• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

వాచ్‌మన్ల జాతి పిత నరేంద్రమోడీ

29 Sunday May 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, INDIA, Literature., Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Narendra Modi, tdp, tdp mahanadu, telugudesam, YS jagan

ఎం కోటేశ్వరరావు

సార్‌ నేను అర్ధరాత్రి తరువాత నిద్రపోతానని మీరంతా అంటారు, ఇక నుంచీ నేను నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటా సార్‌ అని మా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ అర్ధరాత్రి తలుపుకొట్టీ మరి చెప్పాడు.

ఏం ఈ వుద్యోగం చేయాలని లేదా అన్నాను. అదేంటి సార్‌ అలా అంటారు అన్నాడు.

ఓరి పిచ్చోడా నరేంద్రమోడీ మాదిరి కాపలాదారుగా వుంటానంటే ఇక్కడ వున్న వుద్యోగం వూడగొడతారు, కొత్తగా ఎక్కడా ఇవ్వరు అన్నాను. అదేంటి సార్‌ అని నిజంగానే వూడగొట్టిన వుద్యోగి మాదిరి నీరసపడిపోయాడు.

న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ విజయగాన బజానాలను ఎప్పుడూ లేనిది శుక్రవారం రాత్రి దూర దర్శన్‌లో చూసి అమాయకుడు వుత్సాహపడిపోయాడు. ఎన్నడూ లేనిది పొద్దున్నే లేచి నా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నాడు. కనిపించగానే సార్‌ రాత్రి మీరు అలా అన్నారేంటి సార్‌ అని అడిగాడు.

తొమ్మిదివేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎగవేసిన విజయ మాల్య దేశం విడిచి పోతుంటే గుడ్లప్పగించి చూసిన నరేంద్రమోడీ, ఫాదర్‌ ఆఫ్‌ వాచ్‌మెన్‌ అంటే దేశంలోని వాచ్‌మన్లకు తలకాయ. ఆ పెద్దమనిషి మాదిరి పని చేస్తా అంటే దొంగలు దోచుకొని పారిపోతుంటే చూస్తూ వూరుకుంటా, ఎటు వెళ్లిందీ చెబుతా తప్ప పట్టుకోను అని చెప్పటమే అన్నాను.

రాత్రి నుంచి నిద్రపోకుండా ఎంత ఆలోచించినా మీరెందుకు అలా అన్నారో తట్టలేదు సార్‌. ఇప్పుడు మీరు చెప్పిన తరువాత ఇంక చచ్చినా ఎక్కడా నేను వాచ్‌మన్‌ వుద్యోగం చేస్తున్నా అని చెప్పను గాక చెప్పను సార్‌ అన్నాడు ఏదో ధృఢ నిర్ణయం తీసుకున్న వ్యక్తి మాదిరి.

పొద్దున్నే పాలకోసం దుకాణానికి వెళ్లా. మూమూలుగా నన్ను చూడగానే పాలు ఇచ్చేసి తన పనిలో తాను నిమగ్నమయ్యే దుకాణదారు ఎన్నడూ లేని విధంగా అదేంటి సార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భజన చేశాడు రాత్రి అన్నాడు.

ఏం తప్పేముంది నలుగురితో నారాయణా, గుంపుతో గోవిందా అన్నా. అమితాబ్‌ కాంగ్రెస్‌, నెహ్రూ కుటుంబానికి బాగా దగ్గర కదా అలాంటిది ఇప్పుడు ఇలా ఫిరాయించాడేమిటి అన్నాడు సంభాషణ పొడిగిస్తూ.

అపుడు కాంగ్రెస్‌ ‘మా’ ఇప్పుడు పనామా పత్రాలలో పేరు కనిపించటంతో నరేంద్రమోడీ ‘బా'(పు) అయ్యాడు. అయినా ఎన్నడూ దేని గురించి అడగనిది ఇవాళ ఇదేమిటి? నీకూ రాజకీయాలలో చేరాలని వుందా అని అడిగా.

పాత సినిమాల్లో వీలునామా పత్రాల గురించి చూశా, పనామా పత్రాల పేరు ఎప్పుడూ వినలే, కొత్త ప్రభుత్వాలు రాగానే పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టినట్లుగా వీలునామా పత్రాలకూ పేరు మార్చారా ఏమిటి అన్నాడు.

దొంగడబ్బు దాచుకున్నవారి వివరాలను మా జర్నలిస్టులు కొందరు బయట పెట్టారులే, ఆ ఖాతాలు పనామా అనే దేశంలో వున్నాయి, కనుక వాటిని పనామా పత్రాలు అంటున్నారులే.

అంటే కొంత మంది ఇంట్లో వారికి తెలియకుండా నా దగ్గర డబ్బు, నోట్లు పెట్టి వడ్డీకి తిప్పుతుంటార్లే అలాగేనా అన్నాడు.

ఓర్నీ, అంటే ప్రతి దుకాణమూ ఒక పనామా యేనా ఏమిటి కొంపదీసి, నీ సంగతి తెలిస్తే అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్‌ కూడా నీ దగ్గరకే వచ్చి వుండేవారన్నమాట.

అంత పెద్ద మొత్తాలను నేనెక్కడ తిప్పగలను సార్‌, ఏదో….. ఏదో నాతో అంటే అన్నావు గానీ ఇంకెవరితో అనకు….ఏం సార్‌ అన్నాడు.

ఎన్నికలకు ముందు విదేశాల్లో నల్లధనం గురించి చెప్పిన బిజెపి వారు ఇప్పుడు విదేశాల్లో కంటే స్వదేశంలోనే ఎక్కువ వుంది అంటున్నారు, నువ్వు ఇలాగే నలుగురితో చెప్పావనుకో ఏదో ఒక రోజు భారత మాతాకీ జై అంటూ ఖాకీ నిక్కరు వాళ్లు వచ్చి దాడి చేసి నీ దగ్గర ఎవరెవరు నల్లధనం దాచుకుంటున్నారో బయట పెట్టు అంటారు జాగ్రత్త.

సార్‌ ఖాకీ నిక్కరంటే గుర్తుకు వచ్చింది మా పక్కింటి పోరగాడికి వుద్యోగమేదీ రాలేదు, ఈ మధ్య కొత్తగా నిక్కర్లేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు, పిల్లలు నిక్కరంటే సరేగానీ అదేంటి సార్‌ పెద్ద వారు కూడా అలా అసహ్యంగా, వారు వస్తుంటే వీధిలో అడవాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారు, ఈ మధ్య మీరన్నారే భారత మాతాకీ జై అంటూ నిద్రలో కలవరించటమే కాదట, పక్కనున్నవారిని పట్టుకొని మీరూ అనరెందుకు అని నిద్రలోనే కొడుతున్నాడట ఏం చేయాలో తెలియటం లేదంటూ వాళ్ల నాన్న తలపట్టుకుంటున్నాడు.అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందీ అంటూ పాలు తీసుకొని బయలు దేరా.

ఇంతలో పచ్చ చొక్కా వేసుకొని మా ఎదురింటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనిపించాడు.ఏం తిరుపతి మహానాడుకు వెళ్లలేదా ఆహా ఏమి రుచి తినరా మై మరచి అన్నట్లుగా తిరుపతి వెంకన్న దర్శనం, ఎంచక్కా మూడు రోజుల పాటు మంచి భోజనాలు పెడుతున్నారట కదా !

మీరు జర్నలిస్టు కనుక వూరుకున్నా అదే ఇంకొకరు అని వుంటేనా అంటూ, అయినా మహానాడులో మీకు కనిపించింది భోజనాలేనా, తీర్మానాలు, వుపన్యాసాలు వినిపించలేదా అన్నాడు వుక్రోషంగా.

మిత్రమా లైట్‌ తీస్కో అదేదో సామెత చెప్పినట్లు పండగనాడూ పాత….. పాడిందే పాడరా…. అన్నట్లు ఎన్నికలకు ముందు నుంచి తరువాత గత రెండు సంవత్సరాలుగా జగన్‌ భజన చేస్తూనే వున్నారు బోరు కొట్టటం లేదా ! ఒకవైపు జగన్‌ పార్టీని ఫినిష్‌ చేశాం చూడమంటారు, మరోవైపు తద్దినపు తంతు మాదిరి ఎన్‌టిఆర్‌ పేరన్నా అప్పుడపుడు చెబుతున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్‌ పేరు తలవకుండా, పలకకుండా తెలుగుదేశం సమూహం మాట్లాడలేని స్ధితికి వచ్చింది, భాషా దారిద్య్రం పట్టుకుందా ! ఒకవైపు మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు జనంలోకి వెళ్లటం లేదని మీరే చెబుతుంటారు, జగన్‌ భజన మాని ఆ పని ఎందుకు చేయరు ? అయినా అదేమిటయ్యా నేను నిద్రపోను, ఇతరులను నిద్రపోనివ్వను అని పదే పదే చెప్పే చంద్రబాబు హాయిగా నిద్రపోతున్నా అని మహానాడులో చెప్పాడు విడ్డూరంగా లేదూ !

మనలో మన మాట ఆఫ్‌ది రికార్డు, ప్రధాని నరేంద్రమోడీకి భార్యను వదిలేశారు కనుక ఆయన న్యూఢిల్లీలో వున్నపుడు నిశ్చింతగా నిద్రపోతున్నారు, మా నాయకుడికి భార్యా కుటుంబం వున్నా వారంతా హైదరాబాదులో వుంటున్నారు, ఈయనేమో వుండేది వుండవల్లిలో ఇంక నిద్రపోకేమీ చేస్తారు.

అదేమిటి ? వుండవల్లికి నిద్రకు సంబంధం ఏమిటి, ఆ వూరి వారంతా రేయింబవళ్లు కష్టపడి బాగా పని చేస్తారే అన్నాను నిజంగానే ఆశ్చర్యంగా !

ఎక్కడైనా దేవుళ్లందరూ నిలబడే వుంటారు, కానీ వుండవల్లి గుహలలోని అనంత పద్మనాభ స్వామి పడుకొని కదా వుండేది, మరి చంద్రబాబు నిద్రపోకుండా రాత్రంతా మేలుకొని వుంటే పద్మనాభునికి అంతరాయం కలుగుతుంది కదా అందుకని అన్నాడు.

నీ లాజిక్‌ వినటానికి బాగానే వుంది గానీ బాబొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, దానితో ఇంటికో జాబొస్తుందని ఆశించారు, ఇప్పుడే హోదా లేదు గీదా లేదు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం కావాలంటే లెక్కలు తీయండి అని బిజెపి, కేంద్ర ప్రభుత్వం వారు సవాళ్లు విసురుతున్నారు. వాటి గురించి చెప్పకుండా నా పాలనలో అవినీతి లేదు కనుక నిద్ర పోతున్నా అంటారేమిటి ?

సార్‌ మరోసారి మనలో మాట, కొడదామంటే కడుపుతో వుంది, తిడదామంటే అక్కకూతురైపాయే అన్నట్లు మా పరిస్ధితి వుంది. అందుకే కేంద్రాన్ని మోడీని, వెంకయ్య నాయుడిని ఏమీ అనలేక ఆ కసిని జగన్‌, కాంగ్రెస్‌ మీద తీర్చుకుంటున్నాం అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చక్కా పోయాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్భాటం ఎక్కువ-ఆచరణ తక్కువ

27 Friday May 2016

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

CORRUPTION, failure Modi, MODI TWO YEARS RULE, Narendra Modi Failures, NDA Two years rule

 

రెండేళ్ల మోడీ పాలన

ఎం కోటేశ్వరరావు

    తన రెండు సంవత్సరాల పాలనలో అవినీతిని  చూపండంటూ మూడవ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ తన రాజకీయ ప్రత్యర్ధులకు ఒక సవాలు విసిరారు. అవినీతి అంశాన్నే ప్రధాన సోపానంగా చేసుకొని అధికారానికి వచ్చిన మోడీ ఈ కాలంలో ఎన్ని అవినీతి కేసులను ఒక కొలిక్కి తెచ్చారు? ఎంతమందిని కటకటాల వెనక్కు పంపారు ? అందుకు తీసుకున్న ప్రత్యేక చర్యలేమిటి? అన్నింటి కంటే ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలను పంచుతానన్న నల్లధనం సంగతేమిటి ? దానిని దాచినవారిపై చర్యలేమిటి అన్న అసలు ప్రశ్నలకు రెండేళ్లు గడిచినా సమాధానం లేదేమిటా అని ఎదురు చూస్తున్నవారికి మోడీ సవాలు గానీ, ఎన్నో సంస్కరణలు అమలు చేశానని చెప్పుకోవటం గానీ అంతగా కిక్కు ఇవ్వటం లేదు. అన్నింటి కంటే పనామా పత్రాలలో పేరు చోటు చేసుకున్న అమితాబ్‌ బచ్చన్‌ న్యూఢిల్లీలో నరేంద్రమోడీ విజయాలను పొగుడుతూ ఒకవైపు కార్యక్రమం నిర్వహించుతున్నపుడు మరోవైపు అవినీతి అక్రమాలకు వ్యతిరేక పోరాట యోధుడిగా నరేంద్రమోడీ ఎన్నికబుర్లు చెప్పినా ప్రయోజనం ఏముంది ?

     మోడీ ప్రభుత్వ పని తీరు గురించి ఆయనను వ్యతిరేకించే పార్టీలు ఏదైనా చెబితే ఒక పద్దతి, ఆయన మిత్రపక్షం శివసేన ఏం చెబుతున్నది ? కొండంత రాగాలు తీయటమే తప్ప చేస్తున్నది తక్కువని ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీ ప్రకటించిన పధకాలన్నీ గత ప్రభుత్వం వేరే పేర్లతో అమలు చేసినవే అని కూడా గాలితీసింది. నల్లధనాన్ని వెలికి తీసి కనీసం పదిలక్షల రూపాయల వంతున పంచుతానని వాగ్దానం చేసిన మోడీ దాన్ని అమలు జరపటంలో విఫలమయ్యారని పేర్కొన్నది. సరిహద్దులలో పాక్‌ వుగ్రవాదం కొనసాగుతూనే వుంది, నిరంతరం మన సైనికులు మరణిస్తూనే వున్నారు, కానీ పొరుగు దేశంతో కౌగిలింతలు, ముద్దులు కొనసాగుతూనే వున్నాయని వ్యాఖ్యానించింది.మోడీ సర్కార్‌ ఐదు సంవత్సరాలకు ఎన్నికైంది కనుక ఆ గడువు ముగిసిన తరువాతే ప్రభుత్వ పని తీరు గురించి వ్యాఖ్యానించటం సబబుగా వుంటుంది, ఇప్పటికైతే మోడీకి మా శుభా కాంక్షలు అని ముగించింది.

     నరేంద్రమోడీ సర్కార్‌ ఏరి కోరి రాజ్యసభకు ఎంపిక చేసిన సుబ్రమణ్యస్వామి నోటి వెంట వచ్చిన నిజాలేమిటి ? దేశంలో అసహన వాతావరణం వుందని దీనికి బిజెపి ప్రభుత్వమే కారణమని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌ అభిప్రాయమని సుబ్రమణ్యస్వామి తాజాగా ప్రధానికి సంధించిన లేఖలో పేర్కొన్నారు.రాజన్‌ అసహనవాతావరణం గురించి మాట్లాడి వుండవచ్చు తప్ప దానికి బిజెపిఏ కారణమని బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు.ఒక వేళ రాజన్‌ అలా అని వుంటే అధికారంలో వున్నంత మాత్రాన అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదా ? మొత్తం మీద స్వామి ఫిర్యాదు స్వభావం భావ ప్రకటనా స్వేచ్చను సవాలు చేస్తున్నట్లే ? అన్నింటి కంటే గత రెండు సంవత్సరాల కాలంలో రిజర్వుబ్యాంకు గవర్నరు హోదాలో రాజన్‌ వడ్డీ రేటు తగ్గించని కారణంగా పరిశ్రమలన్నీ కుప్పకూలాయని, నిరుద్యోగం పెరిగిందని అదీ మోడీ రెండేళ్ల సంబరాలు జరుపుకుంటున్న సమయంలో సుబ్రమణ్యస్వామి చెప్పటం గమనించాల్సిన అంశం.ఇక్కడే చిన్న కిక్కుంది. అదేమిటంటే ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ అనేక సందర్భాలలో మోడీ హయాంలో ఆర్ధిక వ్యవస్ధ తిరిగి పట్టాలెక్కిందని, చైనాను అధిగమించే దిశలో పురోగమిస్తోందని అనేక సందర్బాలలో చెప్పారు. అంటే మంత్రి అవాస్తవాలను చెబుతున్నట్లా ? స్వామి నిజాలను చెబుతున్నట్లా ?ఈ సంబరాల సమయంలో కాకపోయినా తరువాత అయినా మౌన ముని మోడీయే నోరు విప్పాలి.

