• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: USA

డాలరు విలువను అమెరికా ఎందుకు తగ్గించదు !

07 Friday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

Currency Value, Donald trump, US Dollar

Image result for donald trump us currency

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనం మీద ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యాఖ్యానం చూసినపుడు మాయాబజార్‌ సినిమాలో శశిరేఖ రూపంలో వున్న ఘటోత్కజుడు వివాహ ప్రహసనంలో లక్ష్మణ కుమారుడి పాదాన్ని తొక్కినపుడు నొప్పి పెడుతున్నా ఏడవ లేక నవ్విన దృశ్యం గుర్తుకు రాకమానదు. ఆ సంగతి జనం చూసుకుంటారు వదిలేద్దాం ! గురువారం నాడు రూపాయి విలువ 72.11కి దిగజారి 71.99 వద్ద ముగిసింది. ( ఎన్ని రోజులు ఇలా జరుగుతుందో తెలియదుగానీ దాదాపు రోజూ జరుగుతున్నదానికి వరుసగా కొత్త రికార్డులంటూ రాసి రాసి చదువరులకు బోరు కొట్టించదలచుకోలేదు.) మన రూపాయి లేదా చైనా యువాన్‌ విలువ పతనమైతే ఎగుమతులు పెరుగుతాయి కదా అలాగే అమెరికా కూడా తన డాలరు విలువను తగ్గించుకొని ఎగుమతులు పెంచి వాణిజ్య లోటును ఎందుకు తగ్గించుకోకూడదు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది.

2008లో ప్రారంభమైన తీవ్ర ఆర్ధిక మాంద్యం, చైనా నుంచి దిగుమతుల కారణంగా కోల్పోయిన వుద్యోగాలను తిరిగి కల్పించేందుకు డాలరు విలువ తగ్గించాలన్న వూహలతో అధికారానికి వచ్చాడు డోనాల్డ్‌ ట్రంప్‌. అయితే అది ఎంత నష్టదాయకమో వెంటనే తెలిసి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏం జరిగి పరిణామాలు ఎలా వుంటాయో చెప్పలేము గాని ప్రపంచంలో ఇప్పుడొక వినూత్న పరిస్ధితి ఏర్పడిందని చెప్పక తప్పదు.

ప్రపంచంలో అమెరికా ఎంత పెద్ద ధనిక దేశమో దానికి అప్పులు కూడా అంత ఎక్కువగా వున్నాయి. మొత్తం అప్పు19.19లక్షల కోట్ల డాలర్లు.దానిలో విదేశీ అప్పు 5.35 లక్షల కోట్ల డాలర్లు వుంది. డాలరు విలువ తగ్గితే అప్పులు పెట్టిన వారందరూ గగ్గోలు పెడతారు. అప్పులిచ్చిన విదేశాలలో చైనా 1.1877లక్షల కోట్లతో ప్రధమ స్ధానంలో వుండగా జపాన్‌ 1.0435 లక్షల కోట్లు, ఐర్లండ్‌ 317.9 బిలియన్‌ డాలర్లతో మూడో స్ధానంలో వుంది. మన విదేశీ అప్పు 500 బిలియన్‌డాలర్లకు మించి వుంది. అయితేనే మనం కూడా అమెరికాకు 157 బిలియన్‌ డాలర్ల అప్పిచ్చి 11వ స్ధానంలో వున్నాం.(అరవై వేల జనాభాగల కేమాన్‌ దీవులు 242.9 బిలియన్లిచ్చి ఏడవ స్ధానంలో వుంది) అమెరికా అప్పు దాని జిడిపికి 106శాతం వుంది. 2017లో అప్పులకు చెల్లించిన వడ్డీ రేటు 2.26శాతం. కొందరు ఇంకా తక్కువ వడ్డీరేటుకే అప్పు ఇచ్చారు.

ఒక్కసారిగా డాలరు విలువ తగ్గితే వారంతా ఏం కావాలి. దివాలా తీయాలి, చలికాచుకొనేందుకు నోట్లను వుపయోగించాలి. తక్కువ వడ్డీకి ఇచ్చిన వారికి డాలరు విలువ పెరిగితే లాభం తప్ప తగ్గితే మిగిలేది బూడిదే. అందువలన దాని విలువలో స్వల్ప మార్పులను అనుమతించటం తప్ప అధికారంలో ఎవరున్నా విలువ పతనం కాకుండా చూస్తారు. ప్రస్తుతం మన దేశంతో లావాదేవీలలో అమెరికా 23బిలియన్‌డాలర్ల మేరకు వాణిజ్యలోటు కలిగి వుంది. దాన్ని పూడ్చుకోవాలంటే రానున్న మూడు సంవత్సరాలలో పది బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా తమ నుంచి దిగుమతులు చేసుకోవాలని అమెరికన్లు మన మీద వత్తిడి చేస్తున్నారు.(సెప్టెంబరు 6 హిందూ పతాక శీర్షిక) ఇదే విధానాన్ని చైనా, ఇతర దేశాల మీద కూడా రుద్దాలని చూస్తోంది. డాలరు విలువ తగ్గనుంది అనే వార్త వచ్చిందో డాలరు పెట్టుబడులన్నీ ఇతర మెరుగైన కరెన్సీలకు మారిపోతాయి. మన రూపాయి విలువ తగ్గటంతో డాలర్లు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. అందువలన విశ్వం అంతమౌతుందనుకున్నపుడే చివరి చర్యగా డాలరు విలువను తగ్గిస్తారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మన రూపాయి విలువ తగ్గుతున్నమేరకు మనం దిగుమతి చేసుకొనే పెట్రోలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. డాలరు విలువ తగ్గితే అమెరికాలో కూడా అదే జరుగుతుంది. రోజువారీ వాడే వస్తువులన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆ పరిణామం ఎగుమతి చేసే దేశాలకు కూడా మంచిది కాదు. డాలరు విలువ తగ్గితే వాటి కరెన్సీ విలువ పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాకు నామమాత్రపు లేదా అసలేమీ వడ్డీ లేకుండా విదేశీ పెట్టుబడులు, రుణాలు వస్తున్నాయి, దాని కరెన్సీ విలువ తగ్గితే వడ్డీ రేట్లు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. అమెరికాలో ఇప్పుడున్న వేతనాలతో చైనా, భారత్‌ మాదిరి చౌక ధరలకు వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేయటం కష్టం. వేతనాలు తగ్గిస్తే సామాజిక సంక్షోభం తలెత్తుతుంది. డాలరు విలువ ఎక్కువగా వుంటే ఎగుమతులు గిట్టుబాటుగాక వుత్పత్తి పడిపోతుంది.

అన్నింటికంటే ముఖ్యంగా డాలరు ఇప్పుడు రిజర్వు కరెన్సీగా వుంది. అనేక దేశాలు, కార్పొరేట్‌ సంస్ధలు పెద్ద మొత్తంలో వాటిని నిల్వ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ లావాదేవీలు, పెట్టుబడులకు వాటిని వినియోగిస్తాయి. రిజర్వు కరెన్సీ కలిగిన ఏ దేశమైనా చౌకగా ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. బ్రిటన్‌ ప్రాభవం కోల్పోవటంతో దాని పౌండ్‌ స్ధానంలో తన డాలరును అలాంటి కరెన్సీగా చేయాలని అమెరికా నిర్ణయించుకుని అమలు చేస్తోంది. సాంప్రదాయ వస్తూత్పత్తి పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్యపెట్టుబడిదారులది ఎప్పుడు పైచేయి అయిందో అప్పటి నుంచి డాలరును ముందుకు తెచ్చారు. దీని వలన ఇతర దేశాల నుంచి పెట్టుబడులు, అప్పులు తీసుకోవటం ద్వారా అమెరికా తన లోటును పూడ్చుకొంటోంది. ద్రవ్యపెట్టుబడిదారుల ఆధీనంలోని బ్యాంకుల పలుకుబడి, లావాదేవీలు, లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. డాలరును ఆయుధంగా చేసుకొని అమెరికా కార్పొరేట్‌ సంస్ధలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో, ఆయా దేశాలలో చొరబడటంతో పాటు ప్రపంచ మిలిటరీ వుద్రిక్తతలలో అమెరికా జోక్యం, ఎక్కడైనా లేకపోతే సృష్టించటం జరుగుతున్నది. వాటి ద్వారా కార్పొరేట్ల ఆయుధ పరిశ్రమలు మూడుపువ్వులు ఆరుకాయలుగా లాభాలు పొందుతున్నాయి. వాటికి దెబ్బ తగుల కుండా వుండాలంటే ఒక చోట వుద్రిక్తతలు సడలితే, ముగిస్తే మరొక చోట తలెత్తేట్లు చేస్తున్నారు. మిలిటరిజం, సామ్రాజ్యవాదం ఒకదానితో ఒకటి కలసి పెరుగుతున్నాయి. డాలరు విలువను తగ్గిస్తే ఇది సాధ్యం కాదు.

చైనా పెద్ద మొత్తంలో అమెరికాకు అప్పు ఇచ్చినందున డాలరు విలువ తగ్గితే ఎక్కువగా నష్టపోయేది కూడా ఆ దేశమే. చైనా కనుక తన అప్పును తగ్గించుకుంటే, మిగతా దేశాలు కూడా దాని బాటనే నడిస్తే తక్షణం డాలరు విలువ పతనం అవుతుంది. చైనా కొత్తగా డాలర్లను కొనుగోలును తగ్గించినా సమస్యలు తలెత్తుతాయి. మొత్తం మీద అమెరికా లేదా చైనా ఏ విపరీత చర్యకు పాల్పడినా రెండు దేశాలతో పాటు ప్రపంచం సంక్షోభంలో మునుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే తెలిసిగానీ లేక తెలియకగానీ ట్రంప్‌ దూకుడు మీద వున్నాడు. పిచ్చి పనులు చేస్తే ఫలితాలు, పర్యవసానాలను అనుభవిస్తాడు. మన రూపాయితో పోలిస్తే జపాన్‌ ఎన్‌ విలువ ఇంకా తక్కువ, శుక్రవారం నాడు ఒక డాలరుకు 110.6 ఎన్‌ల వద్ద వుంది. దీని కంటే చాలా ఎక్కువగా వుండే చైనా యువాన్‌ విలువను పెంచాలని అమెరికా డిమాండ్‌ చేస్తోందిగానీ జపాన్‌ గురించి ఇంతవరకు మాట్లాడలేదు. రాబోయే రోజుల్లో జపాన్‌తో వాణిజ్య సమస్య మీద కూడా కేంద్రీకరిస్తానని ట్రంప్‌ ప్రకటించటంతో డాలర్‌ విలువ స్వల్పంగా పతనమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రో పన్ను తగ్గించం- గాల్లో దీపం రూపాయి !

05 Wednesday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China Currency, Currency Value, India oil Tax, Naredra Modi, RBI, Rupee Fall

Image result for rupee value : narendra modi cartoons

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -3

ఎం కోటేశ్వరరావు

రూపాయి విలువ పతనానికి వాణిజ్య యుద్దం, చమురు ధరల పెరుగుదల వంటి బయటి అంశాలే కారణం, మనకు సంబంధం లేదు, కనుక రూపాయి దానికదే సర్దుకుంటుంది. రూపాయి విలువ పతనమైనందున పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగినంత మాత్రాన వాటి మీద కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదు. తాజా పరిస్ధితులపై నరేంద్రమోడీ సర్కార్‌ అనధికార స్పందన లేదా అధికార యంత్రాంగం లీకుల ద్వారా వెల్లడి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో తర్కం ఇది. అయినా సరే ఇంకా మోడీని సమర్ధించేవారు, బిజెపిని నెత్తికెత్తుకునే వారు వున్నారు. ప్రజాస్వామ్యం మనది, ఎవరి స్వేచ్చ వారిది.

వస్తుమార్పిడి పద్దతి నుంచి నగదు లావాదేవీలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి ప్రతి దేశ కరెన్సీ ఏదో ఒక విధంగా ప్రభావితమౌతూనే వుంది. గత కొద్ది రోజులుగా రూపాయి విలువ పడిపోతూ వుండటం, నిత్యం పెట్రోలు, డీజిలు ధరల పెంపుదల ప్రకటనలు వెలువడుతుండటంతో కరెన్సీ విలువపై చర్చ జరుగుతోంది. బుధవారం వుదయం (11.20) రూపాయి విలువ మరింతగా దిగజారి ఒక డాలరుకు రు. 71.71గా నమోదైంది . ఇంత జరుగుతున్నా మన కరెన్సీ ఇంకా పతనమైనా ఫరవాలేదు అన్నట్లుగా కొందరు చెబుతున్నారు. నరేంద్రమోడీ తీరు తెన్నులను చూసినపుడు దేశమంతా చర్చనీయాంశం అయిన, ఆందోళన చెందిన విషయాల మీద సకాలంలో సూటిగా మాట్లాడిన వుదంతం ఒక్కటంటే ఒక్కటీ లేకపోవటం ఆశ్చర్యకరంగాకపోయినా ఆందోళనకరం. రూపాయి పతనాన్ని అరికడతారో లేక కొనసాగింపును అనుమతిస్తారో ఏదో ఒకటి చెప్పాల్సిన రాజధర్మం ఏమైనట్లు ?

కరెన్సీ విలువలను ప్రస్తుతం ఎక్కువ దేశాలు మార్కెట్‌ శక్తులకు వదలి వేశాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు తెరచాటున విలువ నిర్ణయ అధికారాన్ని తమ చేతుల్లోనే వుంచుకున్నాయి. చైనా సర్కార్‌ తన యువాన్‌ విలువను నియంత్రిస్తున్నదని అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తాయి. అలాంటిదేమీ లేదని చైనా చెబుతోంది. ఇటీవలి కాలంలో మన కరెన్సీ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబ్యాంకు డాలర్లను కొన్నింటిని అమ్మిందని అవి 20బిలియన్ల వరకు వున్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకు గానీ, కేంద్రం గానీ తాము తీసుకోబోయే చర్యల గురించి జనానికి చెప్పటం లేదు. మొత్తం మీద పరిణామాలను చూసినపుడు మార్కెట్‌ శక్తులకు వదలివేసినా అదుపు తప్పినపుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. లేకపోతే వాటి పుట్టి మునుగుతుంది కదా !

గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అనుసరించిన విధానాలు దాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. అందుకే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే నిర్ధారణలకు వస్తున్న యువత అక్కడ నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో చైనా తనదైన తరహా సోషలిస్టు పద్దతుల్లో ముందుకు పోతోంది, కొన్ని ఎగుడుదిగుడులున్నా సంక్షోభాలకు దూరంగా వుంది. అనేక దేశాలు అమెరికా నుంచి అధిక ధరలకు యంత్రాలు, పరికరాలు, ఇతర వస్తువులను కొనే బదులు తామే తయారు చేయటం, ప్రత్యామ్నాయాలను చూసుకోవటంతో పాటు ఎగుమతుల్లో అమెరికాకు పోటీగా తయారయ్యాయి. తన కరెన్సీ విలువను అధికంగా వుంచుతూ ఆధరకు తన వస్తువులను కొనాలంటూ ఇతర దేశాల మీద అమెరికా వత్తిళ్లు తెస్తోంది. బెదిరింపులకు పాల్పడుతోంది. చైనాపై ప్రారంభించిన వాణిజ్య యుద్ద సారమిదే. అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు పరిమితంగా అయినా తన కరెన్సీ విలువ తగ్గింపును చైనా ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తన ఎగుమతులకు కొత్త మార్కెట్లను చూసుకోవటం, వున్న మార్కెట్లలో దెబ్బ తగలకుండా చూసుకొనేందుకు కరెన్సీ విలువను పరోక్షంగా నియంత్రిస్తున్నట్లు కనిపిస్తోంది.

1930దశకంలో తలెత్తిన మహా ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడేందుకు అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి బడాదేశాలన్నీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్ధాయిలో 40శాతం వరకు తమ కరెన్సీ విలువలను తగ్గించాయి.బంగారంతో కరెన్సీ విలువ లింక్‌ను విస్మరించాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి నష్టపరిహారం చెల్లించిన జర్మనీ యుద్ధ భారాలను తట్టుకోలేక తన కరెన్సీకి కావాలనే విలువ లేకుండా చేసింది. ఒక డాలరుకు వందకోట్ల మార్క్‌లుగా విలువ పతనం అయింది. తద్వారా కారుచౌకగా తన వస్తువులను ప్రపంచ మార్కెట్లో అమ్మి ప్రభుత్వం కష్టాల నుంచి గట్టెక్కిందిగానీ సామాన్య జర్మన్లు భారీ మూల్యం చెల్లించారు. ఆ దశలో అధికారానికి వచ్చిన హిట్లర్‌ జర్మన్‌ ఔన్నత్యాన్ని నిలబెట్టాలనే పేరుతో రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన విషయం తెలిసిందే. చరిత్రలో అతిపెద్ద వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు ఏ పర్యసానాలకు దారి తీస్తాయో ?

గత ఆరునెలల్లో జరిగిన పరిణామాలను చూస్తే అంతర్గత ఇబ్బందులను అధిగమించటం కోసం అమెరికా తన వడ్డీ రేట్లను పెంచటం, ఇంకా పెంచనున్నట్లు ప్రకటించటం, చైనా, ఇతర దేశాల మీద వాణిజ్య యుద్ధానికి దిగటం, ఇరాన్‌పై తిరిగి ఆంక్షలను ప్రకటించటం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు రేట్లు పెరగటం, టర్కీ లీరా, అర్జెంటీనా పెసో పతనం వంటి ముఖ్య పరిణామాలన్నీ ప్రపంచ కరెన్సీలను ప్రభావితం చేస్తున్నాయి. ఓట్ల కోసం ట్రంప్‌ తీసుకొనే చర్యల కారణంగా నవంబరులో అమెరికాలో జరిగే పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల వరకు ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం వుంటుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా మన వంటి దేశాల పౌరుల పరిస్ధితి తయారైంది. కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలతో ప్రతి దేశానికీ కొన్ని ప్రయోజనాలు, కొన్ని కష్టాలు వుంటాయి. వుదాహరణకు ఐటి వుత్పత్తులను ఎగుమతి చేసే మన కంపెనీల వాటాల ధరలు దూసుకుపోతుండగా దిగుమతులు చేసుకొనే కంపెనీలవి డీలా పడుతున్నాయి. వాణిజ్యలోటు వున్న మన వంటి దేశాలకు కరెన్సీ పతనం ప్రయోజనకరం అయినా మిగులు వున్న చైనా వంటి దేశాలకు వాటి సమస్యలు వాటికి వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో డాలర్లను కొనుగోలు చేయటం అంటే మిగతా కరెన్సీలను విక్రయించటం కూడా ఇమిడి వుంటుంది. ఏ లావాదేవీ జరిగినా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారులు వీటిని తమకు అనుకూలంగా నియంత్రిస్తారు.

ప్రతి దేశమూ అధికారిక లావాదేవీలను జరిపే సమయంలో ఒక నిర్ణీత విలువతోనే ఖరారు చేసుకుంటుంది. ఒక పరిధి నిర్ణయించుకొని దానికి లోబడి మార్పులున్నంత వరకు లావాదేవీలను అనుమతిస్తుంది. దాటినపుడు చర్యలకు వుపక్రమిస్తుంది. కొన్ని దేశాలు ప్రయివేటు రంగంలో కూడా నిర్ణీత విలువను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి చోట్ల డాలర్ల క్రయ విక్రయాలు బ్లాక్‌ మార్కెట్‌కు చేరే అవకాశాలూ లేకపోలేదు. పీకల్లోతు నీరు వచ్చింది తప్ప ప్రాణాలకు ముప్పు లేదు, అయినా వచ్చిన వరద వచ్చినట్లే పోతుంది లేదా స్ధిరపడుతుంది ఆందోళన అవసరం లేదన్నట్లుగా మన అధికార యంత్రాంగం వుంది. రూపాయి పతనానికి వాణిజ్యం యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రధాన కారణాలు, వాటిని ప్రభుత్వం ఏమీ చేయగలిగింది లేదు, రూపాయి దానంతట అదే స్ధిరపడుతుందని ఆర్ధికశాఖ అధికారి ఒకరు అనధికారికంగా వ్యాఖ్యానించారు. పతనం మరింతగా కొనసాగుతుందనటానికి తగినన్ని కారణాలున్నాయని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ చెప్పారు.

డబ్బు బయటకు పోకుండా చర్యలు తీసుకోవటం ద్వారా కరెన్సీ పతనాన్ని కొంతమేరకు అరికట్టిన వుదంతాలు వున్నాయి. గతంలో చైనా అలా వ్యవహరించిందని విశ్లేషకులు చెబుతున్నారు. స్ధానిక కరెన్సీని విక్రయించకుండా ఆర్ధిక సంస్ధలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి అదుపు చేయటం, వుల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకపద్దతి. రిజర్వుబ్యాంకులు బయటకు ప్రకటించకుండానే ఒక నిర్ణీత ధరను సూచించటం మరొకటి. లావాదేవీలపై పరిమితులు విధించటం, అన్నింటిని విధిగా నమోదు చేయటం వంటివి మరికొన్ని చర్యలు.

అమెరికాలో వడ్డీ రేట్లను ఎప్పుడైతే పెంచారో అప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి అక్కడికి తరలటం ప్రారంభించాయి. ఆ ప్రవాహాన్ని ఆపేందుకు మన బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి, రూపాయి పతనం ఇంకా కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా పెంచే అవకాశాలున్నాయి. చివికి పోయిన వస్త్రానికి ఒక దగ్గర మాసిక వేస్తే మరో చోట చిరిగి పోతుందన్నట్లుగా ఒకదాని కోసం ఒక చర్య తీసుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయి. జనం మీద విపరీత భారం, ప్రభుత్వాలకు ద్రవ్యలోటు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక దేశ కరెన్సీ విలువ పెరగటం కూడా ఒక్కోసారి నష్టదాయకమే. వుదాహరణకు స్విడ్జర్లాండ్‌ వుదంతం. బలమైన మారకపు విలువ కారణంగా అక్కడ డబ్బు దాచుకోవటం ఎంతో భరోసాగా భావించి ఒకప్పుడు మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనమంతా స్విస్‌ బ్యాంకులకు చేరేది. దాంతో వాటి లాభాలు ఇబ్బడి ముబ్బడి అయ్యాయి. అయితే స్విస్‌ ఫ్రాంక్‌ విలువ పెరిగి ఆ దేశ ఎగుమతులు ఖరీదయ్యాయి. పారిశ్రామికవేత్తలు లబోదిబో మన్నారు. దాంతో నల్లధన ప్రవాహాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవటంతో నల్లధన కుబేరులు వేరే దేశాల బాట పట్టారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనకూ చైనాకూ పోలిక హాస్యాస్పదం !

04 Tuesday Sep 2018

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China Currency, China Trade surplus, Currency Value, Indian Rupee, Rupee, yuan

Image result for yuan vs rupee

రూపాయి విలువ- మోడీ భక్తుల గారడీ -2

ఎం కోటేశ్వరరావు

మన రూపాయే కాదు చైనా యువాన్‌ కూడా అంతకంటే ఎక్కువగానే పతనమైంది కదా, దాని గురించి మాట్లాడరేమని ఒక విమర్శ. ఈ విషయంలో చైనాతో పోల్చేవారు మిగతా అంశాలలో కూడా ఆ దేశంతో పోల్చితే నిజాయితీగా వుంటుంది. మన కంటే బాగా అభివృద్ధి చెంది, జపాన్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదిగింది అంటే అది కమ్యూనిస్టు దేశం, మనది ప్రజాస్వామిక దేశం అని వితండవాదం.మనకంటే అనేక దేశాలలో ప్రజాస్వామ్యమేగా వుంది, వాటితో సమంగా లేదా దగ్గరగా అయినా ఎందుకు ఎదగలేదు అంటే సమాధానం వుండదు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి మనకంటే యువాన్‌ పతన శాతం ఎక్కువ కాదు, గణనీయంగానే మనకు దగ్గరగా పడిపోయింది. మన కంటే పొరుగున వున్న పాక్‌ రూపాయి డాలరు మారకంతో మరింతగా పతనమైంది. దాన్ని చూసి మన దేశం మోడీ పాలనలో వెలిగిపోతున్నట్లు భావించాలా ?

