• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

జన తీర్పులు అన్ని వేళలా సరిగానే వుంటాయా ?

25 Saturday May 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

Adolf Hitler, are the people's verdict always perfect ?, India elections 2019, Naredra Modi, people's verdicts, RSS

Image result for are the people's verdict always perfect

ఎం కోటేశ్వరరావు

తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న లుబ్దావధాన్ల మాదిరి ఓటర్లు తీర్పు చెప్పారు. కేంద్రంలో పాత పాలకులే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచనున్నారు. కొన్ని కొత్త ముఖాలు, పాత ముఖాలు కొత్త వేషాలతో జనం ముందుకు వస్తారు. ఎన్నికల ప్రచారంలో వారూ, వీరూ అందరూ కలసి గత ఐదేండ్లలో తాము చేసింది సరైనదే అని సమర్ధించుకున్నారు కనుక విధానాలు, వైఖరిలో పెద్ద మార్పు వుండదు. సంస్కరణలను ఎంత వేగంగా అమలు జరిపితే అంతగా తలెత్తే పర్యవసానాల గురించి జనానికి పెద్దగా పట్టలేదన్నది స్పష్టం. కష్టాలు, నష్టాలను భరించటమే దేశభక్తి అనుకుంటున్నారు. ప్యూడల్‌ సమాజపు అవశేషాలు ఇంకా మనలను వెన్నాడుతున్నాయి గనుక గత జన్మల్లో చేసిన పాపాలు ఇంకా మనల్ని వెంటాడుతున్నాయి అనే వేదాంతంలో వున్నారు.

ఎందుకు అంటే, మన దేశంలో యోగులు, యోగినులు, బాబాలు, గురువులు ఇలా ఏ పేరైనా పెట్టండి. అంతా భక్తులు, అభిమానులుగా వచ్చే జనాన్ని మాయలో పడవేసినపుడు వారు మిగతా వాటి గురించి దేనినీ ఆలోచించరు, పట్టించుకోరు, ఎవరైనా హేతువాదులు ఇదేమిటి అని ప్రశ్నించినా సహనం కోల్పోయి అవాంఛనీయ చర్యలకు సైతం దిగటాన్ని మనం చూశాం. మన కళ్ల ముందే ఆశారాంబాపు, డేరాబాబా,కల్కి భగవాన్‌ ఇలా ఎందరో జనాన్ని ఎలా భక్తులుగా, వున్మాదులుగా మార్చుకున్నారో, ఎలా రెచ్చగొట్టారో చూశాము. వారంతా కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఇప్పుడు బిజెపి అనే ఆశ్రమం, మోడీ అనే గురువు దేశమంతటా గణనీయమైన సంఖ్యలో జనాన్ని అటువంటి మాయలోకి నెట్టారు. గతంలో అనేక ఆశలతో మోడీకి ఓటు వేస్తే అవి అడిఆశలయ్యాయని అనుభవం చెబుతున్నా తిరిగి ఓటు వేశారు. అంటే దీన్ని మరో విధంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలలో పలు ఎత్తుగడలతో జనాన్ని తన భక్తులుగా, ప్రశ్నించని మత్తులోకి దించటంలో సఫలమయ్యారు. సమస్యల సంగతి తరువాత చూసుకుందాం ముందు మన మతానికి ముప్పు ఏర్పడిందట దాన్ని రక్షించుకుందాం అనే కుహనా ప్రచారం మాయలో పడిన జనం తమకు తెలియకుండానే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు, ఓట్లు వేశారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని పార్టీ, కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

జనం తీర్పును తప్పు పట్టకూడదు అనే ఒక వైఖరి ఫలితాలపై చర్చల సందర్భంగా వెల్లడైంది. ఇది దొంగను కూడా గారు అని మర్యాదగా పిలవాలి కదా అనే అతి మంచితనం కలిగిన వారు, తీర్పు మీద చర్చలోతుల్లోకి పోకూడదని భావించే వారు గెలిచిన వారిని, గెలిపించిన వారిని అభినందించాలి అనే వైఖరితో వచ్చిన సమస్య ఇది. న్యాయమూర్తులకు వుద్ధేశ్యాలను ఆపాదించకూడదు గానీ వారి తీర్పుల మంచి చెడ్డల మీద వ్యాఖ్యానించేందుకు ప్రజాస్వామ్యం హక్కునిచ్చింది. జన తీర్పుకు సైతం అదే వర్తిస్తుంది. జనానికి దురుద్ధేశ్యాలను ఆపాదించనవసరం లేదు. పని గట్టుకొని తప్పు పడితే ప్రయోజనం లేదు, అలాగని సమర్ధించనవసరమూ లేదు. వారి తీర్పు పర్యవసానం గురించి విమర్శనాత్మకంగా వైఖరిని చెప్పే హక్కును కలిగి వుండాలి.

అత్యాచారాలు,హత్యలకు కారకులైన ఆశారాంబాపు, డేరాబాబాల నిజస్వరూపం బయట పడేంతవరకు వారి మీద మాట పడనివ్వని రాజకీయ పార్టీలను చూశాము. వారి మీద నేర ఆరోపణలే తప్ప అవి రుజువు కాలేదుగా అని సమర్ధించి వారికి సాష్టాంగ పడిన వారిని, వారి మద్దతుతో ఓట్లు పొందిన వారినీ చూశాము. సామాన్యుల విషయానికి వస్తే గుడ్డిగా నమ్మి వారి మీద చిన్న విమర్శ చేసినా సహించక ఎంతకైనా తెగించిన వారిని చూశాము.

హిట్లర్‌ వంటి నరహంతకులను కూడా అధికార అందలం ఎక్కించింది జనమే.చరిత్రలో నియంతలు, నరహంతకులను జనం ముందుగా గుర్తించిన దాఖలాలు లేవు. చరిత్ర పాఠాలను సక్రమంగా తీసుకొని జాగ్రత్తలు పడుతున్నదీ లేదు. ఐరోపాలో హిట్లరూ, ముస్సోలినీ, ఫ్రాంకో, లాటిన్‌ అమెరికా, కొన్ని ఆఫ్రికన్‌, ఆసియా దేశాలలో ఇలా ఎందరినో జనం చూశారు. అలాంటి శక్తులకు అధికారం వస్తే ఏమి జరుగుతుందో మిగతా ప్రపంచం కంటే అలాంటి పాలనల్లో మగ్గిన వారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటి అనేక దేశాలలో, ఆ నియంతలకు బలైన దేశాలలో ఫాసిస్టు శక్తులు పెరుగుతున్న తరుణమిది. ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులు, వదలని మాంద్య పరిస్ధితులు వున్నపుడు వాటిని మార్చి అచ్చే దిన్‌( మంచి రోజులు) తెచ్చే దేవదూతలుగా నిరంకుశ శక్తులు ముందుకు రావటం గత చరిత్ర. ఇప్పుడు కూడా ప్రపంచంలో అదే పరిస్ధితిని ఆసరా చేసుకొని ఆశక్తులు తలెత్తుతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అది పాత రూపం, పాత పద్దతుల్లోనే వుండనవసరం లేదు, వుండదు కూడా. మితవాద భావజాలానికి వూతమిస్తున్నదీ, దాని వెంట నడుస్తున్నదీ కూడా జనమే. అంటే జనం కూడా తప్పులు చేస్తారు అని చరిత్రే చెప్పింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముందే చెప్పుకున్నట్లు అలాంటి తప్పు మెజారిటీ చేస్తే మెజారిటీ, తక్కువ మంది చేస్తే మైనారిటీ చేశారనే చెప్పాలి.

మధ్యయుగాల నాడు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు మత యుద్ధాలు జరిగాయని చరిత్ర చదువుకున్నాము. క్రైస్తవులకు చెందిన పవిత్ర భూమిని ముస్లింలు ఆక్రమించారని దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని 1095లో పోప్‌ రెండవ అర్బన్‌ పిలుపు మేరకు కానిస్టాంటినోపుల్‌ రాజధానిగా వున్న బైజాంటైన్‌ రాజ్య రాజు తొలి మత యుద్ధాన్ని ప్రారంభించాడు.అవి 1291వరకు సాగాయి. పవిత్ర ప్రాంతాల స్వాధీనంలో విఫలమయ్యాయి. తరువాత ముస్లిం రాజులు విజృంభించి 150 సంవత్సరాల తరువాత బైజాంటైన్‌ రాజ్యాన్నే స్వాధీనం చేసుకొని ఒట్టోమన్‌ సామ్రాజ్యాన్ని విస్తరించి 20వ శతాబ్దం వరకు తిరుగులేకుండా ఏలారు. మత యుద్ధాలను సమర్ధించాలా లేదా అనేదాన్ని పక్కన పెడితే దానికి పవిత్ర ప్రాంతాలను మరొక మతం వారు స్వాధీనం చేసుకున్నారనే ఒక సాకు వుంది. నిజానికి ఆ ప్రాంతాలను ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. పవిత్ర ప్రాంతాలుగా వర్ణితమైన చోట ఒక నాడు యూదు మతాన్ని జనం అవలంభించారు, అదే చోట యూదుమతం మీద తిరుగుబాటు లేదా విబేధించిగానీ క్రైస్తవం, తిరిగి అదే కారణాలతో క్రైస్తవం పరిఢవిల్లిన చోటనే ఇస్లాం మతం వునికిలోకి వచ్చింది తప్ప ఎవరో వచ్చి ఆ ప్రాంతాలను ఆక్రమించలేదు. మతం ఒక మత్తు, అది ఎక్కిన వారికి వేరే ఏమీ పట్టదు కనుక అబ్రహామిక్‌ మతాలుగా వున్న యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల పెద్దలు చరిత్రలో మారణకాండకు కారకులయ్యారన్నది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలో మతాల చరిత్ర చూసినా ఆ ఛాయలు కనిపిస్తాయి.

మన దేశంలో కూడా మత యుద్ధాలకు గతశతాబ్దిలో నాంది పలికారు. అయితే క్రైస్తవ మతయుద్ధాలు కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు జరిగితే ఇక్కడ హిందూ మత పునరుద్దరణ పేరుతో ప్రారంభమైంది. దానికి గాను హిందూ మత ప్రార్ధనా మందిరాలను ముస్లింలు ఆక్రమించి వాటిని మసీదులుగా మార్చారనే ఆధారాలు లేని వివాదాలను ముందుకు తెచ్చారు. బాబరీ మసీదు ప్రాంతంలోనే రాముడు జన్మించాడని, అక్కడే రామాలయం వుండేదని తమ నమ్మకం అని చెబుతారు. నిజానికి మొఘల్‌ , ఇతర ముస్లిం పాలకులు దేవాలయాలను నాశనం చేసి మసీదులుగా మార్చి లేదా నిర్మించి వుంటే ఆలయాలేవీ మిగిలేవి కాదు. ఇతర మతాల వారు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు, మతమార్పిడులకు పాల్పడుతున్నారు అనే పేరుతో వారి మీద బస్తీమే సవాల్‌ అంటూ అన్ని రకాల దాడులు చేస్తున్నారు. మెజారిటీ మతానికి ముప్పు ఏర్పడింది అనే ఒక అభిప్రాయాన్ని గణనీయమైన సంఖ్యలో కలిగించటంలో జయప్రదమయ్యారు. అలాంటి వారికి మరొక అంశం పట్టదు. బెంగాల్‌ రాష్ట్ర విభజనకు బ్రిటీష్‌ వారు చెప్పిన కారణాలు ఏవైనప్పటికీ దాన్ని కొందరు హిందూ-ముస్లిం విభజనగా చూశారు. హిందువుల హక్కల పరిరక్షణ పేరుతో 1910దశకంలో ప్రారంభమైన హిందూమహాసభ, తరువాత 1925లో వునికిలోకి వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ హక్కుల స్ధానంలో హిందుత్వ పరిరక్షణగా మార్చివేశారు. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అది చివరికి నిజమై కూర్చుంటుందన్న గోబెల్స్‌ సూత్రీకరణను అమలు జరిపి హిందూ మతానికి ముప్పు ఏర్పడిందని నిజంగానే నమ్మేట్లు చేశారు. వందల సంవత్సరాల మొగలాయీల, బ్రిటీష్‌ వారి పాలనలో దేశంలో ఎన్ని మతమార్పిడులు జరిగినప్పటికీ 80శాతం మంది హిందువులుగానే వున్నారు.ఎన్నడో వందల సంవత్సరాల నాడు మతం మార్చుకున్నవారు కూడా హిందువులే అన్నది హిందూత్వ వాదుల అభిప్రాయం. దానిలో పాక్షిక సత్యం వుండవచ్చు, పంచముల పేరుతో గణనీయమైన జనాన్ని సామాజిక, ఆర్ధిక అణచివేతకు గురించి చేసిన హిందూ మనువాదమే దానికి కారణం. ఒక వేళ హిందూత్వ వాదులు కోరుకుంటున్నట్లు ఎవరైనా ముస్లింలు, క్రైస్తవులు తిరిగి హిందూమతంలోకి వారిని ఏ కులంలో చేర్చుకుంటారు. ఇప్పటికే వున్న వందలు, వేల కులాలకు తోడుగా ముస్లిం, క్రైస్తవ కులాలను ఏర్పాటు చేయటం తప్ప మరొక మార్గం ఏముంది. అలా మారి వారు బావుకునేదేముంది?

మత యుద్ధాలు రెండు వందల సంవత్సరాలు సాగాయంటే సామాన్యులు పాల్గొన కుండా సాధ్యమేనా ? మరి ఆ సామాన్యులు చేసింది మంచా, చెడా ? చెడే అని చరిత్ర తీర్పు చెప్పింది. వారెందుకు ఆ చెడ్డపని చేశారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. చరిత్ర కారుడు గిల్స్‌ కానిస్టేబుల్‌ అభిప్రాయం ప్రకారం మత యుద్ధాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎవరి కారణాలు వారికున్నాయి. క్లారివాక్స్‌కు చెందిన సెయింట్‌ బెర్నాడ్‌ 1140వ సంవత్సరంలో శక్తిశాలి సైనికుడు లేదా యుద్ద వీరుడు అనే పేరుతో రాసిన దానిలో నీవు ఇప్పుడు యుద్దం చేయాల్సిన తరుణం వచ్చింది. నీవు గనుక విజయం సాధిస్తే అది కీర్త నీయం అవుతుంది. ఒక వేళ జెరూసలేము కొరకు పోరాటంలో మరణించావనుకో నీవీ స్వర్గంలో ఒక చోటును గెలుచుకుంటావు, పవిత్ర నగరాన్ని మత ద్రోహుల నుంచి విముక్తి చేసి యాత్రీకులకు దారి ఏర్పాటు చేయాలంటే దాన్ని విముక్తి చేయాలన్న పోప్‌ పిలుపులను నీవు పాటించాలి అని పేర్కొన్నారు. గతంలో చేసిన తప్పిదాల నుంచి క్షమాపణ పొందటానికి పాల్గొనాలి. మత యుద్ధాల్లో పాల్గొన్న ఎవరినైనా క్షమిస్తానని పోప్‌ ఒక అవకాశం ఇచ్చారు. అనేక యుద్ధాల్లో ఎందరి ప్రాణాలనో తీసిన రాజులకు ఇది అవసరంగా కనిపించింది. యుద్ధంలో పాల్గొనటం ద్వారా కొత్త ప్రపంచాన్ని చూడవచ్చు, ఒక సాహసం చేసినట్లు వీరత్వాన్ని ప్రదర్శించటానికి అవకాశం దొరుకుతుంది అని కొందరు భావించారు. తలిదండ్రుల నుంచి వారసత్వంగా భూములు, సంపదలు పొందే అవకాశం లేని కుమారులు విదేశాల్లో భూములు, సంపదలు పొందవచ్చని పాల్గొన్నారు. ఈ యుద్దంలో పాల్గొంటే స్వేచ్చ నిస్తామని పోప్‌ వాగ్దానం చేశారు కనుక బానిసలు, ఫ్యూడల్‌ శక్తుల వద్ద బందీలుగా వున్న రైతులు అందుకోసం దాడుల్లో భాగస్వాములయ్యారు. తమకు తలనొప్పిగా వున్న సామంత రాజులు, లేదా రాజకుటుంబీకులను వదలించుకొనేందుకు వారిని మతయుద్ధాలకు పోవాల్సిందిగా రాజులు ఆదేశాలు జారీ చేశారు. మరి కొందరు చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం మత యుద్దాల వెనుక ప్రధాన లక్ష్యం మతపరమైనదే అయినప్పటికీ పాల్గొన్న అనేక మందికి పైన పేర్కొన్న సంపదలు, భూమి, అధికారం వంటి ఆకాంక్షలు కూడా వున్నాయి. జెరూసలెమ్‌కు వెళ్లే దారిలో కానిస్టాంటినోపుల్‌ సమీపంలోని ఎడేసా అనే ప్రాంతం లేనప్పటికీ దాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు అక్కడి క్రైస్తవులను కూడా హతమార్చటాన్ని అందుకు తార్కాణంగా చూపారు.

మన దేశంలో మత యుద్దాన్ని ప్రోత్సహిస్తున్న వారి వెనుక బయటికి కనిపించని అంశాలెన్నో వున్నా పైకి చెబుతున్నది మాత్రం హిందూ మత రక్షణ. ఇది పవిత్ర యుద్దం అని భావిస్తున్నవారికి తెలియని ఆవేశం, మతానికి ఏదో ముప్పు వచ్చి పడుతోందన్న మానసిక భయం తప్ప పైన పేర్కొన్న మతయుద్ధాలలో మాదిరి సంపదలు, భూములు, రాజ్యాల వంటి లక్ష్యాలు వున్నాయని చెప్పలేము, వారికి హిందూత్వ శక్తుల ముసుగు అజెండా ఏమిటో తెలుసా అంటే తెలియదనే చెప్పాలి. ఎవరైనా మాకు తెలుసు అంటే విద్వేషం తలకు ఎక్కించుకున్న వారు తప్ప వేరు కాదు. వివేచనలేని ఆవేశం, గుడ్డి నమ్మకాలు, గుడ్డి ద్వేషంతో బాబరీ మసీదును కూల్చివేసింది, లేదా గోరక్షణ పేరుతో దాడుల్లో, మత ఘర్షణల్లో పాల్గొంటున్నదీ సామాన్యులే. వీరిలో కేంద్ర ప్రభుత్వ విధానాల వలన నష్టపోతున్న రైతు బిడ్డలు, వ్యవసాయ కార్మికులు, వృత్తులు అంతరించి నిరుద్యోగ సైన్యంలో చేరుతున్న చేతివృత్తుల వారూ, నిరుద్యోగులూ, ధరల పెరుగుదల వలన బతుకు అతలాకుతలం అవుతున్నవారూ అందరూ వున్నారు. వారెవరూ ఓటు వేయకుండా బిజెపి, దాని మిత్రపక్షాలకు అన్ని ఓట్లు ఎలా వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతోందో అంతు తెలియని అంశమేమీ కాదు. దాన్నుంచి జనాన్ని ఎలా మళ్లించాలనేదే అసలైన సమస్య.

జనం ఆమోదం పొందటం వేరు, జనం చేత ఆమోదింప చేయటం, మాయలో పడవేయటం వేరు. రెండోదాన్ని ఆంగ్లంలో మాన్యుఫాక్చరింగ్‌ కన్సెంట్‌ అంటున్నారు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మాయలో పడవేసి జనం చేత తలూపించటం. సంఘటితమైనదిగా పైకి కనిపించకుండా అది సామాజిక లేదా సాంప్రదాయ మాధ్యమాల ద్వారా, మౌఖిక ప్రచారం, ప్రతిదానినీ వాణిజ్యీకరణ ద్వారా కొన్ని సిద్ధాంతాలు, పదసమూహాలు, రూపాలు లేదా నమ్మకాలు వేటినైనా సరే ఎలాంటి వివరణ అడగకుండా, హేతుబద్దమైన ప్రశ్నలు లేకుండా ఆమోదం తెలిపేట్లు, విధేయత చూపేట్లు, మొగమాటం పెట్టి తలూపేట్లు చేసే విధానం ఇప్పుడు ప్రపంచ సమాజాన్ని వూపివేస్తున్నది. అందుకు మనది మినహాయింపు కాదు. మచ్చుకు ఏమిటీ మీకు ఎయిడ్సా అన్నట్లుగా మీ పిల్లలను ప్రభుత్వ స్కూలుకు పంపుతున్నారా, మీరు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నారా , మీకు కారు కూడా లేదా అని ఎవరైనా అడిగితే ఎదుటి వారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. ఈ ఎన్నికల సందర్భంగా టీవీ ఛానల్స్‌ చర్చల్లో ప్రజల సమస్యల మీద జరిగిన చర్చ లెన్ని, రాజకీయ వివాదాలు, ఆరోపణలు,ప్రత్యారోపణలపై చర్చలెన్నో పరిశీలించండి. అంటే యాజమాన్యాల ప్రయోజనాలకు నష్టం లేని లేదా పాలకులకు ఆగ్రహం కలిగించని అంశాల చుట్టూ చర్చలను పరిమితం చేయటం, బలవంతంగా చూపటం వాటికి అలవాటు చేయటం దీనిలో భాగమే. టీవీ ఛానల్స్‌, పత్రికలను మనం డబ్బు చెల్లించే పొందుతున్నాం. మనం డబ్బు చెల్లించేటపుడు మనకు కావాల్సింది పొందుతున్నామా లేదు, డబ్బిచ్చి మరీ వారు చూపింది చూస్తున్నాం, ఇచ్చిన వార్తలను చదువుతున్నాం. వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చే సమాచారం వాస్తవమైనదా కాదా అనే విచక్షణతో ఎందరు పరిశీలిస్తున్నారు. ఎవరు, ఏమిటి,ఎక్కడ,ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ఆరు ప్రశ్నలను అడగలేని బలహీనతకు లోనైన స్ధితిలోకి మనల్ని నెట్టారంటే అతిశయోక్తి కాదు. మన పిల్లలకు వాటిని నేర్పుతున్నామా అంటే లేదు. మా పెద్దలు చేశారు, మేము చేస్తున్నాము, మీరు కూడా చేయండి. మేము కూడా ప్రశ్నించలేదు అంటూ ప్రశ్నించే తత్వాన్ని మొగ్గలోనే తుంచి వేస్తున్నాం. అలాంటి తరం మా పెద్దలు పాలకులను నిలదీయలేదు మేము మాత్రం ఎందుకు చేయాలి అంటే దేశం ఎటుపోతుంది.ప్రతి కొన్ని సంవత్సరాలకు తమను అణచివేసే అసామాన్య ప్రతినిధులెవరో నిర్ణయించుకొనేందుకు అణచివేతకు గురయ్యే వారు అనుమతిస్తారు అని కారల్‌ మార్క్స్‌ చెప్పారు. ఇప్పుడు మన దేశంలో అదే జరుగుతోందా? గతంలో కాంగ్రెస్‌ను అనుమతిస్తే ఇప్పుడు మతవాదుల వంతు వచ్చిందా ?

Image result for people's verdict, hitler

బ్రిటీష్‌ వారు, అంతకు ముందు మొగల్స్‌, ఇతరులు మన దేశాన్ని ఆక్రమించటం గురించి, దీర్గకాలం పాటు మన సమాజం విదేశీ ఆక్రమణను వ్యతిరేకించకపోవటం, ప్రతిఘటన, స్వాతంత్య్ర పోరాటం, దీర్ఘకాలం కాంగ్రెస్‌ పాలన కొనసాగటం, అసలు స్వాతంత్య్రవుద్యమంతో ప్రమేయం లేకపోవటమే కాదు, వ్యతిరేకించిన శక్తుల వారసులు ఇప్పుడు తామే అసలైన జాతీయవాదులమని చెప్పటం, ప్రత్యామ్నాయ విధానాల వంటి ప్రతి అంశాన్ని పైన చెప్పిన ఆరు ప్రశ్నలతో మన సమాజంలో కొందరైనా విశ్లేషించి వైఖరులను నిర్దేశించుకొన్న రోజునే సమాజ మార్పుకు నాంది అవుతుంది. ఇది ఎలా అన్నది ఒక సమస్య. జనానికి ఇలాగే కావాలి అని జనాన్ని తిడితే ప్రయోజనం లేదు. పాలకుల విధానాలతో పాటు సమాజంలో జనాన్ని ప్రభావితం చేస్తున్న అన్ని రంగాల మంచి చెడ్డలతో పాటు జనంలో వుండే అవకాశవాదాన్ని కూడా మిత్ర వైరుధ్యంలో భాగంగా చర్చించాలి. మేథావులు ప్రజారంగంలోకి రావాలి, ఈ రంగంలోని కార్యకర్తలు మేథోపరమైన అధ్యయనాలను చేసి వాస్తవిక పరిస్ధితులకు అనుగుణంగా మేళవించి విశ్వసనీయతను పొందటం ద్వారానే జరుగుతుంది. దీని అర్ధం పరస్పరం పాత్రలను మార్చుకోవాలని కాదు. ఒకరి అనుభవాన్ని మరొకరు వుపయోగించుకొని ఆచరణాత్మక వైఖరిని, ఎత్తుగడలను అనుసరించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భగవద్గీత కంటే గాడ్సే గ్రంధమే వారికి ముఖ్యం !

20 Monday May 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

bhagavad gita, Godse, Mahathma Gandhi, Narendra Modi, Nathuram Godse, Prahgya Thakoor, RSS, why i killed gandhi

Image result for gandhi

ఎం కోటేశ్వరరావు

మనిషిని కుక్క కరవటం సాధారణం, మనిషి కుక్కను కరవటమే వార్త అన్నది పాత చింతకాయ పచ్చడి. అధ్యక్షులు, ప్రధానులు, ఛాన్సలర్‌లు ఇలా ఏ పేరుతో వున్నా వారు అబద్దాలు చెప్పటం సాధారణం, ఎన్ని నిజాలు చెప్పారన్నదే వార్త అన్నది కొత్త చింతకాయ పచ్చడి. ఏప్రిల్‌ 29వరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదివేలకు పైగా అబద్దాలు చెప్పారని వాషింగ్టన్‌ పోస్టు ఫాక్ట్‌ చెక్కర్‌( వాస్తవాలు, అవాస్తవాలను కనుకొనే వ్యవస్ధ) వెల్లడించింది. ట్రంప్‌ అధికారంలో వున్న 827రోజుల్లో ఈ రికార్డు నెలకొల్పారు. ఆయన పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే సరికి ఆ సంఖ్య ఇరవై వేలకు చేరుతుందా, పాతికవేలు అవుతుందా అన్నది ఇప్పుడు అసలైన వార్తగా మీడియాలో విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్‌ 25-27 తేదీల మధ్య అంటే మూడు రోజుల్లో ట్రంప్‌ మహాశయుడు 171 అబద్దాలు లేదా వక్రీకరణలకు గానీ పాల్పడ్డారట. రోజుకు 57 అబద్దాలు చెప్పటం అంటే సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు, ఇదొక రికార్డు. మరి మన దేశంలో ఇలా అబద్దాలు చెప్పేవారిని కనుక్కొనే వ్యవస్ధలను ఒక్క బడాపత్రిక లేదా ఛానల్‌ కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు? పాకేజీలు ఆగిపోతాయనా ? ఏమో !