   మోడీ, ఆయన అర్ధభాగం అమిత్‌ షా ఇతర పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో అనేక అంశాలు చెప్పారు. వాటి సంగతి ఏమంటే ఎన్నికలపుడు అనేకం చెబుతుంటాం అవన్నీ అమలు జరపటం ఎవరికైనా ఎలా సాధ్యం అని అమిత్‌ షా నల్లధనం వెలికితీత గురించి అడిగిన సందర్భంలో చెప్పారు.తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న పార్టీ నేత ఆయన. మోడీ సర్కార్‌ పార్లమెంట్‌లో చెప్పిన వాటిని కూడా అమలు జరపటం లేదన్నదే ఇక్కడ అసలు సమస్య.

    లోక్‌సభ అధికారిక సమాచారం ప్రకారం మూడింట రెండువంతుల కేంద్ర మంత్రిత్వశాఖలు సగానికిపైగా హామీలను అమలు జరపలేదని వివరాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో రోజుకు 250 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిస్తుంది. ప్రశ్నలు, చర్చలు, ఇతర ప్రస్తావనల సందర్భంగా మంత్రులు అనేక హామీలు ఇస్తారు. అవి అధికారికంగా నమోదు అవుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాటన్నింటినీ క్రోడీకరించి హామీల స్టాండింగ్‌ కమిటీకి పంపుతుంది. వాటిని మూడు నెలలలోగా అమలు జరిపించేందుకు కమిటీ ప్రయత్నిస్తుంది. అది ఎంత వరకు వచ్చిందనేది వారం, పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష జరుగుతుంది. ఒకసారి హామీ ఇచ్చిన తరువాత ఏ కారణంతో అయినా లోక్‌సభ రద్దయితే తరువాత ఏర్పడే సభ, ప్రభుత్వానికి వాటిని అందచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా అలాంటి హామీలలో ఒకటి. అది ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా బిజెపి సర్కార్‌ కాదు అనటానికి లేదు. లేదా అధికారికంగా అది సాధ్యం కాదు అని అయినా చెప్పాలి.

     వుదాహరణకు ముంబై వుగ్రవాద దాడుల సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కోస్తా ప్రాంతాలలో పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు గురించి హామీ ఇచ్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ దానిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అలాగే అణువిద్యుత్‌ కేంద్రాలను సకాలంలో పూర్తి చేస్తామన్న హామీకి కూడా అదే జరిగింది.పెద్దగా ఆర్ధిక భారం లేని హామీలను కూడా మోడీ సర్కార్‌ నెరవేర్చటం లేదు. దేశంలోని మరో 38 భాషలను రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో చేరుస్తామని 2014 ఆగస్టులో ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రస్తుతం మన దేశంలో అద్దె గర్భంతో పిల్లలను కనటం కూడా ఏటా రెండున్నర వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. దీనిలో ఎక్కువగా బలహీన వర్గాలకు చెందిన మహిళలే దోపిడీకి గురి అవుతున్నారు. దీనిని క్రమబద్దీకరించేందుకు అవసరమైన చట్ట సవరణ చేస్తామని 2014 ఆగస్టులో ప్రభుత్వం ఇచ్చిన హామీకి ఇంతవరకు దిక్కులేదు. ఇలా అనేకం వున్నాయి.న్యాయ మంత్రిత్వశాఖ ఇచ్చిన హామీలలో కేవలం 27శాతమే అమలు చేసింది. ఇంకా అనేక మంత్రిత్వశాఖలు తరతమ స్దాయిలో హామీలు ఇ్వటమే తప్ప అమలు జరపటం లేదు. ఈ వైఖరిని ఏమనాలి? జవాబుదారీతనం లేక మోడీ చెప్పినట్లు ఇసాబ్‌(లెక్క)లేని తనం కాదా ఇది. మంత్రుల గురించి తరువాత చెప్పుకోవచ్చు ఏకంగా ప్రధాన మంత్రి ఇచ్చిన ఏకైక హామీకి ఇంతవరకు దిక్కులేదు. మంత్రిత్వశాఖల పనితీరు, మదింపు పద్దతి గురించి 2013-14 సంవత్సరానికి సంబంధించి నివేదికలు ఇస్తామని మోడీ స్వయంగా 2014లో హామీ ఇచ్చారు. వాటిని ఇంతవరకు ఇవ్వలేదు. అందువలన ఆర్భాటంగా పధకాలు ప్రకటించటం కాదు, అవి ఎంతవరకు అమలు జరిగాయన్నది కావాలి. ప్రతి పధకంపై అధికారిక శ్వేత పత్రాలు ప్రకటిస్తే అసలు రంగు తేలుతుంది.

   అవినీతికి పాల్పడబోమని, స్వచ్చమైన పాలన అందిస్తామని మంత్రులు ప్రమాణం చేస్తారు. అందువలన అలా వుండటం వారి విధి. దానిని మరిచి పోయి మేం అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకోవటం ప్రత్యేకమే. అవినీతికి పాల్పడకపోవటం సంతోషమే, కానీ అవినీతికి పాల్పడిన వారిని వెలికి తీసి శిక్షించటం కూడా రాజధర్మమే. అందువలన మేము మా రాజధర్మాన్ని నిర్వర్తించామా లేదా అన్న సవాలు విసరాలి. అధికారాంతమందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నారు. అసలు ఏదైనా పని చేస్తే కదా సక్రమంగా చేశారా అక్రమంగా చేశారా అనేది తేలేది. ఎరువులు, గ్యాస్‌ సబ్సిడీలను తగ్గించటం, బ్యాంకు ఖాతాలను తెరవటం వంటి వాటిలో అవినీతికి అస్కారం తక్కువ. ప్రజల సంపదలను కార్పొరేట్లకు కారుచౌక రేట్లకు కట్టపెట్టటం నీతా ? అవినీతా ? అది లంచం తీసుకొని చేశారా తీసుకోకుండా చేశారా అని కాదు, విధాన పరమైన అక్రమమా కాదా ?

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెలుగు నాట భక్తి రసం డేంజరుగా మారుతోంది

26 Thursday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, INDIA, NATIONAL NEWS, RELIGION, Telangana

≈ Leave a comment

Tags

Chandrbabu, KCR, sins, temple income, troubles

“పాపాలు, ఇబ్బందులే హుండీ ఆదాయాలు పెంచుతున్నాయి”

సత్య

     తన రెండేళ్ల పాలన పూర్తి కావస్తున్న సమయం, మహానాడుకు ముందుగా విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో జనానికి వుపయోగపడే పనుల గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో తెలియదుగానీ మద్యం గురించి చేసిన వ్యాఖ్యలతో కలెక్టర్ల సదస్సుకు కాస్త కిక్కు వచ్చింది. ప్రత్యేక రాష్రనఠ హోదారాదని తేలిపోవటం, చంద్రన్నే చెప్పినట్లు విభజన సమయంలో ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు కాకపోవటంతో వడదెబ్బ తగిలినట్లు కలెక్టర్ల సదస్సు ప్రసంగం నిస్సారంగా సాగిందని చెప్పవచ్చు.తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో తాను చేసిన వుపన్యాసాన్ని ఒక వర్గపు మీడియా వక్రీకరించిందని దేవుడి గురించి తాను పాజిటివ్‌గానే మాట్లాడానని రెండోరోజు వివరణ ఇచ్చారు.

    చంద్రబాబుకు సానుకూల మరొక వర్గపు మీడియాగా గుర్తింపు వున్న ఒక పత్రికలో కష్టాల్లో వున్న వారు దేవుణ్ని నమ్ముకొంటున్నారు అనే శీర్షికతో ప్రధాన వార్తలో వుప భాగంగా రాశారు. దేవాదాయశాఖ కష్టపడకపోయినా 27శాతం ఆదాయం పెరిగిందనీ, ఇది ప్రజల్లో పెరిగిన భక్తిని తెలియ జేస్తుందని చంద్రబాబు అన్నారు. కష్టాల ో్ల వున్న వాళ్లు దేవుణ్ని నమ్ముకుంటున్నారు. వారితో పాటు తప్పులు చేసిన వాళ్లు హుండీల్లో డబ్బులు వేస్తున్నారు. కష్టాల్లో వున్నామని వ్యసనాల బారిన పడకుండా దేవుణ్ని విశ్వసిస్తున్నారు. గుళ్లు, చర్చిలు, మసీదుల్లాంటివి లేకపోతే పిచ్చి వాళ్లయ్యేవారేమో ! దీక్షల కాలంలో దుర్వ్యవసనాలకు దూరంగా వుంటున్నారు. అయ్యప్ప దీక్షల్లాంటివి చేస్తూ 40 రోజుల పాటు మద్యాన్ని ముట్టుకోవటం లేదని చెప్పారు. ఇదే తరగతికి చెందిన మరొక పత్రిక పాపపు సొమ్ము అనే వుప శీర్షికతో వార్త ఇచ్చింది. ఎక్కువ తప్పులు చేసిన వారు, ఆదాయం బాగా వచ్చేవారు హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారు ‘ అని నవ్వుతూ అన్నారు. అని పేర్కొన్నది.చంద్రబాబు చెప్పిన ఓ వర్గానికి చెందిన మీడియాలో భాగమైన ఒక పత్రిక తన పాఠకులకు మరింత కిక్కు ఇచ్చేందుకు ఇదే అంశాన్ని మొదటి పేజీలో, తరువాత లోపలి పేజీలో పతాక శీర్షికతో వార్తను ఇచ్చింది. ‘తప్పులు చేసే వారే గుడికి వెళుతున్నారు ‘అని రాయటంతో సమస్య వచ్చింది.

    ఇదే వార్తను ఏ వర్గానికీ చెందని మీడియాలో భాగంగా పరిగణించబడే ఒక ఆంగ్ల పత్రిక తనకు మందీ మార్బలం వున్నప్పటికీ పిటిఐ వార్తా సంస్ధ ఇచ్చిన కధనాన్ని ప్రచురించటం విశేషం. ‘తప్పులు(పాపాలు), ఇబ్బందులు పెరగటమే దేవాలయాల ఆదాయ పెరుగుదల కారణం ‘ అని శీర్షిక పెట్టింది.’ జనం పాపాలు చేస్తున్నారు. కొంత మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, వాటిని వదిలించుకొనేందుకు దేవాలయాలకు వెళుతున్నారు, ప్రార్ధనలు చేస్తున్నారు. వారు ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటే, ఎక్కువ పాపాలు చేస్తే వారు దేవాలయాలకు వస్తున్నారు, డబ్బులు సమర్పించుకుంటున్నారు, ఇది వాస్తవం’ అని చెప్పినట్లు దానిలో పేర్కొన్నారు. అందువలన మొత్తం మీద దీనిలో వక్రీకరణగా చెప్పాల్సి వస్తే తప్పులు చేసేవారే గుడికి వెళుతున్నారు అన్న శీర్షిక తప్ప ఆయన చెప్పిన అంశాలలో వక్రీకరణ కనిపించటం లేదు. చంద్రబాబు నాయుడు రెండవ రోజు ప్రవచించిన అంశాలలో ఒకటి ఆధ్యాత్మిక టూరిజం. ఏడు ప్రధాన పుణ్య క్షేత్రాలలో దీనిని అభివృద్ధి చేయాలని కోరారు. పరిశ్రమలు, ఇతర రంగాల అభివృద్ధి ద్వారా ఆదాయం సమకూరే పరిస్ధితులు కనిపించటం లేదు కనుక అప్పనంగా వచ్చే ఆధ్యాత్మిక ఆదాయాన్ని మరింత పెంచేందుకు చంద్రబాబు పూనుకున్నారు.

   తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డేంజరుగా మారుతోంది అని ఎప్పుడో ఒక కవి చెప్పారు. ఇప్పుడు సునామీలా వుండబట్టే చంద్రబాబు నాయుడు అంత ఆనందంగా హుండీల ఆదాయం గురించి చెప్పారు. ఏ మతానికి చెందిన దేవుడు, దేవత లేక ప్రవక్తలు కూడా అవినీతిని సహించమనే చెప్పారు. కానీ వారి కళ్లెదుటే రోజు రోజుకూ దుర్మార్గాలు, పాపాలూ పెరిగి పోతున్నా వారెలాంటి చర్యలూ తీసుకోవటం లేదంటే వారు ఇస్తున్న డబ్బులు తక్కువనా లేక రూపాయి విలువ దిగజారిందని పట్టించుకోవటం లేదా? పోనీ బంగారం వేస్తున్న వారికి ఏదైనా ప్రత్యేక దారి వుందా అంటే అదీ లేదు. పాపులు వారి పాపాన వారే పోతారు అనుకుంటే మంచి వారికి ఎదురైన సమస్యలనైనా దేవతలు, దేవదూతలు, ప్రవక్తలు ఎందుకు పట్టించుకోవటం లేదు.

    మన దేశంలో ఇంకా ఫ్యూడల్‌ అవశేషాలు ఒకవైపు, ఆధునిక పెట్టుబడిదారీ తెంపరితనం మరొకవైపు కవలల మాదిరి కొనసాగుతున్నాయి. దాని పర్యవసానమే ఒక పక్కన శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచే బిర్లా ప్లానెటోరియం వుంటే దాని పక్కనే మూఢ భక్తి, విశ్వాసాలను పెంచే బిర్లా మందిరం వుండటం. తమ విధానాలను ప్రశ్నించకుండా, జనాన్ని మతం మత్తులో ముంచేందుకు పూర్వకాలంలో రాజులు, రంగప్పలు గుడులు గోపురాలు కట్టించి జనం దృష్టిని మళ్లించేవారు లేదా మత బేధాలు పెంచేవారు. ఆధునిక పాలకులు కూడా అందుకు అతీతులు కాదు.గోదావరి పుష్కరాల గురించి ఎన్నడూ లేని విధంగా జనాన్ని ప్రభుత్వాలే ప్రోత్సహించి స్నానాలు చేయించటాన్ని చూశాము. ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు సిద్ధం అవుతున్నారు. పుష్కర ఘాట్లకు విదేశీ సాయం గురించి కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణాలో యాదాద్రి అభివృద్ధికి చూపుతున్న శ్రద్ధలో వెయ్యోవంతైనా దళితులకు భూమి పంపిణీ కార్యక్రమంపై చూపటం లేదంటే కారణం ఏమిటి?

