• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: CHINA

నరేంద్రమోడీ గడ్డం దీక్ష వికటించి రెండవ దశలో కరోనా రెచ్చిపోతోందా ?

06 Thursday May 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, UK, USA

≈ Leave a comment

Tags

China bio war, India’s COVID-19, Modi’s Beard, Narendra Modi, Propaganda War, RSS, RSS Propaganda War, Untruths


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు కరోనా వైరస్‌ మన దేశ పౌరుల మీద యుద్దం చేస్తోంది. దాన్ని ఎదుర్కోవాల్సింది కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలే . రాష్ట్రాలకు (రాజకీయ ) మార్గదర్శనం (కాదు) చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. ఆ పని చేయటంలో విఫలమైన ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చే సంఘపరివార్‌, పాలకులకూ-పరివార్‌ కొమ్ముకాస్తున్న ప్రధాన స్రవంతి మీడియా (జనం ఏదని భావిస్తే అది ) మరోవైపు తీవ్ర ప్రచార యుద్దం ప్రారంభించింది. సామాజిక మాధ్యమంలో దాడి సంగతి సరేసరి ! స్వయంగా గోబెల్స్‌ స్వర్గం నుంచి రంగంలోకి ( దాని మీద నమ్మకం ఉన్న వారి మనోభావాల ప్రకారం) దిగి పర్యవేక్షిస్తున్నాడా ? ఇప్పటికే వాట్సప్‌ విశ్వవిద్యాలయ పండితులు వండి వారుస్తున్న సరకుతో రాబోయే రోజుల్లో మరింతగా జనం మెదళ్లను నింపబోతున్నారు. వాటిలో ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. దానిలోని కొన్ని అంశాల మంచి చెడ్డలను చూద్దాం ! ఇలాంటి అంశాల మీద జనంలో అనుమానాలు తలెత్తటం ప్రారంభమైంది. దాంతో తమ పోస్టులోని అంశాలు సాధికారికంగా చెబుతున్నట్లు నమ్మించేందుకు కొన్ని పత్రికలలో వచ్చిన వార్తల లింకులను కూడా దీనికి జతచేశారు.

మెదళ్లతో వేస్తున్న ప్రశ్నలేనా ?

” కోవిడ్‌ -2 వేవ్‌ ఒక ప్లానెడ్‌ బయోలాజికల్‌ యుద్ధం ? భారత ఉపఖండం మొత్తం మీద ఒక్క భారత్‌ లోనే ఇలా ఎందుకు అవుతున్నది ? బంగ్లాదేశ్‌ , పాకిస్థాన్‌, నేపాల్‌ , శ్రీలంక, భూటాన్‌ దేశాలలో ఎందుకు లేదు ? అంటే భారత్‌ ప్రజలు మిగతా ఉపఖండ దేశాల ప్రజల కంటే క్రమశిక్షణ లేని వారా ? అమెరికా ,చైనా లు కలిసి ఎకానమీ,ఫార్మా రంగాలని కాపాడుకోవడానికే ఇదంతా చేశారా ? ”
పధకం ప్రకారం జరుపుతున్న బయలాజికల్‌ యుద్దం అదీ చైనా మీద చేస్తున్న ఆరోపణ రోత పుట్టించే పాచిపాటే. పధకం ప్రకారం జరుగుతున్నదనుకుంటే మోడీ సర్కార్‌ నిఘా యంత్రాంగం, అసలు సిసలు జేమ్స్‌ బాండ్‌ అని చెబుతున్న అజిత్‌ దోవల్‌ ఏమి చేస్తున్నట్లు ? అధికారికంగా ప్రభుత్వం ప్రకటించి ఎందుకు జనాన్ని అప్రమత్తం చేయలేదు. మిగతా దేశాలకు రానందుకు సంతోషించాల్సింది పోయి ఎందుకు రాలేదు అని ప్రశ్నించేవారి మానసిక స్ధితి ఏమిటి ? పైన పేర్కొన్న దేశాల్లోనే కాదు ఇంకా అనేక దేశాల్లో రాలేదు. అలా ఎందుకు జరిగిందో చూసి ఇక్కడ కూడా నివారించాలని కోరకుండా ఫలానా చోట ఎందుకు రాలేదు అనే వారు మెదడుతోనా మరోదానితో ప్రశ్నిస్తున్నట్లా ? భారత ప్రజలు క్రమశిక్షణ లేని వారని ఎవరన్నారు ! వారిలో కొందరికి లేదు మచ్చుకు గోమాంసం, గోసంరక్షణ పేరుతో మైనారిటీల మీద దాడి చేసే వారు, వాలెంటైన్స్‌ డే రోజున పార్కుల వెంట తిరిగే బాపతు, మసీదులు, దేవాలయాల్లో, సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రచారాలు, కుట్రలు చేసే సకల కళా పారంగతులు, కాశ్మీరులో మాదిరి అత్యాచారం చేసిన వారికి మద్దతుగా ప్రదర్శనలు చేసిన రాజకీయ పార్టీలు, లాయర్ల వంటి వారు, వారికి మద్దతు ఇచ్చే పెద్దలు క్రమశిక్షణ లేనివారు తప్ప వాటితో నిమిత్తం లేని సామాన్య జనం క్రమశిక్షణ లేని వారని ఎలా అంటాం ? చైనా మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్దం గురించి తెలిసి కూడా తెలియనట్లు నటించే వారు మాత్రమే ఆ రెండు దేశాలూ కలసి ఆర్ధిక, ఔషధ రంగాలను కాపాడుకోవాలని చేశాయని చెప్పగలరు. బుర్రతక్కువ ప్రచారం గాకపోతే రెండూ కలిస్తే అమెరికాలో కరోనా ఎందుకు పుచ్చిపోతుంది, చైనాలో అదుపులోకి వచ్చి ఆర్ధికరంగం ఎందుకు పురోగమిస్తోంది. ఇలాంటి అంశాలను ముందుకు తెస్తున్న వారు జనాలకు మెదళ్లు లేవన్న జనం అంటే గౌరవం లేని వారే అని ఎందుకు అనుకోగూడదు ?

దీన్నే ఎదురు దాడి అంటారు !

” డొనాల్డ్‌ ట్రంఫ్‌ లాగా మోడీ గ్లోబల్‌ ఆయుధ, ఫార్మా,ఆయిల్‌ లాబీలకి లొంగకుండా ముందుకు వెళ్తునందుకె ఇదంతా జరుగుతున్నదా ? ”
నరేంద్రమోడీ మహానుభావుడు లొంగలేదని ఎలా చెబుతారు. అమెరికా ఆదేశిస్తే జీ సార్‌ అంటూ చేతులు కట్టుకొని ఇరాన్‌ నుంచి చమురు కొనటం మాని అమెరికా దగ్గర కొంటున్నారు. అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలు సరేసరి. సర్వం అర్పించుకుంటాం అన్నట్లుగా తయారైన కారణంగానే మోడీ రాక ముందు పాకిస్ధాన్‌తో లాహిరి లాహిరిలో అన్నట్లున్న అమెరికా ఇప్పుడు దాన్ని తెరచాటుకు పంపి మన దేశంతో సయ్యాటలాడుతోంది. చతుష్టయం పేరుతో మనలకు ముగ్గులాగిందా లేదా ? అది లొంగుబాటు కాదా ! నూట ముప్పయి కోట్ల జనాభాకు వాక్సిన్‌ వేయాలంటే రెండు కంపెనీలకే ఎందుకు అనుమతి ఇచ్చారు ? ఏ లాబీ దీని వెనుక ఉంది. అత్యవసర వినియోగానికి ఆ రెండింటికీ అనుమతి ఇచ్చినట్లుగానే ఇతర వాక్సిన్లకు అనుమతి ఇవ్వకపోవటం సకాలంలో వాక్సిన్లు వేయకుండా జనాలను చావుదాకా నెట్టటం వెనుక ఫార్మా లాబీ హస్తం లేదా, దానికి మోడీ సర్కార్‌ తలొగ్గలేదా ? నరేంద్రమోడీ సర్కార్‌ మూడు వేల కోట్ల రూపాయలు సీరం సంస్ధకు ఎలాంటి హామీలు లేకుండా ఇస్తే ఆ సొమ్ముతో బ్రిటన్‌లో తయారీ కేంద్రం పెడుతున్నట్లు అదర్‌పూనావాలా ప్రకటించిన విషయం తెలియదా ? దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరించటం అంటే ! నిజానికి మోడీకి విదేశీ ఫార్మాలాబీని దెబ్బతీయాలంటే 56 అంగుళాల ఛాతీ ఉంటే రెమిడెసివిర్‌, వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సులు ఇచ్చి మన దేశంలో చౌకధరలకు ఎందుకు తయారు చేయించరు ? ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని ప్రకటించి ఫార్మారంగం మీద నియంత్రణ ఎందుకు పెట్టరు ? అమెరికా నుంచి చమురుకొనుగోలు నిలిపివేసి తిరిగి ఇరాన్‌ నుంచి ఎందుకు కొనుగోలు చేయరు ? జనాలకు ఎల్లకాలం చెవుల్లో పూలు పెట్టలేరు !

డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఇంత సానుభూతి, ప్రేమ ఎందుకు ?

” ముందు డొనాల్డ్‌ ట్రంఫ్‌ ఓటమి వెనక ఉన్న వాస్తవాలు ఏమిటో చూద్దాము. నాటో దేశాల రక్షణ అమెరికా బాధ్యత కాదు అన్నాడు అంటే నాటో దేశాల కంటే నాటో కూటమిలో ఉన్న అమెరికా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నది. యూరోప్‌ అంతటా మిలటరీ బేస్‌ లు పెట్టి అమెరికన్‌ సైనికులని అక్కడ మోహరించి ఉంచడం చాలా ఖర్చుతో కూడుకొని ఉంది. అందుకే నాటో కూటమి నుండి అమెరికా వైదొలుగుతుంది అని చెప్పేశాడు మళ్ళీ అధికారం లోకి వస్తే ఆ పని చేసేవాడు ఇది అమెరికన్‌ ఆయుధ లాబీ కి అస్సలు నచ్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక చోట ఉద్రిక్తతలు ఉండాలి అక్కడ అమెరికా సైన్యం వెళ్ళాలి ఆయుధాలు అమ్ముడుపోవాలి కానీ ట్రంఫ్‌ ఉంటే ఇవన్నీ జరగవు. ”
ఇదొక బుర్ర తక్కువ వాదన. ఐరోపా దేశాలను బెదిరించేందుకు, వారి నుంచి డబ్బు గుంజేందుకు, ఉపయోగించే అవసరం లేకపోయినా ఆయుధాలు కొనిపించేందుకు నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ చెప్పాడు తప్ప మరొకటి కాదు. నాటో నుంచి వైదొలుగుతాం అన్న ట్రంప్‌ ఆసియాలో దక్షిణ చైనా సముద్రంలో చిచ్చు పెట్టేందుకు ఆసియా నాటో అని పిలుస్తున్న చతుష్టయం(క్వాడ్‌)లో జపాన్‌, ఆస్ట్రేలియాలతో పాటు మన జుట్టుకూడా ముడివేసింది వాస్తవం కాదా ? నాటో నుంచి వైదొలిగే వాడికి ఇక్కడ ఈ కూటమి ఎందుకు అని నరేంద్రమోడీ ఎందుకు ప్రశ్నించలేకపోయినట్లు ? మన దేశం ఆయుధాలు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నది ట్రంప్‌ హయాంలోనే కదా ?
” ఇక బ్లాక్స్‌ ఓన్లీ లివ్‌ (బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌ )నినాదం తో ట్రంఫ్‌ మీద విపరీతమయిన దుష్ప్రచారం చేశారు. ప్రతి ఒక పోలీసుని ఏ దేశ ప్రధాని కావచ్చు లేదా అధ్యక్షుడు కానీ నీయంత్రించ లేరు కానీ అది ట్రంఫ్‌కి అంటగట్టారు విజయవంతంగా ! అప్పటికి నల్లజాతి వాళ్ళ మీద అదే మొదటి దాడి జరిగినది అనే విధంగా ! ఆయుధ లాబీ పాచిక పారింది. ట్రంఫ్‌ ఓటమికి ఏవైతొ శక్తులు వెనక ఉండి ప్లాన్‌ చేసాయో అవే ఇప్పుడు మోడీ మీద ప్రయోగిస్తున్నాయి. ”
బోడి గుండుకూ మోకాలికి ముడి పెట్టటం అంటే ఇదే ! నల్జజాతీయుల జీవిత సమస్య (బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌ ) అనేది 2013లో ప్రారంభమైన ఒక సామాజిక మాధ్యమ, సామాజిక, రాజకీయ ఉద్యమం. అప్పటికే వారి మీద జరుగుతున్నదాడుల తీవ్రతతో అది ఉనికిలోకి వచ్చింది. ట్రంప్‌ హయాంలో నల్లజాతి, ఆసియా, ఇతర రంగుజాతి వ్యతిరేక చర్యలు పెచ్చుమీరాయి. అందువలన ఎన్నికల ప్రచారంలో అది ఒక సమస్యగాకుండా ఎలా ఉంటుంది. రిపబ్లికన్‌ పార్టీ ట్రంప్‌ పుట్టక ముందే పుట్టింది, అది శ్వేత జాతి దురహంకార పార్టీ అన్నది అందరికీ తెలిసిందే. ట్రంప్‌ ఎంత వదరుబోతో, ఎంత అబద్దాలకోరో అక్కడి మీడియా లెక్కలు వేసి మరీ చూపింది.ట్రంప్‌ నల్లజాతి విద్వేషి అయితే మోడీ ముస్లిం, క్రైస్తవ మతాల మీద నిరంతరం విద్వేషం, దాడులకు పాల్పడే శక్తులకు కాపు కాస్తున్న పెద్దమనిషి. అందుకే ఒక దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకో కూడదన్న విధానాన్ని పక్కన పెట్టి మన నరేంద్రమోడీ అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని అమెరికా వెళ్లి కౌగిలింతలతో మరీ పిలుపునిచ్చి వచ్చారు. ఒకటి మాత్రం స్పష్టం. కరోనా నిర్లక్ష్యం చేసి లక్షలాది మందిని చంపి జనాగ్రహానికి గురైన ట్రంప్‌ మీద ఎంత సానుభూతి ! ఎంత గాఢమైన అనురాగం. దీనికి కారణం లేకపోలేదు. ట్రంప్‌ నల్లజాతి వ్యతిరేకి – నరేంద్రమోడీ మైనారిటీల వ్యతిరేకి. అందుకే ఇద్దరికీ రాగి-బంగారం మాదిరి కలిసింది. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ కూడా కరోనాను నిర్లక్ష్యం చేసి చివరికి ఆక్సిజన్‌ కూడా అందించలేకపోతోంది. అందువలన అవకాశం వచ్చినపుడు జనం ట్రంప్‌కు చేసిన సత్కారాన్ని మోడీ లేదా ఆయన పార్టీకి చేస్తారు !

ఈ ”చావు ” తెలివితేటలే కొంప ముంచుతున్నాయి !

” కోవిడ్‌ మొదటి దశ ని విజయవంతంగా దాటడం అనేది భారత దేశ చరిత్రలో అతి పెద్ద విజయం. గత 2020 జనవరి నెలలో వెస్ట్‌ దేశాలు జోస్యం చెప్పింది ఏమిటంటే భారత్‌ లో హీన పక్షం వొ రెండు కోట్ల మంది కోవిడ్‌ వల్ల చనిపోతారు కానీ వాళ్ళు జోస్యం నిజం కాలేదు సరికదా మరణాల సంఖ్య రెండు లక్షల లోపే జరిగినది. పైగా హైడ్రాక్లోరో క్వీన్‌ ని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయగలిగింది. నిజానికి 2020 లో ఇదే సమయానికి అమెరికా,యూరోపు తో సహా మిగతా ప్రపంచదేశాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి కానీ భారత్‌ మాత్రం పెద్దగా నష్టం లేకుండానే బయటపడగలింది. చివరకి చైనా తొత్తు అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు కూడా భారత్‌ ని చూసి మిగతా దేశాలు నేర్చుకోవాలి కోవిడ్‌ ని ఎలా ఎదుర్కోవాలో అంటూ ఒక ప్రకటన చేశాడు గతి లేక. ”
ఈ చావు తెలివితేటలు, విజయగానాలే దేశాన్ని ఇప్పుడీ దుస్తితికి తెచ్చాయి. స్పానిష్‌ ప్లూ మహమ్మారి అనుభవంతో భారత్‌ వంటి పెద్ద దేశంలో విస్తరిస్తే మరణాలు ఎక్కువ ఉంటాయని ఎవరైనా అంచనా వేస్తే వేసి ఉండవచ్చు గానీ ప్రపంచ ఆరోగ్య సంస్ద అలాంటి జోశ్యాలు చెప్పలేదు. రెండవ దశ కరోనా గురించి నిర్లక్ష్యానికి నరేంద్రమోడీని బోనులో నిలబెడుతుండటంతో దానికి సమాధానం చెప్పలేక విజయగానాల గురించి మొదలు పెట్టారు. జ్యోతిష్కులు చెప్పిన సొల్లు కబుర్ల మీద ఉన్న విశ్వాసం శాస్త్రవేత్తలు చెప్పిన లేదా ప్రపంచ అనుభవాల మీద పాలకులకు లేకపోవటమే ఈ దుస్దితికి కారణం. మార్చి 30 నుంచి దేశంలో కరోనా ప్రభావం ఉండదని, మే 11 తరువాత ప్రపంచంలోనే కరోనా అంతరిస్తుందని ఇలా ఎవడికి తోచిన చెత్తను వారు చెప్పారు. ఒక్కడంటే ఒక్క జ్యోతిష్కుడు కూడా రెండవ దశ ఇంత తీవ్రంగా వస్తుందని ఎందుకు చెప్పలేకపోయాడు. ఒక పక్క మార్చినెలలో కరోనా రెండవ దశ తీవ్రంగా వ్యాపిస్తుండటాన్ని చూసి కూడా గంగలో మునిగితే వైరస్‌ అంటదని బిజెపి అగ్రనేతలు చెప్పారంటే కళ్ల ముందున్నదానిని చూడలేని, వినలేని, శాస్త్రవేత్తలు చెప్పిన దానిని విశ్వసించలేని మూఢత్వంలోకి వారు జారి దేశాన్ని నెట్టారని ఎవరైనా అంటే తప్పేముంది ? ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనా తొత్తు అయితే దాన్నుంచి మన దేశం ఎందుకు బయటకు రాలేదు ?

అవాస్తవాలు -జనం చెవుల్లో పూలు !

”ఇక వాక్సిన్‌ విషయంలో అన్నీ దేశాల కంటే ముందే ఉత్పత్తి ప్రారంభం చేసి వాక్సిన్‌ ఇవ్వడం మొదలు పెట్టింది భారత్‌. సరిగ్గా ఇక్కడే గ్లోబల్‌ ఫార్మా లాబీకి కష్టం అనిపించింది. ప్రతి సంవత్సరం గ్లోబల్‌ ఫార్మా చేసే వ్యాపార విలువ 4 నుండి 6 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుంది ఇక వాక్సిన్‌ వ్యాపారం అయితే 1.25 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా కానీ భారత్‌ బయో టెక్‌ కోవాక్సిన్‌, లైసెన్స్‌ తీసుకొని తయారు చేస్తున్న కొవీషీల్డ్‌ ఉత్పత్తి రేటు మిగతా దేశాలకంటే ఎక్కువ. పైగా ధర విషయంలో మిగతా దేశాలకంటే 60% తక్కువగా ఉండడం పశ్చిమ దేశాలకి మింగుడు పడడం లేదు ఇదే మోడీ పట్ల ద్వేష భావం నెలకొనడానికి కారణం అయ్యింది. చివరకి జర్మనీ ఛాన్సేల్లర్‌ అంజేల మోర్కెల్‌ అయితే భారత్‌ ఫార్మా రంగ హబ్‌ అవడం మనం చేసిన తప్పు అంటూ బహిరంగంగా ప్రకటించింది అంటే ఎంత అక్కసు ఉందో తెలిసిపోయింది. ఇక్కడ ప్రధానం గా ఆస్ట్రా జెనీక వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల మరణాలు సంభవించాయి యూరోపులో. ఇదే సమయంలో అదే లైసెన్స్‌ తీసుకొని భారత్‌ లో తయారుచేసిన కొవీషీల్డ్‌ వల్ల అలాంటి దుష్ప్రభావాలు కలిగినట్లు ఎక్కడా ఫిర్యాదులు లేవు. ”
జనం చెవుల్లో కమలం పూలు పెట్టుకున్నారన్నది ఇది రాసిన వారి గట్టి విశ్వాసంగా కనిపిస్తోంది.ప్రపంచ ఫార్మామార్కెట్‌ 2019లో 324 బిలియన్‌ డాలర్లు, 2020లో 405, 2027లో 908 బిలియన్‌ డాలర్లు (ఒకబిలియన్‌ వంద కోట్లు )ఉంటుందనే అంచనా వార్తలను గూగుల్తల్లిని ప్రార్ధించి ఎవరైనా తెలుసుకోవచ్చు. నాలుగు వందల బిలియన్లెక్కడ ? రాసిన వారు చెప్పిన నాలుగు నుంచి ఆరులక్షల కోట్ల డాలర్లెక్కడ ? గ్లోబల్‌ ఫార్మా లాబీకి కష్టం అట. ఆస్ట్రాజెనెకా వల్ల రక్తం గడ్డకట్టి మరణాలు సంభవించాయట. మన దేశంలో సీరం సంస్ధ కోవిషీల్డు పేరుతో తయారు చేస్తున్నది అదే విదేశీ ఆస్ట్రాజెనెకా కంపెనీ ఆధ్వర్యాన ఆక్ప్‌ఫర్డ్‌ తయారు చేసిందని తెలియదా ? అందుకే కదా మన దేశంలో కోవిషీల్డు వద్దు కోవాగ్జిన్‌ కావాలని అనేక మంది కోరుతున్నది.

” గ్లోబల్‌ ఫార్మా రంగం ఆశించింది అసలు జరగలేదు….. అన్నీ మన దేశంలో నే తయారు చేసుకున్నాము. రెండు వాక్సిన్లు భారత్లోనే తయారు చేసుకోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగలేదు. బిడెన్‌ అధికారంలోకి రాగానే ఫార్మా లాబీ భారత్‌ కి వాక్సిన్‌ తయారీ కోసం వాడే ముడి పదార్ధాల మీద నిషేధం విధించమని తీవ్ర ఒత్తిడి తెచ్చి విజయం సాధించాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాక్సిన్‌ కోసం ముందే రా మెటీరీయల్‌ బుక్‌ చేసుకుంది. ముందు ఇచ్చిన ఆర్డర్‌ లు డెలివరీ అయ్యాకే మనకి ఇస్తాయి అమెరికన్‌ సంస్థలు అంటే హీన పక్షం మరో మూడు నెలల వరకు మనకి రా మెటీరీయల్‌ దొరికే అవకాశం లేదు.”
ఇది రాసిన పెద్దలే మన అజిత్‌ దోవల్‌ అమెరికాకు వారి భాషలోనే మాట్లాడి ముడిపదార్దాల సరఫరాకు దిగివచ్చేట్లు చేశారని కూడా రాశారు. దానికి ఆధారాలు లేవు. ట్రంపు అంటే కౌగిలింతల మిత్రుడు బిడెన్‌ కాదు కదా అయినా నరేంద్రమోడీకి నోరు ఎందుకు రావటం లేదు. అమెరికాతో అవసరం అయితే తెగతెంపులు చేసుకుంటామని బహిరంగ హెచ్చరిక ఎందుకు చేయలేదు ?

ఇది రాసిన వారికి తెలిసిన మాత్రం కూడా తెలియకుండా మోడీ, బిజెపి నేతలు బెంగాల్‌ వెళ్లారా !

” ఇక ఇంత హఠాత్తుగా 2 వేవ్‌ విజ ంభించడానికి కారణాలు సుస్పష్టం. ప్రస్తుతం విజ ంభిస్తున్న కోవిడ్‌ రెండు సార్లు మార్పు చెందినట్లు పరీక్షలలో తేలింది అంటే ఇది ప్రత్యేకంగా పని కట్టుకొని వ్యాప్తి చేసినట్లు కనపడుతున్నది దీనికి కారణం వేస్ట్‌ బెంగాల్‌ లో ఉన్న చికెన్‌ నెక్‌ ప్రాంతం ప్రధానం గా చెప్తున్నారు. ఈ చికెన్‌ నెక్‌ ప్రాంతం నుండే డుబుల్‌ మ్యూటేషన్‌ చేసిన వైరస్‌ ని వదిలినట్లు అనుమానిస్తున్నారు ఎందుకంటే బెంగాల్‌ లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరికీ అనుమానం రాదు కానీ ఒకేసారి డబుల్‌ మ్యూటేషన్‌ ఎలా జరుగుతుంది ? ఇది ఖచ్చితంగా బయో వార్‌ మన మీద. లేకపోతే కేవలం భారత దేశంలోనే ఇది విజ ంభిస్తున్నది ? పోయిన సంవత్సరం కూడా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్నప్పుడే చైనా సరిహద్దుల్లో తిష్ట వేసింది అలాగే ఇప్పుడు 2వ వేవ్‌ ఉధ తంగా ఉన్న సమయంలో మళ్ళీ సవాల్‌ విసురుతున్నది. ”
తాము ఏమి రాసినా బుర్రను ఉపయోగించకుండా నమ్మే జనం ఉన్నారన్న గట్టి నమ్మకంతో అల్లిన కధ ఇది. కోడి మెడ మాదిరి ఉండే ప్రాంతాన్ని చికెన్‌ నెక్‌ అంటున్నారు. ఇది పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం. ఆ ప్రాంతం పక్కనే భూటాన్‌,నేపాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులు ఉన్నాయి. అక్కడ వదలిన వైరస్‌ ముక్కుసూటిగా అటూ ఇటూ చూడకుండా పొరుగుదేశాలకు వెళ్లకుండా పశ్చిమ బెంగాల్‌కు వచ్చిందని చెబుతున్నారు. మరి కర్ణాటకలో ఎందుకు పెరుగుతోంది. బెంగాల్‌కు కర్ణాటకకు, మహారాష్ట్రకు చాలా దూరం ఉంది. పక్కనే ఉన్న బీహార్‌కు, ఝార్కండ్‌, ఒడిషా, వాటి మీదుగా ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఎందుకు వ్యాపించలేదు. ఇలాంటి కట్టుకధలతో జనాన్ని ఎంతకాలం మభ్యపెడతారు ? ఇక్కడ చిన్న తర్కం మరచిపోయారు. చికెన్‌ నెక్‌ ప్రాంతానికి వైరస్‌ను తీసుకురావాలంటే భూటాన్‌, నేపాల్‌ దేశాలను దాటి చైనా వారు రావాలి. కానీ లడఖ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కింలకు కొన్ని అడుగుల దూరంలోనే మన సరిహద్దు ఉన్నపుడు అక్కడ వదల కుండా దేశాలు దాటి వచ్చి చికెన్‌ నెక్‌ ప్రాంతంలో ఎందుకు వదలినట్లు ? నిజంగా బయోవార్‌ అయితే దేశం మొత్తాన్ని లక్ష్యం చేసుకుంటారు తప్ప ఒక్క పశ్చిమ బెంగాల్‌నే ఎందుకు ఎంచుకుంటారు? బయోవార్‌ కథలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలేమిటి ? దాన్ని గుర్తించేందుకు మోడీ సర్కార్‌ ఇచ్చిన ప్రత్యేక శిక్షణ ఏమిటి ? సొల్లు కబుర్లంటే ఇవే. కాస్త బుర్ర ఉపయోగిద్దాం. నిజానికి బయోవార్‌ మొదలు పెడితే లడఖ్‌ ప్రాంతంలో మన సైన్యం మీదే చైనా వారు వైరస్‌ను వదలి ఉండేవారు. లడఖ్‌ సైనికులు కరోనా బారిన పడ్డారన్న వార్తలేమీ ఇంతవరకు లేవే ! ఎందుకీ బుర్రతక్కువ రాతలు ?

” దాదాపు 15 కోట్ల మంది బంగ్లాదేశీయులు , రోహింగ్యా లు వెస్ట్‌ బెంగాల్‌ లో అస్సాం లో ఉన్నారు. మమత బేగం తో పాటు కాంగ్రెస్‌ వీళ్ళకి ఆధార్‌ కార్డులు ఇచ్చింది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు వీళ్ళకి ప్రధానం అందుకే వీటి కోసం ఏం చేయడానికయినా వెనుకాడరు. ”
బంగ్లాదేశ్‌ మొత్తం జనాభా పదహారున్నర కోట్లు, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిం జనాభా మొత్తం పద్నాలుగు లక్షలు. పదిహేను కోట్ల మంది మన దేశం వస్తే బంగ్లాదేశ్‌ మొత్తం ఖాళీ అయినట్లా ?

అమెరికన్లు చైనాకు మద్దతిస్తే చతుష్టయంలో చేరి మనం చేసేది ఏమిటి ?

” ఇప్పుడు జో బిడెన్‌ మంత్రి వర్గంలోని అధికారులు అందరూ దాదాపుగా లెఫ్ట్‌ వింగ్‌ ని సమర్ధించేవాళ్లే కాబట్టి కనపడకుండా చైనాకే మద్దతు ఇస్తారు , తీసుకుంటారు. మోడీ ప్రధాన మంత్రిగా ఉంటే అటు ఫార్మా లాబీ తో పాటు ఆయుధ లాబీ కూడా నష్టపోతుంది. నల్ల జాతీయుడు ఒక అమెరికన్‌ పోలీసు చేతిలో హత్యమవ్వడం దానిని ఎన్నికల ప్రచార ప్రధాన అస్త్రంగా వాడుకొని లెఫ్ట్‌ వింగ్‌ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదే లాబీ చైనా , కాంగ్రెస్‌ మద్దతుతో కోవిడ్‌ ని భూతంగా చూపించి దానికి మోడీ నే బాధ్యుడుగా చిత్రీకరిస్తున్నది. మోడీ ఉన్నంత కాలం డిఆర్‌డిఓ చాలా వేగంగా పనిచేస్తుంది కాబట్టి అది తమకి నష్టదాయకం. మోడీని ఏదో విధంగా దించాలి. ఈ కుట్రలని ఛేదించుకొని మోడీ మనగలరా ? లేక ట్రంఫ్‌ లాగా బలి అవుతారా అన్నది మనమీదే ఆధారపడి ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ”
ఒకవైపు అజిత్‌ దోవల్‌ జేమ్స్‌ బాండ్‌లో బైడెన్‌ మెడలు వచ్చి వాక్సిన్‌ ముడిపదార్దాల దిగుమతులు సాధించారంటారు. మరోవైపు అదే బైడెన్‌ మన నరేంద్రమోడీని దించుతారని చెబుతారు. అమెరికన్లు చైనాకు మద్దతు ఇస్తే, మన మోడీని దించేందుకు ప్రయత్నిస్తుంటే చతుష్టయం నుంచి వెంటనే బయటకు రావాలి, అమెరికాతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలి కదా ? కరోనా వైఫల్యంతో మోడీ కనుక కొనసాగితే అసలు మొదటికే మోసం వస్తుందనే భయం సంఘపరివార్‌లో ప్రారంభమైందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా మరో బొమ్మను రంగంలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు. ట్రంప్‌ బలి స్వయంకృతం, జనం గద్దె దించారు. ట్రంపు జిగినీదోస్తు నరేంద్రమోడీ, ఆయన సౌభాగ్యం ఎలా ఉంటుందో నోస్ట్రోడోమస్‌ ఎక్కడా చెప్పినట్లు లేదు.

నరేంద్రమోడీ గడ్డం దీక్ష వికటించి కరోనా పెరిగిందా ?

