కేవలం ఎనిమిది లక్షలలోపు జనాభా ఉన్న భూటాన్తో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనా ఒక ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది. చైనా-భూటన్ – భారత్ త్రికోణ కూడలికి దగ్గరలో నాలుగు సంవత్సరాల నాడు తీవ్ర వివాదంగా మారిన డోక్లాం ప్రాంతం ఉంది. అది ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్నప్పటికీ భూటన్ తనదిగా చెబుతోంది. దానితో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ఆ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోడ్డు, ఇతర నిర్మాణాలు చేసేందుకు 2017లో చైనా ప్రయత్నించినపుడు మన సైన్యాలు అడ్డుకున్నాయి. డెబ్బైమూడు రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. రోడ్డు నిర్మాణాన్ని చైనా నిలిపివేసిన తరువాత సద్దుమణగింది. వేస్తున్న రోడ్డును ఆపివేసింది తప్ప చైనా ఆప్రాంతంలోనే అప్పటి నుంచీ కొనసాగుతోంది.సిక్కిం వైపు నుంచి నిర్ధారిత సరిహద్దు నుంచి 2017జూన్ 18న భారత సైన్యం తమ భూభాగంలోకి ప్రవేశించి అతిక్రమణకు పాల్పడిందని అప్పుడు చైనా విమర్శించింది. మూడు దశలుగా లేదా మూడంచెలలో వివాదాలను పరిష్కరించుకొని రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలన్నది ఒప్పందం, వివరాలు వెల్లడి కాలేదు.
రెండు దేశాల మధ్య 1984 నుంచీ చర్చలు జరుగుతున్నాయి, 24 సార్లు కూర్చున్నా పరిష్కారం కాలేదు.2017లో డోక్లాం ఉదంతం తరువాత అవి కూడా నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పదవసారి జరిగిన నిపుణుల సమావేశం తరువాత తాజా ఒప్పందం కుదిరింది. దీని గురించి ఎవరికి వారు తమ ప్రయోజనాలు, భాష్యాలకు అనుగుణ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం గురించి ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదని, ఎప్పటి నుంచో ఊహిస్తున్నదే అనే అభిప్రాయంవెల్లడించిన వారు కొందరు. నిజానికి దీనికి 2010లోనే పునాది పడింది. వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలను భౌతికంగా పరిశీలించాలని నిర్ణయించారు, ఆ మేరకు 2015నాటికి దాన్ని పూర్తి చేశారు.వివాదం ఉన్న వాటిలో డోక్లాంను తమకు అప్పగిస్తే దానికి బదులు ఇతర ప్రాంతాల మీద హక్కును వదులుకుంటామని చైనా చెబుతోంది. భూటాన్ మొత్తం విస్తీర్ణం 38వేల చదరపు కిలోమీటర్లు, నాలుగు వందల కిలోమీటర్ల మేరకు చైనాతో సరిహద్దును కలిగి ఉంది. రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం 765 చదరపు కిలోమీటర్లు. ఈ ఒప్పందాన్ని వీడియో సమావేశంలో చేసుకున్నారు.
త్రికోణ కూడలి ఇటు మన దేశానికి చైనాకు ప్రాధాన్యత కలిగినవే. మన ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలను కలిపే ప్రాంతం కూతవేటు దూరంలో ఉంది. పరస్పరం అనుమానాలు ఉన్నందున డోక్లాం చైనాలో ఆధీనంలో ఉండేందుకు మన దేశం అంగీకరించటం లేదు. భూటాన్ విషయానికి వస్తే అటు చైనా ఇటు మన దేశంతో దానికి భద్రతాపరమైన ముప్పు ఉందని భావించటం లేదు. మనదేశం-భూటాన్ మధ్య ఒక చిత్రమైన ఒప్పందం ఉంది. తరువాత అది అనేక మార్పులకు లోనైంది. ఆ ఒప్పందం ప్రకారం భూటాన్ మన రక్షిత ప్రాంతమని మన దేశం భావించింది.
1949 ఆగస్టు 8న కుదిరిన స్నేహ ఒప్పందం ప్రకారం అంతర్గత వ్యవహారాలలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. అయితే విదేశీ, రక్షణ విషయాలలో పరస్పరం సంప్రదించుకోవాలి, మన దేశం భూటాన్కు మార్గదర్శనం చేయాలి. భూటాన్ స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించవచ్చుకనుక కొందరు దీన్ని రక్షణ కల్పించే దేశం తప్ప రక్షణలో ఉండేది (అలాంటి దేశాలను అన్నివిధాలుగా నియంత్రిస్తారు) కాదని చెప్పారు.1958లో నాటి ప్రధాని నెహ్రూ భూటాన్ సందర్శించిన తరువాత పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ భూటాన్ మీద ఎవరైనా దురాక్రమణకు పాల్పడితే అది భారత్ మీద జరిపినట్లే పరిగణిస్తామని ప్రకటించారు. నాడు వేరేదేశంగా ఉన్న సిక్కిం, భూటాన్లను చైనా ఆక్రమించనుందనే పుకార్లు (సిక్కింలో తిష్టవేసేందుకు అమెరికా సిఐఏ అల్లిన కట్టుకథలు )వచ్చినపుడు 1959లో పార్లమెంటులో ప్రకటన చేస్తూ భూటన్ రక్షణ బాధ్యత భారత్ వహిస్తుందని నెహ్రూ ప్రకటించారు. దాన్ని నాటి భూటాన్ ప్రధాని ఖండిస్తూ తమది భారత రక్షిత దేశం కాదని ఒప్పందంలో అలాంటి అంశం లేదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ భారత్ – భూటాన్ సరిహద్దు వివాదాలు 1973-84 కాలంలోనే పరిష్కారమయ్యాయి.
తమ సార్వభౌమత్వం పెంపుదలకు ఒప్పందంలోని కొన్ని అంశాలను తిరిగి రాసుకోవాలని 1970లోనే భూటాన్ కోరింది. దానిలో భాగంగానే మన ప్రమేయం లేకుండానే 1971లో అది ఐక్యరాజ్య సమితిలో చేరింది. బంగ్లాదేశ్ విముక్తిని గుర్తించి మరుసటి ఏడాది ఒక ఒప్పందం చేసుకుంది. అలీన కూటమిలో చేరింది. కంపూచియా ఖేర్మరోగ్ సంస్ధను ఐరాసలో ప్రతినిధిగా గుర్తించాలా లేదా అన్న అంశంపై కొన్ని ఆ ప్రాంత దేశాలు, భారత వైఖరికి భిన్నంగా చైనాతో కలసి అనుకూలంగా ఓటు వేసింది.2007లో 1949నాటి ఒప్పందాన్ని నవీకరించారు. అంతకు ముందు భూటాన్ సరిహద్దు సార్వభౌమత్వం గురించిన విదేశాంగ విధానంలో భారత మార్గదర్శనం చేయాలని ఉన్న అంశాన్ని తొలగించారు. ఆయుధ దిగుమతులకు కూడా భారత అనుమతి అవసరం లేదని సవరించారు. ఒప్పందంలో ఈ మార్పులు జరిగినప్పటికీ మన దేశం మీద భూటాన్ అనేక అంశాలలో ఆధారపడటం వంటి కారణాలతో ప్రభావితమైంది. డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణ సమయం భూటాన్ వినతి మేరకు తాము దాని భూభాగాన్ని రక్షించేందుకు వచ్చినట్లు ప్రకటించి మన మిలిటరీని అక్కడకు పంపారు.అయితే భూటాన్ ఆ సమయంలో మౌనం పాటించింది. భూటాన్ కోరితేనా లేక మనమంతట మనమే మిలిటరీని పంపామా అన్నది ఇప్పటికీ చిక్కుముడే.
సరిహద్దులతో సహా భూటాన్ పూర్తి సార్వభౌమత్వ దేశంగా ఉన్నట్లు చైనాతో కుదుర్చుకున్న ఒప్పందంతో మన దేశానికి, ప్రపంచానికి స్పష్టం చేసింది. ఈ కారణంగానే కావచ్చు లేదా వివరాలు పూర్తిగా వెల్లడి కానందున గానీ మన దేశం జాగ్రత్తగా స్పందించింది. 1997లో ఇచ్చి పుచ్చుకొనే ప్రాతిపదికన చైనా చేసిన ప్రతిపాదనకు భూటాన్ అంగీకరించకపోవటానికి మన దేశం తెచ్చిన వత్తిడే అని చైనా చెబుతోంది. డోక్లాం ప్రాంతం ఉన్న చుంబీ లోయ చైనా ఆధీనంలోకి వెళితే భవిష్యత్లో ఏవైనా వివాదాలు తలెత్తితే సిక్కిం, పశ్చిమబెంగాల్లోని సిలిగురి ప్రాంతం మీద సులభంగా దాడి చేయటానికి వీలు కలగటమే గాక ఈశాన్య ప్రాంతంతో సంబంధాలు తెగిపోతాయన్నది మన దేశ భయం. మన దేశం నుంచి తమ టిబెట్కూ అలాంటి ముప్పు ఉంటుందని చైనా చెబుతోంది.
రెండు దేశాల మధ్య అవగాహన కుదిరినప్పటికీ అది సజావుగా ముందుకు పోతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఒప్పందం గురించి మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందిస్తూ అవగాహన కుదిరినట్లు గమనించాము, 1984 నుంచి రెండు దేశాలూ సరిహద్దు గురించి సంప్రదింపులు జరుపుతున్నాయి.మనమూ చైనాతో సంప్రదింపుల్లోనే ఉన్నాం అని క్లుప్తంగా స్పందించారు. భారత్కు తెలియచేయ కుండా భూటాన్ ఒప్పందం చేసుకుందా అన్న ప్రశ్నకు బాగ్చీ స్పందించలేదు. తమ సరిహద్దు చర్చలకు ఇది నూతన ఉత్సాహాన్నిస్తుందని, విజయవంతంగా ముగుస్తుందనే ఆశాభావాన్ని భూటాన్ వ్యక్తం చేసింది. ఒప్పందం భారత్కు అవమానమని, తమ దేశానికి విజయం అని చైనా పత్రికలు వర్ణించాయి.చైనాను నిలువరించాలని, సరిహద్దు వివాదాలను ఆయుధమయం కావించాలని చూస్తున్న నరేంద్రమోడీ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అని చైనా టీవీ సిజిటిఎన్ పేర్కొన్నది.
భూటాన్ను తన చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకు అంతర్జాతీయ సంబంధాలు పెట్టుకోకుండా మనదేశం నిలువరించిందనే విమర్శలను చైనా చేసింది. గతంలో భూటాన్ తరఫున సరిహద్దు సమస్యను తమతో చర్చించాలని భారత్ ప్రతిపాదించిందని అది విఫలం కావటంతో భూటాన్ మీద వత్తిడి తెచ్చినట్లు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసింది ఇప్పుడు రెండు సార్వభౌమ దేశాల మధ్యజరిగిన ఒప్పందం గురించి వేలెత్తి చూపితే బలహీన, చిన్న దేశ సార్వభౌమత్వాన్ని భారత్ దెబ్బతీస్తున్నదని ప్రపంచంలో రుజువు అవుతుందని, అందువలనఒప్పందం గురించి భారత్ ఒక ప్రకటన చేస్తుందని భావించటం లేదని కూడా పేర్కొన్నది. బహిరంగంగా ఏమీ చెప్పలేదు కనుక అంతర్గతంగా భూటాన్ మీద వత్తిడి లేదా ఏం చేయాలో చెప్పేందుకు ప్రయత్నిస్తుందని రాసింది.
ఈ ఒప్పందానికి భూటాన్ కట్టుబడి ఉంటే మరోసారి డోక్లాం ఉదంతం పునరావృత అవకాశం లేదు.వర్తమాన ప్రపంచ రాజకీయ పరిణామాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నది చైనా. వాటిలో మన దేశంతో సహా అనేక దేశాలతో చరిత్ర సృష్టించిన సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఒక్కొక్క వివాదాన్ని చైనా పరిష్కరించుకొనే దిశలో ఉంది. ఆ క్రమంలో ఇదొక కీలక అడుగు. నాలుగు వందల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన ఒక్క భూటాన్తో తప్ప మిగిలిన అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను కలిగి ఉంది. అయితే భూటన్కు ఐరాస భద్రతా మండలిలోని ఏ ఒక్క శాశ్వత సభ్యదేశంతో కూడా సంబంధాలు లేవు. ఇదొక విచిత్రమైన స్ధితి. ఈ ఒప్పందంతో చైనాతో సంబంధాలు ఏర్పడితే పెనుమార్పులేమీ సంభవించవుగానీ అమెరికా దాని కుట్రలకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.
ఈ ఏడాది ఆఖరు నాటికి చైనా-భారత వాణిజ్యం గత రికార్డులను బద్దలు కొట్టి వంద బిలియన్ల డాలర్లకు చేరనుందనివార్త. సెప్టెంబరు ఆఖరుకు 90.7బి.డాలర్లుగా ఉంది. ఈ లెక్కన వచ్చే మూడు నెలల్లో నెల సగటు పది బి.డాలర్ల చొప్పునైతే120బి.డాలర్లు లేదా కనీసంగా వంద బి.డాలర్లు అవుతుందని అంచనా. సరిహద్దులో గాల్వన్లోయలో అంత పెద్ద ఉదంతం జరిగినా చైనా వస్తువులను బహిష్కరించాలని ”అపరదేశ భక్తులు” ఎంతగా గొంతు చించుకున్నా, మీడియా ఎంత రచ్చ చేసినా ప్రధాని నరేంద్రమోడీ వాటిని ఎడం కాలుతో తన్నేసి దిగుమతులకు అనుమతులిచ్చారు.వ్యాపారులు తెచ్చుకున్నారు. దీన్ని కొందరు మింగా లేరు కక్కలేరు.2018లో మనం గరిష్టంగా 76బి.డాలర్ల మేరకు దిగుమతులు చేసుకున్నాం, ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నాం అని చెప్పవచ్చు.
రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకున్నా ఆకస్మికంగా వస్తువుల దిగుమతి నిలిపివేయలేరని హాంకాంగ్ నుంచి వెలువడే ఆలీబాబా దినపత్రిక సౌత్ చైనా మోర్నింగ్ పోస్టు పేర్కొన్నది. ఆత్మనిర్భర పేరుతో ముడి పదార్ధాలు, విడిభాగాల కోసం చైనా మీద ఆధారపడకూడదని నరేంద్రమోడీ కోరుకుంటున్నా వెంటనే సాధ్యం కాదని ఆ పత్రిక పేర్కొన్నది.భారత ఎగుమతి సంస్ధల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అజయ సాహీ చైనాతో సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. 2021 సెప్టెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల్లో గతేడాదితో పోలిస్తే చైనా నుంచి 51.7శాతం(68.46బి.డాలర్లకు) దిగుమతులు పెరిగాయి. ఇదే కాలంలో మన దేశ ఎమతులు 42.5శాతం(21.91బి.డాలర్లు) పెరిగాయి. మన దేశ లోటు 46.55బి.డాలర్లు. సంఘపరివార్ అనుబంధ సంస్ధ కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటి) 500 చైనా ఉత్పత్తుల జాబితాను విడుదల చేసి 13బి.డాలర్ల మేరకు 2021లో దిగుమతులను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఇంకేముంది మనం దిగుమతులు నిలిపివేస్తే చైనా వారు మన కాళ్ల దగ్గరకు రావాల్సిందే, ఇదే దేశభక్తి అంటూ వీరంగం వేస్తూ అనేక మంది ఎక్కడికో వెళ్లిపోయారు.2020లో చైనా దిగుమతుల్లో మన వాటా (20.86బి.డాలర్లు) కేవలం 1.2శాతం, 18వ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉన్న జపాన్ 174.87 (పదిశాతం) మరో పదిశాతం ఉన్న దక్షిణ కొరియా నుంచి 172.76, అమెరికా నుంచి 136(7.9శాతం) ఆస్ట్రేలియా నుంచి 114.84(6.6శాతం) ఉన్న దేశాలే చైనాతో బేరాలాడుతున్నాయి. అలాంటి స్ధితిలో మనం చైనాను కాళ్ల బేరానికి రప్పిస్తామని ఏ ధైర్యంతో కొందరు చెబుతున్నారో తెలియదు.
ఇండియా టుడే సమాచారం ప్రకారం 2010లో మనం వంద వస్తువులను దిగుమతి చేసుకుంటే చైనా నుంచి 10.7 ఉండేవి, నరేంద్రమోడీ ఏలుబడిలో 2018నాటికి 16.4కు పెరిగి, 2020లో 13.8కి తగ్గాయి. ఈ ఏడాది గత రికార్డును అధిగమించేట్లుంది. గతేడాది మనం మొత్తంగా 473 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే 65బి.డాలర్లతో చైనా అగ్రస్ధానంలో, రెండవ స్ధానంలో ఉన్న అమెరికా నుంచి 35.6 బి.డాలర్లు, 7.5శాతం చేసుకున్నాము. మనం వంద వస్తువులను ఎగుమతి చేస్తుంటే చైనాకు చేస్తున్నవి కేవలం(2020) 5.3 మాత్రమే. మన గరిష్ట ఎగుమతులు 2010లో 6.5శాతం. అందుకే నిజాలు తెలిసినా మన ఎగుమతుల మీద చైనా ఆధారపడుతోందని కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మన వాణిజ్య లోటు విషయానికి వస్తే 2010లో 19.2 బి.డాలర్లు కాగా 2018లో గరిష్టంగా 63 బి.డాలర్లు. ఈ ఏడాది ఇప్పటికే 46.55 బి.డాలర్లుంది. పదేండ్లలో చైనా నుంచి మన దిగుమతులు రెట్టింపు అయ్యాయి.వాటిని తగ్గించేందుకు దిగుమతి సుంకాలు విధించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చినా ఖరారు కాలేదు. పన్ను విధించినా దిగుమతులు కొనసాగితే ఆ భారం మన వినిమయదారులే భరించాల్సి ఉంటుంది.మనం పన్నులు విధిస్తే చైనా ఊరుకుంటుందా ?
2012లో నాటి చైనా ప్రధాని వెన్జియాబావో – మన ప్రధాని మన్మోహన్ సింగ్ ఇరు దేశాల వ్యాపార లావాదేవీలు 2015నాటికి వంద బి.డాలర్లకు పెంచాలని ఆకాంక్షించారు. తాజా సమాచారాన్ని బట్టి మన ఆత్మనిర్భర, మేకిన్, మేడిన్ ఇండియా పిలుపులిచ్చిన నరేంద్రమోడీ దాన్ని ఈ ఏడాది నెరవేర్చేదశలో ఉన్నారు. 2017-18లో గరిష్టంగా 89.6బి.డాలర్లకు చేరగా ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టారు. త్వరలో 100బి.డాలర్ల రికార్డు నెలకొల్పనున్నారు.కొన్ని వస్తువులను వయా హాంకాంగ్ దిగుమతి చేసుకుంటున్నాము. వాటిని కూడా కలుపుకుంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది. వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2018లో విడుదల చేసిన ఒక నివేదికలో భారత పరిశ్రమపై చైనా వస్తు ప్రభావం గురించి పేర్కొన్నారు. దిగుమతి పన్ను చట్టాలు సరిగా అమలు కావటం లేదని ఔషధరంగంలో ముడి సరకులు, సోలార్ పరికరాల దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. మన ఎంఎస్ఎంఇ పరిశ్రమలు మూతపడుతున్నట్లు కూడా తెలిపారు.
చైనా నుంచి పెరుగుతున్న దిగుమతులు నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న రాజకీయ నేతలు, సంస్ధలు, మీడియాకు, వాటి ప్రచారాన్ని భుజానకెత్తుకున్నవారికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ అంటే అతిశయోక్తి కాదు.వారి విశ్వసనీయతను జనం ప్రశ్నిస్తారు. దీన్ని మరోకోణం నుంచి చూస్తే వీరి చర్యల పర్యవసానాలేమిటో కూడా చూడాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనా నుంచి ఇలాంటి దిగుమతులు లేవు.1990దశకంలోనే ఎగుమతులు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు సంఘపరివార్ శక్తులే అధికారంలో ఉన్నాయి. వారి హయాంలో చైనా నుంచి దిగుమతులు పెరిగాయి తప్ప తగ్గలేదు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది వందలకు పైగా చైనా కంపెనీలు ఉన్నాయి. వాటిలో 75వరకు వినియోగ వస్తువులను తయారు చేసేవే.అంకుర కంపెనీలలో చైనా పెట్టుబడులు 400 కోట్ల డాలర్లు ఉన్నాయి.ఫ్లిప్కార్ట్, పేటియం, ఓలా, బైజూస్ వంటివి ఉన్నాయి. అనేక ఔషధ పరిశ్రమలు చైనా దిగుమతుల మీద ఆధారపడ్డాయి. వీటికి ప్రత్నామ్నాయం చూడకుండా తెల్లవారేసరికి చైనా వస్తువులను బహిష్కరిస్తే నష్టపడేది కోట్లాది మంది సామాన్యులే. చైనాకు నష్టం ఉండదు. అత్యవసర జీవన ఔషధాల తయారీకి వినియోగించే ఎపిఐలో 75శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాము.ఎలక్ట్రానిక్ వస్తువులు, సోలార్ పానెల్స్, రసాయనాల గురించి చెప్పనవసరం లేదు. జనజీవితాలు, పారిశ్రామిక రంగం నుంచి ఇప్పటికిప్పుడు చైనాను పక్కన పెట్టే అవకాశాలు లేవు. అందుకే నరేంద్రమోడీ సర్కారు ఆత్మనిర్భరత , స్వయం సమృద్ధి వంటి ఎన్నికబుర్లు చెప్పినా దిగుమతులను అనుమతించిందన్నది స్పష్టం. లేకపోతే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో అధికారపార్టీకి కష్టం.చైనాలో తయారైన వస్త్రాలను బంగ్లాదేశ్కు తీసుకువచ్చి అక్కడ దుస్తులు తరాయారు చేసి మన దేశానికి ఎగుమతి చేస్తున్నారు. ఇలా అనేక దేశాల నుంచి వేరే రూపంలో చైనా వస్తువులు వస్తున్నాయి. వీటిని అడ్డుకుంటే మన ఎగుమతులూ ఆగుతాయి. జనానికి చౌకగా వస్తువులూ దొరకవు.
మబ్బులను చూసి ముంతలో నీళ్లు ఒలకపోసుకున్నట్లుగా అమెరికాను నమ్మి బొమనం బస్తీమే సవాల్ అని గనుక తారసిల్లితే అంతర్జాతీయ రాజకీయాల్లో నెగ్గుకు రాలేము. అందుకు నిదర్శనం ఆస్ట్రేలియా. ఇప్పుడు నిండా మునిగి చైనాతో వైరం కొని తెచ్చుకుంది. వారిని ముందుకు నెట్టి రెచ్చగొట్టిన అమెరికా ఇప్పుడు తన లాభాన్ని తాను చూసుకొంటోంది. చైనాకు వ్యతిరేకంగా నిలవటం ఒక గౌరవ ప్రదమైన ఘనతగా భావించిన ఆస్ట్రేలియా వెనక్కితిరిగి చూసుకుంటే తన నీడ తప్ప మరొకరు కనిపించని స్ధితికి వెళుతోందని సిడ్నీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జేమ్స్ లారెన్స్సన్ హెచ్చరించాడు.ఆర్ధిక లబ్దికోసం చైనా, రక్షణ అవసరాల కోసం అమెరికా మీద ఎలా ఆధారపడకూడదో ఆస్ట్రేలియా పరిణామాలు వెల్లడిస్తున్నాయన్నారు.2016 రెండవ అర్దభాగం నుంచి చైనాకు వ్యతిరేకంగా మారటం ప్రారంభమైంది. దీంతో చైనా తీసుకున్న చర్యల కారణంగా మద్యం నుంచి బొగ్గువరకు అనేక ఆస్ట్రేలియా ఎగుమతులు ప్రభావితమయ్యాయి.