అబద్దాలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేయటం నిత్యజీవితంలో ఒక భాగమైంది. సామాజిక మాధ్యమాల్లో నేను సైతం ఫేస్‌బుక్కుకు, ట్విటర్‌కు ఫేక్‌ పోస్టును సమకూర్చాను అన్నట్లుగా పరిస్ధితి వుంది. అబద్దాల కోరు ట్రంప్‌కు అడుగులకు మడుగులొత్తటం, కౌగిలింతల దౌత్యం, మమేకం అయ్యే వారికి ట్రంప్‌ లక్షణాలు అబ్బకుండా ఎలా వుంటాయి. మనలోని అసహ్యాన్ని, దుష్టాలోచనలను కనిపించకుండా వేసుకొనేది ముసుగు. అది పలు రూపాలు, వ్యక్తీకరణలు, ఇతరత్రా వుంటుంది. కొన్ని శరీరాల నుంచి వెలువడే దుర్గంధం, చెడువాసనల నుంచి ఇతరులను రక్షించేందుకే అత్తర్లను తయారు చేశారని కొంత మంది చెబుతారు. భారతీయ సంస్కృతికి, నాగరికతకు వారసురాలు అని స్వయంగా మన ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రశంసలు అందుకున్న ప్రజ్ఞా ఠాకూర్‌ మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే గొప్ప దేశభక్తుడు అని సెలవిచ్చారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే దేశంలో తొలి వుగ్రవాది, అతను హిందువు అని ప్రముఖ చలన చిత్ర నటుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఒక వుగ్రవాద కేసులో నిందితురాలిగా వుండి, అసత్యాలతో బెయిలు మీద బయటకు వచ్చి, బిజెపి అభ్యర్ధిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ‘యోగిని’ ప్రజ్ఞ తీసిన దెబ్బకు దెబ్బ అది. ఆమె మీద కేసు తేలేంత వరకు యోగిని ముసుగు వేసుకున్న మహిళ అంటే తప్పు లేదు. అయితే డేరాబాబా, ఆశారాంబాపు వంటి హంతకులు, అత్యాచారాలకు పాల్పడిన వారికి శిక్షలు పడేంతవరకు వారి మీద మాటపడనివ్వలేదు సరికదా వారితో అంటకాగారు బిజెపి వారు అని గుర్తు చేయటం అవసరం. ప్రజ్ఞ ఠాకూర్‌ నోటి నుంచి వెలువడిన దుర్గంధాన్ని కప్పి పుచ్చేందుకు బిజెపి క్షమాపణ అనే అత్తరు పూసింది.దుర్గంధం సహజలక్షణం, అత్తరు తాత్కాలికం, మళ్లీ మళ్లీ పూసుకుంటే తప్ప ఫలితం లేదు. ఆమె అత్తరు పూసుకున్నప్పటికీ నేను ఆమెను ఎప్పటికీ క్షమించను అన్న నరేంద్రమోడీ అతిశయోక్తి అలంకార ప్రయోగాన్ని చూసి నవరసాల నటుడు కమల్‌ హసనే కాదు, యావత్తు దేశ, ప్రపంచ సినీ రంగం తమకు 56అంగుళాల ఛాతీ గలిగిన కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, గాయకుడు, దర్శకుడు, నటుడు ఒకే వ్యక్తిలో దొరికారని సంతోషించక తప్పదు. మరో విధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ రెండింటికీ చెడ్డ రేవడి అయ్యారు.ఆయన చేసిన ప్రకటనను మిగతా వారే కాదు మోడీ భక్తులు కూడా నమ్మరని వేరే చెప్పనవసరం లేదు.ఒక మనిషి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైనా అంతిమంగా ఎక్కడ ముగిసింది అనేది ముఖ్యం. వినాయక దామోదర సావర్కర్‌ అందరు యువకుల మాదిరే స్వాతంత్య్ర వుద్యమంలోకి వచ్చారు. అండమాన్‌ జైలుకు పంపగానే పిరికిబారి అనేక మంది మాదిరే బ్రిటీష్‌ వారికి లొంగిపోయారు, లేఖల మీద లేఖలు రాశారు, చివరికి తెల్లవారి దయాదాక్షిణ్యాలతో బయట పడ్డారు. అలాంటి వ్యక్తినే దేశభక్తుడు అని కీర్తిస్తున్నవారు, గాడ్సేను దేశభక్తుడు అనటంలో ఆశ్చర్యం ఏముంది? జనానికి మతిమరుపు ఎక్కువ అని జర్మన్‌ నాజీ గోబెల్స్‌ ఎప్పుడో నిరూపించారు. ఆయనను అనుసరించేవారు వేరే దారిలో ఎలా నడుస్తారు?

Image result for gandhi godse

రాజకీయాల్లోకి వచ్చిన కమల్‌హసన్‌ రాబోయే రోజుల్లో ఏం చేస్తారో తెలియదు గానీ ఇప్పటి వరకైతే గాడ్సే గురించి వ్యాఖ్యానించి ఎవరెటువైపు వుంటారో తేల్చుకోవాల్సిన సవాలును మన జాతి ముందుంచారు. ఇప్పుడు సమస్య గాంధీ కాదు, గాడ్సే అయ్యారంటే అతిశయోక్తి కాదు. మహాత్మాగాంధీ, ఆయన సిద్ధాంతాలు, ఆచరణ గురించి గతంలోనే చర్చ జరిగింది. తొలుత ఆయనను అనుసరించిన ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ వంటి వారు తరువాత కమ్యూనిస్టులయ్యారు. ఆయన ఆశయాలనే పాటిస్తున్నామని చెప్పేవారు ఇప్పుడెక్కడ వున్నారో చూస్తున్నాము. స్వాతంత్య్రవుద్యమంలో ఆయనతో విబేధించిన వారు సైతం ఆయనను జాతి పితగా, మహాత్ముడిగా పిలవటాన్ని ఎన్నడూ వ్యతిరేకించలేదు, ప్రశ్నించలేదు. స్వాతంత్య్రం వుద్యమంలో ఆయనతో కొంత కాలం నడచిన కొందరు వ్యక్తులు లేదా నడచినట్లు చెప్పుకొనే వారు, దూరంగా వున్నవారు తరువాత కాలంలో హిందూత్వవాదులుగా మారారు. స్వాతంత్య్ర వుద్యమంలో ఆయన పాత్రను సవాలు చేశారు, చేస్తున్నారు. ఆయన మహాత్ముడని ఎవరు చెప్పారు, జాతి పిత ఎలా అయ్యారు అని ప్రశ్నిస్తూనే వున్నారు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను సంఘీయులందరూ ‘వీర’ బిరుదుతో కలిపి పిలుస్తారు. వారు తగిలించటం తప్ప ఆ బిరుదును ఎవరిచ్చారో చెప్పమనండి. సదరు సావర్కర్‌ వేరే పేరుతో తన చరిత్రను తానే రాసుకొని దానిలో తన వీరత్వం గురించి కూడా జోడించారు. అంటే స్వంతడబ్బా కొట్టుకున్నారు. మహాత్మా గాంధీ ఎక్కడా ఆ స్ధాయికి దిగజారలేదు. మహాత్ముడిని హతమార్చిన వాడిని దేశభక్తుడు అంటూ అధికార పార్టీ ప్రసిద్ధ వ్యక్తి ప్రజ్ఞా ఠాకూర్‌ వ్యాఖ్యానించారు.ఆమెను సమర్ధిస్తూ ట్వీట్లు, ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేస్తున్న వారందరూ చౌకీదార్‌ నామం తగిలించుకున్న నరేంద్రమోడీ అనుయాయులే. వారందరి చేత బిజెపి లేదా దానికి మార్గదర్శనం చేస్తున్నామని చెప్పుకొనే సంఘపరివారం, నరేంద్రమోడీ క్షమాపణ చెప్పిస్తారా, చెప్పినా వారిని కూడా క్షమించనని నరేంద్రమోడీ అంటారా ? బంతి ఆయన కోర్టులోనే వుంది. ఐదేండ్లలో ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశంలో మాట్లాడేందుకు ధైర్యం చేయని వ్యక్తి, ఐదేండ్ల గడువు ముగిసేలోగా అమిత్‌ షా పత్రికా గోష్టిలో ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొన్నారు స్ధాయికి దిగిపోయారు. ప్రతమూ చెడింది, ఫలితమూ రాలేదు. మరోసారి ఆలిండియా రేడియోలో మనసులోని మాట చెప్పేందుకు అవకాశం వుంటుందో తెలియదు, ఎలా వెల్లడిస్తారనేది ఆయనకే వదిలేద్దాం !

ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులుగా లేదా దాని ప్రభావానికి లోనైన వారి విశ్వసనీయత ఎల్లవేళలా ప్రశ్నార్దకమే. వారు ముసుగు మనుషులు. వారు చెప్పే ఆదర్శాలు, అందుకు విరుద్దమైన ఆచరణే దానికి నిదర్శనం. ఇలాంటి వారి తీరు, తెన్ను మనకు ఇటలీ,జర్మనీలోని ఫాసిస్టులు, నాజీల్లోనూ వారి బాటలో నడిచే నియంతల్లో మాత్రమే కనిపిస్తుంది. బిజెపిలో వాజ్‌పేయి ఒక ముసుగు వంటి వారు, నిజమైన నేత అద్వానీయే అని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు గోవిందాచార్య మన్‌కీ బాత్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ నేతవై వుండి కూడా నిజాలు చెబుతావా నీకెంత ధైర్యం అన్నట్లుగా సదరు ఆచార్యను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. గాడ్సేను దేశభక్తుడని ప్రజ్ఞ వ్యాఖ్యానించటంలో ఆశ్చర్యం లేదు. మహాత్ముడి హత్య కుట్రలో భాగస్వామి అని తీవ్ర విమర్శలు వచ్చిన, శిక్ష పడకుండా కేసునుంచి తప్పించుకున్న విడి సావర్కర్‌ను నరేంద్రమోడీ స్వయంగా దేశభక్తుడు అని కితాబిచ్చారు. ఆ సావర్కర్‌ స్వాతంత్య్ర సమర కార్యకర్తగా అండమాన్‌ జైలుకు వెళ్లి అక్కడ వుండలేక బ్రిటీష్‌ సర్కార్‌కు లేఖలు రాసి తాను ప్రభుత్వానికి విధేయుడనై వుంటాను, సహకరిస్తాను అని లొంగిపోయిన పిరికి పందగా జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంఘపరివార్‌ పెద్దలు ఏమి చెబుతారంటే ఒక ఎత్తుగడగా అలా లేఖలు రాశారు తప్ప ఆయన లొంగలేదు అంటారు. అంటే సావర్కర్‌ ఒక ముసుగు వేసుకున్నట్లు ఆయన శిష్యులే అంగీకరించటం. లేదా శిష్యులే ఆయనకు ఆ ముసుగు వేశారని అనుకోవాలి. ఆ పెద్దమనిషి వేసుకోవటం ఏమిటి ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంగా తమకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలకు పాల్పడం, తమది సాంస్కృతిక సంస్ధ అని ఒక అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి తమ మీద వున్న నిషేధాన్ని ఎత్తివేయించుకుంది. ఇది దేశ చరిత్రలో అతి పెద్ద ముసుగు.గత ఏడు దశాబ్దాలుగా దాని వెనుక అది ఎన్ని రాజకీయాలు నడిపిందో, ఏమి చేసిందో, ఎలాంటి శక్తులను సృష్టించి దేశం మీదకు వదలిందో, అనేక మతకల్లోలాలు, గుజరాత్‌ మారణకాండ, బాబరీ మసీదు కూల్చివేత, అనంతర పరిణామాల్లో తెలిసిందే.

మహాత్మాగాంధీ హత్యానంతరం దానిలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం కారణంగా నాటి ప్రభుత్వం నిషేధం విధించింది. వల్లభాయ్‌ పటేల్‌ నాడు హోం మంత్రి. ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టించిన విషపూరిత వాతావరణమే గాంధీ హత్యకు దారితీసిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. నిషేధం మీద సంతకం చేసింది, తరువాత ఎత్తివేసింది కూడా ఆయనే.గోల్వాల్కర్‌తో సహా అనేక మందిని జైలులో వేశారు. ఆ సమయంలో వున్నత స్ధాయిలో జరిగిన కుట్ర లేదా అధికారంలో వున్న పెద్దల కారణంగా కానీ నిషేధం ఎత్తివేశారు. దానికి గాను ప్రభుత్వం పెట్టిన షరతు ఏమిటి? హింసాకార్యకలాపాలనుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ వైదొలగాలి, రాతపూర్వకమైన నిబంధనావళితో అది బహిరంగ కార్యకలాపాలు నిర్వహించాలి. రాజకీయాలను వదలి పెట్టాలి, జాతీయ పతాకాన్ని గౌరవించాలి, భారత్‌ను లౌకిక దేశంగా గుర్తించాలి. ఆ మేరకు గోల్వాల్కర్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అప్పుడు భారత్‌ను లౌకిక దేశంగా గుర్తిస్తున్నారా అన్న ప్రశ్నకు ఒక హిందువుకు దేశం ఎల్లవేళలా లౌకిక రాజ్యమే అని సమాధానమిచ్చాడు. నాటి ప్రభుత్వానికి సమర్పించిన నిబంధనావళిలో తమది సాంస్కృతిక సంస్ధ అని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని కార్యకలాపాలు, ఆచరణ ప్రభుత్వానికి ఇచ్చిన వాగ్దానానికి విరుద్దమే. అన్నింటికీ వక్రీకరణలే. అందుకే దేశంలో, ప్రపంచంలో వున్న అనేక ముసుగు సంస్ధలలో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దది. దాని రహస్య అజెండాను అమలు చేసేందుకు అప్పటి వరకు రాజకీయ సంస్ధగా వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ తన రాజకీయ విభాగంగా జనసంఘ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు బిజెపి, విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, హిందూవాహిని, దుర్గావాహిని వంటి అనేక సంస్ధలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వాటిలో వున్న వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులే. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా అంగీకరించే ధైర్యం దానికి లేదు. గాంధీని చంపింది హిందూమహాసభకు చెందిన గాడ్సే అని చెబుతారు. అదే హిందూమహాసభకు చెందిన శ్యాంప్రసాద్‌ ముఖర్జీతో జనసంఘ్‌ను ఏర్పాటు చేశారు. అంటే సాంకేతిక ఆటంకాలను తప్పించుకొనేందుకు తప్ప నిజానికి దానిలో దీనిలో పనిచేసేది ఆర్‌ఎస్‌ఎస్‌ వారే. గాడ్సే ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను వదలిపెట్టలేదని కుటుంబసభ్యులే చెప్పారు. పోనీ వారేమైనా ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బిజెపి వ్యతిరేకులా అంటే కాదు. అందువలన వారికి అలాచెప్పాల్సిన అవసరం లేదు.

ట్రంప్‌ పెద్ద అబద్దాల కోరైతే మన దేశ నేతలను ఏమనాలి. నిత్యం వందల కుహనా వార్తలు, అసత్యాలు, అర్ధసత్యాలతో సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నదెవరు? ఎవరికి అనుకూలంగా వస్తున్నాయో వారే ఆ పని చేస్తున్నారు. వాటి పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని మేథావులు గుర్తించటం లేదు. అలాంటి సమాజంలో నియంతలు, నిరంకుశులు పెరగటం చాలా సులభం. గతంలో సుభాష్‌ చంద్రబోస్‌ మరణం గురించి జవహర్‌లాల్‌ నెహ్రూ మీద పెద్ద ఎత్తున తప్పుడు ప్ర చారం చేశారు. అది 2016లో ఎన్నికలకు ముందు ప్రారంభమై ఎన్నికలు ముగిసే వరకు సాగింది. సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబ సభ్యులు బిజెపిలో చేరారు. బెంగాల్లో ఆయన గురించి ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయని ఆపని చేశారు. పోనీ కేంద్ర ప్రభుత్వం సుభాష్‌ చంద్రబోస్‌ మరణం గురించి నిజాలేమైనా బయట పెట్టిందా అంటే ఏమీ లేదు. ప్రభుత్వం దగ్గర గతంలో బహిర్గతం కాని పత్రాలను కొన్నింటిని బహిర్గతం చేయటం తప్ప జరిగిందేమిటి?

సంఘపరివార్‌ శక్తులు బయట చేస్తున్న తప్పుడు ప్రచారాలనే అదే పరివార్‌ సభ్యుడైన నరేంద్రమోడీ పార్లమెంట్‌ వేదికగా చేసుకొని అవే విషయాలను చెప్పారు. సర్దార్‌ పటేల్‌ గనుక నాడు ప్రధాని అయి వుంటే కాశ్మీరు పూర్తిగా మన చేతుల్లోనే వుండేది అన్నారు. ఇది చరిత్రకు విరుద్ధం. చరిత్రను వక్రీకరించటానికి కొందరు వ్యక్తులు అవసరం. అందుకే నెహ్రూ, గాంధీని ఎన్నుకున్నారు. గాంధీని నేరుగా తిడితే పరువు దక్కదు కనుక ఆయన మీద సామాజిక మాధ్యమాల్లో, నెహ్రూమీద ప్రత్యక్షంగా దాడి చేస్తున్నారు. అసలు మనకు స్వాతంత్య్రం రాక ముందే ఏర్పడిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాకు శాశ్వత సభ్యత్వం రావటానికి నెహ్రూ కారకుడని స్వయంగా కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీలో పచ్చి అబద్దమాడారు.భారత ఫాసిజం చర్చిల్‌ మాదిరి ముసుగు ధరించిందని బ్రిటన్‌ పత్రిక ఇండిపెండెంట్‌ 1998ఫిబ్రవరి 15న బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పేయి గురించి రాసింది. సౌమ్యుడంటూ చిత్రించిన వాజ్‌పేయి నికార్సయిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త. బాబరీ మసీదు కూల్చివేతకు బాధ్యులైన ఎవరి మీదా పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గుజరాత్‌ మారణకాండ సమయంలో నరేంద్రమోడీ మీద చర్య లేదు. ఇప్పుడు ప్రజ్ఞ మీద అలాగే ఇతర బిజెపి నేతల మీద పార్టీ పరంగా ఎలాంటి చర్యలూ లేవు.

Image result for gandhi godse

సంఘపరివార్‌ కార్యకర్తలు నేతలు, కార్యకర్తలు హిందూమతానికి చెందిన గ్రంధాలు ఎంత మంది చదివారో తెలియదు, సెల్‌ఫోన్లలో భగవద్గీత అయినా వుందో లేదో చెప్పలేము గానీ ఇప్పుడు వారి సెల్‌పోన్లలో గాంధీని నేను ఎందుకు చంపాను అనే గాడ్సే పుస్తకం వుందంటే అతిశయోక్తి కాదు. వారు దానిని బలవంతంగా ఇతరులకు పంపుతున్నారు. ఆ మధ్య మన ఇతిహాసాలలో హింస వుంది, హిందువులు హింసకు అతీతులు కాదు అని చేసిన వ్యాఖ్య మీద రగడ జరిగింది. భారత, రామాయణాలు చదివిన వారు ఎంత మంది హింసకు పాల్పడ్డారు లేదా వుగ్రవాదులయ్యారు అని సంఘీయులు అడ్డు సవాళ్లు విసిరారు. మహాత్మా గాంధీ, నాధూరామ్‌ గాడ్సే ఇద్దరూ భగవద్గీతను చదివిన వారే ఒకరు ప్రాణాలను బలిదానమెందుకు ఇచ్చారు, మరొకడు ప్రాణాలు ఎందుకు తీసినట్లు ? భగవద్గీత నుంచి ఏమి నేర్చుకున్నట్లు? కేసు విచారణ సమయంలో తన చర్యకు సమర్ధనగా భగవద్గీతనే వుదాహరించాడు. అందుకే సంఘీయులు ఇప్పుడు దాన్ని జనాల మెదళ్లకు ఎక్కించటానికి పుస్తక రూపంలో వచ్చిన గాడ్సే వాదననే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా గాంధీ మీద అభిమానం, గౌరవం వుంటే అలా చేస్తారా? రాజకీయంగా, ఓట్ల పరంగా నష్టం అనే భయంతో క్షమాపణ చెప్పించటం, చెప్పినా నేను క్ష మించను అని మోడీ అనటం తప్ప నిజంగా వారి మనసులో గాడ్సే మీద భక్తి, అభిమానమే వుంది. జనంలో జరగాల్సిన ప్రచారం ఎలాగూ జరిగిపోయింది, గాడ్సేకు రావాల్సిన ప్రచారం వచ్చింది, మరి కొంత కాలం గాడ్సే గురించి చర్చ జరుగుతుంది తప్ప గాంధీ గురించి కాదు. గాడ్సే మీద జరిగే చర్చ తమ ముసుగును మరింత తొలగిస్తుంది అనుకుంటే బిజెపి మరో ముసుగు వేసుకుంటుంది. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం. మతోన్మాదం, వుగ్రవాదం, తీవ్రవాదం పులి స్వారీ వంటివి. ఒకసారి వాటిని ఎక్కిన వారు లేదా ఎక్కించుకున్నవారు వాటిని అదుపు చేయాలి లేదా వాటికే బలికావాలి. చరిత్రలో అలాంటి పులులను ఎక్కిన వారు ఎవరూ అదుపు చేయలేక వాటికే బలయ్యారన్నది తెలిసిందే.ప్రజ్ఞ మీద వెల్లడైన వ్యతిరేకతను పక్కదారి పట్టించటానికి ఆడిన నాటకం క్షమాపణ, దాన్ని ముందే చెప్పుకున్నట్లు బయటి వారే కాదు, పెద్ద చౌకీదారు మోడీ చేసిన ప్రకటనను పిల్ల చౌకీదార్లు గౌరవించటం లేదు. గాడ్సేను కీర్తిస్తూనే వున్నారు. అలాంటి వారు అవసరమైతే మోడీని కూడా పక్కన పెడతారు. వున్మాద లక్షణం అది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై దాడికి సాకు సృష్టించిన అమెరికా, కొత్తగా వచ్చిన ముప్పేమీ లేదన్న బ్రిటన్‌ !

15 Wednesday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

iran us war, Islamic State, MIDDLE EAST, Threats From Iran, Trump administration

Image result for iran us war

ఎం కోటేశ్వరరావు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు పిచ్చి పట్టిందా ? అలాంటి వున్మాదిని అక్కడి పాలకవర్గం ఎందుకు అనుమతిస్తోంది? ప్రపంచాన్ని ఎటు వైపు తీసుకుపోతున్నారు? గత వారం పదిరోజులుగా పరిణామాలను చూస్తున్న సామాన్యులకు సైతం ఎదురవుతున్న ప్రశ్నలు.అమెరికా ప్రస్తుతం ఒక కొత్త యుద్ధాన్ని ప్రారంభించి మరొక రెండింటిని తీవ్రతరం చేస్తోంది. ఇరాన్‌ తీరానికి మరో యుద్ద నౌకను పంపుతోంది. అది సముద్రంలోనూ అవసరమైతే భూమ్మీదకు వచ్చి దాడి చేయగలదు. మరో వైపు గుర్తుతెలియని వారు తమ రెండు చమురు టాంకర్లపై దాడి చేసి నష్టం కలిగించారని సౌదీ అరేబియా ఆరోపించింది. చమురు పైప్‌లైన్లపై కూడా దాడి జరిగిందని రెండో రోజు ప్రకటించింది. చైనా నుంచి చేసుకొనే 200 బిలియన్‌ డాలర్ల విలువగల దిగుమతులపై 25శాతం వరకు పన్ను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతిగా చైనా కూడా 60బిలియన్‌ డాలర్ల అమెరికా వస్తువులపై దిగుమతి పన్నులు విధించింది. ఇది ఏడాది క్రితం ప్రారంభించినదాని కొనసాగింపు. ఇరాన్‌ తీరానికి అమెరికా యుద్దనౌకలను పంపటం, అవసరమైతే లక్షా ఇరవై వేల మంది సైనికులను ఆ ప్రాంతానికి తరలించేందుకు పెంటగన్‌ పధకాలను సిద్ధం చేసినట్లు వార్తలను వ్యాపింప చేయటం మానసిక యుద్ధాన్ని ప్రారంభించటమే. మరోవైపు ఇరాన్‌ నుంచి తమకు, తమ అనుయాయులకు ముప్పువుందని అమెరికా చెబుతుంటే అందుకు నిదర్శనం అంటూ సౌదీ అరేబియా తమ నౌకలపై దాడి జరిగిందని ఆరోపించింది. ఎవరు చేశారో చెప్పకపోయినా అది ఇరాన్‌వైపే సంకేతాలిచ్చిందని వేరే చెప్పనవసరం లేదు. ఇది గత ప్రచార యుద్ద కొనసాగింపు.

ట్రంప్‌ యంత్రాంగం యుద్దోన్మాద ప్రేలాపనలు చేస్తుంటే కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని బ్రిటన్‌ గాలి తీసింది. మంగళవారం నాడు పెంటగన్‌ వద్ద బ్రిటీష్‌ సీనియర్‌ మిలిటరీ అధికారి మేజర్‌ జనరల్‌ క్రిస్‌ ఘికా విలేకర్లతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు అసాధారణం, బ్రిటన్‌ ఆలోచనా తీరుకు ప్రతిబింబం. అమెరికా యుద్ధానికి దిగేందుకు సిద్దమౌతున్న తరుణంలో దాని మిత్రపక్షానికి చెందిన ఒక వున్నతాధికారి ఇలా మాట్లాడటం చిన్న విషయమేమీ కాదు. అయితే అంతిమంగా బ్రిటన్‌ ఏం చేస్తుందనేది వేరే విషయం. ఘికా మాట్లాడిన కొద్ది సేపటికే అమెరికా మిలిటరీ కమాండ్‌ ఒక ప్రకటన చేస్తూ అమెరికా, దాని మిత్రపక్షాల వద్ద వున్న విశ్వసనీయమైన ముప్పుకు సంబంధించి వున్న సమాచారానికి విరుద్ధంగా ఐఎస్‌ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సేనలకు డిప్యూటీ కమాండర్‌ కూడా అయిన బ్రిటీష్‌ అధికారి చెప్పారని ప్రకటించటం కూడా అసాధారణ అంశమే. ఇరాన్‌పై అమెరికా దాడులకు తెగబడుతుందా లేదా అన్నది ఒక అంశమైతే, అందుకు అవసరమైన నేపధ్యాన్ని సిద్ధం చేస్తోందన్నది స్పష్టం. చరిత్రలో జరిగిన అనేక యుద్దాలు సాకులు, చిన్న చిన్న కారణాలతోనే ప్రారంభమయ్యాయి. వీటిలో అమెరికాదే అగ్రస్ధానం.మచ్చుకు కొన్నింటిని నెమరు వేసుకుందాం.

