• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: WAR

కుట్రలను అధిగమించి పురోగమనంలో వెనెజులా !

02 Wednesday Feb 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Prices, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#viva Venezuela, Chavez, crude oil price, Maduro, President Maduro, Venezuela, Venezuela’s economy, Yandamuri, Yandamuri Veerendranath


ఎం కోటేశ్వరరావు


వెనెజులా మరోసారి వార్తల్లోకి వస్తోంది. దానిపై మీడియా సంస్ధలు, ప్రముఖులుగా ఉన్న కొందరు చేయని ప్రచారం లేదు. అక్కడ సమస్యల్లేవని ఎవరూ చెప్పలేదు. కాకపోతే కాళిదాసు కవిత్వానికి కొంత తమపైత్యాన్ని జోడించే వారి గురించి పట్టించుకోనవసరం లేదు. వెనెజులా సెంట్రల్‌(రిజర్వు)బాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లో 686.4శాతం ద్రవ్యోల్బణం ఉంది. అంతకు ముందు సంవత్సరం 2,959.8 శాతం ఉంది. గతేడాది సెప్టెంబరు నుంచి నెలవారీ ద్రవ్యోల్బణం ఒక అంకెకు పరిమితం అవుతోంది. వందలు,వేలశాతాల్లో నమోదైన ద్రవ్యోల్బణం అంటే అర్ధం ఏమిటి ? ఒక వస్తువు ధర ఈ క్షణంలో ఉన్నది మరోక్షణంలో ఉంటుందన్న హమీ ఉండదు. చేతిలో ఉన్న కరెన్సీతో ఫలితం ఉండదు. రాయిటర్స్‌ వార్తా సంస్ధ కథనం ప్రకారం కరెన్సీ మారకపురేటును స్ధిరంగా ఉంచేందుకు తీసుకున్న చర్యలతో ఫలితాలు కనిపించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్ధ సరఫరాదార్లకు విదేశీ కరెన్సీ(డాలర్లలో) చెల్లింపులు చేస్తోంది. ఒక ఆశావహ పరిస్ధితి ఏర్పడింది.దీని అర్ధం అంతా బాగుందని కాదు. ప్రభుత్వ టీవీలో దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు నడిచిన హైపర్‌ ద్రవోల్బణం గత చరిత్రే అని, ఐతే ఇప్పటికీ ఈ సమస్య తీవ్రమైనదే అన్నారు.


లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు చెందిన ఐరాస ఆర్ధిక కమిషన్‌ వచ్చే ఏడాది ఈ ప్రాంతదేశాల జిడిపి వృద్ధిరేటు సగటున 2.1శాతం కాగా, వెనెజులా రేటు 3 శాతంగా పేర్కొన్నది. గత ఏడు సంవత్సరాలలో ఇది తొలిసానుకూల సంవత్సరం కావటం గమనించాల్సిన అంశం, 2014 నుంచి ఇటీవలి వరకు దేశ జిడిపి 75శాతం పతనమైంది. మరొక దేశం ఏదైనా ఈ స్థితిని తట్టుకొని నిలిచిందా ? వెనెజులా వామపక్ష పార్టీల ఏలుబడిలో ఉంది తప్ప అమలు జరుపుతున్న విధానాలన్నీ సోషలిస్టు పద్దతులు కావు.ఇటీవలి కాలంలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ, పాలక సోషలిస్టు పార్టీ మధ్యవిభేదాలు కూడా తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. వాటిని అంతర్గతంగా అక్కడే పరిష్కరించుకుంటారు. జనాన్ని ఆదుకొనేందుకు ఉపశమన చర్యలు వేరు, దీర్ఘకాలిక సోషలిస్టు సంస్కరణలు వేరు. సోషలిస్టు క్యూబా, దానికి మద్దతు ఇస్తున్న వెనెజులా వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, బిజెపి పాలిత ప్రాంతాల్లో అధికారపక్షాలు ప్రతిపక్షాలను దెబ్బతీసి తమకు ఎదురు లేదని జనం ముందు కనిపించేందుకు చేస్తున్నదేమిటో తెలిసిందే. లాటిన్‌ అమెరికాలో వామపక్ష పార్టీలు, ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు అమెరికా,కెనడా, ఐరోపా ధనికదేశాలు ఇంతకంటే ఎక్కువగా ప్రాణాలు తీసే దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి.2018లో డ్రోన్‌తో దాడి చేసి మదురోను హత్య చేయాలని చూశారు. అంతర్గత తిరుగుబాట్లను రెచ్చగొట్టి అసలు ప్రభుత్వాన్నే గుర్తించలేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని బహిరంగా ఇచ్చిన పిలుపులు వెనెజులా వ్యతిరేకులకు వీనుల విందుగా ధ్వనించి ఉండాలి.


మన దేశంలో వెయ్యిమంది జనాభాకు 44 కార్లు ప్రపంచంలో కార్లసాంద్రతలో మనం 132వ స్ధానంలో ఉండగా అదే వెనెజులా 96వ స్థానంలో ఉండి 145కలిగి ఉంది.ఐరాస మానవాభివృద్ధి సూచికలో 2021లో మనం 131 స్ధానంలో ఉంటే వెనెజులా 113లో ఉంది. ఈ అంకెల దేముంది అని తోసిపుచ్చవచ్చు, అలాంటి వారిని ప్రమాణంగా తీసుకోవాలా ? వారి నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి ? వారికి నచ్చితే, విలువ లేకపోతే లేదు, ఎంత బాధ్యతా రాహిత్య వైఖరి ? 2021లో ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం 116 దేశాల్లో 101కాగా వెనెజులా 82లో ఉంది. ఎనిమిదేండ్ల మన ఘనమైన పాలన చేసిందేమిటి ?


2014 చమురు మార్కెట్లు పతనం కావటంతో ఎగుమతుల మీద ఆధారపడిన వెనెజులా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా తదితర దేశాల ఆంక్షలతో చమురును వెలికితీసే కంపెనీ ముఖం చాటేశాయి. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. ఒక సమాచారం ప్రకారం 2021 ప్రారంభంలో దేశంలో ఉన్న 41లక్షలకు పైగా ఉన్న కార్లలో సగానికి మాత్రమే అక్కడ ఉత్పత్తి జరిగే పెట్రోలు, డీజిలు సరిపోతుంది. గ్లోబల్‌ పెట్రోల్‌ ప్రైసెస్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం జనవరి 24న అక్కడ లీటరు పెట్రోలు ధర రు.1.87. ఇటీవలి కాలంలో తిరిగి ముడి చమురు ఉత్పత్తితో పాటు ధరలు పెరగటం దానికి ఎంతగానో ఉపశమనం కలిగించింది. డిసెంబరు 2021నాటికి రోజుకు పదిలక్షల పీపాలకు ఉత్పత్తి పెరిగింది. ఆంక్షల కారణంగా ఇప్పటికీ శుద్ధి కర్మాగారాలు మరమ్మతులకు నోచుకోలేదు.


ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వెనెజులాకు ఉపశమనం కలిగిస్తున్నాయి.చైనా, రష్యా, ఇరాన్‌తో చమురు రంగంలో కుదుర్చుకున్న పెట్టుబడుల ఒప్పందాలు కీలకమైనవి.అమెరికా ఆంక్షల కారణంగా దాదాపు వెనెజులా చమురు ఉత్పత్తి నిలిపివేసిన తరుణంలో ఒప్పందం చేసుకున్న ఇరాన్‌ ఆహారం, చమురుటాంక్లను పంపి ఎంతగానో ఆదుకుంది. చాలా మందికి అర్ధంగాని అంశం ఏమంటే వామపక్షాలు అధికారానికి రాకముందే అక్కడి చమురు పరిశ్రమ అమెరికా, ఐరోపా ధనికదేశాల సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైంది. అందువలన దానికి అవసరమైన విడిభాగాలు కావాలంటే పశ్చిమ దేశాల నుంచి, వాటి అనుమతితోనే తెచ్చుకోవాలి. దీన్ని అవకాశంగా తీసుకొని వెనెజులాను అవి దెబ్బతీస్తున్నాయి. రష్యా, ఇరాన్‌ ఇటీవలి కాలంలో ఆ సాంకేతిక పరిజ్ఞానానికి ప్రత్నామ్నాయం కనుగొనటంతో పశ్చిమ దేశాల ఆటలు సాగటం లేదు. భారీ సాంద్రత కలిగిన వెనెజులా ముడిచమురును శుద్ది సమయంలో పలుచన గావించేందుకు అవసరమైన డైల్యూటెంట్‌ను ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది.వీటికి తోడు చమురు తవ్వకరంగంలో పోటీ కూడా వెనెజులాకు కలసివచ్చింది. చిన్న డ్రిల్లింగ్‌ సంస్ధలు ముందుకు వచ్చాయి. అనేక ఆంక్షలను పక్కన పెట్టి తనకు అవసరమైన చమురు కొనుగోలు ద్వారా మరోరూపంలో చైనా పెద్ద ఎత్తున తోడ్పడింది.

అమెరికా చంకలో దూరిన మనవంటి దేశాలపై అమెరికా వత్తిడి తెచ్చి వెనెజులా నుంచి చమురుకొనుగోలును నిలిపివేయించాయి. లాయడ్‌ లిస్ట్‌ ఇంటర్నేషనల్‌ ప్రకారం 2020లో 150ఓడలు మలేసియా మీదుగా చైనా, ఇండోనేషియాలకు వెనెజులా చమురును సరఫరా చేశాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు పుట్టుకు వస్తాడన్నట్లు అమెరికా ఆంక్షలు విధిస్తున్నకొద్దీ ఇతర మార్గాలు అనేక వచ్చాయి. ఈ ఏడాది 17లక్షల పీపాలు అదనంగా ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నారు. ఇరాన్‌, వెనెజులా నుంచి చమురు చౌకగా లభించనుండటంతో పాటు సరఫరా హామీ ఉంటుంది. 1990లో రోజుకు 32లక్షల పీపాల చమురు వెలికి తీసిన వెనెజులా రిగ్గులు అమెరికన్ల దుర్మార్గం కారణంగా దాదాపు నిలిపివేసిన స్ధితికి చేరుకున్నాయి. ఇరాన్‌ తోడ్పాడుతూ రోజుకు నాలుగున్నరనుంచి ఐదులక్షల పీపాల చమురు ఉత్పత్తికి పధకాలు వేశారు.


వెనెజులా ఇబ్బందుల గురించి ఎకసెక్కాలాడటం అపర మానవతావాదులకు ఒక వినోదం. అక్కడి సమస్యలేమిటి ? వాటికి ఎవరు కారకులు అన్నది వారికి పట్టదు.అంగవైకల్యం మీద హాస్యాన్ని పండించి వండి వార్చుకు తినేందుకు అలవాటు పడ్డ చౌకబారు స్దాయికి ఎప్పుడో మనం దిగజారాం. ఒక రొట్టె ముక్క కోసం ఒళ్లప్పగించేందుకు సిద్ద పడుతున్న వెనెజులా పడతులని,సిగిరెట్‌ పీక కోసం దేవురించే వృద్దులున్నారని వర్ణించిన మహానుభావులను చూశాము. ఇక్కడా వక్రదృష్టే. అనేక ఆఫ్రికా దేశాల్లో ఎండు డొక్కలతో కనిపించే పిల్లలు అడుక్కోవటాన్ని, పిల్లలకోసం మానం అమ్ముకొనే తల్లులను ఈ మానవతావాదులు బహుశా చూడలేరు. చూసినా తాగిన ఖరీదైన విస్కీ మత్తు వదలి, అందమైన వర్ణనలు రావు. ఇలాంటి పెద్దలకు మాదాపూర్‌, కొండాపూర్‌ పబ్బుల్లో తాగితందనాలతున్న కొందరు చిన్న పెగ్గు, బిర్యానీ, ఇతర విలాసాల కోసం రాత్రంగా కాలక్షేపసరకుగా మారుతున్న వారు కనిపించరు. వీరు ఏ పేదరికం నుంచి వచ్చినట్లు ? కరోనా లాక్‌డౌన్‌ తరుణంలో అనేక మంది యువతులు ఆధునిక దస్తులు వేసుకొని వైన్‌ షాపుల ముందు వరుసలు కట్టింది కనిపించలేదా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనెజులాతో పోల్చుకొనే పరిస్ధితులేమీ లేవు కదా ? చీకటిపడితే చాలు వెలుతురులేని సందులు, గోడలు, లైటు స్థంభాలపక్కన కడుపు కక్కుర్తి కోసం కనిపించే అభాగినులు చేయితిరిగిన రచయితలకు కథావవస్తువులౌతారు. వారిపట్ల సానుభూతో మరొక పేరుతో సొమ్ము చేసుకుంటారు. వెనెజులాలో సంక్షేమ పధకాలే ఈ స్ధితికి తెచ్చాయట, ఎంత కుతర్కం.


ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేరుతో 2019 నుంచి ఒక చిన్న విశ్లేషణ సామాజిక మాధ్యమంలో తిరుగుతోంది, కొన్ని పత్రికల్లో కూడా అచ్చయింది. పదవి కోసం పెన్షన్లు, రుణ మాఫీలూ, వుచిత సర్వీసుల ఆఫర్‌ ద్వారా మన నాయకులు దేశాన్ని మరో వెనిజులా చేస్తున్నారా, ఒళ్లు గగుర్పొడిచే ఈ చరిత్ర చదవండి అంటూ రాశారు. అది చరిత్రా కాదు, రాసిన వీరేంద్రనాథ్‌ చరిత్ర కారుడూ కాదు అంటూ అప్పుడే ఈ రచయిత స్పందించాడు. ఇన్నేండ్ల తరువాత కూడా అదే ప్రచారం అటూ ఇటూ మారి జరుతోంది. ఎంత పెద్ద అబద్దాలను అలోకగా ఆడతారంటే 1970లో వెనిజులా ప్రపంచపు 20 ధనిక దేశాల్లో ఒకటి’ అని రాశారు. నిజమా అమెరికా లెక్కల ప్రకారం 210, ఐఎంఎఫ్‌ అంచనా మేరకు 191, ఎక్కడనా పోలీక ఉందా ?


అమెరికాకు వెనెజులా అంటే ఎందుకు పడదు ? ఎక్కడన్నా గట్టు తగాదా ఉందా లేదే ? సైద్దాంతిక, అదీ వామపక్ష ప్రభావం పెరటాన్ని తట్టుకోలేకపోతోంది. ప్రపంచీకరణలో అమెరికా ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్ధలోకి ప్రవేశించకుండా వెనిజులాను అడ్డుకోవటం ఒక విద్రోహ చర్య అని వార్త రాయలేని పత్రికా స్వేచ్చ మనది మరి., వెెనిజులా బంగారు నిల్వలను తిరిగి తీసుకొనేందుకు నిరాకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ చర్య చట్టవిరుద్దం, లేదా దోచుకోవటం అని రాయటం కూడా కష్టమే అంటూ జర్నలిస్టు జాన్‌ పిల్గర్‌ చలోక్తి విసిరాడు. ఒళ్లు గగుర్పొడిచే పచ్చినిజాలు ఇవి. ‘2008లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి, ధరపెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నాడు’ ఇది హ్యూగో ఛావెజ్‌ గురించి రాశారు.(అసలు ఆ ఏడాది ఎన్నికలే జరగలేదు)
ఎవరీ ఛావెజ్‌ ? 1977లో ఒక సైనికుడిగా ఒక వామపక్ష తీవ్రవాద సంస్ధను అణచివేసేందుకు వెళ్లిన ఆయన, వారెందుకు తీవ్రవాదులుగా మారారు, రాజ్యం వారినెందుకు అణచివేస్తున్నది అనే అంతరంగ మధనంతో వామపక్ష వాదిగా మారిన వ్యక్తి. 1989లో కార్లోస్‌ అండ్రెజ్‌ పెరోజ్‌ అనే పెద్ద మనిషి తాను ఎన్నికైతే అమెరికా వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకుంటానని, ఐఎంఎఫ్‌ విధానాలను వ్యతిరేకిస్తాననే వాగ్దానాలతో అధికారానికి వచ్చి అందుకు వ్యతిరేకంగా వ్యవహించాడు. అతని విధానాలు నచ్చని మిలిటరీ అధికారిగా వున్న ఛావెజ్‌ 1992లో విఫల తిరుగుబాటు చేశాడు. అందుకుగాను ప్రభుత్వం జైల్లో పెట్టింది. 1994లో అధికారానికి వచ్చిన కొత్త ప్రభుత్వం ఛావెజ్‌ను, ఆయనతో పాటు జైల్లో పెట్టిన ఇతర తిరుగుబాటుదార్లను విడుదల చేసింది. మిలిటరీలో తిరిగి చేరకూడదని ఆంక్షలు విధించింది. 1998 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో, వామపక్ష, వుదారవాద, ప్రజాస్వామిక అభిప్రాయాలు కలిగిన వివిధ సంస్ధలు, పార్టీలతో ఏర్పడిన వెనిజులా ఐక్యసోషలిస్టు పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. నూతన రాజ్యాంగం మేరకు 1999లో మరోసారి ఎన్నికలు జరిపి రెండోసారి అధికారానికి వచ్చారు. 2006 డిసెంబరులోనే జరిగాయి, మరుసటి ఏడాది జనవరిలో మూడోసారి అధికారంలోకి వచ్చారు. నాలుగోసారి 2012లో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కాన్సర్‌ కారణంగా ఆసుపత్రిలో వున్నందున ప్రమాణస్వీకారం చెయ్యలేదు. అయితే అధికారంలో వుండి తిరిగి గెలిచినందున ప్రమాణస్వీకారం మరోసారి చేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు మినహాయింపు ఇచ్చింది.అయితే ఆరోగ్యం విషమించి 2013 మార్చి ఐదున మరణించారు. వుపాధ్యక్షుడిగా వున్న నికొలస్‌ మదురో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. తరువాత ఎన్నికల్లో మదురో గెలుస్తున్నారు.

వెనెజులాలో వున్నది వామపక్ష ప్రభుత్వం. అంతకు ముందు అక్కడ అనుసరించిన నయా వుదారవాద విధానాలను పూర్తిగా మార్చకుండా జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకుంటున్నది. దాని ఆదాయం నూటికి 95శాతం చమురు ఎగుమతుల మీదే ఆధారపడి వుంది. అలాంటి చమురును అమ్ముకోనివ్వకుండా అమెరికా ఆంక్షలు పెడుతున్నది, అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే పరిమితం అమ్ముకుంటున్నదానికి అయినా నాలుగు డాలర్లు వస్తాయి లేకపోతే ఇబ్బందే. ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నది. వాటినుంచి గుణపాఠాలు తీసుకొని మెరుగైన విధానాల గురించి అక్కడ మధనం జరుగుతోంది. అక్కడి జనమే వాటిని నిర్ణయించుకుంటారు.సంక్షమే పధకాలను వ్యతిరేకించటం ప్రపంచంలో కడుపు నిండిన వారికి ఒక ఫ్యాషన్‌. దాన్ని సూటిగా చెబితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ అందుకు వెనిజులాను సాకుగా చూపటమే అభ్యంతరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాటో బలగాల సమీకరణ ఉక్రెయిన్‌లో పోరుకు దారి తీస్తుందా ?

25 Tuesday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, NATO massive arms buildup, RUSSIA, Ukraine war, US imperialism, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


మంగళవారం తెల్లవారేసరికి రెండు ప్రధాన అంతర్జాతీయ వార్తలు. ఒకటి రష్యాదిశగా నాటో నావిక, వైమానిక దళాల తరలింపు. తూర్పు ఐరోపా దేశాలకు 50వేల మందివరకు సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సర్కార్‌ చర్చలు. భద్రతా చర్యల్లో భాగంగా తైవాన్‌ ప్రాంతంపై చక్కర్లు కొట్టిన చైనా వైమానిక దళ విమానాలు. ఉక్రెయిన్‌ నుంచి అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తమ దౌత్యసిబ్బంది, కుటుంబాలను స్వదేశాలకు రావాలని ఆదేశించాయి. ఈ పరిణామాలకు పూసల్లో దారం మాదిరి సంబంధం ఏమైనా ఉందా ? అంతర్జాతీయ రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తుల్లో భాగంగా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం.కార్యాకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. చైనా గనుక తైవాన్‌ ప్రాంతాన్ని బలవంతంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే తాము సాయుధ జోక్యం చేసుకుంటామని అంతకు ముందు డోనాల్డ్‌ట్రంప్‌, ఇప్పుడు బైడెన్‌ పదే పదే హెచ్చరించిన అంశం తెలిసిందే. అలాగే దక్షిణచైనా సముద్రం, తైవాన్‌ జలసంధిలోకి అమెరికా యుద్ద నావలను నడిపించిన అంశం తెలిసిందే. ఒక్క చిన్న యుద్ద రంగంలోనే గెలుపెరగని అమెరికా, దాని అనుచర దేశాలు ఒకేసారి రెండు చోట్ల యుద్ధానికి – అదీ బలమైన రష్యా, చైనాలతో తలపడతాయా ?


ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే రష్యాను రెచ్చగొట్టేందుకు పశ్చిమ దేశాలు కవ్వింపులకు పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తొలి దశలో వెయ్యి నుంచి ఐదువేల మంది వరకు మిలిటరీని రుమేనియా, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియా దేశాలకు పంపాలని తరువాత 50వేలు, అంతకు మించి కూడా మోహరించాలని అమెరికన్లు చర్చలు జరుపుతున్నారు. బాల్టిక్‌, నల్లసముద్ర ప్రాంతంలోని ఈ దేశాల నుంచి కొద్ది నిమిషాల్లోనే రష్యాపై క్షిపణి దాడులు జరిపేందుకు వీలు కలుగుతుంది. పశ్చిమ దేశాల కదలికలు, ప్రకటనలను గమనించిన రష్యా సరిహద్దులకు లక్ష మంది సైనికులను తరలించినట్లు వార్తలు. ఐరోపా గడ్డమీద రెండవ ప్రపంచ పోరు తరువాత అతి పెద్ద యుద్ధం అవుతుంది కనుక తాము ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని ఇంత పెద్ద ఎత్తున ఆయుధ తరలింపును తాము చూడలేని అమెరికా ప్రతినిధి విండ్‌మాన్‌ చెప్పాడు.


