• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

అవకాశ వాదానికి మారు పేరే మహారాష్ట్ర బిజెపి-శివసేన పొత్తు !

25 Monday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

BJP, bjp sena alliance, Congress-NCP alliance, Maharashtra elections 2019, NCP, Shiv sena

Image result for bjp sena alliance  cartoons

ఎం కోటేశ్వరరావు

దేశ రాజకీయాలలలో అధికారమే పరమావధిగా వుండే రాజకీయ నేతల అవకాశవాదానికి హద్దులు ఎన్నడో చెరిగిపోయాయి.రాత్రి వరకు కత్తులు దూసుకున్నవారు తెల్లవారే సరికి పొత్తులు కుదుర్చుకుంటున్నారు. గతంలో ఎన్నికల ముందు వరకు ఎవరు ఏ పార్టీలో వుంటారో తెలియని స్ధితి. ఇప్పుడు ఎన్నికల తరువాత ఎటువైపు చేరతారో కూడా తెలియని విధంగా అధికార రాజకీయాలు తయారయ్యాయి. అధికార దాహంగల పార్టీల తరఫున పోటీ చేస్తున్న అమీర్లు స్పష్టంగా వున్నారు. ఎన్నికల వ్యాపారంలో ఎంత పెట్టుబడి పెట్టాలి, దాన్ని లాభంతో సహా రాబట్టుకోవాలంటే ఏమి చేయాలన్నది బరిలోకి దిగే ముందే వారికి తెలుసు. బీద ఓటర్లే ఇంకా అయోమయంలో వున్నారు.

దేశంలో వుత్తర ప్రదేశ్‌ తరువాత 48లోక్‌సభ స్ధానాలతో ఎక్కువ సీట్లున్న రాష్ట్రం మహారాష్ట్రలో ఏప్రిల్‌ 11,18,23,29 తేదీలలో నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబరుతో ముగిసే అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పటికీ దేశంలో బిజెపి విజయంపై నీలి నీడలు కమ్ముకోవటంతో అసెంబ్లీ ఎన్నికల ఆలోచనను ఆ పార్టీ విరమించుకుంది.  దీర్ఘకాలంగా ఈ రాష్ట్రం సంకీర్ణ రాజకీయాలకు నిలయంగా వుంది. ఒక నాడు పెద్ద పార్టీలుగా వున్న కాంగ్రెస్‌, శివసేన ప్రాభవం కోల్పోయాయి. గత ఎన్నికలలో యుపిఏ కూటమిలో కాంగ్రెస్‌ 26, శరద్‌ పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌(ఎన్‌సిపి) 21 స్ధానాల్లో పోటీ చేయగా ఎన్‌డిఏ కూటమిలో బిజెపి 24,శివసేన 20 చోట్ల పోటీ చేశాయి. మిగిలిన స్ధానాలలో కాంగ్రెస్‌, బిజెపి ప్రాంతీయ మిత్రపక్షాలు పోటీ చేశాయి.

Image result for bjp sena alliance  cartoons

మహారాష్ట్ర రాజకీయాలలో ఒకనాడు పులిలా వున్న శివసేన ఇప్పుడు బిజెపి ముందు పిల్లిలా తయారైంది. ఒక వైపు కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపితో అధికారం పంచుకుంటూనే గత ఐదు సంవత్సరాలలో శివసేన అనేక సందర్భాలలో బిజెపిని విమర్శించింది.ఏండాది క్రితం తాము ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించటమే కాదు, విమర్శల జోరు పెంచింది. కొండంత రాగం తీసి కీచు గొంతుతో అరచినట్లు ఎన్నికల నోటిఫికేషన్‌కు కొద్ది రోజుల ముందు బిజెపితో ఎన్నికల అవగాహనకు అంగీకరించింది. సామ్నా పత్రికలో, మీడియా సమావేశాలలో గతంలో ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేసినప్పటికీ విడిగా పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసిన బిజెపి వాటన్నింటినీ దిగమింగింది. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి పాలన వైఫల్యాలను విమర్శించి వాటితో తమకేమీ సంబంధం లేదని జనం ముందు ప్రదర్శించుకొనేందుకు శివసేన ప్రయత్నించింది. నోట్ల రద్దు నిర్ణయం మాదిరే రామాలయ నిర్మాణంపై ఎందుకు నిర్ణయం తీసుకోరని మోడీని ప్రశ్నించింది. గోమాతల రక్షణ గురించి మాట్లాడుతున్నారు సరే మన మాతలను ఎలా రక్షిస్తారంటూ నిలదీసింది. చివరికి చౌకీదార్‌ చోర్‌ అన్న కాంగ్రెస్‌ నినాదాన్ని కూడా పునరుద్ఘాటించింది. అలాంటి పార్టీ ఆకస్మికంగా ప్లేటు ఫిరాయించింది. మిగతా చిన్న పార్టీలను విస్మరించి బిజెపి 25,శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.కాంగ్రెస్‌ 24, ఎన్‌సిపి 20 సీట్లలో పోటీ చేసేందుకు, రెండేసి సీట్ల చొప్పున ఆయా పార్టీల అభీష్టం మేరకు ఇతర పార్టీలకు కేటాయించుకొనే విధంగా రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

Image result for bjp sena alliance  cartoons

శివసేన తీరు తెన్నులను చూస్తే చివరి నిమిషం వరకు బిజెపితో దోస్తీ లేదని చెప్పటం వెనుక బేరసారాలలో సాధ్యమైనన్ని సీట్లు రాబట్టుకోవటం, బాబరీ మసీదు వంటి విషయాల్లో మతోన్మాదం, మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా ఓటర్లను తనవైపు తిప్పుకోవాలన్న ఎత్తుగడే కనిపిస్తున్నది.అనేక రాష్ట్రాలలో మాదిరి ఇక్కడ కూడా తమకు పడవు అనుకొనే తరగతుల ఓట్లను తొలగించారనే విమర్శలు వచ్చాయి. మాజీ న్యాయమూర్తి, జనతాదళ్‌(ఎస్‌) జాతీయ కార్యదర్శి బిజి కోల్సే పాటిల్‌ చెబుతున్నదాని ప్ర కారం దాదాపు 40లక్షల ఓట్లు జాబితాల నుంచి మాయమయ్యాయి. ఇదంతా బిజెపి కుట్రలో భాగమని, తొలగించిన ఓట్లలో 17లక్షలు దళితులు, పదిలక్షలు ముస్లింలకు చెందినవన్నారు. మిస్సింగ్‌ ఓటర్‌ యాప్‌ను తయారు చేసిన ఖాలిద్‌ సైఫుల్లా నాయకత్వంలో జరిగిన సర్వే ప్రకారం దేశంలో మూడు కోట్ల మంది ముస్లింలతో సహా దాదాపు 12.7కోట్ల మంది ఓట్లు జాబితాల నుంచి మాయమయ్యాని పాటిల్‌ అన్నారు.

రాష్ట్ర రాజకీయాలలో చిన్న రాజకీయ పార్టీలు కొన్ని ప్రాంతాలలో పట్టు కలిగి వుండటంతో ఏదో ఒక పార్టీ వాటితో సర్దుబాటు చేసుకోవలసి వచ్చేది. శివసేన నుంచి విడిపోయిన వుద్దావ్‌ ధాకరే ఏర్పాటు చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) ఒకటి. ముంబై, మరికొన్ని పట్టణ ప్రాంతాలలో వున్న బలంతో శివసేన,బిజెపి అభ్యర్ధుల ఓటమికి తోడ్పడేది. కాంగ్రెస్‌,ఎన్‌సిపి కూటమితో కలసి పనిచేసింది. ఈ ఎన్నికలో ఎంఎన్‌ఎస్‌తో ఎలాంటి ఒప్పందం లేదని కాంగ్రెస్‌ ప్రకటించింది. బిజెపి, శివసేనలను గట్టిగా వ్యతిరేకించే ఆ పార్టీ ఈసారి ఏవైఖరి తీసుకుంటుందో వెల్లడి కావాల్సి వుంది.

అంబేద్కర్‌ ప్రభావంతో మహారాష్ట్ర దళిత వుద్యమాలు, రాజకీయ పార్టీలు, సంస్ధలకు కేంద్రంగా వుంది.  అయితే వాటిలో ఐక్యత లేదు. అవకాశవాదం, అధికార దాహంతో వ్యవహరిస్తుంటాయనే విమర్శ వుంది. పార్లమెంట్‌ సభ్యుడు, అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ నాయకత్వంలోని భారతీయ రిపబ్లికన్‌ బహుజన్‌ మహాసంఘ్‌ ఈ సారి అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్‌ పార్టీతో కలసి పని చేస్తానని ప్రకటించింది. బీమా కొరేగావ్‌ వుదంతం, అదే విధంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మరాఠాల ఆందోళనల పూర్వరంగంలో జనాభాలో 12-14శాతం మధ్య వున్న దళితులు ఆగ్రహంతో వున్నారు. వీరికి ముస్లింలు కూడా తోడై ఒక సంఘటిత శక్తిగా వుంటే ప్రధాన  పార్టీలను కొన్ని చోట్ల దెబ్బతీసే అవకాశం వుంది. అయితే ముందే చెప్పుకున్నట్లు దళిత సంస్ధల మధ్య ఐక్యత లేకపోవటంతో కాంగ్రెస్‌,బిజెపి వంటివి వాటిని ఖాతరు చేయటం లేదు. వంచిత్‌ బహుజన్‌ అగాధీ వంటి పార్టీలు ముఖ్యంగా దళితుల్లో పని చేసేవి వున్నాయి.

2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ఓట్లు, సీట్లు

పార్టీ    ఓట్ల వాటా        మార్పు     సీట్లు      మార్పు

బిజెపి    27.30%    9.13%    23        14

శివసేన    20.60%    3.60%    18       7

కాంగ్రెస్‌    18.10%    -1.51      2      -15

ఎన్‌సిపి    16.00%    -3.28      4      -4

స్వాభిమానిపక్ష            2.30%     1      0

Image result for bjp sena alliance  cartoons

అధికారం కోసంమే కాంగ్రెస్‌ నుంచి చీలి వేరు కుంపటి పెట్టుకున్న శరద్‌ పవార్‌ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. ఆయన కుమార్తె సుప్రియ సూలే రంగంలో వున్నారు. ఈ వయసులో తాను పోటీ చేసినా చేయకపోయినా ఒకటే అని, అయినా ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది పోటీ చేయటం ఎబ్బెట్టుగా వుంటుందని పవార్‌ అంటున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసిన బిజెపి-శివసేన కూటమి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సంఖ్యపై పేచీ కారణంగా వేర్వేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూటమి కూడా విడిపోయింది. అసెంబ్లీలోని 288 సీట్లకు గాను బిజెపి 27.8శాతం ఓట్లతో 122, శివసేన 19.3శాతం ఓట్లతో 63, ఎన్‌సిపి 17శాతం ఓట్లతో 41, కాంగ్రెస్‌కు 18శాతం ఓట్లు 42 సీట్లు వచ్చాయి.ఎంఎన్‌ఎస్‌ పార్టీ ఒక సీటు 3.7శాతం ఓట్లు తెచ్చుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో బిజెపి, శివసేన పార్టీల ఓట్లు దాదాపు సమంగా వున్నాయి. కాంగ్రెస్‌, బిజెపి ఓట్లుస్వల్పంగా పెరిగాయి. ఈ ప్రభుత్వ వ్యతిరేకత, ఎన్నికల ముందు వరకు శివసేన, బిజెపి కుమ్ములాటలు ఆ కూటమి అవకాశాలను దెబ్బతీస్తాయని కొందరి అంచనా. అయితే ఆ రెండు పార్టీల కలయిక మెజారిటీ సీట్లను స్వంతం చేసుకోవచ్చు అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. పది నుంచి పన్నెండు సీట్లు తాము గెలిచే అవకాశం వుందని ఎన్‌సిపి అంచనా వేసుకుంటున్నది. కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూటమికి 18 నుంచి 23 సీట్లవరకు వస్తాయని జనవరి పోల్‌ సర్వేలు తెలిపాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆదిత్యనాధ్‌ ఇలాకాలో బిజెపి తొలి ఓటమి !

24 Sunday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

Bahujan Samaj Party, BJP, Congress party, Modi, Samajwadi Party, Shah, UP Loksabha elections 2019, UP's kairana, Yogi Adityanath

Image result for up lok sabha election 2019

ఎం కోటేశ్వరరావు

అవును ఎన్నికలు ఇంకా జరగముందే ఓడిపోవటం ఏమిటి అనుకుంటున్నారా ? అవును నిజంగానే ఏడాది క్రితం నిలిపిన అభ్యర్ధిని ఇప్పుడు మార్చటం అంటే నైతికంగా ఓటమిని అంగీకరించటం కాదా ? కైరానా నియోజకవర్గం ఏడాది క్రితం ఒక సంచలనం. మూడో వంతుకు పైగా ముస్లిం జనాభా వున్న ఈ నియోజకవర్గంలో వారు మెజారిటీగా వున్న చోట్ల నుంచి హిందువులను తరిమి వేస్తున్నారంటూ ఆ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బిజెపి నేత హుకుం సింగ్‌, తదితరులు పెద్ద ఎత్తున ప్రచారం చేసి వుద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సదరు సింగ్‌ హఠాన్మరణంతో ఏడాది క్రితం వుప ఎన్నిక అవసరమైంది. అది ఒక్క వుత్తర ప్రదేశ్‌ రాజకీయాలనే కాదు, దేశ వ్యాపితంగా బిజెపి వ్యతిరేక శక్తులు ఒక్కతాటి మీదకు వస్తే కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటో వెల్లడించింది.

ఆ ఎన్నికలో బిజెపి అభ్యర్దిగా హుకుంసింగ్‌ కుమార్తె మృగాంకను నిలిపి సానుభూతి ఓట్లతో గెలవాలని చూసింది. అయితే సమాజవాదిపార్టీ, ఆర్‌ఎల్‌డి వుమ్మడి అభ్యర్ధిగా ఆర్‌ఎల్‌డికి చెందిన తబుసుమ్‌ హసన్‌ను రంగంలోకి దిగటమే కాదు గణనీయ మెజారిటీతో బిజెపిని ఓడించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ పోటీ చేయలేదు.బిజెపిని ఓడించండి అని కార్యకర్తలకు పిలుపునివ్వటం తప్ప ఫలానా వారికి మద్దతు ఇస్తున్నట్లు బహుజన సమాజవాది పార్టీ నాయకురాలు మాయావతి సూచించలేదు. ఈ ఎన్నిక తరువాత అనూహ్యంగా దశాబ్దాలుగా వుప్పు నిప్పుగా వుండే ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. ఒక ఫార్ములాను రూపొందించుకొని సీట్ల సర్దుబాటు చేసుకొని బిజెపి మీద బస్తీమే సవాల్‌ అంటూ బరిలోకి దిగాయి.

శనివారం నాడు బిజెపి ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో కైరానాలో మృగాంకకు మొండి చేయి చూపి పక్క జిల్లాకు చెందిన ఒక ఎంఎల్‌ఏను ఎంపిక చేశారు. వేరే కారణాలేమీ లేకుండా ఏడాదిలోనే అభ్యర్ధిని మార్చటం అంటే నైతికంగా బిజెపి ఓటమిని అంగీకరించటమే. వుప ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డి అభ్యర్ధినిగా వున్న తబుసుమ్‌ ఈ సారి సమాజవాది పార్టీ అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ సారి కాంగ్రెస్‌ తమ అభ్యర్ధిని నిలిపే అవకాశం వుంది. ఏడుశాతంపైగా గత ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఏకపక్షంగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్దానాలలో మద్దతు ప్రకటించి మిగిలిన అన్ని చోట్ల ఎస్‌పి, బిఎస్‌పి,ఆర్‌ఎల్‌డి కూటమి అభ్యర్దులను రంగంలోకి దించుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర బిజెపి సర్కార్‌పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ప్రధాన ప్రత్యర్ధులకే దోహదం చేస్తుంది తప్ప కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చదు. అయినా అన్ని చోట్లా తమ అభ్యర్ధులను నిలుపుతామని ఆ పార్టీ ప్రకటించింది.ఓటర్లు ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది.

Image result for up lok sabha election 2019

అయోధ్య ! రాముడిని వీధుల్లోకి, భారతీయ జనతాపార్టీతో పాటు దేశంలో అనేక మందిని మత రాజకీయాలవైపు నెట్టిన పేరు. పక్కా కాషాయంతో మతం, అయోధ్య రాముడిని వుపయోగించుకొని బిజెపి లాభపడిందన్నది నిస్సందేహం. దాని తీరు చూసి కాంగ్రెస్‌ కూడా పలుచబారిన కాషాయంతో ఓట్లు సంపాదించాలని చూస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నది. అయోధ్యలోని బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణం అన్నది గత ఎన్నికలలో బిజెపి వాగ్గానం. దానికి నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి, నల్లధనం వెలికితీత వంటి నినాదాలు తోడయ్యాయి. సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్‌, తదితర పార్టీలు విడివిడిగా పోటీపడటం బిజెపికి అనూహ్యంగా 80కిగాను 71, దాని మిత్రపక్షం అప్నాదళ్‌కు రెండు, సమాజవాది పార్టీకి ఐదు, కాంగ్రెస్‌కు రెండు వచ్చాయి.

Image result for ayodhya priest surendra das

ఈ సారి రామ మందిరం కాదు, పుల్వామాయే బిజెపిని రక్షిఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని పుల్వామా మాత్రమే రక్షించగలదు తప్ప రామ మందిరం కాదని అయోధ్యలోని వివాదాస్పద తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సురేంద్రదాస్‌ అన్నారు. సాధారణంగా రాజకీయాల గురించి నోరు విప్పని ఆ పెద్దమనిషి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ‘కాశ్మీర్‌పై దాడితో బిజెపి రామ మందిర సమస్యను పక్కన పెడుతుంది. రామ్‌ రామ్‌ అని నినాదాలు ఇచ్చేవారు ఇప్పుడా పని చేయరు. వారు గనుక రామ మందిరం సమస్యను ముందుకు తెస్తే ఓడిపోతారు, జనం వారిని నమ్మటం లేదు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు’ అని వ్యాఖ్యానించారు.

గతంలో బాబరీ మసీదు వున్న చోట ఇప్పుడు తాత్కాలిక గుడారంలో భద్రతా సిబ్బంది రక్షణ మధ్య నాలుగు రాముడి విగ్రహాలు వున్నాయి. నాలుగంచలలో సందర్శకులను తనిఖీ చేసిన తరువాత 50 మీటర్ల దూరం నుంచి ఆ విగ్రహాలను చూడనిస్తారు. గతంలో సంస్కృత పండితుడిగా పని చేసిన సురేంద్రదాస్‌ కొన్ని విషయాలను నిర్మొహమాటంగా చెబుతారు. బాబరీ మసీదు కూల్చివేత ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా బాధించిందని, కూల్చాల్సిన అవసరం లేదని అంటారు.

