• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

అమెరికా ఎడమ చంకలో ఇమ్రాన్‌ – కుడి వైపున నరేంద్రమోడీ ! వావ్‌ !!

10 Saturday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, F-16 jets, imperialism, imran khan, Narendramodi, US, yankees


ఎం కోటేశ్వరరావు


మరో ఆరు రాఫేల్‌ యుద్ద విమానాలు ఏప్రిల్‌ 28న మన దేశానికి రానున్నాయన్నది ఒక వార్త . తన వ్యూహాత్మక భాగస్వామి పాకిస్ధాన్‌కు ఎనిమిది ఎఫ్‌-16 జెట్‌ యుద్దవిమానాలను విక్రయించాలని నిర్ణయించిన అమెరికా ఆమేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. డోక్లాంతో సహా చైనా-భూటాన్‌ మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలూ మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన సంప్రదింపులలో రెండు దేశాలూ నిర్ణయించాయి.


విమానాల కొనుగోలు లావాదేవీల్లో మధ్యవర్తిగా ఉన్న భారత ” దేశభక్తుడు ” సుషేన్‌ గుప్తా దొంగతనంగా మన సైన్యం వద్ద పత్రాలను దొంగిలించి అందచేసినందుకు బహుమతి పేరుతో గుప్తా, మరికొందరు మధ్యవర్తులకు రాఫేల్‌ కొన్ని మిలియన్ల యూరోలు సమర్పించుకుంది. మన పాలక దేశభక్తులు ఏం చేస్తారో తెలియదు. పాకిస్ధాన్‌కు ఎఫ్‌-16 యుద్ద విమానాలు అందచేయటం ‘ఉగ్రవాదం’ మీద జరిపే పోరుకు ఇబ్బంది అని నరేంద్రమోడీ ఎంత మొత్తుకున్నా -నిజంగా అలా చేశారో లేదో తెలియదు- అమెరికా ఖాతరు చేయలేదు. గెజిట్‌లో కూడా ప్రకటించాం తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది.
డోక్లాంలో చైనా సైన్యాన్ని అడ్డుకొనేందుకు మన మిలిటరీ భూటాన్‌ ఆహ్వానం మీద వెళ్లిందా లేదా చిన్న దేశం కనుక పక్కకు నెట్టి వ్యవహరించిందా అన్నది ఇప్పటికీ తేలని విషయమే. తాజాగా చైనా-భూటాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్వతంత్రంగానే భూటాన్‌ వ్యవహరించనున్నదని వార్తలు వచ్చాయి. అంటే మీకు చైనా ముప్పు ఉందంటూ మనం జోక్యం చేసుకొనేందుకు దారి మూసినట్లేనా ? అంతిమ ఒప్పందం కుదిరే వరకు రెండు దేశాల మధ్య శాంతి, సుస్ధిరతలను కాపాడాలని నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేకపోయినా ఈ ఒప్పందం కుదరటం విశేషం. భారత్‌ను దూరంగా ఉంచేందుకు చైనా వైపు నుంచి భూటాన్‌కు గణనీయంగా రాయితీలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. డోక్లాంకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో చైనీయులు భూటాన్‌ భూ భాగంలో ఒక గ్రామాన్ని నిర్మించారని మన పత్రికలు కట్టుకధలు రాసిన విషయం తెలిసిందే. అరుణాచల్‌లో కూడా అదే విధంగా గ్రామాలను నిర్మించినట్లు రాసిన విషయం తెలిసిందే.


నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికా, దాని మిత్రపక్షాలతో జతకట్టదలచుకుంటే సూటిగానే చెప్పవచ్చు. దాని మంచి చెడ్డలను సమయం వచ్చినపుడు జనం తేలుస్తారు. మేము ఏదైనా బస్తీమే సవాల్‌ అన్నట్లుగా చెప్పి చేస్తాము అని చెప్పుకుంటున్న మోడీ నాయకత్వం ఆచరణలో అలా ఉందా ? ప్రతిదేశం ప్రతి సమస్య, పరిణామం నుంచి తామెలా లబ్ది పొందాలన్న తాపత్రయంలోనే ఉంది.అందుకే ఎన్నో ఎత్తులు, జిత్తులూ దీనికి ఏ దేశమూ మినహాయింపు కాదు. వాటి వలన జనానికి లబ్ది చేకూరుతుందా, వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టి కార్పొరేట్లకు లాభాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్నదే గీటురాయి.ప్రపంచం వైరుధ్యాల మయం. అవి నిరంతరం ఉంటూనే ఉంటాయి. అయితే అన్నీ ఒకేసారి ముందుకు రావు. ఏదైనా ప్రధాన వైరుధ్యంగా ముందుకు వచ్చినపుడు వాటి పట్ల తీసుకొనే వైఖరి తరువాత వచ్చే వైరుధ్యాన్ని బట్టి మారిపోతూ ఉండవచ్చు. ప్రపంచం మొత్తాన్ని మింగివేయాలన్నది అమెరికా దురాశ. అది సాధ్యం కాదని ఐరోపాలోని ధనిక దేశాలకు ఇంతకు ముందే తెలుసు కనుక వైరుధ్యాలను ఉపయోగించుకోవాలని అవి నిత్యం చూస్తుంటాయి.అమెరికా, ఐరోపా ధనిక దేశాలు తమ పధకంలో ఏ దేశాన్ని ఎక్కడ నిలిపి ఎలా లబ్ది పొందాలా అని నిరంతరాన్వేషణ సాగిస్తున్నాయి.
ఇప్పుడు ప్రపంచంలో ఇండోాపసిఫిక్‌ ప్రాంతం మీద కేంద్రీకరణ పెరిగింది. భూమి తన చుట్టుతాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది ప్రకృతి. అమెరికా అన్ని దేశాలనూ తన చుట్టూతిప్పుకోవాలనుకుంటుంది, అది వికృతి. తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడని చైనా నిరూపించింది. అతి పెద్ద దేశంలో ప్రవేశించి అక్కడి మార్కెట్‌ను కొల్లగొట్టాలన్నది అమెరికా, ఐరోపా ధనిక దేశాల ఆకాంక్ష. తమ దగ్గర లేని సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను బయటి నుంచి తెచ్చుకొని తాము అభివృద్ధి చెందాలన్నది చైనా కమ్యూనిస్టుల లక్ష్యం. నాలుగుదశాబ్దాల ఈ పయనంలో చైనా కమ్యూనిస్టులే పైచేయి సాధించారు. ఎంతగా అంటే ఆర్ధికంగా అమెరికాను అధిగమించి పోయేంతగా అని వేరే చెప్పనవసరం లేదు. అందుకే దాన్ని అడ్డుకొనేందుకు ఎన్నో పధకాలు.


తన ఆర్ధిక, మిలిటరీ శక్తిని ఉపయోగించి మన దేశంతో సహా అనేక దేశాలను చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలన్నది దాని పధకం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచిన తరువాత అమెరికా కొంత మేరకు సఫలీకృతమైంది.దానిలో భాగమే గతేడాది జరిగిన లడఖ్‌, అంతకు ముందు సంభవించిన డోక్లాం పరిణామాలు. భూటాన్‌-చైనా మధ్య వివాదంగా ఉన్న ప్రాంతంలో చైనా రోడ్డు వేయకూడదని మన దేశం వెళ్లి అడ్డుకుంది. మన ప్రాంతాలను చైనా ఆక్రమించలేదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పినప్పటికీ లడఖ్‌ ప్రాంతంలో రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి.చైనాకు వ్యతిరేకంగా చతుష్టయం పేరుతో అమెరికా-జపాన్‌-ఆస్ట్రేలియాలతో మన దేశం జట్టుకట్టి బస్తీమే సవాల్‌ అంటున్నాయి.ఈ గుంపులోకి ఐరోపా ధనిక దేశాలను కూడా లాగాలని చూస్తున్నాయి. పశ్చిమ దేశాలు అనుకున్న, వేసిన పధకం సఫలం కావాలంటే కాగితాల మీద గీతలు గీసినంత సులువు కాదు. ముందుగా చైనా వస్తువుల మీద ధనిక దేశాలు ఆధారపడటం మానుకోవాలి. అంటే వాటికి చౌకగా వస్తువులను తయారు చేసి సరఫరా చేసే ప్రత్యామ్నాయ దేశాలు కావాలి. మన దేశంలో చౌకగా దొరికే మానవశక్తి ఉంది, పశ్చిమ దేశాల వస్తువులకు అవసరమైన మార్కెట్టూ ఉంది. అందుకే మన దేశాన్ని, ఎవరు గద్దెమీద ఉంటే వారిని ఇంద్రుడూ చంద్రుడూ అంటూ పొగుడుతున్నాయి. సమీప భవిష్యత్‌లో మనం ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఎవరూ అనుకోవటం లేదు.


వివిధ పరిణామాలను ఒక దగ్గరకు చేర్చి చూస్తే దారులన్నీ రోమ్‌కే అన్నట్లుగా ప్రస్తుతానికి ప్రయత్నాలన్నీ చైనాకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. గతంలో బ్రిటన్‌-జపాన్‌-ఫ్రాన్స్‌ -స్పెయిన్‌- ఇటలీ-జర్మనీ చరిత్రను చూసినపుడు ప్రపంచాన్ని పంచుకొనేందుకు వాటి మధ్య వచ్చిన పంచాయతీలే అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు దారి తీశాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కకు నెట్టి అమెరికా ముందుకు వచ్చి అదే చేస్తోంది.చైనా మార్కెట్లో వాటికి ప్రవేశం కల్పిస్తే, చైనా తమకు పోటీ ఇవ్వకుండా ఉంటే అసలు పేచీయే లేదు. అది జరగటం లేదు గనుకనే ఏదో ఒక గిల్లికజ్జా పెట్టుకుంటున్నాయి. చైనాకు పోటీగా మన దేశాన్ని వినియోగించుకోవాలని చూసిన పశ్చిమ దేశాలు తీవ్ర ఆశాభంగం చెందాయి. దాని దరిదాపుల్లో కూడా మనం లేకపోవటంతో చైనాతో విధిలేక ముద్దులాట-దెబ్బలాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మన ప్రధాన బలహీనత జిడిపిలో 14శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో 50శాతం మంది ఉపాధిపొందుతున్నారు.అరవైశాతంగా ఉన్న సేవారంగం 28శాతం మందికే ఉపాధి చూపగలుగుతోంది.

లాహిరి లాహిరిలో అన్నట్లుగా చైనా అధినేత గ్జీ జింపింగ్‌ ా మన నరేంద్రమోడీ వ్యవహరించిన తీరును మనం చూశాము. అలాంటిది ఆకస్మికంగా గాల్వన్‌లోయ ఉదంతాలకు ఎందుకు దారి తీసింది ? చైనా మన ప్రాంతాలను ఆక్రమించుకోలేదని ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశంలో చెప్పిన తరువాత సరిహద్దుల్లో జరిగిన ఉదంతాల గురించి పరిపరి విధాల ఆలోచనలు ముందుకు వచ్చాయి. చైనాతో వచ్చిన లేదా తెచ్చుకున్న సరిహద్దు వివాద అసలు లక్ష్యం ఏమిటి ?తెరవెనుక పాత్రధారులు, వారేం చేస్తున్నదీ మనకు కనిపించదు,వినిపించదు. తెర ముందు జరిగే వాటిని బట్టి నిర్దారణకు వస్తే తప్పులో కాలేస్తాము. చైనాతో సరిహద్దు వివాదం రాజకీయంగా నరేంద్రమోడీ పుట్టక ముందునుంచీ ఉంది.1962 తరువాత కొత్తగా మన భూభాగం చైనా ఆధీనంలోకి వెళ్లలేదని మోడీ సర్కారే పార్లమెంటులో కూడా చెప్పింది. మన పాలకులు చెబుతున్నట్లుగా సరిహద్దుల్లో చైనా కవ్వించిందనే అనుకుందాం. చర్చల ద్వారా అనేక అంశాలను పరిష్కరించుకుంటున్న మనం ఆ మార్గాన్ని ఎందుకు ఎందుకు ఎంచుకోలేదు ? కాసేపు పక్కన పెడదాం.

ఇరాన్‌తో మనకు గోడ-నీడ పంచాయతీల్లేవే. (ఇష్టం లేకపోతే నీ స్ధలమే గావచ్చు గోడ ఎత్తుగా కట్టావు, దాని నీడ మా ఇంటి మీద పడుతోందని గిల్లికజ్జా) ఇప్పుడు ఇరాన్‌-చైనా మధ్య ఏర్పడిన బంధం మన దేశానికి తలనొప్పిగా మారిందని, కొత్త సవాళ్లను ముందుకు తెచ్చిందని సంఘపరివార్‌ పత్రిక ఆర్గనైజర్‌ మాజీ సంపాదకుడు శేషాద్రి చారి పేర్కొన్నారు. తలనొప్పి స్వయంగా నరేంద్రమోడీ తెచ్చింది తప్ప మరొకటి కాదు. శేషాద్రి ముందుకు తెచ్చిన అంశాల సారాంశాన్ని చూద్దాం. ఇరాన్‌ మీద విధించిన ఆంక్షలను తొలగించే చిన్నపాటి సూచనలు కూడా అమెరికా నుంచి వెలువడని సమయంలో పాతికేండ్ల పాటు అమల్లో ఉండే 400 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని ఇరాన్‌తో చైనా కుదుర్చుకుంది.హార్ముజ్‌ జలసంధిలో కీలక స్ధానంలో ఉన్న బందర్‌ అబ్బాస్‌ రేవు ద్వారానే మన దేశానికి గరిష్టంగా సరకు రవాణా జరుగుతోంది.అమెరికా ఆంక్షల కారణంగా మన దేశానికి దాన్ని మూసివేసినందున మన రవాణా ఖర్చులు అనేక రెట్లు పెరుగుతున్నాయి.చమురు సరఫరాలు నిలిచిపోయిన కారణంగా ధరలు పెరిగిపోయి వాణిజ్యలోటులో సమస్యలు వస్తున్నాయి. అరవై రోజుల వరకు అరువు సౌకర్యం, ఆకర్షణీయమైన రాయితీలు, రూపాయి చెల్లింపులను అంగీకరించటం వంటివి ఇరాన్‌తో మనకున్న సానుకూల అంశాలలో కొన్ని మాత్రమే. ఇవన్నీ పోవటం మన వ్యూహాత్మక, రక్షణ ప్రయోజనాలకు వ్యతిరేకం. మధ్య ఆసియా దేశాలతో మన వాణిజ్యానికి ఇరాన్‌ ముఖద్వారం. పాకిస్ధాన్‌తో నిమిత్తం లేకుండా చబ్బార్‌ రేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించేందుకు ఉపయోగపడుతుంది. తుర్కుమెనిస్దాన్‌-ఆఫ్ఘనిస్దాన్‌-పాకిస్దాన్‌-భారత్‌ చమురు పైప్‌లైన్‌ మన ఇంధన భద్రతకు అవసరం. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇరాన్‌ సహకారం లేకుండా సాధ్యం కాదు, అందువలన ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేతకు మన దేశం అమెరికాను ఒప్పించాల్సి ఉందని శేషాద్రి చారి చెప్పారు. ఆ పెద్దమనిషి చైనా వ్యతిరేకి అని వేరే చెప్పనవసరం లేదు. అయినా నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరిని ఎందుకు తప్పు పడుతున్నట్లు ? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.అమెరికాను నమ్ముకొని మోడీ ఇరుగు పొరుగు దేశాలను చైనా వైపు వెళ్లేట్లు నెడుతున్నారన్నది అసలు దుగ్ద. చైనాతో సరిహద్దు వివాదం ఉంది గనుక మన లడఖ్‌లో ప్రతాపం చూపాము అనుకుంటే అర్ధం ఉంది. మరి ఇరాన్‌ను ఎందుకు దూరం చేసుకుంటున్నాము ? అమెరికా కౌగిలింతలతో మునిగి తేలుతూ ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు నిలిపివేశాము.


ఇరాన్‌తో చైనా ఒప్పందం కేవలం దానికి అవసరమైన చమురు కోసమే అనుకుంటే పొరపాటు. అమెరికా ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న ఇరాన్‌ ఆర్దిక వ్యవస్ధను ఆదుకోవటం కూడా దానిలో కీలక అంశం. ప్రపంచాన్ని ఆక్రమించాలని చూస్తున్న అమెరికాను కట్టడి చేసే మధ్య ప్రాచర్య వ్యూహంలో భాగం అది. ఇండో-పసిఫిక్‌ వ్యూహం పేరుతో చైనాను దెబ్బతీసేందుకు భారత్‌-జపాన్‌-ఆస్ట్రేలియాలను ఇప్పటికే అమెరికా ఒక దగ్గరకు చేర్చింది. దానికి ప్రతిగా చైనా తన ఎత్తుగడలను రూపొందించుకొంటోంది. రానున్న రోజుల్లో మధ్య ప్రాచ్యం అగ్రదేశాల అధికార పోరుకు వేదిక కానుందన్నది చైనా అంచనా.అందుకే ఆప్రాంతంతో పాటు ఆఫ్రికాలో కూడా చైనా వ్యూహాన్ని అమలు చేస్తూ అనేక దేశాలతో ఒప్పందాలతో ముందుకు పోతున్నది. పశ్చిమాసియాలో షియా-సున్నీ విభేదాలను ఉపయోగించుకొని అమెరికా రాజకీయం చేస్తుంటే చైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది.సున్నీలు మెజారిటీగా ఉన్న సౌదీ అరేబియా-షియాలు మెజారిటీగాఉన్న ఇరాన్‌తోనూ సత్సంబంధాలను కలిగి ఉంది. రెండు దేశాల నుంచీ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నది. అమెరికాను ఎదుర్కొనే ఎత్తుగడలో భాగంగా రష్యా కూడా తన పావులు కదుపుతున్నది. 2019లో చైనా-రష్యా-ఇరాన్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు అమెరికాకు ఒక హెచ్చరిక తప్ప మరొకటి కాదు.


వర్దమాన దేశాలు తమలో తాము సహకరించుకోవటం ద్వారా అభివృద్ధి పొందాలి తప్ప సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి బాగుపడదామనుకుంటే జరిగేది కాదన్నది ఇప్పటి వరకు ప్రపంచ అనుభవం. మన సంబంధాలు అమెరికా, జపాన్‌ వంటి దేశాలతో ఈ గీటురాయితోనే సరి చూసుకోవాలి. ఒకవైపు బ్రెజిల్‌, రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్‌) ఒక కూటమిగా సహకరించుకోవాలని సంకల్పం చెప్పుకున్నాయి. మరోవైపు మన దేశం చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జతకడుతుంది. అలాంటపుడు ఈ కూటమి దేశాల మధ్య విశ్వాసం ఎలా ఉంటుంది, సహకారానికి ఎలా దారి చూపుతుంది ? అందుకే ముందుకు పోవటం లేదు. చతుష్టయంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపిన ఆస్ట్రేలియా, జపాన్‌ మరోవైపు అమెరికా వ్యతిరేకించే ఆర్‌సిఇపి కూటమిలో చైనాతో చేతులు కలుపుతాయి.అమెరికా బెదిరింపులను కూడా ఖాతరు చేయకుండా చైనాతో ఒప్పందాలు చేసుకున్న ఐరోపాధనిక దేశాలు మరోవైపున ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో జట్టుకట్టేందుకు ఆసక్తి చూపుతాయి. అమెరికా రెచ్చగొట్టగానే చైనాతో తాడోపేడో తేల్చుకుంటామన్న మన నరేంద్రమోడీ సర్కార్‌ మరోవైపు దానితో చర్చల ప్రక్రియ సాగిస్తోంది.బాలాకోట్‌ దాడులతో పాక్‌ను దెబ్బతీశామని ప్రకటించిన మన దేశం తెరవెనుక వారితో 2018 నుంచే సంప్రదింపులు జరుపుతున్నట్లు బయటపడింది. రెండు దేశాలూ సఖ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవలనే నాటకీయంగా ప్రకటన చేశాయి. ఆట మనకై మనమే ఆడుతున్నామా లేక ఎవరైనా ఆడించినట్లు ఆడుతున్నామా ?

ప్రపంచీకరణను ముందుకు తెచ్చింది అమెరికా, ఐరోపా అగ్రరాజ్యాలు. మనవంటి వర్ధమాన, పేద దేశాలను దానిలోకి లాగిందీ అవే. దశాబ్దాల పాటు చైనాను ప్రపంచీకరణలో భాగస్వామిని చేసేందుకు నిరాకరించాయి. తీరా ఇప్పుడు ప్రపంచీకరణకు భిన్నమైన చర్యలు తీసుకుంటున్నదీ దాన్ని ప్రారంభించిన దేశాలే. నిజమైన ప్రపంచీకరణ స్ఫూర్తిని పాటించాలని చైనా డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పరిణామాల్లో ఎంత మార్పు ? ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్ధ వంటి వాటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా తన సంగతి తాను చూసుకుంటోంది. మనవంటి దేశాలను తన అజెండాకు అనుగుణ్యంగా నడవమంటోంది, బెదిరిస్తోంది.(ఇరాన్‌ చమురు కొనవద్దని ఆదేశించటం పక్కా నిదర్శనం). రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రపంచీకరణ ద్వారా తన మార్కెట్‌ను పెంచుకోవాలన్నది ధనిక దేశాల ఎత్తుగడ. అవి అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి.


మనలను ప్రధాన భాగస్వామి అని చెబుతున్న అమెరికన్లు పాకిస్ధాన్‌కూ అదే చెబుతున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు గానీ అమెరికా చెరొక చంకలో ఇమ్రాన్‌ ఖాన్ను, నరేంద్రమోడీని ఎక్కించుకుంటున్నట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాను నమ్ముకొని చైనాతో శతృత్వం పెంచుకుంటే నష్టం మనకే. పశ్చిమాసియా, మధ్య ఆసియాలో అమెరికా ప్రయోజనాల రక్షణకు, ఇరాన్‌కు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ అవసరం. అందుకే మనలను మాయపుచ్చటానికి ఎన్ని కబుర్లు చెప్పినా చేయాల్సింది చేస్తోంది. పాక్‌తో సయోధ్యకు మన మెడలు వంచుతోంది. మనం లొంగిపోయామనే అంచనాకు వచ్చిన కారణంగానే వాణిజ్యం, దిగుమతుల విషయంలో సానుకూల ప్రకటన చేసిన పాకిస్ధాన్‌ మరుసటి రోజే అబ్బెబ్బె అదేం లేదంటూ మాట మార్చింది. ఎఫ్‌ -16 విమానాలను తెచ్చుకున్నాం గనుక తాడో పేడో తేల్చుకుందాం అన్నా ఆశ్చర్యం లేదు.


ఒక స్వతంత్ర విదేశాంగ విధానం లేనట్లయితే మనం ఎటువైపు ఉండాలో తేల్చుకోలేము.గతంలో నెహ్రూ, కాంగ్రెస్‌ హయాంలో సోవియట్‌కు అనుకూలంగా ఉండి భారీ పరిశ్రమలు, ఇప్పుడు అనేక విజయాలు సాధిస్తున్న అంతరిక్ష రంగానికి అవసరమైన వాటిని సాధించుకున్నాము. ఇప్పుడు అమెరికాకు అనుకూలంగా మారి చెప్పుకొనేందుకు సాధించింది ఏమైనా ఉందా ? లేకపోగా చుట్టుపక్కల వారినందరినీ దూరం చేసుకున్నాము. పాకిస్ధాన్‌, చైనాతో శతృత్వం పెంచుకుంటున్నాము. దాని ద్వారా ఆయుధాలు అమ్ముకుంటున్న అమెరికా తప్ప మనకు కలిగిన లబ్ది ఏమిటో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కరుడు గట్టిన నేరగాండ్లు, మాఫియా ముఠాలు కొత్త వారికి ఎరలు వేసి ఆకర్షిస్తారు. మెల్లగా వారికి తెలియకుండానే చిన్నపాటి నేరాలు చేయించి తమ బందీలుగా చేసుకుంటారు. తరువాత వారు చెప్పినట్లు చేయక తప్పని స్ధితిని కల్పిస్తారు. అమెరికా, ఇతర అగ్రదేశాలు కూడా అంతే ! ఈ అంశాన్ని మన పాలకులు గుర్తిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మిలిటరీ కుట్రలు – ఐరోపా,అమెరికన్ల ద్వంద్వ ప్రమాణాలు !

31 Wednesday Mar 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

2021 Myanmar coup d'état, Aung San Suu Kyi, Myanmar’s Military Coup, US double standards on coups


ఎం కోటేశ్వరరావు


మార్చి 27న మన పొరుగు దేశమైన మయన్మార్‌లో దేశ వ్యాపితంగా మిలిటరీ జరిపిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించారు. ఆ దుశ్చర్యను యావత్‌ సమాజం ఖండిస్తోంది, నిరసిస్తోంది. గత ఏడాది నవంబరు పార్లమెంటరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరి ఒకటవ తేదీ ఏడాది పాటు అత్యవసర పరిస్ధితిని ప్రకటించి మయన్మార్‌ మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్దంలో 76 సంవత్సరాల క్రితం జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా మార్చి 27న మయన్మార్‌ సాయుధ దళాల ప్రతిఘటన ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ రోజున సాయుధ దళాల దినోత్సవం జరుపుతున్నారు. అదే రోజున నిరసనకారుల మీద జరిపిన కాల్పుల్లో 90 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సంఖ్య 114 అని, ఇంకా ఎక్కువ ఉండవచ్చని కూడా చెబుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొత్తం మరణించిన వారు 510 మంది అని కొందరి లెక్క. మిలిటరీ చర్యల మీద యావత్‌ ప్రపంచంలో నిరసన వ్యక్తమైంది. ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది. ప్రపంచంలో మిలిటరీ అధికారానికి వచ్చిన చోటల్లా మానవహక్కుల ఉల్లంఘన, ప్రాణనష్టం పెద్ద జరుగుతున్నది. అమెరికా దాని మిత్రపక్షాలుగా ఉన్న ఐరోపా, మరికొన్ని దేశాలు మయన్మార్‌పై ఆంక్షలను ప్రకటించాయి.