నిజంగా యుద్ధం జరుగుతుందా ? అసలెందుకీ హూంకరింపులు ? ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యం, జాతీయ సమగ్రత పరిరక్షణకోసమే ఇది అంటున్నారు. ఇదొక పెద్ద అబద్దం. రష్యాను దెబ్బతీయాలంటే దాని సరిహద్దులకు నాటోను విస్తరించాలన్నది అమెరికా ఎత్తుగడ.2014లో రష్యాకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌ పాలకులను కుట్ర చేసి గద్దెదింపారు. తాజా ఉద్రిక్తతలకు మూలం, రష్యా-ఉక్రెయిన్‌ విబేధాలకు 2013 పరిణామాలు నాంది. ఐరోపా యునియన్‌తో ఆర్ధిక సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్న ప్రతిపాదనను నాటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ యనుకోవిచ్‌ తిరస్కరించాడు. 2013 నవంబరులో దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శకులకు అమెరికా, ఐరోపా దేశాలు, యనుకోవిచ్‌కు రష్యామద్దతు ఇచ్చింది. ఆర్ధిక సంబంధాల ముసుగుతో నాటోలో చేర్చుకోవాలని అమెరికా చూస్తే, వ్యతిరేకించి నిలువరించాలన్నది రష్యాఎత్తుగడ. మరుసటి ఏడాది ఫిబ్రవరిలో యనుకోవిచ్‌ దేశం వదలిపారిపోయాడు. మార్చినెలలో క్రిమియా ప్రాంతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ జనం రష్యాతో కలవాలని తీర్పు చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకొని రష్యా తనతో విలీనం చేసుకుంది.(గతంలో రష్యా రిపబ్లిక్‌లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని నాటి సోవియట్‌ పాలకులు పాలనా సౌలభ్యత కోసం ఉక్రెయిన్‌లో కలిపారు.) మరో రెండు నెలల తరువాత తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటు వాదులు డోన్‌టెస్క్‌, లుహాన్‌స్క్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపగా వేరుపడాలని జనం చెప్పారు. దాన్ని ఉక్రెయిన్‌ తిరస్కరించింది. తరువాత అక్కడి వేర్పాటు వాదులు ఆయుధాలు పట్టి అనేక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. ఇప్పటికీ అదే స్ధితి కొనసాగుతోంది. వారికి రష్యా మద్దతు ఇస్తోంది.2015లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ ఎవరూ దానికి కట్టుబడిలేరు. అంతర్యుద్దంలో 15వేల మంది మరణించారని అంచనా.


ఇప్పుడు ఆ వేర్పాటువాదులు కోరుతున్నట్లుగా వారిని రష్యా గుర్తించినా లేదా వారికి మద్దతుగా సైన్యాన్ని పంపినా ఆ పేరుతో రష్యా మీద దాడికి దిగాలన్నది అమెరికా ఎత్తుగడ. అందుకుగాను పచ్చి అవాస్తవాలను ప్రచారంలో పెట్టారు. మధ్యధరా సముద్రంలో నాటో కూటమి ఇప్పుడు ” నెప్ట్యూన్‌ స్ట్రైక్‌ 22” పేరుతో ఫిబ్రవరి నాలుగు వరకు సైనిక విన్యాసాలు జరుపుతున్నది. ఇంకా డైనమిక్‌ మంటా 22, డైనమిక్‌ గార్డ్‌, కోల్డ్‌ రెస్పాన్స్‌ 22 పేరుతో కూడా సైనిక విన్యాసాలు జరపనున్నాయి. ఇవన్నీ బలప్రదర్శన తప్ప మరొకటి కాదు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, విదేశాంగశాఖ చేసిన ప్రకటనలో ఉక్రెయిన్‌లో తన అనుకూల మాజీ ఎంపీ మురాయెవ్‌ను గద్దెమీద నిలిపేందుకు రష్యాకుట్ర పన్నినట్లు ఆరోపించింది. దీని మీద స్పందించిన అతగాడు బ్రిటన్‌ గాలితీశాడు. బ్రిటన్‌ విదేశాంగశాఖ గందరగోళంలో ఉన్నట్లుంది.రష్యా నామీద నిషేధం విధించింది, అంతేకాదు నాతండ్రి సంస్ధ నుంచి డబ్బుతీసుకోకుండా ఆ సంస్ధనే స్వాధీనం చేసుకుందని చెప్పాడు. అయినా సరే ప్రచారం ఆపలేదు, అమెరికా దాన్ని లంకించుకుంది. నాటో దేశాల్లో 20లక్షల మందికి పైగా కరోనాతో మరణించినా వారికి పట్టలేదు. ఉక్రెయిన్‌ ప్రజాస్వామ్యం పేరుతో కవ్వింపులకు దిగుతున్నారు.ప్రజారోగ్యరక్షణ ఖర్చును ఆయుధాల మీద ఖర్చు చేస్తున్నారు.


సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసి, స్వాతంత్య్రం ప్రకటించుకున్న తరువాత ఉక్రెయిన్‌ కుక్కలు చింపిన విస్తరిలా మారింది. ఎవరికి దొరికిన ప్రజాసంపదలను వారు స్వంతం చేసుకున్నారు. నడమంత్రపు సిరిగాళ్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు అన్ని రంగాలను వారే శాసిస్తున్నారు.మీడియా, అధికారులు, న్యాయమూర్తులు, ఎంపీలు అందరూ సంతలోని సరకులుగా మారారు. ఎవరికి వారు స్వంత సాయుధ ముఠాలను ఏర్పాటు చేసుకున్నారు. ఫాసిస్టు శక్తులు రాజకీయాల్లోకి వచ్చాయి. 2014లో రష్యా అనుకూల యనుకోవిచ్‌ను గద్దె దించేందుకు ఐదు బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు అమెరికా విదేశాంగ సహాయమంత్రి విక్టోరియా న్యూలాండ్‌ స్వయంగా చెప్పారు.నాటి జర్మన్‌ మంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపాడు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులతో తలపడేందుకు ఏర్పాటు చేసిన అజోవ్‌ రెజిమెంట్‌ అనే కిరాయి సాయుధమూకకు 2014 కుట్రలో జైలు నుంచి విడుదలైన నేరగాడు ఆండ్రీ బిలెట్‌స్కీ నేత. పచ్చి నాజీ. ఇలాంటి ముఠాలను ఉక్రెయిన్‌ మిలిటరీతో సమన్వయం చేసి వేర్పాటువాదుల మీదకు వదులుతున్నారు. ఈ రెజిమెంట్‌కు మీడియా,రాజకీయపార్టీ, సాయుధ శిక్షణా కేంద్రాలు, ఆయుధాలు ఉన్నాయి.


వివిధ కారణాలతో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తమ స్వంత మిలిటరీ సిబ్బంది పాత్ర నామమాత్రం గావించి కిరాయి మూకలను దించటం ఇటీవలి కాలంలో నానాటికీ పెరుగుతోంది. సిరియాలో అది స్పష్టంగా కనిపించింది. గత కొద్ది సంవత్సరాలుగా అలాంటి మూకలకు కేంద్రంగా ఉక్రెయిన్‌ మారింది.గత ఆరు సంవత్సరాలుగా 50దేశాల నుంచి 17వేల మందికి పైగా కిరాయి మూకలు అక్కడకు వచ్చినట్లు ఎఫ్‌బిఐ మాజీ ఏజంట్‌ అలీ సౌఫాన్‌ చెప్పినట్లు గతేడాది టైమ్‌ పత్రిక రాసింది. వీరందరికి అక్కడి అమెరికా అనుకూల ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.అజోవ్‌ సంస్ధను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధగా ప్రకటించాలన్న 40 మంది ఎంపీల వినతిని అమెరికా సర్కార్‌ బుట్టదాఖలు చేసింది.ఇలాంటి నయా నాజీ మూకలకు అమెరికా శిక్షణ, ఆయుధాలను అందచేస్తోంది. ఇది బరాక్‌ ఒబామా ఏలుబడి నుంచీ జరుగుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన సరిహద్దు రక్షణ దళాలతో పాటు ప్రయివేటు సాయుధ ముఠాలకూ శిక్షణ ఇస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక గతేడాది డిసెంబరు 26న రాసింది. ఇప్పుడు మిలిటరీతో పాటు ఇలాంటి ముఠాలను కూడా సన్నద్దం చేయటాన్ని బట్టి వారిని ఎలా ఉపయోగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాన్ని, ఉద్యమించే కార్మికవర్గాన్ని అణచేందుకు, రష్యాతో గిల్లి కజ్జాలు పెట్టుకొనేందుకు వీరిని ముందుకు నెట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్లోని డోన్‌టెస్క్‌,లుహానస్క్‌ ప్రాంతాలలో వేర్పాటు వాదులపైకి వీరిని ఉసిగొల్పితే వారికి మద్దతుగా రష్యా రంగంలోకి దిగవచ్చని, దాన్ని సాకుగా చూపి నాటో దేశాలు దాడులకు పూనుకొనే ఎత్తుగడ కూడా ఉంది. ఇది ఒక అంశం మాత్రమే.


మరో రెండు దశాబ్దాల వరకు నాటో కూటమిలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వబోమని రష్యాను నమ్మించేందుకు అమెరికా పూనుకుంది. అమెరికా కడుపులో దుష్టాలోచన లేకపోతే ఇప్పుడు ఆయుధ సమీకరణ ఎందుకు అని అనుమానించిన రష్యా రిజర్వు దళాలు, క్షిపణులను మోహరిస్తున్నది.పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికన్‌ మీడియా యుద్దోన్మాదంతో ఊగిపోతున్నది.జనానికి ఎక్కిస్తున్నది. ఏక్షణమైనా దాడులు జరగవచ్చంటూ వర్ణిస్తున్నది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఉక్రెయిన్‌లో మూడు లక్షల మందికి ఆయుధ శిక్షణ ఇచ్చామని వారికి ఆయుధాలు, డబ్బు అందచేస్తే వారే రష్యా సంగతి చూసుకుంటారని తన మిత్రదేశాలకు అమెరికా చెప్పినట్లు వార్తలు. నాటో కూటమి దేశాలన్నింటా మీ చావు మీరు చావండి, కరోనాతో సహజీవనం చేయండి అంటూ వదిలేసిన పాలకుల మీద కార్మికవర్గం ఆగ్రహంగా ఉంది. అటువంటపుడు యుద్ధానికి మద్దతు ఏమేరకు ఇవ్వగలరన్నది సందేహమే. ఇదే విధంగా రష్యాలో వ్లదిమిర్‌ పుతిన్‌ స్ధితి కూడా అంత సానుకూలంగా లేదు. అందువలన రెండు పక్షాలూ బేరసారాలు తప్ప తెగే దాగా లాగే పరిస్ధితి ఉండకపోవచ్చు.

పుతిన్‌ మాటకు గౌరవం, విలువ ఇవ్వాలంటూ ఢిల్లీలో మాట్లాడిన జర్మన్‌ నౌకాదళాధిపతికి స్వదేశం వెళ్లే సరికి ఇక చాలు ఇంటికి దయచెయ్యండి అనే వర్తమానం సిద్దంగా ఉంది. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని విచారం వెలిబుచ్చినా పదవి ఊడింది. మరోవైపు ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వకూడదని జర్మనీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. ఎస్తోనియాకు తాము అందచేసిన వాటిని కూడా ఉక్రెయిన్‌కు తరలించరాదని షరతు పెట్టింది. రష్యాతో సంబంధాల అంశంలో జర్మనీలో భిన్న వైఖరులున్నట్లు ఈ పరిణామాలు వెల్లడించాయి.ఆర్ధిక ఆంక్షలపై జర్మనీ అంగీకరించటంలేదు. రష్యానుంచి పెద్ద గాస్‌ సరఫరా ప్రాజెక్టుకు జర్మనీ మద్దతు ఇస్తున్నది. ఐరోపా యునియన్‌ నుంచి వెళ్లిపోయిన బ్రిటన్‌ మాత్రం అమెరికాకు పూర్తి మద్దతు ఇస్తోంది.ఇప్పటికే ఆర్ధిక ఆంక్షలకు అలవాటు పడిన రష్యా ఇంతకంటే తమను చేసేదేముందనే తెగింపుతో ఉంది.
ఉక్రెయిన్‌ వేర్పాటు వాద ప్రాంతాలను స్వతంత్రదేశాలుగా రష్యా గుర్తిస్తే స్వల్పవివాదం తలెత్తవచ్చు. అది కూడా వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ మిలిటరీకే పరిమితం కావచ్చు తప్ప నాటో రష్యా పోరుగా మారే అవకాశాలు పరిమితం. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, ఉక్రెయిన్‌కు అందచేసిన ఆయుధాలను వెనక్కు తీసుకోవాలని రష్యాకోరుతోంది. అమెరికా నిరాకరిస్తోంది.ఉక్రెయిన్‌ నాటో కూటమికి దగ్గరగా ఉన్నప్పటికీ దానిలో సభ్యురాలు కాదు. గతంలో జార్జియాలో రెండు ప్రాంతాలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నపుడు రష్యాగుర్తించింది. రెండు దేశాల మధ్య 2008లో స్వల్పపోరు జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరి పరిణామాలు ఉంటాయా ? ప్రతి మేఘం వర్షించదుా ప్రతి ఉరుముకూ పిడుగులు పడవు. ప్రతి పరిణామమూ వినాశకర పోరుకు దారితీయదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమ ప్రయోగాలకు నల్లజాతి అమెరికన్లు, దళితులను కమ్యూనిస్టులు వాడుకుంటున్నారా !

23 Sunday Jan 2022

Posted by raomk in CHINA, CPI(M), Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Black Americans, communism, discrimination against dalits india, Left politics, US anti communism


ఎం కోటేశ్వరరావు


” కమ్యూనిజం ప్రయోగాల కోసం నల్లజాతి అమెరికన్లను ఉపయోగించుకుంటున్న పురోగామివాదులు ” అనే శీర్షికతో ఇటీవల ఒక విశ్లేషణను అమెరికా మీడియాలో చదివాను. వెంటనే మన దేశంలో దళితులను కమ్యూనిస్టులు ఉపయోగించుకుంటున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం గుర్తుకు వచ్చింది. అమెరికాలో లేదా మన దేశం, మరెక్కడైనా ఇలాంటి ప్రచారం చేస్తున్న వారు రెండు రకాలు. ఒకటి ఒక పధకం ప్రకారం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసే మేథావులు, రెండో తరగతి వారి ప్రచారదాడి బాధితులుగా మారిన వారు. కమ్యూనిజం, పురోగామివాదులపై చేసిన దాడికి పాల్పడిన ఆడమ్‌ బి కోల్‌మన్‌ ” బ్లాక్‌ విక్టిమ్‌ టు బ్లాక్‌ విక్టర్‌ ” అనే పుస్తక రచయిత కూడా, ఆఫ్రో-అమెరికన్‌ అని వేరే చెప్పనవసరం లేదు.


ఏమంటాడు ఇతను ? ” అమెరికాలో నేడు నల్లవారు ఫుట్‌బాల్‌ బంతుల్లా ఉన్నారు. వారిని ఎవరు ఎప్పుడు ఎటు తంతారో తెలియదు. నల్లవారికి తమ మీద అదుపు ఉండదు. ఆధునిక రాజకీయాల్లో రాణించాలంటే నల్లజాతి వారికి సాయం అనే అంశాన్ని సోపానంగా చేసుకుంటున్నారు. సాయం చేస్తున్నట్లు చెప్పుకోవటం వేరు నిజంగా సాయం చేయటం వేరు. పురోగామివాదులు ఊహాజనిత కమ్యూనిస్టు జ్వర ప్రేలాపనలో నల్లజాతి అమెరికన్లను ఒక ప్రయోగశాలలో మాదిరి వాడుతున్నారు. అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని ఉపయోగించుకొని నల్లజాతీయులను ధనికులు కాకుండా అడ్డుకుంటున్నారు.” అన్నం ఉడికిందో లేదో చూసేందుకు ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలు అన్నట్లుగా అతగాడు రాసిందాన్ని మొత్తం పునశ్చరణ చేయాల్సిన అవసరం లేదు. నల్లజాతీయుడై ఉండి ఒక వైపు జాత్యహంకార వివక్ష ఉంది, దాడులు నిజమే అని సన్నాయి నొక్కులు నొక్కుతూ అక్కడి దోపిడీ వ్యవస్ధకు మద్దతు ఇచ్చే, కమ్యూస్టు వ్యతిరేకతను అడుగడుగునా వెల్లడించిన కోల్‌మన్‌ వాదనల గురించి ఎంత చెప్పుకున్నా వాటి చుట్టూనే తిరుగుతుంటాయి.


కోల్‌మన్‌ ఇంకా ఎంత కుతర్కం చేశాడో చూడండి ” అమెరికా చరిత్రలో నల్లజాతీయులు హతులయ్యారా ? నిస్సందేహంగా ఎలాంటి మినహాయింపుల్లేవు. పోలీసులు నల్లజాతీయులను అన్యాయంగా కాల్చి చంపారా ? అవును. కానీ జాత్యహంకారం ఉనికిలో ఉండటం, జాత్యహంకార అన్యాయం జరుగుతుండటాన్ని ఉపయోగించుకొని సర్వకాలాల్లో అందరిని సమానంగా చూస్తారు, ప్రతిభతో నిమిత్తం లేకుండా అందరికీ సమంగా ఉత్పత్తిని పంచుతారు అనే ఊహాజనితమైన వైఖరివైపు అమెరికా జనాన్ని వామపక్షం లాగుతున్నది. ఇది కేవలం ప్రహసన ప్రాయమైన అసాధ్యం. సమాజం పని చేసేందుకు అవసరమైన ప్రతిదాన్నీ నాశనం చేయాలని, దానిలోనే జీవించాలని, అదే సరైనదని చెబుతారు… అమెరికా అంతటా పట్టణాల్లో జరుగుతున్నదాన్ని మీరు చూడవచ్చు.శాన్‌ఫ్రాన్సిస్‌కోలో చివరికి పట్టపగలు కూడా దొంగతనాలు జరగటం సర్వసాధారణం. ఇళ్లు లేని వారు నగరమంతటా ఎక్కడబడితే అక్కడ వారు అనుకున్న చోట గుడారాలు వేస్తున్నారు, అనుకున్న ప్రతిదాన్నీ అపరిశుభ్రంగావిస్తున్నారు. తప్పుడు విధానాలు దీనికి కారణం కావచ్చు గానీ ఇదంతా మన సమాజాన్ని నిర్వీర్యం చేసేందుకే పధకం ప్రకారం చేస్తున్నది. మార్క్సిస్టు భావజాలపు ప్రత్యక్ష ప్రభావం ఇది ”


1950దశకంలో ఆంధ్రదేశంలో కమ్యూనిస్టుల ప్రభావం బలంగా ఉన్న సమయంలో వ్యతిరేకులు ఇలాంటి ప్రచారాలే చేశారు. మనకు ఐదువేళ్లు సమంగా ఉండవు కదా, కమ్యూనిస్టులు వస్తే అన్నింటినీ సమంగా నరికేస్తారు. మీకు రెండు చొక్కాలు, పంచెలు ఉంటే ఒకటి లాక్కుని లేనివారికి ఇస్తారు. ఇంటిని సగం చేసి మిగతాది లేని వారికి అప్పగిస్తారు. ఎవరైనా వ్యతిరేకిస్తే నెత్తిమీద సుత్తితో కొట్టి కాడవలితో గొంతు కోస్తారు, ఇంకా నోరుబట్టని ప్రచారాలతో జనాన్ని రెచ్చగొట్టారు. అన్నింటినీ ధ్వంసం చేస్తామని కమ్యూనిస్టులు ఎక్కడ చెప్పారు. మనిషిని మనిషి దోచుకొనే పద్దతిని నాశనం చేస్తామన్నారు, దోపిడీకి రక్షణగా , జనానికి వ్యతిరేకంగా ఉండేవారి సంగతి చూస్తామన్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలోనో మరొక నగరంలో జనానికికందరికీ ఇంటి వసతి కల్పిస్తే రోడ్లమీద గుడారాలు ఎందుకు వేస్తారు. పని, ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తే ఎవరైనా దొంగతనాలు చేస్తారా ? నల్లవారు కనిపించగానే ఉట్టిపుణ్యానికే రెచ్చిపోతున్న పోలీసులను అదుపు చేస్తే ఎందుకు తిరగబడతారు ? అలాంటి పరిస్ధితులను నివారిస్తే కమ్యూనిస్టులు, మరొక పురోగామి, ప్రజాస్వామ్యవాదులతో పనేముంటుంది ?