   ప్రపంచ మంతా గత కొద్ది సంవత్సరాలుగా ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్ధల వంటి వన్నీ కార్పొరేట్‌ల లాభాలు తప్ప సామాన్యుల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు. వాటి ఎజండాలోనే అది లేదు. ప్రభుత్వం అంటే పరిపాలన చేయాలి తప్ప వుల్లిపాయల వ్యాపారం చేయకూడదని, వాటిని ప్రయివేటు రంగానికి వదిలి వేయాలన్నది చంద్రబాబు స్కూలు సిద్ధాంతం. గ్రామాల్లో పాలు, కూరగాయలు అమ్ముకొనే వారు హెరిటేజ్‌ వంటి సంస్ధలు పెట్టక ముందు నుంచీ వున్నారు. వారు ఎంత మంది కోటీశ్వరులయ్యారు? లక్షల కోట్ల సంపదలున్న అంబానీలు పట్టణాలలో మూల మూలనా దుకాణాలు తెరిచి వుల్లిపాయలు, కూరగాయలు, పిన్నీసుల వంటివి అమ్ముతున్నారు. జడ పిన్నులు కావాలన్నా చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్ధలలో బుక్‌ చేసుకొని ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. అందుకే అనేక మంది చిన్న వ్యాపారులు తమకు కలిసి రావటం లేదని ఎప్పుడూ వాపోతుంటారు. రానున్న రోజుల్లో ఇలాంటి వారు ఇంకా పెరిగి పోతారు. అప్పుడు చంద్రబాబు చెప్పినట్లు దేవాదాయ శాఖ సిబ్బంది పని చేసినా చేయకపోయినా అభాగ్యుల సొమ్ముతో హుండీలు దండిగా నిండిపోతాయి. కాళ్లూ, చేతులు చూసి జాతకాలు చెప్పి సొమ్ము చేసుకొనే వారు ఇప్పటికే తామర తంపరగా పెరిగిపోయారు. కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారు అనుసరిస్తున్న విధానాలు సమాజంలో మెజారిటీకి నష్టదాయకమైతే వాటి వలన లాభపడే వారు కూడా వుంటారు.అదిగో అలాంటి వారే ఆదాయాలు పెరిగి పోయి మరింత పెరగాలని కోరుకుంటూ హుండీలలో నల్లధనాన్ని గుట్టలుగా వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇండియా-ఇరాన్‌-చైనా సంబంధాలు

25 Wednesday May 2016

Posted by raomk in CHINA, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Chabahar, China, INDIA, india- iran-china relations, iran, port of Chabahar, Silk Road Train

సత్య

  గత రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలతో ఎక్కువగా ఎందుకు కాలం గడుపుతున్నారంటే వెంకయ్య నాయుడి వంటి శిష్య గణం విదేశీ పెట్టుబడుల కోసం అని వెనుకా ముందు చూసుకోకుండా చెప్పారు. మూడో సంవత్సరంలో అడుగుపెట్టబోయే ముందు ప్రధాని ఇరాన్‌ పర్యటన జరిపారు. ఈ సందర్బంగా వచ్చిన వార్తలేమిటి అక్కడ ఒక రేవును అభివృద్ధి చేయటంతో పాటు రానున్న రోజులలో 20 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు లక్షా 30వేల కోట్ల రూపాయల పెట్టుబడులను అక్కడ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు మన దేశానికి విదేశీ పెట్టుబడులు రావాలని, వాటితో దేశాన్ని బాగు చేస్తామని చెబుతున్న పాలకులు మరోవైపు దేశం వెలుపలికి పెట్టుబడులను తరలించటం ఏమిటి ?

    దీనికి గాను జనానికి చెబుతున్నది ఏమిటి ? ఆఫ్ఘనిస్తాన్‌, మధ్య ఆసియా దేశాలకు ఎగుమతులు, వాణిజ్య లావాదేవీలు నిర్వహించాలంటే పాక్‌ భూ భాగం గుండా వెళ్లాలని, ఆ దేశం మనకు ఇబ్బందులు కలిగించకుండా వుండాలంటే ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని, అందుకు గాను గుజరాత్‌లో కాండ్లా రేవు నుంచి ఇరాన్‌లోని చబహార్‌ రేవుకు దగ్గరకు దగ్గర, తలనొప్పిలేని మార్గం అవుతుందని, దీనికి తోడు ఇరాన్‌ నుంచి మధ్య ఆసియా ద్వారా రష్యా వరకు రైలు మార్గంతో సరకు రవాణా సులభం అవుతుందని చెబుతున్నారు. ఇదేమీ కొత్త విషయం కాదు, ఇతరులతో తలనొప్పిలేని మార్గాలను వెతుక్కోవటం కూడా మంచిదే. మన గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇబ్బంది లేదు, తప్పులేదు, చేయదలచుకున్నదేదో చేసుకోక పొరుగుదేశాల గురించి నోటి దూల ఎందుకు ?

     అమెరికా కనుసన్నలలో నడుస్తున్న మనం ఇరాన్‌కు దూరంగా జరిగిన సమయంలో చైనా ఆ స్ధానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇరాన్‌కు తొలి సిల్కు రైలును విజయవంతంగా నడిపింది. చైనా తూర్పు రాష్ట్రమైన ఝియాంగ్‌లోని ఇవు నుంచి ఇరాన్‌ రాజధాని టెహరాన్‌కు 10,399 కిలోమీటర్ల దూరాన్ని కజకస్తాన్‌, తుర్క్‌మెనిస్తాన్‌ దేశాల గుండా ప్రయాణించి 14 రోజుల్లో రైలు 32 కంటెయినర్ల సరకును చేర్చింది. అదే సముద్రమార్గం ద్వారా చైనా షాంఘై నుంచి ఇరాన్‌ రేవు బందర్‌ అబ్బాస్‌కు ఓడ చేరుకొనేందుకు 45 రోజులు పడుతుంది. రెండు దేశాల మధ్య 2003-13 మధ్య వాణిజ్యం నాలుగు నుంచి 53 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. రానున్న దశాబ్ద కాలంలో ఈ మొత్తాన్ని 600 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని జనవరిలో చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌ పింగ్‌ పర్యటన సందర్భంగా వుభయ దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఇరాన్‌తో మన వాణిజ్యం ప్రత్యక్షంగా 14 బిలియన్‌ డాలర్లు, మూడవ పక్ష దేశం ద్వారా చేసిందానితో కలిపితే 30 బిలియన్‌ డాలర్లకు మించి లేదు. చైనా నుంచి యూరేసియా ప్రాంతానికి రైలు ద్వారా సరకు రవాణా ఇరాన్‌కు ఆదాయం తెచ్చిపెడుతుంది. తన రైలు మార్గాన్ని వినియోగించుకున్నందుకు సరకు రవాణా సంస్ధలు చెల్లిస్తాయి. చైనాలోని ఇవు నుంచి స్పెయిన్‌లో మాడ్రిడ్‌ వరకు 13వేల కిలోమీటర్ల దూరం వరకు సరకు రవాణాకు అవకాశం వుంది. ఈ పూర్వరంగంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు చబహార్‌ రేవు ఒప్పందం అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి వుండదు. ఇరాన్‌ తనకు ప్రయోజనం వున్న ప్రతి ఒక్కరితో సంబంధాలు నెరుపుకుంటుందని గుర్తించాలి.

     మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం మన పారిశ్రామికవేత్తలు చబహార్‌లో అభివృద్ధి చేసేది పిచ్చుక గూడు అంత చిన్నది అనుకుంటే దానికి 100 కిలోమీటర్ల దగ్గరలోని పాకిస్థాన్‌ రేవు గ్వడార్‌ ప్రాంతంలో చైనా ఏకంగా పెద్ద రాజప్రాసాదమే ఏర్పాటు చేస్తున్నదట. నరేంద్ర మోడీ నిర్ణయం గురించి సంతోషం పట్టలేని ఒక తెలుగు పత్రిక ఈ ప్రాంతంలో హెచ్చుతున్న చైనా ప్రాబల్యానికి ఇది కళ్లెం వేసే నిర్ణయం అని జబ్బలు చరుచుకుంది. పాకిస్థాన్‌లో చైనా అభివృద్ధి చేసే కారిడార్‌లో పెట్టుబడులు 46 బిలియన్‌ డాలర్లు అయితే చబహార్‌లో మనం పెట్టేది 50 కోట్ల డాలర్లని ఒక ఆంగ్ల పత్రిక తన సంపాదకీయంలో పేర్కొన్నది. అదే చబహార్‌ రేవు ఆధారంగా అక్కడ చైనా ఒక పెద్ద పారిశ్రామిక పట్టణాన్నే ఏర్పాటు చేసేందుకు అదే ఇరాన్‌తో ఒప్పందం చేసుకుంది.

    చబహార్‌ రేవు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పలుకుబడి పెంచుకోవాలని 2003లోనే వాజ్‌పేయి బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంతకాలం ఎందుకు ముందుకు పోలేదు? స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో ఒక ప్రాజెక్టు కట్టాలన్నా, ఒక కాలవ తవ్వాలన్నా బ్రిటీష్‌ రాణీగారి అనుమతి కావాల్సి వచ్చేది. ఇప్పుడు మన దేశం ఏం చేయాలన్నా అమెరికా అనుమతి కావాలంటే ఇదేమిటి ఇలా అంటున్నారు అని చాలా మందికి కోపం రావచ్చు. కానీ ఇది నిజం. ఇరాన్‌తో మనకు ఎలాంటి గట్టు పంచాయతీ లేదు. ఎక్కడా మార్కెట్ల కోసం పోటీ పడలేదు, తగాదా లేదు. అమెరికా-ఇరాన్‌కు మధ్య ఎప్పటి నుంచో వైరం. ఇరాన్‌లోని చమురు మొత్తాన్ని స్వాహా చేయాలన్నది అమెరికా కల. దాన్ని ఇరానియన్లు అడ్డుకున్నారు. దాంతో ఇరాన్‌ అణ్వాయుధ తయారీ కార్యక్రమాన్ని చేపట్టిందనే పేరుతో దానిపై ఆర్ధిక, రాజకీయ ఆంక్షలు విధించింది అమెరికా. మన పాలకులు అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ దాని వెనుకే నడుస్తున్నారు కనుక మనమూ ఇంతకాలం ఇరాన్‌కు దూరంగా వుండి అమెరికన్లను సంతోషపరిచాము. ఇప్పుడు ఇరాన్‌తో అమెరికన్లు రాజీకి వచ్చారు కనుక, ఇప్పుడు మనమూ మైత్రి గురించి కవిత్వం చెబుతున్నాము. వెన్నెముకలేని విదేశాంగ విధానం, అమెరికాకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతో చౌకగా చమురు ఇస్తామని ఇరాన్‌ ముందుకు వచ్చినా అయ్యగారికి కోపం వస్తుందన్నట్లుగా తీసుకోలేదు.

    మా దేశంలో పరిశ్రమలు పెట్టండహో అని ప్రపంచమంతా తిరిగి రా రమ్మంటున్నాము. కానీ మన పారిశ్రామికవేత్తలు రాబోయే రోజుల్లో ఇరాన్‌లో పరిశ్రమలు పెడతారట. నీరు పల్లమెరుగు- పెట్టుబడి లాభాలనెరుగు అని కొత్త సామెతను చెప్పుకోవాలేమో. పెట్టుబడి తనకు లాభాలు ఇచ్చే దేశ మాతలు లేదా పితలకు తప్ప స్వదేశ మాతా, పితలకు జై అనదు. అదేమీ చిత్రమో గానీ ప్రధాని నరేంద్రమోడీ విదేశాల్లో తిరిగిన కొద్దీ మన ఎగుమతులు, దేశంలో వస్తూత్పత్తి రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు నానాటికీ పడిపోతున్నాయి. పదిహేడు వుపరంగాలతో కూడిన వస్తూత్పత్తి రంగంలో 2013 ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో వచ్చిన ఎఫ్‌డిఐ 8.8 బిలియన్‌ డాలర్లయితే అదే కాలంలో 2014లో 6.8, 2015లో 4.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అయితే ఇదే సమయంలో సేవారంగం, ఐటిలో ఎఫ్‌డిఐలు గణనీయంగా పెరిగాయి. వస్తూత్పత్తి రంగంలోకి వచ్చే పెట్టుబడులు మన మౌలిక అభివృద్ధికి తోడ్పడతాయి. ఇతర రంగాలకు వచ్చేవి లాభాలు దండుకొని తెల్లవారేసరికి మాయం అవుతాయి. గతేడాది మన దేశానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐలలో కేవలం 16శాతమే వస్తూత్పత్తి రంగానివి, ఇదే చైనాలో 43శాతం వున్నాయి. అందుకే అది ప్రపంచంలో ఎక్కడ బడితే అక్కడ తన పలుకుబడిని పెంచుకొనేందుకు అమెరికా ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా స్వతంత్ర కార్యాచరణతో ముందుకు పోతున్నది, తన పారిశ్రామిక వుత్పత్తులకు మార్కెట్లను నిలబెట్టుకోవటమే కాదు, విస్తరించుకుంటున్నది. మరి మన పరిస్ధితి వున్న ఎగుమతులే గత 17 నెలలుగా పడిపోతున్నాయి. మార్కెట్లు లేకుండా స్వంత కార్యాచరణ, విధానాలు లేకుండా అమెరికా,ఐరోపా దేశాలకు జూనియర్‌ భాగస్వామిగా మారితే , అవే చైనా ధాటికి నిలవలేక విలవిల్లాడుతుంటే మనం ఎన్ని చబహార్‌లను అభివృద్ధి చేసినా ఫలితం వుంటుందా ?

    చైనా ఆర్ధిక వ్యవస్ధ గురించి అనేక మంది భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొంత మంది అక్కడ సోషలిస్టు వ్యవస్థలేదని అంటారు, మరికొందరు ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్ధ నిర్మాణంలో వుందని వ్యాఖ్యానిస్తారు. బ్రిటన్‌ నుంచి హాంకాంగ్‌, పోర్చుగీసు నుంచి మకావో దీవులను తిరిగి తన పాలన కిందకు తెచ్చుకున్న సమయంలో చైనా ప్రభుత్వం 50 సంవత్సరాల పాటు అంటే 2049 వరకు అక్కడ వున్న వ్యవస్ధలను యధావిధిగా కొనసాగించేందుకు ఒప్పందం చేసుకుంది. అందుకే ఒకే దేశం-రెండు వ్యవస్ధలున్న దేశంగా చైనా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రధాన భూభాగంలో సోషలిస్టు వ్యవస్ధ, ఇతర ప్రాంతాలలో పెట్టుబడిదారీ వ్యవస్ధ వుంది. ఇదొక నూతన ప్రయోగం. అది అనుసరించిన ప్రజానుకూల సంస్కరణల ఫలితంగా పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎంతో వేగంగా పురోగమిస్తోంది.అగ్రశ్రేణి పెట్టుబడిదారీ దేశాలతో వున్న ఆర్ధిక సంబంధాల రీత్యా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నది తప్ప పెట్టుబడిదారీ విధానం 2008 నుంచి ఎదుర్కొంటున్న అతి పెద్ద మాంద్యానికి అది దూరంగా వుంది.

   చబహార్‌ రేవు అభివృద్ధిపై ఒప్పందం కుదుర్చుకోవటాన్ని గొప్ప అంశంగా చిత్రిస్తున్నారు. దీని వలన లాభం ఎవరికి అన్నది ప్రశ్న. చైనా కూడా అలాంటి ఒప్పందాలనే కుదుర్చుకుంటున్నది, అంతకంటే ఎక్కువ పెట్టుబడులే పెడుతున్నది. కొంత మంది వ్యాఖ్యాతలు చెబుతున్నదాని ప్రకారం అక్కడ ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానమే వుందనుకుందాం. అలాంటపుడు ఇలాంటి ఒప్పందాల వలన కలిగే లాభం ఏదైనా వుంటే అది ప్రభుత్వానికే చెందుతుంది, ఆ మొత్తాన్ని చైనా సర్కార్‌ జనానికే ఖర్చు పెడుతుంది. మరి మన దేశం కుదుర్చుకొనే ఒప్పందాల వలన వచ్చే లాభం ఎవరికి జేబుల్లోకి పోతుంది. అంబానీ, అదానీ అండ్‌కోలకే కదా ? మన దేశంలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు వచ్చిన లాభాలను తిరిగి ఇక్కడ పెట్టుబడులుగా పెట్టకుండా బయటకు తరలిస్తున్నాయని విమర్శిస్తున్నాం, ఇప్పుడు అదే పని మన దేశ కార్పొరేట్‌ సంస్ధలు కూడా చేస్తున్నట్లే కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబు : చరిత్రకు విరుద్దమైన సమాచారం

22 Sunday May 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Amaravathi, CHANDRABABU, Facts, History

ఎం కోటేశ్వరరావు

ఈనెల 20వ తేదీన విజయవాడలో ప్రముఖ సంపాదకులు పొత్తూరు వెంకటేశ్వరరావు రచించిన’అమరావతి ప్రభువు -వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు’ అనే గ్రంధాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగంలోని అంశాల గురించి ప్రభుత్వ మీడియా సలహాదారు కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దానిలోని కొన్ని అంశాల మంచి చెడ్డల గురించి చూద్దాం.