ప్రధాని నరేంద్రమోడీ గడ్డం పెంచటం గురించి ఇంతవరకు ఎవరూ ఏమీ చెప్పటం లేదు. గడ్డం, జులపాలు పెంచుకోవటమా లేదా అనేది వ్యక్తిగతమైనదే. కానీ మన దేశంలో కొంత మంది ఆకస్మికంగా పెంచితే దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. కొందరు భార్య గర్భవతి అయితే గడ్డం తీయరు. అలాగే దేవతలకు మొక్కో, దీక్ష్లో మరొక ప్రత్యేక కారణమో ఉంటుంది. కుర్రకారుకు సరదా ! మరి నరేంద్రమోడీ ఏ తరగతికి చెందుతారు. గడ్డం పెంచటం అనేది అస్తిత్వ రాజకీయాలకు, పురుషాధిక్యత ప్రదర్శనలో భాగం అనే తాత్పర్యాలు చెప్పేవారు కూడా ఉన్నారు. రామాలయ నిర్మాణ దీక్షలో భాగంగా గడ్డం పెంచారని పెజావర మఠం స్వామి చెప్పారు. మోడీ గడ్డం తప్ప దేశ ఆర్ధికస్ధితి పెరగటం లేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కొన్ని పత్రికలు కూడా గడ్డం గురించి రాశాయి. అయినా మోడీ తనదైన శైలిలో తన గడ్డం గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేకమైన మన్నాత్‌ క్రతువులో భాగంగా రహస్య పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారని అందుకే గడ్డం పెంచుతున్నారని 2020 సెప్టెంబరు 27న డక్కన్‌ క్రానికల్‌ పత్రిక రాసింది. దీన్ని చూస్తుంటే కరోనా బారి నుంచి దేశాన్ని రక్షించేందుకు భగవంతుని ప్రార్ధిస్తున్నట్లు అనిపిస్తోందని కూడా పేర్కొన్నది. అదే నిజమైతే ఆ పూజలు, ప్రార్ధనలు వికటించి ఇప్పుడు ఇంత విపత్తును తెచ్చి పెట్టాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరోసారి మీడియా, కాషాయ దళాల చైనా వ్యతిరేక ప్రచారం- వాస్తవాలు !

01 Saturday May 2021

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Narendra Modi Failures, RSS Outfits anti china, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


మరోసారి మీడియా – కాషాయ దళాలు ప్రచారదాడితో రెచ్చిపోతున్నాయి. ఎవరెంత సమర్దవంతంగా జనాన్ని పక్కదారి పట్టించగలమో చూద్దాం అన్నట్లుగా మిత్రులుగా పోటీ పడుతున్నాయి. నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ప్రతిసారీ వాటికి ఏదో ఒక అంశం, బకరాలు కావాలి. కరోనా రెండవ దశను ఊహించటంలో వైఫల్యం, అలక్ష్యం, అసమర్ధ నిర్వహణ ఒకటేమిటి ? వందకు ఒకటైనా ప్రతికూల వార్తకు చోటు కల్పించకపోతే ” చాల బాగోదు ” కనుక బాధ్యత ఎవరిది అనే అంశాన్ని తెలివిగా పక్కన పెట్టి సమస్య తీవ్రతను ప్రతిబింబించక మీడియాకు తప్పని స్ధితి. కాషాయ దళాల ఆరాధ్య దైవం గోబెల్స్‌. రాముడికైనా విరామం ఇస్తారేమో గానీ ఆయనకు రోజూ అబద్దాల నైవేద్యం పెట్టటం మానరు. ఎవరైనా నిజాలు చెప్పటంలో పోటీ పడితే మంచిదే. కానీ జరుగుతోందేమిటి ?


వద్దంటున్నా అనుమతించిన ఉత్తరాఖండ్‌ కుంభమేళా ( మనం పుష్కరాలు అంటాం) గంగలో మునిగిన వారు కరోనాను ఎలా వ్యాప్తి చేస్తున్నారన్నదాన్ని గురించి చెప్పటంలో వాటి మధ్య పోటీ లేదు. గతంలో తబ్లిగీ సమావేశాల సందర్భంగా చేసిన రచ్చ ఊసేలేకుండా జాగ్రత్త పడుతున్నాయి. జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 వరకు 91లక్షల మంది గంగలో మునిగారని, ఒక్క ఏప్రిల్లోనే 60లక్షల మందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరాఖండ్‌లో మార్చి 31న కేవలం 1,862 కేసులుండగా ఏప్రిల్‌ 24 నాటికి 33,330 పెరిగినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎంత మందికి అంటించారో తెలియదు. దేశాన్ని వస్తు ఉత్పత్తి కేంద్రంగా మార్చి యావత్‌ ప్రపంచానికే ఎగుమతులు చేస్తామని చెప్పిన వారు స్వంత జన ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పిత్తి, పంపిణీ చేయటంలో కూడా ఎందుకు విఫలమయ్యారో, విదేశీ సాయం కోసం ఎదురు చూడాల్సిన అగత్యం గురించి చెప్పటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం రంకు-భారతం బొంకు అన్న ఇతిహాసాలలోని అధ్యాయాలను మించిపోతాయి. రాబోయే రోజుల్లో వాటి గురించి ఎలాగూ చెప్పుకుంటాం గనుక అసలు విషయానికి వద్దాం.

ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెల వంటి జీవులు ఆహారం దొరకగానే ఆబగా కొద్దిగా నమిలి తింటాయి. తరువాత తీరికగా నోట్లోకి తెచ్చుకొని పూర్తిగా నమిలి మింగుతాయి, దీన్నే నెమరు వేసుకోవటం అంటారు. మనుషులు అలా చేసేందుకు అవకాశం లేదు గానీ జరిగిన అంశాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని నెమరు వేసుకోవచ్చు. గత రెండు నెలల కాలంలో జరిగిన కొన్ని ముఖ్య పరిణామాల గురించి ఒక్కసారి చూద్దాం. ఏప్రిల్‌ 28నాటికి అమెరికాలో పది కోట్ల మందికి పూర్తిగా వాక్సిన్‌ వేశారు, మరో 23 కోట్ల మందికి ఒక డోసు వేశారు.వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం అమెరికాలో 80 కోట్ల డోసులు అందుబాటులోకి రానుంది. జనాభా అంతటికీ వేసిన తరువాత కూడా పది కోట్ల డోసుల వరకు అదనంగా ఉంటుంది. అయినా అదేమిటో డబ్బు చెల్లిస్తామురా నా ప్రియమైన ఒకే మంచం ఒకే కంచం దోస్తూ అని మన దేశం రెండు నెలల నుంచి మొత్తుకుంటున్నా కోవిషీల్డ్‌ వాక్సిన్‌ తయారీకి అవసరమైన 37 రకాల ముడి పదార్దాలు, పరికరాలను విక్రయించేందుకు కొద్ది రోజుల క్రితం అంగీకరించాం అన్న ప్రకటన తప్ప ఇంతవరకు (మే 1 ) పంపిన దాఖలా లేదు. ఇది కూడా పాక్షిక సడలింపు మాత్రమే అని చెబుతున్నారు.


గతేడాది జరిగిన పరిణామాల నేపధ్యంలో మొత్తంగా మీడియా లేదా పూర్తిగా కాషాయ దళాలుగానీ చైనాను దోస్తుగా పరిగణించటం లేదు. యాప్‌లను నిషేధించారు, అక్కడి నుంచి పెట్టుబడులను ఆపేశారు. వస్తువుల దిగుమతి నిలిపివేసి కాళ్ల దగ్గరకు వచ్చేలా చేసుకుంటామని చెప్పారు. చైనా వస్తువులు నాశిరకం అన్నారు. వాటిని బహిష్కరించాలని పెద్ద హడావుడి చేశారు. ఇదిగో చూడండి మన దిగుమతులు తగ్గిపోయాయని అంకెలు చెప్పారు. అక్కడ తయారు చేసిన వాక్సిన్‌లో పసలేదని రాశారు. ఔషధాల నాణ్యత ప్రశ్నార్దకం అన్నారు. గతేడాది నవంబరు నుంచి రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలు, వీసాల జారీలేదు. సరిహద్దు వివాదం గురించి ఎడతెగని చర్చలు సాగుతున్నాయి, ఎటూ తేలటం లేదు. అవి ఎప్పుడు పూర్తవుతాయో లడఖ్‌ కొండలెక్కించిన మన సైనికులను కిందికి ఎప్పుడు దింపుతారో తెలియదు. ఏ విధంగా చూసినా చైనాను శత్రువుగానే పరిగణిస్తున్నారు. చైనా ప్రభుత్వ సిచువాన్‌ విమాన సంస్ధ పదిహేను రోజుల పాటు వస్తురవాణా విమానాల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించింది. తరువాత వెంటనే తిరిగి అనుమతిస్తామని, అవసరాన్ని బట్టి కొత్త షెడ్యూలును ప్రకటిస్తామని చెప్పింది. ఈలోగా ఇంకే ముంది సాయం చేస్తామని మోసం చేసింది, సరఫరాలను అడ్డుకుంటున్నది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే గతేడాది నవంబరు నుంచి ప్రయాణీకుల విమానాల రాకపోకలు లేకున్నా మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చైనా నుంచి సిచువాన్‌ సంస్ధ వస్తురవాణా విమానాలను నడుపుతూనే ఉంది.సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. భారత్‌తో కరోనా విపరీతంగా పెరిగిన కారణంగా పదిహేను రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఏప్రిల్‌ చివరి వారంలో ప్రకటించింది. అంటే అప్పటి వరకు అటు నుంచి ఇటు నుంచి అటు సరకు రవాణా జరుగుతూనే ఉంది. కాషాయ దళాలు చెప్పినట్లు చైనా వస్తువుల బహిష్కరణ లేదు, పాడూ లేదు. తమకు అనేక దేశాల నుంచి ఆర్డర్లు ఉన్నాయని, వాటి తయారీలో తలమునకలుగా ఉన్నామని, అందువలన భారత ప్రభుత్వం తమకు ఏమి కావాలో స్పష్టంగా చెబితే దానికి అనుగుణ్యంగా చర్య తీసుకుంటామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. మన దేశం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ లోగా కాషాయ దళం రంగంలోకి దిగింది. చైనా ప్రకటనపై మోడీ సర్కార్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఇంతవరకు అధికారికంగా స్పందన లేదు. మీడియా, కాషాయ దళాలు రచ్చ చేస్తున్నాయి. దక్షిణాసియా దేశాలలో కరోనా నిరోధం గురించి చర్చించేందుకు చైనా విదేశాంగ మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి మన దేశం డుమ్మాకొట్టింది.


ముడిసరకులపై నిషేధం ఎత్తివేసేందుకు నిరాకరించి వాక్సిన్‌ తయారీకి ఆటంకం కలిగేందుకు కారణమైన అమెరికా గురించి పల్తెత్తు మాట మాట్లాడని వారు చైనా పదిహేను రోజుల పాటు విమానాలను నిలిపివేస్తామని ప్రకటించగానే ఇంకేముంది నమ్మక ద్రోహం చేసింది, దాని బుద్ది బయటపెట్టుకుంది అంటూ రెచ్చిపోవటం ఏమిటి ? అప్రకటన చేసే ముందు రోజు వరకు మనకు అవసరమైన అత్యవసర సరఫరాలన్నింటినీ చైనా నుంచి తెచ్చుకున్నది వాస్తవం కాదా ? నేరుగా చైనా నుంచి గాకుండా ఇతర దేశాల మార్గాల ద్వారా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది, ప్రభుత్వ కంపెనీ గాకుండా ఉన్న మరో విమాన కంపెనీ ఎలాంటి నిషేధం విధించలేదు, దాని ద్వారా తెచ్చుకోవచ్చు. నిజానికి మనలను ఇబ్బంది పెట్టదలచుకుంటే అమెరికా మాదిరి నిషేధమే విధించవచ్చు కదా ! మనకు ఎగుమతి చేసే వాటి మీద మన నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద భారీ ఎత్తున పన్నులు విధించిందన్నది మరొక తప్పుడు ప్రచారం. నిజంగా ఆ పని చేస్తే దాపరికం ఏముంది ? గతంలో జిగినీ దోస్తు అమెరికా ట్రంపు అదేపని చేసినపుడు మీడియాలో వార్తలు వచ్చాయిగా, నిజంగా చైనా ఆ పని చేస్తే ఏ మీడియా కూడా ఎందుకు వార్తలు ఇవ్వలేదు.మన దేశం కూడా చైనా వస్తువుల మీద అదే మాదిరి పన్నులు ఎందుకు విధించకూడదు.

సిచువాన్‌ విమానాలను రద్దుచేసినట్లు ప్రకటించిన తరువాత హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి చైనాకు చెందిన 800 ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు వచ్చినట్లు, వారంలో మరో పదివేలు పంపుతున్నట్లు కొలంబోలో చైనా రాయబారి ప్రకటించారు. ఏప్రిల్‌ నెలలో 26వేల వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ జనరేటర్లు పంపినట్లు చైనా విదేశాంగ మంత్రి ప్రకటించారు. చైనా నుంచి నేరుగా అవకాశం లేకపోతే సింగపూర్‌, ఇతర ప్రాంతాల మీదుగా తెచ్చుకొనేందుకు అవకాశం ఉంది.ఏప్రిల్‌ ఒకటి నుంచి 25వ తేదీ వరకు చైనా నుంచి ప్రతి రోజూ మన దేశానికి సగటున ఐదు విమానాలు నడిచాయి. వాటిలో సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు కూడా ఉన్నాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి. ప్రముఖ సినిమా నటుడు చైనా తీసుకున్న నిర్ణయం కారణంగా తాను ఆర్డరు పెట్టిన ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు ఆగిపోయాయని ఢిల్లీలోని చైనా రాయబారికి పంపిన ట్వీట్‌లో పేర్కొన్నారు. దాని మీద స్పందించిన రాయబారి ట్వీట్లద్వారా సమాధానం పంపుతూ రెండు దేశాల మధ్య సరకు రవాణా విమానాలు మామూలుగానే తిరుగుతున్నాయని, గత రెండు వారాల్లో 61 విమానాలు తిరిగాయని వెల్లడించారు. అనుమానాలుంటే ఎవరైనా తీర్చుకోవచ్చు, సమస్యలుంటే పరిష్కరించాలని కోరవచ్చు.
అందువలన నిజాలేమిటో, సమస్య ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి తీవ్ర విమర్శలు చేయటం తగనిపని, మనకే నష్టం. కొద్ది రోజులుగా పద్దెనిమిది వేల ఆక్సిజన్‌ యంత్రాలకు మన దేశం నుంచి వివిధ సంస్ధలు ఆర్డరు చేశాయని చైనాలోని పెద్ద మెడికల్‌ కంపెనీ జియాంగ్‌సు యు మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తెలిపింది. భారత్‌తో సహా వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఉన్న కారణంగా వెంటనే సరఫరా చేయలేమని, నెల రోజులు కూడా పట్టవచ్చని, భారత మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చైనా సంస్దలు చెబుతున్నాయి.


గతేడాది చైనాతో తలెత్తిన సరిహద్దు వివాద నేపధ్యంలో మోడీ సర్కార్‌ వైఖరిలో అస్పష్టమైన మార్పు వచ్చింది. దానికి అనుగుణ్యంగానే చైనా నుంచి అత్యవసర వస్తువులను కొనుగోలు చేస్తున్నాము. భారత్‌ నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు 25వేల ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్లను సరఫరా చేసేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నామని భారత్‌లో చైనా రాయబారి సన్‌ వెయిడోంగ్‌ నిర్ధారించారు. వాటిని సరఫరా చేసేందుకు అసరమైన సరకు రవాణా విమానాలను సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.చైనా నుంచి వస్తువులను తీసుకుంటున్నామని భావనా పరమైన సమస్యలేవీ లేవని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లు మీడియా-కాషాయ దళాలు ఎందుకు రచ్చ చేస్తున్నాయి ?


లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్‌ఫినిటీ అనే సంస్ధ సేకరించిన సమాచారం ప్రకారం మార్చినెలాఖరుకు 16.4 కోట్ల కరోనా వాక్సిన్‌ డోసులను అమెరికా ఉత్పత్తి చేసింది. ఒక్కడోసు కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయలేదు. ఐరోపా యూనియన్‌ పదకొండు కోట్ల డోసులు ఉత్పత్తి చేయగా 42శాతం ఎగుమతి జరిపింది. చైనాలో తయారైన సినోవాక్‌, సినోఫామ్‌ 20 కోట్ల డోసులను ఎగుమతి చేశారు. అమెరికా మీద తీవ్రమైన వత్తిడి రావటంతో రాబోయే రోజుల్లో ఆరుకోట్ల డోసుల ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌ ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. ఇది గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం వంటిదే. ఈ వాక్సిన్‌ వినియోగానికి అమెరికాలో అనుమతి ఇవ్వాలో లేదో నిర్ణయించక ముందేే కొనుగోలు చేశారు. తరువాత అనుమతి ఇవ్వలేదు. అందువలన దాన్ని వదిలించుకొనేందుకు ముందుకు వచ్చింది. లేనట్లయితే అది నిరుపయోగంగా అక్కడే ఉండిపోతుంది.


వాక్సిన్‌ తయారీలో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికా సంస్దలదే గుత్తాధిపత్యం.అక్కడి ఫైజర్‌ కంపెనీకి అవసరమైన ముడిపదార్దాల సరఫరా తద్వారా దాని లాభాలను ఇబ్బడి ముబ్బడి చేసేందుకు వాటి మీద నిషేధం విధించినట్లు చెబుతున్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమెరికా, ఐరోపా స్వంతం కావటంతో వేగంగా పెద్ద మొత్తంలో తయారు చేసి సొమ్ము చేసుకొనేందుకు వాక్సిన్‌ తయారీని ఒక్కోదశలో ఒక్కో దేశానికి అప్పగించారు. మోడెర్నా వాక్సిన్‌ స్విడ్జర్లాండ్‌లో తయారు చేసి దాన్ని సీసాల్లో నింపేందుకు స్పెయిన్‌కు పంపుతారు. బ్రిటన్‌ కంపెనీ క్రోడా వాక్సిన్‌ తయారు చేసి సీసాల్లో నింపేందుకు నార్మండీ, ఫ్రాన్స్‌ పంపుతున్నారు. ఒక వేళ తమ కంపెనీ వాక్సిన్‌ వికటించి వినియోగించిన వారికి పరిహారం చెల్లించాల్సి వస్తే కోర్టు దావాల నుంచి ఔషధ కంపెనీలకు రక్షణ కల్పించేందుకు లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనా, బ్రెజిల్‌, ఇతర దేశాలు ప్రభుత్వ ఆస్తులను, రిజర్వుబ్యాంకుల నిధులు, మిలిటరీ కేంద్రాల వంటి వాటిని తాకట్టుపెట్టాలని ఫైజర్‌ కంపెనీ వత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇదేంట్రాబాబూ తొలి రోజుల్లోనే బిడెన్‌ పెద్దమనిషి ట్రంప్‌ కంటే దారుణంగా తయారయ్యాడు అని ఎక్కడ అనుకుంటారో, అమెరికా వ్యతిరేకత ఎక్కడ పెరుగుతుందో అనే భయం – బిడియంతో వాక్సిన్‌ తయారీ వస్తువులపై నిషేధాన్ని కాస్త సడలించేందుకు నిర్ణయించుకున్నట్లుగా గత కొద్ది రోజుల పరిణామాలు స్పష్టం చేశాయి.

అజిత్‌ దోవల్‌ ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్పి దారికి తెస్తారని, అమెరికాను అదే విధంగా హెచ్చరించి మనకు సరఫరాలు చేసేందుకు అంగీకరింప చేయించారని కాషాయ దళాలు ప్రచారం ప్రారంభించాయి. మరి అదే అజిత్‌ దోవల్‌ చైనా విషయంలో కూడా అదే విధంగా ఎందుకు వ్యవహరించలేదు, అమెరికా కంటే బలహీనమైన చైనాను కాషాయ దళాల భాషలో చెప్పాలంటే ఎందుకు మన కాళ్లదగ్గరకు తేలేదు ? చివరికి బలహీన పాకిస్దాన్‌న్ను ఎందుకు అంకెకు తేలేకపోయారు ? మన ఇరుగు పొరుగుదేశాలను మన వైపు ఎందుకు తిప్పలేకపోయారు. అజిత్‌ దోవల్‌కు అంతసీన్‌ లేదు ! నరేంద్రమోడీ కంటే బలవంతుడా ! అందరికీ చెడ్డాం, చివరికి మీరు కూడా ఇలా చేస్తే మా మోడీ పరువు, పనేంగాను అని సాష్టాంగపడ్డారేమో ? చరిత్రలో ఇలాంటివారిని అమెరికన్లు ఎందరినో చూశారు. తిరిగే చక్రం మీద కూర్చున్న ఈగ దాన్ని తానే తిప్పుతున్నట్లు భావిస్తున్నట్లుగా ఈ ప్రచారం ఉంది. ఇలాంటి పోసుకోలు కబుర్లతో నరేంద్రమోడీ వైఫల్యాలను కప్పిపుచ్చగలరా ? తోకపట్టుకొని పోవటం తప్ప మరొక విధంగా వ్యవహరించలేని రీతిలో మనం అమెరికా చేతిలో చిక్కాము. దాన్ని నమ్మి రెచ్చి పోయి చైనా, పాకిస్దాన్‌, ఇతర ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకున్నాం, వాటన్నింటినీ చైనాకు దగ్గర చేశాము. రెండునెలలుగా ససేమిరా అని మొరాయిస్తుంటే అజిత్‌ దోవల్‌ గానీ నరేంద్రమోడీ గానీ చేసిందేమీ లేదు. మిత్రదేశం అని చెప్పిన భారత్‌ను అమెరికన్లు ఎలా నిర్లక్ష్యం చేశారో చూడండి అంటూ చైనా మీడియాలో వ్యాఖ్యలు, ఇతర దేశాల నుంచి విమర్శలు, వత్తిడి, అన్నింటికీ మించి మన దేశంలో అమెరికా వ్యతిరేకత పెరిగితే తమకూ, అనుయాయి నరేంద్రమోడీకి నష్టం అని లెక్కలు వేసుకున్న తరువాతనే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది.


శ్రీరాముడంతటి శక్తివంతుడే రావణుడిపై పోరుకు ఉడత సాయం తీసుకున్నారని గొప్పగా చెప్పుకుంటారు. రాముడి అడుగుజాడల్లో నడుస్తున్నామని చెబుతున్నవారు పాక్‌ నుంచి సాయం తీసుకొనేందుకు తిరస్కరించటం శ్రీరాముడి పట్ల అపచారం చేసినట్లు కాదా ?వెంటిలేటర్లతో సహా కొన్ని ఇతర వైద్య సామగ్రిని పంపుతామని పాకిస్ధాన్‌ ప్రకటించింది. అయితే దాన్ని స్వీకరిస్తామని గానీ తిరస్కరిస్తున్నట్లుగానీ మోడీ సర్కార్‌ ప్రకటించలేదు. స్వీకరించటం తమ స్ధాయికి భంగకరమని, తలెత్తే ప్రశ్నలు, విమర్శలకు సమాధానాలు చెప్పలేమని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.పాకిస్ధాన్‌తో సయోధ్య కుదిరినట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పటికీ ఈ వైఖరితో వ్యవహరించటం గమనించాల్సిన అంశం. పదహారు సంవత్సరాల క్రితం విదేశీ సాయం తీసుకోవటంపై మన్మోహన్‌ సింగ్‌ హయాంలో స్వయంగా విధించుకున్న ఆంక్షలను గుట్టుచప్పుడు కాకుండా నరేంద్రమోడీ ఎత్తివేసింది. చైనా నుంచి ప్రాణావసర ఔషధాలు, ఆక్సిజన్‌, సంబంధిత పరికరాలను తీసుకొనేందుకు భావనా పరమైన సమస్యల్లేవని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొన్నది. అయితే పాకిస్ధాన్‌ నుంచి స్వీకరించే విషయంలో ఏం చేయాలనేది స్పష్టం చేయలేదు. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం విదేశాల నుంచి బహుమతులు, విరాళాలను స్వీకరించాల్సి వస్తే వాటిని రెడ్‌ క్రాస్‌ సంస్ధకు మాత్రమే అందచేయాలి, దాని ద్వారానే పంపిణీ చేయాలి.ప్రభుత్వాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవాటికి వెల చెల్లించి మాత్రమే తీసుకోవాలి. గత కొద్ది రోజులుగా అమెరికాతో సహా వివిధ దేశాల నుంచి ప్రకటిస్తున్న సాయమంతా డబ్బు చెల్లించి కొనుగోలు చేసేదే అని గ్రహించాలి. విధాన సడలింపుల తరువాత వచ్చే సాయంలో కొంత విరాళం కొంత నగదు చెల్లింపులు ఉండే అవకాశం ఉంది. ఇంటా బయటా వెల్లువెత్తుతున్న విమర్శలు, ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేస్తున్న నేపధ్యంలో ఈ మార్పు చేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేరుగా తమకు అవసరమైన వాటిని విదేశాల నుంచి సేకరించుకోవచ్చని కేంద్రం సూచించింది.

అంతకు ముందు ఉత్తరా ఖండ్‌ భూకంపం(1991) లాతూర్‌ భూకంపం(1993) గుజరాత్‌ భూకంపం(2001) బెంగాల్‌ తుపాను(2002) బీహార్‌ వరదలు(2004) సంభవించిన సమయాలలో విదేశీ సాయం తీసుకున్నాము.2004లో సునామీ తరువాత పరిస్ధితిని మనకు మనమే ఎదుర్కోగలమంటూ విదేశీ విరాళాలను తీసుకోవద్దని, అవసరమైతే వారి సాయం తీసుకుందామని నిర్ణయించారు. దీనికి అనుగుణ్యంగా 2005లో కాశ్మీరులో భూకంపం, అక్కడే 2014లో వరదల సమయాలో, 2013లో ఉత్తరా ఖండ్‌ వరదల సమయంలో విదేశీ విరాళాన్ని తీసుకొనేందుకు ప్రభుత్వ నిరాకరించింది.తాజా విషయానికి వస్తే లక్షలాది మంది మళయాలీలు పని చేసే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం 2018లో కేరళ వరదల సమయంలో 700 కోట్ల రూపాయల విరాళం అందచేస్తామని ముందుకు వచ్చినపుడు కేంద్రం తిరస్కరించింది. ఆ మేరకు కేంద్రం సాయం ఇవ్వకపోవటం తీవ్ర విమర్శలు రావటం అది వేరే విషయం. కానీ అదే ప్రభుత్వం పిఎం కేర్‌ నిధికి ఎవరు విరాళం ఇచ్చినా తీసుకోవాలని గతేడాది నిర్ణయించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే స్వీకరించనుంది. అయితే ఈ అంశాన్ని బహిరంగంగా ప్రకటించలేదని, ఇదే సమయంలో సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం ఎలాంటి వినతులు చేయలేదని, ప్రభుత్వాలు లేదా ప్రయివేటు సంస్ధలు ఏవైనా బహుమతిగా విరాళం ఇస్తే కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరిస్తామని ఒక అధికారి చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది. గతంలో మన ప్రభుత్వం ఇతర దేశాలకు విరాళంగా ఇచ్చిన హైడ్రోక్సీ క్లోరోక్విన్‌ నుంచి వాక్సిన్లకు ప్రతిగా ఇలాంటి విరాళాలు వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఇప్పుడు కావాల్సింది ఏమిటి ? ప్రపంచ లేదా ప్రాంతీయ రాజకీయాలు, శత్రుత్వమా ? ప్రజల రక్షణా ఏది ముఖ్యం. నిజమైన రాజనీతి ప్రాధాన్యత జన సంక్షేమం అన్నది స్పష్టం. గతంలో అన్ని దేశాలూ రాజకీయాలు చేశాయి. ఒకదానిని ఒకటి దెబ్బతీసుకొనేందుకు ప్రయత్నించాయి. మనం తప్ప మిగతావన్నీ అదే చేశాయనే కాషాయ ప్రచారాన్ని ఎవరైనా నమ్మితే తప్పుదారి పట్టినట్లే. చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో చతుష్టయం పేరుతో కలిశాము. అయినా దానిని పక్కన పెట్టి చైనీయులు మనకు అవసరమైన వాటిని విక్రయిస్తున్నారు. ఎలాంటి నిషేధం పెట్టలేదు. మిత్రదేశం అనుకున్న అమెరికా ఆ పని చేసింది. మనకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ -చైనా దగ్గరయ్యాయి. అమెరికాకు అనుకూలంగా మనం ఇరాన్‌ను దూరం చేసుకున్నాము. అమెరికాకు వ్యతిరేకంగా అది చైనాకు దగ్గరైంది. ఇతర ఇరుగుపొరుగు దేశాలు కూడా అమెరికాతో మన సంబంధాల కారణంగా చైనా వైపు మొగ్గుచూపుతున్నాయన్నది స్పష్టం. ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు, దేనితో ఎలా తేల్చుకోవాలో తరువాత నిర్ణయించుకోవచ్చు. సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ చైనాతో స్నేహం చేశాము, ఇప్పటికీ ఎగుమతి-దిగుమతి కొనసాగుతూనే ఉంది. పాకిస్ధాన్‌తో వైరం ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు వాణిజ్యంలో అత్యంత సానుకూల హౌదా ఇచ్చాము. ఒకవైపు మిత్ర రాజ్యం అంటూనే మరోవైపున మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్దలో ఫిర్యాదులు చేస్తున్నది, మన వస్తువుల దిగుమతులపై ఉన్న పన్ను రాయితీలను రద్దు చేసింది, కొత్తగా దిగుమతి పన్నులు వేసింది. మాకు మా దేశ పౌరులు తప్ప మిగతావారి గురించి పట్టించుకోము అంటూ వాక్సిన్‌ ముడిసరకులు, పరికరాలపై నిషేధం విధించినా అమెరికాతో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే విధానం చైనా, పాకిస్దాన్‌తో ఎందుకు అనుసరించకూడదో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వివాదాలు, విబేధాలతో రాజీపడాలని, లొంగిపోవాలని ఎవరూ చెప్పటం లేదు. ప్రజానుకూలంగా విధానాలుండాలని చెప్పటం తప్పుకాదు. అలాంటి వైఖరి, విదేశాల సాయం లేకుండా కరోనా బారి నుంచి మన జనాన్ని మన ప్రభుత్వం కాపాడగలదా ?

ఆపదలో ఆదుకుంటాయని నమ్మిన అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు ముఖం చాటేశాయి.మనలను చైనాకు వ్యతిరేకంగా ఉపయోగించుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత ఆదుకొనేందుకు ఇవ్వలేదని కరోనా నిరూపించింది. మార్చినెలలో జరిగిన తొలి చతుష్టయ సమావేశంలో ప్రపంచానికి వంద కోట్ల వాక్సిన్లు అందించాలని, వాటిని భారత్‌లో తయారు చేసేందుకు అవసరమైన సాయం చేయాలని కూటమి నిర్ణయించింది. ఇప్పుడు మన దేశమే వాక్సిన్ల కొరతను ఎదుర్కొంటుంటే మిగతా దేశాలు ముఖం చాటేస్తున్నాయి. ముడిపదార్దాల సరఫరాను అడ్డుకుంటున్నాయి. లక్షల సంఖ్యలో ఆక్సిజన్‌ జనరేటర్లు మనకు అవసరం కాగా కొన్ని వందలు పంపుతూ దాన్నే పెద్ద సాయంగా అమెరికా చిత్రిస్తున్నది. జపాన్‌ మౌనంగా ఉంది.మానవహక్కుల గురించి నిత్యం కబుర్లు చెప్పే, గుండెలు బాదుకొనే అమెరికా, ఐరోపా ధనిక దేశాలు కరోనా వాక్సిన్ను మానవ హక్కుగా పరిగణించటం లేదు. అలాంటి వాటిని నమ్మి అలీన విధానానికి తిలోదకాలిచ్చి వాటి చంకనెక్కితే ప్రయోజనం లేదని తేలిపోయింది కనుక భేషజాలకు పోకుండా ఇప్పటికైనా మన విదేశాంగ విధానాన్ని పున:పరిశీలించుకోవటం అవసరం.
హొహొహొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

స్లేట్‌ ద స్కూల్‌ అధిపతి వాసిరెడ్డి అమరనాధ్‌ ఫేస్బుక్‌ పోస్టు – ఒక పరిశీలన ! మేథావులు ఆత్మావలోకనం చేసుకోవాలి !!