బలవంతపు వాణిజ్య పద్దతులను వ్యతిరేకించాలని ఆస్ట్రేలియాతో కలసి జపాన్,భారత్ ఉమ్మడి ప్రకటనలు చేయ వచ్చు గానీ జపాన్, భారత్ ఎక్కడా చైనా పేరెత్తేందుకు సిద్దం కాదని, ఇండోనేషియా ఆప్రకటన మీద సంతకం చేసేందుకు సిద్దం కాదని లారెన్స్ సన్ చెప్పారు. మార్చినెలలో ఆస్ట్రేలియాలో అమెరికా రాయబారి మైక్ గోల్డ్మన్ మాట్లాడుతూ మీరు చేస్తున్నదానితో విశ్వాసంతో ముందుకు పోండి,ఆమెరికా ఇతర ప్రజాస్వామిక దేశాలు మీ విజయాన్ని ఎంతో ఆసక్తితో చూస్తాయి అన్నాడు. మిమ్మల్ని రోడ్డు మీద వంటరిగా వదిలేది లేదని మేనెలలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చెప్పాడు. వాణిజ్య దాడులకు ఆస్ట్రేలియా గురైనంత కాలం తాము చైనాతో సంబంధాల మెరుగుదలకు సిద్దం కాదని ఇండో-పసిఫిక్ అమెరికా పార్లమెంట్ సమన్వయకర్త కర్ట్ కాంప్బెల్ సెలవిచ్చాడు. ఆరునెలల తరువాత వాణిజ్య లావాదేవీల వివరాలను చూస్తే చైనా నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఎగుమతుల స్ధానాన్ని అమెరికా కంపెనీలు తమ సరకులతో నింపుతున్నట్లు తేలింది.ఇదేం పని అని అడిగితే అమెరికా ఏమీ మాట్లాడదు. అంతేకాదు అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండో మాట్లాడుతూ చైనా వాణిజ్యాన్ని పెంచుకొనేందుకు తాము చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు. ఉద్రిక్తతలను సడలించేందుకు ముమ్మర వాణిజ్యం తోడ్పడుతుందని సెలవిచ్చాడు.అమెరికా-చైనా వాణిజ్యం తీరుతెన్నులపై ఎనిమిది నెలల సమీక్ష తరువాత అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి మాట్లాడుతూ తాము చైనాతో విడగొట్టుకొనేందుకు బదులు సంధానం చేసుకోవటం గురించి అజెండాను ముందుకు జరపనున్నామని చెప్పింది. ఇవన్నీ చెప్పిన సదరు ప్రొఫెసర్గారు చెప్పిందేమంటే అమెరికా తన సంగతి తాను చూసుకుంటున్నపుడు చైనాతో మనం తగాదా ఎందుకు పడాలని తమ పాలకులను ప్రశ్నించాడు.
ఇది మన దేశానికి వర్తించదా ? మనకూ అలాంటి అనుభవం ఎదురైతేగానీ మోడీ సర్కార్ తన వైఖరిని మార్చుకోదా ? చైనాతో స్నేహం చేసేదీ లేనిదీ పక్కన పెడితే తగాదా అవసరమా ? గాల్వన్ వివాదం మన సైనికుల మరణం విచారకరమే, కానీ అదే చైనా నుంచి మనం రికార్డు స్ధాయిలో దిగుమతులు చేసుకుంటున్నది ఆ తరువాతే కదా ? మనోభావాలతో ఆడుకుంటూ జనంలో దేశ భక్తి, చైనావ్యతిరేకతను రెచ్చగొడుతూ రాజకీయరగా బిజెపి ఉంటే దిగుమతిదారులు తమ లాభాల సంగతి తాము చూసుకుంటున్నారు. నరేంద్రమోడీ వాటిని అనుమతిస్తున్నారు. ఏమి దేశభక్తిరా బాబూ ఇది.
ఒక సోషలిస్టు దేశంగా చైనాను కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తులు అభిమానించవచ్చు. దాని మాదిరి మన దేశం, ఇతర దేశాలూ ముందుకు పోవాలనీ కోరుకుంటారు. అందుకోసం ఉద్యమాలు చేస్తారు తప్ప చైనాతో వాణిజ్యం చేయరు. ఇంతకు ముందు అలా చేసిన నేతలూ లేరు, ఇప్పుడూ లేరు, ఇక ముందూ ఉండరు.చేసేదంతా పారిశ్రామిక,బడా బాబులే, వారికి సహకరించేది అధికారంలో ఉన్న పార్టీల నేతలే. వ్యాపారం వ్యాపారమే. ఎవరికైనా లాభం వస్తేనే చేస్తారు. భారత కమ్యూనిస్టులు ఇక్కడి ప్రజల ప్రయోజనాలకే ప్రధమ పీటవేస్తారు తప్ప మరొక దేశానికి దోచిపెట్టమని ఎక్కడా చెప్పలేదు, చెప్పరు. గాల్వన్ లోయ ఉదంతం సందర్భంగా ప్రధాని అఖిలపక్ష సమావేశంలో చైనా మన ప్రాంతాలను ఆక్రమించలేదని స్వయంగా చెప్పారు. సరిహద్దు వివాదం కొత్తగా తలెత్తింది కాదు. దాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కమ్యూనిస్టులు ప్రత్యేకించి సిపిఎం మొదటి నుంచీ చెబుతోంది. అలా చెప్పిన వారిని దేశద్రోహులుగానూ, చైనాతో తగాదా కోరుకున్నవారిని దేశభక్తులుగానూ చిత్రిస్తున్నారు. దేశభక్తి అంటే చైనాను వ్యతిరేకించటంగా చిత్రీకరిస్తున్నారు. మరి ఆ చైనా నుంచి రికార్డు స్ధాయిలో దిగుమతి చేసుకుంటున్నవారిని, అనుమతిస్తున్నవారిని ఏమనాలి ? దేశద్రోహులా, భక్తులా ?
సామాజిమాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేందుకు బిజెపి దాని మాతృసంస్ధ సంఘపరివారం వెచ్చించే సమయంలో వెయ్యవ వంతు దేశం మీద కేంద్రీకరించినా – ఎందుకంటే దేశమంతటా తామే ఉన్నామని చెబుతున్నారు గనుక ఇక్కడే ఉత్పత్తి పెరిగి చైనా మీద ఆధారపడటం కాస్తయినా తగ్గి ఉండేదేమో ! మన జనాలకు పనీపాటా దొరికేదేమో !
దేశంలో అధికార రాజకీయ క్రీడ ఒక వైపు, దానిలో ఓడిపోకుండా ఉండేందుకు వెంపర్లాట మరోవైపు. ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్య ఒకవారం ఇన్ఫోసిస్ దేశభక్తిని శంకిస్తే మరో వారం కథనంలో అమెజాన్ రెండో తరం ఈస్టిండియా కంపెనీ అని వర్ణించింది. అది ఒక కంటితోనే చూస్తోంది. మరోకంటితో అవలోకిస్తే విదేశీ ఒప్పందాల కోసం నరేంద్రమోడీ సర్కార్ వెంపర్లాడుతున్న దృశ్యం కూడా కనపడి ఉండేది. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అనే అంశం తెలిసినా సర్దుబాటు చేసేందుకు పూనుకున్నారు. చైనాతో వివాదం, తాలిబాన్ల అధికారం మధ్య ప్రభుత్వ వాణిజ్య విధానంలో పెద్ద మార్పు అనే పేరుతో ఒక వార్తా సంస్ధ విశ్లేషణ వెలువడింది. పెద్ద మార్పు అంటే ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ త్వరత్వరగా ప్రయోజనాలు పొందే ఒప్పందాలు చేసుకోనున్నది అని కూడా దానిలో చెప్పారు. కేంద్ర మంత్రులు లేదా ఉన్నతాధికారులతో జర్నలిస్టులు సంభాషించిన తరువాతనే ఇలాంటి విశ్లేషణలు వస్తుంటాయి లేదా పని కట్టుకొని రాయిస్తుంటారు. ఇది మొదటి కోవకు చెందినదే.
ఎందుకు ఇలాంటి విశ్లేషణలు అంటే ప్రతిదాని వెనుక ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు నరేంద్రమోడీ ఎందుకు తొందరపడుతున్నారు ? అధికారానికి వచ్చిన తొలిరోజుల నుంచి కొన్ని సంవత్సరాల పాటు చమురు ధరలు పడిపోవటంతో వచ్చిన వెసులుబాటు నరేంద్రమోడీ ఘనతే అన్నట్లుగా ప్రచారం చేశారు. మీడియా కూడా అదే భజన చేసింది. అది నూతన సాధారణ స్ధాయికి చేరటం, చమురు ధరలు పెరగటంతో ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆరు సంవత్సరాల కాలంలో దేశవృద్ది రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి దిగజారింది. అప్పటి నుంచి ప్రతిదానికీ కరోనాను సాకుగా చూపుతున్నారు. ఇంకేమాత్రం ఆ కబుర్లు నమ్మేందుకు జనం సిద్దంగా లేరు. తొలి నెలల్లో విదేశాల్లో, విమానాల్లోనే మోడీ ఎందుకు కాలం గడుపుతున్నారు అంటే పెట్టుబడుల కోసం అని చెప్పారు. కొత్తగా వచ్చిందేమీ లేదు. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా అన్నారు. ఉన్న ఎగుమతులు కూడా తగ్గాయి. తరువాత చైనా నుంచి ఇతర దేశాల కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెప్పారు. వాటి జాడలేదు.
ఇప్పుడు ఆత్మనిర్భరత, ఉత్పత్తి, ఎగుమతుల ఆధారిత రాయితీలంటూ విఫల పధకాన్ని మరోసారి ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు విదేశాలతో ఒప్పందాలని హడావుడి చేస్తున్నారు.చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలు ఒకవైపు ఎగుమతులు-మరోవైపు తమ పౌరుల కొనుగోలు శక్తి పెంచేవిధంగా ఆదాయాల పెంపు వంటి విధానాలను అనుసరిస్తున్న కారణంగా అవి ముందుకు పోతున్నాయి. రెండవది జరగకుండా ఎగుమతులతో ముందుకు పోవాలని మోడీ సర్కార్ ఆత్రంగా ఉంది. అలాంటి విధానాలను అనుసరించిన లాటిన్ అమెరికా దేశాల అనుభవాలను ఏమాత్రం పట్టించుకున్నట్లు కనపడదు.
ఎగుమతులు, పెట్టుబడుల ఆకర్షణకు సమగ్ర ఒప్పందాలు కుదరాలంటే ఏండ్లూ పూండ్లూ పడుతుంది. ఏ దేశానికి ఆ దేశం తమకే పెద్ద పీట అంటే మీ దేశానికి వస్తే మాకేమి ఇస్తావు, మాదేశం వస్తే మాకేం తెస్తావు అన్నట్లుగా ఉన్నాయి. బేరాలాడుతున్నాయి. చైనాతో తగాదా పెట్టుకొన్న మోడీ కౌగిలింతల భాగస్వామి డోనాల్డ్ ట్రంప్కు ఏ గతి పట్టిందో చూసిన తరువాత ఎవరికి మాత్రం ఆందోళన, ఆత్రం ఉండదు ! ఎన్నికలు, రాజకీయాలు నిలవనీయవు కదా ! తక్షణ ఫలితాలను జనానికి చూపాలి, అందుకు గాను ఏదో ఒకటి చేయాలి మరి. అందుకే వెంటనే అమల్లోకి వచ్చే తాత్కాలిక ఒప్పందాలు అని చెబుతున్నారు. నిజమే కదా… చేసుకుంటే తప్పేమిటి ? కోడలు మనవడిని కంటానంటే అత్త వద్దంటుందా అన్న సామెత తెలిసిందే.(ఇది ఆడపిల్లల పట్ల వివక్షే అని వేరే చెప్పనవసరం లేదు) మన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గారు గత ఏడాది జరిగిన 290బిలియన్ డాలర్ల ఎగుమతులను 2022లో 400బి.డాలర్లకు(40వేల కోట్లు) పెంచాలని, 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్లకు పెంచాలని చెపుతున్నారు. ప్రస్తుతం కనీసం ఇరవై దేశాలతో ఒప్పందాల సంప్రదింపులు జరుపుతున్నారు. ఆస్ట్రేలియా,బ్రిటన్, ఐరోపాలోని మరికొన్నింటితో క్రిస్మస్లోగా ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీలతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చూస్తున్నారు.గతంలో మేకిన్, మేడిన్ ఇండియా ప్రచారంలో భాగంగా ఇలాంటి రాయితీల ఆశ చూపినా ప్రయోజనం కలగలేదు. తమకు దేశ ప్రయోజనాలు ముఖ్యం కనుక దేశాలతో ద్విపక్ష ఒప్పందాలకు అనుకూలమే అని స్వదేశీ జాగరణ మంచ్ సహకన్వీనర్ అశ్వనీ మహాజన్ చెప్పారు. కరోనా సమయంలో వాణిజ్యలోటు తగ్గింది, ఇప్పుడు తిరిగి గణనీయంగా పెరుగుతోంది.
2019లో కుదిరిన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్సిఇపి)ని జనవరి నుంచి అమల్లోకి తెచ్చేందుకు చైనా, ఇతర ఒప్పంద దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే 15దేశాలకు గాను పది దేశాలు సంతకాలు చేశాయి. ఇది ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య ఒప్పందం. ఆసియన్ కూటమిలోని ఆరు, ఇతర దేశాల్లో మూడు సంతకాలు చేసిన తరువాత రెండు నెలల్లో ఇది అమల్లోకి వస్తుంది. అనుకున్నట్లుగా అమల్లోకి వస్తే ఆ దేశాలకు చెందిన 91శాతం వస్తువులు ముఖ్యంగా పారిశ్రామిక వస్తువులపై పన్నులు పూర్తిగా రద్దు లేదా నామమాత్రం అవుతాయి. తాను లేని ఈ ఒప్పందాన్ని అమెరికా ముందుకు పోనిస్తుందా అన్న ప్రశ్న ఎలాగూ ఉంది. ఒకవేళ అమలైతే మన దేశానికి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఏ దేశం ముందుకు వస్తే వారితో వెంటనే ఏదో ఒక ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎగుమతుల్లో పురోగతి లేక దిగుమతులు పెరిగి చెల్లింపుల సమస్య తలెత్తితే 2024 ఎన్నికల్లో ఎదురీదక తప్పదు.
మన దేశానికి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కొత్త కాదు.మన దేశం ఇప్పటి వరకు వివిధ దేశాలతో పెట్టుబడులకు సంబంధించి 86 ఒప్పందాలు చేసుకుంది. వాటిలో పదమూడు మాత్రమే అమల్లో ఉన్నాయి.వివాదాల కారణంగా అనేక ఒప్పందాల నుంచి వైదొలిగాము. అయితే గత అనుభవం ఏమంటే మన ఎగుమతులకు బదులు దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అంటే లబ్ది ఇతర దేశాలకు కలిగింది.2001లో మన వాణిజ్యలోటు ఆరుబిలియన్ డాలర్లు ఉంటే 2017నాటికి 109బి.డాలర్లకు పెరిగింది. ఒప్పందం చేసుకున్న దేశాలలో ఒక్క శ్రీలంకతో మాత్రమే మనకు మిగులు ఉంది. 2011-17 మధ్య జపాన్, దక్షిణ కొరియాతో వాణిజ్యలోటు రెట్టింపైంది. చైనా విషయానికి వస్తే 50శాతం పెరిగింది. దీంతో రెండు అంశాలు ముందుకు వచ్చాయి. దిగుమతి వస్తువులతో వాణిజ్యం చేసే వారు లబ్ది పొందారు. అవే వస్తువులను మన దేశంలో తయారు చేసే సంస్ధలు పోటీని తట్టుకోలేక మూతపడ్డాయి. మన్మోహన్ సింగ్ హయాంలో, అంతకు ముందు చేసుకున్న ఒప్పందాల సారమిదే. వాటికి వ్యతిరేకంగానే ఆర్ఎస్ఎస్ స్వదేశీ జాగరణ మంచ్ అనే ఒక సంస్ధనే రంగంలోకి తెచ్చింది. మన్మోహన్ సింగ్ చివరి సంవత్సరాలలో కొన్ని ఒప్పందాలను సమీక్షించాలన్నంత వరకు ఆలోచన చేశారు. దాని ప్రభావం తరువాత ఏలుబడిలోకి వచ్చిన మోడీ సర్కార్ మీద పడి కొత్త ఒప్పందాలేవీ చేసుకోలేదు. ఆర్సిఇపిలో చేరకూడదని నిర్ణయించింది.
ఏ ఒప్పందం చేసుకున్నప్పటికీ అది ఆ దేశ వాణిజ్య పోటీతత్వం మీద ఆధారపడి ఉంటుంది. స్విడ్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఐఎండి సంస్ధ ప్రకటించే ప్రపంచ పోటీతత్వ సూచికలో 64దేశాలలో మనం 2021లో 43వ స్ధానంలో ఉండగా చైనా 16 దగ్గర ఉంది. గత ఐదు సంవత్సరాల సూచికలను చూస్తే మనం 45 నుంచి 43కు పెంచుకుంటే చైనా 18 నుంచి 16కు ఎదిగింది. 2017 నుంచి వరుసగా 45,44,43,43,43 సూచికలతో మనం ఉండగా చైనా 18,13,14,20,16తో ఉంది. ప్రస్తుతం మనం ఒప్పందాల కోసం సంప్రదింపులు చేసే దేశాలన్నీ మన కంటే మెరుగైన సూచికలతో ఉన్నందున మనం పోటీ పడగలమా ?
తమ వైఫల్యాలను జనం గ్రహించకముందే ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంలో మోడీ సర్కార్ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతి దేశమూ రక్షణాత్మక చర్యలను అమలు జరుపుతోంది. మనం ఆర్సిపిఇలో చేరకపోవటం కూడా దానిలో భాగమే.గత స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి ముందే చెప్పుకున్నాము. ఆ కారణంగానే గత ఏడు సంవత్సరాలలో వాటి పట్ల మోడీ సర్కార్ పెద్దగా మొగ్గుచూపలేదు. ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్ (ఎస్జెఎం) అలాంటి ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ప్రచారం చేయటం కూడా దీని కారణాల్లో ఒకటి. అయితే వాణిజ్య, పారిశ్రామికవేత్తల నుంచి ఇటీవలి కాలంలో వత్తిడి పెరుగుతోంది. అందుకే వారి ఉత్పత్తులకు మార్కెట్లను వెతికేపనిలో భాగంగా ఐరోపా యూనియన్, విడివిడిగా వివిధ దేశాలో ఒప్పందాలు చేసుకొనేందుకు పూనుకుంది. అయితే ఆ దేశాలు విధించే షరతులు బిజెపి ఓటు బ్యాంకుగా ఉన్న చిన్న వ్యాపారులు, చివరికి పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు సైతం మింగుడు పడక ముందుకు సాగటం లేదు. మరోవైపు అలాంటి ఒప్పందాలను ప్రపంచ వాణిజ్య సంస్ధలో సవాలు చేసే అవకాశం కూడా ఉంది. అందువలన తాత్కాలిక ఒప్పందాల ముసుగులో పని కానివ్వాలని చూస్తున్నారు.
కరవమంటే కప్పకు కోపం-విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా పరిస్ధితి ఉంది. అనేక వస్తు దిగుమతులపై రక్షణాత్మక చర్యల్లో భాగంగా పన్నులను పెంచారు. ఇప్పుడు వాటిని తగ్గించకపోతే విదేశాలు ముందుకురావు, తగ్గిస్తే స్ధానిక సంస్ధలు నష్టపోతాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యరాజ్యాల మధ్య ప్రత్యేక ఒప్పందాలు కుదిరితే మిగతా దేశాలకు కూడా వాటిని వర్తింప చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే వివాదాలే. తాత్కాలిక ఒప్పందాలకు కాలపరిమితిని స్పష్టం చేయాల్సి ఉంటుంది, అది అనిశ్చితికి దారితీస్తుంది. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో నామమాత్ర పన్నులు విధించే చర్యలకు త్వరలో మంగళం పాడే అవకాశం ఉంది. ఏ బహుళజాతి కంపెనీ ఎక్కడ పెట్టుబడులు పెట్టినా పదిహేనుశాతం పన్ను విధించాలన్న ఒప్పందాన్ని అంగీకరించిన 140కి గాను 136 దేశాలు సంతకాలు చేశాయి. దీనివలన దేశాల మధ్య పోటీ నివారణ అవుతుందని భావిస్తున్నారు. అది అమల్లోకి వస్తే ద్విపక్ష ఒప్పందాలు ఏమౌతాయో తెలియదు.
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు, ద్విపక్ష పెట్టుబడి ఒప్పందాల తీరుతెన్నులు చూసినపుడు కొన్ని అంశాలు స్పష్టం అయ్యాయి.ప్రజల,పర్యావరణాన్ని ఫణంగా పెట్టి బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు పెద్ద పీట వేసే సాధనాలుగా పని చేస్తాయి. 1950-70దశకం వరకు నూతనంగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాల్లోని వలస దేశాల పెట్టుబడుల రక్షణకు వీటిని సాధానాలుగా చేసుకున్నారు. తరువాత స్వేచ్చామార్కెట్ పేరుతో వాటిని మరింత ఎక్కువ చేశారు. ఇప్పుడు మూడువేలకు పైగా పెట్టుబడి రక్షణ ఒప్పందాలున్నాయని అంచనా.వీటిని ఆధారం చేసుకొని అనేక కంపెనీలు ప్రభుత్వాలతో వివాదాలకు దిగాయి. పన్నుల తగ్గింపు లేదా అసలు కొన్నింటిపై పన్ను లేకుండా చేస్తారు. ఈక్రమంలో వాణిజ్యపోటీలో నిలిచే పేరుతో కార్మికుల వేతనాల తగ్గింపు, బేరమాడేశక్తి లేకుండా చేసే కార్మిక చట్టాలను వారి మీద రుద్దుతారు.ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు జనాన్ని అప్పగిస్తాయి. ఐరోపా ఫ్రీ ట్రేడ్ ఏరియా(ఇఎఫ్టిఏ), ఐరోపా యూనియన్తో 2007-08లోనే చర్చలకు నాంది పలికాము. వారి కార్లు, మద్యం దిగుమతులకు అంగీకరించాము. మన ధాన్యసేకరణ రంగం, బీమా, బాంకు, ఇతర ఆర్ధిక సేవల రంగంలో ప్రవేశానికి అనుమతించాలన్న వత్తిడి కారణంగా 2013లో అవి నిలిచిపోయాయి. తిరిగి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
మోడీ సర్కార్ ముందుకు తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో ధాన్యసేకరణ ప్రయివేటును అనుమతించే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. నరేంద్రమోడీ సర్కార్ కరోనా సమయంలో ఎలాంటి చర్చకు వీల్లేకుండా ఆదరాబాదరా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఆ క్రమంలో భాగమే. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన వస్తున్నది, పదినెలలుగా సాగుతున్న రైతు ఉద్యమం దానిలో భాగమే.దీన్ని అణచివేసిన తరువాత కార్మిక హక్కులను హరించేందుకు అవసరమైన బిల్లులను సిద్దం చేశారు. అనూహ్యమైన రైతు ఉద్యమం కారణంగా సమయం కోసం చూస్తున్నారు. కార్పొరేట్లపై పన్ను తగ్గింపు కారణంగా తలెత్తిన లోటును పూడ్చుకొనేందుకు, కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు కల్పించేందుకు ప్రజల మీద పన్ను భారాలు మోపుతారు. పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను, సెస్సుల మర్మమిదే. పెరుగుతున్న ధరలకు అనుగుణ్యంగా రైతులకు సబ్సిడీలను పెంచకుండా నామమాత్రం చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఎరువుల సబ్సిడీ ఏటా 70-80వేల కోట్ల మధ్యనే ఉంచటమే దానికి నిదర్శనం. ప్రతిపాదిత విద్యుత్ బిల్లు ప్రకారం విద్యుత్ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదని చెప్పటం కూడా దానిలో భాగమే. రాష్ట్ర ప్రభుత్వాలకు క్రాస్ సబ్సిడీ అవకాశాలను ఎత్తివేస్తారు. ముందుగా వినియోగదారులనుంచి వసూలు చేసి తరువాత వారి ఖాతాలో జమచేసే విధానాన్ని తీసుకురానున్నారు. వంటగ్యాస్ మాదిరి ధరలు పెంచుకుంటూపోయి నామమాత్రం చేస్తారు. రాష్ట్రాలకు అధికారం లేకుండా నియంత్రణ కమిషన్ల పేరుతో చట్టసభల అవకాశాలను పరిమితం చేసి కాలక్షేప కేంద్రాలుగా మార్చివేస్తారు. ఇవి చట్టసభలకు జవాబుదారీగా ఉండవు.
రైతాంగానికి, పరిశ్రమలకు నష్టం అనే వైఖరి తీసుకున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల వత్తిడి, ఆందోళనల కారణంగా, హిందూ మత, మితవాదుల మాతృక ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్ తదితర సంస్ధల వైఖరి వలన మోడీ సర్కార్ ఆర్సిఇపిలో చేరలేదు.అది హ్రస్వ దృష్టికి నిదర్శనమని విదేశాంగశాఖ మాజీ అధికారి శ్మామ్ సరణ్ వంటి వారు విమర్శించారు. మరోవైపు అదే మోడీ సర్కార్ ఇతర దేశాలతో స్వేచ్చా, ద్విపక్ష ఒప్పందాల కోసం వెంపర్లాడుతోంది. ఇప్పుడు అదే జాగరణమంచ్ దేశం కోసం ఇవి అవసరం అని కొత్త పల్లవి అందుకుంది. తాము బహుళ దేశాలతో కూడిన వాటికి తప్ప ద్విపక్ష ఒప్పందాలకు అనుకూలం అంటోంది. చిల్లు కాదు తూటు అన్నట్లుగా ఆర్సిఇపి ఒప్పందంలోని అంశాలే వీటిలో కూడా ఉంటాయి, నాడు దాన్నెందుకు తప్పన్నారు, నేడు వీటినెందుకు ఒప్పంటున్నారు ? విదేశీ రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు వరుసలు కట్టి వస్తున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా యూనియన్, గల్ఫ్ సహకార సంస్ధ, యుఏయి, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఉన్నాయి. పూర్వం గ్రామాల్లో హరికథలు, బుర్రకథలు, ఇతర కళారూపాలను ప్రదర్శించేవారు. గ్రామపెద్దలు, పౌరుల నుంచి పెద్ద మొత్తంలో కానుకల కోసం అబ్బో మీ ఊరు చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతుగడ్డ, మీది పెద్ద చేయి అంటూ పొగిడేవారు. ఇప్పుడు మన మార్కెట్ మీద కన్నేసిన దేశాలన్నీ అలాంటి పొగడ్తలే కురిపిస్తున్నాయి, మనకు బిస్కెట్లు వేస్తున్నాయి.
