీ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి, ఒక వంద యుద్దాల ఫలితాల గురించి నువ్వు భయపడాల్సిన పనిలేదు. నీ గురించి నీకు తెలిసినా శత్రువు గురించి తెలియకపోతే నువ్వు సాధించిన ప్రతి విజయం వెనుక ఒక పరాజయం వస్తుంది. నీ గురించి నీకు , శత్రువు గురించి తెలియకపోయినా ప్రతి పోరులోనూ ఓటమే. పోరు సలపకుండానే శత్రువును అదుపులోకి తీసుకోవటం ఉన్నతమైన యుద్ద కళ.నువ్వు అన్ని యుద్దాలలోనూ పోరాడటం, గెలవటం కాదు, ఎలాంటి పోరు లేకుండానే శత్రువు ప్రతిఘటనను దెబ్బతీయటం ఉన్నత మేథాశక్తికి నిదర్శనం.- అన్నది సన్‌ జు నీతి సారాంశం.

కౌటిల్యుడు చెప్పిందేమంటే -శత్రువు బలవంతుడు అయితే అతని సలహాలను అనుసరించవచ్చు, అతను బలహీనుడు అయితే దెబ్బతీయాలి.ఒక వేళ సమానుడు అయితే బలంతో లేదా స్నేహంతో అతన్ని అదుపులో ఉంచాలి. దాడి చేసే వారు తన, శత్రువు బలం,బలహీనతలు, లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి, ముందుకు సాగబోయే ముందు నిర్దారించుకోవాలి. తరువాత పూర్తి స్ధాయిలో ముందుకు పోవాలి, లేనట్లయితే మౌనంగా ఉండాలి. ద్వేషం తర్కబద్దమైన ఆలోచననను అంతం చేస్తుంది,కనుక శత్రువు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అతన్ని ప్రేమించేందుకు ప్రయత్నించు. సంధించిన బాణం ఎదుటి వ్యక్తిని సంహరించవచ్చు, లేకపోవచ్చు. తెలివిగల వాడి తంత్రం గర్భంలో ఉన్నవారిని కూడా అంతం చేస్తుంది. నేనయితే సాయుధ పోరును సూచించను, లక్ష్య సాధనకు కుట్ర, తంత్రం, మోసం వంటి సైనికేతర చర్యలన్నింటినీ ప్రయోగించవచ్చు. చైనా ఏం చేస్తోందన్నది ముఖ్యం కాదు, మనం కౌటిల్యుడు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామా ?


చైనా పెట్టుబడులు, అమెరికా మిలిటరీ ఆయుధ సంపత్తి, ప్రాంతీయ శక్తి – మూడింటిని కలిగి ఉండటం మోడీకి సాధ్యమేనా అనే శీర్షికతో యూరేసియా టైమ్స్‌ పత్రిక ఒక విశ్లేషణను ప్రచురించింది. దాని సారాంశం ఇలా ఉంది. సరిహద్దులలో చైనాతో ఘర్షణలను ప్రపంచమంతా ఆసక్తితో చూస్తోంది. భారత్‌ గనుక వెనుకా ముందాడుతుంటే చైనా విస్తరణ చర్యల అజెండాను నిలిపివేసేందుకు జరిపే ప్రయత్నాలకు హాని మరియు నష్టం జరుగుతుందని అర్ధం చేసుకోవాలని అమెరికా నేతలు భారత్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాతో భారత్‌ వాణిజ్యం కొనసాగుతూనే ఉంది. ఎగుమతులు- దిగుమతులపై లడఖ్‌ వివాదం పరిమితంగా లేదా అసలేమీ ఉన్నట్లు కనిపించటం లేదు. ఆ ఉదంతం తరువాత చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో రసాయనాలు, ఎలక్ట్రికల్‌ మరియు వైద్య పరికరాల దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. మోడీ సర్కార్‌ అనేక చైనా యాప్‌లను నిషేధించినప్పటికీ అవి కేవలం పరువు కాపాడుకొనే చర్యలు మాత్రమే. అనేక రంగాలలో బిలియన్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. వేలాది అంకుర సంస్ధలు చైనా పెట్టుబడులతో విజయాలు సాధిస్తున్నాయి. సరిహద్దు వివాదం కొనసాగుతున్నప్పటికీ ఆయుధాలు తప్ప దాదాపు అన్నింటికీ చైనా మీద ఆధారపడుతున్నది.
నరేంద్రమోడీ చైనా విధానాన్ని చూస్తే ఒక మార్గంలో పయనిస్తున్నట్లు కనిపించటం లేదు, తరువాతేమి చేస్తారో అంచనాకు అందటం లేదు. ఇది నరేంద్రమోడీకి ఒక విచిత్రమైన పరిస్ధితిని తీసుకు వచ్చింది. చైనాతో సంబంధాలను పూర్తిగా బహిష్కరించలేరు లేదా యుద్ధాన్ని ఎంచుకోలేరు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించేందుకు చైనా కరాఖండిగా తిరస్కరించటం భారత ప్రభుత్వానికి విషయాలను కష్టతరంగా మార్చింది. ఈ వివాదాన్ని తొలుత భారతే ప్రారంభించిందని, ఆర్టికల్‌ 370 , కాశ్మీర్‌ రాష్ట్ర రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటమే రెండు దేశాల మధ్య వివాదాంశంగా కనిపిస్తున్నది. చైనాతో ఘర్షణ పడటం లేదా సంబంధాలను మెరుగుపరచుకోవటమా అన్నది మోడీ సర్కార్‌ తేల్చుకోవాలి. ఇటు చూస్తే గొయ్యి అటు చూస్తే నుయ్యి అన్నట్లుగా ప్రభుత్వం మధ్యలో ఇరుక్కుపోయింది. చైనా డిమాండ్లకు అంగీకరించితే అంతర్గతంగా పరువు పోతుంది. ఒప్పుకోకపోతే వివాదం మరింత దిగజారే ముప్పు ఉంది. అమెరికా కూటమితో మరింతగా దగ్గరయ్యే క్రీడను నరేంద్రమోడీ ఆడుతున్నందున భారత్‌కు విషయాలు మరింత సంక్లిష్టం కావటం తప్ప మరొకటి జరగదు. ఈ విపత్కర పరిస్ధితి నుంచి మోడీ భారత్‌ను ముందుకు నడిపించగలరా ?


అదే యూరేసియా టైమ్స్‌ మరో విశ్లేషణలో మూడు సంవత్సరాల క్రితం డోక్లాంలో అత్యంత శక్తివంతమైన చైనాకు భారత్‌ చిల్లు పెట్టింది లేదా గాలి తీసింది అన్నది ఒక అవాస్తవం అని అమెరికా గూఢచార నివేదిక నిర్ధారించింది అని పేర్కొన్నారు. భూటాన్‌లోని డోక్లాం ప్రాంతంలో 2017లో రెండు దేశాల సేనలు 75 రోజుల పాటు ముఖాముఖీ తలపడిన విషయం తెలిసిందే. దుందుడుగా వ్యవహరించిన చైనా మిలిటరీకి షాక్‌ తగిలే విధంగా భారత్‌ వ్యవహరించిందని విశ్లేషకులు అప్పుడు పేర్కొన్నారు. అయితే డోక్లాం ఉదంతంలో గట్టి పాఠం నేర్చుకున్న చైనా ఆ ప్రాంతంతో పాటు వాస్తవాధీన రేఖ సమీపంలో అదనపు మిలిటరీ నిర్మాణాలను చేపట్టిందని భూ రాజకీయ గూఢచార వ్యవహారాల మీద అధ్యయనం చేసే అమెరికా సంస్ధ స్ట్రాట్‌ఫర్‌ వెబ్‌ సైట్‌ ఒక విశ్లేషణలో పేర్కొన్నది. గత మూడు సంవత్సరాలలో భారత సరిహద్దులో చైనా తన వైమానిక స్ధావరాలు, వైమానిక రక్షణ కేంద్రాలు, హెలిపోర్టులను రెట్టింపు చేసింది. కొత్తగా పదమూడు మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా మూడు వైమానిక స్ధావరాలు, ఐదుశాశ్వత వైమానిక రక్షణ కేంద్రాలు, ఐదు హెలిపోర్టుల నిర్మాణం ప్రారంభించింది. లడఖ్‌ ఘర్షణ ప్రారంభమైన తరువాతే నాలుగు హెలిపోర్టుల నిర్మాణం ప్రారంభమైనట్లు అంతరిక్ష చిత్రాలు, ఇతర సమాచారం తెలుపుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో చైనా శాశ్వత మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేయటం ద్వారా తన స్దానాన్ని పటిష్ట పరచుకుంది. ఇదే వ్యూహాన్ని భారత సరిహద్దులో కూడా అనుసరిస్తున్నదని విశ్లేషకుడు పేర్కొన్నారు.


చైనా, ఇతర ఇరుగు పొరుగుదేశాల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకొనేందుకు, ఇతర అవసరాల కోసం అమెరికాతో మన దేశం అనేక ఒప్పందాలు చేసుకున్నది. అదేమీ ఉచితం కాదు. ఆ రంగంలో మనం ఉంటే అమెరికాతో ఒప్పందంతోనే పని లేదు, కనుక మూల్య రూపం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సరిగ్గా ఇదే సమయంలో చైనా అలాంటి సమాచారాన్ని సేకరించేందుకు మూడు స్వంత మిలిటరీ యావోగాన్‌ ఉపగ్రహాలను ప్రారంభించింది. యావోగాన్‌ పేరుతో ఉపగ్రహాల ప్రయోగం 2006 నుంచి జరుగుతోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా, దాని మిత్ర దేశాల కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నౌకల నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణుల వ్యవస్ధలను దెబ్బతీసేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని చైనా సమకూర్చుకుంటోంది. సముద్రాలలో ఉన్న యుద్ద నౌకలు విడుదల చేసే రేడియో, ఎలక్ట్రానిక్‌ సంకేతాల(సిగల్స్‌)ను పసిగట్టటంతో పాటు అవి వెలువడుతున్న ప్రాంతాలను స్కాన్‌ చేసి యుద్ద నావల సంచారాన్ని పసిగడతాయి. ఈ ఉపగ్రహాల ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించి శత్రు యుద్ద నావల మీద క్షిపణులతో ఏ లక్ష్యంపై అయినా కేవలం 40 నిమిషాల్లో దాడి చేయవచ్చని చైనా నిపుణులు చెబుతున్నారు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ఒక వేళ అమెరికా అందచేసిన ఆయుధాలతో కవ్వింపులు, దాడులకు తెగబడితే దానికి మద్దతుగా దక్షిణ చైనా సముద్రంలో సంచరించే అమెరికా యుద్ద నౌకలను ముందుగా అడ్డుకోవాలన్నది చైనా ఎత్తుగడ. గత ఏడాది అక్టోబరు నాటికి అంతరిక్షంలో యావోగాన్‌-30 రకం ఉపగ్రహాలు పదిహేను ఉన్నాయి. తాజాగా ప్రయోగించినవి దాదాపు ప్రపంచమంతటినీ చుట్టి సమాచారాన్ని సేకరిస్తాయి. ఇలాంటి సమాచారాన్ని తాము భారత్‌కు అందచేస్తామని అమెరికా చెబుతోంది. ఇటీవల దానితో సంతకాలు చేసిన బెకా ఒప్పంద సారం అదే.


