• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: NATIONAL NEWS

వివాదాస్పద విదేశీ ఆర్ధికవేత్త విఫల స్వదేశీ నరేంద్రమోడీని గట్టెక్కిస్తారా ?

20 Friday Oct 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

behavioural economics, Consumer Affairs, economist richard thaler, Narendra Modi, Nobel economics prize, swadesi

కొండూరి వీరయ్య

అర్థశాస్త్రంలో 2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ బహుమతి రిచర్డ్‌ థేలర్‌ను వరించింది. దానివల్ల అర్థశాస్త్ర పరిశోధనా రంగంలో ఉన్న మేధావులు ఎంతైనా చర్చించుకోవచ్చు. కానీ థేలర్‌కు నోబెల్‌ బహుమతి రావటం పట్ల దేశంలో బిజెపి సంబరాలు చేసుకోవటమే ఈ వ్యాసానికి నేపథ్యం. థేలర్‌ను ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించిన వెంటనే బిజెపి ఐటి సెల్‌ ( దేశవ్యాప్తంగా బిజెపి, ప్రధాని పేరు మీద ప్రచారమవుతున్న అవాకులు, చవాకులు, అర్థ సత్యాలు, అసత్యాలు, నిరాధారమైన అభిప్రాయాల పోగు పోసే కేంద్రం – సంక్షిప్తీకరణ కోసం బిజెపి గోబెల్స్‌ విభాగం అని పిలుద్దాం) సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన వెలువడించింది. మోడీ అమలు చేసిన నోట్ల రద్దు పథకాన్ని థేలర్‌ సమర్ధించాడు అన్నది ఈ ప్రకటన సారాంశం. నోబెల్‌ విజేత పేరు ప్రకటించగానే బిజెపి ఐటి సెల్‌ అధ్యక్షుడు అమిత్‌ మాలవీయ తన ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. యథా ప్రకారం ఈ ప్రకటనను సుక్షితులైన బిజెపి ఐటి కరసేవకులు దేశమంతా వ్యాపింపచేశారు. థేలర్‌ నోబెల్‌ విజేత కావటానికి, మోడీ నోట్ల రద్దు నిర్ణయానికి ఏమిటి సంబంధం ?

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ గురించిన చర్చను భారతదేశంలో నోట్ల రద్దు అనుభవాలతో పోల్చవచ్చు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి దఫా సమర్ధకులు ముందుకు తెచ్చిన వాదన ఇలా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నగదు వినియోగం వల్లనే ఆర్థిక వ్యవస్థ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. నగదు పట్ల ప్రజల మక్కువ తగ్గించాలంటే నగదు పనికిరాని కాగితం కింద మార్చటం ద్వారా ఆర్థిక లావాదేవీల్లో వారి ప్రవర్తన, కొనుగోళ్ల పద్దతి, ప్రాధాన్యతలనను నగదురహిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించటానికి నోట్లు రద్దు నిర్ణయం ఉపయోగపడుతుంది అన్నది ఈ విశ్లేషణల సారాంశం. ఈ సందర్భంగానే తొలిసారిగా పామర చర్చల్లో సైతం ఆర్థిక లావాదేవీలు- ప్రవర్తనాశీలత (బిహేవియరల్‌ ఎకనమిక్స్‌) గురించిన చర్చ సార్వత్రికమైంది. నగదు రహిత లావాదేవీల ప్రయోజనాల గురించి బిజెపి గోబెల్స్‌ విభాగం కంప్యూటర్లెక్కి కూయటమే కాదు. మన జేబుల్లో ఉన్న సెల్‌ఫోన్లల్లో కూడా అర్థరహిత సమాచారాన్ని నింపేసింది. ఇదే నిజమని నమ్మిన పలువురు మేధావులు, ఆర్థిక వేత్తలు, ఆరెస్సెస్‌-బిజెపి కంప్యూటర్‌ కరసైనికులతో గొంతు కలిపి నోట్ల రద్దు విమర్శకుల నోళ్లు మూయించటానికి విశ్వ ప్రయత్నం చేశారు.

విదియ నాడు కనపడకపోతే తదియ నాడు కనపడుతుంది అని తెలంగాణలో ఒక సామెత ఉంది. అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరి వంటి వాళ్ల మొదలు నోట్ల రద్దుకు సిపార్సు చేసిన గురుమూర్తి వంటి వారంతా ఆర్థిక వ్యవస్థ పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తూ వరుసగా నోళ్లు తెరిచారు. గత ఆర్నెల్లుగా ఈ ప్రమాదాన్ని వామపక్ష ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తూనే వచ్చారు. నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపలేము కదా… ఈ విమర్శల పట్ల ప్రభుత్వ స్పందన ఈ సామెతనే గుర్తు తెస్తోంది. రెండ్నెల్ల క్రితం స్వయంగా రిజర్వు బ్యాంకు విడుదల చేసిన వార్షిక నివేదికలో నోట్ల రద్దు నిర్ణయంతో ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు అని నిర్దారించింది. ఆగస్టు చివరి వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడిన ఆర్థిక సర్వేలో నోట్ల రద్దు, జిఎస్టీ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్త కుంగిపోయింది అన్న అంచనాను వెల్లడించింది. బిజెపి గోబెల్స్‌ విభాగం మోడీ నిర్ణయాన్ని సమర్ధించుకోవటానికి థేలర్‌ను అరువు తెచ్చుకొంటోంది. నిజంగా నోట్ల రద్దు మీద థేలర్‌ అభిప్రాయం ఏమైనా ఈ రకమైన అరువుతెచ్చుకున్న మద్దతు ద్వారా కుదేలైన ఆర్థిక వ్యవస్థ బతికి వస్తుందా అన్న ప్రశ్నకు బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు, వారిని పనికి పురామాయించిన పెద్ద తలకాయలు సమాధానం ఇవ్వాలి.

బిహేవియరల్‌ ఎకనమిక్స్‌కు పునాదులు ఆధునిక వినిమయ వాదంలో ఉన్నాయి. సరళీకరణ విధానాల ఆరంభానికి ముందు ఆర్థిక నిర్ణయాలు ప్రధానంగా వ్యవస్థాగతంగా ఉండేవి. అంటే ఆయా దేశాల రాజకీయ ఆర్థిక వ్యవస్థల ప్రయోజనాలు, పురోగతి నేపథ్యంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకునే పద్ధతి. ఈ క్రమంలో జాతీయ వనరులు అర్థవంతమైన వినియోగంతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభాల రేటుపై నియంత్రణలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థను బతికించటానికి కీన్స్‌ ముందుకు తెచ్చిన సంక్షేమ ఆర్థిక విధానాలు, వాటి ద్వారా సాధారన ప్రజానికి కలిగే కొద్దిపాటి వెసుబాట్లు కూడా దిగమింగటం పెట్టుబడిదారీ వ్యవస్థకు సాధ్యం కాలేదు. దాంతో సంక్షేమ ఆర్థిక విధానాలపై మొదలైన మితవాద ఆర్థికవేత్తల దాడిలో ఒక కోణమే బిహేవియరల్‌ ఎకనమిక్స్‌. ఈ ధోరణి ప్రకారం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రతి వ్యక్తీ వినియోగదారుడే. వినియోగపు అస్థిత్వమే వ్యక్తి అస్థిత్వంగా మారుతుంది. ప్రపంచీకరణ విధానాలు పుంజుకున్న తర్వాత ఈ ధోరణి మరింత ముదిరి నిర్ణీత మోతాదులో వినియోగం చేయలేని వాళ్ల గురించి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం లేదు అనేంత వరకు వెళ్లింది. ఆధునిక మాల్స్‌లో ఖరీదైన వస్తువుల అమరిక ఆరోహణ క్రమంలో అమర్చటాన్ని మనం రోజూ గమనిస్తూనే ఉంటాం. కొనుగోలు చేసే వస్తువుల ఖరీదును బట్టి కొనుగోలుదారుడికి అందే సమపర్యలుంటాయి.

వాణిజ్య ప్రకటనల కోలాహలం బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ పునాదిగా పెరిగిన ధోరణే. ఈ వాణిజ్య ప్రకటనల వెనక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఉత్పత్తుల గురించిన సమాచారాన్ని వినియోగదారుల వద్దకు చేర్చటమే కాదు. తమ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని వారిని ప్రభోదించటం, ప్రభావితం చేయటం కూడా. సూత్ర రీత్యా బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ చెప్పేది విస్తృతమైన ప్రత్యామ్నాయాలు (ఒకే సరుకు వివిధ బ్రాండ్లలో) అందుబాటులో ఉంటే నచ్చింది ఎంచుకునే స్వేఛ్చ వినియోగదారుడికి ఉంటుంది. ఈ ఆర్థిక సూత్రీకరణలో ప్రధాన లోపం ఉంది. అది వినియోగదారుల ఆర్థిక సామాజిక స్థాయి, కొనుగోలు శక్తి, అవసరాలుతో నిమిత్తం లేకుండా మూసపోసిన కొనుగోలుదారుల మందను తయారు చేయటమే ఈ లోపం.

ఈ ధోరణి మరో చర్చను కూడా ముందుకు తెస్తుంది. ఇది మరింత ప్రమాదకరమైనది. డేటా మోడలింగ్‌తో ముడిపడిన అంశం ఇది. దీన్ని పరిశీలించటానికి ఆర్థిక రంగం కంటే రాజకీయ రంగం మరింత అర్థవంతంగా ఉంటుంది. 2013 మొదలు 2017 సెప్టెంబరు వరకు బిజెపి, మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానం ఇది. ప్రజలను నిర్దిష్ట ఆలోచనలు, అవసరాలు, అవగాహనలు, అస్థిత్వాలు ఉన్న వ్యక్తులుగా కాక తమ సమాచార సరఫరాకు క్షేత్రంగా మాత్రమే చూసే ధోరణి. ఒక సారి వ్యక్తులు తమ సామాజిక అస్థిత్వం కోల్పోయిన ప్రయోగశాలలో పరిశీలనావస్తువులుగా మారిన తర్వాత వారి నిర్ణయాలను ప్రభావితం చేయటంలో డేటా మోడలింగ్‌ ద్వారా చూపించే ప్రొజెక్షన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. 2014 ఎన్నికల్లో మోడీ అనుసరించిన ప్రచార వ్యూహం ఇది. ఆ తర్వాత కూడా వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ విధంగా ఓటర్లు, ప్రజల రాజకీయ అభిప్రాయాలు ప్రభావితం చేయటం ద్వారా ఓటింగ్‌ విషయంలోనూ లేదా ప్రభుత్వ నిర్ణయాలను అంచనా వేసే విషయంలోనూ తప్పు దారి పట్టించటం ద్వారా తమ ప్రభుత్వం తమ పబ్బం గడుపుకుంటున్న తీరును గమనిస్తూనే ఉన్నాము. ఇదే ధోరణి బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ ద్వారా వస్తూత్పత్తుల వినియోగం విషయంలో కొనుగోలు దారుల బ్రెయిన్‌ వాష్‌ చేసే టెక్నిక్కులు విపరీతంగా రూపొందించబడతాయి. ఇదే ధోరణిని తాజాగా హిందూత్మ మతోన్మాద శక్తులు వంటబట్టించుకున్నాయి.

కీన్స్‌ విధానాలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సామాజిక అవసరాలు తీర్చటానికి ఉపయోగపడే సమీకృత, పరస్పరాధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తెస్తే సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలతో సమాంతరంగా పుట్టుకొచ్చిన బిహేవియరల్‌ ఎకనమిక్స్‌ వికేంద్రీకృత ఆర్థిక విధాన నిర్ణయ వ్యవస్థను ముందుకు తెస్తుంది. ఈ ధోరణిలో ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగానికి ఆ రంగం పూర్తి స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఆయా రంగాల లాభాల రేటును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం జరుగుతుంది. దాంతో స్థూల ఆర్థిక వ్యవస్థలో ఉండాల్సిన సమతౌల్యం దెబ్బతింటోంది. ప్రణాళికా రంగం రద్దు చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు దీనికి సరైన ఉదాహరణ.

అమెరికాలో ఒబామా ప్రభుత్వం గానీ ఇంగ్లాండ్‌లో టోనీ బ్లెయిర్‌ ప్రభుత్వంగానీ తమ కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా సామాజిక ప్రవర్తనా శాస్త్రవేత్తల బృందాలను నియమించి పాలకవర్గం అవసరాల నేపథ్యంలో ప్రజల మనోభావాలు ప్రభావితం చేయటానికి తద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ధ్యాన్ని ప్రభావితం చేయటానికి అవసరమైన ప్రయోగాత్మక విధానాలు రూపొందించాయి. ఆయా దేశాల నుండి పాఠాలు నేర్చుకున్న మోడీ ప్రభుత్వం అవే ప్రయోగాత్మక విధానాలు భారతదేశంలో అమలు చేయటం ద్వారా ఓటర్ల నిర్ణాయక సామర్ద్యాన్ని అన్ని వేళలా ప్రభావితం చేయాలనుకొంటోంది.చేయగలననుకొంటోంది. ఏదైనా కీలక సందర్భం, సమస్య ముందుకొచ్చినపుడు ప్రజల దృష్టిని మళ్లించటానికి అవరమైన అప్రాధాన్య విషయాలను, అర్థసత్యాలను, అసత్యాలను, నిరాధారమైన విషయాలను ప్రజల ముందు కుప్పలు పోయటానికి బిజెపి కంప్యూటర్‌ కరసేవకులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. బిహేవియరల్‌ ఎకనమిక్స్‌లో సరైన నిర్ణయం అంటే కంపెనీల లాభాలు పెంచేందుకు దోహదం చేసేది. బిహేవియరల్‌ పాలిటిక్స్‌లో సరైన నిర్ణయం అంటే పాలకవర్గాల ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్లేంది. ప్రజలు గొర్రెల మంద కాదు. ఈ రెండు రకాల ప్రమాదాల నుండి సగటు మనిషి తన సామాజిక రాజకీయ జంతువుగా (అరిస్టాటిల్‌ అన్నట్లు) తన అస్థిత్వాన్ని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నమే ఇటువంటి కుహనా సిద్ధాంతాలపై సాగించే పోరాటంలో అంతర్భాగమవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మెరుగైన అవకాశాలు-తీవ్ర సవాళ్ల మధ్య చైనా: గీ జింపింగ్‌

18 Wednesday Oct 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

China, chinese communist party, chinese communist party congress 2017, Xi Jinping

బుధవారం నాడు మహాసభను ప్రారంభిస్తున్న గీ జింపింగ్‌

చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ ప్రారంభం

ఎం కోటేశ్వరరావు

ప్రియమైన పాఠకులు ఈ వ్యాసం చదవటం ప్రారంభించే సమయానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరొక చారిత్రక అధ్యాయానికి చైనాలో తెరలేచింది. వారం రోజుల పాటు జరిగే చైనా కమ్యూనిస్టుపార్టీ 19వ మహాసభ బుధవారం నాడు ప్రారంభమైంది. బీజింగ్‌లోని తియన్మెస్‌ స్క్వేర్‌లోని గ్రేట్‌ హాల్‌లో మహాసభ ప్రారంభం వుపన్యాసంలో రానున్న ఐదు సంవత్సరాల కార్యాచరణకు సంబంధించిన అంశాలను పార్టీ ప్రధాన కార్యదర్శి గీ జింపింగ్‌ ఆవిష్కరించారు.’ ప్రస్తుతం చైనా, ప్రపంచం కూడా తీవ్ర మరియు సంక్లిష మార్పుల మధ్య వుంది. వ్యూహాత్మక అభివృద్ధి అవకాశాల విషయంలో చైనా ఇప్పటికీ ఒక ముఖ్యమైన యుగంలోనే వుంది. అవకాశాలు మెరుగ్గా వున్నాయి, అదే సమయంలో తీవ్రమైన సవాళ్లు కూడా వున్నాయి.’ అని జింపింగ్‌ చెప్పారు.

ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహసభల గురించి అటు శత్రువులు, ఇటు స్నేహితులలోనూ సహజంగానే ఎంతో ఆసక్తి తలెత్తుతుంది. గతంలో జరిగిన మహాసభలకు ముందు ప్రపంచ మీడియాలో ఎన్నో కట్టుకథలు, పిట్టకథలు రాసేవారు. ఈ సారి కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా తన పాఠకులు, వీక్షకులకు అటువంటి వినోదాన్ని చాలా పరిమితం చేసి ఎందరినో నిరాశపరిచింది.

పురాతన చరిత్రలో ఎన్నో వైవిధ్యాలను నమోదు చేసిన చైనా వర్తమానంలో కూడా అదే బాటలో నడుస్తోంది. పెట్టుబడిదారీ దేశాలు, వ్యవస్ధలతో ఆర్ధిక సంబంధాలు కలిగి వున్న కారణంగా కొన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ ఏడాదికేడాది ఎన్నో విజయాలు సాధిస్తూ చైనా సోషలిస్టు వ్యవస్థ ముందుకు పోతున్నది. పెట్టుబడిదారీ వ్యవస్ధకు పట్టిన జబ్బులు ఎప్పుడు వదులుతాయో, పక్షవాతం ఎన్నటికి నయమౌతుందో తెలియని స్ధితిలో చైనా గురించి అవాస్తవాలు రాసే మీడియా విశ్వసనీయత నానాటికీ పడిపోవటం వంటి కారణాలతో ఈ సభల సందర్భంగా వాటి జోలికి పోలేదా ? పది సంవత్సరాల క్రితం ప్రపంచ పెట్టుబడిదారీ కేంద్రం అమెరికాలో ప్రారంభమైన సంక్షోభానికి త్వరలో పదేండ్లు నిండబోతున్నాయి. తమతో పాటే చైనా కూడా మునిగిపోతుందని పిచ్చి కలలు కన్న వారిని చైనా కమ్యూనిస్టులు కొరడాతో కొట్టి లేపి మా విజయాలు చూడండి అని చూపుతున్న కారణంగానే 19వ మహాసభ సందర్భంగా వారు ఒళ్లు దగ్గర పెట్టుకున్నారా ?

కమ్యూనిస్టు పార్టీల మహాసభలు రెండు విధాలుగా జరుగుతాయి. అధికారంలో వున్న కమ్యూనిస్టు పార్టీలు సైద్దాంతిక సమస్యలతో పాటు తమ దేశ ఆర్ధిక వ్యవస్ధ, జనజీవన పరిస్ధితులను ఎలా మెరుగుపరచాలో సభలలో చర్చించి లక్ష్యాలను నిర్ణయించుకుంటాయి. ప్రస్తుతానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ముందు పెద్ద సైద్ధాంతిక సవాళ్లు లేవనే చెప్పాలి. అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ము చేసి, ప్రపంచ దేశాలతో సఖ్యత పెంచుకొని తన జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరచి వర్తమానం నుంచి మరో సోషలిస్టు దశకు ఎలా చేరటమా అన్నదే వారి ముందున్న పెద్ద సవాలు . అధికారంలో లేని కమ్యూనిస్టు పార్టీలు జరిపే సభలలో సైద్ధాంతిక, రాజకీయ ఎత్తుగడల పంధా, జనజీవన పరిస్థితుల మెరుగుదలకు చేపట్టాల్సిన పోరాటాల వంటి సమస్యలు ప్రధాన అజెండాగా వుంటాయి.

2012లో జరిగిన 18వ మహాసభ తరువాత చైనా సాధించిన అభివృద్ధి గురించి జాతీయ గణాంకాల సంస్థ వివరాలను గత వారంలో విడుదల చేసింది. 2013ా16 సంవత్సరాల మధ్య ప్రపంచ సగటు వృద్ధి రేటు 2.6, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 4 వుంటే చైనాలో 7.2శాతం వుంది.ఈ ఏడాది తొలి త్రైమాసిక వృద్ధి రేటు 6.9శాతం. గతేడాది ప్రపంచ జిడిపి విలువలో చైనా వాటా 14.8శాతం(11.2లక్షల కోట్ల డాలర్లు).గత నాలుగు సంవత్సరాలలో 3.4శాతం పెరిగింది. ఇదే కాలంలో ప్రపంచ పురోభివృద్ధికి చైనా 30శాతం వాటా అందించింది.ఇది అమెరికా, జపాన్‌, యూరోజోన్‌ దేశాల మొత్తం కంటే ఎక్కువ. జిడిపిలో సేవారంగం వాటా 45.3 నుంచి 51.6కు పెరిగింది. పట్టణాలలో పని చేసే గ్రామీణుల వార్షిక పెరుగుదల రేటు 1.8శాతం. పట్టణాలలో శాశ్వతనివాసితుల శాతం 52.57 నుంచి 57.35కు పెరిగింది. ఏటా కోటీ 30లక్షల కొత్త వుద్యోగాలు కల్పిస్తున్నప్పటికీ 31 పెద్ద నగరాలలో నిరుద్యోగులు ఐదుశాతం వున్నారు.పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు 1.91నుంచి 2.11శాతానికి పెరిగింది. పేటెంట్‌ దరఖాస్తుల స్వీకరణ 69శాతం, మంజూరు 39.7శాతం పెరిగింది.కొత్త కంపెనీల నమోదు పెరుగుదల 30శాతం. జనం ఖర్చు చేయగలిగిన తలసరి ఆదాయం 7,311యువాన్ల నుంచి 23,821కి పెరిగింది.వార్షిక పెరుగుదల రేటు 7.4శాతం. అది గ్రామీణుల విషయంలో 10.7శాతం వుంది.

1921లో షాంఘై నగరంలో చైనా కమ్యూనిస్టు పార్టీ తొలి మహాసభ జరిగింది.మావో సేటుంగ్‌తో సహా కేవలం 13 మంది మాత్రమే ప్రతినిధులు ఆ సభకు హాజరయ్యారు. దేశంలోని ఇతర ప్రాంతాలలో కొన్ని డజన్ల మంది కార్యకర్తలు, నాయకులు మాత్రమే అసమయానికి వున్నారు.వారి నాయకత్వంలో కమ్యూనిస్టుపార్టీ 28 సంవత్సరాల తరువాత అనూహ్యరీతిలో చైనాలో అధికారాన్ని స్వీకరిస్తుందని వారు ఆ సమయంలో వూహించి వుండరు. ప్రపంచ కమ్యూనిస్టు వుద్యమ చరిత్రలో చైనాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అక్కడి భౌతిక పరిస్ధితులకు అనుగుణ్యంగానే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ధ’ నిర్మాణం చేపట్టాలని 1982లో పన్నెండవ మహాసభ నిర్ణయించింది. బీజింగ్‌లో జరుగుతున్న 19వ సభకు 8.9కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశమంతటి నుంచీ ఎన్నికైన 2,287 మంది ప్రతినిధులు హాజరుకావాల్సివుంది. ఈ సభలో ఇరవై అయిదు మందితో పొలిట్‌బ్యూరో, ఏడుగురితో పొలిట్‌బ్యూరో స్టాండింగ్‌ కమిటీ, 205 మందిని కేంద్రకమిటీ సభ్యులుగా మరి కొందరిని ప్రత్యామ్నాయ కమిటీ సభ్యులుగా ఎన్నుకుంటారు. కేంద్రకమిటీ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటుంది.

గతమహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గ్జీ జింపింగ్‌(64) తిరిగి ఆ బాధ్యతకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయని, పార్టీలో అంతర్గతంగా ఎలాంటి నాయకత్వ సమస్యలేదని, స్టాండింగ్‌ కమిటీలోని ఏడుగురిలో ఐదుగురు బాధ్యతల నుంచి తప్పుకొంటారని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో చర్చించబోయే అంశాలను ముందుగానే గత మహాసభలో ఎన్నికైన కేంద్రకమిటీ ఖరారు చేస్తుంది.రాబోయే మహాసభ వరకు ఏమి చెయ్యాలో ముసాయిదా నివేదికలను రూపొందిస్తుంది. ఒక వేళ కేంద్రకమిటీలో తీవ్రమైన భిన్నాభిప్రాయాలుంటే పార్టీ అత్యున్నత విధాయక పార్టీ మహాసభకు నివేదిస్తుంది. అంగీకారమైతే వాటిని నివేదికలు లేదా తీర్మానాలలో చేర్చుతారు, లేదా సవరణ ప్రతిపాదనలను ఓటింగ్‌కు పెట్టి అంతిమ నిర్ణయం చేస్తారు.