స్వదేశీ కంపెనీలకు రక్షణకు కట్టుకున్న మడిని పక్కన పెట్టి మోడీ సర్కార్ మంత్రులు, అధికారులు వీటితో మాట్లాడుతున్నారని గ్రహించాలి. వచ్చే ఏడాది మార్చినాటికి బ్రిటన్తో, తరువాత ఆస్ట్రేలియాతో తాత్కాలిక ఒప్పందాలు కుదురుతాయని చెబుతున్నారు. ఐరోపా,ఆస్ట్రేలియా వంటి దేశాలతో అంటే వాటి పాల ఉత్పత్తులు మన మార్కెట్ను ముంచెత్తుతాయి. అప్పుడు పాల ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాల రైతులు కూడా ఢిల్లీ వద్ద నిరసనలకు దిగకతప్పదు. ఐరోపా యూనియన్నుంచి బయటకు వచ్చిన బ్రిటన్కు ఇప్పుడు ఇతర దేశాలతో ఒప్పందాలు అవసరం గనుక అది వెంటపడుతోంది. చైనాతో వివాదం వచ్చింది కనుక ఆస్ట్రేలియా తన ఉత్పత్తులను మన దేశంలో విక్రయించాలని చూస్తోంది. ఎలక్ట్రానిక్స్, టెలికాం పరికరాల కోసం చైనా మీద ఆధారపడకుండా ఉండాలంటే బ్రిటన్తో ఒప్పందం అవసరమని స్వదేశీ జాగరణ మంచ్ నేత అశ్వనీ మహాజన్ వాదిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాతో మన వాణిజ్యం మిగులుతో ఉంది. కనుక తన వ్యవసాయ, పాడి, కోళ్ల ఉత్పత్తులను మన మార్కెట్లో కుమ్మరించాలని చూస్తోంది. దానికి అంగీకరిస్తే మన రైతాంగం నష్టపోతుంది. తన ఆయుధాలు, చమురుతో పాటు వీటిని కూడా దిగమతులు చేసుకోవాలని మన మీద వత్తిడి తెస్తోంది.
అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు కుదుర్చుకొనే ద్విపక్ష ఒప్పందాలలో కార్మికులకు సంబంధించి ప్రపంచ కార్మిక సంస్ధ(ఐఎల్ఓ) ఆమోదించిన ఎనిమిది కీలక అంశాల అమలును ఒక షరతుగా పెడతాయి. యజమానులకు ఇష్టమైనపుడు కార్మికులను పెట్టుకొనే, లేనపుడు తొలగించే, అసలు సంఘాలు పెట్టుకోవటాన్నే అసాధ్యం చేసే విధంగా కార్మిక చట్టాలను మార్చేందుకు పూనుకన్న మోడీ సర్కార్ మరి వాటిని ఎలా అంగీకరిస్తుంది. అంగీకరించి అమలు జరపకపోతే కార్మికులు ఊరుకుంటారా ? ఈ మార్పులను చివరికి సంఘపరివార్ సంస్ధ బిఎంఎస్ కూడా అంగీకరించటం లేదు. నిజంగా దేశానికి తద్వారా మన జనాలకు మేలు కలిగించే ఇలాంటి ఒప్పందాలు చేసుకోవటానికి చైనాతో వివాదం, తాలిబాన్ల అధికారం వంటి పరిణామాలను సాకుగా చూపటం అవసరమా అనే ప్రశ్నలు అడగకూడదు. అపర దేశభక్తులు చెప్పింది వినాలి తప్ప బుర్రతో ఆలోచించకూడదు. మోడీ ప్రారంభించిన ఒప్పందాల తీరుతెన్నులు గతంలో మన్మోహన్ సింగ్కు తెచ్చిన తలనొప్పులనే పునరావృతచేస్తాయా ? మోడీ దూకుడు అలానే ఉంది మరి.
మైకోల్ డేవిడ్ లించ్ అమెరికా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, యువ కమ్యూనిస్టు లీగ్ ప్రధాన కార్యదర్శి. 2012 సెప్టెంబరు పదవ తేదీన అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్సైట్లో రాసిన ఒక విశ్లేషణ ప్రపంచంలోని వామపక్ష, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఉపయోగపడేదిగా ఉందని భావించి దాని అనువాదాన్ని ఇక్కడ ఇస్తున్నాను. అమెరికా కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తేడాలు ఉన్నాయి. అయితే పార్టీలలో, కొన్ని గ్రూపులు, వ్యక్తులలో ఉన్న కొన్ని వక్రీకరణలు, పెడధోరణులు, కొన్ని సమస్యలపై వైఖరులను సవరించుకొనేందుకు తోడ్పడవచ్చు. ఉదాహరణకు అగ్రవర్ణాలు లేదా ఆధిపత్య కులాలకు చెందిన వారు విప్లవోద్యమాలకు నాయకులుగా ఉండకూడదు, వారిని నమ్మలేము అని చెప్పేవారు, ఒక కులం వారు మొత్తం దొంగలే అని సూత్రీకరించిన ఒక ప్రొఫెసర్ భావజాలానికి మూలం ఏమిటి ? దళితులు మాత్రమే దళితులను విముక్తి చేసుకోగలరు వంటి సూత్రీకరణల నేపధ్యం వంటి కొన్ని అంశాలను సరైన కోణంలో చూసేందుకు ఈ విశ్లేషణ దోహదం చేయవచ్చు. నూరు పూవులు పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నదానిలో విశ్వాసం ఉన్నవారందరూ చదవాల్సిన అంశమిది. ” సమూల మార్పు కోరుతున్న నేటి యువత దృక్కోణం ” అనే శీర్షికతో రాసిన విశ్లేషణ సమీక్షకు వేరే శీర్షికను నేను జత చేశాను. దాని పూర్తి పాఠం ఇలా ఉంది. ఆంగ్ల మూలపు లింక్ను కూడా కింద జతచేశాను.
సమూల మార్పు కోరుతున్న నేటి యువత దృక్కోణం ! మైకోల్ డేవిడ్ లించ్ విద్యార్ధులు,యువతను సంఘటిత పరచటం మొత్తగా ” సమయాన్ని వృధా ” చేయటమేనబ్బా ! వామపక్ష వాదులు నిర్వహిస్తున్న, నేను పని చేస్తున్న సమూహాలు కొన్నింటిలో ఇటీవల నేను వింటున్న మాట ఇది. ఇలా చెప్పటం సరైనదేనా అని నేను చర్చకు పెట్టినపుడు తొలుత ముందు చెప్పిన వైఖరిని తీసుకున్నవారు ” సరే యువ కార్మికులను సంఘటిత పరచటం గురించి కేంద్రీకరిద్దాం. వారిని మార్చగలము, విద్యార్ధుల కంటే మరింత విశ్వసనీయంగా మొగ్గుతారు ” అని తమ వైఖరిని మార్చుకున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే నేను ఒకప్పుడు కాలేజీ విద్యార్ధిని. మూడు ఉద్యోగాలు చేశాను, ఆసియన్ రెస్టారెంట్లలో రెండు, చిల్లర దుకాణంలో ఒకటి.చదువుకొనేందుకు నాకు సమయం ఉండేది కాదు, అయితే ఏదో విధంగా గ్రాడ్యుయేట్ కాలేజీలో కూడా అంగీకరించేందుకు అవసరమైన మంచి గ్రేడ్లు తెచ్చుకున్నాను. అయితే నేను ఎన్నడూ ఒక కార్మికుడిని అనుకోలేదు. మీరు విద్యార్ధా లేక కార్మికుడా అని అప్పుడు కొందరు నన్ను అడిగారు. తర్కబద్దమైన, ప్రత్యక్ష సమాధానంగా రెండూ అని ఉండేది. దాన్ని గురించి ఇప్పుడు ఆలోచిస్తే మరింత స్పష్టమైన నా సమాధానంగా నేను పూర్తి కాలం పని చేస్తాను, పూర్తి కాలం చదువు కుంటాను అని చెప్పివుండే వాడిని. కరోనా మహమ్మారి మధ్యలో 2020డిసెంబరులో జరిగిన ఒక సర్వే ప్రకారం 70శాతం మంది కాలేజీ విద్యార్ధులు కూడా పని చేశారు. కనుక వారు చదువుకుంటూ పని చేస్తున్నందున విద్యార్ధులా కార్మికులా అన్న తేడాను చూడాల్సిన అవసరం లేదు. కాలేజీ రోజుల్లో పని చేయని వారు డిగ్రీ తరువాత కార్మికశక్తిలో చేరతారు. నలభై ఒక్కశాతం కాలేజీ విద్యార్ధులు వారు కేంద్రీకరించిన డిగ్రీ- చేసిన పనికి సంబంధం లేదని తేలింది. అంతిమంగా వారు చదివిన డిగ్రీకి పని చేసే రంగానికి సంబంధం ఉండదు. కాబట్టి విద్యార్దులను సంఘటిత పరచటం సాధ్యం కాదు అని కొట్టిపారవేయటం మన కార్మికవర్గంలో గణనీయ భాగాన్ని విస్మరించటమే.
ఇప్పుడు మరొక వాదన గురించి చూద్దాం.” విద్యార్ధులు అంత విశ్వసనీయులు కాదబ్బా ”. కాలేజీ డిగ్రీలేని కార్మికుల గురించి కూడా అదే మాదిరి చెప్పవచ్చు.జనం జనమే. కమ్యూనిస్టు పార్టీలో, కమ్యూనిస్టు యువజన సంఘంలో గానీ కొందరు సభ్యులు వారు ఇరవైల్లో ఉన్నా అరవైల్లో ఉన్నా సమావేశాలకు రారబ్బా అని తరచూ చెబుతుంటారు. అది నిజం, ఒక ఇరవై ఏండ్ల వయస్కులకు కుటుంబం , స్కూలు, పని వంటి బాధ్యతలు ఎక్కువగా ఉండవచ్చు. దీని అర్ధం 60ఏండ్ల కామ్రేడ్లకు తమ పిల్లలు, మనవలు, పని వంటి బాధ్యతలు లేవని, నిర్వహించటం లేదని కాదు. మిలీనియల్స్లో అరవైశాతం మంది(24-39 ఏండ్ల వారు) పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక రకమైన సోషలిజంతో ఏకీభవిస్తున్నారు. ఈ తరం యువజన తరగతి నుంచి బయట పడటం ప్రారంభమైంది. వారిని మనం విస్మరించకూడదు, వారి మనోభావాలను మరింత పటిష్టపరచాలి. మనం ఒకటి గుర్తుకు తెచ్చుకోవాలి. పౌరహక్కుల ప్రదర్శనలు, బస్ బహిష్కరణలు, అహింసాత్మక బైఠాయింపులకు దారి తీసింది విద్యార్ధి ఉద్యమాలే. పచ్చి మితవాది ట్రంప్ పాలనలో కరోనా మహమ్మారి సమయంలో నల్లజాతీయుల సమస్యల ఆందోళనలు,వలస-కస్టమ్స్ నిబంధనల అమలు రద్దు ఉద్యమాలకు నాయకత్వం వహించింది యువతరమే అన్నది మరచిపోకూడదు. విప్లవ లక్ష్యాల సాధనకు గాను ప్రజాస్వామిక పోరాటాలు, కార్మిక పోరాటాలకు అవసరమైన భవిష్యత్ తరాలను సిద్దం చేయాలని లెనిన్ ఇచ్చిన పిలుపు ఇలాంటి యువతరం గురించే.( దీనిలో భాగంగా ఇటీవలనే యువకుల కోసం పార్టీ మార్క్సిస్టు తరగతులను విజయవంతంగా నిర్వహించింది).
కరోనా సమయంలో నిరుద్యోగులు, దారిద్య్రంలో కూరుకుపోయిన వారి కోసం పరస్పర సహాయ కార్యక్రమాలు, ఎన్నికలలో అక్రమాలు జరిగాయని డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపిన కమ్యూనిస్టు యువత పార్టీకి ఎలా దారిచూపిందో నేను గుర్తు చేస్తున్నాను. ఈ యువ కమ్యూనిస్టులు క్యూబాకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు. నల్లజాతీయుల జీవన సమస్యల ప్రదర్శనల నిర్వహణకు వీరిని ఆహ్వానించారు. ఈ యువకార్యకర్తలలో ఎక్కువ మంది విద్యార్ధులు, మిగిలిన వారిలో కాలేజీ డిగ్రీలు లేని, నిరుద్యోగ లేదా ఉద్యోగాలు చేస్తున్న కార్మికులు ఉన్నారు. మరో మాటలో చెప్పాలంటే మార్పు కోరుకుంటున్న క్రమపు ఉత్పత్తే ఈ యువ కమ్యూనిస్టులు, అదే వీరిని కమ్యూనిస్టు పార్టీ , కమ్యూనిస్టు యువజన సంఘం వైపు నడిపించింది. వారు ఉద్యమంలోకి కాలేజీలు, పుస్తక క్లబ్లు, లేదా ఆన్లైన్లో చేరటం వంటి వాటి ద్వారా వచ్చారు, సమిష్టి విప్లవ క్రమంలో పోషించే తమ పాత్రను తెలుసుకుంటూ యువ కమ్యూనిస్టులు భాగస్వాములవుతున్నారు.మార్పు కోరుకొనే క్రమాలన్నీ భిన్నంగా ఉండవచ్చు. ఒక సమావేశానికి లేదా ఒక కార్యక్రమానికి రాలేదనో మరోకారణంతోనో యువ కార్యకర్తలను మనం వదలిపెట్ట కూడదు. సామాజిక మాధ్యమం, కరపత్రాలు, చిత్రాలు గీయటం వంటి ఏదో ఒక కార్యక్రమంలో వారు ఒక పాత్ర పోషించే విధంగా చూడాలి.
2020దశకంలో మార్పుకోరుకొనే క్రమంలో అనేక మంది యువకులు స్వీయ అధ్యయనం, ఆన్లైన్లో ఇతర వామపక్ష యువజన బృందాలతో చర్చల ద్వారా వామపక్షం వైపు వస్తున్నారు, ప్రత్యేకించి కరోనా సమయంలో క్వారంటైన్ లేదా ఇండ్లలోనే ఉన్నపుడు ఇది జరిగింది. ఈ మార్పు క్రమాన్ని అమెరికా కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిస్టు యువజన సంఘం ఆహ్వానిస్తున్నది. ఇది గందరగోళపరుస్తుందని కూడా మాకు అవగాహన ఉంది. ఉదాహరణకు ఇంటర్నెట్లో ఒక బహుళ ప్రచారం జరుగుతోంది. అదేమంటే ” తెల్లజాతి కార్మికులు విప్లవకారులు కాలేరు. ఎందుకంటే ప్రపంచ పేద దేశాలు, రంగుజాతి కార్మికుల దోపిడీ మీద వారు ఆధారపడతారు ”. నా అభిప్రాయం ఏమంటే ఇది తృతీయ ప్రపంచ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన శ్వేతజాతి మావోయిస్టుల ప్రచారం.” మైథాలజీ ఆఫ్ ద వైట్ ప్రోలటేరియట్ ” అనే జె సాకాయి గ్రంధం చదవిన తరువాత ముందుకు తెచ్చారు. ఇది మార్క్సిస్టు వ్యతిరేకమైనదే కాదు, రంగు, జాతితో నిమిత్తం లేకుండా అన్ని ఖండాల కార్మికులు ఐక్యం కావాలని పిలుపు ఇచ్చి స్వయంగా ప్రయత్నించిన తెల్లవారైన ఐరోపాకు చెందిన మార్క్స్, ఎంగెల్స్, లెనిన్కు వ్యతిరేకమైనది. రాజకీయ మార్పు విషయానికి వస్తే ఎలాంటి కార్యాచరణకు పూనుకోకుండా తెలివిగా తప్పించుకొనే సాకును ఇది అందిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీల వంటి సంస్ధలు కార్మికులనందరినీ ఐక్యం చేయాలని చూస్తుంటే ఈ పుస్తకం చదివిన తరువాత నలుపు లేదా గోధుమవర్ణం విద్యార్ధి గానీ పోరాటంలో పాల్గొనేందుకు విముఖత చూపుతాడు. సాకీ ముందుకు తెచ్చిన నిరాశావాదం వారిని తాము మైనారిటీలమని, అమెరికాలో తెల్లజాతీయులు మెజారిటీ కనుక సోషలిజానికి అవకాశం లేదనే నిర్దారణకు వచ్చేట్లు చేస్తుంది.
వలసలుగా చేసుకోవటాన్ని, సామ్రాజ్యవాదాన్ని ఓడించాలని మార్క్సిస్టులు అంగీకరిస్తారు. అదే సమయంలో ఒక జాతి వారు విప్లవకారులు కాదని లేదా విప్లవ వ్యతిరేకులని మనం వేరు చేయకూడదు.శ్వేతజాతీయులను విప్లవ వ్యతిరేకులని, కార్మికవర్గం కాదనే స్వభావ చిత్రీకరణ చేయటం మధ్య తరగతి తీవ్రవాదంలో భాగం. దీనికి విప్లకారులు, కార్మికులు, మార్క్సిస్టు-లెనినిస్టు సిద్దాంతానికి సంబంధం లేదు. ఇప్పటికీ మీరు అంగీకరించటం లేదా ? రష్యన్లు స్లావిక్ జాతికి చెందిన వారు కనుక, స్లావ్లు చారిత్రకంగా ఆర్మీనియా, అజరబైజాన్, జార్జియన్లను, కాకసస్ పర్వత ప్రాంతాలను రష్యన్ సామ్రాజ్యంలో వలసవారిగా చేసుకున్నారు గనుక అక్టోబరు విప్లవాన్ని రష్యన్లు నిర్వహించకూడదని, లేదా దానికి విరుద్దంగా ఆర్మీనియన్లు, అజర్బైజానియన్లు,జార్జియన్లు మాత్రమే నడపగలరు అని లెనిన్ చెప్పి ఉంటే ఏమిజరిగేదో ఊహించుకోండి.ఈ మన:ప్రవృత్తిని బోల్షివిక్లు తలకు ఎక్కించుకొని ఉంటే ఏం జరిగేదో ఊహించుకోండి. ఎంతో దూరం అవసరం లేదు, నేను కచ్చితంగా చెప్పగలను. కార్మికవర్గ ఐక్యతను నిరోధించే ఏ ” విప్లవ ” వైఖరి అయినా అది ఏ విధంగానూ విప్లవకరమైనది కాదు.
ఇంటర్నెట్ యువ వామపక్ష వాదుల మరొక తిరోగామి వైఖరి గురించి చూద్దాం. అమెరికా కార్మికవర్గాన్ని సంఘటిత పరచేందుకు, మార్పును కోరేవారిగా మార్చేందుకు, ఐక్యపరిచేందుకు వివిధ ప్రజాస్వామిక పోరాటల్లో భాగస్వాములను చేయకుండా తక్షణ హింసాత్మక ( లేదా అంత తక్షణంగాకపోవచ్చు) మద్దతు ఇచ్చేవైపు మొగ్గుతున్నది.స్వయం ప్రకటిత యువ మావోయిస్టులు, ట్రాట్స్కీయిస్టులు, అరాచకవాదులు, చివరికి మార్క్సిస్టు-లెనినిస్టులమని స్వయంగా చెప్పుకుంటున్నవారు గానీ ఇలాంటి వైఖరిని తీసుకోవటాన్ని నేను గమనించాను. జనాలకు దూరంగా ఉండటం ఈ బృందాలు, వ్యక్తుల ఉమ్మడి లక్షణం, అంటే వాస్తవానికి దూరంగా ఉండటం. విప్లవ వాగాడంబరానికి ఆకర్షితులవుతున్న యువ విప్లవకారులు ఎలా ఉన్నారు? మన దేశ ప్రజాస్వామిక సంప్రదాయాలు, సంస్కృతి, సమాజం, భౌతిక పరిస్ధితుల పట్ల వారికి అవగాహన లేదు. తరువాత ఇంకొకటేమిటి, రోజాలక్సెంబర్గ్ చెప్పిన ” సంస్కరణ లేదా విప్లవం ” అవగాహనతో ప్రారంభమైతే ” విప్లవం లేదా మరింకేమీ లేదు” అనేదానికి దారి తీస్తుంది. ఎలాంటి కార్యాచరణ లేకుండా సాకులు చెప్పటానికి ఈ వైఖరి కూడా సిద్దంగా ఉంటుంది.” మన కార్మికవర్గం ఇంకా విప్లవకరంగా మారలేదు కనుక నేను కార్మికవర్గంతో చేరాల్సిన అవసరం లేదు లేదా మన కార్మికవర్గం సాయుధం అయ్యేంత వరకు మనమేమీ చేయలేము ” అనేట్లు చేస్తుంది. కానీ వాస్తవం ఏమంటే కార్మికవర్గం అంతర్యుద్దాన్ని కోరుకోవటం లేదు, లేదా మనం వారి మీద దాన్ని రుద్దుతున్నట్లు నటించాల్సిన పనిలేదు. మనం కార్మికులు, విద్యార్ధులను వారున్న చోట కలుస్తున్నాం తప్ప ఉండాలని మనం కోరుకున్న చోట కాదు. కాబట్టి రైతులు లేని ఒక దేశంలో హింసాత్మక రైతుల తిరుగుబాటు( మావోయిస్టులు వాంఛిస్తున్న) కోసం వేచి చూస్తూ మనం కూర్చునే బదులు చేయాల్సిందేమిటి ? స్ధానిక విద్యార్ధి సంఘాలు, కార్మికయూనియన్లు, కమ్యూనిస్టు పార్టీ క్లబ్ లేదా యువ కమ్యూనిస్టు సంఘం ద్వారా యువతను వర్గపోరాటాలకు ప్రోత్సహించుదాం. జనకట్టుతో కలసి పని చేసేందుకు నిరాకరించే కమ్యూనిస్టు ఒక కమ్యూనిస్టు కాదు.
ప్రజాస్వామిక పోరాటాలు అనేక రూపాల్లో ఉంటాయి. పౌరహక్కుల కోసం, యూనియన్ల కోసం, ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా, ఇలా అనేకం. సోషలిజం కోసం జరిపే మొత్తం వర్గపోరాటాలకు ఈ పోరాటాలు తప్పనిసరి.ఈ పోరాటాలు మహిళల పౌరహక్కులు, ఎల్బిజిటిక్యు జనాలు, ఆఫ్రికన్ అమెరికన్స్, ఇతర అనేక అణచివేతకు గురైన సమూహాలకు సంబంధించి కావచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్ధ విస్తృత దోపిడీలో ఈ బృందాలన్నీ ప్రత్యేక అణచివేతకు గురవుతున్నందున ఇవి తప్పనిసరి. ఉదాహరణకు ఒక బిలియనీరైన మహిళా సిఇఓ వివక్షకు లేదా తరచుగా కార్మికవర్గ మహిళల మాదిరి అదే విధమైన అణచివేతలో భాగంగా లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు. అందుకే మహిళా సమానత్వ సమస్య వర్గాలకు అతీతమైనది. జాత్యంహంకారానికి కూడా ఇదే వర్తిస్తుంది. నల్లజాతీయులైన కార్మికుల మాదిరే నల్లజాతీయులైన బాస్కెట్బాల్,ఫుట్బాల్ క్రీడాకారులు రోజువారీ జాతిపరమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. క్యూబా ఉదాహరణ చూపుతున్నదేమిటి ? విప్లవం తరువాత కార్మికవర్గం అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ జాత్యంహంకారం అంతరించలేదు. వర్గాలకు అతీతంగా జాతి వివక్ష వ్యతిరేక పోరాటం జరుగుతుంది గనుక అది ప్రజాస్వామిక పోరాటమే. ఎల్బిజిటిక్యుల సమానత్వం కూడా ప్రజాస్వామ్య పోరాటాల మరో రంగమే. సోషలిస్టు దేశాలలో కార్మికులందరికీ స్వేచ్చకు హామీ ఉన్నప్పటికీ ఎల్బిజిటిక్యు కామ్రేడ్లు, కార్మికుల మాదిరి వారి హక్కుల విషయంలో ఎల్లవేళలా సానుకూల వైఖరితో ఉన్న రికార్డు ఉందని మనమూ మన ఉద్యమం నటిస్తే అది కపటత్వమే అవుతుంది. ఇది కూడా మనం అధిగమించాల్సిన అంశమే.
