• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

నాటో కూటమిలో విబేధాలు-తొలిసారిగా చైనా బూచి !

10 Tuesday Dec 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

2019 NATO Summit, Brain death of NATO, China challenges and threats, London Londres, NATO 70th anniversary

Image result for 2019 NATO Summit : first time mentioned china challenge

ఎం కోటేశ్వరరావు
గతవారం, డిసెంబరు 3,4 తేదీలలో లండన్‌లో జరిగిన నాటో కూటమి 70వార్షికోత్సవ సమావేశ ముగింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్వహించాల్సిన పత్రికా గోష్టిని రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాన్ని నాటోలో ఉన్న సంక్షోభానికి నిదర్శనంగా వర్ణిస్తున్నారు. ఎందుకు రద్దు చేశారని విలేకర్లు ప్రశ్నిస్తే సమావేశ వివరాల గురించి రెండు రోజుల పాటు ఎన్నో వివరించారని, అందువలన ట్రంప్‌ కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు కనుక రద్దు చేసినట్లు తెలిపారు. అయితే అసలు విషయం ఏమంటే నాటో సభ్య రాజ్యాల మధ్య ఉన్న విబేధాలు మరింతగా ఎక్కడ బట్టబయలు అవుతాయో అన్న భయంతోనే ట్రంప్‌ కార్యక్రమాన్ని రద్దు చేశారని భావిస్తున్నారు. సమావేశం పూర్తిగా ముగియక ముందే ట్రంప్‌ వెళ్లిపోయారని కూడా వార్తలు వచ్చాయి. తొలిసారిగా నాటో చరిత్రలో చైనాను తొలిసారిగా ఒక బూచిగా చూపేందుకు ప్రయత్నం జరగటం ఈ సమావేశ విశేషం.
ఉత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ, దీన్నే ‘నాటో’ అంటారు. మొత్తం 29 దేశాలలో అమెరికా,కెనడా మినహా మిగిలిన 27 సభ్య రాజ్యాలూ ఐరోపా ఖండానికి చెందినవే.ఈ సంస్ధ 70వ వార్షికోత్సవం గతవారం లండన్‌లో జరిగింది.రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ను సోవియట్‌ కమ్యూనిస్టులు మట్టి కరిపించారు. అయినప్పటికీ జర్మనీ లేదా సోవియట్‌ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకోవాలని 1947లో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మరుసటి ఏడాది దాన్ని బెల్జియం, నెదర్లాండ్స్‌, లక్సెంబర్గ్‌లకు విస్తరించాయి.1949లో ఈ ఐదు దేశాలతో పాటు అమెరికా, కెనడా, ఇటలీ పోర్చుగల్‌, నార్వే, ఐస్‌లాండ్‌,డెన్మార్క్‌లను కూడా కలుపుకొని పన్నెండు దేశాలతో ‘నాటో’ ఏర్పడింది. తరువాత జర్మనీతో సహా మరో 17 దేశాలకు దాన్ని విస్తరించారు. ఇవిగాక దానిలో చేరాలనుకుంటున్న మరో ఐదు దేశాలను నాటో గుర్తించింది. శాంతికోసం కలసి పని చేస్తామనే సాకుతో మరో 21భాగస్వాములు అవుతున్నాయి, సంప్రదింపుల పేరుతో 15 దేశాలు నాటోతో సంబంధాలు కలిగి ఉన్నాయి. ప్రపంచం మొత్తం వంద రూపాయలు మిలిటరీ ఖర్చు చేస్తుంటే నాటో దేశాల వాటా 70గా ఉంది. ఈ సంస్ధ సభ్య రాజ్యాలపై ఇతరులెవరన్నా దాడి చేస్తే ఉమ్మడిగా ఎదుర్కోవాలన్నది లక్ష్యం. ఇంతవరకు అలాంటి దాడులేవీ జరగకపోగా నాటో కూటమే ఇతర దేశాలపై దాడులకు, జోక్యానికి తెగబడింది.

Image result for 2019 NATO Summit : first time mentioned china challenges and threats
ఏడు దశాబ్దాల నాటో కూటమి చరిత్రలో తొలిసారిగా తమ కూటమికి చైనా నుంచి తలెత్తుతున్న సవాళ్లంటూ లండన్‌ శిఖరాగ్ర సభ ప్రకటనలో పేర్కొనటం గమనించాల్సిన ముఖ్యపరిణామం. సంస్ద ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో రక్షణ ఖర్చులో రెండవ పెద్ద దేశంగా చైనా ఉంది, భవిష్యత్‌లో అగ్రరాజ్యాల మధ్య కుదిరే ప్రధాన ఆయుధ నియంత్రణ ఒప్పందాల్లో చైనాను కూడా భాగస్వామిని చేయాలి. దీనర్దం దక్షిణ చైనా సముద్రంలోకి నాటో వెళుతోందని కాదు. చైనా మన సమీపానికి వస్తోన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త శత్రువును నాటో సృష్టిస్తోందనటం వాస్తవం కాదు అని స్టోలెన్‌బర్గ్‌ చెప్పారు. ఎటు తిప్పి ఎటు చెప్పినా చైనా సంగతి చూడాలన్న దుష్ట ఆలోచన లండన్‌ సమావేశంలో చోటు చేసుకుంది.
కమ్యూ నిజం వ్యాప్తిని అరికట్టే ప్రధాన లక్ష్యంగా ముందుకు వచ్చిన నాటో కూటమి సోవియట్‌, తూర్పు ఐరోపా దే శాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసింది. ఇప్పుడు చైనా మీద కేంద్రీకరించాలని నిర్ణయించింది. అమెరికా-చైనా మధ్య సంబంధాలు దిగజారుతున్న నేపధ్యం, నాటో సారధి అమెరికాయే గనుక దాని ప్రమేయంతోనే తొలిసారిగా లండన్‌ సమావేశంలో చైనా ముప్పు గురించి ప్రస్తావించారు. దీన్నే పరిశీలకులు మరో ప్రచ్చన్న యుద్దంగా వర్ణిస్తున్నారు.ఈ ముఖ్యపరిణామాన్ని ప్రపంచ మీడియా కావాలనే విస్మరించిందా ? కొంత మంది అవుననే అంటుండగా మరి కొందరు నాటో కూటమి విబేధాలకు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా చైనా అంశం మరుగున పడిందని అన్నారు.
నాటోకు ప్రాణం ఉన్నా మెదడు చచ్చిందని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ అన్నాడు. నాటోది కాదు ఫ్రెంచి అధ్యక్షుడి మెదడే ప్రాణం లేనిదిగా మారిందని టర్కీనేత ఎర్డోగన్‌ తిప్పికొట్టాడు. నాటో నేతల మందుకొట్టే కార్యక్రమంలో కెనడా నేత జస్టిన్‌ ట్రుదెవ్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను పరిహాసాలాడాడు. దానికి ప్రతిగా కెనడాకు రెండు ముఖాలున్నాయంటూ ట్రంప్‌ జవాబిచ్చాడు. అగ్రరాజ్యాల నేతలు ఇలా మీడియాకు వినోదం పంచినప్పటికీ ఎక్కడన్నా బావే కాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా ఆర్ధికంగా తమకు సవాలు విసురుతున్న చైనా విషయాన్ని ప్రస్తావించటంలో మాత్రం ఒకే మాట మీద ఉన్నారు.అయితే చైనా విషయంలో నాటో నేతల్లో ఏకాభిప్రాయం లేదని ప్రకటనలో వినియోగించిన పదజాలం స్పష్టం చేసింది. అందుకే ఇలా పేర్కొన్నది.’ ప్రస్తుత పెరుగుతున్న చైనా ప్రభావం మరియు దాని అంతర్జాతీయ విధానాలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా విసురుతున్నాయి, వాటిని ఒక కూటమిగా ఐక్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
రష్యా ఇప్పుడు కమ్యూనిస్టు దేశం కానప్పటికీ పెట్టుబడిదారీ వ్యవస్ధలో మిగతా అగ్రరాజ్యాలకు అది మిలిటరీ, ఇతర సవాళ్లను విసరగలిగే స్ధితిలో ఉంది. ఆ కారణంగానే దాని ముంగిట్లోకి నాటోను విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి ప్రతిగా చైనాతో భాగస్వామ్యాన్ని అది పెంచుకుంటున్నది. తాజాగా దాదాపు మూడువేల కిలోమీటర్ల పొడవు గ్యాస్‌పైప్‌లైన్‌తో సహా అనేక అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య ఉన్న నాలుగువేల కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దులో ఎలాంటి సమస్యలూ ప్రస్తుతం లేవు. నాటోలోని అనేక దేశాలలో గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలు- ప్రస్తుత చైనా వ్యవస్ధలను పోల్చుకొని చైనాతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. చైనాతో పోటీ-విబేధాలతో వచ్చే పర్యవసానాలను అంచనావేయటంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రపంచంపై ఆమెరికా ప్రభావం తగ్గుతుండటం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తగ్గినప్పటికీ అమెరికా ఇప్పటికీ ప్రపంచ అగ్రరాజ్యమే అన్నది గమనంలో ఉంచుకోవాలి.

Image result for 2019 NATO Summit : first time mentioned china challenge
తాజాగా అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ మూడు సంవత్సరాల ట్రంప్‌ పాలన తీరు తెన్నులపై వివిధ రంగాలకు చెందిన వారితో జరిపిన ఇంటర్వ్యూలలో మారుతున్న ప్రపంచ వ్యవస్ధలో అమెరికా కీలకపాత్ర పరిమితంగా ఉన్నట్లు తేలింది. లండన్‌ నాటో సమావేశాల్లో కూడా పెరుగుతున్న చైనా,తరుగుతున్న అమెరికా ప్రభావం గురించే గుసగుసలు సాగినట్లు మీడియా పేర్కొన్నది. గతంలో సన్నిహిత అనుయాయులుగా ఉన్న ఫ్రాన్స్‌,జర్మనీ, టర్కీ,ఈజిప్టు, పాకిస్ధాన్‌,మెక్సికో వంటి దేశాలు గత మూడు సంవత్సరాలలో మరింత దూరం జరిగాయి. కొన్ని సందర్భాలలో బహిరంగంగానే దానితో విబేధించాయి. దీర్ఘకాలంగా అమెరికాతో స్నేహంగా ఉన్న అనేక దేశాలు ఇటీవలి కాలంలో తరచుగా రష్యా , చైనాలవైపు చూస్తున్నాయి. టర్కీ, పాకిస్ధాన్‌, ఫిలిప్పీన్స్‌, ఈజిప్టు అందుకు ఉదాహరణలు.
ఐరోపాలో అమెరికా పాత్ర బలహీనపడితే రష్యా ప్రభావం అనివార్యంగా పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి వరకు నాటో ఖర్చులో సింహభాగాన్ని అమెరికా భరించేది. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత ఇతర సభ్యరాజ్యాలు పెద్ద మొత్తంలో ఖర్చులను భరించే విధంగా వత్తిడి తెచ్చారు. తామెంత కాలం భారాన్ని మోస్తామని ప్రశ్నించారు. అలాంటపుడు అమెరికాతో నిమిత్తం లేకుండా తమ వ్యూహాలను తాము రచించుకుంటామని ఐరోపా దేశాలు చెబుతున్నాయి.నాటో రక్షణ ఖర్చును భరించేందుకు సభ్యదే శాల జిడిపిలో రెండుశాతం కేటాయింపులు జరపాలని అమెరికా వత్తిడి చేస్తోంది. అంత రక్షణ కోసం ఖర్చు పెట్టేబదులు ఆ మొత్తాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తే ఫలితం ఎక్కువ అని అనేక దే శాలు భావిస్తున్నాయి. వాణిజ్య యుద్ధాల నుంచి ఇరాన్‌ అణు సమస్య వరకు ఐరోపా చూడాల్సింది చైనా వైపు మాత్రమే అని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఉత్తర సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ గురించి చెబుతూ నాటో మెదడు చచ్చిపోతోందనటానికి సూచిక అని ఎకనమిస్టు పత్రిక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఫసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం నుంచి అమెరికా వెనక్కు తగ్గటం ద్వారా ప్రత్యామ్నాయ స్వేచ్చా వాణిజ్య ఒప్పందంతో ముందుకు పోవటానికి చైనాకు అవకాశం ఇచ్చినట్లయిందని ఐరోపా నిపుణులు భావిస్తున్నారు.
ఒకవైపు అమెరికా ప్రభావం తగ్గుతున్నట్లు భావిస్తుండగా, ఆ దేశ నాయకత్వంలో అసహనం పెరిగిపోతోంది. విమర్శలను సహించలేని స్ధితి. నాటో సమావేశాల సందర్భంగా కోపెన్‌హాగన్‌ నగరంలో జరిగే ఒక కార్యక్రమంలో అమెరికాకు చెందిన నిపుణుడు స్టాన్లీ ఆర్‌ సోలన్‌ ప్రధాన వక్తగా ప్రసంగించాల్సి ఉంది. దానిని అమెరికా, డెన్మార్క్‌లోని ఒక సంస్ధ నిర్వహిస్తోంది. అయితే డెన్మార్క్‌లోని అమెరికా రాయబారి కార్లా శాండ్స్‌ ఒక రోజు ముందుగా వర్తమానం పంపుతూ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ట్రంప్‌ విధానాలను గతంలో సోలన్‌ విమర్శించటమే దీనికి కారణంగా పేర్కొన్నారు.
ఏడు దశాబ్దాల క్రితం అంటే రెండవ ప్రపంచ యుద్దం ముగిసేనాటికి అమెరికా తిరుగులేని అగ్రరాజ్యం.1945లో ఏకైక అణు శక్తి, ఆయుధాలను, ప్రపంచ జిడిపిలో సగం వాటా కలిగి ఉంది. ఇప్పుడు అది 15శాతానికి పడిపోయింది. ఉత్తర కొరియా వంటి చిన్న దేశం కూడా నేడు అణుశక్తిని కలిగి ఉంది.నాడు దుర్భరదారిద్య్రంతో ఉన్న చైనా నేడు అమెరికాను సవాలు చేసే స్ధాయికి ఎదుగుతోంది. ఒకనాడు అమెరికా ప్రపంచీకరణ ఛాంపియన్‌గా ఉంది, నేడు దానికి విరుద్దంగా అనేక ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది, ఏక పక్షంగా వైదొలుగుతోంది. ఈ నేపధ్యంలోనే నాటో సభలో ట్రంప్‌ వ్యవహరించిన తీరును చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుట్రతో బొలీవియా మొరేల్స్‌ నిష్క్రమణ-బ్రెజిల్‌ లూలా జైలు నుంచి విడుదల !

16 Saturday Nov 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Bolivia’s leader Evo Morales, Evo Morales, Former Brazilian President Luiz Inácio Lula da Silva, lula da silva

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail

ఎం కోటేశ ్వరరావు
గతవారంలో గమనించదగిన రెండు పరిణామాలు జరిగాయి. ఒకటి తప్పుడు కేసుల్లో ఇరికించిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా కుట్రలో భాగంగా బొలీవియా మిలిటరీ తిరుగుబాటు చేయటంతో అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నతరువాత మరోసారి ఎన్నికై రాజీనామా చేసి దేశం వదలి మెక్సికోలో రాజకీయ ఆశ్రయం పొందారు.
పౌరుల రక్తపు మరకలను అంటించుకోవద్దని బొలీవియా మాజీ అధ్యక్షుడు ఇవో మొరేల్స్‌ దేశ అధికారులను హెచ్చరించారు. మిలిటరీ కుట్ర కారణంగా పదవికి రాజీనామా చేసి సోమవారం నాడు మెక్సికో చేరిన మొరేల్స్‌ నూతన ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తున్న తన మద్దతుదారులకు బాసటగా ఈ ప్రకటన చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించుకున్న సెనేట్‌ డిప్యూటీ స్పీకర్‌ జీనైన్‌ ఆంజెను తాము గుర్తించటం లేదంటూ లాపాజ్‌ పట్టణంలో పెద్ద ఎత్తున మొరేల్స్‌ మద్దతుదారులు ప్రదర్శనలు చేశారు. మూలవాసీ(స్ధానిక రెడ్‌ ఇండియన్‌ తెగలు) పతాకాలను చేబూని నిరసన తెలుపుతున్న నిరసనకారులు పలు చోట్ల పోలీసులతో తలపడినట్లు వార్తలు వచ్చాయి. అంజె ప్రభుత్వాన్ని గుర్తించినట్లు అమెరికా ప్రకటించింది.ఈ చర్యను మెక్సికో సిటీలో ఉన్న ఇవో మొరేల్స్‌ ఖండించారు. శుక్రవారం నాడు మొరేల్స్‌ అనుకూల ప్రదర్శకులపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. మొరేల్స్‌ లేకుండానే మరోసారి ఎన్నికలు జరిపేందుకు నూతన పాలకులు తెరతీసినట్లు వార్తలు వచ్చాయి. బొలీవియాలో జరిపిన సైనిక కుట్రను డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారయుతంగా సమర్ధిస్తూ ఒక ప్రకటన చేశాడు.వెనెజులా, నికరాగువాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఇదొక హెచ్చరిక అని బెదిరించాడు.
మొరేల్స్‌ దేశం నుంచి పోయేట్లు చేసిన కుట్రలో శ్వేతజాతి దురహంకారి అయిన మితవాద ప్రతిపక్ష నేత లూయీస్‌ ఫెర్నాండో కమాచో పాత్ర కూడా ఉంది. మొరేల్స్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలను అతని మద్దతుదారులు నిర్వహించారు. వ్యవసాయ, సహజవాయు వాణిజ్యవేత్త అయిన కమాచో బొలీవియా అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు చూస్తున్నాడు. ఫాసిస్టు, క్రైస్తవ సంస్దలతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నాయి. స్ధానిక తెగలను ద్వేషించటం, పురోగామి శక్తులు క్రైస్తవ మతవిరోధులని ప్రచారం చేయటంలో ముందున్నాడు.

Image result for evo morales disposed in a coup, lula da silva freed from jail
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు లూలా డ సిల్వాను సుప్రీం కోర్టు అనుమతి మేరకు ఏడాదిన్నర తరువాత జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి అక్రమాల కేసులో 2018 నుంచి పన్నెండు సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారంటూ తీర్పును సవాలు చేస్తూ పునర్విచారణకు దరఖాస్తు చేశారు. విచారణ పూర్తయ్యేంతవరకు నిందితుడు నిర్దోషే అని చెబుతున్న 1988నాటి రాజ్యాంగ నిబంధనను అంగీకరిస్తూ సుప్రీం కోర్టు తన గత తీర్పుకు భిన్నంగా నిర్ణయించటంతో లూలాను వెంటనే విడుదల చేశారు. లూలా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన మూడు సంవత్సరాల తరువాత తానున్న ఇంటి మరమ్మతులకు ఒక కంపెనీ నుంచి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిస సాయానికి అక్రమంగా మరమ్మతుల రూపంలో లంచం తీసుకున్నట్లు ఒక నేరగాడితో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. అసలు ఆ ఇల్లు లూలాది కాదు, అంతకు మించి మరమ్మతులు జరిగిన దాఖలాలు కూడా లేవని తేలింది. లూలా మీద చేసిన ఆరోపణల్లో ఇదొకటి. అమెరికా ప్రమేయంతో జరిగిన కుట్రలో సరిగ్గా గత ఎన్నికలకు ముందు లూలాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు కుట్ర చేశారు. ఫలితంగా చివరి నిమిషంలో లూలా నాయకత్వంలోని వర్కర్స్‌ పార్టీ నూతన అభ్యర్ధిని ప్రకటించాల్సి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ ఓడిపోయినా, పార్లమెంట్‌లో మెజారిటీ స్ధానాలు, రాష్ట్రాలలో మెజారిటీని దక్కించుకుంది.

Image result for evo morales disposed in a coup,
బొలీవియా విషయానికి వస్తే అక్కడ మరో కుట్రకు తెరలేపారు. అక్టోబరు 20న జరిగిన ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు వీధులకు ఎక్కాయి. అమెరికా దేశాల సంస్ధ ప్రతినిధులు గనుక అక్రమాలు జరిగినట్లు నివేదిక ఇస్తే మరోసారి ఎన్నిక జరిపేందుకు తాను సిద్దమే అని మొరేల్స్‌ ముందుకు వచ్చాడు. అమెరికా కనుసన్నలలో పని చేసే ఆ సంస్ధ అక్రమాలు జరిగినట్లు ఆ నివేదిక ఇచ్చింది. ఆ మేరకు తిరిగి ఎన్నికలు జరుపుతానని ప్రకటించాడు. అయితే పదవిని వదులుకోవాలంటూ పోలీసులు, మిలిటరీ తిరుగుబాటు చేశారు. ఈ నేపధ్యంలో ప్రాణ రక్షణకు ఆయన మెక్సికో వెళ్లి ఆశ్రయం పొందారు.
బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల వలస లేదా స్ధానికేతరుల పాలన తరువాత 2006లో తొలిసారిగా స్ధానిక గిరిజన తెగలకు చెందిన ఇవో మొరేల్స్‌ సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పేరుతో పనిచేస్తున్న పార్టీ తరఫున అధికారానికి వచ్చాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని, తాను గిరిజనుడిని, కార్మిక ఉద్యమ ఉద్యమ కార్యకర్తను, కోకా పండించే రైతును కావటమే తాను చేసిన పాపం అని రాజీనామా సందర్భంగా వ్యాఖ్యానించాడు. సోమవారం జరిగిన పరిణామాల్లో అధ్యక్ష భవన రక్షణ సిబ్బంది, పోలీసులు తమ విధులను బహిష్కరించారు. దేశంలో శాంతినెలకానాలంటే మొరేల్స్‌ గద్దె దిగాల్సిందేనని మిలిటరీ అధిపతి విలియమ్స్‌ కాలిమాన్‌ డిమాండ్‌ చేశాడు.
మొరేల్స్‌ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం గత పదమూడు సంవత్సరాలలో అక్కడి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాన్ని పైకి తెచ్చింది. గ్యాస్‌, ఖనిజాల ఎగుమతుల కారణంగా జిడిపి గణనీయంగా పెరిగింది. ప్రయివేటు రంగం చేతుల్లో ఉన్న సంపదలన్నింటినీ జాతీయం చేస్తానని ప్రకటించినప్పటికీ వాటి జోలికి పోలేదు.దేశ ంలోని సహజవనరులను వెలికి తీసి దారిద్య్ర నిర్మూలన వంటి సంక్షేమ చర్యలను సమర్ధవంతంగా అమలు జరిపింది. ఇటీవలి సంవత్సరాలలో వైద్యులు, గని కార్మికుల వంటి తరగతుల సమ్మెలు, ఇతర ఆందోళనల కారణంగా గతంలో ఆయనను బలపరచిన శక్తులు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దేశంలో పేదరిక నిర్మూలన, ఇతర సంక్షేమ చర్యలను తీసుకున్నప్పటికీ అంతకు ముందు ప్రారంభమైన నయా వుదారవాద విధానాలలో పెద్దగా మార్పులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి.