పుల్వామా వుదంతం బిజెపిని తిరిగి అధికారంలోకి తెస్తుందనే అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించటం లేదు. గతంలో కార్గిల్‌ యుద్ధాన్ని, యూరి సర్జికల్‌ దాడులను బిజెపి ఎన్నికలలో వుపయోగించుకొని జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను విస్మరించి ఓటర్లకు దూరమైన విషయాలను గుర్తు చేస్తున్నారు. పుల్వామా తాత్కాలికంగా భావోద్వేగాలను రగిలించగలదు తప్ప నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభాన్ని ఓటర్లు మరచిపోయే అవకాశం లేదంటున్నారు. పుల్వామా వుదంతాన్ని, అయోధ్య స్ధల వివాదం సుప్రీం కోర్టులో ఇంకా విచారణలో వుండగా దాన్ని ఏ రూపంలో ముందుకు తెచ్చినా బిజెపి విమర్శపాలయ్యే అవకాశం వుంది. రామాలయ నిర్మాణ వాగ్దానంతో అధికారానికి వచ్చిన యోగి ఆదిత్యనాధ్‌ భక్తులను తప్పుదారి పట్టించేందుకు లేదా సంతృప్తి పరచేందుకు ఆలయ నిర్మాణం బదులు ఫైజాబాద్‌ జిల్లా పేరును శ్రీ అయోధ్య అని మార్చటం, అయోధ్యలో అతి పెద్ద రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసినదే. బాబరీ మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్‌ జారీ చేయాలని కోరిన ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌ వంటి సంస్ధలు ఎన్నికలు రాగానే మౌనం దాల్చాయి.

కాంగ్రెస్‌ స్వామిగా పేరున్న శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఫిబ్రవరి 21న అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేస్తానని ప్రకటించి తన అనుచరులందరూ రావాలని పిలుపునిచ్చారు. అయితే 14వ తేదీన పుల్వామా వుగ్రదాడితో ఆ కార్యక్రమం వెనక్కు పోయింది. బిజెపి ఎంతగానో వూపిరి పీల్చుకుంది. రామ మందిర నిర్మాణం జరుగుతుందని రామ ప్రభు సూచన ప్రాయంగా కూడా వెల్లడించలేదు, రామ మందిరం చుట్టూ నాటకం నడుస్తోంది, అదొక ప్రహసనంగా మారుతోంది, బిజెపి ఏమి చెప్పింది, ఏమి చేస్తుంది అన్నది సమస్య కాదు, చివరికి సుప్రీం కోర్టు నిర్ణయిస్తుంది, దాని పట్ల బిజెపి నిజాయితీతో వుండాలి అని పూజారి సురేద్రదాస్‌ వ్యాఖ్యానించారు.

లెక్కలు ఏమి చెబుతున్నాయి !

దేశంలో వుపాధి కల్పన మొదలు, అభివృద్ధి అంకెల వరకు ఎవరు చెప్పేది నిజమో దేన్ని నమ్మాలో నమ్మకూడదో నిర్ణయించుకోలేనంతగా జనాన్ని ఆయోమయంలో పడవేశారు. ఐదేండ్లలో ఎంత మందికి వుపాధి కల్పించారంటే వున్న లెక్కలు తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అంటారు. పకోడీలు అమ్ముకోవటం కూడా వుపాధి కల్పనకిందికే వస్తుందని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పిన తరువాత పకోడీ బండ్లను కూడా తాను కల్పించిన వుపాధిలో భాగంగా పరిగణిస్తున్నారా ? వాటిని వదలి వేద్దాం. గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల లెక్కలను తప్పు, కొత్త లెక్కలు వేయాల్సి వుంది అనటం కుదరదు. అందువలన వాటి ప్రాతిపదికగానే విశ్లేషణలు చేయటం మినహా మరొక మార్గం లేదు.

వుత్తర ప్రదేశ్‌లోని 80 నియోజక వర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.జరుగుతున్నాయి.గత లోక్‌సభ ఎన్నికలలో చిన్న పార్టీలను కలుపుకొని బిజెపి ఎన్‌డిఏ కూటమి పేరుతో, కాంగ్రెస్‌, ఎస్‌పి,బిఎస్‌పి, ఇతర పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. బిజెపి పోటీచేసిన 78 స్ధానాల్లో 71, మిత్రపక్షం అప్నాదళ్‌ రెండు చోట్ల పోటీ చేసి రెండూ గెలిచింది. కాంగ్రెస్‌ 66కు రెండు, సమాజవాది పార్టీ 78కి ఐదు గెలవగా 80చోట్ల పోటీ చేసిన బిఎస్‌పి అన్నింటా ఓడిపోయింది. బిజెపికి 42.3శాతం ఓట్లు రాగా ఎస్‌పికి 22.2, బిఎస్‌పికి 19.6, కాంగ్రెస్‌కు 7.5శాతం వచ్చాయి. ఈ ఎన్నికల్లో బిఎస్‌పి 38, ఎస్‌పి 37 చోట్ల వుమ్మడిగా పోటీ చేస్తూ మిగిలిన చోట్ల కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డిని బలపరుస్తున్నాయి. కాంగ్రెస్‌ అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత గానీ నిజంగా ఎన్నిసీట్లలో పోటీ చేసేది తెలుస్తుంది. బిఎస్‌పి, ఎస్‌పి కూటమి గతంలో వచ్చిన ఓట్లను కలిపితే 41.8శాతం ఓట్లున్నాయి.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ను చూస్తే బిజెపికి 39.7, దాని మిత్రపక్షానికి ఒక శాతం ఓట్లు వచ్చాయి. అదే బిఎస్‌పి,ఎస్‌పిలకు 22.2, 22శాతం వంతున 44.2శాతం వచ్చాయి. ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో బిజెపి సీట్లు సగానికి సగం అంతకంటే ఎక్కువగా పడిపోతాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు ఎన్నికల సర్వేలలో వెల్లడించిన అంకెల సగటును తీసుకుంటే బిజెపికి 29, కాంగ్రెస్‌కు 4, ఎస్‌పి-బిఎస్‌పి కూటమికి 47 వస్తాయని తేలింది.

వుత్తరాది రాష్ట్రాలలో, వుత్తర ప్రదేశ్‌లో బిజెపికి అయోధ్య అంశం ఓట్లు తెచ్చి పెట్టిందేమో కానీ అయోధ్య పట్టణం వున్న ఫైజాబాద్‌ నియోజకవర్గం ఎప్పుడూ దానితో లేదు. బిజెపి ఆయోధ్య ఆందోళన చేపట్టిన తరువాతే అక్కడ అది ఓట్లు తెచ్చుకోగలిగింది. బాబరీ మసీదు కూల్చివేత తరువాత జరిగిన ఎన్నికలలో దానికి ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. 1957 నుంచి 2014వరకు జరిగిన 15 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఏడు సార్లు విజయం సాధించింది. 1991 తరువాత జరిగిన ఏడు ఎన్నికలలో బిజెపి నాలుగు సార్లు విజయం సాధించగా సమాజవాది పార్టీ, బిఎస్‌పి, కాంగ్రెస్‌ ఒక్కోసారి విజయం సాధించాయి. గత ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి లాలూ సింగ్‌కు 48శాతం ఓట్లు రాగా సమాజవాది పార్టీ మిత్రసేన్‌ యాదవ్‌కు 20.43, బిఎస్‌పికి 13.87, కాంగ్రెస్‌కు 12.7శాతం వచ్చాయి.

Image result for up lok sabha election 2019

బాబరీ మసీదు కూల్చివేసిన రోజు సాయంత్రమే జిల్లా కలెక్టర్‌గా నియమితుడైన పరిస్ధితిని చక్కదిద్ది ప్రశంసలు పొందిన విజయ శంకర్‌ పాండే తాజా ఎన్నికల్లో లోక్‌ ఘటబంధన్‌ పార్టీ(ఎల్‌జిపి) అభ్యర్దిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. నిజాయితీ పరుడైన అధికారిగా పేరున్న విజయ శంకర్‌ బాబరీ మసీదు కూల్చివేత అనంతరం ఏర్పడిన పరిస్ధితిని చక్కదిద్దటంలో ఎంతో సమర్ధవంతంగా పని చేశారు. ముక్కుసూటిగా, అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరించే పాండేను 52సార్లు బదిలీ చేశారంటే అవినీతి రాజకీయవేత్తలకు ఎంత దడపుట్టించారో అర్ధం అవుతుంది. అరవై రెండు సంవత్సరాల వయస్సున్న ఈ మాజీ అధికారి తాను ఇప్పుడు వునికిలో వున్న ఏ దైనా రాజకీయ పార్టీలో చేరితే ఇంతరకు తాను చేసిందంతా వృధా అయినట్లే అన్నారు.మార్పుకోసం సహకరించమని తాను సూటిగా ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. తాను కలెక్టర్‌గా నియమితమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు అయోధ్యలో మూకలు హింసాకాండకు పాల్పడ్డాయి. రోడ్లన్నింటినీ మూసివేశారు. ఫైజాబాద్‌ వెళ్లే రోడ్డును కూడా మూసివేయటంతో లక్నో నుంచి హెలికాప్టర్‌లో వచ్చి బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. వివాదాస్పద చంద్రస్వామి వివాదాస్పద స్దలం వద్ద హోమం చేయటానికి అనుమతించని కారణంగా కేవలం ఐదు నెలలకే తనను ఫైజాబాద్‌ నుంచి బదిలీ చేశారని చెప్పారు. మాయావతి, ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌ తనను వేధించారని చెప్పిన పాండే 2017లో వుద్యోగ విరమణ చేశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దేశమంతటా కుస్తీ, కేరళలో కాంగ్రెస్‌ – బిజెపి దోస్తీ !

23 Saturday Mar 2019

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Kerala, Kerala CPI(M), Kerala LDF, UDF Kerala, understanding between Congress-BJP

Image result for kerala cpm

ఎం కోటేశ్వరరావు

దేశాన్ని కాంగ్రెస్‌ నుంచి విముక్తి చేస్తామని చెప్పుకుంటున్న బిజెపి కేరళలో దాన్ని బలపరచటమా ? దక్షిణాది అయోధ్య అని కొందరు వర్ణించిన శబరిమల అయ్యప్ప ఆలయం ఈ సారి కమ్యూనిస్టుల పాలనలోని కేరళ లోక్‌సభ ఎన్నికలలో ప్రధాన అంశంగా మారనున్నదా ? ఈ ఎన్నికల్లో అయ్యప్ప భక్తుల మనోభావాలను మరోసారి రెచ్చగొట్టి లబ్ది పొందాలని కాంగ్రెస్‌, బిజెపి రెండూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకు గాను రెండూ పరస్పర అవగాహనతో ఓట్ల బదిలీకి కొన్ని చోట్ల పరోక్ష ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చిన మార్గదర్శక సూత్రాల మేరకు వడకర, కన్నూరు, కొల్లం, కోజికోడ్‌, ఎర్నాకులం నియోజకవర్గాలలో బిజెపి నామమాత్రంగా పోటీ చేయాలని, దానికి ప్రతిగా తిరువనంతపురంలో బిజెపి అభ్యర్ధికి కాంగ్రెస్‌ మద్దతు తీసుకోవాలని అవగాహనకు వచ్చినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియరి బాలకృష్ణన్‌ చెప్పారు. గతంలో 1991లో వడకరలో ఇలాంటి ప్రయోగమే జరిగిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో అవగాహనతోనే నేమమ్‌ అసెంబ్లీ స్ధానంలో బిజెపిని కాంగ్రెస్‌ గెలిపించిందని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి బంధం మాదిరే ఎస్‌డిపిఐ-ముస్లిం లీగ్‌ వ్యవహరిస్తున్నాయని అలాంటి ఎస్‌డిపిఐతో కాంగ్రెస్‌ చేతులు కలుపుతున్నదని చెప్పారు.

బిజెపి విషయానికి వస్తే కేరళలో అసలైన పోటీ తమకూ కమ్యూనిస్టులకే నని, తదుపరి తమ లక్ష్యం కేరళ అని చెప్పుకొనే బిజెపి ఇరవైకి గాను కేవలం 14సీట్లలోనే పోటీ చేయాలని, మిగిలిన ఆరు సీట్లను మరో రెండు పార్టీలకు వదిలిపెట్టాలని నిర్ణయించింది. పోటీ చేసే చోట కూడా అభ్యర్ధుల విషయంలో కుమ్ములాటల కారణంగా ఎంతో ఆలస్యంగా 13మందినే ప్రకటించారు. శబరిమల ఆలయం వున్న పత్తానంతిట్ట నియోజకవర్గంలో గెలుపు అవకాశాలున్నాయనే ఆశతో ఆ సీటు తమకు కావాలంటే తమకు కావాలని కుమ్ములాడుకున్నారు.దాంతో తలలు పట్టుకున్న అధిష్టానం ఆ సీటు అభ్యర్ధి ప్రకటన వాయిదా వేసింది. మిజోరాం గవర్నర్‌గా వున్న కుమనం రాజశేఖరన్‌ పదవికి రాజీనామా చేయించి బిజెపి తిరువనంతపురం అభ్యర్ధిగా నిలబెట్టింది. అక్కడ ప్రస్తుత కాంగ్రెస్‌ సభ్యుడు శశిధరూర్‌, సిపిఐ అభ్యర్ధి దినకరన్‌ పోటీలో వున్నారు.

Image result for kerala cpm

కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా గత అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని చోట్ల పరోక్ష అవగాహనకు వచ్చినట్లుగానే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌, బిజెపి అవగాహనకు వచ్చిన వార్తలను కాంగ్రెస్‌ కాదంటున్నది. కేరళలో తమకూ సిపిఎంకు మధ్య మాత్రమే పోటీ అని మతశక్తుల నుంచి తమకు ఒక్క ఓటు కూడా అవసరం లేదని పిసిసి అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ అంటున్నారు. కొన్ని చోట్ల ఒకరికి మించి అభ్యర్ధులను పరిశీలించాల్సిన కారణంగా తమ జాబితా ఆలస్యమైంది తప్ప బిజెపితో పరోక్ష అవగాహన కోసం ఆపలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పటికే అక్కడి 20 నియోజకవర్గాలలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్‌డిఎఫ్‌) అందరి కంటే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్ధులను ప్రకటించి రెండవ దశ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బిజెపి, కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్ధులను పూర్తిగా ప్రకటించలేని దశలోనే వున్నాయి.

పిల్లల్ని కనే వయస్సులో వున్న మహిళలకు అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఆంక్షలు విధించటాన్ని సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పులో తప్పు పట్టి ప్రవేశం కల్పించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును బిజెపి, కాంగ్రెస్‌ తొలుత స్వాగతించిన స్ధానిక పార్టీల నాయకత్వాలు వెంటనే ఈ అంశాన్ని రాజకీయంగా మార్చి ఓట్లు దండుకొనేందుకు ప్లేటు ఫిరాయించాయి. భక్తుల మనోభావాలను గౌరవించాలంటూ మహిళలకు ఆలయ ప్రవేశ హక్కును అడ్డుకొనేందుకు అయ్య ప్ప భక్తుల పేరుతో ఆందోళనలను నిర్వహించాయి. అవి హింసాత్మకంగా కూడా మారాయి. కమ్యూనిస్టులు అయ్యప్ప ఆలయ పవిత్రతను మలినం చేసేందుకు పూనుకున్నారని తప్పుడు ప్రచారం చేశాయి. నిజానికి అయ్యప్ప కేసుతో కమ్యూనిస్టులకు ఎలాంటి ప్రమేయం లేదు. దీనిపై కొంత మంది న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్‌పై కేరళ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరినపుడు అధికారంలో వున్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం తాము మహిళల ప్రవేశానికి అనుకూలమే అని సుప్రీం కోర్టుకు నివేదించింది. తరువాత కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ సర్కార్‌ అధికారానికి వచ్చిన తరువాత సంప్రదాయాలను పరిరక్షించేందుకు తాము కట్టుబడి వున్నామంటూ మరొక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కేసు విచారణ చివరి దశకు వచ్చిన సమయంలో ప్రస్తుతం పినరయ్‌ విజయన్‌ నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గతంలో వున్న వైఖరికే తాము కట్టుబడి వుంటామని తన అభిప్రాయాన్ని చెప్పింది.

కేసు విచారణ సమయంలో పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్‌, కాంగ్రెస్‌లు తీర్పు తామూ వూహించని విధంగా రావటంతో కంగుతిని కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తీర్పును పునర్విచారణ జరపాలని కోరుతూ పిటీషన్లు దాఖలు చేయించారు.వాటిపై సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని చెప్పాల్సి వుంది. ఈ లోగా లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్‌, బిజెపి ద్వంద్వ వైఖరులను ఎండగడుతూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రజాతంత్ర వుద్యమ సాంప్రదాయాలను ముందుకు తీసుకు పోయే కృషిలో భాగంగా కేరళలో పలు సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన మహిళా మానవ హారంలో 40లక్షల మందికి పైగా అన్ని మతాలకు చెందిన మహిళలు పాల్గన్నారు.

Image result for congress and bjp friends in kerala cartoons

పోటీల తీరు తెన్నులకు వస్తే ఇరవైకి గాను 18 చోట్ల సిపిఎంాకాంగ్రెస్‌ కూటమి మధ్య ముఖాముఖి పోటీ వుంటుందని, తిరువనంతపురం, శబరి మల ఆలయం వున్న పత్తానంతిట్ట నియోజకవర్గాలలో బిజెపి కూడా పోటీలో వుంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇరవై సీట్లలో సిపిఎం బలపరిచే స్వతంత్రులతో సహా 16చోట్ల పోటీ చేస్తుండగా సిపిఐ నాలుగు స్ధానాలలో వున్నది. కాంగ్రెెస్‌ 16చోట్ల, ముస్లింలీగ్‌ రెండు, మరో రెండు పార్టీలు రెండు చోట్ల పోటీ చేస్తున్నాయి. బిజెపి 14, దాని మిత్రపక్షాలు ఆరు చోట్ల బరిలో వున్నాయి. గత ఎన్నికలలో యుడిఎఫ్‌ 12సీట్లు, ఎల్‌డిఎఫ్‌ ఎనిమిది చోట్ల గెలుపొందింది. గత ఎన్నికలలో యుడిఎఫ్‌ కూటమికి 41.98శాతం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు 40.12శాతం బిజెపి కూటమికి 10.82 శాతం ఓట్లు వచ్చాయి. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మూడు కూటములకు వరుసగా 38.81,43.48,15.10శాతాలు వచ్చాయి.