గాల్వాన్‌ లోయ ఉదంతం తరువాత తూర్పు సరిహద్దులో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌కు 160 కిలోమీటర్ల దూరంలో టిబెట్‌లోని చామడో బంగడా విమానాశ్రయాన్ని చైనా విస్తరిస్తున్నట్లు ఉపగ్రహచిత్రాలు చూపుతున్నాయి. ఈ చిత్రాలను పొరుగు సేవల పద్దతిలో సొమ్ము చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఇటీవలి కాలంలో మన మీడియాలో వస్తున్నవి అవే. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉన్న బంగడా విమానాశ్రయంలో రెండు రన్‌వేలు ఉన్నాయి. ఒకదానిలో రాకపోకలు నడుస్తున్నాయి, విదేశీ పౌరులకు వాటిలో ప్రవేశం లేదు. రన్‌వేకు ఒక వైపు మిలిటరీ తరహా నిర్మాణాలు ఉన్నట్లు , గాల్వాన్‌ ఉదంతం తరువాతే ఇవి ఏర్పాటయినట్లు మీడియా విశ్లేషకులు రాస్తున్నారు. అరుణాచల్‌ సరిహద్దులో కనీసం నాలుగు చోట్ల ఆగస్టు-సెప్టెంబరు నుంచి చైనా మిలిటరీ మోహరింపు కనిపిస్తున్నదని చైనా నిపుణుడు కలపిట్‌ ఏ మనికికార్‌ చెప్పారు. సరిహద్దుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో చైనా మిలిటరీ ఉందని, భారత్‌ మీద వత్తిడిని పెంచే ఎత్తుగడ కావచ్చని అన్నారు.
అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌ దక్షిణ ప్రాంతమని చైనా చెబుతున్నది. 1962 యుద్దంలో ఆ ఏడాది అక్టోబరు 20న చైనా మిలిటరీ అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది, వాటిలో తవాంగ్‌ పట్టణం ఉంది, అసోంలోని తేజ్‌పూర్‌ పట్టణం వరకు చైనా సేనలు వచ్చాయి. అయితే నవంబరు 20 తరువాత చైనా తనంతట తానే వెనక్కు తగ్గి వాస్తవాధీన రేఖ వెనక్కు వెళ్లిపోయింది. చైనా ఇప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని గుర్తించటం లేదు. ఈ కారణంగానే దలైలామా తవాంగ్‌ పట్టణాన్ని సందర్శించేందుకు నిర్ణయించుకున్నపుడు అభ్యంతరం తెలిపింది.

ప్రతి దేశం చిన్నదా పెద్దదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పుడున్న స్ధితిలో రక్షణ ఏర్పాట్లు చేసుకోవటం అవసరం. దానికి మన దేశం మినహాయింపు కాదు. దానికి హడావుడి, రాజకీయ ప్రచారం చేసి ఇతర దేశాలను రెచ్చగొట్టాల్సిన, మనలను అనుమానించే స్ధితిని కల్పించాలని కౌటిల్యుడు చెప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దంలో అవసరం లేకపోయినా జపాన్‌పై అణుబాంబులు వేశారు. అమెరికన్లు ప్రపంచాన్ని భయపెట్టి లొంగదీసుకొనేందుకు అమలు జరిపిన యుద్ద తంత్రం తప్ప మరొకటి కాదు. తరువాత మనతో సహా అనేక దేశాలు అణ్వాయుధాలను తయారు చేశాయి. అణువిద్యుత్‌ కేంద్రాలు కలిగిన ప్రతి దేశం అణుబాంబుతయారీకి దగ్గరలో ఉన్నట్లే లెక్క.


చాణుక్యుడు, సన్‌ జు చెప్పినట్లు ఎన్ని దేశాలు వ్యవహరిస్తున్నాయి ? నీ శత్రువు శత్రువు నీకు మిత్రుడు అన్న నీతి తెలిసిందే. ఆ మేరకే చైనాకు వ్యతిరేకంగా అమెరికా, ఇతర దేశాలతో మనం చేతులు కలుపుతున్నట్లు సమర్ధించుకోవచ్చు. దానిద్వారా వచ్చే లాభాలతో పాటు నష్టాలు, సమస్యలను కూడా బేరీజు వేసుకోవాలి. చాణుక్యుడు చెప్పింది అదే. కాశ్మీర్‌ను ఆక్రమించిన కారణంగా పాకిస్ధాన్‌ మనకు శత్రువుగా మారింది. అలీన విధానం అనుసరిస్తూ అంతర్జాతీయ పరిణామాల్లో అనేక విషయాల్లో మనం అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకున్నాం. దానికి ప్రతిగా పాకిస్ధాన్‌న్ను ప్రోత్సహించి మన దేశం మీద అమెరికా ఎన్నికుట్రలు చేసిందీ, కాశ్మీర్‌, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఎంత నష్టపరచిందీ చూశాము. ఎప్పుడైతే మనం అమెరికాకు దగ్గర అయ్యామో, విస్తారమైన మన మార్కెట్‌ను ఎప్పుడు తెరిచామో, దాని ఆయుధాలను -ఇటీవలి కాలంలో చమురును సైతం – కొనటం ఎప్పుడైతే ప్రారంభించామో దానికి పాక్‌తో పని లేదు. కానీ జరిగిందేమిటి ? తమను ఉపయోగించుకొని వదలివేసిందన్న దుగ్ద పాక్‌లో తలెత్తి చైనాకు దగ్గర అయింది.

శత్రువులను పెంచుకున్న వారు తెలివైన రాజనీతిజ్ఞులు కాదు. అమెరికా అండ చూసుకొని మన యుద్ద ప్రేలాపనలు ఎంతవరకు పోయాయంటే ఒకేసారి రెండున్నర యుద్దాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సైనికాధికారి బిపిన్‌ రావత్‌ లడఖ్‌ ఉదంతాలకు ఎంతో ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా వంటి అగ్రరాజ్యమే బస్తీమే నిరంతరం ఎక్కడో ఒక చోట యుద్దం చేసింది తప్ప ఒకేసారి అనేక యుద్దాలు చేయలేదు.రెండున్నర యుద్దాలు అంటే చైనా, పాకిస్ధాన్‌, ఉగ్రవాదుల మీద అని అర్ధం.ఉగ్రవాదాన్ని అణచేందుకే కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చామని, మిలిటరీకి అధికారాలు ఇచ్చామని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఏడాది కాలంలో ఉగ్రదాడుల్లో 54 మంది పౌరులు మరణించగా కేంద్రపాలనలోకి వచ్చిన ఏడాది కాలంలో 45 మంది మరణించారు. దీన్ని బట్టి ఏం జరుగుతోందో ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చు.


రామ-రావణ యుద్దంలో లంకకు వారధి నిర్మాణంలో ఉడుత సాయం కథ తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్నదేమిటి ? మన ఇరుగుపొరుగున ఉన్న దేశాలో నేపాల్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక ఒక్కటీ మనకు స్నేహంగా లేదు. అమెరికా అండ చూసుకొని ఈ దేశాలను విస్మరించాము. తద్వారా వాటిని చైనాకు దగ్గర చేయటం రాజనీతా, తెలివిగల వ్యవహారమా ? పశ్చిమాసియాలో సైనికంగా బలమైన దేశాల్లో ఇరాన్‌ ఒకటి. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా అది చైనా వైపు మొగ్గింది. దాంతో అమెరికా ఆంక్షలను మరింత పెంచి మనలను కూడా బెదిరించగానే దాన్నుంచి చమురు కొనటం ఆపేశాము. దాంతో వారు చైనాకు మరింత దగ్గరయ్యారు, అసలేమి చేస్తున్నామో, పర్యవసానాలేమిటో అర్ధం అవుతోందా ? బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఇరాన్‌, పాకిస్ధాన్‌, శ్రీలంక, మయన్మార్‌, బంగ్లాదేశ్‌ ఏవీ మనకు మిత్రదేశాలుగా లేవు.

మనం ఫ్రాన్స్‌ నుంచి రాఫెల్‌ యుద్ద విమానాలు తెచ్చుకున్నాం. అవి అధిక ధరలకా, దానిలో ముడుపులున్నాయా లేదా అన్నది- ఉంటే ఏదో ఒక రోజు బయటపడకపోదు- కాసేపు పక్కన పెడదాం. మరోవైపు వాటితో సమంగా లేదా కాస్త ఆధునికమైన విమానాలను స్వంతంగా తయారు చేసుకొనే స్ధితిలో చైనా ఉంది. మనం ఆ రంగంలో ఎంతో వెనుకబడి ఉన్నాం కనుకనే మనకు విమానాలు అమ్మే దేశాలన్నీ చైనాకు వ్యతిరేకంగా మనలను ఎగదోస్తున్నాయి. భారత్‌ గనుక తాను తయారు చేస్తున్న 114 ఎఫ్‌ 21 రకం విమానాలను కొనేందుకు అంగీకరిస్తే ఇతర దేశాలకు వాటిని విక్రయించబోనని అమెరికా లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ చెప్పింది. ఎంతకాలం ఇలా విదేశాల మీద ఆధారపడి ఆయుధాలు కొనగలం? ఇక్కడ సమస్య మనం విమానాలను ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అన్నది. పరిశోధన-అభివృద్దికి నిధులు కేటాయిస్తే ఏదీ అసాధ్యం కాదు. మనకేమీ నిపుణులు తక్కువ లేరు. యాభై ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలన్నింటినీ ఐదేండ్లలో తాను సరి చేశానని నరేంద్రమోడీ దళం చెప్పుకుంటుంది. మరి పరిశోధనా-అభివృద్ధి రంగంలో చేసిందేమిటి ?


