• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

డోనాల్డ్‌ ట్రంప్‌ కంటే చైనానే ఎక్కువగా నమ్ముతున్న అమెరికన్‌ యువత !

12 Wednesday Jun 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Communist China, Donald trump, RED MAY, US youth distrust Trump, US Youth Trusting communist China

Image result for College kids' distrust for Trump over communist China

ఎం కోటేశ్వరరావు

‘డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం మేథావులకు తీవ్ర వ్యతిరేకి, చాలా వ్యతిరేకి, విశ్వవిద్యాలయాల వంటి వాటిని వుదారవాద ప్రచార యంత్రాలుగా పిలుస్తున్నారు. కాబట్టి అది జాత్యంహంకారి మాత్రమే కాదు, మేథావుల మీద దాడి వంటిది కూడా అని భావిస్తా ‘ ఇది ఒక విద్యార్ధి అభిప్రాయం. ‘ నావరకైతే చైనా ప్రభుత్వం నిజాయితీ కలిగినదా లేనిదా అనే గుర్తింపు ఎంత వుందో తెలియదు, కానీ ట్రంప్‌ సర్కార్‌ నిజాయితీలేనిదని మాత్రం నాకు కచ్చితంగా తెలుసు, కనుక అతన్ని నేను నమ్మను, అందువలన నేను నా స్వతంత్ర పరిశోధన చేస్తాను ‘ అనేది మరొక విద్యార్ధిని చెప్పిన మాట. అమెరికా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక చర్చలలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ ధోరణి గురించి ఒక కమ్యూనిస్టు వ్యతిరేక వెబ్‌సైట్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక క్లుప్త వ్యాఖ్యానాన్ని ప్రచురించింది.

పూర్వరంగం ఏమిటంటే అమెరికా విశ్వవిద్యాలయాల్లో దాదాపు వంద చోట్ల చైనా ప్రభుత్వం లేదా సంస్ధల నుంచి పొందే నిధులతో నడిచే కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. వాటిని మూసివేయాలని కోరుతూ 2014లో కొంతమంది ప్రొఫెసర్లు ఒక నివేదికను విడుదల చేశారు. గత సంవత్సరం సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ముందు ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ రే మాట్లాడుతూ కన్‌ఫ్యూసియస్‌ సంస్ధల కార్యకలాపాల మీద దర్యాప్తు జరుపుతున్నామని, వాటిని నిఘానిమిత్తం వినియోగిస్తున్నట్లు గూఢచారులు హెచ్చరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా పదమూడు విశ్వవిద్యాలయాల్లోని కేంద్రాల గురించి పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ కార్యాలయం) చేసిన పరిశోధనలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్‌ ఫ్రీ బీకన్‌ అనే పత్రం పేర్కొన్నది. ఈ అధ్యయన కేంద్రాలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని సిఐఏ పేర్కొన్నది. అమెరికా-చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య పోరు నేపధ్యంతో పాటు విశ్వవిద్యాలయాల సంస్కరణల గురించి అధ్యయనం చేస్తున్న ఒక మితవాద బృందానికి చెందిన మీడియా డైరెక్టర్‌ కాబోట్‌ ఫిలిప్స్‌ ఇటీవల మేరీలాండ్‌ విశ్వవిద్యాలయ సందర్శన చేశారు. అక్కడ మీరు కన్‌ఫ్యూసియస్‌ కేంద్రాలను నడిపే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్నా లేక కాపిటలిస్టు డోనాల్డ్‌ట్రంప్‌లో ఎవరిని ఎక్కువగా నమ్ముతారు అని ప్రశ్నించగా విద్యార్ధులు చెప్పిన సమాధానాలను పైన చూశారు. కనీసం ఒక విషయంలో అయినా ట్రంప్‌ కంటే చైనా చెప్పేదాన్నే నమ్ముతామన్నది వారి భావం అని తేలిందని, దీన్ని గమనించే అమెరికా గూఢచారశాఖ గేరు మార్చిందని సదరు వెబ్‌సైట్‌ వ్యాఖ్యాత పేర్కొన్నారు. దానిలో భాగంగానే దేవుడిని నమ్మని, అణచివేత వ్యవస్ధ కలిగిన, విఫలమైన చైనా గురించి ఆందోళన కలిగించే, తీవ్ర, కరోఠ సత్యాలను జనానికి అందిస్తున్నట్లు కూడా తెలిపారు.

కన్‌ఫ్యూసియస్‌ సంస్ధ మరియు పురోగామి విద్యావ్యవస్ధ కారణంగా విద్యార్ధులు సోషలిజం, కమ్యూనిజాల మరియు ప్రపంచ హేతువాద భావాల ఛాంపియన్లుగా తయారవుతున్నారు, అది చివరికి అమెరికా వ్యతిరేక మరియు సామాజిక న్యాయ పోరాట యోధులనే నూతన జాతిని తయారు చేస్తున్నది, ఈ రోజుల్లో కాలేజీ విద్యార్ధులు డోనాల్డ్‌ ట్రంప్‌ మరియు అతని ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకమైన ధోరణులకు దగ్గర అవుతున్నారు. అనేక మంది విద్యార్ధులు ట్రంప్‌ సర్కార్‌ కంటే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానే ఎక్కువగా నమ్ముతున్నారనే విస్తుగొలిపే అంశాన్ని ఎవరైనా చూడవచ్చు అని బ్లేజ్‌ అనే ఒక స్ధానిక పత్రిక పేర్కొన్న అంశాన్ని వెబ్‌సైట్‌ విశ్లేషణ వుటంకించింది.అనేక అంశాలపై ట్రంప్‌ ప్రభుత్వం,అమెరికా గూఢచార సంస్ధలు చెబుతున్న దాని కంటే చైనా ప్రభుత్వం చెబుతున్నవాటికే మద్దతు పలుకుతామన్నది సాధారణంగా వెల్లడైన సమాధానం కావటంతో సదరు కాబోట్‌ ఫిలిప్స్‌ బుర్ర దిరిగి చైనాలో మానవహక్కులు లేవని, మతవిశ్వాసాల కారణంగా మిలియన్ల మందిని అణచివేస్తున్నారంటూ ఆ విద్యార్ధులకు చెప్పి ఇప్పుడు చెప్పండి చైనా గురించి అని అడిగాడు. వెంటనే ఒక విద్యార్ధి చైనాను నమ్ముతున్నానని నేను చెప్పలేదు అనగా, మేథావులకు ట్రంప్‌ వ్యతిరేకం అని వ్యాఖ్యానించిన విద్యార్ధిని ఒక్క క్షణం ఆలోచించి నేను కచ్చితంగా చెప్పలేను అన్నది, మరొకరు ఇది చాల కష్టమైన ప్రశ్న, దానికి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, అది నూటికి నూరుశాతం కరెక్టని చెప్పలేను అన్నారు. చైనా భాష, సంస్కృతిని, కన్‌ఫ్యూసియస్‌ భావజాలాన్ని పెంపొందించే పేరుతో కమ్యూనిస్టు పార్టీ ప్రచార కేంద్రాలుగా వినియోగించుకుంటున్నారని కాబోట్‌ ఫిలిప్స్‌ ఆరోపించాడు. గత పన్నెండు సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేంద్రాలలో మొత్తం 35వేల మంది విద్యను అభ్యసించారు. అక్కడ జరిగే కార్యక్రమాలలో తొమ్మిది లక్షల 20వేల మంది పాల్గొన్నారని 2018లో నార్త్‌ కరోలినా కేంద్రం వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

అమెరికా సమాజం తమ నాయకత్వాన్ని విశ్వసించటం లేదన్నది స్పష్టం, అయితే ఇదే సమయంలో ఇతర దేశాలు, చైనా వంటి వాటి గురించి ఏకపక్ష సమాచారం మాత్రమే యువతరానికి అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా పాలకవర్గం పూనుకుంది అన్నది కూడా సుస్పష్టం.చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వ అణచివేత గురించి యువతకు వివరిస్తే వారి వైఖరి మారుతుందని ఫిలిప్స్‌ చెప్పటాన్ని బట్టి రానున్న రోజుల్లో మరో మారు పెద్ద ఎత్తున చైనా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరతీయనున్నారు.

‘ రెడ్‌ మే ‘ పేరుతో అమెరికాలోని సియాటెల్‌ నగరంలో 2017 నుంచి ప్రతి ఏటా మే మాసమంతా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘ పెట్టుబడిదారీ విధానం నుంచి కొన్ని రోజులు సెలవు ‘ పేరుతో ఇవి జరుగుతున్నాయి. బహిరంగ స్ధలాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు ఎవరైనా హాజరుకావచ్చు. విద్యాసంస్ధలు లేదా సభల్లో చెప్పేదానికి అతీతంగా ఇక్కడ అవగాహన చేసుకోవటానికి అవకాశం వుంటుందని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధుల పత్రిక ది డైలీ పేర్కొన్నది. అలాంటి ఒక కార్యక్రమంలో ఒక ఆంగ్ల ప్రొఫెసర్‌ పాల్గొని మానవాళి విముక్తికి మార్క్సిస్టు భావజాలాన్ని వినియోగించటాన్ని పొగిడినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. అలీస్‌ వెయిన్‌బౌమ్‌ అనే ప్రొఫెసర్‌ మాట్లాడుతూ ‘ ఇండ్లలో భోజనం చేసే సమయంలో దొర్లే మాటల్లో సోషలిజం లేదా కమ్యూనిజం అనేవి చెడ్డ పదాలు, ఇలాంటి కార్యక్రమాలలో పొల్గ్గొన్నపుడు వ్యక్తులు ప్రత్యేకించి కాలేజీ విద్యార్ధులు వామపక్ష భావజాలం మీద వున్న నిందల గురించి ప్రభావితం అయ్యే అవకాశం వుంది. రెడ్‌ మే కార్యక్రమాలు ఒక రాజకీయ సిద్ధాంతం మీద ఒకే వైఖరికి కట్టుబడి వుండటం లేదు, ప్రస్తుత మన పరిస్ధితి గురించి ఎల్లలు లేని చర్చలకు అవకాశం ఇస్తున్నాయి. అనేక మంది పండితులు ఈ భావజాలాలను వర్తమాన పరిస్ధితులకు వర్తింప చేస్తూ ఆలోచిస్తున్నారు. వారిలో పండితులే కాదు, కార్యకర్తలుగా పని చేసే పండితులు కూడా ఈ విద్వత్సభలో వున్నారు. ఈ సంస్ధ పరిధిలకు మించి వారంతా పని చేస్తున్నారు, మానవాళి విముక్తికి వివిధ మార్గాలలో భాగంగా మార్క్సిస్టు భావజాలాన్ని కూడా ఒక మార్గంగా వినియోగిస్తున్నారు.’ అని చెప్పారు. ఆమె స్త్రీవాదం, నల్లజాతీయుల అధ్యయనం, మార్క్సిస్టు సిద్దాంతం, అట్లాంటిక్‌ ప్రాంత వర్తమాన సాహిత్యం, సంస్కృతి, పునరుత్పత్తి సంస్కృతి, రాజకీయాల వంటి అంశాల మీద బోధన చేస్తున్నారు. ఆమె పుట్టుక శ్వేతజాతిలో అయినప్పటికీ జాత్యహంకార సమస్యల గురించి రచనలు చేశారు.

రెడ్‌ మే కార్యక్రమాలకు హాజరైన మైక్‌ కార్లసన్‌ ఇలా చెప్పాడు.’ దీనికి సంబంధించి ఒక గొప్ప విషయం ఏమంటే వామపక్ష భావజాలంలో ఒకదానికొకటి విడిగా వుండే అనేక అంశాలు వున్నాయి. ఎవరైనా వచ్చి భిన్నమైన ఆలోచనలను ఇక్కడ వ్యక్తీకరించవచ్చు, ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అది తమ స్వంత విషయం కావచ్చు లేదా ఒక ప్రాజెక్టు ఏదైనా కావచ్చు అన్నాడు. ‘కమ్యూనిస్టు పరిధి వెలుపల (కమింగ్‌ అవుట్‌ కమ్యూనిస్టు)’ అనే అంశమీద చర్చలో అతను పాల్గొన్నాడు.ఈ కార్యక్రమాలలో మార్క్సిస్టు సిద్ధాంతాల నుంచి కార్పొరేట్‌లు సోషలిజానికి ఎలా పునాది వేస్తున్నాయి అనే అంశాల వరకు అనేక చర్చలు జరుగుతాయి. తమ కార్యక్రమాలు వివిధ ఆలోచనలకు ఎదురవుతున్న సవాళ్లు, అభివృద్ధి చేయటం తప్ప హాజరైన వారి బుర్రల్లో బలవంతంగా ఎక్కించటం లేదా వున్న వాటిని తొలగించటం కాదని రెడ్‌మే కార్యక్రమాల ప్రారంభ నిర్వాహకులలో ఒకరైన ఫిలిప్‌ హోల్‌స్టెట్టర్‌ అన్నారు. ఏడాదికి ఒక నెల పెట్టుబడిదారీ విధానం నుంచి సెలవు తీసుకుందాం, ఒక నెల పాటు కమ్యూనిస్టుగా వుందాం, భిన్నంగా ఆలోచిద్దాం, మిమ్మల్ని ఎవరూ మార్చేందుకు ప్రయత్నించరు అన్నారు.

Image result for communist China

కమ్యూనిజం గురించి అమెరికన్లను భయపెట్టేందుకు అక్కడి పాలకవర్గం అనుసరించని తప్పుడు ఎత్తుగడలు, ప్రచారాలు లేవు. అవే ఇప్పుడు వారి నోళ్లు మూతపడేట్లు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విశ్లేషణ ప్రారంభంలోనే అమెరికా యువత ట్రంప్‌ ప్రభుత్వ మాటలు, చేతలను విశ్వసించటం లేదు అని చెప్పుకున్నాము, అంటే విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. ‘దశాబ్దాల తరబడి చైనా గురించి అబద్దాలు చెప్పిన వారు మనకు ఇప్పుడు ఏదోఒకటి చెప్పాలి’ అనే శీర్షికతో అమెరికాకు చెందిన అట్లాంటిక్‌ పత్రిక తాజాగా ఒక విశ్లేషణను ప్రచురించింది. తియన్మెన్‌ స్క్వేర్‌ ఘటనలకు మూడు దశాబ్దాలు నిండిన సందర్భంగా దాన్ని రాశారు.

తరతరాలుగా చైనా గురించి రాజకీయ పండితులు, ఆర్ధికవేత్తలు చేసిన విశ్లేషణలు, చెప్పిన జోశ్యాలను చైనా ఎలా వమ్ము చేసిందో, అవెలా తప్పో, చైనా సాధించిన విజయాలను పేర్కొంటూ ఆ విశ్లేషణ సాగింది. దానిలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా వుంది.కమ్యూనిజం అంటే ఎక్కడైనా ఒకటే అని అమెరికా విదేశాంగ విధానంలో పేర్కొన్నారు. ఆచరణలో వేర్వేరు అని సోవియట్‌, చైనాల అనుభవం తెలిపింది. నిక్సన్‌ చైనాతో సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనే వరకు రెండు దేశాలను ఒకే శత్రుశిబిరంలో వుంచారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత చైనా కంటే సహజవనరులు ఎక్కువగా వున్న ఆఫ్రికన్‌ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అమెరికా ఆర్ధికవేత్త జోశ్యం చెప్పారు. ఆ విషయంలో పప్పులో కాలేశారు. 1960లో కాంగోలో తలసరి జిడిపి 220 డాలర్లు వుండేది, అది నైజీరియా, చైనాలకు రెట్టింపు.2017నాటికి చైనా తలసరి జిడిపి 9000 డాలర్లకు అంటే నైజీరియా జిడిపికి నాలుగు రెట్లు, కాంగోకు 19రెట్లు ఎక్కువ. చైనా 1978లో నవీకరణ కార్యక్రమం చేపట్టిన తరువాత మానవజాతి చరిత్రలో అత్యంత వేగమైన అభివృద్ధిని నిలకడగా సాధించటమేగాక 85కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసింది.

ఆసియన్‌ టైగర్లని చెప్పిన జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాల మాదిరి అభివృద్ధి సాధించిన తరువాత మరింత ప్రజాస్వామికంగా తయారవుతుందని చెప్పారు. అది కూడా జరగలేదు.1989 నుంచి 1991 మధ్య కమ్యూనిస్టు దేశాలలో ప్రజాస్వామిక గాలి వీచింది, ప్రచ్చన్న యుద్దం ముగిసింది, కొంత మంది అయితే చరిత్ర ముగిసింది అని చెప్పారు.(ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే సోషలిజాన్ని వదులు కోవటం, చరిత్ర ముగిసింది అంటే కమ్యూనిస్టు చరిత్ర అని అర్ధం) అయితే అది తూర్పు ఐరోపాలో, ఇతర చోట్ల జరిగింది తప్ప చైనాలో కాదు. దీర్ఘకాలం అభివృద్ధితో పాటు పార్టీ అదుపు కూడా కొనసాగింది.చైనాను ప్రపంచ వాణిజ్య సంస్ధలో చేర్చితే అది కూడా పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ ప్రజాస్వామిక వ్యవస్ధల మాదిరి తయారవుతుందనే భావన 1989 నుంచి డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ ప్రభుత్వాలలో వుంది. అది కూడా జరగలేదు. చరిత్రలో అతి పెద్ద సంపద బదిలీ జరిగింది అని జాతీయ భద్రతా సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ కెయిత్‌ అలెగ్జాండర్‌ 2012లోనే చెప్పారు. చైనా గురించి ఎంతో మంది ఎందుకిలా చెప్పారంటే విధాననిర్ణేతలు, మేథావులు సాధారణ సూత్రీకరణలు చెప్పారు కానీ చైనా పురాతన కాలంలోనూ నూతన ఆవిష్కరణలు చేసింది, ఆధునిక కాలంలోనూ దారిద్య్రం నుంచి బయటపడి ఒక ఆధునిక దేశంగా మారింది.1949 తరువాత కమ్యూనిస్టు నాయకత్వంలో ఒక గ్రామీణ దేశంగా వున్నదానిని ప్రపంచంలో అత్యంత ఆధునిక నిఘావేసే దేశాలతో సమంగా తయారైంది.

Image result for communist China

అమెరికా, చైనా నేతలకు మౌలికమైన తేడాలున్నాయి. అమెరికన్ల విషయానికి వస్తే జ్ఞాపకాలు స్వల్పకాలంలోనే అంతరిస్తాయి, కేంద్రీకరణలో నిలకడ వుండదు, ఒక సంక్షోభం నుంచి మరోసంక్షోభానికి ఎదురు చూస్తున్నట్లు వుంటుంది. వాషింగ్ట్‌న్‌లో బడ్జెట్‌ను ఆమోదించటం, దాని మీద కేంద్రీకరించటమే ఒక వీరోచిత చర్యగా చూస్తారు. అదే చైనా విషయానికి వస్తే దీనికి భిన్నంగా జ్ఞాపకాలు దీర్ఘకాలం వుంటాయి, కేంద్రీకరణ నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వ పధకాలు దీర్ఘకాలానికి రూపొందిస్తారు.కృత్రిమ మేధస్సు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు చైనాలో సంవత్సరాల తరబడి పని చేస్తాయి. చైనా మిలిటరీ నవీకరణ 1990దశకంలో ప్రారంభమైంది.ఒక విమానవాహక యుద్ద నౌకను తయారు చేయటానికి చైనాకు ఎంత కాలం పడుతుందని ఒక నౌకాదళ అధికారిని అడిగితే సమీప భవిష్యత్‌లో అని చెప్పారు. దాని అర్ధం 2050 కొంత కాలం ముందు అని, ఆ జోశ్యం కూడా తప్పింది.(1985లో ఆస్ట్రేలియా పాతబడిన ఒక యుద్ద నౌకను తుక్కు కింద మార్చేందుకు చైనాకు విక్రయించింది. అలాంటి వాటిలో అన్ని కీలక విభాగాలను పునరుద్దరించటానికి వీల్లేని విధంగా పనికి రాకుండా చేసి ఇస్తారు. చైనా దానిని అలాగే వుంచి ఏ భాగానికి ఆభాగాన్ని విడదీసి తన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పరిశీలనకు అప్పగించింది. దాన్నే తన ప్రయోగాలకు వాడుకుంది. తరువాత రష్యా నుంచి మరో మూడు పాత యుద్ద నౌకలను కొనుగోలు చేసింది. వాటిని తుక్కు కింద మార్చకుండా ఒక దానిని విలాస హోటల్‌గానూ, మరొక దానిని సందర్శకులకు ఇతివృత్త పార్కుగా మార్చింది. మూడోదానికి మరమ్మతులు చేసి 2012లో తన తొలి విమాన వాహక యుద్ధ నౌకగా మిలిటరీకి అప్పగించింది. 2030 నాటికి అందుబాటులోకి వచ్చే దశలవారీ కనీసం అరడజను నౌకలను నిర్మిస్తోంది.) అమెరికా ప్రపంచ నాయకత్వం అనేది నడుస్తున్న చరిత్ర, అదే చైనా విషయానికి వస్తే 1840దశకం నాటి నల్లమందు యుద్ధాలకు ముందు అదొక పెద్ద శక్తి. వందసంవత్సరాల అవమానాల తరువాత తిరిగి అది ఒక శక్తిగా తయారవుతోంది. అనేక విధాలుగా అసాధారణంగా అది పెరుగుతోంది. చైనా గురించి చేసిన సాధారణ సూత్రీకరణలు, జోశ్యాల గురించి వివరించిన దాని కంటే ఎంతో అస్పష్టంగా వున్నాయి.

ఇండోచైనా, ఆగ్నేయ ఆసియాలో వియత్నాంపై భ్రాంతి పూర్వకమైన అంచనా కారణంగా అమెరికా 58వేల మంది సైనికులను బలి ఇచ్చుకోవాల్సి వచ్చిందంటూ ఒక విశ్లేషకుడు తాజాగా రాశాడు.1965 జూన్‌ తొమ్మిదిన అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ వియత్నాం మీదకు సైన్యాన్ని పంపుతున్నట్లు ప్రకటించిన రోజును గుర్తు చేస్తూ అమెరికా నాయకత్వ అంచనాలు ఎలా తప్పాయో, దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అమెరికా సైనికుల మరణాల గురించి తప్ప వారు వియత్నాంలో చేసిన దారుణాలు, మారణ కాండ ప్రస్తావన లేదు. వియత్నాం మన చేతుల నుంచి పోతే కంబోడియా పోతుంది, థాయ్‌లాండ్‌ పోతుంది, మలేసియా పోతుంది, ఇండోనేషియా పోతుంది, ఫిలిప్పినోస్‌ పోతుంది అంటూ సెనెటర్‌ గాలే మెక్‌గీ చెప్పారు. ఇలాంటి భ్రాంతికి అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ గురయ్యాడు. వుత్తర వియత్నాం కమ్యూనిస్టు దేశంగా వున్నందున దాన్ని అరికట్టి దక్షిణ వియత్నాంను కమ్యూనిస్టు ప్రభావంలోకి పోకుండా చూడాలనే ఎత్తుగడతో ముందుకు తెచ్చిన వున్మాదమది. వియత్నాంను అదుపు చేయకపోతే తమ దేశాలు కూడా కమ్యూనిజంలోకి పోతాయని భయపడి వియత్నాంపై యుద్ధానికి జత కలుస్తాయని అమెరికా భావించింది. అయితే దానికి విరుద్దంగా జరిగిందని, అమెరికా మాత్రం 58వేల మంది సైనికులను బలిపెట్టాల్సి వచ్చిందన్నది విశ్లేషకుడి సారాంశం.

Image result for College kids' distrust  Trump

ప్రపంచ పరిణామాల గురించి తమ నేతలు, విధాన నిర్ణేతలు చేసిన అనేక వూహాగానాలు, సిద్ధాంతాలు విఫలమయ్యాయని చెప్పే వారు అమెరికాలోనే పెరగటం ఇటీవలి కాలంలో వూపందుకుంటున్న పరిణామం. అందుకే యుద్ధాలకు పాల్పడినప్పటికీ తమ సైనికులను అక్కడికి పంపకూడదని, ఒక ప్రాణం పోయినా సమాజంలో తీవ్ర ప్రతికూలత ఎదురవుతుందని సామ్రాజ్యవాదులు భయపడుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా యుద్ధాలు చేయాలని చూస్తున్నారు. అమెరికా నేతల గురించి యువతలో నమ్మకం లేకపోవటం, మీడియాలో ఇలాంటి చర్చ జరగటానికి సంబంధం వుంది. ఏది ముందు, ఏది వెనుక అనే చర్చ కంటే జరుగుతున్న పరిణామాలు పురోగామి శక్తులకు ఎంతో విశ్వాసాన్ని కలిగించేవి అనటంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో ఇవి ఏ రూపం తీసుకుంటాయని జోశ్యం చెప్పలేము గాని సోషలిజం, కమ్యూనిజాల మీద విశ్వాసం తగ్గుతున్న రోజుల్లో ఇవి ఆశారేఖలు అనటం నిస్సందేహం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో వున్న పురోగామి, వామపక్ష ప్రభావాన్ని చూసిన కారణంగానే మన దేశంలోని కాషాయ దళాలు జెఎన్‌యు, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటివాటి మీద తప్పుడు ప్రచారాలు చేయటంతో పాటు వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించాలి. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం చెందుతున్న పూర్వరంగంలో అమెరికా సామ్రాజ్యవాదులకే వామపక్ష భావజాల వ్యాప్తిని అరికట్టటం సాధ్యం కాలేదు. అలాంటిది మన దేశంలో కాషాయదళాల వల్ల అవుతుందా ? అమెరికాలో కమ్యూనిస్టులం అని చెప్పుకొని పని చేసే పరిస్ధితుల్లేని రోజుల నుంచి అవును మేం సోషలిస్టులం, కమ్యూనిస్టులం అని చెప్పుకొనే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగలవచ్చు. వివిధ కారణాలతో తాత్కాలికంగా కమ్యూనిస్టులకు ఓటు వేయకపోవచ్చుగానీ అమెరికా సమాజంలో మాదిరి మన దేశంలోని కష్టజీవుల్లో కమ్యూనిస్టు వ్యతిరేకత లేదు. వారి త్యాగాలను మరచిపోలేదు. జనంలో పోయిన పునాదిని తిరిగి పొందటం ఎలా అన్నదే అభ్యుదయవాదులు, కమ్యూనిస్టుల ముందున్న సవాలు ! చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికి వున్న చేపలు ఎదురీదుతాయి. కమ్యూనిస్టులూ అంతే !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందూత్వపై గిరీష్‌ కర్నాడ్‌ తిరుగుబాటు !

