• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RUSSIA

సామాన్యులకు గోడదెబ్బ-చెంపదెబ్బ : పెరుగుతున్న చమురు – తరుగుతున్న రూపాయి !

07 Thursday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

crude oil price, Fuel Price in India, Rupee depreciation

ఎం కోటేశ్వరరావు


మరోసారి అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ప్రతి రోజూ వినియోగదారుల మీద భారం పెరుగుతోందని ఇంకోసారి చెప్పనవసరం లేదు. బుధవారం నాడు పీపాధర బ్రెంట్‌ రకం 82-83 డాలర్ల మధ్య కదలాడింది. గురువారం నాడు 80.7 డాలర్లతో ప్రారంభమై 81.36 మధ్య ఉంది. మనం దిగుమతి చేసుకొనే రకం ఒకటి-రెండు డాలర్లు తక్కువగా ఉంటుంది. తొంభై డాలర్ల వరకు పెరగవచ్చని గోల్డ్‌మన్‌ శాచస్‌ జోశ్యం చెప్పింది. ఏం జరగుతుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేని స్ధితి. జనం జేబులు కొల్లగొట్టటం ఎలా అని తప్ప భారం తగ్గింపు ఆలోచనలో కేంద్రం లేదు. రాష్ట్రాలకు అలాంటి అవకాశం పరిమితం. మిగతా వస్తువుల మాదిరే చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తెచ్చి వాటి ఆదాయాలకు హామీ ఇస్తే రాష్ట్రాలు ఆ విధానానికి ఆమోదం తెలుపుతాయి. అందుకు కేంద్రం సిద్దంగా లేదు.


అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఓపెక్‌+దేశాలు నవంబరు నెలలో రోజుకు నాలుగు లక్షల పీపాల కంటే ఉత్పత్తిని ఎక్కువ పెంచేందుకు తిరస్కరించటం ఒక ప్రధాన కారణం.ఈ ఏడాది ఇప్పటి వరకు చమురు ధరలు 50శాతంపైగా పెరిగాయి. కరోనా కారణంగా కుదేలైన రంగాలు తిరిగి కోలుకుంటే చమురు గిరాకీ పెరుగుతుంది. అప్పుడు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వంద డాలర్లకు చేరే అవకాశం గురించి జోశ్యాలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగితే వచ్చే ఏడాది 180డాలర్లను అధిగమించవచ్చని కూడా చెబుతున్నారు. కరోనాకు ముందు ఉన్న ఉత్పత్తి స్ధాయికి చేరుకొనే వరకు నెలకు నాలుగు లక్షల పీపాలకు మించి పెంచేది లేదని ఒపెక్‌+దేశాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే వంద రూపాయలు దాటిన పెట్రోలు ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలియదు.


ఐరోపాతో సహా అనేక దేశాలలో సహజవాయు ధరలు విపరీతంగా పెరిగాయి.బొగ్గు కూడా మండుతోంది. ఈ నేపధ్యంలో అనేక విద్యుత్‌ కంపెనీలు గ్యాస్‌కు బదులు చమురుతో విద్యుత్‌ ఉత్పత్తి చౌక అని ఆలోచించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది. అమెరికాలో ఇడా హరికేన్‌ కారణంగా మూడు కోట్ల పీపాల చమురు ఉత్పత్తి పడిపోయింది.ఇది కూడా ఒక తక్షణ కారణం. ఉత్పత్తి కంటే కంపెనీల వాటాదారుల లాభాలు ముఖ్యం అనుకుంటున్న అమెరికాలోని షేల్‌ చమురు కంపెనీలు ఉత్పత్తిని పరిమితం చేశాయి. ధరలు పెరిగినా ఫరవాలేదు, ఉత్పత్తి పెంచాలనే డిమాండ్‌ అమెరికా వైపు నుంచి వచ్చింది. దాన్ని ఉత్పత్తి దేశాలు ఖాతరు చేయలేదు. రోజుకు ఎనిమిది లక్షల పీపాల ఉత్పత్తి పెంచుతారు అన్న అనధికారిక వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.
రానున్న శీతాకాలంలో అనేక దేశాలు గడ్డు పరిస్ధితిని ఎదుర్కోనున్నట్లు చెబుతున్నారు.పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలను సాగిస్తున్న చైనా తన అవసరాల కోసం ఎక్కడెక్కడి చమురు, గ్యాస్‌, బొగ్గును కొనుగోలు చేస్తోంది. ఐరోపా ఇబ్బందులు పడుతోంది. ధర ఎక్కువైనా స్ధానిక ఉత్పత్తి కారణంగా అమెరికాలో ఇబ్బంది లేదు. ఐరోపా గ్యాస్‌ నిల్వలు పదేండ్ల కనిష్టానికి తగ్గాయయి.

రష్యా గ్యాస్‌ సరఫరా చేయగలిగినప్పటికీ ఐరోపా దేశాలతో ఉన్న విబేధాల కారణంగా ముందుకు రాకపోవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి ప్రభావితం అవుతాయి. సాధారణ వినియోగదారులు, పరిశ్రమలు, కార్మికుల నుంచి రాజకీయ నాయకత్వాలకు సమస్యలు ఎదురవుతాయి. నిరసనలకు దారి తీసి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినా ఆశ్చర్యం లేదు. ఇంధన సరఫరా ముప్పు గురించి ప్రతి వారూ చర్చిస్తున్నారు గానీ పరిష్కారాలు కనిపించటం లేదు. ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పన్నులు తగ్గించటం తప్ప మరొక మార్గం లేదు. సహజవాయు ధరలపై నియంత్రణ ఎత్తివేయటంతో ఏ రోజు కారోజు ధరల విధానంవైపు మార్కెట్‌ను నెట్టారు. మరోవైపు రష్యా నుంచి ఐరోపా దేశాలకు సహజవాయు సరఫరా చేసే గొట్టపు మార్గంపై రాజకీయ కారణాలతో అమెరికా విధించిన ఆంక్షలను ఐరోపా వ్యతిరేకిస్తోంది. దీనివలన ఎక్కువగా నష్టపోయేది ఐరోపా దేశాలే. తాము వాయు సరఫరాను పెంచుతామని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించటం వెనుక అమెరికా పలుకుబడిని దెబ్బతీసే ఎత్తుగడ ఉంది.దీని వలన పదిశాతం ధరలు కూడా తగ్గాయి. గొట్టపు మార్గం పని చేసేందుకు అనుమతించేందుకు జర్మనీ సిద్దంగా ఉంది.


ఐరోపాలో ఒక మెగావాట్‌ అవర్‌ విద్యుత్‌(ఐరోపాలో 330 ఇండ్లలో ఒక గంటపాటు వినియోగించేదానికి సమానంగా పరిగణిస్తారు) ధర రికార్డును బద్దలు కొట్టి 106 యూరోలను తాకింది. ఇది పీపా చమురు ధర 205 డాలర్లకు సమానం. రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రం కానుందని భావిస్తున్నారు. ఆసియా, ఇతర కొనుగోలుదారులకు సౌదీ అరేబియా పీపాకు చమురు ధరలో 0.42 డాలర్లు తగ్గించటంతో చమురు ధరలు గురువారం నాడు స్వల్పంగా తగ్గాయి. రానున్న చలికాలంలో ఇంధన సరఫరాలు తగ్గకుండా చూడాలని చైనా ప్రభుత్వం ఆదేశించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది.


మన దేశంలో చమురు ధరల పెరుగుదలకు అంతర్జాతీయ కారణాలతో పాటు నరేంద్రమోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఎగుమతులను పెంచేందుకు మన రూపాయి విలువను పతనం కావించటం ఒకటి. అక్టోబరు ఆరవ తేదీన రూపాయి డాలరుకు 75కు పతనమైంది. సెప్టెంబరు 28న 74 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర స్ధిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే వినియోగదారుల నుంచి ఆ మేరకు వసూలు చేస్తారు. ఇప్పుడు చమురు ధర పెరుగుదల, రూపాయి పతనం రెండూ జరుగుతున్నాయి. దీన్నే గోడదెబ్బ-చెంపదెబ్బ అంటారు. దేశీయంగా జరుగుతున్న చమురు ఉత్పత్తిని పెంచకపోగా గత స్ధాయిని కొనసాగించటంలో కూడా నరేంద్రమోడీ సర్కార్‌ విఫలమైంది. ఇథనాల్‌ ఉత్పత్తి చేసి ఆమేరకు భారం తగ్గిస్తామని చెప్పిన మాటలు కూడా అమలు కాలేదు. ప్రస్తుతం మన దేశం 80శాతం చమురు దిగుమతులపై ఆధారపడుతున్నది.


గతంలో ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి కొనుగోలు చేసిన చమురు విలువలో సగం మొత్తాన్ని రూపాయిలలో చెల్లిస్తే సరిపోయేది. మన దేశం నుంచి ఇరాన్‌కు ఎగుమతులు చేసిన వారికి మన ప్రభుత్వం సర్దుబాటు చేసేది. మన అవసరాల్లో పదిశాతం అక్కడి నుంచే దిగుమతి చేసుకొనే వారం. ఇరాన్‌ దగ్గర చమురు కొన్న దేశాల మీద ఆంక్షలు విధిస్తామన్న అమెరికా బెదిరింపులతో మన సర్కార్‌ భయపడిపోయి అక్కడి నుంచి పూర్తిగా కొనుగోళ్లను ఆపివేసింది. అందువలన ఆ మేరకు డాలర్లు చెల్లించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దీంతో ఇరాన్‌ మన దేశం నుంచి దిగుమతులను కూడా పరిమితం చేసింది. 2018-19లో రెండు దేశాల వాణజ్య విలువ 17బిలియన్‌ డాలర్లు ఉండేది. మరుసటి ఏడాదికి అది 4.77 బి.డాలర్లకు పడిపోయింది. మన ఎగుమతులు 2019తో పోల్చితే 42శాతం తగ్గి 2020లో 2.2బి.డాలర్లకు, 2021లో మరింతగా పడిపోయాయి.

మరోవైపున ఇరాన్‌-చైనా బంధం మరింత గట్టిపడింది.రాయితీలతో కూడిన చమురు నిరంతరాయంగా ఇరాన్‌ సరఫరా చేస్తే చైనా 400 బిలియన్‌ డాలర్ల మేరకు వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెట్టనుంది. అమెరికా బెదిరింపుల కారణంగా మనం ఇరాన్‌తో స్నేహాన్ని ప్రశ్నార్దకం చేసుకోవటంతో పాటు వాణిజ్య అవకాశాలను కూడా కోల్పోయాము. వినియోగదారుల మీద భారం మోపుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఇరాన్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే అది మన అర్ధిక వ్యవస్ధ మీద తీవ్ర ప్రభావం చూపనుంది. బడ్జెట్‌లోటు పెరిగితే సంక్షేమ చర్యలకు కోత పెడతారు.పరిమితంగా ఉన్న సబ్సిడీలను కూడా ఎత్తివేస్తారు. చమురు, గాస్‌ ధరలు పెరిగితే ఎరువుల ధరలు కూడా పెరిగి రైతాంగం మీద భారాలు పెరుగుతాయి. ఇది మరొక సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు తిరస్కరిస్తూ రాజధాని చుట్టూ ఇనుప మేకులు పాతి పది నెలలుగా రైతులను రాజధానిలోకి రాకుండా అడ్డుకుంటున్న సర్కార్‌ చమురు భారాలకు వ్యతిరేకంగా జనం ఉద్యమిస్తే ఏం చేయనుందో చూడాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాలో ఏం జరుగుతోంది, పుతిన్‌కు సవాలుగా మారుతున్న కమ్యూనిస్టులు ?

03 Sunday Oct 2021

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

2021 Duma elections, Alexei Navalny, Gennady Zyuganov, Russia Communists, United Russia, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


కొందరి దృష్టిలో కమ్యూనిస్టుల తప్పిదాలతో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయింది. మరొక కోణం ప్రకారం కుట్రతో సామ్రాజ్యవాదం కూల్చివేసింది. దేని పాత్ర ఎంత అనేది ఎవరికి వారు గుణపాఠాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ ఉదంతం జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఇంతకాలం తరువాత అక్కడ కమ్యూనిస్టులు ఏమి చేస్తున్నారు, ఉద్యమం ఎలా ఉంది అనేది వామపక్ష అభిమానులు, వ్యతిరేకులకూ ఆసక్తికరమైన అంశమే. పుతిన్‌కు తలనొప్పిగా మారుతున్న కమ్యూనిస్టులు అనే శీర్షికతో అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఒక సమీక్ష రాసింది. రష్యాను మరోసారి కమ్యూనిస్టు భూతం వెంటాడుతోందా అనే వాక్యంతో అది ప్రారంభమైంది.నిజమేనా -అతిశయోక్తా ? అసలు అక్కడేం జరుగుతోంది ?


సెప్టెంబరు 17-19 తేదీలలో రష్యన్‌ డ్యూమా(పార్లమెంటు ) ఎన్నికలు జరిగాయి.నాలుగు వందల యాభై స్ధానాలకు గాను 225 దామాషా ప్రాతినిధ్యం పద్దతిలో మిగిలిన 225 నియోజకవర్గాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అధికార యునైటెడ్‌ రష్యా పార్టీకి 49.82 శాతం ఓట్లు, 324 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షంగా మొదటి స్ధానంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి 18.93శాతం ఓట్లు, 57 సీట్లు వచ్చాయి. జస్ట్‌ రష్యా పార్టీకి 7.46 శాతం ఓట్లు 27 సీట్లు, ఎల్‌డిపిఆర్‌కు 7.55శాతం ఓట్లు 21 సీట్లు,న్యూపీపుల్‌ పార్టీకి 5,32శాతం ఓట్లు 13 సీట్లు, మరో మూడు పార్టీలకు ఒక్కొక్కసీటు, స్వతంత్రులకు ఐదు వచ్చాయి. మాస్కో తదితర ప్రాంతాలో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడటంతో ప్రత్యక్ష ఎన్నికలలో కమ్యూనిస్టులు కొందరు ఓడిపోయారు.వాటి మీద కోర్టులో కేసులు దాఖలు చేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికలలో మొత్తం ఓట్లలో 47.8శాతం పోలుకాగా ఈ సారి 45.15శాతానికి తగ్గాయి. అధికారపక్ష ఓట్లు 54.20శాతం నుంచి 49.82శాతానికి తగ్గాయి.

కమ్యూనిస్టులతో సహా ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది అభ్యర్ధులపై తప్పుడు కేసులు బనాయించి పోటీలో లేకుండా చేసుకోవటం, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ అక్రమాలకు పాల్పడటంలో పుతిన్‌ అధికార యంత్రాంగం పేరు మోసింది. వాటన్నింటినీ అధిగమించి కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు రావటం, అక్రమాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగటంతో అసలు సిసలు ప్రతిపక్షం కమ్యూనిస్టులే అని పరిశీలకులు, సామాన్యజనం కూడా గుర్తించారు. అనేక మంది చురుకైన యువ కమ్యూనిస్టులు ఈ ఎన్నికలలో పని చేయటం, జనం ఆదరించటం గతం కంటే ఆరుశాతం ఓట్లు 15 సీట్లు పెరగటాన్ని చూసి రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులతోనే పుతిన్‌కు సవాలు ఎదురవుతుందని భావిస్తున్నారు.వాషింగ్టన్‌ పోస్టు విశ్లేషణ సారాంశమిదే.


కమ్యూనిస్టు పార్టీ ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న ఎత్తుగడలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను సంఘటితం చేసేందుకు చేసిన యత్నాలు ఫలిస్తున్నట్లు ఈ ఎన్నికలు నిరూపించాయి.గత అధ్యక్ష ఎన్నికలలో (2018) కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పురోగామి భావాలు కలిగిన స్ట్రాబెరీ వాణిజ్యవేత్త పావెల్‌ గ్రుడినిన్‌ పోటీ చేశారు.గ్రుడినిన్‌కు విదేశాల్లో ఆస్తులున్నాయని, పుతిన్‌ మీద పోటీ చేసిన ఆయనకు 90లక్షల మంది మద్దతుదారుల లేరనే పేరుతో ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించారు. ప్రాంతీయ అసెంబ్లీలలో ఈ విధంగా ఐదుగురు ప్రముఖ కమ్యూనిస్టునేతలను అనర్హులుగా ప్రకటించారు. కమ్యూనిస్టు మద్దతుదారులే కాదు, పుతిన్‌ విధానాలను వ్యతిరేకించే ఇతర ఓటర్లు కూడా ఈ ఎన్నికలలో కమ్యూనిస్టులవైపు మొగ్గటం స్పష్టంగా కనిపించింది. ఇది వచ్చే అధ్యక్ష ఎన్నికలలో కూడా పుతిన్‌ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగతా ప్రతిపక్ష పార్టీనేతలను తప్పుడు కేసులతో, ఏదో ఒకసాకుతో జైలు పాలు చేసి, కమ్యూనిస్టుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే అది ఎదురుతన్నే అవకాశం ఉందనే అంశం పుటిన్‌కు తెలియంది కాదు.

కమ్యూనిస్టులకు ఈ ఎన్నికలలో కోటీ ఆరులక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. దేశంలోని 41 ప్రాంతాల(మన రాష్ట్రాల మాదిరి)లో నాలుగు చోట్ల ు 30 నుంచి 36శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ పెద్ద పక్షంగా అవతరించింది. మిగతా చోట్ల 20 నుంచి 30శాతం ఓట్లు వచ్చాయి.38 ప్రాంతీయ శాసనసభల్లో గతంలో 158 స్ధానాలుండగా ఇప్పుడు 254వచ్చాయి. ఇవన్నీ అనేక చోట్ల అధికారపక్షం అక్రమాలకు పాల్పడిన నేపధ్యంలో వచ్చిన విజయాలు అని గ్రహించాలి. మూడు రోజుల పాటు ఎందుకు ఎన్నికలు జరిపారు అంటే కరోనా అని సాకులు చెప్పారు. అధికారపక్షానికి ఎదురుగాలి వీస్తున్నదనే సూచికలు ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించాయి. దాంతో ఓటింగ్‌కు రాని ప్రభుత్వ రంగ కార్మికులు,ఇతరులను పెద్ద ఎత్తున సమీకరించటం, పరోక్ష ఎలక్ట్రానిక్‌ పద్దతిలో అధికారపక్షానికి ఓటు వేయించారు.


మీడియా కేంద్రీకరణ మొత్తం అధికారపక్షం వైపు తప్ప ప్రతిపక్షాలను ముఖ్యంగా కమ్యూనిస్టులను విస్మరించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మాయాజాలం గురించి చెప్పాలంటే మాస్కో నగరం, పరిసరాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. సెప్టెంబరు 19వ తేదీ రాత్రి ఏడు గంటల సమయంలో ప్రత్యక్ష ఓట్ల లెక్కింపులో కమ్యూనిస్టు-అధికార యునైటెడ్‌ రష్యా పోటాపోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు వెల్లడైంది. తరువాత పరోక్ష ఎలక్ట్రానిక్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఒక గంటలోనే పరిస్ధితి తారుమారైంది. ఇది రిగ్గింగుతప్ప మరొకటి కాదు. అనేక పోలింగ్‌ కేంద్రాలలో పెద్ద ఎత్తున ఏదో ఒకసాకుతో వేలాది ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. ఇలాంటి అక్రమాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీలేవీ ఎక్కడా ఆందోళన జరపలేదు. పోలీసులు, అధికార యంత్రాంగం కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలలో ప్రవేశించి బెదిరించటం, అరెస్టులు చేయటం, ప్రదర్శనలను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. పార్టీ వెబ్‌సైట్‌ను నిరోధిస్తామని చెప్పారు. ఎన్నికల అక్రమాలపై కేసులు దాఖలు చేసేందుకు వివరాలను సేకరిస్తున్న లాయర్లను బెదిరించారు.పదిరోజుల పాటు జైలుపాలు చేశారు.

ఎన్నికలకు ముందు ఆల్‌ రష్యన్‌ సెంటర్‌ అనే ప్రజాభిప్రాయసేకరణ సంస్ధ జరిపిన సర్వేలో కమ్యూనిస్టు నేత జుగనోవ్‌ మీద విశ్వాసం ప్రకటించిన వారు 30.7శాతం ఉన్నట్లు ప్రకటించింది. కమ్యూనిస్టులకు ఎన్నికలలో 16.6, రష్యన్‌ ఫెడరేషన్‌లో 23.3శాతం వస్తాయని పేర్కొన్నది. ఎన్నికలలో అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పార్టీ సిద్దాంతాలు, ఆచరణకు జనం మద్దతు పెరిగినట్లు ఫలితాలు వెల్లడించాయని కమ్యూనిస్టు పార్టీ సమీక్షలో పేర్కొన్నది. అక్రమాలు చోటు చేసుకోనట్లయితే ఇంకా ఓటింగ్‌ శాతం, సీట్లు పెరిగి ఉండేవి.కమ్యూనిస్టు పార్టీని ప్రధాన ప్రతిపక్షంగానే కాదు, అసలైన ఏకైక ప్రతిపక్షంగా జనం భావించారు. అందువల్లనే ప్రభుత్వ వ్యతిరేకులు కమ్యూనిస్టుల వైపు మొగ్గారు.


గత పదిసంవత్సరాలుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పుతిన్‌కు అసలైన ప్రతిపక్షం ఉదారవాదులు తప్ప కమ్యూనిస్టులు కాదని జనాల మెదళ్లలో ఎక్కించేందుకు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తికాదు. అమెరికాలో మాదిరి ఎవరు అధికారంలో ఉన్నా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలను అనుసరించే శక్తులతోనే రాజకీయ రంగాన్ని నింపాలన్నది ఎత్తుగడ. తన అధికారాన్ని సుస్ధిరం చేసుకొనే యత్నాలలో భాగంగా వ్లదిమిర్‌ పుతిన్‌ ఏ పెట్టుబడిదారి విధాన సమర్ధపక్షాన్ని కూడా బతకనివ్వలేదు. గతేడాది చేసిన రాజ్యాంగ సవరణల ప్రకారం అధ్యక్ష పదవిని ఎవరు ఎన్నిసార్లయినా అధిరోహించవచ్చు. దాని ప్రకారం 2036వరకు ఆరోగ్యం సహకరించి అన్నీ అనుకూలిస్తే పుతిన్‌ అధికారంలో కొనసాగవచ్చు. అయితే ఉదారవాద పార్టీలకు బదులు కమ్యూనిస్టులే అసలైన ప్రతిపక్షం అని ఈ ఎన్నికలు నిరూపించటం గమనించాల్సిన ముఖ్య అంశం.


