• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: COUNTRIES

అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా-హొండురాస్‌లో మరోసారి ప్రజాస్వామ్యం ఖూనీ !

06 Wednesday Dec 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Honduras, Honduras democracy hijaked, Salvador Nasralla, Tegucigalpa, yankees

ఎం కోటేశ్వరరావు

ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయటాన్ని అంగీకరించబోమన్న హొండురాన్లపై పాలకులు వుక్కుపాదాన్ని మోపేందుకు పూనుకున్నారు. దేశమంతటా పది రోజుల పాటు కర్ఫ్యూ ప్రకటించి రక్తాన్ని కండ్ల చూస్తున్నారు. తెలియందేముంది, మేమున్నాం అంటూ సకల అప్రజాస్వామిక చర్యలకు మద్దతు ఇచ్చే అమెరికన్లు తాజా దుండగానికీ మద్దతు ఇస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. రాజకీయ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం నాటి వరకు 11మంది మరణించినట్లు మానవహక్కుల సంఘం ప్రకటించింది. మరోవైపు పోలీసు బలగాలు తాము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదని తిరుగుబాటును ప్రకటించాయి. కర్ఫ్యూను వుల్లంఘించి ప్రదర్శనలు జరుపుతున్న వారిపై బల ప్రయోగానికి నిరాకరించాయి. ప్రదర్శనల్లో పాల్గొన్నవారిని సురక్షితంగా ఇండ్లకు చేర్చేందుకు ముందుకు వస్తున్నాయి. అనేక చోట్ల పోలీసులు కూడా ప్రదర్శకులతో కలసి అధ్యక్షుడు హెర్నాండెజ్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దక్షిణ అమెరికా ఖండంలోని మధ్య అమెరికాగా పిలిచే కరీబియన్‌ దేశాలలో ఒకటైన హొండురాస్‌కు ఈశాన్యంలో నికరాగువా, నైరుతిలో ఎల్‌ సాల్వెడార్‌, పశ్చిమాన గౌతమాలా, దక్షిణాన పసిఫిక్‌, వుత్తరాన కరీబియన్‌ సముద్రాల మధ్యలో తొంభైలక్షల మంది జనాభా వున్న దేశమది.నవంబరు 26న ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు మితవాది జువాన్‌ ఆర్లొండో హెర్నాండెజ్‌ తిరిగి ఎన్నికౌతాడని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు బలపరిచిన టీవీ జర్నలిస్టు సాల్వెడార్‌ నసరల్లా విజయం సాధించే దిశగా వున్నట్లు ఓట్ల లెక్కింపు సరళి వెల్లడించింది. పోలైన ఓట్లలో 58శాతం లెక్కించిన సమయానికి ఐదుశాతం మెజారిటీతో నసరల్లా ముందున్నారు. అయితే సాంకేతిక కారణాలు చూపి ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. రెండు రోజుల తరువాత ప్రారంభించగా నాటకీయంగా నసరల్లా మెజారిటీ తగ్గిపోయి హెర్నాండెజ్‌ స్వల్పమెజారిటీకి చేరుకున్నారు. ఓట్ల లెక్కింపును నిలిపివేయగానే ఓటర్ల తీర్పును వమ్ము చేయనున్నారని గ్రహించిన నసరల్లా ఎన్నికలలో తాను గెలిచానని, తీర్పును వమ్ముచేసేందుకు పూనుకున్నందున నిరసన తెలపాలని తన మద్దతదార్లకు పిలుపునిచ్చారు.

టీవీ జర్నలిస్టు సాల్వెడార్‌ నసరల్లా

ఇదే సమయంలోే ఎన్నికల పరిశీలకురాలిగా వున్న అమెరికా దేశాల సంస్ధ(ఓఏఎస్‌) హొండూరాస్‌ ప్రతినిధి బృందం నాయకుడు జార్జ్‌ క్విరోగా ఒక ప్రకటన చేస్తూ ఓట్ల లెక్కింపులో అక్రమాలు, తప్పిదాలు, వ్యవస్ధా పరమైన సమస్యలున్నందున ఫలితాన్ని గురించి చెప్పలేమని, తిరిగి లెక్కింపు జరపాలని ప్రకటించారు. ఈ పూర్వరంగంలో అనుమానాలున్న వెయ్యి పోలింగ్‌ కేంద్రాల ఓట్లను తిరిగి లెక్కించిన తరువాత మొత్తం 99.98శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని, హెర్నాండెజ్‌ 42.98, నసరల్లా 41.39 శాతం చొప్పున పొందినట్లు సోమవారం నాడు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. అయితే విజేత ప్రకటన చేయలేదు. శుక్రవారం రాత్రి నుంచి కర్ఫ్యూ ప్రకటించి ఈ ఓట్ల లెక్కింపు తతంగం జరిపారు. తాజా ఓటింగ్‌ ఫలితాన్ని ప్రకటించకముందే వాటిని తాము అంగీకరించేది లేదని అన్ని పోలింగ్‌ కేంద్రాల ఓట్లను తిరిగి పార్టీల ప్రతినిధుల, పరిశీలకుల సమక్షంలో జరపాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాపితంగా జనం ప్రదర్శనలకు దిగారు. భద్రతా దళాలు వారిపై భాష్పవాయు, నీటి ఫిరంగులను ప్రయోగించాయి.కొన్ని చోట్ల కాల్పులు జరిపాయి. దేశంలోని మొత్తం 5,179 పోలింగ్‌ బూత్‌ల ఓట్లను తిరిగి లెక్కించాలని, లేనట్లయితే నిరసన తెలుపుతామని నసరల్లా నాయకత్వంలోని అలయన్స్‌ పార్టీ ప్రకటించింది.

రాజధాని టెగు(టెగుసియాగల్పా)తో సహా ఎక్కడా పోలీసులు ప్రస్తుత అధ్యక్షుడు ప్రకటించిన కర్ఫ్యూ ఆజ్ఞలను అమలు జరపరని, రాజకీయ సంక్షోభం పరిష్కారమయ్యే వరకు తాము యూనిట్లకే పరిమితం అవుతామని పోలీసు ప్రతినిధి ప్రకటించారు.’ మాకు రాజకీయ సిద్ధాంతాలు లేవు, మేము శాంతిని కోరుకుంటున్నాము, మేము ప్రభుత్వ ఆజ్ఞలను పాటించేది లేదు, ఈ విషయంలో మేము అలసిపోయాము.మేము జనంతో ఘర్షణ కొనసాగించలేము, అణచివేతను కోరుకోవటం లేదు, దేశ ప్రజల మానవహక్కులను వుల్లంఘించజాలం’ అని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ప్రతినిధి ప్ర కటించాడు. అంతకు ముందు కొట్లాటల నిరోధ కోబ్రా దళ సభ్యుడు మాట్లాడుతూ ‘ఇదేమీ సమ్మె కాదు, వేతనాలు లేదా డబ్బు గురించి కాదు, మా విధి దేశ ప్రజలకు శాంతి, భద్రత కల్పించటం, వారిని అణచివేయటం కాదు, దేశ ప్రజలందరూ సురక్షితంగా వుండాలని కోరుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ ప్రకటనల పరంపర కొనసాగుతుండగానే మరో పోలీసు ప్రతినిధి ఒక టీవీలో మాట్లాడుతూ కొంత మంది పోలీసులు నిరాహారదీక్షకు పూనుకుంటారని ప్రకటించారు. ‘మేము మానవహక్కుల వుల్లంఘనలో భాగస్వాముల కాబోం, మేమా పని చేస్తే త్వరలోనో తరువాతో అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుంది. వాస్తవానికి గతంలో మా వున్నతాధికారుల హక్కుల వుల్లంఘన కారణంగా మేము ఇప్పటికే పరిహారం చెల్లిస్తున్నాము.యూనిఫాంలో వున్న సిబ్బంది మెరుగైన పని పరిస్ధితులు వుండాలని కోరుతున్నారు, వాటిని మా డిప్యూటీ డైరెక్టర్‌ తిరస్కరించారు. మాకు కావాల్సింది యజమానులు కాదు, నాయకులు, మా కమిషనర్‌ నాయకుల కోవకు చెందుతారు. వీధులలో గస్తీ తిరిగే సిబ్బందికి నిరాకరించి అనుబంధంగా వుండే వారికి మాత్రమే వేతనాలు ఎందుకు పెంచారు.ఇది సరైనది కాదు. అని చెబుతూ తమ డిమాండ్లు ఇవి అని టీవీలో ఒక ప్రకటన చదివారు. మరోవైపు భద్రతా దళాలు అనేక మంది విదేశీ జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని స్వదేశాకు పంపివేయటం ప్రారంభించాయి.

ఇదిలా వుండగా హొండురాస్‌లో ఎన్నికల కమిషన్‌ క్రమపద్దతిలో ఓట్ల లెక్కింపు జరిపిందని అమెరికా వున్నతాధికారి ఒకరు కితాబునిచ్చారు.హెర్నాండెజ్‌ అమెరికాకు అత్యంత సన్నిహితుడు. ఈక్రమంలోనే అతగాడిని రక్షించేందుకు పూనుకుంది.హొండురాస్‌ సర్కార్‌ అవినీతి వ్యతిరేకత పోరాటం, మానవ హక్కుల పరిరక్షణకు మద్దతు ఇస్తోందంటూ అమెరికా విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రక ప్రకటనలో పేర్కొన్నది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసే ఇలాంటి శక్తులకు మద్దతు ఇవ్వకపోతేనే ఆశ్చర్యం. లాటిన్‌ అమెరికాలో నియంతలకు వ్యతిరేకంగా అనేక దేశాలలో పోరాడిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి రావటాన్ని అమెరికా తొలి రోజుల్లో అడ్డుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో చట్టబద్దమైన కుట్రలకు తెరతీసి అనేక దేశాలలో మితవాదులకు పెద్దపీట వేసి తన మద్దతుదార్లుగా మారుస్తున్నది. హొండురాస్‌లో కూడా అదే పునరావృతం అవుతోంది.

అటు వుత్తర అమెరికా ఖండానికి ఇటు దక్షిణ అమెరికా ఖండానికి మధ్యలో కీలకమైన ప్రాంతంలో వున్న హొండూరాస్‌లో ప్రజాస్వామ్యం ఒక మేడి పండు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగంలోని ప్రతి వ్యవస్ధ ఆమోద ముద్రవేయాల్సిందే. అది నందంటే నంది పందంటే పంది. రాజ్యాంగాన్ని సవరించటం అన్నది అప్రజాస్వామికమని ఇంతవరకు ఏ కోర్టూ చెప్పలేదు.2009లో నాటి అధ్యక్షుడు మాన్యువల్‌ జెలయా రాజ్యాంగసవరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు నిర్ణయించారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపటం రాజ్యాంగ బద్దమేనని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలిపివేసింది తప్ప రాజ్యాంగ సవరణ రాజ్యాంగ బద్దమా కాదా అన్న విషయం చెప్పలేదు. ఈ లోగా పార్లమెంట్‌, అటార్నీ జనరల్‌, ఎన్నికల సంఘం జెలయా నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని ప్రకటించాయి.వాటిని ఖాతరు చేయని జెలయా బ్యాలట్‌ పత్రాలు, బాక్సులను పోలింగ్‌ కేంద్రాలకు తరలించాలని జారీ చేసిన ఆదేశాన్ని మిలిటరీ అధిపతి తిరస్కరించాడు. ఈ సమయంలో తమ ఆదేశాన్ని పాటించలేదనే పేరుతో జెలయాను పదవి నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మిలిటరీ ఆయనను నిదుర మంచం మీద నుంచి తీసుకు పోయి పక్కనే వున్న కోస్టారికా దేశంలో విడిచి వచ్చింది. ఒక దేశ పౌరుడిని మరొక దేశంలో అక్రమంగా వదలి రావటం ఏ చట్టం ప్రకారం సమర్ధనీయమో, మిలిటరీ చేసిన పని తప్పోకాదో కూడా సుప్రీం కోర్టు విచారించలేదంటే ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో చూడవచ్చు. జెలయా, కుటుంబ సభ్యులు కోస్టారికా నుంచి బయలు దేరి రహస్యంగా కాలినడకన తిరిగి హొండూరాస్‌ చేరుకొని బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. తరువాత ఆయన మీద కేసులు ఎత్తివేసి దేశంలో కొనసాగనిచ్చారు.

రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి పదవీ బాధ్యతలలో వున్న తరువాత రెండసారి అధ్యక్షపదవికి పోటీ చేయటానికి అర్హత లేదు. ఆ రీత్యా చూసినపుడు తాజా ఎన్నికలలో అధికారంలో వున్న అధ్యక్షుడు హెర్నాండెజ్‌ పోటీ చేయటానికి లేదు.అయినా కేంద్ర ఎన్నికల సంఘం మూడింట రెండు ఓట్ల మెజారిటీతో ఆమోదం తెలపటంతో పోటీ చేసినా సుప్రీం కోర్టు, ఇతర రాజ్యాంగ సంస్ధలు నోరు మెదపలేదు. అనుకున్నదొకటీ అయింది ఒకటి అన్నట్లుగా సులభంగా విజయం సాధిస్తాడని అనుకున్న హెర్నాండెజ్‌ వెనుకబడటంతో ఆయన నియమించిన ఎన్నికల సంఘం సాంకేతిక సమస్యలు తలెత్తాయనే సాకు చూపి ఓట్ల లెక్కింపును రెండు రోజుల పాటు నిలిపివేసి మెజారిటీతో వున్న ప్రతిపక్ష అభ్యర్ధికంటే హెర్నాండెజ్‌కు స్వల్ప మెజార్టీ వచ్చిందని ప్రకటించి ఎన్నికలను బూటకంగా మార్చివేసింది. ప్రస్తుతం మెజారిటీ ఓట్లు సాధించి విజయం సాధించిన ప్రతిపక్ష అభ్యర్ధి జర్నలిస్టు అయిన సాల్వెడార్‌ నసరల్లా ఓ ప్రజాస్వామికవాది, గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజామద్దతు పొందిన వ్యక్తి. ఆయనను మాజీ అధ్యక్షుడు, వామపక్షాలతో సహా పురోగామి పార్టీలు, శక్తులు బలపరిచాయి. నసరుల్లాకు వున్న అనర్హత ఏమంటే అమెరికాకు బంటుగా పనిచేస్తాడనే హమీ లేకపోవటమే. అందుకే ఓట్ల లెక్కింపు మధ్యలోనే ఫలితాన్ని తారుమారు చేశారు. అమెరికా తలచుకుంటే అక్రమాలకు కొదవా ?ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగినందున మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలి లేదా ఎన్నికను రద్దు చేసి తిరిగి జరపాలని ప్రతిపక్ష అభ్యర్ధి సాల్వెడార్‌ నసరల్లా డిమాండ్‌ చేశారు. గురు, శుక్రవారాలలో ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం వుందని వార్తలు వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఎన్నికను తొత్తడం గావించి, మరింతగా అణచివేతకు పూనుకుంటే పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జర్మనీలో అనిశ్చితిపై ఐరోపాలో ఆందోళన !

30 Thursday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Angela Merkel, European Union, German elections, Germany

Image result for germany political uncertainty

ఎం కోటేశ్వరరావు

జర్మనీ, ఐరోపాయూనియన్‌ అనే ఒక రైలు బండికి ఇంజను వంటిది. గత రెండు నెలలుగా అది ఆగిపోయి ముందుకు కదలటం లేదు. దాన్ని తిరిగి ఎలా నడుపుతారో ప్రస్తుతానికైతే తోచటం లేదు. బండి ప్రయాణించకపోతే జర్మన్లకే కాదు, మొత్తం ఐరోపా ప్రయాణీకులందరికీ ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. కొందరు విశ్లేషకులు పేర్కొన్నట్లు జర్మనీ రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఎరుగనంత రాజకీయ అనిశ్చితి, సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నది. సెప్టెంబరు 24న ఎన్నికలు జరిగాయి. ఇంతవరకు కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా పచ్చిమితవాదులు పన్నెండుశాతంపైగా ఓట్లతో మూడవ పెద్ద పార్టీగా పార్లమెంటులో ప్రవేశించారు. క్రిస్మస్‌ నాటికి ఒక కొలిక్కి రానట్లయితే మహాసంఘటన చర్చలు విఫలమైనట్లుగా భావించాలని ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ తరువాతే మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుంది. రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కనుక తన రాజకీయ సంక్షోభాన్ని జర్మనీ ఎలా పరిష్కరించుకుంటుందనేదే ఆసక్తికరం. మొత్తం ఐరోపా పధకాలే గందరగోళంలో పడతాయని బ్రస్సెల్స్‌(ఐరోపా యూనియను ప్రధాన కేంద్రం) భయంకరమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.ఐరోపా యూనియను సముద్రంలో వుంది, దాన్ని ఆదుకొనే పెద్ద స్నేహితుడు మధ్య ఐరోపాలో మనకు లేడు అంటూ ఐరోపా ప్రపంచం అనే పత్రిక ప్రచురణకర్త చేసిన వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా వుంది. అమెరికా ట్రంప్‌ తప్పుడు అంతర్జాతీయ విధానాల ఫలితంగా భద్రత మరియు విదేశీ వ్యవహారాలలో ఐరోపా యూనియను కలసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం వుంది, అందుకు గాను ఇంజను వంటి బలమైన జర్మనీ అవసరం అని భావిస్తున్నారు. అలాంటి జర్మనీలో ప్రభుత్వం ఏర్పడుతుందో లేదో తిరిగి ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని స్ధితి ఏర్పడింది. మరోవైపు యూనియన్‌ నుంచి విడిపోయేందుకు 50బిలియన్‌ పౌండ్లు చెల్లించేందుకు సిద్ధపడి బ్రిటన్‌ తనదారి తాను చూసుకుంటున్నది.ఐరోపా అంతటా పచ్చి మితవాద, నయా ఫాసిస్టు, నాజీ శక్తులు తలెత్తటం ఐరోపా యూనియన్‌ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. సహజంగానే ఈ పరిస్ధితి అమెరికన్లకు సంతోషం కలిగిస్తుంది.

తమ విధానాలకు ప్రత్యామ్నాయం లేదని విర్రవీగిన పెట్టుబడిదారీ కావలి బంట్లలో ఏంజెలా మెర్కెల్‌ ఒకరు. వరుసగా మూడు సార్లు ఛాన్సలర్‌గా ప్రభుత్వాలను నడిపిన ఆమెకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఆమె ప్రభుత్వంలో పన్నెండు సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాలు భాగస్వామిగా చేరిన సోషలిస్టులం అనిచెప్పుకొనే సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి వెన్నుదన్నుగా వుండే కార్మికులు ఈ ఎన్నికలలో దూరం, కావటం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతి తక్కువ ఓట్లు తెచ్చుకోవటం శరాఘాతం వంటిది. మెర్కెల్‌తో జతకడితే రానున్న రోజుల్లో వున్న ఓట్లుకూడా పోతాయోమోననే భయం ఆ పార్టీని వెన్నాడుతున్నది. అయితే తాజా వార్తలను బట్టి వారు సంకీర్ణ సంప్రదింపులకు తలుపులను పూర్తిగా మూసివేయలేదు. అదే సమయంలో 20శాతం బలంతో వందశాతం డిమాండ్లు పెడితే అంగీకరించేది లేని మెర్కెల్‌ శిబిరం హెచ్చరికలు జారీ చేసింది. ఈ పూర్వరంగంలో ఎవరు ఎంత మేరకు రాజీపడినప్పటికీ కార్మికవర్గానికి జరిగే మేలు ఏమిటన్నది అసలు సమస్య.