Image result for kerala bjp,congress

తాజా ఎన్నికల్లో శబరిమలై ఆలయ పవిత్రత పరిరక్షణ పేరుతో ఆందోళన సాగించిన బిజెపి, కాంగ్రెస్‌ రెండూ హిందూ ఓట్లకోసం ఏదో విధంగా మత అంశాన్ని ముందుకు తెచ్చేందుకు పూనుకున్నట్లు ఆ రెండు పార్టీల మధ్య నడుస్తున్న వివాదం వెల్లడించింది. శబరిమల ఆందోళనలు జరిగిన తరువాత జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ వుప ఎన్నికలలో ఆ అంశం బిజెపికి లాభించిన దాఖలాలు లేవు. అనేక చోట్ల ఘోరపరాజయం పాలైంది. అయినప్పటికీ ఈ ఎన్నికలు మూడు పక్షాలకూ సవాలుగానే పరిణమించాయని చెప్పవచ్చు. లౌకిక, వామపక్ష భావాలకు నిలయమైన కేరళలో గతంలో ముస్లిం, క్రైస్తవ మత శక్తులు కమ్యూనిస్టులను దెబ్బతీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. తొలిసారిగా హిందూత్వశక్తులు అటువంటి ప్రయత్నంలోనే వున్నాయి. అందువలన అక్కడి ఫలితాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేద గణితంతో చూడవలే ! సంతోషమే సంతోషం !!

21 Thursday Mar 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

India happiness index, world happiness index, World Happiness Report 2019

Image result for india happiness index

 

ఎం కోటేశ్వరరావు

అమిత్‌ షా ! అమిత్‌ షా !!

ఓ….. సమయానికి నా ఆత్మ క్షోభను పంచుకోవటానికి నా ఆత్మ షా కూడా లేరే !

ఎవరక్కడ…. నా భ్రమ కాకపోతే సిబ్బంది అందరినీ పంపి సెక్యూరిటీని భవనం వెలుపల వుండమని చెప్పిన తరువాత ఎవరక్కడ అంటే పలుకునదెవరు…. హత విధీ….. ఆలి వున్నా….. వున్నట్లో లేనట్లో చెప్పుకోలేని స్ధితి…. పిల్లలు లేరు…. సమయానికి అమ్మ కూడా లేకపోయనే……

ప్రపంచ ఆనందమయ నివేదిక అట….. సిబ్బంది నాకు కనిపించే విధంగా బల్లమీద పెట్టి వెళ్లారు…..అదేమి అయివుండునో అని తీసి చూద్దును కదా అక్కటా…. పులి మీద పుట్రలా అది ఇప్పుడు రానేల…..ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా దానిని అక్కడ వుంచినారో అవగతమైనది….. ఎంతయినను మనసెరిగిన వారు కదా……

ఒకింత సంతసముగా కూడా యున్నది…… మీడియా ఈ వార్తకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు….. ఇచ్చినచో…..తలచుకొన్నంతనే కలవరము కలుగుచున్నది.

కలవరమా….. రానివ్వ రానివ్వ చెంతకు రానివ్వ…….వచ్చెను పో……156 రాజ్యములలో మన స్ధానం……తలచుకొనుటకు నాకే సిగ్గుగా వున్నది…. 140వ స్ధానమట……

కావచ్చు…. మనకు మంచి ర్యాంకు నానందుకు చింత లేదు, మన పొరుగు రాజ్యము పాకిస్ధాన్‌ స్ధానము చూచినంతనే అలనాటి ద్రౌపది నవ్వు గుర్తుకు వచ్చుచున్నది……..67వ స్ధానములో మన కంటే రెట్టింపు ఎత్తులో వుండుట ఎంత అవమానము……ఎందుకు ఆ విధముగా జరిగినదో ఎంత ఆలోచించినను తట్టుట లేదు….నాది మట్టి బుర్ర అనుకొందురేమో(వులిక్కి పడి వెనుకా ముందూ కలియ తిరిగి) హమ్మయ్య బహిర్గతమైన నా అంతరంగము విన్నవారు లేరు….

అమిత్‌ షా…. అమిత్‌ షా…… నా లాంటి స్ధితిలో యున్నవారిని మరొకరిని నా అంతరంగికునిగా ఎంచుకొనుట ఎంత వుత్తమమో ఇలాంటి సమయములలో కూడా కదా తెలియునది…..నాతో పాటు నిరంతరము వుండును కదా !

Image result for india happiness index modi

పాకిస్ధాన్‌లో జనము అంత సంతసముగా వుండుటకు అక్కడి వారు చేసినదేమి, నేను చేయనిదేమి……. గత ఐదు సంవత్సరములుగా కొనసాగించి ఇటీవలి పుల్వామా వుదంతము తరువాత రద్దు చేసిన అత్యంత సానుకూల హోదా కారణము అయి వుండవచ్చునా…. ఒక్క పాకిస్ధాన్‌ ఏమి ఖర్మ అఖండభారత్‌ అని మనము చెబుతున్న దేశములన్నింటా ఒక్క ఆఫ్ఘనిస్తానము తప్ప మిగతా చోట్ల మనకంటే జనము సంతోషముగా నుండిరట….. ఇది మరింత విపరీతముగా వున్నది. గతములో చేసిన సర్జికల్‌ దాడులు, గోవులను కాపాడుట వంటి చర్యలతో జనము సంతసముగా లేరా ? నేపాల్‌ 100, బంగ్లాదేశ్‌ 125, శ్రీలంక 130, మయన్మార్‌ 131 స్ధానములో వుండుటా ఇంతకంటే అప్రతిష్ట మరేమున్నది. మనకు ఎంతో అవసరము వున్నది కనుక అధికారికముగా పైకి అనలేము గాని నిరంతరము మన సంఘపరివారము కమ్యూనిస్టు నియంతృత్వ రాజ్యమని ప్రచారము చేయుచున్న చైనా 93వ స్ధానములో వున్నదట. దీనిని సమర్ధించుకొనుట ఎట్లు …….. అమెరికాలో విఫలమైన పెట్టుబడిదారీ విధానము కంటే సోషలిజమే మేలను కుర్రకారు పెరుగుతున్నదట…. ఇక్కడ కూడా వుద్యోగాలు కల్పించలేని ప్రజాస్వామ్యం కంటే చైనా మాదిరి కమ్యూనిస్టు పాలనే మెరుగని అనుకుంటే…….

ప్రతిపక్షుల విమర్శలను ఖాతరు చేయక విదేశీయానములు చేసి సాధించినదేమిటి అని…. నా సోదరులే ప్రశ్నించిన ఏమి చెప్పవలే. గడ్కరీ వంటి వారు వదులు పరోక్ష బాణములను తప్పించుకొనుట ఎట్లు ? మొదటికే మోసము వచ్చుననే అంచనాతో ప్రస్తుతము గడ్కరీ లేదా వృద్ధాశ్రమమునకు పరిమితం చేసిన అద్వానీ వంటి వారు నోరు మెదపకున్ననను ప్రతిపక్షముల నోటినేమి చేయగలము……ఛీ ఇదేమిటి ఎంత అణుచుకున్నను ప్రజాస్వామ్యపీక నొక్కినచో ఇటువంటి విపత్కర పరిస్ధితి తలెత్తపోవును కదా అనే ఆలోచన వుబికి వచ్చుచున్నదేమి? విదేశీయానముల వలన కలిగిన ఫలితమేమీ ? విదేశీ పెట్టుబడులెక్కడ, మేకిన్‌ ఇండియా సంగతేమిటి,కౌగిలింతల దౌత్యము అంతవరకే పరిమితమా, వాగ్దానములన్నీ అమలు జరిపిన తరువాత జనంలో సంతోషము ఎందుకు కలగటము లేదు అని ఎవరైనా ప్రశ్నించిన ఏమి చెప్పవలె……

Image result for india happiness index modi

ఒకింత వూరటగా వున్నది….. ఐదు సంవత్సరములుగా మీడియాతో మాట్లాడని వ్రతమును ఎన్నికల వరకు కొనసాగించిన….. మీడియా గండమును తప్పించుకొన వచ్చును. అంతగా ప్రతిపక్షము నిలదీసిన ఎడల దీని కంతకు నెహ్రూ, కాంగ్రెస్‌ పాలనే కారణమని అస్త్రమున్నది కదా …..

సపోజ్‌ పర్‌ సపోజ్‌ అలా ప్రచారము చేసితిమే అనుకొందుము నేటి ఆనందరాహిత్యమునకు గతము ఎట్లు కారణమని బుర్రవున్నవారెవరైనను అడిగినచో…… జనానికి బుర్రలో అంత గుంజు వున్నదా…..

ఛీఛీ ఎంత ఖర్మదాపురించినది….. ఇదియును ఎదురు తన్నును….. నేను ఇంద్రప్రస్తములో సింహాసనము అధిష్టించు సమయములో అనగా 2014లో ఆనందమయ సూచికలో మన స్ధానము 156 దేశములలో 111లో,పాకిస్ధాన్‌ 81లో వున్నదట…… ఈ వివరములు జనానికి తెలియకుండునా….తెలిసిన మన ఆబోరు దక్కునా…….ఏమిటి మార్గము……

మన ఏలుబడిలో వుపాధి అవకాశములు తగ్గినట్లు వెల్లడించిన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదికను బహిర్గతపరచటమా తొక్కి పెట్టటమా అన్నది మన చేతులలో వున్నది కనుక లెక్కలు సరిగా వేయలేదనే కారణముతో తొక్కిపెడితిమి……ఆనందమయ సూచికకు అటు వంటి అవకాశము లేదు, అది ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు 2012 నుంచి ప్రతి సంవత్సరము వెలువడుతున్నది. ఇప్పటికే బహిర్గతమైనది, ముందు తెలిసినను ఆపే అవకాశము లేదు. అయినను అబద్దము ఒకటి అయినా వంద అయినా ఒకటే కదా. ఒక అబద్దమును వందసార్లు చెప్పినచో అది నిజము అగునని గోబెల్స్‌ మహాశయుడు వుపదేశించినాడు. గత ఏడు దశాబ్దాలుగా కిరస్తానీ లెక్కలు మన భారతీయ ఆత్మను గ్రహించలేకపోయాయి. అందుకే గత ఐదు ఏండ్లుగా దేశములో కనిపిస్తున్న సంతోషమును కానలేకుండా వున్నారు. వేద గణితము ప్రకారం భారతీయులు సంతోషముతో ఓలలాడుతున్న విషయము విదేశీ కళ్లతో చూసిన ఎలా కనిపించును. పక్కా భారతీయ దృష్టితో చూడవలే….. ఇదే ఇంతకు మించి మరొక మార్గము కనిపించట లేదు…. మనసు ఎంత హాయిగా వున్నది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చాయ్‌ వాలా, చౌకీదార్‌ రెండూ నరేంద్రమోడీ కాపీ నినాదాలే !

21 Thursday Mar 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Chaiwala, chowkidar, chowkidar narendra modi, Naredra Modi

Image result for chai wala narendra modi cartoons

ఎం కోటేశ్వరరావు

గత లోక్‌సభ ఎన్నికల్లో చాయ్‌ వాలా నినాదం మాదిరి తాజా ఎన్నికల్లో నేను కూడా చౌకీదారునే అనే నరేంద్రమోడీ ప్రచారం ఫలితాలనిస్తుందా లేదా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా తయారైంది. సామాన్య ఓటర్ల స్పందన ఇంకా తెలియదు. గతంలో బిజెపి వారందరూ చాయ్‌ వాలా టీ షర్టులు వేసుకున్నారు. వెంకయ్య నాయుడి వంటి పెద్దలు కూడా టీ దుకాణాలు ఏర్పాటు చేసి ఫొటోలకు ఫోజులిచ్చి టీతో పాటు తమ ప్రచార సామగ్రిని జనానికి అందచేశారు. మహిళలకు ప్రత్యేకం అన్నట్లు చాయ్‌ వాలాలు కూర్చొనేందుకు ప్రత్యేక జాగాలు కేటాయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఈ సారి ప్రస్తుతానికి విధేయులందరూ మోడీ మాదిరే తమ పేర్లకు ముందు చౌకీదార్‌ అని తగిలించుకుంటున్నారు. సభల్లో చాయ్‌ వాలాలను కూర్చోబెట్టిన మాదిరి చౌకీదార్లను సమీకరించే అవకాశం లేదు. నామ మాత్రంగా జీతాలు వచ్చే వుద్యోగాలు కూడా పోతాయి. బిజెపి వారంటే చావో రేవో తేల్చుకోవాలి గనుక ఇష్టం వున్నా లేకపోయినా పొలోమంటూ నరేంద్రమోడీని అనుకరించాలి కనుక ఆ పని చేస్తున్నారు. సామాజిక మాధ్యమంలో బిజెపి మరుగుజ్జుల ఆర్భాటం చూస్తే రాబోయే ఎన్నికల్లో దాన్నొక ప్రధాన ప్రచార నినాదంగా చేసేందుకు తలపెట్టినట్లు ఈ పరిణామం స్పష్టం చేసింది. మోడీ అనుయాయులందరూ తమ పేర్లకు చౌకీదార్లని తగిలించుకోవటాన్ని కాంగ్రెస్‌ మోడీ బాబా మరియు 40 మంది దొంగలు అని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ఆ పేరుతో జనాన్ని వెర్రివాళ్లను చేసిందని వ్యాఖ్యానించింది.గతంలో టీ స్టాల్స్‌ ఏర్పాటు చేసిన మాదిరే ఈ సారి దేశంలో ఐదువందల చోట్ల వీడియో కాన్ఫరెన్సుద్వారా నరేంద్రమోడీ నేనూ చౌకీదారునే అనే ప్రతిజ్ఞలు చేయిస్తారని ఇప్పటికే కోటి మంది దీనికి మద్దతు పలికారని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.

Image result for chai wala narendra modi cartoons

గతంలోనూ ఇప్పుడూ బిజెపికి కాంగ్రెస్‌ నేతలే ప్రచార అస్త్రాలను అందించారనే ప్రచారాన్ని కొందరు ప్రారంభించారు. 2014లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ బిజెపి ప్రధాన ప్రతిపక్షమూ కాదు, నరేంద్రమోడీ ప్రధాని కాలేడు, కావాలంటే మా ఏఐసిసి సమావేశాల్లో టీ అమ్ముకొనేందుకు అవకాశం ఇస్తాం ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు. వెంటనే దాన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌ అవినీతిని ప్రస్తావిస్తూ దేశాన్నే ఏకంగా అమ్మేవారి కంటే టీ విక్రయించేవారే మెరుగు అంటూ బిజెపి చాయ్‌ వాలా మా ప్రధాని అంటూ నరేంద్రమోడీని ముందుకు తెచ్చింది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎంతో సమర్ధుడు, గుజరాత్‌ నమూనాను దేశమంతటికీ విస్తరింప చేస్తారు అన్న ప్రచారంతో పాటు వెనుకబడిన తరగతులకు చెందిన మా మోడీ టీ అమ్మటాన్ని అపహాస్యం చేస్తారా, చాయ్‌ వాలా ప్రధాని ఎందుకు కాకూడదు అంటూ సెంటిమెంటును కూడా రెచ్చగొట్టి సొమ్ము చేసుకున్నారు. ప్రధాని అయ్యాక మిగతా నల్లధనం వెలికితీత, అవినీతి పరులపై చర్య వంటి వాటి మాదిరే మోడీ చాయ్‌ వాలా, చాయ్‌ పే చర్చా ప్రస్తావనలే రాకుండా జాగ్రత్త పడ్డారు. కాంగ్రెస్‌ వారు దొంగలైతే తానొక కాపలాదారునని ప్రధాని అని గాక చౌకీదార్‌ అని పిలిపించుకోవటానికి ఇష్టపడతానని గతంలో చెప్పుకున్నారు. రాఫెల్‌ విమానాల లావాదేవీల్లో ప్రధాని మోడీ కాపలాదారు కాదు దొంగ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రచారం ప్రారంభించటంతో మోడీ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు తన పేరుకు ముందు చౌకీదారు పేరు తగిలించుకొని నేనూ చౌకీదార్‌నే అని అందరూ ముందుకు రావాలని తన మద్దతుదార్లకు పిలుపునిచ్చారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే ఇది 2014 కాదు, నరేంద్రమోడీ ఏ పిలుపునిస్తే దానిని గుడ్డిగా నమ్మటానికి జనమూ సిద్ధంగా లేరు. చాయ్‌ వాలా నినాదం పేలితే చౌకీదారు పిలుపు తుస్సుమనే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. భారతీయ జనతా పార్టీకి, నరేంద్రమోడీకీ ఇప్పుడు అంతసీను లేదు.ఎన్‌డిఏలోని మిత్రపక్షాల నేతలు, కొందరు మంత్రులు ఆపని చేసేందుకు సిగ్గుపడి మొహం చాటేస్తున్నారని, తటపటాయించి ఎందుకు మోడీతో అనవసర పంచాయతీ అని ఎట్టకేలకు తగిలించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది బిజెపికి తొలి ఎదురుదెబ్బ అనవచ్చు. వారా పని చేస్తే కేంద్ర సర్కార్‌ చేసిన అవినీతి అక్రమాలన్నింటికీ వారు కూడా జవాబుదారీ అవుతారు. ప్రతిపక్షాలు వారిని వదలిపెట్టవు. అయితే చౌకీదారు పేరును బిజెపి మిత్రపక్షాలు తగిలించుకోకపోయినా వదలవు అది వేరే విషయం. ఇప్పుడు ఎవరైనా చౌకీదారు అని చెప్పుకున్నాడు అంటే దొంగలను స్వేచ్చగా వదలి వేసేబాపతు అనే అభిప్రాయం జనంలో ఇప్పటికే వ్యాపించింది, సామాజిక మీడియాలో ప్రస్తుతం అది పెద్ద ప్రచారంలో వుంది. ప్రచారం వూపందుకున్న తరువాత అదింకా పెరుగుతుంది. అందువలన బిజెపి దీన్ని ఎంతగా జనంలో తీసుకుపోతే అంతగా ఎదురు తన్నవచ్చు.

