• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

రేటింగ్‌ మతలబులో మరిన్ని భారాలు, సబ్సిడీల కోతకు వత్తిడి !

03 Thursday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Congress, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

failure Modi, india debt, Modi Sarkar, Narendra Modi, s&p india, s&p india rating, subsidy, subsidy cuts

ఎం కోటేశ్వరరావు

    వూహల పల్లకిలో తేలుతున్న ప్రధాని నరేంద్రమోడీకి వారం రోజుల్లోనే రెండు చెడువార్తలు. సరళతర వాణిజ్య సూచికలో ప్రపంచ బ్యాంకు మన స్ధానాన్ని 131 నుంచి కేవలం 130కి మాత్రమే తాజాగా సవరించింది. పులి మీద పుట్రలా ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే అమెరికా రేటింగ్‌ సంస్ధ స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ (ఎస్‌అండ్‌ పి) వచ్చే రెండు సంవత్సరాల వరకు ప్రస్తుతం అత్యంత నాసిగా వున్న భారత్‌ రేటింగ్‌ను సవరించేది లేదని తేల్చి చెప్పింది. అంటే మన ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ ‘పని తీరు మీద అంతగట్టి విశ్వాసం ‘ ఏర్పరుచుకుందన్న మాట. తాను రాగానే అంతర్జాతీయ సమాజంలో గత ప్రభుత్వ హయాంలో గతించిన భారత ప్రతిష్టను ఎంతగానో ఇనుమడింప చేశానని తనకు తానే కితాబు ఇచ్చుకున్న నరేంద్రమోడీకి దీన్ని పెద్ద తిట్టు, అవమానంగా భావిస్తారా ? లేక సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటారా ? ఆ సంస్ధ మనకు ఇచ్చిన రేటింగ్‌‘ BBB-/A-3’ . దీన్ని వాణిజ్య పరిభాషలో చెప్పాలంటే పెట్టుబడులకు సంబంధించి అత్యంత తక్కువ గ్రేడ్‌ ఇది. ఇప్పుడున్న స్ధితి, జోస్యాలను బట్టి ఈ గ్రేడ్‌ అయితే స్ధిరంగా వుంటుందని, వచ్చే ఏడాది కూడా దీనిని సమీక్షించే అవకాశం లేదని, ప్రభుత్వ సంస్కరణలు, ద్రవ్య పరిస్ధితిని మెరుగు పరిస్తే, ప్రభుత్వ రుణం జిడిపికి 60శాతం కంటే తగ్గితే అప్పుడు రేటింగ్‌ సవరణ గురించి సమీక్షిస్తామని చెప్పటం పుండుమీద కారం చల్లటం వంటిది. సెప్టెంబరు నెలలో మూడీస్‌ సంస్ధ కూడా ఇదే విధంగా ఒకటి రెండు సంవత్సరాల తరువాతే సమీక్షిస్తామని చెప్పటాన్ని మరిచిపోరాదు. ప్రస్తుతం మన ప్రభుత్వ రుణ భారం 69శాతం వుంది. అంటే మనకు వంద రూపాయల ఆదాయం వస్తుందనుకుంటే అప్పు 69 రూపాయలు వున్నట్లు. మన జిడిపి పెరుగుదల గురించి మంచి మాటలు చెప్పిన ఎస్‌ఆండ్‌ పి 2016లో 7.9శాతం, 2016-18 సంవత్సరాలలో సగటున ఎనిమిది శాతం పెరుగుదల వుంటుందని, జిఎస్‌టి వంటి చర్యల పట్ల అభినందనలు కూడా తెలిపింది. అయితే ఈ బలంతో పాటు తక్కువగా వున్న తలసరి ఆదాయం, ప్రభుత్వ ఖజనా బలహీనంగా వుండటం, బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల వంటి బలహీనతలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటదని తేల్చి చెప్పింది.

    ఈ ప్రకటనతో హతాశురాలైన ప్రభుత్వం పెట్టుబడిదార్ల ఆలోచన, రేటింగ్‌ ఏజన్సీల మధ్య సంబంధాలు లేనట్లు కనిపిస్తున్నదని ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ ద్వారా వ్యాఖ్యానించింది.ఆర్ధిక వ్యవస్ధను పటిష్ట పరిచేందుకు, జిడిపి అభివృద్ధిని పెంచేందుకు, వుద్యోగ కల్పనకు ప్రయత్నిస్తామని కూడా దాస్‌ చెప్పారు.రేటింగ్‌ను మెరుగు పరచనంత మాత్రాన ప్రభుత్వం పెద్దగా ఆందోళన చెందటం లేదని, సంస్ధ నివేదికలో పేర్కొన్నట్లుగా వివిధ అంశాలను పోల్చుకుంటే భారత్‌తో సమంగా మరొక ఆర్ధిక వ్యవస్ధ వుందా అని ప్రశ్నిస్తూ రేటింగ్‌ ఇవ్వబోయే ముందు ఆత్మావలోకనం చేసుకోవాలని కూడా దాస్‌ అన్నారు. భారత రేటింగ్‌ను తక్కువ చూపుతున్నారని ప్రపంచ మదుపుదార్లు భావిస్తున్నారని, వారి ఆలోచనలు- రేటింగ్‌ సంస్ధలకు మధ్య సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.

    మన ప్రభుత్వ రుణ భారం 1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభించిన సమయంలో జిడిపిలో 75.33 శాతం వుండేది. అది 1998లో బిజెపి నేత వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఏ అధికారానికి వచ్చే నాటికి 68.09 శాతానికి తగ్గింది. తమ పాలనలో భారత్‌ వెలిగిపోతోంది అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగి బిజెపి ఓడిపోయిన సమయానికి 2003లో అప్పును రికార్డు స్ధాయికి 84.24 శాతానికి బిజెపి సర్కార్‌ తీసుకుపోయింది. ఆ తరువాత 2013 నాటికి 67.96 శాతానికి తగ్గింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015 నాటికి 69.07 శాతానికి పెరిగింది.http://countryeconomy.com/national-debt/india 2015 వివరాల ప్రకారం ప్రపంచంలోని 184 దేశాల జాబితాలో జడిపి-రుణం నిష్పత్తిలో మన దేశం 140 స్ధానంలో తలసరి అప్పులో 69లో వుంది.

Image result for worried arun jaitly

    మన దేశంలో కొంత మంది దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో వుండేందుకు ప్రయత్నిస్తారు. అనేక సందర్భాలలో చైనా, పాకిస్తాన్‌లతో మన దేశాన్ని పోల్చుకుంటారు. తప్పులేదు. అందుకే మచ్చుకు కొన్ని పోలికలు చూడండి.http://countryeconomy.com/countries/compare/china/india సమాచారం ప్రకారం 2015వ సంవత్సరంలో కొన్ని వివరాలు ఇలా వున్నాయి. జిడిపి మిలియన్‌ డాలర్లలో, తలసరి ఆదాయం డాలర్లుగా గమనించాలి.

                                చైనా                    భారత్‌                 పాకిస్తాన్‌

జిడిపి                  11,181,556             2,073,002             271,050

జిడిపి తలసరి                8,141                   1,581                 1,428

జిడిపిలోరుణశాతం           42.92                   69.07                 63.57

జిడిపిలోలోటుశాతం            2.69                     6.91                   5.24

     నరేంద్రమోడీ లేదా గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వమైనా అనుసరిస్తున్నది విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ అనుకూల విధానాలే అన్నది స్పష్టం. వివిధ దేశాలలోని రేటింగ్‌ సంస్ధలన్నీ వారి కనుసన్నలలో నడిచేవే, వారి లాభాలను కాపాడేవే అన్నది గమనంలో వుంచుకోవాలి. ఈ పూర్వరంగంలో ప్రపంచబ్యాంకు సూచికను చూసినా, ప్రస్తుత ఎస్‌ఆండ్‌ పి రేటింగ్‌ను గమనించినా మన దేశ పాలకవర్గం నుంచి ఇంకా మరిన్ని రాయితీలు, మరింతగా మన ఆర్ధిక వ్యవస్ధను తెరవాలని వత్తిడి చేస్తున్నాయన్నది స్పష్టం. జిఎస్‌టి అమలు వలన సమీప భవిష్యత్‌లో ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదని ఎస్‌ అండ్‌ పి పేర్కొన్నది. గత రెండు దశాబ్దాల తీరుతెన్నులను గమనిస్తే సంస్కరణలు అమలు జరుపుతున్నామని చెబుతున్నప్పటికీ రెండు దశాబ్దాలలో జిడిపిలో ద్రవ్యలోటు 8.8శాతం, గత ఐదు సంవత్సరాల సగటు ఏడు శాతంగా వుంది. దీని పర్యవసానంగా మన దేశ రుణ భారంతో పాటు దానికి చెల్లించే వడ్డీ కూడా గణనీయంగా పెరుగుతోంది. జిడిపిలో మన ఆదాయం 21శాతం తక్కువగా వున్నదని, ఖర్చులో సబ్సిడీలు గణనీయంగా వున్నట్లు తాజా నివేదికలో పేర్కొన్నారు. అంటే అర్ధం పన్నులు,సెస్సుల వంటి వాటిని పెంచి ఆదాయం పెంపు, సబ్సిడీలకు మరింత కోత విధించి పొదుపును పెంచాలని పరోక్షంగా వత్తిడి చేయటమే. జిఎస్‌టి ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుందని అయితే అది వెంటనే ఫలితాలను ఇవ్వదని, సబ్సిడీ కోతలు ఆలశ్యమౌతాయని స్పష్టంగా చెప్పింది. బ్యాంకులు ప్రత్యామ్నాయ వనరుల ద్వారా పెట్టుబడులను సమకూర్చుకోలేని పక్షంలో బాసెల్‌-3 ప్రమాణాల ప్రకారం 2019 నాటికి 45 బిలియన్‌ డాలర్ల మేరకు ప్రభుత్వం పెట్టుబడి నిధులను సమకూర్చాల్సి వుంటుందని, ప్రస్తుతం ప్రభుత్వం వాగ్దానం చేసిన 11 బిలియన్‌ డాలర్లను గణనీయంగా పెంచాలని తెలిపింది. ద్రవ్యోల్బణం రేటును 2017 మార్చి నాటికి ఐదు శాతానికి రిజర్వుబ్యాంకు పరిమితం చేయగలదనే ఆశాభావాన్ని వెలిబుచ్చింది. సంస్కరణల నిలిపివేత, అభివృద్ధి గిడసబారటం, నిర్ధేశిత లక్ష్యాలను అమలు జరపటంలో వైఫల్యం లేదా విదేశీ చెల్లింపుల పరిస్ధితి దిగజారితే రేటింగ్‌ను తగ్గించే అవకాశం వుంది. వీటిపై మోడీ ప్రబుత్వం తీసుకొనే చర్యల పట్ల విశ్వాసం లేక లేదా గట్టిగా అమలు జరిపించేందుకు రేటింగ్‌ ఏజన్సీలు ప్రస్తుతం ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచబ్యాంకు,రేటింగ్‌ ఏజన్సీలను సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పటమంటే రానున్న రోజులలో కార్మికులు, వుద్యోగులు, సామాన్య జనానికి మరిన్ని కష్టాలు మూడబోతున్నట్లే భావించాలి.

    రేటింగ్‌ ఏజన్సీల వత్తిడి ఇప్పుడేదో ఆకస్మికంగా ప్రారంభం అయింది కాదు. ద్రవ్య పరిస్ధితిని పటిష్ట పరచేందుకు రూపొందించిన పధకానికి కట్టుబడి వుండకపోతే అనుకున్న ప్రకారం ఆదాయం పెరగకపోవటం, సబ్సిడీల కోత ఆలస్యం కావచ్చని ఇదే ఎస్‌ అండ్‌ పి సంస్ధ ఈ ఏడాది జనవరిలోనే హెచ్చరించింది. http://articles.economictimes.indiatimes.com/2016-01-31/news/70222497_1_services-tax-subsidy-cuts-finance-minister-arun-jaitley సంస్ధ విశ్లేషకుడు కైరన్‌ కరీ పిటిఐ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ద్రవ్యలోటు లక్ష్యం చేరుకోవటాన్ని ఒక ఏడాది పాటు వాయిదా వేసి 2015-16 బడ్జెట్‌లో ప్రభుత్వం దారి తప్పిందని, అనుకున్న విధంగా ఆదాయం రాకపోవటం, ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీల కోతపై ఆటంకాలను ఎదుర్కొన్నదని చెప్పాడు. కార్పొరేట్‌ సంస్ధల వత్తిడి, రేటింగ్‌ సంస్ధలను సంతృప్తి పరచటం కోసమే నరేంద్రమోడీ సర్కార్‌ పెట్రోలు, డీజిల్‌పై ఎక్సయిజ్‌ సుంకం, సేవాపన్ను పెంపు,కిరోసిన్ పై నెలవారీ సబ్సిడీ తగ్గింపు , స్వచ్చభారత్‌, కృషి కల్యాణ్‌ వంటి రకరకాల సెస్సులను ఈ కాలంలో విధించి మరో ఔరంగజేబుగా మారిన విషయం తెలిసిందే. అయితే జనంపై మరిన్ని భారాలు మోపి 2019లో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి, దాని మిత్ర పక్షాలు ఓట్ల కోసం జనం ముందుకు వెళతాయా? అధికారం కోసం విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు కోరుతున్న సంస్కరణలను ఏం చేస్తారు అన్నది చూడాల్సి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రజాస్వామ్యం -మిలిటరీ- ప్రశ్నించే హక్కు ?

12 Wednesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Congress party, dadri, dalali, democracy, Media, military, right to ask a question, surgical strike

ఎంకెఆర్‌

   సమాజంలో ఎప్పుడూ విరుద్ధ భావజాలాల మధ్య సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. అయితే అన్ని వేళలా అన్నీ ఒకే విధంగా సంఘర్షించుకోవు. ఎప్పుడూ ఒకటి ప్రధాన మైన సంఘర్షణగా వుంటుంది. దీని అర్ధం మిగతావి సంఘర్షించుకోవు అని కాదు. ఏ రెండింటి మధ్య జరిగేది ప్రధాన సంఘర్షణ అన్నది గుర్తించటం ముఖ్యం. అయితే వెంటనే దానితో అందరూ ఏకీభవించకపోవచ్చు.అసలు దానిని ఒక వైరుధ్యంగా కొందరు గుర్తించకపోవచ్చు కూడా. ఇప్పుడు దేశంలో అదే పరిస్ధితి వుందన్నది అనేక మంది అభిప్రాయం. కొంత మంది విభేదించినప్పటికీ అనేక దేశాలతో పోలిస్తే మనం మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్ధలో వున్నాం. భావ ప్రకటనా స్వేచ్చ మీద జరుగుతున్న తీవ్ర దాడిని సాధారణంగా మేథావి వర్గంగా భావించే వారందరూ వ్యతిరేకించకపోయినా గట్టిగా వ్యతిరేకించే వారు కూడా వున్నారు. కలుబుర్గి హత్యను ఖండించటానికి కేంద్ర సాహిత్య అకాడమీ తిరస్కరించటం మొదలు, ఎవరు ఏమితినాలి, తినకూడదు అని నిర్ధేశించిన దానిలో భాగంగా గొడ్డు మాంసంపై తలెత్తిన వివాదం, విశ్వవిద్యాలయాలలో భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకొనే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడిన వుదంతాలు, గో సంరక్షణ ముసుగులో ముస్లింలు, దళితులపై దాడులు, చివరికి తాజా సర్జికల్‌ దాడుల వరకు అనేక వుదంతాలలో తలెత్తిన ఘర్షణలను చూస్తే పూసల్లో దారంలో తిరోగామి భావజాలానికి ప్రాతినిధ్యం వహించే ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర మనువాద, మతశక్తులు అన్ని రంగాలలో, అంశాలలో తమ ఆధిపత్యాన్ని రుద్దేందుకు ప్రయత్నించటం చూస్తున్నాం. వారేమీ దాచుకోవటం లేదు, బాహాటంగానే తెగింపుతో ముందుకు వస్తున్నారు. చర్చను ప్రమాదకర పరిస్థితిల్లోకి నెడుతున్నారు. ఇది ఒక పధకం ప్రకారం జరుగుతున్నదా? యాదృచ్చికమా అన్న గుంజాటన వున్న వారు తీరికగా ఆలోచించి దానిని తేల్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ దాడులకు ప్రతిఘటన కూడా అలాగే వుంది. అనేక మంది ఇదేదో తేడాగా వుంది అని ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటి వారు పెరుగుతారు.అయితే ఈ శక్తుల ప్రయత్నాలన్నింటికీ తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఒక ఎత్తుగడగా అయినా వెనక్కు తగ్గి కొత్త దారులు వెతుకుతున్నారు.

    కలుబుర్గి హత్యపై తలెత్తిన రచయితలు, కళాకారులు, మేథావుల నిరసనలతో ఖంగు తిన్న శక్తులు కేంద్ర సాహిత్య అకాడమీతో సంతాపం ప్రకటింపు చేయించి పరువు దక్కించుకొని బయట పడ్డాయి. ఆవు మాసం వివాదం చివరకు దళితులపై దాడులకు తెరతీయటంతో స్వయంగా ప్రధాని జోక్యం చేసుకొని లోపల ఎలా వున్నప్పటికీ దళితుల ఓట్ల కోసం గోసంరక్షకులపేరుతో దుకాణాలు తెరిచారని తీవ్ర విమర్శలు చేయాల్సి వచ్చింది. వురి శిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడిన, యాకుబ్‌ మెమెన్‌ వురి తీత సరైంది కాదని అభిప్రాయపడిన వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేసి హైదరాబాదులో రోహిత్‌ వేముల ఆత్మ హత్యకు కారకులు కావటం, జెన్‌యు విద్యార్ధులపై తప్పుడు ప్రచారం, తప్పుడు వీడియోలు, కేసులతో వేధించేందుకు పూనుకున్నారు. ఆ రెండు చోట్లా జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. ఈ విషయంలోనూ తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. తమకు రాజకీయంగా లాభం అనుకుంటే ఏ వివాదాన్ని అయినా రావణా కాష్టంలా రగిలిస్తూనే వుంటారు, తాత్కాలికంగా అయినా నష్టం అనుకుంటే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గుతారు.ఇప్పుడు సర్జికల్‌ దాడుల వివాద వుదంతాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి వుంది.

    ఒక్కొక్క అంశంపై తమ ఆధిపత్యాన్ని రుద్ధేందుకు ప్రయత్నిస్తున్న మత, తిరోగామి శక్తులు సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నించటం ఒకటైతే , తలెత్తిన పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవటం మరొకటి. అసహనం, దేశభక్తి, ఆవు నుంచి తాజా మిలిటరీ చర్యల వరకు నడుస్తున్న చర్చలో రెండు ఈ ధోరణులను మనం చూడవచ్చు. పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదుల అణచివేతలో భాగంగా మిలిటరీ చేపట్టిన సర్జికల్‌ దాడులను దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సమర్ధించాయి. ఎవరూ వాటిని వివాదం చేయలేదు. అయితే ఆ దాడులనుంచి రాజకీయ ప్రయోజనాలను పిండుకోవటానికి బిజెపి తెరతీయటం, అది తగదన్న అంశంపై తీవ్రమైన రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ముందు బోనులో నిలబెట్టాల్సింది మీడియాను అంటే అతిశయోక్తిగా కనిపించవచ్చు. సర్జికల్‌ దాడుల గురించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరించినపుడు వచ్చిన వార్తల తీరు తెన్నులను ఒక్కసారి నెమరు వేసుకోండి. దాడుల ఖ్యాతిని పూర్తిగా మిలిటరీకే ప్రతిపక్షాలు అప్పగిస్తున్నాయని, నరేంద్రమోడీకి దానిని పంచేందుకు నిరాకరించాయని రాయటాన్ని ఏమనాలి. మరణించింది సైనికులు, ప్రాణాలకు తెగించి ప్రతిదాడులు జరిపింది సైనికులు, దీనిలో రాజకీయ నాయకులు లేదా పార్టీలకు ఖ్యాతిని ఆపాదించటం ఏమిటి ? వుప్పు తిన్న విశ్వాసం లేదా కిరాయి రాతలని ఇలాంటి వాటినే అంటారు.

    మిలిటరీ చర్యలను, మిలిటరీని రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకున్న దేశాలలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన దేశాన్ని కూడా ఆ స్ధితిలోకి నెట్టదలచుకున్నారా ? కొందరి వుత్సాహం అలాగే కనిపిస్తోంది. కార్గిల్‌ యుద్ధాన్ని బిజెపి తన ఎన్నికల ప్రయోజనానికి వుపయోగించుకోవటం జగమెరిగిన సత్యం. ప్రతిపక్షం ఎంత బలహీనంగా వున్నప్పటికీ ఇది 1999 కాదు 2016 అని గుర్తించకుండా సర్జికల్‌ దాడులను కూడా అందుకు వినియోగించుకొనే ప్రయత్నం చేస్తే సహించే పరిస్థితి వుంటుందా ? మిలిటరీ చర్యలనుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించవద్దన్న అభిప్రాయాల వెల్లడి, ప్రకటనలు జాతీయ ఐక్యత ప్రదర్శించాల్సిన సమయంలో సైనికుల శౌర్య, పరాక్రమాలను అవమానించటమే అని చిత్రించటం అత్యంత ప్రమాదకర పోకడ. మొదటిది ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటనా స్వేచ్చకు ప్రతిబింబం అయితే రెండవది అందుకు విరుద్ధమైన అణచివేత వ్యవస్ధ లక్షణం.