ఈ మహాసభ సమయంలో పిట్టకథలేమీ లేవంటే అసలేమీ లేవని కాదు. అవి లేకపోతే మీడియాకు కిక్కు వుండదు కదా. బహిరంగంగా మాట్లాడే అసమ్మతి వాదులను మహాసభ సమయంలో బీజింగ్‌ వదలి వెళ్లమన్నారని, విదేశీ జర్నలిస్టులతో మాట్లాడవద్దన్నారని రాశారు. అధికారిక వార్తా సంస్ధ నుంచి వచ్చే కథనాలను తప్ప వేరే పుకార్లను వ్యాపింపచేయవద్దని, చోటివ్వవద్దని మీడియా సంస్ధలకు జారీ చేసిన రహస్య సెన్సార్‌ నిబంధనలలో పేర్కొన్నారని ఒక పత్రిక రాసింది. ఇవెంత హాస్యాస్పదమో వేరే చెప్పనవసరం లేదు. ఇవే నోళ్లు గతంలో అసమ్మతి వాదులను జైలు పాలు చేశాయని చెప్పి ఇప్పుడు నగరం విడిచి వెళ్లమని చెప్పాయని చెబుతున్నాయి. అధికార మీడియా సంస్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రహస్య సెన్సార్‌ నిబంధనలు అని చెప్పటం కట్టుకధగాక మరేమిటి? గత నాలుగు దశాబ్దాలుగా చెబుతున్న ఒక పిట్టకధ చైనీయులు చెప్పే అంకెలను నమ్మకూడదు. ఎవరు నమ్మమన్నారు? వివిధ దేశాలతో వాణిజ్య మిగులు కారణంగా ఏ దేశం వద్ద లేనన్ని డాలర్లు పోగుపడ్డాయా లేదా? చివరకు అమెరికాయే వారి నుంచి అప్పుతీసుకొంటోందా లేదా? అన్ని దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లి పరిశ్రమలు, వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతున్నారా లేదా ?

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఇతర దేశాలపై నెట్టేందుకు, ఇతర దేశాల మార్కెట్లను ఆక్రమించుకొని ఇబ్బందుల నుంచి తాము బయట పడాలని పెట్టుబడిదారీ వర్గం చేయని ప్రయత్నం లేదు. వారికి కంటగింపుగా వున్న తమను వేయి కళ్లతో చూస్తున్నాయని చైనా నాయకత్వానికి తెలియంది కాదు. గత మూడు దశాబ్దాలుగా విపరీత వేగంతో జరిగిన అభివృద్ది వారికి కొత్త సమస్యలను తెచ్చింది. ఆర్ధికరీత్యా తమతో సంబంధాలు కలిగి వున్నప్పటికీ సోషలిస్టు వ్యవస్థను కూల్చేందుకు, మిలిటరీ రీత్యా దెబ్బతీసేందుకు పశ్చిమ దేశాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. వీటిని ఎదుర్కొంటూనే, అంతర్గతంగా సామాజికంగా తలెత్తుతున్న సమస్యల నుంచి తమ వ్యవస్ధను మెరుగుపరుచుకోవటం అనే ద్వంద్వ సవాళ్లను ప్రస్తుతం చైనా నాయకత్వం ఎదుర్కొంటున్నది. అదే సమయంలో పెట్టుబడిదారీ ప్రపంచంలో వున్న వైరుధ్యాలను ప్రస్తుతానికి అది వుపయోగించుకోగలుగుతోంది. ఈ రోజు చైనా సాధిస్తున్న పురోగతి, దాని నుంచి ఇతర పెట్టుబడిదారీ దేశాల మాదిరి లబ్ది పొందకుండా మనకు మనమే గిరిగీసుకోవద్దని ఆస్ట్రేలియా-చైనా వాణిజ్య మండలి మాజీ సిఇవో లారీ పెర్సీ ‘ఆస్ట్రేలియన్‌’ పత్రికలో చైనా కమ్యూనిస్టుపార్టీ మహాసభ సందర్భంగా రాసిన వ్యాసంలో సలహా ఇచ్చారు. నలభై అయిదు సంవత్సరాల క్రితం 1971లో ఆస్ట్రేలియా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు విట్‌లామన్‌ చైనా సందర్శించారు. అది జరిగిన మూడు రోజుల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌ రహస్యంగా చైనా వెళ్లి నిక్సన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసి వచ్చాడు. ఆ పర్యటనను నాడు అధికారంలో వున్న ఆస్ట్రేలియా సంకీర్ణ కూటమి దాన్ని బుద్దిలేని వ్యవహారంగా చూసిందని ఆ వుదంతాన్ని పేర్కొంటూ అమెరికాయే చైనాతో సంబంధాలు పెట్టుకొని లబ్ది పొందుతున్నపుడు మనం కూడా చైనా నుంచి ఎందుకు లబ్ది పొందకూడదని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఇది ఒక్క ఆస్ట్రేలియా కార్పొరేట్ల వైఖరే కాదు. గత పది సంవత్సరాలుగా ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న మన దేశంతో సహా అన్ని పెట్టుబడిదారీ దేశాల కార్పొరేట్ల ఆలోచనకు అది ప్రతిబింబం. అందువలనే బయట వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ గాంగ్‌ చైనా వ్యతిరేక ప్రచారం చేసి ఇంతకాలం తాము తయారు చేసిన కమ్యూనిస్టు వ్యతిరేకులను సంతృప్తి పరుస్తుంటే అధికారంలో వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చైనాతో వాణిజ్యం, పెట్టుబడులతో కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. ఇది వారి ద్వంద్వ స్వభావం అనేకంటే మోసకారి తనం అనాలి.

చైనా కమ్యూనిస్టు పార్టీ విజయాల వెనుక ఎంతో పకడ్పందీగా పధకం రూపొందించటం, ఆచరణ గురించి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా అంగీకరిస్తారు. బ్రిటీష్‌ వారి కౌలుకింద వున్న హాంకాంగ్‌ ప్రపంచంలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రాలలో ఒకటిగా మారింది. తిరుగుబాటు రాష్ట్రంగా వున్న తైవాన్‌ కూడా అదేమాదిరి అభివృద్ధి చెందింది. వాటితో పోల్చుకుంటే ప్రధాన భూభాగం ఎంతో వెనుక బడి వుంది. కౌలు గడువు తీరి హాంకాంగ్‌ చైనాలో విలీనమైంది. అక్కడ వున్న పెట్టుబడుల అవసరం చైనాకు వుంది. అందువలననే సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణానికి భంగం కలగకుండానే ఒకే దేశం-రెండు వ్యవస్ధల విధానం కింద 2050వరకు హాంకాంగ్‌ ఆర్ధిక వ్యవస్ధలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఒక ఒప్పందం చేసుకొని అక్కడి పెట్టుబడిదారులకు స్పష్టమైన హామీనిచ్చింది.

చైనాలో సంస్కరణలు మొత్తం మీద ఎంతో అభివృద్దికి దోహదం చేసినప్పటికీ ఆదాయ, ప్రాంతాల మధ్య అసమాన అభివృద్ధి అసమానతలు, అవినీతి పెరుగుదల వంటి సమస్యలతో పాటు, సామాజికంగా మత ప్రభావం పెరుగుదల వంటి కొత్త సమస్యలను చైనా ఎదుర్కొంటోంది. వాటిని తక్కువగా చూడనవసరం లేదు. వాటిని పరిష్కరించటంలో చైనా నూతన నాయకత్వం ఎలాంటి చర్యలను చేపడుతుందన్నదే ఆసక్తికరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతిపితను చంపిందెవరన్న ప్రశ్న జనం ముందుకు రానుందా – 2

14 Saturday Oct 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

assassination of Mohandas Karamchand Gandhi, Hindu Fundamentalism, HINDU MAHASABHA, Mahatma Gandhi, Nathuram Godse, RSS

ఎం కోటేశ్వరరావు

మహాత్మాగాంధీ హత్యలో మరోవ్యక్తి వున్నాడంటూ విచారణ జరపాలని కోరటం వెనుక గాడ్సే, తద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రను చరిత్ర నుంచి అధికారికంగా తుడిచివేయాలనే ప్రయత్నం కనపడుతోంది.తమకు అనుకూలంగా చరిత్రను మార్చుకొనేందుకు మితవాద హిందూశక్తులు ప్రయత్నిస్తున్నాయని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్‌ గాంధీ ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. దాని సారాంశం ఇలా వుంది.తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయటం, గందరగోళపరచేందు ప్రయత్నించటం ఇదే మొదటిసారి కాదు. ఇది గాంధీ హంతకుల నుంచి సైద్ధాంతిక స్ఫూర్తి పొందిన హిందూ మితవాదుల పెద్ద పధకంలో భాగం. హత్య గురించి అనుమానాలను పెంచేందుకు మరొక స్ధాయికి తీసుకుపోయారు.ఇటువంటి విజ్ఞాపనను కోర్టు తిరస్కరించకపోవటం ఆశ్చర్యపరిచింది. అదృష్టం కొద్దీ గతేడాది ముంబై హైకోర్టు వినతిని తిరస్కరించింది. పిటీషన్‌ వేసిన వ్యక్తి తాను వీర సావర్కర్‌ భక్తుడిని అని స్వయంగా అంగీకరించాడు. సావర్కర్‌పేరును కేసు నుంచి తొలగించాలని కోరాడు. జస్టిస్‌ కపూర్‌ కమిషన్‌ 1969లో సమర్పించిన నివేదికలో గాంధీ హత్యకు వున్న సంబంధాన్ని నిరూపించటమేగాక హత్యకుట్రలో సావర్కర్‌ పాత్ర, ప్రమేయం వున్నట్లు కూడా తెలిపింది. అంతకు ముందే కేసు నుంచి సావర్కర్‌ విముక్తి చేసినప్పటికీ ఈ కమిషన్‌ తన నివేదికలో అతని ప్రమేయం గురించి పేర్కొన్నది. అప్పటి నుంచి సంఘపరివార్‌ మరియు సావర్కర్‌ వాదులకు ఈ నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కమిషన్‌ నివేదికను రద్దు చేయాలని ఫడ్నిస్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు అనుమతించింది. వర్తమాన చరిత్రను కించపరుస్తూ దాని స్ధానంలో తమ వూహలనే చరిత్రగా చొప్పించాలని చూసే ఈ పధకంలో బంబే హైకోర్టు తిరస్కరించటం, సుప్రీం కోర్టు అనుమతించటం కొన్ని అడుగులు.

పిటీషన్‌దారు ఆరోపించిన దాని ప్రకారం 1948 జనవరి 30న రెండవ అజ్ఞాత వ్యక్తి జరిపిన నాలుగవ రౌండ్‌ కాల్పులకే గాంధీ మరణించారు. రెండున్నర అడుగుల దూరం నుంచి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన గాడ్సే తూటాల కారణంగా ఆయన మరణించలేదు. రెండవ వ్యక్తి రహస్యంగా జరిపిన కాల్పులను ఎవరూ వినలేదు, అతను వున్నట్లు కూడా ఎవరూ గుర్తించలేదు.ఆ సమయంలో అక్కడదాదాపు వెయ్యి మందికి పైగా వున్నారు. గాంధీ మరణం తరువాత అంత్యక్రియలకు ముందు చేయించే పార్ధివ దేహానికి స్నానం చేయించి,శుద్ధి చేసే సమయంలో దేహంపై కప్పిన షాల్‌ మడతలలో ఒక బుల్లెట్‌ కనిపించిందని మనుబెన్‌ అనే వ్యక్తి చెప్పాడని పిటీషనర్‌ పేర్కొన్నాడు. దాన్నే నాలుగవ బుల్లెట్‌గా చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం మూడుసార్లు కాల్పులు జరిగినట్లు మూడు గాయాలున్నట్లు రెండు బుల్లెట్లు వెనుకవైపుకు దూసుకుపోయాయని, మూడింటిలో ఒక బుల్లెట్‌ గాంధీ వెనుక పది అడుగుల దూరంలో పడి వుండగా తరువాత కనుగొన్నారు. ఒకటి బాపు శరీరంలోనే వుండిపోయి చితిలో తరువాత కరిగిపోయి కనిపించింది. మూడవ బుల్లెట్టే షాల్‌లో దొరికిందని, నాలుగవది అసలు లేదని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు.

గాంధీ హత్యకు వుపయోగించిన 9ఎంఎం బెరెట్టా తుపాకి గాడ్సే చేతికి ఎలా వచ్చిందన్న అంశం గురించి తుషార్‌ గాంధీ తన విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. పిటీషన్‌దారు రెండు బెరెట్టా తుపాకులున్నాయని పేర్కొన్నారు. అవును నిజమే.ఒకే 606824 నంబరు గల రెండు తుపాకులున్నాయి.ఒకటి అసలైనది, రెండవది సందర్శకుల కోసం రూపొందించిన దాని నమూనా రాజఘాట్‌లోని జాతీయ గాంధీ మ్యూజియంలో వున్నాయి.ఈ తుపాకీ గాడ్సే చేతిలోకి ఎలా వచ్చిందన్నది ఆసక్తికరం. హత్యకు రెండు రోజుల ముందు వరకు అంటే జనవరి 28వరకు గాడ్సే-ఆప్టే ముఠాకు విస్వసనీయమైన ఆయుధం దొరకలేదు. ఇరవయ్యవ తేదీన వారు మూడు తుపాకులు కలిగి వున్నప్పటికీ హత్యాయత్నం విఫలమైంది. మరుసటి రోజునుంచి మరో ఆయుధం కోసం అన్ని వనరులనూ సంప్రదించారు. ఆ రోజుల్లో అక్రమ తుపాకుల విక్రయ కేంద్రంగా గ్వాలియర్‌ వుండేది. అక్కడ దత్తాత్రేయ పర్చూరే అనే డాక్టరున్నాడు. అతను సావర్కర్‌ వీర భక్తుడు, హిందూమహాసభ సభ్యుడిగా నాధూరామ్‌, ఆప్టేలకు తెలుసు. డాక్టరు దగ్గర మంచి తుపాకీ వుందని తెలిసి అది కావాలని అడిగారు. తిరస్కరించిన దత్తాత్రేయ వారికి ఒకదానిని సమకూర్చేందుకు అంగీకరించాడు.గంగాధర్‌ దండావతే అనే తన కింద పనిచేసే వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించాడు. జనవరి 28 సాయంత్రానికి అతను ఐదువందల రూపాయలకు ఒక తుపాకీని తెచ్చాడు.దానితో గాడ్సే-ఆప్టేలకు కాల్చటం రాకపోతే ఆ డాక్టరు తన ప్రాంగణంలో కాల్చిచూపించాడు.

సమీపం నుంచి హత్యలు చేయటానికి ఆ రోజుల్లో బెరెట్టా సెమీ ఆటోమాటిక్‌ తుపాకిని ఎక్కువగా వుపయోగించేవారు. ఇటాలియన్‌ ఫాసిస్టు ముస్సోలినీ సైన్యాధికారులు వుపయోగించేందుకు బెరెట్టా కంపెనీ పరిమితంగా వాటిని తయారుచేసేది. ఇప్పటికీ దాన్ని ఫాసిస్టు స్పెషల్‌ అని పిలుస్తారు. వుత్తర ఆఫ్రికాలోని అబిసీనియాను ఆక్రమించేందుకు ముస్సోలినీ సేనలు ప్రయత్నించినపుడు మిత్రపక్షాల సేనలు వాటిని ఓడించాయి. ఆ యుద్ధంలో బ్రిటీష్‌ సైన్యంలోని నాలుగ గ్వాలియర్‌ ఇన్‌ఫాంట్రిలో కమాండింగ్‌ అధికారిగా పనిచేసిన లెప్టినెంట్‌ కల్నల్‌ వి.వి జోషి ముస్సోలినీ సేనల లంగుబాటుకు చిహ్నంగా ఒక అధికారి నుంచి బెరెట్టా తుపాకిని స్వీకరించాడు. అది యుద్ద ట్రోఫిగా మారింది. తరువాత జోషిని నాటి గ్వాలియర్‌ రాజు జియాజీరావు సింధియా సంస్ధాన కోర్టులో అధికారిగా నియమించాడు. జోషి దగ్గర వున్న బెరెట్టా తుపాకి దొంగ తుపాకులు అమ్మేవారి దగ్గరకు అక్కడి నుంచి హంతకుల దగ్గరకు ఎలా చేరిందన్న విషయాన్ని ఎవరూ దర్యాప్తు చేయలేదు. గాంధీ హత్యలో డాక్టరు దత్తాత్రేయ సహనిందితుడు. అతడిని పంజాబు హైకోర్టు కేసు నుంచి విడుదల చేసింది. ఎందుకంటే అతడు సాంకేతికంగా అప్పటికి బ్రిటీష్‌ పౌరుడు. స్వయంగా తన నేరాన్ని అంగీకరించినప్పటికీ బ్రిటీష్‌ ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం నిందితుడిగా మార్పిడి జరగలేదనే సాకుతో విడుదల చేశారు. గాంధీ హంతకులకు సంబంధించి నకిలీలకు ఇవన్నీ ఇబ్బంది కలిగించే వాస్తవాలు. వారు ఇప్పుడు తమకు నిజాలను తారు మారు చేయగల, చరిత్రను తమకు అనుకూలంగా తిరిగి రాయగల సామర్ధ్యం, అధికారం వచ్చాయని భావిస్తున్నారు. ఇప్పటికే పురాతన చరిత్రను దిగజార్చటంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు వర్తమాన చరిత్రను తమ అవసరాలకు అనుకూలంగా మార్చుకొనేందుకు పూనుకున్నారు. అని తుషార్‌ గాంధీ పేర్కొన్నారు.

చరిత్ర రెండు రకాలు, ఒకటి హీనమైనది, రెండవది ఘనమైనది. మొదటి చరిత్ర కలవారు రెండోవారిని కించపరిచేందుకు, తమకు లేని చరిత్రను కృత్రిమంగా తయారు చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. మన దేశంలో గాంధీ మహాత్ముడిని హత్యచేసిన వారు మతోన్మాదులు అన్నది తిరుగులేని సత్యం. ఒకవైపు హంతకుడు,కుట్ర చేసిన వారిని అనధికారికంగా కీర్తిస్తూ మరోవైపు వారితో తమపై ఏర్పడ్డ మచ్చను చెరిపివేసుకొనేందుకు కాషాయశక్తులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. నాధూరామ్‌ గాడ్సే మావాడు కాదు అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాదనదానిలో మొదటిది. అయితే హత్యానంతరం కమిషన్‌ విచారణలో వారికి వున్న సంబంధాన్ని నిర్ధారించటంతో పాటు గాడ్సే సోదరుడు స్వయంగా నాధూరామ్‌ గాడ్సే ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌ను వీడలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ఏర్పడిన జనసంఘ్‌పై గాంధీ హత్య మరక చాలా పెద్దదిగా కనిపించేది, ఎందుకంటే గాడ్సేను సమర్ధించే ఆర్‌ఎస్‌ఎస్‌ వారు, హిందూమహాసభకు చెందిన వారందరూ ఆ పార్టీలో కనిపించేవారు. 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్దితిని ప్రకటించటం ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని కూడా జైళ్లలో వేయటంతో వారు ప్రజాస్వామ్యం పరిరక్షణలో జైలుపాలైన వారిగా ఫోజు పెట్టి తమపై వున్న మచ్చను కాస్త మసకపారేట్లు చేసుకున్నారు. జనతా పార్టీలో మత ముద్రను చెరిపివేసుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారు, అయితే ఆర్‌ఎస్‌ఎస్‌-జనతా పార్టీలలో ఏదో ఒకదానిలో మాత్రమే సభ్యులుగా వుండాలన్న అంశం తెరమీదకు వచ్చినపుడు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలంటే లౌకిక ముద్ర కంటే మతముద్రే లాభమని లెక్కలు వేసుకొని బిజెపి రూపమెత్తారు. తరువాత బాబ్రీ మసీదు కూల్చివేత- అయోధ్యలో రామాలయ నిర్మాణం తదితర అజెండాను ముందుకు తీసుకువచ్చినా విజయం సాధించలేకపోయారు. ఎదురుదెబ్బలు తిన్నారు. గత ఎన్నికలలో గణనీయ సంఖ్యలో సీట్లు సాధించినా మూడోవంతు కూడా ఓట్లు రాలేదు. ఆ వచ్చినవి కూడా నరేంద్రమోడీ గుజరాత్‌ను అభివృద్ది చేసిన ప్రగతివాదిగా చిత్రించటం, అన్నింటి కంటే కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, అసంతృప్తి కారణంగా ఆమేరకైనా ఓట్లు వచ్చాయి. ఆ ఓటింగ్‌ నిలవదని బిజెపి, సంఘపరివార్‌ నాయకత్వానికి తెలుసు. అందువలననే తమపై వున్న తిరోగామి ముద్రలను తుడిచివేసుకొనేందుకు పూనుకుంది. దానిలో తొలి అడుగు స్వచ్చభారత్‌ పిలుపును మహాత్మాగాంధీకి జతచేసి తాము ఆయనను గౌరవిస్తున్నామనే సందేశం పంపేందుకు ప్రయత్నించారు. దాని వలన ఆయనను హత్యచేసిన మచ్చపోయే అవకాశం లేదు. గతంలో ఏ సందర్భంలోనూ ప్రస్తావించని అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ నివేదిక పేరుతో ఒక కధనాన్ని ప్రచారంలో పెట్టారు. ఆ పధకంలో భాగమే బ్రిటీష్‌ గూఢచార విభాగానికి చెందిన గుర్తుతెలియని మూడో వ్యక్తి, అసలు లేని నాలుగో బుల్లెట్‌ కధ. మహాత్మాగాంధీని నిజంగా వదిలించుకోవాలని బ్రిటీష్‌ పాలకులు నిర్ణయించుకొని వుంటే ఆయనేం ఖర్మ యావత్తు స్వాతంత్య్రపోరాట నాయకత్వాన్నే అంతం చేసి వుండేది. అందునా స్వాతంత్య్రం ప్రకటించి, మన దేశం నుంచి వెళ్లిపోయిన తరువాత మహాత్ము డిని హత్యచేయాల్సిన అవసరం బ్రిటీష్‌ వారికి ఏమాత్రం లేదు. ఎందుకంటే వారు వెళ్లిపోయినా బ్రిటీష్‌ కార్పొరేట్ల పెట్టుబడులు అలాగే వున్నాయి. మహాత్ము డిని హత్య చేయించి వాటిని కాపాడుకోగలమనే పిచ్చి ఆలోచన వారికి కలిగే అవకాశం లేదు.

అయినా బ్రిటీష్‌ గూఢచారి కధ చెబుతున్నారంటే రాబోయే రోజుల్లో దాన్ని బలపరిచేందుకు వీలుగా అమెరికాలో కొత్త స్క్రిప్టు,దర్శ కత్వం, సినేరియో వంటి వన్నీ తయారువుతున్నాయని భావించాల్సి వుంది. మన మార్కెట్‌, మన మిలిటరీతో సంబంధాల విషయంలో అమెరికా పట్టు సాధించిన కారణంగా దానికి అనుగుణంగా వ్యవహరించే శక్తులకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. అనేకదేశాలలో ఇది రుజువైంది.మన దేశంలో కూడా అదే పునరావృతం అవనుందా ?

గమనిక: ఈ వ్యాసం ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాయబడినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతిపితను చంపిందెవరన్న ప్రశ్న జనం ముందుకు రానుందా-1

14 Saturday Oct 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

assassination of Mohandas Karamchand Gandhi, Hindu Fundamentalism, HINDU MAHASABHA, Mahatma Gandhi, Nathuram Godse, RSS

ఎం కోటేశ్వరరావు

ఆయేషా మీరా, అరుషి కేసులలో నిందితులు నిర్దోషులు, వారు హత్య చేయలేదని కోర్టులు తీర్పులిచ్చాయి. ఎవరూ వారిని చంపకపోతే వారెలా హత్యకు గురయ్యారు? జాతిపిత మహాత్మాగాంధీ హత్యకేసులో కూడా, నిందితులు, వారి వెనుక కుట్ర చేశాయన్న సంస్ధలు పరిశుద్ధులని నిర్ధారించేందుకు ప్రయత్నం జరుగుతోందా ? మన న్యాయవ్యవస్ధకు ఎలాంటి దురుద్ధేశ్యాలను అపాదించకుండానే జరుగుతున్నవాటిని చూసి ఏమైనా జరగవచ్చని సామాన్యులు అనుకోవటంలో తప్పులేదు కదా. దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న కొందరు వూహిస్తున్నట్లుగా ఒక వేళ ఆయేషా, అరుషి కేసుల తీర్పులే మహాత్మాగాంధీ విషయంలో పునరావృతం అయితే జాతిపితను చంపింది ఎవరు అన్న ప్రశ్న భవిష్యత్‌ తరాల ముందు వుంటుంది. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ వూహించి వుండరు కదా !

