• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: RUSSIA

స్లేట్‌ ద స్కూల్‌ అధిపతి వాసిరెడ్డి అమరనాధ్‌ ఫేస్బుక్‌ పోస్టు – ఒక పరిశీలన ! మేథావులు ఆత్మావలోకనం చేసుకోవాలి !!

26 Monday Apr 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ 1 Comment

Tags

conspiracy theories, Intellectuals, Propaganda War, Propaganda war victims, Slate the School

ఎం కోటేశ్వరరావు

ఆంగ్లంలో ఇంటలెక్చ్యువల్‌ – తెలుగులో బుద్ధి జీవి. బుద్ది జీవులు ఎవరు, వారి లక్షణాలు ఏమిటి అన్నది సామాన్యులకూ – బుద్ది జీవుల్లోను ఎడతెగని సమస్య. వాళ్లు అలా అనుకుంటున్నారు- వీళ్లు ఇలా అనుకుంటున్నారు అని చెప్పటమే మేథావి లక్షణం అయితే అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడివి అక్కడికి చేరవేసే వారందరూ, అలా అట ఇలా అట అంటూ చెవులు కొరికే వారూ మేధావులే. ప్రశ్నలను మాత్రమే రేకెత్తించి జవాబులు చెప్పని వారు మేథావులని ఒక అనుభవశాలి చెప్పాడు. జార్జి ఆర్వెల్‌ అనే కలం పేరుతో సుప్రసిద్దుడైన ఆంగ్ల రచయిత ఎరిక్‌ ఆర్ధర్‌ బ్లెయిర్‌ ” కొన్ని ఆలోచనలు ఎంత బుద్ది తక్కువగా ఉంటాయంటే బుద్ది జీవులు మాత్రమే వాటిని నమ్ముతారు ” అని చెప్పారు. జార్జి ఆర్వెల్‌ ప్రస్తుతం బీహార్‌లోని మోతీహరిలో జన్మించి స్వాతంత్య్రం తరువాత ఇంగ్లండ్‌ వెళ్లిపోయి 47 సంవత్సరాల వయస్సులోనే 1950లో మరణించాడు. ఇంటర్నెట్‌, వాట్సప్‌ రాక ముందే తనువు చాలించాడు గానీ లేకుంటేనా వాట్సప్‌ విశ్వవిద్యాలయ బుద్ది మంతుల గురించి ఎంత చెప్పి ఉండేవాడో కదా !

హైదరాబాదు, విజయవాడ, తిరుపతి నగరాల్లో స్లేట్‌ ద స్కూలు పేరుతో విద్యా సంస్ధలు నడుపుతూ వైద్యంతో సహా (ఫేస్బుక్‌ పోస్టులను బట్టి ) బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న వాసిరెడ్డి అమరనాధ్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. పేరు వినటమే తప్ప నాకు పరిచయం లేదు, పంచాయతీల్లేవు. అమరనాధ్‌ పోస్టు వాట్సప్‌ విశ్వవిద్యాలయంలో చూసిన తరువాత ఒక జర్నలిస్టుగా బుద్ది జీవుల గురించి రాయాలనిపించింది. ఆ పోస్టు అంశాలు ప్రస్తుతం సమాజంలో ఎందరో మేథావులు, విద్యావంతుల గందరగోళం- ఆలోచనకు ప్రతిబింబంగా ఉంది కనుక స్పందించాల్సి వస్తోంది. కనుక వ్యక్తిగతంగా తీసుకోనవసరం లేదు. పోస్టులోని అంశాన్ని విమర్శించాలని లేదా సంవాదం ప్రారంభించాలని కాదు. నా అభిప్రాయాలతో ఏకీభవించటమా, వ్యతిరేకించటమా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవచ్చు. రాగ ద్వేషాలకు అతీతంగా పరిశీలించి బుద్దికి పదును పెట్టమని కోరుతున్నాను. అమరనాధ్‌గారి పోస్టులోని అంశాలపై నా స్పందన ఇక్కడ ప్రస్తావిస్తాను.

” చైనాలో పుట్టిన ఆ వైరస్‌ ప్రపంచం నలుచెరుగులా ఉన్న 180 కి పైగా దేశాలకు వ్యాపించింది . కానీ చైనా లో మాత్రం ఒక్క నగరానికే పరిమితం . ప్రపంచమంతా ఒకటి.. రెండు .. మూడు అంటూ వేవ్‌ లు . అక్కడ మాత్రం మొదటి మూడు నాలుగు నెలలు .. ఒక నగరం .. 90 వేల కేసులు మాత్రమే . . దీని వెనుక ఉన్న ఇంద్ర జాల మహేంద్ర జాలం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు . పోనీ చైనా న్యూజిలాండ్‌ లాగా ఎక్కడో దూరంగా ఉన్న దేశమా అంటే .. కాదు . ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ! జన సాంద్రత ! ఆ వైరస్‌ ను ఏ అల్లాఉద్దీన్‌ అదుÄ్బత ద్వీపం సాయం తో కట్టడి చేసారో ఇప్పటి దాక ఒక్క శాస్త్రవేత్త కూడా వివరించ లేదు. ”

దీనిలో శాస్త్రవేత్తలు వివరించాల్సిందీ, వివరించనిదీ, తెలియనిదీ ఏమీ లేదు. వైరస్‌ చైనాలో పుట్టిందా మరోచోటనా అన్నది ఇంకా తెలియదు. చరిత్రలో స్పానిష్‌ ఫ్లూగా పరిచితమైనది తొలుత బయటపడింది అమెరికాలో, నింద మాత్రం స్పెయిన్‌కు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన సమయంలో దేశాలన్నింటా మీడియా మీద సెన్సార్‌ ఆంక్షలున్నాయి. స్పెయిన్‌ ఆ యుద్దంలో తటస్దంగా ఉంది. రాజు పదమూడవ ఆల్పోన్సోకు తీవ్ర సుస్తీ చేయటంతో అక్కడి మీడియాలో దాని గురించి రాశారు. అందరూ స్పానిష్‌ ఫ్లూ అన్నారు.
1977లో ఫ్లూ రష్యా, ఇతర దేశాలను వణికించింది. తొలుత ఇది ఉత్తర చైనాలో కనిపించింది. వ్యాప్తి ఎక్కువగా నాటి సోవియట్‌యూనియన్‌లో జరిగింది కనుక మీడియాలో దాన్ని రష్యా ప్లూ అన్నారు. తరువాత అమెరికా, ఇతర దేశాల్లో కూడా వ్యాపించింది. అప్పుడు చైనా-సోవియట్‌ సంబంధాలు సరిగా లేవు గనుక చైనా వారు లాబ్‌లో తయారు చేసి వదిలారని తప్పుడు ప్రచారం చేశారు.
2009లో ప్రపంచాన్ని వణికించిన హెచ్‌1ఎన్‌1 ప్లూ తొలుత మెక్సికోలో కనిపించినా దాన్ని మెక్సికో ఫ్లూ అని పిలువ లేదు. పందుల నుంచి వ్యాప్తి చెందినట్లు బయటపడినందున స్వైన్‌ ఫ్లూ అన్నారు. అయితే పంది మాంసం తినే దేశాలు ఈ పేరును అభ్యంతర పెట్టాయి. తరువాత ఇలాంటి వైరస్‌లకు ఒక దేశం, ప్రాంతం, భాష, జీవి పేరు పెట్టకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్ణయించింది. ఆ మేరకు కోవిడ్‌-19 అని పేరు పెట్టారు. దాన్ని ఉల్లంఘిస్తూ చైనా వైరస్‌ అని ప్రచారం చేసి చైనా మీద ఉన్న కసిని అలా తీర్చుకున్నారు.

కరోనా వైరస్‌ తొలుత కనిపించిన ఊహాన్‌ నగరంలోని కోటి మంది జనాభా, పరిసరాలలో లాక్‌డౌన్‌ అమలు జరిపారు. అపార్ట్‌మెంట్లు, జనావాసాలను ఎక్కడిక్కడ కట్టడి చేశారు. రోగలక్షణాలతో నిమిత్తం లేకుండా దాదాపు ప్రతి ఇంటివారిని పరీక్షించి వైరస్‌ లక్షణాలున్న వారిని వేరు చేసి చికిత్స చేశారు. దేశంలోని ప్రజారోగ్య సిబ్బందినీ, వేలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా సమీకరించి ప్రతి నివాసం వద్ద ఉంచారు. ప్రతి ఇంటిలో ఎవరికేమి జరుగుతోందో పర్యవేక్షించారు. కావాల్సిన వాటిని అందచేశారు, జవాబుదారీతనంతో వ్యవహరించారు. అమరనాధ్‌ గారు స్లేట్‌ అనే ఒక కార్పొరేట్‌ స్కూలు అధిపతి గనుక స్కూలు పిల్లల గురించి చైనా తీసుకున్న జాగ్రత్తలను తెలుసుకోవాల్సింది. స్కూలు బస్సులకు ప్రత్యేక రోడ్ల కేటాయింపు, ఎక్కేటపుడు దిగేటపుడు జ్వరం ఉందా లేదా అని పరీక్షించటం వంటి చర్యలన్నీ తీసుకున్నారు.
ఇక్కడ కావాల్సింది చైనా మీద, అక్కడి వ్యవస్ధ మీద విశ్వాసం. అది లేని వారు అక్కడ ఏమి జరిగినా నమ్మరు. అందుకు ఒక్క ఉదాహరణ. చైనాలో జరిగిన ఆర్దిక అభివృద్ది గురించి చెప్పిందంతా అంకెల గారడీ అని ప్రచారం చేశారు. అవే నోళ్లు ఇప్పుడు తన ఆర్దికశక్తితో ప్రపంచాన్ని అదుపులోకి తెచ్చుకొనేందుకు చైనా పూనుకుంది అని కొత్తబాణీ అందుకున్నాయి. చైనా, వైరస్‌ గురించి కుట్ర సిద్దాంతాలను ప్రచారం చేసేందుకు చూపిన శ్రద్ద వైరస్‌ నివారణకు మన దేశంతో సహా మిగతా దేశాలు చూపి ఉంటే ఇలాంటి తీవ్ర పరిస్ధితి ఉండేది కాదు. రెండవ తరంగం కరోనా వ్యాప్తి తీవ్రం అవటం ప్రారంభించిన తరువాతనే కదా లక్షలాది మంది రాసుకుంటూ పూసుకుంటూ తిరిగే కుంభమేళాకు అనుమతించింది. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి మూర్ఖ, మూఢత్వాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించాయా ? దీనిలో తెలియంది ఏముంది ? అమరనాధ్‌ లాంటి వారికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది, నిజంగా శ్రద్ద ఉండి తెలుసుకుంటే తెలియనిదేమీ లేదు. తెలుసుకోకుండా ఉంటారనీ అనుకోలేము.నిర్మొహమాటంగా చెప్పాలంటే చైనా సమాచారాన్ని విశ్వసించలేకపోవటమే అసలు సమస్య. దానికి సామాన్యుడైనా మేథావి అయినా ఒకటే.

” చైనా అమెరికా దేశంలోని అనేక యూనివర్సిటీ లకు సీక్రెట్‌ గా ఫండ్స్‌ ఇచ్చిందట . ఇదేదో అభియోగం కాదు. ట్రంప్‌ అధికారం లో వున్నప్పుడు దీని పై విచారణ జరిపి ఆయా యూనివర్సిటీ ల పై చర్య ల కు కూడా ఆదేశించాడు . యూనివర్సిటీ ల కు ఫండ్స్‌ ఇస్తే మంచే పనే కదా . దాన్ని గొప్పగా చెప్పుకోవాలి కదా ? . కానీ సీక్రెట్‌ గా దొంగ లాగా ఇవ్వడం ఏంటి ? అమెరికా మేధావులను తన అదుపులో పెట్టుకోవడం .. అమెరికన్‌ ల బ్రెయిన్‌ వాష్‌ .. మరో మాటలో చెప్పంటే మేధో దాడి అని కొంత మంది అంటారు . ”

చీమ చిటుక్కుమంటే కనిపెట్టగలిగిన అమెరికా గూఢచారి వ్యవస్ద గురించి తెలిసిన అమరనాధ్‌ గారు మీడియా ప్రచారదాడికి గురైయ్యారని పోస్టు పెట్టిన తీరు చెబుతోంది. ఇక్కడ కూడా అమెరికన్లు చెబుతున్న కుట్ర సిద్దాంతాన్ని నమ్మటమే. ముందే చెప్పినట్లు అక్కడ అలా అట ఇక్కడ ఇలా అట అని చెప్పటానికి అమరనాధ్‌ గారు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. మన దేశంలోని విశ్వవిద్యాలయాలలో అధ్యయన సంస్దల ఏర్పాటు వాటికి స్వదేశీ, విదేశీ సంస్ధలు నిధులు ఇవ్వటం రహస్యమేమీ కాదు. అలాగే అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో కన్పూషియస్‌ సిద్దాంతాల అధ్యయనం పేరుతో మరో పేరుతో చైనా అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి చైనా సంస్దల నుంచి, అమెరికా సంస్దల నుంచి కూడా నిధులు ఇచ్చారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా-చైనాల మధ్య సంబంధాలు, వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతున్నపుడు లేని సమాచారం ట్రంప్‌ హయాంలోనే బయటకు వచ్చిందా ? అంతకు ముందున్న పాలకులకు తెలియదా ? సిఐఏ, ఎఫ్‌బిఐ, జాతీయ దర్యాప్తు సంస్దలు వాటికి ఉన్న లక్షలాది మంది గూఢచారులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నారు ? నిజానికి అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందేమీ లేదు.

చైనాతో వివాదం పెట్టుకోవాలి, దాన్ని అదిరించి బెదిరించి తన వాణిజ్యలోటును తగ్గించుకోవాలి. అందుకోసం ఏదో ఒక సాకులు చెప్పి జనాన్ని నమ్మించాలి. ఆ ఎత్తుగడలో భాగమే విశ్వవిద్యాలయాలకు నిధులు, అమెరికన్ల బుద్ది శుద్ది ప్రచారం. మన దేశంలోని విద్యా సంస్ధలలో గత ఐదు దశాబ్దాలుగా వామపక్ష ఉగ్రవాద సానుభూతి పరులు ఉద్యోగాలు చేయటం, నక్సల్‌ పార్టీల అనుబంధ సంఘాలతో సంబంధాలు కలిగి ఉండటం తెలిసిందే. ఇదే సమయంలో తిరోగమన ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్నవారి సంఖ్యతో పోలిస్తే వీరు తక్కువే. అయినా అర్బన్‌ నక్సల్‌ అనే పదాన్ని ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా ఎందుకు ప్రచారంలోకి తెచ్చారు? నిజానికి విశ్వవిద్యాలయాల్లో అలాంటి వారి సంఖ్య గతంతో పోల్చితే చాలా తగ్గింది. అధికార పార్టీలకు భజన చేసే బ్యాచి ఎక్కువైంది. అర్బన్‌ నక్సల్స్‌ పదం ప్రచారం ఎత్తుగడలో భాగం.

అమెరికాలో బుద్ది శుద్ది ఎవరు చేస్తున్నారు? చైనా కమ్యూనిస్టులు వచ్చి అక్కడేమీ రాజకీయ పాఠశాలలు పెట్టి కమ్యూనిస్టు పాఠాలు చెప్పటం లేదే ? గత మూడు దశాబ్దాల్లో అమెరికా విద్యావంతుల్లో వచ్చిన మార్పు ఏమిటి ? అంతకు ముందు కమ్యూనిజాన్ని బూచిగా చూపారు. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలను కూల్చివేసిన తరువాత కమ్యూనిజంపై విజయం సాధించామని ప్రకటించింది ఎవరు ? అమెరికన్లే కదా ! అక్కడే అమెరికా మేథావులు, యువతలో కొత్త ఆలోచనకు నాంది పడింది. దేశంలో దిగజారుతున్న పరిస్ధితి, దుకాణాలన్నీ చైనా వస్తువులతో నిత్యం దర్శనమివ్వటం, వాణిజ్య లోటు తగ్గించాలని అమెరికా నేతలు నిత్యం చైనీయులను కోరటం, అదే సమయంలో చైనా కమ్యూనిస్టు వ్యవస్ధలో మానవ హక్కులు లేవనే బ్లాక్‌మెయిల్‌ ప్రచారం వాస్తవమా, కాదా ? వీటికి తోడు పదేండ్లకొకసారి వస్తున్న ఆర్ధిక సంక్షోభాలు అమెరికా వంటి ధనిక దేశాలకు తప్ప చైనా దరిచేరకపోవటం అమెరికా మేథావులకు తెలియదా ? ఆందుకే మన దేశపు పెట్టుబడిదారీ వ్యవస్ధ ఎందుకు విఫలమైంది, అంతకు ముందు విఫలమైంది అని చెప్పిన సోషలిస్టు వ్యవస్ధ చైనాలో ఎందుకు ముందుకు పోతోంది అనే ఆలోచన వారిని కాపిటల్‌ గ్రంధం దుమ్ముదులిపేందుకు ముందుకు నెట్టింది. ఇప్పుడు అమెరికా విద్యావంతుల్లో చర్చ పెట్టుబడిదారీ వ్యవస్ద వైఫల్యం గురించే నడుస్తున్నది. సోషలిస్టు అంటే ఎయిడ్స్‌ వచ్చిన వాడిని చూసినట్లు చూసే జనం ఒకప్పుడు ఉన్న అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతోంది. అవును నేను సోషలిస్టును బస్తీమే సవాల్‌ అంటూ బహిరంగంగా ప్రకటించుకున్న బెర్నీ శాండర్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కొరకు పోటీపడే స్ధితి ఏర్పడింది. ఆ పార్టీలోని అనేక మంది మీద కమ్యూనిస్టు ముద్ర ఉన్నా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మిలియన్ల మంది యువత మేమూ సోషలిస్టులమే అని ప్రకటించుకుంటున్నారు. ఇవేవీ అమరనాధ్‌ వంటి వారికి తెలియవా, తెలుసుకుంటే దొరకని వస్తువా ? మార్గం చూపాల్సిన మేథావులు అపని చేయకుండా, తాము ఏమనుకుంటున్నారో చెప్పకుండా అమెరికన్ల బ్రెయిన్‌ వాష్‌.. మరో మాటలో చెప్పాలంటే మేథోదాడి అని కొంత మంది అంటారు అని ఇతరుల మీద నెట్టటం ఏమిటి ?

” తొలిసారి ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయినప్పుడు ఒక ప్రచారం జరిగింది . రష్యా వివిధ పద్ధతుల్లో ట్రంప్‌ గెలవడానికి సాయ పడింది . ఆ విధంగా అమెరికా పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తోంది అని . చైనా ప్రపంచం పై పట్టు సాధించడానికి చేయని ప్రయత్నం లేదనేది మేధావుల మాట . మొన్నటి అమెరికా ఎన్నికలు ముందు అమెరికా లో కేసులు విపరీతంగా పెరగడం తెలిసిందే . అప్పటికే దిగజారుతున్న ట్రంప్‌ పరపతి దీనితో ఇంకా పోయింది . ట్రంప్‌ , కరోనా విషయం లో సరిగా వ్యవహరించక పోవడం వల్లే ఇంత నష్టం జరిగింది అని చాలా మంది అమెరికన్‌ లు అనుకొన్నారు . ఫలితం .. ట్రంప్‌ ఓటమి . అమెరికన్‌ లు మాస్క్‌ పెట్టుకోకపోవడం వల్లే కేసులు పెరిగాయని ట్రంప్‌ మాస్క్‌ ల విషయం లో తప్పుదారి పట్టించేలా వ్యవహరించాడని చాలా మంది భావించారు . లేదు .. తన పై దాదాపుగా యుద్ధం ప్రకటించిన ట్రంప్‌ ను ఓడించాలని చైనా పంతం పట్టింది .. అమెరికా లో మేధావులు , మీడియా ఇప్పుడు చైనా గుప్పిట్లో వున్నారు . చైనా కావాలంటే కేసులు పెంచడం పెద్ద కష్టమా ? ఇందులో ఏదో కుట్ర వుంది అని భావించే వారున్నారు . ఇలా చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవనేది సత్యం . ఇలాంటి కుట్ర సిద్ధాంతాలు కేవలం కాలక్షేపానికి పనికి వస్తాయి అని చాలా మంది భావిస్తారు. ” అని అమరనాధ్‌గారు చెప్పారు.

వాట్సప్‌ యూనివర్సిటీ చేస్తోంది ఇదే. రుజువులు లేని సొల్లుకబుర్ల తయారీ కూడా ప్రచార దాడిలో భాగమే. జనాన్ని తప్పుదారి పట్టించేందుకు అవి బాగా ఉపయోగపడతాయి, రంజుగా ఉంటాయి. ఎలాంటి విమర్శనాత్మక దృష్టి లేకుండా మేథావులు వాటిని జనం ముందు ఉంచటమే విషాదం, విచారకరం, ఆక్షేపణీయం. ఆ పని చేయటంలో పోస్టుమాన్‌ పని తప్ప వారి బుద్ది కుశలత ఏముంది ? వాటి మీద బుద్ది జీవుల వైఖరి ఏమిటి ? ఒక టీవీ యాంకర్‌ అయితే దీని మీద వారలా అంటున్నారు, మీరేమంటున్నారు, దాని మీద వారలా అన్నా మీరేమంటారు అని అడగవచ్చు. అది మేథోలక్షణం కాదు. కొందరు యాంకర్లు తమకు నచ్చేవాటిని చెప్పేందుకు ఎక్కువ అవకాశమిస్తారు, భిన్నంగా మాట్లాడితే ఏదో ఒక పేరుతో వేరే అంశానికి మరలుతారు. మేథావులు అలా చేస్తే సహజంగానే అనుమానాలు వస్తాయి.

ప్రతి దేశం మరోదేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది అన్నది అందరికీ తెలిసిన పచ్చినిజం. మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా అమెరికా వెళ్లి అబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బహిరంగంగా ప్రచారం చేసి వచ్చిన విషయం తెలియదా ? అంటే బైడెన్‌ను ఓడించాలనే కదా ! ఎవరైనా ఒకటే కదా మరి, మోడీ ఎందుకు ఆ పిలుపు ఇచ్చినట్లు ? పాకేజ్‌ ఏమైనా కుదుర్చుకున్నారా ? తన పెరటితోట అనుకుంటున్న లాటిన్‌ అమెరికాలో, ఇంకా అనేక దేశాల్లో అమెరికా జోక్యం చేసుకుంటూ ఎవరు గద్దెమీద ఉండాలో కూడదో నిర్దేశిస్తున్నది. ఎన్నుకున్న ప్రభుత్వాలను గుర్తించేందుకు నిరాకరిస్తున్నది. మేథావులకు ఇవేవీ పట్టవా ? కుట్ర సిద్దాంతాలను ఒక లక్ష్యం కోసం తప్ప కాలక్షేపం కోసం సృష్టించటం లేదు. అదేమీ చిన్న విషయం కాదు. సూటిగా చెప్పకుండా అనుమానాలు రేకెత్తించి జుట్టుపీక్కొనేట్లు చేసే నైపుణ్యం ఉంటేనే అలాంటి వాటి సృష్టి కర్తలకు నాలుగు డబ్బులు వస్తాయి. దేశంలో హిందువులను మైనారిటీలుగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఇస్లాం, క్రైస్తవ మతాల వారి మీద నిరంతరం ప్రచారం చేస్తున్నారు. దీన్ని కాలక్షేపానికి చేస్తున్నారని అనుకోవాలా ? కేంద్ర ప్రభుత్వ చర్యలను లేదా రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల చర్యలను విమర్శించిన మీడియా మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏకంగా దేశద్రోహంగా చిత్రిస్తున్నది. అదే విధంగా అమెరికా మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే దానికి చైనా మద్దతు, నిధులు అంటున్నారు. అమెరికా మీడియాలో ప్రధాన స్రవంతి సంస్ధలన్నీ కార్పొరేట్లవే. వాటి ప్రయోజనాలే మీడియాకు ముఖ్యం తప్ప చైనా కోసం పని చేస్తాయని చెప్పటం ప్రచారదాడిలో భాగమే.

” కొన్ని నెలల క్రితం ఒక యూట్యూబ్‌ లో ఒక సీనియర్‌ జర్నలిస్ట్‌ వీడియో చూసాను . ఆయన తెలుగు వాడే . పేరు గుర్తు రావడం లేదు . ఢిల్లీ స్థాయిలో మీడియా ను చైనా దేశం తరపున కొంత మంది బ్రోకర్‌ లు ఎలా మానిప్యులేట్‌ చేస్తున్నారో .. మీడియా లో చైనా వ్యతిరేక వార్తలు రాసిన జర్నల్లిస్ట్‌ ల ఉద్యోగాలు ఎలా ఊడి పోయాయో అయన ఆ వీడియో లో పేర్ల తో సహా వివరించాడు . అవునా ? మన దేశం లో కూడా చైనా కు నిజంగా అంత పట్టుందా అని నేను ఆశ్చర్య పోయాను. ”

ఇది ఆధారం, అర్దం లేని అంశం. సదరు సీనియర్‌ జర్నలిస్టు తెలుగువాడైనా మరొకరైనా చైనా వ్యతిరేక వార్తలు రాసి ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు. పత్రికలు, టీవీ ఛానళ్లు తమ రేటింగ్‌ను పెంచుకొనేందుకు చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చేస్తున్న ప్రచారం అమరనాధ్‌ గారి దృష్టికి వచ్చి ఉంటే ఈ అతిశయోక్తి వార్తను నమ్మి పోస్టులో పెట్టి ఉండరు. చైనాతో మన సంబంధాల గురించి విమర్శనాత్మకంగా రాసిన వారెవరైనా ఉద్యోగాలు పోగొట్టుకొని ఉంటారు తప్ప మరొకటి కాదు. చైనీయులు అమెరికాను, మన దేశ మేథావులను కూడా అదుపులోకి తీసుకున్నారని అమరనాధ్‌ వంటి వారు నిజంగా నమ్ముతున్నారా ? మొత్తంగా ఎక్కడైనా అమ్ముడు పోతారా ? ఒక వైపు మీడియాను పూర్తిగా తనకు అనుకూలంగా వినియోగించుకుంటూ ఒకటీ అరావిమర్శనాత్మకంగా ఉంటే మీడియా మొత్తం కమ్యూనిస్టులు, దేశద్రోహులతో నిండిపోయిందని కాషాయ దళాలు నిరంతరం ప్రచారం చేస్తుంటాయి. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే వారు, భజన చేయని వారందరూ వారి దృష్టిలో కమ్యూనిస్టులే.

” ఫిబ్రవరి మూడవ వారం నుంచి కేసులు మన దేశం లో భారీగా పెరిగాయి . ఇలా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదు అనేది సత్యం . ఇప్పుడు అనేక వాట్సాప్‌ గ్రూప్‌లలో ఫేస్బుక్‌ పైన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత పెరగడం చూసాను . అమెరికా లో సఫలం అయిన ప్రయోగాన్ని ఇక్కడ కూడా చేయాలని చైనా చూస్తోందా ? అసలు అమెరికా లో చైనా ఆలా చేసింది అని చెప్పడానికే ఆధారాలు లేవు . ఇంకా ఇక్కడ దాన్ని ప్రయోగిస్తోంది అని అనుకోవడమేంటి ? పిచ్చి ఊహ కాదా ? అయిన చైనా ఆలా చెయ్యాలని ప్రయత్నిస్తే మన దేశం లో గూఢచారి సంస్థలు పసిగట్ట లేవా ? ఏమో .. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కన్నా మన సంస్థ లు గొప్పవా ? ఆబ్బె .. ఇది అతి గా ఆలోచించడం .. ”

ఇది వాట్సప్‌, బుర్ర ఉపయోగించకుండా దానిలో వచ్చిన వాటన్నింటినీ గుడ్డిగా నమ్మి ప్రచారం చేసిన దాని ప్రభావం అమరనాధ్‌ గారి మీద కూడా పడినట్లుంది. ఆయనే చెప్పినట్లు పిచ్చి ఊహల గురించి చెప్పుకోవటం పనిపాటా లేని వ్యవహారం. లేదా వాటిని చెప్పాల్సి వస్తే అలాంటి పనిపాటా లేని సరకు గురించి జనాన్ని హెచ్చరించాలి. అతిగా ఆలోచించటం అన్నారు తప్ప అమరనాధ్‌ పోస్టులో అలాంటి సూచనలేవీ లేవు. కరోనా కేసులు పెరుగుతాయని సామాన్యులు ఊహించలేకపోవచ్చు. కానీ ఎంతో అనుభవం, నిత్యం ప్రపంచ పరిణామాలను చూస్తున్న అధికార యంత్రాంగం, దాన్ని నడిపే రాజకీయనాయకత్వానికి ముందు చూపు లేకపోతే దేశం అధోగతి పాలవుతుంది. ఇరుగు పొరుగు దేశాలతో వస్తుందో రాదో తెలియని యుద్దం గురించి అంచనా వేసుకొని లక్షల కోట్ల రూపాయల ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాము. ఆ సమాచారం ఉంది ఈ సమాచారం ఉందని కథలు రాయిస్తుంటారు. కొన్న ఆయుధాలు పాతపడి పోగానే పక్కన పడేసి కొత్తవి కొంటున్నాము.