కరెన్సీ విలువల పనితీరు గురించి చెప్పేటపుడు పోలిక సాధారణం. కరెన్సీ పతనమైన దేశాలన్నీ ఏదో ఒక తీవ్ర సమస్యను ఎదుర్కొంటాయి. పతనం కాని దేశాలన్నీ సజావుగా వున్నాయనుకుంటే పప్పులో కాలేసినట్లే ! ఒక దేశ కరెన్సీ విలువ పతనం లేదా పెరుగుదల అన్నది వాటి పరిస్ధితులు, అంతర్గత విధానాల మీద ఆధారపడి వుంటాయి. తెలిసి లేదా తెలియకగానీ చైనాను ముందుకు తెస్తున్నారు గనుక దాని గురించే చూద్ధాం. మన దేశం దాదాపు ప్రతి దేశంతో వాణిజ్యలోటులోనే వుంది. అంటే మనం చేసే ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. అందువల్లనే మన విదేశీమారక ద్రవ్య ఎప్పటి కప్పుడు ఎన్నినెలల దిగుమతులకు సరిపడా వుంటుంది అని లెక్క పెట్టుకుంటూ వుంటాము. చైనాకు మరికొన్ని దేశాలకు అటువంటి దురవస్ధలేదు. 2013లో మన దగ్గర ఆరునెలల దిగుమతులకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలుంటే ఇప్పుడు పది నెలలకు సరిపడా వున్నాయి. కొందరు వూహిస్తున్నట్లు త్వరలో రూపాయి పతనం 74కు చేరితే ఆ నిల్వలు హరించుకుపోతాయి. చైనాలో అంతర్భాగమైన హాంకాంగ్‌లో మన కంటే ఎక్కువగా డాలర్లు వున్నాయి. చైనా గురించి చెప్పనవసరం లేదు. మన నిల్వలు 400 బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా వుంటే చైనా వద్ద 3,110 బిలియన్లు వున్నాయి. తరువాత స్ధానంలో జపాన్‌ 1,250 బిలియన్‌ డాలర్లతో వుంది. డాలర్‌ విలువతో పోల్చితే చైనా,జపాన్‌ కరెన్సీల విలువ తక్కువే. సెప్టెంబరు మూడున( 2018 ) ఒక చైనా యువాన్‌కు మన రు.10.43, జపాన్‌ ఎన్‌కు రు.1.56 మారకపు విలువగా వున్నాయి.

ప్రతి దేశం తన కరెన్సీ విలువను పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయించుకుంటుంది. ప్రజల ప్రయోజనాలను పట్టించుకోదు. చైనా,వియత్నాం, క్యూబా, వుత్తర కొరియా వంటి సోషలిస్టు దేశాల పాలకవర్గం కార్మికవర్గమే కనుక దాని ప్రయోజనాలకు అనుగుణంగా వాటి విధానాలు వుంటాయి. అయితే అవి ఇతర పెట్టుబడిదారీ దేశాలతో కూడా ముడిపడి వున్నాయి కనుక వాటికి కూడా కొన్ని సమస్యలు వుంటాయి. ప్రస్తుతం ద్రవ్య పెట్టుబడి పెత్తనం నడుస్తోంది కనుక దాని ప్రయోజనాలకు అనుగుణంగా కరెన్సీల విలువ నిరంతరం మారుతూ వుంటుంది. వుదాహరణకు ఒక యూరో లేదా బ్రిటీష్‌ పౌండ్‌తో ఇప్పుడు రెండు అమెరికన్‌ డాలర్లు కొనే అవకాశం వుంది. మొదటి రెండు కరెన్సీలు తమ విలువను కొంత తగ్గించుకుంటే అప్పుడు ఒకటిన్నర డాలర్లే వస్తాయి. అధికారికంగా చేస్తే విలువ తగ్గింపు లేదా మార్కెట్‌ శక్తుల కారణంగా తగ్గితే దాన్ని పతనం అంటారు. మన రూపాయి విలువలో జరిగిన మార్పుల క్రమం ఇలా వుంది.

స్వాతంత్య్రం పొందిన సమయంలో మన రూపాయి బ్రిటీష్‌ పౌండ్‌తో ముడివడి వుంది. ఒక పౌండుకు ఒక రూపాయి విలువ వుండేది.1949లో బ్రిటన్‌ తన కరెన్సీ విలువను తగ్గించటంతో మనది కూడా ఆమేరకు తగ్గింది.1966లో మన దేశం తొలిసారిగా చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్నది, దానికి తోడు దుర్భిక్షం, పాకిస్ధాన్‌తో యుద్దం తదితర కారణాలు తోడయ్యాయి. అప్పు కావాలంటే దేశ ఆర్ధిక వ్యవస్ధలోకి విదేశాలకు మార్కెట్లు తెరవాలని, రూపాయి విలువను తగ్గించుకోవాలని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ షరతులు విధించాయి. తొలిసారిగా వాటిని అంగీకరించి రూపాయి విలువను 36.5శాతం తగ్గించి డాలరుకు 4.76 నుంచి 7.50కు పడిపోయేట్లు ప్రభుత్వమే చేసింది. దాని పర్యవసానాలతో 1967 ఎన్నికలలో కాంగ్రెస్‌ తొలిసారి తొమ్మిది రాష్ట్రాలలో ఏర్పడటం, పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తి తదుపరి చీలి పోవటం వంటి పరిణామాలు, దాని కొనసాగింపుగానే 1975లో అత్యవసర పరిస్ధితికి దారి తీసింది. 1971లో రూపాయిని డాలర్‌తో ముడివేశారు.1972లో తిరిగి రూపాయిని బ్రిటీష్‌ పౌండ్‌తో ముడివేశారు.1975లో ప్రధాన కరెన్సీలతో మారకపు విలువలను ముడివేశారు, కాలనుగుణ్యంగా కొన్ని మార్పులు చేసినా ఆ సంబంధాలను 1991వరకు కొనసాగించారు. ఆ ఏడాది ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక విధానాలలో భాగంగా 19శాతం వరకు రూపాయి విలువను తగ్గించటమే గాక క్రమంగా 1994నాటికి వాణిజ్యం కోసం స్వేచ్చగా మార్కెట్‌ శక్తులకు మన రూపాయిని వదలి వేశారు. అప్పటి నుంచి డాలరుకు రు. 31.37గా వున్న విలువ క్రమంగా పతనమౌతూ మోడీ హయాంలో 71 దాటి కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇది తప్పుడు విధానమని, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమైనదని రుజువైంది. కాంగ్రెస్‌ ప్రారంభించిన ఈ క్రమాన్ని బిజెపి తు.చ తప్పకుండా అనుసరిస్తోంది.

హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్టు పత్రిక(ఇదేమీ కమ్యూనిస్టు అనుకూలం కాదు) తాజా విశ్లేషణ సారాంశం ఇలా వుంది. రాబోయే రోజుల్లో అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే ఏమోగాని యువాన్‌ విలువ ఒక శాతం పతనమైతే చైనా ఎగుమతులు 0.6శాతం పెరుగుతాయి. జూన్‌ మధ్యనాటికి ఐదుశాతం పతనమైనందున నాలుగో త్రైమాసికం నుంచి మూడుశాతం ఎగుమతులు పెరుగుతాయి.(తాజా విలువల ప్రకారం యువాన్‌ ఎనిమిదిశాతం పతనం అయింది) దీని వలన అదనంగా వచ్చే 68.4బిలియన్‌ డాలర్లు చైనా వస్తువులపై అమెరికా విధించిన దిగుమతి పన్ను కంటే ఎక్కువ.

ఆర్ధికవేత్తల విశ్లేషణల ప్రకారం వాణిజ్య మిగులు కారణంగా ముందే చెప్పుకున్నట్లు చైనా దగ్గర డాలర్ల నిల్వలు మూడులక్షల కోట్ల డాలర్లకు పైగా వున్నాయి. వాటిలో 1.4లక్షల కోట్ల డాలర్లను అమెరికా అప్పుగా తీసుకుంది. ఇప్పుడు గనుక చైనా అప్పు వసూలు చేసుకొనేందుకు అమెరికా బాండ్లను విక్రయిస్తే డాలరు విలువ పతనం అవుతుంది. చైనా యువాన్‌ విలువ పెరుగుతుంది. చైనా ఇంకే మాత్రం డాలర్ల ఆస్ధులను కొనుగోలు చేయకపోయినా, అమెరికాతో కరంటు ఖాతా మిగులు వున్నందున డాలర్లు చైనా వ్యవస్ధలోకి ప్రవేశించినపుడు దాని కరెన్సీ విలువ పెరుగుతుంది. అందువలన అవసరం వున్నా లేకపోయినా డాలరు ఆస్ధులను కొనుగోలు చేసి తన కరెన్సీ విలువ బలహీనంగా వుంచటం ద్వారా తన ఎగుమతులు మరింతగా గిట్టుబాటు అయ్యేట్లుగా చూసుకోగలుకు తుంది. పరిమితంగా డాలర్ల నిల్వలున్న దేశాలకు వాటిని విక్రయించి తమ కరెన్సీలను కొనుగోలు చేసేందుకు అవకాశాలు తక్కువగా వుంటాయి.

ఈ నేపధ్యంలో మన నరేంద్రమోడీ సర్కార్‌ ఏమి చేయగలదో, ఏమి చేస్తోందో ఎవరైనా చెబుతారా, ఇంతవరకు అలాంటి ప్రయత్నాలేమీ కనిపించటం లేదు. మోడీ హయాంలో 58 నుంచి 71కి మన రూపాయి పతనమైంది. మన కరెన్సీ విలువ పడిపోయినా ఒక్క ఐటి సేవల ఎగుమతులు తప్ప ఇతర వస్తు ఎగుమతులు నేలచూపులు చూడటం తప్ప పైకి లేవలేదు. ఎక్కడుందీ వైఫల్యం ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

దక్షిణాఫ్రికా భూ సంస్కరణలకు అమెరికా వ్యతిరేకత!

29 Wednesday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, land reforms, South Africa, South African land reforms

Image result for Donald trump against South Africa land reforms                   అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌                                   సిరిల్‌ రాంఫొసా

 ఎం. కోటేశ్వరరావు

‘దక్షిణాఫ్రికాలో భూ స్వాధీనాలు, పెద్ద ఎత్తున రైతాంగ హత్యలూ జరుగుతున్నాయి, వాటి గురించి సునిశితంగా అధ్యయనం చేయండి’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన విదేశాంగ మంత్రి మైక్‌ పోంపియోను ఆగస్టు 22న ఆదేశించటంతో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా భూసమస్య ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఒక సర్వసత్తాక దేశ అంతర్గత వ్యవహారాలలో, భూ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇంత బహిరంగంగా జోక్యం చేసుకొనేందుకు పూనుకోవటం అమెరికా తెంపరి తనానికి నిదర్శనం. కొద్ది రోజుల క్రితం మితవాద మేథావి మరియన్‌ టపీ భూ స్వాధీనాలపై దక్షిణాఫ్రికాను హెచ్చరించండి అంటూ ట్రంప్‌ను కోరుతూ ఒక వ్యాసం రాశాడు. శ్వేతజాతి రైతులను చంపుతున్నారు, వారి భూములను లాక్కుంటున్నారు అంటూ అమెరికా మీడియాలో రెచ్చగొడుతున్నారు. భూ సంస్కరణలను వ్యతిరేకించే శ్వేతజాతీయులతో కూడిన ఆఫ్రీఫోరమ్‌ ప్రతినిధులు జూన్‌లో అమెరికా వచ్చి అనేక మందిని కలిశారు, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ట్రంప్‌ చర్యను దక్షిణాఫ్రికాలో అనేక మంది తీవ్రంగా ఖండించారు. దేశ ఉపాధ్యక్షుడు మబుజా ఒక ప్రకటన చేస్తూ భూ సంస్కరణలు సామాజిక, జాతి విభజన ఫలితాలు కాదని స్పష్టం చేశారు.
భూ సమస్య ముందుకు రావటం గురించి పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొందరు దీనిని రాబోయే ఎన్నికల గారడీగా భావిస్తున్నారు. భూ సంస్కరణలు జరగాలన్నది సాధారణ ఏకాభిప్రాయం. ఎలా అన్నదానిపై తేడాలున్నాయి. పాతికేండ్లుగా తేల్చుకోలేని స్ధితి. జాత్యహంకార, వలసపాలనలో భూముల నుంచి స్థానికులను వెళ్లగొట్టి వలస వచ్చిన శ్వేతజాతీయులు ఆక్రమించుకున్నారు. 1994లో శ్వేతజాతి దురహంకార పాలన అంతమై ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నాయకత్వంలో త్రిపక్ష కూటమి అధికారానికి వచ్చేనాటికి తొమ్మిదిశాతం శ్వేత జాతీయుల చేతిలో 90శాతం భూమి కేంద్రీకృతమై ఉంది. భూ పంపిణీ అన్నది ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ ప్రకటించిన ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. స్ధానిక ఆఫ్రికన్లను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసిన శ్వేతజాతి ప్రభుత్వం 1913లో చేసిన ఒక చట్టం ప్రకారం నల్లజాతీయులైన ఆఫ్రికన్లు ‘శ్వేత దక్షిణాఫ్రికా’లో భూములు కొనుగోలు చేసేందుకు లేదా కౌలుకు తీసుకొనే అవకాశాన్ని కోల్పోయారు, భూముల నుంచి గెంటివేతకు గురయ్యారు.
దేశాధ్యక్షుడు సిరిల్‌ రాంఫొసా తాజాగా ఒక పత్రికకు భూసమస్యపై రాసిన వ్యాసం సారాంశం ఇలా వుంది. గ్రామీణాభివృద్ధి, భూ సంస్కరణల శాఖ జరిపిన భూ తనిఖీ లెక్కల ప్రకారం 90శాతం భూమి వ్యక్తులు, ట్రస్టులు, కంపెనీల చేతిలో ఉంది. పదిశాతం ప్రభుత్వానికి చెందినది. తొంభైశాతం భూమిలో వ్యక్తుల వద్ద 39, ట్రస్టులకు 31, కంపెనీలకు 25శాతం వుంది. వ్యవసాయ క్షేత్రాలు, భూములు కేవలం ఏడుశాతం యజమానుల చేతుల్లో ఉన్నాయి. ఈ ఏడుశాతంలో 72శాతం శ్వేతజాతీయులు, 15శాతం రంగు జాతీయులు (మన దేశంలో ఆంగ్లో ఇండియన్ల మాదిరి స్ధానిక ఆఫ్రికన్లు, శ్వేతజాతీయులు, భారత జాతీయుల సంకరంతో కలిగిన జనాభా), ఐదుశాతం భారతీయ సంతతి, నాలుగుశాతం ఆఫ్రికన్లు ఉన్నారు. ట్రంప్‌ ప్రకటన విషయానికి వస్తే ఉత్తర రాష్ట్రంలో ప్రయివేటు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న వార్తల పూర్వరంగంలో వెలువడింది. ప్రభుత్వ రేటు ప్రకారం రెండు కోట్ల రాండ్‌లు తీసుకొని భూమిని స్వాధీనం చేయాలని స్థానిక అధికారులు ఒక యజమానిని కోరారు. అయితే తనకు 20కోట్ల రాండ్లు ఇవ్వాలని అతను తిరస్కరించటంతో చట్టనిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకొనేందుకు పూనుకున్నారు.
ముఫ్పైశాతం భూమిని ఐదేండ్లలో పంపిణీ చేయాలన్నది 1994లో తొలి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో చేసిన వాగ్దానం. దానిలో ఇప్పటి వరకు పదిశాతం కూడా జరగలేదని 2014వరకు విధించిన గడువును 2024 వరకు పొడిగించనున్నట్టు వార్తలు వచ్చాయి. అంటే పాతికేండ్లలో చేసిందేమీ లేదన్నది చేదు నిజం. ఆఫ్రికన్లలో విపరీతంగా ఉన్న నిరుద్యోగం, పాతికేండ్లుగా అనుసరిస్తున్న నయావుదారవాద విధానాల వలన ఉపాధి అవకాశాలు పెరగకపోవటం వంటి అనేక కారణాలతో జనంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. అవినీతి, అక్రమాల కారణంగా ఏకంగా ఒక దేశాధ్యక్షుడు జాకబ్‌ జుమా కొద్ది నెలల క్రితం పదవి నుంచి తప్పుకోవాల్సి రావటం అక్కడి పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. జుమాను తొలగించకపోతే తాము సంకీర్ణ కూటమి నుంచి వైదొలుగుతామని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించాల్సి వచ్చింది. అవినీతి విషయంలో పట్టుబట్టిన మాదిరి ఇతర ప్రజావ్యతిరేక విధానాలు లేదా భూ సంస్కరణల వంటి వాటి విషయంలో కమ్యూనిస్టు పార్టీ అలాంటి వత్తిడి పాలక కూటమి మీద తీసుకురాలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే అంగీకృత విధానాల నుంచి కూటమి నాయకురాలైన ఏఎన్‌సీ దూరంగా వ్యవహరిస్తున్నందున వచ్చే ఎన్నికలలో తాము అవసరమైతే వంటరిగా బరిలోకి దిగుతామని కమ్యూనిస్టు నేతలు హెచ్చరించారు. ఒక వేళ అదే జరిగితే భూ సంస్కరణలు ఎన్నికల సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. కూటమి ఐక్యంగానే ఉన్నప్పటికీ జనం నుంచి వస్తున్న వత్తిళ్లు, నిరుద్యోగం, సాధికారత వంటి అంశాల కారణంగా భూ సంస్కరణలను వ్యతిరేకించే వారు, అనుకూలించే వారుగా ఎన్నికలలో చీలిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఎలాంటి పరిహారం లేకుండా పరిమితులు దాటిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి పంపిణీ చేసే విధంగా చట్ట సవరణ చేయనున్నట్టు అధ్యక్షుడు రాంఫొసానే ప్రకటించారు. 25వేల ఎకరాలకు పైబడి ఉన్న వారి నుంచి మాత్రమే పరిహారం చెల్లించకుండా భూములు తీసుకుంటామని ఏఎన్‌సీ అధ్యక్షుడు మంతాషే చేసిన ప్రకటన అనేక మందిలో చలనం కలిగించింది. పరిమితికి మించి వున్న భూములను అమ్ముకొనేందుకు ప్రయత్నించగా కొనే వారు కరువయ్యారు. దాంతో ప్రభుత్వ రేటుకు పదిహేను నుంచి ఇరవై రెట్లు అదనంగా ఇస్తేనే తాము భూములు వదులుకుంటామని కొందరు పట్టుబడుతున్నారు. భూములన్నీ శ్వేతజాతీయుల చేతిలో ఉండటంతో ప్రభుత్వ చర్యలు కూడా సహజంగానే వారికి వ్యతిరేకంగానే ఉంటాయి. దీంతో ఆ సమస్యకు రంగు పూసి జాతి వివక్షగా చిత్రించేందుకు పూనుకున్నారు. ట్రంప్‌ ట్వీట్‌ కూడా దానినే ప్రతిబింబించింది. స్వాభావికంగానే పెట్టుబడిదారీ వర్గం భూసంస్కరణలను సమర్ధిస్తుంది. దాని వస్తువులకు మార్కెట్‌ పెరగాలంటే జనం కొనుగోలు శక్తి పెరగాలి, అందుకుగాను భూ కేంద్రీకరణ ఒక ఆటంకం. ఒక వైపు కంపెనీ వ్యవసాయం లాభసాటి అంటూ ఆ వైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు భూ పంపిణీని కూడా ప్రపంచబ్యాంకు సమర్ధించుతుండటం మిత్రవైరుధ్యానికి నిదర్శనం. విప్లవాత్మకంగా భూసంస్కరణలను అమలు జరిపే ఉద్దేశ్యం ఏఎన్‌సీ ప్రభుత్వానికి ఉంటే నిజానికి ఎప్పుడో పరిహారంతో నిమిత్తం లేకుండా సీలింగ్‌ దాటిన భూములను స్వాధీనం చేసుకొని రైతాంగానికి పంచి ఉండేది. కారణాలు ఏమైనా కొన్ని చర్యలు తీసుకోక తప్పక పోవటంతో భూస్వాముల ప్రతినిధులు పాతపడిన, పాచి పాటలు పాడటం ప్రారంభించారు. అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటంతో అవి స్పష్టమయ్యే వరకు యజమానులు వ్యవసాయ పెట్టుబడులు పెట్టటం ఆలస్యం లేదా నిలిపివేస్తారు. దాని వలన ఈలోగా కార్మికుల వేతనాలు తగ్గిపోతాయి. పెట్టుబడి తగ్గితే ఆ మేరకు నిజ ఆదాయాలు, ఉత్పత్తి, దిగుబడులు పడిపోతాయి. మాంద్యం తలెత్తుతుంది. పెట్టుబడులు కలిగిన నిపుణులు, తెలివి తేటలు కలిగిన శ్వేతజాతీయులందరూ, తమ పరిజ్ఞానంతో సహా దేశం వదలి పోతారు. భూముల స్వాధీనం కారణంగా విదేశీ పెట్టుబడిదారులు తమ మదుపు మొత్తాలను వెనక్కు తీసుకుంటారు. అదింకెన్నటికీ తిరిగి రాదు. రాజకీయంగా చూస్తే భూ స్వాధీనం పాలక పార్టీకి మంచిదేమో గానీ ఆర్థిక విధానాల రీత్యా చాల చెడుచేస్తుంది. ఇలాంటి కబుర్లతో భయపెట్టాలన్నది వృధా ప్రయత్నమే. నష్ట పరిహారం లేకుండా భూ స్వాధీనం గురించి ఇంతవరకు చట్ట సవరణే చేయలేదు. చేస్తామని ప్రకటించగానే అప్పుడే భూములు లాగేసుకున్నట్టు, శ్వేతజాతి రైతులపై దాడులు, హత్యలు చేస్తున్నట్టు అంతర్జాతీయంగా నానా యాగీ చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో వ్యవసాయ సమస్య కీలకమైనదే. అక్కడి జనాన్ని భూముల నుంచి వెళ్లగొట్టి వాటిని స్వాధీనం చేసుకున్నవారు పెట్టుబడిదారీ పద్ధతుల్లో వ్యవసాయం, గనుల తవ్వకం వంటి వాటిని అభివృద్ధి చేశారు. జనాన్ని దోపిడీ, అణచివేతలకు గురిచేశారు. వ్యవసాయ పంటల ఉత్పత్తి, సంపదసృష్టి, వన్యప్రాణి రక్షణ, కనీస సదుపాయాలతో జన నివాసాల ఏర్పాటు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. జాత్యహంకార పాలన పోయింది తప్ప ఆ పాలనలో గట్టిపడిన ఆస్తి, యాజమాన్య సంబంధాలలో పెద్ద మార్పు రాలేదు. వాటి స్థానంలో నల్లజాతీయుల పెత్తనం అంటే తెల్లజాతి పెట్టుబడిదారుల స్థానంలో నల్లజాతి పెట్టుబడిదారులను పెంపొందించాలనే వైఖరులు కూడా అక్కడ కొన్ని తరగతుల్లో బలంగా ఉన్నాయి. 1994తరువాత వచ్చిన అవకాశాలను అందుకు వినియోగించుకోవాలని చూసే వారు ఉన్నారు. అనేక మంది ఇప్పటికే ఆ క్రమంలో బలంగా తయారయ్యారు. వారు శ్వేతజాతి పెత్తనాన్ని వ్యతిరేకిస్తారు తప్ప పెట్టుబడిదారీ విధానాన్ని, నయా వుదారవాద విధానాలను కాపాడేందుకు పూనుకుంటారు. గత 25ఏండ్లలో కార్మికవర్గంపై జరిగిన దాడులే అందుకు నిదర్శనం. పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలతో జాత్యహంకారాన్ని, సామాజిక అసమానతలను దూరం చేయటం, దోపిడీ, స్త్రీ పురుష వివక్షను రూపు మాపటం జరిగేది కాదు. తెల్లవారి స్ధానంలో నల్లవారు రావటం తప్ప జరిగేదేమీ ఉండదు.
దక్షిణాఫ్రికాలో భూసమస్యపై గత పాతికేండ్లలో స్ధూలంగా వెల్లడైన ధోరణుల గురించి చూద్దాం. మితవాదులైన శ్వేత జాతీయులు, ఇతరంగా స్వల్పంగా వున్న భూ కామందులు మొత్తంగా ఎలాంటి సంస్కరణలు జరగరాదని పట్టుబడుతున్నారు. లేదా భూములను వదులుకోవాల్సి వస్తే పెట్టుబడిదారీ మార్కెట్‌ రేటు ప్రకారం పరిహారం ఇచ్చి తీసుకోమంటున్నారు. నయా వుదారవాదులు అమ్మకందార్లు, కొనుగోలు దార్ల సూత్రాన్ని అమలు జరపమంటున్నారు. అంటే అది కూడా డబ్బున్నవారి యాజమాన్యంలోకే భూ బదిలీ తప్ప మరొక పురోగామి ఆలోచన కాదు. మరోవైపున భూ సంస్కరణలు ఎలా అమలు జరపాలన్న విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకోవాలి అన్నది ఒక వైఖరి. ఏ భూమిని స్వాధీనం చేసుకోవాలి దేనిని కూడదు అన్నది ఇంతవరకు తేల్చుకోలేదు. పట్టణ ప్రాంతాలలోని వ్యాపారులు తమ వ్యాపారాలకు గ్రామాలలో అనుబంధంగా కొన్ని వ్యవసాయ క్షేత్రాలను కలిగి ఉండటానికి అనుమతించాలని కోరుతున్నారు. భూస్వాములు కోరుతున్నట్టు మార్కెట్‌ రేట్లకు ప్రభుత్వం కొనుగోలు చేయటం అర్థం లేని విషయం. అవన్నీ కొన్ని తరాల కింద పేదల నుంచి ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకున్నవి, కూలీలుగా వారి శ్రమను దోచుకున్న వారి ఆధీనంలో ఉన్నవి. అన్నింటినీ మించి నయా వుదారవాద విధానాలలో భాగంగా ప్రభుత్వాలు ఉత్పాదక రంగాలలో పెట్టుబడులను పెట్టటం లేదు. దక్షిణాఫ్రికాలో భూ సంస్కరణలు అమలు జరిపి పేదలకు భూమిని ఇచ్చి సాగు చేయమంటే జరిగేది కాదు. ఇప్పటి వరకు వేలాది ఎకరాల క్షేత్రాలలో పెట్టుబడిదారీ పద్ధతులలో సాగును చూసిన అక్కడి పేదలు తమకు కేవలం భూమిని ఇస్తే ఏం చేసుకోవాలనే అనాసక్తత కూడా ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అందువలన ప్రభుత్వం ఏ రూపంలో పెట్టుబడులు పెట్టాలి, ఆహార భద్రత ఎలా చేకూర్చాలి, రైతాంగానికి గిట్టుబాటు అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి మొదలైన అనేక అంశాల మీద విధానపరమైన స్పష్టత వచ్చినపుడే సంస్కరణలు జయప్రదమౌతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా యువతలో సైద్ధాంతిక మధనం, పెట్టుబడిదారీ విధానంపై విముఖత !