మహాత్మాగాంధీ జన్మించి 148 సంవత్సరాలు గడిచాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నాధూరామ్‌ గాడ్సే, మరొకడు కలిసి ఆయనను హత్యచేసి 69 సంవత్సరాలవుతోంది. ఇన్ని సంవత్సరాల తరువాత హత్యలో మూడోవాడు,వాడు పేల్చిన నాలుగో బుల్లెట్టే ప్రాణం తీసింది దాని గురించి విచారణ జరపండి అని సుప్రీం కోర్టులో ఒక కేసు దాఖలైంది. ముంబైకి చెందిన డాక్టర్‌ పంకజ్‌ ఫడ్నిస్‌ అనే వ్యక్తి అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించే సంస్ధగా పరిగణించబడే అభినవ్‌ భారత్‌ ట్రస్టీ. నాధూరామ్‌ గాడ్సే, నారాయణ్‌ ఆప్టేలో పాటు మహాత్మాగాంధీ హత్య సమయంలో మరో విదేశీ అజ్ఞాత వ్యక్తి వున్నాడని, నాలుగవ బుల్లెట్‌ పేలిందని దాని గురించి విచారణ జరపాలని గతేడాది దాఖలు చేసిన పిటీషన్ను బంబాయి హైకోర్టు కొట్టివేసింది. అదే వ్యక్తి సుప్రీం కోర్టుకు విన్నవించారు. అమెరికా సిఐఏ నుంచి తనకు కొంత విలువైన సమాచారం త్వరలో అందనుందని, దానిని కోర్టుకు సమర్పిస్తానని కూడా అతను వాదించాడు. ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్‌ తదుపరి వాదనలను అక్టోబరు 30కి వాయిదా వేస్తూ ఈ కేసును విచారణకు చేపట్టవచ్చో లేదో తమకు సలహా ఇవ్వాలని అమరేందర్‌ శరణ్‌ అనే సీనియర్‌ న్యాయవాదిని నిర్ణయించింది. ఆ కేసు తదుపరి ఎటు తిరుగుతుందో అన్న ఆసక్తి సహజంగానే రేకెత్తింది. అనేక ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

ఒక వైపు మహాత్మాగాంధీని పొగుడుతూనే మరోవైపు ఆయనను కించపరిచే ద్వంద్వ వైఖరిని మనం ప్రస్తుత అధికారపక్షంలో చూస్తున్నాం. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌ షా కొద్ది వారాల క్రితం గాంధీని చతురుడైన కోమటి అని వర్ణించిన విషయం తెలిసిందే. గాంధీని హత్యచేసిన ‘గాడ్సేను దేవుడే పంపాడు, అసలు గాంధీనే వురి తీసి వుండాల్సింది, గాంధీని చంపటానికి గాడ్సేకు వుండే కారణాలు గాడ్సేకున్నాయి, అవును నేను గాడ్సేకు పెద్ద అభిమానిని, అయితే ఏమిటి’ అని ఆరాధించే అనేక మంది ప్రధాని నరేంద్రమోడీ భక్తులైతే అందుకు ప్రతిగా ట్విటర్‌ ద్వారా మోడీ వారిని అనుసరిస్తూ ప్రోత్సహిస్తున్నారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎవరో వూరూ పేరు లేని వారైతే పట్టించుకోనవసరం లేదు బిజెపి జాతీయ ఐటి విభాగ అధిపతి అమిత్‌ మాలవీయ ఒక ట్వీట్‌లో ‘గాంధీని హత్యచేయటానికి గాడ్సేకు వుండే కారణాలు ఆయనుకున్నాయి, న్యాయబద్దమైన సమాజం వాటిని కూడా వినాలి’ అని వ్యాఖ్యానించాడు. వారందరికీ ఆరాధ్యదైవంగా పరిగణించబడే నరేంద్రమోడీ మరోవైపు ‘ గాంధీ జయంతి సందర్బంగా బాపూకు నేను ప్రణమిల్లుతున్నాను. ఆయన మహత్తర ఆశయాలు ప్రపంచవ్యాపితంగా కోట్లాది మందికి ప్రేరణనిస్తున్నాయి’ అని ట్వీట్‌ చేస్తారు.

సైద్ధాంతికంగా గాంధీని వ్యతిరేకించిన సుభాస్‌ చంద్రబోసే గాంధీని జాతిపితగా వర్ణించారు. మన రాజ్యాంగంలో జాతిపితగా గుర్తించే అవకాశం లేదు. అయినా మహాత్ముడి వ్యక్తిత్వం కారణంగా ఆయనను జాతిపితగా వర్ణిస్తున్నాము. కరెన్సీపై ఆయన చిత్రాన్ని ముద్రించటం అంటే అంతటి స్ధాయిని కల్పించటమే. బిజెపి, దానిని వెనుక నుంచి నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ ఆయనను జాతిపితగా గుర్తించలేదు, పిలవలేదు.అలాంటి వ్యక్తిని గాడ్సే గాంగ్‌ ఎందుకు చంపింది. అనేది అవలోకించాల్సి వుంది. ప్రస్తుతం దేశంలో హిందూమతోన్మాదశక్తులు రెచ్చిపోతున్నాయి. గాంధీని చంపటం ఒక పెద్ద ఘనతగా, అలాంటిదానిని తమకు దక్కకుండా చేసేందుకు పూనుకున్నారని హిందూమహాసభ పేరుతో వున్న వారు ప్రకటించారు.

మహాత్మాగాంధీని చంపింది హిందూమహసభకు చెందిన నాధూరామ్‌ గాడ్సే అనే తమ వారసత్వ ఆస్థి లేదా వుత్తరదాయిత్వాన్ని దెబ్బతీసేందుకు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని హిందూమహాసభ ఆగ్రహం వెలిబుచ్చింది.మూడో వ్యక్తి, నాలుగో బుల్లెట్‌ పేరుతో దాఖలైన కేసులో సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీ నియామకం జరుపుతున్నట్లు ప్రకటించగానే హిందూమహాసభ జాతీయ వుపాధ్యక్షుడు అశోక్‌ శర్మ ఒక ప్రకటన చేశారు. హిందూ మహాసభ నుంచి పుట్టిన భావజాలమే బిజెపి మరియు ఆర్‌ఎస్‌ఎస్‌ వునికి కారణం. ఆ రెండు సంస్ధలు ఈరోజు ధరించిన ముసుగులను బహిరంగపరచగలిగేది తమ సంస్ధ మాత్రమే అని వాటికి తెలుసు, హిందూమహసభ గుర్తింపును నాధూరామ్‌ గాడ్సే నుంచి విడదీయలేరు, గాంధీ హత్యలో గాడ్సేకు ఖ్యాతి దక్కకుండా చేసేందుకు అతని పాత్రపై అనుమానాలను సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. గాడ్సే లేకపోతే హిందూమహాసభ పూర్తిగా వునికి కోల్పోతుందని వారికి తెలుసు.ఇదందా బిజెపి ద్విముఖ వ్యూహంలో భాగం. గాడ్సేను పొగడలేదు కనుక గాంధీ పట్ల సానుకూల వైఖరిని అనుసరించేందుకు ఒక వైపు ప్రయత్నిస్తోంది. మరోవైపు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ ప్రమాణాల గురించి బహిరంగంగా మాట్లాడగలిగేది హిందూ మహాసభే కనుక దానిని పూర్తిగా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పిటీషన్‌ దాఖలు చేసిన వ్యక్తి పూర్తిగా సంఘ్‌ తరఫున పని చేస్తున్నాడు.’ అని అశోక్‌ శర్మ వ్యాఖ్యానించాడు.

ఇలాంటి మతోన్మాద, హంతక శక్తులకు అంతటి బరితెగింపు ఎలా వచ్చింది? వారిని రక్షించే శక్తులది పైచేయి అయిందా, జనం విచక్షణ కోల్పోతున్నారా ? దేశవిభజన సమయంలో చెలరేగిన మతఘర్షణలపై గాంధీ తీసుకున్న వైఖరి మతోన్మాదులకు నచ్చనందునే ఆయనను పొట్టన పెట్టుకున్నారు. మతాల గురించి గాంధీ చెప్పిందేమిటి? గాంధీ ధర్మం ప్రకారం సహనానికి మించి అన్ని మతాల పట్ట చిత్తశుద్దితో కూడిన గౌరవం వుంది.ఆమేరకు ఆయన విజ్ఞప్తి చేశారు.మతోన్మాదానికి ఏ మాత్రం అవకాశం లేదు. వివిధ సందర్భాలలో ఆయన చెప్పిన, రాసిన మాటలు ఇలా వున్నాయి. ‘ నావరకు విభిన్న మతాలు ఒకే తోటలోని అందమైన పూలవంటివి లేదా దివ్యమైన చెట్టు యొక్క వివిధ కొమ్మలు. మానవ పరిణామక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రతి మతం తనదైన అంశభాగాన్ని అందచేసింది. ప్రపంచంలోని అన్ని విశ్వాసాలు ఒకే చెట్టులోని అనేక శాఖలు, మిగతావాటితో పోల్చితే దేనికది ప్రత్యేకతలు కలిగి వున్నప్పటికీ వాటికి వనరు ఒక్కటే.’ వివిధ మతాలు ఒకే చెట్టుమీది ఆకుల వంటివి. ఏ రెండు ఆకులూ ఒకే విధంగా వుండవు. ఒకే చెట్టుమీద పెరిగిన కొమ్ములు లేదా ఆకుల మధ్య వైరం వుండదు. ప్రపంచంలోని అన్ని గొప్పమతాలలోని నిజాల విశ్వాసిని, కేవలం సహనమే కాదు ఇతర మతాల విశ్వాసాలు కూడా మన వంటివే అనే గౌరవం లేకపోతే భూమ్మీద శాంతి నెలకొనదు. నేను ప్రబోధించే విశ్వాసం దాన్ని అమలు చేయటానికి మాత్రమే నన్ను అనుమతించదు, ఏ వనరునుంచి వచ్చినప్పటికీ మంచిని గ్రహించే విధి నిర్వహణ అనివార్యం చేస్తుంది. దీర్ఘ పఠనం, అనుభవం తరువాత నేను కొన్ని నిర్ధారణలకు వచ్చాను. అన్ని మతాలు నిజమైనవే,అన్ని మతాలలోనూ కొన్ని తప్పులున్నాయి, నా స్వంత హిందూమతం మాదిరి నాకు అన్ని మతాలూ ప్రియమైనవే, అదే విధంగా మానవులందరూ వారి స్వంత బంధువుల మాదిరి ప్రియంగా వుండాలి. ‘ ఒక క్రైస్తవ మిత్రుడు ఒకసారి గాంధీని ఒక ప్రశ్న అడిగాడు. మీ మతం అన్ని మతాల సంయోగం అని మీరు చెబుతారా ? అంటే ఆ సంయోగాన్ని నేను హిందూయిజం అని పిలుస్తాను, మరియు మీ విషయానికి వస్తే క్రైస్తవమే సంయోగం అవుతుంది అని గాంధీ చెప్పాడు.

ఇటువంటి భావాలున్న వ్యక్తి దేశవిభజన సమయంలో చెలరేగిన మతఘర్షణలకు నిరసనగా దీక్ష చేపట్టటాన్ని అవకాశంగా తీసుకొని హిందూమతోన్మాదశక్తులు తమ కసి తీర్చుకున్నాయి.ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ వంటి సంస్దలకు నాయకత్వం వహించిన వారి కార్యకలాపాలు రచనలు, వుపన్యాసాలను గమనించితే వారికి ఇటాలియన్‌ ఫాసిస్టు ముస్సోలినీ, జర్మన్‌ హిట్లర్‌ నాజీలు స్ఫూర్తి ప్రదాతలుగా కనిపిస్తారు. భారత్‌ను జర్మనీగా భావించి అక్కడ యూదులను దేశద్రోహులుగా ఎలా చిత్రించారో ఇక్కడ ముస్లింలను అలా పరిగణించాలని భావించారు. ఐరోపా మతరాజ్యాల మాదిరి భారత్‌ను ఒక హిందూ రాజ్యంగా చూడాలని అనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో తాము గెలవాలని కోరుకున్న ముస్సోలినీ, హిట్లర్‌ మట్టి కరవటం, యూదులను వూచకోత కోయటాన్ని సభ్యసమాజం వ్యతిరేకించటం, జర్మనీ, ఇటలీలు ఓడిపోవటం, భారత్‌ నుంచి పాకిస్తాన్‌ విడిపోవటం వంటి అంశాలతో తాము వూహించుకున్నది ఒకటి జరిగింది ఒకటనే ఆశాభంగానికి గురైన శక్తులు గాంధీ కారణంగానే హిందువులు చేతగాని విధంగా తయారయ్యారనే తప్పుడు నిర్దారణలకు వచ్చి ఆయనను హతమారిస్తే తప్ప హిందూమతం పటిష్టం కాదనే అంచనాతో హత్యకు పాల్పడివుంటారని చెప్పవచ్చు. వారి వారసులు ఇప్పుడు గాంధీ హత్యను మరోవిధంగా వ్యాఖ్యానించటానికి, వుపయోగించుకోవటానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే సుప్రీం కోర్టులో మూడో వ్యక్తి, నాలుగో బుల్లెట్‌ కథ.

గత లోక్‌సభ ఎన్నికలలో మూడింట రెండువంతుల సీట్లు బిజెపికి వచ్చాయి గానీ వచ్చిన ఓట్లు 31శాతమే. బిజెపిని వ్యతిరేకించే పార్టీల ఓట్ల చీలిక దానికి సీట్ల పంట పండించింది. గరిష్ట మతరాజకీయాల అనంతరం పరిస్ధితి ఇది. వుత్తర ప్రదే శ్‌ ఎన్నికలలో కూడా బిజెపికి ఎన్నడూ లేని సంఖ్యలో సీట్లు వచ్చాయి. కానీ ఓట్ల లెక్కలో లోక్‌సభ ఎన్నికల కంటే తగ్గాయి. అత్యవసర పరిస్దితి అనంతర ఓట్లవివరాలను చూస్తే తమకు వున్న పరిమితులేమిటో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి నాయకత్వానికి అవగతం అయ్యాయి. అందువలన అధికారంలో కొనసాగాలన్నా, మరో రూపంలో మతోన్మాద అజెండాను అమలు జరపాలన్నా విశ్వసనీయతను సృష్టించుకోవటం అవసరంగా భావించినట్లు కనిపిస్తోంది.

నాటి నుంచి నేటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలందరూ హిందుత్వ గురించి, దేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలని కోరుతూ, హిందూ ధర్మానికి ముప్పు కలుగుతోందని చెబుతున్నవారే. అది వారికి ఆక్సిజన్‌ వంటిది. అదిలేకపోతే దానికింక మనుగడే వుండదు. ఎందుకంటే మిగతా అంశాలన్నీ అన్నీ పార్టీలు చెప్పేవే. గాంధీ హత్యకు కుట్రచేసిన గాడ్సే, ఇతరులందరూ ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభలలో సభ్యులుగా వున్న హిందుత్వశక్తులే. గతంలో జనసంఘం, ప్రస్తుతం బిజెపిగా వ్యవహరిస్తున్న పార్టీకి అది ఒక మాయని మచ్చ. దానిని తొలగించుకోవాలని ఎప్పటి నుంచో పెద్ద ప్రయత్నం జరుగుతోంది. గాంధీని హతమార్చిన విషయాన్ని కాదనలేరు కనుక ఆయనను చంపింది రాజకీయ కారణాలతో తప్ప మతఅంశాలు కాదని చెప్పటానికి అనేక మంది బిజెపి ప్రముఖులు గతంలో ప్రయత్నించారు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన వారు గాంధీని హత్యచేసిన ఘనత తమఖాతాలో వేసుకొనేందుకు ఇంకా మోజుపడుతున్నారు.అది బహిరంగంగా చెప్పుకోలేరు. అదే సమయంలో అధికారం కావాలంటే అదొక ఆటంకంగా వుంది కనుక అధికారికంగా ఏదో విధంగా మత ముద్ర బదులు రాజకీయ ముద్రవేయాలని చూస్తున్నారన్నది ఒక విమర్శ. గాడ్సే గతాన్ని తుడిచి వేసుకొనేందుకు అతడసలు ఆర్‌ఎస్‌ఎస్‌ కాదని ప్రకటిస్తారు.హత్య సమయంలో అతను సంఘపరివార్‌లో లేడంటారు. అయితే గాడ్సే తమ్ముడు గోపాల్‌ గాడ్సే అసలు విషయాలు చెప్పాడు.’ నాధూరామ్‌, దత్తాత్రేయ, నేను, గోవింద్‌ సోదరులందరం ఆర్‌ఎస్‌ఎస్‌లో వున్నాం. మా ఇండ్లలో కంటే మేం ఆర్‌ఎస్‌ఎస్‌లోనే పెరిగామని నేను చెప్పగలను, అది మాకు ఒక కుటుంబం వంటిది.ఆర్‌ఎస్‌ఎస్‌లో నాధూరామ్‌ ఒక మేధోపరమైన కార్యకర్తగా ఎదిగాడు, తన ప్రకటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వైదొలిగినట్లు చెప్పాడు, ఎందుకంటే గాంధీ హత్య తరువాత గోల్వాల్కర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో ఇబ్బందుల్లో వుంది కనుక అలా చెప్పాడు. అతను ఆర్‌ఎస్‌ఎస్‌ను వదలి పెట్టలేదు. వెళ్లు, గాంధీని హత్యచేయమని ఆర్‌ఎస్‌ఎస్‌ తీర్మానించలేదని చెప్పుకోవచ్చు తప్ప అతనితో మాకేమీ సంబంధం లేదని చెప్పకూడదు.ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేస్తూనే 1944 నుంచి హిందూ మహాసభలో కూడా నాధూరామ్‌ పని చేయటం ప్రారంభించాడు.’ అని పేర్కొన్నాడు. గోపాల్‌ గాడ్సే చెప్పింది వాస్తవమే అనటానికి నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వుత్తర ప్రత్యుత్తరాల్లోని అంశాలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఆరవ వాల్యూమ్‌ పేజి 56లో ‘సావర్కర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసిన మతోన్మాద విభాగం హిందూమహాసభ కుట్ర చేసి అమలు చేయించింది’ అని పేర్కొన్న విషయాన్ని జర్నలిస్టు ఏజి నూరాని తన పుస్తకంలో వివరించాడు.

దేశ రాజకీయ చిత్రపటం నుంచి గాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్య్రం పోరాటనాయకులను తొలగించాలని బిజెపి నేతలు బాహాటంగానే చెబుతున్నారు. హత్యకేసు విచారణ సమయంలో గాడ్సే చెప్పిన అంశాల కొనసాగింపే ఇది. జిన్నాకు గాంధీ తదితరులు లంగిపోయారని గాడ్సే ఆరోపించాడు. చెవులప్పగించిన వారికిది వినసొంపుగానే వుంటోంది. ఎందుకంటే గత 70సంవత్సరాలుగా మధ్యలో కొంత కాలం మినహా గాంధీ, నెహ్రూల వారుసులుగా చెప్పుకొనే వారే అధికారంలో కొనసాగారు. అనుసరించిన దివాళాకోరు ఆర్ధిక విధానాల కారణంగా సమాజంలోని వివిధ తరగతులలో అసంతృప్తి నెలకొంది. దీన్ని సొమ్ము చేసుకోవాలంటే ఒక దగ్గర మార్గం సకల అనర్ధాలకు గాంధీ, నెహ్రూవారసులే కారణం అంటే చాలు. సరిగ్గా జర్మనీలో హిట్లర్‌ కూడా అదే చేశాడు. ఐరోపా యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని పంచుకొనే పోటీలో జర్మన్‌ సామ్రాజ్యవాదులు వెనుకబడ్డారు. అందువలన మొదటి ప్రపంచయుద్ధంలో విజేతలు జర్మనీని దెబ్బతీసేందుకు అవమానకరమైన షరతులతో సంధిని రుద్ధారు. దాన్ని చూపి జనాన్ని రెచ్చగొట్టి హిట్లర్‌ రాజకీయంగా ఎదిగాడు. ఇప్పుడు బిజెపి చేస్తోంది అదే. కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలలో ఎలాంటి మార్పు లేదు. అవే దివాలా కోరు విధానాలను అమలు జరుపుతున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనం ప్రారంభమైన సమయంలో అంకెల గారడీ చేసి నరేంద్రమోడీ సర్కార్‌ లేని అభివృద్ధిని చూపింది. దేన్నయినా మూసిపెడితే పాచి పోతుంది. మూడు సంవత్సరాల కాలంలో అదే జరిగింది. తప్పుడు సలహాలు విని తాత్కాలికంగా అయినా కొన్ని మెరుపులు మెరిపించి మరోసారి ఓట్లను కొల్లగొడదామనే ఎత్తుగడుతో పెద్ద నోట్లను రద్దు చేశారు. ముఖ్యమంత్రిగా తన జీవిత కాలమంతా వ్యతిరేకించిన జిఎస్‌టిని ముందు వెనుకలు ఆలోచించకుండా బలవంతంగా అమలు జరిపించారు. ఆర్ధికాభివృద్ధి వెనుకపట్టు పట్టటం తాత్కాలికమే అని కొత్త పల్లవి అందుకున్నారు. దాని మంచి చెడ్డల గురించి మరోసారి చూద్దాం.

అసలు మహాత్మా గాంధీ అనుసరించిన విధానాలేమిటి? అవి ఇప్పుడెలా వున్నాయో, వర్తమాన మేథావులు వాటిని ఎలా చూస్తున్నారో చూద్దాం. అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నీతి నాయర్‌ గాంధీ జయంతి సందర్భంగా ఒక విశ్లేషణ చేశారు. దానితో ఎకీభవించాలా లేదా మరో కోణం నుంచి చూడాలా అనేది వేరే విషయం. అమె విశ్లేషణ సారం ఇలా వుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ రాజఘాట్‌లో శ్రద్ధాంజలి ఘటించటాన్ని కోట్లాది మంది చూశారు. గాంధీకి ఇష్టమైన ప్రార్ధనలను రేడియో వినిపించి, నలుపు, తెలుపుల డాక్యుమెంటరీలను టీవీలలో ప్రసారం చేశారు. అయితే ఈ తీపి మాటలు, విధిలో భాగంగా వెల్లడించే శ్రద్ధాంజలులు, జాతిపితకు సంబంధించిన వాస్తవాలను మూసిపెట్టేందుకే. అధికార భారత్‌లో వాస్తవానికి గాంధీ గతించారు.

మహాత్మాగాంధీ సంప్రదింపుల శక్తిని విశ్వసించారు. కాశ్మీరులో పరిస్ధితి నెత్తుటి మరకలా వుంది. సంప్రదింపులు లేవు,క్లుప్తంగా చెప్పాలంటే అధికారం పశుబలాన్ని ప్రయోగించింది. నిరాయుధనిరసనకారులపై భద్రతాదళాలు ప్రయోగించిన పిల్లెట్లతో వందలాది మంది అంధులయ్యారు. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఎన్ని సత్యాగ్రహాలు చేసి వుండేవారు? భిన్న సామాజిక తరగతులను ఐక్యం చేసేందుకు తన ప్రార్ధనా సమావేశాలలో గాంధీజీ బైబిల్‌, ఖురాన్‌, గీతలోని అంశాలను ప్రస్తావించేవారు, ఇప్పుడు హిందూ చిహ్నలను మాత్రమే వినియోగిస్తున్నారు. ఏ పధకమైనా పేదలకు లబ్ది చేకూర్చిందా లేదా అన్నదే దాని విజయానికి గీటురాయిగా తీసుకోవాలన్నది గాంధీ వైఖరి. మోడీ తన పుట్టిన రోజు కానుకగా జాతికి అంకితం చేసిన సర్దార్‌ సరోవర్‌ డామ్‌ నీటిని నాలుగు రాష్ట్రాలలో రువు ప్రాంతాలకు వుద్దేశించగా దానికి భిన్నంగా దామాషాకు వ్యతిరేకంగా కోకాకోలా, టాటానానో కారు వంటి కొన్ని ఎంపిక చేసిన కార్పొరేట్ల అవసరాలకు అనుగుణ్యంగా నీటిని మళ్లిస్తున్నారు. అత్యంత పేదలైన గిరిజనుల నివాసాలు మునిగిపోయాయి, దశాబ్దాలు గడిచినా, పాకేజీలు ప్రకటించినా నిర్వాసిత గిరిజనుల జీవితాల్లో మార్పులేదు. ప్రజాస్వామ్యంలో మీడియా పోషించాల్సన విమర్శనాత్మక పాత్రను గాంధీజి విశ్వసించారు. నేడు దేశంలో ప్రభుత్వ విమర్శకులను భయపెట్టే పద్ధతులను నిరంతరం అనుసరిస్తున్నారు. జర్నలిస్టులను హత్యచేయటం నుంచి స్వతంత్రంగా వ్యవహరించే సంపాదకులను రాజీనామా చేయించటం వరకు అవి వున్నాయి.

గాంధీ గోవధను వ్యతిరేకించినప్పటికీ హిందువేతరులపై ఒక మతాన్ని రుద్దటాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. హిందువులు బీఫ్‌ తింటారని, ఆవు చర్మాలతో వ్యాపారం చేస్తారని ఆయనకు బాగా తెలుసు. భిన్న ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలున్న ముస్లిం, పార్సీ, క్రైస్తవులు తదితర బహుళ సామాజిక తరగతుల గురించి గాంధీజి పదే పదే చెప్పారు. కానీ నేడు ఆయన ప్రాతినిధ్యం వహించినదానికి విరుద్దంగా గో రక్షకులు రాత్రి పగలూ వీధులలో తిరుగుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ స్వచ్చభారత్‌ కార్యక్రమంలో గాంధీ జీవించి వున్నారు. చీపుర్లు పట్టి మోడీ మంత్రులు ఫొటోలు తీయించుకోవటంలో చూపుతున్న శ్రద్ధ పారిశుద్ధ్య నియమాలను పాటించటంలో లేదు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌ నుంచి రాట్నం వడుకుతున్న గాంధీ పొటోను తొలగించి నరేంద్రమోడీది చేర్చటం ఖాదీతో గాంధీ అనుబంధాన్ని కనిపించకుండా చేయటమే. గోరక్షకుల దాడులకు బలైన బాధిత కుటుంబాల ఇండ్లకు శాంతియుతంగా వెళ్లిన కార్యకర్తల కార్యక్రమంలో గాంధీ జీవించి వున్నారు. జర్నలిస్టులపై దాడులకు వ్యతిరేకంగా అక్టోబరు రెండున దేశవ్యాపితంగా మౌనంగా అయినప్పటికీ శక్తివంతంగా జరిపిన జర్నలిస్టుల నిరసనల్లో గాంధీ వున్నారు. ప్రపంచవ్యాపితంగా జరిగిన అనేక శాంతియుత నిరసనల్లో గాంధీ భావజాలం పని చేసింది.

