• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

ఆవు కథలు కాదు మోడీ గారూ ఆర్ధిక అంశాల మీద నోరు విప్పండి !

13 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Cow excreta, Cow excreta start-ups, India cow commoission, Panchgavya, Rashtriya Kamdhenu Aayog

Image result for not cow stories Mr narendra modi speak on country economy

ఎం కోటేశ్వరరావు

చరిత్రకు పక్షపాతం లేదు. దాన్నుంచి తీసుకొనే పాఠాలకే ఏదో ఒక పక్షపాతం. అది దోపిడీదారులకు అనుకూలమైనది కావచ్చు, దోపిడీకి గురయ్యేవారిని మేల్కొలిపేదిగానూ వుండవచ్చు. గాంధీ గురించి ఎంత రాసినా స్వీకరించింది, ఆయన హంతకుడు గాడ్సేను ఎంత పొగిడినా అదే రీతిలో చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకుంటున్నది. అదే చరిత్ర మనకు కావలసినంత వినోదం, విషాదాలతో పాటు చతురతను కూడా అందిస్తుంది.

మనకు జ్ఞాపకశక్తి తక్కువని గుర్తు చేయటం కాదుగానీ మన ప్రధాని నరేంద్రమోడీ 2018వ సంవత్సరానికి ఒక అంతర్జాతీయ అవార్డును స్వీకరించారు. మోడీకి ఈ అవార్డు ఎందుకు వచ్చింది అంటే ‘మోడినోమిక్స్‌’ (మోడీ అర్ధశాస్త్రం- ఎవరైనా ఒక ప్రత్యేక సిద్దాంతం లేదా మరొకదాన్ని కనిపెట్టినా, అభివృద్ధి చేసినా వారి కృషికి గుర్తింపుగా ఆ పేరుతో వ్యవహరిస్తారు) ద్వారా భారత్‌, ప్రపంచ ఆర్ధిక పురోభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఇచ్చారని మన విదేశాంగశాఖ వెల్లడించింది. అంతర్జాతీయ సహకారానికి ఆయన పునరంకితమైన తీరు, ప్రపంచ ఆర్ధిక అభివృద్ధిని పెంచేందుకు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెద్ద ఆర్ధిక వ్యవస్ధగా రూపుదిద్ది భారతీయుల అభివృద్ధికి చేసిన కృషికి, అవినీతి వ్యతిరేక చర్యలు, సమాజాన్ని ఒకటిగా చేసిన కృషికి గుర్తింపు అని వ్యాఖ్యానించింది. నరేంద్రమోడీగారికి ఏ డిగ్రీలు వున్నాయో తెలియదు, తెలిసినా దేశభద్రత దృష్ట్యా వెల్లడించకూడదనుకోండి. మరోవైపు అందరికీ తెలిసిన డిగ్రీలు కలిగి ఆర్ధిక నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్‌ సింగ్‌ పదేండ్లు ప్రధానిగా వున్నా అదేమిటో ఒక్క అంతర్జాతీయ అవార్డూ రాలేదు. (ఆయన ఆర్ధిక విధానాలు, వైఖరితో ఏకీభవించినా లేకున్నా, అవి ఎవరికి వుపయోగపడతాయన్నది వేరే అంశం కావచ్చుగానీ ఆయన పట్టాలు వున్న ఒక ఆర్ధికవేత్త )

చరిత్రలో వినోదం, విషాదం అని ఎందుకన్నానంటే మన్మోహన్‌ సింగ్‌ దేశంలో తలెత్తిన ఆర్దిక మందగమనం గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ అవార్డు గ్రహీత నరేంద్రమోడీ మాత్రం ఆర్ధిక వ్యవస్ధకు బదులు ఆవు వ్యాసం, కథల గురించి దేశ ప్రజలకు చెబుతున్నారు. ఓం, ఆవు అనే మాటలు వినపడితే కొంత మందికి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయని, దేశం 16,17 శతాబ్దాల వెనక్కు పోయిందని మాట్లాడతారని 2019 సెప్టెంబరు పదకొండున చెప్పారు. ఓం, ఆవులకు ఆ రెండు శతాబ్దాలకు సంబంధం ఏమిటో ఎంత వెతికినా కనపడలేదు. ఎందుకంటే అవి రెండూ అంతకంటే చాలా పురాతనమైనవి. దేశాన్ని ఆ కాలానికి తీసుకుపోవాలన్నది మోడీ అండ్‌కో ప్రయత్నం అన్నది తెలిసిందే. మేకిన్‌ ఇండియా పిలుపు ఏమైందో, అచ్చేదిన్‌ ఎప్పుడొస్తాయో, ఒక వేళ ఆర్ధిక మాంద్యం లేకపోతే లేదనైనా చెప్పకుండా ఈ అవుగోలేందో, ఎవరో దేశాన్ని వెనక్కు తీసుకుపోతున్నారని అంటూ ఎదురుదాడి చేయటం ఏమిటో ఎవరికైనా అంతుపడుతోందా ?

అంటే అన్నారని ఏడుస్తారు. మోడీ సర్కార్‌ రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ అనే సంస్ధను తాత్కాలిక బడ్జెట్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేయాల్సి వుంది. జాతీయ మహిళ, జాతీయ ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ల మాదిరి ఇది జాతీయ ఆవు కమిషన్‌. ఆవు పేడ, గోమూత్రం, వాటితో వుత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌కు యువతీ, యువకులు ఏర్పాటు చేసే అంకుర సంస్ధలకు 60శాతం వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనున్నదని జాతీయ ఆవు కమిషన్‌ అధ్యక్షుడు వల్లభ్‌ కథిరియా నాలుగు రోజుల క్రితం వెల్లడించారు. పేడ, మూత్రాలతో ఔషధాలను తయారు చేస్తున్నామని, వాటిని మనుషులతో పాటు వ్యవసాయానికి వినియోగించవచ్చని చెప్పారు. ఇందుకోసం ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. పాడి ఎండిపోయిన తరువాత ఆవులు దేనికీ పనికిరావనుకోవటం సరైంది కాదని పేడ, మూత్రం వస్తాయని, వాటిలో వున్న ఔషధ గుణాల గురించి పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలను కోరినట్లు కథిరియా చెప్పారు. గోశాల నిర్వాహకుల నైపుణ్య అభివృద్దికి శిక్షణ ఇస్తామని కూడా అన్నారు. ఆవు పేడ, మూత్రాలతో తయారు చేసే ప్రత్యేక ఔషధం పంచగవ్యను గర్భిణీ స్త్రీలు తీసుకుంటే వున్నతమైన తెలివిగల పిల్లలు పుడతారని ఆయుష్‌, జాతీయ ఆవు కమిషన్‌ అధికారులు చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Image result for cow stories,narendra modi cartoon

గ్రామాల నుంచి వుద్యోగాల కోసం యువత పట్టణాలకు రాకుండా చూసేందుకు మోడీనోమిక్స్‌లో ఇదొకటి. పంచగవ్యతో పాటు ఆవు, పేడ మూత్రాలతో సబ్బులు, దోమల నివారణ పిడకలు, కాగితం తయారీ వంటి వాటిని యువకులకు వుపాధిగా చూపాలని తలపెట్టారు. వీటిని వ్యాపారపరంగా తయారు చేసే వారికి పన్నెండు సంవత్సరాల్లో తీర్చే విధంగా తక్కువ వడ్డీకి రుణాలు కూడా ఇస్తారు. ప్రతి ఇంటికి ఒక ఆవు వుండే విధంగా చేయాలన్నది మోడీగారి లక్ష్యం. తాము అధికారానికి వస్తే ఒక లక్ష ఆవులను పంపిణీ చేస్తామన్నది తెలంగాణా బిజెపి ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి.

కార్పొరేట్ల సామాజిక బాధ్యత(సిఎస్‌ఆర్‌) పధకాల్లో గోశాలల నిర్మాణం కూడా ఒకటిగా చేరుస్తూ యుపి యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది, రెండు శాతం ఆవు పన్ను విధించింది. అన్ని దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆయుర్వేద, ఖాదీ కేంద్రాలలో ఆవు సంబందిత వుత్పత్తులను విక్రయిస్తారు.

మోడీ గారు దేశం గురించి ఎప్పుడు నోరు తెరుస్తారో, శాశ్వతంగా మూసుకుంటారో తెలియదు. ఆది గోద్రెజ్‌, ఆయనేమీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకి కాదు, పాకిస్ధానీ మద్దతుదారు లేదా తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌ అసలే కాదు. ప్రముఖ పారిశ్రామిక సంస్ధ గోద్రెజ్‌ గ్రూప్‌ చైర్మన్‌. ‘ త్వరగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది, వుదాహరణకు కాశ్మీర్‌, కానీ వాణిజ్య విషయాల్లో వేగంగా నిర్ణయాలు చేయకపోవటం మంచిది కాదు ‘ అన్నారాయన. దేశంలో వాణిజ్య, పారిశ్రామికవేత్తల్లో నెలకొన్న అసహనం లేదా అసంతృప్తికి నిదర్శనం. ఈ వ్యాఖ్య ఈ ఏడాది తొలి త్రైమాసిక ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు ఐదుశాతానికి పడిపోయిందని, ఎనిమిది ప్రధాన రంగాలలో గతేడాది జాలైలో 7.3శాతంగా వున్న వృద్ధి రేటు ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోయిందని సాక్షాత్తూ కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖే ప్రకటించటానికి ముందే గోద్రెజ్‌ మాట్లాడారు. తన ప్రభుత్వంలో ఎవరైనా పాక్‌ ఏజంట్లు చొరబడ్డారేమో, వారి మీద మెరుపు దాడులు చేయాలేమో మోడీ గారు ఆలోచించాలి. రాయిటర్స్‌ వార్తా సంస్ధ చేసిన ఇంటర్వ్యూలలో డజనుకు పైగా ప్రముఖులు గోద్రెజ్‌ మాదిరే ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేశారు, కొంత మంది పేరు రాయటానికి ఇష్టపడలేదు. వారంతా మోడీ విజయానికి హారతులు పట్టిన వారే సుమా ! వీరి అభిప్రాయాలపై వ్యాఖ్యానించాలని అడగ్గా ప్రధాని కార్యాలయం తిరస్కరించిందట. మోడీ గారే మాట్లాడనపుడు కందకు లేని దురద కత్తి పీటకెందుకు అన్నట్లుగా ఆయన ఆఫీసు ఎలా స్పందిస్తుంది. జూలై నెలలో ఈ విదేశీ మదుపుదార్లు మన స్టాక్‌ మార్కెట్‌ నుంచి 1.8 బిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడులు వుపసంహరించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వుద్దీపన చర్యలు, బ్యాంకుల విలీనాలు ఎలాంటి ప్రభావం చూపలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.

తాము అప్పుల పాలయ్యామని, దివాలా తీశామని, వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు కనుక రుణాల రద్దు, సబ్సిడీలను కొనసాగించాలన్న కోట్లాది రైతాంగ వినతుల సందర్భంగా మీడియా, పారిశ్రామికవేత్తలు కూడా వాటికి వ్యతిరేకమైన వాదనలు చేస్తున్న విషయం తెలిసింది. ఎవరైనా స్వంత కాళ్ల మీద నిలబడాలి తప్ప ప్రభుత్వాలు ఆదుకుంటే సోమరితనాన్ని పెంచినట్లే అని సుభాషితాలు పలికారు. అవే నోళ్లు ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందుల నుంచి పారిశ్రామిక, వాణిజ్య రంగాన్ని బయటపడవేసేందుకు వుద్దీపన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. రాయిటర్స్‌ కధనం ప్రకారం కొంత మంది బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగానికి చెందిన ప్రముఖులు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ గ.ారిని కలిశారు. వారు చెప్పిన అంశాల మీద ఎలాంటి చర్చ లేకుండా కృతజ్ఞతలు, మేం పరిశీలిస్తామని చెప్పి పంపారు. ఎక్కువ సమావేశాల తంతు ఇలాగే వుంటోంది.

ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతుండటంతో దిక్కుతోచని ప్రభుత్వం జనం దృష్టిని మళ్లించేందుకు పెద్ద ఎత్తున సిబిఐ, ఇడి, ఇతర ఆర్ధిక దర్యాప్తు సంస్ధల దాడులను ప్రారంభించింది. అక్రమాల మీద చర్య తీసుకోవటాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఇదే సమయంలో ఆర్ధిక వ్యవస్ధ రక్షణకు తీసుకున్న చర్యలేమిటన్నది అసలు ప్రశ్న. ఐదేండ్ల క్రితం ఒక నవయువకుడు ప్రేమలో పడినట్లుగా మేము వున్నాం, ఇప్పుడు కలలు కల్లలైనట్లుగా తయారైంది అని ఒక వాణిజ్య వేత్త వ్యాఖ్యానించారు. అది నరేంద్రమోడీ గురించి అని వేరే చెప్పనవసరం లేదు.

Image result for cow stories,narendra modi cartoon

దేశం ఆర్ధికంగా దిగజారుతోంది అని గుర్తించటానికి కూడా నరేంద్రమోడీ సర్కార్‌ సిద్దపడటం లేదు. ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దేందుకు స్ధిరచిత్తం గలవారు చెప్పే మాటలను ఆలకించండి అని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యల గురించి ఏం చెబుతారని విలేకర్లు అడిగితే ఆయనేం చెప్పారో నాకు తెలియదు, చెప్పినదాని మీద నాకెలాంటి ఆలోచన లేదు, ఆయన చెప్పింది నేను విన్నాను అంతే అని ముక్తసరిగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం చెప్పారు. కార్ల అమ్మకాలు పడిపోవటానికి యువతీ యువకులు కార్లు కొనటం మాని ఓలాలు, వూబర్‌లు ఎక్కుతున్నారని ఆమె సెలవిచ్చిన విషయం తెలిసిందే.

దేశంలో నిరుద్యోగుల శాతం 8.2కు పెరిగిందని, పట్టణాల్లో అది 9.4శాతంగా వుందని సిఎంఐఇ చెప్పింది. పెంచిన సర్‌ఛార్జిని వుపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తరువాత కూడా విదేశీ (ఎప్‌పిఐ) మదుపుదార్లు పెట్టుబడులను వుపంసంహరించటం ఆగలేదు. రూపాయి విలువ 72 దాటి పతనమైంది. ఒక వైపు పరిస్ధితి ఇలా వుంటే ఇప్పటికీ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వుంది అంటూ గతనెల 26న బిజెపి ట్వీట్‌ ద్వారా ప్రకటించింది. పని గట్టుకొని ఎగవేస్తున్న వారి నుంచి బ్యాంకు రుణాలు వసూలు చేయటం మీద అంతగా శ్రద్ద పెట్టని కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనాన్ని ముందుకు తెచ్చింది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసింది. ప్రస్తుతం అభివృద్ధి మందగించటానికి అవే ప్రధాన కారణం అని అనేక సర్వేలు చెబుతున్నా అంగీకరించటానికి ప్రభుత్వం సిద్దంగా లేదు. వీటి గురించి రోజూ మీడియాలో వార్తలు వస్తుంటే ప్రస్తావించని మోడీ గారు దేశానికి ఆవు పాఠాలు చెబుతున్నారు. దేశాన్ని ఎవరు వెనక్కు తీసుకుపోతున్నారు ? ఇది వినోదమా దేశానికి పట్టిన విషాదమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తొలిసారి ముఖ్యమంత్రిగా జగన్‌, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు వంద రోజులు !

12 Thursday Sep 2019

Posted by raomk in AP NEWS, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

100 days : ys jagan as cm- chandrababu as opposition leader, CHANDRABABU, CM YS Jagan, tdp, Ycp

Image result for ys jagan vs chandrababu naidu

ఎం కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన రెడ్డి పాలనకు, మూడోసారి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడికి వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా టీవీల్లో జరిగిన చర్చల్లో యాంకర్లు మీరు జగన్‌ తొలి వంద రోజుల పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు అన్నది ఒకటి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తొలి ఆందోళనగా చేపట్టిన చలో ఆత్మకూరు యాత్ర గురించి కూడా మీడియాలో చర్చ జరిగింది.

జగన్‌ పాలన విషయానికి వస్తే నవరత్నాల సంక్షేమ చర్యల అమలుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు కొన్ని చర్యలను ప్రకటించారు. కొండంత రాగం తీసిన విద్యుత్‌ ఒప్పందాల విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. సంప్రదాయేతర విద్యుత్‌ వుత్పత్తి సంస్ధలు విద్యుత్‌ పంపిణీ సంస్ధలతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటన్నింటిలో కేంద్రంలో బిజెపి సర్కార్‌లో భాగస్వామి అయిన తెలుగుదేశం, రాష్ట్రంలోని తెలుగుదేశం సర్కార్‌లో చేరిన బిజెపి నేతలు, వారి లాబీయిస్టులు, ప్రభుత్వాలు భాగస్వాములు. ఆ విద్యుత్‌ కంపెనీలన్నీ విదేశీ బడా సంస్ధలకు చెందినవి. వాటి వత్తిడి మామాలుగా వుండదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం తాము అన్ని ఒప్పందాలను తిరగదోడబోమని, అక్రమాలు జరిగిన వాటికే పరిమితం అవుతామని జగన్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. అందువలన పంచపాండవులంటే మంచం కోళ్ల మాదిరి మూడనుకొని రెండంకె వేసి తప్పని కొట్టేసి ఒకటిగా చివరికి సున్నాగా మారుస్తారా అన్నది చూడాల్సి వుంది. నవయుక కంపెనీ ఒప్పందం రద్దు కోర్టులో వుంది. రివర్స్‌ టెండర్ల ప్రక్రియ ఏమౌతుందో చూడాల్సి వుంది. టెండర్ల జారీకి ముందే పరిశీలనకు ఒక రిటైర్డ్‌ న్యాయమూర్తితో పరిశీలనకు ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో అన్నీ రివర్స్‌ టెండర్లే వుంటాయని ప్రకటించిన సర్కార్‌ మరో వైపు ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన నవరత్నాల గురించి జనం మరచిపోయే విధంగా రాజధాని వివాదాన్ని తలకు చుట్టుకోవటంలో వైసిపి జయప్రదమైంది. రాజధాని నిర్మాణం గురించి అనవసర చర్చకు తెరలేపింది, దాన్ని సమర్ధించుకొనేందుకు ఆ ప్రాంతంలో భూముల కొనుగోలులో తెలుగుదేశం నేతలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పింది. ఇది ఒక ఎత్తుగడగా ముందుకు తీసుకు వచ్చారా? అది తప్పుడు ఎత్తుగడా అన్నది పక్కన పెడితే వైసిపి కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నది. మార్కుల భాషలో చెప్పుకోవాలంటే ఆ పార్టీ తన సిలబస్‌లో లేని అంశాలను తానే ముందుకు తెచ్చి తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రాయలేక ఇబ్బందులకు గురి అవుతోంది. అందువలన దానికి అత్తెసరు తప్ప పెద్దగా మార్కులు రాలేదు. రాజధాని సమస్యపై రగడ సృష్టించిన మంత్రి బొత్స సత్యనారాయణకు, ఆయనను సమర్ధించిన పార్టీ వారిని చుట్టుముట్టిన ప్రశ్నలకు వుక్కిరి బిక్కిరై రాజధాని మారుస్తామని మేము చెప్పామా అంటున్నారు. అభివృద్ది మొత్తం ఒక్క రాజధాని ప్రాంతంలోనే చేస్తే ఎలా మిగతా ప్రాంతాలలో జరగనవసరం లేదా అనే ఎదురుదాడికి దిగారు. ఇక రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణ ఒక ప్రతిపక్ష పార్టీగా చేయటం వేరు. అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే ఆరోపణలు చేస్తే ఫలితం లేదు. వాటిని నిగ్గుతేల్చాల్సిన బాధ్యత తమదే అని మర్చిపోరాదు. తగు సమయంలో బయట పెడతాం అంటే కుదరదు.

ప్రజాకర్షక సంక్షేమ పధకాలకు సంబంధించి తప్ప వైసిపి వద్ద అభివృద్ధి ఆలోచనలు లేదా పధకాలు గానీ లేవు. వర్షాధారిత రైతు మాదిరి ప్రయివేటు పెట్టుబడుల కోసం ఎదురు చూడటం తప్ప, ప్రభుత్వంగా పెట్టుబడులు పెట్టి వుపాధి కల్పించటానికి ఎలాంటి ఆలోచనా లేదు. చర్చల్లో నిలదీస్తే మా నాయకుడు త్వరలో వెల్లడిస్తారు అని చెప్పటం తప్ప మరొక మాట లేదు. దేశంలోనూ, ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ మౌన ముద్ర వహించినట్లుగానే మూలవిరాట్టు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాజధాని గురించి, అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ఇంతవరకు నోరు విప్పలేదు. వైసిపి వుత్స విగ్రహాలే మాట్లాడుతున్నాయి. రైతాంగానికి గిట్టుబాటు ధరలు, వ్యవసాయానికి ప్రోత్సాహం, నిరుద్యోగ యువతకు వుపాధి కలిగించకుండా ఎన్ని కబుర్లు చెప్పినా ఫలితం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్‌ అన్నట్లుగా గ్రామ సచివాలయాల ఏర్పాటు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జనానికి 237 సేవలను అందిస్తామంటున్నారు. లక్ష్యం మంచిదే, ఇవి కార్యరూపం దాల్చితే తప్ప వాటి గురించి చెప్పలేము. అయితే ఇదే అభివృద్ధి, నాలుగు లక్షల మంది వలంటీర్లనియామకాన్ని నాలుగు లక్షల వుద్యోగాల కల్పనగా చిత్రిస్తే ఎదురు దెబ్బలు తగలటం ఖాయం.

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరు పేరుతో తొలి ఆందోళనా యాత్రకు తెరతీశారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని ముఠా కక్షలకు నిలయమైన గ్రామాల్లో అదొకటి. అక్కడ ఎక్కువ మంది జనాభా దళితులే. అయినా తెలుగుదేశం, వైసిపి పెత్తందార్ల మధ్య చీలిపోయి వున్నారు. పరస్పర దాడులు, కేసుల్లో బాధితులుగా కూడా వారే వుంటారు. గ్రామాల్లో ముఠా కక్షలకు ఎవరు తెరతీసినా, వాటిని ఎవరు కొనసాగించినా గర్హనీయమే. ఎక్కువ సందర్భాలలో ఎక్కడైనా బాధితులుగా వెనుకబడిన తరగతులు, దళితులే ఎక్కువగా వుంటారు. పెత్తందార్లు రెండు పార్టీల మద్దతుదార్లుగా మోహరించినపుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పెత్తందార్లదే ఆ గ్రామంలో పెత్తనం. వారికి అదొక ఆదాయ మార్గం కూడా, అందుకే అధికారం లేనపుడు పెట్టుబడులు పెడతారు, ముఠాలను నిర్వహిస్తారు. అధికారం రాగానే వడ్డీతో సహా రాబట్టుకుంటారు.

తమ చలో ఆత్మకూరు పిలుపును సాగనివ్వలేదని, మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తామని చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకత్వం గుండెలు బాదుకొని ప్రజాస్వామ్యం గురించి కడవల కొద్దీ కన్నీరు కార్చింది. నిజానికి వారికి నైతికంగా వున్న హక్కు వున్నదా ? తెలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారికంగా, పార్టీగా తెలుగుదేశం కూడా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ప్రతి చలో పిలుపును పోలీసు యంత్రాంగంతో, పార్టీ పరంగా సాగకుండా చేసేందుకు చేయాల్సిందంతా చేశారు. అంతే కాదు, చంద్రబాబు ఎక్కడ పర్యటనకు పోతే అక్కడి సిపిఎం, సిపిఐ పార్టీలు, ఇతర ప్రజాసంఘాల నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవటం, దూర ప్రాంత పోలీసు స్టేషన్లకు తరలించటం అందరికీ తెలిసిన అంశమే. కొన్ని సందర్భాలలో వైసిపి నేతలను కూడా అక్కడక్కడా అలా ముందుస్తుగా నిర్బంధించిన వుదంతాలు కొన్ని లేకపోలేదు. అదే గుంటూరు జిల్లా పెద్ద గొట్టిపాడులో దళితులమీద జరిగిన దాడిని ఖండించేందుకు సిపిఎం, ఇతర పార్టీలు, సంస్ధలు ఇచ్చిన పిలుపును తెలుగుదేశం సర్కార్‌ సాగనివ్వలేదు. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితుల భూ సమస్య మీద కూడా అదే చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గరికపర్రులో అంబేద్కర్‌ విగ్రహం, సామాజిక బహిష్కరణ వివాదంలో ఒక్క ఆగ్రామానికి రానివ్వకపోవటమే కాదు పది కిలోమీటర్ల దూరంలో వున్న భీమవరంలో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ మూడూ దళితుల ప్రమేయం వున్న సామాజిక న్యాయ వుదంతాలు, ఆత్మకూరు మాదిరి పెత్తందార్ల ముఠాకక్షల సమస్య కాదు. మరొకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని కాలుష్యకారక తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలోనూ తప్పుడు కేసులు పెట్టి మహిళలతో సహా ఎందరినో జైలు పాలు చేసింది చంద్రబాబు సర్కార్‌. అక్కడ కూడా అంతే పరిసర పట్టణాల్లో కూడా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వలేదు. అలాంటి పార్టీ తమ పెత్తందార్లకు మద్దతుగా ఆత్మకూరు యాత్ర జరపాలని ప్రయత్నించింది. అంగన్‌ వాడీలు, ఆశావర్కర్లు,ఇతర అనేక చిరుద్యోగ సంఘాలు చలో అమరావతి పిలుపు ఇస్తే (వారేమీ సచివాలయం దగ్గరకు వెళ్లేందుకు కాదు) విజయవాడకు రాకుండా చేసేందుకు రైళ్లలో,బస్సులో బయలు దేరిన వారిని ఎక్కడికక్కడ దింపివేసి అడ్డుకున్న చరిత్రను చెరిపేస్తే చెరగదు. తాను రెండు కాళ్లతో నడుస్తూ వెళుతున్నా అడ్డగించారని అసెంబ్లీలో తెలుగుదేశం వుపనేత కె అచ్చన్నాయుడు వాపోయారు. ఆయన మంత్రిగా వున్న సమయంలో వివిధ చలో పిలుపులు ఇచ్చిన వారు కూడా కాలినడకనే వెళ్లేందుకు ప్రయత్నించారు. వారేమీ అనుమతి లేని ఆయుధాలు తీసుకొని రాలేదు. అంగన్‌ వాడీలు, ఆశాలు అందరూ మహిళలు కూడా. అధికారంలో వుంటే ఒక పాట ప్రతిపక్షంలో వుంటే మరొక పల్లవి.

