• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

కాషాయదళానికి కర్రుకాల్చి వాత పెట్టిన పినరయి విజయన్‌ : బోనస్‌ , ధాన్యం పండిస్తే భారమ ంటూ లేఖ రాసిన మోడీ సర్కార్‌, ఇరుకున పడ్డ బిజెపి !

09 Monday Feb 2026

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, STATES NEWS

≈ Leave a comment

Tags

Anti Farmer BJP, BJP, Kerala Paddy Bonus Policy, LDF, Narendra Modi Failures, Pinarayi Vijayan

ఎం కోటేశ్వరరావు

ధాన్య ఉత్పత్తి పెరిగితే దేశానికి భారంగా మారుతుందా ? నేరుగా రైతులకే ఎగుమతి అవకాశాలు కల్పిస్తామంటూ కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ అదే చెబుతోంది, రాష్ట్రాలకు లేఖలు రాస్తోంది. అవర్‌ వరల్డ్‌ డాటా ప్రకారం మన పక్కనే ఉన్న చైనాలో 2022లో రోజుకు ప్రతి వ్యక్తికి సగటున 3,454 కాలరీల శక్తి నిచ్చే ఆహారాన్ని అందిస్తుండగా నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తున్న నరేంద్రమోడీ ఏలుబడిలో 2,574 కాలరీలు ఉంది. అయినప్పటికీ ధాన్యం పండించే రైతులకు బోనస్‌ ఇస్తే ఉత్పత్తి పెరుగుతుందని, అది దేశానికి భారంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర వైఖరిని ఆదివారం నాడు ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరి మద్దతు ధరకంటే అదనంగా క్వింటాలుకు కేరళ ప్రభుత్వం రు.631 అందిస్తున్నది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఎక్కువగా ఇవ్వటాన్ని నిలిపివేయాలని కేంద్ర ఆర్థికశాఖలో ఖర్చుల విభాగ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇలా ఇస్తున్న కారణంగా ధాన్య సేకరణ ఖర్చు పెరిగి ప్రభుత్వ ఖజానా మీద వత్తిడిని పెంచుతున్నదని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన అధికారిక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణాలో సన్న రకాలు పండించే వారికి బోనస్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర లేఖ ఒక్క కేరళకేనా, అన్ని రాష్ట్రాలు పంపిందా అన్నది తెలియదు. ఎలాంటి శషభిషలు లేకుండా కార్పొరేట్‌ కంపెనీలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నదని, రైతులకు ఇచ్చే బోనస్‌ను ప్రధాన ఆర్థిక భారంగా ఎందుకు భావిస్తున్నదని పినరయి విజయన్‌ ప్రశ్నించారు. ఈ లేఖలో వెల్లడించిన అభిప్రాయం వెనుక మనదేశ మార్కెట్‌ను అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు తెరవాలన్న ఆలోచన ఉందా అని కూడా ప్రశ్నించారు.వరి రైతులకు చెల్లించాల్సిన సాయాన్ని సకాలంలో విడుదల చేయటంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ లేఖను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఎల్‌డిఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ టిపి రామకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర వైఖరి ఆహార భద్రత, స్వయం సమృద్ధిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం రాసిన ఈ లేఖలో గోధుమ,వరి పంటలకు అదనపు ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పప్పు ధాన్యాలు,చమురు గింజలు,చిరుధాన్యాలకు ప్రోత్సాహాకాలను అందించాలని పేర్కొన్నారు.కేంద్ర సూచనను తిరస్కరిస్తున్నామని, వరి సాగు విషయంలో రాజీపడేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి పి ప్రసాద్‌ కేంద్రానికి లేఖ రాశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగు ప్రోతాహకాలను తాము వ్యతిరేకించటం లేదని, వరిని ఫణంగా పెట్టి ఆ పని చేయలేమని, వాటి ఉత్పత్తికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేరళ అవసరాలలో కేవలం 21శాతం మాత్రమే స్థానికంగా బియ్యం ఉత్పత్తి ఉంది, దాన్ని 30శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహం అందిస్తున్నది.

కొసమెరుపు ఏమంటే కేంద్ర చర్యతో రైతాంగంలో వెలువడిన వ్యతిరేకతతో రాష్ట్ర బిజెపి బెంబేలెత్తింది. వెంటనే ఆ లేఖను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు సోమవారం నాడు వార్త వచ్చింది. అంతవరకైతే అదో దారి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్య రైతాంగాన్ని పట్టించుకోవటం లేదని, ముఖ్యంగా ఉత్పాదక ఖర్చు, సేకరణ యంత్రాంగం, మార్కెటింగ్‌ మద్దతు ఇవ్వటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్‌ ప్రకటించలేదని కూడా చెప్పారు.కేంద్రం పంపిన లేఖలో పేర్కొన్నట్లు కేరళలో అదనపు ఉత్పత్తిలేదని, కేంద్ర నిల్వలు కూడా అదనంగా లేవని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని చెప్పిన అంశాలు కేరళకు వర్తించవని బిజెపి నేత వాపోయారు. ధాన్య సాగు విస్తీర్ణం తగ్గుతున్నదని, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు, ఆహార భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కూడా పేర్కొన్నారు.ఈ కారణంగానే కేంద్రం ఆర్థికంగా కేరళను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వరి సాగును పెంచేందుకు అదనంగా బోనస్‌ ఇస్తున్నది. దీన్ని సాకుగా చూపి మరిన్ని ఇబ్బందులు పెట్టేందుకే ఆర్థిక శాఖ రాసిన లేఖ అన్నది స్పష్టం. త్వరలో ఎన్నికలు జరగనుండగా ఇలాంటి పనులు చేస్తే వచ్చే ఇబ్బందులను ఊహించి బిజెపి నేత నిర్మలా సీతారామన్‌కు మొరపెట్టుకున్నారు.దీంతో కేంద్ర ప్రభుత్వం, బిజెపి కూడా ఇరుకునపడింది.ఇప్పుడు లేఖను వెనక్కు తీసుకున్నా, లేకున్నా బిజెపికే నష్టం.అదొక అసెంబ్లీ ఎన్నికల అస్త్రంగా మారుతుంది.

ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం గురించి పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం 2022జూలైలో వేసిన కమిటీ ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించలేదు, ఏం చేస్తున్నారని కేంద్రం అడగనూ లేదు. రైతుల పట్ల మోడీ ప్రభుత్వ శ్రద్దకు ఇది చక్కటి తార్కాణం.అమెరికా ఉత్పత్తులకు ఒక్కసారే పూర్తి స్థాయిలో మార్కెట్‌ను తెరిస్తే రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతో దశలవారీ చర్యలకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరినైనా హత్య చేయదలచుకుంటే మెల్లగా పనిచేసే విషం ఇవ్వటం తెలిసిందే. అలా ఒక్కొక్కటిగా వెల్లడిస్తే ఈలోగా జనం అలవాటు పడిపోతారన్నది భావన కావచ్చు. మంత్రి పియూష్‌ గోయల్‌ స్వయంగా చెప్పినట్లు ఇప్పుడు కుదిరింది ఒక స్వరూప అవగాహన మాత్రమే. ఉదాహరణకు ఇల్లు కట్టేటపుడు ఒక ప్లాన్‌ గీస్తారు. తరువాత పిల్లర్లు, గోడలు, స్లాబ్‌ వేస్తారు. ఇంట్లో ఏమేమి ఉండేది తరువాత మాత్రమే బయటివారికి తెలుస్తుంది. అలాంటిదే అమెరికాతో కుదిరిన అవగాహన. తాత్కాలిక ఒప్పందం పేరుతో పశుదాణా అవసరాలకు ఎర్ర జొన్నలు, పలురకాల ధాన్యాలతో చేస్తున్న ఇథనాల్‌ తయారీలో ఉప ఉత్పత్తిగా తయారయ్యే చెక్కను కూడా కూడా దిగుమతి చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దిగుమతి పన్నులేకుండా అనుమతించింది. ఇప్పటికే పత్తి దిగుమతి పన్ను తగ్గింపుతో క్వింటాలకు వెయ్యి నుంచి రెండువేల వరకు రైతాంగం నష్టపోయింది.ఈ పశుదాణా పేరుతో దిగుమతులు, అందుకోసం మనదేశంలో సాగు చేస్తున్న మొక్కజొన్న, జొన్న, ఇతర పంటల ధరల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సోయా ఆయిల్‌ దిగుమతి ఆ పంట పండించే రైతాంగంతో పాటు పామాయిల్‌, నూనె గింజల సాగుమీద ఎలాంటి ప్రతికూల ప్రభావం పడనుందో అధ్యయనం చేయాల్సి ఉంది. యాపిల్‌ పండ్ల దిగుమతులు కాశ్మీర్‌,హిమచల్‌ ప్రదేశ్‌ ఇతర ప్రాంతాల్లోని రైతాంగానికి గొడ్డలి పెట్టని యాపిల్‌ సాగుదార్ల అఖిల భారత సంఘ అధ్యక్షుడు, సిపిఐ(ఎం) నేత మహమ్మద్‌ యూసుఫ్‌ తారిగామి పేర్కొన్నారు.

అమెరికాతో ఒప్పందం రైతాంగానికి నష్టం గనుక ఆందోళన చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, దాన్నుంచి విడిపోయిన వారితో సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికన్‌ కార్పొరేట్లకు పూర్తిగా అప్పగించేశారని పేర్కొన్నాయి.వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవని, మనం ఎగుమతి చేసే వాటిపై 18శాతం పన్ను విధిస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు గిడసబారిన స్థితిలో ఉన్నందున చేసుకొనే ఒప్పందాలు వాటికి ఉపయోగం తప్ప భారత్‌కు మేలు చేయవని అనేక మంది చేస్తున్న ఆందోళనను కేంద్రం పట్టించుకోవటం లేదు. ఈనెల పన్నెండున లేబర్‌ కోడ్‌లు, ఇతర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాపిత సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే, వారికి మద్దతుగా, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఆ రోజున రైతాంగం కూడా పాల్గ్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున ట్రంప్‌, మోడీ దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని కోరాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయేతర) ఒక ప్రకటన చేస్తూ త్వరలో సమావేశం జరిపి, అమెరికాతో ఒప్పందానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిస్తామని పేర్కొన్నది. ప్రతిపక్షాలు, రైతు సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వ్యవసాయానికి ఎలాంటి ముప్పు ఉండదని పియూష్‌ గోయల్‌ చెప్పుకున్నారు.

వాణిజ్య ఒప్పందం గురించి 2025 ఫిబ్రవరి 13న డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ చర్చలకు శ్రీకారం చుట్టారు.రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంలోని అంశాలు ఇలా ఉన్నాయి. అమెరికా పారిశ్రామిక వస్తువులు మరియు పలు ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులను భారత్‌ పూర్తిగా ఎత్తివేయటం లేదా తగ్గించటం చేస్తుంది.వాటిలో పశుదాణా అవసరాల కోసం డ్రైడ్‌ డిస్టిల్లర్స్‌ గ్రెయిన్స్‌(పైన చెప్పుకున్న ఇథనాల్‌ ఉప ఉత్పత్తులు), ఎర్ర జొన్నలు,ట్రీ నట్స్‌, తాజా మరియు ప్రోసెస్‌ చేసిన పండ్లు, సోయాబీన్‌ నూనె, వైన్‌, ఆల్కహాల్‌ మరియు అదనపు ఉత్పత్తులు.దీనికి ప్రతిగా ఏప్రిల్‌ రెండవ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం భారత ఉత్పత్తులపై 18శాతం పన్నులు విధిస్తారు. వాటిలో వస్త్రాలు, దుస్తులు, తోలు వస్తువులు, చెప్పులు, ప్లాస్టిక్‌ మరియు రబ్బరు, ఆర్గానిక్‌ రసాయనాలు,గృహ అలంకరణ వస్తువులు, కళా ఉత్పత్తులు మరియు కొన్ని యంత్రాలు ఉన్నాయి.జనరిక్‌ ఔషధాలు, వజ్ర వైఢూర్యాలు, విమానాల విడిభాగాల మీ పన్నులను రద్దు చేస్తారు.అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా భావించి గతంలో పన్నులు విధించిన భారత విమానాల విడిభాగాలు,అల్యూమినియం, ఉక్కు, రాగి, వాహన ఉత్పత్తులపై రాయితీలు, కోటాలను అమలు చేస్తారు. రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి ఇంథన ఉత్పత్తులు, విమానాలు, విమానవిడి భాగాలు, వంట బొగ్గు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పతులను 500 బిలియన్‌ డాలర్ల మేర కొనుగోలు చేయాలనుందని భారత్‌ చెప్పింది. ఈ ఒప్పందంలో భారత్‌ నుంచి అమెరికా ఏ వస్తువులను, ఎంత మొత్తంలో కొనుగోలు చేసేందుకు అంగీకరించిందీ లేదా వాంఛిస్తున్నదీ వివరాలు లేవు.ఈ కారణంగానే దీన్ని ఖరారు చేసే నాటికి వాటిలో ఎన్ని చేరుస్తారో ఏమిటో జనాలకు అంతుబట్టటం లేదు గనుకనే అనేక అనుమానాలు తలెత్తాయి. ఇది అమెరికాకు అనుకూలంగా ఉందనే అభిప్రాయం రావటానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది, ఒప్పందంపై సంతకాల తరువాత అవి వెల్లడౌతాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బూతు పురాణంలో ”భారతీయ ” ప్రముఖులు : దర్శకురాలు మీరా నాయర్‌ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన హిందూత్వ శక్తులు !

07 Saturday Feb 2026

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Telugu, Uncategorized, USA, Women

≈ Leave a comment

Tags

Anil Ambani, BJP, Epstein Files, Hardeep Singh Puri, Jeffrey Epstein, Leftist Zohran Mamdani, Mira Nair

ఎం కోటేశ్వరరావు

ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌ ఈ మాట వినగానే వివాదాస్పద కాశ్మీరీ ఫైల్స్‌ సినిమా గుర్తుకు వస్తుంది. అమెరికాలో జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ స్వంత విమానాల్లో తిరిగేంత ధనవంతుడు, ఫైనాన్సర్‌, ఘరానా పైరవీ, తార్పుడుగాడు. వాడి దగ్గర ఉన్న ఫైల్స్‌ ఓ బూతుసినిమా అనుకుంటే దానిలో మన దేశానికి చెందిన ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రభుత్వ ప్రాపకం ఉన్న పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ వరకు కొందరు నటించినట్లు ప్రస్తావనలు ఉన్నాయి.నీలి చిత్రాల్లో నటించటం అంటే ‘ఏ’ దృశ్యాల్లోనే పాల్గొనాల్సిన అవసరం లేదు. అసలేం జరిగింది ? ట్రంప్‌ సర్కార్‌ విధిలేక బయటపెట్టిన లక్షలాది ఆ ఫైళ్లలో ప్రముఖ దర్శకురాలు, న్యూయార్క్‌ నగర వామపక్ష మేయర్‌ జోహ్రాన్‌ మమదానీ తల్లి మీరా నాయర్‌ పేరు కూడా ఉంది. ట్రంప్‌ను సవాల్‌ చేసి ప్రపంచ పెట్టుబడిదారీ కుంభస్థలంగా భావించే నగరానికి 34ఏండ్ల మమదానీ ఎన్నికయ్యాడు. అవకాశం కోసం చూస్తున్న అమెరికాలో వామపక్ష వ్యతిరేకులు, వారి అడుగుజాడల్లో నడిచే హిందూత్వ శక్తులు రెచ్చిపోయాయి.

కృత్రిమ మేథతో రూపొందించిన చిత్రాల్లో ఒకదానిలో బాలుడిగా ఉన్న జోహ్రాన్‌ మమ్‌దానీ, మీరానాయర్‌, బిల్‌క్లింటన్‌,జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ ఉన్నారు. ఆ ఫొటోలను ఎక్స్‌లో పెట్టటంతో లక్షలాది మంది చూశారు.ఇద్దరు పెద్ద ఉగ్రవాదులతో ఒక చిన్న ఉగ్రవాది అన్నారు. మమదానీకి శిక్షణ ఇచ్చింది ఎప్‌స్టెయిన్‌ అన్న అర్ధం వచ్చేలా ఫొటోల కింద వ్యాఖ్య రాశారు. మన దేశంలో హిందూత్వ ప్రచారం చేస్తున్న ఖాతాలలో జైపూర్‌ డైలాగ్స్‌ ఒకటి. అలెక్స్‌ జోన్స్‌ పోస్టు చేసిన ఫేక్‌ ఫొటో వీడియోను అది షేర్‌ చేసింది. మమదానీ అసలు తండ్రి ఎప్‌స్టెయిన్‌ అని వర్గాలు తెలిపాయి అంటూ వ్యాఖ్య చేశారు. ఇదే విధంగా వాయిస్‌ ఆఫ్‌ హిందూస్‌ పేరుతో ఉన్నవారు కూడా దాన్ని ప్రచారంలో పెట్టారు. నిజమేమిటో తల్లి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇలా అనేక మంది వాటిని వైరల్‌ చేశారు. దీని వెనుక ముస్లిం, వామపక్ష భావజాల వ్యతిరేక ఉన్మాదం స్పష్టంగా కనిపిస్తోంది. మీరా నాయర్‌ అమెరికాలో చదువుకున్న రోజుల్లో ఆమెకు టీచర్‌గా ఉన్న మిచెల్‌ ఎపిస్టెయిన్‌తో 1970దశకం చివరిలో వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత విడిపోయారు.ఈ ఎపిస్టెయిన్‌కు, తార్పుడు ఎపిస్టెయిన్‌కు కుటుంబం, ఇతరత్రా ఎలాంటి సంబంధాలు లేవు. ఒకరు ఆర్టిస్టు కాగా మరొకడు నేరగాడు. మీరా నాయర్‌ ఎలాంటి తప్పూ చేయనప్పటికీ ఆ పార్టీలో పాల్గొనటాన్ని అవకాశంగా తీసుకొని మమదానీ వ్యతిరేకులు, వారితో గొంతుకలిపిన హిందూత్వశక్తులు పెద్ద ఎత్తున కృత్రిమ ఫొటోలు సృష్టించి అక్రమ సంబంధాలను అంటగట్టారు.జోహ్రాన్‌ తండ్రి ఎప్‌స్టెయిన్‌ అని ప్రచారం చేశారు. ఎన్నికల్లో నిజాలను దాచి తమను మోసం చేశారంటూ మమదానీ అభిమానుల ముసుగులో కొందరు న్యూయార్క్‌లో ప్రదర్శన చేశారు. అయితే నిజనిర్ధారణ చేసిన వారు అవన్నీ తప్పుడు ప్రచారాలని, ఎలాంటి వాస్తవం లేదని తేల్చారు.

ఎప్‌స్టెయిన్‌ ఫైళ్లలో మాన్‌సూన్‌ వెడ్డింగ్‌, నేమ్‌సేక్‌, సలాంబాంబే వంటి చిత్రాలు నిర్మించినప్రముఖ దర్శకురాలు మీరా నాయర్‌ ప్రస్తావన ఉంది. ఆమె న్యూయార్క్‌లో ” సామాజిక సేవకురాలు ” గా ఉన్న ఘిస్‌లేయిన్‌ మాక్స్‌వెల్‌ ఇంట్లో జరిగిన ఒక విందులో పాల్గ్గొన్నారు. తన సినిమా అమేలియా తొలి ప్రదర్శన తరువాత 2009లో ఈ ఉదంతం జరిగింది. ప్రచార రంగంలో ఉన్న పెగీ సిగల్‌ ఆ పార్టీలో పాల్గ్గొన్నవారి గురించి ఎప్‌స్టెయిన్‌కు పంపిన ఈ మెయిల్‌లో ” సినిమా కోసం ఏర్పాటు చేసిన పార్టీ తరువాత ఘిస్‌లెయిన్‌ టౌన్‌హౌస్‌ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. బిల్‌క్లింటన్‌(అమెరికా మాజీ అధ్యక్షుడు),జెఫ్‌ బెజోస్‌(అమెజాన్‌ అధినేత) అక్కడ ఉన్నారు.జీన్‌ పిగోజీ (పెట్టుబడిదారు), డైరెక్టర్‌ మీరా నాయర్‌ తదితరులు కూడా ఉన్నారు ” అని ఉంది. సినిమా పార్టీ గనుక అనేక మంది హాలీవుడ్‌ ప్రముఖులు కూడా వచ్చారు. న్యూయార్క్‌లో ఇలాంటి పార్టీలు మామూలు. మీరా నాయర్‌-ఎపిస్టెయిన్‌ మధ్య నేరుగా సంబంధాలు ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావన లేదు. మాక్స్‌వెల్‌ కార్యకలాపాల గురించి తెలియని అనేక మంది అలాంటి పార్టీలకు సినిమా రంగానికి చెందిన వారు వచ్చేవారు. నిజానికి ఆమె సామాజిక సేవకురాలి ముసుగులో ఎప్‌స్టెయిన్‌తో కలసి తరుణ వయస్సులో ఉన్న బాలికలను ఆకర్షించి ప్రముఖులకు తార్చటంలో ప్రముఖురాలు.ఆ కేసులో 20 ఏండ్ల శిక్షపడి ఇప్పుడు జైల్లో ఉంది. చిత్రం ఏమిటంటే ఆమె తండ్రే ఎప్‌స్టెయిన్‌కు పరిచయం చేశాడు. ఇద్దరూ కలసి తిరగటమేగాక బాలికలను సరఫరా చేశారు.

ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌లో పేర్లున్న మన ప్రముఖుల గురించి చూద్దాం.వారికి ఆ తార్పుడు గాడు అమ్మాయిలను సరఫరా చేసినట్లు గానీ, వాడి నేరాలలో భాగస్వామ్యం ఉన్నట్లు గానీ ఇప్పటి వరకు వెలువడిన పత్రాల్లో లేదు.ఇప్పటికి ఆరులక్షల పేజీలు వెల్లడి కాగా ఇంకా బయటకు రావాల్సినవి ఉన్నాయి. ఇక్కడ అసలు సమస్య అలాంటి అవాంఛనీయ వ్యక్తితో విలువలు వలువల గురించి కబుర్లు చెప్పేవారు సంబంధాలు ఎందుకు పెట్టుకున్నారన్నదే బయటకు రావాల్సిన అంశం. తెరవెనుక ఇవన్నీ సాధారణమే అంటారా అదైనా చెప్పండి. మోడీ ఆన్‌ బోర్డ్‌ అనే ఇమెయిల్లో ప్రధాని పేరు ప్రస్తావన ఉంది. ఆ తార్పుడుగాడితో 2014-17 సంవత్సరాలలో కేంద్ర మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఐదుసార్లు కలిసినట్లు వెల్లడైంది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన పూరీ 2014 జనవరిలో బిజెపిలో చేరారు. అంతకు ముందు 1974 నుంచి 2013వరకు విదేశాంగశాఖ అధికారిగా వివిధ హౌదాల్లో పని చేశారు.ప్రస్తుతం పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీ గురించి జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ మరియు డోనాల్డ్‌ ట్రంప్‌ మాజీ వ్యూహకర్త స్టీవ్‌ బనాన్‌ మధ్య నడిచిన ఇమెయిల్స్‌లో ప్రస్తావన ఉంది.తాను ట్రంప్‌ అధికార యంత్రాంగం-భారత ప్రధాని కార్యాలయ అధికారులకు మధ్యవర్తిగా ఉన్నట్లు ఎప్‌స్టెయిన్‌ పేర్కొన్నాడు. 2017 జూలై ఆరున మోడీ ఇజ్రాయెల్‌ పర్యటన ముగిసిన తరువాత కతార్‌కు చెందిన జబోర్‌ వై అనే వ్యక్తి(కతార్‌ రాచకుటుంబానికి చెందిన వ్యక్తి అని వార్తలు)కి మెయిలు పంపాడు.దానిలో ” భారత ప్రధాని మోడీ సలహా తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడికి మేలు చేకూర్చేందుకు ఇజ్రాయెల్‌లో నృత్యం చేశారు, పాట పాడారు.వారు కొద్ది వారాల ముందు కలుసుకున్నారు, అది పని చేసింది ” ( ఇక్కడ నృత్యం, పాట అంటే అవసరానికి అనుగుణంగా వ్యవహరించారని అనుకోవాలేమో) మోడీ ఇజ్రాయెల్‌ పర్యటన ఖ్యాతి తనదే అని కూడా పేర్కొన్నాడు. ఒక భారత ప్రధాని తొలిసారిగా ఇజ్రాయెల్‌ను సందర్శించటమే గాక తరువాత విదేశాంగ విధానంలో నిర్ణయాత్మక మార్పులు చేసిన ఖ్యాతి మోడీకి దక్కిందన్నది స్పష్టం. ఈ ఫైళ్లలో ఉన్న అంశం మీద మన విదేశాంగశాఖ స్పందించింది.ప్రధాని పర్యటన నిజమే గానీ శిక్షపడిన ఒక నేరగాడు పేర్కొన్న అంశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎప్‌స్టెయిన్‌ లేదా ఇతర విదేశీ సలహాల ప్రభావంగానీ పర్యటన మీద లేదని వ్యాఖ్యానించింది. ఆ సమయంలో ఎప్‌స్టెయిన్‌ ట్రంప్‌ యంత్రాంగంతో సంబంధాలలో ఉన్నాడన్నది, భారత వ్యవహారాల్లో వేలుపెట్టాడన్నది వాస్తవమే అన్నది కొందరి అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితిలో నిజానిజాలను ఎవరూ బయటపెట్టరన్నది వేరే చెప్పనవసరం లేదు.

నరేంద్రమోడీ నేరుగా కలిసినట్లు ఎప్‌స్టెయిన్‌ కూడా చెప్పలేదు. అతగాడి హవా నడిచిన సమయంలో కేంద్ర మంత్రి హరదేవ్‌ సింగ్‌ పూరీ 2014-17 సంవత్సరాలలో ఐదుసార్లు పూరీ కలిసినట్లు ఎప్‌స్టెయిన్‌ దినచర్య డైరీలో పూరీ పేరు ఉంది. మూడు సార్లు న్యూయార్క్‌ నివాసంలో భేటీ అయినట్లు స్పష్టంగా ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2014 నవంబరులో భారత డిజిటల్‌ ఎకానమీ, పెట్టుబడులకు ఉన్న మంచి అవకాశాల గురించి పూరీ ఒక మెయిల్‌ పంపారు.సిలికాన్‌ వాలీలోని,టెక్‌ కంపెనీల ఉన్నతాధికారులు, పెట్టుబడిదారులతో పూరీని కలిపేందుకు చురుకుగా ఎప్‌స్టెయిన్‌ పని చేసినట్లు ఒక మెయిల్లో ఉంది. లింక్‌డ్‌ ఇన్‌ కంపెనీ స్థాపకుడితో భారత్‌లో పెట్టుబడి అవకాశాల గురించి పూరీ చర్చించినట్లు కూడా వెల్లడైంది.తాను ఎనిమిదేండ్లు న్యూయార్క్‌లో ఉన్నానని, మూడు సార్లు కలిసింది నిజమే అని అంతర్జాతీయ పీస్‌ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తుండగా మూడుసార్లు కలిసింది నిజమే అని, అది పని సంబంధంగా, చాలా పరిమితమైన కలయిక అని, తనకు అతగాడి నేరజీవితం గురించి తెలియదని వైర్‌ పోర్టల్‌ అడిగిన ప్రశ్నకు పూరీ సమాధానంగా చెప్పారు.తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని చెప్పినట్లుగా కేంద్ర మంత్రి సమాధానం ఉంది.అంతర్జాతీయ శాంతి వ్యవహారాల్లో ఎప్‌స్టెయిన్‌కు ఉన్న సంబంధం ఏమిటో ఒక రాయబారిగా పూరీ ఏమి చర్చించారో అంతుబట్టదు. ఆ భేటీల తరువాతే గురుదీప్‌ సింగ్‌ పూరీ కేంద్ర మంత్రివర్గంలో 2017లో చేరారు. చిత్రం ఏమిటంటే ఈ ఫైళ్ల గురించి తొలి సమాచారం 2025 నవంబరులోనే వెల్లడైంది. ఇదంతా వట్టిదే అని అప్పుడు బిజెపి ప్రతినిధి ప్రదీప్‌ భండారీ కొట్టి పడేశారు. ఇప్పుడు ఆ పెద్దమనిషి తలెక్కడ పెట్టుకున్నారో తెలియదు.

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ పేరుతో మందిని ముంచిన అనిల్‌ అంబానీ నడిపిన వ్యవహారాలు ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌లో స్పష్టంగా ఉన్నాయి. 2017మార్చినెల 16న అంబానీ పంపిన ఒక వర్తమానం ఇలా ఉంది.” హలో నేను ఢిల్లీలో ఉన్నాను.జారెడ్‌(ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుషనర్‌) మరియు బానన్‌ (స్టీవ్‌ బానన్‌ ట్రంప్‌ ప్రధాన వ్యూహకర్త)లను నేను కలుసుకొనేందుకు మీ సాయం కావాలని ”నాయకత్వం ” ( ప్రధాని కార్యాలయం) వాంఛిస్తున్నది. దయచేసి సలహా ఇవ్వండి.ప్రధాని వాషింగ్టన్‌ పర్యటన జరపబోతున్నారు. అని అనిల్‌ అంబానీ పేర్కొన్నాడు. ఇదంతా ఆ తరువాత 2017 జూన్‌లో జరిపే అమెరికా పర్యటనకు ముందు జరిగింది.2017 నుంచి 2019వరకు అనిల్‌ అంబానీ -ఎప్‌స్టెయిన్‌ మధ్య నిరంతర సంబంధాలు ఉన్నట్లు ఫైళ్లలో బయటపడింది.వారేమి చర్చించుకున్నారంటే అమెరికా, భారత్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పెట్టుబడి వ్యూహాలు, ట్రంప్‌ యంత్రాంగంతో అప్పాయింట్‌మెంట్లు,మోడీ అమెరికా, ఇజ్రాయెల్‌ యాత్రల గురించి.ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటనకు ముందు, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ బరాక్‌ను ఎలా కలుసుకోవాల్సిందీ ఒక మెయిల్‌లో ఎప్‌స్టెయిన్‌ అంబానీకి సూచించాడు. ఇద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పాడు. మోడీ పర్యటనపై ఇజ్రాయెల్‌ వ్యూహం గురించి చర్చించారు. ఆ సమయంలో అనిల్‌ అంబానీ రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇజ్రాయెల్‌ ప్రభుత్వ రంగ సంస్థ రాఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కంపెనీతో సంయుక్త ప్రాజెక్టు నడుస్తున్నది. మోడీ సర్కార్‌ రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో అనిల్‌ అంబానీ పాత్ర, అతగాడికి ఆ విమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీ దసాల్ట్‌తో విమానాల విడిభాగాల తయారీపేరుతో కుదిరిన ఒప్పందం గురించి తెలిసిందే. అంతకు ముందు అంబానీలు ఎన్నడూ ఆ రంగంలో లేరు. అనిల్‌ అంబానీ దివాలా ప్రకటించినపుడు 2019లో తనకు 75 కోట్ల డాలర్ల రుణ సేకరణకు సలహా ఇవ్వాలని ఎప్‌స్టెయిన్ను కోరినట్లు వెల్లడైంది. వీటి గురించి వివరణ కోరగా అంబానీ కంపెనీ నుంచి స్పందన లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. రాజకీయ నేతలు, వాణిజ్య కంపెనీల యజమానుల సంబంధాలు గురించి ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.ఎపస్టెయిన్‌ వంటి బాపతును దేనికైనా వినియోగించుకోవచ్చని కూడా తెలిసిందే.

భారతీయ-అమెరికన్‌ రచయిత,నీతి బోధలు చేస్తూ, ప్రత్యామ్నాయ వైద్యం గురిచి ప్రచారం చేస్తున్న దీపక్‌ చోప్రా కూడా ఎప్‌స్టెయిన్‌తో సంబంధాలు నెరిపినట్లు బయటపడింది. అతనితో సంబంధాలు నిజమే గానీ తానెలాంటి నేరాలకు పాల్పడలేదని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వారి మధ్య 2016-2019 మధ్య ఇమెయిల్స్‌ నడిచాయి.పన్నెండుసార్లు వారు కలుసుకున్నట్లు తేలింది.డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవ భార్య మర్లా మాపుల్స్‌ సమాచారం చెప్పమని, అది మన మధ్యే ఉంటుంది తప్ప ఇతరులెవరితో చెప్పనని దీపక్‌ మిశ్రా 2016 జూలైలో ఎప్‌స్టెయిన్‌కు మెయిలు చేశారు.అమె వివరాలు తెలియచేస్తూ ఆమె గర్భవతా కాదా అన్నదాని గురించిన పందెంలో తాను ఓడిపోయినట్లు కూడా ఎప్‌స్టెయిన్‌ పేర్కొన్నాడు. ఈ వ్యవహారాలు బయటపడిన తరువాత నెలకు పదిడాలర్లు చెల్లిస్తే ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తానంటూ దీపక్‌ మిశ్రా జనాలను ఆకట్టుకొనేందుకు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. మనదేశానికి చెందిన వారు ఎప్‌స్టెయిన్‌తో నిర్వహించిన లావాదేవీలు, సంబంధాల గురించి మన ప్రధాన స్రవంతి మీడియా మౌనం దాల్చింది.నిజానిజాలను చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం, బిజెపి వాటిని కొట్టిపారవేయటం, మౌనం దాల్చి మూసిపెట్టేందుకు చూస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

యోగులు-స్వాముల కొట్లాట : సిఎం ఆదిత్యనాధ్‌ను నకిలీ హిందువుగా ప్రకటిస్తా , శంకరాచార్య అవిముక్తేశ్వరానంద !

02 Monday Feb 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

Avimukteshwaranand saraswati, BJP, fake Hindu, Jyotish Peeth controversy, Narendra Modi, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు

వేదాలు నాలుగు, వాటి ప్రాతిపదికన దేశంలో ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలకు నలుగురు జగద్గురువులైన శంకరాచార్యలు ఉన్నారు. ఒడిషాలోని పూరీలో ఉన్న గోవర్ధన మఠం రుగ్వేదంతో సంబంధం కలిగినది, నిశ్చలానంద అధిపతి, గుజరాత్‌లోని ద్వారకలో ఉన్నది శారదా పీఠం, సామవేదం ప్రకారం నడుస్తుంది, స్వామి సదానంద సరస్వతి, కర్ణాటక శృంగేరిలో ఉన్న శారదా పీఠం యజుర్వేదాన్ని అనుసరిస్తుంది, స్వామి భారతీ తీర్థ.నాలుగవది ఉత్తరాఖండ్‌లో ఉన్న జ్యోతిర్మ్‌ఠం. ఇది అధర్వణవేదాన్ని పాటిస్తుంది. స్వామి అవిముక్తేశ్వరానంద అధిపతి. ఆయన నియామకాన్ని కొందరు సవాలు చేయటంతో అది సుప్రీం కోర్టుకు చేరింది.ఈ శంకరాచార్యకు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధ్య పెద్ద యుద్దమే నడుస్తున్నది. మాఘ మాసం సందర్భంగా జనవరి 18న మౌనీ అమావాస్య రోజున ప్రయాగరాజ్‌లో పల్లకిలో ఊరేగుతూ త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు రాగా కుదరదని అధికార యంత్రాంగం అడ్డుకుంది.రద్దీ ఎక్కువగా ఉందని సాకు చెప్పింది, కావాలంటే అందరి మాదిరి కాలినడకన వెళ్ల వచ్చంటూ అసలు ముందు మీరు శంకరాచార్య అని రుజువు ఏమిటి అని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి అండ లేదా ప్రమేయం లేకుండా ఇలా జరుగుతుందని ఎవరూ నమ్మటం లేదు. మొత్తం మీద ఈ వివాదం కొత్తమలుపు తిరిగింది. మార్చినెల పదవ తేదీలోగా ఆవును రాష్ట్రమాతగా ప్రకటించాలని, గోవధను, గొడ్డు మాంసాన్ని నిషేధించాలని లేనట్లయితే పది, పదకొండు తేదీలలో లక్నోలో జరిగే సాధు, సంతుల సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ” నకిలీ హిందువు ” గా ప్రకటిస్తామని అవిముక్తేశ్వరానంద ప్రకటించారు.

తానే జ్యోతిర్మఠ శంకరాచార్యనని, తాను చూపిన రుజువును పదిహేను రోజుల తరువాత కూడా తిరస్కరించలేదంటే ఇంతకంటే వేరే ఆధారం ఏమి కావాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని పీఠాధిపతి ప్రశ్నించారు. జనవరి 29న వారణాసిలో నిర్వహించిన పత్రికా గోష్టిలో ముఖ్యమంత్రికి అవిముక్తేశ్వరానంద సవాల్‌ విసిరారు. యోగి ప్రభుత్వం తనను వేధిస్తున్నదని 1966లో కరపత్రి జీ మహారాజ్‌ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నదని అన్నారు.సిఎం సన్నిహితుడు రామభద్రాచార్య తనకు వ్యతిరేకంగా కుట్రపన్నారని, వేధిస్తున్నారని ఆరోపించారు. ఇరవై నాలుగు గంటల్లో తన ఆచార్యత్వం గురించి రుజువులు చూపాలని అడిగారని, చూపి పదిహేను రోజులు కావస్తున్నా ప్రభుత్వం వాటిని కాదని తిరస్కరించలేదని చెప్పారు. యోగి నిజమైన హిందువో కాదో నిరూపించుకోవాలన్నది ఇప్పుడు ప్రశ ్న అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం క్షమాపణలు చెప్పి రక్షణ కల్పిస్తే ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రయాగరాజ్‌లో మాఘపూర్ణిమ రోజున పవిత్ర స్నానం చేస్తారని అవిముక్తేశ్వరానంద మీడియా ప్రతినిధి శైలేంద్ర యోగిరాజ్‌ చెప్పారు గానీ జరిగినట్లు వార్తలు లేవు. మౌనీ అమావాస్య రోజున తన పరివారంతో స్నానమాచరించటానికి అనుమతి నిరాకరించచటంతో జనవరి 18 నుంచి పది రోజుల పాటు ప్రయాగరాజ్‌లోని తన శిబిరంలోనే నిరసన దీక్ష చేసి 28వ తేదీన వెళ్లిపోయారు. తన అంతరాత్మ సంతృప్తికోసం సంగమంలో స్నానమాచరించాలని తలపెట్టానని అనుమతించకపోవటంతో ఎంతో కలచివేతకు గురయ్యానని, స్నానమాచరించకుండానే బరువైన హృదయంతో వెళ్లిపోతున్నట్లు శంకరాచార్యచెప్పారు. తానిలాంటి పరిస్థితిని ఎన్నడూ ఊహించలేదన్నారు. స్వామి అనుచరులు బారికేడ్‌ను ధ్వంసం చేసినట్లు పోలీసులు ఆరోపించారు.శంకరాచార్య ఎవరనేది సుప్రీం కోర్టులో వివాదం ఉన్నందున మీరు శంకరాచార్య అని ఎలా చెప్పుకుంటారంటూ అధికార యంత్రాంగం నోటీసు జారీ చేసింది.

శంకరాచార్య పట్ల అనుసరించిన వైఖరి దురహంకారానికి నిదర్శనం, తీవ్ర అరిష్టదాయకమని సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ వర్ణించారు.యోగి ప్రభుత్వ చర్యతో ప్రపంచంలోని సనాతనులందరూ బాధపడ్డారని, అధికారం బిజెపిని గుడ్డిదానిగా మార్చిందన్నారు.కాంగ్రెస్‌ పార్టీ కూడా శంకరాచార్యకు మద్దతుగా నిలిచింది.తప్పిదాన్ని సరిచేసుకొనేందుకు మాఘపూర్ణిమ రోజున లాంఛనాలతో స్నానమాచరించేందుకు అధికారులు చూస్తున్నారని అవిముక్తేశ్వరానంద చెప్పగా అలాంటిదేమీ లేదని అధికారవర్గాలు చెప్పాయి.తనకు క్షమాపణ చెప్పాలని, రానున్న రోజుల్లో నలుగురు శంకరాచార్యలకు ప్రామాణిక లాంఛనాలతో పవిత్ర స్నానాలు ఆచరించే విధంగా నిబంధనలు రూపొందించాలని స్వామి డిమాండ్‌ చేశారు. జనవరి 18 ఉదంతంపై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలైంది. ప్రయాగరాజ్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌, మేలా అధికారిపై కేసులు దాఖలు చేయాలని కూడా దానిలో కోరారు. యోగి ఆదిత్యనాధ్‌పై అవిముక్తేశ్వరానంద చేసిన ఆరోపణలతో మనోభావాలు దెబ్బతిన్న కారణంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు రాష్ట్ర జిఎస్‌టి ఆయోధ్య ఉపకమిషనర్‌ ప్రశాంత కుమార్‌ సింగ్‌ ప్రకటించారు.రాజీనామాను నేరుగా గవర్నర్‌కు పంపారు, అయితే దాన్ని ఆమోదించిందీ లేనిదీ తెలియదు..

జ్యోతిర్మఠ్‌ పీఠం శంకరాచార్య గురించి గత ఎనిమిది దశాబ్దాలుగా వివాదాలు నడుస్తున్నాయి.అవిముక్తేశ్వరానంద 2022 నుంచి శంకరాచార్యగా గుర్తింపు పొందారు. అయితే అప్పటి నుంచీ వివాదం ప్రారంభమైంది. ఎక్కడా లేని విధంగా స్వామి రామకృష్ణ తీర్ధ మరణించిన తరువాత గత 168 సంవత్సరాల నుంచి ఈ పీఠానికి గుర్తింపు పొందిన శంకరాచార్యల గురించి వివాదాలు నడుస్తున్నాయి. అనేక మంది తమను పీఠాధిపతులుగా ప్రకటించుకొని కొనసాగారు.స్వాతంత్య్రానికి ముందు 1941లో మిగిలిన ముగ్గురు శంకరాచార్యలు ఉత్తరాఖండ్‌ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాలని స్వామి బ్రహ్మానంద సరస్వతిని కోరారు. ఆయన 1953 మే 20వ తేదీన మరణించినప్పటి నుంచి వారసత్వం గురించి ఇప్పటి వరకు వివాదాలు కొనసాగుతున్నాయి.బ్రహ్మానంద శిష్యుడు హరిహరానంద పీఠాన్ని అలంకరించేందుకు నిరాకరించారు. వారసుడిగా శాంతానంద సరస్వతి అని బ్రహ్మానంద విల్లు రాసినట్లుగా చెప్పటమే దీనికి కారణం. విల్లు చట్టబద్దతను ఇతర శంకరాచార్యలు ప్రశ్నించారు. ఆది శంకరుడు మహాత్మన్యాయ మహానుశాసనం ప్రకారం విల్లుద్వారా వారసుల నియామకం చెల్లదని వారు పేర్కొన్నారు. తరువాత కూడా వివాదాలు కొనసాగాయి. 1973లో స్వామి కృష్ణబోధ్‌ మరణంతో స్వామి స్వరూపానంద నియామకం జరిగింది. తరువాత వాసుదేవానంద సరస్వతిని కూడా శంకరాచార్యగా గుర్తించటంతో ఒకేసమయంలో ఇద్దరు శంకరాచార్యలు తయారయ్యారు. ఇది కోర్టుకెక్కటంతో 2017లో వీరిద్దరినీ గుర్తించేందుకు అలహాబాద్‌ హైకోర్టు నిరాకరించింది. స్వామి స్వరూపానంద 2022 సెప్టెంబరు 11న మరణించారు. ఆ మరుసటి రోజే తానే నూతన శంకరాచార్య అని స్వామి అవిముక్తేశ్వరానంద ప్రకటించుకున్నారు. అయితే అక్టోబరు 16నఆచారం ప్రకారం నిర్ణయించిన పీఠాధిపత్య స్వీకార కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు నిలిపివేసింది. అయితే కోర్టు ఉత్తరువులో పలు చోట్ల అవిముక్తేశ్వరానందను శంకరాచార్యగా ప్రస్తావించటం సమస్యను ఝటిలం చేసింది.కోర్టు అలా పేర్కొన్నది కనుక తానే ఆ స్థానంలో ఉన్నట్లు అప్పటి నుంచి అవిముక్తేశ్వరానంద చెబుతున్నారు.పీఠంలో కొనసాగుతున్నారు. సాంప్రదాయాలు, చట్టపరమైన అంశాల గురించి కోర్టు ఇంతవరకు తేల్చలేదు. దీనికి తోడు రాజకీయనేతలు కూడా వేలుబెట్టటం మరింతగా వివాదాన్ని పెంచింది. ఈ కారణంగానే ఉత్తర ప్రదేశ్‌ అధికార యంత్రాంగం మీరు శంకరాచార్యులనేందుకు ఆధారాలేమిటని ప్రశ్నించింది, పల్లకిలో ఊరేగుతూ స్నానానికి వెళ్లటాన్ని అడ్డుకుంది.