ఒక దేశ అంతర్గత వ్యవహారాలు, పరిణామాలపై ఎంత వరకు స్పందించాలి, ఎంత మేరకు జోక్యం చేసుకోవాలి అన్నది ఒక ఎడతెగని, ఏకీభావం కుదరని సమస్య. ఇలాంటి సమస్యలు తలెత్తిన దేశాలన్నింటి పట్ల అన్ని దేశాలూ ఒకే వైఖరి తీసుకుంటే అసలు ఇలాంటి పరిణామాలు తలెత్తవు, ఒకవేళ జరిగినా మారణకాండకు అవకాశాలు పరిమితం.ఐక్య రాజ్యసమితి వంటి సంస్ధలు ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలను నివారించలేకపోతున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన పరిణామాల సమయంలోనే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. గతవారాంతంలో జరిగిన పరిణామాల తరువాత దౌత్య, సంబంధాలన్నింటినీ పక్కన పెట్టింది.హింసా కాండ భయానకంగా ఉందని అధ్యక్షుడు జో బైడెన్‌ వర్ణించారు. మిలిటరీ తిరుగుబాటు అయినా, దానికి ప్రజాప్రతిఘటన అయినా అది అంతర్గత సమస్యగానే పరిగణించాల్సి ఉంది. మరో దేశం జోక్యం చేసుకొనే పరిస్ధితి తలెత్తినపుడు ఒకవేళ జోక్యం చేసుకుంటే అది సమర్దనీయమా కాదా అన్న చర్చ జరుగుతుంది. మార్చినెల 26వ తేదీన బంగ్లాదేశ్‌ విముక్తి 50సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ తాను రాజకీయ జీవితం ప్రారంభించినపుడు బంగ్లా విముక్తికోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లినట్లు ప్రకటించారు.దానిలో నిజమెంత అనేది ఒక అంశమైతే పాకిస్ధాన్‌లో ఒక భాగమైన నేటి బంగ్లాదేశ్‌లో నాటి పాక్‌ నియంతల మారణకాండకు స్వస్తి పలికేందుకు మన దేశం సైనిక జోక్యం చేసుకున్నది.దాన్ని ఎందరో హర్షించినా, పాక్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు పూనుకుంది అనే పేరుతో మనలను బెదిరించేందుకు ముందుగానే అమెరికన్లు తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాతానికి దింపారు. అమెరికా చర్యను మాత్రం నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండించలేదు. అమెరికా దాడి చేస్తే రక్షణ కోసం ఆ రోజు మన దేశం నాటి సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంది. జనసంఘం బంగ్లాదేశ్‌కు మద్దతు పేరుతో ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసింది తప్ప నిజానికి బంగ్లా మీద ప్రేమతో కాదు. ఏది ఏమైనా నాటి జోక్యం సరైనదే, అందువలన ప్రతి జోక్యాన్ని తప్పు పట్టలేము, అలాగని ప్రతి ప్రత్యక్ష, పరోక్ష జోక్యాన్ని సమర్ధించకూడదు. దేనికి దాన్నే విడిగా విచక్షణగా చూడాలి.


తాజా విషయాలకు వస్తే మయన్మార్‌ పరిణామాలపై అన్ని దేశాలూ ఒకే విధంగా స్పందించటం లేదు. మార్చి 27న మయన్మార్‌ మిలిటరీ దినోత్సవంలో పాల్గొని మన దేశంతో సహా ఎనిమిది దేశాల ప్రతినిధులు హాజరై సామాన్యుల రక్తంతో తడిచిన మిలిటరీ అధికారుల చేతులతో కరచాలనం చేశారు. పాకిస్ధాన్‌, రష్యా, చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం, లావోస్‌, థారులాండ్‌ ప్రతినిధులు కూడా వారిలో ఉన్నారు. మన సంఘపరివార్‌ సంస్దలు చెబుతున్నదాని ప్రకారం ఈ దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు కనుక వెళ్లారని కాసేపు అనుకుందాం, మరి మన ప్రధాని మన ప్రతినిధిని ఎందుకు పంపినట్లు ? ముందే చెప్పుకున్నట్లు తాను పాక్‌ మిలిటరీ నియంత్రత్వానికి వ్యతిరేకంగా జరిగిన బంగ్లా విముక్తి ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రకటనకూ దీనికీ పొంతన కుదరటం లేదు. ఒక చోట మానవహక్కులను హరించటాన్ని ఖండిస్తారు-మరోచోట హరిస్తున్నవారితో కరచాలనం చేస్తారా ? ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు ? మయన్మార్‌ విషయంలో సత్యాగ్రహం చేయకపోయినా ఖండన ప్రకటన ఎందుకు చేయలేదంటే ఏమి చెబుతారు ? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే భారత్‌ మా రక్తంతో తడిచిన మిలిటరీతో కరచాలనం చేసేందుకు తన ప్రతినిధిని ఎందుకు పంపింది అని మయన్మార్‌ ప్రజాస్వామిక వాదులు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించారు. చైనాను కూడా వారే అదే ప్రశ్న వేయవచ్చు. ఆంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి ఎంపీల కమిటీ కూడా భారత చర్యను ప్రశ్నించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మన దేశం కూడా సభ్యురాలే అయినప్పటికీ ఇంతవరకు హింసాకాండను ఖండించలేదు.ప్రస్తుతం మన దేశం భద్రతా మండలి సభ్యురాలిగా ఉండి,పొరుగుదేశం గురించి ఏమి చేసింది అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమివ్వాలా లేదా ?


దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్టవేస్తామంటూ బయలు దేరిన చతుష్టయ దేశాలలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి సాధారణ పరిస్ధితుల పునరుద్దరణ జరగాలని మన దేశం కోరింది. మరి మిగిలిన మూడూ మయన్మార్‌ మీద ఆంక్షలను విధించాలని అంటుంటే మన దేశం మౌనంగా ఉంది, అంగీకరించటం లేదు. మయన్మార్‌లో పరిణామాలు అంతర్గత విషయాలని చైనా, రష్యా బహిరంగంగానే ప్రకటించాయి. మయన్మార్‌లో మిలిటరీ చర్యలకు నిరసనగా ఆంక్షలను కఠినంగా అమలు జరుపుతామని ప్రకటించింది అమెరికా, దాని నాయకత్వంలో ఐరోపా పశ్చిమ దేశాలు అన్నది తెలిసిందే. ఆంక్షల వలన ఫలితం లేదని మన దేశం ఇప్పటికే ఈ దేశాలన్నింటికీ మన దూతల ద్వారా తెలిపింది.


మయన్మార్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగితే అక్కడి జనం వాటి సంగతి చూసుకుంటారు. మిలిటరీ జోక్యం చేసుకోవటాన్ని ఎవరూ హర్షించరు, ఖండించాల్సిందే. కానీ ఆంక్షలు విధించటానికి అమెరికా, పశ్చిమ దేశాలకు ఉన్న హక్కేమిటి ? ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన ప్రతి ఉదంతంలోనూ అదే విధంగా ప్రవర్తిస్తే పోనీ అదొక తీరు. అనేక దేశాల్లో వారే స్వయంగా మిలిటరీ నియంతలను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించటమే కాదు, పెద్ద సంఖ్యలో పౌరుల పాణాలను బలిగొన్న రక్త చరిత్ర మన కళ్ల ముందు ఉంది. తమ ప్రయోజనాలను ప్రపంచ ప్రయోజనాలుగా చిత్రించటంలో పశ్చిమ దేశాలు, వాటికి మద్దతు ఇచ్చే మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోశాడనే పేరుతో అమెరికా తదితర దేశాలు జోక్యం చేసుకొని సద్దాంతో సహా లక్షలాది మంది సామాన్య పౌరులను హత్య చేశారు. తరువాత అబ్బే ఎలాంటి మారణాయుధాల ఆనవాళ్లు లేవని అదే అమెరికా ప్రకటించింది. యెమెన్‌లో ప్రభుత్వం-దాన్ని వ్యతిరేకించే శక్తుల మధ్య అంతర్యుద్దం జరుగుతోంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అక్కడి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయి. సౌదీ అరేబియాను తమ ప్రతినిధిగా నియమించి దాడులు చేయిస్తున్నాయి. వేలాది మందిని హతమార్చాయి. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద మూకలను రెచ్చగొట్టి ఆయుధాలు అందించి అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈజిప్టులో 2013లో జనరల్‌ శిసి తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేశాడు.దానికి నిరసనగా పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మహమ్మద్‌ మోర్సీ మద్దతుదారులు రాజధాని కైరోలో నిరసన తెలుపుతున్న సమయంలో మిలిటరీ విరుచుకుపడి మారణకాండ సాగించింది.ఆధునిక చరిత్రలో అత్యంత దారుణమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతున్న రబ్బా చౌక్‌ మారణకాండ గురించి తెలిసిందే. 2013 ఆగస్టు 14న రబ్బాతో పాటు మరొక ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య వెయ్యి నుంచి రెండువేల ఆరువందల వరకు ఉంది.గాయపడిన వారు కొన్నివేల మంది ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు వేలాది మందిని హత్య చేశారు, తప్పుడు కేసులు పెట్టి ఉరితీశారు. డెబ్బయి వేల మంది రాజకీయ ఖైదీల కోసం 23 జైళ్లను ప్రత్యేకంగా నిర్మించిన అపర ప్రజాస్వామిక మిలిటరీ నియంతను బలపరించిది అమెరికా. అలాంటి నిరంకుశ పాలకుల చేతిలో జనం ఎంతో సుఖవంతంగా ఉన్నారంటూ టైమ్‌ వంటి పత్రికలు రాతలు రాశాయి. ఇప్పటికీ జనరల్‌ శశి నిరంకుశపాలన కింద ఈజిప్టు మగ్గిపోతూనే ఉంది. తమ తొత్తుగా ఉన్న కారణంగానే అమెరికా అన్ని రకాల మద్దతు ఇస్తోందన్నది స్పష్టం. ఎలాంటి ఆంక్షలు లేవు, ఎందుకని ? ఇది ద్వంద్వప్రమాణం కాదా ? తమకు అనుకూలంగా ఉండే మిలిటరీ పట్ల ఒక వైఖరి, లేని వారి పట్ల భిన్న వైఖరి.


అమెరికన్లు తమకు నచ్చని లేదా లొంగని పాలకులను తొలగించేందుకు చేసిన కుట్రలకు అంతే లేదు. ప్రతి ఖండంలో అలాంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. 1946 నుంచి 2000 సంవత్సరం వరకు కనీసం 81దేశాలలో పాలకులను మార్పు చేసేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. మిలిటరీ నియంతలను సమర్ధించింది, నియంతలుగా మారిన వారిని ప్రోత్సహించింది. బొలీవియాలో జరిగిన ఎన్నికల్లో ఇవో మోరెల్స్‌ విజయం సాధిస్తే అక్రమాలతో గెలిచారంటూ అక్కడి పోలీసు, మిలిటరీ తిరుగుబాటు చేసి మోరెల్స్‌, ఇతర నేతలను దేశం నుంచి బయటకు పంపారు. ఆ దుర్మార్గాన్ని అమెరికా నిస్సిగ్గుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు సమర్దించాయి. ఎలాంటి ఆంక్షలు విధించకపోగా అన్ని రకాలుగా సాయం చేశాయి. వెనెజులాలో ఎన్నికైన ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి తమ తొత్తును పాలకుడిగా గుర్తించాయి. అందువలన మయన్మార్‌లో ఆంక్షలు విధించటానికి వారికి ఉన్న అర్హత, హక్కేమిటి ? అమెరికా చర్యలను గనుక సమర్ధిస్తే లాటిన్‌ అమెరికాలో తమను వ్యతిరేకించే శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోట ఆదే సాకుతో ప్రభుత్వాలను కూలదోస్తారు.
ప్రపంచ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంతో పాటు అనేక ఇతర అంశాలూ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. మయన్మార్‌ విషయానికి వస్తే అక్కడి నియంతల తీరుతెన్నులు ఒక పట్టాన అంతుబట్టవు. ప్రపంచ వ్యాపితంగా ప్రతి మిలిటరీ నియంత అమెరికా మద్దతు పొందిన వాడే. ఇక్కడ నియంతలను మాత్రం అమెరికా వ్యతిరేకిస్తోంది.మిలిటరీ నియమించిన మంత్రుల్లో కొంత మంది గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారున్నారు కనుక చైనాకు మిలిటరీ అనుకూలం అనే విధంగా కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. మిలిటరీ పాలనకు మద్దతుగా చైనా ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. 2015 ఎన్నికల్లోనే అంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి పార్టీ పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చింది. గడచిన ఐదు సంవత్సరాలలో ఆ ప్రభుత్వం చైనాతో సన్నిహితంగానే మెలిగింది తప్ప మరొక విధంగా వ్యవహరించలేదు. గతేడాది ఎన్నికల్లో అదే పార్టీ తిరిగి విజయం సాధించింది. మిలిటరీ తిరుగుబాటుకు కొద్ది రోజుల ముందు ఈ ఏడాది జనవరిలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఉన్నత స్దాయి ప్రతినిధి వర్గంతో మయన్మార్‌ పర్యటనకు వచ్చి సూకీతో భేటీ కావటం, ప్రభుత్వంతో ఆర్దిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులు అక్కడ ఉన్నందున శాంతియుత వాతావరణం ఉండాలనే కోరుకుంటుంది తప్ప మరొకటి కాదు.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ కార్యక్రమంలో మయన్మార్‌ కూడా ఉంది. అక్కడ మిలిటరీ అధికారాన్ని చేపట్టిన నేపధ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షలు ప్రకటించాయి. అందువలన అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే చైనా ఒప్పందాలు ఉన్నాయి గనుక మిలిటరీ పాలకులు అయినా మరొకరైనా ఉనికికోసం పెట్టుబడుల గురించి చైనా మీద ఆధారపడక తప్పదు. ఆ కారణంగానే గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారిని మంత్రులుగా నియమించి ఉండవచ్చు.చైనా కూడా మిలిటరీ చర్యలు అంతర్గత వ్యవహారమని భావిస్తున్నందున మన వైఖరిని ప్రశ్నిస్తున్నట్లుగానే బర్మీయులు చైనా వైఖరిని కూడా ప్రశ్నించవచ్చు. మయన్మార్‌ మిలిటరీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో ఒక పట్టాన అంతుపట్టదు. అంగ్‌సాన్‌ సూకీ తండ్రి అంగ్‌సాన్‌ బర్మా స్వాతంత్య్రసమర యోధుడు, సోషలిస్టు, కమ్యూనిస్టు.జపాన్‌ దురాక్రమణ నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. అప్పటికే పక్కనే ఉన్న చైనాలో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపధ్యంలో అంగ్‌సాన్‌ నాయకత్వంలో బర్మా కూడా కమ్యూనిస్టు దేశంగా మారుతుందనే భయంతో బ్రిటీష్‌ వారు చేసిన కుట్రలో భాగంగా అంగ్‌సాన్‌ నాయకత్వంలోని మంత్రివర్గం మొత్తాన్ని హత్య చేశారు. మిలిటరీలోని కొందరు దీని వెనుక ఉన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన వారు అమెరికా, బ్రిటన్‌ ప్రోద్బలంతో చైనా చాంగ్‌కై షేక్‌ మిలిటరీకి బర్మాలో ఆశ్రయం కల్పించి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అస్దిరపరచేందుకు దాడులు చేయించిన చరిత్ర ఉంది. గత ఏడు దశాబ్దాలలో మయన్మార్‌లో మిలిటరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం నాలుగో వంతు మంది ఎంపీలు మిలిటరీ నియమించిన వారే, కీలకమైన శాఖల మంత్రులుగా కూడా వారే ఉంటారు. అదేమీ ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం కాదు. అంగ్‌సాన్‌ సూకీకి శాంతి నోబెల్‌ బహుమతి ఇచ్చారు. ఆమె పాలనలోనే రోహింగ్యా మైనారిటీలపై దాడులు, దేశం నుంచి తరిమివేయాటాలు జరిగాయి. ఇప్పుడు ఆమే బందీ అయ్యారు. అందువలన నిరంకుశ, అప్రజాస్వామిక చర్యలకు ఎవరు పాల్పడినా ఖండించాల్సిందే. తమ విముక్తి కోసం తోడ్పడిన దేశ ప్రతినిధిగా మన ప్రధానిని బంగ్లాదేశ్‌ ఆహ్వానించింది. కానీ అదే బంగ్లాదేశ్‌ నుంచి శరణార్దులుగా, దేశ విభజన సమయంలో వచ్చిన వారి పట్ల బిజెపి అనుసరించిన వైఖరికి నిరసనగా నరేంద్రమోడీ రాకను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసిస్తూ ప్రదర్శనలు, జనం మీద కాల్పులు, అనేక మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. అంతిమ నిర్ణేతలు ప్రజలే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరిహద్దు రక్షకులకు చలిదుస్తులు కూడా ఇవ్వలేని స్దితిలో ” దేశ రక్షకుడు ” మోడీ ఉన్నారా ?

11 Thursday Mar 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

#ladakh conflict, BJP anti China, India's biggest trade partner, Indo-China standoff, Indo-China trade, LAC, Ladakh, Narendra Modi, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మాటలు కోటలు దాటతాయి గాని చేతలు గడప దాటవు అన్న సామెత తెలిసిందే. ప్రపంచంలో ఏ మిలిటరీని అయినా ఎదిరించగల సురక్షితమైన (నరేంద్రమోడీ) చేతుల్లో దేశం ఉందని బిజెపి నేతలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. నిజమే అని జనం కూడా నమ్మారు.నమ్మినవారెపుడూ చెడ్డవారు కాదు. కానీ తాజాగా అమెరికా ఇండో-పసిఫిక్‌ కమాండర్‌ అడ్మిరల్‌ ఫిలిప్‌ డేవిడ్సన్‌ చెప్పినదాని ప్రకారం మంచుకొండల్లోని మన సైన్యానికి అవసరమైన చలిదుస్తులు కూడా అందించలేని స్దితిలో మన ప్రభుత్వం ఉందన్న అనుమానం కలుగుతోంది. చలి దుస్తులు, మంచులో ధరించాల్సిన పరికరాలు, కళ్లద్దాలు, బూట్లు, ఆహార కొరత ఉన్నట్లు కాగ్‌ కూడా తన నివేదికలో పేర్కొన్నది. దానిమీద రక్షణ మంత్రిత్వశాఖ వివరణ ఇస్తూ కాగ్‌ 2015-17 సంవత్సరాల వివరాల ప్రకారం అలా చెప్పిందని, ప్రధాన కార్యాలయాల్లో కొరత నిజమే గానీ రంగంలో ఉన్న సైనికులకు అందించామని పేర్కొన్నది. కానీ డేవిడ్స్‌న్‌ చెప్పింది గతేడాది ఉదంతం గురించి అన్నది గమనించాలి. అమెరికా నుంచి ఆయుధాలతో పాటు చివరకు దుస్తులను కూడా తెచ్చుకొనే దుస్దితిలో మన సర్కార్‌ ఉంది. నిజానికి అవి మనం తయారు చేసుకోలేనివి కాదు, సైనికులను చలికి వదలివేసే నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు.


అమెరికా పార్లమెంటరీ కమిటీ ముందు మార్చినెల తొమ్మిదిన హాజరై ముందుగానే తయారు చేసుకు వచ్చిన అంశాల ఆధారంగా మాట్లాడిన డేవిడ్స్‌న్‌ చెప్పిన వాటి సారాంశం ఇలా ఉంది.సరిహద్దు వివాదంలో భారత్‌కు అవసరమైన సమాచారం, చలి దుస్తులు, ఇతర సామగ్రిని అమెరికా అందించింది.ముందుకు వచ్చిన అనేక స్ధానాల నుంచి చైనా ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. సరిహద్దు ఘర్షణలకు చైనాయే కారణం.వివాదాస్పద సరిహద్దుల సమీపంలో నిర్మాణకార్యక్రమాలను చేపట్టిన చైనా దానికి మద్దతుగా దాదాపు 50వేల మంది సైన్యాన్ని దించింది. దానికి ప్రతిగా భారత్‌ కూడా సైన్యాన్ని మోహరించింది. ఇతరులతో సహకారం తమ స్వంత రక్షణ అవసరాలకే అని సరిహద్దు వివాదం భారతదేశ కళ్లు తెరిపించింది.ఇప్పటికీ భారత్‌ తమ అలీన వైఖరికి కట్టుబడి ఉన్నప్పటికీ అత్యంత సమీప కాలంలో చతుష్టయం(క్వాడ్‌ : అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌. ఈ కూటమిని చైనా తన వ్యతిరేక దుష్ట చతుష్టయంగా పరిగణిస్తోంది, పోటీగా తన అస్త్రాలను తీస్తోంది)లో మరింతగా భాగస్వామి అయ్యేందుకు అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా అమెరికా,జపాన్‌, ఆస్ట్రేలియాలకు ఇది కీలకమైన అవకాశం.భారత-అమెరికా సంబంధాలు, 21వ శతాబ్దిలో భాగస్వామ్యంలో ఎవరేమిటో నిర్వచించుకోవాల్సిన సమయం ఇదని భావిస్తున్నాను. సంబంధాలను మరింత సన్నిహితంగా మరియు గట్టిపరుచుకొనేందుకు ఒక చారిత్మ్రాక అవకాశాన్ని ముందుకు తెచ్చింది. ఇటీవలి కాలంలో రెండు దేశాలు పునాదుల వంటి మూడు ఒప్పందాలు చేసుకున్నాయి. మిలిటరీ సహకారాన్ని పెంచుకోవటం,అమెరికా నుంచి రక్షణ ఉత్పత్తుల కొనుగోలును భారత్‌ పెంచుకోవటం, అమెరికాతో కలసి సంయుక్త విన్యాసాల నిర్వహణ.భారతదేశంతో రక్షణ సంబంధాలు వ్యూహాత్మకంగా తప్పనిసరి.” అన్నారు.


ప్రపంచాన్ని తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని, తన కార్పొరేట్లకు యావత్‌ దేశాల మార్కెట్లను అప్పగించాలన్న అమెరికా వ్యూహత్మక ఎత్తుగడలో మన పాలకులు మన దేశాన్ని ఇరికించారన్నది డేవిడ్స్‌న్‌ చెప్పిన అంశాల సారం. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు అమెరికాను నమ్మి, దాని వెంట నడచి బాగుపడిన దేశం ఒక్కటైనా ఉందని ఎవరైనా చూపితే సంతోషం. సహకారం పేరుతో మన ఇరుగు పొరుగుదేశాలతో మనం లడాయి పెట్టుకొనేట్లు చేయటం, ఆ ముసుగులో తన ఆయుధాలను మనకు అంటగట్టటం, మన మిలిటరీలో చొరబడేందుకు సంయుక్త విన్యాసాల వంటివి నిర్వహించటం ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తాయో దేశభక్తులు(బిజెపి మార్కు కాదు) ఆలోచించటం అవసరం. ఈనెల 12న చతుష్టయ అంతర్జాల సమావేశం జరగనుండటం, ఆ తరువాత అమెరికా నూతన రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌ త్వరలో మన దేశాన్ని సందర్శించనున్న తరుణంలో డేవిడ్సన్‌ ఈ విషయాలను వివరించారు.అంతకు కొద్ది రోజుల ముందు అమెరికా రక్షణశాఖ విడుదల చేసిన ఒక మార్గదర్శక పత్రంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని, దాన్ని ఎదుర్కొనేందుకు భాగస్వాములతో కలసి పని చేయాలని పేర్కొన్నది. ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా తమ ముగ్గులోకి మనలను లాగే వైఖరిని అమెరికా కొనసాగిస్తూనే ఉందన్నది స్పష్టం. అందువలన పాత ప్రియుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు బ్రేకప్‌ చెప్పి(వదలివేసి) కొత్త ప్రియుడు జో బైడెన్‌ను కౌగలించుకొనే రోజు ఎంతో దూరంలో లేదని గ్రహించాలి.
అమెరికన్‌ కమాండర్‌ డేవిడ్స్‌న్‌ తమ పార్లమెంటరీ కమిటీకి ఈ విషయాలను చెప్పిన మరుసటి రోజే మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఏమి చెప్పింది ? చైనా అన్ని ప్రాంతాల నుంచి వెనక్కు పోలేదని డేవిడ్స్‌న్‌ చెప్పాడు. ఇది చైనా-మనకు తంపులు పెట్టే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.లడఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతం నుంచి పూర్తిగా సేనల ఉపసంహరణ పూర్తయిందని, మిగతా సమస్యలేవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు.