Image result for evo morales disposed in a coup, protests
ఇవో మొరేల్స్‌కు వ్య తిరేకంగా జరిగిన కుట్రను ప్రతిఘటించాలని ఇరుగుపొరుగు సంఘాల ఫెడరేషన్‌ పిలుపునిచ్చింది. మొరేల్స్‌ అధికారంలోకి రాకముందు జరిగిన పోరాటాలలో ఈ సంస్ధ ప్రముఖపాత్ర పోషించింది. ఆత్మరక్షణ దళాలను ఏర్పాటు చేయాలని, ఎక్కడి కక్కడ ప్రతిఘటనకు పూనుకోవాలని కోరింది. ఎల్‌ ఆల్టో పట్టణంలో ఇలాంటి దళాల నాయకత్వంలో అనేక పోలీసు కార్యాలయాలను ఆక్రమించుకొని కొన్నింటిని దగ్దం చేసినట్లు వార్తలు వచ్చాయి. 2005ఎన్నికలకు ముందు దేశంలో కార్పొరేట్‌ సంస్ధల ఆర్దిక ప్రయోజనాల రక్షణకు వాటి తరఫున పని చేసే రాజకీయ బృందాలు, సంస్ధలు ఉన్నాయి. అవి అవకాశవాద పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవి. అవి ప్రజల సమస్యలను పట్టించుకొనేవి కాదు. ఈ పూర్వరంగంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడిన పౌర సంస్ధలు జరిపిన పోరాటాలు వాటితో మమేకం కావటం ఎన్నికలలో ఇవో మొరేల్స్‌ విజయానికి బాటలు వేసింది.మొరేల్స్‌ నాయకత్వంలోని సోషలిజం కోసం ఉద్యమం(మాస్‌) పార్టీ అవకాశవాద రాజకీయాలు, పొత్తులకు వ్యతిరేకంగా పని చేసింది. ఎన్నికలలో అభ్యర్ధులుగా దిగువ స్ధాయి నుంచి ఉద్యమాలలో పాల్గన్నవారే ఉండటంతో ఘనవిజయాలు సాధించారు.
అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్ధల బొలీవియా సహజవనరుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఇవో మొరేల్స్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహించలేని శక్తులే తాజా కుట్రవెనుక వున్నట్లు భావిస్తున్నారు. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మొరేల్స్‌ అధికారానికి వచ్చిన కొత్తలో విదేశీ కంపెనీల చేతుల్లో వున్న గ్యాస్‌, చమురు కంపెనీలను జాతీయం చేశారు. అయితే విదేశీ కంపెనీలే ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాటిని వెలికి తీస్తున్నాయి. విద్యుత్‌ కార్లు, స్మార్ట్‌ ఫోన్లలో వాడే బ్యాటరీల తయారీకి ఎంతో అవసరమైన లిథియం నిల్వలు బొలీవియాలో పుష్కలంగా ఉన్నాయి. వర్తమాన శతాబ్ది బంగారంగా ఈ ఖనిజాన్ని పరిగణిస్తున్నారు. కొద్ది సంవత్సరాలలో దీనికి డిమాండ్‌ మరింత పెరిగి కొరత ఏర్పడవచ్చని కార్పొరేట్‌ శక్తులు అంచనా వేశాయి. ప్రపంచంలో ఉన్న లిథియం నిల్వల్లో ఒక్క బలీవియాలోనే 25 నుంచి 45శాతం వరకు నిక్షిప్తమై ఉన్నట్లు అంచనా. దీన్ని ప్రభుత్వరంగంలో వెలికి తీసి వచ్చే ఆదాయంతో మరిన్ని సంక్షేమ చర్యలను చేపట్టాలని మొరేల్స్‌ ప్రభుత్వం తలపెట్టింది. జర్మన్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం వలన జనానికి పెద్దగా ప్రయోజనం చేకూరదని స్ధానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో గతవారంలో ఒప్పందాన్ని మొరేల్స్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
లాటిన్‌ అమెరికాలో సహజవనరుల దోపిడీని అరికట్టి జనానికి లబ్ది కలిగించే చర్యలు తీసుకొనే ఏ ప్రభుత్వాన్ని అమెరికా,కెనడా తదితర దేశాలు అంగీకరించటం లేదు. వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన ప్రతి చోటా పచ్చిమితవాద శక్తులు వాటికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావటం వెనుక అమెరికా హస్తం ఉండటం బహిరంగ రహస్యం. బొలీవియాలో కూడా అదే జరిగింది. ధనికులు, మితవాద శక్తులు బలంగా ఉన్న శాంతా క్రజ్‌ ప్రాంతంలో ప్రతిపక్ష నేత ఫెర్నాండో కామాచో, ఇతరుల నాయకత్వంలో తాజా కుట్రకు తెరలేచింది. ఆదివారం నాడు మిలిటరీ, పోలీసు అధికారులు వారికి వంతపాడారు. మొరేల్స్‌ను గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.తొలుత కార్మికనేతగా ఎదిగిన చాపారే ప్రాంతానికి చేరుకున్న మొరేల్స్‌ అక్కడి నుంచి టీవీలో మాట్లాడుతూ నన్ను ఎన్నడూ వదలని నా జనం వద్దకు తిరిగి వచ్చాను, పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అంటూ తన రాజీనామాను ప్రకటించారు.
సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ పోలసీ రిసర్చ్‌ సంస్ద జరిపిన అధ్యయనం ప్రకారం మొరేల్స్‌ పాలనా కాలంలో దారిద్య్రనిర్మూలన కార్యక్రమం విజయవంతమైందని తెలిపింది. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల ప్రాంతంలోని దేశాలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువగా బొలీవియా ఆర్ధిక ప్రగతి సాధించినట్లు పేర్కొన్నది. మొరేల్స్‌ అధికారానికి రాకముందు చమురు కంపెనీల నుంచి ఏటా 73.1కోట్ల డాలర్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. జాతీయం తరువాత అది 495 కోట్ల డాలర్లకు పెరిగింది.2018 నాటికి దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారి సంఖ్య 60 నుంచి 35శాతానికి తగ్గింది. దుర్భరదారిద్య్రంలో ఉన్న వారి సంఖ్య 38 నుంచి 15శాతానికి తగ్గింది. అయినప్పటికీ బలీవియా ఇప్పటికీ పేద దేశంగానే ఉంది. ఈ కారణంగా కొన్ని తరగతుల్లో కొన్ని అంశాలపై అసంతృప్తి తలెత్తింది. దానిని సొమ్ము చేసుకొనేందుకు మితవాద శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి.
అక్టోబరులో జరిగిన ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలియక ముందే అమెరికా, లాటిన్‌ అమెరికాలోని ఇతర మితవాదశక్తుల నాయకత్వంలోని ప్రభుత్వాలు బొలీవియన్ల ఆకాంక్షలను ప్రతిబింబించని ఫలితాలను తాము గుర్తించబోమని ప్రకటించాయి. 2005కు ముందు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ప్రపంచ ఆర్ధిక సంస్ధలన్నీ మొరేల్స్‌ వ్యతిరేకులను బలపరిచాయి. సహజవనరులను జాతీయం చేయబోమని ప్రకటించిన శక్తులకు ప్రాతినిధ్యం వహించిన అధ్యక్షుడు కార్లోస్‌ మెసాకు మద్దతు ప్రకటించాయి. 2002లో ఇవో మొరేల్స్‌ అధ్యక్ష పదవికి పోటీచేసినపుడు మొరేల్స్‌ గెలిస్తే ఆర్ధిక సాయంలో కోత పెడతామని బెదిరించాయి. ఈ పూర్వరంగంలో మొరేల్స్‌కు వ్యతిరేకంగా ఎంతటి కుట్రకు తెరలేచిందో అర్దం చేసుకోవచ్చు.

Image result for evo morales disposed in a coup, protests
బొలీవియా పరిణామాల నేపధ్యంలో రాయిటర్స్‌ వార్తాసంస్ధ వెలువరించిన ఒక కథనాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వుంది.బొలీవియా మాదిరి పరిణామాలు వెనెజులాలో పునరావృతం కావటానికి అక్కడి మిలిటరీ అడ్డుగా ఉందనే శీర్షికతో ఒక కథనాన్ని అందించింది. ఇవో మొరేల్స్‌ మాదిరి వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో రాజీనామా చేసేందుకు అక్కడి ప్రతిపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారని, అయితే ఒక కీలకాంశం దాన్ని కష్టతరం గావిస్తున్నదని ఆదివారనాడు బొలీవియా నిరసనకారుల పక్షాన మిలిటరీ చేరిన మాదిరి వెనెజులా మిలిటరీ వ్యవహరించటం లేదని పేర్కొన్నది. దేశంలో ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతున్నప్పటికీ 2014,17లో పెద్ద ఎత్తున నిరసన తలెత్తినా, 2018 ఎన్నికల్లో అక్కడి సోషలిస్టు పార్టీకి మిలటరీ మద్దతు ఇచ్చిందని రాయిటర్‌ పేర్కొన్నది.ఈ ఏడాది ఏప్రిల్‌ 30న అనేక మ ంది మిలిటరీ అధికారులు తిరుగుబాటు నేత గురుడోకు మద్దతు ఇచ్చారని అయితే ఉన్నతాధికారులు మదురోకు మద్దతు ఇవ్వటంతో తిరుగుబాటు విఫలమైందని తెలిపింది. వెనెజులా మిలిటరీలో తన వామపక్ష సైద్ధాంతిక భావజాలాన్ని మాజీ అధ్యక్షుడు ఛావెజ్‌ ఎక్కించారని బలీవియా మిలిటరీలో అలాంటి పరిస్ధితి లేదన్న ఒక ప్రొఫెసర్‌ అభిప్రాయాన్ని అది ఉటంకించింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లాటిన్‌ అమెరికాలో నయా ఉదారవాద విధానాలు-పర్యవసానాలు !

30 Wednesday Oct 2019

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Latin America, Opinion, USA

≈ Leave a comment

Tags

Argentina elections, Bolivarian Revolution, Latin America, Lenín Moreno, neoliberalism, Neoliberalism in Latin America

Image result for chilean protests

ఎం కోటేశ్వరరావు
లాటిన్‌ అమెరికాలో ఒక వైపున ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమాలు, మరోవైపున కొన్ని దేశాల్లో ఎన్నికలతో అక్కడి పరిణామాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. చిలీ, ఉరుగ్వే,హైతీ, బొలీవియాలో ఆందోళనలు జరిగాయి. అర్జెంటీనా, బొలీవియా, ఈక్వెడోర్‌లో సాధారణ, కొలంబియాలో స్ధానిక సంస్దల ఎన్నికలు ముగిశాయి. చిలీ పాలకులు ఒక అడుగు దిగినా అక్కడి ఉద్యమం ఆగలేదు. ఉరుగ్వేలో ప్రభుత్వం రద్దు చేసిన సబ్సిడీలను, పెంచిన భారాలను వెనక్కు తీసుకుంటూ ఉద్యమకారులతో ఒక ఒప్పందం చేసుకోవటంతో తాత్కాలికంగా ఆందోళనలు ఆగాయి. స్థలాభావం రీత్యా ఉద్యమాలకు సంబంధించి మరో సందర్భంలో చర్చించుదాం. నాలుగు దేశాల్లో జరిగిన ఎన్నికల ప్రాధాన్యతను చూద్దాం.
నాలుగు సంవత్సరాల క్రితం మితవాద శక్తులు విజయం సాధించిన అర్జెంటీనాలో అంతకు ముందు అధికారంలో ఉన్న ప్రజాతంత్ర లేదా వామపక్ష శక్తులు తిరిగి ఈ గద్దెనెక్కాయి. బొలీవియాలో వామపక్ష ఇవో మోరెల్స్‌ మరోసారి అధికారానికి వచ్చారు. ఉరుగ్వేలో అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ మెజారిటీకి అవసరమైన 50శాతం ఓట్లను సాధించలేదు, పెద్ద పార్టీగా అవతరించి వచ్చే నెలలో జరిగే అంతిమ పోటీకి సిద్దం అవుతోంది. కొలంబియాలో కొలంబియా విప్లవ సాయుధ శక్తులు(ఎఫ్‌వామపక్ష సాయుధ సంస్ధ (ఎఫ్‌ఏఆర్‌సి)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న తరువాత జరిగిన తొలి స్ధానిక సంస్ధల ఎన్నికలలో రాజధాని బగోటాతో సహా అనేక ప్రధాన పట్టణాలు, ప్రాంతాలలో వామపక్ష శక్తులు విజయం సాధించాయి. కొన్ని దేశాలలో తలెత్తిన ఉద్యమాలు, కొన్ని దేశాలలో జరిగిన ఎన్నికలలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల విజయాల వెనుక ఉన్న అంశాలేమిటి, వాటిని ఎలా చూడాలన్నది ఒక ప్రశ్న.
అర్జెంటీనా ఎన్నికల ఫలితం వామపక్ష జనాకర్షకం వైపు మొగ్గుదలకు సూచిక అని ఒక విశ్లేషణ శీర్షిక. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అర్జెంటీనాలో సామాజిక న్యాయం కోరే న్యాయ పార్టీ పేరుతో ముందుకు వచ్చిన శక్తులు పెట్టుబడిదారీ విధానం, కమ్యూనిజాలకు భిన్నంగా తృతీయ మార్గం అనుసరిస్తామని చెప్పుకున్నాయి. ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఆ పార్టీకి చెందిన జువాన్‌ డోమింగో పెరోన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై ఒక వరవడికి నాంది పలకటంతో ఆ పార్టీని పెరోనిస్టు పార్టీ అని కూడా అంటారు. సంక్షేమ చర్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రత్యర్ధి పార్టీలు పెరోనిస్టులను నిరంకుశులని కూడా విమర్శిస్తారు. పెరోనిస్టు పార్టీ విధానాలతో విబేధించిన వారు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి విడివడి వేరే పార్టీని ఏర్పాటు చేసిన మావోయిస్టులు ఈ ఎన్నికలలో విజయం సాధించిన పెరోనిస్టు పార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారు. మొత్తంగా చూస్తే అర్జెంటీనాలో కమ్యూనిస్టుల బలం పరిమితం.

Image result for argentina new president
తాజా ఎన్నికల విషయానికి వస్తే 2015లో అధికారం కోల్పోయిన పెరోనిస్టు పార్టీ తిరిగి విజయం సాధించింది. గతంలో ఆ పార్టీలో తెరవెనుక ప్రముఖ పాత్ర వహించిన ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రస్తుత అధ్యక్షుడు మార్సియో మక్రీని తొలి దశ ఎన్నికల్లోనే ఓడించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం నలభైశాతం ఓట్లు తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉన్న అభ్యర్ధికి రెండో స్ధానంలో వున్న వారికి పదిశాతం ఓట్ల తేడా ఉండాలి లేదా పోలైన ఓట్లలో 45శాతం తెచ్చుకొని ప్రధమ స్ధానంలో ఉంటే ఎన్నికైనట్లు పరిగణిస్తారు. ప్రస్తుతం ఫెర్నాండెజ్‌ 48శాతం ఓట్లు సాధించి తొలి దశలోనే ఎన్నికయ్యారు. పెరోనిస్టు పార్టీకి చెందిన మాజీ దేశాధ్యక్షురాలు క్రిస్టినా కిర్చెనర్‌ వైఖరితో విబేధించి పార్టీకి దూరంగా ఉన్న ఫెర్నాండెజ్‌తో సర్దుబాటు చేసుకొని అధ్యక్ష అభ్యర్ధిగా, ఆమె ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఫెర్నాండెజ్‌ అధ్యక్షుడే అయినా అసలు సారధి క్రిస్టినా అనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. గత అనుభవాల రీత్యా ఫెర్నాండెజ్‌ తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తారని కూడా మరో అభిప్రాయం వెల్లడైంది.
లాటిన్‌ అమెరికా రాజకీయాల్లో నేడున్న పరిస్ధితుల్లో ఫెర్నాండెజ్‌ ఎన్నిక ప్రజాతంత్ర, పురోగామి శక్తులకు ఊపునిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. వెనెజులాలో వామపక్ష నికోలస్‌ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న కుట్రలకు ఓడిపోయిన మార్సియో మక్రీ మద్దతు ఇచ్చాడు. తిరుగుబాటుదారు జువాన్‌ గురుడోను అధ్యక్షుడిగా గుర్తించిన వారిలో ఒకడు. ఇప్పుడు మదురో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఆర్ధికంగా ఉన్న ఇబ్బందులు, ఐఎంఎఫ్‌తో సంబంధాల కారణంగా అమెరికా వత్తిడికి తలొగ్గితే అనే సందేహం ఉండనే వుంటుంది. గతంలో అధికారంలో ఉన్న పెరోనిస్టు పార్టీ, మక్రీ సర్కారు కూడా సంక్షేమ చర్యల విషయంలో తప్పితే మొత్తంగా నయావుదారవాద విధానాలనే అనుసరించారు. అందువల్లనే గతంలో పెరోనిస్టు క్రిస్టినా సర్కార్‌ మీద జనంలో అసంతృప్తి తలెత్తింది. మక్రీ అనుసరించిన విధానాల కారణంగా జనజీవనం మరింత దిగజారింది. ద్రవ్యోల్బణం 50శాతం, అభివృద్ధి సూచనలు కనుచూపు మేరలో కనపడటం లేదు, ఉపాధి తగ్గింది, దారిద్య్రం పెరిగింది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్‌, ఇతర సంస్ధలతో వందబిలియన్‌ డాలర్లకోసం గత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. దాన్ని తీసుకుంటే చిలీ, ఉరుగ్వే మాదిరి సంక్షేమ చర్యలు, సబ్సిడీలకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.
బొలీవియాలో అక్టోబరు 20న జరిగిన ఎన్నికల్లో ‘సోషలిజం దిశగా ఉద్యమం’ (మువ్‌మెంట్‌ టువార్డ్స్‌ సోషలిజం-మాస్‌) పార్టీ నేత ఇవో మొరేల్స్‌ మరోసారి ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ అనేక దేశాలు ఆ ఎన్నికను ఇంకా గుర్తించలేదు. అక్రమాలపై విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. అమెరికా దేశాల సంస్ధ అలాంటి విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మరోసారి ఎన్నికలు జరపటానికి తాను సిద్ధమే అని మొరేల్స్‌ ప్రకటించారు. ఆదివాసీలు మెజారిటీగా ఉన్న బొలీవియాలో ఐదు వందల సంవత్సరాల తరువాత తొలిసారిగా ఆ సామాజిక తరగతులకు చెందిన మొరేల్స్‌ దేశాధ్యక్షుడయ్యారు.ఒక ఉద్యమకారుడిగా ఉన్న సమయంలో పాలకపార్టీ, మాదక ద్రవ్యాల మాఫియా గూండాలు ఆయనమీద దాడి చేసి మరణించాడనుకొని వదలి వెళ్లారు. బతికి బయటపడి అనేక ఉద్యమాల తరువాత 2006లో అధికారానికి వచ్చారు. రాజ్యాంగంలో అనేక మార్పులు చేసి సామాన్య జనానికి సాధికారత కలిగించటంతో పాటు దారిద్య్ర నిర్మూలనకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. తొలి నుంచి ఆయనను అధికారం నుంచి తొలగించేందుకు అమెరికాతో చేతులు కలిపిన శక్తులను ఎదుర్కొని నిలిచారు. మొరేల్స్‌ గెలిస్తే తాము ఆ ఎన్నికను గుర్తించబోమని ప్రతిపక్షాలు ముందే ప్రకటించాయి. దానికి అనుగుణ్యంగానే విచారణ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి.

Image result for claudia lopez
కొలంబియా స్ధానిక సంస్ధల ఎన్నికల విషయానికి వస్తే దేశాధ్యక్ష పదవి తరువాత ప్రాధాన్యత కలిగిన రాజధాని బగోటా మేయర్‌గా వామపక్ష వాది క్లాడియా లోపెజ్‌ను ఎన్నుకున్నారు. ఆ నగర తొలి మహిళా మేయర్‌గా కూడా ఆమె చరిత్రకెక్కారు. మాజీ అధ్యక్షుడు, పచ్చి మితవాది అయిన అల్వారో యురిబి ఒక ట్వీట్‌లో స్ధానిక సంస్ధల ఎన్నికలలో తమ ఓటమిని అంగీకరిస్తూ మధ్యే, వామపక్ష వాదుల వైపు ఓటర్లు మొగ్గు చూపారని వ్యాఖ్యానించాడు. అవినీతి వ్యతిరేక ఆందోళనకారిణిగా పేరున్న లోపెజ్‌ ఒక జర్నలిస్టు. పారామిలిటరీ దళాల రాజకీయ జోక్యం గురించి పరిశోధనాత్మక కధనాలు వెల్లడించినందుకు ఆమెను చంపివేస్తామనే బెదిరింపులు రావటంతో 2013లో కొలంబియా వదలి విదేశాల్లో తలదాచుకున్నారు.2016లో ఎఫ్‌ఏఆర్‌సితో ఒప్పందం కుదిరిన తరువాత స్వదేశం వచ్చి రాజకీయ కార్యాకలాపాల్లో పాల్గొని 2018లో ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఉరుగ్వేలో 2005 నుంచి అధికారంలో ఉన్న వామపక్ష బ్రాడ్‌ ఫ్రంట్‌ పెద్ద పార్టీగా అధ్యక్ష ఎన్నికలలో ముందుకు వచ్చినప్పటికీ అవసరమైన సంఖ్యలో ఓట్లను తెచ్చుకోలేకపోయింది. సగానికి పైగా ఓట్లు తెచ్చుకోవాల్సి ఉండగా పార్టీ అభ్యర్ధి డేనియల్‌ మార్టినెజ్‌కు 40.7శాతం వచ్చాయి. దీంతో నవంబరు 24న ప్రధమ, ద్వితీయ స్ధానాల్లో వున్న అభ్యర్ధుల మధ్య తుది పోటీ జరగనుంది. మితవాద నేషనల్‌ పార్టీకి చెందిన లాకలే పౌ 29.7శాతం తెచ్చుకున్నాడు, మూడు, నాలుగు స్ధానాల్లో 12.8, 11.3శాతం చొప్పున ఓట్లు తెచ్చుకున్న మితవాద పార్టీలు లాకలేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ఆ ఓటింగ్‌లో ఎలాంటి మార్పు లేనట్లయితే బ్రాడ్‌ఫ్రంట్‌ గెలిచే అవకాశం వుండదని విశ్లేషణలు వెలువడ్డాయి.2014 ఎన్నికల్లో బ్రాడ్‌ ఫ్రంట్‌కు తొలి దశలో 49.45శాతం వచ్చాయి. తుది ఎన్నికల్లో 56శాతం తెచ్చుకుంది. ఈ సారి తొలి దశలో ఓట్లు గణనీయంగా తగ్గినందున అంతిమ ఫలితం గురించి ఉత్కంఠనెలకొన్నది.
నేషనల్‌, కొలరాడో మితవాద పార్టీల కూటమి 1830 నుంచి తిరుగులేని అధికారాన్ని చలాయించింది. 2005లో బ్రాడ్‌ఫ్రంట్‌ దానికి తెరదించింది. అయితే ఈ ఎన్నికల్లో శాంతి భద్రతలు, పౌరులకు భద్రత అంశాలతో పాటు ఎదుగూ బొదుగూ లేని ఆర్ధిక స్ధితి, ఏడున్నరశాతం ద్రవ్యోల్బణం, తొమ్మిదిశాతం నిరుద్యోగం కారణంగా బ్రాడ్‌ ఫ్రంట్‌ మద్దతు కొంత మేరకు దెబ్బతిన్నట్లు ఓట్ల వివరాలు వెల్లడించాయి. అయితే ఓటర్లు తిరిగి మితవాద శక్తులకు అధికారాన్ని అప్పగిస్తారా అన్నది చూడాల్సి వుంది.