పదిరోజుల పాటు జరిపిన ధర్నా సమయంలో మాటల తూటాలు పేలాయి. యోగి ఆదిత్యనాథ్‌ను హిందువుగా పిలవాల్సిన అవసరం లేదని, అతన్ని తాను అక్బర్‌, ఔరంగజేబ్‌ అంటానని, సదరు వ్యక్తి దేవాలయాల కూల్చివేతకు మద్దతు పలికాడని అవిముక్తిశ్వేరానంద ధ్వజమెత్తారు. ధర్మం పేరుతో కొందరు వ్యక్తులు బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ పేరు పెట్టకుండా యోగి ఆదిత్యనాథ్‌ ధ్వజమెత్తారు.ఇలాంటి వారి పట్ల సనాతన ధర్మాన్ని నమ్మేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. హర్యానాలో ఒక మతపరమైన క్రతువులో మాట్లాడుతూ ఒక యోగి అంటే అన్నింటినీ త్యజించిన వాడు, ఒక స్వామి అంటే ధర్మం, జాతికంటే గొప్పవ్యక్తి కాదు. అతనికేమీ వ్యక్తిగత ఆస్థి ఉండదు,అనేక మంది కాలనేమి వంటి వారు ఉన్నారు.(రామాయణంలో హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవినీ మూలిక తెచ్చేందుకు హిమాలయాలకు ఎగిరి వెళుతున్న సమయంలో కాలనేమి అనే రాక్షసుడు మునివేషంలో వచ్చి తప్పుదారి పట్టించేందుకు చూస్తాడు) స్వాముల పేరుతో ఉండేవారు ధర్మం ముసుగు వేసుకుంటారు.వారు సనాతన ధర్మాన్ని బలహీన పరిచేందుకు కుట్ర చేస్తున్నారు. అయితే యోగి మాట్లాడిన కొద్ది గంటల తరువాత అవిముక్తేశ్వరానందకు మద్దతుగా ఉత్తర ప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ముందుకు వచ్చారు. భగవాన్‌ శంకరాచార్య లేదా గౌరవనీయమైన స్వాములు, ఆచార్యలు ఎవరి పట్లా కూడా అగౌవరవాన్ని ప్రదర్శించకూడదని, అలాంటి ఉదంతాలు జరిగినట్లు వెల్లడైతే విచారణ జరుపుతామని, తప్పుచేసిన వారి మీద చర్య తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి మీడియాకు చెప్పారు. శంకరాచార్యకు పాదాభివందనం చేస్తాం, పవిత్ర స్నానం ఆచరించాలని కోరతాం. వివాదం దాంతో సమసి పోవాలి. ఎవరైనా తప్పు చేస్తే విచారణ జరిపి బాధ్యులైన వారి మీద చర్య తీసుకుంటామని చెప్పారు.శంకరాచార్యను అవమానించటం అంటే సనాతన ధర్మాన్ని అవమానించటమే అని బిజెపి నేత సునీల్‌ భలారా విమర్శించారు. ప్రయాగరాజ్‌ అధికారులు దయ్యాల మాదిరి అవమానించారని, శంకరాచార్య శిష్యుల శిఖలు పట్టుకొని లాగారని అన్నారు.బిజెపి నేతల ఈ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో ఆ పార్టీలో ఉన్న గందరగోళంతో పాటు విబేధాలు కూడా వెల్లడయ్యాయి. వ్యక్తులుగా అభిప్రాయాలు వెల్లడించటం మినహా పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేని దుస్థితిలో ఉంది. అనేక మంది సంత్‌లు, ఆలిండియా అఖారాపరిషత్‌ కూడా అవిముక్తేశ్వరానందకు మద్దతు పలికింది.యోగి-శంకరాచార్య మధ్య వివాదం కొత్తగా తలెత్తింది కాదు,పరోక్షంగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నది,అవిముక్తేశ్వరానంద బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందగా యోగి ఠాకూర్‌.గతేడాది కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట, మరణాల గురించి యోగి అబద్దాలు చెప్పినందున రాజీనామా చేయాలని గతేడాది జనవరిలోనే అవిముక్తేశ్వరానంద డిమాండ్‌ చేశారు.నలభై రోజుల్లో ఆవును రాష్ట్రమాతగా ప్రకటించాలని,గొడ్డు మాంస ఎగుమతుల నిషేధం చేయకపోతే యోగిని నకిలీ హిందువుగా ప్రకటిస్తామని శంకరాచార్య చేసిన ప్రకటన ఏమౌతుందో ఆసక్తి కలిగిస్తోంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !

25 Sunday Jan 2026

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, BJP, Governors Walkout, MK Stalin, Narendra Modi, o, Puppet Rulers, Sidda Ramaiah

ఎం కోటేశ్వరరావు

కుక్క మనిషిని కరిస్తే సాధారణం, అదే మనిషి కుక్కను కరిస్తే పెద్ద వార్త. జర్నలిజం విద్యార్ధులకు చెప్పే ఉదాహరణ ఇది. అదే మాదిరి చట్టసభల నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు వాకౌట్‌ చేయటం పెద్ద వార్త కాదు, కానీ గవర్నర్లు అదే పని చేస్తే సంచలనం. కానీ మన మీడియా చర్మాలు మొద్దుబారటంతో దాని గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. పెద్దన్న నరేంద్రమోడీ పైనుంచి గమనిస్తున్నారన్న భయంతో రాజ్యాంగ పరిరక్షణకు మద్దతుదార్లం అని చెప్పుకొనే వారు కూడా గొణుగుతున్నారు తప్ప నోరు విప్పటం లేదు. మన దేశంలో అపహాస్యం పాలైన వాటిలో గవర్నర్ల వ్యవస్థ ఒకటి. తొలిసారిగా 1959 జూలై 31న రాష్ట్రగవర్నర్‌ సిఫార్సుతో ఆర్టికల్‌ 356ను ఉపయోగించి ఎన్నికలలో కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వంలో అధికారానికి వచ్చిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. భూ సంస్కరణల చట్టం తెచ్చి అమలు జరిపేందుకు పూనుకున్న కారణంగా అక్కడ ఉన్న అన్ని రకాల కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఏకమై విమోచన సమరం పేరుతో సాగించిన ఆందోళనను సాకుగా చూపి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందనే సాకుతో ఆ దుండగానికి పాల్పడ్డారు. నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే సదరు ఆందోళన వెనుక ఉన్నారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌లో సిపిఐ(ఎం) నాయకత్వాన ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం బలనిరూపణకు సిద్దం అవుతున్న తరుణంలో గవర్నర్‌ ధరమ్‌ వీర అధర్మంగా వ్యవహరించి ఆ ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేయటంతో రాష్ట్రపతి పాలన విధించారు. నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని వ్యతిరేకించే పార్టీలు రాష్ట్రాలలో అధికారానికి వస్తే గవర్నర్ల ద్వారా కుట్రలు, కూలదోయించటంలో ఎవరూ తక్కువ తినలేదు, 2014 నుంచి మోడీ సర్కార్‌ నియమించిన గవర్నర్లు బరితెగించి వ్యవహరిస్తున్నారు.

పార్టీ ఏజంట్ల మాదిరి గవర్నర్లు వ్యవహరిస్తున్నారని, ఎన్నికైన ప్రభుత్వాల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా వ్యవవరిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. చట్టసభలను ఉద్దేశించి ఏడాది ప్రారంభంలో గవర్నర్లు ప్రసంగించాల్సిన అవసరం లేకుండా రాజ్యాంగ సవరణ చేయటమే పరిష్కారమని, ఇతర పార్టీలతో కలసి దీని గురించి రానున్న పార్లమెంటు సమావేశాలలో లేవనెత్తుతామని చెప్పారు. జనవరి 22(2026)న కర్ణాటక గవర్నర్‌ తహ్వార్‌చంద్‌ గెహలట్‌ కేవలం కొన్ని పేరాల ప్రసంగాన్ని మాత్రమే చదివి మిగతాది వదలి ఉభయ సభల సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష బిజెపి, జెడిఎస్‌ సభ్యులు కూడా అనుసరించారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం తయారు చేస్తుందన్నది తెలిసిందే. దానిలో పదకొండు పేరాలను చదివేందుకు గవర్నర్‌ నిరాకరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని బదులు ఒక స్కీమును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆ ప్రసంగంలో విమర్శించారు. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 176, 163 ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం తయారు చేసిన ప్రసంగాన్ని విధిగా చదవటం తప్ప గవర్నర్‌కు మరొక అవకాశం లేదని, తన స్వంత అభిప్రాయాలను దానిలో చొప్పించే అధికారం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గవర్నర్‌ చర్యను ఖండించారు. అంతకు ముందు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే భాగాలు ఉన్నందున అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగంలో కొన్ని భాగాలను వదలి, కొన్నింటిని తాను చేర్చి చదివారు.తాము సూచించిన భాగాలను చేర్చకుండా ప్రసంగాన్ని రూపొందించారని లోక్‌భవన్‌ పేర్కొన్నది.కేరళకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యవిధానాన్ని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్రవేయని గవర్నర్‌ చర్యను విమర్శిస్తూ రాసిన భాగాలను గవర్నర్‌ విస్మరించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అనవసరమైన, ఆధారం లేని అంశాలు మంత్రివర్గం రూపొందించిన ప్రసంగంలో ఉన్నాయని, వాటిని తొలగించాలన్న తమ సూచనను పట్టించుకోకుండా రెండవసారి కూడా తొలి ముసాయిదానే పంపారని గవర్నర్‌ కార్యాలయం ఆరోపించింది. ఏ అంశ ం అవసరమో కాదో నిర్ణయించే విచక్షణ అధికారం గవర్నర్‌కు లేదు. అయితే గవర్నర్‌ ఏమి ప్రసంగించినప్పటికీ అసెంబ్లీ రికార్డులలో మంత్రివర్గం రూపొందించిన ప్రసంగపాఠమే ఉండాలని ప్రభుత్వం కోరింది. గతంలో మాదిరే మంత్రివర్గం తయారు చేసినదే రికార్డులలో ఉంటుందని స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌ ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ చర్యలు, విధానాలనే కాదు తొలిసారిగా గవర్నర్‌ చర్యను కూడా పశ్చిమబెంగాల్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ మంత్రివర్గం రూపొందించిన ప్రసంగంలో విమర్శించింది.1967లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టిన తరువాత 1969లో ఎన్నికలు జరిపారు. తిరిగి వామపక్షాలతో కూడిన ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రూపొందించిన ప్రసంగంలో గవర్నర్‌ చర్యను తప్పుపట్టింది. తన చర్యను తానే విమర్శించినట్లు అవుతుంది గనుక ఆ పేరాను చదివేది లేదని ధరమ్‌ వీర తిరస్కరించారు. తరువాత కూడా బెంగాల్లో పునరావృతమైంది. గవర్నర్‌ బిడి పాండేను బంగ్లా డామన్‌ పాండే( బెంగాల్‌ను నాశనం చేస్తున్న పాండే)గా వామపక్షాలు వర్ణించాయి.1984లో గవర్నర్‌ ఏపి శర్మ కొల్‌కతా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా తాను ఎంపిక చేసిన వ్యక్తిని తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాబితా నుంచి నియమించేందుకు తిరస్కరించారు.ఇలాంటి అనేక చర్యలకు పాల్పడుతుండటంతో గవర్నర్‌ కార్యక్రమాలను బహిష్కరించాలని వామపక్ష సంఘటన నిర్ణయించింది. గవర్నర్‌ పదవిని రద్దు చేయాలని సర్కారియా కమిషన్‌కు నివేదిక పంపింది.2007లో నందిగ్రామ్‌ హింసాకాండ సందర్భంగా గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ (మహాత్మా గాంధీ మనవడు) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు.ఈ డొంకతిరుగుడెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గంటే పోతుందిగా అని అప్పుడు సిపిఐ(ఎం) నేతలు గడ్డిపెట్టారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా గవర్నర్‌ను సమర్ధించిన మమతా బెనర్జీకి తరువాత బిజెపి నియమించిన గవర్నర్లు అదేపని చేస్తే భగ్గుమన్నారు,కొంత మందికి అంతే, తమదాకా వస్తే తప్ప తత్వం బోధపడదు. తరువాత కాలంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికై అర్ధంతరంగా రాజీనామా చేసిన బిజెపి అసంతృప్త నేత జగదీప్‌ థంకడ్‌ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్నపుడు బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు.

మనదేశంలో గవర్నర్లను మూడు తరగతులుగా చూడాలి. స్వాతంత్య్రానికి ముందు, తరువాత 1967వరకు, ఆ తరువాత వ్యవహరించిన తీరులో స్పష్టంగా దిగజారుడు కనిపిస్తుంది. బ్రిటీష్‌ వారి కాలంలో గవర్నర్‌ అంటే ప్రభుత్వ ప్రతినిధి, సర్వాధికారి. మనదేశంలోని ప్రోవిన్స్‌లకు అధిపతులుగా ఉన్నారు.ప్రజాప్రభుత్వాలు లేవు, స్వాతంత్య్రానికి ముందు 1935 నుంచి పరిమితంగా ప్రావిన్సు( రాష్ట్ర ) ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశమిచ్చినా వాటికి పెద్దగా అధికారాలు లేవు, గవర్నర్లే సర్వస్వం. తరువాత రెండు దశాబ్దాలలో దేశంలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలే లేవు(1957లో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తప్ప, దాని గురించి ముందే చెప్పుకున్నాం) గవర్నర్లుగా నియమితులైనవారు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నతరం వారే అత్యధికులు కనుక రాజ్యాంగ విలువలను పాటించారు.గవర్నర్ల గురించి జనానికి పెద్దగా తెలియదంటే అతిశయోక్తి కాదు. తొలిసారిగా కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోయిన 1967 నుంచి ఇప్పటి వరకు చూస్తే రాజకీయ పార్టీలలో తమకు పోటీగా వస్తున్నారని పక్కకు తప్పించిన నేతలు, సామాజిక సమీకరణల్లో భాగంగా కొందరిని గవర్నర్‌లుగా నియమిస్తున్నారు. వారు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి చేత నియమాకాలు పొందినవారు కావటంతో పార్టీల ఏజంట్లుగా సిగ్గువిడిచి ప్రవర్తిస్తున్నారు.

రాజ్యాంగాన్ని రచించే సమయంలో గవర్నర్ల వ్యవస్థ గురించి పెద్ద చర్చే జరిగింది. గవర్నర్లు వద్దని, కావాలని వాదించిన వారు ఉన్నారు. రాజీమార్గంగా రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతిగా గవర్నర్‌ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గ సలహామేరకు పని చేయాల్సి ఉంటుందని పరిమితి విధించారు. ఇదే సమయంలో కొన్ని విచక్షణాధికారాలను కూడా కల్పించారు. ఇప్పుడు ఆ పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. అయితే ఎస్‌ఆర్‌ బొమ్మరు-కేంద్ర ప్రభుత్వ కేసులో సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. గవర్నర్ల చర్యలు కోర్టు సమీక్షలకు లోబడి ఉంటాయన్నదే అది.దానికి అనుగుణంగానే కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించి గవర్నర్ల చర్యలను సవాలు చేశాయి.అడ్డగోలుగా ఆర్టికల్‌ 356ను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయకూడదని, గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలను పాటించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తరువాత 2005లో రామేశ్వర ప్రసాద్‌-కేంద్ర ప్రభుత్వ వివాదంలో గవర్నర్ల విచక్షణ అధికారం,రాష్ట్ర అసెంబ్లీ పనివిధానం గురించిన అంశం ముందుకు వచ్చింది. బీహార్‌ ముఖ్యమంత్రి అసెంబ్లీని లాంఛనంగా రద్దు చేయకముందే గవర్నర్‌ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఉత్తరాఖండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంలో గవర్నర్‌ జోక్యం చేసుకున్నారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్లు కేంద్ర పాలకపార్టీ ఏజంట్లుగా తయారయ్యారు.1984లో తెలుగుదేశం పార్టీలో తలెత్తిన సంక్షోభంలో గవర్నర్‌గా ఉన్న రామ్‌లాల్‌ ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని కూలదోసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు నిరసనగా తలెత్తిన ప్రజానిరసనతో తిరిగి ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామం మరేరాష్ట్రంలోనూ జరగలేదు.

సుప్రీం కోర్టు 2025 ఏప్రిల్‌ ఎనిమిదిన మైలురాయిగా నిలిచే తీర్పునిచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన పది బిల్లులకు ఆమోదముద్ర వేసేందుకు తిరస్కరించటం గవర్నర్‌ రాజ్యాంగవిరుద్ధ చర్య అని ప్రకటించింది.తమిళనాడు ప్రభుత్వం 2020 నవంబరు నుంచి 2023 ఏప్రిల్‌ మధ్య పదమూడు బిల్లులను ఆమోదించగా వాటిలో పదింటిని ఆమోదించకుండా, తిప్పి పంపకుండా గవర్నర్‌ తనదగ్గరే అట్టిపెట్టుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200ప్రకారం గవర్నర్లకు నాలుగు అవకాశాలు ఉన్నాయి. ఒకటి బిల్లులకు ఆమోదం తెలపటం, ఆమోదం నిలిపివేయటం, ద్రవ్య బిల్లుతప్ప ఇతర వాటిని తిరిగి పరిశీలించాలని కోరటం,తిరిగి వచ్చిన వాటిని ఆమోదించటం, రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా నిలిపివేయటం. అయితే ఆ నిబంధనలో ఎటూ తేల్చకుండా ఎంతకాలం కొనసాగించవచ్చు అన్నది ఎక్కడా లేదు. దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు.తమిళనాడు గవర్నర్‌ చర్య ఉద్దేశ్య పూర్వకంగా బిల్లులను అడ్డుకున్నట్లున్నదని,రాజ్యాంగ పద్దతిని ఉల్లంఘించటమే అని కోర్టు పేర్కొన్నది. ఎలాంటి మార్పులు లేకుండా రెండవసారి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా ఉండటం తగదని, నిలిపివేయకూడదని రాజ్యాంగం పేర్కొన్నదని విధిగా పంపాలని పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు గవర్నర్‌ రవి పాల్పడ్డారని స్పష్టం చేసింది. బిల్లు వచ్చిన నెలరోజుల్లో ఆమోదం తెలపాలి,ఆమోదం తెలపని వాటిని కారణం తెలుపుతూ మూడు నెలల్లోగా తిప్పి పంపాలి.రెండవసారి వచ్చిన బిల్లుకు నెలరోజుల్లో ఆమోదం తెలపాలి, మూడు నెలలకు మించి బిల్లులను నిలిపివేయరాదు. ఆర్టికల్‌ 201ప్రకారం రాష్ట్రపతి కూడా నిరవధికంగా ఆమోదం నిలిపివేయరాదు. ఒకవేళ బిల్లు రాజ్యాంగవిరుద్ధంగా ఉందనకుంటే రాష్ట్రపతి దాని గురించి తప్పనిసరిగాకపోయినప్పటికీ సుప్రీం కోర్టు సలహాను కోరవచ్చు అని కూడా కోర్టు చెప్పింది.ఈ తీర్పులు వచ్చిన తరువాత కూడా గవర్నర్లు మంత్రివర్గం రూపొందించిన ప్రసంగాలకు బద్దులై ఉండకుండా స్వంతపైత్యాలను జోడించటం చూస్తున్నాం. అందువలన ఈ అంశంపై కూడా రానున్న రోజుల్లో రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టటం మినహా మరొక మార్గం లేదు. రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చేందుకు క్షణ క్షణం ప్రయత్నిస్తున్న బిజెపి చర్యలను అడ్డుకొనేందుకు అటు న్యాయవ్యవస్థను ఆశ్రయించటంతో పాటు వ్యతిరేకంగా ప్రజాసమీకరణ కూడా అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !

21 Wednesday Jan 2026

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, EU vs US, Green Land, Greenland annexation By US, Narendra Modi Failures, NATO

ఎం కోటేశ్వరరావు

గ్రీన్‌లాండ్‌ కోసం అమెరికా ఎంత దూరం వెళుతుందో మీరు చూస్తారంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఐరోపా నేతలకు ఒక సవాలు విసిరాడు. దవోస్‌ ప్రపంచ వాణిజ్య వేదిక సమావేశాలకు వెళ్లే ముందు ట్రంప్‌ మాటలివి. గ్రీన్‌లాండ్‌లోని అమెరికా మిలిటరీ కేంద్రానికి ఒక యుద్ధ విమానం కూడా వచ్చిందన్న వార్తలు ఒకవైపు, ఏం చేయాలో తోచక ఐరోపా కూటమి మరోవైపు. ప్రపంచ పరిణామాలు సామాన్యుల ఊహకు అందకుండా మారుతున్నాయి. అనేక దేశాల, దేశాధినేతల బండారాలు బయటపెడుతున్నాయి.కడుపులో చల్ల కదలకుండా కాలు మీద కాలువేసుకు కూర్చుందామంటే కుదరదు. అదియును సూనృతమే ఇదియును సూనృతమే అంటూ రెండు పక్షాలనూ సంతుష్టీకరించాలంటే జరిగేది కాదు. వెనెజులా మన మిత్రదేశమే, చౌకగా చమురు తెచ్చుకున్నాం, డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించగానే మానేశాం, ఆ దేశ అధ్యక్షుడు మదురో, సతీమణిని కిడ్నాప్‌ చేసినా తప్పని చెప్పలేకపోయాం.ఇరాన్‌ కూడా మనకు మిత్రదేశమే. మన రూపాయలు తీసుకొని చమురు విక్రయించింది.అమెరికా బెదిరించగానే అక్కడి నుంచీ కొనుగోలు నిలిపివేశాం. ఆ దేశం మీద దాడులు చేస్తాం, పాలకులను మార్చివేస్తామని పెద్దన్న అమెరికా బెదిరిస్తుంటే తగదని అనలేకపోయాం. ఉక్రెయిన్‌ సంక్షోభ సమయంలో అక్కడ ఉన్న మనవారిని వెనక్కు రప్పించేందుకు, పుతిన్‌కు చెప్పి దాడులు ఆపించామని చెప్పుకున్నాం, ప్రత్యేక విమానాలు పంపి భారతీయులను స్వదేశానికి రప్పించాం. కానీ ఇరాన్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రమ్మని సుభాషితం మాత్రమే చెప్పాం తప్ప విమానాలు పంపి వెనక్కు తీసుకురాలేదు. కొన్ని సమయాల్లో కొందరు ఎలా ప్రవర్తిస్తారో గుర్తు చేసేందుకే ఇవి. ఈ సందర్భంగా అమెరికా బెదిరింపులపై ఐరోపా స్పందన గురించి విశ్లేషించుకుందాం.

డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో కమ్యూనిస్టు చైనా మీద పన్ను ఉగ్రవాదదాడులను ప్రారంభించగానే అనేక మంది సంతోషించారు.చైనా వస్తువుల ధరలు పెరిగితే అంతకంటే చౌకగా అమెరికాకు ఎగుమతి చేసి లాభం పొందవచ్చని డాలర్‌ కలలు కన్నారు. ఇప్పుడు అదే ట్రంప్‌ తన పరబేధాలు లేకుండా బస్తీమే సవాల్‌ అందరి సంగతి చూస్తా అంటూ కొరడా ఝళిపిస్తుంటే దిక్కు తోచక దిక్కులు చూస్తున్నారు.చైనా మూడు చేపల కథలో దీర్ఘదర్శి మాదిరి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతున్నది. ప్రస్తుతం ఐరోపా ఇరకాటంలో పడింది. మదురోను కిడ్నాప్‌ చేసి వెనెజులా చమురు సంపదలన్నింటినీ స్వంతం చేసుకుంటామన్నపుడు దానికి పట్టలేదు. ఇప్పుడు డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామనగానే ఐరోపా సమాఖ్యకు గొంతులో పచ్చివెలక్కాయపడినట్లయింది. ఆర్కిటిక్‌ సముద్రంలోని ఆ మంచుదీవిని అన్నమాట ప్రకారం స్వాధీనం చేసుకోకపోతే అమెరికన్ల దృష్టిలో ట్రంప్‌ చులకన అవుతాడు. ఆక్రమించుకుంటే ఐరోపా సమాఖ్య అభాసుపాలవుతుంది. ఆపరేషన్‌ ఆర్కిటిక్‌ ఎండ్యూరెన్స్‌( ఆర్కిటిక్‌ ప్రాంతానికి బాసట) పేరుతో పరిమిత వన్యాసాలు జరిపేందుకు గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా పన్నెండు దేశాలు మిలిటరీ అధికారులు, సిబ్బందిని పంపేందుకు నిర్ణయించాయి, కొన్ని దేశాల నుంచి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. నిజంగా అమెరికా దురాగతానికి దిగి బలవంతంగా స్వాధీనానికి పూనుకుంటే వారు చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ ఉండదు. అయితే ఈ మాత్రానికే ఆగ్రహించిన ట్రంప్‌ ధిక్కారమును సైతునా అంటూ ఐరోపా దేశాల వస్తువుల మీద ఫిబ్రవరి ఒకటి నుంచి అదనపు సుంకాలు విధిస్తానని ప్రకటించాడు.

అయితే దీనికి ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై 108 బిలియన్‌ డాలర్ల మేర ప్రతి సుంకాలు విధించేందుకు ఆలోచిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది.తోటి నాటో దేశాన్ని మరో సభ్య దేశం ఆక్రమించుకోవటం ఏమిటి అని గట్టిగా ఖండించలేక ఆమోదించలేక ఇతర దేశాలు సతమతం అవుతున్నాయి. గ్రీన్‌లాండ్‌ మా ఒక్కరి భద్రతకోసమే కాదు, ఐరోపా రక్షణకూ అవసరమే అని, తాము స్వాధీనం చేసుకోకపోతే రష్యా, చైనా ఆక్రమిస్తే మీకు అంగీకారమేనా అంటూ ట్రంప్‌ యంత్రాంగం ఎదురుదాడికి దిగింది. ఐరోపా యూనియన్‌ పరిస్థితిని చూస్తే అమెరికాను ఎదిరించే స్థితిలో లేదు. గత ఎనిమిది దశాబ్దాలుగా ఐరోపా రక్షణ బాధ్యత పేరుతో నాటో ఖర్చులో అధిక భాగం అమెరికా భరించింది. ఆ మేరకు పొదుపు మొత్తాలను పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాలకు మళ్లించిన ఐరోపా అనేక విధాలుగా రెండు ప్రపంచ యుద్ద నష్టాల నుంచి కోలుకున్నది. ఐరోపా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నది. ఉభయుల వాణిజ్యలావాదేవీల విలువ 2024లో 976 బిలియన్‌ డాలర్లు ఉండగా అమెరికా వస్తు ఎగుమతులు 370 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అందుకే దిగుమతి పన్ను అదనంగా వేస్తా అని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇది ఐరోపా బలహీనత కాగా అదే పరిస్థితి అమెరికాకూ ఉంది, 2015-19 సంవత్సరాలతో పోలిస్తే 2020-24 నాటికి అమెరికా నుంచి ఐరోపా దేశాలు దిగుమతి చేసుకున్న ఆయుధాలు 28 నుంచి 52శాతానికి పెరిగాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత ఇది జరిగింది. అందువలన మాతో తెగేదాకా లాగితే ఆయుధ దిగుమతులు తగ్గిస్తామని ఐరోపా సంకేతాలు పంపుతున్నది. అంతే కాదు చైనాతో లావాదేవీలు పెంచుకోవాల్సి వస్తుందని కూడా చెబుతున్నది. అందుకే దాగుడుమూతలాడుతున్నాయి. చైనా ప్రమాదాన్ని చూపి భారత్‌ను తన బుట్టలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, అదే ఎత్తుగడతో రష్యాను చూపి ఐరోపాను తన అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నది. అందుకే అప్పుడప్పుడు మిత్రవైరుధ్యాలు తలెత్తినప్పటికీ వాటిని శత్రువుల స్థాయికి తీసుకువెళ్లకుండా రాజీపడుతున్నాయి. ఇది ఎల్లకాలమూ సాధ్యమౌతుందా ?

తన ఆర్థిక బలం, మిలిటరీ బలగాలను చూపి గరిష్టంగా లబ్దిపొందేందుకు, ప్రభావాన్ని మరింతగా పెంచుకొనేందుకు అమెరికా పూనుకుంది.అయితే బలహీనమైన అంశాల పట్ల కఠినంగా, బలమైన వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది ఐరోపా.దాన్లో భాగమే అమెరికా వస్తువులపై పన్ను వేస్తామని హెచ్చరించటంగా చెప్పవచ్చు. అట్లాంటిక్‌ దేవాల మధ్య ఇదొక తీవ్రమైన సంక్షోభానికి గుర్తు అని తాజా పరిణామాల గురించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. అంత తేలికగా అమెరికా వత్తిడికి ఐరోపా లొంగే అవకాశాలు లేవని కొందరు చెబుతున్నారు. ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు ఇప్పటి వరకు ఐరోపా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లుగా చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌ కావాల్సిందేనని ఆదివారం నాడు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ మరోసారి చెప్పాడు. ఆ ప్రాంతం అమెరికాలో అంతర్భాగం గాకపోతే రక్షణ అసాధ్యమన్నాడు. రక్షణ పేరుతోనే క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటాన్ని విమర్శించేవారు గ్రీన్‌లాండ్‌ విలీనాన్ని ఎలా సమర్ధించుకుంటారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా తమ చర్య అందరికీ మంచిదని, యూరోపియన్స్‌ దీన్ని అర్ధంచేసుకుంటారని భావిస్తున్నా అని మాత్రమే బెసెంట్‌ చెప్పాడు. ట్రంప్‌ ఈ విషయంలో వెనక్కు తగ్గకపోతే అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందానికి ఐరోపా పార్లమెంటు ఆమోద ముద్రవేసే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. బలవంతంగా ఒప్పించటాన్ని వ్యతిరేకించే సమాఖ్య 2023 నాటి ఆయుధంతో అమెరికాను దెబ్బతీయాలని ఫ్రాన్సు పిలుపునిచ్చింది. ఒకవైపు అమెరికాను అడ్డుకోవాలని అంటున్న ఐరోపా దేశాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం లేదు. గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో మిలిటరీ విన్యాసాలకు దూరంగా ఉండాలని జర్మనీ నిర్ణయించింది. శుక్రవారం నాడు వచ్చిన జర్మనీ మిలిటరీ బృందం ఆదివారం నాడు వెనక్కి వెళ్లింది. అమెరికా వత్తిడి తప్ప మరొక కారణం లేదు. ఈ మిలిటరీ విన్యాసంలో పాల్గన్నదేశాల మీద ప్రత్యేకించి పన్నులు విధించాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి అన్నమాట ప్రకారం పన్నులు వేస్తారా లేక బేరసారాల కోసం వాయిదా వేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

ఐరోపా ప్రతిపన్ను హెచ్చరిక కూడా ఎత్తుగడలో భాగమే అంటున్నారు. అమెరికాతో తెగతెంపులు చేసుకుంటే ఎనిమిది దశాబ్దాలుగా అనుసరించిన విధానాలన్నింటినీ మార్చుకోవాల్సి ఉంటుంది. అది ఒక్క గ్రీన్‌లాండ్‌తోనే సమసిపోదు. మొత్తం నాటో కూటమి ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది.ప్రపంచ బలాబలాల్లో వచ్చే మార్పులు తమకు లాభదాయకమా లేక అమెరికాతో ఉంటేనే మంచిదా అన్న మధింపు జరిగిన తరువాత నిర్ణయాత్మక పరిణామాలు జరుగుతాయి తప్ప ఇప్పటికిప్పుడు జరిగే అవకాశాలు పరిమితం. అసలు గ్రీన్‌లాండ్‌తో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో ఐరోపా మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ఒక వ్యూహం అనుసరిస్తున్నదని చెబుతున్నారు. గతేడాది డిసెంబరులో జాతీయ భద్రతా వ్యూహం పేరుతో రూపొందించిన పత్రంలో ఐరోపా సమాఖ్యలో రాజకీయ స్వేచ్చను బలహీనపరుస్తున్నారని, రాజకీయ వ్యతిరేకతను, భావ ప్రకటనా స్వేచ్చను అణచివేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.మరోవైపు ఐరోపాలో ఇటీవలి కాలంలో తలెత్తిన మితవాద జాతీయోన్మాద శక్తులను అమెరికా ప్రోత్సహిస్తున్నట్లు ఈ విమర్శల మర్మం అంటున్నారు. విద్వేష ప్రసంగాలను అదుపు చేసే చర్యల్లో భాగంగా ఇంటర్నెట్‌లో చొప్పిస్తున్న వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకున్న సాంకేతిక విభాగ ఐరోపా మాజీ కమిషనర్‌ తియెరీ బ్రెటన్‌పై అమెరికా ఆంక్షలు విధించటం కూడా వత్తిడిలో భాగమే అంటున్నారు. అమెరికా కంపెనీల పట్ల నిబంధనలను చూసీచూడనట్లు పోవాలని, వాటికి అవకాశాలను పెంచాలని ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ వత్తిడి చేస్తున్నారు.అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలన్న ట్రంప్‌ ఏలుబడిలో అది మరింతగా బరితెగించినట్లు కనిపిస్తోంది. ఐరోపాను ఒక వలస ప్రాంతంగా చూస్తూ తన నిబంధనలను అక్కడ రుద్దాలని చూస్తోందని, అందుకుగాను ఎంతకైనా తెగిస్తోందని ఐరోపా వర్గాలు భావిస్తున్నాయి.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇంతగా గతంలో ఎన్నడూ ఐరోపా పట్ల అమెరికా వ్యతిరేకత వెల్లడి కాలేదేని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు.తమను నాశనం చేయాలని వాషింగ్టన్‌ చూస్తున్నదని ఇనిస్టిట్యూట్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ నతాలీ టోసీ చెప్పారు. ఉదారవాద ప్రజాస్వామ్యం, ఐరోపా ఒక్కటి కావటం తమకు వ్యతిరేకంగా పరిగణిస్తున్నదని కూడా అన్నారు. నాటో అనుకూల ఐరోపా దేశాల్లో అమెరికా పట్ల పునరాలోచనకు నాంది పడింది.గ్రీన్‌లాండ్‌ గురించి అమెరికా చాలా కాలం క్రితమే తన వాంఛను వెల్లడించింది. డెన్మార్క్‌ మిలిటరీ గూఢచార సేవల విభాగం గత డిసెంబరులో తొలిసారి అమెరికా తమ జాతీయ భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించిందని ఒక నివేదికలో పేర్కొన్నది. తన మిత్రదేశాలను కూడా వదలకుండా అధిక పన్నులతో సహా ఆర్ధిక బలాన్ని వినియోగిస్తున్నదని, చివరికి మిలిటరీ ఫోర్సు వినియోగంలో కూడా వదలటం లేదని దానిలో ప్రస్తావించారు. ఈ పూర్వరంగంలోనే డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడరిక్సన్‌ తోటి నాటో సభ్యదేశంపై అమెరికా దాడికి దిగుతానని చెప్పటాన్ని గర్హించారు. భద్రత గురించి అమెరికా మీద అతిగా ఆధారపడటం మంచిది కాదని కొందరు నిపుణులు హెచ్చరించటం పెరుగుతోంది. ఇలా ఆధారపడిన కారణంగా స్వతంత్ర ఆత్మరక్షణ సామర్ధ్యం మీద ప్రభావం పడుతుందని, ఐరోపా మిలిటరీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రష్యా, చైనాల రక్షణ బడ్జెట్ల కంటే ఎక్కువగా 2025 ఐరోపా 447 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టినందున స్వతంత్ర మిలిటరీని ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదని ప్రశ్నిస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో యూరోలు ఖర్చు చేస్తే ప్రయోజనం లేదని, కీలకమైన గూఢచర్యం, నిఘా, భౌతిక పరిస్థితి వివరాలపై అమెరికా మీద ఆధారపడకతప్పదని, అనేక రంగాలలో ఐరోపా వెనుకబడి ఉందని మరికొందరు చెబుతున్నారు. అణ్వాయుధాలు తమ దగ్గర మాత్రమే సురక్షితంగా ఉంటాయని అమెరికన్లు భావిస్తున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్సు దగ్గర ఉన్నవి అవాంఛనీయ శక్తుల చేతుల్లో పడకుండా చూసేందుకు గాను మొత్తం ఖండ సాంప్రదాయ రక్షణ సామర్ధ్యాలను 2027 నాటికి తమ అదుపులోకి తెచ్చుకోవాలని వాషింగ్టన్‌ కోరుకుంటున్నదని రాయిటర్స్‌ వార్తలో పేర్కొన్న అంశాలు ఐరోపాలో ఆందోళనకు గురిచేశాయి. మొత్తం మీద ఐరోపాలో అమెరికాతో సంబంధాల గురించి ఒక మధనం ప్రారంభమైంది, అది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో, ఏ రూపంలో ఉంటుందో చూడాల్సి ఉంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

17 Saturday Jan 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, inequality, Narendra Modi Achhedin, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు పెద్దలు. జగతిని నడిపించేది ధనమే. పూర్వకాలపు మన, ఇతర దేశాల తత్వవేత్తలు ప్రవచించినా ఆధునిక కాలంలో కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ చెప్పినా వాస్తవం అదే. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కూడా కమ్యూనిస్టులు చెప్పారు. ఇద్దరూ చెప్పింది ఒకటే కదా మనవారు ఎన్నడో చెప్పారు, వామపక్ష వాదుల ప్రత్యేకత ఏమిటని ఎవరికైనా సందేహం వచ్చిందంటే వారి బుర్రపని చేస్తున్నదని అర్ధం. నిజమే, సర్వేజనా సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అని లేదా ఇతర దేశాలలో తత్సమాన అర్ధంతో ఎవరు చెప్పినా వారంతా మంచి జరగాలని ఆకాంక్షించారు, సుబోధ చేశారు. కానీ విన్నవారు, పాటించినవారెవరూ లేరు, సుభాషితాలను దాటి అమలుకోసం ఎవరైనా ముందుకు పోతే విప్లవకారులంటూ అణచివేతలే అన్నది యావత్‌ప్రపంచ చరిత్ర. ఆ సారాన్ని గ్రహించిన మార్క్సిస్టు పెద్దలు చెప్పిందేమంటే మంచిమాటలతో సమాజం మారదు, మార్చేందుకు జనమే పూనుకోవాలి, వారిలో కూడా దోపిడీకి గురయ్యేవారే ముందుండాలి. అడ్డుకొనేవారు మామూలుగా వినకపోతే చివరికి బడితెలు పట్టుకొని మార్చటం తప్ప మరొక మార్గం లేదని కర్తవ్యబోధ చేశారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవలి కాలంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే ఈ మాటలు చెప్పేవారిలో సంపన్నుల బాగు కోరుకొనే వారే ఎక్కువగా ఉన్నారు. వారి ఉద్దేశ్యం ఏమిటంటే కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే మొదటికే మోసం వస్తుందన్నది వారి ఉద్దేశ్యం. అయితే నిజంగా మంచి కోరుకుంటున్నవారు లేరా అంటే ఉన్నారు.

2026 ప్రపంచ అసమానతల నివేదిక డిసెంబరులో విడుదలైంది.2018, 22 తరువాత ఇది మూడవది.ప్రపంచంలో, మనదేశంలో కూడా అసమానత తీవ్ర స్థాయిలో ఉందని హెచ్చరించింది. ఈ నివేదికను రూపొందించిన వారు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, రికార్డో గోమెజ్‌ కరేరా, రొవాయిడా మోషిరిఫ్‌, థామస్‌ పికెటి. ఆ నివేదికకు మన దేశానికి చెందిన జయతి ఘోష్‌,జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ముందు మాటరాశారు. సంపాదకుల్లో చివరి వ్యక్తి ఫ్రెంచి ఆర్థికవేత్త థామస్‌ పికెటి గురించి తెలుగువారికి కొంతమేరకు తెలుసు,ఎందుకంటే ఆర్థిక అసమానతల గురించి ఆయన హెచ్చరించిన అంశాలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. అసమానతలు అంటే కేవలం సంపదకే పరిమితం కాదు, వాతావరణ, లింగపరమైన, అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవటం, చివరికి ఎన్నికల కోసం నియోజకవర్గాల విభజనలో వివక్షతో సహా ఇతర అంశాలు ఉన్నాయి. ప్రపంచ అసమానతల సమాచార సంస్థకు అనుబంధంగా ఉన్న రెండువందల మందికి పైగా పరిశోధకులు అనేక కోణాల్లో చేసిన విశ్లేషణల సారమే ప్రపంచ అసమానతల నివేదిక. అన్ని అంశాలను ఇక్కడ సృజించటం సాధ్యం కాదు గనుక సంపదల పున:పంపిణీ గురించి చర్చిద్దాం.ప్రపంచాన్ని ” కమ్యూనిస్టు భూతం ” ఆవహించకుండా జనం దానివైపు మరలకుండా చూసేందుకు పెట్టుబడిదారీ ఆర్థిక, సామాజికవేత్తలు అనేక అంశాలను ముందుకు తెచ్చారు.వాటిలో ఊట సిద్దాంతం ఒకటి.