12 Wednesday Jun 2019

Posted by raomk in Communalism, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Girish Karnad, hindutva

Image result for Girish Karnad : a rebel against Hindutva

ఎం కోటేశ్వరరావు

అవును నిజంగానే ! ఆయనొక తిరుగుబాటుదారుడు !! రాసిన నాటకాలు, తీసిన సినిమాలు, పొల్గొన్న వుద్యమాలు, వెల్లడించిన అభిప్రాయాలు అన్నీ తిరుగుబాటు స్వభావం కలిగినవే. ఆయనే గిరీష్‌ కర్నాడ్‌. ఒక విప్లవకారుడు అస్తమించినపుడు ఎవరైనా సంతాపం ప్రకటించటం, కుటుంబానికి సానుభూతిని వెల్లడించటం వేరు. అతని జీవితాంతం అన్ని విధాలుగా వ్యతిరేకించిన వారు, దెబ్బతీసేందుకు ప్రయత్నించిన శక్తులు మరణించిన తరువాత కూడా అదేపని చేస్తే నిజంగా ధన్యజీవే అనటం కొంత మందికి రుచించకపోవచ్చు. విప్లవకారుడు లేదా తిరోగమన వాది భౌతిక శరీరాల సాధారణ లక్షణాలన్నీ ఒకే విధంగా వుంటాయి. భావజాలాలే భిన్నం. అందుకే గిరీష్‌ మృతికి ఆయన భావజాలాన్ని అభిమానించే, అనుసరించేవారు నివాళి అర్పిస్తే, వ్యతిరేకించే వారు సామాజిక మాధ్యమంలో విద్వేష వ్యాఖ్యలు చేశారు. అందుకే భావజాల పోరులో ఆయన తుదికంటా నిలిచిన ధన్యజీవి. ముందుతరాలకు వుత్తేజమిచ్చే ఒక తార.

Image result for Girish Karnad, gauri lankesh

గౌరీ లంకేష్‌ను హత్యచేసిన ప్రధాన నిందితుల దగ్గర నుంచి కనుగొన్న సమాచారం ప్రకారం వారి హంతక జాబితాలో ఆయన పేరు కూడా వుంది. అయితేనేం ఎక్కడా ఎలాంటి వెరపు లేకుండా కడవరకూ హిందూత్వశక్తులను వ్యతిరేకించిన ధీశాలి. దేశం, దాని రాజ్యాంగానికి ముప్పు వచ్చింది కనుక బిజెపి, దాని మిత్రపక్షాలను ఎన్నుకోవద్దంటూ దేశ ప్రజలను బహిరంగలేఖలో కోరిన ఆరువందలకు పైగా కళాకారుల్లో ఆయనొకరు. బహుశా ప్రజాజీవనంలో, హిందూత్వశక్తులకు వ్యతిరేకంగా ఆయన చివరి గళం, సంతకం అదే అయి వుంటుంది. చరిత్రలో గాంధీలు వుంటారు గాడ్సేలు వుంటారు. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలన్నదే అసలు సమస్య. ఘనమైన మన గత చరిత్రలో చార్వాకులు పురోగామి శక్తుల ప్రతినిధులు. వారిని భౌతికంగా అంతం చేయటమే కాదు, వారి భావజాలాన్ని కూడా మితవాదులు, మతవాదులు వదల్లేదు. అందుకే మన కాలంలో వారి కోవకు చెందిన రాజీలేని యోధుడు కర్నాడ్‌ను మరణించిన తరువాత సామాజిక మాధ్యమంలో మతశక్తులు తూలనాడటంలో ఆశ్చర్యం ఏముంది.

Image result for Girish Karnad

కళ కళకోసం, కాసుల కోసం కాదు ప్రజల కోసం అని నమ్మిన వ్యక్తి గిరీష్‌. నాటక రచయిత, సినిమా నటుడు, లౌకిక వాది, సామాజికవేత్త గిరీష్‌ కర్నాడ్‌ దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యని ఎదుర్కొంటూ 81వ ఏట ప్రధాన అవయవాల వైఫల్యంతో సోమవారం ఉదయం బెంగుళూరులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన బాల్యం, యవ్వనాన్ని చూస్తే తిరుగుబాటు పుట్టుక నుంచే వారసత్వంగా వచ్చిందా అనిపిస్తుంది. ఒక బిడ్డ తరువాత గిరీష్‌ తల్లి భర్తను కోల్పోయింది. బతుకు తెరువు కోసం ముంబై వెళ్లి నర్సుగా శిక్షణ పాందాలనే ప్రయత్నంలో డాక్టర్‌ రఘునాధ్‌ కర్నాడ్‌ను లుసుకుంది. వితంతు వివాహాలకు నాటి సమాజ ఆమోదం లేని కారణంగా వివాహం చేసుకొనేందుకు వారు ఐదు సంవత్సరాలు వేచి చూశారు. చివరికి ఆర్యసమాజం వారిని ఒక్కటిగా చేసింది. వారికి కలిగిన సంతానం నలుగురిలో మూడవ వాడు గిరీష్‌. మహారాష్ట్రలోని ప్రస్తుత ధానే జిల్లాలోని మధెరాన్‌లో 1938 మే నెల 19న జన్మించాడు. ఆయన పధ్నాలుగవ ఏట వారి కుటుంబం కర్ణాటకలోని ధార్వాడకు వచ్చింది. అప్పటికే అది కన్నడ సాంస్కృతిక కేంద్రంగా వుండటంతో యక్షగానం వంటి కళా రూపాల పట్ల ఆకర్షితుడైన గిరీష్‌ 1958లో కర్ణాటక యూనివర్శిటి నుండి డిగ్రీ పట్టా పొందాడు. తరువాత ఎంఎ, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం, పొలిటికల్‌ సైన్స్‌, అర్ధశాస్త్రాలను అభ్యసించాడు. చిత్రం ఏమిటంటే ఆక్స్‌ఫర్డ్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత చెన్నయ్‌లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌లో పని చేస్తుండగా సరస్వతి గణపతి అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆమె తల్లి పార్సీ, తండ్రి కొడవ సామాజిక తరగతికి చెందిన వారు. పది సంవత్సరాల తరువాత గాని ఆయన 42ఏండ్ల వయస్సులో వివాహం చేసుకొనే వీలు కలగలేదు.

చిన్నతనంలోనే పురాణాలు, ఇతిహాసాల పూర్వరంగంలో పెరగటం, దేశంలో మొగ్గతొడిగిన పురోగామి భావాలు వికసించిన సమయంలో వున్నత విద్యాభ్యాసం, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో అధ్యయనం ఆయన మానసిక పరిణితికి దోహదం చేశాయి. అనేక మంది ఆ కాలంలోని వారు అదే బాటలో నడక ప్రారంభించినప్పటికి అందరూ చివరి వరకు లేరు. గిరీష్‌ ప్రత్యేకత అదే. తనకు ఇష్టమైన కళారంగాన్ని ఎంచుకున్నప్పటికీ దానిలోనూ ఆయన ప్రత్యేకతను కనపరిచాడు. పురోగామి సినిమాలను నిర్మించటం, ప్రోత్సహించటమే కాదు, తాను సంపాదించినదానిలో కొంత మొత్తాన్ని నాటకరంగ వేదికల నిర్వహణకు వెచ్చించారు.

Image result for Girish Karnad : a rebel against Hindutva

అనేక మఠాలు, పీఠాలకు నిలయమైన కర్ణాటకలో వాటి ప్రభావం ఎక్కువ. అదే సమయంలో వాటి తిరోగామి భావజాలాలకు వ్యతిరేకంగా అనేక మంది అక్కడే రాటుదేలారు. అక్కడి సామాజిక వాతవరణాన్ని వినియోగించుకొని సంఘపరివార్‌ శక్తులు దాన్నొక ప్రయోగశాలగా చేసుకొని తాత్కాలికంగా అయినా పాగా వేశాయి. వాటి దాడులను ఎదుర్కొని కళాకారులు నిలవటం సామాన్యవిషయం కాదు. గిరీష్‌ కర్నాడ్‌ చాలా నాటకాలు రాశారు. 1961లో యయాతి, 1972లో హయవదన, 1988లో నాగమందాల రచించారు. గిరీష్‌ కర్నాడ్‌ పలు భాషా సినిమాల్లో నటించారు. తెలుగు, కన్నడలో ఎక్కువగా నటించారు. 1970లో కన్నడ సినిమా సంస్కారలో నటించాడు. దానిలో ప్రఖ్యాత సోషలిస్టు కార్యకర్త స్నేహలతా రెడ్డి ముఖ్యపాత్రధారిణి. ఆమె వామపక్ష భావాల కారణంగా 1975లో అత్యవసర పరిస్ధితిలో అరెస్టయి జైలులో చిత్రహింసలకు గురై మరణించే స్ధితిలో పెరోల్‌పై బయటకు వచ్చిన ఐదురోజులకే ప్రాణాలు విడిచారు. ‘సంస్కార’ని వ్యాపారాత్మకంగా కాకుండా కళాత్మకంగా తీసి మెప్పుపొందారు. ఇందులో కర్నాడ్‌ ప్రాణేశాచార్య అనే ప్రధాన పాత్ర పోషించారు. మరో ప్రముఖ నటుడు పి.లంకేష్‌ ఇందులో నెగటివ్‌ రోల్‌ పోషించారు. ఈ చిత్రానికి పట్టాభిరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదటి స్వర్ణకమలం పొందిన కన్నడ చిత్రం కావడం విశేషం. తర్వాత బి.వి.కారంత్‌ అనే ప్రసిద్ధ దర్శకునితో కలిసి సహదర్శకత్వంలో ఎస్‌.ఎల్‌.బైరప్ప రాసిన వంశవ క్ష కావ్యం ఆధారంగా అదే పేరుతో ఓ సినిమాని రూపొందించారు. దీనికి పలు రాష్ట్రీయ, అంతరాష్ట్రీయ పురస్కారాలు, ప్రశంసలు లభించాయి. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కర్నాడ్‌ ‘ప్రేమికుడు’ సినిమాలో విలన్‌గా తన విలక్షణ నటనని ప్రదర్శించారు. తెలుగులో ‘ఆనంద బైరవి’, ‘రక్షకుడు’, ‘కొమరం పులి’, ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’, ‘ధర్మ చక్రమ్‌’, ‘స్కెచ్‌ ఫర్‌ లవ్‌’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. దీ హిందీలో కర్నాడ్‌ 1976లో మంథాన్‌, 2000లో పుకార్‌, 2005 ఇక్బాల్‌, 2012లో ఎక్‌దటైగర్‌, 2017లో టైగర్‌ జిందాహై అనే సినిమాలో నటించాడు.

1974లో పద్మశ్రీ అవార్డును, 1992లో పద్మభూషణ్‌ అవార్డును, 1998లో జ్ఞానపీఠ అవార్డును స్వీకరించారు. 2017లో ప్రముఖ జర్నలిస్టు గౌరి లంకేష్‌ను హిందూమతోన్మాద శక్తులు హత్య చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక గౌరిని హత్య చేస్తే మేమందరం గౌరిలుగా మారతామంటూ గౌరి హత్య తరువాత బెంగళూరులో నిర్వహించిన పెద్ద ర్యాలీలో, తరువాత జరిగిన సభలో పాల్గొని ప్రజాస్వామికవాదులపై ప్రభుత్వాలు కొనసాగిస్తున్న దాడిని తీవ్రంగా ఖండించారు. పలువురిని అక్రమంగా నిర్బంధించటాన్ని వ్యతిరేకిస్తూ పౌరహక్కుల కార్యకర్తగా కూడా వ్యవహరించారు. దానిలో భాగంగానే తాను అర్బన్‌ నక్సల్‌నంటూ మెడలో బోర్డు వేసుకొని నిరసన తెలిపాడు.

Image result for Girish Karnad : a rebel against Hindutva

మరణానంతరం కూడా హిందూత్వశక్తులు గిరీష్‌ కర్నాడ్‌పై దాడి చేయటాన్ని గౌరీ లంకేష్‌ సోదరి, చిత్రనిర్మాత కవితా లంకేష్‌ ఖండించారు. ‘ఇలాంటి వారంతా పడక కుర్చీలకు పరిమితం అయ్యే బాపతు. ఒక వ్యక్తి గురించి ఏమీ తెలియకుండానే ట్వీట్‌లు చేస్తారు. బెంగళూరు విమానాశ్రయానికి చారిత్రక వ్యక్తి టిప్పు సుల్తాన్‌ పేరు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చినపుడు మద్దతు తెలిపినందుకు ముస్లిం పేరున్నందుకు కర్నాడ్‌ను అపహాస్యం చేశారు. ఇలాంటి వారి హీనమైన వ్యాఖ్యలను సేకరించి కేసులు పెట్టాలి, ఏదో ఒక చర్య తీసుకోవాలి. అప్పుడే ఇతరులు అదుపులో వుంటారు. నరేంద్రమోడీ మాదిరి ప్రమోద్‌ ముతాలిక్‌ వంటి వారు ప్రతి కుక్క మరణించినపుడు సంతాపం తెలపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించే వారు తప్పించుకుంటున్నారు, వారిని అరెస్టు చేయటం లేదు. వారు ఇతరుల మీద ద్వేషాన్ని రెచ్చగొడతారు, అలాంటి వారిని ఎందుకు జైలుకు పంపరు? మీరు ఒక మంత్రిమీద జోక్‌ వేస్తే వెంటనే జైలుకు పంపుతారు, ఇలాంటి వారిని మాత్రం కాదు ‘ అన్నారు. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి వుండటమే కాదు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా జీవితాంతం నిలబడిన గిరీష్‌ కర్నాడ్‌ తోటి కళాకారులకే కాదు, యావత్‌ సభ్య సమాజానికి ఆదర్శనీయుడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతులకు పెట్టుబడి సాయం- మోడీ సర్కార్‌ బండారం !

08 Saturday Jun 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Literature., Loksabha Elections, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

agriculture in india, cash support schemes for farmers, Distressed farm sector, Modi sarkar secrecy, PM-KISAN scheme

Image result for cash support schemes for farmers

ఎం కోటేశ్వరరావు

ఢిల్లీ మెట్రోలో మహిళలకు వుచిత ప్రయాణం కల్పించాలనే ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వ ఆలోచన లేదా నిర్ణయం రాబోయే ఎన్నికలలో లబ్ది పొందేందుకే అని బిజెపి గోలగోల చేసింది. ఐదేండ్లూ చేయని ఆలోచన ఇప్పుడు చేస్తున్నారని రుసరుసలాడింది. అధికారమే యావగా వున్న పార్టీలకు ప్రత్యర్ధుల ఎత్తులు బాగా అర్ధం అవుతాయి. చిన్న, సన్నకారు రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయలు వ్యవసాయ పెట్టుబడి సొమ్ము చెల్లించాలని నరేంద్రమోడీ సర్కార్‌ ఐదేండ్లూ ఏమీ చేయకుండా హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు తాత్కాలిక బడ్జెట్‌లో వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే పధకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్నేమనాలి ? రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో బిజెపి ఓడిపోవటం, అంతకు ముందు పలుచోట్ల రైతాంగ ఆందోళనల నేపధ్యంలో ఓట్లకోసం మోడీ సర్కార్‌ ఆ పని చేసిందన్నది బహిరంగ రహస్యం. ఆమ్‌ ఆద్మీ కూడా అంతే !

ఆమధ్య, బహుశా ఇప్పటికీ సామాజిక మాధ్యమంలో తిరుగుతూనే వుండి వుంటుంది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ వెనెజులాలో అమలు జరుపుతున్న సంక్షేమ పధకాల మాదిరే మన దేశంలో కూడా ప్రకటిస్తున్నారు, దేశాన్ని దివాలా తీయిస్తారు జాగ్రత్త అనే అర్ధంలో ఒక పోస్టు పెట్టారు. సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిన ప్రతిసారీ ప్రతి చోటా దేశాన్ని దివాలా తీయించటంతో పాటు జనాన్ని సోమరులుగా మారుస్తున్నారనే వాదనలు వినిపిస్తూనే వున్నాయి. కిలో రెండు రూపాయల బియ్యం పధకం, గతంలో పనికి ఆహార పధకం, ఇప్పుడు మహాత్మాగాంధీ గ్రామీణ వుపాధి పధకం, నిరుద్యోగ భృతి ఇలా ఒకటేమిటి ప్రతిదానికి ఏదో ఒక కారణం చూపి వ్యతిరేకించే వారు మనకు కనిపిస్తారు. ఇది మనదేశం లేదా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. అమెరికాలో కూడా ఆరోగ్యబీమా, ఆహార కూపన్లు( మన దగ్గర రెండురూపాయల బియ్యం పధకం మాదిరి), నిరుద్యోగభృతి, స్కూళ్లలో వుచిత మధ్యాహ్నభోజన పధకం, బలహీనవర్గాలకు గృహనిర్మాణం, పిల్లల సంరక్షణ సహాయం వంటి పధకాలన్నీ జనాన్ని ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా చేస్తాయని, పనిచేయటానికి ఇష్టపడని వాతావరణాన్ని సృష్టిస్తాయనే అభిప్రాయాలు బలంగా వ్యక్తం చేసే పార్టీలు, శక్తులలో రిపబ్లికన్లు ముందుంటారు. ఓడిపోయినా సరే పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేయకూడదు, సోమరిపోతులను తయారు చేయకూడదని చెప్పేవారు మనకు అన్ని చోట్లా కనిపిస్తారు. పన్నుల రూపంలో తాము చెల్లించిన మొత్తాలను సంక్షేమ పధకాల పేరుతో కొంత మందికి దోచిపెడుతున్నారని, ఎందుకు పెట్టాలనే భావం దీని వెనుక వుంటుంది. ఇలాంటి వారు మహాఅయితే వికలాంగులు, పని చేయలేని వారి వరకు ఏదో దయా దాక్షిణ్యంగా సాయం చేసేందుకు సరే అంటారు.

Image result for cash support schemes for farmers

ఈ వాదన నిజమే అనుకుందాం, సంక్షేమ పధకాల పేరుతో పొందుతున్న నిధులను కుటుంబ అవసరాలు లేదా వినియోగానికి ఖర్చు చేస్తారనే అంగీకరిద్దాం. దాని వలన లబ్ది పొందేది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులే కదా ! అంటే వారి వుత్పత్తులు వినియోగించేవారు లేకపోతే పరిశ్రమలూ నడవవు, వ్యాపారాలూ సాగవు. వుదాహరణకు వృద్దులకు ఇచ్చే పెన్షన్లూ, పిల్లలను బడికి పంపిన తలిదండ్రులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాల వంటివి వాటిని ఏదో ఒక అవసర నిమిత్తం ఖర్చు చేసుకొనేందుకు తప్ప మరొకందుకు కాదు. అసలేమీ ఆదాయం లేకపోతే వారికి ఇచ్చే సొమ్ము వస్తు లేదా సేవల మార్కెట్లోకి వచ్చే అవకాశం వుండదు. ఆ మేరకు లావాదేవీలు తగ్గిపోతాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అనారోగ్యంతో వుంటూ పని చేయలేకపోతే అలాంటి వారిని భారంగా ఆ సమాజం భావిస్తుంది. పని చేస్తేనే పెట్టుబడిదారులకు లాభం. అందుకోసమైనా జనానికి వైద్య రాయితీలు ఇచ్చేందుకు పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలకులు ముందుకు వస్తారు. అవి తమ ఘనతగా ఫోజు పెడతారు. ఎన్నికల ప్రచారానికి వాడుకుంటారు పని చేయగలిగిన వారు అనారోగ్యాలకు గురైతే సంభవించే నష్టం ఎంతో గతంలో అనేక సర్వేలు, పరిశోధకులు అంచనా వేశారు. సంక్షేమ పధకాల వెనుక దాగి వున్న అంశాలలో ఇవి కొన్ని. అన్నింటి కంటే వీటి గురించి ప్రపంచ బ్యాంకు ఏమి చెప్పిందనేది మరొక ముఖ్యాంశం.

ఎస్కే వాన్‌ గిల్స్‌, ఎర్డెమ్‌ ఓరక్‌ అనే ఇద్దరు పరిశోధకుల వ్యాసాన్ని సేజ్‌ వెబ్‌సైట్‌ 2015లో ప్రచురించింది. దానిలో అంశాల సారాంశాన్ని చూద్దాం.(అసక్తి వున్నవారు ఇక్కడ ఇస్తున్న లింక్‌లో దానిని పూర్తిగా చదువుకోవచ్చు). ‘ అభివృద్ధి చెందుతున్న మరియు సంధి దశలో వున్న దేశాలలో సామాజిక సాయం: రాజకీయ మద్దతు సాధన, రాజకీయ అశాంతిని అదుపు చేసేచర్య ‘ అన్నది దాని శీర్షిక. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల ఏర్పాటుతో రెండవ ప్రపంచ యుద్దం తరువాత మార్కెట్లను అదుపులోకి తెచ్చుకొనేందుకు సూచించిన విధానాలనే నయా వుదారవాద విధానాలు లేదా నూతన ఆర్ధిక విధానాలు అని పిలుస్తున్నారు. ఆ విధానాలను అమలు జరుపుతున్నామని చెప్పుకొనే ధైర్యం లేని పాలకవర్గం వాటికి సంస్కరణలు అనే ముద్దు పేరు పెట్టి జనం మీద రుద్దారు. తామే ప్రవేశపెట్టామని చెప్పుకున్నారు. ప్రపంచ బ్యాంకు 1980-2013 మధ్య సిఫార్సు చేసిన 447 విధానపరమైన పత్రాలను ప్రచురించింది. వాటిని తీసుకున్న పరిశోధకులు తేల్చిన సారం పైన పేర్కొన్న శీర్షికలో వుంది. తమకు అభివృద్ధి తప్ప రాజకీయ అజెండా లేదు అని ప్రపంచబ్యాంకు ఎంతగా చెప్పుకున్నా, అవి వెల్లడించిన పత్రాలలో పరోక్షంగా చేసిన ప్రస్తావనల ప్రకారం ఆయా దేశాలలో తలేత్తే సామాజిక అశాంతిని చల్లార్చేందుకు, పక్కదారి పట్టించేందుకు, తమ విధానాలను అమలు జరుపుతున్న పాలకులకు రాజకీయ మద్దతు వుండాలంటే ఏమి చేయాలో ప్రపంచబ్యాంకు నిపుణులు సూచించారు. వాటిలో భాగమే సంక్షేమ పధకాలు.

Image result for cash support schemes for farmers-ysrcp

లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలలో మిలిటరీ, ఇతర నియంతలను సమర్ధించటం, గద్దెనెక్కించి తమ ప్రయోజనాలను నెరవేర్చుకున్న అమెరికా, ఇతర ధనిక దేశాలు వుక్కు పాదాలతో జనంలో తలెత్తిన అసంతృప్తి, తిరుగుబాటును అణచలేమని గ్రహించి వారిని తప్పించి ప్రజాస్వామ్య పునరుద్దరణ పేరుతో తమకు అనుకూలమైన శక్తులను అధికారంలోకి తెచ్చారు. ఇది కూడా ప్రపంచబ్యాంకు సలహా ప్రకారమే అన్నది గమనించాలి.లాటిన్‌ అమెరికాలో జరిపిన ప్రయోగంలో నియంతలను తొలగించినా జనంలో అసంతృప్తి తొలగలేదని గ్రహించారు. అందువల్లనే సామాజిక సహాయ పధకాలను ముందుకు తెచ్చారు. ఈ పూర్వరంగంలో మన దేశంలో 1990దశకంలో తలుత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ బ్యాంకు షరతులను మన పాలకులు ఆమోదించారు. వాటికే సంస్కరణలు, నూతన ఆర్ధిక విధానాలు, నూతన శతాబ్దంలోకి తీసుకుపోతామనే తీపి కబుర్లు చెప్పారు. పాలకులకు ప్రజల నుంచి నిరసన ఎదురు కాకుండా చూసేందుకు 1995లో మన దేశంలో సామాజిక సహాయపధకాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో భాగమే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్‌లు తదితరాలు. తరువాత అవి ఇంకా విస్తరించాయి.

రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ 2014లో గద్దెనెక్కిన తరువాత అనుసరించిన విధానాలు రైతాంగంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. చివరికి పదిహేను ఏండ్లుగా ఎదురులేని రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ రైతాంగాన్ని బుజ్జగించేందుకు, ఆ పరిస్ధితిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకొనేందుకు రూపొందించిందే ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయం పధకం. రెండవ సారి గద్దెనెక్కిన తరువాత నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించిన రైతుల భాగస్వామ్య పెన్షన్‌ పధకం అన్నది స్పష్టం. ఇలాంటి పధకాల గురించి ప్రపంచబ్యాంకు గతంలోనే సూచించింది. తెలంగాణాలో చంద్రశేఖరరావుకు రైతు బంధు పధకం గురించి సలహాయిచ్చిన అధికార యంత్రాంగానికి వాటి గురించి తెలుసు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని కూడా అవగాహన వుంది కనుకనే ముందుగా ప్రకటించి అమలు జరిపిన ఖ్యాతిని పొంది ఎన్నికల్లో ఎలా వినియోగించుకున్నారో చూశాము.

Image result for cash support schemes for farmers

నయా విధానాలు రైతాంగానికి గిట్టుబాటుగా లేవు, అందుకే వారు పదే పదే రుణగ్రస్తులౌతున్నారు. ఒకవైపు వారికి రుణమాఫీలు చేస్తాం, సాగు చేసినా చేయకపోయినా భూయజమానులకు నేరుగా వ్యవసాయ ఖర్చుల సాయం పేరుతో నేరుగా నగదు అందిస్తాం అని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలలో అమలు జరుపుతున్నాయి.రాబోయే రోజుల్లో ఇంకా రావచ్చు కూడా. ఈ సంక్షేమ పధకాలు శాశ్వతమా అంటే అవునని ఎవరూ చెప్పలేరు. వీటితో సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే కావని లాటిన్‌ అమెరికా అనుభవాలే తిరిగి చెబుతున్నాయి. అక్కడ అధికారంలోకి వచ్చిన వామపక్ష శక్తులు మౌలిక విప్లవ సంస్కరణల జోలికి పోలేదు. నయా వుదారవాద పునాదుల మీద నిర్మించిన వ్యవస్ధల పరిధిలోనే అనేక సంక్షేమ పధకాలను అమలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. వాటిని కూలదోసేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు చేసే నిరంతర కుట్రలు ఒక భాగమైతే, వామపక్ష ప్రభుత్వాలు అనుసరించిన విధానలకు వున్న పరిమితులు కూడా వెల్లడయ్యాయి. అందుకే పదిహేనేండ్లు, ఇరవై సంవత్సరాల తరువాత ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జనం ప్రజాకర్షక మితవాదులను గుడ్డిగా నమ్ముతున్నారు. తెలంగాణా పసుపు రైతులు, ఎర్రజొన్నల రైతులు కూడా రైతు బంధు పధకంతో లబ్ది పొందిన వారే. అయినా సరే మార్కెట్లో తమ వుత్పత్తులకు పడిపోయిన ధరలు అంతకంటే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి గనుకనే ఎన్నికలు ముగిసిన వెంటనే రోడ్డెక్కారు. లోక్‌సభ ఎన్నికలలో దాన్నొక సమస్యగా ముందుకు తెచ్చారు.