Image result for chowkidar narendra modi cartoons

గత ఎన్నికల్లో నల్లధనం, అవినీతి అక్రమాలు, వాటి నివారణ గురించి చెప్పని మాట లేదు. ఐదు సంవత్సరాలకు ముందు దేశంలోని వివిధ తరగతులు ఎదుర్కొంటున్న సమస్యలను పదేండ్ల కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి గురించి ఎదురుదాడి చేసిన నరేంద్రమోడీ ఇప్పుడు తన ఐదేండ్ల పాలనలో జరిగిన అక్రమాల గురించి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన స్ధితిలో పడ్డారు. కాంగ్రెస్‌ మీద గతంలో మాదిరి దాడి చేస్తే కుదరదు. ఐదు సంవత్సరాల తరువాత ఇప్పుడు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించపోగా రాఫెల్‌ విమానాల కొనుగోలు కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయారు. ఆ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు అత్యంత భద్రంగా వుండే రక్షణశాఖ కార్యాలయంలోకి ప్రవేశించి తీరిగ్గా జిరాక్స్‌లు తీసుకొని వాటిని మీడియాకు అందచేసి ప్రచురించే వరకు కాపలదారును అని చెప్పుకున్న మోడీ ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతూ తన విధి నిర్వహణలో విఫలమయ్యారు? హిందూ పత్రికలో ప్రచురితమైన తరువాత పార్లమెంట్‌లోనూ వెలుపలా కూడా నోరు మెదపకుండా సుప్రీం కోర్టులో ఆ పత్రాలు చోరీ అయ్యాయని చెప్పటం ఏమిటి? ఏ చిన్న చోరీ జరిగినా వెంటనే కేసు నమోదు చేస్తారు. మరి రాఫెల్‌ పత్రాల చోరీ లేదా జిరాక్స్‌ గురించి ఎలాంటి ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఇంత జరిగాక నేను కూడా చౌకీదార్‌నే అని చెప్పుకోవటం గోబెల్స్‌ స్ఫూర్తి తప్ప మరొకటి కాదు. వందసార్లు ఒక అబద్దాన్ని చెబితే చివరకు అది నిజమై కూర్చుంటుంది అన్నది గోబెల్స్‌ సూత్రం. దాని ప్రకారం తాను నికార్సయిన కాపలాదారును అని చెప్పుకుంటే సరిపోతుందా ? అంతకు ముందే వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయమల్య, ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోడీ వంటి వారు పారిపోతుంటే ఏమి చేస్తున్నారన్న ప్రశ్నకు ఇంతవరకు జవాబు లేదు.

నరేంద్రమోడీ ఇచ్చిన చౌకీదార్‌ పిలుపుకు తానూ సిద్ధమే అని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు లూటీ ఫేం నీరవ్‌ మోడీ చేసిన ట్వీట్‌కు నరేంద్రమోడీ ప్రతి ట్వీట్‌ ద్వారా మీ భాగస్వామ్యం ద్వారా నేనూ చౌకీదార్‌నే అనే వుద్యమం మరింత బలపడుతుంది అభినందనలు అని చెప్పారంటే తాజా నినాదం ఎంత ప్రహసన ప్రాయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. మోడీ భక్తుడు, మహిళా జర్నలిస్టులను వేధించిన ఆరోపణలు ఎదుర్కొని కేంద్ర మంత్రి వుద్యోగం పోగొట్టుకున్న జర్నలిస్టు ఎంజె అక్బర్‌ తన పేరుకు చౌకీదార్‌ అని తగిలించి ట్వీట్‌ చేయగానే సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. సినీనటి రేణుకా సహానే చేసిన ట్వీట్‌లో మీరు కూడా చౌకీదార్‌ అయితే ఏ మహిళకైనా రక్షణ ఎక్కడుంటుంది, సిగ్గులేని వారికి హద్దేముంది అని వ్యాఖ్యానించారు. దాంతో వెంటేనే అక్బర్‌ తొలగించారు. అయితే ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అనుకున్నాడో ఏమో కొన్ని గంటల తరువాత తిరిగి చౌకీదారు అని తగిలించుకున్నాడు.

Image result for chowkidar narendra modi cartoons

గత ఎన్నికల సందర్భంగా చాయ్‌ పే చర్చా పేరుతో టీ స్టాళ్ల దగ్గర చర్చలంటూ వూదరగొట్టారు. కొన్ని చోట్ల బిజెపి ప్రచార సభల్లో టీ అమ్మేవారికి ప్రత్యేక స్ధలాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత ఏమైంది, టీ అమ్మేవారి బతుకులు ఏమైనా మారాయా ? చాయ్‌ వాలా నరేంద్రమోడీ చౌకీదారు అవతారమెత్తి దొంగలు పారిపోతుంటే పట్టనట్లు వూరుకొని ఆపని చేసే వారికి తీరని కళంకం తెచ్చారు. గతంలో చాయ్‌ వాలాల మాదిరి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా చౌకీదార్లకు ప్రత్యేక స్ధలం ఏర్పాటు చేసి కూర్చోపెట్టారంటే పోలీస్‌ సేషన్లలో బోర్డులపై దొంగలను చూసిన మాదిరి జనం వారిని చూస్తారంటే అతిశయోక్తి కాదు. ఎందుకుంటే ఎవరైనా చౌకీదార్‌ పని చేస్తానంటే అనుమానించే విధంగా బిజెపి సర్కార్‌, నరేంద్రమోడీ వ్యవహరించారంటే అతిశయోక్తి కాదు. నల్లధనం వెలికి తీత గురించి అరచేతిలో స్వర్గం చూపారు. చివరకు పెద్ద నోట్ల రద్దు అనే సర్జికల్‌ స్రైక్‌(మెరుపుదాడి) జరిపారు.నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేశారు. చివరకు అది ఖజానాకు, దేశ ఆర్ధిక వ్యవస్ధకు, అన్నింటికీ మించి జనానికి ఎంతో నష్టదాయకంగా మారిన విషయం తెలిసిందే. నోట్ల రద్ధు వలన సాధించిన విజయాలేమిటయ్యా అంటే కింద పడ్డా గెలుపు నాదే అన్నట్లుగా ధనం మొత్తాన్ని బ్యాంకింగ్‌ వ్యవస్ధలోకి తెచ్చాముగా అని చెప్పుకున్నారు. అవినీతి నిరోధం గురించి బిజెపి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. లోక్‌పాల్‌ నియామకం చేయాలంటూ అన్నాహజారే చేసిన ఆందోళనకు మద్దతు పలికింది. లోక్‌పాల్‌ బిల్లును 2013లోనే పార్లమెంట్‌లో ఆమోదించినా తరువాత అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ ఐదేండ్ల వరకు కుంటిసాకులు చెబుతూ అందుకు చర్యలు తీసుకోలేదంటే చిత్తశుద్ది ఏమిటో అర్దం చేసుకోవచ్చు. సాకులు చెబితే కుదరదు, ఫిబ్రవరిలోగా నియామకం సంగతి తేల్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన కారణంగా దాన్ని అమలు చేయకపోతే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అదొక ప్రచార అస్త్రంగా మారుతుందనే భయంతోనే ఎట్టకేలకు నియామకాలను చేపట్టారు.లోక్‌పాల్‌ వ్యవస్ధ ఏర్పాటు తమ ఘనతే అని చెప్పుకోవటానికి కూడా వీలులేని విధంగా తయారైందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గుజరాత్‌ లోకాయుక్త నియామకాన్ని వ్యతిరేకించిన చరిత్ర తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల పాటు ఖాళీగా వున్న ఆ పోస్టు నింపకుండా ఏదో ఒకసాకుతో అడ్డుకున్న అతి పెద్ద అవినీతి వ్యతిరేక పితామహుడు. మంత్రివర్గఆమోదం లేకుండా నియామకం చెల్లదన్న వాదనను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు నియామకాన్ని సమర్ధించింది.

Image result for chowkidar narendra modi cartoons

గత ఎన్నికల్లో చాయ్‌ వాలా, ఇప్పుడు నేనూ చౌకీదార్‌నే అనే నినాదాలను బిజెపి, నరేంద్రమోడీ మన అటార్నీ జనరల్‌ కె వేణుగోపాల్‌ భావంలో చెప్పాలంటే ఇతరుల నుంచి తస్కరించారు లేదా జిరాక్స్‌ తీసుకున్నారు. గతంలో అనేక సందర్భాలలో నేను… నేను కూడా….. అనే నినాదాలు ప్రపంచ వ్యాపితంగా జనంలో ప్రాచుర్యం పొందినవే. ఆఫ్రికా నుంచి పట్టుకొచ్చిన బానిసలు, వారి సంతానాన్ని అమెరికన్‌ శ్వేతజాతీయులు తమ ‘కుర్రాళ్ల’ ని పిలిచేవారు. బానిసత్వ వ్యతిరేక పౌర వుద్యమంలో నేను కుర్రాడిని కాదు నేను మనిషిని అంటూ వుద్యమించారు.ఇటీవలి వుదంతాల విషయానికి వస్తే 2015లో ఫ్రాన్స్‌లోని వివాదాస్పద పత్రిక చార్లీ హెబ్డో మహమ్మద్‌ ప్రవక్త మీద ప్రచురించిన ఒక కార్టూన్‌ కారణంగా ఆల్‌ఖైదా తీవ్రవాదులు పత్రికా కార్యాలయం మీద దాడి చేసి పన్నెండు మందిని కాల్చి చంపారు. దానికి నిరసనగా నేనూ చార్లీనే అనే నినాదంతో లక్షలాది మంది ఐరోపాలో ప్రదర్శనలు చేశారు. మన దేశంలో జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను హిందూత్వ వుగ్రవాదులు హత్యచేసినపుడు దానికి నిరసనగా నేనూ గౌరీలంక్షేష్‌నే అంటూ పలుచోట్ల ప్రదర్శకులు ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే. జనలోక్‌పాల్‌ బిల్లుకోసం అన్నా హజారే వుద్యమించిన సమయంలో నేనూ అన్నానే అంటూ అనేక మంది తమ టోపీల మీద రాసుకొని దానికి మద్దతు పలికారు. పని స్ధలాల్లో మహిళలపై వేధింపులకు నిరసనగా కొద్ది నెలల ముందు మీ టూ ప్రచారం సంగతి తెలిసిందే. అంటే నేను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అని అనేక మంది మహిళలు ముందుకు వచ్చారు. ఇంకా ఇలాంటివే అనేక దేశాలలో జరిగాయి. వాటి నుంచి కాపీ కొట్టిందే నేనూ చౌకీదార్‌నే అనే నినాదం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముస్లిం వ్యతిరేకత, వుగ్రవాదం-ప్రపంచ సంక్షోభం !

20 Wednesday Mar 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, USA

≈ Leave a comment

Tags

Hindu Fundamentalism, islamophobia, islamophobia is a global crisis, Origin of Terrorism, saffron talibans, talibans, terrorism

Image result for islamophobia is a global crisis

ఎం కోటేశ్వరరావు

గత శుక్రవారం నాడు న్యూజిలాండ్‌లోని క్రీస్టు చర్చ్‌ పట్టణంలోని రెండు మసీదుల మీద జరిగిన వుగ్రదాడి ప్రపంచాన్ని వులిక్కిపడేట్లు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన 28ఏండ్ల బ్రెంటన్‌ హారిసన్‌ టారంట్‌ అనే శ్వేతజాతి వుగ్రవాది జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు, పదకొండు మంది చావుబతుకుల మధ్య వున్నారు, అనేక మంది గాయపడ్డారు. ప్రపంచంలో ఇస్లాం, ముస్లింల పట్ల పెరుగుతున్న విద్వేషం, తప్పుడు ప్రచారం ప్రపంచ వ్యాపితంగా వుందని ఈ వుదంతం స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌ జనాభా మొత్తం 50లక్షలకు అటూ ఇటూగా వారిలో ముస్లింలు 50వేల వరకు వున్నారు. వారిలో కొందరు మతం మారిన వారు. మన దేశంలో హిందువుల వునికికే ముప్పుగా ఇస్లాం, క్రైస్తవం తయారయ్యాయని మతోన్మాదశక్తులు ఎలా నిరంతరం ప్రచారం చేస్తున్నాయో, ఈ టారంట్‌ అనే వాడు కూడా ప్రపంచంలో శ్వేత జాతికి ముస్లింలు ముప్పుగా తయారయ్యారనే వున్మాదానికి లోనయ్యాడు. తనకు బ్రిటీష్‌ ఫాసిస్టు ఓస్వాల్డ్‌ మోస్లే, నార్వీజియన్‌ హంతకుడు ఆండ్రెస్‌ బ్రెవిక్‌ వంటి వారు స్పూర్తి నిచ్చారని, ప్రపంచంలో శ్వేతజాతి గుర్తింపునకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నూతన ప్రతీక, తనకు వుత్తేజమిచ్చిన వాడని అని మసీదులపై దాడులకు ముందు ఇంటర్నెట్‌లో పెట్టిన 74పేజీల పత్రంలో పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌ వుదంతం ప్రపంచ సంక్షోభానికి ఒక తార్కాణంగా అనేక మంది వర్ణించారు. అనేక దేశాలు, మీడియాలో ముస్లిం వ్యతిరేకత ఒక సాధారణ అంశంగా తయారైందంటే అతిశయోక్తి కాదు. ముస్లింలందరిని వుగ్రవాదులు అనం, అనకూడదు గానీ వుగ్రవాదులందరూ ముస్లింలుగానే కనిపిస్తున్నారు కదా అనే ఒక గడుసరి ప్రచారంతో అనేక మంది నిజమే కదా అనుకుంటున్నారు.సంప్రదాయ మీడియాలో, సామాజిక మీడియాలో అనేక కధనాలను వండి వారుస్తున్నారు. ఎక్కడ వుగ్రవాద దాడి జరిగినా ఖండిస్తామంటూ పుల్వామా వుదంతాన్ని తీవ్రంగా ఖండించిన ట్రంప్‌ న్యూజిలాండ్‌లోని క్రీస్తు చర్చ్‌ మసీదుల వుదంతాల విషయానికి వచ్చేసరికి శ్వేతజాతి జాతీయవాదం( దురహంకారం) నుంచి ఎలాంటి ముప్పు లేదని వెంటనే ప్రకటించాడు.అదే ట్రంప్‌తో సహా అమెరికా నేతలెవరూ తమ ఖండన ప్రకటనల్లో ముస్లిం అనే పదం లేకుండా జాగ్రత్తపడటం విశేషం.

ఇటీవలి కాలంలో అమెరికా, ఐరోపాలోని ప్రభుత్వాలు ముస్లిం వ్యతిరేక చర్యలు తీసుకున్నాయి. ముస్లిం దేశాల నుంచి వలసలపై అనేక ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల బురఖాలపై ఆంక్షలు పెడితే మరికొన్ని చోట్ల ముఖాన్ని పూర్తిగా కప్పుకోవటానికి వీల్లేదని ఆదేశించారు. తమ మత విశ్వాసాల ప్రకారం స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో కరచాలనం చేయకూడదంటూ అందుకు తిరస్కరించిన ఒక ముస్లిం జంటకు స్విడ్జర్లాండ్‌ పౌరసత్వాన్ని నిరాకరించింది. అమెరికాలోని అనేక రాష్ట్రాలలో షరియా వ్యతిరేక చట్టాలు చేశారు. ఇస్లాం మనలను ద్వేషిస్తుంది, ముస్లిం వలసలపై నిషేధం విధించాలని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఈ దేశాలన్నింటా ముస్లిం వలసలను అనుమతిస్తే శ్వేతజాతీయులు మైనారిటీలుగా మారిపోతారనే ప్రచారం విపరీతంగా జరిగింది. మొత్తం ముస్లిం మతావలంబకులు ప్రస్తుతం ప్రపంచవ్యాపితంగా వున్నది కేవలం 24శాతం మందే. వారంతా వలస వచ్చినా ఎక్కడా మెజారిటీగా మారే అవకాశం లేదు, అసలది జరిగేది కాదు. కానీ అనేక మంది ఈ ప్రచారాన్ని తలకెక్కించుకొని వున్మాదులుగా మారి అనేక చోట్ల హత్యలకు సైతం పాల్పడ్డారు. ఇప్పటికీ పాల్పడుతున్నారు.

Image result for islamophobia is a global crisis

మీడియాలో వుగ్రవాదం ఎలా వుందో చూద్దాం. యాభై మందిని చంపిన క్రీస్తు చర్చి హంతకుడిని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక గన్‌ మన్‌(తుపాకితో వున్న వ్యక్తి) అని శీర్షికలో పెడితే కాశ్మీర్‌లో ఒక మహిళా పోలీసు అధికారిని చంపిన వాడిని టెర్రరిస్టు అని అదే పత్రిక శీర్షిలో పెట్టింది. అంతే కాదు ఆవులను వధిస్తున్నారనే పేరుతో దాడులు చేసే వారిని గోరక్షకులు అని లేదా ఫలానా సంఘకార్యకర్తలని ముద్దుపేర్లతో మీడియా రాయటం, చూపటం తప్ప వారిని హిందూ తీవ్రవాదులు అనేందుకు నోరు రాదు. అదే పశ్చిమ దేశాల్లో ఒక శ్వేతజాతీయుడు హత్యాకాండకు పాల్పడితే వాడిని మతిస్థిమితం లేనివాడిగా ముద్రవేస్తారు తప్ప జాత్యహంకార వున్మాది, వుగ్రవాది అని ఎక్కడా పేర్కొనరు. వారిని వుత్తేజపరుస్తున్నదేమిటో, ప్రేరేపిస్తున్నదేమిటో అసలు చర్చించరు.

ముస్లింలు, ఇస్లామ్‌కు సంబంధించి ప్రపంచవ్యాపితంగా అనేక ముస్లిమేతర దేశాలలో వ్యతిరేకత పుంఖాను పుంఖాలుగా కనిపిస్తుంది. అమెరికాలో అది 80శాతం, బ్రిటన్‌లో 70శాతం వున్నట్లు పరిశోధనల్లో తేలింది. పత్రికల్లో కాలమిస్టులు, టీవీలలో యాంకర్లు, రేడియోల్లో జాకీలు అనేక మంది తమ వ్యతిరేకతను వెల్లడించుకున్నారు.2015లో అమెరికాలో ఇద్దరు తీవ్రవాదులు దాడి చేసి వారి ఇంటి నుంచి పారిపోయారు. ఆ ఇంటిని సందర్శించిన అనేక మీడియా సంస్ధల జర్నలిస్టులు అక్కడ వున్న ఖురాన్‌, నమాజు చేసే దుప్పటి, ఇతర ప్రార్ధనా సంబంధమైన వాటిని చూపుతూ వుగ్రవాదులు తమ ఆయుధాలుగా వీటిని కూడా వుపయోగించవచ్చని చెప్పారు. న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్యకేంద్ర స్ధలం పక్కనే మసీదు నిర్మాణాన్ని ఒక ఛానల్‌లో కార్యక్రమాన్ని నిర్వహించిన జర్నలిస్టు తీవ్రంగా వ్యతిరేకించాడు. అక్కడ మసీదును అనుమతించటం పశ్చిమ దేశాల వుదారత్వంతో పాటు పిరికితనానికి నిదర్శనమని రెచ్చగొట్టాడు.