ఆగస్టు నెలలో లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నట్లుగా మంచి పెట్టుబడిదారీ విధానానికి బదులు తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. మరోవైపున తమ కళ్ల ముందే అమెరికా, ఐరోపా దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ధలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని రష్యన్‌ యువతరం గ్రహించకుండా ఎలా ఉంటుంది. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా అమెరికా నుంచి రష్యాకు ముప్పు ఉందనే జాతీయ భావాలను కూడా ముందుకు తెచ్చారు. అయితే ఇటీవలి కాలంలో అమెరికా కేంద్రీకరణ రష్యామీద కంటే చైనావైపు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రచారం రష్యన్లలో అంతగా ఎక్కే అవకాశం లేదు. అనేక దేశాలలో తమకు అనుకూలమైన శక్తులను ప్రతిష్టించేందుకు అమెరికా అంతర్గత అంశాలు, ఎన్నికలలో జోక్యం చేసుకొంటోంది. పుతిన్‌ బదులు మరొకరిని ప్రోత్సహించాలని చూసినా అందుకు తగిన శక్తులు రష్యాలో కనిపించటం లేదు. పురోగామి సోషలిస్టు మార్గాన పయనించటానికి తాము కట్టుబడి ఉన్నామని వెనక్కి తగ్గేది, లొంగిపోయేది లేదని, జన ధోరణి తమకు అనుకూలంగా మారుతోందని కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణ తరువాత ప్రకటించింది.


” ఓటర్లు మేం చెప్పింది విన్నారు. ఓటర్లు మమ్మల్ని నమ్మారు. మాకు ఓట్లు వేశారు ” అని పార్టీ అగ్రనేత గెన్నడీ జుగనోవ్‌ చెప్పారు. నియోజవర్గ ప్రాతిపదికన ప్రత్యక్ష ఓటింగ్‌ జరిగిన 225 స్ధానాల్లో కమ్యూనిస్టులకు తొమ్మిది రాగా అధికారపక్షానికి 198వచ్చాయి. ఈ సీట్లలో అనేక అక్రమాలు జరిగాయనే విమర్శలు వచ్చాయి. మొత్తగా 50శాతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న అధికారపార్టీ నియోజకవర్గ ప్రాతిపదికన జరిగిన చోట అత్యధిక సీట్లు గెలిచిన కారణంగా మొత్తం సీట్లలో 72శాతం వచ్చాయి. అదే కమ్యూనిస్టులకు 19శాతం ఓట్లు వచ్చినా సీట్లు 12.7శాతమే వచ్చాయి. స్వతంత్ర విశ్లేషకుడు సెర్గీ షిఫిల్‌కిన్‌ అంచనా ప్రకారం కమ్యూనిస్టులకు వాస్తవంగా 31-33 శాతం మధ్య ఓట్లు వచ్చాయని అన్నాడు.మాస్కో ప్రాంతంలోని పదిహేను నియోజకవర్గాలలో అధికారపక్షం రిగ్గింగుకు పాల్పడిన కారణంగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్దులు ఓడిపోయారన్నది స్పష్టం. ప్రత్యక్షంగా వేసిన ఓట్ల లెక్కింపు జరిగినంతసేపూ అధికారపక్షం, కమ్యూనిస్టులు పోటా పోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు ప్రకటించిన అధికారులు ఎలక్ట్రానిక్‌ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాలు మారు చేశారన్నది అభియోగం. కమ్యూనిస్టులు గట్టి పోటీ ఇచ్చిన ప్రతి చోటా ఇదే జరిగినట్లు చెబుతున్నారు.


కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న యువత రానున్న రోజుల్లో మరింతగా మిలిటెంట్‌ పోరాటాలకు సిద్దమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జైలు పాలైన ఒక ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నవల్నీ అధికారపక్షాన్ని ఓడించే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చాడు. అతని మద్దతుదారులు కొందరు కమ్యూనిస్టులకు ఓటు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. సోవియట్‌ అంతరించి మూడు దశాబ్దాలు గడచింది. కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నలభై ఏండ్ల లోపు వారికి నాటి విషయాలు వినటం తప్ప ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు. అలాంటి వారు అనేక మంది జాతీయ పార్లమెంట్‌, స్ధానిక అసెంబ్లీలకు ఎన్నికయ్యారు. దేశంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలకు, పెట్టుబడిదారీ వ్యవస్ధ దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. గతంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి ఇప్పటి కమ్యూనిస్టు పార్టీకి తేడా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ముందుకుపోతామని అనేక మంది యువనేతలు చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఆర్ధిక రంగంలో పుతిన్‌ వైఫల్యాల కారణంగా ఇటీవలి కాలంలో కార్మికవర్గంలో అసంతృప్తి పెరుగుతున్నది. మరొక ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేనందున కమ్యూనిస్టు పార్టీ ముందుకు పోవటానికి ఇది కూడా దోహదం చేస్తుందన్నది తెలిసిందే.లెనిన్‌ జన్మించిన ఉల్యనోవస్క్‌ పట్టణం, పరిసరాలలో కమ్యూనిస్టులు 30శాతంపైగా ఓట్లు సాధించారు. ఆ నియోజకవర్గంలో గత ఎన్నికలలో విజయం సాధించిన కమ్యూనిస్టులను అడ్డుకొనేందుకు అధికారపక్షం అనేక ప్రయత్నాలు చేసినా తిరిగి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. లెనిన్‌ పదిహేడు సంవత్సరాల వయస్సులో ఉల్యనోవస్క్‌ను విడిచి వెళ్లిన తరువాత తిరిగి అక్కడికి వెళ్లలేదు. అయినా అంతటి మహానేత జన్మించిన ప్రాంతం తమదని అక్కడి వారు గర్వపడతారు. తిరిగి తమ జీవిత కాలంలో రష్యన్‌ సోషలిజాన్ని చూస్తామనే విశ్వాసం కమ్యూనిస్టు కార్యకర్తల్లో ఉంది.


మాస్కోలోని మాక్రో అడ్వైజరీ సంస్ధ అధిపతి క్రిస్‌ వీఫర్‌ ఎన్నికల గురించి విశ్లేషిస్తూ ” జనాభాలో మారుతున్న నిష్పత్తి పుతిన్ను భయపెడుతున్న అసలైన సమస్య, సోవియట్‌ యూనియన్‌ అంతరించిన తరువాత జన్మించిన జనాభా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఈ తరం పెద్ద ఎత్తున ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నది, అనేక దేశాలు తిరిగి వస్తున్నది. దేశం స్ధిరపడాలనే పుతిన్‌ కబుర్లను వినేందుకు వీరు సిద్దంగా లేరు. మెరుగైన జీవనం, ఆదాయం, సామాజిక భద్రత, మెరుగైన భవిష్యత్‌ను కోరుకుంటున్నారు. వీరి ఆకాంక్షలను నెరవేర్చుతూ అధికారంలో కొనసాగటం అనేది పుతిన్‌ ముందున్న పెద్ద సవాలు. ప్రస్తుత వైఫల్యాలు వచ్చే ఎన్నికల్లో ఎవరు అధ్యక్ష అభ్యర్ధిగా ఉన్నా వారికి గుదిబండలుగా మారతాయి” అన్నాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వెళ్లారు, వచ్చారు ! సాధించింది ఏమిటి ?

28 Tuesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

anti china, BJP, India-UNSC, Joe Biden, Narendra Modi US Visit


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్లారు, తిరిగి వచ్చారు. అరవై అయిదు గంటల వ్యవధిలో 20 సమావేశాలలో, ప్రయాణ సమయంలో విమానంలో నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారట. తిరిగి వస్తూనే కొత్త పార్లమెంట్‌ భవన సముదాయ నిర్మాణం ఎలా జరుగుతోందో రాత్రిపూట పర్యవేక్షించారు. రాగానే ప్రధాని నిర్మాణ స్ధలాన్ని సందర్శించటంలో పెద్ద విశేషం ఏమీ లేదు గానీ (కరోనా సమయంలో భరోసా ఇచ్చేందుకు ఏ ఆసుపత్రినీ సందర్శించలేదు గానీ అన్న కాంగ్రెస్‌ విమర్శ వేరే అంశం), విదేశాలకు వెళ్లినా, స్వదేశంలో ఉన్నా మన ప్రధానికి పని యావతప్ప మరొకటి ఉండదనే సందేశాన్ని మోడీ మీడియా మేనేజ్‌మెంట్‌ బృందం ఇచ్చిందని చెప్పవచ్చు. తన శరీర ధర్మాన్ని ఎలా కావాలనుకుంటే అలా మార్చుకొనే రహస్యాలు ప్రధాని దగ్గర ఉన్నందున విమాన ప్రయాణ బడలికకు ఏమాత్రం గురికాలేదని, ఎల్లవేళలా ఉత్సాహంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. వాటిని అదేదో అంటున్నారుగా డబ్బిచ్చి రాయించుకోవటం అని అదా, విలేకరులే ఉత్తేజితులై రాశారా అంటే, ప్రధాని వెంట ఎప్పుడూ విలేకర్లు ఉండరు, వారి పొడ గిట్టదని తెలిసిందే.


ఇంత హడావుడి చూసిన తరువాత ఒక సినిమాలో నువ్వు ఎవరు అని ప్రశ్నించినట్లుగా ప్రధాని అమెరికా, ఐరాస పర్యటనలో సాధించింది ఏమిటి అనే అంశం ముందుకు వస్తుంది. ఫలితం వస్తేనే పని చేసినట్లుగా భావిస్తున్న రోజులు కనుక అలాంటి ప్రశ్న వేసిన వారి మీద ఆగ్రహించనవసరం లేదు. అమెరికాలో ఇండియన్‌ అమెరికన్‌ వాణిజ్యవేత్తలతో సహా పలు కంపెనీల అధిపతులతో సమావేశం జరిపినట్లు వార్తలు వచ్చాయి. వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారా లేక పెట్టుబడుల విషయమై చర్చించారా అన్నది తెలియదు. సులభతర వాణిజ్యంలో మోడీ ఏలుబడిలో 142 నుంచి 63కు ఎదిగిన తరువాత కొత్తగా వారు తెలుసుకొనేదేమి ఉంటుంది-మోడీగారు చెప్పేది మాత్రం ఏం ఉంటుంది ? వచ్చే నెలలో అమెరికా నుంచి ఒక ఉన్నత స్ధాయి బృందం రానుందని వార్తలు.


ప్రధాని పర్యటన ఫలితాలు-పర్యవసానాలు వెంటనే వెల్లడికావాలనేదేమీ లేదు. ఈ పరిమితులను గమనంలో ఉంచుకొని జరిగిన కొన్ని విషయాల గురించి చూద్దాం. మొత్తం మీద మూడు అంశాలు ముందుకు వచ్చాయి. ఒకటి ఐరాస వార్షిక సమావేశంలో ప్రసంగించటం, రెండవది అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా, భారత్‌లతో ఏర్పడిన చతుష్టయ కూటమి శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్‌లకు గట్టి పరోక్ష హెచ్చరిక , ఈ సందర్భంగా వాణిజ్య ప్రముఖులు ఇతరులతో భేటీ కావటంగా చెప్పవచ్చు.బిజెపి నేతలు ఈ పర్యటన ఒక చారిత్రాత్మక మలుపు అన్నట్లుగా చిత్రించారు. వెంపల చెట్లను నిచ్చెనలతో ఎక్కే జనాలున్న రోజులివి. కొత్తగా జరిగిన పరిణామాలేవీ లేవు, కొత్తగా పొరుగుదేశాలకు చేసిన హెచ్చరిక ఏమిటన్నది ఒక బ్రహ్మపదార్దం.ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ బహుముఖ సంస్థలు అసంగతమైనవిగా మారాయని వాటిని సంస్కరించాలని కోరారు. వాస్తవమే, ఇది కూడా పరోక్ష వ్యవహారమే.భద్రతా మండలిలో శాశ్వత స్ధానం కావాలని మనం కోరుతున్నాం. ఆ హౌదా ఉన్న దేశాలు దాన్ని దేనికి వినియోగిస్తున్నాయన్నది వివాదాస్పదం, ప్రజాస్వామ్య విరుద్దం. ఆ హక్కు ఎవరికీ ఉండకూడదు. ఐరాస జనరల్‌బాడీ లేదా భద్రతా మండలి మెజారిటీ తీర్మానాలను ఏ ఒక్కదేశం వీటో చేసినా అవి చెల్లవు. అలాంటి హక్కును మనం కోరుతూ ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాఠాలు చెబుతున్నాం. అయినా చైనాతో సహా అందరూ మనకు మద్దతు పలుకుతున్నారు. ఇదే సమయంలో మనతో సహా ఎవరి రాజకీయం వారు చేస్తున్నందున అది ముందుకు పోవటం లేదు, ఆశ కూడా కనిపించటం లేదు.


తిరోగామి దేశాలు ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఐరాసలో ప్రధాని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌ గడ్డను ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా ఉపయోగించటాన్ని అనుమతించకూడదని, ఏ దేశమూ అక్కడి పరిస్ధితిని వినియోగించుకొనేందుకు వీల్లేకుండా చూడాలనీ చెప్పారు, నిజమే, ఆ పేరుతో ఇరవై ఏండ్లు ప్రత్యక్షంగా మరో 23 ఏండ్లు పరోక్షంగా అమెరికా చేసింది ఏమిటో పరోక్షంగా అయినా చెప్పి ఉంటే మరింత ఘనంగా ఉండేది. అమెరికా, దానికి ఇంతకాలం మద్దతు ఇచ్చిన మనం ఏ రకమైన దేశాల జాబితాలోకి వస్తాం ? ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా ఆప్ఘనిస్తాన్‌లో మిలిటరీ జోక్యం చేసుకుంది. అక్కడి జనజీవితాలను అతలాకుతలం గావించింది. తాలిబాన్‌, ఇతర ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్‌కు ఆయుధాలతో సహా అన్ని రకాల మద్దతు ఇచ్చింది. మాదారిన మేం పోతాం మా జోలికి రావద్దు అని వారితోనే ఒప్పందం చేసుకుంది, అయినా ఒక్క మాట అనేందుకు మనకు ధైర్యం లేదు.


ప్రధాని అంతర్జాతీయ వేదిక మీద తన గురించి తాను పొగుడుకోవటాన్ని ఎవరైనా తప్పు పడితే వారి మీద విరుచుకుపడితే కుదరదు. ఇతరులు పొగిడితే అందం చందం. మనల్ని మనమే పొగుడుకుంటే ”చాల బాగోదు ”. ఒక రోజు రైల్వే స్టేషన్‌లో తేనీరు అమ్మేందుకు తన తండ్రికి సహకరించిన ఒక చిన్న కుర్రవాడు నేడు నాలుగోసారి ఐరాస సమావేశంలో ప్రసంగించటం భారత ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం అని మోడీ తన గురించి చెప్పుకున్నారు. అయితే అదే చిన్న కుర్రవాడు పెద్దయిన తరువాత ఆ రైల్వేస్టేషన్లను ఏం చేయచూస్తున్నారో చూస్తున్నదే. ఆ కుర్రవాడి ఊరి రైల్వే స్టేషన్‌ తేనీరు అమ్మేంత పెద్దది కాదని, అందుకు ఆధారాలేవీ లేవని మన దేశ మీడియాలో వచ్చిన వార్తలను చదువుకున్న విదేశీయులు భారత ప్రధాని గురించి ఏమనుకుంటారు ? కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లుగా మనం వదిలేద్దాం.


అమెరికా పర్యటనలో నరేంద్రమోడీ సాధించిందేమిటి అనే ప్రశ్నకు మోడీ అద్భుత అమెరికా సందర్శన – ప్రదర్శన ప్రపంచ రాజకీయాల్లో భారత్‌కు ఒక మూలమలుపు అని బిజెపి అధికార ప్రతినిధి తుహిన్‌ ఏ సిన్హా ఏకంగా ఒక పెద్ద వ్యాసమే రాశారు. ఎవరికైనా అలా అనిపించిందా ? ప్రతి సందర్భంలోనూ చాతుర్యం ప్రదర్శించారని, సునాయాసంగా, ఎంతో చక్కగా ఐరాసలో ప్రసంగించారని వర్ణించారు. హిందీ, గుజరాతీలో ఆయన మంచి వక్త అని కొత్తగా చెప్పాల్సిందేముంది. మోడీ ప్రసంగం ప్రపంచంలో ఏదైనా కొత్త పరిణామానికి నాంది పలికిందా, దానికి సూచనలు కూడా లేవు. అందుకే ఒరిగిందేమిటి అనాల్సి వస్తోంది. 1950దశకంలో మనకు భద్రతా మండలిలో శాశ్వత స్ధానం దక్కే అవకాశాన్ని నెహ్రూ చైనాకు వదలివేశారని బిజెపి ప్రతినిధి గోబెల్స్‌ ప్రచారాన్ని పునరుద్ఘాటించారు. భద్రతా మండలిలో చైనాకు శాశ్వత స్దానం వచ్చిన 1945లో మనకు అసలు స్వాతంత్య్రం రాలేదు, చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రాలేదు, వచ్చిన 1949 నుంచి 1971వరకు కమ్యూనిస్టు చైనాకు ఐరాసలో అసలు గుర్తింపే లేదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనా పేరుతో కథ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు.


ప్రస్తుతం భద్రతా మండలిని విస్తరించాలనే మల్లగుల్లాల్లో భాగంగా భారత్‌, జపాన్‌, జర్మనీ,బ్రెజిల్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. భారత్‌ విషయంలో ఒక్క పాకిస్తాన్‌ తప్ప చైనాతో సహా మరేదేశమూ అభ్యంతరం చెప్పలేదు. తమ దేశాలపై యుద్దనేరాలకు పాల్పడిన జపాన్‌ వైపు నుంచి ఇప్పటికీ సరైన పశ్చాత్తాపం లేనందున చైనా, ఉత్తరకొరియా, వియత్నాం వంటి దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి.ఇటలీ పరోక్షంగా జర్మనీకి వ్యతిరేకంగా ఉంది. మరికొన్ని ఐరోపా, ఆఫ్రికాదేశాలు కూడా జర్మనీని వ్యతిరేకిస్తున్నాయి.బ్రెజిల్‌ను కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు అంగీకరించటం లేదు. మన దేశాన్ని తన అనుయాయిగా మార్చుకొనేందుకు తెరవెనుక మంతనాల్లో నెహ్రూ ప్రభుత్వానికి అమెరికా భద్రతా మండలి శాశ్వత స్ధానం అనే బిస్కెట్‌ను వేసింది. మాక్కూడా ఇస్తే అంగీకారమే గాని చైనాను తప్పించి ఆ స్ధానం మాకు అవసరం లేదు అని నెహ్రూ చెప్పారు. ఇప్పుడు మన దేశం జపాన్‌కు మద్దతు ఇస్తున్నది. మీ సంగతి మీరు చూసుకోండి తప్ప జపాన్‌కు మద్దతు మానుకోవాలని మన దేశానికి చైనా చెబుతున్నది. నాటి నెహ్రూ వైఖరిని తప్పుపడుతున్న నేటి నరేంద్రమోడీ సర్కార్‌, బిజెపి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా ? అలా ఇంతవరకు ఎందుకు చెప్పలేదు.అలాంటి వారికి నెహ్రూను విమర్శించే నైతిక హక్కు ఎక్కడ ఉంది ?


నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో చతుష్టయ(క్వాడ్‌) సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇది మిలిటరీ కూటమి కాదు, చైనాకు వ్యతిరేకం కాదని గతంలో మన దేశ వైఖరి గురించి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించారు. ఇప్పుడు నరేంద్రమోడీ వైఖరిలో అంత స్పష్టత లేదు. అది ఎత్తుగడ లేదా ముసుగు కావచ్చు, కానీ ఒక పార్టీగా బిజెపి అధికార ప్రతినిధి ఏం చెబుతున్నారు ? బ్రెజిల్‌, రష్యా, ఇండియా,చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి 2006లో ఏర్పడింది. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయం(క్వాడ్‌) 2007లో ఉనికిలోకి వచ్చింది. బ్రిక్స్‌ అవసరార్ధం, ఎడముఖం పెడముఖంగా ఉండేదేశాలతో ఏర్పడిందని, అంతగా అయితే రద్దు చేయకుండానే సార్క్‌ మాదిరి వదలివేయవచ్చట. పురోగామి ప్రజాస్వామిక దేశాలతో కూడిన చతుష్టయం సహజంగా ఉనికిలోకి వచ్చిందట. జగడాలంటే ఇష్టపడటం దాని స్వభావమట. ఎవరి మీద ? ఇది ఎల్లవేళలా చైనాకు వ్యతిరేకంగానే కనిపిస్తుందని,కమ్యూనిస్టు-ఇస్లామిస్టు కూటమికి వ్యతిరేకంగా పని చేసేందుకు అని కూడా బిజెపి ప్రతినిధి సెలవిచ్చారు. లడఖ్‌ సరిహద్దు వివాదం ఎందుకు,ఎలా జరిగిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చేమో !అంతేకాదు, భవిష్యత్‌ ప్రపంచ రాజకీయాలను మలచటంలో చతుష్టయం భారత్‌కు అత్యంత అనుకూల స్ధానాన్ని చేకూర్చుతుందని కూడా చెప్పారు. ఇక ఐరాస ప్రసంగంలో మోడీగారు చెప్పిన అంశాలలో ” భారత్‌ అభివృద్ది చెందినపుడు ప్రపంచం అభివృద్ధి చెందుతుంది… భారత్‌ సంస్కరణలు అమలు జరిపినపుడు ప్రపంచం మారుతుంది ” దీని మీద వ్యాఖ్యానించనవసరం లేదు. ఒకవైపు చతుష్టయ రాజకీయం చేస్తూనే మరోవైపు అకుస్‌ను ఏర్పాటు చేసి ఆస్ట్రేలియాకు అణుపరిజ్ఞానాన్ని అంద చేసేందుకు ఒక అడుగు ముందుకు వేశారు. దీంతో చతుష్టయం కూడా ఒక బాతాఖానీ కేంద్రంగా మారుతుందని కొందరు చెబుతున్నారు. దీనితో చైనాను దెబ్బతీసే అవకాశం మనకు వచ్చిందని బిజెపి చెబుతోంది.