కరోనా మీద యుద్దం ముగిసిందని ఎవరు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ అలాంటి సూచనలేమీ ఇవ్వలేదు. అనేక దేశాలలో తిరగబెట్టింది. కేంద్ర పాలకులు ఆ అనుభవాన్ని ఏమైనా పరిగణనలోకి తీసుకున్నారా ? పోనీ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న తరువాత కూడా కుంభమేళాకు ఎందుకు అనుమతిచ్చారు? అనేక మంది నిపుణులు చేసిన హెచ్చరికలను ఎందుకు పెడచెవిన పెట్టారు ? ఆక్సిజన్‌ అవసరం గురించి గతేడాదే అర్దం అయింది. దానికోసం 150 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని గతేడాదే నిర్ణయించారు. ఏడు నెలల పాటు టెండర్లు ఖరారు చేయలేదు, దీన్ని ఏమనాలి బాధ్యతా రాహిత్యమా , నేరపూరిత నిర్లక్ష్యమా ? ఫేస్బుక్‌లో జన స్పందన చూసేంతవరకు మీకు కేంద్ర వైఖరిలో ఎలాంటి తప్పు ఒప్పులు కనిపించలేదా ? సామాన్యులకు మీకు ఇంక తేడా ఏముంది. పరిజ్ఞానం కంటే ఊహ ముఖ్యమని ఐనిస్టీన్‌ చెప్పాడు. మెదడుతో చూడగలిగిన వాడే బుద్ది జీవి అని మరో పెద్దమనిషి సెలవిచ్చారు. అలాంటి వారు కొందరు హెచ్చరిస్తున్నా కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో యంత్రాంగం పట్టించుకోకపోవటమే ఇంతవరకు తెచ్చింది. మేథావులూ పట్టించుకోవటం లేదు.

” చైనా లో ఆ ఒక్క నగరం తప్పించి మిగతా చోట్లకు ఆ రోగం ఎందుకు విస్తరించలేదు ? ఆ నగరం పేరు పోస్ట్‌ చేసినా సోషల్‌ మీడియా ఎందుకు ఆ పోస్ట్‌ ను బ్లాక్‌ చేస్తోంది ? చైనా మిత్రం దేశం .. మన పొరుగున వున్న పాకిస్థాన్‌ . మన దేశం లో మాత్రం అటు ఉత్తరాంచల్‌ మొదలు ఇటు తమిళనాడు దాకా కేసులు పెరుగుతున్నాయి . సరే ఇక్కడ మాస్క్‌ లు పెట్టుకోలేదు .. జనాలు గుంపులు గుంపులుగా తిరిగారు అని చెప్పేవారు . మరి మన పొరుగునే వున్న పాకిస్థాన్‌ ? అక్కడ కొద్దీ పాటి కేసులు పెరిగినా ఇక్కడి లాగా ఇన్ని కేసులు రావడం లేదు . అక్కడ మాస్క్‌ లు భౌతిక దూరం సిద్ధాంతం పని చెయ్యదా ?
పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను కదా . అందుకే చెప్పా .. నా దగ్గర రుజువులు లేవండి . చదివే వారికి ఏదో సోది లాగా ఉంటుంది .. లేదా నేనేదో సంచలనం కోసం .. పబ్లిసిటీ పిచ్చితో ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది .. కాబట్టి నేను చెప్పను .. అవి నా మనసులో అనుమానాలే .. అది నాతోనే ఉండి పోనీ అని .. నిన్నటి నుంచి సర్‌ చెప్పండి చెప్పని అని మెసెంజర్‌ లో మెసేజ్‌ ల వెల్లువ . సరే పోస్ట్‌ చేశా . జస్ట్‌ చదివి మరచి పోండి. అయిదు నిముషాలు కాలక్షేపం అనుకోండి. ”

ఊహాన్‌ నగరం పేరు ఉన్న పోస్టును సోషల్‌ మీడియా బ్లాక్‌ చేస్తోందన్నారు. చాలా చిత్రంగా ఉంది. కాషాయ తాలిబాన్లు ఇలాంటి చిత్రాల గురించి పోస్టులు పెట్టటం నేను ఫేస్బుక్‌లో చూశాను. మన దేశంలో ఇంటర్నెట్‌ను నియంత్రించేది చైనా అనుకుంటున్నారా ? పక్కా నరేంద్రమోడీ సర్కార్‌. రైతు ఉద్యమం సందర్భంగా మీడియా కిట్ల గురించి ఎంత రచ్చ చేసిందో మీకు తెలియకుండా ఉంటుందా ? పబ్లిసిటీ పిచ్చికోసం ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది అన్నారు. మీకేమనిపించిందో స్కానింగ్‌చేసినా దొరకదు, కానీ మెసేజ్‌ల వెల్లువ కారణంగా పోస్టు చేయాల్సి వచ్చిందన్నారు. పర్యవసానం మీకు ఎంతో పబ్లిసిటీ వచ్చింది. మీకు కాలక్షేపం అనిపించవచ్చు గానీ, ఒక మేధావిగా ఇలాంటి పోస్టులు పెట్టటం తగదేమో ఆలోచించండి. దీని వలన ఏమి సాధించిందీ అవలోకించుకోండి. ఎవరిలో అయినా ఉన్న గందరగోళాన్ని తొలగించారా, ఇంకా గట్టిపరిచారా ? చైనా-అమెరికా-నరేంద్రమోడీ ఇంకా ఎవరైనా సరే వారి గురించి అమరనాధ్‌ గారయినా మరొక మేధావి అయినా ఒక స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండాలని మనవి. అవి వెల్లడించే ధైర్యం లేనపుడు మౌనంగా ఉండటం మేలు. అటూ ఇటూగాకుండా చెబితే ప్రయోజనం ఏముంది ? ఒక బుద్ది జీవిగా ఆలోచించండి. మేథావుల మౌనం దేశాలకు మంచిది కాదని ప్రపంచ చరిత్ర చెప్పింది.ప్రపంచంలో తటస్ధం అంటూ ఏదీ లేదు. నాకు రాజకీయాలు పట్టవు, నేను ఎవరికీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదు అని ఎవరైనా అంటే అధికారంలో ఉన్నవారిని కొనసాగించాలని కోరే పక్షానికే అది అనుకూలిస్తుంది. తెలియకుండానే అలాంటి వారు ఒక వైపు మద్దతు ఇచ్చినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మిలిటరీ కుట్రలు – ఐరోపా,అమెరికన్ల ద్వంద్వ ప్రమాణాలు !

31 Wednesday Mar 2021

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

2021 Myanmar coup d'état, Aung San Suu Kyi, Myanmar’s Military Coup, US double standards on coups


ఎం కోటేశ్వరరావు


మార్చి 27న మన పొరుగు దేశమైన మయన్మార్‌లో దేశ వ్యాపితంగా మిలిటరీ జరిపిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించారు. ఆ దుశ్చర్యను యావత్‌ సమాజం ఖండిస్తోంది, నిరసిస్తోంది. గత ఏడాది నవంబరు పార్లమెంటరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరి ఒకటవ తేదీ ఏడాది పాటు అత్యవసర పరిస్ధితిని ప్రకటించి మయన్మార్‌ మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్దంలో 76 సంవత్సరాల క్రితం జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా మార్చి 27న మయన్మార్‌ సాయుధ దళాల ప్రతిఘటన ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ రోజున సాయుధ దళాల దినోత్సవం జరుపుతున్నారు. అదే రోజున నిరసనకారుల మీద జరిపిన కాల్పుల్లో 90 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సంఖ్య 114 అని, ఇంకా ఎక్కువ ఉండవచ్చని కూడా చెబుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొత్తం మరణించిన వారు 510 మంది అని కొందరి లెక్క. మిలిటరీ చర్యల మీద యావత్‌ ప్రపంచంలో నిరసన వ్యక్తమైంది. ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది. ప్రపంచంలో మిలిటరీ అధికారానికి వచ్చిన చోటల్లా మానవహక్కుల ఉల్లంఘన, ప్రాణనష్టం పెద్ద జరుగుతున్నది. అమెరికా దాని మిత్రపక్షాలుగా ఉన్న ఐరోపా, మరికొన్ని దేశాలు మయన్మార్‌పై ఆంక్షలను ప్రకటించాయి.


ఒక దేశ అంతర్గత వ్యవహారాలు, పరిణామాలపై ఎంత వరకు స్పందించాలి, ఎంత మేరకు జోక్యం చేసుకోవాలి అన్నది ఒక ఎడతెగని, ఏకీభావం కుదరని సమస్య. ఇలాంటి సమస్యలు తలెత్తిన దేశాలన్నింటి పట్ల అన్ని దేశాలూ ఒకే వైఖరి తీసుకుంటే అసలు ఇలాంటి పరిణామాలు తలెత్తవు, ఒకవేళ జరిగినా మారణకాండకు అవకాశాలు పరిమితం.ఐక్య రాజ్యసమితి వంటి సంస్ధలు ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలను నివారించలేకపోతున్నాయి. ఫిబ్రవరిలో జరిగిన పరిణామాల సమయంలోనే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. గతవారాంతంలో జరిగిన పరిణామాల తరువాత దౌత్య, సంబంధాలన్నింటినీ పక్కన పెట్టింది.హింసా కాండ భయానకంగా ఉందని అధ్యక్షుడు జో బైడెన్‌ వర్ణించారు. మిలిటరీ తిరుగుబాటు అయినా, దానికి ప్రజాప్రతిఘటన అయినా అది అంతర్గత సమస్యగానే పరిగణించాల్సి ఉంది. మరో దేశం జోక్యం చేసుకొనే పరిస్ధితి తలెత్తినపుడు ఒకవేళ జోక్యం చేసుకుంటే అది సమర్దనీయమా కాదా అన్న చర్చ జరుగుతుంది. మార్చినెల 26వ తేదీన బంగ్లాదేశ్‌ విముక్తి 50సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ తాను రాజకీయ జీవితం ప్రారంభించినపుడు బంగ్లా విముక్తికోసం జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లినట్లు ప్రకటించారు.దానిలో నిజమెంత అనేది ఒక అంశమైతే పాకిస్ధాన్‌లో ఒక భాగమైన నేటి బంగ్లాదేశ్‌లో నాటి పాక్‌ నియంతల మారణకాండకు స్వస్తి పలికేందుకు మన దేశం సైనిక జోక్యం చేసుకున్నది.దాన్ని ఎందరో హర్షించినా, పాక్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేందుకు పూనుకుంది అనే పేరుతో మనలను బెదిరించేందుకు ముందుగానే అమెరికన్లు తమ సప్తమ నౌకా దళాన్ని బంగాళాఖాతానికి దింపారు. అమెరికా చర్యను మాత్రం నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండించలేదు. అమెరికా దాడి చేస్తే రక్షణ కోసం ఆ రోజు మన దేశం నాటి సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకుంది. జనసంఘం బంగ్లాదేశ్‌కు మద్దతు పేరుతో ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసింది తప్ప నిజానికి బంగ్లా మీద ప్రేమతో కాదు. ఏది ఏమైనా నాటి జోక్యం సరైనదే, అందువలన ప్రతి జోక్యాన్ని తప్పు పట్టలేము, అలాగని ప్రతి ప్రత్యక్ష, పరోక్ష జోక్యాన్ని సమర్ధించకూడదు. దేనికి దాన్నే విడిగా విచక్షణగా చూడాలి.


తాజా విషయాలకు వస్తే మయన్మార్‌ పరిణామాలపై అన్ని దేశాలూ ఒకే విధంగా స్పందించటం లేదు. మార్చి 27న మయన్మార్‌ మిలిటరీ దినోత్సవంలో పాల్గొని మన దేశంతో సహా ఎనిమిది దేశాల ప్రతినిధులు హాజరై సామాన్యుల రక్తంతో తడిచిన మిలిటరీ అధికారుల చేతులతో కరచాలనం చేశారు. పాకిస్ధాన్‌, రష్యా, చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం, లావోస్‌, థారులాండ్‌ ప్రతినిధులు కూడా వారిలో ఉన్నారు. మన సంఘపరివార్‌ సంస్దలు చెబుతున్నదాని ప్రకారం ఈ దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు కనుక వెళ్లారని కాసేపు అనుకుందాం, మరి మన ప్రధాని మన ప్రతినిధిని ఎందుకు పంపినట్లు ? ముందే చెప్పుకున్నట్లు తాను పాక్‌ మిలిటరీ నియంత్రత్వానికి వ్యతిరేకంగా జరిగిన బంగ్లా విముక్తి ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన నరేంద్రమోడీ ప్రకటనకూ దీనికీ పొంతన కుదరటం లేదు. ఒక చోట మానవహక్కులను హరించటాన్ని ఖండిస్తారు-మరోచోట హరిస్తున్నవారితో కరచాలనం చేస్తారా ? ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు ? మయన్మార్‌ విషయంలో సత్యాగ్రహం చేయకపోయినా ఖండన ప్రకటన ఎందుకు చేయలేదంటే ఏమి చెబుతారు ? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే భారత్‌ మా రక్తంతో తడిచిన మిలిటరీతో కరచాలనం చేసేందుకు తన ప్రతినిధిని ఎందుకు పంపింది అని మయన్మార్‌ ప్రజాస్వామిక వాదులు సామాజిక మాధ్యమంలో ప్రశ్నించారు. చైనాను కూడా వారే అదే ప్రశ్న వేయవచ్చు. ఆంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి ఎంపీల కమిటీ కూడా భారత చర్యను ప్రశ్నించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మన దేశం కూడా సభ్యురాలే అయినప్పటికీ ఇంతవరకు హింసాకాండను ఖండించలేదు.ప్రస్తుతం మన దేశం భద్రతా మండలి సభ్యురాలిగా ఉండి,పొరుగుదేశం గురించి ఏమి చేసింది అన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమివ్వాలా లేదా ?


దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్టవేస్తామంటూ బయలు దేరిన చతుష్టయ దేశాలలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి సాధారణ పరిస్ధితుల పునరుద్దరణ జరగాలని మన దేశం కోరింది. మరి మిగిలిన మూడూ మయన్మార్‌ మీద ఆంక్షలను విధించాలని అంటుంటే మన దేశం మౌనంగా ఉంది, అంగీకరించటం లేదు. మయన్మార్‌లో పరిణామాలు అంతర్గత విషయాలని చైనా, రష్యా బహిరంగంగానే ప్రకటించాయి. మయన్మార్‌లో మిలిటరీ చర్యలకు నిరసనగా ఆంక్షలను కఠినంగా అమలు జరుపుతామని ప్రకటించింది అమెరికా, దాని నాయకత్వంలో ఐరోపా పశ్చిమ దేశాలు అన్నది తెలిసిందే. ఆంక్షల వలన ఫలితం లేదని మన దేశం ఇప్పటికే ఈ దేశాలన్నింటికీ మన దూతల ద్వారా తెలిపింది.


మయన్మార్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగితే అక్కడి జనం వాటి సంగతి చూసుకుంటారు. మిలిటరీ జోక్యం చేసుకోవటాన్ని ఎవరూ హర్షించరు, ఖండించాల్సిందే. కానీ ఆంక్షలు విధించటానికి అమెరికా, పశ్చిమ దేశాలకు ఉన్న హక్కేమిటి ? ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన ప్రతి ఉదంతంలోనూ అదే విధంగా ప్రవర్తిస్తే పోనీ అదొక తీరు. అనేక దేశాల్లో వారే స్వయంగా మిలిటరీ నియంతలను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించటమే కాదు, పెద్ద సంఖ్యలో పౌరుల పాణాలను బలిగొన్న రక్త చరిత్ర మన కళ్ల ముందు ఉంది. తమ ప్రయోజనాలను ప్రపంచ ప్రయోజనాలుగా చిత్రించటంలో పశ్చిమ దేశాలు, వాటికి మద్దతు ఇచ్చే మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోశాడనే పేరుతో అమెరికా తదితర దేశాలు జోక్యం చేసుకొని సద్దాంతో సహా లక్షలాది మంది సామాన్య పౌరులను హత్య చేశారు. తరువాత అబ్బే ఎలాంటి మారణాయుధాల ఆనవాళ్లు లేవని అదే అమెరికా ప్రకటించింది. యెమెన్‌లో ప్రభుత్వం-దాన్ని వ్యతిరేకించే శక్తుల మధ్య అంతర్యుద్దం జరుగుతోంది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అక్కడి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయి. సౌదీ అరేబియాను తమ ప్రతినిధిగా నియమించి దాడులు చేయిస్తున్నాయి. వేలాది మందిని హతమార్చాయి. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాద మూకలను రెచ్చగొట్టి ఆయుధాలు అందించి అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈజిప్టులో 2013లో జనరల్‌ శిసి తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేశాడు.దానికి నిరసనగా పదవీచ్యుతుడైన అధ్యక్షుడు మహమ్మద్‌ మోర్సీ మద్దతుదారులు రాజధాని కైరోలో నిరసన తెలుపుతున్న సమయంలో మిలిటరీ విరుచుకుపడి మారణకాండ సాగించింది.ఆధునిక చరిత్రలో అత్యంత దారుణమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతున్న రబ్బా చౌక్‌ మారణకాండ గురించి తెలిసిందే. 2013 ఆగస్టు 14న రబ్బాతో పాటు మరొక ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య వెయ్యి నుంచి రెండువేల ఆరువందల వరకు ఉంది.గాయపడిన వారు కొన్నివేల మంది ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు వేలాది మందిని హత్య చేశారు, తప్పుడు కేసులు పెట్టి ఉరితీశారు. డెబ్బయి వేల మంది రాజకీయ ఖైదీల కోసం 23 జైళ్లను ప్రత్యేకంగా నిర్మించిన అపర ప్రజాస్వామిక మిలిటరీ నియంతను బలపరించిది అమెరికా. అలాంటి నిరంకుశ పాలకుల చేతిలో జనం ఎంతో సుఖవంతంగా ఉన్నారంటూ టైమ్‌ వంటి పత్రికలు రాతలు రాశాయి. ఇప్పటికీ జనరల్‌ శశి నిరంకుశపాలన కింద ఈజిప్టు మగ్గిపోతూనే ఉంది. తమ తొత్తుగా ఉన్న కారణంగానే అమెరికా అన్ని రకాల మద్దతు ఇస్తోందన్నది స్పష్టం. ఎలాంటి ఆంక్షలు లేవు, ఎందుకని ? ఇది ద్వంద్వప్రమాణం కాదా ? తమకు అనుకూలంగా ఉండే మిలిటరీ పట్ల ఒక వైఖరి, లేని వారి పట్ల భిన్న వైఖరి.


అమెరికన్లు తమకు నచ్చని లేదా లొంగని పాలకులను తొలగించేందుకు చేసిన కుట్రలకు అంతే లేదు. ప్రతి ఖండంలో అలాంటి ఉదంతాలు మనకు కనిపిస్తాయి. 1946 నుంచి 2000 సంవత్సరం వరకు కనీసం 81దేశాలలో పాలకులను మార్పు చేసేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. మిలిటరీ నియంతలను సమర్ధించింది, నియంతలుగా మారిన వారిని ప్రోత్సహించింది. బొలీవియాలో జరిగిన ఎన్నికల్లో ఇవో మోరెల్స్‌ విజయం సాధిస్తే అక్రమాలతో గెలిచారంటూ అక్కడి పోలీసు, మిలిటరీ తిరుగుబాటు చేసి మోరెల్స్‌, ఇతర నేతలను దేశం నుంచి బయటకు పంపారు. ఆ దుర్మార్గాన్ని అమెరికా నిస్సిగ్గుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు సమర్దించాయి. ఎలాంటి ఆంక్షలు విధించకపోగా అన్ని రకాలుగా సాయం చేశాయి. వెనెజులాలో ఎన్నికైన ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరించి తమ తొత్తును పాలకుడిగా గుర్తించాయి. అందువలన మయన్మార్‌లో ఆంక్షలు విధించటానికి వారికి ఉన్న అర్హత, హక్కేమిటి ? అమెరికా చర్యలను గనుక సమర్ధిస్తే లాటిన్‌ అమెరికాలో తమను వ్యతిరేకించే శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోట ఆదే సాకుతో ప్రభుత్వాలను కూలదోస్తారు.
ప్రపంచ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంతో పాటు అనేక ఇతర అంశాలూ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. మయన్మార్‌ విషయానికి వస్తే అక్కడి నియంతల తీరుతెన్నులు ఒక పట్టాన అంతుబట్టవు. ప్రపంచ వ్యాపితంగా ప్రతి మిలిటరీ నియంత అమెరికా మద్దతు పొందిన వాడే. ఇక్కడ నియంతలను మాత్రం అమెరికా వ్యతిరేకిస్తోంది.మిలిటరీ నియమించిన మంత్రుల్లో కొంత మంది గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారున్నారు కనుక చైనాకు మిలిటరీ అనుకూలం అనే విధంగా కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. మిలిటరీ పాలనకు మద్దతుగా చైనా ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. 2015 ఎన్నికల్లోనే అంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డి పార్టీ పూర్తి మెజారిటీతో అధికారానికి వచ్చింది. గడచిన ఐదు సంవత్సరాలలో ఆ ప్రభుత్వం చైనాతో సన్నిహితంగానే మెలిగింది తప్ప మరొక విధంగా వ్యవహరించలేదు. గతేడాది ఎన్నికల్లో అదే పార్టీ తిరిగి విజయం సాధించింది. మిలిటరీ తిరుగుబాటుకు కొద్ది రోజుల ముందు ఈ ఏడాది జనవరిలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఉన్నత స్దాయి ప్రతినిధి వర్గంతో మయన్మార్‌ పర్యటనకు వచ్చి సూకీతో భేటీ కావటం, ప్రభుత్వంతో ఆర్దిక ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులు అక్కడ ఉన్నందున శాంతియుత వాతావరణం ఉండాలనే కోరుకుంటుంది తప్ప మరొకటి కాదు.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ కార్యక్రమంలో మయన్మార్‌ కూడా ఉంది. అక్కడ మిలిటరీ అధికారాన్ని చేపట్టిన నేపధ్యంలో పశ్చిమ దేశాలు ఆంక్షలు ప్రకటించాయి. అందువలన అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే చైనా ఒప్పందాలు ఉన్నాయి గనుక మిలిటరీ పాలకులు అయినా మరొకరైనా ఉనికికోసం పెట్టుబడుల గురించి చైనా మీద ఆధారపడక తప్పదు. ఆ కారణంగానే గతంలో చైనా సంస్దలలో పని చేసిన వారిని మంత్రులుగా నియమించి ఉండవచ్చు.చైనా కూడా మిలిటరీ చర్యలు అంతర్గత వ్యవహారమని భావిస్తున్నందున మన వైఖరిని ప్రశ్నిస్తున్నట్లుగానే బర్మీయులు చైనా వైఖరిని కూడా ప్రశ్నించవచ్చు. మయన్మార్‌ మిలిటరీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో ఒక పట్టాన అంతుపట్టదు. అంగ్‌సాన్‌ సూకీ తండ్రి అంగ్‌సాన్‌ బర్మా స్వాతంత్య్రసమర యోధుడు, సోషలిస్టు, కమ్యూనిస్టు.జపాన్‌ దురాక్రమణ నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. అప్పటికే పక్కనే ఉన్న చైనాలో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపధ్యంలో అంగ్‌సాన్‌ నాయకత్వంలో బర్మా కూడా కమ్యూనిస్టు దేశంగా మారుతుందనే భయంతో బ్రిటీష్‌ వారు చేసిన కుట్రలో భాగంగా అంగ్‌సాన్‌ నాయకత్వంలోని మంత్రివర్గం మొత్తాన్ని హత్య చేశారు. మిలిటరీలోని కొందరు దీని వెనుక ఉన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన వారు అమెరికా, బ్రిటన్‌ ప్రోద్బలంతో చైనా చాంగ్‌కై షేక్‌ మిలిటరీకి బర్మాలో ఆశ్రయం కల్పించి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అస్దిరపరచేందుకు దాడులు చేయించిన చరిత్ర ఉంది. గత ఏడు దశాబ్దాలలో మయన్మార్‌లో మిలిటరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం నాలుగో వంతు మంది ఎంపీలు మిలిటరీ నియమించిన వారే, కీలకమైన శాఖల మంత్రులుగా కూడా వారే ఉంటారు. అదేమీ ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం కాదు. అంగ్‌సాన్‌ సూకీకి శాంతి నోబెల్‌ బహుమతి ఇచ్చారు. ఆమె పాలనలోనే రోహింగ్యా మైనారిటీలపై దాడులు, దేశం నుంచి తరిమివేయాటాలు జరిగాయి. ఇప్పుడు ఆమే బందీ అయ్యారు. అందువలన నిరంకుశ, అప్రజాస్వామిక చర్యలకు ఎవరు పాల్పడినా ఖండించాల్సిందే. తమ విముక్తి కోసం తోడ్పడిన దేశ ప్రతినిధిగా మన ప్రధానిని బంగ్లాదేశ్‌ ఆహ్వానించింది. కానీ అదే బంగ్లాదేశ్‌ నుంచి శరణార్దులుగా, దేశ విభజన సమయంలో వచ్చిన వారి పట్ల బిజెపి అనుసరించిన వైఖరికి నిరసనగా నరేంద్రమోడీ రాకను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసిస్తూ ప్రదర్శనలు, జనం మీద కాల్పులు, అనేక మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. అంతిమ నిర్ణేతలు ప్రజలే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లా విముక్తి ఉద్యమం : నగుబాట్ల పాలైన నరేంద్రమోడీ సత్యాగ్రహం !

28 Sunday Mar 2021

Posted by raomk in Communalism, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Bangladesh liberation struggle, Jan Sangh, Narendra Modi Satayagrah claim


ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌ విముక్తి జరిగి యాభై సంవత్సరాలు గడచిన సందర్భంగా అతిధిగా ఢాకా వెళ్లిన మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తాను బంగ్లాదేశ్‌ విముక్తి కోసం 1971లో సత్యాగ్రహం చేసి జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. తనతో పాటు తన మిత్రులు కూడా ఉన్నారన్నారు. ఈ ప్రకటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రధాని అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్‌ మండిపడింది. యాభై సంవత్సరాల నాడు జరిగిన విషయం- అది నిజమో కాదో తెలుసుకొనేందుకు ఇప్పుడున్నన్ని ఆధారాలు అప్పుడు లేవు. ప్రధాని అంతటి పెద్దాయన చెప్పారు గనుక అది పచ్చి అబద్దమని ఎవరైనా అంటే దాన్ని తేలికగా తీసిపారవేయలేము- అలాగని వాస్తవం అని కూడా చెప్పలేము. అప్పుడేం చేయాలి ? ఉన్న ఆధారాలను బట్టి ఏది నిజం ఏది అబద్దం అనే అంశాలను పాఠకుల ముందు ఉంచితే వారే ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ ప్రయత్నం అదే ! నరేంద్రమోడీ స్వయంగా నోరువిప్పితే తప్ప అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.


ప్రధాని ఏమి చెప్పారు ? ” అప్పుడు నాకు 20-22 సంవత్సరాలుంటాయి. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం నేను, నా మిత్రులు సత్యాగ్రహం చేశాము, జైలుకు కూడా వెళ్లాము ” అని చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు స్వయంగా ఇచ్చిన వివరాల ప్రకారం నరేంద్రమోడీ 1950 సెప్టెంబరు 17న జన్మించారు. బంగ్లా విముక్తి ఉద్యమ సమయంలో జనసంఘం 1971 అగస్టు నెలలో సత్యాగ్రహం నిర్వహించింది. అంటే అప్పటికి మోడీ వయస్సు 21 సంవత్సరాలు. ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే నరేంద్రమోడీ ఆ సమయంలో ఏమి చేస్తున్నారు ? తాను ఫలానా కాలేజీలో ఫలానా సంవత్సరంలో చదివాను అని నరేంద్రమోడీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. బిజెపి అనుకూల పత్రిక జాగరణ జోష్‌లో 2020 సెప్టెంబరు 17న షిఖా గోయెల్‌ రాసిన వ్యాసం ప్రకారం 1967లో గుజరాత్‌ ఎస్‌ఎస్‌సి బోర్డు నుంచి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పదిహేడవ ఏట తనకు వివాహం వద్దంటూ ఇల్లు వదలి రెండు సంవత్సరాలు దేశంలో వివిధ ఆశ్రమాలను సందర్శించారు. తరువాత వచ్చి అహమ్మదాబాద్‌లోని బస్టాండులో ఒక టీ దుకాణంలో పని చేశారు. 1970 ప్రారంభంలో ఏబివిపి శాఖను ఏర్పాటు చేశారు.1971లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా చేరారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సు ద్వారా రాజకీయ శాస్త్రంలో బిఏ డిగ్రీ పొందారు.1983లో గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ పట్టా తీసుకున్నారు. స్కూలు విద్య తరువాత రెండేండ్లు అక్కడా ఇక్కడా తిరిగిన వ్యక్తి ఏ కాలేజీలో చేరకుండా ఏబివిపి విద్యార్ధి సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ? వివాహం వద్దంటూ ఇల్లు వదలిన మోడీ భార్య అని స్వయంగా పేర్కొన్న యశోదాబెన్‌తో వివాహం ఎప్పుడు జరిగింది ?