Image result for islamophobia india

ముస్లింలతో అమెరికాకు ముప్పు ఏర్పడిందని ట్రంప్‌తో సహా అనేక మంది గతంలో రెచ్చగొట్టారు. తీవ్రవాద ముస్లిం వుగ్రవాదుల నుంచి అమెరికన్లను రక్షించేందుంటూ ఏడు ముస్లిం దేశాల నుంచి జనాన్ని అమెరికాలో ప్రవేశించేందుకు వీల్లేకుండా డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2008-2016 మధ్య అమెరికాలో 201 వుగ్రవాద చర్యలు చోటు చేసుకుంటే వాటిలో ట్రంప్‌ నిషేధించిన దేశాలైన ఇరాన్‌, లిబియా,సోమాలియా, సూడాన్‌,సిరియా, ఎమెన్లకు చెందిన వారు పాల్గొన్న లేదా ప్రేరేపించిన వుదంతాలు కేవలం మూడే. అమెరికాలో ట్రంప్‌ హయాంలో, అంతకు ముందూ జరిగిన హత్యాకాండను చూస్తే అత్యధిక సంఘటనల్లో నేరగాండ్లు శ్వేతజాతీయులే వున్నారు. వారి చేతుల్లోనే ఎక్కువ మంది మరణించారు. వారెవరికీ ముస్లిం తీవ్రవాద సంస్ధలతో లేదా విదేశీయులతో సంబంధాలు లేవు, ఇస్లాం నుంచి వుత్తేజాన్ని పొందిన వారు కాదు. ప్రపంచ జనాభాలో ముస్లింలు 24శాతం కాగా 1970 నుంచి ఇటీవలి వరకు జరిగిన అన్ని వుగ్రవాద దాడుల్లో ముస్లింలు జరిపినవి 10.3శాతమే అని ఇటీవల కొంత పెరిగినా జనాభా నిష్పత్తికంటే తక్కువని తేలింది. ముస్లిం తీవ్రవాదుల దాడులకు బలైన వారిలో మెజారిటీ బలైంది కూడా ముస్లింలే అని విశ్లేషకులు చెబుతున్నారు.

Image result for islamophobia is a global crisis

ప్రపంచంలో కేవలం ముస్లిం తీవ్రవాద సంస్ధలే వున్నట్లు మీడియా చిత్రిస్తున్నది. వుగాండాలో లార్డ్స్‌ రెసిస్టెన్స్‌ ఆర్టీ(ప్రభు ప్రతిఘటన సైన్యం) పేరిట క్రైస్తవ తీవ్రవాదులు లక్ష మందిని హత్య చేశారు.టెన్‌ కమాండ్‌మెంట్స్‌ ప్రాతిపదికన క్రైస్తవ మతరాజ్యాన్ని ఏర్పరచాలన్నది దాని లక్ష్యం. అమెరికాలో ఆర్మీ ఆఫ్‌ గాడ్‌(దేవుని సైన్యం) పేరుతో వున్న తీవ్రవాదులు అబార్షన్లకు వ్యతిరేకంగా హింసాకాండకు పాల్పడుతున్నారు. వీరికీ ఇస్లామిక్‌ దేశాలలోని ఆల్‌ఖైదా, తాలిబాన్లకు తేడా ఏముంది? అమెరికాలో, ఇతర ఐరోపా దేశాల్లో శ్వేతజాతీయులతో కూడిన వుగ్రవాద బృందాలు అనేక నేరాలకు పాల్పడుతున్నాయి. మీడియా తీరు తెన్నుల విషయానికి వస్తే ముస్లిం తీవ్రవాదులు ఒక సంఘటనకు పాల్పడినపుడు మీడియాలో 105పతాక శీర్షికల్లో అది చోటు చేసుకుంటే అదే ముస్లిమేతర వుగ్రవాదులు పాల్పడిన ఘటనకు కేవలం 15పతాక శీర్షికలే వుంటున్నట్లు అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయం జరిపిన విశ్లేషణలో తేలింది. అమెరికాలో 2006-2015 మధ్య జరిగిన శ్వేతజాతి మరియు మితవాద వుగ్రవాదులు జరిపిన దాడుల కంటే ముస్లింలు జరిపిన దాడులకు అమెరికన్‌ మీడియాలో రెట్టింపు ప్రచారం చోటు చేసుకుందని తేలింది. ప్రపంచమంతటికీ ఇస్లామిక్‌ తీవ్రవాదులు, తీవ్రవాదంతో ముప్పు ఏర్పడిందన్నది ఒక తప్పుడు ప్రచారం.

వుగ్రవాద మూలాల విషయానికి వస్తే ఎంతో వివరించాల్సి వుంటుంది. సామాజిక చరిత్రలో కొత్త తత్వశాస్త్రం(మతం) వునికిలోకి వచ్చినపుడల్లా గతమెంతో ఘనమంటూ పాతరోతను నిలబెట్టేందుకు తిరోగమన వాదులు, కొత్తదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు పురోగమన వాదులు వుగ్రవాదం వైపు మళ్లిన చరిత్ర మనకు కనిపిస్తుంది. నిజానికి వుగ్రవాదం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు ప్రపంచవ్యాపితంగా అంగీకరించిన అర్ధం ఇంతవరకు లేదు. మధ్య ప్రాచ్యంలో రోమన్లను కూలదోసేందుకు యూదులు కొందరు వుగ్రవాదులుగా మారారు. క్రీస్తు శకం తొలి శతాబ్దిలో సికారి అనే యూదు సంస్ధ ఏర్పాటయింది.దానికి ముందు జాకబ్‌, సైమన్‌ అనే యూదునేతలు దేవుడు తప్ప యూదులను మరొకరు పాలించటానికి లేదని అవసరమైతే సాయుధ ప్రతిఘటన చేయాలని వుద్బోధించారు.సికారి సంస్ధకు చెందిన వారు ఇంకొక అడుగు ముందుకు వేసిన సాయుధ ప్రతిఘటనతో పాటు రోమన్లతో సయోధ్య కోరుకున్న యూదులను కూడా హతమార్చాలని పిలుపునిచ్చింది. అందుకు గాను వారు జన సమూహాల్లో కలసిపోయి తమ దగ్గర దాచుకున్న కత్తులతో శత్రువులుగా ఎంచుకున్నవారిని హతమార్చే వారు. తరువాత వారు ఇతరులతో కలసి మరణించిన వారికోసం ఏడుపులు పెడబొబ్బలు పెట్టి తప్పించుకొనే వారట.పదిహేడవ శతాబ్దిలో స్పెయిన్‌లో కాథలిక్‌ రాజ్యాన్ని స్ధాపించేందుకు గై ఫాకెస్‌ నాయకత్వంలో మత వుగ్రవాదులు విఫల తిరుగుబాటు చేశారు. తరువాత ఫ్రెంచి విప్లవ సమయంలో తమ మాట వినని వారిని నిర్ధాక్షిణ్యంగా అధికారంలో వున్నవారే చంపి రాజ్య వుగ్రవాదానికి తెరలేపారు.

Image result for islamophobia is a global crisis

హంగరీలో ముస్లింలు ఒకశాతం మంది కూడా లేరు, అయినా సరే అక్కడి ప్రధాని విక్టర్‌ ఓర్బన్‌ హంగేరియన్‌ పిల్లలను కనేందుకు దేశంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, వలసలను అంగీకరించటం అంటే మనం లొంగిపోవటమే అని కొద్ది రోజుల క్రితం రెచ్చగొట్టాడు. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగకపోతే లండన్‌ నగరం ఫ్రెంచి పెట్టుబడిదారులకు బదులు టర్కీ ముస్లింలతో నిండిపోతుందని బ్రెక్సిట్‌ అనుకూల వాదులు ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం కారణంగా అమెరికాలో 17శాతం మంది ముస్లింలు వున్నారని మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సర్వేలో అమెరికన్లు చెప్పారు. నిజానికి అక్కడ ఒకశాతానికి దగ్గరగా వున్నారు.ఫ్రాన్స్‌లో కూడా వున్నదాని కంటే నాలుగు రెట్లు వున్నారనే ప్రచారానికి అక్కడి వారు లోనయ్యారు. అనేక ముస్లిం దేశాలలోని ఛాందసులు కూడా ఇలాంటి ప్రచారంతోనే అక్కడి సమాజాలను రెచ్చగొడుతున్నారు. మత వుగ్రవాదులను తయారు చేస్తున్నారు ‘ హిందూస్ధాన్‌కు హిందూ సంస్కృతి జీవనాడి. అందువలన హిందూస్ధాన్‌ను రక్షించుకోవాలంటే ముందుగా మనం హిందూ సంస్కృతిని పెంచి పోషించుకోవాలన్నది స్పష్టం. హిందుస్ధాన్‌లోనే హిందూ సంస్కృతి నాశనమైతే, హిందూ సమాజం వునికి కోల్పోతే……. కాబట్టి తనకు చేతనైనంత వరకు హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం ప్రతి హిందువు విధి………మన యువత మెదళ్లను అంతిమంగా ఆ దిశగా మలచటం సంఘ్‌ ప్రధాన లక్ష్యం’ అని సంఘపరివార్‌గా పరిచితమైన ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం గురించి దాని స్ధాపకుడు డాక్టర్‌ కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ చెప్పిన మాటలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌ తెరవగానే మనకు కనిపిస్తాయి. మతోన్మాదం తలకెక్కితే ఏ మతం వారైనా ఒకటే. మన దేశంలో ముస్లింలు, క్రైస్తవుల సంఖ్యను పెంచేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని, దాన్ని వమ్ముచేసేందుకు హిందువులు కూడా పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనాలని చెప్పిన కాషాయ తాలిబాన్లను చూశాము. న్యూజిలాండ్‌లో ముస్లింలను హతమార్చిన క్రైస్తవ వుగ్రవాది ఏమన్నాడో చూడండి.’ మన భూముల నుంచి ఒక వేళ రేపు మనం ఐరోపాయేతరులందరినీ( వారిలో భారతీయ హిందువులు కూడా వుంటారని మరచిపోవద్దు) బయటకు పంపివేసినా యూరోపియన్ల సంఖ్య నశించి చివరకు అంతమౌతుంది.చివరికి తిరిగి మనం ప్రజననశక్తిని పెంచుకోవాలి లేకపోతే అది మనల్ని చంపివేస్తుంది.’ ఇస్లామిక్‌, కాషాయ తాలిబాన్లకు, వీడికి తేడా ఏముంది? ఇలాంటి వారు ఎంతకైనా తెగిస్తారు, అందుకే వుగ్రవాదం ప్రపంచ సంక్షోభానికి చిహ్నం. గతంలో మతం కోసం వుగ్రవాదులు తయారైతే ఇప్పుడు సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలలో భాగంగా మత వుగ్రవాదులను తయారు చేస్తున్నారు. అదే నాటికీ నేటికీ తేడా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నెహ్రూపై అరుణ్‌ జెట్లీ వక్రీకరణలు – వాస్తవాలు !

15 Friday Mar 2019

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Jaitley blames Nehru, original sinner, UNSC Seat

ఎం కోటేశ్వరరావు

భీష్ముడు మరణించిన తరువాత కౌరవ సేనాధిపతిగా ద్రోణుడు వచ్చాడు.కుమారుడు అశ్వద్ధామ అంటే ద్రోణుడికి చచ్చేంత ప్రేమ. ద్రోణుడిని ఓడించటం కష్టమని తెలిసిన శ్రీకృష్ణుడు అందుకు ఒక కుయుక్తిని ప్రయోగించాడు అదే ద్రోణుడిని నిర్వీర్యం చేయటం. అందుకు గాను అశ్వద్ధామ అనే పేరున్న ఏనుగును చంపమని భీముడికి చెప్పాడు. భీముడు ఆపని చేసి తాను అశ్వద్ధామను చంపినట్లు యుద్ధరంగంలో ప్రకటించాడు. దానిని నమ్మని ద్రోణుడు అబద్దం చెప్పడని పేరున్న ధర్మరాజు  దగ్గరకు వెళ్లి అశ్వద్ధామను చంపామని చెప్పారు నిజమేనా అని అడిగాడు. దానికి అవును అశ్వద్ధామను చంపారు అని బిగ్గరగా చెప్పి అయితే అది మనిషో ఏనుగో నాకు తెలియదు అని వినిపించీ వినిపించకుండా గొణిగాడు. దాంతో ద్రోణుడు కుప్పకూలాడు. తరువాత పాండవులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలో లోక్‌సభ ఎన్నికల పోరు ప్రారంభమైంది. దీన్ని గెలిచేందుకు రాజకీయ పార్టీలు వేయని ఎత్తులు, చేయని మోసాలు లేవు. వాటిలో ఒకటి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గురువారం నాడు చేసిన పెద్ద వక్రీకరణ. ఇలాంటి సమయాలలో ఒక అబద్దం, వక్రీకరణను వదిలితే అది రేసు గుర్రంలా పరుగుతీస్తుంది, నిజం తాబేలు మాదిరి వేగంతో కూడా జనం దగ్గరకు వెళ్లదు.

జైషే మహమ్మద్‌ అధిపతి మసూద్‌ అజహర్‌ను ప్రపంచ వుగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానాన్ని భద్రతామండలిలో చైనా  వీటో చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం గురించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానిస్తూ చైనాకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదని, మోడీ బలహీనుడు, చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ అంటే భయం అన్నారు.  దాన్ని తిప్పి కొడుతూ కాశ్మీర్‌, చైనాల మీద అసలు పాపం చేసింది జవహర్‌లాల్‌ నెహ్రూ అని, భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్ధానం కల్పిస్తామంటే చైనా వంటి గొప్పదేశానికి ఇవ్వాలని నెహ్రూ చెప్పారని, అదే విషయాన్ని 1955లో ముఖ్య మంత్రులకు లేఖలో కూడా రాశారని జెట్లీ ఎదురుదాడి చేశారు. భద్రతా మండలిలో ఆంక్షల కమిటి ప్రతిపాదించిన 1267వ తీర్మాన ఫలితంతో ఆశాభంగం చెందామని మన విదేశాంగశాఖ తన తొలి స్పందనలో వ్యాఖ్యానించింది. తీర్మానాన్ని ప్రతిపాదించిన వారికి, మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. తీర్మానాన్ని వీటో చేసిన చైనా గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. చైనా ఈ తీర్మానాన్ని వీటో చేయటం ఇదే మొదటిసారి కాదు, ఇంతకు ముందు మూడుసార్లు అదే చేసింది. భారత్‌-పాకిస్ధాన్‌ విబేధాలు పరిష్కారం కావటానికి ఇలాంటి తీర్మానాలు దోహదం చేయవని, మసూద్‌ను వుగ్రవాదిగా ప్రకటించేందుకు తగినన్ని ఆధారాలు లేవని గతంలోనూ ఈ సందర్భంగానూ చైనా పేర్కొన్నది. చైనా వైఖరి గురించి తెలిసినప్పటికీ ఈ ఐదు సంవత్సరాలలో ఆ దేశంతో మన ఆర్ధిక, ప్రభుత్వ సంబంధాలు ఇంకా బలపడ్డాయి, వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రిమోట్‌ కంట్రోలర్‌ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధలు ఏదో ఒక అవకాశాన్ని సాకుగా చూపి చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తూనే వున్నాయి, అవి ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తే అంతగా వాణిజ్యం పెరుగుతోందన్నది చేదు నిజం.

2013ా14లో చైనా నుంచి మన దిగుమతులు 51బిలియన్‌ డాలర్ల విలువ  కలవి కాగా ఎగుమతులు 14.82బిలియన్ల్‌, మన వాణిజ్యలోటు 36బిలియన్లు వుంది.2017ా18 తొలి తొమ్మిది నెలల కాలంలో మన ఎగుమతులు పది బిలియన్‌డాలర్లు కాగా చైనా నుంచి దిగుమతులు ఇదే కాలానికి 63బిలియన్‌ డాలర్లకు, వాణిజ్య లోటు 53బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలోనే చైనా మూడుసార్లు భద్రతామండలిలో మసూద్‌ టెర్రరిస్టు తీర్మానాన్ని వీటో చేసింది. దీన్ని బట్టి నరేంద్రమోడీ సర్కార్‌ రాజకీయాలను, ఆర్ధిక లావాదేవీలను విడివిడిగా చూస్తున్నదన్నది స్పష్టం. రాజకీయంగా చైనాను ఏమీ అనలేని స్ధితిలో వున్న అరుణ్‌ జెట్లీ తన అక్కసును నెహ్రూ మీద తీర్చుకున్నారని, బిజెపి ప్రచార కమిటీ నేతగా  తమ క్యాడర్‌కు ఒక అస్త్రాన్ని అందించారన్నది స్పష్టం. అయితే ప్రతి అస్త్రం నిర్ధేశిత లక్ష్యాన్ని తాకుతుందా అంటే అనుమానమే. ఈ పూర్వరంగంలో నెహ్రూ గురించి చేసిన వాఖ్యల గురించి చూద్దాం.

మొదటిది. జైట్లీ చేసిన వక్రీకరణ కొత్తది కాదు. వాస్తవమూ కాదు. వివేక్‌ అగ్నిహోత్రి అనే ఒక సినిమా రంగానికి చెందిన కాషాయదళ వ్యక్తి 1965 యుద్ధంలో ఎదురుదాడి చేద్దామన్న తన మిత్రుడైన సైనికదళాల ప్రధాన అధికారి జనరల్‌ చౌదరిని రాజీనామా చేస్తావా తొలగించమంటావా అని నాటి ప్రధాని నెహ్రూ వత్తిడి చేశారని కొద్ది రోజుల క్రితం ట్వీట్‌ చేశాడు. జనరల్‌ చౌదరి 1966లో పదవీ విరమణ చేసిన ఏడు సంవత్సరా తరువాత పుట్టిన అగ్నిహోత్రి సదరు అధికారి తన స్నేహితుడని చెప్పుకుంటే కాషాయ మరుగుజ్జులు ఆ ట్వీట్‌ను గుడ్డిగా షేర్‌ చేశారు. అన్నింటి కంటే పచ్చి నిజం ఏమంటే జవహర్‌లాల్‌ నెహ్రూ 1964మేనెలలో మరణించారన్న కనీస పరిజ్ఞానం కూడా అతనికి లేదు. 1965 యుద్ద సమయంలో ప్రధానిగా లాల్‌బహదూర్‌ శాస్త్రి వున్నారు.