    మన దేశంలో స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్‌ పార్టీ చేయని తప్పిదం లేదు. అత్యవసర పరిస్థితి విధించి నిరంకుశత్వాన్ని రుద్ధేందుకు ప్రయత్నించింది. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అనుసరించి సామాన్య జనజీవితాలను అతలాకుతలం చేసింది. మతోన్మాదులతో పోటీపడి ఓట్ల కక్కుర్తితో మతశక్తులతో రాజీపడి లౌకిక వ్యవస్ధకు హాని చేసింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం వేర్పాటు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చింది. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించి ఇప్పుడు ప్రతిపక్షంగా పార్లమెంట్‌లో గుర్తింపునకు తగిన సంఖ్యలో కూడా సీట్లను పొందలేకపోయింది. ఇంకా దాని తప్పిదాలు చాలా వున్నాయి.

    రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతలు జర్మనీ మిలిటరీపై నిషేధం విధించారు. అదే యుద్ధంలో జపాన్‌ను ఓడించి 1945-52 మధ్య కాలంలో తమ ఆక్రమణలో వుంచుకున్న అమెరికా ఆ దేశ రక్షణ బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు ఆ దేశంతో ఒక ఒప్పందం చేసుకొన్నది. రెగ్యులర్‌ మిలిటరీని నిషేధిస్తూ జపాన్‌ నూతన రాజ్యంగంలో ఒక అంశంగా చేర్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జర్మనీ, జపాన్‌లకు సైన్యం లేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ను బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ చిత్తుగా ఓడించింది. అంతే తప్ప కాంగ్రెస్‌ పార్టీని లేదా దాని హక్కులను గానీ జపాన్‌,జర్మనీ మిలిటరీల మాదిరి నిషేధించలేదు. అందువలన ఆ పార్టీ అయినా మరొకదానికి అయినా ఒక అంశం మీద అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్చను కలిగి వున్నాయి.

    ఆ విధంగా చూసినపుడు బిజెపి లేదా దాన్ని చూసి సమాజవాది పార్టీ గానీ రాజకీయ ప్రయోజనాల కోసం జరిపే ప్రచారంలో, పోస్టర్లలో సైన్యాన్ని వుపయోగించుకోకూడదని చెప్పేందుకు ఎవరికైనా హక్కుంది. ‘సర్జికల్‌ దాడులకు మా సంపూర్ణ మద్దతు వుందని నిర్ద్వంద్వంగా చెప్పాను. అయితే సైన్యాన్ని రాజకీయ పోస్టర్లు, ప్రచారానికి వినియోగించుకోవటాన్ని నేను సమర్ధించను ‘ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు రోజు కాస్త ఘాటుగా సైనికుల త్యాగాలను సొమ్ము చేసుకొనే దళారులుగా వ్యవహరించవద్దని విమర్శించారు. ఆ విమర్శ తమను గాక మిలిటరీని అన్నట్లే అంటూ బిజెపి విరుచుకుపడింది. సైనికుని బొమ్మను, మోడీ, బిజెపి నేతల బొమ్మలతో కలిపి ముద్రించి వుత్తర ప్రదేశ్‌లో బిజెపి ప్రచారం ప్రారంభించిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై చేసిన విమర్శలను మిలిటరీకి వర్తింప చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది.

  దళాలీ( తెలుగులో దళారీ ) అన్నది పార్లమెంటేతర భాష కాదు. భోఫోర్స్‌తో సహా అనేక కుంభకోణాలలో దళారుల పాత్ర ఏమిటో కాంగ్రెస్‌కు, బిజెపికి తెలిసినంతగా ఈ దేశంలో మరొక పార్టీకి తెలిసే అవకాశం లేదు. దానిలో భాగంగానే బిజెపి ‘ధరమ్‌ కీ దలాలీ(మతం), గాయ్‌ కీ దళాలీ( ఆవు ) గంగా కీ దళాలీ ( గంగా నది)ని వుపయోగించుకుంటున్నట్లుగానే సైనికుల త్యాగాలను కూడా వుపయోగించుకుంటున్నదని బిజెపి పోస్టర్లను వుటంకిస్తూ కాంగ్రెస్‌ ఎదురు దాడికి దిగింది. రాజకీయాలలో దళారీ పదం వాడటం వుచితమేనా అన్న ప్రశ్నకు రాజకీయాలకు తావు లేని చోట బిజెపి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నది, మోడీని రాముడిగా చిత్రిస్తూ పోస్టర్లు వేశారు, సర్జికల్‌ దాడులతో ఆయన ఛాతీ 56 అంగుళాల నుంచి వందకు పెరిగిందని చెప్పారు, జాంబవంతుడు చెప్పిన తరువాతే హనుమంతుడికి తన బలం గురించి తెలిసి వచ్చి ఒక్క వూపులో సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించినట్లుగా సర్జికల్‌ దాడుల తరువాత మన సైన్యానికి తన బలం ఏమిటో తెలిసి వచ్చిందన్నారు రక్షణ మంత్రి పరికర్‌. ఆయనను సన్మానించేందుకు సభలు జరుపుతున్నారు. బిజెపి ప్రతినిధి జివిఎల్‌ నరసింహారావు కూడా అదే రీతిలో తొలిసారిగా మిలిటరీకి తానంటే ఏమిటో తెలిసిందని మాట్లాడారు. నిజానికి ఇవి మిలిటరీని అవమానించే మాటలు. గతంలో చేసిన సర్జికల్‌ దాడులను విస్మరించటం, త్యాగాలను కించపరచటం తప్ప మరొకటి కాదు. దాడుల ఖ్యాతి పూర్తిగా సైనికులకే దక్కాలి. ఈ పూర్వరంగంలో ఒక పదం ముఖ్యం కాదు దాని వెనుక వున్న భావాన్ని అర్ధం చేసుకోవాలని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ వ్యాఖ్యానించారు. వుగ్రవాదులు పాకిస్తాన్‌ అనే వ్యాధి గ్రస్తు శరీరంలోని క్యాన్సర్‌ కణాల వంటి వారు, ప్రభుత్వం వాటిని అంతం చేయటానికి మద్దతు ఇస్తున్నాం, దానికి గుండెలు పొంగటం ఎందుకు, పోస్టర్ల ప్రచారం దేనికి, ఒక సర్జికల్‌ దాడితో వుగ్రవాదం అంతం కాదు, కానీ బిజెపి వుత్తర ప్రదేశ్‌లో ఆ పేరుతో ఓట్లు అడిగేందుకు ప్రచారం ప్రారంభించింది’ అని కూడా సిబాల్‌ చెప్పారు.

    ఆవు మాంసం కలిగివున్నారంటూ వుత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో ఒక ముస్లిం కుటుంబంపై సామాహిక దాడి చేసి కుటుంబ పెద్దను హత్య చేసిన కేసులోని ఒక నిందితుడు రవి శిశోదియా జైలులో చికున్‌ గున్యా వ్యాధితో మరణించాడు. అతని మృత దేహంపై బిజెపి నేతలు జాతీయ జండా కప్పటాన్ని ఏమనాలి. హిందూత్వ వాది కనుక కావాలంటే తమ బిజెపి జెండాను కప్పుకోవచ్చు, జాతీయ జెండాను కప్పటమంటే దానిని అవమానించటం తప్ప మరొకటి కాదు. బిజెపి ప్రవచించే జాతీయవాద నిజ స్వరూపం ఇదా ? దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల మృత దేహాలపై జాతీయ జెండా కప్పుతారు. మరి శిశోదియా ఏ త్యాగం చేశాడని ఇలా చేశారు ?

Image result for dadri lynching,sisodia, national flag

చికున్‌ గున్యాతో మరణించిన దాద్రి హత్య నిందితుడికి జాతీయ జెండా కప్పిన బిజెపి జాతీయవాదం

    సర్జికల్‌ దాడుల గురించి చర్చించ కూడదని బిజెపి నేతలు మనకు చెబుతున్నారు. అడిగితే అది పాక్‌ ప్రచార వలలో పడినట్లే నట ! సైనిక చర్యకూ జాతీయ వాదానికి ముడి పెడుతున్నారు. గో వధ నిషేధానికీ అదే ముద్ర, చివరికి గో సంరక్షకుల ముసుగులో చచ్చిన ఆవుల చర్మం తీసే, చచ్చిన ఆవులను తొలగించటానికి నిరాకరించిన దళితులపైనా దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. వారిని అలాగే వదలి వేస్తే చివరికి గో సంరక్షక్షుల దాడుల గురించి కూడా చర్చించటం కూడా దేశ ద్రోహమే అంటారేమో ? కొన్ని టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు, కాషాయ దళాల దృష్టిలో భిన్న, బేదాభి ప్రాయం వ్యక్తం చేసే వారందరూ ప్రమాదకారులు, దేశద్రోహుల కింద లెక్క. కనుక అంతిమంగా అలాంటి వారి నోరు మూయాలి లేకపోతే మూయించాలి, ఇదేగా ఇస్తున్న సందేశం ! ఇది ప్రారంభం మాత్రమే. మొగ్గలోనే ఇలాంటి ధోరణులను ఎదుర్కొనకపోతే చివరికి మానులై కూర్చుంటాయి.

   మిలిటరీని విమర్శించకూడదు ! న్యాయ వ్యవస్ధను విమర్శించకూడదు !! మిలిటరీ, న్యాయవ్యవస్ధలనేవి ఆకాశంలోంచి వూడి పడలేదు, కనుక విమర్శలకు అతీతం కాదు. ఏ దేశంలో అయినా మిలిటరీ చర్యలపై , న్యాయ వ్యవస్ధ తీర్పులపై విమర్శలు సహజం. వుద్రేకాలు, విద్వేషాలను అదుపులో వుంచుకొని ఆలోచించాల్సిన విషయాలు వున్నాయి. న్యాయమూర్తి స్ధానంలో కూర్చున్న వారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలన్నది ఒక విధి. తీర్పు రాకముందే లేదా తీర్పు వచ్చిన తరువాత వారికి దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ముందుగానే మరొక కోర్టులో తన కేసును విచారించాలని కోరే హక్కు ఎవరికైనా వుంది. అంత మాత్రాన సదరు న్యాయమూర్తిని అవమానించినట్లు కాదు. కొన్ని కేసుల విచారణలో న్యాయమూర్తులు స్వచ్చందంగా తప్పుకొంటున్న విషయం విదితమే. అయితే ఒక తీర్పు వెలువడిన తరువాత దాని మంచి చెడ్డలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికైనా వుంటుంది. అంతిమ తీర్పులో కూడా తమకు న్యాయం జరగలేదని ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. మిలిటరీ వ్యవహారం కూడా అంతే . దానిలో పని చేసే వారి చిత్త శుద్ధిని శంకించటం వేరు, మిలిటరీలో జరిగే, మిలిటరీ చేసే తప్పులను ఎత్తి చూపటం వేరు అని గమనించాలి.మిలిటరీకి అవసరమైన కొనుగోళ్లలో జరిగే అక్రమాల గురించి ఎన్నో విన్నాం.సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండా అవి జరగవు. మిలిటరీ గనుక అక్కడ ఏం జరిగినా విమర్శించకూడదు, మీడియాలో దాని గురించి చర్చించకూడదు అంటే ఎలా ? కార్గిల్‌ యుద్ధంలో వందల మంది సైనికులు ప్రాణాలర్పించారు. వారి భౌతిక కాయాలను తరలించేందుకు కొనుగోలులో అక్రమాలకు పాల్పడింది అపర దేశభక్తులుగా పేరుపొందిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలనలో అన్నది తెలిసిందే. మిలిటరీ కొనుగోళ్లు కనుక విమర్శించకూడదంటే ఆ వివరాలు బయటకు వచ్చేవా ? అదే అయితే భోపోర్సు ఆయుధాల కమిషన్‌ ముడుపులూ అంతే కదా ?

    పది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం మిలిటరీలో వున్న మైనారిటీల సంఖ్య ఎంత అనే సమాచారాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. ప్రతిపక్షంలో వున్న బిజెపి, మిలిటరీ అధికారులు, మరికొందరు దానిపై నానాయాగీ చేశారు. దాంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది. మిలిటరీ అంటే త్యాగం తప్ప రిజర్వేషన్లు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ భాష మాట్లాడతారు, కుల మతాల లెక్క కాదు అన్నారు. వివరాలు సేకరించాలన్నవారి కారణాలు వారికి వుంటే వ్యతిరేకించే వారికారణాలు వారికి వున్నాయి. అయితే మిలిటరీలో కుల, మత లేదా తెగల ప్రస్తావన లేదా, ముస్లింల సంఖ్యా వివరాలు లేవా అంటే వున్నాయి. అలాంటపుడు ఎందుకు వ్యతిరేకించినట్లు ? మన రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడు. అయితే అది గౌరవం తప్ప అధికారాలు లేవు. లెక్కలు తీయాలని కోరింది రక్షణ మంత్రిత్వశాఖ. అలా లెక్కలు తీయటం మిలిటరీలో మతతత్వ బీజాలు వేయటమే అవుతుంది కనుక ఆ ప్రక్రియను నిలిపివేయాలని మాజీ సైనికాధికారి ఆర్‌ఎస్‌ కడియన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వసైన్యాధ్యక్ష హోదాలో ఇలాంటి లెక్కలు తీయటాన్ని నిలిపివేసేందుకు రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్‌ చేసింది. మాజీ సైనికాధికారులు ధర్నాలు చేశారు. కార్గిల్‌ శవపేటికల కుంభకోణం ఫేం జార్జి ఫెర్నాండెజ్‌ సైన్యాన్ని మత పూరితం చేసే దేశ ద్రోహకర చర్య అని వర్ణించారు. 2004 జనవరి తొమ్మిదిన రక్షణ మంత్రిత్వ శాఖకు సైన్యం పంపిన ఒక నోట్‌లో పదకొండు లక్షల మంది సైనికులలో ముస్లింలు 29,093 మాత్రమే అని పేర్కొన్నారు. అంటే 13శాతం జనాభాకాగా సైనికులలో వారి శాతం 2.6 మాత్రమే. వారి శాతాన్ని పెంచమని కోరటం జాతి వ్యతిరేకం అవుతుందా ? గూర్ఖా, సిక్కు, రాజపుత్ర, డోగ్రా రెజిమెంట్లలలో ముస్లింలతో సహా ఆ తరగతులకు చెందని వారికి చాలా కాలం అసలు ప్రవేశం లేని విషయం తెలిసిందే. 1984లో అమృతసర్‌ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన వుగ్రవాదులను బయటకు గెంటి వేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ చర్య సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లో కొందరు సైనికులు తిరుగుబాటు చేసిన తరువాతే రెజిమెంట్లలో ఇతరులకు కూడా చోటు కల్పించి అఖిల భారత స్వభావం తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.

మన మిలిటరీ, న్యాయవ్యవస్ధ అయినా మన వైవిధ్య సమాజానికి ప్రతిబింబంగా వుండాలన్నదానితో ఎవరూ విబేధించనవసరం లేదు. అలా వుందా లేదా అన్నతి తెలియాలంటే వివరాలు వుండాలి, లోపం వుంటే అధిగమించేందుకు ప్రయత్నించాలి. మన దేశానికి వలస పాలన వారసత్వంగా అనేక అవలక్షణాలు వచ్చాయి. వాటిని వదలగొట్టుకోవాల్సి వుంది. వలస పాలకులు ఎందుకు అలా చేశారన్నది మరో సందర్భంలో చర్చించవచ్చు.మన సైన్యంలో సిక్కు, గూర్ఘా, జాట్‌, రాజపుత్ర, డోగ్రా,పంజాబ్‌, మద్రాస్‌, మరాఠా, బీహార్‌, ఇలా మరికొన్ని పేర్లతో రెజిమెంట్లు వున్నాయి. నిజానికి లౌకిక భారత్‌ లేదా స్వతంత్ర భారతంలో ఇలాంటివి ఇప్పటికీ కొనసాగటం ఆశ్చర్యకరమే. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తరువాత నాగా రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, దేశ రక్షణలో మరింత చురుకుగా పాల్గొనేందుకు తమ పేరుతో ఒక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని నాగాల ప్రతినిధులు కోరిన మేరకు 1970లో ఆ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. మేమెంతో మాకంత వాటా మాదిరి నినాదాలతో అస్థిత్వ భావనలు తీవ్రంగా వ్యాపించిన వర్తమాన పరిస్థితులలో ప్రత్యేక రెజిమెంట్ల ఏర్పాటు డిమాండ్‌ను ముందుకు తెచ్చేందుకు అవకాశం వుందా లేదా ?

   దేశ విభజనకు ముందు పాకిస్థాన్లో ఎంత మంది హిందువులున్నారు, ఇప్పుడు ఎంత మంది వున్నారో చూడండంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారు జనాన్ని తప్పుదారి పట్టించే లెక్కలు కొన్ని చెబుతుంటారు. మన రక్షణ శాఖ సహాయ శాఖ మంత్రిగా పని చేసిన మహావీర్‌ త్యాగి అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశ విభజనకు ముందు భారత సైన్యంలో ముస్లింలు 32శాతంగా వుండగా విభజన తరువాత రెండు శాతానికి పడిపోయింది. ఇది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, ఇతరుల శాతం ఎంత అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ? అయితే సచార్‌ కమిటీ సూచన ప్రకారం ముస్లింల సంఖ్య తెలుసుకోవాలనుకోవటంలో మైనారిటీల సంతుష్టీకరణ, దాన్ని వ్యతిరేకించటంలో మెజారిటీ సంతుష్టీకరణ కోణాలు కూడా లేకపోలేదు. అధికారంలో ఏ పార్టీ వున్నప్పటికీ రాజ్యాంగ బద్దంగా దళితులు, గిరిజనుల వుప ప్రణాళికలకు నిధులు కేటాయించాలన్నా, మత, భాషా మైనారిటీల సంక్షేమానికి చర్యలు, పధకాలను రూపొందించాలన్నా వారి సంఖ్యా, ఇతర పరిస్థితుల వివరాలు తెలియకుండా ఎలా సాధ్యం. వాటిని సేకరించటం ఆ తరగతుల సంతుష్టీకరణ అని ఇంతకాలం రాజకీయం చేసిన బిజెపి ఇప్పుడు కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో అధికారంలో వుంది. అవేమీ లేకుండానే వారికి పధకాలు రూపొందిస్తుందా? వున్న పధకాలను ఎత్తివేస్తుందా ? అమెరికా అంటే బిజెపి, సంఘపరివార్‌ శక్తులకు వల్లమాలిన అభిమానం అక్కడ వర్షం కురిస్తే ఇక్కడ గొడుగులు పడతారు. అమెరికా పర్యటన జరపాలని నరేంద్రమోడీ ఎంతగా తపించి పోయారో తెలిసిందే. అలాంటి అమెరికా సైన్యంలో ముస్లింలు, నల్లవారు, తెల్లవారు, ఇతర జాతుల వారు ఎందరున్నారో ప్రతి ఏటా సంఖ్యా వివరాలను ప్రకటిస్తారని తెలియదా ? మరి అక్కడ రాని పొరపొచ్చాలు మన దేశంలో ఎందుకు వస్తాయని భావిస్తున్నారు?

    పాకిస్తాన్‌ పాలనలో మిలిటరీ ఆధిపత్యం, ప్రభావం గురించి బహిరంగ రహస్యమే. ఆ మిలిటరీ చర్యలను కూడా అక్కడి మీడియా తప్పు పట్టి ప్రశ్నించిందన్న విషయాన్ని అంగీకరిస్తారా లేక పాక్‌ మీడియా కథలను ప్రచారం చేయటంగా కొట్టి పారవేస్తారా ?http://indiatoday.intoday.in/story/pakistan-miliatry-is-no-holy-cow/1/143245.html ఈ వ్యాసాన్ని మన భారతీయ పత్రిక ఇండియా టుడే ఐదు సంవత్సరాల క్రితం ప్రచురించింది. అందరూ చూస్తుండగానే ఇస్లామాబాద్‌లో సలీమ్‌ షహజాద్‌ అనే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు అపహరించి తరువాత చంపివేశారు.అది మిలిటరీ కనుసన్నలలో పని చేసే ఐఎస్‌ఐ పనే అని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ మిలిటరీ ఒక ప్రకటన చేసింది. వార్తలు వాస్తవం కాదని తోసి పుచ్చితే ఒక రకం, అలా కాకుండా వివరాలను వెల్లడిస్తే అది జాతీయ భద్రతకు ముప్పు వస్తుందని, సైనిక బలగాల నైతిక స్ధైర్యం దెబ్బతింటుందని పేర్కొనటమే కాదు, కస్టడీలోకి తీసుకున్న పౌరులను మిలిటరీ చిత్రహింసలు పెట్టదు, చంపదు అని, సలీమ్‌ సహజాదీ హత్యలో ఐఎస్‌ఐ ప్రమేయమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. దీనిపై పాక్‌ పత్రిక ఫ్రైడే టైమ్స్‌ పత్రిక సంపాదకుడు నజమ్‌ సేథీ వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యంలో విమర్శలకు అతీతమైవేవీ లేవు, మిలిటరీ కూడా అలాంటిదే అని రాశాడు. మరి మనది ప్రజాస్వామ్యం. కాశ్మీర్‌, ఈ శాన్య రాష్ట్రాలలో ప్రత్యేక అధికారాలు కలిగిన మిలిటరీపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. మిలిటరీ సైతిక స్ధైర్యం దెబ్బతిన కుండా వుండాలంటే ఆ చర్యలను విమర్శించకూడదా ? మిలిటరీ చర్యలతో దెబ్బతింటున్న సామాన్య పౌరుల మనో స్ధైర్యం నంగతేమిటి ?