అసలు మోడీ గారి డిగ్రీ పట్టా గురించి పెద్ద వివాదమే నడిచింది. ఆ వివరాల వెల్లడి దేశ భద్రతకు ముప్పు అన్నట్లుగా సమాచారహక్కు కింద అడిగిన వారికి వివరాలు ఇవ్వలేదు. వివాదం ముదరటంతో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ పట్టా అంటూ ఒకదానిని చూపారు. పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం కూడా తిరస్కరించింది. ఎట్టకేలకు 1978లో నరేంద్రమోడీ పరీక్షలను పూర్తి చేశారని, 1979లో డిగ్రీ పొందారంటూ వెల్లడించింది. అదే సమయంలో డిగ్రీపరీక్ష రాసేందుకు నమోదు చేసుకున్న సంఖ్య ” సిసి 594-74 అని పరీక్ష హాల్‌ టికెట్‌ నంబరు 16594 ” అని వెల్లడించింది. అంటే 1974లో దూరవిద్య ద్వారా డిగ్రీకోసం నమోదు చేసుకొని మూడు సంవత్సరాల పరీక్షలను ఒకేసారి రాసి పాసయ్యారని అని అనుకోవాలి. మిత్రులతో కలసి బంగ్లాదేశ్‌ కోసం సత్యాగ్రహం చేశాను, జైలుకు వెళ్లాను అని చెప్పారు. వివరాలు నమోదు చేయకుండా పోలీసు లాకప్‌లో ఉన్నానంటే నమ్మవచ్చు, కానీ జైలులో ఒక రోజు కూడా ఉంచరు. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఏ జైల్లో ఉన్నారో వివరాలు వెల్లడి అయ్యేంత వరకు దాని గురించి చెప్పే మాటలను నమ్మటం ఎలా ?


పశ్చిమ దేశాల్లో ప్రధానులు, దేశాధ్యక్షుల మీద బూతులు ప్రయోగించినా అక్కడ పెద్దగా పట్టించుకోరు. మన దేశంలో అలాంటి ప్రయోగం మీద తమకు మాత్రమే హక్కు ఉందనే శీలవంతులు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించటమే దేశద్రోహం అంటున్న ఈ రోజుల్లో దేశ ప్రధాని నరేంద్రమోడీ మీద జోకులు పేలిస్తే ఏమౌతుందో నెటిజన్లు ఒక్కసారి ఆలోచించుకోవాలేమో. బంగ్లా విముక్తి ఉద్యమానికి మద్దతుగా సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాను అని చెప్పిన మోడీగారి మీద సామాజిక మాధ్యమంలో పేలిన జోకులు ఎలా ఉన్నాయో చూడండి.
” 1969లో చంద్రుడిపై కాలుమోపిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ బృందంలో రహస్యంగా దూరి మోడీ గారు కూడా చంద్రుడి మీద కాలుమోపారు. బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావటానికి ముందే పందొమ్మిదేండ్ల వయస్సులోనే మోడీ ఈ నాసా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలికట్‌ స్మార్ట్‌ సిటీలో కాలుపెట్టిన వాస్కోడాగామాను స్వాగతించింది నరేంద్రమోడీ గారే. దేశ తొలి సాధారణ ఎన్నికలు 1951లోనే నరేంద్రమోడీ గారు ఓటు వేశారు. ఏడాది వయస్సులో ఆయన వేసిన ఓటు ప్రధానిగా జవహర్‌లాల్‌ ఎన్నికలో కీలకపాత్ర పోషించింది. 1942లో తన ఆరాధ్య వ్యక్తితో కాన్‌సెంట్రేషన్‌ కాంపుల గురించి చర్చిస్తున్నప్పటి చిత్రం. మోడీ తన ఎంఏ చివరి పరీక్షా పత్రాన్ని రాస్తున్న దృశ్యం ” ఇలా ఉన్నాయి. వీటన్నింటి సారం ఒక్కటే నరేంద్రమోడీ సత్యాగ్రహం గురించి అతిశయోక్తులు చెప్పారని ఎద్దేవా చేయటమే !


అశోకా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌, చరిత్రకారుడు అయిన శ్రీనాధ్‌ రాఘవన్‌ మాట్లాడుతూ మన దేశంలో ఎవరైనా బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాననటం హాస్యాస్పదం అన్నారు. అయితే నరేంద్రమోడీ జైలుకు వెళ్లానని చెప్పింది వాస్తవమేనంటూ సంఘపరివార్‌కు చెందిన వారు సమర్ధిస్తున్నారు.ఒక దేశంలోని మరో దేశంలో జరిగే ఉద్యమాలకు మద్దతు ప్రకటించటం సహజం. కానీ సత్యాగ్రహం చేసి అరెస్టయ్యామని చెప్పటమే అతిశయోక్తి. 1971లో బంగ్లాదేశ్‌లో విముక్తి ఉద్యమం ప్రారంభమైన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, దాని రాజకీయ విభాగమైన జనసంఘం మద్దతు ఇచ్చాయి. ఒక దేశంలో జరుగుతున్న పరిణామాల మీద వెంటనే స్పందిస్తే లేదా ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తే రాబోయే పర్యవసానాల గురించి ప్రభుత్వం తటపటాయించింది, అది సహజం. అదే ప్రభుత్వం అనువైన సమయం రాగానే మిలిటరీ జోక్యం చేసుకున్నది. అమెరికా బెదిరింపులను కూడా లెక్క చేయలేదు. పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ అణచివేతలకు పాల్పడం ప్రారంభమై నెలలు గడుస్తున్నా మోడీ సర్కార్‌ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటానికి కారణం ఏమిటి ? పర్యవసానాల గురించి తటపటాయింపే.


పక్కనే ఉన్న మయన్మార్‌లో మిలిటరీ పాలకులు దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా అణచివేతకు పాల్పడినా, తాజాగా పార్లమెంట్‌, ప్రభుత్వాన్ని రద్దు చేసి జనాన్ని అణచివేస్తున్నా కనీసం జనానికి సానుభూతి మిలిటరీ చర్యలను తప్పు పట్ట లేదు బిజెపి. మరోవైపు ఉన్న శ్రీలంకలో ప్రత్యేక రాజ్యం కోసం ఆయుధాలు పట్టిన తమిళులకు మద్దతుగా బిజెపి ఎన్నడైనా సత్యాగ్రహం చేసిందా ? నేపాల్లో రాజరికానికి వ్యతిరేకంగా జనం ఉద్యమించినపుడు బిజెపి వైఖరి ఏమిటి ? అనేక దేశాల్లో జనసంఘ హయాంలో, బిజెపి హయాంలో విముక్తి పోరాటాలు జరిగాయి. వాటిలో ఏ ఒక్కదానికైనా మద్దతు ప్రకటించిన దాఖలాలు ఉన్నాయా ? అంతెందుకు ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. అది వెంటనే అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల మద్దతుతో పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని ఇప్పటికీ ఖాళీ చేసేందుకు మొరాయిస్తోంది. పాలస్తీనా అరబ్బులకు అసలు మాత్రదేశాన్నే లేకుండా చేశారు. వారు నివశించే ప్రాంతాలను సైనికశిబిరాలుగా మార్చి వేసిన దుర్మార్గాన్ని చూస్తున్నాము. అలాంటి ఇజ్రాయెల్‌తో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోకుండా నిరసన తెలుపుతుంటే మన బిజెపి సర్కార్‌ మిత్ర దేశంగా పరిగణిస్తున్నది. ఇదేమి ద్వంద్వ వైఖరి ? అలాంటి పార్టీ బంగ్లాదేశ్‌ విముక్తి కోసం ఉద్యమించి జైలుకు కూడా వెళ్లామని చెప్పుకుంటున్నదంటే దాని అసలు లక్ష్యం ఏమిటి ? నిజం ఏమిటి ?

బంగ్లాదేశ్‌ విముక్తి విషయంలో జనసంఫ్‌ు మద్దతులో చిత్తశుద్ది లేదు. బంగ్లా విముక్తి కంటే పాకిస్దాన్‌ రెండు ముక్కలు అవుతున్నదనే అంశానికే అది ప్రాధాన్యత ఇచ్చి అమెరికాను సంతృప్తి పరచేందుకు, నాటి సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా సత్యాగ్రహం వంటి హడావుడి చేసింది అన్నది స్పష్టం. నాడు బంగ్లాదేశీయులను ఊచకోత కోసిన పాక్‌ మిలిటరీకి మద్దతుగా అమెరికా తన సప్తమ నౌకాదళాన్ని బంగాళా ఖాతానికి తరలించిన అమెరికా దుర్మార్గాన్ని ఖండించిన పాపాన పోలేదు. ఒక స్వతంత్ర దేశ వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవాలంటే దానికి ఎంతో కసరత్తు అవసరం. అక్కడ అంతర్యుద్దం జరుగుతున్న సమయంలో ఏక్షణంలో అయినా జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి తలెత్తవచ్చని, అందువలన దాని గురించి బహిరంగంగా చర్చించవద్దని,దాని వలన జరిగే లాభం కంటే హానే ఎక్కువ అని నాటి ప్రధాని ఇందిరాగాంధీ జనసంఘంతో సహా ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశంలో చెప్పారు. అమెరికా సప్తమ నౌకాదళాన్ని దించిన నేపధ్యంలో సోవియట్‌ యూనియన్‌తో రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నారు. బంగ్లావిముక్తి ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటనలు చేయవద్దన్న సూచనను రాజకీయ ప్రయోజనం కోసం జనసంఘం ఉల్లంఘించింది. అది చేసిన సత్యాగ్రం బంగ్లాకు విముక్తి కంటే సోవియట్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఉద్దేశించింది అన్నది అసలు విషయం. బంగ్లాదేశ్‌ విముక్తిని గుర్తించకుండా ఉండేందుకే కుట్రతో మన ప్రభుత్వం సోవియట్‌తో రక్షణ ఒప్పందం చేసుకుందని ఢిల్లీలో జరిగిన సత్యాగ్రహ సభలో అతల్‌బిహారీ వాజ్‌పాయి ఉపన్యాసం చేశారని 1971 ఆగస్టు 12న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక వార్తలో రాసింది. అందువలన బంగ్లాదేశ్‌కు మద్దతు పేరుతో సత్యాగ్రహం అని చెప్పినా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది కనుక కొంత మందిని అరెస్టు చేసి ఉండవచ్చు తప్ప బంగ్లాకు మద్దతు కారణం అయితే కాదు. దానిలో నరేంద్రమోడీ పాల్గొన్నట్లు, అరెస్టయి జైలుకు పోయినట్లు ఆధారాలు అయితే లేవు.


దేశ విభజన సమయంలోనూ, బంగ్లా విముక్తి పోరాటం సమయంలో అనేక మంది అక్కడి నుంచి కాందిశీకులుగా ప్రాణాలు అరచేత పట్టుకు వచ్చిన వారిని అక్రమ చొరబాటుదారులంటూ తరువాత కాలంలో అసోం, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలలో పెద్ద రచ్చ చేసి మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపింది సంఘపరివార్‌ శక్తులు, వాటి రాజకీయ రూపం బిజెపి అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికీ దాన్ని ఎన్నికల అస్త్రంగా వినియోగిస్తున్నారు. అందుకే మోడీ పర్యటనకు నిరసనగా అక్కడి మతశక్తులతో పాటు పురోగామి వాదులు కూడా నిరసన వ్యక్తం చేశారు. మోడీ రాకను హర్షించిన వారెవరూ లేరు.


పెద్దల మాటను గౌరవించాలి. నిజమే, ఒక నాటికలో (బహుశా ‘ పంజా ‘ అనుకుంటున్నా) ఒక పాత్రధారి నేనూ స్వాతంత్య్ర సమర యోధుడనే అని చెప్పుకుంటాడు. అదెలా అంటే కొండా వెంకటప్పయ్య జెండా ఎగురవేస్తుంటే చూశా అంటాడు. అలాంటి పెద్దలను కాదు. పెద్దలనే వారు గౌరవ ప్రదంగా వ్యవహరించినపుడే మన్నించాలి. పెద్దలం కదా అని ఏది బడితే అది చెబితే నమ్మే రోజులు కావివి. కనుక పెద్దలూ మా రోజుల్లో లేదా ఆరోజుల్లో అని చెప్పేటపుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపధ్యంలోనే తన ప్రకటన మీద తలెత్తిన వివాదానికి ముగింపు పలకాల్సింది కూడా నరేంద్రమోడీయే. అది వ్యక్తిగతంగా ఆయనకే గౌరవం. తాను, తనతో పాటు ఉన్న మిత్రులు ఏ తేదీల్లో ఏ జైల్లో ఉన్నారో ఆధారాలు వెల్లడించటం కష్టమేమీ కాదు. దేశభద్రతకు వచ్చే ముప్పు అసలే ఉండదు. లేనట్లయితే ఆయన డిగ్రీ వివాదం మాదిరి దేశవ్యాపితంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా మచ్చగా మిగిలిపోతుంది. మీడియాలో దీని గురించి జరిగే చర్చ, సమాచారం సరిహద్దులు దాటకుండా ఉంటుందా ? ట్విటరైట్లను, ఫేస్‌బుకర్లను ఆపగలమా ? ఎవరి గడ్డిని వారికే తినిపిస్తారు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేగంగా పెరుగుతున్న జపాన్‌ మిలిటరీ బడ్జెట్‌ !

23 Wednesday Dec 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

#japan military, East Asia, Japan, Japan military, Japan record military budget


ఎం కోటేశ్వరరావు


ఐక్యరాజ్యసమితి నిబంధనావళి ప్రకారం ప్రతిదేశమూ రక్షణ హక్కు కలిగి ఉంటుంది. అయితే రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీ, జపాన్‌ మిలిటరీ దుర్మార్గాలను చూసిన తరువాత ఆ రెండు దేశాల మిలిటరీలను రద్దు చేస్తూ యుద్ద విజేతలు శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటికి ఆత్మరక్షణ భద్రతా వ్యవస్ధలు తప్ప సాధారణ మిలిటరీ లేదు. ఆ కారణంగా పొదుపు అయిన సొమ్మును ఆ రెండు దేశాలూ పరిశోధనా-అభివృద్ధి రంగానికి మరల్చి పారిశ్రామిక రంగాలలో ఎన్నో విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అవి ప్రపంచ మార్కెట్ల కోసం ఇతర ధనిక దేశాలతో పోటీకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాటి మిలిటరీ బడ్జెట్ల పెరుగుదల, ఆయుధ పోటీ ఎక్కడకు దారితీస్తుందో అన్న ఆందోళన కలిగిస్తోంది.


వరుసగా తొమ్మిదవ సంవత్సరం జపాన్‌ తన మిలిటరీ బడ్జెట్‌ను పెంచింది. 2021 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుదల 52బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికాతో రక్షణ ఒప్పందం ఉండి, ఆత్మరక్షణకు మాత్రమే పరిమిత ఆయుధాలు, ఏర్పాట్లు కలిగి ఉండాల్సిన జపాన్‌ పూర్తి స్ధాయిలో యుద్దానికి వినియోగించే జెట్‌ బాంబర్లు, దీర్ఘశ్రేణి క్షిపణులను, యుద్ద నౌకలు, విమానవాహక యుద్ద నౌకలను సమకూర్చుకుంటున్నది. ఆత్మ రక్షణకు రక్షణ పేరుతో జరుగుతున్న ఈ చర్యలు ఆ ప్రాంతంలోని రష్యా, చైనాలను రెచ్చగొట్టేందుకు, ఆయుధ పోటీకి దారితీయవచ్చని భావిస్తున్నారు. తాజా పెంపుదలతో ప్రపంచంలో మిలిటరీ బడ్జెట్‌ అగ్రదేశాలలో జపాన్‌ పదవ స్దానానికి చేరింది.
అమెరికా ఆయుధాలను విక్రయిస్తున్నప్పటికీ తన ఆధునిక యుద్దవిమానాలను జపాన్‌కు అందచేయటాన్ని నిషేధించింది. వాటి నిర్మాణ రహస్యాలను జపనీయులు తెలుసుకొని తమకు పోటీకి వస్తారన్నదే దాని భయం. ఈ కారణంగానే రానున్న పదిహేను సంవత్సరాలలో తన స్వంత యుద్ద విమానాలను రూపొందించేందుకు మిత్సుబిషి సంస్దకు జపాన్‌ ప్రభుత్వం 40బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టును అప్పగించింది. 2030 నాటికి విమానాన్ని రూపొందించి, 2035నాటికి మిలిటరీకి అందచేయాలన్నది లక్ష్యం. దీనిలో అమెరికా యుద్ద విమానాల కార్పొరేట్‌ సంస్ధ లాక్‌హీడ్‌ మార్టిన్‌ సహకారం కూడా తీసుకుంటున్నారు. అప్పటి వరకు ఆ కంపెనీ ఉత్పత్తి ఎఫ్‌-35ఆరు బాంబర్లను జపాన్‌ కొనుగోలు చేయనుంది.

రెండవ ప్రపంచ యుద్దంలో మిత్రరాజ్యాల చేతుల్లో ఓడిపోయిన జపాన్‌ మరోసారి మిలిటరీ శక్తిగా ఎదగకుండా చూసేందుకు మిలిటరీని రద్దు చేస్తూ పోట్స్‌డామ్‌ సమావేశం నిర్ణయించింది. శాంతి ఒప్పందం ప్రకారం జపాన్‌ ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకోవచ్చు, ఆత్మరక్షణ చర్యలు తీసుకోవచ్చు. అయితే తరువాత అమెరికా తన షరతుల మేరకు జపాన్‌తో రక్షణ ఒప్పందాన్ని రుద్దింది. ఒక ఏడాది ముందు తెలియచేసి ఎవరైనా ఒప్పందం నుంచి వైదొలగవచ్చనే ఒక నిబంధన ఉన్నప్పటికీ ఒక విధంగా జపాన్‌ సార్వభౌమత్వాన్ని అమెరికా తన తాకట్టులో ఉంచుకుంది. 1951 సెప్టెంబరు ఎనిమిదిన కుదిరిన ఈ ఒప్పందం మరుసటి ఏడాది ఏప్రిల్‌ 28నుంచి అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం అమెరికా సైనిక స్ధావరం ఏర్పాటుకు జపాన్‌ తన గడ్డపై భూమిని కేటాయించాల్సి ఉంది. అమెరికా అనుమతి లేకుండా ఇతర దేశాలతో ఎలాంటి రక్షణ ఒప్పందాలు లేదా మిలిటరీ స్దావరాల ఏర్పాటుకు హక్కులు ఇవ్వరాదు. తన స్వంత ఖర్చుతో జపాన్‌లో మిలిటరీ స్దావరాలను నిర్వహించటమే గాక రక్షణ కల్పించాలి. ఆ మేరకు జపాన్‌లో అమెరికా మిలటరీ తిష్టవేసింది.
అయితే ఇంతవరకు ఏ దేశమూ జపాన్‌ మీద దాడి చేయలేదు, అలాంటి సూచికలు కూడా లేవు. సోవియట్‌ యూనియన్‌ లేదా దాన్ని కూల్చివేసిన తరువాత రష్యా వైపు నుంచి లేదా ఒక నాడు జపాన్‌ ఆక్రమణకు గురైన చైనా నుంచి ఎలాంటి ముప్పు తలెత్తిన దాఖలాలు లేవు. అయినా గత కొద్ది సంవత్సరాలు జపాన్‌ తన మిలటరీ శక్తిని పెంచుకుంటూ వస్తోంది. అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకొని స్వతంత్ర మిలిటరీ శక్తిగా ఎదగాలనే డిమాండ్‌ కార్పొరేట్‌ శక్తుల నుంచి పెరుగుతోంది. ఇదే సమయంలో తన కంటే మెరుగైన ఆర్ధిక స్దితిలో ఉన్న జపాన్‌ను ఒక వైపు తమ అదుపులో ఉంచుకుంటూనే దానికి తమ ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఎత్తుగడను అమెరికా యుద్ద పరిశ్రమ ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే అదునుగా భావించి ఆయుధాల కొనుగోలుతో పాటు స్వంతంగా ఆయుధాల తయారీకి జపాన్‌ శ్రీకారం చుట్టింది. గతంలో వాణిజ్యం విషయంలో వివాద పడి సర్దుబాటు చేసుకున్న ఈ రెండు దేశాల మధ్య మిలిటరీ చర్యలు ఏ పర్యవసానాలకు దారి తీస్తాయో చూడాలి. అయితే జపాన్‌ సాయుధం కావటం తూర్పు ఆసియాలో శాంతికి ముప్పు కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

జపాన్‌-రష్యాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న కొన్ని దీవుల వివాదం పరిష్కారం కాలేదు. పసిఫిక్‌ సముద్రంలోని కురిల్‌, సఖాలిన్‌ దీవులు ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్నాయి. అవి తమవని జపాన్‌ చెబుతోంది. ఈ కారణంగానే రెండవ ప్రపంచ యుద్దం నాటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ద శాంతి ఒప్పందం మీద సంతకాలు జరగలేదు. అయినప్పటికీ గత ఏడుదశాబ్దాలలో పూర్వపు సోవియట్‌ లేదా ఇప్పటి రష్యా-జపాన్‌ ఎలాంటి వివాదానికి దిగలేదు. ఆ పేరుతో ఆయుధాల మోహరింపు మాత్రం జరుగుతోంది. ఈ దీవులలో రష్యా ఇటీవలనే ఆధునిక రక్షణ వ్యవస్ధలను ఏర్పాటు చేసింది. వాటిలో స్వల్ప శ్రేణి క్షిపణులు, ఫైటర్‌ జెట్‌లు, నౌకల మీద ప్రయోగించే క్షిపణులు ఉన్నాయి. చైనాతో రష్యా సంబంధాలు సజావుగానే ఉన్నందున ఇవి తమకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టినవే అని జపాన్‌, అమెరికా చిత్రిస్తున్నాయి.


మరోవైపు జపాన్‌లో అమెరికా మోహరిస్తున్న మధ్యశ్రేణి క్షిపణులు, వాటికి తోడుగా జపాన్‌ క్షిపణి వ్యవస్ధలు ఎవరికి వ్యతిరేకంగా అన్న ప్రశ్న సహజంగానే ముందుకు వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ దీవులకు సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా నౌక, యుద్ద విమానాల కదలికలు కనిపించాయి. జపాన్‌ విమానాలు ఈ ఏడాది కాలంలో తమ ప్రాంతాల సమీపంలో మూడు వందల సార్లు, చైనా సరిహద్దులో ఆరువందల చక్కర్లు కొట్టాయని రష్యా చెబుతోంది. కొరియా సమీపంలోని కొన్ని దీవులు కూడా తమవే అని జపాన్‌ వివాద పడుతోంది. ఆసియాలో సామ్రాజ్యవాదశక్తిగా గతంలో చైనా, కొరియా, ఇండోచైనా ప్రాంతాలను జపాన్‌ ఆక్రమించుకుంది. విధిలేని పరిస్ధితుల్లో వాటి నుంచి ఖాళీచేసినప్పటికీ కొన్ని దీవులు తమవే అని గిల్లికజ్జాలకు దిగుతోంది. ఆ పేరుతో ఆయుధీకరణకు పూనుకుంది.కరోనా వైరస్‌ కారణంగా ఆర్ధిక వ్యవస్ధ మీద పడిన ప్రతికూల ప్రభావం ఎంతో ఇంకా తేలనప్పటికీ మిలిటరీ ఖర్చు పెంచేందుకు పాలకులు వెనకాడటం లేదు. కరోనా కట్టడిలో జపాన్‌ మిగతా ధనిక దేశాలకంటే మెరుగ్గా పని చేసినప్పటికీ ఆర్ధిక వ్యవస్ధ 2027వరకు కోలుకొనే అవకాశం లేదని, అయినా మిలిటరీ ఖర్చు పెంచటం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.


అమెరికా నాయకత్వాన ఆస్ట్రేలియా, భారత్‌తో కలసి చతుష్టయం పేరుతో జపాన్‌ ఒక మిలిటరీ కూటమి ఏర్పాటుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మిలిటరీ బడ్జెట్‌ పెంపు దీనిలో భాగమే అని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వద్ద నుంచి క్షిపణులు, విమానాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ స్దానికంగానే తయారీకి కూడా ప్రాజెక్టులను ప్రారంభించింది. జలాంతర్గాములపై దాడి చేసే ఫ్రైగేట్స్‌, ఇతర వేగంగా ప్రయాణించే చిన్న నౌకలను కూడా సేకరిస్తున్నది.
కొద్ది మంది సిబ్బందితో దాడులు చేయగలిగిన రెండు యుద్ద నావల తయారీకి 91 కోట్ల డాలర్లను బడ్జెట్‌లో కేటాయించారు. క్షిపణుల తయారీ లేదా కొనుగోలు ఇతర దేశాల మీద దాడులకు ఉద్దేశించినవి, ఆత్మరక్షణ విధానానికి అనుకూలమైన రాజ్యాంగానికి వ్యతిరేకమైన పరిణామాలని జపాన్‌ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశ నైరుతి దీవుల చుట్టూ చైనా నౌకా దళ కార్యకలాపాలకు స్పందనగా, దేశ ఆత్మరక్షణ దళాల రక్షణ కోసం క్షిపణులు కీలకమని రక్షణ మంత్రి నోబు కిషి సమర్దించుకున్నారు. ఐదు సంవత్సరాలలో యుద్ద నావల నిర్మాణం, క్షిపణి పరిశోధనలు పూర్తవుతాయని, ఇప్పటికే 900 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను తాకే వాటిని అభివృద్ది చేసినట్లు చెబుతున్నారు. తమ గగనతలపై ఎగిరే సూపర్‌సోనిక్‌ విమానాలను పసిగట్టేందుకు అవసరమైన టెలిస్కోప్‌లు, పర్యవేక్షణ వ్యవస్ధల పరిశోధనలకు నిధులు కేటాయించారు. తమ దేశ మిలిటరీ బడ్జెట్‌ వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతీయ శక్తులకు ధీటుగా ఉంటుందని టోకియోలోని ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ నాగీ చెప్పారు. రెండువేల సంవత్సరం నుంచి చైనా మిలిటరీ బడ్జెట్‌ పెరుగుతున్న కారణంగా జపాన్‌ కూడా పెంచకతప్పటం లేదని సమర్ధించారు. టోకియోలోని టకుషోకు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ హెయిగో నాగీ మాట్లాడుతూ స్వయం రక్షణకు జపాన్‌ మరింత బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వత్తిడి కూడా మిలిటరీ బడ్జెట్‌ పెంపుదలకు ఒక కారణం అన్నారు. రక్షణ బడ్జెట్‌ పెంచకూడదనే రోజులు పోయాయన్నారు.