ఆల్‌ ఈజ్‌ వెల్‌(అంతా మంచిగా వుంది) అనుకుంటున్న జర్మనీలో ఎన్నికలు అధికార కూటమిని అనూహ్యకుదుపునకు గురిచేశాయి.నిజానికి జర్మనీలో ఒక విధంగా చెప్పాలంటే ఒక్క వామపక్షపార్టీ తప్ప మిగిలినవన్నీ అవి తెచ్చుకొనే సీట్లను బట్టి, అక్కడి పాలకవర్గ వాంఛలను బట్టి అధికార-ప్రతిపక్ష పాత్రలను పోషిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో 2013లో రెండు పెద్ద పార్టీలైన క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌(సిడియు), దానితో కలసి వుండే క్రిస్టియన్‌ సోషలిస్టు యూనియన్‌ అనే ఒక ప్రాంతీయ పార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డిపి) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా ఎన్నికలలో రెండు పార్టీలకు దిమ్మదిరిగే విధంగా గతంలో ఎన్నడూరానన్ని తక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయి. పార్లమెంట్‌లోని 709 స్థానాలకు గాను మెజారిటీ 355కాగా ఈ మూడు పార్టీలకు 399 వచ్చినప్పటికీ తాము ప్రతిపక్షంలో వుంటామని 143 సీట్లు తెచ్చుకున్న ఎస్‌డిపి ప్రకటించటం జర్మనీలో రాజకీయ అనిశ్చితికి దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పార్లమెంట్‌కు 18సార్లు ఎన్నికలు జరిగాయి.ఇరవై అయిదు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వీటిలో అత్యధికం సిడియు, దాని మిత్రపక్ష ప్రభుత్వాలు. ఎస్‌పిడి దాని మిత్రపక్షాలతో కలసి అధికారానికి వచ్చింది. ఈ రెండు పార్టీలు కలసి ఐదుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర వుంది.

ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీతో కలసి మరోసారి అధికారాన్ని పంచుకొనేందుకు తొలి స్పందనగా ససేమిరా అని పేర్కొన్నది. ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం పదవ సంవత్సరంలోకి ప్రవేశించనుంది. దాని దెబ్బకు ఐరోపాలోని మితవాద పార్టీలతో పాటు సోషలిస్టులుగా వున్నవారు కూడా ఎన్నికలలో చావు దెబ్బలు తింటున్నారు. ఒకసారి అధికారానికి వచ్చిన వారు మరోసారి మట్టికరుస్తున్నారు.జర్మనీలో మితవాద సిడియు, వామపక్షంగా చెప్పుకొనే ఎస్‌డియు రెండూ గత నాలుగు సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కారణంగా రెండుపార్టీల ఓట్లు, సీట్లు పడిపోయాయి.1998లో గరిష్టంగా 40.9శాతం ఓట్లు తెచ్చుకున్న ఎస్‌పిడి తరువాత అధికారానికి వచ్చి ఇప్పుడు 20.5శాతానికి పడిపోయింది. అందువలన మరోసారి సిడియుతో జతకట్టవద్దని ఆ పార్టీలో పైనుంచి కింది వరకు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఐరోపాలోని మిగతా ధనిక దేశాలతో పోల్చితే జర్మనీ ఆర్ధిక పరిస్ధితి కాస్త మెరుగ్గా వున్నప్పటికీ సాంఘిక సంక్షేమ పధకాలకు కోతపెట్టటంలో రెండుపార్టీలు ఏకాభిప్రాయంతో వ్యవహరించాయి. ఈ అసంతృప్తి కార్మికవర్గంలో వుంది. అందుకే వెంటనే తాము ప్రతిపక్షంలో వుంటామని చెప్పింది. అయితే అది కూడా ఒక బూర్జువాపార్టీయే గనుక కార్పొరేట్‌ శక్తుల వత్తిళ్లకు లంగి సంకీర్ణం గురించి చర్చించేందుకు సిద్ధం అంటున్నది.తొలిసారిగా ముస్లిం, వలసకార్మికుల వ్యతిరేక నినాదాలతో ఎన్నికలలో పోటీచేసి మూడవ పెద్ద పార్టీగా ఆవిర్భవించిన జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని బూచిగా చూపి మరోసారి మెర్కెల్‌తో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోలేదు.

పార్లమెంట్‌లోని 709 స్ధానాలకు గాను 299 సీట్లకు ప్రత్యక్ష పద్దతిలో 410 సీట్లకు దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. వివిధ పార్టీలు దిగువ విధంగా సీట్లు సంపాదించాయి.(బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికలలో సాధించిన సీట్లు) క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ(సిడియు),క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌(సిఎస్‌యు) 246(311), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌డిపి) 153(193), జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎడి) 94(కొత్త పార్టీ), ఫ్రీ డెమోక్రటిక్‌ పార్టీ 80(0), వామపక్ష పార్టీ 69(64), గ్రీన్‌ పార్టీ 67(63). మిగతా ఐరోపా దేశాలలో మాదిరే జర్మనీలో కూడా ఈ ఎన్నికలలో తొలిసారిగా పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నా పార్టీ మూడవ పెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష,గ్రీన్‌ పార్టీలు గతం కంటే కొద్దిగా సీట్లు పెంచుకున్నా ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవటంలో విఫలమయ్యాయి.

మెర్కెల్‌ నాయకత్వంలోని సిడియుతో జతకట్టేందుకు ఎస్‌డిపి తిరస్కరించటంతో ఒక సంక్లిష్ట పరిస్ధితి ఏర్పడింది. ఎస్‌పిడి,వామపక్ష,గ్రీన్‌ పార్టీలతో కూటమి ఏర్పడినా మెజారిటీ సాధించే అవకాశం లేదు. సిడియు పరిస్ధితి కూడా అంతే పచ్చిమితవాద జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీని, ఫ్రీడెమోక్రటిక్‌ పార్టీని కలుపుకుంటే తప్ప మెజారిటీ సాధించే పరిస్ధితి లేదు.ఆ మూడు కలిసే అవకాశం లేదు. అయితే జర్మనీ పాలకవర్గం సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీల మీద వత్తిడి చేస్తోంది. మరోసారి ఎన్నికలు జరిపినా పరిస్ధితిలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేకపోగా సిడియు పరిస్ధితి మరింత దిగజారినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్ధితుల్లో ఏకైక పెద్ద పార్టీగా సిడియు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మినహా మరొక మార్గం లేదు. అందుకు సిద్దపడటం కంటే తిరిగి ప్రజాతీర్పు కోరటం మేలనే వైఖరితో మెర్కెల్‌ వున్నారు. అయితే అందుకు ఆ పార్టీనాయకత్వం అంగీకరిస్తుందా, లేక ఆమెను పక్కకు నెట్టి కొత్తనేతతో సంకీర్ణ లేదా మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్నది వచ్చే ఏడాది జనవరిలో గానీ స్పష్టం అయ్యే అవకాశం లేదు.ఎస్‌డిపితో కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సుమఖత తెలియచేస్తూ సిడియు తీర్మానించింది. మరోవైపు ఎస్‌డిపి యువజన విభాగం కూడా ఒక తీర్మానం చేసి మహా సంఘటన ఏర్పాటుకు ప్రయత్నించటం కంటే ప్రతిపక్షంలోని పార్టీలతో సంకీర్ణానికి ప్రయత్నించాలని తీర్మానించి పార్టీ నాయకత్వంపై వత్తిడి తెచ్చింది.

దేశ జనాభాలో గణనీయ భాగం 2000 సంవత్సరంలో సంపాదించిన ఆదాయ మొత్తంలో సగం కూడా ఇప్పుడు పొందటం లేదని విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఇటువంటి స్ధితిలో వామపక్షాలు ప్రత్యామ్నాయంగా లేకపోతే జనం పచ్చిమితవాద, నయా ఫాసిస్టు శక్తులవైపు మొగ్గుతారని జర్మనీతో సహా అన్ని ఐరోపా దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి. ఇవి వామపక్ష, కమ్యూనిస్టు పార్టీలకు కూడా మేలుకొలుపు వంటివే. పెట్టుబడిదారీ వ్యవస్ధ జరుపుతున్నదాడులు, నయావుదారవాద విధానాలను నిఖరంగ ఎదిరించే మొనగాళ్లుగా వామపక్షాలు జనానికి కనిపించకపోతే మితవాదులే మెరుగని జనం భావిస్తారు. తాజా ఎన్నికలలో పూర్వపు పశ్చిమ జర్మనీ ప్రాంతంలో వామపక్ష పార్టీ కొంత మేరకు ఓట్లు పెంచుకుందిగానీ, తూర్పు జర్మనీలో ఆరుశాతం కోల్పోయింది, ఆ ఓట్లు ఎడి పార్టీకి పడ్డాయి. స్వల్పంగా ఓట్లు, సీట్లు పెంచుకున్నప్పటికీ మిగతాపార్టీలకంటే తాము భిన్నం అనే గుర్తింపును జనంలో తెచ్చుకోలేకపోయింది. కొన్ని రాష్ట్రాలలో సమతూక బడ్జెట్‌ పేరుతో కోతలకు, రోడ్ల ప్రయివేటీకరణకు అంగీకరించటం వంటి చర్యలు అందుకు నిదర్శనం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మార్క్సిజానికి క్రైస్తవం వ్యతిరేకమా, అనుకూలమా ?

16 Thursday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RELIGION, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Anti communist, bible teachings, Bolshevik Revolution, communism, communist manifesto, Pope Francis

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-5

ఎం కోటేశ్వరరావు

మతాలన్నీ ఏదో ఒక తత్వశాస్త్ర ప్రాతిపదికన ఏర్పడినవే. చరిత్రలో ప్రతి మతం అంతకు ముందున్నది సామాన్య జనం నుంచి దూరమైనపుడు దాని మీద తిరుగుబాటుగా వుద్భవించిందే. అందువల్లనే ప్రతిదీ ప్రారంభంలో ప్రజల పక్షమే,పురోగామి వైఖరినే కలిగి వుంటుంది. కాల క్రమంలో దోపిడీ వర్గం ప్రతిమతాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటం కనిపిస్తుంది. అందువల్లనే ప్రతి మతం ఆయా సమాజాలలో వున్న దోపిడీ వర్గానికే మద్దతుపలికిందన్నది చరిత్ర సారం. ఆ దోపిడీ సమాజాన్ని అంతం చేసేందుకు శాస్త్రీయ అవగాహనతో ముందుకు వచ్చిందే మార్క్సిస్టు తత్వశాస్త్రం. మతాలకు దీనికి వున్న ప్రధాన తేడా ఏమంటే ప్రతికొత్త మతం అంతకు ముందున్న ఏదో ఒక మతంపై తిరుగుబాటుగా వస్తే మార్క్సిస్టు తత్వశాస్త్రం అన్ని మతాలను ఒకేగాటన కట్టి ప్రతిదాన్నీ వ్యతిరేకించింది. మతం జనం పాలిట మత్తు మందు అని సాధారణ సూత్రీకరణ చేసింది. సహజంగానే దోపిడీ శక్తులకు కొమ్ముగాసే మతం, మతాలకు వెన్నుదన్నుగా నిలిచే దోపిడీశక్తులు పరస్పరం ఆధారపడటం, సహకరించుకోవటం జగమెరిగిన సత్యం. ఆందువల్లనే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మార్క్స్‌,170 సంవత్సరాల నాడు వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక, 150 సంవత్సరాల నాడు జనానికి అందుబాటులోకి వచ్చిన కాపిటల్‌ గ్రంధం మొదటి భాగాలపై దోపిడీవర్గం, అన్ని రకాల మతశక్తులు దాడులు చేస్తూనే వున్నాయి.

కమ్యూనిస్టు ప్రణాళిక 1848 ఫిబ్రవరి చివరిలో 23పేజీల పుస్తకంగా జర్మన్‌ భాషలో లండన్‌లోని బిషప్స్‌ గేట్‌లో వెలువడింది. దానిని రహస్యంగా వర్కర్స్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ప్రచురించింది. బ్రిటన్‌లోని జర్మన్‌ల కోసం ప్రచురితమయ్యే డచ్‌ లండనర్‌ జీటుంగ్‌ పత్రిక సీరియల్‌గా ప్రచురణలో తొలి భాగాన్ని మార్చినెల మూడవ తేదీన అచ్చువేసింది. మరుసటి రోజే బెల్జియంలో వున్న మార్క్స్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 20నాటికి దానిని మూడుసార్లు అచ్చువేశారు. వాటిలో వెయ్యి కాపీలు ఏప్రిల్‌ మొదటి వారానికి పారిస్‌ చేరాయి, అక్కడి నుంచి జర్మనీ చేర్చారు. ఏప్రిల్‌- మే మాసాలలో ఆ పుస్తకంలోని అచ్చుతప్పులను సరిదిద్దారు. తరువాత అది 30పేజీలకు పెరిగింది. సంచలనం కలిగించించిన ఈ పరిణామంతో చర్చ్‌ వులిక్కి పడింది. మరుసటి ఏడాది 1849 డిసెంబరు ఎనిమిదిన నాటి పోప్‌ తొమ్మిదవ పయస్‌ ఇటాలియన్‌ ద్వీపకల్పంలోని తన పాలిత దేశాలైన ఇటలీ, వాటికన్‌ సిటీ, ఇటలీ ఆధీనంలోని శాన్‌మారినోలో వున్న ఆర్చిబిషప్‌లు, బిషప్‌లకు పంపిన సర్క్యులర్‌లో సోషలిజం, కమ్యూనిజాల గురించి తొలి హెచ్చరిక చేశారు. సోషలిజం, కమ్యూనిజాలనే నూతన సిద్ధాంతాల పేరుతో మత విశ్వాసులను గందరగోళపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.కాథలిక్‌ చర్చ్‌ ఐహిక అధికారాన్ని కూలదోసేందుకు విప్లవకారులు, హేతువాదులు పన్నుతున్న కుట్రలు,కూహకాలను గమనించాలని కోరారు. మత వ్యవహారాలలో నిరాసక్తతగా వుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటాలియన్లు తమ న్యాయబద్దమైన రాజకీయ అధికారులకు బద్దులై వుండాలని నిజమైన స్వేచ్చ, సమానత్వాన్ని క్రైస్తవం మాత్రమే రక్షించగలదని, అందువలన విప్లవాలు పనికిమాలినవని పోప్‌ పయస్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆస్ట్రియా సామ్రాజ్యం నుంచి ఇటలీ స్వాతంత్య్రం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. తరువాత వెయ్యి సంవత్సరాల పోప్‌ ఆధిపత్యాన్ని అంతం చేస్తూ 1861 రెండవ విక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ ఇటలీ రాజుగా ప్రకటించుకున్నాడు. అందువలన పోప్‌ అధికారాన్ని తొలిసారిగా సవాలు చేసింది రాజరికం తప్ప కమ్యూనిస్టులు కాదని గుర్తించటం అవసరం.

1917లో బోల్షివిక్‌ విప్లవం జయప్రదమైన తరువాత రష్యన్‌ ఆర్ధడాక్స్‌ చర్చి అధికారులు పైకి కొన్ని సందర్భాలలో తటస్ధంగా వుంటున్నట్లు ప్రకటించినా 1922 వరకు విప్లవ వ్యతిరేకులు జరిపిన తిరుగుబాటులో అభ్యుదయగాములుగా వున్న కొద్ది మంది చర్చ్‌ అధికారులు మినహా అత్యధికులు బోల్షివిక్‌ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన ఇటలీ ఎన్నికలలో కమ్యూనిస్టులు 31శాతం ఓట్లు సాధించారు. అనేక దేశాలలో విప్లవ, జాతీయోద్యమాలు వూపందుకొని విజయాలు సాధించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చైనాలో కమ్యూనిస్టుపార్టీ అధికారానికి వచ్చింది. ఈ పూర్వరంగంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే కుట్రలో భాగంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదులు కాథలిక్‌ చర్చిని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. దానిలో భాగంగా పోప్‌ పన్నెండవ పయస్‌ 1949లో ఒక ప్రకటన చేస్తూ కమ్యూనిజాన్ని బోధించిన వారిని మత వ్యతిరేక తిరుగుబాటుదారులుగా పరిగణించి మతం నుంచి వెలివేయాలని ఆదేశించి కమ్యూనిజంపై ప్రత్యక్ష దాడికి నాంది పలికారు.

ప్రచ్చన్న యుద్ధం పేరుతో అమెరికా సాగించిన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక చర్యలలో ఎక్కడ ఏమతం పెద్దదిగా వుందో అక్కడదానిని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వినియోగించారు. ఇండోనేషియాలో ముస్లింలు మెజారిటీ వున్నారు కనుక అక్కడ ఇస్లామిక్‌ మతోన్మాదులను రంగంలోకి దించి మిలిటరీతో జతకట్టించి పదిలక్షల మంది కమ్యూనిస్టులను వూచకోత కోయించిన విషయం తెలిసిందే. తూర్పు ఐరోపాలో రోనాల్డ్‌ రీగన్‌ పాలనా కాలంలో సోషలిస్టు దేశాలలో తిరుగుబాట్లు, కూల్చివేతలకు తెరతీసిన కుట్రలో సిఐఏ, పోప్‌ రెండవ జాన్‌పాల్‌ పాత్ర గురించి తెలిసిందే. సాలిడారిటీ పేరుతో జరిపిన సమీకరణల వెనుక సిఐఏ నిధులు, వాటికన్‌ బ్యాంకు నిధులు, చర్చి అధికారుల మద్దతు బహిరంగ రహస్యం.

తూర్పు ఐరోపా, సోవియట్‌లో అమలు జరిపిన కుట్రకంటే ముందు చర్చిద్వారా కమ్యూనిజం, కమ్యూనిస్టులపై ప్రపంచవ్యాపితంగా దాడి చేసేందుకు జరిపిన ఒక ప్రయత్న వివరాలను గతనెల(అక్టోబరు) 25న లైఫ్‌ సైట్‌ న్యూస్‌ తొలిసారిగా ఆంగ్ల తర్జుమాను ప్రచురించింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత మారిన పరిస్ధితులలో చర్చి పాత్ర, సంస్కరణల గురించి, గడచిన వంద సంవత్సరాలలో తలెత్తిన మత సంబంధ సిద్ధాంతాల పరిష్కారానికి రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ అవసరమని 1959లో భావించారు. ఆమేరకు అది 1962 నుంచి 1965వరకు కొనసాగింది.

లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనంలోని అంశాలు ఇలా వున్నాయి. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌లో ఇతర విషయాలతో పాటు కమ్యూనిస్టులు, కమ్యూనిజానికి దండనా విధి నిర్ణయానికి ఒక ముసాయిదా పత్రాన్ని తయారు చేసేందుకు కొందరు నిర్ణయించారు. తరువాత దానిని పక్కన పెట్టారు. మార్క్సిజం, కమ్యూనిజం ప్రభావానికి ప్రతిగా, వాటి తెంపరితనాన్ని బహిర్గతపరిచేందుకు, ఓడించేందుకు ప్రపంచవ్యాపితంగా ఎలా సమన్వయంతో వ్యవహరించాలో పెద్ద ప్రణాళికను రూపొందించారు. అయితే కౌన్సిల్‌ కమిషన్లను రైన్‌ గ్రూప్‌ (రైన్‌ నదీ పరివాహక దేశాల)బిషప్పులు ఆక్రమించటంతో కమ్యూనిజం, మార్క్సిజాలను నేరుగా ఖండించాలనే ప్రయత్నాలన్నింటినీ వారు తిరస్కరించి పక్కన పెట్టారు. రెండవ వాటికన్‌ కౌన్సిల్‌ ముగిసిన తరువాత ఆ పత్రాలన్నీ అధికారిక తయారీ పత్రాల రికార్డు రూముకు చేరాయి. లాటిన్‌(స్పానిష్‌)భాషలో రాసిన ఆపత్రాలకు గత కొన్ని దశాబ్దాలుగా దుమ్ముపట్టింది.