26 Monday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ 1 Comment

Tags

conspiracy theories, Intellectuals, Propaganda War, Propaganda war victims, Slate the School

ఎం కోటేశ్వరరావు

ఆంగ్లంలో ఇంటలెక్చ్యువల్‌ – తెలుగులో బుద్ధి జీవి. బుద్ది జీవులు ఎవరు, వారి లక్షణాలు ఏమిటి అన్నది సామాన్యులకూ – బుద్ది జీవుల్లోను ఎడతెగని సమస్య. వాళ్లు అలా అనుకుంటున్నారు- వీళ్లు ఇలా అనుకుంటున్నారు అని చెప్పటమే మేథావి లక్షణం అయితే అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడివి అక్కడికి చేరవేసే వారందరూ, అలా అట ఇలా అట అంటూ చెవులు కొరికే వారూ మేధావులే. ప్రశ్నలను మాత్రమే రేకెత్తించి జవాబులు చెప్పని వారు మేథావులని ఒక అనుభవశాలి చెప్పాడు. జార్జి ఆర్వెల్‌ అనే కలం పేరుతో సుప్రసిద్దుడైన ఆంగ్ల రచయిత ఎరిక్‌ ఆర్ధర్‌ బ్లెయిర్‌ ” కొన్ని ఆలోచనలు ఎంత బుద్ది తక్కువగా ఉంటాయంటే బుద్ది జీవులు మాత్రమే వాటిని నమ్ముతారు ” అని చెప్పారు. జార్జి ఆర్వెల్‌ ప్రస్తుతం బీహార్‌లోని మోతీహరిలో జన్మించి స్వాతంత్య్రం తరువాత ఇంగ్లండ్‌ వెళ్లిపోయి 47 సంవత్సరాల వయస్సులోనే 1950లో మరణించాడు. ఇంటర్నెట్‌, వాట్సప్‌ రాక ముందే తనువు చాలించాడు గానీ లేకుంటేనా వాట్సప్‌ విశ్వవిద్యాలయ బుద్ది మంతుల గురించి ఎంత చెప్పి ఉండేవాడో కదా !

హైదరాబాదు, విజయవాడ, తిరుపతి నగరాల్లో స్లేట్‌ ద స్కూలు పేరుతో విద్యా సంస్ధలు నడుపుతూ వైద్యంతో సహా (ఫేస్బుక్‌ పోస్టులను బట్టి ) బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న వాసిరెడ్డి అమరనాధ్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. పేరు వినటమే తప్ప నాకు పరిచయం లేదు, పంచాయతీల్లేవు. అమరనాధ్‌ పోస్టు వాట్సప్‌ విశ్వవిద్యాలయంలో చూసిన తరువాత ఒక జర్నలిస్టుగా బుద్ది జీవుల గురించి రాయాలనిపించింది. ఆ పోస్టు అంశాలు ప్రస్తుతం సమాజంలో ఎందరో మేథావులు, విద్యావంతుల గందరగోళం- ఆలోచనకు ప్రతిబింబంగా ఉంది కనుక స్పందించాల్సి వస్తోంది. కనుక వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు. పోస్టులోని అంశాన్ని విమర్శించాలని లేదా సంవాదం ప్రారంభించాలని కాదు. నా అభిప్రాయాలతో ఏకీభవించటమా, వ్యతిరేకించటమా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు. రాగ ద్వేషాలకు అతీతంగా పరిశీలించి బుద్దికి పదును పెట్టమని కోరుతున్నాను. అమరనాధ్‌గారి పోస్టులోని అంశాలపై నా స్పందన ఇక్కడ ప్రస్తావిస్తాను.

” చైనాలో పుట్టిన ఆ వైరస్‌ ప్రపంచం నలుచెరుగులా ఉన్న 180 కి పైగా దేశాలకు వ్యాపించింది . కానీ చైనా లో మాత్రం ఒక్క నగరానికే పరిమితం . ప్రపంచమంతా ఒకటి.. రెండు .. మూడు అంటూ వేవ్‌ లు . అక్కడ మాత్రం మొదటి మూడు నాలుగు నెలలు .. ఒక నగరం .. 90 వేల కేసులు మాత్రమే . . దీని వెనుక ఉన్న ఇంద్ర జాల మహేంద్ర జాలం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు . పోనీ చైనా న్యూజిలాండ్‌ లాగా ఎక్కడో దూరంగా ఉన్న దేశమా అంటే .. కాదు . ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ! జన సాంద్రత ! ఆ వైరస్‌ ను ఏ అల్లాఉద్దీన్‌ అదుÄ్బత ద్వీపం సాయం తో కట్టడి చేసారో ఇప్పటి దాక ఒక్క శాస్త్రవేత్త కూడా వివరించ లేదు. ”

దీనిలో శాస్త్రవేత్తలు వివరించాల్సిందీ, వివరించనిదీ, తెలియనిదీ ఏమీ లేదు. వైరస్‌ చైనాలో పుట్టిందా మరోచోటనా అన్నది ఇంకా తెలియదు. చరిత్రలో స్పానిష్‌ ఫ్లూగా పరిచితమైనది తొలుత బయటపడింది అమెరికాలో, నింద మాత్రం స్పెయిన్‌కు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన సమయంలో దేశాలన్నింటా మీడియా మీద సెన్సార్‌ ఆంక్షలున్నాయి. స్పెయిన్‌ ఆ యుద్దంలో తటస్దంగా ఉంది. రాజు పదమూడవ ఆల్పోన్సోకు తీవ్ర సుస్తీ చేయటంతో అక్కడి మీడియాలో దాని గురించి రాశారు. అందరూ స్పానిష్‌ ఫ్లూ అన్నారు.
1977లో ఫ్లూ రష్యా, ఇతర దేశాలను వణికించింది. తొలుత ఇది ఉత్తర చైనాలో కనిపించింది. వ్యాప్తి ఎక్కువగా నాటి సోవియట్‌యూనియన్‌లో జరిగింది కనుక మీడియాలో దాన్ని రష్యా ప్లూ అన్నారు. తరువాత అమెరికా, ఇతర దేశాల్లో కూడా వ్యాపించింది. అప్పుడు చైనా-సోవియట్‌ సంబంధాలు సరిగా లేవు గనుక చైనా వారు లాబ్‌లో తయారు చేసి వదిలారని తప్పుడు ప్రచారం చేశారు.
2009లో ప్రపంచాన్ని వణికించిన హెచ్‌1ఎన్‌1 ప్లూ తొలుత మెక్సికోలో కనిపించినా దాన్ని మెక్సికో ఫ్లూ అని పిలువ లేదు. పందుల నుంచి వ్యాప్తి చెందినట్లు బయటపడినందున స్వైన్‌ ఫ్లూ అన్నారు. అయితే పంది మాంసం తినే దేశాలు ఈ పేరును అభ్యంతర పెట్టాయి. తరువాత ఇలాంటి వైరస్‌లకు ఒక దేశం, ప్రాంతం, భాష, జీవి పేరు పెట్టకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్ణయించింది. ఆ మేరకు కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. దాన్ని ఉల్లంఘిస్తూ చైనా వైరస్‌ అని ప్రచారం చేసి చైనా మీద ఉన్న కసిని అలా తీర్చుకున్నారు.

కరోనా వైరస్‌ తొలుత కనిపించిన ఊహాన్‌ నగరంలోని కోటి మంది జనాభా, పరిసరాలలో లాక్‌డౌన్‌ అమలు జరిపారు. అపార్ట్‌మెంట్లు, జనావాసాలను ఎక్కడిక్కడ కట్టడి చేశారు. రోగలక్షణాలతో నిమిత్తం లేకుండా దాదాపు ప్రతి ఇంటివారిని పరీక్షించి వైరస్‌ లక్షణాలున్న వారిని వేరు చేసి చికిత్స చేశారు. దేశంలోని ప్రజారోగ్య సిబ్బందినీ, వేలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా సమీకరించి ప్రతి నివాసం వద్ద ఉంచారు. ప్రతి ఇంటిలో ఎవరికేమి జరుగుతోందో పర్యవేక్షించారు. కావాల్సిన వాటిని అందచేశారు, జవాబుదారీతనంతో వ్యవహరించారు. అమరనాధ్‌ గారు స్లేట్‌ అనే ఒక కార్పొరేట్‌ స్కూలు అధిపతి గనుక స్కూలు పిల్లల గురించి చైనా తీసుకున్న జాగ్రత్తలను తెలుసుకోవాల్సింది. స్కూలు బస్సులకు ప్రత్యేక రోడ్ల కేటాయింపు, ఎక్కేటపుడు దిగేటపుడు జ్వరం ఉందా లేదా అని పరీక్షించటం వంటి చర్యలన్నీ తీసుకున్నారు.
ఇక్కడ కావాల్సింది చైనా మీద, అక్కడి వ్యవస్ధ మీద విశ్వాసం. అది లేని వారు అక్కడ ఏమి జరిగినా నమ్మరు. అందుకు ఒక్క ఉదాహరణ. చైనాలో జరిగిన ఆర్దిక అభివృద్ది గురించి చెప్పిందంతా అంకెల గారడీ అని ప్రచారం చేశారు. అవే నోళ్లు ఇప్పుడు తన ఆర్దికశక్తితో ప్రపంచాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు చైనా పూనుకుంది అని కొత్తబాణీ అందుకున్నాయి. చైనా, వైరస్‌ గురించి కుట్ర సిద్దాంతాలను ప్రచారం చేసేందుకు చూపిన శ్రద్ద వైరస్‌ నివారణకు మన దేశంతో సహా మిగతా దేశాలు చూపి ఉంటే ఇలాంటి తీవ్ర పరిస్ధితి ఉండేది కాదు. రెండవ తరంగం కరోనా వ్యాప్తి తీవ్రం అవటం ప్రారంభించిన తరువాతనే కదా లక్షలాది మంది రాసుకుంటూ పూసుకుంటూ తిరిగే కుంభమేళాకు అనుమతించింది. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి మూర్ఖ, మూఢత్వాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించాయా ? దీనిలో తెలియంది ఏముంది ? అమరనాధ్‌ లాంటి వారికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది, నిజంగా శ్రద్ద ఉండి తెలుసుకుంటే తెలియనిదేమీ లేదు. తెలుసుకోకుండా ఉంటారనీ అనుకోలేము.నిర్మొహమాటంగా చెప్పాలంటే చైనా సమాచారాన్ని విశ్వసించలేకపోవటమే అసలు సమస్య. దానికి సామాన్యుడైనా మేథావి అయినా ఒకటే.

” చైనా అమెరికా దేశంలోని అనేక యూనివర్సిటీ లకు సీక్రెట్‌ గా ఫండ్స్‌ ఇచ్చిందట . ఇదేదో అభియోగం కాదు. ట్రంప్‌ అధికారం లో వున్నప్పుడు దీని పై విచారణ జరిపి ఆయా యూనివర్సిటీ ల పై చర్య ల కు కూడా ఆదేశించాడు . యూనివర్సిటీ ల కు ఫండ్స్‌ ఇస్తే మంచే పనే కదా . దాన్ని గొప్పగా చెప్పుకోవాలి కదా ? . కానీ సీక్రెట్‌ గా దొంగ లాగా ఇవ్వడం ఏంటి ? అమెరికా మేధావులను తన అదుపులో పెట్టుకోవడం .. అమెరికన్‌ ల బ్రెయిన్‌ వాష్‌ .. మరో మాటలో చెప్పంటే మేధో దాడి అని కొంత మంది అంటారు . ”

చీమ చిటుక్కుమంటే కనిపెట్టగలిగిన అమెరికా గూఢచారి వ్యవస్ద గురించి తెలిసిన అమరనాధ్‌ గారు మీడియా ప్రచారదాడికి గురైయ్యారని పోస్టు పెట్టిన తీరు చెబుతోంది. ఇక్కడ కూడా అమెరికన్లు చెబుతున్న కుట్ర సిద్దాంతాన్ని నమ్మటమే. ముందే చెప్పినట్లు అక్కడ అలా అట ఇక్కడ ఇలా అట అని చెప్పటానికి అమరనాధ్‌ గారు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. మన దేశంలోని విశ్వవిద్యాలయాలలో అధ్యయన సంస్దల ఏర్పాటు వాటికి స్వదేశీ, విదేశీ సంస్ధలు నిధులు ఇవ్వటం రహస్యమేమీ కాదు. అలాగే అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో కన్పూషియస్‌ సిద్దాంతాల అధ్యయనం పేరుతో మరో పేరుతో చైనా అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి చైనా సంస్దల నుంచి, అమెరికా సంస్దల నుంచి కూడా నిధులు ఇచ్చారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా-చైనాల మధ్య సంబంధాలు, వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతున్నపుడు లేని సమాచారం ట్రంప్‌ హయాంలోనే బయటకు వచ్చిందా ? అంతకు ముందున్న పాలకులకు తెలియదా ? సిఐఏ, ఎఫ్‌బిఐ, జాతీయ దర్యాప్తు సంస్దలు వాటికి ఉన్న లక్షలాది మంది గూఢచారులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు ? నిజానికి అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందేమీ లేదు.

చైనాతో వివాదం పెట్టుకోవాలి, దాన్ని అదిరించి బెదిరించి తన వాణిజ్యలోటును తగ్గించుకోవాలి. అందుకోసం ఏదో ఒక సాకులు చెప్పి జనాన్ని నమ్మించాలి. ఆ ఎత్తుగడలో భాగమే విశ్వవిద్యాలయాలకు నిధులు, అమెరికన్ల బుద్ది శుద్ది ప్రచారం. మన దేశంలోని విద్యా సంస్ధలలో గత ఐదు దశాబ్దాలుగా వామపక్ష ఉగ్రవాద సానుభూతి పరులు ఉద్యోగాలు చేయటం, నక్సల్‌ పార్టీల అనుబంధ సంఘాలతో సంబంధాలు కలిగి ఉండటం తెలిసిందే. ఇదే సమయంలో తిరోగమన ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్నవారి సంఖ్యతో పోలిస్తే వీరు తక్కువే. అయినా అర్బన్‌ నక్సల్‌ అనే పదాన్ని ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ఎందుకు ప్రచారంలోకి తెచ్చారు? నిజానికి విశ్వవిద్యాలయాల్లో అలాంటి వారి సంఖ్య గతంతో పోల్చితే చాలా తగ్గింది. అధికార పార్టీలకు భజన చేసే బ్యాచి ఎక్కువైంది. అర్బన్‌ నక్సల్స్‌ పదం ప్రచారం ఎత్తుగడలో భాగం.

అమెరికాలో బుద్ది శుద్ది ఎవరు చేస్తున్నారు? చైనా కమ్యూనిస్టులు వచ్చి అక్కడేమీ రాజకీయ పాఠశాలలు పెట్టి కమ్యూనిస్టు పాఠాలు చెప్పటం లేదే ? గత మూడు దశాబ్దాల్లో అమెరికా విద్యావంతుల్లో వచ్చిన మార్పు ఏమిటి ? అంతకు ముందు కమ్యూనిజాన్ని బూచిగా చూపారు. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలను కూల్చివేసిన తరువాత కమ్యూనిజంపై విజయం సాధించామని ప్రకటించింది ఎవరు ? అమెరికన్లే కదా ! అక్కడే అమెరికా మేథావులు, యువతలో కొత్త ఆలోచనకు నాంది పడింది. దేశంలో దిగజారుతున్న పరిస్ధితి, దుకాణాలన్నీ చైనా వస్తువులతో నిత్యం దర్శనమివ్వటం, వాణిజ్య లోటు తగ్గించాలని అమెరికా నేతలు నిత్యం చైనీయులను కోరటం, అదే సమయంలో చైనా కమ్యూనిస్టు వ్యవస్ధలో మానవ హక్కులు లేవనే బ్లాక్‌మెయిల్‌ ప్రచారం వాస్తవమా, కాదా ? వీటికి తోడు పదేండ్లకొకసారి వస్తున్న ఆర్ధిక సంక్షోభాలు అమెరికా వంటి ధనిక దేశాలకు తప్ప చైనా దరిచేరకపోవటం అమెరికా మేథావులకు తెలియదా ? ఆందుకే మన దేశపు పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎందుకు విఫలమైంది, అంతకు ముందు విఫలమైంది అని చెప్పిన సోషలిస్టు వ్యవస్ధ చైనాలో ఎందుకు ముందుకు పోతోంది అనే ఆలోచన వారిని కాపిటల్‌ గ్రంధం దుమ్ముదులిపేందుకు ముందుకు నెట్టింది. ఇప్పుడు అమెరికా విద్యావంతుల్లో చర్చ పెట్టుబడిదారీ వ్యవస్ద వైఫల్యం గురించే నడుస్తున్నది. సోషలిస్టు అంటే ఎయిడ్స్‌ వచ్చిన వాడిని చూసినట్లు చూసే జనం ఒకప్పుడు ఉన్న అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతోంది. అవును నేను సోషలిస్టును బస్తీమే సవాల్‌ అంటూ బహిరంగంగా ప్రకటించుకున్న బెర్నీ శాండర్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కొరకు పోటీపడే స్ధితి ఏర్పడింది. ఆ పార్టీలోని అనేక మంది మీద కమ్యూనిస్టు ముద్ర ఉన్నా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మిలియన్ల మంది యువత మేమూ సోషలిస్టులమే అని ప్రకటించుకుంటున్నారు. ఇవేవీ అమరనాధ్‌ వంటి వారికి తెలియవా, తెలుసుకుంటే దొరకని వస్తువా ? మార్గం చూపాల్సిన మేథావులు అపని చేయకుండా, తాము ఏమనుకుంటున్నారో చెప్పకుండా అమెరికన్ల బ్రెయిన్‌ వాష్‌.. మరో మాటలో చెప్పాలంటే మేథోదాడి అని కొంత మంది అంటారు అని ఇతరుల మీద నెట్టటం ఏమిటి ?

” తొలిసారి ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పుడు ఒక ప్రచారం జరిగింది . రష్యా వివిధ పద్ధతుల్లో ట్రంప్‌ గెలవడానికి సాయ పడింది . ఆ విధంగా అమెరికా పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది అని . చైనా ప్రపంచం పై పట్టు సాధించడానికి చేయని ప్రయత్నం లేదనేది మేధావుల మాట . మొన్నటి అమెరికా ఎన్నికలు ముందు అమెరికా లో కేసులు విపరీతంగా పెరగడం తెలిసిందే . అప్పటికే దిగజారుతున్న ట్రంప్‌ పరపతి దీనితో ఇంకా పోయింది . ట్రంప్‌ , కరోనా విషయం లో సరిగా వ్యవహరించక పోవడం వల్లే ఇంత నష్టం జరిగింది అని చాలా మంది అమెరికన్‌ లు అనుకొన్నారు . ఫలితం .. ట్రంప్‌ ఓటమి . అమెరికన్‌ లు మాస్క్‌ పెట్టుకోకపోవడం వల్లే కేసులు పెరిగాయని ట్రంప్‌ మాస్క్‌ ల విషయం లో తప్పుదారి పట్టించేలా వ్యవహరించాడని చాలా మంది భావించారు . లేదు .. తన పై దాదాపుగా యుద్ధం ప్రకటించిన ట్రంప్‌ ను ఓడించాలని చైనా పంతం పట్టింది .. అమెరికా లో మేధావులు , మీడియా ఇప్పుడు చైనా గుప్పిట్లో వున్నారు . చైనా కావాలంటే కేసులు పెంచడం పెద్ద కష్టమా ? ఇందులో ఏదో కుట్ర వుంది అని భావించే వారున్నారు . ఇలా చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవనేది సత్యం . ఇలాంటి కుట్ర సిద్ధాంతాలు కేవలం కాలక్షేపానికి పనికి వస్తాయి అని చాలా మంది భావిస్తారు. ” అని అమరనాధ్‌గారు చెప్పారు.

వాట్సప్‌ యూనివర్సిటీ చేస్తోంది ఇదే. రుజువులు లేని సొల్లుకబుర్ల తయారీ కూడా ప్రచార దాడిలో భాగమే. జనాన్ని తప్పుదారి పట్టించేందుకు అవి బాగా ఉపయోగపడతాయి, రంజుగా ఉంటాయి. ఎలాంటి విమర్శనాత్మక దృష్టి లేకుండా మేథావులు వాటిని జనం ముందు ఉంచటమే విషాదం, విచారకరం, ఆక్షేపణీయం. ఆ పని చేయటంలో పోస్టుమాన్‌ పని తప్ప వారి బుద్ది కుశలత ఏముంది ? వాటి మీద బుద్ది జీవుల వైఖరి ఏమిటి ? ఒక టీవీ యాంకర్‌ అయితే దీని మీద వారలా అంటున్నారు, మీరేమంటున్నారు, దాని మీద వారలా అన్నా మీరేమంటారు అని అడగవచ్చు. అది మేథోలక్షణం కాదు. కొందరు యాంకర్లు తమకు నచ్చేవాటిని చెప్పేందుకు ఎక్కువ అవకాశమిస్తారు, భిన్నంగా మాట్లాడితే ఏదో ఒక పేరుతో వేరే అంశానికి మరలుతారు. మేథావులు అలా చేస్తే సహజంగానే అనుమానాలు వస్తాయి.

ప్రతి దేశం మరోదేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది అన్నది అందరికీ తెలిసిన పచ్చినిజం. మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా అమెరికా వెళ్లి అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా ప్రచారం చేసి వచ్చిన విషయం తెలియదా ? అంటే బైడెన్‌ను ఓడించాలనే కదా ! ఎవరైనా ఒకటే కదా మరి, మోడీ ఎందుకు ఆ పిలుపు ఇచ్చినట్లు ? పాకేజ్‌ ఏమైనా కుదుర్చుకున్నారా ? తన పెరటితోట అనుకుంటున్న లాటిన్‌ అమెరికాలో, ఇంకా అనేక దేశాల్లో అమెరికా జోక్యం చేసుకుంటూ ఎవరు గద్దెమీద ఉండాలో కూడదో నిర్దేశిస్తున్నది. ఎన్నుకున్న ప్రభుత్వాలను గుర్తించేందుకు నిరాకరిస్తున్నది. మేథావులకు ఇవేవీ పట్టవా ? కుట్ర సిద్దాంతాలను ఒక లక్ష్యం కోసం తప్ప కాలక్షేపం కోసం సృష్టించటం లేదు. అదేమీ చిన్న విషయం కాదు. సూటిగా చెప్పకుండా అనుమానాలు రేకెత్తించి జుట్టుపీక్కొనేట్లు చేసే నైపుణ్యం ఉంటేనే అలాంటి వాటి సృష్టి కర్తలకు నాలుగు డబ్బులు వస్తాయి. దేశంలో హిందువులను మైనారిటీలుగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఇస్లాం, క్రైస్తవ మతాల వారి మీద నిరంతరం ప్రచారం చేస్తున్నారు. దీన్ని కాలక్షేపానికి చేస్తున్నారని అనుకోవాలా ? కేంద్ర ప్రభుత్వ చర్యలను లేదా రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల చర్యలను విమర్శించిన మీడియా మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏకంగా దేశద్రోహంగా చిత్రిస్తున్నది. అదే విధంగా అమెరికా మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే దానికి చైనా మద్దతు, నిధులు అంటున్నారు. అమెరికా మీడియాలో ప్రధాన స్రవంతి సంస్ధలన్నీ కార్పొరేట్లవే. వాటి ప్రయోజనాలే మీడియాకు ముఖ్యం తప్ప చైనా కోసం పని చేస్తాయని చెప్పటం ప్రచారదాడిలో భాగమే.

” కొన్ని నెలల క్రితం ఒక యూట్యూబ్‌ లో ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ వీడియో చూసాను . ఆయన తెలుగు వాడే . పేరు గుర్తు రావడం లేదు . ఢిల్లీ స్థాయిలో మీడియా ను చైనా దేశం తరపున కొంత మంది బ్రోకర్‌ లు ఎలా మానిప్యులేట్‌ చేస్తున్నారో .. మీడియా లో చైనా వ్యతిరేక వార్తలు రాసిన జర్నల్లిస్ట్‌ ల ఉద్యోగాలు ఎలా ఊడి పోయాయో అయన ఆ వీడియో లో పేర్ల తో సహా వివరించాడు . అవునా ? మన దేశం లో కూడా చైనా కు నిజంగా అంత పట్టుందా అని నేను ఆశ్చర్య పోయాను. ”

ఇది ఆధారం, అర్దం లేని అంశం. సదరు సీనియర్‌ జర్నలిస్టు తెలుగువాడైనా మరొకరైనా చైనా వ్యతిరేక వార్తలు రాసి ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు. పత్రికలు, టీవీ ఛానళ్లు తమ రేటింగ్‌ను పెంచుకొనేందుకు చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రచారం అమరనాధ్‌ గారి దృష్టికి వచ్చి ఉంటే ఈ అతిశయోక్తి వార్తను నమ్మి పోస్టులో పెట్టి ఉండరు. చైనాతో మన సంబంధాల గురించి విమర్శనాత్మకంగా రాసిన వారెవరైనా ఉద్యోగాలు పోగొట్టుకొని ఉంటారు తప్ప మరొకటి కాదు. చైనీయులు అమెరికాను, మన దేశ మేథావులను కూడా అదుపులోకి తీసుకున్నారని అమరనాధ్‌ వంటి వారు నిజంగా నమ్ముతున్నారా ? మొత్తంగా ఎక్కడైనా అమ్ముడు పోతారా ? ఒక వైపు మీడియాను పూర్తిగా తనకు అనుకూలంగా వినియోగించుకుంటూ ఒకటీ అరావిమర్శనాత్మకంగా ఉంటే మీడియా మొత్తం కమ్యూనిస్టులు, దేశద్రోహులతో నిండిపోయిందని కాషాయ దళాలు నిరంతరం ప్రచారం చేస్తుంటాయి. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారు, భజన చేయని వారందరూ వారి దృష్టిలో కమ్యూనిస్టులే.

” ఫిబ్రవరి మూడవ వారం నుంచి కేసులు మన దేశం లో భారీగా పెరిగాయి . ఇలా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదు అనేది సత్యం . ఇప్పుడు అనేక వాట్సాప్‌ గ్రూప్‌లలో ఫేస్బుక్‌ పైన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత పెరగడం చూసాను . అమెరికా లో సఫలం అయిన ప్రయోగాన్ని ఇక్కడ కూడా చేయాలని చైనా చూస్తోందా ? అసలు అమెరికా లో చైనా ఆలా చేసింది అని చెప్పడానికే ఆధారాలు లేవు . ఇంకా ఇక్కడ దాన్ని ప్రయోగిస్తోంది అని అనుకోవడమేంటి ? పిచ్చి ఊహ కాదా ? అయిన చైనా ఆలా చెయ్యాలని ప్రయత్నిస్తే మన దేశం లో గూఢచారి సంస్థలు పసిగట్ట లేవా ? ఏమో .. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కన్నా మన సంస్థ లు గొప్పవా ? ఆబ్బె .. ఇది అతి గా ఆలోచించడం .. ”

ఇది వాట్సప్‌, బుర్ర ఉపయోగించకుండా దానిలో వచ్చిన వాటన్నింటినీ గుడ్డిగా నమ్మి ప్రచారం చేసిన దాని ప్రభావం అమరనాధ్‌ గారి మీద కూడా పడినట్లుంది. ఆయనే చెప్పినట్లు పిచ్చి ఊహల గురించి చెప్పుకోవటం పనిపాటా లేని వ్యవహారం. లేదా వాటిని చెప్పాల్సి వస్తే అలాంటి పనిపాటా లేని సరకు గురించి జనాన్ని హెచ్చరించాలి. అతిగా ఆలోచించటం అన్నారు తప్ప అమరనాధ్‌ పోస్టులో అలాంటి సూచనలేవీ లేవు. కరోనా కేసులు పెరుగుతాయని సామాన్యులు ఊహించలేకపోవచ్చు. కానీ ఎంతో అనుభవం, నిత్యం ప్రపంచ పరిణామాలను చూస్తున్న అధికార యంత్రాంగం, దాన్ని నడిపే రాజకీయనాయకత్వానికి ముందు చూపు లేకపోతే దేశం అధోగతి పాలవుతుంది. ఇరుగు పొరుగు దేశాలతో వస్తుందో రాదో తెలియని యుద్దం గురించి అంచనా వేసుకొని లక్షల కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాము. ఆ సమాచారం ఉంది ఈ సమాచారం ఉందని కథలు రాయిస్తుంటారు. కొన్న ఆయుధాలు పాతపడి పోగానే పక్కన పడేసి కొత్తవి కొంటున్నాము.

కరోనా మీద యుద్దం ముగిసిందని ఎవరు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అలాంటి సూచనలేమీ ఇవ్వలేదు. అనేక దేశాలలో తిరగబెట్టింది. కేంద్ర పాలకులు ఆ అనుభవాన్ని ఏమైనా పరిగణనలోకి తీసుకున్నారా ? పోనీ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న తరువాత కూడా కుంభమేళాకు ఎందుకు అనుమతిచ్చారు? అనేక మంది నిపుణులు చేసిన హెచ్చరికలను ఎందుకు పెడచెవిన పెట్టారు ? ఆక్సిజన్‌ అవసరం గురించి గతేడాదే అర్దం అయింది. దానికోసం 150 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని గతేడాదే నిర్ణయించారు. ఏడు నెలల పాటు టెండర్లు ఖరారు చేయలేదు, దీన్ని ఏమనాలి బాధ్యతా రాహిత్యమా , నేరపూరిత నిర్లక్ష్యమా ? ఫేస్బుక్‌లో జన స్పందన చూసేంతవరకు మీకు కేంద్ర వైఖరిలో ఎలాంటి తప్పు ఒప్పులు కనిపించలేదా ? సామాన్యులకు మీకు ఇంక తేడా ఏముంది. పరిజ్ఞానం కంటే ఊహ ముఖ్యమని ఐనిస్టీన్‌ చెప్పాడు. మెదడుతో చూడగలిగిన వాడే బుద్ది జీవి అని మరో పెద్దమనిషి సెలవిచ్చారు. అలాంటి వారు కొందరు హెచ్చరిస్తున్నా కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో యంత్రాంగం పట్టించుకోకపోవటమే ఇంతవరకు తెచ్చింది. మేథావులూ పట్టించుకోవటం లేదు.

” చైనా లో ఆ ఒక్క నగరం తప్పించి మిగతా చోట్లకు ఆ రోగం ఎందుకు విస్తరించలేదు ? ఆ నగరం పేరు పోస్ట్‌ చేసినా సోషల్‌ మీడియా ఎందుకు ఆ పోస్ట్‌ ను బ్లాక్‌ చేస్తోంది ? చైనా మిత్రం దేశం .. మన పొరుగున వున్న పాకిస్థాన్‌ . మన దేశం లో మాత్రం అటు ఉత్తరాంచల్‌ మొదలు ఇటు తమిళనాడు దాకా కేసులు పెరుగుతున్నాయి . సరే ఇక్కడ మాస్క్‌ లు పెట్టుకోలేదు .. జనాలు గుంపులు గుంపులుగా తిరిగారు అని చెప్పేవారు . మరి మన పొరుగునే వున్న పాకిస్థాన్‌ ? అక్కడ కొద్దీ పాటి కేసులు పెరిగినా ఇక్కడి లాగా ఇన్ని కేసులు రావడం లేదు . అక్కడ మాస్క్‌ లు భౌతిక దూరం సిద్ధాంతం పని చెయ్యదా ?
పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను కదా . అందుకే చెప్పా .. నా దగ్గర రుజువులు లేవండి . చదివే వారికి ఏదో సోది లాగా ఉంటుంది .. లేదా నేనేదో సంచలనం కోసం .. పబ్లిసిటీ పిచ్చితో ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది .. కాబట్టి నేను చెప్పను .. అవి నా మనసులో అనుమానాలే .. అది నాతోనే ఉండి పోనీ అని .. నిన్నటి నుంచి సర్‌ చెప్పండి చెప్పని అని మెసెంజర్‌ లో మెసేజ్‌ ల వెల్లువ . సరే పోస్ట్‌ చేశా . జస్ట్‌ చదివి మరచి పోండి. అయిదు నిముషాలు కాలక్షేపం అనుకోండి. ”

ఊహాన్‌ నగరం పేరు ఉన్న పోస్టును సోషల్‌ మీడియా బ్లాక్‌ చేస్తోందన్నారు. చాలా చిత్రంగా ఉంది. కాషాయ తాలిబాన్లు ఇలాంటి చిత్రాల గురించి పోస్టులు పెట్టటం నేను ఫేస్బుక్‌లో చూశాను. మన దేశంలో ఇంటర్నెట్‌ను నియంత్రించేది చైనా అనుకుంటున్నారా ? పక్కా నరేంద్రమోడీ సర్కార్‌. రైతు ఉద్యమం సందర్భంగా మీడియా కిట్ల గురించి ఎంత రచ్చ చేసిందో మీకు తెలియకుండా ఉంటుందా ? పబ్లిసిటీ పిచ్చికోసం ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది అన్నారు. మీకేమనిపించిందో స్కానింగ్‌చేసినా దొరకదు, కానీ మెసేజ్‌ల వెల్లువ కారణంగా పోస్టు చేయాల్సి వచ్చిందన్నారు. పర్యవసానం మీకు ఎంతో పబ్లిసిటీ వచ్చింది. మీకు కాలక్షేపం అనిపించవచ్చు గానీ, ఒక మేధావిగా ఇలాంటి పోస్టులు పెట్టటం తగదేమో ఆలోచించండి. దీని వలన ఏమి సాధించిందీ అవలోకించుకోండి. ఎవరిలో అయినా ఉన్న గందరగోళాన్ని తొలగించారా, ఇంకా గట్టిపరిచారా ? చైనా-అమెరికా-నరేంద్రమోడీ ఇంకా ఎవరైనా సరే వారి గురించి అమరనాధ్‌ గారయినా మరొక మేధావి అయినా ఒక స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండాలని మనవి. అవి వెల్లడించే ధైర్యం లేనపుడు మౌనంగా ఉండటం మేలు. అటూ ఇటూగాకుండా చెబితే ప్రయోజనం ఏముంది ? ఒక బుద్ది జీవిగా ఆలోచించండి. మేథావుల మౌనం దేశాలకు మంచిది కాదని ప్రపంచ చరిత్ర చెప్పింది.ప్రపంచంలో తటస్ధం అంటూ ఏదీ లేదు. నాకు రాజకీయాలు పట్టవు, నేను ఎవరికీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదు అని ఎవరైనా అంటే అధికారంలో ఉన్నవారిని కొనసాగించాలని కోరే పక్షానికే అది అనుకూలిస్తుంది. తెలియకుండానే అలాంటి వారు ఒక వైపు మద్దతు ఇచ్చినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి పాపాయి మీద అనుమానం, అమెరికా నిఘా : మోడీకి అడుగడుగునా అవమానాలు, భంగపాటు !

