• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

దెబ్బకు దెబ్బ – ఓడకు ఓడ – అమెరికా వలలో బ్రిటన్‌ !

23 Tuesday Jul 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Britain, Grace 1, Iran Oil, Iran Tanker, Stena Impero, tit-for-tat ship seizures, UK Tanker., US Trap

Image result for Ship crisis: Britain falls into a dangerous US trap

ఎం కోటేశ్వరరావు

దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను అందరికీ తెలిసిన ప్రతీకార చర్యలు. ఇప్పుడు గల్ఫ్‌లోని హార్ముజ్‌ జలసంధిలో అమెరికా-ఇరాన్‌ మధ్య ప్రతీకార చర్యలలో బ్రిటన్‌ ఓడకు ఓడ చేరింది.తమ ఓడను పట్టుకున్న బ్రిటన్‌ చర్యకు ప్రతిగా బ్రిటన్‌ ఓడను ఇరాన్‌ పట్టుకొని తన రేవుకు తరలించింది. అమెరికా పన్నిన వలలో తనకు మాలిన ధర్మాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించిన బ్రిటన్‌ ఇప్పుడు ఇరాన్‌తో కొత్త వైరాన్ని తెచ్చుకుంది, దాన్నుంచి పరువు దక్కించుకొని ఎలా బయపడుతుందన్నది ఆసక్తికరం. ఇరాన్‌ వ్యవహారంలో ఒంటరిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అమెరికా తనకు తోడుగా బ్రిటన్‌ వున్నట్లు ప్రపంచానికి చూపింది. ఇరాన్‌ అణు ఒప్పందంపై అమెరికా వైఖరిని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న బ్రిటన్‌ ఇప్పుడు ఈ పిచ్చిపని ఎందుకు చేసిందని ఆంగ్లేయులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఎవరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు, ఎలా జరిగిందన్నది తేలాలని కోరుతున్నారు. మరోవైపు బ్రిటన్‌ చర్యకు ఐరోపా యూనియన్‌(ఇయు) మద్దతు ప్రకటించలేదు. మౌనంగా వుంది. ఇరాన్‌ చర్యను మాట మాత్రంగా ఫ్రాన్స్‌, జర్మనీ తప్ప ఐరోపా యూనియన్‌ తప్పు పట్టలేదు, మౌనం దాల్చింది. అమెరికా-ఇరాన్‌ వివాదంలో బ్రిటన్‌ ముందుకు రావటం యాదృచ్చికమా ? వ్యూహాత్మకమా ? అమెరికా పన్నిన వలలో చిక్కుకుందా? పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయి? ఇది అనూహ్య పర్యవసానాలకు దారి తీస్తుందా ? తన తప్పిదాన్ని బ్రిటన్‌ గ్రహిస్తే టీ కప్పులో తుపానులా ముగుస్తుందా ! పరువు ప్రతిష్టలకు పోయి మరేదైనా చేస్తుందా ?

తాజా వుదంత నేపధ్యాన్ని క్లుప్తంగా చూద్దాం. జూన్‌ 13: తమ రెండు చమురు ఓడలపై ఇరాన్‌ దాడి చేసిందని అమెరికా ఆరోపణ, తప్పుడు ప్రచారం తప్ప అలాంటిదేమీలేదని ఇరాన్‌ ఖండన. జూన్‌ 20: తమ గగన తలాన్ని అతిక్రమించినందున అమెరికా మిలిటరీ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్‌ ప్రకటన. ప్రతిదాడికి ఆదేశాలిచ్చిన ట్రంప్‌ 150 మంది పౌరుల ప్రాణాలు పోతాయని చెప్పటంతో చివరి నిమిషంలో వుపసంహరించుకున్నట్లు అమెరికా మీడియా ద్వారా వెల్లడి. జూలై 4: సరిగ్గా అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజున సిరియాకు చమురు తీసుకు వెళుతోందని, ఇది ఇయు ఆంక్షలను వుల్లంఘించటమే అనే సాకుతో జిబ్రాల్టర్‌ ప్రభుత్వ కోరిక మేరకు బ్రిటన్‌ నౌకాదళం రంగంలోకి దిగి జిబ్రాల్టర్‌ జలసంధిలో పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఇరాన్‌ చమురు ఓడ గ్రేస్‌1ని పట్టుకుంది. దెబ్బకు దెబ్బగా బ్రిటీష్‌ చమురు ఓడలను పట్టుకుంటామని ఇరాన్‌ ప్రకటన. జూలై 10: వాణిజ్య నౌక బ్రిటీష్‌ హెరిటేజ్‌ను అడ్డుకోబోయిన మూడు ఇరాన్‌ పడవలకు దగ్గరగా వెళ్లిన బ్రిటన్‌ నావీ ఫ్రైగేట్‌ హెచ్‌ఎంఎస్‌ మాంట్‌రోజ్‌, హెచ్చరికలతో ఇరాన్‌ పడవలు వెళ్లిపోయాయని, ఎలాంటి కాల్పులు జరగలేదని బ్రిటన్‌ ప్రకటన. అయితే ఆ వుదంతానికి ఎలాంటి ఆధారాలు లేవు, అస్పష్టమైన ఫొటోల వెల్లడి. అలాంటిదేమీ లేదని ఇరాన్‌ ప్రకటన.ఈ నౌక తన ట్రాకర్‌ను ఒక రోజు ముందుగా నిలిపివేసింది. దానికి వెన్నుదన్నుగా బ్రిటీష్‌ యుద్ధ నౌక ఎందుకు వెళ్లింది అన్న ప్రశ్నకు సమాధానాలు లేవు. జూలై 11: గ్రేస్‌1 నౌక కెప్టెన్‌, ఇతర అధికారులను అరెస్టు చేసినట్లు జిబ్రాల్టర్‌ ప్రకటన. ఇయు ఆంక్షలను వుల్లంఘించారని ఆరోపణ. రెండు రోజుల తరువాత బెయిలు మీద అధికారుల విడుదల. ఆంక్షలను వుల్లంఘించబోమని ఇరాన్‌ హామీ ఇస్తే గ్రేస్‌1 టాంకర్‌ను వదులుతామని ఇరాన్‌ మంత్రికి బ్రిటన్‌ విదేశాంగ మంత్రి ప్రతిపాదన. జూలై 15:ఇరాన్‌ అణు ఒప్పందంపై బ్రసెల్స్‌లో ఇయు విదేశాంగ మంత్రుల సమావేశం. గల్ఫ్‌లో సైనిక చర్యకు చూస్తున్న ట్రంప్‌కు మద్దతు ఇచ్చేది లేదని బ్రిటన్‌ నేతల ప్రకటన. జూలై 16:తమ నౌక గ్రేస్‌1 నిర్బంధం అపహరణ తప్ప మరొకటి కాదని, దెబ్బకు దెబ్బ తీస్తామని ఇరాన్‌ అధ్యక్షుడి ప్రకటన.జూలై 17: యుఏయి నుంచి బయలు దేరిన పనామా పతాకం వున్న చమురు ఓడను హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ నిర్బంధించినట్లు అనుమానిస్తున్నట్లు అమెరికా అధికారుల వెల్లడి. ఇరాన్‌ జలాల్లో ప్రవేశించే ముందు మూడురోజుల క్రితమే ట్రాకర్‌ను ఆపివేసిన ఓడ. తమ దళాలు ఒక విదేశీ ఓడను, పన్నెండు మంది సిబ్బందిని పట్టుకున్నట్లు ఇరాన్‌ ప్రకటన. జూలై 18: తమ నౌక యుఎస్‌ బాక్సర్‌కు వెయ్యి గజాల సమీపానికి వచ్చిన ఇరాన్‌ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ట్రంప్‌ ప్రకటన, అంత సీన్‌ లేదు, అదంతా వట్టిదే అని ప్రకటించిన ఇరాన్‌. జూలై 19: హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ రెండు నౌకలను నిర్బంధించినట్లు వార్తలు. వాటిలో ఒకటైన బ్రిటన్‌ స్టెనా ఇంపెరో అంతర్జాతీయ నౌకా నిబంధనలను వుల్లంఘించినందున అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్‌ ప్రకటన. లైబీరియా పతాకంతో వున్న మరొక నౌక మెస్‌డార్‌ను నిలువరించిన ఇరాన్‌ దళాలు తరువాత వారి ప్రయాణాన్ని అనుమతించినట్లు నౌక ఆపరేటర్‌ ప్రకటన.

Image result for iran oil tanker, gibraltar

ఇరాన్‌ అనే ఒక చిన్న దేశాన్ని దెబ్బతీసేందుకు అమెరికా అనే ప్రపంచ అగ్రరాజ్యం గత కొద్ది నెలలుగా గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు చేస్తున్న యత్నాలను ప్రపంచం చూస్తోంది.వాటిలో ఓడకు-ఓడ కొత్త అధ్యాయం. అట్లాంటిక్‌-మధ్యధరా సముద్రాలను కలిపే, ఐరోపా-ఆఫ్రికాలను విడదీసే జలసంధి పేరు జిబ్రాల్టర్‌. ఐరోపాలో స్పెయిన్‌, ఆఫ్రికాలో మొరాకో ఈ జలసంధికి ఎదురెదురుగా వుంటాయి. వాటి మధ్య దూరం కేవలం 14.3కిలోమీటర్లే. జిబ్రాల్టర్‌ 30వేల జనాభా వున్న బ్రిటీష్‌ పాలిత ప్రాంతం. అది స్పెయిన్‌దే అయినప్పటికీ ఆధిపత్యం కోసం ఐరోపాలో జరిగిన యుద్ధాలలో కీలకమైన ఈ ప్రాంతాన్ని 1713లో బ్రిటన్‌కు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ బ్రిటన్‌ నౌకాదళ స్దావరం వుంది. ప్రపంచంలో సముద్రం ద్వారా జరిగే వాణిజ్య ఓడల రవాణాలో సగం ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సి వుంది. ఆ ప్రాంతాన్ని తమకు తిరిగి అప్పగించాలన్నది స్పెయిన్‌ డిమాండ్‌. అయితే ఇప్పటి వరకు రెండు ప్రజాభిప్రాయ సేకరణల్లో అక్కడి వారు స్పెయిన్‌లో విలీనం కావటానికి గానీ లేదా స్పెయిన్‌ సార్వభౌమత్వాన్ని అంగీకరించటానికి గానీ అంగీకరించలేదు. దాని వెనుక బ్రిటన్‌ హస్తం వుందని వేరే చెప్పనవసరం లేదు.

ఇక తాజా వివాద విషయానికి వస్తే ఈ వుదంతంలో నిబంధనలను వుల్లంఘించి బ్రిటన్‌ గిల్లి కజ్జాకు దిగినట్లు కనిపిస్తోంది. ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని నియంత్రించేందుకు ఇరాన్‌, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాన్ని ఇరాన్‌ వుల్లంఘిస్తోందంటూ ఏకపక్షంగా ఆరోపించి ఆ ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా వెంటనే ఇరాన్‌పై ఆంక్షలను తీవ్రతరం చేయటమే కాదు, యుద్ధానికి కాలుదువ్వుతోంది. చమురు అమ్మకాలను అడ్డుకుంటోంది. అమెరికా చర్యలను బ్రిటన్‌తో సహా ఇతర దేశాలేవీ ఆమోదించలేదు. ఇరాన్‌ నౌకను స్వాధీనం చేసుకోవటానికి ఒక రోజు ముందుగా జిబ్రాల్టర్‌ తన చట్టాన్ని సవరించుకుంది. ఆ మేరకు గ్రేస్‌1 చమురు నౌక(టాంకర్‌) ద్వారా ఐరోపా యూనియన్‌ ఆంక్షలను వుల్లంఘించి సిరియాలోని బానియాస్‌ చమురు శుద్ధి కేంద్రానికి చమురు సరఫరా చేస్తున్ననట్లు తమకు అనుమానంగా వుందని జిబ్రాల్టర్‌ చేసిన వినతి మేరకు బ్రిటన్‌ నౌకాదళం రంగంలోకి దిగింది. 2012 నాటి ఐరోపా యూనియన్‌ నిబంధన 36 మేరకు నౌకను స్వాధీనం చేసుకున్నట్లు జిబ్రాల్టర్‌ కోర్టు పేర్కొన్నది.

సిరియాకు చమురు సరఫరాలపై ఐరోపా యూనియన్‌ విధించిన ఆంక్షలు సభ్యదేశాలకు వర్తిస్తాయి తప్ప ఇరాన్‌కు వర్తించవు. ఎందుకంటే ఇరాన్‌ సభ్యరాజ్యం కాదు. నౌకలోని చమురు సిరియాకు కాదని ఇరాన్‌ ప్రకటించింది. అలాంటపుడు ఇరాన్‌ చమురు ఓడను కూడా ఐరోపా యూనియన్‌ మధ్యలో అడ్డుకోకూడదు. ఒకవేళ అడ్డుకున్నా ఇరాన్‌ ప్రకటన తరువాత వదలి వేయాలి. ఇక్కడ ఆంక్షలు విధించిన ఐరోపా యూనియన్‌ అసలు రంగంలోనే లేదు. అలాంటపుడు జిబ్రాల్టర్‌ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకను అడ్డుకోవటానికి బ్రిటన్‌కు ఎవరు అధికారమిచ్చారు? ఐరోపా యూనియన్‌ అలాంటి అధికారం ఇవ్వలేదు. సిరియా మీద ఐరోపాయూనియన్‌ ఆంక్షలను బ్రిటన్‌ అమలు జరుపుతోందా లేక ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలను బ్రిటన్‌ అమలు జరుపుతున్నట్లా ? ఒక వైపు తాను ఐరోపా యూనియన్‌ నుంచి వైదొలగాలని బ్రిటన్‌ నిర్ణయించుకుంది. దాంతో తలెత్తిన సంక్షోభంలో ప్రధానిగా వున్న థెరెసా మే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. ఈ తరుణంలో ఇరాన్‌ నౌకను స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయం ఎక్కడ జరిగిందన్నది ఒక ప్రశ్నగా ముందుకు వచ్చింది. అంతర్గతంగా ఏమి జరిగినా అమెరికా తరఫున బ్రిటన్‌ అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది.

మరోవైపు డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు పరస్పర విరుద్ధంగా వున్నాయి. సౌదీ అరేబియాకు తాజాగా సైనికులతో పాటు ఎఫ్‌ 22 యుద్ధ విమానాలను, క్షిపణులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సెనెటర్‌ రాండ్‌ పాల్‌ను నియమించారు. బ్రిటన్‌-ఇరాన్‌ సంబంధాల చరిత్రను చూస్తే రెండు దేశాల మధ్య విశ్వాసం లేదు.1901లో బ్రిటన్‌ వ్యాపారి విలియం నాక్స్‌ డీ అర్సే పర్షియాగా మరో పేరున్న ఇరాన్‌లో చమురు అన్వేషణకు నాటి రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం అక్కడ దొరికే చమురు మొత్తం అతనిదే. లాభాల్లో 16శాతం మాత్రమే ఇరాన్‌కు దక్కుతుంది. కంపెనీ మీద రాజుకు ఎలాంటి ప్రమేయం వుండదు. ఆ విధంగా ది ఆంగ్లో పర్షియన్‌ ఆయిల్‌ కంపెనీ వునికిలోకి వచ్చింది. తరువాత బ్రిటన్‌ ప్రభుత్వం అక్కడ పెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి వుత్పత్తులను బ్రిటన్‌కు తీసుకుపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1951లో కంపెనీని జాతీయం చేశారు, ఆస్ధులను స్వాధీనం చేసుకున్నారు. దానికి ప్రతిగా బ్రిటన్‌ తన చమురుశుద్ధి కర్మాగారాన్ని మూసివేసింది. ఇరాన్‌ బ్యాంకు ఖాతాలను స్ధంభింపచేసింది. అయితే 1953లో అమెరికా- బ్రిటన్‌ తమ తొత్తు అయిన షాను గద్దెపై కూర్చోపెట్టాయి. బ్రిటీష్‌ పెట్రోలియం(బిపి)కు తిరిగి చమురు క్షేత్రాలను కట్టబెట్టారు.1979లో అయాతుల్లా ఖొమైనీ నాయకత్వంలో తిరుగుబాటు జరిగే వరకు అదే కంపెనీ దోపిడీ కొనసాగింది. తరువాత మరోసారి చమురు పరిశ్రమను కంపెనీని జాతీయం చేశారు.

Image result for Ship crisis: Britain falls into a dangerous US trap

ఓడకు ఓడ వుదంతానికి ఇరాన్‌ మీద ఒంటి కాలిపై లేచే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ సూత్రధారిగా వున్నట్లు కనిపిస్తున్నది. నౌకను పట్టుకోగానే బోల్టన్‌ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అయితే ఇదంతా అతగాడి బృంద పధకం ప్రకారం జరిగిందని, ఆశ్చర్యం ఒక నటన అని తేలింది. అమెరికా వూబిలోకి తమ దేశాన్ని లాగారని ఆంగ్లేయులు అంటున్నారు. బ్రిటన్‌ స్వాధీనం చేసుకున్న ఇరాన్‌ నౌక పెద్దది కావటంతో అది సూయజ్‌ కాలువ గుండా ప్రయాణించే అవకాశం లేదు.దాంతో మధ్యధరా సముద్రంలో నుంచి జిబ్రాల్టర్‌ జల సంధిలో ప్రవేశించేందుకు గుడ్‌ హోప్‌ ఆగ్రాన్ని చుట్టి వచ్చింది. మరో 48 గంటల్లో ఇరాన్‌ నౌక జిబ్రాల్టర్‌ ప్రాంతానికి రానుండగా అమెరికా గూఢచార సంస్ధలు స్పెయిన్‌ నౌకదళానికి ఆ విషయాన్ని చేరవేశాయి. అయితే స్పెయిన్‌ మీద నమ్మకం లేని అమెరికన్లు బ్రిటన్‌కు సైతం తెలియచేశారు. వారు కోరుకున్నట్లుగానే బ్రిటన్‌ అడ్డగించింది. ఈ సైనిక చర్యకు ఎవరు వుత్తరువులు జారీ చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా వినతి మేరకు నౌకను పట్టుకుంది బ్రిటన్‌ తప్ప తమకు ఆ చర్యతో ఎలాంటి సంబంధం లేదని స్పెయిన్‌ విదేశాంగ మంత్రి జోసెఫ్‌ బోరెల్‌ ప్రకటించారు. ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల విభాగం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇరాన్‌ మీద దాడికి ఐరోపా ధనిక దేశాలు సుముఖంగా వుంటే ఈ పాటికి అమెరికా ఆ పని చేసి వుండేది. ఇప్పటి వరకు అలాంటి సూచనలేమీ లేకపోవటంతో ఏదో ఒక విధంగా ట్రంప్‌ గిల్లికజ్జాలతో కాలం గడుపుతున్నాడు, దానిలో భాగమే బ్రిటన్‌ నౌకా వుదంతం అని చెప్పవచ్చు. సోమవారం నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ బ్రిటన్‌ తన నౌకల రక్షణ బాధ్యతను తానే చూసుకోవాలని చెప్పటం మరో మలుపు. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న వాటిని ఇరాన్‌ పట్టుకోవటం ఏమిటని ప్రశ్నిస్తూ అంతర్జాతీయ జలాల్లో ఆటంకం లేకుండా చూసుకోవటం ప్రపంచ బాధ్యత అని అన్ని దేశాలను రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేశాడు. ఈ పూర్వరంగంలో ఈ వుదంతానికి ముగింపు సుఖాంతం అవుతుందా ? కొత్త పరిణామాలకు నాంది పలుకుతుందా అని చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వృద్ధి రేటు పతనం ఎవరికి లాభం, ఎవరికి నష్టం ?

17 Wednesday Jul 2019

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, china’s economic growth, china’s economic growth slides, Donald trump, world Trade

Image result for china’s economic growth slides

ఎం కోటే శ్వరరావు

ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో 6.4శాతంగా వున్న తమ వృద్దిరేటు రెండవ త్రైమాసిక కాలంలో 6.2శాతానికి తగ్గిందని, ఇది గడచిన ఇరవై ఏడు సంవత్సరాలలో కనిష్టం అని చైనా ప్రకటించింది. ఈ పరిస్ధితి లాభమా నష్టమా అనే చర్చ ప్రపంచ వ్యాపితంగా మీడియాలో ప్రారంభమైంది. అనుకూల వార్తలను తప్ప ప్రతికూల, విమర్శనాత్మక వైఖరులను సహించే పరిస్ధితి దేశంలో రోజు రోజుకూ దిగజారుతోంది. ఎదుటి వారి బలహీనతలను వినియోగించుకొని లబ్ది పొందాలని చెప్పేవారిని దేశ భక్తులుగానూ, మంచి చెడ్డలను వివరించి వైఖరులు మార్చుకోవాలని కోరే వారిని దేశద్రోహులనేంతగా పరిస్ధితులు వున్నాయి. ఎదుటి వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని ఎలా చూస్తామో ఎదుటి వారు కూడా అదే ప్రయత్నం చేస్తారనే చిన్న తర్కం తట్టకపోతే వచ్చే సమస్య ఇది. ప్రపంచ వ్యాపితంగా ప్రతి దేశం స్వేచ్చా వాణిజ్యం, విధానాల గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ఎవరికి వారు రక్షణాత్మక చర్యలను ఎక్కువగా తీసుకుంటున్న రోజులివి. ప్రతికూలతలను మనం మూసిపెడితే ప్రపంచానికి తెలియకుండా పోతుందా? మంచి చెడ్డలను చర్చించిన వారు దేశద్రోహులు కాదు అసలైన దేశ భక్తులని ముందుగా చెప్పాలి.

తాము విధించిన పన్నుల కారణంగానే చైనా ఆర్ధిక వ్యవస్ధ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తమ చర్యలు పన్నులు లేని దేశాలకు తరలిపోవాలని అనుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేయటమే కాదు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనేలా చైనాపై వత్తిడిని పెంచుతున్నాయని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు. వేలాది కంపెనీలు వెళ్లిపోతున్న కారణంగానే తమతో ఒప్పందం చేసుకోవాలని చైనా కోరుకుంటోందని, తమకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోందని, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుందని, విలువ తగ్గించటం ద్వారా ఆ మొత్తం చైనాయే చెల్లిస్తోందని కూడా ఆ పెద్దమనిషి చెప్పాడు. అయితే అమెరికా ఆర్ధికవేత్తలు ఇలాంటి వైఖరులను తోసిపుచ్చుతున్నారు. చైనా వుత్పత్తులపై విధించే దిగుమతి పన్ను కారణంగా ధరల పెరుగుదల వలన ఆ మొత్తాన్ని వినియోగదారులే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. రెండువందల బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై అమెరికా 25శాతం పన్ను విధిస్తే, అరవై బిలియన్‌ డాలర్ల విలువగల అమెరికా వస్తువులపై చైనా కూడా అంతే మొత్తంలో పన్ను విధిస్తోంది. మరో 325 బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై పది నుంచి 25శాతం మేర పన్ను విధిస్తామని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇరుదేశాల వాణిజ్యంలో చైనాది పైచేయిగా వుంది. అమెరికా దిగుమతులు 540 బిలియన్‌ డాలర్లుండగా చైనా దిగుమతులు కేవలం 120 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఈ తేడాను తగ్గించేందుకు తమ వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలంటూ అమెరికా బలవంతం చేస్తోంది.