Image result for neoliberalism and its consequences in latin america
లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలలో ప్రజా ఉద్యమాలు తలెత్తటానికి, కొన్ని చోట్ల వామపక్ష శక్తులకు ఎదురు దెబ్బలు తగలటానికి, తిరిగి ఓటర్ల మద్దతు పొందటానికి ఆయా దేశాలలో అనుసరిస్తున్న నయా ఆర్ధిక విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ విధానాల ప్రయోగశాలగా మారిన లాటిన్‌ అమెరికాలో దాదాపు అన్ని దేశాలలో వాటిని అమలు జరిపేందుకు గతంలో నియంతలను పాలకవర్గాలు ఆశ్రయించాయి. చిలీ వంటి చోట్ల వాటిని వ్యతిరేకించినందుకు కమ్యూనిస్టు అయిన సాల్వెడార్‌ అలెండీ వంటి వారిని హతమార్చేందుకు కూడా వెనుదీయలేదు. ప్రజాస్వామ్య ఖూనీ, సంక్షేమ చర్యలకు కోత, ప్రజల మీద భారాలు మోపటం, ఆర్ధిక వ్యవస్ధలను దివాలా తీయించిన పూర్వరంగంలో అక్కడ వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు నిర్వహించిన నిరంతర పోరాటాల కారణంగా జనం మద్దతు పొంది ఈ శతాబ్ది ప్రారంభంలో అనేక దేశాలలో అధికారానికి వచ్చాయి. అయితే నయా వుదారవాద విధానాల పునాదులను పెకలించకుండా ఉన్నంతలో జనానికి మేలు చేకూర్చేందుకు ఆ ప్రభుత్వాలు పని చేసి వరుస విజయాలు సాధించాయి. అయితే పెట్టుబడిదారీ వ్యవస్ధలో వాటికి వున్న పరిమితుల కారణంగా జనంలో కొంతకాలానికి అసంతృప్తి తలెత్తటం, కొన్ని చోట్ల అవినీతి కారణంగా బ్రెజిల్‌, అర్జెంటీనా వంటి చోట్ల ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే అర్జెంటీనాలో ప్రత్యామ్నాయంగా వచ్చిన పాలకుల తీరు మరింతగా దిగజారటంతో తిరిగి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులకు పట్టం కట్టారు. ఈక్వెడోర్‌లో అధికారానికి వచ్చిన రాఫెల్‌ కొరెయా 2007-17 అధ్యక్షుడిగా అనేక సంక్షేమ చర్యలు చేపట్టారు. అంతకుముందు పాలకులు చేసిన అప్పులతో తమకు సంబంధం లేదని ప్రకటించటమే కాదు, అంతర్జాతీయ కోర్టులలో వాదించి 60శాతం మేరకు అప్పును రద్దు చేయించారు.దారిద్రాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే 2017ఎన్నికలో వామపక్ష అభ్యర్ధిగా విజయం సాధించి లెనిన్‌ మొరెనో వామపక్ష విధానాలకు స్వస్ధి చెప్పి దేశీయంగా, అంతర్జాతీయంగా నయావుదారవాద విధానాలు, రాజకీయ వైఖరులను అనుసరించి ప్రజాగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తప్పుడు కేసులతో రాఫెల్‌ కొరియాను అరెస్టు చేయించేందుకు ప్రయత్నించాడు. ప్రజల మీద భారాలు మోపేందుకు పూనుకోవటంతో తాజాగా అక్కడ ప్రజాందోళనలు తలెత్తాయి. విధిలేని స్ధితిలో తలగ్గాల్సి వచ్చింది. అందువలన లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులు వర్గపోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయి, రాజీలేని విధానాలతో పాటు నయా వుదారవాద విధానాల బాటను వీడాల్సిన అవసరాన్ని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదంతో మరింత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వుంటుంది. దాన్ని ఎదుర్కొవటం తప్ప మరొక దగ్గరి దారి లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిరియాలో కొత్త పరిణామం – టర్కీ తాత్కాలిక కాల్పుల విరమణ !

20 Sunday Oct 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Syrian Kurds, Turkish military intervention in Syria, US support Turkey

Image result for turkey military offensive in syria
ఎం కోటేశ్వరరావు
రాజీ లేదా మారణహౌమం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే పౌరులే తమకు ముఖ్యమని, అందుకే సిరియా అధ్యక్షుడు అసాద్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో ఒక అవగాహనకు వచ్చినట్లు సిరియన్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌(ఎస్‌డిఎఫ్‌) ప్రధాన కమాండర్‌ మజులుమ్‌ అబ్దీ చెప్పారు. కొద్ది రోజులుగా టర్కీ దళాలు సిరియాలోని కర్దుల ఆధీనంలోని ప్రాంతాలపై దాడులు జరుపుతున్న పూర్వరంగంలో తాజా పరిణామం చేసుకుంది. ఒక వైపు టర్కీ దాడులు కొనసాగిస్తుండగా సిరియా-టర్కీ సరిహద్దుల్లో వుగ్రవాదులకు వ్యతిరేక పోరు పేరుతో దించిన తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది జరగ్గానే సిరియా అధ్యక్షుడితో ఎస్‌డిఎఫ్‌ ఒక అవగాహనకు వచ్చింది. వెంటనే సిరియా దళాలు ఆ ప్రాంతానికి తరలి వెళ్లి టర్కీ దాడులను అడ్డుకునేందుకు సిద్దం అయ్యాయి. ఈ పరిణామంతో యావత్‌ సిరియా ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్లు అయిందని, రష్యా, ఇరాన్‌ ఆ ప్రాంతంపై పై చేయి సాధించినట్లే అనే అభిప్రాయాలు వెల్లడి అవుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాల్లో ఇది మరొక మలుపు.
టర్కీ ప్రారంభించిన దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేయాలని ఒక ఒప్పందం కుదిరింది. ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని ప్రకటించారు. అయితే ఇది సమగ్రమైనది కాదని తేలిపోయింది. అమెరికా దీన్ని ముందుకు తెచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు పెనెస్‌ ప్రకటించినదాని ప్రకారం సిరియాలోని కర్దు ప్రాంతాలపై ఐదు రోజుల పాటు టర్కీ దాడులను నిలిపివేస్తుంది. అమెరికా తన వంతుగా ఆప్రాంతంలో ఉన్న కర్దు దళాలను అక్కడి నుంచి ఉపసంహరించే విధంగా అమెరికా పని చేస్తుంది. తమ దళాలు తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటిస్తాయి తప్ప శాశ్వతంగా కాదని మజులుమ్‌ అబ్దీ చెప్పారు. టర్కీ-సిరియా సరిహద్దులో 30కిలో మీటర్ల మేర ప్రాంతంలో వున్న తమ దళాలు కొన్ని చోట్ల నుంచి మాత్రమే వెనక్కు పోతాయి తప్ప పూర్తిగా కాదని స్పష్టం చేశారు. తమ దళాలు వెనక్కు వచ్చేందుకు ఒక నడవాను ఏర్పాటు చేయమని అడిగారని, ఇదే సమయంలో టర్కీ దళాలు అందుకు పూనుకోలేదని అన్నారు. మంగళవారం నాటికి కర్దు దళాల ఉపసంహరణ జరగనట్లయితే తిరిగి దాడులను ప్రారంభిస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ప్రకటించాడు.
సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించాలన్న అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాన్ని అమెరికన్‌ కాంగ్రెస్‌(పార్లమెంట్‌ దిగువ సభ) 354-60 ఓట్లతో తిరస్కరించింది. ఐఎస్‌ తీవ్రవాదుల మీద పోరులో అమెరికాకు కీలక మిత్రులుగా ఉన్న కర్దిష్‌ యోధుల పట్ల అనుచితంగా ప్రవర్తించటమే అని సిఐఏ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డేవిడ్‌ పెట్రాస్‌ వ్యాఖ్యానించాడు. తమకు పర్వతాలు తప్ప ఇతర మిత్రులు ఎవరూ లేరని కర్దులు ఎప్పుడూ చెబుతూ ఉంటారని అయితే అమెరికన్లు వారికి మిత్రులే అని ట్రంప్‌ చర్య విద్రోహం తప్ప వేరు కాదని అన్నారు. ఐఎస్‌పై పోరులో పదివేల మంది కర్దులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇప్పటి వరకు సిరియాలోని అమెరికా దళాలు ఐఎస్‌ వ్యతిరేక పోరులో ముందు పీఠీన లేవని పోరాడుతున్న వారికి సాయం చేసే పాత్ర పోషించాయని చెప్పారు.
అమెరికా దళాలు అర్ధంతరంగా ఖాళీ చేసిన సైనిక కేంద్రాన్ని రష్యన్‌ సేనలు స్వాధీనం చేసుకున్నాయని, అక్కడ చూస్తే అమెరికన్లు వదలి వెళ్లిన సగం సగం ఆహార పదార్దాలతో వున్న ప్లేటు బల్లలపై కనిపించాయని ఒక టీవీ పేర్కొన్నది. రష్యన్లు ఐఎస్‌ తీవ్రవాదుల పట్ల చాలా కఠినంగా ఉంటారని, ఇతర చోట్ల మాదిరే సిరియాలో కూడా వారిని చంపివేస్తారని డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌లో వ్యాఖ్యానించాడు.
పశ్చిమాసియాలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఎవరు ఎవరికి ఎప్పుడు మిత్రులుగా మారతారో, శత్రువులుగా తయారవుతారో తెలియని స్ధితి. ఈ ప్రాంతంలోని దేశాలు, అక్కడ వున్న సహజ సంపదలను కొల్లగొట్టటంతో పాటు మిలిటరీ రీత్యా పట్టుసాధించేందుకు అమెరికా అనుసరిస్తున్న విధానాలు మారణహౌమాన్ని సృష్టిస్తూ శాంతిని లేకుండా చేస్తున్నాయి. తన లక్ష్యాల సాధనకు కర్దిస్ధాన్‌ ఏర్పాటుకు తోడ్పడతామని ఆశ చూపుతూ ఆ ప్రాంతంలోని కర్దులను అమెరికా పావులుగా వాడుకొంటున్నది. తామే ప్రవేశపెట్టిన ఐఎస్‌ తీవ్రవాదులను అణచే పేరుతో అ క్కడ తిష్టవేయాలని చూసిన అమెరికా, ఐరోపా యూనియన్‌, వాటితో చేతులు కలిపిన టర్కీ దేశాలకు తాజా పరిణామం పెద్ద ఎదురు దెబ్బ.
మజులుమ్‌ అబ్దీ చెప్పినదాని ప్రకారం గత నాలుగు సంవత్సరాలుగా సిరియా మీద దాడులకు దిగిన జీహాదీ లేదా ఐఎస్‌ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మాత్రమే కర్దులు పోరాడారు తప్ప టర్కీ, అమెరికా మిలిటరీ మీద ఒక్క తూటాను కూడా కాల్చలేదు. కర్దు ప్రాంతాలను ఆక్రమించిన ఐఎస్‌ తీవ్రవాదులను ఎదిరించేందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టర్కీ, అమెరికా రెండూ కర్దులకు ఆయుధాలిచ్చాయి. కర్దులు ఐఎస్‌ తీవ్రవాదులను సిరియాలో అదుపు చేశారు. ఇదే సమయంలో అమెరికా హామీ మేరకు దాని మాటలు నమ్మి టర్కీ తమ మీద దాడులకు దిగదనే భరోసాతో కర్దులు టర్కీ సరిహద్దులనుంచి వెనక్కు తగ్గారు. అయితే ప్రస్తుతం టర్కీ అదే ఐఎస్‌ తీవ్రవాదులకు ఆయుధాలిచ్చి సిరియా ప్రాంతాలను తిరిగి ఆక్రమించేందుకు ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగుతున్నది. ఈ దశలో కూడా సిరియన్‌ కర్దులు అమెరికా మీద విశ్వాసం వుంచి టర్కీ మీద పలుకుబడిని వుపయోగించి సిరియా సమస్యను పరిష్కరించాలనే కోరుతున్నారు. అమెరికా అక్కడి నుంచి తన సైన్యాన్ని ఉపసంహరిస్తానని చెప్పటాన్ని కూడా వారు తప్పుపట్టటం లేదు. దాని ఇబ్బందులు దానికి వున్నాయని సరిపెట్టుకుంటున్నారు. టర్కీ దాడులు తీవ్రతరం కావటంతో విధిలేని పరిస్ధితుల్లో తమ జనాన్ని రక్షించుకొనేందుకు సిరియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మిలిటరీని దించేందుకు అంగీకరించామని మజులుమ్‌ అబ్దీ చెప్పారు. జనాన్ని రక్షిస్తామని సిరియా, రష్యా ప్రతినిధులు చెప్పటాన్ని కూడా మేము పూర్తిగా నమ్మటం లేదు. అసలు ఎవరిని నమ్మాలో తెలియటం లేదు, విధిలేని పరిస్ధితుల్లో అంగీకరించాము అన్నారు.
ఆదివారం నాడు కుదిరిన ఒప్పందం మేరకు కర్దు దళాల ఆధీనంలో వున్న రెండు పట్టణాల ప్రాంతాన్ని సిరియా సైన్యానికి అప్పగించారు. గత ఆరు రోజులుగా టర్కీ చేస్తున్న దాడులకు ఉత్తర సిరియాలో ఎందరు మరణించిందీ తెలియదు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదమూడువేల మంది ఐఎస్‌ తీవ్రవాదులను తాము బందీలుగా చేశామని కర్దులు ప్రకటించారు. కర్దుల ప్రాంతాలపై దాడుల కారణంగా అనేక వందల మంది ఐఎస్‌ తీవ్రవాదులు బందీల శిబిరాల నుంచి తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి. వారిని కర్దులే విడుదల చేశారని అమెరికన్‌ మీడియా చెబుతోంది. టర్కీ చర్యలను భారత్‌తో సహా అనేక దేశాలు ఖండించాయి. ఐరోపా యూనియన్‌ టర్కీ మీద ఆంక్షలను విధించాలని తలపెట్టినా దాని మీద వచ్చిన వత్తిడి కారణంగా సభ్యదేశాల విచక్షణకు వదలివేశారు. యుద్ద విమానాలతో సహా టర్కీ ఆయుధాలన్నీ అమెరికా, ఐరోపా దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నది. కర్దు తిరుగుబాటుదార్లను టర్కీ ఉగ్రవాదులుగా చిత్రిస్తోంది. సిరియా విముక్తి సేనపేరుతో వున్న ఐఎస్‌ తీవ్రవాదులను సిరియా విముక్తి ప్రదాతలుగా పరిగణిస్తోంది.
సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సేనలను వుపసంహరించుకుంటామని అమెరికా ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ టర్కీ వత్తిడికి లొంగిపోయిన ట్రంప్‌ ఆకస్మిక నిర్ణయం తీసుకోవటంతో కర్దులు హతాశులయ్యారు. అమెరికా తమను మోసం చేసిందని భావిస్తున్నారు. అందుకే వెంటనే రష్యా మధ్యవర్తిత్వంతో సిరియా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే గతంలో కర్దులను అణిచివేయటంలో సిరియా ప్రభుత్వం కూడా తక్కువ తినలేదు. ఇప్పుడు కర్దుల ఆధీనంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తరువాత మరోసారి అణచివేతకు పూనుకోవచ్చనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి.
ఇంతకాలం ఐఎస్‌ తీవ్రవాదులను అణచేందుకే ఉత్తర సిరియాలో వున్నామని ప్రకటించిన అమెరికా ఇప్పుడు అక్కడి నుంచి తప్పుకోవటం అంటే మొత్తంగా సిరియాను ప్రభుత్వానికి అప్పగించి తోకముడిచినట్లే అన్నది కొందరి వ్యాఖ్యానం. ఇదే సమయంలో టర్కీతో సిరియా యుద్ద పర్యవసానాలు ఎలా వుంటాయన్నది చూడాల్సి వుంది. తమ దేశంలో తలదాచుకున్న 20లక్షల మంది సిరియన్ల రక్షణ ప్రాంతాలను ఏర్పరచేందుకే తాము దాడులు చేస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ చెబుతున్నాడు.
పశ్చిమాసియాలో అనేక తెగలలో కర్దిష్‌ ఒకటి. పశ్చిమ, మధ్య ఆసియా ప్రాంతాలపై ఆధిపత్య పోరు లో సఫావిద్‌ – ఒట్టోమన్‌ సామ్రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ఒప్పందాలు జరిగాయి. వాటిలో భాగంగా కర్దులు గణనీయంగా లేదా మెజారిటీ వున్న ప్రాంతాలు చీలిపోయాయి. సులభంగా అర్ధం చేసుకోవాలంటే నేటి టర్కీ, సిరియా, ఇరాన్‌, ఇరాక్‌ దేశాలలో ఈ ప్రాంతాలు వున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని ముక్కలు చేశారు. తరువాత వాటికి స్వాతంత్య్రం ఇచ్చే క్రమంలో యూదులకు ఇజ్రాయెల్‌ మాతృదేశంతో పాటు కర్దులకు ఆయా దేశాలలో స్వయం పాలిత ప్రతిపత్తి మంజూరును పరిశీలించాలని సామ్రాజ్యవాదులు సూచించారు. టర్కీ తప్ప మిగిలిన దేశాలు వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. టర్కీ అయితే తమ దేశంలో కర్దు అనే పదం వినపడకుండా చేసింది. చివరకు ఆ భాష మాట్లేవారిని కూడా వెంటాడి వేధించింది. కర్దులకు కొండ ప్రాంతాల టర్కులని పేరు పెట్టింది. ఈ నేపధ్యంలో కర్దు ప్రాంతాలలో అనేక తిరుగుబాట్లు జరిగాయి.పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ ఏర్పాటు నిర్ణయం జరగటం, స్వయంప్రతిపత్తి ప్రాంతాల డిమాండ్‌ను సక్రమంగా అమలు జరపకపోవటంతో అది 1945లో నాలుగుదేశాలలోని కర్దు ప్రాంతాలతో కర్దిస్ధాన్‌ ఏర్పాటు చేయాలనే నినాదంగా మారింది.

Image result for Syrian Kurds  fight
కర్దిస్ధాన్‌ సాధనకు నాలుగు దేశాలలో తలెత్తిన ఉద్యమాలు సాయుధ రూపం తీసుకున్నాయి. వాటిని అణచివేయటంలో ఏ దేశ పాలకులూ తక్కువ తినలేదు. ఇదే సమయంలో తన రాజకీయ, ఆధిపత్య ఎత్తుగడలలో భాగంగా అమెరికన్లు నాలుగు చోట్లా కర్దులకు మద్దతు ఇచ్చి వారి తిరుగుబాట్లను ప్రోత్సహించారు. వాటిలో కర్దిస్ధాన్‌ వర్కర్స్‌ పార్టీ(పికెకె) ప్రధాన సంస్ధగా ముందుకు వచ్చింది. టర్కీలో కర్దులపై అణచివేతకు వ్యతిరేకంగా విద్యార్ధులు దీనిని ప్రారంభించారు.1984లో పూర్తి స్ధాయి తిరుగుబాటుగా మారింది.అనేక పరిణామాల తరువాత 2013లో పికెకె కాల్పుల విరమణ ప్రకటించింది. రెండు సంవత్సరాల తరువాత టర్కీ దాడులు, ఇతర పరిణామాల కారణంగా కాల్పుల విరమణ విరమించింది.
ఇరాక్‌, సిరియాలలో కర్దుల స్వయంపాలిత ప్రాంతాల ఏర్పాటును టర్కీ వ్యతిరేకించటమే కాదు, ఆ ప్రాంతాలలోని కర్దులపై తరచుగా దాడులు చేస్తున్నది. ఇరాకీ కర్దు ప్రాంతాలలో తనకు అనుకూలమైన ఉగ్రవాద బృందాలకు సాయం చేసి ఆ ప్రాంతంలో తన తొత్తులను ప్రతిష్టించాలని కూడా టర్కీ చూసింది. ఇప్పుడు అమెరికా,ఐరోపా యూనియన్‌ మద్దతుతో మరోసారి సిరియాలోని కర్దు ప్రాంతాలపై దాడులకు దిగుతున్నది, ఐఎస్‌ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చి సిరియాను అస్ధిరం చేయాలని చూస్తున్నది. మంగళవారంతో ఐదు రోజుల కాల్పుల విరమణ గడువు ముగియనున్నది. ఒప్పందానికి టర్కీ-కర్దులు తమవైన భాష్యాలు చెబుతున్నందున తిరిగి మరోసారి టర్కీ దాడులకు తెగబడుతుందా ? టర్కీని అమెరికా నివారిస్తుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీని దేశపితగా అంగీకరించకపోతే భారతీయులు కాదా ?

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

BJP motor mouths, Donald trump, father of the country, Father of the Nation, Mahatama Gandhi, Narendra Modi, Nathuram Godse

Image result for PM As “Father Of India”

(నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా ! అన్న విశ్లేషణ ముగింపు రెండవ భాగం)

ఎం కోటేశ్వరరావు

ప్రముఖ నేతలు మనసా, వాచా, కర్మణా జీవితాలను జాతికి అంకితం చేసిన వారిని కొన్ని దేశాలలో జాతిపితలుగా వర్ణించి గౌరవించటం మనం చూస్తున్నాం. రాజకీయంగా విబేధించే వారు కూడా వారి వ్యక్తిత్వాలను గౌరవిస్తారు. స్పెయిన్‌ వంటి చోట్ల రాజకుటుంబానికి పాలనా పరంగా ఎలాంటి బాధ్యతలు, హక్కులు లేనప్పటికీ రాజును దేశ ఐక్యతా చిహ్నంగా పరిగణిస్తారు. థాయ్‌లాండ్‌లో కూడా రాజుకు అటువంటి గౌరవమే వుంది.

కొన్ని దేశాలలో దేశ స్ధాపకులుగా కొందరిని గౌరవిస్తారు. అయితే కొంత మంది తమకు తామే జాతిపితలుగా ప్రకటించుకున్నవారు కూడా లేకపోలేదు. వారంతా నియంతలు, ఇతర అవాంఛనీయ శక్తులకు ప్రాతినిధ్యం వహించిన వారిగానే వున్నారు. ప్రపంచ సమాజం వారిని గుర్తించ లేదు. టోగో అనే దేశంలో గనాసింగ్‌బె యడేమా తను జాతిపిత, పెద్ద అన్న, ప్రజల మార్గదర్శకుడు అనే బిరుదులతో పిలిపించుకున్నాడు. జైరే నియంత మొబుటు సెసె సెకో జాతి పిత, దేవదూత, వుదయించే సూర్యుడు వంటి పేర్లను తగిలించుకున్నాడు.

కొన్ని సందర్భాలలో ముఖ్యంగా నియంతల కాలంలో జాతి పిత వివాదాలకు కారణమైంది. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాట నేత ముజబుర్‌ రహ్మాన్‌ అని అందరికీ తెలిసిందే. పాకిస్దాన్‌ నుంచి విముక్తి పొందిన అనంతరం 1972లో రాజ్యాంగంలో ఆయనను జాతిపిత అని చేర్చారు.2004 అధికారానికి వచ్చిన బిఎన్‌పి దాన్ని రాజ్యాంగం నుంచి తొలగించింది. దాని మీద నిరసనలు వ్యక్తమయ్యాయి.

నరేంద్రమోడీని భారత దేశ పిత అని పిలిచారు తప్ప జాతిపిత అనలేదు కదా అని కొందరు వాదిస్తున్నారు. చరిత్రలో బ్రిటీష్‌ వారు ఆక్రమించుకోక ముందు ఇప్పుడు మనం అమెరికాగా పిలుస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే ఒక దేశం లేదు. కొలంబస్‌ అమెరికాను కనుగొన్న తరువాత వివిధ ఐరోపా దేశాల నుంచి వలస వచ్చిన వారు 13వలస ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 1760దశకంలో అక్కడి జనాభా కేవలం 25లక్షల మాత్రమే. బ్రిటీష్‌-ఫ్రెంచి వారి యుద్ధాలను చూసి, వాటి పర్యవసానాలతో ప్రభావితమైన ఆ కాలనీలకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో బ్రిటీష్‌ వారి వలసపాలనను వ్యతిరేకించి అమెరికా అనే దేశాన్ని ఏర్పాటు చేశారు. వారిని అమెరికా దేశ స్ధాపక పితలుగా పరిగణిస్తున్నారు. వారిలో ఎనిమిది మంది పేర్లు కనిపిస్తాయి. జార్జి వాషింగ్టన్‌, అలెగ్జాండర్‌ హామిల్టన్‌, బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌, జాన్‌ ఆడమ్స్‌, శామ్యూల్‌ ఆడమ్స్‌, థామస్‌ జఫర్సన్‌, జేమ్స్‌ మాడిసన్‌, జాన్‌లే అనే నేతలను అమెరికా స్ధాపక పితలుగా పరిగణిస్తారు. వారిలో అగ్రగణ్యుడు జార్జి వాషింగ్టన్‌ దేశ తొలి అధ్యక్షుడయ్యాడు. అమెరికా దేశ పిత ఎవరు అన్నా జాతిపిత ఎవరు అన్నా ఆయన పేరే వస్తుంది.

ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ జాతిపిత-దేశ పిత ఒకటే అనే అర్ధంలో నరేంద్రమోడీని అలా పిలిచారా అన్నది ఒక అంశం. ఒక వేళ దేశపిత అనాలంటే బ్రిటీష్‌ వారు రాక ముందే భారతదేశం వుంది. పోలీసు చర్య ద్వారా హైదరాబాద్‌ సంస్ధానాన్ని విలీనం చేసిన ఖ్యాతిని కేవలం సర్దార్‌ పటేల్‌కే ఆపాదిస్తున్న బిజెపి వాదన మేరకు, లేదా కాశ్మీర్‌ను మన దేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని నడిపించిన జవహర్‌లాల్‌ నెహ్రూను, భారత రక్షిత స్వతంత్ర దేశంగా వున్న సిక్కింను మన దేశంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకున్న ఇందిరా గాంధీని దేశపితలు, దేశమాత అంటే ఒక మేరకు అర్ధం చేసుకోవచ్చు నరేంద్రమోడీ ఎలా అవుతారు ? ‘ చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు.’ అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు అర్ధం ఏముంది. కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక రక్షణలు తొలగించటాన్ని , దానికి కూడా దేశంలో మాదిరి చట్టాలు వర్తింపచేశామని మోడీ చెప్పుకోవటాన్ని బట్టి అలా అన్నారా ? ఒక వేళ అదే ప్రాతిపదిక అయితే అనేక రాష్ట్రాలకు వున్న ప్రత్యేక రక్షణలు, చట్టాల మాటేమిటి?

మన దేశానికి వస్తే ఎవరినీ జాతిపితగా గుర్తించేందుకు రాజ్యాంగంలో అవకాశం లేదు. రాజకీయంగా గాంధీతో విబేధించినప్పటికీ సుభాస్‌ చంద్రబోస్‌ తొలిసారిగా 1944లో సింగపూర్‌ రేడియోలో ప్రసంగిస్తూ జాతిపిత అని సంబోధించాడు. అయితే మరుసటి ఏడాదే గాంధీని హతమార్చేందుకు గాడ్సే తొలి విఫల హత్యాయత్నం చేసినట్లు తరువాత వెల్లడి అయింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతిపితగా పరిగణించి మన కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాలను ముద్రించి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీని జాతిపితగా బిజెపి గుర్తించదు. ఆయన మీద విమర్శ చేస్తే జనం అంగీకరించరన్న భయం కారణంగా పైకి మాట్లాడటం లేదు గానీ ఏదో ఒక రూపంలో ఆ పార్టీ వారు దాచుకోలేకపోతున్నారు.

గాంధీ పాకిస్తాన్‌కు జాతి పిత అని బిజెపి మధ్యప్రదేశ్‌ నేత అనిల్‌ సౌమిత్ర నోరు పారవేసుకున్నాడు.మహాత్మా గాంధీ జాతిపితే అయితే అది పాకిస్ధాన్‌కు. ఆయన వంటి వారు భారత్‌లో కోట్లాది మంది పుత్రులున్నారు. కొందరు పనికి వచ్చే వారైతే మరికొందరు పనికిమాలిన వారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఇదేమిటయ్యా నేతా అని విలేకర్లు ప్రశ్నిస్తే భారత జాతిపితగా గౌరవం ఎవరికి వుందో ఎవరికీ తెలియదు లేదా వూరూపేరూ లేనివారు. కాబట్టి మహాత్మాగాంధీ జాతిపిత కావచ్చు కానీ అది పాకిస్ధాన్‌కు, ఇక్కడ పుట్టిన ప్రతివారూ భారత మాత పుత్రులమని గర్విస్తారు’ అన్నాడు. అంతే కాదు, ఆ పోస్టును తొలగించటానికి కూడా అంగీకరించలేదు. ఎవరూ 24గంటలూ పార్టీ ప్రతినిధులుగానే వుండలేరు. అలాంటి వారి అభిప్రాయాలన్నీ ఎల్లవేళలా పార్టీ వైఖరిగా వుండాల్సిన అవసరం లేదు అని కూడా అన్నాడు. అంటే అది తన వ్యక్తిగత అభిప్రాయమని చిత్రించే యత్నం అని వేరే చెప్పనవసరం లేదు.

ఈ సౌమిత్రకు వుత్తేజం సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌. ఆమె భోపాల్‌ బిజెపి అభ్యర్ధినిగా రంగంలో వుండి ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా అగర్‌-మాళ్వా ప్రాంతంలో ప్రచార సభల్లో విలేకర్లతో మాట్లాడుతూ ‘ నాధూరామ్‌ గాడ్సే ఒక దేశభక్తుడు. ఆయన ఎన్నటికీ దేశభక్తుడిగానే వుంటారు. కొందరు ఆయన్ను వుగ్రవాది అని పిలుస్తారు. ఈ ఎన్నికల్లో అలాంటి వారికి తగిన విధంగా బుద్ది చెబుతారు’ అని వ్యాఖ్యానించిన మరుసటి రోజు సౌమిత్ర రెచ్చిపోయాడు. తరువాత బిజెపి నుంచి వత్తిడితో ప్రజ్ఞ క్షమాపణ చెప్పారు. యథా ప్రకారమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కూడా సెలవిచ్చారు. ఆరోగ్యం బాగోలేదని తరువాత కొద్ది రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా వున్నారని చెప్పారు గానీ వచ్చే ఓట్లకు ఏమైనా గండిపడుతుందేమో అని పార్టీయే ఆమెను దూరం పెట్టింది. నరేంద్రమోడీ ఆమె వ్యాఖ్యలపై ఆమెను క్షమించటానికి నేను అశక్తుడను అని చెప్పి నష్టాన్ని తగ్గించే యత్నం చేశారు.గాడ్సే స్వతంత్ర భారత తొలి వుగ్రవాది అని సినీ హీరో కమల్‌ హసన్‌ చేసిన వ్యాఖ్యకు సమాధానంగానే ప్రజ్ఞ తన మన్‌కీ బాత్‌ను వెల్లడించారు.

ఆమె, మరో ఇద్దరు ఎంపీలు కూడా వారి వ్యక్తిగత స్ధాయిలో చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అమిత్‌ షా చెప్పటం విశేషం. గాడ్సే ఒకరిని చంపాడు, కసబ్‌ 72 మందిని, రాజీవ్‌ గాంధీ 17వేల మందిని చంపాడు. వీటిలో ఎవరిది పెద్ద క్రూరత్వమో మీరే నిర్ణయించండి అని కర్ణాటక బిజెపి ఎంపీ నళిన్‌ కుమార్‌ కటీల్‌ కూడా ఇదేసమయంలో ట్వీట్‌ చేశాడు. అతని మీదా ఎలాంటి చర్య లేదు. ఇతగాడు రెండు సార్లు బిజెపి ఎంపీగా పనిచేసి మూడవ సారి గత ఎన్నికల్లో గెలిచాడు.కేంద్రమంత్రిగా వున్న అనంత కుమార్‌ తక్కువ తినలేదు.’ ఏడు దశాబ్దాల తరువాత దృష్టి మారిన వాతావరణంలో నేటి తరం శిక్షకు గురైన ఒక వ్యక్తిని గురించి చర్చిస్తున్నారంటే గాడ్సే గనుక బతికి వుంటే ఇప్పుడు జరుగుతున్న చర్చను చూసి సంతోషపడి వుండేవాడు.’ అని ట్వీట్‌ చేశారు.

ముంబయ్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా వున్న ఐఏఎస్‌ అధికారిణి నిధి చౌధరి చేసిన ఒక ట్వీట్‌లో దేశంలో వున్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలన్నింటినీ కూల్చివేయండి,కరెన్సీ నోట్లపై వున్న ఆయన చిత్రాలను చెరిపివేయండి, నాధూరామ్‌ గాడ్సేకు కృతజ్ఞలు అని పేర్కొన్నారు. తరువాత దాన్ని వుపసంహరించుకున్నారు. ఆమెపై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆ వ్యాఖ్యలను తాను వ్యంగ్యంగా చేశాను తప్ప మరొకటి కాదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా జనవరి నుంచి సామాజిక మాధ్యమంలో మహాత్మాగాంధీ మీద ప్రతికూల వ్యాఖ్యలు బాగా కనిపిస్తున్నాయని, గాంధీ వాటిని చూడకుండా చేసినందుకు గాడ్సేకు కృతజ్ఞలు అనే అర్ధంలో తాను ట్వీట్‌ చేసినట్లు మీడియాకు వివరించారు.

నరేంద్రమోడీని జాతి పిత లేదా ప్రపంచ పిత అని పిలవటానికి సంఘపరివార్‌ నీడలో వున్నవారిలో వున్న ఆతృత ఎలా వుందో అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అని ప్రశ్నించటం ఒక సూచిక. అనేక మంది అలా పిలిచేందుకు వుబలాటపడుతున్నారు. నరేంద్రమోడీ 69వ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ సతీమణి అమృత శుభా కాంక్షలు చెబుతూ నరేంద్రమోడీని జాతి పిత అని సంబోధించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన వీడియోను కొన్ని వేల మంత్రి ఆమోదించారు. దాని మీద సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్రమోడీ సన్నిహితుడు గుజరాత్‌ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన విష్ణు పాండ్య గుజరాత్‌ సమాచార్‌ టీవీ చర్చలో పాల్గొంటూ గాంధీ మాదిరే గాడ్సే కూడా దేశభక్తుడే అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని జాతిపితగా గుర్తించే వారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కడైనా ఒకరో అరో వుంటారేమోగానీ గాడ్సేను దేశభక్తుడు కాదని చెప్పేవారెవరూ మనకు కనిపించరు. నేను గాంధీని ఎందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనను పెద్ద ఎత్తున ప్రచురించి పంపిణీ చేసేది, చదివించేది కూడా వారే అంటే అతిశయోక్తి కాదు.

Image result for narendra modi and gandhi

చరఖా తిప్పినంత మాత్రాన గాంధీలు, శాంతి మంత్రం జపించినంత మాత్రాన బుద్దులు అయిపోరు. కానీ అలాంటి ప్రయత్నాలను దేశం చూసింది. ఖాదీ వుద్యోగ సంస్ధ కాలెండర్‌ కోసం నరేంద్రమోడీ చరఖా ముందు కూర్చొని ఫొటోకు పోజిచ్చారు. మహాత్మా గాంధీ సామాన్యులను ప్రతిబింబిస్తూ కొల్లాయి కట్టి తిరిగారు. నరేంద్రమోడీ ధరించే దుస్తులు ఎంత ఖరీదైనవో, ఎంత దర్జాగా వుంటాయో రోజుకు రెండు మూడు మార్లు మారుస్తారని చదివాము. గాంధీ ఆశ్రమంలో తన మరుగుదొడ్డి తానే శుభ్రం చేసుకున్నారు. పారిశుధ్యకార్మికులను విముక్తి చేయాలని కోరుకున్నారు. కానీ కుంభమేళా సందర్భంగా ఐదుగురు పారిశుధ్యకార్మికుల కాళ్లు కడిగి నరేంద్రమోడీ మీడియా ఫొటోలకు ఫోజిచ్చారు. అంతమాత్రాన గాంధీ అయిపోతారా ? గాంధీ ఒక వ్యవస్ధకు ప్రతిరూపం అయితే నరేంద్రమోడీ కంపెనీల ప్రచారకర్తగా తయారయ్యారు. గాంధీ కంటే ప్రధాని మంచి బ్రాండ్‌ అని హర్యానా బిజెపి మంత్రి వ్యాఖ్యానించిన విషయం మరచిపోరాదు. జియో, పేటియంల ప్రచారకర్తగా జాతికి కనిపించిన విషయం మరచిపోగలమా ? గాంధీ సామాన్యులకు ప్రతిబింబంగా అంగవస్త్రంతో బతికారు, మరి మోడీ ఖరీదైన దుస్తులను రోజుకు రెండు మూడుసార్లు మారుస్తారని చదివాము. గాంధీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశాన్ని నడిపారు. నరేంద్రమోడీ సామ్రాజ్యవాదుల పాదాల దగ్గరకు దేశాన్ని నడిపిస్తున్నారు.

ఇరాన్‌-అమెరికా మధ్య పంచాయితీ వుంది. అందుకని దాని దగ్గర చమురు కొనవద్దని మన దేశాన్ని ట్రంప్‌ ఆదేశిస్తే తలొగ్గటాన్ని సామ్రాజ్యవాదుల పాదాల చెంతకు మనం చేరటం కాదా ? గాంధీ 150వ జయంతి సందర్భంగా బిజెపి వారు గాంధీ ఆర్ధిక సిద్దాంతాల గురించి కూడా ప్రచారం చేస్తారట. దానికి పూర్తి విరుద్దమైన పాలన ఐదేండ్లు సాగించారు. బిజెపి ఏలుబడిలోకి రాక ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసింది. మొత్తం మార్కెట్‌ను విదేశాలకు అప్పగిస్తుంటే మరి ఆ సంస్ధ ఏమైందో, దాని దేశభక్తి ఎటుపోయిందో తెలియదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

29 Sunday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Donald trump, father of the country, Howdy Modi, is narendra modi india's divider in chief or unifier, Narendra Modi, narendra modi father of the country, narendra modi india's divider in chief, narendra modi india's unifier in chief

Image result for modi unifier

నరేంద్రమోడీ సమాజ ఐక్యతకు ప్రతీకా లేక విభజన దళపతా !

మొదటి భాగం

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ చరిత్రలో రాజులు, రంగప్పలే కాదు, ప్రజాస్వామిక వ్యవస్ధలని చెప్పుకొనే చోట కూడా అధికారంలో వున్న వారికి లేని ప్రతిష్టను చేకూర్చే ప్రయత్నాల గురించి చెప్పనవసరం లేదు. వాటి వెనుక వ్యక్తిగత ప్రయోజనాలే కాదు తమను ఆశ్రయించుకున్న వారికి అవకాశాల కోసం కూడా పాత పద్దతులైన సామ, దాన, బేధ, దండోపాయాలే కాదు అన్ని రకాల అవాంఛనీయ చర్యలకు పాల్పడటం చూస్తున్నాము.

అమెరికాలోని హూస్టన్‌ నగరంలో సెప్టెంబరు 22న జరిగిన ప్రవాస భారతీయుల హౌడీ మోడీ (మోడీ గారూ ఎలా వున్నారు) సభలో మన ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు నరేంద్రమోడీ ఒకరిని ఒకరు పొగుడుకున్న తీరు చూసిన తరువాత నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచేందుకు ప్రయత్నం జరుగుతోందా అని ఎవరైనా అనుకుంటే వారు సరిగానే ఆలోచిస్తున్నట్లు లెక్క. కొందరికి ఆ ధోరణులు కనిపిస్తున్నాయి, మరి కొందరు నరేంద్రమోడీ అందుకు అర్హులే అని కీర్తిస్తున్నారు. అన్నింటినీ బేరీజు వేసుకొని ఎవరి అంచనా సరైనదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.

హిందూ హృదయ సామ్రాట్‌ అని కొందరు నరేంద్రమోడీని కీర్తిస్తే, ఆయన హిందూ ఏమి ఖర్మ ఏకంగా భారత హృదయ సామ్రాట్‌ అని మరికొందరు ప్రస్తుతించారు. భారత విభజన దళపతి అని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాక ముందు ఒక అంతర్జాతీయ పత్రిక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించిది. అదే పత్రిక ఎన్నికల తరువాత దశాబ్దాల కాలంలో ఏ ప్రధానీ నరేంద్రమోడీ మాదిరి దేశాన్ని ఐక్యం చేయలేదు అని మరొక వ్యాసాన్ని ప్రచురించింది. కాలం నరేంద్రమోడీని ఐక్యతా దళపతిగా నిరూపించింది అని ఫలితాలు వెలువడిన తరువాత బిజెపి నేత సంబిత్‌ పాత్ర వంటి వారు వర్ణించారు. ఇప్పుడు అది మరింత వేగం పుంజుకొని ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది. ఏదీ వూరికే రాదు అన్న విషయం తెలిసిందే. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లుగా మోడీ- ట్రంప్‌ వ్యవహరించారా ?

ఎవరైనా ఒకరిని అసాధారణ వ్యక్తులతోనో, అసాధారణ రీతినో ఏ కారణంతో అయినా పొగిడితే వారేదో అలా అన్నారు గానీ నాకంత లేదు అని వినమ్రంగా చెప్పుకుంటారు. మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి అలాంటి వినమ్రత ఆశించే వారిని ఆయన హతాశులను గావించారు. ఒక్క విషయం స్పష్టమైంది.దేశద్రోహం, నువ్వు భారతీయుడివా కాదా అని నిర్ధారించేందుకు ప్రమాణాలుగా సంఘపరివార్‌, దాని రాజకీయ సంస్ధ బిజెపి తయారుచేసిన నిఘంటువులోకి మరొక అంశం తోడైంది. అదే ‘భారత దేశ పిత’ నరేంద్ర దామోదరదాస్‌ మోడీ.

మన రాజ్యాంగంలో ఎవరినీ అధికారికంగా జాతిపితగా లేదా భారత దేశ పితగా పరిగణించేందుకు అవకాశం లేదు. అయినా యావత్‌ సమాజం జాతిపితగా పరిగణిస్తున్న మహాత్మా గాంధీని గుర్తించేందుకు, నరేంద్రమోడీని భారత దేశ పితగా పరిగణించకపోవటాన్ని అంగీకరించేందుకు బిజెపి, సంఘపరివార్‌కు చెందిన వారు సిద్దంగా లేరు.

ఇప్పటికే జాతిపిత గాంధీని చంపిన విడి సావర్కర్‌ అసలైన దేశభక్తుడు అని చెబుతున్న వారు రేపు గాంధీ జాతి పిత ఏమిటి అసలైన జాతిపిత సావర్కర్‌, ఆయన వారసుడు నరేంద్రమోడీ భారత దేశ పితి అని చెప్పేందుకు ఎంతో సమయం పట్టదా అనిపిస్తోంది. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తన మనసులో వున్న విషయాన్ని దాచుకోకుండా చెప్పినందుకు ఒక విధంగా ఆయనకు ‘అభినందనలు’ చెప్పకతప్పదు. భారత దేశ పితగా నరేంద్రమోడీని అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారన్నదే ఆయన ప్రశ్న.

‘ ప్రధాని వ్యక్తిత్వం,చొరవ కారణంగా ఈ రోజు విదేశాల్లో వున్న వారు గర్వపడుతున్నారు. ఎవరైనా ఒకరి గురించి అమెరికా దాని అధ్యక్షుడి నుంచి ఒక నిష్పాక్షిక మరియు ధైర్యవంతమైన ప్రకటన వచ్చిందంటే ఏదైనా పార్టీతో అతని రాజకీయ అనుబంధాలు లేదా భావజాలంతో నిమిత్తం లేకుండా ప్రతి భారతీయుడు గర్వపడాలని నేను భావిస్తున్నాను.ఒక అమెరికా అధ్యక్షుడు అలాంటి పదాలతో ప్రశంసలు కురిపించటం ఒక భారత ప్రధాని గురించే కాదు ఇతర ఏ ఒక్క ప్రపంచ నేత గురించి చేయలేదు. దీనికి ఎవరైనా గర్వపడకపోతే, తరువాత వారు తమను తాము భారతీయులుగా పరిగణించుకోకపోవచ్చు’ అని జితేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. జాతిపిత ఒకరే వుంటారు అన్న కాంగ్రెస్‌ వ్యాఖ్య గురించి అడగ్గా దాని గురించి ట్రంప్‌తో కాంగ్రెస్‌ను వాదించమనండి అన్నారు. దీన్ని చూసిన తరువాత జర్మన్‌ భావజాలానికి వ్యతిరేకం అనేపేరుతో ప్రఖ్యాత రచయితల పుస్తకాలను దగ్దం చేసిన నాజీల చర్య గుర్తుకు వస్తోంది.

హిట్లర్‌ పుట్టటానికి వంద సంవత్సరాల ముందే హెన్రిచ్‌ హైనే అనే రచయిత ” ఎక్కడైతే పుస్తకాలను తగులబెడతారో (భావజాలం లేదా విజ్ఞానం) అక్కడ మానవులను కూడా సజీవదహనం చేస్తారు ” అని ప్రకటించాడు. 1933 మే 10ప తేదీ రాత్రి బెర్లిన్‌ నగరంలో నాజీలు, విశ్వవిద్యాలయాల విద్యార్ధులు పెద్ద సంఖ్యలో కూడి 20వేల పుస్తకాలను దగ్దం చేశారు. వాటిలో కమ్యూనిస్టు రచయితలు కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఎంగెల్స్‌, ఆల్బర్‌ ఐనిస్టీన్‌, ఎర్నెస్ట్‌ హెమింగ్వే, జాక్‌లండన్‌, హెచ్‌జి వెల్స్‌ వంటి ఎందరో కమ్యూనిస్టేతర, పురోగామి రచయితల పుస్తకాలు వాటిలో వున్నాయి. నరేంద్రమోడీని భారత దేశ పితగా అంగీకరించని వారు భారతీయులు ఎలా అవుతారు అని ప్రశ్నించినట్లుగానే హిట్లర్‌, నాజీ భావజాలానికి వ్యతిరేకమైన రచనలన్నీ జర్మన్‌ వ్యతిరేకమైనవే అన్న వున్మాదానికి లోనైన వారు దీనికి పాల్పడ్డారు. ఇప్పటికే మన దేశంలో జెఎన్‌యు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంటివి భారతీయతకు వ్యతిరేకులు, దేశద్రోహులతో చేతులు కలిపే వారితో నిండి వున్నాయనే ప్రచారాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ రోజు దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్న, ఆశించిన రీతిగా పరిస్ధితులు లేవు. తమ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, విదేశీతొత్తులుగా చిత్రిస్తున్నారు. పరమత, పురోగామి భావజాలాలు, వాటిని కలిగి వున్నవారి మీద ద్వేషం, ఆవుల రక్షణ పేరుతో హత్యాకాండ, అసహనం,రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చటం వంటి పరిణామాలను సమర్ధించేవారు, ముందుకు తీసుకుపోయే వారు తమకు ఒక ప్రతీక కావాలనుకుంటున్న వారు నరేంద్రమోడీని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదంతా అమెరికా అధ్యక్షుడు మాననీయ మహోదయ ఎప్పుడేం మాట్లాడతాదో తెలియని తలతిక్క మనిషిగా పేరు మోసిన (నిజానికి అది వాస్తవం కాదు, తమకు హాని కలిగించే వారిని అమెరికా కార్పొరేట్‌ రంగం తమ ప్రతినిధిగా కొనసాగనివ్వదు.) డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్యలే కారణం. మన ప్రధానిని ‘భారత దేశ పిత’ గా వర్ణించటంతో వచ్చింది అనుకొనే వారికి కాదు మహానుభావులారా మన దేశంలో అనేక మంది మనసులో వున్న మాటనే వెల్లడించాడు అని చెప్పాల్సి వస్తోంది. హూస్టన్‌ సభ తరువాత న్యూయార్క్‌ నగరంలో ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌, నరేంద్రమోడీ మరోసారి భేటీ అయ్యారు. పరస్పర పొగడ్తలు కిక్కు ఇవ్వలేదని అనుకున్నారేమో తెలియదు. ఇద్దరూ విలేకర్లతో మాట్లాడారు.’ హూస్టన్‌ సభకు డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరైనందుకు ధన్యవాదాలు. అమెరికా అధ్యక్షుడు మంచి స్నేహితుడు’ అని మోడీ చెప్పారు. అంతగొప్ప స్నేహితుడు కాశ్మీర్‌ గురించి మధ్యవర్తిత్వం వహించమని మోడీ తనను అంతర్గత సమావేశంలో అడిగారు అని పచ్చి అబద్దం చెప్పి ఎంతో కాలం గడవ లేదు. స్నేహితుల మధ్య బయటి ప్రపంచానికి వెల్లడి కాని అనేక అంశాలు దొర్లుతాయి. బహుశా వారి స్నేహం చెడకుండా వుండేందుకే మోడీ దాని మీద నోరు విప్పలేదు అనుకోవాలి. అలాంటి అబద్దాల కోరు ట్రంప్‌ మోడీని భారత దేశ పిత అనటం కూడా మరొక అబద్దం లేదా అతిశయోక్తి కావచ్చు కదా ! అంతగా మంచి స్నేహితుడు అని మోడీ స్పందించిన తరువాత ట్రంప్‌ బదులు తీర్చుకోకపోతే భారత జాతికే అవమానం కదా !