24 Saturday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

currency manipulators, Currency watch list of US, India’s Rupee, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఎదుటి వారిలో ఏమీ లేకుండా మనం ఎగిరెగిరి కౌగలించుకున్నంత మాత్రాన ఒరిగిందేమీ లేకపోగా అడుగడుగునా అవమానాలు. విదేశీనేతలను ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ను మన నరేంద్రమోడీ కౌగిలించుకున్న తీరు తెన్నులు చూసి ఎబ్బెట్టుగా అనిపించి ఇదేమిటని విమర్శించిన వారు కొందరు ఉండవచ్చు. కానీ మోడీ ఏం చేసినా దేశం కోసమే అని నమ్మి సమర్ధించిన వారెందరో. ఒక్కొక్క నేతది ఒక్కో శైలి. అధికారంలో ట్రంపు ఉన్నా బైడెన్‌ వచ్చినా అమెరికా నుంచి అడుగడుగునా ఆటంకాలు, అవమానాలే. అన్నింటికీ మించి మనకు ఒరిగిందేమీ లేకపోగా నష్టాలే. వాటిని పదే పదే చెప్పుకున్నా అల్లు అర్జున్‌ ఒక సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు.


తాజా విషయానికి వస్తే అమెరికా మనల్ని మోసకారుల జాబితాలో చేర్చింది. కరెన్సీతో మోసాలకు పాల్పడుతూ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదంటూ కన్నేసి ఉంచాల్సిన దేశాల జాబితాలో మన పేరు చేర్చింది. తొలిసారి 2018లో చేర్చి మరుసటి ఏడాది తొలగించింది, మరోసారి గత డిసెంబరులో చేర్చింది. దాన్ని మరోసారి తాజా పరిచినట్లు గతవారంలో వార్తలు వచ్చాయి. అమెరికా ఆర్ధికశాఖ రూపొందించిన జాబితాలో చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఐర్లాండ్‌, ఇటలీ, ఇండియా, మలేషియా, సింగపూర్‌,థాయిలాండ్‌, మెక్సికో ఉంది. అమెరికాకు తన ప్రయోజనాలు తప్ప మిత్ర-శత్రుదేశాలనేవి లేవని ఈ జాబితా స్పష్టం చేస్తున్నది. డిసెంబరు జాబితాలో మెక్సికో, ఐర్లండ్‌లు లేవు. ఈ జాబితా లేదా ఈ దేశాల మీద ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసింది ఏ ప్రపంచ వాణిజ్య సంస్దో లేక ఐక్యరాజ్యసమితో అయితే అదోదారి. ఏదో ఒక అంతర్జాతీయ చట్టం కింద అనుకోవచ్చు. అదేమీ లేదు, 2015నాటి అమెరికా వాణిజ్య చట్టం ప్రకారం ఈ పని చేశారు. వారు దాడి చేయాలనుకున్నవారిని జాబితాలో పెడతారు, ఎత్తుగడగా వద్దనుకున్న వారిని మినహయిస్తారు. దానిలో భాగంగానే వియత్నాం, చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌, స్విడ్జర్లాండ్‌లను ఆరునెలల క్రితం ఈ జాబితాలో చేర్చారు. అయినప్పటికీ రాజకీయ కారణాలతో జాబితా నుంచి తొలగించి మిగతావాటితో పాటు ఓ కన్నేసి ఉంచాలని మాత్రమే నిర్ణయించారు.


ఒక దేశం కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించేందుకు అమెరికాకు ప్రాతిపదిక ఏమిటి? అమెరికాతో వాణిజ్యం చేసే దేశపు మిగులు ఏడాదిలో 20 బిలియన్‌ డాలర్లు ఉండటం, ఆయా దేశాల జిడిపిలో కరెంటు ఖాతా మిగులు మూడుశాతం వరకు ఉన్నపుడు, ఒక దేశం ఏడాది కాలంలో కొనుగోలు చేసిన విదేశీ కరెన్సీ దాని జిడిపిలో రెండుశాతం దాటితే అమెరికాను మోసం చేస్తున్నట్లు పరిగణిస్తారు. 2020 జనవరి నుంచి డిసెంబరు మధ్యకాలంలో వియత్నాం, స్విడ్జర్లాండ్‌, తైవాన్‌, భారత్‌, సింగపూర్‌ లావాదేవీల గురించి అమెరికాకు అనుమానం వచ్చినట్లు ఏప్రిల్‌ 16వ తేదీన విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. పైన పేర్కొన్న మూడు ప్రాతిపదికలలో మన దేశం రెండింటిలో గీత దాటినట్లు పేర్కొన్నది. 2020లో పన్నెండు నెలలకు గాను పదకొండు నెలల్లో భారత్‌ నిఖరంగా 131 బిలియన్‌ డాలర్లను కొనుగోలు చేసింది, ఇది జిడిపిలో ఐదుశాతానికి సమానం. 2001,02,03 తరువాత 2020లో భారత కరెంటు ఖాతా మిగులు 1.3శాతం ఉంది. అదే ఏడాది అమెరికాతో భారత వాణిజ్య మిగులు 24 బిలియన్‌ డాలర్లు ఉంది, సేవల వాణిజ్యంలో కూడా ఎనిమిది బిలియన్‌ డాలర్ల మిగులు ఉంది. 2019తో పోల్చితే కరోనాతో ఆర్ధిక వ్యవస్ధ కుదేలయినా మన దేశ స్టాక్‌ మార్కెట్లోకి విదేశీ మదుపరులు పెద్ద మొత్తంలో ప్రవేశించారు. మన డాలర్ల నిల్వ పెరగటానికి అది కూడా ఒక కారణం. ఒక దేశ ఆర్ధిక మౌలిక అంశాలను ప్రతిబింబించే విధంగా కరెన్సీ మారకపు విలువ ఉండాలి. విదేశీ కరెన్సీ జోక్యం పరిమితంగా ఉండాలి, ఎక్కువగా నిలువ చేసుకోకూడదని అమెరికా ఆర్ధికశాఖ నివేదిక పేర్కొన్నది.


వారి జాబితా నుంచి తొలగించిన వాటిలో స్విడ్జర్లండ్‌ ఐరోపాలోని తటస్ధదేశం, అయినా గతంలో మోసకారుల జాబితాలో చేర్చి తాజాగా తొలగించింది. వియత్నాం సోషలిస్టు దేశం. దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల విషయంలో చైనాతో విబేధిస్తున్నది కనుక దాన్ని తనవైపు తిప్పుకోవాలంటే ఇలాంటి తాయిలం పెట్టాలన్నది ఒక ఎత్తుగడ. ఇక తైవాన్‌ విషయానికి వస్తే చైనాలోని తిరుగుబాటు రాష్ట్రం, స్వంతంగా మిలిటరీని కలిగి ఉంది. అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నది. దాన్ని కూడా అనుమానితుల జాబితాలో చేర్చితే అక్కడి జనంలో అమెరికా వ్యతిరేకత పెరుగుతుంది, దీనికి తోడు చైనాను రెచ్చగొట్టేందుకు తైవాన్‌ ఒక శిఖండిలా ఉపయోగపడుతోంది కనుక దానికీ అమెరికన్లు మినహాయింపు ఇచ్చారు. మనల్ని మిత్రదేశం అంటూనే మరింతగా లొంగదీసుకొనేందుకు మోసకారి ముద్రవేశారు.


అమెరికా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నది. స్వార్ధం, బెదిరింపు,లొంగదీసుకొనే ప్రక్రియలో భాగం తప్ప మరొకటి కాదు. దీనిలో కీలక అంశం కరెన్సీ విలువ. ప్రస్తుతం ప్రపంచంలో వివిధ దేశాల మధ్య టవమారకానికి డాలర్లను వినియోగిస్తున్నారు. కరెన్సీ విలువలను మోసపూరిత పద్దతుల్లో కృత్రిమంగా తగ్గించి లేదా పెంచి తమ కార్మికులను దెబ్బతీస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలని చెబితే బాగోదు కనుక కార్మికుల పేరుతో రాజకీయం చేస్తోంది. ఆయా దేశాలు తమ కరెన్సీ విలువలను కావాలని తగ్గిస్తున్నాయన్నది దాని ప్రధాన ఆరోపణ. చిత్రం ఏమంటే ట్రంప్‌ యంత్రాంగం చైనాను మోసకారి అని ప్రకటించగా, బైడెన్‌ యంత్రాంగం నిఘావేసి ఉంచాల్సిన మోసకారుల జాబితాలో మన దేశంతో పాటు చైనాను కూడా చేర్చింది, అంటే చైనా మీద దాడి తీవ్రతను తగ్గించింది. ఈ జాబితా రూపకల్పనలో ఎలాంటి ఆర్ధిక పరమైన తర్కం తనకు అర్ధం కావటం లేదని మన వాణిజ్యశాఖ కార్యదర్శి అనుప్‌ వాధ్వాన్‌ వ్యాఖ్యానించారు. పోనీ మోసకారులంటే ఏ ఒక్కరి మీద అమెరికా ఆంక్షలు ఎందుకు లేవు అన్నారు. మార్కెట్‌ శక్తుల ప్రాతిపదికగానే రిజర్వుబ్యాంకు వ్యవహరిస్తోందన్నారు.


ఇక అమెరికా ఆగ్రహం విషయానికి వస్తే మన రూపాయి పాపాయి బలపడుతోంది- చిక్కిపోతోంది. తాజాగా ఆసియాలో అత్యంత దారుణమైన పని తీరు కనపరుస్తున్న కరెన్సీగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలర్ల కొనుగోలు రూపాయి పెరుగుదలను నిరుత్సాహపరచేందుకు తీసుకున్న చర్యగా కొందరు చెబుతున్నారు. రూపాయి చిక్కితే ఎగుమతిదార్లకు లాభం- దిగుమతిదార్లకు నష్టం, బలపడితే ఎగుమతిదార్లకు నష్టం-దిగుమతిదార్లకు లాభం. మార్కెట్లోని ఈ రెండు శక్తులు తమకు అనువైన వాదనలను ముందుకు తెస్తూ వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి.మనతో వాణిజ్యం జరిపే దేశాల ప్రమేయం కూడా దీనిలో ఉంటుంది. తమ డాలరు విలువ తగ్గకుండానే తమ సరకులను అమ్ముకోవాలన్నది అమెరికా లక్ష్యం. కరెన్సీ విలువ ఎక్కువ-తక్కువలు ఒకే దేశంలో ఎగుమతి-దిగుమతిదార్లు ఇద్దరి మీద ప్రభావం చూపుతాయి. ఇలా ఇంటా బయటి వత్తిళ్లతో రూపాయి పరిస్ధితి అగమ్యగోచరంగా ఉంటుంది. గత ఏడు సంవత్సరాల కాలంలో చూసినపుడు రూపాయి 58 నుంచి 75కు దిగజారింది కనుక దీనిలో రెండు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుపిఏ కంటే తన పాలనలో ఎగుమతులను పెంచి దేశాన్ని ముందుకు తీసుకుపోయానని చెప్పుకొనేందుకు మోడీ సర్కార్‌ రూపాయి విలువను దిగజార్చిందని చెప్పవచ్చు. అంతకు ముందు రూపాయి విలువ పడిపోతే ముఖ్యమంత్రిగా మోడీ, బిజెపి నేతలు ఎంత యాగీ చేశారో, ఎన్ని మాటలన్నారో తెలిసిందే. తమ దాకా వచ్చే సరికి ప్లేటు ఫిరాయించారు.నోరు మూసుకున్నారు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.


2010 నుంచి 2019వరకు ఉన్న వివరాలను చూసినట్లయితే మన ఎగుమతులు జిడిపిలో 2010లో 22.4శాతం ఉండగా 2013 నాటికి 25.43శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి పడిపోతూ 2019నాటికి 18.41శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో దిగుమతులు కూడా తగ్గినప్పటికీ ఎగుమతుల కంటే ఎక్కుగానే ఉన్నాయి. 2010 -21 మధ్య డాలరుతో రూపాయి మారకపు విలువ 45 నుంచి 75కు పడిపోయింది (ఏప్రిల్‌ 24న 75.22). మే నెలలో 76.50వరకు పతనం కావచ్చని అంచనా. ఇదే కాలంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు రూపాయి విలువ అంతర్గతంగా 100 నుంచి 202.96(ఏప్రిల్‌ 24వ తేదీ)కు పడిపోయింది. అంటే ఒక వస్తువు ధర పదేండ్లలో ఆ స్ధాయిలో పెరిగింది అని చెప్పవచ్చు. ఒక దేశ కరెన్సీ విలువ డాలరుతో మారకపు ధర ఎంత తక్కువ ఉంటే అంతగా ఎగుమతి అవకాశాలు ఉంటాయన్నది సాధారణ సిద్దాంతం. దానికి మినహాయింపుగా మన దేశ పరిస్ధితి ఉన్నట్లు పై వివరాలు వెల్లడిస్తున్నాయి. నరేంద్రమోడీ సర్కార్‌ ఏడు సంవత్సరాలుగా ఎగుమతుల గురించి కబుర్లు చెప్పటం తప్ప పెరగలేదంటే ఇతర దేశాల సామర్ధ్యం లేదా మన అసమర్ధత అయినా కావచ్చు. ఎగుమతుల మీద ఆధారపడిన ఆర్ధిక వ్యవస్దలను నిర్మించిన దేశాలన్నీ చైనా మాదిరి విజయవంతం కాలేదు.మనం అసలు పోటీలోకే ప్రవేశించ కుండా లేస్తే మనిషిని కాదు అన్న మల్లయ్య కథమాదిరి మాట్లాడుతున్నాము.


ప్రస్తుతం అమెరికాతో మన వాణిజ్యం మిగులులో ఉంది. ఇలాంటి పరిస్ధితి ఏ దేశంతో ఉన్నా అమెరికన్లకు నిదురపట్టదు.చైనాతో లోటు మరింత ఎక్కువగా ఉంది కనుక దానితో వాణిజ్య యుద్దానికి దిగింది.మనది పెద్ద మార్కెట్‌గా ఉన్నందున ఖరీదైన తన వస్తువులను మన మీద రుద్దాలని చూస్తున్నది. వాటికి మార్కెట్‌ ఉండదు కనుక దానికి మన దిగుమతిదారులు కూడా అంగీకరించరు. ఎక్కడ వస్తువుల ధరలు తక్కువగా ఉంటే అక్కడికే దారితీస్తారు. అందుకే కమ్యూనిజానికి నరేంద్రమోడీ బద్ద వ్యతిరేకి అయినప్పటికీ వాణిజ్యవేత్తల వత్తిడికి తలొగ్గి భారీ ఎత్తున దిగుమతులకు అనుమతించక తప్పలేదు. మరోవైపు అమెరికాను సంతృప్తి పరచేందుకు పెద్ద మొత్తంలో ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్నారు, మరో దేశం నుంచి దొరకని వైద్యపరికరాల వంటివాటిని కూడా దిగుమతి చేసుకుంటున్నాము. అయినా అమెరికన్లకు తృప్తి లేదు.


మన దేశ కరెంటు ఖాతా ఎప్పుడూ లోటులోనే ఉంటున్నది. గతేడాది కరోనా వలన కొనుగోలు చేసేవారు లేక దిగుమతులు పెద్ద ఎత్తున పడిపోయినందున మన వాణిజ్యం మిగుల్లో ఉంది తప్ప నిజానికి మన ఎగుమతులు పెరిగి కాదు. నికర వాణిజ్యలోటు నిరంతరం ఉండే మన వంటి దేశాలకు తగినన్ని డాలర్ల నిల్వలు లేనట్లయితే అసాధారణ రీతిలో చమురు ధరలు పెరిగితే చెల్లింపుల సమస్య తలెత్తుతుంది. అయితే నరేంద్రమోడీ అధికారానికి వచ్చినప్పటికీ ఆరు సంవత్సరాల కాలంలో చమురు ధరలు కనిష్టస్ధాయికి పడిపోయి విదేశీమారక ద్రవ్య నిల్వలు బాగా పెరిగాయి.కరోనా కారణంగా స్టాక్‌మార్కెట్‌ పడిపోయింది, దాంతో విదేశీమదుపుదార్లు వాటాలను అమ్ముకొని పెట్టుబడులు తరలించుకుపోయినపుడు రిజర్వుబ్యాంకు డాలర్లను కొనుగోలు చేసింది. అయితే మన ప్రభుత్వం కార్పొరేట్‌శక్తులకు పెద్దమొత్తంలో రాయితీలు ఇవ్వటంతో స్టాక్‌మార్కెట్‌లో వాటాలు ధరలు పెరిగినందున తిరిగి విదేశీ పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. గతేడాది ఏప్రిల్‌ 24న రూపాయి విలువ 76.22కు పడిపోయింది. తరువాత పెరిగి, స్వల్పంగా తగ్గినా 2021మార్చి 21న 72.32కు పెరిగింది. తిరిగి గత నెల రోజుల్లో ఏప్రిల్‌ 21న 75.22కు పతనమైంది. తరువాత అదే స్ధాయిలో కొనసాగుతోంది. ఇప్పుడు ముడిచమురు ధర 65 డాలర్లకు అటూ ఇటూగా ఉన్నపుడు ఇలా ఉంటే విశ్లేషకులు చెబుతున్నట్లు 75డాలర్లకు పెరిగితే పతనం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఉన్న డాలర్లు కూడా హరించుకుపోతాయి గనుక డాలర్లను కొనుగోలు చేయకతప్పదు.


2020-21 ఆర్ధిక సంవత్సరంలో తొలి ఆరునెలల్లో మన వాణిజ్య మిగులు 15.1 బిలియన్‌ డాలర్లు ఉండగా, సెప్టెంబరు-డిసెంబరు కాలంలో 1.3 బిలియన్‌ డాలర్లలోటు నమోదైంది. తరువాత మూడు నెలల్లో అది 5-7 బిలియన్‌ డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా. అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప ఇప్పటి వరకు ఉన్న పరిస్ధితిని బట్టి రూపాయి విలువ 74.50 నుంచి 76 మధ్య కదలాడవచ్చని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఇంతకు మించి పతనం కాకుండా ఆర్‌బిఐ చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. అంతకు మించితే మన దిగుమతుల బిల్లు పెరిగి, పర్యవసానంగా జనం మీద మరింత భారం పడుతుంది.


వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి మార్కెట్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండేట్లు చూసే లక్ష్యంతో ఏప్రిల్‌-జూన్‌ మాసాల మధ్య రిజర్వుబ్యాంకు లక్ష కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా రూపాయి పతనాన్ని అరికట్టవచ్చని కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం వీటి మీద ఎలా ఉంటుందో ఊహించలేని స్ధితి. ఇక్కడ సమస్య మనకు అవసరమైన డాలర్లు కొనుగోలు చేస్తే అమెరికాకు అభ్యంతరం ఎందుకు ఉండాలి ? తర్కబద్దంగా చెప్పాలంటే డాలరు విలువను నిర్ణయించేది మార్కెట్‌శక్తులైనపుడు మన రూపాయిని కూడా అవే శక్తులు నిర్ణయిస్తాయని ఎందుకు అనుకోకూడదు. అయితే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏమంటే ప్రతి దేశమూ తన అవసరాలకు అనుగుణ్యంగా కరెన్సీ విలువలను నియంత్రిస్తోంది. ఈ క్రీడలో అమెరికా లబ్ది పొందలేదా ? కరెన్సీని అదుపు చేస్తున్నదని చైనా మీద ఆరోపణలు చేసే అమెరికన్లు అదే చైనా కరెన్సీ రేటు తక్కువగా ఉన్నందునే అక్కడినుంచి పెద్ద ఎత్తున సరకులను దిగుమతి చేసుకున్నది వాస్తవం కాదా ? అంతేకాదు, ఉత్పత్తి ఖర్చు కూడా తక్కువగా ఉన్న కారణంగా తమ గడ్డమీద పరిశ్రమలను మూసి చైనాకు తరలించలేదా ? కొత్తగా చైనాలో పెట్టలేదా ?


గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య ప్రచ్చన్న యుద్దం సాగిన సమయంలో ఆ రెండు దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు లేవు. అందుకు విరుద్దంగా అమెరికా-చైనా సంబంధాలు ఉన్నాయి. చైనా తన మార్కెట్‌ను తెరిచిన తరువాతనే ప్రపంచ వాణిజ్య సంస్దలో చేరేందుకు అమెరికా అనుమతించింది. సోవియట్‌యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాలను పతనం గావించి ప్రచ్చన్న యుద్దంలో తామే విజయం సాధించామని 1990 దశకంలో అమెరికా ప్రకటించుకుంది. అంతకు ముందు సోవియట్‌ – చైనా మధ్య ఉన్న విబేధాలను ఉపయోగించుకొనేందుకు, చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు అమెరికన్లు చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.వారు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సోవియట్‌ కూలిపోయిన తరువాత ప్రచ్చన్న యుద్దరంగాన్ని చైనాకు మార్చారు. గత మూడు దశాబ్దాలలో వాటి మధ్య వాణిజ్యంతో పాటు వైరమూ పెరిగింది. ఇలాంటి స్ధితి సోవియట్‌తో లేదు.


అలాంటి చైనాతో అమెరికన్లకు ఇప్పుడు వాణిజ్యలోటు చాలా ఎక్కువగా ఉంది. ట్రంపు నాలుగు సంవత్సరాల పాటు పరోక్షంగా, ప్రత్యక్షంగా చైనాతో వాణిజ్య యుద్దం చేశాడు.2019తో పోలిస్తే 2020లో తొమ్మిది శాతం తగ్గినా అమెరికాలోటు 310.8 బిలియన్‌ డాలర్లు ఉంది. అమెరికన్లు 124 బిలియన్‌ డాలర్ల సరకు, వస్తువులను ఎగుమతి చేయగా చైనా నుంచి 435.5 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి చేసుకున్నారు. అలాటి చైనా మీద తుపాకి పేల్చేందుకు మన భుజాన్ని వాడుకుంటున్నారు, చివరికి మనలను కూడా మోసకారుల జాబితాలో చేర్చారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆక్సిజన్‌, ప్రాణావసర ఔషధాల మీద జాతీయ విధానం ఉందా – సుప్రీం కోర్టు !

22 Thursday Apr 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ 1 Comment

Tags

Narendra Modi Failures, national plan on oxygen supply, Supreme Court Notice to GOVI, vaccination Policy


ఎం కోటేశ్వరరావు


డబ్బు ఊరికే రాదు అని ఒక బంగారు వాణిజ్యవేత్త టీవీ ప్రకటనల్లో ఊదరగొట్టటం చూడని వారు ఉండరు. దీని మాతృక ఊరకరారు మహాత్ములు అని మహాభాగవతంలో పోతన రాసిన ఒక పద్యం.
ఊరక రారు మహాత్ములు
వా రధముల ఇండ్లకడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక మాకు శుభంబు నిజము మహాత్మా


అన్నారు పోతన. అది వేరే సందర్భం అనుకోండి.మీవంటి మహాత్ములు మా ఇంటికి వచ్చారంటే ఊరికే కాదు, మీ రాక మాకు పుణ్యం అని అర్దం. దాన్ని పక్కన పెడదాం. మన పాలకులుగా వచ్చిన వారిని కూడా దేవదూతలు, మహాత్ములు అని కదా పొగుడుతున్నారు. పోతన గారు పుణ్యం గురించి చెప్పారు, వారితో శుభం కలుగుతుంది అన్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది ? ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ గురించి మరోసారి ప్రపంచం దృష్టి సారించింది. ప్రాణవాయువు, ప్రాణావసర ఔషధాలు, టీకాల మీద కేంద్రానికి ఒక జాతీయ విధానం ఉందా అని గురువారం నాడు సుప్రీం కోర్టు తనకు తాను కల్పించుకొని ప్రశ్నించాల్సి వచ్చింది. ఈ మేరకు కేంద్రానికి ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఇది ఒక రకంగా అభిశంసన తప్ప మరొకటి కాదు. కేంద్రం ఏం చెబుతుందన్నది పెద్ద విషయం కాదు, ఇప్పటి వరకు జనానికి చెప్పిన కబుర్లు కాకుండా ఉన్నత న్యాయస్దానానికి కొత్త విషయాలేమైనా వినిపిస్తారేమో చూద్దాం. మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకర్లతో చెప్పారు.అమెరికా కూడా అదే ప్రకటన చేసింది. సాయం తీసుకొనేందుకు కూడా ఒక పధకం ఉండాలి.


అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో కూడా మహాత్ములే అధికారంలో ఉన్నారు. మహాత్ములు కదా చిత్రాలు జరుగుతాయి, ఎన్నో చేస్తారు. అవి సామాన్యుల కంటికి కొన్ని ఘోరంగా ఉన్నా అలా రాసి పెట్టి ఉండబట్టే జరుగుతుందనుకోవాలి మరి. ఒక రోజులో అత్యధిక కరోనా కేసులు నమోదై మన దేశం అమెరికా రికార్డును బద్దలు కొట్టింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్దితి గురించి ఆలోచించటం లేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మహాత్ములు కనుక ఎక్కడో ఆలోచిస్తున్నట్లున్నారు, ఇంకా ఎంత మందిని బలిపెడతారో అన్న ఆందోళన కలుగుతోంది. ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఏమీ పట్టటం లేదు.కొంత మంది మూఢనమ్మకం లేదా మూర్ఖత్వానికి జనం బలి అవుతున్నారు. కుంభమేళాలో లక్షలాది మందిని అనుమతించిన కారణంగా ఉత్తరాఖండ్‌లో గురువారం నాడు నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ కార్యాలయాలను శుద్ధి చేసేందుకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.


కేంద్రం తీసుకున్న చర్యలు, విధానం గురించి తమకు సహాయం చేసేందుకు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వేను సుప్రీం కోర్టు నియమించింది. ఆక్సిజన్‌ – ప్రాణావసర ఔషధాల సరఫరా, వాక్సిన్‌ విధానం-పద్దతి, లాక్‌డౌన్లను విధించే అధికారం గురించి వివరించాలని కేంద్రానికి కోర్టు నోటీసు ఇచ్చింది. శుక్రవారం నాడు విచారణ జరపనుంది.ఆరు హైకోర్టులు కరోనాకు సంబంధించి విచారణ జరుపుతున్నాయని మంచి కోసం వాటి పరిధిలో వ్యవహరించటాన్ని తాము అభినందిస్తున్నామని అయితే గందరగోళం తలెత్తటం వనరులు పక్కదారి పడుతున్నందున వాటి గురించి కూడా విచారించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే వ్యాఖ్యానించారు.


సుప్రీం కోర్టు ఈ విధంగా జోక్యం చేసుకొనేందుకు ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రోద్బలం చేశాయని భావించవచ్చు. ” ఇక్కడేమీ మానవత్వం మిగిలి ఉన్నట్లు లేదు. అడుక్కుంటారో, అప్పు తెస్తారో, అపహరిస్తారో మాకనవసరం జనాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయాలి ” కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన ఢిల్లీ హైకోర్టు. ఆసుపత్రులకు కొరత లేకుండా ఆక్సిజన్‌ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటూ ప్రభుత్వ తీరు పట్ల న్యాయమూర్తులు మండి పడ్డారు. కొన్ని గంటల్లో అత్యవసరంగా ఆక్సిజన్‌ అందించకపోతే వందలాది మంది రోగుల పరిస్ధితి ఏమౌతుందో తెలియని స్ధితి ఇప్పుడు ఢిల్లీలో ఉంది. అనేక రాష్ట్రాల్లో కూడా అదే స్ధితి. పెట్రోలియం, ఉక్కు పరిశ్రమల నుంచి ఆక్సిజన్‌ వాయువును వైద్య అవసరాలకు ఎందుకు మళ్లించరు అని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దిగువ పేర్కొన్న కొన్ని ఉదంతాలు, వార్తలు కూడా సుప్రీం కోర్టును జోక్యానికి పురికొల్పి ఉండవచ్చు.


ఢిల్లీ నుంచి తమ రాష్ట్రంలోని ఫరీదాబాద్‌కు వస్తున్న ఆక్సిజన్‌ టాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం లూటీ చేసిందని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ ఆరోపించారు. దాంతో ఆక్సిజన్‌ వాహనాలకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించామన్నారు.
హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. అక్కడి నుంచి తమకు రావాల్సిన ఆక్సిజన్‌ టాంకర్లను ఆయా రాష్ట్రాల అధికారులు, పోలీసులు రానివ్వటం లేదు అని ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా విమర్శించారు. వారికి ఢిల్లీతో పంచాయతీ ఏమైనా ఉంటే తేల్చుకోవచ్చు, ఇది సమయం కాదు అన్నారు.


మధ్యప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రిక ఆక్సిజన్‌ సిలిండర్ల వాహనం రాగానే అప్పటికే కాచుకొని ఉన్న కరోనా రోగుల బంధువులు వాటిని లూటీ చేశారని తనకు సమాచారం అందిందని దమో జిల్లా కలెక్టర్‌ తరుణ్‌ రతి చెప్పారు. ఆ జిల్లాలోని ఒక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారం కోసం కరోనా పుచ్చిపోతున్నా మధ్య ప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి, స్వయంగా వైద్యుడై ఉండి కూడా నెల రోజుల పాటు ఏ ఒక్క సమావేశానికీ రాలేదు. తీరికగా ఏప్రిల్‌ 15న భోపాల్‌ వచ్చి కర్ఫ్యూను ఉల్లంఘించి అంబేద్కర్‌కు నివాళి అర్పించి 15వ తేదీన విలేకర్ల సమావేశంలో ఇబ్బందికర పరిస్ధితిని ఎదుర్కొన్నారు. జవాబుదారీ తనంలో తమకు మించిన వారెవరూ లేరని నరేంద్రమోడీ చెప్పుకుంటారు. ఆయన మాత్రం తక్కువ తిన్నారా, ఎన్నికల ప్రచారం మీద పెట్టిన శ్రద్దలో వెయ్యోవంతు ఆక్సిజన్‌ మీద పెట్టి ఉంటే ఈ పరిస్ధితి తలెత్తి ఉండేదా ?


దేశంలో వైద్య అవసరాలకు ఆక్సిజన్‌ సరిపడా ఉంది, సమస్య దాన్ని సరఫరా చేసేందుకు అవసరమైన వాహనాలు లేవని ముంబైకి చెందిన ఒక పెద్ద కంపెనీ ప్రతినిధి చెప్పినట్లు ఒక పత్రిక వార్త.