మోడీ గారి అమెరికా పర్యటనలో పెద్ద జోక్‌ పేలింది. జో బైడెన్‌, నరేంద్రమోడీ ఇద్దరూ మాట్లాడుకొనేందుకు అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు.అప్పుడు బైడెన్‌ మన ప్రధాని మోడీతో మాట్లాడుతూ అమెరికా కంటే భారత మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తిస్తుంది.మీరు అనుమతిస్తే నేను ఒక్క మాట చెబుతాను. పత్రికల వారిని తీసుకొచ్చేట్లున్నారు. మనం వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవద్దు, ఎందుకంటే వారు నిర్దిష్ట అంశం మీద ఏ ప్రశ్నా అడగరు” అన్నాడు. మరొక వార్త ప్రకారం అమెరికా జర్నలిస్టులు ఏ అంశం మీదా సరిగా ప్రశ్నలు అడగరని వాటికి మీరు సమాధానం చెప్పలేరని అన్నట్లుగా ఆర్‌ఎన్‌సి రిసర్చ్‌ రాసింది. ఏదైనా జరిగి ఉండవచ్చు గానీ, అసలు నరేంద్రమోడీ భారత్‌లో కూడా మీడియాతో ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా మాట్లాడలేదు, అస్సలు నోరు విప్పరు అనే అంశం జో బైడెన్‌కు తెలియదా, అంతటి అమాయకండా ఉన్నాడా ? అసలు విషయం ఏమంటే అమెరికా మీడియా నరేంద్రమోడీ గురించి అనేక విమర్శనాత్మక కథనాలు రాసింది. అందువలన తమ దేశ మీడియాను బైడెన్‌ అవమానిస్తూ మాట్లాడి మోడీని సంతోషపెట్టేందుకు ప్రయత్నించారని చెబుతున్నవారు కూడా లేకపోలేదు. ఇదే సమయంలో అమెరికన్‌ మీడియా మీద జోబైడెన్‌ కూడా వివిధ కారణాలతో ఆగ్రహంతో ఉన్నారు. వారి ఉనికే సహించటం లేదని చతుష్టయ సమావేశాల సమయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో బైడెన్‌ భేటీ సందర్భంగా వెల్లడైంది. సిబ్బంది విలేకర్లను దాదాపు బయటకు గెంటేసినంత పని చేశారు.


సాధారణంగా ఒక ప్రాంతానికి అలవాటు పడినవారు మరో చోటికి వెళ్లినపుడు అందునా నిద్రవేళలు పూర్తిగా తారుమారైపుడు నిద్రపట్టకపోవటం, అలసి పోవటం, అక్కడి సమయాలకు వెంటనే అనువుగా అలవాటు పడకపోవటం తెలిసిందే. అయితే నరేంద్రమోడీ ఎక్కడికి వెళ్లితే అక్కడి సమయాలకు అనుగుణంగా విమానం ఎక్కగానే తన శరీర ధర్మాన్ని మార్చుకుంటారని ఆయనను అనుసరించిన వారు చెప్పినట్లు వార్త వెలువడింది. ఇవన్నీ సిబ్బంది చెప్పి రాయించిన వార్తలన్నది స్పష్టం. సాధారణ వ్యక్తులకే ఎంతో పని ఉంటుంది, అలాంటిది ప్రధాని మోడీ తన ముమ్మర కార్యక్రమాలకు అనుగుణ్యంగా ఉన్నత స్ధాయిలో శక్తిని ప్రదర్శించేలా తన శరీరాన్ని ఉంచుకున్నారని, ఎంత వత్తిడి ఉన్నా, ఎన్ని గంటలైనా ఎల్లవేళలా ఉల్లాసంగా విదేశీ ప్రయాణాల్లో ఉంటారని కూడా రాశారు. అలసటను జయించిన ప్రధాని అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, విమానబడలికకు దూరంగా ఉన్న ప్రధాని రహస్యాలు అనే అర్ధంతో హిందూస్తాన్‌టైమ్స్‌ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి.వీటిని ఆధారం చేసుకొని పిటిఐ వార్తా సంస్థ తన కథనాన్ని వండి వార్చింది. విమానాల్లో ప్రయాణించేటపుడు శరీరంలోని తడి ఆరిపోతుంది కనుక వైద్యుల సలహామేరకు ప్రధాని నీటిని ఎక్కువగా తాగుతారని పేర్కొన్నది.1990 దశకంలో నెలవారీ టిక్కెట్లు తీసుకొని రైల్లో తిరిగినట్లుగా మోడీ అమెరికా వెళ్లివచ్చేవారట. రాత్రిపూటే ప్రయాణించటం, విమానాలు లేదా విమానాశ్రయాల్లోనే సేద తీరేవారు తప్ప హౌటళ్లకు ఒక రూపాయి కూడా ఖర్చు చేసే వారు కాదట.

గోద్రా ఉదంత అనంతర గుజరాత్‌ మారణకాండ తరువాత నరేంద్రమోడీ పర్యటనకు అమెరికా అసలు వీసా ఇవ్వలేదని తెలిసిందే. ప్రధాని అయిన తరువాతే వెళ్లారు. అంతకు ముందు ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా అంతగా అమెరికాలో పని ఏమి ఉండి ఉంటుంది,1993లో ఒక్కసారి అమెరికా వెళ్లి అక్కడి సినిమా స్టూడియోలను సందర్శించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇతరంగా ఫొటోలు అంతర్జాలంలో దర్శనమిచ్చాయి. పోనీ రోజుకు ఒకసారి వెళ్లివచ్చారనే అనుకుందాం. నష్టం ఏముంది ? ఎన్నికల ప్రచారం వంటి సందర్భాలలో ప్రముఖుల ప్రచారశైలి గురించి మీడియా రాయటం తెలిసిందే, దాన్ని అర్ధం చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణాల్లో శరీరధర్మాన్ని మార్చుకోవటం వంటి అతిశయోక్తులు వ్యక్తిపూజకు నిదర్శనం. ఇలాంటి అంశాలు గతంలో కూడా అనేక మంది ప్రముఖుల గురించి రాసిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ కూడా ఆ కీర్తి కండూతి జాబితాలో చేరిపోయారు.ప్రత్యేకత ఏముంది ? ఇలాంటి వార్తలు, లేదా వ్యక్తిగత అలవాట్ల గురించి రాసి భక్తులను ఆనందపెట్టటం తప్ప దేశానికి జరిగే ప్రయోజనం ఏముంది ? బిజెపి నేతలు చెబుతున్నట్లు ప్రపంచ రాజకీయాలను మోడీ గారు ఎలా మలుస్తారో, చారిత్రాత్మకం ఏమిటో తరువాతైనా కనిపిస్తాయోమో చూద్దాం !

.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా ఆరాధకులూ, గుడ్డి భక్తులూ జర జాగ్రత్త !

26 Sunday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, AUKUS, Canada, Huawei Technologies, Meng Wanzhou, Quad


ఎం కోటేశ్వరరావు


చైనా మీద ఉక్రోషంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హువెయి కంపెనీ అధికారిని కిడ్నాప్‌ చేయించాడు.దాని పర్యవసానాలను తట్టుకోలేని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ దిగివచ్చి రాజీ చేసుకున్నాడు. బాధితురాలు చైనాకు చెందిన వాంగ్‌ వాన్‌ఝౌ స్వదేశం చేరుకొనే సమయంలోనే చతుష్టయ దేశాధినేతల తొలి సమావేశం వాషింగ్టన్‌లో జరిగింది. చతుష్టయ సమావేశం ముందుగా నిర్ణయించుకున్నదే, మరి మొదటి ఉదంతం ? యాదృచ్ఛికమా ? కానేకాదు ! ఈ చర్య అమెరికా-చైనాల మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు దోహదం చేయనుందనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్యలకు ” అకుస్‌” ఒప్పందం చేసుకున్నారు. చతుష్టయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో నాటకీయంగా సుఖాంతమైన కిడ్నాప్‌ ఉదంతం, దీని ద్వారా భారత్‌ సహా మిత్రదేశాలకు అమెరికా ఇచ్చిన సందేశం ఏమిటి ?


చైనాతో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా టెలికాం కంపెనీ హువెయి సిఎఫ్‌ఓ, కంపెనీ స్ధాపకుడి కుమార్తె మెంగ్‌ వాన్‌ఝౌను 2018డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలో ” రాజకీయ కిడ్నాప్‌ ” చేయించాడు. మెంగ్‌ చైనా నుంచి మెక్సికో వెళుతూ విమానం మారేందుకు కెనడాలోని వాంకోవర్‌ విమానాశ్రయంలో దిగింది. అమెరికా వత్తిడికి లొంగిన కెనడా సర్కార్‌ ఆమెను కిడ్నాప్‌ చేసి నిర్బంధించింది. ఇదే సమయంలో గూఢచర్యానికి పాల్పడుతూ దొరికిపోయిన ఇద్దరు కెనడీయులను చైనా అరెస్టు చేయటమే కాదు, విచారణ జరిపి శిక్షలు కూడా విధించింది. ఈ పరిణామాలతో అమెరికా-చైనా సంబంధాలు గత నాలుగుదశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా దిగజారటమే కాదు, కెనడా ఇరుక్కుపోయి చైనాతో వైరాన్ని కొని తెచ్చుకుంది.


ఇంతకీ వాంగ్‌ మీద మోపిన నేరం ఏమిటి ? ఇరాన్‌ మీద అమెరికా విధించిన ఆంక్షలను వమ్ము చేసేందుకు హుబెయి కంపెనీ కుట్ర చేసిందట, దానికి గాను సిఎఫ్‌ఓను అరెస్టు చేసి తమకు అప్పగించాల్సిందిగా కెనడాను కోరింది. కెనడా అరెస్టయితే చేసింది గానీ చైనాతో వచ్చే ముప్పును గ్రహించి వాంగ్‌ను అమెరికాకు అప్పగించలేదు. ఒకవైపు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ (క్వాడ్‌) తొలి సమావేశం వాషింగ్టన్‌లో జరుపుతున్న సమయంలోనే నాటకీయ పరిణామాల మధ్య వాంగ్‌ విడుదలకు చైనాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. వాంగ్‌ శనివారం నాడు ప్రత్యేక విమానంలో చైనా చేరుకుంది. ఒప్పంద వివరాలు పూర్తిగా తెలియదు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగే విషయం ఇతర భాగస్వామ్య పక్షాలతో చెప్పకుండానే నిర్ణయం తీసుకున్న అమెరికా ఇప్పుడు ఈ పరిణామంతో చతుష్టయంలోని మిగిలిన దేశాలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లయింది.


ఈ ఒప్పందానికి జో బైడెన్‌ యంత్రాంగాన్ని ప్రేరేపించిన అంశాలేమిటి ? చైనా వైపు నుంచి కొత్తగా పొందిన రాయితీలేమీ లేవు. ఒక వైపు అక్కడి గుత్త సంస్ధలపై అనేక చర్యలను జింపింగ్‌ సర్కార్‌ ప్రకటిస్తున్నది. ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వంత పరిజ్ఞానం, వనరులతో అభివృద్ధి వ్యూహాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. జనవరిలో అధికారాన్ని స్వీకరించిన బైడెన్‌ వాణిజ్య ప్రతినిధిగా కాథరీన్‌ తాయి నియామకం జరపటంతో వాణిజ్యవేత్తలు తమ సమస్యలను పట్టించుకుంటారనే ఆశాభావం వెలిబుచ్చారు. అయితే నెలలు గడుస్తున్నా వ్యూహాత్మక ఓపిక పేరుతో కాలం గడుపుతున్న బైడెన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు రాకపోవటంతో కొంత మందిలో ఓపిక స్దానంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. వెంటనే చైనాతో చర్చలు జరిపి సాధారణ సంబంధాలతో తమ ప్రయోజనాలను కాపాడతారా లేదా అనే వత్తిడి తెస్తున్నారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో చైనాతో కుదుర్చుకున్నట్లు ప్రకటించిన తొలి దశ వాణిజ్యం ఒప్పందం ఏమేరకు అమలు జరిగిందో స్పష్టత లేదు. కరోనా వైరస్‌ను చైనాయే తయారు చేసి వదలిందని నోరు పారవేసుకున్న ట్రంప్‌ చైనాతో వైరాన్ని మరింత పెంచాడు. ఒప్పందంలో ఏమి చెప్పినప్పటికీ అమెరికాకు ఆగ్రహం కలిగినా, దాంతో చైనాకు చిర్రెత్తినా నష్టపోయేది అమెరికాయే గనుక అక్కడి వాణిజ్యవేత్తలు బైడెన్‌ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు తొలివారంలో అమెరికాలోని అతి పెద్ద వాణిజ్య సంస్ధల సంఘాలు సమావేశమై చైనాతో సర్దుబాటు చేసుకొని వాణిజ్య అవకాశాలను పెంచుతారా లేదా అని బైడెన్‌కు ఒక విధంగా హెచ్చరికను జారీ చేశాయి. కొన్ని ఉత్పత్తుల తయారీకి అవసరమైన ఉత్పాదకాలు చైనాలో మాత్రమే దొరుకుతాయి, ఇతర దేశాల్లో పరిమితంగా లభ్యమైనా అధికధరలకు వాటిని కొనుగోలు చేసి మార్కెట్లో తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నామని, అందువలన చైనా సరఫరాదార్ల మీద ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, కార్మికులు, అమెరికా పోటీతత్వాన్ని కాపాడాలంటే చైనాతో రాజీకి రావాలని స్పష్టం చేశాయి.


అమెరికా కంపెనీలను చైనీయులు ఎలా ప్రభావితం చేస్తున్నారో మచ్చుకు విమానాలను తయారు చేసే బోయింగ్‌ కంపెనీ ఉదంతాన్ని చూద్దాం. అసలే ఆ కంపెనీ కష్టాల్లో ఉంది, అది తయారు చేసే విమానాల్లో ఐదోవంతు కొనుగోలు చేసే చైనా నుంచి 2017 తరువాత ఆర్డర్లు లేవు. లాభాలు తెస్తుంది అనుకుంటున్న బోయింగ్‌ 737 మాక్స్‌ రకం తన గగన తలంపై ఎగిరేందుకు చైనా అనుమతించ లేదు. దాంతో ఇతర దేశాలు అనుమతి ఇచ్చినా, విమానాలు కొనుగోలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. ఇదంతా ట్రంపు చేసిన కంపు అని అది మండిపడుతోంది. రాబోయే పది సంవత్సరాల్లో ప్రపంచం వంద విమానాలు కొనుగోలు చేస్తుందనుకుంటే వాటిలో 25 చైనా వాటా.ఈ కారణంగా బోయింగ్‌ వాటాదారులు ఇటీవల కంపెనీ మీద ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డుంకులను అధిగమించినా చైనాతో సాధ్యం కావటం లేదు, చైనాతో సర్దుబాటు చేసుకోకపోయినా, ఆలస్యం అయినా మన కంపెనీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సిఇఓ దవే కాలహన్‌ వాపోయాడు. మే నెలలో కొత్తగా 73 విమానాలకు అర్డర్లు వస్తే అదే నెలలో 53 ఆర్డర్లు రద్దయ్యాయి. కనుక ఇలాంటి కార్పొరేట్లకు ఆగ్రహం కలిగినా, మద్దతు లేకపోయినా అమెరికాలో ట్రంపూ, బైడెన్‌ ఎవరూ తెరమీద కనిపించరు.


బోయింగ్‌ వంటి కంపెనీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి ? రానున్న రెండు దశాబ్దాలలో చైనాకు 8,700 విమానాలు అవసరమన్నది ప్రస్తుత అంచనా. చైనా వృద్ధి రేటు, పౌరుల ఆదాయాలు పెరిగితే ఇంకా ఎక్కువ అవసరం కావచ్చు. మరోవైపు 2025నాటికి స్వంత విమానాలను ఎగురవేయాలని చైనా ముమ్మరంగా పరీక్షలు జరుపుతోంది.2008లో ఏర్పాటు చేసిన కంపెనీ రెండు రకాల విమానాలను అభివృద్ది చేస్తోంది. ఎక్కడా ఆగకుండా 5,555 కిలోమీటర్ల దూరం 156 నుంచి 168 మంది, పన్నెండు వేల కిలోమీటర్లు ఆగకుండా 250 నుంచి 320 మంది ప్రయాణీకులను చేరవేయగలిగే విమానాలను తయారు చేస్తున్నారు. వెయ్యి చిన్న విమానాలను ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య అవసరాలకు ప్రవేశపెడతారని, 2025నాటికి పెద్ద విమానం సిద్దమౌతుందని భావిస్తున్నారు. అవి రంగంలోకి వస్తే ఐరోపా ఎయిర్‌బస్‌, అమెరికా బోయింగ్‌లకు పెద్ద పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ లోగా వీలైనన్ని విమానాలను అమ్ముకోవాలని ఆ రెండు కంపెనీలు తొందరపడుతున్నాయి. తమ ప్రభుత్వాల మీద వత్తిడి చేస్తున్నాయి.


వచ్చే ఏడాది నవంబరులో అమెరికా పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల జరగాల్సి ఉంది. చైనాతో ఒప్పందం చేసుకుంటే లొంగిపోయినట్లుగా ట్రంప్‌ గ్యాంగ్‌ ఓటర్లను రెచ్చగొట్టవచ్చని డెమోక్రటిక్‌ పార్టీ భయపడుతోంది. లేకపోతే కార్పొరేట్లు గుర్రుమంటున్నాయి.మరోవైపు ఎవరి మీదా ఆధారపడకుండా ఆర్ధిక వ్యవస్దను నడపాలనే వైఖరితో ముందుకు పోతున్న చైనా నాయకత్వ వైఖరి కూడా పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు చతుష్టయంలోని భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలను చైనాకు వ్యతిరేకంగా అమెరికా రెచ్చగొడుతూ దూరం పెంచుతోంది. మరోవైపు తన వ్యాపారాన్ని తాను చక్కపెట్టుకొంటోంది.2021 తొలి ఎనిమిది నెలల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 36.6శాతం పెరిగి చైనా-అమెరికా వాణిజ్యం రెండు వైపులా రికార్డులను బద్దలు కొట్టి 470బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికా నుంచి 48శాతం ఎగుమతులు(111బి.డాలర్లు) పెరిగితే చైనా నుంచి 33.3శాతం(354 బి.డాలర్లు) పెరిగాయి. ఏడాది మొత్తం మీద రెండు దేశాల మధ్య 700 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఇది వాణిజ్య యుద్దానికి ముందున్న స్ధాయిని దాటి కొత్త రికార్డు నెలకొల్పుతుందని చెబుతున్నారు.


చైనా నుంచి కంపెనీలు మన దేశం వస్తున్నాయన్న ప్రచారం తెలిసిందే. కరోనా సమయంలో(2020) చైనాలోని తమ అసోసియేషన్‌లోని 95శాతం మంది చైనా మార్కెట్లో లబ్దిపొందారని అమెరికా-చైనా వాణిజ్య మండలి(యుఎస్‌సిబిసి) ఒక శ్వేతపత్రంలో వెల్లడించింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ట్రంప్‌ వైఖరినే బైడెన్‌ కొనసాగిస్తారనే భయం అమెరికన్‌ కార్పొరేట్లలో ఉంది, అందుకే వత్తిడి పెంచారు.అదే జరిగితే చైనా ప్రతిదాడికి దిగితే వాణిజ్యంతో పాటు సామాన్య అమెరికన్లు కూడా ఇబ్బంది పడతారనే భయం వ్యక్తమౌతోంది. అంతర్గతంగా రాయితీలు ఇవ్వటాన్ని ప్రపంచ వాణిజ్య సంస్ధ కూడా అడ్డుకోలేదు.ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దితో 2025 నాటికి ఒక మైలురాయిని దాటాలని చైనా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ స్ధానిక పరిశోధన, అభివృద్దిని ప్రోత్సహిస్తోంది. ఇది కూడా అమెరికన్లకు ఆందోళనకరంగా మారింది. ట్రంప్‌ మార్గంలో పయనిస్తే మరోదారీ, తెన్నూ లేని చోటికి పయనిస్తామని, కనుక వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చర్చలు జరపాలని కార్పొరేట్లు డిమాండ్‌ చేస్తున్నాయి.ఈ నేపధ్యంలోనే సెప్టెంబరు పదిన జో బైడెన్‌-గ్జీ జింపింగ్‌ మధ్య అనేక అంశాలపై ఫోను ద్వారా సంభాషణలు జరిగాయి. పదిహేను రోజుల్లోనేే హుబెయి సిఎఫ్‌ఓ వాంగ్‌ఝౌ విడుదల ఆఘమేఘాల మీద జరిగింది.


అమెరికన్‌ కార్పొరేట్లు బైడెన్‌ సర్కారు మీద మరోవత్తిడిని కూడా ప్రారంభించాయి. ఆర్ధికంగా చిక్కుల్లో ఉన్న వ్యవస్ధను గట్టెక్కించేందుకు ప్రభుత్వం 3.5లక్షల కోట్ల డాలర్లను వివిధ పధకాల మీద ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. అందుకు గాను వాణిజ్య, పారిశ్రామిక సంస్దల నుంచి వసూలు చేసే పన్ను మొత్తాల పెంపుదల, ఇతర చర్యల ద్వారా నిధుల సేకరణ జరపాలన్న ప్రతిపాదనలున్నాయి.ఇదే చేస్తే దేశ ఆర్ధిక వ్యవస్ధ ఉనికే ప్రశ్నార్దకం అవుతుందని అమెరికా వాణిజ్య మండలి ధ్వజమెత్తింది.దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీవీల్లో ప్రకటనలు జారీ చేసి ప్రచారం చేస్తోంది. ఈ మొత్తం దేశంలోని 50 రాష్ట్రాల బడ్జెట్లకు రెండు రెట్ల కంటే ఎక్కువని, దీని వలన ఫలితం లేకపోగా మొదటికే ముప్పు వస్తుందని వాణిజ్య మండలి సిఇఓ సుజానే క్లార్క్‌ విమర్శించాడు.ఈ ప్రతిపాదనలను ఆమోదించవద్దని, మద్దతు ఇస్తే ఏ సభ్యుడికీ తమ మద్దతు ఉండదని హెచ్చరిస్తూ పార్లమెంట్‌ సభ్యులకు ఒక లేఖను కూడా మండలి రాసింది. ఇదే సమయంలో ఎట్టి పరిస్ధితుల్లో ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సిందే అని కొంత మంది ఎంపీలు బహిరంగంగా ప్రకటించారు.


ప్రపంచీకరణ పేరుతో ప్రపంచమార్కెట్లను ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నిస్తే అనుకున్నదొకటీ అయింది మరొకటి. ప్రపంచీకరణ శ్రమశక్తి ఖర్చును తగ్గించింది. అది అమెరికా కార్పొరేట్లకు వరంగానూ, కార్మికవర్గానికి శాపంగానూ మారింది. స్ధానిక మార్కెట్ల ద్వారా వృద్ధి సాధించే అవకాశాలు తగ్గిపోయాయి. అమెరికా వస్తువుల కంటే ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటం లాభదాయయకంగా మారింది. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా చేరినప్పటి నుంచీ అంతకు ముందు యాభై సంవత్సరాలతో పోల్చితే అమెరికన్‌ కార్పొరేట్ల లాభాలు 22శాతం పెరిగాయి.చైనాలో పెట్టుబడి పెట్టిన వారు కూడా ఇదే విధంగా లబ్ది పొందారు. దశాబ్దాల తరబడి క్యూబా, ఉత్తర కొరియా,రష్యా,సిరియా, తదితర దేశాల మీద అమెరికా విధించిన ఆంక్షలు పరిస్ధితిని మరింతగా దిగజారాయి తప్ప ప్రయోజనం లేకపోయింది. అవన్నీ ఇబ్బందులను భరించాయి తప్ప అమెరికాకు లొంగలేదు. అమెరికా విధించిన ఆంక్షల వలన ఆయా దేశాలు బోయింగ్‌ బదులు ఎయిర్‌బస్‌ విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇదే ఇతర అంశాల్లోనూ జరుగుతోంది. క్రమంగా చైనా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారుతుందని పశ్చిమదేశాలు వేసిన అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ఇప్పుడు అక్కడ బడా సంస్దల మీద నియంత్రణ, ఉమ్మడి సౌభాగ్యం పేరుతో తీసుకుంటున్న చర్యల గురించి అర్ధంగాక జుట్టుపీక్కుంటున్నాయి.