నాటో కూటమి ఖర్చులో ఎక్కువ మొత్తాన్ని ఐరోపా దేశాలు భరించాలని వత్తిడి చేసినట్లే జపాన్‌తో రక్షణ ఒప్పందం ఉన్నప్పటికీ రక్షణ బడ్జెట్‌ పెంపుదల వత్తిడి వెనుక అమెరికా యుద్ద పరిశ్రమల వత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది.జపాన్‌కు వంద ఎఫ్‌-35 రకం యుద్ద విమానాలను విక్రయించాలని జూలై నెలలో నిర్ణయించారు. అమెరికా ఆయుధ పరిశ్రమలైన లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌,నార్త్‌రోప్‌గ్రుమాన్‌, బ్రిటన్‌కు చెందిన బియేయి సిస్టమ్స్‌, రోల్స్‌ రాయిస్‌ కంపెనీలు జపాన్‌ ఆయుధ తయారీలో భాగస్వాములు కావాలని చూస్తున్నాయి. కరోనాకు ముందే అమెరికా ఆర్ధిక వ్యవస్ద సమస్యలను ఎదుర్కొంటుండగా కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నదని అందువలన తూర్పు ఆసియాలో తన తరఫున ప్రాంతీయ భద్రతా పెంపుదల చర్యలకు జపాన్‌ ఎక్కువగా ఖర్చు చేయాలనే వత్తిడి పెంచుతున్నట్లు భావిస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత గణనీయంగా పుంజుకున్నప్పటి నుంచి తిరిగి ప్రపంచ రాజకీయాల్లో పాత్ర పోషించటం ద్వారా తమ మార్కెట్‌ను పెంచుకోవాలని జపాన్‌ చూస్తోంది. దానికి మిలిటరీ శక్తి ఒక సాధనం అన్నది తెలిసిందే. దానిలో భాగంగానే కార్పొరేట్లు రాజ్యాంగాన్ని సవరించి పూర్తి స్ధాయి మిలిటరీని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. అయితే రక్షణ ఒప్పందం పేరుతో తన గుప్పెట్లో ఉన్న జపాన్‌ మరోసారి తనకు పోటీనిచ్చే మిలిటరీ శక్తిగా ఎదగాలని అమెరికా కోరుకోవటం లేదు. ఆసియాలో తన అనుయాయిగా ఉంచుకొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో ఒక సామ్రాజ్యశక్తిగా పెత్తనం చేసినపుడు లబ్దిపొందిన కార్పొరేట్లు అమెరికా, ఇతర దేశాలనుంచి ఆయుధాల కొనుగోలుకు బదులు తామే వాటిని తయారు చేసి లబ్ది పొందాలని చూస్తున్నాయి. ఇప్పుడు చైనా, ఉత్తర కొరియాలను బూచిగా చూపి తమ మిలిటరీ బడ్జెట్‌ను పెంచుకుంటున్నాయి. ఒక వైపు అమెరికా మరోవైపు స్వంత కార్పొరేట్ల వత్తిడిని అక్కడి పాలకవర్గం ఏ విధంగా సమన్వయ పరుస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు అమెరికాను తోసిరాజనే స్ధితి లేనప్పటికీ దానికి బాటలు వేస్తోందన్నది బడ్జెట్‌ కేటాయింపులే చెబుతున్నాయి. అమెరికా బలహీనత ఏమంటే అనూహ్యరీతిలో చైనా ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా పెరగటంతో దానికి గతం కంటే ఆర్దిక భారాన్ని ఎక్కువగా పంచుకొనే మిత్ర రాజ్యాలు అవసరం పెరిగింది. దాన్ని గ్రహించి జపాన్‌, జర్మనీలు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత్‌ బెకా ఒప్పందం – అమెరికా కూటమికి గ్జీ జింపింగ్‌ హెచ్చరిక !

27 Tuesday Oct 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BECA, BECA agreement, Quad, Quadrilateral Security Dialogue, Xi Jinping warning to US and its allies


ఎం కోటేశ్వరరావు


ఉపగ్రహాల ద్వారా సేకరించే భౌగోళిక, ఇతర సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకొనేందుకు ఉద్దేశించిన -బెకా- ఒప్పందం మీద భారత్‌- అమెరికాలు సంతకాలు చేశాయి. రెండు దేశాల మిలిటరీ, ఇతర సంబంధాలలో దీన్నొక మలుపుగా పరిగణిస్తున్నారు. సులభ భాషలో చెప్పాలంటే ఇప్పటి వరకు అమెరికా మనకు అనధికారికంగా అందచేస్తున్న సమాచారాన్ని మరింత వివరంగా అధికారికంగా అంద చేయనుంది. లడఖ్‌ సరిహద్దుల్లో చైనా కదలికల గురించి ఇప్పటి వరకు మీడియాకు అందచేసిన సమాచారం, చిత్రాలు, భాష్యాలు అన్నీ కూడా అమెరికా సంస్ధలు అందచేసినవే అన్నది తెలిసిందే. ఏదీ ఊరికే రాదు అన్నట్లుగా అమెరికా నుంచి పొందే సమాచారానికి మనం ఏ రూపంలో ప్రతిఫలం లేదా మూల్యం చెల్లించాల్సి ఉంటుందో వెల్లడికావాల్సి ఉంది. బెకా ఒప్పందం గురించి చాలా కాలంగా రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో అమెరికాతో మన మిలిటరీ బంధానికి మరో ముడి పడుతుంది.

మాతో పెట్టుకుంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ తీస్తాం జాగ్రత్త. ఇదీ చైనా అధినేత గ్జీ జింపింగ్‌ చేసిన తాజా హెచ్చరిక. పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్న నౌకా సంబంధ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల సమన్వయం, సజావుగా సాగే సరఫరా వ్యవస్ధలు, మానవతా పూర్వక మరియు ప్రళయాలు సంభవించినపుడు సాయం కోసం అనే పేరుతో అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా, భారత్‌ ఒక చతుష్టయ లేదా చతుర్భుజ (క్వాడ్‌) కూటమిగా మరింత ముందుకు పోయేందుకు నిర్ణయించుకున్న నేపధ్యంలో గ్జీ ఈ హెచ్చరిక చేశారు. ఒక దేశం పేరు పెట్టి అనకపోయినా నాలుగుదేశాలు, ప్రత్యేకించి అందరినీ కూడగడుతున్న, రెచ్చగొడుతున్న అమెరికా గురించి అన్నది స్పష్టం.


ఏదో ఒక సాకుతో చైనాను రెచ్చగొడుతున్న అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ద నౌకల విన్యాసాలు జరుపుతున్నది. ఇటీవలి కాలంలో చైనా మీద నెపం మోపేందుకు లడఖ్‌లో జరిగిన పరిణామాలను పదే పదే ఉదహరించటం తప్ప మరొకటి లేదు. మీరు చైనా మీదకు దూకండి మీ వెనుక మేము ఉన్నాం అంటూ మన దేశాన్ని పురికొల్పుతున్నది. నాలుగుదేశాల కూటమిని మిత్ర చతుష్టయంగా పిలుస్తున్నారు. అయితే ఇది దుష్ట చతుష్టయం అని చైనా పరిగణిస్తున్నది. బహుశా ఆప్రచార ప్రభావం లేదా అంతర్గతంగా జరుగుతున్న చర్చల సారం కావచ్చు ఉత్తర ప్రదేశ్‌ బిజెపి అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ పాకిస్ధాన్‌, చైనాలతో యుద్దానికి ప్రధాని నరేంద్రమోడీ తేదీని కూడా ఖరారు చేశారని చెప్పినట్లు సాక్షాత్తూ ఆర్నాబ్‌ గోస్వామి రిపబ్లికన్‌ టీవీ పేర్కొన్నది. అతగాడేమీ గల్లీ నేత కాదు, ఆ వార్తను ప్రసారం చేసిన టీవీ బిజెపి అనధికారవాణి తప్ప మరొకటి కాదు. సామాజిక మాధ్యమంలో కాషాయ దళాల యుద్ద ప్రేలాపనల గురించి చెప్పనవసరం లేదు.

కొరియా ఆక్రమణకు పూనుకున్న అమెరికన్లను ఎదిరించి చైనా సాధించిన విజయానికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా అక్టోబరు 23వ తేదీన బీజింగ్‌ గ్రేట్‌ హాల్‌ సభలో సుత్తి లేకుండా సూటిగానే పరోక్షంగా అమెరికా కూటమిని గ్జీ హెచ్చరించాడు. సరిగ్గా అదే సమయంలో తమ భూ భాగమైన తైవాన్‌ గగన తలం మీద అమెరికా గూఢచార విమానం సంచరించినట్లు రుజువైతే తమ మిలిటరీ జట్లను పంపుతామని చైనా హెచ్చరిక చేసింది. అబ్బే ఆ వార్తల్లో నిజం లేదని 24వ తేదీన అమెరికా పసిఫిక్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రజా సంబంధాల అధికారి లెప్టినెంట్‌ కల్నల్‌ టోనీ విక్‌మాన్‌ ప్రకటన చేశాడు.


ఏ చిన్న ఉదంతం జరిగినా పరిణామాలు ఏ విధంగా మారతాయో తెలియని స్ధితి ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్నదని చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు. ఒక వేళ ఆ ఉదంతం జరిగితే ఎంత తీవ్ర పరిణామాలు జరుగుతాయో అమెరికా, దానితో చేతులు కలిపిన తైవాన్‌ యంత్రాంగం గ్రహించిదనేందుకు చిహ్నం అమెరికా ప్రకటన. ప్రధాన భూభాగంలో తైవాన్‌ విలీనం శాంతియుతంగా జరగాలితప్ప సైనిక బలంతో కాదని, తొలి తూటా పేలుడు తమ వైపు నుంచి ఉండదన్నది ఏడు దశాబ్దాలుగా చైనా ప్రభుత్వ వైఖరి. అయితే అమెరికన్లు తైవాన్‌లో తిష్టవేసి రచ్చ చేస్తే అవసరమైతే సైనిక చర్య తప్పదని చైనా హెచ్చరిస్తున్నది. అమెరికా విమానం తైవాన్‌ గగన తలం మీదుగా ఎగిరిందా లేదా ఆ వార్త కల్పితమా నిజమా అన్నది నిర్దారణ కాలేదు. ఒక వేళ ఎగిరితే అది చైనా సార్వభౌమత్వాన్ని ధిక్కరించటమే. అదే జరిగితే అమెరికా విమానాలను తరిమేందుకు చైనా మిలిటరీ జట్లు సిద్దంగా ఉంటాయి. తైవాన్‌ దీవి చైనా ప్రధాన భూ భాగానికి తూర్పున 161కిలోమీటర్ల దూరంలో దక్షిణ చైనా సముద్రంలో ఉంది. కొద్ది వారాల క్రితం చైనా ఆ ప్రాంతంలో నౌకా విన్యాసాలు జరపటంతో పాటు తూర్పు తీరంలో తైవాన్‌ వైపు గురిపెట్టి అనేక ఆధునిక క్షిపణులను చైనా మిలిటరీ మోహరించింది.


కొరియా యుద్దంలో చైనా విజయానికి 70 ఏండ్లు నిండిన సందర్భంగా గ్జీ చేసిన హెచ్చరిక ఒక్క అమెరికాకు మాత్రమే కాదు, తమకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న దేశాలన్నింటికీ అన్నది స్పష్టం. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొరియాను జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆక్రమించారు. దాన్ని విముక్తం చేసేందుకు నాటి సోవియట్‌ సేనలు ఒక వైపు నుంచి మరో వైపు నుంచి అమెరికన్‌ సేనలు కదిలాయి.38వ అక్షాంశరేఖకు ఉత్తర వైపున ఉన్న కొరియా ప్రాంతం సోవియట్‌, దక్షిణ ప్రాంతం అమెరికా ఆధీనంలోకి వచ్చాయి. యుద్దం ముగిసిన తరువాత రెండు ప్రాంతాలను ఐక్యం చేయాలన్నది ఒప్పందం. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల పాలనలోకి, దక్షిణ కొరియా మిలిటరీ పాలనలోకి వెళ్లాయి. అయితే దక్షిణ కొరియాలోనే తిష్టవేసి చైనాకు, అదే విధంగా ఇండోచైనా ప్రాంతంలోని వియత్నాం తదితర దేశాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా తన సైన్యాన్ని అక్కడే ఉంచింది.1950లో ఉత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు ఐక్యరాజ్యసమితి శాంతిసేనల ముసుగులో ఉన్న అమెరికా మిలిటరీ ప్రయత్నించటంతో పక్కనే ఉన్న చైనా జోక్యం చేసుకొని తన వలంటీర్ల సైన్యాన్ని పంపింది.1953 జూలైలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దాని మీద నాటి దక్షిణ కొరియా పాలకులు సంతకాలు చేయలేదు. విలీన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా అమెరికా ఇప్పటికీ తన సైన్యాన్ని అక్కడే ఉంచి అడ్డుపడుతోంది.

1950 నాటికి చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అనేక చోట్ల ప్రతిఘటనను ఎదుర్కొంటూ కుదుట పడలేదు. అయితే సరిహద్దులోకి అమెరికా సేనల ప్రవేశం చేసిన తరువాత అక్కడికే పరిమితం గావు చాంగ్‌కై షేక్‌కు మద్దతుగా చైనాలో ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆ పరిస్ధితిని ఎదుర్కొనేందుకు సిద్దమైంది. ఇదే సమయంలో దక్షిణ కొరియా మిలిటరీ, అమెరికన్ల దురాక్రమణను ఎదుర్కొనేందుకు సాయపడవలసిందిగా ఉత్తర కొరియా ప్రభుత్వం 1950 అక్టోబరు 19న చైనా ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే లక్షలాది మంది స్వచ్చంద సైనికులు యాలూ నదిని దాటి కొరియాలో ప్రవేశించారు. 1951అక్టోబరు 25న చైనా సైనికులు దక్షిణ కొరియా మిలిటరీపై తొలి విజయం సాధించారు. ఆ యుద్దంలో రెండు లక్షల మంది చైనా సైనికులు మరణించారు. యుద్దం ముగిసిన తరువాత ప్రతి ఏటా అక్టోబరు 25ను విజయోత్సవంగా జరపాలని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం త్యాగం పేరుతో ఒక సినిమాను కూడా నిర్మించి విడుదల చేశారు.1950 అయినా 2020 అయినా చైనా విషయాల్లో ట్రంప్‌ లేదా భవిష్యత్‌లో మరొక నేత అయినా పెత్తందారీ పోకడలకు పోతే తగిన జవాబు ఇస్తామని గ్జీ స్పష్టం చేశారు. పశ్చిమ పసిఫిక్‌, ఆసియాలో ప్రస్తుత పరిస్ధితి 1950లో యుద్దానికి ముందున్నట్లుగా ఉందని చైనా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌ లేదా జో బిడెన్‌ ఎవరు అధికారానికి వచ్చినా చైనా వ్యతిరేకులకు విధాన నిర్ణయాన్ని అప్పగిస్తే అమెరికా తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
చైనా పౌరులు నేడు సంఘటితంగా ఉన్నారని, వారిని తక్కువగా చూడవద్దని గతంలో మావో చెప్పిన అంశాన్ని గ్జీ పునరుద్ఘాటించారు. బెదిరింపులు, అడ్డుకోవటం వంటి వత్తిళ్లు పని చేయవని స్పష్టం చేశారు. గతంలో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాను అడ్డుకునేందుకు ఆసియాలో క్వాడ్‌ పేరుతో అలాంటి కూటమి ఏర్పాటుకు పూనుకున్నారు. దానిలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ఉన్నాయి. ఆసియా ముఖ్యంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని దేశాలతో వాటిని విస్తరించాలనే యత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే చైనాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఈ నాలుగు దేశాల్లో అన్ని అంశాలపైనా ఏకీభావం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. చతుష్టయంలో అమెరికా, భారత్‌తో చైనా వాణిజ్యం మిగుల్లో ఉండగా జపాన్‌,ఆస్ట్రేలియాలతో తరుగులో ఉంది. అంటే చైనాతో లడాయి కొని తెచ్చుకోవటం అంటే ఇవి తమ వాణిజ్య అవకాశాలను ఫణంగా పెట్టాల్సి ఉంది. అందువలన అమెరికా వత్తిడికి తట్టుకోలేక చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ జపాన్‌, ఆస్ట్రేలియా దూకుడును ప్రదర్శించటం లేదన్నది ఒక అభిప్రాయం. చైనాకు ఎన్నిహెచ్చరికలు చేసినా మన ప్రధాని నరేంద్రమోడీ అధికారికంగా చేసిన ప్రకటనలో మన భూభాగంలోకి చైనా కొత్తగా ప్రవేశించలేదని అఖిలపక్ష సమావేశంలో చెప్పటం చైనాతో తెగేదాకా లాగేందుకు ఇంకా నిర్ణయించుకోలేదనేందుకు నిదర్శనంగా భావిస్తున్నారు.


అమెరికాతో జతకడితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని స్వతంత్రంగా ఎదగాలని చూస్తున్న మన దేశ కార్పొరేట్‌ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. గతంలో అమెరికా-సోవియట్‌ మధ్య సాగిన ప్రచ్చన్న యుద్దకాలంలో మన కార్పొరేట్‌ శక్తులు ఆ విబేధాన్ని వినియోగించుకొని లబ్దిపొందేందుకు, తామే స్వతంత్ర శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించాయి. గతంతో పోల్చితే ఇప్పుడు మన కార్పొరేట్‌ శక్తులు మరింతగా బలపడ్డాయి. వివిధ కారణాలతో అమెరికా మునుపటి స్ధాయిలో లేదు. కొనుగోలు శక్తి పద్దతి(పిపిపి)లో లెక్కించినపుడు చైనా నేడు ప్రపంచంలో ఆర్ధిక అగ్రరాజ్యం, అమెరికా ద్వితీయ స్ధానంలో ఉంది. సాధారణ పద్దతిలో చూస్తే ప్రధమ స్దానంలో ఉన్న అమెరికాను త్వరలో చైనా అధిగమించనుందనే అంచనాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య అంతరం ప్రతి ఏటా తగ్గుతున్నది. ఈ నేపధ్యంలో అమెరికా పాటలకు మన కార్పొరేట్‌ శక్తులు నృత్యాలు చేస్తాయా అన్నది సమస్య.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దంలో భాగంగా ఐరోపాలోని అనేక దేశాలకు సోవియట్‌ నుంచి ముప్పు, కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తారనేే భయాన్ని రేపి నాటో కూటమిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చైనా నుంచి అలాంటి ముప్పు ఏదేశానికీ లేదు. మన దేశంతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ అది మరోసారి యుద్దానికి దారితీసే అవకాశం లేదు.1962 యుద్దం నాటికి సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమయ్యాయి. యుద్దంలో మనదేశానికి సోవియట్‌ యూనియన్‌ అండవుంటుందనే ఒక పొరపాటు అంచనాకు నాటి మన నాయకత్వం వచ్చిందని చెబుతారు. ఇప్పుడు ఆ సోవియట్‌ లేదు. సిరియా రష్యా నేతలు చైనాతో వివాదపడకపోగా స్నేహబంధాన్ని మరింతగా పెంచుకొనేందుకు నిర్ణయించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఒక వేళ మన దేశం-చైనా మధ్య యుద్దమంటూ వస్తే వారూ మనం చావో రేవో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇద్దరి మధ్య తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్ముకొని అమెరికా లబ్ది పొందుతుంది తప్ప మనకు ఒరిగేదేమీ ఉండదు. జపాన్‌, ఆస్ట్రేలియాల పరిస్ధితీ అదే. జపాన్‌ కొన్ని దీవుల విషయంలో చైనాతో వివాద పడుతోంది. అయితే వాటికోసం యుద్దానికి దిగేస్థితి లేదు. మరోవైపు అమెరికా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రశక్తిగా ఎదిగేందుకు, మిలిటరీశక్తిగా మారాలని చూస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అలాంటి సమస్య లేదు. అయితే అమెరికా అనుంగు దేశంగా వ్యతిరేకించటం తప్ప మరొక కారణం లేదు.


దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల గురించి చైనా – ఆప్రాంత దేశాల మధ్య వివాదం ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ దేశానికి చెందిన నౌకలనూ అడ్డుకోలేదు, అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇక క్వాడ్‌ను ఆసియా నాటోగా మార్చి పెత్తనం చేయాలని అమెరికా చూస్తోంది. ఇదే సమయంలో జపాన్‌ రాజ్యాంగాన్ని మార్చాలని అక్కడి కార్పొరేట్‌ శక్తులు ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ తొమ్మిది ప్రకారం అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి మిలిటరీని వినియోగించటం నిషేధం, అంతే కాదు త్రివిధ దళాలను నిర్వహణను కూడా అనుమతించదు. ఈ కారణంగానే ఆత్మరక్షణ పేరుతో జపాన్‌ పరిమితంగా తన దళాలను నిర్వహిస్తున్నది. ఈ స్ధితి నుంచి బయట పడేందుకు అమెరికా అంగీకరిస్తుందా ? ఆసియా ప్రాంతీయ మిలిటరీ శక్తిగా తిరిగి ఎదగటాన్ని అనుమతిస్తుందా ?


ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేసి దానిలో మన దేశం చేరాలంటే దానికోసం మనం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దున్న-ఎద్దు వ్యవసాయం ఎలాంటి సమస్యలను తెస్తుందో తెలిసిందే. ప్రస్తుతం మనం అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ రష్యన్‌ ఆయుధాలదే అగ్రస్ధానం. అందువలన సగం రష్యా, సగం అమెరికా ఆయుధాల నిర్వహణ కుదరదు. అన్నింటికీ మించి తన ఆయుధాల కొనుగోలును మనం నిలిపివేస్తే రష్యా చూస్తూ ఊరుకోదు. అమెరికా ఉచితంగా ఆయుధాలు ఇవ్వదు. ఐరోపాలో నాటో నిర్వహణ తమకు కష్టంగా మారిందని, నిర్వహణ ఖర్చును ఐరోపా దేశాలు మరింతగా భరించాలని అమెరికా వత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అలాంటి స్దితిలో అమెరికా కోసం మనం చేతి చమురు వదిలించుకోవాల్సిన అవసరం ఏముంది ?
అధ్యక్ష ఎన్నికల నేపధ్యం, చైనా నుంచి మరిన్ని రాయితీలు పొందేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ ముందుకు తెచ్చిన చతుష్టయంతో తెల్లవారేసరికి అద్బుతాలు జరుగుతాయని అనుకుంటే పొరపాటు. నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగా అన్నట్లుగా ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. నిజానికి ఈ ప్రతిపాదన 2004లో ప్రారంభమైంది. మధ్యలో మూలనపడి 2017లో మరోసారి కదలిక ప్రారంభమైంది. ట్రంప్‌ ఓడిపోతే కొంతకాలం పాటు దూకుడు తగ్గవచ్చు. ఒక వేళ గెలిచినా మన వంటి దేశాలను ముందుకు నెట్టటం తప్ప తన ఆర్దిక పరిస్ధితి మెరుగుపడేంతవరకు ట్రంప్‌ కూడా ఏదో ఒక పేరుతో కాలక్షేపం చేయవచ్చు.


అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాలు నాటో కూటమిని రష్యా ముంగిటికి తీసుకు వస్తున్నాయి. దాన్ని ఎదుర్కొనేందుకు రష్యా తనవంతు సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు క్వాడ్‌ పేరుతో ఆసియా నాటో ఉనికిలోకి వస్తే అది చైనాకే కాదు రష్యాకూ సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ నేపధ్యంలోనే చైనాతో కూటమి ఏర్పాటు గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సూచన ప్రాయంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఇప్పటి వరకు చైనా మరో దేశానికి వ్యతిరేకంగా మూడో దేశంతో ఎలాంటి సైనిక కూటమిని ఏర్పాటు చేయలేదు. అమెరికాకు మరింత దగ్గరగా భారత్‌ వెళుతున్నప్పటికీ దాయాదిగా ఉన్న పాకిస్ధాన్‌తో, మిత్రదేశంగా ఉన్న నేపాల్‌తో చైనా మిలిటరీ ఒప్పందాలు చేసుకోలేదని అంతర్జాతీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అయితే దేనికైనా కొన్ని పరిమితులుంటాయని గమనించాలి. అమెరికా మరింత దూకుడుగా చైనా వ్యతిరేక అజెండాను ముందుకు తీసుకువస్తే చైనా తన వైఖరిని పున:పరిశీలించుకోవచ్చు. తన ఆర్దికశక్తితో చైనా చిన్న దేశాలను నియంత్రిస్తున్నదని విమర్శించే వారు ఇరాన్‌ పట్ల అమెరికా, మోడీ అనుసరించిన వైఖరి ఆర్ధికపరమైనదిగాక మరేమిటో చెప్పాలి. అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఆర్ధికపరమైనవి కావా, దానిలో భాగంగానే కదా ఇరాన్‌ నుంచి మనం చమురు కొనుగోలు నిలిపివేసి ఆమేరకు అమెరికా నుంచి తెచ్చుకుంటున్నది. అమెరికా పుణ్యమా అంటూ ప్రధాని నరేంద్రమోడీ మన మిత్రదేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించారు.ఈ చర్యతో మనకు ఒరిగిందేమీ లేకపోగా మిత్ర దేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించాము. అమెరికా బెదిరింపులు, అదిరింపులతో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు చైనా అందిస్తున ఆర్దిక స్నేహ హస్తాన్ని అందుకుంటున్నాయి. మన పాలకులకు అమెరికా కౌగిలింతలు తప్ప చుట్టుపట్ల ఏమి జరుగుతోందో పట్టటం లేదు. ఇది తెలివి తక్కువ వ్యవహారమా తెలివిగలదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

భద్రతా మండలిలో అమెరికాకు ఎదురు దెబ్బ-ఇరాన్‌పై ఏకపక్ష ఆంక్షలు !

25 Tuesday Aug 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Trump Iran Sanctions, UN arms vote, UN Security Council


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురు లేదని విర్రవీగుతున్న అమెరికాకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో గత వారం ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మండలిలోని 15 మందికి గాను 13 మంది ఇరాన్‌ మీద తిరిగి ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు లేఖలు అందచేశారు.2015లో కుదిరిన అణు ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించించిదని ప్రకటించేందుకు ఐరాస ప్రధాన కార్యాలయానికి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోకు ఈ లేఖలు శరా ఘాతం మాదిరి తగిలాయి. అయితే తాము ఏకపక్షంగా ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికా ప్రకటించింది. అయితే ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగినందున ఆంక్షలను అమలు జరపాలని కోరే హక్కును కోల్పోయిందని పదమూడు మంది పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు18తో ఆయుధాల విక్రయంపై ఇరాన్‌ మీద ఉన్న ఆంక్షల గడువు ముగియనుంది. భద్రతా మండలి ఆమోదం పొంది ఉంటే మరికొంత కాలం ఆంక్షలు కొనసాగేవి. ఈ పరిస్ధితిపై చర్చించేందుకు సమావేశం కావాలని రష్యా ప్రతిపాదించింది. తాము హాజరు కావటం లేదని ట్రంప్‌ ప్రకటించాడు.