కరోనా వ్యాక్సిన్‌ ధర విషయంలో సీరం సంస్ధ అధిపతి బందిపోటు మాదిరిగా వ్యవహరిస్తున్నారని, అత్యవసర చట్టాన్ని విధించి వాక్సిన్‌, ఇతర ఔషధాలను ప్రభుత్వం మొత్తంగా స్వాధీనం చేసుకోవాలని ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌ బిజెపి ఎంఎల్‌ఏ మండి పడ్డారు. కరోనా వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు 45 ఏండ్లు పై బడిన వారికే మా బాధ్యత అని తప్పుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసు 150 రూపాయలకు ఇచ్చిన వాక్సిన్‌ కంపెనీలలో ఒకటైన సీరం సంస్ధ తాజాగా కొత్త ధరలను ప్రకటించింది. ప్రయివేటు ఆసుపత్రులకు ఆరువందలు, రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగు వందల రూపాయలుగా ధర నిర్ణయించింది. కేంద్రానికి ఒక రేటు రాష్ట్రాలకు ఒక రేటు ఏమిటంటూ జనంలో తీవ్ర ప్రతికూల స్పందన వెలువడింది. సుప్రీం కోర్టుకు కూడా ఇది తాకినట్లు భావించవచ్చు.


ఒక వైపున వాక్సిన్లకు కొరత ఉందనే వార్తలు. మరోవైపున 18శాతం వరకు వృధా చేసిన రాష్ట్రాలు ఉన్నట్లు నివేదికలు. మార్చినెల 17వ తేదీ వరకు నమోదైన సమాచారం మేరకు 6.5శాతం అంటే 44 లక్షల డోసుల వాక్సిన్‌ వృధా అయింది. ఒక సీసా మూత తీసిన తరువాత నాలుగు నుంచి ఆరు గంటలలోపు దాన్ని ఉపయోగించకపోతే అది పనికిరాదు. అందువలన వాక్సిన్‌ తెచ్చుకోవటమే కాదు, వినియోగించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.తెలంగాణాలో 17.6శాతంతో ప్రధమ స్దానంలో ఉంది. నెల రోజుల తరువాత 12శాతంతో తమిళనాడు వృధాలో అగ్రస్దానంలో ఉందని వార్తలు వచ్చాయి. ఏ మాత్రం వృధాచేయని రాష్ట్రాలలో కేరళ ప్రధమ స్దానంలో ఉంది.


దేశంలో ఆక్సిజన్‌ కొరత ఉందని గతేడాది సెప్టెంబరునెలలోనే కేంద్రానికి తెలుసు. నివారణకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించామని నాటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ప్రకటించారు. గత నెల రోజుల్లోనే రోజుకు 26వేల కేసుల నుంచి మూడులక్షల 15వేలకు పెరిగాయి. ఇల్లు తగులబడుతుంటే బావి తవ్వకం ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు గురించి హడావుడి చేస్తున్నది. నూట అరవై రెండు జిల్లా కేంద్ర ఆసుపత్రులలో వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే ఏప్రిల్‌ 19 నాటికి పదకొండు ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయితే కేవలం ఐదు మాత్రమే ఉత్పత్తిలోకి వచ్చాయని ఒక వార్త, కాదు 33 ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనా మొత్తమైతే ఏర్పాటు చేయలేదు కదా ! వీటికోసం ఏడు నెలలుగా టెండర్లు పిలుస్తూనే ఉన్నారు. డబ్బుకేమైనా కొరత ఉందా ? పిఎం కేర్స్‌ పేరుతో విరాళం ఇమ్మని కేంద్రం బచ్చె పట్టుకుంటే ఎన్నివేల కోట్లు వచ్చాయో తెలిసిందే. ఆ సొమ్మును ఉపయోగించి కనీసం ప్లాంట్లను ఏర్పాటు చేయలేని అసమర్ద పాలనకొనసాగుతోంది. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఖర్చెంత కేవలం రెండు వందల కోట్ల రూపాయలు. అవి సాధారణ సమయాల్లో కూడా ఉపయోగపడేవే తప్ప మరొకటి కాదు. ఇవిగాక మారుమూల ప్రాంతాల్లో మరో వంద ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు కోరాయి. సాధారణ రోజుల్లో 100-150 రూపాయలుండే సిలిండర్‌ ధర రెండువేల వరకు పెరిగిపోయింది.పట్టించుకొనే దిక్కులేదు. వెంటిలేటర్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దేశంలోనే తయారు చేయగలం అని చెప్పారు. తప్పులేదు, ముందు జాగ్రత్త ఉంటే వాటిని తగినన్ని సిద్దంగా ఉంచుకుంటే ఎన్నో ప్రాణాలు నిలిచేవన్నది వాస్తవం కాదా ? కరోనా పోయిన తరువాత వాటిని జిల్లా, తాలూకా ఆసుపత్రులకు అందచేయవచ్చు కదా ?


కరోనా చికిత్సలో రెమిడెసివర్‌ ఎంత ప్రభావం చూపుతుందో ఇప్పటికీ తేలలేదు. అయినా వేలం వెర్రిగా దాని కోసం జనం ఎగబడుతున్నారు. ” ఈ నీచ సమాజంలో భాగమైనందుకు సిగ్గుగా ఉంది ” అని బోంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడింది. గతంలో తాము ఆదేశించిన విధంగా నాగపూర్‌ ఆసుపత్రులకు పదివేల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను ఎందుకు సరఫరా చేయలేదని మండి పడింది. దాని గురించి అధికారులు చెప్పిన వాదనలను కోర్టు అంగీకరించలేదు. ముంబై, పరిసర జిల్లాలకు ఎక్కువ సరఫరా చేస్తున్నారు, నాగపూర్‌తో సహా మిగతా ప్రాంతాలను పట్టించుకోవటం లేదని కేసు దాఖలైంది. కోర్టు ఈ వ్యాఖ్యలకు ముందు మహారాష్ట్రలో జరిగిన ఒక ఉదంతం ఆసక్తి కలిగించటమే కాదు, చివరికి కరోనాను కూడా సొమ్ము చేసుకొనే బిజెపి పన్నాగాన్ని బయట పెట్టింది.


కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్‌లో ఫ్యాక్టరీ, గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న బ్రక్‌ ఫార్మా కంపెనీ అరవై వేల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తుండగా ముంబై పోలీసులు పట్టుకున్నారు. కంపెనీ డైరెక్టర్‌ను పోలీసులు విచారించారు. ఆ చర్యను నిరసిస్తూ బిజెపి నేత అయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తన అనుచరులతో వచ్చి ఆందోళనకు దిగారు. వాటిని బ్లాక్‌ మార్కెట్లో విక్రయించేందుకు తరలిస్తున్నారని పోలీసులు అనుమానించారు. ఎఫ్‌డిఏ అధికారుల అనుమతితో తామే వాటిని కొనుగోలు చేశామని బిజెపి నేతలు తొలుత బుకాయించారు. అలాంటి అనుమతి లేదని తేలిపోయింది. ఎగుమతి కోసం తయారు చేసిన వాటిని నిషేధం కారణంగా స్దానిక మార్కెట్లో విక్రయించేందుకు అనుమతి కోరుతూ కంపెనీ అధికారులు ఔషధ యంత్రాంగానికి దరఖాస్తు చేశారు. వాటిని రాష్ట్రప్రభుత్వానికి విక్రయించవచ్చని అనుమతి ఇచ్చారు తప్ప బిజెపికి ఇమ్మని ఎక్కడా లేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు దానంగా ఇచ్చేందుకు కొనుగోలు చేశాం తప్ప బ్లాక్‌ మార్కెట్లో విక్రయించటానికి కాదని మరొక కహానీ చెప్పారు.


ఇక్కడ తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు లేవు. అదే నిజమైతే ముందుగానే బహిరంగంగానే ప్రకటించవచ్చుగా, తమ వంతు విరాళం అని ప్రచారం చేసుకోవచ్చు, దానిలో దాపరికం ఎందుకు ? నిజంగా బిజెపికి అంత దాతృత్వం ఉంటే దేశ వ్యాపితంగా రెమిడెసివిర్‌కు డిమాండ్‌ ఉన్నపుడు దేశమంతటికీ కాకుండా మహారాష్ట్రకే ఎందుకు ఇవ్వాలి. అసలు ఒక రాజకీయ పార్టీకి ఔషధాన్ని అమ్మటానికి సదరు కంపెనీకి అధికారం ఎక్కడుంది? అంటే ఆ పార్టీ రాజకీయ ప్రచారానికి సదరు కంపెనీ మద్దతు ఇచ్చినట్లే ? ప్రభుత్వం చేయలేని పనిని మేం చేస్తున్నామని చెప్పుకొనే చౌకబారు రాజకీయ ప్రయోజనం కోసం బిజెపి వేసిన ఎత్తుగడ తప్ప దీనిలో మరొకటి కనిపించటం లేదు. అంత కక్కుర్తి అవసరమా ? దేశ చరిత్రలో ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా ? కమ్యూనిస్టులు వివిధ సందర్భాలలో బహిరంగంగానే ధన, వస్తు రూపంలో బాధితులకు విరాళాలు వసూలు చేశారు. క్యూబా, పాలస్తీనా వంటి దేశాలకు ప్రభుత్వాలతో సంప్రదించే విరాళంగా వచ్చిన సొమ్ముతో వారికి అవసరమైన వాటిని కొనుగోలు చేసి పంపారు తప్ప ఇలాంటి పనులు చేయలేదు.


జనం ముందుకు కొందరు మహాత్ములు ఊరకరారు- అదే విధంగా కొందరు పోయేటపుడు ఊరికే పోరు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఏం జరుగుతుందో చూడటం తప్ప సామాన్యులం చేయగలిగింది ఏముంది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాక్సిన్‌ దౌత్యం : డోనాల్డ్‌ ట్రంప్‌ ధైర్యం నరేంద్రమోడీకి ఎందుకు లేకపోయింది ?

21 Wednesday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

Corona vaccine, US Vaccine Diplomacy, vaccine controversy, Vaccine Nationalism


ఎం కోటేశ్వరరావు


నిజమే, అవసరం మనదైనపుడు తగ్గి ఉండాలని పెద్దలు చెప్పిన బుద్దులు- సుద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సిందే-కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని లొంగి పోవాలని పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు ఏవీ చెప్పలేదే ? మన గత చరిత్ర కూడా అది కాదు కదా ! కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించకపోతే ఎవరికైనా ఏం గౌరవం ఉంటుంది. అయితే అందుకు తగిన దమ్మూ-ధైర్యం ఉండాలి. మనమూ అమెరికా విడదీయలేనంతటి సహ భాగస్వాములమని చెప్పారు. నిజమే కామోసు, మన నరేంద్రమోడీ గారిని చూసి భయపడకపోయినా అమెరికా మారు మనసు పుచ్చుకుందేమో అనుకున్నారు ఎందరో ! కానీ జరుగుతోందేమిటి ? కరోనాతో ప్రాణాలు పోతున్నా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలను మనకు అందచేసేందుకు – సొమ్ము తీసుకొనే సుమా – మన సహ భాగస్వామి అంగీకరించటం లేదు. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా అబ్బే మేము నిషేధం పెట్టలేదు ట్రంప్‌ హయాంలో దుమ్ముదులిపిన మా చట్టాన్నే అమలు జరుపుతున్నాం, దాని ప్రకారం ఎగుమతి చేసేందుకు అవకాశం లేకపోతే మేమేం చేయగలం, ఎగుమతుల మీద పని గట్టుకొని నిషేధం అయితే లేదబ్బా …. ఏవమ్మా కమలా హారిస్‌ మీ పూర్వీకుల దేశం వారు ఏదేదో అంటున్నారు నువ్వయినా చెప్పమ్మా అన్నట్లుగా జో బైడెన్‌ మాట్లాడుతున్నారు. మీ అవసరాలను గుర్తించాంగానీ ఇప్పటికైతే మా చేయి ఖాళీ లేదు, ఏమీ చేయలేం అంటున్నారు అధికారులు. ఏం చేయాలో పాలుపోక మన నరేంద్రమోడీ గారి నోట మాట రావటం లేదు.(మామూలుగానే మాట్లాడే అలవాటు లేదు, కరోనా కదా నోరు విప్పుతారేమో అనుకున్నవారికి ఆశాభంగం).

సరిగ్గా ఏడాది క్రితం మన ప్రధాని నరేంద్రమోడీ జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలో కరోనా వ్యాప్తిని అలక్ష్యం చేసి ఎందరి ప్రాణాలను ఎలా తీశాడో చూశాము. ఆ సమయంలో మలేరియాకు వాడే హైడ్రోక్సీక్లోరోక్విన్‌ కరోనాకు కూడా దివ్వ ఔషధంగా పని చేస్తుందని ఎవరో చెప్పగానే మన దేశం దాని ఎగుమతుల మీద నిషేధం విధించింది. అది నిజమా కాదా అని నిర్దారించుకోకుండా తక్షణమే మాకు సరఫరా చేయండి లేకపోతే మన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాదిరి మీ తాట వలుస్తా అని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన విషయమూ-యాభై ఆరు అంగుళాల ఛాతీ గల మనదేశం వెంటనే ఎందుకంత కోపం కావాలంటే పంపకుండా ఉంటామా అంటూ ఆఘమేఘాల మీద అందచేయటం తెలిసిందే. శ్రీశ్రీ అన్నట్లుగా తారీఖులు, దస్తావేజులను పక్కన పెడితే శనివారం నాడు మనం నిషేధం విధించాం, ఆదివారం నాడు మోడీతో ట్రంప్‌ ఫోన్లో మాట్లాడాడు. సోమవారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ ఔషధాన్ని పంపకపోతే ప్రతీకార చర్యలు తీసుకుంటామని బహిరంగంగా బెదిరించాడు. మంగళవారం నాడు ఆంక్షలను సడలించి అమెరికాకు ఎగుమతి చేశాము. ఇదీ ఏడాది క్రితం జరిగిన ఉదంతం.


ఇంతేనా జర్మనీకి రవాణా అవుతున్న లక్షలాది మాస్కులు, తొడుగులను మధ్యలోనే అడ్డుకొని తమ దేశానికి మళ్లించుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ అదరగొండితనం కూడా అదే సమయంలో జరిగిన సంగతి తెలిసిందే. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో తాము దేశీయంగా చేసుకున్న రక్షణ ఉత్పత్తి చట్టానికి పదును పెట్టామని, దాని ప్రకారం అవి ఎగుమతి నిషేధ జాబితాలో ఉన్నాయని, తమ కంపెనీలు తయారు చేసినందున వాటిని తాము స్వాధీనం చేసుకున్నామని అమెరికా సమర్ధించుకుంది. ఇప్పుడు కరోనా వాక్సిన్‌ కోవీషీల్డ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు, ఇతర వస్తువుల సరఫరా మీద కూడా అదే చట్టాన్ని ప్రయోగించి ఎగుమతుల మీద జోబైడెన్‌ సర్కార్‌ నిషేధం విధించింది. ట్రంప్‌ అయినా బైడెన్‌ అయినా తమ అవసరాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమ సహజ భాగస్వాములుగా వర్ణించి, ఉబ్బేసిన మన విషయంలో ఇవ్వటం లేదని తేలిపోయింది. ఎక్కడైనా బావే గానీ వంగతోట దగ్గర కాదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ముద్దులాట వ్యవహారం దగ్గర మొహమాటానికి సిద్దమే గాని వ్యాపారం దగ్గర కాదు అంటే ఇదే. మనం నొప్పిని తట్టుకోలేని-బయటకు చెప్పుకోలేని స్దితిలో పడిపోయామా ?

అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ముడి సరుకులు నిండుకొని వాక్సిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని పూనాలోని సీరం సంస్ధ మార్చి తొమ్మిదవ తేదీన ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన వాక్సిన్‌ తయారీదారుల సమవేశంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఆరువారాలు గడచిపోయాయి. తమ నేత ప్రపంచాన్ని శాసించగలుగుతున్నారని చెబుతున్న మోడీ భక్తులు గానీ, బహుశా గడ్డాన్ని చూసి విశ్వగురువు అని వర్ణిస్తున్నవారు గానీ, చివరికి నరేంద్రమోడీ గానీ ఈ విషయంలో ఇంతవరకు చేసిందేమీ లేదు. భారత వినతిని పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని జో బైడెన్‌ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఎప్పుడు ? తాత చచ్చి అవ్వ వితంతువు అయిన తరువాతనా అని తెలుగులో ఒక సామెత ఉంది. కరోనా కాటుకు మన జనం బలైన తరువాతనా లేక అమెరికా సంస్దలు తయారు చేస్తున్న వాక్సిన్ను మనం అధిక ధరలకు కొనుగోలు ఒప్పందం కుదిరిన తరువాత అనా ?


గతేడాది పిపిఇ కిట్ల తయారీ నిర్ణయాన్ని తీసుకోవటంలో జరిగిన జాప్యం గురించి వచ్చిన విమర్శలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక దేశాల్లో రెండవ, మూడవ కరోనా తరంగం వచ్చిన విషయమూ తెలిసినా ఒకవేళ మన దగ్గర వస్తే ఏం చెయ్యాలన్న ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. మరోసారి లాక్‌డౌన్‌ విధించే పరిస్ధితులను తెచ్చుకోవద్దని ఘనమైన ప్రధాని నరేంద్రమోడీ గారు నెపాన్ని జనం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.కరోనా మీద విజయం సాధించామన్న స్వంతడబ్బా ప్రకటనలు తప్ప మరోసారి వస్తే అన్న ముందుచూపు లేకపోయింది. గతేడాది అనేక చోట్ల ఆక్సిజన్‌ కొరత ఏర్పడి రోగులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇరవైఆరులక్షల కోట్ల ఆత్మనిర్బర పాకేజీ గురించి గొప్పలు చెప్పుకోవటం తప్ప అది అవసరమై ఆక్సిజన్‌ అందించి ప్రాణాలను నిలిపేందుకు ఉపయోగపడలేదు. గతేడాది అనుభవాన్ని చూసి ఇప్పటికే ఆక్సిజన్‌ సరఫరాకు కొత్త ప్లాంట్లకు అనుమతి ఇచ్చి సిద్దం చేసి ఉంటే అనేక రాష్ట్రాల్లో కొందరు రోగులు దిక్కులేని చావు చచ్చేవారా ? ఒక్క సిలిండరు ఉత్పత్తికి కూడా పనికి రాని లక్షల కోట్ల పాకేజ్‌లు ఎందుకు ? ఇల్లుకాలుతుండగా నీటికోసం బావులు తవ్వినట్లుగా ఇప్పుడు వంద ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్లు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. కేవలం రెండు వందల కోట్ల రూపాయలతో 150 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు ఎనిమిది నెలలు పట్టిందంటే మన కేంద్ర ప్రభుత్వ నిర్వాకం ఎలా ఉందో ఇంతకంటే చెప్పాలా ? ఇలాంటి స్దితికి విచారించాలా, బాధ్యతా రాహిత్యాన్ని గర్హించాలా ? యుద్దం వస్తుందో రాదో తెలియకపోయినా లక్షల కోట్ల రూపాయల ఆయుధాలను కొని పెట్టుకుంటున్నాం. అవి కొంత కాలానికి పనికి రావని తెలిసినా కొనుగోలు చేస్తున్నాం. అలాంటిది కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్సిజన్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలా లేదా ? డబ్బుల్లేక అడుక్కుంటే ఇచ్చే దాతలు ఎందరు సిద్దంగా లేరు ?

మార్చినెల 26వ తేదీ నుంచి దేశంలో కరోనా అనూహ్యంగా వ్యాపిస్తోన్న విషయం తెలిసినా, అంతకంటే ముందే తయారీదార్లు హెచ్చరించినా వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి సరకులు మీద నిషేధం ఎత్తివేయించేందుకు అమెరికా మీద ఎలాంటి వత్తిడీ ఎందుకు తేలేదు. గత వారం వరకు మన కేంద్ర మంత్రులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? అన్నీ తానై చూసుకుంటున్న ప్రధాని ఏమి చేస్తున్నట్లు ? ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యతలో వందో వంతైనా ఇచ్చి ఉంటే అమెరికా నుంచి వస్తాయో రావో ఎప్పుడో తేలిపోయి ఉండేది. ప్రపంచం గొడ్డుపోలేదుగా ! మరో దేశం నుంచి తెచ్చుకొనేందుకు ప్రయత్నం చేసినట్లు కూడా ఎవరూ చెప్పటం లేదు. అమెరికా కోడి కూయకపోతే ప్రపంచానికి తెల్లవారదా ? వాక్సిన్‌ తయారు చేస్తున్న దేశాల్లో చైనా ఒకటి. కావాలంటే ముడిసరకులు సరఫరా చేస్తామంటూ వారు ముందుకు వచ్చారు. అక్కడి నుంచి తెచ్చుకొనేందుకు ఇబ్బంది ఏమిటి ? గాల్వన్‌ ఉదంతానికి, సరిహద్దు ఉద్రిక్తతలు, సమస్యలకు ఇతర అంశాలను ముడి పెట్టవద్దని వారు చెబుతున్నారు. అలాంటపుడు అక్కడి నుంచి తెచ్చుకుంటే తప్పేముంది?


చైనా నుంచి తెచ్చుకోవచ్చుగానీ వారి సరకుల నాణ్యత గురించి సందేహాలున్నాయి అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము, వాటి మీదే ఆధారపడి ఉన్నాము. వాటికి లేని నాణ్యత సమస్య వాక్సిన్‌ ముడి పదార్దాలు, వస్తువులకు మాత్రమే వచ్చిందా ? ఎందుకీ సాకులు, ప్రాణాలు పోతున్నా రాజకీయమేనా ? చైనాలో తయారైన వాక్సిన్ను ఇతర దేశాలు వినియోగించటం లేదా ? కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకత ఎక్కిన వ్యవహారం తప్పితే మరొకటి ఏదైనా ఉందా ? నువ్వు మిత్రుడు అనుకుంటున్న అమెరికా వాడు ఇవ్వడు-శత్రువు అంటున్న చైనా వారు ఇస్తానంటే జనం ప్రాణాలను పోగొట్టటానికైనా సిద్దం అవుతున్నాము తప్ప తెచ్చుకోవటానికి ముందుకు కదలటం లేదు. ఇదేమి జవాబుదారీతనం ! ఇదేమి రాజధర్మం !! ప్రపంచంలో ఏదేశమూ ఎదుర్కోని విధంగా మన దేశంలో కరోనా విజృంభిస్తోందన్న కఠోర సత్యాన్ని కేంద్ర పాలకులు గుర్తిస్తున్నట్లు లేదు. బతికుంటే కావాలంటే తరువాత చైనాతో సమస్యలను తేల్చుకోవచ్చు. 1962లో యుద్దం జరిగిన తరువాత వివాదం ఉండగానే సాధారణ సంబంధాలు నెలకొల్పుకోలేదా, వాణిజ్యం చేయలేదా ? గాల్వన్‌లో మరో వివాదం వచ్చింది, ఆ పేరుతో ప్రాణావసరాలను కూడా తెచ్చుకోకుండా మడికట్టుకు కూర్చుందామా ? ఉత్తరాఖండ్‌ కుంభమేళాకు అనుమతి ఇస్తే కరోనా పుచ్చిపోతుందని అనేక మంది హెచ్చరించారు. అయినా బిజెపి పెద్దలు ఖాతరు చేయలేదు.మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఏమైంది, కరోనాతో అనేక మంది మరణించిన తరువాత మధ్యలోనే విరమించాలని ప్రధాని చెప్పాల్సి వచ్చిందా లేదా ? వాయిదా కూడదు కూడదు అని చెప్పిన అఖాడాలు బతుకు జీవుడా అంటూ మూటా ముల్లె సర్దుకొని గుడారాలు ఎత్తివేశాయా లేదా ?

ముప్పు పేరుతో అమెరికా ఆయుధవ్యాపారులు చెప్పిన ఆయుధాలన్నీ కొంటున్నాము. సమాచారం ఇస్తామంటే దానికీ ఒప్పందాలు చేసుకున్నాము. ఇటు నుంచి అటుపోవటం తప్ప అటు నుంచి ఇటు వచ్చిందేమీ లేదు. చైనా మీద, అదే విధంగా పెరుగుతున్న చమురు ధరల మీద మన ఆయుధాలను ప్రయోగిస్తామని చెప్పారు.చైనా యాప్‌లను నిషేధించారు, కొన్ని పెట్టుబడులను అడ్డుకొని, ఆయుధాలు కొనుగోలు చేసి అమెరికాను సంతోష పెట్టారు తప్ప మనం సాధించింది ఏమిటి? అమెరికా నుంచి వాక్సిన్‌ ముడిసరకులను అప్పనంగా అడిగామా ? ఆపదలో ఆదుకోని మిత్రుడి గురించి వెంపర్లాడటం ఎందుకు ? చైనా వస్తువుల కొనుగోలు మానుకుంటే వారు మన కాళ్ల దగ్గరకు వస్తారని, మనం చెప్పినట్లు వింటారని ప్రచారం చేశారు. అలాంటి సూచనలేమీ లేవు, తొలి మూడు మాసాల్లో 18శాతం అభివృద్ది రేటు సాధించినట్లు వార్తలు వచ్చాయి. కీలకమైన లడఖ్‌ సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యాలు పూర్వపు స్ధానాలకు తగ్గాలంటే మనం పెడుతున్న ప్రతిపాదనలను అంగీకరించటం లేదు. అంటే మన వత్తిడిలో పసలేదని తేలిపోయింది. అమెరికా అండ చూసుకొని ఆయాసపడటం అవసరమా ? పోనీ చమురు ఎగుమతి దేశాల మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పినట్లు దిగుమతి ఆయుధ ప్రయోగంచేసి వత్తిడి తెచ్చి చమురు ధరలు తగ్గించామా అంటే అదీ లేదు. చివరకు చమురును కూడా అమెరికానుంచే కొనుగోలు చేస్తున్నాము. గల్ఫ్‌, పశ్చిమాసియా దేశాలను శత్రువులుగా చేసుకుంటున్నాము. చతుష్టయ కూటమి నుంచి తప్పుకుంటాము, ఆయుధాలు, చమురు కొనుగోలు నిలిపివేస్తాము అంటే అమెరికా దిగిరాదా ? జనం చస్తున్నా ఎందుకీ లొంగుబాటు ?ముడి పదార్దాల సరఫరా గురించి మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ అమెరికా మంత్రితో మాట్లాడామని చెప్పారు తప్ప ఫలితం ఏమిటో వెల్లడించలేదు. వాక్సిన్లకోసం ముడి సరకులు సజావుగా అందేందుకు అందుబాటులో ఉంచాలని పెద్ద దేశాలను కోరినట్లు జై శంకర్‌ చెప్పారు. అలాంటపుడు సూటిగానే చైనా నుంచి ముడిసరకులను ఎందుకు తీసుకోకూడదు ?

వాక్సిన్‌ రాజకీయాల్లో భాగంగా చతుష్టయ దేశాలైన అమెరికా, జపాన్‌, భారత్‌,ఆస్ట్రేలియా కూటమి వాక్సిన్‌ తయారీకి చర్యలు తీసుకొని చైనా పలుకుబడిని తగ్గించాలని నిర్ణయించాయి. దానిలో భాగంగా మన దేశానికి వాక్సిన్‌ ముడి పదార్దాలతో పాటు అమెరికా, జపాన్‌ నుంచి పెట్టుబడులూ వస్తాయని చెప్పారు. బ్రిటన్‌ ఆస్ట్రాజెనెకాతో పాటు సీరం సంస్ద అమెరికాకు చెందిన నోవాక్స్‌ వాక్సిన్‌ కూడా తయారీకి ఒప్పందం చేసుకుంది. పోనీలే రాజకీయం చేస్తే చేశారు, ఏదో ఒక పేరుతో వాక్సిన్‌ అందించేందుకు పూనుకున్నాయి అని సంతోషించిన వారికి ముడిసరకులను బ్లాక్‌చేసిన అమెరికా తానే మోకాలడ్డింది. దీంతో కోవిషీల్డ్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది, నోవాక్స్‌ ప్రారంభానికి నోచుకోలేదు.


తూర్పు చైనాలోని జియాంగ్‌సు రాష్ట్రంలో ఔషధాలు తయారు చేస్తున్న కంపెనీ ప్రతినిధి చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌తో మాట్లాడుతూ ఇప్పటికే తాము భారత్‌కు సరఫరా చేస్తున్న సోడియం క్లోరైడ్‌ను వైద్య అవసరాలకు వినియోగిస్తున్నారని, దానిలో కొంత వాక్సిన్లకూ ఉపయోగించవచ్చని చెప్పారు. ప్రస్తుతం తాము దేశీయ అవసరాలకోసమే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఇతర దేశాలు కోరితే వాటికీ అందచేసే సామర్ధ్యం తమకు ఉందని చెప్పారు. షాంగ్‌డోంగ్‌ రాష్ట్రానికి చెందిన మరో సంస్ధ ప్రతినిధి మాట్లాడుతూ ఔషధాలకు అవసరమైన సీసాల తయారికి వినియోగించే సిలికాన్‌ గ్లాస్‌ను తయారు చేస్తున్నామని, ఏటా ఐదు కోట్ల సీసాలు తయారు చేయగలమని అవసరమైతే విదేశాలకూ అందచేయగలమని చెప్పారు. క్యూబాలో వాక్సిన్‌ తయారు చేసినా దానిని సరఫరా చేసేందుకు అవసరమైన సీసాల తయారీ సమస్యగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి, అదే పరిస్ధితి మన దేశంతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఉంది.


మనకు అవసరమైన వాక్సిన్ల తయారీకి విదేశాల్లో కూడా ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. మంచిదే ! మన పాలకులు చేయాల్సిందేమిటి ? ప్రయివేటు కంపెనీలను నమ్ముకొని మన ఐడిపిఎల్‌ను మూతపెట్టాము, వాక్సిన్‌ తయారీ కేంద్రాలలో చెట్లు మొలిపిస్తున్నాము.లాభాలే ధ్యేయంగా పని చేసే సీరం సంస్దలో ఉత్పత్తిని పెంచటానికి 1500 కోట్ల రూపాయల రుణాన్ని ఎలాంటి హామీలు లేకుండా ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తప్పులేదు, తమిళనాడులో ఆరువందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సమగ్ర వాక్సిన్‌ కేంద్రాన్ని ఎందుకు ఖాళీగా ఉంచుతున్నారు ? ఇలాంటివే ఇంకా కొన్ని సంస్ధలు ఉన్నాయి. యుద్ద ప్రాతిపదికన వాటిని కరోనా వాక్సిన్ల తయారీకి ఎందుకు ఉపయోగించటం లేదు ? ఎవరి ప్రయోజనాలకోసమీ నిర్లక్ష్యం ? ఇంత పెద్ద దేశంలో ఎప్పుడే అవసరం ముంచుకు వస్తుందో తెలియదు. అవసరం తీరిన తరువాత ఇతర వాక్సిన్లను తయారు చేయవచ్చు, ఇతర దేశాలకు ఎగుమతికి ఉపయోగించవచ్చు. ప్రభుత్వ రంగంలో ఔషధతయారీని మూతపెట్టిన కారణంగా ఈ రోజు అవసరమైన డెమిసెవిర్‌ వంటి ఔషధాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు. మహారాష్ట్రలో అలా దొరికిపోయిన దొంగలకు మద్దతుగా ఆ రాష్ట్ర బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ధర్నాకు దిగారంటే ఏమనుకోవాలి. తీరా అసలు విషయం బయటపడిన తరువాత మహారాష్ట్ర కోసమే డామన్‌ కంపెనీ నుంచి తెప్పిస్తున్నట్లు మాట మార్చారు. అంటే అక్కడి శివసేన-ఎన్‌సిపి-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం చేతగానిదైంది, మా పలుకు బడి ఉపయోగించి తెచ్చామనే చౌకబారు చావు రాజకీయం తప్ప దీనిలో ఏమైనా ఉందా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కమ్యూనిస్టులు జాక్‌ మాకు ఎందుకు చెక్‌ పెట్టారు ?

19 Monday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Alibaba, china communist party, Jack Ma, U.S. Cold War on China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


జాక్‌ మా, అలీ బాబా పేరు ఏదైనేం, వ్యక్తి-సంస్ద పేరు విడదీయలేనంతగా మారిపోయాయి. కొద్ది నెలల క్రితం జాక్‌ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో దర్శనమిచ్చిన తరువాత కట్టుకథలు-పిట్టకథలకు తెరపడింది. తాజాగా చైనా ప్రభుత్వం జాక్‌ మా కంపెనీల పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించిందన్న సమాచారంతో మరోసారి వార్తలకు ఎక్కాడు. ఆలీబాబా, ఆంట్‌ తదితర గ్రూపు కంపెనీల నుంచి అతగాడు బయటికి పోవటం, కొన్ని వాటాల విక్రయం, మరికొన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వంటి అంశాల గురించి వార్తలు వస్తున్నాయి. తన వాటాలను కొన్నింటిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తానని నవంబరు నెలలోనే జాక్‌ మా ప్రతిపాదించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ గతంలో రాసింది. జనవరి నుంచి పీపుల్స్‌ బాంక్‌ ఆఫ్‌ చైనా( మన రిజర్వుబ్యాంకు వంటిది), బ్యాంకింగ్‌, బీమా నియంత్రణ కమిషన్‌ వివిధ అంశాలకు సంబంధించి చర్చలు జరుపుతున్నాయి. ఇంత వరకు ఏ విషయమూ ఇదమిద్దంగా తెలియదు.