బొల్లు బొల్లరా వెంకన్నా అంటే మా గురించి గొప్ప చెప్పుకోవటం కాదు గానీ బాబయ్యా మా అయ్యగారి తోటలో మిరియాలు తాటికాయలంత వుంటాయండయ్యా అన్నట్లుగా ట్రంప్‌ స్పందించారు. ‘ అంతకు ముందు భారత్‌ నాకు గుర్తుంది. అంతబాగా తెలియదు గానీ నాకు గుర్తుంది, అది చీలికలు పేలికలు అయింది. ఎంతో గొడవ జరిగేది, ఆయన దాన్నంతా ఒక దగ్గరకు చేర్చారు. ఒక తండ్రి మాదిరిగా ఆయన ఒకటిగా చేశారు. మనం ఆయన్ను భారత దేశ పితగా పిలవవచ్చు, ఆయనొక అసాధారణ మంచిపని చేశారు అనుకుంటున్నా’ అని డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Image result for narendra modi india's divider in chief

వివిధ రాజ్యాలుగా వున్న భారతావనిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకొని దోపిడీని యధేశ్చగా కొనసాగించేందుకు దేశమంతటా కొన్ని సంస్ధానాలను కొనసాగించేందుకు అనుమతించినా వాటిని కూడా తమకు లోబడి వుండేట్లు చేసుకొని దేశాన్ని ఒక్కటిగా చేసింది బ్రిటీష్‌ వారే.అయినంత మాత్రాన వారిని దేశాన్ని ఆక్రమించుకున్నవారిగా తప్ప ఆధునిక భారత నిర్మాతలుగా చరిత్ర పరిగణించలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత వందల సంఖ్యలో వున్న చిన్నా, పెద్ద సంస్దానాలను విలీనానికి భారత ప్రధానిగా నెహ్రూ కృషి చేశారు. కాశ్మీర్‌ సంస్ధానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు ఏకంగా సైన్యాన్నే నడిపించారు. పోర్చుగీసు పాలనలో వున్న గోవాను భారత్‌లో విలీనం చేసేందుకు అదే నెహ్రూ సైన్యాన్ని నడిపించిన చరిత్ర తెలిసిందే. ఫ్రాన్స్‌ ఆధీనంలో వున్న నేటి పుదుచ్చేరి ప్రాంతాలను భారత్‌లో విలీనం చేసింది కూడా ఆయన హయాంలోనే. సంఘపరివార్‌ గొప్పగా చిత్రించే సర్దార్‌ పటేల్‌ కారణంగానే హైదరాబాదు సంస్దానం దేశంలో విలీనం అయింది అని చేసే వాదనను కాసేపు అంగీకరిద్దాం. భారత రక్షణలో స్వతంత్ర రాజ్యంగా వున్న సిక్కిం మన దేశంలో విలీనం అయింది ఇందిరా గాంధీ ఏలుబడిలో, అలాంటి ఏ చరిత్రా లేని నరేంద్రమోడీ భారత్‌ను ఐక్యం చేశారనే పేరుతో భారత దేశ పిత అని పిలిస్తే పై ముగ్గురిని కూడా భారత దేశ పితలు, మాత అని పిలవాల్సి వుంటుంది. ఒక వేళ జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగమే కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి, హక్కులను రద్దు చేయటమే దేశాన్ని ఐక్యం చేయటమే అయితే, గిరిజన ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు కల్పించిన ప్రత్యేక హక్కులు, రక్షణల కొనసాగింపు మాటేమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందువలన భారత చరిత్ర తెలియని ట్రంప్‌ చేసే ప్రకటనలు, వర్ణణలకు విలువేమిటి అన్నది సమస్య.

Image result for narendra modi india's divider in chief

ట్రంప్‌కు గత చరిత్ర తెలియదు లేదా తెలిసినా కావాలని తన ప్రయోజనం కోసం నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తారనుకోవాల్సి వుంటుంది. నరేంద్రమోడీ ‘భారత విభజన దళపతి’ అని అమెరికాకు చెందిన టైమ్స్‌ పత్రిక ఈ ఏడాది మేనెలలో తన ముఖచిత్ర కధనానికి శీర్షిక పెట్టింది. అదే పత్రిక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మరొక అడుగు ముందుకు వేసి గత దశాబ్దాలలో ఏ ప్రధానీ చేయని విధంగా నరేంద్రమోడీ ఐక్యతా దళపతిగా వ్యవహరించారు అని మరొక కధనాన్ని ప్రచురించింది. వాటి లోని అంశాలను మరోసారి వివరించుకోవచ్చు. బ్రిటన్‌, ఇతర అనేక దేశాల నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ఏమి వ్యాఖ్యానించిందో దిగువ కొన్ని వ్యాక్యాలను చూడండి.

”భారతీయ ఆత్మకు చెడు !

ఒక వైపు కుహనా వార్తలతో కాలక్షేపం చేస్తూ వాణిజ్య వేత్తల అనుకూల అజెండా అమలు జరుపుతూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే మరో ప్రజాకర్షక నినాదాల నేత ప్రపంచానికి అవసరం లేదు.2017లో జరిపిన ఒక సర్వేలో రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా ఏ దేశంలోనూ లేని విధంగా నిరంకుశమైన పాలన చేసేందుకు ఒక బలమైన నేత కావాలని భారత్‌లో 55శాతం మంది కోరుకోవటాన్ని చూసిన తరువాత ఈ విజయం చూసి మాకేమీ ఆశ్చర్యం కలగలేదు. స్వాతంత్య్ర భారత అత్యంత విలువైన లక్షణమైన బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి నరేంద్రమోడీ ముప్పుగా పరిణమించారు.” అని పేర్కొన్నది.

బ్రిటీష్‌ వారి పాలనకు చరమ గీతం పాడేందుకు సాగిన మహోద్యమానికి నాయకత్వం వహించింది గాంధీ. ఆయన అనుసరించిన కొన్ని వుద్యమ పద్దతులు, కొన్ని అంశాల మీద ఆయన వైఖరులను మ్యూనిస్టులు, ఇతరులు కూడా విబేధించారు గానీ గాంధీ దేశభక్తి, చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేదు. కానీ నరేంద్రమోడీ, ఆయన మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఆరాధించే, ఆయన వారసులం అని చెప్పుకొనే సదరు వినాయక దామోదర్‌ సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవ చేస్తానని చెప్పిన వ్యక్తి. సంఘపరివార్‌కు చెందిన వారి చరిత్ర భారత సమాజాన్ని మతప్రాతికన విడదీసే, పరమత ద్వేషులుగా వుంది తప్ప ట్రంప్‌ చెప్పినట్లు ఐక్యపరిచేదిగా లేదు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా టైమ్‌ పత్రిక మాదిరి ఇదే ట్రంప్‌ లేదా మరొక అమెరికా అధ్యక్షుడు తన అభిప్రాయాలను భిన్నంగా వెల్లడించవచ్చు. అందువలన ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకొనే లేదా మెప్పించుకొనే వారు కాదు, వ్యక్తుల ఆచరణే గీటురాయిగా వుండాలి.

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రయాన్‌ 2 ప్రయోగం : తీవ్ర ఆశాభంగం చెందింది నరేంద్రమోడీనా , శాస్త్రవేత్తలా !

09 Monday Sep 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Chandrayaan 2, ISRO scientists, Narendra Modi, Vikram Lander

Image result for chandrayaan 2

ఎం కోటేశ్వరరావు

చంద్రయాన్‌ -2 ప్రయోగం విఫలమైందా ? ఈ ప్రయోగం ఫలితంపై తీవ్ర ఆశాభంగానికి గురైంది ఇస్రో శాస్త్రవేత్తలా లేక రాజకీయవేత్త ప్రధాని నరేంద్రమోడీనా ? ప్రయోగం విజయవంతంగా కావాలని మఠాధిపతులు, గుడి పూజారులు, చిన్న దేవుళ్లు, దేవతలు, పెద్ద వెంకటేశ్వరస్వామి ఆశీర్వచనాలు, వాట్సాప్‌ భక్తుల పూజలు ఏమైనట్లు ? అసలు శాస్త్రవేత్తలకు కావాల్సింది ఏమిటి ? ఈ ప్రాతిపదికన కొన్ని అంశాల మీద వెల్లడించే అభిప్రాయాలు తమ మనోభావాలను గాయపరుస్తాయని భావించే వారు, భయపడే వారు ఇక్కడి నుంచి చదివేందుకు ముందుకు పోవాలా లేదా అన్నది వారి స్వేచ్చకే వదలి వేస్తున్నాను.

నూతన ఆవిష్కరణలు గావించే మానవాళి శాస్త్ర పరిశోధనా, ప్రయోగాలు నిర్దిష్టంగా ఫలానా రోజున ప్రారంభం అయ్యాయని చెప్పలేము. ప్రతి చిన్న ఆవిష్కరణ ఎంతో పెద్ద పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసింది. పెద్ద బండరాయి కంటే అంచు వాడిగా వుండే చిన్న రాయి ఎంతో శక్తివంతమైనదని, పశువులను చంపి తినటం కంటే వాటిని పెంచి అవసరమైనపుడు ఆహారానికి వినియోగించుకోవచ్చన్న ఆలోచన రావటం, వాటిని భూమిని దున్నటానికి వినియోగించవచ్చని ప్రయోగించటం ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారితీసిన చరిత్ర తెలిసిందే. అందువలన అది నిరంతర ప్రక్రియ, మానవుడి లక్షణాల్లో ఒకటి. శాస్త్రవిజ్ఞానమే కాదు, ఏ విజ్ఞాన అభివృద్ధికైనా ఎదురుదెబ్బలే స్ఫూర్తి,కసిని పుట్టిస్తాయి. పరిశోధనా, ప్రయోగాలు వ్యక్తిగతం కంటే సమిష్టి కృషి ఫలితాలు, పర్యవసానాలే. అయితే ప్రతి ఆవిష్కరణలోనూ వ్యక్తిగత పాత్ర లేదా అంటే వుంటుంది. దానిలో కూడా ఇతరుల అనుభవాల సారం వుంటుంది. విద్యుత్‌ బల్బ్‌ను కనుగొన్నది ఎవరంటే ధామస్‌ ఆల్వా ఎడిసన్‌ అని చెబుతాము. నిజానికి అంతకు ముందు ఎందరో దాని మీద చేసిన పరిశోధనలు ఆయనకు తోడ్పడ్డాయి. ప్రతి దేశ అంతరిక్ష పరిశోధనకూ ఇదే వర్తిస్తుంది.

గత ఆరు దశాబ్దాలలో చంద్రుడి మీద అడుగు పెట్టేందుకు చేసిన ప్రతి ప్రయోగం విజయవంతం కాలేదు. అయినప్పటికీ ఏ దేశమూ నీరసించి తన ప్రయత్నాలను మానుకోలేదు. అమెరికాకు చెందిన నాసా సంస్ధ నిర్వహిస్త్ను చంద్రుడి వాస్తవ పత్రం(మూన్‌ ఫ్యాక్ట్‌ షీట్‌)లో వున్న సమాచారం ప్రకారం వివిధ దేశాలు ఇప్పటి వరకు 109 ప్రయోగాలు జరపగా 61 విజయవంతం కాగా 48 విఫలమయ్యాయి. మన చంద్రయాన్‌-2కు ముందు 2019 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌లో ఒక ప్రయివేటు సంస్ధ చేసిన ప్రయోగం ఏప్రిల్‌లో విఫలమైంది.

1958,59 సంవత్సరాలలో నాటి సోవియట్‌ యూనియన్‌, అమెరికా దేశాలు 14 ప్రయోగాలు చేశాయి. వాటిలో సోవియట్‌ లూనా 1,2,3 మాత్రమే విజయవంతమయ్యాయి. మొదటి విజయానికి ముందు సోవియట్‌ ప్రయోగాలు ఆరు విఫలమయ్యాయి. తరువాత 1964లో అమెరికా జరిపిన ఏడవ ప్రయోగం విజయవంతమైంది. 1966లో సోవియట్‌ లూనా 9 చంద్రుడి మీద దిగి చంద్రుడి వుపరితల చిత్రాలను తొలిసారిగా పంపింది. ఐదునెలల తరువాత అమెరికా అలాంటి ప్రయోగంలోనే విజయవంతమైంది. తొలుత సోవియట్‌ యూనియన్‌ అంతరిక్షంలోకి యూరీ గగారిన్‌ను పంపి చరిత్ర సృష్టిస్తే, తరువాత అపోలో 11వ ప్రయోగంలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నాయకత్వంలో చంద్రుడి మీద తొలిసారి కాలుమోపిన చారిత్రాత్మక ఘటన తెలిసిందే. 1958 నుంచి 1979 వరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ 90 ప్రయోగాలు జరిపాయి. తరువాత ఒక దశాబ్దం పాటు ఎలాంటి ప్రయోగాలు జరగలేదు. తరువాత జపాన్‌, ఐరోపాయూనియన్‌, చైనా, భారత్‌, ఇజ్రాయెల్‌ తమ ప్రయోగాలను ప్రారంభించాయి. 2009-19 మధ్య పది ప్రయోగాలు జరిగాయి. రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఆ రంగంలో మొదటి మూడు స్ధానాలను ఆక్రమించాయి. మన చంద్రయాన్‌ 2 సఫలీకృతం అయితే మనది నాల్గో స్ధానం అవుతుంది. మన కంటే ఆర్ధికంగా బలమైన జపాన్‌ ఎంతో వెనుకబడి వుంది, అంతమాత్రాన దాని పలుకుబడి తగ్గలేదు. మిగతా కొన్ని రంగాలలో తన ప్రతిభ చూపింది.

ఒక ప్రయోగం విఫలమైనపుడు, మరొకటి సఫలమైనపుడు శాస్త్రవేత్తలు, సమాజం భావోద్వేగాలకు గురి కావటం సహజం. వస్తువు గురుత్వాకర్షణ, సాంద్రత, చలన శక్తి సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ గురించి ప్రచారంలో వున్న కధ తెలిసిందే. తన సింహాసనం పూర్తి బంగారంతో చేసింది కాదని తనకు అనుమానంగా వుందని దాన్ని రుజువు చేయాలని రాజుగారు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించారు. ఒక రోజు ఆర్కిమెడిస్‌ స్నానం చేస్తుండగా ఆయన కూర్చున్న తొట్టెలోంచి నీరు పైకి వుబికింది. అది తన బరువుకు సమానంగా గుర్తించి భావోద్వేగానికి గురై యురేకా యురేకా ( నాకు అర్ధమైంది, నాకు అర్ధమైంది) అంటూ నీటి తొట్టెలోంచి లేచి బట్టల్లేకుండానే వీధుల్లో పరుగెత్తి రాజుగారి దగ్గరకు వెళ్లాడు. తరువాత బంగారంలో వేరే లోహాన్ని కలిపినట్లు బయటపెట్టాడు. అంతకు ముందు ఆర్కిమెడిస్‌తో పాటు అనేక మంది బంగారంలో కల్తీని కనుగొనేందుకు అనేక ఆలోచనలు, ప్రయోగాలు చేయకపోలేదు. అయితే తామెలా చేసేది చూడండని రాజుగారిని వారు పిలిచిగానీ, లేదా మీ ప్రయోగాన్ని స్వయంగా చూస్తానని రాజుగారు వచ్చి కూర్చున్న వుదంతాలుగానీ, ప్రయోగం లేదా వివరణలో విఫలమైతే శాస్త్రవేత్తలు కంటినీరు పెట్టుకున్నట్లు, వారిని రాజుగారు ఓదార్చినట్లు ఎక్కడా చదవలేదు. అసాధారణంగా ఎక్కడైనా జరిగిందేమో నాకు తెలియదు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి అంశం మీద జనంలో భావోద్వేగాలు, మనోభావాలు రేపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి భావించాల్సి వస్తోంది. శాస్త్ర పరిశోధనల మీద దేశమంతటా ఆసక్తిని కలిగించే యత్నాలు, శాస్త్రంపట్ల ఆసక్తిని కలిగించేందుకు తీసుకొనే చర్యలు వేరు. అనేక దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి, కానీ మన ప్రధాని నరేంద్రమోడీ మాదిరి ఒక దేశాధినేత స్వయంగా పరిశోధనా కేంద్రానికి వచ్చి కూర్చొని వీక్షించిన వుదంతం వుందేమో చెప్పమ్మా అని గూగులమ్మ తల్లిని అడిగితే చెప్పలేదు. ఎవరి దగ్గర అయినా అలాంటి సమాచారం వుంటే నా వ్యక్తీకరణను సవరించుకొనేందుకు సిద్దం. ఇస్రో చరిత్రలో విజయాలతో పాటు అపజయాలు కూడా వున్నాయి. అపజయాలు సంభవించినపుడు వుత్సాహం కొరవడ వచ్చుగానీ, ఎప్పుడూ కంటనీరు పెట్టుకున్నట్లు చదవలేదు. చంద్రయాన్‌ 2 వుదంతంలో రాజకీయం, మీడియా జనంలో భావోద్వేగాలను పెంచటంలో , వుపయోగించుకోవటంలో మాత్రం విజయం సాధించింది. మన దేశంలో క్రికెట్‌ మీద, మరొక దేశంలో మరొక క్రీడను సొమ్ము చేసుకొనేందుకు జనంలో పిచ్చిని పెంచే విధంగా మీడియా రాతలు, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పొందే బిసిసిఐ తీరుతెన్నులను చూశాము.అది ముదిరిపోయి కొన్ని చోట్ల తాము ఆశించిన జట్టు విజయం సాధించని సందర్భాలలో అభిమానం దురభిమానంగా మారిన వుదంతాలు కూడా చూశాము. శాస్త్ర ప్రయోగాలు అలాంటివి కాదు. వాటి విజయం గురించి ఎవరూ హామీ ఇవ్వలేరు. మన చంద్రయాన్‌ మాదిరే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల మన ఖర్చులో సగంతో ఒక ప్రయోగం జరిపారు. అది ఏప్రిల్‌ 19వ తేదీన చివరిక్షణాల్లో సమాచార వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయి, మన ప్రయోగం మాదిరే జయప్రదం కాలేదు. మన దేశంలో మాదిరి దృశ్యాలు,ఓదార్పు యాత్రలు అక్కడ లేవు. ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గర ఎందుకో జనం ఆలోచించాలి.

చంద్రయాన్‌ ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమంలో ఒక అంశం చక్కర్లు కొట్టింది. అది నిడివి పెద్దది అయినా ఇక్కడ పూర్తి పాఠం ఇస్తున్నాను. ” చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా రెడీ, కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి తెమలడం లేదు, తేలడం లేదు లెక్క తెగడమే లేదు.900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచ కన్ను . ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్‌ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్‌ కూడా ప్రతిదీ వినే తరహా, దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్‌, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు తను ఓ క్షణం విస్తుపోయాడు ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు స్వామివారినే శ్రీహరికోటకు రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చాడు,చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్‌ చేసేశాడు శంకరాచార్య అలియాస్‌ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్‌. ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్‌-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది అబ్బే, ఏమాత్రం నమ్మబుల్‌గా లేదు, ఉత్త ఫేక్‌ అని కొట్టేసేవాళ్లు బోలెడు మంది ఉంటారు కదా ఈ వార్తను..! కానీ కాస్త అతిశయోక్తి ఉంది గానీ వార్త నిజమే. కాకపోతే మన మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాకు ఇలాంటివి పట్టవు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్‌.ఈ స్వామి పూరి శంకరాచార్య నంబర్‌ 145, ఈయన 143వ శంకరాచార్యుడు భారతక ష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు. ఆయన వేదగణితంలో దిట్ట. ఆధునిక గణితం వల్ల కాని అనేకానేక సంక్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని ఇట్టే సాల్వ్‌ చేసేవాడు. ఈ నిశ్చలానంద కూడా ఆయన దగ్గర నేర్చుకుని, పాత వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత మెరుగుపెట్టుకున్నాడు.

ఆహారానికి, భాషకు, మందులకు, ఆహార్యానికీ, అలవాట్లకూ మతాన్ని రుద్దినట్టుగా ఈ గణితానికి మతాన్ని రుద్దకండి.లెక్కలంటే లెక్కలే. ఆధునిక గణితం పోకడ వేరు, వేదగణితం పోకడ వేరు .రెండూ సొల్యూషన్సే చూపిస్తాయి. కాకపోతే వేదగణితం సులభంగా స్టెప్‌ బై స్టెప్‌ ఉంటుంది. ఆధునిక గణితం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది.”ఇందులో వింత ఏమీ లేదు, ఇదేమీ మాయ కాదు, లీల కాదు, మహత్తు అసలే కాదు. వేల ఏళ్ల క్రితమే భారతీయ రుషులకు లెక్కలు, జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బ్రహ్మాండమైన విద్వత్తు ఉంది. మన పురాణాల్లో, భగవద్గీతలో బోలెడు అంశాలు దొరుకుతాయి. నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో బోలెడంత సాధన చేశాడు.11 పుస్తకాలు రాశాడు తను. దీనిపై చాలా మంది విదేశీ గణిత పరిశోధకులు స్వామితో టచ్‌లో ఉంటారు. సందేహాలకు వేదగణితంలో పరిష్కారాలు వెతుక్కుంటారు అంటున్నాడు ఈ శంకరాచార్యుడి గోవర్ధన పీఠం పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ మనోజ్‌ రత్తా.

నిజానికి నిశ్చలానందుడికి ఇస్రో స్పేస్‌ సైన్స్‌తో పరిచయం కొత్తదేమీ కాదు. చాలాసార్లు తను ఇస్రో లెక్కలకు సాయం చేశాడు. రెండేళ్ల క్రితం అహ్మదాబాద్‌ స్పేస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు వెళ్లి దాదాపు 1000 మంది సైంటిస్టులు, రీసెర్చ్‌ స్కాలర్లను ఉద్దేశించి ప్రసంగించాడు. అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్‌మెంట్‌ పాఠాలు కూడా చెప్పాడు సో, స్వామి అనగానే కాషాయాలు (మన తెలుగు స్వాములతో అస్సలు పోల్చుకోవద్దు దయచేసి..) ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే అనుకోకండి. ఇదుగో, ఈ నిశ్చలానందులూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పురాతన జ్ఞానాన్ని అద్ది సుసంపన్నం చేస్తారు. తమ చుట్టూ ఛాందసాల మడి గీతలు గీసుకుని, వాటిల్లో బందీలుగా ఉండరు. విభిన్నరంగాల్లో ఇదుగో ఇలా తళుక్కుమంటారు. అవసరమైన వేళల్లో..!! ”

రోజూ సామాజిక మాధ్యమాల్లో ‘ మేకిన్‌ ఇండియా ‘ ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఫేక్‌ న్యూస్‌ల్లో పైదొకటి. ఇస్రో అంటే ఏదో గణిత శాస్త్ర సంస్ధ అన్నట్లు, లెక్కల చిక్కు ముడి పడినట్లు ? చిత్రించారు. చంద్రయాన్‌ 2 ప్రాజెక్టు 2007లో ప్రారంభమైంది. 2008లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2013లో ప్రయోగించాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో ఆలస్యమైంది. అలాంటిదానికి ప్రయోగించబోయే ముందు లెక్కల చిక్కుముడి పడిందని చెప్పటం నిజంగా మన శాస్త్రవేత్తలను అవమానించటం, స్వామీజీలు, బాబాలకే లేని ప్రతిభను ఆపాదించటం తప్ప మరొకటి కాదు. సదరు నిశ్చలానంద సరస్వతి తన శిష్యులతో ఇస్రోకు సమాంతరంగా ఇప్పటికైనా తన ప్రతిభతో ప్రయోగాలను చేపట్టమనండి.