Image result for ys jagan vs chandrababu naidu

అయితే చలో ఆత్మకూరు విషయంలో అధికార వైసిపి లేదా ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలి. పైన పేర్కొన్న పెదగొట్టిపాడు, గరికపర్రు, తుందుర్రు వుదంతాల్లో వైసిపి జనం తరఫున నిలబడేందుకు ముందుకు రాలేదు. గరికపర్రు దళితులను ఓదార్చాలనే ఆలోచనే జగన్‌కు రాలేదు. అంటే ఆ ప్రాంతాల్లో వున్న పెత్తందార్లు వారికి ముఖ్యంగా కనిపించారు తప్ప జనం కాదు. ఆత్మకూరు విషయంలో కూడా పెత్తందారీ పోకడలనే వైసిపి ప్రదర్శించింది. చంద్రబాబు నాయుడు వైసిపి బాధితుల శిబిరం పేరుతో గుంటూరులో హడావుడి చేస్తే, దానికి పోటీగా తెలుగుదేశం బాధితుల పేరుతో తాను కూడా సమీకరించింది. చలో ఆత్మకూరుకు పోటీగా తమ మద్దతుదార్లకు అనుకూలంగా పోటీగా అదే చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చింది. ఒక అధికార పార్టీ ఇలా వ్యవహరించటం సమస్యను పరిష్కరించటంగాక తమ శిబిరాన్ని నిలబెట్టుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. ఇలాంటి పార్టీ రేపు మరొక సామాజిక న్యాయ సమస్య మీదో, ప్రజాసమస్యల మీదో వామపక్షాలో, ప్రజా సంస్ధలో ఇచ్చిన పిలుపును కూడా సాగనిస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పటికే అలాంటి కొన్ని సూచనలు వున్నాయి. తెలుగుదేశం చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చేంత వరకు గుంటూరు శిబిరంలో వున్న ఆత్మకూరు, ఇతర గ్రామాల వారికి భరోసా కల్పించి వారిని గ్రామాలకు పంపించి తగు రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముందుకు రాలేదు. తీరా ఆందోళన రోజు ఆ పని చేసింది? అదే ముందు ఎందుకు చేయలేదు ? చంద్రబాబు హయాంలో అధికార యంత్రాంగం తెలుగుదేశం కనుసన్నలలో పని చేస్తే జగన్‌ ఏలుబడిలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించనుందని ఈ వుదంతం వెల్లడించింది.

తెలుగుదేశం వైఖరిని సమర్ధించటమా, దెబ్బకు దెబ్బ, వారి పాఠం వారికే తిరిగి చెప్పారు అనుకుంటే పొరపాటు. గత ఐదేండ్ల చంద్రబాబు పాలనలో లెక్కలు తీస్తే ముందస్తు అరెస్టులు, నిరసనలను అడ్డుకోవటాలు ప్రధాన ప్రతిపక్షంగా వున్న వైసిపి పట్లకాదు, బలం పరిమితంగానే వున్నా, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, సామాన్య జనం మీదనే దాడిని ఎక్కు పెట్టారు. ఇది న్యాయమైన ప్రజాస్వామ్య లేదా ఆర్ధిక హక్కుల మీదనే దాడి అన్నది గ్రహించాలి. అందువలన గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు ఏ ప్రభుత్వం పాల్పడినా ప్రశ్నించాలి. లేకపోతే అంతిమంగా నష్టపోయేది మనమే అని జనం గ్రహించాలి.

గమనిక : చంద్రబాబు నాయుడు 2004,2009లో రెండు సార్లు ప్రతిపక్ష నేతగా పదేండ్లు కొనసాగటాన్ని ఒక విడతగా, తాజాగా నిర్వహిస్తున్న పాత్రను రెండోదిగా పరిగణించి ఈ విశ్లేషణలో రెండుసార్లు అని పేర్కొన్నాను. సాంకేతికంగా చూస్తే మూడవ సారి, అందువలన ఆ మేరకు శీర్షికను, విశ్లేషణ అంశంలో ఆ మేరకు సవరించాను.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నిర్మలమ్మా నిజాలను అంగీకరించండి, నివారణ చర్యలు తీసుకోండి !

11 Wednesday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

automobile, BoycottMillennials, mindset of millenials, Nirmala Sitharaman

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

అమ్మా నిర్మలమ్మా ఒక తెలుగింటి కోడలివనే గౌరవంతో ఒక తెలుగువాడిగా ఈ బహిరంగ లేఖలో నాలుగు ముక్కలు రాస్తున్నా. ఆటో మొబైల్‌ పరిశ్రమలో తలెత్తిన పరిస్ధితికి కారణాలను వివరించాలని మీరే అనుకున్నారో, విలేకర్లు ఎవరైనా వ్యాఖ్యానించమని కోరారో తెలియదు. మీ అధినేత ప్రధాని నరేంద్రమోడీయే ఇంతవరకు నోరు విప్పలేదు, మన్‌కీ బాత్‌లో కూడా చెప్పలేదు. ప్లాస్టిక్‌ గురించి, ఫిట్‌నెస్‌ వంటి సుభాషితాలనే పలికారు. మీ రెందుకమ్మా అలా వ్యాఖ్యానించారు. కార్ల అమ్మకాలు పడిపోవటానికి యువత ఓలాలు, వూబర్‌లు, మెట్రోలు ఎక్కటం, వాయిదాలు కట్టేందుకు సిద్దం గాకపోవటం, బిఎస్‌ 6 కారణాలని చెప్పటం ఏమిటి తల్లీ ?

తెలుగునాట ఒక సామెత వుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి ఎక్కడుందో చూడటానికని చెప్పాడట ఒకడు. అసలు విషయం కల్లుకోసం ఎక్కాడని వేరే చెప్పనవసరం లేదు. మీరు కూడా సమస్య వుంది, పరిశీలిస్తున్నాం, తగిన సమయంలో తగు చర్యలు తీసుకుంటాం ఇలా ఏదో ఒకటి చెప్పకుండా ఈ సహస్రాబ్ది కుర్రకారు మానసిక స్ధితి గురించి అలా మాట్లాడారేమి తల్లీ ! అయినా కార్ల అమ్మకాలు, కుర్రకారు గురించి మీరు చెప్పిన మాటలను ఏడాది క్రితమే మహింద్రా సంస్ధ అధిపతి ఆనంద్‌ మహింద్ర, మారుతి కంపెనీ చైర్మన్‌ ఆర్‌సి భార్గవ చెప్పారమ్మా. వాటినే ఇప్పుడు మీరు పునశ్చరణ చేశారు. కార్లంటే అదేదో కుర్ర వ్యవహారంగా మార్చి వేశారు. మన దేశంలో వున్న జనాభాలో 40 కోట్ల మంది కుర్రకారే. వారిలో ఒక కోటి మంది కొనుగోలు చేసినా ఎంతో మార్కెట్‌ వుంటుంది. 2018 మార్చినెలతో ముగిసిన ఆర్దిక సంవత్సరంలో మన దేశంలో వుత్పత్తి అయిన అన్ని రకాల మోటారు వాహనాల సంఖ్య 2.91 కోట్లు. వీటిలో ద్విచక్ర వాహనాలు 2.31 కోట్లు, కార్లు 21.7లక్షలు, త్రిచక్ర వాహనాలు పది లక్షలు, వాణిజ్య వాహనాలు ఆరులక్షల అరవై వేలు,ఎగుమతి చేసిన కార్లు ఏడు లక్షలు, ద్విచక్ర వాహనాలు 32.6లక్షలు, వాణిజ్యవాహనాలు లక్ష,త్రిచక్ర వాహనాలు 5.3లక్షలు.

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

మీరు వూహా లోకంలో వున్నట్లున్నారు. మన యువతీ, యువకులందరూ కార్లు కొనేంతగా వేతనాలు తెచ్చుకోవటం లేదు గనుక మన దగ్గర అంత సీన్‌ లేదు తల్లీ. 2018 డిసెంబరు 12న ఆటో. ఎకనమిక్‌ టైమ్స్‌ సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి వెయ్యి మందికి 22 కార్లు వుంటే చైనాలో 164, జపాన్‌లో 591, కెనడాలో 662, ఆస్ట్రేలియాలో 740, న్యూజీలాండ్‌లో 774, బ్రిటన్‌లో 850, అమెరికాలో 980 వున్నాయట. సహస్రాబ్ది కుర్రకారు అందరూ కార్లు కొనటం మానుకోలేదు. వారికి అంత ఆర్ధిక శక్తి కూడా లేదు. అంతర్జాతీయ చమురు సంస్ధ(ఐఇఏ) అంచనా ప్రకారం 2040 నాటికి మన దేశంలో వెయ్యి మందికి 175 కార్లు వుంటాయట. మోడీగారు చెప్పినట్లు పకోడీల బండ్లు నిర్వహించే వారు కూడా వుద్యోగులే అయితే వారందరికీ ఐటి ఇంజనీర్లలో కొంత మందికి వస్తున్న మంచి ఆదాయాలు వారికి కూడా వస్తే వారు కూడా కారులో వచ్చి పకోడీలు అమ్మి తిరిగి కారుల్లోనే ఇండ్లకు వెళతారు. అమెరికాలో రోడ్లు వూడ్చే వారు కూడా కార్లలో వస్తారని మా చిన్నపుడు చెబితే అబ్బో అక్కడికి వెళ్లి వీధులూడ్చినా మన జీవితం ధన్యం అనుకొనే వాళ్లం. ఎందుకంటే అసమయంలో సినిమాల్లో తప్ప పల్లెటూళ్లలో వాస్తవంగా కార్లు చూసిన వారి సంఖ్య చాలా నామమాత్రంగా వుండేది మరి.

అనేక కంపెనీలు మందగమనం కారణంగా తమ వుత్పాదకతను తగ్గించిన తరువాత ఈ ఏడాది జూలై నెలలో కార్లు 25-30 రోజుల వుత్పత్తి, వాణిజ్య వాహనాలు 55-60 రోజుల, ద్విచక్ర వాహనాలు 60ా65 రోజుల వుత్పత్తి నిల్వలు వున్నాయని ఆటో పరిశ్రమ అంచనా. కుర్రకారంటే కార్లు కొనటం లేదు, మరి వాణిజ్య వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాల్లో ఎందుకు మాంద్యం ఏర్పడినట్లు ? బిఎస్‌ 6 ను ఒక కారణంగా చూపుతున్నారు. ఇది కూడా అంతగా అతకటం లేదమ్మా! బిఎస్‌ ఒకటి నుంచి ఐదు వరకు లేని సమస్య ఆరుకు వచ్చిందంటే ఎలా? కొత్తగా వచ్చే తరం వాహనాల కోసం ఎదురు చూసే వారు చాలా నామమాత్రంగా వుంటారు తప్ప అసలు కొనుగోళ్లను బంద్‌ చేసిన వుదంతం లేదు. అసలు కంపెనీలే కొత్త తరం గడువుకు అనుగుణ్యంగా తమ పాత తరం వుత్పత్తి క్రమంగా తగ్గించటం లేదా నిలిపివేసే ప్రణాళికలను రూపొందించుకుంటాయి తప్ప అమాయకంగా అమ్ముడు పోని వాహనాలను తయారు చేసి పెట్టుకుంటాయా ? మన కార్పొరేట్‌ సంస్ధలు మరీ అంత అమాయకంగా లేవు తల్లీ !

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

మీరు గానీ మీ సర్కార్‌ గానీ దేశంలో ఆర్దిక మాంద్యం పెరుగుతోంది అని అంగీకరించటానికి సిద్ధంగా లేరు. కుర్రకారు కార్లు కొనేందుకు విముఖత చూపుతున్నారు గనుక ఆటోమొబైల్‌ రంగం కుదేలైందని కాసేపు మీ అభిప్రాయాన్ని అంగీకరిద్దాం. అమెరికా-చైనా వారు వాణిజ్య యుద్ధంలో మునిగితే దాన్ని వుపయోగించుకొని మన దేశం చైనా స్ధానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా ? అదే వాస్తవమైతే గత ఏడాది కాలంలో మన ఎగుమతులు పెరగాల్సింది పోయి తగ్గాయి ఎందుకని ? ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రేటు గతేడాది జూలైలో 7.3శాతం వుంటే ఈ ఏడాది జూలైలో 2.1శాతానికి పడిపోవటానికి కారకులు ఎవరు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా గత 25నెలల్లో అత్యంత కనిష్టంగా టోకు ధరల సూచి పెరుగుదల 1.8శాతంగా నమోదైంది. అంటే ధరల పెరుగుదల వున్నా పెద్దగా లేవు. అయినప్పటికీ వినియోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు తమ వస్తువులకు డిమాండ్‌ తగ్గిపోయిందని గగ్గోలు పెడుతున్నాయి. వినియోగవస్తువులను వుపయోగించే విషయంలో సహస్రాబ్ది కుర్రకారు పాత తరాలను మించిపోయింది కదా ! మరి ఆ వస్తువులకు డిమాండ్‌ ఎందుకు తగ్గినట్లు ? చివరకు ఐదు రూపాయల బిస్కెట్‌ పాకెట్లు కూడా సరిగా అమ్ముడు పోవటం లేదని పార్లే కంపెనీ ముంబైలోని విల్‌ పార్లే ఫ్యాక్టరీని మూసివేసింది. వీటికి ఓలా, వూబర్‌లు ఎక్కే కుర్రకారేనా ? అందుకే తల్లీ నిజాలను అంగీకరించండి, ఆత్మావలోకనం చేసుకోండి. వైఫల్యానికి ఎవరో ఒకరిని బలి చేయాలి కనుక ఆర్‌ఎస్‌ఎస్‌ మరో కొత్త బమ్మను రంగంలోకి తెస్తే ఏమో గాని లేకపోతే మరో నాలుగు సంవత్సరాల వరకు మీ సర్కార్‌కు ఎలాంటి ఢోకా వుండదు. నిజాన్ని అంగీకరించి నివారణ చర్యలు చేపట్టండి, మూసిపెడితే పాచిపోతుందని గుర్తించండి.

Image result for Twitter trolls Nirmala Sitharaman's 'mindset of millennials' remarks cartoon

చెన్నయ్‌లో మీరు విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మాటలు విన్న వారు టీవీల్లో కన్నవారిలో కుర్రకారు ఒకటే జోకులు వేసిన విషయం మీ వరకు వచ్చే వుంటుంది. ఏది ఏమైతేనేం ఒకందుకు మాత్రం మిమ్మల్ని అభినందించక తప్పదు. రేపేం కానుందో అని అన్ని తరగతుల వారు ఆందోళనపడుతున్న తరుణంలో మీ ప్రకటనతో పేలుతున్న జోకులతో విషాదంలో వినోదం మాదిరి నవ్వుకుంటున్నారంటే అది మీ పుణ్యమే. ఇదే మాట నరేంద్రమోడీ నోట వచ్చి వుంటే దేశం ఇంకా విరగబడి నవ్వి వుండేది. కొన్ని జోకులు ఎలా వున్నాయో మీకు చెబుదామనుకుంటున్న. దేశంలో మంచి నీటి కొరతకు మిలీనియల్స్‌ ఎక్కువగా తాగటం, ఆక్సిజన్‌ కొరతకు ఎక్కువగా పీల్చటం. పారగాన్‌ చెప్పుల అమ్మకాలు పడిపోవటానికి మిలీనియల్స్‌ చెప్పులు లేకుండా తిరగటమే కారణం. ఎంఎల్‌ ఏలను కొనేందుకు అమిత్‌ షా పేటిఎంను వినియోగిస్తున్న కారణంగా నల్లధనం తగ్గిపోయింది. అనిల్‌ అంబానీ అప్పులు చెప్పులు చెల్లిస్తున్నందున నిరర్ధక ఆస్ధులు తగ్గుతున్నాయి. పార్లమెంట్‌ సభ్యురాలైన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ బిజెపి మంత్రుల మీద చేతబడి చేస్తున్న కారణంగా జనాభా తగ్గుతోంది. కార్ల అమ్మకాలు ఢమాల్‌ అన్నందుకు దేశం నుంచి మిలీనియన్స్‌ను బహిష్కరించాలంటూ ఒకటే ట్వీట్లు. ఇంకా వున్నాయి గానీ వినోదం కాస్త విషాదం అవుతుంది. వుంటా మరి

ఓ తెలుగోడు

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రయాన్‌ 2 ప్రయోగం : తీవ్ర ఆశాభంగం చెందింది నరేంద్రమోడీనా , శాస్త్రవేత్తలా !

09 Monday Sep 2019

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Chandrayaan 2, ISRO scientists, Narendra Modi, Vikram Lander

Image result for chandrayaan 2

ఎం కోటేశ్వరరావు

చంద్రయాన్‌ -2 ప్రయోగం విఫలమైందా ? ఈ ప్రయోగం ఫలితంపై తీవ్ర ఆశాభంగానికి గురైంది ఇస్రో శాస్త్రవేత్తలా లేక రాజకీయవేత్త ప్రధాని నరేంద్రమోడీనా ? ప్రయోగం విజయవంతంగా కావాలని మఠాధిపతులు, గుడి పూజారులు, చిన్న దేవుళ్లు, దేవతలు, పెద్ద వెంకటేశ్వరస్వామి ఆశీర్వచనాలు, వాట్సాప్‌ భక్తుల పూజలు ఏమైనట్లు ? అసలు శాస్త్రవేత్తలకు కావాల్సింది ఏమిటి ? ఈ ప్రాతిపదికన కొన్ని అంశాల మీద వెల్లడించే అభిప్రాయాలు తమ మనోభావాలను గాయపరుస్తాయని భావించే వారు, భయపడే వారు ఇక్కడి నుంచి చదివేందుకు ముందుకు పోవాలా లేదా అన్నది వారి స్వేచ్చకే వదలి వేస్తున్నాను.

నూతన ఆవిష్కరణలు గావించే మానవాళి శాస్త్ర పరిశోధనా, ప్రయోగాలు నిర్దిష్టంగా ఫలానా రోజున ప్రారంభం అయ్యాయని చెప్పలేము. ప్రతి చిన్న ఆవిష్కరణ ఎంతో పెద్ద పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసింది. పెద్ద బండరాయి కంటే అంచు వాడిగా వుండే చిన్న రాయి ఎంతో శక్తివంతమైనదని, పశువులను చంపి తినటం కంటే వాటిని పెంచి అవసరమైనపుడు ఆహారానికి వినియోగించుకోవచ్చన్న ఆలోచన రావటం, వాటిని భూమిని దున్నటానికి వినియోగించవచ్చని ప్రయోగించటం ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారితీసిన చరిత్ర తెలిసిందే. అందువలన అది నిరంతర ప్రక్రియ, మానవుడి లక్షణాల్లో ఒకటి. శాస్త్రవిజ్ఞానమే కాదు, ఏ విజ్ఞాన అభివృద్ధికైనా ఎదురుదెబ్బలే స్ఫూర్తి,కసిని పుట్టిస్తాయి. పరిశోధనా, ప్రయోగాలు వ్యక్తిగతం కంటే సమిష్టి కృషి ఫలితాలు, పర్యవసానాలే. అయితే ప్రతి ఆవిష్కరణలోనూ వ్యక్తిగత పాత్ర లేదా అంటే వుంటుంది. దానిలో కూడా ఇతరుల అనుభవాల సారం వుంటుంది. విద్యుత్‌ బల్బ్‌ను కనుగొన్నది ఎవరంటే ధామస్‌ ఆల్వా ఎడిసన్‌ అని చెబుతాము. నిజానికి అంతకు ముందు ఎందరో దాని మీద చేసిన పరిశోధనలు ఆయనకు తోడ్పడ్డాయి. ప్రతి దేశ అంతరిక్ష పరిశోధనకూ ఇదే వర్తిస్తుంది.

గత ఆరు దశాబ్దాలలో చంద్రుడి మీద అడుగు పెట్టేందుకు చేసిన ప్రతి ప్రయోగం విజయవంతం కాలేదు. అయినప్పటికీ ఏ దేశమూ నీరసించి తన ప్రయత్నాలను మానుకోలేదు. అమెరికాకు చెందిన నాసా సంస్ధ నిర్వహిస్త్ను చంద్రుడి వాస్తవ పత్రం(మూన్‌ ఫ్యాక్ట్‌ షీట్‌)లో వున్న సమాచారం ప్రకారం వివిధ దేశాలు ఇప్పటి వరకు 109 ప్రయోగాలు జరపగా 61 విజయవంతం కాగా 48 విఫలమయ్యాయి. మన చంద్రయాన్‌-2కు ముందు 2019 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌లో ఒక ప్రయివేటు సంస్ధ చేసిన ప్రయోగం ఏప్రిల్‌లో విఫలమైంది.

1958,59 సంవత్సరాలలో నాటి సోవియట్‌ యూనియన్‌, అమెరికా దేశాలు 14 ప్రయోగాలు చేశాయి. వాటిలో సోవియట్‌ లూనా 1,2,3 మాత్రమే విజయవంతమయ్యాయి. మొదటి విజయానికి ముందు సోవియట్‌ ప్రయోగాలు ఆరు విఫలమయ్యాయి. తరువాత 1964లో అమెరికా జరిపిన ఏడవ ప్రయోగం విజయవంతమైంది. 1966లో సోవియట్‌ లూనా 9 చంద్రుడి మీద దిగి చంద్రుడి వుపరితల చిత్రాలను తొలిసారిగా పంపింది. ఐదునెలల తరువాత అమెరికా అలాంటి ప్రయోగంలోనే విజయవంతమైంది. తొలుత సోవియట్‌ యూనియన్‌ అంతరిక్షంలోకి యూరీ గగారిన్‌ను పంపి చరిత్ర సృష్టిస్తే, తరువాత అపోలో 11వ ప్రయోగంలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ నాయకత్వంలో చంద్రుడి మీద తొలిసారి కాలుమోపిన చారిత్రాత్మక ఘటన తెలిసిందే. 1958 నుంచి 1979 వరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ 90 ప్రయోగాలు జరిపాయి. తరువాత ఒక దశాబ్దం పాటు ఎలాంటి ప్రయోగాలు జరగలేదు. తరువాత జపాన్‌, ఐరోపాయూనియన్‌, చైనా, భారత్‌, ఇజ్రాయెల్‌ తమ ప్రయోగాలను ప్రారంభించాయి. 2009-19 మధ్య పది ప్రయోగాలు జరిగాయి. రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఆ రంగంలో మొదటి మూడు స్ధానాలను ఆక్రమించాయి. మన చంద్రయాన్‌ 2 సఫలీకృతం అయితే మనది నాల్గో స్ధానం అవుతుంది. మన కంటే ఆర్ధికంగా బలమైన జపాన్‌ ఎంతో వెనుకబడి వుంది, అంతమాత్రాన దాని పలుకుబడి తగ్గలేదు. మిగతా కొన్ని రంగాలలో తన ప్రతిభ చూపింది.