17 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

'Socialist' Bernie Sanders, american youth, American youth prefer socialism to capitalism, ideological churning, prefer socialism to capitalism

Image result for american youth prefer socialism to capitalism

ఎం కోటేశ్వరరావు

5డబ్ల్యూస్‌ 1హెచ్‌ ఒక ఫార్ములా, దీని గురించి ఏ మాత్రం తెలియకపోయినా మానవ పరిణామ క్రమంలో వానరుడు నరుడుగా మారిన తరువాత యావత్‌ మానవ జాతిని గతంలో ముందుకు నడిపించింది, ఇప్పుడు నడిపిస్తున్నదీ, రాబోయే రోజుల్లో నడిపించేదీ ఇదే. ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? అన్నదే ఆ సూత్రం. అమెరికాలో తలెత్తిన వర్తమాన పరిస్ధితులు అక్కడి జనాన్ని మొత్తంగా, ప్రత్యేకించి మూడుపదుల లోపు యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడి సమాజంలో ఒక సరికొత్త మధనం ప్రారంభమైంది. వివిధ సర్వేల ఫలితాలు దాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

గతేడాది డిసెంబరు నాలుగున న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ‘సహస్రాబ్ది యువత పెట్టుబడిదారీ విధానాన్ని అసహ్యించుకోవటంలో ఆశ్చర్యం లేదు’ అంటూ మిచెల్లీ గోల్డ్‌బర్గ్‌ రాసిన ఒక విశ్లేషణను ప్రచురించింది. అది ఇలా ప్రారంభం అయింది.’ మనం పెట్టుబడిదారీ విధానాన్ని రద్దు చేయాలా అనే అంశంపై గతనెలలో శుక్రవారం రాత్రి మాన్‌హట్టన్‌(న్యూయార్క్‌)లో జరిగిన ఒక చర్చను నేను సమన్వయం చేశాను. దానిని సోషలిస్టు పత్రిక జాకోబిన్‌ నిర్వహించింది. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధిస్తూ వుదారవాద పత్రిక ‘ రీజన్‌ ‘ సంపాదకులు పాల్గొన్నారు. హాలులోని 450సీట్లకు ఒక రోజులోనే టికెట్లు అయిపోయాయి. దాంతో దానికి రెట్టింపు మంది పట్టే చోటుకు జాకోబిన్‌ పత్రిక వేదికను మార్చింది. అదనపు సీట్ల టిక్కెట్లు కేవలం ఎనిమిది గంటలలోనే అయిపోయాయి. నేను రాగానే ప్రవేశ ద్వారం వైపు వరుసలలో వెళుతూ జనం కనిపించారు. భూ గర్భంలోని ఒక నైట్‌ క్లబ్‌ పార్టీ ఆహ్వానితుల జాబితాలో నేనున్నానా అనిపించింది. హాజరైన వారిలో అత్యధికులు 20,30వ పడులలో వున్నారు. వారి పెద్దలు ఎలాంటి శషభిషలు లేకుండా విశ్వసించిన పెట్టుబడిదారీ విధానం పట్ల ఈ తరంలోని ఒక భాగం అసాధారణ రీతిలో అనుమానంతో వుంది.

సహస్రాబ్దియువతలో 44శాతం మంది ఒక సోషలిస్టు దేశంలో నివసించాలని కోరుకుంటున్నారని, దానితో పోల్చితే పెట్టుబడిదారీ విధానం కావాలని కోరుకొనే వారు 42శాతం మందే అని ఇటీవలి సర్వేలో కనుగొనటం గురించి కమ్యూనిస్టు వ్యతిరేక ‘కమ్యూనిజం బాధితుల స్మారక సంస్ధ ‘ హెచ్చరించింది. కమ్యూనిజం కుప్పకూలటం అంటే పెట్టుబడిదారీ విధానానికి మరొక ప్రత్యామ్యాయం లేనట్లుగా అమెరికాలోని పెద్దవారికి కనిపించింది. కానీ రాను రాను మన ఆర్ధిక వ్యవస్ధ కొద్ది మంది చేతిలో పోగుబడే స్వభావ రూపం పెట్టుబడిదారీ విధానం అంటే విఫలమైన దేవుడిగా ఎక్కువ మంది యువతకు కనిపించటంలో ఆశ్చర్యం లేదు. శనివారం తెల్లవారు ఝామున ఆమోదం పొందిన దిక్కుమాలిన పన్నుల బిల్లుతో ఇప్పుడు అది మరింత స్పష్టమైంది. ఆ బిల్లు ధనికులను మరింత ధనికులుగా పేదలను మరింత పేదలుగా చేస్తుంది. టాక్స్‌ పాలసీ కేంద్రం పేర్కొన్నదాని ప్రకారం 2027 ఆదాయంలో అగ్రభాగాన వున్న ఐదు శాతం మందికి పెద్ద మొత్తంలో పన్నుల తగ్గింపు, అధమ స్ధానంలో వున్నవారికి పెంపుదల వుంటుంది. ఇక్కడ ఒక వుదాహరణ చూద్దాం. ప్రయివేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపే తలిదండ్రులకు సెనేట్‌ బిల్లు పన్నుల రాయితీని ప్రకటించింది. సహస్రాబ్ది తరంలో అత్యధికులు ఎవరైతే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారో ఈ చర్య వాటికి నిధుల లభ్యతను కష్టతరం గావిస్తుంది.’

ట్రంప్‌ ప్రతిపాదించిన ఈ పన్నుల రాయితీలు ధనికులను మరింతగా ధనికులను గావిస్తాయి, పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త థామస్‌ పికెటీ పేర్కొన్న ఆదాయ,సంపద అంతరాలను మరింతగా పెంచుతాయి. అలాంటపుడు వాటి గురించి యువత, మొత్తం సమాజం ఆలోచించకుండా ఎలా వుంటుంది. వారికి ముందుగా చెప్పుకున్న ఫార్ములా తప్ప మరొకటి దారి చూపదు. దానికి అనుగుణ్యంగానే సర్వేలు అక్కడి జనాల మనోభావాలను వ్యక్తీరిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఒక గాలప్‌ సర్వే ప్రకారం అమెరికాలో తొలిసారిగా సోషలిజం పట్ల మెజారిటీ యువతలో సానుకూల ధోరణులు వ్యక్తమయ్యాయి. పురోగామి శక్తులకు ఇది నిజంగానే ఎంతో వుత్సాహం, తిరోగామి వాదులకు నిరుత్సాహం కలిగించే అంశం. సోషలిజం, కమ్యూనిజం అంతరించింది, వాటికి భవిష్యత్‌ లేదు అని ప్రకటించిన పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకతకు నెలవైన చోటే ఈ పరిణామం జరుగుతోంది. 2010లో పెట్టుబడిదారీ విధానం పట్ల 18-29 సంవత్సరాల యువతలో 68శాతం సానుకూలత వ్యక్తం కాగా అది క్రమంగా దిగజారుతూ 2018లో 45కు పడిపోయింది, ఇదే సమయంలో తొలిసారిగా 51శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. డెమోక్రటిక్‌ పార్టీ, దానిని అభిమానించే స్వతంత్రులలో సోషలిజాన్ని అభిమానించే వారు 57శాతం వరకు వున్నారని కూడా తేలింది. అయితే అమెరికా సమాజంలో మొత్తంగా చూసుకున్నపుడు పెట్టుబడిదారీ విధానం పట్ల 56శాతం సానుకూలంగా వున్నప్పటికీ అది ఇప్పటి వరకు నమోదైన కనిష్ట సంఖ్య. సోషలిజం అంటే సానుకూలత పెరిగినప్పటికీ దాని సాధనకు ఒక విప్లవ పార్టీని ఏర్పాటు చేసే పరిస్ధితులు ఇంకా ఏర్పడలేదు. 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఏడాది కాలంలోనే అధిగమించామని అమెరికా పాలకులు ఎంతగా నమ్మబలికినప్పటికీ జనం దానిని నమ్మటం లేదని ఈ సర్వే నిర్దారించింది. ఎందుకంటే గత పది సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలను కుదించటం లేదా నిధుల కోత పెట్టారు. గతంలో మాదిరి వాటిని అమలు జరుపుతారనే నమ్మకం పోతోంది.

1990 దశకంలో సోవియట్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన సమయంలో తరుణ వయస్సు వచ్చిన వారికి, తరువాత పుట్టిన వారికి ఆధునిక ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం సహజమైనదిగా కనిపించింది. దాని వైఫల్యం, తమ కళ్ల ముందే ధనికులకు మరిన్ని అవకాశాలను కల్పించటంతో యువత ఆ విధానం సరైంది కాదని భావిస్తోంది. అన్నింటికీ మించి వారికి పొద్దున లేస్తే చైనా తయారీ వస్తువులు లేనిదే గడవదు. తమ దేశంలో మాదిరి సమస్యలు తలెత్తినట్లు చైనా గురించి వార్తలేమీ లేవు.అధికారంలో ఎవరున్నప్పటికీ చైనాతో పెరుగుతున్న వాణిజ్యలోటు గురించి నిత్యం చర్చ జరుగుతోంది. చైనాపై వ్యతిరేకతను కూడా రోజూ రెచ్చగొడుతున్నారు, అయినప్పటికీ జపాన్‌ను వెనక్కు నెట్టి తమతో పోటీ పడేవిధంగా చైనా అభివృద్ధి చెందుతోందనే వార్తలు వెలువడుతున్నాయి. అందువలన వారికి సోషలిస్టు వ్యవస్ద గురించి పూర్తి అవగాహన లేకపోయినా తమ విధానం కంటే సోషలిజమే మెరుగైనదని వారు భావించటం సహజం.

Image result for american youth prefer socialism to capitalism

యువతను పునరాలోచనకు పురికొల్పుతున్నదేమిటి?

నిజవేతనాలు పడిపోతున్నాయి, మెరుగైన వుద్యోగాలు లేవు, ఆదాయ అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో పరిస్ధితి మెరుగుపడుతుందనే ఆశ కనిపించటం లేదు. విద్యకోసం తీసుకున్న రుణాలు కొండలా పెరిగిపోతున్నాయి. గతంలో తమ వేతనాల్లో 18శాతం ఇండ్ల అద్దెలకు చెల్లిస్తే సరిపోయేది ఇప్పుడు అది 30శాతం దాటింది. మెరుగైన జీవనం గడవాలంటే వారానికి కనీసం 80గంటలు పని చేస్తే తప్ప అవసరమైన ఆదాయం రాదు. అన్ని గంటల పని దొరికే అవకాశాలు కూడా లేవు. స్వతంత్రంగా బతికే అవకాశాలు తగ్గిపోతుండటంతో తలిదండ్రుల మీద ఆధారపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కాపిటలిజం ప్రతినిధులుగా డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారే కనిపిస్తున్నారు, ఇలాంటి వారు తమ జీవితాలను మెరుగుపరచే అవకాశాలు లేవని బలంగా నమ్ముతున్నారు. డెమోక్రటిక్‌ పార్టీలో శాండర్స్‌ వంటి వారు సోషలిజం గురించి గతం కంటే గట్టిగా మాట్లాడుతున్నారు.

ఏ సిద్ధాంతం లేదా రాజకీయాలు లేకపోవటం కంటే ఏదో ఒక సిద్ధాంతం, రాజకీయాల మీద చర్చ జరగటం మంచిది. సిద్ధాంత, రాజకీయ రాహిత్య ధోరణులను ప్రోత్సహించేది పాలకవర్గమే. అమెరికాలో జరుగుతున్న మధనం, పరిణామాల గురించి భిన్నాభిప్రాయాలు వున్నాయి. ట్రాట్క్సీయిస్టులుగా వున్న వారి వాదన ప్రకారం పెట్టుబడిదారీ విధానానికి జన సామాన్యంలో ఎదురవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, గందరగోళపరిచేందుకు మరొక మార్గంలో పాలకవర్గం బెర్నీ శాండర్స్‌ వంటి నకిలీ సోషలిస్టులను, వుద్యమాలను ప్రోత్సహిస్తున్నది. డెమోక్రటిక్‌ పార్టీలోని ఒక భాగం ఏర్పాటు చేసిన డెమోక్రటిక్‌ సోషలిస్ట్స్‌ ఆఫ్‌ అమెరికా(డిఎస్‌ఏ) అనే పార్టీ దాని అనుబంధ సంస్ధ తప్ప ఆ పార్టీని వ్యతిరేకించేది కాదు. దాని పెట్టుబడిదారీ, బూర్జువా రాజకీయాలకు అది ఆమోదయోగ్యమైనది. ఈ అవగాహనతో పూర్తిగా ఏకీభావం వుండకపోవచ్చు లేదా అంగీకరించవచ్చు. తాము చెప్పేదే నిజమైన సోషలిస్టు విప్లవ మార్గం అని చెప్పుకొనే ట్రాట్క్సీయిస్టులు ఎక్కడా బలమైన కమ్యూనిస్టు వుద్యమాలను నిర్మించిన లేదా సోషలిస్టు విప్లవాలకు నాయకత్వం వహించిన చరిత్రగానీ లేదు. తాము తప్ప మిగిలిన వారందరూ నకిలీలని వారు చెప్పుకుంటారు. సోషలిస్టులుగా, మార్క్సిస్టులుగా చెప్పుకొనే కొంత మంది చైనాలో జరుగుతున్నది ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ తప్ప సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం కాదు అంటారు. అందువలన నూరు పూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను బయటకు రానివ్వండి అన్నట్లుగా చర్చ జరగనివ్వాలి, భిన్నాభిప్రాయలను వినటానికి ఇబ్బంది లేదు. ఆయా దశలను బట్టి కార్యాచరణను ప్రోత్సహించాలి. జనాల వివేచన మీద విశ్వాసం వుండాలి, దాన్ని మెరుగుపరచేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి. డెమోక్రటిక్‌ పార్టీలో వామపక్ష వాదులుగా వున్న వారు ఏర్పాటు చేసిన ఒక వేదిక తప్ప డిఎస్‌ఏ అనేది ఒక పార్టీ కాదని కూడా చెబుతారు. అయితే ఆ వేదిక సభ్యులం అని అనేక మంది సగర్వంగా చెప్పుకుంటారు. అలాంటి వారిని ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది.

Image result for american youth prefer socialism to capitalism

ఈ పూర్వరంగంలో అమెరికాలో జరుగుతున్న పరిణామాలను ఆహ్వానించాలా, వ్యతిరేకించాలా? మార్క్సిస్టు అవగాహన ప్రకారం కార్మికవర్గం తప్ప దోపిడీకి గురయ్యే వారందరూ సోషలిస్టు విప్లవం జయప్రదం అయ్యేంత వరకు దానికి నాయకత్వం వహించే పార్టీలతో వుండరు. తమ సమస్య పరిష్కారం కాగానే కొందరు ఆగిపోతారు. కమ్యూనిస్టు పార్టీలు దున్నేవానికి నినాదంతో రైతాంగాన్ని సమీకరిస్తాయి. ఆ సమస్య పాక్షికంగా పరిష్కారమై కొందరికి భూమి వచ్చిన తరువాత వారు వుద్యమంలో భాగస్వాములయ్యే తీరుకు, రాని వారి తీరుకు తేడా వుంటుంది. కమ్యూనిస్టులు గాని సోషలిస్టు పార్టీలు కూడా అంతే. సోషలిజం, కమ్యూనిజం అనే మాటే బూతుగా, సోషలిస్టును, కమ్యూనిస్టును అని చెప్పుకున్న వారిని వెలివేసినట్లుగా చూసే వాతావరణం వున్న అమెరికాలో అవును నేను సోషలిస్టును అని చెప్పుకోవటమే ఒక పెద్ద ముందడుగు. ఎన్నికలలో పోటీ చేసి ఒక మున్సిపల్‌ వార్డులో అయినా గెలవటం సామాన్య విషయం కాదు. అమెరికన్‌ యువతలో సోషలిజం పట్ల పెరుగుతున్న సానుకూలత ఒక మంచి పరిణామం. గతంలో కమ్యూనిజం సిద్ధాంతానికి ఆకర్షితులు అయిన వారందరూ సమగ్రంగా ఆ సిద్ధాంతం, ఆచరణలను అవపోసన పట్టిన తరువాతే కమ్యూనిస్టులుగా మారలేదు. ఇప్పుడున్న దుష్ట సమాజాన్ని మార్చాలని కోరుకుంటున్న వారికి కమ్యూనిస్టు నినాదమే ఆకర్షణీయంగా కనిపించింది కనుక ఆ వైపు మొగ్గారు. తరువాత రాటు దేలారు. అమెరికాలో అయినా మరొక చోట అయినా అదే క్రమం. అమెరికా డిఎస్‌ఏలో 2016లో ఏడువేల మంది సభ్యులుంటే గతేడాదికాలంలో ఆ సంఖ్య 47వేలకు చేరింది. నవంబరులో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ వేదికకు చెందిన ఇద్దరు విజయం సాధించబోతున్నారని వార్తలు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దుల ఎంపిక పోటీలో న్యూయార్క్‌ నగరంలోని ఒక స్ధానంలో డిఎస్‌ఏ అభ్యర్ధి అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ ప్రస్తుతం సభ్యుడిగా వున్న జోసెఫ్‌ క్రోలేను ఓడించి అభ్యర్ధిగా ఎంపికయ్యారు. డెట్రాయిల్‌ 13వ నియోజకవర్గం డిఎస్‌ఏకు బలమైనది, ఆ బృందానికి చెందిన రషీదా లాయిబ్‌ అభ్యర్ధిగా ఎంపికయ్యారు. ఈ బృందం నడిపే జాకోబిన్‌ పత్రిక సంపాదకుడిగా ప్రవాస తెలుగు సంతతికి చెందిన సుంకర భాస్కర్‌ వున్నాడు. అమెరికాలో సోషలిజం పట్ల యువతలో పెరుగుతున్న సానుకూలతను సొమ్ము చేసుకొనేందుకు భాస్కర్‌ రచనలకు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక కొద్దికాలంగా అవకాశం ఇస్తున్నది. ప్రపంచ సోషలిస్టు పార్టీల చరిత్ర చూసినపుడు అవి ప్రధానంగా సంస్కరణల మీద కేంద్రీకరించాయి తప్ప వ్యవస్ధలో మౌలిక మార్పులను కోరలేదు. మితవాద, తిరోగమన వాదం కంటే నిస్సందేహంగా ఇవి మెరుగైనవే. డిఎస్‌ఏను సంస్కరణవాద వేదికగా భావించవచ్చు.

కారల్‌ మార్క్స్‌-ఫె˜డరిక్‌ ఎంగెల్స్‌ కంటే ముందే రకరాల సోషలిస్టు భావాలు కలిగిన వారున్నారు. వారంతా సమాజాన్ని సంస్కరించాలని, మార్చాలని కోరుకున్నారు. మార్పును కోరుకుంటే రాదు. తత్వవేత్తలు వివిధ మార్గాలలో ప్రపంచానికి వ్యాఖ్యానాలు చెప్పారు. అసలు సమస్య దానిని మార్చటం ఎలా అన్నదే అన్న మార్క్స్‌-ఎంగెల్స్‌లు తమ కమ్యూనిస్టు ప్రణాళికలో ఒక శాస్త్రీయ మార్గాన్ని చెప్పిన తరువాతే వారికీ సోషలిస్టులకు వున్న తేడాను ప్రపంచశ్రామికవర్గం గ్రహించింది. ట్రాట్క్సీయిస్టులు లేదా మరొకరో అంటున్నట్లు అమెరికాలో ఇప్పుడు సోషలిస్టులుగా చెప్పుకుంటున్నవారు కేవలం సంస్కరణలకే పరిమితం అయితే కావచ్చు. పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు పూర్తిగా పోయాయని ఎవరూ చెప్పటం లేదు. అలాంటి వారు సంస్కరణల ద్వారా మంచి భవిష్యత్‌ నిర్మాణం చేసుకోవచ్చని అనుకోవచ్చు. తమ అనుభవంలో వాటికి వున్న పరిమితులను అర్ధం చేసుకొని అక్కడి యువత,శ్రామికవర్గం ఆ తదుపరి ఏం చేయాలో, ఏ బాటను పయనించాలో నిర్ణయించుకోలేదా ? విప్లవ పార్టీని నిర్మించుకోలేదా ? పాలకవర్గ నిజరూపాన్ని గుర్తించలేదా ? అందువలన అనుమానాలు, ఎలాంటి సందేహాలు అవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

టర్కీకి అమెరికా వెన్నుపోటు !

16 Thursday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Donald trump, NATO allies, Recep Tayyip Erdoğan, Turkey, Turkish lira, U.S.

Image result for U.S. is stabbing Turkey in the back

ఎం కోటేశ్వరరావు

ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా, విను వీధిని శ్రేణులుగా నిలిచి విడ్డూరమును చూచెదరా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరూ.. అంటూ కొసరాజు రాసిన పాటకు స్వరాలు సమకూర్చి స్వయంగా గానం చేసిన ఘంటసాల గీతాన్ని లవకుశ సినిమాలో చూసి కన్నీళ్లు కార్చేవారు ఇప్పటికీ వున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఇతిహాస గాధ. ప్రపంచవ్యాపితంగా ఎందరినో కష్టాల పాలు చేసే, తప్పించటానికి అవకాశం వున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పలు దేశాల మీద ప్రారంభించిన వాణిజ్య లేదా ఆర్ధిక యుద్దమనే దారుణాన్ని సహించాలా, ఎలా అడ్డుకోవాలన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న వాస్తవం. అమెరికాను మనకు మంచి స్నేహదేశంగా చిత్రించేందుకు నిక్కర్ల నుంచి పాంట్స్‌కు మారిన వారు నానా తంటాలు పడుతున్నారు. అలాంటి మిత్రదేశం దెబ్బకు తొలిసారిగా మన రూపాయి గురువారం వారం నాడు ఒక దశలో ఒక డాలరుకు మారకం విలువ 70.32కి పడిపోయి సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క మన దేశమే కాదు ప్రపంచాన్నంతటినీ ట్రంప్‌ ప్రమాదపు అంచుల వరకు తీసుకుపోతున్నాడు. మరి ఈ దారుణాన్ని ఎవరు అడ్డుకోవాలి? జనం శ్రేణులుగా నిలిచి విడ్డూరంగా చూడాలా ?