    పౌరపాలకుల పర్యవేక్షణలో పని చేస్తున్న మిలిటరీ వ్యవస్ధలలో మనది ఒకటిగా గర్వించాల్సిందే. నిత్యం సరిహద్దులను కాపాడుతున్న వారి సామర్ధ్యం, త్యాగాలకు హారతి పట్టాల్సిందే. వారి విశ్వసనీయతను ప్రశ్నించకూడదన్నది కూడా నిజమే. సర్జికల్‌ దాడులకు మన దగ్గర సాక్ష్యాలు వున్నాయని బల్లగుద్ది మరీ చెప్పినపుడు అబ్బే అసలు దాడులే జరగలేదని పాక్‌ ప్రభుత్వం ఎత్తుగడగానే చెప్పి వుండవచ్చు, ఎందుకంటే తన పౌరులకూ అది సంజాయిషీ ఇచ్చుకోవాలి గనుక.ఈ వుదంతంలో ప్రపంచ దృష్టిలో ఎవరిది పైచేయిగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌ అసలు దాడులే జరగలేదనే వాదనకే కట్టుబడి వుంది. పరిస్థితులు సాధారణంగానే వున్నాయి చూడమంటూ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాలను చూపింది. దాడులు జరిగి వుంటే సాక్ష్యాలు వెల్లడించాలని సవాలు చేస్తున్నది. ఇది కూడా ప్రచార ఎత్తుగడే అనుకుందాం .

  మన దేశంలో జరిగిందేమిటి ? తాజా వివాదానికి అధికార రాజకీయ నేతల, మిలిటరీ వున్నతాధికారుల బాధ్యతేమీ లేదా ? సర్జికల్‌ దాడుల వివరాలతో సహా అనేక అంశాలు గోప్యంగా వుంచాల్సినవే అయినపుడు దాడులను తాము చిత్రీకరించామని, ద్రోణులను కూడా వుపయోగించామని చెప్పాల్సిన అవసరం ఏముంది. దాడులు చేశాం అని మాత్రమే చెప్పి వుంటే సరిపోయేది కదా ? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన మాదిరి కాళిదాసు కవిత్వానికి స్వంతపైత్యం జోడించి నట్లు మిలిటరీ వినియోగించిన రాత్రుళ్లు చూడగలిగే పరికరాలు మా మచిలీపట్నంలోని బెల్‌లో తయారు చేశారని, ఆ ఫ్యాక్టరీని మరింత విస్తరించేందుకు మా చంద్రబాబు నాయుడు నిమ్మలూరులో మరో ప్లాంట్‌ ఏర్పాటుకు చర్య తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు సర్జికల్‌ దాడుల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించలేదా ? సర్జికల్‌ దాడుల రీత్యా సరిహద్దులలో పాక్‌ మిలిటరీ చర్యకు పూనుకోవచ్చంటూ వందలాది గ్రామాల నుంచి పౌరులను ఖాళీ చేయించటానికి, తరువాత ఆ కార్యక్రమాన్ని వుపసంహరించుకోవటానికి బాధ్యత ఎవరిది? దాడుల గురించి గుండెలు వుప్పొంగించుకోనవసరం లేదని జబ్బలు చరుచుకోవనవసరం లేదని ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారంటూ వచ్చిన వార్తలు కూడా పాక్‌ సృష్టే అంటారా ? సర్జికల్‌ దాడుల ఖ్యాతి అంతా మోడీకే దక్కాలని రాసిన మీడియా పెద్దమనుషులే రొమ్ములు విరుచుకోవనసరం లేదని ప్రధాని చెప్పినట్లు కూడా రాయటం మోడీ వ్యక్తిత్వాన్ని పెంచటంలో భాగమని సంతోషించి వుండవచ్చు. కానీ అవి సర్జికల్‌ దాడుల తీవ్రతను తగ్గించే సందేశాన్ని కలిగి వున్నాయని గ్రహించారా ? ఎవరు ఎవరి వలలో పడ్డారు.ఈ మొత్తం వుదంతం ఎలాంటి సందేశం ఇస్తున్నది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

దళిత,గిరిజన వుద్ధరణ బండారం – మోడీని నిలదీయాల్సిందే మరి !

20 Tuesday Sep 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

Narendra Modi, sc, ST's upliftment, Tribal & Scheduled Caste Sub Plan)

ఎం కోటేశ్వరరావు

   పోనీయండి వదిలేద్దాం ! రాజకీయ నాయకులన్న తరువాత జనం ముందు చెప్పేదొకటి, అధికారానికి వచ్చాక చేసేదొకటి . అందరూ అంతే . అది కాంగ్రెస్‌ అయినా బిజెపి, తెలుగు దేశం లేదా టిఆర్‌ఎస్‌ ఎవరైతేనేం అందరూ మహానుభావులే . ఇంక చూడాల్సింది కమ్యూనిస్టులనే ! వారెలా వుంటారో తెలియదు, ఇలాంటి మాటలు ఏదో ఒక సందర్భంలో వినే వుంటారు కదా ! మీరూ వదిలేసే వుండి వుంటారు. ఎందుకంటే ఎవరి పాపాన వారు పోతారని కదా మన ముందు తరాల వారు మనకు నేర్పింది. మాతాత, మానాన్న వారు స్వర్గంలో వున్నారో, నరకంలో వున్నారో అసలు ఎక్కడికైనా ఇంకా చేరారో లేదో తెలియదు. ఎందుకంటే వారి దగ్గర నుంచి స్వర్గానికి పోతే రంభ, వూర్వశి, తిలోత్తమలు కనిపించారని గానీ, లేక పాపం చేసి నరకానికి పోయి సలసలా కాగే నూనెలో పడి బొబ్బలెక్కినట్లు గానీ ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇ మెయిల్‌ వర్తమానం ఏదీ ఇంతవరకు రాలేదు. మా తాత పోయినపుడు ఆయనకు ఫోన్‌ అనేది ఒకటుందని మాత్రమే తెలుసు.అక్కడకు వెళ్లిన తరువాత మిగతావన్నీ తెలుసుకొని వుండాలి. ఎందుకంటే స్వర్గం, నరకంలో అంతా వేద విజ్ఞానంతో అందరి కంటే టెక్నాలజీలో ముందు వుండి వుంటారు కదా ! ఇంతకీ ఇంత వుపోధ్ఘాతం ఎందుకంటారా ?

    అధికారంలో వున్న వారిని విమర్శించటమే నేరం, దేశ ద్రోహంగా పరిగణించి కేసులు పెడుతున్న రోజులివి. కొంత మంది గురించి తాతగారి నాన్నగారి భావాలకు దాసులు అని ఒకప్పుడు ఒక కవి చెప్పాడు .అయితే మాటకు కట్టుబడి వుండకపోతే ఎవరినైనా నిలదీయాల్సిందేనని మాతాత, మానాన్న కూడా చెప్పారు.నాటి జాతీయ వాదులను నేడు దేశానికి హాని చేసిన వారిగా, నాడు బ్రిటీష్‌ వారి అడుగులకు మడుగులొత్తిన వారిని అపర దేశభక్తులుగా చూపుతున్న స్దితి. అందువలన నిలదీయాలన్న మా తాతగారి నాన్న గారి భావాలు తిరోగమనం కాదు, అందువలన నన్ను దేనికి ప్రతినిధిగా చూస్తారో మీ ఇష్టం. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాటలను అమలు జరపటం లేదు గనుక నిలదీయాల్సిందే మరి. కొద్ది రోజుల క్రితం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని అనేక అంశాలపై మాట్లాడుతూ దళితుల గురించి కూడా మాట్లాడారు. సామాజిక అసమానతల గురించి అడిగిన అంశంపై మోడీ ఇలా చెప్పారు.’ కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి వాటిని ఖండించాల్సిన అవసరం వుంది.నాగరిక సమాజంలో వాటికి చోటు లేదు. శాంతి భద్రతల సమస్య రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కొంత మంది కొన్ని సమస్యలను ఎంపిక చేసుకొని మోడీ వాటికి కారకుడంటున్నారు. దీని వలన ఏ ప్రయోజనం నెరవేరుతుందో నాకు తెలియదు, కానీ ఇది దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఇది ఎంతో లోతుగా వేళ్లూనుకున్న సామాజిక సమస్య. సామాజిక అసమానతల మీద రాజకీయం చేయటం సమాజానికి అపకారం చేయటమే. తర తరాలుగా ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ఈ రోజు చూస్తే బిజెపిలో గిరిజన ఎంపీలు, ఎంఎల్‌ఏలు గణనీయ సంఖ్యలో వున్నారు. నేను బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జన్మదినాన్ని వుత్సవంగా జరిపినప్పటి నుంచి ఆయన జన్మదినాన్ని ఐక్యరాజ్య సమితి , అలాగే 102 దేశాలు పాటించిన తరువాత, రెండు రోజుల పాటు ఆయన జీవితం, చేసిన కృషి గురించి పార్లమెంట్‌లో చర్చించిన తరువాత మోడీ అంబేద్కర్‌ భక్తుడా అనే ఆలోచనతో అనేక మందికి ఒక సమస్య ఏర్పడింది. తమకు తామే సంరక్షకులుగా ప్రకటించుకున్న కొందరు వుద్రిక్తతను సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారు. మోడీ దళితులతో వుండటం, స్వయంగా గిరిజనులకోసం అంకితం కావటాన్ని వారు ఇష్టపడటం లేదు. అణచివేతకు, అణగారిన, అవకాశాలు రాని దళితులందరి అభివృద్ధి కోసం కోసం నేను అంకిత మయ్యాను.’ ఇంకా కొన్ని విషయాలు చెప్పారు, గానీ ఇప్పటికే చాలా ఎక్కువైంది.

    తాజాగా ఇండియా స్పెండ్‌ అనే వెబ్‌సైట్‌ నిఖిల్‌ ఎం బాబు అనే ఒక జర్నలిస్టు రాసిన విశ్లేషణకు ‘దళితులు, గిరిజనులకు కేటాయించి ఖర్చు పెట్టని మొత్తం వ్యవసాయ బడ్జెట్‌కు ఎనిమిది రెట్లు ‘ అనే శీర్షికను పెట్టారు.ఈ విషయంలో కాంగ్రెస్‌, మరొక పార్టీ అన్న తేడా లేదు. వారి అభివృద్ధికి తాను అంకితమైనట్లు చెప్పుకున్న నరేంద్రమోడీ హయాంలో మిగతావారితో పోల్చితే ఖర్చు పెట్టని మొత్తం హిమాలయాల్లా పెరిగి పోతున్నట్లు వెల్లడైంది. కొత్త బిచ్చగాడికి లేదా దొంగ భక్తుడికి పంగనామాలెక్కువుంటాయని పెద్దలు వూరికే చెప్పారా ! ఆ వెబ్‌ సైట్‌ నిర్వాహకులు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు గత మూడున్నర దశాబ్దాల కాలంలో దళితులు, గిరిజనులకు కేటాయించి ఖర్చు పెట్టని సొమ్ము అక్షరాలా రెండు లక్షల 80వేల కోట్లు. వారికోసం కేటాయించిన రిజర్వుడు వుద్యోగాలు తగిన అభ్యర్ధులు లేని కారణంగా కొన్నాళ్లు వాటిని ఖాళీలుగా చూపి తరువాత ఇతరులతో నింపివేయటం మనం చూస్తున్నదే. అయితే వుప ప్రణాళికల కింద కేటాయించిన సొమ్ము ఫలాన్ని అందుకొనేందుకు తగినంత సంఖ్యలో ఆ నిర్భాగ్యులు కూడా లేరా ? మరోవైపు ఇంత మొత్తం కేటాయించినా ఆ తరగతులు ఇంకా అభివృద్ధి చెందలేదంటే అదంతా వృధా అయిందని తాత్పర్యాలు చెప్పే పండితులు కూడా లేకపోలేదు.

     ప్రణాళికా సంఘం నూతన అవతారం లేదా ఎన్‌డిఏ ప్రభుత్వ నూతన సృష్టి నీతి అయోగ్‌ సిఇఓ అమితాబ్‌ కాంత్‌ ఏమంటారంటే రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలు ఏం చేస్తున్నాయో పర్యవేక్షించటం తప్ప మరింతగా ఖర్చు చేయాల్సిన బాధ్యత వాటిదే. ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నది అన్నారు. ఖర్చు చేయని మొత్తాలను తిరిగి కేంద్రానికి పంపాల్సి వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. అలా వెనక్కు ఇచ్చిన మొత్తం వ్యవసాయ బడ్జెట్‌ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ లేదా వచ్చే పది హేను సంవత్సరాలలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి సరిపడే మొత్తం, లేదా నేపాల్‌, సెర్బియ, జోర్డాన్‌ దేశాల స్థూల జాతీయాదాయం కంటే ఎక్కువట. ఈ మొత్తం 2.8లక్షల కోట్లరూపాయలను దేశంలోని పాతిక కోట్ల దళితులు, గిరిజనులకు పంచితే తలా రు.11,289 రూపాయలు వస్తాయట.

     కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ సూత్రాల ప్రకారం జనాభాలో దళితులు, గిరిజనుల దామాషా ప్రాతిపదిక 16.6,8.6 శాతం చొప్పున వారి అభివృద్ధి వుప ప్రణాళికలకు బడ్జెట్లలో కేటాయింపులు జరపాలి. 2006లో ప్రణాళికా సంఘం జారీ చేసిన నిబంధనల ప్రకారం సకాలంలో ఖర్చు చేయని నిధులు మురిగి పోతాయి. అలా మురగబెట్టటంలో దళితుల నిధుల విషయంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌, వుత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, గిరిజన నిధులకు సంబంధించి ఝార్కండ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ మొదటి మూడు స్ధానాలలో వున్నాయి. తెలంగాణా కొత్త రాష్ట్రం, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, భూములు ఇస్తామని చెప్పిన పెద్దల పాలనలో వున్న చోట 2014-15లో ఖర్చు చేయని నిధులు 61శాతం లేదా 4,643 కోట్లరూపాయలని విశ్లేషించారు.

    నరేంద్రమోడీ సర్కార్‌ను ఎందుకు తప్పు పట్టాల్సి వస్తున్నదంటే బిజెపి లేదా దాని మాతృసంస్ధ సంఘపరివార్‌ నేతలు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలను నిత్యం విమర్శిస్తున్నారు. అందుకు వారిని తప్పుపట్టటం లేదు, ఆ విధానాలు దేశాన్ని సర్వనాశనం చేశాయన్నది వాస్తవం. వారి స్ధానంలో అధికారానికి వచ్చిన బిజెపి తెచ్చిన మార్పులేమిటన్నది ప్రశ్న. ఒక రోజు వేసుకున్న చొక్కా మరుసటి రోజు మార్చినట్లుగా కాంగ్రెస్‌ స్ధానంలో బిజెపి వచ్చింది తప్ప విధానాలు మారలేదు. దళిత, గిరిజన వుప ప్రణాళికల నిధుల ఖర్చుకు సంబంధించి అవి అమలులోకి వచ్చిన 35 సంవత్సరాల నుంచి ఏ విధానాలను అనుసరిస్తున్నారో వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆ తరగతులకు అంకితమైనట్లు చెప్పుకున్న పెద్ద మనిషి హయాంలో కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి కేంద్రానికి చేరుతున్నాయి. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అంటే ఇదేనా ?

      కర్ణాటకలో వున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్ధిక సంవత్సరం ముగియటానికి మూడునెలల ముందు ఈ ఏడాది జనవరిలో అక్కడి ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సమీక్షిస్తూ నిధులలో కేవలం 0.87శాతమే ఖర్చు చేసినందుకు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. 2005-14 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి వుప ప్రణాళిక నిధులు రు.19,367 కోట్లు, గిరిజన వుప ప్రణాళిక నిధులు రు.6,922 కోట్లు ఖర్చు చేయలేదు. కాంగ్రెస్‌-బిజెపి ఏదో ఒక పార్టీ లేదా వాటితో సంబంధం వున్న వారే అందునా గిరిజనులే ముఖ్యమంత్రులుగా వున్న ఝార్కండ్‌లో ఇదే కాలంలో రు.17,107 కోట్ల గిరిజన నిధులు ఖర్చు చేయలేదట. నరేంద్రమోడీ ప్రభుత్వ విజయాల గురించి మన తెలుగోడు వెంకయ్య నాయుడు ప్రతి ఏటా ఒకసారి వూరూ వాడా తిరిగి గొప్పగా ప్రచారం చేసి వెళ్లారు. దళితులు, గిరిజనులకు తమ తొలి ఏడాది పాలనా కాలంలోనే అంతకు ముందుతో పోల్చితే 25శాతం బడ్జెట్‌ పెంచామని చెప్పారు. నిజమే, అయితే అది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు చూడండి.

    కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సంబంధించి షెడ్యూల్డు కులాల, తెగల వుప ప్రణాళికల నిధుల తీరు తెన్నులు ఎలా వున్నాయో చూడండి. (కటాయింపులు, ఖర్చు కోట్ల రూపాయలలో, ఖ.చే.పె ఖర్చు చేయని మొత్తం పెరుగుదల )

ఏడాది         కేటాయింపు       ఖర్చు           ఖర్చుచేయనిది      కే.పెరుగుదల     ఖ.చే.పె

2012-13     58,823.14    53,345.04       5,478.1 — —

2013-14     66,159.52    56,761.17       9,398.35                   12               72

2014-15      82,935.00   49,955.79      32,979.21                  25              251

నరేంద్రమోడీ ఏలుబడి మొదటి సంవత్సరంలో కేటాయింపు పెరుగుదల 25శాతం అయితే ఖర్చు పెట్టని మొత్తం పెరుగుదల 251 శాతం వుంది. ఇదేమిటని నిలదీయాలా వద్దా ? పాపం తగిలిపోతారని వదిలేద్దామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జనంపై తెలుగు దేశం-బిజెపి ఎదురుదాడి !

15 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Politics

≈ Leave a comment

Tags

AP Package, ap special asistance, ap special status, chandababu duplicity, Narendra Modi, Venkaiah naidu

Image result for Telugu desam started offensive against people

ఎం కోటేశ్వరరావు

     మహానటుడు నందమూరి తారకరామారావు సినిమాలలో చిక్కడు-దొరకడు, రేచుక్క-పగటి చుక్క వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు ఆనందాన్ని పంచితే సినిమా పరిభాషలో చెప్పాలంటే కొంతమంది దృష్టిలో అయినా ‘తోడు దొంగలు ‘ గా కనిపిస్తూ, ఎన్‌టిఆర్‌ అసలు సిసలు వారసులం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ, మితృపక్షం బిజెపి నాయకులు నిజజీవితంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరుల ముందు నటిస్తున్నారు. ఎన్‌టిఆర్‌ సినిమాలు చివరకు సుఖాంతంగా ముగిశాయి. ప్రత్యేక తరహా హోదా కంటే ఎక్కువ ప్రయోజనం కలిగే ప్రత్యేక సాయం అనే వీరి నటన ఎలా ముగుస్తుందన్నది ఆసక్తికరం. ఎందుకంటే రియాలిటీ షో కదా ! ఇలాంటి షోలు ఫలానా విధంగా మాత్రమే నిర్వహించాలనే , ఫలానా విధంగా ముగించాలనే నిబంధనేమీ లేదు. వ్యాపారం కనుక వారికి అనుకూలమైన రీతిలో వాటిని రూపొందిస్తారు.ఈ రియాలిటీ షోలో రాని ప్రత్యేక హోదా , దాని కంటే ఎలా మెరుగో తెలియని లేదా వారైనా చెప్పని ప్రత్యేక సాయంపై జనంపై ఎదురు దాడికి దిగారు. త్వరలో ఈ సాయానికి కేంద్ర కాబినెట్‌ ఆమోద ముద్ర వేసిన తరువాత అదింకా పెరగవచ్చు లేదా జనంలో ప్రతికూలత వ్యక్తమైతే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గ వచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం తమ ఆత్మరక్షణ, సమర్ధనకు వూరూరా ఎదురుదాడి చేయాలనే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

Image result for venkaiah naidu

దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో మాదిరి ‘పంచాంగ ‘ వెంకయ్య

      రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇక రాదు అన్నది సుస్పష్టం. దీనికి జనాన్ని మానసికంగా సిద్ధం చేయటానికి 27నెలల పాటు కసరత్తు చేయాల్సి వచ్చిందంటే ఈ విషయంలో తెలుగుదేశం, బిజెపిలు ఎంత భయపడ్డాయో, ఆందోళనకు గురయ్యాయో చెప్పకనే చెప్పినట్లయింది. ఎంతైనా బిజెపివారి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలు, తెలుగుదేశం వారి సినిమా దర్శకత్వాలతో పార్లమెంటరీ చర్చల ట్విస్టులమీద ట్విస్టులు, అసెంబ్లీ తీర్మానాల ప్రహసనాలు, అనుకూల, సానుకూల పత్రికలు, టీవీలలో లీకుల వార్తల వడ్డన, వుత్తుత్తి బెదిరింపులు, అలకలు , పిట్టకథలు అబ్చో ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేశారు. జనానికి ఎంతో వినోదం కలిగించారు. ఇప్పుడు చెబుతున్న ఆసాధ్యాలు, సుసాధ్యాల గురించి వుభయ పార్టీల పెద్దలు పార్లమెంట్‌, అసెంబ్లీ చర్చలలో ఎందుకు చెప్పలేదని ఎవరైనా అడిగితే అది రాష్ట్ర ద్రోహం అవుతుంది. కనీసం ఎప్పుడు జ్ఞానోదయం అయిందో అదైనా చెప్పాలి. దొంగను దొంగంటే నువ్వు దొంగ, నీ కుటుంబం అంతా దొంగలే అని ఎదురుదాడి చేస్తారు. తెలుగుదేశం,బిజెపిలు ఇపుడు ఎదురుదాడికి దిగాయి. పార్లమెంట్‌లో తానొక్కడినే మాట్లాడానని,కమ్యూనిస్టులుగానీ మిగతా వారు ఎందుకు మాట్లాడలేదని వెంకయ్య నాయుడు, పాకేజి కంటే ఇంకా మెరుగైనదేమిటో చెబితే తాను పోరాడతానని చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. వెంకయ్య నాయుడి వ్యవహారం దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా వుంది. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి తానొక్కడినే పట్టుబట్టినట్లు ఒక ఘనతగా చెప్పుకున్నారు. తీరా తామే దానికి మొండిచేయి చూపాల్సి వచ్చేసరికి తానసలు అంధ్రప్రదేశ్‌ ప్రతినిధిని కాదని అయినా దానికోసం ఎంతో చేస్తే విమర్శిస్తారా అంటున్నారు. గత రెండున్నర సంవత్సరాలలో ఎన్నడూ ఈ మాట ఎక్కడా ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పలేదు ? కావమ్మ మొగుడని మీరంతా అంటే కామోసు కామోసనుకొని ఇంతకాలం కాపురం చేశా, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే వెళ్లి పోతా అన్నాడట వెనుకటి కెవడో ! ‘పంచాంగ’ నాయుడిగారి తీరు అలాగే వుంది.