వియత్నాంపై దాడికి టోంకిన్‌ గల్ఫ్‌ వుదంతం

కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టాలి, చైనాకు పక్కలో బల్లెంగా మారాలంటే అప్పటికే దక్షిణ కొరియాలో తిష్టవేసిన అమెరికన్లు వియత్నాంలో కూడా స్ధావరం ఏర్పాటు చేసుకోవాలని పధకం వేశారు.హోచిమిన్‌ నాయకత్వంలోని కమ్యూనిస్టులు, జాతీయ వాదుల పోరాటానికి తోక ముడిచిన ఫ్రెంచి సామ్రాజ్యవాదలు వియత్నాం నుంచి వైదొలుగుతూ దేశాన్ని రెండు ముక్కలుగా చేశారు. పరిస్ధితులు బాగుపడిన తరువాత ఎన్నికలు జరిపి రెండింటినీ విలీనం చేయాలనేది జెనీవా ఒప్పంద సారం. అయితే సామ్రాజ్యవాదుల తొత్తులుగా వున్న దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు వ్య తిరేకులు, మిలిటరీ విలీనానికి అడ్డుపడింది. ఈ పూర్వరంగంలో దక్షిణ వియత్నాంకు మద్దతుగా రంగంలోకి దిగేందుకు పొంచి వున్న అమెరికాకు ఎలాంటి అవకాశం దొరకలేదు. దాంతో టోంకిన్‌ గల్ఫ్‌లోని తమ యుద్ధ నౌకలపై వుత్తర వియత్నాం సేనలు దాడి చేశాయనే కట్టుకధలు అల్లి 1964లో అమెరికా వుత్తర వియత్నాంపై దాడులకు తెగబడింది. ఇప్పుడు సౌదీ అరేబియా తన నౌకల్లో ఎవరూ మరణించలేదని, చమురు సముద్రం పాలు కాలేదని అయితే నౌకలకు నష్టం జరిగిందని చెబుతున్నట్లుగానే టోంకిన్‌ గల్ఫ్‌లో కూడా వియత్నాం దాడిలో ఎవరూ మరణించలేదని, తమ నౌకకు చిన్న రంధ్రం మాత్రమే ఏర్పడినట్లు, ఇదే సమయంలో తాము మూడు వియత్నాం యుద్ద బోట్లను కూల్చివేశామని, నలుగురు సైనికులను మట్టుపెట్టామని అప్పుడు అమెరికా చెప్పుకుంది. అయితే అదంతా వియత్నాం మీద దాడికి అల్లిన కట్టుకధ అని తరువాత వెల్లడైంది. వియత్నాం మీద జరిపిన దుర్మార్గ దాడుల్లో అమెరికా ఎంత మారణకాండకు పాల్పడిందీ, చివరకు ఎలా తోకముడిచిందీ, రెండు వియత్నాంలు ఎలా ఒకటై కమ్యూనిస్టు దేశంగా మారిందీ చెప్పనవసరం లేదు.

పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడి పేరుతో రెండవ ప్రపంచ యుద్దంలో అడుగు పెట్టిన అమెరికా

రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభంలో అమెరికా తటస్ధ దేశంగా ఫోజు పెట్టింది. రెండు పక్షాలకూ ఆయుధాలను విక్రయించి సొమ్ము చేసుకుంది. అయితే యుద్దంలో నాజీలు ఓడిపోతున్నారనే అంచనాకు వచ్చిన అమెరికన్లు యుద్ధానంతరం తమ పలుకుబడిని విస్తరించాలనే కాంక్షతో ఎలాగైనా యుద్ధంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ పూర్వరంగంలో 1941 డిసెంబరు ఏడున అమెరికా పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ సేనలు దాడి చేశాయి. అమెరికన్లు ఆసియాలో జోక్యం చేసుకొనేందుకు పధకం వేశారని తెలిసిన తరువాత ముందస్తు ఎదురుదాడిలో భాగంగా ఇది జరిగినట్లు చెబుతారు. ఇదే సమయంలో జపాన్‌ అలాంటి దాడులకు పధకం వేసిందని అమెరికన్లకు ముందుగానే వుప్పందింది. అయినా దాడి జరిగిన తరువాత ఆ పేరుతో తాము యుద్ధానికి దిగాలన్నది వారి ఎత్తుగడగా తరువాత బయటపడింది.1941నవంబరు 30న హిలో(హవాయి) ట్రిబ్యూన్‌ హెరాల్డ్‌ అనే పత్రిక వారాంతంలో జపాన్‌ దాడి చేయవచ్చు అంటూ ఎనిమిది కాలాల పతాక శీర్షికతో వార్తను ప్రచురించింది. జపాన్‌ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా పూర్తి స్ధాయి యుద్దానికి దిగిందంటే అది అప్పటికే సన్నాహాలు పూర్తి చేసుకుందన్నది స్పష్టం. దాడులు చేసే విధంగా జపాన్‌ను ప్రోత్సహించిదని కూడా కొందరు చెప్పారు. అది ఒక్క అమెరికాకే కాదు, బ్రిటీష్‌ వారికి కూడా తెలుసని తేలింది.యుద్దం చివరిలో జపాన్‌ దాదాపు లొంగిపోయి, పోరు ముగిసే సమయంలో అమెరికన్లు హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసి తమ దగ్గర ఎంతటి ప్రమాదకర ఆయుధాలున్నాయో చూడండి అంటూ ప్రపంచాన్ని బెదిరించారు. ఆ వుదంతం తరువాతే ప్రపంచంలో ఆయుధ పోటీ పెరిగిందన్నది తెలిసిందే.

రెండో ప్రపంచ యుద్ధానికి జర్మనీ సాకు

రెండవ ప్రపంచ యుద్దాన్ని 1939 సెప్టెంబరు ఒకటిన పోలాండ్‌పై దాడితో హిట్లర్‌ సైన్యం ప్రారంభించింది. అంతకు ముందు రోజు అందుకు అవసరమైన సాకును సృష్టించింది. ఆగస్టు 31న ఆరుగురు నాజీ సైనికులు పోలాండ్‌ ప్రతిఘటన యోధుల పేరుతో వేషాలు వేసుకొని ఒక పోలాండ్‌ రైతును పట్టుకొని అతకి మాదకద్రవ్యాలిచ్చి పోలాండ్‌ సరిహద్దుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని గిలివైస్‌ అనే చోట ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. పోలాండ్‌ యోధుల వేషాల్లో వున్న నాజీ సైనికులు స్టేషన్‌ ఇంజనీర్లను నిర్బంధించి రేడియోను స్వాధీనం చేసుకొని పోలిష్‌ భాష వచ్చిన ఒక సైనికుడు తాము జర్మన్‌ స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నామని, న్యూయార్క్‌ వర్ధిల్లాలి, జర్మనీపై కెనడా దాడి చేయనున్నది అంటూ మాట్లాడి జర్మన్లను రెచ్చగొట్టారు. తరువాత మాదకద్రవ్యాల మత్తులో వున్న రైతును రేడియో స్టేషన్‌ మెట్ల మీద పోలిష్‌ సైనిక యూనిఫాం వేసి కూర్చోబెట్టి నుదిటిపై కాల్చి వదలి వెళ్లారు. జర్మనీపై పోలాండ్‌ జరిపిన దాడికి చిహ్నంగా చూపారు. తరువాత జరిపిన మారణ హోమం ఏమిటో ప్రపంచానికి తెలిసిందే.

అబద్దాలతో యుద్దాన్ని ప్రారంభించిన బిస్మార్క్‌

జర్మన్లను ఐక్యం చేసిన ఘనుడిగా బిస్మార్క్‌ను చరిత్రకారులు రాశారు. జర్మనీని ఒక సామ్రాజ్యవాద శక్తిగా మార్చేందుకు అతగాడు అబద్దాలతో యుద్ధాన్ని ప్రారంభించిన విషయాన్ని కావాలనే విస్మరించారు. 1870లో ప్రష్యా ప్రధానిగా బిస్మార్క్‌ వున్నాడు. అప్పటికే ఫ్రాన్స్‌తో విబేధాలు వున్నాయి. ఈ పూర్వరంగంలో ఘర్షణలను నివారించేందుకు ఫ్రాన్సు ఒక టెలిగ్రామ్‌ను పంపింది, దానిని ప్రచురించి జనానికి తెలియచేయాలని కోరింది. అయితే బిస్మార్క్‌ దానిలోని కొన్ని అంశాలను పూర్తిగా మార్చి జర్మన్లను అవమానపరిచే విధంగా ఫ్రెంచి వారు రాశారంటూ దానిని ప్రచారం చేశాడు. అది జరిగిన వారం రోజులకే ఫ్రాన్స్‌ యుద్దం ప్రకటించింది. ఆ యుద్ధాల్లో అది ఓడిపోయింది. ప్రష్యాలో భాగంగా వున్న జర్మన్‌,ఇతర ప్రాంతాలను కలిపి జర్మనీగా ఏర్పాటు చేయటంలో బిస్మార్క్‌ కీలక పాత్ర వహించాడు. తరువాత అదే జర్మనీ మొదటి ప్రపంచ యుద్దానికి కారణమైంది. దానిలో ఓడిపోయి, అవమానకర షరతులతో రుద్దిన సంధిని అంగీకరించింది. ఆ సంధిని చూపి పోయిన జర్మనీ పరువు నిలబెట్టాలి, తిరిగి జర్మనీకి పూర్వప్రాభవం కల్పించాలనే పేరుతో హిట్లర్‌ రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Image result for iran us war

మన కళ్ల ముందే జరిగిన అనేక దాడులకు ఇలాంటి సాకులనే సామ్రాజ్యవాదులు, ముఖ్యంగా అమెరికన్లు ప్రయోగించారు. ఇరాక్‌లో సద్దాం హుసేన్‌ పెద్ద మొత్తంలో మారణాయుధాలను పోగు పెట్టాడని ప్రచారం చేసి అమెరికా, దాని మిత్ర దేశాలు దాడులు చేసి సద్దాంను హతమార్చిన విషయం తెలిసిందే. మారణాయుధాలు లేవు మరొకటి లేదు. అలాగే లిబియాలో గడాఫీ మీద తప్పుడు ప్రచారం చేసి హతమార్చిన విషయమూ జగద్విదితమే.ఇప్పుడు ఇరాన్‌ మీద అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. సరిగ్గా ఏడాది క్రితం ఇరాన్‌తో ఇతర దేశాలతో కలసి చేసుకున్న అణుకార్యక్రమ నిలిపివేత ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. అయినప్పటికీ ఇరాన్‌ దానికి కట్టుబడే వుందని, ఎలాంటి వుల్లంఘనలు తమ దృష్టికి రాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్ధ ప్ర కటించింది. మిగతా భాగస్వాముల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అయినా అమెరికా తప్పుడు ప్రచారం మానలేదు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ట్రంప్‌కు ఏదో ఒకటి అవసరం కనుక ఇరాన్‌ మీద కాలు దువ్వుతున్నాడన్నది ఒక అంచనా.

డోనాల్డ్‌ ట్రంప్‌ తన లబ్దికి చేసే పిచ్చిపనులకు అమెరికా పాలకవర్గం ఎందుకు మద్దతు ఇస్తోంది అన్నది కొందరి సందేహం. అమెరికా కార్పొరేట్లకు ఆయుధాల వ్యాపారం ఇప్పుడు అసలైన ఆదాయ వనరు. అందుకు గాను వారికి మార్కెట్‌ అవసరం. కొత్తగా రూపొందించిన మారణాయుధాలు ఎలా పని చేస్తాయో చూడాలంటే జనం మీద ప్రయోగించాలి, అందుకు గాను ఎక్కడో ఒక చోట యుద్ధాలు చేయాలి. రెండవది వివిధ దేశాల మధ్య తగాదాలు పెట్టాలి, లేదా ఫలానా దేశం నుంచి మీకు ముప్పు వుందంటూ పరస్పరం పురి ఎక్కించి రెండు దేశాలకూ ఆయుధాలను అమ్ముకోవాలి. ఇలాంటి పనులు చేసే వారే సదరు కార్పొరేట్లకు అమెరికా గద్దె మీద వుండాలి. సౌమ్యుడని పేరు తెచ్చుకున్న డెమోక్రాట్‌ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అయినా పిచ్చిపనులు చేస్తున్నాడని పేరు తెచ్చుకున్న ట్రంప్‌ అయినా ఆచరణలో అమలు జరిపింది ఒకే అజండా. చైనాతో వాణిజ్య యుద్దం అమెరికన్లకు హాని అనేకంటే అక్కడి వాణిజ్య సంస్ధల లాభాలకు గండికొట్టేది కనుక ఆ తరగతికి చెందిన కార్పొరేట్లు వాణిజ్య యుద్దాన్ని వ్యతిరేకిస్తున్నాయి.అనేక అమెరికన్‌ కంపెనీలు చైనాలో వస్తూత్పత్తి చేసి తిరిగి తమ దేశానికే ఎగుమతి చేస్తున్నాయి. వాణిజ్య యుద్ధంలో ట్రంప్‌ విధించే పన్నులు వాటిమీద కూడా వుంటాయి. ఈ చర్య అమెరికా నుంచి ఎగుమతులను దెబ్బతీస్తుంది, వినియోగదారులపై భారాలు మోపుతుంది, కార్పొరేట్ల లాభాలను హరిస్తుంది. అందుకే ఇరాన్‌ మీద యుద్ధం అంటే ముందుకు నెట్టే వారు కొందరైతే వాణిజ్య యుద్దం అంటే వెనక్కు లాగేవారు మరి కొందరు. రెండు చర్యలూ కార్పొరేట్లకు అవసరమైనవే.

Image result for sabotage attacks an american alibi,Britain says no new Threat from iran

తాజా పరిణామాల్లో సౌదీ అరేబియా నౌకల మీద దాడి అనే వుదంతాన్ని సృష్టించారన్నది స్పష్టం. తమ మీద ఆంక్షలు మరింతగా విధించినా,మరొకటి చేసినా హార్ముజ్‌ జలసంధిలో చమురు నౌకల రవాణాను అడ్డుకుంటామని ఇరాన్‌ హెచ్చరించింది. ఈ ప్రాంతానికి దాదాపు 140కిలోమీటర్ల దూరంలోని ఎమెన్‌ జలసంధిలో యుఏయి రేవు ఫుజైరాలో ఆదివారం నాడు నార్వేకు చెందిన ఒకటి, సౌదీ అరేబియాకు చెందిన రెండు నావల మీద ఇరాన్‌ పంపిన వారు దాడులు చేశారని, నౌకలకు పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే అవి నకిలీ వార్తలని తమ రేవుల్లో ఎలాంటి వుదంతం జరగలేదని యుఏయి వాటిని ఖండించింది. అయితే తరువాత అప్పుడప్పుడూ అలాంటివి జరుగుతుంటాయని, తరువాత నిజంగానే దాడులు జరిగాయని ప్రకటించింది.

Image result for iran us war

మధ్య ప్రాచ్యంలో తమ ప్రయోజనాలకు ముప్పుగా ఇరాన్‌ తయారైందని, లెబనాన్‌, ఇరాక్‌, సిరియాలలో షియా మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నదని, ఎమెన్‌లో హుతీ తిరుగుబాటుదార్లకు క్షిపణులు అందిస్తున్నదని, పర్షియన్‌ గల్ఫ్‌లో యుద్ద విన్యాసాలకు తన నౌకాదళాన్ని అనుమతిస్తున్నదని అమెరికా ఎప్పటి నుంచో చెబుతోంది. ఇవన్నీ కొత్తవేమీ కాదని, ఈ అంశాలన్నీ తమకు తెలిసినవేనని, వాటిని ఇప్పటికే పర్యవేక్షిస్తున్నామని కొత్తగా పెరిగిన ముప్పేమీ లేదని బ్రిటీష్‌ అధికారి చెప్పారు. గతంలో ఇరాక్‌ విషయంలో సద్దాం హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పేర్చారని తప్పుడు ఆరోపణలతో చేసిన యుద్ధం గురించి తెలిసిన ఐరోపా మిత్ర దేశాలు ఇప్పుడు ఇరాన్‌ విషయంలో చెబుతున్న అంశాలను తాపీగా తీసుకుంటున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. సోమవారం నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో బ్రసెల్స్‌లో ఐరోపా యూనియన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల అధిపతి ఒక ప్రకటన చేస్తూ గరిష్ట సంయమనం పాటించాలని, వత్తిడిని పెంచాలని చెప్పారు తప్ప అమెరికాకు వంత పాడలేదు. ట్రంప్‌ సలహాదారు బోల్టన్‌, మైక్‌ పాంపియోలు ట్రంప్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని ఐరోపా అధికారులు ప్రయివేటు సంభాషణల్లో చెబుతున్నారు. ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం విషయంలో అమెరికా చెబుతున్నదానికి విశ్వసనీయత లేదని మిగతా భాగస్వామ్య దేశాలన్నీ భావిస్తున్నాయి.అయితే వెలువడిన వార్తల ప్రకారం ఇరాన్‌ మీద దాడికి ఐరోపా యూనియన్‌ సుముఖంగా లేదన్న వాదన వినిపిస్తోంది. అందువలన అదే నిజమైతే వాటిని కాదని అమెరికా ముందుకు పోతుందా, ప్రచార దాడితో సరిపెడుతుందా అన్నది చూడాల్సి వుంది. ఆ జలసంధిలో అమెరికా యుద్ద నౌక ఇప్పటికే ప్రవేశించింది, ఈ నేపధ్యంలో ఇరాన్‌ తన ఆధీనంలో వున్న హార్ముజ్‌ జలసంధిని మూసివేయటం అంటే అమెరికాతో యుద్ధానికి సిద్దపడటమే. అది జరుగుతుందా, మూసివేసినా దాడులకు అమెరికా తెగిస్తుందా ? ఇప్పటికి వూహాజనిత ప్రశ్నలే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత, రామాయణాల పేరుతో మత రాజకీయాలు !

09 Thursday May 2019

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, communalism, CPI(M), Hindu Supremacists, mahabharata, pragya thakur, ramayana, SITARAM YECHURY, violence

Image result for communal politics with mahabharata, ramayana epics

ఎం కోటేశ్వరరావు

కొన్ని సంఘటనలను, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలను వక్రీకరించటం ఆ పేరుతో తమ అజెండాను అమలు జరపటం సంఘపరివార్‌ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల్లో దేవుళ్లు, దేవతల పేర్లను ప్రస్తావించి ఓట్లడగటం నిబంధనల వుల్లంఘన కిందికి వస్తుంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలు, వారి అనుచర గణాలు ఈ ఎన్నికల్లో ఎన్ని సార్లు ఆ పేరుతో ప్రతిపక్షాలపై దాడి చేశాయో, రెచ్చగొట్టేవిధంగా మాట్లాడాయో చూస్తున్నాము. జై శ్రీరామ్‌ అని భారత్‌లో గాక పాకిస్ధాన్‌లో అంటామా అని అమిత్‌ షా, బెంగాల్లో జై శ్రీరామ్‌ అనటమే నేరమైంది, మా వాళ్లను జైల్లో పెడుతున్నారని నరేంద్రమోడీ నానా యాగీ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యను ఆధారం చేసుకొని టీ అమ్మే వారు ప్రధాని కాకూడదా అంటూ తెగ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ సారి అదేమిటో మోసగాండ్లలో చాలా మంది పేర్ల చివర మోడీ అనే వుంది అని రాహుల్‌ గాంధీ చేసిన విమర్శను పట్టుకొని నన్ను అంటే అనండిగానీ నా వెనుక బడిన మోడీ కులం మొత్తాన్ని దొంగలంటారా అని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో కులాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు జై శ్రీరాం నినాదం చేస్తే జైల్లో పెడతారా అనే యాగీ కూడా బెంగాల్లో, ఇతర చోట్ల ఓట్ల వేటలో భాగమే. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచారానికి వెళుతుండగా భద్రతా ఏర్పాట్లను దాటి ముగ్గురు యువకులు ముందుకు వచ్చి మమతా బెనర్జీ కారు ముందు జై శ్రీరాం అంటూ నినాదాలు చేసి ఆమెను అడ్డుకోబోయారు. రెచ్చి పోయిన ఆమె వెంటనే కారు దిగి ఇప్పుడు రండి అంటూ కేకలు వేశారు. ఆ యువకులు పారిపోయారు. తరువాత పోలీసులు వారిని పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌లో విచారించి వదలి వేశారని మీడియా వార్తలు వచ్చాయి. ఈ వుదంతాన్ని సాకుగా చేసుకొని రాముడిని వీధుల్లోకి తెచ్చి ఓటర్లను రెచ్చగొట్టేందుకు బిజెపి పెద్దలు పూనుకున్నారు. కేరళలో కూడా అయ్యప్ప స్వామి పేరుతో నినాదాలు చేస్తూ హింసాకాండకు పాల్పడిన వారి మీద కేసులు పెడితే భక్తులను అడ్డుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. భక్తి ఒక ముసుగు, దేవుడి పేరు ఒక సాకు తప్ప ఇంకేమైనా వుందా ?

మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి మాట్లాడుతూ అక్కడ పోటీ చేస్తున్న మాలెగావ్‌ పేలుళ్ల నిందితురాలు, బిజెపి అభ్యర్ధి ప్రజ్ఞ సింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. హిందువులకు హింస మీద విశ్వాసం లేదు అని ఆమె మాట్లాడటం గురించి సీతారామ్‌ స్పందించారు. ఈ దేశంలో ఎందరో చక్రవర్తులు, రాజులు యుద్ధాలు చేశారు.రామాయణం, మహాభారతాలు కూడా ఎన్నో యుద్ధాలు, హింసతో నిండి వున్నాయి. ఒక ప్రచారకురాలిగా మీరు ఇతిహాసాల గురించి చెబుతారు. అయినా హిందువులు హింసకు పాల్పడరని అంటారు. దీనికి వెనుక వున్న తర్కం ఏమిటి ? హిందువులు హింసకు పాల్పడరనేది ఒక అవాస్తవం, దానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. తొలి దశ ఎన్నికలు అయిపోయాయి. తిరిగి వారి అసలైన అజెండా 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు, వివాదాస్పద స్ధలంలో రామమందిర నిర్మాణం, వుమ్మది పౌర స్కృతి వంటి అంశాలకు వారు తిరిగి వచ్చారు. మూడవ దశ ఎన్నికల తరువాత భోపాల్‌లో ప్రజ్ఞా ఠాకూర్‌ను అభ్యర్ధిగా నిలబెట్టటం ప్రజలలో మనోభావాలను రెచ్చగొట్టే చర్య తప్ప మరొకటి కాదు. ఇదీ సీతారామ్‌ ఏచూరి వుపన్యాసంలో ఒక అంశం సారాంశం.

Image result for mahabharata, ramayana , violence

దీనిలో రామాయణ,భారతాల ప్రస్తావనను మాత్రమే ముందుకు తెచ్చి మతధోరణులును రెచ్చగొట్టేందుకు తద్వారా మిగిలిన దశల్లో ఓట్ల లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఏచూరి చేసిన విమర్శలో రెండో భాగానికి సమాధానం లేదు. హింసాత్మక ప్రవృత్తి కలిగిన వారు అన్ని మతాల్లో వుంటారని తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్రమోడీ వక్రీకరిస్తున్నారని ఏచూరి పేర్కొన్నారు.’ ఒక వుగ్రవాద కేసులో నిందితురాలిగా వున్న వ్యక్తిని అభ్యర్ధిగా బిజెపి నియమించిన అంశం మీద భోపాల్‌లో నేను చెప్పిన దానిని ఆయనకు అలవాటైన పద్దతుల్లో వక్రీకరించారు. వుగ్రవాదానికి మతం వుండదు, హింసాత్మక ప్రవృత్తి వున్న వారు అన్ని సామాజిక తరగతుల్లో వుంటారు. ఇతిహాసాలైన రామాయణ, మహాభారాతాల్లో కూడా అలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. మతపరమైన విభజనను మరింత పెంచేందుకు మోడీ అసత్యాలు చెబుతున్నారు’ అని ట్వీట్‌ చేశారు. ఏచూరి భోపాల్‌ వ్యాఖ్యలు హిందూమతాన్ని కించపరిచేవిగా వున్నాయని, మనోభావాలను దెబ్బతీశాయని ఇంకా ఏవేవో చేశాయని చెబుతూ కార్పొరేట్‌ రామ్‌దేవ్‌ బాబా, ఇంకా చిల్లర మల్లర ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వ్యక్తులు కొన్ని చోట్ల పోలీసు కేసులు దాఖలు చేశారు. సంఘపరివార్‌ ఎత్తుగడల్లో కేసులు దాఖలు చేసి కోర్టుల చుట్టూతిప్పే చౌకబారు చర్య ఒకటి. అయితే ఆ కేసులు నిలుస్తాయా లేదా, వాటికి ఎవరూ భయపడక పోయినప్పటికీ మీడియాలో ప్రచారం పొందవచ్చని, వివాదాలు జనం నోళ్లలో నానుతూ వుండాలనేది వారి లక్ష్యం. వారికి శివసేన తాళం, పక్కవాయిద్యాలుగా పని చేస్తున్నది.