గాంధీకి అధికారికంగా ఏర్పాటు చేసిన రాజఘాట్‌ స్మారక చిహాన్ని చూపేందుకు బస్సుల్లో స్కూలు పిల్లల్ని తీసుకు వెళ్లేవారు ఒక పధకం ప్రకారం మితవాద మతోన్మాది నాధూరామ్‌ గాడ్సే చేతిలో గాంధీ హత్యకు గురైన బిర్లా భవనాన్ని ఎందుకు చూపరు అని గాంధియన్‌ విద్యావేత్త కృష్ణకుమార్‌ 2007ఒక రచనలో ఆశ ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గాడ్సే పేరును పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నారు. భారతీయ, విదేశీ అతిధులు కూడా బిర్లా భవనాన్ని ఎవరూ సందర్శించరు. గాంధీ హత్యవెనుక వున్న కారణాలేమిటని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగే అవకాశం లేకుండా చేసేందుకు హత్యజరిగిన నాటి నుంచి ఒక ‘నిశబ్ద ఒప్పందం’ జరగటమే దీనికి కారణం అయివుండాలని కృష్ణ కుమార్‌ నిర్ధారణకు వచ్చారు. గాంధీ హత్య జరిగిన తరువాత హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలపై దాడులు చేసి కార్యకర్తలను అరెస్టుచేసి వారి రికార్డులను స్వాధీనం చేసుకొన్నారు. తరువాత రికార్డులను నెహ్రూ మ్యూజియంలో భద్రపరిచారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం తొలగింపు, కార్యకర్తల విడుదల తరువాత వారు రహస్యంగా హిందూ సామాజిక తరగతిని పటిష్టపరిచేందుకు పనిచేస్తున్నారు. విరాళాలు వసూలు చేసేటపుడు రాతపూర్వక రికార్డులు నిర్వహించకూడదని నిర్ణయించారు. గాడ్సేకు మరణశిక్ష విధించిన న్యాయమూర్తులలో ఒకరైన జి.డి ఖోస్లా కొన్ని సంవత్సరాల తరువాత ‘ ఆరోజు కోర్టులో ప్రేక్షకులుగా వున్నవారు ఒక జూరీని ఏర్పాటు చేసి గాడ్సే అప్పీలు మీద విచారణ జరపమని దానికి అప్పగించి వుంటే గాడ్సే తప్పుచేయలేదని అత్యధిక మెజారిటీతో తీర్పు చెప్పి వుండేవారు’ అని పేర్కొన్నారు.

సంవత్సరాలు గడిచిన కొద్దీ అనేక రోడ్లకు మహాత్మాగాంధీ పేరు పెట్టారు, దేశమంతటా అనేక విగ్రహాలు నెలకొల్పారు తప్ప ఆయన సందేశాన్ని నిర్లక్ష్యం చేశారు. లౌకికవాదులుగా పిలుచుకొనే పార్టీలు 1977-79 మధ్య కాలంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు స్ధానం దొరికింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనతా పార్టీ రెండింటిలో ద్వంద్వ సభ్యత్వం కలిగి వుండటమనే సమస్యకారణంగా దేశంలోని తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం కూలిపోయింది.( ఇప్పుడు బిజెపిగా ఏర్పడిన వారు తాము ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వాన్ని వదులుకొనేది లేదని జనతా పార్టీ నుంచి బయటికి వచ్చారు) రాజకీయాలు మరియు ఇటీవలి సంవత్సరాలలో సాగుతున్న రాజకీయ బేరసారాలలో దేశంలో గాడ్సే స్ధానం గురించి పరిశీలించటానికి ఏమాత్రం చోటులేదు. భగత్‌ సింగ్‌, బిఆర్‌ అంబేద్కర్‌ వంటి గాంధీ సమకాలిక పెద్దలు వున్నప్పటికీ భిన్న తరగతుల మధ్యó మహాత్ముడి స్ధానంలో గాంధీ కొనసాగుతూనే వుంటారు.ఆయన అనుసరించిన, ఆచరించిన పద్దతులు వర్తమాన భారతంలో ఎన్నడూ లేనివిధంగా మరింతగా ప్రతిబింబించాలి.’ నీతి నాయర్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలతో ఏకీభవించినా, విబేధించినా అవి ఆలోచనాత్మకంగా వున్నాయని చెప్పవచ్చు. మూసిపెట్టటానికి ప్రయత్నించకుండా మరిన్ని కోణాల నుంచి ఈ అంశాలను చర్చించవచ్చు.

గమనిక: ఈ వ్యాసం ఎంప్లాయీస్‌ వాయిస్‌ పత్రిక రానున్న సంచికలో ప్రచురణ నిమిత్తం రాయబడినది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ నోరు మూస్తే ఏమిటి ? తెరిస్తే ఏమిటి ?

29 Friday Sep 2017

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Arun jaitly, BJP, BJP-led NDA, economic mess, India economy, Narendra Modi, rupee value

ఎం కోటేశ్వరరావు

మిన్ను విరిగి మీద పడ్డా తన అంతరాత్మ అయిన అమిత్‌ షాతో మనకు లాభమో నష్టమో చెప్పు, అవసరమైతే నోరు విప్పుతా అంటారు ప్రధాని నరేంద్రమోడీ. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు దాన్నే నిర్ధారిస్తున్నాయి. ప్రయోజనం లేని మొగుడు తోటలో వుంటేనేం కోటలో వుంటే ఏమిటి ప్రయోజనం అన్న సామెత మాదిరి మోడీ వచ్చి మూడు సంవత్సరాల నాలుగు నెలలైంది ఆయన నోరు తెరిస్తే ఏమిటి మూస్తే ఏమిటి అని జనం అనుకోవటం ప్రారంభించారు. ఆ పెద్ద మనిషి మూసుకున్నా దేశం కోసం మేం నోరు తెరవక తప్పదంటున్నారు బిజెపి నేతలు. మోడీ పోయినా పార్టీని దక్కించుకోవాలి కదా మరి ! ఇంతకాలం చెప్పిన వాటికి భిన్నంగా ఇప్పుడు వాస్తవాలను చెప్పినా జనం నమ్ముతారా ? అన్నది అసలు సమస్య !

డాలరుతో మారకంలో రూపాయి బలపడినట్లే కనిపించి తిరిగి పతనం అవుతోంది. ఆ క్రమంలో అది పడుతూ లేస్తూ వుంది. సెప్టెంబరు ఎనిమిదిన గరిష్ట స్ధాయిలో రు.63.78 వున్నది కాస్తా ఆ తరువాత 194పైసల విలువ కోల్పోయింది. బుధవారం నాడు 65.72కి చేరింది. శుక్రవారం నాడు 65.31గా వుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ముఖ్యంగా డాలరుతో మన బంధం ముడివేసుకున్న కారణంగా, మన పాలకులు గత 70సంవత్సరాలుగా అనుసరిస్తున్న దివాలాకోరు ఆర్ధిక విధానాల పర్యవసానంగా కరవ మంటే కప్పకు కోపం విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా మన రూపాయి పరిస్ధితి తయారైంది. విలువ తగ్గినా, పెరిగినా కార్పొరేట్లకు పోయిందేమీ లేదు. ఆ కారణాలతో దివాలా తీసి బలవన్మరణాలకు పాల్పడిన పెద్దలు ఒక్కరంటే ఒక్కరు కూడా వున్నట్లు మనకు వార్తలు లేవు. వారు బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులను ఎగవేయటం, మన్మోహన్‌, మోడీ వంటి పాలకులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు బ్యాంకులకు ఎగవేసిన కార్పొరేట్ల అప్పులను ఏటా వేల కోట్ల వంతున రద్దు చేయటం తప్ప. బ్యాంకులు చేశాయా, పాలకులు చేయించారా అన్నది జనానికి అనవసరం మనవి ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుక పాలకులే మనకు బాధ్యులు. 2016 మార్చి వరకు అంతకు ముందు ఐదు సంవత్సరాలలో రద్దు చేసిన మొత్తం బకాయి 2,25,180 కోట్ల రూపాయలు. అంతకు ముందు ఆరు సంవత్సరాలవి కూడా కలుపుకుంటే రెండున్నరలక్షల కోట్ల రూపాయలు. రుణగ్రస్తులైన సామాన్య వ్యాపారులు, జనమే గగ్గోలు పెట్టి ఆత్మహత్యలకు పూనుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది తప్ప పెద్దలకు లేదు.విజయమాల్య వంటి వాడైతే అమ్మాయిలను వెంటేసుకొని మరీ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. గత ఆరునెలలుగా రూపాయి బలపడితే కొంత మంది వ్యాపారులు సంతోషించారు, ఇప్పుడు కొంత మంది వ్యాపారులతో పాటు జనమంతా గగ్గోలు పెట్టే దిశంగా ఈ పతనం కొనసాగుతుందా అని పిస్తోంది. రూపాయి విలువ పెరిగినపుడే పెట్రోలు ధరలను మండిస్తుంటే ఇదేంట్రా బాబూ అనుకుంటున్న జనానికి రూపాయి విలువ పడిపోయిందంటే మరింతగా బాదుడు తప్పదు. అయినా సరే నరేంద్రమోడీ నోరు విప్పరు, ఇలాంటి మేళాన్నా మనం తలకెక్కించుకున్నాం !

కొత్తల్లుడు నోరు విప్పకపోతే మాఅల్లుడి పలుకే బంగారం అని అత్తామామలు మురిసి పోతారు, ఏదైనా వుంటే గదిలోకి తీసుకు వెళ్లి అమ్మాయికే చెబుతాడు అని అత్తింటి వారు సిగ్గుపడుతూ తొలి రోజుల్లో గొప్పగా చెప్పుకుంటారు. కానీ పాతపడిన తరువాత సమయం వచ్చినపుడు కూడా నోరు తెరవకపోతే మీ ఆయనకదేం జబ్బే అని అడిగితే నేనూ మోసపోయా, ఆయనకు నత్తి, మాట్లాడటం సరిగా రాదు అని కూతురు అసలు విషయం చెప్పక తప్పదు. మా మోడీ ఎలాగూ మాట్లాడరు కనుక మేం మాట్లాడక తప్పదు అంటున్నారు బిజెపి అగ్రనేతలలో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత సిన్హా . ఆర్ధిక రంగాన్ని చిందరవందర చేసిన మంత్రి అరుణ్‌జైట్లీ గురించి ఇప్పటికీ నేను నోరు విప్పక పోతే నా బాధ్యతలను విస్మరించిన వాడిని అవుతాను. పార్టీలో పెద్ద సంఖ్యలో వున్నటువంటి, బయట మాట్లాడటానికి భయపడే వారి తరఫున నేను మాట్లాడుతున్నాను అన్నారాయన. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. నోట్ల రద్దు, జిఎస్‌టి ఇలా ప్రతి చర్యనూ మోడీకి ఆపాదించిన పూర్వరంగంలో ఆయన పూలనే కాదు రాళ్లను కూడా భరించాల్సి వుంటుంది. అయితే ‘ అంత సహనం’ ప్రస్తుతం బిజెపిలో లేదు. అందుకే లోతు తెలుసుకొనేందుకు ఆంచులను తాకి చూస్తున్నట్లుగా యశ్వంత సిన్హా ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీని ఎంచుకున్నారు. ఆయనేమీ తక్కువ తినలేదు, అసలు విషయాలు చెప్పకుండా 80 ఏండ్ల వయస్సులో వుద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడని సిన్హాను ఎత్తిపొడిచారు. అంతే కాదు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా వున్న సిన్హా కుమారుడు జయంత సిన్హా చేత పోటీగా తండ్రి వ్యాసానికి ఖండనగా మరో పత్రికలో వ్యాసం రాయించారు.మంత్రిత్వశాఖకు సంబంధం లేని తమ కుమారుడి చేత వ్యాసం రాయించిన పెద్దలు మరి అతనిని సహాయ ఆర్ధిక మంత్రిగా ఎందుకు తొలగించారో అని యశ్వంత సిన్హా ఎత్తి పొడిచారు. కొడుకు వ్యాసంలో పెద్ద పసేమీ లేదనుకోండి.

ఇంతకీ సీనియర్‌ సిన్హా చెబుతున్నదేమిటి? ప్రయివేటు పెట్టుబడులు గత రెండు దశాబ్దాల కనిష్టానికి తగ్గిపోయాయి. పారిశ్రామిక వుత్పత్తి మొత్తంగా కుప్పకూలిపోయింది. వ్యవసాయం సంక్షోభంలో వుంది. పెద్ద సంఖ్యలో వుపాధి కల్పించే నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందుల్లో వుంది. ప్రతి త్రైమాసికానికి అభివృద్ధి రేటు పడిపోతూ 5.7శాతానికి చేరింది. ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడుకు నోట్ల రద్దు ఆజ్యం పోసింది. ప్రస్తుత ప్రభుత్వం 2015లో జిడిపి లెక్కింపు పద్దతిని మార్చింది. ఫలితంగా రెండువందల ప్రాతిపదిక పాయింట్లు పెరిగి అభివృద్ధి రేట్లు రికార్డయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసిక వృద్ధి రేటు 5.7, అదే పాత లెక్కల ప్రకారం అయితే 3.7 లేదా అంతకంటే తక్కువ. నరేంద్రమోడీ నోరు మూసుకొని గానీ ఇతర మంత్రులు, బిజెపి నేతలు తెరిచిగానీ ఈ అంకెలను సవాలు చేసే స్ధితిలో లేరు.

దేశ ఆర్ధిక వ్యవస్ధకు వుద్దీపన కలిగించనున్నారనే వార్తలు రావటంతోనే వరుసగా వారం రోజుల పాటు స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఇంటి పెద్ద సామర్ధ్యం మీద ఒకసారి అపనమ్మకం కలిగిన తరువాత బయటి వారే కాదు జాగ్రత్తగా గమనిస్తే ఇంట్లో వారే ఎవరికి వారు జాగ్రత్త పడటం వుమ్మడి కుటుంబాల్లో తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ పరిస్ధితి అలాగే వుందంటే అతిశయోక్తి కాదు. యశ్వంత సిన్హా చెప్పినట్లు గణాంక విధానం మార్చిన కారణంగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఒక ఏడాది తరువాత అభివృద్ధి ఎంతో పెరిగినట్లు కనిపించింది. అది వాపు తప్ప బలుపు కాదని అప్పుడే ఎందరో చెప్పారు. ఇప్పుడు రుజువైంది. ఇంకా వాపుగానే కనిపిస్తున్నప్పటికీ మూడు సంవత్సరాల కనిష్టానికి మన అభివృద్దిరేటు పడిపోయింది. నిజానికి ఈ పరిస్ధితిని అధికారంలో వున్న పెద్దలు వూహించలేదా అంటే నమ్మటం కష్టం. మార్కెట్లో చెలామణి అవుతున్న నల్లధనాన్ని వెలికి తీయటానికి పెద్దనోట్ల రద్దు అనే తప్పుడు ఇచ్చిందెవరో మోడీ పదవీచ్యుతుడై ఎన్‌డిఏలో ముసలం పుట్టిన తరువాత గానీ బయటకు రాదు. దానితో నాలుగు లక్షల కోట్లరూపాయల రాబడి అప్పనంగా ప్రభుత్వానికి వస్తుందని ఆ మొత్తంతో కొన్ని మెరుపులు మెరిపించి మంచి రోజులొచ్చయనే ప్రచార హోరులో మధ్యంతర ఎన్నికలతో మరో ఐదు సంవత్సరాలకు ఓట్లు కొల్లగొడదామని వేసిన అంచనాలు నీరు గారిపోయాయి. మోడీ ప్రతిష్టనిర్మాణంలో భాగంగానే నోట్ల రద్దు ఆయన తీసుకున్న నిర్ణయమే అని ఆపాదించిన వారు అదిప్పుడు శాపంగా మారిందని అర్ధమైన తరువాత తేలుకుట్టిన దొంగల మాదిరి వున్నారు.ముఖ్యమంత్రిగా వుండగా తీవ్రంగా వ్యతిరేకించిన జిఎస్‌టి అమలు మంచి చెడ్డలను పూర్తిగా ఆధ్యయనం చేయకుండానే ఆదరాబాదరా అమలులోకి తెచ్చారు. ఈ రెండు చర్యలూ తాత్కాలికంగా అయినా ఆర్ధిక వ్యవస్ధ తిరోగమనానికి కారణమయ్యాయని మోడీ సర్కారు తప్ప అందరూ అంగీకరిస్తున్నారు. అంతా బాగుంది, ఏదైనా వుంటే అది తాత్కాలికమే అని సొల్లు కబుర్లు చెబుతున్న పెద్దలు వాటినే కొనసాగిస్తే ఒక దారి. కానీ ఆర్ధిక వ్యవస్ధను తిరిగి పని చేయించేందుకు ఒక వుద్దీపన పధకం గురించి కసరత్తు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ఆరుణ్‌జైట్లీ సెప్టెంబరు 20న చేసిన ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి.

మరో ఆరు రోజుల తరువాత గత మూడు సంవత్సరాలుగా మూలన పడవేసిన ప్రధాని ఆర్ధిక సలహా మండలి దుమ్ముదులిపారు. ఇది ఆర్ధిక వ్యవస్ధలో నెలకొన్న భయాలను మరింత పెంచేదే తప్ప తగ్గించేది కాదు. ఇప్పటి వరకు ద్రవ్యలోటు 3.2శాతం కంటే పెరగరాదు అన్న ఆంక్షలను చూపి అన్ని రకాల పెట్టుబడులు, అభివృద్ధి పనులకు కోత పెట్టిన సర్కార్‌ ఇప్పుడు కట్టుకున్న ఆ మడిని పక్కన పెట్టి ఆర్ధిక వ్యవస్ధలోకి అదనంగా 50వేల కోట్లను కుమ్మరించి ఆర్ధిక మందగింపును ఆపగలమా అని సర్కార్‌ ఆలోచిస్తున్నట్లు రాయిటర్‌ వార్తా సంస్ధ పేర్కొన్నది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న మంద్యానికి కారణంగా గత మూడు సంవత్సరాలుగా గ్రామీణ ఆర్ధిక వ్య వస్ధలో రైతాంగ వుత్పత్తులకు ధరలు పడిపోవటం ఒక ప్రధాన కారణంగా అనేక మంది చెబుతున్నారు. దేశ బ్యాంకింగ్‌ వ్యవస్ధలో నిరర్ధక ఆస్థులు 2013 మార్చి నాటికి 1.56లక్షల కోట్ల రూపాయలు కాగా ఈ ఏడాది మార్చినాటికి 6.41లక్షల కోట్లకు పెరిగాయి. రుణాలు ఇచ్చింది మన్మోహన్‌ సర్కారే అనుకుందాం వసూలు చేయకుండా మోడీ సర్కార్‌ను అడ్డుకున్నదెవరు? యుపిఏ హయాంలో విజయమాల్య వేల కోట్లు తీసుకొని ఎగవేసి విదేశాలకు పారిపోతుంటే నరేంద్రమోడీ సర్కార్‌ వెళ్లిరండి సార్‌ అని విమానం ఎక్కించిందా లేదా ? ప్రతి వారూ పరిశ్ర మలు, వ్యాపారాలకు వడ్డీ రేటు తగ్గించమని కోరేవారే తప్ప అదే సూత్రం వ్యవసాయానికి ఎందుకు వర్తింపచేయరని అడుగుతున్నవారేరి?

నరేంద్రమోడీ సర్కార్‌ అప్పుచేసి పప్పుకూడు అన్నట్లుగా వ్యవహరిస్తోందంటే చాలా మంది నమ్మరు. మన ప్రభుత్వాలు ఏటా ఎంత మొత్తం అప్పు తెచ్చుకోవాలో, దాన్నెట్లా తీర్చుకోవాలో ముందే నిర్ణయించుకుంటాయి. ఆ మేరకు వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో పన్నెండు నెలల్లో వంద రూపాయల అప్పు తీసుకోవాల్సి వుంటే మొదటి నాలుగు నెలల్లోనే 92 తీసుకొని అనుభవజ్ఞుడైన నరేంద్రమోడీ ఖర్చు పెట్టేశారు. అందువలన ఏ మాత్రం అదనంగా ఖర్చు చేయాలన్నా అప్పులన్నా తేవాలి లేదా అదనంగా నోట్లన్నా అచ్చువేయాలి. మొదటి పని చేస్తే అభివృద్ధి పనులు ఆగిపోయి అప్పులు తీర్చుకోవాల్సి రెండోది జరిగితే జనానికి ధరలు పెరుగుతాయి. బలి ఇవ్వటానికి మంచి యువకుడి కోసం దుర్భిణీ వేసి వెతికిన పాతాళభైరవి మాంత్రికుడి మాదిరి నరేంద్రమోడీ ఏదైనా మంత్రదండం దొరక్క పోతుందా అని వెతుకుతున్నారు. ఏదైనా పిచ్చిపని చేసి జనం దృష్టిని మళ్లిస్తే తప్ప అల్లావుద్దీన్‌ అద్బుత దీపాలకు, మంత్రదండాలకు పరిష్కారమయ్యేవి కాదిప్పుడు ముసురుకున్న సమస్యలు. వచ్చేటపుడు మంచిదినాలను తెస్తున్నా అన్న మోడీ చెడ్డదినాలతో పోయాడు అని పించుకుంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసలేమనుకుంటున్నారీ కాషాయ తాలిబాన్లు మన అమ్మాయిల గురించి ?

28 Thursday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Banaras Hindu University, BHU, BJP, girl students, saffron talibans

ఎం కోటేశ్వరరావు

అసలేమనుకుంటున్నారీ కాషాయ తాలిబాన్లు మన అమ్మాయిల గురించి ? అమ్మాయిలు చదువుకోవద్దా ? చెప్పండీ ఆ విషయం స్పష్టంగా. ఆకుపచ్చ తాలిబాన్లకున్న నిజాయితీ కూడా వీరికి లేదు. వారు అనుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. వీరు అడుగడుగునా ఆటంకాలు, అవమానాలు కలిగిస్తూ, వ్యక్తిత్వాలను దెబ్బతీస్తూ ఆడ పిల్లలను చదివించటం ఎందుకురా బాబూ అనుకునేట్లుగా తలిదండ్రులలో ఆలోచనలు కలగచేస్తున్నారు. పొమ్మన కుండానే పొగబెడుతున్నామని లోలోపల చంకలు కొట్టుకుంటున్నారా ? అసలేమనుకుంటున్నారు వీరు మన అమ్మాయిల గురించి?

గ్యాన్‌ దేవ్‌ ఆహుజా అనే రాజస్ధాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ గతేడాది ఫిబ్రవరిలో జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయం గురించి చేసిన నీచమైన వ్యాఖ్యలను మన సభ్య సమాజం ఎందుకు తీవ్రంగా పట్టించుకోలేకపోయింది అన్నది ప్రశ్న. ఏమన్నాడతడు ? అక్కడ రోజుకు మూడువేల కండోమ్‌లు, రెండు వేల మద్యం సీసాలు, 50వేల బొమికలు, నాలుగువేల బీడీలు, పదివేల సిగిరెట్‌ ముక్కలు పోగుపడతాయట. ప్రస్తుతం మన రక్షణ మంత్రిగా వున్న నిర్మలా సీతారామన్‌ కూడా అక్కడి విద్యార్ధినే, ఆమె కూడా బహిరంగంగా ఆ ఎంఎల్‌ఏ నోరు మూయించలేదు. ఇంకా ఎందరో అక్కడ చదివిన బిజెపి నేతలు అదే మౌనం పాటించారు, ఎందుకో తెలియదు. ఈ ఒక్క విద్యా సంస్ధలో చదివే వారి గురించే కాదు అనేక కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులను వ్యతిరేకించే ప్రతి చోటా ఇలాంటి చౌకబారు ప్రచారాలు, నిందలతో విద్యార్ధులను బెదిరించేందుకు ఇలాంటి ఎత్తుగడలు అనుసరిస్తున్నారు.

అది బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జాతీయ విద్యాలయాల ఏర్పాటులో పండిట్‌ మదన మోహన్‌ మాలవీయ నాయకత్వంలో 1916లో ఏర్పడిన విశ్వవిద్యాలయం ఇది. జాతీయోద్యమ స్ఫూర్తితో తెలుగు ప్రాంతాల నుంచి ఎందరో అక్కడ చదివి స్వాతంత్య్ర సమరంలో, తరువాత కమ్యూనిస్టు కార్మిక వుద్యమాలలోకి దూకేందుకు ప్రాతిపదిక వేసిన సంస్ధ అది. నేడు మనువాదుల నిలయంగా, ప్రయోగశాలగా మారింది.