ట్రంపు కంపును మరింతగా పెంచాలనే జో బైడెన్‌ నిర్ణయించుకున్నారు. పాతికేండ్ల క్రితం చైనా ప్రభుత్వం పంచన్‌లామా నియామకం మత స్వేచ్చను దుర్వినియోగం చేయటమే అని బైడెన్‌ యంత్రాంగం తాజాగా ఒక ప్రకటన ద్వారా ట్రంప్‌ బూట్లలో దూరి నడవనున్నట్లు వెల్లడించింది. టిబెటన్‌ దలైలామా చైనా మీద విఫల తిరుగుబాటు చేసి 1959 మే 17న మన దేశానికి పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే. టిబెట్‌ బౌద్దమత చరిత్రను చూసినపుడు సంప్రదాయం ప్రకారం ఇద్దరూ వేర్వేరు ఆరామాలకు – తెగలకు అధిపతులు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వారు. ఒకరి అధికారాన్ని మరొకరు పరస్పరం గుర్తించుకుంటారు. అయితే దలైలామా తరువాత స్ధానం పంచన్‌లామాదిగా బౌద్దులు పరిగణిస్తారు. పదవ పంచన్‌ లామా 1989లో మరణించిన తరువాత ఎవరినీ నియమించలేదు. 1995లో దలైలామా ఒక ఐదేండ్ల బాలుడిని పదకొండవ పంచన్‌ లామాగా నియమించినట్లు ప్రకటించారు. దాన్ని టిబెట్‌ రాష్ట్ర ప్రభుత్వం, చైనా కేంద్ర ప్రభుత్వమూ గుర్తించలేదు. అతని స్దానంలో వేరొకరిని నియమించి, బాలుడిని, అతని కుటుంబాన్ని వేరే ప్రాంతంలో ఉంచారు. ప్రస్తుతం బాలుడు పెరిగి పెద్దవాడై డిగ్రీ చదువుకొని ఉద్యోగం చేస్తున్నట్లు చైనా పేర్కొన్నది తప్ప ఇతర వివరాలు తెలియవు. చైనా సర్కార్‌ నియమించిన పంచన్‌లామాను దలైలామా గుర్తించలేదు కనుక దలైలామాకు మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర దేశాలూ గుర్తించటం లేదు. మధ్యమధ్యలో ఆ వివాదాన్ని ముందుకు తెస్తూ రాజకీయాలు చేస్తుంటాయి. గతేడాది డిసెంబరులో ట్రంప్‌ (ఓడిపోయిన తరువాతే) చివరి రోజుల్లో టిబెట్‌లో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఒక బిల్లును చట్టంగా మారుస్తూ సంతకం చేశారు.


ప్రస్తుత పద్నాలుగవ దలైలామా 62 సంవత్సరాలుగా మన దేశంలోనే ఉన్నారు. అయినా ఆయన స్దానంలో టిబెట్‌లో ఎవరినీ నియమించలేదు. కొత్త దలైలామాను నియమించబోతున్నారంటూ రెచ్చగొట్టే వార్తలను రాయిస్తూ ఉంటారు. అమెరికాతో కలసి గోక్కోవటం మొదలు పెట్టిన తరువాత గత (కాంగ్రెస్‌, చివరికి అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా ) పాలకులు కావాలని విస్మరించిన ఈ అంశాన్ని అమెరికాతో పాటు ఎందుకు గోకకూడదనేే ఆలోచన మన మోడీ సర్కార్‌కూ వచ్చిందని వార్తలు వచ్చాయి. బహిరంగ ప్రకటన చేయలేదు గానీ చైనాను రెచ్చగొట్టే చర్యలన్నీ చేస్తోంది. తాజాగా గాల్వన్‌ లోయ ఉదంతాల్లో టిబెటన్‌ తిరుగుబాటుదార్లతో స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) పేరుతో ఏర్పాటు చేసిన అనధికార కిరాయి సాయుధ మూకను చైనీయుల మీదకు ఉసిగొల్పి పాపాంగాంగ్‌ సో సరస్సు దక్షిణ ప్రాంతంలో గతేడాది ఆగస్టులో కొన్ని కొండలను ఆక్రమించుకొనేందుకు పంపటం, ఆ ఉదంతంలో కొందరు మరణించటం తెలిసిందే.

చతుష్టయ సమావేశం సాధించేది ఏమిటి ?


చతుష్టయ కూటమి ఏర్పాటు వెనుక అమెరికా ఎత్తుగడ ఏమిటో వారెన్నడూ దాచుకోవటం లేదు. తెలిసి వారి వలలో చిక్కుకొనే వారి గురించే ఆలోచించాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనాను ఈ కూటమిలోని అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ముప్పుగా పరిగణించలేదు. ఇప్పుడు ముప్పు సిద్దాంతం లేదా భయాన్ని ముందుకు తెస్తున్నాయి. నాలుగు దశాబ్దాల్లో ఈ నాలుగు దేశాలూ చైనా నుంచి ఎంతో లబ్దిపొందాయి-అదే సమయంలో దాని ఎదుగుదలకూ దోహదం చేశాయి. ఎవరి ప్రయోజనం కోసం వారు వ్యవహరించారు. ఈ క్రమంలో మొత్తంగా తేలిందేమంటే చైనా అర్ధికంగా అమెరికానే సవాలు చేసే స్ధాయికి ఎదిగింది ? నాలుగు దేశాలు అనుసరించిన దివాలా కోరు విధానాలు చైనాతో పోటీపడలేకపోయాయి. ఇప్పుడు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా చైనా ముప్పును ముందుకు తెస్తున్నాయి. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో తెగేదాకా లాగేందుకు భయపడుతున్నాయి. ఇదే సమయంలో ఎవరికి వారు స్వంత ప్రయోజనాలకు పెద్దపీట వేసి చైనాతో బేరసారాలాడుతున్నాయి. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. అందరమూ ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తూనే దెబ్బలాట-ముద్దులాట మాదిరి మరోవైపు ఎవరి సంగతి వారు చూసుకుంటున్నారు.


నిజానికి చైనా నుంచి ముప్పు వచ్చేట్లయితే చతుష్టయ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే చైనా ప్రధాన భాగస్వామిగా ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం( ఆర్‌సిఇపి )లో జపాన్‌,ఆస్ట్రేలియా ఎందుకు చేరినట్లు ? మన దేశంతో సరిహద్దులు కలిగిన దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను పూర్తిగా పరిశీలించిన తరువాతే అనుమతి ఇవ్వాలని గత ఏడాది మన ప్రభుత్వం నిబంధనలను సవరించింది. అలాంటి పెట్టుబడులు పెట్టగలిగింది చైనా ఒక్కటే కనుక దాని పెట్టుబడులను అడ్డుకోవాలన్నది అసలు లక్ష్యం. తరువాత తత్వం బోధపడింది, చైనా పెట్టుబడులు రాకుండా గడవదు అని గమనించిన తరువాత ఆ నిబంధనలను సడలించి సమగ్రంగా పరిశీలించిన తరువాత కీలక రంగాలలో స్ధానికంగా చేయలేని వాటిని ఆమోదించవచ్చు అంటూ తలుపులు తెరిచారు. అంతకు ముందు మాత్రం పరిశీలించకుండా అనుమతించాలని ఎవరు కోరారు, ఎందుకు అనుమతించారు ? సమాధానం రాదు.


మన ఔషధ పరిశ్రమకు అవసరమైన ముడి సరకులు, కొంత మేరకు తయారైన దిగుమతులు చైనా నుంచి రాకుండా ప్రత్యామ్నాయం వెంటనే చూసుకొనే అవకాశం లేకనే ఆ పరిశ్రమ వత్తిడి మేరకు చైనా పెట్టుబడులకు ద్వారాలు తెరవటం వాస్తవం కాదా ? ఆసియా అభివృద్ది బ్యాంకు నుంచి అప్పులు తీసుకొని అమలు చేసే పధకాల్లో చైనా కంపెనీలు కూడా టెండర్లను దక్కించుకొనేందుకు అవకాశం ఉంటుంది. అసలు అప్పులు తీసుకోవటం మానుకోవచ్చుగా ? పైగా మోడీ ఏలుబడిలోకి వచ్చిన తరువాత అసలు బయటి నుంచి అప్పులే తీసుకోవటం లేదని తప్పుడు ప్రచారం ఒకటి. చైనా పెట్టుబడులు వస్తే దాని ముప్పు మనకు తొలిగినట్లుగానే భావించాలా ? అలాంటపుడు చతుష్టయంలో అమెరికాతో గొంతు కలిపి చైనా వ్యతిరేక ప్రగల్భాలు ఎందుకు ? చైనాతో సరిహద్దు వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకుంటామని ఇప్పుడు చెబుతున్నవారు సంఘర్షణ వరకు ఎందుకు తీసుకుపోయినట్లు ? అమెరికన్లకు చైనా మార్కెట్‌ను మరింతగా తెరిస్తే మిగిలిన మూడు దేశాలను దక్షిణ చైనా సముద్రంలో ముంచి అమెరికా తన దారి తాను చూసుకుంటుందనే జ్ఞానం ఆయా దేశాలకు ఉండవద్దా !

ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసి లబ్ది పొందింది అమెరికానా మిగిలిన సభ్యదేశాలా ? ఆ కూటమి తరువాత ఏ సభ్యదేశం మీద అయినా ఎవరైనా దాడి చేశారా ? ఆ పేరుతో ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకున్నది అమెరికా, అందుకు మూల్యం చెల్లించింది ఐరోపా దేశాలు కాదా ? 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి లేదా తాజా కరోనా కల్లోలం నుంచి నాటో కూటమి దేశాలను అమెరికా ఏమైనా ఆదుకోగలిగిందా ? లేనపుడు మనలను ముందుకు నెట్టి ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ఎత్తుగడలో మనం ఎందుకు పావులుగా మారాలి ? మనల్నే రక్షిస్తున్నామని ఒక వైపు అమెరికా డేవిడ్సన్‌ చెబుతుంటే మన నాయకత్వంలో ఏర్పడే ఆసియా నాటో కూటమి అమెరికా ఆయుధాలను ఆయా దేశాలతో కొనిపించే దళారీగా మారటం తప్ప ఎవరి నుంచి ఎవరిని రక్షిస్తుంది ? యుద్దానికి ఎందుకీ ఉత్సాహం ?
నాలుగు సంవత్సరాల పాటు తన దేశాన్ని ఎలా బాగు చేసుకుందామా అనే ఆలోచనకు బదులు చైనాను ఎలా నాశనం చేద్దాం లేదా దారికి తెచ్చుకుందాం అనే యావలో గడిపిన డోనాల్డ్‌ ట్రంప్‌ చివరికి అమెరికాను ఏమి చేసిందీ చూశాము.కరోనా నివారణలోను, దాని పర్యవసానంగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్ధను నిలపటంలోనూ ఘోరంగా విఫలమయ్యాడు.కరోనా మహమ్మారికి అత్యధిక మంది పౌరులను బలిచ్చిన దుష్టుడిగా చరిత్రకెక్కాడు.


చైనా వస్తువులను బహిష్కరించండి, చైనా పెట్టుబడులను బహిష్కరించండి, అసలు చైనానే బహిష్కరించండి అన్నట్లుగా గతేడాది సరిహద్దు ఉదంతాల తరువాత ఎంత పెద్ద రచ్చ చేశారో, ఎవరు చేశారో చెప్పనవసరం లేదు. జనానికి చైనాను వ్యతిరేకించటమే అసలైన దేశభక్తి అని నూరిపోశారు.మీడియా తన రేటింగులకోసం మరింతగా రెచ్చిపోయింది. మరోవైపు జరిగిందేమిటి 2020లో అమెరికాను రెండవ స్ధానానికి నెట్టి చైనాతో ప్రధమ స్ధానంలో వాణిజ్యలావాదేవీలను జరిపారు మన అపర దేశభక్తులని ఎంత మందికి తెలుసు.కరోనా కారణంగా మొత్తం దిగుమతులు తగ్గాయి, దానిలో భాగంగానే 2019లో ఉన్న 85.5 బిలియన్‌ డాలర్లకు చేరలేదు గానీ 77.7 బిలియన్‌ డాలర్లతో చైనా మన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా 2020లో ఉంది. మన ఎగుమతులు చైనాకు పెరిగాయి. ఇది తెలియని సామాన్యులు, అమాయకులు ఇంకా తెలిసినప్పటికీ మీడియా ఇంకా చైనా వ్యతిరేకతను వదిలించుకోలేదు.


గత నెలలో జరిగిన మ్యూనిచ్‌ భద్రతా సమావేశంలో అమెరికా – చైనాలలో ఏదో ఒక దాని వైపు తేల్చుకోవాలని జోబైడెన్‌ హెచ్చరించారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ దానిని పూర్వపక్షం చేస్తూ అన్ని రాజకీయ కార్యకలాపాలకు బహుముఖ విధానం అవకాశం కల్పించిందని అటువంటి సంస్దలను పటిష్టపరచాలని ఒక్కాణించారు.అంతకు ముందు అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా చైనా ఐరోపా యూనియన్‌ పెట్టుబడి ఒప్పందం చేసుకున్నాయి. అందువలన ఇప్పటికైనా చతుష్టయ కూటమి-దాని వెనుక ఉన్న అమెరికా స్వార్ధం, ఎత్తుగడలు, మన మీద తుపాకి పెట్టి చైనాను కాల్చ చూస్తున్న పన్నాగాన్ని మన పాలకులు గ్రహిస్తారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత రైతు ఉద్యమం : బ్రిటన్‌ చేతిలో నరేంద్రమోడీ సర్కార్‌కు భంగపాటు !

10 Wednesday Mar 2021

Posted by raomk in CHINA, Current Affairs, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, Uncategorized

≈ Leave a comment

Tags

#Farmers’ protest, #narendra modi failures, BJP, Narendra Modi on Farmers, UK lawmakers' debate on farmers' stir


ఎం కోటేశ్వరరావు


గురువు గారూ నా సందేహాలు కొన్నింటిని నివృత్తి చేసుకోవాలని ఉంది… వదలమంటారా ?
శిష్యా అత్యవసరం అయితే అడుగు… చెబుతా ! ఇప్పుడు నేను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి దుర్భిణీ వేస్తున్నా !!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా ఇంకా పొత్తులు జిత్తులు ఖరారు కాలేదు కనుక వాటి గురించి మరోసారి అడుగుతా.
సరే శిష్యా బిజెపి గ్రహగతులు కూడా బాగున్నట్లు లేదు, అంతా మసకమసకగా ఉంది.నువ్వు అడిగితే నేనూ ఇప్పుడే చెప్పలేను… ఇంకాస్త చూడాలి… సరే సందేహాలేమిటో అడుగు !


మూడు వ్యవసాయ చట్టాల సవరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమై వంద రోజులు దాటిపోయింది. దీనికి ప్రచారం ఎక్కువగా కల్పించింది గోడీ మీడియానా లేక మోడీ ప్రభుత్వమా ?
పెట్రోలు ధరల గురించి ధర్మ సంకటంలో పడిన మంత్రి నిర్మలమ్మ మాదిరి ఈ విషయంలో నన్ను సంకటంలో పడవేశావు కద నాయనా ! అయినా …. మనలో మాట….ఆశ్రమంలో దొంగ చెవులు ఉంటాయి. ప్రతి చోటా రహస్య కెమెరాలు అమర్చుతున్నారట. అందరు స్వామీజీలూ నిత్యానందమాదిరి ఉంటారనుకుంటున్నారు జనం, ఖర్మ ఖర్మ ! జరిగేది జరగకమానదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, వ్యతిరేక ప్రచారంతో పాటు గోడీ మీడియా రైతు ఉద్యమం గురించి అనుకూల ప్రచారమూ చేయక తప్పలేదు. మొత్తంగా చెప్పాలంటే రైతాంగ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది మోడీ ప్రభుత్వమే, దానికే నేను ఎక్కువ మార్కులు వేస్తా !


అదేంటి గురువుగారూ చెవులో చెబుతారేమిటి ? దీనిలో ఏముంది… బహిరంగ రహస్యమేగా !
నా మఠం, నా భక్తులు, నా శిష్యులతో మూడు ప్రవచనాలు-ఆరు ఆదాయాలు అన్నట్లుగా వెలుగొందుతున్నదానిని నువ్వు నాశనం చేసేట్లున్నావు…. టూలుకిట్లు, ట్వీట్లు ఇలాంటి పదాలను ఉచ్చరించాలంటేనే ఉచ్చపడుతోంది. ఎక్కడ కేసుల్లో ఇరికిస్తారో అని…


మీరు మరీను గురువుగారూ మనం వేసుకుంటున్నదీ కాషాయమేగా మనల్నీ జైల్లో పెడతారా ?
నీ బండబడ కాషాయం కాషాయం అని పదే పదే అనకు. చివరకు అది బూతులా మారేట్లు ఉంది. బేటీ బచావో అని పిలుపిచ్చిన వారు టూలుకిట్టుపేరుతో దిశ రవి అనే బేటీని జైలు పాలు చేసిన పెద్దలు… ఎంత కాషాయం వేసుకుంటే మాత్రం నిజాలు చెబితే వదులుతారా నాయనా ? ఫిప్టీ ఇయర్స్‌ ఇండిస్టీ ఇక్కడ…75 సంవత్సరాలు దాటిన వారు ముఖ్యమంత్రి లాంటి పదవులకు అనర్హులు అని చెప్పారా ! ఆ సాకుతోనే కదా ముసలోడయ్యాడని అద్వానీని పక్కన పెట్టారు. ఒక ఏడాది అటూ ఇటూగా అంతే వయస్సున్న మరో ముసలోడు మెట్రో మాన్‌ శ్రీధరన్‌ను మాత్రం కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్నారు, ఓట్లొస్తాయనుకుంటే ఎప్పుడేం చేస్తారో తెలియదు. ఈ వయస్సులో నాకు ఎందుకు చెప్పు ?


సరే సరే గురువుగారూ మీరుంటేనే కదా మేమూ పదికాలాల పాటు పచ్చగా కాదు కాదు కాషాయంగా ఉండేది ! రైతు ఉద్యమానికి ప్రచారం కల్పించటం గురించి వివరంగా సెలవిచ్చారు కాదు.!
నాయనా గాంధీని మోసిన రైలే గాడ్సేనూ మోసింది. అలాగే అమెరికా టైమ్‌ మాగజైన్‌ గతంలో నరేంద్రమోడీ ముఖచిత్రంగా ప్రచారం కల్పించింది. ఇప్పుడు అదే పత్రిక మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతాంగ ఉద్యమంలో మహిళలతో వంద రోజుల సందర్భంగా ముఖపత్ర కథనం ప్రచురించింది. దాని పాఠకులతో పాటు ఆ అంశాన్ని వార్తగా ప్రచురించిన దినపత్రికల ద్వారా మరింత ప్రచారం వచ్చింది. విధి వైపరీత్యంగాకపోతే ఏమిటి నాయనా ఇది !


నిజమే గురువుగారూ ! చూస్తుంటే రైతు ఉద్యమం గురించి ప్రస్తావించిన వారందరి మీద బస్తీమే సవాల్‌ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఇది ఎక్కడకు దారితీస్తుందంటారు ?
నాయనా శిష్యుడిగా ఇంకా ముదరాల్సిన వాడివి. భారత్‌, చైనా వంటి దేశాల్లో జరిగే పరిణామాలను ప్రపంచ మీడియా విస్మరించజాలదు ! తొలిసారిగా నరేద్రమోడీకి అతి పెద్ద సవాలు రైతుల నుంచి వచ్చిందంటూ ఏదో ఒక రూపంలో వార్తలు ప్రచురించని, దృశ్యాలను చూపని టీవీ ఛానల్స్‌ లేవంటే అతిశయోక్తికాదు నాయనా ? ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చిందంటే వేరు, దాన్ని దెబ్బతీసే సత్తా మోడీగారికి ఉంది. కానీ జనంతో, అందునా పెద్ద సంఖ్యలో ఉన్న రైతులతో పెట్టుకుంటే అంతే సంగతులు. ఇంకా తత్వం తలకెక్కినట్లు లేదు. అనుకున్నదొకటి అయింది ఒకటిలే బుల్‌బుల్‌ పిట్టా అన్నట్లు పరిస్ధితి తయారైంది. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటే ఇంక నువ్వెందుకు అంటూ కార్పొరేట్లు మోడీగారిని ఇంటికి పంపుతాయి. అమలు జరిపితే రైతులు అదే పని చేస్తారు. రిపబ్లిక్‌ దినోత్సవ అతిధిగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రావాల్సింది రాలేదు. కరోనా అని చెప్పినా రైతు ఉద్యమం సాగుతున్నందున ముఖం చాటేశారని అందరూ అనుకున్నారు. నిజంగా ఆరోజు ఆయన వచ్చి ఉంటే జరిగిన పరిణామాలను చూసి ఏం చేసేవారో తెలియదు. రైతు ఉద్యమాన్ని బదనాం చేసేందుకు ప్రభుత్వం చేసిన కుట్ర ఎదురుతన్నిందని, ప్రపంచ వ్యాపితంగా పెద్ద ప్రచారం వచ్చింది కదా నాయనా ! మనలో మాట ఇది ప్రభుత్వం కల్పించినది కాదంటే ఎలా కుదురుతుంది చెప్పు ?


బోరిస్‌ జాన్సన్‌ అంటే గుర్తు వచ్చింది గురువు గారూ. త్వరలో ఆయన పర్యటన ఉందని ఆ సందర్భంగా రైతు ఉద్యమం గురించి చర్చించుతాం అని బ్రిటను మంత్రి నిగెలు ఆదాము గారు స్పష్టంగా చెప్పారని వచ్చిన వార్తలేమిటి గురువర్యా !
చదువు రాని వాడికి ఒక చోట-చదువుకున్న వాడికి మూడు చోట్ల అనే లోకోక్తి విన్నావా నాయనా ? సావధానంగా చెబుతా విను. ఒక చదువు రాని వాడు, చదువుకున్నవాడు ఒక రోడ్డు మీద నడుస్తున్నారు. ఇద్దరూ అనుకోకుండా పెంటను తొక్కారు. చదువు రాని వాడు ఛీ అంటూ కాలు కడుక్కొని వెళ్లిపోయాడు. అదే చదువుకున్నవాడు తొక్కిందేమిటో తెలుసుకోవాలనుకుని చేతికి రాసుకున్నాడు, వాసన ఏమిటో చూద్దామని ముక్కుదగ్గర పెట్టుకున్నాడట.
రైతు ఉద్యమం గురించి చర్చించాలంటూ గతంలోనే వంద మంది బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులు వారి ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు తెచ్చుకో. అలాగే కెనడాలో ఇదే అంశం మీద చర్చ జరిగింది. తాజా విషయానికి వస్తే మన దేశంలో పత్రికా స్వేచ్చ, భారత్‌లో నిరసన తెలుపుతున్న రైతుల రక్షణ గురించి చర్చించాలంటూ బ్రిటీష్‌ పార్లమెంట్‌ పిటీషన్ల కమిటీకి వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఇ-దరఖాస్తు చేశారు. చర్చకు తీసుకోవాలంటే అవసరమైన సంఖ్య కంటే ఎక్కువగా లక్ష మంది జనం వెబ్‌సైట్‌లో సంతకాలు చేశారు. దాని గురించి పార్లమెంట్‌ ప్రాంగణంలోని వెస్ట్‌ మినిస్టర్‌ హాలులో మార్చి ఎనిమిదవ తేదీ నాడు చర్చ జరిగింది. శిష్యా మన పార్లమెంట్‌ చేసిన వాటినే మనం పట్టించుకోవటం లేదు, అలాంటిది బ్రిటీష్‌ ఎంపీలు పార్లమెంటు వెలుప మన గురించి వారేమి చర్చిస్తే, ఏం చేస్తే మనకేంటి అని వదలి వేయకుండా దాన్ని మన హైకమిషన్‌ వారు దొరకబుచ్చుకొని సమగ్ర చర్చ కాకుండా తప్పుడు సమచారాన్ని ఏకపక్షంగా చర్చించారంటూ బ్రిటన్‌కు లేఖ రాసి రచ్చ చేశారు.


అదేంటి గురువా మన గురించి ఇతరులు చర్చించటం ఏమిటి ? అలా చేస్తే అభ్యంతరం తెలుపకూడదా ? తప్పేంటి ? మన అంతర్గత విషయాలను ఇతరులు చర్చించటం ఏమిటి ?
శిష్యా ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న పద్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నిజమే మన అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదు. ఇక్కడ చిన్న తర్కం మరిచిపోకూడదు. ప్రభుత్వాలు వేరు, పౌరులు వేరు.ఎంపీలు వేరు అలాగే ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వాలు స్పందిస్తే అది జోక్యం కిందకు వస్తుంది. పౌరులకు, ఎంపీలకు అది వర్తించదు. దేన్ని గురించి అయినా వ్యాఖ్యానించవచ్చు.

