• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: COUNTRIES

‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘కుట్ర విఫలంపై మీడియా మూగనోము !

05 Sunday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

“Operation Liberty”, Juan Guaidó, Media’s Propaganda Campaign Against Venezuela’s Government, Nicolás Maduro, Nicolás Maduro Moros, Propaganda War, Venezuela

Image result for venezuela 1: mainstream media ignores failed coup

వెనెజులా పరిణామాలు -1

ఎం కోటేశ్వరరావు

ఏప్రియల్‌ 30వ తేదీన వెనెజులా వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘ (స్వేచ్చా ప్రక్రియ) పేరుతో అమలు జరపతలచిన కుట్రను మొగ్గలోనే నికోలస్‌ మదురో సర్కార్‌ తుంచివేసింది. ఇదెంత ప్రాధాన్యత కలిగిన అంశమో అమెరికా మరోసారి పచ్చి అబద్దాల కోరు అని ప్రపంచముందు బహిర్గతం కావటం కూడా అంతే ప్రాధాన్యత కలిగి వుంది. కూల్చివేత ప్రయత్నాల వార్తలకు అంతర్జాతీయ మీడియా ఇచ్చిన ప్రాధాన్యత దాని తుంచివేతకు ఎందుకు ఇవ్వలేదో నిజాయితీగా ఆలోచించే వారు అర్ధం చేసుకుంటారు. వెనెజులా మీద ఇప్పుడు బహుముఖ దాడి జరుగుతోంది. దానిలో ఆర్ధిక దిగ్బంధనం, ప్రచారదాడి, మతాన్ని వినియోగించటం, మిలిటరీని, జనాన్ని అంతర్గత తిరుగుబాట్లకు రెచ్చగొట్టటం ఇలా అనేక రకాలుగా సాగుతోంది. ఇది ఈ నాటిది కాదు, ఇప్పటితో అంతమయ్యేది కాదు. ఇది ఒక్క వెనెజులాకే పరిమితం కాదు. తనను రాజకీయంగా వ్యతిరేకించే వారు ఎక్కడ అధికారానికి వస్తే అక్కడ వారిని కూల్చివేయటం, ఆయా దేశాలు, ప్రాంతాలను ఆక్రమించకోవటం లేదా తన ఆధిపత్యం కిందకు తెచ్చుకోవటం అమెరికాకు నిత్యకృత్యం.

ఐరోపో నుంచి వలస వెళ్లిన వివిధ దేశాలకు చెందిన వారు స్ధానిక రెడ్‌ ఇండియన్లను అణచివేసి నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పరిగణించబడుతున్న, ఇతర అమెరికా ఖండ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అవి వివిధ ఐరోపా దేశాల వలస ప్రాంతాలుగా మారాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మెజారిటీ ప్రాంతాలు(అమెరికా) బ్రిటీష్‌ పాలనలో వున్నాయి. తమకు తామే పరిపాలించుకొనే శక్తి వచ్చింది కనుక బ్రిటీష్‌ పెత్తనం ఏమిటంటూ వలస వచ్చిన వారు చేసిన తిరుగుబాటు కారణంగానే 1776లో అమెరికాకు స్వాతంత్య్రం వచ్చింది. అంతర్యుద్ధం ముగిసి కుదుట పడిన తరువాత వారే తొలుత తమ పరిసరాలను, తరువాత ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకొని మరోబ్రిటన్‌ మాదిరి తయారయ్యేందుకు ప్రయత్నించారు. బ్రిటీష్‌ వారు మన దేశంలో ముందు రాజులు, రాజ్యాల మీద యుద్దాలు చేయలేదు. ప్రలోభాలు, కొన్ని ప్రాంతాల మీద హక్కులు సంపాదించుకున్నారు. అమెరికా విషయానికి వస్తే ప్రస్తుతం అమెరికాలోని పదిహేను రాష్ట్రాలలో, కెనడాలో కొంత భాగం, హైతీగా వున్న దేశంతో కూడిన ఫ్రెంచి ఆధీనంలోని లూసియానా ప్రాంతాన్ని 1803లో అమెరికా కొనుగోలు చేసింది. 1699 నుంచి 1762 వరకు తన ఆధీనంలో వున్న లూసియానా ప్రాంతాన్ని ఫ్రెంచి పాలకులు స్పెయిన్‌కు దత్తత ఇచ్చారు. 1800 సంవత్సరంలో తిరిగి వుత్తర అమెరికా ఖండంలో తమ పాలనను విస్తరించేందుకు లూసియానాను తిరిగి తీసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే హైతీ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటును ఫ్రెంచి సేనలు అణచివేయలేకపోయాయి. దానికి తోడు బ్రిటన్‌తో తలపడేందుకు సన్నాహాలలో భాగంగా లూసియానా ప్రాంతాన్ని విక్రయించేందుకు ఫ్రాన్స్‌ ప్రయత్నించింది. తనకు రేవు పట్టణమైన న్యూ ఆర్లినియన్స్‌ పరిసరాలను కొనుగోలు చేయాలని ముందుగా భావించిన అమెరికా సర్కార్‌ ఫ్రాన్స్‌ బలహీనతను సాకుగా తీసుకొని మొత్తం ప్రాంతాన్ని కొనుగోలు చేసింది.కోటీ 80లక్షల ఫ్రాంకుల అప్పురద్దు రద్దు చేసి మరో ఐదు కోట్ల ఫ్రాంకులను అందుకుగాను చెల్లించింది.(2017 విలువ ప్రకారం 600బిలియన్‌ డాలర్లకు అది సమానం) ఇలా ఇతర దేశాల ప్రాంతాలను కొనుగోలు చేయటం అమెరికా రాజ్యాంగానికి విరుద్దం అని ప్రతిపక్ష ఫెడరలిస్టు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తే అధ్యక్షుడిగా తనకున్న అధికారాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకొని కొత్త ప్రాంతాలను సేకరించవచ్చని థామస్‌ జఫర్సన్‌ సమర్ధించుకున్నాడు. అలా అమెరికా విస్తరణ తొలుత ఒప్పందాలతో ప్రారంభమైతే తరువాత సామ్రాజ్యవాదిగా మారి 1846లో మెక్సికో నుంచి నేటి టెక్సాస్‌ ప్రాంతాన్ని యుద్దంలో ఆక్రమించుకున్న అమెరికా నాటి నుంచి నేటి వెనెజులా వరకు అనేక ప్రభుత్వాలను అదిరించటం,బెదిరించటం, లొంగని వారిని అడ్డుతొలగించుకోవటం, వలసలు చేసుకోవటం, అది సాధ్యం కానపుడు తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం వరకు అన్ని ఖండాలలో అమెరికా పాల్పడని అప్రజాస్వామిక చర్య లేదు. అంతర్జాతీయ చట్టాలకు వక్ర భాష్యం చెప్పటం ఒకటైతే తన పధకాల అమలుకు ఇతర దేశాల మీద స్వంత చట్టాలను రుద్దటం మరొక దుశ్చర్య.

స్పానిష్‌ వలస పాలన నుంచి విముక్తి పొందిన లాటిన్‌ అమెరికా లేదా దక్షిణ అమెరికా దేశాలలో వెనెజులా ఒకటి. గత వంద సంవత్సరాలలో సామ్రాజ్యవాదుల జోక్యం, మిలిటరీ నియంతలు, ఆర్ధిక పతనాలు ఇలా ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్న దాని చరిత్రను మూసి పెట్టి వామపక్షాల పాలనలోనోనే దేశమంతా పాచిపోయిందనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో వున్న మదురో, అంతకు ముందున్న ఛావెజ్‌లనే కాదు,తనను వ్యతిరేకించిన వామపక్ష వాదులు కాని అనేక మందిని అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో కూల్చివేసేందుకు, గద్దెల నెక్కించేందుకు ప్రయత్నించిన అమెరికా చరిత్ర దాస్తే దాగేది కాదు. వెనెజులా విషయానికి వస్తే 1951-58 మధ్య అధికారంలో వున్న నియంత పెరెజ్‌ జిమెంజ్‌ను అమెరికా బలపరిచింది.1958లో వామపక్ష, మధ్యేవాదులుగా వున్న వారు తిరుగబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు. మరో నియంతను బలపరిచే అవకాశాలు లేక తరువాత కాలంలోే ఏ నినాదంతో ధికారంలోకి వచ్చినప్పటికీ పాలకులందరినీ తన బుట్టలో వేసుకొని తన అజెండాను అమలు జరపటంలో అమెరికా జయప్రదమైంది. వామపక్ష వాది ఛావెజ్‌ విషయంలో కూడా అమెరికా అదే అంచనాతో వుంది. అది వేసుకున్న తప్పుడు అంచానాల్లో అదొకటిగా చరిత్రలో నమోదైంది. ఆయన వారసుడిగా అధికారంలోకి వచ్చిన నికొలస్‌ మదురో విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ఆయనను తొలగించేందుకు ఆపరేషన్‌ లిబర్టీ పేరుతో విఫలయత్నం చేసింది. దానికి ముందుగా, ఆ సమయంలోనూ, తరువాత ప్రచార దాడిని కొనసాగిస్తోంది. ఈ దాడి తీరుతెన్నులను ముందుగా పరిశీలిద్దాం,( తరువాయి భాగాల్లో మిగతా అంశాలు)

దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమనే వాట్సాప్‌, లైక్స్‌ కొట్టే ఫేస్‌బుక్‌ మరుగుజ్జులు చెలరేగిపోతున్న తరుణమిది. సామ్రాజ్యవాదం తన ప్రచార దాడికి వుపయోగించే ఆయుధాలలో సాంప్రదాయక మీడియాతో పాటు ప్రస్తుతానికి సామాజిక మీడియాలో ఇవెంతో శక్తివంతగా పని చేస్తున్నాయి. అనేక మంది వాటి దాడికి మానసికంగా బలి అవుతున్నారు. వామపక్ష ప్రభుత్వాలు అమలు జరిపిన అనేక పధకాల వలన వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దివాలా దీసింది, జనాన్ని సోమరులను గావించింది, మన దేశాన్ని లేదా తెలుగు రాష్ట్రాలను ఇలా కానివ్వ వద్దు అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనిలో పేరు మోసిన ఒక రచయిత కూడా స్టార్‌ కాంపెయినర్‌గా మారటంతో అనేక మంది దృష్టిని ఆకర్షించింది. చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు.

Image result for media war on venezuela

వెనెజులా గురించిన ఈ ప్రచారం 2001లో ప్రారంభమైంది.1999లో వామపక్ష వాది హ్యూగో ఛావెజ్‌ తొలిసారి అధికారానికి వచ్చారు. అప్పటికే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధ ఘోరవైఫల్యం చెందిన కారణంగానే ఆయనను జనం అందలం ఎక్కించారు. కానీ మీడియా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం గురించి ఏమాత్రం తెలియనట్లే వుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా జరిపిన దుశ్చర్యలు, అది బలపరిచిన పాలకులు జరిపిన మారణకాండ, పర్యవసానాలలో రెండు కోట్ల మంది మరణించారని, లిబియా, ఎమెన్‌, లెబనాన్‌, సిరియాలలో జరిగిన మానవ నష్టం దీనికి అదనమని జేమ్స్‌ ఏ లూకాస్‌ అంచనా వేశారు. వెనెజులాలో అత్యవసర ఔషధాలు లేక 40వేల మంది మరణించారని చెబుతున్నా, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని అంటున్నా, మిలియన్ల మంది పొరుగుదేశాలకు వలసపోయారంటూ అతిశయోక్తులు చెబుతున్నా, అవన్నీ అమెరికా, దాని కనుసన్నలలో వ్యవహరించే పొరుగుదేశాలు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, అమెరికా విధించిన ఆంక్షలే కారణం తప్ప వామపక్ష పాలకులు కాదు. ఇవన్నీ మీడియాకు, పరిశీలకులకు కనిపించవా?

వెనెజులా ఎంతో ధనిక దేశం వామపక్ష పాలనలో దివాలా తీసిందన్నది మరొక ప్రచారం.1999లో ఛావెజ్‌ అధికారానికి వచ్చినపుడు అక్కడ జనాభాలో సగం మంది దారిద్య్రరేఖకు దిగువన, పొరుగు దేశాలతో పోల్చితే శిశు మరణాలు రెండు రెట్లు ఎక్కువ. మరి ధనిక దేశం అయితే అలా ఎందుకున్నట్లు ? అంతకు ముందున్న పాలకులందరూ అమెరికాతో మిత్రులుగా వున్నవారే కదా ! అనేక దేశాలలో వామపక్ష, వుదారవాదులుగా వుంటూ అధికారంలోకి వచ్చిన వారిని అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంది. చిలీలో అందుకు వ్యతిరేకించిన సాల్వెడార్‌ అలెండీని హతమార్చింది. వెనెజులాలో కూడా ఛావెజ్‌ను తమ వాడిగా మార్చుకోవచ్చని ఆశించిన అమెరికాను 2001లో ఆయన తొలి దెబ్బతీశాడు. ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించి ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంతో అప్పటి నుంచి కుట్రలు మొదలు.2002లో మిలిటరీ తిరుగుబాటు చేసి వాణిజ్యవేత్త పెడ్రో కార్‌మోనాకు అదికారం అప్పగించారు. అప్పుడు జార్జి బుష్‌ ఆ తిరుగుబాటను సమర్ధించాడు. వెంటనే ఐఎంఎఫ్‌ రంగంలోకి దిగి సాయం చేస్తామని ప్రకటించింది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఆ తిరుగుబాటు విఫలం కాకుండా చూడాలని సంపాదకీయం రాసింది.’కాబోయే నియంత’ ను తొలగించారని ఛావెజ్‌ను వర్ణించింది, ఆయన స్ధానంలో గౌరవనీయుడైన వాణిజ్యవేత్తను ప్రతిష్టించారని ప్రశంసించింది. ఈ కుట్ర వెనుక అమెరికా వుందని ఛావెజ్‌ అబద్దాలు చెబుతున్నారని గార్డియన్‌ పత్రిక ప్రకటించింది. .అయితే ఆ కుట్ర విఫలమై తిరిగి ఛావెజ్‌ అధికారానికి వచ్చాడు. వెంటనే ప్రభుత్వ చమురు కంపెనీలో విద్రోహ చర్యలకు పాల్పడి పెద్ద నష్టం కలిగించారు. అప్పటికే వున్న ఆర్ధిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. నిరుద్యోగం, దారిద్య్రం పెరిగింది. దానికి కారకులు ఎవరు?

Image result for media war on venezuela

దాన్నుంచి బయట పడేందుకు ఛావెజ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా వ్యాపారవేత్తలు తమకు అనువుగా మార్చుకొని మరిన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టారు.ఛావెజ్‌ మరణించిన తరువాత 2014లో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పతనమయ్యాయి. దాంతో ఇబ్బందులు పెరిగాయి. అయినా నికొలస్‌ మదురో స్వల్పమెజారిటీతో విజయం సాధించటంతో తిరిగి కుట్రలు మరో దశకు చేరాయి. బరాక్‌ ఒబామా 2015లో ఆంక్షలను ప్రకటించాడు. ఏ సాకూ దొరక్క మదురో సర్కార్‌ వుండటం తమ జాతీయభద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ కొనసాగిస్తున్నాడు.మరిన్ని కొత్త ఆంక్షలు విధించాడు. వీటన్నింటిని విస్మరించిన మీడియా వెనెజులా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అతిగా చూపుతూ మొసలి కన్నీరు కారుస్తోంది. కెనడాకు చెందిన స్టెఫానీ నోలెన్‌ అనే జర్నలిస్టు వెనెజులా గురించి వాస్తవాలనే పేరుతో అనేక అవాస్తవాలను రాస్తూ ముగింపులో ఇలా పేర్కొన్నారు.’మదురో సర్కార్‌ అంతిమంగా పతనం అవుతుందని ప్రతిపక్ష నేత ఆశాభావంతో వున్నాడు. ఆహారం మొత్తం ఖాళీ అయింది, జనాన్ని వీధుల్లో దింపాలని, మదురో గద్దె దిగే వరకు వారు ఇండ్లకు వెళ్లకూడదనేవిధంగా ఆలోచనలు సాగుతున్నాయని రాశారు. దీనికి అమెరికా, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయని ఎలాంటి బెరకు లేకుండా ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. అంటే ఏం చేయాలో కూడా జర్నలిస్టులు నిర్ణయిస్తారు, అవన్నీ అమెరికా ఆలోచనలకు అనుకూలంగా వుంటాయి.

Image result for media war on venezuela

తాజా పరిణామాల విషయానికి వస్తే మదురో సర్కార్‌ కూలిపోనుందనే రీతిలో ఏప్రిల్‌ చివరివారంలో మీడియా వార్తలున్నాయి. తానే అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న గుయ్‌డో రాజధాని శివార్లలోని ఒక వైమానిక స్ధావరం సమీపంలో మకాం వేశాడు. గృహనిర్బంధంలో వున్న అతగాడి గురువు లియోపాల్డో లోపెజ్‌ను తప్పించి గుయ్‌డో వద్దకు చేర్చారు. తిరుగుబాటులో భాగంగా ఆ స్దావరాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది పధకం. అయితే అంతా పదిగంటల వ్యవధిలోనే ముగిసిపోయింది. తిరుగుబాటుదార్లు వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలో వున్నారు. లక్షల మందిగా వస్తారనుకున్న జనం ఎక్కడా జాడలేదు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి సిఎన్‌ఎన్‌ ఛానల్లో మాట్లాడుతూ మదురో క్యూబాకు పారిపోతున్నాడంటూ చేసిన అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున మీడియా జనం ముందు కుమ్మరించింది. ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన అంతర్జాతీయ మీడియాలో మొత్తంగా అక్కడ తిరుగుబాటు జరుగుతున్నట్లే వార్తలు వచ్చాయి. మదురోకు మద్దతుగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన జనం మీడియాకు కనిపించలేదు.బిబిసి అలాంటి వార్తనే రోజంతా ఇచ్చి చివరకు సాయంత్రానికి దాన్ని కొద్దిగా మార్చుకోవాల్సి వచ్చింది. కొద్ది మంది కిరాయి మనుషులను, గుయ్‌డోను పదే పదే చూపాయి. కుట్రలో భాగంగా కొన్ని చోట్ల సాగించిన దహనకాండను తిరుగుబాటుగా వర్ణించాయి. అయితే ఇంత జరిగినా మీడియాను వెనెజులా జనం విశ్వసించలేదు. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా జరుగుతున్న అసత్య ప్రచారం ప్రపంచం కంటే వారికి ఎక్కువగా తెలుసు. వాస్తవం ఏమిటో, కట్టుకధలేమిటో ఎరిగిన వారు. 2002లో తిరుగుబాటు సమయంలో నిరాయధుల మీద ఛావెజ్‌ సర్కార్‌ కాల్పులు జరిపిందని, మారణకాండ జరిపినట్లు కొన్ని మీడియా సంస్ధలు ప్రసారం చేసిన వీడియోలు నకిలీవని తేలింది. అందువలన విశ్వసనీయత కోల్పోయిన మీడియా వార్తలను వారు విస్మరించారు. వాస్తవాలు తెలియదు కనుక మన జనాల్లో కొంత మంది అలాంటి వాటిని నిజమే అని నమ్ముతున్నారు. సమాచార సామ్రాజ్యవాదానికి కావాల్సింది అదే.అయితే అందరినీ ఎల్లకాలం నమ్మించలేమనే వాస్తవం వారికి తెలిసినా, ఇదొక యుద్ధం కనుక అస్త్రాలను ప్రయోగిస్తూనే వుంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులాలో మంగళవారం నాటి తిరుగుబాటును అణచివేసిన వామపక్ష ప్రభుత్వం !

01 Wednesday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Caracas, Juan Guaidó, Leopoldo Lopez, Nicolás Maduro, Venezuela, Venezuelan Military Putsch, Venezuelan Opposition

ఎం కోటేశ్వరరావు

తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనికులు, ఇతర భద్రతా దళాలకు చెందిన కొద్ది మంది చేసిన తిరుగుబాటు ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచివేసినట్లు వెనెజులా అధ్య క్షుడు నికోలస్‌ మదురో మంగళవారం రాత్రి ప్రకటించారు. సైనిక అధికారులు, ఇతర ప్రముఖులతో కలసి గంటసేపు టీవీలో చేసిన ప్రసంగంలో వుదయం నుంచి జరిగిన పరిణామాలను దేశ ప్రజలకు వివరించారు. సాయుధ తిరుగుబాటును సాకుగా చూపి అమెరికా మిలిటరీ జోక్యానికి పాల్పడాలని కుట్ర చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్న సమాయానికి కొంత మంది విద్రోహులు బయటపడ్డారని వారిని వదిలేదని చెప్పారు. తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జువాన్‌ గుయ్‌డో అజ్ఞాతం నుంచి తిరుగుబాటుకు పిలుపునిస్తూ వీడియోలను విడుదల చేయటం , అక్కడక్కడా బారికేడ్ల ఏర్పాటు, దహనకాండ వుదంతాలు తప్ప ఎక్కడా తిరుగుబాటు సూచనలు లేవని వార్తలు వెల్లడించాయి. మదురోకు మిలిటరీ మద్దతు ఇవ్వటం లేదని గుయ్‌డో చెప్పుకున్నాడు. తమ నాయకుడికి పధకం ప్రకారం అమెరికా నుంచి రావాల్సిన సాయం అందలేదని అనుచరులు చెప్పినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే సైనిక తిరుగుబాటుకు బదులు బుధవారం నాడు శాంతియుత తిరుగుబాటులో భాగంగా లక్షల మంది వీధుల్లోకి వచ్చి తనకు మద్దతుగా ప్రదర్శనలు చేయాలని గుయ్‌డో విడుదల చేసిన వీడియోల్లో వుందని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక పేర్కొన్నది. బుధవారం నాడు వీధుల్లోకి వచ్చి ప్రతిపక్షాల కుట్రను విఫలం చేయాలని, మేడేను జరుపుకోవాలని మదురో కూడా తన మద్దతుదార్లకు పిలుపునిచ్చాడు. తాను మంగళవారం వుదయం రష్యన్ల మద్దతుతో వెనిజులా నుంచి క్యూబాకు పారిపోనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పటాన్ని మదురో అపహాస్యం చేశాడు. వెనెజులాలో వున్న క్యూబన్‌ సైనికులు అక్కడ ఏదైనా మరణాలు, నష్టానికి కారకులైతే క్యూబా మీద మరిన్ని కఠిన ఆంక్షలు అమలు జరుపుతామని, కనుక వెంటనే స్వదేశానికి వెళ్లాలని మంగళవారం సాయంత్రం ట్విటర్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. వెనెజులాలో పరిస్ధితి క్లిష్ట దశకు చేరుకుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ అన్నాడు.ముగ్గురు సీనియర్‌ అధికారులతో తాము సంప్రదించామని, మదురోను తప్పించేందుకు వారు అంగీకరించారని చెప్పుకున్నాడు. అయితే బోల్టన్‌ ఇలాంటి ఇలాంటి కలలు కనటం కొత్త కాదని వెనెజులా విదేశాంగ మంత్రి జార్జ్‌ అరియా వ్యాఖ్యానించాడు.