బేటీ పఢావో, బేటీ బచావో అన్న నినాదం ఇచ్చిన వారి పాలనలో నిశ్చింతగా చదువుకుంటూ సురక్షితంగా వుండొచ్చు అనుకుంటున్న చోట సెప్టెంబరు మూడవ వారంలోసూర్యుడు అస్తమించక ముందే అదీ ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు ముందు రోజు సాయంత్రం, ముగ్గురు యువకులు ఒక విద్యార్ధినితో అనుచితంగా ప్రవర్తించారు. దాని గురించి వెంటనే వార్డెన్‌కు ఫిర్యాదు చేస్తే అసలు ఆ సమయంలో నువ్వెందుకు అక్కడ వున్నావ్‌ అని ఎదురు ప్రశ్న వచ్చిందట. దాంతో మిగతా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ కేవలం ముట్టుకోవటమేగా, అంతకు మించి ఏం చేయలేదటకదా అయినా ప్రధాని పర్యటన ముగిసింతరువాతే దాని గురించి చూద్ధాం అని నిర్లక్ష్య సమాధానాలిచ్చారట. విసిని కలుసుకుంటామంటే కుదరదు పొమ్మని అనుమతించలేదట. ఆ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ గిరీష్‌ చంద్ర తిఫాఠి ఒక పరివార్‌ కార్యకర్త అన్నది బహిరంగ రహస్యం. మిగతా అధికారులు కూడా సాక్షి మహారాజ్‌ వంటి వారి నుంచి స్ఫూర్తి పొందిన వారే. అందుకే విద్యార్ధినులు రాత్రి ఎనిమిది గంటలలోగానే రూములకు చేరుకోవాలి. పది గంటల తరువాత ఎవరూ సెల్‌ఫోన్లు వుపయోగించకూడదు. పురుష విద్యార్ధుల మాదిరి యువతులు కాంటీన్లలో ఎలాంటి మాంసాహారం తీసుకోకూడదు. ఇలాంటి లక్ష్మణ రేఖలను ఎన్నింటినో అక్కడి విద్యార్ధినులు పాటించాల్సి వుంది. ఇంతకూ వేధింపు జరిగిన సమయం బయట తిరగటానికి అనుమతించిన వ్యవధిలో, అందునా సూర్యాస్తమయం కూడా కాలేదు.

విశ్వవిద్యాలయంలో ప్రధాని కార్యక్రమం లేదు, అది వున్న రోడ్డు మార్గంద్వారా ప్రయాణిస్తారంతే. కడుపు మండిన విద్యార్ధినులు గంగమ్మ, అవులు పిలిస్తే పరిగెత్తుకొచ్చే మోడీ గారూ అకతాయిలు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, మా మొర వినండి మేం పిలుస్తున్నాం అంటూ ఒక గేటు దగ్గర ఆందోళనకు దిగారు. దాంతో వేరే మార్గంలో ప్రధాని ప్రయాణం ముగిసే వరకు మిన్నకుండి తరువాత దొరికిన వారిని దొరికినట్లు మగపోలీసులతో చితకబాదించారు. ఒక యోగి పోలీసులు ఎలా వుంటారో తొలిసారిగా అమ్మాయిలకు రుచి చూపించారు. వందలాది మందిపై కేసులు బనాయించారు. ఇదంతా ఆడపిల్లలను వేధించిన వారిని పట్టుకొనే క్రమంలో కాదు, దానిని ఎదిరించిన వారి నోరు మూయించే పక్రియలో భాగం. మోడీ-యోగి సర్కార్‌ నిజరూపం గురించి తెలుసుకోండమ్మా, తెలుసుకోండయ్యా అని వేల గొంతులు చెప్పినా తలకు ఎక్కనిది ఒక్క రోజు లాఠీ, రెండో రోజు కేసులు అరటి పండు వలచినట్లు వేలాది మంది విద్యార్ధినులకు, అన్ని వేలకు మరికొన్ని రెట్లు ఎక్కువగా తలిదండ్రులకు సామూహిక జ్ఞానబోధ చేశాయంటే అతిశయోక్తి కాదు.

ఒకనాడు ప్రాచ్య దేశాల ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంగా ఖ్యాతికెక్కిన విశాలమైన బనారస్‌ విశ్వవిద్యాలయంలో చీకటి పడితే స్వేచ్చగా సంచరించటానికి సరిపడా విద్యుత్‌ వెలుగులు కూడా లేవని ఆడపిల్లలు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. ఎవరు అధికారంలో వున్నా అదే తీరు నడిచింది. బిజెపి అందుకు మినహాయింపు కాదు. బహుశా దేశంలో 30వేల మందికి పైగా విద్యార్ధులున్న విశ్వవిద్యాలయం ఇదేనేమో ? మీ ఆడపిల్లలు చదువుకోవాలంటే ముందు వారిని రక్షించండి అన్నది ఆందోళన జరిగిన రాత్రి ఆడపిల్లలు ప్రదర్శించిన ఒక ప్లేకార్డులోని అంశం. ఆందోళన చేశారు. ఎన్నడూ బయటకు రాని వారు వీధులకెక్కారు. వారేం చెబుతారో విందామని కనీసం ముఖ్యమంత్రి యోగి అయినా వారి వద్దకు వచ్చి ఓదార్చాల్సిన అవసరం వుందా లేదా. అలాంటి దేమీ లేకపోగా ఆడపిల్లలు కనుక బయటి నుంచి సంఘవ్యతిరేకశక్తులు ప్రవేశించి కుట్రచేశాయంటే చాలా బాగోదు కనుక యోగి గారు అమ్మాయిలలోనే సంఘవ్యతిరేకశక్తులు ఆందోళనకు కారణమంటూ సెలవిచ్చారు. సరే వంది మాగధులు కుట్ర గురించి చెబుతున్నారనుకోండి.

అంటే ఏమిటటా ? ప్రధాని పర్యటనకు ముందు రోజు ముగ్గురు ఆకతాయిలను ప్రతిపక్షాలు పని గట్టుకొని బనారస్‌ విశ్వవిద్యాలయానికి పంపించాయి. వారిచేత ఒకమ్మాయిని అల్లరి చేయించాయి. ఆమె చేత అధికారులకు ఫిర్యాదు చేయించాయి. అధికారులతో రెచ్చగొట్టేట్లు మాట్లాడించాయి. విద్యార్ధినులను ఆందోళనకు దించాయి. ప్రధాని పర్యటన ముగిసేవరకు పోలీసులను అదుపు చేసి తరువాత దాడి చేయించాయి. రెండో రోజు వందలాది మందిపై కేసులు పెట్టించాయి. తరువాత కొంత మందిపై చర్యలకు వుపక్రమింప చేశాయి. అని జనం అనుకోవాలి. మరి ఇంత జరుగుతుంటే, కూత వేటు దూరంలో ప్రధాని కార్యక్రమాలు వుంటే నిఘా యంత్రాంగం, యోగి సర్కార్‌ ఏ గుడ్డి గుర్రానికి…. అబ్బే ఇది పాత సామెత, ఏ కర్రావు పేడెత్తుతూ తెల్లావు మూత్రాన్ని వడిసి పడుతున్నట్లు ?

నరేంద్రమోడీ అంటే సమయం వచ్చినపుడు నోర్మూసుకుంటారు గానీ విద్యార్ధినులు వారి తలిదండ్రులకు అంత ఖర్మేం పట్టింది. ముందుగానే దసరా సెలవుల పేరుతో విశ్వవిద్యాలయాన్ని మూసివేశారు. దాంతో ప్రస్తుతం వేలాది మంది విద్యార్ధినులు హాస్టళ్లను ఖాళీ చేసి తమ గ్రామాలు, పట్టణాలకు వెళ్లిపోయారని వార్తలు. ప్రధానంగా వుత్తర భారత్‌లోని వుత్తర ప్రదేశ్‌, బీహారు, రాజస్ధాన్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వారంతా అక్కడ వూరుకుంటారా ? ఎవరి మీద కేసులు పెట్టారో తెలియదు, తమ మీద ఏ తప్పుడు ప్రచారం చేస్తారో తెలియదు. వారి దసరా, అనంతర కబుర్లు కూడా ఇవే. ఇంటి దగ్గర వున్ననన్ని రోజులు ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తే జరిగిందేమిటో, మోడీ-యోగి సర్కార్‌ నిర్వాకం ఏమిటో చర్చ జరగకుండా వుంటుందా? కొంతమంది అయినా కొత్త కార్యకర్తలు తయారవుతారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా కొంత మంది వున్నతాధికారులచేత రాజీనామా, కొంత మంది పోలీసులు, విశ్వవిద్యాలయ అధికారులపై కొన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. అసమర్దంగా అంతకంటే బాధ్యతా రహితంగా వ్యవహరించిన వైస్‌ ఛాన్సలర్‌ను ఏదో ఒక పేరుతో ఇంటికి పంపే ఏర్పాట్లలో వున్నట్లు వార్తలు. మన సంఘపరివార్‌ వ్యక్తే కదా అని మూసిపెడితే విశ్వవిద్యాలయం పాచిపోతుంది.

ఎక్కడ శవం కనపడితే అక్కడకు రాబందులు వాలినట్లుగా ఎక్కడ బిజెపి ప్రభుత్వంపై విద్యారు&ధలు ఆందోళన చేస్తుంటే అక్కడకు కాషాయ ట్రోల్‌ సేనలు దాని మీదకు దిగిపోతాయి. బనారస్‌ విషయంలో కూడా అదే జరిగింది. వుద్యమంలోకి కమ్యూనిస్టులు ప్రవేశించారని తెలుసుకొని తాను వైదొలుగుతున్నట్లు ఒక యువతి చెప్పిందట. ఇదంతా అమెరికా పోలీసు కట్టుకధల కాపీ. అక్కడ కూడా విద్యాలయాల్లో ఏదైనా జరగ్గానే వాటి వెనుక కమ్యూనిస్టులున్నారని మరుసటి రోజు కథనాలు వెలువడతాయి. రెండవది అంతకంటే విడ్డూరమైన ప్రచారం. బనారసులో వుద్యమం ప్రారంభం కాగానే ఎన్‌డిటివీ నుంచి ఒక వ్యాను వచ్చిందట, దాని వెనుకే మరో రెండు వ్యాన్లు వచ్చాయట. వాటిలోంచి ఐదుగురు విద్యారి&ధనులు దూకి వుద్యమకారులతో కలసిపోయారట. వెంటనే సదరు టీవీ విలేకరి ఇతరులతో గాక వారితోనే మాట్లాడించిన వెంటనే వారు అక్కడి నుంచి మాయమయ్యారట. ఇది ఒక నకిలీ వార్త కధనం. ఇక్కడ మన బుర్రను వుపయోగించాల్సి వుంది. అదే వాస్తవం అయితే ఎన్‌డిటివీ వార్తలో కనిపించిన అమ్మాయిలు ఎవరో కనిపెట్టటం కష్టమా? వారు అక్కడి వారు కానట్లయితే ఎవరో ఏమిటో వెల్లడించాలి. ఇలాంటి కట్టుకధలు రాయటం, ఎన్డీటీవిపై బురదజల్లటానికి తప్ప మరొకటి కాదు. నకిలీ వీడియోలనే తయారు చేసిన వారికి ఇలాంటి కట్టుకధలు ఒక లెక్కా ?

బనారస్‌ వుదంతం చూసిన తరువాత ఒక సున్నితమైన సమస్య పట్ల ఎలా వ్యవహరించాలో కూడా విద్యాసంస్ధల వున్నతాధికారులకు తెలియదని, వారి చర్మాలు ఎంతగానో మొద్దుబారి పోయాయనన్నది స్పష్టమైంది. ఒక యువతి తనను అల్లరి పెట్టారనో, అఘాయిత్యం జరపబోయారనో నిర్దిష్ట ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావటమంటేనే జరగకూడనిదేదో జరిగిందనుకోవాలి. ఫిర్యాదు చేయటానికి వెళ్లిన బాధితులనే నేరగాళ్ల మాదిరి పోలీసులు ప్రశ్నించినట్లుగా విశ్వవిద్యాలయ అధికారులు అసలు ఆ సమయంలో అక్కడ నువ్వెందుకున్నావ్‌, నిన్నే ఎందుకు అలా చేశారు, ఆ డ్రస్సేమిటి, ఆ పోకడేమిటి అన్నట్లు ప్రవర్తించటమే సమస్య మరో రూపం తీసుకోవటానికి దారితీసింది. యువతి పట్ల చిన్నపాటి వేధింపును ప్రధాని రాక సందర్భంగా కావాలని ముందుకు తెచ్చి రాజకీయం చేశారని విసీ గిరీష్‌ చంద్ర త్రిపాఠీ వర్ణించారు. తొలుత స్పందించిన వారు సక్రమంగా వ్యవహరించి వుండాల్సిందని వారణాసి కమిషనర్‌ చేసిన వ్యాఖ్యను విసి అంగీకరించలేదు. ప్రతివారు సక్రమంగా వ్యవహరించి వుంటే విశ్వవిద్యాలయ ప్రధాన ప్రోక్టర్‌ ప్రొఫెసర్‌ ఓఎన్‌ సింగ్‌ నైతిక కారణాలతో రాజీనామా ఎందుకు చేసినట్లు ? అసలు లాఠీచార్జి చేయాల్సినంతగా శాంతి భద్రతలేమి అదుపు తప్పాయి. ఇప్పుడు చేసిన పొరపాటును కప్పిపుచ్చుకోవటానికి మరికొన్ని తప్పులతో ఏదో ఒక నివేదికను జనం ముందు పడేస్తారు, తాత్కాలికంగా అయినా విద్యార్ధినుల నోరు మూయిస్తారు. దేశంలో మితవాద భావజాల పట్టులో వున్న వుత్తరాది ప్రాంతానికి చెందిన ఆమ్మాయిల్లో ఇంత ప్రతిఘటన తెగింపు ఎలా వచ్చిందన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇది బిజెపి వంటి మనువాద, ఇతర ఫ్యూడల్‌ శక్తుల పట్టులో వున్న పార్టీలకు ఆందోళన కలిగించే పరిణామం అయితే ప్రగతివాద శక్తులు హర్షించే అధ్యాయం. అన్యాయం, అక్రమాలను ప్రతిఘటించటానికి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని బిజెపిఏ కాదు అధికార పులినెక్కిన ఏ పాలకపార్టీ తలకెక్కించుకోదని వేరేచెప్పాల్సిన పని లేదు.

 

 

Share this:

  • Tweet
  • More
Like Loading...

తూటాలు గౌరీ లంకేష్‌ దేహాన్నే కానీ భావాలను తాకలేవు !

13 Wednesday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, Left politics, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

attack on journalists, BJP's social media, dissent, Gouri lankesh, RSS

ఎం కోటేశ్వరరావు

మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాల వ్యతిరేక పోరులో హేతువాద, వామపక్ష వాదిగా గళమెత్తి, కలంతో కదనరంగంలోకి దూకిన షీరో(వీర నారి) జర్నలిస్టు గౌరీ లంకేష్‌. తన ప్రాణాలను తృణపాయంగా అర్పించింది. తనను ఎప్పుడైనా మతోన్మాదులు అంతం చేస్తారని తెలిసినా ఏనాడూ వెన్ను చూపని ధీశాలి. దుండగుల తూటాలు ఆమె దేహాన్ని చీల్చాయి తప్ప భావాలను కాదని దేశవ్యాపితంగా వెల్లడైన నిరసన వెల్లడించింది. నేనూ గౌరినే ఏం చేస్తారో చేయండి అంటూ ఎలుగెత్తి చాటారు. గౌరి నివాసం ముందున్న సిసిటీవీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సెప్టెంబరు ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో తన కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన ఆమెపై మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగుడు తుపాకితో కాల్చిచంపాడు. సమీపంలో ఇంకా ఎవరైనా వున్నారా అన్నది విచారణలో తేలాల్సి వుంది. మతోన్మాద వ్యతిరేక, హేతువాద, సంస్కరణవాదం, వామపక్ష భావాల నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, కలుబుర్గి సరసన గౌరి చేరింది. అభ్యుదయం, హేతువాదం, ప్రజానుకూల జర్నలిస్టు కలం, గళం పరంపరలో దేశంలో మతోన్మాదుల తూటాలకు బలైన తొలి మహిళగా చెప్పవచ్చు. తన ప్రాణాలకు ఏక్షణంలో అయినా ముప్పు వుందని, కొద్ది రోజులుగా ఎవరో వెంటాడుతున్నారని పసిగట్టినప్పటికి ప్రభుత్వంవైపు నుంచి ఎలాంటి సాయం ఆమె కోరలేదు. అలాంటి రక్షణలు ప్రాణాలను కాపాడలేవు అనే లోకానుభవంతో ఆమె ఆ నిర్ణయానికి వచ్చి వుండవచ్చు.

కాషాయ పరివారం, వారితో అంటకాగుతున్న పార్టీలు, శక్తులు, వ్యక్తులు తప్ప గౌరి హత్యపై దేశవ్యాపితంగా జర్నలిస్టు, ప్రజా సంఘాలు, వామపక్ష, అభ్యుదయ పార్టీలు, సంస్ధలు, శక్తులు తీవ్రనిరసన తెలిపాయి. నిందితులను గట్టిగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి. అనేక మంది సీనియర్‌ జర్నలిస్టులు దేశంలో నెలకొన్న పరిస్ధితుల తీరుతెన్నుల పట్ల నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జర్నలిస్టుల ప్రాణాలు తీయటం కొత్త కాదు. మన దేశంలో కూడా అనేక మంది బలయ్యారు.రాజకీయ నేతల, గూండాల, మాఫియాల అవినీతి అక్రమాలను బయట పెట్టే క్రమంలో జర్నలిస్టులు ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితిలో గడుపుతున్నారు. గత నాలుగు సంవత్సరాలలో (2013 నుంచి) ఇప్పటి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాలలో 22 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.అనేక మందిపై హత్యాయత్నం జరిగింది. దేశమంతా గౌరీ లంకేష్‌ హత్యకు నిరసన తెలుపుతున్న సమయంలోనే బీహార్‌లో పంకజ్‌ మిశ్రా అనే జర్నలిస్టుపై అధికారపక్ష ఎంఎల్‌ఏ అనుచరులు తుపాకులతో కాల్పులు జరిపారు.

జర్నలిస్టులపై జరిగిన దాడుల కేసులను పరిశీలిస్తే అవి కాంగ్రెస్‌, బిజెపి,జెడియు, ఎస్‌పి,టిడిపి మరొకటా అన్నది పక్కన పెడితే ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ దుండగులు చెలరేగిపోతున్నారు. వత్తిడి కారణంగా కేసులు నమోదు చేయటమే తప్ప వాటిలో ఎలాంటి పురోగతి వుండటం లేదు. డేరా బాబా గుర్మీత్‌ హత్య చేయించిన సిర్సా జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి కేసు పదిహేను సంవత్సరాలుగా నడుస్తూనే వుంది. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అనేక వుదంతాలలో చార్జిషీట్లు పెట్టటంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు సంవత్సరాల క్రితం కర్ణాటకలో మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురైన కలుబుర్గి కేసులో ఇంతవరకు నిందితులెవరో తేలలేదు, దబోల్కర్‌, గోవింద్‌ పన్సారే కేసులలో నిందితులు గోవా కేంద్రంగా పనిచేసే హిందూత్వ సనాతన సంస్ధకు చెందిన వారని సిబిఐ కేసులు దాఖలు చేసింది. ఇలాంటి వుదంతాలలో నేరగాళ్లకు శిక్షలు పడటం ఎంత అవసరమో అంతకంటే ఇటువంటి ధోరణులను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలు, శక్తులను ఎదుర్కోవటానికి సంఘటితం కావటం అంతకంటే ముఖ్యం. అసహనం, విమర్శలను తట్టుకోలేని ధోరణి, భిన్నాభిప్రాయాలను సహించకపోవటం దేశంలో క్రమంగా మరీ ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. అసమ్మతి, భిన్నాభిప్రాయాన్ని గౌరవించటం ప్రజాస్వామ్య లక్షణం. నిత్యం భావ ప్రకటనా స్వేచ్చ హక్కు గురించి పారాయణం చేసే వారు తమ దాకా వచ్చే సరికి హరిదాసు-ధర్మపత్ని-వుల్లిపాయ కథలో మాదిరి వ్యవహరిస్తున్నారు.నేతి బీరలో నెయ్యి మాదిరి తయారవుతున్నారు.

వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలహీనంగా వున్న కర్ణాటకను దక్షిణాదిలో మతోన్మాద శక్తులు ఒక ప్రయోగశాలగా చేసుకున్నాయి. అక్కడి ప్రాంతీయ పార్టీల అవకాశవాదం, అనేక హిందూ మతసంస్ధల మద్దతు కారణంగా కారణంగా బిజెపి ఆ రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పూర్వరంగంలో అనేక వివాదాస్పద, రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఆ పార్టీ రూపకల్పన చేసింది. ఈ పూర్వరంగంలో గౌరీ వంటి అనేక మంది మతోన్మాదశక్తులకు వ్యతిరేక గళం విప్పుతూ కంట్లో నలుసుగా మారారు. వాటన్నింటిని ఆమె తన పత్రికలో ఎప్పటి కప్పుడు రాస్తూ హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆమెను కొంత మంది అనుసరించారని, రాకపోకలను నిర్ధారించుకున్నారని ఆమె హత్య అనంతరం వెల్లడైన సమాచారాన్ని బట్టి సరిగ్గా ప్రముఖ రచయిత ఎంఎం కలుబర్గిని హత్య చేసిన రోజే గౌరిని కూడా చంపివేయాలని పధకం వేశారా అనిపిస్తోంది. సరిగ్గా రెండు సంవత్సరాల ఐదు రోజుల తరువాత వారి పధకం నెరవేరింది. ఇద్దరి హత్యలకు అనేక సామీప్యాలున్నాయి.కుటుంబ సమస్యల కారణంగా కలుబర్గిని హత్య చేశారని వెంటనే ప్రచారం జరిగింది. గౌరిని నక్సలైట్లు చేసి వుండవచ్చని ప్రచారం చేశారు.

అనేక ప్రాంతాలలోని కోర్టులలో తప్పుడు కేసులు బనాయించటం మతోన్మాద శక్తులు అనుసరించే ఎత్తుగడలలో ఒకటి. ఎవరైనా పదులకొద్దీ కేసులకు హాజరుకావటం మామూలు విషయం కాదు. అయితే కోర్టులున్న ప్రతిచోటా అలాంటి కేసులను వుచితంగా చేపట్టటానికి మతశక్తులకు లాయర్లు వున్నారు. లుబుర్గి హత్య జరిగే నాటికి ఆయనపై ఇరవై వరకు వివిధ ప్రాంతాలలో పరువు నష్టం కేసులు దాఖలై వున్నాయి. అదే విధంగా గౌరి మీద కూడా(15) వున్నాయని ఆమె న్యాయవాది వెంకటేష్‌ హూట్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె కోర్టు కేసులకు వెళ్లిన ప్రతి చోటా కోర్టు వెలుపల సభలు, సమావేశాలు జరపటానికి అ అవకాశాలను వినియోగించుకొనే వారని ఆయన తెలిపారు. గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌, కలుబర్గిని ఎలాంటి నాటు తుపాకితో కాల్చి చంపారో సరిగ్గా అలాంటిదానితోనే గౌరిని కూడా చంపారు.నాలుగు వుదంతాలలోనూ దుండగులు మోటారు సైకిళ్లనే వుపయోగించి దగ్గరినుంచి కాల్చారు.పన్సారే, దబోల్కర్‌ కేసులలో ముద్దాయిలుగా తేలి పరారీలో వున్న ఒకడు 2009 గోవా పేలుళ్ల వుదంతంలో కూడా వున్నాడు.పన్సారే కేసులో ప్రధాన నిందితుడిగా వున్న సమీర్‌ గైక్వాడ్‌ బాల్యస్నేహితుడైన రుద్రపాటిల్‌ కలుబుర్గి కేసులో అనుమానితుడు, పరారీలో వున్నాడు.