Image result for mahabharata, ramayana , violence

ఈ సందర్భంగా తమ రాజకీయాలేవో తాము చెప్పుకోకుండా అనవసరంగా సీతారామ్‌ ఏచూరి వ్యాఖ్యలు చేశారంటూ కొందరు కపటంతో కూడిన సలహాలు ఇస్తున్నారు. అంటే తాము చెప్పిందే వేదం, పాడిందే పాట అంటూ కొంత మంది వక్రీకరణలకు, విద్వేష ప్రచారానికి పూనుకుంటే నోరు మూసుకొని కూర్చోవాలా? ప్రపంచంలో ఎక్కడా ఇలా కూర్చోలేదు, అది అసలు మానవ స్వభావానికే విరుద్దం. ఒక రాయికి, నోరు లేని పశువుకు, మనిషికి ఇంక తేడా ఏముంది. అనవసరంగా వ్యాఖ్యలు చేశారని కాదు, ఆయన అన్నదాంట్లో వున్న అసందర్భం, అసమంజసం ఏమిటన్నది చెప్పకుండా చేయకుండా వుంటే బాగుండేది , మనోభావాలను దెబ్బతీయటం, ఓట్లు పొగొట్టుకోవటం ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇది చచ్చిన చేపల బాట తప్ప బతికిన చేపల ఎదురీత కాదు. భిన్న అభిప్రాయం అనేది భారతీయ సంస్కృతిలో భాగం. దానికి వేల సంవత్సరాల నాడే చార్వాకులు లేదా లోకాయతులు నాంది పలికారు. వారిని భౌతికంగా నాశనం చేస,ి వారు రాసిన గ్రంధాలను ధ్వంసం చేసిన వుగ్రవాద చరిత్ర నాటి మత పెద్దలది, వారికి మద్దతు ఇచ్చిన రాజరికాలది. అయినా సరే ప్రతి తరంలోనూ ఛాందసాన్ని, మతోన్మాదాన్ని వ్యతిరేకించే శక్తులు పుట్టుకు వస్తూనే వున్నాయి. భావజాలాన్ని అంతం చేయటం ఎవరి వల్లా కాదన్నది చరిత్ర చెప్పిన సత్యం.పురోగామి భావజాలానికిి ప్రతీకలుగా వున్నవారిలో ఏచూరి ఒకరు. గతంలోఎందరో రామాయణ, మహాభారతాలను విమర్శనాత్మకంగా చూడలేదా ? చోళరాజు కుళోత్తుంగుడు శైవమతాభిమాని. వైష్ణవులను ఇతరులను సహించని కారణంగానే రామానుజుడు పన్నెండు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం లేదా హోయసల రాజుల ఆశ్రయం పొందాడని చరిత్రలో లేదా ? అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో జరిగిన మారణకాండను చూసిన తరువాత మారు మనసు పుచ్చుకొని బౌద్ధమతాన్ని అవలంభించాడన్న చరిత్ర చెబుతున్నదేమిటి? కుళోత్తుంగుడు, అశోక చక్రవర్తి, లేదా శైవ, వైష్ణవ మతాభిమానులైన చక్రవర్తులకు వేదాలు, పురాణాలు, భారత, రామాయణాలు తెలియవా, వారు వాటిని చదివిన తరువాతనే కదా శైవ, వైష్ణవ మత యుద్దాలకు, ప్రార్ధనా మందిరాల విధ్వంసకాండ, కూల్చివేతలకు, మారణకాండకు పాల్పడింది. మరి వాటిలోని మంచి నుంచి వారేమి నేర్చుకున్నట్లు ? అలాంటి మారణకాండకు పాల్పడకుండా వారిని ఆ గ్రంధాల భావజాలం నిలువరించలేదే. ఒకనాడు ఒకరిని ఒకరు అంతం చేసుకోవాలని చూసిన వారు నేడు హిందూ మతం పేరుతో వారు శైవులైనా, వైష్ణవులైనా రాజీపడి ఇతర మతాల మీద దాడికి పూనుకుంటున్నారు.

Image result for mahabharata, ramayana , violence

ఇతిహాసాలైనా, పురాణాలు, వేదాలు, భగవద్గీత వంటి హిందూ మత గ్రంధాలైనా, ఇతర మతాలకు చెందిన బైబిల్‌ పాత మరియు కొత్త నిబంధనలు, ఖురాన్‌, సిక్కుల గురుగ్రంధమైనా మరొకటి అయినా ఎవరినీ వుగ్రవాదులుగా మారమని, ఇతరులను అంతం చేయమని చెప్పలేదు. వాటిని చదివినవారందరూ వుగ్రవాదులుగా మారి వుంటే ఈ పాటికి ప్రపంచంలో ఏ ఒక్కడూ మిగిలి వుండేవారు కాదు. ప్రపంచంలో అత్యధికంగా 230 కోట్ల మంది క్రైస్తవులు, 180 కోట్ల మంది ముస్లింలు, 115 కోట్ల మంది హిందువులు, అసలు ఏ మతం లేని వారు 120 కోట్ల మంది వున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారు చెప్పేదాని ప్రకారం ఖురాన్‌ హింసను ప్రేరేపిస్తున్నదని చెప్పేదే వాస్తవం అయితే ప్రపంచంలో 180 కోట్ల మంది వుగ్రవాదులుగా మారి వుండాలి. ఐఎస్‌ వుగ్రవాదులు ముస్లింలే, వారు చంపుతున్నదీ సిరియా,ఎమెన్‌ వంటి ఇస్లామిక్‌ దేశాల్లోని జనాన్నే కాదా ? సౌదీ అరేబియా ముస్లిం దేశం మరొక ముస్లిం దేశం ఎమెన్‌ మీద యుద్దం చేస్తున్నది, ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో సహకరిస్తున్నది. అలా చేయమని ఖురాన్‌ చెప్పిందా ? అమెరికాను, ఐరోపా దేశాలను పరిపాలించింది క్రైస్తవులే, ప్రపంచాన్ని ఆక్రమించుకున్నది క్రైస్తవ దేశాలకు చెందిన వారే. అనేక ప్రాంతీయ యుద్ధాలకు, రెండు ప్రపంచ యుద్దాలకు కారకులైన హిట్లర్‌, ముస్సోలినీ వంటి వారందరూ క్రైస్తవులే. యుద్ధాలు చేయమని, జనాన్ని చంపమని బైబిల్‌ బోధించిందా? అదే అయితే ఇతర మతాలకు చెందిన దేశాల మీద వారికి వారే ఎందుకు యుద్ధాలు చేసుకున్నట్లు ? ఈ రోజు ప్రపంచంలో దాదాపు 40దేశాలలో జోక్యం చేసుకుంటున్న అమెరికన్లు మత రీత్యా క్రైస్తవులే. బరాక్‌ ఒబామా అయినా, డోనాల్డ్‌ ట్రంప్‌ అయినా ఆ విధానంలో మార్పు లేదు. భారత, రామాయణాలు, భగవద్గీత, పురాణాలను చదివిన నరేంద్రమోడీ మరి నరహంతక చర్యలకు పాల్పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగిలింతలతో స్నేహం చేయమని ఆ గ్రంధాల్లో చెప్పాయా? ఆ దారుణాలను ఎందుకు ఖండించరు, అలాంటి శక్తులకు దూరంగా ఎందుకు వుండరు ? ముస్లింలు, క్రైస్తవులను ద్వేషించమని, వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టమని భారత రామాయణాలు చెప్పలేదే, మరి వాటిపేరుతో హిందూత్వశక్తులు చెలరేగిపోతుంటే ఆ దేవుళ్లు,దేవతలు ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు.

Image result for mahabharata, ramayana , violence

తాను బాబరీ మసీదు పైకి ఎక్కానని, దాని కూల్చివేతలో భాగస్వామి అయ్యానని, దేవుడు తనకు ఇచ్చిన అవకాశమదని, మరోసారి దొరికితే తిరిగి పాల్గొంటానని స్వయంగా టీవీ ఇంటర్య్యూలో ప్రజ్ఞ చెప్పటం అంటే బాబరీ మసీదు కూల్చివేత నేరాన్ని అంగీకరించటమే. సాంకేతికంగా కేసుల్లో నిందితులుగా వున్నప్పటికీ బహిరంగంగా అంగీకరించిన వారిని నేరస్తులు అనే జనం అంటారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇతరుల సాయం వుంటే తప్ప నడవలేనంటూ కాన్సర్‌ చికిత్సకోసం బెయిలు ఇవ్వాలని కోరిన ఆమె ఎవరి సాయంతో పని లేకుండా ఎన్నికల ప్రచారం అంటూ భోపాల్‌ వీధుల్లో తిరిగి రెచ్చగొడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ నిషేధం విధిస్తే గుళ్లు, గోపురాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇదేమంటే పూజలు చేసుకోనివ్వరా అంటూ మనోభావాలను రెచ్చగొడుతున్న ఆమెను అబ్దాలకోరు అనాలా, నిజం చెప్పని మనిషిగా భావించాలా ? వుగ్రవాద కేసులో ఆమె జైల్లో వున్నారు. నిందితులు ముస్లింలు, క్రైస్తవులు అయితే వారికి ఆ మతాలను తగిలించి వుగ్రవాదులు అని మీడియా రాస్తున్నది, చూపుతున్నది. ఆ లెక్కన ప్రజ్ఞను హిందూ వుగ్రవాది, హిందూ వుగ్రవాదం అనాలా లేదా ? అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో వుగ్రవాద చర్యలకు పాల్పడిన శ్వేతజాతీయులకు శిక్షపడకుండా లేదా నామమాత్రంగా వేసే విధంగా ముందే పోలీసులు మతిస్ధిమితం లేని వ్యక్తి అని చెబుతారు. మీడియా కూడా జీహుజూర్‌ అంటూ అలాగే రాస్తున్నట్లుగా ప్రజ్ఞను కూడా మతిలేని స్దితిలో వున్నట్లు పేర్కొనాలా ? ఇలాంటి ఆమె దేశ సంస్కృతికి ప్రతీక అని నరేంద్రమోడీ అభివర్ణించటాన్ని ఏమనాలి? మహోన్నతమైన దేశ సంస్కృతి గురించి గర్వపడుతున్నవారి మనోభావాలు గాయపడ్డాయా లేదా? లేకపోతే ఇలాంటి వారే ప్రతీకలైతే మన సంస్కృతి కూడా అలాంటిదేనా అని ఎవరైనా అనుకుంటే తప్పు ఎవరిది?

ప్రజ్ఞ ఇంకా నిందితురాలే తప్ప నేరం రుజువు కాలేదు కదా , ఆమె తన మతం గురించి మాత్రమే చెప్పింది కదా ? ఇలాంటి వాదనలను బిజెపి వారు తెస్తున్నారు. ఇది పచ్చి అవకాశవాదం, తర్కానికి కట్టుబడనిది. అదే ఇతర మతాలకు చెందిన వారైతే కేసులు నమోదు చేసిన వెంటనే నేరస్తులనే ముద్రవేస్తున్నారు. నిర్ధారించేస్తున్నారు.అయినా కేసుల్లో ఇరుక్కొన్న వివాదాస్పదులైన వారు తప్ప మరొకరు బిజెపికి దొరకలేదా ? ఇదే పార్టీ పెద్దలు గతంలో ఆశారాంబాపు, డేరా బాబా గుర్మీత్‌ సింగ్‌ వంటి కరడు గట్టిన నేరస్ధులందరినీ నేరం రుజువు కాలేదు కదా అని సమర్ధించారు. వారి ఆశీర్వాదాలు పొందారు, వారితో తమకు ఓట్లు వేయించాలని సిఫార్సులు చేయించుకున్నారు. వారికి శిక్షలు పడిన తరువాత ఏ బిజెపి నేత అయినా వ్యక్తిగతంగా లేదా పార్టీ పరంగా అలాంటి వారిని సమర్ధించినందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారా? లేదే ? రేపు ప్రజ్ఞ నేరం రుజువైతే ఏమిటి?

Image result for pragya thakur

హిందువుల మీద సీతారాం ఏచూరి ఇలాంటి దాడులు చేయటం వల్లే కమ్యూనిస్టులు వున్న పలుకుబడి కూడా కోల్పోతున్నారు. అనే శాపనార్ధం ఒకటి. భారత, రామాయణాల్లో వున్న సంఘటనలు, పాత్రల మీద విమర్శలు లేదా వ్యాఖ్యలు చేసింది కమ్యూనిస్టులొక్కరే కాదే, ఎన్‌టిరామారావు సినిమాల్లో ఎన్ని డైలాగులు వున్నాయో తెలియదా, మరి అలాంటి వ్యక్తి పార్టీ పెట్టిన ఆరునెలల్లోనే అధికారానికి వచ్చారు. దానికేమంటారు? ఆ మాటకు వస్తే కాంగ్రెస్‌ నేతలెవరూ భారత, రామాయణాలను విమర్శించలేదు, వాటికి కట్టుబడే వున్నారు. మరి ఆ పార్టీ నేడు ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఎందుకు దిగజారినట్లు ? దాన్నుంచి దేశాన్ని విముక్తి చేస్తానని బిజెపి ఎందుకు చెబుతున్నట్లు ? నిజానికి సంఘపరివార్‌ లేదా ప్రజ్ఞ వంటి వారి శాపాలకే అంత శక్తి వుంటే రామాయణ విషవృక్షం అనే గ్రంధం రాసిన రంగనాయకమ్మ దశాబ్దాల తరువాత కూడా అదే వుత్సాహంతో ఇంకా రాస్తూనే వున్నారే. ప్రజ్ఞ చెప్పినట్ల హేమంత కర్కరే మాదిరి ప్రాణాలు తీయకపోయినా కనీసం ఆమె కలాన్ని పని చేయకుండా చేయలేకపోయిన నోటి తుత్తర సరుకని అనుకోవాలి. ఎందరో సాధ్వులుగా దేశమంతా తిరుగుతున్నవారు, పీఠాలు పెట్టుకున్నవారు వున్నారు. ఆశారాం బాపు, డేరా బాబాలు ఎందరో మానవతుల శీలాలను హరించారు,హత్యలు చేశారు. శీలం, ఏకత గురించి కబుర్లు చెప్పే ఇలాంటి సాధ్వులు ఒక్కడంటే ఒక్కడినీ శపించలేదేం. ప్రాణాలు తీయకపోయినా జీవచ్ఛవాలుగా మార్చి మరొకడు అలాంటి పనికి పాల్పడకుండా చేయవచ్చు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మసీదుల్లో, రైళ్లలో అమాయకుల ప్రాణాలు తీసే తీవ్రవాద చర్యలు గాక తామక తంపరగా తయారవుతున్న తోటి యోగులతో కలసి దుష్టసంహారం కోసం శాపాలు పెట్టమనండి.

చివరిగా భారత, రామాయణాల గురించి ఒక్క మాట. ఒక్క భారతం ఏమిటి ఏ పురాణం చూసినా ముగింపు ఏమిటి దుష్ట సంహారం పేరుతో హింసాకాండలేగా. అసలు యుద్ధమే సమర్దనీయం కాదు. ధర్మ యుద్దమని కొన్నింటికి పేరు. నిజానికి ధర్మ యుద్దమైతే రెండువైపులా వారు గాక అధర్మంవైపు వారే మరణించాలి కదా ? మహా భారత యుద్ధంలో ఏడు అక్షౌహిణులు పాండవుల తరఫున పదకొండు అక్షౌహిణులు కౌరవుల తరఫున పాల్గొన్నాయి. ఒక వ్యాఖ్యానం ప్రకారం 18 అక్షౌహిణుల్లో 47,23,920 సైనికులు, గుర్రాలు, ఏనుగులు, రధాలు వున్నాయి. మరొక కధనం ప్రకారం కురు పాండవ యుద్దంలో మరణించిన వారి సంఖ్య 166 కోట్ల 20వేల మంది అని, బతికిన వారు 2,40,165 మంది అని యుధిష్టరుడు (ధర్మరాజు) చెబుతాడు. అంటే ఇంత మందిని బలిపెట్టినది ధర్మ యుద్దం ఎలా అవుతుంది. వంద మంది కౌరవ సోదరులను హతమార్చి వుంటే సరిపోయేదానికి ఇంత మందిని బలిపెట్టాలా ? మరొక కధనం ప్రకారం బతికింది పన్నెండు మందే అని ఎక్కడో చదివాను. ఇక రామాయణం. ఇది చెబుతున్నదేమిటి? రాముడు వాలిని చెట్టుచాటు నుంచి బాణం వేసి చంపాడు. అంటే చంపదలచుకున్నవాడిని ఎలాగైనా అంతం చేయవచ్చు అన్ననీతిని బోధించినట్లే కదా, నేడు జరుగుతున్న నేరాలన్నీ దాదాపు ఇలాంటివే కదా. ధర్మ యుద్దం అంటే ఒక తేదీ, స్ధలం నిర్ణయించుకొని ముఖాముఖీ తలపడటం ఎక్కడైనా జరుగుతోందా? రామ రావణ యుద్దంలో ఎందరు మరణించిందీ స్పష్టంగా తెలియదు. కానీ రావణుడి ఆయువు పట్టు విభీషణుడి ద్వారా తెలుసుకొని రాముడు చంపాడు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా. ప్రత్యర్ది పార్టీల ఆర్ధిక ఆయువు పట్టు ఎక్కడుందో తెలుసుకొని ప్రభుత్వ సంస్ధల ద్వారా దాడులు చేయించి లేదా బెదిరించీ రాజకీయాల్లో ఫిరాయింపులు లేదా నాశనం చేయటం చూస్తున్నదే కదా. ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి. అందువలన భిన్న అభిప్రాయాలు, భిన్న స్వరాలు విప్పనివ్వండి, జనాన్ని తెలుసుకోనివ్వండి. పిచ్చిబియ్యాలకు,శాపాలకు భయపడే రోజులు కావివి అని గుర్తించండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందే వెల్లడైన వెనెజులా ప్రతిపక్ష కుట్ర !

06 Monday May 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

“Operation Liberty”, cia, Juan Guaidó, Nicolás Maduro, operation liberty coup, Venezuela

Image result for operation liberty coup unveiled weeks before

ఎం కోటేశ్వరరావు

వెనెజులా పరిణామాలు 2

ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన జరిపిన తిరుగుబాటు యత్నం విఫలం కావటంతో ఇప్పుడు వెనెజులా ప్రతిపక్ష నేత జువాన్‌ గుయ్‌డో అమెరికా ప్రత్యక్షంగా మిలిటరీ జోక్యంచేసుకోవాలని కోరుతున్నాడు. తమ నడకలో ఎలాంటి తడబాట్లు లేవని, మిలిటరీ జోక్యంతో సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా ప్రకటించింది. మరోవైపు గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని కారకాస్‌లోని స్పెయిన్‌ రాయబారి ఇంట్లో ఆశ్రయం పొందిన ప్రతిపక్ష నేత లియోపాల్డ్‌ లోపెజ్‌ను అరెస్టు చేయాలని వెనెజులా సర్కార్‌ నిర్ణయించింది. అతను రాజకీయ ఆశ్రయం కోరలేదని తాము ఆతిధ్యం మాత్రమే ఇస్తున్నామని స్పెయిన్‌ ప్రకటించింది.

వెనెజులా వ్యవహారాల్లో అమెరికా జోక్యం నిత్యకృత్యం అన్న విషయం తెలిసినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త పధకాలు వేస్తూనే వుంటారు. ఆపరేషన్‌ లిబర్జీ పధకం కూడా అలాంటిదే. మధ్యంతర అధ్యక్షుడిగా జువాన్‌ గుయ్‌డో ప్రకటించుకోవటం, అతగాడి ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నట్లు అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలతో దాన్ని గుర్తింప చేయటం, మదురో సర్కార్‌ నియమించిన రాయబారులను గుర్తించటం లేదని ప్రకటించటం వగైరాలన్నీ అంతర్జాతీయంగా వెనెజులాలో ప్రభుత్వం మారిపోయిందని, మదురో ఇంకేమాత్రం అధ్యక్షుడు కాదని ప్రపంచాన్ని నమ్మింపచేయటం ఈ పధకంలో భాగమే. దీన్ని అనేక దశల్లో అమలు జరిపారు. విఫలమైన అంకం ఏప్రిల్‌ ఆరవ తేదీ నుంచి దేశంలో అంతర్గతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేయటం, మిలిటరీని తన వైపు రమ్మని కోరటం, తిరుగుబాటు చేయాలని అమెరికా పిలుపు ఇవ్వటం వంటి వన్నీ దానిలో భాగమే. కుట్రను గొప్పగా రూపొందించిన వారికి దాన్ని అనుసరించటానికి వెనెజులా జనం సిద్ధంగా లేరనే స్పృహ లేదు. అక్కడే పప్పులో కాలేశారు.

ఈ పధకంలో భాగంగా అమలు జరపాల్సిన వాటి మీద అమెరికాకు చెందిన సిఐఏ, యుఎస్‌ ఎయిడ్‌, ఎన్‌ఇడి వంటి వాటికి బాధ్యతలు అప్పగించారు. యుఎస్‌ ఎయిడ్‌ రూపొందించిన పలు దేశాలకు రూపొందించిన కార్యాచరణ పధకానికి సంబంధించిన పత్రం ఫిబ్రవరిలోనే వెల్లడైంది. ఆ సంస్ధకు అనుబంధంగా పనిచేసే ‘ యుఎస్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ లాబ్‌ ‘ 75పేజీల పత్రాన్ని రూపొందించింది. దానికి రాపిడ్‌ ఎక్స్‌పెడిషనరీ డెవలప్‌మెంట్‌(ఆర్‌ఇడి)(రెడ్‌) టీమ్స్‌: డిమాండ్‌ అండ్‌ ఫీజ్‌బులిటీ అని పేరు పెట్టింది.( వేగంగా దండయాత్ర నిర్వహించే బృందాలు: అవసరం మరియు సాధ్యాసాధ్యాలు) ఈ నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం వివిధ దేశాలలో రహస్య కార్యకలాపాలు నిర్వహించే సామర్ధ్యం గురించి అమెరికా మిలిటరీ, గూఢచార తదితర అధికారులు నివేదికను రూపొందించిన వారిని ఇంటర్వ్యూ చేశారు. ఒక్కో బృందం ఇద్దరిద్దరితో వుండాలని, ఎదురుదాడి, ఆత్మరక్షణ పద్దతులను, ప్రతికూల పరిస్ధితుల్లో ఎలా పని చేయాలో వాటికి నేర్పాలని అవి అమెరికా ప్రత్యేక దళాలు(ఎస్‌ఎఫ్‌) మరియు సిఐఏ పర్యవేక్షణలో పని చేయాలని నిర్దేశించారు. ఇవి స్ధానిక సామాజిక తరగతుల మధ్య అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తాయి. స్ధానికంగా వున్న పరిస్దితులను గమనించటం వాటికి అనుగుణంగా వెంటనే స్పందించి పధకాలు రూపొందించటం, నిధులు అందచేయటం, చిన్న చిన్న కార్యకలాపాల నిర్వహణ చేస్తాయి. వీటిలో సామాజిక కార్య క్రమాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే పేరుతో బోధలతో పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించటం కూడా వుంటాయి. దేశమంతటా స్వేచ్చ మరియు సహాయ కమిటీలను దేశ వ్యాపితంగా ఏర్పాటు చేయాలి. రెడ్‌ టీమ్స్‌ పైకి వుత్ప్రేరకాలుగా కనిపించాలి, వాటికి సామాజిక తరగతులను సమీకరించే పద్దతులు, చిట్కాలతో పాటు ఎదురుదాడి, ఆత్మ రక్షణకు ఆయుధాలను ఎలా వినియోగించాలో కూడా శిక్షణ ఇస్తారు. వారు స్ధానికులతో సంబంధాలను నెలకొల్పుకొని వారి ద్వారా మరికొందరిని ప్రభావితం చేసేందుకు, ప్రలోభపరచేందుకు వారి బలహీనతలను గుర్తించి డబ్బు,ఇతర వాటిని ఎరవేస్తారు. ఒకసారి వారి వలలో చిక్కిన తరువాత తమకు నిర్ధేశించిన రహస్యకార్యకలపాలలో నిమగ్నం చేస్తారు. ఈ అంశాలన్నీ ప్రతి దేశంలో అమలు జరపాల్సిన నమూనాలో భాగం. ఈ పధకాన్ని దక్షిణ అమెరికా దేశాలన్నింటా అమలు జరపాలి. ముందుగా అమెరికా పట్ల సానుకూలంగా వుండే ప్రభుత్వాలున్న దేశాలను ఎంచుకోవాలి. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు జరిపేందుకు బ్రెజిల్‌ను ఎంచుకోవాలని సూచించారు.

ఈ ఏడాది జనవరిలో బ్రెజిల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఫాసిస్టు జెయిర్‌ బల్‌సానారో అమెరికాతో సంబంధాల ఏర్పాటు గురించి బహిరంగంగానే చెప్పాడు. సిఐఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి బ్రెజిల్‌ అధ్యక్షుడయ్యాడు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ గతం కంటే తమ మధ్య సంబంధాలు బలపడ్డాయని, బ్రెజిల్‌ నాటోలో చేరాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తరువాత బొల్‌సానారో ఫిబ్రవరిలో ఒక ప్రకటన చేస్తూ తమ గడ్డ మీద నుంచి అమెరికా మరో దేశంలో సైనిక జోక్యం చేసుకోవటాన్ని తాము అనుమతించబోమని ప్రకటించాడు. అయితే తండ్రికి సలహాదారు, పార్లమెంట్‌ సభ్యుడైన ఎడ్వర్డ్‌ బొల్‌సానారో మార్చినెలలో మాట్లాడుతూ ఏదో ఒక సమయంలో వెనెజులాలో సైనిక జోక్యం అవసరమని, అన్ని అవకాశాలున్నాయని చెప్పాడు. అయితే బ్రెజిల్‌ నుంచి ప్రత్యక్ష జోక్యం చేసుకొనే అవకాశం లేకపోతే అక్కడి నుంచి రెడ్‌ బృందాలు రహస్య కార్యకలాపాలను నిర్వహించాలని సిఐఏ సూచించింది.

Image result for Venezuela 2 : operation liberty coup unveiled weeks before

నివేదికలో వెనెజులాలో నిర్వహించాల్సిన అంశాలను కూడా అనుబంధాలలో పొందుపరిచారు. ఏప్రిల్‌ ఆరవ తేదీన ఆపరేషన్‌ ఫ్రీడమ్‌ లేదా లిబర్టీ ప్రారంభమౌతుందని వాటిలో పేర్కొన్నారు. కాన్వాస్‌ అనే సంస్ధ అమెరికా నిధులతో వెనెజులాలో ప్రతిపక్ష పాత్రను ఎలా పోషించాలో జువాన్‌ గుయ్‌డోకు శిక్షణ ఇచ్చింది. దేశంలోని కీలకమైన వ్యవస్ధలను ధ్వంసం చేయటం ద్వారా మదురో ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తిని రెచ్చగొట్టటం వాటిలో ఒకటి. దానికి అనుగుణంగానే కొద్ది వారాల క్రితం వెనెజులా విద్యుత్‌ వ్యవస్ధను దెబ్బతీసి అంధకారం గావించిన విషయం తెలిసిందే. ఇలాంటి సలహాలు, ఎత్తుగడలు అమెరికా జోక్యం చేసుకొనే అన్నిదేశాలకూ సూచించారు. చిత్రం ఏమిటంటే వుదాహరణకు అని చెప్పినట్లుగా వెనెజులాలోని గౌరి డామ్‌ వద్ద వున్న సైమన్‌ బోలివర్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని దెబ్బతీస్తే పర్యవసానాలు ఎలా వుంటాయో వివరించారు.