Image result for cash support schemes for farmers

మన ఆహార వుత్పత్తి పెరగటానికి దోహదం చేసిన వాటిలో రసాయన ఎరువుల వినియోగం ఒక ముఖ్యపాత్రపోషించింది. రైతులకు తగినంత ఆదాయం లేదు కనుక ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. సంస్కరణల పేరుతో అమలు జరుపుతున్న నయా వుదారవాద విధానాలు వాటికి మంగళం పాడమని వత్తిడి చేసి విజయం సాధించాయి. పోషకాల ప్రాతిపదికన(ఎన్‌బిఎస్‌) సబ్సిడీ విధానం మరొక పేరు ఏదైనా పెట్టనివ్వండి, ఒక్క యూరియా మినహా మిగిలిన అన్ని మిశ్రమ, ఇతర రకాల ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సమాచారం ప్రకారం 2017 నవంబరు నుంచి 2018నవంబరు మధ్యకాలంలో మనం దిగుమతి చేసుకొనే యూరియా, డిఏపి, ఎంఓపి, ఫాస్పారిక్‌ యాసిడ్‌, రాక్‌ ఫాస్ఫేట్‌, అమోనియా, సల్పర్‌లలో మొదటి ఐదు రకాల ధరలు సగటున 21.47శాతం పెరిగాయి. చివరి రెండింటి ధర 8.51శాతం తగ్గింది. అంటే ఒక కిలో ధర వంద రూపాయలు అనుకుంటే ఏడు కిలోల ఎరువులు కొంటే ఏడాది కాలంలో ఐదింటికి అదనంగా చెల్లించింది రు.107 .35, రెండింటికి తగ్గిన ధర రు 17.02 నికరంగా రైతుమీద పడిన భారం 90రూపాయలకు పైమాటే. 2010-11లో డిఏపి క్వింటాలు ధర రు.1075, ఎంఓపి రు.505రులు వుండగా, మరుసటి ఏడాదికి అవి రు.1775, రు.1036కు పెరిగాయి.2018 నవంబరులో గరిష్ట ధరలు రు.2,862, రు.1799గా వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో ఎరువుల సబ్సిడీ రు.74570 కోట్లనుంచి 70100 కోట్లకు తగ్గాయి. ఆరు సంవత్సరాల సగటు రు.73,024 కోట్లు అంటే ధరల పెరుగుదలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ మొత్తం స్ధిరంగా వుందంటే పెరుగుతున్న ధరల భారాన్ని రైతాంగమే మోస్తోంది. ఈ కాలంలో రూపాయి విలువ పతనమై అదనపు భారాన్ని మోపింది. ఇది యుపిఏ మన్మోహన్‌ సింగ్‌-బిజెపి మోడీ పాలనా కాలం.పాలకులు మారినా సబ్సిడీ మొత్తం మారలేదు.

2002-03 నుంచి 2008-09 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తంలో ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీల వాటా 26.56శాతం నుంచి 62.22 శాతానికి పెరిగింది. అంటే వంద రూపాయల సబ్సిడీ ఇస్తే దానిలో ఎరువులకు రూ 62.22, దీన్ని జిడిపితో పోల్చి చూస్తే మొత్తం జిడిపిలో 0.48 నుంచి 1.51శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ 2018-19నాటికి నిఖర ఎరువుల సబ్సిడీ 26.51 శాతానికి జిడిపిలో 0.43శాతానికి తగ్గింది. రైతులకు ఎంతో మేలు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ హయాం తొలి ఏడాది 2014-15లో 0.62శాతం వుండగా ఐదేండ్లలో అది 0.43శాతానికి పడిపోయింది. ఐదేండ్ల సగటు నిఖర సబ్సిడీ 28.73శాతంగానూ, జిడిపిలో సగటు 0.51శాతంగా వుంది. అంటే చివరి ఏడాది గణనీయ మొత్తం తగ్గిపోయింది. అక్కడ మిగిల్చిన మొత్తంలో కొంత రైతులకు పెట్టుబడి సాయం పేరుతో బదలాయించి అదనపు సాయం అన్నట్లుగా ప్రచారం చేసుకొని ఎన్నికల్లో రైతాంగాన్ని మాయచేసిన తీరును చూశాము.

Image result for cash support schemes for farmers

జరిగిన మోసం, దగా ఎలా వుందో చూద్దాం. ఎరువుల సబ్సిడీ విధానంలో మార్పు పేరుతో నూట్రియంట్స్‌ ప్రాతిపదికన సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. నిజానికి ఇది ఎడమ చేయి కాదు పుర చేయి అని చెప్పటమే.ఎన్‌పికె మిశ్రమ ఎరువును రైతు ఒక కిలో కొనుగోలు చేశారని అనుకుందాం. ఆ మూడింటికి కలిపి 2010లో ఇచ్చిన సబ్సిడీ రూ.24.66 వుంటే 2014-15 నాటికి రూ.18.35కు, 2018-19కి రూ.15.08కి తగ్గిపోయింది. అందువల్లనే పైన పేర్కొన్నట్లుగా బడ్జెట్‌లో సబ్సిడీ మొత్తాలను పెంచలేదు. గత పదేండ్ల కాలంలో పది రూపాయల వరకు రైతుల సబ్సిడీ కోత పడింది. ఇదిగాక మార్కెట్లో పెరిగిన ధరలు అదనం. దీన్నే చెంపదెబ్బ గోడదెబ్బ అంటారు. వ్యవసాయ పెట్టుబడుల మొత్తం పెరగటానికి ,రైతాంగానికి గిట్టుబాటు కాకపోవటానికి ఇదొక కారణం కాదా ! ఒక దగ్గర తగ్గించి మరొక దగ్గర ఇవ్వటం వలన అసలు సమస్య పరిష్కారం కాదు. సంక్షేమ పధకాలు శాశ్వతం అని చెప్పలేము. ఏదో ఒకసాకుతో రద్దు చేసినా ఆశ్చర్యం లేదు. ఒక వేళ కొనసాగించినా పెరుగుతున్న ఖర్చులతో పోల్చితే అవి ఏమూలకు సరిపోతాయన్న ప్రశ్న వుండనే వుంది. అసలు లేని దాని కంటే ఎంతో కొంత సాయం చేస్తున్నారుగా ! అని ఎవరైనా అనవచ్చు. అదే ఆ సంతృప్తితో వ్యవసాయ రంగంలో తలెత్తుతున్న ఆగ్రహాన్ని చల్లార్చటమే అసలు లక్ష్యం. పోగాలము దాపురించినపుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు-కుంకము పేరుతో బదలాయించిన డబ్బు తెలుగుదేశం పార్టీని కాపాడగలిగిందా ! ఎవరికైనా అదే గతి, వెనుకా ముందూ తేడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సంక్షేమపధకాల పరిమితులు – జగన్‌ ముందున్న సవాళ్లు !

04 Tuesday Jun 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH CM, challenges before ys jagan, CM YS Jagan, Limits of Welfare schemes, ysrcp

Image result for ys jagan images

ఎం కోటేశ్వరరావు

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కోరుకున్న పదవి సాధించారు. అదీ అఖండ మెజారిటీతో పొందారు. మరికొద్ది రోజుల పాటు అభినందనలు-ఆకాంక్షలను అందుకుంటూనే వుంటారు. ఇంకా మంత్రులను తీసుకోలేదు, తరువాత కూడా కొంతకాలం కాస్త కుదురుకునే వరకు ఏమి చేస్తారు, చేయరు అనే అంశాల మీద కాస్త ఓపిక పట్టక తప్పదు. అయితే తన పాలన ఎలా వుండబోతోందో జగన్‌ ప్రమాణ స్వీకారం రోజే వెల్లడించారు, సమీక్షల సందర్భంగా మరికొన్ని అంశాలను వెల్లడిస్తున్నారు. ఈ పూర్వరంగంలో పాచిపొయ్యే వరకు మూసి పెట్టటం కంటే ఎదురయ్యే సవాళ్లు ఏమిటి, ఎలా పని చేయాలో కోరుకోవటం లేదా సూచించే చర్చ తప్పు కాదు. వింటారా, పరిశీలిస్తారా లేదా అనేది కొత్త ముఖ్యమంత్రికి, ఆయన పరివారానికి వదలి వేద్దాం. ఆ పార్టీ అభిమానులు, సామాన్యులు అయినా బుర్రలకు ఎక్కించుకోవటం అవసరం.

ఏ పార్టీ ఎన్నికల ప్రణాళిక చూసినా ఏమున్నది వాటిలో అంటే అన్నింటా ప్రజాకర్షక సంక్షేమ పధకాలే. పార్టీల నేతలను బట్టి పేర్లు మారుతుంటాయి. జగన్‌ అదేబాటలో నడుస్తున్నట్లు పేర్ల మార్పు ప్రక్రియ వెల్లడించింది. రాజకీయ లబ్ది కోసం, ప్రచారంలో భాగంగా ఫలానా వారు మా పధకాలను కాపీ కొట్టారంటే ఫలానా వారు మమ్మల్ని అనుకరిస్తున్నారని అనటం తప్ప వస్త్రం ఒక్కటే రంగులు, పన్నాలే తేడా. మనకంటే ముందే వివిధ దేశాలలో అమలు జరిపిన వాటిని అనుకరిస్తూ అందరూ ఇక్కడ తమ బుర్రలోంచి పుట్టినవి అన్నట్లుగా ఫోజు పెడుతున్నారు. సంక్షేమ పధకాలను వ్యతిరేకించే వారు, సమర్ధించేవారూ వుంటారు. అయితే అవే సర్వస్వం, బొందితో కైలాసానికి తీసుకుపోతాయని ఎవరైనా చెబితే అక్కడే తేడా వస్తుంది. సమర్ధించేవారు సైతం మింగలేరు. ఇంతవరకు ఎవరూ సంక్షేమ పధకాలతో జనాన్ని కైలాసానికి తీసుకుపోలేదు, ఇక ముందు కూడా తీసుకుపోలేరు అన్నది ఇప్పటికే అమలు జరిపిన దేశాల అనుభవం చెప్పిన సత్యం. ఎవరైనా తూర్పున వుదయించే సూర్యుడిని పడమరకు మారుస్తామని చెపితే, నిజమే వారికి అంత సామర్ధ్యం వుందని భక్తులు భజన చేస్తే చేసుకోనివ్వండి. బాబాలు ఎందరో భక్తులు కూడా అన్ని తరగతులుంటారు కదా ! ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి జగన్‌ ఎదుర్కొనే సమస్యల గురించి కొన్ని అంశాలను చూద్దాం.

అంత్య కంటే ఆదినిష్టూరమే మంచిది. ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలోనూ కేవలం సంక్షేమ పధకాలతో ప్రజల మన్ననలను చూరగొన్న వారు లేరు. ఎక్కడైనా వున్నా అది గరిష్టంగా రెండు ఎన్నికల వరకు మాత్రమే వుంటుందని అమెరికాలోని అట్లాంటిక్‌ పత్రిక 1991 నుంచి 2018వరకు 33 దేశాలలోని 46 మంది ప్రజాకర్షక నేతల పాలన, వారు పదవి నుంచి దిగిపోయిన తీరు తెన్నులు, ఇతర అంశాల గురించి ఒక విశ్లేషణలో పేర్కొన్నది. జగన్‌కు వాటన్నింటినీ అధ్యయనం చేసే తీరిక వుంటుందో లేదో తెలియదు కనుక ఆయన మంచి కోరుకొనే సలహాదారులైనా ఆపని చేసి నివేదించాలి. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తామని పదేపదే చెబుతున్నారు. కానీ ఫీజుల రాయితీ, ఆరోగ్యశ్రీ, ఇంకా ఇతర సంక్షేమ పధకాలను అమలు జరిపిన ఐదేండ్ల తరువాత ఆ రాజన్నకు 2009 ఎన్నికలలో వచ్చిన ఓట్లు 36.56శాతమే. ప్రజారాజ్యం చిరంజీవి తెచ్చుకున్న 17శాతం ఓట్ల పుణ్యమా అని కాంగ్రెస్‌కు అధికారం పొంది, తరువాత ప్రజారాజ్యాన్ని మింగివేయటం వేరే విషయం. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ పుణ్యమా అని జగన్‌ తొలిసారి అఖండ మెజారిటీ తెచ్చుకున్నారు.

కుందేటి కొమ్ము సాధించవచ్చు,తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు గానీ ఈ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సిపి చేసిన కొన్ని వాగ్దానాలను అమలు జరపటం అసాధ్యం. వాటిలో ఒకటి ర్రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన.పదిహేడవ లోక్‌సభ ఎన్నికలలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏకు పూర్తి మెజారిటీ రాదు, అందుకు అవసరమైన సీట్లను తాము సాధిస్తే వాటిని వుపయోగించుకొని ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు అన్న అంచనాతో ఈ నినాదాన్ని ముందుకు తీసుకు వచ్చారన్నది స్పష్టం. ఎన్నికల ఫలితాలు ఆ అంచనాను దెబ్బతీశాయి. ప్రత్యేక హోదా గురించి మరచి పొమ్మని బిజెపి నేతలు తెగేసి చెప్పారు, దానికి తోడు ఇతర అంశాలు వున్నాయి కను బిజెపితో వైఎస్‌ఆర్‌సిపికి దానికి జతకలవలేదు. నరేంద్రమోడీ 2.0కు గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, ఇప్పటికే ఎదురవుతున్న అనేక సమస్యలకు తోడు ఏపికి ప్రత్యేక హోదాను తలకెత్తుకుంటారంటారని ఎవరైనా అనుకుంటే రాజకీయాల్లో ఓనమాలు తెలియని వారనే చెప్పాలి.

ఇక మద్యపాన నిషేధం, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోలేదన్నది స్పష్టం. ఆచరణ సాధ్యం కాని వాటి గురించి చెప్పటం ప్రజాకర్షక నేతల స్వభావం. ఈ వాగ్దానం చేసిన ఆ పార్టీ నేతలు లేదా కార్యకర్తలు ఎన్నికల సందర్భంగా మద్యం జోలికి పోకుండా వున్నట్లయితే వారి చిత్తశుద్ది, ఆచరణను ప్రశ్నించాల్సి వచ్చి వుండేది కాదు. రైతుల రుణాల రద్దు సాధ్యం కాదని గతంలో ఒక వ్యూహాత్మక తప్పిదం చేసిన ఫలితం ఐదేండ్లపాటు అధికారానికి దూరంగా వుండటం అని జగన్‌కు అర్ధం అయింది కనుక ఈ సారి ఎక్కడా ఏ విషయంలోనూ అసాధ్యం అనే మాటే లేదు. మద్యపాన నిషేధం వలన ఆర్ధికంగా రెండు నష్టాలు. ఒకటి మద్యవిక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోతుంది. జనం అలవాటును మానుకోలేరు గనుక నాటుసారా బట్టీలు తిరిగి మొదలవుతాయి, అవిగాకపోతే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అయ్యే మద్యాన్ని కొనుగోలు చేయటం ద్వారా రాష్ట్రంలోని జనం దగ్గర వున్న సొమ్ము బయటకు పోతుంది. ఆ రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ వాగ్దాన సలహా ఇచ్చిన వారు మత్తులో వుండి ఆపని చేశారో మరొక విధంగా చేశారో తెలియదు గానీ జగన్‌కు కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. అవినీతిని పెంచుతుంది, మద్యం మాఫియాలను సృష్టిస్తుంది. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం గురించి ముందుగానే జనానికి చెప్పి అజెండానుంచి వాటిని ఎత్తివేస్తే అదొకదారి అలాగాక ఇతర సాకులు చెబితే ప్రతిపక్షానికి పని కల్పించినట్లే !

Image result for cm ys jagan

ప్రస్తుతం రెండు వేల రూపాయలుగా వున్న వృద్దాప్య పెన్షన్లను ఏటా 250 రూపాయల చొప్పున పెంచుతూ నాలుగు సంవత్సరాలలో మూడువేలు చేస్తామని జగన్‌ ఫైలు మీద సంతకం చేశారు. గత పన్నెండు సంవత్సరాలుగా పెంపుదల లేని జాతీయ సామాజిక సహాయ పధకం(ఎన్‌ఎస్‌ఏపి) పెన్షన్‌ మొత్తాలను పెంచాలని ఈ ఏడాది జనవరిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం రూ.200గా వున్న వృద్ధులు, వికలాంగుల, వితంతు పెన్షన్లను రూ.800కు, 80సంవత్సరాలు దాటిన వారికి ఇస్తున్న రూ 500లను 1200 పెంచాలన్నది దాని సారాంశం. కేంద్రం ఇస్తున్న ఈ నిధులకు రాష్ట్రాలు తమ వాటాను తోడు చేయాలని గతంలో కేంద్రం కోరింది. అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా మరికొన్ని రాష్ట్రాలలో అంతకంటే ఎక్కువే జమచేసి అమలు జరుపుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించిన మొత్తాలను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టుబోయే బడ్జెట్‌లో చేర్చితే కేంద్రం నుంచి వచ్చే మొత్తం రెండు నుంచి ఎనిమిది వందలంటే నెలకు ఆరువందల పెరుగుతుంది.ఈ లెక్కన ఒకరికి ఏడాదికి రూ 7,200 పెరుగుతుంది. జగన్‌ మోహన రెడ్డి పెంచుతానన్నది నెలకు రూ 250, అంటే ఏడాదికి మూడువేల రూపాయలు. కేంద్రం ఎనిమిది వందలకు పెంచితే నాలుగు సంవత్సరాలకు రాష్ట్రానికి ఒక్కొక్కరికి 28,800 జమ అవుతుంది. జగన్‌ సర్కార్‌ పెంపుదల ప్రకారం ఏడాదికి మూడువేల చొప్పున నాలుగు సంవత్సరాలకు పడే అదనపు భారం పన్నెండువేలు మాత్రమే. ఒక వేళ కేంద్రం ఎనిమిది బదులు ఆరువందలు చేసినా 19,200 కేంద్రం నుంచి వస్తే రాష్ట్ర సర్కార్‌ మీద భారం తగ్గుతుంది తప్ప పెరగదు. గతేడాది చివరిలో జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ ఘర్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఎదురులేని బిజెపి పదిహేనేండ్ల పాలనకు ఎదురు దెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. దానికి వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం, పెరిగిన నిరుద్యోగం వంటి అంశాలు కారణం. జనంలో తలెత్తిన అసంతృప్తిని చల్లార్చేందుకు లేదా పక్కదారి పట్టించేందుకు కేంద్రం తాత్కాలిక బడ్జెట్‌ అయినా కిసాన్‌ సమ్మాన్‌ యోజన పేరుతో పాత తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా ఏటా ఆరువేల రూపాయల వ్యవసాయ పెట్టుబడి పధకాన్ని ఎన్నికల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. సామాజిక సహాయ పెన్షన్ల పెంపు ప్రతిపాదన ఆలోచన కూడా దాన్నుంచే వచ్చింది.

దేశంలో ఇప్పటికీ ఈ నామమాత్ర సాయం కూడా అందుకోని వారు దాదాపు ఆరుకోట్ల మంది వున్నారని ఏడాది క్రితం పెన్షన్‌ పరిషత్‌ అనే పౌరసమాజ సంస్ధ జరిపిన సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఇందిరా గాంధీ జాతీయ సామాజిక సహాయ పధకం కింద కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు అందిస్తున్నది. సమాజంలోని తొంభైశాతం మంది వృద్ధులు, ఇతరులకు ఇస్తున్న పెన్షన్లకు జడిపిలో 0.04శాతం మాత్రమే ఖర్చవుతున్నదని, నెలకు రెండున్నరవేల రూపాయల వంతున చెల్లిస్తే జిడిపిలో 1.6శాతం అవుతుందని ప్రముఖ ఆర్ధికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ పెన్షన్‌ పరిషత్‌ సర్వే తీరు తెన్నుల మీద వ్యాఖ్యానించారు. దేశంలో మూడు కోట్ల మంది వృద్ధులు ఇతరులకు పెన్షన్లు పెంచితే మొత్తం బడ్జెట్‌ 30వేల కోట్ల రూపాయలని, ఇప్పటికే వున్నది గాక ఏటా అదనంగా అయ్యే ఖర్చు 18వేల కోట్ల రూపాయలు మాత్రమే అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొన్నది. కేంద్ర, రాష్ట్ర పెన్షన్‌ పధకాలను కూడా విలీనం చేసే అంశం గురించి చర్చలు జరుగుతున్నాయి. అది జరిగితే కొన్ని చోట్ల పెన్షన్‌లు గణనీయంగా పెరిగితే ఇప్పటికే ఎక్కువగా వున్న చోట్ల ఏమౌతాయన్నది ఒక పెద్ద ప్రశ్న. సార్వత్రిక పెన్షన్‌ పధకాలను అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ఒక ప్రజాప్రయోజన వాజ్యంపై విచారించిన న్యాయమూర్తులు అన్ని పధకాలను విలీనం చేసి ఒక సమగ్ర పధకాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ కారణంగానే విలీన అంశం తెరమీదికి వచ్చింది. జూన్‌ నాటికి ఒక రూపం తీసుకోవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. దీనిలో అనేక అంశాలు వున్నాయి. కొన్ని రాష్ట్రాలలో కేంద్రం ఇస్తున్న మొత్తాలు రెండువందలే అమల్లో వుండగా ఏపిలో తాజాగా పెంచినదానితో 2,250 రూపాయలు వుంది. అందువలన కేంద్రం, రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులు, ఇతర అంశాలు ముందుకు వస్తాయి.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత ప్రత్యక్ష వలసలు సాధ్యం కాదని గ్రహించిన సామ్రాజ్యవాదులు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల ద్వారా ప్రపంచంలో నయా వుదారవాద విధానాలను ముందుకు తెచ్చి ప్రపంచ మార్కెట్లను ఆక్రమించుకోవటం, ప్రత్యక్ష దోపిడీ స్ధానంలో పరోక్ష దోపిడీకి తెరతీశారు. రెండవ ప్రపంచ యుద్ధ పర్యవసానాలు సోషలిస్టు దేశాల సంఖ్యను పెంచటంతో పాటు అనేక దేశాలలో కమ్యూనిస్టులు బలం పుంజుకోవటం గమనించిన సామ్రాజ్యవాదులు కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన అనేక అంశాలలో భాగంగా సంక్షేమ రాజ్య భావన పేరుతో జనానికి తాయిలాలు అందించేందుకు తెరలేపారు. ఇదే సమయంలో ద్రవ్య పెట్టుబడిదారులకు అనుకూలమైన నయా వుదారవాద విధానాలు అమలు జరిగిన చోట జనంలో అసంతృప్తి పెరగటాన్ని గమనించిన తరువాత దాన్ని దారి మళ్లించేందుకు సామాజిక సహాయ పధకాలను అమలు జరపాలని దాని నిపుణులు సూచించారు. ఇదే సమయంలో నూతన శతాబ్ది లక్ష్యాల పేరుతో వాటికి పంచదారపూత పూశారు. మన దేశంలో 1991లో నూతన ఆర్ధిక విధానాల అమలు ప్రారంభమైంది. అప్పటికే పలు దేశాలలో సామాజిక అసమానతలు తీవ్రం కావటం, అశాంతికి దారి తీస్తున్న నేపధ్యంలో మన దేశంలో అలాంటిది పునరావృతం కాకుండా చూసేందుకు 1995లో సామాజిక సహాయ పధకాలను ప్రారంభించారు. ఇదేదో మన పాలకులు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పట్ల చూపుతున్న ఔదార్యమనో మరొకటో అనుకుంటే పొరపాటు ఎవరు వచ్చినా అమలు జరిపేవే అన్నది ఇప్పటికే స్ఫష్టమైంది. ఈ కారణంగానే ఎన్నికల ముందు ఎన్ని ఆకర్షణీయ పధకాలను ప్రకటించినా తెలుగుదేశం పాలనపట్ల తలెత్తిన అసంతృప్తి ముందు అవి నిలువలేకపోయాయి. ఎవరొచ్చినా అమలు జరుపుతారు, అవినీతి,అక్రమార్కులను వదిలించుకుందామనే కసితోనే ఓటర్లు రాత్రి వరకు వేచి వుండి మరీ తెలుగుదేశాన్ని ఓడించారు.దారిద్య్ర నిర్మూలన, మిలీనియం అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా మన కంటే దరిద్రంలో వున్న దేశాలు కూడా సామాజిక సంక్షేమ పెన్షన్లు ఎక్కువ మొత్తాలు చెల్లిస్తున్నాయి.

అనేక లాటిన్‌ అమెరికా దేశాలలో సంక్షేమ పధకాలను అమలు జరిపిన ప్రభుత్వాలు ప్రజల అసంతృప్తిని చల్లార్చలేకపోయాయి. వాటి మూలాలను తొలగించలేవు.అందువలన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతి యాభై కుటుంబాలకు ఒక వలంటీర్‌ పేరుతో గ్రామాలలో లక్షలాది మందిని నియమించటం, ఆచరణలో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలకు పునరావాసం కింద మారనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే రాజన్య రాజ్యంలో రైతు వలంటీర్ల పేరుతో కాంగ్రెస్‌ కార్యకర్తలనే నియమించటాన్ని చూశాము. అందువలన నెలకు ఐదు వేల రూపాయలు పొందే వలంటీర్లుగా అధికార పార్టీ కార్యకర్తలు మాత్రమే వుంటారు లేకపోతే పార్టీలోనే అసంతృప్తి మొదలవుతుంది. మిగతా పధకాల అమలు గురించి సందర్భోచితంగా చర్చించుదాం.

Image result for cm ys jagan

ప్రభుత్వ వుద్యోగులకు కొత్త పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్దరిస్తామని జగన్‌ వాగ్దానం చేశారు.కాంట్రాక్టు వుద్యోగుల క్రమబద్దీకరణ వంటి వాగ్దానాలు చేశారు. గతంలో పాత పెన్షన్‌ వర్తించే సిబ్బంది ఎక్కువగా, కొత్త పధకపు సిబ్బంది తక్కువ. ఇప్పుడు ప్రతి నెలా, ప్రతి ఏటా పాతవారు తగ్గిపోయి కొత్తవారు పెరుగుతున్నారు. అంటే అసంతృప్తి చెందేవారు పెరుగుతున్నట్లే. ఈ ముఖ్యమైన సమస్య గురించి ఏమి చెబుతారా అని వుద్యోగులు, వుపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇలాంటివే చాలా వున్నాయి.