మంగళవారం తెల్లవారు ఝామున నాలుగు గంటల సమయంలో గుయ్‌డోకు గురువు, గృహనిర్బంధంలో వున్న ప్రతిపక్ష నేత లియోపోల్డో లోపెజ్‌ను కొంత మంది సాయుధులు తప్పించి వెలుపలకి తీసుకువచ్చారు. రాజధాని కారకాస్‌లో ఒక రహదారిని మూసివేశారు. నగరశివార్లలోని ఒక చోట లోపెజ్‌, గుయ్‌డో కలుసుకున్నారు. అక్కడి నుంచి వీడియోలు విడుదల చేశారు. రాజ్యాంగపరిషత్‌ అధ్యక్షుడు డియోసడాడో కాబెల్లో టీవీలో మాట్లాడుతూ కుట్రదారుల గురించి వివరించి బలివేరియన్‌ మిలిషియా వీధుల్లోకి వచ్చి అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన జరిపారు. తామనుకున్న విధంగా ఎలాంటి తిరుగుబాటు లేకపోవటంతో గుయ్‌డో కొంత మంది అనుచురులతో కలసి గుర్తు తెలియని ప్రాంతానికి తప్పించుకోగా లోపెజ్‌ తొలుత చిలీ రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడ వున్న కుటుంబసభ్యులతో కలసి తరువాత స్పెయిన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి శరణువేడినట్లు,25 మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారని వార్తలు వచ్చాయి.

రాజధాని కారకాస్‌, ఇతర పట్టణాల్లో గుయ్‌డో అనుచరులు బారికేడ్లు ఏర్పాటు చేసి కొన్ని చోట్ల దహనకాండకు పాల్పడ్డారని, కారకాస్‌ శివార్ల నుంచి ప్రదర్శన జరిపేందుకు ప్రయత్నించిన గుయ్‌డోను భద్రతాదళాలు చెదరగొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఏడు గంటల పాటు గుయ్‌డో సామాజిక మాధ్యమానికి అందుబాటులో లేకుండా పోయాడు. ప్రతిపక్షం రెచ్చగొట్టే చర్యల పట్ల సంయమనం పాటించాలని మదురో మిలిటరీ, ఇతర భద్రతా దళాలను కోరాడు.తిరుగుబాటు యత్నాలను బలీవియా అధ్యక్షుడు ఇవోమొరేల్స్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ తీవ్రంగా ఖండించారు. ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చేస్తూ హింస ఏరూపంలో వున్నా ఖండించాలని, సంయమనం పాటించాలని కోరగా, ఐరోపా పార్లమెంట్‌ అధ్యక్షుడు అంటోనియో టజని మాత్రం తిరుగుబాటును సమర్ధించాడు.

నాడు క్యూబా, నేడు వెనెజులాలో చరిత్ర పునరావృతం !

అమెరికా దేశాల సంస్ధ (ఒఎఎస్‌) నుంచి తప్పుకొనే ప్రక్రియను పూర్తి కావటంతో సంతోషం ప్రకటిస్తూ వెనిజులాలో అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఆ సంస్ధ అమెరికా కీలబొమ్మగా మారిందని ఇప్పుడు తాము మరింత స్వతంత్రంగా వున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో ఆ సంస్ధ చేసే నిర్ణయాలకు కట్టుబడనవసరం లేదు. అది అమెరికా వలస దేశాల మంత్రిత్వశాఖ అని గతంలో కాస్ట్రో చేసిన విమర్శను మదురో పునరుద్ఘాటించారు.అమెరికా ఆంక్షలకు గురైన వెనెజులా విదేశాంగ మంత్రి జార్జి అరియా విదేశాంగశాఖ భవనంపై నుంచి శనివారం నాడు ప్రదర్శకులతో మాట్లాడుతూ మనం నిన్నటి కంటే నేడు మరింత స్వతంత్రుల మయ్యామని ప్రకటించారు. అమెరికా దేశాల సంస్ధ ప్రధాన కార్యదర్శి లూయీస్‌ మగారో అమెరికాకు వంతపాడుతూ అవసరమైతే మానవతా పూర్వకంగా మిలిటరీ జోక్యం చేసుకున్నాతప్పు లేదని గతంలో ప్రకటించాడు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో సభ్యదేశాలన్నీ గుయ్‌డో సర్కార్‌ను గుర్తించాలని తీర్మానించటమేగాక మదురో సర్కార్‌ ప్రతినిధి బదులు గుయ్‌డో మనిషిని సమావేశానికి ఆహ్వానించింది. ఈ పూర్వరంగంలో వెనిజులా రెండు సంవత్సరాల గడువు నిబంధనను పూర్తి చేసి ఆ సంస్ధ నుంచి వైదొలిగింది. వెనిజులా మీద దాడికి పాల్పడితే సహించేది లేదని రష్యా, చైనా హెచ్చరికలు చేశాయి. యాభై ఏడు సంవత్సరాల క్రితం క్యూబాలో క్షిపణుల మోహరింపు, నేడు వెనెజులాలో అదే పునరావృతం అయింది. నాడు అమెరికా తోక ముడిచి రాజీకి దిగి వచ్చింది.నేడు వుక్రోషంతో హూంకరింపులు చేస్తోంది. ముగింపు కూడా గతమే పునరావృతం అవుతుందా? ఆరు దశాబ్దాల నాటికి నేటికీ ప్రపంచం, రాజకీయాల్లో వచ్చిన మార్పులేమిటి? కొత్త వుద్రిక్తతలకు నాందీ వాచకం పలుకుతుందా, అంతర్జాతీయ పరిణామాలు, పర్యవసానాలు ఎలా వుంటాయి? వీటి మంచి చెడ్డలను ఎలా చూడాలి? రెండింటి మధ్య వున్న సామ్యాలు ఏమిటి ?

నాడు క్యూబాలో జరిగిందానికి, నేడు వెనెజులాలో జరుగుతున్నదానికి అమెరికా సామ్రాజ్యవాదులే కారణం. తమ గుమ్మం ఎదుట ఒక సోషలిస్టు రాజ్యం అవతరించటమా అని నాడు ఆగ్రహం వస్తే, అంతరించిపోయిందనుకు కున్న వామపక్ష శక్తి తన పెరటితోటలోనే పెరగటమా అని నేడు అమెరికా వూగిపోతోంది. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన 1959లో ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కాస్ట్రో వ్యతిరేకులకు ఆయుధాలు, శిక్షణ ఇచ్చిన అమెరికా 1961లో జరిపిన తిరుగుబాటు కుట్రను బే ఆఫ్‌ పిగ్స్‌ అని పిలిచారు. ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌ దృష్టిని క్యూబా నుంచి మళ్లించేందుకు ఐరోపాలోని టర్కీ, ఇటలీలో ఖండాంతర క్షిపణులను మోహరించి రెచ్చగొట్టారు. అమెరికన్ల మద్దతుతో జరిగిన తిరుగుబాటును అణచివేసిన క్యూబా సర్కార్‌ తమకు రక్షణ కల్పించాలని కోరగా 1962 అక్టోబరులో క్యూబా గడ్డమీద సోవియట్‌ తన క్షిపణులను మోహరించింది. ఈ చర్య అమెరికా సమాజంలో ప్రభుత్వం మీద ఆగ్రహం కలిగించింది. తమకు అణ్వాయుధాల ముప్పు తెచ్చారంటూ తీవ్ర నిరసనలు, విమర్శలు చెలరేగాయి. రెండవది అదే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దానికే ఎదురు తిరగటంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముదు అంటే 1962 అక్టోబరు రెండవ పక్షంలో జరిగిన ఈ పరిణామంతో అమెరికా వెనక్కు తగ్గి సోవియట్‌ యూనియన్‌తో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టర్కీ, ఇటలీ నుంచి అమెరికా అణ్వాయుధాలను తొలగించాలి, దానికి ప్రతిగా క్యూబా నుంచి సోవియట్‌ తొలగిస్తుంది. క్యూబా వైపు నుంచి ప్రత్యక్షంగా రెచ్చగొట్టే చర్యలు వుంటే తప్ప తాముగా క్యూబాలో జోక్యం చేసుకోబోమని, సోవియట్‌తో న్యూక్లియర్‌ హాట్‌లైన్‌ ఏర్పాటు చేసుకుంటామని అమెరికన్లు దిగివచ్చారు.

ఇప్పుడు వెనిజులా విషయంలో అమెరికన్లు ఎత్తుగడను మార్చారు. సైన్యంలో తిరుగుబాట్లను రెచ్చగొట్టి విఫలమయ్యారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షానికి వచ్చిన మెజారిటీని ఆసరా చేసుకొని వామపక్ష మదురో సర్కార్‌ను కూలదోసేందుకు తెరతీశారు.ఈ ఏడాది జనవరి 23న పార్లమెంట్‌ స్పీకర్‌ జువాన్‌ గుయ్‌డో తనకు తానే దేశాధ్యక్షుడనని ప్రకటించుకున్నాడు. బయట ప్రమాణస్వీకార తతంగం కూడా జరిపాడు. దాన్ని అమెరికాతో సహా దాని అనుంగు దేశాలు గుర్తించాయి. గుయ్‌డోకు విధేయులై వుండాలని మిలిటరీ, అధికార యంత్రానికి చేసిన వినతికి స్పందన లేదు. వాస్తవానికి అంతకు ముందే అధ్యక్షుడు మదురో పార్లమెంట్‌ను రద్దు చేసి నూతన రాజ్యాంగ రచనకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. అందువలన గుయ్‌డో అధ్యక్షుడిగా అతను చేసిన ప్రమాణస్వీకారం చెల్లదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే విదేశాలలో ఏర్పాటు అయినట్లు చెప్పుకున్న గుయ్‌డో అనుకూల సుప్రీం కోర్టు అతన్ని సమర్ధించింది. తన పధకానికి అనుగుణంగా పరిణామాలు లేకపోవటంతో కంగు తిన్న అమెరికన్లు వెనెజులా మీద మరింత కఠినంగా ఆంక్షలు పెట్టటమే కాదు, దేశంలోని విద్యుత్‌ వ్యవస్ధను చిన్నాభిన్నం చేశారు. ప్రాణావసర ఔషధాలను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మానవతా పూర్వక సాయం పేరుతో ట్రక్కుల్లో ఆయుధాలు చేరవేసేందుకు పన్నిన ఎత్తుగడను మదురో సర్కార్‌ విఫలం చేసింది.

దీనికి ప్రతిగా వెనెజులా కోరిక మీద అమెరికన్ల అధునాతన ఆయుధాల దాడిని ఎదుర్కొనే వుపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే ఎస్‌300క్షిపణులను, వాటిని ప్రయోగించే మిలిటరీ నిపుణుల రష్యా తరలించింది. వాటిని దాపరికం లేకుండా వెనిజులా ప్రత్యక్షంగా ప్రదర్శించింది కూడా. దీనికి తోడు యాంగ్జీఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌లైన్స్‌ చైనా నుంచి బోయింగ్‌ 747 సరకు రవాణా విమానంలో ఔషధాలు, పరికరాలను చైనా పంపింది. నికొలస్‌ మదురో వుద్వాసనకు గురి కాబోతున్నాడంటూ సోమవారం నాడు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. లక్ష కోట్ల డాలర్ల సిల్కు రహదారి(దీన్నే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ అని పిలుస్తున్నారు) పారిశ్రామిక, వాణిజ్య పధకం గురించి 150దేశాలకు, 90సంస్ధలకు చెందిన ప్రతినిధులతో గతవారంలో బీజింగ్‌లో చైనా పెద్ద సమావేశం నిర్వహించింది. దానికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా 37దేశాధినేతలు కూడా హాజరయ్యారు.( ఈ సమావేశాన్ని అమెరికా,దానితో కౌగిలింతల దౌత్యం నడుపుతున్న మన దేశం కూడా బహిష్కరించింది) ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు గ్జీ గింపింగ్‌తో సమావేశమైనపుడు వెనిజులా ప్రస్తావన వచ్చిందని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలు ఆమోదయోగ్యం కాదని, ఇరుదేశాలు దానికి బాసటగా నిలవాలని, అమెరికా వైఖరిని ఖండిస్తూ వారు మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఇది అమెరికన్లకు ఆగ్రహం తెప్పించింది. క్యూబా మీద మరిన్ని ఆంక్షలు విధించటాన్ని గుర్తు చేస్తూ మదురో మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్ధితి ఎంతో మెరుగ్గా వుండేదని చెప్పేందుకే తామీ పని చేశామని, మదురోను సమర్ధించే దేశాలన్నింటికీ ఇదే చెప్పదలచుకున్నామని రష్యా, చైనాలను బెదిరిస్తూ పాంపియో మాట్లాడాడు. వెనెజులా పౌరులు, మిలిటరీకి, క్యూబన్లకు, రష్యన్లకు, మీరు గనుక వార్తలు చూస్తే వెనిజులాకు సాయం చేస్తున్న ఇరాన్‌కు, అదే విధంగా ఎంతో చేస్తున్న చైనాకూ ఇదే హెచ్చరిక అన్నాడు. మదురోకు మద్దతుదారుల్లో ఒకరు తిరుగుబాటుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. క్యూబా నుంచి వందల మంది అధికారులు, 20వేల మంది సనికులు వెనెజులా వెళ్లినట్లు అమెరికా చేసిన ఆరోపణలను క్యూబా అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌ తోసి పుచ్చారు. ప్రపంచంలో 800చోట్ల సైనిక స్ధావరాలు, లక్షల మంది సైన్యాన్ని దింపిన అమెరికా తమ గురించి మాట్లాడుతోందని,అబద్దాలు చెబుతోందని అన్నారు.

సర్వసత్తాక దేశాల్లో జోక్యం చేసుకొనే అమెరికా వైఖరిని రష్యా, చైనా ఖండించాయి. వెనిజులాపై చర్య తీసుకొనే అంశంలో తమ అధికారులు సిద్ధంగా వున్నారని అమెరికా దక్షిణ కమాండ్‌ నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ క్రెయిగ్‌ ఫాలర్‌ వెల్లడించాడు. ఈ ప్రకటన మిలిటరీ జోక్యం వూహకాదు వాస్తవమే అని రష్యా వ్యాఖ్యానించింది.అమెరికా అంతర్గత చట్టాల పేరుతో భద్రతా మండలి వెలుపల ఆం్షలు విధించటాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా పేర్కొన్నది.చైనా, ఇరాన్‌ మానవతా పూర్వక సాయాన్ని అందించేందుకు ప్రతినిధులతో పాటు విమానాల్లో సాయాన్ని కూడా పంపాయి. అమెరికా దాడికి సిద్ధం అవుతున్నదనే వార్తల పూర్వరంగంలో భద్రతా దళాలకు మద్దతుగా పది లక్షల మందిని సిద్ధం చేయాలని గతవారం మదురో ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

గత నెల చివరి వారంలో రష్యా నుంచి యుద్ధనిపుణులు వెనిజులా చేరుకున్నారు. అమెరికా నుంచి ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు అవసరమైన ఎత్తుగడలను వారు రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మిలిటరీ కేంద్రాల సంరక్షణకు రష్యా తయారీ ఎస్‌-300 క్షిపణులను ప్రయోగించే నాలుగు సంచార వాహనాలను ఏర్పాటు చేశారు. ఛావెజ్‌ బతికి వున్న సమయంలోనే బ్రహ్మూెస్‌ క్షిపణులను మోసుకుపోగల సుఖోయ్‌ ఎస్‌యు-30 జట్‌ యుద్ధ విమానాలను, టి-72 టాంకులు, వేగంగా ప్రయాణించే పడవలు, ఎకె-103 తుపాకులను తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వుపరితలం నుంచి గగనతలంలోకి సైనికులు భుజాలపై వెంట తీసుకుపోగల క్షిపణి ప్రయోగ పరికరాలను పెద్ద సంఖ్యలో రష్యా సరఫరా చేసింది. అమెరికా తొత్తు గుయ్‌డోకు మద్దతు ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్ళిన గూఢచారశాఖ మాజీ అధిపతి కార్వాజల్‌ను స్పెయిన్‌లో మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు.

Crowds gathered outside Miraflores Palace on Tuesday morning. (Cira Pascual Marquina)

అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని  మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన

అమెరికా విధించిన ఆర్ధిక, వస్తు సరఫరాలపై ఆంక్షలు, విద్యుత్‌ కేంద్రాలలో విద్రోహ చర్యల వంటి సమస్యల కారణంగా వెనిజులా పౌరులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారు గత నిరంకుశపాలనతో పోల్చుకొని మదురోకు బాసటగా నిలుస్తున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తట్టుకొనేందుకు వీలుగా కార్మికుల, వుద్యోగుల వేతనాలను మదురో సర్కార్‌ ఎప్పటికప్పుడు సవరిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి పరిస్ధితి మరింత దిగజారింది. ఆర్ధికంగా జనాన్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటం అమెరికా ఎత్తుగడగా వుంది.ఇప్పటికే చమురుపై ఆంక్షల కారణంగా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయింది. 2017-18లో 40వేల మంది చావులకు అమెరికా ఔషధాలపై విధించిన దుర్మార్గ ఆంక్షలే కారణం. మరో మూడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 2013లో 11.2బిలియన్‌ డాలర్ల మేరకు ఆహారం దిగుమతి చేసుకుంటే ఆంక్షల కారణంగా 2018లో అది 2.46బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

ఇన్ని ఇబ్బందులను భరిస్తున్నప్పటికీ అమెరికా వ్యతిరేక వైఖరిలో ఇంతవరకు జనంలో పట్టుసడల లేదు. అమెరికాకు చెందిన గాలప్‌ సంస్ధ ఇటీవల జరిపిన సర్వేలో వెనిజులా పౌరుల కంటే ప్రపంచంలో అత్యంత ధనికులు, శక్తివంతులైన అమెరికన్లే ఎక్కువ వత్తిడికి లోనవుతున్నట్లు 2019 ప్రపంచ మనోద్వేగ నివేదికలో గాలప్‌ సంస్ధ తెలిపింది. పగలు తాము అత్యంత వత్తిడికి లోనవుతున్నట్లు 55శాతం మంది అమెరికన్లు చెప్పారట. ఇరాన్‌, శ్రీలంక,అల్బేనియా, అమెరికా నాలుగవ స్ధానంలో వున్నాయి. మొదటి మూడు స్ధానాల్లో గ్రీస్‌, ఫిలిప్పయిన్స్‌, టాంజానియా వున్నాయి.అనేక ఇబ్బందులున్నప్పటికీ వెనెజులా 12వ స్ధానంలో వుంది.

క్యూబాపై అమెరికా కుట్ర చేసిన సమయంలో క్షిపణులను మోహరించిన సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు రాజ్యం. సోదర దేశాన్ని రక్షించటం తన బాధ్యతగా ఎంచుకుంది. ఆ సమయం చైనా కూడా సోషలిస్టు దేశమే అయినప్పటికీ సోవియట్‌ మాదిరి శక్తి కలిగినది కాదు, అంతర్గత ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇప్పుడు రష్యాకు అలాంటి బాధ్యత లేనప్పటికీ ఐరోపాలో తనకు ఎసరు పెడుతున్న అమెరికాను అడ్డుకోవాలంటే దాని పెరటితోటలోనే తాను పాగా వేయగలమన్న హెచ్చరిక దాని చర్యలో కనిపిస్తోంది. మరోవైపున క్యూబా, వెనిజులా, తదితర సోషలిస్టు, వామపక్ష ప్రభుత్వపాలనలో వున్న దేశాల పట్ల చైనా ఇటీవలి కాలంలో బాసటగా నిలవటం మరింత ఎక్కువగా చేస్తున్నది. మాటల కంటే చేతల్లో చూపుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వర్తమానంలో మేడే ప్రాధాన్యత !