ఒక ప్రయోగం విఫలమైనపుడు, మరొకటి సఫలమైనపుడు శాస్త్రవేత్తలు, సమాజం భావోద్వేగాలకు గురి కావటం సహజం. వస్తువు గురుత్వాకర్షణ, సాంద్రత, చలన శక్తి సూత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ గురించి ప్రచారంలో వున్న కధ తెలిసిందే. తన సింహాసనం పూర్తి బంగారంతో చేసింది కాదని తనకు అనుమానంగా వుందని దాన్ని రుజువు చేయాలని రాజుగారు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించారు. ఒక రోజు ఆర్కిమెడిస్‌ స్నానం చేస్తుండగా ఆయన కూర్చున్న తొట్టెలోంచి నీరు పైకి వుబికింది. అది తన బరువుకు సమానంగా గుర్తించి భావోద్వేగానికి గురై యురేకా యురేకా ( నాకు అర్ధమైంది, నాకు అర్ధమైంది) అంటూ నీటి తొట్టెలోంచి లేచి బట్టల్లేకుండానే వీధుల్లో పరుగెత్తి రాజుగారి దగ్గరకు వెళ్లాడు. తరువాత బంగారంలో వేరే లోహాన్ని కలిపినట్లు బయటపెట్టాడు. అంతకు ముందు ఆర్కిమెడిస్‌తో పాటు అనేక మంది బంగారంలో కల్తీని కనుగొనేందుకు అనేక ఆలోచనలు, ప్రయోగాలు చేయకపోలేదు. అయితే తామెలా చేసేది చూడండని రాజుగారిని వారు పిలిచిగానీ, లేదా మీ ప్రయోగాన్ని స్వయంగా చూస్తానని రాజుగారు వచ్చి కూర్చున్న వుదంతాలుగానీ, ప్రయోగం లేదా వివరణలో విఫలమైతే శాస్త్రవేత్తలు కంటినీరు పెట్టుకున్నట్లు, వారిని రాజుగారు ఓదార్చినట్లు ఎక్కడా చదవలేదు. అసాధారణంగా ఎక్కడైనా జరిగిందేమో నాకు తెలియదు.

ప్రస్తుతం మన దేశంలో ప్రతి అంశం మీద జనంలో భావోద్వేగాలు, మనోభావాలు రేపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జరుగుతున్న పరిణామాలను బట్టి భావించాల్సి వస్తోంది. శాస్త్ర పరిశోధనల మీద దేశమంతటా ఆసక్తిని కలిగించే యత్నాలు, శాస్త్రంపట్ల ఆసక్తిని కలిగించేందుకు తీసుకొనే చర్యలు వేరు. అనేక దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి, కానీ మన ప్రధాని నరేంద్రమోడీ మాదిరి ఒక దేశాధినేత స్వయంగా పరిశోధనా కేంద్రానికి వచ్చి కూర్చొని వీక్షించిన వుదంతం వుందేమో చెప్పమ్మా అని గూగులమ్మ తల్లిని అడిగితే చెప్పలేదు. ఎవరి దగ్గర అయినా అలాంటి సమాచారం వుంటే నా వ్యక్తీకరణను సవరించుకొనేందుకు సిద్దం. ఇస్రో చరిత్రలో విజయాలతో పాటు అపజయాలు కూడా వున్నాయి. అపజయాలు సంభవించినపుడు వుత్సాహం కొరవడ వచ్చుగానీ, ఎప్పుడూ కంటనీరు పెట్టుకున్నట్లు చదవలేదు. చంద్రయాన్‌ 2 వుదంతంలో రాజకీయం, మీడియా జనంలో భావోద్వేగాలను పెంచటంలో , వుపయోగించుకోవటంలో మాత్రం విజయం సాధించింది. మన దేశంలో క్రికెట్‌ మీద, మరొక దేశంలో మరొక క్రీడను సొమ్ము చేసుకొనేందుకు జనంలో పిచ్చిని పెంచే విధంగా మీడియా రాతలు, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పొందే బిసిసిఐ తీరుతెన్నులను చూశాము.అది ముదిరిపోయి కొన్ని చోట్ల తాము ఆశించిన జట్టు విజయం సాధించని సందర్భాలలో అభిమానం దురభిమానంగా మారిన వుదంతాలు కూడా చూశాము. శాస్త్ర ప్రయోగాలు అలాంటివి కాదు. వాటి విజయం గురించి ఎవరూ హామీ ఇవ్వలేరు. మన చంద్రయాన్‌ మాదిరే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల మన ఖర్చులో సగంతో ఒక ప్రయోగం జరిపారు. అది ఏప్రిల్‌ 19వ తేదీన చివరిక్షణాల్లో సమాచార వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయి, మన ప్రయోగం మాదిరే జయప్రదం కాలేదు. మన దేశంలో మాదిరి దృశ్యాలు,ఓదార్పు యాత్రలు అక్కడ లేవు. ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గర ఎందుకో జనం ఆలోచించాలి.

చంద్రయాన్‌ ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమంలో ఒక అంశం చక్కర్లు కొట్టింది. అది నిడివి పెద్దది అయినా ఇక్కడ పూర్తి పాఠం ఇస్తున్నాను. ” చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా రెడీ, కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి తెమలడం లేదు, తేలడం లేదు లెక్క తెగడమే లేదు.900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచ కన్ను . ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్‌ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్‌ కూడా ప్రతిదీ వినే తరహా, దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్‌, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు తను ఓ క్షణం విస్తుపోయాడు ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు స్వామివారినే శ్రీహరికోటకు రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చాడు,చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్‌ చేసేశాడు శంకరాచార్య అలియాస్‌ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్‌. ఆ తరువాత కొద్దిరోజులకే చంద్రయాన్‌-2 మన పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖగోళంలోకి చంద్రుడి వైపు దూసుకుపోయింది అబ్బే, ఏమాత్రం నమ్మబుల్‌గా లేదు, ఉత్త ఫేక్‌ అని కొట్టేసేవాళ్లు బోలెడు మంది ఉంటారు కదా ఈ వార్తను..! కానీ కాస్త అతిశయోక్తి ఉంది గానీ వార్త నిజమే. కాకపోతే మన మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాకు ఇలాంటివి పట్టవు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నయ్‌.ఈ స్వామి పూరి శంకరాచార్య నంబర్‌ 145, ఈయన 143వ శంకరాచార్యుడు భారతక ష్ణ తీర్థకు ప్రియమైన శిష్యుడు. ఆయన వేదగణితంలో దిట్ట. ఆధునిక గణితం వల్ల కాని అనేకానేక సంక్లిష్టమైన సూత్రాల్ని, సమీకరణాల్ని ఇట్టే సాల్వ్‌ చేసేవాడు. ఈ నిశ్చలానంద కూడా ఆయన దగ్గర నేర్చుకుని, పాత వేదగణిత గ్రంథాల్ని ఔపోసన పట్టి, తన జ్ఞానానికి మరింత మెరుగుపెట్టుకున్నాడు.

ఆహారానికి, భాషకు, మందులకు, ఆహార్యానికీ, అలవాట్లకూ మతాన్ని రుద్దినట్టుగా ఈ గణితానికి మతాన్ని రుద్దకండి.లెక్కలంటే లెక్కలే. ఆధునిక గణితం పోకడ వేరు, వేదగణితం పోకడ వేరు .రెండూ సొల్యూషన్సే చూపిస్తాయి. కాకపోతే వేదగణితం సులభంగా స్టెప్‌ బై స్టెప్‌ ఉంటుంది. ఆధునిక గణితం కాస్త సంక్లిష్టంగా ఉంటుంది.”ఇందులో వింత ఏమీ లేదు, ఇదేమీ మాయ కాదు, లీల కాదు, మహత్తు అసలే కాదు. వేల ఏళ్ల క్రితమే భారతీయ రుషులకు లెక్కలు, జ్యోతిష్యం, క్షిపణి పరిజ్ఞానం, ఖగోళ జ్ఞానం, గగనయానంపై బ్రహ్మాండమైన విద్వత్తు ఉంది. మన పురాణాల్లో, భగవద్గీతలో బోలెడు అంశాలు దొరుకుతాయి. నిశ్చలానంద సరస్వతి ఆధ్యాత్మక గురువే కాదు, వేదగణితంలో బోలెడంత సాధన చేశాడు.11 పుస్తకాలు రాశాడు తను. దీనిపై చాలా మంది విదేశీ గణిత పరిశోధకులు స్వామితో టచ్‌లో ఉంటారు. సందేహాలకు వేదగణితంలో పరిష్కారాలు వెతుక్కుంటారు అంటున్నాడు ఈ శంకరాచార్యుడి గోవర్ధన పీఠం పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ మనోజ్‌ రత్తా.

నిజానికి నిశ్చలానందుడికి ఇస్రో స్పేస్‌ సైన్స్‌తో పరిచయం కొత్తదేమీ కాదు. చాలాసార్లు తను ఇస్రో లెక్కలకు సాయం చేశాడు. రెండేళ్ల క్రితం అహ్మదాబాద్‌ స్పేస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కు వెళ్లి దాదాపు 1000 మంది సైంటిస్టులు, రీసెర్చ్‌ స్కాలర్లను ఉద్దేశించి ప్రసంగించాడు. అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఏడాది క్రితం మేనేజ్‌మెంట్‌ పాఠాలు కూడా చెప్పాడు సో, స్వామి అనగానే కాషాయాలు (మన తెలుగు స్వాములతో అస్సలు పోల్చుకోవద్దు దయచేసి..) ఉపవాసాలు, పూజలు, ధ్యానాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలే అనుకోకండి. ఇదుగో, ఈ నిశ్చలానందులూ ఉంటారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పురాతన జ్ఞానాన్ని అద్ది సుసంపన్నం చేస్తారు. తమ చుట్టూ ఛాందసాల మడి గీతలు గీసుకుని, వాటిల్లో బందీలుగా ఉండరు. విభిన్నరంగాల్లో ఇదుగో ఇలా తళుక్కుమంటారు. అవసరమైన వేళల్లో..!! ”

రోజూ సామాజిక మాధ్యమాల్లో ‘ మేకిన్‌ ఇండియా ‘ ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఫేక్‌ న్యూస్‌ల్లో పైదొకటి. ఇస్రో అంటే ఏదో గణిత శాస్త్ర సంస్ధ అన్నట్లు, లెక్కల చిక్కు ముడి పడినట్లు ? చిత్రించారు. చంద్రయాన్‌ 2 ప్రాజెక్టు 2007లో ప్రారంభమైంది. 2008లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2013లో ప్రయోగించాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాలతో ఆలస్యమైంది. అలాంటిదానికి ప్రయోగించబోయే ముందు లెక్కల చిక్కుముడి పడిందని చెప్పటం నిజంగా మన శాస్త్రవేత్తలను అవమానించటం, స్వామీజీలు, బాబాలకే లేని ప్రతిభను ఆపాదించటం తప్ప మరొకటి కాదు. సదరు నిశ్చలానంద సరస్వతి తన శిష్యులతో ఇస్రోకు సమాంతరంగా ఇప్పటికైనా తన ప్రతిభతో ప్రయోగాలను చేపట్టమనండి.

విక్రమ్‌ లాండర్‌ను సులభంగా చంద్రుడి దక్షిణ ధృవం మీద దించటం, అది పద్నాలుగు రోజుల పాటు వుపరితలం మీద కదలాడుతూ సమాచారాన్ని సేకరించటం కీలకాంశం. దానికి ముందు వున్న దశలను మన శాస్త్రవేత్తలు ఎప్పుడో జయప్రదంగా అధిగమించారు. రష్యా సహకారంలో భాగంగా వారు లాండర్‌ను తయారు చేసి ఇవ్వాల్సి వుంది. అయితే వారికి తలెత్తిన సాంకేతిక సమస్యలు కావచ్చు, బయటికి తెలియని ఇతర కారణాలతో గానీ తాము ఇవ్వలేమని చెప్పిన తరువాత మన వారే స్వంతంగా తయారు చేశారు. ఇది కూడా ఆలశ్యానికి ఒక కారణం.

Image result for disappointed Narendra Modi at ISRO

మన దేశంలో ప్రతి అంతరిక్ష ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలతో తిరుపతి వెంకన్న , సుళ్లూరు పేట చెంగాలమ్మ దేవాలయాల్లో పూజలు చేయటం చేస్తున్నారు. ఈ ఏడాది ఇస్రో అధిపతి కె శివన్‌ వుడిపి శ్రీకృష్ణ మఠాధిపతి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక వాట్సాప్‌ భక్తులు, ఇతరులు చేసిన వినతులకు కొదవ లేదు. ఈ వుత్తరం అందిన వారు మరొక పదకొండు మందికి లేఖలు రాయకపోతే అరిష్టానికి గురి అవుతారు అన్నట్లు గాక పోయినా అందరికీ పంపి ప్రార్ధనలు చేయండని కోరారు. మరి శంకరాచార్య లెక్కలేమయ్యాయి. దేవుళ్ల కరుణాకటాక్షం, మఠాధిపతుల, తిరుపతి వేద పండితుల ఆశీర్వాచనాల మహత్తు, శక్తి ఏమైపోయినట్లు ? మనం చేయాల్సింది చేయాలి, దేవుడి కటాక్షం కోరాలి అని చెప్పేవారు వుంటారు. అలాంటపుడు ఓదార్పు శాస్త్రవేత్తలకే ఎందుకు, ప్రయోగాన్ని కాపాడలేకపోయినందుకు దేవుళ్లు దేవతలు, స్వాములను కూడా ఓదార్చాలి లేదా అభిశంచించాలి. మూఢనమ్మకాలను పెంచే, శాస్త్రవిజ్ఞానం మీద పూర్తి నమ్మకంలేని తరాలను మనం తయారు చేస్తున్నాము.

ఆయుధాలు, అంతరిక్ష ప్రయోగాల కోసం దేశాలు పోటీ పడ్డాయి. దీనిలో సాంకేతికంగా, మిలిటరీ రీత్యా పై చేయి సాధించటంతో పాటు ‘రాజకీయ’ ప్రయోజనం కూడా చోటు చేసుకుంది. వుదాహరణకు హిట్లర్‌ నాయకత్వంలోని జర్మనీ, ఇటలీ, జపాన్‌ కూటమికి వ్యతిరేకంగా తమతో చేయి కలపాలని అమెరికా, బ్రిటన్‌ దేశాలు నాటి సోవియట్‌ను కోరాయి. 1945 జూలై 16న ప్రపంచంలో తొలిసారిగా అమెరికా అణుబాంబు పరీక్ష జరిపింది. మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌కు ఈ విషయం చెప్పాడు. అయితే అప్పటికే సోవియట్‌ నేత స్టాలిన్‌ వారితో కలవటానికి సూత్ర ప్రాయంగా అంగీకరించారు. మిత్రపక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు. అందువలన ఈ విషయం తెలిస్తే ఒక వేళ స్టాలిన్‌ వెనక్కు తగ్గుతారేమో, కొత్త షరతులను పెడతారేమో అనే అనుమానంతో వెంటనే చెప్పవద్దని ఇద్దరు నేతలూ అనుకున్నారు. జపాన్‌ మీద యుద్దం చేసేందుకు స్టాలిన్‌ అంగీకరించిన తరువాత జూలై 25 తమ దగ్గర ప్రమాదకరమైన ఒక బాంబు వుందని ట్రూమన్‌ సూచన ప్రాయంగా స్టాలిన్‌కు చెప్పాడు. దీనిలో వున్న రాజకీయం ఏమంటే అప్పటికే అమెరికన్లు బాంబు ప్రయోగానికి నిర్ణయించుకున్నారు. ఆగస్టు పదిలోగా బాంబును ప్రయోగించాలని, అలాంటి బాంబులు హిట్లర్‌, స్టాలిన్‌ దగ్గర లేవని ట్రూమన్‌ తన డైరీలో రాసుకున్నాడు. అది జరిగిన తరువాత సోవియట్‌ యూనియన్‌ భయపడిపోయి యుద్ధానంతరం ఐరోపాను పంచుకొనే విషయంలో తమ షరతులకు అంగీకారానికి రాకతప్పదనే ఆలోచన దాగుంది. అయితే స్టాలిన్‌ ఆ సమాచారం విని తాపీగా అలాగా, సంతోషం, మంచికోసమే వుపయోగించాలి అనటం తప్ప ఎలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదు. అప్పటికే యుద్ధం ముగింపుదశలో వుంది. మరో వారం రోజుల్లో సోవియట్‌ సేనలు జపాన్‌పై దాడికి వస్తాయనగా ట్రూమన్‌ ఆగస్టు ఆరున తొలి బాంబును, రెండు రోజుల తరువాత రెండవ బాంబును ప్రయోగించాలని ఆదేశించాడు.యుద్ధం ముగిసిన తరువాత మూడు సంవత్సరాల్లో అంటే 1949 ఆగస్టు 29న సోవియట్‌ యూనియన్‌ తొలి అణుపరీక్ష జరిపింది.అది ప్రపంచ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన విషయం తెలిసిందే.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

సోవియట్‌ పట్టుదల అంతటితో ఆగలేదు. అణుబాంబును మోసుకుపోయి లక్ష్యాల మీద వేసే క్షిపణుల తయారీకి పూనుంది. అమెరికా కంటే ముందుగా అలాంటి ఒక క్షిపణిని ప్రయోగించింది. అదే తరువాత కాలంలో అంతరిక్ష ప్రయోగాలకు ఎన్నో పాఠాలు నేర్పింది. తాము మరో రెండు సంవత్సరాలలో అంతరికక్ష వుపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు 1955లో అమెరికా ప్రకటించింది. దానికంటే ముందే సోవియట్‌ వుపగ్రహాన్ని ప్రయోగించింది, అంతటితో ఆగలేదు 1961లో యూరీ గగారిన్‌ అంతరిక్ష ప్రయాణం చేయించింది. అదే ఏడాది అమెరికన్లు క్యూబామీద దాడి చేసేందుకు ప్రయత్నించి ఎదురు దెబ్బతిన్నారు.దీంతో సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో అమెరికాకు ఎదురు లేదన్న ప్రతిష్ట అడుగంటింది. ఈ పూర్వరంగంలో అమెరికా ఆధిపత్యానికి తిరుగులేదు అంటే ఏమి చెయ్యాలి? అంతరిక్షంలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనం సోవియట్‌ను అధిగమించగలమా ? చంద్రుడి చుట్టూ తిరిగి రాగలమా, చంద్రుడి మీద రాకెట్లను దించగలమా ? రాకెట్లలో మనిషిని పంపి తిరిగి వెనక్కు తీసుకురాగలమా ? ఇవిగాక మన ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకు అవసరమైన నాటకీయ ఫలితాలను సాధించే అంతరిక్ష కార్యక్రమం ఏదైనా వుంటే చెప్పండి అని నాటి అమెరికా అధ్యక్షుడు కెన్నడీ తన సలహాదారులను అడిగాడు. రెండు వారాల తరువాత వుపాధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ నాయకత్వంలోని ఒక కమిటీ సోవియట్‌తో పోటీలో అధిగమించకపోయినా సమంగా అయినా వుండేట్లు చూడాలని కెన్నడీ కోరాడు. దాని ఫలితమే అపోలో కార్యక్రమం.

1961 మే 25న అమెరికా పార్లమెంట్‌, దేశ ప్రజలను వుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ వ్యాపితంగా వున్న మన స్నేహితులుా,శత్రువుల మధ్య జరుగుతున్న పోరులో మనం విజయం సాధించాల్సి వుంది. మనం సైనికుల హృదయాలను చూరగొన గలగాలి. అంతరిక్షంలో 1957లో స్పుత్నిక్‌(సోవియట్‌) సాధించిన నాటకీయ పరిణామాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రతి చోటా ముందుకు పోవాలనే పట్టుదలతో వున్న మార్గంలో ప్రయాణిస్తున్న సైనికులపై ప్రభావం పడింది. మనం అంతరిక్షంలోకి పోవాలి. ఇలా సాగింది ఆ ప్రసంగం. అంతటి అమెరికన్లే తమ రాజకీయ, ఇతర ప్రయోజనాల కోసం అంతరిక్ష కార్యక్రమాన్ని వుపయోగించుకున్నారన్నది స్పష్టం.

ఇదే సమయంలో తమ సోషలిస్టు భావజాలం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు, ఇతర దేశాలను అమెరికా నుంచి దూరం చేసి తమ వైపుకు తిప్పుకొనే రాజకీయాల్లో భాగంగా సోవియట్‌ కూడా తన పాత్ర నిర్వహించింది. పెద్ద విజయంగా టాంటాం వేసుకుంటున్న కాశ్మీరు రాష్ట్ర విభజన, ఆర్టికల్‌ 370 గురించి ఎన్నో రోజులు వూదరగొట్టేందుకు నరేంద్రమోడీకి, బిజెపికి అవకాశం లేదు. ఎంత ఎక్కువగా ప్రచారం చేస్తే అంత ఎక్కువగా ఆ చర్య వలన ఇతర రాష్ట్రాలకు జరిగిన మేలు ఏమిటని జనం ప్రశ్నిస్తారు. ఇదిలా వుండగా దేశంలో ఆర్ధిక మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం మరింత పెరుగుతోంది, పరిశ్రమల మూతలు పెరుగుతున్నాయి. వాటిని గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని నరేంద్రమోడీ అండ్‌కోకు జనం దృష్టిని మళ్లించే ఒక పెద్ద అంశం కావాలి. అందువలన ఈ పూర్వరంగంలో చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని తనకు అనుకూలంగా మలచుకొనేందుకు నరేంద్రమోడీ ప్రయత్నించారా అన్న సందేహం కలగటంలో తప్పేముంది. ప్రయోగాల వైఫల్యం ఇస్రో శాస్త్రవేత్తలకు కొత్త కాదు. అందువలన వారి కంటే నరేంద్రమోడీ ఎక్కువగా హతాశులయ్యారా ? చంద్రయాన్‌ అందినట్లే అంది అందకుండా పోయింది.

చంద్రయాన్‌ 2 విఫలం కాదు, ప్రయోగాలలో అది ఒక భాగమే. ఆర్యభట్ట నుంచి సాగుతున్న విజయాల పరంపరలో ఇదొక చిన్న ప్రయోగం. వైఫల్యాలతో గతంలో ఏ శాస్త్రవేత్త కుంగిపోలేదు. నిరాశపడలేదు. అది అసలు వారి లక్షణం కాదు. వారి ప్రయోగాలు విజయవంతం కావాలని, అది దేశానికి వుపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్‌ 1లో 2008లోనే దాదాపు 10 నెలలపాటు మన పరిశోధనలు చంద్రునిపై సాగాయి, కొన్ని లోపాలు ఉన్నా అది విజయమే, ప్రపంచంలో స్థానం ఆనాడే సాధించాము. గతకాలంలో ఎన్నో విజయాలు సాధించాము. తక్కువ ఖర్చుతో చేపట్టబోయే, 2024లో మొదలయ్యే చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని కోరుకుంటున్నాము.. మన శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఎవరికంటే తీసిపోరు, 104దేశ విదేశీ ఉపగ్రహాలను ఒక్కసారిగా ప్రయోగించిన ఘనత మనవారిదే కదా. అయినా.. కొంతమందికి బాధ అనిపించినా మన దేశానికి ముందు కావలసింది దేశ అభివ ద్ధికి ప్రత్యక్షంగా ఉపయోగపడే ప్రయోగాలు అని గుర్తించాలి. ప్రస్తుత చంద్రయాన్‌ 2 లో ఆర్బిటర్‌ లక్షణంగా పని చేస్తున్నది. లాండర్‌ మాత్రమే విఫలమైంది.

Image result for chandrayaan 2 : who disappointed most Narendra Modi or ISRO scientists

నరేంద్రమోడీ సర్కార్‌ వుగ్రవాదులు, నల్లధనం వున్న వారి మీద కంటే మేధావులు, శాస్త్ర పరిశోధనల మీద సమర్దవంతంగా మెరుపు దాడులు చేసిందని (సర్జికల్‌ స్ట్రెక్స్‌ ) ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి మేథావుల మీద నిరంతరం యుద్ధం సాగిస్తున్నదని, ఒక విశ్వవిద్యాలయం తరువాత మరొక విశ్వవిద్యాలయాన్ని, పరిశోధనా సంస్ధలను లక్ష్యంగా చేసుకొని వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. మోడీ సర్కార్‌లో ఇద్దరు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులకు విద్య లేదా పరిశోధన చేసిన పూర్వరంగం లేదని వారు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి సూచనలను స్వీకరించటం తప్ప నిపుణులు చెప్పేది వినటం లేదని అన్నారు. మన పూర్వీకులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, కృత్రిమ గర్భధారణ పద్దతులను అభివృద్ధి చేశారని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పారు. ఇలాంటి ఆధారం లేని ఆశాస్త్రీయ ప్రచారాలను చేయటంలో మోడీని ఆయన మంత్రులు పెద్ద ఎత్తున అనుకరిస్తున్నారు.ఇలాంటి విషయాలను (చెప్పింది వినటం తప్ప ప్రశ్నించటానికి సాహసం చేయని) ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో లేదా ప్రయివేటు సంభాషణల్లో కాదు, ఏకంగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే చెప్పారని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు.