యునెస్కో సమాచారం ప్రకారం 1996-2018 మధ్య మన దేశంలో పరిశోధన-అభివృద్ధికి చేసిన ఖర్చు జిడిపిలో 0.639 – 0.65 శాతం మధ్య ఉంది. మధ్యలో 2008లో 0.859 శాతానికి పెరిగి క్రమంగా దిగజారింది. దీనికి కారణం నరేంద్రమోడీ తప్ప నెహ్రూ కాదు కదా ! ఇదే కాలంలో చైనా కేటాయింపు 0.563 శాతం నుంచి 2.186శాతానికి పెరిగింది. 2017-18 ఆర్ధిక సర్వేలో పరిశోధన రంగానికి నిధులు రెట్టింపు చేయాలని పేర్కొన్నారు. ఆ జాడలు ఎక్కడా లేవు. ప్రపంచంలో పరిశోధన-అభివృద్ధికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్న దేశాలలో అమెరికా తరువాత చైనా ఉంది. 2020 నాటికి తన జిడిపిలో రెండున్నర శాతం ఖర్చు చేయాలన్న లక్ష్యానికి 2.23శాతంతో చైనా దగ్గరలో ఉంది. అమెరికా 2018లో 2.83శాతం ఖర్చుచేసింది. ఓయిసిడి దేశాల సగటు ఖర్చు 2.38, ఇజ్రాయెల్‌ 4.9, దక్షిణ కొరియా 4.5శాతం ఖర్చు చేశాయి.
చైనా గత రెండు ద శాబ్దాలుగా ఖర్చు చేసిన ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నది. అన్ని రంగాలలో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో ధీటుగా ఉంది. గతంలో ఆయుధాలను దిగుమతి చేసుకొనేదిగా ఉన్న దేశం నేడు తొలిసారి ఎగుమతులను ప్రారంభించింది. సైంటిఫిక్‌ జర్నల్స్‌లో ఆయా దేశాలకు చెందిన వారు సమర్పించిన పత్రాల సమీక్షలో చైనా 19.9శాతంతో ప్రధమ స్ధానంలో ఉండగా అమెరికా 18.3శాతంతో ద్వితీయ స్ధానంలో ఉంది. 2016-18 సంవత్సరాల మధ్య చైనా సగటున ఏడాదికి 3,05,927, అమెరికా 2,81,487 శాస్త్ర పత్రాలను ప్రచురించగా 67,041 పత్రాలతో (4.4శాతం) జర్మనీ మూడవ స్ధానంలో ఉంది. నల్లమందు భాయీలని ప్రపంచంలో ఒకనాడు అవమానాలు పొందిన చైనీయులు ఇప్పుడు నవతరం భాయీలని రుజువు చేసుకుంటున్నారు.


పరిశోధన-అభివృద్ధి రంగంలో పెడుతున్న భారీ ఖర్చు కారణంగా 2018లో ప్రపంచ వ్యాపితంగా పేటెంట్లకు దరఖాస్తు చేసిన వారిలో చైనీయులు 49శాతం ఉన్నారు. గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పరిశోధన గురించి కబుర్లు చెప్పటం తప్ప తీసుకుంటున్న చర్యలన్నీ తిరోగమనంలోనే ఉన్నాయి. వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. మన సంస్కృత గ్రంధాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొత్తం నిక్షిప్తమై ఉందని చెబుతారు. వాటిని చదివే అమెరికా నాసా, ఇతర సంస్దలు పరిశోధనల్లో ముందున్నాయని, చివరికి కంప్యూటర్‌ లాంగ్వేజ్‌ను కూడా రాస్తున్నాయనే పోసుకోలు కబుర్లతో వాట్సాప్‌ను నింపివేస్తున్నారు. అదేపని మనం ఎందుకు చేయటం లేదు ?


చైనా విజయాల గురించి నమ్మని వారిని ఏమీ చేయలేం. సంస్కృత గ్రంధాల్లో అన్నీ ఉన్నాయని చెప్పే పండితులు వాటిని వెలికి తీసి దేశానికి ఎందుకు మేలు చేయరు, ఎంతో డబ్బు మిగులుతుంది, ప్రయోజనం కలుగుతుంది కదా ? గోమూత్రం తాగే వారిని తాగనిద్దాం-దేశానికి నష్టం లేదు. గోమూత్రంలో బంగారం దాగుందని, పేడకు ఆరోగ్యం అంటుకొని ఉందని చెప్పే వారిని వారి లోకంలోనే ఉండనిద్దాం. శాస్త్రీయ ఆలోచనలను అణగదొక్కవద్దు. మేలు చేయకపోయినా కీడు చేయకూడదు ! గతంలో జరిగిందాన్ని పునరావృతం కానివ్వొద్దు. దేశాన్ని, సమాజాన్ని మరింతగా వెనక్కు నెట్టే యుద్దం అసలే వద్దు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌ బెకా ఒప్పందం – అమెరికా కూటమికి గ్జీ జింపింగ్‌ హెచ్చరిక !

27 Tuesday Oct 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BECA, BECA agreement, Quad, Quadrilateral Security Dialogue, Xi Jinping warning to US and its allies


ఎం కోటేశ్వరరావు


ఉపగ్రహాల ద్వారా సేకరించే భౌగోళిక, ఇతర సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకొనేందుకు ఉద్దేశించిన -బెకా- ఒప్పందం మీద భారత్‌- అమెరికాలు సంతకాలు చేశాయి. రెండు దేశాల మిలిటరీ, ఇతర సంబంధాలలో దీన్నొక మలుపుగా పరిగణిస్తున్నారు. సులభ భాషలో చెప్పాలంటే ఇప్పటి వరకు అమెరికా మనకు అనధికారికంగా అందచేస్తున్న సమాచారాన్ని మరింత వివరంగా అధికారికంగా అంద చేయనుంది. లడఖ్‌ సరిహద్దుల్లో చైనా కదలికల గురించి ఇప్పటి వరకు మీడియాకు అందచేసిన సమాచారం, చిత్రాలు, భాష్యాలు అన్నీ కూడా అమెరికా సంస్ధలు అందచేసినవే అన్నది తెలిసిందే. ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా అమెరికా నుంచి పొందే సమాచారానికి మనం ఏ రూపంలో ప్రతిఫలం లేదా మూల్యం చెల్లించాల్సి ఉంటుందో వెల్లడికావాల్సి ఉంది. బెకా ఒప్పందం గురించి చాలా కాలంగా రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో అమెరికాతో మన మిలిటరీ బంధానికి మరో ముడి పడుతుంది.

మాతో పెట్టుకుంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ తీస్తాం జాగ్రత్త. ఇదీ చైనా అధినేత గ్జీ జింపింగ్‌ చేసిన తాజా హెచ్చరిక. పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్న నౌకా సంబంధ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల సమన్వయం, సజావుగా సాగే సరఫరా వ్యవస్ధలు, మానవతా పూర్వక మరియు ప్రళయాలు సంభవించినపుడు సాయం కోసం అనే పేరుతో అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా, భారత్‌ ఒక చతుష్టయ లేదా చతుర్భుజ (క్వాడ్‌) కూటమిగా మరింత ముందుకు పోయేందుకు నిర్ణయించుకున్న నేపధ్యంలో గ్జీ ఈ హెచ్చరిక చేశారు. ఒక దేశం పేరు పెట్టి అనకపోయినా నాలుగుదేశాలు, ప్రత్యేకించి అందరినీ కూడగడుతున్న, రెచ్చగొడుతున్న అమెరికా గురించి అన్నది స్పష్టం.


ఏదో ఒక సాకుతో చైనాను రెచ్చగొడుతున్న అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ద నౌకల విన్యాసాలు జరుపుతున్నది. ఇటీవలి కాలంలో చైనా మీద నెపం మోపేందుకు లడఖ్‌లో జరిగిన పరిణామాలను పదే పదే ఉదహరించటం తప్ప మరొకటి లేదు. మీరు చైనా మీదకు దూకండి మీ వెనుక మేము ఉన్నాం అంటూ మన దేశాన్ని పురికొల్పుతున్నది. నాలుగుదేశాల కూటమిని మిత్ర చతుష్టయంగా పిలుస్తున్నారు. అయితే ఇది దుష్ట చతుష్టయం అని చైనా పరిగణిస్తున్నది. బహుశా ఆప్రచార ప్రభావం లేదా అంతర్గతంగా జరుగుతున్న చర్చల సారం కావచ్చు ఉత్తర ప్రదేశ్‌ బిజెపి అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ పాకిస్ధాన్‌, చైనాలతో యుద్దానికి ప్రధాని నరేంద్రమోడీ తేదీని కూడా ఖరారు చేశారని చెప్పినట్లు సాక్షాత్తూ ఆర్నాబ్‌ గోస్వామి రిపబ్లికన్‌ టీవీ పేర్కొన్నది. అతగాడేమీ గల్లీ నేత కాదు, ఆ వార్తను ప్రసారం చేసిన టీవీ బిజెపి అనధికారవాణి తప్ప మరొకటి కాదు. సామాజిక మాధ్యమంలో కాషాయ దళాల యుద్ద ప్రేలాపనల గురించి చెప్పనవసరం లేదు.

కొరియా ఆక్రమణకు పూనుకున్న అమెరికన్లను ఎదిరించి చైనా సాధించిన విజయానికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా అక్టోబరు 23వ తేదీన బీజింగ్‌ గ్రేట్‌ హాల్‌ సభలో సుత్తి లేకుండా సూటిగానే పరోక్షంగా అమెరికా కూటమిని గ్జీ హెచ్చరించాడు. సరిగ్గా అదే సమయంలో తమ భూ భాగమైన తైవాన్‌ గగన తలం మీద అమెరికా గూఢచార విమానం సంచరించినట్లు రుజువైతే తమ మిలిటరీ జట్లను పంపుతామని చైనా హెచ్చరిక చేసింది. అబ్బే ఆ వార్తల్లో నిజం లేదని 24వ తేదీన అమెరికా పసిఫిక్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రజా సంబంధాల అధికారి లెప్టినెంట్‌ కల్నల్‌ టోనీ విక్‌మాన్‌ ప్రకటన చేశాడు.