విక్రమ్‌ లాండర్‌ను సులభంగా చంద్రుడి దక్షిణ ధృవం మీద దించటం, అది పద్నాలుగు రోజుల పాటు వుపరితలం మీద కదలాడుతూ సమాచారాన్ని సేకరించటం కీలకాంశం. దానికి ముందు వున్న దశలను మన శాస్త్రవేత్తలు ఎప్పుడో జయప్రదంగా అధిగమించారు. రష్యా సహకారంలో భాగంగా వారు లాండర్‌ను తయారు చేసి ఇవ్వాల్సి వుంది. అయితే వారికి తలెత్తిన సాంకేతిక సమస్యలు కావచ్చు, బయటికి తెలియని ఇతర కారణాలతో గానీ తాము ఇవ్వలేమని చెప్పిన తరువాత మన వారే స్వంతంగా తయారు చేశారు. ఇది కూడా ఆలశ్యానికి ఒక కారణం.

Image result for disappointed Narendra Modi at ISRO

మన దేశంలో ప్రతి అంతరిక్ష ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలతో తిరుపతి వెంకన్న , సుళ్లూరు పేట చెంగాలమ్మ దేవాలయాల్లో పూజలు చేయటం చేస్తున్నారు. ఈ ఏడాది ఇస్రో అధిపతి కె శివన్‌ వుడిపి శ్రీకృష్ణ మఠాధిపతి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక వాట్సాప్‌ భక్తులు, ఇతరులు చేసిన వినతులకు కొదవ లేదు. ఈ వుత్తరం అందిన వారు మరొక పదకొండు మందికి లేఖలు రాయకపోతే అరిష్టానికి గురి అవుతారు అన్నట్లు గాక పోయినా అందరికీ పంపి ప్రార్ధనలు చేయండని కోరారు. మరి శంకరాచార్య లెక్కలేమయ్యాయి. దేవుళ్ల కరుణాకటాక్షం, మఠాధిపతుల, తిరుపతి వేద పండితుల ఆశీర్వాచనాల మహత్తు, శక్తి ఏమైపోయినట్లు ? మనం చేయాల్సింది చేయాలి, దేవుడి కటాక్షం కోరాలి అని చెప్పేవారు వుంటారు. అలాంటపుడు ఓదార్పు శాస్త్రవేత్తలకే ఎందుకు, ప్రయోగాన్ని కాపాడలేకపోయినందుకు దేవుళ్లు దేవతలు, స్వాములను కూడా ఓదార్చాలి లేదా అభిశంచించాలి. మూఢనమ్మకాలను పెంచే, శాస్త్రవిజ్ఞానం మీద పూర్తి నమ్మకంలేని తరాలను మనం తయారు చేస్తున్నాము.

ఆయుధాలు, అంతరిక్ష ప్రయోగాల కోసం దేశాలు పోటీ పడ్డాయి. దీనిలో సాంకేతికంగా, మిలిటరీ రీత్యా పై చేయి సాధించటంతో పాటు ‘రాజకీయ’ ప్రయోజనం కూడా చోటు చేసుకుంది. వుదాహరణకు హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ, ఇటలీ, జపాన్‌ కూటమికి వ్యతిరేకంగా తమతో చేయి కలపాలని అమెరికా, బ్రిటన్‌ దేశాలు నాటి సోవియట్‌ను కోరాయి. 1945 జూలై 16న ప్రపంచంలో తొలిసారిగా అమెరికా అణుబాంబు పరీక్ష జరిపింది. మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌కు ఈ విషయం చెప్పాడు. అయితే అప్పటికే సోవియట్‌ నేత స్టాలిన్‌ వారితో కలవటానికి సూత్ర ప్రాయంగా అంగీకరించారు. మిత్రపక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు. అందువలన ఈ విషయం తెలిస్తే ఒక వేళ స్టాలిన్‌ వెనక్కు తగ్గుతారేమో, కొత్త షరతులను పెడతారేమో అనే అనుమానంతో వెంటనే చెప్పవద్దని ఇద్దరు నేతలూ అనుకున్నారు. జపాన్‌ మీద యుద్దం చేసేందుకు స్టాలిన్‌ అంగీకరించిన తరువాత జూలై 25 తమ దగ్గర ప్రమాదకరమైన ఒక బాంబు వుందని ట్రూమన్‌ సూచన ప్రాయంగా స్టాలిన్‌కు చెప్పాడు. దీనిలో వున్న రాజకీయం ఏమంటే అప్పటికే అమెరికన్లు బాంబు ప్రయోగానికి నిర్ణయించుకున్నారు. ఆగస్టు పదిలోగా బాంబును ప్రయోగించాలని, అలాంటి బాంబులు హిట్లర్‌, స్టాలిన్‌ దగ్గర లేవని ట్రూమన్‌ తన డైరీలో రాసుకున్నాడు. అది జరిగిన తరువాత సోవియట్‌ యూనియన్‌ భయపడిపోయి యుద్ధానంతరం ఐరోపాను పంచుకొనే విషయంలో తమ షరతులకు అంగీకారానికి రాకతప్పదనే ఆలోచన దాగుంది. అయితే స్టాలిన్‌ ఆ సమాచారం విని తాపీగా అలాగా, సంతోషం, మంచికోసమే వుపయోగించాలి అనటం తప్ప ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదు. అప్పటికే యుద్ధం ముగింపుదశలో వుంది. మరో వారం రోజుల్లో సోవియట్‌ సేనలు జపాన్‌పై దాడికి వస్తాయనగా ట్రూమన్‌ ఆగస్టు ఆరున తొలి బాంబును, రెండు రోజుల తరువాత రెండవ బాంబును ప్రయోగించాలని ఆదేశించాడు.యుద్ధం ముగిసిన తరువాత మూడు సంవత్సరాల్లో అంటే 1949 ఆగస్టు 29న సోవియట్‌ యూనియన్‌ తొలి అణుపరీక్ష జరిపింది.అది ప్రపంచ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన విషయం తెలిసిందే.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

సోవియట్‌ పట్టుదల అంతటితో ఆగలేదు. అణుబాంబును మోసుకుపోయి లక్ష్యాల మీద వేసే క్షిపణుల తయారీకి పూనుంది. అమెరికా కంటే ముందుగా అలాంటి ఒక క్షిపణిని ప్రయోగించింది. అదే తరువాత కాలంలో అంతరిక్ష ప్రయోగాలకు ఎన్నో పాఠాలు నేర్పింది. తాము మరో రెండు సంవత్సరాలలో అంతరికక్ష వుపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు 1955లో అమెరికా ప్రకటించింది. దానికంటే ముందే సోవియట్‌ వుపగ్రహాన్ని ప్రయోగించింది, అంతటితో ఆగలేదు 1961లో యూరీ గగారిన్‌ అంతరిక్ష ప్రయాణం చేయించింది. అదే ఏడాది అమెరికన్లు క్యూబామీద దాడి చేసేందుకు ప్రయత్నించి ఎదురు దెబ్బతిన్నారు.దీంతో సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో అమెరికాకు ఎదురు లేదన్న ప్రతిష్ట అడుగంటింది. ఈ పూర్వరంగంలో అమెరికా ఆధిపత్యానికి తిరుగులేదు అంటే ఏమి చెయ్యాలి? అంతరిక్షంలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనం సోవియట్‌ను అధిగమించగలమా ? చంద్రుడి చుట్టూ తిరిగి రాగలమా, చంద్రుడి మీద రాకెట్లను దించగలమా ? రాకెట్లలో మనిషిని పంపి తిరిగి వెనక్కు తీసుకురాగలమా ? ఇవిగాక మన ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకు అవసరమైన నాటకీయ ఫలితాలను సాధించే అంతరిక్ష కార్యక్రమం ఏదైనా వుంటే చెప్పండి అని నాటి అమెరికా అధ్యక్షుడు కెన్నడీ తన సలహాదారులను అడిగాడు. రెండు వారాల తరువాత వుపాధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ నాయకత్వంలోని ఒక కమిటీ సోవియట్‌తో పోటీలో అధిగమించకపోయినా సమంగా అయినా వుండేట్లు చూడాలని కెన్నడీ కోరాడు. దాని ఫలితమే అపోలో కార్యక్రమం.

1961 మే 25న అమెరికా పార్లమెంట్‌, దేశ ప్రజలను వుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాపితంగా వున్న మన స్నేహితులుా,శత్రువుల మధ్య జరుగుతున్న పోరులో మనం విజయం సాధించాల్సి వుంది. మనం సైనికుల హృదయాలను చూరగొన గలగాలి. అంతరిక్షంలో 1957లో స్పుత్నిక్‌(సోవియట్‌) సాధించిన నాటకీయ పరిణామాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రతి చోటా ముందుకు పోవాలనే పట్టుదలతో వున్న మార్గంలో ప్రయాణిస్తున్న సైనికులపై ప్రభావం పడింది. మనం అంతరిక్షంలోకి పోవాలి. ఇలా సాగింది ఆ ప్రసంగం. అంతటి అమెరికన్లే తమ రాజకీయ, ఇతర ప్రయోజనాల కోసం అంతరిక్ష కార్యక్రమాన్ని వుపయోగించుకున్నారన్నది స్పష్టం.

ఇదే సమయంలో తమ సోషలిస్టు భావజాలం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు, ఇతర దేశాలను అమెరికా నుంచి దూరం చేసి తమ వైపుకు తిప్పుకొనే రాజకీయాల్లో భాగంగా సోవియట్‌ కూడా తన పాత్ర నిర్వహించింది. పెద్ద విజయంగా టాంటాం వేసుకుంటున్న కాశ్మీరు రాష్ట్ర విభజన, ఆర్టికల్‌ 370 గురించి ఎన్నో రోజులు వూదరగొట్టేందుకు నరేంద్రమోడీకి, బిజెపికి అవకాశం లేదు. ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే అంత ఎక్కువగా ఆ చర్య వలన ఇతర రాష్ట్రాలకు జరిగిన మేలు ఏమిటని జనం ప్రశ్నిస్తారు. ఇదిలా వుండగా దేశంలో ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం మరింత పెరుగుతోంది, పరిశ్రమల మూతలు పెరుగుతున్నాయి. వాటిని గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని నరేంద్రమోడీ అండ్‌కోకు జనం దృష్టిని మళ్లించే ఒక పెద్ద అంశం కావాలి. అందువలన ఈ పూర్వరంగంలో చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని తనకు అనుకూలంగా మలచుకొనేందుకు నరేంద్రమోడీ ప్రయత్నించారా అన్న సందేహం కలగటంలో తప్పేముంది. ప్రయోగాల వైఫల్యం ఇస్రో శాస్త్రవేత్తలకు కొత్త కాదు. అందువలన వారి కంటే నరేంద్రమోడీ ఎక్కువగా హతాశులయ్యారా ? చంద్రయాన్‌ అందినట్లే అంది అందకుండా పోయింది.

చంద్రయాన్‌ 2 విఫలం కాదు, ప్రయోగాలలో అది ఒక భాగమే. ఆర్యభట్ట నుంచి సాగుతున్న విజయాల పరంపరలో ఇదొక చిన్న ప్రయోగం. వైఫల్యాలతో గతంలో ఏ శాస్త్రవేత్త కుంగిపోలేదు. నిరాశపడలేదు. అది అసలు వారి లక్షణం కాదు. వారి ప్రయోగాలు విజయవంతం కావాలని, అది దేశానికి వుపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్‌ 1లో 2008లోనే దాదాపు 10 నెలలపాటు మన పరిశోధనలు చంద్రునిపై సాగాయి, కొన్ని లోపాలు ఉన్నా అది విజయమే, ప్రపంచంలో స్థానం ఆనాడే సాధించాము. గతకాలంలో ఎన్నో విజయాలు సాధించాము. తక్కువ ఖర్చుతో చేపట్టబోయే, 2024లో మొదలయ్యే చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని కోరుకుంటున్నాము.. మన శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఎవరికంటే తీసిపోరు, 104దేశ విదేశీ ఉపగ్రహాలను ఒక్కసారిగా ప్రయోగించిన ఘనత మనవారిదే కదా. అయినా.. కొంతమందికి బాధ అనిపించినా మన దేశానికి ముందు కావలసింది దేశ అభివ ద్ధికి ప్రత్యక్షంగా ఉపయోగపడే ప్రయోగాలు అని గుర్తించాలి. ప్రస్తుత చంద్రయాన్‌ 2 లో ఆర్బిటర్‌ లక్షణంగా పని చేస్తున్నది. లాండర్‌ మాత్రమే విఫలమైంది.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

నరేంద్రమోడీ సర్కార్‌ వుగ్రవాదులు, నల్లధనం వున్న వారి మీద కంటే మేధావులు, శాస్త్ర పరిశోధనల మీద సమర్దవంతంగా మెరుపు దాడులు చేసిందని (సర్జికల్‌ స్ట్రెక్స్‌ ) ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి మేథావుల మీద నిరంతరం యుద్ధం సాగిస్తున్నదని, ఒక విశ్వవిద్యాలయం తరువాత మరొక విశ్వవిద్యాలయాన్ని, పరిశోధనా సంస్ధలను లక్ష్యంగా చేసుకొని వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. మోడీ సర్కార్‌లో ఇద్దరు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులకు విద్య లేదా పరిశోధన చేసిన పూర్వరంగం లేదని వారు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి సూచనలను స్వీకరించటం తప్ప నిపుణులు చెప్పేది వినటం లేదని అన్నారు. మన పూర్వీకులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, కృత్రిమ గర్భధారణ పద్దతులను అభివృద్ధి చేశారని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పారు. ఇలాంటి ఆధారం లేని ఆశాస్త్రీయ ప్రచారాలను చేయటంలో మోడీని ఆయన మంత్రులు పెద్ద ఎత్తున అనుకరిస్తున్నారు.ఇలాంటి విషయాలను (చెప్పింది వినటం తప్ప ప్రశ్నించటానికి సాహసం చేయని) ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో లేదా ప్రయివేటు సంభాషణల్లో కాదు, ఏకంగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే చెప్పారని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు.

యుపిఏ హయాంలో శాస్త్ర, పరిశోధనల మీద జిడిపిలో 0.8శాతం ఖర్చు చేస్తే మోడీ హయాంలో అది 0.69కి పడిపోయింది. అమెరికా అత్యధికంగా 3-4శాతం వరకు ఖర్చు చేస్తుండగా చైనా రెండుశాతంపైగా చేస్తున్నది. వైఫల్యాలన్నీ పరిశోధన బడ్జెట్‌ను బట్టే వుంటాయని చెప్పలేము గానీ,తగినన్ని నిధుల కేటాయింపు లేకపోయినా ప్రయోగాలు విజయవంతం కావు. పరిశోధనల మీద ఖర్చును పెంచాలని దేశవ్యాపితంగా శాస్త్రవేత్తలు ప్రదర్శనలు చేసిన విషయం తెలిసినదే.విజయం అంచున ఖ్యాతిని సొంతం చేసుకొనేందుకు పరిశోధనా కేంద్రాలకు చేరి తాపత్రయం పడే రాజకీయాలకు నేటి నేతలు స్వస్తి పలకాలి. అలాంటివి శాస్త్రవేత్తలను మరింత వత్తిడికి గురిచేస్తాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఓదార్పులు, ఆ పేరుతో ప్రచారం కాదు. వర్తమానంలో వున్న ఆవిష్కరణలన్నింటినీ మన పూర్వీకులు ఎప్పుడో కనుగొని వాడిపారేశారు, ఆ విజ్ఞానమంతా వేదాల్లో , సంస్కృత గ్రంధాల్లో వుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిని వెలికి తీసి దేశానికి మేలు చేసి పక్కా దేశభక్తులని నిరూపించుకోండని చేసిన సూచనలను ఏ ఘనాపాఠీ, సంస్కృత పండితులు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు నైవేద్యం తినడనే నిజం పూజారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియనట్లే వాటిలో కావలసినంత అజ్ఞానం తప్ప విజ్ఞానం లేదని పండితులకు బాగా తెలుసు. ఇస్రో లేదా మరొక శాస్త్ర పరిశోధనల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలా కాదు, వారిలో నిజాయితీ వుంది, తాము నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలంటే వాటిని నిరుత్సాహపరిచే అశాస్త్రీయ భావాల ప్రచారాన్ని కట్టిపెట్టాలి. ఆవు మూత్రం, పేడలో ఏముందని తెలుసుకొనేందుకు కాదు, జనానికి పనికి వచ్చే పరిశోధన, అభివృద్ధికి నిధులను గణనీయంగా పెంచాలి. అవి లేకుండా ఓదార్పుల వలన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తరిగిపోతున్న అమెరికన్‌ కార్మిక సంపద !

04 Wednesday Sep 2019

Posted by raomk in Current Affairs, Economics, History, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

American Workers, Inequality in USA, US Plutocracy, USA Labor Day

Image result for inequality in wealth holdings, usa

ఎం కోటే శ్వరరావు

ప్రపంచంలో మెజారిటీ దేశాల్లో మే ఒకటవ తేదీ కార్మిక దినం. చిత్రం ఏమిటంటే మే డే పోరాటాల గడ్డ అమెరికాలో మాత్రం అధికారయుతంగా సెప్టెంబరు 2 కార్మిక దినం. అంతర్జాతీయ కార్మిక వుద్యమం ఖరారు చేసిన మే డేను అంగీకరిస్తే కార్మికవర్గం ఎక్కడ కమ్యూనిజం వైపు పయనిస్తుందో  అనే భయంతో  అమెరికా పారిశ్రామికవేత్తలు దానికి బదులుగా 1880దశకంలో సెప్టెంబరు రెండవ తేదీని కార్మిక దినంగా నిర్ణయించాలని తమకు అనుకూలురైన కార్మికులతో ఒక ప్రతిపాదన చేయించారు. ముందే తెలుసుగనుక నాటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ అంగీకరించారు. అంటే ఆచరణలో అది కార్మికవర్గానికి చెందినది కాదు యజమానుల దినం.

అమెరికా కార్మికదినాన్ని జరుపుకొనేందుకు నిజానికి అక్కడి కార్మికవర్గం సంతోషించాల్సిందేమీ లేదు. నానాటికీ వారి పరిస్ధితులు దిగజారుతున్నాయి.2003తో పోల్చితే సగం అమెరికన్‌ కుటుంబాల(12.9 కోట్ల మంది) సంపద ఇప్పుడు 32శాతం తక్కువ. ఇదే కాలంలో ఎగువన వున్న ఒక శాతం మంది(పన్నెండు లక్షల 90వేల మంది) ధనికుల సంపద రెండు రెట్లు పెరిగింది.రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రతి ఏటా  సగటు వేతనాలు 1970వరకు పెరిగాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో పేదలు మరింత పేదలుగానూ, ధనికులు మరింత ధనికులుగా మారారు. డోనాల్డ్‌ ట్రంప్‌ బడ్జెట్‌లో లక్ష కోట్ల డాలర్లమేరకు లోటును పెంచి ఒక శాతం ధనికులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చాడు. ఇది వారికి రాయితీలు అనటం కంటే పేదల మీద విధించిన పన్ను అనటం సబబు.

1894లో అమెరికా పార్లమెంట్‌ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబరులో వచ్చే మొదటి సోమవారం సెలవు ప్రకటించి అమెరికా కార్మిదినంగా పాటించాల్సి వుంది. అదే ఏడాది అమెరికా రైల్వే కార్మికుల సమ్మెను నిరంకుశంగా అణచివేయటంలో అప్పటి అధ్యక్షుడు గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ పేరు మోశాడు. ప్రస్తుతం అమెరికాలో యూనియన్‌లు నామ మాత్రంగా మారాయన్నది ఒక అభిప్రాయం. ఈ కారణంగానే వారి ఆదాయాలు ఏడాదికేడాది పడిపోతున్నాయి, మధ్యతరగతి అంతరిస్తున్నది.1950దశకంలో మూడో వంతు మంది కార్మికులు ఏదో ఒక యూనియన్‌లో వుండే వారు. 1983 నాటికి ప్రయివేటు రంగంలోని కార్మికులు 16.8శాతం మంది యూనియన్లలో వుండగా గతేడాది అది 6.4శాతానికి పడిపోయింది. ప్రభుత్వ రంగంలో 37 నుంచి 34శాతానికి తగ్గింది. యూనియన్లకు కార్మికులు ఎప్పుడైతే దూరంగా వుంటారో అప్పుడు కార్మిక సంఘాల బేరమాడేశక్తి తగ్గుతుంది.1940 దశకం నుంచి చూస్తే 66శాతం మేరకు  యూనియన్ల సభ్యత్వం పడిపోగా ఆర్ధిక అసమానతలు 30శాతం వరకు పెరిగాయని ఒక అధ్యయనం తెలిపింది.

అమెరికాలో ఏర్పడిన మహా సంక్షోభ సమయంలో అధికారానికి వచ్చిన డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ తన తొలి పదవీ కాలం 1935లో జాతీయ కార్మిక సంబంధాల చట్టాన్ని తెచ్చారు. దాని ప్రకారం ప్రయివేటు రంగంలోని కార్మికులకు యూనియన్‌ ఏర్పాటు చేసుకొనే హక్కుతో పాటు బేరమాడే, సమ్మె చేసే హక్కులు కూడా సంక్రమించాయి. రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత న్యాయమైన కార్మిక ప్రమాణాల పేరుతో మరొక చట్టాన్ని తెచ్చారు.దాన్లో భాగంగానే కనీస వేతన వ్యవస్ధను ఏర్పాటు చేశారు. బాలలతో పని చేయించటాన్ని నిషేధించటం, వారానికి నలభై గంటలకు మించి పని చేసిన వారికి ఒకటిన్నర రెట్లు ఓవర్‌ టైమ్‌ చెల్లింపులు వచ్చాయి. ఈ కారణంగానే నేటికీ అమెరికాలో వున్న మేరకు కార్మిక సంఘాలు ఎక్కువ భాగం డెమోక్రటిక్‌ పార్టీతోనే వుంటాయి.