యుపిఏ హయాంలో శాస్త్ర, పరిశోధనల మీద జిడిపిలో 0.8శాతం ఖర్చు చేస్తే మోడీ హయాంలో అది 0.69కి పడిపోయింది. అమెరికా అత్యధికంగా 3-4శాతం వరకు ఖర్చు చేస్తుండగా చైనా రెండుశాతంపైగా చేస్తున్నది. వైఫల్యాలన్నీ పరిశోధన బడ్జెట్‌ను బట్టే వుంటాయని చెప్పలేము గానీ,తగినన్ని నిధుల కేటాయింపు లేకపోయినా ప్రయోగాలు విజయవంతం కావు. పరిశోధనల మీద ఖర్చును పెంచాలని దేశవ్యాపితంగా శాస్త్రవేత్తలు ప్రదర్శనలు చేసిన విషయం తెలిసినదే.విజయం అంచున ఖ్యాతిని సొంతం చేసుకొనేందుకు పరిశోధనా కేంద్రాలకు చేరి తాపత్రయం పడే రాజకీయాలకు నేటి నేతలు స్వస్తి పలకాలి. అలాంటివి శాస్త్రవేత్తలను మరింత వత్తిడికి గురిచేస్తాయి. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఓదార్పులు, ఆ పేరుతో ప్రచారం కాదు. వర్తమానంలో వున్న ఆవిష్కరణలన్నింటినీ మన పూర్వీకులు ఎప్పుడో కనుగొని వాడిపారేశారు, ఆ విజ్ఞానమంతా వేదాల్లో , సంస్కృత గ్రంధాల్లో వుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిని వెలికి తీసి దేశానికి మేలు చేసి పక్కా దేశభక్తులని నిరూపించుకోండని చేసిన సూచనలను ఏ ఘనాపాఠీ, సంస్కృత పండితులు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు నైవేద్యం తినడనే నిజం పూజారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియనట్లే వాటిలో కావలసినంత అజ్ఞానం తప్ప విజ్ఞానం లేదని పండితులకు బాగా తెలుసు. ఇస్రో లేదా మరొక శాస్త్ర పరిశోధనల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలా కాదు, వారిలో నిజాయితీ వుంది, తాము నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలంటే వాటిని నిరుత్సాహపరిచే అశాస్త్రీయ భావాల ప్రచారాన్ని కట్టిపెట్టాలి. ఆవు మూత్రం, పేడలో ఏముందని తెలుసుకొనేందుకు కాదు, జనానికి పనికి వచ్చే పరిశోధన, అభివృద్ధికి నిధులను గణనీయంగా పెంచాలి. అవి లేకుండా ఓదార్పుల వలన ప్రయోజనం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలకుల దాడి – ప్రశ్నార్ధకంగా మారిన మీడియా విశ్వసనీయత !

06 Friday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

attacks on journalists, BJP, BJP's social media, Indian media credibility, Journalism in India, Media, Narendra Modi

Image result for government attack and question of indian media credibility

ఎం కోటేశ్వరరావు

ఒకే దేశం ఒకే చట్టం అనే భావోద్వేగాల ముసుగులో దేశ చరిత్రలో తొలిసారిగా ఒక్క దెబ్బతో ఒక రాష్ట్రాన్ని ఏకంగా రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేసి అక్కడి జనానికి దేశంతో సంబంధాలను తెంపివేసిన ఆగస్టు ఐదు, 2019 నాటి అత్యంత అప్రజాస్వామిక చర్య వారాలు గడిచినా సాధారణ పరిస్ధితులు ఏర్పడలేదు. దేశంలో ఎన్ని పత్రికలు, టీవీలు ఈ చర్యను విమర్శనాత్మకంగా చూశాయి అన్నది ఒక ప్రధానమైన అంశం. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి వున్న అనేక వివాదాస్పద అంశాలు, జనజీవితంతో పెనవేసుకున్న ఆర్ధిక వ్యవస్ధ దిగజారుడు పర్యవసానాల గురించి మీడియాలో ఎంత చోటు దక్కిందన్నది ఒక శేష ప్రశ్నగా మారింది.కాశ్మీరు గురించి మీడియా చర్చల్లో ఎక్కడో కొంత మంది చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు తప్ప స్వంత కధనాలను జనం ముందుకు ఎన్ని తెచ్చాయంటే చెప్పలేని స్ధితి. అధికార పార్టీని చూసి నిజం చెప్పలేని స్ధితిలో మీడియా పడిపోయిందా ?ప్రస్తుతం భారత మీడియాలో వేళ్ల మీద లెక్కించదగిన సంస్ధలు తప్ప మొత్తం మీద విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. అంతకు ముందు కూడా ఆ సమస్య వున్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా వేగంగా దిగజారుతున్నది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్ధగా చెప్పుకుంటున్న మన దేశంలో జర్నలిజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. వుత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్‌ సర్కార్‌ చర్య ఒక వుదాహరణ. మధ్యాహ్న భోజన పధకంలో రొట్టెలతో కూరలకు బదులు వుప్పు అందచేసిన అంశాన్ని వీడియో తీసి వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు మీద అక్కడి అధికార యంత్రాంగం కేసు పెట్టింది. మీరు కావాలంటే ఫొటోలు తీసుకోవచ్చు, మీకు తప్పుగా కనిపించినదాని గురించి ఏమైనా రాసుకోవచ్చు. కానీ వీడియో తీయటం అంటే అనుమానించాల్సి వస్తోంది. ఒక కుట్రలో భాగంగానే వీడియో తీశారంటూ జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ పటేల్‌ సదరు జర్నలిస్టు మీద పెట్టిన కేసును సమర్ధించారు. కేసు పెట్టాలి, దానికి ఒక సాకు చూపాలి అంతకు మించి దీనిలో మరొకటి కనిపించటం లేదు. ఫొటోలు తీయటానికి అర్హత వున్న ఒక జర్నలిస్టు వీడియో తీయకూడదని ఏ నిబంధనలు చెబుతున్నాయి. జర్నలిస్టుల పట్ల బిజెపి పాలకుల వైఖరికి ఇది చక్కటి నిదర్శనం. అధికారంలో వున్న వారికి వ్యతిరేకంగా నిజం చెప్పకూడదు, చూపకూడదు.

నరేంద్రమోడీ తొలిసారి ఎన్నికైనపుడు చమురు ధరలు భారీగా క్షీణించి జనానికి పెద్దగా వుపయోగపడకపోయినా దిగుమతి బిల్లు తగ్గించి కేంద్ర ప్రభుత్వానికి ఎంతో మేలు చేశాయి. అయినా ఎప్పుడైతే ఆర్ధికంగా దిగజారుడు ప్రారంభమైందో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నో జిమ్మిక్కులు చేశారు.1970దశకం తరువాత గత ఏడాది నిరుద్యోగ శాతం 6.1శాతానికి పెరిగి పాత రికార్డును బద్దలు కొడితే ఇప్పుడు మొత్తంగా 8.2శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.4శాతానికి చేరిందని తాజా పరిశీలనలు వెల్లడించాయి. వుద్యోగాలు ఎంత మందికి కల్పించారు అని అడిగితే లెక్కలు సరిగా వేయటం లేదు అని ఒకసారి, పకోడీలు తయారు చేయటం కూడా వుపాధి కల్పనే వాటన్నింటినీ కూడి తరువాత చెబుతామంటూ మోడీ దాటవేశారు. ఇంతవరకు లెక్కలు చెప్పలేదు. కొత్త వుద్యోగాలు కల్పించకపోగా వున్న వుద్యోగాలు కూడా పోతున్నాయని, ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి జారుతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. పలుకే బంగారమాయెగా అన్నట్లు అసలేం జరుగుతోందో చెప్పటానికి మోడీ నోరు విప్పటం లేదు. బ్యాంకులకు పని గట్టుకొని రుణాలు ఎగవేసినట్లుగా ముఖ్య విషయాలపై మౌనం ఒక ప్రధాన సమస్యగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వ తీరు తెన్నుల గురించి మీడియా శల్యపరీక్ష చేయాల్సి వుంది. జర్నలిస్టులు, మీడియా ఈ విషయంలో శక్తిహీనులైతే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటం తప్ప మరొకటి కాదు. విమర్శనాత్మకంగా తమ కలాలు, గళాలను పని చేయించే జర్నలిస్టులు వున్నప్పటికీ మీడియా మొత్తంగా కార్పొరేట్ల చేతిలోకి పోవటంతో యాజమాన్యాలు తొక్కిపడుతున్నాయి. ఇది మరింత ప్రమాదకరం.

Image result for government attack and question of indian media credibility

మూడు సంవత్సరాల క్రితం దేశంలో నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్ర్రకటించారు. దాని ఫలితాలు వెంటనే కాదు, తరువాత వస్తాయని నరేంద్రమోడీ చెప్పారు. జిందా తిలిస్మాత్‌ సర్వరోగ నివారిణి అన్నట్లుగా తన చర్యతో అవినీతి మటుమాయం అవుతుందని బల్లగుద్దారు. ఆర్ధికవేత్తలుగా వున్న వారు కూడా ఖాళీ పత్రం మీద సంతకాలు చేసినట్లుగా సమర్ధించారు. ఆ సమయంలో ఒకటీ అరా తప్ప మొత్తంగా మీడియా నిజమే నిజమే అన్నట్లుగా వంత పాడి జనాల్లో భ్రమలను పెంచింది తప్ప ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలతో అవినీతి తగ్గిందా అనే చర్చకు తెరతీయలేదు. విషాదం ఏమిటంటే త్వరలో పెద్ద నోట్ల రద్దు మూడో వార్షికోత్సవానికి సిద్దం అవుతున్నాము. ఈ కాలంలో నరేంద్రమోడీ దాని గురించి ఒక్కసారి కూడా ఎందుకు నోరు విప్పలేదో ఏ మీడియా అయినా అడిగిందా, ఏ జర్నలిస్టు అయినా ధైర్యం చేశారా? ఏ ఆర్ధిక వేత్త అయినా తాము చెప్పింది తప్పని చెంపలు వేసుకున్నారా?

పుల్వామా వుగ్రదాడి తరువాత మన సైనిక దళాలు బాలాకోట్‌ పట్టణం మీద మెరుపుదాడి చేసి వందల మంది వుగ్రవాదులను మట్టుబెట్టినట్లు మీడియాకు చెప్పారు. అందుకు రుజువు ఏమిటని అడిగిన రాజకీయపార్టీలను దేశద్రోహులు, మన సైనిక సామర్ధ్యాన్ని అవమానిస్తున్నారంటూ మనోభావాలను రెచ్చగొట్టి బిజెపి, దాని సోదర సంస్ధలు జనాన్ని వుసిగొల్పాయి. అది రాజకీయ క్రీడలో భాగం అనుకోండి. మీడియా ఎలాంటి తటపటాయింపులు లేకుండా ఒకదానితో మరొకటి పోటీపడి ఆ ప్రచారాన్ని తలకెత్తుకొని యుద్దోన్మాదాన్ని, దాన్ని వ్యతిరేకించిన వారిపై వ్యతిరేకతను రెచ్చగొట్టటాన్ని చూశాము. అధికార రాజకీయ పక్షానికి, మీడియా వైఖరికి తేడా చెరిగిపోయింది. రాయిటర్స్‌, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్ధలు మాత్రమే ప్రభుత్వ, అధికారపక్ష ప్రచారాన్ని సవాలు చేశాయి. ఫలితంగా దేశీయ మీడియా విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది.

ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి రేటు గురించి ఎన్నికలకు ముందు మార్చినెలలో వందకు పైగా ఆర్ధికవేత్తలు రాసిన ఒక బహిరంగలేఖను మీడియా విస్మరించిది. వార్త ముగింపులో ఫలానా వారు కూడా ప్రసంగించారు అని రాసినట్లుగా మోడీ సర్కార్‌ చెప్పుకుంటున్న అభివృద్ధిని తమ లేఖలో ప్రశ్నించారు అన్నట్లుగా వార్తలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వమే అసలు విషయాలను బయటపెట్టాల్సి వస్తోంది. మీడియా దాన్ని పాఠకులకు అందించే సమయంలో గతంలోనే ఫలానా ఆర్ధికవేత్తలు సర్కార్‌ ప్రచారాన్ని ప్రశ్నించారు అని రాయటానికి చేతులు, చెప్పటానికి నోరు రావటం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమ మనుగడకోసం విధిలేక కొన్ని అంశాలను వెల్లడించాల్సి రావటం తప్ప ఎక్కువ భాగం జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్ధలు పాలకపార్టీల బాకాలుగా మారాయి.

ఒక ప్రధానిగా ఇంతవరకు నరేంద్రమోడీ పత్రికా గోష్టి పెట్టలేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొద్ది రోజుల్లో వెలువడ నుండగా బిజెపి ప్రధాన కార్యాలయంలో ఒక పత్రికా గోష్టి నిర్వహించారు. ముందే తయారు చేయించిన ఒక ప్రకటన విడుదల చేసి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పక్కన చిరునవ్వులు చిందిస్తూ మోడీ కూర్చున్నారు, విలేకర్ల ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానం చెప్పారు. చూశారా ప్రధాని అయ్యుండి కూడా పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంటూ దాన్ని కూడా మోడీ ఘనతగా మీడియా చిత్రించింది.ఎన్నికల సమయంలో మోడీతో ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో జాతీయ మీడియా సంస్ధలు గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాయి. అలాంటి అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వని కారణంగా అదంతా అధికారపక్ష ఆర్ధిక పాకేజీల్లో భాగమని జనం అనుకున్నారు. లాలూచీ కుస్తీ మాదిరి ఇంటర్వ్యూలు సాగాయి తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు ఒక్కటీ వేయలేదు. ఎన్నికల సమయంలో విమర్శనాత్మకంగా వార్తలిచ్చిన హిందూ, టెలిగ్రాఫ్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలకు రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ ప్రభుత్వ ప్రకటనల జారీలో కోత పెట్టిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. 2002లో మీడియా స్వేచ్చలో 139దేశాల్లో మన స్ధానం 80వది, అలాంటిది తాజాగా సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ ప్రకటించిన 180 దేశాల్లో మనది 140వ స్ధానం. నిత్యం హింసా వాతావరణం వుండే దేశాలకంటే మనది దిగువన వుంది అని చెప్పుకోవాల్సి రావటం సిగ్గు చేటు.

1975లో నాటి కాంగ్రెస్‌ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించినపుడు దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే జనం బిబిసి రేడియో మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎదిరించిన మీడియాను అణచివేస్తే లొంగిపోయిన మీడియా ప్రభుత్వ బాకాగా మారిపోయింది. ఇప్పుడు దేశంలో అత్యవసర పరిస్ధితి లేదు. అయినా కాశ్మీరులో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే జాతీయా మీడియాతో ఫలితం లేదని తేలిపోయింది. నాటి అత్యవసర పరిస్ధితిలో మాదిరి తిరిగి నేడు కాశ్మీర్‌లో వేలాది మందిని అరెస్టు చేశారనే వార్తల కోసం విదేశీమీడియాను, ఇంటర్నెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాంటి ఆసక్తి ఎందరికి , అందరిలో వుండే అవకాశం లేదు, అందువలన హిజ్‌మాస్టర్‌ వాయిస్‌ లేదా రాణీగారీ ప్రతిపక్షం మాదిరి మన మీడియా అందిస్తున్న అంతా బాగుంది వార్తలనే చదవటం, చూడాల్సి వస్తోంది. జమ్మూకాశ్మీర్‌ను మొత్తంగా మూసివేసిన మోడీ సర్కార్‌ చర్యను ఏ విదేశీ నేత కూడా ప్రశ్నించలేదు కదా అనే వాదనను మన మీడియా ముందుకు తెస్తోంది. నాణానికి రెండోవైపు చూస్తే ఏ నేత ఏ దేశం కూడా సమర్ధించిన దాఖలా కూడా లేదు. మన దేశంతో వున్న ఆర్ధిక సంబంధాలు, మార్కెట్‌ మీద ఆశతో విదేశాలేవీ మన సర్కార్‌తో ఘర్షణపడేందుకు సిద్దంగా లేవు.

భారత్‌లో పత్రికలు, టీవీ ఛానల్స్‌ పైకీ కిందికీ గంతులు వేస్తూ కేరింతలు కొడుతున్నాయని కాశ్మీర్‌లో పరిస్ధితి గురించి అంతర్జాతీయ పత్రిక ఎకానమిస్టు పేర్కొన్నది. విదేశీ మీడియా ఛానల్స్‌ కధనాల మీద దాడి చేయటంలో సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ అనుకూల మరుగుజ్జుల(ట్రోల్స్‌)తో పాటు, సాంప్రదాయక మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు కూడా తోడవుతున్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను కాశ్మీర్‌లో ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవటాన్ని మీడియా దాదాపుగా సమర్దించిందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికల్లో ఎప్పటి నుంచో చెబుతున్నామని బిజెపి చెబుతోంది. దాని మంచి చెడ్డల గురించి ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది కనుక కాసేపు పక్కన పెడదాము. కాశ్మీర్‌ రాష్ట్రాన్ని రద్దు చేస్తామని, రెండుగా చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తామని, ఆప్రక్రియకు ముందూ, తరువాత దాన్ని మొత్తంగా బహిరంగ జైలుగా మారుస్తామని, కమ్యూనికేషన్‌ వ్యవస్ధను మూలన పడేస్తామని బిజెపి ఎక్కడా ముందు చెప్పలేదు కదా ? దీన్ని గురించి మన మీడియా ఎన్నడైనా ప్రశ్నించిందా ? ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే గళాలకు చోటు ఇస్తోందా ? కాశ్మీర్‌పై తీసుకున్న చర్యలకు మద్దతుగా మీడియాలో ఇచ్చిన కవరేజి, దేశవ్యాపితంగా దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధ మంచి చెడ్డల గురించి వివరించేందుకు కేటాయిస్తున్న సమయం, స్ధలం ఎంత ?.

కాశ్మీరు ఒక పంజరం అనే ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వత్తిడి తీసుకురావటంతో క్లబ్‌ నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దుచేశారు. అదే విధంగా సంత్‌ రవిదాస్‌ దేవాలయ కూల్చివేతకు నిరసనగా కొన్ని సంస్ధల వారు ఢిల్లీలోని మహిళా జర్నలిస్టుల క్లబ్బులో పత్రికా గోష్టి నిర్వహించేందుకు హాలును అద్దెకు తీసుకున్నారు. ప్రభుత్వం క్లబ్‌ నిర్వాహకుల మీద వత్తిడి తీసుకువచ్చి అనుమతిని రద్దు చేయించింది.1992లో బాబరీ మసీదును కూల్చివేయటాన్ని ఖండిస్తూ అనేక మంది పారిశ్రామికవేత్తలు పత్రికలకు ఇచ్చిన యాడ్స్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇప్పుడు కాశ్మీర్‌ విషయంలో అలా బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు భయపడుతున్నారని చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2015లో అద్వానీ, ఆయనేమీ మోడీ అభిమాని కాదు, వెంటనే గాకపోయినా త్వరలో దేశంలో మరో అత్యవసర పరిస్ధితిని ప్రకటిస్తే తాను ఆశ్చర్యపోనని చెప్పారు.అది తీవ్రమైన అనుమానంగానే వుంటుంది, అయితే ఒక విషయం ఖాయం, దాన్ని సమర్ధించేందుకు మీడియా సిద్దంగా వుంటుంది అని ఎకానమిస్ట్‌ పేర్కొన్నది.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను మౌన మునిగా వర్ణించిన నరేంద్రమోడీ అండ్‌ కో ఆయన మాదిరిగా కూడా నోరు విప్పిన పాపాన పోలేదు. సామాజిక మాధ్యమం గురించి జరిపిన పరిశీలనలో 201-18 మధ్య సోషల్‌ నెట్‌వర్క్‌ల సంఖ్య 16.8 కోట్ల నుంచి 32.6 కోట్లకు పెరిగింది. వీటి ద్వారా పాలక బిజెపి అర్ధసత్యాలు, అసత్యాలను పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చింది. వాటికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుల మీద ప్రచారదాడులు జరుగుతున్నాయి. భారత సంస్కృతి పరిరక్షణ, వున్నతి గురించి సుద్దులు చెప్పిన నోళ్లతోనే మహిళా జర్నలిస్టులను నోరు బట్టని బూతులు తిట్టటం, మానభంగాలు చేస్తామని బెదిరింపులు కూడా సాగించిన, సాగిస్తున్న వుదంతాలు తెలిసిందే. విమర్శకుల నోరు మూయించే ఆయుధాలుగా సామాజిక మాధ్యమాలను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన, విమర్శించిన వారిని దేశద్రోహులుగా, పాకిస్ధాన్‌, చైనా ఏజంట్లుగా, వుగ్రవాదుల మద్దతుదారులుగా ముద్రవేశారు. స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు బిజెపికి చెందిన వారు ఎలా ఈ ప్రచార దాడిని సాగిస్తున్నారో ఒక పుస్తకంలో వివరించారు. తమ పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించే ఛానల్స్‌,పత్రికల యాజమాన్యాల మీద సిబిఐ, ఇడి వంటి సంస్ధలతో దాడులు చేయించటం, ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయటం, అధికారపక్షం నుంచి చర్చలను బహిష్కరించటం వంటి చర్యలు సర్వసాధారణం అయ్యాయి.

తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి గొప్పలు చెప్పుకొనేందుకు మీడియాను నరేంద్రమోడీ ఎలా వుపయోగించుకున్నారో 2018లో ఒక వుదంతం వెల్లడించింది. చత్తీస్‌ఘర్‌కు చెందిన ఒక గిరిజన మహిళా రైతుతో నరేంద్రమోడీ మాట్లాడినదానిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ధాన్యం బదులు సీతాఫలాలను పండించటం ద్వారా తన ఆదాయం రెట్టింపు అయిందని ఆ మహిళ చెప్పింది. అయితే దాని గురించి అనుమానం వచ్చిన ఎబిపి ఛానల్‌ ప్రతినిధులు ఆ మహిళ వద్దకు వెళ్లి విచారించగా అలా చెప్పాలని బిజెపి నేతలకు తనకు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్తను మాస్టర్‌ స్ట్రోక్‌ కార్యక్రమాన్ని నిర్వహించే పుణ్య ప్రసూన్‌ వాజ్‌పేయి ప్రసారం చేయటంతో ప్రధాని పరువుపోయింది. దాంతో కక్ష గట్టిన ప్రభుత్వం రామ్‌దేవ్‌ బాబా కంపెనీ పతంజలితో సహా దాదాపు వంద కోట్ల రూపాయల విలువగల అనేక ప్రయివేటు కంపెనీల వాణిజ్య ప్రకటనలను ఆ ఛానల్‌కు నిలిపివేయాలని వత్తిడి తెచ్చింది. దాంతో యాజమాన్యం ఆ జర్నలిస్టును బలవంతంగా రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని తృప్తి పరచింది. తన కార్యక్రమంలో మోడీ ప్రస్తావన రాకుండా చూడాలని యాజమాన్యం ఆదేశించిందని, మీడియాలో మోడీ గురించి వస్తున్న వార్తల తీరుతెన్నులను విశ్లేషించేందుకు రెండు వందల మందితో ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి మోడీ గురించి ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో సంపాదకులకు ఆదేశాలు వెళతాయని ప్రసూన్‌ వాజ్‌పేయి వెల్లడించారు. దేశంలో విద్వేష నేరాలు ఎలా పెరుగుతున్నాయో తెలిపేందుకు హిందూస్ధాన్‌ టైమ్స్‌లో ఒక పర్యవేక్షణ ప్రారంభించిన బాబీ ఘోష్‌ అనే జర్నలిస్టు పని తీరు ప్రభుత్వానికి నచ్చలేదంటూ యాజమాన్యంపై వత్తిడి తేవటంతో అతను రాజీనామా చేసి ఇంటికిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ పత్రిక ఆ పర్యవేక్షణను నిలిపివేసింది. లైసన్సు రాజ్యం అంటూ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించే బిజెపి ఆ విషయంలో తక్కువేమీ తినలేదు. టీవీ ఛానల్స్‌ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. బిజెపి ఎంపీ యాజమాన్యంలో, బిజెపి అనుకూల ఆర్నాబ్‌ గోస్వామి నిర్వహణలో రిపబ్లిక్‌ టీవీకి అలా దరఖాస్తు చేయగానే ఇలా అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే మోడీ సర్కార్‌ పట్ల విమర్శనాత్మకంగా వుండే రాజీవ్‌ బహాల్‌ నిర్వహణలో బ్లూమ్‌బెర్గ్‌ క్వింట్‌ సంస్ధ దరఖాస్తు చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఎటూ తేల్చలేదు.

Image result for government attack and question of indian media credibility

దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్ధ రిలయన్స్‌, దాని యజమాని ముకేష్‌ అంబానీ పెద్ద సంఖ్యలో అన్ని భాషలల్లో ఛానళ్లను ప్రారంభించటం లేదా కొనుగోలు చేసి పెద్ద మీడియా అధిపతిగా మారిన విషయం తెలిసిందే. తన వ్యాపారాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారంలో ఎవరుంటే వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార అవకాశాలు కల్పించటం, విమర్శలకు దూరంగా వాటిని నిర్వహిస్తారు. కోబ్రాపోస్ట్‌ నిర్వహించిన ఒక శూల శోధనలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇండియా టుడే వంటి బడా సంస్ధలతో పాటు 25 మీడియా సంస్ధల ప్రతినిధులు మాట్లాడుతూ ఇచ్చే సొమ్మును బట్టి బిజెపికి ప్రచారంతో పాటు మతపరమైన విద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేందుకు సిద్దం అని చెప్పిన విషయాలు వెల్లడయ్యాయి. అంటే మన మీడియా సంస్ధలు డబ్బుకోసం ఎంతకైనా తెగించటానికి సిద్దపడుతున్నాయి.అయితే అన్నీ ఇలాంటి సంస్ధలే లేవు. హిందూ పత్రిక, ఎన్‌డిటివీ వంటి న్యూస్‌ ఛానల్స్‌, వైర్‌, స్క్రోల్‌, బూమ్‌లైవ్‌, న్యూస్‌ మినిట్‌, ఆల్ట్‌న్యూస్‌ వంటి వెబ్‌ మీడియా సంస్ధలు వాస్తవాలను వెల్లడించటానికి వెనుకాడటం లేదు. అలాంటి సంస్ధలు వెల్లడించిన కుంభకోణాలు, అక్రమాల మీద వందల కోట్ల రూపాయల మేర నేరపూరిత పరువు నష్టదావాలను వేస్తూ వాటి నోరు మూయించే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటి సంస్ధలకు ఆదాయాలు పరిమితం, ప్రభుత్వ దాడులను తట్టుకొని అవి ఎంత కాలం నిలబడగలవు అన్నది శేష ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన్‌కీ బాత్‌ కాదు – మోడీ మభ్య పెట్టే మాటలు !