తమ ఎగుమతులపై పన్ను విధించి కరెన్సీ లీరాను దెబ్బతీసిన అమెరికాపై ప్రతీకారంగా అమెరికా కార్లపై 120శాతం, మద్యంపై 160, పొగాకు వుత్పత్తులపై 60శాతానికి దిగుమతి పన్నును టర్కీ పెంచింది. మరోవైపు 15బిలియన్‌ డాలర్ల మేరకు టర్కీలో పెట్టుబడులు పెడతామని కతార్‌ ప్రకటించటంతో లీరా కొద్దిగా కోలుకుంది.ఏడాది క్రితం సౌదీ అరేబియా నాయకత్వంలో నాలుగు అరబ్‌ దేశాలు కతార్‌పై వాణిజ్య, దౌత్యపరమైన ఆంక్షలను విధించాన్ని టర్కీ వ్యతిరేకించింది. ఇపుడు కతార్‌ ఈ విధంగా బదులు తీర్చుకుంది. టర్కీ అవసరాలలో 15బిలియన్‌ డాలర్లు చిన్న మొత్తమే అయినప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా సాధించిన నైతిక విజయమిది.

దశాబ్దాల తరబడి ఆంక్షలతో క్యూబాను అతలాకుతలం చేసిన అమెరికా తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. గత కొద్ది సంవత్సరాలుగా వామపక్ష పాలనలో వున్న వెనెజులా, నయా పెట్టుబడిదారీ ఏలుబడిలో వున్న రష్యా, మతశక్తుల ఏలుబడిలో వున్న ఇరాన్‌, పొరుగునే వున్న మిత్రదేశాలు మెక్సికో, కెనడా, సోషలిస్టు దేశమైన చైనాపై ఆర్ధిక, వాణిజ్య దాడులను జరుపుతున్నది. ఐరోపా యూనియన్‌తో తాత్కాలిక రాజీకుదుర్చుకుంది. పాతికేండ్ల క్రితం సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తమకిక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా ఇప్పుడు బస్తీమే సవాల్‌ అంటూ తన, పరబేధం లేకుండా ఎందుకు కత్తులు దూస్తున్నది? పర్యవసానాలేమిటి? తాజాగా మన రూపాయి రికార్డు పతనానికి కారణం నాటో కూటమిలో కీలక సభ్యదేశమైన టర్కీపై అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఆదేశాన్ని ఏ క్షణంలో అయినా పతనంలోకి నెట్టే అవకాశం వుందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా ఆర్ధిక, రాజకీయ, మిలిటరీ ఎత్తుగడులలో ఎంతో కీలకమైనది ఐరోపా కేంద్రంగా వున్న నాటో కూటమి.దానిని మరింతగా విస్తరించేందుకు ఒకవైపు పూనుకున్న అమెరికా మరోవైపు కీలకమైన భాగస్వామి టర్కీతో సంబంధాలను దెబ్బతీసేందుకు పూనుకుంది. తమను వెన్నుపోటు పొడిచేందుకు అమెరికా చూస్తున్నదని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయిప్‌ ఎర్డోగన్‌ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించాడు.ఆర్ధిక యుద్ధాల తూటాలు, ఫిరంగి గుండ్లు, క్షిపణులను ప్రయోగించినప్పటికీ తాము వెనక్కు తగ్గేది లేదని హెచ్చరించాడు. టర్కీ కరెన్సీ లీరా పతనమైన కారణంగానే తాము పన్నులను పెంచినట్లు ట్రంప్‌ తన చర్యను సమర్ధించుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లీరా 41శాతం పతనమైంది. దీంతో టర్కీలో విదేశీ వస్తువుల ధరలు పెరిగిపోయి డిమాండ్‌ తగ్గిపోయింది. వీటిని సాకుగా చూపి గతవారంలో టర్కీ నుంచి దిగుమతి అయ్యే వుక్కుపై 50, అల్యూమినియంపై 20శాతం చొప్పున సుంకాన్ని విధించటంతో టర్కీ కరెన్సీ లీరా, స్టాక్‌ మార్కెట్‌ మరింతగా పతనమయ్యాయి, ద్రవ్యోల్బణం 15శాతానికి పెరిగింది. ఇవన్నీ ఆర్ధిక సంక్షోభానికి దారితీయవచ్చని భావిస్తున్నారు.దీనికి మతాధికారి ఆండ్రూ బ్రూసన్‌ను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌ను కూడా ట్రంప్‌ సర్కార్‌ జోడించింది. టర్కీ యూరేసియా దేశం.ఐరోపాలో ఎక్కువ భాగం వుండటంతో అక్కడి ఏకైక ముస్లిం దేశంగా పరిగణిస్తారు. ఐరోపాలోని గ్రీస్‌, బల్గేరియా, యూరేసియాలోని జార్జియా, ఆర్మీనియా, అజర్‌బైజాన్‌, ఆసియాలోని ఇరాన్‌, ఇరాక్‌, సిరియాలు సరిహద్దుగా వుంది. ఈ ప్రాంతంలో అమెరికా తన ప్రయోజనాలకు పెద్ద పీట వేయటంతో విధిలేక కొన్ని సార్లు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించుతున్నది, తాజా వివాదానికి నేపధ్యమిదే. నిజానికి అమెరికా చేసుకొనే దిగుమతుల్లో టర్కీ నుంచి వుక్కు 4.2, అల్యూమినియం ఒకశాతం లోపే వున్నది. అందువలన వీటి కంటే రాజకీయకారణాలే ప్రస్తుతం వుభయ దేశాల మధ్య విబేధాల పెరుగులకు కారణాలుగా చెప్పవచ్చు.

2003లో జార్జి డబ్ల్యు బుష్‌ నాయకత్వంలో ఇరాక్‌పై అమెరికా దాడి చేసింది. అది మొదలు ఆ ప్రాంతంలో అమెరికా ప్రమేయంతో జరుగుతున్న పరిణామాలలో టర్కీకి సమస్యలు తలెత్తుతూనే వున్నాయి. టర్కీ, ఇరాన్‌, సిరియా సరిహద్దు ప్రాంతంలో కుర్దులు పెద్ద సంఖ్యలో వున్నారు. ఇజ్రాయెల్‌ మాదిరి తమకు ప్రత్యేకంగా కుర్దిస్దాన్‌ ఏర్పాటు చేయాలన్నది ఎప్పటి నుంచో వారి డిమాండ్లలో ఒకటి. అది జరిగితే ఆ ప్రాంత దేశాల స్వరూపమే మారిపోతుంది కనుక ఎవరూ అంగీకరించటం లేదు. పశ్చిమాసియా వివాదాలలో అమెరికన్లు కుర్దులకు మద్దతు తెలిపి వారిని పావులుగా వాడుకుంటున్నారు. సిరియాలో అసాద్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఐఎస్‌ తిరుగుబాటుదార్లను ఎదుర్కోవటంలో కుర్దులది ప్రధాన పాత్ర. వారికి అమెరికా మద్దతు ఇస్తున్నది. ఇరాక్‌, టర్కీలలోని కుర్దులు తమకు ప్రత్యేకం దేశం కావాలంటూ చేస్తున్న సాయుధ చర్యలను అక్కడి ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి.

రెండు సంవత్సరాల క్రితం టర్కీలో ఒక విఫల తిరుగుబాటు జరిగింది. దానికి కుర్దిస్ధాన్‌ వర్కర్స్‌ పార్టీ, దానితో సంబంధాలున్న అమెరికా మతాధికారి ఆండ్రూ బ్రున్‌సన్‌ సంధానకర్తగా వున్నాడని భావించిన టర్కీ ప్రభుత్వం అతగాడిని అరెస్టు చేసి విడుదలకు తిరస్కరించింది. ప్రస్తుతం అధికారంలో వున్న ఎకెపి పార్టీ సహకారంతో రెండు దశాబ్దాల క్రితం టర్కీలో గులెన్‌ పేరుతో ఒక ఇస్లామిక్‌ సంస్ధ వునికిలోకి వచ్చింది. ప్రభుత్వ అండదండలతో దానితో సంబంధం వున్న అనేక మంది ప్రభుత్వ యంత్రాంగంలోకి చొరబడ్డారు. అది ఎంతవరకు వచ్చిందంటే పోలీసు, న్యాయవ్యవస్ధలోని గులెన్‌ సభ్యులు, ఆ సంస్ధను పెంచి పోషించిన ఎకెపి పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు తలెత్తింది. చివరకు అధ్యక్షుడు ఎర్డోగన్‌పై తిరుగుబాటుకు ఆ సంస్ధ పురికొల్పింది. అయితే దానిని కఠినంగా అణచివేశారు. దానికి సహకరించాడంటూ అమెరికా మతాధికారిని అరెస్టు చేసి గులెన్‌ ఒక వుగ్రవాద సంస్ధ అని ప్రకటించింది.తిరుగుబాటును ప్రోత్సహించిన ఫతుల్లా గులెన్‌ అమెరికాలోని పెన్సిల్వేనియాలో వుంటున్నాడు. అతడిని తమకు అప్పగించాలన్న టర్కీ డిమాండ్‌ను అమెరికా తిరస్కరించింది. వుగ్రవాదం పట్ల అమెరికా మెతకగా వుందంటూ టర్కీ విమర్శించింది. అప్పటి నుంచి వుభయ దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. ఒక దేశాన్ని లొంగదీసుకోవాలంటే దాని ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం అమెరికా ఆయుధాల్లో ఒకటి. టర్కీ విషయంలో అదే జరుగుతోందా ? ఇటీవలి కాలంలో జరిగిన మరికొన్ని పరిణామాలు అమెరికాకు మింగుడు పడటం లేదు.

అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వుపసంహరించుకున్న అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తాము ఖాతరు చేసేది లేదని టర్కీ ప్రకటించింది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రత్యర్ధి అయిన రష్యాతో టర్కీ సంబంధాలు పెరుగుతున్నాయి. క్షిపణులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. అది అమెరికన్లను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నది. సిరియాలో రష్యా మద్దతు వున్న ప్రభుత్వానిది పైచేయిగా వుంది. రష్యా, ఇరాన్‌, టర్కీలే సిరియా పరిణామాలను నిర్దేశించేవని ఇప్పటికే తేలిపోయింది. అమెరికన్లకు అది పరాభవమే. చైనా చొరవతో ప్రారంభమైన సిల్క్‌ రోడ్‌తో పాటు చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం, తదితర చర్యలు సిరియా పునర్‌నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించటంతో పాటు ఇరాన్‌ స్ధిరపడటానికి దోహదం చేసేవిగా వున్నాయి. ఇది అమెరికన్లకు ఏమాత్రమూ అంగీకారం కాదు. సిరియా తదితర పరిణామాలలో అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ నిలబడుతోంది. ఇరాన్‌తో వాణిజ్యాన్ని వదులుకొనేది లేదని చైనా స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా తన వెసులుబాటు కోసం ఇరాన్‌ వంటి దేశాలతో సంబంధాల మెరుగుదలకు చమురురంగంలో పెట్టుబడుల వంటివాటితో పూనుకుంది.

ఒక మతాధికారిని అడ్డం పెట్టుకొని టర్కీని తమ కాళ్లముందు పడేసుకోవాలని చూస్తోందని ఎర్డోగన్‌ మండిపడ్డారు. అమెరికా గనుక తన పద్దతులను మార్చుకోనట్లయితే తాము కొత్త స్నేహితులు, కలసి వచ్చే వారికోసం చూడాల్సి వస్తుందని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. గత ఆరుదశాబ్దాల కాలంలో అమెరికాతో కలసి తాము ఎలాపని చేసిందీ ఏకరువు పెట్టి అవన్నీ మరచిపోయి తమతో వ్యవహరిస్తున్నారని, తమ పౌరుల ఆందోళనను అర్ధం చేసుకోవటం లేదని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన తిరుగుబాటు మీద సంతృప్తికరంగా అమెరికా స్పందించలేదని, తిరుగుబాటకు కారకుడైన వ్యక్తిని తమకు అప్పగించలేదని పేర్కొన్నాడు. ఒక మతాధికారి కోసం మీరు నాటోలోని మీ వ్యూహాత్మక భాగస్వామిని మార్చేందుకు చూస్తున్నారు, బెదిరింపులతో మా దేశాన్ని మీదారికి తెచ్చుకోలేరు, మీకు డాలర్లు వుంటే మాకు అల్లా వున్నాడు, మేము స్వాతంత్య్రంతో పోరాడతాము అని హెచ్చరించాడు.అమెరికా స్వయంగా వుగ్రవాద గ్రూపుగా ప్రకటించిన సిరియా మద్దతు వున్న పికెకె సంస్ధకు అమెరికా ఐదువేల ట్రక్కులు, రెండువేల విమానాల ద్వారా ఆయుధాలను అందచేసిందని, ఆ సంస్ధ చేతిలో 1984 నుంచీ వేలాది మంది తమ పౌరులు మరణించారని పేర్కొన్నాడు. అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించిన నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఎర్డోగన్‌ ఫోన్లో సంభాషించాడు.

టర్కీ పాలకుల విషయానికి వస్తే అమెరికా అనుచిత కార్యకలాపాలన్నింటిలో భాగస్వాములయ్యారు.దేశంలో భిన్నాభిప్రాయాన్ని అణచివేయటంలో పేరు మోశారు. వ్యూహాత్మక స్ధానంలో వున్న కారణంగా అమెరికా, ఇతర పశ్చిమ ఐరోపా ధనిక దేశాల మాదిరి ప్రాంతీయ పరిణామాలలో పాత్రవహించాలని సహజంగానే కోరుకుంటారు. అమెరికా బలంగా వున్నపుడు ఎర్డోగన్‌ వంటి వారు ఎలా తలొగ్గుతారో బలహీనపడినపుడు దాని నుంచి లబ్ది పొందేందుకు కూడా అదే మాదిరి తలెత్తుతారు. టర్కీ తీరుతెన్నులు ఇప్పుడు అలాగే వున్నాయి. ఇప్పుడున్న స్ధితిలో మరో అధికార కేంద్రం పెరగటాన్ని అమెరికా అంగీకరించదు. టర్కీ నాటో సభ్యురాలు, రష్యా ఆ కూటమికి ప్రధమ శత్రువు, తోటి సభ్యురాలిపై అమెరికా కత్తి గట్టింది. సిరియాకు రష్యా పూర్తి మద్దతు ఇస్తున్నది. సిరియాపై గతంలో ఐఎస్‌ తీవ్రవాదులు దాడి చేసేందుకు టర్కీ ప్రాంతాన్ని అమెరికా వుపయోగించుకుంది. ఇప్పుడు మారిన పరిస్ధితులలో ఐఎస్‌ తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు టర్కీలోని వైమానిక స్ధావరాన్ని నాటో వినియోగిస్తున్నది. అమెరికా తమపై కత్తి కట్టింది కనుక దాన్ని మూసివేయాలని కొందరు వత్తిడి తెస్తున్నారు. టర్కీ దిగుమతి చేసుకొనే చమురులో సగం ఇరాన్‌ నుంచే వస్తోంది. అమెరికా ఆంక్షలను టర్కీ తిరస్కరించింది. నాటో సభ్యురాలైనప్పటికీ రష్యా నుంచి టర్కీ క్షిపణులను కొనుగోలు చేస్తున్నది. ఇవన్నీ ఒక సంక్లిష్ట పరిస్ధితికి నిదర్శనం.ఐరోపా యూనియన్‌ తక్షణమే అమెరికాతో ఘర్షణకు దిగటానికి సిద్ధం కాదు కనుకనే పన్నుల విషయంలో తాత్కాలిక రాజీకి వచ్చింది. అమెరికాకు అనేక షరతులు విధించింది. ఐరోపా కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకే ఈ రాజీ. అమెరికా వత్తిడికి తలొగ్గిన టర్కీ సర్కార్‌ మతాధికారి బ్రున్స్‌న్‌ను జైలు నుంచి గృహనిర్భంధానికి మార్చింది. తాజా వివాదంలో బ్రున్సన్‌ ఒక తురుపు ముక్క మాత్రమే. నల్ల సముద్రం, మధ్యప్రాచ్చం, పసిఫిక్‌ సముద్రాల మధ్య వున్న టర్కీ ప్రాధాన్యత గురించి అమెరికన్లకు తెలియదనుకోవటం పొరపాటు. అందువలన తెగేదాక లాగకపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ రాజకీయాల పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా ఆదేశాలు, ఆర్ధిక విధానాలతో స్వాతంత్య్రానికి ముప్పు !

03 Friday Aug 2018

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

economic policies, India foreign policy under narendra modi, Indian independence, modi foreign policy, US dictats

Image result for threat to india's independence

ఎం కోటేశ్వరరావు

డెబ్బయి రెండవ స్వాతంత్య్రవేడుకలకు దేశం సిద్దం అవుతోంది, మరోసారి అధికారానికి వచ్చి 75వ వేడుకలను కూడా తానే ప్రారంభించాలని ప్రధాని నరేంద్రమోడీ కోరుకుంటున్నారు. తన ప్రసంగంలో వుండాల్సిన అంశాల మీద సలహాలు ఇవ్వాలని కోరారు. జనాభిప్రాయానికి తలొగ్గే పాలకుడిగా కనపడే ప్రచార ఎత్తుగడలో భాగమిది. మూకదాడుల గురించి దేశ అత్యున్నత న్యాయస్ధానం ఒక చట్టాన్ని రూపొందించండని చెప్పటం సమస్య తీవ్రతకు నిదర్శనం. అయినా ఈ సమస్యపై మన ప్రధాని మౌనంగానే వున్నారు. అలాంటి పెద్దమనిషి సామాన్య జనం చెప్పే మాటలను పరిగణనలోకి తీసుకుంటారంటే నమ్మటమెలా ? వంచనగాకపోతే నిత్యం జనంతో వున్నామని చెప్పుకొనే నేతలకు జనాభిప్రాయాలేమిటో స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా చెప్పేదేమిటి?

ఐదవసారి ఎర్రకోట మీద మువ్వన్నెల జండా ఎగురవేయబోతున్న ప్రధాని ముందు ఒక పెద్ద ప్రశ్న వుంది. నిజానికి అది యావత్తు దేశ ప్రజల ముందున్న సవాలు. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా వున్న మన విదేశాంగ విధానాన్ని నిర్దేశిస్తున్నది ఎవరు అన్నదే ఈ స్వాతంత్య్రదినోత్సవ ప్రత్యేకత అని చెప్పవచ్చు. వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవవేడుకల ముఖ్య అతిధిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను మన ప్రభుత్వం ఆహ్వానించింది. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చిన కొన్ని వార్తలు ఈ ఆహ్వాన ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీల విషయంలో అమెరికా ఆంక్షలకు తలగ్గకపోతే చెల్లించే మూల్యం భారీగా వుంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికే ఫ్రాన్స్‌ను అధిగమించి ప్రపంచంలో ఆరవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించిన మన దేశం 2030 నాటికి మూడవ స్ధానానికి చేరుకోనున్నదని వార్తలు వచ్చాయి. ఆ బాటలో వున్న మనం భారీ మూల్యం చెల్లించాల్సినంత దుర్బలంగా వున్నామా? అమెరికా అడుగుల్లో నడవటం స్వాతంత్య్రపిపాసకులకు మింగుడు పడని అంశమే. ఒక చిన్న దేశం విధిలేక ఒక పెత్తందారు అడుగులకు మడుగులొత్తిందంటే అర్ధం చేసుకోగలం కానీ జనాభారీత్యా, ఘనమైన గతంతో వున్న మనదేశం అమెరికా కనుసన్నలలో నడుస్తోందంటే మన ఆత్మగౌరవం ఏమైనట్లు? నరేంద్రమోడీ లేదా ఎన్‌డిఏ పక్షాలకు ఇవేవీ తెలియకనే ట్రంప్‌కు ఆహ్వానం పలికారా? పాండవుల పక్షాన నిలవాలని ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణుడు ధుర్యోధనుడితో ముందుగ వచ్చితీవు, మున్ముందుగ అర్జున జూచితి అని చెప్పినట్లుగా అన్నీ తెలిసే మోడీ సర్కార్‌ ట్రంప్‌కు ఎర్రతివాచీ పరచేందుకు నిర్ణయించింది అనుకోవాలి. దేశభక్తులమని చెప్పుకొనే వారు చేయాల్సినపనేనా ఇది?

చైనా మన పొరుగుదేశం. రెండు దేశాల మీద బ్రిటీష్‌ పాలకులు పెత్తనం చేశారు. వాస్తవంలో ఏ ప్రాంతం ఎవరికింద వుంది అన్నది చూడకుండా ఆఫీసుల్లో కూర్చొని సరిహద్దుగీతలు గీసిన కారణంగా చైనాతో తలెత్తిన సరిహద్దు పంచాయతీలు ఇంకా పరిష్కారం కాలేదు. దేశాన్ని బ్రిటీషోడు విడదీసినపుడు మనవైపు మొగ్గిన కాశ్మీర్‌లో కొంత ప్రాంతాన్ని పాకిస్ధాన్‌ ఆక్రమించుకుంది, దాన్నొక విముక్తి ప్రాంతంగా, స్వతంత్రమైనదిగా ప్రకటించింది. ఆ సమస్య కారణంగా దానితో సంబంధాలు సజావుగా లేవు. తరువాత కాలంలో అమెరికా ప్రోద్బలంతో కాశ్మీర్‌ వేర్పాటు వాదులను రెచ్చగొట్టటం, వుగ్రవాదులను మన దేశంలో ప్రవేశపెట్టి దుర్మార్గాలకు పాల్పడటం వంటి చర్యలు తెలిసినవే. నిత్యం సరిహద్దుల్లో పోరుకు బదులు వాటిని వారూ మనం పరిష్కరించుకోవాలి. మిగతా ప్రపంచ దేశాలతో మనకు ఎలాంటి పేచీలు లేవు. స్నేహసంబంధాలే వున్నాయి, ఇప్పుడు అమెరికా వాడు వాటిని దెబ్బతీసేందుకు పూనుకోవటం ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం?

మనకు ఒక స్వతంత్ర విధానం వుంది, గతంలో సోవియట్‌ లేదా అమెరికా కూటమిలోకో మొగ్గు చూపకుండా అలీన విధానం అవలంభించాం. దాని మేరకు మన రక్షణ అవసరాల రీత్యా అణ్వాయుధాలను తయారు చేస్తున్నాం, వాటిని పరీక్షిస్తున్నాం. అందుకే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేసేందుకు ఇంతకాల నిరాకరించాం, ఇప్పటికీ అదే వైఖరి కొనసాగుతోంది.దీనిపై సంతకం చేయని వాటిలో మనతో పాటు పాకిస్ధాన్‌,ఇజ్రాయెల్‌, 2011లో స్వాతంత్య్రం పొందిన దక్షిణ సూడాన్‌ వున్నాయి. ఈ ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు శాంతియుత అవసరాలకు అణుశక్తిని వినియోగించవచ్చు తప్ప అణ్వాయుధాలను తయారు చేయటానికి లేదు.

ఇరాన్‌తో ఆరు దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా ఏకపక్షంగా ప్రకటించింది. అంతవరకు పరిమితమైతే అదొకదారి, ఇరాన్‌పై ఆంక్షలు ప్రకటించింది. దానితో వ్యాపారలావాదేవీలు జరిపేవారికి కూడా అవి వర్తిస్తాయని పేర్కొన్నది. పంచాయతీ వుంటే ఆ రెండు దేశాలు తేల్చుకోవాలి తప్ప ఇతర దేశాల మీద కూడా తన ఆంక్షలు అమలు జరుగుతాయని చెప్పటం పెద్దన్న వైఖరి తప్ప ప్రజాస్వామ్యపూరితం కాదు. ఇరాన్‌తో మన సంబంధాలు ఈనాటివి కాదు. దాని అవసరాల నిమిత్తమే కావచ్చు మిగతా చమురు సరఫరా దేశాలేవీ ఇవ్వని రాయితీలను అది మనకు ఇస్తోంది, కొంత మేరకు మన రూపాయి చెల్లింపులను అంగీకరిస్తోంది. ఇది మనకూ ప్రయోజనమే కనుక మన ఇంధన అవసరాలలలో ఎక్కువభాగం అక్కడి నుంచే పొందుతున్నాము. ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షలు ఇరాన్‌తో సంబంధాలున్న అన్ని దేశాలకూ వర్తిస్తాయి. గతంలో కూడా ఆంక్షలున్నప్పటికీ టర్కీ బ్యాంకుల ద్వారా మనం సొమ్ము చెల్లించి చమురు దిగుమతి చేసుకొనే వారం. ఇప్పుడు అలాంటివి కూడా కుదరదని ట్రంప్‌ తెగేసి చెప్పాడు. గతంలో మన దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సమయంలో రెండు దేశాలూ సమాన భాగస్వాములు అంటూ వూదరగొట్టిన అమెరికన్లు ఇప్పుడు మనల్ని పాలేర్లకింద జమడుతున్నారంటే అతిశయోక్తి కాదు.