అదేమిటి ఎంపీలకు బాధ్యత ఉండనవసరం లేదా మన ఎంపీలు ఎవరైనా అలా చేస్తే మన మోడీ గారు ఊరుకుంటారా గురువు గారూ !
అంతసీను లేదు నాయనా మంత్రులు బూతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి గారు అదుపు చేస్తున్నారా లేదు. మోడీ గారూ కూడా అంతే . తైవాన్‌ అనేది ఒక దేశం కాదు. చైనాలో తిరుగుబాటు రాష్ట్రం. అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది. దాన్ని మన దేశం అధికారికంగా గుర్తించలేదు, చైనాలో అంతర్భాగంగానే చూస్తున్నది. అయినా అక్కడి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి గతేడాది ఇద్దరు బిజెపి ఎంపీలు టిక్కెట్లు కొనుక్కొని తైపే వెళ్లేందుకు సిద్దమయ్యారు. కరోనా కారణంగా ఆగి అంతర్జాల సభలో పాల్గొన్నారు.
అలాగే చైనా వస్తువులను బహిష్కరించాలని మన మోడీ గారు ప్రధాని హౌదాలో పిలుపు ఇస్తే సమస్యలు వస్తాయి. ఆ పని చేయకుండా తన మాతృసంస్ధ సంఘపరివార్‌ దళాల ద్వారా నిత్యం అదే పారాయణం చేస్తుంటారు. ఇది తెలిసినప్పటికీ ప్రభుత్వానికి పార్టీకి తేడా ఉంది కనుక దాన్ని మన ప్రభుత్వ విధానంగా చైనా పరిగణించటం లేదు. ఇతర దేశాల పౌరులను, ఎంపీలను తప్పు పట్టే ముందు మనం అధికారికంగా అనధికారికంగా చేస్తున్నదేమిటో చూస్తే నేను చెప్పిన ఎప్పటికెయ్యది వర్తిస్తుంది.


అయితే గురువు గారూ బ్రిటన్‌ ఎంపీలను మీరు సమర్ధిస్తున్నారా ?
శిష్యా అల్లుడికి బుద్ది చెప్పిన మామ గడ్డికరిచినట్లుగా మనం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే ఇతరులూ దాన్ని పాటిస్తారు.మన కాశ్మీరు మాదిరే టిబెట్‌ చైనా అంతర్గత వ్యవహారం. తేడా ఏమన్నా ఉంటే మనం మనం తేల్చుకుంటున్నట్లుగా వారూ వారూ తేల్చుకుంటారు.కానీ మనం దలైలామాకు ఎందుకు ఆశ్రయం ఇచ్చాం, తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతులు ఎందుకు కల్పించాం. ప్రతిరోజు మన కాషాయ దళాలు టిబెట్‌ అంశం గురించి ఎక్కడో ఒకదగ్గర చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నాయి కదా ? అంతెందుకు శిష్యా పోయినేడాది మన మోడీ గారు అమెరికా వెళ్లి అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా సభలో సెలవిచ్చారే ! దాన్నేమందాం.


డోనాల్డ్‌ ట్రంప్‌ – మన నరేంద్రమోడీ జిగినీ దోస్తులు, తప్పేముంది గురువుగారూ !
దోస్తు అయితే మోడీ గారికి ఇల్లు, సంసారం లేదు గనుక హౌటలుకు తీసుకుపోయి తాగినంత తాగించి తిన్నంత పెట్టించమను. వారి దేశానికి పోయి ఎన్నికల్లో జోక్యం చేసుకుంటే ఇప్పుడేమైందో చెప్పు. ఆ ట్రంపు కంపును ఎంత జిగినీ దోస్తు అయినా భరించగలడా ? జో బైడెన్‌ దగ్గరకు వెళ్లలేరు, వెళ్లినా ట్రంప్‌ మాదిరి కౌగలించుకోలేరు. రెండింటికీ చెడలా !
అదేంటి గురువు గారూ అంత మాట అంటారు, మన దగ్గరకు వచ్చే నరేంద్రమోడీ భక్తులెవరూ అలా అనుకోవటం లేదు కదా !
శిష్యా చెప్పుకుంటే సిగ్గు చేటు. కాశ్మీరు రాష్ట్రాన్ని, దాని ప్రత్యేక హౌదాను రద్దుచేసి అక్కడి నేతలను నిర్బంధించి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మన నేతలను, చివరికి ఎంపీలను కూడా పోనివ్వకుండా అడ్డుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కానీ మరోవైపు ఏం చేశారు ? ఐరోపా దేశాల నుంచి పార్లమెంట్‌ సభ్యుల బృందాన్ని ఆహ్వానించి వారికి రాచమర్యాదలు చేసి కాశ్మీరులో తిప్పి ఏం చూపించారు? ఎందుకు రప్పించారు. అక్కడ జనాన్ని అణచివేయలేదు అని ప్రపంచానికి చెప్పించుకొనేందుకే కదా ? తమ్ముడు తమ్ముడే ధర్మం ధర్మమే కదా శిష్యా ! మరి అదే దేశాల పౌరులు కాశ్మీరులో చీకటి రాజ్యం అని స్పందిస్తే జోక్యం అవుతుందా ?
అయినా మనలో మాట ! అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం, మా వ్యవసాయ చట్టాలను బయట చర్చించటం ఏమిటి అంటున్నాం కదా ! మన చట్టాలను మన పార్లమెంట్‌లోనే సమగ్రంగా చర్చించేందుకు అవకాశం ఇవ్వలేదనే విమర్శలు, అసలు చర్చించకుండానే మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించినట్లు రాసుకున్నాం కదా ! వాటిని వ్యతిరేకించే వారు రాజధానిలోకి రాకుండా చూసేందుకు రోడ్ల మీద మేకులు కొట్టాం కదా ? మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా మన దగ్గర ఇన్ని పెట్టుకొని ఎవరో మన గురించి ట్వీట్లు చేశారు, టూలుకిట్లు పంచారు అని రుసరుసలాడినా, బ్రిటన్‌ లేదా మరొక దాని మీద పడితే ఊరుకుంటారా, మరింత రెచ్చి పోరా నువ్వు చెప్పు !


అయితే గురువా తరువాత ఏం జరుగుతుందంటారు ?
నా బొంద మన నిర్వాకం అలా తగలడింది. పిలిచి మరీ తిట్టించుకున్నట్లయింది. బ్రిటన్‌ ప్రధాని మన దేశం వచ్చినపుడు ఈ అంశాలను కూడా ప్రస్తావిస్తామని బ్రిటన్‌ మంత్రి చెప్పారు. వ్యవసాయ సంస్కరణలు భారత అంతర్గత వ్యవహారమని ఒక వైపు చెబుతూనే రెండు దేశాల మధ్య ఉన్న సంబంధానికి ఇది ప్రేరేపక సమయం అయినప్పటికీ భారత దేశంతో జఠిలమైన సమస్యలను చర్చించటానికి ఏ విధంగానూ ఆటంకం కాదు అని కూడా చెప్పారు.
శిష్యా అంతటితో ఊరుకోలేదు. భారత్‌లో రైతుల నిరసనలు, వాటి గురించి వార్తలు బ్రిటస్‌ సమాజాల్లో ఆందోళనకరంగానూ అనిశ్చితంగానూ ఉన్నాయని, రెండు దేశాల మధ్య కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయన్నారు. ఓకే ఓకే అంటూ ఆమోదం- వ్యతిరేకత ఏమి తెలుపుతున్నారో కూడా తెలియకుండా చేతులెత్తే వెనుక బెంచీల్లోని ఎంపీలు, ఎంఎల్‌ఏల మాదిరి బ్రిటన్‌ పార్లమెంటులో కూడా అదే బ్యాచీకి చెందిన ఒక మహిళా ఎంపి తప్ప మన వ్యవసాయ చట్టాలను మిగతా పార్టీల వారెవరూ సమర్దించలేదట.


అంటే గురువు గారూ ఆమె అధికార పార్టీ కనుక మన ప్రభుత్వంతో మంచిగా ఉంటే పోలా అన్నారు లోపల ఆమె కూడా వ్యతిరేకంగానే ఉన్నారేమో ! అయినా గురువు గారూ అదేంటండీ మిగతా పార్టీలేవీ మోడీ గారు చెప్పిందాన్ని నమ్మటం లేదూ అంటే ! మన పలుకుబడి ఏమైనట్లూ ? పోనీయండి ఏదో ఒకటి అవుతుంది. చివరిగా ఒక్కటి చెప్పండి ! కాశ్మీరులో మానవ హక్కులకు భంగం కలిగించలేదని ప్రపంచానికి వెల్లడించేందుకు విదేశాల నుంచి ఎంపీలను రప్పించిన విషయం చెప్పారు. వ్యవసాయ చట్టాల గురించి, రైతుల ఆందోళన పట్ల అనుసరిస్తున్న తీరు గురించి కూడా నిజాలు చెప్పేందుకు అలాంటి ఆలోచన చేస్తారంటారా !
శిష్యా ఇప్పటికే పండుగాడి దెబ్బవంటి రైతుల ఆందోళనతో మన ప్రధాని, మంత్రులు మైండ్‌ బ్లాక్‌ అయి ఉన్నారు. ఇప్పుడు అలాంటి పని చేస్తే మన పరువు మరింత దిగజారుతుంది. నీకు పుణ్యముంటుంది నా దగ్గర అంటే అన్నావ్‌గానీ బయట నోరు జారకు, కాషాయం వేసుకున్నావని కూడా చూడరు. దేశ ద్రోహం కింద జైల్లో వేస్తారు జాగ్రత్త !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనం గంగిరెద్దులం కాదు – అయినా ప్రతిదానికి తలలూపుతున్నామెందుకు ?

20 Saturday Feb 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

#India oil taxes, India oil price, narendra modi bhakts, Narendra Modi Failures, Watsapp fake news


ఎం కోటేశ్వరరావు


ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ! అది ఎప్పుడు సాధ్యం అవుతుంది ? మనం అంటే జనం బుర్రలకు పని పెట్టకుండా, చరిత్రను మర్చిపోతేనే అలాంటి వారు రెచ్చిపోతుంటారు. సమాజం పుచ్చిపోతుంది !
ఇపుడు అదే జరుగుతోంది. కారణాలు ఏవైనా, పేనుకు పెత్తనం ఇచ్చినట్లు మనం మెదళ్లను విదేశీ వాట్సాప్‌కు అప్పగించాం, ఇప్పుడు స్వదేశీ ”కూ ”కు అప్పగించమని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే తప్పు యాప్‌లది కాదు. విదేశీ అయినా, స్వదేశీ అయినా మనం వాటిలో దేన్ని ఉంచితే దాన్నే పదుగురిక పంచుతాయి. అందుకే పళ్లూడ గొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం ? బుర్రలను తాకట్టు పెట్టదలచుకుంటే ఎక్కడైతేనేం ! దాన్ని కూడా చూద్దాం !
వినేవాడికి బుర్రలేకపోతే చెప్పేవాడికి లోకువ ! నేనూ ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నాను గనుక మెదడుకు పని పెట్టమనే చెబుతున్నా. వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లుగా ఎవరు చెప్పినా వినండి. హంస పాలూ నీళ్లను వేరు చేస్తుందంటారు, మనమూ మంచీ-చెడును వేరు చేసి మంచిని స్వీకరించుదాం !


పెట్రోల్‌ ,డీజిల్‌, ఎల్పిజి ధరలేం ఖర్మ ! రాబోయే రోజుల్లో ప్రతి వస్తువు, సేవ ధర పెరుగుతుంది. ఏమంటే దేశభక్తి అంటారు ! నరేంద్రమోడీ గారి అచ్చేదిన్‌ ఆచరణ అదే కదా ! వాట్సాప్‌లో తిప్పుతున్న అనేక పోస్టులలో ఒక దాని ప్రకారం కేంద్రలోని పెద్దలకు అవగాహన ఉంది కనుకనే వాటిని పెంచుతున్నారట ! వారికి లేదని ఎవరన్నారు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డించేందుకు కావాలనే చేస్తున్నారు. సందేహం లేదు. తెగించిన వాడికి తెడ్డే లింగం ! ఇంతకు ముందు ధరలు పెంచితే జనం ఆగ్రహిస్తారనే భయం ఉండేది కనుక పాలకులు కాస్త వెనుకా ముందూ చూసే వారు. దున్నపోతు మీద వాన కురిసినట్లుగా పరిస్దితి ఉందని గ్రహించారు గనుకనే చెప్పి మరీ చేస్తున్నారు.


గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో డిమాండ్‌ లేకపోవటంతో ఒక దశలో ముడి చమురు ధర15 డాలర్లకు పడిపోయినా సౌదీ అరేబియా నుంచి మన దేశం పాత ధరకే కొనుగోలు చేసిందట ? డిమాండ్‌ తగ్గినా సౌదీ నుంచి కొనుగోళ్లను ఆపలేదట, డిమాండ్‌ లేనపుడు ఎందుకు కొనుగోలు చేసినట్లు ? అదీ పాత ధరకు ! స్వంత జనం మీద అంత కోపమెందుకు ? సౌదీ మీద అంత ప్రేమ ఎందుకబ్బా ! మనం చెవులప్పగిస్తే ఫ్రీగా ఉన్నాయి కదా అని ప్రతి చెత్త వాటిలో వేసిపోతారు !
అంతర్జాతీయ మార్కెట్లో ఏరోజు ఎంత ఉంటే ఆరోజు మన వినియోగదారుల నుంచి అంత వసూలు చేయాలన్నది మన విధానం. మన కొనుగోలు కూడా అలాగే ఉంటుంది తప్ప వచ్చే ఏడాది సరఫరా చేసే చమురుకు ముందు సంవత్సరమే ఒప్పందాలేమీ ఉండవు. ధర తగ్గినా సౌదీ నుంచి పాత ధరలకే కొనుగోలు చేయటం అంటే జనానికి శఠగోపం పెట్టటం, కుంభకోణం ఉన్నట్లే ! లేదా రాసిన వారికి అసలు విషయం పరిజ్ఞానం లేకపోయి ఉండాలి.


ఒపెక్‌ (చమురు ఎగుమతి దేశాలు) ధరలు పెంచే ఆలోచనలో ఉండగా మన దేశ విజ్ఞప్తి మేరకు ఆసియా ఖండం వరకు పాత ధరలకే ఇవ్వటానికి ఒప్పుకున్నాయట. అలాంటపుడు సెంచరీ దిశగా ప్రతి రోజూ ధరలను పెంచటం ఎందుకు ? పాత ధరలు ఎంతో ఇప్పుడు ఎంతకు కొంటున్నామో చెప్పమనండి, మన బండారం బయటపడుతుంది.


చైనా యాప్‌లను నిషేధించినా, వారి వస్తువులను కొనుగోలు చేయం అని బెదిరించినా సరిహద్దుల్లో చెట్టు చివరి ఆకు కూడా ఊగలేదు. మీరూ మూసుకోండి-మేమూ మూసుకుంటాం అన్నట్లుగా ఒప్పందం చేసుకొని సరిహద్దుల్లో చైనా-భారత్‌ సైన్యాలు గతంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వెనక్కు వెళ్లాయి. కొండల దిగువన ఉన్న చైనా వారు వెనక్కు తగ్గారు, కంపు ట్రంప్‌ మాటలు నమ్మి ఏదో అనుకొని, ఏదో చేద్దామని కొండలెక్కిన మనం కాళ్లనొప్పులతో దిగాము తప్ప జరిగిందేమీ లేదు.
అలాంటిది కొనుగోలు దేశంగా ఉన్న మనం కోరితే లేదా బెదిరిస్తే ఒపెక్‌ దేశాలు ధరలు తగ్గించాయంటే, ఒక్కసారికేం ఖర్మ 56 అంగుళాల ఛాతీ రోజూ గడ్డం నిమురుకోవటం మాని ఆ పని మీద కేంద్రీకరిస్తే జనం మీద బాదుడు తగ్గుతుంది కదా ! మనం ఎప్పుడు ఏ దేశం నుంచి చమురును ఎంతకు కొనుగోలు చేశామో, అధికారికంగా శ్వేత పత్ర ప్రకటన లేదా ప్రభుత్వ ప్రకటన చేయమనండిి అసలు సంగతి బయటపడుతుంది ! టూల్‌కిట్టూ కాదు, దేశద్రోహం అంతకంటే కాదు. దీన్ని కూడా అడగలేక ఏమి చెప్పినా తలలు ఊపుతాం – ఎందుకంటే మనం గంగిరెద్దులం కదా !


” క్రూడ్‌ ధరలు నిలకడగానే ఉన్నా దేశంలో పెట్రోల్‌ , డీజిలు ధరల పెంపు ఎందుకంటే వీలు ఉన్నంత వరకు వీటి ద్వారా మళ్ళీ ఆర్ధికంగా నిలదొక్కుకోవడం కోసమేనట ! లాక్‌ డౌన్‌ సమయంలో ఆదాయం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం అల్పదాయ ప్రజల ఆరు నెలల పాటు ఉచిత రేషన్‌ ఇచ్చిందట.” కనుక చమురు ధరలు పెంచటం సమర్దనీయమే అని భజన చేయటం.
ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఆరు నెలల పాటు కుటుంబానికి నెలకు ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు ఇవ్వటానికి 90వేల కోట్ల రూపాయలు ఖర్చయిందట. అంటే కుటుంబానికి రూ.1,125 కేటాయించారు. ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేశారని సాధికారికంగా సమాచారం చెబితే సవరిస్తా ! కేంద్ర ప్రభుత్వం మార్చి నెల 14న కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలు మీద మూడేసి రూపాయలు, మే ఐదవ తేదీన రూ.10,13చొప్పున పెంచింది. తద్వారా కేంద్రానికి అదనంగా వస్తుందని చెప్పిన ఆదాయం ఎంత ? రెండు లక్షల కోట్ల రూపాయలు. అంతకు ముందు లీటరు పెట్రోలు మీద రూ.9.48గా ఉన్న పన్ను 22.98కి పెంచారు. అంటే మరో రెండులక్షల కోట్లు ఉంటుంది. మరి దాన్ని ఎందుకు పెంచినట్లు ? అప్పుడేమీ కరోనా, ఉచిత రేషన్‌ లేదే ? మనకు ఇచ్చింది ఎంత మన జేబుల నుంచి కొల్లగొట్టింది ఎంత ? దేశ భక్తి ఉండాల్సిందే గానీ అది మరీ మత్తులోకి దిగకూడదు. దిగితే మన ఒంటి మీద దుస్తులు కూడా మిగల్చరు ! ఏది చెబితే దాన్ని నమ్మేందుకు మనం గంగిరెద్దులమా ? అయినా తలలెందుకు ఊపుతున్నాం ?


చమురు ధరల పెంపుదలకు మరో అంశాన్ని మెదళ్లకు ఎక్కించే యత్నం జరుగుతోంది. కరోనా, ఉచిత రేషను అంటే ఎక్కువ కాలం నడవదు . మరి అదేమిటి ? ” 2020 ఏప్రిల్‌ నుండి ఇప్పటి వరకు లడాక్‌ దగ్గర 50,000 మంది సైనికులని మోహరించింది మన దేశం. యుద్ధ టాంకులు, ఆర్టీలరీ గన్స్‌ తో పాటు నిత్యం యుద్ధ విమానాలని గస్తీ లో ఉంచింది. కేవలం సైనికులని తరలించడానికే 10,000 కోట్లు ఖర్చు అయ్యింది. ఇక మీరేజ్‌ యుద్ధ విమానం ఒక గంట గాలిలో ఎగిరితే అయ్యే ఖర్చు 6 లక్షలు అవుతుంది. ఒక ఎస్‌యు మిగ్‌ అయితే ఒక గంటకి 10 లక్షల ఖర్చు అవుతుంది. ఒక సి-30 రవాణా విమానం లోడ్‌ తో గాల్లోకి లేచి దింపినందుకు అయ్యే ఖర్చు అక్షరాల 750 కోట్లు అవుతుంది. యావరేజ్‌ గా చూస్తే మొత్తం 10 నెలల కాలానికి రోజుకి 5 వేల కోట్లు ఖర్చు అయ్యింది. పూర్తి స్థాయి యుద్ధం కనుక వస్తే రోజుకి లక్ష కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది – ఇది రెండు లక్షల కోట్లకి కూడా పెరగవచ్చు. మీరేజ్‌, రాఫెల్‌ ల తో వాడే ఒక్కో మిసైల్‌ ఖరీదు 600 కోట్లు ఉంటుంది మరి ఈ ఖర్చు ఎవరు భరిస్తారు ? ఎక్కడా తగ్గకుండా కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో గట్టిగానే నిలబడ్డది. దేశ భద్రత ద ష్ట్యా ఇది తప్పని సరి ఖర్చు. ” అని సమర్ధన !


మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించలేదని గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా చెప్పారు. తన ప్రకటనను వక్రీకరించారని అనలేదు కనుక ఇప్పటికీ అదే మాటతో ఉన్నారనుకుందాం ! ఒక్క అంగుళం ఆక్రమించినా ఊరుకునేది లేదని రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. చైనా పది సార్లు సరిహద్దులను అతిక్రమిస్తే మనం 50సార్లు అతిక్రమించాం అని మాజీ సైనికాధిపతి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వికె సింగ్‌ తాజాగా చెప్పారు. సరిహద్దుల వెంబడి మనం తిష్టవేశాం, అది చైనా మీద వత్తిడి పెంచుతోందని కూడా సింగ్‌ చెప్పారు.
ప్రధాని చెప్పినట్లు మన ప్రాంతాన్ని చైనా వారు ఆక్రమించలేదు, రాజనాధ్‌ చెప్పినట్లు ఒక్క అంగుళం కూడా కొత్తగా ఆక్రమించలేదు ,అయినా వికె సింగ్‌ గారు చెప్పినట్లు మనం వెళ్లి సరిహద్దులో కూర్చున్నాం. అందుకు గాను మనకు వదిలిన చమురు ఎంత. రోజుకు ఐదు వేల కోట్లంటే నెలకు లక్షా యాభై వేల కోట్లు, పది నెలలకు పదిహేను లక్షల కోట్లు ? ఇదంతా ఎందుకు చేసినట్లు ? అంత ఖర్చు భరించే స్దితిలో దేశం ఉందా ? ప్రతి పైసాకు జవాబుదారీ వహిస్తా అని చెబుతున్నవారు చేయాల్సిన పనేనా ఇది ? ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్న రామదాసు గుర్తుకు రావటం లేదూ ! తేడా ఏమిటంటే ఆయన నవాబు జైల్లో బందీగా ఉండి వాపోయాడు. మనం హిందూత్వ ప్రజాస్వామ్య బందీలుగా ఉండి నోరు విప్పలేకపోతున్నాం. రామదాసు రక్షణకు రాముడు వచ్చాడంటారు. మన రక్షణకు కనీసం జైల్లో పరామర్శించేందుకు సైతం రాముడు వచ్చే అవకాశం లేదు. వచ్చినా అధికారులు అనుమతించరు.
పోనీ చైనా వారు కొత్తగా మన ప్రాంతాన్ని ఒక్క అంగుళం అయినా ఆక్రమించినట్లు చెప్పి ఉంటే దాన్ని కాపాడుకొనేందుకు పదిహేను లక్షల కోట్లేమిటి, దేశం మొత్తాన్ని అమ్మివేసి ఆ సొమ్ముతో అమెరికా నుంచి తెచ్చుకొనే ఆయుధాలతో సదరు అంగుళాన్ని తిరిగి తెచ్చుకొనేందుకు పూనుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టరు. దేశభక్తిలో ఎవరూ ఎవరికి తీసిపోరు ! ఏమీ లేని దానికి కరోనా కాలంలో ఇంత ఖర్చా ? అనేక దేశాలకు సరిహద్దు సమస్యలున్నాయి. ఎవరైనా కరోనా కాలంలో ఇలాంటి పని చేశారా ? ఇది రాజనీతా – బాధ్యతా రాహిత్యమా ! ఏది చెబితే దానికి తలూపటానికి మనం గంగిరెద్దులమా ! అయినా తలలెందుకు ఊపుతున్నాం ?


” ఈ ఖర్చు అంతా కోవిడ్‌ టాక్స్‌ పేరు మీదనో లేదా యుద్ధ టాక్స్‌ పేరు మీదనో మన నుండి వసూలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఆయిల్‌ పూల్‌ ఖాతా మీదనే భారం వేస్తున్నది అది కూడా ఇంకో రెండు నెలలు మాత్రమే. మే నెల ఆరంభం నుండి మళ్ళీ పెట్రో రేట్లు తగ్గుతాయి. భయం అవసరం లేదు. ”
జనానికి బుర్రలేదనుకొనే అతి తెలివి వాదనతప్ప పైన పేర్కొన్న లక్షల కోట్ల ఖర్చును జనం నుంచి వసూలు చేయటం లేదట ? ఆయిల్‌ పూల్‌ ఖాతా నుంచి చేస్తున్నారట. దానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తోంది? నరేంద్రమోడీ గారికి అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం ఏమైనా దొరికిందా ! జనాన్ని ఇంత వెర్రివారిగా జమకడుతున్నవారినా మనం నోరెత్తకుండా అంగీకరిస్తున్నది ? ఎందుకిలా ప్రశ్నించలేని స్ధితికి చేరుకున్నాం ? గంగిరెద్దులమా ?

ఆయిల్‌ పూల్‌ అనండి మరొకటనండి పేరేదైతేనేం గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రానికి రాష్ట్రాలకు వస్తున్న ఆదాయ వివరాలు కోట్ల రూపాయలలో దిగువ విధంగా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్నఅంకెలు కేంద్రం,రాష్ట్రాల పన్నులలో చమురు రంగం వాటాల శాతాలు.