1.’గతంలో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని ఐటిలో అభివృద్ధి చేయగా నవ్యాంధ్రప్రదేశ్‌లో పోర్టుల(రేవుల) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.ఓడ రేవుల ఆధార ఆర్ధిక వ్యవస్ధగా రూపొందితే భవిష్మత్‌ వుజ్వల రీతిలో వుంటుందని వివరించారు.’

   కొంత మంది అంగీకరించినా అంగీకరించకపోయినా, అతిశయోక్తులు చెబుతారని అన్నా చంద్రబాబు నాయుడు అంటే ఐటి రంగ అభివృద్దికి మారుపేరుగా కీర్తి కండూతి దక్కింది. అంతకంటే ఎక్కువగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాయి కనుక విమర్శకులు అంగీకరించరు. దానివలన నష్టం లేదు వదిలేద్దాం. ఇప్పుడేం చేయాలన్నదే అసలు సమస్య. ఇజాలేమీ లేవు ఒక్క టూరిజం తప్ప అని ఒకసారి, ఐటి తప్ప చరిత్ర పాఠాలు చదవనవసరం లేదు అని ఒకసారి ఇలా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ అధికార ప్రస్తానంలో ఎన్నో ఆణిముత్యాలను ప్రవచించారు. గతంలో గ్రామాలలో హరికధలు, బుర్ర కధల వంటి జానపద కళారూపాలను ప్రదర్శించేవారు భుక్తి కోసం ఏ వూరు వెళితే ఆ వూరును మీ వూరు చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతు గడ్డ అని చెప్పేవారు. కొంత మంది నిజమే కదా అనుకొనే వారు.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఐటి రంగం అభివృద్ధి పట్ల ఆ దిగ్గజాలకు ఆసక్తి లేదని ఆపిల్‌ సిఇవో టిమ్‌ కుక్‌ హైదరాబాదు పర్యటనలో చేసిన హడావుడి స్పష్టం చేసింది. గతంలో ఏ కంపెనీ సిఇఓ వచ్చినా చంద్రబాబును కూడా తోటి సిఇఓగా పరిగణించి కలవకుండా వెళ్లే వారు కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకనే ఐటి గురించి గాక రేవుల అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెబుతున్నారా ? ఇదే నిజమైతే ఇంజనీరింగ్‌ కళాశాలల పెట్టుబడిదారులు, ఏటా లక్షల మంది పట్టభద్రులను తయారు చేస్తున్న వారి పరిశ్రమలు ఏం కావాలి ?

  చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడని చెప్పటానికి గతంలోనూ, ఇపుడు మరొకసారి రూపొందించిన విజన్‌ పత్రాలు సజీవ సాక్ష్యాలు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కన్న కలలు ఏమిటి అని ఎవరైనా భవిష్యత్‌లో పరిశోధన చేస్తే వారికి మంచి సమాచారంగా అవి వుపయోగపడతాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థగా వుంది. పరిశ్రమలు, సేవారంగం వంటివి అభివృద్ధి చెందకుండా యువతరానికి వుపాధి దొరకదు. ఇప్పటికే వున్న ఓడ రేవుల ద్వారా జరిగే అభివృద్ధి ఏదో జరిగింది. మన తూర్పు, పశ్చిమ తీరాలలో మన కంటే పెద్ద ఓడరేవులు ఇప్పటికే వున్నాయి. సింగపూర్‌ మాదిరి తయారు చేయటానికి మన భౌగోళిక పరిస్థితులు అనువుగా లేవు.

   పరిశ్రమలు పెట్టటానికి, వారికి పదేళ్ల పాటు పలు రాయితీలు ఇవ్వటానికి ఏపికి ప్రత్యేక రాష్ట్ర హోదా రాదని తేలిపోయింది. అందువలన వారు మరొకదారి చూసుకుంటారు. లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పారిశ్రామికవేత్తలకు రాయితీలు కుమ్మరించటానికి రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదని, లోటుతో వున్నట్లు చంద్రబాబే స్వయంగా చెబుతున్నారు. అది ఇప్పట్లో పూడేది కాదన్నది వాస్తవం. పరిశ్రమలు లేకుండా రేవులను అభివృద్ధి చేసి ఏమి ఎగుమతి చేస్తారు. బొగ్గు దిగుమతులు చేసుకోవటానికి ఇప్పటికే కృష్ణపట్నం వంటివి వున్నాయి. చంద్రబాబు నాయుడు పుట్టక ముందు నుంచీ చెబుతున్న భావనపాడు, నిజాంపట్నం చేపల రేవులు ఏమయ్యాయో తెలియదు. ఈ స్ధితిలో ఓడరేవుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందటానికి వున్న అవకాశాలేమిటో నిపుణులు చెప్పాలి.

2. తాను జపాన్‌లో పర్యటించినపుడు జపాన్‌లో బౌద్దాన్ని ఆచరించేవారు బుద్ధిజం అమరావతి నుంచే వచ్చిందని తమకు చెప్పారని, నాగార్జునుడి పేరు విన్నామని తెలిపారని చంద్రబాబు తెలిపారు.

3.లండన్‌లో పర్యటించినపుడు లండన్‌ మ్యూజియాన్ని సందర్శించానని అక్కడ రెండే రెండు గ్యాలరీలు వున్నాయని ఒకటి గ్రీసు గ్యాలరీ, రెండు అమరావతి గ్యాలరీ అని మ్యూజియం అధికారులు వివరించారని చెప్పారు. అమరావతి గ్యాలరీ అని ఎందుకు నామకరణం చేశారని తాను ప్రశ్నించానని, ప్రపంచంలో అమరావతి వుత్కృష్టమైనదిగా వారు తనకు చెప్పారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

    ఈ రెండూ చరిత్రకు సంబంధించిన అంశాలు. ఈ మధ్య సౌదీ అరేబియాలో అక్కడి యువతులు భారత మాతాకీ జై అని నినాదాలు చేస్తున్న వీడియో ఒక దానిని సామాజిక మాధ్యమంలో కొందరు పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేశారు. వారు మాత భక్తులని వేరే చెప్పనవసరం లేదు. ప్రధాని నరేంద్రమోడీ సౌదీ పర్యటన సందర్భంగా ఆయనకు పలికిన ఆహ్వానంలో అదొక భాగం. దీన్ని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఎవరైనా విదేశీ అతిధులు వచ్చినపుడు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు వారి మనసెరిగి ఇష్టమైన కార్యక్రమాలు రూపొందించటం, వంటకాలు వడ్డించటం అంతర్జాతీయ దౌత్యం మొదలైప్పటి నుంచి జరుగుతున్నదే. దానిలో భాగంగానే మోడీని వబ్బేయటానికి భారత మాతాకు జై అనిపించారు సౌదీవారు. అక్కడి ముస్లింలే జై అంటే ఇక్కడి వారు ఎందుకు అనరనే వాదనలో భాగంగా ఆ వీడియోను హిందుత్వ భక్తులు వినియోగించుకున్నారు.

    జపాన్‌, లండన్‌ పర్యటనలో చంద్రబాబు నాయుడికి కూడా అదే జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు నాయుడి పుణ్యమా అంటూ ఇప్పుడు చరిత్ర పాఠాలు చదివేవారు లేకుండా పోయారు. ఒక వేళ హైస్కూలు స్ధాయిలో కాస్తో కూస్తో చదివినా అదెవరికీ గుర్తుండటం లేదు. అయినా చరిత్ర చరిత్రే. దాన్నెవరూ చెరిపి వేయలేరు.

   జపాన్‌కు అమరావతి నుంచి బుద్ధిజం వెళ్లిందని ఏ చరిత్ర చెప్పలేదు. చైనీయుల నుంచి కొరియా అక్కడి నుంచి జపాన్‌కు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది.జపనీయులు అలా ఎందుకు చెప్పారన్నది ప్రశ్న.

   రెండవది లండన్‌ మ్యూజియంలో వున్న గ్యాలరీల గురించి ఇంటర్నెట్‌లో ఎన్నిసార్లు వెతికినా అమరావతి, గ్రీసు గ్యాలరీల పేరే మనకు కనపడదు, మిగతా గ్యాలరీల గురించి మాత్రమే మనకు దొరుకుతోంది. అక్కడి అధికారులు కూడా చంద్రబాబును తప్పుదారి పట్టించారా ?

   రాజకీయ నేతలు అనేక అంశాలను చెబుతుంటారు, వాటిని అధికారిక ప్రకటనలలో చేర్చినపుడు అధికారయంత్రాంగం ముందు వెనుకలు ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడి వంటి వారు ఇబ్బందులలో పడతారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫ్లయింగ్‌ మోడీ నుంచి ఫెయిల్యూర్‌ మోడీ వరకు

21 Saturday May 2016

Posted by raomk in AP, BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Telangana

≈ Leave a comment

Tags

Acheedin, BJP, CHANDRABABU, CHANDRABABU TWO YEARS RULE, failure Modi, flying Modi, KCR, KCR TWO YEARS RULE, Narendra Modi, NDA, NDA Two years rule, Two years Modi rule

అచ్చే దిన్‌ ఆమడ దూరం

ఎం కోటేశ్వరరావు

    కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. మూడు చోట్లా అధికారానికి వచ్చిన వారు రాజకీయ, పాలనా రంగాలకు కొత్తవారు కాదు. అందువలన అనుభవాల గురించి మాట్లాడుకోవటంలో అర్ధం వుండదు. ఈ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఏమిటి ? జనానికి వాటి పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. గత పాతిక సంవత్సరాలుగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఎవరు అధికారంలో వున్నప్పటికీ నయా వుదారవాద విధానాల చట్రంలో పనిచేయాల్సి వచ్చింది.ఈ క్రమంలో కేంద్రంలో కాంగ్రెస్‌ లేదా బిజెపి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాలు ఏవి వున్నా ఎడమ చేయికి,పురచేయికి వున్న తేడా తప్ప వేరు కాదు. నయా వుదార వాద విధానాలు విదేశీ కార్పొరేట్లు, అంతర్జాతీయ సంస్ధలైన ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్ధల విధానాలకు స్వదేశీ ముద్రవేసి అమలు జరుపుతున్నారన్నది స్పష్టమైంది. వాటి ప్రకారం దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఒకే విధమైన అమలు జరపాల్సి వుంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం వుంటే విదేశీ కంపెనీలకు తలనొప్పి. పన్ను రేట్లు, చట్టాలు ఒకే విధంగా వుండేట్లు ఇప్పటికే చూశారు. వాట్‌ బదులు జిఎస్‌టిని అమలు జరపాలన్నది కూడా దానిలో భాగమే.ఇలా ఎన్నో వున్నాయి. వాటి గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు.మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంటే పెద్ద మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయికి ఎక్కువ, కేంద్రానికి తక్కువ.

   ఎవరు అవునన్నా కాదన్నా , అభిమానులు గింజుకున్నా ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రాలలో చంద్రబాబు, కెసిఆర్‌ పట్ల మోజు తగ్గిపోతున్నది.వెంకయ్య నాయుడి వంటి వంది మాగధులు నరేంద్రమోడీని దేవదూత, దేవుడు అని పొగడవచ్చు. కేంద్రంలో లేని ప్రత్యేకత ఏమంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను, వారి కుటుంబ సభ్యులను కూడా పొగడాల్సి రావటం బోనస్‌ వంటిది. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు నరేంద్రమోడీ తమ పాలిట బంగారు పళ్లెంతో వస్తారని రెండు సంవత్సరాల క్రితం ఇదే సమయంలో వారు సంబరాలు చేసుకున్నారు.తొలి ఏడాది ఫ్లయింగ్‌ మోడీగా పేరు తెచ్చుకున్న ప్రధాని రెండో ఏడాది ఫెయిల్యూర్‌ మోడీగా పిలిపించుకుంటున్నారు. మనువాదం పట్ల వున్న శ్రద్ధ జనవాదం గురించి లేకపోవటంతో అటు పారిశ్రామికవేత్తలు, బడా వాణిజ్యవేత్తలు, సామాన్య జనం కూడా అసంతృప్తికి గురవుతున్నారు. విదేశీయులకు మన దేశం అంటే కనిపించేది నరేంద్రమోడీ తప్ప రాష్ట్రాలు కాదు. అందువలన శరభ శరభ దశ్శరభ శరభ అంటూ వీరతాళ్లతో చంద్రబాబు, కెసిఆర్‌ వంటి వారు విదేశాలలో, స్వదేశంలో ఎన్ని వీరంగాలు వేసినా వారిని కొమ్ముగాసే స్వరాష్ట్రాల మీడియాను తప్ప విదేశీ కార్పొరేట్లను రంజింపచేయవు.

    తాను అధికారానికి వస్తే గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటికీ విస్తరిస్తానని మోడీ చెప్పారు. ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావన కూడా చేయటం లేదు. అమలు జరుపుతున్నట్లా లేదా కనీసం ఆ నమూనా ఏమిటో అయినా జనానికి వివరించారా అంటే లేదు. చిత్రం ఏమిటంటే గుజరాత్‌ మోడల్‌ బండారం గురించి అనేక మంది అనేక సందర్భాలలో వెల్లడించారు. ఇక్కడ స్ధలాభావం వలన దాని గురించి వివరించటం లేదు. మోడీ మహాశయుడు చెప్పినట్లు అదొక ఆదర్శ నమూనా, వాస్తవమే అయితే అందుకు దోహదం చేసింది పంచవర్ష ప్రణాళికలే. నరేంద్రమోడీ అధికారానికి రాగానే అసలు ఆ విధానాన్నే రద్దు చేశారు. నీతి ఆయోగ్‌ పేరుతో ప్రణాళికా సంఘాన్ని తెరమరుగు చేశారు. రెండు సంవత్సరాలు సాము చేసి ఇప్పుడు చెబుతున్నదాని ప్రకారం పదిహేను సంవత్సరాల పాటు అమలు జరిపే ఒక స్వప్న పత్రాన్ని రూపొందించబోతున్నారు.అది 2018 నుంచి అమలులోకి వస్తుంది. దాని ప్రకారం తొలి ఏడు సంవత్సరాలకు ‘ జాతీయ అభివృద్ధి అజెండా’ను రూపొందిస్తారు. దానిని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్షిస్తారు. దాని ప్రకారం తొలి సమీక్ష 2020లో జరుగుతుంది. దీన్నే చిల్లి కాదు తూటు అంటారు. మరి అప్పటి వరకు అంటే 2018 వరకు ఏ విధానాలను అమలు జరుపుతారు? విఫల కాంగ్రెస్‌ విధానాలను కొనసాగిస్తున్నట్లా ?