హిందూత్వ శక్తులు 2004 నుంచి గౌరిని బెదిరిస్తున్నాయి. కేసులు బనాయిస్తున్నాయి.2016 నవంబరు 28న హుబ్లి జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆమెకు పరువు నష్టం కేసులో ఆరునెలల జైలు, జరిమానా విధించారు. అదే రోజు ఆమె బెయిల్‌ తీసుకొని సెషన్స్‌ కోర్టుకు అప్పీలు చేయాలని నిర్ణయించారు. తప్పు చేస్తే జర్నలిస్టులైనా మరొకరైనా శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఇతర జర్నలిస్టులు దీనిని గమనంలో వుంచుకోవాలంటూ బిజెపి ఐటి విభాగ ప్రతినిధి జర్నలిస్టులను ఆ సందర్భంగా బెదిరించాడు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే 2008లో లంకేష్‌ పత్రికలో ప్రచురించిన ఒక వ్యాసం తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందంటూ సంపాదకురాలిపై ధార్వాడ బిజెపి ఎంపీగా వున్న ప్రహ్లాద్‌ జోషి, బిజెపి స్ధానిక నేత వుమేష్‌ దుషి క్రిమినల్‌ పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. కోర్టు తీరు తెన్నుల గురించి తాను ఎలాంటి ఆందోళనకు గురికాలేదని, ఆ కేసును బిజెపి నేతలు, మద్దతుదార్లు వుపయోగించుకున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందని గౌరీ వ్యాఖ్యానించారు. తాను జైలుకు పోతానని ఆశించిన వారందరికీ నిరాశ ఎదురైందని అన్నారు. ‘అదొక పెద్ద అంశమని నేను భావించలేదు, బిజెపి ఐటి విభాగం దీనినొక ఆయుధంగా చేసుకొని జర్నలిస్టులను బెదిరించటమే విభ్రాంతి కలిగించింది’ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్చ దేశంలో ఏ స్ధితిలో వున్నదో తన వుదంతం వెల్లడించిందన్నారు. అధికారంలో వున్న వారి భావజాలాన్ని వ్యతిరేకించిన లేదా విబేధించిన వారి నోరు నొక్కేందుకు చట్టాన్ని వినియోగించుకోవటం ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఈ ధోరణి ఎంఎం కలుబుర్గి హత్య అనంతరం పెరుగుతోందని చెప్పారు. ఈ హత్యను సమర్ధిస్తూ భజరంగ్‌ దళ్‌ కార్యకర్త భువిత్‌ షెట్టి హిందూయిజాన్ని విమర్శించిన వారు కుక్క చావు చస్తారంటూ ట్వీట్‌ చేశాడన్నారు. గతేడాది హరీష్‌ పూజారి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు, హరీష్‌ను ఒక ముస్లింగా పరిగణించి హత్య చేశారు.

గౌరీ లంకేష్‌పై కేసు వివరాల్లోకి వెళితే బిజెపి కార్యకర్తలు తనను మోసం చేశారంటూ ఒక నగల వ్యాపారి బిజెపి ఎంపీ జోషీ దగ్గరకు వెళ్లారు. ఆయన తమ కార్యకర్తలను సమర్ధించి న్యాయం చేయకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వ్యాపారి హెచ్చరించాడు. ప్రచురించిన వార్త సారాంశం ఇది. దీనిలో జోషి పరువుకు నష్టం కలిగించే అంశమేదీ లేదని, ఇదే వార్తను ఇతర పత్రికలు కూడా ప్రచురించాయని, అయినప్పటికీ తనను మాత్రమే లక్ష్యంగా చేసుకొని కేసు దాఖలు చేసినట్లు గౌరీ అన్నారు. తాను వార్తను ప్రచురించిన తరువాత జరిగిన ఎన్నికలలో జోషీ విజయం సాధించారని అలాంటపుడు పరువు పోవటం అనే ప్రశ్న ఎక్కడుందని అన్నారు. దుషీ విషయానికి వస్తే అతని మీద అనేక కేసులు దర్యాప్తులో వున్నాయని, పోవాల్సిన పరువేదో ఇప్పటికే పోయిందని, తమ పత్రికలో రాసిన వార్తతో అదనంగా పోయేదేమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.

అంతకు ముందు 1994లో హుబ్లీ ఈద్‌గాలో జాతీయ జెండాను ఎగురవేసి మతకొట్లాటలను రెచ్చగొట్టిన వుమాభారతిపై పెట్టిన కేసును వుపసంహరించేందుకు గౌరి తిరస్కరించారు.గత కొంత కాలంగా కర్ణాటకలో ఒక బలమైన సామాజిక తరగతిగా వున్న లింగాయత్‌లు తాము బసవన ధర్మాన్ని పాటించేవారం తప్ప హిందువులం కాదని, తమను ఒక ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానాలు చేసి సభలు జరుపుతున్నారు. గౌరి ఒక హేతువాది అయినప్పటికీ బసవన చెప్పిన అనేక అంశాలు తన భావాలకు దగ్గరగా వున్నందున తాను వారి అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ మత శక్తులకు కంటగింపుగా మారింది. కొన్ని పార్టీలను నిషేధించాలని కోరుతూ బిజెపి చలో మంగళూరు పేరుతో సెప్టెంబరు ఐదవ తేదీన ఒక రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టింది. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ కార్యక్రమాన్ని గౌరి తీవ్రంగా విమర్శించారు.(అదే రోజు ఆమెను దుండగులు బలిగొన్నారు) అంతకు ముందు నెలలోనే బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటకలో పర్యటించి వెళ్లారు.

రెండు సంవత్సరాల క్రితం కలుబర్గిని హత్య చేసిన తరువాత కర్ణాటకలోని అనేక మందికి అదే గతి పడుతుందనే బెదిరింపులు వచ్చాయి.ఆ సందర్భంగా గౌరి,మరికొందరు ఒక జాబితాను తయారు చేసి ఎవరెవరిపై ఎన్నిసార్లు మతశక్తులు విద్వేష ప్రచారం, దాడులు చేశాయో, ఎవరికి ప్రాణహాని వుందో వెల్లడించారు.వారిలో మొదటి వ్యక్తిగా హేతువాది కెఎస్‌ భగవాన్‌,రచయితలు యోగేష్‌ మాస్టర్‌,బంజగారే జయప్రకాష్‌, తాను నాలుగవదానినని వెల్లడించారు. మతశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు కర్ణాటక కోము సౌద్ర వేదికను ఏర్పాటు చేయటంలో గౌరి ముఖ్యపాత్ర పోషించారు.

నీ స్నేహితులను చూస్తే నువ్వు ఎలాంటి వాడివో చెప్పవచ్చన్నది ఒక నానుడి. దాన్ని కొద్దిగా మార్చి నువ్వు సామాజిక మీడియాలో ఎవరిని అనుసరిస్తున్నావో చూస్తే నీవెలాంటి వాడివో చెప్పవచ్చన్నది న్యూ నుడిగా చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న కొంత మంది ట్వీట్లు గౌరి హత్యను సమర్ధించేవారిగా వున్నట్లు తేలటంతో, అసలు నరేంద్రమోడీని అనుసరించటం మానివేయాలనే ప్రచారం ప్రారంభమైంది. అసలే అన్ని రంగాలలో నరేంద్రమోడీ సర్కార్‌ విఫలం అయినట్లు అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. మీరు కన్న కలలను నిజం చేసేందుకు చేపట్టిన ఈచర్యకు యాభై రోజులు ఓపిక పట్టండి, ఫలితాలు కద్దనిపించకపోతే నన్ను వురి తీయండి అని మోడీ చెప్పిన పెద్ద నోట్ల రద్దు ఘోరంగా విఫలమేగాక దేశానికి నష్టదాయకంగా మారిందని రుజువైంది. దాని గురించి తేలు కుట్టిన దొంగ మాదిరి ఇంతవరకు ఒక్క మాటా మాట్లాడలేదు. ఈలోగా నరేంద్రమోడీ ఎలాంటి వారిని అనుసరిస్తున్నదీ వెల్లడి అయింది. దాంతో నష్ట నివారణ చర్యగా బిజెపి ఐటి విభాగం రంగంలోకి దిగింది. మోడీ ఎవరినైనా అనుసరిస్తున్నారంటే అర్ధం వారందరి ప్రవర్తన సరైనదే అని నిర్ధారణ పత్రం ఇవ్వటంగా భావించరాదని, ఎవరేం చేస్తారో ముందుగా ఎవరు వూహిస్తారంటూ, అనేక అవినీతి ఆరోపణలున్న రాహుల్‌ గాంధీని కూడా మోడీ అనుసరిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. గౌరి హత్యను సమర్ధించేవారి వైఖరి తప్పని ఒక్క ముక్క కూడా ఆప్రకటనలో లేకపోవటం గమనించాల్సిన అంశం.

గౌరీ హత్య వార్త ఇంకా లోకానికి పూర్తిగా తెలియక ముందే దానితో తమకేమీ సంబంధం లేదని హత్య జరిగిన కొద్ది నిమిషాలలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటించింది. ఎవరు చంపారో తెలియకుండా హిందుత్వ సంస్ధలకు దానిని ఆపాదించవద్దని కొందరు ప్రచారం ప్రారంభించారు. కొందరు చేసిన పనులకు మొత్తం హిందువులకు ఆపాదించటం ఏమిటి అని మరి కొందరు, కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని హత్యచేసినపుడు ఈ మాదిరి స్పందన ఎందుకు వ్యక్తపరచరని మరి కొందరు, ఆ కోవకు చెందిన వారే నక్సలైట్ల అంతర్గత తగాదాలలో భాగంగా ఆమెను హత్య చేశారని, కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్య అవినీతిపై కథనాన్ని రూపొందిస్తున్న సమయంలో హత్యకు గురయ్యారని, ఇలాంటి ప్రచారం మొదలు పెట్టిన వారందరూ విషయాన్ని పక్కదారి పట్టించే యంత్రాంగంలో భాగం లేదా వారి వలలో పడ్డారన్నది స్పష్టం. ఏ ఆధారం లేదా నిర్ధారణ ప్రకారం నక్సలైట్లో, మరో కారణంతోనే హత్యచేసినట్లు కొందరు చెప్పినట్లు ? హిందూత్వ సంస్ధలు, చడ్డీవాలాలకు(ఆర్‌ఎస్‌ఎస్‌) వ్యతిరేకంగా ఆమె వ్యవహరించకుండా వుంటే ఇది జరిగేది కాదని, ఆమె నా సోదరి వంటిది కానీ ఆమె రాతలను తాను అంగీకరించనని బిజెపి మాజీ మంత్రి జీవరాజ్‌ చేసిన ప్రకటనకు అర్ధం ఏమిటి? హిందుత్వ అంటే హిందూమతోన్మాదులకు పర్యాయపదంగా వాడుతున్న పదం తప్ప మొత్తం హిందువుల గురించి చెబుతున్నది కాదు. దానిని మొత్తానికి ఆపాదిస్తున్నారని చెప్పటం వక్రీకరణ. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని హత్య చేసినపుడు ఎందుకు స్పందించరని ఆమాయకత్వం నటిస్తూ అడిగే ప్రశ్న ఒకటి. అక్కడ వారేమైనా తపస్సు చేసుకొనే మునుల్లా వున్నారా? పచ్చి గూండాల మాదిరి చేస్తున్న హత్యలు దాస్తే దాగేవా? ఎక్కడా లేనివిధంగా అక్కడే ఎందుకు హత్యకు గురవుతున్నారు అంటే కమ్యూనిస్టులను అడ్డుకొంటున్నందుకు అంటారు.పేరుకు సాంస్కృతిక సంస్ధ, కమ్యూనిస్టులు రాజ్యాంగబద్దంగా పనిచేస్తున్నారు, వారిని అడ్డుకోవాల్సిన కర్తవ్యం వారెందుకు భుజానవేసుకున్నట్లు? కమ్యూనిస్టుల మీద ఆర్‌ఎస్‌ఎస్‌వారు కత్తులు ఝళిపిస్తుంటే కమ్యూనిస్టులు గులాబీలు విసురుతారా ?

ఎవరేమన్నారు ?

కేంద్ర ప్రభుత్వ పరోక్ష మద్దతుతో మితవాద శక్తులు పెంచి పోషించిన విపరీత అసహన సంస్కృతికి మరో రుజువు గౌరీ లంకేష్‌ హత్య. నాలుగు హత్యలు ఒకే తీరునజరగటం అదే విధంగా వారి సారూప్యతను ఎవరూ చూడకుండా వుండలేరు. గోవింద పన్సారే ఒక కమ్యూనిస్టు, నరేంద్ర దబోల్కర్‌ ఒక హేతువాది, ఎంఎం కలుబుర్గి ఒక సంస్కరణవాది, గౌరీ లంకేష్‌ జంకు గొంకులేని ఒక జర్నలిస్టు, సామాజిక కార్యకర్త. భారత్‌లో మత ఫాసిస్టుల లక్ష్యం ఎవరో ఇది చూపుతున్నది. అయితే బెదిరింపులు లేదా హత్యలు స్ధిరచిత్తంతో వుండే వారి గళాలను, మార్పును కోరుకొనే వారిని నిలువరించలేవు. మన లౌకిక, సోషలిస్టు విలువలు, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను నులిపివేయాలని ప్రయత్నించే చీకటి శక్తులతో పోరాడాలనే మన నిర్ణయాన్ని ఇలాంటి ప్రతి పిరికి చర్య మరింత గట్టిపరుస్తుంది.

కె సచ్చిదానందన్‌

గౌరి హత్య ఒక వ్యక్తిని హత్య చేయటం కంటే పెద్దది, అది భావ ప్రకటనా స్వేచ్చ,విబేధించే హక్కు,ప్రజాస్వామిక పౌరసత్వాలపై జరిగిన దాడి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది భావజాలాల సంఘర్షణ. మా దారికి రాకపోతే నీ అంతం చూస్తామని చెప్పటమే ఈ హత్య. దేశ ప్రజాజీవనంలో ప్రముఖ పాత్రపోషించే మహిళలకు ఇదొక ప్రమాదకర హెచ్చరిక. ఆమెను తిరిగి తీసుకురాలేము కానీ విమర్శకులు, నిరసన వ్యక్తం చేసే వారిపై ప్రత్యక్ష హింసాకాండతో ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టాలని చూసే పాలకులకు ప్రతిఘటన,తిరస్కరణను రెట్టింపు చేస్తుంది.

అనన్య వాజ్‌పేయి

భారతీయ పౌరుల హత్యలను చూస్తూ వున్న మీరు ఏ దేశానికి చెందిన వారని కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలచుకున్నాను. ఈ రక్తపాతాన్ని ఆపుతారా లేక కొనసాగనిస్తారా? మీరు చర్య తీసుకొనేందుకు ఇంకా ఎన్ని శవాలు లేవాలి.ఈ దేశం మహాత్మాగాంధీది, ఆయన అంతేవాసులు, భావ ప్రకటనా స్వేచ్చకు హామీ ఇచ్చిన జవహర్‌లాల్‌ నెహ్రూది. చరిత్ర నుంచి వారి పేర్లను తుడిచి వేసే పనిలో మీరు తీరికలేకుండా వున్నారు, కానీ మీరు స్వేచ్చను హరించలేరు.

నయనతార సెహగల్‌

గౌరి దారుణ హత్యను బిజెపి ఖండిస్తున్నది. ఒక జర్నలిస్టు లేదా మావోయిస్టు మరియు నక్సలైట్ల హత్యలను ఖండించాల్సిందే, వాటికి వ్యతిరేకంగా గొంతెత్తి, గట్టిగా ఖండిస్తున్న నా వుదారవాద స్నేహితులందరూ కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా కేరళలో బిజెపి కార్యకర్తలను అనేక మందిని హత్య చేస్తుంటే ఎందుకు మౌనంగా వుంటున్నారని ప్రశ్నిస్తున్నా?

రవి శంకర్‌ ప్రసాద్‌, కేంద్ర మంత్రి

గౌరి హత్య వెనుక నక్సల్స్‌ హస్తం వుందని అనుమానిస్తున్నా. అది కావచ్చు, కాకపోనూ వచ్చు.ఆమె పూర్వరంగం దృష్ట్యా ఈ చర్య మితవాద వుగ్రవాదులదీ కావచ్చు లేదా మావోయిస్టులదీ కావచ్చు

ఇంద్రజిత్‌ లంకేష్‌( గౌరి సోదరుడు)

నక్సల్స్‌కు సంబంధం వుందని నేను అనుకోవటం లేదు. ఆమె భావజాలం మితవాదశక్తులకుతీవ్ర వ్యతిరేకమైనది కనుక వారి పనే అని నేను చెప్పదలచుకున్నాను. ఇది వ్యక్తిగతమైనది కాదని నాకు తెలుసు. ఇది మౌలికంగా ఒక ఆలోచనను హతమార్చటం. వారు ఒక ఆలోచన, ఒక వుద్యమాన్ని అంతం చేయాలని ఆలోచించారు.

కవితా లంకేష్‌( గౌరి సోదరి)

బెంగాల్‌లో హిందువులు మరియు కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు వధించబడుతుంటే ఆమె, ఆమె వంటి ధైర్యవంతమైన జర్నలిజం ఎక్కడా కనపడలేదు. ఆ లం…పట్ల ఏ మాత్రం సానుభూతి లేకుండా శరీరాన్ని చీల్చివేసి, ఆపార్ట్‌మెంట్‌ను కూడా కూల్చివేసి వుండాల్సి వుంది.ఆమె, ఆమె వంటి జర్నలిస్టులనబడే సాగరిక ఘోష్‌, శోభాడే, అరుంధతీరాయ్‌, కార్యకర్తలు కవితా కృష్ణన్‌,షీలా రషీద్‌, వుమర్‌ ఖాలిద్‌, కన్నయ్య కుమార్‌ వంటి వారికి ఇదే తగినది, వారిని లేపేయాల్సిన జాబితాలో పైన పెట్టాలి.

జర్నలిస్టులు, కార్యకర్తల ముసుగులో వున్న జాతి వ్యతిరేకులకు గౌరీ లంకేష్‌ కాల్చివేత ఒక వుదాహరణగా చేద్దాం. ఇటువంటి హత్య చివరిదని భావించటం లేదు, జాతి వ్యతిరేకులందరినీ వరుసగా లేపేసే కార్యక్రమం వుండాలి

( రెండు ఫేసుబుక్‌ పోస్టులలో విక్రమాదిత్య రానా పేరుతో వున్న అంశాలివి.హిందూత్వ శక్తులు సామాజిక మాధ్యమంలో పెడుతున్న పోస్టుల సారాంశమిదే. అలాంటి వారిని, వారి పోస్టులను నరేంద్రమోడీ అనుసరిస్తున్నారు)

నువ్వు అనుసరించేవారెవరో చూస్తే నువ్వేంటో తెలుస్తుంది

తమ భావజాలంతో విబేధించే వారిపై ద్వేషం ఎలా వెళ్లగక్కుతున్నారో, ఎలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారో దిగువ వుదాహరణ చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ‘అనేక మంది గౌరీ లంకేష్‌ గురించి వ్యతిరేకంగా సానుకూలంగా పోస్టులు పెట్టారు.నేను ఎన్నడూ గౌరీ లంకేష్‌ను కలుసుకోలేదు, ఆమె గురించి వినలేదు, ఈ ట్వీట్‌ చేసేంత వరకు నేను ఒక అనామకుడిని. కొంత మంది దీనికి రాజకీయ రంగు పులిమి వివాదాన్ని సృష్టించారు. ఇప్పుడు నాకు గుర్తు తెలియని ఫోన్లు వస్తున్నాయి, అభినందిస్తున్నవారు, నిందిస్తున్నవారూ వున్నారు ‘ అని చెప్పాడు సూరత్‌కు చెందిన 38 సంవత్సరాల బట్టల వ్యాపారి నిఖిల్‌ దధిచ్‌. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అతనితో మాట్లాడి వార్త ప్రచురించింది) కొద్ది రోజుల క్రితం తన ట్విటర్‌ ఖాతా వివరాలలో ఇతర విషయాలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ అనుసరించే గౌరవం పొందిన వ్యక్తిని అని రాసుకున్నాడు. గౌరీ గురించి ఏమీ తెలియకపోయినా కొంతమంది పెట్టిన పోస్టులను చూసి అతగాడు గుజరాతీలో పెట్టిన పోస్టులో ‘ ఒక లం…, ఒక కుక్క చచ్చింది, పందులు ముక్త కంఠంతో గోల చేస్తున్నాయి ‘ అని రాశాడు. ఇది ఒక సాధారణ ట్వీట్‌ అని కూడా ఎక్స్‌ప్రెస్‌ విలేకరితో చెప్పుకున్నాడు. పెళ్లాం, ఇద్దరు పిల్లలతో కుటుంబం వున్న ఒక వ్యక్తి సంస్కారం ఇది. ఒక వ్యక్తి గురించి తనకేమీ తెలియకపోయినా గుడ్డిగా తోటివారితో కలసి రాళ్లు వేసే ఇతగాడు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు, రోజూ శాఖలకు వెళుతుంటాడట. ఇలాంటివి చూసినపుడు నువ్వు మనిషివా ఆర్‌ఎస్‌ఎస్‌ వాడిగా అని ప్రశ్నించటం సహజం. సంఘపరివార్‌ నుంచి ఒక సందేశం ఏదైనా వెలువడితే దాని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా ప్రచారం చేయాలన్న ఆదేశం లేదా పధకం లేకపోతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది. ఏకత, శీలము అంటూ నేర్పేది, నేర్చుకుంటున్నది ఇలాంటివా? ఇంతటి ఘనకార్యం చేసిన ఇతగాడిని అనుసరించే వారు మూడు రోజుల్లో పెరిగారంటే దేశంలో ద్వేష పూరిత ధోరణులు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.ఈ ఘనుడిని ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్నాడని మీడియాలో గుప్పుమనటంతో తన వివరాల నుంచి ప్రధాని మోడీ అనుసరిస్తున్న గౌరవం పొందిన వాడిని అనే దానిని తొలగించి హిందూ జాతీయవాదని అని ప్రకటించుకున్నాడు. అంటే హిందూ జాతీయవాదులంటే ఎలాంటి వారో స్వయంగా ప్రకటించుకున్నాడు.

ఈ ఘనుడిని అనుసరించేవారిలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, వుత్తర గుజరాత్‌ బిజెపి మీడియా విభాగనేత పరాగ్‌ షేత్‌ కూడా వున్నారు. దధీచ్‌ ట్వీట్‌ గురించి అడిగిన ప్రశ్నకు పరాగ్‌ స్పందిస్తూ ‘ మీరు ట్వీట్‌ అనంతరం వెలువడిన వ్యాఖ్యలను దానికి జోడిస్తే అప్పుడు నేను అదొక అసహ్యకరమైన ట్వీట్‌ అని తీవ్రంగా ఖండించాలంటాను’ అన్నాడు. అయినప్పటికీ నేను ట్విటర్‌పై అతనిని అసుసరించటం మానుకోబోవటం లేదు. సామాజిక మీడియాలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అనుసరించటం అంటే రెండోవారి ప్రవర్తనపై సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు కాదు.సామాజిక మీడియాలో జరుగుతున్నదాని ప్రకారం ఒకసారి ఎవరైనా ఒకరిని అనుసరిస్తే తరువాత అనుసరించకపోవటం అంటూ వుండదు.’ అని సమర్ధించుకున్నాడు.

లాటిన్‌ అమెరికా అనుభవాలు

1970,80 దశకాలలో లాటిన్‌ అమెరికాలోని వామపక్ష భావజాలం, మానవహక్కుల వుద్యమకార్యకర్తలను పూర్తిగా నిర్మూలించేందుకు అమెరికా సిఐఏ ఆపరేషన్‌ కండోర్‌ పేరుతో పెద్ద హంతక కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఒక అంచనా ప్రకారం చిన్న పెద్ద నాయకులు అలాంటి వారు 50 వేల మంది అదృశ్యం లేదా హత్యలకు గురయ్యారు. ఇప్పటికీ ఎన్నో వేల మంది విషయం విడిపడని రహస్యంగానే వుంది. ఒక్క అర్జెంటీనాలోనే అలాంటి వారు ఏడు నుంచి 30వేల మంది వరకు వున్నారని అంచనా. మన దేశంలో కూడా అదే దశకాలలో తలెత్తిన వామపక్ష వుగ్రవాదులను అణచేందుకు పాలకులు బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేయించారు. అందుకు పాల్పడిన పోలీసులకు అవార్డులు, రివార్డులు ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తున్నారు. ఇదొక భాగమైతే తమ చేతికి మట్టి అంటకుండా తమ భావజాల వ్యతిరేకులను అంతం చేయించేందుకు కిరాయి మూకలను వినియోగించిన అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్‌ మొసాద్‌ పద్దతులను మన దేశంలో కూడా అమలు చేస్తున్నట్లు గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన కొన్ని వుదంతాలు స్పష్టం చేశాయి. జర్నలిస్టుల హత్యలకు కూడా అదే పద్దతిని ఆయాశక్తులు అనుసరించినట్లు చెప్పవచ్చు. లాటిన్‌ అమెరికా దేశాల్లో ఇలాంటి హత్యలకు పాల్పడిన శక్తులు వాటిని పెంచి పోషించిన పాలకుల పేర్లను ప్రస్తావించటానికి కూడా మీడియా ముందుకు రాలేదు. అత్యధిక సందర్భాలలో నియంతల, సిఐఏ కధనాలకే ప్రాధాన్యత ఇచ్చి జనం ముందు పెట్టాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లాటిన్‌ అమెరికాను తన పెరటి తోటగా మార్చుకొనేందుకు అమెరికా ఇంత దుర్మార్గానికి పాల్పడింది. ప్రస్తుతం మన దేశంలో తమ భావజాల వ్యతిరేకుల నోరు మూయించేందుకు మితవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి, వాటికి కేంద్రంలోని ప్రభుత్వమద్దతు వుందని ప్రతిపక్షాలు, అనేక మంది మేధావులు, సంస్ధలు విమర్శిస్తున్నాయి. అలాంటి వారిపై దాడులు, హత్యలు జరిగినపుడు పాలక పార్టీ లేదా దానికి మద్దతు ఇచ్చే సంస్ధల వాదనల తీరు వాటిని ఆ విమర్శలకు బలం చేకూర్చేవిగా వుంటున్నాయి. మీడియా మొత్తం మీద పాలకవర్గ ప్రయోజనాలకే తోడ్పడుతోంది. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలలో కమ్యూనిజం నుంచి రక్షించేందుకు తాము పూనుకున్నట్లు నియంతలు ప్రకటనలు చేశారు. ఇక్కడ కమ్యూనిస్టులు, అభ్యుదశక్తులు అంతపెద్ద శక్తిగా లేనందున అలాంటి ప్రకటనలు లేవుగానీ చాపకింద నీరులా తమ పని తాము చేస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబద్దాల ఫ్యాక్టరీ ఆర్‌ఎస్‌ఎస్‌

12 Tuesday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

fake news, Gouri lankesh, Narendra Modi, RSS

గౌరీ లంకేష్‌

ఈ వారం సంచికలో దేశంలోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్‌దారిలో వెళుతున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను.