సంవత్సరం 2013-14 ××××× 2014-15 ××××× 2015-16 ××××× 2016-17
కేంద్రం 1,04,163(38.0) ×× 1,22,925(39.2) ×× 2,13,995(57.4) ×× 2,37,388(52.6)
రాష్ట్రాలు 1,27,957(27.2) ×× 1,31,595(25.7) ×× 1,29,214(23.5) ×× 1,53,287(25.1)

కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను భారాన్ని ఈ అంకెలు చెబుతున్నాయి. మనం చెల్లిస్తున్నవే. ఇచ్చిన అంకెలన్నీ కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంవత్సరాలవే. ఈ పెంపుదల సమయంలో కరోనా లేదు, సరిహద్దుల్లో సరాగాలు, పనేమీ లేదు ఒకసారి వచ్చి పోండి అన్న ఆత్మీయ పిలుపులే తప్ప మరొకటి లేదు కదా ! ఎందుకు పెంచినట్లు ? పైన పేర్కొన్న అంకెలకు గత ఏడాది పెంచిన పన్నుల మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ఆదాయానికి కలుపుకోవాలి. కేంద్ర పన్నుల మీద కూడా రాష్ట్రాల వాట్‌ ఉంటుంది కనుక ఆ మేరకు కొంత మేరకు రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరుగుతుంది తప్ప శాతాలలో పెద్ద మార్పు ఉండదు.
ఒకవేళ ఆయిల్‌ పూల్‌ – మరొకటో ఏదో ఒకటి. కరోనా, సరిహద్దుల కోసమే పన్నులు పెంచా అని విలేకర్ల సమావేశం పెట్టి చెప్పే ధైర్యం ఎలాగూ నరేంద్రమోడీ గారికి లేదు కనుక కనీసం తన మన్‌కీ బాత్‌లో సెలవిమ్మనండి. పార్లమెంటులో చెప్పమనండి. కొద్ది నెలలే గనుక భరిద్దాం.
మనం చర్చిస్తున్న పోస్టులో రాసినట్లు ఆసియా ఖండానికి చమురు రేట్లు తగ్గించిన నరేంద్రమోడీ గారికి మిగతా దేశాల వారందరూ జేజేలు పలుకుతూ ఉండి ఉండాలి. లేకపోతే నేపాల్‌, శ్రీలంకతో సహా ఇరుగు పొరుగుదేశాల్లో కూడా బిజెపిని ఏర్పాటు చేసి అధికారానికి వచ్చేందుకు ప్రయత్నించాలని త్రిపుర పర్యటనలో హౌం మంత్రి అమిత్‌ షా ఎందుకు చెబుతారు, ఆ విషయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవదేవ్‌ ప్రపంచానికి ఎలా వెల్లడిస్తారు. బిజెపి నాయకులు జనాన్నే కాదు చివరికి స్వంత పార్టీ వారిని కూడా వెర్రి పుష్పాల కింద జమకడుతున్నారన్నమాట. లేకపోతే విదేశాల్లో బిజెపి ఏర్పాటు ఏమిటి ? నరేంద్రమోడీ ఘనత కారణంగా మన, ఇరుగు పొరుగుదేశాల్లో ఫిబ్రవరి 15న గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం పెట్రోలు, డీజిలు ధరలు, సెంట్లు, మన కరెన్సీలో(ఫిబ్రవరి 18 మారకపు రేటులో) ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది ఖలిస్తానీ లేదా చైనా, పాకిస్దాన్‌ టూలకిట్టులో భాగం కాదని మనవి.

దేశం ×××××× పెట్రోలు ×××× డీజిలు
భారత్‌ ××××× 126 (91.37) ×× 115 (83.39)
బంగ్లాదేశ్‌ ××× 105 (73.24) ×× 77 (55.84)
చైనా ×××××× 103 (74.69) ×× 90 (65.26)
నేపాల్‌ ××××× 95 (68.89) ×× 80 (58.04)
శ్రీలంక ×××× 83 (60.19) ×× 54 (39.16)
పాకిస్దాన్‌ ××× 70 (50.76) ×× 73 (52.93)
భూటాన్‌ ××× 68 (49.31) ×× 64 (46.41)
మయన్మార్‌× 67 (68.89) ×× 60 (43.51)

మనం కోరితే ఒపెక్‌ సంస్ద ఆసియా ఖండానికి ధరలు తగ్గించిందని చెబుతున్న పెద్దలకు ఒక ప్రశ్న. విదేశాలకే మన మాట మీద అంత ప్రేమ ఉండి అడిగిన మనకే గాక ఆసియా మొత్తానికి ఉదారంగా భారం తగ్గించేందుకు కారకులైన మాననీయ నరేంద్రమోడీ మన దేశంలో ఇంత ఎక్కువకు ఎందుకు అమ్మిస్తున్నారు ? మనకెందుకీ దరిద్రం పట్టుకుంది. ఎక్కడిదీ ఏలినాటి శని ? కరోనా అందరికీ ఉంది. సరిహద్దుల్లో వివాదానికి మనం పదిహేను లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నపుడు చైనా వారికీ అంతే మొత్తం ఖర్చు అవుతుంది కదా ? మరి వారెందుకు ఆయిల్‌పూల్‌లో పన్నులు వసూలు చేయటం లేదు ? గంగిరెద్దుల్లా తలాడించటం తప్ప మనం ఇవేవీ అడగకూడదు !

” 100 రూపాయలు ఉన్న బీరు 160 అయితే ఎవరూ కిక్కురుమనరు కానీ పెట్రోల్‌ లీటర్‌ 100 అయిపోతున్నది అని గగ్గోలు పెట్టేస్తున్నారు. ఒక కుటుంబం రెస్టారెంట్‌ కి వెళ్ళి భోజనం చేస్తే 2000 అవుతున్నది కానీ ఎవరికీ ఇబ్బంది అనిపించడం లేదు. స్టేట్‌ హైవే ల మీద టోల్‌ గెేట్‌లు పెట్టి వసూలు చేస్తుంటే మాత్రం కమ్మగా ఉంటున్నది. అసలు 10 ఖరీదు చేసే ఒక క్వార్టర్‌ విస్కీ ని 150 రూపాయాలకి అమ్ముతుంటే ఎవడూ ఆడగడు. కానీ దేశానికి అవసరం అయ్యే ఖర్చు మీద మాత్రం గొంతులు లేస్తాయి ఇది మన దౌర్భాగ్యం. ”
చమురు ధరలు ఎంత పెరిగినా జనం పట్టించుకోవటం లేదు అన్నది స్పష్టం. అప్పో సప్పో చేసి దేశం కోసం చమురు కొంటున్నవారు ఎక్కడా కనీసంగా నిరసన తెలిపిన పాపాన కూడా పోలేదు. ఒకవైపు రోడ్డు పేరుతో పెట్రోలు మీద సెస్‌ వేస్తున్నారు. మరో వైపు ద్విచక్ర వాహనాల మీద తప్ప మిగిలిన వాటన్నింటికీ ”తోలు” వసూలు చేస్తున్నారు. అయినా సరే నోరు మూసుకొని చెల్లించాల్సిందే ! గంగిరెద్దులం కదా మాట్లాడ కూడదు ! మనసులో కూడా ధరలు పెరిగాయి అనుకోకూడదు అన్నమాట ! ఎక్కడ నోరు తెరుస్తామో అని ముందుగానే మన నోరు మూయించేందుకు తిడుతున్నతిట్లు తప్ప ఇవి మరొకటి కాదు. ఒక వేళ ఎవరైనా చమురు ధరల మీద ఆందోళన చేశారో ! మీ వెనుక ఏపాకిస్ధానో, చైనానో ఉందనో, మీకు ఏదో ఒక ఉగ్రవాద సంస్ద నుంచి నిధులు అందుతున్నాయనో వెంటనే ముద్రవేస్తారు ! రైతులను చూస్తున్నాం కదా ! గంగిరెద్దులం కనుక తలెత్తటం లేదు !


వాట్సాప్‌లో తిరుగుతున్న మరో పోస్టు ఇరాన్‌కు చమురు బిల్లు చెల్లింపు గురించి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే చెబితే నిజం అవుతుందన్నగోబెల్స్‌ సూత్రాన్ని పక్కాగా అమలు జరుపుతున్నారు. యుపిఏ పాలనా కాలంలో చమురు ఖాతాలో ఇరవై లక్షల కోట్ల లోటు పెట్టారని, ఇరాన్‌కు అరవైవేల కోట్ల రూపాయల చెల్లింపు గురించి గత మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం దాచి పెట్టిందని, ఆ సొమ్మును ప్రభుత్వం వినియోగించుకుందని, మోడీ సర్కార్‌ మీద భారం మోపిందనే ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. వాస్తవం ఏమిటి ?
ఇరాన్‌పై పశ్చిమ దేశాల ఆంక్షలు అమలు జరుపుతున్న సమయంలో మన దేశంలోని మంగళూరు చమురు శుద్ది కర్మాగారం, హెచ్‌పిసిఎల్‌,ఐఓసి, హెచ్‌పిసిఎల్‌ మిట్టల్‌ ఎనర్జీ, ఎస్సార్‌ ఆయిల్‌ కంపెనీలు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకున్నాయి. దానికి గాను నలభైశాతం మొత్తాన్ని మన రూపాయల్లో చెల్లించాయి. అయితే మన దేశం మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు సిద్దపడినప్పటికీ ఆంక్షల కారణంగా అంతర్జాతీయ బ్యాంకులు భయపడి సొమ్ము తీసుకొనేందుకు ముందుకు రాలేదు. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది, ఆంక్షలను సడలించారు. టర్కీకి చెందిన హాక్‌బ్యాంక్‌ ముందుకు వచ్చింది, 6.5బిలియన్‌ డాలర్ల(మన కరెన్సీలో 43వేల కోట్లు) మొత్తాన్ని యూరోలలో చెల్లించాలని బ్యాంకు, ఇరాన్‌ కూడా కోరింది. ఆ మేరకు ప్రభుత్వం చెల్లించింది. అప్పటి వరకు ఆ సొమ్ము ఆయా కంపెనీల దగ్గరే ఉండిపోయింది తప్ప మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌ వాడుకోలేదు, మోడీ సర్కార్‌ తన బొక్కసం నుంచి చెల్లించిందీ లేదు. అయితే ప్రభుత్వం ద్వారా చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వం చమురు ఖాతాలోటు పూడ్చుకొనేందుకు గాను పన్ను భారం పెంచామని చెప్పుకొనేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేశారు. మనం గంగిరెద్దుల మాదిరి తలూపాలా ? నిజాల నిగ్గు తేల్చాలా ? మన గత చరిత్ర తలెత్తుకున్నది తప్ప తలూపింది కాదు మరి !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!

16 Saturday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

FIMI, iron ore, Iron Ore Exports, ISA, steel companies, steel prices in India, Trading with China



ఎం కోటేశ్వరరావు


దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఒక పాట గుర్తుకు వస్తోంది. నేను పుట్టాను లోకం మెచ్చిందీ-నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది..నాకింకా లోకంతో పని ఏముంది… అలా సాగుతూ ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి… ఐ డోన్ట్‌ కేర్‌ ….అని బాగా ప్రాచుర్యం పొందిన ప్రేమనగర్‌ సినిమాలోని యాభై సంవత్సరాల నాటి పాట ఇది.


ఈ మధ్య కార్పొరేట్‌లు దేశభక్తులు, వారు లేకపోతే సెల్‌ఫోన్లు లేవు, ఉపాధి లేదు, అసలు మన జీవితమే లేదు, వారిని విమర్శించేవారు దేశద్రోహులు అనే ధోరణి పెరిగిపోతోంది. కార్పొరేట్లే అన్నింటినీ జనానికి అందుబాటులోకి తెచ్చాయి అన్నది వారి వాదన. అరే నీకు తెలుసా లండన్‌లో చిన్న పిల్లలు, చివరికి కూరగాయలు అమ్మేవారు, రోడ్లు ఊడ్చేవారు కూడా ఇంగ్లీషు మాట్లాడతారంట అంటే అవునా అని చిన్న తనంలో ఎబిసిడిలు నేర్చుకోవటానికి కష్టపడిన సమయంలో ఆశ్చర్యపోయిన రోజులు గుర్తుకు వచ్చాయి. అందువలన ఇప్పుడా స్దితి కాదు గనుక అన్నీ కార్పొరేట్లే చేశారు అనే దానితో ఏకీభవించినా లేకున్నా వారి మనోభావాలను గాయపరచకూడదు కదా ! కనుక కార్పొరేట్‌లను, వారికి వెన్నుదన్నుగా ఉన్న వారిని దేశభక్తులుగా పేర్కొంటున్నాను. అలాంటి దేశభక్తులు నువ్వు ద్రోహం చేస్తున్నావంటే అసలు నువ్వు పెద్ద ద్రోహివని వీధులకు ఎక్కుతున్నారు. జనానికి తెలియని విషయాలను చెబుతున్నారు. కోవాక్స్‌ పేరుతో విదేశాల్లో రూపొందించిన కరోనా వాక్సిన్‌ను మన దేశంలో తయారు చేస్తున్న సీరం సంస్ధ-స్వయంగా రూపొందించి తయారు చేస్తున్న భారత బయోటెక్‌ యజమానులు ఎలా అసలు విషయాలు చెప్పిందీ చూశాము. నీది హానిలేని నీటితో సమానమైందని ఒకరంటే, అసలు నీ వాక్సిన్‌తో వచ్చే దుష్ప్రభావాల గురించి నువ్వు దాచి పెట్టలేదా అని ఇద్దరూ గోదాలోకి దిగారు. మీ రెండు వాక్సిన్లను జనానికి అంటగట్టేందుకు మై హూనా అంటూ మీలో మీకు గొడవెందుకని తెరవెనుక ఉన్న కేంద్రంలోని పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. దాంతో ఇద్దరం గొడవ పడకుండా ఎవరిది వారు అమ్ముకుందా అని రాజీపడ్డారు. జనం కళ్ల ముందే ఇది ఇద్దరు కార్పొరేట్‌ కరోనా వాక్సిన్‌ దేశభక్తులు-వారికి వెన్నుదన్నుగా ఉన్న వారి వాస్తవ కధ !


ఇటీవల సిమెంట్‌, ఇనుము ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వస్తున్నవార్తల గురించి తెలిసిందే. ముడి ఇనుప ఖనిజపు ధరలు రెట్టింపు అయ్యాయి. పదేండ్ల నాటి రికార్డులతో పోటీ పడ్డాయి. ఎగుమతిదార్లతో పాటు ఆ పేరు చెప్పి ఉక్కు ఉత్పత్తిదారులూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ ధరలు ఎంతకాలం ఉంటాయో తెలియదు. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే కార్పొరేట్‌ కంపెనీలు పోటీ పడి వినియోగదారుడి కాళ్లను నెత్తిమీద పెట్టుకుంటాయని కథలు చెప్పినవారు, దానికి ఉదాహరణగా సెల్‌ ఫోన్‌ కంపెనీలను ఉదాహరించే వారు గానీ మనకు ఎక్కడా కనిపించటం లేదు. కంపెనీలన్నీ కుమ్మక్కై ధరలు పెంచేశాయని ఏకంగా కేంద్ర మంత్రులే గగ్గోలు పెడుతున్నారు. ఇక గృహనిర్మాణ కంపెనీల దేశభక్తులు సిమెంట్‌, ఉక్కు కంపెనీలే కారణమని గగ్గోలు పెడుతుంటే మీరు మాత్రం తక్కువగా మీ నిర్మాణంలో మా సిమెంటు పాలెంత మీరు ఎంతకు అమ్ముతున్నారో ఎలా సొమ్ము చేసుకుంటున్నారో మాకు తెలియదా, లెక్కలు చెప్పమంటారా అని సిమెంట్‌ దేశభక్తులు ఎదురుదాడికి దిగారు. ఇది ఇంతటితో ఆగలా !


ఇనుప ఖనిజం తవ్వకం,ఎగుమతి-ఉక్కుతయారీ దేశభక్తులు కూడా తక్కువ తినలేదు. రాజకీయ నేతలు మనోభావాలను వాడుకుంటున్నపుడు మనం ఎందుకు తగ్గాలంటూ వారు కూడా నీ దేశభక్తి ఎంత అంటే నీది ఎంత అని దెబ్బలాడుకున్నారు. ఇద్దరూ తమ కోవెల అయినా ప్రధాని కార్యాలయంలో కొలువు తీరిన పెద్దాయనకు లేఖలు రాస్తున్నారు. తమ దేశభక్తిని శంకించటం ఉక్కుకు( ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్‌-ఐఎస్‌ఏ) తగని పని అని ఇనుపఖనిజం (భారతీయ ఖనిజ పరిశ్రమల ఫెడరేషన్‌-ఫిమి) మండిపండింది. ఒకవైపు చైనాతో వాణిజ్యం సాగిస్తున్న ఉక్కుగాళ్లు మేము ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేస్తున్నామంటూ మా దేశభక్తిని శంకించటం తగిని పని అని ఫిమి పేర్కొన్నది. లడఖ్‌ సరిహద్దులో తలెత్తిన వివాదం తరువాత చైనాతో లావాదేవీల విషయంలో అనేక ఆంక్షలు ఉండగా గనుల యజమానులు ఏప్రిల్‌-ఆగస్టు మధ్య 92శాతం ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేశారని ప్రధానికి ఉక్కు రాసిన లేఖలో మనోభావాన్ని గుర్తు చేసింది.

ఇనుప ఖనిజం నుంచి వేరు చేసిన ముడి ఇనుప గుళికలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్ద కుద్రేముఖ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీకి మాత్రమే అనుమతి ఉంది. గత ఏడాది అక్టోబరు-నవంబరు మాసాల్లో 7.52 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని గనుల యజమానులు ఎగుమతి చేశారు. వాటిపై నిషేధం విధించాలంటున్న ప్రాధమిక ఉక్కు తయారీ(గుళికలు)దారులు గతేడాది అక్రమంగా 10.63 మిలియన్‌ టన్నులు ఎగుమతి చేశారని, ఇనుప ఖనిజానికి దేశంలో కొరత లేదని ఇది వెల్లడించటం లేదా అని ఫిమి వాదించింది. ఏప్రిల్‌-అక్టోబరు మధ్య ఎగుమతి చేసిన 33 మిలియన్‌ టన్నుల ఖనిజంలో 19మి.టన్నులు 58శాతం లోపు ఇనుము ఉండే ముడి ఖనిజం ఎగుమతి అయిందని, మన ఉక్కు కంపెనీలు 63శాతంపైగా ఇనుము ఉన్న ఖనిజాన్నే వినియోగిస్తాయని అందువలన తాము ఎగుమతి చేయటం వలన కొరత అనటం అర్ధం లేదని ఫిమి చెబుతోంది. అంతేనా గత ఆరునెలల్లో ఇనుప ఖనిజం ధరలు టన్నుకు రూ.1,950 నుంచి 4,110కి పెరిగితో మరోవైపు ఉక్కు రూ.16,700 నుంచి 51,590కి పెరగాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది.ఉక్కు పరిశ్రమ యజమానులు తమ స్వంత లేదా స్దానిక గనుల నుంచి ఉన్నతస్దాయి ఖనిజాన్ని పొందుతూ ధరలు మాత్రం అంతర్జాతీయ స్ధాయిలో వసూలు చేస్తూ విపరీత లాభాలు ఆర్జిస్తున్నారని ఫిమి పేర్కొన్నది.

ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది ? ఎవరు చెబుతున్నది, ఏది నిజం ? జనం జేబుల ఖాళీ పచ్చినిజం. మేం ఇటు జనానికి దేశభక్తి , లవ్‌ జీహాద్‌, హిందూత్వను ఎక్కిస్తుంటాం, వారు వెంటనే ఈ మత్తునుంచి తేరుకోలేరు గనుక మీరు అటు చైనాతో ఎగుమతి వ్యాపారం ద్వారా, ఇటు జనానికి ధరలు పెంచి రెండు చేతులా లాభాలు పిండుకోండి, ఎన్నికల సమయంలో మా సంగతి చూడండి అని ఖనిజ,ఉక్కు కార్పొరేట్‌ దేశభక్తులకు చెప్పారన్నది అర్ధం కావటం లేదూ !


ఇలాంటి పరిస్ధితి ఉంటే ఏమౌతుంది ? రికార్డు స్ధాయిలో పెట్రోలు, డీజిలు ధరలు పెరిగాయి, ఏమైంది ? మోడీభక్తితో సమర్పించుకోవటంలా ? ఉక్కు ధరలు పెరగటం, తరచూ మారటం ఒక సమస్య అని వీల్స్‌ ఇండియా( ఆటోమొబైల్స్‌ పరిశ్రమకు అవసరమైన ఉక్కు విడిభాగాలు తయారు చేసే కంపెనీ) ఎండీ శ్రీవత్స రామ్‌ అంటున్నారు. వాణిజ్య పధకాల్లో అనిశ్చితి ఏర్పడుతుంది, మోడీగారి ఎగుమతి పధకమైన మేకిన్‌ ఇండియా మూలనపడుతుంది. ప్రాజెక్టులు, ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోతాయి, నిరుద్యోగం పెరుగుతుంది,కొనుగోలు శక్తి తగ్గుతుంది. దరిద్రం పెరుగుతుంది. ఇంతకంటే ఏం జరగదు. కార్పొరేట్‌ లాభాలకు కరోనా కాలంలోనే ఢోకా లేదు గనుక ఇప్పుడు ఏమీ కాదు.


చైనా ప్రపంచమంతటి నుంచి చేసుకుంటున్న వస్తు దిగుమతులు 2020 సంవత్సరాన్ని కాపాడాయని, ఇదొక చారిత్రక పాఠం, హెచ్చరికగా తీసుకోవాలని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రపంచమంతటా గిరాకీ పడిపోతే ఒక పెద్ద దేశంగా సహజ వనరులను కొనుగోలు చేసిన తీరు చరిత్ర. అయితే చైనా తాజాగా విడుదల చేసిన డిసెంబరు గణాంకాలను చూస్తే దాని కొనుగోళ్లు తగ్గిపోయే అవకాశాలు వెల్లడయ్యాయి. ఇది వస్తుమార్కెట్‌కు పొంచి ఉన్న ముప్పుగా పరిణమిస్తున్నారు. నవంబరుతో పోలిస్తే డిసెంబరులో దిగుమతులు తగ్గిపోయాయి. వీటిలో చమురు, రాగితో పాటు ఇనుప ఖనిజం కూడా ఉంది. చైనా వారు ఆకలితో మాడుతున్నారు గనుక మన దేశం నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేవారు మనకు కోకొల్లలుగా కనిపిస్తారు. ఆకలితో మాడేవారు ఇనుపఖనిజం ఏం చేసుకుంటారు అంటే ఏం చెబుతారో తెలియదు.

ఇక మన ఇనుప ఖనిజ ఎగుమతి దేశ భక్తులు ఖజానాకు చెల్లించాల్సిన 7,08,000 కోట్ల రూపాయల డ్యూటీ ఎగవేసి చైనాకు ఎగుమతులు చేశారని, 61 సంస్ధల నుంచి ఆ మొత్తాలను వసూలు చేయాలని సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజం దాఖలైంది. న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ కేంద్ర ప్రభుత్వానికి, ఎగుమతి సంస్ధలకు నోటీసులు జారీ చేసి చేసింది. డ్యూటీని ఎగవేసేందుకు తప్పుడు టారిఫ్‌ కోడ్‌ను చూపి 2015 నుంచి ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడిన సంస్దలలో ఎస్సార్‌ స్టీల్‌, జిందాల్‌ స్టీలు మరియు పవర్‌ కంపెనీ ఉన్నాయని, 30శాతం డ్యూటీ వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షించి ఈ అక్రమాలకు పాల్పడిన వారి మీద నిర్ణీత వ్యవధిలోపల విచారణ పూర్తి చేయాలని వారి నుంచి ఎగవేసిన డ్యూటీ, జరిమానా వసూలు చేయాలని పిటీషనరు పేర్కొన్నారు. ఇప్పుడున్న విధాన ప్రకారం ముడిఖనిజంలో 58శాతం లోపు ఇనుము ఉంటే ఎలాంటి పన్నులు లేకుండా చైనా, జపాన్‌, కొరియా వంటి దేశాలకు ఎగుమతులు చేయవచ్చు. అంతకు మించితే 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంది.


దేశంలో కొరత ఏర్పడిన కారణంగా ఇనుప ఖనిజ ఎగుమతులపై స్వల్పకాలం పాటు నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నవంబరు చివరివారంలో చెప్పారు. సిమెంట్‌, ఉక్కు ఉత్పత్తిదారులు కూటములుగా ఏర్పడి ధరలు పెంచారని మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దీని వలన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రోడ్ల వంటి మౌలికసదుపాయాల ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోతుందన్న విషయం తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిందేమంటే నాణ్యత తక్కువ ఉన్న ఖనిజం నుంచి కూడా గరిష్టంగా ఇనుము ఉత్పత్తి చేయగల నైపుణ్యం చైనాతో సహా విదేశాల్లో ఉందన్నది ఒక అంశం. టెక్నాలజీలో ఎంతో ముందున్నాం అని చెప్పుకొనే మనం ఎందుకు వినియోగించటం లేదు ? అభివృద్ది గురించి చైనా చెప్పే లెక్కలను నమ్మలేం అని చెప్పే నిత్య శంకితులు ప్రతి తరంలోనూ శాశ్వతంగా ఉంటారు. అదే నిజమైతే మన దేశం నుంచి ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేసి వారేమి చేసుకుంటారు అంటే నోరు విప్పరు. 2020లో కూడా గణనీయంగా దిగుమతులు చేసుకున్నదంటే అక్కడ కరోనాను కట్టడి చేసి సాధారణ కార్యకలాపాలను పునరుద్దరించటం, డిమాండ్‌ పెరగటమే కారణం. ప్రపంచ ఉక్కు సమాఖ్య సమాచారం ప్రకారం గతేడాది జనవరి-నవంబరు మధ్య 64దేశాల్లో ఉక్కు ఉత్పత్తి 1.3శాతం తగ్గితే చైనాలో 5.5శాతం పెరిగింది. చైనా తీసుకున్న ఉద్దీపన చర్యలు కూడా దీనికి దోహదం చేశాయి. అనేక దేశాలు కూడా ఉద్దీపన ప్రకటించినా అక్కడ డిమాండ్‌ పెరగలేదు.