    రెండు సంవత్సరాల పాలనలో పరిశ్రమలు, సేవలు, నిర్మాణం,వ్యవసాయం మొదలైన రంగాలలో వాణిజ్య అవకాశాల తీరుతెన్నుల గురించి విశ్లేషణ జరిపిన జర్మనీకి చెందిన ఎంఎన్‌ఐ బిజినెస్‌ సూచిక 2014లో గరిష్టంగా 80.3 వుండగా ఈఏడాది ఏప్రిల్‌ నెలలో 69.6కు దిగజారింది. ఇదే కాలంలో చైనా సూచిక 50-55 పాయింట్ల మధ్య కదలాడినట్లు అదే సంస్ధ తెలిపింది. ఏ దేశంలో ఎలాంటి పరిస్ధితులు వున్నాయో ఎక్కడ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయో సూచిస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తల నిమిత్తం ఇలాంటి సూచికలను రూపొందిస్తారు. వాటి ఆధారంగా పెట్టుబడిదారులు నిర్ణయాలు తీసుకుంటారు. దేశం మొత్తానికి ఈ సూచికను రూపొందించినప్పటికీ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టేవారు కూడా వీటిని గమనంలోకి తీసుకుంటారు. మన రిజర్వుబ్యాంకు విశ్లేషణ ప్రకారం వాణిజ్య ఆశల సూచిక 2014 అక్టోబరు-డిసెంబరు మాసాలలో 117.9 వుండగా 2016 తొలి మూడు నెలల్లో 111 పాయింట్లకు పడిపోయింది. దేశ ఆర్ధిక వ్యవస్ధ 8.2శాతం చొప్పున అభివృద్ధి చెందుతుందని గతంలో చెప్పారు. రిజర్వుబ్యాంకు తాజా జోస్యం ప్రకారం సమీప భవిష్యత్‌లో ఆ అంకెను చేరుకొనే అవకాశం లేదని ఆచరణ వెల్లడిస్తోంది.

 అంతర్జాతీయంగా వినియోగదారుల విశ్వాసాన్ని అభివృద్ధి సూచికలలో ఒకదానిగా పరిగణిస్తున్నారు.మోడీ అధికారానికి వచ్చిన సమయంలో 98.2 వుండగా తరువాత అది 109కి పెరిగి ప్రస్తుతం 104.1 పడిపోయింది.గ్రామీణ ప్రాంతాలలో దిగజారిన పరిస్థితులకు ఇది ప్రతిబింబం అని భావిస్తున్నారు.ఈ ఏడాది మంచి వర్షాలు పడితే, కేంద్ర ప్రభుత్వం వుద్యోగులకు వేతనపెంపుదల చేస్తే సూచిక తిరిగి పెరగవచ్చని వాణిజ్యవేత్తలు ఆశిస్తున్నారు. పారిశ్రామిక వుత్పత్తి సామర్ధ్య వినియోగ సూచిక కూడా దేశ పరిస్ధితికి దర్పణం పడుతుంది. 2013-14 చివరి మూడు నెలల్లో ఈ సూచిక 76శాతం వుండగా 2015-16 మూడవ త్రైమాసికంలో 72.5 పాయింట్లకు పడిపోయింది. పారిశ్రామిక ఆర్డర్లు కూడా సగటున ప్రతి మూడు నెలలకు 1.45 బిలియన్‌ రూపాయల నుంచి 1.15 బిలియన్లకు పడిపోయింది. అంటే పెట్టుబడులను ఆకర్షించే పరిస్ధితి లేదన్నది దీని అర్ధం. ఈ పూర్వరంగంలోనే చంద్రబాబు నాయుడు, లోకేష్‌, కెసిఆర్‌, కెటిఆర్‌లు ఎన్ని రాష్ట్రాలు, దేశాలు తిరిగినా వాగ్దానాలు తప్ప పెట్టుబడులు వచ్చేఅవకాశాలు ఏమేరకు వుంటాయో అర్ధం చేసుకోవచ్చు.గడచిన 24నెలల పాలనలో వరుసగా 17వ నెలలో కూడా మన ఎగుమతులు పడిపోయాయని అధికారికంగా ప్రకటించారు.2014-15తో పోల్చితే గతేడాది ఎగుమతుల మొత్తం 310 బిలియన్‌ డాలర్ల నుంచి 261 బిలియన్లకు పడిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.మోడీ అధికారానికి వచ్చిన తరువాత మన రూపాయి పతనం చెంది జనం మీద భారమూ పెరిగింది, అదే సమయంలో మన ఎగుమతులూ పడి పోయాయి. రూపాయి పతనమౌతుంటే గుడ్లప్పగించి చూడటం తప్ప నిలబెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సమయంలో మన దిగుమతులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి కనుక విదేశీ మారకద్రవ్య చెల్లింపుల సమస్య తీవ్రత కూడా తగ్గింది. ఈ స్థితిలో మేకిన్‌ ఇండియా గురించి చెప్పుకోవటం అంటే నరేంద్రమోడీ ఘోర వైఫల్యం గురించి గుర్తు చేయటమే.

  చిత్రం ఏమిటంటే ఆర్ధిక రంగంలో ఇన్ని వైఫల్యాలు,దిగజారుడు కనిపిస్తున్నప్పటికీ కిందపడ్డా పైచేయి మాదే అన్నట్లు ఇప్పటికీ బిజెపి అధికార ప్రతినిధి నరేంద్ర తనేజా మాట్లాడుతున్నారు. అసాధారణ రీతిలో ఆర్ధికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవటం ప్రతిపక్షాలకు కనిపించటం లేదని, కోమాలోకి పోయిన ఆర్ధిక వ్యవస్ధను చైతన్యంలోకి తీసుకువచ్చి ఇప్పుడు మరమ్మతులు ప్రారంభించి మార్పుకోసం పనిచేస్తున్నామని నమ్మబలుకుతున్నారు.

    నరేంద్రమోడీ పాలనలో ఒక్క అవినీతి వుదంతమైనా వున్నదా? అవినీతి సూచికలో మన స్థానం తగ్గిందని ప్రకటించటం చూడ లేదా అని ఆయన అభిమానులు అడ్డు సవాళ్లు విసురుతుంటారు. నిజమే, అసలు కొత్తగా ఏదైనా పనిచేస్తే కదా అవినీతి వున్నదీ లేనిదీ తెలిసేది. తొమ్మిదివేల కోట్లరూపాయలు ఎగవేసిన విజయ మాల్య వుదంతం ఏమి తెలియ చేస్తోంది. దాని గురించి అడిగితే అతగాడికి కాంగ్రెస్‌ హయాంలో రుణాలు ఇచ్చారని తెలివిగా సమాధానమిచ్చారు.అదే పెద్దమనిషి దేశం నుంచి పరారీ అవుతుంటే దొంగగారు పోతుంటే చూసి చెప్పమన్నారు తప్ప పట్టుకోమనలేదని నిఘా సంస్థలు చెప్పటం చూస్తే తెలివితక్కువ తనానికి సరికొత్త వుదాహరణగా మోడీ సర్కార్‌ను కొందరు వర్ణించారు. వీడ్కోలు ఇచ్చి మరీ విదేశాలకు పంపిన నిర్వాకాన్ని చూసి దేశం నివ్వెర పోతోంది. నిజానికి ఇది తెలివితక్కువ తనం కాదు, వున్నత స్థానాలలోని పెద్దల ప్రాపకం లేకుండా పట్టుకోవాల్సిన వ్యవస్థలను దానికి బదులు ఎటువెళుతున్నారో చెబితే చాలని ఆదేశాలు జారీచేయించింది ఎవరు? రేపు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేస్తారనగా ముందురోజే దేశం నుంచి పరారీ కావటానికి పెద్దల సహకారంలేకుండా సాధ్యమా? అధికారం వున్నంత కాలం కాంగ్రెస్‌ను వుపయోగించుకొని పోగానే బిజెపిలో చేరిన మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు కూడా విజయమాల్యను ఆదర్శంగా తీసుకున్న పెద్దమనిషే,తమ దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకుల సిబ్బంది ధర్నా చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు లోకాయుక్త నివేదన ఆధారంగా బిజెపి ముఖ్యమంత్రి ఎడ్డియూరప్ప పదవి నుంచి తప్పుకున్న విషయం లోకవిదితం. తిరిగి అదే పెద్ద మనిషిని ఆ పార్టీ అందలమెక్కించించింది. ఇలాంటి వారందరినీ పార్టీలో చేర్చుకుంటూ అవినీతి వ్యతిరేక కబుర్లు చెబితే ప్రయోజనం వుందా ? కాంగ్రెస్‌ హయాంలో అవినీతి అక్రమాలపై విచారణను వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి? ఎంత మందిని శిక్షించారు? వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదా ? గొప్పగా చెబుతున్న గుజరాత్‌ మోడల్‌ ఏమిటి, అప్పనంగా ప్రకృతి సంపదలైన నీరు, భూముల వంటి వాటిని పెట్టుబడిదారులకు కట్టపెట్టమేగా ? దాన్ని ఏమంటారు ? వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతోంది . చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ అవినీతి గురించి ఎన్నికలపుడూ, ఇప్పుడూ నానా యాగీ చేశారు, చేస్తున్నారు. కానీ గత రెండు సంవత్సరాలలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఫిరాయింపులకు ప్రోత్సహించి తన పార్టీలో కలుపుకొనేందుకు చూపిన శ్రద్ధ తాను చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు చూపటం లేదేమి? చంద్రశేఖరరావు కూడా కాంగ్రెస్‌ అవినీతి గురించి అలాగే కబుర్లు చెప్పారు. అక్కడ కూడా జరుగుతున్నది అదే ఫిరాయింపులు, ఫిరాయింపులు.

  ఆరు ప్రభుత్వరంగ బ్యాంకులు గతేడాది నాలుగవ త్రైమాసిక ఫలితాల ప్రకారం ఏడువేల కోట్లరూపాయలను నష్టపోయాయి. అధికారానికి వచ్చిన వంద రోజుల్లో విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తానని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ సర్కార్‌ ఆ దిశగా తీసుకున్న చర్యలేమీ కనిపించటం లేదు. బ్యాంకులకు వుద్ధేశ్యపూర్వకంగా రుణాలు ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు చట్ట సవరణలు ప్రతిపాదించటానికేే రెండు సంవత్సరాలు పట్టిందంటే దున్నపోతు మీద వానపడ్డట్లుగా వుంది తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపియే హయాంలో 2008-13 సంవత్సరాలలో బ్యాంకుల నిరర్ధక ఆస్థుల సగటు 2.6శాతం వుండగా తమ అసలైన ప్రతినిధి మోడీ అనుకున్నారేమో పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రెండు సంవత్సరాలలో వాటిని 4.5శాతానికి పెంచి ఎంతో లబ్దిపొందారు, 2008లో 2.3శాతంగా వున్నవి కాస్తా 2015 నాటికి 4.3 శాతానికి పెరిగాయి. వుద్ధేశ్యపూర్వంగా రుణాలు ఎగవేసిన పెద్ద మనుషులు 2015 డిసెంబరు నాటికి 7,686 మంది వుంటే వారి నుంచి రావాల్సిన సొమ్ము 66వేల కోట్ల రూపాయలు. అందువలన కాంగ్రెస్‌ హయాంలో రుణాలు ఇచ్చారన్నది సాకు మాత్రమే వారి మీద చర్య తీసుకుంటే, డబ్బువసూలు చేస్తే వీరికి ఎవరు అడ్డుపడ్డారు? అవినీతికి పాల్పడటం ఎంత నేరమో పాలకులుగా వుండి అవినీతి పరులను వుపేక్షించటం కూడా దానితో సమానమైన నేరమే అవుతుంది.సుగర్‌, బిపి కవల పిల్లల వంటివి. అలాగే పెట్టుబడిదారీ విధానంతో అవినీతి పెనవేసుకొనే వుంటుంది. అందుకే అధికారాంత మందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌ అన్నట్లు ఎవరి గురించి అయినా ముందే సంబరపడిన వారు తరువాత విచారించకతప్పదు.

   జపాన్‌లో పిల్లలకు వేసే డైపర్ల కంటే వృద్ధులకు వేస్తున్న వాటి సంఖ్య పెరిగిపోతోంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ముంచుకు వస్తున్న వృద్ధాప్య సమస్యను ఎలా పరిష్కరించాలా అని తలలు పట్టుకుంటున్నాయి. మన దేశంలో పశు ‘వృద్ధాప్యం’ రైతాంగానికి, కొందరు వృత్తిదారులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. నరేంద్రమోడీ సర్కార్‌ కొత్తగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగేస్తున్నారని మహారాష్ట్రలో కరువు ప్రాంతాల రైతాంగం వాపోతోంది. అనేక రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం కారణంగా వ్యవసాయానికి, పాడికి పనికిరాని పశువులను వదిలించుకోవటం రైతాంగానికి కొత్త కష్టాలు తెచ్చి పెడుతోంది. పశువుల ధరలు సగానికి సగం పడిపోయాయి. ప్రయోజనం లేని పశువులకు నీరు, మేత అందించటం పెద్ద సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌ చేసిన వ్యాఖ్య బడా పారిశ్రామికవేత్తలలో నరేంద్రమోడీ విధానాల పట్ల వున్న అసంతృప్తిని వెల్లడిస్తోంది.ఆయనేమీ కమ్యూనిస్టు కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తి, శక్తి కాదు.’ కొన్ని అంశాలు అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి, వుదాహరణకు కొన్ని రాష్ట్రాలలో గొడ్డు మాంసంపై నిషేధం. ఇది స్పష్టంగా వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధిని దెబ్బతీస్తోంది, ఎందుకంటే ఈ వృధాగా వున్న ఆవులను మనం ఏమి చేసుకుంటాం, ఇది వాణిజ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోంది,ఎందుకంటే ఇది అనేక మంది రైతులకు మంచి ఆదాయ వనరు, అందువలన ఆ చర్య ప్రతికూలం. వేదకాలంలో కూడా భారతీయులు గొడ్డు మాంసం తినేవారు, కరవు పరిస్థితులు ఏర్పడినపుడు రైతులు పశువులను వధశాలలకు తరలించేవారు.’ అని చెప్పారు. దేశంలోని 24 రాష్ట్రాలలో జంతు వధ నిషేధం, జరిమానాలు, ఇతరంగా ఏదో ఒక రూపంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు మాసాలలో పశువుల ధరలు 13శాతం పడిపోయాయని రాయిటర్‌ వార్తా సంస్ధ తెలిపింది.

    రాజకీయ రాజధాని న్యూఢిల్లీ అయితే దేశ ఆర్ధిక రాజధాని ముంబై.మహారాష్ట్రలోని బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ‘ గొడ్డు మాంసం, మరాఠీ చిత్రాలు తరువాత ఏమిటి; మధ్యాహ్న భోజనంలో విధిగా వడపావ్‌ తినాలి, మరాఠీ మాట్లాడాలి, ప్రతి రోజూ దేవాలయాలను సందర్శించాలనే చట్టాలు చేస్తారేమో అని పారిశ్రామికవేత్త హర్ష గోయంకా వ్యాఖ్యానించారు.’ భారత్‌ ఇప్పుడు భవిష్యత్‌లో వెలిగిపోవాలంటే జనానికి ఏం చేయాలో నిర్ణయించుకొనే స్వేచ్చ వుండాలి.ప్రభుత్వం పర్యవేక్షణ కార్యకలాపాలకు పరిమితం కావాలి, జనం ఏం చేయాలో చెప్పాల్సిన పాత్ర ధరించకూడదు’ అని రతన్‌ టాటా ఈ ఏడాది జనవరిలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

    ఒక పార్టీ మరొక పార్టీ విధానాలను విమర్శించటం ప్రజాస్వామ్య పద్దతి. కానీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షం లేకుండా చేసుకోవటం క్షంతవ్యం కాదు. కానీ అధికార రాజకీయాలలో ఒక్క వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ విలువలను పాటించటం లేదు. కేరళ, బెంగాల్‌,త్రిపుర రాష్ట్రాలలో ఎవరైనా ఒకరో అరో వామపక్షాల నుంచి ఇతర పార్టీలలో చేరటం తప్ప ఇతర పార్టీల నుంచి వామపక్షాలు ఫిరాయించిన వుదాహరణలు లేవని చెప్పవచ్చు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నపుడు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అస్థిరపరచటం, ఫిరాయింపులను ప్రోత్సహించాటాన్ని బిజెపి విమర్శించింది. కానీ అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పనిచేసినట్లు అరుణాచల్‌, వుత్తరాంచల్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను పడగొట్టేందకు ప్రయత్నించి భంగపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న పిలుపును ఈ విధంగా అమలు జరిపేందుకు ప్రయత్నించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణాలో టిఆర్‌ఎస్‌ పార్టీలు కూడా అదే చేస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఒక్కొక్క ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సిని ఒక పద్దతి ప్రకారం ఆకర్షించటమే పనిగా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. తెలంగాణాలో వైఎస్‌ఆర్‌సిపిని పూర్తిగా పూర్తిగా, తెలుగుదేశం పార్టీని కూడా దాదాపు అదే విధంగా స్వాహా చేయటంలో టిఆర్‌ఎస్‌ జయప్రదమైంది. కాంగ్రెస్‌ నుంచి కూడా వలసలను ప్రోత్సహిస్తోంది. వీటన్నింటినీ చూసినపుడు పార్టీ ఫిరాయింపులు సాధారణ అంశంగా మార్చివేయటంలో ఈ పార్టీలన్నీ జయప్రదమయ్యాయి. రాజకీయాలలో హుందాగా ప్రవర్తించటం అన్నది దాదాపు కనుమరుగైంది. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి స్థాయిలలో వున్నవారు కూడా అందుకు అతీతులు కాదని రుజువు చేశారు.

    చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల గురించి చిన్నమాట. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించటం తప్ప వీటికంటూ ప్రత్యేక విధానాలు లేవు. అందువలన ధరల పెరుగుదలను నివారించటంలో రెండు చోట్లా వైఫల్యమే. కరవు పరిస్థితులను కప్పి పెట్టేందుకు ప్రయత్నించటం తప్ప జనాన్ని ఆదుకొనేందుకు, కేంద్రం నుంచి నిధులు పొందేందుకు చూపిన ప్రత్యేక శ్రద్ధ ఏమిటో జనానికి తెలియదు. రాష్ట్రం విడిపోతే యువతకు పెద్ద ఎత్తున వుపాధి దొరుకుతుందని తెలంగాణా నేతలు చెప్పారు. ఈ రెండు సంవత్సరాలలో అంతకు ముందుతో పోల్చితే పెద్ద మార్పేమీ కనపడటం లేదు. బాబొస్తే జాబు గ్యారంటీ అన్న నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి, వున్న వుద్యోగాలు పోతున్నాయి తప్ప కొత్తవాటి జాడ కనిపించటం లేదు. తెలంగాణాలో ముడుపుల కోసమే ప్రాజక్టుల రూపురేఖలన్నీ మార్చివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుస్తాయన్నట్లు గతంలో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలో వున్నవారికి, అధికారంలో వున్నవారికి కూడా ఈ విషయాలన్నీ కొట్టిన పిండి కనుక దేన్నీ కాదనలేము.ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పోలవరం తప్ప కొత్తగా కట్టే పెద్ద ప్రాజక్టులేమీ లేవు. వున్నవన్నీ పూర్తి చేయాల్సినవే. పోలవరం వంటి వాటికి నీళ్లు లేకుండానే ముందుగానే కాలువలు తవ్వి గత పాలకులు సొమ్ము చేసుకున్నారు. ఇప్పటి వారు వాటి పూడికలు తీసి సొమ్ము చేసుకుంటారు. అన్నింటి కంటే రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అతి పెద్ద ప్రాజెక్టుకు తెరలేపారు.గతంలో చంద్రబాబు నాయుడే చెప్పినట్లు ఐదులక్షల కోట్ల పధకమది. అందువలన శ్రీశ్రీ చెప్పినట్లు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం పరపీడన పరాయణత్వం అన్నట్లు ఏ పార్టీ చరిత్ర చూసినా గత రెండు సంవత్సరాలలో గర్వించదగిన చర్యలేమీ లేవు. రానున్నవి మంచి రోజులని చెప్పారు. అవి ఎండమావుల మాదిరి కనిపిస్తున్నాయి. ఈ చెంపమీద కొడితే మరో చెంప చూపమని మన వేదాంతం చెబుతుంది తప్ప కొట్టిన వారి చెంప చెళ్లు మనిపించమని చెప్పలేదు. అందుకే మన జనం కూడా అంత నిస్సారంగా తయారయ్యారు. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్నారు. ఇదొక చిత్రం !

గమనిక :ఈ వ్యాసం ‘ఎంప్లాయీస్‌ వాయిస్‌’ మాసపత్రిక జూన్‌ సంచికలో ప్రచురణ నిమిత్తం రాసినది

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ వామపక్షాలకు సవాలు విసిరిన ఓటింగ్‌ సరళి

20 Friday May 2016

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Others, RELIGION

≈ 2 Comments

Tags

BJP, Congress, CPI(M), INDIAN LEFT, LDF, LEFT FRONT, UDF

ఎం కోటేశ్వరరావు

    ఐదు సంవత్సరాల తరువాత కేరళలో తిరిగి అధికారానికి రావటంతో సిపిఎంతో సహా అన్ని వామపక్షాలు, శక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తిరిగి అధికారానికి రాకపోయినా గతం కంటే మెరుగైన ఫలితాలను అయినా వామపక్షాలు సాధిస్తాయని ఆశించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. గతంలో వున్న స్ధానాలను కోల్పోయాయి. అందువలన కేరళ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేవు. ఇది భౌతిక వాస్తవం. కేరళలో మూడింట రెండు వంతుల మెజారిటీకి కేవలం రెండు స్ధానాలు మాత్రమే తగ్గాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్ధితుల్లో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) విజయానికి వున్న ప్రాధాన్యతను ఎవరూ తగ్గించజాలరు. దీన్ని జీర్ణించుకోలేని కొందరు కడుపు మంటతో ఏడవలేక నవ్వు ముఖం పెడతారు. అది సహజమే, అర్ధం చేసుకోవాలి అంతే. ఇదే సందర్భంలో మరో కోణం నుంచి కూడా ఫలితాలను విశ్లేషించటం అవసరం.అది ఈ దేశంలో అభ్యుదయ పురోగామి శక్తులు మరింతగా పెరగాలని కోరుకొనే వారందరూ చేయాలి. ఓటమి చెందినపుడు ఎంత తీవ్రంగా అంతర్మధనం చేయాలో గెలిచినపుడు దానిని కొనసాగించటానికి అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సి వుంటుంది.

     కేరళలో ఎగ్జిట్‌ పోల్స్‌ కంటే ఎక్కువగా సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమికి సీట్లు  వచ్చాయి.ఎల్‌డిఎఫ్‌ ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం తెచ్చుకుంది. కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుపొందింది. త్రిసూర్‌, పథ్థానం తిట్ట, అలప్పూజ, వైనాడ్‌ జిల్లాలో ఒక సీటు మినహా , కన్నూరు, కాలికట్‌ జిల్లాలో రెండేసి తప్ప అన్నింటినీ గెలుచుకుంది. ఇదే సమయంలో ఓటింగ్‌ తీరు తెన్నులు సిపిఎంకు ఒక పెద్ద సవాలును కూడా విసిరాయి.

1.గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఎల్‌డిఎఫ్‌కు దాదాపు ఒక శాతం తక్కువగా 43.1శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలలో అధికారం రానప్పటికీ కాసరగోడ్‌, కోజికోడ్‌, ఇడుక్కి, కొల్లం జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఒక్క కొల్లం జిల్లాలోనే ఆ విజయాన్ని కొనసాగించింది.

2. అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌కు పెద్ద మొత్తంలో ఓట్లు తగ్గి 45 నుంచి 38.78శాతానికి పడిపోయాయి. పోటా పోటీగా కేరళలో జరిగే ఎన్నికలలో రెండు కూటముల మధ్య ఇంత పెద్ద మొత్తంలో ఓట్ల తేడా వుండటం, రెండు కూటములకూ ఓటింగ్‌ శాతం తగ్గటం కూడా ఇదే ప్రధమం.

3.బిజెపి నాయకత్వంలోని కూటమి గత ఎన్నికలలో వచ్చిన ఆరుశాతాన్ని 15కు పెంచుకుంది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు, కొద్ది నెలల కితం జరిగిన స్ధానిక సంస్ధ ఎన్నికల కంటే కూడా అదనంగా ఓట్లు తెచ్చుకొంది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో ఒక సీటు గెలుచుకోవటంతో పాటు ఏడు చోట్ల రెండవ స్ధానంలో నిలిచింది.

     కాంగ్రెస్‌ మీద వున్న వ్యతిరేకతతో పాటు బిజెపి గణనీయంగా ఓట్లు చీల్చటం కూడా ఎల్‌డిఎఫ్‌కు కలసి వచ్చి ఘన విజయం సాధించిందని ఓటింగ్‌ తీరుతెన్నులను బట్టి కొందరు విశ్లేషించారు. గతంలో అనేక సందర్బాలలో కమ్యూనిస్టులను అధికారానికి రానివ్వకూడదన్న గుడ్డి వ్యతిరేకతతో బిజెపి తన ఓట్లను కాంగ్రెస్‌కు బదలాయించిందన్నది బహిరంగ రహస్యం.ఈ సారి ఎలాగైనా బిజెపి పర్మనెంటు అభ్యర్ధిగా పేరు తెచ్చుకున్న ఓ రాజగోపాలన్‌ను గెలిపించేందుకు తోడ్పడటం ద్వారా బిజెపి హిందూత్వ ఓటర్ల మద్దతు పొందేందుకు కాంగ్రెస్‌ ఆయనపై బలహీనమైన అభ్యర్ధిని నిలిపి పరోక్ష సందేశం పంపింది. అయితే బిజెపి కాంగ్రెస్‌ మద్దతు పొంది తొలిసారిగా కేరళ అసెంబ్లీలో అడుగు పెట్టింది తప్ప మొత్తం మీద తన ఓట్లను బదలాయించినట్లు కనిపించటం లేదు. అయితే గతంలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అనేక చోట్ల ఈ సారి బిజెపి ఓట్లు తగ్గాయి. అంటే అక్కడ ఆ ఓట్లు కాంగ్రెస్‌కు బదలాయించారా ? చూడాల్సి వుంది. కాంగ్రెస్‌, బిజెపి చేసిన తప్పుడు ప్రచారాల కారణంగా సిపిఎంకు హిందువుల ఓట్లతో పాటు అనేక చోట్ల మైనారిటీలు కూడా మద్దతు ఇచ్చినట్లు ఫలితాల తీరు తెన్నులపై విశ్లేషకులు చెబుతున్నారు.’ సాంప్రదాయంగా సిపిఎంకు ఓటు చేసే హిందువులలో చీలిక తెచ్చేందుకు చివరి దశలో బిజెపిఏ తనకు ప్రధాన ప్రత్యర్ధి అని కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. కానీ ఫలితాలను చూస్తే హిందువులు మెజారిటీ వున్న ప్రాంతాలతో పాటు బిజెపి పెరుగుదల కారణంగా మైనారిటీలు ఎక్కువగా వున్న కొన్ని చోట్ల కూడా సిపిఎం తన ఓట్లను పెంచుకున్నట్లు వెల్లడి అవుతోందని’ డెక్కన్‌ క్రానికల్‌ కేరళ ఎడిషన్‌ సంపాదకుడు కెజె జాకబ్‌ అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు కారణంగానే ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ మెజారిటీ 70వేల నుంచి 27వేలకు పడిపోయిందన్నారు.

    బెంగాల్లో ఫలితాలు వామపక్షాలను తీవ్రంగా పునరాలోచనలో పడవేస్తాయి. రెండు సంవత్సరాల క్రితం పార్లమెంట్‌ ఎన్నికలలో 16శాతం ఓట్లు పొందిన బిజెపి అసెంబ్లీలో 10శాతానికి పడిపోయింది.అవి తృణమూల్‌ కాంగ్రెస్‌కు బదిలీ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటమికి కారణాలుగా చెబుతూ వస్తున్న కొన్ని వ్యాఖ్యలను వామపక్షాలు నిశితంగా పరిశీలించాల్సి వుంది. మమతాబెనర్జీ కిలో రెండు రూపాయల బియ్యం పధకం ప్రవేశపెట్టి శారద, నారద వ్యతిరేకతను అధిగమించారన్నది ఒకటి. దేశవ్యాపితంగా ఆహార భద్రత కావాలని డిమాండ్‌ చేసిన వామపక్షాలు బెంగాల్‌లో తమ మూడున్నర దశాబ్దాల పాలనలో సబ్సిడీ బియ్యం పధకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. బాలికలకు స్కాలర్‌ షిప్పులు, సైకిళ్లు ఇచ్చారని మరికొన్ని ఇలాంటివే వున్నాయి. అన్నింటినీ ప్రజాకర్షక పధకాలుగా కొట్టివేయలేము. సిపిఎం కార్యక్రమం జనతా ప్రజాస్వామిక విప్లవ దశకు చేరటం తప్ప నేరుగా సోషలిజం కాదు. అటువంటిది ఒక రాష్ట్రంలో మౌలిక మార్పులను చేయలేని పరిస్థితులలో వున్నంతలో ప్రజలకు వుపశమనం కలిగించటం అవసరమా లేదా ? అందువలన బెంగాల్లో గతంలో ఏం జరిగింది అని అంతర్గతంగా మధించుకోవటంతప్ప ఇప్పుడు బహిరంగంగా చర్చించి ప్రయోజనం లేదు. అధికారంలో వున్న త్రిపుర, కేరళలో అయినా అలాంటి వైఫల్యాలు, లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది.

    రెండవది కాంగ్రెస్‌ ఓటింగ్‌ పూర్తిగా బదిలీకాలేదన్న వాదన. దీని గురించి ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. బదిలీ అవుతాయి అని ఎవరైనా భావిస్తేనే భ్రమలకు లోనయినట్లుగా పరిగణించాలి. వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, ఇతర వామపక్షపార్టీలతో కలిగిన అనుభవం ఏమిటి? సిపిఎం ఓట్లు పూర్తిగా, నిజాయితీగా బదిలీ అయ్యాయి తప్ప ఇతర పార్టీల నుంచి అవి మిత్రపక్షాలుగా వున్నపుడే పూర్తిగా బదిలీ జరగలేదని తేలింది. అలాంటిది బెంగాల్లో గత ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ వ్యతిరేకతతో పనిచేసిన కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌ ఓట్లు పూర్తిగా బదిలీ అవుతాయని భావించటం అత్యాశే అవుతుంది. సాధారణ పరిస్థితులలో పార్టీ పనిచేయటానికి కూడా అవకాశం లేని స్ధితిలో ప్రజాస్వామ్య పరిస్ధితుల పునరుద్దరణకోసం చేసుకున్న సర్దుబాటు తప్ప అది మరొకటి కాదు. కమ్యూనిస్టులు ప్రపంచంలో అనేక చోట్ల అంతకంటే తీవ్ర నిర్బంధం, ప్రతికూల పరిస్థితులలో పనిచేస్తున్నారు. అందువలన బెంగాల్లో వామపక్షాలు రాబోయే అయిదు సంవత్సరాలలో మరిన్ని దాడులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. నూతన పరిస్ధితులకు అనుగుణంగా పని చేసి తిరిగి ప్రజల విశ్వాసం పొందటం తప్ప మరొక మార్గం లేదు. అది ఎలాగన్నదే సమస్య.