     రాష్ట్ర విభజన ఒక రాజకీయ నిర్ణయం. దానిలో భాగస్వాములు కానిది ఒక్క సిపిఎం మాత్రమే. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు మిగతా పార్టీలన్నీ ఎంతో కొంత దానిలో భాగస్వాములే. ఒక వైపు రెండు కళ్ల సిద్ధాంతం చెబుతూ చంద్రబాబు నాయుడు తన పాత్రను చక్కగా పోషించారు. విభజన చట్టంలోని అంశాల గురించి ఏం మాట్లాడితే జనం ఏమనుకుంటారో, రాజకీయంగా నష్టమా లాభమా అని ఆలోచించి విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సమయంలో విభజన సరిగా లేదంటూ తెలుగుదేశం పార్టీ గోడమీది పిల్లివాటం ప్రదర్శించింది. భాషా ప్రయ్తు రాష్ట్రాలను విడదీయకూడదన్న తమ సూత్రబద్ద వైఖరికి సిపిఎం కట్టుబడి వుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా విభజితమయ్యే రెండు రాష్ట్రాలలోనూ తమ పలుకుబడి పెంచుకోవచ్చన్న దురాశతో బిజెపి నేతలు కాంగ్రెస్‌ నిర్ణయానికి వంతపాడారన్నది నగ్నసత్యం. అందుకే వెంకయ్య నాయుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు తప్ప నిజానికి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కాదు. ఆ పెద్దమ్మనే (సోనియా గాంధీ) కాదు, ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండని సుష్మాస్వరాజ్‌ తెలంగాణా వాసులను, కాంగ్రెస్‌ ఐదంటే కాదు పది అని పట్టుబట్టి ప్రత్యేక హోదాకు ఒప్పించింది తామే అని బిజెపివారు ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకున్న విషయాన్ని కాదంటారా ? అప్పుడు ఏ పార్టీ వారు కూడా పాకేజి గురించి మాట్లాడలేదు. మాట తప్పింది, ద్రోహం చేసింది బిజెపి . అందువలన హోదా గురించి మాట్లాడింది మీరే కనుక ఆ ఖ్యాతిని కూడా గుండుగుత్తగా వుంచుకోండి , ప్రత్యేక హోదాను తప్ప అందుకు వచ్చే ఖ్యాతిలో వాటా ఇమ్మ ని ఎవరైనా అడిగితే వెంకయ్యకు కోపం వస్తే అర్ధం వుంది. ఎవరూ అడగటం లేదే ! ఒక రాజకీయ పార్టీ మీద మరొక పార్టీ ఎదురుదాడి చేస్తే కొంత వరకు అర్ధం చేసుకుంటారు, కానీ మొత్తం జనం మీదే ఎదురుదాడికి దిగి లబ్ది పొందిన రాజకీయ పార్టీ మనకు ఎక్కడా కనపడదు. ఇపుడు కొన్ని రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని బిజెపి,తెలుగుదేశం పార్టీలు ప్రశ్నించిన జనం మీదే తుపాకులు ఎక్కుపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధిని కాకపోయినా నన్నే తిడతారా అంటూ వెంకయ్య నాయుడి రుసరుసలు.ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి కాకపోయినా రాష్ట్రానికి ఎంతో చేశారంటూ ఆ పెద్దమనిషికి బిజెపి నేతలు సన్మానాల మీద సన్మానాలు చేస్తున్నారు. రెండు పార్టీలకు చట్ట సభల్లో సరిపడా తగిన మద్దతు వుంది,కావాలనుకుంటే ఎదుటి పార్టీల ప్రతినిధులను ఆకర్షించగలిగే అధికారం వుంది, నీతి నియమాలను ఎప్పుడో గాలికి వదిలి నిరంతరం ఎక్కడ అధికారమనే పంచదార వుంటే అక్కడికి చేరే చీమల మాదిరి పార్టీలు మారటానికి సిద్ధంగా వున్న జనం వున్నారు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ఎదురు దాడి ప్రారంభించిన చంద్రబాబు

    వెంకయ్య నాయుడి మాటలలో చెప్పాలంటే ప్రత్యేక హోదాతో నిమిత్తం లేకుండానే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకున్నారు. పదేళ్లలో చేయాల్సిందానిని రెండు సంవత్సరాలలోనే కేంద్రం ఎన్నో చేసిందని వెంకయ్య నాయుడు టాం టాం వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దీనికి కృతజ్ఞతల మీద కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా గురించి వూరూ వాడా ప్రచారం చేసింది, అశలు కల్పించింది మీరు. ఎప్పుడూ పాకేజి గురించి చెప్పలేదు. ఇప్పుడు పాకేజి కంటే మెరుగైనదేమిటో చెప్పమని చంద్రబాబు, తెలుగుదేశ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. అది కూడా చెప్పాల్సింది మీరే. పద్నాలుగవ ఆర్ధిక సంఘం కొత్తగా ప్రత్యేక హోదాను ఇవ్వకూడదని సిఫార్సు చేసిందని ఒక మాట, ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇస్తే మిగతావన్నీ తమకూ అడుగుతాయి,ఇవ్వకపోతే ఎన్‌డిసిలో వ్యతిరేకిస్తాయి అని మరోమాట, ఇప్పటికే వున్న రాష్ట్రాలకు కూడా రద్దు చేయబోతున్నాం అని ఇంకోమాట. ఏదో ఒక మాట మీద కట్టుబడి వుండాలి కదా !

    ప్రత్యేక హోదాకు ఇన్ని ఆటంకాలు చెప్పిన పెద్ద మనుషులు ప్రత్యేక పాకేజీ కూడా లేకుండా ప్రత్యేక సాయం అని పేరు పెట్టి ఒక ప్రకటన చేశారు. ఓకే ఆంధ్రప్రదేశ్‌ పట్ల జాలి, దయ, కరుణతో ఈ సాయం చేస్తున్నారని అనుకుందాం. అది నిబంధనలకు అనుగుణంగానా, లేక పక్కన పెట్టారా ? అనుగుణ్యంగానే అయితే దానిలో ప్రత్యేకత ఏమున్నట్లు. వుదాహరణకు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన ఆదాయలోటు రు.22,113 కోట్ల మొత్తాన్ని ఐదు సంవత్సరాలలో కేంద్రం చెల్లిస్తుంది. దీన్ని ప్రత్యేక సాయం అంటున్నారు, అది ఎలా అవుతుంది ? రాష్ట్రాన్ని విడగొట్టకపోయినా ఆ మొత్తం వచ్చేదే. ఎందుకంటే మన రాష్ట్ర విభజనతో నిమిత్తం లేని పధ్నాలుగవ ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్‌తో పాటు పదకొండు రాష్ట్రాలకు రు.1,94,821 కోట్ల రూపాయలను ఐదు సంవత్సరాల కాలంలో చెల్లించాలని సిఫార్సు చేసింది. విశాఖ పట్టణం నగరం కంటే తక్కువ జనాభా వున్న నాగాలాండ్‌ రాష్ట్రానికి రు.18,475, జమ్ము కాశ్మీర్‌కు 60, హిమచల ప్రదేశ్‌కు 40వేల కోట్లు ఇవ్వనున్నారు. దీన్ని గురించి ఏమంటారు ?http://ficci.in/SPdocument/20563/Highlights_14thFinance_Commission_Report.pdf

    ప్రత్యేక హోదాకు,పరిశ్రమల రాయితీలకు సంబంధం లేదని ఒక మాట. విభజన చట్టంలోనే హోదా గురించి అప్పుడు కాంగ్రెసే పెట్టి వుంటే పోయేది, ఆ పని చేయకుండా అన్యాయం చేసిందని ఒక విమర్శ. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే పరిశ్రమలన్నీ అక్కడికే తరలి పోతాయని తమిళనాడు అభ్యంతరం చెబుతున్నదని వెల్లడించింది ఎవరు ? హోదాకు రాయితీలకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్‌ జనాల మెదళ్లకు ఎక్కించేందుకు కష్టపడకపోతే అదేదో అభ్యంతరాలు పెట్టే రాష్ట్రాలకు ఎందుకు నచ్చచెప్పలేకపోయినట్లు ? రాని హోదా గురించే పట్టుబట్టి ఇచ్చే రాయితీలసు కూడా వద్దందామా అని మరొక ఎదురుదాడి.ఈ కాలంలో వెంకయ్య నాయుడి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమిటో, హోదాతో నిమిత్తం లేకుండానే తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చేసిందేమిటో ఒక శ్వేతపత్రం ప్రకటించి వివరిస్తే తప్ప జనానికి వాస్తవం అర్ధం కాదు.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ప్రధాని అలా మనవి చేసుకుంటారా ? గవర్నర్‌ అంతగా దిగజారి పోయారా ?

      అన్నింటికీ కొత్త అర్ధాలు చెబుతున్న మాననీయ ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశానికి కూడా కొత్త భాష్యం చెప్పినట్లు ఒక అస్మదీయ పత్రిక వార్తలను బట్టి తెలిసింది. ప్రధాన మంత్రి, రాష్ట్ర గవర్నర్‌ భేటీ అయ్యారని 40 నిమిషాలలో సగం పాకేజి,ఆంధ్రప్రదేశ్‌ గురించే మాట్లాడారని లీకుల కధనం. ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు ప్రధానో లేక గవర్నరో అస్మదీయ పత్రికల విలేకర్లను పిలిచి చెవిలో వూది వుండాలి. లేకపోతే వారి ప్రతినిధులు కల్పించిన కధనమైనా అయి వుండాలి. తామేం చేసినా, చెప్పినా నోరు మూసుకొని వినాలి, పడి వుండాలన్న బరితెగింపు కాకపోతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే సమస్య మరింత జఠిలం అవుతుందని ప్రధాని మోడీ అభిప్రాయ పడినట్లు ఆ కధనంలో వుంది.అలాంటపుడు మజ్లిస్‌ పార్టీ ప్రతినిధితో సహా అఖిల పక్ష బృందాన్ని కాశ్మీర్‌కు ఎందుకు పంపినట్లు ? సమస్యను మరింత జఠిలం చేయటానికా ? ఇక ముందు ఎలాంటి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయరని భావించాలా ? అభివృద్ధి కావాలనుకున్నవారు ప్యాకేజీని స్వాగతిస్తారని, సమస్యను సాగదీసి రావణకాష్టం చేయాలనుకున్నవారు మాత్రమే విమర్శలు చేస్తారని ప్రతిపక్షాలపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్యాకేజికి నానా కష్టాలు పడాల్సి వచ్చిందట. కొన్ని ప్రాంతాలలో ఇలాంటి వాటిని పోసుకోలు కబుర్లు అంటారు. హోదా బదులు వట్టిస్తరి మంచినీళ్ల వంటి పాకేజీకి జనాన్ని ఒప్పించటానికి పడుతున్న పాట్లు తప్ప మరొకటి దీనిలో కనిపించటం లేదు. పాకేజి పట్ల 60శాతం జనం సంతృప్తిగా వున్నారని ప్రతిపక్షాలు మాత్రం హోదా వల్ల అమిత ప్రయోజనాలు కలుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నాయని గవర్నర్‌ ప్రధానితో చెప్పినట్లుగా వుంది. ఒక గవర్నర్‌ ప్రధానితో కలిసినపుడు ఒక వేళ చెప్పాల్సి వస్తే ఏ పార్టీ వైఖరి ఏమిటో చెబుతారు తప్ప దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఒక రాజకీయ నేత మాదిరి ఫిర్యాదు చేస్తారా ? గవర్నర్‌ అంతగా దిగజారి పోయారా ? ప్రతిపక్షాలపై తాము చేయదలచుకున్న ఆరోపణలను గవర్నర్‌కు ఆపాదించి వాటికి విశ్వసనీయత కల్పించ చూసే అతి తెలివి తప్ప మరొకటి కాదు . అంతకంటే పెద్ద తెలివి తక్కువ పదజాలం చూడండి. ‘ ఇంకొన్ని అంశాలలో ఏపీకి సాయం అవసరమనే విషయం మేమూ గుర్తించాం. వాటిని కూడా అందించటానికి ప్రణాళిక రూపొందించుకుంటాం ‘ అని ప్రధాని పేర్కొన్నారట. ప్రణాళికను రూపొందించుకుంటాం అని ప్రధాని అన్నట్లుగా రాయటం చంద్రబాబు మెప్పు పొందటానికి తప్ప మరొకటి కాదు. ఒక కింది స్ధాయి అధికారి పెద్ద అధికారితో ‘మనవి’ చేసుకున్నట్లుగా వుంది తప్ప ఒక ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్య మంత్రితో మాట్లాడినదిగా లేదు. అయితే ఇక్కడ ఒకటి జరిగి వుండటానికి ఆస్కారం వుంది. ఆంగ్ల భాషలో ప్రధాని అంత పండితుడు కానట్లే హిందీలో కూడా చంద్రబాబు అంతే. అందువలన ఒకరు హిందీలో మరొకరు ఆంగ్లంలో ఫోన్లో మాట్లాడి నపుడు సదరు వార్త రాసిన విలేకరి పక్కనే వుండి విని రాసుకోవటం లేదా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసి మాట్లాడిన దానిని తర్జుమా చేయటంలో వచ్చిన ఇబ్బంది కానీ అయి వుండాలి.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

చంద్రబాబు చక్రం తిప్పటంపై జనంలో ఇంకా ఆశలు

    తెలుగుదేశ నాయకత్వ ఆరోపణలను వారి మాటల్లో చెప్పాలంటే వారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు జనాన్ని రెచ్చగొడుతున్నాయి. జనం రెచ్చిపోయిన సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. అంతా శాంతియుతంగా వుంది. కనుక తెలుగుదేశమే ప్రతిపక్షాలను రెచ్చగొడుతున్నది అనుకోవాలేమో ! ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక హోదా రాష్ట్రం అంటే ఏమిటో జనానికి ఒక బ్రహ్మ పదార్ధంగా తయారైంది. అది రాదని తెలిసిన తెలుగుదేశం, బిజెపిలు , వాటికి కొమ్ముకాసే మీడియా దాని వలన కలిగే ప్రయోజనాలను జనానికి వివరించి చైతన్య పరచటం, ఆశలు కలిగించటం తమకు నష్టమని భావించాయన్నది కొందరి అభిప్రాయం. కర్ణుడి రధం నడుపుతూనే అతనిని దెబ్బతీయటానికి ప్రయత్నించిన సారధి శల్యుడి మాదిరి అస్మదీయ మీడియా జనం పక్షం అని చెపుతూనే ప్రత్యేక హోదా పట్ల జనంలో ఆసక్తి సన్నగిల్లి పోవటానికి శల్యసారధ్యం చేస్తున్నదా ? ఆ మేరకు జయప్రదమైనట్లే కనిపిస్తున్నది. ప్రత్యేక హోదా రాదన్న నిరాశ, నమ్మిన వారే మోసం చేశారన్న ఆశక్తత జనంలో కనిపిస్తోందన్నది ఒక అభిప్రాయం. రెండో వైపు ప్రతిపక్షంపై విస్వసనీయత లేకపోవటంతో నిజం చెప్పినా నమ్మని స్ధితి, వామపక్షాలు నామమాత్రంగా మారటం. మూడో అభిప్రాయం కూడా వుంది అదేమంటే తిమ్మిని బమ్మిని చేయగల చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఐటి రంగంలో అమరావతిని మరో హైదరాబాదుగా మారుస్తారనే గుడ్డి విశ్వాసం బలంగా వుండబట్టే హోదా లేకపోయినా ఇచ్చిందాంతో సంతృప్తి చెందుదామనే భావనకు లోనయ్యారనే అభిప్రాయమూ వుంది.

  ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న శతకకారుడిని బిజెపి-తెలుగుదేశం పార్టీలు ఆశ్రయించినట్లు ఇప్పుడు వారి మాటలను బట్టి చెప్పవచ్చు. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి జనాన్ని భ్రమ పెడితే ఇప్పుడు ప్రత్యేక హోదా లేకపోయినా రాయితీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తారని బాబొస్తే జాబొస్తుందన్న పాత నినాదాన్ని తిరిగి జనానికి గుర్తు చేశారు. ఇది మరొక ఆశాభంగానికి నాంది అవుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

శిక్షలేని నేరం జర్నలిస్టుల హత్యలు

13 Tuesday Sep 2016

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others

≈ 1 Comment

Tags

attacks on journalists, Journalist Murders, Journalist Murders in India, journalists

Image result for stop attacks on journalists in india

ఎం కోటేశ్వరరావు

     మీరు ఎవరినైనా మట్టు పెట్టదలచుకున్నారా ? మన దేశంలో చాలా సులభం ! ఎలాంటి శిక్షలు వుండవు !! వాణిజ్య ప్రకటనలలో షరతులు వర్తిసాయని నక్షత్ర గుర్తులు వేసినట్లే దీనికి కూడా ఒక షరతు వుంది. అదేమంటే అలాంటి వారు మీడియా వ్యక్తులై వుండాలి. ఈ రోజుల్లో వారు దొరకటం చాలా సులభం. పత్రికలు, టీవీలు, రేడియో, అంతర్జాతల మీడియాలో చాలీ చాలని లేదా అసలు వేతనం లేకుండా పని చేసే వారే కాదు, ఎలాంటి జీతం, భత్యాలు, పగలనకా, రాత్రనకా తేడా లేకుండా పని చేస్తూ , యజమానులకు విపరీత లాభాలు సమకూర్చి పెడుతున్న సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే. అనుమానమా ? అక్కర లేదు మీ పోస్టులను సాక్ష్యంగా చూపి ఎవరైనా నా మనోభావాన్ని దెబ్బతీశారు అని ఫిర్యాదు చేస్తే కేసులు పెడుతున్నారు. సాంప్రదాయ మీడియాలో పని చేసే వారి మీద కూడా అలాంటి కేసులే పెట్ట వచ్చు. కానీ అలా చేయటం లేదే, భౌతికంగా మట్టు పెడుతున్నారు. అలాంటి పరిస్థితి రేపు సామాజిక మీడియా జర్నలిస్టులకు ఎదురు కాదని ఎవరైనా చెప్పగలరా ?

     చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నది అధికారంలో వున్న పెద్దల వువాచలలో ఒకటి. వంద మంది నేరగాళ్లు తప్పించుకుపోవచ్చుగాని ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదన్నది న్యాయ సూక్తి. అంతర్జాతీయ సంస్ధ జర్నలిస్టుల రక్షణ కమిటి( కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌-సిపిజె) తాజా నివేదిక ప్రకారం 1992 నుంచి 2016 జూలై వరకు 27 మంది జర్నలిస్టుల హత్య కేసులలో ఒక్కటంటే ఒక్క దానిలో కూడా నేరగాళ్లకు శిక్ష పడలేదు. నిజంగా చట్టం తనపని తాను చేస్తే ఇలాగే జరుగుతుందా ? ఒక్క కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడలేదంటే నిందితులందరూ నిరపరాధులేనా ?అనేక మంది చెబుతున్నట్లు, వాటిని అనేక మంది నమ్ముతున్నట్లు మనది ప్రపంచంలో ఎంతో బాగా పనిచేస్తున్న అతి పెద్ద ప్రజాస్వామిక సంస్ధ, దర్యాప్తు చేయాల్సిన పోలీసులూ సమర్ధులే, విచారించాల్సిన న్యాయమూర్తులనూ తప్పు పట్టలేము. తిమ్మినిబమ్మిని చేసే న్యాయవాదులూ తమ వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వరిస్తున్నట్లే. మనది బూటపు ప్రజాస్వామ్యమా లేక ప్రజాస్వామ్యాన్ని బూటకంగా మార్చివేశారా ? లేక వ్యవస్ధలోనే లోపమున్నదా ? ఎవరు దీనికి బాధ్యులు ? ఎందుకిలా జరుగుతోంది? ఏం జరిగినా అన్నీ మన మంచికే అన్నట్లుగా అన్నింటినీ గుడ్లప్పగించి చూస్తున్న సమాజం ? ఏమిటీ వైపరీత్యం, ఎంతకాలమిలా ? వీటన్నింటిని చూసి అరుదుగా వున్న సున్నిత మనస్కులలో ఏ ఒక్కరైనా ఈ ప్రజాస్వామ్యం, ఈ వ్యవస్ధ మీద నమ్మకం కోల్పోయినట్లు ప్రకటిస్తే ఆ ఘోరానికి బాధ్యులెవరు ?