Image result for us diktats to india

ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించగానే వాటితో తమకు సంబంధం లేదని, ఏ దేశంపై అయినా ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించింది. ఆంక్షలు మూడోపక్ష దేశాలకూ వర్తిస్తాయని వెల్లడించగానే నెల రోజులు కూడా గడవక ముందే ఇరాన్‌ బదులు నవంబరు నుంచి మరొక దేశం నుంచి చమురు దిగుమతి ఏర్పాట్లు చేసుకోవాలని మన చమురు మంత్రిత్వశాఖ చమురుశుద్ధి కర్మాగారాలకు లేఖ రాసింది. తాము చెల్లింపులు జరపలేమని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇది అమెరికా వత్తిడికి లొంగటం కాదా ? మన అలీన విధానం ఏమైనట్లు? ఈ పూర్వరంగంలోనే ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ఆంక్షలను విధిస్తామన్న అమెరికా బెదిరింపుకు భారత్‌ ఎలా స్పందించాలన్న ప్రశ్నకు అమెరికాకు తలొగ్గకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ చెప్పారు.’ ఇదొక ప్రధాన ఆర్ధిక సమస్య గాక విదేశాంగ విధానపరమైన నిర్ణయం కూడా ఇమిడి వుంది. గతం కంటే మరింత కఠినంగా అమలు జరుపుతామని అమెరికా స్పష్టంగా చెప్పటం కనిపిస్తోంది, దీని అర్ధం మినహాయింపులు పరిమితంగా వుంటాయి. అదే జరిగితే మనం చమురుకోసం ఇతర వనరులను చూసుకోవాలి, అమెరికా చెప్పింది వినకపోతే మూల్యం చాలా ఎక్కువగా వుంటుంది. ప్రతి అంతర్జాతీయ వ్యవస్ధలో డాలరు ప్రవేశిస్తోంది, అది ఒక్క వ్యాపారానికే పరిమితం కావటం లేదు ఒక చెల్లింపు సంవిధానంగానూ ద్రవ్య మార్కెట్లలో ఒక సాధనంగా మారింది, దానికి అనుగుణంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుంది.’ అన్నారు.

ఏ దేశపెత్తనానికి తలొగ్గం అని చెప్పుకొనే ప్రభుత్వానికి సలహాలిచ్చే పెద్దమనిషి చెప్పిన ఈ మాటలకు అనుగుణంగానే మోడీ సర్కార్‌ వ్యవహరిస్తున్నది. ఇరాన్‌పై ఆంక్షలను అమలు జరుపుతామని అమెరికాకు రాత పూర్వకంగా ఇంతవరకు ఇవ్వలేదు తప్ప ఇప్పటికే ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను తగ్గించింది. దీని అర్ధం ఏమిటి? మరోవైపు అమెరికా ఆంక్షలను తాము ఖాతరు చేయబోమని చైనా, టర్కీ ప్రకటించాయి.తామే అసలైన జాతీయవాదులం, దేశభక్తులం అని చెప్పుకుంటున్న బిజెపికి ఈ పరిణామం పెద్ద పరీక్ష. అలీన విధానం, స్వతంత్ర వైఖరినుంచి వైదొలగి అమెరికా వైపు మొగ్గుచూపటమే. ఆగస్టు ఆరవ తేదీ నుంచి అమెరికా ఆంక్షల తొలి చర్యలు అమలులోకి వస్తాయి. వీటి వలన మనకు ఎలాంటి ఇబ్బందులు రావు, చమురు లావాదేవీలపై ఆంక్షలు నవంబరు నాలుగవ తేదీ నుంచి వర్తిస్తాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న మనం ఇరాన్‌తో సంబంధాలు వదులుకొంటే మరింత ఇబ్బందులు పడటం ఖాయం. అమెరికా వత్తిడికి లొంగితే ప్రపంచంలో మనపరువు గంగలో కలుస్తుంది. మనతో భాగస్వామ్యానికి మిగతా దేశాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి.

భారత ఇబ్బందులను తాము అర్ధం చేసుకోగలమని, అయితే ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీలు నిలిచిపోతాయని, భారత సర్వసత్తాక నిర్ణయ హక్కును తాము గౌరవిస్తామని ఇరాన్‌ రాయబారి ప్రకటించారు. అమెరికా నుంచి ఇలాంటి ప్రకటన రాకపోగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నికీహాలీ న్యూఢిల్లీ వచ్చి ప్రధానితో సమావేశమై ఇరాన్‌తో సంబంధాలను సవరించుకోవాలని ఆదేశం మాదిరి మాట్లాడి వెళ్లారు. అంతకు ముందే తమ ఆంక్షలలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా ప్రకటించింది. ఒక దేశాధినేతతో అమెరికా వ్యవహరించే తీరిది. అయితే అమెరికా బెదిరింపు పని చేసిందనేందుకు నిదర్శనమా అన్నట్లు జూన్‌లో ఇరాన్‌ నుంచి మన చమురు దిగుమతులు 16శాతం తగ్గాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి మన చమురు దిగుమతులు రెట్టింపు అయ్యాయి. రూపాయలతో కొంత మేరకు కొనే చమురును ఇప్పుడు పెరిగిన డాలర్లతో కొనాల్సిన అగత్యం ఏర్పడింది.

మన రక్షణ ఏర్పాట్లు మనం చేసుకోవాలి. అవసరాలకు అనుగుణంగా మనం ఎవరి దగ్గర ఆయుధాలు కొనుగోలు చేయాలి, ఏ సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాలనేది మన సర్వసత్తాక హక్కు. దీనిలో కూడా అమెరికా జోక్యం చేసుకొంటోంది. తన చట్టాలు, నిర్ణయాలను సర్వవ్యాపితంగా రుద్దాలని, అమలు చేయాలని చూస్తోంది. మన అవసరాలకు తగినవిగా రష్యా తయారీ ఎస్‌-400 గగన రక్షణ క్షిపణి వ్యవస్ధలను కొనుగోలు చేయాలని మన రక్షణ శాఖ నిర్ణయించింది. రష్యా మీద తాము ఆంక్షలను విధించిన కారణంగా రష్యాలో తయారయ్యే ఆయుధాలను కొనుగోలు చేసిన వారికి అవి వర్తిస్తాయని అమెరికా చెబుతోంది. తమకు ఐక్యరాజ్యసమితి నిబంధనలు, చట్టాలు వర్తిసాయి తప్ప అమెరికావి కాదని మన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ అమెరికాకు చెప్పినప్పటికీ వాటి కొనుగోలుకు మనల్ని నిరోధించే విధంగా అమెరికా వత్తిడి చేయటం మానుకోలేదు. ఒకేసారి 400 కిలోమీటర్ల పరిధిలోని 36 లక్ష్యాలను చేరుకోగలిగిన అధునాతన పరికరాలివి. మన విదేశాంగ విధానంలో జోక్యం చేసుకొనేందుకు, వత్తిడి చేసేందుకు, భారాలు మోపేందుకు ఇతర దేశాలకు అవకాశం ఇస్తున్నది ఎవరు? ఎందుకీ పరిస్ధితి ఏర్పడింది. అమెరికాకు దాసోహం అన్న కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ బూట్లలో కాళ్లు పెట్టి బిజెపి నరేంద్రమోడీ నడుస్తున్నారు. రష్యా క్షిపణి వ్యవస్ధల కొనుగోలు వ్యవహారంలో వెనక్కు తగ్గితే అది మన రక్షణకే ముప్పు, అందువలన వాటి కొనుగోలుకే కట్టుబడి వుండటంతో తమ ఆంక్షలను మన దేశానికి మినహాయింపు నిచ్చేందుకు అమెరికా పార్లమెంట్‌ ఒక బిల్లును ఆమోదించాల్సి వచ్చింది. మిగతా విషయాలలో మన సర్కార్‌ అంతగట్టిగా మన వైఖరికి ఎందుకు కట్టుబడి వుండదు ?

దేశాన్ని దీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడింది, తప్పిదాలు చేసిందనే విమర్శను తప్పుపట్టాల్సిన పనిలేదు. తిరుగులేని వాస్తవం, అందుకు ఆ పార్టీ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష గుర్తింపు హోదా కూడా లేని పార్టీగా దిగజారి భారీ రాజకీయ మూల్యం చెల్లించింది. పాలనలో అలాంటి పార్టీ ప్రభావం, రూపురేఖలను పూర్తిగా చెరిపివేయాలనే పేరుతో నరేంద్రమోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలేమిటి అన్నది జనం ముందున్న ప్రశ్న. వాటిలో ఒకటి ప్రణాళికా సంఘం, విధానాలను రద్దు చేయటం. గతంలో సోవియట్‌ యూనియన్‌, ఇప్పుడు చైనా అభివృద్ధిలో ప్రణాళికా విధానం కీలకమైనది అని రుజువైంది.ఆరున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం పనికిరానిదిగా తయారైంది అంటూ దానిని రద్దు చేసి నీతి ఆయోగ్‌ పేరుతో రూపాంతరం చెందుతున్న భారత్‌ కోసం జాతీయ సంస్ధ(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా)ను 2015 జనవరి ఒకటి నుంచి అమలులోకి తెచ్చారు. ఇది పదిహేను సంవత్సరాల మార్గం, ఏడు సంవత్సరాల దృష్టి, వ్యూహం, కార్యాచరణతో పని చేస్తుంది. అంటే ఐదేండ్లకు బదులు ఏడు సంవత్సరాల ప్రణాళిక అనుకోవాలా? రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగి, ప్రభుత్వాలు మారటానికి అవకాశం వున్నపుడు పేరు ఏది పెట్టినా ఏడు సంవత్సరాల ప్రణాళికలంటే వచ్చే ఇబ్బందుల గురించి చెప్పనవసరం లేదు. మధ్యలో మార్చుకోకూడదా అంటే మార్చుకోవచ్చు. ఇక్కడ సమస్య అది కాదు.

1991 నుంచి నూతన ఆర్ధిక విధానాల పేరుతో అమలు చేస్తున్న విధానాలు ప్రణాళికలు అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపే కొన్ని కార్యక్రమాలుగా మారిపోయాయి. అప్పటి నుంచి ప్రభుత్వాలు ఒక్కొక్క బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. వుదాహరణకు పెరుగుతున్న జనాభా, అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్ధల ఏర్పాటు, మెరుగుపరచటంపోయి వాటిని ప్రయివేటు రంగానికి వదలి వేశారు. ఆ విధానాలలో భాగంగానే ప్రభుత్వాలు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేశారు. ఈ కారణంగానే ఒక్క రక్షణ సంబంధిత రంగాలలో తప్ప ఇతరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పిన పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. విద్యుత్‌ రంగంలో ప్రయివేటు విద్యుత్‌ ఖర్చు ఎక్కువగా వుండటం వలన గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయటం, ఒకటీ అరా కొత్తగా స్ధాపించటం తప్ప ఆ రంగంలోనూ పరిమితం చేశారు. వ్యవసాయ రంగంలో గణనీయంగా తగ్గించిన కారణంగా పరిశోధన, అభివృద్ధి లేకుండా పోయింది. బహుళజాతి గుత్త సంస్ధలు వ్యవసాయరంగంలో ప్రవేశించి విత్తన రంగాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.పర్యవసానంగా విత్తన ధరలు పెరిగాయి. ఎరువులపై ధరల నియంత్రణ ఎత్తివేసి మార్కెట్‌ శక్తులకు వదలివేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పరిమితం చేసి దానినే అందచేస్తున్నారు. దీనిలో కొత్త పద్దతుల్లో అక్రమాలకు తెరలేవటం అందరికీ తెలిసిందే.

స్వాతంత్య్రానికి ముందు, తరువాత కాలంలో కార్మికవర్గ రక్షణ కోసం రూపొందించిన అనేక చట్టాలను నీరుగార్చటం, అమలుకు నోచుకోకుండా ఆటంకాలు, ఆంక్షలు విధించటం వంటి విషయాలు తెలిసిందే. మొత్తం శ్రమ జీవులందరికీ సామాజిక భద్రత కల్పించాల్సిన ప్ర భుత్వాలు వున్న వారికి వర్తింపచేస్తున్న వాటిని రద్దు చేశాయి. నూతన పెన్షన్‌ పధకం(ఎన్‌పిఎస్‌) పేరుతో 2004 తరువాత చేరిన వారికి పాత పద్దతిలో వుపయోగకరమైన పెన్షన్‌ రద్దు చేశారు. దానిని రూపొందించిన ఖ్యాతి వాజ్‌పేయి నాయకత్వంలోని గత ఎన్‌డిఏ ప్రభుత్వానిదైతే దానిని తు.చ తప్ప కుండా అమలు జరిపిన చరిత్ర తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ, రాష్ట్రాలలో అధికారంలో వున్న బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీల గురించి తెలిసిందే. నూతన పెన్షన్‌ పధకాన్ని రద్దు చేసి పాతదాన్ని పునరుద్దరించాలని వుద్యోగులు పోరుబాట పట్టారు. ఒక్క వామపక్షాలు తప్ప మిగతా పార్టీలేవీ దాని గురించి పట్టించుకోవటం లేదంటే ఆమోదం, అమలుకు అంగీకరించినట్లే.

Image result for us diktats to india

మన దేశంలో వునికిలోకి వచ్చిన ప్రతి చట్టం వెనుక ఆయా తరగతులు జరిపిన వుద్యమాల వత్తిడి, త్యాగాలు వున్నాయి. వ్యాపార సులభతరం పేరుతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. బిజెపి పాలిత రాజస్ధాన్‌ పారిశ్రామిక వివాదాల చట్ట సవరణ ప్రకారం మూడు వందలలోపు సిబ్బంది పనిచేసే చోట ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా యజమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను తొలగించవచ్చు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేయాలంటే కనీసం 30శాతం మంది సిబ్బంది ఆమోదం వుంటేనే అనుమతిస్తారు. గో స్లో( వుత్పత్తి నెమ్మదించటం) అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతపరిచారు.ఏ కారణంతో వుత్పత్తి తగ్గినా, కార్యకలాపం విఫలమైనా దానికి బాధ్యత కార్మికులదే అని యజమానులు ఆరోపించి చర్యలు తీసుకొనేందుకు వీలు కల్పించారు. అంటే సూటిగా చెప్పాలంటే ఏ చట్టాలు లేనపుడు యజమానుల దయాదాక్షిణ్యాలపై కార్మికులు వున్నట్లే గతంలో సాధించుకున్న హక్కులను హరించి స్వాతంత్య్ర పూర్వ పరిస్ధితిలోకి నెట్టారు. ఫ్యాక్టరీ చట్టం వర్తించాలంటే విద్యుత్‌ అవసరం లేని చోట పని చేసే కార్మికుల సంఖ్యను 20 నుంచి 40కి, అవసరం వున్నచోట 10 నుంచి 20కి పెంచారు. ఏ యజమాని అయినా చట్టాలను వుల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాతపూర్వక అనుమతి లేకుండా కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదనే సవరణ కూడా చేశారు. చట్టాలను వుల్లంఘించిన వుదంతాలలో వేయాల్సిన శిక్షలను కూడా ఎంతో సరళతరం చేశారు. ఇలాంటి వన్నీ బ్రిటీష్‌ వలసదారులు చేశారంటే అర్ధం వుంది, స్వతంత్ర భారత్‌లో చేయటం అంటే పరాయి పాలనకు వ్యతిరేకంగా కార్మికోద్యమం చేసిన త్యాగాలన్నీ వృధా అయినట్లే. 2014 ఆగస్టు ఒకటిన తీవ్ర కార్మిక నిరసనల మధ్య ఫ్యాక్టరీలు మరియు కాంట్రాక్టు లేబర్‌(క్రమబద్దీకరణ, రద్దు)చట్టాన్ని కార్మిక వ్యతిరేక అంశాలతో సవరించి ఒకే రోజు ప్రవే శపెట్టి అదే రోజు ఆమోదింపచేయించిన అపర ప్రజాస్వామిక నడత ఘనత బిజెపి ఖాతాలో చేరింది. అంబేద్కరిస్టులు లేదా దళిత అస్ధిత్వవాదులు చేసే ప్రకారం ఈ దేశంలో కార్మికులందరూ దళితులే. అంటే వారి అవగాహన ప్రకారం కార్మిక రంగంలో చేస్తున్న మార్పులన్నీ దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వ్యతిరేక చర్య, చట్టాల దుర్వినియోగం గాక మరేమిటి? బిజెపి కార్మిక సంస్కరణల పర్యవసానంగా రాజస్ధాన్‌లోని 7622 ఫ్యాక్టరీలలో 7252 కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదని వెల్లడైంది.ఇదా స్వాతంత్య్రం ! అది ఎవరికి వుపయోగపడుతోంది?

ప్రభుత్వ రంగ సంస్ధలలో 50, ప్రయివేటు రంగంలో 70శాతం పైగా కార్మికులు చట్టాలు పెద్దగా వర్తించని కాంట్రాక్టు కార్మికులుగా వున్నారు.పన్నెండు గంటల పని సర్వసాధారణమైంది. ఓవర్‌ టైమ్‌ లేదు, చేయించుకొనే ఓవర్‌ టైమ్‌కు కొందరు సాధారణ సెలవులు ఇస్తారు లేదా ఓవర్‌ టైమ్‌ రెట్టింపు కంటే తక్కువగా వుంటాయి. నేడు కార్మికులు-యజమానుల మధ్య తలెత్తుతున్న వివాదాలలో అత్యధికం కార్మిక చట్టాల వుల్లంఘనలపైనే అన్నది స్పష్టం. చివరికి కార్మిక సంఘాల నమోదు కూడా దుర్లభం అవుతోంది. నమోదు ప్రక్రియ పూర్తిగాక ముందే సంఘం పెట్టుకున్న కార్మికుల వుద్యోగాలు పోతున్నాయి. ఇదేదో నరేంద్రమోడీ హయాంలోనే ప్రారంభమైందని కాదు, ఆయన ఏలుబడిలో వేగం పెరిగింది. దానికి నిదర్శనం సులభతర వాణిజ్యంలో మన స్దానం పైకి ఎగబాకటమే. తన ప్రభుత్వ ఘన విజయాలలో అదొకటని మోడీ సర్కార్‌ చెబుతోంది. కార్మికవర్గానికి ఇదొక సవాల్‌. స్వాతంత్య్రానికి ముందు మనం ఏ లక్ష్యాల కోసం పోరాడాము, తరువాత ఇప్పటి వరకు వాటికి మనం ఎంతవరకు కట్టుబడి వున్నాము, లక్ష్యాలు, గత ఆచరణ నుంచి కూడా ఇప్పుడు మనం వైదొలగుతున్న తీరు మన స్వాతంత్య్రాన్ని ఏమి చేయనున్నది అని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలోనే కాదు ప్రతి క్షణం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. నాడు బ్రిటీష్‌ తెల్లదొరల దుర్వివిధానాలకు వ్యతిరేకంగా పోరాడినట్లుగానే ఆ స్వాతంత్య్రానికి, సర్వసత్తాక అధికారానికి ముప్పు తెస్తున్న నేటి అమెరికన్‌ దొరల వత్తిడికి లంగిపోతున్న నల్లదొరల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పరిరక్షణకోసం మరోమారు వుద్యమించాల్సిన పరిస్ధితి ఏర్పడలేదా ? ఆలోచించిండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యూహ ప్రతి వ్యూహాలతో విస్తరిస్తున్న వాణిజ్య యుద్ధం !

01 Wednesday Aug 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Counter tariffs, counterstrategies, TRADE WAR, Trade war Expanding

Image result for Trade war

ఎం కోటేశ్వరరావు

జూలై ఆరున తాను ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కొనసాగించటంపై అమెరికా, తనను తాను రక్షించుకోవటంపై దాడికి గురైన చైనా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ మొదలు పెట్టిన ఈ పోరు మీద ఇప్పటికీ అనేక కోణాల నుంచి విమర్శలే ఎక్కువగా వస్తున్నాయంటే ప్రపంచ పెట్టుబడిదారులు దీనిని ‘ మంచి యుద్ధం’ గా పరిగణించటం లేదనే అనేకోవాలి. తాజా పరిణామాలు, విశ్లేషణలను బట్టి వాణిజ్య దాడులను దీర్ఘకాలం కొనసాగించేందుకే అమెరికా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ చర్యలు చైనా నాయకత్వ పట్టుదలను మరింత పెంచుతాయని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ హెచ్చరించాడు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బట్టి చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్నుల పెంపుద్వారా మోపిన భారాన్ని అమెరికన్‌ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు వినియోగదారులపై మోపటం ప్రారంభమైంది. పంటల ధరలు పడిపోవటంతో రైతులకు 12బిలియన్‌ డాలర్ల మేర చెల్లించాలని ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ ప్రకటన వెలువడగానే మా సంగతేమిటని పారిశ్రామికవేత్తలు అడగటం ప్రారంభించారు. ఇదే సమయంలో అమెరికా దాడి ప్రభావం చైనాపై పెద్దగా పడిన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా కరెన్సీ యువాన్‌ విలువ తగ్గటంతో చైనా ఎగుమతులపై పెద్ద ప్రభావం లేదన్నది వాటి సారాంశం. వెలువడుతున్న విమర్శలు, వాణిజ్య యుద్ధం ఇరుపక్షాలకూ నష్టం కలిగిస్తుందనే విశ్లేషణల పూర్వరంగంలో రెండు దేశాలూ మరోమారు చర్చలకు పూనుకోవచ్చన్నది తాజా వార్త.

అమెరికా తన మిత్రదేశాలైన కెనడా, మెక్సికోలతో పాటు ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై కూడా దిగుమతి పన్నుల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెరతీసింది. అయితే జూలై నెల మూడవ వారంలో ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌-డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య రాజీకుదిరింది. అమెరికా నుంచి సోయా, సహజవాయువు(ఎల్‌ఎన్‌జి), ఐరోపా నుంచి కార్లు మరియు ఆటో విడి భాగాలను పరస్పరం దిగుమతులు చేసుకొనేందుకు, ఆటోయేతర పారిశ్రామిక వుత్పత్తులపై ఎగుమతులు, దిగుమతులపై ఆటంకాలు, పన్నులు, సబ్సిడీలను ఎత్తివేసేందుకు అంగీకరించారు. అయితే పన్నులను పూర్తిగా రద్దు చేయటం అన్నది ఎంత మేరకు సాధ్యం అన్నది ప్రశ్న. అంతిమంగా కుదిరే ఒప్పందాన్ని బట్టి స్పష్టం అవుతుంది. ఈ చర్య బహుముఖాలుగా దాడులు చేయటం తనకు మంచిది కాదన్న గ్రహింపు అమెరికాకు వచ్చినందునే ఈ తాత్కాలిక రాజీ, దానికి అది ఎంత కాలం కట్టుబడి వుంటుందన్నది కూడా సందేహమే. మా తల మీద తుపాకి గురి పెట్టి మమ్మల్ని ఒప్పించాలని చూస్తే కుదరదని ఇటీవలి కాలంలో ఐరోపా దేశాలు అమెరికాకు స్పష్టం చేశాయి. అందువల్లనే ట్రంప్‌ ఒక అడుగు వెనక్కు వేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో చొక్కా నలగకుండా, అటూ ఇటూ ఆయుధాలను విక్రయించి లాభపడిన అమెరికాను ఎదుర్కోవాలంటే, విజయం సాధించినప్పటికీ ఎంతో నష్టాన్ని మూటగట్టుకొని, వికలాంగులుగా మారిన తాము ఐక్యంగా వుంటే తప్ప సాధ్యం కాదని గ్రహించిన ఫలితమే నేటి ఐరోపా యూనియన్‌. అందువలన వాటి రెండింటి మధ్య ఇప్పటికీ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో అనూహ్యంగా తమకు సవాలుగా పరిణమించిన చైనాను ఎదుర్కోవటంలోనూ అవి చేతులు కలిపేందుకు వెనుకాడవు. కమ్యూనిస్టు ్యవతిరేకత, మార్కెట్లను ఆక్రమించుకోవటంలో అవి ఏవీ తక్కువ కాదు. అందువలన తమపై దాడి ప్రారంభించిన అమెరికా మీద ఐరోపా ధనిక దేశాలు వత్తిడి తెస్తాయనే భ్రమలు, తమతో చేతులు కలుపుతాయనే ఆశలు చైనాకు లేవు. అతి పెద్ద దేశంగా వున్నందున జిడిపి ఎక్కువగా వున్నట్లు కనిపించినా, అమెరికా, ఐరోపా ధనిక దేశాలతో పోల్చితే ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్నదేశమే, ఈ కారణంగానే ప్రపంచ వాణిజ్య సంస్ధలో కొన్ని రాయితీలను పొందుతున్నది.