26 Friday Apr 2019

Posted by raomk in Current Affairs, employees, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

International Workers' Day, may day, May Day 2019, May Day significance, May day significance in the contemporary period

Image result for may day haymarket

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అభివృద్ధి రేటు గతేడాది వున్న 3.6శాతం నుంచి ఈ ఏడాది 3.3కి తగ్గుతుందని, వచ్చే ఏడాది తిరిగి 3.6శాతం వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) ప్రకటించింది. ఏడాదిలో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆర్ధిక వ్యవస్ధల మంచి చెడ్డల గురించి తన అంచనాలను వెల్లడిస్తుంది. ఈ సంస్ధ వునికిలోకి వచ్చిన ఏడు దశాబ్దాలలో ప్రపంచంలో ముఖ్యంగా ధనిక దేశాలలో తలెత్తిన ఆర్దిక సంక్షోభం గురించి ఎన్నడూ జోస్యం చెప్పలేకపోయింది. అందువలన అది చెప్పే అంచనాలకూ అదే పరిస్ధితి. ఈ ఏడాది జనవరిలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ 3.5శాతం రేటుతో అభివృద్ధి చెందనుందని చెప్పింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ చెప్పే అంకెల విశ్వసనీయత సమస్యను కాసేపు పక్కన పెడదాం. వాటినే పరిగణనలోకి తీసుకుంటే కార్మికవర్గానికి అర్దం అయ్యేదేమిటి? గతేడాది కంటే ఈ ఏడాది పరిస్ధితి దిగజారుతుంది, వచ్చే ఏడాది గతేడాది మాదిరే వుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వున్నాం. మనకు ఆమోదం వున్నా లేకపోయినా మన పాలకులు మన దేశాన్ని ప్రపంచీకరణ రైలు ఇంజనుకు బోగీగా తగిలించారు. అందువలన దాని నడతను బట్టే మన పరిస్ధితీ వుంటుంది. గీతా గోపీనాధ్‌ చెప్పినట్లు రాబోయే రోజుల్లో పరిస్ధితిలో పెద్దగా మార్పు వుండదంటే మూడు సంవత్సరాలలో కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే ఈ మే డే సందేశం.

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. మిగతా చోట్ల మిగిలిన దశ ఎన్నికలు జరగున్నాయి. పోలింగ్‌ ముగిసిన చోట ఓటరు తీర్పు రిజర్వు అయింది. అందువలన భావోద్వేగాలను పక్కన పెట్టి వుద్యోగులు, కార్మికులు ఆలోచించటం అవసరం. ఈ ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో వుపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరిగాయి. చిత్రం ఏమిటంటే రెండు చోట్లా అధికారపార్టీతో అంటకాగిన వుపాధ్యాయ నేతలు మట్టి కరిచారు. గత ఐదు సంవత్సరాలుగా వారు ఆయా ప్రభుత్వాల మీద కల్పించిన భ్రమలు టీచర్లు, గ్రాడ్యుయేట్లలో తొలగిపోతున్నాయనేందుకు ఇదొక సంకేతం. వుద్యోగులు, వుపాధ్యాయుల్లో ఏడాది కేడాది నూతన పెన్షన్‌ స్కీం అమలయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పధకాన్ని ప్రవేశపెట్టి, అమలు జరిపిన పార్టీలు కూడా దానిని రద్దు చేస్తామని ఎన్నికల ఆపదమొక్కులు మొక్కుతున్నాయి. వాగ్దానాలు చేసిన పార్టీలు లేదా వాటికి మద్దతు పలికిన వుద్యోగ సంఘాల నేతలు గానీ అధికారంలో వున్నపుడు కొత్త పెన్షన్‌ స్కీము రద్దు చేసి పాతదానిని ఎందుకు పునరుద్దరించలేదో సంజాయిషీ ఇవ్వాలి, వుద్యోగులు నిలదీయాలి.

ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతున్న నయా వుదారవాద విధానాలు మొత్తంగా జనాన్ని భ్రమలకు గురి చేస్తాయి. అలాంటపుడు శ్రమ జీవులు దానికి అతీతంగా ఎలా వుంటారు. అందుకే ఆశల పల్లకిలో వున్న వారు కుదుపుకు గురైతే తట్టుకోలేరు. ఎప్పుడు వుద్యోగాలు వూడతాయో తెలియదు. ఏటా రెండు కోట్ల వుద్యోగాలను కల్పిస్తాన్న నరేంద్రమోడీ వాగ్దానాన్ని జనం నమ్మారు. కొత్తవాటి సంగతి దేవుడెరుగు వున్న వుద్యోగాలే వూడుతున్నాయన్నది వాస్తవం. ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త , మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

Image result for may day india citu

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన వృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న. వుపాధి రహిత అభివృద్ధి వుద్యోగుల, కార్మికుల బేరసారాలాడే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించే డిఏను వుద్యోగులకు నష్టదాయకంగా ఆరునెలలకు చేస్తే సంఘాలేమీ చేయలేకపోయాయి. కారుచౌకగా పనిచేసేందుకు సిద్దం సుమతీ అంటున్నవారు క్యూకడుతున్న కారణంగానే పర్మనెంటు వుద్యోగాల స్ధానంలో కాంట్రాక్టు, పొరుగు సేవల పేరుతో తక్కువ వేతనాలకు పనిచేయించుకుంటున్నారు. ఒకే పనికి ఒకే వేతనం అన్న సహజన్యాయం అన్యాయమై పోతోంది. దీనికి వ్యతిరేకంగా వుద్యో గులు, నిరుద్యో గులూ ఐక్యంగా పోరాడకపోతే రేపు వుద్యోగుల మీద జరిగే దాడిని అన్యాయం అనేవారు కూడా మిగలరు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును ప్రవేశపెట్టినపుడు అప్పటికే వుద్యోగాల్లో వున్న తమకు అది వర్తించదు కదా అని వుద్యో గులు పట్టించుకోలేదు, అసలు వుద్యోగాలు లేనపుడు ఏదో ఒకటి అని నిరుద్యోగులు ఆలోచించలేదు. తీరా కొత్త పెన్షన్‌ స్కీములో చేరిన కొత్తవుద్యో గులకు రోజులు గడిచే కొద్దీ జరిగే నష్టం ఏమిటో అర్ధం అయింది. ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.

ఏడాది క్రితం అమెరికన్లు చైనా, ఇతర దేశాలతో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కారణంగా గతేడాది అక్టోబరు నుంచి ఐఎంఎఫ్‌ మూడు సార్లు ప్రపంచ అభివృద్ధి అంచనాలను తగ్గించింది. అమెరికన్లు వాణిజ్య యుద్ధాన్ని ఒక్క చైనాకే పరిమితం చేయటం లేదు. ఐరోపా యూనియన్‌ నెదర్లాండ్స్‌లోని ఎయిర్‌ బస్‌ విమాన కంపెనీకి అనుచితంగా సబ్సిడీలు ఇస్తున్నందున తమ దేశంలోని బోయింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చాలా కాలంగా అమెరికన్‌ కార్పొరేట్లు గుర్రుగా వున్నాయి. ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై 11బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి పన్నులు విధిస్తాంటూ ఏప్రిల్‌ పదిన డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్దంలో కొత్త రంగాన్ని తెరిచాడు. బోయింగ్‌ కంపెనీకి ఇస్తున్న సబ్సిడీల సంగతి తాము తేలుస్తామంటూ ఐరోపా యూనియన్‌ ప్రతిసవాల్‌ చేసింది. ట్రంప్‌ జపాన్‌ మీద కూడా దాడి ప్రారంభించేందుకు పూనుకున్నాడు. భారత్‌తో సహా వాణిజ్య లోటు వున్న ప్రతిదేశం మీద అమెరికా దాడి చేసేందుకు పూనుకుంది. అంటే బలవంతంగా తన వస్తువులను కొనిపించే గూండాయిజానికి పాల్పడుతోంది. ఇది ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలకు పూనుకొనేట్లు చేస్తోంది, కొత్త వివాదాలను ముందుకు తెస్తోంది. ముందే చెప్పుకున్నట్లు ఏ దేశానికి ఆదేశం తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు పూనుకోవటం అంటే జనం మీద భారాలు మోపటం, వున్న సంక్షేమ చర్యలకు మంగళం పాడటమే. ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల వుద్యమం ప్రతి శనివారం ఏదో ఒక రూపంలో జరుగుతోంది, ఇలాగే అనేక దేశాల్లో కార్మికవర్గం నిరసన తెలుపుతోంది. వేగంగా పెరుగుతున్న సంపద అంతరాలు వుద్యమాలు, విప్లవాలకు దారి తీస్తాయన్న హెచ్చరికలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు.

ప్రపంచంలో ప్రస్తుతం 66దేశాల్లో మేడే రోజున ప్రభుత్వాలు సెలవులు ఇస్తున్నాయి. ఇది కార్మికవర్గ విజయం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే మెజారిటీ దేశాలలో సెలవు లేదంటే దాన్నే సంపాదించలేని కార్మికవర్గం దోపిడీని అంతం చేయాలంటే ఇంకా ఎంతో చేయాల్సి వుందన్నది స్పష్టం. సెలవు వున్న దేశాల్లో కూడా కార్మికవర్గంలో కొన్ని అపోహలు, అవాంఛనీయ ధోరణులు వున్నాయి.

Image result for may day

ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ, బ్యాంకు, మార్కెటింగు, విత్త కంపెనీల కార్యకలపాలు నిర్వహించే వుద్యోగులు ఇప్పటికే తాము కార్మికులని అనుకోవటం మానేశారు. కంపెనీ క్యాబుల్లో పని ప్రదేశాలకు వెళుతూ మహానగరాలలో పని చేసే ఐటి కంపెనీలు, వాటి అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే వారు తమది ప్రత్యేక తరగతి అనుకుంటున్నారు. ఆ లెక్కన సంప్రదాయ భాష్యం ప్రకారం అసలు కార్మికులు ఎందరు ? ఎవరు? ఇప్పటికీ కార్మికులం అని భావించే అనేక మందికి మేడే ఒక వుత్సవం. మరి కొంత మందికి ఆ రోజు దీక్షా దినం. వుత్సవానికి, దీక్షా దినానికి తేడా ఏమిటి ?

మేడేను వుత్సవంగా జరిపినా, దీక్షా దినంగా పాటించినా కార్మికుల బతుకులు ఆదివారం నాడు అరటి మొలచింది…. శనివారం నాడు పాపాయి చేతికి పండు వచ్చిందన్నంత సులభంగా మారటం లేదు, మారవు అని గమనించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి.

Image result for may day haymarket

ప్రతి ఏడాదీ చెప్పుకొనేదే అయినప్పటికీ కొత్త తరాలు వస్తుంటాయి గనుక ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. చాలా మంది మే డే అంటే ఎర్రజెండా పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. మన దేశంతో సహా అనేక చోట్ల కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. అనేక డిమాండ్లను యజమానుల ముందుంచాయి. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటిపై స్పందన లేకపోవటంతో కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచేందుకు పూనుకుంది.దానిపై చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు మే నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. సంఖ్య ఇప్పటికీ తెలియదు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మినేతలను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో శిక్షలను ఖరారు చేశారు. 1887 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for may day haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని, ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ముఖ్య అనుచరుడైన నారాయణ్‌ మేఘాజీ లోఖాండే. ఒక జర్నలిస్టు, ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, అప్పటికి కమ్యూనిస్టు వాసనలు మన దేశంలో లేవు. బొంబాయి వస్త్ర మిల్లు కార్మికుల పని పరిస్థితులను చూసి చలించిపోయిన ఆ జర్నలిస్టు జ్యోతిబా పూలే సహకారంతో 1880 నుంచీ కార్మికులను సంఘటిత పరిచేందుకు పూనుకున్నాడు.1884లో మిల్లు కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. యజమానుల ముందుంచిన వారి ప్రధాన కోరికలు ఇలా వున్నాయి. కార్మికులకు వారానికి ఒకరోజు ఆదివారం నాడు సెలవు ఇవ్వాలి.ప్రతి రోజు మధ్యాహ్నం అరగంట పాటు విరామం కల్పించాలి. మిల్లులను వుదయం ఆరున్నర గంటలకు ప్రారంభించి సూర్యాస్తమయానికి మూసివేయాలి.కార్మికుల వేతనాలు ప్రతినెల పదిహేనవ తేదీన చెల్లించాలి. ఇదే సమయంలో చికాగోలో కార్మికులు ఎనిమిది గంటల పని కోసం డిమాండ్‌ చేస్తే బొంబాయి కార్మికులు పన్నెండు గంటల పని డిమాండ్‌ చేశారంటే ఇంకా ఎక్కువ గంటలు పని చేసే వారన్నది స్పష్టం.

ప్రపంచాన్ని వూపి వేస్తున్న ఐటి, దాని అనుబంధ కార్యకలాపాలు, వివిధ టెక్నాలజీలలో శిక్షణ పొంది పరిశ్రమలలో పని చేస్తున్న ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కార్మికులు కారా? యజమానులైతే కాదు, కనుక వారిని ఏ పేరుతో పిలవాలి. తెల్లచొక్కాల వారు కార్మికులు కాదా ? వారిని ఎలా సమీకరించాలి? ఇలాంటి ప్రశ్నలు వారినే కాదు, కార్మికవర్గాన్ని సమీకరించి దోపిడీ లేని నూతన సమాజాన్ని స్ధాపించాలని పని చేస్తున్న కమ్యూనిస్టు, సోషలిస్టు శక్తులన్నీ పరిష్కరించాల్సినవే. యాజమాన్యం తరఫు విధులు నిర్వహిస్తూ ప్రత్యక్షంగా వుత్పాదన, సేవలలో నిమగ్నం కాని సిఇఓ, డైరెక్టర్‌ వంటి వున్నత పదవులలో వున్నవారు తప్ప, ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని ఏదైనా ఒక వుత్పత్తి, సేవలలో భాగస్వామి అయిన ప్రతి వారూ కార్మికులే. వారు ఐటి నిపుణుడు, బ్యాంకు అధికారి, గుమస్తా, ఫ్యాక్టరీ ఇంజనీరు, డాక్టరు, యాక్టరు, జర్నలిస్టు, ప్రతిఫలం తీసుకొనే రచయిత ఇలా ఎవరైనా కావచ్చు. కొంత మంది వుత్పాదక, సేవల విలువ ఎక్కువ మొత్తంలో వుంటుంది కనుక ఆ రంగాలలో పని చేసే వారు పెద్ద మొత్తంలో వేతనంలో పొందినంత మాత్రాన కార్మికులు కాకుండా పోరు. ఆచరణలో అలాంటి వారంతా తాము కార్మికులం కాదనుకుంటున్నారు. వారిని ఆ భావజాలం నుంచి బయటకు తెచ్చి సమీకరించకుండా కార్మికవర్గ పార్టీలు ఎలా ముందుకు పోతాయన్నది ప్రశ్న. దోపిడీ వర్గం సంపదల సృష్టితో పాటు తమను అంతం చేసే కార్మికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేస్తుందన్నది చరిత్ర సారమని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పారు. బానిస యజమానులను బానిసలు, భూస్వాములను వ్యవసాయ కార్మికులు అంతం చేయటం గత చరిత్ర. పెట్టుబడిదారులను పారిశ్రామిక కార్మికులు అంతం చేయటం భవిష్యత్‌ చరిత్ర. అందుకే దోపిడీదారులు తమ హక్కులను అడగని కార్మికులను ప్రోత్సహిస్తారు, అడిగేవారిని అంతం చేసేందుకు చూస్తారు. తాగి తందనాలాడేందుకు డబ్బిచ్చి మరీ ప్రోత్సహించే యజమానులు, కార్మిక సంఘాన్ని పెట్టుకుంటే తొలగించటం, వేధించటం అందుకే.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోషలిస్టు శక్తులు సాధించిన విజయాలతో మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు జరిగాయి. పాలకపార్టీ ఒక కార్మిక సంఘాన్ని ప్రోత్సహించింది. మరోవైపున 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీ పద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మికులేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం. అందుకే మే డేను వుత్సవంగా జరుపుకోవటం గాక దీక్షా దినంగా పాటించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా వత్తిడికి లొంగిన అపర జాతీయవాది నరేంద్రమోడీ !

25 Thursday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Donald Trump diktats, INDIA, iran, Iran Oil, Narendra Modi, US SANCTIONS

Image result for narendra modi surrendered to donald trump diktats

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌, అమెరికా మధ్య రెండు ఖండాలు, పన్నెండు వేల కిలోమీటర్ల దూరం వుంది. అమెరికాతో పోల్చితే ఇరాన్‌ సైనిక శక్తి లేదా ఆయుధాలు ఒక రోజు యుద్ధానికి కూడా సరిపోవు. అలాంటి దేశం తమకు, పశ్చిమాసియాకు ముప్పుగా పరిణమిస్తోందని, అందువలన మేనెల రెండవ తేదీ తరువాత దాని దగ్గర వున్న ముడి చమురును కొన్నవారి తాట తీస్తా అంటూ అమెరికా హెచ్చరించింది. ఆ మాత్రానికే మన దేశ పాలకులకు బట్టలు తడుస్తున్నాయి. అంతవరకు ఎందుకు లెండి, కొనుగోళ్లను బాగా తగ్గించాం, ఇక ముందు పూర్తిగా నిలిపివేస్తాం, ఇప్పటికే ప్రత్యామ్నాయం చూసుకొన్నాం అని చేతులేత్తేశాం. అంతమాట అన్నావు కదా ఇప్పుడు చెబుతున్నాం ఇంతకు ముందు కొన్నదాని కంటే ఎక్కువ కొనుగోలు చేస్తాం, ఏమి చేస్తావో చేసుకో చూస్తాం అని చైనా తాపీగా జవాబు చెప్పింది. హెచ్చరికలు అందుకున్న దేశాలలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలాగూ అమెరికా అడుగులకు మడుగులత్తుతాయి, అటూ ఇటూ తేల్చుకోలేక టర్కీ మల్లగుల్లాలు పడుతోంది. అమెరికా ప్రకటన కొత్తదేమీ కాదు గతంలోనే చేసినప్పటికీ ఏదో మీరు మిత్రదేశాలు కనుక కొద్ది నెలలు ఆంక్షలను సడలిస్తున్నాం, ఆలోగా తేల్చుకోండి అని గతేడాది చివరిలో చెప్పింది. ఇప్పుడు తాజాగా మే రెండవ తేదీతో గడువు ముగుస్తుంది అని ప్రకటించేసింది.

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అది గల్లీ, ఢిల్లీ, వాషింగ్టన్‌ ఏదైనా కావచ్చు. అమెరికా చివరి క్షణంలో మరోసారి గడువు పెంచుతుందా? ఎందుకంటే మన దేశంతో సహా ప్రభావితమయ్యే దేశాలన్నీ బహిరంగంగానో, తడిక రాయబారాలో చేస్తున్నాయి. వారం రోజుల గడువుంది. అమెరికా అంటే డాలర్లు. ప్రతిదానిలో తనకెన్ని డాలర్ల లాభమా అని చూసుకుంటుంది. అందుకే ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజులుగా అమెరికన్ల ప్రకటనలను బట్టి ఇరాన్‌తో రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నదనే భావం కలుగుతోంది కనుక, దాని పూర్వరంగం, పర్యవసానాల గురించి చూద్దాం.

ఇరాన్‌ మీద ఎందుకీ ఆంక్షలు ?

ప్రపంచంలో ఏకీభావం లేని అంశాలలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పందం(ఎన్‌పిటి) ఒకటి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు ఈ ఒప్పందం వర్తించదు, మిగతా దేశాలు మాత్రం అణ్వస్త్రాలను తయారు చేయకూడదనేది అప్రజాస్వామిక, అవి లేని దేశాలను బెదిరించే వైఖరి తప్ప మరొకటి కాదు. అందుకే మన దేశం వంటివి ఆ ఒప్పందం మీద సంతకాలు చేయకుండా ఆత్మ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును అట్టిపెట్టుకున్నాయి. ఇరాన్‌ 1970లోనే ఆ ఒప్పందంపై సంతకం చేసింది. అలాంటి దేశాల అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు అనువైనదిగా వుండాలి తప్ప ఆయుధాలు తయారు చేయకూడదు. ఇరాన్‌ ఆ నిబంధనలను వుల్లంఘిస్తున్నదనే ఆరోపణల పూర్వరంగంలో చాలా సంవత్సరాల సంప్రదింపుల తరువాత 2015లో ఇరాన్‌-భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాలు, కార్యక్రమం అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ(ఐఏఇఏ) పర్యవేక్షణలోకి తేవాలి. దానికి ప్రతిగా అంతకు ముందు అమెరికన్లు స్దంభింపచేసిన ఇరాన్‌ ఆస్ధులను విడుదల చేయాలి, ఆంక్షలను ఎత్తివేయాలి. అయితే ఒప్పందంలోని మిగతా దేశాలతో నిమిత్తం లేకుండా కుంటి సాకులతో 2018లో అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అప్పటి నుంచి ఆంక్షలను మరింత కఠినతరం గావించేందుకు, అందుకు ఇతర దేశాలను కూడా తనకు మద్దతు ఇచ్చేందుకు వాటి మీద చమురు ఆయుధంతో వత్తిళ్లు, బెదిరింపులకు పూనుకుంది. ఇరాన్‌ చమురు సొమ్ముతో పశ్చిమాసియాలో గత నాలుగు దశాబ్దాలుగా అస్ధిర పరిస్ధితులకు కారణం అవుతోందని, అందువలన ఆ సొమ్ముదానికి అందకుండా చేయాలని అమెరికా చెబుతోంది. అదే సరైనది అనుకుంటే ప్రపంచవ్యాపితంగా అనేక ప్రాంతాలలో అస్ధిర పరిస్ధితులకు కారణం అమెరికా, మరి దాని మీద ప్రపంచమంతా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదా ?

కమ్యూనిస్టు అంటే ప్రతిఘటన, ప్రజాస్వామ్యం అంటే లొంగిపోవటమా !

కొంత మంది దృష్టిలో చైనా కమ్యూనిస్టు నియంతృత్వదేశం. అమెరికా అపర ప్రజాస్వామిక దేశం. అయితే సదరు దేశ పాలకులు కమ్యూనిస్టు చైనాతో పాటు తోటి ప్రజాస్వామిక, మిత్ర దేశాలుగా పరిగణించే భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, టర్కీ మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు. కమ్యూనిస్టు చైనా మాత్రమే అవి మాదగ్గర పనిచేయవు అని చెప్పింది. వీర జాతీయవాదులమని చెప్పుకొనే బిజెపి నాయకత్వంలోని మన ప్రభుత్వం మాత్రం అమెరికా గుడ్లురుమగానే సలాం కొట్టి వేరే దేశాల నుంచి అధిక ధరలకు చమురు కొనుగోలుకు పూనుకుంది. ఎంతకు కొంటే అంత వసూలు చేయాలనే విధానం అమలవుతోంది గనుక డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ కౌగిలింతలు, కలయికలకు ఎలాంటి అంతరాయం వుండదు, జేబుల్లో డబ్బులు పోగొట్టుకొనేది వినియోగదారులే. పెట్రోలు, డీజిలు ధరలు పెరిగినా, వాటి ప్రభావం పరోక్షంగా పడినా అనుభవించేంది జనాభాలో నూటికి 80శాతంగా వున్న బడుగు, బలహీనవర్గాలే అన్నది తెలిసిందే. ట్రంప్‌ సంతోషం లేదా అమెరికా రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకోసం పేద, మధ్యతరగతి వారిని బలిపెడతారా ? దీన్ని దేశభక్తి అనాలా లేక మరొకటని వర్ణించాలా?