చైనా ఆర్ధికవృద్ధి రేటు పడిపోవటం అమెరికాకు చెడు వార్త అని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఏజన్సీ విశ్లేషణ పేర్కొన్నది. దాని సారాంశం ఇలా వుంది. చైనా ఆర్ధిక మందగమనం వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చు. ఇది ప్రపంచవ్యాపిత పర్యవసానాలకు దారి తీస్తుంది.చిలీ రాగి మొదలు ఇండోనేషియా బొగ్గు వరకు చైనా ఫ్యాక్టరీలకు జరుగుతున్న ముడిసరకుల సరఫరాపై ప్రభావ చూపవచ్చు. దక్షిణాఫ్రికా వుత్పత్తిలో ఈ శతాబ్ది ప్రారంభంలో రెండుశాతం చైనాకు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం 15శాతానికి చేరాయి. కాంగో ఎగుమతుల్లో 45శాతం చైనాకే వున్నాయి. ఇలాంటి దేశాలన్నీ చైనా పెట్టుబడుల మీద ఆధారపడి వున్నాయి. పీటర్సన్‌ సంస్ధ వివరాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 35, బ్రెజిల్‌ 30, దక్షిణకొరియా 24శాతం వుత్పత్తులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మందగమనం కారణంగా చైనా అంతర్గత వినియోగం పడిపోతే ఈ దేశాలే కాదు చైనాలో వస్తువిక్రయాలు చేస్తున్న అమెరికన్‌ కంపెనీల ఆదాయం, లాభదాయకత, వాటాల విలువ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని సిరాకాస్‌ విశ్వవిద్యాలయ ఆర్ధికవేత్త మేరీ లవ్లీ చెప్పారు. అంతిమంగా వాటాల ధరలు బలహీనమైతే అది అమెరికా వినియోగదారుల, ఆర్ధిక వ్యవస్ధపై వున్న విశ్వాసాన్నే దెబ్బతీస్తుందని కూడా ఆమె అన్నారు. చైనా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిందని ట్రంప్‌ సంతోషంగా వుండవచ్చు గానీ ఇది జాగ్రత్తగా వుండాల్సిన పరిణామం అని ఆమె హెచ్చరించారు. ట్రంప్‌ ఒక్క చైనా మీదనే కాదు, ఇతర అనేక దేశాల మీద పన్నులు విధిస్తున్నారు. ఆ దేశాల వారు బదులు తీర్చుకుంటున్నందున మొత్తంగా ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు దెబ్బతింటున్నాయి. వార్షిక అభివృద్ది లక్ష్యం 6నుంచి 6.5శాతం వుండే విధంగా వినియోగం పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటోంది.

చైనాలో జరిగే పరిణామం మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా జరుగుతోంది.ఈ ఏడాది జనవరి 22 నాటి ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక విశ్లేషణ సారాంశం ఇలా వుంది. చైనా తొలిసారిగా వుత్పాదక కార్యకలాపాలు పడిపోయాయి. ఎగుమతులు, దిగుమతులూ తగ్గాయి. కొన్ని సంస్ధల సామర్ధ్య వినియోగం 40,50శాతం మధ్య వుంది. చైనాలో వస్తు డిమాండ్‌ పడిపోతే దాని ప్రభావం ప్రపంచవ్యాపితంగా వుంటుంది.ఈ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచ ఆర్ధిక కార్యకలాపాల్లో చైనా వాటా ఏడుశాతం మాత్రమే వుండగా ఈ ఏడాది 19శాతానికి చేరనుంది. చైనా పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా గొలుసుతో ముడిపడి వుంది. అనేక వస్తువుల ధరలను ప్రస్తుతం చైనా ఆర్ధిక వ్యవస్ధ నిర్ణయించే స్ధితిలో వుంది. ప్రపంచంలో వినియోగించే వుక్కు, రాగి, బొగ్గు, సిమెంట్‌లో సగం చైనాకు పోతోంది.అది కొనటం ఆపివేస్తే ధరలు పడిపోతాయి. డిమాండ్‌ పడిపోకుండా చూసేందుకు చైనా తక్షణ నిర్మాణ పధకాలను చేపట్టింది, పన్నులను తగ్గించింది. కొన్ని దిగుమతి పన్నులను తగ్గించింది.చిన్న సంస్ధలకు రుణాలను పెంచింది, బ్యాంకుల వద్ద నిల్వధనాన్ని తగ్గించింది.వడ్డీల తగ్గింపునకు చర్యలు తీసుకుంది. పెద్ద సంఖ్యలో వుద్యోగాలు రద్దు కాకుండా వుద్దీపన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం భారత్‌ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో చైనా వాటా 4.39శాతం.అక్కడి నుంచి 16శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటున్న కారణంగా మన దేశం మీద ప్రభావం పెద్దగా పడకపోవచ్చు. అయితే చైనా కరెన్సీ యువాన్‌ బలహీనపడితే చైనా నుంచి దిగుమతులు చౌక అవుతాయి, దాంతో అక్కడి నుంచి వస్తువులను మన దేశంలో కుమ్మరిస్తారు. అది ఇక్కడి కంపెనీలను దెబ్బతీస్తుంది. చైనాకు ఎగుమతి చేసే ముడిసరకులు దెబ్బతింటాయి. చైనా కంపెనీలు భారత్‌కు వస్తాయి, ఇక్కడ వస్తువులను వుత్పత్తి చేస్తాయి, మౌలిక సదుపాయాల కల్పనలో చైనా సాయం తీసుకొని భారత్‌ లబ్ది పొందవచ్చు.

మరికొందరి విశ్లేషణల సారాంశం ఇలా వుంది. వాణిజ్య యుద్ధం కారణంగా కొంత మేరకు అమెరికా మార్కెట్‌ను చైనా కోల్పోవచ్చు. ఆ మేరకు మన దేశం ఆ స్ధానంలో ప్రవేశించవచ్చు అన్నది ఒక అభిప్రాయం. 2012-15 మధ్య కాలంలో ఎగుమతి మార్కెట్లో చైనా చొరబాటు 53-51శాతం మధ్య కదలాడగా దాటగా మన దేశం 27-28శాతం కలిగి వుంది. అమెరికా 48 నుంచి 43శాతానికి పడిపోయింది. 2016లో చైనా 42.57శాతానికి పడిపోగా మన దేశం 23.32కు, అమెరికా 37శాతానికి తగ్గిపోయింది. అంటే మూడు దేశాలకూ ఎగుమతుల అవకాశాలు తగ్గాయి. అయినా మన కంటే చైనా వాటా రెట్టింపుకు దగ్గరగా వుంది. పోయిన వాటాను పూడ్చుకొనేందుకు చైనా ఏం చేస్తుందనే అంశాన్ని పక్కన పెడితే మన దేశం మీద కూడా అమెరికా వాణిజ్య యుద్దం చేస్తోంది. చైనా స్ధానంలో మనం చొరబడాలంటే ఈ అంశం పరిష్కారం కావటం ఒకటి. చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వుత్పత్తుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవి వున్నాయి. వాటిని మనం తయారు చేసి ఎగుమతి చేయాలంటే అవసరమైన వుత్పాదక సామర్ధ్యాలను సమకూర్చుకోవటం తెల్లవారే సరికి జరిగే వ్యవహారం కాదు. 2016లో వుత్పాదక రంగంలో చైనా హైటెక్‌ వుత్పత్తుల ఎగుమతులు 25శాతం కాగా మన దేశంలో ఏడుశాతమే వున్నాయి. పన్ను ఒప్పందాలు చైనాకు 22 వుండగా మన దేశానికి రెండు మాత్రమే వున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో చొరబడాలంటే అందునా ప్రతి దేశం రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇవి ఎంత ఎక్కువ వుంటే అంత ప్రయోజనం. ఇలాంటి తేడాలు అనేకం వున్న కారణంగా మన దేశం ఏ మేరకు లబ్దిపొందుతుంది అన్నది ప్రశ్న.

చైనా వారు ప్రకటించిన లెక్కలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా లేవు, నేను గతవారం చైనాలో వున్నాను. వుత్పాదక రంగంలో మందగించిందనేది సాధారణ అభిప్రాయంగా వుంది. వేగంగా పెరుగుతున్న సేవా రంగం తిరిగి వెనుకటి స్ధాయికి తీసుకు వస్తుందనే అభిప్రాయమూ వుంది అని ఏలే విశ్వవిద్యాలయ సీనియర్‌ ఆర్ధికవేత్త స్టీఫెన్‌ రోచి చెప్పారు. మోర్గాన్‌ స్టాన్లే ఆసియా అధ్యక్షుడిగా 2007-12 మధ్య ఆయన చైనాలో వున్నారు. ప్రస్తుతం సాగుతున్న వాణిజ్య పోరు గురించి కూడా వారిలో ఎలాంటి ఆత్రత కూడా కనిపించలేదన్నారు. ఆర్ధిక మందగమన నేపధ్యంలో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలనే ధోరణిలో కూడా వారు లేరని, ఒక వేళ పోరు ముదిరితే దాన్ని అదుపు చేసే వ్యూహాలు కూడా వారి దగ్గర వున్నాయని చెప్పారు.

చైనా ఆర్ధికం మందగిస్తే ఏం జరుగుతుందనే అంశంపై పైన పేర్కొన్న అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని లేదు.చర్చలో ముందుకు వస్తున్న అంశాలకు ప్రతీకగా వాటిని చూడాలి. ప్రతి దేశ ఆర్ధిక వ్యవస్ధ తాను ఎదుర్కొంటున్న సమస్యలకు తమదైన పరిష్కారాలను చూసుకోవాలి తప్ప అనుకరిస్తే ప్రయోజనం వుండదు. అనేక మంది పరిశీలకులు చెబుతున్నదాని ప్రకారం చైనా ప్రస్తుతం పెట్టుబడుల కంటే వస్తు వినియోగాన్ని పెంచే ఆర్ధిక నమూనా దిశగా ప్రయాణిస్తోంది. 2007-17 మధ్య కాలంలో చైనా గృహ వినియోగం అమెరికాతో పోలిస్తే 13శాతం నుంచి 34శాతానికి పెరిగింది. జిడిపిలో దాని వినియోగం గతేడాది 40శాతం వుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ అంచనా ప్రకారం 2017-23 మధ్య చైనా ఆర్ధిక వ్యవస్ధ 42శాతం చొప్పున(వార్షిక వృద్ధి 6.1శాతం), అమెరికా వ్యవస్ధ 13శాతం(వార్షిక వృద్ధి రెండుశాతం) పెరుగుతాయి. తరువాత వాటి వృద్ధి రేటు 8, 4శాతాల చొప్పున వుంటాయి.2026 నాటికి డాలర్లలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ స్ధాయికి చైనా చేరుకుంటుంది. 2027 నాటికి అమెరికా వినియోగంలో 74శాతం కలిగి వుంటుంది. తరువాత చైనా జిడిపి వృద్ధి రేటు ఆరుశాతం, అమెరికా రేటు నాలుగుశాతం వుంటుంది.

ఈ లెక్కలు కొంత గజిబిజిగా అనిపించవచ్చు. ఈ నేపధ్యంలో మన దేశం ఎంచుకున్న మార్గం ఏమిటన్నది చూడాల్సి వుంది. ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం మన దేశ అభివృద్ధి అత్యధికంగా అంతర్గత డిమాండ్‌ కారణంగా జరిగింది, ఎగుమతుల అభివృద్ధి నెమ్మదిగా వుంది. కనుక కొత్త ప్రభుత్వం ఎగుమతి ఆధారిత అభివృద్ది ప్రాతిపదికగా చూడాలని సలహాయిచ్చింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారం 2018లో ప్రపంచ వాణిజ్య వృద్ది రేటు 3.9శాతం కాగా 2019లో 3.7శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. వుత్పత్తి కూడా 3.5 నుంచి 3.3శాతానికి తగ్గనున్నట్లు తెలిపింది. ప్రపంచం వాణిజ్యం తగ్గితే అది కొన్ని దేశాల మీదనే ప్రతికూల ప్రభావం చూపదు. చివరికి దుస్తుల ఎగుమతి విషయాల్లో కూడా మన దేశం బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడలేకపోతోంది. భారత్‌లో అంతర్గత డిమాండ్‌ ఎక్కువగా వున్న కారణంగా దిగుమతులు రెండంకెల స్ధాయికి చేరుతున్నాయని, డిమాండ్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.జిడిపిలో సాధారణంగా 30శాతం మేరకు ఎగుమతులు చేయాల్సి వుండగా ఇప్పుడు పదిశాతం మేరకే వుందని, రానున్న రోజుల్లో ఎగుమతులు పెంచాలని కోరింది.

Related image

తాజాగా కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సర్వే, బడ్జెట్‌లోనూ ప్రయివేటు పెట్టుబడుల ద్వారా అభివృద్ది తద్వారా ఎగుమతుల గురించి వక్కాణించారు.గత ఐదు సంవత్సరాలలో మొత్తంగా చూస్తే ఎగుమతులు పడిపోవటంతో పాటు పారిశ్రామిక మరియు వస్తుతయారీ అభివృద్ది కూడా మందగించింది. వినియోగ వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోయింది. దీనికి ఒక ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టకపోవటం, ఇతర కారణాలతో తలెత్తిన సంక్షోభం అన్నది అందరూ చెబుతున్నదే. ఒక్క సేవారంగంలో తప్ప ఇతర రంగాలలో తీవ్ర సమస్యలున్నప్పటికీ మనం మాత్రం వేగంగా అభివృద్ది చెందుతున్న దేశమనే తోక తగిలించుకుంటూనే వున్నాం. లేకపోతే రాజకీయంగా చెప్పుకొనేందుకేమీ వుండదు. దేశాన్ని ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధగా మార్చాలనే తపనతో మేకిన్‌ ఇండియా అనో మరొక పిలుపో ఇచ్చినా దాని వలన ఫలితాలేమీ రాలేదు. గతంలో తూర్పు ఆసియా దేశాలు, కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధలతో ఒక వెలుగు వెలిగిన మాట నిజం.నాటికీ నేటికీ ఎంతో తేడా వుంది. ప్రస్తుతం ధనికదేశాలు ఎదుర్కొంటున్న మాంద్యం, ప్రతి దేశం అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు అలాంటి అభివృద్దికి అనేక ఆటంకాలు కలిగిస్తున్నాయి. అన్నింటినీ మించి గతంలో ఆసియన్‌ దేశాలు అభివృద్ధి చెందిన సమయంలో దిగ్గజ చైనా రంగంలో లేదు. అక్కడి నుంచి దిగుమతులను అడ్డుకొనేందుకు మన దేశంతో సహా ప్రతిదేశమూ ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నది. అనేక సందర్భాలలో మన వుత్పత్తులు తగినంత నాణ్యత లేవనే సాకుతో ఐరోపా, అమెరికా తిరస్కరించిన వుదంతాల గురించి వస్తున్న వార్తల గురించి తెలిసిందే.అమెరికా మన దేశం మీద కూడా వాణిజ్యపోరు సాగిస్తున్నది, మనం కూడా మన ఎలక్ట్రానిక్‌పరిశ్రమ రక్షణ కోసం కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయరంగంలో అలాంటి చర్యలను మరింతగా తీసుకోవాల్సి వుంది.

వేగంగా అభివృద్ధి చెందటం గురించి ప్రతి ఒక్కరూ చైనాను పదే పదే చెబుతుంటారు.అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరించిన సమతుల విధానం దాని విజయానికి కారణం. వుత్పాదకత పెంపుదలతో పాటు అక్కడి జన జీవితాలను ఎంతో మెరుగుపరచటం, అందుకు అవసరమైన విధంగా వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల రూపంలో ఆదాయాలు కూడా పెరిగాయి. ఈ రెండో కోణాన్ని అనేక మంది చూడటం లేదు. 2008లో ప్రపంచ ధనిక దేశాల్లో తలెత్తి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతున్న ఆర్ధిక మాంద్యంతో తన విధానంలోని బలహీనతను చైనా నాయకత్వం గుర్తించింది. దాన్ని సరిచేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగానే అంతర్గత వినిమయాన్ని పెంచి తగ్గిన ఎగుమతుల సమస్యను కొంత మేరకు అధిగమించింది. ఎంతగా తగ్గినా ఆరుశాతం పైగా ఆర్ధిక వృద్ది రేటు చైనాలో కొనసాగుతోంది. ఇప్పటికే దాని దగ్గర పెద్ద మొత్తంలో డాలర్లు పోగుపడి వున్నాయి కనుక తన ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పరుగు పెట్టించేందుకు అవసరమైన వుద్దీపన పధకాలను చేపట్టగల సత్తా వుంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఠలాయిస్తే ఇతర మార్కెట్లను సంపాదించగల శక్తి వుంది. మన దేశంలో బ్యాంకులు నిరర్ధక ఆస్తులతో, పెట్టుబడుల కొరతతో సతమతమౌతున్నాయి. అంతర్గత డిమాండ్‌ను పెంచటంతో పాటు వుపాధి కల్పనలో లోటు రాకుండా చూసుకొనేందుకు చైనాలో ప్రయివేటు రంగానికి రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. ధనికదేశాలతో వాణిజ్య పోరును ఎదుర్కొంటూనే సవ్యసాచిలా చైనా నాయకత్వం అనేక చర్యలు తీసుకొంటున్నది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఫలితం లేదు. మన విధానాల లోపాల్ని ముందుగా సవరించుకోవాలి. వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు మన సర్కార్‌ చెబుతున్న తప్పుడు లెక్కలను ప్రశ్నించిన వారిని దేశ ద్రోహులుగా చూస్తున్నారు. ఈ పూర్వరంగంలో అసలు మనం చెప్పే అభివృద్ది ఇతర లెక్కలను విశ్వసించి ప్రయివేటు పెట్టుబడిదారులు ముందుకు వస్తారా అన్నదే అసలు సమస్య !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తీవ్ర విబేధాలను వెల్లడించిన జి 20 ఒసాకా సభ !

30 Sunday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

G20, G20 Osaka 2019, G20 Osaka 2019 summit

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఎం కోటేశ్వరరావు

అనేక మంది వూహించినట్లు ఒసాకాలో జరిగిన జి 20 శిఖరాగ్ర సమావేశం స్పష్టమైన నిర్ణయాలు, నిర్ధిష్ట కార్యాచరణ లేకుండానే ముగిసిందని చెప్పాలి. ఆతిధ్యం ఇచ్చిన జపాన్‌ ప్రధాని మర్యాద పూర్వకంగా సభ విజయవంతమైందని చెప్పవచ్చు తప్ప ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేకుండా కేవలం ఆశాభావాలతో ముగిసింది. ప్రపంచీకరణ మరింత ముందుకు పోతున్న వర్తమానంలో అనేక అంతర్జాతీయ వేదికల సందర్భంగా జరిగిన పరిణామాలే పునరావృతం అయ్యాయి. నేను కూడా రాజుగారి గంగాళంలో పాలుపోయటానికే వచ్చాను గానీ నీతో ముఖ్యవిషయాలు మాట్లాడాలి పక్కకు రా అన్నట్లుగా ఒసాకాలో నేతల ద్వైపాక్షిక సమావేశాలకే ప్రాధాన్యత ఏర్పడిందన్నది స్పష్టం. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మిగతా దేశాల నేతలతో-మన ప్రధాని నరేంద్రమోడీతో సహా- జరిపిన సంప్రదింపులన్నీ మా యింటికొస్తే మీరేమి తెస్తారు, మీ ఇంటికొస్తే మాకేమి పెడతారు అన్న పద్దతుల్లో అమెరికా ప్రయోజనాల చుట్టూ చర్చలను తిప్పారు. మద్దులాట-దెబ్బలాట పద్దతిలో ఒక వైపు ట్రంప్‌తో భాయీ భాయీ అంటూనే మరో ఏకపక్ష వ్యవహారాలను సహించరాదని మిగతా దేశాల నేతలతో పరోక్షంగా అమెరికా వైఖరిని విమర్శించే ప్రకటన జారీలో మన ప్రధాని నరేంద్రమోడీ భాగస్వామి అయ్యారు.

ఈ సమావేశాల సందర్భంగా వివిధ దేశాల మధ్య వున్న వివాదాలను కూడా పలువురు నేతలు ప్రస్తావించారు. నిజానికి వాటిని వేరే సందర్భాలలో చర్చించేందుకు అవకాశం వున్నప్పటికీ జి 20ని వేదిక చేసుకోవటాన్ని బట్టి ఎవరూ ఏ విషయంలోనూ వెనక్కు తగ్గే ధోరణిలో లేరన్నది స్పష్టమైంది.నాటోలో సభ్యరాజ్యమైన టర్కీ తన మిలిటరీ అవసరాల కోసం రష్యా తయారీ ఎస్‌-400 క్షిపణులను కొనుగోలు చేయటాన్ని ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రస్తావించారు. కొనుగోలుతో ముందుకు పోతే ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరించిన విషయం తెలిసిందే.తమ వ్యవహారాల్లో రష్యా బాధ్యతారహిత, అస్ధిర కార్యకలాపాలకు దూరంగా వుండాలని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే చెప్పారు. గతేడాది శాలిస్బరీలో సెర్గీ స్కిరిపాల్‌ మీద విషపూరిత దాడికి పాల్పడిన ఇద్దరు రష్యన్లను తమకు అప్పగించాలని పుతిన్‌తో జరిపిన భేటీలో కోరినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశాల సందర్భంగా హాంకాంగ్‌ అంశాన్ని లేవనెత్త కూడదని తాము కోరుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు జింపింగ్‌ చెప్పారు. అయినప్పటికీ జపాన్‌ ప్రధాని షింజో అబె దాన్ని ప్రస్తావించారు. హాంకాంగ్‌ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని కోరారు.