కిందపడినా తనదే పై చేయి అన్నట్లుగా అమెరికా తప్పుడు వాదనకు పూనుకుంది. తాను ఒప్పందం నుంచి వైదొలిగినా 2015లో సంయుక్త సమగ్ర కార్యాచరణ పధకం ఒప్పందం ప్రకారం భద్రతా మండలి ఆమోదించిన తీర్మానంలో సాంకేతికంగా తాము కూడా సంతకం దారుగా ఉన్నందున తిరిగి ఆంక్షలను విధించాలని కోరే హక్కు తమకు ఉన్నదని ట్రంప్‌ సర్కార్‌ విఫలవాదన చేసింది. ఆ వాదనను తిరస్కరిస్తున్నట్లు అమెరికా మిత్రరాజ్యాలైన జర్మనీ, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ స్పష్టం చేశాయి. అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించిన సభ్యదేశాలలో రష్యా, చైనా,జర్మనీ, బెల్జియం, వియత్నాం, నైగర్‌, సెయింట్‌ విన్‌సెంట్‌, గ్రెనడైన్స్‌, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఎస్తోనియా, ట్యునీసియా ఉన్నాయి.కేవలం డొమినికన్‌ రిపబ్లిక్‌ ఒక్కటే ఈ సమస్యపై లేఖను ఇవ్వాల్సి ఉంది. అయితే అంతకు ముందు జరిగిన చర్చలో ఇరాన్‌ మీద ఆంక్షలు విధించాలన్న అమెరికా ప్రతిపాదనను బలపరచిన దేశం అదొక్కటే కావటంతో లేఖను కూడా అదే మాదిరి ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
భద్రతా మండలిలో తగిలిన ఎదురు దెబ్బతో దిమ్మతిరిగిన మైక్‌ పాంపియో ఉక్రోషం వెళ్లగక్కుతూ యూరోపియన్లు అయాతుల్లాల వైపు ఉండేందుకు నిర్ణయించుకున్నారని నోరు పారవేసుకున్నాడు.భద్రతా మండలిలో అమెరికన్లు అపహాస్యం పాలయ్యారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. డెబ్బయి అయిదు సంవత్సరాల ఐరాస చరిత్రలో తమ శత్రువు ఇంతగా ఒంటరి పాటు కావటం గతంలో జరగలేదని ఇరాన్‌ వ్యాఖ్యానించింది.అయినా తాను తగ్గేది లేదని ట్రంప్‌ ప్రకటించాడు. తామేం చేసేది త్వరలో తెలుస్తుందని వ్యాఖ్యానించాడు.
భద్రతా మండలి తీర్మాన తిరస్కరణతో గల్ఫ్‌ ప్రాంతంలో తలెత్తిన పరిస్ధితి గురించి చర్చించేందుకు చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, అమెరికా, ఇరాన్‌కు రష్యా చేసిన ప్రతిపాదన మేరకు జరిగే వీడియో సమావేశంలో తాను పాల్గొనకపోవచ్చని ట్రంప్‌ చెప్పాడు. సమావేశ ప్రతిపాదనను చైనా స్వాగతించింది. 2018లో సంయుక్త సమగ్రకార్యాచరణ పధకం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత దానిలో అమెరికా భాగస్వామి కాదని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ సంయుక్త ప్రకటనలో వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. ఈ పధకానికి తీవ్రమైన సవాళ్లు ఎదురైనప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని అమెరికా చర్యను తాము సమర్ధించలేమని, ఒప్పందానికి మద్దతు యత్నాలకు ఇది పొసగటం లేదని పేర్కొన్నాయి. ఒప్పందానికి అనుగుణంగా లేని చర్యలనుంచి వెనక్కు తగ్గాలని తాము ఇరాన్‌పై వత్తిడి తెస్తామని మూడు దేశాలు స్పష్టం చేశాయి.
తమ మిత్రులుగా ఉన్న ఇ3(బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌) దేశాలు ఇరాన్‌కు ఆయుధ సరఫరాపై ఆంక్షలకు మద్దతు ఇవ్వకపోవటం తమకు ఆశాభంగం కలిగించిందని ఇజ్రాయెల్‌ వ్యాఖ్యానించింది. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డోమినిక్‌ రాబ్‌తో మంగళవారం నాడు సమావేశమైన ఇజ్రాయెల్‌ మంత్రి అషెకెనాజీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్‌-యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్య కుదిరిన ఒప్పందం పట్ల ఇరాన్‌ స్పందించిన తీరు ఈ ప్రాంత భద్రతకు ముప్పు తెచ్చేదిగా ఉందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.
మూడు అణువిద్యుత్‌ కర్మాగారాలలో అణుశుద్ధి కార్యక్రమం నుంచి ఇరాన్‌ వైదొలిగితే దానికి పరిహారంగా ఆంక్షల తొలగింపు, ఇతర సహాయం చేస్తామంటూ భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ భాగస్వాములుగా 2015లో ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నాయి.2018లో దీన్నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అయితే ఇరాన్‌ గనుక ఒప్పందానికి కట్టుబడి ఉండకపోతే దానిలో భాగస్వాములైన ఏ దేశమైనా తనంతటతానుగా 2007నాటి భద్రతా మండలి తీర్మానంలో పేర్కొన్న ఆంక్షల విధింపునకు చర్య తీసుకోవచ్చనే నిబంధన కూడా ఉంది. 2007నాటి తీర్మానంలో తాము భాగస్వాములం కనుక ఆ మేరకు ఆంక్షలు విధించవచ్చనే వితండవాదానికి అమెరికా దిగింది.అది ఒప్పందానికి కట్టుబడి ఉన్న ఇతర భాగస్వాములకు తప్ప వైదొలగిన అమెరికాకు లేవని మిగిలిన దేశాలు చెబుతున్నాయి. ఎవరూ తమను అనుసరించకపోయినా తాము ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికా అంటోంది. నిజానికి 2018 తరువాత అమెరికా అదరగొండితనంతో తన ఆదేశాలను పాటించని దేశాల మీద కూడా ఆంక్షలు విధిస్తానని బెదిరిస్తోంది. దానికి అనుగుణ్యంగానే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు సైతం మినహాయింపులేదని అమెరికా చెప్పటంతో మన దేశం భయపడి ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేసింది.
అయితే అమెరికా బెదిరింపులకు భయపడి మిగతా దేశాలేవీ ఇరాన్‌తో సంబంధాలను వదులుకోలేదు. అంతర్జాతీయ నిబంధనలు, తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా వ్యవహరిస్తామే తప్ప ఇరాన్‌తో సంబంధాలను వదులుకొనేది లేదని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రియబకోవ్‌ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితిని కొన్ని ముడుల మధ్య బంధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమెరికా చర్య అక్రమం అని చైనా పేర్కొన్నది. అంతే కాదు పాతిక సంవత్సరాల వ్యవధిలో ఇరాన్‌లో 400 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్దం అవుతోంది. ఒప్పందం ప్రకారం తమకు చేస్తామన్న సాయం రానపుడు దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఇరాన్‌ చెబుతోంది. తాము పూర్తి స్ధాయి అణుశుద్ధి చేస్తున్నపుడు విధించిన వాటి కంటే తీవ్రమైన ఆంక్షలను ఇప్పుడు అనుభవిస్తున్నామని అంటున్నది. అణురియాక్టర్లలో వినియోగించే అణు ఇంధనాన్ని ఐదుశాతానికి మించి శుద్ది చేయకూడదు. ఒప్పందం ప్రకారం 3.67శాతం మించకూడదు. అయితే ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినందున మిగతా సభ్యదేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై వత్తిడి తెచ్చేందుకు ఇరాన్‌ 4.5శాతానికి పెంచింది
2015లో అంగీకరించిన దానికి మించి అదనపు నిబంధనలను తాము అంగీకరించేది లేదని మంగళవారం నాడు ఇరాన్‌ స్పష్టం చేసింది. ఐరాస అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ ప్రతినిధి(ఐఏఇఏ) బృందం సోమవారం నాడు ఇరాన్‌ పర్యటనకు వచ్చింది. బహిర్గతం చేయకుండా నిల్వ చేసిన లేదా ఉపయోగించిన అణుపదార్ధాల తనిఖీకి అనుమతించాలని ఆ బృందం కోరుతోంది. గత ఏడాది వరకు ఒప్పందానికి అనుగుణ్యంగానే ఇరాన్‌ వ్యవహరిస్తున్నట్లు ఐరాస బృందం నివేదించింది. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత పరిమితికి మించి అణు శుద్ధి చేస్తున్నట్లు బహిరంగంగానే ఇరాన్‌ చెబుతోంది. తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణ్యంగా వ్యవహరిస్తామని అణుశక్తి సంస్ద ప్రతినిధి బృంద నేత రాఫెల్‌ గ్రాసీతో కలసి టెహరాన్‌లో విలేకర్లతో మాట్లాడిన ఇరాన్‌ ప్రతినిధి అలీ అక్బర్‌ సలేహీ స్పష్టంగా చెప్పారు. రెండు అణుకేంద్రాలను తనిఖీ చేయాలని ఐఏఇఏ కోరుతోంది. గత ఏడాది వాటి తనిఖీని ఇరాన్‌ అడ్డుకుందని, వాటిలో ఒక దానిని 2004లో పాక్షికంగా ధ్వంసం చేశారని, మూడవదానిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అణుకేంద్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామనే ఆరోపణలను తాము ఖండిస్తున్నామని, ఒప్పందానికి తాము కట్టుబడే ఉన్నామని ఇరాన్‌ చెబుతోంది
టెహరాన్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని ఇరాన్‌ అతి పెద్ద నాటంజ్‌ యురేనియం శుద్ధి కర్మాగారంలో గత నెలలో జరిగిన పేలుడు, చెలరేగిన అగ్ని విద్రోహచర్యల్లో భాగమే అని ఇరాన్‌ అణు శక్తి సంస్ధ చెబుతోంది. కేంద్రం పరిసరాలలో చెలరేగిన మంటలకు సైబర్‌ దాడులు కారణం కావచ్చని తొలుత అధికారులు భావించారు. అక్కడ మరింత ఆధునిక పరికరాలను అమర్చుతామని ప్రకటించారు. ఇక్కడ యురేనియం శుద్ధిని మరింతగా పెంచినట్లు, ఇది 2015 ఒప్పంద ఉల్లంఘనే అని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు కథనాలను వెల్లడించాయి. ముందే చెప్పుకున్నట్లు తక్కువ శాతం శుద్ధి మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఆయుధ తయారీకి ఉపయోగించే యురేనియం 90శాతం ఉన్నట్లు ఆరోపించాయి. ఒప్పందం ప్రకారం నాంటజ్‌లో 2026వరకు 5,060 సెంట్రిఫ్యూజస్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఫోర్డోలోని భూగర్భ కేంద్రంలో 2031 వరకు ఎలాంటి శుద్ధి చేయకూడదు. ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తరువాత నాంటజ్‌లో ఆధునిక సెంట్రిఫ్యూజస్‌ను రెట్టింపు చేసిందని, ఫోర్డోలో సెంట్రిఫ్యూజస్‌లోకి హెక్సాఫ్లోరైడ్‌ గ్యాస్‌ను ఎక్కిస్తున్నారని చెబుతున్నారు.ఇప్పుడు భద్రతా మండలితో నిమిత్తం లేకుండా అమెరికా ప్రకటించిన ఆంక్షల గురించి రానున్న రోజుల్లో పరిణామాలను చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో ప్రచ్చన్న యుద్ధాన్ని తీవ్రం చేసిన అమెరికా !

25 Saturday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Communist China, Mike Pompeo, US cold war with China, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


” స్వేచ్చా ప్రపంచం చైనాను మార్చాలి(కూల్చాలి) లేనట్లయితే అదే మనల్ని మారుస్తుంది” అన్నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో. హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించాలన్న అంతర్జాతీయ అంగీకారాన్ని చైనా ఉల్లంఘించింది, దక్షిణ చైనా సముద్రం, మరియు ప్రభుత్వ మద్దతుతో మేథోసంపత్తి దోపిడీని ఆపాలి అని కూడా చెప్పాడు. దేశీయంగా చైనా రోజు రోజుకూ నియంతృత్వాన్ని పెంచుతోంది, అంతర్జాతీయంగా స్వేచ్చకు వ్యతిరేకంగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ కొత్త ప్రజోపద్రవాన్ని తెచ్చిందని కాలిఫోర్నియాలోని యోర్బా లిండాలో ఈ వారంలో చేసిన ఒక ప్రసంగంలో చైనాకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని రెచ్చగొట్టాడు.పాంపియో మాటలు ఒక చీమ ఒక చెట్టును ఊపేందుకు చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదని చైనాకు వ్యతిరేకంగా ప్రారంభించిన నూతన యుద్దం నిష్ఫలం అవుతుందని చైనా విదేశాంగశాఖ కొట్టివేసింది.


గత నాలుగు దశాబ్దాల కాలంలో రెండు దేశాల సంబంధాల్లో వచ్చిన పెను మార్పును ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. 1970 దశకంలో చైనాతో దౌత్య సంబంధాలకు నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ తెరతీశాడు.” చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రపంచాన్ని తెరవటం ద్వారా తాను ఒక ప్రాంకెస్టయిన్‌ను సృష్టించానేమో అని నిక్సన్‌ ఒకసారి భయాన్ని వ్యక్తం చేశాడు, ఇదిగో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం” అంటూ పాంపియో చైనాను ఒక వికృతాకార అసహజ జంతువుగా వర్ణించాడు. మేరీ షెల్లీ అనే బ్రిటీష్‌ యువరచయిత్రి 1818లో ఫ్రాంకెస్టయిన్‌ అనే ఒక నవలను రాసింది. దానిలో విక్టర్‌ ఫ్రాంకెస్టయిన్‌ అనే యువశాస్త్రవేత్త ఒక వికృతాకార అసహజ జంతువును సృష్టించటం, దాని పర్యవసానాల గురించి ఆ నవల సాగుతుంది. అనేక ఆధునిక సినిమాలకు అది మూలకథావస్తువు అయింది. అమెరికన్లు కమ్యూనిస్టులను, సోషలిస్టు దేశాలను అలాంటి జంతువుతో పోల్చి ప్రచారం చేశారు.
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సైద్దాంతిక మౌలిక విబేధాలను మనమింకే మాత్రం విస్మరించరాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నడూ అలా చేయలేదు మనం కూడా అంతే ఉండాలి అని కూడా పాంపియో చెప్పాడు. ఎంతగా చైనా వ్యతిరేకతను రెచ్చగొడితే అంతగా నవంబరులో జరిగే ఎన్నికలలో తమ నేత ట్రంప్‌కు ఓట్లు వచ్చి తిరిగి అధికారం వస్తుందనే ఎత్తుగడ కూడా పాంపియో ప్రసంగ లక్ష్యం కావచ్చు. వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్ధి కావాలనే వ్యూహంతో పాంపియో ఉండటం కూడా ఆ దూకుడుకు కారణం కావచ్చు.


నాలుగు దశాబ్దాల క్రితం -అమెరికా, సోవియట్‌ యూనియన్‌ నాయకత్వంలో ఉన్న సోషలిస్టు కూటమి దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం, సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు కూడా తీవ్రంగానే కొనసాగుతున్న సమయమది. అమెరికా తోడేలు అయితే అది తినదలచుకున్న మేక పిల్లలుగా సోషలిస్టు దేశాలు ఉన్నాయి. అప్పుడు కూడా జనాభారీత్యా పెద్దది అయినా చైనా కూడా ఆర్ధికంగా ఒక మేకపిల్ల వంటిదే. అలాంటి చైనాతో దోస్తీ అంటూ అమెరికా తోడేలు ముందుకు రావటమే కాదు, ఏకంగా కావలించుకుంది. ఇప్పుడు మింగివేసేందుకు పూనుకుంది. ఎంతలో ఎంత తేడా !


అది జరిగేనా ? చైనాతో పోల్చితే పసిగుడ్డు వియత్నాంనే ఏమీ చేయలేక తోకముడిచిన అమెరికా గురించి తెలియంది ఏముంది ! నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికా ఎక్కడ కాలుబెడితే అక్కడి నుంచి తోకముడవటం తప్ప పైచేయి సాధించింది లేదు. కొంత మంది చెబుతున్నట్లు అమెరికాలోని ఆయుధ పరిశ్రమలకు లాభాలు తప్ప మరొకటి కాదన్నది కూడా వాస్తవమే. అందుకోసం సాధ్యమైన మేరకు ఉద్రిక్తతలను తానే సృష్టించటం, ఇతర దేశాలను ఎగదోయటం వంటి అనేక పద్దతులను అనుసరిస్తున్నది. నాలుగు దశాబ్దాల నాడు ఉన్నంత బలంగా అమెరికా ఇప్పుడు లేదన్నది ఒక అభిప్రాయం( అయినా ఇప్పటికీ అదే అగ్రరాజ్యం). ఇదే విధంగా చైనా స్ధితి కూడా అంతే, ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా నాటికీ నేటికి ఎంతో తేడా !
సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీలు ఒకరి ముఖం ఒకరు చూసుకొనేందుకు సుముఖంగా లేని స్ధితిని వినియోగించుకొని సోవియట్‌ను దెబ్బతీయాలన్నది నాటి అమెరికా ఎత్తుగడ. ప్రపంచంలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలని పూనుకున్న దేశమది. అప్పటికే ప్రపంచంలో అతి పెద్ద దేశమే కాదు, సోషలిస్టు వ్యవస్ధను కూడా కలిగి ఉన్న చైనాతో సయోధ్యకు రావటం వెనుక అమెరికన్లు మారు మనస్సు పుచ్చుకున్న దాఖలాలేమీ లేవు. ఇప్పుడు ఆ సోవియట్‌ యూనియన్‌ లేదు. చైనాను తన ప్రత్యర్ధిగా అమెరికా భావిస్తోంది. తన 140 కోట్ల జనాభా జీవన స్ధాయిని పెంచేందుకు చైనా సర్వశక్తులను వినియోగిస్తోంది. అమెరికా, దాని అనుయాయి దేశాలు చేస్తున్న కుట్రలు, రెచ్చగొడుతున్న కారణంగా, తాను సాధించిన విజయాలను పదిల పరుచుకొనేందుకు అది స్పందించాల్సి వస్తోంది తప్ప, తానుగా కాలుదువ్వటం లేదు. కొన్ని సందర్భాలలో రాజీ పడిందనే విమర్శలను కూడా ఎదుర్కొన్నది.


సోవియట్‌ వారసురాలిగా ఐరాసలో శాశ్వత సభ్యత్వం రష్యాకు దక్కింది. నాడు అలీన రాజ్యంగా ఉన్నప్పటికీ అనేక అంశాలలో సోవియట్‌కు మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా భారత్‌ ఉంది. నేడు రష్యా -చైనాల మధ్య విరోధం లేదు, సైద్ధాంతిక బంధమూ లేదు. కానీ అమెరికాను ఎదుర్కోవాలంటే చైనా లేకుండా సాధ్యం కాదన్నది ఇప్పటి రష్యా వైఖరి (భవిష్యత్‌ గురించి చెప్పలేము). అలీన వైఖరి అనేది పాతబడిపోయింది, ఇంక ఆ మాట గురించి మరచిపోండి, మేము ఏ కూటమిలోనూ చేరటం లేదని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. అయితే ఆచరణలో మనం అమెరికా కౌగిలిలో మరింతగా ఒదిగిపోతున్నామన్నది అందరికీ కనిపిస్తున్న వాస్తవం. లేకుంటే మీరు చైనా మీద యుద్దం ప్రకటించండి మీవెనుక మేము ఉన్నామన్నట్లుగా అమెరికా, దాని అనుంగుదేశాలు బహిరంగంగా ఎలా చెబుతాయి. ప్రపంచ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల్లో వచ్చిన ఈ ప్రధాన మార్పును గమనంలోకి తీసుకోకుండా లడఖ్‌ వంటి వర్తమాన పరిణామాలను అర్ధం చేసుకోలేము.
హౌడీ మోడీ పేరుతో అమెరికాలో ట్రంప్‌-మోడీ చెట్టపట్టాలు వేసుకు తిరిగిన హూస్టన్‌ నగరంలో ఉన్న చైనా తొలి కాన్సులేట్‌ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. మా ఊరు మీకు ఎంత దూరమోా మీ ఊరూ మాకూ అంతే దూరం అన్నట్లు తమ చెంగుడూ నగరంలో ఉన్న అమెరికా కార్యాలయాన్ని మూసివేయాలని చైనా ఆదేశించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో తెలియని ఒక అనిశ్చితి ఏర్పడిందన్నది స్పష్టం. రానున్న అధ్యక్ష ఎన్నికలను గమనంలో ఉంచుకొని ట్రంప్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా ? అదే అయితే తాత్కాలికమే. కానీ వాటిలో భాగంగానే ఆసియాలో భారత్‌ పోతుగడ్డ అని రెచ్చగొడుతున్న దానిని మనం నిజమే అనుకుంటే మనకు కొత్త సమస్యలు వస్తాయని గ్రహించాలి. లేదూ అమెరికన్లు చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దపడినా రాచపీనుగ ఒంటరిగా పోదు అన్నట్లు మనం నలిగిపోతాము.


అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి నినాదం. చైనాలో కమ్యూనిస్టులు లాంగ్‌ మార్చ్‌తో ఒక్కో ప్రాంతాన్ని విముక్తి చేస్తూ జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో అమెరికన్లు నాటి కొమింటాంగ్‌ పార్టీనేత చాంగ్‌కై షేక్‌కు అన్ని రకాల మద్దతు ఇచ్చారు.కొమింటాంగ్‌ మిలిటరీ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడ స్ధావరాన్ని ఏర్పాటు చేసుకుంది. కమ్యూనిస్టులు ప్రధాన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికన్లు తైవాన్‌లోని తిరుగుబాటుదార్ల ప్రభుత్వాన్నేే అసలైనా చైనాగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితిలో రెండు దశాబ్దాల పాటు కథనడిపించారు.
చైనాకు స్నేహ హస్తం చాచినా అమెరికన్లు తమ కమ్యూనిస్టు వ్యతిరేకతను ఎన్నడూ దాచుకోలేదు.దాన్ని దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. అమెరికాతో సహా అనేక దేశాలకు తమ మార్కెట్‌ను తెరిచిన చైనీయులు తమవైన ప్రత్యేక సంస్కరణలు అమలు జరిపి అసాధారణ విజయాలను సాధించటంతో పాటు అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు ధీటుగా తయారయ్యారు. అమెరికన్లు తలచింది ఒకటి, జరిగింది మరొకటి. ఒకవైపు తైవాన్‌ ప్రాంతం చైనాకు చెందినదే అని గుర్తిస్తూనే మరోవైపు అమెరికా అక్కడి పాలకులు, మిలిటరీని మరింత పటిష్టం గావిస్తూ చైనాను నిరంతరం రెచ్చగొడుతున్నది.
తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామన్నట్లుగా దాదాపు ప్రతి రోజూ చైనా మిలిటరీ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయని తైవాన్‌ మంత్రి జోసెఫ్‌ వు ఈనెల 22న ఆరోపించాడు.నేడు తైవాన్‌తో ఏ దేశమూ అధికారిక సంబంధాలను కలిగి లేదు. పరోక్షంగా అమెరికా, మరికొన్ని దేశాలు రోజువారీ సంబంధాలు కలిగి ఉన్నాయి. ఏ క్షణంలో అయినా మిలిటరీని ప్రయోగించి తైవాన్‌ను తనలో విలీనం చేసుకోవచ్చని చైనా విలీన వ్యతిరేక శక్తులు నిత్యం స్ధానికులను రెచ్చగొడుతుంటాయి. అంతర్జాతీయంగా చైనా మీద వత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమిది. 1996లో హెచ్చరికగా చైనీయులు కొన్ని క్షిపణులను తైవాన్‌ వైపు ప్రయోగించారు. దీన్ని సాకుగా తీసుకొని అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి తన విమానవాహక యుద్ద నౌకను పంపి చైనాను బెదిరించింది. 2001లో అమెరికా నిఘా విమానం ఒకటి చైనా స్ధావరంలో అత్యవసరంగా దిగింది. సిబ్బందిని, విమానాన్ని కొద్ది రోజుల పాటు చైనా నిర్బంధించింది. ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా తనకు పోటీగా చైనా ఎదుగుతున్నదనే భయం అమెరికాలో మొదలైన నాటి నుంచి రెండు దేశాల సంబంధాలు ఏదో ఒక రూపంలో దిగజారుతూనే ఉన్నాయి. వాణిజ్య మిగులుతో ఉన్న చైనా తన వస్తువులను కొనాలంటూ 2018లో ట్రంప్‌ వాణిజ్య యుద్దానికి తెరతీసిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతున్నది, ఈ లోగా కరోనా సమస్య ముందుకు వచ్చింది. తమ జనాన్ని గాలికి వదలివేసిన ట్రంప్‌ ప్రపంచ ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు.ఎన్నికల రాజకీయాలకు తెరలేపినా దాని వెనుక ఇతర అజెండా కూడా ఉందన్నది స్పష్టం.


చైనాను కట్టడి చేయాలన్న అమెరికా పధకంలో భాగంగా ఒక వైపు మన దేశాన్ని మరోవైపు రష్యాను అమెరికన్లు దువ్వుతున్నారు.మన రక్షణ ఏర్పాట్లలో భాగంగా రష్యా నుంచి ఎస్‌-400 సంచార క్షిఫణి ప్రయోగ వ్యవస్ధలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు, బెదిరింపులకు దిగింది. చివరకు మనం గట్టిగా ఉండటంతో పులిలా బెదిరించిన వారు పిల్లిలా మారిపోయారు. మరోవైపున అనేక చోట్ల రష్యాతో ఘర్షణ పడుతున్న అమెరికన్లు చైనాను కట్టడి చేసే ఎత్తుగడలో భాగంగా రష్యాను కూడా దువ్వేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా ప్రారంభించిన దౌత్యకార్యాలయాల మూసివేత యుద్దంలో చైనా కూడా కంటికి కన్ను-పంటికి పన్ను అన్నట్లుగా స్పందించింది. నిజానికి ఈ వారంలో ప్రారంభమైనట్లు కనిపించినా గత ఏడాది అక్టోబరులోనే దానికి ట్రంప్‌ తెరలేపాడు. చైనా దౌత్య సిబ్బంది సంఖ్యపై ఆంక్షలు విధించాడు. ప్రస్తుతం రెండు దేశాలూ పరస్పరం కాన్సులేట్‌ కార్యాలయాలను మూయాలని ఆదేశించాయి. తరువాత వుహాన్‌, హాంకాంగ్‌, మకావులలో మూసివేతలకు చైనా ఆదేశించవచ్చని వార్తలు వచ్చాయి. వాటితో పాటు దౌత్యవేత్తల బహిష్కరణ, వారి మీద ఆరోపణల పర్వం ఎలాగూ ఉంటుంది. పరిశోధకుల పేరుతో అమెరికా వచ్చిన నలుగురు తమకు చైనా మిలిటరీతో సంబంధాలు ఉన్న విషయాన్ని దాచారంటూ వారిలో ముగ్గురిని అమెరికా అరెస్టు చేసింది. ఒక పరిశోధకురాలు శాన్‌ ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌కు వెళ్లి రక్షణ పొందింది. తమ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను తస్కరించేందుకు వారు వచ్చినట్లు అమెరికా ఆరోపించింది. వారికి పది సంవత్సరాల జైలు శిక్ష, రెండున్నరలక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని చైనా వ్యాఖ్యానించింది.


వర్తమాన పరిణామాల్లో హాంకాంగ్‌కు వర్తింప చేస్తూ చైనా చేసిన ఒక చట్టాన్ని ఆధారం చేసుకొని అమెరికా, దానికి మద్దతుగా బ్రిటన్‌, ఇతర మరికొన్ని దేశాలు రంగంలోకి దిగి అక్కడ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నట్లు నానా యాగీ చేస్తున్నాయి.తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన చైనా హంకాంగ్‌లోని బ్రిటీష్‌ మరియు ఇతర దేశాలకు చెందిన వారిని విదేశీ పౌరులుగా గుర్తిస్తూ గతంలో బ్రిటన్‌ జారీ చేసిన పాస్‌పోర్టుల గుర్తింపును రద్దు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. విదేశాంగశాఖ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ హాంకాంగ్‌ పౌరులు విదేశీ ప్రయాణాలు చేసేందుకు అది చెల్లుబాటయ్యే పత్రం కాదని త్వరలో తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చైనా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారికి అవసరమైతే తాము భద్రత కల్పిస్తామనే అర్ధంలో బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా కొన్ని వివరాలను ప్రకటించింది. ఈ పాస్‌పోర్టులు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు 2021జనవరి తరువాత బ్రిటన్‌ సందర్శించవచ్చని, అక్కడ ఐదు సంవత్సరాల పాటు విద్య, ఉద్యోగాలు చేయవచ్చని, తరువాత కావాలనుకుంటే బ్రిటన్‌లో శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తాము వాటి గుర్తింపు రద్దు చేయనున్నట్లు చైనా సూచన ప్రాయంగా తెలిపింది. హాంకాంగ్‌ చైనాలో భాగమని, అంతర్గత భద్రతకు తీసుకొనే చట్టాలను బ్రిటన్‌ గుర్తించాల్సి ఉందని, దానికి భిన్నంగా వ్యవహరిస్తే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అని చైనా స్పష్టం చేసింది. అంతే కాదు హాంకాంగ్‌ పౌరులు చైనా ప్రధాన భూభాగంలో ప్రవేశించాలంటే బ్రిటీష్‌ వారు జారీ చేసిన పాస్‌పోర్టులను చైనా గుర్తించదు, చైనా యంత్రాంగం ఇచ్చిన అనుమతి పత్రాలతోనే ప్రవేశించాల్సి ఉంటుంది. హాంకాంగ్‌ జనాభా 75లక్షలు కాగా తాజాగా బ్రిటన్‌ వెల్లడించిన నిబంధనల ప్రకారం 30లక్షల మంది వరకు బ్రిటన్‌లో స్ధిరపడేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో అంత మందిని బ్రిటన్‌ అనుమతిస్తుందా, వారందరికీ ఉపాధి, వసతి చూపుతుందా అన్న అంశం పక్కన పెడితే చైనా పౌరులకు బ్రిటన్‌ పాస్‌పోర్టులు ఇవ్వటం ఏమిటన్న సమస్య ముందుకు వస్తోంది.


రెండు దేశాలు దౌత్య పరమైన చర్యలు, ప్రతిచర్యలకు పాల్పడటం సాధారణంగా జరగదు. అమెరికా వైపు నుంచి జరుగుతున్న కవ్వింపులు ట్రంప్‌ ఎన్నికల విజయం కోసమే అని చైనా భావిస్తున్నప్పటికీ ట్రంప్‌ తిరిగి వచ్చినా లేదా మరొకరు ఆ స్ధానంలోకి వచ్చినా రాగల పర్యవసానాల గురించి కూడా చైనా ఆలోచిస్తున్నది. అందువలన నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు ఇలాంటి చర్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చైనా తాత్కాలిక చర్యలకు ఉపక్రమించినప్పటికీ దీర్ఘకాలిక వ్యూహం ఎలా ఉంటుందన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కరోనా బారి నుంచి బయట పడి తిరిగి పూర్వపు స్ధాయికి ఆర్ధిక కార్యకలాపాలను తీసుకురావాలని కోరుకుంటున్న చైనా ఏ దేశంతోనూ గిల్లికజ్జాలకు సిద్దంగా లేదని చెప్పవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో, ఇతర చోట్ల అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, దాని వలలో పడిన దేశాలు చైనా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా దానికి అనుగుణ్యంగానే చైనా స్పందన ఉంటుంది.