ఏ చిన్న ఉదంతం జరిగినా పరిణామాలు ఏ విధంగా మారతాయో తెలియని స్ధితి ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్నదని చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు. ఒక వేళ ఆ ఉదంతం జరిగితే ఎంత తీవ్ర పరిణామాలు జరుగుతాయో అమెరికా, దానితో చేతులు కలిపిన తైవాన్‌ యంత్రాంగం గ్రహించిదనేందుకు చిహ్నం అమెరికా ప్రకటన. ప్రధాన భూభాగంలో తైవాన్‌ విలీనం శాంతియుతంగా జరగాలితప్ప సైనిక బలంతో కాదని, తొలి తూటా పేలుడు తమ వైపు నుంచి ఉండదన్నది ఏడు దశాబ్దాలుగా చైనా ప్రభుత్వ వైఖరి. అయితే అమెరికన్లు తైవాన్‌లో తిష్టవేసి రచ్చ చేస్తే అవసరమైతే సైనిక చర్య తప్పదని చైనా హెచ్చరిస్తున్నది. అమెరికా విమానం తైవాన్‌ గగన తలం మీదుగా ఎగిరిందా లేదా ఆ వార్త కల్పితమా నిజమా అన్నది నిర్దారణ కాలేదు. ఒక వేళ ఎగిరితే అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించటమే. అదే జరిగితే అమెరికా విమానాలను తరిమేందుకు చైనా మిలిటరీ జట్లు సిద్దంగా ఉంటాయి. తైవాన్‌ దీవి చైనా ప్రధాన భూ భాగానికి తూర్పున 161కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఉంది. కొద్ది వారాల క్రితం చైనా ఆ ప్రాంతంలో నౌకా విన్యాసాలు జరపటంతో పాటు తూర్పు తీరంలో తైవాన్‌ వైపు గురిపెట్టి అనేక ఆధునిక క్షిపణులను చైనా మిలిటరీ మోహరించింది.


కొరియా యుద్దంలో చైనా విజయానికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా గ్జీ చేసిన హెచ్చరిక ఒక్క అమెరికాకు మాత్రమే కాదు, తమకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న దేశాలన్నింటికీ అన్నది స్పష్టం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొరియాను జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆక్రమించారు. దాన్ని విముక్తం చేసేందుకు నాటి సోవియట్‌ సేనలు ఒక వైపు నుంచి మరో వైపు నుంచి అమెరికన్‌ సేనలు కదిలాయి.38వ అక్షాంశరేఖకు ఉత్తర వైపున ఉన్న కొరియా ప్రాంతం సోవియట్‌, దక్షిణ ప్రాంతం అమెరికా ఆధీనంలోకి వచ్చాయి. యుద్దం ముగిసిన తరువాత రెండు ప్రాంతాలను ఐక్యం చేయాలన్నది ఒప్పందం. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల పాలనలోకి, దక్షిణ కొరియా మిలిటరీ పాలనలోకి వెళ్లాయి. అయితే దక్షిణ కొరియాలోనే తిష్టవేసి చైనాకు, అదే విధంగా ఇండోచైనా ప్రాంతంలోని వియత్నాం తదితర దేశాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా తన సైన్యాన్ని అక్కడే ఉంచింది.1950లో ఉత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు ఐక్యరాజ్యసమితి శాంతిసేనల ముసుగులో ఉన్న అమెరికా మిలిటరీ ప్రయత్నించటంతో పక్కనే ఉన్న చైనా జోక్యం చేసుకొని తన వలంటీర్ల సైన్యాన్ని పంపింది.1953 జూలైలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దాని మీద నాటి దక్షిణ కొరియా పాలకులు సంతకాలు చేయలేదు. విలీన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా అమెరికా ఇప్పటికీ తన సైన్యాన్ని అక్కడే ఉంచి అడ్డుపడుతోంది.

1950 నాటికి చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అనేక చోట్ల ప్రతిఘటనను ఎదుర్కొంటూ కుదుట పడలేదు. అయితే సరిహద్దులోకి అమెరికా సేనల ప్రవేశం చేసిన తరువాత అక్కడికే పరిమితం గావు చాంగ్‌కై షేక్‌కు మద్దతుగా చైనాలో ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆ పరిస్ధితిని ఎదుర్కొనేందుకు సిద్దమైంది. ఇదే సమయంలో దక్షిణ కొరియా మిలిటరీ, అమెరికన్ల దురాక్రమణను ఎదుర్కొనేందుకు సాయపడవలసిందిగా ఉత్తర కొరియా ప్రభుత్వం 1950 అక్టోబరు 19న చైనా ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే లక్షలాది మంది స్వచ్చంద సైనికులు యాలూ నదిని దాటి కొరియాలో ప్రవేశించారు. 1951అక్టోబరు 25న చైనా సైనికులు దక్షిణ కొరియా మిలిటరీపై తొలి విజయం సాధించారు. ఆ యుద్దంలో రెండు లక్షల మంది చైనా సైనికులు మరణించారు. యుద్దం ముగిసిన తరువాత ప్రతి ఏటా అక్టోబరు 25ను విజయోత్సవంగా జరపాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం త్యాగం పేరుతో ఒక సినిమాను కూడా నిర్మించి విడుదల చేశారు.1950 అయినా 2020 అయినా చైనా విషయాల్లో ట్రంప్‌ లేదా భవిష్యత్‌లో మరొక నేత అయినా పెత్తందారీ పోకడలకు పోతే తగిన జవాబు ఇస్తామని గ్జీ స్పష్టం చేశారు. పశ్చిమ పసిఫిక్‌, ఆసియాలో ప్రస్తుత పరిస్ధితి 1950లో యుద్దానికి ముందున్నట్లుగా ఉందని చైనా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌ లేదా జో బిడెన్‌ ఎవరు అధికారానికి వచ్చినా చైనా వ్యతిరేకులకు విధాన నిర్ణయాన్ని అప్పగిస్తే అమెరికా తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
చైనా పౌరులు నేడు సంఘటితంగా ఉన్నారని, వారిని తక్కువగా చూడవద్దని గతంలో మావో చెప్పిన అంశాన్ని గ్జీ పునరుద్ఘాటించారు. బెదిరింపులు, అడ్డుకోవటం వంటి వత్తిళ్లు పని చేయవని స్పష్టం చేశారు. గతంలో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాను అడ్డుకునేందుకు ఆసియాలో క్వాడ్‌ పేరుతో అలాంటి కూటమి ఏర్పాటుకు పూనుకున్నారు. దానిలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ఉన్నాయి. ఆసియా ముఖ్యంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని దేశాలతో వాటిని విస్తరించాలనే యత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే చైనాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఈ నాలుగు దేశాల్లో అన్ని అంశాలపైనా ఏకీభావం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. చతుష్టయంలో అమెరికా, భారత్‌తో చైనా వాణిజ్యం మిగుల్లో ఉండగా జపాన్‌,ఆస్ట్రేలియాలతో తరుగులో ఉంది. అంటే చైనాతో లడాయి కొని తెచ్చుకోవటం అంటే ఇవి తమ వాణిజ్య అవకాశాలను ఫణంగా పెట్టాల్సి ఉంది. అందువలన అమెరికా వత్తిడికి తట్టుకోలేక చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ జపాన్‌, ఆస్ట్రేలియా దూకుడును ప్రదర్శించటం లేదన్నది ఒక అభిప్రాయం. చైనాకు ఎన్నిహెచ్చరికలు చేసినా మన ప్రధాని నరేంద్రమోడీ అధికారికంగా చేసిన ప్రకటనలో మన భూభాగంలోకి చైనా కొత్తగా ప్రవేశించలేదని అఖిలపక్ష సమావేశంలో చెప్పటం చైనాతో తెగేదాకా లాగేందుకు ఇంకా నిర్ణయించుకోలేదనేందుకు నిదర్శనంగా భావిస్తున్నారు.


అమెరికాతో జతకడితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని స్వతంత్రంగా ఎదగాలని చూస్తున్న మన దేశ కార్పొరేట్‌ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. గతంలో అమెరికా-సోవియట్‌ మధ్య సాగిన ప్రచ్చన్న యుద్దకాలంలో మన కార్పొరేట్‌ శక్తులు ఆ విబేధాన్ని వినియోగించుకొని లబ్దిపొందేందుకు, తామే స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించాయి. గతంతో పోల్చితే ఇప్పుడు మన కార్పొరేట్‌ శక్తులు మరింతగా బలపడ్డాయి. వివిధ కారణాలతో అమెరికా మునుపటి స్ధాయిలో లేదు. కొనుగోలు శక్తి పద్దతి(పిపిపి)లో లెక్కించినపుడు చైనా నేడు ప్రపంచంలో ఆర్ధిక అగ్రరాజ్యం, అమెరికా ద్వితీయ స్ధానంలో ఉంది. సాధారణ పద్దతిలో చూస్తే ప్రధమ స్దానంలో ఉన్న అమెరికాను త్వరలో చైనా అధిగమించనుందనే అంచనాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య అంతరం ప్రతి ఏటా తగ్గుతున్నది. ఈ నేపధ్యంలో అమెరికా పాటలకు మన కార్పొరేట్‌ శక్తులు నృత్యాలు చేస్తాయా అన్నది సమస్య.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దంలో భాగంగా ఐరోపాలోని అనేక దేశాలకు సోవియట్‌ నుంచి ముప్పు, కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తారనేే భయాన్ని రేపి నాటో కూటమిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చైనా నుంచి అలాంటి ముప్పు ఏదేశానికీ లేదు. మన దేశంతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ అది మరోసారి యుద్దానికి దారితీసే అవకాశం లేదు.1962 యుద్దం నాటికి సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమయ్యాయి. యుద్దంలో మనదేశానికి సోవియట్‌ యూనియన్‌ అండవుంటుందనే ఒక పొరపాటు అంచనాకు నాటి మన నాయకత్వం వచ్చిందని చెబుతారు. ఇప్పుడు ఆ సోవియట్‌ లేదు. సిరియా రష్యా నేతలు చైనాతో వివాదపడకపోగా స్నేహబంధాన్ని మరింతగా పెంచుకొనేందుకు నిర్ణయించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఒక వేళ మన దేశం-చైనా మధ్య యుద్దమంటూ వస్తే వారూ మనం చావో రేవో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్ముకొని అమెరికా లబ్ది పొందుతుంది తప్ప మనకు ఒరిగేదేమీ ఉండదు. జపాన్‌, ఆస్ట్రేలియాల పరిస్ధితీ అదే. జపాన్‌ కొన్ని దీవుల విషయంలో చైనాతో వివాద పడుతోంది. అయితే వాటికోసం యుద్దానికి దిగేస్థితి లేదు. మరోవైపు అమెరికా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రశక్తిగా ఎదిగేందుకు, మిలిటరీశక్తిగా మారాలని చూస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అలాంటి సమస్య లేదు. అయితే అమెరికా అనుంగు దేశంగా వ్యతిరేకించటం తప్ప మరొక కారణం లేదు.


దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల గురించి చైనా – ఆప్రాంత దేశాల మధ్య వివాదం ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ దేశానికి చెందిన నౌకలనూ అడ్డుకోలేదు, అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇక క్వాడ్‌ను ఆసియా నాటోగా మార్చి పెత్తనం చేయాలని అమెరికా చూస్తోంది. ఇదే సమయంలో జపాన్‌ రాజ్యాంగాన్ని మార్చాలని అక్కడి కార్పొరేట్‌ శక్తులు ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ తొమ్మిది ప్రకారం అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి మిలిటరీని వినియోగించటం నిషేధం, అంతే కాదు త్రివిధ దళాలను నిర్వహణను కూడా అనుమతించదు. ఈ కారణంగానే ఆత్మరక్షణ పేరుతో జపాన్‌ పరిమితంగా తన దళాలను నిర్వహిస్తున్నది. ఈ స్ధితి నుంచి బయట పడేందుకు అమెరికా అంగీకరిస్తుందా ? ఆసియా ప్రాంతీయ మిలిటరీ శక్తిగా తిరిగి ఎదగటాన్ని అనుమతిస్తుందా ?


ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేసి దానిలో మన దేశం చేరాలంటే దానికోసం మనం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దున్న-ఎద్దు వ్యవసాయం ఎలాంటి సమస్యలను తెస్తుందో తెలిసిందే. ప్రస్తుతం మనం అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ రష్యన్‌ ఆయుధాలదే అగ్రస్ధానం. అందువలన సగం రష్యా, సగం అమెరికా ఆయుధాల నిర్వహణ కుదరదు. అన్నింటికీ మించి తన ఆయుధాల కొనుగోలును మనం నిలిపివేస్తే రష్యా చూస్తూ ఊరుకోదు. అమెరికా ఉచితంగా ఆయుధాలు ఇవ్వదు. ఐరోపాలో నాటో నిర్వహణ తమకు కష్టంగా మారిందని, నిర్వహణ ఖర్చును ఐరోపా దేశాలు మరింతగా భరించాలని అమెరికా వత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అలాంటి స్దితిలో అమెరికా కోసం మనం చేతి చమురు వదిలించుకోవాల్సిన అవసరం ఏముంది ?
అధ్యక్ష ఎన్నికల నేపధ్యం, చైనా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ ముందుకు తెచ్చిన చతుష్టయంతో తెల్లవారేసరికి అద్బుతాలు జరుగుతాయని అనుకుంటే పొరపాటు. నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. నిజానికి ఈ ప్రతిపాదన 2004లో ప్రారంభమైంది. మధ్యలో మూలనపడి 2017లో మరోసారి కదలిక ప్రారంభమైంది. ట్రంప్‌ ఓడిపోతే కొంతకాలం పాటు దూకుడు తగ్గవచ్చు. ఒక వేళ గెలిచినా మన వంటి దేశాలను ముందుకు నెట్టటం తప్ప తన ఆర్దిక పరిస్ధితి మెరుగుపడేంతవరకు ట్రంప్‌ కూడా ఏదో ఒక పేరుతో కాలక్షేపం చేయవచ్చు.


అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాలు నాటో కూటమిని రష్యా ముంగిటికి తీసుకు వస్తున్నాయి. దాన్ని ఎదుర్కొనేందుకు రష్యా తనవంతు సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు క్వాడ్‌ పేరుతో ఆసియా నాటో ఉనికిలోకి వస్తే అది చైనాకే కాదు రష్యాకూ సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ నేపధ్యంలోనే చైనాతో కూటమి ఏర్పాటు గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సూచన ప్రాయంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పటి వరకు చైనా మరో దేశానికి వ్యతిరేకంగా మూడో దేశంతో ఎలాంటి సైనిక కూటమిని ఏర్పాటు చేయలేదు. అమెరికాకు మరింత దగ్గరగా భారత్‌ వెళుతున్నప్పటికీ దాయాదిగా ఉన్న పాకిస్ధాన్‌తో, మిత్రదేశంగా ఉన్న నేపాల్‌తో చైనా మిలిటరీ ఒప్పందాలు చేసుకోలేదని అంతర్జాతీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి. అమెరికా మరింత దూకుడుగా చైనా వ్యతిరేక అజెండాను ముందుకు తీసుకువస్తే చైనా తన వైఖరిని పున:పరిశీలించుకోవచ్చు. తన ఆర్దికశక్తితో చైనా చిన్న దేశాలను నియంత్రిస్తున్నదని విమర్శించే వారు ఇరాన్‌ పట్ల అమెరికా, మోడీ అనుసరించిన వైఖరి ఆర్ధికపరమైనదిగాక మరేమిటో చెప్పాలి. అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఆర్ధికపరమైనవి కావా, దానిలో భాగంగానే కదా ఇరాన్‌ నుంచి మనం చమురు కొనుగోలు నిలిపివేసి ఆమేరకు అమెరికా నుంచి తెచ్చుకుంటున్నది. అమెరికా పుణ్యమా అంటూ ప్రధాని నరేంద్రమోడీ మన మిత్రదేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించారు.ఈ చర్యతో మనకు ఒరిగిందేమీ లేకపోగా మిత్ర దేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించాము. అమెరికా బెదిరింపులు, అదిరింపులతో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు చైనా అందిస్తున ఆర్దిక స్నేహ హస్తాన్ని అందుకుంటున్నాయి. మన పాలకులకు అమెరికా కౌగిలింతలు తప్ప చుట్టుపట్ల ఏమి జరుగుతోందో పట్టటం లేదు. ఇది తెలివి తక్కువ వ్యవహారమా తెలివిగలదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా సంగతి తరువాత, ముందు బంగ్లాదేశ్‌ను అధిగమించండి !

18 Sunday Oct 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Bangladesh Per capita GDP, IMF about India, India per capita GDP


ఎం కోటేశ్వరరావు


ఆగండి ఆగండి శీర్షికను చూసి ఉద్రేకపడకండని కొందరికి సవినయ మనవి. ఇది కమ్యూనిస్టులు ఇచ్చిన సలహా కాదు మహాశయులారా ! మోడినోమిక్స్‌ అంటే తెలుసు కదా ! నరేంద్రమోడీ ప్రావీణ్యత సంపాదించిన ప్రత్యేక ఆర్ధశాస్త్రం. అసలు ఆయనే చదువుకున్నారో మనకు తెలియదు. చదువులతో పనేముంది అంటూ ఆయన ప్రకటించిన విధానాలను చూసి అర్ధశాస్త్ర పండితుడని, ఆ పాండిత్యం అనితర సాధ్యం కనుక ఆయన పేరుతోనే మన మీడియా కితాబిచ్చింది. ఇప్పుడు అదే మీడియాలో ఒక విశ్లేషణ వెలువడింది. చైనా సంగతి తరువాత ముందు బంగ్లాదేశ్‌ను అధిగమించండి అనే శీర్షికతో ఒక విశ్లేషణ వెలువడింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ తీరు తెన్నుల గురించి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) వెల్లడించిన తాజా అంచనా-జోశ్యంలో చెప్పిన అంశాలు మోడినోమిక్స్‌ గాలితీస్తున్నాయి. ఆండీ ముఖర్జీ అనే జర్నలిస్టు మోడీకి అలాంటి సలహా ఇచ్చేందుకు చేసిన సాహసాన్ని ముందుగా అభినందించాలి. పైన పేర్కొన్న శీర్షికతో ఆండీ రాసిన దాన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రచురించింది.


ఐఎంఎఫ్‌ నివేదిక అందరికీ అందుబాటులో ఉంది. అదేమీ రహస్య పత్రం కాదు.మరికొందరు విశ్లేషకులు కూడా దాని మీద వ్యాఖ్యలు, వార్తలు రాశారు. ఆండీ ముఖర్జీ శీర్షిక ఎంతో సూటిగా వాస్తవానికి దగ్గరగా ఉంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో మన తలసరి జిడిపి పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌ కంటే తగ్గనుందని ఐఎంఎఫ్‌ చెప్పింది. ” ఏ వర్ధమాన ఆర్ధిక వ్యవస్ద అయినా బాగా పని చేస్తున్నదనటం శుభవార్త. అయితే ఐదు సంవత్సరాల క్రితం 25శాతం ఆధిక్యతలో ఉన్న భారత్‌ ఇప్పుడు వెనుకపడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది ” అని ప్రముఖ ఆర్ధికవేత్త కౌశిక్‌ బసు ఐఎంఎఫ్‌ నివేదిక వెలువడిన వెంటనే ట్వీట్‌ చేశారు. మన కేంద్ర పాలకుల స్పందన చూస్తే చీమకుట్టినట్లు కూడా లేదు.


చైనాను అధిగమిస్తామని చెప్పిన వారు చివరకు అత్యంత పేద దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్‌కంటే వెనుకబడిపోవటం విజయనాదాలు తప్ప మరొకటి తెలియని నరేంద్రమోడీ గణానికి జీర్ణించుకోలేని అంశమే. ఒక పెద్ద దేశంగా మన ఆర్ధిక వ్యవస్ధ పెద్దదిగా ఉండవచ్చుగానీ తలసరి విషయంలో ఎంత వెనుకబడి ఉందో ఈ పరిణామం స్పష్టం చేసింది. దీనికి కారణం కరోనా అని ఠకీమని చెప్పవచ్చు. చివరకు దానిలో కూడా మన ప్రధాని అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సిందే. బంగ్లాదేశ్‌ జనాభా కంటే మనం ఎనిమిది రెట్లు ఎక్కువ. అక్టోబరు 18 నాటికి ప్రపంచంలో కరోనా సోకిన వారు నాలుగు కోట్లు దాటారు.మన దేశంలో 75లక్షల మందికి కరోనా సోకితే, 1,114,064 మంది మరణించారు. అదే బంగ్లాదేశ్‌లో 3,87,295 మందికి వైరస్‌ సోకగా 5,646 మంది మరణించారు. అంటే మన దేశంలో 20 రెట్లు మరణాలు ఎక్కువ.