అమెరికా తరువాత మరో ధనిక దేశమైన జపాన్‌ కూడా ఇటీవలే ఐరోపా యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక బహిరంగ వాణిజ్య ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాయి. జపాన్‌ నుంచి చేసుకొనే దిగమతులలో 99శాతం వస్తువులపై పన్నులను ఐరోపా యూనియన్‌ రద్దు చేస్తుంది. అమెరికా-ఐరోపా యూనియన్‌ కూడా ఇదే మాదిరి ఒప్పందానికి వస్తే అప్పుడు చైనా ఇతర దేశాలతో వాణిజ్యం చేయటం కష్టం అవుతుంది లేదా వత్తిడికి లంగి తన దిగుమతి పన్నులను తగ్గించి మరింతగా తన మార్కెట్‌ను తెరవాల్సి వుంటుంది. నూతన ఆర్ధిక విధానాల పేరుతో చైనా ప్రారంభించిన సంస్కరణలకు నలభై సంవత్సరాలు నిండాయి. పశ్చిమ దేశాలకు పెద్ద ఎత్తున మార్కెట్‌ ద్వారాలు తెరిచిన కారణంగా పరస్పరం లబ్దిపొందాయి. ఈ క్రమంలో అది వాణిజ్య మిగులు దేశంగా మారింది. ఇంకా తమ వస్తువులను అదనంగా కొనాలని పశ్చిమ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధ మూలకారణమిదే. చైనా ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ పశ్చిమ దేశాలతో పోల్చితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పటికీ వెనుకబడే వుంది. తమ వైపు నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపును అడ్డుకుంటే చైనా దారికి రావచ్చన్నది పశ్చిమ దేశాల వూహ. అమెరికా ఇప్పుడు క్రమంగా వాణిజ్య యుద్ధాన్ని 500బిలియన్‌ డాలర్ల మేరకు విలువగల వస్తువులకు పెంచుతానని బెదిరించింది. దీనితో పాటు చైనా పశ్చిమ దేశాల ఆధునిక పరిజ్ఞాన కంపెనీలను కొనుగోలు చేయకుండా చూడటంతో పాటు వాణిజ్య సంస్ధలో సంస్కరణల పేరుతో కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టాలని కూడా అమెరికా నిర్ణయించింది. అంటే చైనాను చక్రబంధంలో బిగించి దారికి తెచ్చుకోవాలన్నది వ్యూహం.

‘చైనాతో వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. అంటే వాణిజ్య యుద్ధం నిరవధికంగా కొనసాగవచ్చు, ఇతర దేశాల ద్వారా చైనా వుక్కు అమెరికా చేరకుండా వుండాలంటే ప్రపంచం అంతటి నుంచి వచ్చే వాటి మీద పన్నులు విధించటమే ఏకైక మార్గం ‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌ పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పారు. అమెరికా మరో వాణిజ్య ప్రతినిధి డెనిస్‌ షెయా చైనా కమ్యూనిస్టుపార్టీపై విరుచుకుపడుతూ చైనా ప్రభుత్వ ఒప్పందాలకు విరుద్దంగా కమ్యూనిస్టు పార్టీ వాణిజ్య విధానాన్ని ఆదేశిస్తున్నదని, చైనా ఆర్ధిక విధానాల కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యులు నష్టపోవాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యురాలిగా లబ్ది పొందిన చైనా 2005-16 మధ్య 9.5శాతం నిజ జిడిపి అభివృద్ధి రేటుతో రెండవ ఆర్ధికశక్తిగా ఎదిగిందని కూడా వుక్రోషం వెలిబుచ్చాడు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో ధనిక దేశాలన్నీ చైనా మీద కత్తి గట్టటానికి సన్నద్ధం అవుతున్నాయి.

ముందు తన ఇంటిని చక్కదిద్దుకొని వాణిజ్య లోటు ఏర్పడకుండా దేశీయంగా పొదుపును పెంచుకోవాలని చైనా తిప్పి కొట్టింది. వాణిజ్య యుద్ధం ప్రారంభం సాంకేతికంగా జూలై ఆరున ప్రారంభమైనప్పటికీ దానికి నిర్ణయం, సన్నాహాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అనేక సంవత్సరాలుగా తమ సరకులను ఎక్కువగా కొనుగోలు చేసి వాణిజ్య లోటును తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తోంది. ఇదే సమయంలో ధనిక దేశాలపై ఆధారపడిన తన ఎగుమతి ఆధారిత ఆర్ధిక వ్యవస్ధకు వున్న పరిమితులను చైనా నాయకత్వం గుర్తించకపోలేదు. తమ పౌరుల కొనుగోలు శక్తిని పెంచటం, వెనుక బడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ వంటి అంతర్గత చర్యలతో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో సహా అన్ని ఖండాలలో తన వాణిజ్య అవకాశాలను పెంచుకొనేందుకు పూనుకుంది, ఆ దిశగా అనేక చర్యలను చేపట్టింది. తమ పన్నుల దాడి నుంచి కాచుకొనేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తున్నదని అమెరికా ఆరోపిస్తోంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏ దేశమైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే లాభాలతో పాటు నష్టాలు కూడా వుంటాయి. కరెన్సీ విలువ తక్కువగా వుంటే ప్రపంచ మార్కెట్‌లో ధరలపోటీలో నిలబడవచ్చు. అదే సమయంలో సదరు దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతాయి. చైనా దగ్గర డాలర్‌ నిల్వలు భారీగా వున్నందున తన కరెన్సీ విలువ తగ్గించి కుక్క కాటుకు చెప్పు దెబ్బమాదిరి ప్రతీకారం తీర్చుకోవచ్చన్నది ఒక వాదన. పదకొండువందల వస్తువులపై అమెరికా విధించిన 25శాతం దిగుమతి పన్ను భారాన్ని తమ కంపెనీలపై తగ్గించేందుకు వాణిజ్య యుద్ధం ప్రారంభానికి ముందు నుంచే అంటే తన కరెన్సీ విలువ పతనాన్ని ప్రోత్సహించిందని, గత మూడునెలల్లో డాలరుతో 7.7శాతం పడిపోయిందని చెబుతున్నారు. ఇదే కాలంలో మన దేశంతో సహా అనేక దేశాల కరెన్సీ విలువలు పడిపోయాయి.’ చైనా, ఐరోపా యూనియన్‌లు కరెన్సీ విలువలను తిమ్మిని బమ్మిని చేస్తున్నాయి, వడ్డీ రేట్లు తక్కువగా వుంచుతున్నాయని’ ట్రంప్‌ స్వయంగా ట్వీటర్‌లో ఆరోపించాడు. దీనికి తగిన ఆధారాలు కనిపించటం లేదు. జర్మనీలో పదేండ్ల బాండ్లపై 0.5, అమెరికాలో 2.6 శాతం వడ్డీ వస్తుండగా చైనాలో 3.75శాతం వస్తున్న కారణంగా ఏప్రిల్‌కు ముందు పన్నెండు నెలల కాలంలో వంద బిలియన్‌ డాలర్లు చైనాకు తరలి వచ్చాయి. చైనా వడ్డీ రేటును స్ధిరంగా వుంచుతుందనే నమ్మకమే దీనికి కారణమని కొందరి విశ్లేషణ. కరెన్సీ విలువ తగ్గితే విత్త (వడ్డీ) వ్యాపారులు చైనా నుంచి బయటకు పోతారు. చైనాకు సంపదలతో పాటు అప్పులు కూడా భారీగానే వున్నాయి, అలాంటపుడు విదేశీ నిధులు బయటకుపోతే ఎన్నో చిక్కులు తలెత్తుతాయి కనుక చైనా నాయకత్వం అలాంటి పరిస్ధితిని కొని తెచ్చుకోదు అని కొందరి వాదన.

Image result for Trade war

ఒక దేశంలో కరెన్సీ విలువ పడిపోతే అది దిగుమతి చేసుకొనే వస్తువుల ధరలు పెరుగుతాయి. యువాన్‌ విలువ తగ్గితే చైనాలో అమెరికా వస్తువులు ప్రియం అవుతాయి. జూలై ఆరు తరువాత ఇప్పటి వరకు యువాన్‌ విలువ రెండున్నర శాతం తగ్గింది. అయితే ఇలాంటి హెచ్చు తగ్గులు గతంలో కూడా వున్నాయి. గతనెలలో చైనా పిఎంఐ సూచిక 51.2గా వుంది. అంతకు తగ్గితే ఆర్ధిక వ్యవస్ధ ఇబ్బందుల్లో పడినట్లు. ఏమైనా ప్రభావం, పర్యవసానాల గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేము. గత నాలుగు సంవత్సరాలుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకొనేందుకు రష్యా తన కరెన్సీ విలువను తక్కువగా వుంచిందని, చైనా కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని కొందరు అంటున్నారు.అయితే రష్యాకు దాని వలన కొన్ని సమస్యలు కూడా తలెత్తకపోలేదు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు అటు చైనా ఇటు అమెరికా మీద మెల్లగా ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో సోయా, ఇతర వ్యవసాయ వుత్పత్తుల ధరలు పతనం కావటంతో రైతులను ఆదుకొనేందుకు ట్రంప్‌ సర్కార్‌ 12బిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. అమెరికాకు ప్రతిగా తాము విధించిన పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభావితమయ్యే పరిశ్రమలు, సంస్ధలకు రాయితీల రూపేణా అందిస్తామని చైనా ఎప్పుడో ప్రకటించింది. రైతులకు రాయితీలు ప్రకటించటంతో మిగతా పరిశ్రమల వారు కూడా తమ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా రాయితీలు ఇస్తే 39బిలియన్‌ డాలర్లు అవుతాయని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. గతంలో తాము ఎన్నో మాంద్యాలు, అంతర్యుద్ధాల కాలంలో కూడా నిలబడ్డామని కానీ ఇప్పుడు వాణిజ్య యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మనుగడ కష్టమని 1839 నుంచి వునికిలో వున్న బ్రిన్లీ-హార్డీ కంపెనీ ప్రతినిధి చెప్పారు. వుక్కు ధరలు 33శాతం పెరిగాయని వాపోయారు. అనుచిత యుద్ధం, అసమర్ధులైన సైన్యాధికారులు, ప్రజల మద్దతు లేనపుడు గెలవటం అసాధ్యమని, ట్రంప్‌ ప్రారంభించి వాణిజ్య యుద్దం కూడా అలాంటిదే అని ప్రముఖ ఆర్ధికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ద పర్యవసానాలు ఏమైనప్పటికీ 2020 నాటికి అమెరికా ఆర్ధిక లోటు లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే జరిగితే పెట్టుబడులు, దిగుమతులు పడిపోవటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం వుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సమస్య చైనా కాదని, దేశీయంగా పొదుపు చాలా తక్కువగా వుండటం అసలు సమస్య అన్నారు. ట్రంప్‌ కోరుతున్నట్లు అమెరికా నుంచి చైనా మరింతగా చమురు, గ్యాస్‌ కొనుగోలు చేసి ఇతరులకు అమ్మితే చైనాతో వాణిజ్యలోటు తగ్గించానని ట్రంప్‌ చెప్పుకోవటానికి తప్ప పెద్ద తేడా ఏమీ వుండదు, రవాణా ఖర్చులు పెరుగుతాయి అన్నారు. చైనా వస్తువులకు డిమాండ్‌ తగ్గితే ప్రభుత్వ ప్రమేయం లేకుండానే దాని కరెన్సీ విలువ బలహీనమౌతుంది, అప్పుడు ఇతర దేశాలతో చైనా పోటీతత్వం పెరుగుతుంది. 2015లో చైనా ఆమోదించిన మేడిన్‌ చైనా 2025 విధానాన్ని అడ్డుకొనేందుకు ట్రంప్‌ ప్రయత్నించినట్లయితే కచ్చితంగా విఫలమౌతాడు, మరోవైపు నూతన ఆవిష్కరణలు, సాంకేతికంగా పైచేయి సాధించాలన్న చైనా నేతల పట్టుదలను మరింత పెంచినవారవుతారు, తాము ఇతరులపై ఆధారపడలేమని వారు గుర్తించిన తరువాత అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అని స్టిగ్జిజ్‌ చేసిన హెచ్చరికను ట్రంప్‌ పట్టించుకుంటాడా?

Share this:

  • Tweet
  • More
Like Loading...

డోనాల్డ్‌ ట్రంప్‌ అబద్దాలు, అదిరింపులు, బెదిరింపులతో నాటో భేఠీ !

14 Saturday Jul 2018

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, Politics, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

Donald trump, lies, NATO, nato brussels summit 2018, scares, threats

Image result for nato brussels summit 2018

ఎం కోటేశ్వరరావు

గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారికి ఒక మౌలిక ప్రశ్న తలెత్తుతోంది.అమెరికా పాలకవర్గం(దాని ప్రతినిధులు రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలనేతలు) ప్రపంచాన్ని ఏవైపు తీసుకుపోతున్నది? పర్యవసానాలు ఎలా వుంటాయి? ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌, వుత్తర కొరియాతో అణు సమస్యపై తొలిసారిగా ఒక ఒప్పందానికి వస్తున్నట్లు ప్రకటించాడు. ఇరాన్‌తో ఏ దేశమైనా లావాదేవీలు జరిపితే వాటి మీద కూడా తన కొరడా ఝళిపిస్తానని భారత్‌ వంటి దేశాలను బెదిరించాడు.కెనడాలో జరిగిన జి7 సమావేశంలో అన్నింటా తన అనుయాయిగా వున్న కెనడా, ఇతర మిత్ర దేశాల మీద విరుచుకుపడ్డాడు. చైనాతో పాటు కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ మీద కూడా వాణిజ్య యుద్దం ప్రకటించాడు. తాజాగా ఈనెల 11,12 తేదీలలో జరిగిన నాటో కూటమి దేశాల సమావేశంలో మిలిటరీ ఖర్చు పెంచుతారా లేదా అంటూ బెదిరింపులకు దిగాడు. ఐరోపా యూనియన్‌లో అగ్రరాజ్యమైన జర్మనీపై విరుచుకుపడుతూ ఇంధనం కోసం రష్యా చేతిలో బందీ అయిందని మండిపడ్డాడు. నాటో ఖర్చు అంతటినీ అమెరికాయే భరిస్తోందంటూ అతిశయోక్తులు పలికి అపహాస్యం పాలయ్యాడు. అంతే కాదు దాదాపు అన్ని విషయాల్లో అమెరికాకు వత్తాసు పలుకుతూ, ఐరోపా యూనియన్‌లో అమెరికా ఏజంటు వంటిది అని పేరు తెచ్చుకున్న బ్రిటన్‌ను కూడా ట్రంప్‌ వదల్లేదు. ప్రధాని థెరెస్సా మే గురించి, బ్రెక్సిట్‌ గురించి నోరుపారవేసుకున్నాడు. దీంతో సోమవారం నాడు బ్రిటన్‌ పర్యటనలో లక్షలాది మంది నిరసన ఎదుర్కొన్నాడు. బ్రసెల్స్‌ నాటో సమావేశంలో నిజమైన బేధాభిప్రాయం దానికి నిధుల చెల్లింపు గురించే అని నాటో వర్గాలు వెల్లడించాయి. లోపల ఎన్ని బేధాభిప్రాయాలు వున్నా, ట్రంప్‌ ప్రవర్తనపై అసంతృప్తి వున్నా ఐరోపా నేతలు సంయమనం పాటించారు. తాత్కాలికంగా అయినా ట్రంప్‌ను సంతృపరచేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామలన్నీ దేనికి సూచిక ?

ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ముఖ్యంగా సోవియట్‌ పూర్వపు రిపబ్లిక్‌లైన జార్జియా, వుక్రెయిన్లలో రష్యా మిలిటరీ జోక్యం ముగిసిందనుకున్న ప్రచ్చన్న యుద్ధం మరో రూపంలో ప్రారంభం అవుతుందా అన్న ప్రశ్నను రేకెత్తించాయి. రష్యాను ఒంటరిని చేయాలని నాటో అనే శిఖండిని ముందు పెట్టుకొని అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఎలా ప్రయత్నిస్తున్నాయో రష్యా కూడా నాటోలో రాజకీయ విబేధ విత్తనాలు నాటేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. బ్రసెల్స్‌ సమావేశాల్లో వాటి గురించి స్వయంగా అమెరికాయే బయటపడటం విశేషం. రెండవ ప్రపంచ యుద్దం తరువాత అమెరికా, ఐరోపా దేశాలు 1949లో వుమ్మడి మిలిటరీ రక్షణ కూటమిగా వుత్తర అట్లాంటిక్‌ సంధి సంస్ధ(నాటో)గా ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటిలో 29దేశాలు వున్నాయి. నాటి సోవియట్‌ నుంచి రక్షించుకొనే పేరుతో ఏర్పడిన ఈ సంస్ధ 1991 అది రద్దయిన తరువాత కూడా కొనసాగటమే కాదు, దాని ఖర్చును రెట్టింపు చేయాలని తాజాగా బ్రసెల్స్‌లో జరిగిన సమావేశంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సభ్యరాజ్యాలను డిమాండ్‌ చేశాడు. గత ఏడు దశాబ్దాలలో కమ్యూనిస్టు సోవియట్‌ లేదా తరువాత దాని వారసురాలిగా మారిన పెట్టుబడిదారీ రష్యా గానీ నాటో సభ్యరాజ్యాల మీద దాడి లేదా ప్రయత్నం కూడా చేయలేదు. అయినా సరే దాన్నింకా బలపరచాలని అమెరికా కోరటం వెనుక వున్న వుద్దేశ్యం ఏమిటి? ఎవరి నుంచి ముప్పు వస్తుస్తుందని ఐరోపా రాజ్యాలు భయపడుతున్నాయి?

1991లో సోవియట్‌ యూనియన్‌ను కూల్చివేశారు. అప్పటి వరకు దానికి వ్యతిరేకంగా పని చేసిన నాటో తదుపరి ప్రయాణం ఏదిశగా సాగాలి, అసలు కొనసాగటం అవసరమా అన్న దిశలో చర్చలు జరిగాయి. పశ్చిమ ఐరోపాతో పాటు తూర్పు ప్రాంతానికి కూడా రక్షణ ఛత్రాన్ని విస్తరింప చేయాలని నాటి బిల్‌క్లింటన్‌ సర్కార్‌ మొగ్గు చూపింది. ప్రపంచం మీద పెత్తనం కొనసాగించాలన్నదే అంతర్గత అంశం. సోవియట్‌ ముప్పు లేకపోయిన తరువాత ఐరోపా రక్షణకు అమెరికా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదని కొంత మంది అమెరికా రక్షణశాఖలో అభిప్రాయాలు వెల్లడయ్యాయి. నాటో విస్తరణ కూటమిని పలుచన చేస్తుందని బ్రిటన్‌, విస్తరణ నాటో ప్రభావాన్ని అవసరానికి మించి పెంచుతుందని ఫ్రాన్స్‌ భయం వ్య్తం చేసింది. చిత్రం ఏమిటంటే 69 సంవత్సరాల క్రితం నాటో ఏర్పాటు లక్ష్యం వేరు, ఆచరణలో దాన్ని వినియోగిస్తున్న తీరు వేరుగా వుంది. నాటో ఒప్పందం ప్రకారం ఐరోపా, వుత్తర అమెరికా ఖండంలోని సభ్య రాజ్యాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిపై ఎవరైనా దాడి చేస్తే అందరి మీద జరిగిన దాడిగా పరిగణించి ప్రతిఘటించాలి. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా అటువంటి దాడి జరగలేదు. సరికదా నాటో దేశాల సరిహద్దుల వెలుపల నాటో సభ్య దేశాలే ఏదో ఒకసాకుతో మిలిటరీ జోక్యం చేసుకుంటున్నాయి. కొత్త భద్రతా సమస్యలు తలెత్తాయనే పేరుతో దాన్ని కొనసాగించేందుకు కొత్త సాకులు వెతుకుతున్నాయి.

Nato

1990దశకంలో నాటి యుగోస్లావియా జాతుల విబేధాలతో ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి బోస్నియా, హెర్జెగోవినా మీద విమానాలు ఎగరకూడదని ఆంక్షలు విధించింది. దాన్ని అవకాశంగా తీసుకొని తొలిసారిగా నాటో దళాలు 1994లో నాలుగు బోస్నియా విమానాలను కూల్చివేశాయి. ఆ తరువాత కొసోవోలో శాంతి పరిరక్షణ పేరిట, మధ్యధరా సముద్రంలో భద్రతా గస్తీ, సోమాలియాలో ఆఫ్రికన్‌ దళాలకు మద్దతు, ఆఫ్ఘనిస్తాన్‌లో వుగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతు పేరుతో నాటో జోక్యం చేసుకుంది. ఇవన్నీ అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాద ఎత్తుగడలు, లక్ష్యాలలో భాగంగానే జరిగాయి తప్ప ఐరోపాకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇంతే కాదు ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను నీరుగార్చి, దాని లక్ష్యాలను కూడా దెబ్బతీసే విధంగా నాటో రాజ్యాలు వ్యవహరిస్తున్నాయి. వుదాహరణకు లిబియా మీద 2011లో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. వాటిని అమలు జరిపే పేరుతో రంగంలోకి వచ్చిన అమెరికా,బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరువాత కొద్ది రోజుల్లోనే ఆ బాధ్యతను నాటో కమాండ్‌కు అప్పగించాయి. టర్కీ ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదు.లిబియాపై దాడులు చేసేందుకు జర్మనీ, పోలాండ్‌ తిరస్కరించాయి.