గత దశాబ్దకాలంలో చైనా సంస్దలు అమెరికా నుంచి 76బిలియన్‌ డాలర్లను సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 13బిలియన్‌ డాలర్లను పొందాయి.2016 నుంచి అమెరికాలోని స్టాక్‌మార్కెట్‌లో వాటాలను విక్రయిస్తున్న చైనా కంపెనీలు రెట్టింపై 400కు చేరాయి. వాటి లావాదేవీల మొత్తం 400 బిలియన్‌ డాలర్ల నుంచి 1.7లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా విదేశాంగ విధానంలో ఆర్ధిక అంశాలు చిన్నచిన్న దేశాలను కూడా ప్రభావితం చేయలేకపోయాయి. మిలటరీ చర్యలు కూడా ఎలా పరువు తీశాయో ఆప్ఘనిస్తాన్‌ స్పష్టం చేసింది. మిత్రదేశమైన మెక్సికో సరిహద్దులో వలస కార్మికులను అడ్డుకొనేందుకు ఏకంగా ట్రంప్‌ సర్కార్‌ గోడనే కట్టించిన విషయం తెలిసిందే. చైనా మీద విధించిన ఆంక్షలను ఐరోపాలోని జర్మనీ వంటి దేశాలే ఖాతరు చేయటం లేదు. హువెయి కంపెనీ టెలికాం ఉత్పత్తుల దిగుమతిని వ్యతిరేకించిన జర్మనీ ఇప్పుడు పునరాలోచనలో పడి ఐరోపా యూనియన్‌ మీదనే ఆంక్షలకు వ్యతిరేకంగా వత్తిడి తెస్తోంది. చైనాతో ఒప్పందాలు చేసుకుంటోంది. గతేడాది చైనాతో దాని వాణిజ్యం 243 బిలియన్‌ డాలర్లు. ఆర్ధిక ఆంక్షల కొరడాను అమెరికా ప్రయోగిస్తుంటే అదే ఎత్తుగడను చైనా అనుసరిస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్‌, కెనడా, దక్షిణ కొరియా వంటి అమెరికా అనుకూల దేశాలకు నీవు నేర్పిన విద్యయే అంటూ జవాబిస్తోంది.


మాఫియా ముఠాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు ఎరలు వేసి యువతను ఆకర్షించి వారి చేత తప్పులు చేయించి తమ చక్రబంధంలో ఇరికించుకొని మరిన్ని తప్పులు చేయిస్తాయి.ఆ విషవలయం నుంచి ఎవరైనా బయటపడాలన్నా తమ మీద ఆధారపడటం తప్ప తప్పుకోలేని స్ధితికి నెడతారు. సరిగ్గా అమెరికా కూడా అదే పద్దతులను అనుసరిస్తోంది. పేకాటలో గెలిచేందుకు వేసే ఎత్తుగడల్లో భాగంగా, ఎదుటివారిని మభ్యపెట్టేందుకు కొన్ని పేకలను పడవేయటాన్ని తురుపు ముక్కలు అంటారు. వాటిని చూసి ఎదుటి వారు ఆడితే తప్పుదారి పట్టినట్లే.్ల అమెరికా తన క్రీడలో కూడా అలాంటి తరుపుముక్కలను ఉంచుకుంటుంది. మన దేశం విషాయనికి వస్తే స్వతంత్ర లేదా అలీన విధానాన్ని అనుసరించినపుడు మనకు ఉన్న మిత్రదేశాలెన్ని ఇప్పుడు దూరమయ్యాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. ఆసియాలో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు మన నుంచి దూరం జరిగి చైనాకు సన్నిహితం అవుతున్నాయి.అయినప్పటికీ ప్రస్తుత మనపాలకుల వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. చైనా, లేదా మరొకదేశానికి లొంగిపోవాలని లేదా దాని అనుయాయిగా మారాలని ఎవరూ చెప్పటం లేదు. మన రక్షణ, ప్రయోజనాలూ ముఖ్యం. అమెరికా చెప్పుడు మాటలు విని దాని కోసం మనం ఇరుగు పొరుగు వారితో విబేధాలను కొనితెచ్చుకోవటం సరైన వైఖరికాదు. సరిహద్దు సమస్యను ఉభయ దేశాలు పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా ఆర్చేది కాదు తీర్చేది కాదు.


ఐరోపా యూనియన్‌కు మోటారు వంటి జర్మనీలో ఇటీవల ఒక నివేదిక వెలువడింది. మన అపర దేశభక్తులు దాని గురించి ఒక్కసారి చూడటం మంచిదేమో ఆలోచించండి. బిట్స్‌ అండ్‌ చిప్స్‌ అనే వెబ్‌సైట్‌లో సెప్టెంబరు ఒకటవ తేదీన ఒక వార్త వచ్చింది. దానికి పెట్టిన శీర్షిక ” చైనా విషయంలో మనం అమెరికా అజండాను గుడ్డిగా అనుసరించకూడదు ”. జర్మన్‌ ఎకనమిక్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించిన ఒక నివేదిక మీద సమీక్ష మాదిరి రాశారు. ఐరోపా ఎగుమతి వస్తాదుగా ఉన్న జర్మనీ ఇటీవలి కాలంలో చైనాతో ఓడిపోతోంది అని పేర్కొన్నారు. ఇదే వెబ్‌సైట్‌లో అంతకు ముందు విశ్లేషణ రాసిన సానే వాన్‌డెర్‌ లగట్‌ ఇలా చెప్పారు.” గావుసియన్‌ అనే చైనా కంపెనీ శుభ్రం చేసే రోబోట్లను ఉన్నతమైన నాణ్యతతో అందచేస్తున్నది. వాటన్నింటి కంటే నేను ఒక ప్రధాన పెద్ద భ్రమ గురించి హెచ్చరిక చేయదలచాను.సాంకేతికంగా ఆసియా దేశాల కంటే ముందున్నామని ఇంకా అనుకుంటున్నాము. దాన్ని మనం కాపాడుకోవాలంటే అపహరించకుండా, కొనుగోలు, కాపీ చేయకుండా చూడాలని అనుకుంటున్నాము. మనం ఒక అంశానికి సిద్దపడటం లేదు, అదేమంటే ఉదారవాద మార్కెట్‌లో మన స్వంత చట్టాల ప్రకారమే మన మాదిరే అనేక కంపెనీలు మరింత ఆధునిక ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి.”


ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగితే జరిగే పర్యవసానాల గురించి భాగస్వామ్య దేశమని పొగడ్తలు కురిపించిన మనతో లేదా అక్కడికి సైన్యాన్ని పంపిన నాటో కూటమి దేశాలతో కూడా అమెరికా మాట మాత్రం చెప్పకుండా తనదారి తాను చూసుకుంది. మనం బహిరంగంగా తప్పు పట్టకపోగా తాలిబాన్లతో ప్రయివేటు ఒప్పందాన్ని హర్షించాము. చతుష్టయం పేరుతో మన దేశం, జపాన్‌, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించి చైనాకు వ్యతిరేకంగా నిలబెడుతోంది. జపాన్‌, మనదేశంతో చెప్పకుండానే మిత్రదేశమైన ఫ్రాన్స్‌ ప్రయోజనాలను కూడా దెబ్బతీసి ఆస్ట్రేలియాకు తమ అణుశక్తి జలాంతర్గాములను అమ్ముకొనేందుకు బ్రిటన్‌తో కలసి కొత్త కూటమి అకుస్‌ను ఏర్పాటు చేసింది. మూడు సంవత్సరాలుగా హుబెయి సిఎఫ్‌ఓను కెనడాలో నిర్బంధించిన అమెరికా నాటకీయ రీతిలో కేసులు ఎత్తివేసింది. దాని మాట నమ్మి అరెస్టు చేసిన కెనడా, ఆ చర్యను సమర్ధించిన దేశాలన్నీ ఇప్పుడు తలెత్తుకోలేని స్ధితిలో పడ్డాయి. ఇదంతా ఎందుకు అంటే చైనాతో తన వాణిజ్యాన్ని పెంచుకొనేందుకే అన్నది స్పష్టం. అందుకోసం అమెరికన్లు దేనికైనా సిద్దపడతారు. మనం ఇప్పటికే చాలా దూరం ప్రయయాణించాం. ఎక్కడకు పోతామో తెలియదు. అందువలన మన దేశంలోని అమెరికా గుడ్డి అరాధకులు, భక్తులు ఇప్పటికైనా దాని తోకను వదలి పెట్టటం గురించి ఆలోచించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశ్వగురువా… వినదగునెవ్వరు చెప్పిన !

15 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan, China Factor, imperialism, India foreign policy under narendra modi, Narendra Modi, NATO, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


ఆఫ్ఘనిస్తాన్‌లో అగ్రరాజ్యం అమెరికాకు జరిగిన ఘోర పరాభవం గురించి ఎంత మూసిపెడదామన్నా, నోళ్లు నొక్కుదామన్నా కుదరటం లేదు. పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలు, సమాచారం వరదలా వస్తూనే ఉంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోందో, జరగనుందో ఇంకా స్పష్టత రాలేదు. పంజీషర్‌ లోయలో ఉత్తరాది కూటమి(నార్తరన్‌ అలయన్స్‌) కొరకరాని కొయ్యగా ఉంది. అధికారంలో వాటా కావాలని పట్టుబడుతోంది. ఆ కూటమి గురించి ఎలా వ్యహరించాలనే అంశం మీద తాలిబన్లలోని రెండు ప్రధాన ముఠాల మధ్య వివాదం ముదిరి కాల్పుల వరకు వచ్చిందనే వార్తలు నమ్మశక్యం లేవు. కాల్పులు జరగటానికి కారణాలు వేరే ఉండవచ్చు. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకార ఉత్సవాన్ని రద్దు చేశారు. రష్యా వంటి దేశాల సలహామేరకు అలా చేశారని ఒకవైపు వార్తలు, మరోవైపు పొదుపు కార్యక్రమంలో భాగంగా అలా చేశామని తాలిబన్లు ప్రకటించారు. పోనీ నిరాడంబరంగా అయినా ప్రమాణస్వీకారం చేశారా లేదా ? తెలియదు. అలాంటిదేమీ లేకుండా పాలన సాగిస్తే అదీ కొత్త వరవడే అవుతుంది.


కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదేందుకు పూనుకోవద్దన్నది తెలుగు ప్రాంతాల్లో లోకోక్తి. ఇప్పుడు గోదావరి బదులు అమెరికాను నమ్మి పోవద్దని చెబుతున్నారు. విశ్వగురువుగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ ప్రభుత్వానికి కూడా అలాంటి సలహాలు ఇస్తున్నారు. మోడీ ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు గనుక పాము చావకుండా కర్ర విరగకుండా అన్నట్లు అనేక మంది అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా సలహాలు ఇస్తున్నారు. రేపు ఏం జరిగినా చూశారా మేం చెప్పిందే జరిగింది అని తమ జబ్బలను తామే చరుచుకుంటారు.


స్టేట్స్‌మన్‌ అనే ఆంగ్లదిన పత్రిక సంపాదకుడిగా పని చేసిన సునంద కె దత్తా రే(84) తాజాగా ఒక విశ్లేషణ రాశారు. ఆయనేమీ కమ్యూనిస్టు కాదు. ఆ విశ్లేషణ సారాంశం ఇలా ఉంది.” భద్రతకు మతం గురించి తెలియదు. హిందూయిస్టు ఇండియా లక్ష్యమైనా ఉగ్రవాదుల దాడులకు నెలవు కాని ఆఫ్ఘనిస్తాన్‌ స్ధిరమైన ప్రభుత్వంతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. ఇప్పుడు అమెరికా పొగుడుతూ ఉండవచ్చుగానీ నరేంద్రమోడీ ఆసియా చరిత్రను అవలోకించాలి. అమెరికాతో తృతీయ ప్రపంచ దేశాల సంబంధాలు మృత్యువును ముద్దాడినట్లే అని పదే పదే రుజువైంది. ఇస్లాం మరియు ఉగ్రవాద రాజకీయాలకు మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హిందూయిస్టు పార్టీ అనుసరించకూడదు. ఇండోనేషియా, పాకిస్తాన్‌ తరువాత 19.5 కోట్ల మంది ముస్లింలకు స్దానం ఉన్న దేశం భారత్‌. ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు. సహజ భాగస్వాములంటూ అతల్‌బిహారీ వాజ్‌పాయి, అణుఒప్పందంతో మన్మోహన్‌ సింగ్‌, తరువాత చతుష్టయ కూటమి పేరుతో నరేంద్రమోడీ అమెరికాతో ఎంతో సౌఖ్యంగా ఉన్నారు. చతుష్టయం చర్చలతో పాటు సమాంతరంగా అంతకు ముందు లేని సంయుక్త మిలిటరీ విన్యాసాల(మలబార్‌)కు దారి తీసింది.అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌లతో 2007లో ప్రారంభమైన చతుష్టయ కూటమి తనకు వ్యతిరేకమైనదిగా భావించిన చైనా నిరసన తెలిపింది. సదరు కూటమి మిలిటరీ సంబంధాలకు కాదని, చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటం లేదని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నాడు చైనా అధినేతగా ఉన్న హు జింటావోకు హామీ ఇచ్చారు.పరిస్ధితులు మారిపోయాయి. లడఖ్‌ ఘర్షణ ముక్కుసూటి తనాన్ని సమర్ధించవచ్చు. అయితే చైనా చరిత్ర మరియు సంప్రదాయాలు అదే విధంగా అమెరికా, ఇతర ఆసియా దేశాలతో దాని సంబంధాల రికార్డును జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉందని పరిస్ధితి చెబుతున్నది.


ఆసియా పాలకులను అమెరికా నట్టేట ముంచిన, మోసం చేసిన ఎన్నో విచారకరమైన ఉదంతాలను నరేంద్రమోడీ గారు తప్పక తెలుసుకోవాలి. దక్షిణ వియత్నాం అధ్యక్షుడు నగో దిన్‌ దిమ్‌, అతని సోదరుడు నగో దిన్‌ హు మీద జరిగిన మిలిటరీ తిరుగుబాటులో వారు హతమైన ఉదంతాన్ని అమెరికా పట్టించుకోలేదు. మీరు అమెరికాలో ఆశ్రయం పొందుతారా అని హు భార్యను అడిగితే నాకు వెన్నుపోటు పొడిచిన దేశంలో నేను జీవించలేను అని చెప్పింది. దక్షిణ వియత్నాం మరో అధ్యక్షుడు గుయెన్‌ వాన్‌ థీవ్‌ పరిస్ధితిని గమనించి రాజీనామా చేసి తైవాన్‌ పారిపోయాడు.అమెరికా అధ్యక్షుడొకరు ఏ దేశ నియంతను అయినా మా ఒక ఉంపుడు గత్తె కొడుకు అన్నాడంటే అతను దక్షిణ కారియా అధ్యక్షుడు సింగమాన్‌ రీ అయి ఉండవచ్చు. అమెరికా మరియు ఐరాస కమాండర్‌ మార్క్‌ క్లార్క్‌ ఒక రోజు అతన్ని పదవి నుంచి గెంటివేయాలనుకున్నాడు.( అతన్ని సిఐఏ అమెరికా హవాయిలోని హానలూలుకు తరలించింది, అక్కడే చచ్చాడు) అమెరికావదిలించుకొని ఉండకపోతే ఫిలిప్పైన్స్‌ ఫెర్డినాండ్‌ మార్కోస్‌ హానలూలు వెళ్లటం, అక్కడే చచ్చి ఉండేవాడు కాదు( ఇది రోనాల్డ్‌ రీగన్‌ హయాంలో జరిగింది). అమెరికాతో చేతులు కలిపిన అనేక మందిలో అతనొకడు. ఇరాన్‌ షా అమెరికన్లకు సంకటం తెచ్చాడు. ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు, కోర్టులకు ఒక ప్రామాణికమైన పద్దతి లేదు, నమ్మశక్యం కాని పద్దతుల్లో చిత్రహింసల చరిత్ర ఉందని షా పాలన గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వ్యాఖ్యానించింది.( వీడిని సమర్ధించిన అమెరికా పాలకులు ఎంతగా భయపడ్డారంటే పదవీచ్యుతుడైన తరువాత షా అమెరికా వచ్చాడు. న్యూయార్క్‌ ఆసుపత్రిలో స్వంత పేరుతో ఆపరేషన్‌ చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడి డేవిడ్‌ డి న్యూసమ్‌ అనే దొంగపేరుతో చేర్పించారు. మెక్సికో, పనామా ఎక్కడకు వెళితే అక్కడ జనం వ్యతిరేకించటంతో చివరికి ఈజిప్టులో ఆశ్రయం ఇప్పించారు.)

అష్రాఫ్‌ ఘనీ(పారిపోయిన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు)ది ఒక అసాధారణ అనుభవం. దోహాలో తాలిబాన్లతో చర్చల నుంచి అమెరికా అతన్ని మినహాయించింది. ట్రంపు మాదిరే బైడెన్‌ కూడా తమ అవసరాల మేరకే వ్యవహరించాడు. కఠినమైన వాస్తవం ఏమంటే చిన్నా చితక భాగస్వాములను అమెరికా పట్టించుకోదు, ఏడు దశాబ్దాల పరస్పర రక్షణ ఒప్పందం ఉన్న ఫిలిప్పైన్స్‌నే అది వదలివేసింది.భారత సమస్యల మూలాలు దాని భౌగోళిక రాజకీయ స్దానం, సంస్కృతి, గుర్తింపు, ఆకాంక్షల్లో ఉన్నాయి. సీతారామ్‌ ఏచూరి ఒకసారి హెచ్చరించినట్లు మరొక పాకిస్తాన్‌గా మారితే అవి పరిష్కారం గావు. చైనా చెబుతున్నట్లు చతుష్టయం(క్వాడ్‌) ఆసియా నాటో కావచ్చు, కాకపోవచ్చు. ప్రస్తుతం చైనాతో ఉన్న విబేధాలను అమెరికా పరిష్కరించుకుంటే, మరిచిపోయిన సీటో( సౌత్‌-ఈస్ట్‌ ఆసియన్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌), బాగ్దాద్‌ ఒప్పందాలకు పట్టిన గతే పడుతుందనుకొని సిద్దపడాలి. తరువాత ఇంటా బయటా ఉన్న ముస్లింలతో సర్దుబాటు చేసుకోవాల్సిన వాస్తవాన్ని మోడీ సర్కార్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది.” (బ్రాకెట్లలోని అంశాలు నేను జతచేసినవి)
అమెరికా ఎలాంటిదో, దానితో వ్యవహారం గురించి తాజా పరిణామాలతో అనేక దేశాలు పునరాలోచనలో పడ్డాయి. అమెరికన్‌ కార్పొరేట్లకు లాభాలు తెచ్చేవాటిలో యుద్దం ఒకటి. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. గత రెండు దశాబ్దాల్లో అమెరికా యుద్దాలు, వాటిలో పాల్గొన్న మాజీ సైనికుల సంక్షేమం కోసం చేసిన ఖర్చు ఎనిమిదిలక్షల నుంచి 21లక్షల కోట్ల డాలర్లు. పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్త ఒక దానిలో లాభం రాకపోతే మరొక ఉత్పత్తిని ప్రారంభిస్తాడు. యుద్దం కోసం అంత పెట్టుబడి పెట్టిన దేశం ఒక్కసారిగా తన దుకాణాన్ని మూసుకుంటుందా ? శత్రువులు లేకుండా నిద్రపోతుందా ? ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి తోకముడవటం ఖాయం చేసుకున్న దగ్గర నుంచి అమెరికా యుద్దోన్మాదులు కొత్త రంగాన్ని తెరవటం గురించి ఆలోచనలు చేస్తున్నారు. ఉగ్రవాదం మీద యుద్దం పేరుతో పశ్చిమ, మధ్య ఆసియాలో ఇప్పటి వరకు కేంద్రీకరించారు. ఇప్పుడు దాన్నుంచి చైనా మీద కేంద్రీకరించారు. తైవాన్‌ జల సంధి, దక్షిణ చైనా సముద్రంలో రెచ్చగొట్టే పనులకు పూనుకున్నారు. దానిలో భాగమే చతుష్టయం కార్యకలాపాలు. తైవాన్ను ఆక్రమించేందుకు, దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్నదని దాన్ని అడ్డుకోవాలనే పేరుతో అనేక దేశాలను కూడ గడుతున్నతీరు బహిరంగ రహస్యం. ఆఫ్ఘనిస్తాన్లో పెట్టిన ఖర్చును ఇప్పుడు చైనా వైపు మళ్లిస్తారు.2022 సంవత్సరంలో పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ) బడ్జెట్‌ 715బిలియన్‌ డాలర్లుగా బైడెన్‌ ప్రభుత్వం అంచనాలు తయారు చేసింది. దానికి అదనంగా మరో 24బి. డాలర్లతో ఒక పధకానికిపార్లమెంట్‌ ఆయుధ సేవల కమిటీ ఆమోదం తెలిపింది. సెనెట్‌ కమిటీ కూడా అదే పద్దతిలో ఆమోదం ప్రకటించింది.


సునంద దత్తా రే చెప్పినట్లుగా అమెరికా చిన్న దేశాలనే కాదు, పెద్ద వాటిని కూడా పట్టించుకోదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదం మీద పోరు సాకుతో దాడులకు దిగింది ఒక్క అమెరికాయే కాదు. నాటో దేశాలు కూడా పాల్గొన్నాయి. కాబూల్‌ విమానాశ్రయం నుంచి పారిపోతుండగా జరిగిన దాడిలో మరణించిన చివరి పదమూడు మందితో కలిపి 2,461 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు. ఇతర దేశాలకు చెందిన వారు 1,145 మంది, వారిలో బ్రిటన్‌ సైనికులు 457, జర్మన్లు 62 మంది చనిపోయారు. ఆ దేశాలతో మాట మాత్రం కూడా చెప్పకుండా అమెరికా నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి. విశ్వాసానికి పెద్ద నష్టం జరిగిందని అమెరికాలో జర్మన్‌ మాజీ రాయబారి ఊల్ఫ్‌గాంగ్‌ షింగర్‌ వ్యాఖ్యానించాడు.” ఐరోపాకు నిజమైన గుణపాఠం ఇది. అమెరికా సామర్ద్యం మరియు దాని నిర్ణయాలపై పూర్తిగా ఆధారపడాలా లేదా అంతిమంగా ఒక విశ్వసనీయమైన వ్యూహాత్మక పాత్రధారిగా ఉండాలా లేదా అన్నదాని గురించి ఆలోచన ప్రారంభించగలమా ” అని కూడా అన్నాడు. అమెరికా చలచిత్తంతో నిమిత్తం లేకుండా, అమెరిన్‌-చైనీస్‌ ద్విదాధిపత్యం, స్ధాన భ్రంశం, ప్రాంతీయ శత్రుత్వాలకు మరల కుండా ఐరోపా రక్షణ దళ నిర్మాణం జరగాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ అభిప్రాయపడ్డాడు. కాబూల్‌ నుంచి అమెరికా విమానాలు వెనుదిరిగిన వెంటనే అమెరికా నిర్ణయాలపై ఆధారపడటానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఐరోపా యూనియన్‌ అధికారులు వ్యాఖ్యానించారు.ఐరోపా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని, అది జరిగితే నిర్ణయాత్మకం స్వయం ప్రతిపత్తి వస్తుందని, ప్రపంచంలో కార్యాచరణకు పెద్ద సామర్ద్యం సమకూరుతుందని కూడా చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విదేశాంగ విధానాల్లో అమెరికా ప్రభావం నుంచి బయటపడి తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పటమే. అలీన విధానం నుంచి తప్పుకొని అమెరికాకు దగ్గరైన మనం ఇప్పుడు నడి సంద్రంలో ఉన్నాం. ఎటు పోవాలో తేల్చుకోలేక ఇప్పటికీ అమెరికా వైపే చూస్తున్నాం.