మన జిడిపి 10.3శాతం తిరోగమనంలో ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేయగా బంగ్లాదేశ్‌లో 3.8శాతం పురోగమనంలో ఉంటుందని పేర్కొన్నది.అందుకే కరోనా లేకపోయినా తలసరి జిడిపిలో బంగ్లాదేశ్‌ మనలను మించి పోయి ఉండేదని ఆర్దికవేత్తలు పేర్కొన్నారు. నైపుణ్యం తక్కువగా ఉన్న వారు చేయగలిగిన వస్తు తయారీకి ప్రాధాన్యత ఇచ్చే విధానాలు అనుసరించటమే దీనికి కారణం.తొలి సంవత్సరాల్లో చైనా అనుసరించిన విధానమదే. ఎగుమతులతో పాటు ఉపాధి కల్పించింది. బంగ్లాదేశ్‌లో పని చేయగలిగిన వయస్సులోని ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు కార్మికులుగా ఉన్నారు. మన దేశం కంటే ఎక్కువ. ప్రస్తుతం చైనా నైపుణ్యం తక్కువ అవసరమైన ఉత్పత్తులకు బదులు అధిక నైపుణ్యం కలిగిన వస్తు తయారీ, సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నందున బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలు చైనా వదలిన ఖాళీని పూర్తి చేసి ఎగుమతుల బాటలో పయనిస్తున్నాయి. మన దేశంలో ప్రతి ఏటా కొత్తగా 80లక్షల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది. కరోనా కారణంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులయ్యారు. ఈ నేపధ్యంలోనే చైనాతో పోల్చుకోవటం పక్కన పెట్టి బంగ్లాదేశ్‌ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించాలని ఆండీ ముఖర్జీ సూచించారు.


ఐదేండ్ల క్రితం మన తలసరి జిడిపి బంగ్లాదేశ్‌ కంటే 24శాతం ఎక్కువగా ఉంది. కానీ 2020లో మన తలసరి జిడిపి 1,876.53 డాలర్లుగా అంచనా వేస్తే బంగ్లాదేశ్‌లో 1,887.97 డాలర్లుగా పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ అంచనాలు దిగువ విధంగా ఉన్నాయి. 2021లో మన తలసరి జిడిపి 2,030.62 డాలర్లు ఉంటే బంగ్లాదేశ్‌లో 1,989.85గా ఉంటుంది. అయితే 2024లో రెండు దేశాల్లో దాదాపు సమంగా ఉన్నప్పటికీ 2025నాటికి మన దేశంలో 2,729.24 డాలర్లు, బంగ్లాదేశ్‌లో 2,756.10డాలర్లు ఉంటుంది. ఇక చైనా విషయానికి వస్తే 2020లో తలసరి జిడిపి 10,839.43 డాలర్లు. మన పొరుగునే ఉన్న నేపాల్‌లో 1,115, శ్రీలంకలో 3,697 డాలర్లుగా పేర్కొన్నది. అందువలన మన చైనాతో పోటీ పడటానికి బదులు బంగ్లాదేశ్‌, శ్రీలంకలను అధిగమించేందుకు పూనుకోవటం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
బంగ్లాదేశ్‌ కంటే మనం వెనుకబడిపోతున్నామనటాన్ని మన అధికార యంత్రాంగం అంగీకరించటం లేదు. కొనుగోలుశక్తి ప్రాతిపదికన లెక్కించే పిపిపి ప్రకారం 2020 మన తలసరి జిడిపి 6,284 డాలర్లుంటుందని అదే బంగ్లాదేశ్‌లో 5,139 డాలర్లని పేర్కొన్నట్లు పిటిఐ తెలిపింది. ఐఎంఎఫ్‌ అంచనాలతో ఇప్పుడు అనేక మంది చైనాను పక్కన పెట్టి బంగ్లాదేశ్‌తో మన దేశాన్ని పోలుస్తున్నారు. ఇది ఎన్‌డిఏకు ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోడీకి ఒక పెద్ద సవాలు విసరటం తప్ప వేరు కాదు. 2004-16 మధ్య మన దేశ జిడిపి పెరుగుదల రేటు బంగ్లాదేశ్‌ కంటే వేగంగా ఉంది. అయితే 2017 నుంచి బంగ్లా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. గత 15 సంవత్సరాలలో మన జనాభా పెరుగుదల 21శాతం పెరగ్గా బంగ్లాదేశ్‌లో 18శాతం మాత్రమే ఉంది. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరని, పిల్లల్ని ఎక్కువగా కని ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్‌ సమాజంగా మారుస్తారని ప్రచారం చేసే వారికి ఇది చెంపపెట్టు.


ప్రపంచ ఆకలి నివేదిక 2019, ప్రపంచ బ్యాంకు సమాచారం మేరకు కొన్ని అంశాలలో రెండు దేశాల మధ్య కొన్ని సూచికల పోలిక దిగువ విధంగా ఉంది.
అంశం బంగ్లాదేశ్‌ ×××××××× భారత్‌
ద్రవ్యోల్బణ శాతం 5.8 ××××××××× 3,8
కరంట్‌ ఖాతాలోటు శాతం జిడిపి -2.4 ××××××××× 0.7
జిడిపిలో నిఖర ఎఫ్‌డిఐశాతం 0.4 ×××××××××× 1.1
జిడిపిలో ద్రవ్యలోటు శాతం -8.8 ×××××××××× -12.4
జిడిపిలో రుణశాతం 49 ×××××××××× 90
మానవాభివృద్ధి సూచిక 135 ×××××××××× 129
ఆయు ప్రమాణం సం. 72.3 ×××××××××× 69.4
మహిళా కార్మికుల భాగస్వామ్యశాతం 36 ×××××××××× 20.335
సులభతర వాణిజ్య సూచిక 168 ×××××××××× 63
ఆర్ధిక స్వేచ్చ సూచిక 122 ×××××××××× 105
బ్యాంకుఖాతాలున్న పెద్దలశాతం 50 ×××××××××× 80
మరుగుదొడ్లు ఉన్నవారి శాతం 48.23 ××××××××× 59.43
అపరిశుభ్రత కారణంగా మరణాలు 11.9 ××××××××× 18.6
సమానత్వ సూచిక 50 ××××××××× 112
ఆకలి సూచిక 75 ××××××××× 94


బంగ్లాదేశ్‌లో జనాభా ఎక్కువగా పరిశ్రమలు, సేవారంగం మీద ఆధారపడుతుండగా మన దేశంలో వ్యవసాయరంగం ప్రధానంగా ఉంది. అనేక రంగాలలో పురోగతి ఉన్నప్పటికీ మన దేశంతో పోల్చితే బంగ్లాదేశ్‌లో దారిద్య్రం ఎక్కువగా ఉంది. ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 2019-20లో బంగ్లాదేశ్‌లో 21.9శాతం మంది దారిద్య్రంలో ఉండగా మన దేశంలో 8.3శాతం ఉన్నారు. 2021-22 నాటికి బంగ్లాలో 21.4శాతానికి తగ్గుతారని మన దేశంలో పదిశాతానికి పెరుగుతారని అంచనా. చైనా అయినా బంగ్లాదేశ్‌ అయినా ఎదగటానికి దశాబ్దాలు పట్టింది. కానీ మన పాలకులు ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా అరచేతిలో స్వర్గాన్ని చూపుతున్నారు. గుజరాత్‌ నమూనాను దేశమంతటా అమలు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు చైనా నుంచి కంపెనీలు వస్తున్నాయని ఊరించారు. వస్తే వచ్చాయి, వస్తాయో రావో తెలియని వాటి గురించి ఊహల్లో లెక్కలు వేసుకుంటూ మంచాలు నేసే సోమరిపోతులను గుర్తుకు తెస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి తగు చర్యలు తీసుకుంటారా ? మరో కొత్త ఊరింపులతో జనాన్ని మభ్యపెడతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నోబెల్‌ బహుమతులు : డోనాల్డ్‌ ట్రంప్‌ -నరేంద్రమోడీ అర్హత లేమిటి ?

11 Sunday Oct 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

HUNGRIEST COUNTRIES, Ig Nobel Prize, India Hungry, Nobel prize matter


ఎం కోటేశ్వరరావు


నోబెల్‌ బహుమతి కమిటీ ఎంపిక ప్రమాణాలు ఏమిటో ముఖ్యంగా శాంతి బహుమతి విషయంలో ఒక్కోసారి అంతుబట్టవు. కొన్ని బహుమతుల ప్రకటన చూస్తే తెరవెనుక ఏదో జరుగుతోంది అనిపిస్తుంది. అమెరికాలో ఏ పార్టీకి చెందిన వారు అధ్యక్షులుగా ఉన్నా నిత్యం ఎక్కడో ఒక చోట నిప్పురాజేస్తారు, జనాలను చంపటమో, చంపించటమో చేస్తారు. అలాంటి వారికి శాంతి బహుమతి ప్రకటన చేయటాన్ని ఏమనాలి ? బరాక్‌ ఒబామాతో సహా ఇప్పటికి నలుగురికి అలా ప్రకటించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచశాంతి కోసం చేసిన కృషికి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటూ కొందరు ట్రంప్‌ పేరును ప్రతిపాదించారు. స్వయంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకపోబట్టి గానీ ఉంటే తన పేరును తానే ప్రతిపాదించగల సమర్ధుడు ఆ పెద్దమనిషి.


ఈ నేపధ్యంలో ట్రంప్‌కు జిగినీ దోస్తు, ప్రపంచ నేతలుగా భుజం భుజం రాసుకుంటూ తిరుగుతున్న మన ప్రధాని నరేంద్రమోడీ పేరును ప్రతిపాదించకపోవటాన్ని ఎలా చూడాలి. గతంలో కేంద్ర మంత్రిగా మోడీని దేవుడు అని వర్ణించిన నేటి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాదిరి ఒక్కరు కూడా మోడీ పేరును ప్రతిపాదించే సాహసం ఎందుకు చేయలేకపోయినట్లు ? ప్రపంచ నేతగా ఎదిగిన తొలి ప్రధాని అని ఇంతకాలం ఊదరగొట్టిందంతా ఒట్టి గ్యాసేనా ? ప్రపంచ శాంతికి, ఆర్ధిక అభివృద్ధికి గాను నరేంద్రమోడీకి దక్షిణకొరియా అందచేసిన బహుమతి వెనుక మన మార్కెట్‌ మీద దృష్టి ఉందా ?


ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు, ఒక కిలో పప్పులు ఉచితంగా 80 కోట్ల కార్డులున్న వారికి అందచేస్తున్నట్లు, అందుకోసం 90వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అది నిజంగా అంత గొప్ప చర్యే అయితే ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఎందుకు వచ్చినట్లు ? ప్రతి దానికీ వీరుడు శూరుడు అంటూ పొగుడుతున్న కొన్ని దేశాల వారు ప్రధాని నరేంద్రమోడీని ఎవరూ ఎందుకు పట్టించుకోలేదు ? చౌక దుకాణాల్లో సరకులు కొనుగోలు చేసేందుకు డబ్బు ఉండవచ్చు లేకపోవచ్చు, ఉచితంగా ఇచ్చేవాటితో కనీసం ప్రాణాలు అయినా నిలుపుకుంటారు,సాయం ఎంతని కాదు, ఎన్ని కోట్ల మందికి చేశారు అన్నది ముఖ్యం కదా ! ఇంత అన్యాయమా ? ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యుఎఫ్‌పి) నోబెల్‌ బహుమతి ప్రకటిస్తారా అని భక్తులు లోలోపల తీవ్ర మనోవేదనకు గురవుతున్నారా ? వచ్చిన ఆపద తీవ్రతతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం లేదా దానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్రమోడీ ప్రచార ఆర్భాటం చేస్తున్నారా ? ఆచరణలో ఆకలి లేదా ఆహార భద్రత, పోషకాహారం అందించే విషయలో జరుగుతున్నదేమిటి ?


నోబెల్‌ బహుమతుల ఎంపికలో జరుగుతున్న లోపాలను చూసిన తరువాత 1991లో కొందరు ఇగో నోబెల్‌ పేరుతో ఎగతాళి బహుమతులను ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో వైద్య రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు గాను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌,రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌, టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రడార్‌, బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో, తుర్కుమెనిస్దాన్‌ అధ్యక్షుడు బద్రిమహ్మద్‌లకు కలిపి ఉమ్మడి బహుమతిని ప్రకటించారు. కరోనా మహమ్మారి జనజీవితాల మీద చూపే ప్రభావాన్ని శాస్త్రవేత్తలు, వైద్యుల కంటే ముందుగానే రాజకీయవేత్తలుగా వీరు ప్రపంచానికి బోధ చేసినందుకు ఈ అవార్డు ఇచ్చారు. ఈ దేశాల్లో కరోనా కేసులు ఎలా పెరిగిపోయిందీ, జనాన్ని ఎలా ఇబ్బంది పెట్టిందీ ప్రపంచం చూసింది. ప్రపంచ శాంతికి ఇచ్చే ఇగో నోబెల్‌ బహుమతులు భారత్‌-పాకిస్ధాన్‌ దౌత్యవేత్తలకు ప్రకటించారు. అర్ధరాత్రి అపరాత్రి అనికూడా చూడకుండా తలుపు గంటలను మోగించటం, వచ్చి తలుపు తెరిచి సమాధానం ఇచ్చే లోగానే కనపడకుండా పోతున్నందుకు ఇస్తున్నట్లు ప్రకటించారు.(సెప్టెంబరు 18, ది ప్రింట్‌)

నరేంద్రమోడీ సర్కార్‌ ఎన్నో విజయాలు సాధించినట్లు ప్రచారం చేసుకుంటోంది. అదేమిటో గానీ సరైన లెక్కలు తయారు చేయటంలో లేదా తనకు అనుకూలంగా లెక్కలు రాయించటంలో సైతం వైఫల్యం కనిపిస్తోంది. మరోవైపు అన్నీ నెహ్రూయే చేశాడు అని చెప్పుకొనే అవకాశాలు రోజు రోజుకూ నరేంద్రమోడీ దళానికి తగ్గిపోతున్నాయి. 2016-25ను పోషకాహార కార్యాచరణ దశాబ్దంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి 2016ఏప్రిల్‌లో నిర్ణయించింది. 2012లో ప్రపంచ ఆరోగ్య ప్రతినిధుల సమావేశం 2025 నాటికి ఆరుపోషకాహార లక్ష్యాలను సాధించాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది. దాన్ని చేరుకోవటంలో విఫలమయ్యే 88 దేశాల్లో మనది ఒకటి అని 2020 ప్రపంచ పోషకహార నివేదిక పేర్కొన్నది. గడచిన ఎనిమిది సంవత్సరాలలో మోడీ గారీ వాటా ఆరు సంవత్సరాలు ఉంది. ప్రభుత్వ పని తీరు చూసి వచ్చే ఐదేండ్లలో లక్ష్యాన్ని చేరే అవకాశం లేదని ప్రకటించేశారు. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల ఆగిపోవటాన్ని నివారించటం, పిల్లల్ని కనే వయస్సు ఉన్న మహిళల్లో రక్త హీనత నివారణ, పిల్లలో అధికబరువు నివారణ, తల్లిపాలు ఇవ్వటం పెంపు లక్ష్యాలను చేరుకొనే అవకాశాలు లేవని మన సమాచారాన్ని విశ్లేషించిన నివేదిక పేర్కొన్నది.ప్రపంచంలో అధ్వాన్నంగా ఉన్న మూడు దేశాలలో నైజీరియా, ఇండోనేషియాతో పాటు మన దేశాన్ని చేర్చారు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లో పరిస్ధితి దారుణంగా ఉందని నివేదిక పేర్కొన్నది. ఇలాంటి కార్యక్రమాలను అమలు జరపాల్సింది రాష్ట్రాలు కదా, వాటి వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేయటం సబబా అని కొంత మంది అతి తెలివి వాదనలు చేస్తున్నారు. మెజారిటీ రాష్ట్రాలలో బిజెపియే అధికారంలో ఉంది అనే వాస్తవాన్ని వారు కావాలనే దాస్తున్నారు. పదిహేనేండ్లకు పైగా పాలనలో ఉన్న రాష్ట్రాలలో పరిస్ధితి మారిందేమీ లేదు.


పిల్లలకు తగినన్ని పండ్లు ఆహారంగా ఇస్తే తరువాతి రోజుల్లో వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు దేశంలో తగినంత ఆహారమే పెట్టలేని స్ధితిలో పండ్లు తినిపించటం సాధ్యమా ? తలిదండ్రుల ఆదాయాలు అందుకు అనుగుణ్యంగా ఉన్నాయా? కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో ఈ అంశం మరింతగా ముందుకు వచ్చింది. దేశంలో 80 నుంచి 90శాతం మంది పెద్ద వారికి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ డి లోపం ఉంది. కరోనా నిరోధానికి అది అవసరమని కొందరు చెప్పటంతో సూక్ష్మంలో మోక్షానికి అలవాటు పడిన మన జనాలు ఇష్టమొచ్చినట్లు డి విటమిన్‌ టాబ్లెట్‌లు తీసుకొని కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నారు. దీనికి అర్హతలు లేని ప్రబోధ వైద్యులు, వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులే ప్రధాన కారణం.


ప్రపంచంలో పలుచోట్ల నెలకొన్న అస్తవ్యస్ధ పరిస్ధితికి సరైన టీకా ఆహారమే అని నోబెల్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెరిట్‌ రెసి అండర్సన్‌ చెప్పారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్‌ బహుమతిని ప్రకటించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచ ఆకలిని కరోనా మహమ్మారి రెట్టింపు చేయనుందనే అంచనాల నేపధ్యంలో ఈ కార్యక్రమ అవసరం ఎంతో ఉందన్నారు. తమ కుటుంబానికి దక్కిన ఈ గౌరవంగా దీన్ని భావిస్తున్నామని, తొలిసారిగా తనకు మాటలు రావటం లేదని ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యనిర్వహణ అధికారి డేవిడ్‌ బియాస్‌లే వ్యాఖ్యానించారు. అనేక దశాబ్దాల పాటు ప్రపంచంలో ఆకలి తగ్గిన తరువాత 2016 నుంచి పెరుగుతోందని, పెద్ద దేశాలు కొన్ని ఆకలిని తీర్చేందుకు సహకరించటం లేదని ఆహార కార్యక్రమ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.


మన దేశానికి సంబంధించి 117 దేశాలలో ఆకలి సూచిక 2019లో 102గా ఉంది. అయితే మన అధికారులు అది పాత సమాచారం మీద ఆధారపడి రూపొందించినది, 2017, 18 సంవత్సరాల వివరాలను తీసుకుంటే 91గా ఉంటుందని చెబుతున్నారు. ఆకలిని కొలిచేందుకు తీసుకుంటున్న ప్రమాణాల్లో మార్పులు చేసిన మాట వాస్తవం. అది ఒక్క మన దేశానికే కాదు అన్ని దేశాలకూ వర్తిస్తుంది.102కు బదులు 91 ఎంతో మెరుగైదని చెప్పుకొనేందుకు తాపత్రయ పడటం తప్ప మనం ఎంతో ఆకలితో ఉన్నామనే విషయాన్ని విస్మరిస్తున్నారు. 2019 సూచికలో ఐదు పాయింట్లు, అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన దేశాలన్నింటినీ ఒకటవ స్ధానంలో ఉన్నట్లుగా పరిగణించారు, అలాంటి దేశాలు 17 ఉన్నాయి. ఐదు-ఆరు పాయింట్ల మధ్య ఐదు దేశాలు ఉన్నాయి. ఆరు -ఏడు పాయింట్ల మధ్య మరో ఐదు దేశాలుండగా వాటిలో 6.5 పాయింట్లతో చైనా 24వ స్ధానంలో ఉంది. పదిపాయిట్ల లోపు ఉన్న దేశాలన్నీ ఆకలి తక్కువగా, 10-19.9 మధ్య వచ్చినవి సాధారణమైనవిగా, 20-34.5 మధ్య తీవ్రంగా, 35-49.9 ఆందోళన కరంగా , 50పాయింట్లు దాటినవి మరింత ఆందోళన కరమైన స్దితిలో ఉన్నట్లు భావిస్తున్నారు. మన దేశం 91 అయినా 102 అయినా ఆందోళనకర స్ధాయిలో ఆకలి ఉన్న దేశాల వర్గీకరణలోనే ఉంటుందని గమనించాలి. ఆహారమే కొనలేని మన దేశవాసులకు పోషకాహారం గురించి మన ప్రధాని మన్‌కీ బాత్‌లో ఉద్బోధ చేశారు.