ఒకటి మాత్రం స్పష్టం, చైనా ప్రభుత్వం జాక్‌ మాను అదుపులోకి తెచ్చింది. దేశంలోని ఇతర ప్రయివేటు సంస్ధలను నిరుత్సాహపరచకుండా ఒక వైపు అడుగులు వేస్తూ మరో వైపు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే విధంగా బడా సంస్ధలను అనుమతించబోమనే సందేశాన్ని జాక్‌ మా ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ అనేక మందిలో తలెత్తే సందేహం ఏమంటే అసలు అలాంటి బడా సంస్ధలను మొగ్గలోనే తుంచి వేయకుండా ఎందుకు ఎదగనిచ్చింది ? ప్రపంచ కార్పొరేట్‌ శక్తుల ప్రతినిధులు చెబుతున్నట్లుగా ఈ చర్యలతో చైనా నవకల్పనలు కుంటుపడతాయా ? అభివృద్ధికి ఆటంకం కలుగుతుందా ? కొంత మంది చైనాలో జాక్‌ మా యుగం ప్రారంభమైందని ప్రచారం చేశారు.అది నిజమే అని అతగాడు భ్రమించి చైనా వ్యవస్ధనే సవాలు చేశాడా ? వాస్తవానికి చైనా యుగంలో జాక్‌ మా వంటి వారు కొందరు తప్ప వ్యక్తుల యుగాలు ఉండవు.


దీన్ని వివరిస్తే కొంత మందికి జీర్ణం గాకపోవచ్చు, అయినా తప్పదు . అందువలన క్లుప్తంగా చెప్పుకుంటే పెట్టుబడిదారీ విధానం అంటే శ్రమను అమ్ముకొనే ఒప్పందం మేరకు పని, ఆ మేరకు వేతనం. మిగతా వాటితో సంబంధం ఉండదు. సోషలిజం అంటే శక్తికొద్దీ పని, శ్రమకొద్దీ ప్రతిఫలం. మొదటిదానిలో లాభం లేదా మిగులు పెట్టుబడిదారుల స్వంతం అవుతుంది. రెండవ దానిలో శ్రామికులకు గౌరవప్రదమైన వేతనాలతో పాటు మిగులు సామాజిక పరం అవుతుంది. దాన్ని వివిధ రూపాలలో అందరికీ వినియోగిస్తారు. సోషలిజం అంటే దరిద్రాన్ని పారదోలటం తప్ప దాన్ని అలాగే ఉంచి అందరికీ పంచటం కాదు. సోషలిజం దాని తరువాత కమ్యూనిజం అంటే శక్తికొద్దీ పని, అవసరం కొద్దీ వినియోగం. ఇప్పటికైతే కమ్యూనిజం ఒక ఉత్తమ భావన. మరి దీనికి ప్రాతిపదిక లేదా అంటే, ఉంది. ఆదిమ కమ్యూనిజం అనే దశలో నాటి మానవులు సామూహిక శ్రమ ద్వారా సాధించిన వాటిని అవసరం కొద్దీ పంచుకొనే వారు గనుక ఆ స్ధాయిలో ఉత్పత్తి సాధిస్తే ఆధునిక కమ్యూనిజం సాధ్యమే అన్నది మార్క్స్‌-ఎంగెల్స్‌ భావన. దాన్ని సాధించాలంటే జనం అందరి అవసరాలు తీరేంతగా ఉత్పత్తిని, ఉత్పాదక శక్తులను పెంచటం ఎంతకాలంలో సాధ్యం అవుతుంది అంటే ఎవరమూ చెప్పలేము. వ్యక్తిగత ఆసక్తి కొద్దీ ఒకరు కత్తి పట్టుకొని వైద్య పరమైన శస్త్ర చికిత్సలు చేయవచ్చు, మరొకరు అదే కత్తితో అందమైన క్రాఫులూ చేయవచ్చు. ఏది చేసినా సమాజం తగిన గుర్తింపు, గౌరవంతో పాటు వారి పూర్తి అవసరాలు తీరుస్తుంది. దోపిడీ, పీడన, యుద్దాలు ఉండవు, మారణహౌమాలు జరగవు. అదే కమ్యూనిజం భావన.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాలతో పాటు కొండకోనలకే పరిమితమై దుస్తులు కూడా వేసుకోని ఆదిమానవుల లక్షణాలను ఇంకా కలిగి ఉన్న వారి వరకు వివిధ దశల్లో ఉన్న జనం ఉన్నారన్నది వాస్తవం. పెట్టుబడిదారీ వ్యవస్ధ సంక్షోభంలో ఉన్నపుడు దాని బలహీనపు లింకును తెగగొట్టి సోషలిస్టు వ్యవస్ధను ఏర్పాటు చేయవచ్చు అన్నది రష్యాలో కమ్యూనిస్టులు నిరూపించారు. అయితే దాన్ని విఫలం చేశారు అని కొందరి అభిప్రాయం, కాదు అంతర్గత లోపాల కారణంగా అది విఫలమైంది అని కొందరు చెబుతారు. నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ అని కొందరు భావిస్తే అలాంటి బిడ్డను బతికించుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకోని కారణంగా అంతరించిందని కొందరు చెప్పవచ్చు. దేన్నీ పూర్వపక్షం చేయకుండా అనుభవాలు తీసుకోవటం ఇక్కడ ముఖ్యం. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను ఏర్పాటు చేసిన వారు ఈ అనుభవాన్ని తీసుకొని తమదైన శైలిలో ఆ వ్యవస్ధను ముందుకు తీసుకుపోతున్నామని చెబుతున్నారు.


దానిలో భాగమే జాక్‌ మా వంటి వారు, ఆంట్‌ వంటి సంస్ధలూ వాటి మీద చర్యలూ అని చెప్పవచ్చు. రష్యాలో విప్లవం వచ్చిన నాటికి ఆ ప్రాంతం అభివృద్ది చెందిన పెట్టుబడిదారీ వ్యవస్ధలలో ఒకటి. అదే చైనా విప్లవ సమయంలో ఫ్యూడల్‌ సంబంధాలతో ఉన్న వ్యవస్ధ, పారిశ్రామికంగా మనకంటే వెనుకబడిన దేశం. పెట్టుబడిదారీ విధానం ఉన్నత స్ధాయిలోకి రావటం అంటే ఉత్పాదకశక్తులు గణనీయంగా అభివృద్ది చెంది ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడి కావటం. దానితో పాటు దోపిడీ విపరీతంగా పెరిగి దాన్ని కూలదోసే సైన్యాన్ని కూడా అది పెంచుతుందన్నది కమ్యూనిస్టులు చెప్పే సిద్దాంతం. ఈ నేపధ్యంలో చూసినపుడు చైనాలో సోషలిస్టు వ్యవస్ధ లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అధికారానికి వచ్చిన తరువాత ఉత్పాదకశక్తుల పెరుగుదల ఆశించిన మేరకు పెరగలేదు. కనుకనే డెంగ్‌సియావో పింగ్‌ సంస్కరణలలో భాగంగా విదేశీ పెట్టుబడులు, పెట్టుబడిదారులను చైనాకు ఆహ్వానించారు. దేశీయంగా కూడా పరిమితుల మేరకు అనుమతించారు. దీనికి తోడు జాక్‌ మా వంటి వారు ఐటి, దాని అనుబంధ రంగాలలో ప్రవేశించి అనూహ్య స్దాయిలో సంపదలను సృష్టించారు, బిలియనీర్లుగా పెరిగిపోయారు. అయితే వారు సోషలిస్టు వ్యవస్ధకే ఎసరు తెచ్చే సూచనలు వెల్లడిస్తే కమ్యూనిస్టు పార్టీ అనుమతిస్తుందా ?


జాక్‌ మా వంటి వారి పెరుగుదలను చూసి ఇతర దేశాల్లో ఉన్న కమ్యూనిస్టుల్లో కొంత మంది ఇంకేముంది అక్కడ పెట్టుబడిదారీ విధానం అమల్లోకి వచ్చింది అని సూత్రీకరించారు, విచారపడ్డారు. ఇదేమిటని పెదవి విరిచారు. అదే జాక్‌ మా మీద ఆంక్షల విషయం వెల్లడికాగానే ప్రపంచంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు, పెట్టుబడిదారులందరూ గుండెలు బాదుకున్నారు. మేము ఇలా అనుకోలేదు అంటూ మొసలి కన్నీరు కార్చారు. ఇంకేముంది చైనా తిరోగమనం ప్రారంభం అయిందని చంకలు కొట్టుకున్నారు. ఒకటి స్పష్టం, గ్లాస్‌నోస్త్‌ పేరుతో నాటి సోవియట్‌ యూనియన్‌లో అమలు చేసిన అనుభవాలు చూసిన తరువాత తియన్మెన్‌ స్కేర్‌లో విద్యార్ధుల పేరుతో జరిపిన ప్రతీఘాత ప్రయత్నాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ మొగ్గలోనే తుంచి వేసింది. తాను పెరిగి, ఇతర సంస్దలను మింగివేసేందుకు పూనుకున్నట్లు జాక్‌మా గురించి వచ్చిన వార్తలు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినట్లు వెల్లడైన సమాచారం మేరకు తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలీబాబా, ఆంట్‌ ఇతర కంపెనీల్లోని జాక్‌ మా వాటాలను చిన్న మదుపర్లకు విక్రయిస్తారని, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని పరిపరి విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఏమి జరిగినప్పటికీ ప్రభుత్వ అనుమతుల మేరకు ఉంటాయి.

గుత్త సంస్ధలు పెరగకుండా నిరోధించే చట్టాలు అన్ని దేశాలలో మాదిరి చైనాలో కూడా ఉన్నాయి. వాటిని లోపభూయిష్టంగా తయారు చేయటం, సరిగా అమలు జరపని కారణంగా అనేక దేశాలలో సంస్ధలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. చైనాలో వాటి అమలుకు నిదర్శనమే తాజా పరిణామాలు అని చెప్పవచ్చు.ఆంట్‌ కంపెనీ 37 బిలియన్‌ డాలర్ల వాటాల విక్రయానికి పూనుకోగా గతేడాది డిసెంబరులో చైనా ప్రభుత్వం అడ్డుకున్నది. ఈ చర్యలను చైనా అధినేత గ్జీ జింపింగ్‌ తన వ్యతిరేకులను అణచివేసే వాటిలో భాగంగా తీసుకుంటున్నట్లు చిత్రిస్తున్నారు. మన దేశంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో తమ ప్రత్యర్ధులుగా ఉంటూ వాణిజ్య, పారిశ్రామికవేత్తలుగా ఉన్న వారి మీదనే దాడులు జరుగుతాయి. ఆ రీత్యా చూసినపుడు చైనాలో అలాంటి వాటికి అవకాశం లేదు. మూడు సంవత్సరాల క్రితం జాక్‌ మా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అక్రమాలకు పాల్పడిన అనేకమంది కమ్యూనిస్టులు, ఇతరుల మీద చర్యలు తీసుకున్నారు. రియలెస్టేట్‌ కంపెనీ వాండా యజమాని వాంగ్‌ జియాన్‌లిన్‌, ఇన్సూరెన్సు కంపెనీ అనబాంగ్‌ అధిపతి ఉ గ్జియావోహురు మీద చర్యలు తీసుకోవటమే గాక వారి వ్యాపారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.(మన దేశంలో మాదిరి మేం వ్యాపారం చేయటం లేదు అని ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలకు ఎసరు తెస్తున్నదానికి విరుద్దం).


1999లో కేవలం 20 మంది స్నేహితులు, సిబ్బందితో తన స్వంత ఫ్లాట్‌లో ఐటి కార్యకలాపాలను ప్రారంభించిన జాక్‌ మా కేవలం రెండు దశాబ్దాల కాలంలోనే 2020 నాటికి ఏడాదికి 72 బిలియన్‌ డాలర్ల ఆదాయం తెచ్చే కంపెనీలకు అధిపతి అయ్యాడు.కెఎఫ్‌సి కంపెనీ తమ దుకాణంలో ఉద్యోగానికి పనికి రాడని జాక్‌ను తిరస్కరించింది. తాను జన్మించిన పట్టణానికి వచ్చే విదేశీయుల పరిచయాలతో ఆంగ్లం నేర్చుకున్న జాక్‌ తరువాత ఆంగ్లబోధకుడయ్యాడు. అదే సమయంలో ఇంటర్నెట్‌ చైనాలో ఊపందుకుంటున్నది. తన ఆంగ్ల పరిజ్ఞానంతో వాణిజ్య సంస్దలకు వెబ్‌ పేజీలను తయారు చేయటంతో తన కార్యకలాపాలను ప్రారంభించి ఆ రంగంలో ఉన్నత స్ధానాలకు ఎదిగాడు. ఇలాంటి వారెందరో తమ ప్రతిభతో బిలియనీర్లుగా మారారు.చైనాలో బిలియనీర్లుగా ఉన్న వారిలో ఇలాంటి వారే అత్యధికులు. స్వాతంత్య్రం వచ్చినపుడు మన దేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని ప్రయివేటు సంస్ధలు ఇప్పుడు ప్రభుత్వ అండతో బడా సంస్ధలుగా ఎదిగి ప్రభుత్వ రంగాన్నే కొనుగోలు చేసే స్ధాయికి ఎదిగినట్లుగా, తమకు అనుకూలమైన విధానాలను అనుసరించాలని శాసిస్తున్నారు. జాక్‌ మా వంటి వారు చైనా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే స్దాయికి ఎదిగారు. దానికి పరాకాష్టగా గతేడాది అక్టోబరులో చేసిన ఒక ప్రసంగంలో తన అంతరంగాన్ని బయటపెట్టారు. దేశ ఆర్ధిక, నియంత్రణ, రాజకీయ వ్యవస్ధలను సంస్కరించాలని, వస్తు తనఖా లేదా ఆస్తి హామీ లేకుండా రుణాలు ఇవ్వని వడ్డీ వ్యాపార దుకాణ ఆలోచనల నుంచి బ్యాంకులు బయటపడాలని చెప్పారు. ఇవి చైనా వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రచారానికి ప్రతిబింబం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. 2008లో ఇతర ధనిక దేశాల్లో వచ్చిన బ్యాంకింగ్‌ సంక్షోభం చైనాను తాకలేదు, దీనికి కారణం అక్కడి వ్యవస్ధపై ప్రభుత్వ అదుపు, ఆంక్షలు ఉండటమే. అలీబాబా ప్రభావం ఎంతగా పెరిగిపోయిందంటే దాన్ని అదుపులోకి తేవాల్సినంతగా అని సాంగ్‌ క్వింగ్‌హురు అనే ఆర్ధికవేత్త వ్యాఖ్యానించాడు.

చైనా మీద తరువాత కాలంలో వాణిజ్య యుద్దం ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ తాను అధికారం స్వీకరించిన తరువాత భేటీ అయిన తొలి చైనీయుడు జాక్‌ మా అన్నది చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు. తొలి పది రోజుల్లోనే న్యూయార్క్‌లో వారి భేటీ జరిగింది. అమెరికా వస్తువులను తన వేదికల ద్వారా చైనాలో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి పది లక్షల మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తామని జాక్‌ మా ఆ సందర్భంగా ట్రంప్‌కు వాగ్దానం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక పారిశ్రామికవేత్తగా అలా చెప్పటాన్ని తప్పు పట్టనవసరం లేదు. తమ దేశ అవసరాలు, వ్యూహంలో భాగంగా చైనా ప్రభుత్వమే జాక్‌ మా వంటి వాణిజ్యవేత్తలను ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి వేదికల మీద రాజులు, రాణులు, దేశాల అధ్యక్షులు, ప్రధానుల సరసన కూర్చో పెట్టింది. దాన్ని చూసి అది తన పలుకుబడే, గొప్పతనమే అనుకుంటే అది పతనానికి నాంది. ఎంత పెద్ద వారైనా తిరుగుతున్న చట్రం మీద కూర్చున్న జీవులు తప్ప చట్రాన్ని తిప్పే వారు కాదు. ఈ నేపధ్యంలో చైనాలో జరుగుతున్న పరిణామాలను చూడాల్సి ఉంది. వ్యవస్ధకు కంపెనీలు, వ్యక్తులు అనువుగా ఉండాలి తప్ప వ్యక్తులు,సంస్ధల కోసం వ్యవస్ధలు కాదని చైనా నాయకత్వం స్పష్టం చేయదలచుకుంది.


ఇదే సమయంలో ఒక దేశం – రెండు వ్యవస్ధలు అనే అవగాహనకు చైనా కమ్యూనిస్టు నాయకత్వం దూరంగా పోతున్నదనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. బ్రిటన్‌ కౌలు గడువు తీరిన తరువాత 1997లో హాంకాంగ్‌ ప్రాంతం, అదే విధంగా పోర్చుగీసు నుంచి మకావో ప్రాంతాలు చైనాలో విలీనం అయిన సమయంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం, ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఒప్పందం అది. ఆ మేరకు 2047 నాటికి ఈ రెండు ప్రాంతాలూ పూర్తిగా చైనా ప్రధాన వ్యవస్ధలో అంతర్భాగంగా మారాల్సి ఉంది. అప్పటి వరకు హాంకాంగ్‌లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్ధ, మకావూలో ఉన్న జూద కేంద్రాల కొనసాగింపు, పెట్టుబడులకు స్వేచ్చ ఉంటుంది. ఆ తరువాత అక్కడ కూడా ప్రధాన ప్రాంతంలోని చట్టాలు, వ్యవస్ధలోకి మారాల్సి ఉంటుంది. దీనికి అక్కడి పౌరులు సిద్దం కావాల్సి ఉంటుంది. అయితే అమెరికా, బ్రిటన్‌, ఇతర దేశాలు జోక్యం చేసుకొని హాంకాంగ్‌కు స్వాతంత్య్రం కావాలనే డిమాండ్‌ చేస్తూ ఆందోళనలకు పూనుకొనే విధంగా అక్కడి జనాలను రెచ్చగొడుతున్నారు. దాన్ని ఎదుర్కొంటూ విలీనానికి అవసరమైన చర్యలను ఒక్కొక్కటిగా చైనా తీసుకొంటోంది. అది పూర్తిగా చైనా అంతర్గత వ్యహారం, అయినా ఏదో ఒక పేరుతో మన దేశంతో సహా అనేక దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి.

తైవాన్‌ మీదకు చైనా యుద్ద విమానాలు వెళ్లాయంటూ ఇటీవల కొన్ని సంచలనాత్మకంగా వార్తలను మీడియా ముందుకు తెచ్చింది. అది నిరంతర ప్రక్రియ. చైనా ప్రధాన భూ భాగానికి దూరంగా ఉన్న ఒక దీవి రాష్ట్రం తైవాన్‌.అది తిరుగుబాటు రాష్ట్రంగా విడిగా ఉంటోంది. తైవాన్‌ ప్రత్యేక దేశం కాదని, చైనాలో అంతర్భాగమే అని ఐక్యరాజ్యసమితి ఎప్పుడో గుర్తించింది. బలవంతంగా విలీనం చేసుకోవాలంటే చైనాకు పెద్ద సమస్య కాదు, సామరస్యపూర్వకంగా విలీనం జరగాలని కోరుకుంటోంది. అమెరికా, ఇతర దేశాలు తైవాన్‌లో జోక్యం చేసుకొని దానికి ఆయుధాలు అందిస్తున్నాయి, దాని తీరాలకు యుద్ద నావలను పంపి విన్యాసాల పేరుతో చైనాను రెచ్చగొడుతున్నాయి. ఇలా చేసినపుడల్లా విదేశీ జోక్యం దారులకు హెచ్చరికా చైనా నౌకలు విన్యాసాలు చేస్తుంటాయి, విమానాలు ఎగిరి వెనక్కు వస్తుంటాయి తప్ప ఎన్నడూ దాడులు చేయలేదు.తైవాన్‌లో, హాంకాంగ్‌లో జోక్యం ద్వారా చైనాను రెచ్చగొట్టి యుద్దానికి దింపాలన్నది సామ్రాజ్యవాదుల ఎత్తుగడ. వాటి వలలో పడకుండా చైనా తనదైన శైలిలో వ్యవహరిస్తోంది. తన జన జీవితాలను మెరుగుపరచటమే చైనాకు ప్రధమ ప్రాధాన్యత తప్ప యుద్దం కాదు.అదే సమయంలో అనివార్యం అయితే అందుకు అనుగుణ్యంగా తన ఆయుధాలకూ పదును పెడుతోంది. దాని బలం అమెరికా, ఇతర దేశాలనూ దుందుడుకు చర్యలకు పాల్పడకుండా నిలువరిస్తోంది.

అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు చైనా మీద సాగిస్తున్న ప్రచ్చన్న యుద్దంలో చైనాలోని గ్జిన్‌ జియాంగ్‌ రాష్ట్రం కేంద్ర స్ధానంగా మారింది. అక్కడ ఉన్న ముస్లిం మైనారిటీలను సర్కార్‌ అణచివేస్తున్నదని, నిర్బంధంగా చాకిరీ చేయిస్తూ మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నదని కొంత కాలం ప్రచారం చేశారు. ఇప్పుడు దాని కొనసాగింపుగా మానవహక్కులకు భంగం కలిగించే ప్రాంతం నుంచి ఉత్పత్తి అయ్యే చైనా వస్తువులను బహిష్కరించాలని అనేక దేశాలు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఆంక్షలు ప్రకటించింది, మరికొన్ని దేశాలు అప్రకటితంగా అమలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రం చుట్టూ రష్యా, మంగోలియా, కిర్ఖిజిస్తాన్‌, తజికిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్దాన్‌, మన దేశ సరిహద్దులు ఉన్నాయి. కోటీ 30లక్షల మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. పొరుగుదేశాల నుంచి జోక్యం చేసుకుంటున్న శక్తులు అక్కడ వేర్పాటు వాదులను, ఉగ్రవాదులకు ప్రోత్సహిస్తున్నాయి. అనేక దేశాల మాదిరే చైనా కూడా తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్నది. వాటిని మానవహక్కుల హననంగా చిత్రించి ప్రచారం చేస్తున్నారు. ఇస్లామిక్‌ దేశాలను రెచ్చగొడుతున్నారు. ప్రపంచ మార్కెట్లో మూడో వంతు దుస్తులు, వస్త్రాలు చైనా నుంచి వస్తున్నాయి. ఏటా చైనా చేస్తున్న 300 బిలియన్‌ డాలర్ల వస్తు ఎగుమతుల్లో 120బిలియన్‌ డాలర్లు వీటి నుంచే వున్నాయి. చైనాలో ఉత్పత్తి అయ్యే పత్తిలో 87శాతం గ్జిన్‌ జియాంగ్‌ రాష్ట్రం నుంచే ఉంది.ఆ రాష్ట్రం కొత్తగా చైనాలో చేరింది కాదు, జౌళి ఉత్పత్తులు కొత్తగా జరుగుతున్నవీ కాదు. వాటిని దిగుమతి చేసుకొని లబ్ది పొందని పశ్చిమ దేశమూ లేదు. అందువలన అక్కడ మానవ హక్కులకు భంగం కలుగుతోందనే పేరుతో చైనా జౌళి ఎగుమతులను దెబ్బతీయాలన్నది అమెరికా అండ్‌కో ఎత్తు గడ. అందుకోసం ప్రచార, దౌత్య, ఆర్ధిక యుద్ద రంగాలను తెరిచి చైనాను ఉక్కిరి బిక్కిరి చేయటం అసలు లక్ష్యం.అదే జరుగుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరోనా వాక్సిన్‌ రాజకీయాలు – కమ్యూనిస్టు క్యూబా ఆదర్శం !

16 Friday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science, USA

≈ Leave a comment

Tags

Big Pharma Vaccine Profits, Corona vaccine, Cuba Corona Vaccine, Vaccine Nationalism, world Vaccine politics


ఎం కోటేశ్వరరావు


అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్న సద్భావం గురించి తెలిసిందే. అదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా నుంచి సురక్షితంగా బయటపడేంత వరకు ఎవరికీ రక్షణ ఉండదు అని గ్రహించాలి. కొత్త రకం వైరస్‌లు తయారు కావటం, వాటి నిరోధానికి జరుగుతున్న పోరాటం ముఖ్యంగా కరోనా మానవాళికి చరిత్రలో ఎదురైన అతిపెద్ద సవాలు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా మన దేశంలోనూ, ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్రిక్తతలకు కారణం అవుతున్న అమెరికా సామ్రాజ్యవాదులు తీరుతెన్నులు అందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కరోనా నుంచి కూడా లాభాలు పిండుకొనేందుకు ఔషధ కార్పొరేట్లు ప్రయత్నించటం దారుణం. వాక్సిన్‌ పంపిణీ, లభ్యత అసమానంగా ఉంటే ఏడాదికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు 1.2లక్షల కోట్ల డాలర్ల నష్టం అని రాండ్‌ కార్పొరేషన్‌ అంచనా వేసింది. వాక్సిన్లు సమ ప్రాతిపదికన పంపిణీ చేయనట్లయితే ప్రపంచానికి నైతికంగా, ఆర్ధికంగా వినాశకరమే అని ప్రపంచ ఆరోగ్య సంస్ద డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ చెప్పారు. ఇది రాసిన సమయానికి అమెరికా తరువాత స్ధానంలో ఉన్న బ్రెజిల్‌ను కిందికి నెట్టి మన దేశం మొత్తం కేసుల్లో రెండవ స్దానంలో ఉంది. ఏప్రిల్‌ 16న రెండు లక్షల పదహారువేలకు పైగా కేసులు రోజుకు నమోదయ్యాయి. మహారాష్ట్ర తరువాత ఉత్తర ప్రదేశ్‌ రెండవ స్ధానంలో ఉంది.
కొత్త కరోనా వైరస్‌లు పెరుగుతున్న నేపధ్యంలో పాత వైరస్‌కు తయారు చేసిన వాక్సిన్ల గురించి ఒక వైపు అనుమానాలు. మరోవైపు సాధ్యమైన త్వరగా దాన్నుంచి లబ్ది పొందాలని కార్పొరేట్లు ప్రయత్నిస్తున్నాయి. వాక్సిన్లు వస్తాయి, 2020 డిసెంబరు నాటికి కరోనాను అదుపులోకి తెస్తాము, త్వరలో సామూహిక రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పిన వారి అంచనాలు తప్పాయి. ఆశించిన వారికి కొత్త రకాల విజృంభణతో ఆశాభంగం కలిగేలా పరిణామాలు ఉన్నాయి. పరిమిత మరణాలతో వ్యాధి తీవ్రత తగ్గటానికి వాక్సిన్లు మినహా మరొక మార్గం కనిపించటం లేదు. అదే సమయంలో అవే కరోనాను కట్టడి చేస్తాయనే హామీ లేదు. కొత్త వైరస్‌ను కనుగొనే సామర్ధ్యమే అనేక దేశాలకు లేని స్ధితిలో వాటికి వాక్సిన్లు తయారు చేయటం ఎంత పెద్ద సవాలో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే. కనిపిస్తున్నదాని కంటే పరిస్ధితి తీవ్రంగా ఉంది.


గతేడాది మార్చినెల 14న దేశంలో ఇరవై కొత్త కేసులు నమోదైతే సెప్టెంబరు 16న గరిష్టంగా 97,894కు పెరిగి తరువాత క్రమంగా తగ్గాయి. ఈ ఏడాది మార్చి 14న 26,971నమోదు కాగా నెల రోజుల్లో ఏప్రిల్‌ 15న 2,17,353కి పెరిగాయి. ఇంత వేగంగా పెరుగుతున్నప్పటికీ లక్షల మంది గుమికూడే కుంభమేళాను ప్రభుత్వాలు అనుమతించాయి. దానికి సమర్ధన విచిత్రంగా ఉంది. రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఏప్రిల్‌ 30వరకు జరిగే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే హరిద్వార్‌లో రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అనేక మంది సాధువులకు కరోనా సోకిందని ఒక అఖారా ప్రకటించి కుంభమేళాలను ముగించాలని కోరింది. ఆ పిలుపును ఎవరూ లెక్క చేయటం లేదు. కుంభమేళా జరిగేది ఉత్తరా ఖండ్‌లో అయినప్పటికీ పాల్గొనేవారు దేశం మొత్తం నుంచి వచ్చేవారుంటారు. అందువలన వారికి అంటుకుంటే అది దేశం మొత్తానికి అంటిస్తారు. పుణ్యం పోయి పాపం చుట్టుకుంటుంది అన్న స్పృహకూడా లేకుండా పాల్గొనేవారు, వారిని ప్రోత్సహిస్తున్నవారూ ఉండటం విచారకరం, గర్హనీయం.


కొత్త కరోనా వైరస్‌ రకాల గురించి తక్షణమే కేంద్రీకరించాలని, ఉన్న వాక్సిన్ను అందరికీ సమాన ప్రాతిపదికన అందించాలని, గరిష్టంగా వైరస్‌ను అణచివేయాలని ప్రపంచంలోని ప్రముఖులు పిలుపు నిచ్చారు. ఒకసారి వైరస్‌ సోకి రోగనిరోధక శక్తి పెంపొందిన తరువాత తిరిగి వైరస్‌ సోకదని చెబుతారు. అయితే కొత్త రకాలు వస్తున్నందున వాటికి గతంలో వచ్చిన వారా లేదా అనే విచక్షణ ఉండదు, ఎవరికైనా మరోసారి సోకుతుంది గనుక గతంలో తీసుకున్న జాగ్రత్తలన్నీ ఇప్పుడు కూడా పాటించాలి. సామాజిక వ్యాప్తి నిరోధానికి అంతర్జాతీయంగా మరింత సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సి ఉంది.


మార్చి నెలాఖరుకు ఉన్న సమాచారం ప్రకారం వాక్సిన్‌ తయారీలో చైనా అగ్రస్ధానంలో ఉండగా తరువాత అమెరికా, భారత్‌, ఐరోపాయూనియన్‌, బ్రిటన్‌ ఉన్నాయి. వీటిలో అమెరికా,బ్రిటన్‌ తమ దేశాల్లో తయారయ్యే వాక్సిన్‌ స్ధానిక వినియోగానికి మాత్రమే అని ప్రకటించాయి.ఐరోపా యూనియన్‌ తమ సభ్యదేశాల మధ్యనే వినియోగిస్తున్నది. చైనా, భారత్‌లు మాత్రమే ఇతర దేశాలకు ముఖ్యంగా పేద, అభివృద్ది చెందుతున్న దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అయితే ప్రతి దేశం వాక్సిన్‌ దౌత్యానికి పాల్పడుతున్నదనే విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవం లేదని చెప్పలేము. కమ్యూనిస్టు వ్యతిరేకత, ఇతర రాజకీయ కారణాలతో చైనా వాక్సిన్ల సామర్ధ్యం మీద తప్పుడు ప్రచారం చేయటంతో పాటు వాటిని తిరస్కరించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ కారణాలతో పాటు మన దేశంలో తయారీ ఖర్చు తక్కువగా ఉండటంతో అనేక బహుళజాతి కంపెనీలు తమ ఉత్పత్తులను మన దేశంలో తయారు చేయిస్తున్నాయి. ఈ కారణంగా రాబోయే రోజుల్లో చైనా కంటే మన దేశం ఉత్పత్తిలో ముందుండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే చైనాలో ఉన్న సంస్ధలు మనకంటే ఎక్కువగా ఉత్పత్తి చేయగల స్థితిలో ఉన్నాయి.