నీతి, దేశభక్తి, దేశద్రోహం వంటివి ఇప్పుడు మన దేశంలో బాగా అమ్ముడు పోతున్న సరకులు. అంటే లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అవి ఎంతకాలం అనేది వేరే విషయం. చైనాను వ్యతిరేకించటం దేశభక్తుడి విధి. చైనాను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవటం నేటి మహత్తర కర్తవ్యం అంటూ సామాజిక మాధ్యమంలో, సంప్రదాయ మాధ్యమాల్లో మనం వింటున్నామా-చూస్తున్నామా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా కుమ్మరిస్తున్నారు. గతేడాది జూన్‌లో లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌ లోయలో భారత-చైనా సైన్యం మధ్య జరిగిన సంఘటనలో మన సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ఇది మరీ ఎక్కువైంది. మధ్యలో మన నరేంద్రమోడీ కౌగిలింతల భాగస్వామి అమెరికా ట్రంపు కంపు కారణంగా కాస్త తగ్గింది గానీ లేకపోతేనా…..రేటింగ్స్‌ కోసం టీవీ ఛానల్స్‌ ఇంకా రెచ్చిపోతుండేవి.

చైనా వస్తువుల దిగుమతులు నిలిపివేసి చైనీయులను మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చెప్పటాన్ని దేశభక్తిగా చిత్రిస్తున్నారు. చైనాతో ఇనుప ఖనిజం ఎగుమతులకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు లేవు.అడ్డా మీదకు వచ్చి మాకు ఇనుప ఖనిజం ఎంతకు సరఫరా చేస్తారు అని ఎప్పటికప్పుడు బేరమాడి చైనీయులు కొనుగోలు చేస్తున్నారు. భవిష్యత్‌లో మన అవసరాలకు ఖనిజాన్ని నిల్వ చేసుకోవటం అవసరమా లేక చైనా నుంచి వచ్చే నాలుగు డాలర్లు ముఖ్యమా ? చైనా మాదిరి ఉక్కు తయారీ మనకు చేతకాదా ? మనం ఎగుమతులు చేయలేమా ? వారికి అవసరమైన ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసి మరింతగా బలపడేట్లు చేస్తున్నట్లా కాదా ? చైనాకు ఎగుమతులు చేయటం ఎందుకు ? దాంతో మన దేశంలో ఉక్కు ధరలు పెరగటం ఎందుకు ? జనం గగ్గోలు పెడుతుంటే అచేతనంగా చూస్తూ కూర్చోవటం శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్న బిజెపికి మేలు చేస్తుందా ?తనదైన ప్రత్యేక ఆర్ధిక శాస్త్రం(మోడినోమిక్స్‌)తో దేశాన్ని నడిపిస్తున్న నరేంద్రమోడీ గారికి ఈ చిన్న లాజిక్కు తెలియదా లేక కార్పొరేట్ల చేతిలో బందీ అయ్యారా ? అనేక మంది అంటున్నట్లు ఆయనకు గడ్డం, జులపాల మీద శ్రద్ద పెరిగిపోయి దేశం మీద తగ్గిందా ? దేశ భక్తి నీతులు కేవలం సామాన్యులకేనా ? కార్పొరేట్లకు ఉండవా ? అసలేం జరుగుతోంది ? అర్ధం కావటం లేదా, కానట్లు నటిస్తున్నారా ? సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ! ఎంతకాలమో !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిసిఐకి వచ్చే నష్టం- పత్తి రైతులకు ఇస్తున్న సబ్సిడీ అట !

08 Friday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

CCI, Cotton Corporation of India, cotton farmers, Cotton MSP, cotton subsidies


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతాంగం ఉద్యమం సాగిస్తున్నది. రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ తీరును గమనించి ఉద్యమాన్ని ఉధృతం చేయటంలో భాగంగా ఢిల్లీలో ట్రాక్టర్ల ప్రదర్శనకు రైతులు సన్నద్దం అవుతున్నారు.వారికి వ్యతిరేకంగా పాలకులు, కార్పొరేట్‌లు, వత్తాసుగా వాస్తవాలను మూసిపెట్టాలని గోడీ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.మూసిపెడితే పాచిపోతుందన్నది తెలిసిందే. వాస్తవాలను వక్రీకరిస్తున్నకొద్దీ ఏదో ఒక రూపంలో కొన్ని అంశాలైనా వెలుగు చూస్తున్నాయి. కేంద్రం ఎందుకు మొండిగా ఉందన్న చర్చ రోజు రోజుకూ పెరుగుతోంది.


ఉపాధి కల్పిస్తున్నాయనే పేరుతో కార్పొరేట్లకు పాలకులు ఎన్నో రాయితీలు ఇస్తున్నారు. మరోవైపు వాటికి రక్షణ కల్పించాలంటూ విదేశీ దిగుమతులపై పన్నులు, ఇతర ఆంక్షలతో కాపు కాస్తున్నారు. నిజంగా మేలు జరిగితే ఇవ్వండి, ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాకులను కొట్టి గద్దలకు వేయవద్దని చెప్పటం తప్పు కాదు కదా ! చైనా నుంచి దిగుమతుల మన కొర్పొరేట్లు, పారిశ్రామికవేత్తల లాభాలకు గండిపెడుతున్నాయంటూ అనేక ఉత్పత్తులను నిలిపివేశారు. దానికి గాల్వాన్‌ లోయ ఉదంతాన్ని సాకుగా చూపి దేశభక్తి మేకప్‌ వేశారు. చైనా ఉత్పత్తులు నరేంద్రమోడీ హయాంలో ఇబ్బడి ముబ్బడి అయ్యాయన్నది వేరే విషయం. కరోనాకు ముందే పారిశ్రామిక, వాణిజ్య రంగాలు దిగజారటం ప్రారంభమైంది. నిలకడగా ఉన్నది వ్యవసాయ రంగమే. దాన్నుంచి లాభాలు పిండుకోవాలన్న కార్పొరేట్ల కన్ను పడింది కనుకనే వ్యవసాయ చట్టాలను సవరించారు. రైతుల ఉత్పత్తులకు ఆంక్షలు లేని స్వేచ్చా మార్కెట్‌ కబుర్లు చెబుతున్నారు. అన్ని రక్షణలు ఉన్నకారణంగానే కార్పొరేట్‌లు ఎక్కడా రోడ్ల మీద కనిపించరు.నోరు మెదపరు. రైతులు మాత్రం వీధులకు ఎక్కాల్సి వస్తోంది. గళం విప్పక తప్పటం లేదు.


వరుసగా రైతులకు ఉన్న రక్షణలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. సబ్సిడీలను ఎత్తివేస్తున్నారు. కార్పొరేట్లకు లేని ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలు రైతుల విషయాలకు మాత్రమే గుర్తుకు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.ప్రపంచ వాణిజ్య సంస్ద నిబంధనల పేరుతో 2019-20లో టారిఫ్‌ రేటు కోటా కింద లక్ష టన్నులు, 2020-21లో మరో ఐదు లక్షల టన్నుల మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి 50శాతం ఉన్న పన్నును తగ్గించి కేవలం 15శాతంతోనే దిగుమతులకు అనుమతించింది.ఇది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వత్తిడి మేరకు జరిగింది. మన దేశంలో ఉన్న ధరల కంటే తక్కువకే గిట్టుబాటు అవుతున్న కారణంగా వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా మన దేశంలో రైతాంగం కనీస మద్దతు ధరలకంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపున మన దేశం నుంచి బంగ్లాదేశ్‌కు మన కనీస మద్దతు ధరల కంటే తక్కువకు బంగ్లాదేశ్‌కు మన వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,850 కాగా ఎగుమతి ద్వారా తాము 1500 నుంచి 1550వరకు పొందుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారు వివిధ రాష్ట్రాలలో రైతుల నుంచి 12 నుంచి 1400 మధ్య కొనుగోలు చేస్తున్నారు(డిసెంబరు 25 మనీకంట్రోలు వార్త). దేశమంతటా ఇదే స్ధితి, ఏ ఒక్క ప్రయివేటు వ్యాపారీ వచ్చి కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. ఏ రైతూ తన పంటను పరాయి రాష్ట్రాలకు తీసుకుపోయి తనకు గిట్టుబాటు ధరకు అమ్ముకొనే పరిస్దితీ లేదు. ఎగుమతి చేస్తున్నా ధరలు రావటం లేదన్నది చేదునిజం.


2016 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతుల మీద పన్నులను తగ్గించింది దాంతో 5.9 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకున్నాము. తరువాత కాలంలో రైతాంగం గగ్గోలు పెట్టటంతో 2019 ఎన్నికల సమయంలో తిరిగి దిగుమతి పన్ను పెంచింది. అంటే పన్ను తగ్గింపు మన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. ఒక వైపు మనం మొక్కజొన్నలు, గోధుమలను ఎగుమతి చేసే స్ధితిలో ఉన్నామని చెప్పే ప్రభుత్వం దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలని చెబుతున్నారు.చైనా నుంచి వస్తున్న పారిశ్రామిక వస్తువులకు అది వర్తించదా ? రైతాంగానికి ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఏమిటి ? పప్పుధాన్యాల రైతులను ప్రోత్సహిస్తున్నామని ఒక వైపు చెబుతారు. మరోవైపు వాటి మీద ఉన్న దిగుమతి పన్నును 30 నుంచి 20శాతానికి తగ్గించారు.అది విదేశీ రైతులకు ఉపయోగపడింది తప్ప మరొకటి కాదు. ఇదే విధంగా విదేశీ పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై పన్ను పదిశాతం తగ్గించారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే.


ప్రపంచ వాణిజ్య సంస్ధ ఉనికిలోకి రాక ముందు ఉనికిలో ఉన్న పన్నులు, వాణిజ్యాలపై సాధారణ ఒప్పందం(గాట్‌) ఉరుగ్వే దఫా చర్చలకు ముందు వ్యవసాయం లేదు. ఆ దఫా చర్చలలోనే ముందుకు తెచ్చారు. దాని ప్రకారం ధనిక దేశాలు తమ రైతాంగానికి ఇచ్చే ఎగుమతి రాయితీలు, సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలి. ఇదే సమయంలో మిగిలిన దేశాలు దిగుమతులపై ఉన్న పన్నులు, ఇతర ఆంక్షలను ఎత్తివేయాలి, విదేశాలకు మార్కెట్లను తెరవాలి, రైతాంగానికి మద్దతు ధరల, ప్రజాపంపిణీ వ్యవస్దలను నిలిపివేయాలి. అయితే అమెరికా, ఐరోపా యూనియన్‌ ధనిక దేశాలు గ్రీన్‌ బాక్స్‌ పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి. మిగతా దేశాలు ఒప్పందాన్ని అమలు చేయాలని వత్తిడి చేస్తున్నాయి. ఆ వివాదమే గత రెండు దశాబ్దాలుగా దోహా దఫా ఒప్పందం కుదరకపోవటానికి కారణం.


బిల్‌క్లింటన్‌ హయాంలో రైతాంగానికి 1530 కోట్ల డాలర్ల మొత్తాన్ని నేరుగా అందించారు. ఎలా అంటే టన్ను సోయా ధర మార్కెట్లో 155 డాలర్లు ఉంటే ప్రభుత్వం 193 డాలర్లు చెల్లించింది. వాటిని మన వంటి దేశాలకు ఎగుమతి చేయటంతో మన రైతాంగం నాశనమైంది. అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికా వత్తిడికి లొంగిపోయి 2001లో 719 వస్తువులపై పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేశారు. గత ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా రైతులకు 4600 కోట్ల డాలర్ల సబ్సిడీ ఇచ్చాడు. అయితే వీటిలో ఎక్కువ మొత్తం బడా రైతులకు, కార్పొరేట్లకు చేరాయన్నది మరో అంశం. ఒక శాతం కంపెనీలు 26శాతం పొందితే, పదిశాతం పెద్ద బడా రైతులు, కంపెనీలకు 78శాతం దక్కాయి.


తాజాగా డిసెంబరు చివరి వారంలో ప్రపంచ పత్తి సలహా కమిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఒక్క పత్తికే 2018-19లో వివిధ దేశాలు ఇచ్చిన పలు రకాల రాయితీల మొత్తం 570 బిలియన్‌ డాలర్ల నుంచి 2019-20లో ఈమొత్తం 800కోట్ల డాలర్లకు పెరిగింది.గడచిన నాలుగు సంవత్సరాలలో పత్తి ధరలు తగ్గిన కారణంగా సబ్సిడీల మొత్తం 450 నుంచి 800 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతకు ముందు సంవత్సరాలలో గరిష్టంగా 1,700 కోట్లు చెల్లించిన రికార్డు ఉంది.2010-11 సంవత్సరాలలో ప్రపంచ పత్తి మార్కెట్లో ధర పౌండుకు(454 గ్రాముల గింజలు తీసిన దూది) 165 సెంట్లు పలకగా 2019-20లో 72సెంట్లకు తగ్గింది. ప్రస్తుతం 80 సెంట్లకు అటూ ఇటూగా కదలాడుతోంది.2019-20లో వివిధ దేశాలు ఇచ్చిన రాయితీల మొత్తాలు ఇలా ఉన్నాయి. ఆయా దేశాల పత్తి ఉత్పత్తిని సబ్సిడీ మొత్తాలతో భాగిస్తే సెంట్ల వారీ చూస్తే కొన్ని దేశాల స్ధానాలు మారతాయి.
దేశం×× కోట్ల డాలర్లు ×× పౌనుకు సెంట్లలో
చైనా×××× 471.1 ××××× 37
అమెరికా×× 202.2 ××××× 21
భారత్‌×××× 59 ××××× 4.4
టర్కీ ×××× 23.2 ××××× 13
గ్రీస్‌ ××××× 20.7 ××××× 32
మాలి ×××× 8.2 ××××× 12
స్పెయిన్‌ ××× 6.7 ××××× 46
కోట్‌ డి ఐవరీ × 3.8 ××××× 13
బుర్కినాఫాసో×× 2.4 ××××× 6
మన దేశ సబ్సిడీ విషయానికి వస్తే కాటన్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన పత్తికి చెల్లించిన మొత్తం- దాన్ని తిరిగి మిల్లర్లకు లేదా ఎగుమతులు చేయగా వచ్చిన మొత్తాలకు ఉన్న తేడాను సబ్సిడీగా పరిగణిస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలలో సిసిఐ నామ మాత్రపు కొనుగోళ్లు జరిపింది. కొన్ని సంవత్సరాలలో దానికి ఎలాంటి నష్టాలు లేవు. అందువలన దీన్ని ప్రాతిపదికన తీసుకుంటే సబ్సిడీ అసలు లేనట్లే అని చెప్పవచ్చు. ఉదాహరణకు 2017-18 పత్తి సంవత్సరంలో సిసిఐ 66,313 టన్నులు కొనుగోలు చేయగా 2018-19లో 1,81,970 టన్నులు, 2019-20లో (గడచిన ఐదేండ్లలో రికార్డు స్ధాయిలో) 17.9లక్షల టన్నులు సిసిఐ కొనుగోలు చేసింది. 2018-19లో సిసిఐకి వచ్చిన నష్టం 4.6 కోట్ల డాలర్లు, కాగా 2019-20లో 2020 నవంబరు నాటికి 12లక్షల టన్నులు విక్రయించగా మిగిలిన మొత్తం నిల్వ ఉంది. అయితే అమ్మినదాని మీద వచ్చిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తంగా నష్టం 59 కోట్ల డాలర్లు ఉండవచ్చని అంతర్జాతీయ పత్తి సలహా సంస్ద తన నివేదికలో పేర్కొన్నది. దీన్ని సబ్సిడీగా పరిగణించింది.నిజానికి దీన్ని పత్తి రైతులకు ఇచ్చిన సబ్సిడీగా పరిగణించాలా లేక మిల్లర్లకు, ఎగుమతులకు ఇచ్చిన రాయితీలు మరియు సిసిఐ అవినీతి, అక్రమాల మొత్తంగా చూడాలా ?


పత్తితో పాటు ఇతర కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలను సబ్సిడీలుగా అమెరికా తదితర దేశాలు పరిగణిస్తూ ప్రపంచ వాణిజ్య సంస్ధలో కేసులు దాఖలు చేశాయి. ఆ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఓయిసిడి సంస్ధ ప్రకటించిన వివరాల ప్రకారం అమెరికా, ఐరోపా యూనియన్‌, జపాన్‌ ధనిక దేశాల రైతాంగ ఆదాయాల్లో 40 నుంచి 65శాతం మొత్తాలు ఆయా ప్రభుత్వాలు అందచేస్తున్న సబ్సిడీల ద్వారా సమకూరుతున్నవే.
ఈ ఏడాది పత్తి రైతాంగం కనీస మద్దతు ధరలను పొందటం లేదని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో క్వింటాలుకు ఏడు నుంచి ఎనిమిది వందల రూపాయవరకు తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా సిసిఐ కేంద్రాలకు పెద్ద మొత్తంలో పత్తి వస్తోంది. కొనుగోలును తగ్గించేందుకు అనేక నిబంధనలు పెట్టటంతో పాటు పెద్ద మొత్తంలో ఒకేసారి తీసుకు రావద్దని, ఈ ఏడాది సెప్టెంబరు వరకు ( ప్రతి ఏటా అక్టోబరు ఒకటవ తేదీన పత్తి సంవత్సరం ప్రారంభమై మరుసటి ఏడాది సెప్టెంబరులో ముగుస్తుంది) కొనుగోళ్లు జరుపుతూనే ఉంటామని సిసిఐ ప్రకటించింది. చిన్న, మధ్య తరగతి రైతులకు ఇది సాధ్యమేనా ? కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా ? పంజాబ్‌లో ప్రతి రోజూ మండీలకు 50వేల క్వింటాళ్ల పత్తి వస్తుంటే తాము రోజుకు పన్నెండున్నరవేలకు మించి కొనుగోలు చేసేది లేదని సిసిఐ చెబుతున్నదని ప్రయివేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదలి వేస్తున్నదని అకాలీదళ్‌నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమె కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రైతులు భయపడుతున్నది న్యాయమే అని ఈ పరిణామం వెల్లడిస్తున్నదన్నారు.

పత్తికి కనీస మద్దతు ధరలు ఉంటాయని తెలిసిన రైతాంగం 25శాతంలోపే అని, ప్రధానంగా పత్తి పండించే రాష్ట్రాలలో వారు 12 నుంచి 27శాతంగా ఉన్నారని పరిశోధకులు తెలిపారు. తెలిసిన వారిలో కూడా 34.34 నుంచి 37.5 శాతం మాత్రమే సేకరణ సంస్ధలకు విక్రయిస్తున్నారని తేలింది. అందుకే కాస్త ఎక్కువ తెలిసిన ప్రాంతాల రైతులు ముందుగా మేలుకున్నారు, తెలియని వారు తెలుసుకొని రంగంలోకి దిగుతారు. వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి ఒరగబెడతామని చెబుతున్న పాలకులు, వారికి వంత పాడుతున్న మేధావులూ ఈ అంశాల గురించి ఏమంటారో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వాక్సిన్‌ జాతీయవాదం- దేశ ద్రోహం – బిజెపి విపరీత పోకడ !

05 Tuesday Jan 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Science, USA

≈ Leave a comment

Tags

Bjp nationalism, COVAX, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు
అన్నీ వివాదం అవుతున్నాయి, ఛీ ఛీ, చివరికి కరోనా వాక్సిన్‌ కూడా అనుకుంటున్నారా ! అవును, ఎవరి పాత్రను వారు పోషిస్తున్నారు. వాక్సిన్‌ తయారీ తన ఆత్మనిర్భర కలను నిజం చేయటంలో శాస్త్రవేత్తల ఆతురత కనిపించిందని అని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే ఎదుటి వారి మీద తప్పుడు ముద్రలు వేసేందుకు కూడా అతీతంగా ఏవీ కనిపించటం లేదు. ఒక కంపెనీ వాక్సిన్‌ నీటి మాదిరి సురక్షితమైనది అని ఒకరు ఎత్తిపొడిచింది. మరో కంపెనీ వాక్సిన్‌కు 60శాతం దుష్ప్రభావాలు ఉన్నా పారాసిటమాల్‌ వేసి కనపడకుండా చేసినట్లు మేం చేయం, కేవలం వంద మంది మీదనే పరీక్షించి మా ఉత్పత్తి సురక్షితం అంటే ఎలా అన్నారు మరొకరు. ఇద్దరూ కరోనా వాక్సిన్‌ తయారు చేసే బడా కంపెనీల అధిపతులే, రోడ్డెక్కి చెప్పిన మాటలే కనుక ఒకరు సీరం సిఎండి అదర్‌ పూనావాలా అయితే మరొకరు భారత్‌ బయోటెక్‌ అధినేత కృష్ణ ఎల్ల అని చెప్పుకోవటానికి మనం సిగ్గుపడనవసరం లేదు. ఏమిటీ లొల్లి, ఎవరి మాట నమ్మాలి, ఎవరిని అనుమానించాలి ? కేంద్ర ప్రభుత్వం రెండు వాక్సిన్లను అత్యవసర పరిస్ధితిలో వినియోగానికి అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకదాని ప్రభావం, పరీక్షా ఫలితాల గురించి ప్రశ్నించిన వారి మీద దాడి చేస్తున్నారు.


ఔషధం, వాక్సిన్‌ ఏదైనా సరే జీవుల ప్రాణాలను కాపాడాలి తప్ప తీయకూడదు. రోగాలు, మహమ్మారుల నుంచి కూడా లాభాలు పిండుకోవటమే పరమార్ధంగా ఉండకూడదు. ఏ కంపెనీ అయినా పూర్తి వివరాలు ప్రకటించనపుడు అనేక మందికి అనుమానాలు కలగటం, వాటిని బహిరంగంగా వ్యక్తం చేయటం సహజం. అది కూడా తప్పేనా ? ఏమిటీ ఉన్మాదం ! భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఉత్పత్తి వలన ప్రయోజనం-హానీ రెండు లేవని ప్రత్యర్ధి కంపెనీ సీరం సంస్ధ ప్రతినిధి చెప్పారు. అది ఆరోపణో, నిజమో జనానికి తెలియదు. దాని మీద స్పందించిన భారత్‌ బయోటెక్‌ అధిపతి కృష్ణ తన ప్రత్యర్ధి కంపెనీ ఉత్పత్తి 60శాతం దుష్ప్రభావాలు కలిగిస్తుందని చెబుతున్నారు. నిజానికి జనం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే వారు ఇలాంటి సమాచారాన్ని ఇప్పటి వరకు ఎందుకు దాచినట్లు ? తన ఉత్పత్తి మీద విమర్శచేసిన తరువాతనే స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు వాక్సిన్ల గురించి కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. దొంగల మధ్య పంపిణీలో తేడాలు వచ్చినపుడు దొంగతనం విషయం బయటకు వచ్చినట్లుగా లేదీ వ్యవహారం !


గర్భవిచ్చిత్తి జరిగిన మానవ పిండాల నుంచి తీసిన కణాలతో తయారు చేసిన వాక్సిన్లను మన క్రైస్తవులు వేసుకోకూడదని కొందరు, పంది మాంసం నుంచి తీసి కణాలతో చేసిన వాక్సిన్లు ముస్లింలు వేసుకోకూడదని మరికొందరు టీకా తాత్పర్యాలు చెబుతున్నారు. వీరందరికంటే ముందే వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పిన వారు ఆవు మూత్రం తాగి, ఆవు పేడ పూసుకుంటే కరోనా ప్రభావం ఉండదని, దీపాలు వెలిగిస్తే వైరస్‌ నశిస్తుందని చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి. గోమూత్ర సేవనం సర్వరోగ నివారిణి అని ఊరందరికీ చెప్పిన పెద్దలు తమవద్దకు వచ్చే సరికి ఆ పని చేయకుండా బతుకు జీవుడా అంటూ కరోనా సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న విషయం తెలిసిందే. అదే మాదిరి క్రైస్తవ, ఇస్లామిక్‌ మత పెద్దలు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వాక్సిన్లు తీసుకోవచ్చని ముక్తాయింపులు పలికారు. మతాలవారు చెప్పారని వాక్సిన్లు తీసుకోకుండా జనం ఆగుతారా ?