పందొమ్మిది దేశాలు, ఐరోపా యూనియన్‌ సభ్యురాలిగా వున్న జి20 పద్నాలుగవ శిఖరాగ్ర సమావేశం జపాన్‌లోని ఒసాకాలో ఈనెల 28,29 తేదీలలో జరిగింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో 80శాతం వుత్పత్తి, మూడింట రెండువంతుల జనాభాను కలిగివున్న దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఈ బృంద సమావేశం జపాన్‌లో జరగటం ఇదే తొలిసారి. ఒకవైపు వాణిజ్య యుద్ధాలు, మరోవైపు ఇరాన్‌ మీద భౌతిక దాడులు జరుపుతామని అమెరికా బెదిరింపులకు పాల్పడిన నేపధ్యంలో ఈ సమావేశం జరిగింది. ఇతర అనేక అంశాల గురించి దేశాల నేతలు ప్రస్తావించి చర్చించినప్పటికీ ఈ సమావేశాల అజెండాలో అగ్రస్ధానం వాణిజ్య యుద్ధం ఆక్రమించింది. భారత్‌ మార్కెట్లో మరింతగా ప్రవేశించేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ అనేక వలపు బాణాలు విసిరారు. అమెరికాతో దోస్తీకి నరేంద్రమోడీ తహతహలాడుతున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్ధితి, దేశీయంగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తల ప్రయోజనాలు ఇమిడి వున్నందున మోడీకి ఇష్టం వుందా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ట్రంప్‌కు దూరంగా వుండాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది. స్వేచ్చా, న్యాయమైన, వివక్షలేని, పారదర్శక, స్ధిరమైన వాణిజ్యం, పెట్టుబడుల వాతావరణాన్ని కల్పించేందుకు సభ్యదేశాలు పని చేయాలని సమావేశం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ వాంఛలకు విరుద్దంగా పర్యావరణ పరిరక్షణపై కుదిరిన పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగాలన్న తన నిర్ణయంతో మార్పు లేదని అమెరికా స్పష్టం చేయటంతో ఈ అంశంపై పడిన పీఠముడి విడిపోలేదు. పర్యావరణానికి హానిచేసే విషవాయువుల విడుదలను తగ్గించాలన్నది ఆ ఒప్పంద సారం. దాన్ని తాము అమలు జరిపితే తమ కార్మికుల, పన్ను చెల్లింపుదార్ల ప్రయోజనాలకు హాని కలుగుతుందంటూ అమెరికా ఆ ఒప్పందంతో తనకు సంబంధం లేదంటోంది.

తన పంతం నెగ్గించుకోవాలని, తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడాలని అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ దాని ఆటలు సాగలేదనే చెప్పాలి. చైనాలోని హువెయ్‌ టెలికాం కంపెనీ వుత్పత్తులు ఇంతకాలం తన భద్రతకు ముప్పు అని ప్రకటించి వాటిని కొనుగోలు చేయరాదని ఇతర దేశాలను కూడా బెదిరించిన ట్రంప్‌ ఆ కంపెనీకి అమెరికన్లు విడిభాగాలను విక్రయించవచ్చు అని ఒసాకాలో ట్రంప్‌ ప్రకటించటం విశేషం. ఇదే విధంగా తాము ఇప్పటి వరకు 300 బిలియన్‌ డాలర్ల విలువగల చైనా వుత్పత్తులపై విధించిన పన్ను మినహా ప్రస్తుతానికి అదనంగా పన్నుపెంచటం లేదని కూడా చెప్పారు. అయితే ఇది డిసెంబరులో చేసిన ప్రకటన పునశ్చరణ తప్ప కొత్తదేమీ కాదు. చైనాతో తమ సంబంధాలు వూహించినదాని కంటే మెరుగ్గా వున్నాయని, రెండు దేశాలు తిరిగి పట్టాలు ఎక్కాయని, చైనా నేత గ్జీ జింపింగ్‌తో చాలా చాలా మంచి సమావేశం జరిగిందని ట్రంప్‌ విలేకర్లతో అన్నాడు. వుద్రిక్తతలను గమనంలో వుంచుకొని ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను ముందుకు తీసుకుపోవాలని సమావేశంలో నేతలు అంగీకరించినట్లు జపాన్‌ ప్రధాని షింజో అబే శిఖరాగ్ర సభ ముగింపు సమావేశంలో ప్రకటించారు.

ఒసాకా సమావేశాల్లో వుమ్మడిగా అజెండా అంశాలను చర్చించటంతో పాటు అనేక దేశాల నేతల మధ్య ద్విపక్ష సమావేశాలు చోటు చేసుకున్నాయి. ముదిరి వాణిజ్య యుద్ద నేపధ్యంలో ట్రంప్‌, గ్జీ జింపింగ్‌ మధ్య అలాంటి సమావేశం గురించి ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురు చూసింది.వారు భేటీ అయ్యే ముందు మీడియాకు విడివిడిగా ప్రకటనలు చేశారు. 1970దశకంలో అమెరికాాచైనా మధ్య సంబంధాలు ఒక టేబుల్‌ టెన్నిస్‌ క్రీడతో ప్రారంభమయ్యాయని, ఒక చిన్న బంతి తరువాత కాలంలో ప్రపంచ పరిణామాలను ముందుకు తీసుకుపోవటంలో ఎంతో పెద్ద పాత్రపోషించిందని జింపింగ్‌ గత చరిత్రను గుర్తు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో అంతర్జాతీయ పరిస్ధితులు, వుభయ దేశాల సంబంధాల్లో ఎంతో మార్పు జరిగినా సహకారం ద్వారా రెండు దేశాలు లబ్ది పొందటం, ఘర్షణతో నష్టపడ్డాయన్న మౌలిక వాస్తవంలో మార్పులేదని అన్నారు.

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఒసాకాలో ట్రంప్‌, జింపింగ్‌ ఏమి చెప్పినప్పటికీ వాణిజ్య యుద్దం విషయంలో ఎవరూ వెనక్కి తగ్గినట్లు కనిపించటం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రతి వారూ వాణిజ్యం గురించి మాట్లాడుతూ మనం తప్పు చేయకూడదని చెబుతున్నారు. వాటిని విన్నవారికి ఏదో ఒక పరిష్కారానికి వస్తారన్న ఆశకలుగుతుంది, కానీ వారి నడక తీరు చూస్తే మరింత ప్రతికూలంగా సాగుతున్నట్లు కనిపిస్తోందనే చెప్పవచ్చు. మరో 350బిలియన్‌ డాలర్ల వుత్పత్తుల మీద పన్నులు విధించాల్సి వున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ పని చేయటం లేదని ట్రంప్‌ చెప్పారు. అయితే ఒసాకా నుంచి వాషింగ్టన్‌ చేరేలోగా ట్రంప్‌ వైఖరిలో మార్పు రాదని చెప్పలేము. ఎప్పుడు ఏమి మాట్లాడతారో, ఏం చేస్తారో వూహించలేము. రెండు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయి మరింత సంక్లిష్టం అవుతుందా అన్నట్లుగా తయారైన అంశం తెలిసిందే. అదే జరిగితే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ అతలాకుతలం అయ్యే అవకాశం వుందని భయపడిన వారంతా ఈ సమావేశాల్లో రెండు దేశాల వైఖరి ఎలా వుంటుందా అని ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు.

అగ్రరాజ్యాల మధ్య తలెత్తిన పోటీ నివారణకు గాను ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ)ను ఏర్పాటు చేసినప్పటికీ ఏ దేశానికి ఆదేశం రక్షణాత్మక విధానాలను చేపట్టటంతో దానితో నిమిత్తం లేకుండానే, సంస్ధ స్ఫూర్తికి విరుద్దంగా దాని వెలుపల దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవటం ఎక్కువైంది. దీంతో రక్షణాత్మక చర్యలను నిరోధించేందుకు సంస్కరణలు అవసరమనే అజెండా ముందుకు వచ్చింది. అవును నిజమే, సంస్కరణలు తేవాల్సిందే అనే అభిప్రాయం ఒసాకాలో కూడా వెల్లడైనప్పటికీ పిల్లి మెడలో గంట కట్టేదెవరన్నట్లుగా పరిస్ధితి తయారైందని చెప్పవచ్చు. బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జరిగిన గత సమావేశంలో రక్షణాత్మక చర్యలకు దూరంగా వుండాలని అమెరికా కోరింది. అయితే ఆచరణలో ఈ కాలంలో చూస్తే అమెరికన్లు బస్తీమే సవాల్‌ అంటూ అనేక దేశాల మీద పన్నులు విధించి తమ షరతులకు అంగీకరించే విధంగా వత్తిళ్లకు పూనుకున్న విషయం తెలిసిందే. ఆంబోతుల వంటి అమెరికా-చైనాలు ముందుగా ఒక అంగీకారం, అవగాహనకు వస్తే తమ పని సులభం అవుతుందని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య వివాదం పరిష్కారం కావాలని తాము ఆశిస్తున్నట్లు ఎగుమతి ఆధారిత ఆర్దిక వ్యవస్ధ వున్న జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఒసాకాలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ అంశాల గురించి తాను ట్రంప్‌తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. అమెరికన్లు ఒకవైపు జర్మనీ, రెండోవైపు చైనాతో కూడా లడాయి పడుతున్న విషయం తెలిసిందే.ప్రపంచ వాణిజ్య సంస్ధలో సంస్కరణలు అవసరమని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా నేతల సమావేశంలో మోడీ మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలు, వివాదాలతో ప్రపంచ వ్యవస్ధ నడుస్తోందని, ఈ పూర్వరంగంలో డబ్ల్యుటిఓను సంస్కరించాలని అన్నారు.

Image result for G20 Osaka 2019 summit revealed deep divides

ఏకపక్ష నిర్ణయాలను ఎదుర్కోవాలని ఈ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, భారత ప్రధాని నరేంద్రమోడీ ఒక సంయుక్త ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ముగ్గురు నేతల సమావేశ అనంతరం ఈ ప్రకటన వెలువడింది.దీనిలో అమెరికా పేరు ప్రస్తావన లేనప్పటికీ దాని గురించే అన్నది స్పష్టం. అంతర్జాతీయ చట్టాల మీద ఆధారపడాలని, జాతీయ సార్వభౌమత్వాలను గౌరవించాలని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సమావేశాల్లో పర్యావరణ సమస్యల మీద ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నారు.అయితే పర్యావరణాన్ని కాపాడాలనే సాధారణ తీర్మానాన్ని ఒక తంతుగా ఆమోదించారు. విడిగా మాట్లాడినపుడు కొన్ని దేశాల వారు పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి వుండాలని కోరారు. ఈ అంశంపై తయారు చేసిన ప్రకటనలో ఎక్కడా 2015నాటి పారిస్‌ ఒప్పందం గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవటంతో తాము సంతకం చేయటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించారు. పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా, జపాన్‌ కూడా దాని ప్రస్తాన ఒసాకా ప్రకటనలో వుండరాదని పట్టుబట్టాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాలో కమ్యూనిస్టులకు చోటు, వెసులుబాటు !

23 Sunday Jun 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

100 years US Communist Party, American Communist Party, CPUSA, CPUSA organization’s 31st National Convention, HAY MARKET, Wahsayah Whitebird

Wahsayah Whitebird, shown here attending the Communist Party USA's 2019 convention in Chicago, Ill., won election to the Ashland, Wisconsin, city council in a nonpartisan election in April 2019.  (James Varney/The Washington Times)

ఎం కోటేశ్వరరావు

పార్టీ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేయాలా, డెమాక్రటిక్‌ పార్టీ వంటి వాటిలోని వామపక్ష శక్తులకు మద్దతు ఇవ్వాలా అన్నది అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలోని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాలు ఎదుర్కొంటున్న ఒక సమస్య. ఆ సమాజాలలో రెచ్చగొట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకత ఆ పరిస్ధితిని సృష్టించింది. అయితే అమెరికాలోని ఒక యువ కమ్యూనిస్టు, మన పరిభాషలో చెప్పాలంటే ఒక గిరిజన యువకుడికి అలాంటి పరిస్ధితి ఎదురుకాలేదు. చికాగో నగరంలో జరిగిన అమెరికా కమ్యూనిస్టు పార్టీ 31వ మహాసభ, పార్టీ శతవసంతాల వుత్సవాలకు ప్రతినిధిగా హాజరైన విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని ఒక చిన్న మున్సిపాలిటీ ఆష్‌లాండ్‌ కౌన్సిలర్‌గా ఏప్రిల్‌ నెలలో ఎన్నికైన వాహ్‌సయా వైట్‌బర్డ్‌ గురించి ఒక పత్రిక వెల్లడించిన కధనం ఎంతో ఆసక్తికరంగానూ, అమెరికా సమాజంలో వస్తున్న మార్పు సూచికగా కనిపిస్తున్నది. అమెరికా రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ వైఖరిని చెప్పటానికి,వునికిని కొనసాగించటానికి చోటు, వెసులుబాటు వుందంటారు వైట్‌బర్డ్‌. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలకు ముందు తన రాజకీయ వైఖరి ఏమిటని ఎవరూ అడగలేదు, అడిగిన తరువాత వెంటనే 2011 నుంచి కమ్యూనిస్టుగా వున్నట్లు తెలిపే నా పార్టీ గుర్తింపు కార్డును వారికి చూపించాను. ఎన్నికలకు ముందు స్ధానిక మీడియా వారు పార్టీ అనుబంధం గురించి అడిగారు, అదొక సమస్యగా నాకు అనిపించలేదు, ఎన్నికలలో నేను పేదల వేదిక పేరుతో పోటీ చేశాను, పేదలకు అందుబాటులో గృహాలు, కనీసవేతనం పెంపు, ఇండ్లు లేని వారికి ఆశ్రయాలు కల్పించాలనే అజెండాను ఓటర్ల ముందు పెట్టాను, డెమోక్రటిక్‌ పార్టీ ప్రత్యర్ధి మీద గెలిచాను. పార్టీ గుర్తు మీద పోటీ చేయటం ఒక సమస్య కాదనుకుంటున్నాను. పార్టీ తన స్వంత అభ్యర్ధులను నిలిపేందుకు ప్రయత్నించాలి.ఇతరులతో కూటమి కట్టాలి. కీలకమైన అంశం విధానాల మీద వుండాలి, పాక్షికమైన అనుబంధాల మీద కాదు. అని చెప్పాడు. ఒక బేకరీ కార్మికుడిగా అతను పని చేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ భావజాలం ఆధిపత్యం సాధిస్తుందని చెప్పబోవటంలేదు గానీ తాను పని చేస్తున్న గ్రామీణ విస్కాన్సిన్‌ రాష్ట్రంలో తాను చెప్పే అంశాలను వినేవారు వున్నారంటూ కొన్ని అంశాలలో స్ధానిక సంస్ధలలో పన్నులు పెంచకుండా,ప్రస్తుతం లాభాలే లక్ష్యంగా పని చేస్తున్న చోట తక్కువ రేట్లతో కొన్ని పనులు చేయవచ్చు అన్నారు. రియలెస్టేట్‌ను ప్రజోపయోగ కంపెనీగా నడిపితే జనం మీద భారం పడదని తాను గుర్తించానన్నారు.

Communist Party USA celebrates its 100th birthday at Chicago convention

అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ చాలా పరిమితమైనది. మూడు రోజుల జాతీయ మహాసభ, శతవసంతాల వుత్సవం శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగింది.ప్రతినిధులు చికాగోలోని హేమార్కెట్‌ (మేడే పోరాటాలు జరిగిన ప్రాంతం)ను సందర్శించటంతో శుక్రవారం నాడు సభలు ప్రారంభమయ్యాయి. అనేక దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు సౌహార్ధ ప్రతినిధులుగా వచ్చారు. వెనెజులా కమ్యూనిస్టు యువజన విభాగ ప్రతినిధి అలెక్స్‌ గ్రానాడో ఇచ్చిన సందేశానికి పెద్ద ఎత్తున ప్రతినిధులు ప్రతిస్పందించారు. ప్రారంభ సభలో చికాగో నగరానికి నల్లజాతికి చెందిన తొలి మేయర్‌ హరోల్డ్‌ వాషింగ్టన్‌ సన్నిహితుడిగా వుండి 1983లో హత్యకు గురైన కమ్యూనిస్టు రూడీ లోజోనో కుమారుడు పెపె లోజోనో, గతంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున వుపాధ్యక్షపదవికి పోటీ చేసిన, ప్రస్తుతం పార్టీ వుపాధ్య క్షుడిగా వున్న జార్విస్‌ టైనర్‌ తదిరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మీద వున్న ఆరోపణలను తిప్పి కొట్టాలని, అమెరికాకు శాంతి, సమానత్వం, సోషలిజాలను తీసుకు రావాలని జార్విస్‌ టైనర్‌ చెప్పారు. కమ్యూనిస్టు వ్యతిరేకత అనేది పెద్ద అబద్దమని, అది ఇప్పుడు వైట్‌హౌస్‌లో నివాసం వుందని అన్నారు. యుద్దం, జాత్యంహంకారం, అసమానతల వైపు నెడుతున్నారని, యజమానులకు లొంగిపోవాలని కార్మికులను ఒప్పించేందుకు చూస్తున్నారని అన్నారు.

పార్టీ ప్రతినిధుల సభ శనివారం నాడు ప్రారంభమైంది. అధ్యక్షుడు జాన్‌ బాచ్‌టెల్‌ ప్రారంభ వుపన్యాసం చేస్తూ దేశంలో పార్టీ నిర్మాణం, సమస్యలను వివరించారు.డోనాల్డ్‌ ట్రంప్‌ కార్పొరేట్‌, పచ్చి మితవాదుల ప్రతిబింబంగా వున్నాడని పెద్ద ఎత్తున ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడని చెప్పారు. అహింసా పద్దతుల్లో ఎన్నికల ద్వారా సోషలిజాన్ని తీసుకురావాలని కోరారు. కార్మికవర్గ పోరాటం వీధులతో పాటు భావజాల రంగంలో కూడా కొనసాగించాలన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు డెమోక్రటిక్‌ పార్టీలో బెర్నీ శాండర్స్‌, ఎలిజబెత్‌ వారెన్‌, కమలా హారిస్‌,జో బిడెన్‌ వంటి వారు 24 మంది అభ్యర్ధిత్వం కోసం పోటీపడుతున్నారని, ఎవరు సరైన వ్యక్తి అన్నది ఇంతవరకు నిర్ణయం కాలేదన్నారు. అధికారాన్ని నిలుపుకొనే ప్రక్రియలో భాగంగా పురోగామి, వామపక్ష శక్తుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు మితవాదులు అబద్దాలు, తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని బాచ్‌టెల్‌ చెప్పారు. కార్మికవర్గంలో వున్న భయాలు, అభద్రతాభావాలను వుపయోగించుకొని ఆర్ధిక జాతీయవాదాన్ని ముందుకు తెచ్చి దోపిడీ చేయాలని చూస్తున్నారన్నారు. వర్గ, శ్వేత, పురుషాధిక్యాలను ప్రదర్శిస్తూ అవినీతి, యూనియన్లను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. పచ్చిమితవాదులు, రిపబ్లికన్‌ పార్టీని ఓడించటం అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు.చమురు వ్యాపారులు, మిలిటరీ-పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ శక్తులతో అవి నిండి వున్నాయని అన్నారు. అధికారికంగా నమోదు కాని పదిలక్షల మంది వలసకార్మికులను దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్‌ అనుకుంటే అతగాడు నరకానికి పోతాడని బాచ్‌టెల్‌ అన్నారు.

Communist Party chair declares at convention: “Trump can go to hell!”

మితవాద శక్తుల ప్రభావానికి వ్యతిరేకంగా జరిగే పోరులో పార్టీకి ప్రత్యేకించి యువతరం కావాలని, పార్టీ ప్రతినిధులను చూస్తే యువజన ప్రాతినిధ్యం, భిన్న సామాజిక తరగతులు వుండటం దీన్ని ప్రతిబింబిస్తున్నదని బాచ్‌టెల్‌ అన్నారు. 202 మంది ప్రతినిధుల్లో మూడింట రెండువంతుల మంది 44సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు వారని, 10.3శాతం ఆఫ్రికన్‌ అమెరికన్లు, మరో 10.3శాతం లాటినోలు, ఐదుశాతం ఆఫ్రో కరీబియన్లు, 9.2శాతం మంది యూదులు వున్నారు. అయితే మహిళలు 30శాతమే వున్నారని, ఈ అసమతూకాన్ని సరిదిద్దాలని అన్నారు. ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత పార్టీ సభ్యత్వం పెరిగిందని, అనేక మంది స్ధానిక బృందాలు, సామాజిక వుద్యమాల్లో చేరుతున్నారని, వారిలో ఎక్కువ మంది నేడు డెమోక్రటిక్‌ పార్టీలో వుంటూనే కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా కూడా వుంటున్నారని, రేపటి కార్మికవర్గ పార్టీకోసం అందరూ కలసి పని చేయాలని చెప్పారు.

కమ్యూనిస్టుపార్టీ కనీస వేతన చట్టం, సామాజిక భద్రత, కార్మిక సంబంధాల జాతీయచట్టం, అందరికీ వైద్యం, నిరుద్యోగ పరిహారం వంటి ఇతర పురోగామి అంశాలతో పాటు ఆఫ్రో అమెరికన్ల అణచివేతకు, ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్న కమ్యూనిస్టుల భావజాలం నేడు ప్రధాన స్రవంతి చర్చగా వుందన్నారు.మనకు ఒక స్వప్నం వుంది. దానిలో గోడలు వంతెనలుగా, ఆయుధాలు నాగళ్లుగా, పెట్టుబడిదారులు అంతరించిపోయిన రాజులు, డైనోసార్సుగా మారతారు. మన ముందున్న సవాలుకు ధీటుగా మనం పెరిగితే ఇదే మన భవిష్యత్‌ అని బాచ్‌టెల్‌ చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చి రాగాలకు నరేంద్రమోడీ నాట్యం చేస్తున్నారా ?

23 Sunday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

military strike on targets in Iran, President Donald Trump, US aborted strikes on Iran

Image result for is narendra modi dancing to donald trump insane tunes

ఎం కోటేశ్వరరావు

డోనాల్డ్‌ ట్రంప్‌కు పిచ్చి పట్టిందా, ఆ పిచ్చివాడి ప్రేలాపనలు, చర్యలకు అనుగుణంగా మారు మాట్లాడకుండా భారత్‌తో సహా అనేక దేశాలు నృత్యం చేయటం ఏమిటి? ఆ పిచ్చి మనకూ సోకిందా ? ఇరాన్‌ మీద దాడి చేయమని ట్రంప్‌ ఆదేశించటం ఏమిటి, చివరి నిమిషంలో ఆపేయండి అనటం ఏమిటి, అంతలోనే అసలు నేను దాడికి సిద్దం కమ్మని చెప్పానే తప్ప అంతిమ ఆదేశం జారీచేయలేదని అనటం ఏమిటి, పిచ్చిగాక పోతే అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇరాన్‌ గగన తలం మీద నుంచి మన విమానాలు ఎగరకూడదని అమెరికా తన సంస్ధలను ఆదేశించింది. మనతో సహా మిగతా దేశాలకు ఏమైంది. మన విమానాలను కూల్చివేస్తామని ఇరాన్‌ ప్రకటించలేదే, అటువంటి వాతావరణం కూడా లేదే, అయినా మనం కూడా మరో దారిలో ప్రయాణించాలని నిర్ణయించాం. ఇది విమాన సంస్ధల మీద లేదా ప్రయాణీకుల మీద భారం మోపదా ? అమెరికా కోసం మనం ఇరాన్‌తో వైరం తెచ్చుకోవాలా? ఇవన్నీ జనానికి సంబంధించిన ప్రశ్శ లు. అమెరికా అడుగులకు మడుగులొత్తాలని పాలకులెప్పుడో నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల పూర్వరంగంలో తమపై దాడి జరిగితే దాన్ని తిప్పికొట్టేందుకు సర్వసన్నాహాలతో వున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.