అనేక అంశాలలో సోషలిస్టు దేశాలు-ఇతర దేశాల మధ్య స్పష్టమైన తేడాలను గతంలో ప్రపంచం చూసింది. ఇప్పుడు కరోనా విషయంలో కూడా అదే వెల్లడైంది. చైనా, వియత్నాం కరోనాను ఎలా కట్టడి చేశాయో, ఆర్ధిక దిగజారుడును ఎలా తప్పించాయో తెలిసిందే. అమెరికాలో తయారు చేసిన వాక్సిన్లకు పేటెంట్‌ హక్కు ఉన్న కారణంగా లాభాల కోసమే వాటిని తయారు చేస్తున్నారు. సామాన్యులకు వాటి ధర అందుబాటులో ఉండదు. కోవిషీల్డ్‌ను మన దేశంలో తయారు చేస్తున్న పూనాలోని సీరం సంస్ధ ప్రభుత్వానికి ఒక డోసును 150 రూపాయలకు ఇస్తున్నామని, బయటి మార్కెట్లో వెయ్యి రూపాయలకు అమ్ముకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఎగుమతుల మీద నిషేధం విధించిన కారణంగా తమకు నష్టం వస్తున్నదని అందువలన కేవలం మన దేశానికి మాత్రమే తయారు చేయాలంటే ఉత్పాదకత సౌకర్యాలను పెంచేందుకు ప్రభుత్వం తమకు మూడువేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరింది. ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని వత్తిడి చేస్తోంది. వివిధ రకాల వాక్సిన్లు అందుబాటులో లేని కారణంగా పేద, వర్దమాన దేశాల్లో ఏటా పదిహేను లక్షల మంది మరణిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలకు భిన్నంగా తాము తయారు చేసిన వాక్సిన్‌ ఎవరైనా తయారు చేసేందుకు దాని ఫార్ములాను అందచేస్తామని, పేటెంట్‌ హక్కును వదులు కుంటామని క్యూబా ప్రకటించింది.గతంలో పోలియో వాక్సిన్‌ కనుకొన్న అమెరికా శాస్త్రవేత్త జోనాస్‌ సాక్‌ దాని మీద పేటెంట్‌ హక్కును వదలుకొని ప్రపంచంలో ఎవరైనా తయారు చేసేందుకు అవకాశం ఇచ్చిన ఆదర్శానికి అనుగుణ్యంగా ఇది ఉంది.

మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌ వంటి ఇతర ఔషధ కంపెనీలు వాక్సిన్‌ పరిశోధనలకు ప్రభుత్వాల నుంచి పెద్ద మొత్తంలో నిధులు పొందినప్పటికీ, వాటి ఫార్ములాను ఇతరులకు అందించేందుకు నిరాకరిస్తున్నాయి. జనం ప్రాణాలు కోల్పోయినా సరే తమ లాభాల వేటలో ఉన్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్ధ కరోనా వాక్సిన్‌ తయారీ కార్యక్రమంలో 142 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. నూటముప్పయి కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికా ఖండానికి జూన్‌ నాటికి కేవలం కోటీ 40లక్షల డోసులు మాత్రమే అందుతాయని గార్డియన్‌ పత్రిక విశ్లేషించింది. ప్రపంచవ్యాపింగా 700 కోట్ల డోసులు కొనుగోలు చేస్తే వాటిలో 420 కోట్లు ప్రధాన పెట్టుబడిదారీ దేశాలకే పోతున్నదని కూడా తెలిపింది. నిజానికి ప్రపంచ జనాభా మొత్తానికి వాక్సిన్ల తయారీకి అవకాశాలున్నప్పటికీ లాభాల కోసం ఆ పని చేయటం లేదు. అంతిమంగా కొన్ని లక్షల కోట్ల డాలర్లను కార్పొరేట్లు లాభం పొందితే ఆ మేరకు సామాన్యజనం నష్టపోతారు.


లాటిన్‌ అమెరికాలో క్యూబాతో పోలిస్తే ధనిక దేశాలు అనేకం ఉన్నాయి. కానీ కరోనా వ్యాక్సిన్సు రూపొందించిన దేశం క్యూబా ఒక్కటే. ఐదు రకాల వాక్సిన్ల తయారీకి పూనుకొని రెండింటిని జనానికి అందుబాటులోకి తెచ్చింది. మే నెలాఖరుకు పెద్ద వారందరికీ వాక్సిన్లు వేయనున్నారు.ఆగస్టు నాటికి 70శాతం మందికి ఏడాది ఆఖరుకు మొత్తం జనాభాకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఒక్క కరోనానే కాదు అన్ని వాక్సిన్లు అక్కడి జనానికి ఉచితంగానే వేస్తారు. కరోనా వాక్సిన్ను తమ పౌరులకే కాదు, తమ దేశ పర్యటనకు వచ్చిన వారందరికీ కావాలంటే వేస్తున్నారు. మా దగ్గర లేని దాన్ని మేం ఇవ్వలేము, ఉన్నదాన్ని అందరం పంచుకుంటాం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు.

బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ ( మన దేశంలో కోవీషీల్డ్‌ పేరుతో సీరం సంస్ధ తయారు చేస్తున్నది) అభివృద్దిలో 97శాతం సొమ్ము ప్రజల నుంచి లేదా దాతల నుంచి వచ్చిందే అని తేలింది. అంతేకాదు రెండువేల సంవత్సరం నుంచి జరుపుతున్న వివిధ పరిశోధనల సారాన్ని విశ్వవిద్యాలయ పరిశోధకులు వినియోగించుకున్నారు. కరోనా వాక్సిన్‌ తయారీకి ధనాశ, పెట్టుబడిదారీ విధానమే కారణమని దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చేసిన వ్యాఖ్యలోని డొల్లతనాన్ని గార్డియన్‌ పత్రిక బయటపెట్టింది. ప్రయివేటు పెట్టుబడిదారుల నుంచి కేవలం 2.8శాతం నిధులు మాత్రమే అందాయని, పారదర్శకత లేని కారణంగా వివరాలు జనానికి తెలియటం లేదని పేర్కొన్నది. ఎలాంటి ప్రతిఫలం కోరకుండానే వాక్సిన్‌ తయారు చేసే అర్హత ఉన్నవారందరికీ ఫార్ములా అందచేస్తామని తొలుత ఆక్స్‌ఫర్డ్‌ ప్రకటించింది. అయితే గతేడాది ఆగస్టులో బిల్‌గేట్స్‌ కోరిక మేరకు బ్రిటీష్‌-స్వీడిష్‌ ఔషధ తయారీ సంస్ధ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది. అది వివిధ దేశాలో సీరం వంటి సంస్దలతో ఒప్పందాలు చేసుకొని ఉత్పత్తి చేయిస్తున్నది. లాభాల కోసం తాము వాక్సిన్‌ విక్రయాలు జరపం అని, ఆ మేరకు ఉత్పత్తిదారులతో ఒప్పందం చేసుకుంటామని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత వాక్సిన్‌ ధరను నిర్ణయించే హక్కును అట్టిపెట్టుకున్నట్లు తెలిపింది. ఇక్కడే అసలు కీలకం ఉంది. వాక్సిన్లు పరిమితం కాలం మాత్రమే ప్రభావం చూపుతాయని అందువలన రాబోయే సంవత్సరాలలో అదనపు డోసులను ఇవ్వాల్సి వస్తే దాన్ని లాభాలకు ఉపయోగించుకోవాలన్న దూరాలోచన దాని వెనుక ఉంది. వాక్సిన్ల తయారీకి సంవత్సరాల సమయం పట్టటం, ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉండటం, దాని ఉపయోగం పరిమిత కాలమే అయితే నష్టం కనుక ఔషధ సంస్ధలు పరిశోధనలకు మొగ్గుచూపటం లేదు. అటువంటి స్ధితిలో కరోనా వాటికి ఒక వరం మాదిరి తయారైంది. లాభాలు పిండుకోవచ్చని అంచనా వేస్తున్నారు.


కరోనా వాక్సిన్‌ తయారీ సంస్ధలు ఉత్పత్తి రేటు కంటే ప్రభుత్వానికి తక్కువకు ఇస్తున్నామని చెబుతున్నాయి. పరిశోధన-అభివృద్ధి ఖర్చు, పంపిణీ, మార్కెటింగ్‌ ఖర్చు లేనందున అవి వాటికి కలసి వచ్చినట్లే. ఏ ప్రయివేటు సంస్ధా లాభం లేకుండా ఏ పనీ చేయదు. గరిష్ట స్ధాయిలో ఉత్పత్తి చేస్తున్నందున టర్నోవరు ఎక్కువగా ఉండి లాభాలు దండిగానే ఉంటాయి. ప్రభుత్వ కార్యక్రమం ముగిసిన తరువాత అవి ఎంత చెబితే అంతకు జనం కొనుగోలు చేయాల్సిందే. లాభాల గురించి అడిగితే ఇంతవరకు ఏ సంస్దా నోరు విప్పేందుకు సిద్దంగా లేదు. పూనాలోని సీరం సంస్ద ప్రధానంగా వాక్సిన్ల తయారీమీదే కేంద్రీకరించింది.


చైనా విషయానికి వస్తే కరోనా వాక్సిన్‌ ప్రజా వస్తువు అని ప్రకటించింది. అనేక దేశాలకు అందచేస్తామని ప్రకటించింది. అయితే అదేమీ వాణిజ్య ప్రాతిపదిక కాదు, అలాగని ఉచితమూ కాదు. మన దేశం విరాళంగా ఇస్తున్నట్లే అది కూడా ఇస్తోంది. ప్రతి వాక్సిన్‌ సామర్ధ్యం గురించి అనేక అనుమానాలు ఉన్నాయి, కొన్ని ఎక్కువ మరికొన్ని తక్కువ కావచ్చు. తమ ప్రత్యర్ధి సంస్ధ తయారు చేస్తున్నది ఒట్టి నీళ్లే అని మన దేశంలోని ఒక సంస్ధ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. తరువాత ఆ రెండూ సర్దుబాటు చేసుకొని నోరుమూసుకున్నాయి. చైనాలో ప్రస్తుతం కేసులేవీ లేవు ఉన్నా వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోదగ్గవి కాదు కనుక అక్కడ వాక్సిన్‌ తయారీ విదేశాలకు అందచేయటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగని దేశీయంగా వాక్సిన్లు వేయటం లేదని కాదు. వెయ్యి పడకల ఆసుపత్రిని వారం రోజుల్లో సిద్దం చేయగలిగిన వారికి అవసరమైతే వాక్సిన పెద్ద ఎత్తున తయారు చేయటం పెద్ద సమస్య కాదు.


కరోనా కాటుకు జనం బలవుతున్నా కొన్ని దేశాలు రాజకీయాలు మానుకోలేదు. తప్పుడు ప్రచారాన్ని వ్యాపింప చేస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా వాక్సిన్‌ తీసుకున్నవారిలో రక్తం గడ్డకడుతున్నదనే సాకుతో అనేక దేశాలు దాన్ని నిషేధించాయి. దీనిలో శాస్త్రం కంటే ఇతర అంశాలే ప్రధానంగా ఉన్నాయని అనేక మంది నిపుణులు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారు చేసినదాని మీదే ఇంత రాజకీయం చేస్తుంటే చైనా తయారు చేసిందాని గురించి తప్పుడు ప్రచారంలో ఆశ్చర్యం ఏముంటుంది ?

హొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా అదరగొండితనం-తేలుకుట్టిన నరేంద్రమోడీ !

14 Wednesday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#USS John Paul Jones, 7th Fleet, Freedom of Navigation Programme, India’s EEZ, Narendra Modi


ఎం కోటేశ్వరరావు


అరేబియా సముద్రంలో కేరళకు దగ్గరగా ఉన్న లక్ష దీవుల చుట్టూ ఉన్న మన ప్రత్యేక ఆర్ధిక మండలి(ఇఇజెడ్‌) ప్రాంతంలోకి ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా యుద్ద నావ ఏప్రిల్‌ ఏడున ప్రవేశించింది. ఆ విషయాన్ని అదే రోజు అమెరికా ప్రకటించిన తరువాత రెండు రోజులకు మన ప్రభుత్వం దౌత్య పద్దతిలో నిరసన తెలిపింది. కేరళలోని కొచ్చి నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లక్ష దీవులు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం(వాటిని పాటిస్తే ) ప్రతి దేశానికి తన తీరం నుంచి సముద్రంలో 200 నాటికల్‌ మైళ్లు లేదా 370 కిలోమీటర్ల మేరకు హక్కు ఉంటుంది. ఆ మేరకు అక్కడ ఉండే గ్యాస్‌, చమురు, ఖనిజాలు, చేపల వంటి సంపదలపై ఆ దేశాలకు హక్కు ఉంటుంది. ఆ పరిధిలోకి ఎవరైనా ప్రవేశించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీన్ని అమెరికా అంగీకరించటం లేదు, అందువల్లనే తాము అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని నౌకాయానం చేసే హక్కు, స్వేచ్చ తమకు ఉన్నదని అమెరికా సప్తమనౌకాదళంలోని డిస్ట్రాయర్‌ నౌక యుఎస్‌ఎస్‌ జాన్‌ పాల్‌ జోన్స్‌ అధికారులు ఏప్రిల్‌ ఏడవ తేదీన ప్రకటించారు. ఇది అనుచితం అంటూ మన దేశం నిరసన తెలిపింది. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా విదేశీ నౌకలు ప్రవేశించరాదని పేర్కొన్నది. ఆయా దేశాల ప్రత్యేక జోన్ల తీరాలకు రావటం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలతో మిలిటరీ విన్యాసాలు- చర్యలు అనుమతి లేకుండా జరపరాదని ఐరాస తీర్మానాలున్నాయని పేర్కొన్నది. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి మలక్కా జలసంధి వరకు పహారాలో భాగంగా ప్రయాణిస్తూ అనుమతి లేకుండా మన జలాల్లో లక్ష ద్వీపాలకు పశ్చిమంగా 130 నాటికల్‌ మైల్‌ వరకు అమెరికా నౌక వచ్చింది.


చిత్రం ఏమిటంటే గతంలో కూడా అనేక సార్లు ఇలా అక్రమంగా ప్రవేశించినా ఆ విషయాన్ని అమెరికా ఎన్నడూ బహిరంగంగా ప్రకటించలేదు, మన దేశం ఎందుకు నిరసన తెలపలేదు. ఇప్పుడెందుకు అలా జరిగాయి అన్న ప్రశ్న తలెత్తింది. అనుమతి లేకుండా అమెరికా యుద్ద నౌక చివరిసారిగా 2018 అక్టోబరు ఒకటి నుంచి 2019 సెప్టెంబరు 30వరకు తిరిగింది. హిందూ మహా సుముద్రం ప్రాంతలో గగన తల, నౌకాయాన కార్యకలాపాలు నిర్వహించేందుకు తమకు హక్కుందని, వాటిని కాపాడుకొనేందుకు పర్యటించినట్లు అమెరికా రక్షణ శాఖ నివేదికలో పేర్కొన్నారు. అంతకు ముందు 2015,16,17 సంవత్సరాలలో కూడా ఇలాగే అనుమతి లేకుండా పర్యటించినా ఎన్నడూ బహిరంగ ప్రకటన చేయని అమెరికా ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు ప్రకటించింది. 1991 నుంచి ఇప్పటి వరకు మూడు దశాబ్దాల్లో 20సార్లు మన అనుమతి లేకుండా అమెరికా నావలు మన జలాల్లో తిరిగాయి.


ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా తమ మిలిటరీ తిరుగుతుంటుందని, అంతర్జాతీయ చట్టాల మేరకు తమకు హక్కు ఉందని తెలియచెప్పేందుకే ఈ పని చేస్తామని కూడా అమెరికా తెలిపింది. ఇదేదో ఒక దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నది లేదా రాజకీయ ప్రకటనలు చేసేందుకు కాదని, గతంలోనూ చేశామూ, భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఆయా దేశాలు తమకు లేని హక్కులను ప్రకటించుకుంటున్నాయని, అలాంటి వాటిని గుర్తించి ప్రతి చోటా దాన్ని సవాలు చేస్తూ తాము తిరుగుతుంటామని తెలిపింది.బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రాలకు అమెరికాకు సంబంధం లేదు. ఈ ప్రాంతంలో పహారా కాయమని వారిని ఎవరు అడిగారు, ఎవరి కోసం ఆ పని చేస్తున్నారు. ప్రపంచ పోలీసుగా తనకు తానే ప్రకటించుకొని ఈ పని చేస్తున్న అదరగొండితనం తప్ప మరొకటి కాదు.
2019లో అండమాన్‌-నికోబార్‌ దీవుల జలాల్లోకి చైనా నౌక ప్రవేశించినపుడు వెనక్కు పంపించారు. మరి అమెరికా నావలు 20సార్లు ప్రవేశిస్తుంటే మన మిలిటరీ, ప్రభుత్వం ఏమి చేస్తున్నది? అమెరికా తాజాగా చేసిన ప్రకటన గురించి అనేక వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ఇది చైనాను ఉద్దేశించి చేసినట్లు బలంగా వినిపిస్తున్న అంశం. ఇదే సమయంలో మన దేశానికి కూడా హెచ్చరిక అన్నది మరొకటి. ఒక వేళ చైనాకు హెచ్చరిక అయితే మన ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు ? అనేక దేశాల విషయంలో అమెరికా అతిక్రమణలకు పాల్పడినపుడు ఎందుకు చేయలేదు ?

దక్షిణ చైనా సముద్రంలోని దీవులపై తమకు హక్కు ఉన్నదని చైనా చేస్తున్న వాదనను అమెరికా, మరికొన్ని దేశాలు అంగీకరించటం లేదు. నిజానికి వాటి మీద చైనా పొరుగుదేశాలు తమ హక్కుల గురించి వివాదాన్ని లేవనెత్తితే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి సంబంధమూ లేని అమెరికా ముందుకు వస్తోంది. అంతేకాదు, గతంలో తాము చైనాను ఆక్రమించిన సమయంలో కొన్ని దీవులు తమ ఆధీనంలోకి వచ్చాయని, వాటిమీద హక్కు తమదే అని జపాన్‌ వాదిస్తోంది. ఈ వివాదంలో మన దేశానికి ఎలాంటి సంబంధం లేకపోయినా అంతర్జాతీయ జలాల్లో స్వేచ్చగా విహరించే హక్కు ఉన్నదని స్పష్టీకరించేందుకు అంటూ మన దేశం కూడా అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో చతుష్టయం పేరుతో చేతులు కలిపింది. అమెరికా తెలివిగా మన దేశాన్ని చైనాతో సరికొత్త వివాదంలోకి దించింది. అనేక మిలిటరీ సంబంధ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు మనం వెనక్కు రాలేని పరిస్ధితి ఏర్పడిందని గ్రహించిన తరువాత అమెరికా తన అసలు రూపాన్ని బయటపెట్టి చివరికి మన హక్కులను కూడా సవాలు చేస్తోంది. తేలుకుట్టిన దొంగ మాదిరి మన పరిస్దితి తయారైందని చెప్పవచ్చు.


తీరదేశాల హక్కులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఒప్పందం 1994లో అమల్లోకి వచ్చింది. దాన్ని 168 దేశాలు నిర్ధారించగా అమెరికా ఇంతవరకు ఆమోదించలేదు. మన దేశం మరుసటి ఏడాదే ఆమోదించింది. దానిలో ఉన్న రెండు వందల నాటికల్‌ మైళ్ల పరిధిని 350 మైళ్లకు పెంచాలని 2010లో మన దేశం ఐరాసకు దరఖాస్తు చేసింది.దీని మీద ఎలాంటి నిర్ణయం జరగలేదు.అంగీకరిస్తే ఆ పరిధిలోపల ఉన్న సహజ సంపదలపై మనకు హక్కు వస్తుంది.దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకల ప్రయాణం తమ జాతీయ భద్రతకు అవసరమని మోకాలికి -బోడి తలకు ముడి వేసినట్లుగా అమెరికా వాదిస్తున్నది. ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు తమకు హక్కున్నదని వాదిస్తోంది. పసిఫిక్‌ సముద్రం-మలక్కా జలసంధి మధ్య దక్షిణ చైనా సముద్రం వాటిజ్య నౌకా ప్రయాణానికి కీలకం. ఏటా నాలుగున్నరలక్షల కోట్ల డాలర్ల విలువగల వాణిజ్యం ఈ మార్గం గుండా జరుగుతున్నట్లు అంచనా.


సముద్ర చట్టాల్లో ఉన్న లోపాలు లేదా ఏకాభిప్రాయం లేకపోవటం లేదా చట్టాలకు చెబుతున్న భాష్యాల కారణంగా అనేక దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఉదాహరణకు దక్షిణ చైనా సముద్రంలో ఉన్న హైనాన్‌ దీవి చైనాలో ఒక రాష్ట్రం. అదే విధంగా ఆ సముద్రంలోని ఇతర చైనా దీవులు కూడా ఇలాగే సుదూరంగా ఉన్నాయి. అందువలన వాటి చుట్టుపక్కల 370 కిలోమీటర్ల వరకు చైనాదే అధికారం. కొన్ని దీవులు తమవని తైవాన్‌ అంటోంది. తైవాన్‌ ప్రస్తుతం విడిగా ఉన్నప్పటికీ అది చైనాలో అంతర్భాగమే కనుక ఎప్పుడైనా విలీనం కావాల్సిందే, అప్పుడు ఆ దీవులు కూడా చైనాకే చెందుతాయి. దీన్ని అమెరికా అంగీకరించటం లేదు. అదే విధంగా ఆ ప్రాంతంలోని వియత్నాం, ఫిలిప్పైన్స్‌, దక్షిణకొరియా, ఇతర దేశాలైన జపాన్‌, రష్యా, శ్రీలంక, మాల్దీవులు, భారత్‌ తీరాల్లోని అధికారాన్ని కూడా అమెరికా సవాలు చేస్తోంది. దానికి తన పెత్తనం, ప్రయోజనాలు తప్ప మిత్ర-శత్రు దేశాలనే తేడా లేదు. ఉంటే మన దేశం గురించి ఇలాంటి ప్రకటన చేసి ఉండేది కాదు. లక్షద్వీపాల ప్రత్యేక ఆర్ధిక ప్రాంతం గురించి అమెరికా చేసిన ప్రకటన పదజాలం గతంలో శత్రుదేశంగా పరిగణించే చైనాతో మాత్రమే చేసింది. ఇంతవరకు జపాన్‌, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల విషయంలో ఉపయోగించలేదు. దీంతో మన నేతల ముఖాలు కందగడ్డల్లా రంగుమారాయని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. గిల్లి జోలపాడటం అమెరికా ఎత్తుగడల్లో ఒకటి. ఇప్పుడు నరేంద్రమోడీ సర్కార్‌ ఇరకాటంలో పడటంతో అమెరికా తన ప్రకటనను సమర్ధించుకుంటూనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. భారత్‌తో భాగస్వామ్యానికి మేము ఎంతో విలువ ఇస్తాము. ఇది మీ గురించి కాదు, అంతర్జాతీయంగా మేము ఎప్పుడూ చేస్తున్నదానిలో భాగంగానే ఇక్కడా చేశాము తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. నరేంద్రమోడీ లేదా విదేశాంగ, రక్షణ మంత్రుల నోట మాటరాలేదు. వివాదాన్ని మూసిపెట్టే ప్రయత్నం జరుగుతోంది.


ఆయా దేశాలు తమవి అని చెబుతున్న సముద్ర ప్రాంతాల్లోకి ప్రవేశించి మీవి అంటే కుదరదు అంటూ అమెరికా గత ఏడాది నవంబరు నుంచి ప్రవేశించిన ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి. నవంబరు 24న జపాన్‌ సముద్రంలో తన ప్రాంతం అని రష్యా చెబుతున్న చోటికి యుఎస్‌ఎస్‌ జాన్‌ మెకెయిన్‌, డిసెంబరు 15న జపాన్‌ జలసంధిలోకి యుఎస్‌ఎన్‌ఎస్‌ అలాన్‌ షెపర్డ్‌, డిసెంబరు 22న దక్షిణ చైనా సముద్రంలోని చైనాకు చెందిన స్పార్టలే దీవుల సమీపానికి జాన్‌ మెకెయిన్‌ ప్రవేశించింది. ఈ ప్రాంతానికి రావటానికి ఇవి తమవి అని చెబుతున్న చైనా, వియత్నాం దేశాల అనుమతి తీసుకోనవసరం లేదని మన లక్షదీవుల పర్యటన మాదిరే అమెరికా ప్రకటించింది. డిసెంబరు 24న జాన్‌మెకెయిన్‌ దక్షిణ చైనా సముద్రంలోని కాన్‌ డావో దీవుల సమీపానికి, ఫిబ్రవరి 5న అదే సముద్రంలోని పార్సెల్‌ దీవులు, ఫిబ్రవరి 17న రస్సెల్‌ ఓడ స్పార్టలే దీవుల ప్రాంతానికి, మార్చి 31న దక్షిణ కొరియా కుక్‌ టో దీవుల సమీపానికి చార్లెస్‌ డ్రా, ఏప్రిల్‌ 3న జాన్‌ పాల్‌ శ్రీలంక ప్రాంతానికి, ఏప్రిల్‌ ఏడున భారత్‌ మరియు మాల్దీవుల ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశించింది.ప్రకటనలో శ్రీలంక, మాల్దీవులను వదలి మన దేశాన్ని మాత్రమే పేర్కొన్నది.

ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా అన్ని ఖండాలలో పన్నెండు నౌకా దళాలను ఏర్పాటు చేసింది. వాటిలో లక్ష్యం పూర్తి అయిన తరువాత ఐదు పని చేయటం లేదు లేదా ఇతర వాటితో విలీనం చేశారు. ప్రస్తుతం రెండు, మూడు, నాలుగు,ఐదు, ఆరు, ఏడు, పది మాత్రమే పని చేస్తున్నాయి. వీటిలో పదవది మిగిలిన ఆరు నౌకాదళాల సమాచార వ్యవస్ధలను సమన్వయ పరిచే విధులు నిర్వహిస్తుంది. ఆరింటిలో సప్తమ నౌకాదళమే పెద్దది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఆసియాలో అమెరికా జరిపిన కొరియా, వియత్నాం, గల్ఫ్‌ దాడులన్నింటిలో ఇది పాత్రధారిగా ఉంది. మూడు వందల యుద్ద విమానాలు, 60 నుంచి 70 వివిధ రకాల యుద్ద నౌకలు, 40వేల మంది సైనికులు ఉన్నారు. దీని ప్రధాన కేంద్రం జపాన్‌లోని యొకోసుకాలో ఉంది. బంగ్లాదేశ్‌ విముక్తి సమయంలో మన దేశాన్ని బెదిరించేందుకు అమెరికా ఈ దళాన్ని బంగాళా ఖాతంలోకి నడిపింది. ఆ సమయంలో మన దేశం నాటి సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొన్నది. బంగ్లా విముక్తి కోసం తాను సత్యాగ్రహం చేశానని మన ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకున్నదానికి ఆధారాలు లేవు. నేటి బిజెపికి పూర్వ రూపమైన నాటి జససంఘం సత్యాగ్రహం జరిపింది నిజానికి బంగ్లా విముక్తి కోసం కాదు, ఆ ముసుగులో సోవియట్‌తో రక్షణ ఒప్పందానికి వ్యతిరేకంగా అన్నది గమనించాలి. ఆ ఒప్పందం చేసుకున్న తరువాతనే మన దేశం బంగ్లాదేశ్‌లోకి సైన్యాన్ని పంపి పాక్‌ సైన్యాన్ని అణచివేసి విముక్తి కలిగించింది.


ఇప్పటికే హిందూ మహాసముద్రంలో డిగాగార్షియా దీవుల్లో సైనిక స్దావరం ఉన్న అమెరికా అక్కడి నుంచి వైదొలిగేందుకు నిరాకరిస్తోంది. మారిషస్‌కు చెందిన ఈ దీవులను బ్రిటన్‌ తన వలస కాలంలో అమెరికాకు కౌలుకు ఇచ్చింది. వాటిని మారిషస్‌కు అప్పగించాలని అంతర్జాతీయ న్యాయస్దానం 2019లోనే తీర్పు చెప్పింది. అయినా ఖాళీ చేయలేదు. ఇక్కడి అమెరికా నౌకా స్దావరం ఆసియా-ఆఫ్రికా దేశాలపై దాడులకు అనువుగా ఉంటుంది కనుకనే ఏదో ఒక సాకుతో కొనసాగించేందుకు పూనుకుంది. ఈ నేపధ్యంలోనే తన రక్షణ ఎత్తుగడల్లో భాగంగా బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర ప్రాంతంపై చైనా కేంద్రీకరిస్తున్నది. దీనికి ప్రతిగా అమెరికాతో కలసి పైసా ఖర్చు లేకుండా దక్షిణ చైనా సముద్రంలో చైనా కార్యకలాపాలతో వత్తిడి పెంచాలని మన దేశం పూనుకుంది. ఒకవైపు ఆ ప్రాంత వివాదాన్ని సామరస్యంతో పరిష్కరించుకోవాలని చెబుతూనే మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్య ఇది. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రమే కాదు అరేబియా సముద్రంలో కూడా తాము కాలుపెడతామంటూ మొదటికే మోసం తెస్తూ మన దేశానికే అమెరికా బహిరంగంగా చెప్పేసింది. రేపు బంగాళాఖాతంలో అండమాన్‌ దీవుల గురించి కూడా ఇదే ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. లడఖ్‌ సరిహద్దులో చైనా సైనిక కదలికల పేరుతో తప్పుడు సమాచారం అందించి మన మిలిటరీని కొండలెక్కించిన అమెరికా ఎత్తుగడ తెలిసిందే. అంతే కాదు, చైనాతో తమ వాణిజ్య యుద్దం కారణంగా అమెరికా, ఇతర దేశాల కంపెనీలన్నీ చైనాలో దుకాణాలు కట్టేసి భారత్‌కు వస్తున్నాయని ఆశచూపిందీ అమెరికా యంత్రాంగమే.


గత కొద్ది రోజులుగా దక్షిణ చైనా సముద్రంలోనూ, తైవాన్‌-చైనా మధ్య సముద్రంలోనూ రెచ్చగొట్టే కార్యకలాపాలకు పూనుకున్న అమెరికా ఇదే సమయంలో అరేబియా సముద్రంలోనూ కెలుకుతోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తన అనుయాయిగా ఉన్న ఫిలిప్పీన్స్‌ ప్రాదేశిక జలాల పేరుతో రాజకీయం నడిపేందుకు అమెరికా నిర్ణయించుకుంది. ఎవరైనా దాని మీద దాడి చేసినా; హక్కులకు భంగం కలిగించినా పరస్పరరక్షణ ఒప్పందంలో భాగంగా తాము జోక్యం చేసుకుంటామని అమెరికా విదేశాంగ ప్రతినిధి ప్రకటన చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి చైనా తీర రక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం తమ జాతీయ సార్వభౌమత్వం, హక్కులు, పరిధికి భంగం కలిగించే విదేశీ సంస్దలు, వ్యక్తుల మీద ఆయుధ ప్రయోగంతో సహా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామన్నది దాని సారం. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమే. అందువలన ఆ ప్రాంతంలో ఎవరు జోక్యం చేసుకున్నా చర్య తీసుకొనేందుకు చైనా సిద్దం అవుతోంది. కొద్ది రోజులుగా అమెరికా యుద్ద నౌకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న కారణంగా సోమవారం నాడు చైనా తన యుద్ద నౌక లియావోనింగ్‌ నుంచి విమానాలను తైవాన్‌ రెండు వైపులకు పంపి అమెరికాను హెచ్చరించింది. తైవాన్‌ జలసంధిలో అమెరికా యుద్ద నౌక జాన్‌ మెకెయిన్‌ ప్రయాణించిన తరువాతే చైనా ఈ చర్యకు పాల్పడింది.

దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాల మధ్య వివాదంలో ఉన్న దీవుల గురించి హేగ్‌లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును తాము గుర్తించటం లేదని నాలుగు సంవత్సరాల క్రితమే చైనా ప్రకటించింది. చారిత్రకంగా చూసినపుడు ఆ సముద్రంలో చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన మత్స్యకారులు దీవులను వినియోగించుకున్నట్లు ఉంది తప్ప చైనాకు మాత్రమే ప్రత్యేక హక్కులు లేవని ట్రిబ్యునల్‌ పేర్కొన్నది.1947లో జపాన్‌ లొంగిపోయిన సమయంలో గుర్తించిన తొమ్మిది చుక్కల గీతల ప్రకారమే ఆ ప్రాంత దీవులపై హక్కు ఉన్నదని తాము చెబుతున్నామని, ఆ ప్రాంత దేశాలతో సమస్యలను పరిష్కరించుకొనేందుకు సిద్దం అని చైనా చెబుతున్నది.1947లో చైనాలో అధికారంలో ఉన్నది కమ్యూనిస్టులు కాదు, చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వమన్న విషయం తెలిసిందే.