కార్మికులు పై మెరుగులు, నాయకుల దయాదాక్షిణ్యాలను కాదు, తమకు అనుకూలమైన ఆర్ధిక వ్యవస్ధ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారని కార్మికదినం సందర్భంగా క్రిస్టియన్‌ సైన్స్‌ మానిటర్‌ పత్రిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎఎఫ్‌ఎల్‌-సిఐఓ అధ్యక్షుడు రిచర్డ్‌ ట్రమ్‌కా  చెప్పారు. ఎన్నికల ప్రచారంలో వున్న అభ్యర్ధులను తాము ఇదే అడుగుతున్నామని అన్నారు.కేవలం వాణిజ్య ఒప్పందాలు కాదు, ఆర్ధిక వ్యవస్దలో మార్పులు తెచ్చే కార్యాచరణ కావాలి. యూనియన్ల అవసరం వుందని గుర్తించిన వారి సంఖ్య 64శాతానికి పెరిగినట్లు గాలప్‌ పోల్‌ వెల్లడించింది, అయితే అమెరికా కార్మిక చట్టంలోని లోపాల కారణంగా అది సభ్యత్వంగా మారటం లేదు అన్నారు. గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ప్రభుత్వ రంగంలోని వుద్యోగులు యూనియన్లలో చేరటం తగ్గవచ్చని భయపడ్డాము కానీ వుద్యోగ సంఘంలో రెండు లక్షల మంది, టీచర్స్‌ యూనియన్‌లో 88వేల మంది తోడయ్యారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులను అడగాల్సి ప్రశ్నల గురించి కార్మిక సంఘాలకు పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తామని వెల్లడించారు. స్ధంభించిన వేతనాలు, పెన్షన్ల గురించే కాదు ఆరోగ్య సంరక్షణకు చేస్తున్న ఖర్చు, స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు, అమెరికా వుద్యోగాలను మెక్సికో, ఇతర చోట్లకు తరలించటం వంటి అనేక అంశాల గురించి పోటీ చేయనున్న అభ్యర్దులను ప్రశ్నిస్తామని అన్నారు. కొత్త ఒప్పందంలో భాగస్వాములు కానున్న అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలో కార్మికుల హక్కులు, గౌరవ మర్యాదలను కాపాడవలసి వుందని చెప్పారు. గతంలో మెక్సికోలోని అమెరికా కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వ అనుకూల, కంపెనీ అనుకూల యూనియన్లతో ఏడు లక్షల ఒప్పందాల గురించి చర్చించాయని  కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే నాలుగు సంవత్సరాల కాలంలో వాటిని రద్దు చేసి స్వతంత్ర కార్మిక సంఘాలతో ఒప్పందాలు చేసుకొనే విధంగా చేస్తామనే మెక్సికో ప్రతిన ఎంతమేరకు నెరవేరుతుందో, అక్కడి కార్మికుల వేతనాలు ఎంత మేరకు పెరుగుతాయో అనుమానమే అన్నారు. చట్టాలను అమలు జరిపే యంత్రాంగం లేకపోతే అది కార్మికుల పాలిట వినాశకరంగానూ, కార్పొరేట్లకు విపరీత లాభాలకు దారి తీస్తుందని, మెక్సికో నూతన అధ్యక్షుడు ఒబ్రాడర్‌ కార్మికుల హక్కులను కాపాడతానన్న తన హామీని ఎలా నిలబెట్టుకుంటారో వెల్లడించాలని అన్నారు.

ఇతర దేశాలతో ఎగుమతుల్లో పోటీ పడేందుకు కార్మికులు వేతనాలు తగ్గించుకొని దేశ భక్తిని చూపాలని లేకపోతే వున్న వుద్యోగాలు కూడా వుండవని బెదిరించిన అమెరికన్‌ కార్పొరేట్ల వత్తిడికి కార్మికవర్గం తలవంచి వేతన స్ధంభనకు అంగీకరించింది. అయినా ఎగుమతులు పెరగలేదు. ఆర్ధిక వ్యవస్ధలో ఎదుగూ బొదుగూ లేదు. ఈ పూర్వరంగంలోనే చైనా, ఐరోపా యూనియన్‌ తదితర దేశాలతో డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి దిగుతున్న విషయం తెలిసిందే. మరోవైపున ట్రంప్‌ కార్మికవర్గం మీద మొత్తంగా దాడి కొనసాగిస్తూనే వున్నాడు. అనేక సంక్షేమ చర్యలకు కోతపెట్టటం దానిలో భాగమే. పేరుకు  అనేక పధకాలు వున్నప్పటికీ వాటిని పొందాలంటే కార్మికులు ఎంతో నష్టపోవాల్సి వుంది. మన దేశంలో ఇఎస్‌ఐ ఆసుపత్రులలో వైద్యం కోసం కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడాలో చూస్తున్నదే. కార్మికోద్యమాన్ని బలహీనపరిచేందుకు యూనియన్లను దెబ్బతీస్తున్నారు.

కుటుంబ నియంత్రణ కార్యక్రమ ప్రచారానికి దానిని వ్యతిరేకించే వారిని నియమించినట్లుగా కార్మిక వ్యతిరేకులుగా రుజువైన వారిని కార్మిక మంత్రులుగా నియమించటం వంటి చర్యలకు ట్రంప్‌ పూనుకున్నాడు. తన సంస్దలలో కార్మిక చట్టాలను వుల్లంఘించి, కార్మికులను మోసం చేసి విధిలేక మిలియన్ల డాలర్ల మేరకు జరిమానాలు చెల్లించిన ఒకరిని కార్మిక మంత్రిగా నియమిస్తే  రిపబ్లికన్లు కూడా అంగీకరించలేదు. రెండవ మంత్రి కూడా అలాంటి వ్యక్తే, తాజాగా ప్రతిపాదించిన మూడవ మంత్రి ఇప్పటివరకు చేసిందేమిటయ్యా అంటే వాణిజ్య సంస్ధలను సమర్ధించటమే పని. ట్రంప్‌ విషయానికి వస్తే ఎన్నికల్లో చేసిన సామాజిక భద్రత, వైద్యం గురించి వాగ్దానాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాడు. సామాజిక భద్రత యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున తగ్గించి దరఖాస్తుల పరిశీలన తతంగాన్ని సంవత్సరాల తరబడి సాగదీస్తున్నారు. మంజూరైన తరువాత కూడా లబ్ది అందుకోవటంలో అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒక వాణిజ్య, పారిశ్రామికవేత్తగా ట్రంప్‌ తక్కువ తినలేదు. అధ్యక్షుడిగా ఎన్నికవటానికి ముందు సంవత్సరాలలో కార్మికులు, వుద్యోగులను వేధించిన చరిత్ర చాలా వుంది. పని చేయించుకొని కాంట్రాక్టర్లు, కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవటం, చట్టాల వుల్లంఘన వంటి వివిధ వుదంతాలకు సంబంధించి అరవై కేసులను ట్రంప్‌ సంస్దలు ఎదుర్కొన్నాయి.

అమెరికాలో ఎన్నికల వాతావరణం మొదలైంది గనుక సహజంగానే కార్మికులు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎనిమిదేండ్ల డెమోక్రటిక్‌ పార్టీ నేత బరాక్‌ ఒబామా పాలనలో వుద్యోగాలను కాపాడటంలో, కొత్త వాటి కల్పనలో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్నో వాగ్దానాలతో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌ జనంలో వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్నాడు. గత మూడు సంవత్సరాలలో అన్ని రంగాల్లో విఫలమై వుద్యోగాల రక్షణ, మరొక పేరుతో అనేక వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నాడు. చైనా, భారత్‌ వంటి దేశాలతో బలవంతంగా అధికరేట్లకు తమ సరకులు కొనాలని వత్తిడి, ప్రతి చర్యలకు దిగుతున్నాడు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎలిజబెత్‌ వారెన్‌, బెర్నీ శాండర్స్‌తో పాటు మరికొందరు అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతూ తాము అధికారానికి వస్తే ఏం చేయనున్నారో వెల్లడిస్తున్నారు. వాటిలో కొన్ని ఇలా వున్నాయి.

Image result for inequality in wealth holdings, usa

గంటకు పదిహేను డాలర్ల కనీస వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదనకు డెమోక్రటిక్‌ పార్టీనేతలు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు కొన్ని ఐరోపా దేశాల్లో మాదిరి కార్పొరేట్‌ డైరెక్టర్ల బోర్డుల్లో కార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలన్న ప్రతిపాదనలను కూడా చేస్తున్నవారు లేకపోలేదు. జవాబుదారీ పెట్టుబడిదారీ బిల్లు ప్రతిపాదన వాటిలో ఒకటి. దాని ప్రకారం డైరెక్టర్లుగా 40శాతం మంది కార్మికుల నుంచి ఎన్నుకోవాల్సి వుంటుంది. జర్మనీలో కొన్ని పరిశ్రమల్లో సగం మంది వరకు డైరెక్టర్లు కార్మికుల నుంచి వున్నారు. పని స్ధలాల్లో ప్రజాస్వామ్యం పేరుతో గత ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడిన,  మరోసారి అదే ప్రయత్నం చేస్తున్న బెర్నీ శాండర్స్‌ కూడా కొన్ని ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు.  బ్రిటన్‌లోని బడా పరిశ్రమల్లో వచ్చిన లాభాల్లో పదిశాతం వాటాల వరకు వచ్చిన మొత్తాన్ని కార్మిక నిధులకు జమ చేస్తారు. ప్రతి ఏటా కార్మికులు 600 పౌండ్లు డివిడెండ్‌ పొందుతారు. ఇలాంటి అంశాలను చర్చకు తెస్తున్నారు.

కార్మికోద్యమాన్ని నిర్మించకుండా అమెరికాలో మధ్యతరగతి పెరిగే అవకాశాలు లేవని బెర్నీ శాండర్స్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అధికారాలన్నీ యజమానులు, బడా కార్పొరేట్ల చేతుల్లో వున్నాయి, యూనియన్లు లేకుండా వేతనాలు, ఇతర లబ్ది పొందటం అసాధ్యం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మౌలికంగా వీటి స్వభావం సంస్కరణలు తప్ప మౌలిక మార్పులను కోరేవి కాదు. అమెరికాలో ఇప్పుడున్న వాతావరణంలో ఆ పెట్టుబడిదారీ సంస్కరణల మీద కూడా దాడి జరుగుతున్నది, కనీసం వాటిని రక్షించుకొనే స్ధితిలో కూడా కార్మికవర్గం లేదని గమనించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మంచి కోసం మాంద్యాన్ని భరించక తప్పదు : డోనాల్డ్‌ ట్రంప్‌

21 Wednesday Aug 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, China–United States trade war, Donald trump, TRADE WAR, United States

China's President Xi Jinping (R) shakes hands with US President Donald Trump before a bilateral meeting on the sidelines of the G20 Summit in Osaka on June 29, 2019. (BRENDAN SMIALOWSKI/AFP/Getty Images)

ఎం కోటేశ్వరరావు

చైనాతో మెరుగైన వాణిజ్య ఒప్పందం కోసం రెండు నెలల మాంద్యం మూల్యం చెల్లించటానికి తాను అంగీకరిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం నాడు చెప్పారు. చైనా పట్ల దూకుడుగా అనుసరిస్తున్న వైఖరి స్వల్పకాలంలో బాధ పెట్టినా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని, రెండు నెలల పాటు మాంద్యాన్ని అమెరికా ఎదుర్కోగలదని అన్నారు. మాంద్యమనే భావన అసంగతం, చైనా మీద చర్య తప్పని సరి, స్వల్పకాలంపాటు మాంద్య మంచిదా కాదా అన్నది సమయాన్ని బట్టి వుంటుంది, మీరు మాంద్యం గురించి చెబుతున్నారు, మనం రెండు నెలల పాటు మాంద్యానికి గురవుతాం, ఎవరో ఒకరు చైనా మీద చర్య తీసుకోవాలి కదా అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. మాంద్యానికి అమెరికా చాలా దూరంగా వుంది, ఫెడరల్‌ రిజర్వు ప్రామాణిక వడ్డీ రేట్లను తగ్గించాలని కూడా అన్నారు. తరువాత అధ్యక్ష ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ అమెరికా మాంద్యం వైపు వెళుతోందనటాన్ని అధ్యక్షుడు విశ్వసించటం లేదని, ఆయన విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎంటో పటిష్టంగా వుందని అన్నారు.

అమెరికా – చైనా వాణిజ్య పోరు కారణంగా తలెత్తిన అనిశ్చితి కారణంగా 2021నాటికి 97లక్షల కోట్ల ప్రపంచ జిడిపి 585 బిలియన్‌ డాలర్ల మేరకు 0.6శాతం నష్టపోనుందని, ప్రపంచ జిడిపి బ్లూమ్‌బెర్గ్‌ ఆర్ధిక నివేదిక పేర్కొన్నది. ఈ పూర్వరంగంలోనే ప్రపంచ వత్తిడి లేదా పర్యవసానాలకు తమనే బాధ్యులుగా చేస్తారనే భయం, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే అనే ఆలోచన తో గానీ చైనాతో వాణిజ్య పోరును ట్రంప్‌ కొంత కాలం పాటు వాయిదా వేశారు. బ్రిటన్‌, జర్మనీ, రష్యా,సింగపూర్‌, బ్రెజిల్‌తో సహా తొమ్మిది దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మాంద్యపు అంచున లేదా మాంద్యంలోకి జారినట్లు భావిస్తున్నారు. తదుపురి వంతు 2021లో అమెరికాదే అని ఆర్ధిక వేత్తలు హెచ్చరించారు.

ఈ నేపధ్యంలో సెప్టెంబరు ఒకటి నుంచి చైనా వస్తువులపై పెంచదలచిన దిగుమతి పన్ను క్రిస్మస్‌ పండుగను నాశనం చేస్తుందనే హెచ్చరికలను సాకుగా చూపి డిసెంబరు 15 నాటికి డోనాల్డ్‌ ట్రంప్‌ వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి. పండుగ అంటే బొమ్మలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను కోట్లాది మంది అమెరికన్లు బహుమతులుగా ఇస్తారు. దిగుమతి పన్ను భారాన్ని వినియోగదారుల మీద మోపటం తప్ప మరొక మార్గం లేదని వాల్‌మార్ట్‌ తదితర దుకాణాల సంస్ధలు స్పష్టం చేశాయి. మరోవైపున చైనా నాయకత్వం కూడా తాము కూడా తగిన ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పటంతో తాను ప్రతిపాదించిన పన్నుల పెంపుదల క్రిస్మన్‌ కొనుగోళ్లకు సంబంధం లేనప్పటికీ వాటి మీద ప్రభావం పడుతుందంటున్నారు కనుక వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. అదే నోటితో హాంకాంగ్‌లో జరుగుతున్న ఆందోళనకు వాణిజ్య యుద్ధానికి లంకె పెట్టేందుకు కూడా ప్రయత్నించిన ట్రంప్‌ రెచ్చగొట్టుడును మానుకోలేదు. హాంకాంగ్‌ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని, ఇతరుల సలహాలు తమకు అవసరం లేదని చైనా ప్రకటించింది.

వాణిజ్య యుద్ధాలు మంచివి, వాటిలో విజయం సాధించటం తేలిక అని 2018 మార్చినెలలో ట్రంప్‌ చెప్పాడు. అయితే చైనాను వూబిలో దించబోయి ట్రంపే తన వూబిలో తానే పడ్డట్లు అనేక మంది విశ్లేషకులు పేర్కొన్నారు. చైనాతో వాణిజ్య యుద్దంలో ఎలా ఓటమి చెందనున్నారో వివరించారు. మీడియాలో వచ్చిన విశ్లేషణలు, వ్యాఖ్యల మేరకు దిగువ అంశాలు ట్రంప్‌ను ప్రభావితం చేశాయి. భద్రతా కారణాలతో చైనా టెలికాం కంపెనీ హువెయ్‌, దాని అనుబంధంగా వున్న 46కంపెనీలతో లావాదేవీలు జరపరాదన్న తమ అధినేత నిర్ణయాన్ని మరో 90 రోజుల పాటు నవంబరు 19 వరకు వాయిదా వేస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ ప్రకటించాడు. అమెరికా కంపెనీలతో పాటు ఇతర దేశాలు కూడా హువెయ్‌ కంపెనీ పరికరాలను కొనుగోలు చేయరాదని అమెరికా ఆదేశించిన విషయం తెలిసిందే. అమెరికా విధించిన ఆంక్షలు హువెయ్‌ కంపెనీ పనితీరు మీద ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో దాని ఆదాయం 23.2శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదవ తరం(5జి) నెట్‌వర్క్‌ పరికరాల విషయమై ఇది 50వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. వాటిలో 28 ఐరోపాలోనే వున్నాయి. ఫిన్లండ్‌కు చెందిన నోకియా 43, స్వీడన్‌ కంపెనీ ఎరిక్సన్‌ 22 కాంట్రాక్టులు కుదుర్చుకుంది. మరోవైపు హువెయ్‌ పోటీదారు జడ్‌టియి 25వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రకటించింది.

మూడు వందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై ఆగస్టు ఒకటి నుంచి పన్ను విధిస్తామన్న ట్రంప్‌ తరువాత ఆ మొత్తాన్ని 160 బిలియన్లకు తగ్గించి సెప్టెంబరు ఒకటి నుంచి పన్ను వేస్తామని ప్రకటించాడు. క్రిస్మస్‌ పేరుతో ఇప్పుడు దాన్ని కూడా డిసెంబరు 15కు వాయిదా వేశాడు. అయితే కిందపడ్డా పైచేయి తనదే అని చెప్పుకొనేందుకు అమెరికా వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించిందని ట్రంప్‌ ఒక ట్వీట్‌ చేశాడు.అయితే అమెరికా రైతాంగం ఇబ్బందులు పడుతున్నదని రాయిటర్స్‌ ఒక వార్తను ఇచ్చింది. ఇటీవలి సంవత్సరాలలో రైతాంగానికి ఇస్తున్న రుణాలు 17.5శాతం తగ్గాయని, బకాయిల చెల్లింపునకు వత్తిడి, కొత్తగా రుణాలు నిలిపివేయటంతో అనేక మంది దివాలా చట్టాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపింది. చైనా, మెక్సికో దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే సోయా, ధాన్యం వంటి వుత్పత్తుల మీద పన్నుల విధించిన కారణంగా అక్కడి రైతాంగం ఇబ్బందులు పడుతున్నది. వారిని ఆదుకొనేందుకు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఫలించలేదు. చైనా వుత్పత్తులపై పన్ను విధింపు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించగానే అమెరికా స్టాక్‌మార్కెట్‌ సంతోషపడింది. అయితే తాము కూడా ప్రతి చర్యలకు వెనుకాడబోమని చైనా వెల్లడించగానే డీలాపడటం అమెరికా బలహీనతకు సూచికగా విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యూహం విఫలమౌతున్నదని బాహాటంగానే మీడియాలో వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలో అనేక దేశాలతో రోజు రోజుకూ చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా ప్రతి వారి మీద బస్తీమే సవాల్‌ నాకు లొంగుతారా లేదా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరిస్తారా లేదా అనే బెదిరింపులకు దిగుతున్నది. ఇది దాని ఆర్ధిక వ్యవస్ధతో పాటు రాజకీయ పలుకుబడిని కూడా దెబ్బతీస్తున్నదంటే అతిశయోక్తి కాదు. తమ చర్యల కారణంగానే చైనా అభివృద్ధి కూడా పడిపోయిందని ట్రంప్‌ చంకలు కొట్టుకోవచ్చు. నిజానికి అదొక చిన్న కారణమే తప్ప మరొకటి కాదు. అంతర్గతంగా తీసుకున్న చర్యలు అభివృద్ధి రేటు తగ్గటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. తన వస్తువులను అమ్ముకొనేందుకు చైనా అవసరమైతే తన యువాన్‌ విలువను తగ్గించుకొనేందుకు సిద్ధంగా వుందన్న సూచనలు గతవారంలో వెలువడిన విషయం తెలిసిందే. అమెరికా తన డాలరు విలువను తగ్గించనట్లయితే ప్రపంచ మార్కెట్లో దాని వస్తువులను కొనుగోలు చేసే వారు వుండరు. తన కరెన్సీ విలువను తగ్గించుకుంటే ఇతర పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని అమెరికా భయపడుతోంది. డాలరు విలువ తగ్గకుండా ప్రపంచ దేశాలను అదిరించి బెదిరించి తన వస్తువులను అంటగట్టాలని చూస్తోంది.

Image result for trade war us china

అమెరికాను ఒంటరిపాటు చేసేందుకు , మిత్రులను సంపాదించుకొనేందుకు చైనా తనదైన శైలిలో ముందుకు పోతోంది.2018 జనవరిలో చైనా తాను చేసుకొనే దిగుమతులపై సగటున ఎనిమిదిశాతం పన్ను విధించింది. అమెరికా ఎప్పుడైతే వాణిజ్య యుద్దానికి దిగిందో అమెరికా వస్తువులపై పన్ను మొత్తాన్ని 20.7శాతానికి పెంచి, మిగతా దేశాలపై సగటు పన్నును 6.7శాతానికి తగ్గించింది. అమెరికా నుంచి దిగుమతులను తగ్గించి ఇతర దేశాల నుంచి పెంచుకున్నదని, ఇతర దేశాలకు తన ఎగుమతులను పెంచిందని పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌ పేర్కొన్నది. అమెరికా ఒక వైపు తన సోయా బీన్స్‌ నుంచి బోయింగ్‌ విమానాల వరకు ఏవేవి కొనాలో జాబితా ఇస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ రంగం మీద ఎక్కువగా ఆధారపడుతున్న చైనా ఆర్ధిక విధానాన్ని మార్చాలని కూడా డిమాండ్‌ చేస్తోంది. భద్రత సాకుతో చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింప చేయకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగావు సరే మిత్ర దేశాలైన మెక్సికో, ఐరోపా దేశాల మీద కూడా తొడగొట్టటం ఏమిటయ్యా బాబూ అని ట్రంప్‌ను చూసి కొందరు అమెరికా వాణిజ్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. మన బోయింగ్‌లు ఎక్కువగా కొనాలని చైనా మీద వత్తిడి తెస్తే తమ ఎయిర్‌బస్‌ల సంగతేమిటని ఐరోపా దేశాలు అమెరికాను ప్రశ్నించవా, చైనాతో సఖ్యతకు ప్రయత్నించవా అని చెబుతున్నా ట్రంప్‌ వినటం లేదు.

హాంకాంగ్‌లో నిరసన తెలుపుతున్న వారి మీద తియన్మెన్‌ తరహా అణచివేతను తాము వ్యతిరేకిస్తామని, హాంకాంగ్‌లో అణచివేత చర్యలు వాణిజ్య యుద్దం మీద ప్రభావం చూపుతాయని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి వివాదాన్ని మరో కొత్త మలుపు తిప్పాడు. ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు.ఇతర సమస్యల్లో కూడా జోక్యం చేసుకొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. హాంకాంగ్‌ నిరసనలు చైనా అంతర్గత వ్యవహారం, దానికి వాణిజ్య యుద్ధానికి సంబంధం లేదు, తమకు ఇతరుల సలహాలు అవసరం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. హాంకాంగ్‌ పరిణామాలకు, వాణిజ్య యుద్ధానికి ముడిపెడితే రెండు దేశాల మధ్య తదుపరి చర్చలకు అవకాశాలుండవని అనేక మంది హెచ్చరిస్తున్నారు. జూలై 30న షాంఘైలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసిన విషయం తెలిసిందే.

ఇలాంటి హెచ్చరికలు అమెరికాలో చాలా కాలం నుంచి వినపడుతున్నా ట్రంప్‌ బింకాలు పోతున్నాడు. తనతో ఒప్పందానికి చైనా సిద్దంగా వుందని తాను సిద్దంగా లేనని, ముందు హాంకాంగ్‌ సమస్యను అదెలా పరిష్కరిస్తుందో చూస్తానంటూ ట్రంప్‌ వాచాలత్వాన్ని ప్రకటించాడు. మాంద్య భయాలేమీ లేవని, వాణిజ్య పోరుతో తమకేమీ నష్టం లేదని వైట్‌ హౌస్‌ యంత్రాంగం భావిస్తున్నదని రాయిటర్స్‌ పేర్కొన్నది. మాంద్య భయంతో గత బుధవారం నాడు అమెరికా స్టాక్‌ మార్కెట్‌ మూడుశాతం పతనమైంది. 2009 మాంద్య తరువాత అమెరికా ఫెడరల్‌ రిజర్వు, ఇతర 19దేశాల రిజర్వుబ్యాంకులు పెద్ద మొత్తంలో తమ వడ్డీరేట్లను తగ్గించాయి. ఈ అధ్యక్షుడు ప్రపంచ ఆర్ధిక వ్యవస్దనే మాంద్యంలోకి నెడుతున్నాడని డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధులలో ఒకరైన బెటో ఒ రూర్కీ ఒక టీవీ ఛానల్‌లో పేర్కొన్నాడు.