02 Monday Sep 2019

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India economy 2019, Manki baat, manki baat-modi, modi duping and diversionary tactics, Narendra Modi and Nero

Image result for not his manki baat-modi duping and diversionary tactics

మిత్రమా వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు అక్షింతలు కూడా అందుకో ! గత ఐదు సంవత్సరాలుగా దేశభక్తి, జాతీయవాదాన్ని జనం చేత తినిపించి, తాగించి, పీల్పించారు. అదేదో సినిమాలో డివైన్‌ అంటే వైన్‌ ఎంత తాగితే అంత జ్ఞానం వస్తుంది అని చెప్పినట్లుగా వాటికి అర్ధం తెలియకుండానే, తప్పుడు లేదా అనర్ధక అర్ధాలను వ్యాపింప చేసిన వారి స్వరూపం తెలియకనే చాలా మంది వాటిని పాటించారు, పాటిస్తున్నారు.

మన ఘనత వహించిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తెలివితేటలు, సామర్ధ్యం, ఆర్ధిక విషయాల్లో ఆయన పరిజ్ఞానం గురించి మీ వంటి వారంతా ఇప్పటికీ నమ్ముతూ ఆహా, ఓహో అంటూ హారతులు పడుతూనే వున్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు వెంటనే రావు తరువాత చూడండి అంటే నిజమే కామోసు అనుకున్నారు, నాలాంటి వారు ఎవరైనా కాదంటే ఖండించి మీద పడి కొట్టినంత పని చేశారు. మూడేండ్లు కావస్తోంది, ఆ ఛాయలు లేవు, మోడీ మాటల్లో ఆ వూసుల్లేవు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు అంటే అది మా మోడీ ప్రత్యేకం మోడినోమిక్స్‌ అన్నారు. ఇప్పుడు దేశం మాంద్యంలోకి పోతోంది అంటే అది ప్రపంచ పరిణామాల్లో భాగం అని పన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మీవి నోళ్లా , మరింకేమైనానా ! మోడీ-షా ద్వయం తెలివితేటలు ఏ మయ్యాయి. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగే వారికి డామిట్‌ కధ అడ్డం తిరిగింది అని గిరీశాన్ని తలచుకోవాల్సిన రోజులు దగ్గరలోనే వున్నాయి.

సందర్భం ఏమంటే మిత్రమా గతనెల మన్‌కీ బాత్‌ విన్న తరువాత అవధానం గుర్తుకు వచ్చింది. అష్టావధాని గారికి ఎనిమిది మంది ప్రచ్చకులు సమస్యలను, ప్రశ్నలను సంధిస్తారు. అలాంటి వారిలో ఒకరు అసందర్భ ప్రలాపి వుంటారు. అంటే అవధాని దృష్టిని మళ్లించినా గాడి తప్పకుండా తన పాండిత్యాన్ని ప్రదర్శించటానికి వుద్దేశించింది. దేశమంతటా దిగజారుతున్న ఆర్ధిక స్ధితి గురించి పృచ్ఛకులు అంటే ప్రాశ్నికులు లేదా ప్రశ్నించేవారు సంధిస్తున్న ప్రశ్నలకు అవధాని స్ధానంలో వుండి సమాధానం చెప్పాల్సిన నరేంద్రమోడీ తానే ఒక పృచ్ఛకుడిగా మారి అదీ అసందర్బ Ûప్రలాపి పాత్ర తీసుకున్నారని నేనంటే నీకు, నీ బృందానికి చెప్పుకోలేని చోట మండటం సహజం.

మన్‌కీ బాత్‌ కంటే ముందు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్లాస్టిక్‌ అనర్ధాల గురించి మోడీగారు సెలవిచ్చారు. ప్లాస్టిక్‌ అనర్ధాల గురించి ఎందరో ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన సర్కార్‌ తీసుకున్న చర్యలేమిటో వాటి ఫలితాలేమిటో చెప్పి సుభాషితాలను కొనసాగించి వుంటే విశ్వసనీయత వుండేది. ఇలా వ్యాఖ్యానించిన వారు మీ దృష్టిలో దేశద్రోహులు అవుతారని తెలుసు. రాబోయే రోజుల్లో ఇలాంటి దేశద్రోహులు మరింతగా పెరిగే విధంగా మోడీగారి తీరు తెన్నులు వున్నందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలియనంత కాలం జనం మోసపోతూనే వుంటారు అని కమ్యూనిస్టు అగ్రనేత లెనిన్‌ మహాశయుడు చెప్పారు. కొందరిని కొంత కాలం మభ్యపెట్టగలరు గానీ అందరినీ ఎల్లకాలం మోసగించలేరని మన పెద్దలు చెప్పారు. రెండింటి అర్ధం ఒకటే. ఐదేండ్ల క్రితం మోడీ చెప్పిందేమిటి, దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి, మోడీ నోట వెలువడుతున్న మాటలేమిటి ? ఒకదానికికొకటికి పొంతన వుందా ? ఏ ఒక్క సమస్యపై అయినా సమగ్రంగా పని చేశారా? ఫలితాలు సాధించారా ?

మిత్రమా నా లాంటి వారు చెబితే కుహనా మేథావులు, విదేశీ తొత్తులు, తప్పుదారి పట్టించేందుకు ఇస్తున్న తప్పుడు సలహాలు అని పక్కన పెట్టేస్తారు. మీ మోడీగారికి ప్రసంగాలు, అంశాలను రాసిచ్చే వారు మోడీని విమర్శించే వారికి అవసరమైన సమాచారాన్ని సరఫరా చేస్తున్నారని మీరైనా చెప్పండి. గొడ్డు మాంసం ద్వారా గో సంతతికి ముప్పు తెస్తున్నారని మోడీ అండ్‌కో ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఆవు మనోభావాలను రెచ్చగొట్టిన విషయం గుర్తుందా ? అదే మోడీ గారి చేత గో హంతకులంటే ప్లాస్టిక్‌ వల్లనే ఆవులకు ముప్పు ఎక్కువగా వుందని,చనిపోతున్నాయని చెప్పించిన దానిని యాది చేసుకోండి.2015 సెప్టెంబరు 28 గో రక్షకుల ముసుగులో మహమ్మద్‌ అఖ్లక్‌ను దాద్రి గ్రామంలో హత్య చేసిన పదకొండు నెలలకు మోడీగారు నోరు తెరిచారు. ఆ దురంతాన్ని ఖండించేందుకు కాదు సుమా !

పంజాబ్‌, వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని మాట్లాడారు తప్ప మరొకటి కాదు. ‘ కొందరు జనాలు గో రక్షణ పేరుతో దుకాణాలు తెరిచారు. కొంత మంది రాత్రిపూట సంఘవ్యతిరేక పనులు చేస్తారు, పగలు గోరక్షకులుగా వ్యవహరిస్తారు. ఇలాంటి చెడ్డ పనులు చేసిన వారిలో 70 నుంచి 80శాతం మంది చర్యలను సమాజం అంగీకరించలేదు, వారి చెడు కార్యకలాపాలను కప్పి పుచ్చుకొనేందుకు గోరక్షకుల ముసుగు వేసుకున్నారు ‘ అని చెప్పిన ప్రధాని పార్టీ వారు ఆ పేరుతో నేరాలకు పాల్పడిన వారిని బిజెపి పాలిత ప్రాంతాల్లో ఎందరిని శిక్షించారు. మోడీ అంతటితో ఆగలేదు గోహంతకుల చేతుల్లో కంటే ప్లాస్టిక్‌ తిన్న కారణంగా మరణిస్తున్న ఆవులే ఎక్కువ అని కూడా చెప్పారు. జనం సంగతి వదలి పెట్టండి వుద్యోగం సద్యోగం, ఆదాయం లేకపోయినా మోడీగారి పుణ్యమా అని దేశభక్తి, జాతీయవాదంతో ప్రాణాలు నిలుపు కుంటున్నారు. గోవులకు అంత బుర్రలేదు కనుక కనీసం బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆవులు ప్లాస్టిక్‌ తినకుండా తీసుకున్న చర్యలు ఏమిటో సెలవిస్తారా మిత్రమా ? గోరక్షకులు లేదా వారి వెనుక వున్న ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రోడ్ల మీద తిరుగుతున్న ఆవులు ప్లాస్టిక్‌ తినకుండా వాటి వెనుక తిరుగుతూ కాపాడుతున్న సేవా దృశ్యాలు మనకు ఎక్కడా కానరావు.

ఆవులు తిన కుండా వుండేందుకు ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలంటూ కరుణా సొసైటీ సుప్రీం కోర్టులో 2012లో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.2016లో దాని మీద తీర్పు చెబుతూ నిషేధం గురించి పరిశీలించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఇంతవరకు మోడీ సర్కార్‌ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఇప్పుడు ప్లాస్టిక్‌ నిషేధం గురించి కబుర్లు చెబుతున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆవుల రక్షణకు చట్టాలను చేశారు గానీ మోడీ చెప్పినట్లు వాటి మరణాలకు కారణం అవుతున్న ప్లాస్టిక్‌ గురించి ఎలాంటి చర్యలూ లేవు. గతంలో స్కైలాబ్‌ కూలిపోతోందనే వార్తలతో జనం రాత్రింబవళ్లు అదేదో తమ మీదే పడనుందన్నట్లు భయపడ్డారు. ఇప్పుడు ప్లాస్టిక్‌ ముప్పు గురించి కొత్తగా వెలువడిన ఆకస్మిక సమాచారమూ లేదు, కొత్తగా ఆందోళన పడాల్సిందీ లేదు. మరొక సమస్యదీ లేనట్లు మోడీ గారు దాని గురించి చెబుతుంటే ఆయన గారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. రిజర్వుబ్యాంకు నిధులను ఖాళీ చేసి దాన్ని దివాలా తీయించటానికి రంగం సిద్ధం చేశారన్న విమర్శలూ పట్టవు, ఆర్ధిక వ్యవస్ధ దిగజారుతోందన్న ఆందోళనా లేదు. రోమ్‌ తగులబడుతోంటే పట్టించుకోకుండా ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరి ప్లాస్టిక్‌, ఫిట్‌ నెస్‌ గురించి కబుర్లు చెప్పటం ఏమిటి ?

మిత్రమా నీకు ఒక ప్రశ్న వేయక తప్పదు. ప్లాస్టిక్‌ గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసే వినాయకవిగ్రహాలు, వాటిని నీటి వనరుల్లో కలిపి కలుషితం చేస్తున్న తీరు గురించి ఎందుకు నోరు విప్పరు. మీరే చెప్పినట్లు మెజారిటీ రాష్ట్రాల్లో మెజారిటీ జనం మీ వెనుకే వున్నారు, అంటే మెజారిటీ కాలుష్య వినాయక విగ్రహాలకు కూడా మీరే బాధ్యులు. మరి దాని గురించి ఎందుకు చెప్పరు? వినాయకుడి పేరుతో వసూలు చేసే వారి వుపాధి, ఆదాయాలు పోతాయనా, మీ ఓటు బ్యాంకుకు నష్టం జరుగుతుందనా? కాలుష్యం, పర్యావరణ రక్షణ అంటే సమగ్ర చర్యలు తీసుకోవాలి తప్ప ప్లాస్టిక్‌ వరకే పరిమితం కాకూడదు. బిజెపి నేతలకు నిజంగా చిత్తశుద్ది పర్యావరణ పట్ల శ్రద్ద వుంటే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన వినాయక బొమ్మలు పెట్టిన పందిళ్లను సందర్శించటం మానుకోవాలి, నిమజ్జనాలకు దూరంగా వుండాలి.లేకపోతే మోడీ ప్లాస్టిక్‌ మీద చెప్పిన సుద్దులను తుంగలో తొక్కినట్లే అనుకోవాల్సి వస్తుంది.

మోడీగారి మన్‌కీ బాత్‌లో మరొక అంశం ఫిట్‌ ఇండియా ! మిత్రమా కాలేజీ రోజుల్లో నువ్వెంత కష్టపడినా బక్కపీచుగానే వుండిపోయావు గుర్తుందా ? మోడీ మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. మీరిచ్చిన ప్రోత్సాహంతో ప్రబోధకుడు చాగంటి కోటేశ్వరరావు గారు కోడి గుడ్లు తినేవారి దగ్గరకు దేవతలు రారని వేదాల్లో వుంది అంటారు. మీరేమో ప్రొటీన్లు అధికంగా వుండి చౌకగా లభించే బీఫ్‌ను ఎవరైనా తింటే ఆవు మాంసం తింటున్నారంటూ దాడులు చేస్తారు, బీఫ్‌ నిషేధించాలంటారు. మరోవైపు ఫిట్‌గా వుండాలంటారు, ఇదెక్కడి విపరీతం ! దేశంలో 2022 నాటికి మన పిల్లల్లో 31.4శాతం మంది గిడసబారి పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్ధితిలో కడుపునిండా తిండి లేని వారికి ఫిట్‌నెస్‌ గురించి మోడీ గారు పాఠాలు చెబుతున్నారు. ఇంతకు ముందు యోగా, స్వచ్చ భారత్‌ గురించి హడావుడి చేశారు. జనం వాటిని మరచి పోయారు గనుక ఫిట్‌నెస్‌ గురించి కొత్త పల్లవి అందుకున్నారు. మీరు, మీ మిత్రులు పరిపాలన సాగించే బీహార్‌, యుపిల్లో ప్రతి ఇద్దరిలో ఒక పిల్ల లేదా పిల్లవాడు గిడసబారి వున్నారు.

Image result for manki baat-modi

బండ బడ మీ వ్యవహారం చూస్తా వుంటే దేశంలో ముంచుకు వస్తున్న ఆర్ధిక తిరోగమనం, మాంద్యాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ప్రధాని పని చేస్తున్నట్లుగా వుంది. ఆర్ధికరంగంలో పరిస్ధితి గురించి మీడియాకు ఇష్టం వున్నా లేకపోయినా వార్తలు ఇవ్వక తప్పటం లేదు. గత నెల రోజులుగా ఏదో ఒక వార్త వస్తోంది. మీడియాతో మాట్లాడటానికి అంటే ధైర్యం లేదు గనుక పత్రికా గోష్టి పెట్టరు అని సరిపెట్టుకుందాం. ఇష్టం వచ్చింది మాట్లాడటానికి అవకాశం వున్న మన్‌కీ బాత్‌లో ఆ విషయాలు ప్రస్తావించరా ? మీడియా వార్తలన్నీ తప్పు , దేశమంతా భేషుగ్గా వుంది, అచ్చేదినాల్లోనే వున్నాం అని చెప్పొచ్చుగా ! ప్రతిపక్షాలకు మోడీ అన్నా ఆయన సర్కార్‌ అన్నా గిట్టదు అనుకుందాం. నీతి అయోగ్‌ అధిపతి రాజీవ్‌ కుమార్‌ 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిస్ధితి వచ్చిందన్నారు, మోడీ కోరి ఎంచుకున్న రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా మాట్లాడారు. మోడీగారు పత్రికలు చదవరు, టీవీలు చూసే తీరిక వుండదు, సంసార బంధనాలు లేవు ఎప్పుడూ దేశం గురించే ఆలోచిస్తారు అనుకుందాం, కనీసం తాను నియమించుకున్న వారి మాటలు కూడా పట్టించుకోరా ?

ఈ మధ్య ప్రధాని, రాష్ట్రాలో ముఖ్యమంత్రులు ఇబ్బంది కలిగించే, వివాదాస్పద అంశాలపై నేరుగా మాట్లాడకుండా వుత్సవిగ్రహాలతో మాట్లాడించి స్పందన ఎలా వుందో చూస్తున్నారు. మోడీ మౌనంతో బిజెపి నేతలు తమ అతితెలివిని ప్రదర్శిస్తున్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియటం లేదు.ఐదు లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ లక్ష్యానికి తిలోదకాలివ్వాలి. మనకు ధైర్యం లేదు, ఆర్ధిక వ్యవస్ధను ఎలా కాపాడాలో తెలివీ లేదు అని బిజెపి నేత సుబ్రమణ్య స్వామి అన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో మాంద్యం వున్నప్పటికీ భారత ఆర్ధిక వ్యవస్ధ ఎంతో బాగా పని చేస్తోందని బిజెపి ప్రతినిధి సంబిత్‌ పాత్ర వర్ణించారు. దీనికి గత ఆరు సంవత్సరాలలో జిఎస్‌టి, పన్నుల సంస్కరణల వంటి పునాదులు వేశారని అన్నారు. అంతటితో ఆగలేదు, మోడీ ఆర్ధిక విధానం ప్రపంచంలోని అగ్రరాజ్యాలలో ఒకదానిగా దేశాన్ని తీసుకుపోయింది, మోడీ కారణంగానే ఇది సాధ్యమైందనే వాతావరణం ఇప్పుడుంది అన్నారు. బిజెపికి చెందిన బీహార్‌ వుప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ కొత్త ప్రచారానికి తెరతీశారు. ప్రతి ఏటా ఐదు, ఆరు హిందూ నెలల్లో ఆర్ధిక వ్యవస్ధ మందగిస్తుందట. ఎన్నికల్లో ఓడిపోయిన అసంతృప్తిని వెల్లడించేందుకు రాజకీయ పార్టీలు ఈ అంశం మీద ఈ ఏడాది గోల చేస్తున్నాయట. తొలిసారిగా గత ఆరు సంవత్సరాల్లో మొదటి మూడు మాసాల్లో అభివృద్ధి రేటు ఐదుశాతానికి పడిపోయిందని ప్రభుత్వమే ప్రకటించినా, ఇది ప్రతి ఏటా జరిగేదే అని బుకాయిస్తున్నారంటే జనం ఇంకా చెవుల్లో పూలు పెట్టుకున్నారనే అనుకుంటున్నారు.

మిత్రమా ఇంకా నయం దీనికి కూడా జవహర్‌ లాల్‌ నెహ్రూయే కారణం అని చెప్పినా మీ లాంటి వారంతా గొర్రెల్లా తలలూపుతారనే నమ్మకం బిజెపి నేతల్లో గట్టిగా వున్నట్లుంది,జనం తాము తాగించిన దేశభక్తి, జాతీయవాద మత్తులోనే జనం వూగుతూ తూగుతున్నారనే అనుకుంటున్నారు ! ఈ స్ధితిలో వున్న వారికి ఎదుటి వారు చెప్పేది ఎక్కదు కదా ! మరో సమస్య మీద మరో లేఖ రాస్తా ! వుంటా మరి.

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమరావతి నిర్మాణం- బొత్స శల్యసారధ్యం !

01 Sunday Sep 2019

Posted by raomk in AP, Current Affairs, History, INDIA, Opinion, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Amaravati capital, Amaravati capital controversy, ANDHRA PRADESH, ANDHRA PRADESH Politics, Chandra Babu, pavan kalyan, YS jagan

Image result for amaravati capital

ఎం కోటేశ్వరరావు

మహాభారతాన్ని ఒక రచనగా నమ్మేవారు గానీ, నిజంగా జరిగిందని విశ్వసించే వారికి గానీ శల్యుడి గురించి తెలిసిందే. యుద్ధంలో కర్ణుడి రధ సారధిగా వ్యవహరించిన తీరు శల్యసారధ్యంగా గణుతికెక్కింది. అర్జునుడిని గెలిపించేందుకు గాను కర్ణుడి సారధిగా వుంటూ అర్జునుడిని పొగుడుతూ కర్ణుడి దృష్టిని పక్కదారి పట్టించే అంటే ఒక నమ్మక ద్రోహి పాత్రను పోషించాడు. ఇదంతా ధర్మరాజు కోరిక మేరకే చేశాడని, తరువాత కృష్ణుడి సలహా మేరకు ఆ ధర్మరాజు చేతిలోనే శల్యుడు హతమయ్యాడన్నది కధ.

తెరవెనుక ఏమి జరిగిందన్నది ఎవరికి వారు వూహించుకోవటం తప్ప ఎవరూ విన్నది లేదు కన్నదీ లేదు గానీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి విషయంలో శల్యుడి పాత్రను పోషిస్తున్నట్లుగా స్పష్టమైంది. వెంటనే దీనికి సూత్రధారి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏదీ రహస్యం కాదు, కాస్త వెనుకో ముందో అన్నీ బయటకు వస్తాయి. చివరికి బొత్స ఏమౌతారో తెలియదు గానీ, ఈ పరిణామాలను చూస్తున్న వారు సహజంగానే పెద్దన్న అంటే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వైపే వేలెత్తి చూపటం సహజం.

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆమోదించటం వేరు, దానికి భూములు సేకరించిన తీరును విమర్శించటం మరొకటి. ఈ విషయంలో వైసిపి పక్ష నాయకుడిగా జగన్‌ అసెంబ్లీలో ఆమోదించారు. భూ సేకరణ పద్దతిని విమర్శించారు. ఐదు సంవత్సరాల తరువాత వారు వీరయ్యారు. రాజధాని నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని, ఆ ప్రాంత భూముల లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, రాజధాని నిర్ణయం జరగక ముందే చంద్రబాబు నాయుడు తన బినామీలు, అనుయాయులకు వుప్పందించి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారని, వాటికి రేట్లు పెరిగే విధంగా తరువాత రాజధాని ప్రాంత పరిధిని విస్తరింపచేసి లబ్ది చేకూర్చారనే విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి. వైసిపి నాయకత్వం కూడా చెప్పింది. వాటన్నింటి మీద విచారణ జరిపి అక్రమాలను బయట పెడతామంటే అంతర్గతంగా ఏమనుకున్నప్పటికీ తమకేమీ అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించింది.

గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీయటానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఇదే సమయంలో ఇప్పటి వరకు బయట పెట్టటానికి తీసుకున్న చర్యలేమీ లేవు. కొన్ని విద్యుత్‌ ఒప్పందాల సమీక్ష, పోలవరం టెండర్ల రద్దు, రివర్స్‌ టెండర్ల విషయంలో వేగంగా తీసుకున్న చర్యలను చూసిన జనం అమరావతి అక్రమాల విషయంలో లేస్తే మనిషిని కాదు అన్న కాళ్లు లేని మల్లయ్య మాదిరి అవసరమైనపుడు బయట పెడతాం అంటున్నారు. ఇది ఒక వైపు సాగుతుండగానే ముందే చెప్పుకున్న శల్యసారధ్యం మాదిరి బొత్స సత్యనారాయణ తెల్లారితే వెలుగు వస్తుంది, పొద్దు గూకితే చీకటి పడుతుంది అన్నట్లుగా వరదలు వస్తే అమరావతి మునిగిపోతుంది. పునాదులు లోతుగా తీయాలి, కట్టడాలను ఎత్తుగా కట్టాలి, మిగతా చోట్ల కంటే ఖర్చు రెట్టింపు అవుతుంది, అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలి అనే రీతిలో మాట్లాడి ఈ ప్రభుత్వానికి అమరావతి రాజధాని అభివృద్ధి అంటే ఇష్టం లేదు, మరో ప్రాంతానికి తరలిస్తారు అని ప్రచారం చేసేందుకు, జనం నమ్మేందుకు ఆస్కారం కలిగించారు. బొత్స చెబుతున్నదాని ప్రకారం అయితే గతంలో రాజులు, రంగప్పల మాదిరి కొండలు, గుట్టల మీద దుర్గాలు, కోటల మాదిరి నిర్మాణాలు చేయాలి. మంత్రిగారికి మద్దతుగా వైసిపి నేతలు ఆయన మాట్లాడిందాంటో తప్పే ముంది, రాజధానిని తరలిస్తామని చెప్పలేదుగా అంటూ సమర్దనకు దిగారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అమెరికాలో వుండగా ప్రారంభమైంది. ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత బొత్సవ్యాఖ్యలతో తలెత్తిన వివాదం లేదా గందరగోళానికి తెరదించుతారని, ముఖ్యమంత్రిగా ఒక వివరణ ఇవ్వాలని అందరూ ఆశించారు, కోరుకున్నారు. అదేమీ చేయలేదు, రాష్ట్రంలో ఒక ముఖ్యమైన అంశం మీద ముఖ్యమంత్రి స్పందించలేదంటే, కావాలనే ఇదంతా చేస్తున్నారు, సిఎం ఆశీస్సులు లేకుండా మంత్రి మాట్లాడి వుండరనే అభిప్రాయాన్ని నిర్దారించినట్లే భావించాల్సి వుంటుంది.