పెట్టుబడిదారీ వర్గాన్ని కూలదోసేంత వరకు ఆ తరగతికి చెందిన వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. కనుక పెట్టుబడిదారీ విధానంలో ఈ సమస్యలపై పోరాటాలు ప్రారంభమౌతూనే ఉంటాయి. అది పికెటింగ్ కేంద్రం, పోలింగ్బూత్, నిరసన లేదా ధర్నా అడ్డాలు ఎక్కడైనా మనం ఈ ప్రజాస్వామిక పోరాటాల్లో పాల్గొంటాము.1960-70దశకాల్లో సాగిన పౌరహక్కుల ప్రజా ఉద్యమం గొప్ప విజయాలు సాధించింది. అది ఓటింగ్ హక్కుల కోసం లేదా ఏంజలా డేవిస్(కమ్యూనిస్టు నాయకురాలు) విడుదల కోసం కావచ్చు. ప్రజాస్వామిక ఉద్యమాలు విప్లవ వ్యతిరేకమైనవని విసిగిపోయిన యువకులు తమను తాము దూరంగా పెట్టుకుంటే ఫలితం లేదు. చివరికి మితవాద తిరోగామి శక్తులు వామపక్ష విప్లవ పదజాలాన్ని గుప్పిస్తున్నపుడూ మనం చూశాము ఇటీవల జనవరి ఆరవతేదీన అమెరికా రాజధాని( పార్లమెంట్)పై జరిగిన దాడిని ” కార్మికవర్గ – విప్లవాత్మకమైనదని ” వర్ణించినపుడు కూడా దూరంగా ఉండకూడదు. నల్లజాతీయులు, గోధుమవర్ణం వారు, మహిళలు, ఎల్బిజిటి వారి సమస్యలపై ఆందోళనలను విస్మరించినపుడు సమానత్వం కోసం జరిపే పోరాటాలను ప్రారంభించినపుడు కార్మికవర్గంలోని యావత్ తరగతులను విస్మరించినట్లే, ఆ తప్పిదం చేయవద్దు.
2021లో యువకులు, విద్యార్ధుల ఉద్యమాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో వాతావరణ మార్పు ఒకటి. తమ తలిదండ్రులు, తాతల కంటే పర్యావరణం గురించి మరింతగా పట్టించుకోవాలి. ఎందుకంటే రానున్న ఐదు పది సంవత్సరాలలో భూ తలాన్ని రక్షించు కొనేందుకు కొట్టొచ్చినట్లుగా ఏదో ఒకటి చేయకపోతే మనం వృద్దాప్య వయస్సు వరకు చేరుకోలేము. ఈ కారణంగానే గ్రీన్ న్యూ డీల్ కోసం యువత ఆందోళనకు దిగింది, అది వాషింగ్ట్న్, డిసి, న్యూయార్క్, సియాటిల్ నగరాల్లో పెద్ద ఎత్తున పర్యావరణ రక్షణ ప్రదర్శనలకు దారితీసింది. పార్లమెంటులో పురోగామి సభ్యురాలు ఇల్హాన్ ఓమర్ కుమార్తె ఇస్రా హిరిసీ ఈ ప్రదర్శనలను నిర్వహించటంలో వహించిన పాత్ర కారణంగా, ఆన్లైన్లో కమ్యూనిస్టు అని చెప్పుకున్నందుకు గాను మితవాద మీడియా దారుణంగా ఆమె మీద దాడి చేసింది. అస్తిత్వ ఉద్యమాలను(ప్రజాస్వామిక పోరాటాలు) కొట్టిపారవేయకూడదనేందుకు ఇదొక పెద్ద ఉదాహరణ. హిరిసి మీద జరిగిన దానిని నల్లజాతీయులు, ముస్లింలు, యువత, కమ్యూనిజం, పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మీద మొత్తంగా జరిగిన దాడిగా చూడాలి. భూగ్రహమే లేనట్లయితే వర్గపోరాటం ఎక్కడ చేస్తాము, అందువలన వీటన్నింటినీ సిద్దాంతంగా అధ్యయనం చేసేందుకు మాత్రమే సమయాన్ని వృధా చేయరాదు, ఆచరణలో పెట్టాలి.
ఈ ఏడాది యువత పాల్గొన్న మరొక ముఖ్యమైన కార్యరంగం ఉంది, చదువుకొనేందుకు తీసుకున్న రుణాల రద్దు సమస్య.కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో ఎన్నికల ప్రచారంలో రుణాల రద్దు గురించి జో బైడెన్ చెప్పారు. పాఠశాల, కాలేజీ ఖర్చులు, బీమా చెల్లింపులు, ఆహారం, అద్దెలు, ఇతర చెల్లింపుల కోసం విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు. 2021 ఏప్రిల్ పీపుల్స్ వరల్డ్ (కమ్యూనిస్టు పార్టీ పత్రిక) వార్త ప్రకారం ” ఒక్కొక్కరికి జో బైడెన్ సర్కార్ గనుక 50వేల డాలర్ల రుణాన్ని రద్దు చేస్తే 84శాతం మంది పూర్తిగా రుణవిముక్తులౌతారు. మీడియా, రుణ విముక్తిని విమర్శించే వారి కేంద్రీకరణ అంతా అధిక సంపాదనా పరులకు సాయం చేయటం మీదనే కేంద్రీకృతమైంది. రుణం తీసుకున్న వారిలో నలభైశాతం మంది డిప్లొమాలు తీసుకోలేకపోయారు, తరచుగా కనీసవేతన ఉద్యోగాలలోనే ఉన్నారు.”. 2021 ఆగస్టులో ఒక్క కలం పోటుతో బైడెన్ 9.5బిలియన్ డాలర్ల విద్యార్ధి రుణాలను రద్దు చేయక ముందు పేర్కొన్న అంశమిది. ఉన్న అప్పులతో పోలిస్తే ఇది చిన్న మొత్తం, అనేక మందికి పెద్ద ఉపశమనం కలగకపోయినా కొంత మందికి విజయమే అనటంలో సందేహం లేదు. విద్యార్ధుల రుణాలను రద్దు చేసేందుకు బైడెన్కు అధికారం లేదు అని అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అబద్దం చెప్పిన నెల రోజుల తరువాత బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అందువలన పరిమితం కాకుండా పూర్తిగా రుణాలను రద్దు చేసేంతవరకు ఉద్యమం కొనసాగాల్సిందే. ఎందుకోసమో తెలియని యుద్దాన్ని ఆఫ్ఘనిస్తాన్లో రెండు దశాబ్దాలు సాగించేందుకు ఖర్చు చేసిన మనం మన యువత వారి కాళ్ల మీద నిలిచేందుకు తోడ్పడలేమా ! యువ కార్మికులు, విద్యార్దులను మనం విస్మరించలేము. వారిని ఉద్యమాలు, మన సంఘటిత శ్రేణుల్లోకి తీసుకురావాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనేందుకు, విస్తృత పరచేందుకు మొత్తం మీద జరిగే పోరాటంలో యువజన సమస్య కీలకమైనది. అది సోషలిస్టు సమాజానికి పునాదులు వేస్తుంది. విప్లవకారులైన మన యువత లేకుండా సోషలిస్టు అమెరికాకు భవిష్యత్ ఉండదు.
అనువాదం, వ్యాఖ్య : ఎం కోటేశ్వరరావు. ఆంగ్లంలో మూల ఆర్టికల్ను చదవాలని కోరుకొనే వారికి దాని లింక్ను దిగువ ఇస్తున్నాను.
మరోసారి అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ప్రతి రోజూ వినియోగదారుల మీద భారం పెరుగుతోందని ఇంకోసారి చెప్పనవసరం లేదు. బుధవారం నాడు పీపాధర బ్రెంట్ రకం 82-83 డాలర్ల మధ్య కదలాడింది. గురువారం నాడు 80.7 డాలర్లతో ప్రారంభమై 81.36 మధ్య ఉంది. మనం దిగుమతి చేసుకొనే రకం ఒకటి-రెండు డాలర్లు తక్కువగా ఉంటుంది. తొంభై డాలర్ల వరకు పెరగవచ్చని గోల్డ్మన్ శాచస్ జోశ్యం చెప్పింది. ఏం జరగుతుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేని స్ధితి. జనం జేబులు కొల్లగొట్టటం ఎలా అని తప్ప భారం తగ్గింపు ఆలోచనలో కేంద్రం లేదు. రాష్ట్రాలకు అలాంటి అవకాశం పరిమితం. మిగతా వస్తువుల మాదిరే చమురు ఉత్పత్తులను కూడా జిఎస్టి పరిధిలోకి తెచ్చి వాటి ఆదాయాలకు హామీ ఇస్తే రాష్ట్రాలు ఆ విధానానికి ఆమోదం తెలుపుతాయి. అందుకు కేంద్రం సిద్దంగా లేదు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఓపెక్+దేశాలు నవంబరు నెలలో రోజుకు నాలుగు లక్షల పీపాల కంటే ఉత్పత్తిని ఎక్కువ పెంచేందుకు తిరస్కరించటం ఒక ప్రధాన కారణం.ఈ ఏడాది ఇప్పటి వరకు చమురు ధరలు 50శాతంపైగా పెరిగాయి. కరోనా కారణంగా కుదేలైన రంగాలు తిరిగి కోలుకుంటే చమురు గిరాకీ పెరుగుతుంది. అప్పుడు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వంద డాలర్లకు చేరే అవకాశం గురించి జోశ్యాలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగితే వచ్చే ఏడాది 180డాలర్లను అధిగమించవచ్చని కూడా చెబుతున్నారు. కరోనాకు ముందు ఉన్న ఉత్పత్తి స్ధాయికి చేరుకొనే వరకు నెలకు నాలుగు లక్షల పీపాలకు మించి పెంచేది లేదని ఒపెక్+దేశాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే వంద రూపాయలు దాటిన పెట్రోలు ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలియదు.
ఐరోపాతో సహా అనేక దేశాలలో సహజవాయు ధరలు విపరీతంగా పెరిగాయి.బొగ్గు కూడా మండుతోంది. ఈ నేపధ్యంలో అనేక విద్యుత్ కంపెనీలు గ్యాస్కు బదులు చమురుతో విద్యుత్ ఉత్పత్తి చౌక అని ఆలోచించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది. అమెరికాలో ఇడా హరికేన్ కారణంగా మూడు కోట్ల పీపాల చమురు ఉత్పత్తి పడిపోయింది.ఇది కూడా ఒక తక్షణ కారణం. ఉత్పత్తి కంటే కంపెనీల వాటాదారుల లాభాలు ముఖ్యం అనుకుంటున్న అమెరికాలోని షేల్ చమురు కంపెనీలు ఉత్పత్తిని పరిమితం చేశాయి. ధరలు పెరిగినా ఫరవాలేదు, ఉత్పత్తి పెంచాలనే డిమాండ్ అమెరికా వైపు నుంచి వచ్చింది. దాన్ని ఉత్పత్తి దేశాలు ఖాతరు చేయలేదు. రోజుకు ఎనిమిది లక్షల పీపాల ఉత్పత్తి పెంచుతారు అన్న అనధికారిక వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది. రానున్న శీతాకాలంలో అనేక దేశాలు గడ్డు పరిస్ధితిని ఎదుర్కోనున్నట్లు చెబుతున్నారు.పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలను సాగిస్తున్న చైనా తన అవసరాల కోసం ఎక్కడెక్కడి చమురు, గ్యాస్, బొగ్గును కొనుగోలు చేస్తోంది. ఐరోపా ఇబ్బందులు పడుతోంది. ధర ఎక్కువైనా స్ధానిక ఉత్పత్తి కారణంగా అమెరికాలో ఇబ్బంది లేదు. ఐరోపా గ్యాస్ నిల్వలు పదేండ్ల కనిష్టానికి తగ్గాయయి.
రష్యా గ్యాస్ సరఫరా చేయగలిగినప్పటికీ ఐరోపా దేశాలతో ఉన్న విబేధాల కారణంగా ముందుకు రాకపోవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే గ్యాస్ ఆధారిత పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి ప్రభావితం అవుతాయి. సాధారణ వినియోగదారులు, పరిశ్రమలు, కార్మికుల నుంచి రాజకీయ నాయకత్వాలకు సమస్యలు ఎదురవుతాయి. నిరసనలకు దారి తీసి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినా ఆశ్చర్యం లేదు. ఇంధన సరఫరా ముప్పు గురించి ప్రతి వారూ చర్చిస్తున్నారు గానీ పరిష్కారాలు కనిపించటం లేదు. ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పన్నులు తగ్గించటం తప్ప మరొక మార్గం లేదు. సహజవాయు ధరలపై నియంత్రణ ఎత్తివేయటంతో ఏ రోజు కారోజు ధరల విధానంవైపు మార్కెట్ను నెట్టారు. మరోవైపు రష్యా నుంచి ఐరోపా దేశాలకు సహజవాయు సరఫరా చేసే గొట్టపు మార్గంపై రాజకీయ కారణాలతో అమెరికా విధించిన ఆంక్షలను ఐరోపా వ్యతిరేకిస్తోంది. దీనివలన ఎక్కువగా నష్టపోయేది ఐరోపా దేశాలే. తాము వాయు సరఫరాను పెంచుతామని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించటం వెనుక అమెరికా పలుకుబడిని దెబ్బతీసే ఎత్తుగడ ఉంది.దీని వలన పదిశాతం ధరలు కూడా తగ్గాయి. గొట్టపు మార్గం పని చేసేందుకు అనుమతించేందుకు జర్మనీ సిద్దంగా ఉంది.
ఐరోపాలో ఒక మెగావాట్ అవర్ విద్యుత్(ఐరోపాలో 330 ఇండ్లలో ఒక గంటపాటు వినియోగించేదానికి సమానంగా పరిగణిస్తారు) ధర రికార్డును బద్దలు కొట్టి 106 యూరోలను తాకింది. ఇది పీపా చమురు ధర 205 డాలర్లకు సమానం. రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రం కానుందని భావిస్తున్నారు. ఆసియా, ఇతర కొనుగోలుదారులకు సౌదీ అరేబియా పీపాకు చమురు ధరలో 0.42 డాలర్లు తగ్గించటంతో చమురు ధరలు గురువారం నాడు స్వల్పంగా తగ్గాయి. రానున్న చలికాలంలో ఇంధన సరఫరాలు తగ్గకుండా చూడాలని చైనా ప్రభుత్వం ఆదేశించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది.
మన దేశంలో చమురు ధరల పెరుగుదలకు అంతర్జాతీయ కారణాలతో పాటు నరేంద్రమోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఎగుమతులను పెంచేందుకు మన రూపాయి విలువను పతనం కావించటం ఒకటి. అక్టోబరు ఆరవ తేదీన రూపాయి డాలరుకు 75కు పతనమైంది. సెప్టెంబరు 28న 74 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర స్ధిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే వినియోగదారుల నుంచి ఆ మేరకు వసూలు చేస్తారు. ఇప్పుడు చమురు ధర పెరుగుదల, రూపాయి పతనం రెండూ జరుగుతున్నాయి. దీన్నే గోడదెబ్బ-చెంపదెబ్బ అంటారు. దేశీయంగా జరుగుతున్న చమురు ఉత్పత్తిని పెంచకపోగా గత స్ధాయిని కొనసాగించటంలో కూడా నరేంద్రమోడీ సర్కార్ విఫలమైంది. ఇథనాల్ ఉత్పత్తి చేసి ఆమేరకు భారం తగ్గిస్తామని చెప్పిన మాటలు కూడా అమలు కాలేదు. ప్రస్తుతం మన దేశం 80శాతం చమురు దిగుమతులపై ఆధారపడుతున్నది.
గతంలో ఇరాన్తో కుదిరిన ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి కొనుగోలు చేసిన చమురు విలువలో సగం మొత్తాన్ని రూపాయిలలో చెల్లిస్తే సరిపోయేది. మన దేశం నుంచి ఇరాన్కు ఎగుమతులు చేసిన వారికి మన ప్రభుత్వం సర్దుబాటు చేసేది. మన అవసరాల్లో పదిశాతం అక్కడి నుంచే దిగుమతి చేసుకొనే వారం. ఇరాన్ దగ్గర చమురు కొన్న దేశాల మీద ఆంక్షలు విధిస్తామన్న అమెరికా బెదిరింపులతో మన సర్కార్ భయపడిపోయి అక్కడి నుంచి పూర్తిగా కొనుగోళ్లను ఆపివేసింది. అందువలన ఆ మేరకు డాలర్లు చెల్లించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దీంతో ఇరాన్ మన దేశం నుంచి దిగుమతులను కూడా పరిమితం చేసింది. 2018-19లో రెండు దేశాల వాణజ్య విలువ 17బిలియన్ డాలర్లు ఉండేది. మరుసటి ఏడాదికి అది 4.77 బి.డాలర్లకు పడిపోయింది. మన ఎగుమతులు 2019తో పోల్చితే 42శాతం తగ్గి 2020లో 2.2బి.డాలర్లకు, 2021లో మరింతగా పడిపోయాయి.
మరోవైపున ఇరాన్-చైనా బంధం మరింత గట్టిపడింది.రాయితీలతో కూడిన చమురు నిరంతరాయంగా ఇరాన్ సరఫరా చేస్తే చైనా 400 బిలియన్ డాలర్ల మేరకు వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెట్టనుంది. అమెరికా బెదిరింపుల కారణంగా మనం ఇరాన్తో స్నేహాన్ని ప్రశ్నార్దకం చేసుకోవటంతో పాటు వాణిజ్య అవకాశాలను కూడా కోల్పోయాము. వినియోగదారుల మీద భారం మోపుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఇరాన్తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే అది మన అర్ధిక వ్యవస్ధ మీద తీవ్ర ప్రభావం చూపనుంది. బడ్జెట్లోటు పెరిగితే సంక్షేమ చర్యలకు కోత పెడతారు.పరిమితంగా ఉన్న సబ్సిడీలను కూడా ఎత్తివేస్తారు. చమురు, గాస్ ధరలు పెరిగితే ఎరువుల ధరలు కూడా పెరిగి రైతాంగం మీద భారాలు పెరుగుతాయి. ఇది మరొక సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు తిరస్కరిస్తూ రాజధాని చుట్టూ ఇనుప మేకులు పాతి పది నెలలుగా రైతులను రాజధానిలోకి రాకుండా అడ్డుకుంటున్న సర్కార్ చమురు భారాలకు వ్యతిరేకంగా జనం ఉద్యమిస్తే ఏం చేయనుందో చూడాలి.
కొందరి దృష్టిలో కమ్యూనిస్టుల తప్పిదాలతో సోవియట్ యూనియన్ కూలిపోయింది. మరొక కోణం ప్రకారం కుట్రతో సామ్రాజ్యవాదం కూల్చివేసింది. దేని పాత్ర ఎంత అనేది ఎవరికి వారు గుణపాఠాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ ఉదంతం జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఇంతకాలం తరువాత అక్కడ కమ్యూనిస్టులు ఏమి చేస్తున్నారు, ఉద్యమం ఎలా ఉంది అనేది వామపక్ష అభిమానులు, వ్యతిరేకులకూ ఆసక్తికరమైన అంశమే. పుతిన్కు తలనొప్పిగా మారుతున్న కమ్యూనిస్టులు అనే శీర్షికతో అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు పత్రిక ఒక సమీక్ష రాసింది. రష్యాను మరోసారి కమ్యూనిస్టు భూతం వెంటాడుతోందా అనే వాక్యంతో అది ప్రారంభమైంది.నిజమేనా -అతిశయోక్తా ? అసలు అక్కడేం జరుగుతోంది ?
సెప్టెంబరు 17-19 తేదీలలో రష్యన్ డ్యూమా(పార్లమెంటు ) ఎన్నికలు జరిగాయి.నాలుగు వందల యాభై స్ధానాలకు గాను 225 దామాషా ప్రాతినిధ్యం పద్దతిలో మిగిలిన 225 నియోజకవర్గాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అధికార యునైటెడ్ రష్యా పార్టీకి 49.82 శాతం ఓట్లు, 324 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షంగా మొదటి స్ధానంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి 18.93శాతం ఓట్లు, 57 సీట్లు వచ్చాయి. జస్ట్ రష్యా పార్టీకి 7.46 శాతం ఓట్లు 27 సీట్లు, ఎల్డిపిఆర్కు 7.55శాతం ఓట్లు 21 సీట్లు,న్యూపీపుల్ పార్టీకి 5,32శాతం ఓట్లు 13 సీట్లు, మరో మూడు పార్టీలకు ఒక్కొక్కసీటు, స్వతంత్రులకు ఐదు వచ్చాయి. మాస్కో తదితర ప్రాంతాలో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడటంతో ప్రత్యక్ష ఎన్నికలలో కమ్యూనిస్టులు కొందరు ఓడిపోయారు.వాటి మీద కోర్టులో కేసులు దాఖలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం ఓట్లలో 47.8శాతం పోలుకాగా ఈ సారి 45.15శాతానికి తగ్గాయి. అధికారపక్ష ఓట్లు 54.20శాతం నుంచి 49.82శాతానికి తగ్గాయి.
కమ్యూనిస్టులతో సహా ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది అభ్యర్ధులపై తప్పుడు కేసులు బనాయించి పోటీలో లేకుండా చేసుకోవటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ అక్రమాలకు పాల్పడటంలో పుతిన్ అధికార యంత్రాంగం పేరు మోసింది. వాటన్నింటినీ అధిగమించి కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు రావటం, అక్రమాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగటంతో అసలు సిసలు ప్రతిపక్షం కమ్యూనిస్టులే అని పరిశీలకులు, సామాన్యజనం కూడా గుర్తించారు. అనేక మంది చురుకైన యువ కమ్యూనిస్టులు ఈ ఎన్నికలలో పని చేయటం, జనం ఆదరించటం గతం కంటే ఆరుశాతం ఓట్లు 15 సీట్లు పెరగటాన్ని చూసి రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులతోనే పుతిన్కు సవాలు ఎదురవుతుందని భావిస్తున్నారు.వాషింగ్టన్ పోస్టు విశ్లేషణ సారాంశమిదే.
కమ్యూనిస్టు పార్టీ ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న ఎత్తుగడలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను సంఘటితం చేసేందుకు చేసిన యత్నాలు ఫలిస్తున్నట్లు ఈ ఎన్నికలు నిరూపించాయి.గత అధ్యక్ష ఎన్నికలలో (2018) కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పురోగామి భావాలు కలిగిన స్ట్రాబెరీ వాణిజ్యవేత్త పావెల్ గ్రుడినిన్ పోటీ చేశారు.గ్రుడినిన్కు విదేశాల్లో ఆస్తులున్నాయని, పుతిన్ మీద పోటీ చేసిన ఆయనకు 90లక్షల మంది మద్దతుదారుల లేరనే పేరుతో ఈ సారి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించారు. ప్రాంతీయ అసెంబ్లీలలో ఈ విధంగా ఐదుగురు ప్రముఖ కమ్యూనిస్టునేతలను అనర్హులుగా ప్రకటించారు. కమ్యూనిస్టు మద్దతుదారులే కాదు, పుతిన్ విధానాలను వ్యతిరేకించే ఇతర ఓటర్లు కూడా ఈ ఎన్నికలలో కమ్యూనిస్టులవైపు మొగ్గటం స్పష్టంగా కనిపించింది. ఇది వచ్చే అధ్యక్ష ఎన్నికలలో కూడా పుతిన్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగతా ప్రతిపక్ష పార్టీనేతలను తప్పుడు కేసులతో, ఏదో ఒకసాకుతో జైలు పాలు చేసి, కమ్యూనిస్టుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే అది ఎదురుతన్నే అవకాశం ఉందనే అంశం పుటిన్కు తెలియంది కాదు.
కమ్యూనిస్టులకు ఈ ఎన్నికలలో కోటీ ఆరులక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. దేశంలోని 41 ప్రాంతాల(మన రాష్ట్రాల మాదిరి)లో నాలుగు చోట్ల ు 30 నుంచి 36శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ పెద్ద పక్షంగా అవతరించింది. మిగతా చోట్ల 20 నుంచి 30శాతం ఓట్లు వచ్చాయి.38 ప్రాంతీయ శాసనసభల్లో గతంలో 158 స్ధానాలుండగా ఇప్పుడు 254వచ్చాయి. ఇవన్నీ అనేక చోట్ల అధికారపక్షం అక్రమాలకు పాల్పడిన నేపధ్యంలో వచ్చిన విజయాలు అని గ్రహించాలి. మూడు రోజుల పాటు ఎందుకు ఎన్నికలు జరిపారు అంటే కరోనా అని సాకులు చెప్పారు. అధికారపక్షానికి ఎదురుగాలి వీస్తున్నదనే సూచికలు ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించాయి. దాంతో ఓటింగ్కు రాని ప్రభుత్వ రంగ కార్మికులు,ఇతరులను పెద్ద ఎత్తున సమీకరించటం, పరోక్ష ఎలక్ట్రానిక్ పద్దతిలో అధికారపక్షానికి ఓటు వేయించారు.
మీడియా కేంద్రీకరణ మొత్తం అధికారపక్షం వైపు తప్ప ప్రతిపక్షాలను ముఖ్యంగా కమ్యూనిస్టులను విస్మరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మాయాజాలం గురించి చెప్పాలంటే మాస్కో నగరం, పరిసరాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. సెప్టెంబరు 19వ తేదీ రాత్రి ఏడు గంటల సమయంలో ప్రత్యక్ష ఓట్ల లెక్కింపులో కమ్యూనిస్టు-అధికార యునైటెడ్ రష్యా పోటాపోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు వెల్లడైంది. తరువాత పరోక్ష ఎలక్ట్రానిక్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఒక గంటలోనే పరిస్ధితి తారుమారైంది. ఇది రిగ్గింగుతప్ప మరొకటి కాదు. అనేక పోలింగ్ కేంద్రాలలో పెద్ద ఎత్తున ఏదో ఒకసాకుతో వేలాది ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. ఇలాంటి అక్రమాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీలేవీ ఎక్కడా ఆందోళన జరపలేదు. పోలీసులు, అధికార యంత్రాంగం కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలలో ప్రవేశించి బెదిరించటం, అరెస్టులు చేయటం, ప్రదర్శనలను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. పార్టీ వెబ్సైట్ను నిరోధిస్తామని చెప్పారు. ఎన్నికల అక్రమాలపై కేసులు దాఖలు చేసేందుకు వివరాలను సేకరిస్తున్న లాయర్లను బెదిరించారు.పదిరోజుల పాటు జైలుపాలు చేశారు.