వాటిలో మూడు రకాల ప్రకటనలను రూపొందించారు.మార్క్సిజం తీవ్రమైన, ప్రపంచవ్యాపిత ప్రమాదం, కమ్యూనిజం దేవుడితో నిమిత్తం లేని ఒక మతం వంటిది, క్రైస్తవ నాగరికతల పునాదుల కూల్చివేతను కోరుకొంటుంది. ఇలాంటి కమ్యూనిజం నుంచి మానవాళిని రక్షించేందుకు వున్నత స్ధాయిలో ప్రపంచవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది.ఈ అంశాలతో కూడిన పత్రాలను వుదారవాదులైన రైన్‌ గ్రూప్‌ బిషప్పులు కౌన్సిల్‌ తొలి నెలల్లోనే తిరస్కరించి పక్కన పెట్టారని లైఫ్‌ సైట్‌ న్యూస్‌ కధనం పేర్కొన్నది.

క్రైస్తవ మతంలో కొందరు మార్క్సిజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేందుకు అమెరికా సిఐఏ, ఇతర గూఢచార, వాటి ముసుగు సంస్ధలతో చేతులు కలిపారు. అదే సమయంలో లాటిన్‌ అమెరికాలో కొందరు క్రైస్తవ మతాధికారులు దారిద్య్రం, సామాజిక సమస్యలను మతవ్యవహారాలతో సమన్వయంచేసి విముక్తి వాదం లేదా సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అలాంటి వారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించలేదు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించాలంటూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించేవారిని ప్రతిఘటించారు కూడా. అలాంటి వారిలో ఒకరే కమ్యూనిస్టు పోప్‌గా కొందరు చిత్రించిన పోప్‌ ఫ్రాన్సిస్‌.అర్జెంటీనాకు చెందిన ఆయన 2013 నుంచి వాటికన్‌ అధిపతిగా కొనసాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఆయనను ఇలా అడిగారు.’ కాబట్టి మీరు సమానత్వానికి పెద్ద పీటవేసే సమాజం కావాలని కాంక్షిస్తున్నారు. అది మీకు తెలిసినదే మార్క్సిస్టు సోషలిజం తరువాత కమ్యూనిజపు కార్యక్రమం. కాబట్టి మీరు మార్క్సిస్టు తరహా సమాజం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.

దానికి పోప్‌ ఇలా సమాధానం చెప్పారు.’ దీని గురించి అనేకసార్లు చెప్పాను, నా స్పందన ఎల్లవేళలా అదే, ఏదైనా వుంటే కమ్యూనిస్టులు కూడా క్రైస్తవుల మాదిరే ఆలోచిస్తారు’ అని చెప్పారు.మార్క్సిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన విమర్శలను తోసిపుచ్చుతూ మార్క్సిస్టు సిద్దాంతం తప్పు, అయితే నా జీవితంలో అనేక మంది ఎంతో మంచివారైన మార్క్సిస్టులను ఎరుగుదును, కనుక నేను తప్పుచేసినట్లుగా భావించటం లేదు’ అని పోప్‌గా ఎన్నికైన కొత్తలోనే చెప్పారు. మార్క్సిజానికి తాను వ్యతిరేకం కాదని పరోక్షంగా చెప్పేందుకు గాను బలీవియాలో వామపక్ష అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ నుంచి సుత్తీ,కొడవలి చిహ్నంగా వున్న శిలువను బహుమతిగా స్వీకరించటం తెలిసిందే. ఆయన జారీచేసిన లాడాటో సి సర్క్యులర్‌ తయారీకి మార్క్సిజంతో స్ఫూర్తి పొందిన విముక్త మత సిద్ధాంత వాదిగా పేరుబడిన లియోనార్డో బోఫ్‌ వంటి వారితోడ్పాటును స్వీకరించారని వార్తలు వచ్చాయి. ఇటీవల కొత్త సుపీరియర్‌ జనరల్‌గా ఎన్నికైన వెనెజులాకు చెందిన ఆర్ధరో సోసా అబాస్కల్‌ మార్క్సిజంతో క్రైస్తవం సమాధానపడాలని బహిరంగంగా చెప్పారు.

మన దగ్గర దేవాలయాల కింద వేలాది ఎకరాల భూములు వున్నట్లుగానే పశ్చిమ దేశాలలో చర్చ్‌లకు అంతకంటే ఎక్కువ ఆస్ధులున్నాయి. దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయిన కారణంగా వాటిని స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు తీసుకున్న ఎన్‌టి రామారావు పెద్ద దైవభక్తుడు, కమ్యూనిస్టు కాదు. రష్యా, ఐరోపాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత పెద్ద మొత్తాలలో వున్న చర్చి ఆస్ధులను ప్రజల పరం చేశారు. అంతే తప్ప చారిత్రక ప్రాధాన్యత వున్న ఏ ఒక్క చర్చిని కూల్చివేయలేదు. కమ్యూనిస్టులు అధికారంలో వున్నంత కాలం వాటిని కూల్చివేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత ఆయా దేశాలలోని చర్చ్‌లకు ఎలాంటి హాని జరగలేదని తేలిపోయిన తరువాత వారంతా తేలు కుట్టిన దొంగల మాదిరి మిన్నకుండిపోయారు.ఇప్పుడు చైనాలో బైబిల్‌ పఠించిన కారణంగా శిక్షలు వేస్తున్నట్లు కొందరు క్రైస్తవులతో పాటు నిత్యం క్రైస్తవులను ద్వేషించే మనువాదులు కూడా కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు.చైనా చట్టాల ప్రకారం దేవుడిని ఇంటికే పరిమితం చేయాలి తప్ప వీధులకు ఎక్కించకూడదు. వీధులలో బైబిలే కాదు, ఏ మత గ్రంధ పఠనాన్ని ప్రోత్సహించినా, పఠించినా, అనుమతి లేకుండా ప్రార్ధనా మందిరాలను నిర్మించినా అది నేరమే.దానికి అనుగుణంగానే శిక్షలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు.దీనిలో మనోభావాల సమస్య వుత్పన్నం కాదు. మన దేశంలో తెల్లవారే సరికి నడిరోడ్లమీద, వివాదాస్పద స్ధలాల్లో దేవుళ్లు, దేవతలు వెలుస్తుంటారు. చైనా వంటి చోట్ల అది కుదరదు. మెజారిటీ, మైనారిటీ ఎవరైనా అలాంటి పనులు చేస్తే కటకటాల వెనక్కు పోవాల్సిందే.

కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడిన ప్రారంభంలో వెల్లడైన వ్యతిరేకతకు, నేటికి వచ్చిన మార్పులను చూస్తే క్రైస్తవ మతాన్ని కూడా సోషలిజం, కమ్యూనిజాలకు వ్యతిరేకంగా పాలకవర్గాలు ఎలా వుపయోగించుకోచూశాయో చూశాము. తొలుత ఒక సిద్ధాంతంగా పనికిరాదని విమర్శ చేశారు. తరువాత బోల్షివిక్‌ విప్లవ సమయంలో రష్యాలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు వ్యతిరేక తిరుగుబాటులో భాగస్వాములయ్యారు. తరువాత ప్రచ్చన్న యుద్ధంలో తమ వంతు పాత్రను మరింతగా పోషించేందుకు కమ్యూనిజం మతానికి వ్యతిరేకమని ప్రకటించటమే కాదు, సోవియట్‌, తూర్పు ఐరోపాలో జరిగిన కుట్రలో భాగస్వాములయ్యారు. ఇప్పటికీ అనేక చోట్ల అటువంటి ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇదే సమయంలో క్రైస్తవమతంలో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపేందుకు నిరాకరించేశక్తులు కూడా వున్నాయని స్పష్టమైంది. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే మతాధిపతులు చెప్పిన భాష్యాలకు ఏ బైబిల్‌ అంశాలు ఆధారమయ్యాయో అదే గ్రంధంలోని అంశాలను మార్క్సిజంతో మతాన్ని సఖ్యత పరిచేందుకు కమ్యూనిజపు సానుభూతిపరులైన మతాధిపతులు కూడా తమ భాష్యాలకు వుపయోగించారు. మొదటి వారు మారణకాండను ప్రోత్సహించిన వారి తరఫున వుంటే రెండో తరగతివారు మానవ కల్యాణాన్ని కోరుకున్న వారి పక్షాన నిలిచారు. మరి మనం ఎటు వుండాలి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ గూండాయిజం-అమెరికాను విస్మరించిన ఆసియన్‌ నాయకత్వం !

14 Tuesday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

asean summit, Donald trump, Donald trump asia tour, donald trump's act of political vandalism, US leadership

ఎం. కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు ఆసియాను అవమానించారా? అవును, పన్నెండు మంది దేశాధినేతలు హాజరైన తూర్పు ఆసియా సభ ప్రారంభం కావటం రెండు గంటల పాటు ఆలస్యమైందంటూ చిందులు వేస్తూ సభను బహిష్కరించి విమానమెక్కి స్వదేశానికి చెక్కేయటం, వాషింగ్టన్‌ వెళ్లిన తరువాత తాను ఒక ప్రకటన చేస్తానని చెప్పటం అవమానం గాక మరేమిటి? ఆసియా పర్యటన చేస్తూ తూర్పు ఆసియా సభలో పాల్గనకపోతే ఆసియా పట్ల అమెరికన్లకు ఆసక్తి లేదనే విమర్శలు వస్తాయనే కారణంతో ఈకార్యక్రమాన్ని కూడా చివరిలో పర్యటనలో చేర్చారు.చివరికి ఆలస్యం సాకు చూపి సభను బహిష్కరించారు.నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందుగానే ట్రంప్‌ విమానం ఫిలిప్పైన్స్‌నుంచి బయలుదేరింది.

విమానంలో విలేకర్లతో మాట్లాడుతూ మధ్యాహ్నభోజన సమయంలో చివరిగా తాను చెప్పదలచుకున్న అభిప్రాయాలను చెప్పేశానని, తన బదులు విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ పాల్గంటారని తెలిపారు.మనం పడ్డ కష్టానికి మంచి ఫలితాలే రానున్నాయని, 300బిలియన్‌ డాలర్ల మేరకు పరికరాలు, ఇతరాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని, త్వరలో లక్షకోట్ల డాలర్లకు పెరుగుతాయని చెప్పారు. తూర్పు ఆసియా సమ్మేళనంలో పాల్గనకపోవటం ట్రంప్‌ రాజకీయ గూండాయిజంగా మారుతుందని ప్రొఫెసర్‌ కార్ల్‌ థయర్‌ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా అధికారం తగ్గిపోవటానికి,ఆసియన్‌ నేతలు ఆ స్ధానాన్ని భర్తీ చేయటానికి ఈ పర్యటన కీలకమైనదిగా చరిత్రకారులు ఈతేదీని నమోదు చేస్తారని మరో ప్రొఫెసర్‌ అనెలైస్‌ రైల్స్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ అధికారంలోకి రాగానే చేపట్టిన తొలి చర్యలలో భాగంగా పసిఫిక్‌ ఇరుసులో వున్న దేశాలతో వాణిజ్య ఒప్పందాన్ని వదలివేశారని, అమెరికా ప్రమేయం లేకుండా శనివారం నాడు ఆసియన్‌ నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమె చెప్పారు. పెద్ద ఒప్పందాలు మన చేతులను కట్టివేస్తాయని, ఏ దేశానికి ఆదేశంతో ఒప్పందాలు చేసుకోవటంపై తాను కేంద్రీకరిస్తానని అదేరోజు ట్రంప్‌ ప్రకటించారు. ఫసిపిక్‌ భాగస్వామ్య దేశాల ఒప్పందాన్ని వమ్ము చేసే ట్రంప్‌ యంత్రాంగ యత్నాలను ఆసియన్‌ నాయకులు పట్టించుకోలేదని, తాము స్వంతంగా ముందుకు పోవాలని నిర్ణయించారని, ట్రంప్‌కు ఘనస్వాగతం చెప్పినప్పటికీ ఆయన అజెండాను మొత్తంగా పట్టించుకోలేదని రైల్స్‌ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడేమిటి? ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని అనేక మంది ముక్కుమీద వేలేసుకున్నారు. గత అధ్యక్షులందరినీ అధిగమించి డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నెండు రోజుల గత రికార్డును బద్దలు కొట్టి 13రోజులతో కొత్త ఆసియా పర్యటన రికార్డును స్ధాపించాడు. నవంబరు ఐదున జపాన్‌తో మొదలై 14వ తేదీన ఫిలిప్పీన్స్‌లో ముగిసింది. మధ్యలో చైనా, దక్షిణ కొరియా, వియత్నాం పర్యటించారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లు అమెరికా అధ్యక్షులు మన ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాదిరి ఏదో ఒక సాకుతో విదేశీ పర్యటనలు చేయరు. రాజకీయ, ఆర్ధిక, మిలిటరీ వంటి అనేక అంశాలుంటాయి. అయితే ఈ పర్యటనలో సాధించినదాని కంటే పొగొట్టుకున్న పరువే ఎక్కువగా వుందని చెప్పవచ్చు.

ఆతిధ్యం ఇచ్చేవారు పెట్టింది తిని, మర్యాదలను స్వీకరించటం సంస్కారం. కొంత మంది మా పిల్లలు అది తినరు తినరు అనిముందే చెప్పి ఇబ్బంది పెడతారు. అలవాటైన ఆహారం తప్ప కొత్తదానిని రుచిచూసేందుకు ఇచ్చగించని తరహా మనిషి ట్రంప్‌. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం జపాన్‌ వచ్చిన ట్రంప్‌ అక్కడ వడ్డించిన చేపను చూసి అది వద్దంటూ బర్గర్‌ కావాలని మరీ మారాం చేసి తెప్పించుకుతిన్నాడంటూ ఈ సందర్భంగా వార్తలు వచ్చాయంటేనేే ట్రంప్‌కు పెద్ద అవమానం. ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ ఆయా దేశాల వారు వడ్డించిందా లేక మరేం తింటారు అంటూ ఐరోపా, జపాన్‌ మీడియాలో కథనాలు రాశాయి. మా వృద్ధ ట్రంప్‌ బర్గర్‌ తప్ప మరొకటి తినడు అని అధికారులుప్పందించారేమో జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన ప్రారంభంలోనే వారి సాంప్రదాయ వంటకాల బదులు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న బీఫ్‌తో తయారు చేసిన బర్గర్‌నే మధ్యాహ్న విందుగా వడ్డించే ఏర్పాటు చేయాల్సి వచ్చిందట.

ట్రంప్‌ అభిరుచులు, అలవాట్లు వ్యక్తిగతం. గొడ్డు, పంది మాంసంతో తయారు చేసే హాంబర్గర్‌లు ఎన్ని తిన్నా ప్రపంచానికేమీ ఇబ్బంది లేదు. ఆ పెద్దమనిషి పర్యటనలో ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ వారు పెట్టింది తినకపోవటం, దక్షిణ కొరియాలో పెట్టింది తినటం రెండూ వివాదాస్పదం కావటం విశేషం. జపాన్‌-దక్షిణ కొరియాల మధ్య వివాదాస్పదంగా వున్న దీవుల జలాల నుంచి తెప్పించిన రొయ్యలతో సహా దక్షిణ కొరియా వంటకాలు వడ్డించటం, వాటిని లట్టలు వేసుకుంటూ ట్రంప్‌ తినటం అంటే ఆ దీవులపై దక్షిణ కొరియా హక్కును అమెరికా గుర్తించినట్లే, ఇది జపాన్‌ వ్యతిరేకమైనది అని జపాన్‌ మీడియా వ్యాఖ్యానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో కొరియాను ఆక్రమించిన జపాన్‌ తన సైనికుల కోసం దక్షిణ కొరియా యువతులను చెరపట్టి అప్పగించారు. అలాంటి వారిలో ఒకరైన 88 సంవత్సరాల లీ యాంగ్‌ సూ ట్రంప్‌ విందు ఆహ్వానితుల జాబితాలో ఒకరుగా ప్రకటించటం తమను నేరగాళ్లుగా పరిగణించటమే అని జపనీస్‌ ప్రభుత్వం భావించింది. దౌత్య పద్దతులలో అమెరికాకు ఆ మేరకు నిరసన తెలిపినట్లు, వుత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా పని చేస్తున్న తరుణంలో ఇలాంటి పనులు తగవని పేర్కొన్నట్లు వెల్లడైంది. మీరు మా ఇంటికొచ్చినా, మేం మీ ఇంటికొచ్చినా మాకు కావాల్సిందే తేవాలి, పెట్టాలి అనే అమెరికా సామ్రాజ్యవాదంతోనే అసలు సమస్య. అందువలన ట్రంప్‌కు ఏం పెట్టారు, ఏ తిన్నారు అనేది కూడా రాజకీయాలు, ఆర్ధికాంశాలతో ముడి పడి వుంటాన్నాయన్నది గమనించాల్సి వుంది.

డెమోక్రటిక్‌ పార్టీ అధినేత బరాక్‌ ఒబామా హయాంలో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం ట్రంప్‌, తరువాత ఎందరు అధ్యక్షులు వచ్చిం తరువాత పరిష్కారం అవుతుందో వారికే తెలియని స్ధితి.రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం మాదిరి ప్రపంచ మార్కెట్‌ను చాపచుట్టినట్లుగా తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికన్‌ సామ్రాజ్యవాదుల పరిస్ధితి పీకసన్నం-బానకడుపులా వుంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా వుంటాయో జోస్యం చెప్పలేము గాని, గతం మాదిరి ఏకఛత్రాధిపత్యం వహించటం సాధ్యం కాని పరిస్థితి నేడు నెలకొంది. ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర మాత్రం కాదన్నట్లు సామ్రాజ్యవాదులు మొత్తంగా సోషలిస్టు, కమ్యూనిస్టు శక్తులు, దేశాలకు వ్యతిరేకత విషయంలో ఐక్యంగా వుంటున్నారు, ప్రపంచ మార్కెట్‌ను పంచుకోవటంలో విబేధాలను దాచుకోవటం లేదు.

ఐదు ఆసియా దేశాల పర్యటనలో తొలి పాదం మోపిన జపాన్‌లో ప్రధాని షింజో అబేతో గోల్ఫ్‌ ఆడటానికి వెళ్లబోయే ముందు యోకోటా వైమానికస్ధావరంలో అమెరికన్‌ సైనికులతో మాట్లాడారు. పరోక్షంగా వుత్తర కొరియాను వుద్దేశించి మాట్లాడుతూ అమెరికా సంకల్పాన్ని ఎవ్వరూ, ఏ నియంత, ఏ ప్రభుత్వమైనా తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరికలు జారీ చేశాడు. గతంలో తమను తక్కువ అంచనా వేసిన ఎవరికీ అది సంతోషకరంగా లేదు, మేము లంగలేదు, ఎలాంటి సడలింపులు లేవు అన్నాడు. తరువాత దక్షిణ కొరియా పార్లమెంట్‌ సభ్యుల నుద్ధేశించి మాట్లాడుతూ ట్రంప్‌ ఇదే మాదిరి హెచ్చరికలు జారీ చేయటమే కాదు, అణ్వాయుధ, ఖండాంతర క్షిపణి తయారీ కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే మిలిటరీ చర్య తీసుకుంటామని సోషలిస్టు కొరియాపై బెదిరింపులకు దిగాడు.