ఆపరేషన్‌ లిబర్టీలో ఒక అంశం నిర్ణయాత్మక దశ అని పేరు పెట్టారు. దాన్ని ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీల్లో అమలు జరపాలని చూశారు. దాని ప్రకారం ఏం జరిగిందో కొందరు ప్రత్యక్ష సాక్షుల వివరణ సారాంశం ఇలావుంది.ఆపరేషన్‌ లిబర్టీలో భాగంగా ఏప్రిల్‌ 30వ తేదీ తెల్లవారు ఝామున 5.46 నిమిషాలకు కొంత మంది సైనికుల రక్షణగా కెమెరా ముందు నిలబడిన లియోపాల్డ్‌ లోపెజ్‌ మాట్లాడుతూ పౌరులు వీధుల్లో ప్రదర్శనలుగా రావాలని, జువాన్‌ గుయ్‌డో వేచి వున్న లా కార్లోటా వైమానిక స్ధావరం వద్ద అందరం కలసి అక్కడి నుంచి మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కదులుదామని చెప్పాడు. ఆ తరువాత అర్ధగంటకు తాను నిర్బంధం నుంచి విముక్తి అయ్యానని, గుయ్‌డోకు విధేయులుగా వున్న సైనికులు తనను విడిపించారని ఇది నిర్ణయాత్మక దశ అని విజయానికి ఇదే తరుణం అన్నాడు. కొద్ది సేపటికి తాను వైమానిక స్ధావరం వద్దకు వచ్చానని చెప్పాడు. అయితే పంపిన ఫొటోలు దాని వెలుపల రోడ్డుమీదివి తప్ప మరొకటి కాదు. వుదయం 8.30కు తుపాకి కాల్పులు వినిపించాయి. ఎవరు ఎవరి మీద కాల్చారో తెలియని స్ధితి. మధ్యాహ్నానికి రోడ్ల మీద కొన్ని వుందల మందే వున్నారు. అక్కడి నుంచి ప్రదర్శన జరుపుదామని గుయ్‌డో, లోపెజ్‌ జనంతో చెప్పారు. ఆ సమీపంలోనే అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌, తదితర ప్రభుత్వ భవనాలు వున్నాయి. అటువైపు ప్రదర్శన సాగాలని చెప్పిన తరువాత భద్రతా దళాలు ప్రదర్శకులను అడ్డుకున్నాయి. రెండు గంటల సమయంలో నేషనల్‌గార్డ్స్‌, బొలివేరియన్‌ పోలీస్‌లు ప్రదర్శకులపై కాల్పులు జరిపారు. కొద్ది మంది గాయపడటం తప్ప ఎవరూ మరణించలేదు. సాయంత్రానికి కొద్ది మంది నిరసనకారులు అక్కడే వున్నారు.ఎక్కువ మంది వెళ్లిపోయారు.

తన ప్రయత్నం విఫలమైందని అర్ధం కాగానే గుయ్‌డో మే ఒకటవ తేదీన పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చాడు. మరోవైపు లోపెజ్‌ కారకాస్‌లోని చిలీ రాయబార కార్యాలయంలో వున్న తన భార్యాబిడ్డలను తీసుకొని స్పానిష్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి ఆశ్రయం కోరాడు. అయితే వారు కార్యాలయానికి బదులు రాయబారి ఇంట్లో రక్షణ ఇచ్చారు. వారం రోజులుగా ఇప్పటికి అక్కడే వున్నాడు. ఇరవై అయిదు మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. గుయ్‌డో గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయాడు. తొలి రోజు ఒకడు మరణించినట్లు,59 మంది గాయపడినట్లు వార్తలు వచ్చాయి. రెండవ రోజు మే డే నాడు కొన్ని చోట్ల గుయ్‌డో మద్దతుదార్లు ఘర్షణలకు దిగారు. పోలీసు కాల్పుల్లో ఒక యువతి గాయపడి తరువాత ఆసుపత్రిలో మరణించింది. అంతకు ముందు రోజు రాత్రే తిరుగుబాటును అణచివేసినట్లు మదురో ప్రకటించాడు. మే డే రోజున పెద్ద ఎత్తున ఆయన మద్దతుదార్లు వీధుల్లో అనేక చోట్ల ప్రదర్శనలు జరిపారు. తిరుగుబాటుదార్లు, వారి నేతలు గుయ్‌డో, లోపెజ్‌ల పట్ల మదురో సర్కార్‌ ఎంతో సంయమనం పాటించిందన్నది స్పష్టం. లేకుంటే వారు అంత స్వేచ్చగా కారకాస్‌ శివార్లలో తిరిగే వారు కాదు. తప్పుదారి పట్టిన పౌరుల పట్ల కూడా భద్రతా దళాలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. భారీ ఎత్తున కాల్పులు జరిగాయని పశ్చిమ దేశాల మీడియా వార్తలు ఇచ్చింది. అయితే తరువాత అందుకు తగిన ఆధారాలు లేకపోవటంతో గప్‌చుప్‌ అయ్యాయి. తరువాత ఏమిటి అంటూ సమస్యను పక్కదారి పట్టించే కధనాలను ఇస్తున్నాయి. మచ్చుకు ఒకదాన్ని చూస్తే చాలు.

Image result for operation liberty coup

వెనెజులా పౌరులు పోగొట్టుకున్న తమ స్వాతంత్య్రం కోసం వీధుల్లోకి పెద్ద ఎత్తున వచ్చివుంటే ఎందరో మరణించి వుండేవారు. ఛావెజ్‌ను ఎన్నుకొని వారు పెద్ద తప్పు చేశారు. ఇరవై ఏండ్ల సోషలిజపు వినాశకర ప్రభావాలను చూస్తున్నారు. దశాబ్దకాలంగా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయింది. ప్రజాస్వామిక స్వేచ్చలను అణచివేశారు. భావ ప్రకటనా స్వేచ్చ, స్వతంత్ర మీడియా అదృశ్యమైంది. సమాజంలోని ప్రతి స్ధాయిలో క్యూబా గూఢచారులను నింపివేశారు. దేశాన్ని ఒక పోలీసు రాజ్యంగా మార్చివేశారు. చివరకు మదురో వ్యక్తిగత అంగరక్షకులుగా భారీ సంఖ్యలో రష్యన్‌ సాయుధులు వచ్చారు. వెనెజులా మిలిటరీ ప్రస్తుత నాయకత్వాన్ని బలపరచి ప్రయోజనం లేదని గ్రహించి తిరుగుబాటు చేసే వరకు రష్యా, చైనా మదురోకు మద్దతు ఇస్తూనే వుంటాయి. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పటం తొందరపాటు అవుతుంది.

ఇలా చెత్త రాతలన్నీ రాస్తున్నాయి. వాటన్నింటినీ దేవదూతల సందేశాలుగా భావించిన వారు ప్రచారంలో పెడుతున్నారు. ఆపరేషన్‌ లిబర్టీ కుట్ర ముందే వెల్లడి కావటంతో మదురో సర్కార్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవటం కూడా జయప్రదంగా దాన్ని తిప్పి కొట్టటానికి దోహదం చేసిందనవచ్చు. వాస్తవం ఏమిటో అనుభవించిన వారికి స్పష్టంగా తెలుసు, ప్రతిపక్ష నాయకుల గురించి కూడా వారికి చెప్పనవసరం లేదు. అయితే అమెరికన్లు తెగించి ప్రత్యక్ష సైనిక చర్యకు పాల్పడతారా, మరోసారి మిగతా దేశాలలో మాదిరి చేతులు కాల్చుకుంటారా అన్నది వచ్చే ఎన్నికలలో లబ్ది కోసం డోనాల్ట్‌ ట్రంప్‌ చేసే పిచ్చి ఆలోచనలను బట్టి వుంటుంది. ఒక వేల ప్రత్యక్ష జోక్యం చేసుకుంటే అది లాటిన్‌ అమెరికాలో, ప్రపంచంలో మరో కొత్త పరిణామాలకు నాంది అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘కుట్ర విఫలంపై మీడియా మూగనోము !

05 Sunday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

“Operation Liberty”, Juan Guaidó, Media’s Propaganda Campaign Against Venezuela’s Government, Nicolás Maduro, Nicolás Maduro Moros, Propaganda War, Venezuela

Image result for venezuela 1: mainstream media ignores failed coup

వెనెజులా పరిణామాలు -1

ఎం కోటేశ్వరరావు

ఏప్రియల్‌ 30వ తేదీన వెనెజులా వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ‘ ఆపరేషన్‌ లిబర్టీ ‘ (స్వేచ్చా ప్రక్రియ) పేరుతో అమలు జరపతలచిన కుట్రను మొగ్గలోనే నికోలస్‌ మదురో సర్కార్‌ తుంచివేసింది. ఇదెంత ప్రాధాన్యత కలిగిన అంశమో అమెరికా మరోసారి పచ్చి అబద్దాల కోరు అని ప్రపంచముందు బహిర్గతం కావటం కూడా అంతే ప్రాధాన్యత కలిగి వుంది. కూల్చివేత ప్రయత్నాల వార్తలకు అంతర్జాతీయ మీడియా ఇచ్చిన ప్రాధాన్యత దాని తుంచివేతకు ఎందుకు ఇవ్వలేదో నిజాయితీగా ఆలోచించే వారు అర్ధం చేసుకుంటారు. వెనెజులా మీద ఇప్పుడు బహుముఖ దాడి జరుగుతోంది. దానిలో ఆర్ధిక దిగ్బంధనం, ప్రచారదాడి, మతాన్ని వినియోగించటం, మిలిటరీని, జనాన్ని అంతర్గత తిరుగుబాట్లకు రెచ్చగొట్టటం ఇలా అనేక రకాలుగా సాగుతోంది. ఇది ఈ నాటిది కాదు, ఇప్పటితో అంతమయ్యేది కాదు. ఇది ఒక్క వెనెజులాకే పరిమితం కాదు. తనను రాజకీయంగా వ్యతిరేకించే వారు ఎక్కడ అధికారానికి వస్తే అక్కడ వారిని కూల్చివేయటం, ఆయా దేశాలు, ప్రాంతాలను ఆక్రమించకోవటం లేదా తన ఆధిపత్యం కిందకు తెచ్చుకోవటం అమెరికాకు నిత్యకృత్యం.

ఐరోపో నుంచి వలస వెళ్లిన వివిధ దేశాలకు చెందిన వారు స్ధానిక రెడ్‌ ఇండియన్లను అణచివేసి నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పరిగణించబడుతున్న, ఇతర అమెరికా ఖండ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. అవి వివిధ ఐరోపా దేశాల వలస ప్రాంతాలుగా మారాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మెజారిటీ ప్రాంతాలు(అమెరికా) బ్రిటీష్‌ పాలనలో వున్నాయి. తమకు తామే పరిపాలించుకొనే శక్తి వచ్చింది కనుక బ్రిటీష్‌ పెత్తనం ఏమిటంటూ వలస వచ్చిన వారు చేసిన తిరుగుబాటు కారణంగానే 1776లో అమెరికాకు స్వాతంత్య్రం వచ్చింది. అంతర్యుద్ధం ముగిసి కుదుట పడిన తరువాత వారే తొలుత తమ పరిసరాలను, తరువాత ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకొని మరోబ్రిటన్‌ మాదిరి తయారయ్యేందుకు ప్రయత్నించారు. బ్రిటీష్‌ వారు మన దేశంలో ముందు రాజులు, రాజ్యాల మీద యుద్దాలు చేయలేదు. ప్రలోభాలు, కొన్ని ప్రాంతాల మీద హక్కులు సంపాదించుకున్నారు. అమెరికా విషయానికి వస్తే ప్రస్తుతం అమెరికాలోని పదిహేను రాష్ట్రాలలో, కెనడాలో కొంత భాగం, హైతీగా వున్న దేశంతో కూడిన ఫ్రెంచి ఆధీనంలోని లూసియానా ప్రాంతాన్ని 1803లో అమెరికా కొనుగోలు చేసింది. 1699 నుంచి 1762 వరకు తన ఆధీనంలో వున్న లూసియానా ప్రాంతాన్ని ఫ్రెంచి పాలకులు స్పెయిన్‌కు దత్తత ఇచ్చారు. 1800 సంవత్సరంలో తిరిగి వుత్తర అమెరికా ఖండంలో తమ పాలనను విస్తరించేందుకు లూసియానాను తిరిగి తీసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే హైతీ ప్రాంతంలో తలెత్తిన తిరుగుబాటును ఫ్రెంచి సేనలు అణచివేయలేకపోయాయి. దానికి తోడు బ్రిటన్‌తో తలపడేందుకు సన్నాహాలలో భాగంగా లూసియానా ప్రాంతాన్ని విక్రయించేందుకు ఫ్రాన్స్‌ ప్రయత్నించింది. తనకు రేవు పట్టణమైన న్యూ ఆర్లినియన్స్‌ పరిసరాలను కొనుగోలు చేయాలని ముందుగా భావించిన అమెరికా సర్కార్‌ ఫ్రాన్స్‌ బలహీనతను సాకుగా తీసుకొని మొత్తం ప్రాంతాన్ని కొనుగోలు చేసింది.కోటీ 80లక్షల ఫ్రాంకుల అప్పురద్దు రద్దు చేసి మరో ఐదు కోట్ల ఫ్రాంకులను అందుకుగాను చెల్లించింది.(2017 విలువ ప్రకారం 600బిలియన్‌ డాలర్లకు అది సమానం) ఇలా ఇతర దేశాల ప్రాంతాలను కొనుగోలు చేయటం అమెరికా రాజ్యాంగానికి విరుద్దం అని ప్రతిపక్ష ఫెడరలిస్టు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తే అధ్యక్షుడిగా తనకున్న అధికారాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకొని కొత్త ప్రాంతాలను సేకరించవచ్చని థామస్‌ జఫర్సన్‌ సమర్ధించుకున్నాడు. అలా అమెరికా విస్తరణ తొలుత ఒప్పందాలతో ప్రారంభమైతే తరువాత సామ్రాజ్యవాదిగా మారి 1846లో మెక్సికో నుంచి నేటి టెక్సాస్‌ ప్రాంతాన్ని యుద్దంలో ఆక్రమించుకున్న అమెరికా నాటి నుంచి నేటి వెనెజులా వరకు అనేక ప్రభుత్వాలను అదిరించటం,బెదిరించటం, లొంగని వారిని అడ్డుతొలగించుకోవటం, వలసలు చేసుకోవటం, అది సాధ్యం కానపుడు తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేయటం వరకు అన్ని ఖండాలలో అమెరికా పాల్పడని అప్రజాస్వామిక చర్య లేదు. అంతర్జాతీయ చట్టాలకు వక్ర భాష్యం చెప్పటం ఒకటైతే తన పధకాల అమలుకు ఇతర దేశాల మీద స్వంత చట్టాలను రుద్దటం మరొక దుశ్చర్య.

స్పానిష్‌ వలస పాలన నుంచి విముక్తి పొందిన లాటిన్‌ అమెరికా లేదా దక్షిణ అమెరికా దేశాలలో వెనెజులా ఒకటి. గత వంద సంవత్సరాలలో సామ్రాజ్యవాదుల జోక్యం, మిలిటరీ నియంతలు, ఆర్ధిక పతనాలు ఇలా ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్న దాని చరిత్రను మూసి పెట్టి వామపక్షాల పాలనలోనోనే దేశమంతా పాచిపోయిందనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో వున్న మదురో, అంతకు ముందున్న ఛావెజ్‌లనే కాదు,తనను వ్యతిరేకించిన వామపక్ష వాదులు కాని అనేక మందిని అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో కూల్చివేసేందుకు, గద్దెల నెక్కించేందుకు ప్రయత్నించిన అమెరికా చరిత్ర దాస్తే దాగేది కాదు. వెనెజులా విషయానికి వస్తే 1951-58 మధ్య అధికారంలో వున్న నియంత పెరెజ్‌ జిమెంజ్‌ను అమెరికా బలపరిచింది.1958లో వామపక్ష, మధ్యేవాదులుగా వున్న వారు తిరుగబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు. మరో నియంతను బలపరిచే అవకాశాలు లేక తరువాత కాలంలోే ఏ నినాదంతో ధికారంలోకి వచ్చినప్పటికీ పాలకులందరినీ తన బుట్టలో వేసుకొని తన అజెండాను అమలు జరపటంలో అమెరికా జయప్రదమైంది. వామపక్ష వాది ఛావెజ్‌ విషయంలో కూడా అమెరికా అదే అంచనాతో వుంది. అది వేసుకున్న తప్పుడు అంచానాల్లో అదొకటిగా చరిత్రలో నమోదైంది. ఆయన వారసుడిగా అధికారంలోకి వచ్చిన నికొలస్‌ మదురో విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ఆయనను తొలగించేందుకు ఆపరేషన్‌ లిబర్టీ పేరుతో విఫలయత్నం చేసింది. దానికి ముందుగా, ఆ సమయంలోనూ, తరువాత ప్రచార దాడిని కొనసాగిస్తోంది. ఈ దాడి తీరుతెన్నులను ముందుగా పరిశీలిద్దాం,( తరువాయి భాగాల్లో మిగతా అంశాలు)

దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమనే వాట్సాప్‌, లైక్స్‌ కొట్టే ఫేస్‌బుక్‌ మరుగుజ్జులు చెలరేగిపోతున్న తరుణమిది. సామ్రాజ్యవాదం తన ప్రచార దాడికి వుపయోగించే ఆయుధాలలో సాంప్రదాయక మీడియాతో పాటు ప్రస్తుతానికి సామాజిక మీడియాలో ఇవెంతో శక్తివంతగా పని చేస్తున్నాయి. అనేక మంది వాటి దాడికి మానసికంగా బలి అవుతున్నారు. వామపక్ష ప్రభుత్వాలు అమలు జరిపిన అనేక పధకాల వలన వెనెజులా ఆర్ధిక వ్యవస్ధ దివాలా దీసింది, జనాన్ని సోమరులను గావించింది, మన దేశాన్ని లేదా తెలుగు రాష్ట్రాలను ఇలా కానివ్వ వద్దు అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనిలో పేరు మోసిన ఒక రచయిత కూడా స్టార్‌ కాంపెయినర్‌గా మారటంతో అనేక మంది దృష్టిని ఆకర్షించింది. చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు.

Image result for media war on venezuela

వెనెజులా గురించిన ఈ ప్రచారం 2001లో ప్రారంభమైంది.1999లో వామపక్ష వాది హ్యూగో ఛావెజ్‌ తొలిసారి అధికారానికి వచ్చారు. అప్పటికే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్ధ ఘోరవైఫల్యం చెందిన కారణంగానే ఆయనను జనం అందలం ఎక్కించారు. కానీ మీడియా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం గురించి ఏమాత్రం తెలియనట్లే వుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా జరిపిన దుశ్చర్యలు, అది బలపరిచిన పాలకులు జరిపిన మారణకాండ, పర్యవసానాలలో రెండు కోట్ల మంది మరణించారని, లిబియా, ఎమెన్‌, లెబనాన్‌, సిరియాలలో జరిగిన మానవ నష్టం దీనికి అదనమని జేమ్స్‌ ఏ లూకాస్‌ అంచనా వేశారు. వెనెజులాలో అత్యవసర ఔషధాలు లేక 40వేల మంది మరణించారని చెబుతున్నా, అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని అంటున్నా, మిలియన్ల మంది పొరుగుదేశాలకు వలసపోయారంటూ అతిశయోక్తులు చెబుతున్నా, అవన్నీ అమెరికా, దాని కనుసన్నలలో వ్యవహరించే పొరుగుదేశాలు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, అమెరికా విధించిన ఆంక్షలే కారణం తప్ప వామపక్ష పాలకులు కాదు. ఇవన్నీ మీడియాకు, పరిశీలకులకు కనిపించవా?

వెనెజులా ఎంతో ధనిక దేశం వామపక్ష పాలనలో దివాలా తీసిందన్నది మరొక ప్రచారం.1999లో ఛావెజ్‌ అధికారానికి వచ్చినపుడు అక్కడ జనాభాలో సగం మంది దారిద్య్రరేఖకు దిగువన, పొరుగు దేశాలతో పోల్చితే శిశు మరణాలు రెండు రెట్లు ఎక్కువ. మరి ధనిక దేశం అయితే అలా ఎందుకున్నట్లు ? అంతకు ముందున్న పాలకులందరూ అమెరికాతో మిత్రులుగా వున్నవారే కదా ! అనేక దేశాలలో వామపక్ష, వుదారవాదులుగా వుంటూ అధికారంలోకి వచ్చిన వారిని అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంది. చిలీలో అందుకు వ్యతిరేకించిన సాల్వెడార్‌ అలెండీని హతమార్చింది. వెనెజులాలో కూడా ఛావెజ్‌ను తమ వాడిగా మార్చుకోవచ్చని ఆశించిన అమెరికాను 2001లో ఆయన తొలి దెబ్బతీశాడు. ఆప్ఘనిస్తాన్‌లో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించి ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించటంతో అప్పటి నుంచి కుట్రలు మొదలు.2002లో మిలిటరీ తిరుగుబాటు చేసి వాణిజ్యవేత్త పెడ్రో కార్‌మోనాకు అదికారం అప్పగించారు. అప్పుడు జార్జి బుష్‌ ఆ తిరుగుబాటను సమర్ధించాడు. వెంటనే ఐఎంఎఫ్‌ రంగంలోకి దిగి సాయం చేస్తామని ప్రకటించింది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఆ తిరుగుబాటు విఫలం కాకుండా చూడాలని సంపాదకీయం రాసింది.’కాబోయే నియంత’ ను తొలగించారని ఛావెజ్‌ను వర్ణించింది, ఆయన స్ధానంలో గౌరవనీయుడైన వాణిజ్యవేత్తను ప్రతిష్టించారని ప్రశంసించింది. ఈ కుట్ర వెనుక అమెరికా వుందని ఛావెజ్‌ అబద్దాలు చెబుతున్నారని గార్డియన్‌ పత్రిక ప్రకటించింది. .అయితే ఆ కుట్ర విఫలమై తిరిగి ఛావెజ్‌ అధికారానికి వచ్చాడు. వెంటనే ప్రభుత్వ చమురు కంపెనీలో విద్రోహ చర్యలకు పాల్పడి పెద్ద నష్టం కలిగించారు. అప్పటికే వున్న ఆర్ధిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. నిరుద్యోగం, దారిద్య్రం పెరిగింది. దానికి కారకులు ఎవరు?

Image result for media war on venezuela

దాన్నుంచి బయట పడేందుకు ఛావెజ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా వ్యాపారవేత్తలు తమకు అనువుగా మార్చుకొని మరిన్ని కొత్త సమస్యలను తెచ్చిపెట్టారు.ఛావెజ్‌ మరణించిన తరువాత 2014లో ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు పతనమయ్యాయి. దాంతో ఇబ్బందులు పెరిగాయి. అయినా నికొలస్‌ మదురో స్వల్పమెజారిటీతో విజయం సాధించటంతో తిరిగి కుట్రలు మరో దశకు చేరాయి. బరాక్‌ ఒబామా 2015లో ఆంక్షలను ప్రకటించాడు. ఏ సాకూ దొరక్క మదురో సర్కార్‌ వుండటం తమ జాతీయభద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ కొనసాగిస్తున్నాడు.మరిన్ని కొత్త ఆంక్షలు విధించాడు. వీటన్నింటిని విస్మరించిన మీడియా వెనెజులా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అతిగా చూపుతూ మొసలి కన్నీరు కారుస్తోంది. కెనడాకు చెందిన స్టెఫానీ నోలెన్‌ అనే జర్నలిస్టు వెనెజులా గురించి వాస్తవాలనే పేరుతో అనేక అవాస్తవాలను రాస్తూ ముగింపులో ఇలా పేర్కొన్నారు.’మదురో సర్కార్‌ అంతిమంగా పతనం అవుతుందని ప్రతిపక్ష నేత ఆశాభావంతో వున్నాడు. ఆహారం మొత్తం ఖాళీ అయింది, జనాన్ని వీధుల్లో దింపాలని, మదురో గద్దె దిగే వరకు వారు ఇండ్లకు వెళ్లకూడదనేవిధంగా ఆలోచనలు సాగుతున్నాయని రాశారు. దీనికి అమెరికా, ఇతర దేశాలు మద్దతు ఇస్తున్నాయని ఎలాంటి బెరకు లేకుండా ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. అంటే ఏం చేయాలో కూడా జర్నలిస్టులు నిర్ణయిస్తారు, అవన్నీ అమెరికా ఆలోచనలకు అనుకూలంగా వుంటాయి.