మన దేశంలో కూడా దళితుల పేరుతో ఇలాంటి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగారు. దీనికి అమెరికాలోని కోల్‌మన్‌ వంటి వారి ప్రభావం ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికాలోని నల్లజాతివారు, దళితులకు అనేక పోలికలు కనిపిస్తాయి. ఇరువురూ బాధితులే. రాబిన్‌హుడ్‌ మాదిరి ఒక వీరుడు వచ్చి వారిని విముక్తి చేస్తాడని, దోపిడీ, వివక్ష నుంచి రక్షిస్తాడని ఎవరూ చెప్పలేదు. తామే విముక్తి చేస్తామని కమ్యూనిస్టులూ వకాల్తాపుచ్చుకోలేదు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నారు అంటే ఎవరి విముక్తికి వారు ముందుకు రావాలనే తప్ప మీరు అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండండి మేమే పోరాడతాం అనటం లేదు. జనం జరిపే పోరాటాల్లో ముందుంటాం అని దారి చూపుతున్నారు. అణగారిన తరగతులు వారు ఎవరైనప్పటికీ వారినందరినీ కమ్యూనిస్టులు వినియోగించుకుంటూ వారిని జెండాలు మోసేవారిగానే పరిమితం చేస్తున్నారనే ఆరోపణలు, వక్రీకరణలు తెలిసిందే. మహత్తర తెలంగాణా సాయుధ పోరాటంలో నైజాం, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు ? మల్లు స్వరాజ్యం వంటి వారంతా దొరల కుటుంబాలనుంచి వచ్చి తుపాకి పట్టిన వారే కదా ! వారితో పాటు వెట్టి,అణచివేతకు గురైన వారందరూ కూడా బందూకులు పట్టారు. ఆ పోరాటంలో ఎవరు అమరులైందీ ఆ గ్రామాలు, పట్టణాల్లో ఎవరిని అడిగినా చెబుతారు.కమ్యూనిస్టులు వాడుకుంటారు అని చెప్పేవారు కేరళలో వరుసగా రెండోసారి సిఎంగా చరిత్ర సృష్టించిన పినరయి విజయన్‌ గురించి ఏమి చెబుతారు ? ఒక గీత కార్మికుడి కుమారుడు కదా !


కుల వివక్ష సమస్యను కమ్యూనిస్టులు గుర్తించలేదు అన్నది ఒక విమర్శ. ఇది కూడా వక్రీకరణే, వాస్తవం కాదు. అంబేద్కర్‌ కంటే ముందే నారాయణ గురు, అయ్యంకలి వంటి సంస్కరణవాదులెందరో కులవివక్ష పోవాలని చెప్పి ఎంతో కృషి చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎకె గోపాలన్‌ వంటి ఎందరో కమ్యూనిస్టులు దళితుల దేవాలయ ప్రవేశం వంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సోషలిస్టు వ్యవస్ధలో ఆర్ధిక అంతరాలను రూపుమాపితే తప్ప కుల సమస్య పరిష్కారం కాదని భావించిన కారణంగానే మొదటిదానికే ప్రాధాన్యత ఇచ్చారనిపిస్తుంది. ప్రతి సంఘసంస్కరణ ఉద్యమాన్ని సొంతం చేసుకున్న కమ్యూనిస్టులు దళిత కులవివక్షను పట్టించుకోలేదనటం వక్రీకరణే. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాటితో పోలిస్తే సిపిఎం నేతలు ఆ సమస్యను మకింత స్పష్టంగా గుర్తించారు గనుక కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐనా వర్గ సమస్యకు ఇచ్చినంత ప్రాధాన్యతను వర్ణ అంశానికి కూడా ఇచ్చి పోరాడలేదని సానుకూలంగా విమర్శిస్తే అదొకదారి. అందుకు సూచనలు చేయవచ్చు. శత్రుపూరిత దాడికి దిగితే ఏమనాలి ?


వర్గ శత్రువు కంటికి కనిపించేది, వర్ణశత్రువు స్వభావం అలాంటిది కాదు. ముందు కులాన్ని నిర్మూలించిన తరువాత వర్గ నిర్మూలన చేపట్టాలని చెప్పేవారు కమ్యూనిస్టులతో నిమిత్తం లేకుండా అంబేద్కర్‌ కాలం నుంచి ఇప్పటి వరకు ఎంత మేరకు జనాన్ని కూడగట్టారో, ఎంత పురోగతి సాధించారో ఒక్కసారి నెమరువేసుకోవాలి. చివరికి అంబేద్కర్‌ను సైతం ఒక కులానికి ప్రతినిధిగా దిగజార్చారనే విమర్శ ఉంది కదా ! కులవివక్షనే వ్యతిరేకించేందుకు మద్దతు తెలపని స్ధితిలో కుల నిర్మూలనకు పిలుపు ఇవ్వటం నేలవిడిచి సాము కాదా ! చట్టాలు, సంస్కరణలతో వెంటనే సామాజిక మార్పులు రావని అనేక దురాచారాల అంశంలో రుజువైంది. రిజర్వేషన్లను అనుభవించేందుకు కులాలవారీ వర్గీకరణ చేయాలనే ఒక ప్రజాస్వామిక డిమాండ్‌నే దళితులలో కొందరు అంగీకరించకుండా వీధులకు ఎక్కుతున్న స్ధితి ఉంది. దేశంలో కులనిచ్చెనమెట్లు అన్ని కులాల్లో ఉన్నాయి. ఇలాంటి వాటినే పరిష్కరించలేని స్ధితిలో మొత్తంగా కులనిర్మూలన అంశాన్ని చేపట్టాలనే వాదన ఆచరణాత్మకóమా ? లేదూ సాధ్యమే అని నమ్మేవారు అందుకోసం పోరాడితే ఎవరూ తప్పు పట్టరు. ఆర్ధిక సమస్యల మీద పోరాడేందుకే జనం ముందుకు రావటం లేదన్నది ఒక కఠోరవాస్తవం. నరనరాన వేల సంవత్సరాలుగా జీర్ణించుకుపోయిన కులవివక్ష అంశం ఎక్కడైనా ముందుకు వచ్చినపుడు దాని మీద పోరాడటం, మిగతా సమయాల్లో ఈ అంశాన్ని ప్రచారం చేస్తూ వర్గ సమస్యతో జమిలిగా చేపట్టటం ఆచరణాత్మక అంశం అవుతుంది.


ఇక్కడ ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఆఫ్రికా నుంచి అమెరికాకు అక్కడి జనాలను బానిసలుగా తీసుకురావటం 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. మన దేశంలో దళితులను కొన్ని వేల సంవత్సరాల నాడే సృష్టించారు. అనేక దేశాలలో ఆఫ్రికన్‌ బానిసల వారసులు గానీ, దళితులు గానీ లేరు. కమ్యూనిస్టు సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ గానీ, వారికి ముందున్న ఊహాజనిత సోషలిస్టులు కానీ నల్లజాతీయులు లేదా దళితుల కోసమే కమ్యూనిస్టు సిద్దాంతం అని గానీ, వారితోనే ప్రయోగాలు చేయాలని గానీ ఎక్కడా చెప్పలేదు. భవిష్యత్‌లో కమ్యూనిస్టు సిద్దాంతం పుడుతుందని, దాని ప్రయోగాలకు వీరిని సిద్దం చేసి ఉంచాలని వారిని వందలు, వేల ఏండ్లక్రితమే సృష్టించారా మరి ? సృష్టిస్తే ఎవరు వారు ? ఒక వేళ తమ ప్రయోగాల కోసమే ఈ సామాజిక తరగతులను లేదా కార్మికవర్గాన్ని సృష్టించి ఉంచారని మార్క్స్‌-ఎంగెల్స్‌లకు తెలుసా ? తెలిసినా, వారు అనుకున్నా తమ కార్యకలాపాలను అమెరికా లేదా లాటిన్‌ అమెరికాలోని స్పానిష్‌ వలస దేశాలు, భారత్‌కు వెళ్లి ప్రయోగాలు చేయకుండా జర్మనీ, బ్రిటన్‌కు ఎందుకు వెళ్లారు ? 1871లో జరిగిన పారిస్‌ కమ్యూన్‌ తిరుగుబాటులో అక్కడి ఆఫ్రో-ఫ్రెంచి జాతీయులు పాల్గని ఉండవచ్చు గానీ నాయకత్వం ఫ్రెంచి కార్మికవర్గమే కదా ? రష్యా,చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలో ఎవరిని వినియోగించి విప్లవాలను తీసుకువచ్చారు ? ఎవరు లబ్ది పొందారు ?


ఇక కమ్యూనిస్టు నేతలు, వారి కుటుంబసభ్యులు త్యాగాలు చేయరు, సామాన్యకార్యకర్తలనే బలిపెడతారు అన్న దుర్మార్గమైన నిందలు కూడా వేసేవారున్నారు. జనం కోసం త్యాగాలకు సిద్దపడి ఏటికి ఎదురీదేవారు కమ్యూనిస్టులు తప్ప మరొకరు లేరు. ఎక్కడైనా పార్టీనేతలుగా ఉండి అక్రమాలకు పాల్పడేవారు వేళ్లమీద లెక్కించగలిగిన వారు లేరని ఎవరూ చెప్పరు. వారిని మాత్రమే చూపుతున్నారంటే ఏమనుకోవాలి ? ఎన్నో కుటుంబాలు అసమాన త్యాగాలు చేశాయి. ఆ వివరాలన్నీ పేర్కొనటం ఇక్కడ సాధ్యం కాదు. రెండు మూడు ఉదంతాలు చూద్దాం.


హిట్లర్‌ అంతు చూసిన స్టాలిన్‌ కుమారుడు ఎకోవ్‌ జర్మన్లకు చిక్కి వారి చేతిలో మరణించిన అంశం తెలిసిందే. అధినేతగా తలచుకుంటే తన కుమారుడిని ఏదో ఒక ఉద్యోగంలో పెట్టటం కష్టమేమీ కాదు. కానీ సైన్యంలో చేరాలని కోరాడు. రెండవ ప్రపంచ యుద్దంలో జర్మన్లకు బందీగా చిక్కాడు. తమ వారిని విడిచిపెడితే ఎకోవ్‌ను అప్పగిస్తామని హిట్లర్‌ మూకలు చేసిన ప్రతిపాదనను స్టాలిన్‌ అంగీకరించలేదు. కుమారుడి కోసం నరహంతక నాజీలను వదిలేదని తిరస్కరించాడు. తరువాత ఎకోవ్‌ను జర్మన్లు కాల్చి చంపారు. స్టాలిన్‌ తరువాత అధికారానికి వచ్చిన నికితా కృశ్చేవ్‌ కుమారుడు లియోనిద్‌ కృశ్చేవ్‌ ఆర్టిలరీ బాటరీ కమాండర్‌. అదే యుద్దంలో వీరమరణం పొందాడు. ఇలాంటి వారెందరో ఉన్నారు. సోవియట్‌ వెలుపల యుగోస్లావియా నేత టిటో కుమారుడు జర్‌కో బ్రోజ్‌ తన చేతిని పొగొట్టుకున్నాడు. స్పెయిన్‌ కమ్యూనిస్టు నేత డోలోర్స్‌ గోమెజ్‌ కుమారుడు రూబెన్‌ రూయిజ్‌ స్టాలిన్‌గ్రాడ్‌ పోరులో కమాండర్‌గా వీరత్వం పొందాడు.


చైనా అగ్రనేత మావో సంతానంలో మావో అనీయింగ్‌ ఒకడు. తల్లి యాంగ్‌ కైహుయి విప్లవకారిణి.1930 అక్టోబరులో కొమింటాంగ్‌ యుద్దప్రభువు హి షియాన్‌ ఆమెను బందీగా పట్టుకున్నాడు. మావోకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన చేస్తే వదలివేస్తామని చెప్పాడు. నిరాకరించినందుకు చిత్రహింసలు పెట్టారు. చివరకు నవంబరు 14న ఆమెను ఉరితీశారు. ఆ నాటికి ఆమె వయసు 29 సంవత్సరాలు. మావో ఎక్కడున్నాడో తెలియదు, ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.మావో అనీయింగ్‌కు అప్పుడు ఎనిమిది సంవత్సరాలు. షాంఘైవీధుల్లో అడుక్కొని పొట్టపోసుకున్నాడు.1936లో అతన్ని కనుగొన్న మావో రష్యా పంపాడు. మావో కుమారుడు కనుక అతన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. సెర్గీ మయవ్‌ అని కొత్త పేరు పెట్టారు. 1942లో తనను రెడ్‌ ఆర్మీలో చేర్చుకోవాలంటూ స్టాలిన్‌కు సెర్గీ లేఖ రాశాడు.” ప్రియమైన కామ్రేడ్‌ స్టాలిన్‌ ! నేను ఒక చైనా యువకుడిని. మీ నేతృత్వంలోని సోవియట్ల దేశంలో ఐదు సంవత్సరాలు చదువుకున్నాను. నేను చైనాను ఎంతగా ప్రేమిస్తానో యుఎస్‌ఎస్‌ఆర్‌ను కూడా అంతగొప్పగా ఆరాధిస్తాను. మీ దేశం జర్మన్‌ ఫాసిస్టుల పదఘట్టనల కింద నలిగిపోతుంటే నేను చూస్తూ కూర్చోలేను. లక్షలాది మంది సోవియట్‌ పౌరులను చంపినదానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ముందు పీఠీన నిలిచి పోరాడేందుకు పూర్తి సంసిద్దంగా ఉన్నాను. దయచేసిన నా వాంఛను మన్నించాలని కోరుతున్నాను.” అని రాసిన లేఖకు సమాధానం రాలేదు. తరువాత ఒక అధికారి వచ్చి ” తండ్రి ఒక హీరో, కుమారుడు ఆయన ఒడిలో పెరిగిన బలశాలి ” అంటూ సైనిక శిక్షణకు పంపాడు.1944లో టాంకుల కమాండర్‌గా పోలాండ్‌, జర్మనీ రంగాలలో పోరాడాడు. అయితే అతను రష్యన్‌ భాష బాగా మాట్లాడుతుండటంతో తోటివారెవరూ మావో కుమారుడని గుర్తించలేదు. తరువాత 1945లో సోవియట్‌ -జపాన్‌ యుద్దంలో కూడా పాల్గొన్నాడు. అతని ధైర్యసాహసాలకు మెచ్చి స్టాలిన్‌ స్వయంగా తన సంతకంతో కూడిన ఒక ఆయుధాన్ని బహుమతిగా ఇచ్చాడు. 1946లో చైనాకు తిరిగి వచ్చాడు.1950లో కొరియాలో పోరాడేందుకు వెళ్లాడు. అక్కడ అమెరికా వైమానిక దాడిలో ప్రాణాలు అర్పించాడు.


మన దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఇతర దేశాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కమ్యూనిస్టులు కాని వారు కూడా ఎందరో అసమాన త్యాగాలు చేసిన చరిత్ర ఉంది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఆ పోరాటాల్లో ఎందరో నేతలతో పాటు వారి అడుగుజాడల్లో నడిచిన సామాన్యులు కూడా అమరులైనారు. స్వాతంత్య్రం పేరుతో సామాన్యులను బలిపెట్టారని ఎవరైనా నాటి నేతలను నిందించగలమా ? చౌకబారుతనం, పాలకవర్గాల ప్రచారాన్ని భుజానవేసుకొనే బానిస బుద్ది తప్ప అది సంస్కారమేనా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కొందరు అమెరికన్ల ఉన్మాదం : చైనా దాడికి వస్తే తైవాన్‌ చిప్స్‌ కంపెనీల నాశనం !

10 Monday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Chinese Invasion Plan, Taiwan Matters, TSMC, US warmongers


ఎం కోటేశ్వరరావు


చైనా గనుక బలవంతంగా స్వాధీనం చేసుకొనేందుకు పూనుకుంటే తైవాన్‌ తన సెమికండక్టర్‌ పరిశ్రమను (TSMC),పూర్తిగా ధ్వంసం చేయాలని అమెరికన్‌ మిలిటరీ పత్రిక ” పారామీటర్స్‌” సూచించింది. జార్‌డ్‌ మెకెనీ, పీటర్‌ హారిస్‌ అనే జంట రచయితలు ఈ సలహా ఇచ్చారు. ఎందుకటా ! తైవాన్‌లో ఉన్న వనరులను పనికి రాకుండా చేస్తే తైవాన్‌ అనావశ్యకమైనదిగా చైనాకు కనిపిస్తుందట. ఒకవేళ ఆక్రమించుకున్నా దానికి పనికి రాకుండా చేయటం చైనాను అడ్డుకొనే ఎత్తుగడల్లో ఒకటవుతుందట.తనకు దక్కని అమ్మాయి వేరెవరికీ దక్క కూడదంటూ యాసిడ్‌ పోసే, హత్యలు చేసే బాపతును ఈ సలహా గుర్తుకు తేవటం లేదూ ! చైనాను దారికి తెచ్చుకొనేందుకు ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించక అమెరికాలో పెరిగిపోతున్న అసహనం, దుష్ట ఆలోచనలకు ఇది నిదర్శనం. ఒక వేళ తైవాను పాలకులు ఆ పని చేయకపోయినా సిఐఏ వారే ఆపని చేయగల దుర్మార్గులు. తైవాన్‌లో రెండున్నర కోట్ల మంది జనాభా ఉన్నారు. వారేమైనా అమెరికన్లకు పట్టదు, కావలసిందల్లా చైనాను అడ్డుకోవటమే. పారా మీటర్స్‌ పత్రికలో ఈ సలహా ఇచ్చిన వారు చిన్నవారేమీ కాదు. అమెరికా ఎయిర్‌ విశ్వవిద్యాలయంలోని భద్రత, వ్యూహాత్మక అధ్యయన కేంద్ర అధిపతిగా మెకనీ, కొలరాడో స్టేట్‌ విశ్వవిద్యాలయ రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్‌గా పీటర్‌ హారిస్‌ ఉన్నాడు.


ఎలక్ట్రానిక్స్‌లో కీలకమైన చిప్స్‌ తయారీలో తైవాన్‌ ప్రాంతం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.అనేక ఇతర దేశాలతో పాటు వాటిని ప్రధాన భూభాగమైన చైనాకు సరఫరా చేస్తోంది.తైవాన్‌ గనుక సెమికండక్టర్‌ పరిశ్రమను నాశనం చేస్తే అమెరికా మిత్రదేశంగా ఉన్న దక్షిణ కొరియాలోని శాంసంగ్‌ ఒక్కటే చిప్స్‌ రూపకల్పనలో ప్రత్నామ్నాయంగా మారుతుందని, చిప్స్‌ లేకపోతే చైనాలోని హైటెక్‌ పరిశ్రమలేవీ పనిచేయవని,అప్పడు చైనీయులు తమ నేతల యుద్ధ ప్రయత్నాలపై తిరగబడతారని, ఒక వేళ స్వాధీనం చేసుకున్పప్పటికీ ఆర్ధిక మూల్యం సంవత్సరాల తరబడి ఉంటుందని, చైనా కమ్యూనిస్టు పార్టీపై జన సమ్మతి తగ్గుతుందంటూ ఒక ఊహా చిత్రాన్ని సదరు పెద్దమనుషులు ఆవిష్కరించారు. చైనా మిలిటరీ అలా వస్తున్నట్లుగా తెలియగానే ఇలా మీటనొక్కగానే వాటంతట అవే సెమికండక్టర్‌ పరిశ్రమలు పేలిపోయేవిధంగా చిప్స్‌ తయారు చేయాలన్నట్లుగా హాలీవుడ్‌ సినిమాల స్క్రిప్ట్‌ను వారు సూచించారు. ఈ రంగంలో పని చేస్తున్న తైవాన్‌ నిపుణులను త్వరగా వెలుపలికి తరలించే పధకాలను సిద్దం చేయాలని, వారికి అమెరికాలో ఆశ్రయం కల్పించాలని కూడా వారు చెప్పారు. తాము చేస్తున్న ప్రతిపాదన తైవానీస్‌కు నచ్చదని, సెమికండక్టర్‌ పరిశ్రమలను నాశనం చేస్తే నష్టం చాలా స్వల్పమని అదే అమెరికా యుద్ధానికి దిగితే పెద్ద ఎత్తున, దీర్ఘకాలం సాగుతుందని అమెరికన్‌ రచయితలు పరోక్షంగా తైవానీస్‌ను బెదిరించారు.


చైనాలోని ఒక తిరుగుబాటు రాష్ట్రం తైవాన్‌ . ఐక్యరాజ్యసమితిలో రెండు చైనాలు లేవు, తైవాన్‌కు ఒక దేశంగా గుర్తింపు లేదు.తైవాన్‌లోని కొందరు స్వతంత్ర దేశంగా మార్చాలని చూస్తున్నారు. అధికారికంగా తైవాన్‌ ప్రాంతం కూడా చైనాలో విలీనం గురించే మాట్లాడుతుంది తప్ప మరొకటి కాదు. విలీనం అవుతాము గానీ అది కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చైనాలో కాదు అంటూ నాటకం ఆడుతోంది. అమెరికా సైతం ఒకే చైనా భావనను అంగీకరిస్తూనే విలీనం బలవంతంగా జరగకూడదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరోవైపు దానికి ఆయుధాలు సమకూరుస్తూ, దొడ్డి దారిన అక్కడ కార్యాలయం తెరిచింది. బలవంతంగా ఆక్రమించుకుంటే చైనాను అడ్డుకుంటామని పదే పదే చెబుతోంది. ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా తైవాన్ను కొన్ని అమెరికా తొత్తు దేశాలు గుర్తిస్తున్నట్లు ప్రకటించి చైనాను రెచ్చగొడుతున్నాయి. ఆ ప్రాంతం తమదే అని, విలీనం సెమికండక్టర్‌ పరిశ్రమ కోసం కాదని చైనా స్పందించింది. ఒకవేళ తైవాన్ను ఆక్రమించదలచుకుంటే చైనాకు 14గంటల సమయం చాలునని, దాన్ని అడ్డుకొనేందుకు అమెరికా, జపాన్‌ రావాలంటే 24 గంటలు పడుతుందని కొందరు చెప్పారు.