ప్రపంచంలో మన దేశంతో సహా అనేక దేశాలలో అణ్వాయుధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. ఒక వాదన ప్రకారం ఏ దేశంలో అణువిద్యుత్‌ కేంద్రం వుంటే ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు తయారు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానం, అణుశక్తి వున్నట్లే లెక్క. అణ్వాయుధాలున్న మిగతా దేశాలన్నీ తాముగా ముందుగా ప్రయోగించబోమని ప్రకటించాయి, మరోసారి ప్రయోగించబోమని అమెరికా ఇంతవరకు చెప్పలేదు. అందువలన దాని బెదిరింపులకు లేదా ఇతరత్రా ప్రమాదాలు వున్న ప్రతి దేశం అణ్వాయుధాలను సమకూర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. మనం ఆపని చేసినపుడు మన మిత్ర దేశం అదే పని చేస్తే తప్పేమిటి అన్నది ఆలోచించాలి. అయినప్పటికీ తాను అణ్వాయుధాలు తయారు చేయనని ఇరాన్‌ ఒప్పందాన్ని అంగీకరించినా వుల్లంఘిస్తోందని ఆధారాలు లేని ఆరోపణలతో అమెరికా పేచీలకు దిగుతోంది. మనం ఎందుకు సమర్ధించాలి? ఒప్పందంలో భాగస్వాములైన మిగతా దేశాలకు లేని అభ్యంతరాలు అమెరికాకు ఎందుకు ?

ఇరాన్‌ మీద ఆంక్షలు అమలు జరిగితే పర్యవసానాలు ఏమిటి ?

ఒక దేశం మీద ఆంక్షలు అమలు జరిపినంత మాత్రాన అది అణ్యాయుధ కార్యక్రమాన్ని వదలివేస్తుందన్న గ్యారంటీ లేదు. ఇరాన్‌తో పోలిస్తే పాకిస్ధాన్‌ చాలా పేద దేశం. అదే అణ్వాయుధాలు,క్షిపణులు తయారు చేయగలిగినపడు ఇరాన్‌కు ఎందుకు సాధ్యం కాదు? గతంలో అణు పరీక్షలు జరిపినపుడు మన దేశం మీద కూడా అమెరికా ఆంక్షలు అమలు జరిపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోయాము.క్షిపణులు తయారు చేశాము, వాటిని జయప్రదంగా ప్రయోగించాము. తాజాగా ఐదున్నరవేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే ఆయుధాన్ని కూడా జయప్రదంగా ప్రయోగించాము. అయితే దాన్నింకా ఎంతో మెరుగుపరచాల్సి వుందనుకోండి. అదేమీ పెద్ద సమస్య కాదు. ఇలాంటి మన దేశం మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కించపరిచే విధంగా అమెరికా ఆంక్షలకు లంగిపోయి వేరే దేశాల నుంచి చమురు కొనుగోలు చేయటం ఏమిటి? మనం వెనిజులా నుంచి కూడా చమురు కొంటున్నాం. ఆదేశం మీద కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. దాన్నుంచి కూడా కొనుగోలు ఆపేయాల్సిందే అంటే ఆపటమేనా, రేపు సౌదీ అరేబియాతో తగదా వచ్చి దాన్నుంచి కూడా కొనుగోలు చేయవద్దంటే మన పరిస్ధితి ఏమిటి ? మన అవసరాలకు 80శాతం విదేశాల మీద ఆధారపడుతున్న స్ధితిలో చమురు దేశాలతో మిత్రత్వం నెరపాలి తప్ప అమెరికా కోసం శతృత్వాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? అమెరికాకు లంగిపోవటమే మన విధానమా, దానితో సాధించేదేమిటి? మన యువతీ యువకులకు వీసాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఎగుమతులకు ఇచ్చిన దిగుమతి పన్ను మినహాయింపులను రద్దు చేశారు.

వినియోగదారుల మీద పడే భారం ఎంత !

అమెరికా ఆడుతున్న రాజకీయాల కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌ ప్రభావితం అవుతోంది. ధరలు పెరుగుతున్నాయి, 2018 నవంబరు రెండవ తేదీన భారత్‌ాఇరాన్‌ ప్రభుత్వాలు కుదుర్చుకున్న అవగాహన ప్రకారం అంతకు ముందున్న ఏర్పాట్ల ప్రకారం నలభై అయిదు శాతం రూపాయల్లో, 55శాతం యూరోల్లో ఇరాన్‌ చమురుకు చెల్లించాలన్న ఒప్పందాన్ని సవరించి సగం మొత్తం రూపాయల్లో చెల్లించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అవగానకు వచ్చిందని రాయిటర్స్‌ సంస్ధ తెలిపింది. గతంలో అమెరికా ఆంక్షలున్నప్పటికీ ఇరాన్‌కు మన దేశం వ్యవసాయ వుత్పత్తులు, ఆహారం, ఔషధాలు, వైద్యపరికరాలను ఎగుమతులు చేయవచ్చు. ఇప్పుడు రూపాయల్లో చెల్లించే అవకాశం లేదు. ఇరాన్‌కు వెళ్లే ఎగుమతులూ నిలిచిపోతాయి. మరోవైపు మార్కెట్లో డాలర్లను కొనుగోలు చేసి మొత్తం చమురు కొనుగోలు చేయాలి. ఇది మన విదేశీమారక నిల్వలు, రూపాయి విలువ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. అన్నింటికీ మించి అమెరికా చర్యల వలన చమురు ధరలు పెరుగుతాయి. ఇరాన్‌ పట్ల కఠిన వైఖరి అవలంభించనుందనే అంచనాల పూర్వరంగంలో గత రెండు నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. నవంబరు తరువాత అమెరికాలో ఒక గ్యాలన్‌ (3.78 లీటర్లు)కు మూడు డాలర్ల మేర ఇప్పుడే ధరలు పెరిగాయి. తొమ్మిది వారాలుగా గ్యాస్‌ ధరలు కూడా పెరుగుతూనే వున్నాయి.అక్కడి జనానికి ఆదాయం వుంది కనుక వారికి ఒక లెక్కకాదు. మనం దిగుమతి చేసుకొనే చమురు డిసెంబరు నెలలో సగటున ఒక పీపా ధర 57.77 డాలర్లు వుండగా మార్చినెలలో అది 66.74డాలర్లకు పెరిగింది. మార్చి ఎనిమిదవ తేదీన మన రూపాయల్లో 3,922 వుండగా ఇప్పుడు 4,620కి అటూఇటూగా వుంది. ఇంకా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. పీపా ధర ఒక డాలరు పెరిగితే మన వినియోగదారుల మీద మనం దిగుమతి చేసుకొనే చమురు ఖర్చు పదకొండువేల కోట్ల రూపాయలు పెరుగుతుందని అంచనా.

మన ప్రత్యామ్నాయ వనరులంటే ఏమిటి ?

మే నెల రెండు నుంచి ఆంక్షల మీద మినహాయింపులు రద్దు చేస్తామని, వుల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించగానే మన అధికారులు దాని వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగాయని ప్రకటించారు. అమెరికా సంగతి తెలిసిన మన అధికారులు చమురు ధరలు తక్కువగా వున్నపుడు సాధారణంగా ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్నదానికంటే ఎక్కువగా దిగుమతులు చేసుకొని మంగళూరు తదితర చోట్ల పెద్ద ఎత్తున నిలవ చేశారు. అది కొద్ది రోజులు లేదా వారాలు వినియోగదారుల మీద భారం మోపకుండా చూడవచ్చు. అయితే ఇదంతా ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆ సమయంలో ధరలు పెరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాటన్నది కొందరి అభిప్రాయం. అందుకే మే 19వ తేదీ చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత పెద్ద మొత్తంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతారని, అప్పటి వరకు పెంచవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్లు చెబుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదేమాదిరి జరిగింది. ఇదొక అంశమైతే ఇటీవలి వరకు అమెరికా తన అవసరాల కోసం చమురు దిగుమతి చేసుకొనేది. ఇప్పుడు తన భూభాగం మీద వున్న షేల్‌ ఆయిల్‌ను తీయటం ప్రారంభించిన తరువాత అది ఎగుమతి దేశంగా మారింది. దానిలో భాగంగానే అది మన దేశానికి గత రెండు సంవత్సరాలుగా చమురు ఎగుమతి చేస్తోంది. పశ్చిమాసియా చమురు నిల్వలు, వాణిజ్యం మీద పట్టుపెంచుకోవటం, క్రమంగా తన షేల్‌ అయిల్‌ వుత్పత్తి పెంచుతూ ఆమేరకు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించుకోవాలన్నది దాని తాజా ఆలోచన. ఇరాన్‌పై ఆంక్షలు, ఇతర దేశాలను బెదిరించటం దీనిలో భాగమేనా అన్నది ఆలోచించాలి.తన చమురుకు మార్కెట్‌ను పెంచుకోవటంతో పాటు ధరలు ధరలు పెరగటం కూడా దానికి అవసరమే.ఇదే జరిగితే అన్నిదేశాలూ దానికి దాసోహం అనాల్సిందేనా ?

Related image

ఇరాన్‌ నిజంగా ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందా ?

అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకే వుపయోగించాలన్న షరతులను ఇరాన్‌ వుల్లంఘిస్తోందా అన్న ప్రశ్నకు లేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ(ఐఎఇఏ) అధిపతి యుకియా అమానో చెప్పారు.అణు ఒప్పందానికి భిన్నంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని, అయితే తాము జాగ్రత్తగా పర్యవేక్షించాలని అన్నారు. ఇరాక్‌ అధిపతి సద్దాం హుస్సేన్‌ మానవాళిని అంతం చేసేందుకు అవసరమైన పెద్ద మొత్తంలో మారణాయుధాలను గుట్టలుగా పేర్చాడని అమెరికా ప్రచారం చేయటమే కాదు, ఇరాక్‌పై దాడి చేసి సద్దాంను హత్య చేసిన విషయం కూడా తెలిసిందే. లిబియాలో కల్నల్‌ గడాఫీ మీద కూడా అలాంటి ఆరోపణలే చేసి హతమార్చిన విషయమూ తెలిసిందే. ఇప్పటికే ఆంక్షల కారణంగా 2018 మేనెల నుంచి పదిబిలియన్‌ డాలర్ల మేరకు ఇరాన్‌ నష్టపోయింది. దాని కరెన్సీ రియాల్‌ మూడింట రెండువంతుల విలువను కోల్పోయింది.అనేక బహుళజాతి గుత్త సంస్ధలు తమ పెట్టుబడులను వుపసంహరించుకున్నాయి. ఫిబ్రవరిలో వరదలు వచ్చినపుడు అవసరమైన ఔషధాలను కూడా సరఫరా చేయకుండా అమెరికన్లు ఆంక్షలు విధించారని ట్రంప్‌ తమ మీద జరుపుతున్నది ఆర్ధిక యుద్ధం కాదు, వుగ్రవాదం అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ విమర్శించారు.

మన దేశం అమెరికాతో మరొక దేశం దేనితో స్నేహాన్ని వదులు కోవాల్సిన అవసరం లేదు. అలాగే అమెరికా కోసం ఇతర దేశాలతో తగాదా తెచ్చుకోవనవసరమూ లేదు. ఒక దేశ వత్తిడికి లంగిపోవటమంటే అప్రదిష్టను మూటగట్టుకోవటమే. చివరికి అది స్వాతంత్య్రానికి ముప్పుతెచ్చినా ఆశ్చర్యం లేదు.అందుకే తస్మాత్‌ జాగ్రత్త !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో వాణిజ్యలోటు తగ్గిందా ? వాస్తవాలేమిటి ?

20 Saturday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

China, India’s Trade, India’s Trade Deficit, India’s Trade Deficit With China

Image result for India’s Trade Deficit With China 2019

ఎం కోటేశ్వరరావు

‘చైనాతో వాణిజ్య లోటును రూ.69,500 కోట్లు తగ్గించిన భారత్‌,చైనాకు భారత్‌ ఎగుమతులు 31శాతం పెరుగుదల, భారత్‌కు చైనా దిగుమతులు ఎనిమిదిశాతం తగ్గుదల,ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అంతిమంగా చైనాతో లోటు తగ్గుతున్నది’ ఇది ‘ నేషన్‌ విత్‌ నమో మోడీ ‘ పేరుతో బిజెపి అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వెలువడిన మరో వుత్పత్తి. ఆంగ్లంలో వున్న ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నది.

దీనిలో రెండు అంశాలున్నాయి. ఒకటి బిజెపి వారు నిజంగా దీన్ని నమ్మితే వెర్రి పుల్లయ్యల కింద జమకట్టాలి. లేదూ వాస్తవాలన్నీ తెలిసి ఇలా ప్రచారం చేస్తున్నారంటే జనాన్ని మోసం చేసే ఘరానా పెద్దలు అయినా అయివుండాలి. బిజెపి వారు వెర్రి పుల్లయ్యలైతే కాదు. అసలు వాస్తవాలేమిటో ఇక్కడ చర్చిద్దాం, అంతిమంగా వారేమిటో పాఠకులే నిర్ణయించుకోవచ్చు.

కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2007-08 నుంచి 2016-17 మధ్య చైనాతో మన దేశ వాణిజ్య లోటు 16బిలియన్ల నుంచి 51బిలియన్‌ డాలర్లకు పెరిగింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో అంటే 2018-19లో వుభయ దేశాల మధ్య వాణిజ్యలోటు పదిబిలియన్‌ డాలర్ల మేరకు తగ్గి 53బిలియన్ల వద్ద వుంది. నమో మోడీ ప్రచారంలో ఈ పదిబిలియన్‌ డాలర్లనే రూపాయల్లోకి మార్చి రూ 69,500 కోట్ల మేరకు తగ్గించినట్లు, ఇదొక విజయమన్నట్లు పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి మన వాణిజ్యలోటు 63బిలియన్లకు పెరిగినదానిలో పది బిలియన్లు తగ్గించారు.

Image result for India’s Trade Deficit With China 2019

2014 మార్చి నాటికి అంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి చైనాతో మన వాణిజ్యలోటు 36.2 బిలియన్‌ డాలర్లు. దీని కంటే తగ్గించటమో కనీసం అంతకు మించి పెరగకుండా వుండటమో చేస్తే నరేంద్రమోడీ ఘనుడని, ఆయన దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుత దీపం వుందని అనుకోవచ్చు. వ్యాపార లావాదేవీలన్న తరువాత ఒక రోజు పెరగవచ్చు, మరో రోజు తరగవచ్చు. అంతిమంగా ఒక ఏడాది కాలంలో లేదా ఒక ప్రధాని పదవీకాలం ఐదేండ్లలో నష్టమా, లాభమా అని ఎవరైనా చూడాలి. ఆ రీత్యా చూసినపుడు ఐదేండ్లలో మన లోటు 36.2బిలియన్ల నుంచి 53కు పెరిగింది. 2008-09లో చైనాకు మన ఎగుమతులు 9.4 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులుండగా 2011-12 నాటికి 18.1 బిలియన్లకు పెరిగింది. తరువాత2015-16 నాటికి తొమ్మిది, 2016-17 నాటికి 10.2కు, 2018-19లో ఏప్రిల్‌-నవంబరు మాసాలకు గాను 11.1బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2018 ఆర్ధిక సంవత్సరంలో ఎగుమతులు 13.3 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. బిజెపి ప్రచార యంత్రాంగం 31శాతం ఎగుమతుల పెరుగుదల అన్నది దీని గురించే. ఇదే కాలంలో చైనా నుంచి తగ్గింది ఎనిమిదిశాతం కాదు,24.64 శాతం పెరిగి 76.38 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంటే మన వాణిజ్య లోటు 63 బిలియన్ల కంటే ఎక్కువగా వుందని ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా చెపుతారు. ఆ మొత్తం ఈఏడాది మార్చినాటికి 53బిలియన్‌ డాలర్లకు తగ్గింది కనుక ఆ ఘనత మోడీ సర్కారుదే అని ప్రచారం చేస్తున్నారు. ఇక మార్చినెలతో ముగిసిన వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పైన పేర్కొన్నట్లు ఏప్రిల్‌-నవంబరు మధ్య మన ఎగుమతులు 11.1 బిలియన్‌ డాలర్లు అయితే ఇదే సమయంలో చైనా నుంచి 2.66శాతం తగ్గి 48.35 బిలియన్‌ డాలర్లుగా వున్నాయి. (బిజినెస్‌ లైన్‌ జనవరి 4, 2019).

ఎకనమిక్‌ టైమ్స్‌ (జనవరి 22,2019) పేర్కొన్నదానిని బట్టి చైనా అధికారిక సమాచారం ప్రకారం 2018లో మన దేశం నుంచి చైనాకు జరిగిన ఎగుమతుల విలువ 18.84 బిలియన్‌ డాలర్లు. అంతకు ముందుతో పోల్చితే 17శాతం పెరిగింది. రెండు దేశాల మధ్య లావాదేవీల్లో మన వాణిజ్యలోటు ఇదే కాలంలో 51.72 బిలియన్ల నుంచి 57.86 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. మొత్తం మీద నరేంద్రమోడీది గోల్డెన్‌ లెగ్గా ఐరన్‌ లెగ్గా ? వాణిజ్య లోటు మోడీ అధికారానికి వచ్చిన సమయంలో వున్న 36.2 బిలియన్లకు తగ్గేదెపుడు ? అసలు సమస్య ఇది కదా !

చైనాకు మన ఎగుమతులు పెరగటం సంతోషించాల్సిందే.ఆ పెరుగుదలకు కారణం బిజెపి వారు ప్రచారం చేస్తున్నట్లు డ్రాగన్‌ మెడలు వంచి సాధించటం కాదు. అయితే దిగుమతులు పెంచాలని వత్తిడి చేస్తున్నది నిజం. అంతర్జాతీయ రాజకీయాల్లో భాగంగా చైనా సడలించిన నిబంధనలే ప్రధాన కారణం. ఇదే సమయంలో చైనా నుంచి మన దిగుమతులు తగ్గాయా ? దీని కధేమిటో చూద్దాం. 2019 ఏప్రిల్‌ 17వ తేదీన లైవ్‌ మింట్‌ పత్రిక వ్యాఖ్యాత ఒక విశ్లేషణ చేశారు. ఇటీవల చైనా తన వుత్పత్తులు కొన్నింటిని తన రేవుల నుంచి గాక హాంకాంగ్‌ రేవు ద్వారా ఎగుమతులు చేయటం ప్రారంభించిందని, చైనా-హాంకాంగ్‌ల నుంచి మన దేశం చేసుకున్న దిగుమతుల విలువను చూస్తే వాణిజ్యలోటు తగ్గిందేమీ లేదని పేర్కొన్నారు. ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ 15వ తేదీన మరొక కధనాన్ని అందించింది. దానిలో మింట్‌ పత్రిక వ్యాఖ్యాతను వుటంకించింది. (సాధారణంగా ఇలా జరగదు) దాని ఆధారంగా తాను సేకరించిన సరికొత్త సమాచారాన్ని పాఠకులకు అందించి మింట్‌ కథనాన్ని నిర్ధారించింది.

Related image

పెరుగుతున్న వాణిజ్యలోటును తగ్గించటానికి చర్యలు తీసుకోవాలని భారత్‌ నుంచి వస్తున్న వత్తిడిని తప్పించుకొనేందుకు చైనా కొత్త ఎత్తుగడలకు పాల్పడిందని పేర్కొన్నారు.’ వాణిజ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2018లో చైనాతో వాణిజ్యలోటు 59.3 నుంచి 57.4 బిలియన్లకు తగ్గింది. ఇదే సమయంలో భారత్‌తో హాంకాంగ్‌ వాణిజ్యలోటు భారత్‌కు ఎగుమతులు పెరిగి 2.7బిలియన్‌ డాలర్లకు చేరింది.భారత్‌తో చైనా-హాంకాంగ్‌ వాణిజ్యాన్ని కలిపి చూస్తే భారత్‌లోటు 2018లో అంతకు ముందున్న 55.4 బిలియన్ల నుంచి 60.1 బిలియన్లకు పెరిగింది.2018లో చైనాకు భారత్‌ ఎగుమతులు 30.4శాతం పెరిగి 16.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో హాంకాంగ్‌కు భారత ఎగుమతులు 15 నుంచి 13.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. మొత్తంగా 900మిలియన్‌ డాలర్లు భారత్‌కు నష్టం. చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకొనే సెల్‌ఫోన్‌ విడి భాగాలు 2018లో 34.1 శాతం తగ్గాయి. అయితే అదే విడిభాగాల దిగుమతి హాంకాంగ్‌ నుంచి 728శాతం పెరిగాయి.లాన్‌ అడాప్టర్లు చైనా నుంచి 32శాతం తగ్గితే హాంకాంగ్‌ నుంచి 173శాతం పెరిగాయి. ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లను దిగుమతి చేసుకోవటం చైనా నుంచి పెరిగింది, అయితే హాంకాంగ్‌ నుంచి 6,017శాతం పెరిగాయి. వాణిజ్యమంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం 2017లో వుభయ దేశాల వాణిజ్య లావాదేవీల విలువ 84.44 బిలియన్‌ డాలర్లు. దీనిలో భారత్‌ లోటు 52 బి.డాలర్లు. 2018 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ ఎగుమతులు 31శాతం పెరిగి 13.3బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో దిగుమతులు 24.64శాతం పెరిగి లావాదేవీల మొత్తం 76.38 బి.డాలర్లుగా వుంది. వాణిజ్యలోటును 63 బిలియన్‌ డాలర్లకు చేరింది.’ అని ఎకనమిక్‌ టైమ్స్‌ పేర్కొన్నది.

మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ నెహ్రూ అనుసరించిన విధానాలే కారణమంటూ తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు బిజెపి పెద్ద ఎత్తున గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది. చైనాతో సంబంధాల విషయానికి వస్తే బిజెపి దాని అనుబంధ లేద సోదర సంస్ధలన్నీ నిత్యం విషం చిమ్ముతుంటాయి. చైనా వస్తు బహిష్కరణలకు పిలుపులనిస్తుంటాయి. అవి ఎంతగా వ్యతిరేకిస్తున్నాయో అంతకంటే ఎక్కువగా వాటికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వ ఆధ్వర్యంలో దిగుమతులు పెరుగుతున్నాయి. మేకిన్‌ ఇండియా అంటూ చైనా ఇతర దేశాలతో పోటీ బడి ఎగుమతులు చేయాలని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఏమైనట్లు ? ఆ చైనా నుంచే దిగుమతులను ఏటేటా ఎందుకు పెంచుతున్నట్లు ? ఎందుకీ వంచన ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసాంజే అరెస్టు వెనుక అసలు కథేంటి ?

17 Wednesday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Political Parties, Politics, UK, USA

≈ Leave a comment

Tags

Assange's Arrest, Assange's asylum, Julian Assange, Lenín Moreno, Rafael Correa, WikiLeaks

Image result for julian assange

ఎం కోటేశ్వరరావు

కాలిలో ముల్లు, చెప్పులో రాయి, చెవిలో జోరీగ, ఇల్లాలి పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామా అన్న వేమన పద్యం తెలిసిందే. వికీలీక్స్‌ అధిపతి జూలియన్‌ అసాంజే చెప్పులో రాయిగా మారాడని వర్ణించిన ఈక్వెడోర్‌ అధ్యక్షుడు లెనిన్‌ మోరెనో అన్నంతపనీ చేసి అసాంజేను వదిలించుకున్నాడు. దీనికి కారణాలేమిటి అన్నది ఆసక్తి రేపుతున్న అంశం. ప్రపంచంలో వెల్లడయ్యే వ్యతిరేకత, వత్తిడే అమెరికా నుంచి అసాంజే జీవితాన్ని కాపాడతాయి. ఆ జర్నలిస్టు జీవితాన్ని ఏదో ఒకసాకుతో జీవితాంతం జైలుపాలు చేయవచ్చు. ఈక్వెడోర్‌ చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఆశ్రయం ఇచ్చిన తరువాత ప్రభుత్వం దానిని రద్దు చేయటానికి వీల్లేదు. బ్రిటన్‌లో బెయిల్‌ నిబంధనలను వుల్లంఘించిన వారు వేలాది మంది వున్నారు. వారందరినీ వదలి అసాంజేను అరెస్టు చేయటం వెనుక బ్రిటన్‌ మీద అమెరికా తెచ్చిన వత్తిడే అన్నది స్పష్టం.

లండన్‌లోని తమ రాయబార కార్యాలయంలో శరణార్దిగా వున్న అసాంజే తామిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసినందున లండన్‌ పోలీసులకు అప్పగించినట్లు తొలుత ప్రకటించిన మోరెనో, అతను తమ కార్యాలయాన్ని గూఢచార కార్యకలాపాలకు వినియోగించుకున్నాడని కొద్ది రోజుల తరువాత మరొక అభాండం వేశాడు. ఇతని తీరు చూస్తే మేకపిల్లను తినదలచుకున్న తోడేలు చెప్పిన సాకుల కధ గుర్తుకు రాకమానదు. ఆస్ట్రేలియన్‌ పౌరుడైన జూలియన్‌ అసాంజే 2006 వికీలీక్స్‌ స్దాపక సంపాదకుడిగా అనేక అంశాల మీద ముఖ్యంగా అమెరికాకు చెందిన లక్షలాది రహస్య పత్రాలను బహిర్గతం కావించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.2010లో అమెరికా అరెస్టు వారెంట్‌ జారీ చేయటమే కాదు, అతను దొరికితే తమకు అప్పగించాలని తనతో ఒప్పందం వున్న దేశాలన్నింటినీ కోరింది. ఆ వల నుంచి బయటపడిన అసాంజే 2012లో బ్రిటన్‌లో వుండగా ఈక్వెడోర్‌ రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు అంగీకరించటంతో లండన్‌లోని రాయబార కార్యాలయంలో అప్పటి నుంచీ నివాసం వుంటున్నాడు. ఒక దేశ అనుమతి లేకుండా స్ధానిక లేదా బయటి ప్రభుత్వాలకు చెందిన పోలీసులు, ఇతర ఏజన్సీలేవీ ప్రవేశించటానికి లేదు. అయితే గత వారంలో ఈక్వెడోర్‌ అధ్యక్షుడు తాము అసాంజేను బయటికి పంపుతున్నామని తెలియచేసి మరీ లండన్‌ పోలీసులకు అప్పగించాడు. ఈ అసాధారణ చర్య మీద ప్రపంచవ్యాపితంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా పట్టించుకోవటం లేదు.

Image result for julian assange

లెనిన్‌ మోరెనో చర్య అంతర్జాతీయంగా ఈక్వెడోర్‌ ప్రతిష్టను దెబ్బతీసింది. తమ సార్వభౌమత్వాన్ని తామే దెబ్బతీసుకోవటంతో పాటు, శరణార్దిగా , తరువాత దేశ పౌరుడిగా మారిన అసాంజేను అప్పగించి అంతర్జాతీయ న్యాయ సూత్రాల వుల్లంఘనకు పాల్పడ్డాడు. లండన్‌ పోలీసులను తమ కార్యాలయంలోకి స్వయంగా ఆహ్వానించాడు. వామపక్ష వాది రాఫెల్‌ కొరెయా వారసుడిగా అధికారానికి వచ్చిన లెనిన్‌ ఇలా ప్రవర్తించటం ఏమిటని వామపక్ష వాదులకు, ఇతరులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. రెండు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చిన అతగాడి కదలికలను గమనిస్తున్నవారికి ఏ క్షణంలో అయినా అసాంజేను అమెరికా రాక్షసికి అప్పగించవచ్చనే అభిప్రాయం ఎప్పటి నుంచో వుంది. అందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూశాడు.

లాటిన్‌ అమెరికాలో గత రెండు దశాబ్దాలలో వామపక్షాలు అధికారానికి వచ్చిన దేశాలలో ఈక్వెడోర్‌ ఒకటి.ఈ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన పార్టీలలో చేరిన వారందరూ అన్ని అంశాల మీద ఏకాభిప్రాయం కలిగిన వారు కాదు. నియంతలు, మిలిటరీపాలకులు, ప్రజాస్వామ్య హక్కులు, కార్మికవర్గంపై దాడులను, అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించే ఒక సాధారణ లక్షణమే ఈ పార్టీలలో చేరిన వ్యక్తులు, శక్తుల మధ్య అంగీకృతమైంది. నయావుదారవాద విధానాల కొనసాగింపు, పెట్టుబడిదారీ వ్యవస్ధను సమూలంగా తొలగించాలనిగాక సంస్కరించాలని కోరే వారి వరకు అందరూ ఈ పార్టీలలో వున్నారు. అందుకే ఎక్కడా నయా వుదారవాద విధానాలకు ప్రత్యామ్నాయం రూపొందించకుండా వాటినే కొనసాగిస్తూ జనానికి వుపశమన చర్యలు తీసుకుంటున్నారు. వాటికి పరిమితులు ఎదురైనపుడు ఆ విధానాల నుంచి కూడా వైదొలుగుతున్నారు. అందుకు తాజా వుదాహరణ ఈక్వెడోర్‌.

అక్కడ ప్రస్తుతం అధికారంలో వున్న పాయిస్‌ అలయన్స్‌. పయస్‌ అంటే స్పానిష్‌లో దేశం అని అర్ధం, ఆంగ్లంలో ప్రౌడ్‌ అండ్‌ సావరిన్‌ ఫాదర్లాండ్‌( గర్వించదగిన మరియు పితృభూమి) కూటమి. మధ్యేవాద-వామపక్ష ప్రజాస్వామిక సోషలిస్టు మరియు సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీగా దీని లక్షణాన్ని విశ్లేషకులు వర్ణించారు. ఈ కూటమికి నాయకుడిగా మూడుసార్లు అధ్య క్షపదవి చేపట్టిన రాఫెల్‌ కొరెయా అక్కడి నిబంధనల ప్రకారం మూడోసారి పోటీ చేసేందుకు వీలులేని కారణంగా తమ అభ్యర్ధిగా లెనిన్‌ మోరెనోను ప్రకటించాడు.(వామపక్ష వాది అయిన మోరెనో తండ్రి తన కుమారుడు లెనిన్‌ అంతటి వ్యక్తి కావాలనే ఆకాంక్షతో పేరులో లెనిన్‌ చేర్పాడు. ) అసాంజేను లండన్‌ పోలీసులకు అప్పగించిన లెనిన్‌ మోరెనో ఈక్వెడోరియన్‌ మరియు లాటిన్‌ అమెరికా చరిత్రలో పేరుమోసిన విద్రోహి అని అదే రాఫెల్‌ కొరెయా తీవ్రంగా స్పందించాడు. మోరెనో ఒక అవినీతి పరుడు, అతను చేసిన నేరాన్ని మానవాళి ఎన్నటికీ మరవదు అని ట్వీట్‌ చేశాడు.

అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే మోరెనో తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించాడు. అచిర కాలంలోనే జనం నుంచి దూరమయ్యాడు. ప్రస్తుతం అతన్ని సమర్ధించేవారి సంఖ్య 17శాతానికి అటూఇటూగా మాత్రమే వుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మార్చినెల చివరి వారంలో ప్రతిపక్ష ఎంపీ ఒకరు మోరెనో అవినీతిని వెల్లడించే పత్రాలను బహిర్గతం చేశాడు. వాటిలో వున్న వివరాల ప్రకారం పన్నుల ఎగవేతల స్వర్గం, బినామీ కంపెనీలకు నిలయమైన పనామాలో ఐఎన్‌ఏ పెట్టుబడుల కంపెనీ పేరుతో మొరెనో అక్రమాస్తులను కూడపెట్టాడు. అది సోదరుడు ఎడ్విన్‌ మోరెనో పేరు మీద వుంది. లెనిన్‌ మోరెనో కుమార్తెలు ఇరినా, క్రిస్టినా,కరీనా పేర్లు కలసి వుండేలా ఐఎన్‌ఏ కంపెనీ వుంది. అందుకు ఆదే పేరుతో అక్రమాల కుంభకోణాన్ని పిలుస్తున్నారు. దీని మీద వచ్చిన ఫిర్యాదులను ప్రాధమికంగా విచారించేందుకు ఏప్రిల్‌ నాలుగున తమ ముందుకు హాజరుకావాలని ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం దేశాధ్యక్షుడికి సమన్లు పంపింది. ఇదంతా తన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పన్నిన కుట్ర అని, మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరెయా ఏర్పాటు చేసిన రాజకీయ సంస్ధ సిటిజన్‌ రివల్యూషన్‌లో సభ్యుడిగా వున్న ఎంపీ ఇదంతా చేస్తున్నాడని మోరెనో ఆరోపించాడు. పాయిస్‌ అలయన్స్‌ అభ్యర్ధిగా ఎన్నికైన మోరెనో దానికే ద్రోహం చేశాడని, విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని కొరెయా విమర్శించారు. విచారణ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు, అమెరికా అనుకూల శక్తులను తనవైపు తిప్పుకొనేందుకు అసాంజేను బలిపెట్టారన్నది ఒక కోణం.దానికి అనుగుణ్యంగానే మీడియా కేంద్రీకరణ అవినీతి నుంచి అసాంజే వైపు మళ్లింది.

గతంలో పాయిస్‌ అలయన్స్‌ నేత, మాజీ వుపాధ్యక్షుడైన జార్జి గ్లాస్‌ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి 20017 ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆ సమయంలో మోరెనో వుపాధ్యక్షుడిగా, రాఫెల్‌ కొరెయా అధ్యక్షుడిగా వున్నారు. తరువాతే మోరెనో అధ్య క్షుడయ్యాడు. ఆ వుదంతాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని తాను అవినీతి పరుల అంతం చూసే వ్యక్తినని జనం ముందుకు వెళ్లాడు. ఇప్పుడు ఐఎన్‌ఏ పత్రాలలో అతగాడే పెద్ద అవినీతి పరుడని బయటపడింది. తనను అధ్యక్షుడిని చేసిన రాఫెల్‌ కొరెయాను కూడా మోరెనో వదల్లేదు. 2012లో అధ్యక్షుడిగా వున్న సమయంలో ప్రతి పక్ష ఎంపీని కిడ్నాప్‌ చేయించారనే ఒక తప్పుడు కేసు బనాయించారు. ఆ కేసులో హాజరుకాకపోవటంతో కొరెయాను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు గత ఏడాది జూలైలో ఆదేశించింది. ఆ సమయంలో బెల్జియం వాస్తవ్యురాలైన భార్యతో కొరెయా అక్కడే వుంటున్నారు. ఇప్పటికీ అక్కడే వున్నారు.అసాంజే అరెస్టు సందర్భంగా కొరెయా ఫేస్‌బుక్‌ పేజీని తొలగించారు. ఇతరుల వ్యక్తిగత వివరాలన్నీ వెల్లడించారనే తప్పుడు కారణాలు చూపారు.

తప్పంటూ ఒకసారి చేసినా వందసార్లు చేసినా ఒకటే అన్నట్లుగా లండన్‌ పోలీసులతో అసాంజేను అరెస్టు చేయించిన మోరెనా దేశంలో తన పోలీసులను ప్రయోగించి అసాంజే మద్దతుదార్లును అరెస్టు చేయించాడు. విదేశీయులను అరెస్టు చేసినపుడు ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు తెలియచేయాల్సి వుంది. దాన్ని కూడా పాటించలేదు. తమ ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు రష్యన్‌ హాకర్స్‌, వికీలీక్స్‌ సభ్యులు వున్నారని హోంమంత్రి ఆరోపించారు.ఈక్వెడోర్‌ మాజీ విదేశాంగ మంత్రి రికార్డో పాటినో ఒక ప్రకటన చేస్తూ నెంబరులేని ప్రభుత్వ ట్రక్కు ఒకటి భార్యతో కలసి ప్రయాణిస్తున్న తన కారును వెంటాడిదని పేర్కొన్నారు. అంతకు ముందు రోజు ఒక రేడియోలో మాట్లాడుతూ ఐఎంఎఫ్‌, అమెరికా పెత్తనంలో వున్న ఆర్ధిక సంస్ధల నుంచి రుణాల కోసం లొంగిపోయి అసాంజేను అప్పగించాడని రికార్డో పాటినో చెప్పారు.పాటినో కూడా తన ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు కుట్రచేసిన వారిలో ఒకరని మోరెనో ఆరోపించాడు.

అసాంజే అప్పగింతకు జరుగుతున్న ప్రయత్నాల గురించి రాఫెల్‌ కొరెయా ఈఏడాది ప్రారంభంలోనే ఒక హెచ్చరిక చేశారు. ఆశ్రయం పొందిన అసాంజే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడా లేదా అన్నది మదింపు జరుగుతోందని ఒక డాక్యుమెంట్‌ను ట్విటర్‌ద్వారా వెల్లడించారు. ఐఎంఎఫ్‌ నుంచి పొందే పది బిలియన్‌ డాలర్ల రుణానికి గాను ప్రతిగా అసాంజేను అమెరికాకు అప్పగించాలని, ఈక్వెడోర్‌ వర్షపు అడవులను కాలుష్యం గావించిన అమెరికా కార్పొరేట్‌ చమురు కంపెనీ చెవరాన్‌ నుంచి ఎలాంటి నష్టపరిహారం కోరకూడదని తదితర షరతులను ఐఎంఎఫ్‌ సూచించింది. ఐఎంఎఫ్‌లో 17.46శాతం వాటా కలిగిన అమెరికా గతంలో తమ డిమాండ్లను అంగీకరించకపోతే ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్‌ వంటి సంస్ధల నుంచి తాము వైదొలగాల్సి వుంటుందని బెదిరించిన విషయం బహిరంగమే. ఐఎంఎఫ్‌ను సాంప్రదాయేతర ఆర్ధిక ఆయుధంగా వాడుకోవాలన్న అమెరికా మిలిటరీ సూచనలను వికీలీక్స్‌ బయట పెట్టింది. ప్రత్యర్ధులు అమెరికాకు లొంగితే రాయితీలు , వ్యతిరేకంగా వుంటే దెబ్బతీయాలని సూచించారు.

మోరెనా సర్కార్‌ అసాంజేను అప్పగించటమే కాదు, ఐఎంఎఫ్‌ ఇతర షరతులను కూడా వెంటనే అమలు జరిపింది.ఒప్పందంపై సంతకాలు చేయకముందే తమ చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు లేదా అప్పుకు వుద్యోగుల తొలగింపుకు సంబంధం లేదని చెప్పుకొనేందుకు సంస్కరణల పేరుతో పదివేల మంది ప్రభుత్వ సిబ్బందిని ఇంటికి పంపింది. అంతేకాదు రెండున్న దశాబ్దాల క్రితం చెవరాన్‌ కంపెనీ కలుషితం చేసిన ప్రాంతాన్ని ప్రభుత్వ నిధులతో శుద్ది చేసేందుకు పూనుకొని కంపెనీకి ఖర్చు తప్పించింది. అధికారానికి రాగానే 2017లోనే క్విటో నగరంలో మోరెనో, అమెరికా ప్రత్యేక ప్రతినిధి రాబర్ట్‌ ములర్‌, ట్రంప్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ పాల్‌ మానాఫోర్ట్‌ సమావేశమయ్యారు.దానిలో అసాంజే అప్పగింతకు తగిన చర్యలు తీసుకుంటామని, దారి వెతుకుతామని మోరెనో హామీ ఇచ్చాడు. పొమ్మనకుండా పొగపెట్టినట్లుగా 2018లో లండన్‌ రాయబార కార్యాలయంలో అసాంజేకు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని, భద్రతా సిబ్బందిని తొలగించారు. అమెరికాకు సంతోషం చేకూర్చేందుకు వెనిజులా నాయకత్వంలో ఏర్పడిన లాటిన్‌ అమెరికా దేశాల కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు గతేడాది ఆగస్టులో ప్రకటించారు. బ్రెజిల్‌ ఎన్నికల్లో గెలిచిన వామపక్ష వ్యతిరేకి జైర్‌ బోల్‌సోనారోకు అభినందనలు తెలిపాడు. తమ సహనం నశించిన తరువాతే అసాంజేను తీసుకుపోవాల్సిందిగా లండన్‌ పోలీసులను కోరినట్లు ఈనెల 11న మోరెనో ప్రకటించాడు.

Image result for julian assange

నయావుదారవాద విధానాల ప్రాతిపదికన సంక్షేమ రాజ్యాలను ఏర్పాటు చేయాలన్న లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల వైఫల్యాన్ని అవకాశంగా తీసుకొని అర్జెంటీనా, బ్రెజిల్‌ వంటి చోట్ల సామ్రాజ్యవాదులు ప్రజావ్యతిరేకులను తిరిగి ప్రతిష్ఠించగలిగారు.ఈక్వెడోర్‌లో వామపక్ష వేదికనే వుపయోగించుకొని నెగ్గిన మోరెనోను ఏకంగా తమ వాడిగా మార్చుకోవటం సరికొత్త పాఠాలను నేర్పుతోంది. అక్కడి వామపక్షాలలో సాగుతున్న మధనం ఇలాంటి హాలాహలాన్ని అధిగమించగలదనటంలో ఎలాంటి సందేహం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోలన్‌ గుట్టలకు ట్రంప్‌ గుర్తింపు భారత్‌కు ఆందోళన కరం !

04 Thursday Apr 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, Golan Heights, Israel, Syria

Image result for golan heights

ఎం కోటేశ్వరరావు

మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. సరిగ్గా అలాంటి సాకులతోనే అరబ్బుల ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు పూనుకున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌కు అమెరికా తాన తందాన అంటోంది. అది ఆక్రమించుకున్న సిరియాకు చెందిన గోలన్‌ గుట్టల ప్రాంతం ఇజ్రాయెల్‌దే అని ప్రకటించింది. ప్రపంచం యావత్తు వ్యతిరేకిస్తున్నా దాని అడ్డగోలు వాదనలను సమర్ధిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత పొడిగింపు, సంక్లిష్టం చేయటమే కాదు, ప్రపంచంలో పలుచోట్ల కొత్త సమస్యలు, సంఘర్షణలు తలెత్తటానికి నాంది పలికింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఏర్పడిన ప్రపంచ వ్యవస్ధ ఐక్యరాజ్యసమితి ఈ ధోరణిని అడ్డుకోవటంలో విఫలమైంది. ఇది మానవాళి శాంతికే ముప్పు. అనేక ప్రాంతీయ ఒప్పందాల వుల్లంఘన మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికితే, నానాజాతి సమితి వైఫల్యం రెండవ ప్రపంచ యుద్ధానికి బాటలు వేసింది. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా వైఫల్య పరంపరలో వుంది. ఇది ఏ పర్యవసానాలకు దారి తీస్తుందో ?