ఎన్నికలకు ముందు ఆల్ రష్యన్ సెంటర్ అనే ప్రజాభిప్రాయసేకరణ సంస్ధ జరిపిన సర్వేలో కమ్యూనిస్టు నేత జుగనోవ్ మీద విశ్వాసం ప్రకటించిన వారు 30.7శాతం ఉన్నట్లు ప్రకటించింది. కమ్యూనిస్టులకు ఎన్నికలలో 16.6, రష్యన్ ఫెడరేషన్లో 23.3శాతం వస్తాయని పేర్కొన్నది. ఎన్నికలలో అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పార్టీ సిద్దాంతాలు, ఆచరణకు జనం మద్దతు పెరిగినట్లు ఫలితాలు వెల్లడించాయని కమ్యూనిస్టు పార్టీ సమీక్షలో పేర్కొన్నది. అక్రమాలు చోటు చేసుకోనట్లయితే ఇంకా ఓటింగ్ శాతం, సీట్లు పెరిగి ఉండేవి.కమ్యూనిస్టు పార్టీని ప్రధాన ప్రతిపక్షంగానే కాదు, అసలైన ఏకైక ప్రతిపక్షంగా జనం భావించారు. అందువల్లనే ప్రభుత్వ వ్యతిరేకులు కమ్యూనిస్టుల వైపు మొగ్గారు.
గత పదిసంవత్సరాలుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పుతిన్కు అసలైన ప్రతిపక్షం ఉదారవాదులు తప్ప కమ్యూనిస్టులు కాదని జనాల మెదళ్లలో ఎక్కించేందుకు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తికాదు. అమెరికాలో మాదిరి ఎవరు అధికారంలో ఉన్నా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలను అనుసరించే శక్తులతోనే రాజకీయ రంగాన్ని నింపాలన్నది ఎత్తుగడ. తన అధికారాన్ని సుస్ధిరం చేసుకొనే యత్నాలలో భాగంగా వ్లదిమిర్ పుతిన్ ఏ పెట్టుబడిదారి విధాన సమర్ధపక్షాన్ని కూడా బతకనివ్వలేదు. గతేడాది చేసిన రాజ్యాంగ సవరణల ప్రకారం అధ్యక్ష పదవిని ఎవరు ఎన్నిసార్లయినా అధిరోహించవచ్చు. దాని ప్రకారం 2036వరకు ఆరోగ్యం సహకరించి అన్నీ అనుకూలిస్తే పుతిన్ అధికారంలో కొనసాగవచ్చు. అయితే ఉదారవాద పార్టీలకు బదులు కమ్యూనిస్టులే అసలైన ప్రతిపక్షం అని ఈ ఎన్నికలు నిరూపించటం గమనించాల్సిన ముఖ్య అంశం.
ఆగస్టు నెలలో లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నట్లుగా మంచి పెట్టుబడిదారీ విధానానికి బదులు తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. మరోవైపున తమ కళ్ల ముందే అమెరికా, ఐరోపా దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ధలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని రష్యన్ యువతరం గ్రహించకుండా ఎలా ఉంటుంది. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా అమెరికా నుంచి రష్యాకు ముప్పు ఉందనే జాతీయ భావాలను కూడా ముందుకు తెచ్చారు. అయితే ఇటీవలి కాలంలో అమెరికా కేంద్రీకరణ రష్యామీద కంటే చైనావైపు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రచారం రష్యన్లలో అంతగా ఎక్కే అవకాశం లేదు. అనేక దేశాలలో తమకు అనుకూలమైన శక్తులను ప్రతిష్టించేందుకు అమెరికా అంతర్గత అంశాలు, ఎన్నికలలో జోక్యం చేసుకొంటోంది. పుతిన్ బదులు మరొకరిని ప్రోత్సహించాలని చూసినా అందుకు తగిన శక్తులు రష్యాలో కనిపించటం లేదు. పురోగామి సోషలిస్టు మార్గాన పయనించటానికి తాము కట్టుబడి ఉన్నామని వెనక్కి తగ్గేది, లొంగిపోయేది లేదని, జన ధోరణి తమకు అనుకూలంగా మారుతోందని కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణ తరువాత ప్రకటించింది.
” ఓటర్లు మేం చెప్పింది విన్నారు. ఓటర్లు మమ్మల్ని నమ్మారు. మాకు ఓట్లు వేశారు ” అని పార్టీ అగ్రనేత గెన్నడీ జుగనోవ్ చెప్పారు. నియోజవర్గ ప్రాతిపదికన ప్రత్యక్ష ఓటింగ్ జరిగిన 225 స్ధానాల్లో కమ్యూనిస్టులకు తొమ్మిది రాగా అధికారపక్షానికి 198వచ్చాయి. ఈ సీట్లలో అనేక అక్రమాలు జరిగాయనే విమర్శలు వచ్చాయి. మొత్తగా 50శాతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న అధికారపార్టీ నియోజకవర్గ ప్రాతిపదికన జరిగిన చోట అత్యధిక సీట్లు గెలిచిన కారణంగా మొత్తం సీట్లలో 72శాతం వచ్చాయి. అదే కమ్యూనిస్టులకు 19శాతం ఓట్లు వచ్చినా సీట్లు 12.7శాతమే వచ్చాయి. స్వతంత్ర విశ్లేషకుడు సెర్గీ షిఫిల్కిన్ అంచనా ప్రకారం కమ్యూనిస్టులకు వాస్తవంగా 31-33 శాతం మధ్య ఓట్లు వచ్చాయని అన్నాడు.మాస్కో ప్రాంతంలోని పదిహేను నియోజకవర్గాలలో అధికారపక్షం రిగ్గింగుకు పాల్పడిన కారణంగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్దులు ఓడిపోయారన్నది స్పష్టం. ప్రత్యక్షంగా వేసిన ఓట్ల లెక్కింపు జరిగినంతసేపూ అధికారపక్షం, కమ్యూనిస్టులు పోటా పోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు ప్రకటించిన అధికారులు ఎలక్ట్రానిక్ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాలు మారు చేశారన్నది అభియోగం. కమ్యూనిస్టులు గట్టి పోటీ ఇచ్చిన ప్రతి చోటా ఇదే జరిగినట్లు చెబుతున్నారు.
కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న యువత రానున్న రోజుల్లో మరింతగా మిలిటెంట్ పోరాటాలకు సిద్దమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జైలు పాలైన ఒక ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నవల్నీ అధికారపక్షాన్ని ఓడించే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చాడు. అతని మద్దతుదారులు కొందరు కమ్యూనిస్టులకు ఓటు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. సోవియట్ అంతరించి మూడు దశాబ్దాలు గడచింది. కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నలభై ఏండ్ల లోపు వారికి నాటి విషయాలు వినటం తప్ప ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు. అలాంటి వారు అనేక మంది జాతీయ పార్లమెంట్, స్ధానిక అసెంబ్లీలకు ఎన్నికయ్యారు. దేశంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలకు, పెట్టుబడిదారీ వ్యవస్ధ దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. గతంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి ఇప్పటి కమ్యూనిస్టు పార్టీకి తేడా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ముందుకుపోతామని అనేక మంది యువనేతలు చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఆర్ధిక రంగంలో పుతిన్ వైఫల్యాల కారణంగా ఇటీవలి కాలంలో కార్మికవర్గంలో అసంతృప్తి పెరుగుతున్నది. మరొక ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేనందున కమ్యూనిస్టు పార్టీ ముందుకు పోవటానికి ఇది కూడా దోహదం చేస్తుందన్నది తెలిసిందే.లెనిన్ జన్మించిన ఉల్యనోవస్క్ పట్టణం, పరిసరాలలో కమ్యూనిస్టులు 30శాతంపైగా ఓట్లు సాధించారు. ఆ నియోజకవర్గంలో గత ఎన్నికలలో విజయం సాధించిన కమ్యూనిస్టులను అడ్డుకొనేందుకు అధికారపక్షం అనేక ప్రయత్నాలు చేసినా తిరిగి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. లెనిన్ పదిహేడు సంవత్సరాల వయస్సులో ఉల్యనోవస్క్ను విడిచి వెళ్లిన తరువాత తిరిగి అక్కడికి వెళ్లలేదు. అయినా అంతటి మహానేత జన్మించిన ప్రాంతం తమదని అక్కడి వారు గర్వపడతారు. తిరిగి తమ జీవిత కాలంలో రష్యన్ సోషలిజాన్ని చూస్తామనే విశ్వాసం కమ్యూనిస్టు కార్యకర్తల్లో ఉంది.
మాస్కోలోని మాక్రో అడ్వైజరీ సంస్ధ అధిపతి క్రిస్ వీఫర్ ఎన్నికల గురించి విశ్లేషిస్తూ ” జనాభాలో మారుతున్న నిష్పత్తి పుతిన్ను భయపెడుతున్న అసలైన సమస్య, సోవియట్ యూనియన్ అంతరించిన తరువాత జన్మించిన జనాభా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఈ తరం పెద్ద ఎత్తున ఇంటర్నెట్ను వినియోగిస్తున్నది, అనేక దేశాలు తిరిగి వస్తున్నది. దేశం స్ధిరపడాలనే పుతిన్ కబుర్లను వినేందుకు వీరు సిద్దంగా లేరు. మెరుగైన జీవనం, ఆదాయం, సామాజిక భద్రత, మెరుగైన భవిష్యత్ను కోరుకుంటున్నారు. వీరి ఆకాంక్షలను నెరవేర్చుతూ అధికారంలో కొనసాగటం అనేది పుతిన్ ముందున్న పెద్ద సవాలు. ప్రస్తుత వైఫల్యాలు వచ్చే ఎన్నికల్లో ఎవరు అధ్యక్ష అభ్యర్ధిగా ఉన్నా వారికి గుదిబండలుగా మారతాయి” అన్నాడు.
మారిన పరిస్ధితులను గమనించకుండా మొరటుగా వ్యవహరిస్తే ఏమౌతుందో అమెరికాలోని ఒక స్కూలు పిల్లలు నిరూపించారు. కరోనా నిరోధ చర్యల్లో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని హంటింగ్టన్ బీచ్ హైస్కూలు అధికారులు మాస్కులు ధరించి రావాలని పిల్లలను ఆదేశించారు. అయితే మాస్కులను వ్యతిరేకిస్తున్న బయటి వారు కొంత మంది వారం రోజుల క్రితం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్కూలు దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. మాకు నిరసన తెలిపే హక్కు ఉంది, రోజంతా ఇక్కడే ఉంటాం అని మెగాఫోన్లో ఒక వ్యక్తి ప్రకటించాడు. అంతటితో ఆగలేదు. మాస్కులు పెట్టుకున్న పిల్లలను చూసి ఈ గుంపును చూస్తుంటే కమ్యూనిజానికి మద్దతు ఇచ్చే విధంగా వీరి బుద్ది శుద్ది చేసినట్లుగా ఉంది అంటూ తన వద్ద ఉన్న కెమెరాను వారి వైపు తిప్పాడు. దాంతో ఒక బాలిక కమ్యూనిజం అంటే ఏమిటో చెప్పండి అని అతగాడిని ప్రశ్నించింది. చూస్తుంటే మీకు అదేమిటో తెలిసినట్లు లేదు అన్నాడతడు. మాకు కమ్యూనిజం అంటే ఇష్టం అని ముక్తకంఠంతో పిల్లలు అరిచారు. అయితే మీరు క్యూబా ఎందుకు పోలేదు అని నోరు పారవేసుకున్నాడతడు. దాంతో మరో పిల్ల నేను క్యూబన్నే అంది. నువ్వు క్యూబన్ అంతే కదా అంటే నువ్వొక క్యూబన్ పిచ్చిగొడ్డువి, నువ్వొక బుద్దిలేని క్యూబన్ ఆడదానివి అంటూ బూతులకు దిగాడు. దాంతో ఒళ్లు మండిన పిల్లలంతా ఒక్కుమ్మడిగా బుద్దిలేని వాడివి నువ్వు, చండాలమైన శ్వేతజాతి దురహంకారివి అంటూ ముందుకు వచ్చి నేను కమ్యూనిజాన్ని ప్రేమిస్తాను అంటూ కెమెరా వైపు వేళ్లు చూపుతూ నినాదాలు చేశారు.
దాంతో గుక్కతిప్పుకోలేని అతగాడు ఓV్ా మీరంతా కమ్యూనిస్టులన్నమాట, నేను తెలుసుకుంటాను, అలా అయితే మీరు ఉండకూడని దేశంలో ఉన్నారు. అంటూ వారి వద్ద నుంచి జారుకున్నాడు. తరువాత కెమెరా ముందు మాట్లాడుతూ మన పిల్లల బుద్దిని ఇలా శుద్ది చేశారు, వారు కమ్యూనిజాన్ని ఆరాధిస్తున్నారు. స్వేచ్చను ద్వేషిస్తున్నారు. వారిని చూడండి అందరూ కమ్యూనిస్టులు, వారిని మనం భరించాలి. పాఠశాల వ్యవస్ధ మన పిల్లలకు ఇలాంటి బోధన చేస్తోంది అని వ్యాఖ్యానించాడు. ఈ ఉదంతాన్ని చిత్రించిన ఒక టీవీ ఛానల్తో మాట్లాడిన ఒక విద్యార్ధి ” మేము కేవలం స్కూలు పిల్లలం, ఇలాంటి నిరసన అవాంఛనీయం. రోజంతా స్కూల్లో ఉన్నాం, ఈ నిరసన గురించి మాకు తెలియదు, ఇలాంటి వారిని ఎదుర్కొనే శక్తికూడా మాకు లేదు అని వ్యాఖ్యానించింది. నిరసన కారులు పాఠశాల బయటే ఉన్నందున పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.న్యూస్వీక్ వంటి పత్రికలు ఈ ఉదంతం గురించి రాశాయి. ఈ నిరసన ఘటన మీద తలిదండ్రులు నిరసన తెలిపారు. విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని నిరసన తెలపటం ఏమిటని అభ్యంతర పెట్టారు. మాస్కు ధరించాలా లేదా అన్నది స్కూలు కమిటీలు నిర్ణయిస్తాయి. టీచర్లు, విద్యార్ధులు ఆ నిర్ణయాల మీద అభిప్రాయాలు చెప్పవచ్చు తప్ప అంతిమ నిర్ణయం కమిటీలదే.అమెరికాలో కమ్యూనిస్టు పార్టీకి పార్లమెంటులో సీట్లు లేవు. ఓటర్లను ప్రభావితం చేయగల పరిస్ధితి కూడా లేదు. అయినా కమ్యూనిస్టు సిద్దాంతాన్ని మేము ప్రేమిస్తామని స్కూలు పిల్లలు కూడా చెబుతున్నారంటే అర్ధం ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం తమను ఉద్దరించదు అని వారికి కూడా తెలిసిపోతోందనే కదా ! గతంలో కమ్యూనిజం విఫలమైందనే బోధనలు విన్న అమెరికన్లు ఇప్పుడు తమ అనుభవంలో పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, కమ్యూనిజమే మెరుగని భావిస్తున్నారు. ముఖ్యంగా యువతలో అలాంటి ధోరణులు పెరుగుతున్నాయి. అదే ఈ స్కూల్లో కూడా ప్రతిబింబించింది.
పొద్దున లేస్తే చైనాలో మానవహక్కులు లేవు, మట్టి లేవు అంటూ ప్రచారం చేసే దేశాలలో బ్రిటన్ ఒకటి. ఊరందరినీ ఉల్లిపాయ తినొద్దని చెప్పాను తప్ప మనింట్లో వేయవద్దన్నానా అని మండిపడిన బోధకుడి కధ తెలిసిందే. బ్రిటన్ తమ దేశంలో ఉద్యోగవిరమణ చేసిన వారి పెన్షన్ నిధులను అదే చైనాలో పెట్టుబడులుగా పెడుతోంది. ఇటీవలి నెలల్లో బ్రిటన్ పెన్షన్ నిధులు, ఇతర పెట్టుబడి సంస్ధలు చైనాలో పెట్టిన పెట్టుబడులు కొత్త రికార్డు నెలకొల్పినట్లు హాంకాంగ్ వాచ్ అనే సంస్ధ తాజాగా ప్రకటించింది. చైనా మీద విమర్శలు చేసే విధాన నిర్ణేతలు, ప్రజానాయకులు-పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకొనే నిపుణుల మధ్య సమాచార, అవగాహన దూరం ఉందని, బాధ్యత లేకుండా ఉన్నారని ఆ సంస్ధ ధ్వజమెత్తింది. ఆర్ధిక వ్యవస్ధలకు లాభాలు తప్ప సామాజిక పరంగా పడే ప్రభావాలు పట్టటం లేదని వాపోయింది. ఝెజియాంగ్ దహువా టెక్నాలజీస్ అనే సంస్ధ ముఖాలను గుర్తించే ఒక సాఫ్ట్వేర్ను కమ్యూనిస్టు పార్టీకి తయారు చేసి ఇచ్చిందట. అది మనుషుల్లో ఎవరు ఏ జాతి వారో గుర్తు పడుతుందట. దానిలో భాగంగా యుఘీర్ ముస్లింలను గుర్తించి పార్టీకి తెలియచేస్తుందట. ఆ సంస్ధలో లీగల్ అండ్ జనరల్ అనే నిధుల సంస్ధ పెట్టుబడి పెట్టిందట. ముస్లింలను గుర్తించే ఉత్పత్తి చేసినట్లు తెలిసిన తరువాత అక్కడి నుంచి తీసుకొని వేరే కంపెనీల్లో పెట్టిందట. దానితో పాటు యూనివర్సిటీస్ సూపర్యాన్యుయేషన్ స్కీము(యుఎస్ఎస్) అనే సంస్ధ కూడా ఈఏడాది మార్చి ఆఖరుకు చెనా అలీబాబా, టెన్సెంట్ కంపెనీలలో 80 కోట్ల పౌండ్లు పెట్టుబడులు పెట్టాయని తెలిపింది.ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆర్ధిక వ్యవస్ధలలో ఒకటైన చైనాలో పెట్టుబడులు పెట్టాలని రిషి సునాక్ అనే ఛాన్సలర్ ప్రోత్సహించినట్లు కూడా హాంకాంగ్ వాచ్ పేర్కొన్నది. ఈ గ్రూప్ ఇంతగా స్పందించటానికి కారణం అది చైనా నుంచి హాంకాంగ్ వేర్పాటును సమర్ధిస్తున్నది.లీగల్ అండ్ జనరల్ సంస్ధ తాజాగా కూడా పెట్టుబడులను విస్తరించాలని చూసినట్లు లండన్ పత్రిక టెలిగ్రాఫ్ రాసింది. ఒక్క బ్రిటన్ సంస్ధలే కాదు, అమెరికా, ఐరోపాలకు చెందిన అనేక సంస్ధలు చైనా మార్కెట్లో లాభాల కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నాయి.
హిట్లర్కు జన్మనిచ్చిన ఆస్ట్రియా తరువాత కాలంలో అదే హిట్లర్ దురాక్రమణకు గురైంది. తరువాత 1955లో తటస్ధ రాజ్యంగా ప్రకటించుకుంది. 1959 నుంచి పార్లమెంట్లో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లేదు.అలాంటి చోట రాజధాని వియన్నా తరువాత మూడు లక్షల జనాభాతో రెండవ పెద్ద నగరంగా ఉన్న గ్రాజ్ కార్పొరేషన్ ఎన్నికలలో అనూహ్యంగా కమ్యూనిస్టులు పెద్ద పక్షంగా ఎన్నికయ్యారు. పార్టీలో ఎంత మంది ఉన్నారు అని గాకుండా ఆశయం కోసం పని చేస్తే ఎక్కడైనా కమ్యూనిస్టులను జనం ఆదరిస్తారు అనే అంశం ఇక్కడ ముఖ్యం. పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదే, మనల్ని ఎవరు ఆదరిస్తారు అని అక్కడి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆలోచించి ఉంటే అసలు ఎర్రజెండానే ఎగిరేది కాదు. పద్దెనిమిది సంవత్సరాలు విరామం లేకుండా అధికారంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద పార్టీని ఓడించి కమ్యూనిస్టులు ఇలా ముందుకు వస్తారని ఎవరూ ఊహించలేదు.వారికి 48 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో 28.8శాతం ఓట్లు, 15 సీట్లు వచ్చాయి. గ్రీన్స్ పార్టీకి తొమ్మిది వచ్చాయి. ఆ రెండు పార్టీలు కలిసేందుకు అవకాశం ఉంది, అయినా మెజారిటీకి ఒక ఓటు తక్కువ గనుక మరొక పక్షం మద్దతు అవసరం. దాని గురించి సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇక్కడ ఒక కార్పొరేషన్లో అధికారం రావటం ముఖ్యం కాదు. పక్కనే ఉన్న తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు, సోవియట్ యూనియన్ కూలిపోయాయి. కమ్యూనిస్టు వ్యతిరేకులు రెచ్చిపోతున్నారు. చుట్టూ కనుచూపు మేరలో కమ్యూనిజం గురించి ఆశారేఖలు కనిపించని చోట ఎర్రజెండాను ఎత్తుకొని నిలవటం, దాని మీద ఉన్న అచంచల విశ్వాసం ప్రదర్శించటం. ఊపుగా ఉన్నపుడు జండాను పట్టుకొని ముందువరుసలో హడావుడి చేయటం, ఎదురుదెబ్బలు తగలగానే పత్తాలేని వారిని ఎందరినో చూస్తున్న తరుణంలో ఏ ఆశారేఖ ఆస్ట్రియా కమ్యూనిస్టులను ముందుకు నడిపించిందో అందరూ అధ్యయనం చేయటం అవసరం. ఆస్ట్రియా ప్రస్తుతం మితవాదశక్తుల పట్టులో ఉంది. అలాంటి చోట ఎర్రజెండా ఎగిరింది.
తొమ్మిది రాష్ట్రాల ఫెడరేషన్ ఆస్ట్రియా, జనాభా 90లక్షలు. వాటిలో ఒక రాష్ట్రం స్ట్రిరియా, దాని రాజధాని గ్రాజ్. అక్కడే కమ్యూనిస్టులు విజయం సాధించారు. జాతీయ ఎన్నికల్లో ఒకశాతం ఓట్లు మాత్రమే సాధిస్తున్నా, ఈ రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలుగా ఇరవైశాతం ఓట్లు తెచ్చుకొంటోంది. పార్టీకి నిబద్దులైన నాయకులు,కార్యకర్తలు నిరంతరం జనం, వారి సమస్యల పట్ల స్పందించటం, మిగిలిన పార్టీలన్నీ ప్రయివేటీకరణ ప్రవాహంలో కొట్టుకుపోయినా వ్యతిరేక వైఖరి తీసుకోవటం సరైనదని జనం గుర్తించారు.అందుకే రాజధాని నగరంలో పెద్ద పార్టీగా ఎన్నికైంది.1991లో అద్దెకుండే వారి సమస్యలను తీసుకొని జనానికి దగ్గరకావటంతో పాటు, పార్టీ లీగల్ సాయం కూడా అందించటంతో జనంలో విశ్వాసం ఏర్పడింది. తమ ఆదాయంలో 55శాతం అద్దెలకే చెల్లిస్తున్న తరుణంలో మూడోవంతు కంటే ఎవరి నుంచీ అద్దె వసూలు చేయకూడదని గ్రాజ్ పట్టణ కౌన్సిల్లో కమ్యూనిస్టు పార్టీ ఒక తీర్మానం పెట్టింది, దాన్ని మిగతా పార్టీలనీ తిరస్కరించాయి. అయితే చట్టంలో ఉన్న ఒక అవకాశాన్ని వినియోగించుకొని పదిహేడువేల మంది ప్రభుత్వ గృహాల్లో ఉండేవారు, అద్దెకుండే వారి నుంచి సంతకాలు సేకరించి తిరిగి అదే తీర్మానాన్ని ప్రవేశపెట్టటంతో ఏకగ్రీవ ఆమోదం పొందింది.1998లో కమ్యూనిస్టు పార్టీ 7.9శాతం ఓట్లు పొందింది. అప్పటి పాలక సంస్ధ కమ్యూనిస్టు పార్టీ నేత కాల్ట్నెగర్కు గృహాల స్ధాయీ సంఘ బాధ్యత అప్పగించింది. దాని నిర్వహణలో పార్టీ వైఫల్యం చెందుతుందనే దురాలోచన మిగతా పార్టీల్లో ఉంది. అయితే అనుకున్నదొకటి జరిగింది మరొకటి అన్నట్లుగా ప్రభుత్వం ఇచ్చిన గృహాలకు అంతకు ముందు కంటే భిన్నంగా ప్రతి ఇంటికి విడిగా మరుగుదొడ్డి, స్నానాలగది ఉండేట్లు కమ్యూనిస్టు నేత సాధించారు. దాంతో మరుసటి ఎన్నికల్లో పార్టీ 20.8శాతం ఓట్లు పొందింది.