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే మాకు వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారన్న అరుణ్‌జెట్లీ ట్వీట్‌ కూడా ఇలాంటిదే.  రెండవ ప్రపంచ యుద్ధం నాటికి చైనా ఒక స్వతంత్ర రాజ్యం. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంగ్‌ మార్చ్‌ పురోగతిలో వుంది. అనేక విజయాలను కమ్యూనిస్టులు సాధించారు. కొమింటాంగ్‌ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ కూటమికి వ్యతిరేకంగా మిత్రరాజ్య కూటమిలో భాగంగా పాల్గన్నది.1939లో రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమైంది. దాన్ని నివారించటంలో నానాజాతి సమితి విఫలమైంది. ఈ పూర్వరంగంలో కొత్త ప్రపంచ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన అమెరికా విదేశాంగ శాఖ ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు 1941డిసెంబరు చివరిలో ఒక ముసాయిదాను తయారు చేస్తే దానికి సోవియట్‌ యూనియన్‌ కొన్ని సవరణలు చేసింది. అమెరికా, సోవియట్‌ యూనియన్‌, బ్రిటన్‌, చైనాలు దాని మీద సంతకాలు చేశాయి. ఆ సమయంలో ఫ్రాన్స్‌ హిట్లర్‌ మూకల దురాక్రమణలో వుంది. 1945 అక్టోబరు 24 ఐక్యరాజ్యసమితి వునికిలోకి వచ్చింది. ఆ తరువాత ఫ్రాన్స్‌ రిపబ్లిక్‌గా ఏర్పడిన తరువాత భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. రెండవ ప్రపంచ యుద్దంలో విజేతలుగా వున్నందున ఐదు దేశాలకు శాశ్వత భద్రతా మండలి సభ్యత్వంతో పాటు వీటో హక్కు కల్పించారు. తరువాత అవి అణుశక్తి దేశాలుగా కూడా మారాయి. అందువలన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామంటే వద్దు చైనాకు ఇవ్వండి అని నెహ్రూ చెప్పారంటే జనం చెవుల్లో పూలు పెట్టటమే. అసలు ఆ సమయానికి మనకు స్వాతంత్య్రం రాలేదు, నెహ్రూ అసలు ప్రధాని కాలేదు.

అయితే నెహ్రూ మీద ఇలాంటి ప్రచారం ఎందుకు జరిగినట్లు? నిప్పులేకుండా పొగరాదు కదా అని ఎవరైనా అనుకోవచ్చు.దీని గురించి జరిగిన ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని 1955లోనే పార్లమెంటులో ఒక ప్రశ్నకు నెహ్రూ సమాధానం చెప్పారు. అయినా అరుణ్‌ జెట్లీ అదే ఏడాది ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నెహ్రూ స్వయంగా అంగీకరించారని ఆరోపించారు. దీని గురించి 2002లోనే ప్రముఖ పరిశోధకుడు ఏజి నూరాని తన విశ్లేషణను ప్రచురించి వాస్తవాలను తెలియచేశారు. అయినా నెహ్రూ వ్యతిరేక శక్తులు తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తూనే వున్నాయి. ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందన్న గోబెల్స్‌ వారుసులు తప్ప మరొకరు వీటిని నమ్మరు. 2015లో ఆంటన్‌ హార్డన్‌ అనే ఒక పరిశోధకుడు రాసిన వ్యాసాన్ని విల్సన్‌ సెంటర్‌ ప్రచురించింది. దాన్ని 2016 ఆగస్టులో వైర్‌ వెబ్‌సైట్‌ తిరిగి ప్రచురించింది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన రెండు సంవత్సరాలకు మనకు స్వాతంత్య్రం వచ్చింది, మూడు సంవత్సరాలకు చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు. ఒక తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌(గతంలో ఫార్మోజా దీవి)కు కొమింటాంగ్‌ సేనలు చేరి అక్కడి నుంచి తామే చైనా అధికారంలో వున్నట్లు ప్రకటించుకున్నాయి. అప్పటికే వారి ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో వున్నారు. అమెరికా వత్తిడితో దాన్నే అసలైన చైనాగా పరిగణించటం మినహా సోవియట్‌తో సహా మిగతా దేశాలకు మరొక మార్గం లేకపోయింది. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల సంఖ్యను విస్తరించాలంటే ఏకాభిప్రాయం అవసరం. కమ్యూనిస్టు చైనానే అసలైనా చైనా గుర్తించాలని సోవియట్‌ కోరినా అమెరికన్లు వీటో చేస్తే చెల్లదు. ఆ పరిస్ధితి 1971వరకు కొనసాగింది. తరువాత అమెరికా చొరవతో తైవాన్‌కు బదులు కమ్యూ నిస్టు చైనాను గుర్తించారు.

ఆ మధ్యకాలంలో జరిగిన రాజకీయాన్ని అర్ధం చేసుకుంటే తప్ప నెహ్రూ ఏమి చేశారన్నది మనకు అవగతం కాదు. మన దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత తమ రాజకీయ పలుకుబడి కిందకు తెచ్చుకొనేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. బెదిరించి లంగతీసుకోవాలన్న  దాని తప్పుడు ఎత్తుగడలు మన దేశాన్ని సోవియట్‌వైపు నెట్టాయి. 1948లో చైనాలో అధికారానికి వచ్చిన కమ్యూ నిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా, బ్రిటన్‌ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాయి. అంతర్గతంగా తిరుగుబాట్లను రెచ్చగొట్టటం, బర్మా (ప్రస్తుత మయన్మార్‌) కేంద్రంగా కొమింటాంగ్‌ సైనికులు, ఇతర విద్రోహకులకు ఆయుధాలిచ్చి చైనాలో దాడులు చేయించటం వంటి వన్నీ దాదాపు పది సంవత్సరాలు సాగాయి. అప్పటికిగానీ మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు నిలదొక్కుకోలేకపోయారు.టిబెట్‌లోని 14వ దలైలామా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చిన చైనా ప్రభుత్వం టిబెట్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు అంగీకరించింది. ఒప్పందం మీద సంతకం చేసిన తరువాత సామ్రాజ్యవాదుల కుట్రల కారణంగా 1959లో తిరుగుబాటు చేసిన దలైలామా స్వాతంత్య్ర ప్రకటన చేశాడు. దాన్ని చైనా అణచివేయటంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ గుండా పారి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొంది ప్రవాస ప్ర భుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. ఇది ఒకటైతే కమ్యూనిస్టులు అధికారాన్ని సుస్ధిరం చేసుకున్న తరువాత ఎప్పటికైనా కమ్యూ నిస్టు చైనాను భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యంగా గుర్తించక తప్పదని అమెరికన్లకు మొదటి నుంచి ఒక అంచనా వుంది. అయితే దాన్ని బయటపడనివ్వకుండా రాజకీయం చేశారు.

చైనా తరువాత అతి పెద్ద దేశమైన భారత్‌కు  భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సి వుందంటూ చైనాను సాధారణ అసెంబ్లీకి పరిమితం చేసి ఐదవ శాశ్వత సభ్యురాలిగా భారత్‌కు మద్దతు ఇస్తామని అమెరికన్లు నెహ్రూకు రాయబేరం పంపారు. కమ్యూ నిస్టు చైనాను దెబ్బతీయటం, భారత్‌ను తమ శిబిరంలోకి చేర్చుకోవటం అనే ఒకే దెబ్బకు రెండు పిట్టలనే ఎత్తుగడ దీనిలో వుంది. తమకు శాశ్వత సభ్యదేశ హోదా అర్హత వుందని, అయితే చైనాను పక్కన పెట్టి తమకు దాన్ని ఇవ్వటం అంటే చైనా-తమ మధ్య విబేధాలను పెంచే ఎత్తుగడ తప్ప వేరు కాదని అందువలన దాన్ని మినహాయించి తమకు ఆ స్ధానాన్ని ఇస్తామనే ప్రతిపాదన తమకు అంగీకారం కాదని నెహ్రూ సర్కార్‌ నాడు అమెరికాకు చెప్పింది. ఇదే విషయాలను నెహ్రూ తన లేఖలో రాశారు. జెట్లీ వంటి వారు ఆ లేఖను పట్టుకొని రామునితోక పివరుండు ఇట్లనియే అన్నట్లు పదే పదే ప్రచారం చేస్తున్నారు. కాశ్మీర్‌ విషయంలోనూ అదే చేస్తున్నారు. నిజానికి భద్రతా మండలిని విస్తరించాలని, దానిలో వున్న ప్రజాస్వామ్య వ్యతిరేక అంశాలను సంస్కరించాలని అనేక మంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సులు తమ ప్రయోజనాలు, అజెండాకు అనుగుణంగా ఆయా దేశాలను రెచ్చగొట్టటం, తాము ప్రతిపాదిస్తుంటే ఇతరులు అడ్డుకుంటున్నారని సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది మసూద్‌ అజార్‌ కావచ్చు మరొకటి కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాతీయ వాదం అంటే నాడు వుత్తేజం, నేడు వున్మాదం !

10 Sunday Mar 2019

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, Uncategorized

≈ Leave a comment

Tags

370 article, Aricle 370 myths and facts, article 35A, Hindutva nationalism, Kashmir problem, nationalism then and now, nationalism then inspiration now frenzy

Image result for nationalism india

ఎం కోటేశ్వరరావు

అడవారి మాటలకు అర్ధాలే వేరులే అని సినీ కవి చెప్పిన సందర్భం ఏదైనా కావచ్చు, మహిళలకు ఆ లక్షణాన్ని ఆపాదించటం గౌరవం ఇచ్చే వర్ణన కాదు. అయితే అలా అన్నవారి మీద మహిళలు వుడుక్కున్నారేమోగాని ఎక్కడా దాడులు జరిపినట్లు తెలియదు. ఇప్పుడు దేశంలో అనేక పదాలకు అర్దాలనే మార్చివేస్తున్నారు.కాదన్నవారిని వాదనల్లో ఖండించటం ఒక పద్దతి, భౌతిక దాడులకు తెగబడటమే ప్రమాదకరం. యుద్దం వద్దు అనటం, ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యం కోరుకోవటం దేశద్రోహం, యుద్ధం కోరుకోవటం, రెచ్చగొట్టటం దేశభక్తి. పరమతం వారి మీద ద్వేషం వెలిబుచ్చటం దేశభక్తి, ప్రేమించకపోతే మానే వారి మానాన వారిని వుండనివ్వమనటం దేశద్రోహం. హిందుత్వమే ఇండియా, ఇండియా అంటే హిందుత్వమే కాదన్నవారి సంగతి చూస్తాం అనే బెదిరింపులు. ఒక నాడు జాతీయ వాది అంటే వుత్తేజానికి మారుపేరు. నేడు జాతీయ వాది అంటే వున్మాదానికి చిరునామా ! 1947ఆగస్టు 15 ముందు, తరువాతకు ఎంత తేడా ! కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించిన ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించిన వారు జాతీయవాదులు, సమర్ధించిన వారు దేశద్రోహులు. అంటే ఎప్పటి నుంచో వున్న ప్రత్యేక రక్షణలు, సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు కోరి మన దేశంలో విలీనానికి కారకుడైన షేక్‌ అబ్దుల్లా ఇప్పటి నిర్వచనం ప్రకారం దేశద్రోహి. కాశ్మీర్‌ విలీనాన్ని వ్యతిరేకించి, స్వతంత్రరాజ్యంగా వుంటామని ప్రకటించిన నాటి కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌(తరువాత తప్పనిసరై అంగీకరించటం వేరే విషయం), ఆయనకు మద్దతు తెలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌ వారు దేశభక్తులు. చరిత్ర తెలియకపోతే కొత్త తరాలు ఇదే నిజమనుకొనే ప్రమాదం వుంది.

భారత్‌ విభజనకు నిర్ణయం జరిగిపోయింది. ఆ సమయానికి జమ్మూ కాశ్మీర్‌ బ్రిటీష్‌ వారి సార్వభౌమత్వానికి లోబడిన ఒక స్వయంప్రతిపత్తి కలిగిన ఒక సంస్ధానం.షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ కాశ్మీర్‌ సంస్ధానం భారత్‌లో విలీనం కావాలని కోరింది. రాజు హరిసింగ్‌ స్వతంత్రంగా వుంటామని ప్రకటించాడు. 1947 నవంబరులో ఏర్పడిన ఆల్‌జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పార్టీ ( అంతకు ముందు ఆల్‌జమ్ము అండ్‌ కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ పేరుతో పని చేశారు) రాజు హరిసింగ్‌ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తాము మద్దతుగా వుంటామని ప్రకటించింది. అంటే కాశ్మీరు వేర్పాటు వాదానికి సై అన్నట్లే కదా ! ఈ పార్టీని ఏర్పాటు చేసిన అపర దేశభక్తులు ఎవరంటే ఇంకెవరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ మహాశయుడే. అదే ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన జనసంఘ్‌తో అది వారే వీరుగా కలసి పని చేసింది, చివరకు 1963లో విలీనమైంది. నాటి కాంగ్రెస్‌ నాయకత్వం మన దేశంలో కాశ్మీర్‌ విలీనానికి అనుకూలంగా వున్న షేక్‌ అబ్దుల్లాతో మాట్లాడటం అంటే అబ్దుల్లా ఆ రాష్ట్రంలో అధికారానికి రావటమే కనుక అది ఆమోదంగాని ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘం మొదటి నుంచి కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చటానికి మొదటి నుంచి వ్యతిరేకించింది తప్ప వేరే ఇతర కారణాలేమీ లేవు. ఆర్‌ఎస్‌ఎస్‌ షేక్‌ అబ్దుల్లాను వ్యతిరేకించటం వెనుక ముస్లిం విద్వేషంతో పాటు అది భూస్వాముల పక్షంలో వుండటం కూడా ఒక కారణం. కాశ్మీర్‌ సంస్ధానంలో భూస్వాములలో అత్యధికులు హిందువులే. షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్సు భూసంస్కరణలు అమలు జరపాలని కూడా కోరింది. అదేగనుక అధికారంలోకి వస్తే తమ భూములు ఎక్కడ పోతాయోనని భూస్వాములకు ప్రాతినిధ్యం వహించే కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ స్వతంత్రరాజ్యంగా వుంటామని చెప్పిన రాజు హరిసింగ్‌కు మద్దతు ఇచ్చింది. పాకిస్దాన్‌ గిరిజనుల ముసుగులో కాశ్మీర్‌ ఆక్రమణకు ఎప్పుడైతే పూనుకుందో అప్పుడు విధిలేని స్ధితిలో రాజు హరిసింగ్‌ కేంద్ర ప్రభుత్వ సాయం కోరాడు. దానికి అనుగుణంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా తన వైఖరి మార్చుకుంది. అయితే భారత్‌లో పూర్తిగా విలీనం కావటానికి మద్దతు ఇస్తాం తప్ప కమ్యూనిస్టులు ఎక్కువగా వున్న షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలోని డోగ్రా(హిందువులు) వ్యతిరేక ప్రభుత్వానికి తాము వ్యతిరేకమని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత బలరాజ్‌ మధోక్‌ అన్నాడు. దానికి అనుగుణ్యంగానే షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 1949లో కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ ఆందోళనలు చేపట్టింది.ఎలాంటి షరతలు లేకుండా కాశ్మీరును దేశంలో విలీనం చేయాలని కోరింది. 1951లో ఏర్పాటయిన జనసంఘ్‌కు కాశ్మీరులో ప్ర జాపరిషత్‌ అనుబంధం అయింది. దాని డిమాండ్‌ మేరకు జనసంఘం కూడా కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని ప్రారంభం నుంచీ వ్యతిరేకించింది. దాని వారసురాలు బిజెపి కనుక అదే డిమాండ్‌ను వదలకుండా పట్టుకుంది. 1963వరకు కాశ్మీర్‌లో జనసంఘం శాఖను ఏర్పాటు చేయలేదు. కాశ్మీర్‌ ప్రజాపరిషత్‌ పేరుతోనే కధ నడిపించారు.

కాశ్మీర్‌కు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే ఏమౌతుంది అని ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం, దాని ప్రచారాన్ని వెనుకా ముందు ఆలోచించకుండా బుర్రకు ఎక్కించుకున్న అమాయకంగా ప్రశ్నిస్తారు. వారికి ఒకటే సూటి ప్రశ్న వుంటే జరిగే నష్టం ఏమిటి, వున్నందువలన దేశానికి జరిగిన ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏమిటి అంటే వారివద్ద కుంటిసాకులు తప్ప సరైన సమాధానం లేదు. రాజ్యాంగంలో కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ఆర్టికల్స్‌, రక్షణలు కేవలం కాశ్మీర్‌కు మాత్రమే వున్నాయా ?

కాశ్మీర్‌కు వర్తించే ఆర్టికల్‌ 35ఏ అమలును సవాలు చేస్తూ చారు వాలి ఖన్నా అనే మహిళ పిటీషన్‌ దాఖలు చేశారు. తాను రాష్ట్ర నివాసినే అయినప్పటికీ తన పిల్లలు జమ్మూకాశ్మీరులో ఇల్లు కొనుక్కోవటానికి అవకాశం లేదని, ఇది కాశ్మీర్‌ మహిళల పట్ల వివక్ష కాదా అన్నది ఆమె ప్రశ్న. కాశ్మీరీ పండిట్‌ అయిన చారు వాలి ఖన్నా సుప్రీం కోర్టులో న్యాయవాది.కాశ్మీరేతర వ్యక్తిని వివాహం చేసుకొని ఢిల్లీలో స్ధిరపడ్డారు. తాను కాశ్మీరులోనే జన్మించినప్పటికి ఇప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టిందని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కు విరుద్దమని వాదిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అమలులో వున్న ఆర్టికల్‌ 35ఏ ప్రకారం శాశ్వత నివాసుల జాబితాలో వున్నవారే ప్రభుత్వ వుద్యోగాలు చేయటానికి, ప్రభుత్వ లేదా ప్రభుత్వ సాయం పొందే విద్యా సంస్ధలలో చేరటానికి, భూమి, ఇతర ఆస్ధులను కొనుగోలు చేయటానికి అర్హులు. 1954రాష్ట్రపతి వుత్తరువుల ద్వారా ఇతరులకు హక్కులను నిషేధించారు. శాశ్వత నివాసి అయిన కాశ్మీరీ మహిళ వేరే రాష్ట్రానికి చెందిన పురుషుడిని వివాహం చేసుకుంటే ఆమె శాశ్వత నివాస అర్హత రద్దవుతుంది. కాశ్మీరీ పురుషుడిని వేరే రాష్ట్ర మహిళ వివాహం చేసుకుంటే ఆమెకు శాశ్వత నివాసి అర్హత వస్తుంది. మాజీ ముఖ్య మంత్రి ఫరూక్‌ అబ్దులా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా కాశ్మీరేతరులను వివాహం చేసుకున్నారు. వారి భార్యలకు శాశ ్వత నివాస అర్హత వచ్చింది. అదే ఫరూక్‌ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లా కాంగ్రెస్‌ నేత రాజస్ధాన్‌కు చెందిన సచిన్‌ పైలట్‌ను వివాహం చేసుకొని అర్హతను కోల్పోయారు.