మరోవైపు నుంచి ఆలోచిస్తే ట్రంప్‌ పిచ్చివాడా, ఇది నిజమా ? కానే కాదు, ప్రపంచాన్ని తన గుప్పిటలో పెట్టుకోవాలనుకుంటున్న అమెరికా సామ్రాజ్యవాదులు ఒక పిచ్చివాడిని గద్దె మీద కూర్చోపెట్టేంత అమాయకులా కానే కాదు, కాదు. మరి ఎందుకలా ప్రవర్తిస్తున్నారు ! డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యల గురించి అనేక మంది పరి పరి విధాలుగా అలోచిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. ఎందుకిలా చేశారు, కారణం ఏమై వుంటుంది. గత కొద్ది వారాల పరిణామాలను చూస్తే ఇరాన్‌ మీద ఆధారరహిత నిందలు మోపేందుకు, రెచ్చగొట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. తాజాగా వచ్చిన వార్తల మేరకు అమెరికన్లు గురువారం వుదయం ఇరాన్‌ గగనతలం మీదకు ఒక గూఢచారి డ్రోన్‌ను పంపారు, దాని వెనుకనే 35మంది సైనికులు వున్న మిలిటరీ విమానమూ వుంది. అనుమతి లేకుండా తమ గగనతలాన్ని అతిక్రమించిన డ్రోన్‌ను ఇరాన్‌ గార్డులు కూల్చివేశారు. మిలిటరీ విమానం కూడా ఇరాన్‌ గగనతలంలో ప్రవేశించిందా లేదా అన్నది తెలియదు. అసలు మిలిటరీ విమానాన్ని పంపలేదని అమెరికా చెబుతోంది. తమ డ్రోన్‌ అంతర్జాతీయ జలాల పరిధిలో వుంది కనుక కూల్చివేత దుర్మార్గమంటూ ఇరాన్‌ మీద దాడి చేయాలని ట్రంప్‌ వెంటనే ఆదేశాలిచ్చాడని, అయితే ఆరోజు రాత్రేే నిలిపివేయమని చెప్పినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ద్వారా లోకానికి వెల్లడించారు. తరువాత ఒక జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానసలు అంతిమ ఆదేశాలు ఇవ్వలేదు, విమానాలు గాల్లోకి ఎగరలేదని ట్రంప్‌ స్వయంగా చెప్పాడు. డ్రోన్‌ కూల్చివేత పూర్వరంగంలో ఇరాన్‌ గగన తలం మీదుగా విమానాలను నడపవద్దని అమెరికా తన విమాన సంస్ధలను కోరింది. ఇంకేముంది పొలోమంటూ మనతో సహా మిగతా దేశాలు కూడా అదే పని చేశాయి. అయితే ఇరాన్‌ రాజధాని టెహరాన్‌కు నడిపే విమానాలను ఇతర దేశాలు రద్దు చేయలేదని, గతం మాదిరే నడిపాయని వార్తలు వచ్చాయి. ఇదొక ప్రచార, మానసిక యుద్ధం తప్ప వేరు కాదు.

తాను ఆదేశించినట్లుగా దాడులు జరిగితే నిర్ధేశిత లక్ష్యాలను దెబ్బతీయటంతో పాటు 150 మంది పౌరుల ప్రాణాలు పోతాయని అందువలన దాడులను నిలిపివేసినట్లు ట్రంప్‌ పేర్కొన్నాడు. అయితే లక్ష్యాలతో పాటు ప్రాణ నష్టాల గురించి వివరించిన తరువాతే ట్రంప్‌ దాడి ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్‌ పత్రిక పేర్కొన్నది. అందువలన ట్రంప్‌ ఆడిన అబద్దాలలో ఇదొకటిగా మిగిలిపోయింది. ట్రంప్‌ చర్య వెనుక కారణాలేమిటి అని అనే మీడియా వూహాగానాలలో ెముఖ్యమైౖనవి ఇలా వున్నాయి.కమాండర్‌ తప్పిదం తప్ప డ్రోన్‌ను కూల్చివేయాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడాలని ఇరాన్‌ నాయకత్వం అనుకోలేదని ట్రంప్‌కు తెలిసిందట, దాంతో దాడుల విరమణకు ఆదేశాలిచ్చినట్లు అమెరికన్‌ మాజీ జనరల్‌ జాక్‌ కియానే ఫాక్స్‌ బిజినెస్‌ ఛానల్‌కు చెప్పాడు. తన ఆదేశాల మేరకు మరో పదినిముషాల్లో విమానాలు బయలు దేరుతాయనగా దాడులు జరిగితే 150 మంది పౌరులు మరణిస్తారని తెలిసిన వెంటనే ఆపమని చెప్పారన్నది ఒక కధనం. అయితే జరిగే ప్రాణనష్టం గురించి కూడా వివరించిన తరువాతే దాడులకు ఆదేశాలిచ్చినట్లు అమెరికన్‌ అధికారులు తమకు చెప్పినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక పేర్కొన్నది. ఇరాన్‌ రక్షణ వ్యవస్ధలను తప్పించుకొనే బి2 బాంబర్లు సిద్ధం కానందున దాడులను నిలిపివేసినట్లు ఒక అధికారి ఓక్స్‌ విలేకరికి చెప్పగా దాడి జరిగితే చమురు సంక్షోభం తలెత్తవచ్చని, అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు నష్టం జరగవచ్చని భావించిన ట్రంప్‌ నిలిపివేతకు ఆదేశించినట్లు మరో అధికారి ఓక్స్‌ విలేకరికి చెప్పటం గమనార్హం. గురువారం రాత్రి ఫాక్స్‌న్యూస్‌ ఛానల్‌లో టక్కర్‌ కార్ల్సన్‌ ఇరాన్‌ మీద దాడి చేయవద్దని చేసిన వినతికి స్పందించి ట్రంప్‌ వెంటనే దాడి నిలిపివేయాలని కోరినట్లు మరొక కధనం. చర్చలకు అంగీకరించకపోతే దాడులు చేస్తామని ట్రంప్‌ బెదిరించాడు, ఏం చేస్తావో చేసుకో అన్నట్లుగా ఇరాన్‌ స్పందించలేదు, దాంతో ట్రంప్‌ వెనక్కు తగ్గాడని ఇరాన్‌ వర్గాలు చెప్పినట్లు రాయిటర్‌ పేర్కొన్నది. అయితే అసలు కారణం ఏమిటన్నది అధ్యక్ష భవన ప్రతినిధి ఎవరికీ చెప్పలేదు. వూహాగానాలను అవునని గాని కాదని గాని ఖండించలేదు. గూఢచార డ్రోన్‌తో పాటు సైనికులున్న విమానం కూడా ఎగిరిందా లేదా అన్నది అమెరికన్లు నిర్ధారించలేదు.

ఇదంతా చూస్తుంటే ఇరాన్‌ ఆదమరచి వున్న సమయంలో దెబ్బతీయటానికి ఇలాంటి ఆదేశాలు, నిలిపివేతల నాటకం ఆడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో యుద్దోన్మాదులు ఇలాంటి అనేక నాటకీయ పరిణామాలకు పాల్పడినందున దేన్నీ కొట్టివేయలేము. అయితే ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ఇరాన్‌ అన్ని విధాలుగా సన్నద్దంగానే వున్నట్లు కనిపిస్తోంది. అమెరికా రెచ్చగొట్టిన వాటికి సమాధానం ఇవ్వటం తప్ప తానుగా ఇంతవరకు రెచ్చిపోయిన వుదంతం లేదు. చమురు ఓడల మీద ఇరాన్‌ దాడులు చేసినట్లు అమెరికా చెప్పటమే తప్ప ఆధారాలు లేవు. డ్రోన్‌ కూల్చివేయటం ఒక్కటే నిజం. అది తన గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించినా కూల్చకపోతే భయపడినట్లు ప్రపంచం భావిస్తుందని ఇరాన్‌కు తెలుసు కనుకనే కూల్చివేసింది. ఒక వేళ సంయమనం పాటించి కూల్చకపోతే చూశారా, వారి గగన తలంలోకి మేము ప్రవేశించినా చూస్తూ వుండిపోయిందని అమెరికన్లు ప్రచారం చేసుకొనే అవకాశమూ వుంది. ఇదంతా రెచ్చగొట్టే ఒక దుష్ట క్రీడ తప్ప వేరే కాదు. అమెరికా విదేశాంగ మంత్రి, రక్షణ సలహాదారు, సిఐఏ డైరెక్టర్‌ వంటి వారందరూ దాడులకు అనుకూలంగా వున్నప్పటికీ ట్రంప్‌ వైఖరి అలా లేదనే ప్రచారమూ జరుగుతోంది. రాజు మంచివాడేగానీ మంత్రులూ, సలహాదారులే చెడ్డవారు అని చెప్పటం వంటిదే. ఇరాన్‌ మీద దెబ్బకు దెబ్బ తీయాలంటూ జనం నుంచి స్పందన వెల్లువెత్తింది, దాన్ని చూసిన తరువాత ఎంత మంది చనిపోతారని నేను అడిగాను, 150 మంది సర్‌ అని ఒక జనరల్‌ చెప్పాడు. వెంటనే డాడి ఇంకా పదినిమిషాల్లో జరగనుందనగా ఆపేయమని చెప్పా, వారు మానవ రహిత డ్రోన్‌ను కదా కూల్చింది, నాకేం తొందరలేదు’ అని స్వయంగా ట్రంప్‌ చెప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి తొలుతదాడికి ఆదేశాలెందుకు ఇచ్చినట్లు ? అమెరికా విమానాలను ఇరాన్‌ గగనతలంలోకి ప్రవేశించవద్దని ఆదేశాలు ఎందుకు జారీ చేసినట్లు ?

Image result for narendra modi dancing to donald trump tunes

ఇరాన్‌ మీద దాడి చేస్తే వుపయోగం ఏమిటి, నష్టాలేమిటి అనే విషయాన్ని అమెరికా వ్యూహకర్తలు తేల్చుకోలేకపోతున్నారా అనే పద్దతుల్లో కూడా విశ్లేషణలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు ట్రంప్‌ నిర్ణయించుకున్నాడు. శతృవులుగా ప్రకటించిన దేశాల పట్ల కఠినంగా వున్నట్లు కనిపించకపోతే ట్రంప్‌ శిబిరం డీలా పడిపోతుంది. అందువలన అలా కనిపించాలి, ఆచరణలో అడుగు ముందుకు వేయకుండా ఎదుటి వారి మీద వత్తిడి తేవాలి, అది మెక్సికోతో సరిహద్దు మూసివేత, చైనాతో వాణిజ్య యుద్దం, రాయితీలను రద్దు చేసి భారత్‌ను బెదిరించటం వంటిది ఏదైనా కావచ్చు. ఇరాక్‌ మీద దాడికి పాల్పడి సీనియర్‌ బుష్‌ భయంకరమైన తప్పిదం చేశారని ట్రంప్‌ విమర్శిస్తుంటారు. అలాంటి పెద్ద మనిషి అంతకంటే బలమైన ఇరాన్‌ మీద దాడి చేసేందుకు మరో తప్పిదం చేస్తాడా ? రెండవది ట్రంప్‌ను వెనక్కు లాగే అంశాలలో ఆర్ధిక వ్యవస్ధ. యుద్దం చేస్తామన్న ప్రకటనతోనే చమురు ధరలు పెరిగాయి, నిజంగా చేస్తే పరిస్ధితి ఏమిటి? తనతో పాటు తనను నమ్ముకున్నవారూ మునుగుతారు అనే సంశయం. అన్నింటా అమెరికాకే అగ్రస్ధానం కోసం ప్రయత్నించాల్సిందేగానీ తెగేదాకా లాగి సుదూర ప్రాంతాలలో యుద్ధాలలోకి దిగితే నష్టమే తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదుకనుక, అమెరికన్ల ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు తొందరపడవద్దు అనే వత్తిడి ట్రంప్‌మీద వుంది. ఒక వేళ ట్రంప్‌ గనుక ఇప్పుడు యుద్ధాన్ని ప్రారంభిస్తే అది ఏవో కొన్ని దాడులు చేసి వదిలివేస్తే వచ్చే ఏడాది నవంబరు ఎన్నికల్లో పరువుపోతుంది. దీర్ఘకాల దాడికి పూనుకుంటే అది ఆలోగా ముగిసే అవకాశం వుండదు, అది మరింకా నష్టం. ఇది ఒక గుంజాటన అయితే అమెరికా అధ్యక్షుడిగా వుండి ఒక్క యుద్ధాన్ని కూడా ప్రారంభించకపోతే చరిత్రలో అసమర్ధుడిగా మిగిలిపోతానేమో అనేది కూడా ట్రంప్‌ను యుద్ధం వైపు లాగుతోందని చెప్పవచ్చు.

ఒకటి మాత్రం స్పష్టం. ఇరాన్‌తో జగడం గతంలో ఇరాక్‌ మీద దాడికి దిగినంత సులభం కాదు. రష్యా, చైనాలు ఇరాన్‌కు బాసటగా వుంటాయన్నది ఇప్పటి వరకు వెల్లడైన వైఖరి. అమెరికన్లు ఇప్పుడు అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నందున వారి వైఖరిలో అనూహ్య మార్పులు జరుగుతాయని అనుకోలేము. ఏక్షణంలో అయినా మరోసారి అమెరికా, ఇతర ధనిక దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మాంద్య సంక్షోభంలోకి జారుతాయని వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమా లేక సాధారణ అమెరికన్లకు మానసికంగా దేనికైనా సిద్ధం చేసేందుకు చేస్తున్న ప్రచారమా అన్నది చూడాల్సి వుంది. ధనిక దేశాల ఆర్దిక వ్యవస్ధల తీరుతెన్నులను చూస్తే సమీప భవిష్యత్‌లో కోలుకొనే అవకాశాలు కనిపించటం లేదు. దాన్నుంచి తప్పించుకొనేందుకే అమెరికా ఇప్పుడు చైనాతో వాణిజ్య యుద్దం, భారత్‌ వంటి దేశాల మీద వత్తిడి అని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హాంకాంగ్‌ ఆందోళన వెనుక అసలు కధ ఏమిటి ?

19 Wednesday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Carrie Lam, china communist party, HONG KONG, Hong Kong Extradition Bill, Hong kong protests, Umbrella Movement

Image result for Hong kong protests

ఎం కోటేశ్వరరావు

హాంకాంగ్‌ ఈ మధ్య ప్రపంచ వార్తల్లోకి వచ్చిన ప్రాంతం. అక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన వార్తలను చదివేవారికి అదొక ప్రత్యేక దేశం అనే భ్రమ కలిగే అవకాశం వుంది. ఎందుకంటే అక్కడ నేరాలకు పాల్పడిన వారిని విచారించేందుకు చైనా ప్రధాన భూభాగానికి పంపేందుకు హాంకాంగ్‌ పాలనా వ్యవస్ధ ఒక బిల్లును ఆమోదించేందుకు గత కొన్ని నెలలుగా అవసరమైన చర్యలను చేపట్టింది. ఇంకేముంది మా స్వేచ్చకు ముప్పు వచ్చింది అని బిల్లును వ్యతిరేకించిన వారు ఆందోళనకు దిగారు.నిజమే అన్యాయం అంటూ అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు వారికి మద్దతు పలికాయి. జనంలో తలెత్తిన వుద్రేకాలను తగ్గించేందుకు బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టి చర్చలు జరుపుతామని ప్రత్యేక పాలనా అధికారి ప్రకటించిన తరువాత కూడా ఆందోళనలు ఆగలేదు, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి, స్వాతంత్య్రం అంటూ డిమాండ్లను ముందుకు తెస్తున్నారు. పోలీసులను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యగా మార్చేందుకు కొట్లాటలకు దిగుతున్నారు. దీన్ని బట్టి నేరస్ధుల అప్పగింత కంటే మించిన అంశాలు ఈ ఆందోళన వెనుక వున్నాయన్నది స్పష్టం.గత మూడు దశాబ్దాలుగా హాంకాంగ్‌ను అడ్డం పెట్టుకొని విదేశాలు చైనా మీద వత్తిళ్లు తెస్తున్నాయంటే అతిశయోక్తికాదు. హాంకాంగ్‌ న్యాయవ్యవస్ధలో వున్న లోపాలను సరి చేసేందుకు, నేరాలకు సంబంధించి పరస్పరం సహకరించుకొనేందుకు గాను నేరస్ధుల అప్పగింతతో సహా మరికొన్ని అంశాలను దానిలో పొందుపరిచారు.నేరగాండ్లను ఒక్క చైనా ప్రధాన భూభాగానికే కాదు, తైవాన్‌కు సైతం అప్పగించేందుకు కూడా దానిలో నిబంధనలను పొందుపరిచారు. ఆందోళనల పూర్వరంగంలో బిల్లును వాయిదా వేయటం, చర్చలు జరుపుతామన్న ప్రకటనను చైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ‘స్వేచ్చ కోసం జరిగే ప్రపంచ యుద్ధంలో ముందు పీఠీన జరిగే పోరులో హాంకాంగ్‌ ‘అనే శీర్షికతో అమెరికాకు చెందిన టైమ్‌ పత్రిక ఒక ముఖచిత్ర కధనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పోరుకు నాయకులెవరూ లేరని, దానంతట అదే తలెత్తిన విద్యార్ధులు, యువకుల వుద్యమం అని ప్రపంచ మీడియాలో కథనాలను వండి వారుస్తున్నారు. జూన్‌ పన్నెండవ తేదీ ప్రదర్శనల గురించి టైమ్‌ కధనం ఇలా ప్రారంభం అయింది. గుమికూడిన గుంపులు కేవలం ఒక గాలివానను తట్టుకొనేందుకు అవసరమైన ఏర్పాట్లతోనే రాలేదు, అలాంటిదొకటి వస్తుందని వారు లెక్కవేసుకుంటున్నారు. వర్షం ప్రారంభం కాగానే ‘గా యావ్‌ ‘ అంటూ గొడుగులు పట్టుకున్నవారందరూ ఒక్కసారిగా కేకలు వేశారు.( దాని అర్ధం అగ్నికి ఆజ్యం పోయండి అని) కొద్ది గంటల్లోనే వచ్చిన అనేక గుడారాలతో తాత్కాలిక రక్షణ శిబిరాలు తయారయ్యాయి. పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించినా, పెప్పర్‌ స్ప్రే చల్లినా తప్పించుకొనేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. ఇలాంటి ఆందోళన అసంఘటితమైనదని, ఎవరూ వెనుక లేరని లోకాన్ని నమ్మింప చూస్తున్నారు. తొంభై తొమ్మిదిసంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారి పాలనలో ఎలాంటి హక్కులూ లేనపుడు అక్కడి వారికి స్వేచ్చ, స్వాతంత్య్రాలు కావాలని అనిపించలేదు. ఎలాంటి ప్రజావుద్యమాలూ జరపలేదు. ఆకస్మికంగా చైనాలో విలీనమైన తరువాత వాటికోసం వారు ఆందోళన ప్రారంభించారని ప్రపంచానికి చెబుతున్నారు.

హాంకాంగ్‌ చైనాలో అంతర్భాగమే అయినప్పటికీ ఒక ప్రత్యేక పాలిత ప్రాంతం. తొంభై తొమ్మిది సంవత్సరాల బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత 1997లో అది చైనాలో విలీనమైంది. అయితే అది ఒక అంతర్జాతీయ ఓడరేవుగా, పెద్ద వాణిజ్య కేంద్రంగా అప్పటికే అభివృద్ధి చెంది వున్న కారణంగా, దాని తరువాత పోర్చుగీసు నుంచి అదే మాదిరి కౌలు గడువు తీరిన తరువాత చైనాలో విలీనం అయ్యే మకావో దీవులు, అప్పటికే తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ సమస్యలను దృష్టిలో వుంచుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ ఎన్నో తర్జన భర్జనల తరువాత ఒక వైఖరిని తీసుకుంది. ఒకే దేశం-రెండు వ్యవస్ధలు అని దాన్ని పిలిచారు. హాంకాంగ్‌ వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చెందితే, మకావో పెద్ద జూదకేంద్రంగా వలసపాలనలో మారింది. అందువలన అక్కడ వున్న ప్రత్యేక పరిస్ధితులు, పెట్టుబడులు, ఇతర సామాజిక అంశాలను గమనంలో వుంచుకొని 2050 వరకు అక్కడ వున్న పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగనిస్తామని, ఇతర దేశాల సంస్ధలతో మాదిరి అక్కడి కార్పొరేట్లు ప్రధాన భూభాగంలో పెట్టుబడులు పెట్టవచ్చని, వాటికి హామీ ఇస్తామని పాలక కమ్యూనిస్టు పార్టీ ఒక ఒప్పందం ద్వారా భరోసా ఇచ్చింది. విలీనాన్ని చైనా ఆక్రమణగా వక్రీకరిస్తున్నారు. ఆ గడువు మరో 30దశాబ్దాలలో ముగిసి చైనా సమాజంలో పూర్తిగా అంతర్భాగం కావాల్సివుంది. గడువు దగ్గర పడుతున్నకొద్దీ సాఫీగా హాంకాంగ్‌ను ఆవైపు నడిపేందుకు చైనా ప్రయత్నిస్తుండగా వేర్పాటు ధోరణులను రెచ్చగొట్టేందుకు, పరిస్ధితులను సంక్లిష్టం గావించేందుకు విలీన వ్యతిరేకశక్తులు, వారికి మద్దతు ఇస్తున్న అమెరికా, తదితర పశ్చిమ దేశాలు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపధ్యాన్ని అర్ధం చేసుకుంటేనే అక్కడి పరిణామాలు అర్ధం అవుతాయి.

బ్రిటీష్‌ పాలకులు హాంకాంగ్‌ను తమ వలసగా చేసుకున్న తరువాత ఏ రకమైన ప్రజాస్వామిక వ్యవస్ధనూ అమలు జరిపేందుకు వారెలాంటి ప్రయత్నమూ చేయలేదు. నామ మాత్ర పాలనా మండళ్లను ఏర్పాటు చేశారు, అదీ ధనికులకు మాత్రమే పరిమితంగా ఓటింగ్‌ హక్కు ఇచ్చారు, నామినేటెడ్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. 1948లో చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు, చాంగ్‌ కైషేక్‌, అతని నాయకత్వంలోని మిలిటరీ, బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాద దేశాల మద్దతుతో తైవాన్‌కు పారిపోయి దాన్ని స్ధావరంగా చేసుకొని చైనా పేరుతో అక్కడి నుంచి పాలన ప్రారంభించారు.ఐరాస కూడా 1970వరకు దానినే అసలైన చైనాగా గుర్తించింది. 1950 దశకంలో బ్రిటీష్‌ వారు హాంకాంగ్‌లో ప్రజాస్వామిక వ్యవస్ధను ఏర్పాటు చేస్తామంటూ ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రాంతాన్ని మరొక తైవాన్‌ మాదిరి తిరుగుబాటు ప్రాంతంగా చేయాలనే ఎత్తుగడ దాని వెనుక వుంది. అందుకే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించి గడువు మీరే వరకు ఒక వలస ప్రాంతంగానే వుంచాలి తప్ప మరొకవిధంగా చేయకూడదని స్పష్టం చేసింది. దాంతో వెనక్కు తగ్గిన బ్రిటీష్‌ వారు, 1997గడువు దగ్గరపడే కొద్ది స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామిక వ్యవస్దల ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించి అసమ్మతికి బీజాలు నాటారు. చైనాలో విలీనమైన తరువాత కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రత్యేక పాలనా మండలికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుపుతూ అందరికీ ఓటు హక్కు కలిగించింది. పైకి ఏమి చెప్పినప్పటికీ చైనాలో విలీనాన్ని వ్యతిరేకించే వారు, అనుకూలించేవారిగా చీలిపోయి పోటీ చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం చైనాలో విలీనానికి మొగ్గుచూపే వారు పాలకమండలిలో మెజారిటీగా వున్నారు.