ప్రభుత్వాలు కేవలం పాలనకే పరిమితమై అన్ని రంగాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకే అప్పగిస్తే వారు సృష్టించే సంపదల మూట నుంచి ఊట యావత్‌ సమాజానికి దిగుతుందన్నది ఊట సిద్దాంతం. దానికి సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాల వంటి ముద్దుపేర్లు పెట్టారు, జనం కూడా నిజమే అని నమ్మారు, తమకూ సంపదల ఊట దిగుతుందేమోనని పోరాటాలు మాని ఆశతో చెంబులు పట్టుకు ఎదురు చూశారు, ధారలేమీ కారలేదు, కేవలం కొన్ని చుక్కలు మాత్రమే పడ్డాయి.దాంతో ఫలితం లేదని అసంతృప్తి చెందటం ప్రారంభించారు. సోషలిస్టు సమాజాలం కోసం జనం చూడకుండా కొన్ని తాయిలాలు అందించి సంతృప్తిపరచేందుకు ఐరోపాలో అనేక ప్రయోగాలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు జరిపి సోషలిజంలో ఇంతకంటే పెద్దగా ఒరిగేదేమిటని జనాన్ని కొంతకాలం మభ్యపెట్టారు. ప్రధమ సోషలిస్టు రాజ్యం సోవియట్‌ యూనియన్‌ కూలిపోవటంతో కమ్యూనిజం, సోషలిజాలపై విజయం సాధించామని, ఆ ప్రయోగం విఫలమైందని ప్రచారం చేశారు. అంతేనా పోటీ లేకపోవటంతో అప్పటి వరకు అమలు జరిపిన అనేక సంక్షేమాలకు కోత పెట్టటం ప్రారంభించారు. అసమానతలు అప్పటి నుంచి మరింత పెరగటంతో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు సంపదల పున:పంపిణీ అవసరమంటూ మరో పల్లవి అందుకున్నారు.సూత్రరీత్యా దీన్ని ఎవరూ వ్యతిరేకించరు, అయితే అది ఎలా అన్న అంశంమీదే తేడా వస్తున్నది. సంపదలు పంచినంత మాత్రాన వేగంగా దారిద్య్రం తగ్గుతుంది తప్ప ఆర్థిక వృద్ధి జరగదని, జనాలను సోమరులుగా మారుస్తాయని కొందరు చెబుతున్నారు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఈ మంచి సంస్కరణ అంశాన్ని ప్రచారం చేసి జనాన్ని సమీకరించేందుకు చూస్తున్నాయి. అసలేమీ లేనిదానికంటే ఏదో ఒకటి మంచిదే.అయితే భ్రమలు పెట్టుకోనవసరం లేదని చెప్పక తప్పదు.

అసమానతల గురించి తాజా నివేదకలో పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూద్దాం.మచ్చుకు ఒకటి, సబ్‌ సహారా ప్రాంతంలో ఒక బిడ్డ మీద పిపిపి పద్దతిలో 200యూరోలు ఖర్చు చేస్తుండగా ఐరోపాలో 7,400, ఉత్తర అమెరికా, ఓషియానా దేశాల్లో 9,000 యూరోలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో 0.001శాతం అంటే అరవైవేల మందికంటే తక్కువ ఉన్న కోటీశ్వరులు దిగువన ఉన్న 50శాతం జనాభా మొత్తం సంపదల కంటే మూడు రెట్లు ఎక్కువ కలిగి ఉన్నారు. ప్రతి ఏటా ప్రపంచ జిడిపిలో ఒకశాతం ధనికదేశాలకు తరలుతున్నది.ఇది ప్రపంచ వృద్ధికి ఇస్తున్నట్లు చెబుతున్న సాయానికి మూడు రెట్లు ఎక్కువ. స్త్రీ, పురుష వేతన తేడా అన్ని చోట్లా ఉంది. గంటకు ఒక పురుషుడు పొందే వేతనంలో మహిళకు వస్తున్నది 61శాతమే, వేతన చెల్లింపులేని పనిగంటలను కూడా లెక్కిస్తే ఈ తేడా 32శాతానికి దిగజారుతుంది.

సంపదల పున:పంపిణీ ఎలా అన్నదాని మీద పూర్తి ఏకాభిప్రాయం ఉందా అంటే లేదు అని చెప్పవచ్చు, దోపిడీ విధానాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయకుండా తీసుకొనే ఏ చర్య అయినా అది ఉపశమనం తప్ప మరొకటి కాదు.లాటిన్‌ అమెరికా దేశాల్లో, దక్షిణాఫ్రికా, నేపాల్‌ వంటి చోట్ల పురోగామివాదులు, కమ్యూనిస్టులు ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చారు.దోపిడీ వర్గ పునాదిని దెబ్బతీయకుండా దాని మీదే కొన్ని సంస్కరణలు మాత్రమే అమలు చేయటంతో ఒకదశ దాటిన తరువాత కార్మికవర్గంలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది.లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం ఇదే.కొన్ని చోట్ల ఒకసారి గెలిచిన వామపక్ష శక్తులు తరువాత ఓడిపోవటానికి కారణాలు ఇవే. అసమానతలు ఎక్కువగా ఉంటే సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి.ఈ కారణంగానే రాజకీయ పార్టీలు ప్రజాకర్షక నినాదాలు, చర్యలతో ముందుకు రావటం పెరిగింది. ఓట్ల కోసం అలాంటి చర్యలకు పాల్పడను, ఆ సంస్కృతికి దూరం అని కొండంత రాగం తీసిన నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి అదే చేస్తున్నది. అయితే ఇతర పార్టీలు చేస్తే జనాకర్షక పథకాలు, తాము చేసేవి సాధికారత కలిగించేవంటూ వంచనకు పాల్పడుతోంది. ఇవి దీర్ఘకాలంలో అభివృద్ధిని దెబ్బతీస్తాయని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆశ్రితులకు దేశ సంపదలను దోచిపెట్టి మరింతగా పెంచటమే గాక, సంపదలను సమంగా పంపిణీ చేయటాన్ని వ్యతిరేకించేవారే ఇలాంటి జనాకర్షక పథకాలను తీసుకువస్తారన్నది ఒక వాస్తవం. స్వాతంత్య్రం గురించి కన్న కలలు విఫలమై 1967లో కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోవటం, తనకు పార్టీలో సవాలు ఎదురైనపుడు గరీబీ హటావో పేరుతో ఇందిరా గాంధీ వాటికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అయితే మనవంటి సమాజాలాలలో అవి అవసరం. ఉదాహరణకు ఎన్‌టి రామారావు ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యపు పధకం, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు ఏ విధంగా సాయపడుతున్నాయో చూస్తున్నాం. ఇతర నగదు బదిలీ పథకాలు కూడా అలాంటివే.నిజానికి ఆ మొత్తాలు వస్తు,సేవల కొనుగోళ్ల రూపంలో తిరిగి ఆర్థిక వ్యవస్థలోకే వస్తున్నాయి. అందువలన ఈ మొత్తాలను ఇంకా పెంచటం సంపద పంపిణీలో భాగంగానే పరిగణించవచ్చు.అభివృద్ధి రేటుకు తగిన విధంగా పేదల ఆదాయాలు పెరగకపోతే ఫలాలు ధనికులకే చేరుతున్నట్లు లెక్క.మనదేశంలో అదే జరుగుతున్నది, శతకోటీశ్వరులు మరింతగా పెరుగుతున్నారు.

ప్రపంచ అసమానతల సమాచార కేంద్ర వివరాల ప్రకారం దిగువ విధంగా మనదేశంలో అసమానత పెరిగింది.దీన్ని రెండుగా విభజించి చూడాలి.1990 దశకంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టక ముందు, తరువాత సమాజంలోని మూడు తరగతుల సంపదలు ఎలా పెరిగాయో చూడవచ్చు.

సంవత్సరాలు××× దిగువ 50శాతం××ఎగువ 10శాతం××× ఎగువ ఒకశాతం

1961-1970×× 12.29 ×× 43.18 ××11.87

1971-1980×× 11.75 ×× 42.25 ×× 11.23

1981-1990×× 10.91 ×× 45.00 ×× 12.50

1991-2000×× 8.36 ×× 54.57 ××× 23.31

2001-2010×× 8.10 ×× 56.60 ××× 25.70

2010-2020×× 6.12 ×× 63.68 ××× 31.55

దీన్ని ముందే చెప్పుకున్నట్లుగా రెండు భాగాలుగా చేస్తే 1961 నుంచి 1990 వరకు సగటు దిగువ 50శాతం జనాభా వాటా 11.65శాతం కాగా ఎగువ పదిశాతం 43.47,ఎగువ ఒకశాతం 11.86శాతం కలిగి ఉన్నారు. ఇదే 1990 నుంచి 2020 వరకు వరుసగా 7.52-58.28-26.85శాతం ఉన్నారు. నూతన ఆర్ధిక విధానాలు అమలు జరిగిన మూడుదశాబ్దాలలో ఎగువ ఒకశాతం వాటా 226,పదిశాతం మంది వాటా 134శాతం పెరగ్గా దిగువ 50శాతం వాటా 63శాతం తగ్గింది. తాజా అంచనా ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 40శాతానికి చేరింది.మంచి రోజులు తీసుకువస్తానని చెప్పిన నరేంద్రమోడీ సంస్కరణలను మరింత వేగంగా అమలు జరుపుతానని కూడా చెప్పారు. దాని ఫలితం ఏమిటో చూశాము. కార్పొరేట్‌ పన్ను గణనీయంగా తగ్గించిన కారణంగా ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖజానా కోల్పోతున్నది. పోనీ ఆ మేరకు ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయా అంటే అదీ లేదు. పర్మనెంటు ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నది.మన దేశ కార్పొరేట్‌ సంస్థలకు పన్ను తగ్గించిన కారణంగా వాటిలో పెట్టుబడులు పెడితే లాభసాటిగా ఉండటంతో విదేశీ కంపెనీ నేరుగా పరిశ్రమల స్థాపనకు బదులు ఉన్న కంపెనీల వాటాలను స్టాక్‌మార్కెట్‌లో కొనుగోలు, విక్రయాలు చేస్తూ లాభాలను తమ దేశాలకు తరలించుకుపోతున్నాయి.

ఆదాయాన్ని బట్టి పన్ను విధించి, ఆ మేరకు అల్పాదాయవర్గాలకు రాయితీల రూపంలో సంపదల పంపిణీ ఒక పద్దతి. లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌లో అసమానతలు, దారిద్య్ర నిర్మూలన పథకాల్లో భాగంగా షరతులతో కూడిన నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న అమ్మవడి, తల్లిదీవెన పథకాలు వాటికి నకలే. తమ బుర్రలో పుట్టినవే అని ఎవరైనా చెప్పుకుంటే బడాయి తప్ప మరొకటి కాదు. 2003లో వామపక్ష నేత లూలా డ సిల్వా అధికారానికి వచ్చినపుడు అంతకు ముందున్న కొన్ని పథకాల అనుభవాలను చూసి మరింత లబ్ది చేకూరేవిధంగా అల్పాదాయ వర్గాలకు ఈ పథకాన్ని అమలు చేశారు. పిల్లలను బడికి పంపటం, టీకాలు వేయించిన వారికి నగదు బదిలీ జరిగింది.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు దీనికి అర్హులు. అంతర్జాతీయంగా అది ప్రశంసలు పొందింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది,సంపదల పంపిణీ వలన దారిద్య్ర తీవ్రత తగ్గుతుంది తప్ప అసమానత తొలగదు. గమనించాల్సిందేమంటే రెండు దశాబ్దాల తరువాత చూస్తే అసమానతలు ఎక్కువగా ఉన్న పది ప్రపంచ దేశాల్లో బ్రెజిల్‌ ఒకటిగా ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రైతు బంధు, భరోసా మరో పేరుతో అందచేస్తున్న నిధులు, పిఎం కిసాన్‌ మొత్తాలు కూడా సంపద పున:పంపిణీలో భాగమే. అయితే అవి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ఆర్చేవి తీర్చేవి కాదు.కనీస వేతనాల పెంపుదల కూడా సంపదల పంపిణీలో ఒక అంశమే. గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు, అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అవకాశాలను పెంచుతాయి. అందువలన సంపదల పంపిణీ గురించి మరింత నిర్దిష్టంగా మధనం జరగాల్సి ఉంది. తమ ప్రత్యేక లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించిన చైనాలో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అయితే వాటిని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.

ఈ నివేదిక ప్రకారం సమాజంలో ప్రపంచంలో ఎగువన ఉన్న పదిశాతం మంది వద్ద సంపద 58శాతం ఉంది (2022లో 57శాతం) దిగువన ఉన్న 50శాతం మందికి 15శాతం(2022లో 13శాతం). ఇంతకు ముందు పట్టికలో సంపదల పెరుగుదల రేటు చూశాము, ఉన్న సంపదల మొత్తం వేరు,పెరుగుదల రేటు వేరు. భారత్‌ మరియు చైనా గురించి చెప్పిందేమంటే ప్రపంచ మధ్యతరగతిలోకి చైనా జనాభా ఎక్కువ మంది చేరారని, అదే భారత్‌లో 1980లో మధ్య తరగతిలో ఉన్న 40శాతంలో ఎక్కువ మంది ఇప్పుడు దిగువ 50శాతంలోకి దిగజారినట్లు పేర్కొన్నది. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కారణంగా సంపదలు పోగుపడటం ఒకటైతే రాష్ట్రాలకు రావాల్సిన పన్నురాబడి తగ్గుతున్నది, అది సంక్షేమ పథకాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఉదాహరణకు వెనుకబడిన తరగతుల వారికి 50 ఏండ్లకే పెన్షన్‌ ఇస్తామని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ మాదిరి సామాజిక పెన్షన్లు నాలుగువేలకు పెంచుతామని చెప్పిన తెలంగాణా కాంగ్రెస్‌ వాగ్దానం అమలుకు నిధులు లేవు, బిజెపి పాలిత రాష్ట్రాలలో పరిస్థితి మరీ అధ్వానం, వారికి అసలు ఆ ఉద్దేశ్యమే లేదు అని వేరే చెప్పనవసరం లేదు. యుపిఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన పెన్షన్‌ మొత్తాలనే మోడీ సర్కార్‌ ఇప్పటికీ అందిస్తున్నది తప్ప పైసా పెంచలేదు. దాని మానవత్వ ముఖం అలా ఉంది. అందువలన మరో విధంగా చెప్పాలంటే సంపదల పున:పంపిణీని దెబ్బతీస్తున్నది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ రూపొందించిన ఆర్థిక చట్రంలోనే మన పాలకులు విధానాలను రూపొందిస్తున్నారు. అందుకే గొర్రె తోక మాదిరి జనజీవితాలు పెద్దగా పెరగటం లేదు. సంపదల పున:పంపిణీ నినాదం సంస్కరణ మాదిరి ఉన్నప్పటికీ అది కూడా వర్గపోరాట ప్రాధమిక రూపమే అని చెప్పవచ్చు. ఈ మాత్రపు సంస్కరణనే వ్యతిరేకించేవారు, సంపదలను సమాజపరం చేస్తే ఊరుకుంటారా ? దేశంలో కార్పొరేట్లు, ధనికుల పెత్తనం ఉన్నందున వారి మీద పన్ను తగ్గించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దానికి విరుద్దంగా పన్ను మొత్తాలను పెంచి పేదలకు పంచాలని ఇతరులు కోరుతున్నారు. పన్నులు పెంచుకుంటూ పోతే ఎగువన ఉన్నవారు కుప్పకూలుతారని వారి సమర్ధకులు అంటే పెంచకపోతే మరింతగా దిగజారతామని దిగువన ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.ఈ వైరుధ్యం మరింత ముదిరితే విప్లవానికే దారితీస్తుంది.ప్రస్తుతం మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు.

‘ చెడుగా మారేంత వరకు అసమానత మౌనంగానే ఉంటుంది.ఈ నివేదిక అసమానతకు మరియు నేటి అసమాన సామాజిక, ఆర్థిక నిర్మాణాలతో అవకాశాల నిరాకరణకు గురైన వందల కోట్ల మందికి గళాన్ని ఇస్తుంది” అని ప్రపంచ అసమానతల నివేదిక సంపాదకుల్లో ఒకరైన రికార్డో గోమెజ్‌ కరేరా వ్యాఖ్యానించాడు. ముందుమాట రాసిన వారిలో ఒకరైన జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ఇలా చెప్పారు.” నేటి విపరీత అసమానత అనివార్యమైనదేమీ కాదని చరిత్ర, అన్ని దేశాల అనుభవాలు, సిద్దాంతం కూడా చెబుతున్నది.పురోగామి పన్ను విధానం( సంపద పెరిగే కొద్దీ పన్నుల పెంపు), పెద్దమొత్తంలో సామాజిక పెట్టుబడి,న్యాయమైన కార్మిక ప్రమాణాలు, ప్రజాస్వామిక వ్యవస్థలు గతంలో తేడాలను తగ్గించాయి. ఇదే మరోసారి చేయగలవు ” సంపదల పున:పంపిణీ జరగాలని కోరుకొనే వారు ప్రచారానికి మాత్రమే పరిమితం కారాదు, కార్యాచరణకూ పూనుకోవాలి !హొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

03 Saturday Jan 2026

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, 2025 Kerala Lokal Elections, Believers in Kerala LDF, BJP, Kalpetta Municipal Chairman, LDF, Paniya Tribe, Pinarayi Vijayan, RSS, Sabarimala Gold case, Soniya gandhi, UDF Kerala

ఎం కోటేశ్వరరావు

మేం అందంగా లేకపోవచ్చు, మేమూ అందరిమాదిరి మనుషులమే…

మా శరీరాలు నల్లగా ఉండవచ్చు, మా హృదయాలు స్వచ్చం…

విత్తనాలు నాటేవారిలో మేమూ ఒకరిమే, వాటికి కాపలాదారులం కూడా ….

పిడికెడు ధాన్యమే మేం కోరుతున్నాం….

ఈ భావంతో లిపిలేని తమ భాషలో పాటలు పాడుకొంటారు కేరళలోని పనియా గిరిజన తెగకు చెందిన వారు. సమాజంలో నిరాదరణకు గురైన ఈ తెగకు చెందిన నాలుగుపదుల వయస్సున్న పి.విశ్వనాధన్‌ జీవనం కోసం కాపలాదారుగా పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబరులో జరిగిన ఎన్నికలలో కేరళలోని వయనాడ్‌ జిల్లా కేంద్రమైన కాల్‌పెట్టా మున్సిపల్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించాడు. ఇతర గిరిజన తెగలలో కురిచియా వారే రిజర్వుడు సీట్ల నుంచి ప్రాతినిధ్యం వహించారు తప్ప జనాభా రీత్యా ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన కారణంగా నోరులేని పనియా తెగకు చెందిన వారు ఇప్పటి వరకు ఇలాంటి పదవులను చేపట్టలేదు. దళితులు, గిరిజనులకు కేటాయించిన స్థానాల నుంచే ఆ తరగతులకు చెందిన వారు ఎన్నికై పదవులను చేపట్టటం సర్వసాధారణం. అయితే సిపిఐ(ఎం) తన కార్యకర్తగా పని చేస్తున్న విశ్వనాధన్ను ఒక జనరల్‌ వార్డు నుంచి పార్టీ పోటీకి నిలిపింది. పట్టణంలో అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్‌గా గెలిపించింది. గిరిజనులకు రిజర్వు చేసిన చైర్మన్‌ పదవిని చేపట్టారు.మళయాళ పత్రికలతో పాటు అక్కడి నుంచి వెలువడే జాతీయ పత్రికలన్నీ ఈ ఎన్నిక గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. విశ్వనాధన్ను ఒక పత్రిక హీరోగా వర్ణించింది. తమ పొలాల్లో పని చేసేందుకు గతంలో ఈ తెగవారిని భూస్వాములు బానిసలుగా చేసుకున్న చరిత్ర ఉంది.

యువకుడిగా డివైఎఫ్‌ఐ నేతగా, సిపిఐ(ఎం)లో ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆదివాసీ క్షేమ సమితి నేతగా, జానపద గాయకుడిగా విశ్వనాధన్‌ పని చేస్తున్నారు.గిరిజన తెగల హక్కులు, గౌరవం కోసం జరిగే అన్ని ఉద్యమాల్లో భాగస్వామి.చిన్న తనంలో చదువు సంధ్యలకు నోచుకోని కారణంగా ఈ వయస్సులో పదవ తరగతితో సమానమైన( మెట్రిక్‌ వంటిది) తుల్యత పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఎవరికోసమో ఎదురు చూడకుండా తమ సామాజిక తరగతికి చెందిన వారు తమ పరిమితులను అధిగమించి అన్ని ఆటంకాలను తట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. తన ఎన్నిక తమవారిలో ప్రోత్సాహానికి దోహదం చేస్తుందన్నారు.దరఖాస్తులు రాసుకోవటం కూడా రాని తమవారు ఇతరుల మీద ఆధారపడుతున్నారని చెప్పారు. వయనాడ్‌ జిల్లాలోని గిరిజనుల్లో పనియా తెగవారు 75వేల మంది ఉండగా కురుమా, కురిచియా తెగలకు చెందిన వారు 52వేల మంది చొప్పున ఉన్నారు. ఈ తెగకు చెందిన వారు వయనాడ్‌, కన్నూరు, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలో ఉన్నారు. పొరుగునే ఉన్న తమిళనాడు నీలగిరి జిల్లాలో, కర్ణాటకలో పరిమితగా ఉన్నారు. ఎన్నికైన తరువాత అధికారిక వాహనంలో తన తలిదండ్రులను కలుసుకొనేందుకు వెళ్లినపుడు వారిలో ఎలాంటి సంభ్రమాశ్చర్యాలు లేకుండా కొడుకును చూశారని, తన కుమారుడు ఈ పదవికి ఎన్నికైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తల్లి చెప్పినట్లు పిటిఐ తెలిపింది. అతని సామర్ధ్యం కారణంగానే జనరల్‌ సీటు నుంచి గెలిచారని సిపిఐ(ఎం) సీనియర్‌ నేత వి హారిస్‌ చెప్పారు.

కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ – కుమ్మక్కుతోనే బిజెపి విజయం: పినరయి విజయన్‌

కేరళలో కూడా మతపరమైన రాజకీయాలు పెరుగుతున్నాయని జనం జాగరూకులై ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హెచ్చరించారు.గురువారం నాడు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సిపిఐ(ఎం) వ్యతిరేకంగా 1990దశకంలో ప్రారంభమైన కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌-బిజెపి కుమ్మక్కు ఇప్పటికీ కొనసాగుతున్నదని, ఆ కారణంగానే ఇటీవల తిరువనంతపురంలో, 2024 ఎన్నికల్లో త్రిసూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిందని, అంతకు ముందు 2016లో నీమమ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలిచిందని చెప్పారు.తనకు అనుకూలంగా కాంగ్రెస్‌ సహకరించిందని నీమమ్‌లో గెలిచిన బిజెపి నేత ఓ రాజగోపాల్‌ స్వయంగా అంగీకరించిన అంశాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. తిరువనంతపురంలో బిజెపి గెలిచిన అనేక వార్డుల్లో కాంగ్రెస్‌కు అతి తక్కువగా ఓట్లు రావటాన్ని బట్టే కుమ్మక్కును గ్రహించవచ్చన్నారు. కర్ణాటకలో ముస్లింల ఇండ్ల కూల్చివేతపై తాను స్పందించిందాంట్లో తప్పులేదన్నారు. ఇలాంటి ఉదంతాలు విదేశాల్లో జరిగినా స్పందిస్తున్నపుడు దేశంలో జరిగిన వాటి మీద మౌనంగా ఎలా ఉంటామని ప్రశ్నించారు. కేరళకే పరిమితం కావాలని అనటం ఏమిటని అన్నారు. ఈ అంశాన్ని కర్ణాటక సిఎం సిద్దరామయ్యతో చర్చించారా అని అడగ్గా, ఇటీవల శివగిరి మఠసమావేశానికి ఆయన ఆలశ్యంగా వచ్చారని, మంత్రివర్గ సమావేశం, ఇతర కార్యక్రమాల వలన తాను ముందుగానే మాట్లాడి వెళ్లినట్లు చెప్పారు.

సోనియా గాంధీని కలిసిన శబరిమల బంగారం చోరీ కేసు నిందితులు !

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు సిట్‌ దర్యాప్తులో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంటున్నదన్న కాంగ్రెస్‌ ఆరోపణను విజయన్‌ తోసిపుచ్చారు. జవాబు చెప్పాల్సిన వారు ఎదురుదాడికి దిగినట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌ పొట్టి, దొంగబంగారం కొనుగోలు చేసిన వర్తకుడు గోవర్ధన్‌తో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు ఆడూర్‌ ప్రకాష్‌, ఆంటో ఆంటోనీ కాంగ్రెస్‌ నేత సోనియగాంధీతో కలసి దిగిన ఫొటో సంగతేమిటో చెప్పకుండా నాటకాలు వేస్తున్నారని సిఎం అన్నారు. పొట్టి పిలిస్తే వెళ్లానని ప్రకాష్‌ చెబుతున్నారని, ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళతారా, అసలు వారిని సోనియా వద్దకు తీసుకువెళ్లిన వారెవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఈ కేసు విచారణలో ఎలాంటి ఇబ్బంది లేదని, హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్నందున బిజెపి కోరుతున్నట్లుగా సిబిఐకి నివేదించాల్సిన అవసరం లేదని విజయన్‌ చెప్పారు.

ఏ కూటమి ఓట్లు పెరిగాయి, ఎవరికి తగ్గాయి !

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ ఘోరపరాజయం పాలైందని, రానున్న రోజుల్లో బిజెపి హవా ప్రారంభమౌతుందని మీడియాలో అనేక మంది చెబుతున్నారు. మళయాళ మనోరమ పత్రిక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన అంకెలను ఉటంకిస్తూ కొన్ని వివరాలను వెల్లడించింది. ఎల్‌డిఎఫ్‌కు మొత్తం 70,99,175 ఓట్లు వచ్చాయి, 2024లోక్‌సభ ఎన్నికల కంటే 4.3లక్షలు ఎక్కువ.యుడిఎఫ్‌, ఎన్‌డిఏల కంటె మెరుగైనదిగా ఉంది.లోక్‌సభ ఎన్నికల్లో యుడిఎఫ్‌ 90,18,752 ఓట్లు తెచ్చుకోగా తాజా ఎన్నికల్లో 82,37,385కు అంటే 7.81లక్షల ఓట్లు తగ్గాయి.ఎన్‌డిఏ(బిజెపి) ఓట్లు 38,37003 నుంచి 31,21,335కు పడిపోయాయి, 7.16లక్షల ఓట్లు తగ్గాయి.

బిజెపి మేయర్‌కు శృంగభంగం !

తిరువనంతపురం నగరమేయర్‌గా ఎన్నికైన బిజెపి నేత వివి రాజేష్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకొనే తానే ఇరుక్కు పోయారు. స్మార్ట్‌ సిటీ పధకంలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్‌ వాటా సొమ్ముతో 113 ఎలక్ట్రానిక్‌ బస్సులను కొనుగోలు చేసి నగరంలో, వెలుపలా వాటిని నడిపిస్తున్నారు.గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం వాటి నిర్వహణలో వచ్చే లాభంలో వాటాను నగర కార్పొరేషన్‌కు ఇవ్వాలని ఉంది. ఆ మేరకు తమకు ఇవ్వటం లేదంటూ బిజెపి మేయర్‌ ధ్వజమెత్తారు. ఆ బస్సులను రాష్ట్ర రవాణా సంస్థకు అప్పగించారు. కార్పొరేషన్‌ ఖాతా నుంచి కొంత సొమ్ము ఇచ్చినప్పటికీ అది కూడా ప్రభుత్వ సొమ్మే, దీనికి తోడు ప్రత్యేకంగా ఆ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఖాతా లేదు గనుక గనుక లాభనష్టాల ప్రస్తావన రాలేదు.పినరయి ప్రభుత్వం మీద ధ్వజమెత్తేందుకు మంచి అవకాశం దొరికిందని బిజెపి భావించింది. డీజిలుతో నడిచే బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ భారంగా ఉందని రవాణా శాఖ మంత్రి కెబి గణేష్‌ కుమార్‌ చెప్పారు. మేయర్‌కు నిజంగా ఆసక్తి ఉంటే వాటిని తిరిగి తమకు అప్పగించాలని లేఖ రాస్తే వెంటనే స్వాధీనం చేస్తామని ప్రకటించారు. ఆ బస్సులను ఆర్‌టిసి డిపోలలో నిలిపేందుకు వీల్లేదని, కార్పొరేషనే ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పారు. ప్రభుత్వం చౌకగా దొరికే డీజిల్‌ బస్సులను కొనుగోలు చేస్తుందని కూడా స్పష్టం చేశారు. దాంతో తత్వం బోధపడిన మేయర్‌ తమకు వాటిని వెనక్కు తీసుకోవాలనే ఉద్దేశ్యం లేదంటూ తోకముడిచారు. నగరమేయర్‌ పదవిని ఆశించి భంగపడిన బిజెపి కార్పొరేటర్‌, మాజీ డిజిపి అయిన ఆర్‌ శ్రీలేఖ ఒక భవనం విషయంలో కూడా భంగపడ్డారు. మాజీ మేయర్‌, సిపిఐ(ఎం) ఎంఎల్‌ఏ అయిన వికె ప్రశాంత్‌ ప్రస్తుతం కార్పొరేషన్‌కు చెందిన ఒక భవనానికి అద్దె చెల్లిస్తూ తన కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ భవనంలోనే సదరు ప్రాంత వార్డు కార్పొరేటర్‌ కార్యాలయం కూడా ఉంది. ప్రస్తుతం ఆ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలేఖ భవనం నుంచి ఎంఎల్‌ఏ ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. తాను ఒప్పందం మేరకు అద్దె చెల్లిస్తున్నందున ఖాళీ చేసే ప్రసక్తి లేదని, గడువు తీరేంతవరకు తననెవరూ కదిలించలేరని ప్రశాంత్‌ స్పష్టం చేశారు. దాంతో ఆమె అబ్బే ఊరికే కేవలం అభ్యర్ధించా అంటూ వెనక్కు తగ్గారు. నెల రోజులు కూడా గడవక ముందే బిజెపి ఇలాంటి పనులకు పాల్పడిందింటే రానున్న రోజుల్లో ఎలాంటి గిల్లి కజ్జాలకు దిగుతుందో చూడాల్సి ఉంది.

బంగ్లాదేశీయుడివా అంటూ గిరిజనుడిని కొట్టి చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి గూండాలు !

డిసెంబరు 17న కేరళ పాలక్కాడ్‌ జిల్లా అట్టపల్లమ్‌ గ్రామంలో హత్యకు గురైన చత్తీస్‌ఘడ్‌ వలస కూలీ, గిరిజనుడైన రామనారాయన్‌ భగేల్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 30లక్షల రూపాయలు మంజూరు చేసింది. తల్లి, భార్యకు ఐదేసి లక్షలు, ఇద్దరు పిల్లలకు పదేసి లక్షల చొప్పున వారి పేర్లతో ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేస్తారు. నువ్వు బంగ్లాదేశీయుడివా అంటూ రామనారాయన్‌ను కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో నిందితుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపికి చెందిన వారు ఉన్నారు. ఏడుగురిని అరెస్టు చేయగా మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో నిందితుల్లో ఇద్దరు పదిహేనేండ్ల క్రితం ఒక సిఐటియు మరియు డివైఎఫ్‌ఐ కార్యకర్తను చేసిన వారిలో ఉన్నారు. వారితో తమకేమీ సంబంధం లేదని బిజెపి చెప్పుకుంది. ఆ పార్టీకి చెందిన వారు ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు మీడియాకు తెలిసినప్పటికీ మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

28 Sunday Dec 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

14th Dalai Lama, 2025 Pentagon Report, anti china, Anti communist, BJP, China, China Arms, Donald trump, Narendra Modi Failures, RSS, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా అమెరికా రక్షణశాఖ ( పెంటగన్‌ ) 2025 నివేదిక విడుదల చేసింది. దానిలో ఉన్న అభూత కల్పనలు, కుట్ర సిద్దాంతాలు, వక్రీకరణలతో సహా అనేక అంశాల గురించి మీడియాలో, ఇతరంగా అనేక మంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. హెచ్చరికలు, పరోక్ష బెదిరింపులు, బుజ్జగింపులు, చైనా, మనదేశం పరస్పరం దెబ్బలాడుకొనేందుకు తంపులు పెట్టటం వంటివి అనేకం ఉన్నాయి. ఈ ఏడాది నివేదిక ప్రత్యేకత ఏమంటే తనతో చెట్టపట్టాలు వేసుకుతిరిగి ఒకే కంచం, ఒకే మంచం అనే జిగిని దోస్తులా ఉన్న నరేంద్రమోడీకి సహజభాగస్వామి డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్ని పరీక్ష పెట్టాడంటే అతిశయోక్తి కాదు. ఏడాది కాలంలో ఎంతలో ఎంతమార్పు ? ఐదేండ్ల పాటు శత్రువుగా పరిగణించిన చైనాతో పూర్వంమాదిరి సంబంధాలు, అమెరికాతో ఎడబాటుకు 2025 నాంది పలికింది. అమెరికా మీడియా కొన్ని అంతర్గత అంశాల మీద విమర్శనాత్మకంగా ఉన్నప్పటికీ మొత్తం మీద ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కనుసన్నలలోనే ఉంటుంది.” భవిష్యత్‌లో ఘర్షణ అవకాశం ” ఉంటుందంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా భారత్‌-చైనా గురించి ఒక విశ్లేషణ రాసింది. దానికి ఆధారం పెంటగన్‌ నివేదికలోని అంశాలు. భవిష్యత్‌లో చైనాతో తలెత్తే యుద్ధం కోసం యావత్‌ హిమాలయ ప్రాంతంలో భారత్‌ వందల కోట్ల డాలర్లతో రోడ్లు, సొరంగాలు, విమానాలు ఎగిరే, దిగే ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. రక్షణ విషయంలో సమతూకంతో ఉండటం కాకుండా వ్యూహాత్మక పోటీని సంచలనాత్మకం కావిస్తోంది. 2020 గాల్వన్‌ లోయలో మాదిరి చైనా కొద్ది గంటల్లోనే అదనపు బలగాలను దించగలదు, మౌలిక సదుపాయాలు లేని కారణంగా అదే భారత్‌కు ఒక వారం పడుతుంది. మొత్తం వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందని గుర్తించామని, అందువలన ఆలోచనలు నాటకీయంగా మారినట్లు లడఖ్‌ ప్రాంతంలో రవాణా నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించిన మాజీ అధికారి మేజర్‌ జనరల్‌ అమ్రిత్‌ పాల్‌ సింగ్‌ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది.గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత రెండుదేశాల మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి పడిపోయాయని, డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నుల విధింపుతో భారత్‌, చైనాలతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నట్లు కూడా వ్యాఖ్యానించింది.

రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవాలని 2024 అక్టోబరు నుంచి నిర్ణయించుకోవటమేగాక వేగంగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాయి. దాంతో ఏడు సంవత్సరాల తరువాత ప్రధాని నరేంద్రమోడీ చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి హాజరై పుతిన్‌, షీ జింపింగ్‌లతో భేటీ జరిపి అమెరికాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. పెంటగన్‌ నివేదిక ఈ పూర్వరంగంలో తయారైందే అన్నది స్పష్టం. సరిహద్దులలో ఉద్రిక్తతలు తగ్గటాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా-భారత్‌ సంబంధాలను బలహీనపరిచేందుకు చూస్తున్నదని, పాకిస్తాన్‌తో రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకుంటున్నదని, అరుణాచల్‌ ప్రదేశ్‌ను ప్రధాన అంశంగా చూస్తున్నదని ఆ నివేదికలో చైనా మీద ఆరోపించారు. గత పదకొండు సంవత్సరాలు, అంతకు ముందు యుపిఏ హయాంలో అమెరికా జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు మన్మోహన్‌ సింగ్‌ ప్రయత్నించారు. ఆ కారణంతోనే యుపిఏ-2 హయాంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. తరువాత నరేంద్రమోడీ హౌడీమోడీ కార్యక్రమంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేసి చెట్టపట్టాలు వేసుకుతిరిగి మరింత సన్నిహితమయ్యారు. క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా మరింత చురుకుగా వ్యవహరించారు.ఈ పరిణామాలకు చైనా కారణమా ? ప్రారంభ సంవత్సరాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా అమెరికావైపే మొగ్గారు.దానిది ధృతరాష్ట్ర కౌగిలి అని అర్ధమయ్యాక అలీనవిధానం, సోవియట్‌ వైపు మొగ్గారు. పరిస్థితిని చూస్తుంటే ఇప్పుడు నరేంద్రమోడీ కూడా చైనాతో రానున్న రోజుల్లో ఎలా ఉంటారో తెలియదుగాని అనివార్యంగా అమెరికా బెదిరింపులను వ్యతిరేకించకతప్పని స్థితిలో ఉన్నారు. నరేంద్రమోడీ అమాయకంగా చైనా వలలో చిక్కుకున్నారని అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. అవసరాలు అలానడిపిస్తాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగమని మనదేశంలో ఆశ్రయం పొందుతున్న దలైలామా స్వయంగా చెప్పాడు. ఆ పెద్దమనిషికి మనదేశం అన్నివిధాలుగా మద్దతు ఇస్తున్నది.అదే మాట చైనా కూడా చెబుతున్నమాట నిజం.అయితే ఎన్నడూ ఆక్రమించుకుంటామని చెప్పలేదు.1962 యుద్ధం సందర్భంగా చైనా సేనలు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. అక్కడే తిష్టవేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.యుద్ధంలో కాల్పుల విరమణను వారే ప్రకటించి, తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు ఆవలకు వెళ్లాయి. ఇది చైనా వ్యతిరేకులు కూడా అంగీకరిస్తున్న తిరుగులేని వాస్తవం. బ్రిటీష్‌ అధికారులు గీచిన సరిహద్దు రేఖలను చైనా ఎన్నడూ అంగీకరించ లేదు. లడఖ్‌లోని ఆక్సారు చిన్‌ ప్రాంతం మనదిగానూ, అరుణాచల్‌ చైనాలో భాగంగా బ్రిటీష్‌ మాపుల్లో ఉంది. అందుకే సరిహద్దు వివాదం తలెత్తింది. ఐదేండ్ల క్రితం ఆరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి చైనా కొన్ని గ్రామాలు నిర్మిస్తున్నదని మన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవి అమెరికా సిఐఏ సృష్టించిన కట్టుకథలు, వక్రీకరించిన చిత్రాలు. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన మన మిలిటరీ అధికారి రావత్‌ అప్పుడే ఆ వార్తలు అవాస్తమని ప్రకటించారు. గతంలో ఎన్నడో నిర్మించిన ఇండ్లు పాతబడిపోయినందున వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు తప్ప చైనా ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని చెప్పారు.మన కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఎలాంటి దురాక్రమణలు జరగలేదని పార్లమెంటులో, వెలుపలా ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు, యుద్ధ విమానాలు విక్రయిస్తున్నది జాగ్రత్త అంటూ మనదేశాన్ని భయపెట్టేందుకు పెంటగన్‌ పూనుకుంది. ఆయుధాల క్రయ, విక్రయాలు అంతర్జాతీయ నిబంధనలమేరకే జరుగుతున్నాయి.చైనా గురించి మనలను రెచ్చగొడుతున్న అమెరికా దాని కంటే ముందుగానే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను, ఇతర ఆయుధాలను పాకిస్తాన్‌కు ఎందుకు అమ్మినట్లు ? మనకు కూడా ఎఫ్‌-35 విమానాలను ఇస్తామని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు కదా ? మనం ఫ్రాన్సునుంచి రాఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా చైనా నుంచి పాకిస్తాన్‌ కొనుగోలు చేసింది. చైనా విమానాలు ఎగరలేవు, ఆయుధాలు తుస్సుమనే నాశిరకం అని ఒకవైపు ప్రచారం చేస్తున్నవారు, వాటి గురించి ఎందుకు భయపెడుతున్నట్లు ? ఎంతో సమర్ధవంతమైనవని చెబుతున్న రాఫేల్‌ విమానాలను పాకిస్తాన్‌ ఆ నాశిరకం ఆయుధాలతోనే కూల్చివేసింది. ఆపరేషన్‌ సింధూర్‌లో ఏం జరిగిందీ, చైనా ఆయుధాల గురించీ నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు. ఆ తరువాతే కదా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి మోడీ వెళ్లటం, చైనాకు వీసాలు, విమానాల పునరుద్ధరణ వంటి సానుకూల పరిణామాలన్నీ చోటు చేసుకున్నది. సంబంధాల పునరుద్ధరణ సందర్భంగా రెండు దేశాలూ ఇతర దేశాలతో సంబంధాల విషయంలో పరస్పరం ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని నిర్ణయించాయి. పెంటగన్‌ నివేదికను చూసి మనదేశంలోని కొందరు నిజమే కదా అనుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.

తగాదాలు పెట్టటం, అనుమానాలను పెంచటంలో అమెరికా తరువాతే ఎవరైనా. పెంటగన్‌ నివేదికను బయటపెట్టిన తరువాత గతంలో అధ్యక్షుడిగా ఉన్న జార్జి డబ్ల్యు బుష్‌ మరియు రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణలు బయటకు వచ్చాయి. చైనాను నమ్మవద్దని ఇప్పుడు మనకు ట్రంప్‌ చెబుతున్నట్లే నాడు బుష్‌ కూడా పుతిన్‌కు చెప్పాడు. బుష్‌-పుతిన్‌ మధ్య 2001 నుంచి 2008వరకు జరిగిన సంభాషణల ప్రకారం చైనా నుంచి మీకూ మాకూ ఇద్దరికీ దీర్ఘకాలిక సవాలు ఉన్నదని, అందువలన మీరు జాగ్రత్తలు తీసుకోవాలని బుష్‌ చెప్పాడు. తొలిసారి స్లోవేనియాలో ఇద్దరు నేతలు భేటీ అయినపుడు రష్యా పశ్చిమదేశాల్లో భాగం అనీ శత్రుదేశం కాదని, చైనాతో జాగ్రత్తగా ఉండాలని, ఇద్దరికీ దీర్ఘకాలం సమస్యలుంటాయని బుష్‌ అన్నాడు.2005లో కూడా ఈ ప్రస్తావన చేసినపుడు మాకంటే మీకే ఎక్కువ సమస్యలని పుతిన్‌ చెప్పాడు. దానికి వారేమీ మా సరిహద్దులలో లేరని (చైనా – రష్యా మధ్య 4,195 కిలోమీటర్ల సరిహద్దు ఉంది ) చైనా నుంచి వ్యవస్థాపరమైన సవాలు ఉందని బుష్‌ బదులిచ్చాడు.అయితే పుతిన్‌ తక్కువేమీ తినలేదు గనుక తమకు తక్షణ ప్రమాదం నాటో తూర్పువిస్తరణ, ఐరోపాలో అమెరికా క్షిపణి మోహరింపు పధకాల నుంచి వుందని చెప్పాడు. చివరి సారిగా ఇద్దరు నేతల మధ్య 2008లో సంభాషణలు చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా బుష్‌ చైనా గురించి హెచ్చరించాడు. అయితే తమ దేశ సరిహద్దులకు పశ్చిమ దేశాల మిలిటరీ మోహరింపు తక్షణ ప్రమాదంగా ఉందని పుతిన్‌ స్పష్టం చేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో రష్యాను నమ్మించి మోసం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని నాటో చేసిన కుట్రలు బయటపడ్డాయి. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి తమకు తొత్తులుగా ఉండేవారిని గద్దెనెక్కించి, దానికి నాటో సభ్యత్వమిచ్చి రష్యా సరిహద్దుల్లో తిష్టవేసేందుకు పూనుకున్నారు. దానికి ప్రతిగానే రష్యా 2014లో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రాంతమైన క్రిమియాను స్వాధీనం చేసుకుంది. దాంతో రష్యాను జి 8 కూటమి నుంచి తొలగించారు.