అమరావతి ప్రాంతం రాజధానిగా వుంటే ఎదురయ్యే సమస్యల గురించి శివరామ కృష్ణన్‌ కమిషన్‌ వెల్లడించిన అభిప్రాయాలను ఖాతరు చేయకుండా ఆ ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి మద్దతు తెలిపిన సమయంలో వైసిపి నాయకత్వానికి ఆ ప్రాంతంలో వరద ముప్పు తెచ్చే కొండవీటి వాగు గురించి తెలియదని, వారంతా అమాయకులని అనుకోలేము. రాజధానితో నిమిత్తం లేకుండానే రైతాంగాన్ని నష్టపరిచే ఆ వాగు ముంపు నివారణ చర్యలు తీసుకోవాలని మంగళగిరికి గతంలో ప్రాతినిధ్యం వహించిన సిపిఎం ఎంఎల్‌ఏ నిమ్మగడ్డ రామమోహనరావు, ఆ పార్టీ ఆధ్యర్యంలో అనేక సార్లు పాలకుల దృష్టికి తెచ్చినా తెలుగుదేశం పార్టీ గానీ, వైసిపి మాతృక కాంగ్రెస్‌ పాలకులు గానీ పట్టించుకోలేదన్నది తెలిసిందే. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తరువాత ముంపు నివారణకు కొన్ని పధకాలను రూపొందించారు. వాటన్నింటినీ విస్మరించి మంత్రి ఆ సమస్యను ఇప్పుడు ముందుకు తేవటం ఏమిటి? అమరావతిపై అసెంబ్లీ చర్చ సందర్భంగా వైసిపి నేతలు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ?

అమరావతి అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తే మిగతా ప్రాంతాలు ఏమి కావాలన్నట్లు వైసిపి నేతలు కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు. మిగతా ప్రాంతాల అభివృద్ధికి ఎవరు అడ్డుపడ్డారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్‌ లేదా తెలుగుదేశం ఎవరున్నా కేంద్ర, రాష్ట్రాల పెట్టుబడులు, సంస్ధలను హైదరాబాదులోనే కేంద్రీకరించి అటు తెలంగాణా ఇటు రాయలసీమ, ఆంధ్రప్రాంతాలను నిర్లక్ష్యం చేసిన నేరానికి అందరినీ బోనులో నిలబెట్టాల్సిందే. మన దేశ అనుభవం తీసుకున్నా లేక ప్రపంచ దేశాల తీరు చూసినా ప్రయివేటు పెట్టుబడులు ఎక్కడ లాభసాటిగా వుంటే అక్కడికే తరలి వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి తప్ప మరోచోటికి రావటం లేదు. 1991 నుంచి కొన్ని రక్షణ సంబంధ సంస్ధల విషయంలో తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టటం నిలిపివేశాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి చెబుతున్న వైసిపి తన ఎన్నికల ప్రణాళికలో నవరత్నాల గురించి తప్ప తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా ఏఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలకు పెట్టుబడులు పెడతానో ఎందుకు చెప్పలేదు. పాలకులు కోరిన చోట పెట్టుబడులు పెట్టేందుకు ప్రయివేటు వారు ఎవరూ ముందుకు రారు. అదే గనుక జరిగితే గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు, లోకేష్‌ బాబు దేశ విదేశాల్లో చేసిన హడావుడికి ఇంక చాలు బాబో అన్నట్లుగా పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్ధలూ వచ్చి వుండాల్సింది. ఇంత ఘోరపరాజయాన్ని మూటగట్టుకొని వుండేవారు కాదు. అమెరికా, ఐరోపా వంటి దేశాలలో విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలకు కొదవలేదు, అయినా పెట్టుబడిదారులు అక్కడ పరిశ్రమలు, సేవలపై పెట్టుబడులు పెట్టటం మాని శ్రమశక్తి చౌకగా వున్న చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలలో పెట్టుబడులు, పరిశ్రమలను పెట్టి వుత్పత్తులను తిరిగి తమ దేశాలకే ఎగుమతులు చేస్తున్నారు. ఆయా దేశాల కంపెనీలు మన దేశంలో ఐటి ఇంజనీర్లు వెట్టి చాకిరీ చేయటానికి అందుబాటులో వున్నారు గనుక పొరుగు సేవల రూపంలో ఐటి రంగ సేవలను పొందుతున్నాయి, కంపెనీలను పెడుతున్నాయి.

అమరావతి విషయంలో ఎన్నికబుర్లు చెప్పినా, భ్రమరావతిగా గ్రాఫిక్స్‌ ఎన్ని చూపినా తాత్కాలిక నిర్మాణాలు చేసినపుడే కాలక్షేపం చేయటానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు, దాన్ని సాగదీస్తూ పూర్తి చేయాలంటే తనకు తిరిగి అధికారం కట్టాబెట్టాలని జనం కోసం ముందుకు వెళ్లాలని పధకం వేసినట్లు రుజువైంది.ఐదేండ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును నిలవేయని జనం మరో ఐదేండ్ల పాటు అదే పని చేస్తే వైసిపిని ప్రశ్నిస్తారని అనుకోలేం. తమకు ఖాళీ ఖజానా అప్పగించారని వైసిపి సర్కార్‌ వాపోతోంది, అందులో వాస్తవం కూడా వుంది. ఏ సర్కార్‌ అయినా వేలు లేదా లక్షల కోట్లు మిగిల్చి తరువాత వచ్చే ప్రభుత్వాలకు ఖజానా అందించిన వుదంతాలు ఎక్కడా లేవు. ఏ ప్రభుత్వం కూడా అలా మిగిల్చిన దాఖలాలు లేవని బడ్జెట్టను చూస్తేనే తెలుస్తుంది. అందువలన ఆ పేరుతో జగన్‌ సర్కార్‌ కాలక్షేపం చేయవచ్చు. రాజధాని నిర్మాణాలను పూర్తి చేయటానికి మా దగ్గర డబ్బు లేదు, అందువలన మరో ఐదేండ్లు తాత్కాలిక నిర్మాణాల్లోనే కాలక్షేపం చేస్తాం, రాజధాని అక్కడే వుంటుంది అని చెప్పండి. వివాదానికి తెరదించండి, అలా చేస్తే బొత్స సత్యనారాయణ ప్రతిష్టకు వచ్చే భంగమూ లేదు, జగన్‌ సర్కార్‌కు పోయే పరువూ లేదు. ఏదో ఒక స్పష్టత ఇచ్చి మంచి పని చేశారనే సానుకూల వైఖరే వ్యక్తం అవుతుంది. అలాగాక నాలుగు ప్రాంతాల్లో లేదా పదమూడు జిల్లాల్లో రాజధానులను ఏర్పాటు చేస్తాం అన్నట్లుగా మాట్లాడితే తుగ్గక్‌తో పోల్చుకుంటారు. తుపాకి రాముడు లేదా పిట్టల దొరలు అనుకుంటారు.

రాజధాని నిర్మాణం గురించి తెలుగుదేశం పార్టీ దాని సమర్ధకులు మరో వైపు లాగుతున్నారు. రాజధాని అంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వశాఖల ప్రధాన కేంద్రం. సిబ్బందికి అవసరమైన వసతుల కల్పనకు ఏర్పాట్లు. అలాంటి రాజధానికి, రాజధాని నగర నిర్మాణానికి ముడిపెట్టి రియలెస్టేట్‌ స్పెక్యులేషన్‌కు తెలుగుదేశం తెరలేపింది. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవటంలో తప్పులేదు. చత్తీస్‌ఘర్‌ రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. రాయపూర్‌ను రాజధానిగా ఎంచుకున్నారు. దాని శివార్లలో నయా రాయపూర్‌ నిర్మించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2031 నాటికి అక్కడ ఐదులక్షల ముఫ్పై వేల మంది నివసించటానికి ఏర్పాట్లు అవసరమైని రూపకల్పన చేశారు. ఝార్ఖండ్‌ కాత్త రాష్ట్రాన్ని కూడా 2000 సంవత్సరంలోనే ఏర్పాటు చేశారు. రాజధానిగా రాంచీని ఎన్నుకున్నారు. అలాగే వుత్తరాఖండ్‌ రాజధానిగా డెహ్రాడూన్‌ వుంది. గుజరాత్‌లో పెద్ద నగరం అహమ్మదాబాద్‌ వున్నప్పటికీ గాంధీనగర్‌ పేరుతో ప్రత్యేకంగా రాజధాని ప్రాంతాన్ని నిర్మించారు. కొన్ని దశాబ్దాల తరువాత కూడా దాని జనాభా మూడులలక్షలు దాటలేదు. హైదరాబాదు నగరం వంటి దానిని నిర్మిస్తే రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తుంది, ఆ దిశగా అమరావతి నిర్మాణం అని చెబుతున్నారు. ఆదాయం కోసం ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ రాజధాని నగరాల నిర్మాణాలు జరపలేదు. అలా జరపటం అంటే అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించటం అనే ఒక తప్పుడు ఆలోచనలో భాగమే.హైదరాబాద్‌ లేదా ఏ మహానగర చరిత్ర చూసినా వందల సంవత్సరాల చరిత్ర, లక్షల కోట్ల రూపాయల మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడి, వాటిని ఆసరా చేసుకొని ప్రయివేటు రంగ విస్తరణ కనిపిస్తుంది.

చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా రాష్ట్ర సంపదను పెంచగలగటం గొప్ప విషయం కాదని ఎవరు మాత్రం అనగలరు అంటూ ఒక మీడియా సంస్ధ అధిపతి, జర్నలిస్టు సెలవిచ్చారు. దీన్ని గుర్తించటానికి నిరాకరించే నాయకులు, కుహనా మేథావులు వివాదాస్పదం చేశారు అంటూ అమరావతి గురించి, అందుకోసం చంద్రబాబు నాయుడు పడిన తపన గురించి వ్యాఖ్యానించారు. నాయకులందరూ, మేథావులు గానీ చంద్రబాబు నాయుడు లేదా జగన్‌మోహన్‌ రెడ్డి నందంటే నంది పందంటే పంది అని తలలూపే గంగిరెద్దులు కాదు.ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగే ఆ బాపతు వేరే వుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు పిల్లి మొగ్గలు వేసిన సందర్భంగా అది వెల్లడైంది. ఇప్పుడు రాజధాని విషయంలో వైసిపి నేతలు అలాంటి పనిలోనే వున్నట్లు కనిపిస్తోంది. ఒక అభిప్రాయం, అంచనాలతో వ్యతిరేకించే వారిని, విబేధించేవారందరినీ కుహనా మేథావులుగా ముద్రవేస్తే సదరు మీడియా సంస్ధ నడిపే పత్రికలు, టీవీ ఛానల్స్‌లో అలాంటి విబేధాలను నిత్యం ఏదో ఒక అంశం మీద వెల్లడిస్తూనే వున్నారు. అంటే వాటిని నిర్వహించే వారు, పని చేసే వారు కుహనా జర్నలిస్టులే అనుకోవాల్సి వుంటుంది. అది రాజధాని కావచ్చు లేదా పదమూడు జిల్లాల్లో కావచ్చు అసలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ద్వారా అభివృద్ధి అని చెప్పటమే జనాన్ని తప్పుదారి పట్టించటం. ఎక్కడో ప్రభుత్వ కార్యాలయాలను పెడితే హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌ వస్తాయా అని ఒక ముక్తాయింపు, అభివృద్ధి అంటే మాల్స్‌, హోటళ్లా ? గుంటూరు పొగాకు, పత్తి, మిర్చి పంటలకు పెద్ద వాణిజ్య కేంద్రం. ఎందరో విదేశీ పొగాకు వ్యాపారులు ప్రతి ఏడాది అక్కడకు వచ్చే వారు. అలాంటి చోట నిన్నమొన్నటి వరకు పెద్ద హోటళ్లు ఎన్ని వున్నాయి? లాభం వుంది గనుకనే గుంటూరులో పొగాకు వ్యాపారులు హోటళ్లను మించిన వసతి గృహాలను ఏర్పాటు చేశారు. లాభం వస్తే వ్యాపారి వరదన పోవటానికైనా వెనుకాడడు. విమానాల సౌకర్యమే ప్రాతిపదిక అయితే ఢిల్లీ, ముంబైకి వచ్చినన్ని విమానాలు ఏ నగరానికి రావు. అయినప్పటికీ బెంగలూరు, హైదరాబాదు మాత్రమే ఐటి రంగంలో ఒకటి రెండు స్ధానాల్లో ఎందుకు ఎదిగాయి. హిమచల్‌ ప్రదేశ్‌, వుత్తరాఖండ్‌ వంటి చోట్ల హైదరాబాదు నుంచి వెళ్లి మరీ ఔషధ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికి వున్న విమాన సౌకర్యాలు ఏపాటి ? లాభాల కోసం పరిశ్రమలు, వాణిజ్యం చేయాలనుకున్న పెట్టుబడిదారులు గానీ, వుద్యోగం కావాలనుకున్న యువత విమాన సౌకర్యాన్ని బట్టి నగరాలను ఎంచుకోరు. అవకాశం వుంటే ఆఫ్రికాకు అయినా వెళుతున్నారు.

Image result for amaravati capital

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ కోరటం పైన పేర్కొన్న మీడియా అధిపతికి ఆశ్చర్యం కలిగిస్తోందట.ఇది ఒక రాజకీయ నేత నోటి నుంచి వస్తే అర్ధం చేసుకోగలం, ఒక జర్నలిస్టు కలం నుంచి వెలువడటం అంటే చౌకబారు జర్నలిజం తప్ప మరొకటి కాదు. ఒక్క పవన్‌ కల్యాణ్‌ ఏమిటి? చంద్రబాబు వైఖరిని విమర్శించిన వామపక్షాలు కూడా అదే కోరుతున్నాయి, రాజధాని నిర్మాణం అక్కడే జరపాలని చెబుతున్నాయి. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్‌ నిర్వాకం చూసి అనేక మంది ఇలాంటి స్వాతంత్య్రాన్ని కాదు మేము కోరుకున్నది అని ఆవేదన చెందారు. అయినంత మాత్రాన ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేయకుండా వదల్లేదు. అమరావతిపై చర్చ సందర్భంగా ప్రతి పార్టీ, మేథావులు అనేక అభిప్రాయాలు చెప్పారు, వాటిలో వ్యతిరేకమైనవీ వున్నాయి. చంద్రబాబు భూసేకరణ తీరును తప్పు పట్టారు. వాటిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఆ వైఖరి మాత్రం సదరు జర్నలిస్టుకు ఆమోదం అయింది గానీ ఆశ్చర్యం కలిగించలేదు. ఇష్టమైన రైతులు ప్రలోభాలకు గురయ్యో, అత్యాశలకు లోనయ్యో భూములు ఇచ్చారు. కొందరిని బెదిరించారని కూడా విమర్శలు వున్నాయి. స్వాతంత్య్ర వుద్యమ సమయంలో ఎందరో మహిళలు తమ వంతు త్యాగంగా భావించి వంటి మీద వున్న నిలువెత్తు బంగారాన్ని మహాత్మాగాంధీకి ఇచ్చారు. రాజధాని విషయంలో చంద్రబాబును కూడా అంతటి మహోన్నతుడిగా భ్రమించి కొందరు మహిళలు బంగారాన్ని ఇవ్వటం, కొన్ని మీడియాలు దాన్ని బాహుబలి స్ధాయిలో ప్రచారం చేయటం తెలిసిందే. ఇప్పుడు సదరు మహిళలు, భూములిచ్చిన వారికి నష్టం జరిగేట్లుగా కనిపిస్తున్నపుడు న్యాయం చేయాలని ఎవరైనా అడగవచ్చు, దానికి తప్పు పట్టటం ఏమిటి. అత్త పెత్తనం సామెత మాదిరి జనాన్ని ముంచినా తేల్చినా చంద్రబాబే చేయాలని చెప్పటమా ?

రాజధాని నిర్మాణం జరగని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం తగ్గుతోందని అనే భావన కలిగేలా చిత్రిస్తున్నారు. అసలు దేశం మొత్తంగానే ఆ పరిస్ధితి ఎందుకు ఏర్పడిందో కనిపించదా? హైదరాబాదూ, ఆదాయం అంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్న వారు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా ఆదాయం పడిపోయిందని, పొదుపు పాటించాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే చెబుతున్న విషయాన్ని విస్మరించకూడదు. ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆదాయం వున్న తెలంగాణా కూడా ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో, ఆరోగ్యశ్రీకి చెల్లింపులు చేయలేక ఆసుపత్రులు సమ్మెకు దిగాల్సిన పరిస్దితి ఎందుకు ఏర్పడిందో చెప్పాలి. రాజధాని నిర్మాణం గురించి వెంటనే జగన్‌మోహన్‌ రెడ్డి జనంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలి, అది ఒక ముఖ్యమంత్రి విధి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నీ ‘దేశ భక్తి, జాతీయవాదం ‘ భారం భరించలేకున్నాం గురూ !

25 Sunday Aug 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, BJP patriotism and nationalism, Naredra Modi, nationalism, patriotism, Rupee Fall

Image result for bjp patriotism and nationalism cartoons

మిత్రమా

వుద్యోగ రీత్యా నువ్వూ నేనూ చాలా దూరంగా వున్నాం. ఈ మధ్య కాలంలో ప్రత్యక్షంగా కలిసే సందర్భం రాలేదు. అయితే నీ గురించి స్నేహితుల ద్వారా వింటూనే వున్నాను. నీ పేరుకు ముందు చాయ్‌ వాలా, చౌకీదార్‌ అని పెట్టుకున్నావని నవ్వులాటల మధ్య మన స్నేహితులు చెబుతుంటే తత్వంబాగా తలకెక్కింది గామోసు అనుకున్నాను. బహుశా ఇప్పుడు నువ్వు 370 అనో కాశ్మీరీ కన్య అనో పేరుకు ముందు తగిలించుకొని కిక్‌లో వుండి వుంటావు. ఈ మధ్య నువ్వు విదేశీ కిన్లే నీరు బదులు పక్కా దేశీ గోమూత్రం తాగుతూ, చివరికి పతంజలి సబ్బులను కూడా వాడటం మాని ఆవు పేడ ఒంటికి పూసుకుంటూ స్నానం చేస్తున్నావని, ఆఫీసులోనూ బయటా వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో సంస్కృత గ్రంధాల్లో దాగున్న టెక్నాలజీని వెలికి తీసేందుకు మరొక పీజీ చేస్తున్నావని, విదేశీ వాట్సాప్‌ తప్ప ఇతర వాటిని పట్టించుకోవటం లేదని, మిస్స్‌డ్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎఎస్‌లను చూడటం మానేశావని, మన వాళ్లు చెప్పారు. అందుకే ఈ వాట్సాప్‌ మెసేజ్‌ పెడుతున్నా.

Image result for bjp patriotism and nationalism cartoons

ఆ మధ్యమన ప్రధాని నరేంద్రమోడీ గారూ, వారి పార్టీ నేతలూ కాంగ్రెస్‌ 50 ఏండ్లలో సాధించలేని వాటిని మేము ఐదేండ్లలో సాధించాం అని వూరూ వాడా ప్రచారం చెశారు. ఇప్పుడు 70 ఏండ్లుగా చేయలేని దానిని 70 రోజుల్లో చేశాం అన్నారు. మనం చదువుకొనే రోజుల్లో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రాసకోసం నువ్వు తెగ తిప్పలు పడి నగుబాట్లు పాలైన సందర్భాలు గుర్తుకు వచ్చాయి. అదేమిటో నీతి ఆయోగ్‌ వుపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ సరిగ్గా ఈ సమయంలోనే 70 సంవత్సరాలలో ఎన్నడూ తలెత్తని అసాధారణ పరిస్ధితి ఏర్పడింది అని వ్యాఖ్యానించారు. ఆ వాక్‌ ప్రభావం లేదా మహత్తు ఏమిటో గానీ నరేంద్రమోడీ అలా అన్నారో లేదో మరోసారి రూపాయి విలువ ఇలా 72రూపాయల అంచుదాకా పడిపోయింది. నరేంద్రమోడీ ఇప్పుడు కొత్తగా ఆకర్షించాల్సిన వారెవరూ లేకపోయినా పాపం ప్రాస కోసం కష్టపడుతున్నట్లుంది.

ఆరు సంవత్సరాల క్రితం అంటే 2013లో రూపాయి విలువ పతనంతో ధరలు పెరుగుతాయని మిగతా వారంతా ఆందోళన పడుతుంటే నువ్వు బిజెపి నేతలు రూపాయి పాపాయి గురించి చేసిన వ్యాఖ్యలను పదే పదే చెప్పి మాకు నవ్వు రాకపోయినా మా బదులు కూడా నవ్వే వాడివి గుర్తుందా ? ‘నేనూ పాలనలోనే వున్నాను(ముఖ్యమంత్రిగా) ఇంత వేగంగా రూపాయి విలువ పడిపోకూడదని నాకు తెలుసు, ఈ విధంగా పతనం కావటానికి కారణం ఏమై వుంటుంది. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, సమాధానం కావాలని దేశం డిమాండ్‌ చేస్తోంది.(2012)రూపాయి ఈ రోజు ఆసుపత్రిలో వుంది, జీవన పోరాటం చేస్తోంది.(2013) అని మన్మోహన్‌ సింగ్‌ గురించి నరేంద్రమోడీ అన్నారు. సుష్మా స్వరాజ్‌ , అరుణ్‌ జైట్లీ మరణించి ఏ లోకాలకు పోయారో పాపం. ‘ రూపాయి విలువ ఎంత వేగంగా పతనమైందంటే గత రాత్రి టీవీ చూస్తూ భయపడి టీవి కట్టేశాను’ అని సుష్మ అన్నారు. రూపాయి విలువ పతనం భయానకంగా వుంది, ప్రధాని నుంచి స్పందన రావాలని డిమాండ్‌ చేస్తున్నా అన్నారు అరుణ్‌ జైట్లీ. ఇప్పటి కేంద్ర మంత్రి, అప్పటి ప్రతిపక్ష బిజెపి నేత రవిశంకర్‌ ప్రసాద్‌ ‘ యుపిఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ(డాలరుతో మారకం) రాహుల్‌ గాంధీ వయసంత( 43 )వుంది, ఇప్పుడు సోనియగాంధీ వయస్సు(67) దగ్గరగా వుంది, త్వరలో మన్మోహన్‌ సింగ్‌ వయస్సు(80)ను తాకుతుంది ‘ అన్న ప్రకటన చదివి అప్పటికే నరేంద్రమోడీ బిజెపి ప్రధాని అభ్యర్ధి అని వచ్చిన వార్తలను దృష్టిలో పెట్టుకొని మా మోడీ వస్తే చూడండి రూపాయి విలువను రాహుల్‌ గాంధీ వయసంత చేస్తా అని గంతులు వేయటం గుర్తుందా ? దాని సంగతేమోగానీ ఇప్పుడు మోడీ గారి వయస్సు(68)ను దాటి నాలుగు అంగలు వేసింది. అది ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నవ్వుతూనే వున్నావా ?

Image result for bjp patriotism and nationalism are two cost to bear cartoons

జనానికి మతిమరుపు లేదా మోహంలో వున్నపుడు ఏమి చెప్పినా తలకు ఎక్కించుకోరు, ఎదురు మాట్లాడరు అని డిగ్రీలో మన లెక్చరర్‌ పదే పదే చెప్పేవారు గుర్తుందా ? గతేడాది గరిష్టంగా రికార్డు స్ధాయిలో ఒక రోజు రూపాయి విలువ 74.48కి పడిపోయింది. ఆజ్‌తక్‌ టీవీ యాంకర్‌ రూపాయి విలువ పతనం వార్త సందర్భంగా ‘ కాలం మారింది. నరేంద్రమోడీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు రూపాయి విలువ పతనం అవుతోంది. ఆయనేమీ చెప్పటం లేదు’ అన్నారు. అంతేనా ఆర్ధికశాఖ నుంచి విద్యుత్‌ శాఖకు మార్చి నా స్ధాయి తగ్గించారు, నా పరువు తీశారు, నేను వుద్యోగం మానుకుంటా ఆమోదించండి అని ప్రకటించిన సుభాష్‌ చంద్ర గార్గ్‌ గతేడాది ఆర్ధికశాఖ అధికారిగా స్పందిస్తూ ఏమన్నారో తెలుసా ‘ ఈ పతనానికి కారణం లేదు. మీరు ఆందోళన చెందుతున్నారు. ఇతర కరెన్సీల విలువలు కూడా పతనమౌతున్నపుడు రూపాయి 80కి పడిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ‘ అని సెలవిచ్చారు.

మాకు అర్ధశాస్త్రవేత్తలకు కొదవ లేదు చూడండి అంటూ నువ్వు పదే పదే వుటంకించే బిజెపి నేత సుబ్రమణ్య స్వామి 2018 సెప్టెంబరులో 74రూపాయలకు రూపాయి విలువ పడిపోయినపుడు సరికొత్త కారణాన్ని ఆవిష్కరించారు. నల్ల ధనం దేశం నుంచి బయటకు పోతున్న కారణంగా రూపాయి విలువ పడిపోతున్నదని 2018 సెప్టెంబరు 23న గోవాలో జరిగిన ఒక సభలో చెప్పారు. అమెరికా డాలరుతో మన రూపాయి విలువ పతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నల్లధనం దేశం నుంచి బయటకు పోతున్నది, రూపాయల సరఫరా ఎక్కువైనపుడు విలువ పతనం అనివార్యం. ‘ అన్నారు. యుపిఏ హయాంలో రూపాయి విలువ పతనం భయానకం అన్న అరుణ్‌ జైట్లీ ఆర్ధిక మంత్రిగా మాట్లాడుతూ ‘ ప్రపంచలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ గనుక మనం భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు ‘ అన్నారు.