Image result for DONALD Trump willing to trigger a two-month recession

విదేశాంగ విధానం అంటే న్యూయార్క్‌ రియలెస్టేట్‌లో పోటీదార్లను బెదిరించి తాను చేసుకున్న లాభదాయకమైన ఒప్పందాలు అనుకుంటున్నట్లుగా వుంది, రెండు దేశాల మధ్య సంబంధాలు అలా వుండవని తెలుసుకోవాలని ట్రంప్‌కు ఒక విశ్లేషకుడు సలహా ఇచ్చాడు. అదిరించి బెదిరించి చైనా నేత గ్జీ జింపింగ్‌ను దారికి తెచ్చుకుందామని చూస్తే కుదరదు.చైనా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయి. అమెరికా దాని దగ్గర తీసుకున్న 1.2లక్షల కోట్ల డాలర్ల రుణ పత్రాలు(బాండ్లు)న్నాయి. వాటిని గనుక అమ్మేస్తే అమెరికా పరిస్ధితి ఏమిటి? దాని దగ్గర ఎక్కడా దొరకని విలువైన ఖనిజం(మట్టి) వుంది, అన్నింటికీ మించి తన కరెన్సీ విలువను తగ్గించి నిలబడగల సత్తా వుందని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. అమెరికాలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు 2018లో 83శాతం తగ్గాయి. ఇప్పటికే వాణిజ్య యుద్దం అమెరికా వార్షిక వృద్ధి రేటును నాలుగు నుంచి రెండుశాతానికి దించింది. ప్రపంచం మరోసారి మాంద్యానికి దగ్గర అవుతోంది. ప్రపంచం దృష్టిలో స్వేచ్చా ప్రపంచపు రాజధాని వాషింగ్టన్‌ ఇప్పుడు బీజింగ్‌వైపు తిరిగింది. ఒక పోలీసు రాజ్యం బాధిత దేశంగా మారింది. స్వేచ్చా వాణిజ్యం గురించి వుదారవాద ప్రజాస్వామ్యాలకు కమ్యూనిస్టు నాయకత్వం ఇప్పుడు పాఠాలు చెబుతోంది అంటూ ఒక విశ్లేషకుడు వాపోవటం అమెరికా ఏ పరిస్ధితికి లోనైందో వెల్లడిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తన వలలో తానే చిక్కుకున్న ట్రంప్‌ ?

07 Wednesday Aug 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Currency war, Donald trump trade war, Rupee, TRADE WAR, Trump Sets Trap for China, US-CHINA TRADE WAR, yuan

Image result for worried Donald trump

ఎం కోటేశ్వరరావు

చైనాకు వలపన్నినట్లు సంబరపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తానే దానిలో చిక్కుకున్నాడా ? అదే జరిగిందని బ్లూమ్‌బెర్గ్‌ మీడియా సంపాదకవర్గం వ్యాఖ్యానించింది. ‘చైనాతో వాణిజ్య యుద్దంలో ఎల్లవేళలా పైచేయిగా వున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఆర్ధిక బాధను తట్టుకొనే చైనా సామర్ద్యాన్ని తక్కువగా అంచనా వేశారు. ఎదుటి వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే గతవారంలో పన్నుల పెంపు బెదిరింపులకు పాల్పడ్డారు. అనేక విధాలుగా వాటిని తిప్పికొడుతున్న చైనా కరెన్సీ యుద్ధానికి కూడా తాను సిద్దం అన్న హెచ్చరిక చేసింది.అది స్టాక్‌ మార్కెట్‌కు మాత్రమే కాదు మాంద్య ముప్పును కూడా ముందుకు తెచ్చింది. ప్రత్యర్ధిని ఒక మూలకు నెట్టేందుకు ప్రయత్నించిన ట్రంప్‌ ఆర్ధిక వ్యవస్ధను రక్షించుకొనే చర్యలేమీ లేకుండానే తన వలలో తానే చిక్కుకున్నాడు.’ అని పేర్కొన్నది.

తాను విధించిన పన్నుల దెబ్బకు చైనా అతలాకుతలం అయిందని ట్రంప్‌ చెప్పింది అబద్దం అని తన కరెన్సీ పతనాన్ని అనుమతించిన చైనా చర్య స్పష్టం చేసిందని కార్ల్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. రెండు పక్షాలూ ఫలవంతమైన చర్చలు జరపకుండా చైనాను కరెన్సీ బెదిరింపుల వైపు నెడితే అది చివరకు ప్రపంచ కరెన్సీ అంతానికి దారి తీస్తుందని జార్జి మాగ్నస్‌ వ్యాఖ్యానించాడు. ఫెడరల్‌ రిజర్వు(అమెరికాకు మన రిజర్వుబ్యాంకు వంటిది) విధి ఆర్ధిక వ్యవస్ధను స్ధిరంగా వుంచటం, కనుక ట్రంప్‌ ఎప్పుడు ఆర్ధిక వ్యవస్ధను అస్ధిరపరిస్తే అప్పుడు అది రంగంలోకి దిగి వడ్డీ రేట్లను తగ్గించాలి. ఈ విధంగా ఫెడరల్‌ రిజర్వును కూడా వూబిలోకి దించుతున్నట్లే అని, ఇది రాజకీయంగా కూడా రాజీపడుతున్నట్లు కనిపిస్తున్నదని కార్ల్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఆర్ధిక మందగమనం లేదా మాంద్యానికి ఫెడరల్‌ రిజర్వు కారణమని విమర్శించాడు, ఇప్పుడు తనను తాను అంతకంటే పెద్ద బలిపశువుగా చేసుకుంటున్నారని, 2020వరకు మెరుగుపడే ధోరణి కనిపించటం లేదని బ్రెయిన్‌ చపట్టా పేర్కొన్నారు. ద్రవ్యవిధానం గురించి మౌలికమైన తప్పుడు అభిప్రాయాలతో ట్రంప్‌ పని చేస్తున్నట్లు కనిపిస్తోందని పొన్నూరు రమేష్‌ వ్యాఖ్యానించారు. ద్రవ్య పరిస్ధితిని సరళతరం మరియు డాలర్‌ను బలహీన పరచి వడ్డీ రేట్లను తగ్గించటం ద్వారా ఆర్ధిక వ్యవస్ధకు బలం చేకూర్చాలనుకోవటం వాటిలో ఒకటి అన్నారు. మిగతా ప్రపంచం కూడా అదే చేస్తే ఆ లబ్ది త్వరలోనే అంతర్దానం అవుతుంది. ప్రస్తుతం 14.5లక్షల కోట్ల ప్రపంచ రుణ మార్కెట్‌లో వస్తున్న వడ్డీ సున్నా కంటే తక్కువ వుండటంతో వడ్డీరేట్లు కృష్ణ బిలాల్లోకి పోతున్నాయని మార్క్‌ గిల్‌బర్ట్‌ వ్యాఖ్యానించారు. ప్రతికూల వడ్డీ రేట్లతో జర్మన్‌ పొదుపుదార్లను ఐరోపా కేంద్రబ్యాంకు శిక్షించకూడదని టైలర్‌ కోవెన్‌ పేర్కొన్నారు.

2008తరువాత తొలిసారిగా సోమవారం నాడు చైనా కరెన్సీ యువాన్‌ విలువ ఒక డాలర్‌కు ఏడుకు పడిపోయింది. అమెరికా సాగిస్తున్న వాణిజ్య యుద్దాన్ని ఎదుర్కొనేందుకు చైనా కరెన్సీదాడికి దిగిందని అమెరికన్లు ఆరోపిస్తున్నారు. సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి 300 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువుల మీద పదిశాతం దిగుమతి విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. తాముగా యువాన్‌ విలువను పతనం చేయలేదని, అమెరికా తీసుకుంటున్న చర్యల పర్యవసానమని చెబుతోంది. దిగుమతి పన్నుల పెంపుతో తమ వస్తువుల ధర పెరగకుండా చూసుకొనేందుకు యువాన్‌ విలువ పతనాన్ని అడ్డుకోకుండా చైనా కేంద్రబ్యాంకు వ్యవహరించిందని వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలతో వాణిజ్య యుద్దం మరింత తీవ్రం అవుతుందనే భయాలు వెల్లడయ్యాయి. ఇదే జరిగితే మన వంటి దేశాల మార్కెట్ల నుంచి పెట్టుబడిదారులు తమ సొమ్మును వెనక్కు తీసుకుంటారు.

యువాన్‌తో మన రూపాయి విలువ కూడా పతనమైంది. యువాన్‌ పతనమైతే వర్ధమాన దేశాలు తమ ఎగుమతులు గిట్టుబాటుగా వుండేందుకు తమ కరెన్సీ విలువలను కూడా తగ్గించుకుంటాయి. అయితే ప్రస్తుతం మన రూపాయి విలువ పతనం కావటానికి పూర్తిగా యువాన్‌ సంక్షోభం కాదని ఇతర అంశాలు తోడైనట్లు కొందరు, వుండాల్సినదాని కంటే విలువ ఎక్కువ వుందని మరి కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి పతనం చెడుకానప్పటికీ ఇతర పర్యవసానాలు వుంటాయి. వడ్డీ రేట్లను పెద్దగా తగ్గించేందుకు అవకాశాలు తగ్గుతాయి. వడ్డీ రేటు ఎక్కువగా, బలమైన రూపాయి వుంటేనే విదేశీ పెట్టుబడిదారులు మన దేశానికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు.యువాన్‌ పతనమైతే చైనా నుంచి సరకులను దిగుమతి చేసుకొనే వారికి లబ్ది కలుగుతుంది. ట్రంప్‌ కనుక దిగుమతులపై ఇంకా సుంకాలను పెంచితే యువాన్‌ విలువ ఇంకా పతనం అవుతుందని భావిస్తున్నారు.ఇదే జరిగితే రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు ఇంకా పెరిగి అమెరికా నష్టపోనుంది.

The days of this polite deference are over.

చైనాను రెచ్చగొట్టేందుకు అమెరికా అస్త్రాలు హాంకాంగ్‌, తైవాన్‌ !

మరో వైపు రెచ్చగొట్టేందుకు అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. దానికి ధీటుగా చైనా తాను చేయాల్సింది చేసుకుపోతోంది. ఒక వైపు హాంకాంగ్‌లో అల్లర్లను రెచ్చగొట్టి ఏదో ఒక పెద్ద వుదంతం జరిగేలా చూసేందుకు అమెరికా చేయాల్సిందంతా చేస్తోంది. మరోవైపున తైవాన్‌కు తాజాగా 220 కోట్ల డాలర్ల మేర ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించి చైనాను రెచ్చగొడుతోంది. చైనా నుంచి 300బిలియన్‌ డాలర్ల దిగుమతులపై పదిశాతం సుంకాన్ని పెంచనున్నట్లు ట్రంప్‌ ప్రకటించాడు. దానికి ప్రతిగా చైనా యువాన్‌ విలువను తగ్గించటం లేదా పతనాన్ని నిరోధించకుండా చైనా వుపేక్షించిందని వార్తలు వచ్చాయి.

హాంకాంగ్‌ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా నేరాలు చేసిన వారిని విచారించేందుకు ప్రధాన భూ భాగానికి అప్పగించేందుకు వుద్దేశించిన బిల్లును ఆమోదించరాదనే డిమాండ్‌తో అక్కడ తొమ్మిది వారాల క్రితం ఆందోళన ప్రారంభమైంది. ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నామని, అది రద్దయినట్లే అని పాలక మండలి ప్రకటించిన తరువాత కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. అలాంటి బిల్లును ఎన్నడూ పెట్టకూడదు అంటూ ఆందోళనకారులు పాలనా మండలి భవనం మీద దాడి చేశారు. రోజుకో పేరుతో ఆందోళనకు వీధుల్లోకి వస్తూ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది మీద దాడులు చేసి రెచ్చగొట్టటం, తద్వారా శాంతి భద్రతల పరిస్ధితిని సృష్టించేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. అంతే కాదు, తమకు మరింత ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం కావాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. దానికి బ్రిటన్‌, అమెరికా తదితర దేశాలు వంతపాడుతున్నాయి.

తాజాగా ఐదు రోజుల నిరవధిక ఆందోళన పిలుపులో భాగంగా సోమవారం నుంచి మెట్రో స్టేషన్లలో ప్రవేశించి ప్రయాణీకులను దించి వేయటం, తలుపులను మూసుకోకుండా చేసి రైళ్లను కదలనివ్వకుండా అడ్డుకుంటున్నారు. దానిలో భాగంగానే విమానాశ్రయాల్లో ప్రవేశించి తిష్టవేయటం, విధి నిర్వహణలో వున్న సిబ్బందిని అడ్డుకోవటం, ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేయటం వంటి చర్యలనూ ప్రారంభించారు. ఇంతగా రెచ్చగొట్టినప్పటికీ పాలనా యంత్రాంగం, స్ధానిక పోలీసులు ఎంతో సంయమనం పాటిస్తున్నారు. ఇదే మరొక చోట అయివుంటే ఏమి జరిగి వుండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా మిలిటరీ దళాలను రంగంలోకి దించేందుకు పాలక మండలికి అవకాశం వున్నప్పటికీ వాటిని వుపయోగించలేదు. ఆందోళనకారుల వెనుక అమెరికా ఇతర దేశాల హస్తం వుందని గ్రహిస్తున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. మరోవైపు శాంతి భద్రతల సమస్యను సృష్టించే విధంగా ఆందోళనకారుల చర్యలు వున్నాయి. ఈ పూర్వరంగంలో చైనా ప్రభుత్వం ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పూనుకున్నట్లు ముఖ్యంగా పశ్చిమ దేశాల మీడియాలో వీటి గురించి చిలవలు పలవలుగా కధనాలు వండి వార్చుతున్నది. మిలిటరీని దించబోతున్నారన్నది వాటిలో ఒకటి.

జూన్‌ తొమ్మిది నుంచి ఇప్పటి వరకు చట్టవిరుద్దంగా సమావేశాలు జరపటం, పోలీసుల మీద దాడి, కొట్లాటలకు దిగటం వంటి చర్యల్లో పాల్గొన్నందుకుగాను 420 మందిని అదుపులోకి తీసుకోగా వారిలో ఒక్క సోమవారం నాడు అరెస్టు చేసిన వారే 82 మంది వున్నారు. కొందరు సిబ్బంది సమ్మెకారణంగా 170 విమానాలు నిలిచిపోయాయి. వారాల తరబడి జరుగుతున్న ఆందోళనల కారణంగా ఆర్ధికంగా కొన్ని రంగాలు దెబ్బతిన్నాయి. టూరిజం, దాని సంబంధిత కార్యకలాపాలు, దుకాణాల్లో అమ్మకాలు, స్టాక్‌ మార్కెట్లో సూచీలు పడిపోయాయి. హాంకాంగ్‌ పాలనా మండలి అధ్యక్షురాలు లామ్‌ రాజీనామా చేయాలన్నది ఆందోళనా కారుల డిమాండ్లలో ఒకటి. అయితే తాను పదవి నుంచి తప్పుకోబోవటం లేదని,నగరంలో పరిస్ధితి ప్రమాదకరంగా మారుతోందని చెప్పారు. నిరసన తెలిపే హక్కును గౌరవిస్తామని అదే సమయంలో నిరసనకు దూరంగా వున్న వారి హక్కులను నిరసనకారులు కూడా గౌరవించాలని అన్నారు. ఆందోళన ప్రారంభంలో చేసిన డిమాండ్లకు బదులు ఇప్పుడు కొత్తవాటిని ముందుకు తెస్తున్నారని, ప్రాణాలకు సైతం తెగించి అమీ తుమీ తేల్చుకుంటామని చెబుతున్నారని ఆమె చెప్పారు.మరోవైపున ఆందోళన నిర్వహిస్తున్న వివిధ బృందాలలో అంతర్గత విబేధాలు కూడా వెల్లడయ్యాయి.శాంతియుత నిరసన స్ధానంలో హింసాపూరితమైన వేర్పాటు వాదశక్తులు ప్రవేశించారని సామాజిక మాధ్యమంలో కొందరు విమర్శించారు. 2016 జూలై ఒకటిన ఇచ్చిన నిరసన పిలుపు విఫలం కావటంతో తీవ్రవాద బృందాల మధ్య మీరంటే మీరు కారకులనే ఆరోపణలు చివరకు దెబ్బలాటలకు దారితీశాయని పరిశీలకులు గుర్తుచేశారు.

ఆందోళనకారులపై మిలిటరీ చర్య తీసుకుంటే చైనా ఆర్ధిక వ్యవస్ధకే నష్టమని అమెరికా టీవీ సిఎన్‌ఎస్‌ బెదిరించింది. హాంకాంగ్‌ వీధుల్లో చైనా మిలిటరీ కవాతు గురించి కొద్ది వారాల క్రితం వూహించ లేదని ఇప్పుడు ఆ అవకాశం కనిపిస్తోందని వ్యాఖ్యాత పేర్కొన్నారు. నిరసనకారుల హింసాకాండను సహించరాదని హాంకాంగ్‌లోని కమాండర్‌ గత వారంలో చేసిన వ్యాఖ్యను వుటంకిస్తూ మిలిటరీ రంగంలోకి దిగే అవకాశం వుందని అమెరికా మీడియా చెబుతోంది.1989లో తియన్మెన్‌ మాదిరి జరగవచ్చని వూహాగానాలను కుమ్మరిస్తోంది. హాంకాంగ్‌లో పరిస్ధితి చేయిదాటిపోయినపుడు అక్కడ వున్న ఆరువేల మంది సైన్య సహాయం కోరేందుకు అక్కడి పాలనా వ్యవస్ధకు చట్టబద్దమైన అవకాశం వుంది.

ఒకే దేశం రెండు వ్యవస్ధలు అనే విధానాన్ని అమలు జరిపి 2050వరకు చైనాలో విలీనమైన హాంకాంగ్‌, మకావో దీవుల్లో విలీనానికి ముందున్న వ్యవస్ధలనే కొనసాగిస్తామని చైనా వాటి అప్పగింతల సమయంలో బ్రిటన్‌, పోర్చుగీసులతో ఒక ఒప్పందం చేసుకుంది. అందువలన అనేక బహుళజాతి కంపెనీలకు ఇప్పటికీ హాంకాంగ్‌ ఒక కేంద్రంగా కొనసాగుతోంది. దీని వలన చైనాకు ఎంతో లబ్ది కలుగుతోంది. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం పేరుతో ఆందోళన నిర్వహిస్తున్నవారి వెనుక ఆమెరికా హస్తం వుందని ఇప్పటికే చైనా విమర్శించింది. ఆందోళనలతో హాంకాంగ్‌ ఆర్ధిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేయటం ద్వారా చైనాకు నష్టం కలిగించాలన్న దుష్టాలోచన కూడా అమెరికాకు వుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తన మార్కెట్‌ను అంతర్జాతీయ కంపెనీలకు పూర్తిగా తెరవకుండానే హాంకాంగ్‌ ద్వారా చైనా లబ్ది పొందుతోంది.2016లో చైనాకు వచ్చిన ఎఫ్‌డిఐలో 61శాతం హాంకాంగ్‌నుంచే వుందని సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. చైనా సైన్యం కనుక ఆందోళనకారులను అణచివేస్తే ప్రపంచ స్టాక్‌మార్కెట్లో హాంకాంగ్‌కు వున్న ఐదవ స్దానం తీవ్రంగా పడిపోతుందని, కంపెనీలు సింగపూర్‌కు తరలిపోతాయని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. హాంకాంగ్‌కు వున్న సానుకూల వాణిజ్య హోదాను రద్దు చేయాల్సి వుంటుందని కొంత మంది అమెరికా ఎంపీలు బెదిరించారు. ఒక వేళ సైన్యాన్ని దించి మరో తియన్మెన్‌ వుదంతం పునరావృతమైతే దాన్ని ప్రపంచానికంతటికీ ప్రత్యక్ష ప్రసారం చేస్తారని ఆస్ట్రేలియాకు చెందిన బెన్‌ బ్లాండ్‌ హెచ్చరించాడు.

తైవాన్‌ ఒక దేశం కాదు. ఐక్యరాజ్యసమితి వేదికలపై దాన్ని చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తున్న అమెరికా శాంతియుత పద్దతుల్లో విలీనం కాకుండా చేయాల్సిందంతా చేస్తోంది.తమ కౌలు గడువు ముగిసిన తరువాత హాంకాంగ్‌ను బ్రిటీష్‌ వారు తిరిగి చైనాకు అప్పగించారు. తైవాన్‌ గత ఏడు దశాబ్దాలుగా తిరుగుబాటు రాష్ట్రంగా వుంది. దానిని స్వాధీనం చేసుకోవటానికి చైనాకు కొద్ది గంటలు చాలు, అయినా అక్కడి జనం అంగీకారంతో జరగాలి గనుక ఎలాంటి దుస్సాహసానికి పాల్పడటం లేదు.హాంకాంగ్‌ విలీనమైనా అక్కడి పరిస్ధితుల కారణంగా వెంటనే ప్రధాన భూభాగంతో మమేకం చేయకుండా ఒకే దేశం, రెండు వ్యవస్ధల పేరుతో 2050వరకు అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని, ప్రత్యేక పాలనా వ్యవస్ధను ఏర్పాటు చేస్తామని విలీన సమయంలో ఒక హామీ పత్రం రాసి ఇచ్చింది. ఇదే సూత్రాన్ని తైవాన్‌కు కూడా వర్తింప చేసేందుకు చైనా ఆ విధానాన్ని ఎంచుకుంది. పోర్చుగీసు కౌలు నుంచి విలీనమైన మకావో దీవులకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింప చేసింది.

Image result for worried Donald trump

తాజాగా తైవాన్‌ ప్రభుత్వానికి 220 కోట్ల డాలర్ల విలువ గల ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించుకుంది. తైవాన్‌ స్వాతంత్య్రానికి మద్దతు ఇస్తున్నాం కనుక తాము ఆయుధాలు విక్రయిస్తాం అంటూ అమెరికా అడ్డగోలు వాదనలు చేస్తోంది. అమెరికా చర్యకు ప్రతిగా చైనా మిలిటరీ విన్యాసాలు నిర్వహించింది. ఇంకేముంది చూడండి తైవాన్‌ స్వాతంత్య్రం కోరే వారిని భయపెట్టేందుకే అవని అమెరికా నానాయాగీ చేస్తోంది. సాధారణ కార్యకలాపాల్లో భాగంగానే మిలిటరీ విన్యాసాలు నిర్వహించాలని చైనా నిర్ణయించింది. అయితే ఈ చర్య తైవాన్‌ స్వాతంత్య్రం కోరుకొనే వారిని బెదిరించటమే అని అమెరికా మీడియా వక్రీకరిస్తోంది. తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకోకుండా వుండేందుకే తాము ఆయుధాలు అందచేస్తున్నామని, ఆ ప్రాంతానికి మిలిటరీని తరలిస్తున్నామని అమెరికా ఎప్పటి నుంచో చెబుతోంది.

ఈ పూర్వరంగంలో పరిస్ధితులు ఎటువైపు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. నిరసనకారులు ఎంతగా రెచ్చగొడుతున్నా వారి మీద స్ధానికుల్లో వ్యతిరేకత మరింత పెరిగే వరకు మౌనంగా వున్నవారు నిరసనకు వ్యతిరేకంగా గళం విప్పే వరకు హంకాంగ్‌ విషయంలో చైనా వేచి చూసే అవకాశం వుంది. తైవాన్‌కు ఆయుధాలు విక్రయించటం అమెరికాకు ఇదే కొత్త కాదు. ఇక వాణిజ్య యుద్దం మరింత ముదురనున్నదనే వార్తల పూర్వరంగంలో చైనా కరెన్సీ యుద్ద రంగాన్ని తెరిచేందుకు నిర్ణయించిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d