     ఫలితాలకు సంబంధించి ఇంకా లోతైన విశ్లేషణలు రాబోయే రోజుల్లో వెలువడతాయి. వామపక్షాల ముందున్న ఒక తీవ్ర సవాలును అవి ఎలా అధిగమిస్తాయన్నదే ప్రశ్న. అదే మిటంటే గత ఎన్నికల ఓటింగ్‌ తీరుతెన్నులను చూస్తే స్పష్టం అవుతుంది. వర్గరీత్యా ఒక శాతం పెట్టుబడిదారులు, భూస్వాములు అయితే 99శాతం కార్మికవర్గం, ఇతర కష్టజీవులే. అటువంటపుడు కమ్యూనిస్టులు పొందుతున్న ఓటింగ్‌ శాతం దానిని ప్రతిబింబించటం లేదు. అనేక మంది శ్రామికులు కమ్యూనిస్టులు కాని పార్టీల, కుల మత శక్తుల వెనుక వున్నారు. ఓడిపోయిన ప్రతి సారీ కమ్యూనిస్టులు ఆత్మశోధన చేసుకొని బలహీనతను అధిగమిస్తామని చెబుతూనే వున్నారు. కానీ తరువాత అది ప్రతిబింబించటం లేదు. కమ్యూనిస్టుల బలం ఒక పరిధికి మించి పెరగటం లేదు. అలాగని దీన్ని గురించి గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు గానీ తీవ్రంగా పరిశీలించకతప్పదు. వివరాలు చూడండి. కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌,బిజెపి ఓట్ల శాతాలు ఇలా వున్నాయి.

                1987      1991      1996     2001     2006     2011     2016

ఎల్‌డిఎఫ్‌    44.65     45.80    44.69    43.70     48.60    44.83   43.10

యుడిఎఫ్‌    44.04     48.07    43.58    49.27    42.98     45.90   38.78

బిజెపి                                                5.20       4.75      6.00    15.00

     గత ఏడు ఎన్నికలలో తొలిసారిగా 2016లో అటు ఎల్‌డిఎఫ్‌ ఇటు యుడిఎఫ్‌ రెండు కూటములు అతి తక్కువ ఓట్లు పొందాయి.ఏడు ఎన్నికల సగటు ఎల్‌డిఎఫ్‌కు 45, యుడిఎఫ్‌కు 44.6శాతంగా వున్నాయి. ఎల్‌డిఎఫ్‌ గరిష్టంగా 2006లో 48.6శాతం, యుడిఎఫ్‌ 2001లో 49.27 శాతం ఓట్లు పొందాయి.

     పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2006 వరకు జరిగిన ఎన్నికలలో వామపక్ష సంఘటన సగటున 49.82 శాతం ఓట్లు పొందింది. ఏడు ఎన్నికలలో రెండు సార్లు మాత్రమే 50 శాతంపైగా ఓట్లు తెచ్చుకుంది. బెంగాల్‌, కేరళలో రెండు చోట్లా సగం మంది కంటే తక్కువ ఓటర్ల మద్దతు మాత్రమే వామపక్షాలు ఇంతకాలం పొందగలిగాయి. బెంగాల్లో గత రెండు ఎన్నికలలో వామపక్ష ఓటింగ్‌ గణనీయంగా తగ్గిపోయింది. తిరిగి ప్రజా మద్దతు పొందటం ఎలా అన్నది ఆ పార్టీలు చూసుకుంటాయి, అది వేరే విషయం. బాగా వున్న రోజులలో కూడా వాటి బలం అంతకు మించి పెరగ లేదు. ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలిన పూర్వరంగంలో బెంగాల్లో పోయిన పునాదిని తిరిగి సంపాదించటం ఒక సవాలైతే కేరళలో పునాదిని మరింత పెంచుకోవటం అంతకంటే పెద్ద సవాలు. కేరళలో వున్న సామాజిక పరిసిస్థితులలో 43శాతం మైనారిటీ జనాభాలో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగాన్ని మరిచి పోరాదు. మైనారిటీలందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులు కానప్పటికీ వారు మెజారిటీగా వున్న ప్రాంతాలలో ఎన్నికల ఫలితాలను చూసినపుడు మతశక్తుల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని బూచిగా చూపి బిజెపి మెజారిటీ మతశక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోంది.అదే సమయంలో కమ్యూనిస్టులను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌తో రాజీపడటం, కుమ్మక్కు కావటమే ఇప్పటివరకు దాని చరిత్రగా వుంది. ప్రపంచంలో మత ధోరణులతో పాటు నయా వుదార వాద విధానాల ప్రభావం అన్ని తరగతులలో బలంగా వ్యాపిస్తున్న తరుణమిది.అందుకే మన దేశంలో మైనారిటీ మతాలకు చెందిన కొన్ని శక్తులు బిజెపిని చూసి ఒకవైపు భయపడుతూనే మరోవైపు దానిని సమర్ధించటానికి కూడా పరిమితంగానే అయినప్పటికీ వెనుకాడటం లేదు. ఆ తరగతులలో మధనం జరుగుతోంది. దీనికి కేరళ మినహాయింపు అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయిననూ పోయి రావలె హస్తినకు…..

18 Wednesday May 2016

Posted by raomk in AP, BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Chandrababu Delhi mission, Narendra Modi, special status to Andhra pradesh, tdp

చంద్రబాబు ఢిల్లీ యాత్ర విఫలం !

ఎం కోటేశ్వరరావు

   అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు మరోసారి హస్థినాపురి పర్యటనకు వెళ్లి వచ్చారు. జూదంలో ఓడిపోయిన పాండవులకు చివరకు ఐదు వూళ్లు కాదుకదా సూదిమోపినంత స్థలం కూడా ఇచ్చేది లేదని కౌరవులు చెప్పినట్లుగా కేంద్రమంత్రులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి ఎంతో స్పష్టంగానే చెప్పారు. కాదని చెప్పటానికి మీరెవరు. అవునన్నా కాదన్నా అగ్రజుడితోనే మాట్లాడి అమీతుమీ తేల్చుకుంటా అన్నట్లగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు, తిరిగి వచ్చారు. సాధించేదిమిటి అన్నది అర్ధంగాక రాష్ట్ర జనం జుట్టుపీక్కుంటున్నారు. తెలుగుదేశం వీరాభిమానులు కూడా వారిలో వుంటారు. కసు ఓడిపోయిన వారు కోర్టులోనే ఏడిస్తే గెలిచిన వారు ఇంట్లో ఏడ్చినట్లుగా వారు బయట పడరు అదే తేడా. ప్రధాన మంత్రిని కలిసిన తరువాత చంద్రబాబు నాయుడు మాట్లాడింది విలేకర్లందరితో ఒకేసారి, ఒకటే అయినా ఒకే పత్రికను చదివితే ఆయనేం మాట్లాడిందీ పూర్తిగా తెలియని స్థితి.

    చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వ పత్రిక ‘సాక్షి ‘(దాని ఆస్థులు ప్రభుత్వ ఆధీనంలో వున్నాయన్నారు కనుక) పత్రిక ‘ హోదాతో ఏం వస్తుంది ‘ అని చంద్రబాబు అన్నట్లు శీర్షిక పెట్టింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పినట్లు ‘ ఆ రెండు ‘ పత్రికలలో ఒకటైన ‘ఆంధ్రజ్య్రోతి’ ‘కేంద్రానిదే బాధ్యత ‘ అనగా ‘ఈనాడు’ ప్రత్యేక హోదాపై ఆందోళన వద్దు ‘ అని ‘ప్రజాశక్తి ‘ చట్టంలోని అంశాలే ‘ అని పేర్కొన్నది. మొత్తం మీద రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అనే దింపుడు కళ్లం ఆశను కూడా చంద్రబాబు తీర్చేశారు. రాష్ట్ర రాజకీయాలలో ఇదొక పెద్ద మలుపుకు నాంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం రాజకీయం ఏ రకంగా వుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వ్యూహాలు పన్నటానికి ప్రతి పార్టీ కొంత సమయం తీసుకోవచ్చు.లేస్తే మనిషిని కాదు అన్నట్లు ఫోజు పెడుతున్న పవన్‌ కల్యాణ్‌ వంటి వారు ఎలా లేస్తారు ? తెలుగుదేశం-బిజెపి తెగతెంపులు చేసుకుంటే పరస్పరం లాభమని భావిస్తాయా, కలిసి వుంటేనే కలదు సుఖం అనుకుంటాయా అన్నది స్పష్టం కావటానికి సమయం పట్టవచ్చు.

    దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియనట్లు ప్రత్యేక హోదా గానీ, ప్రత్యేక పాకేజీ కూడా రాదని చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు.గతేడాది రాజధాని శంకుస్థాపనకు ప్రధాని రాక సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక పాకేజిని అడిగినట్లు ప్రకటించి ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొన్నారు. తరువాత నష్ట నివారణ చర్యగా తాను పొరపాటున హోదాబదులు పాకేజి అన్నానని సవరించుకున్నారు. కేంద్రంపై వున్న భ్రమలు, దింపుడు కళ్లం ఆశతో వున్నారని అప్పుడే వెల్లడైంది. అందువలనే గత రెండు సంవత్సరాలుగా ఎవరైనా కెలికితే తప్ప సాధ్యమైన మేరకు వాటి ప్రస్తావన రాకుండా చూసుకున్నారు, ఒక వేళ వచ్చినా బి పాజిటివ్‌ అన్న ధోరణిలో మాట్లాడారు. ఎంతైనా తెలివైన రాజకీయవేత్త కదా ! హోదా వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ వుండదని జనానికి, హోదారాకపోయినా కనీసం ఆర్ధికంగా మంచి పాకేజి ఇచ్చినా సరిపెట్టుకుంటామన్నట్లుగా కేంద్రానికి అనేక సంకేతాలు పంపారు. మరోవైపు రాజధాని నిర్మాణం, విదేశాల నుంచి భారీఎత్తున పెట్టుబడుల పేరుతో పెద్ద హంగామా సృష్టించారు. ఎన్నిదేశాలు తిరిగినా ,ఎవరితో కూర్చున్నా వూసులు తప్ప కాసుల రాశులు రావటం లేదు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌, మా యింటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగా ప్రతివారూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే పెట్టుబడుల కోసం పోటీ పడని రాష్ట్రం లేదని వారికీ అర్ధం అయింది. ఎవరైనా వూరికి దూరంగా ఇల్లు కడుతుంటే సామాన్లు వేసుకోవటానికి అవసరమైన తాత్కాలిక షెడ్డు వేసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా తాత్కాలిక రాజధాని నిర్మాణానికే వందల కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. అంటే శాశ్వత రాజధాని శంకుస్థాపన దగ్గరే ఆగిపోతుందన్నది స్పష్టం. తనను సవాలు చేసే బలమైన ప్రతిపక్షం లేకపోయినా తాను సృష్టించుకున్న సమస్యలే ఎంతో బలంగా చంద్రబాబును నిలదీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

    ప్రత్యేక హోదా, ప్యాకేజీల వంటివి ఏమీ రాకపోయినా జనాన్ని ఏదో విధంగా జోకొట్ట వచ్చు, అందుకు గాను ముందు ప్రతిపక్షం లేకుండా చూసుకోవాలన్నది చంద్రబాబు చాణక్యంగా కనిపిస్తోంది. ఒక వేళ బిజెపి తనను వదలి పెట్టి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే దానికి అంత సీన్‌ లేదని అందరికీ తెలుసు. అందులోనూ ఐదు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా అని పార్లమెంట్‌లోపలా, వెలుపలా హడావుడి చేసిన పార్టీ అది. చివరికి నిధులు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వకుండా బిజెపి ఏ మొహం పెట్టుకొని ఓటర్ల వద్దకు వెళుతుంది.అందులోనూ దానిలో కాంగ్రెస్‌ ముఖాలే కనిపిస్తాయి. చంద్రబాబు అంచనా ప్రకారం కాంగ్రెస్‌ కోలుకోలేనంతగా దెబ్బతిన్నది, దానిని పునరుద్ధరించే నాయకత్వం కూడా లేదు. వైఎస్‌ఆర్‌సిపి నేత జగన్‌ విఫల ప్రతిపక్ష నేత. ఆ పార్టీని మరింతగా దెబ్బకొట్టటానికి ఒక పధకం ప్రకారం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఎవరెవరో వస్తారని మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. అన్ని పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి తెలుగు దేశం పార్టీని కూడా ముఠాలతో మునిగి వుండే మరొక కాంగ్రెస్‌ పార్టీగా తయారు చేసినా ఒకరి జుట్టును మరొకరికి ముడివేసి తాను చక్రం తిప్పవచ్చు. వైఎస్‌ఆర్‌సిపిని బలహీన పరిస్తే పరిపాలనలో తాను వైఫల్యం చెందినా మరొక ప్రత్యామ్నాయం వుండదు కనుక బొటాబొటా మెజారిటీతో అయినా జనం తమను తప్ప మరొకరిని ఎన్నుకొనే అవకాశం లేదన్న అంచనాతో వున్నట్లు చెబుతున్నారు. అయితే రాజకీయ నేతలు వూహించిన విధంగా పరిణామాలు వుంటాయని చెప్పలేము. అందుకు ఒకసారి వెనక్కు తిరిగి చూడాలి. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ గణనీయంగా ఓట్లు సంపాదించినప్పటికీ సీట్లు పొందటంలో విఫలమైది. 1978 అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున ఎన్నికైన ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరినీ కాంగ్రెస్‌ తనలో కలిపేసుకొని ప్రతిపక్షం లేకుండా చేసుకుంది. అయితే తెలుగు దేశం రూపంలో తన ఏకపక్ష పాలనకు తెరదించే రోజులు వస్తాయని కాంగ్రెస్‌ నాయకత్వం ఆనాడు కనీసంగా వూహించలేదు. చంద్రబాబు నాయుడు కూడా అదే పరిణామాలను పునరావృతం చేస్తూ వైఎస్‌ఆర్‌సిపి దుకాణాన్ని ఖాళీ చేస్తున్నారు. ఆయన వూహిస్తున్నట్లు లేదా చెబుతున్న విధంగా విధిలేక జనం తననే ఎన్నుకుంటారా ? ఊహించని విధంగా కొత్త శక్తులు రంగంలోకి వస్తాయా ? ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు ?

     దేశంలోని కరవు పరిస్థితులపై సుప్రీం కోర్టు చీవాట్లు వేసిన తరువాత కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో భాగంగానే చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించారు తప్ప ప్రత్యేక హోదా గురించి చర్చించటానికి కాదు అన్నది తెలుసుకోవాలి. ఈ సందర్బాన్ని చంద్రబాబు వుపయోగించుకొని ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయి ప్రత్యేక హోదా, ఇతర ఆర్ధిక సమస్యలను గురించి నివేదించారు. దీన్ని గురించి కూడా అధికారిక ప్రకటనేమీ లేదు. లీకుల సమాచారమే. ఎందుకంటే నరేంద్రమోడీ, చంద్రబాబు ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నారు. వారి మధ్య ఏం నడిచిందన్నది ఎవరో ఒకరు ఏదో రూపంలో ఎక్కడో అక్కడ వెల్లడించి వుండాలి. ఈ భేటీ గురించి ఒక పత్రికలో ప్రధానితో చంద్రబాబు సూటిగా మాట్లాడారని రాశారు అంటే చేతులు నలుపుకోకుండా గట్టిగా అడిగారనే అర్ధం ధ్వనించే విధంగా. ఒక ప త్రిక పదినిమిషాలే సమయం ఇచ్చినప్పటికీ రెట్టింపు సమయం మాట్లాడినట్లు రాస్తే మరొక పత్రిక అరగంట సేపు అని రాసింది. ఏది నిజం.