చివరిగా రాజకీయంగా బిజెపి మరుగుజ్జు సేనలు వైఎస్‌ జగన్‌ మతం గురించి అప్పుడే ప్రచారం మొదలు పెట్టాయి. జగన్‌ హిందూ మతంలోకి మారినట్లు నకిలీ వీడియోలను ఇప్పటికే పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలో ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు అదంతా ఒట్టిదే క్రైస్తవమతానికి పెద్ద పీటవేశారంటూ ప్రమాణస్వీకారం సందర్భంగా ముందుగా క్రైస్తవ మతపెద్దల ఆశీర్వాదాన్ని పొందటాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ దేశంలో ఎవరు ఏమతంలో వుండాలన్నది వారి వ్యక్తిగత అభీష్టమే. నిజానికి రాజశేఖరరెడ్డి గురించి ఇలాంటి ప్రచారం వున్నా పరిమితం. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. మరోవైపున జగన్‌ ప్రతి సందర్భంలోనూ హిందూ పీఠాధిపతుల సేవలో తరిస్తున్నారు. తన మీద ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ మార్గం ఎంచుకున్నారా లేక నిజంగానే నమ్మకాలు వున్నాయా? ఒక లౌకిక దేశంలో ఇలా చేయటం అభ్యంతరకరం. అందునా దేశంలో నేడు హిందూత్వ శక్తులు రెచ్చిపోతున్న స్ధితిలో తగని పని. ఒక ప్రధానిగా తన భార్యను గురించి చెప్పలేదని నరేంద్రమోడీపై ఇప్పటికే ఒక విమర్శ వుంది. జగన్‌ హిందూ మతంలోకి మారారని, మారలేదని సామాజిక మాధ్యమంలో నడుస్తున్న చర్చకు ఆదిలోనే ముగింపు పలకాల్సింది ఆయనే. అదే విధంగా దేశంలో వున్న మతతత్వం, తదితర అంశాలపై కూడా ఒక పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీ వైఖరి ఏమిటన్నది తెలుసుకోవాలని సహజంగానే కోరుకుంటారు. అదే విధంగా హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేసిన ప్రయత్నంపై వెంటనే స్పందించి వుండాల్సింది. అవకాశవాదాన్ని ప్రదర్శిస్తే కుదరదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అప్పుడెందుకు మూసి పెట్టారు – ఇప్పుడెందుకు బయట పెట్టారు !

01 Saturday Jun 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

India Unemployment, Narendra Modi, Narendra Modi 2.0, narendra modi bhakts, Unemployment Rate NSSO Report

Image result for modi 2.0

ఎం కోటేశ్వరరావు

2019 మే 23కు ముందు, తరువాత వచ్చిన మార్పు ఏమిటి? మీడియాలో వర్ణించిన దాని ప్రకారం నరేంద్రమోడీ 2.0గా మారారు. దీని భావం ఏమిటంటే తిరుమలేశా, మారుతున్న కాలంతో మారని మీకు అది వర్తించదు. అసలైన భావం, తొలి వుత్పత్తి, తొలి సేవల వంటివి ఏవైనా మలిగా ఆధునిక రూపం, మార్పులు సంతరించుకొంటే దాన్ని వ్యక్తీకరించటానికి 2.0ను సూచికగా వాడుతున్నారు. దాని ప్రకారం మోడీలో వచ్చిన మార్పు ఏమిటి? నిరుద్యోగం గురించి ప్రతిపక్షాల నోరు మూయించేందుకు అసలు సిసలు పాత మోడీ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే లెక్కలు బయటకు రాకుండా చేశారు. ఒక పత్రికలో వెల్లడైన వాటిని తప్పుల తడకలని వర్ణించారు. ఇప్పుడు కొత్త మోడీ తన భక్తుల నోరు మూయించేందుకు ఆ లెక్కలనే అధికారికంగా విడుదల చేయించారు. విడుదల చేయక తప్పని స్ధితి, ఎందుకంటే నాటకంలో రెండో అంకం మొదలు కావాలి కదా ! మోడీ సర్కార్‌ చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి గతంలో వాస్తవాలను బయట పెట్టిన మీడియా, ప్రతిపక్షాల మీద వీరంగం వేసిన పార్టీ కార్యకర్తలు, గుడ్డి భక్తులు వాస్తవాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేరు, జీర్ణించుకున్నా నోరు తెరవలేరు. తిరిగి ఎన్నికలు జరిగే వరకు ఎలాగూ అసలు విషయాల గురించి మోడీ నోరెత్తరు. నాటకం నడవక తప్పదు, మద్దతుదారులకు ఏదో ఒక పని చెప్పాలి కనుక వారు తేరుకొని గళం విప్పేందుకు కొత్త వాదనను అందుబాటులోకి తెచ్చారు. నిరుద్యోగ అంకెలు తప్పుల తడకలని గతంలో మోడీ అండ్‌కో రాగం తీస్తే ఇప్పుడు భారత ప్రధాన గణాంక అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ కొత్త పల్లవి అందుకున్నారు.

ఇంతకీ ప్రవీణ్‌ శ్రీవాత్సవ గారి వేద గణిత తర్క సారాంశం ఏమిటి ? ‘ తాజాగా అధికారికంగా విడుదల చేసిన నమూనా సర్వేక్షణ వుద్ఘాటన ఏమంటే ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరు హైస్కూలు విద్య, అంతకు మించి చదుకొని వుండి వుంటారు అనే ప్రాతిపదిక మీద జరిగింది, గత సర్వేలన్నీ తలసరి నెలవారి వినియోగం ఎంత అనే ప్రాతిపదిక మీద నిరుద్యోగాన్ని అంచనా వేశాయి కనుక గత సర్వేలతో పోల్చకూడదు. ఈ సర్వేలో ఆచార నవీకరణ లేదా కొత్త మార్పుల వంటి అనేక అంశాలు వున్నాయి. ప్రతి మూడు నెలలకు పట్టణాలు, గ్రామాలలో విడివిడిగా, రెండింటినీ కలిపి ఏడాదికి ఒకసారి గణించటం వంటి వన్నీ కొత్తమార్పులు. ఎవరైనా కొత్తగా ఒకదానిని ప్రారంభించినపుడు అది ఎలాంటి రాతలు లేని కొత్త పలక మాదిరి వుండాలనటాన్ని మీరు అభినందించాలి. అనేక విద్యా కోర్సులు యువతకు వుపాధి చూపేవిగా లేవు. వుద్యోగాలు చేయగల యువకులను యజమానులు పొందాలంటే నైపుణ్య అభివృద్ధిని మెరుగుపరచే విధంగా కార్యకలాపాలు పెరగాలి. అది జరగాలంటే అవసరం-సరఫరా తేడా ఎంత వుందో చూడాలి, దాన్ని కేవలం సంఖ్యతో మాత్రమే కాదు నైపుణ్య స్ధాయితో కూడా చూడాలి.’

దీని భావం ఏమిటంటే, ఫీజు రీఇంబర్సుమెంటో మరొకదానితోనో ఇంటికొకరు చదుకొని తగలడ్డారు, ఆ చదువు చట్టుబండలైంది తప్ప వుద్యోగం లేదా వుపాధికి పనికి రాదు. అలాంటి వారు పెద్ద సంఖ్యలో వున్నంత మాత్రాన వారందరినీ నిరుద్యోగులంటే ఎలా ! వారి నైపుణ్యం కూడా చూడాలి. అంటే ఇప్పుడు పెద్ద సంఖ్యలో వున్నవారందరూ పనికి రాని చదువులు చదివి, ఎలాంటి నైపుణ్యం లేకుండా వున్నారు. వారందరినీ నిరుద్యోగులంటే కుదరదు, రాబోయే రోజులలో పరిస్ధితిని, సర్వేలను పోల్చుకోవాలి తప్ప పాతవాటిని అంగీకరించం, బాగా చదువుకొని, బాగా నైపుణ్యం సంపాదించి పని పాటలు లేకుండా నిరుద్యోగిగా వుంటేనే అసలు సిసలు నిరుద్యోగి, అటువంటి వారెందరున్నారో అన్నది తేల్చేందుకు పూనుకున్నాం, కొత్త లెక్కలు రానున్నాయి, పాతలెక్కలను మరచిపోండి అన్నది ప్రవీణ్‌ గారి ప్రావీణ్య తర్కం. దీన్ని అంగీకరిస్తామా లేదా, దీన్ని అర్ధం చేసుకోగల చదువు సంధ్యల విజ్ఞానం లేదా నైపుణ్యం నిరుద్యోగులకు వుందా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఎవరైనా నోరు తెరిచి కాదు గీదంటే ప్రభుత్వ వ్యతిరేకులుగా భావించి గోరక్షకుల మాదిరి చెలరేగి పోవటానికి మోడీ సర్కార్‌ రక్షకులు సిద్ధంగా వుంటారు మరి ! జాతీయ వాదానికే అర్ధం మార్చి కొత్త అర్ధాలు చెబుతున్నవారు చెప్పే నిరుద్యోగ కొత్త అర్దం తెలుసుకోవటానికి, అలవాటు పడటానికి మనం మరో ఐదేండ్లు సిద్దం కావాలి మరి.

సమస్యను పక్కదారి పట్టించటంలో నిరుపమాన సామర్ధ్యం కలిగిన వ్యక్తి గనుక 2018 ప్రారంభంలో ఒక ఛానల్‌తో ఏర్పాటు చేసుకున్న ఇంటర్వ్యూలో ఒక వ్యక్తికి పకోడీలు అమ్మితే రోజుకు 200 మిగులు తుంది, దాన్ని వుపాధి కల్పనగా లెక్కవేయాలా వద్దా అని నరేంద్రమోడీ ఎదురు ప్రశ్నించారు.అది కూడా వుపాధి కల్పనే కదా, మా ఖాతాలోకే రావాలి కదా అని అప్పుడు మోడీ గారు చెప్పారు. ఇప్పుడేమో ప్రవీణ్‌ శ్రీవాత్సవగారు నైపుణ్యం, చదవు వున్నవారే నిరుద్యోగి అని మాట్లాడుతున్నారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అంటే ఇదేనా ?

ప్రపంచ వ్యాపితంగా వేగంగా జరుగుతున్న యాంత్రీకరణ, రోబో, ఇతర ఆధునిక పరిజ్ఞానం కారణంగా ఒక బ్యాచి యువతీ యువకులు నాలుగేండ్ల ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేసి డిగ్రీ చేతబట్టి బయటకు వచ్చేసరికి వారు నేర్చుకున్నది పాతబడిపోతోంది. అందుకే కంపెనీలు కొత్త నైపుణ్యానికి ప్రాధాన్యత ఇచ్చి అవి వున్నవారినే ఎంచుకుంటున్నాయి. ఈ పూర్వరంగలో నైపుణ్యశిక్షణ పేరుతో మోడీ సర్కార్‌ పెద్ద ఎత్తున వూదరగొట్టింది.కంపెనీలు వుద్యోగాలు ఇచ్చి నైపుణ్యాన్ని పెంచితే అందుకయ్యే ఖర్చును తామే చెల్లిస్తామని లేదా ఇతరంగా రాయితీలు కల్పిస్తామని, ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లిస్తామని పేర్కొన్నది. పోనీ దాన్నయినా సక్రమంగా అమలు జరిపిందా?

ఒక వైపు వాజ్‌పేయి పాలన, కాంగ్రెస్‌పాలనా కాలంలో వున్నత విద్య ప్రయివేటీకరణ గావించి పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలను కేవలం డిగ్రీ ముద్రణ కేంద్రాలుగా మార్చివేసినా గత ఐదు సంవత్సరాలలో నాణ్యతను పెంచేందుకు ఎవరూ పట్టించుకోలేదు. బయటకు వచ్చిన వారు పెద్ద మొత్తంలో ప్రయివేటు శిక్షణకు ఖర్చు చేయటం తెలిసిందే. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(నైపుణ్య అభివ అద్ధి) పధకం 2016-20 ఒక ప్రహసనంగా మారింది. అందుకే ఈ మధ్య ఎక్కడా దాని ప్రస్తావనరావటం లేదు. ఈ కాలంలో కోటి మంది యువతీ యువకుల నైపుణ్యాలను పెంచాలన్నది లక్ష్యం. ఇందుకు గాను 12వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీనికి గాను 2018 నవంబరు 30 నాటికి నమోదు చేసుకున్న వారి సంఖ్య 36లక్షలు మాత్రమే. వారిలో 33.9లక్షల మందికి శిక్షణ ఇచ్చారు, 30.02లక్షల మంది గురించి మదింపు వేశారు. వారిలో 26లక్షల మందికి సర్టిఫికెట్లు ఇచ్చామని, వారు వుద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఈ ఏడాది జనవరి ఏడున లోక్‌సభలో ఒక ప్రశ ్నకు ప్రభుత్వం తెలిపింది. మరొక సమాచారం ప్రకారం 2018 ఆగస్టు నాటికి పది లక్షల మందికి వుద్యోగాలు వచ్చాయని చెబుతున్నారు. ఈ లెక్కన చూసినా కోటి మందిలో ఇంతవరకు పదిలక్షలు అంటే పదిశాతం కూడా లక్ష్యం నెరవేరలేదు. మరి ప్రవీణ్‌ గారు దీని గురించి ఏమంటారు?

వీరికి శిక్షణ ఇచ్చిన సంస్ధలది ఒక ప్రహసనం. బోధనా సిబ్బంది లేని ఇంజనీరింగ్‌,వైద్య, విద్యా శిక్షణా సంస్దల గురించిన సమాచారం బహిరంగ రహస్యమే. గతేడాది జనవరిలో పార్లమెంటరీ కమిటీ నైపుణ్య శిక్షణ సంస్ధల తీరు తెన్నుల గురించి తీవ్ర విమర్శలు చేసింది. కొన్ని సంస్ధలు అప్పటికింకా నిర్మాణ దశలోనే వుండటం, కొన్నింటిలో పరికరాల లేమి, ఇతర అవసరాలకు వుపయోగిస్తున్నవి కొన్ని, అసలు చిరునామా తప్ప జాడలేనివి కూడా వున్నాయట. ఈ శిక్షణా సంస్ధలపై వివిధ రాష్ట్రాలలో 1173 కోర్టు కేసులు కూడా నమోదయ్యాయి. దీన్ని బట్టి అవిచ్చిన శిక్షణ ఏమిటో, ఈ తతంగమంతా తెలిసి వారికి వుద్యోగాలు ఇచ్చిన వారెవరో అంతా ఒక పెద్ద ప్రహసనం. నిరుద్యోగులు వుద్యోగాలకు పనికొచ్చే వారు కాదని మోడీ సర్కార్‌ మన్‌కీ బాత్‌ను ప్రవీణ్‌ గారు బయటపెట్టారు. విషాదం ఏమిటంటే నిరుద్యోగులు తమను మభ్యపెడుతున్నవారెవరో కూడా తెలుసుకోలేని దుస్ధితిలో వున్నారు. ఎవరు చేసుకున్న ఖర్మను వారు మరో ఐదేండ్లు అనుభవించక తప్పదనే వాస్తవాన్ని అయినా నిరుద్యోగులు గ్రహిస్తారా ?

Image result for Unemployment Rate NSSO Report : why now  released then suppressed

మన కుర్రకారు భాషలో చెప్పాలంటే పాత మోడీ గారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను కౌగిలింతల దౌత్యంతో పడేయాలని చూశారు. ఫలించినట్లు కనపడటం లేదు. ఇరాన్‌, వెనెజులా నుంచి చమురు కొనవద్దంటే గడువుకు ముందే మానేశాం సార్‌ అని చెప్పారు. మీరు చెప్పినట్లు చేశాము, మరి మాకు ఇప్పుడు ఇరాన్‌ మాదిరి ఎక్కడైనా చౌకగా చమురు ఇప్పిస్తారా అంటే, ఏం మాట్లాడుతున్నారు, మేము ఇప్పించటం ఏమిటి , బయట కావాల్సినంత వుంది, ఎంతరేటు వుంటే అంతకు ఎంతకావాలంటే అంత కొనండి, కావాలంటే మాదగ్గర కూడా వుంది, రేటేమీ తగ్గదు, మీకు తెలిసిందే కదా, అంతా ప్రయివేటు వ్యవహారం అని చెప్పేసింది అమెరికా. మోడీ 2.0అవతారం ఎత్తి సంతోష తరంగాలలో తేలియాడుతుండగానే పెండ్లి అయిన మరుసటి రోజే కట్నం సంగతి ఏమిటని మొదలు పెడుతున్నట్లుగా కౌగిలింతల భాగస్వామి ట్రంప్‌ మరోబాంబు పేల్చాడు. రష్యా నుంచి ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణులు కొనుగోలు చేయటాన్ని నిలిపివేయకపోతే ఆంక్షలు తప్పవని అమెరికా అధికారి ఒకరు స్పష్టం చేశారు. మొండిగా ముందుకు పోతే అమెరికాతో కుదిరిన రక్షణ ఒప్పందాల భవిష్యత్‌ ఇబ్బందుల్లో పడుతుందని, మినహాయింపులు ఇవ్వక ఎ్కడకు పోతారులే అంటే కుదరదని అమెరికా అధికారి చెప్పినట్లు హిందూ పత్రిక కధనం. ఇప్పటి వరకు మన దేశం నుంచి 560కోట్ల డాలర్ల విలువగల వస్తువుల ఎగుమతులపై ఇస్తున్న పన్ను రాయితీలను వుపసంహరించుకుంటామని గతంలోనే ప్రకటించామని దానిని ఇప్పుడు అమలు జరపబోతున్నామని గురువారం నాడే మరో అమెరికా అధికారి విలేకర్లతో చెప్పాడు. మన మాదిరే టర్కీకి ఇచ్చిన ప్రాధాన్యతను రద్దు చేస్తూ మే17న ట్రంప్‌ వుత్తరువులు జారీ చేశారు. మనకు సంబంధించి తమ షరతులకు భారత్‌ అంగీకరించకపోతే ఏ క్షణంలో అయినా అలాంటి ప్రకటనే వెలువడవచ్చన్నది బహిరంగ బెదిరింపు అది. పాత మోడీ కౌగిలించుకుంటే , కొత్త మోడీ కాళ్ల బేర దౌత్యానికి పూనుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బుద్ధి లేని జనాకర్షక, జాతీయ వాదులు !

31 Friday May 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, UK, USA

≈ Leave a comment

Tags

Europe Far-Right, European Commission President Jean-Claude Juncker, Hindu Fundamentalism, Hindu Supremacists, india's saffron brigade, Populists, saffron nationalists, Stupid Nationalists

Image result for eu far right

ఎం కోటేశ్వరరావు

జాతీయ వాదులకు బుద్ధి లేదు, వారి దేశాలను ప్రేమిస్తారు, విదేశీయులను ద్వేషిస్తారు అని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఘాటుగా వ్యాఖ్యానించారు. మే చివరి వారంలో జరిగిన ఆ ఎన్నికల ఫలితాల సరళి ప్రకారం జాతీయవాదులు లేదా పచ్చి మితవాదులు సంపూర్ణ మెజారిటీ వైపుగాక పోయినా గతం కంటే ఎక్కువ స్ధానాలు సంపాదించారు. మన దేశంలో రెండు భావజాలాల మధ్య జరిగిన పోటీగా ఎన్నికలు జరిగాయని, బిజెపి పేరు పెట్టి చెప్పకపోయినా జాతీయవాదులు విజయం సాధించారని ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యాఖ్యానించింది. మన కాషాయ బ్రాండ్‌ జాతీయవాదులు విదేశీయులకు బదులు మైనారిటీలు, మైనారిటీ మతాలను, కమ్యూనిజాన్ని ద్వేషిస్తున్నారు. తమకే అగ్రస్ధానం అన్నది అమెరికా జాతీయవాదం. దానికోసం అనేక దేశాలలో జోక్యం చేసుకొని యుద్దం చేస్తున్నది, చైనా వంటి దేశాలతో వాణిజ్య యుద్ధాలకు పాల్పడుతోంది. మన వంటి దేశాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నది. అవి దాని జాతీయవాదంలో భాగం. ఆఫ్రో-అమెరికన్‌లను ద్వేషించటం అమెరికాలోని మెజారిటీ శ్వేతజాతీయ వాదం. మన స్వాతంత్య్రవుద్యమలో బ్రిటీష్‌ పాలకులను వ్యతిరేకించటం, వారి పాలనకు సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ వంటివి మన మహత్తర జాతీయవాదంలో భాగం. బ్రిటీష్‌ వారికి సలాం కొట్టిన సావర్కర్‌ను కీర్తించటం, గాంధీని చంపిన గాడ్సేను వెనకేసుకు రావటం కూడా నేడు తామే అసలు సిసలు జాతీయ వాదులమని చెప్పుకొనే కుహనా శక్తులు చేస్తున్నపని. పాకిస్ధాన్‌ను, చైనా వస్తువుల దిగుమతులను వ్యతిరేకించటం, అమెరికా ఆంక్షలను ప్రశ్నించకుండా ఆమోదించటం మన కాషాయ వాదుల జాతీయ వాదం. అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యావాదుల దాడులను ప్రతిఘటించటం చైనా జాతీయవాదం. వీటిన్నింటినీ ఒక దగ్గర చేర్చి ఏ జాతీయవాదాన్ని ఎంచుకోవాలి, ఏది పురోగామి, ఏది తిరోగామి అనే ఎంపిక క్లిష్టంగా వుంటుంది. ఒక దగ్గర జాతీయవాదులకు బుద్ధిలేదని తిడుతుంటే, మరొక దగ్గర జాతీయవాదుల విజయాన్ని కీర్తిస్తున్నారు. అమెరికా జాతీయ వాదానికి మన కాషాయవాదులు మినహా ప్రపంచవ్యాపితంగా వ్యతిరేకతం వ్యక్తం అవుతోంది. ఏమిటీ వైపరీత్యం ? అసలు జాతీయ వాదం అంటే ఏమిటి?

ప్రపంచ వ్యాపితంగా ముఖ్యంగా ఐరోపాలో ప్రజాకర్షక, జాతీయవాదులు -వీరందరినీ మితవాదులు అనవచ్చు. వీరి వైఖరి ఆయాదేశాల పరిస్ధితులను బట్టి మారుతూ వుంటుంది గాని మౌలిక లక్షణం మితవాదం, అది ముదిరితే పచ్చి మితవాదం, మతవాదం, ఇంకా నయా ఫాసిజం, నాజీజం. ఎందుకీ పరిస్ధితి తలెత్తింది అన్నది అభ్యుదయవాదులు, మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను సమర్ధించే సాధారణ లౌకికవాదుల ముందున్న ప్రశ్న. ఐరోపానే తీసుకుందాం. వలస కార్మికుల సమస్యపై జాతీయ వాద రాజకీయవేత్తల వైఖరి ఐరోపా ఐక్యతకే స్పష్టమైన ముప్పును ముందుకు తెచ్చింది అని జుంకర్‌ చెప్పారు. ‘ ఈ ప్రజాకర్షకులు, జాతీయ వాదులు, బుద్దిలేని జాతీయవాదులు తమ దేశాలను ప్రేమిస్తారు, సుదూరాల నుంచి వచ్చే వారిని వారు ఇష్టపడరు మన కంటే దుర్భర పరిస్ధితుల్లో వున్న వారికి మనం మద్దతుగా వ్యవహరించాలి’ అని జుంకర్‌ చెప్పారు. ఐరోపాలో, అమెరికాలో ఒకనాడు పాలకులే వలసలను ప్రోత్సహించారు. ఇప్పటికీ ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహించే కార్పొరేట్‌ శక్తులకు వలస కార్మికుల వలన లాభాలు ఎక్కువగా వుంటాయి కనుక. గతకొద్ధి దశాబ్దాలుగా వుపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది కనుక ధనిక దేశాలలో నిరుద్యోగం, వేతనాల పతనం, ఎగుమతుల అభివృద్ధి పేరుతో వేతనాల కోత, ప్రజాధనం ఎగుమతుల రాయితీలకు మళ్లించటంతో సంక్షేమ పధకాలకు కోతలతో సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ అసంతృప్తిని సొమ్ము చేసుకొనేందుకు మితవాదులు, జాతీయవాదులు, జాత్యంహకార వాదులు పెరుగుతున్నారు. అది తమకు నష్టదాయకమని కార్పొరేట్‌లు భావిస్తున్న కారణంగానే వారి ప్రతినిధి జుంకర్‌ మండిపడుతున్నారు. ఇది పాలకశక్తుల మధ్య అధికారం కోసం జరిగే పోరులో జాతీయవాదులు, జనాకర్షకవాదులది దగ్గర దారి. నరేంద్రమోడీ భారత్‌లో పెద్ద (సామాజిక) విభజన వాది అని టైమ్‌ పత్రిక వర్ణించిన విషయం తెలిసిందే. ముస్లింలు, క్రైస్తవులు మన కళ్ల ముందే పుట్టి పెరిగిన వారిని హిందూత్వ జాతీయ వాదులు ఎలా చూస్తున్నారో వివరించాల్సిన అవసరం లేదు. వారు ఈ దేశానికి విధేయులుగా లేరనే ప్రచారం, జాతీయవాదులుగా నిరూపించుకోవాలని పదే పదే అనటం తెలిసిందే. ఐరోపా దేశాలలో కూడా జాత్యహంకారులు, శ్వేతజాతి వాదులు మైనారిటీలను, విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశం పట్ల విధేయత వుండదని ఇలాగే అవమానిస్తారు.

Related image

ఐరోపా అంతటా ఇటీవలి కాలంలో మితవాదం పెరుగుతోంది, ఇదే సమయంలో సోషల్‌ డెమోక్రసీ తరుగుతోంది. మన దేశంలో కూడా జరిగింది అదే. కాంగ్రెస్‌ పార్టీ పతనానికి సూచిక అది. లౌకికశక్తుల మీద మిత, మతవాద శక్తులు పైచేయి సాధించాయి. నాజీ హిట్లర్‌ తరువాత జర్మనీలో ఏడు దశాబ్దాల పాటు ఐరోపా తరహా ప్రజాస్వామ్యమే వుంది తప్ప మితవాద శక్తులు తలెత్తలేదు. అలాంటి చోట ఎఎఫ్‌డి( జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ) అనే పచ్చి మితవాద పార్టీ మూడవ శక్తిగా వునికిలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంలో దెబ్బతిన్న ఐరోపా తిరిగి తమకు పోటీగా బలపడకూడదని అమెరికా భావించింది. ఒంటరిగా వుంటే ఏనుగు వంటి అమెరికాను ఎదిరించి ప్రపంచ మార్కెట్లో తమ వాటాను తాము కాపాడుకోలేమని గ్రహించిన యూరోపియన్‌ కార్పొరేట్‌ శక్తుల ఆలోచన ప్రకారమే ఐరోపా యూనియన్‌ వునికిలోకి వచ్చింది. ఐరోపా బొగ్గు, వుక్కు కమ్యూనిటీతో 1951లో ప్రారంభమై ఏడుదశాబ్దాలుగా సరిహద్దుల చెరిపివేత వరకు వచ్చిన ఐరోపా యూనియన్‌ మీద ఇప్పుడు అనేక దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. ఎవరి కాపురం వారు పెట్టుకుందాం, ఎవరి గొడవ వారు చూసుకుందామనే ధోరణులు పెరిగాయి. దాని పర్యవసానమే ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్‌ నిర్ణయం.

పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అసలు అది ఎలుకలను పట్టగలదా లేదా అన్నది అసలు సమస్య అన్నట్లుగా ఐక్య ఐరోపా లేదా ప్రపంచీకరణ ఏ పేరు పెట్టినా ఐరోపాలో అమలు జరిగింది పెట్టుబడిదారీ విధానమే. అది ఇప్పుడు మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటటోంది. కమ్యూనిజం వైఫల్యం చెందింది అన్నది దాని వ్యతిరేకుల మాట. ఇప్పుడు పెట్టుబడిదారీ వైఫల్యం చెందింది అన్నది దాని అనుకూలురు చెబుతున్నమాట. ఈ ఏడు దశాబ్దాల్లో చూస్తే కార్మికవర్గం సాధించుకున్న లేదా పాలకులు వుదారంగా ఇచ్చిన అనేక సంక్షేమ పధకాలకు కోతపడుతోంది. వేతనాలు పెరగటం లేదు. వుపాధి సమస్యలు ముందుకు వస్తున్నాయి. యూరోపియన్లు వందల సంవత్సరాల పాటు ప్రపంచంలోని మూల మూలకు వలసలు పోయి అక్కడి సంపదలను స్వంతం చేసుకున్న చేసుకున్నారు. అసలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలే అలా ఏర్పడ్డాయి. స్దానికులను మైనారిటీలుగా మార్చి వారి మీద పెత్తనం చేసిన, ఇప్పటికీ చేస్తున్న చరిత్ర మన కళ్ల ముందు వుంది. మరి అలాంటి దేశాలలో ఇప్పుడు ఇతరం ఖండాల నుంచి వలస వస్తున్న వారినే కాదు, ఐరోపాలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వస్తున్న తోటి వారినే అనుమతించకూడదన్న సంకుచిత భావాలు తలెత్తటానికి, పెరిగి పెద్దవి కావటానికి అనువైన పరిస్ధితులు ఏర్పడ్డాయి. అమెరికాలో కూడా అంతే పొరుగుదేశమైన మెక్సికో నుంచి వలసలు రాకుండా ట్రంప్‌ మహాశయుడు ఏకంగా సరిహద్దులో గోడ కడతానంటున్నాడు. బెర్లిన్‌ గోడను బద్దలు చేసినందుకు సంతోషం వెలిబుచ్చిన పెద్దలు వారే ఇప్పుడు కొత్త గోడలు కడుతున్నారు.

ఎటు తిరిగి ఎటు చూసినా పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యమే కనిపిస్తోంది. అందుకు సాంప్రదాయ పార్టీలే కారణం అంటే కాదనలేని స్ధితిలో అవి పడ్డాయి. దాన్ని అవకాశంగా తీసుకొని చూడండి అల్లావుద్దీన్‌ అద్బుతదీపం మాదిరి అద్బుతాలు చేస్తామని చెప్పేశక్తులు ముందుకు వస్తే ఒకసారి చూస్తే పోలా అని ఎవరికి వారు అనుకుంటున్నారు. వారికి ఫాస్ట్‌ ఫుడ్‌ లేదా ఎటిఎం మాదిరి వెంటనే కోరుకున్నది కావాలి. ఇన్నేండ్లుగా మేము నమ్మిన పార్టీలు నట్టేట ముంచాయి. వాటి మీద ఏమాత్రం నమ్మకం లేదు. వారు చేయలేనిదానిని మేము చేస్తామని కొత్తగా రంగంలోకి వచ్చిన వారు చెబుతున్నారు. వారు మితవాదులా అతివాదులా అన్నది మాకనవసరం, పని చేసే వారు, ఫలితాలు ఇచ్చేవారు కావాలి. వారికీ ఒక అవకాశం ఇచ్చి చూస్తాం, మితవాదులు వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు, అలాంటిదేదైనా వస్తే అప్పుడు చూసుకుందాం అనే ధోరణులు ఐరోపా అంతటా ప్రబలుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే అనేక పార్టీలు ఇలా పుట్టి అలా ఓట్లు పొంది దేశాల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. సాంప్రదాయ పార్టీలు మట్టి కరుస్తున్నాయి. బ్రిటన్‌లో మూడు నెలల క్రితం పుట్టిన పార్టీ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల్లో 32శాతం ఓట్లు తెచ్చుకొని బస్తీమే సవాల్‌ అంటోంది. మన దేశంలో కూడా జరుగుతోంది అదే. కాంగ్రెస్‌ అవినీతిని అక్రమాలను కూకటి వేళ్లతో పెకలించి వేస్తామన్నది బిజెపి లేదా కాషాయ జాతీయవాదుల వాగ్దానం. యాభై ఏండ్లలో కాంగ్రెస్‌ చేయలేనిదానిని ఐదు సంవత్సరాలలో తాము చేశామని జనాన్ని నమ్మింప చూసిన యత్నాన్ని చూశాము.

నూటయాభై సంవత్సరాల క్రితం ఫెర్డినాండ్‌ లాసలే కమ్యూనిస్టు లీగ్‌లో సభ్యుడిగా వున్నప్పటికీ మార్క్స్‌, ఎంగెల్స్‌ ఆయనతో తీవ్రంగా విబేధించారు.చివరికి ఆ పెద్ద మనిషి కమ్యూనిస్టు వ్యతిరేక బిస్మార్క్‌తో చేతులు కలిపిన వైనం తెలిసిందే. అయితే ఐరోపాలో కమ్యూనిజాన్ని ఎదుర్కొనే క్రమంలో సంస్కరణ వాదలక్షణాలుండే సోషల్‌ డెమోక్రసీని ముందుకు తెచ్చిన ఆద్యుడిగా లాసాలేను చెబుతారు. నిజమైన రాజ్యాంగబద్దమైన రాజ్యంలో నిజమైన పాలకుడు ఓటరే అనే లాసాలే ప్రవచనాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది వాస్తవం కాదని పాలకవర్గాలకు తెలిసినా, చాలా మంది ప్రజాస్వామిక వాదులు అది నిజమని నిజంగానే నమ్మారు. అయితే నూటయాభై సంవత్సరాల తరువాత వారికి ఆభ్రమలు తొలిగిపోతున్నాయన్నవి విశ్లేషకుల అభిప్రాయం. ఓటర్ల పేరుతో తీర్పులను హైజాక్‌ చేస్తున్నారు. తమకు ఎవరు ప్రయోజనకారులో, ఎవరు హాని చేస్తారో కూడా తెలియని స్ధితికి నేడు ఓటర్లు లోనై వున్నారు.

Image result for jean-claude juncker eu president

సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు వ్యవస్ధల కూల్చివేతకు ముందే ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమంలో ముందుకు వచ్చిన సైద్ధాంతిక సమస్యలతో పార్టీలు విడిపోయాయి. ఆ తరువాత ఆ వ్యవస్దలు కనుమరుగు కావటంతో అనేక మందిలో విశ్వాసం సన్నగిల్లింది. నీరు గారిపోయారు, అనేక పార్టీలు కనుమరుగై బూర్జువా పార్టీల అవతారమెత్తాయి. ఒక విధమైన శూన్యం ఏర్పడింది. పెట్టుబడిదారీ విధాన వైఫల్యాలను ఎండగట్టి జన విశ్వాసాన్ని చూరగొనే స్ధితిలో మిగిలి వున్న కమ్యూనిస్టులు లేకపోవటంతో దిగజారుతున్న ఆర్ధిక పరిస్ధితులను అవకాశంగా తీసుకొని మరోసారి మితవాద, జాతీయవాద శక్తులు మోరలెత్తుతున్నాయి. అనేక మంది ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.

1857లో మన దేశంలో తలెత్తిన ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామానికి అనేక పరిమితులు వుండవచ్చు గానీ, ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని తీవ్రంగా అణచివేసిన తరువాత నాలుగు దశాబ్దాలపాటు ఎలాంటి వుద్యమాలూ రాలేదు. తరువాత కూడా బ్రిటీష్‌ వారిని పరిమిత హక్కుల కోసం ప్రాధేపడే కాంగ్రెస్‌తో ప్రారంభమైన వుద్యమంలో తరువాత ఎన్నిమార్పులు, ఎన్ని ఆలోచనలు తలెత్తిందీ చూశాము. అలాగే ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమం, భారత వామపక్ష, కమ్యూనిస్టు వుద్యమం కూడా అలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటోంది. తిరిగి పుంజుకోవటం అనివార్యం. అయితే అనేక మందికి ఆ విషయంలో విశ్వాసం లేదు. ఇక్కడ ఒకటే సమస్య. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యాల గురించి చెప్పనవసరం లేదు. చైనా సోషలిస్టు వ్యవస్ధ గురించి కొందరికి కొన్ని అనుమానాలు వున్నాయి. అది కూడా పెట్టుబడిదారీ వ్యవస్దే అన్నది కొందరి భావన. అలా భావించే వారు ఎవరికి వారు ఆలోచించాల్సిన అంశాలు రెండు. ఒకటి పెట్టుబడిదారీ వ్యవస్ధకు దోపిడీలేని మరొక ప్రత్యామ్నాయం కమ్యూనిజం తప్ప మరొకటి ఎక్కడైనా కనిపిస్తోందా? చైనా సోషలిస్టు వ్యవస్ధ కానట్లయితే దాన్ని కూల్చివేసేందుకు అమెరికా ఎందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు ? అక్కడ మిగతా పెట్టుబడిదారీ దేశాల మాదిరి సంక్షోభాలు ఎందుకు రావటం లేదు? అంతవేగంగా పురోగమించటానికి చైనా వెనుక వున్న శక్తి కమ్యూనిస్టు పార్టీ గాకపోతే మరేమిటి ? జర్మన్‌ జాతీయ వాదం హిట్లర్‌ను, ఇటలీ జాతీయ వాదం ముస్సోలినీ, అమెరికన్‌ జాతీయ వాదం ప్రపంచాన్ని నిరంతరం యుద్ధాలతో నింపే యుద్దోన్మాదులను తయారు చేసింది. మన దేశంలో కాషాయ జాతీయ వాదం ఎవరిని తయారు చేయనున్నది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలుగుదేశం పార్టీ ఓటమి, చిత్తశుద్ధి లేని పాఠాలు !

30 Thursday May 2019

Posted by raomk in AP, Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

AP Assembly Elections 2019, hypocritical lessons, N Chandra babu naidu, tdp, telugu desam party debacle, ysrcp

Image result for chandrababu naidu debacle

ఎం కోటేశ్వరరావు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నాలుగు జిల్లాల్లో తుడిచి పెట్టుకుపోయింది. మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడిని ఒక జిల్లాకు పరిమితం చేయకపోతే విజయ నగరం, నెల్లూరు, కడప, కర్నూలుతో పాటు చిత్తూరు కూడా అదే కోవకు చెందుతుంది. అక్కడ మరొక తెలుగుదేశం అభ్యర్ధి గెలవలేదు. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రెండేసి స్ధానాలకు, విశాఖ పట్టణం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో నాలుగు స్ధానాల చొప్పున ఆ పార్టీ గెలుచుకుంది. ఇక ఓటింగ్‌ వివరాలకు వస్తే వైఎస్‌ఆర్‌సిపికి 49.9, తెలుగుదేశం పార్టీకి 39.2శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు 6.78, దానితో సీట్లు సర్దుబాటు చేసుకున్న సిపిఎం, సిపిఐలకు 0.43శాతం, కాంగ్రెస్‌కు1.17, బిఎస్‌పికి 0.28, బిజెపికి 0.84శాతం ఓట్లు, వైసిపికి 151, తెలుగుదేశం పార్టీకి 23, జనసేనకు ఒక స్ధానం వచ్చాయి.

తెలుగుదేశం పార్టీకి గతంలో ఓటు చేసిన బిజెపి, పవన్‌ కల్యాణ్‌ అభిమానుల ఓట్లు ఈసారి పడవని, ఎవరి బలం వారికి వుంటుందని, ఆ పరిస్ధితి వైఎస్‌ఆర్‌సిపికి అనుకూలంగా వుంటుందనేది అంకెలు చెప్పిన సత్యం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 44.6, వైసిపికి 44.2, కాంగ్రెస్‌కు 8.8, బిజెపికి 2.2శాతం వచ్చాయి. ఇప్పుడు శాతాల వారీ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఐదుశాతం ఓట్లు తగ్గగా వైసిపికి 5.7శాతం పెరిగాయి. దీన్నిబట్టి చూసినపుడు కాంగ్రెస్‌కుకు తగ్గిన ఏడున్నరశాతం ఓట్లు మొత్తం వైఎస్‌ఆర్‌సికికి పడి వుంటే దాని ఓటింగ్‌ ఇంకా పెరిగి వుండేది. మెజారిటీ ఓట్లు మాత్రమే వైసిపికి పడ్డాయన్నది స్పష్టం. ఇక తెలుగుదేశానికి తగ్గిన ఓట్లు, దానిపునాది చెదిరింది అనేదాని కంటే బిజెపి, పవన్‌ కల్యాణ్‌ ప్రభావంతో వచ్చిన ఓట్లు ఐదుశాతం తగ్గినట్లు పరిగణించ వచ్చు. ఈ ఓట్లు తగ్గటం, కాంగ్రెస్‌, బిజెపి ఓటింగ్‌ కొంత మళ్లిన కారణంగా వైసిపి అఖండ విజయం సాధించింది. ఒక వేళ పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ రెండు పార్టీలలోని ఒక సామాజిక వర్గం ఓట్లు చీల్చింది అనుకున్నా, కొందరు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారారని అనుకున్నా ఎవరి బలం వారికి వుంది అని అంకెలు చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలో తెలుగుదేశం ఓటమి గురించి వెలువడుతున్న విశ్లేషణలు, వెల్లడవుతున్న అభిప్రాయాలను చూద్దాం. తెలుగుదేశం పార్టీ పైనుంచి కింది వరకు అవినీతి అక్రమాలకు పాల్పడిందనటంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి జనం అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి వుంటే తెలుగుదేశం ఓటింగ్‌ ఇంకా ఘోరంగా పడిపోయి వుండేది, అన్ని ఓట్లు వచ్చి వుండేవి కాదు, బహుశా చంద్రబాబు నాయుడు నామమాత్ర మెజారిటీతో గెలిచి ఒకే ఒక్కడుగా అసెంబ్లీలో మిగిలి వుండేవారు. అసలు పట్టించుకోలేదు అనలేము గాని ఎవరు తక్కువలే ఎవరు వచ్చినా తినకుండా వుండేవారెవరు అని జనం అవినీతిని నిత్యజీవితంలో విడదీయని భాగంగా పరిగణించి పెద్దగా పట్టించుకోలేదా అన్నది సూక్ష్మ పరిశీలన చేస్తే తప్ప తెలియదు. ఒక వేళ అవినీతి అక్రమాలపై ఆగ్రహం కారణంగా కోల్పోయిన ఓట్లను ఎన్నికల ముందు తెలుగుదేశం పందారం చేసిన తాయిలాలు పూడ్చాయా అన్నది కూడా ఒక ముఖ్య అంశమే.

తెలుగుదేశం పార్టీ అధికారయుతంగా ఎన్నికల ఓటమి కారణాలను ఇంకా వెల్లడించలేదు. అయినా తెలుగుదేశం మద్దతుదార్లుగా లేదా పాకేజి ఒప్పంద భాగస్వాములుగా లేదా వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేకులుగా పేరు ఏదైనా కానివ్వండి ముద్రపడిన పత్రికల వ్యాఖ్యాతలు, ఎన్నికలలో ఆ పార్టీ తరఫున సీట్లు ఆశించి, చివరి వరకు మద్దతుదార్లుగా వున్న జర్నలిస్టులు ఇప్పుడు తెలుగుదేశం ఓటమి కారణాల గురించి వెంటనే స్పందిస్తున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దానిలో చిత్తశుద్ధి వుందా, విశ్వసనీయత ఎంత అన్నది అనుమానమే.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విఫలం కాలేదు, పార్టీ నేతగా వైఫల్యం చెందారు అన్నది ఒక సూత్రీకరణ. ఈ మాటలను సెలవిచ్చిన పెద్దలే ఎంఎల్‌ఏల, జన్మభూమి కమిటీ సభ్యుల అవినీతిని అరికట్టలేకపోయారు అంటారు. సన్నిహితులు చెప్పినా ఖాతరు చేయలేదు అంటారు, మరో వైపు జగన్‌కు విజయసాయి రెడ్డి వంటి వారు ఎందరో వున్నారు, చంద్రబాబుకు అలా లేరు అంటారు. మరి చంద్రబాబు సన్నిహితులంటే ఎవరు ? తొలి వ్యాక్యంలో ఏమి రాస్తున్నామో మలిగా ఏమి చెబుతున్నామో తెలలియకుండా రాయటాన్ని ఏమనాలి? ఎడా పెడా ఏదో ఒకటి రాస్తున్నట్లా ? అంటే ముఖ్య మంత్రిగా అవినీతి పరులను సహించటం, చెప్పింది వినకపోవటం చంద్రబాబు విజయమని చెబుతున్నట్లా ? వైఎస్‌ జగన్‌ గురించి గతంలో ఇలాంటి ప్రచారమే చెప్పారు. ఆయన ఎవరి మాటా వినడు, తాను చేయదలచుకున్నది చేస్తాడు , ఎంద పెద్ద వారైనా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే ఇంకా అలాంటివి ఎన్నో .ఇప్పుడు అదే నోటితో చంద్రబాబు గురించి చెబుతున్నారు. గుండెలు తీసిన బంట్లంటే వేరే వుంటారా ? గతంలో గత ఐదేండ్లలో కూడా కొన్ని పత్రికలు, ఛానల్స్‌లో ఇదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మంచే చేశారు, అనర్ధాలకు అధికార యంత్రాంగమే కారణం అని సూత్రీకరించి పాఠకుల మెదళ్లకు ఎక్కించారు. రాజకీయాల్లో వెన్నుపోట్లను చూశాము. మీడియా రంగంలో వున్న వారు చంద్రబాబును ఇలా మునగచెట్టిక్కించి మూతిపళ్లు వూడగొట్టేట్లు చేయటం తప్ప మరొకటి కాదు. అయినా నరేంద్రమోడీ కంటే సీనియర్‌ను అని చెప్పుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పార్టీనేతగా జరుగుతున్నదానిని చూడలేక పోవటానికి ధృతరాష్ట్రుడేమీ కాదుగా. ఇక్కడ చంద్రబాబును గతంలో సమర్ధించిన, ఇప్పుడు ఏ కారణంతో అయినా సమర్ధిస్తున్న మీడియాలో ఎన్నడైనా ఎంఎల్‌ఏల, జన్మభూమి కమిటీల అవినీతి గురించి పతాకశీర్షికలు కాదు, పక్కన అయినా వార్తలు ఇచ్చాయా ? పాఠకులకు మతిమరపు ఎక్కువ అనే ధైర్యంతో ఇప్పుడు తగుదునమ్మా అంటూ అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకు పూనుకున్నారు. మీడియా గురించి చంద్రబాబు నాయుడికి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. అధికారంలో వున్నవారు, మీడియా సంస్ధలు నీకిది, నాకది అనే పద్దతుల్లో ఎవరికి కావాల్సినదానిని వారు పొందటం బహిరంగ రహస్యం. గతంలో ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, అదే విధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పని చేసినపుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయినట్లు ? ఏది వాటంగా వుంటే అది రాయటమేనా ? 2016 నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకటరావు వున్నప్పటికీ వుత్సవిగ్రహంగా తప్ప ఆయనకు అధికారాలు ఎక్కడున్నాయి. మీడియా పండితులు అన్నీ చంద్రబాబు నాయుడే చూసుకున్నారని చెప్పారు కదా !

అధికారంలో వుండి కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నిధుల కోసం వెతుక్కోవాల్సి వచ్చిందని ఒక ముక్తాయింపు. తెలుగుదేశం పార్టీ వారికి 50 చోట్ల నిధులు అందకుండా ప్రత్యర్ధులు సఫలమయ్యారని మరొక బాజా. ఇలాంటి వాటిని చదివి, చూసి దేనితో నవ్వాలో అర్ధం కాదు. పాఠకులు మరీ అంతగా చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనుకుంటున్నారా ? ప్రత్యర్ధి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతల వ్యాపారాలు, పరిశ్రమలలో జరిపే అక్రమాల బలహీనతలను ఆధారం చేసుకొని కేంద్రంలోని బిజెపి మద్దతుతో తెలుగుదేశం పార్టీ అనేక మందిని తన పార్టీలోకి ఫిరాయించేవిధంగా చేసిన గతం ఎవరికి తెలియనిది. దొంగే దొంగ దొంగ అని అరవటం అంటే ఇదే. ఇదే విషయాలను ఎన్నికల సమయంలో సదరు మీడియా ఓటర్ల ముందుకు ఎందుకు తీసుకురాలేదు? అధికారంలో వుండి సంక్షేమ పధకాల పేరుతో ఎన్నికల ముందు ఓటర్లకు ఇచ్చిన వేల కోట్ల తాయిలాల మాటేమిటి? ఐదేండ్ల పాటు ఎంఎల్‌ఏలు, ఎంపీలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వీరే చెబుతారు, ఎక్కడో ఒకరో అరా తప్ప వారు లేదా వారసులు అభ్యర్ధులుగా వచ్చారు, మరి వారు జనం నుంచి కొల్లగొట్టిన సొమ్మంతా ఏమైనట్లు? అసలు తెలుగుదేశం లేదా వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధుల్లో డబ్బు లేని వారెందరు?

ఆడలేక మద్దెల ఓడన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైఎస్‌ఆర్‌సిపి వ్యూహాలను తెలుగుదేశం తిప్పికొట్టలేకపోయిందని మరొక సూత్రీకరణ. అసలు మన దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక మాధ్యమాలు అందుబాటులో వున్నవారెందరు? 250 మేర ఛానళ్లు, గ్రూపులతో వైఎస్‌ఆర్‌సిపి చేసిన ప్రచారాన్ని తెలుగుదేశం తిప్పికొట్టలేకపోయిందట. ప్రధాన స్రవంతి మీడియాలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ సాగించిన ప్రచారం సంగతేమిటి? బహుశా ఇలాంటి మీడియా పండితులు చెప్పిన అంశాలనే తెలుగుదేశం పార్టీ తన సమీక్షగా ముద్రవేసుకొని జనం ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గత అనుభవం ఇదే. లీకుల పేరుతో ఇదే మీడియా పెద్దలు తెలుగుదేశం చెప్పిన అంశాలనే జనానికి అందచేసేవారు. ఇప్పుడు కూడా వారితో మాట్లాడకుండా, వారి అభిప్రాయాలను తమ అభిప్రాయాలుగా పాఠకుల ముందు వుంచలేదని ఎలా అనుకోగలం. రాజకీయనేతల మాదిరే నేడు మీడియా విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకంగా వున్నపుడు ఇలా అనుకోవటంలో తప్పేముంది?

Image result for chandrababu naidu debacle

వుదాహరణకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయానే తీసుకుందాం. దీని గురించి చంద్రబాబు నాయుడుగాని, ఆయనను సమర్ధించిన మీడియా గానీ ఎప్పుడైనా పాఠకులకు వాస్తవాలు చెప్పిందా? ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మంచిది. దాని మీద చంద్రబాబు నాయుడు, నరేంద్రమోడీ వేసిన పిల్లి మొగ్గలను తు.చ తప్ప కుండా మీడియా కూడా వేసింది. జాతీయ అభివృద్ది మండలి ప్రత్యేక హోదా గురించి గతంలో ఆమోదించిన నిబంధనలను మార్చకుండా హోదాను ఆంధ్రప్రదేశ్‌కు వర్తింప చేయటం అసాధ్యం. అటువంటి ప్రయత్నమే చేయలేదు. పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ఆధారంగా అలా చేసేందుకు నిబంధనలు మార్చటం అంటే తేనెతుట్టెను కదిలించటమే. అధికారానికి రాక ముందు ఓటర్లను మభ్య పెట్టేందుకు చెప్పినా నరేంద్రమోడీకి ముందే తెలుసు కనుకనే గద్దెనెక్కిన మరునాటి నుంచి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ అంశాన్ని ముందుకు రాకుండా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వమే దాని మీద అసెంబ్లీ తీర్మానాల పేరుతో మరొక పేరుతో నాటకాలాడింది. తరువాత దాని బదులు ప్రత్యేక పాకేజి అంటే దానికి కూడా మీడియా తాన తందాన పలికింది. పోనీ దాని బండారాన్ని అయినా బయట పెట్టారా అంటే అదీ లేదు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావటానికి పాతికేండ్లు పట్టింది, అదే జగన్‌కు పదేండ్లు మాత్రమే అని కొందరి సూత్రీకరణ. దాన్ని ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1983 నుంచి 2004 మధ్య 1989నుంచి ఒకసారి కాంగ్రెస్‌ పాలన ఐదేండ్లు కొనసాగటం తప్ప మిగతా కాలమంతా తెలుగుదేశం పాలనే కొనసాగింది. అందువల్లనే రాజశేఖరరెడ్డి అంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ కాలంలోనే ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలు, 1991నుంచి ప్రారంభమైన నూతన ఆర్ధిక సంస్కరణలు అమలు జరిగాయి. వాటితో జనానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా భారాలు పెరిగాయి, అవినీతి పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. దేశం దృష్టిని ఆకర్షించిన విద్యుత్‌ వుద్యమం వంటివి ఈ కాలంలోనే జరిగాయి. దీనికి తోడు బిజెపితో తెలుగుదేశం పార్టీ జట్టుకట్టిన పూర్వరంగంలో కాంగ్రెస్‌తో వామపక్షాలతో పాటు టిఆర్‌ఎస్‌కూడా సీట్లు సర్దుబాటు చేసుకుంది కనుకనే 2004లో రాజశేఖరేఖరరెడ్డి అధికారానికి వచ్చారు. అదే విధానాలను అమలు జరిపిన కారణంగా వైఎస్‌ఆర్‌పై కూడా అసంతృప్తి తలెత్తినప్పటికీ 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ లేకపోతే రెండవ సారి అధికారానికి వచ్చేవారు కాదన్నది తెలిసిందే. అంటే నూతన ఆర్ధిక విధానాలు ఏ పాలకపార్టీని కూడా వరుసగా రెండవ సారి అధికారానికి తెచ్చే పరిస్ధితి లేదన్నది స్పష్టం. తెలంగాణాలో తెరాస మీద భ్రమలు తొలగకపోవటం, ఇతర అంశాలు తోడై తిరిగి చంద్రశేఖరరావు అధికారానికి వచ్చారు. ఆరునెలల్లోనే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వెల్లడైందా లేదా ? ఆ దివాలా కోరు విధానాలతో రెండవ సారి అధికారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు జన విశ్వాసం పొందలేకపోవటంతో పాటు పైన చెప్పుకున్న ఇతర కారణాలు కూడా తోడై ఈ ఎన్నికల్లో జగన్‌కు అవకాశం వచ్చింది.