ఇలాంటి నాయకులు ఏది చెబితే దాన్నే ప్రమాణంగా భావించి స్వంత బుర్రను వాడకుండా వాటినే పట్టుకొని వాదించే ఓ మూర్ఖ శిఖామణీ (ఇది మన మిత్రులు నీకు పెట్టిన పేరు ) రూపాయి విలువ ఎంత పతనం అయితే అంతగా నల్లధనం తగ్గినట్లా ? ఆ లెక్కన దేశంలో నల్లధనం పెద్ద ఎత్తున పేరుకు పోయిందని దాన్ని బయటకు తీస్తామని చెప్పిన బిజెపి నేత నరేంద్రమోడీ జనాన్ని మోసం చేసినట్లు అనుకోవాలా, సుబ్రమణ్య స్వామి లాంటి వారు జనానికి చెవుల్లో పూలు పెడుతున్నారా ? స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ 4.16 అంటే సుబ్రమణ్య స్వామి తర్కం ప్రకారం ఆ రోజు నల్లధనం బాగా వున్నట్లు, అది క్రమంగా తగ్గుతూ వున్న కారణంగా 2004లో 45.32కు పడిపోయింది. నల్లధనాన్ని వెలికి తీసే పేరుతో నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన ఏడాది విలువ 66.46 అంటే అప్పటికి ఇంకా నల్లధనం తగ్గిపోయింది లేదా బయటకు పోయింది. నోట్లను రద్దు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప నరేంద్రమోడీ ఘనత ఏముంది ? 2018లో 70.09కి చేరింది. అంటే పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా వున్నట్లే, ఇప్పుడు 72రూపాయలకు చేరింది కనుక నోట్ల రద్దు తరువాత నల్లధనం ఇంకా పెరిగినట్లే కదా ! బిజెపి వారు ఎది చెబితే అదే దేశ భక్తి, అదే జాతీయవాదం, అదే ఆర్ధశాస్త్రం. దాన్ని నమ్మిన ఆమోదించిన వారు దేశభక్తులు, కాని వారు దేశద్రోహులు. నాడు బ్రిటీష్‌ వారి దృష్టిలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు వంటి వారందరూ దేశ ద్రోహులే. ఇప్పుడు బిజెపి చెప్పేదాన్ని అంగీకరించని వారందరూ దేశ ద్రోహులే.

బిజెపి మార్కు దేశ భక్త మిత్రమా 2004 నుంచి వార్షిక రూపాయి విలువలు ఎలా వున్నాయో, నరేంద్రమోడీ పాలనలో ఎలా పతనం అయ్యాయో దిగువ ఇస్తున్నాను. ఆధారంగా లింక్‌ కూడా ఇస్తున్నాను. https://www.bookmyforex.com/blog/1-usd-to-inr-in-1947-2019/ సంవత్సరాల వారీ డాలరుతో రూపాయి విలువ ఇలా వుంది. యుపిఏ పాలన-ఎన్‌డిఏ పాలనలో రూపాయి విలువ పతనం ఒక్క రూపాయే అన్న ఒక ఫేక్‌ న్యూస్‌ను నువ్వునాకు షేర్‌ చేశావు.

సంవత్సరం రూపాయి విలువ

2004   45.32

2005   44.10

2006   45.31

2007    41.35

2008    43.51

2009    48.41

2010    45.73

2011    46.67

2012     53.44

2013     56.57

2014     62.33

2015     62.97

2016     66.46

2017     67.79

2018    70.09

నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం నమ్మని రోజులు రాబోతున్నాయి. యుపిఏ పదేండ్ల కాలంలో రూపాయి విలువ ఏడాది సగటు 47.04గా వుంది. అదే నరేంద్రమోడీ హయాంలో 65.93కు పతనమైంది. అయినా నరేంద్రమోడీ కాలంలోనే రూపాయి పటిష్టంగా వుందని అడ్డగోలుగా వాదించే వారికి ఈ వాస్తవం రుచించదు. దీని అర్ధం యుపిఏ పాలన బాగుందని కాదు, మన్మోహన్‌ సింగ్‌కు కితాబు ఇవ్వటమూ కాదు. యుపిఏ, ఎన్‌డిఏ రెండూ అనుసరించినవి ఒకే దివాలా కోరు ఆర్ధిక విధానాలే, ఒకదానికి ఒకటి కొనసాగింపు మాత్రమే. మిత్రమా రూపాయి విలువ పతనమై అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువులు చౌక అయినా ఎగుమతులు పెరక్కపోగా తగ్గాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురు వంటి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి జనం నడ్డి విరుస్తున్నాయి. అందుకే దేశభక్తి, జాతీయవాదంతో మీ వంటి వారి నిర్వాకం భరించలేనిదిగా తయారైంది గురూ అని చెబుతున్నా. ఇలా చెప్పిన వారిని మీరు దేశద్రోహులు అనే అంటారు. అలా పిలిపించుకోవటానికి నేను సిగ్గు పడను.

ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి పాటలు -వైసిపి, తెరాస, తెలుగుదేశం డిస్కో డ్యాన్సులు !

11 Sunday Aug 2019

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana, Telugu

≈ Leave a comment

Tags

370 article, Abrogation of Article 370 and 35A, abrogation of j&k state, Article 370 and 35A, BJP, tdp, trs, Ycp

ఎం కోటేశ్వరరావు

అత్యంత అప్రజాస్వామిక పద్దతుల్లో జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర విభజన, దానికి వున్న 370, 35ఏ ఆర్టికల్స్‌ రద్దు జరిగిందన్నది ఎవరు అవునన్నా కాదన్నా చరిత్ర కెక్కింది. బిజెపి తీసుకున్న చర్యను తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన వైసిపి, తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ గుడ్డిగా సమర్ధించి రాజకీయ అవకాశవాదానికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ తరఫున టీవీల్లో చర్చల్లో పాల్గొనేందుకు ఎవరికీ అనుమతి లేదా బాధ్యత లేదు కనుక వారి వాదనలు మనకు వినిపించటం లేదు కనిపించటం లేదు. వైసిపి, తెలుగుదేశం ప్రతినిధులు మాత్రం సమర్ధనలో పోటా పోటీగా రెచ్చిపోతున్నారు. బిజెపి చర్యలను సమర్ధించని వారు దేశభక్తులు కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజును మించిన రాజభక్తి అంటే ఇదే. ప్రశ్నించే స్ధితి లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ తెరాస అధ్యక్షుడు కెటిఆర్‌ ప్రవచనాలు బాగానే చెప్పారు. వివాదాస్పద అంశాలపై పార్లమెంట్‌లో తమ పార్టీలు ఎంపీల ప్రశ్నించిన స్ధితి ఏమిటో అందరూ చూశారు. ప్రత్యేక రాష్ట్రం లేకపోతే తమ ప్రాంత ప్రజలకు న్యాయం జరగదని ఆందోళనలు చేసి తెలంగాణా సాధించుకున్న పార్టీకి చెందిన పెద్దలు ఒక రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతగా మారుస్తుంటే, దానికి వున్న రక్షణలను తొలగిస్తుంటే బిజెపిని గుడ్డిగా సమర్దించటం తప్ప ప్రశ్నించిందేమిటి ? ఒకవైపు ప్రశ్నించి మరోవైపు మద్దతు ఇచ్చే అవకాశ వాదాన్ని జనం గ్రహిస్తారనే ప్రశ్నించకుండానే పని కానిచ్చారు.

దేశ భక్తి గురించి ఫలానా వారే మాట్లాడాలని ఎక్కడా లేదు. ఎవరికీ పేటెంట్‌ హక్కు కూడా లేదు. పేచీ ఎక్కడ వస్తుందంటే మేము చెప్పేదే దేశభక్తి మిగతావారిది దేశద్రోహం అంటే కుదరదు. ఎవరు చెప్పేది వాస్తవం, ఎవరిది మోసం అన్నది నిర్ణయించుకోవాల్సింది రెండు వైపులా చెప్పేది విన్న జనం మాత్రమే. తమతో వుంటే దేశ భక్తులు లేకపోతే దేశ ద్రోహులు అన్నట్లుగా బిజెపి వ్యవహారం వుందని కెటిఆర్‌ విమర్శ చేశారు. మహాత్మా గాంధీ దేశభక్తి గురించి మరో మాట లేదు. కాదు, ఆయన్ను హతమార్చిన గాడ్సేనే అసలైన దేశభక్తుడు అని చెబుతున్నారు. పాకిస్ధాన్‌ అనుకూల నెహ్రూ విధానాన్ని మహాత్మా గాంధీ సమర్ధించి ప్రజాగ్రహానికి గురయ్యాడని, గాడ్సే ప్రజలకు ప్రాతినిధ్యం వహించాడని, ప్రజాగ్రహానికి ఒక వ్యక్తీకరణగా గాంధీ హత్యకు ఆయనను పురికొల్పిందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ సంపాదకీయంలో గాడ్సేను సమర్ధించింది. అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని పార్టీ ప్రభుత్వ చర్యలను ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఒక వైపు సమర్ధిస్తూ మరోవైపు మహాత్ముడిని గౌరవించుకోలేని స్ధితిలో వున్నామని కెటిఆర్‌ చెప్పటం మొసలి కన్నీరు కార్చటం తప్ప చిత్తశుద్ది కనిపించటం లేదు. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనే పెద్ద మనిషితో సహా అనేక మంది స్వాతంత్య్ర వుద్యమంలో పాల్గొన్నందుకు శిక్షలు విధించారు. ఎక్కడో పిరికి బారిన వారు, నిర్బంధాలను తట్టుకోలేనివారు తప్ప మడమ తిప్పలేదు. సావర్కర్‌ జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి లేఖ రాసి సేవచేస్తానని హామీ ఇచ్చారు. ఆయనకుడా దేశభక్తుడే అంటారు, వీర సావర్కర్‌ అని కూడా కీర్తిస్తారు. మహాత్ముడికి ఆ బిరుదు ఎవరిచ్చారు అని ప్రశ్నించే వారు సావర్కర్‌కు వీర అనే బిరుదు ఎవరిచ్చారో చెప్పగలరా ? కలం పేరుతో తన గురించి తానే రాసుకున్న పుస్తకంలో సదరు సావర్కర్‌ తన వీరత్వాన్ని పొగుడుకున్నారు. బహుశా ఇలాంటి వారు చరిత్రలో మనకు మరొకరు ఎక్కడా కనిపించరు.

చరిత్ర పరిజ్ఞానం లేని వారికి, చరిత్రతో తమకు పని లేదనుకొనే వారికి తప్ప మిగిలిన వారికి కాశ్మీరు విషయంలో ప్రాంతీయ పార్టీలు బిజెపి అప్రజాస్వామిక చర్యకు మద్దతు ప్రకటించటంలో ఆశ్చర్యం కలిగించటం లేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజనకు తాము అనుకూలమే గానీ కాంగ్రెస్‌, బిజెపి కలసి చేసిన విభజన సక్రమంగా జరపలేదు అని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. అదే పార్టీ జమ్మూ-కాశ్మీర్‌ విషయంలో బిజెపి జరిపిన విభజనకు, రాష్ట్ర హోదా రద్దుకు, ప్రత్యేక హోదా, హక్కుల రద్దుకు మాత్రం ఎలాంటి మినహాయింపులు లేకుండా మద్దతు ప్రకటించటం ఆ పార్టీ వంచనా శిల్పానికి తార్కాణం. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు మద్దతు ప్రకటించటంలో ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను తిరస్కరించిన కారణంగానే బిజెపితో రాజకీయ బంధాన్ని తెంచుకున్నట్లు తెలుగుదేశం చెప్పుకుంది. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ వేసిన పిల్లి మొగ్గలను యావత్‌ తెలుగు వారు, దేశం గమనించింది. ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదని చెప్పిన ఆ పార్టీ ప్రస్తుతం కావాలని చెబుతోంది. వైసిపి అదే అంశాన్ని తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకుంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసే లేదా ప్రాధేయపడే ఈ రెండు పార్టీలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు జరపలేదని విమర్శించే తెరాస కూడా కాశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేయాలని మద్దతు ఇవ్వటం అవకాశవాదమా, బిజెపికి లొంగుబాటు కాదా ?

తమ రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించే వారు 75శాతం వుద్యోగాలను స్ధానికులకే ఇవ్వాలని వైసిపి సర్కార్‌ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. కాశ్మీరీలకు రక్షణగా ఆర్టికల్‌ 35ఏలో వున్న రక్షణలు అలాంటివే కదా ! వైసిపి దాన్నెందుకు వ్యతిరేకించినట్లు ? నైజా నవాబు ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనలకు కాలం తీరిన తరువాత తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందనే కదా 1969లో తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. దాని వారసులం అని చెప్పుకొనే టిఆర్‌ఎస్‌ వారు జమ్మూకాశ్మీర్‌కు 35ఏ రూపంలో వున్న ముల్కీ నిబంధనలను వ్యతిరేకించటాన్ని ఏమనాలి? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజలు ఒకే చట్టం, అవకాశాలు అన్న సూత్రం మరి అప్పుడేమైంది? తెలంగాణా లేదా ఆంధ్రప్రదేశ్‌ రెండూ విడిపోయాయి. అయినా స్ధానిక కోటాలు, జోన్లు ఎందుకు? జోన్లవారీ రక్షణలు, నిబంధనలు ఎందుకు ? ఒకే రాష్ట్రం, ఒకే ప్రజ, అందరికీ సమాన అవకాశాలు కావాలని కాశ్మీరు విషయంలో గొంతెత్తి అరుస్తున్న వారు తమవరకు వచ్చే సరికి ఆంక్షలు ఎందుకు ?

వివిధ రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌ను ముందుకు తెచ్చి ఎప్పటి నుంచో కోరుతున్నారు. వీటిలో కొన్నింటికి బిజెపి ప్రత్యక్ష మద్దతు, కొన్నింటికి పరోక్ష మద్దతు వుంది. కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత డిమాండ్‌ ముందుకు వచ్చింది తప్ప కాశ్మీర్‌ రాష్ట్ర హోదా రద్దు చేయాలని ఎవరూ డిమాండ్‌ చేయలేదు.కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది తప్ప వున్నవాటిని పూర్తిగా రద్దు చేయటాన్ని తొలిసారి చూశాము. రాజ్యాంగ నిపుణులు దీని గురించి చెప్పాలి. ఈ లెక్కన బిజెపి తానుగా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేని రాష్ట్రాలను, ప్రాంతాలను విచ్చిన్నం చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడితే దిక్కేమిటి ? సమాఖ్యకు అర్ధం ఏమిటి ? దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి ఇప్పుడు సమాఖ్య వ్యవస్ధకు సైతం ఎసరు పెట్టినట్లు స్పష్టం కావటం లేదా ?

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అన్నది స్వాతంత్య్ర వుద్యమం ముందుకు తెచ్చిన డిమాండ్‌, ఆ మేరకు ఏర్పడిన వాటిని విచ్చిన్నం చేయటానికి పూనుకున్నారు. బిజెపి లేదా మరొక పార్టీ ఎవరైన రాష్ట్రాలను పునర్విభజించాలని అనుకుంటే దానికి ఒక పద్దతి వుంది. అందుకోసం ఒక కమిషన్‌ వేసి వివిధ ప్రాంతాల్లో తలెత్తిన డిమాండ్లు, వాటి హేతుబద్దతను పరిశీలించి, ప్రజాభిప్రాయ సేకరణ చేసి సిఫార్సులకు అనుగుణ్యంగా చేయటం ఒక పద్దతి. వివిధ రాష్ట్రాల్లో వున్న ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ల గురించి క్లుప్తంగా చూద్దాం.

1. మహారాష్ట్ర : తూర్పు మహారాష్ట్రలోని అమరావతి, నాగపూర్‌ ప్రాంతాలతో విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్‌.1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం నాగపూర్‌ను రాజధానిగా విధర్భను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అయినా భాష ప్రాతిపదికన మహారాష్ట్రలో కలిపారు. ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి వుంది, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా అభివృద్ధి చెందలేదు. కాంగ్రెస్‌, బిజెపి, శివసేన పార్టీల పాలనే దీనికి కారణం. 2.వుత్తర ప్రదేశ్‌ : దీన్ని పూర్వాంచల్‌, బుందేల్‌ ఖండ్‌, అవధ్‌, పశ్చిమ ప్రదేశ్‌ అనే నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలన్న డిమాండ్‌ వుంది. 2011లో అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసింది. బ్రిటీష్‌ వారి పాలనలో ఆగ్రా, అవధ్‌ ప్రాంతాలను కలిపి యునైటెడ్‌ ప్రావిన్స్‌ పేరుతో ఒక పాలిత ప్రాంతంగా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వుత్తర ప్రదేశ్‌గా మార్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి రాసిన పుస్తకంలో అంబేద్కర్‌ మీరట్‌ రాజధానిగా పశ్చిమ రాష్ట్రం, అలహాబాద్‌ రాజధానిగా తూర్పు రాష్ట్రం, కాన్పూరు రాజధానిగా మధ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలోనేే బిఎస్‌పి ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. వ్యవసాయ ప్రధానంగా వున్న పశ్చిమ వుత్తర ప్రదేశ్‌ జిల్లాలతో హరిత ప్రదేశ్‌ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్‌ కూడా వుంది. 3.అసోం :అసోం లోని వుత్తర ప్రాంతంలో బోడో భాష మాట్లాడేవారు తమకు బోడో లాండ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకోసం కొందరు తుపాకులు కూడా పట్టుకున్నారు. చివరకు 2003లో కేంద్ర ప్రభుత్వం, అసోంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం బోడో ప్రాంతాలతో అసోం రాష్ట్రంలో భాగంగానే ఒక స్వయం పాలనా మండలిని ఏర్పాటు చేసి ఆరోషెడ్యూలులో చేర్చారు. 4. గుజరాత్‌ : వెనుకబాటు తనం, నీటి సమస్య తదితరాల కారణంగా సౌరాష్ట్రను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది.భాషా పరంగా కూడా మిగతా గుజరాత్‌కు భిన్నమైన లక్షణాలు కొన్ని వున్నాయి. 5.పశ్చిమ బెంగాల్‌ : నేపాలీ భాష మాట్లాడే డార్జిలింగ్‌, మరికొన్ని ప్రాంతాలతో కలిపి గూర్ఖాలాండ్‌ను దేశంగా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే పేరుతో సాగిన ఆందోళనల గురించి చెప్పనవసరం లేదు. 6. రాజస్ధాన్‌ : పశ్చిమ, వుత్తర రాజస్ధాన్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి మారు ప్రదేశ్‌ ఏర్పాటు డిమాండ్‌ వుంది. 7. మధ్య ప్రదేశ్‌ : బుందేల్‌ ఖండ్‌, వింధ్య ప్రదేశ్‌, బాగేల్‌ ఖండ్‌, మహాకోసల రాష్ట్రాలు.8.చత్తీస్‌ఘర్‌ : గోండ్వానా రాష్ట్రం 9.బీహార్‌ : మిధిల, భోజ్‌పురి.10. ఒడిషా : కోసల 11.ఆంధ్రప్రదేశ్‌ : రాయలసీమ, 12. కర్ణాటక : వుత్తర కర్ణాటక, తులునాడు, కొడుగు నాడు, 13. తమిళనాడు : కొంగు నాడు.

ఈ డిమాండ్లతో అన్ని పార్టీలు ఏకీభవించటం లేదు. అదే సూత్రం కాశ్మీర్‌ విభజన, రాష్ట్ర హోదా రద్దుకు సైతం వర్తిస్తుంది. ఈ రాష్ట్రాల డిమాండ్లు బహిరంగంగా చేసినవి. వాటి మీద అభిప్రాయాలు అనుకూలంగానో, ప్రతికూలంగానో వెల్లడయ్యాయి. కాశ్మీర్‌ విషయంలో అలాంటి డిమాండ్‌ లేదు, వాటి మీద ఏ పార్టీ అభిప్రాయమూ వెల్లడి కాలేదు. ఒక రోజులోనే తాము చేయదలచుకున్నది చేయటం, దానికి అనేక ప్రాంతీయ పార్టీలు వంతపాడటం ఏ విధంగా చూసినా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేవే.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీలన్నీ పూర్తిగా అమలు జరిపామని బిజెపి చెబుతోంది. ప్రత్యేక హోదా అవకాశం లేదని చెప్పిన తరువాత కూడా దాని గురించి పదే పదే మాట్లాడటం ఏమిటని వైసిపి మీద బిజెపి ఆగ్రహిస్తోంది. ఈ పూర్వరంగంలో కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక హోదా వలన ప్రయోజనం లేదన్న వాదనను రాజును మించిన రాజభక్తి మాదిరి సమర్ధించిన వైసిపి రేపు ఏపికి ప్రత్యేక హోదాను ఏ నోటితో అడుగుతుంది అన్నది మౌలిక ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేథావులూ మీ రెటు వైపో తేల్చుకోండి !

27 Saturday Jul 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

Adoor Gopalakrishnan, Jai Sri Ram, letters war, open letter to Prime Minister Modi

Image result for martin luther king jr quotes on intellectuals

ఎం కోటేశ్వరరావు

” చెడ్డవారి ద్వేష పూరితమైన మాటలు, చేతలకే కాదు, భయంకరమైన నిశ్శబ్దాన్ని పాటించే మంచి వారి గురించి కూడా మనం ఈ తరంలో పశ్చాత్తాప పడాల్సి వుంటుంది.” మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ జూనియర్‌ చెప్పిన మాటలివి. దేశంలో నేడు పెరుగుతున్న విద్వేష ధోరణులు, వాటిని పెంచి పోషిస్తున్న వారి తీరును గురించి నోరు విప్పని వారికి ఇవి చక్కగా వర్తిసాయి.కొంత కాలం క్రితం ఆవుల సంరక్షణ పేరుతో దాడులు చేసి చంపివేస్తే, ఇప్పుడు కొంత మంది ఆకస్మికంగా ప్రత్యక్షమై మైనారిటీ మతాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని జై శ్రీరామ్‌ అనాలని వత్తిడి చేయటం, నిరాకరించిన వారి మీద దాడులు చేస్తున్న వార్తలు నిత్యం ఏదో ఒక మూలన జరుగుతున్నాయి. వీటిని న్యాయ విచారణ పద్దతిని పాటించని దాడులు, హత్యలు(ఆటవిక) అంటున్నారు. అలాంటి వాటిని నిరోధించాలని కోరుతూ వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ రాశారు. దానికి ప్రతిగా ప్రతిగా 62 మంది ప్రముఖులు మోడీకి లేఖ రాసిన వారి మీద దాడి చేస్తూ మరో లేఖ రాసి మోడీకి మద్దతు పలికారు. రాముడి పేరుతో ఆటవిక దాడులు చేసి పేరును దుర్వినియోగం చేయవద్దు అని కోరిన రాముడి భక్తుల మీద దాడి ప్రారంభించి పేరు మార్చుకోండి, భూమ్మీద వుండవద్దు అని బరితెగిస్తున్నారు.

ఈ ఏడాది మార్చినెలలో సుప్రీం కోర్టు ముందుకు ఒక పిటీషన్‌ వచ్చింది. అదేమంటే దేశంలోని ముస్లింలను పాకిస్ధాన్‌ పంపాలంటూ కోర్టు ఆదేశించాలంటూ దాన్ని దాఖలు చేశారు. దాన్ని న్యాయమూర్తి రోహింటన్‌ నారిమన్‌ మరియు వినీత్‌ శరణ్‌లతో కూడిన బెంచ్‌ విచారణకు చేపట్టింది. పిటీషనర్‌ తరఫు న్యాయవాదిని పిటీషన్‌లోని అంశాన్ని గట్టిగా చదవమని న్యాయమూర్తి నారిమన్‌ అడిగారు. చదివిన తరువాత మీరు నిజంగా ఈ కేసును వాదించదలచుకున్నారా, తరువాత మీ మీద విమర్శలు చేయాల్సి వుంటుంది అని వ్యాఖ్యానించటంతో సదరు న్యాయవాది లేదు అని చెప్పి జారుకున్నాడు. ఆటవిక హత్యల గురించి నరేంద్రమోడీకి లేఖ రాసిన 49 మందిలో ప్రఖ్యాత దర్శకుడు ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ ఒకరు. ఆ లేఖను సహించలేని కేరళ బిజెపి నేత ఒకరు గోపాలకృష్ణన్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.చేశారు. జై శ్రీరామ్‌ నినాదాన్ని భరించలేకపోతే శ్రీహరి కోటలో పేరు నమోదు చేసుకొని చంద్రుడి మీదకో లేదా మరో గ్రహానికో పొమ్మని, పేరు మార్చుకుంటే మంచిదని నోరు పారవేసుకున్నాడు. అయితే అలాగే వెళతా చంద్రుడి మీదకు టిక్కెట్‌ ఏర్పాటు చేయండి అని మరోమారు నోరెత్తకుండా కృష్ణన్‌ సమాధానమిచ్చారు అనుకోండి.