కౌన్సిల్లో ఉన్న ప్రాతినిధ్యంతో పాటు బయట పార్టీ వైపు నుంచి కూడా ఉద్యమాలతో వత్తిడి తేవటంతో కమ్యూనిస్టులు, మిగతా పార్టీలకు ఉన్న తేడాను జనం గమనించారు. ఎన్నికలు జరిగిన మరుసటి ఏడాది 2004లో పట్టణంలోని ప్రభుత్వ గృహాలను ప్రయివేటీకరించేందుకు మిగిలిన పార్టీలన్నీ అంగీకరించినా కమ్యూనిస్టుపార్టీ అడ్డుకుంది. అదే సమయంలో పక్కనే ఉన్న జర్మనీలో సంకీర్ణ కూటమిలో అధికారంలో ఉన్న వామపక్ష డైలింక్ పార్టీ గృహాల ప్రయివేటీకరణ చేసింది. దానితో పోల్చుకున్న గ్రాజ్ పట్టణ ప్రజలు ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ వైఖరిని ప్రశంసించారు. పదివేల మంది సంతకాలు సేకరించి ప్రయివేటీకరణ జరపాలా లేదా అని అధికారయుతంగా పట్టణంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపే విధంగా కమ్యూనిస్టులు చేసిన కృషి ఫలించింది. పౌరుల్లో 96శాతం మంది ప్రయివేటీకరణను వ్యతిరేకించటంతో అది ఆగిపోయింది.
అక్కడి నిబంధనల ప్రకారం దామాషా పద్దతిలో వచ్చిన ఓట్లను బట్టి నగరపాలక సంస్ధలో సీట్లు కేటాయిస్తారు. అ విధానం కూడా కమ్యూనిస్టులకు అనుకూలించింది. పార్టీ ప్రతినిధులు ఎన్నడూ పాలకపక్షంగా లేకపోయినా రోడ్లు, రవాణా, ఆరోగ్య స్ధాయీ సంఘాలకు బాధ్యత వహించి పౌరుల మన్ననలు పొందారు. వృద్దులు ఆసుపత్రులకు పోనవసరం లేకుండా ఇంటి దగ్గరే సేవలు పొందేందుకు అవసరమైన అలవెన్సును అందచేసే ఏర్పాటు చేశారు. అన్నింటికీ మించి కరోనా సమయంలో ఆరోగ్య స్ధాయీ సంఘబాధ్యతలో ఉన్న కమ్యూనిస్టు నేత చేసిన కృషి ప్రశంసలు పొందింది.ఈ ఎన్నికల్లో అది ప్రతిఫలించి పార్టీని ప్రధమ స్ధానానికి చేర్చింది. కమ్యూనిస్టువ్యతిరేక వాతావరణం పరిసర దేశాల్లో ఉన్నప్పటికీ ఆస్ట్రియా కమ్యూనిస్టులు అవసరమైనపుడు తాము మార్క్స్, ఎంగెల్స్, లెనినిజాలకు కట్టుబడి ఉన్నామని బహిరంగంగా చెప్పారు, గర్వపడ్డారు.
సోవియట్ కాస్మొనాట్ యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి ఆరుదశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ ఉత్సవాలను జరపాలని పిలుపు ఇచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని అన్ని రకాల భావజాలాలను వ్యతిరేకిస్తున్నట్లు, వాటికి దూరంగా ఉంటామని అన్ని పార్టీలూ నగరపాలక సంస్ధలో ఒక తీర్మానం ద్వారా వెల్లడించాలని అధికార మితవాద ఓవిపి పార్టీ ప్రతిపాదించింది. కమ్యూనిస్టులు తప్ప వామపక్షంగా చెప్పుకొనే గ్రీన్స్, ఎస్పిఓతో సహా అన్ని పార్టీలు ఆమోదించాయి. చరిత్ర గురించి ఎవరికి వారు చర్చించి వైఖరి తీసుకోవాలి తప్ప కమ్యూనిజాన్ని-నాజీజాన్ని ఒకే గాటన ఎలా కడతామని కమ్యూనిస్టు పార్టీ ప్రశ్నించింది. దాన్ని అవకాశంగా తీసుకొని అధికారంలోని మితవాద పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ గ్రాజ్ పట్టణంలో పార్టీ నిత్యం జనంతో ఉన్న కారణంగా వాటిని తోసిపుచ్చారని ఫలితాలు వెల్లడించాయి. పార్టీ సోషలిజం సాధన ఆశయంగా పని చేస్తున్నప్పటికీ స్ధానిక సంస్ధల ఎన్నికలు గనుక ప్రజాసమస్యలే ప్రధానంగా పని చేసింది. ఈ ఎన్నికల్లో సోషలిజం గురించి తాము బోధించనప్పటికీ వామపక్ష రాజకీయాలను కింది నుంచి నిర్మించాలని, ఒక్క మున్సిపాలిటీ అనే కాదు, ఒక దుకాణంలో పని చేసే వారి దగ్గర నుంచి అంటే అత్యంత దిగువ స్ధాయి నుంచి పార్టీ నిర్మాణం జరిపితే జాతీయ రాజకీయాలకు ఎదగటం సాధ్యమే అని ఇరుగుపొరుగు పోర్చుగీసు, బెల్జియం వంటి ఐరోపా దేశాల అనుభవాలు సూచిస్తున్నాయని ఆస్ట్రియా కమ్యూనిస్టులు చెబుతున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్లారు, తిరిగి వచ్చారు. అరవై అయిదు గంటల వ్యవధిలో 20 సమావేశాలలో, ప్రయాణ సమయంలో విమానంలో నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారట. తిరిగి వస్తూనే కొత్త పార్లమెంట్ భవన సముదాయ నిర్మాణం ఎలా జరుగుతోందో రాత్రిపూట పర్యవేక్షించారు. రాగానే ప్రధాని నిర్మాణ స్ధలాన్ని సందర్శించటంలో పెద్ద విశేషం ఏమీ లేదు గానీ (కరోనా సమయంలో భరోసా ఇచ్చేందుకు ఏ ఆసుపత్రినీ సందర్శించలేదు గానీ అన్న కాంగ్రెస్ విమర్శ వేరే అంశం), విదేశాలకు వెళ్లినా, స్వదేశంలో ఉన్నా మన ప్రధానికి పని యావతప్ప మరొకటి ఉండదనే సందేశాన్ని మోడీ మీడియా మేనేజ్మెంట్ బృందం ఇచ్చిందని చెప్పవచ్చు. తన శరీర ధర్మాన్ని ఎలా కావాలనుకుంటే అలా మార్చుకొనే రహస్యాలు ప్రధాని దగ్గర ఉన్నందున విమాన ప్రయాణ బడలికకు ఏమాత్రం గురికాలేదని, ఎల్లవేళలా ఉత్సాహంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. వాటిని అదేదో అంటున్నారుగా డబ్బిచ్చి రాయించుకోవటం అని అదా, విలేకరులే ఉత్తేజితులై రాశారా అంటే, ప్రధాని వెంట ఎప్పుడూ విలేకర్లు ఉండరు, వారి పొడ గిట్టదని తెలిసిందే.
ఇంత హడావుడి చూసిన తరువాత ఒక సినిమాలో నువ్వు ఎవరు అని ప్రశ్నించినట్లుగా ప్రధాని అమెరికా, ఐరాస పర్యటనలో సాధించింది ఏమిటి అనే అంశం ముందుకు వస్తుంది. ఫలితం వస్తేనే పని చేసినట్లుగా భావిస్తున్న రోజులు కనుక అలాంటి ప్రశ్న వేసిన వారి మీద ఆగ్రహించనవసరం లేదు. అమెరికాలో ఇండియన్ అమెరికన్ వాణిజ్యవేత్తలతో సహా పలు కంపెనీల అధిపతులతో సమావేశం జరిపినట్లు వార్తలు వచ్చాయి. వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారా లేక పెట్టుబడుల విషయమై చర్చించారా అన్నది తెలియదు. సులభతర వాణిజ్యంలో మోడీ ఏలుబడిలో 142 నుంచి 63కు ఎదిగిన తరువాత కొత్తగా వారు తెలుసుకొనేదేమి ఉంటుంది-మోడీగారు చెప్పేది మాత్రం ఏం ఉంటుంది ? వచ్చే నెలలో అమెరికా నుంచి ఒక ఉన్నత స్ధాయి బృందం రానుందని వార్తలు.
ప్రధాని పర్యటన ఫలితాలు-పర్యవసానాలు వెంటనే వెల్లడికావాలనేదేమీ లేదు. ఈ పరిమితులను గమనంలో ఉంచుకొని జరిగిన కొన్ని విషయాల గురించి చూద్దాం. మొత్తం మీద మూడు అంశాలు ముందుకు వచ్చాయి. ఒకటి ఐరాస వార్షిక సమావేశంలో ప్రసంగించటం, రెండవది అమెరికా, జపాన్,ఆస్ట్రేలియా, భారత్లతో ఏర్పడిన చతుష్టయ కూటమి శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్లకు గట్టి పరోక్ష హెచ్చరిక , ఈ సందర్భంగా వాణిజ్య ప్రముఖులు ఇతరులతో భేటీ కావటంగా చెప్పవచ్చు.బిజెపి నేతలు ఈ పర్యటన ఒక చారిత్రాత్మక మలుపు అన్నట్లుగా చిత్రించారు. వెంపల చెట్లను నిచ్చెనలతో ఎక్కే జనాలున్న రోజులివి. కొత్తగా జరిగిన పరిణామాలేవీ లేవు, కొత్తగా పొరుగుదేశాలకు చేసిన హెచ్చరిక ఏమిటన్నది ఒక బ్రహ్మపదార్దం.ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ బహుముఖ సంస్థలు అసంగతమైనవిగా మారాయని వాటిని సంస్కరించాలని కోరారు. వాస్తవమే, ఇది కూడా పరోక్ష వ్యవహారమే.భద్రతా మండలిలో శాశ్వత స్ధానం కావాలని మనం కోరుతున్నాం. ఆ హౌదా ఉన్న దేశాలు దాన్ని దేనికి వినియోగిస్తున్నాయన్నది వివాదాస్పదం, ప్రజాస్వామ్య విరుద్దం. ఆ హక్కు ఎవరికీ ఉండకూడదు. ఐరాస జనరల్బాడీ లేదా భద్రతా మండలి మెజారిటీ తీర్మానాలను ఏ ఒక్కదేశం వీటో చేసినా అవి చెల్లవు. అలాంటి హక్కును మనం కోరుతూ ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాఠాలు చెబుతున్నాం. అయినా చైనాతో సహా అందరూ మనకు మద్దతు పలుకుతున్నారు. ఇదే సమయంలో మనతో సహా ఎవరి రాజకీయం వారు చేస్తున్నందున అది ముందుకు పోవటం లేదు, ఆశ కూడా కనిపించటం లేదు.
తిరోగామి దేశాలు ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఐరాసలో ప్రధాని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డను ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా ఉపయోగించటాన్ని అనుమతించకూడదని, ఏ దేశమూ అక్కడి పరిస్ధితిని వినియోగించుకొనేందుకు వీల్లేకుండా చూడాలనీ చెప్పారు, నిజమే, ఆ పేరుతో ఇరవై ఏండ్లు ప్రత్యక్షంగా మరో 23 ఏండ్లు పరోక్షంగా అమెరికా చేసింది ఏమిటో పరోక్షంగా అయినా చెప్పి ఉంటే మరింత ఘనంగా ఉండేది. అమెరికా, దానికి ఇంతకాలం మద్దతు ఇచ్చిన మనం ఏ రకమైన దేశాల జాబితాలోకి వస్తాం ? ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా ఆప్ఘనిస్తాన్లో మిలిటరీ జోక్యం చేసుకుంది. అక్కడి జనజీవితాలను అతలాకుతలం గావించింది. తాలిబాన్, ఇతర ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్కు ఆయుధాలతో సహా అన్ని రకాల మద్దతు ఇచ్చింది. మాదారిన మేం పోతాం మా జోలికి రావద్దు అని వారితోనే ఒప్పందం చేసుకుంది, అయినా ఒక్క మాట అనేందుకు మనకు ధైర్యం లేదు.
ప్రధాని అంతర్జాతీయ వేదిక మీద తన గురించి తాను పొగుడుకోవటాన్ని ఎవరైనా తప్పు పడితే వారి మీద విరుచుకుపడితే కుదరదు. ఇతరులు పొగిడితే అందం చందం. మనల్ని మనమే పొగుడుకుంటే ”చాల బాగోదు ”. ఒక రోజు రైల్వే స్టేషన్లో తేనీరు అమ్మేందుకు తన తండ్రికి సహకరించిన ఒక చిన్న కుర్రవాడు నేడు నాలుగోసారి ఐరాస సమావేశంలో ప్రసంగించటం భారత ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం అని మోడీ తన గురించి చెప్పుకున్నారు. అయితే అదే చిన్న కుర్రవాడు పెద్దయిన తరువాత ఆ రైల్వేస్టేషన్లను ఏం చేయచూస్తున్నారో చూస్తున్నదే. ఆ కుర్రవాడి ఊరి రైల్వే స్టేషన్ తేనీరు అమ్మేంత పెద్దది కాదని, అందుకు ఆధారాలేవీ లేవని మన దేశ మీడియాలో వచ్చిన వార్తలను చదువుకున్న విదేశీయులు భారత ప్రధాని గురించి ఏమనుకుంటారు ? కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లుగా మనం వదిలేద్దాం.
అమెరికా పర్యటనలో నరేంద్రమోడీ సాధించిందేమిటి అనే ప్రశ్నకు మోడీ అద్భుత అమెరికా సందర్శన – ప్రదర్శన ప్రపంచ రాజకీయాల్లో భారత్కు ఒక మూలమలుపు అని బిజెపి అధికార ప్రతినిధి తుహిన్ ఏ సిన్హా ఏకంగా ఒక పెద్ద వ్యాసమే రాశారు. ఎవరికైనా అలా అనిపించిందా ? ప్రతి సందర్భంలోనూ చాతుర్యం ప్రదర్శించారని, సునాయాసంగా, ఎంతో చక్కగా ఐరాసలో ప్రసంగించారని వర్ణించారు. హిందీ, గుజరాతీలో ఆయన మంచి వక్త అని కొత్తగా చెప్పాల్సిందేముంది. మోడీ ప్రసంగం ప్రపంచంలో ఏదైనా కొత్త పరిణామానికి నాంది పలికిందా, దానికి సూచనలు కూడా లేవు. అందుకే ఒరిగిందేమిటి అనాల్సి వస్తోంది. 1950దశకంలో మనకు భద్రతా మండలిలో శాశ్వత స్ధానం దక్కే అవకాశాన్ని నెహ్రూ చైనాకు వదలివేశారని బిజెపి ప్రతినిధి గోబెల్స్ ప్రచారాన్ని పునరుద్ఘాటించారు. భద్రతా మండలిలో చైనాకు శాశ్వత స్దానం వచ్చిన 1945లో మనకు అసలు స్వాతంత్య్రం రాలేదు, చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రాలేదు, వచ్చిన 1949 నుంచి 1971వరకు కమ్యూనిస్టు చైనాకు ఐరాసలో అసలు గుర్తింపే లేదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ ప్రభుత్వాన్నే అసలైన చైనా పేరుతో కథ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు.
ప్రస్తుతం భద్రతా మండలిని విస్తరించాలనే మల్లగుల్లాల్లో భాగంగా భారత్, జపాన్, జర్మనీ,బ్రెజిల్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. భారత్ విషయంలో ఒక్క పాకిస్తాన్ తప్ప చైనాతో సహా మరేదేశమూ అభ్యంతరం చెప్పలేదు. తమ దేశాలపై యుద్దనేరాలకు పాల్పడిన జపాన్ వైపు నుంచి ఇప్పటికీ సరైన పశ్చాత్తాపం లేనందున చైనా, ఉత్తరకొరియా, వియత్నాం వంటి దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి.ఇటలీ పరోక్షంగా జర్మనీకి వ్యతిరేకంగా ఉంది. మరికొన్ని ఐరోపా, ఆఫ్రికాదేశాలు కూడా జర్మనీని వ్యతిరేకిస్తున్నాయి.బ్రెజిల్ను కొన్ని లాటిన్ అమెరికా దేశాలు అంగీకరించటం లేదు. మన దేశాన్ని తన అనుయాయిగా మార్చుకొనేందుకు తెరవెనుక మంతనాల్లో నెహ్రూ ప్రభుత్వానికి అమెరికా భద్రతా మండలి శాశ్వత స్ధానం అనే బిస్కెట్ను వేసింది. మాక్కూడా ఇస్తే అంగీకారమే గాని చైనాను తప్పించి ఆ స్ధానం మాకు అవసరం లేదు అని నెహ్రూ చెప్పారు. ఇప్పుడు మన దేశం జపాన్కు మద్దతు ఇస్తున్నది. మీ సంగతి మీరు చూసుకోండి తప్ప జపాన్కు మద్దతు మానుకోవాలని మన దేశానికి చైనా చెబుతున్నది. నాటి నెహ్రూ వైఖరిని తప్పుపడుతున్న నేటి నరేంద్రమోడీ సర్కార్, బిజెపి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా ? అలా ఇంతవరకు ఎందుకు చెప్పలేదు.అలాంటి వారికి నెహ్రూను విమర్శించే నైతిక హక్కు ఎక్కడ ఉంది ?
నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో చతుష్టయ(క్వాడ్) సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇది మిలిటరీ కూటమి కాదు, చైనాకు వ్యతిరేకం కాదని గతంలో మన దేశ వైఖరి గురించి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఇప్పుడు నరేంద్రమోడీ వైఖరిలో అంత స్పష్టత లేదు. అది ఎత్తుగడ లేదా ముసుగు కావచ్చు, కానీ ఒక పార్టీగా బిజెపి అధికార ప్రతినిధి ఏం చెబుతున్నారు ? బ్రెజిల్, రష్యా, ఇండియా,చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ కూటమి 2006లో ఏర్పడింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్తో కూడిన చతుష్టయం(క్వాడ్) 2007లో ఉనికిలోకి వచ్చింది. బ్రిక్స్ అవసరార్ధం, ఎడముఖం పెడముఖంగా ఉండేదేశాలతో ఏర్పడిందని, అంతగా అయితే రద్దు చేయకుండానే సార్క్ మాదిరి వదలివేయవచ్చట. పురోగామి ప్రజాస్వామిక దేశాలతో కూడిన చతుష్టయం సహజంగా ఉనికిలోకి వచ్చిందట. జగడాలంటే ఇష్టపడటం దాని స్వభావమట. ఎవరి మీద ? ఇది ఎల్లవేళలా చైనాకు వ్యతిరేకంగానే కనిపిస్తుందని,కమ్యూనిస్టు-ఇస్లామిస్టు కూటమికి వ్యతిరేకంగా పని చేసేందుకు అని కూడా బిజెపి ప్రతినిధి సెలవిచ్చారు. లడఖ్ సరిహద్దు వివాదం ఎందుకు,ఎలా జరిగిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చేమో !అంతేకాదు, భవిష్యత్ ప్రపంచ రాజకీయాలను మలచటంలో చతుష్టయం భారత్కు అత్యంత అనుకూల స్ధానాన్ని చేకూర్చుతుందని కూడా చెప్పారు. ఇక ఐరాస ప్రసంగంలో మోడీగారు చెప్పిన అంశాలలో ” భారత్ అభివృద్ది చెందినపుడు ప్రపంచం అభివృద్ధి చెందుతుంది… భారత్ సంస్కరణలు అమలు జరిపినపుడు ప్రపంచం మారుతుంది ” దీని మీద వ్యాఖ్యానించనవసరం లేదు. ఒకవైపు చతుష్టయ రాజకీయం చేస్తూనే మరోవైపు అకుస్ను ఏర్పాటు చేసి ఆస్ట్రేలియాకు అణుపరిజ్ఞానాన్ని అంద చేసేందుకు ఒక అడుగు ముందుకు వేశారు. దీంతో చతుష్టయం కూడా ఒక బాతాఖానీ కేంద్రంగా మారుతుందని కొందరు చెబుతున్నారు. దీనితో చైనాను దెబ్బతీసే అవకాశం మనకు వచ్చిందని బిజెపి చెబుతోంది.
మోడీ గారి అమెరికా పర్యటనలో పెద్ద జోక్ పేలింది. జో బైడెన్, నరేంద్రమోడీ ఇద్దరూ మాట్లాడుకొనేందుకు అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు.అప్పుడు బైడెన్ మన ప్రధాని మోడీతో మాట్లాడుతూ అమెరికా కంటే భారత మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తిస్తుంది.మీరు అనుమతిస్తే నేను ఒక్క మాట చెబుతాను. పత్రికల వారిని తీసుకొచ్చేట్లున్నారు. మనం వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవద్దు, ఎందుకంటే వారు నిర్దిష్ట అంశం మీద ఏ ప్రశ్నా అడగరు” అన్నాడు. మరొక వార్త ప్రకారం అమెరికా జర్నలిస్టులు ఏ అంశం మీదా సరిగా ప్రశ్నలు అడగరని వాటికి మీరు సమాధానం చెప్పలేరని అన్నట్లుగా ఆర్ఎన్సి రిసర్చ్ రాసింది. ఏదైనా జరిగి ఉండవచ్చు గానీ, అసలు నరేంద్రమోడీ భారత్లో కూడా మీడియాతో ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా మాట్లాడలేదు, అస్సలు నోరు విప్పరు అనే అంశం జో బైడెన్కు తెలియదా, అంతటి అమాయకండా ఉన్నాడా ? అసలు విషయం ఏమంటే అమెరికా మీడియా నరేంద్రమోడీ గురించి అనేక విమర్శనాత్మక కథనాలు రాసింది. అందువలన తమ దేశ మీడియాను బైడెన్ అవమానిస్తూ మాట్లాడి మోడీని సంతోషపెట్టేందుకు ప్రయత్నించారని చెబుతున్నవారు కూడా లేకపోలేదు. ఇదే సమయంలో అమెరికన్ మీడియా మీద జోబైడెన్ కూడా వివిధ కారణాలతో ఆగ్రహంతో ఉన్నారు. వారి ఉనికే సహించటం లేదని చతుష్టయ సమావేశాల సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో బైడెన్ భేటీ సందర్భంగా వెల్లడైంది. సిబ్బంది విలేకర్లను దాదాపు బయటకు గెంటేసినంత పని చేశారు.
సాధారణంగా ఒక ప్రాంతానికి అలవాటు పడినవారు మరో చోటికి వెళ్లినపుడు అందునా నిద్రవేళలు పూర్తిగా తారుమారైపుడు నిద్రపట్టకపోవటం, అలసి పోవటం, అక్కడి సమయాలకు వెంటనే అనువుగా అలవాటు పడకపోవటం తెలిసిందే. అయితే నరేంద్రమోడీ ఎక్కడికి వెళ్లితే అక్కడి సమయాలకు అనుగుణంగా విమానం ఎక్కగానే తన శరీర ధర్మాన్ని మార్చుకుంటారని ఆయనను అనుసరించిన వారు చెప్పినట్లు వార్త వెలువడింది. ఇవన్నీ సిబ్బంది చెప్పి రాయించిన వార్తలన్నది స్పష్టం. సాధారణ వ్యక్తులకే ఎంతో పని ఉంటుంది, అలాంటిది ప్రధాని మోడీ తన ముమ్మర కార్యక్రమాలకు అనుగుణ్యంగా ఉన్నత స్ధాయిలో శక్తిని ప్రదర్శించేలా తన శరీరాన్ని ఉంచుకున్నారని, ఎంత వత్తిడి ఉన్నా, ఎన్ని గంటలైనా ఎల్లవేళలా ఉల్లాసంగా విదేశీ ప్రయాణాల్లో ఉంటారని కూడా రాశారు. అలసటను జయించిన ప్రధాని అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా, విమానబడలికకు దూరంగా ఉన్న ప్రధాని రహస్యాలు అనే అర్ధంతో హిందూస్తాన్టైమ్స్ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి.వీటిని ఆధారం చేసుకొని పిటిఐ వార్తా సంస్థ తన కథనాన్ని వండి వార్చింది. విమానాల్లో ప్రయాణించేటపుడు శరీరంలోని తడి ఆరిపోతుంది కనుక వైద్యుల సలహామేరకు ప్రధాని నీటిని ఎక్కువగా తాగుతారని పేర్కొన్నది.1990 దశకంలో నెలవారీ టిక్కెట్లు తీసుకొని రైల్లో తిరిగినట్లుగా మోడీ అమెరికా వెళ్లివచ్చేవారట. రాత్రిపూటే ప్రయాణించటం, విమానాలు లేదా విమానాశ్రయాల్లోనే సేద తీరేవారు తప్ప హౌటళ్లకు ఒక రూపాయి కూడా ఖర్చు చేసే వారు కాదట.