మన దేశంలో కరోనా వాక్సిన్‌ ఎందుకు రాజకీయ వివాదంగా మారింది ? ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ను మన దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసేందుకు అనుమతులు పొందింది. మరోవైపు దేశీయంగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న భారతబయోటెక్స్‌ కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఐసిఎంఆర్‌ మరియు వైరాలజీ జాతీయ సంస్ధతో కలసి రూపొందించి కోవాగ్జిన్‌ పేరుతో వాక్సిన్‌ ప్రయోగాలు జరుపుతున్నది. కోవిషీల్డ్‌ మూడు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుంది. కోవాగ్జిన్‌ మూడవ దశ ప్రయోగాలు పూర్తయినట్లు చెబుతున్నా ఇంకా ఫలితాలు ఇంకా వెలువడలేదు. అలాంటి వాక్సిన్‌ వినియోగానికి ముందుగానే అనుమతివ్వటం ఏమిటన్న ప్రశ్నను కొందరు లేవనెత్తారు. ఇది వివాదాస్పదమైంది. దీని మీద సమర్ధనలూ, విమర్శలూ వెలువడుతున్నాయి. జనంలో గందరగోళం, వాక్సిన్ల సామర్ధ్యం మీద అనుమానాలు తలెత్తాయి. కొందరు జాతీయవాదాన్ని ముందుకు తెచ్చేందుకు పూనుకున్నారు.ఇదొక అవాంఛనీయ పరిణామం. వాక్సిన్ల తయారీ కంపెనీల మధ్య వాణిజ్య పోరుగా రాబోయే రోజుల్లో బయటపడనుందా ?

కోవాగ్జిన్‌ వాక్సిన్‌ ప్రత్యామ్నాం అని పేర్కొనటం,వినియోగానికి సంబంధించి అనేక పరిమితులను పేర్కొని అనుమతులు ఇచ్చారు. ప్రత్యామ్నాయం అంటే ఏదీ దొరకనపుడు అనే అర్ధం కూడా ఉంది. అందువలన ఈ రెండు వాక్సిన్లలో దేనిని ఎవరు వేసుకోవాలి? నిర్ణయించేది ఎవరు ? మూడవ దశ ప్రయోగాల ఫలితాలు పూర్తిగాక ముందే కోవాగ్జిన్‌కు అనుమతులు ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తొలుత మన సైనికుల పరాక్రమాన్ని ఇప్పుడు వాక్సిన్‌ తయారీని శంకిస్తున్నారంటూ కేంద్ర మంత్రి హర్దేవ్‌సింగ్‌ పూరీ, ఇతర బిజెపి నేతలు ప్రతిపక్షాలు, ఇతరుల మీద ఎదురుదాడికి దిగటం విస్మయం కలిగిస్తోంది. అసలు ఆ కంపెనీ తరఫున వీరు వకాల్తా పుచ్చుకోవటం ఏమిటి ? ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడతారా ? కోవాగ్జిన్‌ సామర్ధ్యం గురించి ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు, వివరాలు వెల్లడించకుండా నమ్మటం ఎలా అన్నదే అసలు సమస్య.


కోవాగ్జిన్‌ గతేడాది ఆగస్టు 15నాటికే అది సిద్దం అవుతుందని స్వయంగా ఐసిఎంఆర్‌ లేఖలు రాసింది. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం రోజున ప్రకటన చేసేందుకు సన్నాహాలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ గడువు పోయింది, రిపబ్లిక్‌ దినోత్సవం లోపు అయినా పరిశోధనా ఫలితాలు వస్తాయా అన్న అనుమానాలు ఉన్న సమయంలో రాకముందే ఏకంగా ముందస్తు అనుమతి ఇచ్చేశారు. కొంత మంది చెబుతున్నట్లు ఇప్పటికే దాదాపు 7 కోట్ల డోసులు తయారు చేసిన సీరం సంస్ధ నుంచి కొనుగోలు బేరసారాల వత్తిడిలో భాగంగా కోవాగ్జిన్‌ పరీక్షలు పూర్తి కాకుండానే అనుమతులు ఇచ్చారా అన్న కోణం కూడా ఉంది. ఒకవేళ అదే వాస్తవం అయితే అలాంటి విషయాలు దాగవు.


కోవాగ్జిన్‌పై అనుమానాలు వ్యక్తం చేయటమే దేశ ద్రోహం అన్నట్లుగా వ్యాఖ్యానించి బిజెపి వాక్సిన్‌ జాతీయవాదాన్ని ముందుకు తెచ్చింది. టీవీ ఛానల్స్‌ పెద్దలు కూడా ముందూ వెనుకా చూడకుండా నిర్దారణ చేసుకోకుండా తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నారో కూడా ఈ సందర్భంగా వెల్లడైంది. ఎవరో ఒక చిన్న విలేకరి పొరపాటు లేదా అత్యుత్సాహం ప్రదర్శించాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇండియా టీవీ అధిపతి, ప్రధాన సంపాదకుడు అయిన రజత్‌ శర్మ ఏకంగా కోవాగ్జిన్‌ టీకాను ముందుగానే 190 దేశాలు ఆర్డర్‌ ఇచ్చాయని సెలవిచ్చారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించి చెప్పే వారి మాదిరి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడారో చూడండి.” మన దేశంలో వృద్ది చేసిన ఈ వాక్సిన్‌ బాగా పని చేస్తుంది, ధర తక్కువ, నిల్వచేయటం సులభం. ఎందుకంటే నరేంద్రమోడీ విధానాలు మన శ్స్తావేత్తల నైపుణ్యం దీనికి కారణం. వాక్సిన్‌ గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ముందుగానే 190 దేశాలు దీని కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయని తెలుసుకోవాలి ” అని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. దాన్ని బిజెపి మరుగుజ్జులు పెద్ద ఎత్తున రీ ట్వీట్‌ చేశారు.


తమ ఉత్పత్తి కేంద్రాన్ని 70దేశాల ప్రతినిధులు సందర్శించారని చెప్పారు తప్ప ఆర్డర్లు బుక్‌ చేశారని భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా ఎక్కడా చెప్పలేదు. అలా సందర్శించిన వారు ఆర్డర్లు పెట్టినట్లు వార్తలు కూడా లేవు. మరి రజత్‌ శర్మగారికి 190 దేశాల సమాచారం ఎలా తెలిసింది? అనేక మంది సామాన్యులు భారత్‌ బయోటెక్‌ తయారీ కోవాగ్జిన్‌ వాక్సిన్‌, ప్రపంచ ఆరోగ్య సంస్ధ కార్యక్రమమైన కోవాక్స్‌తో గందరగోళపడుతున్నారు.ప్రపంచ దేశాలన్నింటికీ చౌకగా వాక్సిన్‌ అందించేందుకు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో 190 దేశాలు పాలుపంచుకుంటున్నాయని, భాగస్వామ్య దేశాలన్నింటికీ రెండువందల కోట్ల డోసుల వాక్సిన్‌ అందచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు డిసెంబరు 19న ప్రకటించారు. వీటిలో అనేక దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్దారించిన వాక్సిన్లన్నీ ఉన్నాయి. ఇరవై కోట్ల డోసులు అందించేందుకు వాక్సిన్‌ అలయన్స్‌ గవీ, ఇతర సంస్ధలు ఒప్పందం చేసుకున్నాయి. వివిధ దేశాలకు చెందిన పది వాక్సిన్‌లను ఉటంకిస్తూ అవి ఏ దశలో ఉన్నాయో కూడా ప్రకటనలో తెలిపారు. చిత్రం ఏమిటంటే వీటిలో భారత బయోటెక్స్‌ కోవాగ్జిన్‌ లేదు. త్వరలో పరీక్షలు పూర్తి చేసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొంది ఇది కూడా చేరుతుందా లేదా అన్నది వేరే విషయం. ఇప్పటికైతే ఎగుమతి వార్తలు లేవు.

కోవాక్స్‌ కార్యక్రమం ప్రకారం దానిలో భాగస్వామ్య దేశాలకు ఆ కార్యక్రమం కింద పంపిణీ చేసే వాక్సిన్‌లో ఆయా దేశాల జనాభాను బట్టి 20శాతం డోసులను వారికి అందచేస్తారు. వాటిని ఆయా దేశాలు ఎలా ఉపయోగించుకుంటాయి, ఎవరికైనా అందచేస్తాయా అన్నది వారిష్టం. ఉదాహరణకు చైనాలో కరోనా కేసులు లేని కారణంగా చైనా రూపొందించిన వాక్సిన్లను బ్రెజిల్‌లో ఉన్న రోగుల మీద ప్రయోగాలు చేశారు. కోవాక్స్‌ కార్యక్రమంలో చైనా భాగస్వామి కనుక దానికి వచ్చే వాటాను ఇతర దేశాలకు అందచేయవచ్చు. అమెరికా దానిలో భాగం కాదు కనుక దానికి వాక్సిన్ల కోటా ఉండదు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారం పేద దేశాలకు సబ్సిడీ ధరలకు వాక్సిన్‌ అందచేస్తారు. బిల్‌గేట్స్‌ కూడా ఈ పధకంలో భాగస్వామి కనుక తనకు వచ్చే వాక్సిన్‌ తన సంస్ధ ద్వారా ఎవరికైనా అందచేయవచ్చు.


సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేసి శాస్త్రవేత్తలను అవమానించటం తన ఉద్దేశ్యం కాదంటూ తరువాత నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్‌ బిజెపిదని దాన్ని తాను వేసుకోనని అఖిలేష్‌ వ్యాఖ్యానించారు. నిజానికి సర్వరోగనివాణి బిజెపి వాక్సిన్‌ లేదా ఔషధం ఆవు పేడ లేదా మూత్రం అన్నది అందరికీ తెలిసిందే . ఆవు మూత్ర సేవన కార్యక్రమాల సమయంలో ఆ ప్రకటన చేసి ఉంటే అర్ధం ఉండేది. ఆవు మూత్రం, పేడ కరోనాను నివారిస్తుందని చెప్పిన బిజెపి పెద్దలు అనేక చోట్ల వాటి సేవన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి చర్యల ద్వారా మన వైద్యులు, శాస్త్రవేత్తలను అవమానించిందీ, ఇప్పటికీ అవమానిస్తున్నదీ కాషాయ దళాలే.
భారత బయోటెక్‌లో తయారు చేస్తున్నది ఆవు (మూత్రపు) శాస్త్రవేత్తలు కాదు. దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇంకా రాలేదు కనుక వేసుకోను అన్నా అదొకరకం. ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లాలోని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపిని ఓడించి ఊపుమీద ఉండటం, వాక్సిన్‌ తయారీని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు భ్రమ కల్పించేందుకు నరేంద్రమోడీ పూనా, హైదరాబాద్‌లోని ఆ సంస్దలను సందర్శించిన నేపధ్యంలో సమాజవాద పార్టీ నేత బిజెపి వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ఆ వ్యాఖ్య పనికి వస్తుందని భావించి ఉండవచ్చేమోగాని, శాస్త్రవేత్తలను కించపరచాలనే ఉద్దేశ్యం ఉంటుందని చెప్పలేము. అఖిలేష్‌ యాదవ్‌ తెలివి తక్కువ ప్రకటన చేస్తే బిజెపి నేతలు తక్కువేమీ తినలేదు. వివరాలు లేని వాక్సిన్‌ సామర్ద్యాన్ని ప్రశ్నించటం దేశద్రోహం అనేంతవరకు వెళ్లారు.


వాక్సిన్లను స్వదేశీ-విదేశీ అని వర్ణించటం అర్ధంలేని విషయం. విదేశాల్లో రూపొందించిన వాక్సిన్లు, ఔషధాలను మన దేశంలోని సంస్ధలు తయారు చేయటమే కాదు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.ఇదొక వ్యాపారం. భారత్‌ బయోటెక్‌ సంస్ధకు ప్రపంచంలో అతి పెద్ద వాక్సిన్‌ వ్యాపారి బిల్‌ గేట్స్‌కు, అంతర్జాతీయ ఫార్మా లాబీకి ఉన్న వ్యాపార లావాదేవీల వివరాలు జనానికి తెలియకపోవచ్చుగానీ వారి సంబంధాలు బహిర్గతమే. ఏదో ఒక రూపంలో ఆ సంస్ధ బిల్‌గేట్స్‌, ఇతర సంస్ధల నుంచి నిధులు పొందింది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తున్న డయేరియాకు ఉపయోగించే రోటోవాక్‌ వాక్సిన్‌ సామర్ధ్యం 56శాతమే అని, దాని మూడవ దశ ప్రయోగ ఫలితాలు ఇప్పటికీ అందుబాటులో లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ వాక్సిన్‌ కొనుగోలుకు ఆ సంస్దతో బిల్‌ గేట్స్‌ ఒప్పందం ఉంది. దాన్ని ప్రభుత్వాలకు అంటగట్టి ప్రజారోగ్య కార్యమ్రాలలో వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌, అంతర్జాతీయ వాక్సిన్‌ లాబీ కంపెనీలు సరఫరా చేస్తున్న నాసిరకం లేదా ప్రభావం లేని వాక్సిన్ల కారణంగా ప్రపంచ వ్యాపితంగా 3.8కోట్ల మంది శిశువులు పుట్టక ముందే మరణించారనే విమర్శలు ఉన్నాయి.మన దేశంతో సహా అనేక దేశాలలో వాక్సిన్ల దుష్ప్రభావాలకు తయారీ కంపెనీల నుంచి పరిహారాన్ని కోరే చట్టాలు లేవు. ఈ నేపధ్యంలోనే కోట్లాది మందికి వేయదలచిన వాక్సిన్‌ గురించి భారత్‌ బయోటెక్‌ వివరాలు వెల్లడి చేయక ముందే అనుమతి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి.

వాక్సిన్‌పై తలెత్తిన వివాదం ”సమాచార మహమ్మారి ” ని మరింత ఎక్కువ చేయనుందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఎన్ని మహమ్మారులను అయినా ఎదుర్కొనగలంగానీ అంతకంటే వేగంగా తప్పుడు, నకిలీ వార్తలను వ్యాపింప చేసే సమాచార మహమ్మారి వైరస్‌ ఎంతో ప్రమాదకరమని ఆ రంగంలోని పెద్దలు చెబుతున్నారు. దీని గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. ఇప్పుడు కరోనా-వాక్సిన్‌ కూడా వివాదం అయింది కనుక దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని సవినయమనవి. చివరిగా ఒక విషయం మరచి పోకూడదు. కరోనా వైరస్‌ గురించి తెలిసిన వెంటనే ప్రపంచంలోని అనేక మంది దాని నివారణకు వాక్సిన్‌ తయారీకి పూనుకున్నారు. మన దేశంలో తొలి వైరస్‌ కేసు బయటపడి, లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తరువాత కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించింది. అది ఆర్ధిక ఉద్దీపన కార్యక్రమం అని అందరికీ తెలుసు. ఇప్పుడు వాక్సిన్‌ తయారీ ఆ కార్యక్రమ కల అని దాన్ని శాస్త్రవేత్తలు నెరవేర్చారని ప్రధాని చెప్పటంలో నిజాయితీ ఎంతో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు మన వాక్సిన్‌ సామర్ధ్యాన్ని ప్రశ్నించటం దేశవ్యతిరేక వ్యాఖ్యలు తప్ప మరొకటి కాదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌, మరొక మంత్రి హరదేవ్‌ సింగ్‌ పూరీ వ్యాఖ్యానించారు. కలికాలం, వైపరీత్యం గాకపోతే బిజెపికి నచ్చని వారందరికీ ఈ ముద్ర తగిలిస్తారా ! ఏమిటీ అనారోగ్యపు వ్యాఖ్యలు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

” దేశభక్త ” నరేంద్రమోడీ పాలనలో ” దేశ ద్రోహ ” చైనా దిగుమతులు !

03 Sunday Jan 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Boycott of Chinese Products, Boycott of goods made in China, China goods boycott, India imports from China


ఎం కోటేశ్వరరావు


అమెరికా మీద ఎవరికైనా అంతగా మోజు ఉంటే తీర్చుకోవచ్చు. సరే దాని ఫలితాలు-పర్యవసానాలను కూడా అనుభవించేందుకు సిద్దపడాలి. ఎక్కడో పదమూడువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని కోసం మూడున్నరవేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్న పొరుగు దేశం చైనాతో సఖ్యత లేకపోతే పో(పా)యే ! విరోధం లేకుండా అన్నా ఉండాలని చెప్పినవారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. పోనీ దాన్ని కూడా భరించవచ్చు- తామే సిసలైన దేశభక్తులమని చెప్పుకుంటున్నవారి ఆచరణ ఏమిటి అన్నది అసలు సమస్య ! ఈ మధ్యనే వచ్చిన వార్తల ప్రకారం సూటిగా నిషేధించే దమ్మూ ధైర్యం లేక చైనా నుంచి వచ్చే వారిని చట్టపరంగా నిషేధించలేము గానీ విమాన టిక్కెట్లు ఇవ్వకుండా అడ్డుకోవాలని సదరు కంపెనీలను కోరినట్లు చదివాము. అంతకు ముందు అమెరికా ప్రభుత్వం చైనా జాతీయులందరినీ కమ్యూనిస్టులుగా పరిగణించి నిషేధం విధించింది. వారిని సంతుష్టీకరించేందుకు ఇంత డొంక తిరుగుడు అవసరమా ?


లడఖ్‌ సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో గత ఏడాది జూన్‌లో జరిగిన ఉదంతం తరువాత చైనా పెట్టుబడులు, వస్తువులను అడ్డుకుంటామంటూ వీర,శూర ప్రతిజ్ఞలు చేశారు. అనేక యాప్‌లను నిషేధించారు. దేశభక్తి అని చెప్పారు గనుక ఎవరూ తప్పు పట్టలేదు. ఉల్లిపాయలు తినొద్దని ఊరందరికీ చెప్పాను గానీ నిన్ను కూరల్లో వేయవద్దని చెప్పానా అని ఒక కథకుడు ఇంట్లో భార్యమీద మండిపడ్డాడట. నరేంద్రమోడీ నాయకత్వం పరిహాసం పాలైందని ఎవరైనా అంటే కాషాయ మరుగుజ్జులు గుంజుకుంటారు.తలరాత లేదా విధి మీద నమ్మకం ఉండేవారి ఆలోచన ప్రకారమైతే గతేడాది ఏప్రిల్‌-నవంబరు మాసాల మధ్య మన దేశ దిగుమతులు మొత్తంగా 32.6శాతం పడిపోతే చైనా నుంచి 17.2శాతమే తగ్గటం విధి వైపరీత్యం, నరేంద్రమోడీకి తలవంపులు గాకపోతే మరేమిటి ?

చైనా వస్తువులను దిగుమతులు చేసుకొనే లేదా వాటిని నియంత్రించే అధికార వ్యవస్దలో సీతారామ్‌ ఏచూరీ, పినరయి విజయన్‌, బృందాకరత్‌ల కుటుంబ సభ్యులు, బంధువులు లేదా వారి పార్టీ వారు గానీ లేరు, ఉన్నదంతా ” అసలు సిసలు ” ” దేశభక్తులు, జాతీయవాదు ” లైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలే కదా ? మరి ఎందుకు చైనా ఉత్పత్తులు నిలిపివేయలేకపోయారు ? నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చూసీ చూడనట్లు ఉన్నట్లు ? జనాలను బకరాలను చేద్దామనా ?
దిగుమతులు తగ్గటంలో ప్రధానంగా చమురు, బంగారం ఉన్నాయని ఎవరైనా సమర్ధించుకోవచ్చు. అవి మినహాయిస్తే పైన చెప్పిన నెలల్లో దిగుమతులు 25.6శాతం తగ్గాయి, వాటితో పోల్చినా చైనా వాటా తక్కువే కదా ! చైనా నుంచి టీవీల దిగుమతి గణనీయంగా పడిపోయింది, అంతకంటే ఎక్కువశాతం వియత్నాం నుంచి పడిపోయిందని అంకెలు చెబుతున్నాయి. ఈ కాలంలో చైనా నుంచి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టాబ్లెట్ల వంటివి గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది. చైనా నుంచి నేరుగా తగ్గితే మరొక మార్గంలో వయా హాంకాంగ్‌ నుంచి భారత్‌కు చేరుతున్నాయి. చిల్లి కాదు తూటు అంటే ఇదే. చైనా నుంచి దిగుమతులు 80.8శాతం నుంచి 65.1శాతానికి పడిపోతే ఇదే సమయంలో హాంకాంగ్‌ నుంచి 9.8 నుంచి 23.4శాతానికి పెరిగాయి. రెండింటినీ కలిపి చూస్తే 90.6 నుంచి 88.5శాతానికి తగ్గాయి. సంఖ్యపరంగా తగ్గింది తక్కువే అయినా విలువ పరంగా 24.7శాతం పెరిగింది. అసలు కారణం ఇంటి నుంచి పని చేసే వారు, వారి అవసరాలు పెరగటమే. ఈ కాలంలో చైనా నుంచి మనం 38.82 బిలియన్‌ డాలర్ల విలువగలవి దిగుమతి చేసుకుంటే 13.64 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేశాము. చైనా వ్యతిరేకత, దేశభక్తి రేటింగ్స్‌ను పెంచుకొనే టీవీ ఛానల్స్‌, కాషాయ దళాల కబుర్లలో తప్ప ఆచరణలో పెద్దగా లేదని, యాప్‌లను నిషేధించినా వాటి ప్రభావం పెద్దగా లేదని అంకెలు చెబుతున్నాయి. విదేశీ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులను అడ్డుకొనే ధైర్యం దేశభక్తులకు లేనట్టా ? ఉన్నట్లా ! ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగుపడుతున్నది కనుక రాబోయే రోజుల్లో దిగుమతులు పూర్వ స్ధాయికి చేరుకుంటాయా ?


చైనా, మరొక దేశం దేనికైనా ఏ దేశమూ లొంగిపోనవసరం లేదు. ఎవరి ప్రయోజనాలను వారు కాపాడుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో స్వంత విధానాలను కలిగి ఉండాలి తప్ప ఇతరుల పాటలకు మరొకరు నృత్యం చేయటం తగనిపని. మన కోసం పశ్చిమ దేశాలు చైనాతో పోరాడుతాయి లేదా చైనా మెడలు వంచుతాయి అనుకుంటే అంతకంటే భ్రమ, అత్యాశ మరొకటి ఉండదు. వాటి ప్రయోజనాల కోసం మనతో పాటు ఎవరినైనా వినియోగించుకుంటాయి.
ఉదాహరణకు అమెరికా గత కొద్ది దశాబ్దాలుగా చైనాలో మానవహక్కులు లేవంటూ ప్రచారం చేయటం తెలిసిందే. కానీ చైనాతో వాణిజ్యం పెంచుకున్నదే తప్ప తెంచుకోలేదు. దానిబాటలోనే ఐరోపా యూనియన్‌ కూడా నానా యాగీ చేసింది. అదంతా రాయితీలు పొందేందుకు ఆడిన నాటకం.తాజాగా చైనా-ఐరోపా యూనియన్‌ మధ్య కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం అందుకు నిదర్శనం. ఒప్పంద చర్చల ప్రారంభం-అంగీకారం మధ్య కాలంలో చైనాలో మారిందేమీ లేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మనకు మద్దతు ఇస్తామన్నట్లుగా మాట్లాడిన ఐరోపా యూనియన్‌ మనకు కబుర్లు చెప్పి తీరా చైనాతో ఒప్పందం చేసుకుంది.


అమెరికాలో ఈనెల 20 అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్‌ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా నియమితులౌతాడని భావిస్తున్న ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పిన మాటలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. చైనాతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవటం మరియు అంతిమంగా ప్రతికూల ఫలితాలనిస్తుంది, అదొక తప్పిదమౌతుంది అన్నాడు. కొన్ని అంచనాల ప్రకారం 2028 నాటికి అమెరికాను పక్కకు నెట్టి చైనా పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా మారనుంది, ఇప్పటికే 140 కోట్ల జనాభాతో పెద్ద మార్కెట్‌, వారి జీవితాలు మరింతగా పెరిగితే మార్కెట్‌ ఎంతో విస్తరిస్తుంది. ఈ విషయం ధనిక దేశాల కార్పొరేట్లన్నింటికీ తెలుసు గనుకనే చైనాతో తెగేదాకా లాగటం లేదు. మన భుజం మీద తుపాకి పెట్టి చైనా నుంచి రాయితీలు పొందాలన్నది అమెరికా లేదా చతుష్టయంలోని జపాన్‌, ఆస్ట్రేలియా ఎత్తుగడ. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా అదే చేస్తారు. ఒప్పందం ప్రకారం 2049 నాటికి హాంకాంగ్‌ చైనాలో పూర్తిగా విలీనం కానుంది, అదే సమయానికి తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమైనా ఆశ్చర్యం లేదు. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే ఏ దేశానికి ఆ దేశం తన వ్యూహాలను నిర్ణయించుకుంటుంది.

కొందరు చెబుతున్నట్లుగా పశ్చిమ దేశాలు చైనాను కట్టడి చేయగలవని గానీ లేదా వాటితో కలసి మనం అదుపు చేయగలమనే పగటి కలలు కనటం మానుకుంటే మంచిది. మన కోసం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా వచ్చి యుద్దం చేస్తాయని ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఇప్పటివరకు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం తమ గుత్త సొమ్ము అన్నట్లుగా ఉన్న ధనిక పశ్చిమ దేశాలు చైనా పురోగమనాన్ని చూసి విస్తుపోతున్నాయి, తేరుకొని సాధ్యమైన మేరకు అడ్డుకొనేందుకు చూస్తున్నాయి. అందుకు 5జి టెలికాం వ్యవస్ధ పెద్ద ఉదాహరణ. దాన్ని అడ్డుకుంటూనే మిగతా రంగాలలో చైనాతో సంబంధాలను వదులుకోరాదని నిర్ణయించుకుంటున్నాయి. మన మాదిరి వాటికవి దూరం కావటం లేదు. వాస్తవ పరిస్దితులకు అనుగుణ్యంగా వ్యవహరించటం రాజనీతి లక్షణం.