తమ దేశాన్ని బాగు చేసుకోవటం గురించి ఇలాంటి పెద్దలు కేంద్రీకరించకుండా ఎదుటి వారిని దెబ్బతీయాలని దుర్మార్గపు ఆలోచనలు ఎందుకు చేస్తున్నట్లు ? రెండు కారణాలున్నాయి. చైనా మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించాలన్నది అమెరికా కార్పొరేట్ల ఆలోచన. రకరకాల ఎత్తుగడలు వేసి బుట్టలో వేసుకోవాలని చూస్తున్నకొద్దీ కొరకరాని కొయ్యగా మారుతోంది. ఆంక్షలను విధించటం, అమెరికా యుద్దనావలను తైవాన్‌ జలసంధిలో దించినప్పటికీ చైనా అదరలేదు బెదరలేదు. తాజాగా చైనా స్వంతంగా చిప్స్‌ తయారీకి పూనుకుంది.2049 నాటికి ఒక దేశం- రెండు వ్యవస్ధల ప్రత్యేక పాలిత ప్రాంతాలుగా ఉన్న హాంకాంగ్‌, మకావు దీవులు ప్రధాన ప్రాంతలో పూర్తిగా విలీనం అవుతాయి. అప్పటికి తైవాన్‌ విలీనం కూడా పూర్తి కావాలని చైనా భావిస్తోంది. ధనిక దేశాల స్ధాయికి తమ జనాల జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో ఉంది. హాంకాంగ్‌ను స్వతంత్ర దేశంగా మార్చాలనే అమెరికా ఎత్తుగడలు విఫలం కావటంతో ఇప్పుడు తైవాన్‌ అంశం మీద రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.


మన దేశంలో కూడా ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నవారు లేకపోలేదు.ఆర్‌సి పాటియల్‌ అనే మాజీ సైనికాధికారి తాజాగా రాసిన వ్యాసంలో అమెరికా ఎత్తుగడలకు అనుగుణంగా ప్రతిపాదించారు. దాని సారాంశం ఇలా ఉంది. అడ్డుకొనే వారు లేకపోతే వివిధ దేశాల పట్ల చైనా కప్పగంతులు వేస్తూ ముందుకు సాగుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో మిత్రరాజ్యాలు జపాన్‌ మీద దాడి చేసినపుడు భారీ ఎత్తున మిలిటరీ ఉన్న దీవులను వదలి ఇతర వాటిని పట్టుకున్నాయని ఇప్పుడు చైనా కూడా అదే పద్దతులను అనుసరించవచ్చని పేర్కొన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు దిగువ సూచనలు పాటించాలని పాటియల్‌ పేర్కొన్నారు. చైనా బలవంతానికి గురైన దేశాలు ముందు స్వంతంగా పోరాడాలి, తరువాత ఉమ్మడిగా పధకం వేయాలి. చైనా వాణిజ్య, ఇతర వత్తిళ్లకు ఇప్పటికై గురైన వాటిని, భవిష్యత్‌లో అవకాశం ఉన్న దేశాలన్నింటినీ అమెరికా, భారత్‌ ఒక దగ్గరకు చేర్చాలి. చైనాలో టిబెట్‌ అంతర్భాగమంటూ 1954లో నెహ్రూ ప్రభుత్వం గుర్తించినదానిని రద్దు చేయాలి. ముందుగా దేశ రాజకీయనేతలు ఆ పని చేసేందుకు భయపడకూడదు. తైవాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలి, దాని తరఫున అమెరికా నిలవాలి. కొత్త దలైలామాను ఎన్నుకొనేందుకు సాంప్రదాయ పద్దతి పాటించేందుకు ప్రస్తుత దలైలామాను అనుమతించాలని భారత్‌ వత్తిడి తేవాలి. ఈ అంశంలో చైనా వైఖరిని గట్టిగా ఎదుర్కోవాలి. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న ఉఘిర్స్‌ ఈస్ట్‌ టర్కిస్తాన్‌ ప్రభుత్వాన్ని(చైనాలోని షిన్‌జియాంగ్‌ రాష్ట్ర తిరుగుబాటుదారులు ఏర్పాటు చేసినది. వారికి మానవహక్కులు లేవంటూ ప్రచారం చేస్తున్న అంశం తెలిసిందే) గుర్తించే విధంగా ముస్లిం దేశాలను ఒప్పించాలి. అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతో ఉన్న చతుష్టయం(క్వాడ్‌) ప్రస్తుతం మిలిటరీ కూటమి కాదు, రాబోఏ రోజుల్లో అలా మార్చాలి. మరిన్ని దేశాలతో విస్తరించాలి.అమెరికా, ఇజ్రాయెల్‌,భారత్‌, ఐక్య అరబ్‌ దేశాలతో రెండవ చతుష్టయాన్ని ఏర్పరచాలి.చైనాతో అన్ని దేశాలూ వాణిజ్యాన్ని తగ్గించుకోవాలి.ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో కూడిన అకుస్‌ మాదిరి భారత్‌, ఫ్రాన్స్‌, జపాన్‌ భద్రతా కూటమిని ఏర్పాటు చేయాలి. ఇండో-పసిఫిక్‌, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని దేశాలన్నింటికీ అమెరికా రక్షణ కల్పించాలి. చైనాను అగ్రరాజ్యంగా ఎదగకుండా చూడాలి.భావ సారూప్యత కలిగిన దేశాలు ముప్పును ఎదుర్కొనేందుకు సిద్దపడి చైనా కప్పగంతు పధకాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి.


అమెరికా అజెండాకు అనుకూలమైన ఎత్తుగడలతో మన దేశాన్ని ఎక్కడకు తీసుకుపోదామనుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లనే అదుపు చేయలేని అమెరికా మిలిటరీ చైనాను నిలువరించగలదా ? తన మిలిటరీని తానే రక్షించుకోలేక తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని దేశం విడిచిన వారు మన దేశం, మరొక దేశం కోసం పోరాడతారా? అసలు అమెరికా తాను స్వయంగా ప్రారంభించిన ఏ యుద్దంలో ఐనా గెలిచిన ఉదంతం ఉందా? దురద తనది కాదు గనుక ఇతరులను తాటి మట్టతో గోక్కోమన్నట్లుగా పడక కుర్చీలకు పరిమితమైన ఇలాంటి యుద్దోన్మాదులు చెప్పే ఉచిత సలహాలను అనుసరిస్తే వారికేమీ పోదు, సామాన్య జనజీవితాలు అతలాకుతలం అవుతాయి.చైనాతో మనకు పరిష్కారం కావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. శుభకార్యానికి పోతూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్లు ఇలాంటి పనులు చేస్తే ఫలితం ఉంటుందా ? కావాల్సింది సరిహద్దు సమస్య పరిష్కారమా ? చైనాతో వైరమా ? దాన్ని గురించి ఒక్కటంటే ఒక్క సూచన కూడా ఈ పెద్దమనిషి చేయలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా గ్రామాల నిర్మాణం నిజానిజాలేమిటి : మీడియా పాత్ర దేశభక్తా – దేశ ద్రోహమా ?

12 Friday Nov 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, CDS Rawat, China- India dispute, Line of Actual Control, Narendra Modi, Pentagon on China military, RSS


ఎం కోటేశ్వరరావు


” భారత భూభాగాల్లో అరుణాచల్‌ సమీపంలో చైనా అక్రమంగా గ్రామాలను నిర్మిస్తున్నది ” అమెరికా పార్లమెంట్‌కు అక్కడి రక్షణ శాఖ పెంటగన్‌ ఇటీవల వార్షిక నివేదికలో చేసిన వ్యాఖ్యలలో ఒకటి. ఇంకేముంది దున్న ఈనిందని చెప్పగానే గాటన కట్టేయమన్నట్లుగా మీడియా మన జనాలకు ఆ వార్తను అందించింది. ఇంత ఘోరమా అని అనేక మంది ఆగ్రహించారు. చైనాకు అడ్డు అదుపూ లేకుండా పోయింది, ఏదో ఒకటి చేయాలని జనాలు కొందరు ఊగి ఊగిపోయారు. చుట్టుముడుతున్న సమస్యల నుంచి జనాన్ని ఎలా పక్కదారి పట్టించాలా అని నిరంతరం మార్గాలు వెతికే పాలకులకు కాగల పని గంధర్వులు తీర్చారు అన్నట్లుగా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టి పెంటగన్‌, మీడియా తమ పాత్రలను తాము చక్కగా పోషించాయి. నివేదిక, వార్తలు వెలువడిన కొద్ది రోజుల తరువాత తాపీగా ప్రభుత్వం, మిలిటరీ అధికారి రంగంలోకి దిగారు. ఆ చెప్పేదేదో మరుసటి రోజే చెబితే జనాలకు అనవసర ఆయాసం తప్పేది కదా ! బుర్రలు ఖరాబు చేసుకొని ఉండేవారు కదా కదా !! ఎందుకు ఆలశ్యం చేసినట్లు ?


కావాలనే ఆలశ్యంగా స్పందించారన్నది స్పష్టం. పెంటగన్‌ ప్రచారాన్ని కొనసాగనిస్తే చైనా వారు ఏకంగా గ్రామాలనే నిర్మిస్తుంటే మన ప్రభుత్వం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నది అని ఆవేశం నుంచి తేరుకున్న జనం ప్రశ్నిస్తారు, వాడెవడో అమెరికా వాడు చెప్పేంతవరకు మన సరిహద్దుల్లో ఏం జరుగుతోందన్న సంగతులే తెలియకుండా లేదా తెలుసుకోకుండా మన ముసలి జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఏం చేస్తున్నట్లు ? దేశ రక్షణ బాధ్యత తనదే అని పదే పదే ప్రకటించుకున్న ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోవద్దా అని జనం అడుగుతారు. రెండోవైపు నుంచి పెంటగన్‌ చెప్పినదాని మీద మీరు మాట్లాడలేదంటే అది నిజమే అని మీరు నమ్మినట్లే అని మేం భావించవచ్చా అని చైనా వారు కూడా అడుగుతారు. అందుకే స్పందించారు. ఏమన్నారు ?


భారత భూభాగంలో చైనా వారు గ్రామాలు నిర్మిస్తున్నారన్నది వాస్తవం కాదు అని మన రక్షణ దళాల ప్రధాన అధికారి (సిడిఎస్‌) బిపిన్‌ రావత్‌ గురువారం నాడు అన్నీ పుకార్లే అని చెప్పారు. వాస్తవాధీన రేఖ అన్న దానికి మన ప్రస్తుత అవగాహనకు విరుద్దంగా ఎలాంటి చొరబాట్లు లేవు, గ్రామాల నిర్మాణం కోసం రేఖను దాటి రాలేదు, ఆ వార్తలు వాస్తవం కాదు, నిర్మించారని చెబుతున్న గ్రామాలు వాస్తవాధీన రేఖకు చైనా వైపే ఉన్నాయి అని రావత్‌ చెప్పారు. మాకు తెలిసినంత వరకు అలాంటి గ్రామ అభివృద్ధి వాస్తవాధీన రేఖకు మన వైపున జరగలేదు. కొత్త గ్రామాన్ని నిర్మించేందుకు చైనా వారు రేఖను దాటి మన ప్రాంతంలోకి వచ్చి నిర్మాణం చేశారన్న వార్తమీద ప్రస్తుత వివాదం తలెత్తింది. బహుశా ప్రత్యేకించి ఇటీవల మనతో తలపడిన తరువాత వాస్తవాధీన రేఖ వెంట వారి సైనికులు, పౌరుల కోసం లేదా భవిష్యత్‌లో మిలిటరీ అవసరాల కోసం గ్రామాలను నిర్మిస్తుండవచ్చు అని కూడా రావత్‌ చెప్పారు. రెండు దేశాలూ వాస్తవాధీన రేఖ వెంట దళాలను నియమిస్తున్నాయి. చైనీయులు తమవైపు కొత్త పోస్టులను ఏర్పాటు చేసినపుడు అక్కడ కొన్ని శిధిలమైన, పాత గుడిసెలను మనం చూస్తున్నాము. కాబట్టి కొన్ని దెబ్బతిన్నపుడు కొత్త వాటిని నిర్మించవచ్చు, ఆధునిక నిర్మాణాలు జరుపుతుండవచ్చు, వాటిలో కొన్ని గ్రామాలు కూడా ఉండవచ్చు, ఉన్నవాటిని విస్తరించి ఉండవచ్చు, చైనా సైనికులు తమ ప్రధాన ప్రాంతం నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు, మన సైనికులు సంతోషంగా ఉండటాన్ని వారు చూస్తున్నారు, మన పౌరులు ఆప్రాంతాలకు వెళతారు, మన కుటుంబాలు ఆప్రాంతాలను సందర్శిస్తాయి, వీటన్నింటినీ వారు చూస్తారు. అందువలన వారి సైనికుల కుటుంబాలు ఆ ప్రాంతాలకు వచ్చేందుకు కూడా వాటిని నిర్మిస్తుండవచ్చు, మన సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి ఏడాదిలో కనీసం రెండు మూడు సార్లు తమ కుటుంబాలను చూసేందుకు స్వస్ధలాలకు వెళతారు, చైనీయులకు అలాంటి అవకాశం లేదు అని రావత్‌ అన్నారు.


వాస్తవాధీన రేఖ అంటే అనేక అవగాహనలు ఉన్నాయి. మన సైనికులకు వాస్తవాధీన రేఖ ఎక్కడ ఉందో తెలుసు ఎందుకు అంటే ఇది రేఖ, ఈ ప్రాంతాన్ని మనం రక్షించాలి అని వారు నిర్విహించాల్సిన విధుల గురించి వారికి చెబుతాము కనుక వారికి తెలుసు. ఒక అవగాహన ఉంది. చైనా వారికి కొన్ని ప్రాంతాల గురించి అవగాహన ఉందని మనకు తెలుసు. కొన్ని ప్రాంతాల గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. ఎందుకంటే వారికి వాస్తవాధీన రేఖ గురించిన అవగాహనను వారికి చెప్పకపోవచ్చు.వాస్తవాధీన రేఖ వెంట గ్రామాల నిర్మాణం కండబల ప్రదర్శన అన్నదాన్ని కచ్చితంగా కాదంటాను, బలప్రదర్శన అని నేను వర్ణించను, ఈ గ్రామాల ద్వారా వారు తమ సరిహద్దులకు సులభంగా చేరుకొనేట్లు చూసుకుంటున్నారు, మనం కూడా అదే చేయాల్సి ఉంది, మన ప్రభుత్వం కూడా సరిహద్దు ఏరియా అభివృద్ది కార్యక్రమ పధకానికి (బిఏడిపి) నిధులు విడుదల చేసింది. నిజానికి మనం సరిహద్దు ప్రాంతాలకు తిరిగి వెళ్లండి అని పౌరులను మనం ప్రోత్సహిస్తున్నాం ఎందుకంటే వాస్తవాధీన సరిహద్దు రేఖ వెంట అనేక గ్రామాలవారు ఖాళీ చేశారు అని రావత్‌ వెల్లడించారు. ఎందుకు వారు ఖాళీ చేస్తున్నారంటే లోపలి ప్రాంతాలలో వారికి మరింతగా విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రావత్‌ చెప్పారు.


మన విదేశాంగశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పిందేమిటి ? ” దశాబ్దాల క్రితం అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతో సహా కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో చైనా నిర్మాణకార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకోవటాన్ని గానీ లేదా చైనా చెబుతున్న అంశాలను గానీ భారత్‌ అంగీకరించలేదు. దౌత్యపద్దతుల్లో ఎప్పుడూ అలాంటి కార్యకలాపాలకు నిరసన తెలుపుతూనే ఉన్నాము. భవిష్యత్‌లో కూడా అదే కొనసాగిస్తాము.భారత భద్రత, భూభాగాన్ని కాపాడుకొనేందుకు నిరంతరం పరిణామాలను గమనిస్తూనే ఉంటాము, తగిన చర్య తీసుకుంటాము. అమెరికా పార్లమెంట్‌కు ఆ దేశ రక్షణశాఖ సమర్పించిన నివేదికలో పేర్కొన్న అంశాలను ప్రత్యేకించి తూర్పు రంగంలోని అంశాలను గమనంలోకి తీసుకున్నాము. చైనాతో ఉన్న సరిహద్దు ఆప్రాంతాన్ని కలుపుతూ రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నాము” అని చెప్పారు.


పెంటగన్‌ నివేదిక, బిపిన్‌ రావత్‌, అరిందమ్‌ బాగ్చీ చేసిన ప్రకటనల్లో తేడా గురించి, ఏది వాస్తవమో ప్రధాని నరేంద్రమోడీ చెప్పాలంటూ కాంగ్రెస్‌ స్పందించింది. ఈ నివేదిక గురించి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం లేదా పార్టీ ప్రతినిధులుగానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.చైనా అక్రమ ఆక్రమణలను అంగీకరించేది లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెబుతారు, సైనికదళాల సిడిఎస్‌ చైనా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటారు, గతంలో అఖిలపక్ష సమావేశంలో మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దీనిలో ఏది వాస్తవమో జనానికి మోడీ సర్కార్‌ చెబుతుందా అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. నిజానికి రావత్‌-అరిందమ్‌ బాగ్చీ చెప్పిందాన్లో పరస్పర విరుద్దతేమీ లేదు. ఎప్పటి నుంచో చెబుతున్న అంశాలను అరిందమ్‌ చెప్పారు. అక్కడి వాస్తవ పరిస్ధితి గురించి బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. రెండు దేశాల మధ్యసరిహద్దు వివాదం బ్రిటీష్‌ వారు సృష్టించింది. వారు గీసిన గీతలకు భిన్నంగా మన దేశానికి చెందినవిగా చూపినవి చైనా ఆధీనంలో, చైనాలో భాగంగా చూపినవి మన ఆధీనంలో ఉన్నాయి. లడక్‌ ప్రాంతంలో ఆక్సాయిచిన్‌, మరికొన్నింటిని మనవి అని మన దేశం చెబుతోంది. తూర్పున అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా అంటోంది. రెండు దేశాలూ వాస్తవాధీన రేఖను అనుసరిస్తున్నాయి. ఈ వివాదాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప మరొక పద్దతిలో సాధ్యం కాదు. దీన్ని మరింతగా రాజేయాలని అమెరికా చూస్తోంది.


ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే అజెండాతో ముందుకు పోతున్న అమెరికా ఎక్కడిక్కడ దేశాల మధ్య తంపులు పెట్టేందుకు చేయని తప్పుడు పనులులేవు. తప్పుడు నివేదికలను రూపొందించటం, వాటి మీద మీడియాలో కట్టుకథలు-పిట్టకథలు రాయించటం దాని నిరంతర కార్యక్రమం. వాటిని పట్టుకొని మన మీడియా రెచ్చిపోతోంది.ఏ దేశంతో అయినా సమస్యలు వచ్చినపుడు జనాలకు వాస్తవాలను వివరించేందుకు భిన్న అభిప్రాయాలతో అంశాలను అందించటం తప్పుకాదు. ఇరుగుపొరుగు దేశాలతో నిరంతరం గిల్లికజ్జాలు పెట్టుకొనే ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖల్లాలేవు. ఆ దిశగా రెచ్చగొట్టే మీడియా ఏ విధంగానూ దేశానికి మేలు చేసేది కాదు. అమెరికా తన గోతిని తానే తవ్వుకొని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఎంత అవమానకరంగా బయట పడిందీ తెలిసిందే, అది ఆడించినట్లు ఆడే దేశాలన్నీ సర్వనాశనం అయ్యాయి. అందుకు ఇరాన్‌-ఇరాక్‌లే పక్కా నిదర్శనం. అక్కడి చమురు సంపదలపై కన్నేసిన అమెరికా రెండు దేశాలకూ ఆయుధాలు అమ్మి పదేండ్ల పాటు తలపడేట్లు చేసిన చరిత్ర, చివరకు ఇరాక్‌ను ఆక్రమించిన దుర్మార్గం, లొంగని ఇరాన్‌పై ఆంక్షల అమలు తెలిసిందే. అలాంటి ప్రమాదకరమైన అమెరికా తప్పుడు నివేదికలను ఆధారం చేసుకొని తప్పుడు వార్తలను జనాల మెదళ్లకు ఎక్కించటాన్ని మీడియా దేశభక్తిగా భావిస్తోందా ? ఇంతకు మించి సంచలనాలు, రేటింగ్‌లు పెంచుకొనే సత్తా లేదా ? మీడియాను గుడ్డిగా నమ్మి రెచ్చిపోకూడదని జనం గ్రహించాలి.

పరిస్ధితులు బాగోలేవు, నరేంద్రమోడీ గారు చెప్పిన మంచి రోజుల గురించి ఇంకా భ్రమలతో జనం ఎదురు చూస్తున్నారు. లక్షలాది కుటుంబాలు కరోనా కల్లోలం నుంచి కోలుకోలేదు.పూర్వపు స్ధాయికి ఆదాయాలు రాలేదు.ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినపుడు మానసిక బలహీనతకు లోనుకావటాన్ని ఆసరా చేసుకొని పాలకపార్టీలకు చెందిన మరుగుజ్జు దళాలు వాట్సప్‌ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పటికే మరమ్మతు చేయటానికి కూడా వీల్లేనంతగా ఎందరో బుర్రలను ఖరాబు చేశాయి.ఇలాంటి ప్రచారానికి పాల్పడేందుకు ఇప్పుడు సాంప్రదాయ మీడియా-సామాజిక మాధ్యమం పరస్పర ఆధారితంగా మారుతున్నాయి. వాస్తవాల కంటే సంచలనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది దేశభక్తా, దేశద్రోహమా ? దేశమంటే మట్టికాదోయి-దేశమంటే మనుషులోయి అని మహాకవి గురజాడ చెప్పిందాని ప్రకారం జనాలను తప్పుదారి పట్టించి ఉన్మాదానికి లోను చేయటం ప్రజాద్రోహం- దేశద్రోహం కాదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా అబద్దాల అమ్ముల పొదిలో మరో అస్త్రం !