అమెరికా, మన దేశం చేసిన తప్పిదాలు, తప్పుడు వైఖరుల కారణంగా దక్షిణాసియాలో, ఇతర ప్రాంతాలలో మన దేశం ఇప్పటికే ఒంటరి అయింది. మరోవైపున మనం నమ్ముకున్న అమెరికా తన ప్రయోజనాల కోసం ఎవరినైనా నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుందని స్పష్టమైంది. చైనా ప్రభావం పెరగటానికి అమెరికా తప్పుడు వైఖరే కారణం అన్నది అనేక మంది విశ్లేషణ. పసిఫిక్‌ సముద్రం – బాల్టిక్‌ సముద్రాలను కలుపుతూ యూరేసియాలో ఉన్న ప్రపంచ జనాభాలోని 70శాతం మంది, ఉత్పాదకత మీద చైనా ప్రారంభించిన బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ(బిఆర్‌ఐ) ప్రభావం రోజు రోజుకూ పెరుగుతున్నది. ఒక్క తుపాకి గుండు కూడా పేల్చకుండా ఆఫ్ఘనిస్తాన్‌లోని లక్ష కోట్ల డాలర్ల విలువగల ఖనిజ సంపదను అమెరికన్లు చైనాకు అప్పగించారనే అతిశయోక్తులు కూడా వెలువడ్డాయి.ప్రతిదాన్నీ లాభం-నష్టం కోణం నుంచి చూసే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.ఒక వేళ అది నిజమే అయినా దానికి కారకులు ఎవరు ? ఇరాన్‌ విషయమే తీసుకుంటే అమెరికా ఆంక్షల ఆటలో మనం పావులుగా మారినందున చివరికి ఇరాన్నుంచి చమురు కొనుగోలు కూడా నిలిపి అమెరికా నుంచి కొంటున్నాము. తన ఇబ్బందులనుంచి బయటపడేందుకు చైనాతో ఇరాన్‌ 400 బిలియన్‌ డాలర్ల అభివృద్ది పధకాల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ కూడా అదే చేయనుందనే వార్తలు వస్తున్నాయి. చైనా తమకు విశ్వసించదగిన మిత్రదేశమని తాలిబన్‌ అధిపతి ముల్లా అబ్దుల్‌ బరాదర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో పోల్చితే ఎంతో దగ్గరి సంబంధాలు గలిగిన మన దేశం ఆ స్దానంలో ఎందుకు నిలవలేకపోయింది ? అమెరికా చేసిన పిచ్చిపనికి మనం ఎందుకు నష్టపోతున్నాం.


కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం ఫలితాలు, పర్యవసానాలేమిటి ? దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాల పాటు జాత్యంహంకార ప్రభుత్వాన్ని అమెరికా బలపరిచింది. పోర్చుగీసు వలసగా ఉన్న అంగోలా విముక్తి కోసం వామపక్ష శక్తులు ప్రారంభించిన సాయుధపోరాటాన్ని అణచివేసేందుకు అమెరికా రెండు దశాబ్దాలపాటు సిఐఏ పర్యవేక్షణలో అమెరికా జోక్యం చేసుకుంది. అనేక దేశాల్లో తమ పలుకుబడిని పెంచుకొనేందుకు నియంతలు, యుద్ద ప్రభువులను అమెరికా అన్ని విధాలుగా బలపరిచింది. మరోవైపున దానికి భిన్నంగా అభివృద్ది పధకాలకు సాయం చేయటం ద్వారా చైనా విధానాలు ఆఫ్రికా ఖండానికి దగ్గర చేశాయి. వాటితో పాటు విముక్తి ఉద్యమాలతో సంబంధాలు పెట్టుకుంది. వాణిజ్యం, పెట్టుబడులు ఉభయతారకంగా లబ్ది చేకూర్చుతున్నాయి. యూరేసియా, ఆఫ్రికా ఖండంలో చైనా లక్ష కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టింది. జరిగిందేదో జరిగింది. మనం ఎవరికీ లొంగనవసరం లేదు. అమెరికా మెప్పుకోసం ఇతరులను దూరం చేసుకోవటం అసలే తగని పని. వినదగు నెవ్వరు చెప్పిన అన్న వివేచనతో విశ్వగురువుగా వంది మాగధుల పొగడ్తలను అందుకుంటున్న నరేంద్రమోడీ ఇప్పటికైనా దాన్నుంచి బయటపడి మన ప్రయోజనాలకు అనుగుణ్యంగా స్వతంత్ర వైఖరితీసుకొనేందుకు వర్తమాన పరిణామాలు దోహదం చేస్తాయా అన్నది పెద్ద ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మా దేశం సోవియట్‌ కాదు – మాతో పెట్టుకోవద్దు : అమెరికాను హెచ్చరించిన చైనా రాయబారి !

01 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Qin Gang, RUSSIA, UNSC Resolution on Afghanistan, US


ఎం కోటేశ్వరరావు


ఒక వైపు న్యూయార్క్‌ నగరంలోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆఫ్ఘనిస్తాన్‌ సమస్యపై అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ప్రతిపాదించిన తీర్మానంపై చర్చ. మరోవైపు మాది పూర్వపు సోవియట్‌ యూనియన్‌ కాదు, మాతో పెట్టుకొనేటపుడు ఆలోచించుకోండి అన్నట్లుగా అమెరికాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైనా రాయబారి క్విన్‌ గాంగ్‌ వాషింగ్టన్‌ సభలో హెచ్చరిక. రెండూ మంగళవారం నాడు జరిగాయి. అమెరికా-చైనా సంబంధాలు జాతీయ కమిటీ బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన స్వాగత సభలో రాయబారి మాట్లాడాడు. రెండు దేశాలు అపార్దాలకు, తప్పుడు అంచనాలకు, వివాదాలు లేదా ఘర్షణలకు తావివ్వ కూడదు.చారిత్రక అవకాశాలను మనం కోల్పోవద్దు, అన్నింటికీ మించి మనం చారిత్రక తప్పిదాలు చేయవద్దు అన్నారు. చైనా అంటే సోవియట్‌ యూనియన్‌ కాదు, స్వయంకృతం వలన అది కుప్పకూలిందని, ప్రచ్చన్న యుద్ద ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు.


ఒక వైపు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనల ఉపసంహరణ నిర్ణయాన్ని అమలు జరుపుతూనే మరో యుద్ద రంగాన్ని ఎక్కడ ప్రారంభించాలా అనే ఆలోచనలో అమెరికా వ్యూహకర్తలు నిమగమయ్యారు. ప్రచ్చన్న యుద్దం తరువాత జరిపిన అతిపెద్ద సైనిక విన్యాసాల్లో ఒకదానిని ఆగస్టు నెలలో పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలో అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా నిర్వహించాయి. పాతికవేల మంది మెరైన్‌లు పెద్ద సంఖ్యలో యుద్దనావలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. మా భాగస్వాములు అది తైవాన్‌ కావచ్చు, అది ఇజ్రాయెల్‌, మరొకటి ఏదైనా మాతో భాగస్వామ్య కలిగిన వాటన్నింటికి బాసటగా నిలుస్తామని అమెరికా అధికారి ప్రకటించాడు. చైనాకు సమీపంలోని జపాన్‌కు చెందిన ఒకినావా దీవుల్లో 50వేల మంది, దక్షిణ కొరియాలో 29వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. తైవాన్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన తరువాత జపాన్‌, భారత్‌,ఆస్ట్రేలియాలతో మిలిటరీ సమన్వయానికి మరింత సామర్ధ్యాన్ని అమెరికా జత చేస్తుందని వార్తలు వచ్చాయి.


మరోవైపు తన మిత్రరాజ్యాల పట్ల అమెరికా సంబంధాలలో తీవ్ర అనిశ్చితలను ముందుకు తెస్తాయని కూడా భావిస్తున్నారు. ” అమెరికా విశ్వసనీయత, దాని మీద ఆధారపడటం గురించి జపాన్‌ అవగాహన మీద తీవ్రమైన దీర్ఘకాల పర్యవసానాలు ఉంటాయని టోకియో సమీపంలోని మెకై విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ టెసు కొటానీ వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పుడు తూర్పు ఆసియా మీద కేంద్రీకరించేందుకు దృష్టి సారించింది.అయితే అమెరికా అభిప్రాయాన్ని చూస్తే తన మిత్రదేశాలకు ఎంతకాలం మద్దతు కొనసాగిస్తుందో చెప్పలేము అని కూడా అన్నాడు. బైడెన్‌కు ప్రతిస్పందించే తెలివి తేటలు ఉన్నాయా లేదా అని రష్యన్లు లేదా చైనీయులు పరీక్షించబోతున్నారని ఐరోపా వ్యూహాల అధ్యయన సంస్ద సలహాదారు ఫ్రాంకోయిస్‌ హెయిస్‌బర్గ్‌ అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా విశ్వసనీయతను అందరూ అంగీకరించటం లేదు అన్నాడు.


ఉగ్రవాద ముఠాలను నిరోధించాలని, ఇతరుల మీద దాడులు, విద్రోహ చర్యలు జరిపేందుకు తమ గడ్డను అడ్డాగా చేసుకోనివ్వొద్దని, దేశం వదలి పోవాలనుకుంటున్న ఆప్ఘన్లను సురక్షితంగా వెళ్లిపోనివ్వాలనే వాగ్దానానికి తాలిబన్లు కట్టుబడి ఉండాలంటూ భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.ఆగస్టు నెలలో మన దేశ అధ్యక్ష పదవి చివరి రోజున ఈ పరిణామం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు ? గత రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష జోక్యం, అంతకు ముందు 23 ఏండ్లు పరోక్ష జోక్యం చేసుకొని ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన, దాన్ని అడ్డాగా చేసుకొని ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు.తాము వ్యక్తం చేసిన ఆందోళనను తీర్మానం ప్రతిబింబింబించటం సంతృప్తి కలిగించిందని మన దేశం పేర్కొన్నది. తీర్మానాన్ని వీటో చేయలేదు గాని చైనా, రష్యా ఓటింగ్‌లో పాల్గొనలేదు .తగినంత కసరత్తు చేసి ఏక గ్రీవానికి ప్రయత్నించకపోవటం లేదా రాజకీయాలు దీని వెనుక ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సెలలో ఆమోదించబోయే మరొక తీర్మానంలో స్పష్టత రావచ్చు. తాలిబన్లను అమెరికాయే గుర్తించి ఒప్పందం చేసుకుంది. అందువలన ఎవరైనా వారిని నిందించి ప్రయోజనం లేదు. ఒప్పందానికి, వారు చేస్తున్న ప్రకటనలకు కట్టుబడి ఉండేవిధంగా వత్తిడి చేయటం తప్ప మరొకమార్గం ఏమిటన్నది ప్రశ్న. తాలిబన్లను అధికారికంగా గుర్తించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ ఒక అడుగు ముందుకు వేసింది. కతార్‌లో మన రాయబారి దీపక్‌ మిట్టల్‌ తాలిబాన్‌ రాజకీయ విభాగనేత షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానెకజారును కలుసుకొని మన వైఖరిని వివరించారు.


ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మధ్య ఆసియాలో అమెరికా శకం ప్రస్తుతానికి ముగిసింది. ఆఫ్ఘన్‌ బదులు మరొక దేశాన్ని తమ స్దావరంగా మార్చుకోవాలని అమెరికా పధకం వేసిందనే వార్తలు వచ్చాయి. ఇరాక్‌ నుంచి వైదొలిగేది లేదని అమెరికాయే బహిరంగంగా ప్రకటించింది. తాలిబన్ల చేతిలో పరాభవం, చావు దెబ్బతిన్నంత మాత్రాన అమెరికా ముప్పును తక్కువ అంచనా వేయకూడదు. మధ్య ఆసియాలో అమెరికా ప్రభావం, ప్రాభవం తగ్గి చైనా, రష్యాలు పై చేయి సాధించనున్నాయి.


భద్రతా మండలి తీర్మానానికి ఈ రెండు దేశాలు ఎందుకు దూరంగా ఉన్నాయి. ఆఫ్ఘన్‌ దుస్ధితికి తాలిబాన్లు ఎంత బాధ్యులో, వారిని తయారు చేసి వారితో పాటు తాము కూడా సర్వనాశనం చేసిన అమెరికా, ఇతర దేశాలది అంతకంటే ఎక్కువ బాధ్యత. ఇప్పుడు తగుదునమ్మా అంటూ తమ నిర్వాకాన్ని విస్మరించి బాధ్యతను ఇతరుల మీద నెట్టేయత్నం ఈ తీర్మానంలో కనిపించిందని అవి చెబుతున్నాయి. అన్ని ఉగ్రవాద ముఠాల పేర్లు ప్రత్యేకించి ఇస్లామిక్‌ స్టేట్‌ మరియు ఉఘుర్‌ ఈస్ట్‌ తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ మువ్‌మెంట్‌ వంటి వాటి పేర్లను తీర్మానంలో చేర్చలేదని అభ్యంతరం తెలిపాయి. అమెరికా బాధ్యతను దోషరహితం చేయటం, ఉగ్రవాద ముఠాలను రెండు తరగతులుగా చేసి కొందరిని మినహాయించటాన్ని రష్యా, చైనా తప్పుపడుతున్నాయి. ఆఫ్ఘన్‌ ఆర్ధిక ఆస్తులను స్ధంభింప చేయటాన్ని రష్యా తప్పు పట్టింది. సంప్రదింపుల సమయంలో రెండు దేశాలూ లేవనెత్తిన అంశాలు, చేసిన సూచనలను పూర్తిగా పట్టించుకోలేదని చైనా పేర్కొన్నది.


ఆఫ్ఘన్‌ వ్యవహారంలో మూడు విధాలుగా అమెరికా, దాని మిత్రపక్షాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.ఒకటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, రెండవది ప్రజాస్వామిక సంస్కరణలు, బాధ్యతా రహితంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా వెళ్లిపోవటం. తన తప్పిదాలను గుర్తించకపోగా ఈ స్ధితికి ఇరుగుపొరుగుదేశాలే బాధ్యత వహించాలని మాట్లాడటం. ప్రతి యుద్దంలో అమెరికా తన ఆయుధాలను పరిక్షించుకోవటానికి ప్రయత్నించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. కాబూల్‌ విమానాశ్రయం దగ్గర ఆత్మాహుతి దళ చర్యలో తమ సైనికుల మరణానికి ప్రతిగా జరిపినట్లు చెప్పిన దాడిలో ఉగ్రవాదుల మరణాల సంగతేమోగాని పౌరులు మరణించినట్లు నిర్దారణ అయింది. గడిచిన రెండు దశాబ్దాలలో ఇలాంటి చర్యల వలన వేలాది మంది అమాయకులు బలైన కారణంగానే సామాన్య జనంలో అమెరికా, అది ఏర్పాటు చేసిన ప్రభుత్వాల పట్ల విశ్వాసం లేకపోవటం, వారిని వ్యతిరేకిస్తున్న తాలిబాన్ల విధానాలను వ్యతిరేకించటంతో పాటు వారి పట్ల ఒక విధమైన సానుకూలత ఏర్పడటానికి దారి తీసింది.


ఫోర్బ్స్‌ పత్రిక ఆగస్టు 16 నాటి సమాచారం ప్రకారం రెండులక్షల కోట్ల డాలర్లు(కొందరి అంచనా మూడు) అంటే రోజుకు 30 కోట్ల డాలర్లు( మన రూపాయల్లో 2,200 కోట్లు) అమెరికా ఖర్చు చేసింది. అమెరికా సైనికులు రెండున్నరవేల మంది మరణించారు.ఆప్ఘన్‌ మిలిటరీ, పోలీసులు 69వేలు, సామాన్య పౌరులు 47వేల మంది మరణించారు. ఆప్ఘన్‌ వ్యవహారం అమెరికా చరిత్రలో చెరిగిపోని మచ్చ, ప్రపంచ వ్యవహారాలను ఎంత దరిద్రంగా నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికీ వెల్లడించింది. అమెరికా కనుసన్నలలోని ప్రభుత్వాలు మూడులక్షల మంది మిలిటెంట్లను నిర్బంధించటం లేదా పౌరజీవనంలోకి అనుమతించాయని అంచనా. ఇప్పుడు వారంతా తిరిగి ఆయుధాలు పట్టుకొని తెగబడితే పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్న.


మన దేశం విషయానికి వస్తే తీసుకోవాల్సిన గుణపాఠం ఏమిటి ? అమెరికా, ఇతర దాని మిత్రపక్షాలు ఏమి చేస్తాయి అనేదానితో నిమిత్తం లేకుండా చైనా-రష్యా అఫ్ఘన్‌ ప్రభుత్వంతో స్వతంత్రంగా వ్యవహరించాలని రష్యన్‌ పరిశీలకుడు అలెగ్జాండర్‌ వి లోమనోవ్‌ చెప్పారు. ఆఫ్ఘన్‌ కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదు గనుక వారి మాటలు వినండి- వారి చర్యలను గమనించండి అన్న కన్ఫ్యూసియస్‌ బోధనల సారాన్ని గమనంలో ఉంచుకొని రెండు దేశాలూ వ్యవహరించాలి.దాని అర్ధం చూస్తూ ఉండమని కాదు అని లోమనోవ్‌ అన్నారు. పశ్చిమ దేశాల వార్తా సంస్దలు, మీడియా కథనాలు గత కొద్ది వారాలుగా అతిశయోక్తులను ప్రచారం చేశాయి. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఆఫ్ఘన్‌ పౌరులు తప్ప సామాన్య జనం పెద్ద సంఖ్యలో శరణార్ధులుగా ఇరుగు పొరుగు దేశాలకు తరలిపోతున్న సమాచారం, పరిస్ధితిగానీ లేదు. తమ దేశాల్లో ఉన్న నగదు, ఇతర ఆస్తులను వినియోగించుకోనివ్వకుండా నూతన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అమెరికా కూటమి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమ దేశాలకు భిన్నంగా తాముంటామని చైనా,రష్యా స్పష్టం చేశాయి. మన దేశం ఇప్పటికైనా స్వతంత్ర వైఖరిని అనుసరిస్తుందా, అమెరికా తోక పట్టుకొని వెళుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ సర్కార్‌ తాలిబాన్లను గుర్తిస్తే భక్తులు తట్టుకుంటారా !

30 Monday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan Talibans, Narendramodi, saffron talibans


ఎం కోటేశ్వరరావు


అవునా ? పరిణామాలను చూస్తే ఆ దిశలోనే అడుగులు పడుతున్నాయి. అందువలన తొందరపడి వీరంగం వేస్తూ ఇతరుల గురించి ముందే ఏదిబడితే అది మాట్లాడి ఇబ్బందుల్లో పడతారో లేక సంయమనం పాటిస్తారో భక్తులు ఆలోచించుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటు తధ్యం, అయితే వారిలో ఏ ముఠా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది, దాన్ని మిగతావారు అంగీకరిస్తారా, అంతర్యుద్దం జరుగుతుందా అనే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వాటికి వెంటనే సమాధానం దొరకదు. కాబూల్‌ విమానాశ్రయ పరిసరాల్లో ఆత్మాహుతిదళం పేలుళ్లు తాలిబాన్లను సవాలు చేసే శక్తులు ఉన్నాయనేందుకు ఒక సూచిక. అవి బలమైనవా లేక బేరమాడేందుకు అలాంటి దారుణాలకు పాల్పడుతున్నారా ? ఏదీ చెప్పలేం !
మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఆగస్టు 27న మాట్లాడుతూ ఆఫ్ఘన్‌ ప్రభుత్వ గుర్తింపు గురించి అడగ్గా ఏదీ ఇప్పుడేగా దాని గురించి ఆలోచిస్తున్నాం, ఇంకా అంతవరకు రాలేదు అన్నారు. ఇతర దేశాలు ఏమి చేస్తాయో వేచి చూస్తున్నాం, ఇప్పుడు అక్కడున్నవారిని స్వదేశానికి రప్పించటం గురించే కేంద్రీకరించాం అని చెప్పారు. ప్రాధమికంగా హిందువులు, సిక్కుల మీదనే కేంద్రీకరించినప్పటికీ మనతో ఉన్న ఆప్ఘన్‌లకు కూడా బాసటగా ఉంటాం అన్నారు. వేగంగా మారుతున్న పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో తెలియదు. చివరి అమెరికన్‌ సైనికుడు వెళ్లిపోయిన తరువాత మరొక అంకం ప్రారంభం అవుతుంది.