Image result for media war on venezuela

తాజా పరిణామాల విషయానికి వస్తే మదురో సర్కార్‌ కూలిపోనుందనే రీతిలో ఏప్రిల్‌ చివరివారంలో మీడియా వార్తలున్నాయి. తానే అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న గుయ్‌డో రాజధాని శివార్లలోని ఒక వైమానిక స్ధావరం సమీపంలో మకాం వేశాడు. గృహనిర్బంధంలో వున్న అతగాడి గురువు లియోపాల్డో లోపెజ్‌ను తప్పించి గుయ్‌డో వద్దకు చేర్చారు. తిరుగుబాటులో భాగంగా ఆ స్దావరాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది పధకం. అయితే అంతా పదిగంటల వ్యవధిలోనే ముగిసిపోయింది. తిరుగుబాటుదార్లు వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలో వున్నారు. లక్షల మందిగా వస్తారనుకున్న జనం ఎక్కడా జాడలేదు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి సిఎన్‌ఎన్‌ ఛానల్లో మాట్లాడుతూ మదురో క్యూబాకు పారిపోతున్నాడంటూ చేసిన అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున మీడియా జనం ముందు కుమ్మరించింది. ఏప్రిల్‌ 30, మే ఒకటవ తేదీన అంతర్జాతీయ మీడియాలో మొత్తంగా అక్కడ తిరుగుబాటు జరుగుతున్నట్లే వార్తలు వచ్చాయి. మదురోకు మద్దతుగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చిన జనం మీడియాకు కనిపించలేదు.బిబిసి అలాంటి వార్తనే రోజంతా ఇచ్చి చివరకు సాయంత్రానికి దాన్ని కొద్దిగా మార్చుకోవాల్సి వచ్చింది. కొద్ది మంది కిరాయి మనుషులను, గుయ్‌డోను పదే పదే చూపాయి. కుట్రలో భాగంగా కొన్ని చోట్ల సాగించిన దహనకాండను తిరుగుబాటుగా వర్ణించాయి. అయితే ఇంత జరిగినా మీడియాను వెనెజులా జనం విశ్వసించలేదు. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా జరుగుతున్న అసత్య ప్రచారం ప్రపంచం కంటే వారికి ఎక్కువగా తెలుసు. వాస్తవం ఏమిటో, కట్టుకధలేమిటో ఎరిగిన వారు. 2002లో తిరుగుబాటు సమయంలో నిరాయధుల మీద ఛావెజ్‌ సర్కార్‌ కాల్పులు జరిపిందని, మారణకాండ జరిపినట్లు కొన్ని మీడియా సంస్ధలు ప్రసారం చేసిన వీడియోలు నకిలీవని తేలింది. అందువలన విశ్వసనీయత కోల్పోయిన మీడియా వార్తలను వారు విస్మరించారు. వాస్తవాలు తెలియదు కనుక మన జనాల్లో కొంత మంది అలాంటి వాటిని నిజమే అని నమ్ముతున్నారు. సమాచార సామ్రాజ్యవాదానికి కావాల్సింది అదే.అయితే అందరినీ ఎల్లకాలం నమ్మించలేమనే వాస్తవం వారికి తెలిసినా, ఇదొక యుద్ధం కనుక అస్త్రాలను ప్రయోగిస్తూనే వుంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులాలో మంగళవారం నాటి తిరుగుబాటును అణచివేసిన వామపక్ష ప్రభుత్వం !

01 Wednesday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Caracas, Juan Guaidó, Leopoldo Lopez, Nicolás Maduro, Venezuela, Venezuelan Military Putsch, Venezuelan Opposition

ఎం కోటేశ్వరరావు

తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనికులు, ఇతర భద్రతా దళాలకు చెందిన కొద్ది మంది చేసిన తిరుగుబాటు ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచివేసినట్లు వెనెజులా అధ్య క్షుడు నికోలస్‌ మదురో మంగళవారం రాత్రి ప్రకటించారు. సైనిక అధికారులు, ఇతర ప్రముఖులతో కలసి గంటసేపు టీవీలో చేసిన ప్రసంగంలో వుదయం నుంచి జరిగిన పరిణామాలను దేశ ప్రజలకు వివరించారు. సాయుధ తిరుగుబాటును సాకుగా చూపి అమెరికా మిలిటరీ జోక్యానికి పాల్పడాలని కుట్ర చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్న సమాయానికి కొంత మంది విద్రోహులు బయటపడ్డారని వారిని వదిలేదని చెప్పారు. తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జువాన్‌ గుయ్‌డో అజ్ఞాతం నుంచి తిరుగుబాటుకు పిలుపునిస్తూ వీడియోలను విడుదల చేయటం , అక్కడక్కడా బారికేడ్ల ఏర్పాటు, దహనకాండ వుదంతాలు తప్ప ఎక్కడా తిరుగుబాటు సూచనలు లేవని వార్తలు వెల్లడించాయి. మదురోకు మిలిటరీ మద్దతు ఇవ్వటం లేదని గుయ్‌డో చెప్పుకున్నాడు. తమ నాయకుడికి పధకం ప్రకారం అమెరికా నుంచి రావాల్సిన సాయం అందలేదని అనుచరులు చెప్పినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే సైనిక తిరుగుబాటుకు బదులు బుధవారం నాడు శాంతియుత తిరుగుబాటులో భాగంగా లక్షల మంది వీధుల్లోకి వచ్చి తనకు మద్దతుగా ప్రదర్శనలు చేయాలని గుయ్‌డో విడుదల చేసిన వీడియోల్లో వుందని లండన్‌ నుంచి వెలువడే గార్డియన్‌ పత్రిక పేర్కొన్నది. బుధవారం నాడు వీధుల్లోకి వచ్చి ప్రతిపక్షాల కుట్రను విఫలం చేయాలని, మేడేను జరుపుకోవాలని మదురో కూడా తన మద్దతుదార్లకు పిలుపునిచ్చాడు. తాను మంగళవారం వుదయం రష్యన్ల మద్దతుతో వెనిజులా నుంచి క్యూబాకు పారిపోనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెప్పటాన్ని మదురో అపహాస్యం చేశాడు. వెనెజులాలో వున్న క్యూబన్‌ సైనికులు అక్కడ ఏదైనా మరణాలు, నష్టానికి కారకులైతే క్యూబా మీద మరిన్ని కఠిన ఆంక్షలు అమలు జరుపుతామని, కనుక వెంటనే స్వదేశానికి వెళ్లాలని మంగళవారం సాయంత్రం ట్విటర్‌లో డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. వెనెజులాలో పరిస్ధితి క్లిష్ట దశకు చేరుకుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ అన్నాడు.ముగ్గురు సీనియర్‌ అధికారులతో తాము సంప్రదించామని, మదురోను తప్పించేందుకు వారు అంగీకరించారని చెప్పుకున్నాడు. అయితే బోల్టన్‌ ఇలాంటి ఇలాంటి కలలు కనటం కొత్త కాదని వెనెజులా విదేశాంగ మంత్రి జార్జ్‌ అరియా వ్యాఖ్యానించాడు.

మంగళవారం తెల్లవారు ఝామున నాలుగు గంటల సమయంలో గుయ్‌డోకు గురువు, గృహనిర్బంధంలో వున్న ప్రతిపక్ష నేత లియోపోల్డో లోపెజ్‌ను కొంత మంది సాయుధులు తప్పించి వెలుపలకి తీసుకువచ్చారు. రాజధాని కారకాస్‌లో ఒక రహదారిని మూసివేశారు. నగరశివార్లలోని ఒక చోట లోపెజ్‌, గుయ్‌డో కలుసుకున్నారు. అక్కడి నుంచి వీడియోలు విడుదల చేశారు. రాజ్యాంగపరిషత్‌ అధ్యక్షుడు డియోసడాడో కాబెల్లో టీవీలో మాట్లాడుతూ కుట్రదారుల గురించి వివరించి బలివేరియన్‌ మిలిషియా వీధుల్లోకి వచ్చి అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన జరిపారు. తామనుకున్న విధంగా ఎలాంటి తిరుగుబాటు లేకపోవటంతో గుయ్‌డో కొంత మంది అనుచురులతో కలసి గుర్తు తెలియని ప్రాంతానికి తప్పించుకోగా లోపెజ్‌ తొలుత చిలీ రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడ వున్న కుటుంబసభ్యులతో కలసి తరువాత స్పెయిన్‌ రాయబార కార్యాలయానికి వెళ్లి శరణువేడినట్లు,25 మంది తిరుగుబాటు సైనికులు బ్రెజిల్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారని వార్తలు వచ్చాయి.

రాజధాని కారకాస్‌, ఇతర పట్టణాల్లో గుయ్‌డో అనుచరులు బారికేడ్లు ఏర్పాటు చేసి కొన్ని చోట్ల దహనకాండకు పాల్పడ్డారని, కారకాస్‌ శివార్ల నుంచి ప్రదర్శన జరిపేందుకు ప్రయత్నించిన గుయ్‌డోను భద్రతాదళాలు చెదరగొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఏడు గంటల పాటు గుయ్‌డో సామాజిక మాధ్యమానికి అందుబాటులో లేకుండా పోయాడు. ప్రతిపక్షం రెచ్చగొట్టే చర్యల పట్ల సంయమనం పాటించాలని మదురో మిలిటరీ, ఇతర భద్రతా దళాలను కోరాడు.తిరుగుబాటు యత్నాలను బలీవియా అధ్యక్షుడు ఇవోమొరేల్స్‌, క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ తీవ్రంగా ఖండించారు. ఐరోపా యూనియన్‌ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చేస్తూ హింస ఏరూపంలో వున్నా ఖండించాలని, సంయమనం పాటించాలని కోరగా, ఐరోపా పార్లమెంట్‌ అధ్యక్షుడు అంటోనియో టజని మాత్రం తిరుగుబాటును సమర్ధించాడు.

నాడు క్యూబా, నేడు వెనెజులాలో చరిత్ర పునరావృతం !

అమెరికా దేశాల సంస్ధ (ఒఎఎస్‌) నుంచి తప్పుకొనే ప్రక్రియను పూర్తి కావటంతో సంతోషం ప్రకటిస్తూ వెనిజులాలో అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఆ సంస్ధ అమెరికా కీలబొమ్మగా మారిందని ఇప్పుడు తాము మరింత స్వతంత్రంగా వున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. దీంతో ఆ సంస్ధ చేసే నిర్ణయాలకు కట్టుబడనవసరం లేదు. అది అమెరికా వలస దేశాల మంత్రిత్వశాఖ అని గతంలో కాస్ట్రో చేసిన విమర్శను మదురో పునరుద్ఘాటించారు.అమెరికా ఆంక్షలకు గురైన వెనెజులా విదేశాంగ మంత్రి జార్జి అరియా విదేశాంగశాఖ భవనంపై నుంచి శనివారం నాడు ప్రదర్శకులతో మాట్లాడుతూ మనం నిన్నటి కంటే నేడు మరింత స్వతంత్రుల మయ్యామని ప్రకటించారు. అమెరికా దేశాల సంస్ధ ప్రధాన కార్యదర్శి లూయీస్‌ మగారో అమెరికాకు వంతపాడుతూ అవసరమైతే మానవతా పూర్వకంగా మిలిటరీ జోక్యం చేసుకున్నాతప్పు లేదని గతంలో ప్రకటించాడు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో సభ్యదేశాలన్నీ గుయ్‌డో సర్కార్‌ను గుర్తించాలని తీర్మానించటమేగాక మదురో సర్కార్‌ ప్రతినిధి బదులు గుయ్‌డో మనిషిని సమావేశానికి ఆహ్వానించింది. ఈ పూర్వరంగంలో వెనిజులా రెండు సంవత్సరాల గడువు నిబంధనను పూర్తి చేసి ఆ సంస్ధ నుంచి వైదొలిగింది. వెనిజులా మీద దాడికి పాల్పడితే సహించేది లేదని రష్యా, చైనా హెచ్చరికలు చేశాయి. యాభై ఏడు సంవత్సరాల క్రితం క్యూబాలో క్షిపణుల మోహరింపు, నేడు వెనెజులాలో అదే పునరావృతం అయింది. నాడు అమెరికా తోక ముడిచి రాజీకి దిగి వచ్చింది.నేడు వుక్రోషంతో హూంకరింపులు చేస్తోంది. ముగింపు కూడా గతమే పునరావృతం అవుతుందా? ఆరు దశాబ్దాల నాటికి నేటికీ ప్రపంచం, రాజకీయాల్లో వచ్చిన మార్పులేమిటి? కొత్త వుద్రిక్తతలకు నాందీ వాచకం పలుకుతుందా, అంతర్జాతీయ పరిణామాలు, పర్యవసానాలు ఎలా వుంటాయి? వీటి మంచి చెడ్డలను ఎలా చూడాలి? రెండింటి మధ్య వున్న సామ్యాలు ఏమిటి ?

నాడు క్యూబాలో జరిగిందానికి, నేడు వెనెజులాలో జరుగుతున్నదానికి అమెరికా సామ్రాజ్యవాదులే కారణం. తమ గుమ్మం ఎదుట ఒక సోషలిస్టు రాజ్యం అవతరించటమా అని నాడు ఆగ్రహం వస్తే, అంతరించిపోయిందనుకు కున్న వామపక్ష శక్తి తన పెరటితోటలోనే పెరగటమా అని నేడు అమెరికా వూగిపోతోంది. క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన 1959లో ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కాస్ట్రో వ్యతిరేకులకు ఆయుధాలు, శిక్షణ ఇచ్చిన అమెరికా 1961లో జరిపిన తిరుగుబాటు కుట్రను బే ఆఫ్‌ పిగ్స్‌ అని పిలిచారు. ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌ దృష్టిని క్యూబా నుంచి మళ్లించేందుకు ఐరోపాలోని టర్కీ, ఇటలీలో ఖండాంతర క్షిపణులను మోహరించి రెచ్చగొట్టారు. అమెరికన్ల మద్దతుతో జరిగిన తిరుగుబాటును అణచివేసిన క్యూబా సర్కార్‌ తమకు రక్షణ కల్పించాలని కోరగా 1962 అక్టోబరులో క్యూబా గడ్డమీద సోవియట్‌ తన క్షిపణులను మోహరించింది. ఈ చర్య అమెరికా సమాజంలో ప్రభుత్వం మీద ఆగ్రహం కలిగించింది. తమకు అణ్వాయుధాల ముప్పు తెచ్చారంటూ తీవ్ర నిరసనలు, విమర్శలు చెలరేగాయి. రెండవది అదే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దానికే ఎదురు తిరగటంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముదు అంటే 1962 అక్టోబరు రెండవ పక్షంలో జరిగిన ఈ పరిణామంతో అమెరికా వెనక్కు తగ్గి సోవియట్‌ యూనియన్‌తో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టర్కీ, ఇటలీ నుంచి అమెరికా అణ్వాయుధాలను తొలగించాలి, దానికి ప్రతిగా క్యూబా నుంచి సోవియట్‌ తొలగిస్తుంది. క్యూబా వైపు నుంచి ప్రత్యక్షంగా రెచ్చగొట్టే చర్యలు వుంటే తప్ప తాముగా క్యూబాలో జోక్యం చేసుకోబోమని, సోవియట్‌తో న్యూక్లియర్‌ హాట్‌లైన్‌ ఏర్పాటు చేసుకుంటామని అమెరికన్లు దిగివచ్చారు.

ఇప్పుడు వెనిజులా విషయంలో అమెరికన్లు ఎత్తుగడను మార్చారు. సైన్యంలో తిరుగుబాట్లను రెచ్చగొట్టి విఫలమయ్యారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షానికి వచ్చిన మెజారిటీని ఆసరా చేసుకొని వామపక్ష మదురో సర్కార్‌ను కూలదోసేందుకు తెరతీశారు.ఈ ఏడాది జనవరి 23న పార్లమెంట్‌ స్పీకర్‌ జువాన్‌ గుయ్‌డో తనకు తానే దేశాధ్యక్షుడనని ప్రకటించుకున్నాడు. బయట ప్రమాణస్వీకార తతంగం కూడా జరిపాడు. దాన్ని అమెరికాతో సహా దాని అనుంగు దేశాలు గుర్తించాయి. గుయ్‌డోకు విధేయులై వుండాలని మిలిటరీ, అధికార యంత్రానికి చేసిన వినతికి స్పందన లేదు. వాస్తవానికి అంతకు ముందే అధ్యక్షుడు మదురో పార్లమెంట్‌ను రద్దు చేసి నూతన రాజ్యాంగ రచనకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. అందువలన గుయ్‌డో అధ్యక్షుడిగా అతను చేసిన ప్రమాణస్వీకారం చెల్లదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే విదేశాలలో ఏర్పాటు అయినట్లు చెప్పుకున్న గుయ్‌డో అనుకూల సుప్రీం కోర్టు అతన్ని సమర్ధించింది. తన పధకానికి అనుగుణంగా పరిణామాలు లేకపోవటంతో కంగు తిన్న అమెరికన్లు వెనెజులా మీద మరింత కఠినంగా ఆంక్షలు పెట్టటమే కాదు, దేశంలోని విద్యుత్‌ వ్యవస్ధను చిన్నాభిన్నం చేశారు. ప్రాణావసర ఔషధాలను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మానవతా పూర్వక సాయం పేరుతో ట్రక్కుల్లో ఆయుధాలు చేరవేసేందుకు పన్నిన ఎత్తుగడను మదురో సర్కార్‌ విఫలం చేసింది.

దీనికి ప్రతిగా వెనెజులా కోరిక మీద అమెరికన్ల అధునాతన ఆయుధాల దాడిని ఎదుర్కొనే వుపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే ఎస్‌300క్షిపణులను, వాటిని ప్రయోగించే మిలిటరీ నిపుణుల రష్యా తరలించింది. వాటిని దాపరికం లేకుండా వెనిజులా ప్రత్యక్షంగా ప్రదర్శించింది కూడా. దీనికి తోడు యాంగ్జీఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌లైన్స్‌ చైనా నుంచి బోయింగ్‌ 747 సరకు రవాణా విమానంలో ఔషధాలు, పరికరాలను చైనా పంపింది. నికొలస్‌ మదురో వుద్వాసనకు గురి కాబోతున్నాడంటూ సోమవారం నాడు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించాడు. లక్ష కోట్ల డాలర్ల సిల్కు రహదారి(దీన్నే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ అని పిలుస్తున్నారు) పారిశ్రామిక, వాణిజ్య పధకం గురించి 150దేశాలకు, 90సంస్ధలకు చెందిన ప్రతినిధులతో గతవారంలో బీజింగ్‌లో చైనా పెద్ద సమావేశం నిర్వహించింది. దానికి రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా 37దేశాధినేతలు కూడా హాజరయ్యారు.( ఈ సమావేశాన్ని అమెరికా,దానితో కౌగిలింతల దౌత్యం నడుపుతున్న మన దేశం కూడా బహిష్కరించింది) ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు గ్జీ గింపింగ్‌తో సమావేశమైనపుడు వెనిజులా ప్రస్తావన వచ్చిందని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలు ఆమోదయోగ్యం కాదని, ఇరుదేశాలు దానికి బాసటగా నిలవాలని, అమెరికా వైఖరిని ఖండిస్తూ వారు మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఇది అమెరికన్లకు ఆగ్రహం తెప్పించింది. క్యూబా మీద మరిన్ని ఆంక్షలు విధించటాన్ని గుర్తు చేస్తూ మదురో మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్ధితి ఎంతో మెరుగ్గా వుండేదని చెప్పేందుకే తామీ పని చేశామని, మదురోను సమర్ధించే దేశాలన్నింటికీ ఇదే చెప్పదలచుకున్నామని రష్యా, చైనాలను బెదిరిస్తూ పాంపియో మాట్లాడాడు. వెనెజులా పౌరులు, మిలిటరీకి, క్యూబన్లకు, రష్యన్లకు, మీరు గనుక వార్తలు చూస్తే వెనిజులాకు సాయం చేస్తున్న ఇరాన్‌కు, అదే విధంగా ఎంతో చేస్తున్న చైనాకూ ఇదే హెచ్చరిక అన్నాడు. మదురోకు మద్దతుదారుల్లో ఒకరు తిరుగుబాటుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. క్యూబా నుంచి వందల మంది అధికారులు, 20వేల మంది సనికులు వెనెజులా వెళ్లినట్లు అమెరికా చేసిన ఆరోపణలను క్యూబా అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌ తోసి పుచ్చారు. ప్రపంచంలో 800చోట్ల సైనిక స్ధావరాలు, లక్షల మంది సైన్యాన్ని దింపిన అమెరికా తమ గురించి మాట్లాడుతోందని,అబద్దాలు చెబుతోందని అన్నారు.

సర్వసత్తాక దేశాల్లో జోక్యం చేసుకొనే అమెరికా వైఖరిని రష్యా, చైనా ఖండించాయి. వెనిజులాపై చర్య తీసుకొనే అంశంలో తమ అధికారులు సిద్ధంగా వున్నారని అమెరికా దక్షిణ కమాండ్‌ నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ క్రెయిగ్‌ ఫాలర్‌ వెల్లడించాడు. ఈ ప్రకటన మిలిటరీ జోక్యం వూహకాదు వాస్తవమే అని రష్యా వ్యాఖ్యానించింది.అమెరికా అంతర్గత చట్టాల పేరుతో భద్రతా మండలి వెలుపల ఆం్షలు విధించటాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా పేర్కొన్నది.చైనా, ఇరాన్‌ మానవతా పూర్వక సాయాన్ని అందించేందుకు ప్రతినిధులతో పాటు విమానాల్లో సాయాన్ని కూడా పంపాయి. అమెరికా దాడికి సిద్ధం అవుతున్నదనే వార్తల పూర్వరంగంలో భద్రతా దళాలకు మద్దతుగా పది లక్షల మందిని సిద్ధం చేయాలని గతవారం మదురో ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.

గత నెల చివరి వారంలో రష్యా నుంచి యుద్ధనిపుణులు వెనిజులా చేరుకున్నారు. అమెరికా నుంచి ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు అవసరమైన ఎత్తుగడలను వారు రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మిలిటరీ కేంద్రాల సంరక్షణకు రష్యా తయారీ ఎస్‌-300 క్షిపణులను ప్రయోగించే నాలుగు సంచార వాహనాలను ఏర్పాటు చేశారు. ఛావెజ్‌ బతికి వున్న సమయంలోనే బ్రహ్మూెస్‌ క్షిపణులను మోసుకుపోగల సుఖోయ్‌ ఎస్‌యు-30 జట్‌ యుద్ధ విమానాలను, టి-72 టాంకులు, వేగంగా ప్రయాణించే పడవలు, ఎకె-103 తుపాకులను తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వుపరితలం నుంచి గగనతలంలోకి సైనికులు భుజాలపై వెంట తీసుకుపోగల క్షిపణి ప్రయోగ పరికరాలను పెద్ద సంఖ్యలో రష్యా సరఫరా చేసింది. అమెరికా తొత్తు గుయ్‌డోకు మద్దతు ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్ళిన గూఢచారశాఖ మాజీ అధిపతి కార్వాజల్‌ను స్పెయిన్‌లో మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు చేశారు.

Crowds gathered outside Miraflores Palace on Tuesday morning. (Cira Pascual Marquina)

అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్‌ను కాపాడుకోవాలని  మంగళవారం నాడు పెద్ద ఎత్తున జనం భవన పరిసరాల్లో ప్రదర్శన

అమెరికా విధించిన ఆర్ధిక, వస్తు సరఫరాలపై ఆంక్షలు, విద్యుత్‌ కేంద్రాలలో విద్రోహ చర్యల వంటి సమస్యల కారణంగా వెనిజులా పౌరులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారు గత నిరంకుశపాలనతో పోల్చుకొని మదురోకు బాసటగా నిలుస్తున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తట్టుకొనేందుకు వీలుగా కార్మికుల, వుద్యోగుల వేతనాలను మదురో సర్కార్‌ ఎప్పటికప్పుడు సవరిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి పరిస్ధితి మరింత దిగజారింది. ఆర్ధికంగా జనాన్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటం అమెరికా ఎత్తుగడగా వుంది.ఇప్పటికే చమురుపై ఆంక్షల కారణంగా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయింది. 2017-18లో 40వేల మంది చావులకు అమెరికా ఔషధాలపై విధించిన దుర్మార్గ ఆంక్షలే కారణం. మరో మూడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 2013లో 11.2బిలియన్‌ డాలర్ల మేరకు ఆహారం దిగుమతి చేసుకుంటే ఆంక్షల కారణంగా 2018లో అది 2.46బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు వార్తలు వచ్చాయి.

ఇన్ని ఇబ్బందులను భరిస్తున్నప్పటికీ అమెరికా వ్యతిరేక వైఖరిలో ఇంతవరకు జనంలో పట్టుసడల లేదు. అమెరికాకు చెందిన గాలప్‌ సంస్ధ ఇటీవల జరిపిన సర్వేలో వెనిజులా పౌరుల కంటే ప్రపంచంలో అత్యంత ధనికులు, శక్తివంతులైన అమెరికన్లే ఎక్కువ వత్తిడికి లోనవుతున్నట్లు 2019 ప్రపంచ మనోద్వేగ నివేదికలో గాలప్‌ సంస్ధ తెలిపింది. పగలు తాము అత్యంత వత్తిడికి లోనవుతున్నట్లు 55శాతం మంది అమెరికన్లు చెప్పారట. ఇరాన్‌, శ్రీలంక,అల్బేనియా, అమెరికా నాలుగవ స్ధానంలో వున్నాయి. మొదటి మూడు స్ధానాల్లో గ్రీస్‌, ఫిలిప్పయిన్స్‌, టాంజానియా వున్నాయి.అనేక ఇబ్బందులున్నప్పటికీ వెనెజులా 12వ స్ధానంలో వుంది.

క్యూబాపై అమెరికా కుట్ర చేసిన సమయంలో క్షిపణులను మోహరించిన సోవియట్‌ యూనియన్‌ సోషలిస్టు రాజ్యం. సోదర దేశాన్ని రక్షించటం తన బాధ్యతగా ఎంచుకుంది. ఆ సమయం చైనా కూడా సోషలిస్టు దేశమే అయినప్పటికీ సోవియట్‌ మాదిరి శక్తి కలిగినది కాదు, అంతర్గత ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇప్పుడు రష్యాకు అలాంటి బాధ్యత లేనప్పటికీ ఐరోపాలో తనకు ఎసరు పెడుతున్న అమెరికాను అడ్డుకోవాలంటే దాని పెరటితోటలోనే తాను పాగా వేయగలమన్న హెచ్చరిక దాని చర్యలో కనిపిస్తోంది. మరోవైపున క్యూబా, వెనిజులా, తదితర సోషలిస్టు, వామపక్ష ప్రభుత్వపాలనలో వున్న దేశాల పట్ల చైనా ఇటీవలి కాలంలో బాసటగా నిలవటం మరింత ఎక్కువగా చేస్తున్నది. మాటల కంటే చేతల్లో చూపుతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఓటర్లకు స్వేచ్చే బెంగాల్‌ ఎన్నికల అసలు సమస్య !