తాజా ఆందోళన వెనుక అమెరికా, మరికొన్ని దేశాలు వున్నాయన్నది చైనా అభిప్రాయం. బిల్లును సమర్ధించేవారు నడుపుతున్న వెబ్‌సైట్‌ మీద దాడి జరిపిన వారి మూలాలు అమెరికాలో కనిపించాయి.మార్చినెలలో ఈ బిల్లును హాంకాంగ్‌ పాలక మండలికి సమర్పించిన వెంటనే స్పందించిన తొలి విదేశం అమెరికాయే. ఒక వేళ బిల్లును ఆమోదించినట్లయితే హాంకాంగ్‌కు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాల రద్దు గురించి ఆలోచించాల్సి వుంటుందని అమెరికా ప్రజాప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ బెదిరించారు. బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా కూడా అదేబాటలో నడిచాయి. జపాన్‌లో త్వరలో జరిగే జి20 సమావేశాల్లో తమ అధ్యక్షుడు ఈ అంశాన్ని లేవనెత్తుతారని అమెరికా విదేశాంగ మంత్రి మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించారు. బిల్లును వక్రీకరిస్తూ హాంకాంగ్‌ అంతటా అనేక కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. విద్యార్ధులు, ఇతరులను రెచ్చగొట్టేవిధంగా వాటి రాతలున్నాయి. ఈ బిల్లును గనుక ఆమోదిస్తే నిరుద్యోగం పెరుగుతుందని, మతాన్ని అణచివేస్తారని, ఇతర దేశాలకు వీసాలతో నిమిత్తం లేకుండా వెళ్లే అవకాశాలు రద్దవుతాయంటూ వాటిలో పేర్కొన్నారు. నిజానికి అలాంటి అంశాలే బిల్లులో లేవు. ఆ బిల్లు చట్టంగా మారితే నేరస్ధులకే కాదు, సామాన్య పౌరులకూ తరువాత పొడిగిస్తారు, నగరంలో ప్రవేశించే వారందరూ అనుమతి పాస్‌లు తీసుకోవాల్సి వుంటుంది. అందువలన మరోసారి నేను ఇక్కడకు రావాలా లేదా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది అని అమెరికా మాజీ దౌత్యవేత్త సీన్‌ కింగ్‌ వంటి వారు తప్పుడు ప్రచారాలు చేశారు. వుఘీర్స్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలను పాటించని వారిని పదిలక్షల మందిని నిర్బంధించారు, టిబెట్‌ బౌద్ధ వారసత్వాన్ని లేకుండా చేస్తున్నారంటూ జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించారు.

2016లో హాంకాంగ్‌ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆరుగురు చైనా వ్యతిరేకులు, హాంకాంగ్‌ వేర్పాటు వాద సభ్యులు ఒక వేదికగా చేసుకున్నారు. హాంకాంగ్‌ చైనా కాదు అని ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. హాంకాంగ్‌ దేశానికే తాము విధేయులమై వుంటామని ప్రమాణస్వీకారాన్ని అపహాస్యం చేశారు. చైనాను అవమానపరిచారు. దాన్నొక వుపన్యాస వేదికగా మార్చివేశారు. వారి ప్రమాణ స్వీకారం చెల్లదని అధికారులు ప్రకటించారు. అయితే వారి ప్రవర్తన సరిదిద్దుకొనేందుకు అవకాశం ఇస్తూ మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చారు. వారు దాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ తాము చేసింది తప్పుకాదంటూ సమర్ధించుకున్నారు. ఈ వివాదం కోర్టుకు వెళ్లింది. అక్కడి న్యాయమూర్తి వేర్పాటు వాదులకు వూతమిచ్చే విధంగా తీర్పు చెప్పారు. అంతకు ముందు హాంకాంగ్‌ కేంద్రంగా వున్న పుస్తక ప్రచురణకర్తల అరెస్టును వివాదం చేశారు. హాంకాంగ్‌ మరియు బ్రిటీష్‌ పౌరసత్వం వున్న ఇద్దరు చైనీయులు పుస్తక ప్రచురణ పేరుతో చైనా వ్యతిరేకతను, అశ్లీలంతో సహా అన్ని రకాల అరాజకత్వాన్ని రెచ్చగొట్టే విధంగా సాగిన రచనలను అక్రమంగా ముద్రించి పంపిణీ చేశారు. వారు సరైన పత్రాలు లేకుండా చైనాలో ప్రవేశించి అధికారులకు దొరికిపోయారు, అలాంటి వారే మరో ముగ్గురిని చైనా నిర్బంధించింది. ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన తరువాత బ్రిటన్‌తో సహా ఇతర చైనా వ్యతిరేకులు మానవహక్కులు, స్వేచ్చ అంశాలను ముందుకు తెచ్చారు తప్ప వారి చైనా వ్యతిరేకచర్యలను మరుగుపరిచారు. వారిని చైనా అధికారులే అపహరించారని ఆరోపించారు. ఐదుగురిలో ఒకడు తమ పౌరుడేనని చైనా ప్రకటించింది. వారు హాంకాంగ్‌ తిరిగి వచ్చిన తరువాత అంతకు ముందు చేసిన ప్రకటనకు భిన్నంగా తమ చేత చైనాలో బలవంతంగా నేరాన్ని అంగీకరింప చేయించారంటూ మీడియా ముందు ప్రకటించి చైనా వ్యతిరేకతను వెల్లడించుకున్నాడు. ఈ పూర్వరంగంలోనే ఇలాంటి వారిని చైనాలో విచారించేందుకు వీలుగా అప్పగింత బిల్లు వచ్చిందని గమనించాలి. ఎక్కడ నేరం చేస్తే అక్కడే విచారించాలనే పేరుతో ఇలాంటి నేరస్ధులను రక్షించేందుకు చైనా వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు. పుస్తక ప్రచురణ కర్తలు స్ధానిక అంశాల మీద పుస్తకాలు ప్రచురించి అక్రమాలకు పాల్పడితే అక్కడే విచారించాలని అంటే అర్ధం వుంది. సమంజసం కావచ్చు, చైనాలో హాంకాంగ్‌ అంతర్భాగం అయినపుడు సదరు చైనా సర్కార్‌ను కూల్చివేయాలని, కమ్యూనిస్టు పార్టీని అంతం చేయాలని అక్కడ మానవహక్కులు లేవని దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినపుడు, స్దానిక చట్టాలు పటిష్టంగా లేనపుడు ఏమి చెయ్యాలన్నది సమస్య.

రాజకీయ పరమైన ఈ సమస్యలు ఇలా వుండగా 2018 ఫిబ్రవరిలో జరిగిన ఒక నేరం బిల్లు రూపకల్పనలకు నాంది పలికిందని చెప్పవచ్చు. హాంకాంగ్‌కు చెందిన ఒక యువకుడు తన స్నేహితురాలితో కలసి తైవాన్‌ వెళ్లి అక్కడ ఆమెను హత్య చేసి హాంకాంగ్‌ తిరిగి వచ్చాడు. చిన్న చిన్న నేరాలకు జైలు పాలయ్యాడు. ప్రస్తుతం వున్న చట్టాల ప్రకారం హాంకాంగ్‌ వెలుపల జరిపిన నేరాలకు గాను నిందితులను హాంకాంగ్‌లో విచారణ జరపటానికి లేదు. అందువలన అతని మీద విచారణ జరపాలంటే తైవాన్‌కు పంపాలి. ఈ పూర్వరంగంలో ఈ బిల్లును రూపొందించారు.

Image result for Hong kong protests

ఈ బిల్లు మీద తలెత్తిన వ్యతిరేకతను, దాని వెనుక వున్న శక్తుల ఎత్తుగడలను గమనించిన చైనా, హాంకాంగ్‌ అధికారులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఎంతగా రెచ్చగొట్టి హింసాపూరితంగా మార్చాలని చూసినా దానికి వీలులేకుండా చూశారు. ఆందోళనలో పాల్గొన్నవారి సంఖ్య గురించి బయటి మీడియా చిలవలు పలవలుగా వర్ణించింది. అంత సీను లేకపోయినా గణనీయ సంఖ్యలో పాల్గొనటాన్ని గమనించిన చైనా నాయకత్వం తాత్కాలికంగా బిల్లును వాయిదా వేయాలని సలహా ఇచ్చింది. వాయిదా కాదు, పూర్తిగా రద్దు చేయాలనే ఆందోళన ఇప్పుడు సాగుతోంది. ప్రస్తుతం చైనాను లొంగదీసుకొనేందుకు అమెరికన్లు వాణిజ్య యుద్దాన్ని తీవ్రతరం చేయటంతో పాటు అనుకోకుండా వచ్చిన హాంకాంగ్‌ బిల్లును కూడా వుపయోగించుకొనేందుకు పూనుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు ఈ ఏడాది మార్చినెలలో అమెరికాను సందర్శించి మద్దతు కోరారు. దాని పర్యవసానమే అమెరికా జోక్యం, బెదిరింపులు అన్నది స్పష్టం. అమెరికా లేదా మరొక దేశం గానీ నేటి చైనా గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. హాంకాంగ్‌ను బ్రిటీష్‌ వారికి కౌలుకు ఇచ్చిన నాటి స్ధితిలో చైనా వుందనుకుంటే పప్పులో కాలేసినట్లే అని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు. సున్నితమైన ఈ సమస్యను చైనా నాయకత్వం ఎంతో జాగ్రత్తగా చూస్తోంది. ఒక్క ఈ విషయంలోనే కాదు, ఇతర అంశాలలో కూడా దీనిని గమనించవచ్చు.

మన దేశంలో పోలీసు చర్యతో సంస్ధానాలను విలీనం చేసినట్లుగా, రష్యా పాలకులు క్రిమియాను స్వాధీనం చేసుకున్నట్లుగా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ను మిలిటరీ చర్యద్వారా చైనాలో విలీనం చేయటం పెద్ద సమస్య కాదు. దాని వెనుక వున్న సామ్రాజ్యవాదుల హస్తం, ఇతర అంశాలను గమనంలో వుంచుకోవటంతో పాటు ఆయా ప్రాంతాలలోని జన అంగీకారం, మద్దతు ముఖ్యం. విశృంఖలమైన పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరిగిన వారు ఒక క్రమశిక్షణకు వెంటనే సిద్ధం కావటం చిన్న విషయం కాదు. అందువలన బలప్రయోగం మార్గం కాదనే చైైతన్యాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రదర్శిస్తోంది. తైవాన్‌, హాంకాంగ్‌, మకావోల్లో సామ్రాజ్యవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు వ్యవధి పట్టవచ్చుగాని, వాటి కుట్రలకు వమ్ము చేసి ఆ ప్రాంతాలను కాపాడుకోవటం అనివార్యం !

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే చైనానే ఎక్కువగా నమ్ముతున్న అమెరికన్‌ యువత !

12 Wednesday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Communist China, Donald trump, RED MAY, US youth distrust Trump, US Youth Trusting communist China

Image result for College kids' distrust for Trump over communist China

ఎం కోటేశ్వరరావు

‘డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం మేథావులకు తీవ్ర వ్యతిరేకి, చాలా వ్యతిరేకి, విశ్వవిద్యాలయాల వంటి వాటిని వుదారవాద ప్రచార యంత్రాలుగా పిలుస్తున్నారు. కాబట్టి అది జాత్యంహంకారి మాత్రమే కాదు, మేథావుల మీద దాడి వంటిది కూడా అని భావిస్తా ‘ ఇది ఒక విద్యార్ధి అభిప్రాయం. ‘ నావరకైతే చైనా ప్రభుత్వం నిజాయితీ కలిగినదా లేనిదా అనే గుర్తింపు ఎంత వుందో తెలియదు, కానీ ట్రంప్‌ సర్కార్‌ నిజాయితీలేనిదని మాత్రం నాకు కచ్చితంగా తెలుసు, కనుక అతన్ని నేను నమ్మను, అందువలన నేను నా స్వతంత్ర పరిశోధన చేస్తాను ‘ అనేది మరొక విద్యార్ధిని చెప్పిన మాట. అమెరికా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక చర్చలలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ ధోరణి గురించి ఒక కమ్యూనిస్టు వ్యతిరేక వెబ్‌సైట్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక క్లుప్త వ్యాఖ్యానాన్ని ప్రచురించింది.

పూర్వరంగం ఏమిటంటే అమెరికా విశ్వవిద్యాలయాల్లో దాదాపు వంద చోట్ల చైనా ప్రభుత్వం లేదా సంస్ధల నుంచి పొందే నిధులతో నడిచే కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. వాటిని మూసివేయాలని కోరుతూ 2014లో కొంతమంది ప్రొఫెసర్లు ఒక నివేదికను విడుదల చేశారు. గత సంవత్సరం సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ముందు ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ రే మాట్లాడుతూ కన్‌ఫ్యూసియస్‌ సంస్ధల కార్యకలాపాల మీద దర్యాప్తు జరుపుతున్నామని, వాటిని నిఘానిమిత్తం వినియోగిస్తున్నట్లు గూఢచారులు హెచ్చరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా పదమూడు విశ్వవిద్యాలయాల్లోని కేంద్రాల గురించి పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ కార్యాలయం) చేసిన పరిశోధనలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్‌ ఫ్రీ బీకన్‌ అనే పత్రం పేర్కొన్నది. ఈ అధ్యయన కేంద్రాలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని సిఐఏ పేర్కొన్నది. అమెరికా-చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య పోరు నేపధ్యంతో పాటు విశ్వవిద్యాలయాల సంస్కరణల గురించి అధ్యయనం చేస్తున్న ఒక మితవాద బృందానికి చెందిన మీడియా డైరెక్టర్‌ కాబోట్‌ ఫిలిప్స్‌ ఇటీవల మేరీలాండ్‌ విశ్వవిద్యాలయ సందర్శన చేశారు. అక్కడ మీరు కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలను నడిపే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్నా లేక కాపిటలిస్టు డోనాల్డ్‌ట్రంప్‌లో ఎవరిని ఎక్కువగా నమ్ముతారు అని ప్రశ్నించగా విద్యార్ధులు చెప్పిన సమాధానాలను పైన చూశారు. కనీసం ఒక విషయంలో అయినా ట్రంప్‌ కంటే చైనా చెప్పేదాన్నే నమ్ముతామన్నది వారి భావం అని తేలిందని, దీన్ని గమనించే అమెరికా గూఢచారశాఖ గేరు మార్చిందని సదరు వెబ్‌సైట్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు. దానిలో భాగంగానే దేవుడిని నమ్మని, అణచివేత వ్యవస్ధ కలిగిన, విఫలమైన చైనా గురించి ఆందోళన కలిగించే, తీవ్ర, కరోఠ సత్యాలను జనానికి అందిస్తున్నట్లు కూడా తెలిపారు.

కన్‌ఫ్యూసియస్‌ సంస్ధ మరియు పురోగామి విద్యావ్యవస్ధ కారణంగా విద్యార్ధులు సోషలిజం, కమ్యూనిజాల మరియు ప్రపంచ హేతువాద భావాల ఛాంపియన్లుగా తయారవుతున్నారు, అది చివరికి అమెరికా వ్యతిరేక మరియు సామాజిక న్యాయ పోరాట యోధులనే నూతన జాతిని తయారు చేస్తున్నది, ఈ రోజుల్లో కాలేజీ విద్యార్ధులు డోనాల్డ్‌ ట్రంప్‌ మరియు అతని ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకమైన ధోరణులకు దగ్గర అవుతున్నారు. అనేక మంది విద్యార్ధులు ట్రంప్‌ సర్కార్‌ కంటే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానే ఎక్కువగా నమ్ముతున్నారనే విస్తుగొలిపే అంశాన్ని ఎవరైనా చూడవచ్చు అని బ్లేజ్‌ అనే ఒక స్ధానిక పత్రిక పేర్కొన్న అంశాన్ని వెబ్‌సైట్‌ విశ్లేషణ వుటంకించింది.అనేక అంశాలపై ట్రంప్‌ ప్రభుత్వం,అమెరికా గూఢచార సంస్ధలు చెబుతున్న దాని కంటే చైనా ప్రభుత్వం చెబుతున్నవాటికే మద్దతు పలుకుతామన్నది సాధారణంగా వెల్లడైన సమాధానం కావటంతో సదరు కాబోట్‌ ఫిలిప్స్‌ బుర్ర దిరిగి చైనాలో మానవహక్కులు లేవని, మతవిశ్వాసాల కారణంగా మిలియన్ల మందిని అణచివేస్తున్నారంటూ ఆ విద్యార్ధులకు చెప్పి ఇప్పుడు చెప్పండి చైనా గురించి అని అడిగాడు. వెంటనే ఒక విద్యార్ధి చైనాను నమ్ముతున్నానని నేను చెప్పలేదు అనగా, మేథావులకు ట్రంప్‌ వ్యతిరేకం అని వ్యాఖ్యానించిన విద్యార్ధిని ఒక్క క్షణం ఆలోచించి నేను కచ్చితంగా చెప్పలేను అన్నది, మరొకరు ఇది చాల కష్టమైన ప్రశ్న, దానికి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, అది నూటికి నూరుశాతం కరెక్టని చెప్పలేను అన్నారు. చైనా భాష, సంస్కృతిని, కన్‌ఫ్యూసియస్‌ భావజాలాన్ని పెంపొందించే పేరుతో కమ్యూనిస్టు పార్టీ ప్రచార కేంద్రాలుగా వినియోగించుకుంటున్నారని కాబోట్‌ ఫిలిప్స్‌ ఆరోపించాడు. గత పన్నెండు సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేంద్రాలలో మొత్తం 35వేల మంది విద్యను అభ్యసించారు. అక్కడ జరిగే కార్యక్రమాలలో తొమ్మిది లక్షల 20వేల మంది పాల్గొన్నారని 2018లో నార్త్‌ కరోలినా కేంద్రం వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

అమెరికా సమాజం తమ నాయకత్వాన్ని విశ్వసించటం లేదన్నది స్పష్టం, అయితే ఇదే సమయంలో ఇతర దేశాలు, చైనా వంటి వాటి గురించి ఏకపక్ష సమాచారం మాత్రమే యువతరానికి అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా పాలకవర్గం పూనుకుంది అన్నది కూడా సుస్పష్టం.చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వ అణచివేత గురించి యువతకు వివరిస్తే వారి వైఖరి మారుతుందని ఫిలిప్స్‌ చెప్పటాన్ని బట్టి రానున్న రోజుల్లో మరో మారు పెద్ద ఎత్తున చైనా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరతీయనున్నారు.

‘ రెడ్‌ మే ‘ పేరుతో అమెరికాలోని సియాటెల్‌ నగరంలో 2017 నుంచి ప్రతి ఏటా మే మాసమంతా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ పెట్టుబడిదారీ విధానం నుంచి కొన్ని రోజులు సెలవు ‘ పేరుతో ఇవి జరుగుతున్నాయి. బహిరంగ స్ధలాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు ఎవరైనా హాజరుకావచ్చు. విద్యాసంస్ధలు లేదా సభల్లో చెప్పేదానికి అతీతంగా ఇక్కడ అవగాహన చేసుకోవటానికి అవకాశం వుంటుందని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధుల పత్రిక ది డైలీ పేర్కొన్నది. అలాంటి ఒక కార్యక్రమంలో ఒక ఆంగ్ల ప్రొఫెసర్‌ పాల్గొని మానవాళి విముక్తికి మార్క్సిస్టు భావజాలాన్ని వినియోగించటాన్ని పొగిడినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. అలీస్‌ వెయిన్‌బౌమ్‌ అనే ప్రొఫెసర్‌ మాట్లాడుతూ ‘ ఇండ్లలో భోజనం చేసే సమయంలో దొర్లే మాటల్లో సోషలిజం లేదా కమ్యూనిజం అనేవి చెడ్డ పదాలు, ఇలాంటి కార్యక్రమాలలో పొల్గ్గొన్నపుడు వ్యక్తులు ప్రత్యేకించి కాలేజీ విద్యార్ధులు వామపక్ష భావజాలం మీద వున్న నిందల గురించి ప్రభావితం అయ్యే అవకాశం వుంది. రెడ్‌ మే కార్యక్రమాలు ఒక రాజకీయ సిద్ధాంతం మీద ఒకే వైఖరికి కట్టుబడి వుండటం లేదు, ప్రస్తుత మన పరిస్ధితి గురించి ఎల్లలు లేని చర్చలకు అవకాశం ఇస్తున్నాయి. అనేక మంది పండితులు ఈ భావజాలాలను వర్తమాన పరిస్ధితులకు వర్తింప చేస్తూ ఆలోచిస్తున్నారు. వారిలో పండితులే కాదు, కార్యకర్తలుగా పని చేసే పండితులు కూడా ఈ విద్వత్సభలో వున్నారు. ఈ సంస్ధ పరిధిలకు మించి వారంతా పని చేస్తున్నారు, మానవాళి విముక్తికి వివిధ మార్గాలలో భాగంగా మార్క్సిస్టు భావజాలాన్ని కూడా ఒక మార్గంగా వినియోగిస్తున్నారు.’ అని చెప్పారు. ఆమె స్త్రీవాదం, నల్లజాతీయుల అధ్యయనం, మార్క్సిస్టు సిద్దాంతం, అట్లాంటిక్‌ ప్రాంత వర్తమాన సాహిత్యం, సంస్కృతి, పునరుత్పత్తి సంస్కృతి, రాజకీయాల వంటి అంశాల మీద బోధన చేస్తున్నారు. ఆమె పుట్టుక శ్వేతజాతిలో అయినప్పటికీ జాత్యహంకార సమస్యల గురించి రచనలు చేశారు.