మన దేశ విషయానికి వస్తే లడఖ్‌లో జరిగిన పరిణామాల తరువాత పూర్వపు స్థితిని పునరుద్దరించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.అయితే పరస్పరం అనుమానాలు, గతంలో ఉన్న స్ధితి గతుల గురించి ఎవరి భాష్యాలకు వారు కట్టుబడి ఉంటే అది వెంటనే నెరవేరకపోవచ్చు. అంగీకారాన్ని అమలు జరిపేందుకు మరిన్ని చర్చలు, సంప్రదింపులు అవసరం కావచ్చు.ౖౖ అమెరికా మాటలు నమ్మి చైనాను దెబ్బతీసేందుకు మనం సహకరిస్తే ఆ స్ధానంలో మనం ప్రవేశించవచ్చని ఎవరైనా కలలు కంటే అంతకంటే ఆమాయకత్వం మరొకటి ఉండదు. చైనాను దెబ్బతీసి తాను లాభపడాలని చూసిన ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకే సాధ్యం కాలేదు. మన నిక్కర్ల నుంచి పాంట్స్‌( దేశ భక్తి గురించి చెప్పేవారికి ఎంత భావ దారిద్య్రం నిక్కరూ మనది కాదు, పాంట్సూ మనవి కాదు.) కు మారిన వారు అమెరికా మాటలు నమ్మి వ్యవహరిస్తే, వారి సూత్రీకరణలను జనం నమ్మితే కుక్కతోకను పట్టుకొని గోదావరిని ఈదిన చందమే అవుతుంది.


చీమ చెట్టును ఊపే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా వైఖరి ఉంది అని చైనీయులు మాట మాత్రంగా పాంపియో గురించి చెప్పినప్పటికీ ఆచరణలో అంత తేలికగా సామ్రాజ్యవాదాన్ని దానికి కేంద్రంగా ఉన్న అమెరికా గురించి చైనా భావించటం లేదు. ఇదే సమయంలో చైనాను ఒంటరిపాటు చేయటం అమెరికాకు అంత తేలిక కాదు. రెండవ ప్రపంచయుద్దం తరువాత బ్రిటన్‌ స్ధానాన్ని అమెరికా ఆక్రమించింది.దాని ప్రతి చర్యలోనూ అమెరికాకు అగ్రస్ధానం ఉండాలన్నట్లు వ్యవహరించింది. అదే పెట్టుబడిదారీ వ్యవస్ధలోని అనేక దేశాలతో దానికి సమస్యలు తెచ్చింది, మిగతా దేశాలను భయానికి గురి చేసింది. ఇప్పుడు అవే దాని ప్రపంచ పెత్తనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి.


అమెరికా వ్యూహకర్తలు అనేక తప్పిదాలు చేశారు లేదా అంచనాలు తప్పి బొక్కబోర్లా పడ్డారు. అదిరించి బెదిరించి తమ పబ్బంగడుపుకోవాలంటే ఎల్లకాలం కుదరదు అనే చిన్న తర్కాన్ని విస్మరించారు.ఐక్యరాజ్యసమితిని ఉపయోగించుకొని ప్రపంచ పెత్తనాన్ని సాగించాలని చూసిన వారు ఇప్పుడు బెదిరింపులకు దిగి ప్రపంచ ఆరోగ్య సంస్ధతో సహా అనేక ఐరాస విభాగాల నుంచి వైదొలుగుతున్నారు. దానితో ఏ దేశమూ అమ్మో అయితే ఎలా అని ఆందోళనకు గురికాలేదు. పసిఫిక్‌ ప్రాంత భాగస్వామ్యం పేరుతో అమెరికా ఒక వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. అది తనకు లాభసాటి కాదు అని వెనక్కు తగ్గింది. అయితే దాని మాటలు నమ్మి ముందుకు పోయిన వారు తరువాత మరొక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదే విధంగా అమెరికా ప్రారంభించిన ఆయుధ నియంత్రణ వంటి చర్చలను ట్రంప్‌ యంత్రాంగం ముందుకు తీసుకుపోలేదు. ప్రపంచం తలకిందులు కాలేదు. ఇలాంటి ఉదంతాలను అనేక దేశాలు అమెరికా బలహీనతగా చూస్తున్నాయి. అటువంటపుడు ఆచి తూచి వ్యవహరిస్తాయి తప్ప అమెరికా ఏది గుడ్డిగా చెబితే దాన్ని అనుసరించే అవకాశాలు లేవు. ఉదాహరణకు రెండు సంవత్సరాల క్రితం చైనాతో ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో ఇతర ధనిక దేశాలు అమెరికా వెనుక నిలిచే అవకాశాలు ప్రస్తుతం లేవు.దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. రెండవది ప్రతి పెట్టుబడిదారీ దేశమూ తన కార్పొరేట్ల ప్రయోజనాల కోసం జాతీయవాదాన్ని, ఏకపక్ష వైఖరిని ముందుకు తెస్తున్నది.


అమెరికా ఎంతగా రెచ్చగొడుతున్నా, దక్షిణ చైనా సముద్రంలోకి తన నౌక, వైమానిక దళాలను దించుతున్నా, అనేక దేశాలు తమను ఒంటరిపాటు చేసేందుకు పావులు కదుపుతున్నా చైనా నాయకత్వ వైఖరిలో ఎక్కడా ఆందోళన కనిపించకపోవటానికి, హాంకాంగ్‌తో సహా అనేక అంశాలపై పట్టుబిగింపు, భారత్‌ విధించిన ఆర్ధిక ఆంక్షలు, దేన్నయినా ఎదుర్కొనేందుకు దేనికైనా సిద్దమనే సంకేతాలకు కారణాలు ఏమిటనే వెతుకులాట పశ్చిమ దేశాల పండితుల్లో మొదలైంది.కొద్ది రోజుల క్రితం గ్జీ జింపింగ్‌ అసాధారణ రీతిలో బీజింగ్‌లో వాణిజ్యవేత్తలతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కడైతే జీవం ఉంటుందో ఆశకూడా అక్కడే ఉంటుంది, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఐక్యంగా పరిస్ధితిని ఎదుర్కొన్నంత కాలం ఎలాటి ముప్పు లేదని వారికి భరోసా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. చైనీయుల మాటలను ప్రపంచం మొదటి నుంచీ అనుమానంతో చూస్తూనే ఉంది. అది సాధించిన అసాధారణ ఆర్ధిక విజయం, తాజాగా కరోనా వైరస్‌ సహా దేన్నీ ఒక పట్టాన నమ్మలేదు.


కరోనా వైరస్‌ గురించి అమెరికా, మరికొన్ని దేశాలు ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినా అవి మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి తప్ప చైనా విజయవంతంగా బయట పడింది. కరోనా మహమ్మారి కారణంగా తమకు ఆర్ధికంగా ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో చూసుకొనే స్ధితిలోనే ఇంకా మిగతా దేశాలు ఉంటే, దాన్ని అధిగమించి ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టే దశలో చైనా ఉంది. అమెరికా శాండియోగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోని చైనా డాటా లాబ్‌ వెయ్యి మంది పట్టణ వాసులపై జరిపిన అధ్యయనంలో చైనా కేంద్ర ప్రభుత్వం మీద జనంలో విశ్వాసం మరింత పెరిగినట్లు వెల్లడైంది. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న సమయం ఫిబ్రవరిలో పదిమందిలో 8.65 మంది విశ్వాసాన్ని వ్యక్తం చేయగా మేనెలలో 8.87కు పెరిగింది, అదే 2019 జూన్‌ నెలలో 8.23 ఉన్నట్లు బ్రిటన్‌ గార్డియన్‌ పత్రిక తెలిపింది. నిర్ణయాలలో ప్రజలు భాగస్వాములైనపుడు వాటికి ఎంత మూల్యం చెల్లించాలో వారికి తెలుసు, చెల్లించేందుకు కూడా సుముఖంగా ఉంటారని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. చైనా నాయకత్వం బలం అదే అని చెప్పుకోవచ్చేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కంపల్సరీ లైసెన్స్‌తో కరోనా మందులు, టీకాలను అందుబాటులో ఉంచాలి !

24 Friday Jul 2020

Posted by raomk in CHINA, Current Affairs, Health, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, Science, UK, USA

≈ Leave a comment

Tags

Compulsory licensing, compulsory licensing of patented drugs, Coronavirus and pharmaceutical companies, Coronavirus outbreak


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


కొద్ది రోజులుగా కోవిడ్‌ 19 కి మందులను కనుగొన్నట్లుగా వార్తలు పెరిగాయి, ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. మందులున్నాయికదా అని ముందు జాగ్రత్తలను వదిలేసి కరచాలనాలు, కౌగిలింతలూ, కేరింతలూ, మొదలయ్యే ప్రమాదం వుంది. ఇక కరోనా వ్యాధి మనల్నేమీ చేయలేదనే ధైర్యం ప్రజలలో పెరుగుతున్నది. కొన్నివందల కంపెనీలు మందుల తయారీలో పోటీలు పడుతున్నాయి. అందరికన్నా ముందు మార్కెట్‌ లో ప్రవేశించి త్వరగా అమ్ముకోవాలని పరుగెత్తుతున్నాయి. ఉత్పత్తి సామర్ధ్యం ఉన్నచిన్న కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాయి.

కొత్తగా వచ్చే మందులన్నీ కొత్తవేనా? ప్రభావమెంత ?
క్వారంటైన్‌తో ఇపుడు వైద్యం మొదలవుతున్నది. వ్యాధి లక్షణాలు ప్రబలే కొద్దీ రోగులను కోవిడ్‌ హాస్పిటల్‌కి మార్చి ప్రాణాన్ని నిలపటానికి ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ ద్వారా ఇస్తున్నారు. చికిత్సలో భాగంగా అందుబాటులోవున్న యాంటీ వైరల్‌ , 30 రకాల మందులను కాంబినేషన్లలో ఇంతవరకూ వాడారు. ఇప్పటివరకూ వున్న మందులలో కరోనావైరస్‌ ను విజయవంతంగా సంహరించే మందు ఒక్కటి కూడా లేదనే వాస్తవాన్నిగ్రహించాలి. ఫలానా మందు పనిచేస్తుందని విశ్వసనీయవర్గాలు చెప్తే, వాడి చూడండని ఐసీయమ్‌ఆర్‌ ప్రొటోకాల్‌లో లేని మందులకు కూడా అనుమతులను ఇస్తున్నది. అత్యవసర సందర్భాలలో మాత్రమే వాడే రెమిడెసివీర్‌ అనేమందు నుండి మలేరియాకు, రుమటాయిడ్‌ ఆర్దరైటిస్‌కు వాడే క్లోరోక్విన్‌, లో మాలిక్యులార్‌ వైట్‌ హెపారిన్‌ డీప్‌ వైన్‌ త్రంబోసిస్‌ రాకుండా దేశీయ ట్రెడిషనల్‌ మందుల వరకూవాటిచూస్తున్నారు.
ఒక దశాబ్దం క్రితం కనిపెట్ట్టిన రెమిడెసివీర్‌ అనేమందును మొదట హెపటైటిస్‌ చికిత్సకు అభివృద్ధి చేశారు. ఆఫ్రికాలో ఎబోలా వ్యాధిని నియంత్రించటానికి మందుగా ప్రయోగించారు. తగ్గించటంలో ఉపయోగపడలేదు. అయినా ట్రయల్స్‌లో దుష్పలితాలేమీ కలగనందున కోవిడ్‌-19 చికిత్సలో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలెట్టారు. రెమిడెస్విర్‌ జనరిక్‌ మందును తయారు చేయటానికి డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ ) అనుమతిని ఇచ్చారు. హెటిరో , సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ కాడిలా కంపెనీలతో గిలియాడ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నది .కోవిఫర్‌ బ్రాండ్‌ పేరున 100 మి.గ్రా.ఇంజెక్షన్గను ఒకరు విడుదలచేశారు. మన దేశంతోపాటు, 127 దేశాలలో విక్రయించుకోవటానికి ఈ కంపెనీలకు అనుమతి లభించింది.
రెమ్డెసీవీర్‌ అందుబాటులోకివచ్చిన తరువాత కూడా మరణాల రేటు తగ్గకపోవటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే రోగి శరీరంలోని వైరస్‌ లోడ్‌ తగ్గటం ప్రోత్సాహకరంగా వుంది. కోలుకోవడానికి సమయం15 నుంచి 11 రోజులకు తగ్గించటంలో స్పష్టమైన ప్రభావం చూపింది. అయిదురోజుల చికిత్సకు మందు ఖర్చు 40 వేల రూపాయలు అంటున్నారు, కానీ అపుడే బ్లాక్‌ మార్కెట్లో 3-4 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. ఢిల్లీ వంటి చోట్ల రూ.5,400 కు ఇవ్వవలసిన ఒక డోసు మందును రూ. 30,000 వేలకు అమ్ముతున్నారు. ధనవంతులు కరోనా వ్యాధిని అందరికీ పంచారు, ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు, పేదప్రజలు కరోనాతో సహజీవనం చేస్తున్నారు.
అమెరికన్‌ కంపెనీ ఐన గిలియాడ్‌ సైన్సెస్‌ కు రెమిడెసీవీర్‌ మందుల పై పేటెంట్‌ హక్కు ఉన్నది. రాబోయే మూడు నెలలలో ఉత్పత్తి చేసిన రెమిడెసీవీర్‌ మందులన్నీ అమెరికాకే ఫస్ట్‌ ఇవ్వాలని ట్రంప్‌ దురహంకారంతో ఆదేశించాడు. సెప్టెంబరు వరకు తయారయ్యే మందులన్నీ అమెరికా ప్రజలకే అంటున్నాడు. మా సంగతేంటని యూరప్‌ నాయకులు అడుగుతున్నారు. ఉత్పత్తిని పెంచి అందరికీ మందును అందిస్తామని గిలియాడ్‌ కంపెనీ చెప్తున్నది. రెమిడెసీవీర్‌ మందును ఇంజెక్షన్‌ గా తయారుచేయటానికి 3 డాలర్లుఱర్చవుతుంది. 3000 డాలర్లకు అమ్మటానికి కంపెనీ నిశ్చయించింది.

2) ఇటోలిజుమాబ్‌ మరియు టోసిలిజుమాబ్‌ మందులను ఇన్వెస్టిగేటివ్‌ ధెరపీ గా ఉపయోగించటానికి అధికారులు అనుమతినిచ్చారు. శరీరంలో కరోనా వైరస్‌ ప్రవేశించినపుడు , ఈ మందులవలన కత్రిమంగా తయారైన యాంటీబాడీస్‌ వైరస్‌ని ఎదుర్కొంటాయనే ప్రతిపాదనతో బెంగుళూరులో వున్న బయోకాన్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఫేజ్‌-2 పరిశోధనలో మరణాలను గణనీయంగా తగ్గించిందని కంపెనీ పత్రికలకు వెళ్ళడించింది. ఐసీయమ్‌ఆర్‌ డైరక్టర్‌ భార్గవ గారు ఈ మందులు మరణాలను తగ్గించలేదనీ, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చన్నారు. ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమన్నారు. అయితే ఈ మందులు మంచికంటే ఎక్కువ హాని చేయవచ్చని కూడా నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టోసిలాజుమాబ్‌ ను వాడాలంటే రోగి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లో వుండాలి, 3) ఫావిపిరవిర్‌అనే యాంటీవైరల్‌ మందును మైల్డ్‌, మోడరేట్‌ లక్షణాలున్నకోవిడ్‌ 19 కేసులలో వాడవచ్చని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించారు. ఇన్‌ ఫ్లూయంజాను నియంత్రించటానికి ఈ మందును గ్లిన్‌ మార్క్‌ అనే జపాన్‌ కంపెనీ కనిపెట్టింది. 150 మంది మనుష్యులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తున్నట్లుగా గ్లిన్‌ మార్క్‌ కంపెనీ ప్రకటించింది. ఒక టేబ్లెట్‌ ను రూ.103 రేటు ప్రకటించి రూ 75 కి తగ్గించారు. దారుణంగా బ్లాక్‌ మార్కెట్‌ నడుస్తున్నది.

4) హైడ్రాక్సీ క్లోరోక్విన్‌: మార్చి 19 న డోనాల్డ్‌ ట్రంప్‌ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను ”చాలా ప్రోత్సాహకరమైనది” ,” చాలా శక్తివంతమైనది” మరియు ”గేమ్‌ ఛేంజర్‌” అని పత్రికా విలేఖరుల సమావేశంలో అభివర్ణించారు. తరువాత ప్రపంచవ్యాపితంగా అనూహ్యమైన డిమాండ్‌ ఏర్పడింది.
5) ప్లాస్మా ధెరపీుప్లాస్మా ధెరపీ అంటే రోగనిరోధక శక్తి బాగావున్నవారి రక్తంనుండి ప్లాస్మాను వేరుచేసి రోగనిరోధక శక్తి తక్కువగావున్నవారికి ఇవ్వటాన్ని ప్లాస్మా ధెరపీ అంటారు. కోవిడ్‌-19 వ్యాధినుండి పూర్తిగా కోలుకున్నవారికి కరోనా వైరస్‌ ను ఎదుర్కొనే రోగనిరోధకణాలు యాంటీబాడీస్‌ ఎక్కువగావుంటాయి. వారి ప్లాస్మాను వేరుచేసి కరోనాతో బాధపడుతున్న రోగులకు ఇచ్చి పరిశోధనలు జరుపుతున్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా వున్నాయంటున్నారు. కోలుకున్నరోగులనుండి రక్తాన్ని సేకరించి రోగులకు ఇవ్వటం కొత్తేమీకాదు. వంద సంవత్సరాల క్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు కూడా ప్లాస్మాధెరపీ ద్వారా చికిత్సచేశారు.
6) క్యూబా లో 1980 లో కనిపెట్టిన ”ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2” వైరస్‌ వ్యాధుల చికిత్స లో ప్రముఖమైనది. ప్రాధమిక దశలో వైరస్‌ వ్టాధులన్నిటిలోను ఉపయోగపడ్తుందని, అమెరికా తో సహా ప్రపంచవ్యాపిత పరిశోధనలు నిరూపించాయి. చైనా తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న ఈ మందును 40 దేశాలలో వాడుతున్నారు. వూహాన్‌లో కోవిడ్‌-19 ప్రబలినపుడు ఇంటర్‌ ఫెరాన్‌ ఆల్ఫా2 ను వాడి సత్ఫలితాలను సాధించారు.
కరోనా మందులకు, వ్యాక్సిన్‌ కు కంపల్సరీ లైసెన్సింగ్‌ (తప్పనిసరిలైసెన్స్‌) ఇవ్వాలి. ఎక్కువ కంపెనీలకు మానుఫ్యాక్చరింగ్‌ లైసెన్సు ఇచ్చిప్రభుత్వం ధరలను నియంత్రించాలి. ప్రభుత్వాధీనంలో కరోనా మందులను అవసరమయిన ప్రజలందరికీ అందుబాటులో వుంచాలి.
కొత్త ఔషధాలను, టీకాలను సైంటిస్టులు ప్రజలప్రయోజనాలకోసం కనిపెట్తారు. ఆ ఖర్చులు భరించిన కంపెనీలు ఆ ఔషధాన్ని మరే కంపెనీ తయారుచేయకుండా పేటెంట్‌ తీసుకుంటాయి. 20 సంవత్సరాలు ఆ మందును తమ ఇష్టమొచ్చిన రేటుకి ప్రపంచంలో ఎక్కడైనాఅమ్ముకోవచ్చు. పోలియో వ్యాధినిరోధక మందును డాక్టర్‌ జోనాస్‌ సాల్క్‌ 1955 లో కనుగొన్నారు. ‘ పోలియో వాక్సిన్‌ పై పేటెంట్‌ ఎవరిది” అని అడిగితే ”ప్రజలది’ అని చెప్తూ ” సూర్యుని పేటెంట్‌ చేయగలమా” అన్నారు.

కరోనా టీకాల తయారీ.
ఇప్పటివరకూ కోవిడ్‌-19 కి వాక్సీన్‌ ను రూపొందించటానికి 200 పరిశోధనా బందాలు పోటీపడుతున్నాయి. కొన్ని సంవత్సరాలు పట్టే పరిశోధనలను కొన్ని నెలలకు కుదించారు. కంపెనీలన్నీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోవున్నాయి. పరుగు పందెంలో ముందుగా వచ్చి మార్కెట్‌ను శాసించి అంతులేని లాభాలను పొందాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి.
బ్రిటన్‌ ఆక్సఫర్డ్‌ జెన్నర్‌ ఇన్స్టిట్యూట్‌లో అసాధారణ వేగంతో ఫేజ్‌-1, ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తి చేశారని, ప్రఖ్యాత మెడికల్‌ పత్రిక లాన్సెట్‌ ప్రకటించింది. మూడవ దశలో బ్రిటన్‌లో పది వేలమంది వాలంటీర్లపై ఆగస్టునెలలో ప్రయోగం ప్రారంభమవుతుందన్నారు. వాక్సిన్‌ను ఆస్ట్రా జనికాతో కలిసి పూనేలో తయారు చేయటానికి సీరమ్‌ ఇన్సిటిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ సంవత్సరం చివరకు వంద కోట్ల డోసులను మార్కెట్‌లోకి తేవటానికి పూర్తిస్ధాయిలో తయారవుతున్నారు.

కోవిడ్‌-19 కొరకు వ్యాక్సిన్ల తయారీలో చైనా లోని సినోఫార్మా , సినోవాక్‌ బయోటెక్‌ సంస్ధలు ఫేజ్‌-2 ట్రయల్స్‌ ను పూర్తిచేశాయని లాన్సెట్‌ పత్రిక ప్రకటించింది. ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలలోని వేలాదిమంది వాలంటీర్లపై ఫేజ్‌-3 వ దశ పరిశోధనలకు తయారవుతున్నారు. ఆరు బ్రెజిలియన్‌ రాష్ట్రాలలో 9000 మంది పై అధ్యయనం ప్రారంభమయిందని గవర్నర్‌ జోవా డోరియా తెలిపారు. టీకా సమర్ధవంతమైనదని రుజువయితే 120 మిలియన్‌ డోసులను ఉత్పత్తి చేయబోతున్నామని గవర్నరు అన్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ , చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కూడావ్యాక్సిన్‌ పరిశోధనలలో ముందున్నదంటున్నారు, అడినోవైరల్‌ ఆధారిత వ్యాక్సిన్‌ లను కొన్ని చైనా కంపెనీలు అభివద్ది చేస్తున్నాయి.
విజయవంతమౌతున్న చైనా వ్యాక్సిన్లను చూసిన తరువాత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ , చైనాతో కలిసి పనిచేయటానికి సుముఖత వ్యక్తంచేసాడు.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ , ఐ సీ యమ్‌ ఆర్‌ సంయుక్తంగా కొరోనా వైరస్‌ వాక్సిన్‌ తయారీలో ముందున్నాయి. భారత్‌ బయోటిక్‌ అభివద్ది చేసిన” కోవాగ్జిన్‌ ” ఇంజెక్షన్‌ రూపంలో ఫేజ్‌-1 క్లినికల్‌ ట్రయల్స్‌ ను ప్రారంభించారు. ఢిల్లీ లోని ఎయిమ్స్‌, హైదరాబాద్‌ నిమ్స్‌, విశాఖ కేజీ హెచ్‌ తోపాటుగా12 ఆసుపత్రులను గుర్తించారు.
కరోనాకు ప్రపంచంలో అందరికన్నా ముందు తొలి టీకాను బయటకు తీసుకురావాలని రష్యా ప్రయత్నిస్తోంది. క్లినికల్‌ ప్రయోగాలు పూర్తయ్యాయని, టీకా సురక్షితమైనదనీ, ఆగస్టు నెల ఆరంభంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలను రష్యాతోపాటు ఆరబ్‌ ఎమిరేట్స్‌ వంటి దేశాలలో వేలమందిపై నిర్వహించనున్నారు. మూడోదశ ప్రయోగాలకు సమాంతరంగా టీకాల ఉత్పత్తికి ప్రణాలికలు రచించారు. ఈ ఏడాది 3 కోట్ల డోసులను రష్యాఉత్పత్తి చేస్తుందని, విదేశాలలో 17 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయ ప్రయత్నిస్తున్నామన్నారు.

అత్యవసర పరిస్ధితులలో ” కంపల్సరీ లైసెన్సు ”, కరోనా మహమ్మారికి మించి అత్యవసరం ఏమున్నది.?
డబ్లు టీ ఓ నిబంధనలను తయారుచేసేటపుడు ఒక చిన్న వెసులుబాటును పేద దేశాలు కల్పించుకున్నాయి. ఆ ప్రకారం ఒక దేశంలో ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్ధితులు ఏర్పడినపుడు కంపల్సరీ లైసెన్సింగ్‌ ఇవ్వటానికి అవకాశంవున్నది. పేటెంట్‌ చట్టం సెక్షన్‌ 84 ప్రకారం ప్రజల అవసరాలను తీర్చలేనపుడు మందు అందుబాటులో లేకపోతే, మందు ఖరీదును ప్రజలు భరించలేకపోతే, స్ధానిక మార్కెట్‌ లో అందుబాటులో లేకపోతే పెటెంట్‌ ఆఫీసర్‌ స్ధానిక ఉత్పత్తి దారునికి తప్పనిసరిగా లైసెన్సును ఇవ్వవచ్చు. ఛాలా తక్కువ ధరకు ప్రాణాలను నిలిపే మందుల తయారీకి అనుమతించవచ్చు. పేటెంట్‌ చట్టాన్ని పక్కన పెట్టవచ్చు. కానీ శక్తివంతమైన, దుర్మాగ్గమైన, నీతీ జాతీ లేని బహుళజాతి కార్పోరేట్‌ కంపెనీలకెదురొడ్డి నిలిచేదెవరు. సెక్షన్‌ 92 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా కంపల్సరీ లైసెన్సును ఇవ్వవచ్చు . చాలా ఖర్చుపడి పరిశోధన జరిపినందుకు పేటెంట్‌ కంపెనీ కి అమ్మకాలలో 4-6 శాతం రాయల్టీగా ఇచ్చేటట్లుగా కూడా చట్టంలో వుంది.
2012 మార్చినెలలో ఇండియన్‌ పెటెంట్‌ ఆఫీసర్‌ పీ హెచ్‌ కురియన్‌ మొదటిసారి ప్రజలకు అనుకూలంగా కంపల్సరీ లైసెన్సింగ్‌ ఆర్డరును ఇచ్చి చరిత్రలో నిలిచారు. భారతదేశంలో నెలకు సరిపోయే ఆ నెక్సావార్‌ మందును రూ.8800కు అమ్మేటట్లుగానూ బేయర్‌ కంపెనీకి అమ్మకాలలో 6 శాతం ఇచ్చేటట్లుగా ఇండియన్‌ పేటెంట్‌ యాక్ట్‌ 2005 క్రింద పేటెంట్‌ ఆఫీసు చారిత్రాత్మక ఆర్డరును ఇచ్చింది.
అంతకు ముందు నెలకు సరిపోయే ఆ మందును రూ 2లక్షల80 వేలకు విక్రయించే వారు.
ఇపుడు ఉపయోగిస్తున్న మందులన్నీ పాతవే. కోవిడ్‌-19 కి కాకపోయినా వైరస్‌ వ్యాధులైన సార్స్‌
( యస్‌.ఈ,ఆర్‌.యస్‌.), మెర్స్‌ ( ఎమ్‌.ఇ,ఆర్‌.యస్‌,), ఎబోలా, ఇన్‌ ఫ్లూయంజా. హెపటైటిస్‌-సీ, హెచ్‌.ఐ.వీ. వ్యాధుల కోసం అభివద్ధిచేశారు. కోవిడ్‌-19 ని కట్టడికి కొత్త మందులేవీ లేవు కనుగొనలేదు కాబట్టి పాత మందులను కారుణ్య కారణాలతో అనుమతిస్తున్నారు. పాత మందులకు కొత్త ఇండికేషన్స్‌, రీ పర్పస్‌ అంటే నూతన ప్రయోజనాలను, ఉపయోగాలను కనుగొని, క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి పాత పేటెంట్‌ మందులను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నది.
వంద సంవత్సరాలక్రితం స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు భారత ప్రజలు 1 కోటి 70 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో 10 కోట్ల మంది చనిపోయారని అంచనా. గంగా నది శవాలతో ఉప్పొంగిందంటారు. అమెరికాలో మూతికి మాస్క్‌ ధరించని వ్యక్తులకు 100 డాలర్ల జరిమానాను వందసంవత్సరాలనాడే విధించారు. కానీ ఈనాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నేను మాస్క్‌ ధరించనన్నాడు. మాస్క్‌ ధరించటం కంపల్సరీ చేయనన్నాడు. ప్రపంచం కరోనా కేసుల లెక్కలలో అమెరికాకు ప్రధమ స్ధానాన్నిసాధించాడు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనోరొ కూడ మాస్క్‌ ధరించనన్నాడు. బ్రెజిల్‌ కు ద్వితీయ స్ధానాన్ని తేవటమే కాకుండా తను కొరోనా జబ్బు బారిన పడ్డాడు.
స్పానిష్‌ ఫ్లూ తరువాత అధికారంలోకి వచ్చిన శ్రామికవర్గ సోవియట్‌ సోషలిస్టు కమ్యూనిస్టు ప్రభుత్వం , ప్రపంచంలో మొదటిసారిగా ప్రజలందరికీ వైద్యం ( యూనివర్సల్‌ హెల్త్‌ ) అనే ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శమయింది. అందరికీ విద్యనందించి ప్రజలకు ప్రాధమిక ఆరోగ్యసూత్రాలను నేర్పి చైతన్యపరచింది. ఆ ఒరవడిలో పయనిస్తూ ప్రపంచప్రజలందరి ఆరోగ్యం తన ధ్యేయంగా క్యూబా ముందుకెళ్తూవుంది. అందరికీ ఆరోగ్యం( యూనివర్సల్‌ హెల్త్‌ ) ఆచరించే దేశాలే కరోనా కట్టడి లో ముందున్నాయి. క్యూబా , వియత్నాం, న్యూజిలాండ్‌,కేరళ లాంటి చోట్ల ప్రజలను చైతన్యపరిచారు. రోగంగురించి ప్రజలకు తెలియచేశారు. ప్రభుత్వం ఏంచేస్తున్నదో ప్రజలేమి చేయాలో చెప్పారు. చెప్పింది చేశారు. ప్రభుత్వ నాయకులు- ప్రజలు సైంటిస్టుల మాటలను విన్నారు. తు.చ తప్పకుండా పాటించారు. ప్రజారోగ్యంపట్ల బాధ్యతతో వ్యవహరించారు.అందువలననే వియత్నాంలో ఒక్క మరణమూ నమోదు కాలేదు. కేరళ రాష్టంలో ప్రభుత్వం-ప్రజలు ఒకటై మహమ్మారిని అదుపులో వుంచారు.