దిగజారుతున్న ఆర్ధిక పరిస్దితులు, తగులుతున్న ఎదురుదెబ్బల కారణంగా గత నాలుగు సంవత్సరాలలో ప్రపంచ నాయకత్వ పాత్ర నుంచి ట్రంప్‌ నాయకత్వంలో అమెరికా పదికిపైగా బహుళపక్ష ఒప్పందాల నుంచి తనకు తానే వైదొలిగింది. అవి ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి వైదొలగటం వరకు ఉన్నాయి. ఇదే సమయంలో చైనాను బూచిగా చూపుతూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. దాని వలలో పడిన దేశాలన్నీ తమ వనరులను సమర్పించుకోవటం తప్ప పొందేదేమీ ఉండదు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాను సృష్టించిన తాలిబాన్లను అది వదిలించుకొని మనకు అంటగట్టింది. వారు పాక్‌ మిలిటరీ అదుపులో ఉంటారని తెలుసు. ఉగ్రవాదం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడతామని చెబుతున్న నరేంద్రమోడీ తాలిబాన్లలో రాజకీయ కోణాన్ని చూపుతూ వారితో వ్యవహరించేందుకు పూనుకున్నారు. ఆప్ఘనిస్తాన్‌ ఒకవైపు ఉన్న ఇరాన్‌, మరో వైపు ఉన్న పాకిస్ధాన్‌తో మనం కొత్త సమస్యలను తెచ్చుకోవటం తప్ప మరొకటి కాదు. మన అభివృద్ది మనం చూసుకుంటూ ఇరుగుపొరుగుదేశాలతో సఖ్యతగా ఉంటూ మిలిటరీ ఖర్చు తగ్గించుకొని దాన్ని అభివృద్ధి వైపు మళ్లించటం శ్రేయస్కరం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా ఐదేండ్లు ముందుకు, భారత్‌ వెనక్కు – మోడినోమిక్సు నిర్వాకం !

27 Sunday Dec 2020

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

China vs India GDP, modinomics, Modinomics a farce


ఎం కోటేశ్వరరావు


చప్పట్లు కొట్టించి – దీపాలు వెలిగించగానే కరోనా పోలేదు. పోనీ మోడినోమిక్స్‌తో అయినా దేశం ముందుకు పోతోందా ? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆత్మనిర్భర కార్యక్రమం ప్రకటించామని కరోనాను అధిగమించి ఆర్ధికంగా ముందుకు పోతామని చెప్పారు. నరేంద్రమోడీ కారణంగానే దేశం ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిందన్న విజయగానాలు మూగపోయాయి. ఈ మధ్యకాలంలో కొత్తవేమీ దొరక్క వంది మాగధులకు ఉపాధిపోయింది. ఆర్దిక వ్యవస్ధ మరింత దిగజారకుండా అన్నదాతలు నిలబెట్టారు. కానీ వారి వెన్ను విరిచే వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలో నెల రోజులకు పైగా తిష్టవేసి వాటిని రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నారు. సరైన సమాధానం లేక ఢిల్లీ నుంచి గల్లీ నేతల వరకు పిల్లిమొగ్గలు వేస్తూ రైతులను బదనాం చేసేందుకు పూనుకున్నారు.


సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచ జిడిపిలో ఐదవ స్దానానికి దేశం ఎదగటానికి నరేంద్రమోడీ నాయకత్వమే కారణమన్న భజనను ఐదేండ్లు ఆపివేయాలని లండన్‌ మేథో సంస్ధ సెంటర్‌ ఫర్‌ ఎకనోమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసర్చ్‌(సిఇబిఆర్‌) డిసెంబరు 26న తన నివేదికలో చెప్పింది. జిడిపి ముందుకు పోవటానికి తమ గొప్ప అన్నవారు వెనక్కు పోయినందుకు బాధ్యత ఎవరిదో చెబుతారో కరోనా మీద నెడతారో చూద్దాం. మనం ఐదు నుంచి ఆరవ స్ధానంలోకి ఎందుకు పడిపోయాం ? మన కరెన్సీ విలువ బలహీనంగా ఉండటం ఒక కారణం అని సిఇబిఆర్‌ చెప్పింది. దీనికి తోడు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, భారత్‌ మధ్య పెద్ద తేడాలు లేకపోవటమే దీనికి కారణం. 2017వ సంవత్సర వివరాల ప్రకారం భారత్‌ జిడిపి విలువ 2.651లక్షల కోట్ల డాలర్లు కాగా బ్రిటన్‌ 2.638, ఫ్రాన్స్‌ 2.583 లక్షల కోట్ల డాలర్లు.


సిఇబిఆర్‌ విశ్లేషణ ప్రకారం అంచనా వేసినదానికంటే ఐదు సంవత్సరాలు ముందుగానే చైనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అగ్రస్ధానాన్ని చేరుకుంటుందని చెప్పింది. ఇదే సమయంలో గతంలో సాధించిన ఐదవ స్ధానాన్ని కోల్పోయిన భారత్‌ తిరిగి దాన్ని 2025లో పొందనుందని అంచనా వేసింది. చైనాను వెనక్కు నెట్టేసి దేశాన్ని వేగంగా అభివృద్ధి పధంలో నడిపిస్తున్నామని చెబుతున్న బిజెపి మరి దీన్ని గురించి ఏమి చెబుతుందో తెలియదు. 2019లో బ్రిటన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో ఐదవ స్ధానానికి ఎదిగిన భారత్‌ ఆరవ స్ధానానికి దిగజారిందని,2025లో తిరిగి ఐదవ స్ధానం, 2030 నాటికి మూడవ స్దానంలోకి రావచ్చని సిఐబిఆర్‌ వార్షిక నివేదికలో జోశ్యం చెప్పింది. ఆ సంస్ధ చెప్పిన అంచనాలు ఇలా ఉన్నాయి. భారత ఆర్దిక వ్యవస్ధ 2021లో తొమ్మిది, 2022లో ఏడుశాతం చొప్పున విస్తరిస్తుంది. ఆర్ధికంగా పురోగమించే కాలదీ సహజంగానే వేగం తగ్గి 2035నాటికి వృద్ది రేటు 5.8శాతానికి పడిపోతుంది. 2025 నాటికి బ్రిటన్‌, 2027నాటికి జర్మనీ, 2030నాటికి జపాన్‌ను వెనక్కు నెట్టి భారత్‌ మూడవ స్ధానానికి చేరుతుంది.


గతంలో వేసిన అంచనాకు భిన్నంగా చైనా 2028 నాటికే అమెరికాను వెనక్కు నెట్టి ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ద స్ధానానికి చేరనుంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకోవటంలో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం దీనికి కారణం.జపాన్‌ 2030వరకూ మూడవ స్ధానంలో ఉండి, అప్పటికి నాలుగవ స్దానంలో ఉన్న జర్మనీని దిగువకు నెట్టి నాలుగవ స్ధానంలో ఉంటుంది.కరోనాతో నిమిత్తం లేకుండానే దానికి ముందే భారత ఆర్ధిక వ్యవస్ద వేగాన్ని కోల్పోతున్నది. 2016లో 8.3శాతం, 2018లో 6.1శాతం కాగా 2019లో పదేండ్ల కనిష్టమైన 4.2శాతం నమోదైంది.


దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంత ఎదిగిందని కాదు, జన జీవితాల నాణ్యత ఎంత పెరిగిందన్నది ముఖ్యం. ఆ విధంగా చూసినపుడు అంతర్జాతీయ సంస్దలు రూపొందించిన అనేక సూచికల్లో మన దేశం నరేంద్రమోడీ హయాంలో మొత్తం మీద దిగజారింది తప్ప పెరగలేదు. అందువలన ఒక దేశాన్ని వెనక్కు నెట్టేశామా, ఏ దేశం మీద ఎన్ని గంతులు వేశామన్నది ముఖ్యం కాదు. వెనకటికి ఎవడో బజార్లో మాది 101 అరకల వ్యవసాయం అని కోతలు కోశాడట. మీది అంటున్నావు, ఎంత మంది ఉన్నారు, నీది ఎంత అని అడిగితే మా అయ్యగారివి వంద, నాది ఒకటి అన్నాడట. ప్రత్యేక విమానాల్లో తిరిగే అంబానీ ఒక వైపు, కాలినడకన వందల కిలోమీటర్లు నడిచి స్వస్దాలకు వెళ్లిన వలస కార్మికులను మరోవైపు కరోనా కాలంలో చూశాము. అందువలన అంబానీలుాఅభ్యాగ్యులను కలిపి చెబితే పైన చెప్పిన కోతలరాయుడి మాదిరి గొప్పగానే ఉండవచ్చు. 138 కోట్లు దాటిన మన జనాభా జీవితాలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. సిఇబిఆర్‌ అంచనా ప్రకారం 2021-25 మధ్య చైనా వార్షిక వృద్దిరేటు 5.7శాతం, 2026-30 మధ్య 4.5శాతంగానూ, ఇదే అమెరికా విషయానికి వస్తే 2022-24 మధ్య 1.9శాతం తరువాత 1.6శాతం వృద్దిరేటు ఉంటుంది.

చైనా వృద్ధి రేటు పైన చెప్పిన మాదిరి ఉంటుందా లేదా తగ్గుతుందా-పెరుగుతుందా, 2028 నాటికి అమెరికాను అధిగమిస్తుందా అన్నది పక్కన పెడితే వృద్ది రేటు అమెరికా కంటే ఎక్కువ అన్నది స్పష్టం. దీన్నే అంటే అభివృద్దినే తనకు ముప్పుగా అమెరికా ప్రపంచానికి చూపుతోంది. కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తోంది. కొన్ని అంతర్జాతీయ సంస్ధలు చెబుతున్నట్లు చైనా నిజానికి అమెరికాను అధిగమించటం అంత తేలిక కాదు. వైఫల్యంతో అమెరికా దిగజారితే అది అసాధ్యమూ కాదు. మన కాషాయ మరుగుజ్జుల మాదిరి గొప్పల కోసం, ప్రధమ స్దానం గురించి చైనీయులు తాపత్రయ పడటం లేదు. గత నాలుగు దశాబ్దాల సంస్కరణల చరిత్ర, తీరుతెన్నులు చూసినపుడు జనజీవితాలు ఎంతగా మెరుగుపడ్డాయన్నదే కీలకంగా భావించారు. 2049లో చైనా విప్లవానికి వందేండ్లు నిండే సమయానికి మరింతగా ఎలా మెరుగుపరచాలా అన్నదాని మీదే కేంద్రీకరణ ఉంది. ఇటీవలనే 2021లో ప్రారంభమయ్యే 14వ వార్షిక ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది.


ఇదే సమయంలో తమ వృద్ది రేట్లను ఎలా పెంచుకోవాలా అన్నదాని కంటే అమెరికా, ఇతర దేశాలు, వాటితో కలసి మన పాలకులు చైనాను ఆర్దికంగా, ఇతర విధాలుగా దెబ్బతీసేందుకు ఏమి చేయాలా అన్నదాని మీద ఎక్కువ కేంద్రీకరించారు. చైనా స్వంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటుంటే మనం జన కష్టార్జితాన్ని అమెరికా ఆయుధాల కొనుగోలుకు వెచ్చిస్తున్నాం. గుజరాత్‌ తరహా అభివృద్ది అన్నారు. మేడిన్‌ ఇండియా పిలుపునిచ్చారు. మోడినోమిక్స్‌ అని చెప్పారు. ప్రపంచాభివృద్దికి చేసిన కృషికి గాను నరేంద్రమోడీ సియోల్‌ అవార్డును కూడా పొందారు. బయట పల్లకీ మోతను చూసి మోడీ గొప్ప అని చెప్పిన వారు ఇంట్లో ఈగల మోతకు కారణం ఏమిటో చెప్పరు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడటాన్ని ఊహించలేకపోయినట్లుగా మోడీ పాలనలో దేశ ఆర్ధిక వృద్ది దిగజారింది తప్ప మెరుగుపడింది లేదు.

జనానికి జ్ఞాపకశక్తి తగ్గిపోతోందో లేక పాలకుల మీద భ్రమలు పెరుగుతున్నాయో తెలియటం లేదు. దేశ ఎగుమతులను 2015-20 సంవత్సరాలలో 900 బిలియన్‌ డాలర్లకు పెంచుతానని మోడీ సర్కార్‌ ప్రకటించింది. వికీపీడియా అంకెల మేరకు 2014 నుంచి 2020 మధ్య ఏడు సంవత్సరాల కాలంలో వార్షిక సగటు ఎగుమతులు 302 బిలియన్‌ డాలర్లు.2014లో 318.2బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరిగితే 2020లో 314.31 బిలియన్‌ డాలర్లు. లక్ష్యం ఎంత ? సాధించింది ఎంత ? ఈ పరిస్ధితికి కారణం ఏమిటో కనీసం ఏకపక్ష ప్రసంగమైన మన్‌కీ బాత్‌లో కూడా చెప్పలేదు. ఇదే సమయంలో మన దిగుమతుల వార్షిక సగటు 446 బిలియన్‌ డాలర్లు.2014లో 462.9 బి.డాలర్లు ఉంటే 2020లో 467.19 బి.డాలర్లు. మేక్‌(తయారు) ఇన్‌ ఇండియా కాస్తా మెస్‌ (తారు మారు లేదా గందరగోళం) ఇన్‌ ఇండియాగా మారింది. మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేస్తే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని చెప్పారు.అదే చేశారు. ఏమైంది ?


తమ విదేశీ వాణిజ్యం (ఎగుమతులుాదిగుమతుల విలువ) నిమిషానికి 91.9లక్షల డాలర్లు దాటిందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ డిసెంబరు 25న ప్రకటించింది.2015తో పోల్చితే 2020లో 30శాతం పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్ద వివరాల ప్రకారం 2015లో ప్రపంచ వాణిజ్యంలో చైనా వాటా 13.8శాతం ఉంది. ఇప్పుడు ఇంకా పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. మనం చైనా వస్తువుల దిగుమతులను నిలిపివేసినా వారి ఎగుమతుల మీద పెద్ద ప్రభావం చూపలేదు. నవంబరు నెలలో ఎగుమతులు 21.1శాతం పెరిగితే దిగుమతులు 4.5శాతం పెరిగాయి.(చైనా చెప్పేది ఎలా నమ్మగలం అనేవారికి సమాధానం లేదు) కరోనా వైరస్‌ తొలుత బయట పడింది చైనాలో అన్నది తెలిసిందే. దాన్ని నిర్ణయాత్మకంగా నిరోధించింది కూడా అక్కడే. నిర్లక్ష్యం చేసి ఇప్పటికి కోటీ 85లక్షల మందికి అంటించిన అమెరికా, కోటి మంది దాటిన మన దేశం, ఇతర ధనిక దేశాలూ వైఫల్యానికి నిదర్శనాలు. మిగిలిన అగ్రశ్రేణి దేశాలన్నీ మాంద్యంలో కూరుకుపోతే రెండుశాతం వృద్దితో చైనా తన ప్రత్యేకతను ప్రదర్శించింది.

మన ఆర్దిక వ్యవస్ధ ఎంత బలహీనంగా ఉందో, అనుసరించిన విధానాలు ఎంత దివాలాకోరుగా ఉన్నాయో కరోనాకు ముందే వెల్లడైంది. కరోనా కారణంగా తలెత్తిన విపత్కర పరిస్ధితుల్లో వినియోగాన్ని పెంచేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలన్న అనేక మంది ఆర్ధికవేత్తల సూచనలను నరేంద్రమోడీ సర్కార్‌ విస్మరించింది. పేదలకు డబ్బు ఇవ్వకూడదన్నవారు చెప్పిన తర్కం ఏమిటి ? జనం చేతుల్లో డబ్బులు పెడితే సమస్య పరిష్కారం కాదు. జనం ఇప్పటికీ దేనికి ఖర్చు చేయాలో చేయకూడదో అని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. డబ్బు ఇస్తే రెండు ఫలితాలు వస్తాయి. ఒకటి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. జనం పాత రుణాలను చెల్లించటానికి దాన్ని వినియోగించవచ్చు లేదా భవిష్యత్‌లో తలెత్తే అనిశ్చిత అవసరాలకు పొదుపు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి డబ్బూపోయి, జనం ఖర్చు చేయక దగ్గర దాచుకుంటే కొనుగోళ్లు పెరగ ఆర్ధిక వ్యవస్ధకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇలా సాగింది.


దీన్ని మరో విధంగా చెప్పాలంటే కరోనాకు ముందే జనం అప్పులపాలయ్యారు( ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో అప్పులు తీర్చుకుంటారు అంటే అర్దం అదే కదా ) కడుపు కాల్చుకొని డబ్బు ఎప్పుడు దాచుకుంటారు అంటే భవిష్యత్‌ ఎలా ఉంటుందో అన్న విశ్వాసం లేనపుడు, దారీ తెన్నూ కనిపించనపుడే. అంటే ఆరేండ్ల మోడీ పాలన అలాంటి పరిస్ధితిని తయారు చేసింది. కరోనా వస్తే చికిత్సకు అయ్యే ఖర్చు గురించి జనం ఎంత ఆందోళన చెందారో అందరికీ తెలిసిందే. సిఎంఐయి సమాచారం ప్రకారం 2019లో వేతన జీవులు 8.7 కోట్ల మంది ఉన్నారు.2020 నవంబరులో ఆ సంఖ్య 6.8కోట్లకు తగ్గింది. అంటే ప్రతి వంద మందిలో 21 మంది ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాల్లో ఉన్నవారి వేతనాల్లో కోతల గురించి తెలిసిందే.


అంతా ముగిసిపోయింది, మామూలు పరిస్ధితులు ఏర్పడ్డాయి అని చెబుతున్నవారికి రిజర్వుబ్యాంకు సమాచారం రుచించకపోవచ్చు. నవంబరు ఆర్‌బిఐ సర్వేలో 63శాతం మంది తమ ఆదాయాల్లో ఈ ఏడాది కోతపడిందని చెప్పారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే తమ ఉపాధి పరిస్ధితి దిగజారిందని 80శాతం చెప్పారు. ఏడాది క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు పెరిగాయని 90శాతం చెప్పారు.లాక్‌డౌన్‌కు ముందు తాము వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తామని 25ా30శాతం మంది గృహస్తులు చెబితే, మేనెలలో అది 1.25శాతానికి పడిపోతే అక్టోబరులో 7.4శాతానికి పెరిగింది తప్ప కరోనా ముందు స్ధాయికి రాలేదు. ఉన్న పొదుపును తప్పని సరి అవసరాలకే వినియోగిస్తారు. ఆదాయం లేక పోయినా వినిమయ వస్తువుల కొనుగోలు రద్దు లేదా వాయిదా వేసుకుంటారు. ధరలు పెరిగితే అంతకు ముందు పొదుపు చేసుకున్న మొత్తాలు హరించుకుపోతాయి లేదా అప్పులపాలు అవుతారు.

లాక్‌డౌన్‌ సడలించిన తరువాత దసరా, దీపావళి ఇతర పండుగలు వచ్చాయి. ఆర్ధిక వ్యవస్ధ పుంజుకుంటుంది, పెద్ద మొత్తంలో జనాలు కొనుగోలు చేస్తారనే వాతావరణం కల్పించారు. కానీ జరిగిందేమిటి ? అంతసీన్‌ లేదు. పెద్ద సంఖ్యలో నిలువ చేసిన వస్తువులు పెరిగాయి. కార్లు, ద్విచక్రవాహనాల అమ్మకాలు దారుణంగా ఉన్నాయని నవంబరు లెక్కలు చెప్పాయి. గృహౌపకరణాల పరిస్దితీ అంతే. ఆర్ధిక వ్యవస్ధ సజావుగా ఉందని చెప్పేందుకు కార్పొరేట్‌ కంపెనీల లాభాలు పెరగటాన్ని కొందరు చూపుతున్నారు. దీనికి ఉద్దీపనల పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇచ్చిన రాయితీలు ఒక కారణం. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచవ్యాపితంగా వివిధ ముడివస్తువులు, ఇతర పారిశ్రామిక వినియోగ వస్తువుల ధరలు పడిపోయి, ఉత్పాదక ఖర్చు తగ్గటం. ఉద్యోగుల తొలగింపు, వేతనాల్లో కోత, ఇతర ఖర్చుల తగ్గుదల అందుకు దోహదం చేశాయి. వడ్డీ రేట్లను తగ్గించేది లేదని రిజర్వుబ్యాంకు చెబుతోంది. అలాంటపుడు పారిశ్రామిక, వాణిజ్య సంస్దలు ఖర్చు తగ్గింపులో భాగంగా సిబ్బందిని తగ్గించి లేదా పని భారం పెంచి వేతన బిల్లును తగ్గించుకుంటారు. అది మరొక ఆర్ధిక దిగజారుడుకు నాంది అవుతుంది.


2021-25 మధ్య బ్రిటన్‌ నాలుగుశాతం వృద్ది రేటుతో అభివృద్ది చెందనుందనే అంచనాతో అప్పటికి మన దేశం దాన్ని అధిగమిస్తుందని సిఇబిఆర్‌ విశ్లేషకులు చెప్పారు. అక్టోబరులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద చెప్పిన జోస్యం ప్రకారం మన ఆర్ధిక వ్యవస్ధ 2021 నుంచి 2025 మధ్య 8.8 నుంచి 7.2శాతం వృద్ది రేటుతో అభివృద్ధి చెందుతుంది. ఒక వేళ అదే నిజమైతే కోల్పోయిన మన జిడిపి ఇంకా ముందుగానే పెరగవచ్చు. మరి సిఇబిఆర్‌ నిపుణులకు ఐఎంఎఫ్‌ అంచనాలు తెలియవా? వాటిని పరిగణనలోకి తీసుకోలేదా ? అంతకంటే తక్కువ వృద్ధి రేటు అంచనా ఎందుకు వేసినట్లు ? కోల్పోయిన ఐదవ స్దానాన్ని సాధించటానికే ఐదేండ్లు పడుతుందని జోస్యం చెబుతుంటే మరి రెట్టింపుతో 2024నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని చెప్పిన మాటల సంగతి ఏమిటి ? మోడినోమిక్స్‌ విఫలమైందని అనేక మంది విశ్లేషకులు, ఆర్ధికవేత్తలు ఎప్పుడో చెప్పారు. కరోనా నుంచి దేశం బతికి బట్ట కట్టగలదని రుజువైంది గానీ మోడినోమిక్స్‌తో కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా మోడీ గుజరాత్‌ను ఉద్దరించినట్లు ఊదరగొట్టారు. దాన్నే దేశమంతటా అమలు చేస్తానని 2014 ఎన్నికల్లో జనాన్ని నమ్మించారు. 2016 నవంబరు ఎనిమిదిన మోడీ పెద్ద నోట్ల రద్దు షాక్‌ నుంచే ఇంకా తేరుకోలేదు. తరువాత జిఎస్‌టితో చిన్న పరిశ్రమలు, వ్యాపారాల వారిని ఎంత ఇబ్బంది పెట్టారో దాని ప్రతికూల పర్యవసానాలు ఏమిటో చూస్తున్నాము. కనుక ఏడు సంవత్సరాల క్రితం అచ్చే దిన్‌ గురించి నరేంద్రమోడీ చెప్పిన అంశాలను జనం మరచిపోయారు. ప్రయివేటు రంగం గురించి నరేంద్రమోడీ సర్కార్‌ పెద్ద ఆశలు పెట్టుకుంది. వారికి ఇవ్వని రాయితీలు లేవు. నిజానికి మన బడా ప్రయివేటు రంగం ఎంత అసమర్ధంగా ఉందో జనానికి తెలియదు. యాభై కోట్ల డాలర్లకు పైబడి ఆదాయం వచ్చే పెద్ద కంపెనీలు తత్సమానమైన చైనా, మలేసియా వంటి దేశాల్లోని కంపెనీలతో పోలిస్తే ఒకటిన్నర రెట్లు, దక్షిణ కొరియా వాటితో పోల్చితే మూడున్నర రెట్లు తక్కువగా జిడిపికి జమ చేస్తున్నాయి. అదే విధంగా ఉత్పాదకత స్దాయిలు చూస్తే 10-25శాతం మధ్య ఉన్నాయి. కేవలం 20శాతం కంపెనీలు మాత్రమే 80శాతం లాభాలను సమకూర్చుతున్నాయి.


జిడిపిలో ఐదవ స్ధానాన్ని తిరిగి సంపాదించటం గురించి లండన్‌ సంస్ద చెప్పిన అంశం ఒకటైతే అంతకంటే ముఖ్యమైనవి ఉన్నాయి.2030 నాటికి దేశంలో తొమ్మిది కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. వాటిలో ఆరు కోట్ల కొత్త వారికైతే, మూడు కోట్లు వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలకు మారే వారికోసం సృష్టించాల్సి ఉంది. ఇది సాధ్యం కావాలంటే నిఖర ఉపాధిని కల్పించే అభివృద్ధి రానున్న పది సంవత్సరాలలో ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరశాతం చొప్పన అభివృద్ధి రేటు ఉండాలి. చైనా జిడిపితో పాటు అక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నది తిరుగులేని సత్యం. కనుక మోడినోమిక్స్‌ అన్నా మరొకటి అన్నా జిడిపి పెరుగుదల జనానికి ఉపయోగపడే విధంగా ఉంటుందా లేదా అన్నదే ముఖ్యం. గత ఆరున్నర సంవత్సరాలలో వీటి జాడలు లేవు. సంపదల పంపిణీ అసమానత పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. ఎండమావుల వెంట పరుగుపెడుతున్నట్లుగా జనం ఉన్నారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d