రెడ్‌ మే కార్యక్రమాలకు హాజరైన మైక్‌ కార్లసన్‌ ఇలా చెప్పాడు.’ దీనికి సంబంధించి ఒక గొప్ప విషయం ఏమంటే వామపక్ష భావజాలంలో ఒకదానికొకటి విడిగా వుండే అనేక అంశాలు వున్నాయి. ఎవరైనా వచ్చి భిన్నమైన ఆలోచనలను ఇక్కడ వ్యక్తీకరించవచ్చు, ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అది తమ స్వంత విషయం కావచ్చు లేదా ఒక ప్రాజెక్టు ఏదైనా కావచ్చు అన్నాడు. ‘కమ్యూనిస్టు పరిధి వెలుపల (కమింగ్‌ అవుట్‌ కమ్యూనిస్టు)’ అనే అంశమీద చర్చలో అతను పాల్గొన్నాడు.ఈ కార్యక్రమాలలో మార్క్సిస్టు సిద్ధాంతాల నుంచి కార్పొరేట్‌లు సోషలిజానికి ఎలా పునాది వేస్తున్నాయి అనే అంశాల వరకు అనేక చర్చలు జరుగుతాయి. తమ కార్యక్రమాలు వివిధ ఆలోచనలకు ఎదురవుతున్న సవాళ్లు, అభివృద్ధి చేయటం తప్ప హాజరైన వారి బుర్రల్లో బలవంతంగా ఎక్కించటం లేదా వున్న వాటిని తొలగించటం కాదని రెడ్‌మే కార్యక్రమాల ప్రారంభ నిర్వాహకులలో ఒకరైన ఫిలిప్‌ హోల్‌స్టెట్టర్‌ అన్నారు. ఏడాదికి ఒక నెల పెట్టుబడిదారీ విధానం నుంచి సెలవు తీసుకుందాం, ఒక నెల పాటు కమ్యూనిస్టుగా వుందాం, భిన్నంగా ఆలోచిద్దాం, మిమ్మల్ని ఎవరూ మార్చేందుకు ప్రయత్నించరు అన్నారు.

Image result for communist China

కమ్యూనిజం గురించి అమెరికన్లను భయపెట్టేందుకు అక్కడి పాలకవర్గం అనుసరించని తప్పుడు ఎత్తుగడలు, ప్రచారాలు లేవు. అవే ఇప్పుడు వారి నోళ్లు మూతపడేట్లు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విశ్లేషణ ప్రారంభంలోనే అమెరికా యువత ట్రంప్‌ ప్రభుత్వ మాటలు, చేతలను విశ్వసించటం లేదు అని చెప్పుకున్నాము, అంటే విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. ‘దశాబ్దాల తరబడి చైనా గురించి అబద్దాలు చెప్పిన వారు మనకు ఇప్పుడు ఏదోఒకటి చెప్పాలి’ అనే శీర్షికతో అమెరికాకు చెందిన అట్లాంటిక్‌ పత్రిక తాజాగా ఒక విశ్లేషణను ప్రచురించింది. తియన్మెన్‌ స్క్వేర్‌ ఘటనలకు మూడు దశాబ్దాలు నిండిన సందర్భంగా దాన్ని రాశారు.

తరతరాలుగా చైనా గురించి రాజకీయ పండితులు, ఆర్ధికవేత్తలు చేసిన విశ్లేషణలు, చెప్పిన జోశ్యాలను చైనా ఎలా వమ్ము చేసిందో, అవెలా తప్పో, చైనా సాధించిన విజయాలను పేర్కొంటూ ఆ విశ్లేషణ సాగింది. దానిలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా వుంది.కమ్యూనిజం అంటే ఎక్కడైనా ఒకటే అని అమెరికా విదేశాంగ విధానంలో పేర్కొన్నారు. ఆచరణలో వేర్వేరు అని సోవియట్‌, చైనాల అనుభవం తెలిపింది. నిక్సన్‌ చైనాతో సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనే వరకు రెండు దేశాలను ఒకే శత్రుశిబిరంలో వుంచారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత చైనా కంటే సహజవనరులు ఎక్కువగా వున్న ఆఫ్రికన్‌ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అమెరికా ఆర్ధికవేత్త జోశ్యం చెప్పారు. ఆ విషయంలో పప్పులో కాలేశారు. 1960లో కాంగోలో తలసరి జిడిపి 220 డాలర్లు వుండేది, అది నైజీరియా, చైనాలకు రెట్టింపు.2017నాటికి చైనా తలసరి జిడిపి 9000 డాలర్లకు అంటే నైజీరియా జిడిపికి నాలుగు రెట్లు, కాంగోకు 19రెట్లు ఎక్కువ. చైనా 1978లో నవీకరణ కార్యక్రమం చేపట్టిన తరువాత మానవజాతి చరిత్రలో అత్యంత వేగమైన అభివృద్ధిని నిలకడగా సాధించటమేగాక 85కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసింది.

ఆసియన్‌ టైగర్లని చెప్పిన జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాల మాదిరి అభివృద్ధి సాధించిన తరువాత మరింత ప్రజాస్వామికంగా తయారవుతుందని చెప్పారు. అది కూడా జరగలేదు.1989 నుంచి 1991 మధ్య కమ్యూనిస్టు దేశాలలో ప్రజాస్వామిక గాలి వీచింది, ప్రచ్చన్న యుద్దం ముగిసింది, కొంత మంది అయితే చరిత్ర ముగిసింది అని చెప్పారు.(ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే సోషలిజాన్ని వదులు కోవటం, చరిత్ర ముగిసింది అంటే కమ్యూనిస్టు చరిత్ర అని అర్ధం) అయితే అది తూర్పు ఐరోపాలో, ఇతర చోట్ల జరిగింది తప్ప చైనాలో కాదు. దీర్ఘకాలం అభివృద్ధితో పాటు పార్టీ అదుపు కూడా కొనసాగింది.చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేర్చితే అది కూడా పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ ప్రజాస్వామిక వ్యవస్ధల మాదిరి తయారవుతుందనే భావన 1989 నుంచి డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ ప్రభుత్వాలలో వుంది. అది కూడా జరగలేదు. చరిత్రలో అతి పెద్ద సంపద బదిలీ జరిగింది అని జాతీయ భద్రతా సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ కెయిత్‌ అలెగ్జాండర్‌ 2012లోనే చెప్పారు. చైనా గురించి ఎంతో మంది ఎందుకిలా చెప్పారంటే విధాననిర్ణేతలు, మేథావులు సాధారణ సూత్రీకరణలు చెప్పారు కానీ చైనా పురాతన కాలంలోనూ నూతన ఆవిష్కరణలు చేసింది, ఆధునిక కాలంలోనూ దారిద్య్రం నుంచి బయటపడి ఒక ఆధునిక దేశంగా మారింది.1949 తరువాత కమ్యూనిస్టు నాయకత్వంలో ఒక గ్రామీణ దేశంగా వున్నదానిని ప్రపంచంలో అత్యంత ఆధునిక నిఘావేసే దేశాలతో సమంగా తయారైంది.

Image result for communist China

అమెరికా, చైనా నేతలకు మౌలికమైన తేడాలున్నాయి. అమెరికన్ల విషయానికి వస్తే జ్ఞాపకాలు స్వల్పకాలంలోనే అంతరిస్తాయి, కేంద్రీకరణలో నిలకడ వుండదు, ఒక సంక్షోభం నుంచి మరోసంక్షోభానికి ఎదురు చూస్తున్నట్లు వుంటుంది. వాషింగ్ట్‌న్‌లో బడ్జెట్‌ను ఆమోదించటం, దాని మీద కేంద్రీకరించటమే ఒక వీరోచిత చర్యగా చూస్తారు. అదే చైనా విషయానికి వస్తే దీనికి భిన్నంగా జ్ఞాపకాలు దీర్ఘకాలం వుంటాయి, కేంద్రీకరణ నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వ పధకాలు దీర్ఘకాలానికి రూపొందిస్తారు.కృత్రిమ మేధస్సు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు చైనాలో సంవత్సరాల తరబడి పని చేస్తాయి. చైనా మిలిటరీ నవీకరణ 1990దశకంలో ప్రారంభమైంది.ఒక విమానవాహక యుద్ద నౌకను తయారు చేయటానికి చైనాకు ఎంత కాలం పడుతుందని ఒక నౌకాదళ అధికారిని అడిగితే సమీప భవిష్యత్‌లో అని చెప్పారు. దాని అర్ధం 2050 కొంత కాలం ముందు అని, ఆ జోశ్యం కూడా తప్పింది.(1985లో ఆస్ట్రేలియా పాతబడిన ఒక యుద్ద నౌకను తుక్కు కింద మార్చేందుకు చైనాకు విక్రయించింది. అలాంటి వాటిలో అన్ని కీలక విభాగాలను పునరుద్దరించటానికి వీల్లేని విధంగా పనికి రాకుండా చేసి ఇస్తారు. చైనా దానిని అలాగే వుంచి ఏ భాగానికి ఆభాగాన్ని విడదీసి తన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పరిశీలనకు అప్పగించింది. దాన్నే తన ప్రయోగాలకు వాడుకుంది. తరువాత రష్యా నుంచి మరో మూడు పాత యుద్ద నౌకలను కొనుగోలు చేసింది. వాటిని తుక్కు కింద మార్చకుండా ఒక దానిని విలాస హోటల్‌గానూ, మరొక దానిని సందర్శకులకు ఇతివృత్త పార్కుగా మార్చింది. మూడోదానికి మరమ్మతులు చేసి 2012లో తన తొలి విమాన వాహక యుద్ధ నౌకగా మిలిటరీకి అప్పగించింది. 2030 నాటికి అందుబాటులోకి వచ్చే దశలవారీ కనీసం అరడజను నౌకలను నిర్మిస్తోంది.) అమెరికా ప్రపంచ నాయకత్వం అనేది నడుస్తున్న చరిత్ర, అదే చైనా విషయానికి వస్తే 1840దశకం నాటి నల్లమందు యుద్ధాలకు ముందు అదొక పెద్ద శక్తి. వందసంవత్సరాల అవమానాల తరువాత తిరిగి అది ఒక శక్తిగా తయారవుతోంది. అనేక విధాలుగా అసాధారణంగా అది పెరుగుతోంది. చైనా గురించి చేసిన సాధారణ సూత్రీకరణలు, జోశ్యాల గురించి వివరించిన దాని కంటే ఎంతో అస్పష్టంగా వున్నాయి.

ఇండోచైనా, ఆగ్నేయ ఆసియాలో వియత్నాంపై భ్రాంతి పూర్వకమైన అంచనా కారణంగా అమెరికా 58వేల మంది సైనికులను బలి ఇచ్చుకోవాల్సి వచ్చిందంటూ ఒక విశ్లేషకుడు తాజాగా రాశాడు.1965 జూన్‌ తొమ్మిదిన అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ వియత్నాం మీదకు సైన్యాన్ని పంపుతున్నట్లు ప్రకటించిన రోజును గుర్తు చేస్తూ అమెరికా నాయకత్వ అంచనాలు ఎలా తప్పాయో, దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అమెరికా సైనికుల మరణాల గురించి తప్ప వారు వియత్నాంలో చేసిన దారుణాలు, మారణ కాండ ప్రస్తావన లేదు. వియత్నాం మన చేతుల నుంచి పోతే కంబోడియా పోతుంది, థాయ్‌లాండ్‌ పోతుంది, మలేసియా పోతుంది, ఇండోనేషియా పోతుంది, ఫిలిప్పినోస్‌ పోతుంది అంటూ సెనెటర్‌ గాలే మెక్‌గీ చెప్పారు. ఇలాంటి భ్రాంతికి అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ గురయ్యాడు. వుత్తర వియత్నాం కమ్యూనిస్టు దేశంగా వున్నందున దాన్ని అరికట్టి దక్షిణ వియత్నాంను కమ్యూనిస్టు ప్రభావంలోకి పోకుండా చూడాలనే ఎత్తుగడతో ముందుకు తెచ్చిన వున్మాదమది. వియత్నాంను అదుపు చేయకపోతే తమ దేశాలు కూడా కమ్యూనిజంలోకి పోతాయని భయపడి వియత్నాంపై యుద్ధానికి జత కలుస్తాయని అమెరికా భావించింది. అయితే దానికి విరుద్దంగా జరిగిందని, అమెరికా మాత్రం 58వేల మంది సైనికులను బలిపెట్టాల్సి వచ్చిందన్నది విశ్లేషకుడి సారాంశం.

Image result for College kids' distrust  Trump

ప్రపంచ పరిణామాల గురించి తమ నేతలు, విధాన నిర్ణేతలు చేసిన అనేక వూహాగానాలు, సిద్ధాంతాలు విఫలమయ్యాయని చెప్పే వారు అమెరికాలోనే పెరగటం ఇటీవలి కాలంలో వూపందుకుంటున్న పరిణామం. అందుకే యుద్ధాలకు పాల్పడినప్పటికీ తమ సైనికులను అక్కడికి పంపకూడదని, ఒక ప్రాణం పోయినా సమాజంలో తీవ్ర ప్రతికూలత ఎదురవుతుందని సామ్రాజ్యవాదులు భయపడుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా యుద్ధాలు చేయాలని చూస్తున్నారు. అమెరికా నేతల గురించి యువతలో నమ్మకం లేకపోవటం, మీడియాలో ఇలాంటి చర్చ జరగటానికి సంబంధం వుంది. ఏది ముందు, ఏది వెనుక అనే చర్చ కంటే జరుగుతున్న పరిణామాలు పురోగామి శక్తులకు ఎంతో విశ్వాసాన్ని కలిగించేవి అనటంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో ఇవి ఏ రూపం తీసుకుంటాయని జోశ్యం చెప్పలేము గాని సోషలిజం, కమ్యూనిజాల మీద విశ్వాసం తగ్గుతున్న రోజుల్లో ఇవి ఆశారేఖలు అనటం నిస్సందేహం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో వున్న పురోగామి, వామపక్ష ప్రభావాన్ని చూసిన కారణంగానే మన దేశంలోని కాషాయ దళాలు జెఎన్‌యు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటివాటి మీద తప్పుడు ప్రచారాలు చేయటంతో పాటు వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించాలి. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం చెందుతున్న పూర్వరంగంలో అమెరికా సామ్రాజ్యవాదులకే వామపక్ష భావజాల వ్యాప్తిని అరికట్టటం సాధ్యం కాలేదు. అలాంటిది మన దేశంలో కాషాయదళాల వల్ల అవుతుందా ? అమెరికాలో కమ్యూనిస్టులం అని చెప్పుకొని పని చేసే పరిస్ధితుల్లేని రోజుల నుంచి అవును మేం సోషలిస్టులం, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగలవచ్చు. వివిధ కారణాలతో తాత్కాలికంగా కమ్యూనిస్టులకు ఓటు వేయకపోవచ్చుగానీ అమెరికా సమాజంలో మాదిరి మన దేశంలోని కష్టజీవుల్లో కమ్యూనిస్టు వ్యతిరేకత లేదు. వారి త్యాగాలను మరచిపోలేదు. జనంలో పోయిన పునాదిని తిరిగి పొందటం ఎలా అన్నదే అభ్యుదయవాదులు, కమ్యూనిస్టుల ముందున్న సవాలు ! చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికి వున్న చేపలు ఎదురీదుతాయి. కమ్యూనిస్టులూ అంతే !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

అప్పుడెందుకు మూసి పెట్టారు – ఇప్పుడెందుకు బయట పెట్టారు !

01 Saturday Jun 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

India Unemployment, Narendra Modi, Narendra Modi 2.0, narendra modi bhakts, Unemployment Rate NSSO Report

Image result for modi 2.0

ఎం కోటేశ్వరరావు

2019 మే 23కు ముందు, తరువాత వచ్చిన మార్పు ఏమిటి? మీడియాలో వర్ణించిన దాని ప్రకారం నరేంద్రమోడీ 2.0గా మారారు. దీని భావం ఏమిటంటే తిరుమలేశా, మారుతున్న కాలంతో మారని మీకు అది వర్తించదు. అసలైన భావం, తొలి వుత్పత్తి, తొలి సేవల వంటివి ఏవైనా మలిగా ఆధునిక రూపం, మార్పులు సంతరించుకొంటే దాన్ని వ్యక్తీకరించటానికి 2.0ను సూచికగా వాడుతున్నారు. దాని ప్రకారం మోడీలో వచ్చిన మార్పు ఏమిటి? నిరుద్యోగం గురించి ప్రతిపక్షాల నోరు మూయించేందుకు అసలు సిసలు పాత మోడీ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే లెక్కలు బయటకు రాకుండా చేశారు. ఒక పత్రికలో వెల్లడైన వాటిని తప్పుల తడకలని వర్ణించారు. ఇప్పుడు కొత్త మోడీ తన భక్తుల నోరు మూయించేందుకు ఆ లెక్కలనే అధికారికంగా విడుదల చేయించారు. విడుదల చేయక తప్పని స్ధితి, ఎందుకంటే నాటకంలో రెండో అంకం మొదలు కావాలి కదా ! మోడీ సర్కార్‌ చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి గతంలో వాస్తవాలను బయట పెట్టిన మీడియా, ప్రతిపక్షాల మీద వీరంగం వేసిన పార్టీ కార్యకర్తలు, గుడ్డి భక్తులు వాస్తవాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేరు, జీర్ణించుకున్నా నోరు తెరవలేరు. తిరిగి ఎన్నికలు జరిగే వరకు ఎలాగూ అసలు విషయాల గురించి మోడీ నోరెత్తరు. నాటకం నడవక తప్పదు, మద్దతుదారులకు ఏదో ఒక పని చెప్పాలి కనుక వారు తేరుకొని గళం విప్పేందుకు కొత్త వాదనను అందుబాటులోకి తెచ్చారు. నిరుద్యోగ అంకెలు తప్పుల తడకలని గతంలో మోడీ అండ్‌కో రాగం తీస్తే ఇప్పుడు భారత ప్రధాన గణాంక అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ కొత్త పల్లవి అందుకున్నారు.

ఇంతకీ ప్రవీణ్‌ శ్రీవాత్సవ గారి వేద గణిత తర్క సారాంశం ఏమిటి ? ‘ తాజాగా అధికారికంగా విడుదల చేసిన నమూనా సర్వేక్షణ వుద్ఘాటన ఏమంటే ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరు హైస్కూలు విద్య, అంతకు మించి చదుకొని వుండి వుంటారు అనే ప్రాతిపదిక మీద జరిగింది, గత సర్వేలన్నీ తలసరి నెలవారి వినియోగం ఎంత అనే ప్రాతిపదిక మీద నిరుద్యోగాన్ని అంచనా వేశాయి కనుక గత సర్వేలతో పోల్చకూడదు. ఈ సర్వేలో ఆచార నవీకరణ లేదా కొత్త మార్పుల వంటి అనేక అంశాలు వున్నాయి. ప్రతి మూడు నెలలకు పట్టణాలు, గ్రామాలలో విడివిడిగా, రెండింటినీ కలిపి ఏడాదికి ఒకసారి గణించటం వంటి వన్నీ కొత్తమార్పులు. ఎవరైనా కొత్తగా ఒకదానిని ప్రారంభించినపుడు అది ఎలాంటి రాతలు లేని కొత్త పలక మాదిరి వుండాలనటాన్ని మీరు అభినందించాలి. అనేక విద్యా కోర్సులు యువతకు వుపాధి చూపేవిగా లేవు. వుద్యోగాలు చేయగల యువకులను యజమానులు పొందాలంటే నైపుణ్య అభివృద్ధిని మెరుగుపరచే విధంగా కార్యకలాపాలు పెరగాలి. అది జరగాలంటే అవసరం-సరఫరా తేడా ఎంత వుందో చూడాలి, దాన్ని కేవలం సంఖ్యతో మాత్రమే కాదు నైపుణ్య స్ధాయితో కూడా చూడాలి.’

దీని భావం ఏమిటంటే, ఫీజు రీఇంబర్సుమెంటో మరొకదానితోనో ఇంటికొకరు చదుకొని తగలడ్డారు, ఆ చదువు చట్టుబండలైంది తప్ప వుద్యోగం లేదా వుపాధికి పనికి రాదు. అలాంటి వారు పెద్ద సంఖ్యలో వున్నంత మాత్రాన వారందరినీ నిరుద్యోగులంటే ఎలా ! వారి నైపుణ్యం కూడా చూడాలి. అంటే ఇప్పుడు పెద్ద సంఖ్యలో వున్నవారందరూ పనికి రాని చదువులు చదివి, ఎలాంటి నైపుణ్యం లేకుండా వున్నారు. వారందరినీ నిరుద్యోగులంటే కుదరదు, రాబోయే రోజులలో పరిస్ధితిని, సర్వేలను పోల్చుకోవాలి తప్ప పాతవాటిని అంగీకరించం, బాగా చదువుకొని, బాగా నైపుణ్యం సంపాదించి పని పాటలు లేకుండా నిరుద్యోగిగా వుంటేనే అసలు సిసలు నిరుద్యోగి, అటువంటి వారెందరున్నారో అన్నది తేల్చేందుకు పూనుకున్నాం, కొత్త లెక్కలు రానున్నాయి, పాతలెక్కలను మరచిపోండి అన్నది ప్రవీణ్‌ గారి ప్రావీణ్య తర్కం. దీన్ని అంగీకరిస్తామా లేదా, దీన్ని అర్ధం చేసుకోగల చదువు సంధ్యల విజ్ఞానం లేదా నైపుణ్యం నిరుద్యోగులకు వుందా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఎవరైనా నోరు తెరిచి కాదు గీదంటే ప్రభుత్వ వ్యతిరేకులుగా భావించి గోరక్షకుల మాదిరి చెలరేగి పోవటానికి మోడీ సర్కార్‌ రక్షకులు సిద్ధంగా వుంటారు మరి ! జాతీయ వాదానికే అర్ధం మార్చి కొత్త అర్ధాలు చెబుతున్నవారు చెప్పే నిరుద్యోగ కొత్త అర్దం తెలుసుకోవటానికి, అలవాటు పడటానికి మనం మరో ఐదేండ్లు సిద్దం కావాలి మరి.

సమస్యను పక్కదారి పట్టించటంలో నిరుపమాన సామర్ధ్యం కలిగిన వ్యక్తి గనుక 2018 ప్రారంభంలో ఒక ఛానల్‌తో ఏర్పాటు చేసుకున్న ఇంటర్వ్యూలో ఒక వ్యక్తికి పకోడీలు అమ్మితే రోజుకు 200 మిగులు తుంది, దాన్ని వుపాధి కల్పనగా లెక్కవేయాలా వద్దా అని నరేంద్రమోడీ ఎదురు ప్రశ్నించారు.అది కూడా వుపాధి కల్పనే కదా, మా ఖాతాలోకే రావాలి కదా అని అప్పుడు మోడీ గారు చెప్పారు. ఇప్పుడేమో ప్రవీణ్‌ శ్రీవాత్సవగారు నైపుణ్యం, చదవు వున్నవారే నిరుద్యోగి అని మాట్లాడుతున్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అంటే ఇదేనా ?