కొన్ని రోజుల క్రితం గణేశ్‌ చతుర్ధి సందర్భంగా సామాజిక మీడియా ద్వారా సంఘపరివార్‌ ఓ పుకారును ప్రచారంలోకి తెచ్చింది. గణేష్‌ విగ్రహాలను ఎక్కెడెక్కడ ప్రతిష్టించాలో కర్ణాటక(కాంగ్రెస్‌) సర్కారే నిర్ణయిస్తుందన్నది ఆ వార్త. ఒక్కో విగ్రహం కోసం రు.పదిలక్షలు చెల్లించాలి. ఎత్తు విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇతర మతస్తుల నివాసాలు లేని దారిలోనే నిమజ్జన యాత్ర సాగాలి. టపాసులు కాల్చేందుకు అనుమతించరు. ఈ తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తెచ్చింది ఆర్‌ఎస్‌ఎస్‌. కర్ణాటక డిజిపి ఆర్‌కె దత్తా ఈ వార్తపై వివరణ ఇవ్వక తప్పని పరిస్దితి. అటువంటి నిబంధనలేమీ ప్రభుత్వం విధించలేదని స్పష్టం చేశారు. దాంతో అది పచ్చి అబద్దమని తేలిపోయింది. ఈ పుకారుకు ఆధారమేమిటని వెతికితే ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ అని తేలింది. అది హిందూత్వ వాదులు నడిపిస్తున్న వెబ్‌సైట్‌. సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు ఇలాంటి వార్తలను ఆ వెబ్‌సైట్‌ సృష్టిస్తుంది.

ఆగస్టు 11వ తేదీన ‘పోస్టు కార్డు న్యూస్‌’ వెబ్‌సైట్‌ కర్ణాటకలో తాలిబన్‌ పాలన పేరుతో ఒక అబద్దపు వార్తను సృష్టించింది. గణేష్‌ చతుర్ధి సందర్భంగా ప్రభుత్వం అనుచిత నియమాలను పెట్టిందన్నది సారాంశం. ఈ అబద్దాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేయటంలో సంఘీయులు విజయం సాధించారు. వేరే కారణాలతో సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలతో వున్నవారు ఈ అబద్దపు వార్తను తమ ఆయుధంగా చేసుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన, విచారకరమైన విషయం ఏమంటే జనం తమ కళ్లు, చెవులు మూసుకొని బుర్రకు ఏమాత్రం పని పెట్టకుండా, ఆలోచించకుండానే అదే నిజమని భావించారు.

అత్యాచారం కేసులో రామ్‌ రహీమ్‌ గుర్మీత్‌ సింగ్‌ను దోషిగా తేలుస్తూ గతవారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనతో చాలా మంది బిజెపి నేతలు అంతకు ముందు దిగిన ఫొటోలు ఈ సందర్బంగా సామాజిక మీడియాలో వైరస్‌ మాదిరి వ్యాపించాయి. ప్రధాని మోడీతో సహా హర్యానాకు చెందిన బిజెపి మంత్రుల ఫొటోలు కూడా అందులో వున్నాయి. దీంతో బిజెపి, సంఘపరివార్‌ ఇరకాటంలో పడ్డాయి. దానికి పోటీగా సిపిఐ(ఎం)నేత, కేరళ ముఖ్య మంత్రి పినరయ్‌ విజయన్‌ గుర్మీత్‌తో కలిసిన ఫొటో అంటూ ఒక దానిని ప్రచారంలో పెట్టారు. వాస్తవాన్ని వెలికి తీయగా అది కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ గుర్మీత్‌తో దిగిన ఫొటో అని తేలింది. ఫొటోషాప్‌ ద్వారా చాందీ తల స్ధానంలో విజయన్‌ది వుంచి సృష్టించిన నకిలీ ఫొటో అని స్పష్టమైంది. హిందూత్వవాదులకు చెందిన సామాజిక మీడియా నిపుణులు చాందీ ఫొటో స్ధానంలో విజయన్‌ది చేర్చి ప్రచారంలో పెట్టారు. అసలు ఫొటోను కొందరు వెలుగులోకి తేవటంతో సంఘపరివార్‌ బండారం బయటపడింది.

హిందుత్వ వాదులు సాగిస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలకు గతేడాది వరకు సరైన ప్రతిస్పందన వ్యక్తం చేసిన వారు లేరు. ఇప్పుడు చాలామంది అందుకు నడుంబిగించారు. స్వాగతించదగిన పరిణామం. ఇప్పటిదాకా నకిలీ వార్తలే రాజ్యమేలగా ఇప్పుడు వాస్తవ వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. వుదాహరణకు ఆగస్టు 17న ధృవ్‌ రాధీ సామాజిక మీడియాలో ఒక వీడియోను పెట్టారు. ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్న అబద్దాలను ఎత్తి చూపే వీడియో ఇది. మోడీ చెబుతున్న అబద్దాలను రాధీ గతకొద్ది మాసాలుగా బహిర్గతం చేస్తున్నారు. ప్రారంభంలో కొద్ది మంది మాత్రమే ఆ వీడియోలను వీక్షించేవారు. అయితే ఈ వీడియోకి బాగా ప్రచారం లభించింది. యూ ట్యూబ్‌లో లక్షమందికి పైగా చూశారు.

రాధీ పేర్కొన్న వివరాల ప్రకారం నెల రోజుల కిందట ‘బుజి బుజియా’ (అబద్దాల కోరు-మోడీకి గౌరీ పెట్టిన పేరు) ప్రభుత్వం రాజ్యసభలో ఓ విషయం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 30లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారని చెప్పింది. అయితే నోట్ల రద్దు అనంతరం 91లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తున్నారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ అంతకు ముందు పేర్కొన్నారు. ఆర్ధిక సర్వే ప్రకారం కేవలం 5.4లక్షల మంది మాత్రమే పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారు. ఈ మూడింటిలో ఏవి సరైన అంకెలని రాధీ తన వీడియోలో ప్రశ్నించారు.

బిజెపి ప్రభుత్వం చెప్పిన అబద్దాలను, ఇచ్చిన సమాచారాన్ని ప్రధాన మీడియా అంగీకరిస్తోంది. ప్ర శ్నించేవారు, సవాల్‌ చేసే వారు లేకపోవటమే అందుకు కారణం. టీవీ వార్తా ఛానళ్ల విషయానికొసే రామనాధ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు అనేక ఆంగ్లవార్తా ఛానళ్లు ఒక కథనాన్ని ప్రసారం చేశాయి. కోవింద్‌ ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే ట్విటర్‌లో 30లక్షల మందికిపైగా అనుచరులను సంపాదించుకున్నారన్నది వార్త సారాంశం. కోవింద్‌కు ప్రజాదరణ ఏవిధంగా పెరిగిందో రోజంతా నొక్కి చెప్పాయి.

ఈ రోజుల్లో అనేక టీవీ వార్తా సంస్ధలు ఆర్‌ఎస్‌ఎస్‌తో జట్టుకట్టినట్లు కనిపిస్తోంది. కోవింద్‌ కథనం వెనుక వాస్తవం ఏమంటే పదవీ విరమణ చేసిన దేశాధ్యక్షుడు ప్రణబ్‌ ముఖర్జీ అధికారిక ట్విటర్‌ ఖాతాను కొత్తగా పదవిని చేపట్టిన కోవింద్‌కు కేటాయించారు. దాంతో సహజంగానే ఆయన అనుచరులందరూ కోవింద్‌కు బదిలీ ఆయ్యారు. మాజీ రాష్ట్రపతికి ట్విటర్‌లో 30లక్షల మందికి పైగా అనుచరులున్నారన్నది గమనించదగ్గ విషయం.

ఆర్‌ఎస్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలకు ప్రతిగా సత్యాన్వేషకులు అనేక మంది వాస్తవమేంటో చెబుతున్నారు. దృవ్‌ రాధే తన వీడియోలతో ఆ పని చేస్తుంటే ప్రతీక్‌ సిన్హా ఒక వెబ్‌సైట్‌(ఆల్ట్‌న్యూస్‌.ఇన్‌), ది వైర్‌, స్క్రోల్‌, న్యూస్‌ లాండ్రి, క్వింట్‌ వంటి ఆన్‌లైన్‌ పత్రికలు వున్నాయి. ఇవి చాలా చురుగ్గా తప్పుడు కథనాల గుట్టు విప్పి చెబుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ కాషాయ దళం సాగిస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వారంతా ఎలాంటి ఆర్దిక ప్రయోజనాలనూ ఆశించకపోవటం గమనార్హం. వాళ్ల లక్ష్యం తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చూడటం, ఫాసిస్టుల బండారాన్ని బయటపెట్టటం. కొద్ది వారాల క్రితం భారీ వర్షాల కారణంగా బెంగళూరు నీట మునిగిపోయినపుడు బిజెపి కర్ణాటక ఐటి విభాగం ఒక ఫొటోను విడుదల చేసింది. ‘చంద్రుడి మీద నడుస్తున్న ప్రజలను నాసా కనిపెట్టింది, ఆ తరువాత బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ దానిని తన రోడ్డుగా ధృవీకరించింది.’ అంటూ ఫొటో కింద వ్యంగ్యోక్తులను కూడా జోడించింది.భారీ వర్షాలపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని సిద్దరామయ్యకు వ్యతిరేకంగా నకిలీ వార్తలను ప్రచారం చేసే యత్నమిదని స్పష్టమౌతోంది. వాస్తవానికి ఆ ఫొటో బిజిపి పాలిత మహారాష్ట్రకు చెందినదని, బెంగళూరుది కాదని బైటపడటంతో పధకం బెడిసి కొట్టింది.

అదే విధంగా ఇటీవల పశ్చిమబెంగాల్లో అల్లర్లు చెలరేగినపుడు మతతత్వశక్తులు సోషల్‌ మీడియాలో రెండు పోస్టర్లను ప్రచారంలో వుంచాయి. ఒకటి కాలిపోయిన ఇళ్ల ఫొటో. దాని కింద’బెంగాల్‌ తగులబడుతోంది’ అని రాసి వుంది. రెండవ ఫొటోలో అనేక మంది చూస్తుండగా ఒక పురుషుడు మహిళ చీరలాగుతున్నాడు. ఆ ఫొటో కింద ‘ బదూరియాలో హిందూ మహిళలపై దాడి ‘ అని రాసి వుంది. అయితే కొద్ది గంటలలోనే ఆ ఫొటో వెనుక దాగిన వాస్తవం బహిర్గతమైంది. మొదటి ఫొటో మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండగా 2002లో అల్లర్లు చెలరేగినపుడు తీసింది. రెండవ ఫొటో ఒక భోజ్‌పురి సినిమాలోది. ఇప్పటికీ వుంది. ఈ ఫొటోను బిజెపి సీనియర్‌ నేత విజేత మాలిక్‌ షేర్‌ చేసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రమే కాదు బిజెపి మంత్రులు కూడా నకిలీ వార్తలు, కథనాలను ప్రచారం చేస్తున్నారు.వుదాహరణకు ముస్లింలు మూడు రంగుల జెండాను తగులబెడుతున్న ఫొటోను నితిన్‌ గడ్కరీ షేర్‌ చేసుకున్నారు. ఆ ఫొటో కింద ‘ గణతంత్ర దినోత్సవం నాడు హైదరాబాదులో మూడు రంగుల జెండాను దగ్దం చేస్తున్నారు ‘ అని రాసి వుంది. గూగుల్‌లో కొత్తగా ఒక యాప్‌ వచ్చింది. దీని సాయంతో ఒక ఫొటోను ఎప్పుడు, ఎక్కడ రూపొందించారో తెలుసుకోవచ్చు. ప్రతీక్‌ సిన్హా దాన్ని ఎక్కడిదో తెలుసుకున్నారు. వాస్తవానికి పాకిస్తాన్లో నిషేధిత సంస్థలు నిరసన తెలుపుతున్న చిత్రమది. కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ ఓ ఫొటోను షేర్‌ చేశారు. దేశంలో 50వేల కిలోమీటర్ల రోడ్ల మీద 30లక్షల ఎల్‌యిడి లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయని ఆ ఫొటో శీర్షిక సారాంశం. అయితే అదీ బోగస్‌ అని తేలిపోయింది.జపానులోని ఒక వీధిలో 2009లో తీసిన చిత్రమది. చత్తీసుఘర్‌ బిజెపి ప్రభుత్వం నిర్మించిన వంతెన అంటూ ఆ రాష్ట్ర బిజెపి మంత్రి రాజేష్‌ మునాత్‌ ఓ ఫొటోను ప్రచారంలో పెట్టారు. వాస్తవానికది వియత్నాంలో నిర్మించిన వంతెన అది. కర్నాటక ఎంపీ ప్రతాప్‌ సిన్హా ప్రపంచానికి నీతి బోధ చేసే పనిలో పడ్డారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ప్రచురితమైందంటూ ఒక నివేదికను షేర్‌ చేశారు. ఒక హిందూ బాలికను ముస్లిం పొడిచి చంపాడు అన్నది శీర్షిక. ఒక్క పత్రిక కూడా ఆ విధమైన వార్తను ప్రచురించలేదు.వార్తను కూడా మతపరమైన కోణంలో మలచారు. శీర్షికను ఫొటోషాప్‌లో మార్చి పెట్టారు.అయితే దీనిపై కలవరం చెలరేగటంతో ఎంపి ఆవార్తను తొలగించారు. మత విద్వేషాన్ని రగిల్చే అబద్దాన్ని ప్రచారం చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పలేదు. విచారం వెలిబుచ్చలేదు.

నా స్నేహితుడు వాసు గుర్తు చేసినట్లు నేను కూడా ఈ వారంలో ఒక నకిలీ ఫొటోను షేర్‌ చేశాను. అది పాట్నాలో ర్యాలీకి సంబంధించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ షేర్‌ చేసినది. నా స్నేహితులు శశిధర్‌ హెమ్మాడి అది నకిలీ అని గుర్తు చేశారు. దాంతో గ్రహించుకొని వాస్తవ ఫొటోలను జతచేసి నా తప్పును సరిదిద్దుకున్నాను. ఇదంతా కేవలం ప్రచారం కోసం కాదు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించాలన్నదే నా ఆకాంక్ష, చివరి మాటగా తప్పుడు వార్తల్ని వెలికితీసే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. అటువంటి వారు చాలా మందే వున్నారని అనుకుంటున్నా.

( ఇది గౌరీ లంకేష్‌ రాసిన చివరి సంపాదకీయం)

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందుత్వ పేరుతో హత్యపై సంబరాలు నీచం !

11 Monday Sep 2017

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

attack on journalists, Gouri lankesh, Hindu supremacy, hindutva, Journo murder

                                                          వాడ్రేవు చిన వీర భద్రుడు

మృత్యువును చూసి కాదు నేను

జీవితాన్ని చూసి జంకుతున్నాను

హంతకుని కత్తి చూసి కాదు, కనుల ద్వేషం

చూసి జంకుతున్నాను

మనసులోని క్రౌర్యం చూసి జంకుతున్నాను

బైరాగి ( ఆగమగీతి:నాకు చావులేదు)

గౌరీ లంకేష్‌ హత్య ఒక విషయాన్ని చాలా బిగ్గరగా, మనం ఎక్కడ వినకుండా పోతామో అన్నంత బిగ్గరగా, మన చెవులు చిల్లులు పడేట్లుగా, భరించలేనంతగా ఘోషిస్తోంది. అదేమంటే: మనం రాజకీయంగా సరే, సాంస్కృతికంగా కూడా పతనం అంచులకు చేరుకున్నామని.

రెండవ ప్రపంచ యుద్ధం అయిన తరువాత ఇంటికి వస్తున్న జర్మన్‌ సైనికులకు( ఇంటికి తిరిగి రాగల అదృష్టం నోచుకున్నవాళ్లు) తమ పదజాలమంతా హఠాత్తుగా మాయమైనట్లు అనిపించిందట.’దేశం’, ‘కుటుంబం’, ‘మనిషి’, ‘ప్రేమ’, ‘మానవ సంబంధాలు’ ఈ మాటలకు అర్ధం లేదని అనిపించిందట.

గౌరిని హత్య చేసిన మర్నాడే హత్యను ఖండించకపోగా, మరణానికి చింతించకపోగా, ఈ అమానుషాన్ని ప్రతి ఒక్కరూ తమ మీద తీసుకొని ఎంతో కొంత ప్రాయచిత్తం ప్రకటించకపోగా, సోషల్‌ మీడియాలో నడచిన, నడుస్తున్న కొన్ని వ్యాఖ్యలు నన్ను బాధిస్తున్నాయి, భయపెడుతున్నాయి. మనం ఏ దేశంలో వున్నాం ? ఏ విలువల గురించి ఇంతకాలం గర్విస్తూ వచ్చాం? ప్రాచీన కాలం నుంచి ఎవరిని ఆదర్శాలుగా ప్రకటించుకుంటూ వచ్చాం? నిర్ధాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ చేసిన హత్యకన్నా, నిర్ధాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ మాట్లాడుతున్న ఈ మాటలు నన్నెక్కువ కలవరపెడుతున్నాయి.

దుర్మార్గమైన ఈ రాతలు చదివి ఎందరో యువతీ యువకులు, ముక్కుపచ్చలారని పిల్లలు తామేదో మహత్తర హిందూ సంస్కృకి వారసులమని, తమ మతానికి సంస్కృతికి ఏదో పెద్ద ప్రమాదం వాటిల్లుతోందని, అలాంటి ఒక ప్రమాదకరమైన మనిషిని చంపేస్తే వీళ్లంతా ఎందుకిట్లా ఖండిస్తున్నారని, దు:ఖిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఎవరు చెప్తారు వీళ్లకి ? ఈ రాజకీయ శక్తులు మాట్లాడుతున్న హిందుత్వానికి, అనాది కాలంగా ఈ దేశంలో కొనసాగుతున్న హిందూ జీవన విధానానికి సంబంధమే లేదని, అసలు ‘హిందుత్వం’ వేరు, హిందూ జీవన విధానం వేరని, అసలు హిందూ మతమంటూ ఒకటి లేనే లేదని, అసలు అటువంటి మతమంటూ ఒకటుందని అనుకున్నా ఇలాంటి అమానవీయ మిలిటెంట్‌ ధోరణుల్ని అది గతంలో ఇంత నిస్సిగ్గుగా చూపించి వుండలేదని, ఇప్పటి ఈ దుర్మార్గ స్వరూపం గ్లోబల్‌ పెట్టుబడికి, రాజకీయ కట్టుకథకి పుట్టిన విష పుత్రిక అని ఎప్పుడు గుర్తిస్తారు !

మరొక మాట కూడా చెప్పాలి. నేను కూడా హిందువునే, కానీ నా మతానికి బయటి మతాల వలన ప్రమాదం వుందని నాకెప్పుడూ అనిపించలేదు. ఏమతమైనా ఆ మతం పేరు చెప్పకుండా దాన్ని అనుసరించలేని ఆత్మవంచన వల్ల, కాలక్రమంలో సంతరించుకొనే దురాచారం వల్ల ప్రమాదంలో పడుతుంది తప్ప బయటివాళ్ల వల్ల కాదు. ఏమతాన్నయినా కాపాడగలిగేది ఆ మతం ప్రబోధించే మంచి విషయాల్ని అనుసరించగలిగే వాళ్లేతప్ప రాజకీయ నాయకులు, గూండాలు కాదు.

నేనీ మాటలు రాస్తే నేను ఎదుర్కోబోయే ప్రశ్నలేమిటో కూడా నాకు తెలుసు. అన్నింటికన్నా ముందు అడిగే ప్రశ్న: మరి వామపక్ష తీవ్రవాదులు అమాయకుల్ని చంపితే నువ్వెందుకు మాట్లాడలేదు అని, కేరళలోనో మరోచోటనో ఎవరో ఎవరినో చంపుతుంటే నువ్వెందుకు మాట్లాడలేదని. హింస ఎక్కడైనా హింసే, ఎవరు చేసినా హింసనే. కత్తితో కుడివైపు నుంచి పొడిచినా, ఎడమవైపు నుంచి పొడిచినా కారేది రక్తమే, దు:ఖమే. కానీ నేను ఈ దేశంలో ఇంతదాకా చూసిన హింసకి, ఈ హింసకీ పోలికనే లేదు. గతంలో ఎవరైనా ఎవరినైనా చంపితే ఎంతో కొంత పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేవారు, చివరికి గాడ్సే కూడా తన వాంజ్మూలంలో గాంధీ పట్ల ఎంతో కొంత సానుభూతి చూపకుండా వుండలేకపోయాడు. కానీ ఈ హత్యని ఇట్లా సెలబ్రేట్‌(పండుగ) చేసుకుంటున్న హీన సందర్భాన్ని ఇప్పుడే చూస్తున్నాను. అది కూడా హిందూత్వం పేరిట.

ఆమె హత్యను ఎవరు ఖండించారన్నది కాదు, ఎవరు ఖండించలేదన్నది నన్నెక్కువ బాధ పెడుతున్నది. బహుశ చిదానంద రాజఘట రాసుకున్న జ్ఞాపకాలు చదివి వుండకపోతే ఈ నాలుగు మాటలు మాట్లాడటానికి కూడా నా గొంతు పెగిలి వుండేది కాదు. మరీ ముఖ్యంగా ఈ వాక్యాలు ‘మరణం ఒక అనుకోని ఘటన. మంచి వ్యక్తులు చేసిన దానికి, వారు దేనికోసం నిలబడ్డారనేదానికి గౌరవం, ప్రేమ మరియు ప్రశంస ముఖ్యం. వామపక్షవాది, తీవ్రవాది, హిందుత్వ వ్యతిరేకి, లౌకిక వాది తదితర ముద్రలన్నింటినీ మరచిపోండి, నావరకైతే అబ్బురమైన కారుణ్యం, హుందాతనాల సారం’.

పిల్లలూ చదవండి, మీకు నచ్చని ప్రతి ఒక్కరినీ నిర్మూలించుకుంటూ పోనక్కరలేదని తెలుస్తుంది. విబేధాలతో విడిపోయినా, స్నేహితులుగా కొనసాగటమెలానో తెలుస్తుంది.మనుషులుగా మిగలటం అన్నింటికన్నా ముఖ్యమని తెలుస్తుంది.

(ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ సౌజన్యంతో)

Share this:

  • Tweet
  • More
Like Loading...

నేరగాడు గుర్మీత్‌: కాంగ్రెస్‌ాబిజెపి బాధ్యత ఎంత ?

27 Sunday Aug 2017

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, cbi, Congress party, Gurmeet Ram Rahim Singh, Narendra Modi, rape, rape case

ఎం కోటేశ్వరరావు

డేరా సచ్చా సౌదా ఆశ్రమాల అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇద్దరు భక్తురాండ్రపై జరిపిన అత్యాచారం కేసులలో నేరగాడని వినాయకచవితి రోజున పంచకుల సిబిఐ కోర్టు నిర్ధారించింది. శిక్ష ఎంత అనేది సోమవారం నాడు ప్రకటించనున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే నిరసిస్తూ గుర్మీత్‌ అనుచరులు పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, వుత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హత్య, హింసాకాండకు పాల్పడ్దారు. పంచకుల నగరం తీవ్రంగా ప్రభావితమైంది.కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌కు ఒక వైపున క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసిన మొహాలీ లేదా ఎస్‌ఎఎస్‌ నగర్‌ మరోవైపు పంచకుల వుంది. వీటిని త్రినగరాలు అంటారు. చండీఘర్‌ కేంద్రపాలనలో మొహాలీ పంజాబ్‌, పంచకుల హర్యానాపాలనలో వుంటాయి. మూడూ ఆధునిక నగరాలే. గుర్మీత్‌ అత్యాచార నిర్ధారణ తీర్పు పర్యావసానం అనేక అంశాలను జనం ముందుంచింది.