30 Tuesday Apr 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Congress, CPI(M), INC, Mamatha Benarjee, Trinamool Congress, West Bengal election

ఎం కోటేశ్వరరావు

దేశంలో ఇప్పటికి నాలుగు దశల ఎన్నికలు జరిగాయి. మరో మూడు దశలకు సిద్ధం అవుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పశ్చిమబెంగాల్లో నాలుగు దశల్లోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఓటర్లను అనేక చోట్ల అధికార తృణమూల్‌ అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయి. త్రిపురలో తొలి దశలో పోలింగ్‌ జరిగిన నియోజకవర్గంలో వందలాది పోలింగ్‌ కేంద్రాలలో సిపిఎం ఏజంట్లను రాకుండా బిజెపి గూండాలు అడ్డుకున్నారు, రిగ్గింగుకు పాల్పడ్డారు. రెండవ నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిస్ధితి దిగజారటంతో ఎన్నికల కమిషన్‌ మొత్తం నియోజకవర్గ పోలింగ్‌నే మరొక రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఒకరి అప్రజాస్వామిక చర్యల గురించి ఒకరు రోజూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్న బిజెపి, తృణమూల్‌ రెండూ ఒకే విధమైన చర్యలకు పాల్పడుతున్నాయి. దేశంలో బిజెపిని విమర్శించే పార్టీలు త్రిపుర గురించి మాట్లాడలేదు. అలాగే మమతాబెనర్జీని తమతో కలుపుకొని కేంద్రంలో రాబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న ప్రాంతీయ పార్టీలు పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య ఖూనీ గురించి నోరెత్తటం లేదు. గతంలో సిపిఎ పాలనలో సైంటిఫిక్‌ రిగ్గింగ్‌ అంటూ అన్‌సైంటిఫిక్‌ వాదనలు, ప్రచారం చేసిన వారు ఇప్పుడు పల్లెత్తు మాట్లాడటం లేదంటే నాడు పని గట్టుకొని ప్రచారం చేసిన వారు తప్ప నిజమైన ప్రజాస్వామిక వాదులు కాదన్నది స్పష్టం. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రానివ్వలేదన్న విమర్శలు, ఆరోపణలు వామపక్ష ప్రభుత్వ హయాంలో రాలేదు.

పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అన్నది ఇప్పుడు ప్రధానం కాదు. అసలు తమ ఓటు తాము వేసుకొనే స్చేచ్చను ఓటర్లకు ఇస్తారా అన్నది అసలు సమస్య. ఒక విధంగా చెప్పాలంటే ఓటర్లు-త ణమూల్‌ కండబలం మధ్య పోటీగా వుంది. మూడు దశల పోలింగ్‌లో వెల్లువెత్తిన ఆరోపణలు మిగిలిన నాలుగు దశల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. అభ్యర్ధులను ప్రచారం చేసుకోనివ్వరు,(స్ధానిక సంస్ధల్లో అయితే అసలు నామినేషన్లనే వేయనివ్వలేదు) అనుమానం వచ్చిన ఓటర్లను బూత్‌లకు రానివ్వరు, వచ్చిన వారు అధికార త ణమూల్‌కు ఓటేయలేదని అనుమానం వస్తే చావచితక కొడతారు అన్న విమర్శలు వచ్చాయి. అయినా రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. చిత్రం ఏమిటంటే ఎవరికి ఓటు వేసినా ఒకే పార్టీకి పడేవిధంగా, జాబితాలో వున్న వారి కంటే ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయని, ఇలా రకరకాలుగా ఎన్నికల ఓటింగ్‌ యంత్రాల మీద విమర్శలు చేస్తున్న వారు పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే మాట్లాడటం లేదన్న విమర్శలున్నాయి. ఈ పూర్వరంగంలో అక్కడ ఏ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నా, ఓటర్లను కదిలించినా, వాస్తవాలను వివరించినా ఫలితం ఏమిటి, అసలు ఎన్నికలను బహిష్కరిస్తే పోలా అనే వారు వుండవచ్చు. అలా వూరందరికీ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు మమతాబెనర్జీ అధికారానికి రావటానికి దోహదం చేసిన వారిలో వున్నారంటే వులిక్కిపడాల్సిన పనిలేదు. ఇప్పుడు వారే వైఖరి తీసుకున్నారో తెలియదు. ఏ పిలుపు ఇచ్చినా పట్టించుకొనే వారు వుండరు.

అత్యవసర పరిస్ధితికి ముందు 1971లో కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమబెంగాల్‌ ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చివేసింది. తాము విజయం సాధిస్తామన్న నియోజకవర్గాలలో మినహా మిగిలిన అన్నిచోట్లా సామూహిక రిగ్గింగ్‌కు పాల్పడింది. ఆ నాడు కూడా ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నోరు మెదపలేదు. కమ్యూనిస్టులనే కదా తొక్కేసింది అన్నట్లుగా వున్నాయి. తరువాత అదే కాంగ్రెస్‌ సిపిఎంతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీల(సిపిఐ ఆ నాడు కాంగ్రెస్‌కు పూర్తిగా మద్దతు ఇస్తున్న కారణంగా దాన్ని మినహా) నేతలందరినీ అత్యవసర పరిస్ధితి పేరుతో జైల్లో పెట్టింది. ఇప్పుడు మమతాబెనర్జీ అకృత్యాలను విమర్శించని పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చుగానీ, ప్రజాస్వామిక ప్రక్రియకు తలపెట్టిన హాని గురించి ఎందుకు పట్టించుకోవు? అవి కూడా తమకు ప్రాబల్యం వున్న ప్రాంతాలలో అలాంటి పనులు చేసిన చరిత్ర కలిగినవే, వర్గ రీత్యా ఒకే తానులో ముక్కలు కనుకే అలా వ్యవహరిస్తున్నాయి.

పైన పేర్కొన్న పరిమితుల పూర్వరంగంలో అక్కడి ఎన్నికల తీరు తెన్నులను చూద్దాం. రాష్ట్రమంతటా అలాంటి పరిస్ధితి వున్నప్పటికీ అనేక చోట్ల తృణమూల్‌ను వ్యతిరేకించే శక్తులు కూడా వున్నాయి. కనుకనే వామపక్షాలు, ఇతరులకు ఆ మేరకైనా ఓట్లు వస్తున్నాయి. దేశమంతటినీ గతంలో ఆకర్షించిన నియోజకవర్గాలలో జాదవ్‌పూర్‌ ఒకటి.లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన సోమనాధ్‌ చటర్జీని ఓడించి మమతాబెనర్జీ జెయింట్‌ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ త ణమూల్‌ అభ్యర్ధిగా సినీ నటి మిమి చక్రవర్తి పోటీ చేస్తుండగా సిపిఎం తరఫున కొల్‌కతా మాజీ మేయర్‌ వికాస్‌ రంజన్‌ భట్టాచార్య, ఇటీవల త ణమూల్‌ నుంచి వుద్వాసనకు గురైన మాజీ ఎంపీ అనుపమ్‌ హజ్రా బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. కొల్‌కతా నగరంలో కొంత భాగం, గ్రామీణ ప్రాంతాలతో నిండి వున్న ఈ నియోజకవర్గంలోని జాదవ్‌ పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 2011లో మినహా 1967 నుంచి సిపిఎం అభ్యర్దులే ఎన్నిక అవుతున్నారు. ప్రస్తుతం అక్కడ సిపిఎం నే సుజన్‌ చక్రవర్తి ఎంఎల్‌ఏగా వున్నారు. త ణమూల్‌-సిపిఎం మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోందనే అభిప్రాయం వెల్లడైంది. లాయర్‌ అయిన భట్టాచార్య నియోజకవర్గంలో అనేక కేసులలో ముఖ్యంగా వివిధ చిట్‌ఫండ్‌ మోసాల కేసుల్లో వందలాది మంది తరఫున ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా వాదించి వారి సొమ్మును వెనక్కు ఇప్పించిన వుదంతాలు వున్నాయి. పోటీ తీవ్రంగా వున్నప్పటికీ రోజు రోజుకూ సులభం అవుతోందని భట్టాచార్య అంటున్నారు. రాజకీయాలకు కొత్త, ఏమీ తెలియని సినీనటి మిమి గురించి అనేక మంది పెదవి విరుస్తున్నారు. సిపిఎం అభ్యర్ధి మంచి వాడైనప్పటికీ తగిన సంస్దాగత పట్టులేదని కొందరు అభిప్రాయపడ్డారు. 2011 ఎన్నికల్లో ఓటమి తరువాత సిపిఎంకు ఈ పరిస్ధితి ఏర్పడింది. మార్పు కోసం ఓటు వేయాలని జనానికి వున్నప్పటికీ త ణమూల్‌ గూండాలు వారిని అనుమతించే అవకాశాలు లేవని ఓటర్లు భయపడుతున్నారని వికాస్‌ రంజన్‌ భట్టాచార్య అన్నారు.

మీరు ఈ నియోజకవర్గానికి చెందిన వారు కదా అన్న ప్రశ్నలకు బిజెపి అభ్యర్ధి హజ్రా మాట్లాడుతూ టిఎంసి అభ్యర్ధిని మిమి చక్రవర్తి ఎక్కడో జల్పాయిగురికి చెందిన వారు, ఆమెకూడా వెలుపలి వ్యక్తే కదా, అయినా నియోజకవర్గ ఓటర్లు బిజెపితోనే వున్నారు. త ణమూల్‌ నేరగాండ్లు, సంఘవ్యతిరేకశక్తులకు నిలయంగా మారినందునే తాను బిజెపిలో చేరానని, వారు నాపై బురద చల్లుతున్నారని అన్నారు. ఈ నియోజకవర్గంలోని భంగోర్‌ అసెంబ్లీ స్ధానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అబ్దుల్‌ రజాక్‌ మొల్లా ప్రస్తుతం మమతా మంత్రి వర్గ సభ్యుడు. గత రెండు సంవత్సరాలలో కావలసినంత చెడ్డపేరు తెచ్చుకున్నాడీ మాజీ సిపిఎం నేత. ప్రస్తుతం త ణమూల్‌ అభ్యర్ధి తరఫున ప్రచారంలో ఎక్కడా కనిపించటం లేదని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. చివరి దశలో పోలింగ్‌కు ఇంకా సమయం వుంది కనుక తరువాత రంగంలోకి వచ్చేది లేనిదీ తెలియదు. సింగూరులో పరిశ్రమలకు భూమి సేకరించటాన్ని వ్యతిరేకించిన త ణమూల్‌కు భంగోర్‌లో నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు అదే పరిస్ధితి ఎదురైంది. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను వ్యతిరేకించిన వారిపై 2017లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. స్ధానిక త ణమూల్‌ ఎంఎల్‌ఏగా గతంలో పనిచేసిన అరబుల్‌ ఇస్లాం తన అనుచరులతో బెదిరించి భూములు స్వాధీనం చేసుకున్నాడు. త ణమూల్‌ గూండాయిజానికి పేరుమోసిన ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో వచ్చిన భారీ మెజారిటీ త ణమూల్‌ గెలుపును నిర్ధేశించింది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదన్నది ఒక అభిప్రాయం.

ఒక్క జాదవ్‌పూరే కాదు, ఏ నియోజకవర్గంలోనూ ఓటర్ల అభీష్టం మేరకు ఓట్లు వేసుకొనే స్వేచ్చాపూరిత వాతావరణం లేదన్నది సర్వత్రా వెల్లడౌతున్న అభిప్రాయం. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు త ణమూల్‌ ధన, కండబలాన్ని వుపయోగించి తన స్ధానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పుడేఇపుపడే కింది స్ధాయి క్యాడర్‌, సానుభూతి పరుల్లో భయం వదులుతున్న స్ధితిలో సిపిఎం, మొత్తంగా వామపక్ష సంఘటన తిరిగి తన మద్దతుదార్లను కూడగట్టుకొని పోయిన స్ధానాలను తిరిగి సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. పన్నెండు సంవత్సరాల తరువాత నందిగ్రామ్‌లో సిపిఎం తన కార్యాలయాన్ని తిరిగి ఈ ఎన్నికల సందర్భంగా ప్రారంభించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పట్ల జనంలో తొలుగుతున్న భ్రమలు, ప్రతిఘటనకు ఇదొక సూచిక అయినప్పటికీ ఇంకా దాని గూండాయిజం ఏమాత్రం తగ్గలేదన్నది నాలుగు దశల ఎన్నికలు నిరూపించాయి. తాము ఇరవైకి పైగా స్ధానాలు సంపాదించగలమనే వూహల్లో బిజెపి నేతలు వున్నారు. గతంలో తాను సాధించిన వాటిని అయినా నిలబెట్టుకొని పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నది. త ణమూల్‌ కాంగ్రెస్‌-బిజెపి పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నప్పటికీ వాటి మధ్య అంతర్గత ఒప్పందం వుందన్నది వామపక్షాల విమర్శ. త ణమూల్‌, బిజెపిని ఓడించాలంటే ప్రతిపక్షాలు గెలిచిన సీట్లలో పరస్పరం పోటీ నివారించుకోవాలని, ఆమేరకు కాంగ్రెస్‌ గెలిచిన సీట్లలో తాము పోటీ చేయబోమని, తమ స్ధానాల్లో అదే విధంగా స్పందించాలని సిపిఎం ప్రతిపాదించింది. అయితే కాంగ్రెస్‌ అందుకు అంగీకరించకుండా సిపిఎం గెలిచిన స్ధానాల్లో పోటీకి దిగింది. అయినప్పటికీ తన చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న స్ధానాలలో వామపక్ష సంఘటన పోటీ చేయకుండా 42కుగాను 38 చోట్లకే పరిమితం అయింది.

మాల్డా అంటే కాంగ్రెస్‌ కంచుకోట. ఏబిఏ ఘనీఖాన్‌ చౌదరి పాతికేండ్లకు పైగా ఎంపీగా వున్నారు. తరువాత ఆయన వారసులే ఎన్నిక అవుతున్నారు. 2006లో ఆయన మరణించినప్పటికీ ఇప్పటికీ ఆయనే వేస్తున్నట్లుగా ఓటర్ల వైఖరి వుంటుంది. ఘనీఖాన్‌ చౌదరి సోదరుడు మాల్డా దక్షిణంలో తిరిగి పోటీచేస్తుండగా సిపిఎం తన అభ్యర్ధిని పోటీకి నిలపలేదు. మాల్డా వుత్తరం నుంచి గెలిచిన ఘనీఖాన్‌ మేనకోడలు జనవరిలో కాంగ్రెస్‌ నుంచి త ణమూల్‌కు ఫిరాయించారు. బిజెపిని ఓడించాలంటే త ణమూల్‌ పార్టీ అవసరమని దానిలో చేరినట్లు చెప్పుకున్నారు. ఆమెపై ఘనీఖాన్‌ కుటుంబం నుంచే మరొకరు రంగంలో వున్నారు.

ముర్షిదాబాద్‌ జిల్లాలో ముర్షిదాబాద్‌, జాంగీపూర్‌ నియోజకవర్గాలున్నాయి. జాంగీపూర్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రెండుసార్లు, తరువాత ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ రెండుసార్లు ఎన్నికయ్యారు. గత రెండు ఎన్నికలలో అభిజిత్‌ మెజారిటీ 2012లో 2,536, 2014లో 8,161 మాత్రమే. రెండు సార్లూ సిపిఎం అభ్యర్ధి రెండవ స్ధానంలో వచ్చారు.ఈ సారి కూడా పోటీ ఆ రెండు పార్టీల మధ్యే జరుగుతోంది. ఈ నియోకవర్గంలో సిపిఎం 1977-1999 మధ్య ఏడుసార్లు గెలిచింది. మరోనియోజకవర్గం ముర్షిదాబాద్‌, సిపిఎం సిటింగ్‌ అభ్యర్ధి బద్రుద్దోజా ఖాన్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుచుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ ప్రముఖుడైన హుమాయున్‌ కబీర్‌ బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్ధి అయ్యాడు. ఇక్కడ కాంగ్రెస్‌, త ణమూల్‌ పోటీ చేస్తున్నాయి. మరో నియోజకవర్గం బెరహంపూర్‌ ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌కు సిపిఎం మద్దతు ఇస్తున్నది. అధిర్‌ అనుచరుడిగా వున్న అపూర్వ సర్కార్‌ కాంగ్రెస్‌ నుంచి త ణమూల్‌లో చేరి అభ్యర్ధి అయ్యారు.

బిజెపి మతతత్వ రాజకీయాల ప్రయోగ కేంద్రంగా మారిన అసన్‌సోల్‌,దుర్గాపూర్‌, బర్ద్వాన్‌ ప్రాంతంలో బిజెపి అసన్‌సోల్‌ నియోజకవర్గంలో విజయం సాధించింది. గతంలో ఎన్నడూ శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతుల పేర్లతో ప్రదర్శనలు జరిపి బలపడింది. త ణమూల్‌ కాంగ్రెస్‌లోని ముఠాతగాదాల కారణంగా ఒక వర్గం మద్దతు ఇచ్చిన కారణంగానే ఇక్కడ బిజెపి అభ్యర్ధి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వున్న బాబూలాల్‌ సుప్రియో విజయం సాధించారు. ఈసారి రెండు వర్గాల మధ్య రాజీగా సినీ నటి మున్‌మున్‌ సేన్‌ రంగ ప్రవేశం చేశారు. బిజెపి మరో నియోజకవర్గం డార్జిలింగ్‌. ఇక్కడ ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా ఆ పార్టీ తరఫున గెలిచారు. ఇక్కడ కూడా మత ప్రాతిపదికన చీల్చేందుకు బిజెపి ప్రయత్నించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 17.02శాతం ఓట్లు తెచ్చుకున్న బిజెపి తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పదిశాతానికి పడిపోయింది. అయినప్పటికీ తానే త ణమూల్‌కు ప్రత్యామ్నాయం అని సగం సీట్లు గెలుస్తామని మీడియా ప్రచారదన్నుతో చెబుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్ల శాతం సీట్లు

త ణమూల్‌ కాంగ్రెస్‌ 39.05      34

వామపక్ష సంఘటన 29.71       2

బిజెపి                17.02       2

కాంగ్రెస్‌                9.58       4

2016 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల ఓట్ల శాతం, సీట్లు

త ణమూల్‌    44.9          211

సిపిఎం        19.8            26

కాంగ్రెస్‌        12.3           44

బిజెపి         10.2            3

ఫార్వర్డ్‌బ్లాక్‌    2.8             2

సిపిఐ          1.5           1

ఆర్‌ఎస్‌పి      1.7           3

జెఎంఎం       0.5           3

ఇండి ్        0             1

Share this:

  • Tweet
  • More
Like Loading...

తిరోగామి-పురోగామి పోరు గడ్డ బెగుసరాయ్‌ !

28 Sunday Apr 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

a regressive vs progressive electoral battle battlefield, Begusarai, Kanhaiya Kumar

Image result for Kanhaiya Kumar

ఎం కోటేశ్వరరావు

బీహార్‌లో రైతాంగ వుద్యమ నిర్మాత ! ఆలిండియా కిసాన్‌ సభ తొలి అధ్యక్షుడు !! స్వామి సహజానంద సరస్వతి కలియ తిరిగిన నేల, వుద్యమాల పురుటి గడ్డ బెగుసరాయ్‌. స్వాతంత్య్ర వుద్యమంలో పరిచయం అవసరం లేని ప్రాంతం. మరోసారి జాతీయంగా జనం నోళ్లలో నానుతోంది. అటు పచ్చి మితవాదులు, ఇటు పురోగామి వాదులు ఇప్పుడు కేంద్రీకరించిన ఎన్నికల పోరుగడ్డ. సోమవారం నాడు జరిగే ఎన్నికల ఫలితం ఏమౌతుందన్నది ప్రశ్నే కాదు.

ఏ మతానికి చెందిన వారైనా పిల్లల్ని కనే సంఖ్య ఒకటిగానే వుండాలి. హిందువులు మరింత ఎక్కువ మంది పిల్లల్ని కని జనాభా సంఖ్యను పెంచాలని ప్రబోధించిన మిత, మతవాది అయిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ బిజెపి అభ్యర్ధి. దేశానికి మిత, మతవాదుల నుంచి పొంచి వున్న ముప్పును చిత్తు చెయ్యాలన్న పురోగమన వాది కన్నయ్య కుమార్‌ వామపక్షాలన్నీ బలపరిచిన సిపిఐ అభ్యర్ధిగా పోటీలో వున్నారు. బిజెపిని ఓడించాలన్న వామపక్షాల పిలుపును విస్మరించిన ఆర్‌జెడి, కాంగ్రెస్‌ కూటమి తరఫున ఆర్‌జెడి అభ్యర్ధిగా తన్వీర్‌ హసన్‌ పోటీలో వున్నారు.

ఆ నియోజకవర్గంలో భూమిహార్‌లు గణనీయ సంఖ్యలో వున్నారు. గిరిరాజ్‌ సింగ్‌, కన్నయ్య ఇద్దరూ అదే సామాజిక వర్గానికి చెందిన వారు. భూమిహార్లు తాము వ్యవసాయం చేసే బ్రాహ్మణులమని, తాము యాచక తరగతికి చెందిన వారం కాదని చెప్పుకుంటారు. కర్మకాండలు చేసే తరగతి బ్రాహ్మణులు వారు అసలు సిసలు బ్రాహ్మలు కాదంటూ తమతో సమంగా గుర్తించేందుకు నిరాకరిస్తారు. భూమిహార్లలో పెద్ద పెద్ద జమిందార్లు వున్నారు. వారికి వ్యతిరేకంగా పోరాడిన పేద భూమిహార్లు వున్నారు. స్వామి సహజనాంద తరగతి నాడు రెండవ కోవకు చెందితే నేడు ఆ వారసత్వాన్ని కన్నయ్య కుమార్‌ కొనసాగిస్తున్నాడు.

Image result for Kanhaiya Kumar

కన్నయ్యకు మద్దతుగా అనేక ప్రాంతాల నుంచి కుల, మత, భాషా, ప్రాంత భేదంలేకుండా చురుకుగా పాల్గొంటున్నవారితో బెగుసరాయ్‌ ఓ ‘మినీ భారత్‌’ను తలపిస్తున్నదని న్యూస్‌ క్లిక్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధి నివేదించాడు. అక్కడ ఉన్నవారిలో కొందరు చర్చల్లో నిమగమై ఉండగా.. మరికొందరు తమ తమ మొబైల్‌ ఫోన్లతో బిజీగా ఉన్నారు. మరికొందరు మండుతున్న వేడి నుంచి సేదతీరేందుకు చెట్ల నీడన తలదాచుకున్నారు. ఇదంతా బేగసరాయ్‌ లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత నివాసం వెలుపల ద శ్యం. అక్కడ ఉన్నవారంతా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు. వారి లక్ష్యం ఒక్కటే. బేగుసరారు లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేస్తున్న కన్నయ్యకుమార్‌కు ప్రచారంలో సహాయ పడటం. బిహత్‌ గ్రామంలోని కన్నయ్యకుమార్‌ ఇంటికి చేరుకునేసరికి వారిలో చాలామందికి ఒకరితో ఒకరికి పరిచయంలేదు. యువకులు, మధ్యవయస్కులు, వ ద్దులు, మహిళలు ఇలా అందరూ ఇప్పుడు మంచి స్నేహితులు. ‘ఉదయం ప్రచారానికి బయలుదేరే ముందు వరకూ.. అలాగే ప్రచారాన్ని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత… వారంతా కన్నయ్యకుమార్‌ ఇంటివెలుపల బహిరంగ ప్రదేశంలో గడుపుతున్నారు..’ అని సీపీఐ అభ్యర్థి ప్రచార సమన్వయకర్త ధనుంజరుకుమార్‌ చెప్పారు. ప్రత్యేకమేమంటే.. అక్కడ విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారులు, కళాకారులు, పర్యావరణ ఉద్యమ కారులు, విద్యావేత్తలు.. ఇలా విభిన్నవర్గాలకు చెందినవారే కాదు, వివిధ భాషలు, కులాలు, సంస్క తులకు చెందిన వారూ ఉన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు, సాంస్క తిక గ్రూపు, వీధి నాటకాలకు, సోషల్‌ మీడియా నిర్వహణ ఇలా… అందరినీ ప్రత్యేక గ్రూపులుగా విభజించారు. ముమ్మర ప్రచారం నిర్వహించారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టుకొని మరీ వీరంతా అక్కడకు చేరుకొని ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ముగ్గురితో సహా విదేశీయులు కూడా ఉండటం ప్రత్యేకం. పన్నెండు అంతర్జాతీయ మీడియాసంస్థలు ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించాయి. నివాసం వెనుక ఖాళీ స్థలంలో భోజనశాలను ఏర్పాటుచేశారు. కన్నయ్యకుమార్‌ తల్లి సహా పలువురు వచ్చిన వారికి భోజన ఏర్పాట్లుచూస్తున్నారు. ‘నా సొంత ఖర్చులు పెట్టుకొని ఇక్కడకు వచ్చాను. నేను సీసీఐ కార్యకర్తనుకాను. అలాగని ఏ పార్టీకి చెందినవాడిని కాదు. కానీ, కన్నయ్య విజయం కోసం నా వంతు సహాయం చేయాలన్న తపనతో ఇక్కడకువచ్చాను. చీకటిలో కాంతిరేఖలా కన్నయ్యకుమార్‌ కనిపించారు నాలాగే వివిధ రాష్ట్రాల నుంచి కన్నయ్యకు సహాయపడేందుకు వందలాది మంది బేగుసరారు వచ్చారు..’ అని పంజాబ్‌లోని భటిధర్‌ నుంచి వచ్చిన జబర్‌ జంగ్‌ సింగ్‌ చెప్పారు.

Image result for Kanhaiya Kumar

‘దాదాపు వెయ్యి కిలో మీటర్ల దూరం నుంచి నేను ఇక్కడకు వచ్చాను. గత ఐదేండ్లుగా గోవాలోనూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యావరణంపై మోడీ ప్రభుత్వ రాజీపడిన ధోరణిని ఇక్కడ ప్రజలకు వివరిస్తున్నాను’ అని పర్యావరణ కార్యకర్త సుదీప్‌ దాల్వీ చెప్పారు. ‘కన్నయ్యకు మద్దతివ్వాల్సిందిగా గ్రామాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నాను. అసంఘటిత రంగ, బలహీనవర్గాలు, మైనార్టీల, పేదల గొంతుక కన్నయ్య. ఆయన కోసం నేను ఉద్యోగానికి సెలవుపెట్టి మరీ వచ్చాను’ అని ఒడిషాలోని జగత్‌సింగ్‌పుర్‌ నుంచి వచ్చిన మిర్జా లుక్మన్‌ చెప్పారు. టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ నుంచి సందీప్‌ గుప్తా, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ విద్యార్థి జైన్‌ మొహమ్మద్‌ సులేమన్‌, అలహాబాద్‌ వర్సిటీ నుంచి ఆరిఫ్‌ సిద్ధికి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మహేశ్‌ కుమార్‌, జేఎన్‌యూ నుంచి పలువురు విద్యార్థులు, తెలంగాణ నుంచి సల్మాన్‌ అలీ, క్రిష్ణరామ్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నాగేశ్వర్‌రెడ్డి.. ఇలా అన్ని ప్రాంతాలవారూ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటువేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘దేశంలోని మతవాద, నియంతత్వ దళాలను ఓడించేందుకే నా పోరాటం., బేగుసరారు ప్రజలు నాకు ఓటు వేస్తారన్న నమ్మకం ఉంది’ అని కన్నయ్యకుమార్‌ చెప్పారు.