ప్రపంచ వ్యాపితంగా వేగంగా జరుగుతున్న యాంత్రీకరణ, రోబో, ఇతర ఆధునిక పరిజ్ఞానం కారణంగా ఒక బ్యాచి యువతీ యువకులు నాలుగేండ్ల ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేసి డిగ్రీ చేతబట్టి బయటకు వచ్చేసరికి వారు నేర్చుకున్నది పాతబడిపోతోంది. అందుకే కంపెనీలు కొత్త నైపుణ్యానికి ప్రాధాన్యత ఇచ్చి అవి వున్నవారినే ఎంచుకుంటున్నాయి. ఈ పూర్వరంగలో నైపుణ్యశిక్షణ పేరుతో మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున వూదరగొట్టింది.కంపెనీలు వుద్యోగాలు ఇచ్చి నైపుణ్యాన్ని పెంచితే అందుకయ్యే ఖర్చును తామే చెల్లిస్తామని లేదా ఇతరంగా రాయితీలు కల్పిస్తామని, ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లిస్తామని పేర్కొన్నది. పోనీ దాన్నయినా సక్రమంగా అమలు జరిపిందా?

ఒక వైపు వాజ్‌పేయి పాలన, కాంగ్రెస్‌పాలనా కాలంలో వున్నత విద్య ప్రయివేటీకరణ గావించి పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలను కేవలం డిగ్రీ ముద్రణ కేంద్రాలుగా మార్చివేసినా గత ఐదు సంవత్సరాలలో నాణ్యతను పెంచేందుకు ఎవరూ పట్టించుకోలేదు. బయటకు వచ్చిన వారు పెద్ద మొత్తంలో ప్రయివేటు శిక్షణకు ఖర్చు చేయటం తెలిసిందే. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(నైపుణ్య అభివ అద్ధి) పధకం 2016-20 ఒక ప్రహసనంగా మారింది. అందుకే ఈ మధ్య ఎక్కడా దాని ప్రస్తావనరావటం లేదు. ఈ కాలంలో కోటి మంది యువతీ యువకుల నైపుణ్యాలను పెంచాలన్నది లక్ష్యం. ఇందుకు గాను 12వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీనికి గాను 2018 నవంబరు 30 నాటికి నమోదు చేసుకున్న వారి సంఖ్య 36లక్షలు మాత్రమే. వారిలో 33.9లక్షల మందికి శిక్షణ ఇచ్చారు, 30.02లక్షల మంది గురించి మదింపు వేశారు. వారిలో 26లక్షల మందికి సర్టిఫికెట్లు ఇచ్చామని, వారు వుద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఈ ఏడాది జనవరి ఏడున లోక్‌సభలో ఒక ప్రశ ్నకు ప్రభుత్వం తెలిపింది. మరొక సమాచారం ప్రకారం 2018 ఆగస్టు నాటికి పది లక్షల మందికి వుద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. ఈ లెక్కన చూసినా కోటి మందిలో ఇంతవరకు పదిలక్షలు అంటే పదిశాతం కూడా లక్ష్యం నెరవేరలేదు. మరి ప్రవీణ్‌ గారు దీని గురించి ఏమంటారు?

వీరికి శిక్షణ ఇచ్చిన సంస్ధలది ఒక ప్రహసనం. బోధనా సిబ్బంది లేని ఇంజనీరింగ్‌,వైద్య, విద్యా శిక్షణా సంస్దల గురించిన సమాచారం బహిరంగ రహస్యమే. గతేడాది జనవరిలో పార్లమెంటరీ కమిటీ నైపుణ్య శిక్షణ సంస్ధల తీరు తెన్నుల గురించి తీవ్ర విమర్శలు చేసింది. కొన్ని సంస్ధలు అప్పటికింకా నిర్మాణ దశలోనే వుండటం, కొన్నింటిలో పరికరాల లేమి, ఇతర అవసరాలకు వుపయోగిస్తున్నవి కొన్ని, అసలు చిరునామా తప్ప జాడలేనివి కూడా వున్నాయట. ఈ శిక్షణా సంస్ధలపై వివిధ రాష్ట్రాలలో 1173 కోర్టు కేసులు కూడా నమోదయ్యాయి. దీన్ని బట్టి అవిచ్చిన శిక్షణ ఏమిటో, ఈ తతంగమంతా తెలిసి వారికి వుద్యోగాలు ఇచ్చిన వారెవరో అంతా ఒక పెద్ద ప్రహసనం. నిరుద్యోగులు వుద్యోగాలకు పనికొచ్చే వారు కాదని మోడీ సర్కార్‌ మన్‌కీ బాత్‌ను ప్రవీణ్‌ గారు బయటపెట్టారు. విషాదం ఏమిటంటే నిరుద్యోగులు తమను మభ్యపెడుతున్నవారెవరో కూడా తెలుసుకోలేని దుస్ధితిలో వున్నారు. ఎవరు చేసుకున్న ఖర్మను వారు మరో ఐదేండ్లు అనుభవించక తప్పదనే వాస్తవాన్ని అయినా నిరుద్యోగులు గ్రహిస్తారా ?

Image result for Unemployment Rate NSSO Report : why now  released then suppressed

మన కుర్రకారు భాషలో చెప్పాలంటే పాత మోడీ గారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగిలింతల దౌత్యంతో పడేయాలని చూశారు. ఫలించినట్లు కనపడటం లేదు. ఇరాన్‌, వెనెజులా నుంచి చమురు కొనవద్దంటే గడువుకు ముందే మానేశాం సార్‌ అని చెప్పారు. మీరు చెప్పినట్లు చేశాము, మరి మాకు ఇప్పుడు ఇరాన్‌ మాదిరి ఎక్కడైనా చౌకగా చమురు ఇప్పిస్తారా అంటే, ఏం మాట్లాడుతున్నారు, మేము ఇప్పించటం ఏమిటి , బయట కావాల్సినంత వుంది, ఎంతరేటు వుంటే అంతకు ఎంతకావాలంటే అంత కొనండి, కావాలంటే మాదగ్గర కూడా వుంది, రేటేమీ తగ్గదు, మీకు తెలిసిందే కదా, అంతా ప్రయివేటు వ్యవహారం అని చెప్పేసింది అమెరికా. మోడీ 2.0అవతారం ఎత్తి సంతోష తరంగాలలో తేలియాడుతుండగానే పెండ్లి అయిన మరుసటి రోజే కట్నం సంగతి ఏమిటని మొదలు పెడుతున్నట్లుగా కౌగిలింతల భాగస్వామి ట్రంప్‌ మరోబాంబు పేల్చాడు. రష్యా నుంచి ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణులు కొనుగోలు చేయటాన్ని నిలిపివేయకపోతే ఆంక్షలు తప్పవని అమెరికా అధికారి ఒకరు స్పష్టం చేశారు. మొండిగా ముందుకు పోతే అమెరికాతో కుదిరిన రక్షణ ఒప్పందాల భవిష్యత్‌ ఇబ్బందుల్లో పడుతుందని, మినహాయింపులు ఇవ్వక ఎ్కడకు పోతారులే అంటే కుదరదని అమెరికా అధికారి చెప్పినట్లు హిందూ పత్రిక కధనం. ఇప్పటి వరకు మన దేశం నుంచి 560కోట్ల డాలర్ల విలువగల వస్తువుల ఎగుమతులపై ఇస్తున్న పన్ను రాయితీలను వుపసంహరించుకుంటామని గతంలోనే ప్రకటించామని దానిని ఇప్పుడు అమలు జరపబోతున్నామని గురువారం నాడే మరో అమెరికా అధికారి విలేకర్లతో చెప్పాడు. మన మాదిరే టర్కీకి ఇచ్చిన ప్రాధాన్యతను రద్దు చేస్తూ మే17న ట్రంప్‌ వుత్తరువులు జారీ చేశారు. మనకు సంబంధించి తమ షరతులకు భారత్‌ అంగీకరించకపోతే ఏ క్షణంలో అయినా అలాంటి ప్రకటనే వెలువడవచ్చన్నది బహిరంగ బెదిరింపు అది. పాత మోడీ కౌగిలించుకుంటే , కొత్త మోడీ కాళ్ల బేర దౌత్యానికి పూనుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బుద్ధి లేని జనాకర్షక, జాతీయ వాదులు !

31 Friday May 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Europe Far-Right, European Commission President Jean-Claude Juncker, Hindu Fundamentalism, Hindu Supremacists, india's saffron brigade, Populists, saffron nationalists, Stupid Nationalists

Image result for eu far right

ఎం కోటేశ్వరరావు

జాతీయ వాదులకు బుద్ధి లేదు, వారి దేశాలను ప్రేమిస్తారు, విదేశీయులను ద్వేషిస్తారు అని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఘాటుగా వ్యాఖ్యానించారు. మే చివరి వారంలో జరిగిన ఆ ఎన్నికల ఫలితాల సరళి ప్రకారం జాతీయవాదులు లేదా పచ్చి మితవాదులు సంపూర్ణ మెజారిటీ వైపుగాక పోయినా గతం కంటే ఎక్కువ స్ధానాలు సంపాదించారు. మన దేశంలో రెండు భావజాలాల మధ్య జరిగిన పోటీగా ఎన్నికలు జరిగాయని, బిజెపి పేరు పెట్టి చెప్పకపోయినా జాతీయవాదులు విజయం సాధించారని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్యానించింది. మన కాషాయ బ్రాండ్‌ జాతీయవాదులు విదేశీయులకు బదులు మైనారిటీలు, మైనారిటీ మతాలను, కమ్యూనిజాన్ని ద్వేషిస్తున్నారు. తమకే అగ్రస్ధానం అన్నది అమెరికా జాతీయవాదం. దానికోసం అనేక దేశాలలో జోక్యం చేసుకొని యుద్దం చేస్తున్నది, చైనా వంటి దేశాలతో వాణిజ్య యుద్ధాలకు పాల్పడుతోంది. మన వంటి దేశాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నది. అవి దాని జాతీయవాదంలో భాగం. ఆఫ్రో-అమెరికన్‌లను ద్వేషించటం అమెరికాలోని మెజారిటీ శ్వేతజాతీయ వాదం. మన స్వాతంత్య్రవుద్యమలో బ్రిటీష్‌ పాలకులను వ్యతిరేకించటం, వారి పాలనకు సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ వంటివి మన మహత్తర జాతీయవాదంలో భాగం. బ్రిటీష్‌ వారికి సలాం కొట్టిన సావర్కర్‌ను కీర్తించటం, గాంధీని చంపిన గాడ్సేను వెనకేసుకు రావటం కూడా నేడు తామే అసలు సిసలు జాతీయ వాదులమని చెప్పుకొనే కుహనా శక్తులు చేస్తున్నపని. పాకిస్ధాన్‌ను, చైనా వస్తువుల దిగుమతులను వ్యతిరేకించటం, అమెరికా ఆంక్షలను ప్రశ్నించకుండా ఆమోదించటం మన కాషాయ వాదుల జాతీయ వాదం. అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యావాదుల దాడులను ప్రతిఘటించటం చైనా జాతీయవాదం. వీటిన్నింటినీ ఒక దగ్గర చేర్చి ఏ జాతీయవాదాన్ని ఎంచుకోవాలి, ఏది పురోగామి, ఏది తిరోగామి అనే ఎంపిక క్లిష్టంగా వుంటుంది. ఒక దగ్గర జాతీయవాదులకు బుద్ధిలేదని తిడుతుంటే, మరొక దగ్గర జాతీయవాదుల విజయాన్ని కీర్తిస్తున్నారు. అమెరికా జాతీయ వాదానికి మన కాషాయవాదులు మినహా ప్రపంచవ్యాపితంగా వ్యతిరేకతం వ్యక్తం అవుతోంది. ఏమిటీ వైపరీత్యం ? అసలు జాతీయ వాదం అంటే ఏమిటి?

ప్రపంచ వ్యాపితంగా ముఖ్యంగా ఐరోపాలో ప్రజాకర్షక, జాతీయవాదులు -వీరందరినీ మితవాదులు అనవచ్చు. వీరి వైఖరి ఆయాదేశాల పరిస్ధితులను బట్టి మారుతూ వుంటుంది గాని మౌలిక లక్షణం మితవాదం, అది ముదిరితే పచ్చి మితవాదం, మతవాదం, ఇంకా నయా ఫాసిజం, నాజీజం. ఎందుకీ పరిస్ధితి తలెత్తింది అన్నది అభ్యుదయవాదులు, మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను సమర్ధించే సాధారణ లౌకికవాదుల ముందున్న ప్రశ్న. ఐరోపానే తీసుకుందాం. వలస కార్మికుల సమస్యపై జాతీయ వాద రాజకీయవేత్తల వైఖరి ఐరోపా ఐక్యతకే స్పష్టమైన ముప్పును ముందుకు తెచ్చింది అని జుంకర్‌ చెప్పారు. ‘ ఈ ప్రజాకర్షకులు, జాతీయ వాదులు, బుద్దిలేని జాతీయవాదులు తమ దేశాలను ప్రేమిస్తారు, సుదూరాల నుంచి వచ్చే వారిని వారు ఇష్టపడరు మన కంటే దుర్భర పరిస్ధితుల్లో వున్న వారికి మనం మద్దతుగా వ్యవహరించాలి’ అని జుంకర్‌ చెప్పారు. ఐరోపాలో, అమెరికాలో ఒకనాడు పాలకులే వలసలను ప్రోత్సహించారు. ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహించే కార్పొరేట్‌ శక్తులకు వలస కార్మికుల వలన లాభాలు ఎక్కువగా వుంటాయి కనుక. గతకొద్ధి దశాబ్దాలుగా వుపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది కనుక ధనిక దేశాలలో నిరుద్యోగం, వేతనాల పతనం, ఎగుమతుల అభివృద్ధి పేరుతో వేతనాల కోత, ప్రజాధనం ఎగుమతుల రాయితీలకు మళ్లించటంతో సంక్షేమ పధకాలకు కోతలతో సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు మితవాదులు, జాతీయవాదులు, జాత్యంహకార వాదులు పెరుగుతున్నారు. అది తమకు నష్టదాయకమని కార్పొరేట్‌లు భావిస్తున్న కారణంగానే వారి ప్రతినిధి జుంకర్‌ మండిపడుతున్నారు. ఇది పాలకశక్తుల మధ్య అధికారం కోసం జరిగే పోరులో జాతీయవాదులు, జనాకర్షకవాదులది దగ్గర దారి. నరేంద్రమోడీ భారత్‌లో పెద్ద (సామాజిక) విభజన వాది అని టైమ్‌ పత్రిక వర్ణించిన విషయం తెలిసిందే. ముస్లింలు, క్రైస్తవులు మన కళ్ల ముందే పుట్టి పెరిగిన వారిని హిందూత్వ జాతీయ వాదులు ఎలా చూస్తున్నారో వివరించాల్సిన అవసరం లేదు. వారు ఈ దేశానికి విధేయులుగా లేరనే ప్రచారం, జాతీయవాదులుగా నిరూపించుకోవాలని పదే పదే అనటం తెలిసిందే. ఐరోపా దేశాలలో కూడా జాత్యహంకారులు, శ్వేతజాతి వాదులు మైనారిటీలను, విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశం పట్ల విధేయత వుండదని ఇలాగే అవమానిస్తారు.

Related image

ఐరోపా అంతటా ఇటీవలి కాలంలో మితవాదం పెరుగుతోంది, ఇదే సమయంలో సోషల్‌ డెమోక్రసీ తరుగుతోంది. మన దేశంలో కూడా జరిగింది అదే. కాంగ్రెస్‌ పార్టీ పతనానికి సూచిక అది. లౌకికశక్తుల మీద మిత, మతవాద శక్తులు పైచేయి సాధించాయి. నాజీ హిట్లర్‌ తరువాత జర్మనీలో ఏడు దశాబ్దాల పాటు ఐరోపా తరహా ప్రజాస్వామ్యమే వుంది తప్ప మితవాద శక్తులు తలెత్తలేదు. అలాంటి చోట ఎఎఫ్‌డి( జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ) అనే పచ్చి మితవాద పార్టీ మూడవ శక్తిగా వునికిలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంలో దెబ్బతిన్న ఐరోపా తిరిగి తమకు పోటీగా బలపడకూడదని అమెరికా భావించింది. ఒంటరిగా వుంటే ఏనుగు వంటి అమెరికాను ఎదిరించి ప్రపంచ మార్కెట్లో తమ వాటాను తాము కాపాడుకోలేమని గ్రహించిన యూరోపియన్‌ కార్పొరేట్‌ శక్తుల ఆలోచన ప్రకారమే ఐరోపా యూనియన్‌ వునికిలోకి వచ్చింది. ఐరోపా బొగ్గు, వుక్కు కమ్యూనిటీతో 1951లో ప్రారంభమై ఏడుదశాబ్దాలుగా సరిహద్దుల చెరిపివేత వరకు వచ్చిన ఐరోపా యూనియన్‌ మీద ఇప్పుడు అనేక దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. ఎవరి కాపురం వారు పెట్టుకుందాం, ఎవరి గొడవ వారు చూసుకుందామనే ధోరణులు పెరిగాయి. దాని పర్యవసానమే ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్‌ నిర్ణయం.

పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అసలు అది ఎలుకలను పట్టగలదా లేదా అన్నది అసలు సమస్య అన్నట్లుగా ఐక్య ఐరోపా లేదా ప్రపంచీకరణ ఏ పేరు పెట్టినా ఐరోపాలో అమలు జరిగింది పెట్టుబడిదారీ విధానమే. అది ఇప్పుడు మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటటోంది. కమ్యూనిజం వైఫల్యం చెందింది అన్నది దాని వ్యతిరేకుల మాట. ఇప్పుడు పెట్టుబడిదారీ వైఫల్యం చెందింది అన్నది దాని అనుకూలురు చెబుతున్నమాట. ఈ ఏడు దశాబ్దాల్లో చూస్తే కార్మికవర్గం సాధించుకున్న లేదా పాలకులు వుదారంగా ఇచ్చిన అనేక సంక్షేమ పధకాలకు కోతపడుతోంది. వేతనాలు పెరగటం లేదు. వుపాధి సమస్యలు ముందుకు వస్తున్నాయి. యూరోపియన్లు వందల సంవత్సరాల పాటు ప్రపంచంలోని మూల మూలకు వలసలు పోయి అక్కడి సంపదలను స్వంతం చేసుకున్న చేసుకున్నారు. అసలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలే అలా ఏర్పడ్డాయి. స్దానికులను మైనారిటీలుగా మార్చి వారి మీద పెత్తనం చేసిన, ఇప్పటికీ చేస్తున్న చరిత్ర మన కళ్ల ముందు వుంది. మరి అలాంటి దేశాలలో ఇప్పుడు ఇతరం ఖండాల నుంచి వలస వస్తున్న వారినే కాదు, ఐరోపాలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వస్తున్న తోటి వారినే అనుమతించకూడదన్న సంకుచిత భావాలు తలెత్తటానికి, పెరిగి పెద్దవి కావటానికి అనువైన పరిస్ధితులు ఏర్పడ్డాయి. అమెరికాలో కూడా అంతే పొరుగుదేశమైన మెక్సికో నుంచి వలసలు రాకుండా ట్రంప్‌ మహాశయుడు ఏకంగా సరిహద్దులో గోడ కడతానంటున్నాడు. బెర్లిన్‌ గోడను బద్దలు చేసినందుకు సంతోషం వెలిబుచ్చిన పెద్దలు వారే ఇప్పుడు కొత్త గోడలు కడుతున్నారు.

ఎటు తిరిగి ఎటు చూసినా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యమే కనిపిస్తోంది. అందుకు సాంప్రదాయ పార్టీలే కారణం అంటే కాదనలేని స్ధితిలో అవి పడ్డాయి. దాన్ని అవకాశంగా తీసుకొని చూడండి అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి అద్బుతాలు చేస్తామని చెప్పేశక్తులు ముందుకు వస్తే ఒకసారి చూస్తే పోలా అని ఎవరికి వారు అనుకుంటున్నారు. వారికి ఫాస్ట్‌ ఫుడ్‌ లేదా ఎటిఎం మాదిరి వెంటనే కోరుకున్నది కావాలి. ఇన్నేండ్లుగా మేము నమ్మిన పార్టీలు నట్టేట ముంచాయి. వాటి మీద ఏమాత్రం నమ్మకం లేదు. వారు చేయలేనిదానిని మేము చేస్తామని కొత్తగా రంగంలోకి వచ్చిన వారు చెబుతున్నారు. వారు మితవాదులా అతివాదులా అన్నది మాకనవసరం, పని చేసే వారు, ఫలితాలు ఇచ్చేవారు కావాలి. వారికీ ఒక అవకాశం ఇచ్చి చూస్తాం, మితవాదులు వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు, అలాంటిదేదైనా వస్తే అప్పుడు చూసుకుందాం అనే ధోరణులు ఐరోపా అంతటా ప్రబలుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే అనేక పార్టీలు ఇలా పుట్టి అలా ఓట్లు పొంది దేశాల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. సాంప్రదాయ పార్టీలు మట్టి కరుస్తున్నాయి. బ్రిటన్‌లో మూడు నెలల క్రితం పుట్టిన పార్టీ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల్లో 32శాతం ఓట్లు తెచ్చుకొని బస్తీమే సవాల్‌ అంటోంది. మన దేశంలో కూడా జరుగుతోంది అదే. కాంగ్రెస్‌ అవినీతిని అక్రమాలను కూకటి వేళ్లతో పెకలించి వేస్తామన్నది బిజెపి లేదా కాషాయ జాతీయవాదుల వాగ్దానం. యాభై ఏండ్లలో కాంగ్రెస్‌ చేయలేనిదానిని ఐదు సంవత్సరాలలో తాము చేశామని జనాన్ని నమ్మింప చూసిన యత్నాన్ని చూశాము.

నూటయాభై సంవత్సరాల క్రితం ఫెర్డినాండ్‌ లాసలే కమ్యూనిస్టు లీగ్‌లో సభ్యుడిగా వున్నప్పటికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ ఆయనతో తీవ్రంగా విబేధించారు.చివరికి ఆ పెద్ద మనిషి కమ్యూనిస్టు వ్యతిరేక బిస్మార్క్‌తో చేతులు కలిపిన వైనం తెలిసిందే. అయితే ఐరోపాలో కమ్యూనిజాన్ని ఎదుర్కొనే క్రమంలో సంస్కరణ వాదలక్షణాలుండే సోషల్‌ డెమోక్రసీని ముందుకు తెచ్చిన ఆద్యుడిగా లాసాలేను చెబుతారు. నిజమైన రాజ్యాంగబద్దమైన రాజ్యంలో నిజమైన పాలకుడు ఓటరే అనే లాసాలే ప్రవచనాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది వాస్తవం కాదని పాలకవర్గాలకు తెలిసినా, చాలా మంది ప్రజాస్వామిక వాదులు అది నిజమని నిజంగానే నమ్మారు. అయితే నూటయాభై సంవత్సరాల తరువాత వారికి ఆభ్రమలు తొలిగిపోతున్నాయన్నవి విశ్లేషకుల అభిప్రాయం. ఓటర్ల పేరుతో తీర్పులను హైజాక్‌ చేస్తున్నారు. తమకు ఎవరు ప్రయోజనకారులో, ఎవరు హాని చేస్తారో కూడా తెలియని స్ధితికి నేడు ఓటర్లు లోనై వున్నారు.