చారు వాలీ ఖన్నా, మరికొందరు ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లను అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. 35ఏ ఆర్టికల్‌ను సమర్ధిస్తున్న వారు మహిళా వ్యతిరేకులని, వివక్షను సమర్ధిస్తున్నారంటూ సంఘపరివార్‌ సంస్ధలకు చెందిన వారు దాడి చేస్తున్నారు. ఈశక్తులకు నిజంగా మహిళా హక్కుల పట్ల అంతశ్రద్దే వుంటే చట్టసభలో మహిళకు మూడోవంతు రిజర్వేషన్ల గురించి గత ఐదు సంవత్సరాలలో ఎందుకు చర్యలు తీసుకోలేదు. అర్టికల్‌ 35ఏ సెక్షన్‌ రద్దు చేస్తామని బిజెపి వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఇలాంటి ఆంక్షలు, రక్షణలు అనేక రాష్ట్రాలలో వున్న అంశాన్ని వీరు విస్మరిస్తున్నారు. ఒక రాజకీయ అజెండాతో కేవలం ఈ అంశాన్నే ముందుకు తెస్తున్నారు. వుదాహరణకు 1-70 చట్టం పేరుతో వుమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమోదించినదాని ప్రకారం ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో షెడ్యూలు గిరిజన ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల గిరిజనేతరులు భూములు, ఇతర స్ధిర ఆస్ధులు కొనుగోలు చేయటానికి లేదు. చట్టం రాకముందు వున్న ఆస్ధులను అమ్ముకోవాలంటే గిరిజనులకు మాత్రమే విక్రయించాలి. ఆప్రాంతాలలోని గిరిజన యువతులు బయటి వారిని వివాహం చేసుకుంటే వారికి ఇతరులకు వర్తించే హక్కులు వర్తిస్తాయి. కానీ గిరిజన యువతులను వివాహం చేసుకున్న గిరిజనేతరులకు ఆ ప్రాంతాలలో అలాంటి హక్కులుండవు. ఇలాంటి పరిమితులే హిమచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, నాగాలాండ్‌ వంటి రాష్ట్రాలలో వున్నాయి. వాటి గురించి బిజెపి, సంఘపరివార్‌ మాట్లాడదేం. ఇదే విధంగా ప్రభుత్వ వుద్యోగాలు కూడా రాష్ట్రానికి సంబంధించిన వాటికి స్ధానికులే అర్హులు లేదా వారికి స్ధానికత అర్హత వచ్చిన తరువాతే అర్హులు అవుతారు.

హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేయబోయే ముందు హైదరాబాద్‌ రాష్ట్రానికి చెందిన వారు తమ ప్రాంతానికి రక్షణ కల్పించాలని కోరలేదా, ఆ మేరకు కల్పించిన విషయం తెలిసినదే.తమ ప్రాంతం వారు వెనుకబడి వున్నందున ముందున్న ఆంధ్రప్రాంతం వారు వుద్యోగాలను ఎక్కువగా పొందే అవకాశం వున్నందున రక్షణ కల్పించాలని కోరారు. దానికి అనుగుణంగా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయని 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అయినపుడు చెప్పారు. ముల్కీ నిబంధనల ప్రకారం పన్నెండు సంవత్సరాలు తెలంగాణాలో నివాసం వుంటే వారు స్ధానికులుగా మారిపోతారు. ఆ మేరకు 1968 నాటికి ముల్కీ నిబంధనలు రద్దయ్యే పరిస్ధితి ఏర్పడింది. తమ వారికి జరగాల్సిన న్యాయం జరగలేదని, ముల్కి నిబంధనలు రద్దవుతున్నందున న్యాయం జరగదంటూ తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ఆందోళన ప్రారంభమైంది. ముల్కీ నిబంధనలు చెల్లుతాయని కోర్టు తీర్పు వచ్చిన తరువాత స్వంత రాష్ట్రంలో పరాయివారిగా వుండటమేమిటి ప్రత్యేక ఆంధ్రను ఏర్పాటు చేయాలంటూ 1972లో జై ఆంధ్ర ఆందోళన ప్రారంభమైంది. ప్రస్తుతం వుపరాష్ట్రపతిగా వున్న వెంకయ్య నాయుడు దాని నాయకులలో ఒకరు, రాజకీయ జీవితం దానితోనే ప్రారంభించారనే విషయం విదితమే. వుమ్మడి రాష్ట్రంలో స్ధానికులకు న్యాయం చేకూర్చేందుకు రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి వుత్తరువులతో ఆర్టికల్‌ 371డి ప్రకారం వుమ్మ డి రాష్ట్రంలో రక్షణ కల్పించి జోనల్‌ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత స్ధానికత సమస్య మరో రూపంలో ముందుకు వచ్చింది. జోనల్‌ వ్యవస్ధను రద్దు చేయాలనే ఆలోచన చేశారు. అంతకు ముందు ఆంధ్రప్రాంతం వారు తమ అవకాశాలను కొట్టివేస్తున్నారని చేసిన వాదన తెలంగాణాలో మరో రూపంలో ముందుకు వచ్చింది. అభివృద్ధి చెందిన హైదరాబాదు,వరంగల్‌,నల్లగొండ, ఖమ్మం జిల్లాల వారు వెనుకబడిన ప్రాంతాలలోని వుద్యోగావకాశాలను తన్నుకుపోయే అవకాశం వుందనే వాదనలు బయలు దేరటంతో జోనల్‌ వ్యవస్ధను కొనసాగించక తప్పలేదు.

ముల్కీ నిబంధనలను నైజాం నవాబు 1919లో అమలులోకి తెచ్చారు. దాని ప్రకారం నాటి హైదరాబాదు సంస్ధానంలో స్ధానికులకు రక్షణ కల్పించటమే లక్ష్యం. వుర్దూలో ముల్క్‌ అంటే ఒక దేశం. ఆ దేశ పౌరులు ముల్కీలు అవుతారు. సంస్ధానం వెలుపల నుంచి వచ్చేవారి కారణంగా స్ధానికుల్లో తలెత్తిన అసంతృప్తిని తగ్గించేందుకు నవాబు ఈ ఏర్పాటు చేశాడు. ఎవరైనా హైదరాబాదు సంస్ధానంలో 15సంవత్సరాల ప్రభుత్వ సేవ పూర్తి చేస్తే వారికి జన్మి ంచేవారికి పుట్టుకతోనే సంస్ధాన పౌరసత్వం వస్తుంది. లేదా ఎవరైనా 15సంవత్సరాలు నివశించి వుంటే వారు కూడా స్ధానికులు అవుతారు. ముల్కీ అయిన వ్యక్తిని వివాహం చేసుకొంటే ఆమెకూడా ముల్కీ అవుతుంది. పదిహేను హైదరాబాదులో నివాసం వున్న వారు పర్మనెంటు ముల్కీ కావాలంటే తన స్వస్ధాలకు తిరిగి వెళ్లాలనే వాంఛను వదులు కొంటున్నట్లు అఫిడవిట్‌ కూడా ఇవ్వాల్సి వుంది. అప్పుడే ముల్కీ సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. అలాంటి ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీం కోర్టు 1972లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇదే మాదిరి 1927కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌ స్ధానికులకు రక్షణ కల్పిస్తూ చేసిన చట్టాన్ని కొనసాగింపుగా భారత్‌లో విలీనం అయిన తరువాత కొనసాగించాలన్నది సంప్రదింపుల్లో అంగీకరించారు. నాడు హరిసింగ్‌ ఆస్దానంలో కాశ్మీరీ పండిట్లు, డోగ్రాలదే ఆధిపత్యం. తమకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పోటీని నివారించేందుకు రాజు చేత 35ఏలో వున్న నిబంధనలను చట్టంగా చేయించారు. అప్పుడు అంగీకరించిన పండిట్లు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు ? నైజాం నవాబు ముల్కీ నిబంధనలను సమర్ధించిన సుప్రీం కోర్టు అదే పద్దతుల్లో కాశ్మీర్‌ రాజు కల్పించిన రక్షణలను ఏ ప్రాతిపదికన రద్దు చేస్తుంది.

ఇలాంటి వాటిని రద్దు చేస్తే పోలా అనే వారికి ఒక ప్రశ్న. చేయాల్సి వస్తే ఒక్క కాశ్మీర్‌ అంశాలనే ఎందుకు రద్దు చేయాలి? వుద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కూడా అలాంటివే. పదేండ్లకోసం చేసిన వాటిని వాటి లక్ష్యం ఇంకానెరవేరలేదనే కారణంగా ఇంకా కొనసాగిస్తున్నాము కదా, వీటిని కూడా అలాగే ఎందుకు పరిగణించకూడదు. చిత్తశుద్ధి వుంటే ఇలాంటి వాటన్నింటినీ కలిపి ఒక చర్చ పెడితే, వాటిమీద ఏకాభిప్రాయం వస్తే రాజ్యాంగ బద్దంగానే చేయవచ్చు. అలా జరగటం లేదే ! ఇప్పుడున్న పరిస్ధితుల్లో అది సాధ్యం అవుతుందా? వుదాహరణకు 1975 మే 16వరకు ప్రస్తుతం మన రాష్ట్రాలలో ఒకటిగా వున్న సిక్కిం ఒక రాజ్యంగా మన రక్షణలో వుంది. అక్కడి జనం రాజరికాన్ని కాదని మన దేశంలో విలీనం కావాలని కోరుకున్నారు. అందుకు అంగీకరించాము. దానికి ఒక షరతు ఏమంటే అప్పటి వరకు సిక్కింలో వున్న ప్రత్యేక రక్షణలను తరువాత కూడా కొనసాగించాలి. వాటిని ఆర్టికల్‌ 371ఎఫ్‌లో చేర్చి రాజ్యాంగాన్ని సవరించారు. ఇప్పుడు కళ్లు తెరిచిన వారు వాటిని అంగీకరించం, రద్దు చేయాలంటే ఎలా? దేశం సమగ్రంగా వుంటుందా ? ఆర్టికల్‌ 370ని సవరించి ఇప్పటికే నీరుగార్చారన్న విమర్శలున్నాయి. దానిని మరింతగా నీరుగార్చటం అంటే కాశ్మీరీల్లో అనుమానాలు, అభద్రతా భావాన్ని మరింత పెంచటమే. దాన్ని రద్దు చేసే అవకాశం లేదని తెలిసి కూడా బిజెపి నిరంతరం వ్యతిరేకంగా ప్రచారం చేయటం రెచ్చగొట్టే వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఈ అర్టికల్‌ను రద్దు చేయాలన్న ఆలోచన తమకు ఇప్పుడు లేదని ఎందుకంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని రాజ్యసభలో ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. నిజానికి అంత మెజారిటీ వున్నప్పటికీ ఏ పార్టీ ప్రభుత్వానికి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని రాజ్యాంగంలో చేర్చాలని చెప్పింది రాజ్యాంగ పరిషత్‌. అది ఇప్పుడు లేదు. అందువల్లనే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. అందుకోసం అసలు రాజ్యాంగాన్నే రద్దు చేసి కొత్త రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేస్తే అన్న వూహాజనిత ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. అటు వంటి పనికి బిజెపితో సహా ఏ పార్టీ పూనుకొనే అవకాశం లేదు.

Image result for nationalism india

కాశ్మీర్‌ గురించి అనేక వక్రీకరణలు ప్రచారంలో వున్నాయి. వాటిలో కొన్నింటి తీరుతెన్నులను చూద్దాం.

ద్వంద్వ పౌరసత్వం: ఇది వాస్తవం కాదు, ముందే చెప్పుకున్నట్లు 35ఏ నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రత్యేక రక్షణల కోసం శాశ్వత నివాసులు అని కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు తప్ప అది పౌరసత్వం కాదు.వారు కూడా భారత పాస్‌పోర్టులనే కలిగి వుంటారు.

ప్రత్యేక రాజ్యాంగం: ఇది పాక్షిక సత్యం, ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు చేసుకోవటానికి ఆర్టికల్‌ 370 అనుమతించింది. అందువలన రక్షణ, విదేశీవ్యవహారాలు, సమాచార రంగాలను వర్తింప చేయటానికి ఆ రాష్ట్ర అనుమతి అవసరం లేదు. మిగిలిన అంశాలను వర్తింప చేయాలంటే రాష్ట్రశాసనసభ అనుమతి అవసరం. మన రాజ్యాంగంలో రాష్ట్రాలు, కేంద్ర అధికారాలతో పాటు వుమ్మడి జాబితా కూడా వున్న విషయం తెలిసిందే. రాష్ట్రాల అధికారాలకు సంబంధించి దేనికది ప్రత్యేక చట్టాలు చేసుకొనేందుకు ఏరాష్ట్రానికి అయినా హక్కుంది. వుమ్మడి అంశాలపై రాష్ట్రాల ఆమోదం అవసరం అన్న విషయం తెలిసిందే.

ప్రత్యేక, రాజ్యాంగం, జెండా : నిజమే, ఆర్టికల్‌ 370 ప్రకారం ప్రత్యేక రాజ్యాంగాన్నే ఏర్పాటు చేసుకొనే హక్కు దానికి వుంది.అది భారత రాజ్యాంగపరిధిలోనే వుంటుంది. ఆ రాష్ట్ర శాసనసభ కాలపరిమితి ఆరు సంవత్సరాలు, 1972లో ప్రత్యేక జండాను అధికారికంగానే ఏర్పాటు చేశారు. దేశంలో అనధికారికంగా సిక్కిం, కర్ణాటలకు ప్రత్యేక జండాలు వున్నాయి. ఒక దేశంలో వుంటూ ప్రత్యేక రాజ్యాంగాలను కలిగి వుండటమంటే అర్ధం స్వతంత్ర దేశాలని కాదు. బ్రిటీష్‌ వారి కౌలు గడువు ముగిసిన తరువాత తిరిగి చైనాలో విలీనమైన హాంకాంగ్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని అనుమతించారు. అలాగే పోర్చుగీసు కౌలు గడువు ముగిసిన తరువాత చైనాలో విలీనమైన మకావో దీవులకు కూడా ప్రత్యేక పాలనా మండలి వుంది. చైనాలో విలీనమైనా చైనా చట్టాలు అక్కడ వర్తించవు. మన దేశంలో సిక్కిం విలీన సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఏ రాష్ట్రంలోనూ లేని ప్రత్యేక రక్షణలు కల్పించారు. అక్కడ అసెంబ్లీలో 32 స్ధానాలున్నప్పటికీ ప్రాదేశికంగా 32వ నియోజకవర్గం లేదు. సంఘ పేరుతో వున్న దానిలో సిక్కింలోని బౌద్ధ ఆరామాలలో వున్న సాధువులు దాని ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆర్టికల్‌ 371ఎఫ్‌ ప్రకారం భుటియా, లెపాచా వంటి గిరిజన సామాజిక తరగతులకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లను కేటాయించారు. ఏ తరగతికి కేటాయించిన సీట్లలో వారే పోటీ చేయాల్సి వుంటుంది. మిగతా రాష్ట్రాలలో ఎక్కడా ఫలానా సామాజిక తరగతికి మాత్రమే ఆయా సీట్లలో పోటీకి అర్హత అనేది లేదు. వుదాహరణకు షెడ్యూలు కులాలు, తరగతులకు ఇన్ని సీట్లు, ఏఏ సీట్లు అనేది నిర్ణయం అవుతుంది తప్ప, వాటిలో ఏ కులం వారు పోటీ చేయాలనే అంశం లేదు.

జాతీయ చిహ్నాలను అవమానించటం నేరం కాదు: ఇదొక అవాస్తవం, 1971లో పార్లమెంట్‌ చేసిన చట్ట ప్రకారం జాతీయ చిహ్నాలైన జెండా, జాతీయ గీతం, రాజ్యాంగాన్ని దేశంలో, దేశం వెలుపల భారతీయ పౌరులు అవమానించటం నేరపూరితం. ఏ దైనా ఒక చట్టం కాశ్మీర్‌కు వర్తించనట్లయితే దాని పీఠికలోనే ముందుగా జమ్మూ కాశ్మీర్‌ మినహా అని వుంటుంది. పైన పేర్కొన్న చట్టానికి అలాంటిది లేదు. అలాగే సుప్రీం కోర్టు, కాగ్‌ పరిధి ఆ రాష్ట్రానికి వర్తించదు అనేది కూడా వాస్తవం కాదు.

బయటి వారు భూములు కొనుగోలు చేయకూడదు : ఇంతకు ముందే చెప్పినట్లు దేశంలో అనేక చోట్ల అలాంటి ఆంక్షలు వున్నాయి.1846లో జమ్మూకు చెందిన డోగ్రా రాజు గులాబ్‌ సింగ్‌ బ్రిటీష్‌ వారితో చేసుకున్న అమృతసర్‌ ఒప్పందం ప్రకారం అక్కడి భూమిని బయటి వారెవరూ కొనుగోలు చేయకూడు. భారత్‌లో విలీన సమయంలో అంతకు ముందు ఆ ప్రాంతాలలో వున్న చట్టాలను కొనసాగించాలన్నది షరతు. ఆ మేరకు ఇప్పుడు కూడా బయటి వారెవరూ భూములు కొనుగోలు చేయటానికి లేదు.

బయటి పెట్టుబడులను 370 ఆర్టికల్‌ అడ్డుకుంటున్నది: 1927 ఏప్రిల్‌26న కాశ్మీర్‌ రాజు జారీ చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్రానికి ఆర్ధిక లబ్ది చేకూరేట్లయితే దీనికి మినహాయింపు వుంటుందని పేర్కొనటం పెట్టుబడులకు అవకాశం కల్పించటమే కదా ! భూముల కొనుగోలుకు సంబంధించి అసోంలోని కొండ ప్రాంతాల్లో నిషేధాలు వున్నాయి. నాగాలాండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్‌ 371ఏ, అరుణాచల్‌ ప్రదేశ్‌కు ఇచ్చిన 371హెచ్‌, సిక్కింకు 371ఎఫ్‌, మిజోరాంకు 371జి ప్రకారం ప్రత్యేక హోదా రక్షణలు వున్నాయి. బిజెపి వాటన్నింటినీ ప్రస్తావించకుండా కాశ్మీర్‌నే ఎందుకు ముందుకు తెస్తున్నది. ముస్లింలు మెజారిటీ వున్నారనా ?