ఢిల్లీలో ఒక నిర్భయపై జరిపిన అత్యాచార వుదంతానికి నిరసనగా నిందితుడిని శిక్షించాలని వేలాది మందిని వీధుల్లోకి రప్పించింది. తన ఆశ్రమంలో సేవ చేసేందుకు వచ్చిన ఇద్దరు నిర్భయలపై గుర్మీత్‌ జరిపిన అత్యాచార వుదంతంలో అతగాడిని శిక్షించకూడదంటూ లక్షలాది మంది వీధుల్లోకి రావటం, వున్మాదంతో హింసాకాండకు పాల్పడటం దేశాన్ని విస్మయపరుస్తోంది. ఢిల్లీ నిర్భయ వుదంతంపై దేశమంతా ఏకతాటిగా నిలిచింది. కానీ ఒక బాబా ముసుగులో గుర్మీత్‌ జరిపిన అత్యాచారంపై పరిమితంగా అయినా భిన్న స్వరాలు వినిపించటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో గుజరాత్‌లో గోధ్రాపేరుతో జరిపిన మారణకాండతో పోలిస్తే ఇదెంత హ ! హ !! అనుకున్నారో ఏమో ప్రధాని నరేంద్రమోడీ షరా మామూలుగా ఇంతవరకు నోరు విప్పలేదు. ఈ వుదంతం సందర్భంగా మీడియాలో పరిమితంగానే అయినప్పటికీ వెలుగులోకి వచ్చిన అనేక అంశాలు మన రాజకీయ వ్యవస్ధ ముఖ్యంగా అధికారమే పరమావధిగా ఎంత గడ్డికరవటానికైనా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీలు(వామపక్షాలకు ఇటు వంటి మరక లేదు) పూనుకుంటాయో అనేక మంది కళ్లు తెరిపిస్తున్నాయి.

గుర్మీత్‌ వంటి శక్తులు తెరముందు ఎలా వున్నా తెరవెనుక నేర,దేశద్రోహ చరిత్రలుంటాయని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొత్తగా పుట్టుకువచ్చే యోగులు, యోగినులు, బాబాల చుట్టూ నిరక్షరాస్యులతో పాటు వున్నత విద్యావంతులు కూడా అనేక కారణాలతో తిరగటం, వారికి విశ్వసనీయత కలిగించటం మన దౌర్భాగ్యం. ఎవరిపై అయినా ఒక ఆరోపణ వచ్చినపుడు దానిలో వాస్తవాలు తేలేంత వరకు వారికి కితాబు ఇవ్వకుండా వుండటం కనీస విధి. కానీ అనేక మంది బాబాల మాదిరి ఇతగాడి విషయంలో కూడా కాంగ్రెస్‌, బిజెపి వంటి పార్టీల నేతలు అతడిని ప్రసన్నం చేసుకొని వెనుక వున్న అనుచరుల ఓట్లను రాబట్టుకొనేందుకు కరవని గడ్డి లేదు. ఇప్పుడు ఆ పార్టీల వారు, ఇతరులు త్వశుంఠ, త్వశుంఠ అంటూ ఎవరెంత వెధవాయలో ఒకరి గురించి ఒకరు, స్వయంగా బయట పెట్టుకుంటున్నారు. అవాంఛనీయ సమర్ధనలకు పూనుకుంటున్నారు. ఈ వుదంతంలో కూడా రాజకీయ లబ్ది పొందేందుకు పూనుకున్నారు. ఇలాంటి వారిని అచ్చ తెలుగులో వుచ్చల గుంటలో చేపలు పట్టేరకం అంటారు. కొంత మంది ఈ వుదంతాన్ని దళిత బాబా- అగ్రకుల కుట్ర కోణంలో చూసేందుకు ప్రయత్నించటం గర్హనీయం. డేరా ఆశ్రమాల్లో చేరుతున్నది దళితులు, ఇతర బలహీనవర్గాలే అనుకుంటే అత్యాచారాలు, హత్యలకు గురైంది కూడా ఆ తరగతులకు చెందిన వారే కదా అనే సృహ కనిపించటం లేదు. ఎవరికి చెందిన వారి ఆశ్రమాల్లో ఏ నేరం, అత్యాచారం జరిగినా పట్టించుకోకూడదు అని చెప్నే ప్రమాదకరపోకడ ఇది. మరో విధంగా చెప్పాలంటే మా మనోభావాలను దెబ్బతీస్తే సహించం అ నే వున్మాద లక్షణం తప్ప మరొకటి కాదు.

తన ఓటు బ్యాంకుకు వ్యతిరేకంగా తొలుత ఆశారాంబాపు, తరువాత రాంపాల్‌, ఇప్పుడు గుర్మీత్‌ సింగ్‌ను కనీసం బిజెపి అరెస్టు చేసింది అని చెట్టుకింది ప్లీడరు పాయింట్‌ను బిజెపి అభిమానులు ముందుకు తెచ్చారు. కోర్టుల తీర్పులు లేదా ఇతర అనివార్య పరిస్ధితులలో అధికారంలో ఏ పార్టీ వున్నా ఆపని చేయటం విధి. ఇష్టం లేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ఇలాంటి బాబాలకు అంటకాగిన వారు వ్యవహరిస్తారు. ఎక్కడిదాకో ఎందుకు గుర్మీత్‌ విషయమే తీసుకుంటే కోర్టు నిర్ణయం వెలువడగానే ప్రముఖులు బసచేసే ఒక వసతి గృహానికి తీసుకు వెళ్లి, దాన్నే జైలుగా మార్చేందుకు హర్యానా బిజెపి పభుత్వ యంత్రాంగం ప్రయత్నించింది. అయితే దాని గురించి మీడియాలో వార్తలు గుప్పుమనటంతో సాధారణ ఖైదీ మాదిరే రోహతక్‌ జైలుకు తరలించాల్సి వచ్చింది. దాన్ని కూడా తమ ప్రభుత్వ ప్రత్యేకతగా చెప్పుకొనేందుకు బిజెపి సేనలు ప్రయత్నించాయి. గుర్మీత్‌కు జడ్‌ తరహా భద్రత కల్పించింది ఎవరు-కాంగ్రెస్‌, గుర్మీత్‌ సింగ్‌ కుమారుడు వివాహం చేసుకున్నది ఎవరిని-పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత కూతురిని అంటూ మరొక ప్రచారం. ఇలాంటి సందర్భాలలో బిజెపి మేథావులు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారు. హర్యానా బిజెపి అధ్యక్షుడి కుమారుడు ఒక యువతిని వెంటాటి కిడ్నాపో, అత్యాచారమో ఏదో చేయటానికి ప్రయత్నించిన వుదంతం తెలిసిందే. ఆ సందర్భంగా ఆ యువతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే చౌకబారు ఎత్తుగడలు కాకపోతే గుర్మీత్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన జడ్‌ భద్రతను బిజెపి ఎందుకు కొనసాగించినట్లు? కాంగ్రెస్‌ నేత కూతుర్ని కోడలుగా చేసుకున్న గుర్మీత్‌తో బిజెపి నేతలు ఆయన అనుగ్రహం కోసం ఎందుకు పడిగాపులు పడ్డారు, ఎందుకు రాసుకొని పూసుకొని తిరిగినట్లు ? ఒక కాంగ్రెస్‌ నేత కూతుర్ని తన కోడలుగా చేసుకున్నందుకు గుర్మీత్‌ను తప్పుపట్టనవసరం లేదు. తద్వారా కాంగ్రెస్‌ పాలకుల నుంచి పొందిన లబ్ది ఏదైనా వుంటే దాన్ని తప్పుపట్టాలి. ఇదే ప్రమాణాన్ని బిజెపికి వర్తింప చేస్తే …… సంజయగాందీ భార్య మేనకా గాంధీని,ó కుమారుడు ఫిరోజ్‌ గాంధీని, గబ్బుపట్టిన ఇంకా ఎందరో కాంగ్రెస్‌ నేతలను బిజెపిలో ఎందుకు చేర్చుకున్నట్లు ? స్వయంగా నరేంద్రమోడీ ప్రధాని హోదాలో గుర్మీత్‌కు ప్రణామం చేస్తున్నట్లు చేసిన ప్రకటన మాటేమిటి? ఇది గుర్మీత్‌పై కేసు విచారణలో వుండగానే కదా ! ఒక నిందితుడికి ప్రణామం చేస్తున్నానని ప్రధాని హోదాలో వున్న వ్యక్తి చెప్పటం దేనికి నిదర్శనం, దేశానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లు? ఇలాంటి బాబాలను వెనకేసుకు రావటంలో, వారి నుంచి లబ్ది రాజకీయంతో సహా అన్ని రకాల లబ్దులు పొందటంలో కాంగ్రెస్‌,బిజెపిలు, వాటికి అంటకాగే ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీలు పడ్డాయి తప్ప వారికి దూరంగా వుండేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

ఇతరుల మీద బురద జల్లేందుకు పూనుకున్న బిజెపి పరివారం, వారి మరుగుజ్జుయోధులు(ట్రోల్స్‌) పాలు తాగుతున్న పిల్లి చందం మాదిరి ఎవరూ తమను గమనించటం లేదని అనుకుంటున్నాయి. సాక్షి మహరాజ్‌ అనే ఒక పేరుమోసిన బిజెపి ఎంపీ గుర్మీత్‌ నేరాన్ని కోర్టు తీర్మానించిన వెంటనే స్పందించిన తీరు దేశాన్ని విస్మయపరిచింది, దాంతో నష్టనివారణ చర్యగా అతని మాటలతో మాకు సంబంధం లేదని బిజెపి నక్కజిత్తు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా కేంద్ర బిజెపి నుంచి రాలేదు. ఈ పెద్దమనిషి కూడా మత బాబాయే, ఆశ్రమాల వ్యాపారం చేస్తాడు, నోటి తుత్తర మనిషి. ఇతగాడేమన్నాడు ‘ దివ్యాత్మ గలిగిన రామ్‌ రహీమ్‌ వంటి వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చెబుతున్నది సరైనది? రామ్‌ రహీమ్‌ సింగ్‌లో దేవుడిని చూస్తున్న కోట్లాది మంది చెబుతున్నదా లేక ఫిర్యాదు చేసిన ఆ యువతిదా ? దీని మీద పెద్ద గొడవ జరుగుతున్నది, శాంతి భద్రతలు చిన్నాభిన్నమయ్యాయి, జనం చనిపోతున్నారు… దీన్ని గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జమా మసీదు అధిపతి షాహీ ఇమామ్‌ను ఈ విధంగా సంబోధించగలదా ? అతని మీద కూడా అనేక కేసులున్నాయి, అతనే మన్నా వారి బంధువా ? రామ్‌ రహీమ్‌ ఎంతో సాదాసీదాగా వుంటాడు కనుక అతన్ని వేధిస్తున్నారు.’ అని సాక్షి మహరాజ్‌ సెలవిచ్చారు. సాక్షి మహరాజ్‌ చెప్పిందాన్ని పార్టీ ఆమోదించటం లేదని దేశానికి అంతగా తెలియని కైలాష్‌ విజయవర్గీయ అనే నేత చేత బిజెపి చెప్పించింది.

మూడు రాష్ట్రాలలో హింస చెలరేగి అనేక మంది మరణించి ఎందరో గాయపడి ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా పరిస్ధితులు వుంటే ఇల్లు కాలుతుంటే బగ్గులేరుకొనే బాపతు మాదిరి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి తన సహజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు.’ సాధువులకు కొత్త ముప్పు వచ్చింది. స్వామీజీలను జైళ్లకు పంపి రాజకీయ నేతలు, ఆశ్రమాలలో వున్నవారు ఆశ్ర మ ఆస్తులను ఆక్రమించుకోవాలనుకుంటున్నారు.’ అని ట్వీట్‌ చేశాడు. అత్యాచారం కేసులో నిందితుడైన ఆశారాంబాపును సమర్ధించిన ఈ స్వామి గారు అంతటితో ఆగలేదు. తాను సాధారణ పరిభాషలో చేసిన వ్యాఖ్యను రావణ రహీమ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్‌ చిత్రించిందని ఆరోపిస్తూ ప్రతి విరాట్‌ హిందూ ప్రముఖుడిపైన తప్పుడు కేసులు పెట్టారంటూ కంచి శంకరాచార్య, రామ్‌దేవ్‌ బాబా, శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్లను మరో ట్వీట్‌లో స్వామి వుటంకించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక ట్వీట్‌లో మీడియాపైన, ఆస్తినష్టం జరగటాన్ని ఖండించారు తప్ప గుర్మీత్‌ అనుచరుల హత్యాకాండ, మరణించిన వారి ప్రస్తావన లేదు.

కోర్టు తీర్పుతో గుర్మీత్‌ను బహిరంగంగా సమర్ధించలేని స్ధితిలో పడింది తప్ప అతనితో బిజెపి సంబంధాలు దాస్తే దాగేవి కాదు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం 47 మంది హర్యానా బిజెపి సభ్యులలో 19తో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుభాష్‌ బరాలా 2014 ఎన్నికల తరువాత గుర్మీత్‌ను కలిశారు. వారిలో దాదాపు అందరూ మంత్రులయ్యారు.కోర్టు నిర్ణయం వెలువడగానే మొదలైన హింసాకాండను ప్రభుత్వ నివారించలేకపోవటం గురించి అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ స్పీకర్‌ కన్వర్‌ పాల్‌ గుజ్జార్‌ సమాధానం ఇచ్చిన తీరు గమనించాల్సిన అంశం.’ మేము ఒక్కరిమే ఈ డేరాలకు వెళ్లలేదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా వెళ్లాయి. రాజకీయవేత్తలుగా మేం అనేక మందిని కలుస్తుంటాం, వారిలో ఎవరైనా తరువాత కాలంలో తప్పుచేసిన వారిగా రుజువు అవుతారని ఎలా అనుకుంటాం, తాను చట్టాన్ని గౌరవిస్తానని గురూజీ చెప్పినట్లు ఇతరులు కూడా దాన్ని గౌరవించాలి. ఎగువ కోర్టులకు వెళ్లటానికి అవకాశాలున్నాయి, హింసాకాండ అన్నింటికీ సమాధానం కాదు,డేరా అనుచరులు శాంతిని పాటించాలి’ అన్నారు తప్ప ఖండన మాట ఒక్కటి కూడా లేదు.

 

డేరా ఆశ్రమాలను కాంగ్రెస్‌, ఇండియన్‌ లోక్‌దళ్‌ వంటి ఇతర పార్టీల నాయకులు కూడా సందర్శించారు. గతంలో కాంగ్రెస్‌కు గుర్మీత్‌ మద్దతు ప్రకటించాడు. అయితే 2014 ఎన్నికలలో డేరా సచ్చా సౌదా బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది. దాని పధకాలకు హర్యానా బిజెపి ప్రభుత్వం ఆర్ధిక తోడ్పాటును కూడా అందించింది. గుర్మీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన సినిమాలకు ఆరునెలల పాటు వినోదపన్ను కూడా మినహాయింపు ఇచ్చింది. డేరా సంస్ధ 2016లో నిర్వహించిన గ్రామీణ క్రీడలకు రాష్ట్రమంత్రి తన విచక్షణా కేటాయింపు నిధి నుంచి 50లక్షలు విరాళంగా ఇచ్చాడు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆశ్రమాన్ని సందర్శించి మరో 51లక్షలు ఇస్తానని ప్రకటించాడు. గుర్మీత్‌తో బిజెపి నేతలకు వున్న ఇన్ని సంబంధాలను వదలి పెట్టి కాంగ్రెస్‌ జడ్‌కేటగిరి భద్రత కేటాయించిందని, కొడుక్కి పిల్లనిచ్చిందని బిజెపి సామాజిక మీడియాలో ప్రచారం ప్రారంభించింది.

గుర్మీత్‌ సింగ్‌ వ్యవహారశైలి, అతని మీద వున్న కేసుల గురించి తెలియజూకుండానే బిజెపి నేతలు ఇవన్నీ చేశారా? బుర్రలో గుంజున్నవారెవరూ నమ్మరు. డేరా ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన ఒక మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ 2002 జూలైలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో గుర్మీత్‌ నిందితుడు, విచారణ చివరి దశలో వుంది. భక్తురాండ్రపై గుర్మీత్‌ అత్యాచారాల వేధింపుల గురించి మేనేజర్‌ రంజింత్‌ సింగ్‌ ఆకాశరామన్న లేఖలను ప్రచారంలో పెట్టిన కారణంగానే హత్యకు గురయ్యాడని చెబుతారు.సిర్సాలోని డేరా ఆశ్రమ ప్రధాన కేంద్రంలో జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి రాసినందుకు చట్టర్‌పతి అనే జర్నలిస్టు 2002 అక్టోబరు 23న హత్యకు గురయ్యాడు. ఆ హత్య కుట్రలో గుర్మీత్‌ భాగస్వామిగా కేసు నమోదైంది.సిబిఐ దర్యాప్తు చేసింది. పంచకుల కోర్టులోనే విచారణ చివరి దశలో వుంది.

గురువుగారి(గుర్మీత్‌) మార్గదర్శకత్వలో దేవుడిని చేరాలంటే పురుష భక్తులు తమ జననాంగాలను తొలగించుకోవాలని చెప్పి సిర్సా ఆశ్రమంలో దాదాపు నాలుగు వందల మందికి ఆపరేషన్లు చేశారనే ఆరోపణలు రావటంతో వాటిపై సిబిఐ దర్యాప్తు జరపాలని 2014 డిసెంబరు 23న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసు దర్యాప్తులో వుంది. తాను దేవుడిని అని చెప్పుకొనే గుర్మీత్‌ సింగ్‌ 2007లో సిక్కుల గురు గోవింద్‌ సింగ్‌ మాదిరి వస్త్రాలను ధరించి కనిపించటంతో హర్యానా, పంజాబ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. భటిండా పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఆకేసును 2014లో పంజాబ్‌ అకాలీ-బిజెపి ప్రభుత్వం కేసును వుపసంహరించుకుంది. సిర్సాలోని డేరా ఆశ్రమంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని సైన్యం 2010 డిసెంబరులో తెలియచేసింది. అక్రమ ఆయుధాలు, శిక్షణ గురించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరగా అబ్బే అలాంటిదేమీ లేదంటూ హర్యానా ప్రభుత్వం పేర్కొన్నది. తాజా హింసాకాండలో ఆయుధాలు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి.

గుర్మీత్‌పై ఆత్యాచారం కేసుల విషయానికి వస్తే అత్యాచారాలు జరిగిన పది సంవత్సరాల తరువాత 2009,10 సంవత్సరాలలో నమోదయ్యాయి. ఇద్దరు భక్తురాండ్ర ప్రత్యక్ష వాంగ్మూలాలు గుర్మీత్‌ను దోషిగా నిలిపాయి. సిబిఐ న్యాయమూర్తుల ముందు వారుచెప్పిన అంశాలు బాబా భయంకర రూపాన్ని వెల్లడించాయి. సిర్సా ఆశ్రమంలోని భూగర్భంలో గుర్మీత్‌ వ్యక్తిగత నివాసం వుంది. దాని రక్షణకు ఎల్లవేళలా యువతులనే నియమిస్తారు. గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మే విశ్వాసపరుల కుటుంబాలకు చెందిన యువతులను ఎంపిక చేసి వారు కూడా గుర్మీత్‌ను ఆధ్యాత్మిక గురువుగా నిజంగా నమ్ముతున్నారా లేదా అని నిర్ధారణ చేసుకున్న తరువాత నియామకాలు జరుపుతారట. అత్యాచారాలు చేసే సమయంలో గుర్మీత్‌ తానొక దేవుడినని ఫోజు పెట్టేవాడట. హర్యానాలోని యమునా నగర్‌కు చెందిన ఒక యువతి తనపై అత్యాచారం ఎలా జరిగిందో 2009 ఫిబ్రవరి 28న సిబిఐ న్యాయమూర్తి ఎకె వర్మ ముందు వివరించింది. తన సోదరుడి కారణంగా తాను 1999 జూలైలో డేరాలో భక్తురాలిగా చేరానని, పితాజీ నిన్ను క్షమించాడా అని అని  భక్తులు అడగుతుంటేే తొలుత తనకు అర్ధం కాలేదని, 1999 ఆగస్టు28/29 తేదీన తనను గుర్మీత్‌ నివాసంలోకి పిలిచించి అత్యాచారం చేసిన తరువాత ఆ మాటలకు అర్ధం స్పష్టమైందని వివరించింది. తన సోదరికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తరువాత ఆమె సోదరుడు హత్యకు గురయ్యాడు. సిర్సాకు చెందిన మరొక భక్తురాలు 2010 సెప్టెంబరు తొమ్మిదిన తన వాంగ్మూలమిచ్చింది. ఆమె తలిదండ్రులు డేరా గురించి చేసిన బోధల కారణంగా తాను భక్తురాలిగా మారానని, 1998 జూన్‌లో ఆశ్ర మంలో చేరిన తనకు నజం అని గుర్మీత్‌ నామకరణం చేశాడని, 1999 సెప్టెంబరులో గుర్మీత్‌ నివాసకాపలాదారుగా వుండగా లోపలికి పిలిచి తనపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లుగా పేర్కొన్నది.

గుర్మీత్‌ మద్దతుదారులు పంచకుల నగరాన్ని తగులబెడుతుంటే హర్యానా బిజెపి సర్కార్‌ నీరోలా వ్యవహరించింది. సాక్షాత్తూ పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆ రాష్ట్ర సర్కార్‌ను బహిరంగంగానే అభిశంచింది. హింసాకాండకు సంఘవ్యతిరేకశక్తులు కారణమని చెప్పటాన్ని ఎండగట్టింది.గుర్మీత్‌కు శిక్ష ఖరారు తేదీని ఎంతో ముందుగానే ప్రకటించారు. ఆ కేసులో అతగాడికి శిక్ష పడనుందని అనుచరులకు కూడా అనిపించిన కారణంగానే వారం రోజుల ముందు నుంచే పంచకుల, తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పెట్రోలు, పెట్రోలు బాంబులు, ఇతర మారణాయుధాలను సమీకరించారని వార్తలు ముందే వచ్చినా హర్యానా సర్కార్‌ తీసుకున్న ముందుస్తు చర్యలేమీ లేవు. గుర్మీత్‌ మద్దతుదారులు స్వేచ్చగా గుమికూడటానికి అన్ని అవకాశాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు సంఘవ్యతిరేకశక్తులే హింసాకాండకు పాల్పడితే అది తెలిసి కూడా ఏడు రోజుల పాటు ఎలాంటి వారి ప్రవేశానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.శాంతి భద్రతల అంశం రాష్ట్రాలదని అదనపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సత్యపాల్‌ జైన్‌ చెప్పటాన్ని కోర్టు తప్పుపట్టింది.’ ప్రధాన మంత్రి దేశం మొత్తానికి ప్రధాని తప్ప ఒక పార్టీకి కాదు…హర్యానా, పంజాబ్‌ దే శంలో భాగం కాదా అని ప్రశ్నించింది. అంతే కాదు, హింసాకాండలో నష్టపడిన వారు అధికారయంత్రాంగానికి దరఖాస్తు చేసుకోవాలని, వాటిని తనిఖీ చేసి కోర్టుకు నివేదించాలని, ఈ నష్టాన్ని దానికి బాధ్యులైన వారి నుంచి రాబట్టాలని కూడా కోర్టు పేర్కొన్నది.

కేరళలోని తిరువనంతపురంలో వ్యక్తిగత వివాదంలో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త హత్యకు గురైతే న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అరుణ్‌జెట్లీ పర్యటించటం, గవర్నర్‌ జోక్యం చేసుకోవటం వంటి చర్యలతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారు నానా యాగీచేశారు. గుర్మీత్‌ మద్దతుదార్ల చేతుల్లో 31 మంది హత్యకు గురికావటం, 250 మందికిపైగా గాయపడటం, పెద్ద సంఖ్యలో ఆస్తినష్టం. రైళ్లు, బస్సులు రద్దయి, కొన్ని చోట్ల కర్ఫ్యూవిధించటంతో లక్షలాది ప్రయాణీకులు, సామాన్య నానా ఇబ్బందులు పడితే, పడుతుంటే బిజెపి నేతలకు చీమైనా కుట్టకపోగా నెపాన్ని సంఘవ్యతిరేక శక్తుల మీదకు నెడతారా ? గుండెలు తీసిన బంట్లు వీరని అనిపించటం లేదా !

 

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఏఐ డేటా సెంటర్లు.. అభివృద్ధి పేరుతో పర్యావరణ ముప్పు
  • భగవత్‌ సుభాషితాలు – ఆచరణలో విరుద్ధతలు!
  • పనిచేయని మోడినోమిక్స్, భారతీయ విజ్ఞానం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భజనలు వృధా – ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా మరింత ముందుకు !
  • ఆర్థిక వృద్ధి కంటే అసమానతల పెరుగుదలే ఎక్కువ!
  • కృష్ణా డెల్టాలో నీటి సంక్షోభం – రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలు

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • September 2026
  • August 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d