పేద ప్రజలకు మందులు, టీకాలు దొరుకుతాయా? మాస్కులతోనే ప్రాణాలను కాపాడుకోవాలా?

ఇపుడు సైన్స్‌ అభివధ్ధిచెందింది. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వైరస్‌ వలన జబ్బు పడిన వారిని త్వరగా టెస్టులు చేసి గుర్తిస్తున్నారు, అందుబాటులోవున్నమందులను ఉపశమనానికి ప్రతిభావంతంగా వాడుతున్నారు. వెంటిలేటర్‌ ద్వారా కత్రిమంగా ప్రాణవాయువును అందించి ప్రాణాన్ని నిలుపుతున్నారు. ఈ లోగా శరీరం తన రోగనిరోధకశక్తితోనూ, ఉపశమన మందుల ప్రభావంతోనూ, మెరుగైన. వైద్యసేవలతోనూ బతికిబయటపడుతున్నారు. చనిపోయేవారిసంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వంద సంవత్సరాలనాడు స్పానిష్‌ ఫ్లూ వచ్చినపుడు మాస్కు ధరించి, భౌతికదూరం పాటించి, రోగనిరోధక శక్తివున్నవారే బతికి బట్టకట్టారు. ఇపుడు కూడా మందులున్నా లేకపోయినా కరోనా రాకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
1) మాస్క్‌ ఖచ్చితంగా ధరించాలి. 2) ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి,3) సబ్బుతో చేతులు కడుక్కోవాలి.4) ఉన్నంతలో సమీకత పౌష్టికాహారం తీసుకోవాలి.5) శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి.

ఎబోలా, హెచ్‌ ఐ వీ, ఏవియన్‌ ఫ్లూ, నిఫా, స్వైన్‌ ఫ్లూ, సార్స్‌, మెర్స్‌, ఈ వ్యాధులన్నిటికీ మూలం పూసలో దారంలాగా వున్న రహస్యాన్ని గమనించాలి. వన్యజీవులనుండి మానవులకు సంక్రమిస్తున్నజూనోటిక్‌ వ్యాధుల్లో అది దాగివున్నది. ఈ రకమైన వైరస్‌ వ్యాధులతో 1981 నుండి 3 కోట్ల మంది మరణించారు. అడవి లో వుండే వైరస్‌,లేడి,జింక,కోతి, ఏనుగు లాంటి ప్రాణులు మామూలుగా మనుష్యుల మధ్య వుండవు. సహజ వనరుల కోసం అడవులను నరకటం, కొండలను తవ్వటం, భూమిపొరలలో దాగున్న చమురు ను పిండటం లాంటి చర్యల వలన జీవసమతుల్యత నాశనమయి వైరస్‌ లు మానవ నివాసాలవద్దకుచేరుతున్నాయి. అభివద్ది పేరున జరుగుతున్న పర్యావరణ విధ్వంస వలన వైరస్‌లు , వన్యజీవులు స్ధానభ్రంశం చెంది మరొక నివాసాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో మనిషిలో చేరిన వైరస్‌లు అల్లకల్లోలం సష్టించి మానవ వినాశనానికి కారణమౌతున్నాయి.
ధనం-లాభం-పెట్టుబడి-ధనం, తప్ప మరే విలువలూ లేని పెట్టుబడి దారీ వ్యవస్ధలో భూమాత ముడిపదార్ధాల గనిగా , మనుష్యులు వినియోగదారులుగా . కార్మికుడు ఉత్పత్తిశక్తిగా మారారు. ప్రకతిని నాశనం చేసిన కార్పోరేట్‌ శక్తులు వ్యాధి అంటకుండా దూరంగా వుండగలరు. ఆధునాతన వైద్యాన్ని అందుకోగలరు. ఎంతఖరీదైనా మందులు వాడుకోగలరు. వాక్సిన్‌ రాగానే కొనుక్కోగలరు. జనాభాలో సగంపైగావున్నపేదప్రజలకు వైద్యం, మందులు, టీకాలు అందుతాయా? రెక్కాడితే డొక్కాడని పేదప్రజల ఉనికికే ప్రమాదం తెచ్చిన ఈ వ్యవస్ధ మార్పుకోసం పోరాడాలి. తక్షణకర్తవ్యంగా కరోనా మందులను, వాక్సిన్‌ లను కంపల్సరీ లైసెన్సుక్రిందకు తెచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవటంకోసం ఆందోళన చేయాలి. సైన్సు ఫలితాలు అందరికీ అందేవరకూ పోరాడాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, గుంటూరు జిల్లా నల్లమడ రైతు సంఘనేతగా కూడా పని చేస్తున్నారు. ఫోన్‌-9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

ట్రంప్‌తో మరిన్ని కౌగిలింతల కోసం మోడీ తహతహలాడుతున్నారా !

11 Thursday Jun 2020

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, G7, G7 summit, G7 Summit in Camp David, G7 to G12


ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే మోజు తీరలేదా ? మరిన్ని కౌగిలింతల కోసం తహతహలాడుతున్నారా ? అమెరికన్లకే మోజు తీరి రోజు రోజుకూ ట్రంప్‌ పలుకుబడి తగ్గిపోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి, అదే నిజమైతే ఓడిపోయే ట్రంప్‌తో కలసి ఊరేగేందుకు మోడీని మన పాలకవర్గాలు అంగీకరిస్తాయా ? ఒక వేళ డెమోక్రాట్లు గెలిస్తే తమకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసిన నరేంద్రమోడీతో ఎలా వ్యవహరిస్తారు ? ఏడు ధనిక దేశాల(జి7) బృందంలో చేరినంత మాత్రాన మనది ధనిక దేశంగా మారుతుందా ? ఆ బృందం ఏర్పడిన నాటి కంటే నేడు ప్రభావం తగ్గిన నేపధ్యంలో దానిలో చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి? మన కంటే పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనాను పక్కన పెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ మనమీద ఎందుకు శ్రద్ద చూపుతున్నాడు? ఆ బృందాన్ని చైనా వ్యతిరేక వేదికగా చేసేందుకు ట్రంప్‌ పూనుకున్నాడన్నది బహిరంగ రహస్యం, అలాంటి దానితో చేరి చైనాతో వ్యతిరేకతను కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ?చేరినంత మాత్రాన మనకు ఒరిగేదేమిటి ? అటు జి7, ఇటు జి20 రెండింటిలో కొనసాగితే మిగిలిన దేశాల వైఖరి ఎలా ఉంటుంది ? ఇలాంటి ఎన్నో భట్టి విక్రమార్క ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి.
1973లో తలెత్తిన చమురు సంక్షోభ పర్యవసానాలతో ఏం చెయ్యాలా అన్న ఆలోచన తలెత్తి అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1977 నుంచి ఐరోపా యూనియన్‌ను శాశ్వత ఆహ్వానితురాలిగా చేర్చారు. సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పూర్వపు రష్యా తిరిగి ఉనికిలోకి వచ్చింది.1998లో రష్యాను చేర్చుకోవటంతో జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి దాన్ని తొలగించారు.
తిరిగి ఇప్పుడు ట్రంప్‌ ఏలుబడిలో రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ బృందంలో ప్రతి ఏటా ఒక దేశం అధ్యక్ష స్ధానంలో ఉంటుంది. ఆ దేశనేత ఎవరినైనా ఆ సమావేశాలకు అతిధులుగా ఆహ్వానించవచ్చు. గతేడాది ఫ్రాన్స్‌ అదే హౌదాతో, ఇప్పుడు ట్రంప్‌ మన ప్రధాని నరేంద్రమోడీని జి7 సమావేశాలకు ఆహ్వానించారు.(2006లో రష్యా సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సమావేశానికి మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. మన దేశం నుంచి ప్రధాని వెంట వెళ్లిన పాత్రికేయ బృందంలో ఈ రచయిత ఒకడు) 2005 నుంచి వరుసగా ఐదు సమావేశాలకు మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించారు. జి7ను విస్తరించాలన్న ఆలోచన ట్రంప్‌లో తలెత్తిన సరికొత్త ఆలోచన కాదు. అంతకు ముందు నుంచీ ఉన్నది. పెరుగుతున్న మన దేశ జిడిపి, మార్కెట్‌ను గమనంలో ఉంచుకొనే అంతకు ముందు లేని విధంగా మన్మోహన్‌ సింగ్‌ను, ఇప్పుడు మోడీని ఆహ్వానిస్తున్నారు.
డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనతో ప్రపంచ మీడియాలో జి7 విస్తరణ వెనుక ఉన్న రాజకీయాల గురించి చర్చ జరుగుతోంది. ఆహ్వానం అందుకున్న దేశాలు ట్రంప్‌ ఆతిధ్యం స్వీకరిస్తే ఏమిటి ? లేకుంటే ఎలా అని తర్జన భర్జన పడుతున్నాయి. ఈ బృంద ప్రస్తుత రూపానికి కాలదోషం పట్టిందని, దీన్ని మార్చాలని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో ఇది సక్రమంగా ప్రాతినిధ్యం వహించటం లేదన్నాడు. ఈ బృంద సమావేశాలలో తీసుకొనే నిర్ణయాలను విధిగా అమలు జరపాలనే నిబంధనేదీ లేదు. ఒక నాడు ప్రపంచ జిడిపిలో అత్యధిక భాగానికి ప్రాతినిధ్యం వహించిన ఈ బృందం క్రమంగా ప్రాభవం కోల్పోయింది.
జి7 విస్తరణతో అమెరికాకు ఒరిగేదేమిటి అని సిఎన్‌బిసి టీవీ విశ్లేషణ చేసింది. మిగిలిన ఆరు దేశాలలో కూడా మనకేమిటి అని, ట్రంప్‌ ప్రతిపాదిత జి7 విస్తరణ కూటమిలో చేరితే దానితో తలెత్తే ముప్పు లాభాల గురించి ప్రతి దేశంలోనూ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ముందుకు వచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. చైనాను కట్టడి చేసే లక్ష్యంతో జరుగుతున్న సమావేశంలో ప్రాధాన్యత లేని పాత్రధారిగా ఆస్ట్రేలియా హాజరైతే కలిగే ప్రయోజనం ఏమిటి? ఓటమి అంచుకు చేరుతున్న ఒక అధ్యక్షుడితో చేతులు కలపటం అవసరమా ? అమెరికా కనుసన్నలలో ఆస్ట్రేలియా పని చేస్తోందనే చైనా ప్రచారం మరింతగా పాదుకుపోతుంది. చైనా వ్యతిరేకతను విధిగా వ్యక్తం చేసే అమెరికా ఎన్నికల ప్రచారానికి ఆస్ట్రేలియా అండనిస్తోందనే భావం కలుగుతుంది.
ఏ దేశమైనా ఇదే ప్రాతిపదికన ఆలోచించాల్సి ఉంటుంది. నరేంద్రమోడీ ఎన్నో అడుగులు ముందుకు వేసి ఆబ్‌కి బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అంటూ గతేడాది హూస్టన్‌లో జరిగిన హౌడీమోడీ కార్యక్రమంలో మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది అమెరికా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, డెమోక్రాట్లకు వ్యతిరేకతను వ్యక్తం చేయటమే. ఆ సభలోనే ఆహ్వానం పలికి ఈ ఏడాది అహమ్మదాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయటం దాని కొనసాగింపే. మోడీ సర్కార్‌ లేదా ఆయనకు సాయంగా ఉన్న విధాన నిర్ణేతలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారా ? చైనాకు వ్యతిరేకంగా ఒక సంయుక్త సంఘటన ఏర్పాటు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ కరోనా వైరస్‌ నుంచి తైవాన్‌, హాంకాంగ్‌ వరకు వివిధ అంశాలపై చైనాకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాడు. ప్రతిదానిలో రాజకీయాలను చొప్పిస్తున్నాడు. వాణిజ్య ఒప్పందాలు, ఇరాన్‌ అణు ఒప్పందం, పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగటం, ఆ నిర్ణయాలకు ట్రంప్‌ బాధ్యుడు కావటంతో గత రెండు జి7 వార్షిక సమావేశాలలో తీవ్ర సెగ తగిలింది. తనకు అనుకూలమైన దేశాలను జత చేసుకోవటం ద్వారా ట్రంప్‌ తన విమర్శకుల నోరు మూయించాలన్న ఎత్తుగడ కూటమి విస్తరణ పిలుపు వెనుక ఉంది. అమెరికా తరువాత ఈ బృందంలో పలుకుబడి కలిగిన జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజలా మెర్కెల్‌ ఈ ఏడాది అమెరికాలోని కాంప్‌డేవిడ్‌ సమావేశాలకు హాజరు కావాలని లాంఛనంగా ట్రంప్‌ స్వయంగా పలికిన ఆహ్వానాన్ని తిరస్కరించటాన్ని బట్టి విబేధాలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.రెండవది గతంలో రష్యాను బహిష్కరించి తిరిగి ఇప్పుడు ఏ ప్రాతిపదికన చేర్చుకోవాలని ట్రంప్‌ కోరుతున్నాడో తెలియని గందరగోళం బృందంలో తలెత్తింది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, రష్యాలను చేర్చుకొనేందుకు బ్రిటన్‌ విముఖంగా ఉంది.
ఏ దేశమైనా తన కార్పొరేట్‌ లేదా చైనా వంటి దేశాలైతే తన ప్రభుత్వ రంగానికి ఉపయోగపడేందుకు ఇలాంటి బృందాలను వినియోగించుకొనేందుకు ప్రయత్నిస్తాయి. మన బడా కార్పొరేట్‌ శక్తులు ముందుగా బలహీనమైన దేశాలలో ప్రవేశించాలని కోరుకుంటున్నాయి. అందుకుగాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, అణుదేశాల క్లబ్బులో సభ్యత్వాన్ని కోరుతున్నాయనే అభిప్రాయం ఉంది. వీటి వెనుక మన దేశ భద్రతా కారణాలు కూడా ఇమిడి ఉన్నాయి. అయితే ఈ లక్ష్యాలను సాధించటం ఎలా, అందుకోసం చైనాను శత్రువుగా చేసుకోవాలా ? ఒక వేళ ఆ వైఖరితో ముందుకు పోతే అది సాధ్యం అవుతుందా అన్నవి పెద్ద ప్రశ్నలు.
ఈ నెలలో జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబరుకు వాయిదా వేయటం వెనుక ట్రంప్‌కు ఎదురైన తక్షణ సమస్యలేమిటన్నది ఆసక్తి కలిగిస్తున్నాయి. ఒకటి కరోనా వైరస్‌ తీవ్రత అమెరికాలో తగ్గే సూచనలు లేకపోవటం, ప్రపంచ నేతలు, ప్రతినిధి బృందాలు అమెరికా వచ్చేందుకు భయపడటం. తాను పాల్గొనేది లేనిదీ నిర్ధారించలేనని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ప్రకటించటం ముఖ్యమైంది. సభ్యదేశాల నేతలందరూ హాజరు కావాల్సిందేనని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పట్టుబట్టటం.జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ జి7 సమావేశాలకు హాజరుకాకపోవచ్చు అన్న వార్తల వెనుక తాము చైనా వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్దంగా లేమని, అమెరికా అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవటానికి సిద్దంగా లేమని చెప్పటంగా అర్ధం చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలకు అనుగుణ్యంగా వారు ఎత్తులు పైఎత్తులు వేయటం సహజం. అయితే అమెరికా ప్రయోజనాలు, రాజకీయ ఎత్తుగడలకు మన దేశాన్ని పావుగా చేసుకొనేందుకు జరుపుతున్న యత్నాలు ప్రమాదకరమైనవి. అమెరికా ప్రయోజనాలు అంటే అర్ధం అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాలే ప్రధానం.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానం పలికిన ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ప్రస్తుతం అమెరికా పాలేళ్ల వంటివి.భారత్‌, రష్యాలను ఆహ్వానించటం అంతర్జాతీయ రాజకీయాల్లో భాగం. చైనా వ్యతిరేకశక్తులను కూడగట్టటమే ప్రధాన లక్ష్యం అయితే దానిలో రష్యా భాగస్వామి అవుతుందా అన్నది ప్రశ్న. రెండు దేశాల మధ్య అనుమానాలు రేకెత్తించే ఎత్తుగడ కూడా ఉండవచ్చు. అనేక చోట్ల అమెరికాను నిలువరించటంలో రష్యా తనవంతు పాత్రను పోషిస్తున్నది. ఈ బృందంలో దాన్ని తిరిగి ఆహ్వానించటాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి కనుక తనకు ప్రయోజనమని ట్రంప్‌ భావిస్తూ ఉండాలి. ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు రష్యా అధినేత పుతిన్‌ ఇంతవరకు వెల్లడించలేదు. ఒక వేళ అంగీకరిస్తే కొన్ని దేశాల స్పందన ఎలా ఉంటుందో తెలియదు. రెండవది రష్యాను బుజ్జగించి అది ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను చూపి తమతో భాగస్వామిగా చేసుకోవచ్చన్న దూరాలోచన కూడా ఉండవచ్చు. ఒక బలమైన ప్రత్యర్ధితో దెబ్బలాటకు దిగటం కంటే సర్దుబాటు చేసుకుంటే లాభం అనుకుంటే ఎత్తుగడలు మారిపోతాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న స్ధితిలో ఇలాంటి సభల కంటే దాన్ని ఎదుర్కొనేందుకే వాయిదా వేశానని చెప్పుకోవచ్చు. ట్రంప్‌ వాయిదా వేసిన సెప్టెంబరులో అయినా అసలు సమావేశాలు జరుగుతాయా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి సమావేశాలు ఉన్నాయి. నవంబరులో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఓటమి పాలైతే ట్రంప్‌ అసలు పాల్గొనే అవకాశాలే ఉండక పోవచ్చు.
రష్యాను తిరిగి కూటమిలోకి రావాలని ట్రంప్‌ ఆహ్వానించటం రష్యా-చైనా-అమెరికా మధ్య ఉన్న సమతూకాన్ని తీవ్రదశకు చేర్చుతాయి. అమెరికా యత్నం ఎదురుతన్నినా ఆశ్చర్యం లేదు. తన ఎన్నిక కోసం ట్రంప్‌ ఈ చర్యకు పాల్పడినట్లు కొందరు చూస్తున్నారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని రష్యా పట్టించుకోకపోగా ఐరోపాయూనియన్‌, కెనడా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి. ఇలాంటపుడు రష్యా హాజరయ్యే అవకాశాలు పరిమితం. అయితే క్రిమియా ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకున్న తరువాత రష్యా అటు అమెరికా, ఇటు ఐరోపా యూనియన్‌ దేశాల నుంచి ఆంక్షలు, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది, ఒంటరి పాటు అయింది. అమెరికాతో విబేధాలు ఉన్నప్పటికీ దాన్నుంచి బయట పడేందుకు ఇదొక అవకాశం అని రష్యా భావిస్తే జి7 సమావేశాలకు హాజరు కావచ్చు. చైనా దీన్ని సానుకూలంగానే పరిగణించవచ్చు.
ప్రస్తుతం చైనాతో ఉన్న స్నేహ సంబంధాలపై వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం గానీ, ట్రంప్‌ ఆహ్వానాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అగత్యం గానీ ప్రస్తుతానికి రష్యాకు లేదని రష్యన్‌ పరిశీలకులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోల్చితే గత రెండు దశాబ్దాలలో రష్యా-చైనా సంబంధాలు సజావుగానే కొనసాగుతున్నాయి. సరిహద్దు సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమయ్యాయి.చైనా మీద అమెరికా తెస్తున్న వత్తిడి కారణంగా సంబంధాలు మరింతగా బలపడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో చైనా నుంచి రాయితీలను ఎక్కువగా పొందవచ్చని కూడా కొందరి అంచనా. ఆర్ధికంగా చూస్తే చైనాకు రష్యా అవసరం కంటే రష్యాకే చైనా అవసరం ఎక్కువగా ఉన్నందున ఒక వేళ అమెరికా-చైనా మధ్య ప్రచ్చన్న యుద్దమంటూ జరిగితే అమెరికాతో రష్యా కలిసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒక బూర్జువా రాజ్యంగా ఆ విబేధాలను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చు.
జి7 దేశాలతో కలసి పని చేసేందుకు భారత్‌ ఎంతో సంతోషిస్తుందని అమెరికాలో మన రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు ఒక వార్తా సంస్ధతో చెప్పారు.జూన్‌ రెండవ తేదీన ట్రంప్‌-నరేంద్రమోడీ మధ్య ఫోన్‌ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంతోషం, కౌగిలింతల వెనుక ఉన్న రహస్యం అందరికీ తెలిసిందే. వాటిలో ఒకటి 2017-18లో మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చమురు 9.6 మిలియన్‌ పీపాలైతే 2019లో 93.34 మిలియన్‌ పీపాలకు పెరిగింది. ఫిబ్రవరిలో ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన సందర్భంగా మరింతగా చమురు దిగుమతి చేసుకోవాలని ఒప్పందానికి వచ్చారు. ఇదంతా సాంప్రదాయంగా మనం పశ్చిమాసియా నుంచి చేసుకుంటున్న దిగుమతులను నిలిపివేసిన పర్యవసానం. ప్రభుత్వ రంగ ఐఓసి ఏటా 24మిలియన్‌ పీపాల చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని టెండర్లు పిలిచింది.
అమెరికా తరువాత రెండవ పెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా లేకుండా జి7 సాధించేదేమిటి? ఆ కూటమిలో చేరినంత మాత్రాన మన దేశానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. జి7 కంటే జి20 దేశాలు ఒక కూటమిగా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అమెరికా తప్ప మిగిలిన జి7 దేశాల కంటే చైనా ఆర్ధిక ప్రభావం ఎక్కువ అన్నది జగమెరిగిన సత్యం.అమెరికా ఏకపక్షంగా అంతర్జాతీయ సంస్ధలు, ఒప్పందాల నుంచి వైదొలగటం ప్రారంభించిన తరువాత మిగిలిన ఆరు దేశాలపై దాని ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఎత్తుగడ మేరకు ఒక వేళ దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జి7లో చేరినా అవి అమెరికాకు వంత పాత్ర తప్ప ఆర్ధికంగా, రాజకీయంగా ప్రపంచం మీద పెద్ద ప్రభావం చూపే స్ధితిలో లేవు. వర్తమాన బలాబలాల్లో అమెరికా నుంచి చైనా నుంచి రాయితీలు ఎక్కువగా పొందేందుకు భారత పాలకవర్గాలు ప్రయత్నిస్తాయి తప్ప పూర్తిగా అమెరికాకు లొంగిపోయే అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.మొత్తంగా చూసినపుడు తన ఎన్నిక నేపధ్యంలో ట్రంప్‌ జి7 విస్తరణను ఒక రాజకీయ ప్రదర్శనగా మార్చదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు 2018 నుంచి చైనా నుంచి ఆర్ధిక రాయితీలు పొందేందుకే అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించటం ఇతర వత్తిడులు అన్నది మిగతా దేశాలేవీ గ్రహించలేనంత అమాయకంగా లేవు. అందువలన అవి చైనా వ్యతిరేక కూటమిగా మారేందుకు ఎంత మేరకు ముందుకు వస్తాయి, వాటికి ఆ అవసరం ఏమిటన్నది ప్రశ్న.
ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చింది.ప్రస్తుతం మిగిలిన దేశాలలో ప్రస్తుతం జర్మనీ ఈ ఏడాది అధ్యక్ష స్ధానంలో ఉంది. సెప్టెంబరు నెలలో జర్మనీ నగరమైన లీప్‌జిగ్‌లో ఐరోపాయూనియన్‌-చైనా సమావేశం జరగాల్సి ఉంది. కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. డిసెంబరులోగా జరగవచ్చు.వైరస్‌ ప్రబలటానికి చైనాయే కారణమన్న అమెరికా ఆరోపణలను ఐరోపా దేశాలు కొన్ని నమ్ముతున్నాయి. అయినా కూటమిలోని జర్మనీ-ఫ్రాన్స్‌ దేశాలు చైనాతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాయి. వైరస్‌ నేపధ్యంలో చైనాతో సంబంధాల గురించి ఐరోపా యూనియన్‌ దేశాలలో ఏకాభిప్రాయాన్ని సాధించటం కూడా ముఖ్యాంశమే. ఒకవైపు చైనా తమకు ఆర్ధికంగా ప్రత్యర్ధి అని భావిస్తున్నా మరోవైపు దానితో ఇప్పటికిప్పుడు శత్రువుగా భావించే స్ధితి లేదు. కమ్యూనిస్టు దేశమని మడిగట్టుకు కూర్చునేందుకు మెజారిటీ దేశాలు సిద్దంగా లేవు. రాజకీయంగా ఈ కూటమి అమెరికాకు పావుగా పని చేసేందుకు సిద్దం కాదని కూడా గతంలో వెల్లడైంది.
జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు నిరసన ప్రతి రోజూ అధ్యక్ష భవనం ముందు నిరసన ప్రదర్శనలు, కరోనా వైరస్‌ అదుపులేకుండా కొనసాగుతుండటంతో జనంలో డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి పడిపోతోందని సిఎఎన్‌ మీడియా సంస్ధ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్ధి జో బిడెన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా, ఆర్ధిక దిగజారుడుతో పాటు ఇప్పుడు ఎన్నికల్లో జాత్యహంకారం కూడా ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి తరువాత ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన వారు 38శాతానికి పడిపోవటం, వ్యతిరేకించే వారు 57శాతం ఉండటం సహజంగానే ట్రంప్‌కు ఎదురు దెబ్బను సూచిస్తున్నది. జో బిడెన్‌-ట్రంప్‌ మధ్య తేడా 14పాయింట్లు ఉంది. బిడెన్‌ను 55శాతం మంది, ట్రంప్‌ను 41శాతం సమర్దిస్తున్నారు.ఫ్లాయిడ్‌ హత్యపై పెల్లుబికిన నిరసన పట్ల ట్రంప్‌ వ్యవహరించిన తీరు ట్రంప్‌ ఏలుబడిలోని మాజీ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ వంటి రిపబ్లికన్లకే నచ్చలేదు. ట్రంప్‌ స్పందన నిరసనలు తగ్గటానికి బదులు పెరిగేందుకు తోడ్పడినట్లు 65శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. జాతి వివక్ష ఒక ప్రధాన సమస్యగా ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలో నరేంద్రమోడీ కలలు నెరవేరేనా, కల్లలవుతాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ అసహనం, బెదిరింపుల వెనుక అసలు కథేంటి !