రాజధాని టోకియోలో వుభయ దేశాల వాణిజ్యవేత్తల సమావేశంలో మాట్లాడుతూ జపాన్‌ అక్రమ వ్యాపార పద్దతులను అనుసరిస్తోందని ట్రంప్‌ విమర్శలు గుప్పించాడు.’ గత కొన్ని దశాబ్దాలుగా జపాన్‌ విజయం సాధిస్తోందని మీరు తెలుసుకోవాలి, ప్రస్తుతం జపాన్‌తో మా వ్యాపారం న్యాయబద్దంగా లేదు, మాకు మార్కెట్‌ను తెరవలేదు. మీరు ఇక్కడి నుంచి కార్లను షిప్పుల్లో రవాణా చేయటం కాదు, అమెరికాలో తయారు చేసేందుకు ప్రయత్నించండి, అలా అడగటం మొరటుగా వుందా’ అని ప్రశ్నించాడు. చైనా తరువాత అమెరికన్ల వాణిజ్యలోటు కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతుల కారణంగా జపాన్‌తోనే ఎక్కువగా వుంది. రాజకీయంగా అమెరికాతో వున్న బంధం కారణంగా జపాన్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. నిజానికి రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య విబేధాలు కొత్తవి కాదు. అమెరికాలో అమ్ముడౌతున్న జపాన్‌ బ్రాండ్‌ కార్లలలో 75శాతం అమెరికాలోనే తయారు చేస్తున్నామని కార్ల తయారీ వాణిజ్య సంస్ధల అసోసియేషన్‌ తెలిపింది. పసిఫిక్‌ సముద్ర ప్రాంత దేశాల స్వేచ్చా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్‌ నిర్ణయించారు, కొనసాగాలని జపాన్‌ కోరుతోంది. రెండు దేశాల మధ్య పన్నుల విషయంలో విబేధాలు ఎడతెగటం లేదు. అమెరికన్‌ కార్ల అమ్మకాలపై జపాన్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని, ఘనీభవింపచేసిన గొడ్డు మాంసం, వ్యవసాయ వుత్పత్తుల దిగుమతులపై పన్ను తగ్గించాలని అమెరికన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

గతేడాది అమెరికా ఎన్నికల ప్రచారంలో చైనా శత్రువు అని చెప్పిన ట్రంప్‌ చైనా పర్యటనలో పొగడ్తలు కురిపించాడు. గ్రేట్‌ హాల్‌లో మాట్లాడుతూ రెండు పెద్ద దేశాల మధ్య పెద్ద వాణిజ్యంలో తమకు న్యాయం జరగలేదని అయితే దానికిి చైనా తప్పేమీ లేదని, తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పర్యటన సందర్భంగా 25వేల కోట్ల డాలర్ల మేరకు ఆర్ధికలావాదేవీలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ట్రంప్‌ పర్యటన లేకపోయినా రెండు దేశాల మధ్య అది జరిగి వుండేదని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

చైనాతో వాణిజ్యం గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆసియా పర్యటనలో ఇంతవరకు చేసిన పెద్ద తప్పిదం, సిగ్గు చేటు, అమెరికా, ఆ ప్రాంత కార్మికులకు ఇది భయంకర వర్తమానం, డెమోక్రాట్లకు ఇది మాంస విందు అవుతుంది అని అమెరికాలోని చైనా అధ్యయనాల సంస్ధ నిపుణుడు ఎలీ రాట్నర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో వాణిజ్యలోటుకు తమ గతపాలకులదే బాధ్యత అని చైనాలో చెప్పిన ట్రంప్‌ తరువాత అపెక్‌ సమావేశంలో నాలుకను మరోవైపు తిప్పాడు.చైనా పేరు ప్రస్తావించకుండా ఈ ప్రాంత దేశాలు అనుచిత వ్యాపార పద్దతులు అనుసరిస్తున్నాయని, ఇక ముందు తమతో అలా కుదరదు అన్నాడు. దుర్విధి అనే నరకంలో పడకుండా తప్పించేందుకు అమెరికన్లు మతి తప్పిన ముసలి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని తమపై చేసిన వ్యాఖ్యలపై వుత్తర కొరియా వ్యాఖ్యానించింది. ఈ పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు నిజంగానే దాన్ని నిర్ధారిస్తున్నాయి. వుత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌ కొవ్వుబలిసిన పొట్టోడంటూ అవమానకరవ్యాఖ్యలు చేసిన నోటితోనే కొద్ది గంటల తరువాత భవిష్యత్‌లో ఇరువురం స్నేహితులుగా వుండవచ్చు అన్నాడు. వియత్నాంలో మానవహక్కులకు భంగం కలిగిస్తున్నారని దుమ్మెత్తి పోసిన ట్రంప్‌ తాజా పర్యటనలో ప్రపంచంలోని గొప్ప అద్భుతాలలో వియత్నాం ఒకటి అని పేర్కొన్నాడు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకోలేదని అధ్యక్షుడు పుతిన్‌ చెప్పిన మాటలను నేను నమ్ముతున్నాను అని గతంలో చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు మాట మార్చాడు. రిపబ్లికన్‌ పార్టీకి(ట్రంప్‌కు) అనుకూలంగా రష్యన్లు జోక్యం చేసుకున్నారని సిఐఏ నివేదించిన విషయం తెలిసిందే. అమెరికా గూఢచార, దర్యాప్తు సంస్ధల నివేదికలను నేను విశ్వసిస్తానా లేదా అన్నది సమస్యకాదు, వాటికినేను కట్టుబడి వున్నాను, ప్రత్యేకించి ప్రస్తుతం పని చేస్తున్న సంస్ధలు మంచివారిని కలిగి వున్నాయి అని చెప్పాడు. ట్రంప్‌ పర్యటన అన్నింటిలో అమెరికాకు ప్రధమ స్ధానం అన్నలక్ష్యంతో సాగిందా లేక ఆ స్ధానంలో చైనాను ప్రవేశ పెట్టేందుకు వచ్చారా అన్నది అర్ధం కావటం లేదన్న వ్యాఖ్య కూడా వెలువడింది.ఆసియా పర్యటనలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అనేక మంది పరిశీలకులు తలలు పట్టుకుంటున్నారు.అనేక మందికి ఆశించిన కిక్కు రాలేదు. తన తీరుతెన్నులను తప్పుపడితే ట్రంప్‌కు కోపం, పొగిడితే జనాల్లో పలుచన. కార్పొరేట్‌ మీడియాకు ఇరకాటమే మరి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మాస్కోలో వైఫల్యం-బీజింగ్‌లో విజయం !

14 Tuesday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, china communist party, communist, Donald trump, Socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-4

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఏడవ తేదీ సందర్భంగా వంద సంవత్సరాల బోల్షివిక్‌ విప్లవం గురించి ముందుగానే మొదలైన చర్చ తరువాత కూడా ప్రపంచ మీడియాలో సాగుతోంది. నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా బోల్షివిక్‌ విప్లవం గురించి వెలువడే వ్యతిరేక,సానుకూల అంశాలన్నింటిపై మధనం జరగవలసిందే. పాత, కొత్త తరాలు వాటి మంచి చెడ్డలను గ్రహించాలి. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ విధానాలదే పైచేయిగా వున్నప్పటికీ ప్రస్తుతం వాటికి ప్రాతినిధ్యం వహించే దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తమ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వాటికి దిక్కు తోచటం లేదు. మొత్తంగా చూసినపుడు సోషలిస్టు దేశాలు-పెట్టుబడిదారీ దేశాల మధ్య వైరుధ్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు తమ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో వాటి మధ్య విబేధాలు కూడా కొనసాగుతూనే వున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) వునికిలోకి రాక ముందు 1949 నుంచి 1994 వరకు ఏడు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందాలు జరిగాయి. 2001లో ప్రారంభమైన దోహా దఫా చర్చలు 16సంవత్సరాలు గడిచినా కొనసాగుతూనే వున్నాయి. సాగదీతలో ఇప్పటికి ఇదే ఒక రికార్డు అయితే ఇంకెంతకాలానికి ఒప్పందం కుదురుతుందో తెలియదు. అమెరికా-ఐరోపాయూనియన్‌ల మధ్య తలెత్తిన విబేధాలే దీనికి కారణం. ఎవరిదారి వారు చూసుకొనే క్రమంలో ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో సోషలిస్టు దేశాలను ఒకవైపు దెబ్బతీయాలని చూస్తూనే మరోవైపు వాటితో సఖ్యతగా వుండే ద్వంద్వ వైఖరిని ధనిక దేశాలు అనుసరిస్తున్నాయి. రెండో వెసులుబాటు గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు వుండేది కాదు.

ఒక సైద్ధాంతిక ప్రత్యర్ధిగా భావించే చైనాను ఎదుర్కొనే క్రమంలో ప్రజాస్వామిక దేశాలు తమ వైఫల్యాలను గుర్తించాల్సి వుందని ఐరిష్‌ టైమ్స్‌ వాఖ్యాత మార్టిన్‌ వూల్ఫ్‌ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యాన సారాంశం ఇలా వుంది. నాటి రష్యానేతల కంటే చైనా గ్జీ మరింత జాగ్రత్తగా వున్నారు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం నూతన యుగంలోకి ప్రవేశించిందని ఎంతో ధృడంగా చెప్పారు. తమ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకుంటూనే అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుకొనే ఇతర దేశాలకు చైనా కొత్త అవకాశాలను కల్పిస్తోంది. లెనినిస్టు రాజకీయ వ్యవస్ధ చరిత్ర అవశేషాలనుంచి వుద్భవించింది కాదు, ఇంకా అదొక నమూనాగా వుంది. సోవియట్‌ పారిశ్రామికీకరణ నాజీ సైన్యాలను ఓడించటానికి తోడ్పడింది. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ, ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అదే పెద్ద అసాధారణ రాజకీయ పరిణామం. ఇదిలా వుండగా అత్యంత ముఖ్యమైన ఆర్ధిక పరిణామం దారిద్య్రం నుంచి మధ్యతరగతి ఆర్ధిక స్ధాయికి చైనా ఎదుగుదల. అందుకే గ్జీ చైనాను ఒక నమూనాగా చెప్పగలుగుతున్నారు. మాస్కోలో విఫలమైన వ్యవస్ధ బీజింగ్‌లో ఎలా విజయవంతం అయిందన్నది ఇంకా తెలియాల్సి వుంది. రెండింటికి మధ్య వున్న పెద్ద తేడా ఏమంటే మావో తరువాత లెనినిస్టు రాజకీయ వ్యవస్ధను అట్టేపెట్టిన డెంగ్‌ సియావో పింగ్‌ సూక్ష్మబుద్ధితో కూడిన నిర్ణయాలు. అన్నింటికీ మించి ఆర్ధిక వ్యవస్ధను బయటివారికి తెరుస్తూనేే పార్టీ ఆధిపత్యపాత్రను కొనసాగించటం. చైనీయులు వర్ణించే జూన్‌ నాలుగవ తేదీ సంఘటన,పశ్చిమ దేశాలు 1989 మారణకాండగా పిలిచిన వుదంతం సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ అదుపు గురించి ఎంత పట్టుదలగా వున్నారో తెలియచేశాయి. ఆర్ధిక సంస్కరణల కొనసాగింపులో ఎన్నడూ తడబడలేదు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి.

Image result for 1991 soviet coup,lenin statue

సోవియట్‌ యూనియన్‌ కూడా అటువంటి బాటనే అనుసరించి వుండాల్సింది అనే చర్చ ప్రారంభమై వుండాల్సింది కానీ జరగలేదు. దీని ఫలితంగా శతాబ్దం క్రితం జరిగిన అక్టోబరు విప్లవాన్ని ఎలా గుర్తించాలి అనేది నేటి రష్యాకు తెలియకుండా పోయింది. లెనినిజం, మార్కెట్‌తో చైనా బంధపు పర్యవసానాలేమిటి? చైనా నిజంగానే పశ్చిమ దేశాల నుంచి ఆర్ధికశాస్త్రాన్ని నేర్చుకుంది.అయితే ఆధునిక పశ్చిమదేశాల రాజకీయాలను తిరస్కరించింది.చైనా అభివృద్ధి చెందే కొద్దీ లెనినిస్టు రాజకీయాలు, మార్కెట్‌ అర్ధికవిధానాల జమిలి వైఖరి పని చేస్తుందా? అంటే మనకు తెలియదనే సమాధానం చెప్పాలి. ఈ వ్యవస్ధ ఇప్పటి వరకు అద్భుతంగా పనిచేసింది. దీర్ఘకాలంలో పార్టీ మీద ఒక వ్యక్తి ఆధిపత్యం, చైనా మీద ఒక పార్టీ ఆధిపత్యం నిలబడదు. ఇదంతా దీర్ఘకాలంలో జరిగేది, తక్షణ స్ధితి సుస్పష్టం. ఏక వ్యక్తి నియంత్రించే లెనినిస్టు నిరంకుశపాలనలో చైనా ఒక ఆర్ధిక అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఎదుగుతున్న ఈశక్తి మిగతా ప్రపంచమంతా శాంతియుతంగా సహకరించటం తప్ప మరొక అవకాశం లేదు. వుదారవాద ప్రజాస్వామ్యంలో విశ్వాసం వున్నవారందరూ ఆర్ధిక చైనాను మాత్రమే కాదు ప్రముఖ సైద్ధాంతిక ప్రత్యర్ధిగా కూడా గుర్తించాల్సిన అవసరం వుంది.ఒకటి, నిష్కారణంగా చైనాతో ప్రతికూల సంబంధాలను పెంచుకోకుండా పశ్చిమ దేశాలు తమ సాంకేతిక, అర్ధిక వున్నతిని కొనసాగించాలి. చైనా మన వ్యాపార భాగస్వామే తప్ప స్నేహితురాలు కాదు. రెండవది ఎంతో ముఖ్యమైనది, ఈరోజు మాదిరి దుర్బలంగా వున్న పశ్చిమ దేశాలు దశాబ్దాలుగా కాకపోయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా తమ ఆర్ధిక యాజమాన్యం మరియు రాజకీయాలు సంతృప్తికరంగా లేవన్న వాస్తవాన్ని గుర్తించి, నేర్చుకోవాలి. పశ్చిమ దేశాలు తమ ద్రవ్యవ్యవస్ధను ఎటూ కదలని తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయే విధంగా వదలివేశాయి.తమ భవిష్యత్‌కు చేసే ఖర్చు విషయంలో గుచ్చి గుచ్చి వ్యవహరించాయి. ముఖ్యంగా ఆర్ధికవిజేతలు-పరాజితుల మధ్య ప్రమాదకరమైన అఘాతం పెరగటాన్ని అమెరికా అనుమతించింది. తన రాజకీయాలలో అబద్దాలు, విద్వేషానికి తావిచ్చింది.

ఇంకా మరికొన్ని విషయాలు తన విశ్లేషణలో పేర్కొన్న మార్టిన్‌ వూల్ప్‌ కమ్యూనిజం పట్ల సానుకూల వైఖరి కలిగినవాడేమీ కాదు. చైనా సోషలిజం కూలిపోతుందని జోస్యం చెప్పాడు. విధిలేని పరిస్ధితుల్లో అవకాశం వచ్చేంత వరకు చైనాతో మంచిగా వుండి సమయంరాగానే దెబ్బతీయాలని పరోక్షంగా సూచించాడు. చైనా వ్యాపార భాగస్వామి తప్ప స్నేహితురాలు కాదనటంలో అంతరంగమిదే. సంక్షోభాన్నుంచి బయటపడేందుకు,లాభాల కోసం పెట్టుబడిదారీ వర్గం సోషలిస్టు దేశాలతో సఖ్యంగా వుండటం అన్నది 1980 దశకం తరువాతి ముఖ్యపరిణామం. అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలన్నీ గత కొద్ది దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానమిదే.

తాజా తొలి ఆసియా పర్యటనలో డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా, వియత్నాంల అభివృద్ధి గురించి పొగిడారు.చైనాతో వాణిజ్యలోటుకు తమ గత అధ్యక్షులు అనుసరించిన విధానాలే కారణమని చెప్పారు.మార్టిన్‌ చెప్పినట్లు ఆర్ధిక అవసరాల కోసం అలా చెప్పాడు తప్ప సైద్ధాంతికంగా కమ్యూనిస్టు వ్యతిరేక చర్యతోనే ఆ దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టటం ట్రంప్‌ వర్గనైజం. బోల్షివిక్‌ విప్లవానికి వందేండ్ల సందర్భంగా నవంబరు ఏడును ‘కమ్యూనిజం బాధితుల జాతీయ దినం ‘గా ప్రకటించి మరీ వచ్చాడు. వాస్తవానికి రోసెన్‌బర్గ్‌ దంపతులను వురితీయటంతో సహా అనేక మందిని వెంటాడి వేధించిన దుష్ట చరిత్ర వారిదే.కమ్యూనిజం గతించిందని, దానిని పాతిపెట్టామని, అంతిమ విజయం సాధించామని చెప్పుకున్న పాతికేండ్ల తరువాత కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఇంకా భయపడుతున్నాయి.పోరులో ఒక రంగంలో ఓడిపోవచ్చు, అంతమాత్రాన యుద్ధం ఓడిపోయినట్లు కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ అనేక రంగాలలో విజేతగా వున్నాడు, సోవియట్‌ గడ్డపై జరిగిన నిర్ణయాత్మకపోరులో కమ్యూనిస్టుల చేతిలో ఓటమిపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. అదే విధంగా బోల్షివిక్‌ విప్లవాన్ని వమ్ముచేసినంత మాత్రాన దోపిడీ వర్గం అంతిమ విజయం సాధించినట్లు సంబరపడితే అది కార్మికవర్గాన్ని మరింతగా కర్తవ్యోన్ముఖులుగా మారుస్తుంది.

అక్టోబరు విప్లవం జయప్రదం అయిన తరువాత సోవియట్‌ను దెబ్బతీయటానికి పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. అంతర్గతంగా సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే శక్తుల విచ్చిన్న కార్యకలాపాలకు తోడు, బయట రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేవరకు ఇరుగుపొరుగు దేశాలతో సోవియట్‌ సంబంధాలు సజావుగా లేవు. ఏడు సంవత్సరాల తరువాత 1924లో మాత్రమే బ్రిటన్‌ సోషలిస్టు రష్యాను గుర్తించింది. ప్రతి దేశంతో ఏదో ఒక సమస్య, సహాయ నిరాకరణ. వీటన్నింటినీ తట్టుకొని స్టాలిన్‌ నాయకత్వంలో సోవియట్‌ బలపడింది.