తాలిబాన్లు ఆగస్టు 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజే మన దేశం అధ్యక్ష స్ధానంలో ఉన్న భద్రతా మండలి చేసిన తీర్మానంలో ఆఫ్ఘన్‌గడ్డ మీద నుంచి ఉగ్రవాద చర్యలను తాలిబాన్లు అనుమతించరాదని కోరింది. ఆగస్టు 27న చేసిన మరో తీర్మానంలో తాలిబాన్లు అనే పదాన్ని తొలగించి ఏ బృందం లేదా వ్యక్తులు ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వరాదని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి భారత్‌ ఎంతో ముఖ్యమైనది. ఆర్ధిక, వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్నాం. గతంలో మాదిరే సంబంధం కొనసాగుతుందని ఆశిస్తున్నాం అని తాలిబాన్‌ ప్రతినిధి స్టానెకజాయి ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. కతార్‌లోని దోహాలో అమెరికా-తాలిబాన్ల మధ్య జరిగిన చర్చల ప్రతినిధి బృందానికి స్టానెకజాయి నాయకత్వం వహించాడు. గత కొన్ని నెలలుగా తెరవెనుక మన ప్రభుత్వం తాలిబాన్‌ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నప్పటికీ వారి వైపు నుంచి ఇలాంటి స్పష్టమైన వైఖరి వెల్లడి కాలేదు. ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాను నమ్ముకొని వ్యవహరించిన తీరుతో ఇరుగుపొరుగు దేశాలన్నింటినీ మనం దూరం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపున ఆప్ఘనిస్తాన్‌లో చైనా పెత్తనాన్ని అడ్డుకోవాలంటే భారత్‌ అక్కడి ప్రభుత్వాన్ని గుర్తించి సంబంధాలు పెట్టుకోవాలనే వాదనలను కొందరు ప్రారంభించారు. చైనాను సాకుగా చూపి తాలిబన్‌ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం గుర్తించినా ఆశ్చర్యపోనవసరం లేదు. దీని మీద మాజీ దౌత్యవేత్తలు, ఇతర పండితులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలోనే అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలుగుతారనే స్పష్టమైన సంకేతాలు వెలువడినప్పటికీ ఏమి జరిగితే ఎలా వ్యవహరించాలి అనే ముందు చూపు మన వ్యూహకర్తలకు, అక్కడి పరిస్దితి గురించి సరైన అంచనా మన విదేశాంగ శాఖకు ఉన్నట్లు కనపడలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ను జేమ్స్‌బాండ్‌ అని పొగుడుతారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల బలం, ప్రభుత్వ బలహీనతలపై అంచనా లేదు. ఒప్పందం ఆరునెలల ముందుగానే కుదిరినప్పటికీ ముందుగానే మన జాతీయులను తరలించేందుకు ఏర్పాట్లు కూడా లేవు. తొంభై రోజుల్లో కాబూల్‌ తాలిబాన్ల వశం అవుతుందని సిఐఏ అంచనా వెలువడి తొమ్మిది రోజులు కూడా గడవక ముందే కూలిపోయింది. మన గూఢచార వ్యవస్ద దాన్ని పసిగట్టలేకపోయింది.


ఆప్ఘనిస్తాన్‌ నుంచి వైదొలుగుతామని బరాక్‌ ఒబామాయే ప్రకటించినప్పటికీ గత పన్నెండు సంవత్సరాలుగా ఆ పని చేయలేదు. ట్రంపు ప్రకటనలు, తరువాత అధికారానికి వచ్చిన జోబైడెన్‌ ప్రకటనలను ఉత్తుత్తివిగానే మన దేశం పరిగణించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తక్షణమేగాకున్నా పరిస్ధితులు కుదుట పడిన తరువాత అయినా గతంలో మనం విదేశాంగ విధానంలో అనుసరించిన తప్పిదాలను సరి చేసుకొనే చర్యలను ఇప్పుడు మోడీ సర్కార్‌ తీసుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న. తాలిబాన్లు అధికారానికి రానున్న నేపధ్యంలో వారి వెన్నంటి ఉన్న పాకిస్తాన్‌, ఇతర దేశాలతో సంబంధాలను సమీక్షించుకోవాల్సి ఉంటుంది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా అమెరికాతో అంటకాగిన కారణంగా మనం ఇప్పుడు జీహాదీ ఉగ్రవాదం వంటి దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికాతో మునుపటి మాదిరిగానే రాసుకుపూసుకు తిరిగితే కుదరదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా వైదొలిగి, మన భద్రతకు ముప్పు తెచ్చిన తీరును మన ప్రభుత్వం మాట మాత్రంగా అయినా తప్పుపట్టలేని బలహీన స్ధితిలో ఉంది.


భారత ఆందోళనను ఏమాత్రం అమెరికా పట్టించుకోలేదని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న హడ్సన్‌ సంస్ధ దక్షిణాసియా దేశాల డైరెక్టర్‌ అపర్ణ పాండే వ్యాఖ్యానించారు. భారత ఆందోళనను విస్మరించటమే కాదు, పాకిస్తాన్‌ గురించి లేవనెత్తిన వాటిని కొట్టిపారవేసింది, చివరికి పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడిందని కూడా ఆమె చెప్పారు. తాలిబాన్లపై రెండు దశాబ్దాలుగా దాడులు జరిపిన అమెరికాయే వారితో రాజీచేసుకున్నపుడు, అనేక దేశాలతో తాలిబాన్లు సంబంధాలు పెట్టుకున్నపుడు మన ప్రయోజనాల రక్షణకు మోడీ సర్కార్‌ తీసుకున్న చర్యలు ఏమిటన్నదే అసలు ప్రశ్న. సైద్దాంతికంగా తాలిబన్లకు మద్దతు ఇవ్వనవసరం లేదు.వారు ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు ఒక దేశంతో మరొక దేశ సంబంధాలు ఏమిటన్న సమస్య ముందుకు వస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయనందున భారత్‌ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాషింగ్టన్‌ డిసిలోని విల్సన్‌ కేంద్రంలోని ఆసియా కార్యక్రమ డైరెక్టర్‌ మైఖేల్‌ కుగ్లెమాన్‌ అన్నారు. తాలిబాన్లతో సంబంధాలను నెలకొల్పుకోవటంలో భారత్‌ ఆలశ్యం చేసింది. ఈ ఆలస్యం తిరిగి స్నేహాన్ని నెలకొల్పుకొనే క్రమంలో తాలిబాన్ల నూతన ప్రభుత్వ ఏర్పాట్లలో పాత్ర లేకుండా భారత్‌ మూల్యం చెల్లించిందని చెప్పారు.


కాబూల్‌ను స్వాధీనం చేసుకోక ముందు తాలిబాన్లు రష్యా, పాకిస్తాన్‌, చైనా, ఇరాన్‌, తుర్కిమెనిస్తాన్‌ వెళ్లారు తప్ప భారత్‌ వైపు చూడలేదు. వీటిలో ఒక్క పాకిస్తాన్‌ తప్ప మిగిలిన దేశాలేవీ తాలిబాన్లను సమర్ధించినవి కాదు. అమెరికా చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి చైనా మన మీద దాడికి వస్తోందని గాని మరొకటని గానీ లడక్‌ సరిహద్దులో ఇప్పుడు రెండులక్షల మంది సైన్యాన్ని మోహరించాము. మేము ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి బయటకు వచ్చాం గనుక భారత్‌తో సహా అందరం కలసి చైనా మీద కేంద్రీకరించుదామని అంటున్నారు. తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండవు. ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్దాలు లేకుండా, ఆయుధాలు అమ్ముకోకుండా అమెరికన్లకు పూటగడవదు. ఓకే, రేపు చైనా వారు ఎత్తుగడగా అమెరికా వారికి వాణిజ్య పరంగా కొన్ని రాయితీలు ఇస్తూ దిగుమతులను ఎక్కువ చేసుకొనేందుకు అంగీకరించారనుకోండి. అప్పుడు అమెరికా వాడు తనదారి తాను చూసుకుంటే వాడిని నమ్మి తాయత్తు కట్టుకొని బరిలోకి దిగే మన పరిస్ధితి ఏమిటి ? ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా వెనక్కు తగ్గిన పరిణామం సరిహద్దు వెంట చైనాతో ఉద్రిక్తతలను తగ్గించుకొనే వైపు భారత్‌ను బలవంతంగా నెడుతుందని హడ్సన్‌ సంస్ద డైరెక్టర్‌ అపర్ణ పాండే చెప్పారు. భారత్‌ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని మార్చుకొనేందుకు, తనకు మరింత దగ్గరయ్యేందుకు అమెరికా వైపు నుంచి ప్రయత్నాలు ఉండవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు భారత్‌ను ఏమాత్రం అమెరికాకు మరింత దగ్గరకు చేర్చకపోగా తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వదులుకోకుండా మరింత గట్టిపరుస్తాయి. హిమాలయ ప్రాంతంలో తాను ఒంటరి అని భారత్‌కు తెలుసు గనుక చైనా వైపు మరింతగా దూకే సాహసం చేస్తుందని తాను అనుకోవటం లేదని కూడా అపర్ణ పాండే చెప్పారు.


ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల గురించి భారత్‌ ఆందోళన పడనవసరం లేదు, పాకిస్తాన్‌ వారిని అదుపు చేసే విధంగా రష్యా,చైనా, ఇరాన్‌లను చూసుకోనివ్వండి అని విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి శ్యామ్‌ సరణ్‌ అభిప్రాయపడ్డారు. తాలిబాన్ల ఆధ్వర్యంలో అక్కడ సుస్ధిరత ఏర్పడితే పాకిస్తాన్‌ కంటే వ్యూహాత్మకంగా చైనా మరింత ఎక్కువ లోతుల్లోకి పోతుంది. అది మధ్య ఆసియాలో తన పట్టును మరింత పటిష్టపరచుకుంటుంది అనికూడా చెప్పారు. రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ లాల్‌ విశ్లేషణలో కొన్ని అంశాల సారాంశం ఇలా ఉంది.తాలిబాన్లు అధికారంలోకి వస్తే అమెరికా పాత్ర పరిమితం అవుతుంది. ఆసియాకు రక్షణ కల్పించే ప్రధాన దేశంగా చైనా తయారవుతుంది. అది చతుష్టయ కూటమి పెరుగుదలను ప్రశ్నార్ధకం చేస్తుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత ప్రాధాన్యత పలుచనవుతుంది. ద్వౌపాక్షిక సమస్యల్లో భారత దేశం అమెరికా మీద ఆధారపడకూడదని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ పర్యటన స్పష్టం చేసింది. అందువలన భారత అవకాశాలు పరిమితం అవుతాయి. అమెరికన్లు ఈ ప్రాంతంతో వ్యవహారించే వ్యూహాన్ని గతంలో మాదిరి తిరిగి పాకిస్తాన్‌తో ఏర్పరచుకుంటారు. అప్పుడు భారత్‌ తిరిగి హామీతో కూడిన, జీవితాంత మిత్రమైన రష్యాతో చేతులు కలపాల్సి ఉంటుంది.దాని కుండే ఇబ్బందులు దానికి ఉంటాయి. అయినప్పటికీ భారత్‌ వైఖరులను మార్చుకోవటానికి సిద్దపడాలి. అది ఆఫ్ఘనిస్తాన్‌లోని పాలకులకు వ్యతిరేకంగా ఉండకూడదు. చైనా, రష్యా, ఇరాన్‌ వ్యూహాలకు అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకోవాలి. భారత భద్రతకు రష్యా, ఇరాన్‌ ఎంతో కీలకం.


కొంత మంది తాలిబాన్లు వారు సైన్యంలో భాగంగా ఉన్నపుడు భారత్‌లో శిక్షణ పొందారు. భారత్‌ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు వారు తోడ్పడతారు. తద్వారా భారత ప్రయోజనాలను కాపాడుకోవచ్చు.కనుక బుర్రను ఉపయోగించకుండా గుడ్డిగా అమెరికాను అనుసరించటం కాకుండా మన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు నేరుగా తాలిబాన్లతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవటం అవసరం. ఆఫ్ఘన్‌ పౌరులలో మనకు పరపతి ఉంది. అందువలన వేచి చూడకుండా ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని గుర్తించే తొలి జాబితాలో మనం ఉండాలి. ముల్లాల నుంచి లబ్దిపొందాలి. ఇది పాకిస్తాన్‌కు ప్రతిగా పలుకుబడిని కలిగిస్తుంది. ఒక వేళ తాలిబాన్లు స్ధిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పంజేష్వర్‌ లోయలోని ప్రతిఘటన బృందంతో చర్చించేందుకు భారత్‌కు సానుకూల అంశం అవుతుంది.ఎందుకంటే గత తాలిబాన్‌ ప్రభుత్వంలో ఉన్న నార్తరన్‌ అలయన్స్‌లో అది భాగం, దాన్ని భారత్‌ సమర్దించింది.ఐఎస్‌కెపి రాష్ట్రంలోని శక్తులు తాలిబాన్ల మీద యుద్దాన్ని ప్రకటించాయి. ఈ అంశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఇబ్బందికర అంశంగా ఉంటుంది. అలా జరిగితే అక్కడ శాంతి, స్దిరత్వాల సాధనపై ప్రభావం చూపేందుకు తాత్కాలికంగా అయినా భారత్‌ చోదకశక్తిగా ఉంటుంది. అని అనిల్‌ కుమార్‌ చెప్పారు.


తాలిబన్లు ఉగ్రవాదులు, మతశక్తులే, మహిళలు, యావత్‌ జనానికి వారి చర్యలు వ్యతిరేకమే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే అజెండాలో భాగంగా గతంలో వారు పాల్పడిన అకృత్యాలను పదే పదే చూపుతూ, పాత వీడియోలు, దృశ్యాలను చూపుతూ మన ప్రధాన స్రవంతి మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాషాయ తాలిబాన్ల సంగతి సరేసరి, చెప్పనవసరం లేదు. ఆఫ్ఘన్‌ తాలిబాన్లతో పార్టీగా సంబంధాలు పెట్టుకోవటం వేరు, వారు లేదా వారి ప్రమేయం ఉన్న శక్తులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరిని అనుసరించాలనే అంశం వేరు. అమెరికా మనలను పట్టించుకోకుండా మోసం చేసిందని లోలోపల కుమిలిపోతున్నారు. ఇప్పుడు తాలిబన్లను గుర్తిస్తే వ్యతిరేకతను రెచ్చగొట్టిన కారణంగా మోడీ అభిమానులు, మతశక్తులు ప్రభుత్వ వైఖరిని జీర్ణించుకుంటాయా ?


మొత్తం మీద చూసినపుడు ఆఫ్ఘన్‌ కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి భద్రతా మండలిలో నెల రోజుల మన అధ్యక్ష పదవీ కాలం ముగుస్తుంది, సెప్టెంబరు నెలలో ఐర్లండు వంతు వస్తుంది. ఒక విధంగా మన దేశం తాత్కాలికంగా ఇరకాటం నుంచి బయటపడుతుంది. అమెరికాతో అంటకాగటం కొనసాగించాలా లేక ఒక స్వతంత్ర వైఖరితో ఉండాలా అన్నది నరేంద్రమోడీ సర్కార్‌ ముందున్న సవాళ్లలో ఒకటి. అమెరికా బెదిరింపులతో ఇరాన్‌ నుంచి నిలిపివేసిన చమురు కొనుగోళ్లను పునరుద్దరిస్తామని ఇప్పటికే ఒక సంకేతం ఇచ్చారు. మన ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని కూడా నిర్ణయించినట్లు చెబుతున్న విషయం తెలిసిందే. అప్పులోడు-చెప్పులోడి వెంట వెళ్ల కూడదని పెద్దలు ఊరికే చెప్పలేదు. మనల్ని తప్పించుకొనేందుకు అప్పులోడు ఎటు తీసుకుపోతాడో తెలియదు. తనకు చెప్పులున్నాయి గనుక చెప్పులోడు ముళ్ల కంపలు, రాళ్లురప్పల మీదకు మనలను తీసుకుపోతాడు. అమెరికా కూడా అంతే . దాన్ని నమ్ముకుంటే ఏం జరుగుతుందో ఎటు తీసుకుపోతుందో తెలియదు. మనకే కాదు, నాటో కూటమి దేశాలకు సైతం తలబొప్పి కట్టింది. దానికి తన ప్రయోజనాలు ముఖ్యం తప్ప ఇతరులు ఏమైనా పట్టదు.మన ప్రయోజనాలను పరి రక్షించుకుంటూ ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలుంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనే వైఖరి, స్వతంత్ర విదేశాంగ విధానం అవసరం. మోడీ సర్కార్‌ ఆ దిశగా ఆలోచిస్తుందా ? అమెరికాను వదలి వెనక్కు తిరిగిరాలేని స్ధితికి వెళ్లి పోయిందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసహనంతో ఉన్న అమెరికా -చైనా మీద యుద్దానికి దిగుతుందా !

12 Thursday Aug 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

US and China, US war With China, world superpowers


ఎం కోటేశ్వరరావు


అమెరికన్లు ఇప్పుడు అసహనంతో ఉన్నారు . ప్రపంచంలో తిరుగులేని శక్తి అన్న భావన క్రమంగా తగ్గిపోతోంది. దాని అర్దం అది బలహీనపడిందని కాదు. తమ పెద్దన్న పెత్తనాన్ని ప్రతి చిన్న దేశమూ సవాలు చేస్తోంది. అందువలన చైనాను దెబ్బతీసి మిగతా దేశాలను భయపెట్టాలని చూస్తోందా ? అందుకుగాను చేయబోయే తదుపరి యుద్దం చైనాతోనా ? దానికి అనుగుణ్యంగానే పావులు కదుపుతున్నారా ? రెండవ ప్రపంచ యుద్దరంగం ఐరోపా అయితే మూడవ యుద్దం ఆసియా కేంద్రంగా జరగనుందా ? ఐరోపాతో మొదలు పెట్టి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసిన హిట్లర్‌ రెండవ యుద్దానికి కారకుడు. ప్రపంచం మీద తమ పట్టు జారిపోతోందని భావిస్తున్న అమెరికా తెగింపు మూడవ యుద్దానికి దారి తీస్తుందా ? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలుగానే ఇప్పుడు కనిపించవచ్చుగానీ పరిణామాలన్నీ వీటి చుట్టూనే తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే నిజంగానే యుద్దం జరుగుతుందా? సామ్రాజ్యవాద కార్పొరేట్‌ల లాభాల కోసం వాటి చౌకీదార్లుగా ఉండే పాలకులు ఎంతకైనా తెగిస్తారన్నది గత అనుభవం. ఇప్పుడు యుద్దం లాభమా ? ఆ వాతావరణం సృష్టించి మార్కెట్‌ వాటాను దక్కించుకోవటం ముఖ్యమా అన్న మధనం జరుగుతోంది !


మరోవైపు తమ జోలికి వస్తే తాట తీస్తాం అన్నట్లుగా చైనా తన వ్యతిరేకులకు సందేశాలు పంపుతోంది.సోమవారం నుంచి శుక్రవారం వరకు(9 నుంచి 13వ తేదీ) చైనాలో జరిపే రష్యాతో కలసి జరిపే సంయుక్త మిలిటరీ విన్యాసాలు అమెరికా, దాని మిత్రదేశాలకు ఒక హెచ్చరికగా భావించవచ్చు. మరొక దేశంతో జరిపే విన్యాసాలకు తొలిసారిగా చైనా జె-20 యుద్ద విమానాలను తరలించటం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అంబుల పొదిలో ఇవి కీలకంగా ఉన్నాయి. సైనిక విన్యాసాలు చైనా వాయువ్య మూలలోని నింగ్జియా హుయి రాష్ట్రంలోని సైనిక శిక్షణ కేంద్రంలో జరుగుతున్నాయి. యుద్ద విమానాలతో పాటు బడా రవాణా విమానాలు, ఇతర ఆధునిక ఆయుధాలను కూడా ప్రదర్శించనున్నారు. రష్యా నుంచి ఎస్‌యు-30 ఫైటర్‌ జెట్‌లు గతనెలలోనే ఇక్కడకు చేరుకున్నాయి. ఉభయదేశాల నిపుణులు, సిబ్బంది ఆయుధాల ప్రయోగం, మెళకువలను తెలుసుకుంటారు. యుద్ధ రంగంలో ఎలా వ్యవహరిస్తారో అదేమాదిరి ఇక్కడ ఆయుధాలను ప్రయోగించి ప్రదర్శనలు నిర్వహిస్తారు. పదివేల మంది మిలిటరీ సిబ్బంది దీనిలో పాల్గొంటారు. ఈ చర్య ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసం, సవాళ్లను ఎదుర్కోవాలనే సంకల్పం ఉన్నత స్ధాయికి చేరినట్లు ప్రదర్శితం అవుతుందని భావిస్తున్నారు. సముద్ర మట్టానికి రెండువేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వివిధ విభాగాల సంక్లిష్టమైన సైనిక విన్యాసాలకు, శిక్షణకు అనువుగా ఉంటుంది. గత ఏడాది రష్యాలోని కవకాజ్‌ ప్రాంతంలో సైనిక విన్యాసాలు జరిగాయి. వాటిలో రష్యా తన ఆధునిక ట్యాంకులు, క్షిపణులు, ఇతర ఆధునిక ఆయుధాలను ప్రదర్శించింది.


ప్రపంచ పరిణామాలను గమనిస్తున్న వారు అనేక కోణాలను ఆవిష్కరిస్తున్నారు. వాటిని వేటిని కొట్టిపారవేయలేము, అలాగని యథాతధంగా స్వీకరించలేము. ఆసియా కీలకం లేదా ఇరుసు అన్న సామ్రాజ్యవాదుల పధకం ఎప్పుడో ప్రారంభమైంది. అధికారంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరున్నా కొనసాగుతోంది. దానిలో భాగంగానే చైనా చుట్టూ వందలాది సైనిక స్ధావరాలను అమెరికా ఏర్పాటు చేస్తోంది. మూడింట రెండువంతుల నౌకా, వైమానిక దళాలను ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి తరలిస్తోంది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇంత పెద్ద మిలిటరీ కేంద్రీకరణ లేదు.ఇరవై ఒకటవ శతాబ్దివిజయాన్ని స్వంతం చేసుకొనేందుకు చైనాతో పోటీ పడుతున్నామని జోబైడెన్‌ పార్లమెంట్‌ తొలి ప్రసంగంలోనే చెప్పాడు.ఐరోపాలో నాటోతో ఎలా చేస్తున్నామో ఆసియాలో కూడా ఇండో-పసిఫిక్‌ అలాంటిదే అని కూడా దాచుకోకుండా చెప్పాడు. చైనాను బూచిగా చూపి మిలిటరీ ఖర్చును విపరీతంగా పెంచివేస్తున్నారు. ప్రచ్చన్న యుద్దంలో విజయం సాధించామని చెప్పుకున్న అమెరికా మూడు దశాబ్దాల తరువాత అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పలేని స్ధితిలో పడిపోయింది.


దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో ఇటీవలి కాలంలో అమెరికా యుద్ద నౌకలు పదే పదే సంచరిస్తున్నాయి. చైనాను రెచ్చగొట్టటం ఒకటైతే, ఆ ప్రాంత అనుపానులు-చైనా కదలికల మీద కన్నువేయటం రెండవది, చూశారా చైనా సమీపంలోకి మేము వచ్చాం అని పరిసర ప్రాంతదేశాలలో విశ్వాసం కలిగించే లక్ష్యం వంటివి ఉన్నాయి. అమెరికా ఒక్కటే కాదు, మేము సైతం యుద్ద అగ్నికి అన్నట్లుగా ఈ ప్రాంతంలో రెండు యుద్ద నౌకలను శాశ్వతంగా ఉంచుతామని జపాన్‌తో కలసి బ్రిటన్‌ ప్రకటించింది.ప్రస్తుతం మిలిటరీ కూటమి కాదని చెబుతున్నప్పటికీ అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ కూటమిని ఆసియా నాటోగా మార్చాలన్న ఎత్తుగడ ఉంది. తైవాన్‌ విలీనానికి చైనా బలప్రయోగం చేయనున్నదనే ప్రచారం వెనుక కూడా తమ మిలిటరీ చర్యలను సమర్దించుకొనేందుకే అన్నది స్పష్టం. తైవాన్‌ రక్షణకు తాము, అమెరికా ఉమ్మడిగా వ్యవహరిస్తామని జపాన్‌ ఉప ప్రధాని తారో అసో చెప్పాడు. తైవాన్‌ సమీపంలోని ఒకినావా, ఇతర జపాన్‌ దీవుల్లో 50వేల మంది సైనికులతో అమెరికా అనేక స్దావరాలను నిర్వహిస్తున్నది. అమెరికాలోని ఇండో-పసిఫిక్‌ వ్యవహారాల అధిపతి కర్ట్‌ కాంప్‌బెల్‌ మాట్లాడుతూ తొలిసారిగా తమ వ్యూహాత్మక, ఆర్ధిక ప్రయోజనాలు, మిలిటరీ కేంద్రీకరణను ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి మళ్లిస్తున్నామని వెల్లడించాడు. ఒబామా హయాంలో పన్నెండు సార్లు యుద్ద నావలను తైవాన్‌ జలసంధివైపు నడిపిస్తే ట్రంప్‌ 13సార్లతో ఆ రికార్డును తిరగరాశాడు. బైడెన్‌ ఆరునెలల్లోనే ఏడుసార్లు నడిపి సరికొత్త రికార్డు దిశగా పయనిస్తున్నాడు.


తన ఉపగ్రహం లేదా తొత్తు దేశమైన ఇజ్రాయెల్‌ ప్రభుత్వ కనుసన్నలలో నడిచే పెగాసస్‌ నిఘా, చొరబాటు గురించి అమెరికా ఇంతవరకు స్పందించలేదు, అనధికారికంగా జర్నలిస్టుల మీద నిఘావేయటాన్ని ఖండిస్తున్నామని మాత్రమే వ్యాఖ్యానించింది.కానీ అదే అమెరికా గతంలో రష్యా మీద, ఇప్పుడు చైనా మీద రుజువు కాని ఆరోపణలతో ఆంక్షలకు తెగబడుతోంది. తమ దేశ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు జోక్యం చేసుకున్నట్లు, మైక్రోసాఫ్ట్‌ సర్వర్‌ను దెబ్బకొట్టేందుకు, సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. ఇప్పుడు పెగాసెస్‌ మీద మౌనం ఎందుకు ? చైనాకు వ్యతిరేకంగా సెంటర్‌ ఫర్‌ ఏ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ(సిఎన్‌ఏఎస్‌) పేరుతో ఆసియా ఇరుసు పధకాన్ని రూపొందించిన కాంప్‌బెల్‌, యుద్ద నేరగాడు మైఖేల్‌ ఫ్లోర్‌నోరు ఏర్పాటు చేసిన సంస్ధకు పెద్ద మొత్తంలు మైక్రోసాఫ్ట్‌ నిధులు ఇచ్చింది. యుద్దమంటూ వస్తే 72 గంటల్లో యావత్‌ చైనా పౌర, మిలిటరీ నౌకలను నాశనం చేసేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని పెంటగన్‌కు సమకూర్చటమే తమ లక్ష్యమని బహిరంగంగానే చెప్పాడు.ఈ సంస్ద, దానితో సంబంధాలు ఉన్న అనేక మంది ఇప్పుడు బైడెన్‌ యంత్రాంగంలో తిష్టవేశారు.ఈ సంస్ధకు అమెరికా విదేశాంగశాఖ,తైవాన్‌ ప్రభుత్వం, నార్త్‌రాప్‌ గ్రుమన్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, కామ్‌కాస్ట్‌, ఎక్సాన్‌, మాస్టర్‌కార్డ్‌, అమెరికాలోని జపాన్‌ రాయబార కార్యాలయం, సిటీగ్రూప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, రేథియాన్‌, జార్జిటౌన్‌ యూనివర్సిటీ వంటి సంస్దలు పెద్ద మొత్తాలలో నిధులు అందచేస్తున్నాయి. ఇలాంటి సంస్ధలు ఒక్క చైనాకే వ్యతిరేకం అనుకుంటే పొరపాటు, అనేక దేశాలలో అమెరికన్‌,మిలిటరీ, కార్పొరేట్లకు, ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియావంటి దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తాయి. రష్యాకు వ్యతిరేకంగా 2014లో దాని ముంగిట ఉన్న ఉక్రెయిన్‌లో నయా నాజీలను అధికారంలో కూర్చోబెట్టాయి.ఇలా అనేక దేశాల్లో వ్యవహరిస్తున్నాయి.


ప్రపంచంలో ప్రతివారి నుంచి తమకు ప్రమాదం ఉందనే ప్రచారంతో అమెరికన్లను మభ్యపెట్టి ఆ దేశ పాలకులు 70దేశాలలో 800వందల సైనిక స్దావరాలు, కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రపంచాన్ని తమ గుప్పిట పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖండాంతర క్షిపణులు, మధ్యశ్రేణి అణ్వాయుధాల పరిమితి ఒప్పందం, గగనతలాన్ని స్వేచ్చగా ఉంచాలనే ఒప్పందాల నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది.ఇది ఆయుధ పోటీకి దారితీస్తోంది. రెండువేల సంవత్సరం వరకు అమెరికా తన సేనలను ప్రధానంగా జర్మనీ, ఉత్తర ఆఫ్రికా దేశాలు, మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియాలో అధికంగా మోహరించింది.2011 సెప్టెంబరులో న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి తరువాత మధ్యప్రాచ్యంలో కేంద్రీకరించారు. ఒక దశలో ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో లక్ష మంది చొప్పున అమెరికన్‌ సైనికులు ఉన్నారు. తరువాత తూర్పు ఆసియాలో మోహరించారు.


సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవించిన రిపబ్లిక్‌లు మిలిటరీల్లో 50శాతం వరకు తగ్గించాయి. ఇదే సమయంలో ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌, మన దేశం 40,30,15శాతం చొప్పున మిలిటరీని, బడ్జెట్లను పెంచాయి.జిడిపిలో ఒకశాతం లోపుగానే ఖర్చు చేయాలని స్వయంగా విధించుకున్న నిబంధనను జపాన్‌ పక్కన పెట్టింది.తనను చక్రబంధంలో బిగించేందుకు అమెరికా పూనుకున్నదని అర్ధం చేసుకున్న చైనా తన బలగాలను గణనీయంగా పెంచుకుంటున్నది. వాటికి సంబంధించి అంచనాలే తప్ప నిర్ధిష్ట సమాచారం బయటికి తెలియదు.1995లో కేవలం 50 స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణులు కలిగి ఉన్న చైనా 2019లో 750 నుంచి 1500వరకు, 950 మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణులు సమకూర్చుకున్నట్ల్లు వార్తలు వచ్చాయి.


రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికన్లు చేసిన ప్రతి యుద్దంలోనూ, ప్రతి చిన్న దేశం చేతిలోనూ ఓడిపోయారు. అలాంటిది చైనాతో పెట్టుకొని నెగ్గుకు రావటం అన్నది కలలో మాట.మొదటి ప్రపంచ యుద్దంలో ఓటమి, విజేతలు రుద్దిన ఒప్పందాలు జర్మన్‌ కార్పొరేట్ల అవకాశాలను దెబ్బతీసిన పరిస్ధితి, దాన్ని అవకాశంగా తీసుకొని హిట్లర్‌ మాదిరి జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం చైనాకు లేదు. తన ప్రయోజనాల రక్షణకు వెనుకడుగువేసే అవకాశమూ లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా తప్పుకున్నప్పటికీ పశ్చిమ, మధ్య ఆసియాలో తన ప్రయోజనాల కోసం మరొక చోట దుకాణం తెరిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అది ఆ ప్రాంత దేశాలతో పాటు రష్యా, చైనాలకు ముప్పుతెచ్చే పరిణామం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం -2 : పెరుగుతున్న మతోన్మాద ముప్పు !

09 Monday Aug 2021

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ 1 Comment

Tags

75th India Independence Day, India foreign policy under narendra modi, India independence @75, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


1757లో ప్లాసీ యుద్దంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించిన తరువాత ఆంగ్లేయులు మన దేశంలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని 1947వరకు పాలించారు, మన సంపదలను దోచుకున్నారు, వారి పారిశ్రామిక ఉత్పత్తులకు మన దేశాన్ని ముడి వస్తువులను సరఫరా చేసేదిగానూ, వినియోగ మార్కెట్‌గా మార్చివేశారు. ఏడున్నర దశాబ్దాల తరువాత చూస్తే పరిస్ధితి ఏమిటి ? బ్రిటీష్‌ వారు భౌతికంగా మనలను పాలించటం లేదు తప్ప ఆ దేశానికి చెందిన వాటితో సహా అనేక దేశాల సంస్దలు మనలను కొత్త రూపాల్లో ఇంకా దోపిడీ చేస్తూనే ఉన్నాయి. మన దగ్గర లేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చుకొనేందుకు విదేశీ కంపెనీలను అనుమతించాలా వద్దా అంటే అనుమతించక తప్పదు, ఎవరూ అభ్యంతర పెట్టటం లేదు. కానీ ఆ పేరుతో విదేశీ కంపెనీలకు మన మార్కెట్‌ ద్వారాలు తెరిస్తే మనం అభివృద్ధి చెందేది ఎప్పుడు, మన జనానికి ఉపాధి దొరికేది ఎన్నడు ? ప్రభుత్వ రంగమూ లేదు, ప్రయివేటు రంగం ముందుకు రావటం లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చైనాకు పోటీగా మన దేశాన్ని మరో ప్రపంచ ఫ్యాక్టరీగా చేస్తామని నరేంద్రమోడీ మేక్‌ ఇండియా,మేకిన్‌ ఇండియా అన్నారు. వాటి సూచనలే లేవు. పిలుపులు ఇస్తే చాలదు, ఆచరణకు అనువైన విధానాలను చేపట్టాలి. చివరకు ఆ చైనా నుంచే వస్తువులను దిగుమతి చేసుకోకపోతే గడవని స్ధితి.


మన కంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా విదేశీ దురాక్రమణ నుంచి రెండవసారి స్వాతంత్య్రం తెచ్చుకుంది చైనా. ఆ నాటికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మనకంటే వెనుకబడి ఉంది. అలాంటి దేశం ఇప్పుడు ఎక్కడ ఉంది ? అత్యంత అభివృద్ది చెందిన అమెరికా, ఐరోపా ధనిక దేశాలను అధిగమించి ముందుకు పోతున్నది. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టి ప్రధమ రాజ్యంగా అవతరించనుంది. ఇప్పటికే టెలికాం రంగం, మరికొన్ని పరిజ్ఞానాల్లో పశ్చిమ దేశాల కంటే ముందుంది. వారికి సాధ్యమైంది మనకు ఎందుకు కావటం లేదు ? అది కమ్యూనిస్టు నియంత దేశం మనది ప్రజాస్వామ్యం కనుక చైనాతో పోల్చకూడదు అంటారు. ప్రపంచంలో అనేక దేశాలను ఏలిన నియంతలందరూ తమను ప్రజాస్వామ్యవాదులుగా వర్ణించుకున్నారు. మరి ఆ దేశాలు చైనా మాదిరి వృద్ది చెందలేదేం ? పోనీ మనది నిజమైన ప్రజాస్వామ్యం అనుకుంటే చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నాం. స్వేచ్చ, స్వాతంత్య్రం అవసరం అయినదాని కంటే ఎక్కువ ఉందంటున్నారు గనుక అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో మన జనం పని చేయాలి కదా ? లోపం ఎక్కడుంది ?


బ్రిటీష్‌ వారు వెళ్లిపోతూ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. హిందూ-ముస్లిం విబేధాలను రగిలించారు. ఆ సందర్భంగా జరిగిన హింసాత్మక ఉదంతాలలో లక్షలాది మంది మరణించారు, ఆ సంఖ్యను రెండు నుంచి 20లక్షలుగా చెబుతారు. అలాగే కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. నాడు ఆంగ్లేయులు తమ అజెండాను అమలు చేసేందుకు తనకు అనుకూలంగా పాకిస్ధాన్‌ పేరుతో కొంత ప్రాంతాన్ని మరల్చుకొనేందుకు మత విభజనను ముందుకు తెచ్చారు. ఏడున్నర దశాబ్దాల తరువాత ఇప్పుడు దేశంలో పెరుగుతున్న మత విభజనను ఎవరు తెస్తున్నారు, ఎవరి ప్రయోజనం కోసం ? వీరికీ బ్రిటీష్‌ వారికీ తేడా ఏముంది ? బ్రిటీష్‌ వారిని తప్పు పట్టిన వారు వీరి విషయంలో అలా ఎందుకు ఉండలేకపోతున్నారు ?


మనకు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రభుత్వం దగ్గర అవసరమైన పెట్టుబడిలేకపోవటంతో ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ పేరుతో ప్రభుత్వం ఒక పునాది వేసింది. పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి సాధించాలనే పద్దతిని అనుసరించారు. ప్రభుత్వ రంగం ప్రజల ఆస్తులను పెంచటమే కాదు, సామాజిక న్యాయాన్ని అమలు జరపటంలో, ఆదర్శయజమానిగా వ్యవహరించటంలో ముందుంది. మిలిటరీ, కరెన్సీ, పోలీసుల, సరిహద్దుల భద్రత, కీలకమైన రక్షణ పరిశ్రమల వంటి తప్ప మిగిలిన రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు 1990దశకం నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్ధలను క్రమంగా వదిలించుకుంటున్నారు. ఈ విధానాలలో కాంగ్రెస్‌-బిజెపికి ఉన్న తేడా ఏమంటే బిజెపి వేగం పెంచింది. గత మూడు దశాబ్దాలలో ఎవరు అధికారంలో ఉన్న కొన్ని రక్షణ విభాగాల్లో తప్ప మిగతావాటిలో ఎక్కడా ఒక్క పైసా కూడా పెట్టుబడులు పెట్టటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయి. తాజాగా రక్షణ రంగంలో కూడా ప్రయివేటుకు ద్వారాలు తెరిచారు. అమెరికా, ఐరోపా దేశాల అనుభవం చూసినపుడు ముఖ్యంగా అమెరికాలో మిలిటరీ పరిశ్రమల సముదాయాలు అభివృద్ధి చెందాయి. ఫలితంగా వాటి లాభాలను పెంచేందుకు ప్రపంచ వ్యాపితంగా నిత్యం ఎక్కడో ఒకచోట స్వయంగా యుద్దాలకు దిగటం లేదా రెండు దేశాల మధ్య తంపులు పెట్టి ఇరుపక్షాలకూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నది. గతంలో భారత్‌ -పాక్‌ మధ్య అదేపని చేసిన అమెరికా ఇప్పుడు చైనా మీదకు మనలను ఉసిగొల్పి మనకు ఆయుధాలు అమ్ముతున్నది. విమానాలతో సహా స్వంతంగా తయారు చేసుకొనే స్ధితిలో వారున్నారు గనుక అమెరికా ఆయుధాల భారం మోసేది మనమే. ఏడు సంవత్సరాలుగా చమురు పన్నులు పెంచుతున్న పాలకులు ఎందుకు పెంచారంటే గాల్వన్‌ ఉదంతాన్ని చెబుతున్నారు. అది జరిగింది ఎప్పుడు ? మనల్ని బాదటం ప్రారంభించింది ఎప్పుడు ?


ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ పరిశ్రమలను ఆసరా చేసుకొని అనేక ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ది చెందాయి. ఐడిపిఎల్‌లో పని చేసిన వారు అనేక మంది ఔషధ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగారో చూస్తున్నాము. అలాంటి వారు నేడు ప్రభుత్వ రంగంలో ఫార్మా పరిశ్రమలను మూసివేసే విధంగా వత్తిడి తెచ్చి వాటి స్ధానాన్ని వారు అక్రమించటం తెలిసిందే. వాక్సిన్ల తయారీని సీరం, భారత్‌ బయోటెక్‌ వంటి ప్రయివేటు సంస్ధలకు వదలివేసి ప్రభుత్వరంగంలోని సంస్ధలను పాడు పెట్టటం గురించి ఇటీవలనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మన దేశంలో తయారీ బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే లాభమా నష్టమా అని లెక్కలు వేసుకొని మన బిహెచ్‌యిఎల్‌ను దెబ్బతీసి దిగుమతులు చేసుకోవటం విద్యుత్‌ రంగంలో చూశాము.ఇదే పరిణామం అనేక రంగాల్లో కనిపిస్తుంది. మన దేశంలో అనేక మంది నిపుణులు ఉన్నప్పటికీ పరిశోధన-అభివృద్ది రంగంలో తగిన పెట్టుబడులు పెట్టకుండా సాంకేతిక రంగంలో ముందుకు పోవటం ఏ దేశానికీ సాధ్యం కాదు. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను నిర్మించాలన్న కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమొక్కటే కాదు, పరిశోధనా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కారణంగానే నేడు పశ్చిమ దేశాలకు సవాలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ముందుకు పోతోంది.


ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రయివేటు రంగం మీద అన్నింటినీ వదలివేసింది. అమెరికా, ఐరోపా దేశాల ప్రయివేటు సంస్ధలు తమ దేశాల్లో పరిశ్రమలు పెట్టటం కంటే చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి దేశాలనుంచి వినియోగవస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందాయి. గత ఏడు సంవత్సరాల కాలంలో నరేంద్రమోడీ ఏలుబడిలో చైనా నుంచి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయంటే దాని అర్ధం ఇక్కడి పారిశ్రామిక-వాణిజ్య సంస్దలు కూడా అదేబాట పట్టాయన్నది స్పష్టం.లడఖ్‌ సరిహద్దులోని గాల్వన్‌లోయలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల తరువాత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఏడాది కాలంలో కరోనా కారణంగా మొత్తంగా మన దిగుమతులు తగ్గాయి కనుక ఆమేరకు చైనా నుంచి తగ్గాయి తప్ప ఇప్పటికీ అక్కడి నుంచే మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాము. ఇటీవలి కాలంలో తిరిగి పెరుగుదల ప్రారంభమైంది.


విదేశాంగ విధానంలో అటు అమెరికా ఇటు సోవియట్‌ వైపు మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరించి అలాంటి దేశాల నేతగా మన దేశం ఎదగటమే కాదు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించింది. సోవియట్‌ యూనియన్ను కూల్చివేసిన తరువాత మన దేశం అలీన విధానానికి స్వస్తిపలికింది. అమెరికాకు చేరువ కావటమే కాదు, దాని జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు అడుగులు వేసింది. దానితో సంబంధాల కారణంగానే యుపిఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గత ఏడు సంవత్సరాల పరిణామాలను చూస్తే అమెరికాకు దగ్గరయ్యే వేగం పెరిగింది. ట్రంప్‌ హయాంలో మన దేశం నుంచి చేసుకుంటున్న దిగుమతుల మీద ఇస్తున్న పన్ను రాయితీలను అమెరికా రద్దు చేసింది. అదే విధంగా మనం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల విధానం ద్వారా పరిమితులకు మించి సబ్సిడీలు ఇస్తున్నామనే పేరుతో దాన్ని రద్దు చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా కేసులు దాఖలు చేసింది. ఆ వత్తిడికి లొంగి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో చట్టాలను పార్లమెంట్‌లో ఎంత హడావుడిగా ఆమోదింప చేయించుకుందో చూశాము. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వేసిన తొలి అడుగు అవి. వాటి ప్రమాదాన్ని గ్రహించిన పంజాబ్‌, హర్యానా, యుపిలోని వ్యవసాయ ప్రధాన ప్రాంతాల రైతాంగం గతేడాది నవంబరు నుంచి నిరవధిక ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.


అలాంటి అమెరికాతో కలసి మలబార్‌ తీరంలో సైనిక విన్యాసాలు జరుపుతున్నాము. మనకు సంబంధం లేని దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకారవాణాను అనుమతించాలనే పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాతో కలసి చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమిలో చేరాము. అంతేకాదు అమెరికాకు అంగీకారం లేదు గనుక ప్రాంతీయ ఆర్దిక సమగ్ర భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు నిరాకరించాము. దానిలో చేరితే మన రైతాంగం, పరిశ్రమలు, వాణిజ్యాలకు హాని జరిగే మాట నిజం. దాన్ని సాకుగా చూపినప్పటికీ అమెరికాతో బిగుస్తున్న ముడే ప్రధానంగా వెనక్కు లాగింది. మరోవైపు తమ ప్రయోజనాలను బేరీజు వేసుకొని అమెరికా వద్దని వారిస్తున్నా ఆర్‌సిఇపిలో జపాన్‌, ఆస్ట్రేలియా భాగస్వాములయ్యాయి. ఈ పరిణామాల తరువాత ఆకస్మికంగా గాల్వన్‌ ఉదంతాలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి ప్రత్యేక అజెండా లేకుండానే నరేంద్రమోడీ చైనా పర్యటన తరువాత గ్జీ జింపింగ్‌ అదే మాదిరి మహాబలిపురం వచ్చిన విషయం తెలిసిందే.


రాచపీనుగ ఒంటరిగా పోదన్న సామెత తెలిసిందే. అమెరికాతో అంటకాగితే దానికి వచ్చే సమస్యలను మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణ ఆఫ్ఘన్‌ ఉదంతమే. అక్కడి నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తరువాత వారి నమ్మి పెట్టుబడులు ఏమౌతాయో తెలియదు. అన్నింటికీ మించి తాలిబాన్ల ముప్పు మన దేశానికి ఎదురవుతుందా అన్న సమస్య ముందుకు వచ్చింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికాతో వ్యవహరించిన మన దేశం అమెరికా మాదిరే ఉగ్రవాదులైన తాలిబాన్లతో రహస్యంగా చర్చలు జరపాల్సి వచ్చింది. తాలిబాన్లను అదుపు చేయాలంటే పాకిస్దాన్‌ సహకారం అవసరం గనుక నాటకీయ పరిణామాల మధ్య సరిహద్దులో కాల్పుల విరమణ గురించి ఒప్పందం కుదిరినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో మన ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాన్‌ – అమెరికా వివాదంలో మనకేమీ సంబంధం లేదు. అమెరికన్లు ఇరాన్‌ మీద ఆంక్షలు విధించారు. తమ నిర్ణయాన్ని ఉల్లంఘించే దేశాల మీద కూడా చర్యలు తీసుకుంటామని అమెరికా బెదిరించింది. మన దేశం భయపడిపోయి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసింది.అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మన మిత్రదేశం ఇరాన్‌ గతంలో సమదూరంలో ఉండేది ఇప్పుడు చైనాకు దగ్గర అయింది. మన చుట్టుపక్కల దేశాలన్నీ అదే విధంగా మారాయి. కారణం అమెరికాను మనం కౌగలించుకోవటమే.