చంద్రబాబు నాయుడు , మరొకరు ఎవరైనా ప్రజాకర్షక విధానాలతో కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టినంత మాత్రాన జనానికి వాటితోనే సంతృప్తి వుండదు. నిరుద్యోగం, దారిద్య్రం వంటి అనేక అంశాలు జనాన్ని పీడిస్తున్నపుడు సంక్షేమ పధకాలు వుపశమనం తప్ప మరొకటి కాదు. తెలంగాణాలో రైతు బంధు సొమ్ము తీసుకున్న రైతులే నిజామాబాద్‌లో రోడ్డెక్కారు, అధికార పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి ఎన్నికలలో కూడా నిరసన తెలిపారు. నయావుదారవాద విధానాలు జనంలో ప్రతి తరగతిలోనూ భ్రమలను పెంచుతాయి. అవినీతిని మరింతగా విస్తరింప చేస్తాయి. అందరూ అడ్డదారిలో సంపాదించుకోగలిగినపుడు మనం కూడా ఎందుకు ప్రయత్నించకూడదనే దగ్గరి దారి ఆలోచనలను ప్రతివారిలో రేకెత్తిస్తాయి.ఈ క్రమంలో ప్రతి పాలక పార్టీ భ్రమలను పెంచటంలో, మరిన్ని ప్రజాకర్షక నినాదాలను ముందుకు తేవటంలో, చర్యలు చేపట్టటంలో పోటీ పడతాయి. విలువలను నాశనం చేస్తాయి. గతంలో ఓటర్లు డబ్బు తీసుకున్నపుడు ఓటేయకపోతే ఎలా అని విశ్వాసంతో తీసుకున్న పార్టీకి ఓటు వేసేవారు, మరో పార్టీ దగ్గర తీసుకొనే వారు కాదు. ఇప్పుడు ఎవరు ఇస్తే ఎంత ఇస్తే అంత తీసుకొని నచ్చిన వారికి ఓటు చేస్తున్నారు. అంటూ ఎవరికీ లేని నిజాయితీ మనకెందుకు అనుకోబట్టే ఈ స్ధితి. అందుకే చంద్రబాబు ఎన్ని తాయిలాలు పెట్టినా ఎన్నికల ముందు ఎవరైనా చేస్తున్నది అదేలే అని లబ్ది పొందిన వారు చూశారు తప్ప, కృతజ్ఞత చూపలేదు. చూపుతారనే ఆశతో గతం చంద్రబాబు నా పధకాల వలన లబ్దిపొందిన వారు నాకే ఓట్లు వేయాలన్నట్లుగా మాట్లాడిన తీరు తెలిసిందే.

Image result for chandrababu naidu hypocrisy

చంద్రబాబు నాయుడి ఐదు సంవత్సరాల కాలంలో వామపక్షాల బలం ఎంత పరిమితం అయినప్పటికీ ఆయన పర్యటనకు వెళ్లిన ప్రతి చోటా ఆ పార్టీల కార్యకర్తలు, నేతలను ముందస్తు అరెస్టులు చేయించటం, వివిధ తరగతుల సమస్యలపై ఆందోళనలకు పిలుపులు ఇచ్చినపుడు వాటిని సాగకుండా ఎక్కడికక్కడ పోలీసులను ప్రయోగించి అణచివేత, విఫలం చేసేందుకు ప్రయత్నించటాన్ని చూశాము. అంటే ప్రజాకర్షక నేతలు వైఫల్యం చెందినపుడు అణచివేతలకు పాల్పడతారన్న ప్రపంచ అనుభవం ఇక్కడ కూడా వాస్తవ రూపం దాల్చింది. దీనికి తోడు కార్మిక సంఘాలను చీల్చటం, నిరంకుశ పద్దతుల్లో డిమాండ్లను వ్యతిరేకించటం, తమతో చేతులు కలిపితే పరిష్కరిస్తామంటూ పోరాడే కార్మిక సంఘాలన్నింటినీ చీల్చటం వంటి అనేక ప్రజాస్వామ్య విరుద్ద చర్యలను చూశాము.

పకోడీలు అమ్ముకోవటం కూడా వుపాధికల్పనకిందికే వస్తుందని నరేంద్రమోడీ చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు, ఆయన బృందం చెప్పకపోవచ్చుగానీ వుద్యోగ కల్పన. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ఎంత ప్రచార ఆర్భాటం చేశారో చూశాము. స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌ నగర కేంద్రంగా ప్రపంచ ఆర్ధిక వేదిక పని చేస్తుంది. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే సమావేశాలకు చంద్రబాబు నాయుడు పెద్ద పరివారాన్ని వేసుకొని తీర్ధయాత్రల మాదిరి తిరిగి వచ్చేవారు. ఆ పిచ్చి ముదిరి ఎంతవరకు పోయిందంటే దవోస్‌ నగరంలో తిరిగే బస్సుల మీద మేక్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ప్రచారానికి డబ్బు ఖర్చు చేశారు. అంటే ప్రపంచ పెట్టుబడిదారులు దవోస్‌ రోడ్ల మీద తిరుగుతుంటారని, వారు బస్సుల మీద ప్రకటనలు చూసి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి పెట్టుబడులు పెడతారని జనం నమ్మాలి. ఎంత మందికి వుపాధిని అదనంగా కల్పించారో నరేంద్రమోడీయే కాదు, చంద్రబాబు కూడా చెప్పలేకపోయారు.

ప్రపంచ వ్యాపితంగా ప్రస్తుతం వుపాధి రహిత అభివృద్ధి జరుగుతోంది. దానికి మనం మినహాయింపు కాదు. రోబోట్‌లు, కంప్యూటర్‌ నియంత్రణ యంత్రాలతో పరిశ్రమలు కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, పాత పరిశ్రమలను నవీకరిస్తున్నారు. అటువంటపుడు వుపాధి పెరగకపోగా తరుగుతోంది. రెండవది పెట్టుబడులకు తగిన రాయితీలు లేదా మార్కెటింగ్‌ను బట్టి ఆయా ప్రాంతాలకు వస్తాయి తప్ప వ్యక్తుల గొప్పనో, మొహమాటాలకో రావు. ఐటి సంస్ధలు కూడా అంతే ఎక్కడైతే కేంద్రీకరణ జరిగిందో అక్కడికే ప్రతి కంపెనీ వెళ్లాలని చూస్తుంది తప్ప కొత్త ప్రాంతాలలో పెట్టి ప్రయోగాలు జరపదు. అందువలన బాబొస్తే జాబస్తుంది అనే ఒక నినాదం ప్రహసన ప్రాయంగా మారింది. అందువలన ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ, గెలిచిన వైఎస్‌ఆర్‌సిపి అయినా చిత్తశుద్దితో గుణపాఠాలను తీసుకోవటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఐరోపా యూనియన్‌ భవిష్యత్‌ మరింత సంక్లిష్టం !

29 Wednesday May 2019

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, UK

≈ Leave a comment

Tags

Brexit Party, Europe Far-Right, european parliamentary elections 2019, european parliamentary elections 2019 verdict, European Union, Far-right populists, Le Pen’s National Rally, Salvini’s Lega party, The Greens

Image result for european parliamentary elections 2019 verdict complicated it's future

ఎం కోటేశ్వరరావు

ఆదివారం నాటితో ముగిసిన మూడు రోజుల ఐరోపా యూనియన్‌ తొమ్మిదవ పార్లమెంట్‌ ఎన్నికలు సంస్ధ భవిష్యత్‌ను సంక్లిష్టగావించాయి. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నది స్పష్టమైంది. పర్యావరణ పరిరక్షణ కోరే గ్రీన్స్‌ పార్టీలు, తీవ్ర మితవాద పార్టీలు గతం కంటే బలం పుంజుకున్నాయి, నాలుగు దశాబ్దాల తరువాత సాంప్రదాయ మధ్యేవాద, వామపక్ష పార్టీలు మెజారిటీని కోల్పోయాయి. ఫలితాలు ఐరోపా సమాజంలో జరుగుతున్న మధనానికి అద్దం పట్టాయి. ఇటీవలి సంవత్సరాల పర్యవసానాల పలితాలు ఇవి. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈ సారి 50శాతం పైగా ఓట్లు పోలు కావటం ఒక విశేషం అయితే కొన్ని చోట్ల పోలింగ్‌ తగ్గటం జనంలో వున్న నిర్లిప్తతను, కొన్ని చోట్ల పెరగటం గ్రీన్స్‌, పచ్చి మితవాదులకు మద్దతుగా ఓటర్లు ముందుకు వచ్చినట్లు కూడా వెల్లడించింది. మితవాద శక్తులు మొత్తం మీద బలం పెంచుకున్నప్పటికీ వూహించినంతగా విజయం సాధించకపోవటమే ఒక వూరటగా కొందరి విశ్లేషణ వుంది. గత ఎన్నికల్లో పార్లమెంట్‌లో 20శాతంగా వున్న బలాన్ని ఇప్పుడు 25శాతానికి పెంచుకున్నారు. అదే విధంగా గ్రీన్స్‌ విజయాన్ని కూడా వూహించలేదు. అన్ని దేశాల్లో ఒకే విధంగా లేనప్పటికీ మొత్తం మీద ఐరోపా రాజకీయ రంగంలో వారొక శక్తిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని కోరుకొనే వారి సంఖ్య మరింత పెరిగే ధోరణులు వ్యక్తమయ్యాయి. గ్రీన్స్‌తో పాటు ఇటీవలి కాలంలో స్ధిరోష్ణ పేటిక(ఇంకుబేటర్‌)లో వున్న జాతీయవాద పార్టీలు ఇప్పుడు యుద్ధ భూమిలో చురుకుగా వున్నట్లుగా ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. వీటన్నింటికీ మితవాదం, జాతీయ వాద లక్షణాలలో సారూప్యత వున్నప్పటికీ విడివిడిగా చూస్తే వాటి మధ్య వైరుధ్యం వుంటుంది. ఎవరికి వారు తమ దేశప్రయోజనాలే ముఖ్యం అనుకున్నపుడు వైరుధ్యాలు తలెత్తటం అనివార్యం. ప్రస్తుతం వున్న వాటిని కూల్చివేయాలనటంలో వున్న ఏకీభావం వాటి స్ధానంలో వేటిని నిర్మించాలనటంలో వుండదు.

1979లో ఐరోపా యూనియన్‌ పార్లమెంట్‌ వునికిలోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం 28దేశాలకు చెందిన 51.2 కోట్ల మంది పౌరులకు ప్రాతినిధ్యం వహించే 751 మంది ఎంపీలను ఎన్నుకొనే ప్రక్రియ మే 23 నుంచి 26వరకు జరిగింది. యూనియన్‌ నుంచి వైదొలగాలని బ్రిటన్‌ నిర్ణయించటంతో స్ధానాల సంఖ్యను 751 నుంచి 705కు తగ్గించారు. అయితే ఈ ఏడాది అక్టోబరు వరకు బ్రిటన్‌ సభ్యత్వాన్ని పొడిగించిన కారణంగా అక్కడ కూడా ఎన్నికలు జరిగాయి.( అధికారిక ఎన్నికల ఫలితాల వివరాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రానందున ఈ సమీక్ష కొన్ని పరిమితులకు లోబడి వుంటుందని పాఠకులు గమనించమనవి.) ఇటలీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లలో మితవాద శక్తులు అతి పెద్ద పార్టీలుగా ముందుకు రాగా మరికొన్ని చోట్ల కూడా గణనీయమైన విజయాలు సాధించాయి.

గ్రీన్స్‌ విషయానికి వస్తే గత ఎన్నికల్లో 51 సీట్లు తెచ్చుకోవగా ఇప్పుడు 70కి పెరిగాయి. జర్మనీలో మధ్యేవాద వామపక్షంగా వర్ణితమయ్యే సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీని వెనక్కు కొట్టి రెండవ పెద్ద పార్టీగా గ్రీన్స్‌ అవతరించారు. ఫిన్లాండ్‌లో 16శాతం, ఫ్రాన్స్‌లో 13, బ్రిటన్‌లో 12శాతం చొప్పున తెచ్చుకున్నారు. వీరు వలసలకు, ఐరోపా యూనియన్‌ ఐక్యతకు అనుకూలురు. అయితే పర్యావరణం పేరుతో వీరు తీసుకొనే కొన్ని వైఖరులతో అటు మితవాదులకు, ఇటు వుదారవాదులకు కూడా కొన్ని విబేధాలు వున్నాయి.

Image result for european parliamentary elections 2019 verdict complicated it's future

ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోతుందా లేదా, అదే జరిగితే ఎలా అనే విషయాలను పక్కన పెడదాం. అక్టోబరు వరకు సాంకేతికంగా అది యూనియన్‌ సభ్యురాలిగా వుంటుంది. తరువాత విడిపోతే ఈ ఎన్నికలు వృధా ప్రయాస. అయితే ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు ఈ ఎన్నికలు బ్రిటన్‌ రాజకీయ రూపు రేఖలను మార్చివేసేవిధంగా సాంప్రదాయ కన్సర్వేటివ్‌, లేబర్‌ పార్టీలకు పోటీగా మరొక పార్టీ ముందుకు వచ్చింది. మూడు నెలల క్రితం పెట్టిన బ్రెక్సిట్‌(ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలని కోరుకొనే ) పార్టీ 32శాతం ఓట్లతో బ్రిటన్‌లోని 73 సీట్లకు గాను 29 పొందింది. ఒక్క లండన్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో ఈ పార్టీ ప్రాతినిధ్యం సంపాదించింది.1834తరువాత కన్సర్వేటివ్‌ పార్టీ అత్యంత దయనీయ స్ధితిలో తొమ్మిదిశాతం ఓట్లతో ఐదవ స్ధానంలో మూడు సీట్లతో సరిపెట్టుకుంది. ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో దీనికి 24శాతం వచ్చాయి. ఈ పార్టీ మద్దతుదారులు అత్యధికులు బ్రెక్సిట్‌ పార్టీకి ఓటు చేశారు. ఐరోపా యూనియన్‌ అనుకూల లిబరల్‌ డెమోక్రాట్లు గతం కంటే బలం పుంజుకొని 20శాతం ఓట్లతో రెండవ స్ధానంలో, ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 14శాతం, గ్రీన్స్‌ పార్టీ 11, యుకెఐపి నాలుగుశాతంలోపు ఓట్లతో చివరి స్ధానంలో వుంది.గత యూరో పార్లమెంట్‌ ఎన్నికలలో 24సీట్లు తెచ్చుకున్న యుకెఐపి పార్టీ ఇప్పుడు ఒక స్ధానానికి పరిమితం అయింది. ఈ పార్టీ నేత నైగెల్‌ ఫారజే దాన్నుంచి విడిపోయి బ్రెక్సిట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పూర్వరంగంలో జూన్‌ ఏడున కన్సర్వేటివ్‌ పార్టీ ప్రధాని థెరెసా మే ఫలితాలు రాక ముందే రాజీనామాకు నిర్ణయించుకున్నారు. ఈ ఓటింగ్‌ తీరుతెన్నులు చూసిన తరువాత ఆమె స్ధానంలో వచ్చేవారు ఎవరు? అసలేమీ జరగనుంది అనేది చూడాల్సి వుంది.

ఫ్రాన్స్‌లో పచ్చి మితవాది మారినే లీపెన్‌ నాయకత్వంలోని నేషనల్‌ ర్యాలీ పార్టీ (ఆర్‌ఎన్‌) 23.3శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో నిలిచింది. అయితే గత ఎన్నికలలో ఈ పార్టీకి 24.9శాతం వచ్చాయి. అధ్యక్షుడు మక్రాన్‌ పార్టీకి తాజా ఎన్నికలలో 22.4శాతం వచ్చాయి. గ్రీన్‌ పార్టీకి 13.4శాతం వచ్చాయి. మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ నాయకత్వంలోని రిపబ్లికన్స్‌ పార్టీకి 8.4, సోషలిస్టు పార్టీకి 6.3శాతం ఓట్లు వచ్చాయి. గత కొద్ది నెలలుగా ప్రతివారాంతంలో ఆందోళనలు చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పసుపు చొక్కాల పార్టీకి కేవలం 0.54శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. వారి కంటే ఎక్కువగా జంతు ప్రేమికుల పార్టీకి 2.17శాతం వచ్చాయి. ఫ్రాన్స్‌లో మొత్తం 34 పార్టీలు పోటీ చేశాయి.

ఇటలీలోని అధికార మితవాద లీగ్‌ పార్టీ 34.3శాతం ఓట్లతో 28సీట్లతో ప్రధమ స్ధానంలో వుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ 27-31శాతం మధ్య వస్తాయని పేర్కొన్నవాటి కంటే ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ప్రతిపక్ష లెఫ్ట్‌ డెమోక్రాట్స్‌ 22.7శాతం, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న ఫైవ్‌ స్టార్‌ పార్టీ(ఎం5ఎస్‌) 17.1శాతం ఓట్లు తెచ్చుకుంది.మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని ఫోర్జా ఇటాలియాకు 8.8శాతం, ఇటలీ బ్రదర్స్‌ పార్టీకి 6.5శాతం వచ్చాయి. కనీసం నాలుగుశాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీలకే ప్రాతినిధ్యం దక్కుతుంది. ఇక్కడ మరో పార్టీ ఆమేరకు ఓట్లు సంపాదించలేదు. ఇటలీ పార్లమెంట్‌ ఎన్నికలలో ఏడాది క్రితం 32శాతం ఓట్లు తెచ్చుకున్న ఫైవ్‌ స్టార్‌ పార్టీ ఓట్లు ఈ ఎన్నికలలో 17శాతానికి పడిపోయాయి. మరోవైపు సాల్వినీ నాయకత్వంలోని లీగ్‌ పార్టీ బలం 17 నుంచి 34శాతానికి పెంచుకుంది. దీంతో సాల్వినీ ప్రధాన పదవిని డిమాండ్‌ చేసే అవకాశం వుందని వార్తలు వచ్చాయి.

ఇటీవలి కాలంలో జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ(ఎఎఫ్‌డి) పేరుతో ముందుకు వచ్చిన పచ్చి మితవాద శక్తులు తాజా ఎన్నికల్లో కాస్త తగ్గినప్పటికీ మొత్తం మీద బలాన్ని నిలుపుకున్నాయి. పూర్వపు తూర్పు జర్మనీలో ఇది బలమైన పార్టీగా ముందుకు వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో 13శాతం తెచ్చుకున్న ఈ పార్టీ ఇప్పుడు 11శాతానికి పరిమితమైంది. ఐరోపా మితవాత శక్తుల్లో బలాన్ని కోల్పోయిన పార్టీ ఇదొక్కటే కనిపిస్తోంది. తూర్పు జర్మనీలోని రెండు రాష్ట్రాలలో రెండు పార్టీల మధ్య తేడా రెండుశాతమే అయినప్పటికీ అధికార ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వంలోని క్రిస్టియన్‌ డెమోక్రాట్స్‌(సిడియు)ను రెండవ స్ధానంలోకి నెట్టి ఎఎఫ్‌డి ప్రధమ స్దానంలో వచ్చింది. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దేశం మొత్తం మీద సిడియు 29శాతంతో ముందుండగా తరువాత గ్రీన్స్‌ పార్టీ 20.5శాతం ఓట్లతో, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) 16శాతం ఓట్లతో మూడవ స్ధానంలో వుంది. పట్టణాలలోని యువత గ్రీన్స్‌ పార్టీ వైపు మొగ్గినట్లు కనిపించింది.

ఎన్నికలు ఐరోపా పార్లమెంట్‌కు అయినప్పటికీ సభ్య దేశాలలో పోటీలు మాత్రం స్ధానిక ప్రాతిపదికగానే జరిగాయి. ఎలాంటి వుమ్మడి ఎన్నికల ప్రణాళికలు, వాగ్దానాలు లేవు. బ్రిటన్‌లో బ్రెక్సిట్‌( ఐరోపా యూనియన్‌ నుంచి విడిపోవాలా లేదా ) అనే ప్రాతిపదిక మీద జరిగాయి. ఫ్రాన్స్‌లో గత అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడిన ప్రత్యర్ధి పార్టీలు మరోసారి తమ బలనిరూపణ ప్రాతిపదికనే తలపడ్డాయి. స్పెయిన్‌లో కొద్ది వారాల ముందు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో గణనీయ విజయాలు సాధించిన సోషలిస్టు వర్కర్స్‌ పార్టీ తన బలాన్ని పటిష్ట పరచుకొనేందుకే ప్రయత్నించింది. ఇటలీలో మితవాద లీగ్‌ పార్టీ ఏడాది క్రితం సాధించిన ఓట్లను మెరుగుపరచుకొవటం మీదే కేంద్రీకరించింది.

ఐరోపా యూనియన్లోని నాలుగు ప్రధాన దేశాల వివరాలను చూసిన తరువాత . మొత్తం మీద ఐరోపా అనుకూల, వ్యతిరేక శిబిరాలుగా మరింత స్పష్టంగా వేరుబడటం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ధోరణులు మరింతగా తీవ్రం కానున్నాయని చెప్పవచ్చు. కార్మికవర్గంలో అసంతృప్తికి అన్ని దేశాలలో ఒకే కారణం కానప్పటికీ మొత్తం మీద పెరుగుతోంది. ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎప్పుడు ఏది జనాకర్షక నినాదంతో ముందుకు వస్తే దాని వెనుక సమీకృతం అవుతున్నారన్నది ఇటలీ ఓటింగ్‌ తీరుతెన్నులు స్పష్టం చేస్తున్నాయి. పచ్చిమితవాదులు బలంపుంజుకోకపోయినా సాంప్రదాయ పార్టీలు బలహీనం కావటం ఫ్రెంచి పరిణామం సూచించింది.జాతీయ వాదులకు బుద్ధి లేదు, వారి దేశాలను ప్రేమిస్తారు, విదేశీయులను ద్వేషిస్తారు అని ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జుంకర్‌ ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఘాటుగా వ్యాఖ్యానించారు. అంటే వలస కార్మికుల సమస్య ఐరోపాను ఎక్కువగా ప్రభావితం చేస్తోందన్నది స్పష్టం.

Related image

ప్రపంచ వ్యాపితంగా ముఖ్యంగా ఐరోపాలో ప్రజాకర్షక, జాతీయవాదులు, వీరందరినీ మితవాదులు అనవచ్చు. వీరి వైఖరి ఆయాదేశాల పరిస్ధితులను బట్టి మారుతూ వుంటుంది గాని మౌలిక లక్షణం మితవాదం, అది ముదిరితే పచ్చి మితవాదం, మతవాదం, ఇంకా నయా ఫాసిజం, నాజీజం. ఎందుకీ పరిస్ధితి తలెత్తింది అన్నది అభ్యుదయవాదులు, అధికారం కోసమే పని చేసినా మౌలికంగా పెట్టుబడిదారీ వ్యవస్ధను సమర్ధించే సాధారణ లౌకికవాదుల ముందున్న ప్రశ్న. వలస కార్మికుల సమస్యపై జాతీయ వాద రాజకీయవేత్తల వైఖరి ఐరోపా ఐక్యతకే స్పష్టమైన ముప్పును ముందుకు తెచ్చింది అని జుంకర్‌ చెప్పారు. ‘ ఈ ప్రజాకర్షకులు, జాతీయ వాదులు, బుద్దిలేని జాతీయవాదులు తమ దేశాలను ప్రేమిస్తారు, సుదూరాల నుంచి వచ్చే వారిని వారు ఇష్టపడరు, మన కంటే దుర్భర పరిస్ధితుల్లో వున్న వారికి మనం మద్దతుగా వ్యవహరించాలి’ అని జుంకర్‌ చెప్పారు. ఐరోపా దేశాలలో కూడా జాత్యహంకారులు, శ్వేతజాతి వాదులు మైనారిటీలను, విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశం పట్ల విధేయత వుండదని అవమానిస్తారు.

ఐరోపా అంతటా ఇటీవలి కాలంలో మితవాదం పెరుగుతోంది, ఇదే సమయంలో సోషల్‌ డెమోక్రసీ తరుగుతోంది. నాజీ హిట్లర్‌ తరువాత జర్మనీలో ఏడు దశాబ్దాల పాటు ఐరోపా తరహా ప్రజాస్వామ్యమే వుంది తప్ప మితవాద శక్తులు తలెత్తలేదు. అలాంటి చోట ఎఎఫ్‌డి( జర్మనీ ప్రత్యామ్నాయ పార్టీ) అనే పచ్చి మితవాద పార్టీ మూడవ శక్తిగా వునికిలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంలో దెబ్బతిన్న ఐరోపా తిరిగి తమకు పోటీగా బలపడకూడదని అమెరికా భావించింది. ఒంటరిగా వుంటే ఏనుగు వంటి అమెరికాను ఎదిరించి ప్రపంచ మార్కెట్లో తమ వాటాను తాము కాపాడుకోలేమని గ్రహించిన యూరోపియన్‌ కార్పొరేట్‌ శక్తుల ఆలోచన ప్రకారమే ఐరోపా యూనియన్‌ వునికిలోకి వచ్చింది. ఐరోపా బొగ్గు, వుక్కు కమ్యూనిటీతో 1951లో ప్రారంభమై ఏడుదశాబ్దాలుగా సరిహద్దుల చెరిపివేత వరకు వచ్చిన ఐరోపా యూనియన్‌ మీద ఇప్పుడు అనేక దేశాలలో వ్యతిరేకత పెరుగుతోంది. ఎవరి కాపురం వారు పెట్టుకుందాం, ఎవరి గొడవ వారు చూసుకుందామనే ధోరణులు పెరిగాయి. దాని పర్యవసానమే ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు రావాలన్న బ్రిటన్‌ నిర్ణయం.