సోషలిస్టు చైనాకు సైతం పాతిక సంవత్సరాల పాటు ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఐక్యరాజ్యసమితిలో గుర్తించకుండా అడ్డుకున్నారు. ఇటువంటి స్ధితి చరిత్రలో మరేదేశానికీ వచ్చి వుండదు. మార్టిన్‌ పేర్కొన్నట్లు చైనాలో కమ్యూనిస్టు పార్టీ తన పట్టును పెంచుకున్న తరువాత డెంగ్‌ హయాంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర రాజకీయ నిర్ణయాలు నేటి చైనా అవతరణకు దోహదం చేశాయి. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను కూలదోసేందుకు జరిగిన ప్రయత్నాన్ని నిర్ణయాత్మకంగా ఎదుర్కొనటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర,దానికి జనామోదం లభించటానికి ఎంతో ముందు చూపుతో డెంగ్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టుపార్టీ ప్రారంభించిన సంస్కరణలతో తమ జీవితాలు మెరుగుపడుతున్నాయని జనం గ్రహించటం కూడా ఒక ప్రధానకారణం.చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోని ప్రజా మిలిటరీ తియన్మెన్‌ స్క్వేర్‌ కుట్రను మొగ్గలోనే తుంచి వేసింది. బహుశా దానిని గమనించే అమెరికా, ఇతరసామ్రాజ్యవాదులు సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలో కుట్రను ముందుకు, మరింత వేగంగా అమలు జరిపినట్లు కనిపిస్తోంది.తియన్మెన్‌ స్క్వేర్‌ ప్రదర్శనలుగా ప్రపంచానికి తెలిసిన ఘటనలు 1989 ఏప్రిల్‌ 15న ప్రారంభమై జూన్‌ నాలుగు వరకు జరిగాయి. తూర్పు ఐరోపాలో అదే ఏడాది నవంబరులో తూర్పు జర్మనీలో, తరువాత సోవియట్‌లో మొదలయ్యాయి. దానిని గుర్తించి అక్కడి కమ్యూనిస్టుపార్టీలు చైనా పార్టీ మాదిరి తమ పాత్రలను మలుచుకొని వుంటే చరిత్ర మరోవిధంగా వుండేది. !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నూటఅరవై కోట్ల మందిని బలితీసుకున్న పెట్టుబడిదారీ విధానం !

07 Tuesday Nov 2017

Posted by raomk in Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Anti communist, Bolshevik Revolution, CAPITALISM, communist, mass murdering evil of capitalism, Nazism, revolution

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం-వర్తమానం-3

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు విప్లవానికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన జాతీయ, ప్రాంతీయ మీడియాతో పోల్చితే పశ్చిమదేశాల మీడియాలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. తరువాత కూడా అది ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. ధనిక దేశాలలో పది సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో పెట్టుబడిదారీ పండితులకు అంతుబట్టటం లేదు. దాదాపు ప్రతి దేశంలోనూ ఒకసారి ఎన్నికైన పార్టీ వెంటనే రెండోసారి అధికారంలో కొనసాగే పరిస్థితి లేదు. పాలకపార్టీల పేర్లు, కొన్ని అంశాలపై భిన్న వైఖరులు కలిగి వుండటం తప్ప అనుసరిస్తున్న విధానాలన్నీ ఒకే విధంగా వుంటున్నాయి. పళ్లూడగొట్టించుకొనేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా జనం మీద భారాలు మోపటానికి, సంక్షేమ పధకాలకు కోత పెట్టటంలో ఏ పార్టీ అయినా ఒకే విధంగా వ్యవహరించటమే దీనికి కారణం.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దానికి వెన్నుదన్నుగా నిలిచిన కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో పెల్లుబికిన కమ్యూనిస్టు వుద్యమంపై మొదటి, రెండవ సాదారణ ఎన్నికల సందర్భంగా నాటి మీడియా ఎంత తప్పుడు ప్రచారం చేసిందో పాత తరాలకు, చరిత్ర కారులకు తెలిసిందే.అయితే పశ్చిమ దేశాలలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా సాగుతూనే వుంది. దాని కొనసాగింపుగానే వందేండ్ల బోల్షివిక్‌ విప్లవం గురించి ఇప్పుడు కూడా చెడరాసిపారేస్తున్నారు. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల మానస పుత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక నవంబరు ఆరున వంద సంవత్సరాల కమ్యూనిజంలో వందమిలియన్ల మంది హత్య అంటూ ఒక శీర్షికతో ఒక వార్త, అంతకు మూడు రోజుల ముందు కమ్యూనిజపు రక్త శతాబ్దం పేరుతో మరొక వార్తను ప్రచురించింది. ఇంకా అనేక పత్రికలు గతంలో కూడా ఆ సమాచారాన్నే అటూ ఇటూ మార్చి గత కొద్ది సంవత్సరాలుగా పాఠకుల మీద రుద్దుతున్నాయి. వాటిని జనం పూర్తిగా నమ్మటం లేదని అక్టోబరులో అమెరికాకు చెందిన కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ విడుదల చేసిన ఒక సర్వేలో పేర్కొన్న విషయం తెలిసిందే.(అమెరికాలో అక్కడి ప్రభుత్వం కమ్యూనిస్టులను వేటాడి వేధించింది తప్ప కమ్యూనిస్టుల బాధితులు లేకపోయినా ఆ పేరుతో ఒక సంస్ధ ఏర్పాటు చేయటమే విడ్డూరం) ఈ ప్రచారం ఎంత హాస్యాస్పదం అంటే రష్యా, చైనాలలో సంభవించిన కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాలలో మరణించిన వారిని కూడా కమ్యూనిస్టులే చంపివేశారని చెబుతారు. అంతకంటే అత్యంత దుర్మార్గమైన ప్రచారం ఏమంటే ఫాసిస్టులు-నాజీలు, వారి పీచమణిచి ప్రపంచాన్ని రక్షించిన కమ్యూనిస్టులను ఒకేగాట కట్టి జనాన్ని చంపటంలో కమ్యూనిస్టులకు, ఫాసిస్టులకు తేడా లేదు. ఇద్దరూ మారణహోమానికి పాల్పడ్డారంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా మొత్తంగా సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, వారికి వూడిగం చేసే వారి చేతుల్లో వుంది కనుక గోబెల్స్‌ మాదిరి పదే పదే ప్రచారం చేసి అనేక మంది బుర్రలను కలుషితం చేస్తున్నారు.

నరహంతకులు ధరాధిపతులైనారన్నట్లు లాభాల కోసం పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ప్రపంచంలో మానవాళిపై జరిపినన్ని దుర్మార్గాలు మరొకరు జరపలేదు. మానవత్వాన్నే పరిహసించారు. వారు హరించిన మానవ హక్కులకు అంతేలేదు. పెట్టుబడిదారీ విధానం, దానిని పరిరక్షించేందుకు కంకణం కట్టుకున్న పాలకులు జరిపిన దాడులు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో జనాన్ని గాలికి వదలి వేయటం వంటి బాధ్యతా రాహిత్యం వంటి సకల అనర్ధాలు వలన పెట్టుబడిదారీ విధానం నూట అరవై కోట్ల మందికిపైగా జనాల మరణాలకు కారణమైందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.https://prolecenter.wordpress.com/2017/08/21/1-6-billion-killed-by-capitalism/ కమ్యూనిస్టుల పాలనలో కరువులలో మరణించినా అందుకు వారే బాధ్యులంటున్న వారు ఆ ప్రాతిపదికను మిగతావారికి ఎందుకు వర్తింప చేయరు?

బ్రిటీష్‌ వారి ఆక్రమణ సమయంలో మన దేశంలో సంభవించిన బెంగాల్‌ కరవులో కోటి మంది, అంతకు ముందు సంభవించిన వాటిలో మూడు కోట్ల మంది మరణించారు. మన దేశాన్ని బ్రిటీష్‌ వారు ఆక్రమించే క్రమంలో జరిగిన యుద్ధాలు, దాడులు, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరో రెండు కోట్లు. ఇక ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు ఐరోపా ధనిక దేశాలు ఐరోపా ఖండంలో, ఇతర ఖండాలలో జరిపిన యుద్ధాలు, వాటిలో చిందిన రక్తం, పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరిది? రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వియత్నాం, కంపూచియా, లావోస్‌లతో కూడిన ఇండో చైనా ప్రాంతాన్ని ఆక్రమించుకొనేందుకు జపాన్‌,ఫ్రాన్స్‌, అమెరికా జరిపిన దాడుల్లో మరణించిన లేదా గాయపడిన వారు దాదాపు కోటి మంది వున్నారు. మారణాయుధాల గుట్టలను వెలికితీసే పేరుతో ఇరాక్‌పై అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులు జరిపిన దాడులు, ఆంక్షల కారణంగా మరణించిన లక్షల మంది గురించి తెలిసిందే. ఇక రెండు ప్రపంచ యుద్ధాలకు కారకులు ప్రజాస్వామిక దేశాలుగా చెప్పుకొనే అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఫాసిస్టు, నాజీలు, నియంతలుగా పేరు పడిన జర్మనీ, జపాన్‌,ఇటలీ వారితో చేతులు కలిపిన వారు తప్ప కమ్యూనిస్టులు కాదే. ఆ యుద్ధాలలో జరిగిన ప్రాణ నష్టాలను ఎవరి ఖాతాలో వేయాలి? వియత్నాం యుద్ధంలో అమెరికన్లు ప్రయోగించిన రసాయనిక ఆయుధాల వలన యుద్ధం ముగిసిన నాలుగు దశాబ్దాల తరువాత కూడా అనేక ప్రాంతాలలో పంటలు పండకపోవటం, జనం రోగాల బారిన పడటం చూస్తున్నదే. జపాన్‌పై అమెరికా ప్రయోగించిన అణ్వాయుధ ప్రభావం డెబ్బయి సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అనుభవిస్తున్నారు. మ్యూనిజాన్ని అరికట్టేపేరుతో ఇండోనేషియాలో నియంత సుహార్తోను ప్రోత్సహించి దాదాపు పది లక్షల మంది మ్యూనిస్టులు,అభిమానులను హత్య చేయించటంలో అమెరికన్లకు పాత్ర వుందని ఇటీవలే బయటపడిన విషయం తెలిసిందే. పెట్టుబడిదారీ విధానంలో భాగంగా సంభవించిన ఆర్ధిక సంక్షోభాలలో చితికిపోయిన కుటుంబాలు, మరణాలకు బాధ్యత ఎవరిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు, దారుణాలకు పాల్పడిన దేశాలు, వారిని నడిపించిన పెట్టుబడిదారీ విధానం, ప్రజాస్వామ్యం మాటేమిటి?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోషలిజంపై చిత్త భ్రమణ తంత్ర విద్య ప్రయోగం !

06 Monday Nov 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

100 years Bolshevik Revolution, Bolshevik Revolution, CAPITALISM, capitalist crisis, China, communist, Communist Revolution, Mind Games, new American socialism

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -2

ఎం కోటేశ్వరరావు

ప్రపంచంలో కొన్ని సోషలిస్టు వ్యవస్ధలకు తగిలిన తీవ్ర ఎదురుదెబ్బలు ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇదే సమయంలో విద్య, సమాచార వ్యవస్ధ కొత్త పుంతలు తొక్కి అరచేతిలోకి అందుబాటులోకి రావటం వంటి పరిణామాలతో కమ్యూనిస్టు సిద్ధాంతంపై దాడి కగతం కంటే తీవ్రంగా జరుగుతోంది. కొత్త ఎత్తుగడలు అనుసరించటాన్ని అన్ని రంగాలలో చూడవచ్చు. గతంలో మాదిరి కమ్యూనిజాన్ని నేరుగా వ్యతిరేకిస్తే లాభం వుండదని గత వంద సంవత్సరాల అనుభవాలు దోపిడీ వర్గానికి నేర్పాయి. అంటే దొంగ దెబ్బలకు పూనుకున్నాయి, దీంతో కమ్యూనిస్టుల పనిని మరింత సంక్లిష్టం గావించాయని చెప్పాలి. శత్రువును చంపదలచుకుంటే ప్రత్యక్ష పోరాటంలో ఎంతో కష్టపడాలి, అదే తీపి మాటలతో వెన్నుపోటు పొడిచి అంతం చేయటం ఎంతో సులభం. ఈ కుటిల నీతిని కమ్యూనిస్టు వ్యతిరేకులు బాగా ప్రయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో నవతరం సోషలిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితులు కావటం గతం మాదిరి సులభం కాదు. అయితే దోపిడీ వ్యవస్ధ ఎప్పటికపుడు తనకు తెలియకుండానే యువతరాన్ని ఆవైపు నెడుతోంది. పీడితులు కూడా తమ ఆయుధాలను సన్నద్దం చేసుకోవటం అనివార్యం.

అమెరికాలోని కమ్యూనిజం బాధితుల స్మారక ఫౌండేషన్‌ అనే సంస్ధ తన వార్షిక నివేదికలో భాగంగా యు గవ్‌ అంటే మీ ప్రభుత్వం అనే ఒక పరిశోధనా సంస్ధతో కలసి అక్టోబరు చివరి వారంలో ఒక సర్వే నివేదికను విడుదల చేసింది. ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సంస్ధ ప్రమేయంతో ఇలాంటి నివేదికల తయారీకి రూపొందించే ప్రశ్నావళి స్వభావం,లక్ష్యం ఎలా వుంటుందో తెలిసిందే. వెన్నుపోటు ఎత్తుగడలో ఇదొక భాగం. ఈ సర్వే సెప్టెంబరు 28 అక్టోబరు 5 మధ్య జరిగింది. అమెరికా ప్రధాన మీడియా అంతటా ఆ సమయంలో అమెరికా దృష్టిలో ధూర్త దేశంగా వున్న సోషలిస్టు-కమ్యూనిస్టు వుత్తర కొరియా జపాన్‌ మీదుగా, అమెరికా తీరంలోని దీవులలో కూడా పడే ఖండాంతర క్షిపణి ప్రయోగాలను జరిపిందని, అమెరికన్లకు ముప్పు తెచ్చిందంటూ ముమ్మరంగా ప్రచార దాడి జరిపిన సమయమది. సర్వేపై దాని ప్రభావం పడకుండా ఎలా వుంటుంది. అందువలన దానికి వుండే పరిమితులను గమనంలో వుంచుకోవాలి. ఈ నివేదికలో కొన్ని అసంబద్దతలు, తర్కానికి నిలబడని అంశాలున్నాయి.

ప్రపంచానికి కమ్యూనిజం ఇప్పటికీ ఒక సమస్యగానే వుందని నమ్ముతున్న అమెరికన్లు 75శాతం వున్నారని, గతేడాది కంటే ఐదుశాతం ఎక్కువంటూ సర్వే తొలి అంశంగా ఆ నివేదిక ప్రారంభమైంది. ప్రతి పదిమందిలో ఏడుగురు అమెరికన్లకు కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకపోవటం లేదా తప్పుగా గుర్తించారట. ఇదే సమయంలో నూతన సహస్రాబ్ది యువతరంగా పరిగణించబడేవారిలో సోషలిజం పట్ల సానుకూలత పెరుగుతోంది. జనాభా మొత్తంగా చూసినపుడు 63శాతం పెట్టుబడిదారీ, నాలుగు శాతం ఫాసిస్టు దేశంలో జీవించాలన్న అభిలాషను వ్యక్తం చేయగా సోషలిస్టు-కమ్యూనిస్టు దేశంలో నివశించాలన్న కోర్కె 37 శాతం మందిలో వ్యక్తమైంది. ఇదే సహస్రాబ్ది యువతలో 49, 51శాతం వున్నారు. ప్రస్తుతం అమెరికా జనాభాలో సహస్రాబ్దితరంగా పరిగణించబడేవారు ఎక్కువగా వున్నారు. నివేదిక మొత్తంలో కమ్యూనిస్టు వ్యతిరేకతనే ప్రధానంగా చూపినప్పటికీ ఈ ఒక్క అంశంపై కమ్యూనిస్టు వ్యతిరేకులు కలవర పడుతున్నారు. గతంలో విదేశాలలో పెరుగుతున్న సోషలిస్టు అభిమానులను చూసి భయపడిన అమెరికన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులు ఇప్పుడు తమ యువతను చూసి తామే భయపడుతున్నారన్నమాట. ఎంతలో ఎంత మార్పు? సహస్రాబ్ది యువతలో ఇటువంటి భావాలు ఏర్పడటానికి కారణం 53శాతం మంది అమెరికా ఆర్ధిక వ్యవస్ధ తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అభిప్రాయం పడటం కావచ్చని సర్వే రచయితలు వ్యాఖ్యానించారు.

‘ ప్రస్తుతం అమెరికాలో సహస్రాబ్ది తరం అతి పెద్ద సమూహంగా వుంది. ఆందోళన కలిగించే కొన్ని ధోరణులు తీవ్ర ఆందోళన కలిగించటాన్ని చూస్తున్నాం. సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు మళ్లటం పెరుగుతోంది, చివరికి కమ్యూనిజం కూడా ఆచరణీయ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు’ అని కమ్యూనిజం బాధితుల స్మార ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.ఇదే సమయంలో 1946-64 మధ్య పుట్టిన వారు ఎక్కువగా పెట్టుబడిదారీ విధానానికి,26శాతం మందే సోషలిజానికి మద్దతు ఇస్తున్నారు. అమెరికాలో స్టాలిన్‌ను ప్రతి ఐదుగురిలో ఒకరు హీరోగా భావిస్తుండగా, లెనిన్‌, వుత్తరకొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ అన్‌లను అభిమానించే వారు ప్రతి నలుగురిలో ఒకరు వున్నారని తేలింది. సోషలిజం, కమ్యూనిజాలకు తేడాతో పాటు అసలు వాటి గురించి తెలియని కారణం, కమ్యూనిస్టు పాలిత దేశాలలో చంపివేయబడిన జనం గురించి తక్కువ అంచనా వేయటం వల్లనే యువత ఈ బాటలో వున్నారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలు ‘ఎర్ర శతాబ్దం’ పేరుతో రాసిన సానుకూల వ్యాసాలు కూడా కమ్యూనిజం వెనుక వున్న నిజాన్ని పట్టించుకోకుండా చేశాయని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు.’ సోషలిజం, కమ్యూనిజాల విషయంలో అమెరికన్‌ సమాజంలో చారిత్రక పాండిత్యం ఎంత తక్కువగా వుందో అలజడి వైపు తిప్పుతున్న ఈ పరిణామం వెలుగులోకి తెస్తోంది.వంద సంవత్సరాల క్రితం జరిగిన బోల్షివిక్‌ విప్లవం తరువాత కమ్యూనిజం కారణంగా జరిగిన మారణహోమం, వినాశనం, దుఖం గురించి విద్యార్ధులకు బోధించటంలో వ్యవస్ధ వైఫల్యం గురించి కూడా ఇది వెల్లడించింది.’ అని కూడా మరియోన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు.

కమ్యూనిస్టుల పాలనలో రోమన్‌ కాధలిక్‌ మతగురువులతో సహా చంపిన వారి సంఖ్య పది లక్షలలోపే అని సర్వేలో పాల్గన్నవారిలో పదిశాతం, 1-250లక్షలని 21, 250-500లక్షలని 15, 500-750లక్షలని 12, 750-1000లక్షలని 11, పది కోట్లకు పైగా అని31శాతం చొప్పున నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఈ అంకెలకు ఎలాంటి ఆధారాలు లేవు. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా వీటిని తిప్పుతున్నారు. ఈ అతిశయోక్తులను మొత్తంగా 69శాతం మంది తక్కువ చేసి చూశారు. సహస్రాబ్ధి యువతలో గతేడాది మాదిరే తప్ప మార్పు లేదు. గత కొద్ది కాలంగా ముఖ్యంగా 2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం తరువాత అమెరికన్‌ యువతలో సోషలిజం, కమ్యూనిజం గురించి సానుకూల వైఖరి వ్యక్తమౌతోంది. అందువలన వారిని గందరగోళంలో పడేయటానికి ఇలాంటి సర్వేలతో ఒకవైపు వారిలో తలెత్తిన మార్పును చెబుతూనే మరోవైపు వెనక్కు లాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు మనం చూడవచ్చు. అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయి? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం, బకెట్లతో సముద్రనీటిని తోడటం ఎలా సాధ్యం కాదో భావజాల వ్యాప్తిని, అసంతృప్తిని అణచివేయటం, పక్కదారి పట్టించటం కూడా అలాంటిదే.

సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం నిజానికి ఒక ప్రయోగం. దాని ఫలితాలు ప్రపంచానికి తెలియవు. అందువలన నిర్మాణంలో ఏవైనా లోపాలుంటే వాటిని స్నేహపూర్వకంగా లేదా సైద్ధాంతికంగా చెప్పటం వేరు. గతంలో సోవియట్‌ యూనియన్‌ను సోషల్‌ సామ్రాజ్యవాదంగా వర్ణించిన నక్సల్స్‌ తాము కూడా కమ్యూనిస్టులమే అని చెప్పుకున్నారు. అలాగే ఇప్పుడు చైనా అనుసరిస్తున్న విధానాలపై కూడా కొంతమంది అదే రకమైన దాడి చేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సామ్రాజ్యవాదులుగా మారినవి వున్నాయి. అదే విధంగా పెట్టుబడిదారీ పంధాలో పయనిస్తూ అభివృద్ధిలో బాగా వెనుకబడిన దేశాలూ వున్నాయి. అటువంటి దేశాలలో సోషలిస్టు వ్యవస్ధలు వస్తే ఎంతకాలం అనేది ఎవరూ చెప్పలేకపోవచ్చుగాని కొంత కాలం అదే మాదిరి తేడాలు లేకుండా ఎలా వుంటాయి? చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ అనేది బూటకం, పేరుకే కమ్యూనిస్టు పార్టీ, అక్కడ ఆర్ధిక అంతరాలు చాలా ఎక్కువగా వున్నాయి, ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా దాడి జరుగుతోంది. ఇక్కడ సోషలిజం పట్ల కారుస్తున్న మొసలి కన్నీరును కడవలతో కొలవజాలం. నిజమైన సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణ జరగటం లేదని తీవ్ర విచార ప్రదర్శన. ఇదంతా కమ్యూనిస్టు వ్యతిరేకులు, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు కూడా కొందరు చేస్తున్నారు. ఇదంతా సమాజంలోని ఒక భాగం లేదా వ్యక్తులను మానసికంగా తిమ్మినిబమ్మిని చేసి ఇబ్బందులకు గురిచేసే చిత్త భ్రమణ తంత్ర విద్యలో భాగమే.

Image result for US youth, socialism

బ్రెజిల్‌కు చెందిన లూయీస్‌ కార్లోస్‌ బ్రెస్సెర్‌ పెరీరా అనే సామాజిక, ఆర్ధికవేత్త పెట్టుబడిదారీ విధానంలో ఐదు నమూనాలు వున్నాయని విశ్లేషించారు. ఆయనతో ఏకీభవించాలనేమీ లేదు. ధనిక దేశాలలో వుదారవాద ప్రజాస్వామిక లేదా ఆంగ్లో-శాగ్జన్‌ నమూనా, సామాజిక లేదా ఐరోపా, అంతర్జన్య లేదా జపాన్‌, వర్ధమాన దేశాలలో వుదారవాద ఆధారిత నమూనాలు ఆసియాలో ఒక విధంగా, బ్రెజిల్‌తో సహా ఇతర దేశాల నమూనాలు భిన్నంగా వుంటాయని ఆయన చెప్పారు. ఇదే సూత్రం సోషలిస్టు దేశాలకు మాత్రం ఎందుకు వర్తించదు? అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గ నాయకత్వాన విప్లవాలు జయప్రదమౌతాయని మార్క్స్‌-ఎంగెల్స్‌ అంచనా వేశారు. ఆ తరువాత బోల్షివిప్లవానికి ముందు సైద్ధాంతిక చర్చ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం గురించి తప్ప నమూనా, విప్లవ మార్గం గురించి పెద్ద సమస్యలు ముందుకు రాలేదు. బోల్షివిక్‌ విప్లవం తరువాతే ఆచరణలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటన్నింటినీ తెల్లవారే సరికి పరిష్కారిస్తామని, పరిష్కారమౌతాయని గానీ ఏ కమ్యూనిస్టూ చెప్పజాలరు. వాటిని కూడా దోపిడీ శక్తులు తమ కమ్యూనిస్టు వ్యతిరేక భావజాల అమ్ముల పొదిలో చేర్చుకున్నాయి. పద్దతులను కూడా మార్చుకున్నాయి. గతంలో మాదిరి సోవియట్‌ను వ్యతిరేకించినట్లుగా నేడు చైనాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగేందుకు ముందుకు రావటం లేదు. ఎందుకంటే గతంలో సోవియట్‌ తయారీ వస్తువులతో పాశ్చాత్య దేశాల మార్కెట్లను నింపలేదు, అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మేడిన్‌ చైనా దర్శనమిస్తోంది.అయితే అదే సమయంలో సోవియట్‌ను తొక్కివేసేందుకు, కూల్చివేసేందుకు చేసిన కుట్రలకు ఏమాత్రం తీసిపోకుండా చైనాకు వ్యతిరేకంగా చేయాల్సినవి చేస్తున్నాయని మర్చిపోరాదు. అధికారికంగా సంబంధాలు, అనధికారికంగా చైనా, కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిజం మీద విషపూరిత దాడి జరుగుతోంది.

గత వంద సంవత్సరాలలో ఫాసిస్టు శక్తులను అణచివేయటంలో కమ్యూనిస్టులు ఎంతటి త్యాగాలకు పాల్పడతారో, ఎలా సన్నద్దమౌతారో లోకానికి తెలియ చెప్పటంలో సోవియట్‌ యూనియన్‌ జయప్రదమైంది. సోషలిజాన్ని కాపాడుకుంటూ అచిర కాలంలోనే ఒక నూతన అభివృద్ది నమూనాను ప్రపంచం ముందుంచటంలో చైనా జయప్రదమైంది. చైనాలో సమస్యలేమీ లేవా అంటే కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమల వంటివి కూడా జరబడతాయని వాటిని అదుపు చేయాల్సి వుంటుందని కూడా తమకు తెలుసునని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ చెప్పారు. సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని ఇప్పుడు అధికారికంగా వారే చెబుతున్నపుడు లేవని ఎవరంటారు? అన్ని పెట్టుబడిదారీ దేశాలూ ఒకే విధంగా అభివృద్ధి ఎందుకు చెందలేదు, అన్ని ఖండాలలో ఒకేసారి పారిశ్రామిక విప్లవం ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలకు సమాధానంలోనే సోషలిజానికి కూడా జవాబు దొరుకుతుంది.

చైనాలో వున్నది పెట్టుబడిదారీ విధానం అనే వాదనలతో విబేధిస్తున్నవారు ముందుకు తెస్తున్న అంశాలేమిటో చూద్దాం.పెట్టుబడిదారీ పాలనా విధానంలో అప్రయత్న పూర్వకమైన సంబంధాలతో వస్తూత్పత్తి లాభాల కోసం జరుగుతుంది.లాభాల రేటు పెట్టుబడుల వర్తులాను నిర్దేశించటంతో పాటు ఆర్ధిక సంక్షోభ ఆవర్తనాలను కూడా వుత్పత్తి చేస్తుంది. ఇది చైనాకు ఇంతవరకు వర్తించలేదు. ప్రణాళిక, ప్రభుత్వరంగంలో వుత్పత్తిపై యాజమాన్య పద్దతే ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ అధికార పునాదివేళ్లు ప్రజాయాజమాన్యంలోనే వున్నాయి.పెట్టుబడిదారీ తరహా వుత్పత్తి పద్దతి లేకుండానే చైనా ఆర్ధికంగా ఎదుగుదలను సాధించింది. కీలకమైన 102 ప్రభుత్వ రంగ సంస్దల విలువ ఏడున్నరలక్షల కోట్ల డాలర్లు. వీటిని ప్రయివేటీకరిస్తారని ఎవరైనా ఆశపడుతుంటే అలాంటిదేమీ వుండదని పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రధానమైన ప్రజాయాజమాన్య స్ధితి, ప్రభుత్వ రంగ ఆర్ధిక వ్యవస్ధ నాయకత్వ పాత్రపై ఎలాంటి డోలాయమానం వుండదని అధ్యక్షుడు గీ జింగ్‌ పింగ్‌ గతేడాది స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల వారు గత మూడున్నర దశాబ్దాలుగా చైనా ఆ బాటను వీడి స్వేచ్చా మార్కెట్‌,ప్రయివేటు రంగం నాయకత్వ పాత్ర వహించాలని కోరుతూనే వున్నారు.లాభాపేక్షలేని ప్రణాళికా బద్దమైన ప్రభుత్వరంగ పాత్ర నాయకత్వంలో తలెత్తే సమస్యలను పెద్దవిగా చూపుతూ వాటిని అవకాశంగా మార్చుకోవాలని కంటున్న కలలు ఇంతవరకు కల్లలుగానే మిగిలిపోయాయి. సామాజిక-ఆర్ధిక అంశాల రూపకల్పన, జయప్రదంగా అమలు చేయటంపై నిజానికి చైనా కమ్యూనిస్టుపార్టీ ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నది.

2008లో పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత కూడా చైనా అభివృద్ధి రేటు ఏడుశాతం కొనసాగుతున్నది. తమ తరువాత సంక్షోభంలోకి కూరుకుపోవటం చైనా వంతు అని చెప్పిన వారి జోస్యం వాస్తవం కాదని తేలిపోయింది. కొన్ని వడిదుడుకులు తప్ప గత పదిసంవత్సరాలుగా సజావుగా పురోగమిస్తోంది. ఇది కమ్యూనిస్టుపార్టీ, సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకత. ఇప్పుడు పెట్టుబడిదారీ ధనిక దేశాలలోని యువతను ఆకర్షించే అంశం ఇది. ఏ స్టోర్‌లో చూసినా చైనా వస్తువులే, పశ్చిమ దేశాల వుద్యోగాలను హరించి చైనా తన వారికి పని కలిపిస్తున్నదన్న వార్తలు ఏదో ఒక రూపంలో వారిని చేరుతూనే వున్నాయి. ఈ నేపధ్యంలో పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందా లేదా అనేదే గీటు రాయి అనుకుంటే ఇప్పటి వరకు పెట్టుబడిదారీ విధానం ఒరగబెట్టిందేమీ లేదు, రాబోయే రోజుల్లో ఏదో చేస్తుందనే ఆశ కనిపించటం లేదు, అందువలన సోషలిజమే మెరుగు, దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అన్న ఆలోచన తలెత్తుతోంది. సోషలిస్టు భావన వునికిలోకి వచ్చిన తరువాత సాధించిన పెద్ద విజయాలలో ఇదొకటి అంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ సిద్ధాంత వేత్తలు సోషలిస్టు వ్యవస్ధల వైఫల్యాలను బూతద్దంలో పెట్టి చూపటం,అవాస్తవాలను ప్రచారం చేసి సోషలిజం గురించి చిత్త భ్రమణ తంత్ర విద్యను( మైండ్‌ గేమ్‌ ఆడటం) ప్రయోగించి తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు తప్ప పెట్టుబడిదారీ విధానం ఎలా మెరుగైనదో దానికి పోతుగడ్డ అంటున్న అమెరికా యువతకు చెప్పలేకపోతున్నారు. అదే పెద్ద బలహీనత. దీన్ని దెబ్బకొట్టి యువతను సోషలిజం వైపు మళ్లించటమే కమ్యూనిస్టుల ముందున్న పెద్ద సవాలు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకర్షణ తగ్గని సోషలిజం, కమ్యూనిజం !

05 Sunday Nov 2017

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Aurora, Bolshevik Revolution, Bolshevik Revolution warship, Lenin, Russia’s 1917 Bolshevik Revolution, winter palace

వందేండ్ల మహత్తర అక్టోబరు విప్లవం- వర్తమానం -1

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఏడు, ప్రపంచవ్యాపితంగా ఎందరో విప్లవదీక్షకు పునరంకితమయ్యే రోజు. విప్లవాలకు దారితీస్తాయని భావించిన, భయపడిన వుద్యమాలను ఏడు నిలువుల లోతున పాతివేయాలన్న దోపిడీదార్ల కసిని మరింతగా పెంచే రోజు. అంతకు ముందు కూడా పెట్టుబడిదారీ వర్గం అణచివేతకు పాల్పడినప్పటికీ అక్టోబరు విప్లవం తరువాత మరింత అప్రమత్తమై గత వంద సంవత్సరాలుగా దాడిని మరింతగా పెంచుతోంది. కమ్యూనిస్టు తత్వశాస్త్రానికి ఒక స్పష్టమైన శాస్త్రీయ భాష్యం చెప్పిన మార్క్స్‌-ఎంగెల్స్‌ ద్వయంలో కారల్‌ మార్క్స్‌ ద్విశత జయంతి,(మార్క్స్‌పేరు నుంచి విడదీయజాలని ఆయన స్నేహితుడు, వుద్యమ సహచరుడు ఎంగెల్స్‌కు వయస్సులో తేడా రెండున్నర సంవత్సరాలే) మార్క్స్‌ రచన కాపిటల్‌ మొదటి సంపుటి వెలువడి 150, సంవత్సరాలు, దానిని ఆచరణలోకి తెచ్చి తొలి సోషలిస్టు రాజ్య స్ధాపనకు నాంది పలికిన రష్యన్‌ బోల్షివిక్‌ విప్లవానికి వంద సంవత్సరాలు నిండాయి. దాన్ని కూల్చివేయటంలో సామ్రాజ్యవాదుల కుట్ర,హస్తం వున్నప్పటికీ, అంతర్గత కారణాలు కూడా వున్నందున వందేండ్ల వార్షికోత్సవం అనటం సముచితంగా అనిపించటం లేదు. అందుకే సింహావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది. బోల్షివిక్‌ విప్లవం వునికిలోకి తెచ్చిన ప్రధమ సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ ప్రగతిశీల వాదులు, కమ్యూనిస్టులు సహజంగానే తమ సిద్ధాంతం, ఆచరణ, అనుభవాల గురించి మదింపు వేసుకొని పునరంకిత మయ్యేందుకు ఈ సందర్భాలను వినియోగించుకుంటున్నారు. మరోవైపు తమ దోపిడీని అంతమొందించే కమ్యూనిస్టు తత్వశాస్త్రాన్ని అణగదొక్కేందుకు దోపిడీదార్లు తమ ఆయుధాలకు మరింతగా పదునుపెట్టుకుంటున్న తరుణమిది. తమ లక్ష్యాలను సాధించుకొనేందుకు ఏం చెయ్యాలి? ఎక్కడ మొదలు పెట్టాలి అనే తర్జన భర్జన రెండు వర్గాలలోనూ జరుగుతోంది.

అది బానిస సమాజమైనా, ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ సమాజంలో కూడా దోపిడీ నిరాఘాటంగా కొనసాగటానికి ఆ వర్గాలు ఎన్నో ఆయుధాలను కనుగొన్నాయి, నవీకరించుకున్నాయి. ఇదే సమయంలో ప్రతి చోటా సర్వేజనా సుఖినోభవంతు అని సర్వజన సంక్షేమాన్ని కోరుకున్నవారెందరో వుద్భవించారు. వారంతా సంస్కర్తలుగానే మిగిలిపోయారు. ఆ క్రమంలోనే మరెందరో దోపిడీ వ్యతిరేక పోరులో తమ ప్రాణాలనే అర్పించారు.తమ కాలపు దోపిడీ నగ్న స్వరూపాన్ని గమనించి, సమ సమాజమార్పును తమ ముందుతరాల వారి తత్వం,భావజాలం, త్యాగనిరతిని ఆపోసన పట్టిన వారిలో ఒక రైన మార్క్స్‌ వర్గాల వేల సంవత్సరాలుగా దోపిడీకి గురవుతున్న వర్గానికి దీనిలో జయాపజయాలు ఎవరివి?

అది 1917 అక్టోబరు 25 రాత్రి, సెంట్‌పీటర్స్‌బర్గ్‌లోని రష్యా అధికార కేంద్రమైన వింటర్‌ పాలెస్‌. ఎప్పుడేం జరుగుతుందో, ఒకవైపు కెరెన్క్సీ ప్రభుత్వ నాయకత్వంలోని జార్‌ సేనలు, మరోవైపు బోల్షివిక్‌ తిరుగుబాటుదారులు వుత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సాయంత్రమే అందాల్సిన సంకేతం రాక బోల్షివిక్‌లలో క్షణ క్షణానికి పెరుగుతున్న ఆతృత…. సరిగ్గా 9.45 బాల్టిక్‌ సముద్రతీరంలోని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ రేవులో మరమ్మతుల కోసం లంగరు వేసిన అరోరా యుద్ధ నౌక నుంచి ఫిరంగి పేలుడు. ఏ రష్యన్‌ సామ్రాజ్యవాదుల తరఫున జపాన్‌ సామ్రాజ్యవాదులపై దాడి జరిపిందో అదే యుద్ద నౌకలోని నావికులు తిరుగుబాటు చేసి శ్రామికుల పక్షాన అదే ఫిరంగి పేల్చారు.(పెట్టుబడిదారులు తమకు లాభాలను చేకూర్చే కార్మికులతో పాటు తమ దోపిడీని అంతం చేసే శ్రామికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేయటం అంటే ఇదే. విప్లవ పరిస్ధితులే వస్తే శ్రామికవర్గం ఆయుధాల కోసం తడుముకోనవసరం లేదు) అంతే బోల్షివిక్‌ యోధులు దాడి ప్రారంభించారు. తెల్లవారు ఝామున అంటే 26వ తేదీ వుదయం రెండు గంటలకు వింటర్‌ పాలెస్‌ పూర్తిగా కమ్యూనిస్టుల వశమైంది. ఎర్రజెండా రెపరెపలాడింది. తిరుగబాటు సైరన్‌ మోగిన అక్టోబరు 25 తరువాత కాలంలో సవరించిన రష్యన్‌ కాలండర్‌ ప్రకారం నవంబరు ఏడవ తేదీ అయింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే అక్టోబరు విప్లవం, నవంబరు విప్లవం అన్నా రెండూ ఒకటే.(పదకొండు సంవత్సరాల క్రితం ఈ వ్యాస రచయితకు వింటర్‌ పాలెస్‌ పరసరాలు, అరోరా నౌక, నెవా నది తదితర ప్రాంతాలను సందర్శించే అవకాశం వచ్చిందని తెలపటానికి సంతోషంగా వుంది)

పెద్ద కుదుపుతో చరిత్ర గతిని మరో మలుపు తిప్పిన సందర్భమది. అందుకే ప్రఖ్యాత అమెరికన్‌ జర్నలిస్టు జాన్‌ రీడ్‌ ఆ సమయంలో ప్రత్యక్షంగా చూసిన పరిణామాలను వర్ణిస్తూ ‘ప్రపంచాన్ని కుదిపివేసిన పది రోజులు’ అనే పేరుతో గ్రంధస్థం చేశారు. దోపిడీని శాశ్వతం చేసుకొనేందుకు దోపిడీదార్లకు ఆ వర్గం నేర్పిన పాఠాలు అపారం. దోపిడీకి మతం, కులం, ప్రాంతం, భాష, రంగు, ఆడమగా తేడా లేదు. అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే. కానీ దోపిడీదార్లను, దోపిడీని అంతం చేసే శ్రామికవర్గ ఐక్యతను దెబ్బతీసేందుకు పైన చెప్పుకున్న సకల అవకాశాలనూ వాడుకోవటాన్ని మనం గమనించవచ్చు. కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడక ముందే మన దేశంలో ప్రవేశించిన ఆంగ్లేయ పెట్టుబడిదారులు, పాలకులు, వారిని అనుసరించిన స్వదేశీ పెట్టుబడిదారులు పైన చెప్పుకున్న అంశాలన్నింటినీ వినియోగించుకున్నారు. ఇప్పటికీ వాటిని ప్రయోగిస్తున్నారు. అందువల్లనే శ్రామికుల మధ్య ఐక్యమత్యం సాధించటానికి, తామంతా ఒక్కటే అనే చైతన్యం కలిగించటానికి ఎంత సమయం పడుతుందో, ఆ తరుణం కోసం ఎంతకాలం వేచి చూడాలో ఎవరు జోస్యం చెప్పగలరు. అందులోనూ అనేక కులాలు,భాషలు, సంప్రదాయాలు, సామాజిక అసమానతలు, వివక్షతో కూడిన నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధ వేల సంవత్సరాలుగా వేళ్లూనుకొని నర నరాన జీర్ణించుకుపోయిన మన దేశంలో శ్రామికవర్గ ఐక్యతను సాధించటానికి ఇంకా ఎక్కువ శ్రమపడటం తప్ప దగ్గరదారులు లేవు.