తమ సభ్యదేశంపై జరిగిన దాడిని వుమ్మడిగా ఎదుర్కోవాలనే సూత్రాన్ని 2001లో ఆప్ఘనిస్తాన్‌లో నాటో ముందుకు తెచ్చింది. వుగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే పేరుతో అక్కడ జోక్యం చేసుకుంది అమెరికా.అమెరికా సేనల మీద దాడులు జరిపింది ఆల్‌ఖైదా వుగ్రవాదులు. దానికి నాటో సూత్రానికి లంకెపెట్టి అమెరికా నాయకత్వంలోని దళాలు అక్కడి ప్రభుత్వానికి సాయం చేసే పేరుతో తిష్టవేశాయి. రెండు సంవత్సరాల తరువాత ఆ బాధ్యతను నాటో స్వీకరించింది.అయితే కొన్ని దేశాలు జాతీయ కారణాలు చూపి ఆ దాడులకు తమ సైన్యాన్ని పంపలేదు. నాటో, దాని భాగస్వామ్య దేశాల పేరుతో 50కిపైగా దేశాల నుంచి లక్షా 30వేల మంది సైన్యాన్ని దించి 2014వరకు దాడులు చేశారు. వాటిలో వుగ్రవాదుల చేతుల్లో మరణించిన వారిలో చురుకుగా పాల్గన్న అమెరికా, బ్రిటన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలవారే అధికులు. ఆ తరువాత గత నాలుగు సంవత్సరాలుగా అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పేరుతో 16వేల మంది నాటో సైనికులు అక్కడ కొనసాగుతుండగా వారిలో సగం మంది అమెరికన్లే. అదే ఆల్‌ఖైదా వుగ్రవాదులకు అమెరికాతో పాటు ఐరోపా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి సిరియాలో వున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించటాన్ని గమనించాలి. వాటికి వ్యతిరేకంగా అక్కడ రష్యా సేనలు సిరియాకు మద్దతు ఇస్తున్నాయి. నాటో విస్తరణ ఐరోపాకే పరిమితం చేయలేదు. రష్యాను చుట్టుముట్టేందుకు ఆసియాలోని అజర్‌బైజాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాలకు సైతం ఏదో ఒకసాకుతో విస్తరించేందుకు పూనుకున్నారు. దీని వెనుక రష్యాను దిగ్బంధనం చేయటంతో పాటు ఇరాన్‌ సరిహద్దుల వరకు నాటో పేరుతో అమెరికా దళాలను రప్పించే ఎత్తుగడ వుంది. అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరాన్‌ వుంది. 1990దశకంలో జర్మనీ ఏకీకరణ సమయంలో నాటోను తూర్పు దిశగా విస్తరించబోమని అమెరికా ఇచ్చిన హామీలకు భిన్నంగా తూర్పుకే కాదు, చివరకు ఆసియాకు సైతం వస్తున్నది. అందువలన నాటో ఏర్పడిన లక్ష్యాలకు, ఇప్పుడు చేస్తున్నదానికి వున్న ఏకైక లక్ష్యం ఏమిటంటే అప్పుడూ ఇప్పుడూ ఈ ప్రాంతంపై అమెరికా పెత్తనాన్ని విస్తరించటమే. నాటోను కొనసాగించితే దీర్ఘకాలంలో ప్రమాదముంటుంది, అదే తూర్పుదిశగా వేగంగా విస్తరింపచేస్తే రష్యాను నయా సామ్రాజ్యవాద దేశంగా మార్చటానికి దారితీస్తుందని 1994లో అమెరికా విదేశాంగ మంత్రి వారెన్‌ క్రిస్టోఫర్‌ హెచ్చరించారు. అయితే రష్యా, నాటో వైపు నుంచి కూడా పరిస్ధితిని దిగజార్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వుక్రెయిన్‌ తూరుప్రాంతంలోని క్రిమియాను రష్యా తనలో విలీనం చేసుకుంది. జార్జియాలో కూడా జోక్యం చేసుకొని తన పలుకుబడిని పెంచుకుంటున్నది . వాటిని చూపి ఐరోపాకు ముప్పుతొలగలేదని అమెరికా చెబుతున్నది. రష్యాపై ఆంక్షలను విధిస్తున్నది. వాటిని కొన్ని ఐరోపా దేశాలు సమర్ధిస్తున్నాయి. 2014 నుంచి రష్యాతో పౌర, మిలిటరీ సహకారాన్ని నాటో నిలిపివేసింది. తూర్పు ఐరోపాలో బాల్టిక్‌ సముద్ర ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాలను పెంచింది. ఈ రెండు దేశాలను నాటోలో చేర్చుకుంటే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని రష్యా హెచ్చరిస్తున్నది. ఈ కారణంగానే ఆ దేశాలను నాటోలో చేర్చుకొనేందుకు కూటమి దేశాలు తొందరపడటం లేదు. వాటిని ఈపాటికి చేర్చుకొని వుంటే పరిణామాలు, పర్యవసానాలు వేరే విధంగా వుండి వుండేవి. అయితే రష్యా మద్దతు వున్న తిరుగుబాటదార్లను అదుపు చేసే పేరుతో వుక్రెయిన్‌కు అత్యంత అధునాత ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. క్రిమియాను విలీనం చేసుకున్న తరువాత అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ చేసిన వుపన్యాసంలో నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ అనేకసార్లు వారు మాతో అబద్దాలు చెప్పారు, మాకు తెలియకుండా నిర్ణయాలు తీసుకున్నారు, తూర్పు దిశగా నాటో విస్తరణ జరిగింది, మా సరిహద్దులలో మిలిటరీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు, ఒక్క ముక్కలో చెప్పాలంటే మమల్ని అదుపు చేయాలనే పశ్చిమదేశాల విధానంతో పద్దెనిమిది, పందొమ్మిది, ఇరవయశతాబ్దాలలో నడిచాయి, నేడు కూడా కొనసాగిస్తున్నాయి.’ అన్నారు.

తమదేశంతో సహా రష్యా విదేశాల ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది, నూతన అణ్వాయుధాలను తయారు చేస్తున్నది. ఐరోపాలోని వ్యవస్ధలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నది, ఐరోపా రక్షణలో అమెరికా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నది అని అమెరికా ఆరోపిస్తున్నది. ఐరోపాలో తాను ఏర్పాటు చేస్తున్న పరిమిత క్షిపణి రక్షణ వ్యవస్ధలు ఇరాన్‌ దాడిని ఎదుర్కొనేందుకు అని అమెరికా చెబుతున్నది. ఈ మాటలను ఎవరూ నమ్మరని వేరే చెప్పనవసరం లేదు. క్రిమియాలో రష్యా జోక్యాన్ని సాకుగా చూపుతూ తటస్ధ దేశాలుగా వున్న ఫిన్లండ్‌, స్వీడన్‌లను కూడా నాటో చేర్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్ధలను సమకూర్చుకొనేందుకు టర్కీ పాలకులు ప్రయత్నించటానికి నాటోలోని మిగతా దేశాలు అభ్యంతర పెడుతున్నాయి.

ఈ పూర్వరంగంలో జూలై 11,12 తేదీలలో బ్రసెల్స్‌లో నాటో కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశాలలో ట్రంప్‌ వ్యవహరించిన తీరు అపహాస్యం పాలైంది. బ్రసెల్స్‌ సమావేశం విజయవంతమైందని ట్రంప్‌ ప్రకటించాడు. సభ్యదేశాల నేతలతో తన సంబంధాలు ఎంతో బాగున్నాయని మరీ మరీ చెప్పాడు. అయితే జరిగిన పరిణామాలు అలా కనిపించటం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌-రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ లోహానిస్‌ భేఠీ వార్తల సేకరణ వుందంటూ ప్రధాన వార్తా కేంద్రం నుంచి వెళ్లిపోయిన రుమేనియా విలేకర్లు వెంటనే తిరిగి వచ్చి సమావేశం రద్దయినట్లు తెలిపారు. అంతే కాదు అజర్‌బైజాన్‌, వుక్రెయిన్‌, జార్జియానేతలతో వుందన్న సమావేశాల పరిస్ధితీ అదే అయింది.

గతంలో సభ్యరాజ్యాల స్ధూల జాతీయాదాయం(జిడిపి)లో రెండుశాతం మొత్తాన్ని 2024నాటికి రక్షణకు కేటాయించాలని నాటో నిర్ణయించింది.దాన్ని వచ్చే జనవరి నాటికే అమలు చేయాలని, తరువాత నాలుగుశాతానికి పెంచాలని ట్రంప్‌ పట్టుపట్టాడు. అతగాడితో ఇప్పుడు గొడవెందుకు సరే అలాగే చేద్దాం లెమ్మన్నట్లుగా సభ్యదేశాల స్పందన వుంది. ఈ సమావేశాలలో అమెరికా ఆయుధ కంపెనీల ప్రతినిధిగా ట్రంప్‌ విశ్వరూపం కనిపించింది అంటే అతిశయోక్తి కాదు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ‘నేను అధికారానికి రాక ముందు ఆయుధాల గురించి విన్నాను గానీ పదవిలోకి వచ్చాక నేను నిజంగా తెలుసుకున్నాను. ఇతరులు తయారు చేసే వాటి కంటే మావి ఎంతో మెరుగైనవి, మీరు మాకంపెనీలు లాక్‌హీడ్‌, బోయింగ్‌, గ్రమ్మన్‌ వంటి వాటిని చూడండి, ఎలాంటి మెటీరియల్‌ను వాడుతున్నామో, ఎంతో నాణ్యమైన పరికరాలను తయారు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మా పరికరాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు. వారెంతో మంచి పని చేస్తున్నారు, వారందరికీ చేయగలరా? కాబట్టి వాటిలో కొన్ని దేశాలకు సాయపడుతున్నాం, మంచి పరికరాలను కొనుగోలు చేయగలుగుతున్నారు.’ ఇలా ఒక కంపెనీ ప్రతినిధి తప్ప ఒక దేశాధినేత చెప్పే మాటలుకావు. ఈ సమావేశాలలో ట్రంప్‌ తన అజెండాకు ఆమోదముద్ర వేయించుకున్నాడా లేదా అన్న చర్చ జరుగుతోంది.

సమావేశాల ప్రారంభంలోనే ట్రంప్‌ జర్మనీపై దాడికి దిగాడు. ఇంధనం కోసం ఎక్కువగా ఆధారపడి తనంతట తానే రష్యాకు బందీ అయిందని, నాటో రక్షణ నిమిత్తం చెల్లింపులలో విఫలమైందని ఆరోపించాడు. చమురుకైతే బిలియన్లకు బిలియన్లు చెల్లిస్తారు గానీ నాటో విషయంలో ముందుకు రారు అని వ్యాఖ్యానించాడు. ‘ జర్మనీని రష్యా పూర్తిగా అదుపు చేస్తోంది. ఈ దేశాలు(నాటో కూటమి) కేటాయింపులు పెంచాలి, దశాబ్దకాలంలో కాదు, వెంటనే కేటాయించాలి.జర్మనీ ధనిక దేశం, వారు కొద్దికొద్దిగా 2030నాటికి పెంచుతామంటున్నారు. వారు తక్షణమే, రేపే పెంచితే మాకెలాంటి సమస్య వుండదు.(విలేకర్ల సమావేశంలో పక్కనే వున్న నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌ బర్గ్‌తో మాట్లాడుతూ) ప్రతి ఏటా గ్యాస్‌ కోసం జర్మన్లు బిలియన్లకొద్దీ డాలర్లు రష్యాకు చెల్లిస్తుంటారు, కానీ రష్యా నుంచి రక్షించాలని మమ్మల్ని కోరతారు, ఇది సరైంది కాదని నేను అనుకుంటున్నాను. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది, తన ఇంధనంలో 70శాతాన్ని రష్యా నుంచి పొందుతోంది.’ అన్నాడు.

రష్యా నుంచి బాల్టిక్‌ సముద్ర ప్రాంత దేశాలన్నింటికీ గ్యాస్‌ను సరఫరా చేసే పదకొండు బిలియన్‌ డాలర్ల పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు తెలిపింది. ఈ వైఖరి ఇతర ఐరోపా దేశాలకు నచ్చలేదు. ‘ ఇది ప్రయివేటు వాణిజ్య పధకం, దీనికి జర్మన్లు చెల్లించిన పన్నుల నుంచి ఎలాంటి కేటాయింపులు లేవని జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్పష్టం చేశారు.జర్మనీ రక్షణ మంత్రి అర్సులా వాండెర్‌ లేయాన్‌ మాట్లాడుతూ మాకు రష్యాతో అనేక సమస్యలున్నాయనటంలో ఎలాంటి సందేహం వుండనవసరం లేదు. మరోవైపు దేశాలు లేదా కూటములు మరియు వ్యతిరేకులతో కూడా సమాచార సంబంధాలను కొనసాగించాల్సి వుంది.’ అన్నారు. రష్యన్‌ గ్యాస్‌ మీద ఆధారపడటాన్ని తగ్గించాలనే అంశంపై నాటోలోని ఐరోపా దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని స్టోల్టెన్‌ బర్గ్‌ కూడా చెప్పారు.

తొలి రోజే అనేక మంది దేశాధినేతలతో ప్రయివేటుగా చర్చలు జరపటంతో రెండో రోజు అజెండా అంశాలపై ఎవరూ భిన్నాభిప్రాయం వెల్లడించలేదు. మిగతా దేశాధినేతలందరూ వుదయం తొమ్మిది గంటలలోపే సమావేశానికి హాజరైనప్పటికీ ట్రంప్‌ కావాలనే ఆలస్యంగా వచ్చారని విమర్శలు వచ్చాయి. జార్జియా, ఆప్ఘనిస్తాన్‌ల గురించి చర్చించే అజెండా వున్నప్పటికీ అదేమీ పట్టనట్లుగా యూరోపియన్ల రక్షణ ఖర్చు గురించి మాట్లాడటం మొదలెట్టారు. వచ్చే ఏడాది జనవరిలోగా ఖర్చుల కేటాయింపు పెంచనట్లయితే అమెరికా తనదారి తాను చూసుకుంటుందని వ్యాఖ్యానించగానే సమావేశంలో వున్నవారంతా అవాక్కయ్యారు. ట్రంప్‌ మాటల గురించి ఎవరూ విబేధించలేదు గానీ వాటికి మాత్రం భిన్న భాష్యాలు వెల్లడయ్యాయి. దీని అర్ధం అమెరికాతో ఘర్షణ పడటానికి ప్రస్తుతానికి ఎవరూ సిద్ధంగా లేరన్నది స్పష్టం.

రక్షణ ఖర్చు పెంచని పక్షంలో తాము నాటో నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ బెదిరించినట్లుగా రాయిటర్స్‌ పేర్కొన్నది. ట్రంప్‌ మాటలకు అర్ధం అదని తాను భావించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ పేర్కొన్నాడు. ట్రంప్‌ వ్యాఖ్యలతో సమావేశ గదిలో విస్మయం వ్యక్తం కావటంతో నాటో జనరల్‌ సెక్రటరీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడే వున్న ఆఫ్ఘనిస్తాన్‌, అజర్‌బైజాన్‌ ప్రతినిధులతో మీరు నాటో సభ్యులు కానందున బయటకు వెళ్లండని చెప్పారు. తరువాత సమావేశంలో ఎవరూ ఎలాంటి కొత్త ప్రతిపాదనలూ చేయలేదు, ఐరోపా నాయకులందరూ అంతకు ముందు ప్రకటించిన మీడియా సమావేశాలను రద్దు చేసుకొని నేరుగా విమానాశ్రయాలకు వెళ్లిపోయారు. మీడియా సమావేశ కార్యక్రమం లేనప్పటికీ షెడ్యూలు మార్చుకొని ట్రంప్‌ 35నిమిషాలు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం జయప్రదమైందని, ఇతర నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకున్నారు. ట్రంప్‌తో ఎలాంటి వుద్రిక్తత ఏర్పడలేదని, ట్రంప్‌ ముక్కుసూటిగా మాట్లాడి వుండవచ్చు,కేటాయింపు పెంచుతామని సభ్యులు వాగ్దానం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి అన్నారు.

రష్యా నుంచి ముప్పు వస్తోందనే పేరుతో నాటో కూటమి గతేడాది 900బిలియన్‌ అంటే దాదాపు లక్షకోట్ల డాలర్లను ఖర్చు చేశాయి. వీటిలో అధికభాగం అమెరికా ఖర్చు చేసిన మాట నిజమే. కానీ అదే రీతిలో ఆ సొమ్ములో అధిక భాగం తిరిగి అమెరికన్‌ సైన్యం, అమెరికన్‌ ఆయుధ కంపెనీలకే చేరుతుందనే విషయం చెప్పనవసరం లేదు. ఇదే సమయంలో రష్యా చేసిన ఖర్చు కేవలం 66 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అవసరం లేకపోయినా విస్తరణ పేరుతో నాటో మిలిటరీని రష్యా ముంగిటకు తీసుకుపోతున్న అమెరికా ఎత్తుగడలే నేడు ఐరోపాలో వుద్రిక్తతలకు కారణం అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఐరోపాకు లేని ముప్పును చూపుతూ అమెరికా మిలిటరీ కార్పొరేట్‌లు ఐరోపా దేశాలను అదిరించి బెదిరించి తమ ఆయుధాలను, వినిమయ వస్తువులను అంటగట్టేందుకు చూడటం తప్ప ట్రంప్‌ చర్యల్లో మరొకటి కనిపించటం లేదు.

ఐరోపా రాజ్యాలు అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణకు సిద్ధం కాదు. అందుకే ఒకవైపు దానితో మిత్రత్వాన్ని నెరపుతూనే తమ ప్రయోజనాలను తాము చూసుకుంటున్నాయని చెప్పవచ్చు. వుదాహరణకు అనేక అంశాలలో అమెరికా వైఖరిని ఐరోపాయూనియన్‌ ఏకీభవించటం లేదు. వుక్రెయిన్‌లో భాగంగా వున్న క్రిమియాను అక్కడి పౌరుల ఆకాంక్షలకు అనుగుణ్యంగా రష్యా తనలో విలీనం చేసుకున్నది.ఆ చర్యను జర్మనీ విమర్శించినప్పటికీ తనకు అవసరమైన చమురు అవసరాలకోసం రష్యన్‌ చమురు కంపెనీ గాజ్‌పోమ్‌తో జర్మనీ 11 బిలియన్‌ డాలర్లతో ఒకపైప్‌లైన్‌ నిర్మాణంపై 2015లో ఒప్పందం చేసుకుంది. దాని గురించే ట్రంప్‌ బ్రసెల్స్‌లో జర్మనీపై విరుచుకుపడ్డాడు. నాటో రక్షణ ఖర్చును తమకు ఇవ్వాలని అమెరికా పట్టుబడుతున్నది, అయితే ఐరోపా దేశాలు ఆ ఖర్చుతో తమ ఏర్పాట్లను తాము చేసుకుంటున్నాయి, ఆ మొత్తాలను కూడా నాటో ఖర్చులో భాగంగానే చూపుతున్నాయి. నాటో సమావేశాలకు ముందు ట్రంప్‌ చేసిన ట్వీట్లు, వ్యాఖ్యలను గమనించటం అవసరం. నాటోలోని అనేక దేశాలు తమను రక్షించాలని కోరుకుంటాయి, అవి అంగీకరించిన మేరకు జిడిపిలో రెండుశాతం ఖర్చుచేయకపోవటమే కాదు, ఏండ్ల తరబడి వుపేక్షిస్తున్నాయి, అవి పాతబకాయిలను కూడా చెల్లిస్తాయా?అని ట్వీట్‌ చేశాడు. బ్రసెల్స్‌ బయలు దేరే ముందు ‘ఐరోపాలో మా రైతులు, కార్మికులు, కంపెనీలు వ్యాపారం చేయటాన్ని ఐరోపా యూనియన్‌ అసాధ్యం గావిస్తున్నది, మరోవైపు నాటో ద్వారా మేము సంతోషంగా వారిని రక్షించాలని కోరుకుంటారు, దానికి నాజూకు చెల్లింపులు చేస్తారు, ఇలా ఎలా పని జరుగుతుంది.’ అన్న ట్రంప్‌ వచ్చీ రావటంతోనే జర్మనీపై విరుచుకు పడ్డారు. రష్యా చేతిలో జర్మనీ బందీ అయింది అన్న ట్రంప్‌తో తాను ఏకీభవించటం లేదని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ పేర్కొన్నారు. తమను మాస్కో గానీ వాషింగ్టన్‌గానీ అదుపు చేయటం లేదని జర్మన్‌ అధికారులు తిప్పికొట్టారు.

తాను ఎక్కడ వున్నా అమెరికన్ల గురించే ఆలోచిస్తూ వుంటానని చెప్పేందుకు ట్రంప్‌ ప్రయత్నించాడు.’నేను ఇప్పుడు బ్రసెల్స్‌లో వున్నప్పటికీ మన రైతుల గురించే ఎల్లవేళలా ఆలోచిస్తున్నాను. 2012 నుంచి నా ఎన్నిక నాటికి సోయాబీన్స్‌ ధర సగం పడిపోయింది, గత పదిహేను సంవత్సరాలుగా రైతులకు తక్కువగా చెల్లిస్తున్నారు. ఇతర దేశాల వాణిజ్య ఆటంకాలు మరియు పన్నులతో వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. నేను గతం కంటే మెరుగ్గా ఈ సమస్యలను లేవనెత్తుతాను, అయితే అది అంతత్వరగా ముందుకు పోదు. మన రైతులందరికీ సమాన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను, మనం విజయం సాధిస్తాము ‘ ఇలా సాగింది.

నాటో కొనసాగాల్సిన అవసరం గురించి సంస్ధ ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలటెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ‘ బలమైన నాటో ఐరోపా, అమెరికాకు మంచిది. విడిపోవటం కంటే కలసి వుంటే ధృడంగా వుంటామని రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రచ్చన్న యుద్ధం మాకు నేర్పాయి.ఐరోపాలో అమెరికా మిలిటరీ,కెనడా వునికి ఐరోపాకు మాత్రమే కాదు వుత్తర అమెరికా మరియు ప్రత్యేకించి అమెరికా(యుఎస్‌)కు మంచిది, ఎందుకంటే అమెరికా ఒక ప్రపంచ శక్తిగా ఎదగటానికి అది తోడ్పడుతుంది. బాల్టిక్‌ సముద్ర గ్యాస్‌ పైప్‌లైన్‌కు జర్మనీ మద్దతు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించాల్సింది నాటో సభ్యదేశాలు కాదు, అది ఒక జాతీయ నిర్ణయం.’

నాటో తొలిరోజు సమావేశ ప్రారంభానికి ముందు వుదయపు అల్పాహార విందు సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యలు విస్మయాన్ని కలిగించాయి. నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌బర్గ్‌తో నాటో ఖర్చులో అత్యధిక భాగం తమ దేశమే భరిస్తోందని వ్యాఖ్యానించాడు. జర్మనీ ఒకశాతం కంటే కొద్దిగా ఎక్కుగా చెల్లిస్తోంది. అదే అమెరికా జిడిపిలో 4.2శాతం చెల్లిస్తోంది. ఇది సరైంది కాదు, మేము జర్మనీని రక్షిస్తున్నాము, మేము ఫ్రాన్స్‌ను రక్షిస్తున్నాము, మేము ప్రతి ఒక్కరినీ రక్షిస్తున్నాము. దానికి ఇంకా మేము ఎంతో చెల్లిస్తున్నాము. విందు అనంతరం ట్రంప్‌ వైఖరిని స్టోల్టెన్‌ బర్గ్‌ అపహాస్యం చేశాడు. వుదయపు అల్పాహార విందు బాగుంది…. దీనికి అమెరికాయే బిల్లు చెల్లించింది అని వ్యాఖ్యానించాడు. ట్రంప్‌ అధ్యక్షుడు అయిన తరువాత ఐరోపాలో మిలిటరీ వునికి నిమిత్తం 40శాతం నిధులు పెంచాడు. అమెరికా సైన్యాలు ఎక్కువగా వున్నాయి, గతం కంటే విన్యాసాలు, మౌలిక సదుపాయాల నిమిత్తం పెట్టుబడులు కూడా పెరిగాయి’ అన్నాడు.

Image result for nato brussels summit 2018

గతంలో అంగీకరించిన మేరకు నాటో నిర్వహణకు పూర్తిగా నిధులు చెల్లిస్తున్నది అమెరికా, బ్రిటన్‌, పోలాండ్‌, గ్రీస్‌, ఎస్తోనియా మాత్రమే. తాను హాజరైన తొలి సమావేశనాటి కంటే సభ్య దేశాలు చెల్లిస్తున్న మొత్తం గణనీయంగా తగ్గిపోయిందంటూ ట్రంప్‌ అవాస్తవం చెప్పారంటూ పొలిటీ ఫాక్ట్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొన్నది. 2014లో ఐరోపా దేశాలు, కెనడా చెల్లించిన మొత్తం 254బిలియన్‌ డాలర్లు 2017 నాటికి 275కు పెరిగినట్లు పేర్కొన్నది. నాటో ఖర్చులో 70 నుంచి 90శాతం వరకు అమెరికా చెల్లిస్తున్నదని చెప్పటం అవాస్తవమని తెలిపింది. నాటోకు ఎంత ఖర్చు చేయాలనేది ఎక్కడా నిర్ధారించలేదు. సంస్ధ వుమ్మడి నిధిలో అమెరికా 22శాతం చెల్లిస్తున్నది. సభ్యదేశాల రక్షణ బడ్జెట్‌ ఎంతో నాటో సేకరిస్తుంది, వాటి మొత్తాలను కలిపి చూసుకున్నపుడు అమెరికా రక్షణ కోసం 70శాతం ఖర్చు చేస్తున్నది. అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తి గనుక అంతవుంది, ఐరోపా సభ్యదేశాలు అలాంటివి కాదు. తమ రైతాంగానికి ఐరోపా యూనియన్‌ తలుపులను మూసింది అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా కంటే ఐరోపా యూనియన్‌ సగటున చూసినపుడు కొద్దిగా ఎక్కువ పన్నులు విధిస్తున్నది. 30శాతం వ్యవసాయ వుత్పత్తులపై ఇరువైపులా పన్నులు లేకుండా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. ఫలితంగా 28 సభ్యరాజ్యాలు, ఐరోపా యూనియన్‌ 2017లో అమెరికాకు వ్య వసాయ వుత్పత్తులలో ఐదవ పెద్ద ఎగుమతిదారుగా మారింది. అమెరికా తాను ఎగుమతి చేసుకున్నవాటి కంటే దిగుమతులు ఎక్కువ చేసుకుంది.