Image result for european parliamentary elections 2019 verdict complicated it's future

ఓటింగ్‌ తీరుతెన్నులను చూసినపుడు మొత్తం మీద మెజారిటీ జనం ఐరోపా యూనియన్‌ ఐక్యతకే మొగ్గుచూపుతున్నట్లు చెప్పవచ్చు. అనేక దేశాలలో విడిపోవాలనే వారు క్రమంగా పెరుగుతుండటం కనిపిస్తోంది. ప్రపంచీకరణ వల్లనే ఇదంతా జరుగుతోంది అనే శక్తులు దాన్ని వ్యతిరేకించటం ఒకటైతే అంతకంటే ప్రమాదకరమైన వైఖరి జాతీయ వాదంవైపు మొగ్గటం. జనంలో మార్పు కావాలనే వాంఛ కనిపిస్తున్నది, అయితే అది ఎటుంవంటిది అన్న విషయంలో స్పష్టత లేదు. ఏ నేత లేదా పార్టీ నినాదం ఆకర్షణీయంగా వుంటే దాని వెంట సమీకృతం అవుతున్నారు. ఈ క్రమంలో సాంప్రదాయ బూర్జువాపార్టీలు, వామపక్ష శక్తులను జనం పక్కన పెడుతున్నారు. జనాకర్షక, జాతీయవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. 2008లో ఆర్ధిక మాంద్యం తలెత్తిన నాటి నుంచి ఐరోపాలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవటం లేదు. కొత్త పార్టీలు పుట్టుకువస్తున్నాయి, పాత పార్టీలను వెనక్కు నెడుతున్నాయి. తాజాగా ఎన్నికలకు ముందు మద్యేవాద మితవాద, పురోగామి సోషలిస్టులు, డెమోక్రాట్లు పార్లమెంట్‌లో 54శాతం మంది వుంటే ఇప్పుడు వారి సంఖ్య 43శాతానికి పడిపోయిందని కొన్ని విశ్లేషణలు వెల్లడించాయి. ఈ మేరకు పచ్చి మితవాదులు, గ్రీన్స్‌ పెరిగారు. ధనిక దేశాల ఆర్ధిక సమస్యలు, మాంద్యానికి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించకపోగా మరో తీవ్ర మాంద్యం పొంచి వుందనే హెచ్చరికల నడుమ వున్నాం. అందువలన ఐరోపాలో లేదా మరొక చోట భవిష్యత్‌లో ఎలాంటి రాజకీయ, నాటకీయ పరిణామాలు జరుగుతాయో జోశ్యం చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీ ముందున్న సవాళ్లు, సమస్యలూ !

29 Wednesday May 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

Indian economy, Issues and Challenges before Narendra Modi, Narendra Modi, pakoda, pakoda self employment

Image result for Issues and Challenges before Narendra Modi

ఎం కోటేశ్వరరావు

రాజకీయనేతలు, ప్రత్యేకించి ఆర్ధిక, రాజకీయ పరిస్ధితులు క్లిషంగా వున్నపుడు తమ అధికారాన్ని పదిల పరచుకొనేందుకు జాతీయవాదాన్ని ఒక సాధనంగా చేసుకుంటారు అని రిచర్డ్‌ ఎన్‌ హాస్‌ అనే అమెరికన్‌ దౌత్యవేత్త చెప్పారు. అమెరికన్ల దృష్టిలో జాతీయ వాదం అంటే ఒక దేశం లేదా ప్రపంచ మీద లేదా మార్కెట్‌ మీద ఆధిపత్యం చెలాయించాలనే వాదం. అమెరికాకు అగ్రస్ధానం అన్నది వారి జాతీయ వాదం. అదే జాతీయ వాదం మరొక దేశం కూడా కలిగి వుంటే జరిగేది ఘర్షణే. అయితే మన దేశంలో జాతీయవాదులుగా చెప్పుకొనే బిజెపి, సంఘపరివార్‌ది అటువంటిది కాదు, హిందూత్వ జాతీయ వాదం. దాని మంచి చెడ్డలను పక్కన పెడితే హాస్‌ చెప్పిన ఆర్ధిక, రాజకీయ క్లిష్ట పరిస్ధితులు ఏ జాతీయవాదులకైనా వర్తిస్తాయి. అధికారం ఒక ముళ్ల కిరీటం, నరేంద్రమోడీ రెండవసారి దాన్ని మరోసారి ధరించబోతున్నారు. ఆయన ఘనతను జాతీయ వాదుల విజయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణించింది. ప్రస్తుతం నరేంద్రమోడీకి రాజకీయ క్లిష్ట పరిస్ధితులు లేవు. ఎందుకంటే ఆ పార్టీకే సంపూర్ణ మెజారిటికీ మించి లోక్‌సభలో సీట్లు వచ్చాయి. మరికొద్ది నెలల్లో రాజ్యసభలో కూడా మెజారిటీ రానుందనే వార్తలను మనం చూశాము. అందువలన నరేంద్రమోడీ ముందు ఆర్ధిక పరమైన, ఇతర సవాళ్లు ఏమి వున్నాయి, వాటి స్వభావం ఏమిటన్నది చూద్దాం.

ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో అధికారంలో వున్న రాజకీయ పార్టీలు లేదా అధికారం కోసం పాకులాడే పార్టీలు గానీ అర్ధసత్యాలను, అసత్యాలనే చెబుతాయి. నిజం చెప్పే వారిని పరిగణనలోకి తీసుకొనే లేదా వారు చెప్పే అంశాలనైనా చర్చించే స్ధితిలో ప్రస్తుతం మన జనం, మీడియా లేదు. ఎన్నికలు ముగిశాయి కనుక వాస్తవ దృక్పధంతో సమస్యలను చూడటం అటు జనానికి, ఇటు నరేంద్రమోడీ పది కాలాలపాటు వుండాలని కోరుకొనే వారికి కూడా అవసరం.

ఆర్ధిక అంకెలే అసలు సమస్య !

తన పాలనా కాలంలో సూట్‌ కేస్‌ కంపెనీలలో చాలా వాటిని మూసివేయించానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషించాల్సిన అంశమే. అయితే ఆ బోగస్‌ కంపెనీలు ఇచ్చిన సమచారాన్ని కూడా కలిపి అభివృద్ధి అంకెలను తయారు చేశారని, అందుకే అభివృద్ధి జరిగినట్లు కనిపించినా ఆచరణలో వుపాధి పెరుగుదల కనిపించలేదన్న ఒక విమర్శ వుంది. ఎన్ని మరుగుదొడ్లు కట్టించిదీ, ఎన్ని గ్యాస్‌ పొయ్యిలు ఇచ్చిందీ, ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేసిందీ, ఎన్ని కిలోమీటర్ల మేరకు రోడ్లు వేసిందీ ఏ బిజెపి కార్యకర్తను అడిగినా గడగడా చెప్పారు గాని, వాగ్దానం చేసినట్లుగా ఎన్ని వుద్యోగాలు కల్పించారు అంటే తయారు చేసిన అంకెలు సక్రమంగా లేవని, వాస్తవ స్ధితిని ప్రతిబింబించే లెక్కలను తయారు చేస్తున్నామని నరేంద్రమోడీయే స్వయంగా చెప్పారు కనుక వాటిని వెల్లడించాలి. పకోడీల బండి పెట్టుకోవటం కూడా వుపాధి కల్పనలో భాగమే అని చెప్పినందున ఎంత మంది పకోడీలు, బజ్జీలు , టీ అమ్ముతూ వుపాధి పొందుతున్నారు అనే వాటితో సహా అన్ని వివరాలు తెలుసుకోవటం జనానికి సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది.

రెండువేల పదమూడో సంవత్సరం జూన్‌ తరువాత మొట్టమొదటిసారిగా 2019 సంవత్సరం మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక గతేడాదితో పోల్చినప్పుడు నిరపేక్షంగా 0.1శాతం తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వ ద్ధి ఫిబ్రవరిలో కేవలం 0.07మాత్రమే ఉంది. అలాగే జనవరిలో 1.7శాతం, డిసెంబరులో 2.6శాతం, నవంబరులో 0.3శాతంగా నమోదు అయింది. క్లుప్తంగా చెప్పాలంటే కొంతకాలంగా పారిశ్రామిక వ ద్ధి మందగిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. పారిశ్రామిక రంగంలో పాతవైనా, కొత్త పరిశ్రమల్లో అయినా ఆధునిక యంత్రాలను, కంప్యూటర్లు, రోబోట్లను ప్రవేశపెడుతున్నారు. గుమస్తాలు చేయాల్సిన పనులను కంప్యూటర్లు చేస్తున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే గత ఐదు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల లాభాల రేటు తగ్గలేదు, నష్టాలు వచ్చి ఫలానా తరహా పరిశ్రమ మూతపడింది అనే సమాచారాన్ని కూడా పాలకులు మనకు చెప్పలేదు కనుక అంతా బాగుందనే అనుకోవాలి. ఇక్కడే సమస్య వస్తోంది.

రైతు లేనిదే రాజ్యం లేదు !

పదిహేను సంవత్సరాల క్రితం దేశ జిడిపిలో వ్యవసాయ రంగ వాటా 21శాతంగా వున్నది కాస్తా ఇప్పుడు 13శాతానికి పడిపోయింది. అయితే ఆ రంగంలో పని చేస్తున్న కార్మికుల సంఖ్య ఆ దామాషాలో తగ్గలేదు. దేశంలో పనిచేసే వారిలో 55శాతం మంది అంటే 26 కోట్ల మంది వ్యవసాయ రంగంలో వున్నారు. అంటే జనాభాలో సగానికి పైగా దాని మీదే ఆధారపడి వున్నట్లు లెక్క. గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రంగంలో తలెత్తిన సమస్యలు అనేక రాష్ట్రాలలో రైతులను రోడ్ల మీదకు తెచ్చాయి. నరేంద్రమోడీ కంటే తెలంగాణాలో చంద్రశేఖరరావు సర్కార్‌ రైతు బంధుపేరుతో ఎక్కువ మొత్తాలు చెల్లించిన నిజామాబాదులో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరగురించి చేసిన ఆందోళన, ఎన్నికల్లో దాని పర్యవసానాలను ఏ పాలకులైనా గమనంలోకి తీసుకోవాలి. ప్రపంచ మంతటా వ్యవసాయ పంటల ధరలు తగ్గుతున్నాయని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్ధ గణాంకాలు చెబుతున్నాయి. మద్దతు ధరలు గిట్టుబాటు ధరలు కాదు. ప్రాణం పోకుండా చేసే ప్రాధమిక చికిత్స వంటివే. 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని మోడీ ఐదు సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం అరుంధతి నక్షత్రంలా వుంది. వ్యవసాయ రంగంలో రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే యాంత్రీకరణ అవసరం అని యంత్రాలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నారు. అవి పారిశ్రామికవేత్తల, వాణిజ్యవేత్తల జేబులు నింపుతున్నాయి తప్ప రైతాంగానికి ఏమేరకు వుపయోగపడ్డాయన్నది పెద్ద ప్రశ్న. మరోవైపున యాంత్రీకరణ కారణంగా వ్యవసాయ కార్మికులకు వుపాధిపోయి వారంతా నిరుద్యోగసేనలో చేరుతున్నారు. చేతివృత్తుల వారి పరిస్ధితీ అంతే. అందువలన ఈ పెద్ద సమస్యను పరిష్కరించకుండా ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే నిజామాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఎదుర్కొన్న పరిస్ధితినే నరేంద్రమోడీ కూడా ఎదుర్కోవాల్సి వుంటుంది.

Image result for Narendra Modi, pakoda

నిరుద్యోగ సమస్య తీరు తెన్నులేమి !

నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజలకు తెలియకుండా దాస్తున్నారనే విమర్శను మోడీ సర్కార్‌ ఎదుర్కొన్నది. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నిరుద్యోగానికి సంబంధిచిన సమాచారాన్ని ప్రచురించటానికి తిరస్కరించటం సహజంగానే అనుమానాలను రేకెత్తిస్తుంది. ఏదైనా మూసి పెడితే పాచిపోతుంది అని తెలిసిందే. ఆ సమస్య మీద సంబంధిత వున్నత అధికారి రాజీనామా కూడా చేశారు. అయితే ప్రభుత్వ గణాంక కార్యాలయం నుంచి లీక్‌ అయిన నివేదిక ప్రకారం నిరుద్యోగం 6.1శాతందాకా ఉంది. ఇది గత 45సంవత్సరాలలో అత్యంత గరిష్టం. ఏప్రిల్‌లో నిరుద్యోగం రేటు 7.6శాతం ఉందని ద సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ద ఇండియన్‌ ఎకానమీ అంచనా వేసింది. నిరుద్యోగం రేటులో చలనాలు నిరుద్యోగం ఏ దిశగా పయనిస్తుందో సూచిస్తాయని తెలుసుకోవాలి. కేవలం రేటుతో సమస్య తీవ్రత తెలియదు. ఎందుకంటే భారతదేశంలో అనేకమందికి పూర్తి కాలం ఉద్యోగం ఉండటం, పూర్తి కాలం ఉద్యోగం లేకపోవటం కాకుండా ఉద్యోగిత కొంతకాలమే ఉంటుంది.

దేశంలో జనాభా 136 కోట్లు, వారిలో పని చేయగలిగిన వారు 15-64 సంవత్సరాల వయసు వారు అనుకుంటే 91 కోట్ల మంది వుంటారు.అయితే వారంతా వుద్యోగాల కోసం చూస్తారని కాదు గాని మన వంటి దేశానికి, ఏ పాలకులకు అయినా అదొక పెద్ద సమస్య అని చెప్పక తప్పదు. దీన్ని పరిష్కరించకుండా, వాగ్దానం చేసిన మాదిరి ఏటా రెండు కోట్ల మందికి వుద్యోగాలు కల్పించకుండా జనానికి ‘మంచి రోజులు ‘ రావు కదా ! నల్లధనాన్ని వెలికి తీసి బాత్‌రూముల్లో, మంచల మీద దాచిన సొమ్మును చలామణిలోకి తెచ్చి వుత్పాదక, వుపాధి అవసరాలకు అందుబాటులోకి తెస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. అలాగే పన్నుల సంస్కరణల్లో భాగంగా ఎగవేతలను అరికట్టేందుకు అని చెప్పి జిఎస్‌టిని ప్రవేశపెట్టారు. దాని వలన పెద్ద ఎత్తున వుపాధి పోయిందని జనం గగ్గోలు పెడితే ఒక చర్య ఫలితాలు వెంటనే ఎలా కనిపిస్తాయి, కొద్ది రోజులు ఆగాలని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పడినా జనం వాటిని మరచిపోయి నరేంద్రమోడీకి ఓటేశారు. ఇప్పుడు ఆ ఫలితాలు ఏ రూపంలో జనానికి వుపయోగపడుతున్నాయో చూపించాల్సిన బాధ్యత మోడీ సర్కార్‌ ముందు వుంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్ధ మోడీ సర్కార్‌ కంటే ముందే ఏర్పడింది. అనేక అంశాలను అది ఎప్పటికపుడు వెల్లడిస్తోంది. అలాంటి సంస్ధ ఇచ్చిన లెక్కల ఆధారంగానే 2014లో నరేంద్రమోడీ రెండు కోట్ల వుద్యోగ కల్పన వాగ్దానం చేసినట్లు మరచి పోరాదు. 2016లో పెద్ద నోట్ల రద్దు, తరువాత జిఎస్‌టి పర్యవసానాల కారణంగా 2018లో కోటీ పదిలక్షల మందికి వుపాధి పోయిందని ఆ సంస్ధ చెప్పింది. ఆ సంస్ధతో పోల్చితే ప్రభుత్వానికి వున్న పెద్ద యంత్రాంగం అసలు వాస్తవాలను బయట పెట్టాలి. లేకపోతే విశ్వసనీయత సమస్యను సర్కార్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ భవిష్యత్‌ కోసం నాకు ఓటు వేయండని నరేంద్రమోడీ స్వయంగా కోరిన విషయాన్ని మరచిపోరాదు.

ఇండియా స్పెండ్‌ వెబ్‌ సైట్‌ విశ్లేషణ ప్రకారం అనేక నెలలుగా నిరుద్యోగశాతం ఏడుశాతానికి అటూ ఇటూగా వుంది. ప్రతి ఏటా 1.2కోట్ల మంది వుద్యోగార్ధులు అడ్డామీదకు వస్తున్నారు.వారిలో కేవలం 47.5 లక్షల మందికి మాత్రమే పని దొరుకుతోంది.దేశ జనాభాలో 80శాతం హిందువులే వున్నారు, అంటే నిరుద్యోగుల్లో కూడా వారి వాటా అంతకు తగ్గదు. ఈ సమస్య ఏ క్షణంలో అయినా పేలే టైంబాంబు వంటిది, అది పేలకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలి లేకపోతే ఏం జరుగుతుందో ఎవరూ వూహించలేరు. కాబట్టి నిరుద్యోగితను తగ్గించటానికి ప్రభుత్వమే ఏదో ఒకటి చెయ్యాలి.ఏం చేస్తారో ఎన్నికల్లో చెప్పలేదు. ఇప్పుడా పని చేసి యువతకు భరోసా కల్పించాలి.

ధనమేరా అన్నిటికీ మూలం !

నరేంద్రమోడీ చేసిన వాగ్దానాలు, రేపిన ఆశలు వేటిని నెరవేర్చాలన్నా కావాల్సింది ధనం.సంపదల సృష్టి లేకుండానే నోట్లను ముద్రిస్తే ప్రయోజనం లేదు. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్నదేశంగా ఎంతకాలం చెప్పుకుంటాం అంటూ ఎన్‌డిఏ కొత్త ఎంపీల సమావేశంలో నరేంద్రమోడీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మన దగ్గర మంత్రదండాలేమీ లేవు.

పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం 77.6శాతం ఉంది. గత సంవత్సరంతో పోల్చినప్పుడు మార్చిలో ఇది 0.4శాతం తగ్గింది. క్యాపిటల్‌ గూడ్స్‌ 8.7శాతం, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ 5.1శాతం, ఇంటర్‌మీడియట్‌ గూడ్స్‌ 2.5శాతం క్షీణించటం, కన్సూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ 0.3శాతం పెరగటంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచికలో వ ద్ధి కేవలం 3.6శాతంగా నమోదైంది. 2017-18 సంవత్సరంలో నమోదైన 4.4శాతంతో పోల్చినప్పుడు ఇది తక్కువ. అయితే ఆర్థిక సంవత్సరంలోని తరువాతి నెలల్లో మాంద్యం తీవ్రమైంది.

ఎగుమతులు, వినియోగమూ పెరగాలి !

మాంద్య పరిస్ధితులు ఏర్పడినపుడు అభివృద్ది రేటు పెరగకపోగా పతనం అవుతుంది. మనది ఎగుమతి ఆధారిత వ్యవస్ధ కాదు. అనేక దేశాల వ్యవస్ధలతో పోల్చుకుంటే మన ఎగుమతులు పరిమితమే. మేకిన్‌ ఇండియా పేరుతో గత ఐదు సంవత్సరాలలో జరిగిందేమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. మన ద్రవ్యోల్బణం అదుపులో, తక్కువగా వుందని మన పాలకులు, అధికారులు తరచూ చెబుతుంటారు. అంటే ధరల పెరుగుదల కూడా తక్కువగా వుందని అర్ధం.అలాంటపుడు వినియోగం పెరగాలి, వినియోగం పెరిగితే పైన పేర్కొన్న విధంగా తయారీ రంగం వెనుక పట్టు పట్టదు. వివిధ రంగాల సమాచారాన్ని విశ్లేషించినపుడు గత నాలుగు నెలల కాలంలో మన వినియోగం తగ్గుతోందన్నది స్పష్టం. అది విదేశీ దిగుమతులైన బంగారం, రాళ్లు, ఆభరణాల వంటివి అయితే మనకే లాభం కాని మనదేశంలో తయారయ్యే వస్తు వినియోగం తగ్గితే అది ప్రమాదకరం. మారుతీ కంపెనీ మిగిలిపోతున్న కార్లను తగ్గించుకొనేందుకు వుదారంగా కార్మికులకు ఒకరోజు సెలవు ఇచ్చిందని వార్త చదివాము. ఒకవైపు మన మధ్యతరగతి మార్కెట్‌ బ్రహ్మాండంగా వుందని చెప్పుకుంటున్నపుడు మారుతీ కార్లెందుకు అమ్ముడుపోవటం లేదు, లేదా మేకిన్‌ ఇండియాలో భాగంగా విదేశాలకు ఎందుకు ఎగుమతి కావటం లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతాయి.

Image result for Challenges before Narendra Modi

పర్యవసానాలు ఎలా వుంటాయి !

కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నా 1991 నుంచి అనుసరిస్తున్నది నయా ఉదారవాద విధానాలే. ఆ విధానం మార్గాంతరం లేని స్థితికి చేరుకోగా, దాని స్థానాన్ని ఆక్రమించటానికి దేశీయ మార్కెట్‌ ఆవిర్భవించనప్పుడు ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలవలెనే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఒక అనిశ్చిత స్థితిలో కూరుకుపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం భారత, చైనా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నది. ఇది ఎగుమతుల వ ద్ధిరేటు తగ్గటం కారణంగా జరుగుతోంది. అయితే తగ్గిన ఎగుమతుల వ ద్ధిరేటు తగ్గటంవల్ల ఏర్పడిన దుస్థితిని పాక్షికంగానైనా సరిదిద్దటానికి దేశీయ మార్కెట్‌ను విస్త తపరచలేదు. అలా జరగకపోగా అదే సమయంలో గ్రామీణ నైరాశ్యంవల్ల, ఎగుమతుల వ ద్ధి మందగించటం వల్ల ఏర్పడే ద్వితీయ శ్రేణి ప్రభావాల కారణంగా, నిరర్ధక ఆస్తుల పరిమాణం పెరగటంవల్ల, ఇతర విషయాలతోపాటుగా దీనివల్ల పారిశ్రామిక వ ద్ధి మందగించటం వల్ల పెద్ద ఎత్తున అవసరమయ్యే వ్యయాలకు అందుబాటులో వుండే రుణ సౌకర్యం బలహీనపడింది. పర్యవసానంగా దేశీయ మార్కెట్‌ కూడా కుదింపునకు గురయింది. వేరేమాటల్లో చెప్పాలంటే ఎగుమతుల వ ద్ధిలో ఏర్పడిన మందగమనానికి విరుగుడుగా తుల్యాన్ని సాధించనందున దేశీయమార్కెట్‌ కుదింపునకు గురయింది. దానితో ఎగుమతుల వ ద్ధి మరింతగా దెబ్బతింది. కన్‌స్యూమర్‌ డ్యూరబుల్‌ రంగం కుదింపునకు గురికావటం, కన్‌స్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్‌ రంగం గత ఏప్రిల్‌తో పోల్చినప్పుడు స్తంభించటమనే వాస్తవాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి నాటికే కుదింపునకు గురైన క్యాపిటల్‌ గూడ్స్‌ రంగం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు క్షీణిస్తున్నాయని సూచిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు తరువాత తెలుస్తాయని మూడు సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ అంతకు ముందే పెట్టుబడుల కోసమే తరచూ విదేశీ ప్రయాణాలు చేశానని మోడీ చెప్పారు. మరి వాటి ఫలితాలు, పర్యవసానాలను ఇప్పుడు జనానికి చూపాలి, లేకపోతే వేరే విధంగా అర్ధం చేసుకొనే ప్రమాదం వుంది.

బ్యాంకింగ్‌ రంగం ఎందుకు సమస్యల్లో వుంది?

అంతా బాగుంది అని చెప్పుకుంటున్న ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకుల్లో నిరర్ధక ఆస్ధులు ఎందుకు పెరిగాయి అంటే గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన అప్పులే కారణం అని చెప్పారు. అదింకేమాత్రం చెల్లదు. నిబంధనల ప్రకారం గడువు మీరి వాయిదాలు చెల్లంచని వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించటం, వాటి ఆస్ధులను స్వాధీనం చేసుకొని సొమ్మును తిరిగి వసూలు చేస్తున్నట్లు కూడా చెప్పినప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఏటేటా పెరుగుతున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా లక్షల కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులను ప్రభుత్వం రద్దు చేసింది. గత రెండు సంవత్సరాలుగా దాదాపు రెండులక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ప్రభుత్వం నిధులు బదలాయించింది. ఎన్నడూ లేని స్ధాయిలో 2018డిసెంబరు నాటికే నిరర్ధక ఆస్తులు ఎనిమిది క్షల కోట్లకు చేరాయి. రుణాలు ఇస్తాం తీసుకోండి అంటూ ఇటీవలి కాలంలో టెలిమార్కెటర్లు జనాన్ని ఫోన్ల మీద చంపుతున్నారు. బ్యాంకులు తమ దగ్గర డబ్బు నిల్వవుంచుకుంటే వాటికి వడ్డీ దండుగ. అందుకే అవి వెంటపడుతున్నాయి. అయినా వాటి ఫలితాలు ఆర్ధిక రంగం మీద పెద్దగా ప్రతిఫలించటం లేదు. ఈ ఎన్నికల కాలంలో రాజకీయ పార్టీలు గ్రామీణ పేదలకు పెద్ద ఎత్తున ఉపశమన పథకాలను ప్రవేశపెడతామని మాట ఇచ్చాయి. దానితో తప్పకుండా దేశీయ మార్కెట్‌ విస్త తమౌతుంది. అది పారిశ్రామిక ఉత్పత్తి పునరుద్ధరింపబడటానికి దారితీస్తుంది. చిన్న రైతు కుటుంబాలకు చెందిన 12కోట్లమందికి వార్షికంగా తలసరి 6000రూపాయలను అందిస్తానని మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో మరింత ముందుకుపోయింది. న్యారు పథకం ద్వారా అత్యంత అథమస్థాయిలో గల 5కోట్ల కుటుంబాలకు నెలకు 6000 రూపాయలు అంటే సంవత్సరానికి రూ.72,000 సమకూరుస్తానని మాట ఇచ్చింది. ఈ పథకాలవల్ల దేశీయ మార్కెట్‌ విస్త తమౌతుంది. అయితే ఇక్కడ ఉదయించే ప్రశ్న ఏమంటే ఈ పథకాలకు అవసరమైన వనరులను ఎలా సమకూరుస్తారు అనేదే.

సంపన్నుల నుంచి అధికంగా వసూలు చేయాలి !

సంపన్నులపై పన్ను వేయటం ముఖ్యంగా భారతదేశంలో అస్థిత్వంలో కూడా లేని సంపదపై పన్నును విధించటం ద్వారా గణనీయమైన స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. వనరులను సమకూర్చుకోవటానికి ఇది మనముందున్న స్పష్టమైన మార్గం. అయితే దీనిని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వనరులను సమకూర్చుకోవటం అంత కష్టం కాదని, అయితే నయా ఉదారవాద వ్యవస్థలో వనరులను అన్వేషించటం కష్టతరమౌతుందని కాంగ్రెస్‌ పార్టీ న్యారు పథకాన్ని ప్రకటించినప్పుడు మన్‌మోహన్‌ సింగ్‌ నర్మగర్భంగా అన్నారు. ఆ విధంగా ఒకవేళ ఈ పథకానికి కావలసిన వనరులను విత్తలోటుతో కూడా పాక్షికంగా సమకూర్చుకోవచ్చనుకున్నా అటువంటి విత్తలోటు స్థూల జాతీయోత్పత్తిలో అనుమతించబడిన 3.4శాతం పరిమితిని మించుతుంది. అప్పుడు అది భారతదేశ క్రెడిట్‌ రేటింగ్‌ తగ్గించటానికి దారితీస్తుంది. దానితో విదేశీ మారకపు చెల్లింపుల శేషం(బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌)కు చెందిన కరెంట్‌ ఖాతా లోటును పూడ్చటం కష్టమవుతుంది. అమెరికా ఆదేశం మేరకు భారతదేశం బహిరంగ మార్కెట్‌ కంటే చౌకగా లభించే ఇరాన్‌ చమురును కొనుగోలు చేయకపోతే ఈ సమస్య మరింతగా తీవ్రమవుతుంది. అమెరికా ఆదేశాన్ని పాటిస్తానని మోడీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటికే పెరుగుతున్న చమురు ధరలవల్ల కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతుంది. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టయితే కరెంటు ఖాతా లోటు మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ దీనికి అదనంగా విత్తలోటులో పెరుగుదల పరిమితిని మించితే భారతదేశ క్రెడిట్‌ రేటింగ్‌ పడిపోయి దేశంలోకి వచ్చే ద్రవ్య ప్రవాహాలు ఎండిపోతాయి. ఈ లోటును సాధారణ మార్గాలలో పూడ్చగలుగుతామనే ఆశ నామమాత్రంగానే ఉంటుంది. కాబట్టి మనం ఒక విపరీత స్థితిలో ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ముంచుకొస్తున్న మాంద్యాన్ని అధిగమించా లంటే కరెంటు ఖాతా లోటును పూడ్చటం దానికి కష్టమౌతుంది. మరోవైపు మాంద్యాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నం చేయకపోతే ఇప్పటికే తీవ్రంగావున్న నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుంది.ఈ సమస్యను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా అధిగమిస్తుందన్నది శేష ప్రశ్న !