మొత్తం సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతానికి తీవ్ర ఎదురు దెబ్బలు తగిలి, పురోగమనానికి అనేక ఆటంకాలు ఏర్పడిన సమయమిది. అందువలన పురోగామి వాదులు తలా ఒక చేయి వేసి ఈ మహోద్యామాన్ని ముందుకు తీసుకుపోయేందుకు పూనుకోవాల్సిన అవసరం వుంది. కమ్యూనిజం అంతమైంది, తిరిగి లేవకుండా దాన్ని పూడ్చిపెట్టాం, చరిత్ర ముగిసింది అని చెప్పినవారికి గతంలో లేని కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వంద సంవత్సరాలకు ముందు ముందు వరకు పెట్టుబడిదారీ, భూస్వామిక వ్యవస్ధ కంటే వూహాజనితమైన సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యవస్ధలు ఎలా మెరుగ్గా వుంటాయో చెప్పి జనాన్ని ఒప్పించేందుకు కమ్యూనిస్టులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఈ వందసంవత్సరాలలో సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలు విఫలమైనప్పటికీ అచిర కాలంలోనే అవిసాధించిన విజయాలను అంతసులభంగా తుడిచిపెట్టలేరని తేలిపోయింది. కొంత కాలం సోషలిస్టు వ్యవస్ధలో జీవనం గడిపి, తిరిగి పెట్టుబడిదారీ వ్యవస్ధలోకి పోయిన చోట్ల కొంత మంది అయినా సోషలిస్టు వ్యవస్ధ గురించి బెంగ పెట్టుకున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అదే పెట్టుబడిదారీ విధానం గురించి దోపిడీ శక్తులు తప్ప సామాన్యులు బెంగపెట్టుకున్నట్లు మనకు ఎక్కడా కనపడదు. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్ధలో పునరావృతం అవుతున్న సంక్షోభాలు పూర్వం వచ్చిన వాటికంటే తీవ్రంగా వుండటంతో పాటు, అనేక తీవ్ర సమస్యలను ముందుకు తెస్తున్నాయి. కొత్త సమాజం గురించి ఆశలేకపోయినా వున్న సమాజం ఎంత త్వరగా పోతే అంత మంచిదని ప్రతి పెట్టుబడిదారీ దేశంలోని శ్రామికులు భావిస్తున్నారు. వంద సంవత్సరాలకు ముందు ఒక్క పెట్టుబడిదారీ సమాజం తప్ప దానితో పోల్చుకొనేందుకు మరొక వ్యవస్ధ లేదు. పెట్టుబడిదారీ వ్యవస్ధలతో పోల్చినపుడు సోషలిస్టు వ్యవస్ధలు తక్కువకాలంలోనే అభివృద్ది చెందుతాయి అనటానికి విఫలమైనప్పటికీ గతంలో సోవియట్‌ యూనియన్‌, వర్తమానంలో చైనా మన కళ్ల ముందున్నాయి. అందువలన ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్ధలతో పాటు, ఎక్కడేం జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా తెలుసుకోగలిగిన ఆధునిక సమాచార వ్యవస్ధ అందుబాటులోకి వచ్చింది.

రొడీషియా పేరుతో గుర్తింపు లేని బ్రిటీష్‌ వారి స్వయం పాలిత వలస రాజ్యంగా వున్న ఆఫ్రికా ఖండంలోని నేటి జింబాబ్వేలో తొలిసారిగా ఈ ఏడాది కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. అనేక కమ్యూనిస్టుపార్టీల మాదిరే అది దక్షిణాఫ్రికాలోని జింబాబ్వే ప్రవాస కార్మికులతో అది ఏర్పడింది.గతంలో రొడీషియా వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమంలో కమ్యూనిస్టులు కూడా భాగస్వాములుగా వున్నారు.1940వ దశకంలో ఏర్పడిన కమ్యూనిస్టుపార్టీని నాటి పాలకులు నిషేధించారు. దాంతో కమ్యూనిస్టులు జాతీయోద్యమానికి ప్రాతినిధ్యం వహించిన రెండు పార్టీలలో భాగస్వాములుగా పని చేశారు.1980లో స్వతంత్ర జింబాబ్వే ఏర్పడిన తరువాత ప్రజాస్వామిక మార్పు కొరకు వుద్యమం( మువ్‌మెంట్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ ఛేంజ్‌(ఎండిసి) పేరుతో సాగిన సంస్ధలో పని చేశారు.

అనేక అనుభవాల తరువాత ఎండిసి, ప్రవాసంలో దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీలోసభ్యులుగా వున్న జింబాబ్వియన్లు తాజాగా కమ్యూనిస్టుపార్టీని ఏర్పాటు చేశారు.అదింకా బాల్యావస్ధలోనే వుంది. వచ్చే ఏడాది అక్కడ జరిగే ఎన్నికలలో తాము పాల్గనటం లేదని, ఇతర ప్రతిపక్షపార్టీల మాదిరి అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబేను గద్దెదింపే లక్ష్యం తమ ముందు లేదని, గత కొద్ది సంవత్సరాలుగా గిడసబారిపోయిన దేశ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించి ప్రజలకోసం వుపయోగపడే విధంగా చేసే అంశాలను చర్చకు పెడతామని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నకబుతో మహెబినా ప్రకటించారు. ప్రపంచంలో తాజాగా ఏర్పడిన కమ్యూనిస్టుపార్టీ ఇదని చెప్పవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన తరువాత కూడా కార్మికులను విముక్తి చేయగలిగేది కమ్యూనిజం ఒక్కటే అనే విశ్వాసం ప్రపంచంలో ప్రతి మూలా నిత్యం వ్యక్తమౌతుందటం.

ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిజాన్ని అంతం చేస్తామంటూ కత్తి పట్టుకు తిరుగుతున్న అమెరికాలోనే నూతన సహస్రాబ్ది యువతలో 42శాతం మంది సోషలిస్టు వ్యవస్తే సురక్షితంగా వుంటుందని నమ్ముతుండగా, ఏడుశాతం మంది ఎలాంటి శషభిషలు లేకుండా తాము సోషలిస్టు వ్యవస్ధలోనే జీవించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేసినట్లు తాజాగా జరిగిన సర్వేలో వెల్లడైందని ఒక సంస్ధ వెల్లడించింది. అమెరికా యువతలో ఇలాంటి ధోరణులు వెల్లడి కావటం పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించేదైతే, అభ్యుదయ వాదులకు అంతకంటే ఆనందం కలిగించేదేముంటుంది? వివరాల కొరకు వచ్చే భాగం వరకు వేచి చూడండి.

(గమనిక:సోషలిస్టు దేశాలలో సంభవిస్తున్న మార్పులు, అనుభవాలు, గుణపాఠాల గురించి తద్దినం మాదిరి ఆరోజుకు స్మరించుకొని మరుసటి రోజు నుంచి మరచి పోవటం కాకుండా నిరంతర మధనం కొనసాగించాలి. ఆ ప్రయత్నంలో భాగంగా తరువాయి భాగాలలో మరికొన్ని అంశాలను రేఖా మాత్రంగా అయినా ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తాను.)

Share this:

  • Tweet
  • More
Like Loading...

వివాదాస్పద విదేశీ ఆర్ధికవేత్త విఫల స్వదేశీ నరేంద్రమోడీని గట్టెక్కిస్తారా ?

20 Friday Oct 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

behavioural economics, Consumer Affairs, economist richard thaler, Narendra Modi, Nobel economics prize, swadesi

కొండూరి వీరయ్య

అర్థశాస్త్రంలో 2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ బహుమతి రిచర్డ్‌ థేలర్‌ను వరించింది. దానివల్ల అర్థశాస్త్ర పరిశోధనా రంగంలో ఉన్న మేధావులు ఎంతైనా చర్చించుకోవచ్చు. కానీ థేలర్‌కు నోబెల్‌ బహుమతి రావటం పట్ల దేశంలో బిజెపి సంబరాలు చేసుకోవటమే ఈ వ్యాసానికి నేపథ్యం. థేలర్‌ను ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించిన వెంటనే బిజెపి ఐటి సెల్‌ ( దేశవ్యాప్తంగా బిజెపి, ప్రధాని పేరు మీద ప్రచారమవుతున్న అవాకులు, చవాకులు, అర్థ సత్యాలు, అసత్యాలు, నిరాధారమైన అభిప్రాయాల పోగు పోసే కేంద్రం – సంక్షిప్తీకరణ కోసం బిజెపి గోబెల్స్‌ విభాగం అని పిలుద్దాం) సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన వెలువడించింది. మోడీ అమలు చేసిన నోట్ల రద్దు పథకాన్ని థేలర్‌ సమర్ధించాడు అన్నది ఈ ప్రకటన సారాంశం. నోబెల్‌ విజేత పేరు ప్రకటించగానే బిజెపి ఐటి సెల్‌ అధ్యక్షుడు అమిత్‌ మాలవీయ తన ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. యథా ప్రకారం ఈ ప్రకటనను సుక్షితులైన బిజెపి ఐటి కరసేవకులు దేశమంతా వ్యాపింపచేశారు. థేలర్‌ నోబెల్‌ విజేత కావటానికి, మోడీ నోట్ల రద్దు నిర్ణయానికి ఏమిటి సంబంధం ?

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ గురించిన చర్చను భారతదేశంలో నోట్ల రద్దు అనుభవాలతో పోల్చవచ్చు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి దఫా సమర్ధకులు ముందుకు తెచ్చిన వాదన ఇలా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నగదు వినియోగం వల్లనే ఆర్థిక వ్యవస్థ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. నగదు పట్ల ప్రజల మక్కువ తగ్గించాలంటే నగదు పనికిరాని కాగితం కింద మార్చటం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో వారి ప్రవర్తన, కొనుగోళ్ల పద్దతి, ప్రాధాన్యతలనను నగదురహిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించటానికి నోట్లు రద్దు నిర్ణయం ఉపయోగపడుతుంది అన్నది ఈ విశ్లేషణల సారాంశం. ఈ సందర్భంగానే తొలిసారిగా పామర చర్చల్లో సైతం ఆర్థిక లావాదేవీలు- ప్రవర్తనాశీలత (బిహేవియరల్‌ ఎకనమిక్స్‌) గురించిన చర్చ సార్వత్రికమైంది. నగదు రహిత లావాదేవీల ప్రయోజనాల గురించి బిజెపి గోబెల్స్‌ విభాగం కంప్యూటర్లెక్కి కూయటమే కాదు. మన జేబుల్లో ఉన్న సెల్‌ఫోన్లల్లో కూడా అర్థరహిత సమాచారాన్ని నింపేసింది. ఇదే నిజమని నమ్మిన పలువురు మేధావులు, ఆర్థిక వేత్తలు, ఆరెస్సెస్‌-బిజెపి కంప్యూటర్‌ కరసైనికులతో గొంతు కలిపి నోట్ల రద్దు విమర్శకుల నోళ్లు మూయించటానికి విశ్వ ప్రయత్నం చేశారు.

విదియ నాడు కనపడకపోతే తదియ నాడు కనపడుతుంది అని తెలంగాణలో ఒక సామెత ఉంది. అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరి వంటి వాళ్ల మొదలు నోట్ల రద్దుకు సిపార్సు చేసిన గురుమూర్తి వంటి వారంతా ఆర్థిక వ్యవస్థ పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తూ వరుసగా నోళ్లు తెరిచారు. గత ఆర్నెల్లుగా ఈ ప్రమాదాన్ని వామపక్ష ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తూనే వచ్చారు. నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపలేము కదా… ఈ విమర్శల పట్ల ప్రభుత్వ స్పందన ఈ సామెతనే గుర్తు తెస్తోంది. రెండ్నెల్ల క్రితం స్వయంగా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన వార్షిక నివేదికలో నోట్ల రద్దు నిర్ణయంతో ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు అని నిర్దారించింది. ఆగస్టు చివరి వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సర్వేలో నోట్ల రద్దు, జిఎస్టీ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్త కుంగిపోయింది అన్న అంచనాను వెల్లడించింది. బిజెపి గోబెల్స్‌ విభాగం మోడీ నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికి థేలర్‌ను అరువు తెచ్చుకొంటోంది. నిజంగా నోట్ల రద్దు మీద థేలర్‌ అభిప్రాయం ఏమైనా ఈ రకమైన అరువుతెచ్చుకున్న మద్దతు ద్వారా కుదేలైన ఆర్థిక వ్యవస్థ బతికి వస్తుందా అన్న ప్రశ్నకు బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు, వారిని పనికి పురామాయించిన పెద్ద తలకాయలు సమాధానం ఇవ్వాలి.

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌కు పునాదులు ఆధునిక వినిమయ వాదంలో ఉన్నాయి. సరళీకరణ విధానాల ఆరంభానికి ముందు ఆర్థిక నిర్ణయాలు ప్రధానంగా వ్యవస్థాగతంగా ఉండేవి. అంటే ఆయా దేశాల రాజకీయ ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలు, పురోగతి నేపథ్యంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునే పద్ధతి. ఈ క్రమంలో జాతీయ వనరులు అర్థవంతమైన వినియోగంతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాల రేటుపై నియంత్రణలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థను బతికించటానికి కీన్స్‌ ముందుకు తెచ్చిన సంక్షేమ ఆర్థిక విధానాలు, వాటి ద్వారా సాధారన ప్రజానికి కలిగే కొద్దిపాటి వెసుబాట్లు కూడా దిగమింగటం పెట్టుబడిదారీ వ్యవస్థకు సాధ్యం కాలేదు. దాంతో సంక్షేమ ఆర్థిక విధానాలపై మొదలైన మితవాద ఆర్థికవేత్తల దాడిలో ఒక కోణమే బిహేవియరల్‌ ఎకనమిక్స్‌. ఈ ధోరణి ప్రకారం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రతి వ్యక్తీ వినియోగదారుడే. వినియోగపు అస్థిత్వమే వ్యక్తి అస్థిత్వంగా మారుతుంది. ప్రపంచీకరణ విధానాలు పుంజుకున్న తర్వాత ఈ ధోరణి మరింత ముదిరి నిర్ణీత మోతాదులో వినియోగం చేయలేని వాళ్ల గురించి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం లేదు అనేంత వరకు వెళ్లింది. ఆధునిక మాల్స్‌లో ఖరీదైన వస్తువుల అమరిక ఆరోహణ క్రమంలో అమర్చటాన్ని మనం రోజూ గమనిస్తూనే ఉంటాం. కొనుగోలు చేసే వస్తువుల ఖరీదును బట్టి కొనుగోలుదారుడికి అందే సమపర్యలుంటాయి.

వాణిజ్య ప్రకటనల కోలాహలం బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ పునాదిగా పెరిగిన ధోరణే. ఈ వాణిజ్య ప్రకటనల వెనక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఉత్పత్తుల గురించిన సమాచారాన్ని వినియోగదారుల వద్దకు చేర్చటమే కాదు. తమ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని వారిని ప్రభోదించటం, ప్రభావితం చేయటం కూడా. సూత్ర రీత్యా బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ చెప్పేది విస్తృతమైన ప్రత్యామ్నాయాలు (ఒకే సరుకు వివిధ బ్రాండ్లలో) అందుబాటులో ఉంటే నచ్చింది ఎంచుకునే స్వేఛ్చ వినియోగదారుడికి ఉంటుంది. ఈ ఆర్థిక సూత్రీకరణలో ప్రధాన లోపం ఉంది. అది వినియోగదారుల ఆర్థిక సామాజిక స్థాయి, కొనుగోలు శక్తి, అవసరాలుతో నిమిత్తం లేకుండా మూసపోసిన కొనుగోలుదారుల మందను తయారు చేయటమే ఈ లోపం.

ఈ ధోరణి మరో చర్చను కూడా ముందుకు తెస్తుంది. ఇది మరింత ప్రమాదకరమైనది. డేటా మోడలింగ్‌తో ముడిపడిన అంశం ఇది. దీన్ని పరిశీలించటానికి ఆర్థిక రంగం కంటే రాజకీయ రంగం మరింత అర్థవంతంగా ఉంటుంది. 2013 మొదలు 2017 సెప్టెంబరు వరకు బిజెపి, మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇది. ప్రజలను నిర్దిష్ట ఆలోచనలు, అవసరాలు, అవగాహనలు, అస్థిత్వాలు ఉన్న వ్యక్తులుగా కాక తమ సమాచార సరఫరాకు క్షేత్రంగా మాత్రమే చూసే ధోరణి. ఒక సారి వ్యక్తులు తమ సామాజిక అస్థిత్వం కోల్పోయిన ప్రయోగశాలలో పరిశీలనావస్తువులుగా మారిన తర్వాత వారి నిర్ణయాలను ప్రభావితం చేయటంలో డేటా మోడలింగ్‌ ద్వారా చూపించే ప్రొజెక్షన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. 2014 ఎన్నికల్లో మోడీ అనుసరించిన ప్రచార వ్యూహం ఇది. ఆ తర్వాత కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విధంగా ఓటర్లు, ప్రజల రాజకీయ అభిప్రాయాలు ప్రభావితం చేయటం ద్వారా ఓటింగ్‌ విషయంలోనూ లేదా ప్రభుత్వ నిర్ణయాలను అంచనా వేసే విషయంలోనూ తప్పు దారి పట్టించటం ద్వారా తమ ప్రభుత్వం తమ పబ్బం గడుపుకుంటున్న తీరును గమనిస్తూనే ఉన్నాము. ఇదే ధోరణి బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ ద్వారా వస్తూత్పత్తుల వినియోగం విషయంలో కొనుగోలు దారుల బ్రెయిన్‌ వాష్‌ చేసే టెక్నిక్కులు విపరీతంగా రూపొందించబడతాయి. ఇదే ధోరణిని తాజాగా హిందూత్మ మతోన్మాద శక్తులు వంటబట్టించుకున్నాయి.

కీన్స్‌ విధానాలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సామాజిక అవసరాలు తీర్చటానికి ఉపయోగపడే సమీకృత, పరస్పరాధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తెస్తే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో సమాంతరంగా పుట్టుకొచ్చిన బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ వికేంద్రీకృత ఆర్థిక విధాన నిర్ణయ వ్యవస్థను ముందుకు తెస్తుంది. ఈ ధోరణిలో ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగానికి ఆ రంగం పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఆయా రంగాల లాభాల రేటును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం జరుగుతుంది. దాంతో స్థూల ఆర్థిక వ్యవస్థలో ఉండాల్సిన సమతౌల్యం దెబ్బతింటోంది. ప్రణాళికా రంగం రద్దు చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు దీనికి సరైన ఉదాహరణ.