పాలస్తీనా అరబ్బులకు చెందాల్సిన జెరూసలెం పట్టణాన్ని ఇజ్రాయెల్‌ రాజధానిగా గత ఏడాది గుర్తించిన అమెరికా తన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 1967 దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న సిరియా భూ భాగం గోలన్‌ గుట్టలు ఇజ్రాయెల్‌ అంతర్భాగంగా తాను గుర్తిస్తున్నట్లు గత వారంలో నిర్ణయించింది. ఈ చర్యను ఐక్యరాజ్యసమితి, ఐరోపా యూనియన్‌, తాజాగా అరబ్‌ లీగ్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే అమెరికా వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు ఆ నిర్ణయం ఎందుకు చేసింది అంటే ఇజ్రాయెల్లో జరగనున్న ఎన్నికల్లో అధికార పక్షానికి ఓట్లు వేయించటం తక్షణ ప్రయోజనం తప్ప పశ్చిమాసియా వివాదాన్ని కొనసాగించే ఎత్తుగడలో భాగమే ఇది. ట్యునిస్‌లో ఆదివారం నాడు జరిగిన లీగ్‌ వార్షిక సమావేశంలో కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయానికి రానప్పటికీ గోలన్‌ హైట్స్‌ సిరియా అంతర్భామనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

1947 నవంబరులో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం మేరకు బ్రిటీష్‌ వలసగా వున్న పాలస్తీనా దేశాన్ని రెండు మ్కులుగా చేశారు. అప్పటికే ముందస్తు కుట్రకు తెరలేపిన ఇజ్రాయెల్‌ సాయుధదళం బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమ దేశాల మద్దతుతో పాలస్తీనాకు మిగిల్చిన ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు దాడులకు పూనుకుంది. దానికి ప్రతిగా పరిసర ప్రాంతాలలో వున్న అరబ్‌ దేశాలన్నీ వాటి రక్షణకు నడుంకట్టాయి. దీనిని 1948 ఇజ్రాయెల్‌-అరబ్బు యుద్దంగా పిలుస్తున్నారు. అదే ఇజ్రాయెల్‌ 1967లో మరోసారి పశ్చిమ దేశాల అండతో మరికొన్ని ప్రాంతాల ఆక్రమణకు పూనుకుంది. ఈ సారి పక్కనే వున్న సిరియా దక్షిణ ప్రాంతం గోలన్‌ గ్టులను చేజిక్కించుకుంది.1974 కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఆ ప్రాంతం ఐక్యరాజ్యసమితి శాంతి సేనల ఆధీనంలోకి వచ్చింది.1981లో ఆ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది, అయినప్పటికీ ఐరాస శాంతి సేనలు అక్కడ కొనసాగుతున్నాయి. నాటి ఇజ్రాయెల్‌ నిర్ణయాన్ని తాము అధికారికంగా గుర్తిస్తున్నట్లు గత సోమవారం నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. ఐరాస శాంతి సేనలు అక్కడ కొనసాగటానికి దీనికి సంబంధం లేదని, అవి అక్కడే వుండవచ్చని అమెరికా నమ్మబలుకుతోంది. 1974నుంచి ప్రతి ఆరునెలలకు ఒకసారి గోలన్‌ గుట్టలలో శాంతి పరిరక్షక దళాల కొనసాగింపు నిర్ణయం తీసుకుంటున్నారు. జూన్‌ 30వ తేదీతో తాజా ఆరునెలల గడువు ముగుస్తుంది. అమెరికా నిర్ణయ నేపధ్యంలో మరోసారి పొడిగింపు వుంటుందా, అమెరికా అందుకు సహకరిస్తుందా అన్నది సందేహాస్పదంగా మారింది.

గోలన్‌ గుట్టలను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ ఆ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్నట్లు చేసిన ప్రకటన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, ఐరాస నిబంధనలకు విరుద్దం కనుక చెల్లదని 1981లోనే భద్రతా మండలి తీర్మానించింది. దానికి అమెరికా తూట్లు పొడిచినందున వెంటనే చర్చించాలన్న సిరియా కోరిక మేరకు గత వారంలో భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది. అమెరికా తప్ప అన్ని దేశాలు ఖండించాయి. ఐక్యరాజ్యసమితి శాంతి సేనలు వున్న ప్రాంతానికి పక్కనే నిత్యం సిరియా సాయుధ దళాలు కొనసాగుతున్నాయని, అది 1974 ఒప్పందానికి వ్యతిరేకమని అమెరికా వాదించింది. సిరియా సరిహద్దులో హిజబుల్లా సాయుధులు కూడా వున్నారనే వార్తలు వుద్రిక్తతలు పెరగటానికి దోహదం చేస్తున్నాయని కూడా ఆరోపించింది. మొత్తం మీద శాంతి నెలకొన్న గోలన్‌ గుట్టలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరేందుకు ఇటీవలి పరిణామాలను సాకుగా తీసుకోవద్దని, ఆ సమస్య విషయంలో భద్రతా మండలి, ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానాల్లో ఎలాంటి మార్పు లేదని, కట్టుబడి వుంటాయని ఐరాస వుప ప్రధాన కార్యదర్శులలో ఒకరైన రోజ్‌ మేరీ డికార్లో స్పష్టం చేశారు. ఆత్మరక్షణకు తాము చేసిన యుద్దంలో విజయం సాధించామని, దురాక్రమణలను నిరోధించేందుకు చేసే యుద్దాలు, కొన్ని ప్రాంతాలను కలిగి వుండటం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్దం కాదని, అమెరికా తమ నిర్ణయాన్ని సమర్ధించటం తప్పు కాదని ఇజ్రాయెల్‌ వాదించింది.అయితే ఈ వైఖరిని ఇజ్రాయెల్‌, అమెరికా నిపుణులతో సహా ప్రపంచవ్యాపితంగా అందరూ తప్పు పట్టారు.

ఇజ్రాయెల్‌ ఏర్పాటుకు కొన్ని దశాబ్దాలకు ముందే యూదు దురహంకారులు యూదు రాజ్య పున:స్ధాపన ప్రతిపాదనలు చేశారు. వాటి ప్రకారం పాలస్తీనా ప్రాంతాలేగాక బైబిల్‌లో పేర్కొన్న అన్ని ప్రాంతాలతో కూడిన ఇజ్రాయెల్‌ ఏర్పడాలి. వాటిలో గోలన్‌ గుట్టలు వున్న దక్షిణ సిరియా ప్రాంతం కూడా వుండాలని ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. దానిలో భాగంగా ఆక్రమించుకున్నారే తప్ప సిరియా నుంచి ఇజ్రాయెల్‌కు ఎలాంటి ముప్పు లేదు. బెన్‌ గురియన్‌ అనే యూదు దురహంకారి 1918లో రూపొందించిన ఒక పధకంలో తొలి దశలో ఏ ప్రాంతాలను, తరువాత వేటిని ఆక్రమించుకోవాలన్నది బహిరంగంగా పేర్కొన్నాడు. దాని ప్రకారమే సిరియా సరిహద్దులో ఇజ్రాయెల్‌ గిల్లికజ్జాలు పెట్టుకుంది. చివరికి 1967లో ఆక్రమించుకుంది. అయితే సిరియాలో పశ్చిమ దేశాల అనుకూల ప్రభుత్వాలు వున్న సమయంలో గోలన్‌ గుట్టలను సిరియాకు వదలి, జోర్డాన్‌ నది, టిబ్రెయాస్‌ సరస్సులో ఇజ్రాయెల్‌కు నీటి వాటా ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే గుట్టలతో పాటు నీరు కూడా తమకు కావాల్సిందేనని,దాని గురించి చర్చలు కూడా లేవని ఇజ్రాయెల్‌ అడ్డగోలుగా వాదించింది. ఆ తరువాత వివాదాన్ని కొనసాగించేందుకు, నీటిని మళ్లించేందుకు నిరంతరం రెచ్చగొట్టే చర్యలకుపూనుకుంది. సిరియా నుంచి ఇజ్రాయెల్‌కు ముప్పు వుందనేది ఒక సాకు మాత్రమే. ఇటీవల సిరియా ప్రభుత్వాన్ని కూల్చేందుకు పశ్చిమ దేశాల మద్దతుతో చెలరేగుతున్న ఐఎస్‌ మూకలకు ఇజ్రాయెల్‌ అన్ని విధాలుగా సహకరిస్తోంది.

Image result for golan heights

1973 యుద్దం తరువాత మిలిటరీ బలంతో గోలన్‌ గుట్టలను తిరిగి పొందలేమని, సంప్రదింపులే మార్గమని సిరియా నిర్ణయించుకుంది. ఇటీవలి కాలంలో సిరియా-ఇరాక్‌ సంబంధాలు బలపడటం, రాజకీయంగా సిరియన్లు రష్యాకు దగ్గర కావటంతో అమెరికన్లు రెచ్చిపోయి గోలన్‌ గుట్టలు ఇజ్రాయెల్‌వే అని గుర్తించిందని చెప్పవచ్చు. సిరియాతో అరబ్‌ లీగ్‌ సంబంధాలు సజావుగా లేకున్నా అరబ్‌ పౌరుల మనోభావాల కారణంగా ఆదివారం నాడు ట్యునీసియా రాజధాని ట్యునిస్‌లో జరిగిన శిఖరాగ్రసమావేశం అమెరికా చర్యను ఖండించాల్సి వచ్చింది. దీనికి అమెరికా అనుంగు దేశం సౌదీ అరేబియా చొరవ తీసుకోవటం విశేషం. రాజు సల్మాన్‌ స్వయంగా అమెరికా వైఖరిని ఖండించారు. తూర్పు జెరూసలెం పట్టణం పాలస్తీనా రాజధాని అన్న తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. అయితే పనిలో పనిగా దీనికి ఆ ప్రాంతంలో ఇరాన్‌ జోక్యమే కారణమని దాని మీద ఒక రాయి వేశాడు.

యాభై రెండు సంవత్సరాల క్రితం 1,250చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వున్న గోలన్‌ గుట్టలను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. రెండు పట్టణాలు, 340 గ్రామాల నుంచి సిరియన్‌ అరబ్బులను ఇజ్రాయెలీ మిలిటరీ తరిమి వేసింది ఆ సమయంలో లక్షా 28వేల మంది సిరియన్‌ పౌరులు వున్నారు. ఇజ్రాయెల్‌ ఆక్రమణలోకి పోగానే వారంతా తమ ఆస్ధులు, ఇండ్లను వదలి సిరియా ఇతర ప్రాంతాలకు తరలి పోయారు. ఆరువేల మంది డ్రజే అనే మతశాఖకు చెందిన వారిని మాత్రమే అక్కడ వుండేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించింది. వారు ఇజ్రాయెల్‌కు అనుకూలురు. 1981లో ఆ ప్రాంతాన్ని తన అంతర్భాగంగా ప్రకటించుకున్న ఇజ్రాయెల్‌ అక్కడి వారికి తమ పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. అది చెల్లదని ఐరాస పేర్కొన్నది. 1967లో సిరియాకు వెళ్లిన వారి వారసుల సంఖ్య ఇప్పుడు ఐదులక్షలకు పెరిగింది. వారంతా తమ స్వస్ధాలలకు రావాలని కోరుకుంటున్నారు.

Image result for golan heights

అమెరికా చర్యను దాని నాయకత్వంలోని నాటో కూటమి దేశాలు కూడా అంగీకరించటం లేదు. ఇది అంతర్జాతీయ న్యాయాన్ని వుల్లంఘించటమే, ఆ ప్రాంతంలో వుద్రిక్తతలను పెంచుతుందని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా చర్య ఆ ప్రాంత సమస్యకు ఒక పరిష్కారం కాదని ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల అధికారి మోఘెరినీ అన్నాడు. గోలన్‌ గుట్టల ఆవలి సిరియా నుంచి ఇరాన్‌ సేనలు తమ మీదకు క్షిపణులు ప్రయోగిస్తున్నాయని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ వంత పాడుతూ ఇరాన్‌తో పాటు అనేక వుగ్రవాద బృందాలు కూడా ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌పై దాడులకు వుపయోగించుకుంటున్నాయన్నాడు. అమెరికా వైఖరి ఇలాంటి అన్ని సమస్యల పట్ల ఒకే విధంగా లేదు. దాని ప్రయోజనాలకే పెద్ద పీట వేసింది. దాని సమర్దన ఒక్క గోలన్‌ గుట్టలకే పరిమితం అవుతుందని అనుకోరాదు. మన దేశాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు రేపు తన ఆధీనంలోని ఆక్రమిత కాశ్మీర్‌ను పాకిస్ధాన్‌ తన అంతర్భాగంగా ప్రకటించుకొంటే అమెరికా దానికి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అన్నింటికీ మించి బలమైన దేశాలు తమ సరిహద్దుల రక్షణలను సాకుగా చూపి బలహీనమైన ఇరుగు పొరుగుదేశాల భూ భాగాలను ఆక్రమించుకొనే అవకాశాలు పెరుగుతాయి. గతంలో ఇరాక్‌ అధినేత పొరుగునే వున్న కువాయిట్‌ తమ ప్రాంతంలోని చమురును అక్రమంగా తోడుకుంటోందని, దొంగతనం చేస్తోందని ఆరోపించి సైన్యాన్ని పంపి ఏడు నెలల పాటు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అదే ఇరాక్‌లో అమెరికా జోక్యానికి నాంది పలికింది. అదే అమెరికా మరో వైపు రష్యా ఆక్రమణలోని క్రిమియా ప్రాంతం విషయంలో వ్యతిరేకతను వ్యక్తం చేయటం రాజకీయం మాత్రమే. తమ భద్రతకు క్రిమియా అవసరమని రష్యా వాదిస్తున్న విషయం తెలిసినదే. ఏదో ఒక సాకుతో ఒక దేశ ప్రాంతాన్ని మరొకటి ఆక్రమించుకోవటం, దాడులను సమర్ధించే అమెరికా వైఖరి ప్రపంచానికే ముప్పు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముస్లిం వ్యతిరేకత, వుగ్రవాదం-ప్రపంచ సంక్షోభం !

20 Wednesday Mar 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

Hindu Fundamentalism, islamophobia, islamophobia is a global crisis, Origin of Terrorism, saffron talibans, talibans, terrorism

Image result for islamophobia is a global crisis

ఎం కోటేశ్వరరావు

గత శుక్రవారం నాడు న్యూజిలాండ్‌లోని క్రీస్టు చర్చ్‌ పట్టణంలోని రెండు మసీదుల మీద జరిగిన వుగ్రదాడి ప్రపంచాన్ని వులిక్కిపడేట్లు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన 28ఏండ్ల బ్రెంటన్‌ హారిసన్‌ టారంట్‌ అనే శ్వేతజాతి వుగ్రవాది జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు, పదకొండు మంది చావుబతుకుల మధ్య వున్నారు, అనేక మంది గాయపడ్డారు. ప్రపంచంలో ఇస్లాం, ముస్లింల పట్ల పెరుగుతున్న విద్వేషం, తప్పుడు ప్రచారం ప్రపంచ వ్యాపితంగా వుందని ఈ వుదంతం స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌ జనాభా మొత్తం 50లక్షలకు అటూ ఇటూగా వారిలో ముస్లింలు 50వేల వరకు వున్నారు. వారిలో కొందరు మతం మారిన వారు. మన దేశంలో హిందువుల వునికికే ముప్పుగా ఇస్లాం, క్రైస్తవం తయారయ్యాయని మతోన్మాదశక్తులు ఎలా నిరంతరం ప్రచారం చేస్తున్నాయో, ఈ టారంట్‌ అనే వాడు కూడా ప్రపంచంలో శ్వేత జాతికి ముస్లింలు ముప్పుగా తయారయ్యారనే వున్మాదానికి లోనయ్యాడు. తనకు బ్రిటీష్‌ ఫాసిస్టు ఓస్వాల్డ్‌ మోస్లే, నార్వీజియన్‌ హంతకుడు ఆండ్రెస్‌ బ్రెవిక్‌ వంటి వారు స్పూర్తి నిచ్చారని, ప్రపంచంలో శ్వేతజాతి గుర్తింపునకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నూతన ప్రతీక, తనకు వుత్తేజమిచ్చిన వాడని అని మసీదులపై దాడులకు ముందు ఇంటర్నెట్‌లో పెట్టిన 74పేజీల పత్రంలో పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌ వుదంతం ప్రపంచ సంక్షోభానికి ఒక తార్కాణంగా అనేక మంది వర్ణించారు. అనేక దేశాలు, మీడియాలో ముస్లిం వ్యతిరేకత ఒక సాధారణ అంశంగా తయారైందంటే అతిశయోక్తి కాదు. ముస్లింలందరిని వుగ్రవాదులు అనం, అనకూడదు గానీ వుగ్రవాదులందరూ ముస్లింలుగానే కనిపిస్తున్నారు కదా అనే ఒక గడుసరి ప్రచారంతో అనేక మంది నిజమే కదా అనుకుంటున్నారు.సంప్రదాయ మీడియాలో, సామాజిక మీడియాలో అనేక కధనాలను వండి వారుస్తున్నారు. ఎక్కడ వుగ్రవాద దాడి జరిగినా ఖండిస్తామంటూ పుల్వామా వుదంతాన్ని తీవ్రంగా ఖండించిన ట్రంప్‌ న్యూజిలాండ్‌లోని క్రీస్తు చర్చ్‌ మసీదుల వుదంతాల విషయానికి వచ్చేసరికి శ్వేతజాతి జాతీయవాదం( దురహంకారం) నుంచి ఎలాంటి ముప్పు లేదని వెంటనే ప్రకటించాడు.అదే ట్రంప్‌తో సహా అమెరికా నేతలెవరూ తమ ఖండన ప్రకటనల్లో ముస్లిం అనే పదం లేకుండా జాగ్రత్తపడటం విశేషం.

ఇటీవలి కాలంలో అమెరికా, ఐరోపాలోని ప్రభుత్వాలు ముస్లిం వ్యతిరేక చర్యలు తీసుకున్నాయి. ముస్లిం దేశాల నుంచి వలసలపై అనేక ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల బురఖాలపై ఆంక్షలు పెడితే మరికొన్ని చోట్ల ముఖాన్ని పూర్తిగా కప్పుకోవటానికి వీల్లేదని ఆదేశించారు. తమ మత విశ్వాసాల ప్రకారం స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో కరచాలనం చేయకూడదంటూ అందుకు తిరస్కరించిన ఒక ముస్లిం జంటకు స్విడ్జర్లాండ్‌ పౌరసత్వాన్ని నిరాకరించింది. అమెరికాలోని అనేక రాష్ట్రాలలో షరియా వ్యతిరేక చట్టాలు చేశారు. ఇస్లాం మనలను ద్వేషిస్తుంది, ముస్లిం వలసలపై నిషేధం విధించాలని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఈ దేశాలన్నింటా ముస్లిం వలసలను అనుమతిస్తే శ్వేతజాతీయులు మైనారిటీలుగా మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరిగింది. మొత్తం ముస్లిం మతావలంబకులు ప్రస్తుతం ప్రపంచవ్యాపితంగా వున్నది కేవలం 24శాతం మందే. వారంతా వలస వచ్చినా ఎక్కడా మెజారిటీగా మారే అవకాశం లేదు, అసలది జరిగేది కాదు. కానీ అనేక మంది ఈ ప్రచారాన్ని తలకెక్కించుకొని వున్మాదులుగా మారి అనేక చోట్ల హత్యలకు సైతం పాల్పడ్డారు. ఇప్పటికీ పాల్పడుతున్నారు.

Image result for islamophobia is a global crisis

మీడియాలో వుగ్రవాదం ఎలా వుందో చూద్దాం. యాభై మందిని చంపిన క్రీస్తు చర్చి హంతకుడిని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక గన్‌ మన్‌(తుపాకితో వున్న వ్యక్తి) అని శీర్షికలో పెడితే కాశ్మీర్‌లో ఒక మహిళా పోలీసు అధికారిని చంపిన వాడిని టెర్రరిస్టు అని అదే పత్రిక శీర్షిలో పెట్టింది. అంతే కాదు ఆవులను వధిస్తున్నారనే పేరుతో దాడులు చేసే వారిని గోరక్షకులు అని లేదా ఫలానా సంఘకార్యకర్తలని ముద్దుపేర్లతో మీడియా రాయటం, చూపటం తప్ప వారిని హిందూ తీవ్రవాదులు అనేందుకు నోరు రాదు. అదే పశ్చిమ దేశాల్లో ఒక శ్వేతజాతీయుడు హత్యాకాండకు పాల్పడితే వాడిని మతిస్థిమితం లేనివాడిగా ముద్రవేస్తారు తప్ప జాత్యహంకార వున్మాది, వుగ్రవాది అని ఎక్కడా పేర్కొనరు. వారిని వుత్తేజపరుస్తున్నదేమిటో, ప్రేరేపిస్తున్నదేమిటో అసలు చర్చించరు.

ముస్లింలు, ఇస్లామ్‌కు సంబంధించి ప్రపంచవ్యాపితంగా అనేక ముస్లిమేతర దేశాలలో వ్యతిరేకత పుంఖాను పుంఖాలుగా కనిపిస్తుంది. అమెరికాలో అది 80శాతం, బ్రిటన్‌లో 70శాతం వున్నట్లు పరిశోధనల్లో తేలింది. పత్రికల్లో కాలమిస్టులు, టీవీలలో యాంకర్లు, రేడియోల్లో జాకీలు అనేక మంది తమ వ్యతిరేకతను వెల్లడించుకున్నారు.2015లో అమెరికాలో ఇద్దరు తీవ్రవాదులు దాడి చేసి వారి ఇంటి నుంచి పారిపోయారు. ఆ ఇంటిని సందర్శించిన అనేక మీడియా సంస్ధల జర్నలిస్టులు అక్కడ వున్న ఖురాన్‌, నమాజు చేసే దుప్పటి, ఇతర ప్రార్ధనా సంబంధమైన వాటిని చూపుతూ వుగ్రవాదులు తమ ఆయుధాలుగా వీటిని కూడా వుపయోగించవచ్చని చెప్పారు. న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్యకేంద్ర స్ధలం పక్కనే మసీదు నిర్మాణాన్ని ఒక ఛానల్‌లో కార్యక్రమాన్ని నిర్వహించిన జర్నలిస్టు తీవ్రంగా వ్యతిరేకించాడు. అక్కడ మసీదును అనుమతించటం పశ్చిమ దేశాల వుదారత్వంతో పాటు పిరికితనానికి నిదర్శనమని రెచ్చగొట్టాడు.