31 Sunday May 2020

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald Trump threats and intolerance on WHO, G7 summit, WHO Controversy, WTO


ఎం కోటేశ్వరరావు
ప్రపంచ ఆరోగ్య సంస్ధ : చైనా చేతిలో కీలుబమ్మగా మారింది.
ప్రపంచ వాణిజ్య సంస్ధ: దీన్ని రద్దు చేయాలి, మాకు ఉపయోగపడటం లేదు. చైనా ఆర్ధిక సామ్రాజ్యవాదిగా వ్యవహరిస్తోంది.
ప్రపంచ మానవ హక్కుల కమిషన్‌: తన స్వార్ధం తాను చూసుకొంటోంది, దొంగ ఏడ్పులు ఏడుస్తోంది.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు : దీన్ని మేము గుర్తించం, మా మీద విచారణ జరిపే అధికారం దానికి లేదు.
ఏడుదేశాల బృందం(జి7) : దీనికి కాలదోషం పట్టింది. ఈ బృందంలో భారత్‌, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను చేర్చాలి.
ఇలాంటి సాకులు చెబుతూ ఒక్కొక్క ప్రపంచ సంస్ధ నుంచి తాము తప్పుకుంటామని ప్రకటించటం లేదా బెదిరించటం ఇటీవలి కాలంలో అమెరికాకు మామూలైంది.దశాబ్దాల పాటు తామే అయి నడిపిన యాంకీలు ఇప్పుడు ఆ సంస్ధలనే తూలనాడుతున్నారు, బెదిరిస్తున్నారు ఎందుకు ? కరోనా వైరస్‌ను అవకాశంగా తీసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి బయటపడేందుకు పూనుకుంది. చైనీయులను బూచిగా చూపుతోంది. ఇలా మరికొన్నింటి నుంచి కూడా తప్పుకొనేందుకు పూనుకుంది వాటన్నింటికీ కారణం ఏమిటి , కారకులు ఎవరు ?
ప్రపంచంలో మానవ హక్కులను కాపాడే ఏకైక దేశంగా ఫోజు పెట్టిన అమెరికా ఆచరణలో వాటిని హరించేదిగా మారింది. స్వేచ్చకు ప్రతి రూపంగా లిబర్టీ విగ్రహాన్ని పెట్టుకున్న వారు ఒక వైపు యాత్రీకుల నుంచి ఆదాయం పిండుకొనే వనరుగా మార్చుకున్నారు. మరోవైపు ప్రపంచంలో అనేక దేశాల పౌరుల స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించిన మిలిటరీ, ఇతర నియంతలను ఆ విగ్రం ముందు నిలబెట్టి అసలైన రక్షకులుగా ప్రపంచానికి చూపారు.
2018లో ప్రపంచ మానవహక్కుల సంస్ధ నుంచి అమెరికా వైదొలగింది. పాలస్తీనియన్ల సమస్య మీద ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆ సంస్ధ పని చేస్తున్నట్లు ఆరోపించింది. నిజానికి పాలస్తీనియన్ల మాతృదేశాన్ని లేకుండా చేసి వారి ప్రాంతాలను ఆక్రమించి, బందీలుగా మార్చి, నిత్యం దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ యూదు దురహంకారులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న ఏకైక దేశం అమెరికా. తాను చేసిన ఆరోపణలకు ఆమోద ముద్రవేయకపోవటం, తాను నందంటే నంది, పందంటే పంది అని వంతపాడేందుకు ఆ సంస్ధ నిరాకరించటమే అసలు కారణం. ఆ సంస్ధ నుంచి వైదొలిగిన అమెరికా సాధించిందేమీ లేదు, అమెరికా లేనంత మాత్రాన దాని కార్యకలాపాలు ఆగిపోలేదు. సిరియా, ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి చోట్ల అమెరికన్లు దాడులు,తిరుగుబాట్లను ప్రోత్సహించి, రెచ్చ గొట్టి, తామే స్వయంగా దాడులకు పాల్పడి మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన సత్యం దాస్తే దాగేది కాదు. ఆ నేరాలు ఏడాది కేడాది పెరుగుతున్నాయి గనుక తమను ఎక్కడ బోనులో నిలబెడతారో అనే భయంతో ఐక్యరాజ్యసమితి చొరవతో ఏర్పడిన అంతర్జాతీయ నేర కోర్టును గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు.
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టును ఏర్పాటు చేయాలని అనేక సంప్రదింపుల అనంతరం రోమ్‌ సమావేశంలో తీర్మానించారు.1998 జూలై 17న దాన్ని 120దేశాలు ఆమోదించగా, 21 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. వ్యతిరేకించిన ఏడు దేశాలలో అమెరికా, చైనా, లిబియా, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, ఎమెన్‌, కతార్‌ ఉన్నాయి. అయితే 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఒప్పందం మీద సంతకం చేశాడు. ఇలాంటి ఒప్పందాల మీద దేశాలు సంతకాలు చేస్తేనే చాలదు, వాటిని ఆయా దేశాల పార్లమెంట్‌లు ఆమోదించాలి. క్లింటన్‌ పార్లమెంట్‌కు నివేదించలేదు. రెండు సంవత్సరాల తరువాత ఐక్యరాజ్యసమితికి ఒక లేఖ రాస్తూ రోమ్‌ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ నాటి అధ్యక్షుడు బుష్‌ స్పష్టం చేశారు. ఒకసారి అంగీకరిస్తే ఆయా దేశాల మీద వచ్చే ఆరోపణలు, విమర్శల మీద విచారణ జరపాల్సి ఉంటుంది. అమెరికా గనుక చేరి ఉంటే ఏదో ఒకసాకుతో అనేక దేశాలలో జోక్యం చేసుకుంటున్నదాని దుర్మార్గాలపై ఈ పాటికి ఎన్నో విచారణలు జరిగి ఉండేవి, దాని దుర్మార్గం మరింతగా లోకానికి బట్టబయలు అయి ఉండేది. అందుకే చేరేందుకు నిరాకరిస్తోంది. ఒక వైపు తాము సహకరిస్తామని చెబుతూనే నేరాలకు పాల్పడిన తమ సైనిక, గూఢచార ఇతర పౌరులను రక్షించుకొనేందుకు, కోర్టు కార్యకలాపాలను అడ్డుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. మరికొన్ని అంతర్జాతీయ ఒప్పందాల నుంచి కూడా ఏకపక్షంగా వైదొలగింది. వాటిలో ఇరాన్‌తో కుదిరి అణు ఒప్పందం అన్నది తెలిసిందే. దాన్నుంచి వైదొలగిన తరువాత అమెరికా దాడులు, దానికి ఇరాన్‌ ప్రతిదాడుల సంగతి తెలిసిందే.
ప్రపంచ వాణిజ్య సంస్ధ ఏర్పాటులో అమెరికా ప్రముఖ పాత్ర పోషించింది. ప్రపంచీకరణను అమలు జరిపే సాధనంగా దాన్ని మార్చుకొని తన ప్రయోజనాలు సాధించుకోవాలని చూసింది.కొన్ని సంవత్సరాల తరువాత భారత్‌, చైనాలు ఇంకేమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదని, ఆ పేరుతో వాటికి రాయితీలు కల్పించటం అక్రమం అని, తమకు సంస్ధలో ఉన్నందున ప్రయోజనాలేమీ లేవని, తమకు సైతం అదే హౌదా ఇవ్వాలని లేకుంటే తాము సంస్ధ నుంచి విడిపోతామని ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. వర్ధమాన దేశాలు పన్నులను తగ్గించేందుకు ఇచ్చిన వ్యవధి మేరకే భారత్‌, చైనాలు అవకాశాలను వినియోగించుకుంటున్నాయి తప్ప ఎవరి దయాదాక్షిణ్యమో కాదు. నిజానికి నిబంధనలను ఉల్లంఘించి లబ్ది పొందుతోంది అమెరికాయే. అనేక దేశాలపై కేసులు దాఖలు చేసి బెదిరింపులకు దిగింది. మన దేశం పత్తికి మద్దతు ధర ప్రకటించటాన్ని రాయితీ ఇవ్వటంగా చిత్రించి ప్రపంచ వాణిజ్య సంస్దలో మనకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది. బోయింగ్‌ విమాన కంపెనీకి పెద్ద ఎత్తున దొడ్డిదారిన రాయితీలు ఇస్తోంది. ఆ విమానాలను కొనాలని ఇతర దేశాలపై తన పలుకుబడిని వినియోగిస్తోంది. బోయింగ్‌కు పోటీగా ఐరోపా ధనిక దేశాలు ఎయిర్‌బస్‌కు మద్దతు ఇస్తున్నాయి. రెండూ పరస్పరం ఆరోపణ చేసుకొని దాఖలు చేసిన కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పదహారేండ్ల నుంచి సాగుతున్న ఈ వివాదంలో ఐరోపా యూనియన్‌ను బెదిరించేందుకు అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే విమానాలు, విడిభాగాలపై విధిస్తున్న పన్ను 10 నుంచి 15శాతానికి ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పెంచింది.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ విషయానికి వస్తే కరోనా వైరస్‌కు కారణం చైనాయే అని ప్రకటించాలన్నది అమెరికా వత్తిడి. దానికి ఆ సంస్ధ లొంగకపోవటంతో ట్రంప్‌ ఎదురుదాడి ప్రారంభించి చైనాతో కుమ్మక్కయిందని ఆరోపించాడు, ముందు నిధులు నిలిపివేస్తామని ప్రకటించి ఇప్పుడు ఏకంగా వైదొలుగుతామని బెదిరింపులకు దిగాడు. ఈ సంస్ధకు ఇచ్చే నిధులను ప్రపంచంలో ప్రజారోగ్యానికి చేసే ఖర్చుకు అంద చేస్తామని గొప్పలు చెప్పాడు. కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి ప్రారంభమైందో దర్యాప్తు జరిపేందుకు చైనా సంస్థలను తమకు అప్పగించాలని అమెరికా ముందు డిమాండ్‌ చేసింది, అంతేకాదు, బాధిత దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని కేసుల నాటకం ఆడించింది. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్ధ సమావేశాల్లో తాము చెప్పిన పద్దతుల్లో దర్యాప్తు తీర్మానం చేయించాలని వత్తిడి తెచ్చింది. అయితే రాజకీయ కోణంతో జరిపే దర్యాప్తులకు బదులు వాస్తవం తెలుసుకొనేందుకు కరోనా సమస్య సమసిపోయిన తరువాత స్వతంత్ర సభ్యులతో దర్యాప్తు జరపవచ్చని దానికి తాము కూడా సహకరిస్తామని చైనా ప్రకటించింది. భారత్‌తో సహా 122 దేశాలు ఉమ్మడిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎలాంటి ఓటింగ్‌ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించటం అమెరికాకు మింగుడు పడలేదు. చైనా వ్యతిరేకిస్తుందని, దాన్ని సాకుగా తీసుకొని దాడి చేయాలని చూసిన ఆమెరికా దీంతో హతాశురాలైంది. ఇక లాభం లేదనుకొని తాము సంస్ధ నుంచి వైదొలుగుతామని ప్రకటించింది. సంస్కరణలు తేవటంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ విఫలమైందని ట్రంప్‌ ఆరోపించాడు. అయితే అమెరికా కోరుతున్న సంస్కరణలు ఏమిటో స్పష్టత లేదని, బయట చర్చకు పెట్టలేదని, ఒక నెల వేచి చూస్తామని చెప్పిన ట్రంప్‌ వారం రోజులకే బెదిరింపులకు ఎందుకు దిగారో తెలియటం లేదని సంస్ధ ప్రధాన కార్యదర్శి టెడ్రోస్‌ చెప్పారు. ట్రంప్‌ నిర్ణయం ముందు చూపులేమి, అమెరికన్ల ప్రాణాలకు ముప్పు తేవటమే అని విమర్శలు వచ్చాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్ధ అసెంబ్లీ ఆమోదించిన ఒక చారిత్రాత్మక ప్రతిపాదన కూడా అమెరికా నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది.కరోనా వైరస్‌ నిరోధానికి తయారు చేసే వ్యాక్సిన్‌ ప్రజల వస్తువుగా ఉండాలి తప్ప ఒకటి రెండు సంస్ధలకు పేటెంట్‌ ఔషధంగా ఉండకూడదని కోస్టారికా చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్‌ తప్ప మిగిలిన దేశాలన్నీ అంగీకరించాయి. వాటిలో అమెరికా అనుయాయి దేశాలు అన్నీ ఉన్నాయి. ప్రపంచానికి మహమ్మారులుగా మారిన వ్యాధుల నివారణకు రూపొందించిన ఔషధాలు చౌకగా అందరికీ అందుబాటులో ఉండాలి తప్ప కొన్ని కంపెనీలకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉండకూడదు. అదే జరిగితే ఏం జరుగుతుందో ఎయిడ్స్‌ ఔషధాల విషయంలో చూశాము.
తాము కూడా కరోనా వాక్సిన్‌ తయారీలో ఉన్నామని, అవి జయప్రదమైన తరువాత ప్రజల వస్తువుగా అందుబాటులో ఉంచుతామని చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ ప్రకటించారు. అంతే కాదు ప్రజల వస్తువుగా ఉంచే వాక్సిన్‌ తయారీ యత్నాలకు రానున్న రెండు సంవత్సరాలలో రెండు బిలియన్‌ డాలర్లు అందచేస్తామని కూడా చెప్పారు. ప్రస్తుతం ఎనిమిది సంస్ధలు వాక్సిన్‌ ఒకటి, రెండవ దశ పరీక్షలలో ఉన్నాయి. వాటిలో నాలుగు చైనాలో, రెండు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లో ఒక్కొక్కటీ ఉన్నాయి.
ఎయిడ్స్‌ ఔషధ పేటెంట్‌ పొందిన కంపెనీ ఏడాదికి ఒక్కో రోగి నుంచి పది నుంచి పదిహేనువేల డాలర్లు వసూలు చేసి విక్రయించింది. పదేండ్ల పాటు అంత ఖర్చు భరించలేని రోగులందరూ దుర్మరణం పాలయ్యారు.2004లో మన దేశ కంపెనీలు ఏడాదికి కేవలం 350 డాలర్లకే మందులను అందుబాటులో తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచానికి కావలసిన ఎయిడ్స్‌ ఔషధాలలో 80శాతం మన దగ్గర నుంచే సరఫరా అవుతున్నాయి. కాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే నెక్సావార్‌ ఔషధంపై బేయర్‌ కంపెనీ పేటెంట్‌ హక్కు కలిగి ఉంది. నూట ఇరవై బిళ్లలను రెండు లక్షల ఎనభైవేల రూపాయలకు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అలాంటిది మన దేశంలోని నాట్కో కంపెనీ జనరిక్‌ ఔషధాన్ని కేవలం రూ.8,800లకే అందుబాటులోకి తెచ్చింది. తాము ఈ ఔషధాన్ని భారత మార్కెట్‌కోసం తయారు చేయలేదని పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేయగల పశ్చిమదేశాల వారికి ఉద్దేశించింది అని నాట్కో కంపెనీపై కేసు దాఖలు చేసిన సందర్భంగా బేయర్‌ కంపెనీ సిఇఓ చెప్పాడు. అయితే ఆ కేసులో బేయర్‌ ఓడిపోయింది.
ఇప్పుడు కరోనా వాక్సిన్‌తో వ్యాపారం చేయాలన్నది అమెరికా, బ్రిటన్‌ ఆలోచన. అనేక వ్యాధులు పశ్చిమ దేశాలలో అంతగా రావు, అయినా పశ్చిమ దేశాల కంపెనీలు ఆ వ్యాధులకు ఔషధాలను ఎందుకు రూపొందిస్తున్నాయంటే రోగులను పీల్చి పిప్పి చేసేందుకే అన్నది స్పష్టం. ప్రపంచ ఆరోగ్య సంస్ధలో ఉంటూ ఇలాంటి చర్యలకు మద్దతు ఇస్తే అమెరికన్లు సభ్య సమాజం నుంచి మరింతగా వేరుపడతారు. ఇతర జబ్బులకు ఒకసారి పెట్టుబడి పెట్టి అభివృద్ది చేస్తే తరువాత రోజుల్లో పెద్ద మార్పుల అవసరం ఉండదు. కరోనా వైరస్‌ లేదా మరొక వైరస్‌ దేనికీ ఒకసారి తయారు చేసిన ఔషధం శాశ్వతంగా పనికి రాదు. వైరస్‌లో మార్పులు జరిగినపుడల్లా మార్చాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఎయిడ్స్‌ కోరి తెచ్చుకొనే జబ్బు, కరోనా కోరకుండానే దాడి చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ భయంతో జీవించాల్సి ఉంటుంది, వాక్సిన్‌కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దపడతారు.మహమ్మారులుగా మారినపుడు లక్షలు, కోట్ల మందికి సోకుతాయి. ఈ అవసరం, బలహీనతను సొమ్ము చేసుకోవాలని అమెరికా, బ్రిటన్‌ కార్పొరేట్‌ సంస్ధలు కాచుకు కూర్చున్నాయి. వాటి ఆకాంక్షలను ట్రంప్‌ వెల్లడిస్తున్నాడు.
ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) నుంచి అమెరికా వైదొలగాలన్న అంశం గత పదిహేను సంవత్సరాలుగా నలుగుతున్నదే. అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఇటీవల ఈ సంస్ధను రద్దు చేయాలంటూ ఊగిపోయారు. అలాంటి అధికారం గనుక అమెరికాకు ఉంటే ఈ పాటికి ట్రంప్‌ ఎప్పుడో ఆ పని చేసి ఉండేవాడు. ఈ విషయంలో ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా తక్కువ తినలేదు.ఆ సంస్ధ నుంచి తప్పుకోవాలంటూ పార్లమెంట్‌లో ఆ పార్టీ సభ్యుడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఒక వేళ ట్రంప్‌ అలాంటి పిచ్చిపని చేస్తే ముందు నష్ట పోయేది అమెరికా తప్ప మిగతా ప్రపంచం కాదు. అయితే తీర్మానం నెగ్గి వెంటనే అమెరికా బయటకు పోతుందని ఎవరూ భావించటం లేదు. అదే జరిగితే ప్రపంచ వాణిజ్యం మీద ఐరోపా యూనియన్‌, చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరితో పాటు కూర్చునేందుకు తమకు స్ధలం ఉండదు అని అమెరికా వాణిజ్య మాజీ ప్రతినిధి వెండీ కట్లర్‌ చేసిన వ్యాఖ్య తీవ్రతకు నిదర్శనం.
గాట్‌లో, తరువాత దాని స్ధానంలో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో స్ధాపక సభ్యురాలిగా చైనాకు స్ధానం కల్పించేందుకు అమెరికా, దాని మిత్ర రాజ్యాలు అనుమతించలేదు.ఏ వర్ధమాన దేశానికీ విధంచని షరతులను చైనాకు పెట్టి చివరకు చేర్చుకున్నారు.అప్పటి నుంచీ చైనా తమ దేశం నుంచి ఫ్యాక్టరీలు, సంస్ధలను తరలించుకుపోతున్నది, ఉద్యోగాలకు ఎసరు పెట్టింది, వాణిజ్యాన్ని దెబ్బతీసింది అంటూ అమెరికా సణగని రోజు లేదు.
అమెరికా ఒక్క ఐక్యరాజ్యసమితి సంస్ధల నుంచే కాదు. ఇతర వ్యవస్ధలను కూడా చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. బలహీనులనే కాదు బలవంతులను కూడా తన పాదాల చెంతకు తెచ్చుకొనేందుకు పూనుకుంది. చరిత్రలో జరిగిన అనేక ప్రాంతీయ, రెండు ప్రపంచ యుద్దాలకు సామ్రాజ్యవాదుల ఇలాంటి వైఖరే కారణమైంది.
జి7 దేశాల బృందానికి కాలదోషం పట్టిందని ప్రకటించటానికి ట్రంప్‌ ఎవరు ? దానిలో అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాలు రష్యాను ఎనిమిదవ దేశంగా చేర్చుకొనేందుకు నిర్ణయించి క్రిమియా ప్రాంతాన్ని ఆక్రమించుకొందనే సాకుతో పక్కన పెట్టారు.ఈ ఏడాది జరిగే సమావేశానికి తిరిగి అధికారికంగా పిలవాలని నిర్ణయించారు. గత ఏడాది మనదేశంతో సహా తొమ్మిది దేశాలను అతిధులుగా ఆహ్వానించారు. ఆరు దేశాల బృందంగా ఏర్పడిన ఈ ఆర్ధిక కూటమిలో తరువాత ఏడవద దేశంగా కెనడాను చేర్చుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత ఐరోపా యూనియన్‌ శాశ్వత ఆహ్వానిత సంస్ధగా పిలుస్తున్నారు. నిజానికి ఇది ధనిక రాజ్యాలు తమ ప్రయోజనాలకోసం ఏర్పాటు చేసుకున్నది తప్ప ఐక్యరాజ్యసమితితో ఎలాంటి ప్రమేయం లేదు. ఈ ఏడాది జూన్‌ 10-12 తేదీలలో అమెరికా మేరీలాండ్‌ రాష్ట్రంలోని కాంప్‌డేవిడ్‌లో జరపాలని నిర్ణయించారు. అయితే కరోనా కారణంగా సమావేశాన్ని ఆన్‌లైన్‌ జరపనున్నట్లు మార్చి నెలలో తెలిపారు. ఇప్పుడు దాన్ని కూడా ఏకంగా సెప్టెంబరుకు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అప్పటికి అమెరికా ఎన్నికలు దగ్గరపడతాయి కనుక తన లాభనష్టాలను బేరీజు వేసుకొని తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.
ఒకే గూటి పక్షులైన ఈ బృంద దేశాలతో కూడా అమెరికా సక్రమంగా వ్యవహరించటం లేదు. మిగతా దేశాలన్నీ తనకు అణగి మణగి ఉండాలని కోరుకుంటోంది. ఈ నేపధ్యంలో 2018లో కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో జరిగిన సమావేశం రసాభాస అయింది. డోనాల్డ్‌ ట్రంప్‌తో మిగిలిన ఆరుగురు నేతలు పడిన ఇబ్బందులను గమనించిన జర్నలిస్టులు ఆ సమావేశాన్ని ” జి6ప్లస్‌ ఒన్‌ ” అని అపహాస్యం చేశారు. ఆ సమావేశం ఎలాంటి ప్రకటనను ఆమోదించకుండా ముగియటానికి అమెరికా, ట్రంపే కారణం అంటే అతిశయోక్తి కాదు. ఆ ఏడాదే చైనా, కెనడా , ఐరోపా యూనియన్‌ ఇతర అనేక దేశాలపై బస్తీమే సవాల్‌ అంటూ ట్రంప్‌ వాణిజ్య యుద్దం ప్రకటించటమే దీనికి కారణం. ఈ ఏడాది ఆతిధ్యం ఇస్తూ ఈ బృందం పనికిమాలినది అని వ్యాఖ్యానించటాన్ని బట్టి ట్రంప్‌ సంస్కారం ఏమిటో బయటపడింది. అదే నోటితో మన దేశంతో సహా మిగిలిన దేశాలతో దాన్ని విస్తృత పరచాలంటూ ఆదేశాల తరఫున మాట్లాడుతున్నట్లు ఫోజు పెట్టాడు. నిజానికి ఆ బృందంలో ఉన్నంత మాత్రాన ఏ దేశానికైనా పెద్దగా ఒరిగేదేమీ లేదు. దానితో నిమిత్తం లేకుండానే చైనా అంతర్జాతీయ వాణిజ్యంలో ఎంతగా ఎదిగిందో, ఆ బృందంలోని అమెరికా మినహా మిగిలిన దేశాలను దాటి ఎలా ముందుకు పోతోందో ఇప్పుడు కరోనా వైరస్‌ను అరికట్టటంలో సోషలిస్టు వ్యవస్ధ ప్రత్యేకతను ప్రపంచానికి చాటింది. ఒక్క జపాన్‌ మినహా మిగిలిన అన్ని జి7దేశాలూ కరోనాతో సతమతం అవుతున్నాయి. అమెరికా గురించి చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఇది రాస్తున్న సమయానికి నమోదైన 62లక్షల కేసుల్లో పద్దెనిమిది లక్షల కేసులను దాటి పోయింది. 2008లలో ధనిక దేశాలలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం నుంచి జి7లోని ఏ ఒక్కదేశమూ బయటపడకపోగా మరో సంక్షోభంలోకి కూరుకుపోతుండటాన్ని చూస్తున్నాము.
అమెరికా పాలకవర్గం, దాని ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుకుంటున్నది ఒకటి-జరుగుతున్నది మరొకటి కావటంతో తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒక పిచ్చిపనో, ప్రకటనో, బెదిరింపులో చేస్తున్నాడు. వాటిలో ఒకటి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నుంచి అమెరికా తప్పుకుంటుందన్న అంశం. గతంలో ప్రపంచాన్ని బెదిరించేందుకు జపాన్‌పై అణుబాంబులు వేశారు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత బెదిరింపులు ఎక్కువయ్యాయి. ప్రపంచ సంస్ధల నుంచి తప్పుకుంటామనే రూపంలో అవి ముందుకు వస్తున్నాయి.అందుకుగాను ప్రతిదానికీ ఏదో ఒక సాకు చూపుతున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత తలెత్తిన పరిస్ధితుల్లో అమెరికా ఒక పెద్ద ఆర్ధికశక్తిగా ఎదిగింది. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను నెత్తికి ఎత్తుకొని ప్రపంచలోని కమ్యూనిస్టు వ్యతిరేకశక్తులన్నింటినీ కూడగట్టింది. ఆ ముసుగులో తన కార్పొరేట్‌ సంస్ధలకు ఆయా దేశాలను మార్కెట్‌గా చేసుకొనేందుకు, సహజవనరులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించింది. తన మిలిటరీ,రాజకీయ వ్యూహాలను అమలు జరిపేందుకు కేంద్రాలుగా చేసుకున్నది. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అమెరికా అనుసరించిన ఎత్తుగడలు దానికి ఎదురుతన్నాయి.ఈ కారణంగానే డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ సంస్ధలలో అమెరికా కొనసాగటం, వాటికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం దండగ, తమ లక్ష్యాలకు ఉపయోగపడటం లేదని భావించటం, తప్పుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అమెరికాయే కాదు ఏదేశంలో అయినా పాలకవర్గాలకు తమ ప్రయోజనాలే ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు. తాము నిర్దేశించిన అజెండాను అమలు జరపకపోతే ఒక బొమ్మ బదులు మరొక బొమ్మను గద్దెపై కూర్చోబెడతాయి. ఈ నేపధ్యంలోనే నవంబరు ఎన్నికలలో ట్రంప్‌ ఓడిపోయి మరొకరు వచ్చినా భాష, హావభావాలు, పిచ్చిమాటలు మారవచ్చు తప్ప ఇదే వైఖరి కొనసాగుతుంది.
ఇలాంటి వైఖరి అమెరికాకు ఉపయోగపడుతుందా ? ప్రపంచ సంస్ధలతో నిమిత్తం లేకుండా తనకున్న ఆర్ధిక, మిలిటరీ శక్తితో ప్రపంచాన్ని శాసించి తన అదుపులోకి తెచ్చుకోవాలని గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అది సాధ్యం కాదని దానికి అవగతం అవుతోంది. 2008లో పెట్టుబడిదారీ దేశాలలో వచ్చిన మాంద్యం తరువాత అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్ధను పక్కన పెట్టి విడిగా ఒప్పందాలు చేసుకోవటం పెరుగుతోంది. గత ఏడాది నవంబరు వరకు వచ్చిన వార్తల ప్రకారం రక్షణాత్మక చర్యల్లో అమెరికా 790తో అగ్రస్ధానంలో ఉంది. మన దేశం ప్రపంచ వాణిజ్యంలో చాలా తక్కువశాతమే కలిగి ఉన్నప్పటికీ దాన్నయినా కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యల్లో 566తో అమెరికా తరువాత రెండో స్ధానంలో ఉన్నాం. దేశాల వారీ జర్మనీ 390, బ్రిటన్‌ 357, ఫ్రాన్స్‌262, చైనా 256, కెనడా 199, ఆస్ట్రేలియా 174 చర్యలు తీసుకున్నాయి.2018 చివరిలో ప్రపంచ వాణిజ్యం మాంద్యంలోకి జారిపోయింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం ఎలాంటి పర్యవసానాలను చూడాల్సి వస్తుందో అప్పుడే చెప్పలేము.
ఐక్యరాజ్యసమితికి ఉండే బలహీనతలు దానికి ఉన్నాయి. అంతకంటే మెరుగైన వ్యవస్ధను ఏర్పాటు చేసుకొనేంతవరకు దాన్ని కొనసాగించటం తప్ప మరొక మార్గం లేదు. ఉన్నదాన్నే కొనసాగించటానికి అంగీకరించని అమెరికన్లు దాన్ని బోనులో నిలబెట్టే అంతకంటే శక్తివంతమైన ప్రపంచ వ్యవస్ధ ఏర్పాటుకు అంగీకరిస్తారని ఆశపెట్టుకోనవసరం లేదు. గతంలో సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని పంచుకొనేందుకు, రక్షణాత్మక చర్యలు అమలు జరిపిన కారణంగానే ప్రపంచ యుద్దాలు వచ్చాయి. ట్రంప్‌ చేస్తున్న పిచ్చిపనులు నవంబరులో జరిగే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అన్నది ఒకటైతే రెండవది అమెరికా వైఖరిలో రోజు రోజుకూ పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. ట్రంప్‌ ఓడిపోతారా, డెమోక్రాట్‌ జోబిడెన్‌ గెలుస్తారా అన్నది పక్కన పెడితే అగ్రస్దానం అమెరికాదే అన్న వైఖరిని మరింత ముందుకు తీసుకుపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలియదు గానీ, తీవ్రంగా ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !
  • చైనాకు చెక్‌ పెట్టే సత్తా చతుష్టయ కూటమికి ఉందా !
  • అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు : బొద్దింకలను చూసి భయపడుతున్న 56 అంగుళాల ఛాతి ! అభిజిత్‌ దెబ్బ నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి !!
  • ఇంటా బయటా ఇరకాటంలో డోనాల్డ్‌ ట్రంప్‌ – చైనా పర్యటన విఫలమా ! సఫలమా !!

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d