అమెరికాలో ఒబామా ప్రభుత్వం గానీ ఇంగ్లాండ్‌లో టోనీ బ్లెయిర్‌ ప్రభుత్వంగానీ తమ కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా సామాజిక ప్రవర్తనా శాస్త్రవేత్తల బృందాలను నియమించి పాలకవర్గం అవసరాల నేపథ్యంలో ప్రజల మనోభావాలు ప్రభావితం చేయటానికి తద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ధ్యాన్ని ప్రభావితం చేయటానికి అవసరమైన ప్రయోగాత్మక విధానాలు రూపొందించాయి. ఆయా దేశాల నుండి పాఠాలు నేర్చుకున్న మోడీ ప్రభుత్వం అవే ప్రయోగాత్మక విధానాలు భారతదేశంలో అమలు చేయటం ద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ద్యాన్ని అన్ని వేళలా ప్రభావితం చేయాలనుకొంటోంది.చేయగలననుకొంటోంది. ఏదైనా కీలక సందర్భం, సమస్య ముందుకొచ్చినపుడు ప్రజల దృష్టిని మళ్లించటానికి అవరమైన అప్రాధాన్య విషయాలను, అర్థసత్యాలను, అసత్యాలను, నిరాధారమైన విషయాలను ప్రజల ముందు కుప్పలు పోయటానికి బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. బిహేవియరల్‌ ఎకనమిక్స్‌లో సరైన నిర్ణయం అంటే కంపెనీల లాభాలు పెంచేందుకు దోహదం చేసేది. బిహేవియరల్‌ పాలిటిక్స్‌లో సరైన నిర్ణయం అంటే పాలకవర్గాల ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్లేంది. ప్రజలు గొర్రెల మంద కాదు. ఈ రెండు రకాల ప్రమాదాల నుండి సగటు మనిషి తన సామాజిక రాజకీయ జంతువుగా (అరిస్టాటిల్‌ అన్నట్లు) తన అస్థిత్వాన్ని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నమే ఇటువంటి కుహనా సిద్ధాంతాలపై సాగించే పోరాటంలో అంతర్భాగమవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా కనుసన్నలలో ఇండోనేషియా కమ్యూనిస్టుల వూచకోత !

19 Thursday Oct 2017

Posted by raomk in Communalism, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ 1 Comment

Tags

Anti-Communist Massacre, cia, Indonesian Communist Party (PKI)., PKI, Suharto’s Purge, Sukarno, US hand in 1960s Indonesia Anti-Communist Massacre

ఎం కోటేశ్వరరావు

పీడకుల నుంచి పీడితులను కాపాడి సమసమాజాన్ని స్ధాపించే మహత్తర కృషిలో కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు అభిమానులు ప్రపంచంలోని అనేక దేశాలలో చిందించిన రక్తం, చేసిన ప్రాణత్యాగాలు మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిలో ఇండోనేషియా కమ్యూనిస్టులకరు. దేశంలో అంతర్యుద్ధం చెలరేగి కమ్యూనిస్టులు ఆయుధాలు చేపట్టి పీడకులపై పోరు సల్పినపుడు వారిని చంపివేశామని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రకటించుకుంటే దాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు.ఎలాంటి తిరుగుబాటు, పోరు లేకుండానే యాభై రెండు సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు పదిలక్షల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, వారి కుటుంబసభ్యులు, సానుభూతిపరులని అనుమానం వున్న వారిని అక్కడి సైన్యం వూచకోత కోసింది. సైన్యానికి మహమ్మదీయ పేరుతో వున్న ఒక సంస్ధను కూడా తోడు చేసి వారికి ఆయుధాలిచ్చి హత్యాకాండకు కమ్యూనిస్టులను గుర్తించటం, హత్య చేయటానికి వుపయోగించుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద మానవహక్కుల పరిరక్షకులమని చెప్పుకొనే అమెరికన్లకు ఈ దారుణ మారణకాండ వారి ఎరుకలోనే జరిగిందని, హత్యాకాండ పట్ల హర్హం వ్యక్తం చేస్తూ నివేదికలు పంపిన విషయాన్ని మంగళవారం నాడు అమెరికా ప్రభుత్వమే స్వయంగా వెల్లడించిన పత్రాలు తెలిపాయి. ఆ వూచకోతలో అమెరికా, దాని మద్దతుదారుగా వున్న బ్రిటన్‌ వూచకోతను సాగించేందుకు ఇచ్చిన తోడ్పాటును ఈ పత్రాలు నిర్ధారించాయి. ఇవి అమెరికాకు ఇబ్బందిలేని రీతిలో జాగ్రత్తగా ఎంపిక చేసి బహిర్గతపరచినవని గమనించాలి. పూర్తి సమాచారం తెలియాలంటే సిఐఏతో సహా మిగిలిన అన్ని పత్రాలను విడుదల చేయాల్సి వుంది. ఆ సమయంలో కమ్యూనిస్టుల తిరుగుబాటు, అధ్యక్షుడిగా వున్న ఇండోనేషియా జాతీయవాది సుకర్ణో ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్లు జరిపిన తప్పుడు ప్రచార బండారాన్ని ఇవి బయట పెట్టాయి. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే పధకంలో భాగంగా అమెరికా కనుసన్నలలో జరిగిన కుట్రలో మిలిటరీ జనరల్‌ సుహార్తో నాయకత్వంలో సుకర్ణోను బందీని చేసి ఆయన పేరుతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

1965ా66 సంవత్సరాలలో జరిపిన ఈ వూచకోతకు సంబంధించి జకర్తాలోని అమెరికా రాయబారకార్యాలయంలో వున్న 39 రహస్య పత్రాలను విడుదల చేశారు. ఇండోనేషియా వూచకోత వాస్తవాలను వెల్లడించాలని అక్కడి పౌరహక్కుల సంస్దలు, చరిత్రకారులు గతకొద్ది సంవత్సరాలుగా చేస్తున్న డిమాండ్‌కు ఇవి కొంత మేరకు వుపయోగపడతాయి. అసలైన నిందితులను బోనులో నిలబెట్టేందుకు ఇంకా ఎంతో చేయాల్సి వుంటుంది. తన ప్రయోజనాలకు హానిలేవు అనుకున్న పత్రాలను మాత్రమే అమెరికా విడుదల చేస్తుంది అనే విషయాన్ని సదా గమనంలో వుంచుకోవాలి. నేషనల్‌ సెక్యూరిటీ అర్కైవ్స్‌ పేరుతో వున్న ఒక సంస్ధ ద్వారా ఇలాంటి పత్రాలను విడుదల చేస్తారు.

‘1965ా66లో ఇండోనేషియాలో జరిగిన సామూహిక హత్యల గురించి అమెరికా అధికారులకు వివరంగా తెలుసునని కొత్తగా విడుదల చేసిన పత్రాలు స్పష్టం చేశాయి. ‘ ఇది 20శతాబ్దంలో జరిగిన ఒక దారుణమైన కిరాతకాన్ని చరిత్రగా నమోదు చేయటానికే కాదు, ఎప్పుడో జరగాల్సిన బాధితుల బాధానివారణ దిశగా కూడా అన్ని పత్రాలను విడుదల చేయాలని’ నేషనల్‌ సెక్యూరిటీ సంస్ధ ఆసియా డిప్యూటీ డైరెక్టర్‌ ఫెలిమ్‌ కినే వ్యాఖ్యానించారు. 1965 నుంచి 1968 వరకు జరిగిన పరిణామాలకు సంబందించి దాదాపు 30వేల పేజీలున్న 39 పత్రాలను విడుదల చేశారు. వాటిలో టెలిగ్రాములు, లేఖలు, రహస్య వర్తమానాలు, పరిస్ధితి గురించి మదింపు నివేదికల వంటివి వున్నాయి.

గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా నియంత సుహార్తో మరణించిన తరువాత అక్కడ పౌర ప్రభుత్వాలు ఏర్పడి నప్పటి నుంచి కమ్యూనిస్టులపై జరిపిన మారణకాండ వివరాలను బయటపెట్టాలని ఏదో ఒక రూపంలో అక్కడ ఆందోళన కొనసాగుతున్నది. అదే సమయంలో ఆవివరాలను ఏమైనా సరే బయటపెట్టకూడదని మిలిటరీ తీవ్ర వత్తిడి తెస్తున్నది. సుహార్తో మరణానంతరం పౌరపాలకులే అధికారంలో వున్నప్పటికీ తెరవెనుక మిలిటరీదే అధికారం. నిషేధిత కమ్యూనిస్టు పార్టీని తిరిగి పునరుద్దరించే యత్నాలు జరుపుతున్నారనే పేరుతో మిలిటరీ ప్రోద్బలంతో గతం నుంచి మిలిటరీతో సంబంధాలున్న మహమ్మదీయ సంస్ధ వారసులు కొత్త పేరుతో ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఎర్రరంగు టీ షర్టు వేసుకున్నా కమ్యూనిస్టు అనే అనుమానంతో పోలీసులు పట్టుకొని విచారణ జరుపుతున్నారు. కమ్యూనిస్టు సాహిత్యం అమ్మేవారిని కూడా పోలీసు స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. నాటి వూచకోతకు సంబంధించి బంధువులకు న్యాయ సహాయం అందించేందుకు ఒక హాలులో ఏర్పాటు చేసిన సమావేశం కమ్యూనిస్టుల మీటింగ్‌ అంటూ ముస్లిం మతోన్మాదులతో దానిపై దాడి చేయించారు. అదే విధంగా కమ్యూనిస్టుపార్టీని పునరుద్దరించకూడదనే పేరుతో తలపెట్టిన ప్రదర్శనలో జనం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పాతికవేల మంది వరకు పోలీసులు రక్షణగా పాల్గన్నారు. యువతరానికి చరిత్రను తెలియ చెప్పాలనే పేరుతో కమ్యూనిస్టులను హత్యచేయటాన్ని సమర్ధిస్తూ మిలిటరీ తరఫున తీసిన చిత్రాన్ని ప్రతిఏటా సెప్టెంబరు 30 టీవీలు, ఇతర చోట్ల ప్రదర్శించేవిధంగా మిలిటరీ చర్యలు తీసుకొంటోంది. వాస్తవాలను చెప్పే డాక్యుమెంటరీల ప్రదర్శనలను అడ్డుకుంటోంది. ఈ పూర్వరంగంలో పరిమితమైన సమాచారాన్నే వెల్లడించినప్పటికీ ఈ పత్రాల విడుదల హక్కుల వుద్యమానికి మరింత వూపు తెస్తాయి. ఇప్పటికీ కమ్యూనిస్టులను హతమార్చటాన్ని అధికారికంగా సమర్ధిస్తూనే వున్నారు. మరణించిన వారు కనీసంగా ఐదు నుంచి పదిలక్షల మంది వరకు వుంటారని అంచనా. ఇంతకాలం గడిచినా తమవారి అదృశ్యం గురించి ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులకు రక్షణ లేదు.ఇండోనేషియాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తిరుగుబాటులో భాగంగా 1965 సెప్టెంబరు 30న ఆరుగురు మిలిటరీ జనరల్స్‌ను కమ్యూనిస్టులు హత్య చేశారనే ఆరోపణతో మిలిటరీ మారణకాండకు పాల్పడింది. నిజానికి ఆ జనరల్స్‌ను కుట్రలో భాగంగా సుహార్తోయే చంపించారన్నది బహిరంగ రహస్యం. వారు కమ్యూనిస్టు అనుకూల మిలిటరీ అధికారులనే అభిప్రాయం కూడా వుంది.

సిఐఏ ద్వారా పధకాన్ని రూపొందించటం ఐదువేల మంది ప్రముఖ కమ్యూనిస్టుల వివరాలు, మిలిటరీకి ఆయుధాలు,ముస్లింమతోన్మాదులకు శిక్షణ, నిధులు అందచేసిన అమెరికా ప్రభుత్వ పాత్ర వివరాలు ఇంకా బయటకు రావాల్సి వుంది. 1990లో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చిన అమెరికా రాయబారకార్యాలయం ఒక అధికారి తనంతటతానే ఒక జాబితాను రూపొందించి ఇచ్చినట్లు అంగీకరించింది. సామూహిక మారణకాండ గురించి నాటి అమెరికా అధికారులు ఎంత సంతోషంగా వర్తమానం పంపారో మచ్చుకు చూడవచ్చు.’ రెండున్నర వారాలలో లక్షమందిని నమ్మశక్యంగాని రీతిలో ఆమీట వూచకోత కోసింది’ అని జకర్తాలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రధమ కార్యదర్శి మారీ వాన్స్‌ ట్రెంట్‌ పంపిన వర్తమానంలో వుంది. 1966లో సిఐఏ అధికారి ఎడ్వర్డ్‌ మాస్టర్స్‌ ఒక వర్తమానంలో ‘బందీలుగా పట్టుకున్న కమ్యూనిస్టుల’ సమస్య గురించి చర్చించారు. ‘ కమ్యూనిస్టు ఖైదీలను వురితీయటం లేదా పట్టుకోక ముందే వారిని చంపివేయటం ద్వారా అనేక ప్రాంతాలు ఈ సమస్యను విజయవంతంగా అధిగమించాయి. దానిలో ముస్లిం యువజన బృందాల కర్తవ్యం ఏమంటే వారికి సహాయం అందచేయటం’ అని పేర్కొన్నాడు. నిజానికి ఈ పత్రాలను 2001లోనే సిద్ధం చేశారు గాని, 16 సంవత్సరాల తరువాత మంగళవారం నాడు విడుదల చేశారు. ‘ మాకు నిజంగా తెలియదు వాస్తవ సంఖ్య లక్షో పదిలక్షలో తెలియదని పేర్కొన్న 1966 ఏప్రిల్‌ నాటి ఒక వర్తమానం విడుదల చేసిన వాటిలో వుంది. సుకర్ణోను గద్దె దించితే ఇండోనేషియాకు అమెరికా సాయం అందచేస్తుంది అనే ఒక వర్తమాన పత్రం కూడా వీటిలో వుంది. మిలిటరీ నియంత సుహార్తో తన అధికారాన్ని సుస్ధిరం చేసుకున్నారని నిర్ధారించుకున్న తరువాత 1966 మార్చి నెల నుంచి అమెరికా సాయం ప్రారంభమైంది.

ఈ పత్రాలను విడుదల చేయాలంటూ 2015లో అమెరికా సెనెట్‌లో ఒక బిల్లును ప్రతిపాదించిన టామ్‌ వుడాల్‌ పత్రాల విడుదల గురించి వ్యాఖ్యానిస్తూ ‘ దారుణమైన నేరాలకు పాల్పడిన సమయంలో ఇండోనేషియా ప్రభుత్వానికి తోడ్పడిన తీరును కూడా ఎంతగానో ఇవి వెల్లడిస్తాయి. ఇండోనేషియాలో ఈ హత్యల వెనుక వున్న వారు అనేక మంది ఎలాంటి శిక్షలు లేకుండా ఇప్పటికీ జీవించి వున్నారు. బాధితులు, వారి వారసులను వెనక్కు నెట్టారు, గుర్తింపు లేకుండా పోయింది.దీనిలో అమెరికా తన పాత్ర గురించి ఘర్షణ పడాలి, దాన్ని అంగీకరించటం ద్వారానే భవిష్యత్‌ మానవహక్కుల రక్షణ గురించి గట్టిగా మాట్లాడగలం ‘ అన్నారు. మహమ్మదీయ సంస్ధ పేరుతో వ్యవహరించిన మతోన్మాదులు మిలిటరీతో చేతులు కలిసి మసీదులలో ప్రార్ధనల సందర్భంగా కమ్యూనిస్టులు దైవ ద్రోహులని వారిని ఎక్కడ బడితే అక్కడ కోడి మెడ కోసినట్లు కోసి చంపాలని పిలుపు ఇచ్చారంటూ అమెరికన్లు పంపిన వర్తమానాలలో వున్నాయి. ‘ మాకు ఈ విషయాల గురించి బాధితుల మౌఖిక సంభాషణల ద్వారా సాధారణంగా తెలుసు, కానీ ఇప్పుడు ఇప్పుడు విడుదల చేసిన సమాచారం మంచి చెడ్డలన్నింటినీ వెల్లడించటం గొప్ప విషయం అని బ్రిటీష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ చరిత్ర అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జాన్‌ రోజా వ్యాఖ్యానించారు.

నెదర్లాండ్స్‌ వలస రాజ్యంగా వున్న ఇండోనేషియా స్వాతంత్య్ర వుద్యమానికి నాయకత్వం వహించిన వారిలో సుకర్ణో ఒకరు. ఆయన జాతీయవాదులు, కమ్యూనిస్టుల అనుకూల వైఖరిని కలిగి వుండేవారు.1945లో ఏర్పడిన స్వతంత్ర ఇండోనేషియాకు ఆయన తొలి అధ్యక్షుడు. అలీనోద్యమ నేతల్లో ఒకరు. తొలిరోజుల్లో జాతీయవాదిగా వున్నప్పటికీ 1960 దశకం నాటికి ఆయన కమ్యూనిస్టుల పట్ల మరింత సానుకూల వైఖరిని తీసుకున్నారు. ఇది అమెరికాకు కంటగింపు అయింది. అప్పటికే అమెరికన్లు వియత్నాంపై దాడులు చేస్తూ మారణకాండ సాగిస్తున్నారు. ఇండోనేషియాలో అతి పెద్ద కమ్యూనిస్టుపార్టీ వుంది. ఇస్లామిక్‌ దేశాలలో పెద్దదైన ఇండోనేషియా ఏ క్షణంలో అయినా కమ్యూనిస్టు దేశంగా మారిపోయే అవకాశం వుందని అమెరికా భయపడింది. అదే అక్కడి కుట్రలకు నాంది. దానిలో భాగంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టేందుకు తెరలేపారు. దీనితో పాటు ఇతర విద్రోహ చర్యలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు రైతాంగ గెరిల్లాల వ్యవస్ధను కూడా తయారు చేసేందుకు పూనుకున్న తరుణంలో సిఐఏ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులసామూహిక హత్యాకాండకు పధకరచన సాగిందని, దాని గురించి సూచాయగా తెలిసినప్పటికీ అధ్యక్షుడు సుకర్ణో మద్దతు వున్నందున కమ్యూనిస్టులు తీవ్రతను వూహించలేక, తగిన సన్నద్దులు కాలేకపోయారని,కుట్రను తిప్పికొట్టలేకపోయారని కూడా ఒక అభిప్రాయం వుంది. సుకర్ణోకు కమ్యూనిస్టుల నుంచి ముప్పు ఏర్పడిందనే పేరుతో ఆయనను గృహనిర్బంధం చేసి మిలిటరీ జనరల్‌ సుహార్తో అధ్యడిగా ప్రకటించుకొని హత్యాకాండను సాగించాడు. 1970లో సుకర్ణో కిడ్నీ వ్యాధితో మరణించినట్లు ప్రకటించారు.

అమెరికా వెల్లడించిన పత్రాలలో సమాచారం వూచకోత దోషులను వెల్లడించకపోయినప్పటికీ అనేక విషయాలను అధికారికంగా నిర్ధారించింది. ఇండోనేషియా సామాజిక, రాజకీయ వ్యవస్ధలో సంభవించబోయే మార్పులను ఇవి ఎంతో కొంత మేరకు ప్రభావితం చేస్తాయి. మిలిటరీ, సామ్రాజ్యవాదుల పాత్ర గురించి వాస్తవాలను తెలుసుకొనే ఆసక్తిని కలుగచేస్తాయి. ప్రజాస్వామిక, ఇప్పటికీ రహస్యంగానే వున్న వామపక్ష శక్తులు మరింత చురుకుగా పని చేస్తాయనటం నిస్సందేహం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d