    భారత రాజ్యాంగం ఆర్టికల్‌ పందొమ్మిది ప్రకారం హామీ ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే నేరాలకు పాల్పడుతున్న వారి నుంచి జర్నలిస్టులను కాపాడేందుకు జాతీయ స్ధాయిలో అవసరమైన ఒక యంత్రాంగాన్ని, పద్దతిని రూపొందించేందుకు అవసరమైన ముసాయితా ప్రతిపాదనలను తయారు చేసేందుకు అనుభవమున్న న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పండితులు, భావ ప్రకటనా స్వేచ్చ విషయాలలో నిపుణులైన ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని సిపిజె తన నివేదికలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

    ఈ నివేదికను సిపిజె ఆసియా కార్యక్రమ సీనియర్‌ పరిశోధకులు సుమిత్‌ గల్‌హోత్రా,స్వతంత్ర పాత్రికేయులు రక్షా కుమార్‌ సిపిజె తరఫున ఈ నివేదికను తయారు చేశారు. మీడియా తీరుతెన్నులను వీక్షించే వెబ్‌సైట్‌ ది హూట్‌ సలహా సంపాదకురాలు ముంబైకి చెందిన గీతా శేషు కేసుల వివరాలను అందచేయగా దేశంలోని పరిస్థితుల గురించి స్వతంత్ర జర్నలిస్టు ఆయుష్‌ సోనీ రాశారు.(గీతా శేషు సేకరించిన కొన్ని వివరాలను వర్కింగ్‌ జర్నలిస్టు జూన్‌ సంచికలో ఇచ్చాము). ఈ నివేదిక ముందు మాటను ప్రముఖ జర్నలిస్టు పి శాయినాధ్‌ రాశారు. నివేదిక పూర్తి పాఠం కావాల్సిన వారు దిగువ లింక్‌లో పొంద వచ్చు.https://cpj.org/reports/2016/08/dangerous-pursuit-india-corruption-journalists-killed-impunity.php పెద్ద పట్టణాలలో వున్నవారి కంటే గ్రామీణ, చిన్న పట్టణాలలో వున్న జర్నలిస్టులకు తాము రాసిన రాతలపై దాడులు జరిగే ముప్పు ఎక్కువగా వుందని అయితే ఈ నివేదికను పరిశీలించిన తరువాత దానికి తోడు జర్నలిస్టు పని చేస్తున్న స్థలం, సంస్ధ, వృత్తిలో స్థాయి, సామాజిక పూర్వరంగం కూడా ఆ ముప్పుకు అదనంగా తోడవుతున్నట్లు వెల్లడైందని శాయినాధ్‌ చెప్పారు. ప్రాంతీయ భాషలలో వార్తలు రాసే వారికి ముఖ్యంగా ఆ రాసింది శక్తివంతులైన వారిని సవాలు చేసేదిగా వుంటే విలేకర్లకు ముప్పు ఇంకా ఎక్కువగా వుంటుందని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాలో పని చేసేవారు ఇలాంటి ఘోరమైన దాడుల నుంచి తప్పించుకుంటున్నారని కారణం జాతీయ మీడియాలోని వున్నత తరగతులు, ప్రత్యేకించి ఆంగ్ల మీడియా సంస్ధలలో వున్నవారికి మెరుగైన రక్షణ కలిగి వున్నారని, పలుకబడి కలిగిన జాతీయ మీడియా సంస్ధలు ప్రభుత్వానికి అందుబాటులో వుండటంతో వాటిలో పనిచేసే వారికి అంతర్గతంగానే వ్యవస్ధా పరరక్షణ వుంటుందని శాయినాధ్‌ పేర్కొన్నారు.

     అవినీతి గురించి రాసిన కారణంగానే జర్నలిస్టులు హత్యకు గురైనట్లు నివేదికలోని 27 వుదంతాలు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఏ ఒక్క కేసులోనూ ఎవరికీ శిక్షలు పడలేదు. ఈ పరిస్థితి మీడియాకు ఒక సవాలు వంటి పరిస్థితిని ముందుకు తెచ్చింది. ముఖ్యంగా చిన్న పట్టణాలలోని జర్నలిస్టులు అవినీతిని గురించి నివేదించినపుడు వారు ఎక్కువగా బెదిరింపులు, హత్యలకు గురవుతున్నారని సిపిజె నివేదిక తెలిపింది. జర్నలిస్టులు ఏమాత్రం రక్షణలేని స్ధితిలో పని చేస్తున్నారని, మీడియా సౌహార్ద్రతలేమి, న్యాయ వ్యవస్ధలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి వుందని, మరణించిన తరువాత బాధితులను అప్రతిష్టపాలు చేస్తున్నారని పేర్కొన్నది. 2015లో తీవ్ర కాలిన గాయాలతో మరణవాగ్ఞూలం ఇచ్చిన స్వతంత్ర జర్నలిస్టు జోగేంద్ర సింగ్‌ ఒక పోలీసు అధికారే తనను సజీవ దహనం చేసేందుకు మంటల్లోకి నెట్టారని చెప్పాడు. అతను చెప్పిన దానిని తిరస్కరించిన స్దానిక పోలీసులు అసలు అతను జర్నలిస్టే కాదని బుకాయించారు. ఒక ఏడాది గడిచినప్పటికీ రాష్ట్ర స్ధాయిలో ఇంకా దర్యాప్తు సాగుతూనే వుంది, అరెస్టులు లేవు. 2011 జనవరిలో తన ఇంటి ముందే కాల్పుల్లో హత్యకు గురైన నయా దునియా హిందీ పత్రిక జర్నలిస్టు రాజపుట్‌ కేసులో దర్యాప్తును సాగదీసి కీలక సాక్ష్యాలను కనుమరుగు చేసే యత్నం చేశారు. చివరికి ఇప్పుడు ఆ కేసును సిబిఐకి అప్పగించారు. భారత్‌లోని అతి పెద్ద కుంభకోణాలలో ఒకదానిపై పరిశోధనలో భాగంగా ఒక ఇంటర్వ్యూ సమయంలో అనుమానాస్పద స్ధితిలో మరణించి ఇండియా టుడే గ్రూప్‌ పత్రికలకు చెందిన అక్షయ్‌ సింగ్‌ కేసు మిగతా కేసులతో పోల్చితే త్వరగా సిబిఐకి అప్పగించారంటే దానికి కారణం ఒక పెద్ద సంస్థలో పని చేస్తూ వుండటమే అని నివేదిక పేర్కొన్నది.

     పైన పేర్కొన్న మూడు వుదంతాల గురించి ఈ ఏడాది మార్చినెలలో సిపిజె బృందం పరిశోధనలో భాగంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, న్యాయవాదులు, జర్నలిస్టులను కలసి వారి అభిప్రాయాలను సేకరించింది. స్వతంత్ర జర్నలిస్టు జగేంద్ర సింగ్‌ పోలీసుల చేతిలో కాలిన గాయాలతో మరణించాడని విమర్శలు వచ్చాయి. వుత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి భూ కబ్జా, అత్యాచారాల గురించి వార్తలు రాయటమే అతను చేసిన నేరం.ఒక రాజకీయనేత కుమారుడు అక్రమంగా జూదం నిర్వహణలో వున్నట్లు రాసిన వుమేష్‌ రాజపుట్‌ను ఇంటి ముందే కాల్చి చంపారు. మధ్య ప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణంగా ప్రసిద్ధి చెందిన అవినీతి అక్రమాలపై శోధన చేస్తుండగా అక్షయ సింగ్‌ ఆకస్మికంగా మరణించాడు. ఇలాంటి పరిశోధనలను అధికార యంత్రాంగం సహించటం లేదు.దాడులు, హత్యలు జరిగిన వుదంతాలలో పోలీసులు సరిగా దర్యాప్తు జరిపి దోషులను గుర్తించటం,అరెస్టు చేయటం జరగటంలేదు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌, 2జి స్కామ్‌ వంటి వాటిలో జరిగిన అక్రమాల గురించి సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి తేవటంలో కార్యకర్తలు, జర్నలిస్టులు ఎంతో ముందున్నారు.గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అవినీతిని ఒక కేంద్రీయ అంశంగా చేసిన నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిపై చర్యలు తీసుకోకపోవటంతో పాటు వాటిని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులకు తగిన రక్షణ చర్యలు తీసుకోవటం లేదు. భారత్‌లో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పత్రికా స్వేచ్చ గురించి తీవ్రంగా పట్టించుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారంలో వున్న కాంగ్రెస్‌,బిజెపి లేదా ప్రాంతీయ పార్టీలుగానీ ఎవరున్నా మౌనం వహిస్తున్నారు. శిక్షలు లేని సంస్కృతిని మాత్రమే పెంచి పోషిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.

    సిపిజె ఇంతవరకు విధులలో భాగంగా హత్యలు జరిగిన 27 కేసులను పరిశీలించగా ఒక్కదానిలో కూడా శిక్షలు పడలేదని తేలింది. మరో 25 అనుమానిత మరణాలను కూడా ఏ కారణంతో జరిగాయనే విషయమై దర్యాప్తు జరుపుతోంది.

    ఒక జర్నలిస్టుపై దాడి లేదా హత్య జరిగిందనే ఫిర్యాదు చేయగానే పోలీసులు ముందుగా అతను జర్నలిస్టు కాదు, ఆ ఘటనకు జర్నలిజానికి సంబంధం లేదంటున్నారని గీతా శేషు పేర్కొన్నారు.దర్యాప్తులో కూడా అదే ప్రతిబింబిస్తోంది. ‘ దేశంలో గట్టి ప్రజాస్వామిక సంస్ధలు, చురుకుగా వుండే స్వతంత్ర న్యాయవ్యవస్ధ వున్నప్పటికీ జర్నలిస్టులను హత్యలు చేసిన వారు శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది, అది దేశంలోని ప్రజాస్వామిక సంస్ధల పనితీరుపై ప్రభావం చూపుతుందని’ 2015లో ప్రెస్‌ కౌన్సిల్‌ పేర్కొన్న అంశాన్ని సిపిజె నివేదిక వుటంకించింది.

     నాణానికి ఒకవైపు బొమ్మ ఇదైతే రెండోవైపు బొరుసు గురించి కూడా సిపిజె నివేదిక పేర్కొన్నది. భౌతికంగా అదే విధంగా సామాజిక మాధ్యమాలలో మొత్తం జర్నలిస్టు సమాజం దాడులకు గురవుతుంటే దాడులు, హత్యలకు గురైనా మీడియాలోని తోటి జర్నలిస్టులలో, మొత్తం మీద సమాజంలో నిరసన వ్యక్తం కావటం లేదని కూడా సిపిజె ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి గురైన జర్నలిస్టు ఎవరా అన్నదానితో నిమిత్తం లేకుండా మీడియాపై దాడులకు సంబంధించిన అంశాలపై మెరుగ్గా శోధించి వెలుగులోకి తీసుకురావాలని భారత మీడియా సంస్ధలను సిపిజె కోరింది. జర్నలిస్టులు ప్రతికూల పరిస్ధితులలో వున్న వెలుగులో సిపిజె నివేదిక అనేక సిఫార్సులు చేసింది. జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు ఇతర దేశాలలో వున్న వుత్తమ ఆచరణలను అధ్యయనం చేసి జాతీయ స్ధాయిలో ఒక యంగ్రాంగాన్ని ఏర్పాటు చేయటం అందులో ఒకటి.మీడియాపై దాడులు చేసి శిక్షలు పడకుండా తప్పించుకున్న వుదంతాలపై పార్లమెంటరీ కమిటీ విచారణ నిర్వహించి న్యాయం చేసేందుకు, శిక్షలు వేయటానికి ఎదురువుతున్న సవాళ్లను గుర్తించాలి. దాడులు, హత్యలు జరిగినపుడల్లా నిర్ద్వంద్వంగా బహిరంగ ప్రకటనలు చేసి కేంద్రం వాటిని ఖండించి గట్టి సందేశం పంపాలి. సిబిఐ తన దర్యాప్తులో వున్న కేసులను త్వరగా పూర్తి చేయాలని, చత్తీస్‌ఘర్‌ ప్రభుత్వం జర్నలిస్టులపై పోలీసుల వేధింపులను ఆపాలని, ఇతర సంస్ధలను కూడా నిరోధించాలని, జైళ్లలో వున్నవారిని విడుదల చేయాలని కోరింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Central Government announced  Special Assistance To Andhra Pradesh 

08 Thursday Sep 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, AP crisis, ap special status, Central government, Special Assistance To Andhra Pradesh

1 The Central Government is committed to help and assist the newly created State of Andhra Pradesh. The commitments of the Centre emanate from four basic documents, namely, the provisions of the Andhra Pradesh Reorganisation Act, 2014, the report of the Fourteenth Finance Commission, the statement of the then Prime Minister before the Parliament on 20.2.2014 and the Report dated 1.12.2015 of Vice Chairman, NITI Aayog on Developmental Support to the Successor State of Andhra Pradesh under the Andhra Pradesh Reorganisation Act 2014.

2. The above mentioned commitments are broadly categorized as under:-

(i) The Andhra Pradesh Reorganisation Act:

(a) Section 46 of the Act provides for a reference to be made to the Fourteenth Finance Commission to take into account the resources available to the Successor States and make separate awards to them. It further provides for a developmental package to be given to the backward areas of the State of Andhra Pradesh. It also provides for adequate incentives in particular for Rayalaseema and north coastal regions of the State.

(b) Section 90 of the Act declares the Polavaram Irrigation Project as a National Project.

(c) Under Section 93 of the Act, the details of institutions and infrastructure to be developed in the State are outlined in the Thirteenth Schedule to the Act.

(d) Section 94 of the Act provides for appropriate fiscal measures, including offer of tax incentives, to be given to the Successor States to promote industrialization and economic growth. It further provides for support to programmes for backward areas including physical and social infrastructure. In addition, it provides for giving special financial support for creation of essential facilities in the new capital of the successor State of Andhra Pradesh, including the Raj Bhawan, High Court, Government Secretariat, Legislative 2 Assembly, Legislative Council and such other essential infrastructure.

(ii) Statement of the then Prime Minister Dr. Manmohan Singh on 20.2.2014: The then Prime Minister, Dr. Manmohan Singh on 20.2.2014 stated before the Rajya Sabha that Special Category Status would be extended to the State of Andhra Pradesh for a period of five years. This would be done to put the State’s finances on a firmer footing. He further stated that the resource gap for the year 2014-15 would be compensated by the Central Government.

(iii) Fourteenth Finance Commission: The Fourteenth Finance Commission defined the financial relationship between Centre and the States for the five year period ending 2019-20. The Commission did not make a distinction between Special and General Category States. Its approach was to fill the resource gap of each State to the extent possible through tax devolution. Accordingly, the Commission recommended an enhanced devolution of 42% of the Central Government’s tax revenues to States. If devolution alone could not cover the assessed gap, for certain States, a revenue deficit grant was provided. Andhra Pradesh was one of the States determined to be a revenue deficit State, and the Commission recommended that the Centre would provide revenue deficit grant for the period of the Fourteenth Finance Commission. The amount of deficit for each year was mentioned in the report itself and a total of Rs.22,113 crores is to be paid to Andhra Pradesh as revenue deficit grant for the 5 year period.

(iv) Report on Developmental Support to Andhra Pradesh dated 1.12.2015: The Vice Chairman, NITI Aayog Dr. Arvind Panagariya studied various aspects of the support to be given to Andhra Pradesh under the Reorganisation Act and made recommendations regarding effective implementation.

3 The Central Government’s commitments to the State of Andhra Pradesh

. Under the Andhra Pradesh Reorganisation Act, the commitment for the resource gap for the year 2014-15 is being met on the basis of standardized expenditure for that year. The revenue gap has been tentatively quantified subject to further adjustment on account of figures relating to certain pension schemes. A part of the revenue gap compensation amounting to Rs.3,979.5 crore has already been paid and the balance is being paid in annual instalments.

An amount of Rs.2,500 crore has already been paid as support for creation of new capital of State of Andhra Pradesh and a balance of Rs.1,000 crore would be paid in due course. An amount of Rs.1,050 crore has been disbursed as special package for backward areas and a further amount of Rs.1,050 crore would be paid in the coming years.

4. The Polavaram Project is on the river Godavari near Ramayyapeta village of Polavaram mandal, about 42 km upstream of Sir Arthur Cotton Barrage in the State of Andhra Pradesh. It envisages construction of a dam and canal system to create ultimate irrigation potential of 2,91,000 ha. (7.2 lakh acres), generation of 960 MW of hydro power, drinking water supply to a population of 28.50 lakh in 540 villages and diversion of 80 TMC of water to Krishna river basin. The project was accorded investment clearance by the Planning Commission for Rs.10,151.04 crore (at 2005-06 price level) in 2009. Further, the Advisory Committee of Ministry of Water Resources approved the cost at 2010-11 price level as Rs.16,010.45 crore during January, 2011 including power and drinking water component of Rs.2868 crore. Prior to the passage of the AP Reorganisation Act, the Polavaram Project was being implemented by the Government of Andhra Pradesh with Central Assistance under the Accelerated Irrigation Benefits Programme (AIBP). An expenditure of Rs.5,135.87 crore had been incurred up to 31.3. 2014 including Central Assistance of Rs.562.469 crore.

The Central Government will fund the Polavaram Irrigation Project in the following manner:

(i) It will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1.4.2014, to the extent of the cost of the irrigation component on that date.

(ii) In view of the recommendations of the Vice Chairman NITI Aayog that it will be appropriate for the State of Andhra Pradesh to execute this project (as it is an important project and the State Government is keen to complete it at the earliest), the Government of India has agreed to the State’s request for the execution of the project by the State Government on behalf of the Government of India.

5. Government of India has already legislated for fiscal incentives of enhanced investment allowance and accelerated depreciation. They will come into effect once notified, after the State of Andhra Pradesh identifies the eligible backward areas.

6. In respect of educational and other institutions:  A Petroleum University has already been established.

 The IIT has already been functioning from a transit campus and the main campus is being constructed.

 The National Institute of Technology has already been functioning since September 2015 in a temporary campus and its main campus is being constructed.

 The Indian Institute of Information Technology, Kurnool has already started functioning from the temporary campus and would start functioning and its main campus is being constructed.

 The site for the Central University in Anantapur district has already been selected. 5  The Indian Institute of Science Education and Research has been established in Tirupati.

 The Indian Institute of Management has been established at Visakhapatnam.

 An All India Institute of Medical Sciences has been approved at Guntur and the land for the same is being taken over.

 A Tribal University is to be established in the State of Andhra Pradesh for which a Site Selection Committee of the State has already approved the land.

 A National Institute of Disaster Management is being established in the State of Andhra Pradesh for which identification and takeover of the land is being completed.

7.(i) The Cabinet Committee on Economic Affairs has given in-principle approval for the establishment of a major port at Dugarajapatnam in Andhra Pradesh on PPP basis, subject to feasibility.

(ii) Proposals with regard to the Steel Authority of India, Indian Oil Corporation/HPCL to set up units in Andhra Pradesh are being examined as provided in the Reorganisation Act.

(iii) Regarding airports:  In Vishakhapatnam, international flights are already operating. For further expansion, land has been identified at Bhogapuram. The State is to acquire and hand over land for development by AAI as per the standard terms for such development or develop on its own by PPP. A techno economic feasibility report is to be undertaken by State Government.  For Vijayawada, MoU has been signed by AAI with Govt. of Andhra Pradesh to develop the existing terminal. The State is to 6 acquire 698 acres of land required for the expansion as per the standard terms.  For Tirupati, the new terminal was inaugurated by the Prime Minister on 22.10.2015. A new apron for parking for 3 aircraft has been completed. The existing runway, apron and terminal building are adequate for commencing international flights. Expansion of new apron for parking additional 4 aircraft and isolation bay is under construction within the available land.

(iv) The National Highway Authority of India has taken several steps for establishment of the National Highways in the State of Andhra Pradesh. The Railways is considering measures for establishing a rapid rail and road connectivity between the new proposed capital of Andhra Pradesh with Hyderabad and other cities in the region. The Government of India is actively considering proposals for the establishment of the Metro Rail in Visakhapatnam and VijayawadaGuntur-Tenali urban area.

8. The Fourteenth Finance Commission’s award came into effect from 1.4.2015. The enhanced devolution amount due to Andhra Pradesh is being paid in entirety. This has resulted in an increase of Rs.7,787 crore in tax devolution in 2015-16 compared to 2014-15, a growth of 55%. The revenue deficit grants for each of the years recommended by the Fourteenth Finance Commission will also be paid by the Government of India to the State of Andhra Pradesh. The same has been done for the year 2015-16 and 2016-17. There are no issues pending on that score.

9. The Government of India is thus honouring and shall honour all commitments made under the Andhra Pradesh Reorganisation Act.

10. The statement of the then Prime Minister, Dr. Manmohan Singh on 20.2.2014 contains six paragraphs. There are no issues with regard to five out of the six paragraphs. With regard to the first point i.e. the grant of special status, an apparent conflict has set in, between the statement and the recommendations of the Fourteenth Finance Commission which came subsequently. On page 17 (para 2.29 & 2.30) of the Report, the Commission has stated (inter alia):

“We did not make a distinction between special and general category states in determining our norms and recommendations…… In our assessment of State resources, we have taken into account the disabilities arising from constraints unique to each State to arrive at the expenditure requirements. In this regard, we have observed that the North-eastern and hill States have several unique features that have a bearing on their fiscal resources and expenditure needs, such as low level of economic activity, remoteness and international borders. Our objective has been to fill the resource gaps of each State to the extent possible through tax devolution. However, we have provided post-devolution revenue deficit grants for States where devolution alone could not cover the assessed gap……

We are of the view that intra-state inequality is within the policy jurisdiction of the States and provisioning of adequate resources through tax devolution should enable them to address intra-state inequalities in an effective manner.”

Thus following the recommendations of the 14th Finance Commission, the class of special category states ceases to exist. However, the Central Government has agreed to give a special assistance measure for Government of Andhra Pradesh for five years, which would make up for the additional Central share the State might have received during these years, i.e. 2015-16 to 2019-20, as envisaged in the then Prime Minister’s statement dated 20.2.2014. This will be in the form of Central Government funding for externally aided projects for the state for Andhra Pradesh signed and disbursed during these years.