   మొత్తం మీద హోదా, నిధుల గురించి నెపాన్ని కేంద్రంపై నెట్టేందుకు తెలుగు దేశం నాయకత్వానికి మార్గాలు వెతికేందుకు మరికొంత కాలం గడపవచ్చు. ఇప్పటికే తెలుగుదేశంపై ధ్వజమెత్తుతున్న బిజెపి రానున్న రోజులలో మరింతగా తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టి నెపం మోపేందుకు ప్రయత్నించవచ్చు. మంగళవారం నాడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు విలేకర్లతో మాట్లాడిన అంశాల తీరు తెన్నులను చూస్తే బిజెపికి వ్యతిరేకంగా సెంటి మెంట్‌ను రెచ్చగొట్టే ధోరణి కనిపించింది. రాష్ట్రానికి అన్యాయం చేసిందని పదే పదే కాంగ్రెస్‌ను ఆడిపోసుకుంటున్న చంద్రబాబు మరి బిజెపి సంగతి ఏమిటంటే తాను ఎన్నికలపుడే రాజకీయాలు మాట్లాడతానని తప్పించుకున్నారు. అన్ని పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని మరొక మాట. మొత్తం మీద ప్రధానితో మాట్లాడిన తరువాత గందరగోళానికి, వత్తిడికి గురైనట్లు ఆయన మాటలు వెల్లడిస్తున్నాయి.ఎవరికి ఏమైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చట్టం కొందరికి చుట్టం కొందరికి దయ్యమైంది ఎందుకు ?

17 Tuesday May 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

AYUSH, BJP, doctored JNU videos, forgery, JNU, reporter

సత్య

    చట్టం ముందు అందరూ సమానులే కానీ కొందరు చట్టానికి చుట్టాలుగా వుంటారా ? న్యూఢిల్లీలో మేనెల రెండవ వారంలో పుష్పా శర్మ అనే జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాధానాన్ని ఫోర్జరీ చేశారని, దానిని పత్రికలో ప్రకటించి తప్పుడు సమాచారంతో మతాల మధ్య విబేధాలు రెచ్చగొట్టటానికి ప్రయత్నించారనే ఆరోపణలతో నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా దినం సందర్భంగా శిక్షకుల ఎంపికలో ఒక్క ముస్లింనుకూడా చేర్చలేదని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్ర కారమే అలా చేసినట్లు ఆయుష్‌ మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించారన్నది పోలీసుల అభియోగం. అది నిజమే అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి ఎవరికీ అభ్యంతరం వుండదు.ఈ వుదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరు అసాధారణంగా వుంది. ఆ వార్తను ప్రచురించిన పత్రిక ‘మిలీ గజెట్‌ ‘ అనే పత్రికకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందినట్లు పేర్కొన్న సదరు శర్మను అనేక మార్లు పోలీసులు ప్రశ్నించారు. ఎలాంటి వారంటు లేకుండానే అరెస్టు చేసే బెయిలు రాని సెక్షన్‌ 153ఏ కింద కేసు బనాయించారు.

     కానీ ఇదే పోలీసులు ఫిబ్రవరి నెలలో జెఎన్‌యు వుదంతంలో తిమ్మిని బమ్మిని చేసి చేయని దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లుగా రూపొందించిన వీడియోలను పదే పదే ప్రసారం చేసిన జాతీయ టీవీ ఛానల్స్‌పై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.ఆ వీడియోల కారణంగా దేశమంతటా ప్రతిష్టాత్మక జెఎన్‌యు పరువు పోయింది, దానిలో చదువుకొనే విద్యార్ధులు దేశద్రోహులుగా దేశం ముందు ప్రదర్శితమయ్యారు. విద్యార్ధి సంఘనేత కన్నయ్య కుమార్‌తో సహా అనేక మందిపై దేశద్రోహ నేరం కేసులు మోపి అరెస్టులు చేశారు. ఢిల్లీ కోర్టుల వద్ద దేశ భక్తుల ముసుగులో వున్న లాయర్లు విద్యార్ధులు, ఆవార్తలను కవర్‌ చేయటానికి వచ్చిన జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటాన్ని దేశమంతా చూసింది. భారత మాతాకీ జై అన్న నోళ్లతోనే విద్యార్ధుల అరెస్టులు అక్రమం అన్న మహిళా జర్నలిస్టులను మాన భంగం చేస్తామని బెదిరించారు. దేశమంతటా ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అందుకు దోహదం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు తోడ్పడిన వీడియో టేపులను తయారు చేసిన వారు, వాటిని ప్రసారం కోట్లాది మంది జనంలో విద్వేషాన్ని నింపిన సాంకేతిక నిపుణులు, జర్నలిస్టులు, టీవీ ఛానల్స్‌ యాజమాన్యాలు, ఆ తప్పుడు వీడియోల ఆధారంగా తప్పుడు కేసులు పెట్టిన పోలీసు యంత్రాంగంపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అంతే కాదు వుమర్‌ ఖాలిద్‌ అనే విద్యార్ధికి వుగ్రవాద సంస్ధతో సంబంధాలు వున్నాయని తప్పుడు వార్తలను ప్రచురించిన పత్రికలు, ప్రసారం చేసిన టీవీలపై కూడా ఎలాంటి చర్యలు లేవు. తనతో పాటు అనిర్‌బన్‌ భట్టాచార్య అనే విద్యార్ధిపై ప్రచురించిన తప్పుడు వార్తల కారణంగా తాము కనిపిస్తే చంపే విధంగా జనంలో ఆగ్రహం వెల్లడైందని వారు స్వయంగా కోర్టుకు విన్నవించుకున్నారే. అంతటి తీవ్రమైన చర్యలు అక్రమాలుగా కేంద్ర ప్రభుత్వానికి కనిపించ లేదా ? ఒక జర్నలిస్టు పుష్పా శర్మ ఫోర్జరీ(రుజువు కావాల్సి వుంది) కారణంగా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తే, మరో ఫోర్జరీ వీడియోల ద్వారా రాజకీయంగా లాభపడేందుకు అదే ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకేనా వీడియో అక్రమాలపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

సుత్తీ, కొడవలి టీ షర్టులతో భయపడిన ఇండోనేషియా సర్కార్‌

15 Sunday May 2016

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics

≈ Leave a comment

Tags

Anti communist, communist, communist symbols, Indonesian Communist Party (PKI)., Jokowi, PKI, victims of 1965

ఎంకెఆర్‌

  ప్రపంచంలో సోషలిజాన్ని తొక్కి వేశామని, కమ్యూనిజాన్ని కాలరాశామని అమెరికా సామ్రాజ్యవాదులు ప్రకటించిన పాతిక సంవత్సరాలు దాటింది. అయితేనేం వారి కనుసన్నలలో నడుస్తున్న ఇండోనేషియా పాలకవర్గం ఇప్పుడు ఎటు వైపు నుంచి ఎప్పుడు కమ్యూనిస్టులు తమకు దర్శనమిస్తారోనని భయపడి చస్తోంది, మాటి మాటికీ వులికిపడుతోంది. యాభై సంవత్సరాల నాడు ఐదులక్షల మందికిపైగా కమ్యూనిస్టులు, వారి సానుభూతి పరులుగా పరిగణించిన వారిని వూచకోత కోసిన వారు ఇప్పుడు ఏ సమాధి నుంచి ఎవరు ఎక్కడ లేచి వస్తారో అన్నట్లుగా సామూహిక సమాధులను కూడా కానరాకుండా చేసేందుకు పూనుకుంది.

     లేకపోతే కార్మిక, కర్షక చిహ్నాలైన సుత్తీ, కొడవలి ముద్రించిన టీ షర్టులు అమ్ముకుంటున్న ఇద్దరు చిరు వ్యాపారులు కమ్యూనిజాన్ని వ్యాపింపచేస్తున్నారంటూ అరెస్టు చేస్తారా? అలాంటి టీ షర్టులను తయారు చేయవద్దని యజమానులను ఆదేశిస్తారా ? ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అక్కడి పాలకవర్గం వామపక్ష భావజాల చర్చను బహిరంగంగా అనుమతిస్తే ఏం జరుగుతుందో, అనుమతించక ఇంకా అణచివేత కొనసాగనిస్తే దాని మీద ఇంకా యువతలో మోజు పెరుగుతుందా అన్నది తేల్చుకోలేక పోతున్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు యాభై సంవత్సరాల నాడు జరిగిన అణచివేతకు గురైన వారి కుటుంబాలతో సర్దుబాటు చేసుకోవాలనే పేరుతో మారణకాండ గురించి ప్రభుత్వమే అధికారికంగా ఒక సదస్సు నిర్వహించి వివరాలుంటే చెప్పమని కోరింది.మరోవైపున అదే ప్రభుత్వం కమ్యూనిస్టు చిహ్నాలను పంపిణీ చేస్తూ కమ్యూనిజాన్ని ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయలేదు, ఏకపక్షంగా రాసిన చరిత్రను, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇంకా అధికారికంగా కొనసాగిస్తూనే వుంది.

    ఈ కారణంగానే పోలీసులు తాజాగా సుత్తీ,కొడవలి గుర్తులున్న టీ షర్టులను విక్రయించేవారిని అరెస్టు చేసి, వాటి తయారీని నిలిపివేయాలని కోరారు.ఈ చర్య కమ్యూనిస్టు వ్యతిరేకులకు ప్రతికూల ఫలితాలనే ఇస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రభుత్వ చర్యను అనేక మంది మానవ హక్కుల కార్యకర్తలు ఖండిస్తున్నారు. కమ్యూనిస్టు చిహ్నాలను ప్రదర్శిస్తున్న, వ్యాపింప చేస్తున్నవారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని అధ్యక్షుడు జోకోవి ఇండోనేషియా మిలిటరీ, నేషనల్‌ ఇంటలిజెన్స్‌, అటార్నీ జనరల్‌ కార్యాలయాలను ఆదేశించించినట్లు జాతీయ పోలీసు ప్రధాన అధికారి బద్రుదిన్‌ హయతీ వెల్లడించారు.దేశంలో కమ్యూనిస్టు భావజాలం అదుపులేకుండా విస్తరించటం ఆందోళన కలిగిస్తున్నదని బద్రుదిన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పారు. కమ్యూనిజం గురించి చర్చించటం, సమావేశాలు జరపటం వంటి కార్యకలాపాలు పెరగటాన్ని గమనించామన్నారు.ఈ పరిస్ధితులను కొన్ని బాధ్యతారాహిత్య పార్టీలు వినియోగించుకోచూడటాన్ని నిరోధించేందుకు పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తి సుత్తీ, కొడవలి గుర్తులున్న టీ షర్టులు ధరించి వున్నా వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఎందుకు వాటిని ధరించారో విచారణ జరుపుతారని చెప్పారు. కమ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. మ్యూనిజం గురించి ప్రచారం చేస్తున్నారన్నది వాస్తవమని తేలితే అలాంటి వారికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. పోలీసులతో పాటు కమ్యూనిస్టులని అనుమానం వున్నవారి సమాచారం చేరవేసేందుకు ఏజంట్లను కూడా వినియోగిస్తున్నారు. టీషర్టులను అమ్మేవారిని నిర్బంధించటంతో వెల్లువెత్తిన నిరసనలతో దిక్కుతోచని అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి జాన్‌ బౌడీ ఒక ప్రకటన చేస్తూ భద్రతా సిబ్బంది ఈ విషయంలో అతిగా స్పందించారని, మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్చను పరిరక్షించేందుకు కూడా శ్రద్ధ తీసుకోవాలని అధ్య క్షుడు కోరినట్లు నష్ట నివారణకు ప్రయత్నించారు.

   కమ్యూనిజం పునరుద్ధరణను నిరోధించే పేరుతో పౌర విధుల్లో మిలిటరీ ప్రమేయం ఎక్కువ అవుతోందని అనేక మంది విమర్శిస్తున్నారు. తూర్పు జావాలో ఈనెల మూడవ తేదీన ‘చెరకు తోటల్లో సుత్తీ, కొడవలి ‘ అనే పేరుతో వున్న గ్రంధ కాపీలను మిలిటరీ స్వాధీనం చేసుకుంది. మరొక ప్రాంతంలో గిరిజన సంఘం సభ్యుల వద్ద వామపక్ష సాహిత్యం, కమ్యూనిస్టు గుర్తులున్న టీ షర్టులు ధరించారనే పేరుతో నలుగురిని అరెస్టు చేశారు.

   టీ షర్టులపై ముద్రించేందుకు ఏ గుర్తులు బాగుంటాయో చూద్దామని తాము ఇంటర్నెటలో వెతికామని దానిలో 1990 దశకం నాటి తూర్పు జర్మనీ చిత్రం ఆకర్షణీయం వుండటంతో దానిని తీసుకొని టీ షర్టులపై ముద్రణకు ఇచ్చాం తప్ప ఆ గుర్తుల గురించి వాటిని కలిగి వుంటే ఇలా జరుగుతుందని తమకు తెలియదని వాటిని అమ్మిన చిరు వ్యాపారులు చెప్పారు. పోలీసులు కూడా తరువాత దానిని నిర్ధారించారు.అయితే ఆ చిహ్నాలను ముద్రించిన ఫ్యాక్టరీ యజమానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలోనే జకర్తాలో జరిపిన ఆసియన్‌ సాహిత్య వుత్సవాన్ని కమ్యూనిజం వ్యాప్తి కోసం తలపెట్టారంటూ కమ్యూనిస్టు వ్యతిరేకులు దానిని జరగనీయరాదని డిమాండ్‌ చేశారు.అయితే పోలీసు రక్షణలో అది జరిగింది. ఇదిలా వుండగా 1965 హత్యాకాండ బాధితుల పరిశోధనా సంస్ధ ప్రతినిధులు జావా,సుమత్రా దీవులలో 122 సామూహిక సమాధుల వివరాలను వెల్లడించింది. ఇండోనేషియా విశ్వవిద్యాలయ ఆంత్రోపాలజిస్టు దవే లుమెంటా మాట్లాడుతూ పాఠశాలల్లో బోధించినది తప్ప అత్యధికులకు దేశ చరిత్ర అందుబాటులో లేదన్నారు. ప్రభుత్వం అందించిన దానిని అంగీకరించటం తప్ప దాని అర్ధం చేసుకోలేక జనం కమ్యూనిజం గురించి భయపడుతున్నారని అన్నారు. ఆ పాఠాలలో కూడా చరిత్రలో ఏ రోజు ఏం జరిగిందో వరుసగా చెప్పటం తప్ప అలా జరగటానికి కారణాలు, పర్యవసానాల గురించి వాటిలో వుండదని, ప్రస్తుతం వునికిలో లేని కమ్యూనిస్టు పార్టీ గురించి ఏమీ వుండదని తెలిపారు. 1965నాటి సామూహిక హత్యాకాండ గురించి ఏకపక్షంగా చెప్పే కధనాల ప్రకారం కమ్యూనిస్టులు కేవలం అంతరాత్మలు లేని నాస్థికులుగా చిత్రితమైందని దవే చెప్పారు. 1965 తరువాత మిలిటరీతో సహా కొన్ని పార్టీలకు రాజకీయ చట్టబద్దత లభించిందని, వాటికి పైన చెప్పిన చెప్పిన కథనాలను పరిరక్షించటం తప్ప మరొకదానిపట్ల ఆసక్తి లేదంటూ నూతన అధికార వ్యవస్ధ కాలంగా పరిగణించబడుతున్న 1966-1998 మధ్య మిలిటరీకి చెందిన వారిని రాజకీయాలు, వాణిజ్యంలో కూడా అనుమతించారని తీవ్రవాదంతో కూడిన మితవాద శక్తులను ప్రోత్సహించటం ప్రమాదకరమని అన్నారు. యాభయి సంవత్సరా క్రితం సామూహిక హత్యాకాండకు గురైన వారి, లేదా దాని నుంచి తప్పించుకున్నవారి కుటుంబాలపై ఇప్పటికీ నింద, వివక్ష కొనసాగుతోందని ఇండోనేషియా విశ్వవిద్యాలయానికి చెందిన సోషియాలజిస్టు రువైదా నూర్‌ చెప్పారు. ప్రభుత్వం దానిని సంస్థాగతంగా జోక్యం చేసుకొని సరిదిద్దాలన్నారు. కుటుంబం, స్కూలు, మీడియా ద్వారా ఇది జరగాలని చెప్పారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d