గతంలో రెండుశాతం వరకు ఖర్చు చేయాలని అనుకున్నారు, ఇప్పుడు దాన్ని విధిగా చేయాలని ట్రంప్‌ అన్నాడు. రక్షణ నిమిత్తం జిడిపిలో రెండుశాతం ఖర్చు చేయాలని 2006లో అంగీకరించిన మాట వాస్తవం. అయితే అంత మొత్తాన్ని విధిగా ఖర్చు చేయాలనే అంగీకారమేదీ లేదు. ఈ వారంలో ఆ మేరకు నిర్ణయం జరిగిందేమో తెలియదు. రెండుశాతం మొత్తం కేటాయింపులను 2024 నాటికి క్రమంగా పెంచుకుంటూ పోవాలని 2014లో మార్గదర్శక సూత్రాలను ఆమోదించారు. ఆ మేరకు వ్యవహరించినవి ఐదు దేశాలు మాత్రమే. బ్రసెల్స్‌ సమావేశాల తరువాత ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన జరిపారు. సోమవారం నాడు హెల్సింకీలో ట్రంప్‌-పుతిన్‌ భేఠీ జరగనుంది. ఆ తరువాత నాటో, ట్రంప్‌ పర్యటన వివరాల సమాచారం వెల్లడయ్యే అవకాశం వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వాణిజ్య యుద్ధంతో ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు

10 Tuesday Jul 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

INDIA, Indonesia, TRADE WAR, Trade war India, Trade war puts Indonesia and India at risk

Image result for trade war

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ పౌరుల ఆకాంక్షలకు విరుద్దంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రలో అతిపెద్ద ప్రపంచ వాణిజ్య యుద్ధం ప్రారంభసూచికగా జూలై ఆరవతేదీ అర్ధరాత్రి చైనా మీద తొలి తూటా పేల్చాడు. గతంలో కూడా వాణిజ్య యుద్ధాలు జరిగినప్పటికీ తాజా పరిణామం పర్యవసానాలు తీవ్రంగా వుంటాయనే అభిప్రాయాలు, భయాలు వెలువడుతున్నాయి. చైనా, ఇతర దేశాల మీద ప్రారంభించిన యుద్ధంతోతాము ఎంతో కొంత లాభపడవచ్చనే ఆశ అమెరికన్‌ కార్పొరేట్లలో అంతర్గతంగా వుంది. అయితే అదే సమయంలో జరిగే నష్టాల గురించి కూడా అంతే భయపడుతున్నా. లాభాల గురించి బహిరంగంగా చెప్పుకోలేరు, ఇదే సమయంలో ప్రతికూలతల గురించి మీడియాలో ఎన్నో హెచ్చరికలు వెలువడుతున్నాయి. అమెరికా దిగుమతులపై విధించిన పన్నుద్వారా వసూలయ్యే మొత్తాన్ని అమెరికా ఆంక్షలతో ప్రభావితమయ్యే చైనా కంపెనీలు, కార్మికుల కోసం వినియోగిస్తామని చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఇతర దేశాల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. అమెరికా-చైనా రెండూ కూడా దీర్ఘకాల వాణిజ్య యుద్ధానికి సిద్దపడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా వుత్పత్తులపై అదనపు పన్ను వసూలు ప్రారంభించిన చైనా మరోవైపు గతంలో నిలిపివేసిన తమ కోడి మాంస దిగుతులకు అనుమతించినట్లు జర్మనీ మంత్రి ప్రకటించారు.

వాణిజ్య యుద్ధాలను, వాటిలో భాగంగా దిగుమతి పన్నులను విధించేందుకు అధ్యక్షుడికి వున్న అధికారాలను పరిమితం చేయాలని నేషనల్‌ టాక్స్‌ పేయర్స్‌ ఫౌండేషన్‌ విశ్లేషకుడు ఆండ్రూ విల్‌ఫోర్డ్‌ ‘యుఎస్‌ఏ టుడే’లో పేర్కొన్నాడు. దాని సారాంశం ఇలా వుంది. 1962లో చేసిన వ్యాపార విస్తరణ చట్టంలోని అవకాశాలను ట్రంప్‌ వినియోగిస్తున్నాడు. నిర్దిష్ట జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వాటికోసం చేసిన చట్టాలను దుర్వినియోగపరుస్తూ దేశ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందున, పార్లమెంట్‌ జోక్యం చేసుకొని అధ్య క్షుడిని నిలువరించాలి. అల్యూమినియం, వుక్కు దిగుమతుల ద్వారా దేశభద్రతకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ పేర్కొన్నాడు. అయితే 2010-15 మధ్య దేశీయంగా వుత్పత్తి అయిన వుక్కులో కేవలం సగటున మూడుశాతం లోపే జాతీయ భద్రతకు వినియోగిస్తున్నట్లు తేలింది, అవసరానికి మించి దేశంలో వుత్పత్తి వుంది, అదే విధంగా దిగుమతి చేసుకున్న వుక్కులో జాతీయ భద్రతకు వినియోగిస్తున్నది సగటున 2.4నుంచి 2.8శాతం మధ్యనే వుంది, ఆ దిగుమతులలో కూడా అత్యధిక భాగం భాగస్వామ్య లేదా మిత్ర దేశాల నుంచే వున్నాయి. వుక్కు పరిశ్రమలో వుపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో ఐదు పెద్ద కంపెనీలు మార్కెట్‌ కాపిటలైజేషన్‌ను రెట్టింపు చేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వుత్పాదకత గణనీయంగా పెరిగింది.అల్యూమినియం, వుక్కు దిగుమతులపై పన్నుల విధింపు కారణంగా నిఖరంగా 4.7లక్షల వుద్యోగాలు పోతాయి. ఇవి అమెరికా వుక్కు పరిశ్రమలో పని చేస్తున్న లక్షా 40వేల మందికి మూడు రెట్లు. బలమైన ఆర్ధిక వ్యవస్ధ లేకుండా బలమైన జాతీయ భద్రత సాధ్యం కాదని వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ స్వయంగా చెప్పాడు. పన్నుల విధింపు తగదని వంద మంది రిపబ్లికన్‌ ఎంపీలు లేఖ రాశారు. ట్రంప్‌ వినియోగిస్తున్న చట్టంలోని నిబంధనను 1979,82 సంవత్సరాలలో ఇరాన్‌, లిబియా చమురు దిగుమతుల నిరోధానికి వినియోగించారు.

రక్షణాత్మక చర్యలను చేపట్టబోయే ముందు వస్తువుల నిజమైన జాతీయత ఏమిటో తెలుసుకోవాలని లాసానే విశ్వవిద్యాలయ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ స్టెఫానే గారెలీ హితవు చెప్పాడు. ఆయన వాదన ఇలా వుంది. ప్రపంచీకరణ యుగంలో వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం అంత సులభం కాదు. కొద్ది సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా, లాస్‌ ఏంజల్స్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఒక ఐపాడ్‌లోని 431భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నారు.ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చిన ఆ భాగాలను చైనాలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఐపాడ్‌గా రూపొందిస్తారు. అంతిమ వుత్పత్తిపై చైనా జోడించే విలువ ఐదుశాతం మించటం లేదు. అయితే అమెరికా కస్టమ్స్‌ శాఖ వద్దకు వచ్చే సరికి అది చైనా తయారీ వుత్పత్తిగా పరిగణించబడుతోంది. అది నిజంగా చైనా వుత్పత్తా ? అమెరికా వాణిజ్యలోటు అది చేసుకొనే దిగుమతుల కారణంగా ఏర్పడుతోంది. మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసుకొనే వాటిలో 40శాతం మెక్సికోలోని అమెరికన్‌ కంపెనీలు లేదా అమెరికాకు మాత్రమే ఎగుమతి చేసే మెక్సికో స్ధానిక కంపెనీల నుంచి వుంటున్నాయి. చైనా నుంచి చేసుకొనే దిగుమతులు కూడా అలాంటివే. వాణిజ్య వ్యూహాలలో భాగంగా స్మార్ట్‌ ఫోన్ల తయారీకి గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వుచితంగా సాప్ట్‌వేర్‌ను అందచేస్తున్నది. దానికి గనుక ధర నిర్ణయిస్తే ఏడాదికి రెండువందల బిలియన్‌ డాలర్లు వుంటుంది. ఆ మొత్తం అమెరికా వాణిజ్యలోటులో సగం.

వాణిజ్యం యుద్ధం విస్తరిస్తే అమెరికా అధ్య క్షుడు జర్మన్‌ ఆటో పరిశ్రమకు కూడా ముప్పు తెస్తున్నట్లే. బిఎండబ్ల్యు సౌత్‌ కరోలినా లోని స్పార్టన్‌బర్గ్‌, అలబామాలోని వాన్స్‌లో మెర్సిడెస్‌, టెనెసీలోని ఛాటూంగాలో ఓక్స్‌వాగన్‌ కార్లు తయారవుతాయి. ఇవి ఎగుమతుల కోసం కూడా తయారు చేస్తాయి. గతేడాది బిఎండబ్ల్యు తయారు చేసిన వాటిలో 70శాతం ఎగుమతి చేశారు. వీటిని అమెరికన్‌ కార్లు అనాలా జర్మనీవి అనాలా ? వాణిజ్య యుద్ధానికి ముందు అమెరికా తయారీ కార్లపై చైనా దిగుమతి పన్ను తగ్గించిన కారణంగా ఫోర్డ్‌, టెల్సా వంటి కంపెనీలు కొద్దివారాల ముందు చైనాలో పదిహేనుశాతం వరకు కార్లధరలను తగ్గించాయి. అమెరికా ప్రారంభించిన యుద్ధంతో చైనా విధించిన ప్రతికూల సుంకాల కారణంగా ఇప్పుడు 40శాతం పన్నుతో ధరలు పెరిగాయి. ఈ పన్నులను వినియోగదారుల నుంచి వసూలు చేయటం తప్ప తాము భరించలేమని బిఎండబ్ల్యు చైనా ప్రకటించింది.1974 నుంచి అమలులోకి వచ్చిన కొయొటో ఒప్పందం ప్రకారం ఒక వస్తువు తయారీలో కనీసంగా స్ధానిక అంశం ఎంత వుంది లేదా చివరి తయారీ క్రమం పాత్ర ఎంత అనేది నిర్ధారించవచ్చు. అయితే ప్రపంచీకరణ మరియు డిజిటలైజేషన్‌ సంక్లిష్టతను పెంచాయి. వివిధ విడిభాగాలతో తయారైన ఒక వస్తువులు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఆయాప్రాంతాల సామర్ధ్యం, ధరలను బట్టి మారిపోతుంటాయి.

ప్రపంచీకరణ కారణంగా ఒక ఆర్ధిక వ్యవస్ధను వేరు చేసి చూడటం కష్టం అనే విషయాన్ని బ్రెక్సిట్‌ మద్దతుదారుల మాదిరి అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. ఇతర దేశాలలో అమెరికా ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది, అలాగే ఇతర దేశాలు అమెరికాలో ఏడులక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. మొత్తం మీద ప్రపంచ జిడిపిలో ప్రత్యక్ష పెట్టుబడులు 35శాతం వరకు వుంటాయి. ఎనిమిది కోట్ల మందికి వుపాధి కల్పిస్తున్నాయి. ప్రయివేటు జీవితంలో వివాహం చేసుకోవటం కంటే విడిపోవటం ఎంతో సంక్లిష్టం, ఖరీదైనది. అంతర్జాతీయ వాణిజ్యం మీద చూపే ప్రభావాన్ని స్పష్టంగా చూడాలంటే కస్టమ్స్‌ లెక్కల నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేదానికంటే ఒక వస్తువు వుత్పత్తిలో విలువ జోడింపు మీద కేంద్రీకరించాలి. బ్లాక్‌ చెయిన్‌ ద్వారా నమోదయ్యే లావాదేవీల ద్వారా వికేంద్రీకరణ చెందిన మరియు నిరాకార ప్రపంచంలో ఎవరు దేనికి యజమానులో ఎలా చెప్పగలం? జాన్‌మైేునార్డ్‌ కీన్స్‌ చెప్పినట్లు సమస్యలన్నీ ఆర్ధిక పరమైనవి అయితే పరిష్కారాలన్నీ రాజకీయ పరమైనవి అయినందున ట్రంప్‌తో మనం జీవించాల్సి వుంది.

వాణిజ్య యుద్ధం జరిగితే నష్టపోయేది అమెరికా అని గతంలో బిల్‌క్లింటన్‌ హయాంలో సహాయ విత్తమంత్రిగా చేసిన ప్రొఫెసర్‌ జె బ్రాడ్‌ఫోర్డ్‌ డెలాంగ్‌ స్పష్టం చేశారు. మోటార్‌ సైకిళ్ల తయారీలో పేరెన్నికగన్న హార్లే డేవిడ్స్‌న్‌పై ఇటీవల డోనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడటం అమెరికా ప్రజాస్వామ్యం మీదే దాడి వంటిదని, నవంబరులో జరిగే ఎన్నికలలో వుభయ సభలలో ఒకదానిలో అయినా మెజారిటీ సంపాదించగలిగితే తప్ప ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టకు చేసిన నష్టాన్ని సరిచేయలేమని అన్నారు. బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో హార్లే డేవిడ్స్‌న్‌ అధికారులు, యూనియన్‌ నేతలతో ట్రంప్‌ ఒక సమావేశం జరిపారు. ఈ కంపెనీ అమెరికాలో వస్తువులను తయారు చేస్తున్నది, నేను చూస్తుండగానే దాన్ని విస్తరించాలని చెప్పాడు. ఏడాది తిరగ్గానే పరిస్ధితులు మారిపోయాయి. దిగుమతి చేసుకున్న అల్యూమినియం, వుక్కుపై పన్నులు విధిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన కారణంగా ఐరోపా యూనియన్‌ ప్రతికూల చర్యలకు గురికాని ప్రాంతాలకు కొన్ని కార్యకలాపాలను తరలిస్తామని మోటార్‌ సైకిల్‌ కంపెనీ ప్రకటించింది. దాన్ని చూడగానే ట్రంప్‌ ఆ కంపెనీ మీద దాడి చేశాడు. ఒకసారి బయటకు పోయిన తరువాత తిరిగి అమెరికాలో పెద్ద మొత్తంలో పన్ను చెల్లించకుండా అమ్ముతామంటే కుదరదు అని హెచ్చరించాడు. వారు మరొక దేశంలో ఫ్యాక్టరీ నిర్మించటానికి వీల్లేదంటే వీల్లేదు, వారు ఇక్కడి నుంచి తరలటం అంటే అంతానికి ఆరంభం అని ట్వీట్లలో వాగాడు.

వాణిజ్య యుద్ధం తధ్యమనే అభిప్రాయంతో చైనాలోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలించేందుకు ఆలోచన చేశాయి, ఇంకా చేస్తున్నాయి. అక్కడ పెరుగుతున్న వేతనాలతో అనేక కంపెనీలు ఎప్పటి నుంచో తక్కువ వేతనాలకు శ్రమ దొరికే చోటికి తరలిపోవాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్యంలో చైనాకు ఎంతో మిగులున్న కారణంగా చైనాను లంగదీసుకోవచ్చనే అభిప్రాయం కొంత మందిలో లేకపోలేదు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐదువందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల మీద పన్ను విధిస్తానంటున్నాడు ట్రంప్‌, దానికి పోటీగా చైనా ఎంతపన్ను విధించినా 130 బిలియన్‌ డాలర్ల మేరకే దాని దిగుమతులున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. వాణిజ్య యుద్ధాలు మంచివి, విజయం సాధించటం సులభం అని ట్రంప్‌ చెప్పారు, వాస్తవం ఏమంటే వాటిలో పాల్గనేవారే కాదు వాణిజ్య యుద్ధాలు ప్రతి ఒక్కరినీ నష్టపరుస్తాయి, ఎవరూ గెలవజాలరని ఆస్ట్రేలియా సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రికలో ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒక వేళ విజయం సాధించినా అది పరిమితం. ట్రంప్‌ తన కలలను నిజం చేసుకోవాలంటే చైనా లేదా ఐరోపా యూనియన్‌ అందచేసే వస్తువులను స్ధానికంగా తయారుచేసేందుకు మరిన్ని ఫ్యాక్టరీలను పెట్టాలి, వాటిద్వారా మరిన్ని వుద్యోగాలను కల్పించవచ్చు. అయితే అలా తయారు చేసే వస్తువులు ఎంతో ప్రియమైనవిగా పరిమితంగా వుంటాయి.

వాణిజ్యయుద్ధ తుపాకి గుండు పేల్చాలన్న నిర్ణయం దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఒక్క చైనాకే పరిమితం చేయలేదు, కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద కూడా పన్నులు విధించాడు. అదే జరిగితే అమెరికా దిగుమతి చేసుకొనే 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై కూడా ఐరోపా యూనియన్‌ పన్నులు విధిస్తుంది. ప్రభావాలు, అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి. ఐరోపా యూనియన్‌, ఇతర అమెరికా మిత్రదేశాలకు చైనాతో స్వంత సమస్యలు వున్నాయి. ట్రంప్‌ గనుక వాణిజ్యదాడిని ఒక్క చైనాకే పరిమితం చేసి వుంటే వారంతా కలసి వచ్చేవారు. దానికి బదులుగా ఐరోపా యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, కెనడా, మెక్సికోలపై చర్యల ద్వారా అమెరికాను ఒంటరిపాటు చేశాడని ఆస్ట్రేలియా పత్రిక పేర్కొన్నది.

తొలి దఫా పన్నుల అర్ధం వాణిజ్య యుద్ధ పూర్తి స్ధాయి ప్రభావం ఎలా వుంటుందో అనుభవించటానికి అమెరికన్‌ వినియోగదారులు ఒక అడుగు దగ్గర కావటమే అని నేషనల్‌ రిటైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మాథ్యూ సాహే అన్నారు. విధించే పన్నులు అమెరికా వుద్యోగాలనేమాత్రం కాపాడలేవు, కానీ అవి పన్నుల సంస్కరణద్వారా పొందిన లబ్దిని దెబ్బతీస్తాయి, అనేక వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి, తమ గదులకు అవసరమైన చిన్న ఫ్రిజ్‌లకు విద్యార్ధులు అధిక మొత్తాలను చెల్లించాల్సి వస్తుంది, ఏకపక్షంగా పన్నులు విధించటం తప్పుడు పద్దతి, దానిని వెంటనే నిలిపివేయాలి అని కూడా సాహే చెప్పారు.

ఇరవై లక్షల కోట్ల పెద్ద అమెరికా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే వాణిజ్య యుద్ధం, దానిలో 34బిలియన్‌ డాలర్ల వస్తువులపై 25శాతం పన్ను విధించటం సముద్రంలో కాకిరెట్ట వంటిదని, దీని వలన కొంత మంది నష్టపోతారు, కొందరు లాభపడతారు అని ఓక్స్‌ డాట్‌కామ్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. చట్టపరంగా చెప్పాలంటే 34బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై 25శాతం పన్ను విధింపు అక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్న చైనాను శిక్షించటమే. ట్రంప్‌ వాక్పటిమలో 300బిలియన్‌ డాలర్లపై పన్ను విధిస్తామని చెప్పాడు. ఇరవైలక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ కలిగిన అమెరికాకు గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న 478బిలియన్‌ డాలర్ల దిగుమతులు చాలా తక్కువ. మరో విధంగా చెప్పాలంటే 2017లో ఏడాదికి 150 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న పార్లమెంట్‌ తీర్మానంతో పోలిస్తే 25శాతం పన్ను విధింపుద్వారా ఏడాదికి వచ్చే 8.5బిలియన్‌ డాలర్లు ఏపాటి? వాషింగ్‌మెషిన్ల పరిశ్రమకు పన్నుల మొత్తం పెద్దగా వుండవచ్చుగాని ఒక మిషన్‌ కొనే పౌరుడికి పెద్ద భారం అనిపించదు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక సమాచారం ప్రకారం 1977 తరువాత తొలిసారిగా జనవరిలో పన్నులు పెంచిన కారణంగా మార్చినెల నుంచి వాషింగ్‌ మెషిన్ల ధరలు 16శాతం పెరిగాయి. పౌరులు వాటిని రోజూ కొనరు కదా ! అయినప్పటికీ 2015లో వున్న ధరలకంటే ఇప్పుడు చౌకగానే వున్నాయి. అనేక పరికరాల ధరలు గత కొద్ది సంవత్సరాలుగా పడిపోతున్నాయి, ట్రంప్‌ వాటిని కొద్దిగా పెంచారు. దాని కధనం ఇలా సాగింది.

Image result for trade war

వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికాలో ధరలు పెరిగి, అభివృద్ధి దిగజారుతుందని ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో పేర్కొన్నది.తొలుత 34 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై విధించిన 25శాతం పన్నుతో అటు చైనా, ఇటు అమెరికాపై ఆర్ధికంగా పెద్దగా ప్రభావం చూపదు. నష్టం తరువాత పెరుగుతుంది. గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 506బిలియన్‌ డాలర్లు కాగా అవసరమైతే తాను 550 బిలియన్‌ డాలర్ల వస్తువులపై పన్ను విధిస్తానని ట్రంప్‌ పేర్కొన్నాడు. పన్నులను విస్తరించే కొద్దీ వినియోగదారులకు ధరలు పెరుగుతాయి, దిగుమతి చేసుకొనే విడిభాగాలపై ఆధారపడిన కంపెనీల ఖర్చు పెరుగుతుంది.ద్రవ్యమార్కెట్‌లు దడదడలాడతాయి.కొంత మందిని లేఆఫ్‌ చేయవచ్చు, చైనాతో ట్రంపేమైనా రాజీకి వస్తారా అని వాణిజ్యపెట్టుబడులపై నిర్ణయం తీసుకొనేందుకు వేచి చూస్తారు. గతేడాది పన్నుల తగ్గింపు ద్వారా కల్పించిన అనేక ఆర్ధిక లబ్దులు ప్రమాదంలో పడతాయి. పూర్తి స్ధాయి వాణిజ్య యుద్దం జరిగితే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇతరులు హెచ్చరించినట్లుగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయే ప్రమాదముంది. అమెరికా సోయాలో 60శాతం దిగుమతి చేసుకుంటున్న చైనా హెచ్చరిక కారణంగా గత నెలలో 17శాతం మేరకు ధరలు పడిపోయాయి. ఇదే సమయంలో చైనా కరెన్సీ విలువ డాలరు మారకంతో గతనెలలో 3.5శాతం పడిపోయింది. ఇది అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి చైనా కంపెనీలకు వూతమిస్తుంది. అమెరికా వినియోగదారుల మీద ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం చైనా పారిశ్రామిక వస్తువుల మీదనే తొలుత కేంద్రీకరించింది. అయితే ఆ చర్య ద్వారా కంపెనీల యంత్రాల ధరలు పెరిగితే ఆ భారాన్ని అవి చివరికి తమఖాతాదారులు, వినియోగదారులమీదనే మోపుతాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది.

అమెరికా-చైనాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు కలిగించవచ్చని ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్ధికవేత్త పాల్‌ గ్రుయెన్‌వాల్‌ హెచ్చరించాడు. వర్ధమాన దేశాల మార్కెట్లనుంచి మంచి వడ్డీ రేట్లు వస్తున్న అమెరికాకు మదుపుదార్లు తమ పెట్టుబడులను తరలిస్తున్నారని, మిగతా ఆసియా దేశాలతో పోల్చితే ఇండోనేషియా, భారత్‌లకు ఎక్కువ ముప్పు వుందన్నాడు.పతనమౌతున్న ఇండోనేషియా కరెన్సీ రుపయా విలువ నిలబెట్టేందుకు, స్టాక్‌మార్కెట్ల నుంచి పెట్టుబడుల వుపసంహరణను నివారించేందుకు మే, జూన్‌ నెలల్లో వడ్డీ రేట్లను పెంచింది. పెట్టుబడులరాక మందగించటం, వున్న పెట్టుబడులు బయటకు పోతుండటంతో భారత్‌ కూడా నాలుగేండ్లలో తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. క్రమంగా పెరుగుతున్న వేతనాలు ఆర్ధిక వ్యవస్ధపై విశ్వాసాన్ని కలిగిస్తూ చైనా ఆర్ధిక పురోగతిని కొనసాగిస్తున్నాయి, అది బ్యాంకింగ్‌ వ్యవస్ధలో డబ్బును మదుపు చేయటానికి జనాన్ని ప్రోత్సహిస్తున్నది, ఆ సొమ్మును కంపెనీలకు రుణాలుగా ఇస్తున్నారని, ఈ వలయం తిరుగుతున్నంత వరకు బయటకు పోయే అవకాశం లేదు, తరువాత ఆ విధానం కొనసాగుతుంది, ఒక వేళ విశ్వాసం కోల్పోయినట్లయితే కరెన్సీ మారకపు విలువమీద, విదేశీమారపు నిల్వల మీద వత్తిడి పెరుగుతుందని గ్రుయెన్‌వాల్‌ పేర్కొన్నాడు.

వాణిజ్య యుద్ధం ప్రారంభమై ఇంకా వారం కూడా గడవ లేదు. దాని ప్రభావం గురించి ప్రారంభానికి ముందూ వెనుకూ ఎలా వున్నాయో చూశాము. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు, ప్రభావాలు వెల్లడవుతాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d