05 Friday Nov 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, Left politics, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China's growing nuclear arsenal, New Pentagon report, nuclear triad’, PRC, Taiwan


ఎం కోటేశ్వరరావు


చైనా – అమెరికా మధ్య యుద్ధం జరుగుతుందా ? ఇప్పటి వరకు అమెరికా జరిపిన యుద్దాలలో ఒక్కటంటే ఒక్కదానిలో కూడా చెప్పుకొనేందుకు విజయం లేదు. అవమానాలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో జరిగిన ఏ యుద్ధమైనా ముందు ప్రచార దాడితోనే ప్రారంభమైంది. అదేమంటే నిజాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెట్టటం. ఇప్పుడు చైనా మీద అమెరికా, దాని మిత్రపక్షాల నుంచి ముప్పేట ప్రచారదాడి మొదలైంది. అమెరికా, జపాన్‌, ఐరోపా యూనియన్‌, వాటితో జట్టుకట్టిన దేశాలన్నీ తమ తమ పాత్రలను పోషిస్తున్నాయి. మన దేశంతో సహా అనేక దేశాల్లో ఉన్న యుద్ధోన్మాదులు ఈ పరిణామాలను చూసి రెచ్చిపోతున్నారు, చంకలు కొట్టుకుంటున్నారు. పర్యవసానాలను పట్టించుకోవటం లేదు. తాజాగా అమెరికా రక్షణ శాఖ పెంటగన్‌ వార్షిక నివేదికలో ఒక ప్రచార అస్త్రాన్ని వదిలింది. దాన్ని పట్టుకొని అనేక మంది పండితులు అది నిజమే అని జనాన్ని నమ్మించేందుకు, చైనాను ఒక బూచిగా చూపేందుకు ఒళ్లుదాచుకోకుండా పని చేస్తున్నారు.


ఇంతకీ పెంటగన్‌ చెప్పిందేమిటి ? చైనా వద్ద రెండువందల వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు, దశాబ్ది చివరికి అవి రెట్టింపు కావచ్చని గతేడాది అమెరికా రక్షణ అంచనా వేసిందట. అప్పటి నుంచి చైనా తన అస్త్రాలను విస్తరించటం ప్రారంభించటంతో 2027నాటికి ఏడువందలకు, 2030 నాటికి 1000కి పెరగవచ్చని, దీంతో ప్రపంచానికి ముప్పు పెరుగుతుందని ఈ ఏడాది పెంటగన్‌ చెప్పింది. ఆధారం లేని అంశాలను, అబద్దాలను చెప్పటంలో పెంటగన్‌ పేరు మోసింది. ఎగిరే పళ్లాలు లేదా గ్రహాంతర వాసులంటూ కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా మీడియా అల్లిన కట్టు-పిట్ట కథలను జనం నమ్మారు, ఇప్పటికీ నమ్మే వారున్నారు. నిజానికి అలాంటి వేమీ లేవు. వియత్నాం యుద్దం గురించి అది ఎలాంటి నివేదికలను రూపొందించిందో, మిలిటరీ, పౌర అధికారులు, విధాన నిర్ణేతలు ఎన్ని అబద్దాలు చెప్పి పార్లమెంటు, స్వంత పౌరులను , ప్రపంచాన్ని తప్పుదారి పట్టించారో తరువాత వివరాలు బయటపడ్డాయి. అందరూ కలిసి చేసిన ఈ దారుణానికి లక్షలాది మంది వియత్నాం పౌరులు దెబ్బతిన్నారు. సైగాన్‌ వంటి నగరాలు, పంట పొలాలను నాశనం చేశారు. ఎందరో మానవతులను చెరబట్టారు. చివరికి ఆ దాడుల్లో ఉత్తిపుణ్యానికి తమ 58వేల మంది సైనికులు మరణించారని, లక్షలాది మంది భౌతికంగా, మానసికంగా దెబ్బతిన్నారంటూ ఆ దాడులను ఆపివేయాలని అమెరికా జనం వీధుల్లోకి వచ్చి ఉద్యమించిన అంశం తెలిసిందే.వియత్నాం టాస్క్‌ ఫోర్స్‌ పేరుతో రక్షణశాఖ మంత్రిత్వ కార్యాలయం రూపొందించిన నివేదికను పత్రికలు ప్రచురించరాదని అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ప్రభుత్వం వత్తిడి తెచ్చింది. అటార్నీ జనరల్‌ జాన్‌ డబ్ల్యు మిచెల్‌ టైమ్‌ పత్రికకు ఒక టెలిగ్రాం పంపాడు. ఆ నివేదిక ప్రచురణ అమెరికా రక్షణ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని వాదించాడు.(ఈ ప్రబుద్దుడు తరువాత నిక్సన్‌ పాల్పడిన వాటర్‌గేట్‌ కుంభకోణంలో పోషించిన పాత్రకు జైలు పాలయ్యాడు, సదరు నిక్సన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.) తరువాత ఈ అంశం సుప్రీం కోర్టుకు వెళ్లింది. పత్రికలకు ప్రచురించే హక్కుందని తీర్పు వచ్చింది.


ఇరాన్‌కు ఆయుధాల సరఫరాపై నిషేధం ఉన్నప్పటికీ రీగన్‌ ప్రభుత్వం రహస్యంగా విక్రయించటమే గాక ఆ సొమ్మును నికరాగువాలో వామపక్ష శాండినిస్టా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తయారు చేసిన కిరాయి మూక కాంట్రాలకు అందచేసింది. వారికి నిధులు ఇవ్వటాన్ని పార్లమెంట్‌ నిషేధించింది. దీని గురించి కూడా పెంటగన్‌ పచ్చి అబద్దాలు, అతకని వాదనలు వినిపించింది. తరువాత జార్జి బుష్‌ పాలనాకాలంలో ఇరాక్‌ మీద దాడి చేసేందుకు అల్లిన అబద్దాలు ఇంకా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. సద్దాం హుసేన్‌ మారణాయుధాలను గుట్టలుగా నిలవ చేశాడని ప్రచారం చేసిన అంశం, తరువాత అలాంటివేమీ దొరకలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇండోచైనా దేశాలైన వియత్నాం, లావోస్‌, కంపూచియాలను ఆక్రమించుకొనేందుకు, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు జపాన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వరుసగా దాడులు చేశాయి. చివరిగా పాల్గొన్న అమెరికన్లు అవమానకర రీతిలో అక్కడి నుంచి తోకముడిచారు. ఆ ఉదంతం నుంచి అమెరికన్లు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు పేరుతో జోక్యం చేసుకున్నారు. అక్కడా పరాభవాలు ఎదురైనా రెండు దశాబ్దాల పాటు విజయం సాధిస్తున్నట్లు అమెరికన్లను, యావత్‌ ప్రపంచాన్ని ఎలా నమ్మించారో, చివరకు ఆ తాలిబాన్ల కాళ్లు పట్టుకొని బతుకు జీవుడా అంటూ పారిపోయిన దృశ్యాలు ఇంకా మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి.


సోవియట్‌ యూనియన్నుంచి పశ్చిమ ఐరోపాకు ముప్పువస్తుందనే ముసుగులో నాటో కూటమి ఏర్పాటు చేశారు. ఆ సోవియట్‌ ఇప్పుడు ఉనికిలో లేదు. తూర్పు ఐరోపా రాజ్యాలన్నీ ఇప్పుడు రష్యాతో కూడా లేవు, అయినా అమెరికన్లు నాటోను కొనసాగిస్తూ మరింతగా విస్తరిస్తున్నారు ? ఐరోపాకు ముప్పు అని కథలు చెబుతూనే ఉన్నారు. పెంటగన్‌ తన సేనలను కొనసాగిస్తూనే ఉంది.తమ ఆయుధాలను అమ్ముకొని లాభాలు గడిస్తూనే ఉన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆసియాలో విస్తరించేందుకు, ఇక్కడ కూడా నాటో మాదిరి ఆసియా కూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. దానిలో భాగమే మన దేశం, జపాన్‌,ఆస్ట్రేలియాలను కలుపుకొని చతుష్టయ(క్వాడ్‌) కూటమి, తరువాత బ్రిటన్‌,ఆస్ట్రేలియాలతో చేరి అకుస్‌ ఏర్పాటు సంగతి తెలిసిందే.వాటిని మరింత ముందుకు తీసుకుపోవాలనే ఎత్తుగడతోనే చైనా అణ్వాయుధాల బూచిని చూపటం, ఖండాంతర క్షిపణుల ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం, అంతరిక్షం నుంచి ప్రయోగించే మహావేగ క్షిపణి పరీక్ష అనే తప్పుడు వార్తలు, తైవాన్‌ పేరుతో రెచ్చగొడుతున్నది. దక్షిణ చైనా సముద్రంలో తిష్టవేసేందుకు అమెరికన్లకు ఒక సాకు కావాలి. దాన్లో భాగమే పెంటగన్‌ ప్రచారదాడి.


ఆయుధాలు కలిగి ఉండే హక్కు తమకు మాత్రమే ఉందన్నట్లుగా, తమ దగ్గర ఉంటే లోక కల్యాణం, ఇతరులు సమకూర్చుకుంటే వినాశనానికి, కనుక అందరం కలిసి అలాంటి వారిని దెబ్బతీద్దాం, అందుకు గాను మా దగ్గర మీరు ఆయుధాలు కొనుగోలు చేయండి అన్నట్లుగా ఉంది అమెరికన్ల తీరు. అమెరికా సైనిక దళాల అధికారుల చైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిలే ఒక మీడియా సంస్ధతో మాట్లాడుతూ చైనా గురించి చెప్పిన మాటలు ఎలా ఉన్నాయో చూడండి.” మీరు గనుక మరోసారి చూస్తే, నాలుగుదశాబ్దాల క్రితం వారికి ఉపగ్రహాలు అసలు లేవు. ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి. వారికి ఖండాంతర క్షిపణులు లేవు, ఈ రోజు వారికి ఎన్నున్నాయో చూడండి. వారికి అణ్వాయుధాలు లేవు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చూడండి. వారికి నాలుగవ లేదా ఐదవ తరం లేదా చివరికి ఆధునిక యుద్ద విమానాలు కూడా లేవు. మరలా చూడండి వారి దగ్గరెన్ని ఉన్నాయో. వారికి నౌకాదళం లేదు, జలాంతర్గాములు లేవు, వారికి ఈ రోజు ఎన్ని ఉన్నాయో చూడండి.” ఇవన్నీ కలిగి ఉండటం ప్రపంచానికి ప్రమాదమైతే తొలి ముప్పు అమెరికా నుంచే వస్తుంది. వారి దగ్గర ఉన్నన్ని మరొక దేశానికి లేవు. పోనీ ఇవన్నీ ఒక్క చైనాకేనా మిగతా దేశాల దగ్గర లేవా ? వాటిని నుంచి మిగతా దేశాలకు ముప్పు లేదా ? ఇదంతా చైనాను దెబ్బతీసే, అనుమానాలు కలిగించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.


ఈ ఏడాది మొదట్లో ప్రపంచానికి తెలిసిన అంచనా ప్రకారం అమెరికా దగ్గర 5,500 అణ్వాయుధాలున్నాయి.ప్రతి ఏటా లక్షల కోట్ల డాలర్లతో నూతన బాంబర్లు, కొత్త ఆయుధాలను రూపొందిస్తోంది. ఖండాంతర క్షిపణి వ్యతిరేక ఒప్పందం, మధ్య శ్రేణి అణ్వాయుధాల నిరోధ ఒప్పందాల నుంచి వైదొలిగింది.ప్రపంచమంతటా ఏదో ఒక పేరుతో తన క్షిపణులను మోహరిస్తూనే ఉంది. అకుస్‌ ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియాకు దొడ్డిదారిన అణుపరిజ్ఞానాన్ని కూడా అంద చేసేందుకు బ్రిటన్‌తో కలసి ఒప్పందం చేసుకుంది. మరి చైనా ఆయుధాలను తయారు చేయటం లేదా ? ప్రతి ఏటా తన వద్ద ఉన్న వాటిని చైనా బహిరంగంగానే ప్రదర్శిస్తోంది. ప్రతిదేశం అదే చేస్తోంది. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన దేశం కూడా ఆయుధాల ప్రదర్శన, ఇతర దేశాలతో కలసి మిలిటరీ విన్యాసాలు చేస్తున్నది. అమెరికన్లు ప్రపంచ పెత్తనం కోసం ఆయుధాలను వినియోగిస్తుంటే మిగిలిన దేశాలు ఆత్మ రక్షణ కోసం తయారు చేసుకుంటున్నాయి. తొలిసారిగా అణుబాంబులు వేసి ప్రపంచాన్ని భయ పెట్టింది అమెరికా తప్ప మరో అణుశక్తి ఏదీ అలాంటి దుర్మార్గానికి పాల్పడలేదు. తాముగా ఎవరి మీద ముందుగా అణుబాంబులను ప్రయోగించబోమని చైనా ప్రకటించింది.


కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం ఎలాగో తైవాన్‌ దీవి చైనాలో అంతర్భాగమని అమెరికాతో సహా ప్రతిదేశం అధికారికంగా గుర్తించింది. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చినపుడు అది తిరుగుబాటు ప్రాంతంగా కమ్యూనిస్టు వ్యతిరేక శక్తుల చేతిలో ఉండి, ఇప్పటికీ కొనసాగుతోంది. ఐరాసలో చైనా అంటే తైవాన్‌తో కూడినది తప్ప మరొకటి కాదు. కానీ అమెరికా, ఐరోపాయూనియన్‌, తదితర కొన్ని దేశాలు తైవాన్ను బలప్రయోగంతో ఆక్రమించేందుకు చైనా చూస్తోందని, దాన్ని తాము అడ్డుకుంటామని చెబుతున్నాయి. శాంతియుత పద్దతిలోనే విలీనం జరగాలని చైనా చెబుతోంది. గత నెల 27న అమెరికా నావలు తైవాన్‌ తీరంలో సంచరించాయి.తైవాన్‌ మిలిటరీకి ఆధునిక ఆయుధాలను విక్రయిస్తున్నది. పదమూడు మంది సభ్యులున్న ఐరోపా యూనియన్‌ పార్లమెంటరీ కమిటీ తైవాన్‌కు రావటం అమెరికా పధకంలో భాగమే. గత పది నెలల్లో ఐరోపా యూనియన్‌ పార్లమెంటు పన్నెండు తైవాన్‌ అనుకూల తీర్మానాలు చేసింది. ఇవన్నీ చైనాను రెచ్చగొట్టే ఎత్తుగడలు తప్ప మరొకటి కాదు. ఒకవైపు ఇలాంటి పనులు చేస్తూ వాటిని కప్పి పుచ్చేందుకు చైనా గురించి కట్టుకధలను ప్రచారం చేస్తున్నది. ఇలాంటివి ఇదే ప్రారంభం కాదు, ఇంతటితో ఆగేవి కాదు. 2049 నాటికి చైనాలో కమ్యూనిస్టు పాలనకు వందేళ్లు పూర్తి అవుతాయి. అప్పటికి హాంకాంగ్‌, మకావూ, తైవాన్‌ దీవులను పూర్తిగా ప్రధాన చైనా భూభాగంలో విలీనం చేసేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. దాన్ని కొనసాగనివ్వకుండా చూసేందుకు అమెరికా, ఇతర కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు పూనుకున్నాయి.పెంటగన్‌ నివేదిక దానిలో భాగమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా మహావేగ క్షిపణి ప్రయోగం – అయోమయంలో అమెరికా ?

22 Friday Oct 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Arms race, China hypersonic missile, Hypersonic missile, spacecraft


ఎం కోటేశ్వరరావు


ఇప్పుడు అమెరికా, ఇతర దేశాల మిలిటరీ నిపుణులను చైనా శాస్త్రవేత్తలు అయోమయంలో పడవేశారా ! లేక ఆయుధాల పోటీకి ఒక సాకుగా అమెరికన్లు ప్రచారదాడి ప్రారంభించారా ? సినిమాలకే పరిమితమైన స్టార్‌వార్స్‌ నిజం అవుతాయా ? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ! ఏదైనా జరిగేందుకు ఆస్కారముంది.చైనా ప్రయోగం నిజమైనా కాకున్నా ఈ పరిణామం అంతరిక్షాన్ని ఆయుధమయం గావిస్తుంది. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసిన ఒక కథనంతో అమెరికా మిలిటరీ నిపుణులు, పశ్చిమ దేశాల మీడియా గుండెలు బాడుకుంటూ ఇంకేముంది అంతా అయిపోయింది మిలిటరీ రంగంలో కూడా చైనా పైచేయి సాధించింది, అణు ముప్పు తలెత్తింది అంటూ నానాయాగీ చేస్తున్నారు. మరోవైపు భయ పడాల్సిందేమీ లేదంటూ తమ వీపును తామే తట్టుకుంటున్నారు. వార్తలో రాసిందేమిటి ?

చైనా వ్యోమ నౌకతో అనుసంధానం చేసిన అణ్వాయుధం అమర్చగలిగిన క్షిపణి విపరీత వేగంతో భూమికి దగ్గర కక్ష్యలో ప్రదక్షిణం చేసిందని, దాన్ని నిర్ణీత ప్రాంతంలో జారవిడిచిందని పేర్కొన్నది. ఈక్షిపణి అన్నివైపుల నుంచి అమెరికా మీద దాడి చేస్తుందని, రాడార్లను తప్పించుకుంటుందని రాసింది. హైపర్‌సోనిక్‌ క్షిపణిని ఆగస్టునెలలో ప్రయోగించిందని లక్ష్యానికి నలభై కిలోమీటర్ల దూరంలో బాంబును వేసిందని, అసలు అలాంటి పరిజ్ఞానం సాధించిన తరువాత నిర్ధిష్టంగా లక్ష్యాన్ని చేరుకొనే విధంగా లోపాలను సవరించటం పెద్ద పని కాదంటూ కిందు మీదవుతున్నారు.(ధ్వని వేగంతో సమంగా ప్రయాణించే వాటిని సూపర్‌ సోనిక్‌ అనీ ఐదు రెట్లు అంతకంటే ఎక్కువ వేగం ఉన్న వాటిని హైపర్‌సోనిక్‌ అంటున్నారు)


దీని మీద చైనా చెబుతున్నదేమిటి ? ఒక సారి ప్రయోగించిన వ్యోమనౌకను మరోసారి వినియోగించటం ద్వారా ఖర్చు తగ్గింపు గురించి జరిపిన ప్రయోగం తప్ప క్షిపణి కాదని చెబుతోంది. సదరు నౌక భూమి మీదకు తిరిగి వచ్చే క్రమంలో దానికి అనుసంధానించిన పరికరాలు విడిపోయి సముద్రంలో మండిపోయినట్లు పేర్కొన్నది. కాదు క్షిపణి అని అమెరికా అందించిన సమాచారం ఆధారంగా ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక రాసిన కథనం సంచలనం సృష్టించింది. దాని కొనసాగింపుగా మిగతా మీడియా అందుకుంది. రెండూ వాస్తవం కావచ్చు. అనేక దేశాలు తాము చేస్తున్న ప్రయోగాలను బహిరంగ పరచటం లేదు.


ప్రస్తుతం ప్రపంచంలో ఆయుధ పోటీ నడుస్తోందన్నది వాస్తవం. నిత్యం ప్రపంచాన్ని తన అమ్ములపొదిని చూపి బెదిరిస్తున్నది అమెరికా. తన నూతన ఆయుధాల ప్రయోగశాలగా ఇరాక్‌ యుద్ధాన్ని వినియోగించుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అణ్వస్త్రాలు ఉన్న దేశాలుగా అధికారికంగా గుర్తించినవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాత్రమే.ఈ ఏడాది జనవరి నాటికి వాటి వద్ద ఉన్నట్లు అంచనా వేస్తున్న అణ్వస్త్రాల సంఖ్య దేశాల వారీ ఇలా ఉంది. అమెరికా 5,550, రష్యా 4,495, చైనా 350, ఫ్రాన్స్‌ 290, బ్రిటన్‌ 225, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేయని పాకిస్తాన్‌ 165, భారత్‌ 156, ఇజ్రాయెల్‌ 90, ఉత్తర కొరియా 40-50 కలిగి ఉన్నట్లు అంచనా. ఇక ఏక్షణంలో అయినా బాంబులను తయారు చేయగలిగిన, కార్యక్రమం ఉన్న దేశాలుగా ఇరాన్‌, సిరియా ఉన్నాయి. అణుకార్య క్రమాన్ని నిలిపివేసిన జాబితాలో బెలారస్‌, కజకస్తాన్‌, ఉక్రెయిన్‌, దక్షిణాఫ్రికా, ఇరాక్‌, లిబియా,అర్జెంటీనా, బ్రెజిల్‌, దక్షిణ కొరియా ఉన్నాయి. ఇక్కడ ఎవరి దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయన్నది కాదు, అవి మారణహౌమం సృష్టిస్తాయన్నదే అసలు సమస్య. పరస్పర విశ్వాసం లేనందున ఎవరు ప్రయోగించినా వాటిని అడ్డుకొనే కొత్త క్షిపణులను, వాహకాలను తయారు చేసేందుకు పోటీ పడుతున్నారు. చైనా తయారు చేసిందని చెబుతున్న హైపర్‌సోనిక్‌ క్షిపణి రగడ అదే.