Image result for jean-claude juncker eu president

సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతకు ముందే ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో ముందుకు వచ్చిన సైద్ధాంతిక సమస్యలతో పార్టీలు విడిపోయాయి. ఆ తరువాత ఆ వ్యవస్దలు కనుమరుగు కావటంతో అనేక మందిలో విశ్వాసం సన్నగిల్లింది. నీరు గారిపోయారు, అనేక పార్టీలు కనుమరుగై బూర్జువా పార్టీల అవతారమెత్తాయి. ఒక విధమైన శూన్యం ఏర్పడింది. పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలను ఎండగట్టి జన విశ్వాసాన్ని చూరగొనే స్ధితిలో మిగిలి వున్న కమ్యూనిస్టులు లేకపోవటంతో దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితులను అవకాశంగా తీసుకొని మరోసారి మితవాద, జాతీయవాద శక్తులు మోరలెత్తుతున్నాయి. అనేక మంది ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.

1857లో మన దేశంలో తలెత్తిన ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామానికి అనేక పరిమితులు వుండవచ్చు గానీ, ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని తీవ్రంగా అణచివేసిన తరువాత నాలుగు దశాబ్దాలపాటు ఎలాంటి వుద్యమాలూ రాలేదు. తరువాత కూడా బ్రిటీష్‌ వారిని పరిమిత హక్కుల కోసం ప్రాధేపడే కాంగ్రెస్‌తో ప్రారంభమైన వుద్యమంలో తరువాత ఎన్నిమార్పులు, ఎన్ని ఆలోచనలు తలెత్తిందీ చూశాము. అలాగే ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమం, భారత వామపక్ష, కమ్యూనిస్టు వుద్యమం కూడా అలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటోంది. తిరిగి పుంజుకోవటం అనివార్యం. అయితే అనేక మందికి ఆ విషయంలో విశ్వాసం లేదు. ఇక్కడ ఒకటే సమస్య. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాల గురించి చెప్పనవసరం లేదు. చైనా సోషలిస్టు వ్యవస్ధ గురించి కొందరికి కొన్ని అనుమానాలు వున్నాయి. అది కూడా పెట్టుబడిదారీ వ్యవస్దే అన్నది కొందరి భావన. అలా భావించే వారు ఎవరికి వారు ఆలోచించాల్సిన అంశాలు రెండు. ఒకటి పెట్టుబడిదారీ వ్యవస్ధకు దోపిడీలేని మరొక ప్రత్యామ్నాయం కమ్యూనిజం తప్ప మరొకటి ఎక్కడైనా కనిపిస్తోందా? చైనా సోషలిస్టు వ్యవస్ధ కానట్లయితే దాన్ని కూల్చివేసేందుకు అమెరికా ఎందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు ? అక్కడ మిగతా పెట్టుబడిదారీ దేశాల మాదిరి సంక్షోభాలు ఎందుకు రావటం లేదు? అంతవేగంగా పురోగమించటానికి చైనా వెనుక వున్న శక్తి కమ్యూనిస్టు పార్టీ గాకపోతే మరేమిటి ? జర్మన్‌ జాతీయ వాదం హిట్లర్‌ను, ఇటలీ జాతీయ వాదం ముస్సోలినీ, అమెరికన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని నిరంతరం యుద్ధాలతో నింపే యుద్దోన్మాదులను తయారు చేసింది. మన దేశంలో కాషాయ జాతీయ వాదం ఎవరిని తయారు చేయనున్నది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారతీయ ఆత్మకు చెడు – నరేంద్రమోడీపై బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ వ్యాఖ్య !

26 Sunday May 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Bad for India’s soul, BJP, India elections 2019, Narendra Modi, Narendra Modi’s landslide, populist leaders, populist schemes, Populists

Image result for bad for India’s soul

ఎం కోటేశ్వరరావు

ఇది నేను చెబుతున్నది కాదు. నరేంద్రమోడీ రెండవ సారి విజయం సాధించటంపై బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ రాసిన సంపాదకీయ శీర్షిక. ఒక వైపు కుహనా వార్తలతో కాలక్షేపం చేస్తూ వాణిజ్య వేత్తల అనుకూల అజెండా అమలు జరుపుతూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే మరో ప్రజాకర్షక నినాదాల నేత ప్రపంచానికి అవసరం లేదు అని వ్యాఖ్యానించింది.2017లో జరిపిన ఒక సర్వేలో రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా ఏ దేశంలోనూ లేని విధంగా నిరంకుశమైన పాలన చేసేందుకు ఒక బలమైన నేత కావాలని భారత్‌లో 55శాతం మంది కోరుకోవటాన్ని చూసిన తరువాత ఈ విజయం చూసి మాకేమీ ఆశ్చర్యం కలగలేదు. స్వాతంత్య్ర భారత అత్యంత విలువైన లక్షణమైన బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి ముప్పుగా నరేంద్రమోడీ ముప్పుగా పరిణమించారు. అని పేర్కొన్నది. అన్నం వుడికిందో లేదో చూడటానికి ఒక మెతుకును చూస్తే చాలన్నట్లుగా ఆ సంపాదకీయంలో మోడీ గురించి ఇంకా ఏం చెప్పారనేది మొత్తం ప్రస్తావించాల్సిన పని లేదు.

అధికారంలో పాతుకు పోయిన వున్నత వర్గం తమ గోడును పట్టించుకోవటం లేదనే అసంతృప్తితో వున్న సాధారణ జన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రంగంలోకి వచ్చే వారిని ప్రజాకర్షక రాజకీయవేత్తలు అంటున్నారు. అలాంటి వారి గురించి అమెరికాకు చెందిన ‘అట్లాంటిక్‌’ పత్రిక గతేడాది డిసెంబరు 26న ప్రజాకర్షక నేతలు ప్రజాస్వామ్యానికి ఏమి చేస్తారు అనే శీర్షికతో ఒక పరిశోధనా విశ్లేషణను ప్రచురించింది. ఇక్కడ ఒక స్పష్టత అవసరం. పశ్చిమ దేశాల మీడియా దృష్టిలో వెనెజులా నేతలు హ్యూగో ఛావెజ్‌, నికోలస్‌ మదురో, బొలీవియా నేత ఇవో మొరేల్స్‌, ఇతర వామపక్ష ప్రజాతంత్ర శక్తులను నరేంద్రమోడీ, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారినీ ఒకే గాటన కడుతున్నారు. ఫాసిస్టులు ఎంత ప్రమాదకారులో సోషలిస్టులు, కమ్యూనిస్టులూ అంతే ప్రమాదకారులనే తప్పుడు అవగాహన పర్యవసానం లేదా పని గట్టుకొని చేసే ప్రచారంలో భాగమిది. వెనెజులా, బలివీయాల్లో వున్న వామపక్ష, ప్రజాతంత్రశక్తుల ప్రభుత్వాలను కూల్చేందుకు ట్రంప్‌ వంటి సామ్రాజ్యవాదులు నిరంతరం కుట్రలు చేస్తున్నారు. దానికి వంత పాడుతూ వెనెజులా నుంచి చమురును కొనుగోలు చేయరాదని నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయించింది. అందరూ జనాకర్షక నేతలే అయితే వారిలో కొందరు తోటి వారిని కూల్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు? పెట్టుబడిదారీ వర్గాన్ని కూల్చివేసేందుకు ఛావెజ్‌, మదురో, ఇవో మొరేల్స్‌ చర్యలు తీసుకోకపోయినా, వారికి సహకరించటం లేదు. అందుకే ఆ వర్గ ప్రతినిధులైన ట్రంప్‌, మోడీ వంటి వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు.

ప్రజాస్వామ్యానికి ప్రజాకర్షక నేతలు చేస్తున్నదేమిటి అన్న అట్లాంటిక్‌ పత్రిక విశ్లేషణను చూద్దాం.తమ పరిశోధనలో తేలినదాని ప్రకారం ప్రజాకర్షక ప్రభుత్వాలు అవినీతిని మరింతగా పెంచుతాయి, వ్యక్తిగత హక్కులను హరిస్తాయి, ప్రజాస్వామిక వ్యవస్ధలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. నరేంద్రమోడీతో సహా ప్రజాకర్షక నినాదాలు, ఆచరణ గురించి 66 ప్రముఖ పత్రికల్లో చోటు చేసుకున్న వ్యాసాలు, విశ్లేషణలను ఆ పత్రిక పరిశోధించింది. వాటి నుంచి 1990 నుంచి 2018 వరకు 33దేశాలకు చెందిన 46 మంది అధికార నేతలను ఎంచుకొని వారి తీరు తెన్నులను విశ్లేషించి పైన పేర్కొన్న సారాన్ని తన పాఠకులకు అందచేసింది. అట్లాంటిక్‌ పత్రిక సర్వేలో కొన్ని అంశాల సారాంశం ఇలా వుంది.

పరిశోధన ఫలితాలు ఆందోళన కలిగించేవిగా వున్నాయి. ప్రజాకర్షక నేతలు ఎంతో నైపుణ్యంతో అధికారంలో కొనసాగారు, ప్రజాస్వామిక సంస్ధలకు తీవ్ర ముప్పుగా మారారు. సగటున సాధారణ ప్రజాస్వామిక ప్రభుత్వాలు స్వల్ప కాలం మూడు సంవత్సరాలు కొనసాగాయి. కొన్ని తొలిసారి అధికారానికి వచ్చిన తరువాత ఆరు సంవత్సరాలు వున్నాయి. ఐదింట నాలుగు ప్రభుత్వాలు అధికారం కోల్పోయాయి. అదే ప్రజాకర్షక ప్రభుత్వాలు దీర్ఘకాలం అధికారంలో వుండేట్లు నడపగలిగాయి. సగటున అవి ఆరున్నర సంవత్సరాలు లేదా ప్రజాకర్షకులు కాని వారి ప్రత్యర్ధుల కంటే రెట్టింపు కాలం వున్నాయి. ప్రజాకర్షక నేతలు ఒకటి రెండు సార్లు ఎన్నిక అవటం కాదు, దశాబ్దకాలానికి పైగా అధికారంలో వుంటారు. వారు దీర్ఘకాలం అధికారంలో వున్నారంటే అది వారి పలుకుబడి, సామర్ధ్యాలను సూచిస్తుంది. 1990-2015 మధ్య కాలంలో అధికారానికి వచ్చిన నేతలను చూస్తే చాలా కొద్ది మంది మాత్రమే సాధారణ ప్రజాస్వామిక ప్రక్రియలో అధికారానికి దూరమయ్యారు. కేవలం పదిహేడు శాతం మంది మాత్రమే స్వేచ్చగా, న్యాయంగా జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. మరో 17శాతం మంది తమ పదవీ వ్యవధులు పూర్తి అయిన కారణంగా అధికారం నుంచి వైదొలిగారు. అయితే 23శాతం మంది నాటకీయ పరిణామాలు అంటే అభిశంసన లేదా బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చి వైదొలిగారు. సర్వేకు ఎంచుకున్న ప్రజాకర్షక నేతల్లో 30శాతం ఇప్పటికీ అధికారంలో కొనసాగుతున్నారు. వారిలో 36శాతం మంది గత ఐదు సంవత్సరాలుగా పదవుల్లో వున్నారు. ప్రజాకర్షక నేతలు ఎంత ఎక్కువ కాలం పదవిలో వుంటే అంత ఎక్కువ ఆందోళన తలెత్తుతోంది. సగం మంది తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో వున్నారు.

ప్రజాకర్షక నేతలు ఎంత కాలం అధికారంలో వున్నారు, అంతిమంగా వారు పదవులను ఎలా వదులుకున్నారు అనేదానికంటే ముఖ్యమైన అంశం అధికారంతో వారేమి చేశారు అన్నది. వారి పదవీకాలంలో రాజకీయ శాస్త్రవేత్తలు వర్ణించినట్లుగా ‘ ప్రజాస్వామ్యం తప్పుదారి పట్టడం ‘ పౌరులు అనుభవిస్తున్న మౌలిక హక్కులు దిగజారటానికి వారి పదవీ కాలం కారణం అవుతున్నది. అనేక దేశాలలో వీరు తమకు అనుకూలంగా ఆట నిబంధనలను శాశ్వతంగా తిరిగి రాసుకున్నారు. సగం మంది నేతలు తమ దేశ రాజ్యాంగాలను తిరిగి రాసుకోవటం లేదా సవరించుకున్నారు. ఇన్ని దఫాలు మాత్రమే అధ్యక్షపదవిలో వుండాలి అనే నిబంధనలను ఎత్తివేయటం, కార్యనిర్వాహక అధికారాన్ని నియంత్రించే, సరి చూసే అంశాలను నామమాత్రం చేయటం వంటి పనులు చేశారు. మీడియా స్వేచ్చ, పౌరహక్కుల రక్షణ,రాజకీయ హక్కుల వంటి ప్రజాస్వామిక మౌలిక హక్కులకు సంబంధించి ఈ దేశాలన్నింటా తరతమ తేడాలువున్నప్పటికీ అవన్నీ దిగజారాయి. మీడియా స్వేచ్చ ఏడుశాతం, పౌరహక్కులు ఎనిమిదిశాతం, రాజకీయ హక్కులు 13శాతం పడిపోయాయి. ఇతర పాలకులతో పోల్చితే ప్రజాకర్షక పాలకుల పాలనలో నాలుగు రెట్లు ఎక్కువగా ప్రజాస్వామ్యం తప్పుదారి పడుతున్నది.

మితవాద ప్రజాకర్షక నేతల పాలనలో మైనారిటీలను బాధించటం, చట్టబద్దంగాని లక్ష్యాల కోసం ప్రజాగ్రహాన్ని ఆయుధంగా మార్చటం వంటి చర్యలకు పాల్పడతారు. వీరు తరచుగా అవినీతి వేళ్లను పెకలించి వేస్తామనే నినాదాలతో ఎన్నిక అవుతుంటారు. బ్రెజిల్‌లో బోల్‌సోనారో, అమెరికాలో డోనాల్డ్‌ట్రంప్‌ అదే నినాదాలతో అధికారానికి వచ్చారు. ఇటలీలో నార్తరన్‌ లీగ్‌ అనే పచ్చిమితవాద పార్టీ అవినీతి వ్యతిరేకనినాదాలతోనే జనాన్ని సమీకరిస్తోంది.( మన దేశంలో నరేంద్రమోడీ తొలిసారి నల్లధనం వెలికితీత, కాంగ్రెస్‌ పాలనలో అవినీతి గురించి పెద్ద నినాదాలతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వాటి వూసే లేదు.) వీరు అధికారానికి వచ్చిన తరువాత అవినీతిని అరికట్టకపోగా ప్రధాన స్రవంతిలోని మొసళ్ల వంటి వారి స్ధానంలో వారికి చెందిన అంతకంటే ప్రమాదకరమైన వారిని ముందుకు తెస్తారు. వీరు స్వతంత్ర దర్యాప్తు సంస్ధలను పని చేయనివ్వరు, అందువలన వారి దుష్కృత్యాలు పెద్దగా బయటకు రావు. అయినప్పటికీ 40శాతం మంది ప్రభుత్వాధినేతలు అంతిమంగా అవినీతి కేసులలో విచారణకు గురి అయ్యారు. అవినీతి, అక్రమాలు, దుర్వినియోగం, అంతకు ముందున్నవారి మీద తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తప్పుదారి పట్టిన ప్రజాస్వామ్యాలను సరైనదారిలో పెడతారు అనే భ్రమలు కలిగిస్తారు. అయితే అందుకు విరుద్ధంగా చేస్తారని దొరికిన సాక్ష్యాలు వెల్లడించాయి. అవినీతి పెరగటం, వ్యక్తిగత హక్కులు హరించుకుపోవటం, ప్రజాస్వామిక సంస్ధలకు తీవ్ర నష్టం కలిగిస్తారని తేలింది.

అట్లాంటిక్‌ పత్రిక నరేంద్రమోడీకి వ్యతిరేకమైనది కాదు, అమెరికాలో వున్న ఇతర బడా పత్రికలతో పోలిస్తే చాలా చిన్నది. అది చేసిన పరిశోధన ప్రజాకర్షక నేతల సాధారణ లక్షణాలను ఎంతో స్పష్టంగా వెల్లడించింది. దీన్ని గీటురాయిగా పెట్టుకొని మోడీని రాజకీయంగా వ్యతిరేకించేవారు గానీ, మద్దతు ఇచ్చేవారు గానీ పోల్చుకుంటే రాగల పర్యవసానాల గురించి ఒక అవగాహన వస్తుంది. ఆ పత్రిక విశ్లేషణలో బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడు, మాజీ సైనిక కెప్టెన్‌ అయిన జైర్‌ బోల్‌సోనారో ఎన్నికై జనవరి ఒకటిన అధికారాన్ని చేపట్టక ముందే క్లుప్తంగా ప్రస్తావించింది. అక్టోబరులో ఆయన ఎన్నికైనపుడు పర్యవసానాల గురించి సాంప్రదాయ రాజకీయ పెద్దలు, వ్యాఖ్యాతలు భిన్న వైఖరులు తీసుకున్నారు. బ్రెజిల్‌ను 1964-1985 మధ్య పాలించిన మిలిటరీ నియంతల పాలనను ఆయన ప్రశంసించటం ప్రజాస్వామిక వ్యవస్ధకు తీవ్రమైన ముప్పును సూచిస్తున్నదని కొందరు వ్యాఖ్యానించారు. దేశంలోని మీడియా, స్వతంత్ర న్యాయవ్యవస్ధ, ఇతర బలమైన ప్రజాస్వామిక వ్యవస్ధలు, సంస్ధలు నియంతృత్వపోకడలను అడ్డుకుంటాయని మరికొందరు పేర్కొన్నారు. అట్లాంటిక్‌ పత్రిక పేర్కొన్న ప్రపంచంలోని నలుగురు పెద్ద ప్రజాకర్షక నేతల్లో బోల్‌సొనారోతో పాటు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, నరేంద్రమోడీ, డోనాల్డ్‌ ట్రంప్‌ వున్నారు.

అనేక అక్రమాలకు పాల్పడి అధికారానికి వచ్చిన బోల్‌సోనారో ఐదు నెలలు గడవక ముందే అభిశంసనకు గురవుతారా లేక మరొక పద్దతుల్లో తప్పించే చర్య వుంటుందా అనే విధంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మేనెల ప్రారంభంలో మిలిటరీలో మాజీలైన కాబినెట్‌ మంత్రులు బోల్‌సోనారో దగ్గరకు వచ్చి మీకు మద్దతు ఇచ్చే మితవాద శక్తులను రంగంలోకి దించకపోతే ప్రభుత్వం కూలిపోవటం తధ్యమని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. దాని పర్యవసానంగా ఐదునెలల్లోనే గబ్బు పట్టిన అధ్యక్షుడికి మద్దతుగా వీధుల్లోకి రావాలని పిలుపు ఇచ్చారు. జనవరి నుంచి సామాజిక మాధ్యమాల్లో అధ్యక్షుడి అనుకూల మరుగుజ్జులు లేదా పోకిరీలు(ట్రోల్స్‌),ముగ్గురు కుమారులు అందరూ రెచ్చిపోతున్నారు. మంత్రివర్గంలో మూడో వంతు మంది మాజీ సైనికాధికారులే వున్నారు.ఆర్ధిక వ్యవస్ధతో సహా అన్ని రంగాలలో అస్తవ్యస్ధ పరిస్థితి ఏర్పడింది. విద్యారంగంలో కోతలకు వ్యతిరేకంగా లక్షలాది మంది గతవారంలో వీధుల్లోకి రాగా దానికి పోటీగా అధ్యక్షుడికి మద్దతు అంటూ బ్రెజిలియన్‌ మిలిటరీ క్లబ్‌ ఆదివారం నాడు(26న) ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చింది.

Image result for bad for India’s soul

బ్రెజిల్‌లోని వామపక్ష దిల్మారౌసెఫ్‌ మంత్రివర్గం మీద అభిశంసన ప్రక్రియతో ఆ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మాజీ అధక్షుడు లూలాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఎన్నో వాగ్దానాలతో, ఆశలు కల్పించి అధికారానికి వచ్చిన బోల్‌సోనారో అక్కడి ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దలేక సంక్షేమ పధకాలకు, పెన్షన్లకు కోత పెడుతూ, జనం మీద భారాలు మోపుతూ ఐదునెలలకే గబ్బుపట్టిన స్ధితి. గద్దెనెక్కించిన వారే దింపేందుకు లేదా పక్కన పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు వార్తలు. ఆయన కుమారులే పెద్ద అవినీతి పరులుగా తేలింది. అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను కప్పిపుచ్చి జనాన్ని పక్కదోవ పట్టించేందుకు ఒక బూతు వీడియోను స్వయంగా సామాజిక మాధ్యమంలోకి వదిలి దేశంలో క్షీణ సంస్కృతి ఎలా తయారైందో చూడాలంటూ జనాన్ని కోరాడు. బ్రెజిల్‌లో వున్న చట్టాల ప్రకారం 50సంవత్సరాలు దాటిన వారు వుద్యోగాల నుంచి రిటైరై పెన్షన్‌ తీసుకోవచ్చు. ఆ సౌకర్యాన్ని రద్దు చేసి వుద్యోగ విరమణ వయస్సును పెంచేందుకు చేసిన యత్నాలతో మద్దతుదార్లలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. పచ్చిమితవాదులైన వారు పార్లమెంట్‌, సుప్రీం కోర్టులను రద్దు చేయాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ఆదివారం నాటి ప్రదర్శనల్లో అది కూడా ఒక డిమాండని వార్తలు వచ్చాయి. అలాంటి డిమాండ్‌ సరికాదని చివరకు అధ్యక్షుడే చెప్పాల్సి వచ్చింది.

ప్రజాకర్షక నినాదాలతో ముందుకు వచ్చే మితవాత శక్తుల పట్ల జనానికి ఎలా భ్రమలు వుంటాయో బ్రెజిల్‌ అనుభవం మన కళ్ల ముందే వుంది. వారు విఫలమైతే వ్యతిరేకత ఎలా వుంటుందో రాబోయే రోజుల్లో చూస్తున్నాము. అందువలన మితవాదశక్తులు బలపడ్డాయని, అధికారానికి వచ్చాయని గుండెలు బాదుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. వారి మీద జనానికి భ్రమలు తొలిగే రోజులు కూడా వుంటాయి. ఒకసారి జనం పొరపాటు పడినా, తప్పు చేసినా వారిని నిందించి ప్రయోజనం లేదు. వారితో వుంటూనే వారి విశ్వాసం పొందేవరకు వారి సమస్యల మీద నిరంతరం పని చేయటం, అనువైన పరిస్ధితులు ఏర్పడే వరకు ఎదురు చూడటం తప్ప ప్రజావ్యతిరేక శక్తులను ఓడించేందుకు మరొక దగ్గరదారి లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d