Image result for islamophobia india

ముస్లింలతో అమెరికాకు ముప్పు ఏర్పడిందని ట్రంప్‌తో సహా అనేక మంది గతంలో రెచ్చగొట్టారు. తీవ్రవాద ముస్లిం వుగ్రవాదుల నుంచి అమెరికన్లను రక్షించేందుంటూ ఏడు ముస్లిం దేశాల నుంచి జనాన్ని అమెరికాలో ప్రవేశించేందుకు వీల్లేకుండా డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2008-2016 మధ్య అమెరికాలో 201 వుగ్రవాద చర్యలు చోటు చేసుకుంటే వాటిలో ట్రంప్‌ నిషేధించిన దేశాలైన ఇరాన్‌, లిబియా,సోమాలియా, సూడాన్‌,సిరియా, ఎమెన్లకు చెందిన వారు పాల్గొన్న లేదా ప్రేరేపించిన వుదంతాలు కేవలం మూడే. అమెరికాలో ట్రంప్‌ హయాంలో, అంతకు ముందూ జరిగిన హత్యాకాండను చూస్తే అత్యధిక సంఘటనల్లో నేరగాండ్లు శ్వేతజాతీయులే వున్నారు. వారి చేతుల్లోనే ఎక్కువ మంది మరణించారు. వారెవరికీ ముస్లిం తీవ్రవాద సంస్ధలతో లేదా విదేశీయులతో సంబంధాలు లేవు, ఇస్లాం నుంచి వుత్తేజాన్ని పొందిన వారు కాదు. ప్రపంచ జనాభాలో ముస్లింలు 24శాతం కాగా 1970 నుంచి ఇటీవలి వరకు జరిగిన అన్ని వుగ్రవాద దాడుల్లో ముస్లింలు జరిపినవి 10.3శాతమే అని ఇటీవల కొంత పెరిగినా జనాభా నిష్పత్తికంటే తక్కువని తేలింది. ముస్లిం తీవ్రవాదుల దాడులకు బలైన వారిలో మెజారిటీ బలైంది కూడా ముస్లింలే అని విశ్లేషకులు చెబుతున్నారు.

Image result for islamophobia is a global crisis

ప్రపంచంలో కేవలం ముస్లిం తీవ్రవాద సంస్ధలే వున్నట్లు మీడియా చిత్రిస్తున్నది. వుగాండాలో లార్డ్స్‌ రెసిస్టెన్స్‌ ఆర్టీ(ప్రభు ప్రతిఘటన సైన్యం) పేరిట క్రైస్తవ తీవ్రవాదులు లక్ష మందిని హత్య చేశారు.టెన్‌ కమాండ్‌మెంట్స్‌ ప్రాతిపదికన క్రైస్తవ మతరాజ్యాన్ని ఏర్పరచాలన్నది దాని లక్ష్యం. అమెరికాలో ఆర్మీ ఆఫ్‌ గాడ్‌(దేవుని సైన్యం) పేరుతో వున్న తీవ్రవాదులు అబార్షన్లకు వ్యతిరేకంగా హింసాకాండకు పాల్పడుతున్నారు. వీరికీ ఇస్లామిక్‌ దేశాలలోని ఆల్‌ఖైదా, తాలిబాన్లకు తేడా ఏముంది? అమెరికాలో, ఇతర ఐరోపా దేశాల్లో శ్వేతజాతీయులతో కూడిన వుగ్రవాద బృందాలు అనేక నేరాలకు పాల్పడుతున్నాయి. మీడియా తీరు తెన్నుల విషయానికి వస్తే ముస్లిం తీవ్రవాదులు ఒక సంఘటనకు పాల్పడినపుడు మీడియాలో 105పతాక శీర్షికల్లో అది చోటు చేసుకుంటే అదే ముస్లిమేతర వుగ్రవాదులు పాల్పడిన ఘటనకు కేవలం 15పతాక శీర్షికలే వుంటున్నట్లు అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయం జరిపిన విశ్లేషణలో తేలింది. అమెరికాలో 2006-2015 మధ్య జరిగిన శ్వేతజాతి మరియు మితవాద వుగ్రవాదులు జరిపిన దాడుల కంటే ముస్లింలు జరిపిన దాడులకు అమెరికన్‌ మీడియాలో రెట్టింపు ప్రచారం చోటు చేసుకుందని తేలింది. ప్రపంచమంతటికీ ఇస్లామిక్‌ తీవ్రవాదులు, తీవ్రవాదంతో ముప్పు ఏర్పడిందన్నది ఒక తప్పుడు ప్రచారం.

వుగ్రవాద మూలాల విషయానికి వస్తే ఎంతో వివరించాల్సి వుంటుంది. సామాజిక చరిత్రలో కొత్త తత్వశాస్త్రం(మతం) వునికిలోకి వచ్చినపుడల్లా గతమెంతో ఘనమంటూ పాతరోతను నిలబెట్టేందుకు తిరోగమన వాదులు, కొత్తదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు పురోగమన వాదులు వుగ్రవాదం వైపు మళ్లిన చరిత్ర మనకు కనిపిస్తుంది. నిజానికి వుగ్రవాదం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు ప్రపంచవ్యాపితంగా అంగీకరించిన అర్ధం ఇంతవరకు లేదు. మధ్య ప్రాచ్యంలో రోమన్లను కూలదోసేందుకు యూదులు కొందరు వుగ్రవాదులుగా మారారు. క్రీస్తు శకం తొలి శతాబ్దిలో సికారి అనే యూదు సంస్ధ ఏర్పాటయింది.దానికి ముందు జాకబ్‌, సైమన్‌ అనే యూదునేతలు దేవుడు తప్ప యూదులను మరొకరు పాలించటానికి లేదని అవసరమైతే సాయుధ ప్రతిఘటన చేయాలని వుద్బోధించారు.సికారి సంస్ధకు చెందిన వారు ఇంకొక అడుగు ముందుకు వేసిన సాయుధ ప్రతిఘటనతో పాటు రోమన్లతో సయోధ్య కోరుకున్న యూదులను కూడా హతమార్చాలని పిలుపునిచ్చింది. అందుకు గాను వారు జన సమూహాల్లో కలసిపోయి తమ దగ్గర దాచుకున్న కత్తులతో శత్రువులుగా ఎంచుకున్నవారిని హతమార్చే వారు. తరువాత వారు ఇతరులతో కలసి మరణించిన వారికోసం ఏడుపులు పెడబొబ్బలు పెట్టి తప్పించుకొనే వారట.పదిహేడవ శతాబ్దిలో స్పెయిన్‌లో కాథలిక్‌ రాజ్యాన్ని స్ధాపించేందుకు గై ఫాకెస్‌ నాయకత్వంలో మత వుగ్రవాదులు విఫల తిరుగుబాటు చేశారు. తరువాత ఫ్రెంచి విప్లవ సమయంలో తమ మాట వినని వారిని నిర్ధాక్షిణ్యంగా అధికారంలో వున్నవారే చంపి రాజ్య వుగ్రవాదానికి తెరలేపారు.

Image result for islamophobia is a global crisis

హంగరీలో ముస్లింలు ఒకశాతం మంది కూడా లేరు, అయినా సరే అక్కడి ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌ హంగేరియన్‌ పిల్లలను కనేందుకు దేశంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వలసలను అంగీకరించటం అంటే మనం లొంగిపోవటమే అని కొద్ది రోజుల క్రితం రెచ్చగొట్టాడు. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగకపోతే లండన్‌ నగరం ఫ్రెంచి పెట్టుబడిదారులకు బదులు టర్కీ ముస్లింలతో నిండిపోతుందని బ్రెక్సిట్‌ అనుకూల వాదులు ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం కారణంగా అమెరికాలో 17శాతం మంది ముస్లింలు వున్నారని మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సర్వేలో అమెరికన్లు చెప్పారు. నిజానికి అక్కడ ఒకశాతానికి దగ్గరగా వున్నారు.ఫ్రాన్స్‌లో కూడా వున్నదాని కంటే నాలుగు రెట్లు వున్నారనే ప్రచారానికి అక్కడి వారు లోనయ్యారు. అనేక ముస్లిం దేశాలలోని ఛాందసులు కూడా ఇలాంటి ప్రచారంతోనే అక్కడి సమాజాలను రెచ్చగొడుతున్నారు. మత వుగ్రవాదులను తయారు చేస్తున్నారు ‘ హిందూస్ధాన్‌కు హిందూ సంస్కృతి జీవనాడి. అందువలన హిందూస్ధాన్‌ను రక్షించుకోవాలంటే ముందుగా మనం హిందూ సంస్కృతిని పెంచి పోషించుకోవాలన్నది స్పష్టం. హిందుస్ధాన్‌లోనే హిందూ సంస్కృతి నాశనమైతే, హిందూ సమాజం వునికి కోల్పోతే……. కాబట్టి తనకు చేతనైనంత వరకు హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం ప్రతి హిందువు విధి………మన యువత మెదళ్లను అంతిమంగా ఆ దిశగా మలచటం సంఘ్‌ ప్రధాన లక్ష్యం’ అని సంఘపరివార్‌గా పరిచితమైన ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం గురించి దాని స్ధాపకుడు డాక్టర్‌ కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ చెప్పిన మాటలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌ తెరవగానే మనకు కనిపిస్తాయి. మతోన్మాదం తలకెక్కితే ఏ మతం వారైనా ఒకటే. మన దేశంలో ముస్లింలు, క్రైస్తవుల సంఖ్యను పెంచేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని, దాన్ని వమ్ముచేసేందుకు హిందువులు కూడా పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని చెప్పిన కాషాయ తాలిబాన్లను చూశాము. న్యూజిలాండ్‌లో ముస్లింలను హతమార్చిన క్రైస్తవ వుగ్రవాది ఏమన్నాడో చూడండి.’ మన భూముల నుంచి ఒక వేళ రేపు మనం ఐరోపాయేతరులందరినీ( వారిలో భారతీయ హిందువులు కూడా వుంటారని మరచిపోవద్దు) బయటకు పంపివేసినా యూరోపియన్ల సంఖ్య నశించి చివరకు అంతమౌతుంది.చివరికి తిరిగి మనం ప్రజననశక్తిని పెంచుకోవాలి లేకపోతే అది మనల్ని చంపివేస్తుంది.’ ఇస్లామిక్‌, కాషాయ తాలిబాన్లకు, వీడికి తేడా ఏముంది? ఇలాంటి వారు ఎంతకైనా తెగిస్తారు, అందుకే వుగ్రవాదం ప్రపంచ సంక్షోభానికి చిహ్నం. గతంలో మతం కోసం వుగ్రవాదులు తయారైతే ఇప్పుడు సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలలో భాగంగా మత వుగ్రవాదులను తయారు చేస్తున్నారు. అదే నాటికీ నేటికీ తేడా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుగ్రవాద వ్యతిరేక మద్దతు నటన – ఆర్ధికంగా దెబ్బతీసే ఆచరణ, ఇదీ అమెరికా నిజరూపం !

16 Saturday Mar 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

GSP notification, GSP privileges to India, US Trade War Aginst India

Image result for trump real face against india

ఎం కోటేశ్వరరావు

కాశ్మీర్‌లోని పుల్వామా వద్ద సిఆర్‌పిఎఫ్‌ వాహన శ్రేణిపై వుగ్రవాదులు జరిపిన దాడి తరువాత మన దేశానికి మద్దతుగా పాకిస్ధాన్‌ మీద వత్తిడి తెస్తున్నట్లు అమెరికా పెద్ద ఫోజు పెట్టింది. దానికి పరాకాష్టగా ఐక్యరాజ్యసమితిలో జైషే మహమ్మద్‌ సంస్ధ నేత మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా ప్రకటించాలనే తీర్మానం గురించి కొద్ది రోజులు వూదరగొట్టింది. ప్రధాన స్రవంతి మీడియా దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. పాకిస్ధాన్‌లో వుగ్రవాద మూకలకు అన్ని విధాలుగా శిక్షణ ఇప్పించి మన మీదకు వుసిగొల్పి వారిని పోషించటానికి ఆర్ధికంగా దశాబ్దాలపాటు సాయపడి వెన్నుదన్నుగా వున్నది అమెరికా అన్నది జగమెరిగిన సత్యం. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న లోకోక్తి తెలిసిందే. వుగ్రవాదులను తొలుత పెంచి పోషించినా,తరువాత వారి మీద చర్యలు తీసుకున్నా లేదా తీసుకున్నట్లు నటించినా అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. ఒకవైపు వుగ్రవాదానికి వ్యతిరేకంగా మనకు టన్నుల కొద్దీ సానుభూతి ప్రకటనలు తప్ప ఆచరణలో అంతకు మించిమరేమీ లేదు. మరోవైపు మనలను ఆర్ధికంగా దెబ్బతీసే నిర్ధిష్ట చర్యలకు అమెరికా తెరతీసింది. ఇండో-అమెరికా భాయీ భాయీ అన్నట్లుగా నరేంద్రమోడీ-డోనాల్డ్‌ ట్రంప్‌ కౌగిలింతల దౌత్యం వికటించిందా ?

కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను బట్టి చైనా మీద అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించవచ్చనే అభిప్రాయాన్ని పలువురు వెల్లడిస్తున్నారు. నిజంగా అది జరుగుతుందా లేదా అన్నది పెద్ద సందేహం. దాని గురించి తలబద్దలు కొట్టుకోనవసరం లేదు. అమెరికాకు తన ప్రయోజనాలు తప్ప మరొకటేదీ పట్టదు. అందువలన ఒక చోట రాజీపడినా మరొక రంగం మీద అది దృష్టి సారిస్తుంది. నీతి అయోగ్‌ వుపాధ్యక్షుడిగా పనిచేసిన అరవింద్‌ పనగారియా మార్చి13న రాసిన ఒక వ్యాఖ్యానంలో వాణిజ్య యుద్ధంలో ట్రంప్‌ తదుపరి లక్ష్యం భారత్‌ అని పేర్కొన్నారు. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాల పర్యవసానంగా కొన్ని దశాబ్దాలుగా మన దేశానికి అమెరికా వర్తింప చేస్తున్న సాధారణ సానుకూల ప్రాధాన్యతను(జిఎస్‌పి) రద్దు చేయాలని ఆలోచిస్తున్నట్లు మార్చినెల నాలుగవ తేదీన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. తమ వస్తువుల దిగుమతులను అడ్డుకుంటున్న పన్నులను భారత్‌ తగ్గించటం లేదని, ఇతర విధాలుగా అడ్డుకుంటోందని ట్రంప్‌ ఆగ్రహం వెలిబుచ్చాడు. ఒకవేళ ఆ సౌకర్యం రద్దయినా మనకు పెద్దగా నష్టం లేదని, మనం కూడా అమెరికా మీద ప్రతిచర్యలు తీసుకుంటామన్న వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రస్తుతం మన దేశం అమెరికాతో 21బిలియన్‌ డాలర్ల వాణిజ్య మిగులులో వుంది. దీన్ని సమం చేసేంత వరకు అమెరికా ఇలాంటి బెదిరింపులు చేస్తూనే వుంటుంది.

Image result for trump real face against india

అసలే మన ఎగుమతులు పడిపోతూ వివిధ దేశాలతో వాణిజ్యలోటులో వున్నాం. మునిగిపోయే స్ధితిలో వున్న నావ గడ్డిపోచను కూడా భరించలేదన్న విషయం తెలిసిందే. కొందరు వర్ణిస్తున్నట్లు అమెరికా చర్య గడ్డిపోచ వంటిదే అనుకోవటానికి లేదు. నయానో భయానో మన మార్కెట్‌ను తన వస్తువులతో నింపి తమ కార్పొరేట్లకు లబ్ది చేకూర్చాలన్నది అమెరికా లక్ష్యం. సదరు జిఎస్‌పి జాబితాలోని ఎగుమతులు ఒక స్ధాయి దాటిన తరువాత వర్తించే రాయితీలు రద్దవుతాయి. అందువలన అనేక అంశాలను పరిశీలించినపుడు మనకు చేసే హెచ్చరిక ఒక సాకు తప్ప దాని వెనుక పెద్ద అజెండాయే వుందని చెప్పవచ్చు. అమెరికా ప్రకటించిన జిఎస్‌పి ఒక్క మన దేశానికే ఇచ్చిన ప్రాధాన్యత కాదు, అనేక వర్ధమాన దేశాలకు వేసిన ఎర అది. ప్రపంచంలో అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నాయి, దీనికి మన దేశం మినహాయింపు కాదు, అవసరం కూడా. అవి లేకపోతే మన పరిస్ధితి మరింతగా దిగజారి వుండేది. అమెరికా అనుకున్న విధంగా మనదేశం దిగుమతి పన్నులను తగ్గించి మార్కెట్‌ను తెరవలేదు. అందుకే ట్రంప్‌ మన దేశాన్ని పన్నుల రాజు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఇటీవలి మనదేశ నిర్ణయాలు అంటే సమాచారాన్ని స్ధానికంగానే అంటే భారత్‌లోనే భద్రపరచాలి, ఆన్‌లైన్‌ వాణిజ్య వుత్పత్తుల అమ్మకాలపై ఆంక్షల వంటి చర్యలు అమెజాన్‌, వాల్‌మార్ట్‌ వంటి కంపెనీలకు అంగీకారం కాదు.హెచ్‌1బి వీసాలు, పని అనుమతుల మీద అమెరికా ఆంక్షలు, విదేశాల నుంచి వచ్చే అల్యూమినియం, వుక్కు దిగుమతులపై ఆంక్షల వంటి చర్యలను అమెరికా తీసుకుంది. ఇవన్నీ మనకు నష్టం కలిగించేవే. దీనికి ప్రతిగా అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకొనే వస్తువులు, సరకులపై దిగుమతి పన్నులు పెంచుతామని మన దేశం హెచ్చరించింది. అందుకుగాను ఏప్రిల్‌ ఒకటవ తేదీని గడువుగా ప్రకటించింది.జిఎస్‌పి సౌకర్యాన్ని భారత్‌కు వుపసంహరిస్తే ఆ జాబితాలోని వస్తువులు సరఫరా చేయటానికి చైనా సిద్దంగా వుంది.వుదాహరణకు 25,50కిలోల పాకింగ్‌ సంచులు, షాపింగ్‌, కారీబ్యాగ్‌లు తయారు చేసే పరిశ్రమలు అమెరికాలో లేవు. వాటిని మనవంటి ఇతర దేశాల నుంచి చౌకగా పన్నులు లేకుండా దిగుమతి చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని తయారు చేసే చిన్న పరిశ్రమలు గత మూడు సంవత్సరాలుగా మన దేశంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

అమెరికా తన వాణిజ్య, రాజకీయ ప్రయోజనాల కోసం మనవంటి దేశాలను తన పాటకు అనుగుణ్యంగా నృత్యం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.ఇరాన్‌, రష్యాల మీద అది విధించిన ఆంక్షలను మూడోపక్ష దేశాలు కూడా అమలు జరపాలని వత్తిడి చేస్తోంది. దానిలో భాగంగానే మన దేశం వెనెజులా, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదు, రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదు అని శాసిస్తోంది. దానికి తలగ్గిన మోడీ సర్కార్‌ ఇరాన్‌ నుంచి గణనీయంగా చమురు దిగుమతులను తగ్గించింది. అయినా అమెరికాకు సంతృప్తి లేదు. సరిగ్గా ఎన్నికల సమయాన్ని ఎంచుకొని మన దేశం మీద వత్తిడి చేయటం వెనుక బ్లాక్‌మెయిలింగ్‌ కనిపిస్తోంది. జిఎస్‌పి రద్దు చేస్తామని అనటం అంటే మన దేశం మీద మరిన్ని చర్యలు వుంటాయని బెదిరించటమే. ఎన్నికల వేళ తీసుకొనే నిర్ణయాల పర్యవసానాలు ఎలా వుంటాయో అన్న సంశయం వుంటుంది కనుక కొత్త లోక్‌సభ కొలువు తీరే వరకు ఎలాంటి చర్యలు వుండకపోవచ్చు. ఒక వేళ అనూహ్యంగా నరేంద్రమోడీ తిరిగి అధికారానికి వచ్చినా, లేక బిజెపిఏతర సర్కార్‌ వచ్చినా మెడమీద కత్తిలా బెదిరింపు వేలాడుతూ వుంటుంది. తద్వారా తన షరతులకు లంగతీసుకోవచ్చు లేదా వాణిజ్య యుద్ధానికి శంఖం పూరించవచ్చు అన్నది స్పష్టమే. జిఎస్‌పి మనకు ఎలా లాభమో చూద్దాం. 2017లో మన దేశం చేసిన 49బిలియన్‌ డాలర్ల ఎగుమతులలో జిఎస్‌పి వస్తువుల వాటా 5.6బిలియన్‌లు, అంటే పదకొండుశాతం. అంటే ఆ మేరకు మన వస్తువులను అమ్ముకోవటం కష్టం అవుతుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి తయారీదార్లు నష్టపోతారు. ఆమేరకు అమెరికా కూడా నష్టపోతుంది. అంతే కాదు మన దేశం విధించే ప్రతికూల పన్నులతో దాని పదిబిలియన్‌ డాలర్ల ఎగుమతులు కూడా దెబ్బతింటాయి.