మిలిటరీ రంగంలో రష్యా పోటా పోటీగా ఉందికనుకనే ఇంతకాలం అమెరికా కొంత మేరకు అదుపులో ఉంది. ఇటీవలి కాలంలో ఆర్ధికంగా చైనా సవాలు విసురుతోంది. ఈదశాబ్ది అంతానికి అమెరికాను అధిగమిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. భారీ సంఖ్యలో అణ్వాయుధాలు లేకున్నా వాటిని అంతరిక్షం నుంచి ప్రయోగించగలిగే పరిజ్ఞానాన్ని చైనా సంతరించుకుందనే భయం పట్టుకుందిప్పుడు. దీనిలో రెండు అంశాలున్నాయి. ఇరాక్‌ను ఆక్రమించుకొనేందుకు దానికి ఏదో ఒక సాకు చూపాలి, దానిలో భాగంగా అక్కడ మారణాయుధాలను సద్దామ్‌ హుసేన్‌ గుట్టలుగా పోశారనే ప్రచారం చేసి దురాక్రమణకు పాల్పడ్డారు. ఇప్పుడు చైనా విషయంలో దాన్నొక బూచిగా చూపి ఇతర దేశాలను భయపెట్టటం, ఆ సాకుతో తన ఆయుధాలను మెరుగుపరచుకొనే ఎత్తుగడ ఉంది. ఒక వైపున చైనా అంటే చౌకవస్తువులను ఉత్పత్తి చేయటం తప్ప ఆధునిక పరిజ్ఞానం వారి దగ్గర ఎక్కడుందని చెబుతారు. మరొక వైపు అరే మనకు తెలియకుండా ఇప్పుడు ఇంత పరిజ్ఞానం ఎప్పుడు సంపాదించుకుందని ఆశ్చర్యపోతున్నట్లు, అతిశయోక్తుల కథలు చెబుతారు. భారత్‌, చైనా ఏ దేశమైనా తన భద్రతను తాను చూసుకోవాలి. అందుకే భారత్‌ అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంలో చేరలేదు.అలాగే అమెరికా కవ్వింపులను ఎదుర్కొనేందుకు చైనా పూనకుంటుందనటంలో సందేహం ఉండనవసరం లేదు.


మరోవైపున అమెరికా చేస్తున్నదేమిటి ? దాని దగ్గర అత్యాధునిక బాంబర్లు ఉన్నాయి. వాటిలో ఒకటైన బి-52హెచ్‌ బాంబరుకు హైపర్‌సోనిక్‌ క్షిపణి ఎజిఎం 183ఏ(ఎఆర్‌ఆర్‌డబ్ల్యు)కు రాకెట్‌ను జతచేసి ప్రయోగాలు జరుపుతోంది. జూలై నెలలో రెండవ ప్రయోగం విఫలమైనట్లు, దాన్ని విశ్లేషిస్తున్నట్లు అధికారులే చెప్పారు. మరి వీటి సంగతేమిటి ? అమెరికా చేస్తే ఒప్పు చైనా చేస్తే ముప్పా ? ఈ ప్రయోగంలో ఆయుధం బాంబరు నుంచి విడిపోయి నప్పటికీ రాకెట్‌ మోటార్‌ పనిచేయక విఫలమైంది. అంతకు ముందు చేసిన తొలి ప్రయోగంలో క్షిపణి విడిపోలేదు. దీనికి సంబంధించి అనేక ప్రయోగాలు అంతకు ముందు జరిగాయి. ఇవి ఎందుకు చేస్తున్నారు ? ఆయుధ వ్యాపారి లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ కోసమేకదా ! ఈ ప్రయోగం ఇతర దేశాలను భయపెట్టేందుకు గాక ఏ లోక కల్యాణం కోసం జరుపుతున్నట్లు ? బ్రిటన్‌తో కలసి ఆస్ట్రేలియాకు అణుపరిజ్ఞానంతో పని చేసే జలాంతర్గాములను అందచేసేందుకు ఒప్పందం(అకుస్‌) చేసుకుంది. ఇది ఎన్‌పిటిని ఉల్లంఘించటం కాదా ? ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే మిగతా దేశాలు ఏం చేయాలి ?


తన నేరాలు, ఘోరాలను కప్పి పుచ్చుకొనేందుకు ఇతర దేశాలపై నిందలు వేయటం, మీడియా ద్వారా ప్రచారం చేయించటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య.గ్జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో అణ్వాయుధాలను ప్రయోగించేందుకు చైనా గోతులు తీసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో రాశారు.పత్రికల వార్తలను పట్టుకొని అమెరికాలోని కొందరు రెచ్చిపోతున్నారు. సాయుధ దళాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడైన రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘెర్‌ వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాలన్నాడు.లేనట్లైతే ఈ దశాబ్దిలోనే ప్రచ్చన్నయుద్దంలో కమ్యూనిస్టు చైనాతో అమెరికా ఓడిపోనుందని చెప్పాడు.
హైపర్‌సోనిక్‌ క్షిపణులను పరీక్షించటం కొత్తగా జరుగుతున్నదేమీ కాదు, బహిరంగ రహస్యమే.చైనా తొలిసారిగా 2014లో రష్యా 2016లో పరీక్షించింది, అమెరికా చేస్తున్నదీ అదే. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్ధలను కూడా తప్పించుకొని నిర్దేశిత లక్ష్యాన్ని చేధించే దాన్ని చైనా రూపొందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిజ్ఞానం అమెరికా దగ్గర లేదని కూడా కొందరు చెప్పారు. ఇదే గనుక నిజమైతే తామెంతో ముందున్నామని చెప్పుకుంటున్న అమెరికా తన మిత్రదేశాలను, తన జనాన్ని ఏ విధంగా సమాధానపరుస్తుంది ? ఆప్ఘనిస్తాన్‌లో పొందిన పరాభవం గురించి ఇంకా చర్చ జరుగుతుండగానే ఈ వార్త అమెరికా సామర్ధ్యం మీద మరింత అనుమానాలను రేకెత్తించదా ? అయినా ప్రచారం చేస్తున్నారంటే ఏదో దాని వెనుక ఏదో ఉండి ఉండాలి.


అమెరికా దూకుడును అడ్డుకునేందుకు 1960దశకంలో నాటి సోవియట్‌ ఇలాంటి వ్యవస్ధలను ఏర్పాటు చేసేందుకు పూనుకున్నప్పటికీ తరువాత నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి అమెరికా తెగబడుతున్నందున ఇతర దేశాలు అందుకు పూనుకొనే అగత్యం ఏర్పడింది. అనేక రంగాల్లో దూసుకుపోతున్న చైనా నిజంగా అధునాతన క్షిపణిని పరీక్షించినా ఆశ్చర్యం లేదు. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ కధనం ప్రకారం చైనా పరీక్షించిన క్షిపణి వేగం గంటకు 33,800కిలోమీటర్లు, గాలిలో ధ్వని కంటే 27 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీన్ని పసిగట్టటం లేదా అడ్డుకోవటం కష్టం. అమెరికా వద్ద ఉన్న ఖండాంతర క్షిపుణులు 23రెట్ల వేగంతో దూసుకుపోతాయి. కొందరు నిపుణులు మరోవాదన వినిపిస్తున్నారు. ఉపగ్రహాల వినియోగం పెరగటం, భూమి, అంతరిక్షంలోని వస్తువులను పసిగట్టే పరికరాలుఉన్నందున హైపర్‌సోనిక్‌ క్షిపణులతో పెద్దగా ప్రయోజనం లేదని ఖండాంతర క్షిపణులే మెరుగని చెబుతున్నారు. అదే నిజమైతే అమెరికన్లు ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏముంది ? అమెరికా నిపుణుడు మార్కో వాదన మరో విధంగా ఉంది.అమెరికా రూపొందించిన బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్ధ( బిఎండి)ను, అమెరికా నగరాలను దెబ్బతీసే శక్తి హైపర్‌సోనిక్‌ క్షిపణికి ఉంటుందని చెబుతున్నాడు. ఇదే అమెరికన్లను భయపెడుతోందన్నది మరొక వాదన. ఒక క్షిపణి ప్రయోగం జరిపినంత మాత్రానే చైనా వద్ద అలాంటివి ఉన్నట్లు కాదని మరొకరు చెప్పారు. అసలు చైనా వారెలా చేశారో తమకు అర్దం కావటం లేదని ఒక అధికారి చెప్పినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. ఈ పత్రిక విశ్వసనీయత గురించి చర్చించటంలో అర్ధం లేదని కొన్ని కీలకమైన మిలిటరీ సాంకేతిక పద్దతుల్లో అమెరికాతో ఉన్న దూరం తగ్గుతోందని, చైనాను ఎవరూ ఆపలేరని గ్రహించాలని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రాసింది. బిఎండి ఉంది కదా మనకు ఇబ్బంది లేదనుకుంటే ఇప్పుడు కుదరదని, ఉపగ్రహాలను కూల్చివేసే క్షిపణులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఒక అమెరికన్‌ సూచించాడు.


అణుబాంబును తయారు చేయటమే గాక దాన్ని ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది, మిగతాదేశాలను రెచ్చగొట్టిందీ అమెరికా. దాన్ని అడ్డుకొనేందుకు ఎవరైనా కొత్త అస్త్రాలను సమకూర్చుకుంటే అమెరికాను రెచ్చగొట్టేందుకే ఆ పని చేస్తున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. అమెరికా ఖండాంతర క్షిపణులకు ధీటుగా రష్యా ఆర్‌ఎస్‌-28 సరమాట్‌ పేరుతో కొత్త క్షిపణి తయారు చేస్తోంది. అది ఈ ఏడాదే సిద్దం అవుతుందనే వార్తలు వచ్చాయి. అది సూపర్‌ ఖండాంతర క్షిపణి అంటున్నారు. దాదాపు పదహారువేల కిలోమీటర్ల వేగంతో, ఒకేసారి అనేక బాంబులను మోసుకుపోయి ఒకేసారి నిర్ణీత ప్రాంతాల మీద జారవిడుస్తుందని చెబుతున్నారు.

అక్టోబరు తొలివారంలో చైనా విమానాలు తైవాన్‌ దీవి మీద అనేక చక్కర్లు కొట్టటాన్ని ప్రపంచ మీడియా కథలు కథలుగా వర్ణించింది. చైనా చర్యకు పోటీగా, కవ్విస్తూ అమెరికా, కెనడాలు క్షిపణి విధ్వంసక నావ, ఫ్రైగేట్‌ను తైవాన్‌ జలసంధిలో తిప్పాయి. ఆ తరువాతే ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ప్రపంచాన్ని రెచ్చగొట్టే విధంగా చైనా హైపర్‌సోనిక్‌ క్షిపణి గురించి కథ అల్లింది. అమెరికా క్షిపణి విధ్వంసక వ్యవస్ధను రూపొందించినప్పటికీ దాని అవసరం కలగలేదు. అది ఎలా పనిచేస్తుందో పరీక్షలు జరుపుతున్నారు. ఎవరైనా అమెరికా మీదకు దీర్ఘశ్రేణి క్షిపణిని వదిలితే దాన్ని మధ్యలోóనే అడ్డుకొనేందుకు రూపొందించారు. ఇప్పటి వరకు 19సార్లు పరీక్షించగా పన్నెండుసార్లు విజయవంతమైంది. గత రెండున్నర సంవత్సరాలుగా పరీక్షలు లేవు. దాని మీద ఇంకా అనుమానాలు తొలగలేదు. ప్రస్తుతం ఉన్న ఖండాంతర క్షిపణులు వంద మీటర్లకు అటూ ఇటుగా లక్ష్యాన్ని చేరతాయి. ఇటీవలి కాలంలో చైనా అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యాతో పోటీ పడుతోంది. ఈ నేపధ్యంలో చైనా పరీక్ష ఇప్పుడు నిజం కాకపోయినా త్వరలో చేసినా ఆశ్చర్యలేదు. అమెరికన్లు అదుపులో ఉంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా మాటలకు అర్ధాలే వేరు- అది రేపిన సరికొత్త చిచ్చు ‘అకుస్‌ ‘ !

22 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

anti china, AUKUS, Joe Biden, U.S. Cold War on China

ఎం కోటేశ్వరరావు


ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అని ఆడిపోసుకున్నారు గానీ నిజానికి అమెరికా మాటలకే అర్ధాలు వేరు. ఆఫ్ఘనిస్తాన్నుంచి ఉపసంహరించుకున్న అమెరికా ఎక్కడ ఎలా కొత్త పధకంతో వస్తుందో అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో బ్రిటన్‌, ఆస్ట్రేలియాతో కలసి చేసుకున్న మిలిటరీ ఒప్పందం(అకుస్‌)తో సరికొత్త చిచ్చు రేపింది. ఆ మాటలు ఇంకా చెవుల్లో ఉండగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఐరాసలో చేసిన తొలి ప్రసంగంలోనే ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకున్నాడు. మరోసారి తాము ప్రచ్చన్న యుద్ధాన్ని కోరుకోవటం లేదని చెప్పాడు. మరి ఎవరు కోరుకుంటున్నారు ?

అసలు ప్రచ్చన్న యుద్దాన్ని ప్రారంభించింది ఎవరు ? ఇంకెవరు అమెరికన్లే. తొలిసారిగా అణుబాంబులను ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికా దుర్మార్గ నేపధ్యంలో బ్రిటీష్‌ రచయిత జార్జి ఆర్వెల్‌ తొలిసారిగా ప్రచ్చన్న యుద్ద పదాన్ని 1945 అక్టోబరు 19న ట్రిబ్యూన్‌ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. మరుసటి ఏడాది మార్చి పదవ తేదీన అబ్జర్వర్‌ పత్రికలో బిటన్‌కు వ్యతిరేకంగా సోవియట్‌ యూనియన్‌ ప్రచ్చన్న యుద్దాన్ని ప్రారంభించిందని ఆరోపించాడు.1947 ఏప్రిల్‌ 16న అమెరికాను ఏలిన డెమోక్రటిక్‌ పార్టీల అధ్యక్షులకు సలహాదారుగా పనిచేసిన బెర్నార్డ్‌ బరూచ్‌ మాట్లాడుతూ మనల్ని మనం మోసం చేసుకోవద్దు, మనం ప్రచ్చన్న యుద్దం మధ్యలో ఉన్నామని ప్రకటించాడు.1991 డిసెంబరు 26న సోవియట్‌ యూనియన్‌ రద్దయినట్లు అధికారికంగా ప్రకటించారు. దాని మీద స్పందించిన అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌ ” మన జీవితాల్లో, నా జీవితకాలంలో ప్రపంచంలో జరిగిన అతి పెద్ద అంశం ఏమంటే దేవుడి దయ వలన ప్రచ్చన్న యుద్దంలో అమెరికా విజయం సాధించింది” అన్నాడు.

అలాంటి దుష్ట అమెరికా పాలకుడిగా జో బైడెన్‌ ఐరాసలో తొలిసారిగా నోరు విప్పి పచ్చి అబద్దం ఆడాడు. రాబోయే రోజుల్లో ఇలాంటి వాటిని ఎన్నింటిని వినాల్సి వస్తుందో, ఎన్ని దుర్మార్గాలకు పాల్పడతారో తెలియదు. ఆఫ్ఘనిస్తాన్‌లో పొందిన పరాభవం నుంచి అమెరికా పాలకవర్గం ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. చైనా గతంలోని సోవియట్‌ యూనియన్‌ కాదు అని తెలిసినప్పటికీ అమీతుమీ తేల్చుకునేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది.

చైనాకు వ్యతిరేకంగా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం 2.0లో భాగంగానే ట్రంప్‌ ప్రారంభించిన దుర్మార్గాలన్నింటినీ బైడెన్‌ కొనసాగిస్తున్నాడు. దానిలో తాజా చర్య అకుస్‌ ప్రకటన. చైనాకు వ్యతిరేకంగా మూడు దేశాలూ కూటమి కడితే దానితో ఆర్ధికంగా ప్రభావితమైన ఫ్రాన్స్‌ మండిపడింది. దానికి బాసటగా ఐరోపా యూనియన్‌ నిలవటం తాజా పరిణామం. కొన్ని సంవత్సరాలుగా డీజిలుతో నడిచే సంప్రదాయ జలాంతర్గాముల గురించి ఆస్ట్రేలియా-ఫ్రాన్స్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు అవి కానసాగుతుండగానే ఫ్రాన్స్‌ను ఏమార్చి అణుశక్తితో నడిచే జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు సరఫరా చేసే ఒప్పందాన్ని నాటకీయంగా ప్రకటించాయి. ” మేము ఆస్ట్రేలియాతో సంబంధాలను విశ్వసించాము, దాన్ని ఇప్పుడు వమ్ముచేశారు, ఇది వెన్ను పోటు ” అని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీన్‌ వెస్‌ లీ డ్రెయిన్‌ వర్ణించాడు. అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి తన రాయబారులను ఫ్రాన్స్‌ వెనక్కు పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామ పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.అకుస్‌ ఒప్పందం పూర్తి బాధ్యతా రహితమైందని చైనా వర్ణించింది.చైనాను రెచ్చగొడుతున్నారని, ఎలాంటి దయా దాక్షిణ్యాల్లేకుండా ఆస్ట్రేలియాను శిక్షిస్తుందని గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక సంపాదకీయం హెచ్చరించింది.


అకుస్‌ చర్యకు ప్రతిగా ఆస్ట్రేలియాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని పునరాలోచించాల్సిందిగా ఐరోపాయూనియన్ను ఫ్రాన్స్‌ కోరింది. ఇప్పటి వరకు పదకొండు దఫాల చర్చలు జరిగాయని, పన్నెండ విడత చర్చలు మామూలుగానే జరుగుతాయని, వచ్చే ఏడాది ముగింపుకు రావచ్చని ఆస్ట్రేలియా మంత్రి డాన్‌ టెహాన్‌ చెప్పాడు. ఇండో-పసిఫిక్‌ వ్యూహం గురించి చర్చించే ఐరోపా యూనియన్‌ సమావేశానికి కొద్ది గంటల ముందే గత బుధవారం నాడు అకుస్‌ ఒప్పందాన్ని బహిర్గతం చేశారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకాలు చేసిన ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే జలాంతర్గాముల తయారీ పరిజ్ఞానాన్ని అందచేయాలని నిర్ణయించటం అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన తప్ప మరొకటి కాదు. అణ్వాయుధాల తయారీకి దోహదం చేసే యురేనియం శుద్ధి రియాక్టర్లను జలాంతర్గాములలో అమరుస్తారు. ప్రస్తుతం ఒప్పందంలో వాటికి అణ్వాయుధాలను అమర్చే ప్రతిపాదన, లక్ష్యం లేనప్పటికీ వాటిని అమర్చేందుకు వీలుగా తయారీ జరుగుతుంది. కనుక సాంకేతికంగా ఆస్ట్రేలియా అణ్వాయుధాలను తయారు చేయకపోయినా ఏదో ఒకసాకుతో అమెరికా, బ్రిటన్‌ అమర్చేందుకు వీలు కలుగుతుంది. ఇది ఒక ప్రమాదకర పరిణామం. అమెరికా తలచుకుంటే ఏ దేశానికైనా ఇలాంటి వాటిని అందచేయవచ్చు.


హిందూ మహాసముద్రం-పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో అమెరికా వ్యూహం ప్రకారం ఆస్ట్రేలియా కీలక స్ధానంలో ఉంది. తొంభై బిలియన్‌ డాలర్ల విలువగల డీజిల్‌తో నడిచే 12 ఫ్రెంచి జలాంతర్గాములకు బదులుగా అమెరికా, బ్రిటన్‌ అందచేసే పరిజ్ఞానంతో నిర్మితమయ్యే 66 బిలియన్‌ డాలర్ల విలువ గల ఎనిమిది అణుశక్తితో నడిచే జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు సమకూర్చాలని నిర్ణయించారు. ఒప్పందంలో ఎక్కడా చైనా పేరు ప్రస్తావన లేనప్పటికీ అది చైనాకు వ్యతిరేకం అన్నది స్పష్టం. ఒక వైపు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌లతో కూడిన చతుష్టయం(క్వాడ్‌) ఉన్నప్పటికీ అకుస్‌ను రంగంలోకి తెచ్చారు. చతుష్టయం మిలిటరీ కూటమి కాదని ప్రకటించిన కారణంగా ఆ పేరుతో మిలిటరీ చర్యలు, ఆయుధాలను విక్రయించే అవకాశాలు లేవు. రెండవది భారత్‌ ఎంత మేరకు మిలిటరీ కూటమిలో భాగస్వామి అవుతుందో అనే అనుమానాలు అమెరికాకు ఉన్నాయి.


ఈ ఒప్పందంతో ఆస్ట్రేలియా మిలిటరీ స్ధావరాలు అమెరికాకు మరింతగా అందుబాటులోకి వస్తాయి. సోవియట్‌ యూనియన్‌తో అమెరికా జరిపిన ప్రచ్చన్న యుద్దంలో మిలిటరీ రంగంలో పోటీ కేంద్రీకృతం అయింది. ఇప్పుడు చైనాతో ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దంలో మిలిటరీతో పాటు ఆర్ధిక రంగంలో అమెరికాకు సవాలు ఎదురుకావటం కొత్త పరిణామం. మధ్య ప్రాచ్యంతో పోల్చితే ఆసియన్‌ దేశాలలో తమ అమ్మకాలు వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోందని 2018లో సింగపూర్‌లో జరిగిన షాంగ్రి లా సమావేశంలో అమెరికా ఆయుధ కంపెనీ జనరల్‌ డైనమిక్స్‌ సిఇఓ హెబె నోవాకోవిక్‌ చెప్పారు. ఆమె అమెరికా రక్షణశాఖ, సిఐఏలో కూడా పనిచేశారు. మొరటుగా ఉండే అధికారులను ఆకట్టుకుంటే అమెరికా ఆయుధ వ్యాపారుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని, స్వంతంగా తయారు చేసుకోవాలనే జాతీయ ప్రయత్నాలను నిరుత్సాహపరచాలని కూడా సెలవిచ్చింది. ఇలాంటి ఆయుధ వ్యాపారుల ఆకాంక్షల పర్యవసానమే ఇప్పుడు ఆసియాలో పెరుగుతున్న ఆయుధపోటీ, అమెరికా విధానాలు అని చెప్పవచ్చు. బైడెన్‌ హయాంలో ఇవి ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. వాణిజ్యవేత్త అయిన కర్ట్‌ఎం కాంప్‌బెల్‌ అధ్యక్ష భవన సమన్వయకర్తగా, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌, నలుగురికీ ఆయుధవ్యాపారులతో దీర్ఘకాలికంగా ఆర్ధిక సంబంధాలున్నాయి.