లక్షదీవుల ఉదంతం తరువాత చతుష్టయం పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి చైనాకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న మన దేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటం అవసరం. విభజించి పాలించే దాని ఎత్తుగడలలో చిక్కుకోకుండా ఉండాలంటే చతుష్టయ కూటమి నుంచి బయటకు రావటం, మన సార్వభౌమత్వ విషయంలో ఎలాంటి రాజీలేదని అమెరికాకు స్పష్టం చేయాల్సి ఉంది. అంత సాహసం కాషాయ దేశభక్తుడు నరేంద్రమోడీకి ఉందా ? నిజమైన దేశ భక్తులు ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హతవిధీ ! విమర్శించిన నెహ్రూ బాటలోనే నరేంద్రమోడీ !!

11 Sunday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti Dumping Duties, India Protectionism, Jawaharlal Nehru, Narendra Modi, Trade Protectionism, WTO


ఎం కోటేశ్వరరావు


జవహర్‌లాల్‌ నెహ్రూ, నరేంద్రమోడీ ఇద్దరూ పాలకవర్గాల సేవకులే అనటంలో మరో మాట లేదు. ఒకరు పదిహేడు సంవత్సరాలు ప్రధానిగా అధికారంలో ఉంటే మరొకరు ఇప్పటి వరకు ఏడు, మరో మూడు సంవత్సరాలు ఉండబోతున్నారు. దేశం కోసం అనే పేరుతో ఇంకేదైనా చేస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. మనం అనేక రంగాలలో వెనుకబడి ఉండటానికి నెహ్రూ, తరువాత కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలే కారణం అని సంఘపరివార్‌ అంశ నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ సందుదొరికినపుడల్లా దుమ్మెత్తి పోయటం తెలిసిందే. కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో సాధించలేని దానిని తాము ఐదేండ్లలో అమలు చేశామని చెప్పుకొనే వారు ఆ పాచిపాట ఇంకేమాత్రం పాడలేరు. దేశ అభివృద్దికి సంబంధించి నిరంతరం చర్చ జరగాల్సిందే. అధికారంలో ఉన్న ఎవరి విధానాలనైనా విమర్శనాత్మకంగా చూడాల్సిందే. చిత్రం ఏమిటంటే నెహ్రూ విధానాలను విమర్శించటం దేశభక్తి, నరేంద్రమోడీ ఏలుబడిని తప్పుపట్టటం దేశద్రోహంగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలో ఏం జరుగుతోంది ? తిరుగుతున్న చట్రంలో ఏ దేశం ఎక్కడ ఉంది ? వాటిలో మార్పుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, వాటి పర్యవసానాలేమిటి ? వీటి అంతరార్దం ఏమిటి ? కార్పొరేట్ల లాభాలుా, అందుకోసం రక్షణాత్మక చర్యలు. ధనిక దేశాలు, వాటిని అనుసరించాలని చూస్తున్న దేశాల విధానాల సారమిదే !

వాణిజ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ద(డబ్ల్యుటివో)ను ఏర్పాటు చేశారు. వివాదాలు తలెత్తితే విచారించి తీర్పు చెప్పేందుకు ఒక న్యాయస్ధానం ఉంటుంది. దానికి న్యాయమూర్తులను నియమించేందుకు అమెరికాలో అధికారంలో ఉన్న ట్రంప్‌ నిరాకరించాడు, ఇప్పుడు జో బైడెన్‌ అదే బాటలో నడుస్తున్నాడు. కనుక ఎవరైనా దానికి ఫిర్యాదు చేస్తే వెంటనే తేలదు. మనం అమెరికా, ఇతర విదేశీ కంపెనీలపై డిజిటల్‌ సర్వీసు టాక్సు(డిఎస్‌టి) వేశాము. దాని మీద డబ్ల్యుటిఓకు వెళితే వెంటనే తేలదు. అది తెలుసు గనుక దానితో నిమిత్తం లేకుండా మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల మీద అమెరికా 25శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించింది.ఈ వివాదం ఎక్కడ తేలాలి ? తెలియదు !
చైనా నుంచి దిగుమతి చేసుకొనే సౌర విద్యుత్‌ పలకలు, సంబంధిత పరికరాలపై మన ప్రభుత్వం రక్షణ పేరుతో 2018లో విధించిన పన్ను గడువు ఈ ఏడాది జూలైలో తీరి పోనుంది. అందువలన సోలార్‌ ఫొటోఓల్టాయిక్‌ మోడ్యూల్స్‌(పివి) మీద 40శాతం, సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌ మీద 25శాతం చొప్పున దిగుమతి పన్నును 2022 ఏప్రిల్‌ నుంచి విధించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని డబ్ల్యుటివోలో సవాలు చేసినా వెంటనే తేలదు కనుక చైనా కూడా పోటీగా ప్రతీకార చర్య తీసుకుంటుంది. దానికీ అదే గతి, కనుక ఏం చేయాలి ? తెలియదు ! అలాంటపుడు జరిగేదేమిటి ? ఆయా దేశాల సామర్ధ్యం ముందుకు వస్తుంది. అది లేని దేశాలు మిగతావాటికి లొంగిపోతాయి. లేదూ తమకూ కొన్ని ప్రత్యేకతలు ఉంటే వాటిని తురుపుముక్కగా ఉపయోగించి రాజీకి వస్తాయి. మన దేశంలో సౌర విద్యుత్‌ తయారీకి అవసరమైన పరికరాకావచ్చు, మరొకటి కావచ్చు స్వంతంగా తయారు చేసుకుంటే ఎవరికీ లొంగాల్సిన, రాజీ పడాల్సిన పని లేదు.

ఇప్పుడున్న పరిస్దితి ఏమిటి ? ఈ ఏడాది మార్చి 24న అమెరికన్‌ ప్రాస్పెక్ట్‌ అనే పత్రిక ప్రచురించిన సమాచారం ప్రకారం సౌర విద్యుత్‌కు అవసరమైన నాలుగు పరికరాల విషయంలో ప్రపంచ సామర్ధ్యం ఇన్‌గాట్స్‌లో 95, వేఫర్స్‌లో 99,పివి సెల్స్‌ 80,పివి మోడ్యూల్స్‌లో 75శాతం చైనా వాటాగా ఉంది. ఈ రంగంలో చైనా తన సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకొంటోంది. దీనికి సాంకేతికపరిజ్ఞానంతో పాటు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం. ఇలాంటి పరిస్దితిలో అమెరికాను మెప్పించేందుకో మరొకందుకో చైనా దిగుమతుల మీద పన్నులు పెంచితే మనం దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవటం అనుమానాస్పదమే అనే వారిని దేశద్రోహులుగానో, స్వదేశీ పరిశ్రమ మీద ప్రేమ లేని వారుగానో ముద్రవేస్తారు. సంప్రదాయ విద్యుత్‌ బదులు ప్రత్యామ్నాయ సౌర విద్యుత్‌ మీద కేంద్రీకరించే దేశాలకు చైనా తన వస్తువులను ఎగుమతి చేస్తుంది. దానికి పోయేదేమీ లేదు. మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించుదాం !


మన దేశంలో సోలార్‌ పానల్స్‌ తయారీలో బోరోసిల్‌ అనే కంపెనీ ఉంది. అది తయారు చేసేవి మన అవసరాలకు చాలవు.దీనికి తోడు సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసే వారు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య మన దేశంలో తయారయ్యే పివి సెల్స్‌ తయారీదారులు చెప్పుకున్నమాదిరి సామర్ద్యం కలిగినవి కాదన్నది విమర్శ. నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే ప్రభుత్వ సంస్దలు లేని కారణంగా ఎవరిష్టం వచ్చినట్లు వారు తమ ఉత్పత్తుల గురించి చెప్పుకుంటున్నారు. అది ఆయా సంస్దల గిట్టుబాటును కూడా ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 32గిగావాట్లు కాగా మన సోలార్‌ సెల్స్‌ ఉత్పత్తి మూడు, మాడ్యుల్స్‌ ఉత్పత్తి ఐదు గిగావాట్లకే సరిపోతుంది. మిగిలినదంతా చైనా నుంచి దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఏడు సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ సారధిగా మారాలని చాలా మంది ఆశించగా వాస్తవ పరిస్ధితి ఇలా ఉంది. దేశభక్తి ప్రదర్శన కాదు, ఆచరణలో చూపాలి మరి. మన దేశంలో సోలార్‌ పానల్స్‌ తయారు చేస్తున్న కంపెనీకి దన్నుగా కేంద్రం దిగుమతి సుంకాలు విధించి రక్షిస్తోంది.

మన దేశ పరిశ్రమలను రక్షించుకోవాలనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వానికి వ్యాపారంతో పని లేదు అని చెబుతున్న పాలకులు నిత్యం వ్యాపారుల సేవలోనే మునిగితేలుతున్నారు.విశాఖ ఉక్కు వంటి వాటిని రక్షించుకొనేందుకు అవసరమైన చర్యలను నిరాకరిస్తున్న పాలకులు విదేశీ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టేందుకు పూనుకోవటం ఏమిటి ? ఇక్కడా చేస్తున్నది దేశానికి దివాలాకోరు-విదేశాలకు లాభాల వ్యాపారమే. ఒకవైపు స్వేచ్చా వాణిజ్యం అని చెబుతారు, సులభతర వాణిజ్యంలో మన స్దానం ఎంతో మెరుగుపడింది చూడమంటారు. కానీ ఆచరణలో ఎలా ఉన్నారు.మనం చైనా ఉత్పత్తుల మీద సుంకాలు విధిస్తున్నాం. చైనా మనకు ఎంత దూరమో మనమూ చైనాకు అంతే దూరంలో ఉంటాం. ఒకరు రాళ్లు వేస్తుంటే మరొకరు పూలు వేస్తారా ? మన భాగస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఏం చేస్తోందో చూశాము. శత్రుదేశం అంటూ నిత్యం కత్తులు దూస్తున్న చైనా ప్రతికార చర్యలకు పూనుకోకుండా ఎలా ఉంటుంది?


మన దేశం నుంచి దిగుమతి చేసుకొనే దున్న-బర్రె మాసం, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల మీదచైనా ఆంక్షలు విధించింది. దాన్ని సవాలు చేస్తూ తాజాగా మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్దకు ఫిర్యాదు చేసింది. గాళ్లు లేదా గాలి కుంటు వ్యాధి ముప్పు కారణంగా దున్న-బర్రె మాంసాన్ని నిషేధిస్తున్నామని, అదే విధంగా రొయ్యల గురించి తగినంత సమాచారం లేనందున వాటినీ నిషేధిస్తున్నట్లు చైనా చెబుతోంది. రొయ్యల్లో ఉండే వైరస్‌ మానవులకు హాని కలిగించేది కాదనే నిర్ధారణ పత్రాలు కావాలని చైనా చెబుతోంది. అయితే కొత్త నిబంధనలను ముందుకు తెస్తూ అడ్డుకుంటున్నదని, ఆ మేరకు నిర్దారణ పత్రాలను మనం ఇవ్వలేమని మన దేశం వాదిస్తోంది. నిజం చెప్పుకోవాలంటే చైనాతో మన సర్కారు వివాదం, పెట్టుబడులపై ఆంక్షలు, దిగుమతులపై సుంకాల విధింపు అసలు కారణం అని వేరే చెప్పనవసరం లేదు. 2019-20 సంవత్సరంలో మన దేశం 680కోట్ల డాలర్ల మేర సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయగా వాటిలో ఐదోవంతు చైనా 130 కోట్ల డాలర్ల సరకు దిగుమతి చేసుకుంది.2020-21లో దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. దున్న-బర్రె మాంసం పరిస్ధితి కూడా ఇంతే.

మనం నిత్యం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ సీసాలు, గ్లాసులను పోలిథిలిన్‌ టెరెఫాథలేట్‌(పెట్‌ రెసిన్‌) అనే పదార్ధంతో తయారు చేస్తారు.దీన్ని మన దేశంలో రిలయన్స్‌, ఇండో రమా కంపెనీలు ప్రధానంగా తయారు చేస్తాయి. వీటి వాటా 91శాతం ఉంది.అత్యధిక భాగం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ రెండు కంపెనీలు తమకు రక్షణ కల్పించాలని కోరిన మేరకు ఏడాది తరువాత నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చే విధంగా రానున్న ఐదు సంవత్సరాల పాటు చైనా దిగుమతుల మీద నాణ్యతను బట్టి టన్నుకు 16.92 నుంచి 200.66 డాలర్ల మేరకు దిగుమతి పన్ను విధించాలని నిర్ణయించింది. పెట్‌తో శీతల పానీయాల, మంచినీటి సీసాలు, జాడీల వంటివి తయారు చేస్తారు. 2018లో చైనా నుంచి 88,247 టన్నులు దిగుమతి చేసుకోగా 2019లో అది 147,601 టన్నులకు పెరిగింది. దీంతో చైనా దిగుమతులపై పన్ను విధించాలని రిలయన్స్‌, ఇండోరమా కంపెనీలు డిమాండ్‌ చేశాయి. లడఖ్‌ వివాదానికి ముందే ఈ కంపెనీలు కేంద్రం ముందు వత్తిడి తెచ్చాయి. ఆ సాకుతో దానికి మోడీ సర్కార్‌ తలొగ్గింది. దీనికి ఆత్మనిర్భర ముసుగు తొడిగింది. రక్షణ చర్యల పేరుతో ప్రతి దేశం తమ కార్పొరేట్ల ప్రయోజనాలకు పూనుకుంటే స్వేచ్చా వాణిజ్యం, పోటీ తత్వం గురించి చెప్పే కబుర్లకు విలువ ఉండదు. చైనా వస్తువులపై 200 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి సుంకాలు విధించిన అమెరికా చర్యను ప్రపంచ వాణిజ్య సంస్ధ విమర్శించింది.


నిజానికి రక్షణ చర్యలు మన దేశానికి కొత్తేమీ కాదు. జవహర్‌లాల్‌ నెహ్రూ పాలన ప్రారంభమైన తరువాత అంతకు ముందు మాదిరి తమ వస్తువులకు మార్కెట్‌గా భారత్‌ను మార్చుకోవాలని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు భావించాయి. మన దేశంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందచేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు రాలేదు. అప్పటికి మన పారిశ్రామికవేత్తలకు భారీ పెట్టుబడులు పెట్టగలిగిన సత్తా లేదు. అంతకు మించి పెట్టి లాభాలు సంపాదించగలమనే ధైర్యమూ లేదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, వాణిజ్యానికి నాటి ప్రభుత్వం పునాదులు వేసింది. వాటిని ఆధారం చేసుకొని అనేక మంది పెట్టుబడిదారులు లబ్ది పొందారు, తమ పరిశ్రమలకు వాటిని ఆలంబనగా చేసుకున్నారు. హైదరాబాదులోని ఐడిపిఎల్‌లో పని చేసిన అనుభవాన్ని ఔషధ రంగంలో పరిశ్రమల స్ధాపనకు వినియోగించుకొని నేడు ఆ రంగాన్ని శాసిస్తున్న రెడ్డీలాబ్స్‌ వంటి కంపెనీల యజమానుల గురించి చెప్పనవసరం లేదు. ప్రయివేటు రంగం ముందుకు వచ్చిన తరువాత ఐడిపిఎల్‌ను మూసివేయించారు. అన్ని రంగాల్లోనూ అదే జరుగుతోంది. నాడు ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు, దానికి ఆలంబనగా చేసేందుకు నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించారు. నేడు వాటి అవసరం తీరిపోయింది గనుక ఆ ప్రభుత్వ రంగ సంస్దలను ప్రయివేటు వారికి తెగనమ్మి లేదా మూసివేసి లబ్ది చేకూర్చేందుకు నరేంద్రమోడీ అదేపని చేస్తున్నారు.ఐడిపిఎల్‌ను మరింతగా విస్తరించి జనానికి చౌకగా ఔషధాలు అందించవచ్చు, కానీ ప్రభుత్వం వ్యాపారం చేయదనే పేరుతో వదిలించుకుంటున్నారు.
1991 నుంచి నూతన ఆర్ధిక విధానాల పేరుతో మన దేశం విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవాలన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద (ఐఎంఎఫ్‌), ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ఈ పని చేశారు. అప్పటి నుంచి మూడు దశాబ్దాల కాలంలో పదమూడు సంవత్సరాలు అతల్‌ బిహారీ వాజ్‌పాయి, నరేంద్రమోడీ ఏలుబడే ఉన్నది. సాధించింది ఏమిటి ? 2014లో అధికారానికి వచ్చిన మోడీ దగ్గర మంత్రదండం ఉందని, అద్భుతాలు చేస్తారని దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ రంగం, దానికి వెన్నుదన్నుగా ఉండే మీడియా ఊదరగొట్టింది.అలాంటిదేమీ లేకపోగా తిరోగమనంలో నడుస్తోందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. పెద్ద దేశాలతో పోలిస్తే భారత్‌లోనే రక్షణ లేదా దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని రెండవ సారి మోడీ అధికారానికి వచ్చిన సమయంలో తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. సంస్కరణలను మరింత వేగవంతం చేస్తానని మోడీ కూడా చెప్పారు.


కాంగ్రెస్‌ హయాంలో అయినా, మోడీ ఏలుబడిలో అయినా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) ఆశించిన మేరకు రాలేదు. వాటికి బదులు మన దేశంలో ఉన్న పరిశ్రమలు, వాణిజ్యాల షేర్‌మార్కెట్లో వాటాల కొనుగోలుకు పెట్టుబడులు పెట్టి లాభాలను తరలించుకుపోయే (ఎఫ్‌పిఐ) పెట్టుబడులు, వడ్డీ వసూలు చేసుకొనే అప్పుల రూపంలో మాత్రమే ఎక్కువగా వచ్చాయి. మన దేశానికి రావటం గొప్ప అన్నట్లుగా పాలకులు, వారికి వంతపాడే అధికార యంత్రాంగం చెబుతోంది.మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, వాటిద్వారా వచ్చే లాభాల కోసం తప్ప మనకు మేలు చేసేందుకు కాదు అన్నది గమనించాలి.

నెహ్రూ హయాంలో అనుసరించిన విధానం అభివృద్ధికి దోహదం చేయలేదని కొంత మంది విమర్శిస్తారు. దాన్ని తప్పుపట్టనవసరం లేదు. వారు ప్రత్యామ్నాయంగా సూచించిన విధానాల పర్యవసానం ఏమిటి? 1990దశకానికి ముందు మన పారిశ్రామిక వస్తువులకు రక్షణగా దిగుమతుల మీద గరిష్టంగా విధించిన పన్ను మొత్తం 355శాతం ఉంటే సగటు 126శాతం. తరువాత 2010-11 నాటికి అవి 10-9.5శాతాలకు తగ్గాయి.2020-21లో 10-11.1శాతాలుగా ఉన్నాయి. నరేంద్రమోడీ హయాంలో తిరిగి రక్షణాత్మక చర్యలు ప్రారంభమయ్యాయి.2020జూన్‌ నాటికి వివిధ దేశాల్లో అమల్లో ఉన్న దిగుమతి వ్యతిరేక చర్యల వివరాలు ఇలా ఉన్నాయి.(ది.ని- దిగుమతి నిరోధ చర్యలు),ప్ర.వా.వా-ప్రపంచ వాణిజ్యంలో వాటాశాతం )
దేశం××× ది.ని ××× సుంకం×××× ప్ర.వా.వా
అమెరికా× 398 ××× 71 ×××× 13.3
భారత్‌ × 243 ××× 98 ×××× 2.5
చైనా × 156 ××× 4 ×××× 10.8
బ్రెజిల్‌ × 111 ××× 4 ×××× 1
ఆస్ట్రేలియా× 71 × 15 ×××× 1.2
గతంలో నెహ్రూ లేదా కాంగ్రెస్‌ హయాంలో రక్షణాత్మక చర్యలు ఎక్కువగా తీసుకున్నారు, వాణిజ్యానికి ఆటంకాలు ఎన్నో కలిగించారు. మేము వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నామని చెబుతున్న బిజెపి పెద్దలు ఏ దేశంతో పోల్చుకొని చెబుతున్నట్లు ? ప్రపంచ వాణిజ్యంలో మనవాటా శాతంతో పోల్చితే అవి ఎక్కువగా తక్కువా అన్నది చెప్పాలి. 1990దశకానికి ముందు, తరువాత గణాంకాలను చూసినపుడు ఎగుమతులు-దిగుమతుల ధోరణి ఒకే విధంగా ఎందుకు ఉన్నట్లు ? గతంలో స్వావలంబన అని చెప్పినా, ఇప్పుడు మేకిన్‌ ఇండియా, స్ధానిక వస్తువులనే కొనండి, ఆత్మనిర్బర్‌ అని ఏ పేరు చెప్పినా దిగుమతులదే పై చేయి ఎగుమతులు ఎందుకు పెరగటం లేదు ? యుపిఏ కాలంలో పెరిగిన ఎగుమతి-దిగుమతులు నరేంద్రమోడీ హయాంలో రెండూ ఎందుకు పడిపోయినట్లు ? ఉపాధి ఎందుకు పెరగటం లేదు, ఎందుకు తగ్గుతోంది ?
పెద్ద పరిశ్రమలను ప్రోత్సహించిన నెహ్రూ విధానంలో దుస్తులు, పాదరక్షలు,ఫర్నీచర్‌ వంటి వాటిని చిన్న లేదా కుటీర పరిశ్రమలుగా వర్గీకరించి వాటికి రక్షణ కల్పించారని, ఫలితంగా అవి గిడసబారి పోయినట్లు విమర్శ చేసే వారున్నారు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు బడా రంగం అది కూడా రక్షణ లేకపోతే విదేశీ దిగుమతుల దెబ్బకు విలవిల్లాడుతున్నాది. చిన్న పరిశ్రమల సంగతి సరేసరి మూతపడుతున్నవాటి సంఖ్యే అందుకు నిదర్శనం.చిన్న సన్నకారు పరిశ్రమల నుంచి ప్రభుత్వ రంగ సంస్ధలు కొనుగోలు చేయాలన్న రక్షణ విధానాలకు గతంలో అనుసరించిన వాటికి తేడా ఏమిటి ? కరోనా సమయంలో వాటికి ఇవ్వాల్సిన బకాయిలను కూడా మోడీ సర్కార్‌ చెల్లించలేకపోవటం వివాదంగా మారిన విషయం తెలిసినదే.

మన దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఘోరంగా విఫలమైంది. దిగుమతుల నిరోధానికి విధించే పన్ను శాతాలు పెరుగుతున్నాయి. మనం ఆ పని చేస్తే మన వస్తువులను దిగుమతి చేసుకొనే దేశాలూ అదే చేస్తాయా లేదా ? మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో మోడీ అండ్‌కో చెబుతారా ? ప్రభుత్వం వాణిజ్యం చేయకూడదంటూ విశాఖ ఉక్కు వంటి సంస్ధలను తెగనమ్మేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం అమలు జరిపే ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పధకం వంటి వాటి సంగతేమిటి ? విశాఖ ఉక్కు వంటి వాటికి ఈ పధకాన్ని ఎందుకు అమలు జరపరు ? ప్రయివేటు రంగం ముద్దు-ప్రభుత్వరంగం వద్దా ! భారీ పెట్టుబడులు-కార్మికులు తక్కువగా ఉండే ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు ఐదేండ్ల పాటు నాలుగు నుంచి ఆరుశాతం రాయితీలు ఇస్తామని ప్రకటించారు. పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలు తమ సంగతి తాము చూసుకుంటాయి కదా వాటికి జనం సొమ్ముతో రాయితీలు ఇవ్వటం ఏమిటి ? ఇది రక్షణాత్మక చర్య కాదా ? భారీ పెట్టుబడులు, ఆటోమేషన్‌తో పనిచేసే సంస్ధలే ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. వాటిలో ఉపాధి తక్కువ. అదే తక్కువ పెట్టుబడి, ఎక్కువ మంది కార్మికులు పని చేసే పరిశ్రమలు వాటితో పోటీ పడలేవు. అంటే బడా కంపెనీలకే ప్రోత్సాహకాలు ఇస్తే ఈ సంస్ధలేమి కావాలి ? విదేశాలు కూడా అదే పని చేస్తే మన ఉత్పత్తులు పోటీ పడతాయా ? నెహ్రూ విధానాలను విమర్శించేవారు తాము చేస్తున్నదేమిటి ?


నినాదాలు జనాన్ని ఆకర్షిస్తాయి తప్ప అమలు సందేహమే.అయితే చైనా అందుకు మినహాయింపుగా ఉంది. ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారన్న లెనిన్‌ మాటలు తెలిసిందే. మన దేశంలో గరీబీ హటావో నినాదం అలాంటిదే.ఇప్పుడు ఆత్మనిర్భరత కూడా అలాంటిదే అని అనేక మంది అభిప్రాయం. మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచిన తరువాత వస్తున్న పోటీని స్ధానిక పరిశ్రమలు, వాణిజ్యం తట్టుకోలేకపోతోంది. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. నరేంద్రమోడీ సర్కార్‌ ఇప్పుడు చేస్తున్నది అదే. ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య(ఆర్‌సిఇపి) ఒప్పందంలో చేరకపోవటం కూడా రక్షణాత్మక చర్యల్లో భాగమే. దానిలో చేరితే మిగతాదేశాల సరకుల మీద దిగుమతి పన్నులు తగ్గించటంతో పాటు వాటిని అనుమతించాల్సి ఉంటుంది. మనకు ఎగుమతి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ సామర్ధ్యం లేని కారణంగా బలమైన వారే ఉట్టి కొడతారు. మన ఎగుమతి అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. గత ఐదు సంవత్సరాలలో టారిఫ్‌ కోడ్‌లో ఉన్న 5,500కు గాను 3,600 వస్తువుల విషయంలో దిగుమతి సుంకాలు పెరిగాయి. గత ఏడాది కాలంలోనే ఆరువందల వస్తువుల మీద పన్నులు పెరిగాయి. నెహ్రూను విమర్శించేవారు తాము కక్కిన దానిని తామే తినటం అంటే ఇదే. ఇప్పటికే ప్రయివేటు రంగం పరిశోధన-అభివృద్దికి చేస్తున్నదేమీ లేదు, ఇక వాటికి రక్షణ కల్పిస్తే రాయితీలు మింగి మరింతగా పెరుగుతాయి తప్ప వినియోగదారులకు ప్రయోజనం ఏముంటుంది ?

అద్భుతాలు సృష్టించిన దేశాలుగా పేరు పడిన వాటిలో దక్షిణ కొరియా ఒకటి. ఇప్పుడు ఆ దేశ పరిస్ధితి ఏమిటి ? ప్రభుత్వం ఇచ్చిన మద్దతుకారణంగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అది పురోగతి సాధించిన మాట వాస్తవం. అమెరికా రక్షణలో ఉన్న కారణంగా మిలిటరీ వ్యయం తక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం ప్రయివేటు రంగానికి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చింది. ఇప్పుడు దానికి చైనా రూపంలో పోటీ ఎదురైంది. అక్కడి సంస్ధలు కార్యకలాపాలను పరిమితం చేయటం, ఉత్పత్తులను నిలిపివేయటం వంటి చర్యలకు పూనుకున్నాయి.1998 తరువాత తొలిసారిగా 2019లో దాని జిడిపి ఒకశాతం తిరోగమనంలో ఉంది. కరోనా కారణంగా ఇంటి నుంచి పని చేసేందుకు ప్రపంచ వ్యాపితంగా పెద్ద ఎత్తున కంప్యూటర్లు అవసరమై అక్కడి సంస్ధలు ఎగుమతులతో 2020లో నిలదొక్కుకున్నాయి గానీ లేకుంటే పరిస్ధితి ఏమిటి ? అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేస్తున్న వడ్డీ రేటు కేవలం 0.5(అర)శాతమే. అటువంటి రాయితీ ఇచ్చే స్ధితిలో మన దేశం లేదు. అలాంటపుడు బస్తీమే సవాల్‌ అన్నట్లుగా అమెరికా అండచూసుకొని మనకంటే బలవంతుల మీద మీసాలు మెలివేయటం తగనిపని. వాణిజ్య యుద్దంలో అమెరికా వారే కిందామీద పడుతుంటే మనం నిలవగలమా ? చైనా మాదిరి వస్తువులను ఎగుమతి చేయాలని, దాన్ని అనుకరించాలని నాలుగు దశాబ్దాల తరువాత చెబుతున్నారు. మరోవైపు అక్కడి నుంచి వస్తువుల దిగుమతులను నిలిపివేసి ఆర్ధికంగా దెబ్బతీస్తామని అసాధ్యమైన అంశాన్ని టాంటాం వేస్తున్నారు.


అమెరికా, ఐరోపా ధనిక దేశాల మాదిరి చౌకగా వచ్చే చైనా వస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందినట్లుగానే గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు కూడా అదే పని చేస్తున్నారు.కొత్త ఆవిష్కరణలు చేసి తక్కువ ఖర్చుతో ఉత్పత్తిచేసేందుకు ముందుకు రావటం లేదు. గతంలో కాంగ్రెస్‌ ఏలుబడిలో లైసన్సు విధానం ద్వారా కొన్ని పరిశ్రమలకు రక్షణ కల్పించారు. దాన్ని విమర్శిస్తున్న సంఘపరివార్‌ పెద్దలు ఇప్పుడు చేస్తున్నదేమిటి. అదే రక్షణ విధానంలో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే అనుమతి తీసుకోవాలని, విధించిన పన్నులను చెల్లించాలంటున్నారు. సబ్సిడీలు ఇస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేస్తే ఒన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో తగ్గిస్తున్నారు. అసలు పూర్తిగా ఎగవేస్తే రద్దుచేస్తున్నారు. అలాంటపుడు పోటీ ఎలా ఉంటుంది ? చరిత్ర పునరావృతం అవుతుందంటారు. దాని అర్ధం గతం మాదిరే అని కాదు. విదేశీ పోటీ నుంచి రక్షణ కల్పిస్తున్నారు, గతంలో తెరిచిన ద్వారాలను మెల్లగా మూస్తున్నారు. స్వాతంత్య్రానంతరం విదేశీ మార్కెట్‌కు ద్వారాలు మూసినందుకు అమెరికా, ఐరోపా దేశాలు మనలను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. అవి వేర్పాటు, ఉగ్రవాదం రూపంలో ఎలా మనలను దెబ్బతీశాయో చూశాము. ఇప్పుడు ఒక వైపు ధనిక దేశాలతో రాజకీయంగా చేతులు కలుపుతూ మరోవైపు ఆర్ధిక విధానాల్లో దేశీయ కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తున్నారు.

అమెరికా బడా దిగ్గజం అమెజాన్‌కు పోటీగా మన దేశ కంపెనీ రిలయన్స్‌ ముందుకు వచ్చింది. రిలయన్స్‌కు దన్నుగా కేంద్ర ప్రభుత్వం ఉంది. అడుగడుగునా అమెజాన్ను అడ్డుకొనేందుకు ప్రభుత్వం పూనుకుంది. అదే విధంగా మెట్రో వంటి సంస్ధలను రిటెయిల్‌ రంగంలోకి రాకుండా ఆటంకం కలిగిస్తూ దేశీయ కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తోంది మోడీ సర్కార్‌. అందువలన విదేశాలు ముఖ్యంగా ధనికదేశాలు మనలను చూస్తూ అలాగే వదలి వేస్తాయనుకుంటే పొరపాటు. ముందే చెప్పినట్లు నెహ్రూ-మోడీ ఇద్దరూ కార్పొరేట్ల ప్రతినిధులే. ఒకరు ప్రయివేటురంగం నిలబడేందుకు ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేస్తే, ప్రయివేటు రంగం బలపడింది కనుక మరొకరు దాన్ని కారుచౌకగా ప్రయివేటు, విదేశీ కంపెనీలకు అప్పగిస్తున్నారు. ప్రయివేటు రంగానికి రక్షణ, రాయితీలు కల్పించటంలో సేమ్‌ టు సేమ్‌ ! ప్రత్యామ్నాయ విధానాలను అనుసరిస్తే తప్ప చైనా మాదిరి అభివృద్ది చెందే అవకాశం ఉండదు. కానీ ఆర్ధిక విధానాల విషయంలో కాంగ్రెస్‌-బిజెపి రెండూ ఒకదాన్నే అనుసరిస్తున్నాయి. అంతర్గత వైరుధ్యాలు అప్పుడూ-ఇప్పుడూ ఉన్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d