Image result for Kanhaiya Kumar

వామపక్షాలకు బెగుసరాయ్‌ ఒకప్పుడు గట్టి పట్టున్న ప్రాంతం. లెనిన్‌గ్రాడ్‌గానూ దీనికి పేరు. 1967లో యోగేంద్ర శర్మ సీపీఐ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లోనూ సీపీఐ అభ్యర్థికి 11.87్న ఓట్లు వచ్చాయి. మరోవైపు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీజేపీ మళ్లీ సత్తా చాటాలనే ఉద్దేశంతో నవడా స్ధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను రంగంలో దించింది. ఆయన అయిష్టంగానే బరిలో దిగారని వార్తలు వచ్చాయి. ఆర్జేడీ గత ఎన్నికల్లో 3.69 లక్షల ఓట్లు దక్కించుకున్న తన్వీర్‌ హసన్‌ను అభ్యర్థిగా ప్రకటించి త్రిముఖ పోరుకు తెరతీసింది. బిజెపి-సిపిఐ మధ్య భూమిహార్‌ ఓట్లు చీలితే తమకు లాభమని ఆర్జేడీ భావిస్తోంది. పైగా తన్వీర్‌ ముస్లిం కావడం, యాదవ్‌ల ఓట్లు తమకే పడతాయని అంచనా వేస్తోంది. కన్నయ్యకు మద్దతుగా గెలిపించేందుకు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యదర్శి డి.రాజా, కె నారాయణ, సీపీఎం నేత సీతారాం ఏచూరి వంటి ఉద్దంఢులు రంగంలోకి దిగారు. ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజాగొంతుకను గెలిపించాలని కోరారు.

Image result for Kanhaiya Kumar, sitaram

షబానా ఆజ్మీ, జావేద్‌ అక్తర్‌, స్వరభాస్కర్‌ వంటి బాలీవుడ్‌ ప్రముఖులు కన్నయ్యకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని, నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా స్వయంగా బెగుసరాయ్‌లో ప్రచారం నిర్వహించారు. మోదీ ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని గిరిరాజ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన తరఫున ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి కన్నయ్య కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. పలు చోట్ల ఘర్షణలకు కూడా ప్రయత్నించారు. నితీశ్‌ కుమార్‌ నేత త్వంలోని జేడీ(యూ) మద్దతు కూడా తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు తన్వీర్‌ హసన్‌ స్థానికంగా అందుబాటులో ఉండటం, ప్రజాదరణ ఉన్న నాయకుడు కావడంతో తామే గెలుస్తామని ఆర్జేడీ అంచనాలు వేసుకుంటోంది.

మొత్తం ఓటర్లు 17.78 లక్షలు

పురుషులు 9.49 లక్షలు

మహిళలు 8.28 లక్షలు

Share this:

  • Tweet
  • More
Like Loading...

వర్తమానంలో మేడే ప్రాధాన్యత !

26 Friday Apr 2019

Posted by raomk in Current Affairs, employees, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

International Workers' Day, may day, May Day 2019, May Day significance, May day significance in the contemporary period

Image result for may day haymarket

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ అభివృద్ధి రేటు గతేడాది వున్న 3.6శాతం నుంచి ఈ ఏడాది 3.3కి తగ్గుతుందని, వచ్చే ఏడాది తిరిగి 3.6శాతం వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ(ఐఎంఎఫ్‌) ప్రకటించింది. ఏడాదిలో ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆర్ధిక వ్యవస్ధల మంచి చెడ్డల గురించి తన అంచనాలను వెల్లడిస్తుంది. ఈ సంస్ధ వునికిలోకి వచ్చిన ఏడు దశాబ్దాలలో ప్రపంచంలో ముఖ్యంగా ధనిక దేశాలలో తలెత్తిన ఆర్దిక సంక్షోభం గురించి ఎన్నడూ జోస్యం చెప్పలేకపోయింది. అందువలన అది చెప్పే అంచనాలకూ అదే పరిస్ధితి. ఈ ఏడాది జనవరిలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ 3.5శాతం రేటుతో అభివృద్ధి చెందనుందని చెప్పింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ చెప్పే అంకెల విశ్వసనీయత సమస్యను కాసేపు పక్కన పెడదాం. వాటినే పరిగణనలోకి తీసుకుంటే కార్మికవర్గానికి అర్దం అయ్యేదేమిటి? గతేడాది కంటే ఈ ఏడాది పరిస్ధితి దిగజారుతుంది, వచ్చే ఏడాది గతేడాది మాదిరే వుంటుంది. ప్రపంచీకరణ యుగంలో వున్నాం. మనకు ఆమోదం వున్నా లేకపోయినా మన పాలకులు మన దేశాన్ని ప్రపంచీకరణ రైలు ఇంజనుకు బోగీగా తగిలించారు. అందువలన దాని నడతను బట్టే మన పరిస్ధితీ వుంటుంది. గీతా గోపీనాధ్‌ చెప్పినట్లు రాబోయే రోజుల్లో పరిస్ధితిలో పెద్దగా మార్పు వుండదంటే మూడు సంవత్సరాలలో కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే ఈ మే డే సందేశం.

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. మిగతా చోట్ల మిగిలిన దశ ఎన్నికలు జరగున్నాయి. పోలింగ్‌ ముగిసిన చోట ఓటరు తీర్పు రిజర్వు అయింది. అందువలన భావోద్వేగాలను పక్కన పెట్టి వుద్యోగులు, కార్మికులు ఆలోచించటం అవసరం. ఈ ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో వుపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరిగాయి. చిత్రం ఏమిటంటే రెండు చోట్లా అధికారపార్టీతో అంటకాగిన వుపాధ్యాయ నేతలు మట్టి కరిచారు. గత ఐదు సంవత్సరాలుగా వారు ఆయా ప్రభుత్వాల మీద కల్పించిన భ్రమలు టీచర్లు, గ్రాడ్యుయేట్లలో తొలగిపోతున్నాయనేందుకు ఇదొక సంకేతం. వుద్యోగులు, వుపాధ్యాయుల్లో ఏడాది కేడాది నూతన పెన్షన్‌ స్కీం అమలయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పధకాన్ని ప్రవేశపెట్టి, అమలు జరిపిన పార్టీలు కూడా దానిని రద్దు చేస్తామని ఎన్నికల ఆపదమొక్కులు మొక్కుతున్నాయి. వాగ్దానాలు చేసిన పార్టీలు లేదా వాటికి మద్దతు పలికిన వుద్యోగ సంఘాల నేతలు గానీ అధికారంలో వున్నపుడు కొత్త పెన్షన్‌ స్కీము రద్దు చేసి పాతదానిని ఎందుకు పునరుద్దరించలేదో సంజాయిషీ ఇవ్వాలి, వుద్యోగులు నిలదీయాలి.

ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతున్న నయా వుదారవాద విధానాలు మొత్తంగా జనాన్ని భ్రమలకు గురి చేస్తాయి. అలాంటపుడు శ్రమ జీవులు దానికి అతీతంగా ఎలా వుంటారు. అందుకే ఆశల పల్లకిలో వున్న వారు కుదుపుకు గురైతే తట్టుకోలేరు. ఎప్పుడు వుద్యోగాలు వూడతాయో తెలియదు. ఏటా రెండు కోట్ల వుద్యోగాలను కల్పిస్తాన్న నరేంద్రమోడీ వాగ్దానాన్ని జనం నమ్మారు. కొత్తవాటి సంగతి దేవుడెరుగు వున్న వుద్యోగాలే వూడుతున్నాయన్నది వాస్తవం. ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు విషయంలో ఐఎంఎఫ్‌ ప్రపంచంతో పాటు మన దేశ అంచనాను తగ్గించింది. మన విషయానికి వస్తే 2019-20లో 7.5 అని గతంలో చెప్పిన జోశ్యాన్ని 7.3%కు తగ్గించింది. వచ్చే ఏడాది మాత్రం 7.5శాతం తగ్గదట. మన రిజర్వుబ్యాంకు, ఏడిబి 7.2 అని, ఫిచ్‌ అనే రేటింగ్‌ సంస్ధ 6.8, ప్రపంచ బ్యాంకు 7.5శాతంగా తమ అంచనాలను పేర్కొన్నాయి. సరే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రారంభించిన లెక్కల సవరింపు చివరికి ఎంత అని తేలుస్తుందో తెలియదు. ప్రపంచంలో 70శాతం ఆర్ధిక వ్యవస్ధలు మందగమనాన్ని సూచిస్తున్నాయని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్ధిక వేత్త , మన దేశానికి చెందిన గీతా గోపీనాధ్‌ పేర్కొన్నారు.2020 తరువాత అభివృద్ధి 3.5శాతం దగ్గర స్ధిరపడనుందని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంకెలను పరిగణనలోకి తీసుకున్నపుడు ఎక్కువ అభివృద్ధి వున్న చోట నిరుద్యోగం తగ్గాలి, తక్కువ వున్న చోట పెరగాలి. ఆ రీత్యాచూసినపుడు మనది చైనా కంటే ఎక్కువ అభివృద్ధి రేటుతో ముందుకు పోతోంది. కానీ మన దగ్గర రికార్డు స్దాయిలో నిరుద్యోగం వున్నట్లు అంకెలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలో గరిష్ట స్ధాయిలో 7.2%కి పెరిగింది. మార్చినెలలో 6.7కు తగ్గింది. పన్నెండు నెలల సగటును ఏడాదికి తీసుకుంటారు, ఆవిధంగా గత ఏడాది 6.1శాతం 45ఏండ్ల రికార్డును తాకింది. అభివృద్ధి రేటు తగ్గనున్నందున నిరుద్యోగం మరింత పెరగనుంది.

మన ఆర్ధిక వ్యవస్ధలో కార్మిక భాగస్వామ్య రేటు ఫిబ్రవరి కంటే మార్చినెలలో 42.7 నుంచి 42.6కు పడిపోయింది. పట్టణ ప్రాంతాలలో పని చేస్తున్న వారి సంఖ్య 129 మిలియన్ల నుంచి 127కు పడిపోయింది.2016 తరువాత పట్టణ కార్మిక వర్గ భాగస్వామ్యం 40.5శాతానికి తొలిసారిగా పడిపోయింది. ఇంతవరకు 2018 నవంబరులో హీనస్ధాయిలో 37.3శాతంగా నమోదైంది.నిరుద్యోగశాతం 7.9గా వుంది. మార్చినెలలో పదిలక్షల వుద్యోగాలు పెరిగితే పదిలక్షల మంది పురుష వుద్యోగులు ఇంటిదారి పట్టారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా వుపాధి కూడా తగ్గిపోయింది.

Image result for may day india citu

అభివృద్ధి రేటు ఎక్కువ వున్నపుడు వుద్యోగాలేమైనట్లు అని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాకిస్ధాన్‌లో జిడిపి వృద్ధి రేటు 2.9శాతానికి తగ్గనుంది. గత ఏడాది 5.2శాతం వుంది. అభివృద్ధి రేటు తగ్గనున్న కారణంగా ప్రస్తుతం వున్న 6.1శాతం నిరుద్యోగం 6.2శాతానికి పెరగనుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. దాయాది దేశం కంటే మన వృద్ధి అంకెలు ఎంతో మెరుగ్గా వున్నా నిరుద్యోగం విషయంలో మనం దానికి దగ్గరగా లేదా ఎక్కువగా వుండటం ఏమిటన్నది ప్రశ్న. వుపాధి రహిత అభివృద్ధి వుద్యోగుల, కార్మికుల బేరసారాలాడే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించే డిఏను వుద్యోగులకు నష్టదాయకంగా ఆరునెలలకు చేస్తే సంఘాలేమీ చేయలేకపోయాయి. కారుచౌకగా పనిచేసేందుకు సిద్దం సుమతీ అంటున్నవారు క్యూకడుతున్న కారణంగానే పర్మనెంటు వుద్యోగాల స్ధానంలో కాంట్రాక్టు, పొరుగు సేవల పేరుతో తక్కువ వేతనాలకు పనిచేయించుకుంటున్నారు. ఒకే పనికి ఒకే వేతనం అన్న సహజన్యాయం అన్యాయమై పోతోంది. దీనికి వ్యతిరేకంగా వుద్యో గులు, నిరుద్యో గులూ ఐక్యంగా పోరాడకపోతే రేపు వుద్యోగుల మీద జరిగే దాడిని అన్యాయం అనేవారు కూడా మిగలరు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమును ప్రవేశపెట్టినపుడు అప్పటికే వుద్యోగాల్లో వున్న తమకు అది వర్తించదు కదా అని వుద్యో గులు పట్టించుకోలేదు, అసలు వుద్యోగాలు లేనపుడు ఏదో ఒకటి అని నిరుద్యోగులు ఆలోచించలేదు. తీరా కొత్త పెన్షన్‌ స్కీములో చేరిన కొత్తవుద్యో గులకు రోజులు గడిచే కొద్దీ జరిగే నష్టం ఏమిటో అర్ధం అయింది. ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.

ఏడాది క్రితం అమెరికన్లు చైనా, ఇతర దేశాలతో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కారణంగా గతేడాది అక్టోబరు నుంచి ఐఎంఎఫ్‌ మూడు సార్లు ప్రపంచ అభివృద్ధి అంచనాలను తగ్గించింది. అమెరికన్లు వాణిజ్య యుద్ధాన్ని ఒక్క చైనాకే పరిమితం చేయటం లేదు. ఐరోపా యూనియన్‌ నెదర్లాండ్స్‌లోని ఎయిర్‌ బస్‌ విమాన కంపెనీకి అనుచితంగా సబ్సిడీలు ఇస్తున్నందున తమ దేశంలోని బోయింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చాలా కాలంగా అమెరికన్‌ కార్పొరేట్లు గుర్రుగా వున్నాయి. ఐరోపా యూనియన్‌ వుత్పత్తులపై 11బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతి పన్నులు విధిస్తాంటూ ఏప్రిల్‌ పదిన డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య యుద్దంలో కొత్త రంగాన్ని తెరిచాడు. బోయింగ్‌ కంపెనీకి ఇస్తున్న సబ్సిడీల సంగతి తాము తేలుస్తామంటూ ఐరోపా యూనియన్‌ ప్రతిసవాల్‌ చేసింది. ట్రంప్‌ జపాన్‌ మీద కూడా దాడి ప్రారంభించేందుకు పూనుకున్నాడు. భారత్‌తో సహా వాణిజ్య లోటు వున్న ప్రతిదేశం మీద అమెరికా దాడి చేసేందుకు పూనుకుంది. అంటే బలవంతంగా తన వస్తువులను కొనిపించే గూండాయిజానికి పాల్పడుతోంది. ఇది ఏ దేశానికి ఆ దేశం రక్షణాత్మక చర్యలకు పూనుకొనేట్లు చేస్తోంది, కొత్త వివాదాలను ముందుకు తెస్తోంది. ముందే చెప్పుకున్నట్లు ఏ దేశానికి ఆదేశం తన కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడేందుకు పూనుకోవటం అంటే జనం మీద భారాలు మోపటం, వున్న సంక్షేమ చర్యలకు మంగళం పాడటమే. ఫ్రాన్స్‌లో పసుపు చొక్కాల వుద్యమం ప్రతి శనివారం ఏదో ఒక రూపంలో జరుగుతోంది, ఇలాగే అనేక దేశాల్లో కార్మికవర్గం నిరసన తెలుపుతోంది. వేగంగా పెరుగుతున్న సంపద అంతరాలు వుద్యమాలు, విప్లవాలకు దారి తీస్తాయన్న హెచ్చరికలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు.

ప్రపంచంలో ప్రస్తుతం 66దేశాల్లో మేడే రోజున ప్రభుత్వాలు సెలవులు ఇస్తున్నాయి. ఇది కార్మికవర్గ విజయం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే మెజారిటీ దేశాలలో సెలవు లేదంటే దాన్నే సంపాదించలేని కార్మికవర్గం దోపిడీని అంతం చేయాలంటే ఇంకా ఎంతో చేయాల్సి వుందన్నది స్పష్టం. సెలవు వున్న దేశాల్లో కూడా కార్మికవర్గంలో కొన్ని అపోహలు, అవాంఛనీయ ధోరణులు వున్నాయి.

Image result for may day

ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ, బ్యాంకు, మార్కెటింగు, విత్త కంపెనీల కార్యకలపాలు నిర్వహించే వుద్యోగులు ఇప్పటికే తాము కార్మికులని అనుకోవటం మానేశారు. కంపెనీ క్యాబుల్లో పని ప్రదేశాలకు వెళుతూ మహానగరాలలో పని చేసే ఐటి కంపెనీలు, వాటి అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే వారు తమది ప్రత్యేక తరగతి అనుకుంటున్నారు. ఆ లెక్కన సంప్రదాయ భాష్యం ప్రకారం అసలు కార్మికులు ఎందరు ? ఎవరు? ఇప్పటికీ కార్మికులం అని భావించే అనేక మందికి మేడే ఒక వుత్సవం. మరి కొంత మందికి ఆ రోజు దీక్షా దినం. వుత్సవానికి, దీక్షా దినానికి తేడా ఏమిటి ?

మేడేను వుత్సవంగా జరిపినా, దీక్షా దినంగా పాటించినా కార్మికుల బతుకులు ఆదివారం నాడు అరటి మొలచింది…. శనివారం నాడు పాపాయి చేతికి పండు వచ్చిందన్నంత సులభంగా మారటం లేదు, మారవు అని గమనించాలి. ఈ పూర్వరంగంలో కార్మికులు, ఇతర కష్ట జీవులు మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి.

Image result for may day haymarket

ప్రతి ఏడాదీ చెప్పుకొనేదే అయినప్పటికీ కొత్త తరాలు వస్తుంటాయి గనుక ముందుగా మే డే చరిత్ర గురించి తెలుసుకుందాం. చాలా మంది మే డే అంటే ఎర్రజెండా పార్టీల రోజు, కమ్యూనిస్టుల వ్యవహారం అనుకుంటారు. నిజానికి దీనికీ కమ్యూనిస్టుపార్టీకి సంబంధం లేదు. మన దేశంతో సహా అనేక చోట్ల కమ్యూనిస్టులతో సంబంధం లేకుండానే కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. అనేక డిమాండ్లను యజమానుల ముందుంచాయి. రోజుకు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం కమ్యూనిస్టుపార్టీ పుట్టక ముందే అనేక ఆందోళనలు చేసింది. వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేక చోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి.వాటిపై స్పందన లేకపోవటంతో కొనసాగింపుగా మే ఒకటవ తేదీన అమెరికా అంతటా ఒక రోజు సమ్మె జరపాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.ప్రభుత్వం సమ్మెను అణచేందుకు పూనుకుంది.దానిపై చికాగో నగరంలో మే మూడవ తేదీన నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల పోలీసులు కార్మికులపై విరుచుకుపడ్డారు. అనేక మంది గాయపడ్డారు, కొంత మంది మరణించారు. దాంతో మరింతగా ఆగ్రహించిన కార్మికులు మే నాలుగవ తేదీన హే మార్కెట్‌ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు. పోలీసు యంత్రాంగ కుట్రలో భాగంగా అక్కడకు వచ్చిన పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించాడు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పులలో అనేక మంది కార్మికులు మరణించారు. సంఖ్య ఇప్పటికీ తెలియదు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మినేతలను ఇరికించి ఒక తప్పుడు కేసు పెట్టారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. పై కోర్టులలో శిక్షలను ఖరారు చేశారు. 1887 నవంబరు పదిన ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు నలుగుర్ని వురితీశారు. తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు.

Image result for may day haymarket

1889 జూలైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్టు, కార్మిక పార్టీల ప్రతినిధులు(రెండవ ఇంటర్నేషనల్‌) చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీని కార్మికుల దీక్షా దినంగా పాటించాలని, ఆ మేరకు 1890లో మే ఒకటిన అంతర్జాతీయంగా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మరుసటి ఏడాది సమావేశమైన రెండవ ఇంటర్నేషనల్‌ వార్షిక సమావేశం మే ఒకటవ తేదీని ప్రతి ఏడాదీ జరపాలని పిలుపు ఇచ్చింది. ఇది జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో 1919లో, తరువాత మన దేశంలో, ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. అందువలన ఎవరైనా మే డేను కమ్యూనిస్టుపార్టీలకు చెందినదిగా చిత్రిస్తే అది చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. అది కార్మికవర్గ వుద్యమం నుంచి ఆవిర్భవించింది. కమ్యూనిస్టు పార్టీలు కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి కనుక మేడేను విధిగా పాటించటంతో చివరికి అది కమ్యూనిస్టుల కార్యక్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే ముఖ్య అనుచరుడైన నారాయణ్‌ మేఘాజీ లోఖాండే. ఒక జర్నలిస్టు, ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, అప్పటికి కమ్యూనిస్టు వాసనలు మన దేశంలో లేవు. బొంబాయి వస్త్ర మిల్లు కార్మికుల పని పరిస్థితులను చూసి చలించిపోయిన ఆ జర్నలిస్టు జ్యోతిబా పూలే సహకారంతో 1880 నుంచీ కార్మికులను సంఘటిత పరిచేందుకు పూనుకున్నాడు.1884లో మిల్లు కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. యజమానుల ముందుంచిన వారి ప్రధాన కోరికలు ఇలా వున్నాయి. కార్మికులకు వారానికి ఒకరోజు ఆదివారం నాడు సెలవు ఇవ్వాలి.ప్రతి రోజు మధ్యాహ్నం అరగంట పాటు విరామం కల్పించాలి. మిల్లులను వుదయం ఆరున్నర గంటలకు ప్రారంభించి సూర్యాస్తమయానికి మూసివేయాలి.కార్మికుల వేతనాలు ప్రతినెల పదిహేనవ తేదీన చెల్లించాలి. ఇదే సమయంలో చికాగోలో కార్మికులు ఎనిమిది గంటల పని కోసం డిమాండ్‌ చేస్తే బొంబాయి కార్మికులు పన్నెండు గంటల పని డిమాండ్‌ చేశారంటే ఇంకా ఎక్కువ గంటలు పని చేసే వారన్నది స్పష్టం.

ప్రపంచాన్ని వూపి వేస్తున్న ఐటి, దాని అనుబంధ కార్యకలాపాలు, వివిధ టెక్నాలజీలలో శిక్షణ పొంది పరిశ్రమలలో పని చేస్తున్న ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కార్మికులు కారా? యజమానులైతే కాదు, కనుక వారిని ఏ పేరుతో పిలవాలి. తెల్లచొక్కాల వారు కార్మికులు కాదా ? వారిని ఎలా సమీకరించాలి? ఇలాంటి ప్రశ్నలు వారినే కాదు, కార్మికవర్గాన్ని సమీకరించి దోపిడీ లేని నూతన సమాజాన్ని స్ధాపించాలని పని చేస్తున్న కమ్యూనిస్టు, సోషలిస్టు శక్తులన్నీ పరిష్కరించాల్సినవే. యాజమాన్యం తరఫు విధులు నిర్వహిస్తూ ప్రత్యక్షంగా వుత్పాదన, సేవలలో నిమగ్నం కాని సిఇఓ, డైరెక్టర్‌ వంటి వున్నత పదవులలో వున్నవారు తప్ప, ఒక యజమాని దగ్గర వేతనం తీసుకొని ఏదైనా ఒక వుత్పత్తి, సేవలలో భాగస్వామి అయిన ప్రతి వారూ కార్మికులే. వారు ఐటి నిపుణుడు, బ్యాంకు అధికారి, గుమస్తా, ఫ్యాక్టరీ ఇంజనీరు, డాక్టరు, యాక్టరు, జర్నలిస్టు, ప్రతిఫలం తీసుకొనే రచయిత ఇలా ఎవరైనా కావచ్చు. కొంత మంది వుత్పాదక, సేవల విలువ ఎక్కువ మొత్తంలో వుంటుంది కనుక ఆ రంగాలలో పని చేసే వారు పెద్ద మొత్తంలో వేతనంలో పొందినంత మాత్రాన కార్మికులు కాకుండా పోరు. ఆచరణలో అలాంటి వారంతా తాము కార్మికులం కాదనుకుంటున్నారు. వారిని ఆ భావజాలం నుంచి బయటకు తెచ్చి సమీకరించకుండా కార్మికవర్గ పార్టీలు ఎలా ముందుకు పోతాయన్నది ప్రశ్న. దోపిడీ వర్గం సంపదల సృష్టితో పాటు తమను అంతం చేసే కార్మికవర్గ సైన్యాన్ని కూడా తయారు చేస్తుందన్నది చరిత్ర సారమని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పారు. బానిస యజమానులను బానిసలు, భూస్వాములను వ్యవసాయ కార్మికులు అంతం చేయటం గత చరిత్ర. పెట్టుబడిదారులను పారిశ్రామిక కార్మికులు అంతం చేయటం భవిష్యత్‌ చరిత్ర. అందుకే దోపిడీదారులు తమ హక్కులను అడగని కార్మికులను ప్రోత్సహిస్తారు, అడిగేవారిని అంతం చేసేందుకు చూస్తారు. తాగి తందనాలాడేందుకు డబ్బిచ్చి మరీ ప్రోత్సహించే యజమానులు, కార్మిక సంఘాన్ని పెట్టుకుంటే తొలగించటం, వేధించటం అందుకే.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోషలిస్టు శక్తులు సాధించిన విజయాలతో మన దేశంలో కార్మికవర్గం సమరశీలంగా తయారు కాకుండా , సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలవైపు మళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు జరిగాయి. పాలకపార్టీ ఒక కార్మిక సంఘాన్ని ప్రోత్సహించింది. మరోవైపున 1953న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. జాతీయవాదం ముసుగులో మే ఒకటవ తేదీకి బదులు విశ్వకర్మ జయంతి రోజు పేరుతో కార్మికదినాన్ని పాటించాలని ఆ సంస్ధ నిర్ణయించింది. ఇలాంటివే చరిత్రలో అనేకం గురించి చెప్పుకోవచ్చు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం వలన ఆశాభంగమే తప్ప జరిగేదేమీ వుండదు. సంఘాలలో చేరటమే కాదు, వాటి నాయకత్వాలు అనుసరిస్తున్న రాజీ పద్దతుల గురించి నిలదీయాలి. న్యాయమైన డిమాండ్లపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి. కార్మికులేమీ గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. నేడు, నా సంగతి నేను చూసుకుంటే చాలు అని గాక రేపు, మన సంగతేమిటి అని విశాల దృక్పధంతో ఆలోచించటం అవసరం. అందుకే మే డేను వుత్సవంగా జరుపుకోవటం గాక దీక్షా దినంగా పాటించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d