తొలి 75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో రాజకీయ రంగంలో ప్రధానంగా ముందుకు వచ్చిన ధోరణి కాంగ్రెస్‌ వ్యతిరేకత. ఇప్పుడు 75 సంవత్సరాల తరువాత దాని స్ధానంలో బిజెపి వ్యతిరేకతకు పునాది పడింది. రెండింటికీ కారణం ఒక్కటే. కాంగ్రెస్‌ ఎలా అయితే అప్రజాస్వామికంగా ప్రత్యర్ది పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయటం, పార్టీలను దెబ్బతీయటం చేసిందో, బిజెపి ఏడు సంవత్సరాల్లోనే దాన్ని మించి పోయింది. దానికి తోడు మతతత్వాన్ని జోడిస్తోంది. ఇది సమాజం చీలిపోవటానికి దారి తీస్తుంది. వామపక్షాలు మినహా కాంగ్రెస్‌, బిజెపి, వివిధ ప్రాంతీయ పార్టీల మధ్య ఆర్దిక విధానాల విషయంలో ఎలాంటి పేచీ లేదు. పంచాయతీ అల్లా అధికారం దగ్గరే. అందుకే గతంలో కాంగ్రెస్‌ వ్యతిరేకత ముందుకు వస్తే దాని స్దానంలో ఇప్పుడు బిజెపి వచ్చింది. అయితే జనం కాంగ్రెస్‌కు ఇచ్చినంత అవకాశం బిజెపికి ఇచ్చే స్ధితి లేదు.


ఏ దేశమైనా తమ ప్రయోజనాలకు తొలి పీట వేయటం ఇప్పుడు ప్రపంచమంతటా జరుగుతోంది. అది దురహంకారంగా మారకపోతే, ఇతర దేశాల ప్రయోజనాలకు ఎసరు పెట్టే విధంగా లేకపోతే ఇబ్బంది లేదు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను బాగు చేసుకోవటం లేదా ముందుకు పోవటం ఎలా అనేదాని కంటే చైనాను దెబ్బతీయటం మీదనే కేంద్రీకరిస్తున్నాయి.దేశీయంగా దివాలా కోరు విధానాలను అనుసరిస్తున్నంత కాలం మరో 75 సంవత్సరాలు గడచినా జన జీవితం మెరుగు పడదు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని వదలి ఏదో ఒక దేశానికి తోకగా మారితే దాని తప్పులకు మనం కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పాలకులు ఎలాగూ ఈ విషయాలను పట్టించుకొనే స్ధితి లేదు. జనం పట్టించుకోకపోతే ఆమృత మహౌత్సవం ముగిసిన తరువాత హాలా హలాన్ని మింగాల్సి వస్తుందన్నదే 75వ స్వాతంత్య్రదినోత్సవ హెచ్చరిక !

మొదటి భాగం https://vedikaa.com/2021/08/08/india-independence-75-what-is-happening-part-one/

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !!
ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

క్యూబా పరిణామాలపై ప్రపంచాన్ని తప్పుదారి పట్టించిన మీడియా !

27 Tuesday Jul 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ 1 Comment

Tags

Anti Cuba, Cuba Communist Party, Fidel Castro, Joe Biden


ఎం కోటేశ్వరరావు


క్యూబాలో ఏం జరుగుతోంది ? మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనా ? జూలై రెండవ వారంలో అక్కడ జరిగిన ప్రదర్శనల పర్యవసానాలు ఏమిటి ? చిన్న దేశం పెద్ద సందేశం ఇచ్చిన క్యూబా గురించి వామపక్ష శక్తులకే కాదు, యావత్‌ ప్రపంచానికి ఆసక్తి కలిగించేదే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం దక్షిణ ప్రాంతం నుంచి క్యూబా దీవి మధ్య దూరం కేవలం 140 కిలోమీటర్లు మాత్రమే. అంత దగ్గరలో ఉండి 1959 నుంచి అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా ఉండటానికి క్యూబన్లకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేదే ఆసక్తికరం.


తాజా పరిణామాలను చూసి క్యూబా సోషలిస్టు వ్యవస్ధను కూలదోస్తామని చెబుతున్నవారు కొందరు, కమ్యూనిస్టు పార్టీ అంతానికి ఆరంభం అని వెలువడుతున్న విశ్లేషణలు కొన్ని. తమ వ్యవస్ధ జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతాం అని హెచ్చరిస్తున్న క్యూబన్లు.ఆరుదశాబ్దాలుగా అమెరికా అష్టదిగ్బంధనంలో ఉన్న తమను ఇంతకంటే చేసేదేమీ లేదన్న తెగింపు. ప్రపంచంలో మానవత్వాన్ని అమెరికన్లు ఇంకా పూర్తిగా అంతం చేయలేదు, వారెన్ని ఆంక్షలు పెట్టినా మరేం చేసినా మా శక్తికొద్దీ ఆదుకుంటామని క్యూబన్లకు బాసటగా నిలుస్తున్న దేశాలు మరోవైపు.


జూలై రెండవ వారంలో అక్కడి సోషలిస్టు వ్యవస్ధను ఎలాగైనా సరే కూలదోయాలని చూస్తున్న శక్తుల ప్రేరేపితంతో నిరసన ప్రదర్శన ఒకటి, ఆ కుట్రను వమ్ముచేసి దాన్ని కాపాడాకోవాలనే పట్టుదలతో మరొక ప్రదర్శన జరిగింది.ప్రపంచంలో అత్యంత మానవీయ ముఖం తమదని చెప్పుకొనే అమెరికా ఆరు దశాబ్దాలుగా తీవ్రమైన ఆంక్షలను అమలు జరుపుతున్న కారణంగా క్యూబన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుదశాబ్దాలు కాదు మరో అరవై సంవత్సరాలు అదే పనిచేసినా బాంచను దొరా నీకాల్మొక్తా అనేది లేదంటున్న అదే జనం.


ప్రభుత్వం మీద అసంతృప్తి చెందిన కొందరి ప్రదర్శనలకు వచ్చిన ప్రచారంతో పోలిస్తే ప్రభుత్వ అనుకూల ప్రదర్శల గురించి దాదాపు రాలేదనే చెప్పాలి. విపరీత చర్య ఏమంటే రాజధాని హవానాలో జరిగిన ప్రభుత్వ అనుకూల ప్రదర్శన చిత్రాన్ని వ్యతిరేకుల ఆందోళనగా పశ్చిమ దేశాల కార్పొరేట్‌ మీడియా, వార్తా సంస్దలు చిత్రించగా దాన్ని గుడ్డిగా ప్రపంచ వ్యాపితంగా మీడియా చిలవలు పలవలుగా వార్తలను ఇచ్చింది. వెంటనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిరసనకారులకు మద్దతు ప్రకటించాడు. అమెరికాలో వర్షం పడితే తమ దేశాలలో గొడుగులు పట్టే మరో ఇరవై దేశాలు యుగళగీతాలాపన చేశాయి. వారంతా రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు అన్నది స్పష్టం.మరోవైపున నిరసనకారులకు ఎన్నో రెట్లు అధిక సంఖ్యలో ప్రభుత్వానికి మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి.


ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల తరువాత క్యూబా ప్రభుత్వానికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. వాటిలో హవానా ప్రదర్శన చిత్రాన్ని ప్రభుత్వ వ్యతిరేకమైనదిగా పశ్చిమ దేశాలలో అగ్రశ్రేణి మీడియా సంస్దలు పేర్కొన్నాయి. ఏపి వార్తా సంస్ధ ఈ తప్పుడు చర్యకు పాల్పడింది. అయితే ప్రదర్శనలో ఉన్న బ్యానర్లపై ఫెడల్‌ కాస్ట్రో నాయకత్వాన సాగిన జూలై 26 ఉద్యమం, తదితర నినాదాలు ప్రభుత్వ అనుకూలమైనవిగా ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు జర్నలిస్టులు ఆ చిత్ర బండారాన్ని బయట పెట్టారు. అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా, న్యూయార్క్‌ టైమ్స్‌, గార్డియన్‌, వాషింగ్టన్‌ టైమ్స్‌, ఫాక్స్‌ న్యూస్‌, ఫైనాన్సియల్‌ టైమ్స్‌ వంటి అగ్రశ్రేణి సంస్దలన్నీ చిత్రాన్ని అదే విధంగా వర్ణించాయి. ప్రపంచ వ్యాపితంగా ఈ చిత్రం వైరల్‌ అయింది. దాని ప్రాతిపదికన అనేక మంది విశ్లేషణలు కూడా రాశారు. వాటిలో వెంటనే ఒక్క గార్డియన్‌ మాత్రమే తప్పు జరిగినట్లు అంగీకరిస్తూ సవరణ వేసింది. తమకు వ్యతిరేకంగా ఒక పధకం ప్రకారమే తప్పుడు వార్తల ప్రచారం జరిగినట్లు క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేత రోగెలియో పోలాంకో చెప్పారు. గతంలో అనేక చోట్ల రంగు విప్లవాల మాదిరి సామాజిక మాధ్యమాల్లో తిరుగుబాటు యత్నంగా చిత్రించారన్నారు.


క్యూబాలో ఎవరిని గద్దెమీద కూర్చోబెట్టాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది అక్కడి జనం. అక్కడి జనానికి ఆహారం లేదు,ఔషధాలు లేవు, అన్నింటికీ మించి స్వేచ్చ లేదు, అందువలన వారికి మద్దతు ఇస్తున్నామని అధ్యక్షుడు జోబైడెన్‌ నమ్మబలుకుతున్నాడు. ఇలాంటి ప్రచారం కొత్తది కాదు బైడెన్‌ ఆద్యుడు కాదు. ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన అక్కడి జనం నియంత బాటిస్టా ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి కుట్ర చేయని రోజు లేదు. స్పెయిన్‌ సామ్రాజ్యవాదుల ఏలుబడిలో ఉన్న క్యూబా, ఇతర వలసల మీద ఆధిపత్యం ఎవరిది అనే అంశంపై స్పానిష్‌-అమెరికన్ల యుద్దాలు జరిగాయి. క్యూబన్లు కోరుకున్న స్వాతంత్య్రానికి అమెరికా మద్దతు పలికింది. అదెందుకు అంటే క్యూబాను ఒక బానిస రాష్ట్రంగా మార్చుకోవాలన్నది వారి కడుపులోని దురాశ. స్పెయిన్‌ నుంచి పాక్షిక స్వాతంత్య్రం పొందిన తరువాత అమెరికన్లు ప్రతి రోజు, ప్రతి విషయంలోనూ క్యూబాలో వేలు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు తొలిసారి అధికారానికి వచ్చినపుడు బాటిస్టా తీసుకున్న కొన్ని చర్యలను అక్కడి కమ్యూనిస్టు పార్టీతో సహా పురోగమనవాదులందరూ బలపరిచారు.అతగాడు హిట్లర్‌కు వ్యతిరేకంగా నిలిచాడు. అయితే యుద్దం తరువాత 1952లో అధికారానికి వచ్చిన తరువాత పచ్చి నియంతగా మారి ప్రజాఉద్యమాలను అణచివేశాడు. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకిగా, తనను వ్యతిరేకించిన వారందరినీ అణచివేశాడు. దానికి ప్రతిఘటన ఉద్యమంలోనే ఫిడెల్‌ కాస్ట్రో అధికారానికి వచ్చాడు.


బాటిస్టాకు అమెరికా మిలిటరీ, ఆర్ధికంగా పూర్తి మద్దతు ఇచ్చింది.అదే అమెరికా ఫిడెల్‌ కాస్ట్రోను హతమార్చటానికి చేసినన్ని ప్రయత్నాలు మరేదేశనేతమీదా చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు వాటిని కొనసాగిస్తూనే ఆర్ధిక దిగ్బంధనానికి పూనుకుంది. అమెరికా గనుక బాటిస్టా అవినీతి, అక్రమాలు, అణచివేతలను వ్యతిరేకించి ఉంటే అసలు కాస్ట్రోకు అవకాశమే ఉండేది కాదని, అనవసరంగా తలనొప్పిని కొని తెచ్చుకున్నారని నిట్టూర్పులు విడిచేవారు కూడా ఉన్నారు. అనేక చిన్నదేశాల మీద అమెరికన్లు పెద్ద ఆయుధాలు ఉపయోగించి చివరికి పరువు పోగొట్టుకొని వెనుదిరగాల్సి వచ్చింది.దానికి క్యూబాయే నాంది పలికింది. కూతవేటు దూరంలో ఉన్న క్యూబా మీద బే ఆఫ్‌ పిగ్స్‌ పేరుతో కిరాయి మూకలను దింపి అమెరికా చేతులు కాల్పుకుంది. మరింత పరువు పోతుందనే భయం కారణంగానే యుద్దానికి దిగలేదు గానీ అంత కంటే భయంకరమైన ఆర్ధిక దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నారు. బరాక్‌ ఒబామా అయినా డోనాల్డ్‌ ట్రంప్‌ అయినా కుడి ఎడమల తేడా తప్ప ఎవరూ తక్కువ తినలేదు. ఒబామా హయాంలో ఆంక్షలను పరిమితంగా సడలించారు. అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌ చర్యలు చూస్తే చరిత్ర పునరావృతం అవుతోందన్నది స్పష్టం. అయినా క్యూబన్లు లొంగలేదు.


ఇప్పుడు క్యూబాలో పరిస్ధితి ఎందుకు దిగజారింది? కరోనా మహమ్మారి చైనా, వియత్నాం వంటి కొన్ని దేశాలను తప్ప యావత్‌ ప్రపంచాన్ని ఆర్ధికంగా కుంగతీసింది. క్యూబా ఆర్ధిక వ్యవస్ధలో పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా ఉండేది. కరోనా కారణంగా 2020లో 75శాతం తగ్గిపోయారు. అది ఆర్ధిక పరిస్దితిని మరింత దిగజార్చింది. చౌకగా చమురు అందిస్తున్న వెనెజులాపై ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సరఫరాలు తగ్గిపోయాయి. ఇలా అనేక కారణాలు పరిస్ధితిని దిగజార్చాయి.


క్యూబా గురించి తప్పుడు వార్తలతో ఆన్‌లైన్‌ మీడియా సంస్దలు సొమ్ము చేసుకున్నాయని ఆల్‌ జజీరా పత్రిక ఒక విశ్లేషణ రాసింది. మాజీ అధ్యక్షుడు, ఫిడెల్‌ కాస్ట్రో సోదరుడు రావుల్‌ కాస్ట్రో దేశం విడిచి వెనెజులాకు పారిపోయాడని, నిరసనకారులు కమ్యూనిస్టు పార్టీ నేతలను బందీలుగా పట్టుకున్నారని, క్యూబాకు వెనెజులా సైన్యాన్ని పంపుతున్నదనే తప్పుడు వార్తలు వైరల్‌ అయ్యాయి. 2018లో కూబ్యా మే దినోత్సవం, 2011లో ఈజిప్టులో జరిగిన నిరసన ప్రదర్శనల చిత్రాలను కూడా క్యూబా నిరసనలుగా చిత్రించి వైరల్‌ చేశారు. వీటిని చూసి ఏమి కాలమిస్టులు, ఏమి అబద్దాలు, ఇది మీడియా ఉగ్రవాద వ్యక్తీకరణ అని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ వ్యాఖ్యానించాడు. తప్పుడు వార్తల గురించి విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పుకొనే సామాజిక మాధ్యమ సంస్దలు ఎలా రాజకీయాలు చేస్తున్నాయో ఈ పరిణామం వెల్లడించిందని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగజ్‌ వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తల గురించి వివరణ కోరగా ఫేస్‌బుక్‌ వెంటనే స్పందించలేదని ఆల్‌ జజీరా రాసింది.
క్యూబాలో గత కొద్ది సంవత్సరాలుగా ఇంటర్నెట్‌ ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది.దాంతో సామాజిక మాధ్యమ ప్రచారం పెద్దఎత్తున కూడా జరుగుతోంది. కొన్ని స్వతంత్ర మీడియా సంస్దలను కూడా అనుమతించారు దీన్ని అవకాశంగా తీసుకొని అమెరికా సంస్దలు పధకం ప్రకారం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, స్వతంత్ర మీడియా సంస్దల ద్వారా సాగించిన ప్రచారానికి అసంతృప్తితో ఉన్న క్యూబన్లు తప్పుదారి పట్టి ప్రదర్శలకు దిగారని కొందరు విశ్లేషించారు.


క్యూబాకు జూలై 26 ఒక స్ఫూర్తి దినం. ప్రతి ఏటా సామ్రాజ్యవాదం గురించి గుర్తు చేస్తూ మాతృభూమి లేదా మరణమే శరణ్యం అంటూ ప్రతిజ్ఞలు చేయిస్తారు. 1953లో బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో నాయకత్వాన తిరుగుబాటును ప్రారంభించిన రోజు. ఆరు సంవత్సరాల తరువాత 1959లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.ఈ సంవత్సరం కరోనా కారణంగా గతంలో మాదిరి పెద్ద సభలు, ప్రదర్శనల వంటివి జరపలేదు.అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌తో సహా అందరూ పిల్లలతో కలసి దేశవ్యాపితంగా లెట్యూస్‌ అని పిలిచే ఒక ఆకు కూర మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. క్యూబా ఎదుర్కొంటున్న సమస్యల తీరుతెన్నులను తెలుసుకొనేందుకు ఒక్క ఉదాహరణ చాలు. క్యూబా కంటే అనేక పెద్ద దేశాలు, ఆర్ధికంగా బలమైనవి ఉన్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ల తయారీకి పూనుకోలేదు. అలాంటిది నిధులకు కటకటగా ఉన్నప్పటికీ పెద్ద మొత్తాన్ని వెచ్చించి కరోనా వైరస్‌ నివారణకు వారు ఐదు వాక్సిన్లను రూపొందిస్తున్నారు. అయితే తయారు చేసిన వాటిని తరలించేందుకు అవసరమైన వాహనాలు నడిపేందుకు అవసరమైన డీజిలు, పెట్రోలు, వాక్సిన్లు నింపేందుకు అవసరమైన ప్రత్యేక సీసాలు, ఇంజెక్షన్ల తయారీ ఇబ్బందిగా మారింది.అయినా మూడో వంతు మందికి ఒక డోసు వాక్సిన్‌ వేశారు, నాలుగో వంతుకు రెండు డోసులూ ఇచ్చారు.


క్యూబన్లపై విధిస్తున్న ఆంక్షలను మానవహక్కుల ఉల్లంఘనగా వాటి గురించి నిత్యం కబుర్లు చెప్పే అమెరికా పరిగణించటం లేదు.తాజాగా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు మద్దతు ఇవ్వటం ఐక్యరాజ్యసమితి నిబంధనల ఉల్లంఘన తప్పమరొకటి కాదు. తాజాగా మరికొన్ని ఆంక్షలను ప్రకటిస్తూ బైడెన్‌ సర్కార్‌ ఇవి ఆరంభం మాత్రమే త్వరలో మరిన్ని ప్రకటిస్తామని బెదిరింపులకు దిగింది. అనేక దేశాలు అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. క్యూబా తమకు శాశ్వత మిత్రదేశమని చైనా గతంలోనే ప్రకటించింది. పది బిలియన్‌ డాలర్ల అప్పును వివిధ దేశాలకు చైనా రద్దు చేయగా దానిలో సగం క్యూబాదే ఉన్నట్లు ్ల 2019 మే 29వ తేదీన ఫోర్బ్స్‌ డాట్‌కామ్‌ ఒక వార్తను ప్రచురించింది. అదే విధంగా కరోనా వాక్సిన్ల రూపకల్పన, స్మార్ట్‌ ఫోన్ల తయారీ, ఔషధాల వంటి అంశాలలో కూడా తోడ్పాటు ఇస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. వివిధ కారణాలతో పలు దేశాలు చేస్తున్న సాయం గురించి వార్తలు రావటం లేదు.


అమెరికా బెదిరింపులు, ఆంక్షలను తోసి పుచ్చి మెక్సికో ఒక టాంకరులో రెండు కోట్ల లీటర్ల డీజిల్‌ను క్యూబాకు తరలించింది. సోమవారం నాడు హవానా రేవుకు చేరనుందని వార్తలు వచ్చాయి.అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ దీని గురించి మాట్లాడుతూ అంతర్జాతీయ సౌహార్ద్రత, మానవతా సాయంగా రెండు ఓడల్లో డీజిల్‌, ఆహారం పంపనున్నట్లు చెప్పారు.ఆంక్షలు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. తమ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఆదేశాల మేరకు రెండు విమానాల్లో వంద టన్నుల సామగ్రిని తరలించినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. వాటిలో ఆహారంతో పాటు పిపిఇ కిట్లు, మెడికల్‌ మాస్కులు ఉన్నాయి. కొద్ది వారాల క్రితమే ఐరాస సాధారణ అసెంబ్లీలో క్యూబాపై ఆర్ధిక దిగ్బంధనాన్ని ఎత్తివేయాలనే తీర్మానంపై ఓటింగ్‌ జరగ్గా 184దేశాలు అనుకూలంగా అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేకంగా ఓటు వేశాయి.బ్రెజిల్‌, ఉక్రెయిన్‌, కొలంబియా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.


అమెరికాకు పారిపోయి వచ్చిన నియంత బాటిస్టా మద్దతుదారులకు 1961లో సిఐఏ ఆయుధాలు ఇచ్చి బే ఆఫ్‌ పిగ్స్‌ పేరుతో కాస్ట్రో ప్రభుత్వంపై తిరుగుబాటుకు కిరాయి మూకలను పంపింది. మూడు రోజుల్లోనే వారందరినీ అదుపులోకి తీసుకొని అణచివేశారు.ఇది కమ్యూనిస్టు క్యూబా చేతిలో అమెరికన్లు తిన్న తొలి ఎదురుదెబ్బ. ఆ మరుసటి ఏడాదే సోవియట్‌ యూనియన్‌ అమెరికాను హెచ్చరిస్తూ క్యూబా గడ్డపై క్షిపణులను మోహరించింది. 1962లో అధ్యక్షుడు కెన్నడీ మాట్లాడుతూ ఒక నాటికి అమెరికాకు వచ్చిన క్యూబన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ స్వేచ్చ ఉండే క్యూబాలో అడుగు పెడతారని వారిని ఉద్దేశించి ప్రసంగించాడు. కెనడీ మరణించేంతవరకు అదే భ్రమలో ఉన్నాడు, చేయించదలచిన దుర్మార్గాలన్నింటికీ ఆమోదం తెలిపాడు. అప్పటి నుంచి బాటిస్టా మద్దతుదారులు క్యూబాకు పొరుగున ఉండే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో నివాసాలు ఏర్పరుచుకొని విద్రోహాలకు పాల్పడుతూ తరాలు మారినా ఇప్పటికీ అదే కలలు కంటున్నారు. క్యూబన్లు లొంగుతారా ? నియంత బాటిస్టాకే సలాం గొట్టని వారు అమెరికాకు సలాం కొడతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d