ప్రపంచం మొత్తం దిగుమతి చేసుకొనే ఆయుధాలలో ఆసియా మరియు ఓషియానా దేశాల వాటా 42శాతం ఉంది. వీటిలో మధ్య ప్రాచ్య దేశాల వాటానే 33శాతం ఉంది. 2020లో అమెరికా 778 బిలియన్‌ డాలర్లను మిలిటరీకి ఖర్చు చేయగా చైనా చేసింది 252బి.డాలర్లు. చైనా ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 4.7శాతం చేసుకుంటున్నది. అమెరికా పుణ్యమా అని తన ఆయుధాలను అమ్ముకొనేందుకు వేసిన ఎత్తుగడలతో ప్రస్తుతం దాని మిత్రదేశంగా ఉన్న మనం అత్యధికంగా 9.5శాతం, ఆస్ట్రేలియా 5.1, జపాన్‌ 2.2శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాము. వీటిని చూసి చైనాను దెబ్బతీయవచ్చనే అంచనాలతో కొందరు రెచ్చిపోతున్నారు.ప్రస్తుతం ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా 37శాతంతో అగ్రస్ధానంలో ఉంది, ఇది చైనా ఎగుమతులతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువ.న్యూయార్క్‌ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రదాడి తరువాత అమెరికా ఇప్పటి వరకు వివిధ దేశాల్లో యుద్దాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దీనిలో దీనిలో ఎక్కువ భాగం తన ఆయుధ కంపెనీలకే తిరిగి చేరిందన్నది తెలిసిందే. ఆసియాలో శాంతి భద్రతలు సజావుగా ఉంటే 2050 నాటికి మూడువందల కోట్ల మంది ఆసియన్లు ఐరోపాలోని జీవన ప్రమాణాలను అందుకుంటారని 2011లో ఆసియా అభివృద్ది బ్యాంకు అంచనా వేసింది. అమెరికా, దానితో చేతులు కలుపుతున్న దేశాల చర్యలు దీన్ని సాకారం చేసేవిగా లేవు.


నాటో కూటమిలో విశ్వసనీయ భాగస్వామిగా ఉన్న ఫ్రాన్స్‌కు తెలియకుండా బ్రిటన్ను భాగస్వామిగా చేసుకొని అమెరికన్లు ఆస్ట్రేలియాతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు అన్నది ఆసక్తికరమే. ఐరోపాలో బ్రిటన్‌ పాత్ర అమెరికాకు బంటు తప్ప మరొకటి కాదని ఐరోపా యూనియన్‌ వ్యవహారాల్లో స్పష్టమైంది. ఇప్పుడు దాన్నుంచి పూర్తిగా బయటకు వచ్చింది కనుక దానిష్టం వచ్చినట్లు వ్యహరించవచ్చు. అమెరికా అణు పరిశోధనలు, బ్రిటన్‌ పరిశోధనలు, సహకారం ఎప్పటి నుంచో నడుస్తోంది.1958లో బ్రిటన్‌ జలాంతర్గాములకు అణుశక్తితో నడిపే రియాక్టర్లను అమెరికా అంద చేసింది. తరువాత వాటిలో అమెరికా క్షిపణులు మోహరించే విధంగా మార్పులు చేశారు. ఇక బ్రిటన్‌ కామన్‌వెల్త్‌ దేశంగా ఉన్న ఆస్ట్రేలియాలో బ్రిటన్‌ తన అణు ప్రయోగాలను నిర్వహించింది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మధ్య గూఢచార సమాచారం ఇచ్చిపుచ్చుకొనే ఒప్పందం 1941లోనే కుదిరింది. దీన్ని యుకుసా లేదా ఐదు నేత్రాలు అని పిలిచారు. తరువాత అనేక దేశాలతో ఇలాంటి ఒప్పందాలు కుదిరినప్పటికీ ఈ కూటమి ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్ని దక్షిణకొరియాను కలుపుకొని విస్తరించేందుకు పూనుకున్నారు.


ఆస్ట్రేలియా మిలిటరీ అమెరికా తరఫున కొరియా, వియత్నాం, ఆప్ఘనిస్తాన్‌ తదితర యుద్దాలలో విశ్వాసపాత్ర దేశంగా పాల్గొన్నది.ఇటీవలి కాలంలో అమెరికా తన చేతికి మట్టి అంటకుండా ఇతర దేశాలను ప్రయోగిస్తున్నది. దానిలో భాగంగానే ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఆస్ట్రేలియాను సాయుధం చేసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ విలీనం సమస్యపై చైనాతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న అమెరికా, జపాన్‌లకు ఇప్పుడు ఆస్ట్రేలియాను కూడా తోడు చేయాలని నిర్ణయించినట్లు చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో ఈ దేశాలు తైవాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాకు అణుశక్తి జలాంతర్గాములను సమకూర్చితే పరిసర దేశాలు అభద్రతకు గురయ్యే అవకాశం ఉంది.బ్రిటన్‌ కూడా ఈ ఏడాది మార్చినెలలో తన అణ్వాయుధాల సంఖ్యను 180 నుంచి 260కి పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం అణుశక్తితో నడిచే జలాంతర్గాములున్న దేశాలలో మనది కూడా ఒకటి. అమెరికా,చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం రష్యా సహకారంతో అరిహంట్‌ అనే జలాంతర్గామిని నిర్మించాము. మరో ఆరింటిని సమకూర్చుకోవాలని నిర్ణయించాము. ఆధునిక అణుశక్తి జలాంతర్గాములకు ఒకసారి అణుఇంధనాన్ని సమకూర్చితే వాటి జీవిత కాలం వరకు పని చేస్తాయి. మన అరిహంట్‌ను ఆరు-ఏడు సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి ఇంధనం నింపాల్సి ఉంటుంది.

ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాలకు హాజరైన ఐరోపా యూనియన్‌ ప్రతినిధులు సమావేశమై ఫ్రాన్స్‌కు మద్దతు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. సమావేశ అనంతరం విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ మాట్లాడుతూ అకుస్‌ ప్రకటన తమను ఆశ్చర్యపరించిందన్నాడు. ఏకపక్షంగా, అనూహ్యంగా, దుర్మార్గంగా వ్యవహరించే ట్రంప్‌ ధోరణులను బైడెన్‌ కొనసాగిస్తున్నాడని తోటి భాగస్వామిని గౌరవించటం లేదని ఫ్రెంచి మంత్రి లీ డ్రెయిన్‌ ఆగ్రహించాడు. అమెరికా విశ్వాసపాత్రత లేకుండా వ్యవహరించిందని ఐరోపా యూనియన్‌ అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ ఆగ్రహించాడు. జోబైడెన్‌ నూతన యంత్రాంగంతో వెనుకటి అమెరికా తిరిగి వచ్చింది.ఈ నూతన ప్రభుత్వం పంపిన చారిత్రాత్మక సందేశం ఇది, ఇప్పుడు మా ముందు ప్రశ్నలు ఉన్నాయి. దీని అర్ధం ఏమిటి అని ప్రశ్నించాడు.అమెరికా నిర్ణయం ద్వారా అట్లాంటిక్‌ ప్రాంత కూటమిని బలహీనపరచింది, అమెరికాకు చైనా మీద కేంద్రీకరించటమే ప్రధానమైతే ఆస్ట్రేలియా, బ్రిటన్‌తో చేతులు కలపటం చాలా అసాధారణంగా ఉందన్నాడు.


అమెరికా సాంకేతిక పరిజ్ఞానం, మిలిటరీ మీద ఆధారపడకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో ఐరోపా వ్యవహరించాలని ఫ్రాన్స్‌ చెబుతోంది. ఐరోపా యూనియన్‌-అమెరికా సంబంధాల విషయానికి వస్తే గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా గుర్రుగా ఉంది.చైనాతో గత సంవత్సరం జర్మనీ, ఫ్రాన్స్‌ పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఫ్రాన్స్‌-అమెరికా సహకార ఒప్పందానికి 240 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవాలను ఫ్రాన్స్‌ రద్దు చేసింది.చైనాను దిగ్బంధనం కావించేందుకు అమెరికా ఉద్దేశించిన ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో ఒక పాత్ర పోషించాలని 2018లోనే నిర్ణయించుకున్న తొలి ఐరోపా దేశం ఫ్రాన్స్‌. మీరు కూడా రావాలని జర్మనీ, మొత్తం ఐరోపా అనుసరించాలని కూడా కోరింది.అలాంటిది ఇప్పుడు ఒప్పందంలో తమను కలుపుకోలేదనే దుగ్దతప్ప మరొకటి లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితిలో ఫ్రాన్స్‌ను దూరం చేసుకొనేందుకు అమెరికా ఎట్టి పరిస్ధితిలోనూ ప్రయత్నించదు. అందుకే దాన్ని సంతృపరచేందుకు బైడెన్‌ యంత్రాంగం రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. అవి ఫలిస్తాయా, బేరమాడేందుకు ఉపయోగించుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.ఫ్రాన్స్‌ ప్రధమ కోపం ప్రదర్శించినప్పటికీ తెగేదాకా లాగుతుందని చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విశ్వగురువా… వినదగునెవ్వరు చెప్పిన !

15 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Afghanistan, China Factor, imperialism, India foreign policy under narendra modi, Narendra Modi, NATO, Quadrilateral Security Dialogue


ఎం కోటేశ్వరరావు


ఆఫ్ఘనిస్తాన్‌లో అగ్రరాజ్యం అమెరికాకు జరిగిన ఘోర పరాభవం గురించి ఎంత మూసిపెడదామన్నా, నోళ్లు నొక్కుదామన్నా కుదరటం లేదు. పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలు, సమాచారం వరదలా వస్తూనే ఉంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోందో, జరగనుందో ఇంకా స్పష్టత రాలేదు. పంజీషర్‌ లోయలో ఉత్తరాది కూటమి(నార్తరన్‌ అలయన్స్‌) కొరకరాని కొయ్యగా ఉంది. అధికారంలో వాటా కావాలని పట్టుబడుతోంది. ఆ కూటమి గురించి ఎలా వ్యహరించాలనే అంశం మీద తాలిబన్లలోని రెండు ప్రధాన ముఠాల మధ్య వివాదం ముదిరి కాల్పుల వరకు వచ్చిందనే వార్తలు నమ్మశక్యం లేవు. కాల్పులు జరగటానికి కారణాలు వేరే ఉండవచ్చు. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకార ఉత్సవాన్ని రద్దు చేశారు. రష్యా వంటి దేశాల సలహామేరకు అలా చేశారని ఒకవైపు వార్తలు, మరోవైపు పొదుపు కార్యక్రమంలో భాగంగా అలా చేశామని తాలిబన్లు ప్రకటించారు. పోనీ నిరాడంబరంగా అయినా ప్రమాణస్వీకారం చేశారా లేదా ? తెలియదు. అలాంటిదేమీ లేకుండా పాలన సాగిస్తే అదీ కొత్త వరవడే అవుతుంది.


కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదేందుకు పూనుకోవద్దన్నది తెలుగు ప్రాంతాల్లో లోకోక్తి. ఇప్పుడు గోదావరి బదులు అమెరికాను నమ్మి పోవద్దని చెబుతున్నారు. విశ్వగురువుగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీ ప్రభుత్వానికి కూడా అలాంటి సలహాలు ఇస్తున్నారు. మోడీ ఏ వైఖరి తీసుకుంటారో తెలియదు గనుక పాము చావకుండా కర్ర విరగకుండా అన్నట్లు అనేక మంది అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా సలహాలు ఇస్తున్నారు. రేపు ఏం జరిగినా చూశారా మేం చెప్పిందే జరిగింది అని తమ జబ్బలను తామే చరుచుకుంటారు.


స్టేట్స్‌మన్‌ అనే ఆంగ్లదిన పత్రిక సంపాదకుడిగా పని చేసిన సునంద కె దత్తా రే(84) తాజాగా ఒక విశ్లేషణ రాశారు. ఆయనేమీ కమ్యూనిస్టు కాదు. ఆ విశ్లేషణ సారాంశం ఇలా ఉంది.” భద్రతకు మతం గురించి తెలియదు. హిందూయిస్టు ఇండియా లక్ష్యమైనా ఉగ్రవాదుల దాడులకు నెలవు కాని ఆఫ్ఘనిస్తాన్‌ స్ధిరమైన ప్రభుత్వంతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. ఇప్పుడు అమెరికా పొగుడుతూ ఉండవచ్చుగానీ నరేంద్రమోడీ ఆసియా చరిత్రను అవలోకించాలి. అమెరికాతో తృతీయ ప్రపంచ దేశాల సంబంధాలు మృత్యువును ముద్దాడినట్లే అని పదే పదే రుజువైంది. ఇస్లాం మరియు ఉగ్రవాద రాజకీయాలకు మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధాన్ని హిందూయిస్టు పార్టీ అనుసరించకూడదు. ఇండోనేషియా, పాకిస్తాన్‌ తరువాత 19.5 కోట్ల మంది ముస్లింలకు స్దానం ఉన్న దేశం భారత్‌. ఈ వాస్తవాన్ని విస్మరించకూడదు. సహజ భాగస్వాములంటూ అతల్‌బిహారీ వాజ్‌పాయి, అణుఒప్పందంతో మన్మోహన్‌ సింగ్‌, తరువాత చతుష్టయ కూటమి పేరుతో నరేంద్రమోడీ అమెరికాతో ఎంతో సౌఖ్యంగా ఉన్నారు. చతుష్టయం చర్చలతో పాటు సమాంతరంగా అంతకు ముందు లేని సంయుక్త మిలిటరీ విన్యాసాల(మలబార్‌)కు దారి తీసింది.అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌లతో 2007లో ప్రారంభమైన చతుష్టయ కూటమి తనకు వ్యతిరేకమైనదిగా భావించిన చైనా నిరసన తెలిపింది. సదరు కూటమి మిలిటరీ సంబంధాలకు కాదని, చైనాకు వ్యతిరేకంగా జట్టుకట్టటం లేదని నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నాడు చైనా అధినేతగా ఉన్న హు జింటావోకు హామీ ఇచ్చారు.పరిస్ధితులు మారిపోయాయి. లడఖ్‌ ఘర్షణ ముక్కుసూటి తనాన్ని సమర్ధించవచ్చు. అయితే చైనా చరిత్ర మరియు సంప్రదాయాలు అదే విధంగా అమెరికా, ఇతర ఆసియా దేశాలతో దాని సంబంధాల రికార్డును జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉందని పరిస్ధితి చెబుతున్నది.


ఆసియా పాలకులను అమెరికా నట్టేట ముంచిన, మోసం చేసిన ఎన్నో విచారకరమైన ఉదంతాలను నరేంద్రమోడీ గారు తప్పక తెలుసుకోవాలి. దక్షిణ వియత్నాం అధ్యక్షుడు నగో దిన్‌ దిమ్‌, అతని సోదరుడు నగో దిన్‌ హు మీద జరిగిన మిలిటరీ తిరుగుబాటులో వారు హతమైన ఉదంతాన్ని అమెరికా పట్టించుకోలేదు. మీరు అమెరికాలో ఆశ్రయం పొందుతారా అని హు భార్యను అడిగితే నాకు వెన్నుపోటు పొడిచిన దేశంలో నేను జీవించలేను అని చెప్పింది. దక్షిణ వియత్నాం మరో అధ్యక్షుడు గుయెన్‌ వాన్‌ థీవ్‌ పరిస్ధితిని గమనించి రాజీనామా చేసి తైవాన్‌ పారిపోయాడు.అమెరికా అధ్యక్షుడొకరు ఏ దేశ నియంతను అయినా మా ఒక ఉంపుడు గత్తె కొడుకు అన్నాడంటే అతను దక్షిణ కారియా అధ్యక్షుడు సింగమాన్‌ రీ అయి ఉండవచ్చు. అమెరికా మరియు ఐరాస కమాండర్‌ మార్క్‌ క్లార్క్‌ ఒక రోజు అతన్ని పదవి నుంచి గెంటివేయాలనుకున్నాడు.( అతన్ని సిఐఏ అమెరికా హవాయిలోని హానలూలుకు తరలించింది, అక్కడే చచ్చాడు) అమెరికావదిలించుకొని ఉండకపోతే ఫిలిప్పైన్స్‌ ఫెర్డినాండ్‌ మార్కోస్‌ హానలూలు వెళ్లటం, అక్కడే చచ్చి ఉండేవాడు కాదు( ఇది రోనాల్డ్‌ రీగన్‌ హయాంలో జరిగింది). అమెరికాతో చేతులు కలిపిన అనేక మందిలో అతనొకడు. ఇరాన్‌ షా అమెరికన్లకు సంకటం తెచ్చాడు. ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు, కోర్టులకు ఒక ప్రామాణికమైన పద్దతి లేదు, నమ్మశక్యం కాని పద్దతుల్లో చిత్రహింసల చరిత్ర ఉందని షా పాలన గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వ్యాఖ్యానించింది.( వీడిని సమర్ధించిన అమెరికా పాలకులు ఎంతగా భయపడ్డారంటే పదవీచ్యుతుడైన తరువాత షా అమెరికా వచ్చాడు. న్యూయార్క్‌ ఆసుపత్రిలో స్వంత పేరుతో ఆపరేషన్‌ చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడి డేవిడ్‌ డి న్యూసమ్‌ అనే దొంగపేరుతో చేర్పించారు. మెక్సికో, పనామా ఎక్కడకు వెళితే అక్కడ జనం వ్యతిరేకించటంతో చివరికి ఈజిప్టులో ఆశ్రయం ఇప్పించారు.)

అష్రాఫ్‌ ఘనీ(పారిపోయిన ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు)ది ఒక అసాధారణ అనుభవం. దోహాలో తాలిబాన్లతో చర్చల నుంచి అమెరికా అతన్ని మినహాయించింది. ట్రంపు మాదిరే బైడెన్‌ కూడా తమ అవసరాల మేరకే వ్యవహరించాడు. కఠినమైన వాస్తవం ఏమంటే చిన్నా చితక భాగస్వాములను అమెరికా పట్టించుకోదు, ఏడు దశాబ్దాల పరస్పర రక్షణ ఒప్పందం ఉన్న ఫిలిప్పైన్స్‌నే అది వదలివేసింది.భారత సమస్యల మూలాలు దాని భౌగోళిక రాజకీయ స్దానం, సంస్కృతి, గుర్తింపు, ఆకాంక్షల్లో ఉన్నాయి. సీతారామ్‌ ఏచూరి ఒకసారి హెచ్చరించినట్లు మరొక పాకిస్తాన్‌గా మారితే అవి పరిష్కారం గావు. చైనా చెబుతున్నట్లు చతుష్టయం(క్వాడ్‌) ఆసియా నాటో కావచ్చు, కాకపోవచ్చు. ప్రస్తుతం చైనాతో ఉన్న విబేధాలను అమెరికా పరిష్కరించుకుంటే, మరిచిపోయిన సీటో( సౌత్‌-ఈస్ట్‌ ఆసియన్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌), బాగ్దాద్‌ ఒప్పందాలకు పట్టిన గతే పడుతుందనుకొని సిద్దపడాలి. తరువాత ఇంటా బయటా ఉన్న ముస్లింలతో సర్దుబాటు చేసుకోవాల్సిన వాస్తవాన్ని మోడీ సర్కార్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది.” (బ్రాకెట్లలోని అంశాలు నేను జతచేసినవి)
అమెరికా ఎలాంటిదో, దానితో వ్యవహారం గురించి తాజా పరిణామాలతో అనేక దేశాలు పునరాలోచనలో పడ్డాయి. అమెరికన్‌ కార్పొరేట్లకు లాభాలు తెచ్చేవాటిలో యుద్దం ఒకటి. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. గత రెండు దశాబ్దాల్లో అమెరికా యుద్దాలు, వాటిలో పాల్గొన్న మాజీ సైనికుల సంక్షేమం కోసం చేసిన ఖర్చు ఎనిమిదిలక్షల నుంచి 21లక్షల కోట్ల డాలర్లు. పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్త ఒక దానిలో లాభం రాకపోతే మరొక ఉత్పత్తిని ప్రారంభిస్తాడు. యుద్దం కోసం అంత పెట్టుబడి పెట్టిన దేశం ఒక్కసారిగా తన దుకాణాన్ని మూసుకుంటుందా ? శత్రువులు లేకుండా నిద్రపోతుందా ? ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి తోకముడవటం ఖాయం చేసుకున్న దగ్గర నుంచి అమెరికా యుద్దోన్మాదులు కొత్త రంగాన్ని తెరవటం గురించి ఆలోచనలు చేస్తున్నారు. ఉగ్రవాదం మీద యుద్దం పేరుతో పశ్చిమ, మధ్య ఆసియాలో ఇప్పటి వరకు కేంద్రీకరించారు. ఇప్పుడు దాన్నుంచి చైనా మీద కేంద్రీకరించారు. తైవాన్‌ జల సంధి, దక్షిణ చైనా సముద్రంలో రెచ్చగొట్టే పనులకు పూనుకున్నారు. దానిలో భాగమే చతుష్టయం కార్యకలాపాలు. తైవాన్ను ఆక్రమించేందుకు, దక్షిణ చైనా సముద్రం మీద ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్నదని దాన్ని అడ్డుకోవాలనే పేరుతో అనేక దేశాలను కూడ గడుతున్నతీరు బహిరంగ రహస్యం. ఆఫ్ఘనిస్తాన్లో పెట్టిన ఖర్చును ఇప్పుడు చైనా వైపు మళ్లిస్తారు.2022 సంవత్సరంలో పెంటగన్‌(అమెరికా రక్షణశాఖ) బడ్జెట్‌ 715బిలియన్‌ డాలర్లుగా బైడెన్‌ ప్రభుత్వం అంచనాలు తయారు చేసింది. దానికి అదనంగా మరో 24బి. డాలర్లతో ఒక పధకానికిపార్లమెంట్‌ ఆయుధ సేవల కమిటీ ఆమోదం తెలిపింది. సెనెట్‌ కమిటీ కూడా అదే పద్దతిలో ఆమోదం ప్రకటించింది.