11. Thus the Government of India has effectively addressed all commitments made to the State of Andhra Pradesh in the Andhra Pradesh Reorganisation Act, the Fourteenth Finance Commission and the statement of the then Prime Minister on 20.2.2014.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మొనా లిసా నవ్వు -ప్రధాని నరేంద్రమోడీ మొసలి కన్నీరు

10 Wednesday Aug 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Gujarat, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

attacks on dalits, BJP, cow, cow slaughter, Cow Vigilante Groups, crocodile tears, Dalit, Narendra Modi, narendra modi crocodile tears, pink revalution, RSS

ఎం కోటేశ్వరరావు

    ప్రఖ్యాత లియోనార్డో డావిన్సీ ‘మొనా లిసా ‘ నవ్విందా లేదా అన్నది ఆ చిత్రం గీచిన గత ఐదు వందల సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే వుంది. బహుశా ఏ చిత్రం గురించి అన్ని కధనాలు, విశ్లేషణలు వెలువడి వుండవు. ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పటం గురించి కూడా ఇలాగే అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా గోరక్షకులు-దళితులపై దాడుల గురించి నరేంద్రమోడీ బహిరంగ వేదికలపై నోరు విప్పారు. ఆయన దళితులపై దాడులను ఖండించారా ? లేక గోరక్షకులు పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారా , కావాలంటే నన్ను కాల్చండి అంటూ వారిని వేడుకున్నారు తప్ప అలాంటి వారిపై గట్టిగా చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పలేకపోయారు, ఆ వ్యాఖ్యల ద్వారా ప్రధాని ఎలాంటి సందేశం ఇస్తున్నారు అన్నది చర్చగా మారింది.

    ఎవరి అర్ధం వారు చెబుతున్నారు. ఆవులు-దళితులు- నరేంద్రమోడీ, మధ్యలో మొసలి చేరింది. దళితులపై దాడుల పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. బిఎస్‌పి నాయకురాలు మాయావతి దళితులపై దాడుల గురించి అదే పని చేస్తున్నారని బిజెపి ధ్వజమెత్తింది,గుజరాత్‌లో దళితులపై దాడుల గురించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అనవసరగా మొసలి కన్నీరు కార్చవద్దని కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పన గురించి కాంగ్రెస్‌ మొసలి కన్నీరు కారుస్తున్నదని వెంకయ్య నాయుడు విమర్శించారు. ఇలా ఎందరో ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలు నిజంగా మొసలి కన్నీరు కారుస్తుందా, కారిస్తే ఎందుకు ? అది నరేంద్రమోడీ, బిజెపి నేతలకు వర్తిస్తుందా ?

   మొసలి కన్నీటి గురించి ఆరువందల సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రస్తావన వస్తోంది. దీని గురించి అనేక మంది అనేక విషయాలు చెబుతూనే వున్నారు. మొసలి కన్నీరు కార్చటం తన కోసం తప్ప ఇతరుల కోసం కాదన్నది చాలా మంది ఏకీభవిస్తున్న విషయం. వుభయ చర జీవులలో ఒకటైన మొసలి నీటిలో వున్నపుడు కన్నీరు కారుస్తుందో లేదో తెలియదు. అవసరం కూడా లేదు. బయటకు వచ్చినపుడు మాత్రం తన కళ్లను శుభ్రం చేసుకొనేందుకు కన్నీరు కారుస్తుంది తప్ప తనకు ఆహారంగా మారిన వాటి గురించి కాదని చెబుతారు.కానీ బయటకు చూసే వారికి మాత్రం అది ఎవరిపట్లనో విచారంతో కన్నీరు కారుస్తున్నట్లు కనిపిస్తుంది.స్వభావం, వాస్తవానికి విరుద్దంగా ఇతరులపై పైకి సానుభూతి వచనాలు పలికే వారిని అందుకే మొసలి కన్నీరు కారుస్తున్నారని అంటున్నారు. ఈ పూర్వరంగంలో నరేంద్రమోడీ అయినా మరొకరి గురించి అయినా లేదా సంఘటనల గురించి అయినా వివిధ పార్టీలు చేసే వ్యాఖ్యలను పరిశీలించాల్సి వుంటుంది.

    గత లోక్‌సభ ఎన్నికలు, తరువాత జరిగిన బీహార్‌ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ, ఇతర బిజెపి నేతల ప్రసంగాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. గత కొద్ది సంవత్సరాలుగా ఒక పధకం ప్రకారమే గులాబి విప్లవం లేదా పింక్‌ రివల్యూషన్‌ గురించి ప్రచారం చేసి తమ ఓటు బ్యాంకును పెంచుకొనేందుకు ప్రయత్నించారనేందుకు అనేక దృష్టాంతాలు వున్నాయి. కేంద్రంలో అధికారానికి రాక ముందు చెప్పిన మాటలకు తరువాత ఆచరణే అందుకు సాక్ష్యం. ఆవు మాంసం, ఇతర మాంసాలకు తేడా లేకుండా మొత్తం ఆవు మాంసాన్ని ఎగుమతి చేసేందుకు కాంగ్రెస్‌ అనుమతి ఇచ్చిందంటూ మనోభావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. పశుమాంసం గులాబి రంగులో వుంటుంది కనుక గులాబి విప్లవం అని పేరు పెట్టారు. కాంగ్రెస్‌ అజెండాయే గులాబి విప్లవం అన్నారు. వుపన్యాసాలు ఎలా సాగాయో చూడండి ‘ మనం హరిత విప్లవం, శ్వేత విప్లవం(పాల విప్లవం) గురించి విన్నాం కానీ గులాబీ విప్లవం గురించి ఎప్పుడూ వినలేదు.దీని అర్ధం ఏమంటే పశువులను వధించటం, మీరు చూడవచ్చు మాంసం రంగు గులాబీ, వారు దానిని ఎగుమతి చేయటం ద్వారా విప్లవాన్ని తీసుకువచ్చేందుకు పూనుకున్నారు.మన ఆవులను వధిస్తారు లేదా వధించేందుకు విదేశాలకు పంపుతారు. మీరు మాకు ఓటేస్తే మేము ఆవులను చంపేందుకు అనుమతి ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్‌ చెబుతోంది’ అని స్వయంగా నరేంద్రమోడీ వుపన్యాసాలు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కనుక ఢిల్లీలో వుంటే గ్రామాల్లోని ఆవులు అంతరించి పోతాయన్నట్లుగా చిత్రించారు. బీహార్‌ ఎన్నికలలో ఏం చెప్పారు? ములాయం సింగ్‌, లాలూ ప్రసాద్‌ వంటి యదువంశీకులు, యాదవులు కాంగ్రెస్‌తో ఎలా జతకడతారు అని ప్రశ్నిస్తూ ‘ గులాబి విప్లవం తీసుకురావాలని కోరుతున్న వారిని మీరు ఎలా సమర్ధిస్తారు అని నేను వారిని అడగదలచుకున్నాను, ఒక పశువును వధించినపుడు దాని మాంసం గులాబి రంగులో వుంటుంది దాన్నే గులాబి విప్లవం అంటున్నాము. ఒక గ్రామం తరువాత మరొక గ్రామంలో పశు సంపదను వధిస్తూ పోతూ వుంటే పశువులను అపహరించటం, వాటిని బంగ్లాదేశ్‌కు తరలించటం, దేశం మంతటా బడా పశువధ శాలలను తెరిచారు. కాంగ్రెస్‌ ఒక రైతుకు లేదా తన ఆవులను పెంచాలనుకొనే యాదవులకు సబ్సిడీ ఇవ్వదు, కానీ ఎవరైనా ఆవులను చంపేందుకు వధ శాలలు ప్రారంభిస్తే, పశువులను వధిస్తే మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికి సబ్సిడీలు ఇస్తుంది’ ఇలా సాగాయి.

     అదే పెద్ద మనిషి ఇప్పుడు ఆవులు ఎక్కువగా చనిపోవటానికి అవి ప్లాస్టిక్‌ తినటమే అని కొత్త పల్లవి అందుకున్నారు. గుజరాత్‌లో చచ్చిన ఆవు చర్మం తీసిన దళితులపై దారుణంగా దాడి చేసిన వుదంతాలతో అక్కడి దళితులలో వెల్లడైన ఆగ్రహం, దాని ప్రభావం దేశమంతటా దళితులపై పడి నిరసన పెరుగుతున్న క్రమంలో నష్టనివారణ చర్యలలో భాగంగా నరేంద్రమోడీ, సంఘపరివార్‌ శక్తులు కొత్త పల్లవి అందుకున్నాయి.

      న్యూఢిల్లీలో జరిపిన టౌన్‌హాల్‌ సమావేశ ఆహ్వానితుల ఇష్టా గోష్టిలో మాట్లాడిన ప్రధాని వధశాలల్లో కంటే ఎక్కువగా ఆవులు ప్లాస్టిక్‌ తిని మరణిస్తున్నట్లు ఆవుల కాపలాదారులు గుర్తించాలని చెప్పారు. ‘నాకు నిజంగా కోపం తెప్పిస్తున్నదేమంటే కొందరు గో సంరక్షణ పేరుతో దుకాణాలు తెరిచారు. కొంత మంది పగలు గోరక్షణ అంటారు రాత్రుళ్లు సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారు. డెబ్బయి నుంచి ఎనభై శాతం వరకు తప్పుడు పనులు చేస్తున్నట్లు తేలింది.సమాజం దీనిని అంగీకరించదు, తమ తప్పుడు పనులను కప్పిపుచ్చుకొనేందుకు వారు గోసంరక్షణ ముసుగు వేసుకుంటారు’ అన్నారు. స్వయం సేవకులు వున్నది సామాజిక సేవ చేయటానికి తప్ప జనాన్ని భయపెట్టటానికి, దుర్మార్గాన్ని ప్రదర్శించటానికి కాదు. వధశాలలలో కంటే ఆవులు ఎక్కువగా ప్లాస్టిక్‌ తిని మరణిస్తున్నాయి. పశు సేవ చేయదలచుకున్న వారు ఆవులను ప్లాస్టిక్‌ తినకుండా నిరోధించేందుకు ప్రయత్నించండి అని మోడీ సలహా ఇచ్చారు. హైదరాబాదు బిజెపి సభలో మాట్లాడుతూ ‘కావాలంటే నాపై దాడి చేయండి, నన్ను కాల్చండి అంతే కాని దళితులపై దాడులు చేయవద్దు. బిజెపి చేస్తున్న మంచి పనులను వారు గ్రహిస్తున్న విషయాన్ని గమనించి వారు తమ అదుపులో వున్నారని భావిస్తున్న కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని ఎన్నికలు, ఓటుబ్యాంకు భాష మాట్లాడారు.

    అసలు వాస్తవం ఏమిటి ? కాంగ్రెస్‌ విధానాలు దివాళాకోరు, ప్రజావ్యతిరేకమైనవి అనటంలో ఎలాంటి సందేహం లేదు. అదే మాదిరి బిజెపి వాజ్‌పేయి నాయకత్వంలో వెలగబెట్టిన పాలనలో, ఇప్పుడు మోడీ హయాంలో కూడా ఆ విధానాల కొనసాగింపు తప్ప ప్రత్యామ్నాయ విధానాలు కాదు. అందువలన దొందూ దొందే. ప్రతి దాని నుంచి తన రాజకీయ విభాగం బిజెపికి ఓట్లు సంపాదించాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా సంఘపరివార్‌ నిరంతర లక్ష్యం, కృషి అన్నది అనేక మంది అభిప్రాయం. గొడ్డు మాంసం నుంచి కూడా ఓట్లు కొల్ల గొట్టేందుకు బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది. ‘గోమాత వధను ప్రోత్సహించే గులాబి విప్లవాన్ని తిరస్కరించాల్సిన సమసయం ఆసన్నమైంది’ అనే శీర్షికతో 2012 అగస్టు 9న నరేంద్రమోడీ కృష్ణుడి పుట్టిన రోజు జన్మాష్టమి సందర్భంగా తన బ్లాగులో ఒక సందేశమిచ్చారు. దానిలో కూడా గులాబి విప్లవాన్ని ప్రోత్సహించేందుకు యుపిఏ ప్రభుత్వం ఆవుల వధను ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. గుజరాత్‌లో గోమాత రక్షణకు సకల చర్యలూ తీసుకున్నామని దానిలో భాగంగానే చివరకు గోవుల కళ్ల అపరేషన్లు కూడా చేయించామని పేర్కొన్నారు. అనుమానం వున్నవారు దిగువ లింక్‌ను చూడవచ్చు.http://www.narendramodi.in/janmashtami-%E2%80%93-the-protector-of-cows-lord-krishna%E2%80%99s-birthday-3070

   అలాంటి నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏం జరుగుతోందో దిగువ లింక్‌లోని నివేదిక చూడండి. http://www.ers.usda.gov/media/2106598/ldpm-264-01.pdf

    మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో గొడ్డు మాంస ఎగుమతుల్లో మిగతా దేశాలను అధిగమించి అగ్రస్థానానికి చేరింది. మన మాంసం ధర తక్కువ, ఇతర కారణాలు అందుకు దోహదం చేస్తున్నాయి. దేశంలో అన్ని రకాల బీఫ్‌(గొడ్డు మాంసం) వుత్పత్తి 2012లో 3,491 వేల టన్నుల నుంచి నరేంద్రమోడీ పాలనలో 2015 నాటికి 4,200 వేల టన్నులకు పెరిగింది. ఇదే సమయంలో మన అంతర్గత వినియోగం 2080 నుంచి 2200 వేల టన్నులకు, ఎగుమతులు 1411 నుంచి 2000 వేల టన్నులకు పెరిగాయి. ఎగుమతి చేసిందంతా దున్నలు, బర్రె మాంసమే. వుత్పత్తిలో దీని వాటా ఈ కాలంలోనే 77 నుంచి 82శాతానికి పెరిగింది. అందువలన ఆవులను వధిస్తున్నారు, ఎగుమతి చేస్తున్నారు అనే ప్రచారం మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవటానికి తప్ప వేరు కాదు. గులాబీ విప్లవం నరేంద్రమోడీ హయాంలో పెరగటమే కాదు, రానున్న రోజులలో ‘మేకిన్‌ ఇండియా ‘ వూపుతో ఇంకా అభివృద్ధి చెందనుంది. ఈ ఏడాది జూన్‌లో విడుదలైన ఆ నివేదికను రూపొందించింది కమ్యూనిస్టులు కాదు, కాంగ్రెస్‌ పార్టీ కాదు, పక్కా అమెరికా, మోడీకి బ్రహ్మరధం పడుతున్నదేశం. దాని ప్రకారం మోడీ పదవి నుంచి దిగిపోయే 2019 నాటికి బీఫ్‌ ఎగుమతులు 2,408 వేల టన్నులకు, 2025 నాటికి 2,826 వేల టన్నులకు పెరుగుతాయని అంచనా వేసింది. అంటే మోడీ సర్కార్‌ కూడా సబ్సిడీలను కొనసాగిస్తుందనే అనుకోవాలి. పత్తి ఎగుమతి చేస్తే పన్నులు, మటన్‌,బీఫ్‌ ఎగుమతి చేస్తే సబ్సిడీలు ఇస్తున్న కాంగ్రెస్‌ అంటూ 2012లో ధ్వజమెత్తిన నరేంద్రమోడీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా అదిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎగుమతులు, వుత్పత్తి ఎందుకు పెరగనిచ్చినట్లు ? బీఫ్‌ ఎగుమతుల సబ్సిడీని రద్దు చేసి పత్తి ఎగుమతులకు సబ్సిడీ ఇచ్చి రైతులకు మెరుగైన ధరలు ఎందుకు ఇప్పించలేకపోయారు?

     https://youtu.be/Mj0_jYfGWTc  ఈ లింక్‌ ద్వారా నరేంద్రమోడీ నాలుగేండ్ల నాడు ఏం చెప్పారో చూడండి.

    తమ పండుగల సందర్బంగా మటన్‌, బీఫ్‌ను నిషేధించాలని గతేడాది జైన సంఘాలు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. తాము నడిచే నేల మీద కంటికి కనపడని జీవులు కూడా తమ పాదాల కింద నలిగి చనిపోకూడదని జైనులు నేలను వూడుస్తూ నడవటం తెలిసిందే.తన కున్న జైన స్నేహితులలో కొందరు బీఫ్‌ ఎగుమతి వ్యాపారంలో వున్నట్లు రెండు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ స్వయంగా ఏబిపి టీవీతో చెప్పారు.

     ఇక ఆవులు ప్లాస్టిక్‌ తినటం గురించి ‘ప్లాస్టిక్‌ కౌ ‘ పేరుతో 2012లోనే కునాల్‌ ఓహ్రా కరుణా సొసైటీ కోసం ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసి ఆ సమస్యను వెలుగులోకి తెచ్చారు. ‘దేశంలో ఆవును సంరక్షించాలంటూ ఇటీవల టీవీ చర్చలు, పత్రికలలో వార్తలు రాసేవారి ఆత్మవంచన చూస్తే నవ్వు వస్తున్నదని ఆ డాక్యుమెంటరీ నిర్మాణంలో భాగస్వామి అయిన రుక్మిణీ శేఖర్‌ గతేడాది వ్యాఖ్యానించారు.ఎవరూ గో రక్షణకు చర్యలు తీసుకోవటం లేదని మీడియా చర్చలలో అదొక పావుగా మారిపోయిందని అన్నారు. నిజంగా నరేంద్రమోడీకి, సంఘపరివార్‌ స్వయం సేవకులు లేదా గో రక్షకులుగా రంగంలోకి వచ్చిన వారు వీధులలో తిరుగాడే గోవులు ప్లాస్టిక్‌ తినకుండా వాటి వెంట తిరుగుతున్నట్లు మనక్కెక్కడా కనిపించరు? అది గోరక్షణ కాదా ? అసలు ఇంతకాలం దాని గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? చర్యలు తీసుకున్నారా ? పోనీ ప్లాస్టిక్‌ నిషేధాన్ని అయినా సక్రమంగా అమలు జరిపించారా లేదే !

   ప్లాస్టిక్‌ కౌ డాక్యుమెంటరీ నిర్మించిన కరుణ సొసైటీ వారు 2012లోనే సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ప్లాస్టిక్‌ సంచులను నిషేధించి ఆవులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.గతనెలలోనే సుప్రీం కోర్టు ఆ కేసు విచారణ ముగించింది. పరిస్థితి తీవ్రంగా వుందని, ప్లాస్టిక్‌ వినియోగ నిషేధానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. దీని గురించి నరేంద్రమోడీ సర్కార్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదు. ప్లాస్టిక్‌ ఒక్క ఆవులకే కాదు, అన్ని రకాల పశువులు, అన్నింటి కంటే మించి పర్యావరణానికి తద్వారా మనుషులకూ హాని కలిగిస్తున్న విషయం తెలిసికూడా ఎలాంటి చర్యలూ గత రెండు సంవత్సరాలుగా ఎందుకు తీసుకోలేదు? అసలు దీన్నొక ప్రాధాన్యత గల సమస్యగా భావించటం లేదా ? బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆవు సంరక్షణ పేరుతో ఇతర చర్యలకు ప్రాధాన్యత ఇచ్చాయి తప్ప మోడీ చెప్పి ఆవుల మరణానికి ఎక్కువగా కారణం అవుతున్న ప్లాస్టిక్‌ నిషేధానికి తీసుకున్న చర్యలేమిటి ?

    దళితులు గణనీయంగా వున్న వుత్తర ప్రదేశ్‌, పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలతో పాటు, గుజరాత్‌లో అడుగు జారుతున్నట్లు గతేడాది జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో దళితులకు ఎక్కువ వుద్యోగాలు ఇవ్వటం కూడా దళిత ఓట్లను దండుకొనేందుకే అనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పూర్వరంగంలో గుజరాత్‌ దళితులపై దాడులు, వెల్లడైన నిరసన కమలనాధుల్లో కలవరం రేపాయి. కావాలంటే నాపై దాడి చేయండి అని నరేంద్రమోడీ గొంతు చించుకుంటున్న హైదరాబాదు సభలో గుజరాత్‌ దళితులపై దాడిని బహిరంగంగా సమర్ధించి బిజెపి ఎంఎల్‌ఏ రాజా సింగ్‌ కూడా అక్కడే వున్న విషయం మోడీ కావాలనే విస్మరించారా ? ఇప్పటి వరకు గో సంరక్షకుల పేరుతో జరిగిన దాడులలో ఎక్కువ భాగం బిజెపి పాలిత రాష్ట్రాలలోనే, వారంతా ఎవరు ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా లెక్కలేనన్ని దాని అనుబంధ సంస్ధలకు చెందిన వారు తప్ప మరొకరు కాదన్నది జగమెరిగిన సత్యం. ఈ పూర్వరంగంలో గో రక్షకుల మంటూ దుకాణాలు తెరిచారని, కావాలంటే తనపై దాడి జరపమనే కబుర్లు, కడవల కొద్దీ దళితులపై కన్నీరు కార్చారు తప్ప అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరలేదు. నూటికి 70-80శాతం తప్పుడు పనులు చేసే వారని చెప్పిన నరేంద్రమోడీ తమ పార్టీ పాలిత రాష్ట్రాలలో అలాంటివారు ఎందరిపై చర్యలు తీసుకున్నారు, ఎన్ని దుకాణాలను మూయించారు అన్నది చెప్పి వుంటే ఆయన మాటలకు విలువ వుంటుంది.అవి లేవు కనుకనే దళితులపై దాడుల గురించి మొసలి కన్నీరు కార్చారనే విమర్శలు వచ్చాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కావాల్సింది వృధా చర్చా ! నమ్మక ద్రోహంపై రచ్చా !