ఆకలి ఒక అంశమైతే దేశాల్లో ఆహార భద్రత ఏ స్ధాయిలో ఉందన్నది కూడా ముఖ్యమే.2019 సూచికలో 113 దేశాలలో 87.4 పాయింట్లతో సింగపూర్‌ తొలి స్ధానంలో ఉంది.చైనా 71 పాయింట్లతో 35వ స్ధానంలో ఉండగా మన దేశం 58.9 పాయింట్లతో 72వ స్దానంలో ఉంది. పాకిస్ధాన్‌ 78వ స్ధానంలో 56.8పాయింట్లను కలిగి ఉంది.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల ముసుగులో మన రైతాంగానికి కార్పొరేట్‌ బకాసురులకు అప్పగించేందుకు పూనుకోవటాన్ని కొందరు పెద్దలు స్వాగతిస్తున్నారు. కొన్ని అంకెలు చెబుతూ మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో మిగులు సాధించినట్లు చిత్రిస్తున్నారు. వారు చెబుతున్న అంకెలు వాస్తవమే గానీ వాటికి చెబుతున్న భాష్యంతోనే అసలు సమస్య. పండించటం ఒక ఎత్తయితే జనం తింటున్నారా లేదా అన్నది అసలు సమస్య. 2019 సంవత్సరానికి చైనా పండ్ల ఎగుమతులు దిగుమతుల వివరాలను ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. చైనా నుంచి కొన్ని పండ్లను ఎగుమతి చేస్తుండగా కొన్ని రకాలను దిగుమతి చేసుకుంటోంది. గతేడాది 950 కోట్ల డాలర్ల విలువ గల పండ్లను దిగుమతి చేసుకుంటే 550 కోట్ల డాలర్ల విలువగల పండ్లను ఎగుమతి చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే దిగుమతుల విలువ 24, ఎగుమతుల విలువ 14శాతం పెరిగింది.


వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంపుదల ద్వారా రైతులకు మేలు చేస్తామనే పేరుతో సంస్కరణలు ప్రారంభించిన నరేంద్రమోడీ సర్కార్‌ సెప్టెంబరు 14న ఉల్లిధరలు పెరగటాన్ని చూపుతూ ఎగుమతులను నిషేధించింది. తరువాత ఉల్లి ధరలు పెద్దగా తగ్గిందేమీ లేదు. విమర్శలు రావటంతో అక్టోబరు మొదటి వారంలో కృష్ణాపురం ఉల్లిరకాన్ని నిషేధం నుంచి మినహాయించింది. ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉల్లి ఎగుమతుల నిషేధం అమల్లోకి తెచ్చిందో మన మీద ఆధారపడిన బంగ్లాదేశ్‌ వంటి దేశాలు చైనా నుంచి దిగుమతులకు పూనుకున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఒక ఏడాది తగ్గినా, పెరిగినా ప్రస్తుతం ప్రపంచంలో 9,32,26,400 టన్నుల ఉల్లి ఉత్పత్తి అవుతోంది. చైనాలో 2,39,07,509 టన్నులు, భారత్‌ 1,94,15,425 టన్నులు ఉత్పత్తి చేస్తోంది. మన దేశంలో ఉల్లి ధరలు ప్రతి ఏడూ ఏదో ఒక సమస్యను ముందుకు తెస్తున్నాయి. గతేడాది కూడా ధరలు పెరగటంతో నిషేధం విధించారు. దాంతో మన మీద ఆధారపడిన అనేక దేశాలు చైనాతో ఒప్పందాలు చేసుకున్నాయి. 2021వరకు ఉల్లి దిగుమతి పన్ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. చైనాలో అసాధారణ రీతిలో రైతులకు, అదే మాదిరి వినియోగదారులకు ఉల్లి కన్నీళ్లు తెప్పించే పరిస్ధితి లేదు. అదే మన దేశంలో వ్యాపారులు ఇరువురినీ దోచుకుంటున్నా పట్టించుకొనే వారు లేరు. తాజాగా నిల్వలపై ఆంక్షలను ఎత్తివేయటం, దానికి వర్షాలు తోడు కావటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. వాటిని అదుపు చేసేందుకు ఎగుమతిపై ఆంక్షలు.


చైనాలో రెండు నెలలుగా స్ధానికంగా కరోనా కేసులేవీ నమోదు కాకపోవటంతో అక్టోబరు ఒకటి నుంచి వారం రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దాదాపు 63 కోట్ల మంది వినోద, విహార యాత్రలు చేసినట్లు ప్రకటించారు. బంధువులు, స్నేహితులను కలిసిన సందర్భాలలో పండ్లను కానుకగా ఇవ్వటం చైనా సంప్రదాయాలలో ఒకటి.ఈ ఏడాది అసాధారణ డిమాండ్‌ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో దిగుమతి చేసుకున్న పండ్లకే ఎక్కువ ఆదరణ ఉంది. ద్రాక్ష ఉత్పత్తిలో, వినియోగంలో చైనా అగ్రస్ధానంలో ఉంది. ఈ కారణంగా మిగులు సమయాల్లో ఎగుమతులు, పంట అయిపోయిన తరువాత దిగుమతులు కూడా చేసుకుంటున్నది. ప్రపంచంలో 23 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా చైనాలో గత ఏడాది 10.8 మి.టన్నులు ఉత్పత్తి అయినట్లు అంచనా. మన దేశంలో మూడు మిలియన్‌ టన్నులకు అటూ ఇటూగా ఉంటోంది. చిలీ ప్రపంచ ప్రధాన ఎగుమతిదారుగా ఉంది.

కూరగాయలు, పండ్లు తగినన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్ద కొన్ని ప్రమాణాలను నిర్ణయించింది. ఆ మేరకు వినియోగించేందుకు అనువుగా ఉత్పత్తి ఉందా లేదా అన్నది కూడా చూడాలి, కొనుగోలు చేసే వారు లేనపుడు మిగులుగా కనిపించవచ్చు. అది ఆయా దేశాల బలహీనత తప్ప బలంగా చెప్పగలమా ? ప్రపంచ వ్యవసాయ సంస్ధ ప్రకటించిన తాజా సమాచారం (2016) ప్రకారం ప్రపంచ పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో చైనా వాటా 39శాతం ఉంది. మన దేశం పదిశాతం, అమెరికా నాలుగుశాతం కలిగి ఉన్నాయి. చైనాలో 708 మి.టన్నుల ఉత్పత్తి జరిగింది. మన దేశంలో 2015లో పండ్లు, కూరగాయల ఉత్పత్తి 180 మి.టన్నులు. ఉత్పత్తిని బట్టి వినియోగాన్ని అంచనా వేసుకోవచ్చు.


ప్రపంచ ఆకలి సూచిక 2019లో ప్రపంచంలోని 117 దేశాలలో మన దేశం 102వ స్ధానంలో ఉంది. నరేంద్రమోడీ గారి మంచి రోజులు ప్రారంభమైన ఐదు సంవత్సరాల తరువాత ఉన్న పరిస్ధితి ఇది. ఆరు నుంచి 23నెలల వయస్సు ఉన్న పిల్లల్లో కేవలం పదిశాతం మందికి మాత్రమే కనీసంగా పెట్టాల్సిన ఆహారం అందుబాటులో ఉన్నది లేదా మన పౌరుల కొనుగోలు శక్తి అలా ఉంది. 1991లో ఆహార లభ్యత తలకు 186.2 కిలోలు కాగా 2016లో 177.9 కిలోలకు తగ్గింది. 2015లో చైనాలో 450 కిలోలు, బంగ్లాదేశ్‌లో 200కిలోలు, అమెరికాలో 1,100 కిలోలు ఉంది. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్ధ సమాచారం ప్రకారం కూరగాయల వినియోగంలో 2017లో చైనా సగటున ప్రతి ఒక్కరూ 377 కిలోలతో ప్రపంచంలోనే అగ్రస్ధానంలో ఉండగా మన దేశంలో 79.86కిలోలు, శ్రీలంకలో 49.83, బంగ్లాదేశ్‌లో 35, పాకిస్ధాన్‌లో 20.83 కిలోల వినియోగం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ తలకు రోజు ఒక్కింటికి 200-250గ్రాముల కూరగాయలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మన దేశంలో 218 గ్రాములుండగా చైనాలో 1033 గ్రాములు తీసుకుంటున్నారు. మన దేశంలో వారాల తరబడి అసలు కూరగాయల మొఖం ఎరగని కుటుంబాలున్నాయంటే అతిశయోక్తి కాదు.


ఆహార భద్రత, పోషకాహార లేమిని మన కంటే ఎంతో మెరుగ్గా చైనా అధిగమిస్తోందన్నది స్పష్టం. జనం ఆహారం తీసుకుంటున్నారా, పోషకాహారం కలిగి ఉన్నారా లేదా అనేందుకు దారిద్య్రం కొలబద్ద. 1981-2015 మధ్య చైనాలో దారిద్య్రం 0.7 శాతానికి తగ్గింది. మన దేశంలో 1987లో 48.9శాతం ఉంటే 2015 నాటికి 13.4శాతానికి తగ్గింది.1999-2005 మధ్య దారిద్య్ర నిర్మూలనలో చైనా ఆదాయ స్ధితిస్దాపకత 1.51ఉంది. అంటే ఆదాయం ఒకటి పెరిగితే దారిద్య్రం 1.51 తగ్గింది. ఇదే కాలంలో మన దేశంలో స్ధితిస్ధాపకత 0.4శాతం మాత్రమే ఉంది.దారిద్య్రం ఒకటికి 0.4 మాత్రమే తగ్గింది. దీనికి అనుగుణ్యంగానే 2002-04 నుంచి 2015-07 మధ్య ఆకలి, పోషకాహారం లేని వారు చైనాలో 15.9 నుంచి 8.8శాతానికి తగ్గితే ఇదే సమయంలో మన దేశంలో 22.2నుంచి 14.8కి తగ్గింది. ఐదేండ్ల లోపు పిల్లల పెరుగుదల ఆగిపోయిన వారు ప్రపంచ సగటు 23.2శాతం కాగా 2000-13 మధ్య చైనాలో 17.8 నుంచి 8.1శాతానికి పడిపోగా మన దేశంలో 2000-15 మధ్య 54.2 నుంచి 38.4కు తగ్గింది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే చైనాలో 1980దశకంలో వ్యవసాయం బాగా అభివృద్ది చెంది జన జీవితాలను మార్చివేయగా మన దేశంలో ఆది జరగలేదు. ఇవన్నీ ఆయా దేశాలలో ఎలాంటి రాజకీయ వ్యవస్ధ ఉందని కాదు, జనం పట్ల జవాబుదారీతనంతో ఉన్నారా లేదా అన్నది ముఖ్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d