సునంద దత్తా రే చెప్పినట్లుగా అమెరికా చిన్న దేశాలనే కాదు, పెద్ద వాటిని కూడా పట్టించుకోదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదం మీద పోరు సాకుతో దాడులకు దిగింది ఒక్క అమెరికాయే కాదు. నాటో దేశాలు కూడా పాల్గొన్నాయి. కాబూల్‌ విమానాశ్రయం నుంచి పారిపోతుండగా జరిగిన దాడిలో మరణించిన చివరి పదమూడు మందితో కలిపి 2,461 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు. ఇతర దేశాలకు చెందిన వారు 1,145 మంది, వారిలో బ్రిటన్‌ సైనికులు 457, జర్మన్లు 62 మంది చనిపోయారు. ఆ దేశాలతో మాట మాత్రం కూడా చెప్పకుండా అమెరికా నిర్ణయం తీసుకుందనే విమర్శలు వచ్చాయి. విశ్వాసానికి పెద్ద నష్టం జరిగిందని అమెరికాలో జర్మన్‌ మాజీ రాయబారి ఊల్ఫ్‌గాంగ్‌ షింగర్‌ వ్యాఖ్యానించాడు.” ఐరోపాకు నిజమైన గుణపాఠం ఇది. అమెరికా సామర్ద్యం మరియు దాని నిర్ణయాలపై పూర్తిగా ఆధారపడాలా లేదా అంతిమంగా ఒక విశ్వసనీయమైన వ్యూహాత్మక పాత్రధారిగా ఉండాలా లేదా అన్నదాని గురించి ఆలోచన ప్రారంభించగలమా ” అని కూడా అన్నాడు. అమెరికా చలచిత్తంతో నిమిత్తం లేకుండా, అమెరిన్‌-చైనీస్‌ ద్విదాధిపత్యం, స్ధాన భ్రంశం, ప్రాంతీయ శత్రుత్వాలకు మరల కుండా ఐరోపా రక్షణ దళ నిర్మాణం జరగాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ అభిప్రాయపడ్డాడు. కాబూల్‌ నుంచి అమెరికా విమానాలు వెనుదిరిగిన వెంటనే అమెరికా నిర్ణయాలపై ఆధారపడటానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఐరోపా యూనియన్‌ అధికారులు వ్యాఖ్యానించారు.ఐరోపా సైన్యాన్ని ఏర్పాటు చేయాలని, అది జరిగితే నిర్ణయాత్మకం స్వయం ప్రతిపత్తి వస్తుందని, ప్రపంచంలో కార్యాచరణకు పెద్ద సామర్ద్యం సమకూరుతుందని కూడా చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే విదేశాంగ విధానాల్లో అమెరికా ప్రభావం నుంచి బయటపడి తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పటమే. అలీన విధానం నుంచి తప్పుకొని అమెరికాకు దగ్గరైన మనం ఇప్పుడు నడి సంద్రంలో ఉన్నాం. ఎటు పోవాలో తేల్చుకోలేక ఇప్పటికీ అమెరికా వైపే చూస్తున్నాం.


అమెరికా, మన దేశం చేసిన తప్పిదాలు, తప్పుడు వైఖరుల కారణంగా దక్షిణాసియాలో, ఇతర ప్రాంతాలలో మన దేశం ఇప్పటికే ఒంటరి అయింది. మరోవైపున మనం నమ్ముకున్న అమెరికా తన ప్రయోజనాల కోసం ఎవరినైనా నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుందని స్పష్టమైంది. చైనా ప్రభావం పెరగటానికి అమెరికా తప్పుడు వైఖరే కారణం అన్నది అనేక మంది విశ్లేషణ. పసిఫిక్‌ సముద్రం – బాల్టిక్‌ సముద్రాలను కలుపుతూ యూరేసియాలో ఉన్న ప్రపంచ జనాభాలోని 70శాతం మంది, ఉత్పాదకత మీద చైనా ప్రారంభించిన బెల్ట్‌ మరియు రోడ్‌ చొరవ(బిఆర్‌ఐ) ప్రభావం రోజు రోజుకూ పెరుగుతున్నది. ఒక్క తుపాకి గుండు కూడా పేల్చకుండా ఆఫ్ఘనిస్తాన్‌లోని లక్ష కోట్ల డాలర్ల విలువగల ఖనిజ సంపదను అమెరికన్లు చైనాకు అప్పగించారనే అతిశయోక్తులు కూడా వెలువడ్డాయి.ప్రతిదాన్నీ లాభం-నష్టం కోణం నుంచి చూసే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు.ఒక వేళ అది నిజమే అయినా దానికి కారకులు ఎవరు ? ఇరాన్‌ విషయమే తీసుకుంటే అమెరికా ఆంక్షల ఆటలో మనం పావులుగా మారినందున చివరికి ఇరాన్నుంచి చమురు కొనుగోలు కూడా నిలిపి అమెరికా నుంచి కొంటున్నాము. తన ఇబ్బందులనుంచి బయటపడేందుకు చైనాతో ఇరాన్‌ 400 బిలియన్‌ డాలర్ల అభివృద్ది పధకాల ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ కూడా అదే చేయనుందనే వార్తలు వస్తున్నాయి. చైనా తమకు విశ్వసించదగిన మిత్రదేశమని తాలిబన్‌ అధిపతి ముల్లా అబ్దుల్‌ బరాదర్‌ వ్యాఖ్యానించాడు. చైనాతో పోల్చితే ఎంతో దగ్గరి సంబంధాలు గలిగిన మన దేశం ఆ స్దానంలో ఎందుకు నిలవలేకపోయింది ? అమెరికా చేసిన పిచ్చిపనికి మనం ఎందుకు నష్టపోతున్నాం.


కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం ఫలితాలు, పర్యవసానాలేమిటి ? దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాల పాటు జాత్యంహంకార ప్రభుత్వాన్ని అమెరికా బలపరిచింది. పోర్చుగీసు వలసగా ఉన్న అంగోలా విముక్తి కోసం వామపక్ష శక్తులు ప్రారంభించిన సాయుధపోరాటాన్ని అణచివేసేందుకు అమెరికా రెండు దశాబ్దాలపాటు సిఐఏ పర్యవేక్షణలో అమెరికా జోక్యం చేసుకుంది. అనేక దేశాల్లో తమ పలుకుబడిని పెంచుకొనేందుకు నియంతలు, యుద్ద ప్రభువులను అమెరికా అన్ని విధాలుగా బలపరిచింది. మరోవైపున దానికి భిన్నంగా అభివృద్ది పధకాలకు సాయం చేయటం ద్వారా చైనా విధానాలు ఆఫ్రికా ఖండానికి దగ్గర చేశాయి. వాటితో పాటు విముక్తి ఉద్యమాలతో సంబంధాలు పెట్టుకుంది. వాణిజ్యం, పెట్టుబడులు ఉభయతారకంగా లబ్ది చేకూర్చుతున్నాయి. యూరేసియా, ఆఫ్రికా ఖండంలో చైనా లక్ష కోట్ల డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టింది. జరిగిందేదో జరిగింది. మనం ఎవరికీ లొంగనవసరం లేదు. అమెరికా మెప్పుకోసం ఇతరులను దూరం చేసుకోవటం అసలే తగని పని. వినదగు నెవ్వరు చెప్పిన అన్న వివేచనతో విశ్వగురువుగా వంది మాగధుల పొగడ్తలను అందుకుంటున్న నరేంద్రమోడీ ఇప్పటికైనా దాన్నుంచి బయటపడి మన ప్రయోజనాలకు అనుగుణ్యంగా స్వతంత్ర వైఖరితీసుకొనేందుకు వర్తమాన పరిణామాలు దోహదం చేస్తాయా అన్నది పెద్ద ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మా దేశం సోవియట్‌ కాదు – మాతో పెట్టుకోవద్దు : అమెరికాను హెచ్చరించిన చైనా రాయబారి !

01 Wednesday Sep 2021

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Qin Gang, RUSSIA, UNSC Resolution on Afghanistan, US


ఎం కోటేశ్వరరావు


ఒక వైపు న్యూయార్క్‌ నగరంలోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆఫ్ఘనిస్తాన్‌ సమస్యపై అమెరికా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ప్రతిపాదించిన తీర్మానంపై చర్చ. మరోవైపు మాది పూర్వపు సోవియట్‌ యూనియన్‌ కాదు, మాతో పెట్టుకొనేటపుడు ఆలోచించుకోండి అన్నట్లుగా అమెరికాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైనా రాయబారి క్విన్‌ గాంగ్‌ వాషింగ్టన్‌ సభలో హెచ్చరిక. రెండూ మంగళవారం నాడు జరిగాయి. అమెరికా-చైనా సంబంధాలు జాతీయ కమిటీ బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన స్వాగత సభలో రాయబారి మాట్లాడాడు. రెండు దేశాలు అపార్దాలకు, తప్పుడు అంచనాలకు, వివాదాలు లేదా ఘర్షణలకు తావివ్వ కూడదు.చారిత్రక అవకాశాలను మనం కోల్పోవద్దు, అన్నింటికీ మించి మనం చారిత్రక తప్పిదాలు చేయవద్దు అన్నారు. చైనా అంటే సోవియట్‌ యూనియన్‌ కాదు, స్వయంకృతం వలన అది కుప్పకూలిందని, ప్రచ్చన్న యుద్ద ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలని చెప్పారు.


ఒక వైపు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనల ఉపసంహరణ నిర్ణయాన్ని అమలు జరుపుతూనే మరో యుద్ద రంగాన్ని ఎక్కడ ప్రారంభించాలా అనే ఆలోచనలో అమెరికా వ్యూహకర్తలు నిమగమయ్యారు. ప్రచ్చన్న యుద్దం తరువాత జరిపిన అతిపెద్ద సైనిక విన్యాసాల్లో ఒకదానిని ఆగస్టు నెలలో పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలో అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా నిర్వహించాయి. పాతికవేల మంది మెరైన్‌లు పెద్ద సంఖ్యలో యుద్దనావలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. మా భాగస్వాములు అది తైవాన్‌ కావచ్చు, అది ఇజ్రాయెల్‌, మరొకటి ఏదైనా మాతో భాగస్వామ్య కలిగిన వాటన్నింటికి బాసటగా నిలుస్తామని అమెరికా అధికారి ప్రకటించాడు. చైనాకు సమీపంలోని జపాన్‌కు చెందిన ఒకినావా దీవుల్లో 50వేల మంది, దక్షిణ కొరియాలో 29వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. తైవాన్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలను అమెరికా విక్రయిస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన తరువాత జపాన్‌, భారత్‌,ఆస్ట్రేలియాలతో మిలిటరీ సమన్వయానికి మరింత సామర్ధ్యాన్ని అమెరికా జత చేస్తుందని వార్తలు వచ్చాయి.


మరోవైపు తన మిత్రరాజ్యాల పట్ల అమెరికా సంబంధాలలో తీవ్ర అనిశ్చితలను ముందుకు తెస్తాయని కూడా భావిస్తున్నారు. ” అమెరికా విశ్వసనీయత, దాని మీద ఆధారపడటం గురించి జపాన్‌ అవగాహన మీద తీవ్రమైన దీర్ఘకాల పర్యవసానాలు ఉంటాయని టోకియో సమీపంలోని మెకై విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ టెసు కొటానీ వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పుడు తూర్పు ఆసియా మీద కేంద్రీకరించేందుకు దృష్టి సారించింది.అయితే అమెరికా అభిప్రాయాన్ని చూస్తే తన మిత్రదేశాలకు ఎంతకాలం మద్దతు కొనసాగిస్తుందో చెప్పలేము అని కూడా అన్నాడు. బైడెన్‌కు ప్రతిస్పందించే తెలివి తేటలు ఉన్నాయా లేదా అని రష్యన్లు లేదా చైనీయులు పరీక్షించబోతున్నారని ఐరోపా వ్యూహాల అధ్యయన సంస్ద సలహాదారు ఫ్రాంకోయిస్‌ హెయిస్‌బర్గ్‌ అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా విశ్వసనీయతను అందరూ అంగీకరించటం లేదు అన్నాడు.


ఉగ్రవాద ముఠాలను నిరోధించాలని, ఇతరుల మీద దాడులు, విద్రోహ చర్యలు జరిపేందుకు తమ గడ్డను అడ్డాగా చేసుకోనివ్వొద్దని, దేశం వదలి పోవాలనుకుంటున్న ఆప్ఘన్లను సురక్షితంగా వెళ్లిపోనివ్వాలనే వాగ్దానానికి తాలిబన్లు కట్టుబడి ఉండాలంటూ భద్రతా మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.ఆగస్టు నెలలో మన దేశ అధ్యక్ష పదవి చివరి రోజున ఈ పరిణామం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు ? గత రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష జోక్యం, అంతకు ముందు 23 ఏండ్లు పరోక్ష జోక్యం చేసుకొని ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన, దాన్ని అడ్డాగా చేసుకొని ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు.తాము వ్యక్తం చేసిన ఆందోళనను తీర్మానం ప్రతిబింబింబించటం సంతృప్తి కలిగించిందని మన దేశం పేర్కొన్నది. తీర్మానాన్ని వీటో చేయలేదు గాని చైనా, రష్యా ఓటింగ్‌లో పాల్గొనలేదు .తగినంత కసరత్తు చేసి ఏక గ్రీవానికి ప్రయత్నించకపోవటం లేదా రాజకీయాలు దీని వెనుక ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సెలలో ఆమోదించబోయే మరొక తీర్మానంలో స్పష్టత రావచ్చు. తాలిబన్లను అమెరికాయే గుర్తించి ఒప్పందం చేసుకుంది. అందువలన ఎవరైనా వారిని నిందించి ప్రయోజనం లేదు. ఒప్పందానికి, వారు చేస్తున్న ప్రకటనలకు కట్టుబడి ఉండేవిధంగా వత్తిడి చేయటం తప్ప మరొకమార్గం ఏమిటన్నది ప్రశ్న. తాలిబన్లను అధికారికంగా గుర్తించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ ఒక అడుగు ముందుకు వేసింది. కతార్‌లో మన రాయబారి దీపక్‌ మిట్టల్‌ తాలిబాన్‌ రాజకీయ విభాగనేత షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానెకజారును కలుసుకొని మన వైఖరిని వివరించారు.


ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మధ్య ఆసియాలో అమెరికా శకం ప్రస్తుతానికి ముగిసింది. ఆఫ్ఘన్‌ బదులు మరొక దేశాన్ని తమ స్దావరంగా మార్చుకోవాలని అమెరికా పధకం వేసిందనే వార్తలు వచ్చాయి. ఇరాక్‌ నుంచి వైదొలిగేది లేదని అమెరికాయే బహిరంగంగా ప్రకటించింది. తాలిబన్ల చేతిలో పరాభవం, చావు దెబ్బతిన్నంత మాత్రాన అమెరికా ముప్పును తక్కువ అంచనా వేయకూడదు. మధ్య ఆసియాలో అమెరికా ప్రభావం, ప్రాభవం తగ్గి చైనా, రష్యాలు పై చేయి సాధించనున్నాయి.


భద్రతా మండలి తీర్మానానికి ఈ రెండు దేశాలు ఎందుకు దూరంగా ఉన్నాయి. ఆఫ్ఘన్‌ దుస్ధితికి తాలిబాన్లు ఎంత బాధ్యులో, వారిని తయారు చేసి వారితో పాటు తాము కూడా సర్వనాశనం చేసిన అమెరికా, ఇతర దేశాలది అంతకంటే ఎక్కువ బాధ్యత. ఇప్పుడు తగుదునమ్మా అంటూ తమ నిర్వాకాన్ని విస్మరించి బాధ్యతను ఇతరుల మీద నెట్టేయత్నం ఈ తీర్మానంలో కనిపించిందని అవి చెబుతున్నాయి. అన్ని ఉగ్రవాద ముఠాల పేర్లు ప్రత్యేకించి ఇస్లామిక్‌ స్టేట్‌ మరియు ఉఘుర్‌ ఈస్ట్‌ తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ మువ్‌మెంట్‌ వంటి వాటి పేర్లను తీర్మానంలో చేర్చలేదని అభ్యంతరం తెలిపాయి. అమెరికా బాధ్యతను దోషరహితం చేయటం, ఉగ్రవాద ముఠాలను రెండు తరగతులుగా చేసి కొందరిని మినహాయించటాన్ని రష్యా, చైనా తప్పుపడుతున్నాయి. ఆఫ్ఘన్‌ ఆర్ధిక ఆస్తులను స్ధంభింప చేయటాన్ని రష్యా తప్పు పట్టింది. సంప్రదింపుల సమయంలో రెండు దేశాలూ లేవనెత్తిన అంశాలు, చేసిన సూచనలను పూర్తిగా పట్టించుకోలేదని చైనా పేర్కొన్నది.


ఆఫ్ఘన్‌ వ్యవహారంలో మూడు విధాలుగా అమెరికా, దాని మిత్రపక్షాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.ఒకటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, రెండవది ప్రజాస్వామిక సంస్కరణలు, బాధ్యతా రహితంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా వెళ్లిపోవటం. తన తప్పిదాలను గుర్తించకపోగా ఈ స్ధితికి ఇరుగుపొరుగుదేశాలే బాధ్యత వహించాలని మాట్లాడటం. ప్రతి యుద్దంలో అమెరికా తన ఆయుధాలను పరిక్షించుకోవటానికి ప్రయత్నించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. కాబూల్‌ విమానాశ్రయం దగ్గర ఆత్మాహుతి దళ చర్యలో తమ సైనికుల మరణానికి ప్రతిగా జరిపినట్లు చెప్పిన దాడిలో ఉగ్రవాదుల మరణాల సంగతేమోగాని పౌరులు మరణించినట్లు నిర్దారణ అయింది. గడిచిన రెండు దశాబ్దాలలో ఇలాంటి చర్యల వలన వేలాది మంది అమాయకులు బలైన కారణంగానే సామాన్య జనంలో అమెరికా, అది ఏర్పాటు చేసిన ప్రభుత్వాల పట్ల విశ్వాసం లేకపోవటం, వారిని వ్యతిరేకిస్తున్న తాలిబాన్ల విధానాలను వ్యతిరేకించటంతో పాటు వారి పట్ల ఒక విధమైన సానుకూలత ఏర్పడటానికి దారి తీసింది.


ఫోర్బ్స్‌ పత్రిక ఆగస్టు 16 నాటి సమాచారం ప్రకారం రెండులక్షల కోట్ల డాలర్లు(కొందరి అంచనా మూడు) అంటే రోజుకు 30 కోట్ల డాలర్లు( మన రూపాయల్లో 2,200 కోట్లు) అమెరికా ఖర్చు చేసింది. అమెరికా సైనికులు రెండున్నరవేల మంది మరణించారు.ఆప్ఘన్‌ మిలిటరీ, పోలీసులు 69వేలు, సామాన్య పౌరులు 47వేల మంది మరణించారు. ఆప్ఘన్‌ వ్యవహారం అమెరికా చరిత్రలో చెరిగిపోని మచ్చ, ప్రపంచ వ్యవహారాలను ఎంత దరిద్రంగా నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికీ వెల్లడించింది. అమెరికా కనుసన్నలలోని ప్రభుత్వాలు మూడులక్షల మంది మిలిటెంట్లను నిర్బంధించటం లేదా పౌరజీవనంలోకి అనుమతించాయని అంచనా. ఇప్పుడు వారంతా తిరిగి ఆయుధాలు పట్టుకొని తెగబడితే పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్న.


మన దేశం విషయానికి వస్తే తీసుకోవాల్సిన గుణపాఠం ఏమిటి ? అమెరికా, ఇతర దాని మిత్రపక్షాలు ఏమి చేస్తాయి అనేదానితో నిమిత్తం లేకుండా చైనా-రష్యా అఫ్ఘన్‌ ప్రభుత్వంతో స్వతంత్రంగా వ్యవహరించాలని రష్యన్‌ పరిశీలకుడు అలెగ్జాండర్‌ వి లోమనోవ్‌ చెప్పారు. ఆఫ్ఘన్‌ కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదు గనుక వారి మాటలు వినండి- వారి చర్యలను గమనించండి అన్న కన్ఫ్యూసియస్‌ బోధనల సారాన్ని గమనంలో ఉంచుకొని రెండు దేశాలూ వ్యవహరించాలి.దాని అర్ధం చూస్తూ ఉండమని కాదు అని లోమనోవ్‌ అన్నారు. పశ్చిమ దేశాల వార్తా సంస్దలు, మీడియా కథనాలు గత కొద్ది వారాలుగా అతిశయోక్తులను ప్రచారం చేశాయి. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఆఫ్ఘన్‌ పౌరులు తప్ప సామాన్య జనం పెద్ద సంఖ్యలో శరణార్ధులుగా ఇరుగు పొరుగు దేశాలకు తరలిపోతున్న సమాచారం, పరిస్ధితిగానీ లేదు. తమ దేశాల్లో ఉన్న నగదు, ఇతర ఆస్తులను వినియోగించుకోనివ్వకుండా నూతన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అమెరికా కూటమి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమ దేశాలకు భిన్నంగా తాముంటామని చైనా,రష్యా స్పష్టం చేశాయి. మన దేశం ఇప్పటికైనా స్వతంత్ర వైఖరిని అనుసరిస్తుందా, అమెరికా తోక పట్టుకొని వెళుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d