04 Thursday Aug 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ap special status, BJP, center's betrayal, CHANDRABABU, tdp

ఎం కోటేశ్వరరావు

     పుష్కర స్నానాల వలన పుణ్యం వస్తుందని బలంగా విశ్వసించటానికి కొంత మందికి ఎలా స్వేచ్ఛ వుందో అదొక మూఢనమ్మకం అని నమ్మేవారికి కూడా అంతే స్వేచ్చ మన దేశంలో వుంది. అందువలన సందర్భం వచ్చినపుడు దాని మంచి చెడ్డలను చర్చించటం తప్పుకాదు. వ్యతిరేక అభి ప్రాయాన్ని వ్యక్తీకరించటం ద్వారా మా మనోభావాన్ని దెబ్బతీశారని ఎవరైనా దెబ్బలాటకు వస్తేనే సమస్య. ప్రపంచంలో ప్రతి మతం, కులం, తెగ ఇలా ఎన్ని తరగతులుంటే అన్నింటికీ సారూప్యత గలిగిన మూఢనమ్మకాలు,ఆచారాలకు కొదవ లేదు. ఆధునిక ప్రవచన కారులు సరికొత్త మూఢనమ్మకాలను ఎక్కిస్తున్నారు. పుష్కరాలనేవి ఒక మతానికి చెందిన నమ్మకం తప్ప వేరు కాదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు రోజుల పాటు పన్నెండు అంశాల మీద రోజుకొకదానిపై చర్చా గోష్టులు, సదస్సులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర ప్రజానీకంలో పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించటానికి, ఓట్లు దండుకోవటానికి, చివరకు నమ్మక ద్రోహానికి మారుపేరుగా మారిన రాష్ట్ర ప్రత్యేక హోదా రాకపోతే ఏం చేయాలో, ఇప్పటికే చేయాల్సిందానికంటే ఎక్కువే చేశాం లెక్కలు చెప్పటం లేదంటున్న బిజెపి నేతల ప్రచార వాస్తవ అవాస్తవాలేమిటో ఒక సమగ్ర శ్వేత పత్రం ప్రకటించి పన్నెండు కోణాలలో పన్నెండు రోజులు చర్చలు జరపమని చంద్రబాబు నాయుడు రచ్చ చేసి వుంటే చర్చ సమంజసంగా వుండేది. కనీసం జనానికి వాస్తవాలు ఏమిటో అన్నా తెలిసేవి. కేంద్రం ఇచ్చే ప్రత్యేక నిధులతో ఆర్ధిక లోటు తీర్చి, ప్రత్యేక హోదాతో వచ్చే ఆకర్షణీయ రాయితీలతో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర రూపు రేఖలు మార్చివేస్తామని చెప్పిన వారు అసలు ఆ ఆంశాలనే చర్చనీయాంశాల జాబితాలో లేకుండా చేశారు. పుష్కరాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినట్లుగా ప్రత్యేక హోదాకు కూడా అదే చేస్తారా ? చిత్రం ఏమంటే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని ఒక మూఢనమ్మకం, ఒక మతానికి చెందిన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం జరప తలపెట్టిన చర్చలో సమాజ పురోగతికి అవసరమైన శాస్త్రీయ భావజాలాన్ని చర్చ నీయాంశంగా చేయకపోవటం. అసలు మత క్రతువుల సందర్భంగా ఇలాంటి కిరస్తానీ చర్చలేంటి అనే ‘గురజాడ అగ్నిహోత్ర అవధానులు’ ఎవరైనా వుంటే అది వేరే విషయం.

     చర్చ చేయండని చంద్రబాబు చెప్పిన పన్నెండు అంశాలు విజన్‌ 2050లో పేర్కొన్నవాటికి మించి సామాన్యజనానికి ఆసక్తి కలిగించేవి కొత్తగా ఏమన్నా వుంటే వాటి గురించి చర్చించవచ్చు. అన్నింటికీ మించి విచారకరమైన అంశం ఏమంటే రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముందుకు వచ్చిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితేమీ లేకున్నా, నమ్మక ద్రోహం జరిగిందని యావత్‌ ప్రజానీకం భావిస్తున్న స్ధితిలో గతాన్ని గోతిలో పారవేసి ఏం చేసినా పొత్తు పెట్టుకున్నోళ్లతో సర్దుకు పోక తప్పదన్న వైఖరి తీసుకోవటం ఒక విషాదం. రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి విషయాలలో తాను రాజకీయాలు చేయనని, అందుకు ఇతర సందర్భాలుంటాయని చంద్రబాబు అనేకసార్లు చెప్పి పెద్ద రాజనీతిజ్ఞుడిగా అనేక మంది ప్రశంసలు పొందారు. ఇప్పుడు రాజ్యసభలో బిజెపి తప్ప అన్ని పార్టీలు ప్రత్యేక హోదా గురించి ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో పరిణితితో అన్ని పార్టీలను ఏకత్రాటిపై నడిపించి కేంద్రంపై వత్తిడి పెంచాల్సిన చంద్రబాబు అందుకు భిన్నంగా తాను, తన సైనికుల ద్వారా రాజకీయాలు మాట్లాడించి నిజమైన రాజనీతిజ్ఞుడు, రాష్ట్రంకోసం నిజాయితీగా పని చేస్తున్నారు అనే పేరు తెచ్చుకొనే అవకాశాన్ని జారవిడుచుకున్నారు.ప్రత్యేక హోదా విషయంలో మిగతా పార్టీలను కలుపుకుంటే దాని ద్వారా పొందే రాజకీయలబ్ది తగ్గుతుందనుకున్నారా ? తద్విరుద్ధంగా ప్రవర్తించి బిజెపిని ఒక్క మాట కూడా అనకుండా మొదటికే మోసం తెచ్చుకొనేందుకు పునాది వేసుకున్నారా ? గోదావరి పుష్కరాలలో మునిగి పుణ్యం పొంది ప్రత్యేక హోదా, కనీసం లోటు పూడ్చుకొనేందుకు నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. మరి ఆ పుణ్యం ఏమైనట్లు ?

     ఇక్కడ మరొక అంశాన్ని ప్రస్తావించటం సందర్భ సహితం అని భావిస్తున్నాను.ముస్లిం లేదా ఇస్లాం హాజ్‌ సబ్సిడీలను 2022 నాటికి రద్దు చేయాలని ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే అదే సమయంలో హిందు క్రతువులకు ప్రజల సొమ్మును ఖర్చు చేయటం విపరీతంగా పెరిగిపోతోంది. అవి పుష్కరాలు, కుంభమేళాలు, మానస సరోవర, చార్‌ధామ్‌ వంటి యాత్రలు ఏవైనా కావచ్చు. వాటి సందర్భంగా పెడుతున్న ఖర్చు హాజ్‌ సబ్సిడీల కంటే ఎంతో ఎక్కువగా వుంటోందా లేదా ? హాజ్‌ మాదిరి నగదు సబ్సిడీ ఇవ్వకపోవచ్చు, అందుకోసం ఏర్పాట్ల పేరుతో చేసే ప్రజాధనం ఖర్చు సంగతేమిటి ? ప్రతి సేవకూ రుసుము చెల్లించాల్సిందే ఏదీ వుచితం కాదు అని చెబుతున్న ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాల సందర్బంగా చేసే ఖర్చులకు ఒక ఖాతాను తెరిచి అందుకయిన ఖర్చును, వాటిలో పాల్గొన్నవారి నుంచి రాబడితే అది విమర్శలకు తావుండదు. అలా చేయటం లేదే ! పుష్కర యాత్రీకులను ఘాట్ల వద్దకు చేర్చేందుకు వుచితంగా బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. అసలే ఆర్టీసి నష్టాల్లో వుందని చెబుతూ ఇలా చేయటాన్ని ఎవడబ్బ సొమ్మని రామచంద్రా అన్నట్లు ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు ?

    బ్రిటీష్‌ వారి కాలంలో రాణీగారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాజ్‌ సబ్సిడీ స్వాతంత్య్రం తరువాత కూడా కొనసాగించారు. స్వాతంత్య్రపోరాట కాలంలో ముస్లింలను పోరుబాట నుంచి వేరు చేయటానికి తెల్లవారు అనేక ఎత్తుగడలు వేశారు. వాటిలో ఇది కూడా ఒకటి. విమానాలు రాక ముందు ఓడలే ప్రయాణ సాధనాలు కనుక బ్రిటీష్‌ ప్రభుత్వం తమ దేశ ఓడల కంపెనీ ఓడ ఎక్కి సౌదీ వెళ్లిన వారికే సబ్సిడీ అని కూడా నిబంధన విధించినందున దానిలో కూడా షిప్పింగ్‌ కంపెనీ ప్రయోజనాలు దాగి వుంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తెల్లవారిని తరిమేసి వారి స్ధానంలో అధికారానికి వచ్చిన నల్లవారు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా దానిని కొనసాగించారని చేసే విమర్శలో వాస్తవం లేకపోలేదు. చేసిన మార్పేమిటంటే ఓడల రాయితీని విమానాలకు వర్తింప చేశారు. అది కూడా ప్రభుత్వ రంగ విమానాలకే వర్తిస్తుంది. ఇది లౌకిక వాదానికి విరుద్ధం అంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దానిని విచారించిన సుప్రీం కోర్టు 2012లో ఒక తీర్పు ఇస్తూ 2022 నాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశించింది. ఈ సబ్సిడీని హిందూత్వ శక్తులు మతకారణంతో వ్యతిరేకిస్తే, మాకు సబ్సిడీ ఇచ్చే పేరుతో ఎయిరిండియాను బతికించేందుకు ప్రభుత్వం దానికి మాత్రమే ఇచ్చిందని, ఇతర కంపెనీల రేట్ల కంటే ఎయిరిండియా రేట్లు ఎక్కువని విమర్శించే ముస్లింలు కూడా లేకపోలేదు.

    పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి.ఒక మత పుష్కరాలను రాష్ట్ర వేడుకగా నిర్ణయించటం లౌకిక వ్యవస్ధకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమా, అనుకూలమా ? గతేడాది గోదావరి, ఈ ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెడుతున్న ఖర్చు, చేస్తున్న హడావుడి గతంలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు.ఎన్నడూ లేని కొత్త కొత్త పద్దతులను ప్రవేశపెడుతున్నారు. నిజంగా పుష్కరుడు వుండి వుంటే గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన దానికి నిరసనగా కృష్ణా పుష్కర బహిష్కరణ జరిగేదేమో? పుష్కరాల కంటే ముఖ్యమంత్రుల కీర్తి కండూతిని పెంచుకోవటం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దేశ విదేశాల్లో వున్న వారికి, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నవారికి , షరా మామూలుగా గ్రామాలు, పట్టణాలలోని ప్రజా ప్రతినిధులు, ముఖ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సంతకంతో కూడిన ఆహ్వానాలు పంపటం ప్రచార ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. వాటి కాంట్రాక్టు పుచ్చుకున్న ముద్రణా సంస్ధలకు తప్ప వాటిని అందుకున్నవారికి, అందుకయ్యే అనవసర ఖర్చు భరించే జనానికి ఒక్క పైసా ప్రయోజనం వుంటుందా? హాజ్‌ సబ్సిడీని రద్దు చేస్తూ అందుకు చేసే ఖర్చును కావాలంటే మైనారిటీల సామాజిక, విద్యా అభివృద్ధికి ఖర్చు చేయవచ్చని సుప్రీం కోర్టు చెప్పిన సలహా ఇతర సందర్భాలకు వర్తించదా ?

   రెండు సంవత్సరాలు గడిచినా చేసిన ప్రధాన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు జరపని స్ధితి.కొంతకాలం రాజధాని భూ సేకరణ, మరికొంత కాలం రాజధాని ఎలా వుండాలి, మరి కొంత కాలం తాత్కాలిక రాజధాని నిర్మాణం, మరి కొంత కాలం శాశ్వత రాజధాని ఎలా నిర్మించాలి, దానికి అప్పు ఎలా తేవాలి ఇలా ఆవు వ్యాసం రాసిన మాదిరి కాలక్షేపం చేయటం, ప్రతి సందర్భాన్ని అతిశయోక్తులతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల దృష్టి మళ్లించటం తప్ప మరొకటి కనిపించటం లేదు. ఇలాంటి వాటికి బుట్టలో పడేంత ఆమాయకంగా ఆంధ్రులు వున్నారా ? ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నారు పెద్దలు. అతిగా ప్రచారంలో జనాన్ని ముంచితే తామూ దానిలోనే మునుగుతారని గ్రహించటం అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ప్రత్యేక హోదా ‘అనే తెలుగుదేశం తోలు బొమ్మలాట

31 Sunday Jul 2016

Posted by raomk in AP NEWS, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ Leave a comment

Tags

ap special status, BJP, narendra modi promises, tdp puppetry

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బిజెపి-తెలుగు దేశం మధ్య ఇంతకాల నడిచిన డ్రామా గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి తేట తెల్లమైంది. ఈ అంశంపై తలెత్తిన పరిస్థితి పర్యవసానాలతో రెండు పార్టీల సంబంధాలు ఎలా వుంటాయి అన్నది ఇప్పుడు సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఆదివారం నాడు తెలుగుదేశ నాయకులతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు మరికొంత కాలం గడపటానికి వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తోంది. ఎంతకాలం అన్నది అప్పుడే చెప్పలేము. అభివృద్ధి పేరుతో అధికారాన్ని అంటి పెట్టుకొని వుండేందుకు అలవాటు పడిన శక్తులు ఎన్నికలు ఇంకా చాలా దూరం వుండి, అధికార పక్షానికి సంపూర్ణ మద్దతు వున్న స్థితిలో అంత తేలికగా కేంద్ర అధికారాన్ని వదులు కుంటాయని చెప్పలేము. రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యవహరించిన తీరు ప్రధాని నరేంద్రమోడీకి తెలియదన్నట్లుగా ఒకసారి ఆయనను కూడా కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇదంతా రాజకీయం తప్ప మరొకటి కాదు. జనం కోసం తప్ప ఆమాయకులు, అవివేకులు ఎవరూ లేరు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లు గురించి ఎంతో చర్చ జరిగిన విషయాన్ని పట్టించుకోనంతగా నరేంద్రమోడీ ఏం రాచ కార్యాలు వెలగబెడుతున్నారు? అసలు మోడీతో మాట మాత్రం కూడా చర్చించకుండా ఇంతటి ముఖ్యఅంశంపై బిజెపి నేతలు ఆషామాషీగా పార్లమెంట్‌కు వచ్చారనుకుంటే జనం చెవుల్లో పువ్వు పెట్టటమే. అననుకూల పరిస్ధితులను కూడా తమ లబ్దికి వుపయోగించుకోవాలనే తెలుగుదేశం ఎత్తుగడ మాత్రమే దీనిలో కనిపిస్తోంది. ఇంత జరిగాక ప్రధాని మోడీని, ఇతర మంత్రులను కలసి కూడా కొత్తగా ఏ వాదనలు వినిపిస్తారో, ఏం సాధించుకువస్తారో ముందు ముందు జనం చూస్తారు.

   ప్రత్యేక హోదా అంశాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన ప్రధమ పార్టీలుగా తెలుగుదేశం-బిజెపి వున్నాయి. అదే ఇప్పుడు భూతంగా మారి భయపెడుతోంది. జరగబోయే రాజకీయ నష్టాన్ని తగ్గించుకొనేందుకు తెలుగుదేశం, బిజెపిలు ప్రయత్నించినట్లే, ఇతర పార్టీలు రాబోయే రాజకీయ లాభాన్ని పెంచుకొనేందుకు పూనుకుంటాయి. జరిగిన మోసం గురించి ఆంధ్రులు ఎలా స్పందిస్తారు అనేది కూడా రానున్న రోజులలో ఆసక్తి కలిగించే అంశమే. మోసాన్ని తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయి నిర్వేదంతో మౌనంగా వుంటారా ? లేదా గతంలో అనేక సందర్బాలలో మాదిరి తీవ్ర ఆందోళనకు పూనుకుంటారా అన్నది చూడాలి.

    టాటా-బిర్లా మధ్యలో లైలా అన్న సినిమా మాదిరి తెలుగుదేశం-బిజెపి మధ్య వచ్చిన పవన్‌ కల్యాణ్‌ నుంచి ఎలాంటి పవనాలూ ఇంతవరకు వెలువడలేదు. ఇప్పటి వరకు అనేక మంది పవర్‌ స్టార్‌ను లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య మాదిరి భావిస్తున్నారు. వారి అభిప్రాయం తప్పని నిరూపిస్తారా లేదా అన్నది కూడా తేలిపోవటం అనివార్యం. ప్రత్యేక హోదా అంశం గురించి గతంలోనేను ఈ బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి మెచ్చుకున్నవారూ వున్నారు, అవన్నీ వూహాజనితం, అవాస్తవాలని త్వరలో తేలిపోతాయని వివిధ రూపాలలో వ్యతిరేకంగా స్పందించిన వారూ వున్నారు. గుడ్డి అభిమానుల బుర్రలలో లోడ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ అలాగే వుంటే వారిని స్పందింప చేయటం సాధ్యంగాని పని. ప్రత్యేక హోదా రాదని నిర్ధారణ అయినందుకు నాకేమీ సంతోషం లేదు. ఏ ఒక్క పార్టీకి దీని గురించి చిత్తశుద్ధి లేదని తొలి నుంచి భావించిన వారిలో నేనూ ఒకడిని.

    కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన నిబంధనలను మార్చకుండా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజీ ఇవ్వటం సాధ్యం కాదు. రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన సమాధానంలో అది తేటతెల్లమైంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అంటే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా కల్పించి వాటి నిర్మాణానికి నిధులు ఇవ్వటం లేదా పరిశ్రమలు, సంస్ధల ఏర్పాటు సందర్బాలలో మాత్రమే కేంద్రంలో వున్న పెద్దలను ప్రభావితం చేసేందుకు అవకాశం వుంటుంది. అలాంటి వాటిని కేంద్ర పాలిత పాంతం లేదా ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి. ఒక రాష్ట్రంలో పెట్టదలచుకున్నదానిని మార్చి మరొక చోట పెట్టే విచక్షణ అధికారం వుంటుంది.అంతకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రూపాయిని కూడా కోరుకున్న లేదా బతిమిలాడిన, బెదిరించిన రాష్ట్రాలకు ఇవ్వటానికి లేదు. గత పాతిక సంవత్సరాలుగా రక్షణ రంగంలో తప్ప కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రభుత్వ రంగ సంస్ధలలో ఒక్క విద్యుత్‌ రంగంలో తప్ప మిగతా పరిశ్రమలు కొత్తగా పెట్టినవేమీ లేవు, భవిష్యత్‌లో పెట్టాలనే వైఖరి లేదు. విద్యుత్‌ కేంద్రాలను ఎక్కడ పెట్టినా తయారయ్యే విద్యుత్‌లో రాష్ట్రాలకు ఎలాగూ వాటా వుంటుంది. అవి కేంద్ర సంస్ధలు కనుక వుద్యోగాలు కూడా పెట్టిన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా కేటాయించే అవకాశాలూ వుండవు. అందువలన కేంద్రంతో సఖ్యతగా వుండాలి, ఆ పేరుతో రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని ఏ పార్టీ చెప్పినా అది తన రాజకీయ విధానానికి వేసుకొనే ముసుగుతప్ప మరొకటి కాదు. గత రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనినే రుజువు చేసింది.

   విభజన చట్టంలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి కేంద్రం నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడి విజన్‌ 2050 నాటికికూడా ప.ూర్తి కాదు. ప్రపంచ స్ధాయి రాజధానిగా అమరావతి నిర్మాణానికి కేంద్రం ఐదులక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకన్న విషయం ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేందుకు ఇదొక చక్కటి వుదాహరణ.అదేదో సినిమాలో ఒక జేబులో ఒక ప్రకటన మరో జేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే పాత్ర మాదిరి బిజెపి వస్తే వంద అడిగితే పది అన్నా ఇవ్వకపోతారా అని గానీ, కాంగ్రెస్‌ వస్తే కోరినంత ఇవ్వలేదన్న దాడి చేయవచ్చన్న ముందుచూపుతో గానీ చంద్రబాబు ఐదులక్షల కోట్లు అడిగారు తప్ప ఇస్తారని నమ్మేంత అమాయకుడు కాదు. తీరా చూస్తే పదిశాతం కాదు కదా కనీసం ఒక శాతం మొత్తం కూడా ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. చివరికి పరిస్థితి చులకనగా, ఎంత దయనీయంగా తయారైందంటే బిజెపి గ్రామ స్ధాయి కార్యకర్త కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు చెబుతారా లేదా అని డిమాండ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది నెలలుగా అలా డిమాండ్‌ చేస్తున్నా చంద్రబాబు అండ్‌ కో రాష్ట్ర ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని దాని గురించిన వాస్తవాలను, వివరాలు చెప్పలేకపోయింది. కింది స్ధాయిలో తామెంత అడ్డగోలు వ్యవహారాలు నడుపుతున్నామో బాగా తెలిసిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు సహజంగానే ఏదో జరగకూడనిది జరిగి వుంటుంది అనే అనుమాన బీజం పడింది.