అసలు అమెరికా ఎందుకు గుండెలు బాదుకుంటోంది ? ఆసియా ఖండంపై ఆధిపత్యం కోసం, దానిలో భాగంగా చైనాను కట్టడి చేసేందుకు దీర్ఘకాలంగా అది అనుసరిస్తున్న విధానానికి న్యూఢిల్లీ-బీజింగ్‌ సాధారణ సంబంధాల పునరుద్దరణ పెద్ద ఎదురుదెబ్బ.భారత్‌ మెడమీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలనుకున్న దాని ఎత్తుగడ పారే అవకాశం లేదని అనుకుంటున్నది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో మూడోదేశ జోక్యానికి అవకాశం లేదని మోడీ సర్కార్‌ స్పష్టం చేసింది.చైనాతో దౌత్య సంబంధాలు, వీసాలు, విమానాల పునరుద్దరణ ఏదో తాత్కాలిక వ్యూహంలో భాగం అనుకోలేము. రష్యా,చైనా, భారత్‌ సంబంధాలు మరింత సన్నిహితం కావటం సహజంగానే అమెరికాకు మింగుడుపడటం లేదు. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేదిగా కనిపిస్తున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా, భారత్‌,జపాన్‌,ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్‌ కూటమి భవిష్యత్‌ ఏమిటన్నది ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు.దక్షిణ చైనా సముద్రంలో చైనాను అడ్డుకొనేందుకు 2007లో ఈ కూటమిని అమెరికా ముందుకు తెచ్చింది. తరువాత దాని పరిణామాలు, పర్యవసానాలను మదింపు చేసుకొని మన్మోహన్‌ సింగ్‌ దాని పట్ల ఆసక్తి చూపకపోవటంతో ఒక విధంగా అది అటకెక్కింది. తరువాత నరేంద్రమోడీ ఉత్సాహం చూపటంతో 2017 నుంచి చురుకుగా పని చేస్తున్నది. అప్పటి వరకు అది ఆసియా – పసిఫిక్‌ అనే ఇతివృత్తంతో పని చేస్తున్నది కాస్తా మన దేశాన్ని ఇరికించేందుకు అమెరికా తెలివిగా ” ఇండో-పసిఫిక్‌ ” అజండాగా మార్చి దానికి భారత్‌ మూలస్థంభం అంటూ మోడీని మునగచెట్టు ఎక్కించి మన భుజాల మీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలని పధకం వేసింది. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో మోడీ ముందుకు పోతారా ? ఈ కూటమి తనకు వ్యతిరేకంగా రూపొందిన ” ఆసియా నాటో ” అని చైనా భావిస్తున్నది. తమకు ముప్పు తలపెట్టిన ఐరోపా కేంద్రంగా ఉన్న నాటో కూటమిని పుతిన్‌ వ్యతిరేకించటమేగాక దానికి పావుగా ఉన్న ఉక్రెయిన్‌ మీద మిలిటరీ చర్య జరుపుతున్న సంగతి తెలిసిందే. క్వాడ్‌ అంశంలో మరింత ముందుకు పోతే చైనాకు, వెనక్కు తగ్గితే అమెరికాకు ఆగ్రహం. అందుకే నరేంద్రమోడీకి డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్నిపరీక్ష పెట్టాడని చెప్పాల్సి వస్తోంది. ఏ దేశానికైనా దీర్ఘకాలిక విదేశాంగ విధానం ఉండాలి. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి అన్నట్లు ఎటువాటంగా ఉంటే అటుపోతే ఇలాంటి ఇరకాటాలే వస్తాయి మరి ! ఏం జరుగుతుందో చూద్దాం !!

రాజకీయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అది నడిపించే బిజెపిలోని అత్యధికులు కమ్యూనిస్టు వ్యతిరేకత, చైనా వ్యతిరేకత కారణంగా అమెరికా వైపు మొగ్గాలని వత్తిడి చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే మనవిదేశాంగ విధానం, స్వదేశీ విధానాలను నిర్దేశించేది ఇక్కడ ఉన్న పాలకవర్గం-బడా కార్పొరేట్లు, వారితో చేతులు కలిపే భూస్వామ్య, ధనిక రైతులు- అన్నది బహిరంగ రహస్యం. కొంత మందికి వెంటనే అవగతం గాకపోవచ్చు. అమెరికా విధించే షరతులు,వాణిజ్య విధానం తమకు నష్టదాయకమని పాలకవర్గం భావిస్తున్నది. దానికి అనుగుణంగా నడుచుకోవటం మినహా ప్రధానిగా ఎవరున్నా చేసేదేమీ లేదు. ధిక్కరిస్తే తమకు దాసులుగా ఉన్నవారిని గద్దెనెక్కిస్తారు.సంస్కరణలను మరింతవేగవంతంగా, ప్రతిఘటనను అణచివేసి తమకు మరింతగా లాభాలు సంపాదించి పెడతారనే నమ్మకంతోనే మన్మోహన్‌ సింగ్‌ను వదిలించుకొని నరేంద్రమోడీని రంగంలోకి తెచ్చారు. మారిన పరిస్ధితుల్లో అంతర్గతంగా మోడీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు, చైనా వైపు మొగ్గారు. అందుకే ట్రంప్‌ ఇప్పుడు అగ్నిపరీక్ష పెట్టారు. ఏ గట్టునుండాలో తేల్చుకొమ్మని హెచ్చరించాడు. చరిత్రలో అనేక మంది తీరుతెన్నులను చూసినపుడు జెండాలు, అజెండాలను ఊసరవెల్లి మాదిరి పరిస్థితికి తగినట్లుగా మార్చటం చూశాము. ముందు రోజు రాత్రి వరకు జనతా పార్టీని గట్టిగా సమర్ధించిన ” సోషలిస్టు ” జార్జి ఫెర్నాండెజ్‌ తెల్లవారేసరికి మొరార్జీదేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారటం తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

24 Wednesday Dec 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Education, Europe, Germany, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti-science politics, Attack on Scientific Temperament, Donald trump, Hitler’s Gift, India pseudoscience, Narendra Modi Failures, RSS, Trump assault on science

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో రెండవసారి అధికారానికి వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తికాకుండానే డోనాల్డ్‌ ట్రంప్‌ సైన్సు, సంబంధిత అంశాలపై దాడులు చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా సైన్సు రక్షణకు అక్కడి శాస్త్రవేత్తలు నడుంకట్టారు. గత పదకొండు నెలల కాలంలోనే ట్రంప్‌ వేగవంతంగా, తీవ్రమైన దాడులు ఐదువందలసార్లు చేశాడని ఆ రంగం తీరుతెన్నులను పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు. అనేక సంస్థలలో అశాస్త్రీయ భావాలు కలవారితో నింపుతున్నాడు. పొమ్మనకుండానే పొగబెట్టినట్లుగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు నిధుల కోత పెడుతున్నాడు. ఈ వైఖరి సైన్సుపై నిరంకుశత్వంగా వర్ణిస్తూ దాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధులు కావాలని, వచ్చే ఏడాది చేపట్టే కార్యాచరణకు గాను డిసెంబరు 31లోగా విరాళాలు ఇవ్వాలని ” తాపత్రయపడే సైంటిస్టుల యూనియన్‌ ” పిలుపునిచ్చింది. మనతో సహా ప్రపంచంలో అనేక దేశాల్లో ఆశాస్త్రీయ కుహనా సైన్సును జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతున్నది.

డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సైన్సు మీద జరుపుతున్నదాడి వలన అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అది స్వయంగా చేసుకొనే తీవ్రహాని అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులు పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావటాన్ని సహించలేని ట్రంప్‌ వాటికి నిధులు కోతపెడతానని బెదిరించిన సంగతి తెలిసిందే.వాటితో నిమిత్తం లేకుండానే శాస్త్రపరిశోధనలను నిరుత్సాహపరిచేందుకు బిలియన్లకొద్దీ నిధులకోత ప్రారంభించాడు. ప్రధాన పరిశోధనా సంస్థల బడ్జెట్‌లో 50శాతం కోత పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీంతో అనేక మంది శాస్త్రవేత్తలు అమెరికా వీడటం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో హిట్లర్‌ యూదులపై జరిపిన ఊచకోత నుంచి తప్పించుకొనేందుకు ఆ సామాజిక తరగతికి చెందిన అనేక మంది విద్యావంతులు, శాస్త్రవేత్తలు అమెరికా, ఇతర ఐరోపా దేశాలకు వలసలు పోయారు.ఆ దేశాల్లో అనేక నవకల్పనలకు ఆద్యులయ్యారు. దీంతో ఇతర దేశాలకు ” హిట్లర్‌ ఇచ్చిన బహుమతి ” అని ఈ పరిణామాన్ని వర్ణించారు. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా అదే చేస్తున్నారని చెబుతున్నారు. ఈ చర్యలతో చైనాతో సహా ఐరోపా ధనికదేశాలన్నీ లబ్దిపొందుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దేశాల్లో ప్రతిభావంతులకు పట్టం కట్టేందుకు పెద్ద మొత్తాలలో నిధులు కేటాయించారు. ట్రంప్‌ శాస్త్ర సలహాదారైన మైఖేల్‌ క్రాటిసియోస్‌ మాట్లాడుతూ సైన్సు అసమర్ధంగానూ, కనపడకుండా కంటిమీద గట్టి పొరలా మారిందని, ప్రత్యామ్నాయాలను చూడనిరాకరించేవారి బందీగా మారినందున అంతటినీ మార్చివేయాలని చెప్పాడు. ఇలాంటి వారి మాటలను విన్నతరువాత 80ఏండ్ల ట్రంప్‌కు బుర్రపని చేస్తుందని ఎలా అనుకోగలం.

శాస్త్ర పరిశోధనలకు గత కొన్ని దశబ్దాలుగా అమెరికా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే, వివిధ రంగాలలో నోబెల్‌ బహుమతి గ్రహీతల్లో సగం మంది అక్కడి నుంచే ఉన్నారు.అలాంటి చోట శాస్త్రంపై కత్తికట్టటం అంటే అది ఒక్క అమెరికాకే కాదు, యావత్‌ ప్రపంచానికి నష్టం.ఇప్పటికీ అనేక వ్యాధులకు కారణాలు, చికిత్సలు సవాలుగానే ఉన్నాయి. ట్రంప్‌ తీసుకున్న మతిమాలిన చర్యల కారణంగా అనేక పరిశోధనలు అర్ధంతరంగా ఆగటం లేదా ఆలశ్యానికి దారితీస్తాయి.అన్ని దేశాల్లో ఉన్నట్లే బ్యూరోక్రసీ అమెరికాలో కూడా తక్కువేమీ కాదు.ఐదు రోజుల పనివారంలో రెండు రోజులు ప్రయోగశాలలకు బదులు ప్రభుత్వ యంత్రాంగ కాగితాలు నింపటానికే రెండు రోజులు పోతున్నదని అనేక మంది శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నమాట నిజం. నివారణకు మార్గాలు వెతకాలి తప్ప అసలు పరిశోధకులనే తొలగిస్తే ఎలా ? అమెరికా అనుసరిస్తున్న ప్రతికూల విధానాల ఫలితంగా అక్కడ ఉండేవారి సంఖ్య తగ్గుతోంది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలకు విదేశాలకు వెళ్లాలని దరఖాస్తుచేసుకున్నవారు 2024 మొదటి మూడునెలలతో పోలిస్తే మూడో వంతు పెరిగింది.అమెరికాకు రావాలనుకొనే వారు నాలుగోవంతు తగ్గారు.ఒకసారి ఉన్న పేరుపోతే తిరిగి తెచ్చుకోవటం కష్టమని అనేక మంది చెబుతున్నా ట్రంప్‌ చెవికి ఎక్కటం లేదు. అమెరికా మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నతంగా ఉండటానికి శాస్త్రపరిశోధనలే కారణమని, అలాంటివి లేకపోతే ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తుందని ఆందోళన చెందేవారు మరోవైపు ఉన్నారు. శాస్త్రవిజ్ఞానాన్ని మానవాళి సౌభాగ్యానికి వినియోగించాలి. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు ఎక్కడ జరిగినా కాస్త వెనుకా ముందూ ప్రపంచంలోని వారందరికీ అందుబాటులోకి వస్తాయి. అలాంటి పరిశోధనా రంగంలో ముందున్న అమెరికా ఒక్కసారిగా జెండా ఎత్తేస్తే లోకమంతా అలాగే ఉంటుందని కాదు గానీ, పరిశోధనలు ఆలశ్యమౌతాయి.

శాస్త్రపరిశోధనలు ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం అవుతున్నందున వాటిని ఆయుధాలుగా చేసుకొని వెనుకబడిన దేశాలను దోపిడీ చేయటం కూడా ఒక వాస్తవం. ఉదాహరణకు అధిక దిగుబడి వంగడాలను తయారు చేసిన దేశాలకు చెందిన సంస్థలు పేటెంట్‌ హక్కుల పేరుతో ఎంత అధిక ధరలకు వాటిని ఎలా విక్రయిస్తున్నారో చూస్తున్నాం. వర్షాలు, వరదలు, దుర్భిక్షం వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే పసిగట్టే పరిజ్ఞానాన్ని మరింత నిర్ధిష్టం కావించాలి. అది అమెరికాకూ అవసరమే అక్కడి కొన్ని రాష్ట్రాలలో సంభవించిన ప్రమాదకర వరదలు, తుఫాన్లను సకాలంలో పసిగట్టగలిగి ఉంటే నష్టాలు తగ్గి ఉండేవి. జలుబుకు కారణమౌతున్న వైరస్‌లు అమెరికాలో ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వలన డెంగీ ఎంత ప్రమాదకరంగా ఉందో తెలిసిందే. రాజకీయాలలో ప్రపంచమంతటా మితవాద శక్తులు పెరిగిపోతున్నట్లుగానే ప్రపంచంలో శాస్త్రవిజ్ఞానాన్ని వ్యతిరేకించే మూఢత్వం కూడా పెరుగుతున్నది. కరోనా సమయంలో మనదేశంతో సహా ప్రపంచమంతటా అలాంటి శక్తులు ఎలా రెచ్చిపోయాయో చూశాము. శాస్త్రవేత్తలు, వైద్యుల సలహాలను పక్కన పెట్టి, వాక్సిన్‌ను వ్యతిరేకంచే శక్తుల మాటలు నమ్మి లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సందర్భంగా లాక్‌డౌన్లు విధించినందుకు పెట్రోలు, డీజిలు వ్యాపారుల లాబీ రంగంలోకి దిగి లాక్‌డౌన్ల వలన ఆర్థిక వ్యవస్థలకు నష్టం అని ప్రచారం చేయించటాన్ని కూడా చూశాము. కరోనా లేకుండానే సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వలన కలిగిన నష్టం ఎంతో, ఎందుకు సంభవించిందో వారు చెప్పారా ? కరోనా గురించి మీడియా సంస్థలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశాయో కూడా చూశాము.కరోనా, వాతావరణమార్పులు వాస్తవం కాదని, వాక్సిన్ల వలన ప్రయోజనం లేదని అమెరికా, ఐరోపాలోని ప్రముఖ మీడియా సంస్థలు చేసిన తప్పుడు ప్రచారం తెలిసిందే.

పర్యావరణానికి కలుగుతున్న హాని, వివిధ వ్యాధుల నివారణకు అవసరమైన వాక్సిన్లపై జరిపే పరిశోధనలకు ట్రంప్‌ సర్కార్‌ నిధుల కోత పెడుతున్నది, సిబ్బందిని తగ్గిస్తున్నది. వాతావరణ మార్పులపై పరిశోధన చేస్తున్న ఎన్‌సిఏఆర్‌ వంటి సంస్థలను ఎత్తివేయాలని చూస్తున్నది. వచ్చే ఏడాది ఎలాంటి దాడులను చేస్తుందో తెలియదు, 2025లో పరిశోధనా ప్రయత్నాలు, కీలకమైన శాస్త్రీయ సమాచారంతో పౌరులందరికీ అందుబాటులో వెబ్‌సైట్లను మూసివేసింది.ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే లేదా వ్యతిరేకించేవారి మీద దాడులకు ఉసిగొల్పుతున్నది, పదవుల నుంచి తొలగిస్తున్నది. ప్రజారోగ్య రక్షణలో ముందున్న డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సిడిసి) అధిపతిగా సుసాన్‌ మోనారెజ్‌ బాధ్యతలు స్వీకరించినపుడు అనేక మంది పరిశోధకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమెకు రాజీపడని మైక్రోబయాలజిస్ట్‌ మరియు ఇమ్యునాలజిస్ట్‌ శాస్త్రవేత్తగా పేరుంది. ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలుగా పని చేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే ఆగస్టులో ట్రంప్‌ ఆమెను బయటకు పంపాడు. ఒక శాస్త్రవేత్తగా రాజీపడని కారణంగానే తనను తొలగించారని ఆమె చెప్పారు.సిడిసిలో కొంత మంది శాస్త్రవేత్తలను తొలగించాలని,ఎలాంటి శాస్త్రీయ సమాచారం లేకపోయినప్పటికీ కొన్ని వాక్సిన్లకు ఆమోద ముద్ర వేయాలని ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌ కెనడీ జూనియర్‌ తనపై తెచ్చిన వత్తిడికి లొంగని కారణంగా తప్పుడు ఆరోపణలతో తొలగించినట్లు ఆమె చెప్పారు. ఈ మంత్రి గతంలో అమెరికాలో అత్యంత అవినీతి సంస్థగా సిడిసిని వర్ణించాడు. వాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కెనడీ వాక్సిన్ల విషయంలోనే ఆమెను వత్తిడి చేయటం అంటే సదరు కంపెనీల లాబీ ఎంతటి శక్తివంతమైనదో అర్ధం చేసుకోవచ్చు. బహిరంగంగా వాక్సిన్లను విమర్శించిన వారిని ఆ సంస్థలో చేర్చాడు. నాలుగో వంతు సిబ్బందిని తగ్గించాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ విధానాలు ప్రజారోగ్యానికి ముప్పు తెస్తాయని మోనారెజ్‌ హెచ్చరించారు.నిబద్దత, ఆత్మగౌరవం ఉన్న శాస్త్రవేత్త ఎవరూ తగిన శాస్త్రీయ సమాచారం లేకుండా వాక్సిన్‌ లేదా ఔషధాలను అంగీకరించరని సుసాన్‌ కూడా అదే చేశారని అనేక మంది ప్రశంసించారు. ఆమెకు మద్దతుగా ఒక వైద్యాధికారి, ముగ్గురు సీనియర్‌ సిడిసి శాస్త్రవేత్తలు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు.