Image result for adoor gopalakrishnan

విద్వేషం ముదిరి ముస్లింలు అయితే పాకిస్ధాన్‌ పోవాలంటున్న వారు హిందువుల వరకు వచ్చే సరికి అసలు భూమ్మీదే వుండకూడదని చెబుతున్నారు. దబోల్కర్‌, గోవింద పన్సారే, కలుబుర్గి, గౌరీ లంకేష్‌లను అలాగే లేకుండా చేసిన విషయం తెలిసిందే. గోపాలకృష్ణన్‌ విషయానికి వస్తే ఆయన ప్రముఖ మళయాళీ, కేరళ వాసి కావటంతో పర్యవసానాలను గమనంలో వుంచుకొని అంతం చేస్తామని బెదిరించలేదు తప్ప ఈ దేశంలోనే కాదు, అసలు భూమ్మీదే వుండవద్దని చెప్పారు. అంతే కాదు, కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం నుంచి గోపాలకృష్ణన్‌కు ఇంతవరకు ఎలాంటి సత్కారాలు జరగలేదు కనుక ఇలా మాట్లాడుతున్నారని కూడా నోరు పారవేసుకున్నాడు. అంటే ఒక వ్యక్తి ప్రతిభా పాటవాలను బట్టిగాక భావజాలాన్ని బట్టి బిజెపి గుర్తిస్తుందన్న వాస్తవాన్ని ఆ పెద్ద మనిషి దాచుకోలేకపోయాడు. ఆటవిక చర్యలకు పాల్పడే సమయంలో జై శ్రీరామ్‌ అనటానికి తాను వ్యతిరేకం తప్ప ఎవరైనా వచ్చి తన ఇంటి ముందు ఆ నినాదం చేస్తే తాను కూడా వారితో గొంతు కలుపుతానని, తనకు ఇప్పటికే ఎన్నో ఘనమైన గౌరవాలు దక్కాయని, ఇంకా కావాలన్న ఆసక్తి లేదని కూడా గోపాల కృష్ణన్‌ చెప్పారు. తాను కూడా భక్తుడనేనని, రాముడు ఆదర్శ పురుషుడు, ఆయనను ఇలాంటి పద్దతుల్లో అవమానించకూడదని ఆయన స్పష్టం చేశారు.

తమతో విబేధించిన వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం సంఘపరివార్‌ శక్తులకు కొత్త అంశం కాదు. మధ్యలోనే రాజీనామా చేసిన రిజర్వుబ్యాంకు మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌, ఆర్ధిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేక వారు బాధ్యతల్లో వున్నపుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఏదో ఆశించి విమర్శిస్తున్నారంటూ దాడి చేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలు. జరుగుతున్న లోపాలు తెలిసి కూడా అనేక మంది నోరు విప్పటం లేదు. గుడులకు పరిమితం కావాల్సిన దేవుళ్లను వీధుల్లోకి లాక్కువ వచ్చిన కాషాయ దళాలు తమ కుతర్కంతో తమ మానాన తాము వున్న మేథావుల మీద కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నారు, అవమానిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను,దేశంలో జరిగే అవాంఛనీయ ధోరణులను విమర్శించే వారికి ‘ ఏదో ఆశించి లేదా ఆశించింది దక్కక ‘ అన్న ముద్రవేస్తున్నారు. నచ్చని విధానాల మీద బహిరంగంగా స్పందించే ధైర్యవంతులను కాసేపు పక్కన పెడదాం. స్పందించని వారి సంగతేమిటి? స్పందించే వారి మీద ఎదురుదాడులు పెరిగే కొద్దీ నోరు మూసుకొని వుండే వారికి మోడీ ఎంత ముట్టచెప్పారు లేదా ఏ పదవి ఇస్తానని ప్రలోభ పెట్టారు అన్న ప్రశ్నలు ప్రారంభం అవుతాయి. ఇక నరేంద్రమోడీకి అనుకూలంగా ప్రకటన చేసేవారికి అంతకంటే ఎక్కువే ముట్టింది కనుక బస్తీమే సవాల్‌ అంటూ మోడీ విమర్శకుల మీద తొడ కొడుతున్నారని అనుకోవాలి. ఈ దేశంలో జై శ్రీరామ్‌ అనకూడదా అంటూ కు తర్కం, విపరీతార్ధం తీసి వ్యాఖ్యానించిన తెలుగు సినీ రంగంలో వర్దమాన రచయిత అనంత శ్రీరామ్‌ 49 మంది మీద విమర్శలకు దిగాడు,మరో 62 మంది పోటీ ప్రకటన చేశారు, వారూ, శ్రీరామ్‌ మోడీకి, బిజెపికి ఎంతకు అమ్ముడు పోయారు అంటే ఎవరు జవాబు చెబుతారు.

ఏదో ఆశించి విమర్శలు చేస్తున్నారనేది ఇప్పుడు అన్ని రంగాలలో ఒక ఆయుధంగా మారిపోయింది. ఎవరూ సరైన వారు కాదు, అందరిలో లోపాలు వున్నాయనే దాడి వెనుక తమ తప్పిదాలను, దుర్మార్గాలను కప్పిపుచ్చుకొనే ఎత్తుగడ దాగి వుంది. తమకు నచ్చని ఏ చిన్న సూచన, లేదా విమర్శ చేసినా సహించే స్ధితి లేదు. అందుకే 49 మంది లేఖపై అంత అసహనం. ఇంతకీ ఆ లేఖలో ఏముందో చూద్దాం.

Image result for narendra modi on lynchings

‘ జూలై 23, 2019,

శ్రీ నరేంద్ర దామోదర్‌ మోడీ,

గౌరవనీయమైన భారత ప్రధాని.

ప్రియమైన ప్రధాన మంత్రి,

శాంతిని ప్రేమించే మరియు భారతీయులంగా గర్వించే మేము ఇటీవలి కాలంలో మన ప్రియమైన దేశంలో జరుగుతున్న అనేక విషాదకర ఘటనల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాము. అన్ని మతాలు,తెగలు,కులాలు, లింగపరంగా అందరినీ సమానులుగా పరిగణించే మన రాజ్యాంగం దేశాన్ని సమసమాజ, ప్రజాస్వామ్య సర్వసత్తాక దేశంగా వర్ణించింది. అందువలన అతడు లేదా ఆమెకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ప్రతి వారూ అనుభవించేట్లు చూడాల్సి వుంది. అందుకు గాను మావినతి ఇలా వున్నది.

1. ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలను న్యాయ విచారణ పద్దతులను పాటించకుండా చంపటాన్ని(ఆటవిక హత్యలు) వెంటనే నిలుపుదల చేయించాలి.2016లో దళితుల మీద 840 అత్యాచారాలు జరిగినట్లు, ఆ వుదంతాలలో శిక్షలు పడుతున్న శాతం పడిపోతుండటాన్ని జాతీయ నేర నమోదు సంస్ధ(ఎన్‌సిఆర్‌బి) ద్వారా తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాము. అంతేకాదు 2009 జనవరి ఒకటి నుంచి 2018 అక్టోబరు 29 మధ్య మత సంబంధమైన గుర్తింపు ప్రాతిపదికన 254విద్వేష పూరిత నేరాలు జరిగినట్లు నమోదైంది. వాటిలో 91 మంది మరణించగా 579 మంది గాయపడ్డారు.(ఫ్యాక్ట్‌ చెకర్‌ డేటా, 2018 అక్టోబరు 30) ది సిటిజన్స్‌ రిలీజియస్‌ హేట్‌ క్రైమ్‌ వాచ్‌ నమోదు చేసిన దాని ప్రకారం 62శాతం కేసులలో ముస్లింలు (భారత జనాభాలో 14శాతం మంది), క్రైస్తవులు(దేశ జనాభాలో రెండుశాతం) 14శాతం కేసులలో బాధితులు. వీటిలో 90శాతం దాడులు జాతీయంగా మీ ప్రభుత్వం అధికారం స్వీకరించిన 2014 మే నెల తరువాత నమోదైనవి.

ఎటువంటి న్యాయ విచారణ పద్దతులను పాటించకుండా చంపిన వుదంతాలను ప్రధాన మంత్రిగా మీరు పార్లమెంట్‌లో విమర్శించారు, అయితే అది చాలదు. దుష్కార్యాలకు పాల్పడిన వారి మీద ఏ చర్య తీసుకున్నారు ? అటువంటి నేరాలకు పాల్పడిన వారికి బెయిలు ఇవ్వకూడదని, ఇతరులు భయపడేవిధంగా శిక్షలు వుండాలని, వేగంగా, తప్పకుండా పడాలని మేము గట్టిగా భావిస్తున్నాము.హత్యలు చేసినపుడు ఎలాంటి పెరోల్‌ లేకుండా జీవితకాల శిక్షలు వేయటానికి అవకాశం వున్నపుడు అంతకంటే క్రూరమైన ఆటవిక హత్యలకు పాల్పడుతున్నవారికి అలాంటి శిక్షలు ఎందుకు వేయకూడదు ? ఆమె లేదా అతను ఎవరూ తమ స్వంత దేశంలో భయంతో బతక కూడదు.

దురదృష్టకరంగా నేడు ‘జై శ్రీరామ్‌’ రెచ్చగొట్టే పోరు నినాదంగా మారింది. అది శాంతి భద్రతల సమస్యలకు దారి తీస్తున్నది.ఆ పేరుతో ఆటవిక హత్యలు చోటు చేసుకుంటున్నాయి. మతం పేరుతో ఎక్కువగా హింసాకాండకు పాల్పడటం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఇవి మధ్య యుగాలు కావు. భారత్‌లో మెజారిటీగా వున్న జనంలో అనేక మందికిి రాముడి పేరు పవిత్రమైనది. దేశంలోనే అత్యున్నత బాధ్యతల్లో వున్న మీరు రాముడి పేరును ఈ విధంగా భష్ట్రు పట్టించటాన్ని వెంటనే నిలుపుదల చేయించాలి.

2.భిన్నాభి ప్రాయం లేపోతే ప్రజాస్వామ్యమే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతిని వ్యక్త పరచేవారిని ఆ కారణంతో దేశ వ్యతిరేకులు లేదా అర్బన్‌ నక్సల్‌ అని నిర్బంధించకూడదు. రాజ్యాంగం కల్పించిన రక్షణ ఆర్టికల్‌ 19ప్రకారం భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్చలో అసమ్మతి అంతర్భాగం.

పాలకపార్టీని విమర్శించటం అంటే దేశాన్ని విమర్శించినట్లు కాదు. అధికారంలో వున్నంత మాత్రాన ఏ పార్టీ కూడా దేశానికి పర్యాయపదం కాదు. అది ఆ దేశంలోని రాజకీయ పార్టీలలో ఒకటి మాత్రమే. అందువలన ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని జాతీయ వ్యతిరేక మనోభావాలతో సమంగా చూడకూడదు. ఎక్కడైతే అసమ్మతిని అణచివేయని స్వేచ్చా వాతావరణం వుంటుందో అది మాత్రమే బలమైన దేశాన్ని తయారు చేస్తుంది. మన దేశ భవితవ్యత కొరకు సమంజసమైన మరియు ఆతృత కలిగిన భారతీయులంగా మేము దేనికొరకైతే సూచనలు చేశామో వాటిని ఆ స్ఫూర్తితో పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాము.’

అంటూ 49 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. ఆదూర్‌ గోపాలకృష్ణన్‌, మణిరత్నం, అపర్ణాసేన్‌, రామచంద్ర గుహ వంటి ప్రముఖులు వున్నారు. దీనికి ప్రతిగా 62 మంది ప్రముఖులు పై లేఖ రాసిన వారి మీద ఎదురు దాడి చేస్తూ అంతకంటే పెద్ద లేఖను రాశారు. ఫలానా అంశం మీద మీరెందుకు స్పందించలేదు, నరేంద్రమోడీ దేశాన్ని ఐక్యంగా వుంచుతుంటే, విదేశాల్లో దేశపరువు తీసే విధంగా, మోడీని ప్రతినాయకుడిగా చూపుతున్నారంటూ 49 మంది లేఖలో లేని అంశాలను ఏకరువు పెట్టారు. దేశంలో ఎవరు ఏ అంశం మీద అయినా స్పందించేందుకు హక్కు వుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే 49 మంది లేఖలో ఎక్కడా ప్రధానిని కించపరచలేదు, జరుగుతున్నదాడులకు బాధ్యుడు మోడీ అని లేదా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, సంస్ధలని ఎక్కడా ప్రస్తావించలేదు. తాము చూస్తున్న,జరుగుతున్న పరిణామాల మీద స్పందించారు. దానికి జవాబు నరేంద్రమోడీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలని ఎవరైనా ఆశిస్తారు. కాశ్మీరు విషయంలో మధ్యవర్తిత్వం లేదా తీర్పు చెప్పాలని తనను నరేంద్రమోడీయే స్వయంగా కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగంగా చెప్పాడు. స్వయంగా తన మీద వచ్చిన అంశానికే నోరు విప్పేందుకు నరేంద్రమోడీకి ధైర్యం లేకపోయింది. మా ప్రధాని అలా అడగలేదు అనటం తప్ప ట్రంప్‌ అబద్దం చెప్పాడు అని మంత్రులు లేదా ప్రభుత్వం ప్రకటన చేసే దమ్మును 56 అంగుళాల ఛాతీ ప్రదర్శించలేకపోయింది.

నలభై తొమ్మిది మంది మన దేశానికే పరిమితమై మన ప్రధానికే లేఖ రాశారు. ఇదే పరువు తీసే అంశమైతే అంతర్జాతీయ స్ధాయిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విలేకర్ల సమావేశంలో మోడీ గురించి చెప్పిన అంశం మన దేశ, ప్రధాని పరువు నిలబెట్టేదని 62 మంది మేథావులు భావిస్తున్నారా? అవునంటే ట్రంప్‌ను అభినందించారా కాకపోతే ఖండిస్తూ ప్రకటన ఏమైనా చేశారా అంటే లేదు. ఫలానా అంశం మీద మీరెందుకు స్పందించలేదని ఇతరులను ప్రశ్నిస్తున్న వారు యావత్‌ దేశ ప్రతిష్టకు, దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా మోడీ అడిగినట్లు చెప్పిన అంశం మీద ఎందుకు స్పందించలేదో చెబుతారా ? అంతర్జాతీయంగా మోడీ గబ్బుపట్టినా, అపహాస్యం పాలైనా ఫరవాలేదని 62 మంది అనుకుంటున్నారా ? కొన్ని ఎంపిక చేసిన అంశాల మీదనే స్పందిస్తున్నారని 62 మంది మేథావులు ప్రశ్నించారు. మీ లేఖలో మీరు ఎంపిక చేసుకున్న అంశాలు గాక ఇతర వాటిని ఎందుకు విస్మరించారో చెప్పాలి.ఈ దేశంలో 49 మందే కాదు 62 మంది కూడా అన్ని అంశాల మీద స్పందించాలని నిర్ణయించుకున్న బృందాలు కావు, అది సాధ్యం కూడా కాదు. కొందరు ప్రస్తావించిన దాని మీద చర్చ లేక స్పందనకు పరిమితం కాకుండా లేని అంశాలను ఎందుకు లేవనెత్తలేదనటం అడ్డగోలు వాదన తప్ప మేథావితనం కాదేమో ! ప్రధానికి లేఖ రాస్తే స్పందించాల్సింది ఆయన లేదా ప్రధాని కార్యాలయం, వారు చేయాల్సిన దాని మీద స్పందించే బాధ్యతను మీకు ఎవరైనా ఇచ్చారా ? లేదూ ఆ బాధ్యతను మీరు స్వచ్చందంగా పుచ్చుకుంటే మీరు ఎన్నింటి మీద, ఎప్పుడు, ఎలా స్పందించారో వివరించండి.

Image result for karl marx on intellectuals

మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు కోపం అన్నట్లు 62 మంది స్పందన వుంది. దేశంలో జరుగుతున్న నేరాల గురించి జాతీయ నేరాల నమోదు సంస్ధ(ఎన్‌సిఆర్‌బి) వెల్లడించిన అంశాలనే 49 మంది తమ లేఖలో వుటంకించారు. అంటే సదరు ఎన్‌సిఆర్‌బి అంతర్జాతీయంగా దేశం, మోడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాటిని నమోదు చేసినట్లా ? ఆటవిక హత్యల గురించి గతంలో ఎన్నడూ ఎవరూ సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేయలేదు. గతంలో జరిగిన ఆటవిక హత్యలేమైనా వుంటే అవి శాంతి భద్రతల సమస్యల్లో భాగంగా జరిగాయి. గత ఐదు సంవత్సరాలుగా ఆవు సంరక్షణ పేరుతో, జైశ్రీరామ్‌ పేరుతో మైనారిటీ మతాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు, హత్యలు జరుగుతున్నాయి. జరుగుతున్న ఆటవిక దాడులు, వాటిని నిరోధించేందుకు, శిక్షాపరంగా తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని ఒక వాజ్యంలో సుప్రీం కోర్టు గతేడాది జూలైలో కేంద్రం, మానవహక్కుల కమిషన్‌, రాష్ట్రాలను కోరింది. ఆటవిక హత్యలను ప్రత్యేక నేరంగా పరిగణించాలని పార్లమెంట్‌ను కూడా కోరింది. ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్‌ వెల్లడించిన 45పేజీల తీర్పు మన దేశంలో నెలకొన్న పరిస్ధితికి పాలకులను తీవ్రంగా అభిశంసించటం తప్ప వేరు కాదు. పరువు, ప్రతిష్ట గురించి పాకులాడే వారికి ఇంతకంటే పరువుతక్కువ మరొకటి వుండదు. అలాంటి తీర్పు ఇచ్చి ఏడాది గడిచినా గడచినా స్పందన లేదేమిటని అదే కోర్టు మరోసారి ఈనెలల అడగటం అంటే మన చర్మాలు ఎంత మొద్దుబారాయో గుర్తు చేయటమే. ఎంపిక చేసుకున్న అంశాల మీద లేఖలు రాస్తున్నారని 49 మందిని విమర్శించిన 62 మంది సుప్రీం కోర్టు స్పందన గురించి ఏమంటారు. కోర్టులో అనేక కేసులు పెండింగ్‌లో వుండగా దీన్ని పట్టించుకోవటంలో దురుద్ధేశ్యం వుందని, కేంద్రాన్ని ఎండగట్టేందుకు కేసులను ఎంపిక చేసుకుందని తప్పుపడతారా ? ఆవేదన చెందిన ప్రముఖులు కోరినా, చివరకు సర్వోన్నత న్యాయస్ధానం అడిగినా స్పందించని వారి గురించి 62 మంది ఏమంటారు? అసలు 62 మంది సమస్య ఏమిటి?

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆది గోద్రెజ్‌ కొద్ది రోజుల క్రితం ముంబై సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీ 150 వార్షికోత్సంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ రెండవసారి తన పాలనా కాలంలో ఆర్ధిక వ్యవస్ధను రెండింతలు చేసి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచేందుకు నిర్ణయించటం అభినందనీయం అన్నారు. అయితే దేశంలో అంతా సవ్యంగా లేదు, సామాజిక రంగంలో తీవ్ర ఆందోళనకర పరిస్ధితులు వున్నాయి. తీవ్రమైన దారిద్య్రం మన సమాజాన్ని పీడిస్తోంది. అది వేగాన్ని మందగింప చేసి మనం ముందుకు పోవటానికి ఆటంకం అవుతుంది. అసహనం పెరగటం, విద్వేష పూరిత నేరాలు, తమకు తోచిన నీతి, రీతిని ఇతరుల మీద బలవంతంగా రుద్దటం వంటి అంశాలు దేశ ఆర్ధిక వ్యవస్ధను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దేశంలో సామాజిక అస్ధిరత పెరుగుతోంది.మహిళల మీద నేరాలు, కుల, మత ప్రాతిపదికన హింసాకాండ వంటి ఇతర అన్ని రకాల అసహనం దేశమంతటా ప్రబలిపోయింది. సామాజిక సామరస్యతను సాధించేందుకు ఆటంకంగా మారుతున్నది. దేశంలో నిరుద్యోగం 6.1శాతం వుండటం నాలుగుదశాబ్దాల రికార్డు, దాన్ని త్వరలో పరిష్కరించాలి. నీటి సంక్షోభం వుంది, వైద్య సదుపాయాలు కుంటుపడుతున్నాయి. తోటి వర్ధమాన దేశాలతో పోల్చుకుంటే దేశంలో ఆర్యోగ సంరక్షణకు చేస్తున్న ఖర్చు అట్టడుగున వుంది. కొన్ని అంశాలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించేందుకు పూనుకోవాలి అని కూడా ఆది గోద్రెజ్‌ చెప్పారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఆటవిక హత్య గురించి పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోడీ తనకు బాధ కలిగించిందని, నిందితులకు సాధ్యమైన మేరకు కఠిన శిక్ష వేయాలని వ్యాఖ్యానించారు.పోలీసుల ముందే జరిగిన మూకదాడి గురించి పార్లమెంటులో మాట్లాడక తప్పని స్ధితి వచ్చింది. వీటి గురించి 62 మంది మేథావులు ఏమంటారు? ఆది గోద్రెజ్‌ కూడా ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని కాలేజీ సభను ఎంపిక చేసుకొని మాట్లాడారా ?

ఆటవిక చర్యలకు పాల్పడే సమయంలో జై శ్రీరామ్‌ అని నినాదాలు చేయటాన్ని లేదా ఆ నినాదాలు చేస్తూ ఆటవిక చర్యలు చేపట్టటాన్ని సభ్య సమాజం తప్పుపడుతోంది. ఆ చర్యలు మన దేశ సంస్కృతి కాదు, పురాణాలు, ఇతర గ్రంధాల్లో చరిత్రలో ఎక్కడా జై శ్రీరామ్‌ పేరుతో ఆటవిక పద్దతులను పాటించటమే మన సంస్కృతి అని ఎక్కడా చెప్పలేదు. మధ్య యుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో, జర్మనీలో హిట్లర్‌ను పొగిడే సందర్భంలో ఇలాంటి వున్మాద పూరితమైన వ్యవహారాలు జరిగాయి తప్ప మరెక్కడా కానరాదు. మోడీకి లేఖ రాసిన 49 మంది తమవైన రాజకీయ అభిప్రాయాలు కలిగి వుండవచ్చు తప్ప వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు, రాజకీయాల్లో వున్న వారు కాదు.అలాగే మోడీకి మద్దతుగా లేఖ రాసిన వారు 62 మంది ఏ పార్టీకి చెందినవారన్నది సమస్య కాదు. ఎవరు ఏ భావజాలానికి ప్రతినిధులుగా జనం ముందుకు వచ్చారన్నదే ముఖ్యం.

Image result for intellectual's

మతోన్మాదులు, ఫాసిస్టులు, నాజీలు, ఇతర నియంతలు ఏలిన దేశాల చరిత్రను చూస్తే మేథావులు ఎప్పుడూ, ఎక్కడా ఒకే వైఖరితో లేరు. దోపిడీ పద్దతులు, విధానాలను రూపొందించిందీ, దోపిడీని నిర్మూలించే, సమసమాజాన్ని నిర్మించే పద్దతులనూ చెప్పింది కూడా మేథావులే. 1925లో ఇటలీలో ఫాసిస్టు మేథావులు సభ జరిపి తమ ప్రణాళికను ప్రకటించిన తరువాత ఫాసిస్టు వ్యతిరేక మేథావులు తమ ప్రణాళికను ప్రకటించారు. ఇలాంటి పరిణామాలు అనేక దేశాల్లో జరిగాయి. ఇప్పుడు మన దేశంలో కూడా అలాంటి సమీకరణ జరుగుతున్నది. వాస్తవానికి దాన్ని సంఘపరివార్‌ శక్తులు వేగవంతం చేస్తున్నాయి. మేథావులుగా వున్న వారు తాము ఎటు వైపో తేల్చుకోవాల్సిన అగత్యాన్ని వారు కల్పిస్తున్నారు. మేము అటు వామపక్షం కాదు ఇటు మితవాద పక్షం కాదు అనుకునే వారు కూడా ఏదో ఒకవైపు సమీకరణ అయ్యేందుకు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మితవాదులు వారిని మధ్యలో వుండనివ్వరు. తమను విమర్శించే వారందరూ తమకు వ్యతిరేకులే అన్నది ఇప్పుడు నడుస్తున్న ధోరణి. తమకు అనుకూలంగా లేనివారందరూ కూడా వ్యతిరేకులే అనే సూచనలు కనిపిస్తున్నాయి. భావ ప్రకటనా స్వేచ్చను మన దేశంలో ఫాసిస్టులు, నాజీలకు ప్రతిరూపాలుగా వున్న శక్తులు సహించే స్ధితిలో లేవు. మేథావులు ఎప్పుడూ రెండు తరగతులుగా వుంటారని చరిత్ర చెప్పింది. ఒక తరగతి పాలకవర్గాలకు వూడిగం చేసేందుకు తమ మేథోశక్తిని వుపయోగించి చరిత్ర చెత్తబుట్టలోకి పోతే, మరో తరగతి ప్రజల గొంతుకగా ముందుండి నిరంతరం జనం నోళ్లలో నానుతున్నారు. అందువలన మేథావులు ఎటు వైపు వుండాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్న మైంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d