    ఇంత జరిగినప్పటికీ అసలు వాస్తవాలను ఆంధ్ర జనం ముందు వుంచుతున్నారా అంటే లేదనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. ఎవరు సమాధానం చెప్పాలి? సిపిఎం తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకు అనుకూలమే కనుక అవే చెప్పాలి. పార్లమెంట్‌లో మా వాణి వినిపించకుండా చేసి తలుపులు మూసి, చీకటిలో బిల్లును ఆమోదించారని,సక్రమంగా విభజించలేదని తెలుగుదేశం పదే పదే చెబుతోంది. లోపల అంచనాలు, ఆలోచనలు ఏమున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం ముసుగులో విభజనకు అంగీకరించింది. తీరా విభజన అనివార్యం అని తేలిన తరువాత ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఆందోళన గమనించి తమ రాజకీయ పునాది ఎక్కడ కదులుతుందో అనే భయంతో అక్కడ వ్యతిరేక ఆందోళనలో ఆ పార్టీ భాగస్వామి అయింది, పరోక్షంగానా, ప్రత్యక్షంగానా అన్నది వేరే విషయం.ఆ కారణంగానే సక్రమంగా విభజించటం లేదనే పేరుతో పార్లమెంట్‌లో ఒక పెద్ద డ్రామాకు తెలుగుదేశం తెరతీసింది. అప్పుడు సక్రమంగానే తమ వారు వ్యవహరించారని ప్రశంసించిన చంద్రబాబు ఇప్పుడు బిజెపి నమ్మక ద్రోహం సందర్భంగా సరిగా వ్యవహరించలేదని తమ కేంద్ర మంత్రులు,ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, దానికి కారణం తగిన సమాచారం అందకపోవటమే అని వారు సంజాయిషీ ఇచ్చి, అవసరమయితే రాజీనామాలకు సిద్ధం అని చెప్పినట్లు లీకుల కధనాలు బయటకు వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఒక తోలుబొమ్మలాట కంపెనీ అనుకుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తోలు బొమ్మలు, వాటిని ఆడించే కధకుడు చంద్రబాబు. ప్రదర్శన రక్తి కట్టలేదంటే దానికి కారణం ఆడించేవారిది తప్ప బొమ్మలది కాదు అన్నది వేరే చెప్పనవసరం లేదు.నాడు పార్లమెంట్‌లో విభజన బిల్లు సందర్భంగా తెలుగుదేశం సభ్యులు చేసిన రచ్చను మెచ్చిన జనం నేడు ఇదేమిటంటూ తెగడుతున్నారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా తెలుగుదేశం లీకుల విభాగం చురుకుగా కదలి నాయకుడు సమర్ధుడే మిగిలినవారే తమ పాత్రలను సరిగా పోషించలేదనే ట్టుకధలు వినిపిస్తున్నది. దీన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మేథావులు వుండవచ్చేమోగాని సామాన్య జనం లేరు. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో మేథావుల తరగతిలోని అత్యధిక వర్గం ఏం చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నదో తెలియని స్ధితి.

  అంతర్జాతీయంగా తగిలిన ఎదురు దెబ్బలు, బూర్జువా వ్యవస్ధ పార్లమెంటరీ రంగంలో పని చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురయ్యే సమస్యలపై వామపక్ష పార్టీలు తీసుకొన్న వైఖరి, దానికి వున్న పరిమితులు, కొత్త పరిస్థితులలో ఎదురయ్యే సవాళ్లను పూర్తిగా కింది స్ధాయి కార్యకర్తలకు వివరించటంలో కూడా వామపక్షాలు జయప్రదం కాలేకపోయాయి. వామపక్షాలు అధికారంలో వున్న చోట్ల ఒక్క అవినీతి, అక్రమ ఆరోపణలు లేకపోయినా, ఎలాంటి కుంభకోణాలలో ఇరుక్కోకపోయినా, నాయకత్వంలో ఒకరో అరో తప్ప పార్టీలు మారటం వంటి అవకాశ వాద వైఖరి లేకపోయినా సామాన్య జనం ఆ పార్టీలు మంచివే అని భావించినప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపించలేవనే భావనతో ఓటింగ్‌ , ఇతర సందర్బాలలో దూరంగా వుంటున్నారు. జనానికి విశ్వాసం కలిగించటం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు.

     ఇంతకాలం కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి మీద ఒంటి కాలితో లేచే పరిస్థితి ఇక ముందు తెలుగు దేశానికి వుండదు. ఎందుంటే కాంగ్రెస్‌ ద్రోహం బహిరంగం. బిజెపితో కుమ్మక్కయి ఆ పార్టీ వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చింది. ఇప్పుడు బిజెపి నాయకత్వం తెలుగుదేశంతో కుమ్మక్కయి నమ్మక ద్రోహం చేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డి తనపై వున్న కేసుల కారణంగా బిజెపి ప్రభుత్వం పట్ల మెతకగా వుంటున్నారనే దాడి ఇక ముందు కుదరదు.ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రం పట్ల ఎలా వున్నప్పటికీ అది రాష్ట్ర అభివృద్దిని ప్రభావితం చేసే పరిస్థితి వుండదు. అధికారంలో వున్న మరొక ప్రాంతీయ పార్టీ కేంద్రంతో సఖ్యతగా వున్నా, రాజకీయంగా భుజం మార్చుకోకుండా కేంద్రంలో వున్న పార్టీని మోసినా ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా నిరూపించింది. అందువలన రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు కొత్త రూపం సంతరించుకోవటం తధ్యం. కేంద్రంతో సఖ్యతతో వుండే రాష్ట్ర ప్రభుత్వమే సాధించేందేమీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభీష్టం మేరకు అధికారపక్షంలో చేరా అని చెప్పుకొనే జంప్‌ జిలానీల నోరు పడిపోవటం ఖాయం. వారంతా గత ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకొని వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ పరిస్థితి వాటంగా వుంటే ఆ పార్టీ టిక్కెట్‌, జనం ఓట్లు కొనేందుకు అవసరమైన డబ్బు దండుకొనేందుకు తప్ప నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి అనేది ఒట్టి మాట. గతంలో ప్రతిపక్షంలో వుండి పార్టీ మారిన పెద్దలు నియోజకవర్గాలను చేసిన అభివృద్ది ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ పార్టీలు అధికారంలో లేనపుడు ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే తమ జేబులు నింపుకోవటం, కార్పొరేట్‌ కంపెనీల కొమ్ము కాయటం తప్ప జన క్షేమం పట్టదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ప్రత్యేక హోదా ‘అనే తెలుగుదేశం తోలు బొమ్మలాట

31 Sunday Jul 2016

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Others

≈ 1 Comment

Tags

ap special status, BJP, narendra modi promises, tdp puppetry

ఎం కోటేశ్వరరావు

    ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బిజెపి-తెలుగు దేశం మధ్య ఇంతకాల నడిచిన డ్రామా గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి తేట తెల్లమైంది. ఈ అంశంపై తలెత్తిన పరిస్థితి పర్యవసానాలతో రెండు పార్టీల సంబంధాలు ఎలా వుంటాయి అన్నది ఇప్పుడు సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఆదివారం నాడు తెలుగుదేశ నాయకులతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు మరికొంత కాలం గడపటానికి వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తోంది. ఎంతకాలం అన్నది అప్పుడే చెప్పలేము. అభివృద్ధి పేరుతో అధికారాన్ని అంటి పెట్టుకొని వుండేందుకు అలవాటు పడిన శక్తులు ఎన్నికలు ఇంకా చాలా దూరం వుండి, అధికార పక్షానికి సంపూర్ణ మద్దతు వున్న స్థితిలో అంత తేలికగా కేంద్ర అధికారాన్ని వదులు కుంటాయని చెప్పలేము. రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ వ్యవహరించిన తీరు ప్రధాని నరేంద్రమోడీకి తెలియదన్నట్లుగా ఒకసారి ఆయనను కూడా కలిసేందుకు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇదంతా రాజకీయం తప్ప మరొకటి కాదు. జనం కోసం తప్ప ఆమాయకులు, అవివేకులు ఎవరూ లేరు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రయివేటు బిల్లు గురించి ఎంతో చర్చ జరిగిన విషయాన్ని పట్టించుకోనంతగా నరేంద్రమోడీ ఏం రాచ కార్యాలు వెలగబెడుతున్నారు? అసలు మోడీతో మాట మాత్రం కూడా చర్చించకుండా ఇంతటి ముఖ్యఅంశంపై బిజెపి నేతలు ఆషామాషీగా పార్లమెంట్‌కు వచ్చారనుకుంటే జనం చెవుల్లో పువ్వు పెట్టటమే. అననుకూల పరిస్ధితులను కూడా తమ లబ్దికి వుపయోగించుకోవాలనే తెలుగుదేశం ఎత్తుగడ మాత్రమే దీనిలో కనిపిస్తోంది. ఇంత జరిగాక ప్రధాని మోడీని, ఇతర మంత్రులను కలసి కూడా కొత్తగా ఏ వాదనలు వినిపిస్తారో, ఏం సాధించుకువస్తారో ముందు ముందు జనం చూస్తారు.

   ప్రత్యేక హోదా అంశాన్ని వుపయోగించుకొని లబ్ది పొందిన ప్రధమ పార్టీలుగా తెలుగుదేశం-బిజెపి వున్నాయి. అదే ఇప్పుడు భూతంగా మారి భయపెడుతోంది. జరగబోయే రాజకీయ నష్టాన్ని తగ్గించుకొనేందుకు తెలుగుదేశం, బిజెపిలు ప్రయత్నించినట్లే, ఇతర పార్టీలు రాబోయే రాజకీయ లాభాన్ని పెంచుకొనేందుకు పూనుకుంటాయి. జరిగిన మోసం గురించి ఆంధ్రులు ఎలా స్పందిస్తారు అనేది కూడా రానున్న రోజులలో ఆసక్తి కలిగించే అంశమే. మోసాన్ని తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయి నిర్వేదంతో మౌనంగా వుంటారా ? లేదా గతంలో అనేక సందర్బాలలో మాదిరి తీవ్ర ఆందోళనకు పూనుకుంటారా అన్నది చూడాలి.

    టాటా-బిర్లా మధ్యలో లైలా అన్న సినిమా మాదిరి తెలుగుదేశం-బిజెపి మధ్య వచ్చిన పవన్‌ కల్యాణ్‌ నుంచి ఎలాంటి పవనాలూ ఇంతవరకు వెలువడలేదు. ఇప్పటి వరకు అనేక మంది పవర్‌ స్టార్‌ను లేస్తే మనిషిని కాదు అన్న కుంటి మల్లయ్య మాదిరి భావిస్తున్నారు. వారి అభిప్రాయం తప్పని నిరూపిస్తారా లేదా అన్నది కూడా తేలిపోవటం అనివార్యం. ప్రత్యేక హోదా అంశం గురించి గతంలోనేను ఈ బ్లాగ్‌లో చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి మెచ్చుకున్నవారూ వున్నారు, అవన్నీ వూహాజనితం, అవాస్తవాలని త్వరలో తేలిపోతాయని వివిధ రూపాలలో వ్యతిరేకంగా స్పందించిన వారూ వున్నారు. గుడ్డి అభిమానుల బుర్రలలో లోడ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ అలాగే వుంటే వారిని స్పందింప చేయటం సాధ్యంగాని పని. ప్రత్యేక హోదా రాదని నిర్ధారణ అయినందుకు నాకేమీ సంతోషం లేదు. ఏ ఒక్క పార్టీకి దీని గురించి చిత్తశుద్ధి లేదని తొలి నుంచి భావించిన వారిలో నేనూ ఒకడిని.

    కేంద్ర ప్రభుత్వం తాను రూపొందించిన నిబంధనలను మార్చకుండా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక పాకేజీ ఇవ్వటం సాధ్యం కాదు. రాజ్యసభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఇచ్చిన సమాధానంలో అది తేటతెల్లమైంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అంటే కొన్ని రాష్ట్ర రహదారులకు జాతీయ హోదా కల్పించి వాటి నిర్మాణానికి నిధులు ఇవ్వటం లేదా పరిశ్రమలు, సంస్ధల ఏర్పాటు సందర్బాలలో మాత్రమే కేంద్రంలో వున్న పెద్దలను ప్రభావితం చేసేందుకు అవకాశం వుంటుంది. అలాంటి వాటిని కేంద్ర పాలిత పాంతం లేదా ఏదో ఒక రాష్ట్రంలో పెట్టాలి. ఒక రాష్ట్రంలో పెట్టదలచుకున్నదానిని మార్చి మరొక చోట పెట్టే విచక్షణ అధికారం వుంటుంది.అంతకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఒక్క రూపాయిని కూడా కోరుకున్న లేదా బతిమిలాడిన, బెదిరించిన రాష్ట్రాలకు ఇవ్వటానికి లేదు. గత పాతిక సంవత్సరాలుగా రక్షణ రంగంలో తప్ప కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రభుత్వ రంగ సంస్ధలలో ఒక్క విద్యుత్‌ రంగంలో తప్ప మిగతా పరిశ్రమలు కొత్తగా పెట్టినవేమీ లేవు, భవిష్యత్‌లో పెట్టాలనే వైఖరి లేదు. విద్యుత్‌ కేంద్రాలను ఎక్కడ పెట్టినా తయారయ్యే విద్యుత్‌లో రాష్ట్రాలకు ఎలాగూ వాటా వుంటుంది. అవి కేంద్ర సంస్ధలు కనుక వుద్యోగాలు కూడా పెట్టిన రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా కేటాయించే అవకాశాలూ వుండవు. అందువలన కేంద్రంతో సఖ్యతగా వుండాలి, ఆ పేరుతో రాష్ట్రాన్ని వుద్దరిస్తాం అని ఏ పార్టీ చెప్పినా అది తన రాజకీయ విధానానికి వేసుకొనే ముసుగుతప్ప మరొకటి కాదు. గత రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనినే రుజువు చేసింది.

   విభజన చట్టంలో పేర్కొన్న పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి కేంద్రం నిధులు ఇస్తే ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడి విజన్‌ 2050 నాటికికూడా ప.ూర్తి కాదు. ప్రపంచ స్ధాయి రాజధానిగా అమరావతి నిర్మాణానికి కేంద్రం ఐదులక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అడుక్కోవటంలో పిసినారి తనం ఎందుకన్న విషయం ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేందుకు ఇదొక చక్కటి వుదాహరణ.అదేదో సినిమాలో ఒక జేబులో ఒక ప్రకటన మరో జేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే పాత్ర మాదిరి బిజెపి వస్తే వంద అడిగితే పది అన్నా ఇవ్వకపోతారా అని గానీ, కాంగ్రెస్‌ వస్తే కోరినంత ఇవ్వలేదన్న దాడి చేయవచ్చన్న ముందుచూపుతో గానీ చంద్రబాబు ఐదులక్షల కోట్లు అడిగారు తప్ప ఇస్తారని నమ్మేంత అమాయకుడు కాదు. తీరా చూస్తే పదిశాతం కాదు కదా కనీసం ఒక శాతం మొత్తం కూడా ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. చివరికి పరిస్థితి చులకనగా, ఎంత దయనీయంగా తయారైందంటే బిజెపి గ్రామ స్ధాయి కార్యకర్త కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు చెబుతారా లేదా అని డిమాండ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది నెలలుగా అలా డిమాండ్‌ చేస్తున్నా చంద్రబాబు అండ్‌ కో రాష్ట్ర ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని దాని గురించిన వాస్తవాలను, వివరాలు చెప్పలేకపోయింది. కింది స్ధాయిలో తామెంత అడ్డగోలు వ్యవహారాలు నడుపుతున్నామో బాగా తెలిసిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు సహజంగానే ఏదో జరగకూడనిది జరిగి వుంటుంది అనే అనుమాన బీజం పడింది.

    ఇంత జరిగినప్పటికీ అసలు వాస్తవాలను ఆంధ్ర జనం ముందు వుంచుతున్నారా అంటే లేదనే చెప్పాలి.ఎందుకంటే ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. ఎవరు సమాధానం చెప్పాలి? సిపిఎం తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకు అనుకూలమే కనుక అవే చెప్పాలి. పార్లమెంట్‌లో మా వాణి వినిపించకుండా చేసి తలుపులు మూసి, చీకటిలో బిల్లును ఆమోదించారని,సక్రమంగా విభజించలేదని తెలుగుదేశం పదే పదే చెబుతోంది. లోపల అంచనాలు, ఆలోచనలు ఏమున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం ముసుగులో విభజనకు అంగీకరించింది. తీరా విభజన అనివార్యం అని తేలిన తరువాత ఆంధ్ర ప్రాంతంలో తలెత్తిన ఆందోళన గమనించి తమ రాజకీయ పునాది ఎక్కడ కదులుతుందో అనే భయంతో అక్కడ వ్యతిరేక ఆందోళనలో ఆ పార్టీ భాగస్వామి అయింది, పరోక్షంగానా, ప్రత్యక్షంగానా అన్నది వేరే విషయం.ఆ కారణంగానే సక్రమంగా విభజించటం లేదనే పేరుతో పార్లమెంట్‌లో ఒక పెద్ద డ్రామాకు తెలుగుదేశం తెరతీసింది. అప్పుడు సక్రమంగానే తమ వారు వ్యవహరించారని ప్రశంసించిన చంద్రబాబు ఇప్పుడు బిజెపి నమ్మక ద్రోహం సందర్భంగా సరిగా వ్యవహరించలేదని తమ కేంద్ర మంత్రులు,ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, దానికి కారణం తగిన సమాచారం అందకపోవటమే అని వారు సంజాయిషీ ఇచ్చి, అవసరమయితే రాజీనామాలకు సిద్ధం అని చెప్పినట్లు లీకుల కధనాలు బయటకు వచ్చాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఒక తోలుబొమ్మలాట కంపెనీ అనుకుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తోలు బొమ్మలు, వాటిని ఆడించే కధకుడు చంద్రబాబు. ప్రదర్శన రక్తి కట్టలేదంటే దానికి కారణం ఆడించేవారిది తప్ప బొమ్మలది కాదు అన్నది వేరే చెప్పనవసరం లేదు.నాడు పార్లమెంట్‌లో విభజన బిల్లు సందర్భంగా తెలుగుదేశం సభ్యులు చేసిన రచ్చను మెచ్చిన జనం నేడు ఇదేమిటంటూ తెగడుతున్నారు. అందుకే నష్ట నివారణ చర్యలలో భాగంగా తెలుగుదేశం లీకుల విభాగం చురుకుగా కదలి నాయకుడు సమర్ధుడే మిగిలినవారే తమ పాత్రలను సరిగా పోషించలేదనే ట్టుకధలు వినిపిస్తున్నది. దీన్ని అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మేథావులు వుండవచ్చేమోగాని సామాన్య జనం లేరు. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో మేథావుల తరగతిలోని అత్యధిక వర్గం ఏం చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నదో తెలియని స్ధితి.

  అంతర్జాతీయంగా తగిలిన ఎదురు దెబ్బలు, బూర్జువా వ్యవస్ధ పార్లమెంటరీ రంగంలో పని చేయాలని నిర్ణయించుకున్న తరువాత ఎదురయ్యే సమస్యలపై వామపక్ష పార్టీలు తీసుకొన్న వైఖరి, దానికి వున్న పరిమితులు, కొత్త పరిస్థితులలో ఎదురయ్యే సవాళ్లను పూర్తిగా కింది స్ధాయి కార్యకర్తలకు వివరించటంలో కూడా వామపక్షాలు జయప్రదం కాలేకపోయాయి. వామపక్షాలు అధికారంలో వున్న చోట్ల ఒక్క అవినీతి, అక్రమ ఆరోపణలు లేకపోయినా, ఎలాంటి కుంభకోణాలలో ఇరుక్కోకపోయినా, నాయకత్వంలో ఒకరో అరో తప్ప పార్టీలు మారటం వంటి అవకాశ వాద వైఖరి లేకపోయినా సామాన్య జనం ఆ పార్టీలు మంచివే అని భావించినప్పటికీ రాజకీయంగా ప్రభావం చూపించలేవనే భావనతో ఓటింగ్‌ , ఇతర సందర్బాలలో దూరంగా వుంటున్నారు. జనానికి విశ్వాసం కలిగించటం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు.

     ఇంతకాలం కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సిపి మీద ఒంటి కాలితో లేచే పరిస్థితి ఇక ముందు తెలుగు దేశానికి వుండదు. ఎందుంటే కాంగ్రెస్‌ ద్రోహం బహిరంగం. బిజెపితో కుమ్మక్కయి ఆ పార్టీ వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చింది. ఇప్పుడు బిజెపి నాయకత్వం తెలుగుదేశంతో కుమ్మక్కయి నమ్మక ద్రోహం చేసింది. జగన్‌ మోహన్‌ రెడ్డి తనపై వున్న కేసుల కారణంగా బిజెపి ప్రభుత్వం పట్ల మెతకగా వుంటున్నారనే దాడి ఇక ముందు కుదరదు.ఎందుకంటే ప్రతిపక్షంలో వున్న ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రం పట్ల ఎలా వున్నప్పటికీ అది రాష్ట్ర అభివృద్దిని ప్రభావితం చేసే పరిస్థితి వుండదు. అధికారంలో వున్న మరొక ప్రాంతీయ పార్టీ కేంద్రంతో సఖ్యతగా వున్నా, రాజకీయంగా భుజం మార్చుకోకుండా కేంద్రంలో వున్న పార్టీని మోసినా ప్రయోజనం లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా నిరూపించింది. అందువలన రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు కొత్త రూపం సంతరించుకోవటం తధ్యం. కేంద్రంతో సఖ్యతతో వుండే రాష్ట్ర ప్రభుత్వమే సాధించేందేమీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభీష్టం మేరకు అధికారపక్షంలో చేరా అని చెప్పుకొనే జంప్‌ జిలానీల నోరు పడిపోవటం ఖాయం. వారంతా గత ఎన్నికలలో పెట్టిన ఖర్చును రాబట్టుకొని వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ పరిస్థితి వాటంగా వుంటే ఆ పార్టీ టిక్కెట్‌, జనం ఓట్లు కొనేందుకు అవసరమైన డబ్బు దండుకొనేందుకు తప్ప నియోజకవర్గం, ప్రజల అభివృద్ధి అనేది ఒట్టి మాట. గతంలో ప్రతిపక్షంలో వుండి పార్టీ మారిన పెద్దలు నియోజకవర్గాలను చేసిన అభివృద్ది ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ పార్టీలు అధికారంలో లేనపుడు ప్రజల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చి, అధికారం రాగానే తమ జేబులు నింపుకోవటం, కార్పొరేట్‌ కంపెనీల కొమ్ము కాయటం తప్ప జన క్షేమం పట్టదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d