శాస్త్రీయ భావనలు, వైఖరుల మీద ఒక్క అమెరికాలోనే కాదు అనేక దేశాల్లో మితవాదశక్తులు దాడులు చేస్తున్నాయి. గత పదకొండు సంవత్సరాల్లో మనదేశంలో కూడా అదే జరిగింది.ఊహాజనితమైన ఆశాస్త్రీయ సాంకేతికపరమైన అంశాలను అధికారంలో ఉన్న పెద్దలే ప్రచారం చేస్తున్నారు. సైన్సును కాపాడాలంటూ గత ఏడాది ఆగస్టులో అనేక పట్టణాల్లో ప్రదర్శనలు చేసిన శాస్త్రవేత్తలను చూశాము. శాస్త్రీయ భావజాలంపై దాడి, పరిశోధనలకు నిధుల కోత పెట్టటాన్ని, కుహనా సైన్సును ముందుకు తేవటాన్ని నిరసించారు. హిందూత్వ భావజాలానికి అనుగుణంగా విద్యావిధానం, సిలబస్‌లో మార్పులు తెస్తున్నారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయని, ఇతర నాగరికతల కంటే వేదకాలమే గొప్పదనే ప్రచారం చేస్తూ జనాలను నమ్మించేందుకు చూస్తున్నారు. పురాతన కాలంలోనే మన దేశంలో ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసని దానికి నిదర్శనం గణేషుడేనని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే పురాతన కాలంలోనే దేశంలో ఇంటర్నెట్‌, ఉపగ్రహాలు ఉన్నాయని త్రిపుర ముఖ్యమంత్రిగా పని చేసిన బిజెపినేత విప్లవదేవ్‌ చెప్పారు.అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు మహాభారతంలో విదురుడు కూడా ఆ పరిజ్ఞానంతోనే యుద్దంలో జరుగుతున్నదాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడని చెప్పేవారున్న సంగతి తెలిసిందే. పురాతన భారతీయ విజ్ఞానం పేరుతో అనేక కోర్సులను ఐఐటిలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెడుతున్నారు. హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడటానికి మాంసాహారం తినటమే కారణమని హిమచల్‌ ప్రదేశ్‌లోని మండి ఐఐటి డైరెక్టర్‌ లక్ష్మీధర్‌ బెహరా సెలవిచ్చారు. ఇలాంటి అంశాలకు ప్రయోగశాలగా ఐఐటిని మార్చారు. భారతీయ విజ్ఞాన కేంద్రం (ఐకెఎస్‌) పేరుతో ఖరగ్‌పూర్‌ ఐఐటి అనేక అశాస్త్రీయ అంశాలను ప్రచురించింది. ఈ పేరుతో జ్యోతిష్యం వంటి వాటిని నూతన విద్యావిధానంలో చొప్పించేందుకు పూనుకున్నారు. డార్విన్‌ సిద్దాంతాన్ని సిలబస్‌నుంచి తొలగించారు. పురాతన కాలంలో అనేక ఇతర నాగరికతల మాదిరి మనదేశంలో కూడా శాస్త్రవిజ్ఞానం వర్ధిల్లిన మాట నిజం, దానికి అనేక దృష్టాంతాలున్నాయి. వాటిని చూపి నాడు లేనివాటిని కూడా ఉన్నాయని చెప్పటం జనాలను తప్పుదారి పట్టించటమే.పురాణాల్లో ఉన్న పుష్పక విమానాలను చూసే మన సంస్కృత గ్రంధాల్లో ఉన్న సమాచారాన్ని తస్కరించి నేటి విమానాలను పశ్చిమదేశాల్లో తయారు చేశారని చెబుతారు. ఆ గ్రంధాలు మన దగ్గర ఉన్నపుడు మనవారెందుకు చేయలేకపోయారంటే సమాధానం ఉండదు.ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సైన్సు వ్యతిరేకచర్యలకు పాల్పడటం ఆశ్చర్యం కలిగించటం లేదు. అతగాడి విధానాలను కార్మికవర్గం ఎలా ప్రతిఘటిస్తున్నదో అదే విధంగా అమెరికా శాస్త్రవేత్తలు ప్రారంభించిన ఉద్యమం కూడా ముందుకు పోయి తగిన ప్రభావం చూపటం అనివార్యం. మనదేశంలో కూడా శాస్త్రవేత్తలు, పురోగామివాదులు ముందుకు వచ్చి అలాంటి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టకపోతే రానున్న తరాలు సైన్సు -జ్యోతిష్యాలలో దేన్ని నమ్మాలో తెలియని అయోమయానికి లోనవుతాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు : బిజెపి తీరుచూస్తే అమిత్‌ షాకు ఆశాభంగం !

24 Wednesday Dec 2025

Posted by raomk in BJP, Congress, CPI(M), INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

BJP, CPI()M, Kerala local body election 2025, LDF, Narendra Modi Failures, UDF

ఎం కోటేశ్వరరావు

ఇటీవల కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అక్కడ అధికారంలో ఉన్న వామపక్ష సంఘటనకు ఎదురుదెబ్బ తగిలిందన్నది వాస్తవం. దాన్ని చావుదెబ్బగా కొందరు వర్ణిస్తున్నారు. అది నిజమా ? ప్రధాని నరేంద్రమోడీ తిరువనంతపురంలో బిజెపి సాధించిన విజయం గురించి గొప్పలు చెప్పుకున్నారు. కేరళ రాజకీయాల్లో ఒక మహత్తర ఘట్టం అన్నారు. మోడీ సేవలో తరిస్తున్న కాంగ్రెస్‌ తిరువనంతపురం ఎంపీ శశిధరూర్‌ చారిత్రాత్మక విజయం అన్నారు. ఎందుకటా నాలుగున్నర దశాబ్దాలుగా తిరువనంతపురం మేయర్‌ పీఠాన్ని నిలుపుకున్న సిపిఎం అక్కడ ఓడిపోయి 101 సీట్లకు బిజెపి 50 తెచ్చుకున్నందుకు. ఓకే, కాసేపు నరేంద్రమోడీని సంతుష్టీకరించేందుకు అంగీకరిద్దాం, నిజమే కదా ! అయోధ్య రామ మందిరం గురించి దశాబ్దాల పాటు బిజెపి ఎంత హడావుడి చేసిందో చూశాము. దానివల్లనే మూడుసార్లు మోడీ ప్రధాని అయ్యారు. అక్కడ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య భాగంగా ఉన్న ఫైజాబాద్‌లో పదేండ్ల అధికారం తరువాత బిజెపి ఓడిపోయింది, అంతేనా, వారణాసి నియోజకవర్గం, వరుసగా ప్రధాని నరేంద్రమోడీ మూడుసార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 3,71,784 ఓట్ల మెజారిటీ తెచ్చుకుంటే రెండవసారి 4,79,505కు పెంచుకోగా మూడవ సారి 1,52,532కు దిగజారింది. దీని గురించి ఏమని వర్ణిస్తారు ? ఒక వాస్తవం ఏమంటే కేరళలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈసారి పెరగకపోగా స్వల్పంగా తగ్గాయి. దీని గురించి మోడీ నుంచి ఎలాంటి స్పందనా ఉండదు ! స్థానిక సంస్థలలో అనేక అంశాలు పని చేస్తాయి. బిజెపి కేరళలో గతంలో తెచ్చుకున్న ఆరువందలకు పైగా పంచాయతీ వార్డులను ఈసారి పోగొట్టుకుంది. కొత్తగా కొన్ని తెచ్చుకొని గతం కంటే స్వల్పంగా మెరుగుపడింది. ఒకసారి అధికారంలో ఉన్నతరువాత అన్ని పార్టీలకూ వాటి పనితీరును బట్టి వ్యతిరేకత ఉంటుంది. అది ఒక్క సిపిఐ(ఎం)కే కాదు, ప్రతి పార్టీకి వర్తిస్తుంది.

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ(ఎం) నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ పని అయిపోయిందని తరువాత బిజెపిదే హవా అన్నట్లుగా మీడియాలో కొందరు ఊదరగొట్టారు. కేరళలో కమ్యూనిస్టు వ్యతిరేక మీడియాలో మళయాళ మనోరమ ఒకటి. అది 2025 డిసెంబరు 22న ఒక విశ్లేషణ రాసింది. దానికి పెట్టిన శీర్షిక ” స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ బిజెపి తీరుచూసి అమిత్‌ షా ఎందుకు ఆశాభంగం పొందుతారంటే ” దాన్లో ఏముందో చూద్దాం. ” స్థానిక సంస్థల ఎన్నికల్లో 25శాతం ఓట్లు తెచ్చుకోవాలని కేంద్ర హౌమ్‌ మంత్రి అమిత్‌ షా లక్ష్య నిర్దేశం చేశారు. అమిత్‌ షాలో ఆశావాద వేడి ఎందుకు పుట్టిందంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏ ఒక్కటే ఇక్కడ 19.40 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. అదిప్పుడేమైందంటే నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (బిజెపి-భారత ధర్మ జనసేన-లోక్‌ జనశక్తి పార్టీ) కేవలం 14.76శాతం ఓట్లనే తెచ్చుకోగలిగింది.(గత స్థానిక ఎన్నికల కంటే 0.24శాతం తక్కువ-వికీపీడియా) యుడిఎఫ్‌కు 38.81, ఎల్‌డిఎఫ్‌కు 33.45శాతం వచ్చాయి.

పంచాయత్‌లలో(జిల్లా,బ్లాక్‌,గ్రామపంచాయతీలు అన్నీ కలిపి) ఎన్‌డిఏకు వచ్చిన ఓట్లు 13.92శాతం, 2020లో వచ్చిన 14.34శాతం కంటే స్వల్పంగా తక్కువ. మున్సిపాలిటీలలో 13.1 నుంచి 19.44శాతానికి పెంచుకుంది.కార్పొరేషన్లలో 19.44 నుంచి 23.58శాతానికి పెంచుకుంది. మొత్తం అన్ని స్థానిక సంస్థలలో వచ్చిన సగటు ఓట్లు 14.76శాతం.2020 ఎన్నికల్లో వచ్చిన 12.92శాతం కంటే స్వల్పంగా పెంచుకుంది. కానీ ఇది తప్పుదారి పట్టించేది,ఎందుకంటే 2020 కంటే బిజెపి అదనంగా ఈసారి 40శాతం సీట్లలో పోటీ చేసింది.ఆ ఏడాది బిజెపి 14వేల వార్డుల కంటే తక్కువే పోటీ చేసింది. ఈసారి ఆ పార్టీ, మిత్రపక్షాలతో కలసి ఎన్నికలు జరిగిన మొత్తం 23,576 వార్డులలో 89.35శాతం అంటే 21,065 చోట్ల పోటీ చేసింది. బిజెపి ఒక్కటే 19,262 సీట్లలో పోటీ చేసింది. ఇతర ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ 17,497, సిపిఎం 14,802చోట్ల పోటీ చేశాయి. గత ఎన్నికల కంటే ఏడువేల వార్డులలో అదనంగా పోటీ చేయటంతో పాటు మొత్తం 25శాతం ఓట్లు, రెండు కార్పొరేషన్లు, కనీసం పది మున్సిపాలిటీలు,30 బ్లాక్‌ పంచాయతీలు, 300కు పైగా గ్రామ పంచాయతీలు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా దానిలో ఒక చిన్న భాగం మాత్రమే చివరికి దక్కింది. ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు (తిరువనంతపురం 6, కొల్లం 2, పత్తానంతిట్ట 4, అలప్పూజ 5,కొట్టాయం 3, త్రిసూర్‌ 1, పాలక్కాడ్‌ 2, కాసరగోడ్‌ ),రెండు మున్సిపాలిటీలు(పాలక్కాడ్‌,తిరుప్పునితుర) ఒక కార్పారేషన్‌(తిరువనంతపురం) దానికి దక్కాయి. అయినప్పటికీ కేవలం ఆరుగ్రామ పంచాయతీల్లోనే దానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ముదక్కల్‌(తిరువనంతపురం),పండలం-తెక్కెక్కర(పత్తానంతిట్ట) తిరువిలివామల(త్రిసూర్‌) అకతెత్తెర, పూడూరు(పాలక్కాడ్‌) మాధూర్‌(కాసర్‌గోడ్‌). చివరికి తిరువనంతపురం కార్పారేషన్‌లో కూడా 101 సీట్లకు గాను సాధారణమెజారిటీ 51కి గాను ఒకటి తక్కువగా 50వచ్చాయి. సీట్ల రీత్యా ఎల్‌డిఎఫ్‌ కంటే మెరుగ్గావచ్చాయి, గతం కంటే నాలుగుశాతం ఓట్లు పెరిగినప్పటికీ ఎన్‌డిఏకు వచ్చిన 34.52శాతం కంటే మెరుగ్గా ఎల్‌డిఎఫ్‌కు 34.56శాతం వచ్చాయి.

2020లో బిజెపికి కాసరగోడ్‌ జిల్లాలోని మధుర్‌, బెల్లూర్‌ గ్రామపంచాయతీలలో, రెండు మున్సిపాలిటీలు పాలక్కాడ్‌, పండలంలో స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈసారి రెండింటిలో దానికి మెజారిటీ రాలేదు, పండలంలో అవమానకరంగా నష్టపోయింది.ఈసారి ఎన్‌డిఏ 421 కార్పొరేషన్‌ వార్డులకు గాను 22.09శాతం(93), 3,240 మున్సిపల్‌ వార్డులకు గాను పదిశాతం (324), 346 జిల్లా పంచాయత్‌ వార్డులకు గాను ఒక్కటి, 2,267 బ్లాక్‌ పంచాయత్‌ వార్డులకు 54, గ్రామపంచాయతీలలోని 17,337కు గాను 1,447 వార్డులు 8.35శాతం వచ్చాయి.ఒక్క కార్పొరేషన్లలో తప్ప 2020తో పోల్చితే బిజెపి పరిస్థితి పెద్దగా మెరుగైనట్లు ఇవి ప్రతిబింబించటం లేదు. మున్సిపాలిటీలు, జిల్లా పంచాయత్‌లో గతం కంటే తగ్గింది. బిజెపి 2020లో సాధించినవి, ఇప్పటి పరిస్థితి ఇలా ఉంది.కార్పొరేషన్లు 14.25(ఇప్పుడు 22.09), మున్సిపాలిటీలు 10.4(ఇప్పుడు పదిశాతం) జిల్లాపంచాయత్‌లు 0.60(ఇప్పుడు 0.29), బ్లాక్‌ పంచాయత్‌ 1.78(ఇప్పుడు 2.38) గ్రామపంచాయతీలు 7.4 (ఇప్పుడు 8.35).ఈ సారి పండలం మున్సిపాలిటీని బిజెపి కోల్పోయింది. ఇది శబరిమలకు దగ్గరగా ఉంది. అంతర్గత కుమ్ములాటలు, పాలనలో అక్రమాల కారణంగా ఇది జరిగింది.గతంలో బిజెపికి 20 సీట్లు ఉంటే ఇప్పుడు తొమ్మిది స్థానాలతో మూడవ స్థానానికి దిగజారింది. పాలక్కాడ్‌లో బిజెపి 2020లో 28 సీట్లు తెచ్చుకొని సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఈసారి పెద్ద పార్టీగా ఎన్నికైనప్పటికీ మెజారిటీకి అవసరమైన 27కు గాను 25 తెచ్చుకుంది. తిపురినిత్తుర మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 15 తెచ్చుకుంది(ఎల్‌డిఎఫ్‌కు 21) ఈసారి 21సీట్లతో బిజెపి పెద్ద పార్టీగా ఎన్నికైంది, మెజారిటీ సంఖ్య 27.గత ఎన్నికల్లో రెండవ పార్టీగా ఉన్నప్పటికీ ఓట్లశాతంలో 27.54తో పెద్దదిగా, యుడిఎఫ్‌ 24.42, ఎల్‌డిఎఫ్‌ 23.25శాతం తెచ్చుకున్నాయి.

మున్సిపాలిటీలలో గుర్తించదగినదిగా బిజెపి ఉనికి ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో దాని ఓట్ల వాటా పెరిగింది. ఎర్నాకుళంలో 9.08 నుంచి 12.65, పత్తానంతిట్టలో 16.18 నుంచి 18.02, త్రిసూర్‌లో 19.14 నుంచి 21.86, పాలక్కాడ్‌లో 18.28 నుంచి 23.96కు పెరిగాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో క్రైస్తవ అభ్యర్ధులతో అది ప్రయోగం చేసింది. మున్సిపాలిటీలలో దాని ఓట్ల వాటా పెరిగింది.కొట్టాయంలో 11.5 నుంచి 15.1, ఇడుక్కిలో 12.53 నుంచి 14.88శాతానికి పెరిగింది. ఎల్‌డిఎఫ్‌ వాటా 21.63శాతానికి దగ్గరగా వచ్చింది.అయితే కొన్ని జిల్లాలోని మున్సిపాలిటీలలో దాని ఓట్ల వాటా తగ్గింది. తిరువనంతపురంలో 24.49 నుంచి 23.48కి, అలప్పూజలో 19.08 నుంచి 18.19, కాసరగోడ్‌లో 15.36 నుంచి 14.52కు తగ్గాయి. కొల్లం కార్పొరేషన్‌లో ఆరు నుంచి పన్నెండు సీట్లకు పెరిగాయి. ఆ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఓట్ల శాతం స్థిరంగా ఉంది, ఇప్పుడు 15.92 రాగా 2020లో 15.9శాతం వచ్చాయి. కొల్లం కార్పొరేషన్‌లో కూడా ఓట్లశాతం స్థిరంగానే ఉంది. తిరువనంతపురంలో 30.92 నుంచి 34.52,కొచ్చిలో 10.95 నుంచి 14.41కి, కన్నూరులో 11.61 నుంచి 14.06కు పెరిగాయి. మిగిలిన మూడు కార్పొరేషన్లలో 2020లో వచ్చిన మేరకే తిరిగి వచ్చాయి. కొల్లంలో 22.02 నుంచి 22.61కి,త్రిసూర్‌లో 18.86 నుంచి 18.54, కోజికోడ్‌లో 22.29 నుంచి 22.43శాతంగా ఉంది.

పైన పేర్కొన్నదంతా మళయాళ మనోరమ విశ్లేషణలోని అంశాలే. తిరువనంతపురంలో బిజెపి గెలుపు గురించి మీడియాలో వచ్చిందేమిటో చూశాము. శబరిమల అయ్యప్ప ఆలయం సమీపంలో ఉన్న పండలం మున్సిపాలిటీలో 34వార్డులు ఉండగా గత ఎన్నికల్లో బిజెపి పద్దెనిమిది తెచ్చుకుంది. ఈ సారి తొమ్మిది వార్డులతో మూడ స్థానానికి పడిపోయింది. అనేక మంది రాష్ట్ర నేతలు ఇక్కడ తిష్టవేసి ఎలాగైనా నిలబెట్టుకోవాలని చూశారు. ఎల్‌డిఎఫ్‌ 14, యుడిఎఫ్‌ 11 తెచ్చుకున్నాయి. అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశ వివాదంతో గతంలో బిజెపి పొందిన లబ్ది ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల అయ్యప్ప ఆలయంలో జరిగిన బంగారు తాపడాల అక్రమాన్ని ప్రచారం చేసి మరింతగా లబ్దిపొందాలని చూసి భంగపడింది. ఈ మున్సిపాలిటీ మాత్రమే కాదు, దాని పక్కనే ఉన్న కులంద గ్రామ పంచాయతీ 15 సంవత్సరాలుగా బిజెపి ఆధీనంలో ఉంది. ఈ సారి అక్కడ ఎల్‌డిఎఫ్‌ 8,బిజెపి, ఇతరులు నాలుగు చొప్పున, యుడిఎఫ్‌కు ఒక స్థానం వచ్చింది. శబరిమల ఆలయం ఉన్న రన్నీ-పెరునాడ్‌ పంచాయతీ శబరిమల వార్డులో బిజెపి మూడవ స్థానంలో ఉంది. యుడిఎఫ్‌, ఎల్‌డిఎఫ్‌కు సమంగా ఓట్లు రావటంతో లాటరీలో ఎల్‌డిఎఫ్‌కు వచ్చింది. ఈ పంచాయతీని పదివార్డులతో ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో బిజెపి 101కిగాను 50వార్డులతో అధికారానికి వచ్చింది. సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఓట్ల రీత్యా అక్కడ సిపిఐ(ఎం) ప్రధమ స్థానంలో ఉంది. మీడియాకు ఈ వివరాలు తెలిసినప్పటికీ అది పెద్ద ప్రాధాన్యత కలిగిన అంశం కాదన్నట్లుగా మౌనంగా ఉంది.లోక్‌సభ ఎన్నికలు 2024లో బిజెపికి తిరువనంతపురంలో 2,13,214 ఓట్లు వస్తే కార్పొరేషన్‌ ఎన్నికల్లో అవి 1,65,891కి తగ్గాయి. యుడిఎఫ్‌ ఓట్లు 1,84,727 నుంచి 1,25,984కు పడిపోగా ఎల్‌డిఎఫ్‌ ఓట్లు 1,29,048 నుంచి 1,67,522కు పెరిగాయి, అంటే బిజెపి కంటే స్వల్పంగా ఎక్కువ తెచ్చుకుంది. బిజెపి గెలిచిన 50 వార్డులలో 40 చోట్ల యుడిఎఫ్‌ మూడవ స్థానంలో ఉంది. ఇరవై అయిదు వార్డులలో కాంగ్రెస్‌కు కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. కొన్నింటిలో ఐదువందలకు లోపే వచ్చాయి. ? కొన్ని చోట్ల బిజెపి వంద ఓట్లకంటే తక్కువ మెజారిటీతో గెలిచింది. దీని అర్ధం ఏమిటి ? పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలో ఓటర్ల తీరులో తేడా ఉంటుందన్నది వాస్తవం. అక్కడ గెలిచిన కాంగ్రెస్‌ నేత శశిధరూర్‌ ఆ పార్టీలో ఉంటూనే బిజెపితో చెలిమిచేస్తున్న సంగతి బహిరంగ రహస్యం. తన పార్టీ తీరుతెన్నులను మరిచి పోయి బిజెపి చారిత్రాత్మక విజయం సాధించిందని పొగిడారంటే ఏం జరిగిందో చెప్పనవసరం లేదు. అనేక చోట్ల రెండు పార్టీలు సిపిఎంకు వ్యతిరేకంగా కుమ్మక్కు కావటం గతంలో జరిగింది, ఇప్పుడు కూడా పునరావృతం అయినట్లు కనిపిస్తోంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా ! ఐదు రోజుల్లోనే మాట మార్చిన ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి !!
  • ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు – అణుబాంబు కంటే అమెరికాకు హార్ముజ్ ముఖ్యం !
  • మోడీ నోరు తెరిపించటం రాముడి వల్లకాదు : మందిర్, మసీదు, చర్చి కాదేదీ చోరీకి అనర్హం – లౌకిక శక్తుల కర్తవ్యం ఏమిటి !
  • మారుతున్న ప్రపంచ సమీకరణాలు – చైనా పట్ల పెరుగుతున్న విశ్వసనీయత !
  • కేజీ బేసిన్ గ్యాస్ ఆయిల్ దోపిడీ – ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు 2024 తెస్తున్న వినాశనం-వేదాంత 

Recent Comments

SIVARAMAKRISHNA Gunturu's avatarSIVARAMAKRISHNA Gunt… on రాముడి సొమ్ము స్వాహా దర్యాప్తు…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…

Archives

  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 240 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d