మైనారిటీలకు భరోసా కల్పించాలి !

ఏ దేశంలో అయినా మైనారిటీలు అభద్రతకు గురౌతారు. ఇది అంతర్జాతీయంగా వున్న పరిస్ధితి. మన దేశంలో అంతకంటే ప్రత్యేక పరిస్ధితులు వున్నాయి. మెజారిటీ జనాన్ని సంతుష్టీకరించేందుకు మైనారిటీల మీద దాడులు చేస్తున్నా పట్టించుకోలేదనే విమర్శ ప్రభుత్వం మీద ఇప్పటికే వుంది. ఎన్నికలు ముగియటంతోనే మైనారిటీలను వేధించే శక్తులు విజృంభిస్తున్నాయని తాజాగా జరిగిన రెండు వుదంతాలు స్పష్టం చేశాయి. బీహార్‌లో పేరు అడిగి మరీ తుపాకితో దాడి చేసిన వుదంతం, దేశ రాజధాని పక్కనే వున్న గురుగ్రామ్‌లో జై శ్రీరాం అనేందుకు తిరస్కరించినందుకు దాడి, మధ్య ప్రదేశ్‌లో ఆవు మాంసం కలిగి వున్నారంటూ జరిగిన దాడులు పరిమితమే అయినా దేశ వ్యాపిత చర్చనీయాంశం అయ్యాయి. అలాంటి శక్తులను తక్షణమే అదుపు చేయలేకపోతే జరిగే నష్టాలకు బాధ్యత వహించాల్సి వుంటుంది. రానున్న ఐదు సంవత్సరాలలో సబ్‌ కా విశ్వాస్‌( అందరి విశ్వాసం) సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ అంటే అందరి అభివృద్ధికి అందరితో కలసి పనిచేస్తామని చెప్పిన మాటలను ఆచరణలో నిరూపించుకోవాలి.

నోటి తుత్తరను అదుపు చేయాలి !

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు మిగతా పార్టీల కంటే బిజెపి వారి మీదనే ఎన్నికల సంఘం ఎక్కువగా చర్యలు తీసుకున్నది. తీసుకోవాల్సినన్ని, తీవ్ర చర్యలు లేవనే విమర్శలు సరేసరి. దేశ నాగరికత, విలువలకు ప్రతీక అని వర్ణించిన సాధ్వి ప్రజ్ఞ గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడని కీర్తించటం తెలిసిందే. దానిని బిజెపి ఆమోదించకపోవటం కాదు, అసలు అలాంటి శక్తులను భవిష్యత్‌లో ఎలా అదుపు చేస్తారన్నదే సమస్య. ఎన్‌డిఏ ఎంపీల సమావేశంలో అలాంటి వారి గురించి మోడీ చేసిన హెచ్చరికను తు.చ తప్పకుండా అమలు చేయాలి.

Image result for Issues and Challenges before Narendra Modi

ఇరుగు పొరుగుతో సంబంధాలు !

ఇరుగు పొరుగుతో సంబంధాలు సజావుగా వుంటే దేశం అనేక విధాలుగా లబ్ది పొందుతుంది.ముఖ్యంగా ఆయుధాలు, మిలిటరీ ఖర్చును తగ్గించుకోవచ్చు.ఆ సొమ్మును వుపాధి కల్పన, సంక్షేమానికి వినియోగించుకోవచ్చు. వుగ్రవాద సమస్యను ఎన్నికల ప్రచారానికి, ఓట్ల లబ్దికి వినియోగించుకున్నారన్న విమర్శలు దాస్తే దాగేవి కాదు. నిజానికి అవి నరేంద్రమోడీకి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా మేలు చేసేవి కాదు. పాక్‌తో సంబంధాలు నిరంతర సమస్యలు తెచ్చిపెడుతున్నవే. అయితే నిరంతరం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం రెచ్చగొట్టటాన్ని జనం కొంత మేరకు అర్ధం చేసుకుంటారు. మితిమీరితే మొదటికే మోసం వస్తుంది. వుగ్రవాది మసూద్‌ అజహర్‌ విషయంలో చైనా అనుసరించిన వైఖరి రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యల పట్ల వర్తించే విధంగా వుండాలి. అందుకు సంఘపరివార్‌ నోటి తుత్తర బ్యాచిని అదుపు చేయాల్సి వుంటుంది.

ఇక చివరిగా విదేశాంగ విధానం గురించి చెప్పుకోవాల్సి వస్తే అమెరికాతో మరింతగా కలసి ముందుకు పోతే మనకు సమస్యలే తప్ప రిగే ప్రయోజనం లేదు. మా దేశానికి వస్తూ మాకేమి తెస్తారు, మీ దేశానికి వస్తే మాకేమి ఇస్తారనే వైఖరే దానిది. అమెరికాలో వున్న మన వారి కుటుంబీకులు వుద్యోగాలు చేయకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు నిజంగా ఆందోళన కలిగించేవి. ఒక మిత్ర దేశంగా చేయాల్సినవి కాదు. ఇప్పటికే వాణిజ్యంపై అమెరికా నియంత్రణలను ప్రవేశపెడుతున్నది. భారతదేశం కూడా అమెరికా కార్యశీలత నీడలో అటువంటి నియంత్రణలను ప్రవేశపెట్టి వుండాల్సింది. అయితే నయా ఉదారవాదం మార్గాంతరంలేని స్థితికి చేరుకున్నదనే వాస్తవాన్ని మోడీ ప్రభుత్వం గ్రహించినట్టు కనపడటం లేదు. వుపాధి రహిత అభివృద్ధి దాని లక్షణం. అంటే సంపన్నులు మరింత సంపన్నులౌతారు, మిగిలినవారు మరింత దిగజారి పోతారు. అటువంటి పరిస్ధితి రానున్న రోజుల్లో మరింత వేగిరం కానున్నది. దీనిని మోడీ ఎలా ఎదుర్కొంటారన్నది నిజంగా పెద్ద సవాలే. ప్రారంభం అమెరికా దౌత్యవేత్త చెప్పిన అంశంతో ప్రారంభమైంది. ముగింపు కూడా దానితోనే చేద్దాం. జాతీయ వాదం ఇతరులను అణచివేసేందుకు ఒక మార్గం అని అమెరికా సామాజికవేత్త చోమ్‌ నోమ్‌స్కీ చెప్పారు. నరేంద్రమోడీ అందుకు తన జాతీయ వాదాన్ని వినియోగించరని ఆశిద్దాం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారతీయ ఆత్మకు చెడు – నరేంద్రమోడీపై బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ వ్యాఖ్య !

26 Sunday May 2019

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Bad for India’s soul, BJP, India elections 2019, Narendra Modi, Narendra Modi’s landslide, populist leaders, populist schemes, Populists

Image result for bad for India’s soul

ఎం కోటేశ్వరరావు

ఇది నేను చెబుతున్నది కాదు. నరేంద్రమోడీ రెండవ సారి విజయం సాధించటంపై బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ రాసిన సంపాదకీయ శీర్షిక. ఒక వైపు కుహనా వార్తలతో కాలక్షేపం చేస్తూ వాణిజ్య వేత్తల అనుకూల అజెండా అమలు జరుపుతూ మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే మరో ప్రజాకర్షక నినాదాల నేత ప్రపంచానికి అవసరం లేదు అని వ్యాఖ్యానించింది.2017లో జరిపిన ఒక సర్వేలో రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌తో సహా ఏ దేశంలోనూ లేని విధంగా నిరంకుశమైన పాలన చేసేందుకు ఒక బలమైన నేత కావాలని భారత్‌లో 55శాతం మంది కోరుకోవటాన్ని చూసిన తరువాత ఈ విజయం చూసి మాకేమీ ఆశ్చర్యం కలగలేదు. స్వాతంత్య్ర భారత అత్యంత విలువైన లక్షణమైన బహుళపార్టీ ప్రజాస్వామ్యానికి ముప్పుగా నరేంద్రమోడీ ముప్పుగా పరిణమించారు. అని పేర్కొన్నది. అన్నం వుడికిందో లేదో చూడటానికి ఒక మెతుకును చూస్తే చాలన్నట్లుగా ఆ సంపాదకీయంలో మోడీ గురించి ఇంకా ఏం చెప్పారనేది మొత్తం ప్రస్తావించాల్సిన పని లేదు.

అధికారంలో పాతుకు పోయిన వున్నత వర్గం తమ గోడును పట్టించుకోవటం లేదనే అసంతృప్తితో వున్న సాధారణ జన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రంగంలోకి వచ్చే వారిని ప్రజాకర్షక రాజకీయవేత్తలు అంటున్నారు. అలాంటి వారి గురించి అమెరికాకు చెందిన ‘అట్లాంటిక్‌’ పత్రిక గతేడాది డిసెంబరు 26న ప్రజాకర్షక నేతలు ప్రజాస్వామ్యానికి ఏమి చేస్తారు అనే శీర్షికతో ఒక పరిశోధనా విశ్లేషణను ప్రచురించింది. ఇక్కడ ఒక స్పష్టత అవసరం. పశ్చిమ దేశాల మీడియా దృష్టిలో వెనెజులా నేతలు హ్యూగో ఛావెజ్‌, నికోలస్‌ మదురో, బొలీవియా నేత ఇవో మొరేల్స్‌, ఇతర వామపక్ష ప్రజాతంత్ర శక్తులను నరేంద్రమోడీ, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారినీ ఒకే గాటన కడుతున్నారు. ఫాసిస్టులు ఎంత ప్రమాదకారులో సోషలిస్టులు, కమ్యూనిస్టులూ అంతే ప్రమాదకారులనే తప్పుడు అవగాహన పర్యవసానం లేదా పని గట్టుకొని చేసే ప్రచారంలో భాగమిది. వెనెజులా, బలివీయాల్లో వున్న వామపక్ష, ప్రజాతంత్రశక్తుల ప్రభుత్వాలను కూల్చేందుకు ట్రంప్‌ వంటి సామ్రాజ్యవాదులు నిరంతరం కుట్రలు చేస్తున్నారు. దానికి వంత పాడుతూ వెనెజులా నుంచి చమురును కొనుగోలు చేయరాదని నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయించింది. అందరూ జనాకర్షక నేతలే అయితే వారిలో కొందరు తోటి వారిని కూల్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు? పెట్టుబడిదారీ వర్గాన్ని కూల్చివేసేందుకు ఛావెజ్‌, మదురో, ఇవో మొరేల్స్‌ చర్యలు తీసుకోకపోయినా, వారికి సహకరించటం లేదు. అందుకే ఆ వర్గ ప్రతినిధులైన ట్రంప్‌, మోడీ వంటి వారు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు.

ప్రజాస్వామ్యానికి ప్రజాకర్షక నేతలు చేస్తున్నదేమిటి అన్న అట్లాంటిక్‌ పత్రిక విశ్లేషణను చూద్దాం.తమ పరిశోధనలో తేలినదాని ప్రకారం ప్రజాకర్షక ప్రభుత్వాలు అవినీతిని మరింతగా పెంచుతాయి, వ్యక్తిగత హక్కులను హరిస్తాయి, ప్రజాస్వామిక వ్యవస్ధలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. నరేంద్రమోడీతో సహా ప్రజాకర్షక నినాదాలు, ఆచరణ గురించి 66 ప్రముఖ పత్రికల్లో చోటు చేసుకున్న వ్యాసాలు, విశ్లేషణలను ఆ పత్రిక పరిశోధించింది. వాటి నుంచి 1990 నుంచి 2018 వరకు 33దేశాలకు చెందిన 46 మంది అధికార నేతలను ఎంచుకొని వారి తీరు తెన్నులను విశ్లేషించి పైన పేర్కొన్న సారాన్ని తన పాఠకులకు అందచేసింది. అట్లాంటిక్‌ పత్రిక సర్వేలో కొన్ని అంశాల సారాంశం ఇలా వుంది.

పరిశోధన ఫలితాలు ఆందోళన కలిగించేవిగా వున్నాయి. ప్రజాకర్షక నేతలు ఎంతో నైపుణ్యంతో అధికారంలో కొనసాగారు, ప్రజాస్వామిక సంస్ధలకు తీవ్ర ముప్పుగా మారారు. సగటున సాధారణ ప్రజాస్వామిక ప్రభుత్వాలు స్వల్ప కాలం మూడు సంవత్సరాలు కొనసాగాయి. కొన్ని తొలిసారి అధికారానికి వచ్చిన తరువాత ఆరు సంవత్సరాలు వున్నాయి. ఐదింట నాలుగు ప్రభుత్వాలు అధికారం కోల్పోయాయి. అదే ప్రజాకర్షక ప్రభుత్వాలు దీర్ఘకాలం అధికారంలో వుండేట్లు నడపగలిగాయి. సగటున అవి ఆరున్నర సంవత్సరాలు లేదా ప్రజాకర్షకులు కాని వారి ప్రత్యర్ధుల కంటే రెట్టింపు కాలం వున్నాయి. ప్రజాకర్షక నేతలు ఒకటి రెండు సార్లు ఎన్నిక అవటం కాదు, దశాబ్దకాలానికి పైగా అధికారంలో వుంటారు. వారు దీర్ఘకాలం అధికారంలో వున్నారంటే అది వారి పలుకుబడి, సామర్ధ్యాలను సూచిస్తుంది. 1990-2015 మధ్య కాలంలో అధికారానికి వచ్చిన నేతలను చూస్తే చాలా కొద్ది మంది మాత్రమే సాధారణ ప్రజాస్వామిక ప్రక్రియలో అధికారానికి దూరమయ్యారు. కేవలం పదిహేడు శాతం మంది మాత్రమే స్వేచ్చగా, న్యాయంగా జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. మరో 17శాతం మంది తమ పదవీ వ్యవధులు పూర్తి అయిన కారణంగా అధికారం నుంచి వైదొలిగారు. అయితే 23శాతం మంది నాటకీయ పరిణామాలు అంటే అభిశంసన లేదా బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చి వైదొలిగారు. సర్వేకు ఎంచుకున్న ప్రజాకర్షక నేతల్లో 30శాతం ఇప్పటికీ అధికారంలో కొనసాగుతున్నారు. వారిలో 36శాతం మంది గత ఐదు సంవత్సరాలుగా పదవుల్లో వున్నారు. ప్రజాకర్షక నేతలు ఎంత ఎక్కువ కాలం పదవిలో వుంటే అంత ఎక్కువ ఆందోళన తలెత్తుతోంది. సగం మంది తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో వున్నారు.

ప్రజాకర్షక నేతలు ఎంత కాలం అధికారంలో వున్నారు, అంతిమంగా వారు పదవులను ఎలా వదులుకున్నారు అనేదానికంటే ముఖ్యమైన అంశం అధికారంతో వారేమి చేశారు అన్నది. వారి పదవీకాలంలో రాజకీయ శాస్త్రవేత్తలు వర్ణించినట్లుగా ‘ ప్రజాస్వామ్యం తప్పుదారి పట్టడం ‘ పౌరులు అనుభవిస్తున్న మౌలిక హక్కులు దిగజారటానికి వారి పదవీ కాలం కారణం అవుతున్నది. అనేక దేశాలలో వీరు తమకు అనుకూలంగా ఆట నిబంధనలను శాశ్వతంగా తిరిగి రాసుకున్నారు. సగం మంది నేతలు తమ దేశ రాజ్యాంగాలను తిరిగి రాసుకోవటం లేదా సవరించుకున్నారు. ఇన్ని దఫాలు మాత్రమే అధ్యక్షపదవిలో వుండాలి అనే నిబంధనలను ఎత్తివేయటం, కార్యనిర్వాహక అధికారాన్ని నియంత్రించే, సరి చూసే అంశాలను నామమాత్రం చేయటం వంటి పనులు చేశారు. మీడియా స్వేచ్చ, పౌరహక్కుల రక్షణ,రాజకీయ హక్కుల వంటి ప్రజాస్వామిక మౌలిక హక్కులకు సంబంధించి ఈ దేశాలన్నింటా తరతమ తేడాలువున్నప్పటికీ అవన్నీ దిగజారాయి. మీడియా స్వేచ్చ ఏడుశాతం, పౌరహక్కులు ఎనిమిదిశాతం, రాజకీయ హక్కులు 13శాతం పడిపోయాయి. ఇతర పాలకులతో పోల్చితే ప్రజాకర్షక పాలకుల పాలనలో నాలుగు రెట్లు ఎక్కువగా ప్రజాస్వామ్యం తప్పుదారి పడుతున్నది.

మితవాద ప్రజాకర్షక నేతల పాలనలో మైనారిటీలను బాధించటం, చట్టబద్దంగాని లక్ష్యాల కోసం ప్రజాగ్రహాన్ని ఆయుధంగా మార్చటం వంటి చర్యలకు పాల్పడతారు. వీరు తరచుగా అవినీతి వేళ్లను పెకలించి వేస్తామనే నినాదాలతో ఎన్నిక అవుతుంటారు. బ్రెజిల్‌లో బోల్‌సోనారో, అమెరికాలో డోనాల్డ్‌ట్రంప్‌ అదే నినాదాలతో అధికారానికి వచ్చారు. ఇటలీలో నార్తరన్‌ లీగ్‌ అనే పచ్చిమితవాద పార్టీ అవినీతి వ్యతిరేకనినాదాలతోనే జనాన్ని సమీకరిస్తోంది.( మన దేశంలో నరేంద్రమోడీ తొలిసారి నల్లధనం వెలికితీత, కాంగ్రెస్‌ పాలనలో అవినీతి గురించి పెద్ద నినాదాలతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వాటి వూసే లేదు.) వీరు అధికారానికి వచ్చిన తరువాత అవినీతిని అరికట్టకపోగా ప్రధాన స్రవంతిలోని మొసళ్ల వంటి వారి స్ధానంలో వారికి చెందిన అంతకంటే ప్రమాదకరమైన వారిని ముందుకు తెస్తారు. వీరు స్వతంత్ర దర్యాప్తు సంస్ధలను పని చేయనివ్వరు, అందువలన వారి దుష్కృత్యాలు పెద్దగా బయటకు రావు. అయినప్పటికీ 40శాతం మంది ప్రభుత్వాధినేతలు అంతిమంగా అవినీతి కేసులలో విచారణకు గురి అయ్యారు. అవినీతి, అక్రమాలు, దుర్వినియోగం, అంతకు ముందున్నవారి మీద తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తప్పుదారి పట్టిన ప్రజాస్వామ్యాలను సరైనదారిలో పెడతారు అనే భ్రమలు కలిగిస్తారు. అయితే అందుకు విరుద్ధంగా చేస్తారని దొరికిన సాక్ష్యాలు వెల్లడించాయి. అవినీతి పెరగటం, వ్యక్తిగత హక్కులు హరించుకుపోవటం, ప్రజాస్వామిక సంస్ధలకు తీవ్ర నష్టం కలిగిస్తారని తేలింది.

అట్లాంటిక్‌ పత్రిక నరేంద్రమోడీకి వ్యతిరేకమైనది కాదు, అమెరికాలో వున్న ఇతర బడా పత్రికలతో పోలిస్తే చాలా చిన్నది. అది చేసిన పరిశోధన ప్రజాకర్షక నేతల సాధారణ లక్షణాలను ఎంతో స్పష్టంగా వెల్లడించింది. దీన్ని గీటురాయిగా పెట్టుకొని మోడీని రాజకీయంగా వ్యతిరేకించేవారు గానీ, మద్దతు ఇచ్చేవారు గానీ పోల్చుకుంటే రాగల పర్యవసానాల గురించి ఒక అవగాహన వస్తుంది. ఆ పత్రిక విశ్లేషణలో బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడు, మాజీ సైనిక కెప్టెన్‌ అయిన జైర్‌ బోల్‌సోనారో ఎన్నికై జనవరి ఒకటిన అధికారాన్ని చేపట్టక ముందే క్లుప్తంగా ప్రస్తావించింది. అక్టోబరులో ఆయన ఎన్నికైనపుడు పర్యవసానాల గురించి సాంప్రదాయ రాజకీయ పెద్దలు, వ్యాఖ్యాతలు భిన్న వైఖరులు తీసుకున్నారు. బ్రెజిల్‌ను 1964-1985 మధ్య పాలించిన మిలిటరీ నియంతల పాలనను ఆయన ప్రశంసించటం ప్రజాస్వామిక వ్యవస్ధకు తీవ్రమైన ముప్పును సూచిస్తున్నదని కొందరు వ్యాఖ్యానించారు. దేశంలోని మీడియా, స్వతంత్ర న్యాయవ్యవస్ధ, ఇతర బలమైన ప్రజాస్వామిక వ్యవస్ధలు, సంస్ధలు నియంతృత్వపోకడలను అడ్డుకుంటాయని మరికొందరు పేర్కొన్నారు. అట్లాంటిక్‌ పత్రిక పేర్కొన్న ప్రపంచంలోని నలుగురు పెద్ద ప్రజాకర్షక నేతల్లో బోల్‌సొనారోతో పాటు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, నరేంద్రమోడీ, డోనాల్డ్‌ ట్రంప్‌ వున్నారు.

అనేక అక్రమాలకు పాల్పడి అధికారానికి వచ్చిన బోల్‌సోనారో ఐదు నెలలు గడవక ముందే అభిశంసనకు గురవుతారా లేక మరొక పద్దతుల్లో తప్పించే చర్య వుంటుందా అనే విధంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మేనెల ప్రారంభంలో మిలిటరీలో మాజీలైన కాబినెట్‌ మంత్రులు బోల్‌సోనారో దగ్గరకు వచ్చి మీకు మద్దతు ఇచ్చే మితవాద శక్తులను రంగంలోకి దించకపోతే ప్రభుత్వం కూలిపోవటం తధ్యమని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. దాని పర్యవసానంగా ఐదునెలల్లోనే గబ్బు పట్టిన అధ్యక్షుడికి మద్దతుగా వీధుల్లోకి రావాలని పిలుపు ఇచ్చారు. జనవరి నుంచి సామాజిక మాధ్యమాల్లో అధ్యక్షుడి అనుకూల మరుగుజ్జులు లేదా పోకిరీలు(ట్రోల్స్‌),ముగ్గురు కుమారులు అందరూ రెచ్చిపోతున్నారు. మంత్రివర్గంలో మూడో వంతు మంది మాజీ సైనికాధికారులే వున్నారు.ఆర్ధిక వ్యవస్ధతో సహా అన్ని రంగాలలో అస్తవ్యస్ధ పరిస్థితి ఏర్పడింది. విద్యారంగంలో కోతలకు వ్యతిరేకంగా లక్షలాది మంది గతవారంలో వీధుల్లోకి రాగా దానికి పోటీగా అధ్యక్షుడికి మద్దతు అంటూ బ్రెజిలియన్‌ మిలిటరీ క్లబ్‌ ఆదివారం నాడు(26న) ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చింది.

Image result for bad for India’s soul

బ్రెజిల్‌లోని వామపక్ష దిల్మారౌసెఫ్‌ మంత్రివర్గం మీద అభిశంసన ప్రక్రియతో ఆ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మాజీ అధక్షుడు లూలాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసేందుకు తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఎన్నో వాగ్దానాలతో, ఆశలు కల్పించి అధికారానికి వచ్చిన బోల్‌సోనారో అక్కడి ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దలేక సంక్షేమ పధకాలకు, పెన్షన్లకు కోత పెడుతూ, జనం మీద భారాలు మోపుతూ ఐదునెలలకే గబ్బుపట్టిన స్ధితి. గద్దెనెక్కించిన వారే దింపేందుకు లేదా పక్కన పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు వార్తలు. ఆయన కుమారులే పెద్ద అవినీతి పరులుగా తేలింది. అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను కప్పిపుచ్చి జనాన్ని పక్కదోవ పట్టించేందుకు ఒక బూతు వీడియోను స్వయంగా సామాజిక మాధ్యమంలోకి వదిలి దేశంలో క్షీణ సంస్కృతి ఎలా తయారైందో చూడాలంటూ జనాన్ని కోరాడు. బ్రెజిల్‌లో వున్న చట్టాల ప్రకారం 50సంవత్సరాలు దాటిన వారు వుద్యోగాల నుంచి రిటైరై పెన్షన్‌ తీసుకోవచ్చు. ఆ సౌకర్యాన్ని రద్దు చేసి వుద్యోగ విరమణ వయస్సును పెంచేందుకు చేసిన యత్నాలతో మద్దతుదార్లలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. పచ్చిమితవాదులైన వారు పార్లమెంట్‌, సుప్రీం కోర్టులను రద్దు చేయాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ఆదివారం నాటి ప్రదర్శనల్లో అది కూడా ఒక డిమాండని వార్తలు వచ్చాయి. అలాంటి డిమాండ్‌ సరికాదని చివరకు అధ్యక్షుడే చెప్పాల్సి వచ్చింది.

ప్రజాకర్షక నినాదాలతో ముందుకు వచ్చే మితవాత శక్తుల పట్ల జనానికి ఎలా భ్రమలు వుంటాయో బ్రెజిల్‌ అనుభవం మన కళ్ల ముందే వుంది. వారు విఫలమైతే వ్యతిరేకత ఎలా వుంటుందో రాబోయే రోజుల్లో చూస్తున్నాము. అందువలన మితవాదశక్తులు బలపడ్డాయని, అధికారానికి వచ్చాయని గుండెలు బాదుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. వారి మీద జనానికి భ్రమలు తొలిగే రోజులు కూడా వుంటాయి. ఒకసారి జనం పొరపాటు పడినా, తప్పు చేసినా వారిని నిందించి ప్రయోజనం లేదు. వారితో వుంటూనే వారి విశ్వాసం పొందేవరకు వారి సమస్యల మీద నిరంతరం పని చేయటం, అనువైన పరిస్ధితులు ఏర్పడే వరకు ఎదురు చూడటం తప్ప ప్రజావ్యతిరేక శక్తులను ఓడించేందుకు మరొక దగ్గరదారి లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d