గోద్రా ఉదంత అనంతర గుజరాత్ మారణకాండ తరువాత నరేంద్రమోడీ పర్యటనకు అమెరికా అసలు వీసా ఇవ్వలేదని తెలిసిందే. ప్రధాని అయిన తరువాతే వెళ్లారు. అంతకు ముందు ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా అంతగా అమెరికాలో పని ఏమి ఉండి ఉంటుంది,1993లో ఒక్కసారి అమెరికా వెళ్లి అక్కడి సినిమా స్టూడియోలను సందర్శించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇతరంగా ఫొటోలు అంతర్జాలంలో దర్శనమిచ్చాయి. పోనీ రోజుకు ఒకసారి వెళ్లివచ్చారనే అనుకుందాం. నష్టం ఏముంది ? ఎన్నికల ప్రచారం వంటి సందర్భాలలో ప్రముఖుల ప్రచారశైలి గురించి మీడియా రాయటం తెలిసిందే, దాన్ని అర్ధం చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణాల్లో శరీరధర్మాన్ని మార్చుకోవటం వంటి అతిశయోక్తులు వ్యక్తిపూజకు నిదర్శనం. ఇలాంటి అంశాలు గతంలో కూడా అనేక మంది ప్రముఖుల గురించి రాసిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ కూడా ఆ కీర్తి కండూతి జాబితాలో చేరిపోయారు.ప్రత్యేకత ఏముంది ? ఇలాంటి వార్తలు, లేదా వ్యక్తిగత అలవాట్ల గురించి రాసి భక్తులను ఆనందపెట్టటం తప్ప దేశానికి జరిగే ప్రయోజనం ఏముంది ? బిజెపి నేతలు చెబుతున్నట్లు ప్రపంచ రాజకీయాలను మోడీ గారు ఎలా మలుస్తారో, చారిత్రాత్మకం ఏమిటో తరువాతైనా కనిపిస్తాయోమో చూద్దాం !
చైనా మీద ఉక్రోషంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హువెయి కంపెనీ అధికారిని కిడ్నాప్ చేయించాడు.దాని పర్యవసానాలను తట్టుకోలేని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ దిగివచ్చి రాజీ చేసుకున్నాడు. బాధితురాలు చైనాకు చెందిన వాంగ్ వాన్ఝౌ స్వదేశం చేరుకొనే సమయంలోనే చతుష్టయ దేశాధినేతల తొలి సమావేశం వాషింగ్టన్లో జరిగింది. చతుష్టయ సమావేశం ముందుగా నిర్ణయించుకున్నదే, మరి మొదటి ఉదంతం ? యాదృచ్ఛికమా ? కానేకాదు ! ఈ చర్య అమెరికా-చైనాల మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు దోహదం చేయనుందనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్యలకు ” అకుస్” ఒప్పందం చేసుకున్నారు. చతుష్టయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో నాటకీయంగా సుఖాంతమైన కిడ్నాప్ ఉదంతం, దీని ద్వారా భారత్ సహా మిత్రదేశాలకు అమెరికా ఇచ్చిన సందేశం ఏమిటి ?
చైనాతో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించిన డోనాల్డ్ ట్రంప్ చైనా టెలికాం కంపెనీ హువెయి సిఎఫ్ఓ, కంపెనీ స్ధాపకుడి కుమార్తె మెంగ్ వాన్ఝౌను 2018డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలో ” రాజకీయ కిడ్నాప్ ” చేయించాడు. మెంగ్ చైనా నుంచి మెక్సికో వెళుతూ విమానం మారేందుకు కెనడాలోని వాంకోవర్ విమానాశ్రయంలో దిగింది. అమెరికా వత్తిడికి లొంగిన కెనడా సర్కార్ ఆమెను కిడ్నాప్ చేసి నిర్బంధించింది. ఇదే సమయంలో గూఢచర్యానికి పాల్పడుతూ దొరికిపోయిన ఇద్దరు కెనడీయులను చైనా అరెస్టు చేయటమే కాదు, విచారణ జరిపి శిక్షలు కూడా విధించింది. ఈ పరిణామాలతో అమెరికా-చైనా సంబంధాలు గత నాలుగుదశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా దిగజారటమే కాదు, కెనడా ఇరుక్కుపోయి చైనాతో వైరాన్ని కొని తెచ్చుకుంది.
ఇంతకీ వాంగ్ మీద మోపిన నేరం ఏమిటి ? ఇరాన్ మీద అమెరికా విధించిన ఆంక్షలను వమ్ము చేసేందుకు హుబెయి కంపెనీ కుట్ర చేసిందట, దానికి గాను సిఎఫ్ఓను అరెస్టు చేసి తమకు అప్పగించాల్సిందిగా కెనడాను కోరింది. కెనడా అరెస్టయితే చేసింది గానీ చైనాతో వచ్చే ముప్పును గ్రహించి వాంగ్ను అమెరికాకు అప్పగించలేదు. ఒకవైపు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్తో కూడిన చతుష్టయ (క్వాడ్) తొలి సమావేశం వాషింగ్టన్లో జరుపుతున్న సమయంలోనే నాటకీయ పరిణామాల మధ్య వాంగ్ విడుదలకు చైనాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. వాంగ్ శనివారం నాడు ప్రత్యేక విమానంలో చైనా చేరుకుంది. ఒప్పంద వివరాలు పూర్తిగా తెలియదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగే విషయం ఇతర భాగస్వామ్య పక్షాలతో చెప్పకుండానే నిర్ణయం తీసుకున్న అమెరికా ఇప్పుడు ఈ పరిణామంతో చతుష్టయంలోని మిగిలిన దేశాలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లయింది.
ఈ ఒప్పందానికి జో బైడెన్ యంత్రాంగాన్ని ప్రేరేపించిన అంశాలేమిటి ? చైనా వైపు నుంచి కొత్తగా పొందిన రాయితీలేమీ లేవు. ఒక వైపు అక్కడి గుత్త సంస్ధలపై అనేక చర్యలను జింపింగ్ సర్కార్ ప్రకటిస్తున్నది. ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వంత పరిజ్ఞానం, వనరులతో అభివృద్ధి వ్యూహాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. జనవరిలో అధికారాన్ని స్వీకరించిన బైడెన్ వాణిజ్య ప్రతినిధిగా కాథరీన్ తాయి నియామకం జరపటంతో వాణిజ్యవేత్తలు తమ సమస్యలను పట్టించుకుంటారనే ఆశాభావం వెలిబుచ్చారు. అయితే నెలలు గడుస్తున్నా వ్యూహాత్మక ఓపిక పేరుతో కాలం గడుపుతున్న బైడెన్ వైపు నుంచి ఎలాంటి సూచనలు రాకపోవటంతో కొంత మందిలో ఓపిక స్దానంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. వెంటనే చైనాతో చర్చలు జరిపి సాధారణ సంబంధాలతో తమ ప్రయోజనాలను కాపాడతారా లేదా అనే వత్తిడి తెస్తున్నారు.
డోనాల్డ్ ట్రంప్ హయాంలో చైనాతో కుదుర్చుకున్నట్లు ప్రకటించిన తొలి దశ వాణిజ్యం ఒప్పందం ఏమేరకు అమలు జరిగిందో స్పష్టత లేదు. కరోనా వైరస్ను చైనాయే తయారు చేసి వదలిందని నోరు పారవేసుకున్న ట్రంప్ చైనాతో వైరాన్ని మరింత పెంచాడు. ఒప్పందంలో ఏమి చెప్పినప్పటికీ అమెరికాకు ఆగ్రహం కలిగినా, దాంతో చైనాకు చిర్రెత్తినా నష్టపోయేది అమెరికాయే గనుక అక్కడి వాణిజ్యవేత్తలు బైడెన్ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు తొలివారంలో అమెరికాలోని అతి పెద్ద వాణిజ్య సంస్ధల సంఘాలు సమావేశమై చైనాతో సర్దుబాటు చేసుకొని వాణిజ్య అవకాశాలను పెంచుతారా లేదా అని బైడెన్కు ఒక విధంగా హెచ్చరికను జారీ చేశాయి. కొన్ని ఉత్పత్తుల తయారీకి అవసరమైన ఉత్పాదకాలు చైనాలో మాత్రమే దొరుకుతాయి, ఇతర దేశాల్లో పరిమితంగా లభ్యమైనా అధికధరలకు వాటిని కొనుగోలు చేసి మార్కెట్లో తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నామని, అందువలన చైనా సరఫరాదార్ల మీద ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, కార్మికులు, అమెరికా పోటీతత్వాన్ని కాపాడాలంటే చైనాతో రాజీకి రావాలని స్పష్టం చేశాయి.
అమెరికా కంపెనీలను చైనీయులు ఎలా ప్రభావితం చేస్తున్నారో మచ్చుకు విమానాలను తయారు చేసే బోయింగ్ కంపెనీ ఉదంతాన్ని చూద్దాం. అసలే ఆ కంపెనీ కష్టాల్లో ఉంది, అది తయారు చేసే విమానాల్లో ఐదోవంతు కొనుగోలు చేసే చైనా నుంచి 2017 తరువాత ఆర్డర్లు లేవు. లాభాలు తెస్తుంది అనుకుంటున్న బోయింగ్ 737 మాక్స్ రకం తన గగన తలంపై ఎగిరేందుకు చైనా అనుమతించ లేదు. దాంతో ఇతర దేశాలు అనుమతి ఇచ్చినా, విమానాలు కొనుగోలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. ఇదంతా ట్రంపు చేసిన కంపు అని అది మండిపడుతోంది. రాబోయే పది సంవత్సరాల్లో ప్రపంచం వంద విమానాలు కొనుగోలు చేస్తుందనుకుంటే వాటిలో 25 చైనా వాటా.ఈ కారణంగా బోయింగ్ వాటాదారులు ఇటీవల కంపెనీ మీద ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డుంకులను అధిగమించినా చైనాతో సాధ్యం కావటం లేదు, చైనాతో సర్దుబాటు చేసుకోకపోయినా, ఆలస్యం అయినా మన కంపెనీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సిఇఓ దవే కాలహన్ వాపోయాడు. మే నెలలో కొత్తగా 73 విమానాలకు అర్డర్లు వస్తే అదే నెలలో 53 ఆర్డర్లు రద్దయ్యాయి. కనుక ఇలాంటి కార్పొరేట్లకు ఆగ్రహం కలిగినా, మద్దతు లేకపోయినా అమెరికాలో ట్రంపూ, బైడెన్ ఎవరూ తెరమీద కనిపించరు.
బోయింగ్ వంటి కంపెనీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి ? రానున్న రెండు దశాబ్దాలలో చైనాకు 8,700 విమానాలు అవసరమన్నది ప్రస్తుత అంచనా. చైనా వృద్ధి రేటు, పౌరుల ఆదాయాలు పెరిగితే ఇంకా ఎక్కువ అవసరం కావచ్చు. మరోవైపు 2025నాటికి స్వంత విమానాలను ఎగురవేయాలని చైనా ముమ్మరంగా పరీక్షలు జరుపుతోంది.2008లో ఏర్పాటు చేసిన కంపెనీ రెండు రకాల విమానాలను అభివృద్ది చేస్తోంది. ఎక్కడా ఆగకుండా 5,555 కిలోమీటర్ల దూరం 156 నుంచి 168 మంది, పన్నెండు వేల కిలోమీటర్లు ఆగకుండా 250 నుంచి 320 మంది ప్రయాణీకులను చేరవేయగలిగే విమానాలను తయారు చేస్తున్నారు. వెయ్యి చిన్న విమానాలను ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య అవసరాలకు ప్రవేశపెడతారని, 2025నాటికి పెద్ద విమానం సిద్దమౌతుందని భావిస్తున్నారు. అవి రంగంలోకి వస్తే ఐరోపా ఎయిర్బస్, అమెరికా బోయింగ్లకు పెద్ద పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ లోగా వీలైనన్ని విమానాలను అమ్ముకోవాలని ఆ రెండు కంపెనీలు తొందరపడుతున్నాయి. తమ ప్రభుత్వాల మీద వత్తిడి చేస్తున్నాయి.
వచ్చే ఏడాది నవంబరులో అమెరికా పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల జరగాల్సి ఉంది. చైనాతో ఒప్పందం చేసుకుంటే లొంగిపోయినట్లుగా ట్రంప్ గ్యాంగ్ ఓటర్లను రెచ్చగొట్టవచ్చని డెమోక్రటిక్ పార్టీ భయపడుతోంది. లేకపోతే కార్పొరేట్లు గుర్రుమంటున్నాయి.మరోవైపు ఎవరి మీదా ఆధారపడకుండా ఆర్ధిక వ్యవస్దను నడపాలనే వైఖరితో ముందుకు పోతున్న చైనా నాయకత్వ వైఖరి కూడా పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు చతుష్టయంలోని భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలను చైనాకు వ్యతిరేకంగా అమెరికా రెచ్చగొడుతూ దూరం పెంచుతోంది. మరోవైపు తన వ్యాపారాన్ని తాను చక్కపెట్టుకొంటోంది.2021 తొలి ఎనిమిది నెలల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 36.6శాతం పెరిగి చైనా-అమెరికా వాణిజ్యం రెండు వైపులా రికార్డులను బద్దలు కొట్టి 470బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా నుంచి 48శాతం ఎగుమతులు(111బి.డాలర్లు) పెరిగితే చైనా నుంచి 33.3శాతం(354 బి.డాలర్లు) పెరిగాయి. ఏడాది మొత్తం మీద రెండు దేశాల మధ్య 700 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఇది వాణిజ్య యుద్దానికి ముందున్న స్ధాయిని దాటి కొత్త రికార్డు నెలకొల్పుతుందని చెబుతున్నారు.
చైనా నుంచి కంపెనీలు మన దేశం వస్తున్నాయన్న ప్రచారం తెలిసిందే. కరోనా సమయంలో(2020) చైనాలోని తమ అసోసియేషన్లోని 95శాతం మంది చైనా మార్కెట్లో లబ్దిపొందారని అమెరికా-చైనా వాణిజ్య మండలి(యుఎస్సిబిసి) ఒక శ్వేతపత్రంలో వెల్లడించింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ట్రంప్ వైఖరినే బైడెన్ కొనసాగిస్తారనే భయం అమెరికన్ కార్పొరేట్లలో ఉంది, అందుకే వత్తిడి పెంచారు.అదే జరిగితే చైనా ప్రతిదాడికి దిగితే వాణిజ్యంతో పాటు సామాన్య అమెరికన్లు కూడా ఇబ్బంది పడతారనే భయం వ్యక్తమౌతోంది. అంతర్గతంగా రాయితీలు ఇవ్వటాన్ని ప్రపంచ వాణిజ్య సంస్ధ కూడా అడ్డుకోలేదు.ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దితో 2025 నాటికి ఒక మైలురాయిని దాటాలని చైనా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ స్ధానిక పరిశోధన, అభివృద్దిని ప్రోత్సహిస్తోంది. ఇది కూడా అమెరికన్లకు ఆందోళనకరంగా మారింది. ట్రంప్ మార్గంలో పయనిస్తే మరోదారీ, తెన్నూ లేని చోటికి పయనిస్తామని, కనుక వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చర్చలు జరపాలని కార్పొరేట్లు డిమాండ్ చేస్తున్నాయి.ఈ నేపధ్యంలోనే సెప్టెంబరు పదిన జో బైడెన్-గ్జీ జింపింగ్ మధ్య అనేక అంశాలపై ఫోను ద్వారా సంభాషణలు జరిగాయి. పదిహేను రోజుల్లోనేే హుబెయి సిఎఫ్ఓ వాంగ్ఝౌ విడుదల ఆఘమేఘాల మీద జరిగింది.
అమెరికన్ కార్పొరేట్లు బైడెన్ సర్కారు మీద మరోవత్తిడిని కూడా ప్రారంభించాయి. ఆర్ధికంగా చిక్కుల్లో ఉన్న వ్యవస్ధను గట్టెక్కించేందుకు ప్రభుత్వం 3.5లక్షల కోట్ల డాలర్లను వివిధ పధకాల మీద ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. అందుకు గాను వాణిజ్య, పారిశ్రామిక సంస్దల నుంచి వసూలు చేసే పన్ను మొత్తాల పెంపుదల, ఇతర చర్యల ద్వారా నిధుల సేకరణ జరపాలన్న ప్రతిపాదనలున్నాయి.ఇదే చేస్తే దేశ ఆర్ధిక వ్యవస్ధ ఉనికే ప్రశ్నార్దకం అవుతుందని అమెరికా వాణిజ్య మండలి ధ్వజమెత్తింది.దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీవీల్లో ప్రకటనలు జారీ చేసి ప్రచారం చేస్తోంది. ఈ మొత్తం దేశంలోని 50 రాష్ట్రాల బడ్జెట్లకు రెండు రెట్ల కంటే ఎక్కువని, దీని వలన ఫలితం లేకపోగా మొదటికే ముప్పు వస్తుందని వాణిజ్య మండలి సిఇఓ సుజానే క్లార్క్ విమర్శించాడు.ఈ ప్రతిపాదనలను ఆమోదించవద్దని, మద్దతు ఇస్తే ఏ సభ్యుడికీ తమ మద్దతు ఉండదని హెచ్చరిస్తూ పార్లమెంట్ సభ్యులకు ఒక లేఖను కూడా మండలి రాసింది. ఇదే సమయంలో ఎట్టి పరిస్ధితుల్లో ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సిందే అని కొంత మంది ఎంపీలు బహిరంగంగా ప్రకటించారు.
ప్రపంచీకరణ పేరుతో ప్రపంచమార్కెట్లను ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నిస్తే అనుకున్నదొకటీ అయింది మరొకటి. ప్రపంచీకరణ శ్రమశక్తి ఖర్చును తగ్గించింది. అది అమెరికా కార్పొరేట్లకు వరంగానూ, కార్మికవర్గానికి శాపంగానూ మారింది. స్ధానిక మార్కెట్ల ద్వారా వృద్ధి సాధించే అవకాశాలు తగ్గిపోయాయి. అమెరికా వస్తువుల కంటే ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటం లాభదాయయకంగా మారింది. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా చేరినప్పటి నుంచీ అంతకు ముందు యాభై సంవత్సరాలతో పోల్చితే అమెరికన్ కార్పొరేట్ల లాభాలు 22శాతం పెరిగాయి.చైనాలో పెట్టుబడి పెట్టిన వారు కూడా ఇదే విధంగా లబ్ది పొందారు. దశాబ్దాల తరబడి క్యూబా, ఉత్తర కొరియా,రష్యా,సిరియా, తదితర దేశాల మీద అమెరికా విధించిన ఆంక్షలు పరిస్ధితిని మరింతగా దిగజారాయి తప్ప ప్రయోజనం లేకపోయింది. అవన్నీ ఇబ్బందులను భరించాయి తప్ప అమెరికాకు లొంగలేదు. అమెరికా విధించిన ఆంక్షల వలన ఆయా దేశాలు బోయింగ్ బదులు ఎయిర్బస్ విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇదే ఇతర అంశాల్లోనూ జరుగుతోంది. క్రమంగా చైనా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారుతుందని పశ్చిమదేశాలు వేసిన అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ఇప్పుడు అక్కడ బడా సంస్దల మీద నియంత్రణ, ఉమ్మడి సౌభాగ్యం పేరుతో తీసుకుంటున్న చర్యల గురించి అర్ధంగాక జుట్టుపీక్కుంటున్నాయి.
గత దశాబ్దకాలంలో చైనా సంస్దలు అమెరికా నుంచి 76బిలియన్ డాలర్లను సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 13బిలియన్ డాలర్లను పొందాయి.2016 నుంచి అమెరికాలోని స్టాక్మార్కెట్లో వాటాలను విక్రయిస్తున్న చైనా కంపెనీలు రెట్టింపై 400కు చేరాయి. వాటి లావాదేవీల మొత్తం 400 బిలియన్ డాలర్ల నుంచి 1.7లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా విదేశాంగ విధానంలో ఆర్ధిక అంశాలు చిన్నచిన్న దేశాలను కూడా ప్రభావితం చేయలేకపోయాయి. మిలటరీ చర్యలు కూడా ఎలా పరువు తీశాయో ఆప్ఘనిస్తాన్ స్పష్టం చేసింది. మిత్రదేశమైన మెక్సికో సరిహద్దులో వలస కార్మికులను అడ్డుకొనేందుకు ఏకంగా ట్రంప్ సర్కార్ గోడనే కట్టించిన విషయం తెలిసిందే. చైనా మీద విధించిన ఆంక్షలను ఐరోపాలోని జర్మనీ వంటి దేశాలే ఖాతరు చేయటం లేదు. హువెయి కంపెనీ టెలికాం ఉత్పత్తుల దిగుమతిని వ్యతిరేకించిన జర్మనీ ఇప్పుడు పునరాలోచనలో పడి ఐరోపా యూనియన్ మీదనే ఆంక్షలకు వ్యతిరేకంగా వత్తిడి తెస్తోంది. చైనాతో ఒప్పందాలు చేసుకుంటోంది. గతేడాది చైనాతో దాని వాణిజ్యం 243 బిలియన్ డాలర్లు. ఆర్ధిక ఆంక్షల కొరడాను అమెరికా ప్రయోగిస్తుంటే అదే ఎత్తుగడను చైనా అనుసరిస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, దక్షిణ కొరియా వంటి అమెరికా అనుకూల దేశాలకు నీవు నేర్పిన విద్యయే అంటూ జవాబిస్తోంది.
మాఫియా ముఠాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు ఎరలు వేసి యువతను ఆకర్షించి వారి చేత తప్పులు చేయించి తమ చక్రబంధంలో ఇరికించుకొని మరిన్ని తప్పులు చేయిస్తాయి.ఆ విషవలయం నుంచి ఎవరైనా బయటపడాలన్నా తమ మీద ఆధారపడటం తప్ప తప్పుకోలేని స్ధితికి నెడతారు. సరిగ్గా అమెరికా కూడా అదే పద్దతులను అనుసరిస్తోంది. పేకాటలో గెలిచేందుకు వేసే ఎత్తుగడల్లో భాగంగా, ఎదుటివారిని మభ్యపెట్టేందుకు కొన్ని పేకలను పడవేయటాన్ని తురుపు ముక్కలు అంటారు. వాటిని చూసి ఎదుటి వారు ఆడితే తప్పుదారి పట్టినట్లే.్ల అమెరికా తన క్రీడలో కూడా అలాంటి తరుపుముక్కలను ఉంచుకుంటుంది. మన దేశం విషాయనికి వస్తే స్వతంత్ర లేదా అలీన విధానాన్ని అనుసరించినపుడు మనకు ఉన్న మిత్రదేశాలెన్ని ఇప్పుడు దూరమయ్యాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. ఆసియాలో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు మన నుంచి దూరం జరిగి చైనాకు సన్నిహితం అవుతున్నాయి.అయినప్పటికీ ప్రస్తుత మనపాలకుల వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. చైనా, లేదా మరొకదేశానికి లొంగిపోవాలని లేదా దాని అనుయాయిగా మారాలని ఎవరూ చెప్పటం లేదు. మన రక్షణ, ప్రయోజనాలూ ముఖ్యం. అమెరికా చెప్పుడు మాటలు విని దాని కోసం మనం ఇరుగు పొరుగు వారితో విబేధాలను కొనితెచ్చుకోవటం సరైన వైఖరికాదు. సరిహద్దు సమస్యను ఉభయ దేశాలు పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా ఆర్చేది కాదు తీర్చేది కాదు.
ఐరోపా యూనియన్కు మోటారు వంటి జర్మనీలో ఇటీవల ఒక నివేదిక వెలువడింది. మన అపర దేశభక్తులు దాని గురించి ఒక్కసారి చూడటం మంచిదేమో ఆలోచించండి. బిట్స్ అండ్ చిప్స్ అనే వెబ్సైట్లో సెప్టెంబరు ఒకటవ తేదీన ఒక వార్త వచ్చింది. దానికి పెట్టిన శీర్షిక ” చైనా విషయంలో మనం అమెరికా అజండాను గుడ్డిగా అనుసరించకూడదు ”. జర్మన్ ఎకనమిక్ ఇనిస్టిట్యూట్ వెల్లడించిన ఒక నివేదిక మీద సమీక్ష మాదిరి రాశారు. ఐరోపా ఎగుమతి వస్తాదుగా ఉన్న జర్మనీ ఇటీవలి కాలంలో చైనాతో ఓడిపోతోంది అని పేర్కొన్నారు. ఇదే వెబ్సైట్లో అంతకు ముందు విశ్లేషణ రాసిన సానే వాన్డెర్ లగట్ ఇలా చెప్పారు.” గావుసియన్ అనే చైనా కంపెనీ శుభ్రం చేసే రోబోట్లను ఉన్నతమైన నాణ్యతతో అందచేస్తున్నది. వాటన్నింటి కంటే నేను ఒక ప్రధాన పెద్ద భ్రమ గురించి హెచ్చరిక చేయదలచాను.సాంకేతికంగా ఆసియా దేశాల కంటే ముందున్నామని ఇంకా అనుకుంటున్నాము. దాన్ని మనం కాపాడుకోవాలంటే అపహరించకుండా, కొనుగోలు, కాపీ చేయకుండా చూడాలని అనుకుంటున్నాము. మనం ఒక అంశానికి సిద్దపడటం లేదు, అదేమంటే ఉదారవాద మార్కెట్లో మన స్వంత చట్టాల ప్రకారమే మన మాదిరే అనేక కంపెనీలు మరింత ఆధునిక ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి.”
ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలిగితే జరిగే పర్యవసానాల గురించి భాగస్వామ్య దేశమని పొగడ్తలు కురిపించిన మనతో లేదా అక్కడికి సైన్యాన్ని పంపిన నాటో కూటమి దేశాలతో కూడా అమెరికా మాట మాత్రం చెప్పకుండా తనదారి తాను చూసుకుంది. మనం బహిరంగంగా తప్పు పట్టకపోగా తాలిబాన్లతో ప్రయివేటు ఒప్పందాన్ని హర్షించాము. చతుష్టయం పేరుతో మన దేశం, జపాన్, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించి చైనాకు వ్యతిరేకంగా నిలబెడుతోంది. జపాన్, మనదేశంతో చెప్పకుండానే మిత్రదేశమైన ఫ్రాన్స్ ప్రయోజనాలను కూడా దెబ్బతీసి ఆస్ట్రేలియాకు తమ అణుశక్తి జలాంతర్గాములను అమ్ముకొనేందుకు బ్రిటన్తో కలసి కొత్త కూటమి అకుస్ను ఏర్పాటు చేసింది. మూడు సంవత్సరాలుగా హుబెయి సిఎఫ్ఓను కెనడాలో నిర్బంధించిన అమెరికా నాటకీయ రీతిలో కేసులు ఎత్తివేసింది. దాని మాట నమ్మి అరెస్టు చేసిన కెనడా, ఆ చర్యను సమర్ధించిన దేశాలన్నీ ఇప్పుడు తలెత్తుకోలేని స్ధితిలో పడ్డాయి. ఇదంతా ఎందుకు అంటే చైనాతో తన వాణిజ్యాన్ని పెంచుకొనేందుకే అన్నది స్పష్టం. అందుకోసం అమెరికన్లు దేనికైనా సిద్దపడతారు. మనం ఇప్పటికే చాలా దూరం ప్రయయాణించాం. ఎక్కడకు పోతామో తెలియదు. అందువలన మన దేశంలోని అమెరికా గుడ్డి అరాధకులు, భక్తులు ఇప్పటికైనా దాని తోకను వదలి పెట్టటం గురించి ఆలోచించాలి.
దారుణం, ఘోరం, అన్యాయం, అక్రమం,నీతులు చెప్పే కమ్యూనిస్టు చైనా ఇంతకు తెగిస్తుందా ? ఇప్పటికైనా నిజం బయటపడింది. ఇక మన దేశానికి మంచి రోజులు వస్తాయి, పెట్టుబడులే పెట్టుబడులు అంటూ కొంత మంది నమ్మించ చూస్తున్నారు. నిజంగా పెట్టుబడులు రావటానికి ప్రపంచబ్యాంకు రాంకులు అవసరమా ? మంచి ర్యాంకులున్న దేశాల నుంచి పెట్టుబడులు ఎందుకు తరలిపోతున్నాయి ? అవి లేక ముందు పెట్టుబడులు రాలేదా, వాణిజ్యం జరగలేదా ? అసలు సమస్య ఏమిటి ?
సులభతర వాణిజ్యం చేసుకొనే అవకాశం, తద్వారా లాభాలు పిండుకొనే అవకాశం ఎక్కడ, ఎలా ఉందో సూచించేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా ఒక సూచికను ప్రకటిస్తున్నది. 2018లో చైనా ర్యాంకు 78, పందొమ్మిదిలో 46, ఇరవైలో 31. ఒక్కసారిగా ఇలా ఎలా పెరిగిపోతుంది. అంతా చేతివాటం అన్నది ప్రచారం. దాని మీద తనిఖీ చేయించినట్లు చెప్పిన ప్రపంచ బ్యాంకు ఆ సూచికల ప్రకటనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.తమ మీద వేసిన నింద మీద పూర్తి స్ధాయిలో దర్యాప్తు జరపాలని చైనా డిమాండ్ చేసింది. బ్యాంకు నివేదిక విశ్వసనీయతతో పాటు దాని సభ్యదేశాల గౌరవాన్ని కూడా కాపాడాలని కోరింది. గతంలో ప్రపంచబ్యాంకులో పని చేసి ప్రస్తుతం ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న క్రిస్టాలినా జియోర్గివే దర్యాప్తు నివేదికలో పేర్కొన్న భాష్యాలతో, తన పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా విబేధిస్తున్నట్లు ప్రకటించారు.
కాసేపు కొంత మందిని సంతుష్టీకరించేందుకు చైనా అక్రమాలకు పాల్పడింది, లబ్ది పొందిందే అనుకుందాం ! మన దేశానికి, ప్రపంచానికి జరిగిన నష్టం ఏమిటి ? వెంటనే వచ్చే సమాధానం, మన దేశానికి వచ్చే పెట్టుబడులను చైనా తన్నుకు పోయింది. ప్రపంచ బ్యాంకు ఏర్పడనపుడు, అది ప్రకటించే సులభతర వాణిజ్య సూచికలు లేనపుడు వాణిజ్యం జరగలేదా ? ప్రచారదాడికి గురై మాట్లాడటం తప్ప సూచికలను బట్టి ఎవరైనా వాణిజ్యం చేసే అమాయకులుంటారా ! 2006లో మనదేశ స్ధానం 116 అయినా పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు రాలేదు. అది 2016నాటికి 142వ స్ధానానికి దిగజారింది. సదరు సూచిక 2020 నాటికి 63కు పెరిగింది. ఈ కాలంలో పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి కావాలి, వృద్ధి రేటు తారాజువ్వలా లేవాలి, జిడిపి పరుగులు తీయాలి. అదేమి మహత్యమో మరొకటో ఎనిమిదిశాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగుశాతానికి పతనమైంది. సూచికలు ఎందుకు నిలబెట్టలేకపోయాయి ?భారత రాంకు తక్కువగా ఉన్న 2010 జడిపిలో పెట్టుబడులు 40శాతం ఉంటే గణనీయంగా మెరుగుపడిన తరువాత 2019లో 30శాతానికి పడిపోయాయి.
కమ్యూనిస్టు దేశాలు తప్పుడు పనులకు పాల్పడవచ్చా అన్నది ఒక ప్రశ్న. ఎవరూ పాల్పడకూడదు. కొందరి లెక్క ప్రకారం కమ్యూనిస్టు దేశాలు నిజాయితీగా ఉండాలి, మిగతా దేశాలు మోసాలకు పాల్పడవచ్చు తప్పులేదు అన్నట్లుగా ఉంది. ఒక వేళ చైనా, మరొక దేశం తప్పు చేసిందే అనుకుందాం. ఆ జాబితా నుంచి వాటిని తొలగించి మిగతా దేశాలకు రాంకులు కొనసాగించవచ్చు కదా ? చైనాను సాకుగా చూసి అసలు రాంకులు ఇవ్వటాన్నే తాత్కాలికంగా అయినా ప్రపంచ బ్యాంకు ఎందుకు నిలిపివేసినట్లు ? దాని నిజాయితీ ప్రశ్నార్ధకం కాదా ? అసలు ఈ సూచికలను ఎందుకు ముందుకు తెచ్చారు ? స్వేచ్చా వాణిజ్యం జరిగేందుకు, సభ్య దేశాలు పన్నులను తగ్గించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)ను ఏర్పాటు చేశారు. చిత్రం ఏమిటంటే అది ఏర్పడిన నాటి నుంచి దానితో నిమిత్తం లేకుండా అనేక దేశాలు, కూటములు ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం ప్రారంభించాయి. 1996లో ప్రపంచ వాణిజ్య సంస్ధను ఉనికిలోకి తెచ్చారు.2001లో దోహా దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ఎటూ తేలలేదు. అసలు ఒక అంగీకారానికి వస్తారో రారో తెలియదు. ప్రపంచ బ్యాంకు ఇది గమనించే కావచ్చు 2006 నుంచి రాంకింగులను ప్రారంభించింది. రాజు గారి గంగాళంలో నేనొక్కడిని నీళ్లు పోస్తే ఎవరికీ అనుమానం రాదులే అని ప్రతి వారూ పాలకు బదులు నీళ్లు పోసినట్లుగా ఎవరికి వారు స్వేచ్చా వాణిజ్య కబుర్లు చెబుతూనే రక్షణ చర్యలు ప్రారంభించారు. దాంతో దేశాల మధ్య పోటీ పెట్టి వాణిజ్యవేత్తలకు లబ్ది చేకూర్చేందుకు ప్రపంచబ్యాంకు వేసిన ఎత్తు ఇది. దీని లక్ష్యం ఎలాంటి నియంత్రణలు లేకుండా లేదా నామమాత్రంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పరిస్ధితిని కల్పించటమే. ఈ సూచికలు సామాజిక ప్రగతిని పట్టించుకోవని, అసమమానతలను పెంచుతాయని కొందరు పరిశోధకులు వెల్లడించారు. ఈ అవాంఛనీయ ర్యాంకుల పద్దతిని మన దేశంలో రాష్ట్రాల మధ్యకూడా ప్రవేశపెట్టటంతో అక్రమాలకు తెరలేచిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతకీ చైనా చేసినట్లు చెబుతున్న అక్రమం ఏమిటి ?
ప్రపంచ బ్యాంకు ఇస్తున్న ర్యాంకుల మీద ఫిర్యాదులు మామూలే. అనేక సార్లు ర్యాంకులకు అవసరమైన మార్కులను ఇచ్చే పద్దతులు, ప్రశ్నలను మార్చారు. వాటిని ఉపయోగించుకొని ప్రతి దేశం ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకే ఇచ్చిన ర్యాంకుల మీద అంతర్గత తనిఖీ నిర్వహిస్తారు. 2018 సెప్టెంబరు 12న ఆ ఏడాది నివేదిక గురించి చైనా అధికారులతో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ చర్చించాడట.తరువాత రెండు రోజులకు బ్యాంకు సిఇఓ క్రిస్టాలినా జియోర్గియేవా చైనా అధికారులతో చర్చించిన తరువాత ర్యాంకులు మారిపోయాయని అమెరికా కంపెనీ చెబుతోంది. ఏ దేశ అధికారులైనా బ్యాంకు ఉన్నతాధికారులను కలిస్తే అక్రమాలకు పాల్పడినట్లేనా ? ఇదెక్కడి తర్కం ! బ్యాంకు ఉన్నతాధికారి సూచన మేరకు 2020 నివేదికలో జోర్డాన్ రాంకును తగ్గించి సౌదీ అరేబియా ర్యాంకును పెంచారట. దీని వెనుక ఎవరున్నారు ?
చైనా అక్రమాలకు పాల్పడిందంటున్నారు గనుక ఇప్పుడు పెట్టుబడులు మన దేశం వైపు మరలుతాయని కొందరు చెబుతున్నారు. సంతోషించాల్సిందే. అదే అయితే మన కంటే ముందున్న వాటిలో చైనాను మినహాయిస్తే ఇంకా అరవై ఒక్క దేశాలుంటాయి వాటన్నింటినీ దాటిన తరువాతే కదా ఎవరైనా మనవైపు చూసేది, కనుక ఆ మాటలను ఎంతవరకు నమ్మాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. గతేడాది ప్రధాని నరేంద్రమోడీ గారే స్వయంగా ముఖ్యమంత్రుల సమావేశంలో చైనా నుంచి కంపెనీలు వచ్చేస్తున్నాయి, ఎర్ర తివాచీలు పరిచేందుకు సిద్దంగా ఉండండి అని చెప్పారు. ఇంతవరకు ఎన్ని వచ్చాయో, దారి మధ్యలో ఎక్కడ ఆగాయో చెప్పినవారు లేరు. ఇప్పుడు రాంకులు మారిపోయాయి గనుక పెట్టుబడులే పెట్టుబడులు, బహుళజాతి కంపెనీలు చైనా బదులు భారత్కు రావాలని చూస్తున్నట్లు కొందరు కొత్త గానాలాపన మొదలు పెట్టారు. చైనా ర్యాంకును పక్కన పెట్టండి, మన ర్యాంకు 142 నుంచి 63కు పెరిగిన కాలంలో చెప్పిన విధంగా పెట్టుబడులు వచ్చాయనేందుకు ఆధారాలు లేవు. వచ్చి ఉంటే కరోనాకు ముందే వృద్ది రేటు, జిడిపి దిగజారేది కాదు కదా !
2018,2020 సూచికల మీద అలాంటి తనిఖీని అమెరికాకు చెందిన విల్మర్హేల్ అనేక కంపెనీకి అప్పగించారు. వారు తయారు చేసిన నివేదిక ప్రకారం అక్రమాలు జరిగాయని ప్రకటించారు. నాటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్, సిఇఓ క్రిస్టాలినా జియోర్గియేవా జోక్యం చేసుకొని చైనా ర్యాంకు పెంచాలని సిబ్బంది మీద వత్తిడి చేశారట.2018లో అలా చేసినందున చైనా ర్యాంకు 85బదులు 78గా ఉందట. వాణిజ్యం ప్రారంభించటం, రుణాలు పొందటం, పన్నుల చెల్లింపు వంటి అంశాల్లో చైనాకు 65.3 పాయింట్లు వచ్చినట్లుగా లెక్కించగా రాంకు 78 వచ్చింది. అమెరికా కంపెనీ తనిఖీలో పాయింట్లు 64.5కు తగ్గాయట. దాని ప్రకారం అయితే 85 వస్తుందట. పాయింట్ల తేడా 0.8, ఈ మాత్రం దాని కోసం ప్రపంచ బ్యాంకు అధిపతులు జోక్యం చేసుకున్నట్లు తేల్చారు. ఏడు రాంకులు పెరిగితే ఏమిటి తగ్గితే ఏమిటి ? తనిఖీ చేసిన అమెరికా కంపెనీ పెద్దలు లెక్కించిన పద్దతి తప్పు కావచ్చు, చైనా వ్యతిరేకతతో అలాంటి నివేదిక ఇచ్చి ఉండవచ్చుగా !
దేశాల మధ్య అనారోగ్యకర పోటీని, అవాంఛనీయ చర్యలను ప్రోత్సహించే రాంకుల మతలబు గురించి విమర్శలు, ఆరోపణలు గతంలోనే వచ్చాయి. అసలా రాంకుల పద్దతి నిలిపివేయాలని అనేక మంది కోరుతున్నారు. 2020ఆగస్టు 31న ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్ విశ్లేషణలో కొన్ని అంశాలను పేర్కొన్నారు. 2015 లాటిన్ అమెరికాలోని చిలీ పన్నుల చెల్లింపు రాంకు 33గా ఉంది. మరుసటి ఏడాది దాని రాంకు 120కి పడిపోయింది. ఇదెలా జరిగింది? మితవాద శక్తులు అధికారంలో ఉన్నపుడు పరిస్ధితి మెరుగ్గా ఉంది, సోషలిస్టు పార్టీ అధికారంలోకి రాగానే దిగజారింది అని చిత్రించటం దీని వెనుక ఉందని అమెరికా పత్రిక వాల్స్ట్రీట్ జర్నలే రాసింది. దాన్ని ఖండించిన బ్యాంకు ప్రధాన ఆర్ధికవేత్త పాల రూమర్ కొద్ది వారాల తరువాత ఇంటిదారి పట్టాడు. సౌదీ అరేబియా రాంకు ఐదు సంవత్సరాల్లో 49 నుంచి 62కు దిగజారటం, అజర్బైజాన్ రాంకు 80 నుంచి 34కు పెరగటం, యుఏయి 22 నుంచి 16కు పెరగటం, చైనా 90 నుంచి 31 పెరగటం వెనుక కిరికిరి జరిగిందని కూడా ఆ పత్రిక రాసింది. ఇన్ని ఉదంతాలు ఉండగా ఒక్క చైనా మీదనే ఎందుకు దాడి కేంద్రీకరించారు అన్నది ప్రశ్న !
రాంకులను తారుమారు చేయటం ఎంతో సులభమని అనేక మంది చెబుతున్నారు. మన దేశం విషయానికి వస్తే విద్యుత్ ధర మిగతా పోటీ దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. కొత్త విద్యుత్ కనెక్షన్ల విషయంలో ప్రయివేటు సరఫరాదారులున్న ముంబై, ఢిల్లీ సమాచారాన్ని మాత్రమే ప్రపంచబ్యాంకు ప్రమాణంగా తీసుకుందని ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్ రాసింది. అంటే అర్ధం ఏమిటి కృత్రిమంగా మన దేశ ర్యాంకును పెంచేందుకు ఇలా చేశారనే కదా ! రాంకుల్లో మన స్ధానం ఎంతో మెరుగుపరుచుకున్నా వాణిజ్యం, జిడిపిలో పెరుగుదల లేకపోగా వృద్ది రేటు దిగజారిపోవటం వెనుక మతలబు ఏమిటి అనేక మంది ప్రశ్నిస్తున్నారు. మన దేశం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ర్యాంకు దోహదం చేస్తుందనే అంచనాతో మెరుగుపరుచుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంది.నరేంద్రమోడీ హయాంలో అది మరింత వేగంగా జరిగింది.2020 నాటికి భారత్ 50వ స్ధానంలో ఉంటుందని 2018లోనే నరేంద్రమోడీ దవోస్లో ప్రకటించారు. దాని కోసం ఏకంగా ఒక కమిటీనే 2015లో ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు లేబరు నియామకానికి అనుమతి, కనీసవేతన చట్టాలకు మంగళం, ఎనిమిది గంటలకు బదులు ఏదో ఒకసాకుతో ఎన్నిగంటలైనా పని చేయించుకొనే వీలు కల్పించటం,వేతనంతో కూడిన వార్షిక సెలవుల రద్దు, ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండా కార్మికులను తొలగించే అవకాశాలను కల్పించటం వంటి చర్యలు. మన ర్యాంకు పెరిగేందుకు దోహదం చేసి ఉండవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్మికరంగంలో తీసుకురాదలచిన మార్పులు అమల్లోకి వస్తే ఇంకా మెరుగుపడవచ్చు. కానీ కార్మికుల పరిస్ధితి మరింత దిగజారటం ఖాయం. ఇప్పటికే ఆర్ధిక అసమానతల్లో మన దేశ తాజా రాంకు 158కి 141లో ఉన్నాం. మరి దీని సంగతి ఏమిటి ? దీన్ని మెరుగుపరచేందుకు నరేంద్రమోడీ తీసుకున్న చర్యలేమిటి ? వాణిజ్య రాంకు మెరుగుదలకు కమిటీ ఏర్పాటు చేసిన పెద్దలు ఆర్ధిక అంతరాలు తగ్గించటం గురించి ఎందుకు పట్టించుకోరు ?
చైనా ఆర్ధిక రంగంలో సాధించిన అద్భుతాలను కొంత మంది ఎన్నటికీ అంగీకరించరు. దాని వలన వారికి కలిగే లాభం లేదు, చైనాకు వచ్చే నష్టం లేదు. ఈ అభివృద్ధి వెనుక ప్రపంచబ్యాంకు రాంకులు లేవు.1948 జనవరి ఒకటిన ఉనికిలోకి వచ్చిన ”గాట్” (జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ – పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం)లో చైనా స్ధాపక సభ్యురాలు.అయితే 1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కాకుండా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్ కేంద్రంగా నడిచిన ప్రభుత్వాన్నే గుర్తించారు.1971లో ఐరాసలో కమ్యూనిస్టు చైనాను గుర్తించినా గాట్లో, దాని వారసురాలిగా వచ్చిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో అసలైన చైనాకు స్ధానం ఇవ్వలేదు, 2001డిసెంబరులో మాత్రమే చేర్చుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసిన 2020లో 2.3శాతం వృద్దిరేటుతో ముందుకు పోయిన ఏకైక పెద్ద ఆర్ధిక వ్యవస్ధ చైనాదే.1948లో దాని విదేశీ వాణిజ్యం 907 బిలియన్ డాలర్లయితే 2020లో 4.65లక్షల కోట్ల డాలర్లు. చైనా వాణిజ్యం 1978లో 26వ స్ధానంలో ఉంటే 2017నాటికి ఒకటవ స్ధానానికి చేరి, నాలుగేండ్లుగా అదే స్ధాయిలో కొనసాగుతోంది. 1986లో తలసరి ఖర్చు చేయగల ఆదాయం వెయ్యి యువాన్లయితే(ఒక యువాన్ పదకొండు రూపాయలు), 2005నాటికి పదివేలు,2020లో32,129 యువాన్లుంది. గ్రామీణుల సగటు 17,131అయితే పట్టణసగటు 43,834 యువాన్లు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు 1950లో యాభైవేల మంది ఉంటే ఇప్పుడు యాభై లక్షలు దాటారు. పరిశోధన మరియు అభివృద్ది కోసం 1980లో 13 బిలియన్ యువాన్లు ఖర్చు చేస్తే 2020లో2.4లక్షల కోట్ల యువాన్లు ఉంది.2020లో తొలిసారిగా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐదు వందల కంపెనీలలో 133తో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించింది. ఇవన్నీ ప్రపంచ బ్యాంకు సులభతర వాణిజ్య సూచికల తారుమారు కారణంగానే జరిగాయని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు.
గతంలో వివిధ దేశాలకు చెందిన ర్యాంకుల కోసం సమాచారాన్ని తారు మారు చేసిన ఉదంతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్ధికవేత్తగా ఉన్న పాల్ రోమర్ రాజీనామా చేసి ఇంటి బాట పట్టాడు. వివిధ దేశాల రాజకీయ అవసరాల కోసం లెక్కింపు పద్దతులను పదే పదే మార్పులు చేసిన కారణంగా ర్యాంకుల్లో మార్పులు జరిగాయని రోమర్ చెప్పాడు.2006-2017 మధ్య చిలీ ర్యాంకులు తారుమారయ్యాయి. సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచ్లెట్ హయాంలో దేశ పరిస్ధితి దిగజారిందని, మితవాది, నియంత సెబాస్టియన్ పినేరా హయాంలో మెరుగుపడిందని చూపేందుకు కావాలని ఆ పని చేశారు. అందుకు గాను వ్యక్తిగతంగా తాను క్షమాపణలు చెబుతున్నట్లు రోమర్ ప్రకటించాడు. వత్తిడి రావటంతో మాట మార్చాడు, చివరికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఆ ఉదంతం తెలిసిన బ్యాంకు అధ్యక్షుడు, సిఇవో చైనాకు అనుకూలంగా మార్పులు చేయాలని కోరారన్న ఆరోపణలు నమ్మదగినవేనా ?
రాంకులను బట్టే పెట్టుబడులు వచ్చేట్లయితే 2006-20 మధ్య అమెరికా రాంకు 3-8, జపాన్ రాంకు 10-39 మధ్య, బ్రిటన్ 9-10, ఆస్ట్రేలియా 6-18, కెనడా 4-23 మధ్య ఉంది. మరి ఆ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు, కంపెనీలు తమ దేశాలను వదలి ఫేక్ రాంకులు తెచ్చుకున్నట్లు చెబుతున్న చైనాలో ఎందుకు పెట్టుబడులు పెట్టినట్లు ? ఒకవేళ ఎవరైనా మోసపోయి చైనా వెళ్లిన తరువాత అక్కడ అంత సీన్ లేదని మిగతా కంపెనీలకు చెప్పి ఉండాలి కదా ? ఒకరిని చూసి ఒకరు పొలోమని ఎందుకు వెళ్లినట్లు ? పోనీ చైనా తప్పుదారి పట్టించింది అనుకుందాం, అక్కడ పెట్టుబడులు పెట్టి దివాలా తీసిన విదేశీ కంపెనీలెన్ని, ఆత్మహత్యలు చేసుకున్న పారిశ్రామికవేత్తలెందరో ఎవరైనా చెప్పగలరా ! చైనాలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు కేవలం ఎగుమతుల కోసమే కాదు, అక్కడి అంతర్గత మార్కెట్లో తమ సరుకులు అమ్ముకొనేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు కూడా వెళతాయి. అలాంటి అవకాశం ప్రస్తుతం మన దేశంలో ఉందా ? మన దేశంలో వినియోగఖర్చు ఎలా ఉందనే అంశంపై అధికారిక లెక్కలు 2012నాటివే అందుబాటులో ఉన్నాయి. జాతీయ గణాంక సంస్ధ 2017-18లో సేకరించిన సమాచారాన్ని విడుదల కాకుండా నిలిపివేశారు. లీకుల సమాచారం ప్రకారం ఖర్చు తగ్గినట్లు తేలింది, దాన్ని మరోవిధంగా చెప్పాలంటే దారిద్య్రం పెరిగింది. నరేంద్రమోడీ సర్కారుకు ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద సుబ్రమణ్యం దేశ ఆర్ధిక స్ధితి ఐసియులో ఉందని చెప్పారు. ఆర్ధిక వ్యవస్ద మాంద్యంలో ఉందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామరాజన్ అన్నారు.చివరికి ప్రపంచబ్యాంకు కూడా మన ఆర్ధిక వ్యవస్ధ చక్రియ మందగింపు తీవ్రంగా ఉందని చెప్పింది. ఇవన్నీ కరోనాకు ముందు వ్యాఖ్యలు. పెట్టుబడులు పెట్టాలనుకొనే వారు వీటన్నింటినీ చూడరా ?