మన మీద డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆగ్రహం కలగటానికి కారణం ఏమిటి? ట్రంప్‌ ఆంక్షలను తిరస్కరించి రష్యా నుంచి మనం మూడు బిలియన్‌ డాలర్ల అణుశక్తి అకుల జలాంతర్గామిని అద్దెకు తీసుకోవాలని ఒప్పందం చేసుకున్నాం, ఏడు బిలియన్‌ డాలర్ల విలువగల ఎస్‌-400 క్షిపణి మరియు రక్షణ వ్యవస్ధలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాము. అమేథీలో ఏడున్నర లక్షల ఏకె-203 రైఫిళ్లతయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రష్యాతో సంయుక్త ఒప్పందం చేసుకున్నాము. గత పది సంవత్సరాల కాలంలో రష్యా సహకారంతో 170 మిలిటరీ పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నాము. అమెరికా నుంచి మనకు లేనివి రష్యా నుంచి మనకు రెండు సానుకూలతలు వున్నాయని మాజీ సైనికాధికారి, ప్రస్తుతం రక్షణ వ్యవహారాలను ప్రచురించే పత్రిక సంపాదకుడిగా వున్న ప్రవీణ్‌ స్వామి పేర్కొన్నారు. అమెరికా కంటే రష్యా మరింత టెక్నాలజీ అందచేస్తుంది, పుతిన్‌ చెప్పేదానిని గ్జీ జింపింగ్‌ వింటారు, చైనా నుంచి వ్యూహాత్మక రక్షణను రష్యా ఇస్తుంది అన్నారు. గత పది సంవత్సరాలలో అమెరికాతో భారత్‌ జరిపిన లావాదేవీల విలువకు సమంగా ఆరెనెలల్లో రష్యాతో భారత్‌ ఒప్పందాలు చేసుకుందని రష్యన్‌ పత్రిక స్పుత్నిక్‌ వ్యాఖ్యానించింది. ఎగుమతి అనుమతులతో నిమిత్తం లేకుండా నేరుగా మనదేశానికి రక్షణ వుత్పత్తులను విక్రయించేందుకు 14 రష్యన్‌ బడా ఆయుధ తయారీ సంస్ధల దేశాధ్యక్షుడి అనుమతులను పొందాయి. సిప్రి అనే సంస్ధ విడుదల చేసిన ఆయుధ విక్రయ లావాదేవీల సమాచారం ప్రకారం ప్రపంచం దిగుమతి చేసుకుంటున్న ప్రతి వంద ఆయుధాల్లో మన వాటా 9.5కాగా వాటిలో 2014-18 మధ్య 58శాతం రష్యా నుంచే వున్నాయి.21 మిగ్‌ 29,సుఖోయ్‌ విమానాల కొనుగోలు చర్చలు,పాతవాటి నవీకరణ చర్చలు జరుగుతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణం. మన మిలిటరీని అమెరికా ఆయుధాలతో నింపాలని సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన గత 28సంవత్సరాల నుంచి చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు సఫలం కాకపోవటంతో అసహనంతో వున్నాడు.

Image result for trump real face

రక్షణ వుత్పత్తులను తన శత్రుదేశం రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేయటం ఒకటైతే హార్లే డేవిడ్సన్‌ మోటారు సైకిళ్లపై విధిస్తున్న అధిక దిగుమతి పన్నుల నుంచి అనేక వస్తువులపై మన ఆంక్షలను అమెరికా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా వైద్య పరికరాలు, పాల వుత్పత్తుల పరిశ్రమల వారు ట్రంప్‌ మీద పెద్ద ఎత్తున వత్తిడి తెచ్చారు. గుండెకు అమర్చే స్టెంట్స్‌, మోకాలి చిప్పలుగా అమర్చే పరికరాల వుత్పత్తుల ధరలను మన దేశం తగ్గించటాన్ని, మరికొన్నింటిని తగ్గించే ఆలోచనలను వైద్యపరికరాల తయారీదారులు అభ్యంతర పెడుతున్నారు. మన దేశం దిగుమతి చేసుకొనే పాలవుత్పత్తులపై ఒక ఆంక్ష వుంది.అతల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వుండగా కేంద్రప్రభుత్వం చేసిన నిర్ణయం ప్రకారం పాలు ఇచ్చే పశువులు తినే దాణాలో రక్తం,ఇతర జంతు అంతర్గత అవవయాలకు సంబంధించినవేవీ కలవ కూడదు. తమ వుత్పత్తుల్లో అలాంటివి లేవని ఎగుమతి చేసే సంస్ధలు హామీ పత్రాలు ఇవ్వాలి. ఇలాంటి అశాస్త్రీయమైన హామీలను తామెలా ఇస్తామని, నమ్మకం ఆధారంగా లావాదేవీలు జరగాలని అమెరికన్లు అంటున్నారు. గతంలో తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ నిబంధనను తామే ఎత్తివేస్తే రాజకీయంగా నష్టం కలుగుతుందని నరేంద్రమోడీ సర్కార్‌ వీటి గురించి ఎలాంటి సంప్రదింపులు జరిపేది లేదని స్పష్టం చేసింది.

పైన పేర్కొన్న అంశాల పూర్వరంగంలో ట్రంప్‌ సర్కార్‌ ఏడాది కాలంగా జిఎస్‌పి రద్దు, ఇతర అంశాల గురించి మనకు హెచ్చరికలు పంపుతూనే వుంది. మార్చినెల మొదటి వారంలో ట్రంప్‌ జిఎస్‌పి వుపసంహరణ గురించి ప్రకటన చేశారు. దీని మీద నోటీసు ఇచ్చిన తరువాత రెండు నెలల్లో అది రద్దవుతుంది. ఇప్పుడు ఆ దశలోనే వుంది. ఇప్పటికైనా భారత్‌ సరైన ప్రతిపాదనలు చేస్తే తమ నిర్ణయాన్ని సమీక్షిస్తామని అమెరికా తాజాగా ప్రకటించింది. ఎన్నికల్లో లేదా ఎన్నికలు ముగిసిన వెంటనే అయినా ఏదో ఒకటి తేల్చాలని పట్టుపడుతోంది. రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు పూర్తవుతాయి గనుక తరువాత చూద్దాం లెమ్మని మోడీ సర్కార్‌ భావిస్తోంది. ఫలితాలు ఎలా వుంటాయి, కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసినా ట్రంప్‌ బెదిరింపులకు తలొగ్గుతారా, ఎదిరిస్తారా అన్నది వూహాజనిత ప్రశ్నలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నెహ్రూపై అరుణ్‌ జెట్లీ వక్రీకరణలు – వాస్తవాలు !

15 Friday Mar 2019

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Jaitley blames Nehru, original sinner, UNSC Seat

ఎం కోటేశ్వరరావు

భీష్ముడు మరణించిన తరువాత కౌరవ సేనాధిపతిగా ద్రోణుడు వచ్చాడు.కుమారుడు అశ్వద్ధామ అంటే ద్రోణుడికి చచ్చేంత ప్రేమ. ద్రోణుడిని ఓడించటం కష్టమని తెలిసిన శ్రీకృష్ణుడు అందుకు ఒక కుయుక్తిని ప్రయోగించాడు అదే ద్రోణుడిని నిర్వీర్యం చేయటం. అందుకు గాను అశ్వద్ధామ అనే పేరున్న ఏనుగును చంపమని భీముడికి చెప్పాడు. భీముడు ఆపని చేసి తాను అశ్వద్ధామను చంపినట్లు యుద్ధరంగంలో ప్రకటించాడు. దానిని నమ్మని ద్రోణుడు అబద్దం చెప్పడని పేరున్న ధర్మరాజు  దగ్గరకు వెళ్లి అశ్వద్ధామను చంపామని చెప్పారు నిజమేనా అని అడిగాడు. దానికి అవును అశ్వద్ధామను చంపారు అని బిగ్గరగా చెప్పి అయితే అది మనిషో ఏనుగో నాకు తెలియదు అని వినిపించీ వినిపించకుండా గొణిగాడు. దాంతో ద్రోణుడు కుప్పకూలాడు. తరువాత పాండవులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలో లోక్‌సభ ఎన్నికల పోరు ప్రారంభమైంది. దీన్ని గెలిచేందుకు రాజకీయ పార్టీలు వేయని ఎత్తులు, చేయని మోసాలు లేవు. వాటిలో ఒకటి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గురువారం నాడు చేసిన పెద్ద వక్రీకరణ. ఇలాంటి సమయాలలో ఒక అబద్దం, వక్రీకరణను వదిలితే అది రేసు గుర్రంలా పరుగుతీస్తుంది, నిజం తాబేలు మాదిరి వేగంతో కూడా జనం దగ్గరకు వెళ్లదు.

జైషే మహమ్మద్‌ అధిపతి మసూద్‌ అజహర్‌ను ప్రపంచ వుగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానాన్ని భద్రతామండలిలో చైనా  వీటో చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం గురించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానిస్తూ చైనాకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదని, మోడీ బలహీనుడు, చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అంటే భయం అన్నారు.  దాన్ని తిప్పి కొడుతూ కాశ్మీర్‌, చైనాల మీద అసలు పాపం చేసింది జవహర్‌లాల్‌ నెహ్రూ అని, భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్ధానం కల్పిస్తామంటే చైనా వంటి గొప్పదేశానికి ఇవ్వాలని నెహ్రూ చెప్పారని, అదే విషయాన్ని 1955లో ముఖ్య మంత్రులకు లేఖలో కూడా రాశారని జెట్లీ ఎదురుదాడి చేశారు. భద్రతా మండలిలో ఆంక్షల కమిటి ప్రతిపాదించిన 1267వ తీర్మాన ఫలితంతో ఆశాభంగం చెందామని మన విదేశాంగశాఖ తన తొలి స్పందనలో వ్యాఖ్యానించింది. తీర్మానాన్ని ప్రతిపాదించిన వారికి, మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. తీర్మానాన్ని వీటో చేసిన చైనా గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. చైనా ఈ తీర్మానాన్ని వీటో చేయటం ఇదే మొదటిసారి కాదు, ఇంతకు ముందు మూడుసార్లు అదే చేసింది. భారత్‌-పాకిస్ధాన్‌ విబేధాలు పరిష్కారం కావటానికి ఇలాంటి తీర్మానాలు దోహదం చేయవని, మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు తగినన్ని ఆధారాలు లేవని గతంలోనూ ఈ సందర్భంగానూ చైనా పేర్కొన్నది. చైనా వైఖరి గురించి తెలిసినప్పటికీ ఈ ఐదు సంవత్సరాలలో ఆ దేశంతో మన ఆర్ధిక, ప్రభుత్వ సంబంధాలు ఇంకా బలపడ్డాయి, వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రిమోట్‌ కంట్రోలర్‌ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధలు ఏదో ఒక అవకాశాన్ని సాకుగా చూపి చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తూనే వున్నాయి, అవి ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తే అంతగా వాణిజ్యం పెరుగుతోందన్నది చేదు నిజం.

2013ా14లో చైనా నుంచి మన దిగుమతులు 51బిలియన్‌ డాలర్ల విలువ  కలవి కాగా ఎగుమతులు 14.82బిలియన్ల్‌, మన వాణిజ్యలోటు 36బిలియన్లు వుంది.2017ా18 తొలి తొమ్మిది నెలల కాలంలో మన ఎగుమతులు పది బిలియన్‌డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు ఇదే కాలానికి 63బిలియన్‌ డాలర్లకు, వాణిజ్య లోటు 53బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలోనే చైనా మూడుసార్లు భద్రతామండలిలో మసూద్‌ టెర్రరిస్టు తీర్మానాన్ని వీటో చేసింది. దీన్ని బట్టి నరేంద్రమోడీ సర్కార్‌ రాజకీయాలను, ఆర్ధిక లావాదేవీలను విడివిడిగా చూస్తున్నదన్నది స్పష్టం. రాజకీయంగా చైనాను ఏమీ అనలేని స్ధితిలో వున్న అరుణ్‌ జెట్లీ తన అక్కసును నెహ్రూ మీద తీర్చుకున్నారని, బిజెపి ప్రచార కమిటీ నేతగా  తమ క్యాడర్‌కు ఒక అస్త్రాన్ని అందించారన్నది స్పష్టం. అయితే ప్రతి అస్త్రం నిర్ధేశిత లక్ష్యాన్ని తాకుతుందా అంటే అనుమానమే. ఈ పూర్వరంగంలో నెహ్రూ గురించి చేసిన వాఖ్యల గురించి చూద్దాం.

మొదటిది. జైట్లీ చేసిన వక్రీకరణ కొత్తది కాదు. వాస్తవమూ కాదు. వివేక్‌ అగ్నిహోత్రి అనే ఒక సినిమా రంగానికి చెందిన కాషాయదళ వ్యక్తి 1965 యుద్ధంలో ఎదురుదాడి చేద్దామన్న తన మిత్రుడైన సైనికదళాల ప్రధాన అధికారి జనరల్‌ చౌదరిని రాజీనామా చేస్తావా తొలగించమంటావా అని నాటి ప్రధాని నెహ్రూ వత్తిడి చేశారని కొద్ది రోజుల క్రితం ట్వీట్‌ చేశాడు. జనరల్‌ చౌదరి 1966లో పదవీ విరమణ చేసిన ఏడు సంవత్సరా తరువాత పుట్టిన అగ్నిహోత్రి సదరు అధికారి తన స్నేహితుడని చెప్పుకుంటే కాషాయ మరుగుజ్జులు ఆ ట్వీట్‌ను గుడ్డిగా షేర్‌ చేశారు. అన్నింటి కంటే పచ్చి నిజం ఏమంటే జవహర్‌లాల్‌ నెహ్రూ 1964మేనెలలో మరణించారన్న కనీస పరిజ్ఞానం కూడా అతనికి లేదు. 1965 యుద్ద సమయంలో ప్రధానిగా లాల్‌బహదూర్‌ శాస్త్రి వున్నారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే మాకు వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారన్న అరుణ్‌జెట్లీ ట్వీట్‌ కూడా ఇలాంటిదే.  రెండవ ప్రపంచ యుద్ధం నాటికి చైనా ఒక స్వతంత్ర రాజ్యం. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంగ్‌ మార్చ్‌ పురోగతిలో వుంది. అనేక విజయాలను కమ్యూనిస్టులు సాధించారు. కొమింటాంగ్‌ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ కూటమికి వ్యతిరేకంగా మిత్రరాజ్య కూటమిలో భాగంగా పాల్గన్నది.1939లో రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమైంది. దాన్ని నివారించటంలో నానాజాతి సమితి విఫలమైంది. ఈ పూర్వరంగంలో కొత్త ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన అమెరికా విదేశాంగ శాఖ ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు 1941డిసెంబరు చివరిలో ఒక ముసాయిదాను తయారు చేస్తే దానికి సోవియట్‌ యూనియన్‌ కొన్ని సవరణలు చేసింది. అమెరికా, సోవియట్‌ యూనియన్‌, బ్రిటన్‌, చైనాలు దాని మీద సంతకాలు చేశాయి. ఆ సమయంలో ఫ్రాన్స్‌ హిట్లర్‌ మూకల దురాక్రమణలో వుంది. 1945 అక్టోబరు 24 ఐక్యరాజ్యసమితి వునికిలోకి వచ్చింది. ఆ తరువాత ఫ్రాన్స్‌ రిపబ్లిక్‌గా ఏర్పడిన తరువాత భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. రెండవ ప్రపంచ యుద్దంలో విజేతలుగా వున్నందున ఐదు దేశాలకు శాశ్వత భద్రతా మండలి సభ్యత్వంతో పాటు వీటో హక్కు కల్పించారు. తరువాత అవి అణుశక్తి దేశాలుగా కూడా మారాయి. అందువలన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. అసలు ఆ సమయానికి మనకు స్వాతంత్య్రం రాలేదు, నెహ్రూ అసలు ప్రధాని కాలేదు.

అయితే నెహ్రూ మీద ఇలాంటి ప్రచారం ఎందుకు జరిగినట్లు? నిప్పులేకుండా పొగరాదు కదా అని ఎవరైనా అనుకోవచ్చు.దీని గురించి జరిగిన ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని 1955లోనే పార్లమెంటులో ఒక ప్రశ్నకు నెహ్రూ సమాధానం చెప్పారు. అయినా అరుణ్‌ జెట్లీ అదే ఏడాది ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నెహ్రూ స్వయంగా అంగీకరించారని ఆరోపించారు. దీని గురించి 2002లోనే ప్రముఖ పరిశోధకుడు ఏజి నూరాని తన విశ్లేషణను ప్రచురించి వాస్తవాలను తెలియచేశారు. అయినా నెహ్రూ వ్యతిరేక శక్తులు తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూనే వున్నాయి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్న గోబెల్స్‌ వారుసులు తప్ప మరొకరు వీటిని నమ్మరు. 2015లో ఆంటన్‌ హార్డన్‌ అనే ఒక పరిశోధకుడు రాసిన వ్యాసాన్ని విల్సన్‌ సెంటర్‌ ప్రచురించింది. దాన్ని 2016 ఆగస్టులో వైర్‌ వెబ్‌సైట్‌ తిరిగి ప్రచురించింది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన రెండు సంవత్సరాలకు మనకు స్వాతంత్య్రం వచ్చింది, మూడు సంవత్సరాలకు చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌(గతంలో ఫార్మోజా దీవి)కు కొమింటాంగ్‌ సేనలు చేరి అక్కడి నుంచి తామే చైనా అధికారంలో వున్నట్లు ప్రకటించుకున్నాయి. అప్పటికే వారి ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో వున్నారు. అమెరికా వత్తిడితో దాన్నే అసలైన చైనాగా పరిగణించటం మినహా సోవియట్‌తో సహా మిగతా దేశాలకు మరొక మార్గం లేకపోయింది. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల సంఖ్యను విస్తరించాలంటే ఏకాభిప్రాయం అవసరం. కమ్యూనిస్టు చైనానే అసలైనా చైనా గుర్తించాలని సోవియట్‌ కోరినా అమెరికన్లు వీటో చేస్తే చెల్లదు. ఆ పరిస్ధితి 1971వరకు కొనసాగింది. తరువాత అమెరికా చొరవతో తైవాన్‌కు బదులు కమ్యూ నిస్టు చైనాను గుర్తించారు.

ఆ మధ్యకాలంలో జరిగిన రాజకీయాన్ని అర్ధం చేసుకుంటే తప్ప నెహ్రూ ఏమి చేశారన్నది మనకు అవగతం కాదు. మన దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత తమ రాజకీయ పలుకుబడి కిందకు తెచ్చుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. బెదిరించి లంగతీసుకోవాలన్న  దాని తప్పుడు ఎత్తుగడలు మన దేశాన్ని సోవియట్‌వైపు నెట్టాయి. 1948లో చైనాలో అధికారానికి వచ్చిన కమ్యూ నిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా, బ్రిటన్‌ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాయి. అంతర్గతంగా తిరుగుబాట్లను రెచ్చగొట్టటం, బర్మా (ప్రస్తుత మయన్మార్‌) కేంద్రంగా కొమింటాంగ్‌ సైనికులు, ఇతర విద్రోహకులకు ఆయుధాలిచ్చి చైనాలో దాడులు చేయించటం వంటి వన్నీ దాదాపు పది సంవత్సరాలు సాగాయి. అప్పటికిగానీ మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు నిలదొక్కుకోలేకపోయారు.టిబెట్‌లోని 14వ దలైలామా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చిన చైనా ప్రభుత్వం టిబెట్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు అంగీకరించింది. ఒప్పందం మీద సంతకం చేసిన తరువాత సామ్రాజ్యవాదుల కుట్రల కారణంగా 1959లో తిరుగుబాటు చేసిన దలైలామా స్వాతంత్య్ర ప్రకటన చేశాడు. దాన్ని చైనా అణచివేయటంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ గుండా పారి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొంది ప్రవాస ప్ర భుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. ఇది ఒకటైతే కమ్యూనిస్టులు అధికారాన్ని సుస్ధిరం చేసుకున్న తరువాత ఎప్పటికైనా కమ్యూ నిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యంగా గుర్తించక తప్పదని అమెరికన్లకు మొదటి నుంచి ఒక అంచనా వుంది. అయితే దాన్ని బయటపడనివ్వకుండా రాజకీయం చేశారు.

చైనా తరువాత అతి పెద్ద దేశమైన భారత్‌కు  భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సి వుందంటూ చైనాను సాధారణ అసెంబ్లీకి పరిమితం చేసి ఐదవ శాశ్వత సభ్యురాలిగా భారత్‌కు మద్దతు ఇస్తామని అమెరికన్లు నెహ్రూకు రాయబేరం పంపారు. కమ్యూ నిస్టు చైనాను దెబ్బతీయటం, భారత్‌ను తమ శిబిరంలోకి చేర్చుకోవటం అనే ఒకే దెబ్బకు రెండు పిట్టలనే ఎత్తుగడ దీనిలో వుంది. తమకు శాశ్వత సభ్యదేశ హోదా అర్హత వుందని, అయితే చైనాను పక్కన పెట్టి తమకు దాన్ని ఇవ్వటం అంటే చైనా-తమ మధ్య విబేధాలను పెంచే ఎత్తుగడ తప్ప వేరు కాదని అందువలన దాన్ని మినహాయించి తమకు ఆ స్ధానాన్ని ఇస్తామనే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని నెహ్రూ సర్కార్‌ నాడు అమెరికాకు చెప్పింది. ఇదే విషయాలను నెహ్రూ తన లేఖలో రాశారు. జెట్లీ వంటి వారు ఆ లేఖను పట్టుకొని రామునితోక పివరుండు ఇట్లనియే అన్నట్లు పదే పదే ప్రచారం చేస్తున్నారు. కాశ్మీర్‌ విషయంలోనూ అదే చేస్తున్నారు. నిజానికి భద్రతా మండలిని విస్తరించాలని, దానిలో వున్న ప్రజాస్వామ్య వ్యతిరేక అంశాలను సంస్కరించాలని అనేక మంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సులు తమ ప్రయోజనాలు, అజెండాకు అనుగుణంగా ఆయా దేశాలను రెచ్చగొట్టటం, తాము ప్రతిపాదిస్తుంటే ఇతరులు అడ్డుకుంటున్నారని సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది మసూద్‌ అజార్‌ కావచ్చు మరొకటి కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d