పాకీస్తానీని వివాహం చేసుకుంటే : కాశ్మీరీ శాశ్వత నివాసి అయిన ఒక యువతి వేరే రాష్ట్రానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే శాశ్వత నివాస హక్కు రద్దవుతుంది, అదే పాకిస్తానీని చేసుకుంటే కాదు అన్నది ఒక తప్పుడు ప్రచారం. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వం లేదు. పాక్‌ యువకుడు కాశ్మీర్‌ లేదా ఇతర భారత రాష్ట్రాల యువతులను వివాహం చేసుకుంటే వారికి పాక్‌ సౌత్వం వస్తుంది తప్ప పాక్‌ యువకులకు మన పౌరసత్వం రాదు. చట్టంలో శాశ్వత నివాసి అన్న పదానికి స్త్రీ, పురుష తేడా లేదు. అయితే పాలనాపరమైన నిబంధనల ప్రకారం మహిళలకు వివాహమయ్యేంత వరకు వుంటుంది. కాశ్మీరీనే వివాహం చేసుకుంటే శాశ్వతనివాస హోదా కొనసాగుతుంది.అదే వేరే రాష్ట్రాల వారిని చేసుకుంటే రద్దవుతుంది. అయితే 2004లో అలా రద్దు కావటానికి ఎలాంటి చట్టబద్దత లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని చెల్లకుండా చేసేందుకు కాశ్మీర్‌ అసెంబ్లీ అదే ఏడాది ఒక బిల్లును ఆమోదించింది. అయితే వివిధ కారణాలతో అది ఇంకా చట్ట రూపం దాల్చలేదు.

కాశ్మీర్‌ మహిళలు షరియత్‌ చట్టం కింద వున్నారు: ఇది వాస్తవం కాదు, కాశ్మీరీ ముస్లిం మహిళలే కాదు దేశంలోని యావత్తు మహిళలు ఆయా మతాల వ్యక్తిగత చట్టాల కిందనే వున్నారు.

హిందు, సిక్కు మైనారిటీలకు రిజర్వేషన్‌ లేదు:2011 జనాభా లెక్కల ప్రకారం కాశ్మీర్‌లో 68.31శాతం ముస్లింలు, 28.43శాతం హిందువులు ఇతరులందరూ 3.26శాతం వున్నారు. హిందువులను మైనారిటీలుగా ఎక్కడా గుర్తించలేదు.2005 రాష్ట్ర రిజర్వేషన్‌ చట్టం ప్రకారం వెనుబడిన ప్రాంతాల(తరగతులు కాదు) వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలకు 8, మాజీ సైనికులకు 6, వికలాంగులు 3, వాస్తవాధీన రేఖ సమీపంలో వుండే వారికి 3, వెనుకబడిన తరగతులకు 2 శాతం చొప్పున రిజర్వేషన్లు వున్నాయి. మత ప్రాతికన ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్న వారు కాశ్మీర్‌లో హిందువులు, సిక్కులకు మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ లేదనటం గమనించాల్సిన అంశం. దేశంలో ఎక్కడా లేని విధంగా వెనుకబడిన ప్రాంతాల వారికి అంటే కుల మత ప్రసక్తి లేకుండా రిజర్వేషన్‌ కలిగించటం ఇక్కడ మాత్రమే వుంది.

మన మాపుల్లో చూపుతున్న ప్రాంతాలన్నీ మన ఆధీనంలో లేవు. కాశ్మీర్‌లోని కొంత భాగం పాకిస్ధాన్‌ ఆక్రమణలో వుంది, మరికొంత ప్రాంతం చైనా కింద వుంది. అరుణాచల్‌ తమదే అని చైనా అంటున్నది. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాల్సి వుంది. ఇప్పుడున్న ఆర్టికల్‌ 370ను తొలగిస్తే తలెత్తే చట్టపరమైన సమస్యలు, సంక్లిష్టతల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర ఆందోళనలకు కారణమైన విషయం తెలిసిందే. అది అసోం ఒప్పందాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అందువలన గతంలో ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను విస్మరించి కేవలం ఓట్ల దృష్టితో బిజెపి తన నిర్ణయాన్ని రుద్దేవందుకు పూనుకుంది. వ్యతిరేకతను గమనించి ఆ బిల్లును మురిగిపోయేట్లు చేసింది. అందువలన కాశ్మీర్‌తో సహా ఈ పూర్వరంగంలో ఇప్పటి పీటముడులను విప్పటమే ఒక సమస్యగా మన ముందున్నపుడు వాటిని మరింతగా బిగిసేట్లు, కొత్త ముడులు వేసేందుకు ప్రయత్నించటం నిజమైన దేశభక్తులు, జాతీయ వాదులు చేయాల్సిన పని కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అధికార రహస్యాల చట్టం ముసుగులో మీడియా నోరు నొక్కే యత్నం !

08 Friday Mar 2019

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Attorney General KK Venugopal, ‘Stolen’ Rafale documents, Official Secrets Act, Rafale fighter jet, The Hindu

Image result for Under Official Secrets Act government is threatening media

ఎం కోటేశ్వరరావు

అటు కేంద్రంలోనూ, ఇటు కొన్ని రాష్ట్రాలలోనూ జరుగుతున్న పరిణామాలను చూస్తే పాలకులు తాము ప్రమాణం చేసిన మాదిరి అధికారిక రహస్యాలను కాపాడటం కంటే అవి మీడియాలో రాకుండా ఎలా చూడాలా, అందుకు మీడియాను ఎలా కట్టడి చేయాలి అన్నదాని మీదే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకు తాజా వుదాహరణ రాఫెల్‌ విమానాల కొనుగోలు లావాదేవీల అక్రమాలపై పునర్విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్‌ కె వేణుగోపాల్‌ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అటార్నీ జనరల్‌ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, ఆయన నోటి నుంచి వెలువడిన ప్రతి మాటా ప్రభుత్వ ఆలోచన, కార్యాచరణకు ప్రతిబింబమే.

రాఫెల్‌ విమానకొనుగోళ్ల లావాదేవీలపై విచారణ జరపనవసరం లేదని గతేడాది డిసెంబరులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దానిని పున:సమీక్షించాలని కొందరు పిటీషన్లు దాఖలు చేశారు. వాటిపై ఈనెల ఆరున సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌, న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్‌, కెఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్‌ విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభిస్తూ ఇప్పటికే రికార్డులలో వున్న అంశాల మీదనే పిటీషనర్లు పునర్విచారణ జరపాలని కోరాలని, దీనికి సంబంధించి ఇటీవల మీడియా ప్రచురించిన అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోదని ప్రకటించారు. ఆ సందర్భంగా జరిగిన వాదోపవాదాల సారాంశం ఇలా వుంది.

పిటీషనర్‌ ప్రశాంత భూషణ్‌ : మేము కోరిన సహాయ స్వభావాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. నా పిటీషన్‌లో లావాదేవీని రద్దు చేయమని కోరలేదు, అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని మాత్రమే కోరుతున్నా. తీర్పు సమయంలో కోర్టు అనేక దోష పూరితమైన అంశాల మీద ఆధారపడింది. సీల్డుకవర్‌ నోట్స్‌ద్వారా దోషపూరితమైన అంశాలను ప్రభుత్వం సరఫరా చేసినందున అలా చేసి వుండవచ్చు. ఆర్ధిక నష్టం గురించి తెలిసి కూడా తప్పుడు అంశాలను కోర్టుకు నివేదించిన ప్రభుత్వ అధికారులను కూడా రప్పించాలి.

అటార్నీ జనరల్‌ కె వేణుగోపాల్‌ : పిటీషనర్లు మరియు ది హిందూ పత్రిక రక్షణ మంత్రిత్వశాఖ నుంచి అపహరించిన పత్రాల మీద ఆధారపడ్డారు. దీని గురించి అధికారిక రహస్యాల చట్టం మేరకు దర్యాప్తుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రభుత్వ పత్రాలను ప్రచురించిన రెండు ప త్రికలు, ఒక సీనియర్‌ న్యాయవాది మీద చర్యను మేము పరిశీలిస్తున్నాము. ఈ అంశం జాతీయ భద్రతకు సంబంధించినది, పిటీషన్‌పై విచారణ జరపక ముందే కోర్టును ప్రభావితం చేసేందుకు వార్తా పత్రికలు ముద్రించాయి. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది.

ప్రశాంత భూషణ్‌: కోర్టుకు వాస్తవాలను నివేదించకుండా పిటీషనర్లను అడ్డుకొనే ప్రయత్నంగా ఎజి ప్రకటనలు వున్నాయి. అటువంటి చర్యల ద్వారా ఎజియే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు.

ఏజి: (సమాచార హక్కు చట్టంలోని అంశాలను చదువుతూ ) రాఫెల్‌ గురించి రక్షణ పత్రాలను బహిర్గత పరచటాన్ని ఈ చట్టం మినహాయిస్తున్నది.(హిందూ పత్రిక ప్రచురించిన అంశాలను చదువుతూ) ఈ పత్రాల మీద రహస్యం అని రాసి వుంది, అవి బహిరంగపరచటానికి వుద్దేశించినవి కాదు. ఈ పత్రాలను ప్రపంచం మొత్తానికి ప్రచురించారు. అదెంత నష్టం చేకూర్చిందో చూడండి. ఎఫ్‌ 16విమానాలకు ప్రతిగా రాఫెల్‌జెట్‌ విమానాలు మన దేశ రక్షణకు అవసరం,ఈ విమానాలను నడిపేందుకు అవసరమైన శిక్షణ కోసం పైలట్లను ఇప్పటికే పారిస్‌ పంపారు.

పధాన న్యాయమూర్తి : పునర్విచారణ పిటీషన్‌కు పరిమితం కండి పరిశీలించాల్సిందానిని మేమేదైనా వదలి వుంటే చూస్తాము.

జస్టిస్‌ కెఎం జోసెఫ్‌ : ఇక్కడ జాతీయ భద్రత అంశం వుత్పన్నం కాదు.దర్యాప్తు చేయాలా వద్దా అన్నది కోర్టు ముందున్న అంశం. అందుకోసం అపహరణకు గురైన సాక్ష్యాలను కూడా కోర్టు పరిశీలిస్తుంది. సాక్ష్య చట్టంలో దీని గురించి స్పష్టంగా వుంది. ఒక వేళ అవినీతి జరిగి వుంటే అధికారిక రహస్యాల చట్టం కింద ప్రభుత్వం రక్షణ పొంద కూడదు.

ఎజి:(న్యాయమూర్తి జోసెఫ్‌తో విబేధిస్తూ) పత్రాలు ఎక్కడి నుంచి సేకరించారన్నది ముఖ్యం, విశేషాధికారం వున్న రక్షణ మంత్రిత్వశాఖ నుంచి పిటీషనర్లు వాటిని ఎలా సంపాదించారు? అధికారిక రహస్యాల చట్టాన్ని వుల్లంఘించారు అనే ప్రాతిపదికన పునర్విచారణ పిటీషన్ను కొట్టివేయాల్సిందిగా కోరుతున్నాను.

ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ : ఒక నిందితుడు అపహరణకు గురైన పత్రం అనేదాని ప్రాతిపదికన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే కోర్టు దానిని విస్మరించాలా ?

ఎజి:భారత్‌లో వున్న చట్టం ప్రకారం వనరు ముఖ్యం !

ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ : వనరు ముఖ్యం అనే సాధికారతను మాకు చూపండి.

ఏజి: 2004లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి పశ్యంత్‌ వెల్లడించిన తీర్పులో చట్టవిరుద్ద పద్దతుల్లో సేకరించిన సాక్ష్యం మీద ఆధారపడకూడదని పేర్కొన్నారు.

ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ : ఒక వ్యక్తి రహస్య పత్రాలను సంపాదించటం నేరపూరితమైన శిక్షకు అర్హునిగా అధికారిక రహస్యాల చట్టం పేర్కొన్నది. అటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోండి, అయితే ఆ పత్రం చెల్లకుండా పోతుందా ?

ఏజి: కోర్టు అలాంటి పత్రాలను పట్టించుకోకూడదు.

న్యాయమూర్తి కెఎం జోసెఫ్‌ :ఏజి మన ముందుంచిన సూత్రాన్ని బోఫోర్స్‌ కేసుకు కూడా వర్తింపచేయాలా? ఆ కేసును కూడా అపివేయాలా ?

న్యాయమూర్తి ఎస్‌కె కౌల్‌ : ఆ పత్రాలు మా ముందుకు వచ్చాయి, మేము వాటిని పరిశీలించకూడదని మీరు చెప్పుకూడదు.

ఎజి: శత్రువుకు వ్యతిరేకంగా ఈ దేశం బతికి బట్టకట్టాలంటే ఈ కొనుగోళ్లు తప్పని సరి.

న్యాయమూర్తి కౌల్‌ : ఏజి వాదనలను అంగీకరించినప్పటికీ, ఒక వేళ కోర్టు వివేకాన్ని దెబ్బతీసేవిగా వుంటే కొన్ని అంశాలు వినటానికి తగినవే.

ఏజి: ఈ సమస్యకు రాజకీయ కోణం వుంది. పార్లమెంటు ముందు ఇప్పటికే కాగ్‌ నివేదికనుంచారు. అది ఈ సమస్యను పరిశీలిస్తుంది. అపహరించిన పత్రాల నుంచి కొన్ని భాగాలను ప్రచురించిన పత్రికల వార్తల ప్రాతిపదిన సుప్రీం కోర్టు సిబిఐ విచారణకు ఆదేశిస్తే విదేశాలకు చెడు సంకేతాలిచ్చినట్లు అవుతుంది.భవిష్యత్‌లో విదేశీ కంపెనీలు రక్షణ కొనుగోలు లావాదేవీల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి, లావాదేవీలు పార్లమెంట్‌, టీవీ ఛానల్స్‌, వార్తా పత్రికలు పరిశీలించిన తరువాత కోర్టులు చూస్తాయని అనుకుంటారు.భారతీయ వాయుసేనకు అత్యవసరంగా అవసరమైన జట్‌ విమానాల సేకరణ ఆలస్యం అవుతుంది.

ఈ కేసు తదుపరి విచారణ మార్చి 14కు సుప్రీం బెంచ్‌ వాయిదా వేసింది. కోర్టులో తాను చేసిన వ్యాఖ్యలు దుమారం లేపటంతో న్యాయవాదులు, జర్నలిస్టుల మీద దర్యాప్తు, చర్యలు తీసుకోవటం లేదని తరువాత అటార్నీ జనరల్‌ వివరణ ఇచ్చినట్లు ఎడిటర్స్‌ గిల్డ్‌ తన ప్రకటనలో పేర్కొన్నది. అయినప్పటికీ ఇటువంటి బెదిరింపులతో తీవ్ర కలత చెందినట్లు, వాటిని ఖండిస్తున్నట్లు తెలిపింది.

Image result for Under Official Secrets Act government is threatening media

గతంలో కుహనా వార్తలను అదుపు చేసే పేరుతో జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటామని అక్రిడిటేషన్లను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం బెదరించింది. ఇప్పుడు 1923లో బ్రిటీష్‌ ప్రభుత్వం చేసిన అధికారిక రహస్యాల చట్టాన్ని ముందుకు తెచ్చి దాని ప్రాతిపదికన చర్యతీసుకుంటామని బెదిరించారు. ఇది దేశ భద్రత కంటే అధికారంలో వున్న వారి అవినీతి, లావాదేవీలలోని అక్రమాలు బయటకు రాకుండా చూసే యత్నంగా వుంది. నిజానికి ఈ చట్టం 2005లో చేసిన సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నది. ప్రభుత్వానికి లేదా అధికారంలో వున్నవారికి ఇబ్బంది కలిగించే ప్రతి సమాచారాన్ని దేశ భద్రత పేరుతో తొక్కిపెట్టేందుకు వీలు కల్పిస్తున్నది. రెండు చట్టాల మధ్య ఏదైనా ఘర్షణ వస్తే ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. 1998లో ప్రభుత్వ పెట్టుబడుల వుపసంహరణకు సంబంధించిన కేంద్రకాబినెట్‌ నోట్‌లోని అంశాలను ఒక జర్నలిస్టు బయటపెట్టినందుకు కేసు పెట్టారు. 2006లో ఒక కాశ్మీరు జర్నలిస్టు మిలిటరీ సమాచారాన్ని మిలిటెంట్లకు అందచేస్తున్నాడని అరోపించి కేసు పెట్టారు. తీరా విచారణలో ఆ సమాచారం బహిరంగంగా అందరికీ అందుబాటులో వున్నట్లు తేలింది. బోఫోర్సు నుంచి 2జి స్ప్రెక్ట్రమ్‌ కుంభకోణాల వరకు జర్నలిస్టులు బయటపెట్టినవే తప్ప ప్రభుత్వం వెల్లడించేందుకు ముందుకు రాలేదు. ఆ సమాచారం బయటకు వచ్చినందున దేశ భద్రతకు వాటిల్లిన ముప్పేమీ లేదు. రాఫెల్‌ కేసు కూడా అలాంటిదే. ప్రభుత్వం కొన్ని అంశాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నది. ఫ్రెంచి కంపెనీ అమ్ముతున్నది మనం కొనుగోలు చేస్తున్నాం, ఎన్నికొనుగోలు చేస్తున్నదీ బహిరంగమే. తేడా అల్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎక్కువ ధర చెల్లిస్తున్నారని, ప్రభుత్వ కంపెనీని పక్కన పెట్టి ప్రయివేటు కంపెనీ ప్రయోజనం కోసం నిబంధనలను మార్చారని. దీనిలో దేశభద్రతకు వచ్చిన ముప్పేమిటో తెలియదు.

Image result for Under Official Secrets Act government is threatening media

అటార్నీ జనరల్‌ చేసిన వాదన పర్యవసానాలు ఎలా వుంటాయో చూద్దాం. ఒక కేసు విచారణలో ఒక వ్యక్తి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనే సాక్ష్యాలను కోర్టు ముందుంచటంలో విఫలమయ్యాడు. వున్న ఆధారాల మేరకు అతను నేరం చేశాడని కోర్టు మరణశిక్ష విధిస్తుంది. అది అమలు గాక ముందే సదరు వ్యక్తికి చెందిన వారు నిందితుడిని నిర్దోషిగా నిరూపించే అధికారిక సాక్ష్యాన్ని అక్రమ పద్దతుల్లో సంపాదించి కోర్టు ముందు పెడితే అక్రమంగా సాక్ష్యాలను తెచ్చారు గనుక వినేది లేదు వురి వేయాల్సిందే అని కోర్టు చెప్పాల్సి వుంటుంది. రాఫెల్‌ లావాదేవీలను ఆసరా చేసుకొని ప్రతిపక్షాలు తమ ప్రభుత్వాన్ని అస్ధిర పరచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇప్పటి వరకు బిజెపి ఆరోపిస్తున్నది. ఇప్పుడు ఏజి ద్వారా మీడియా రహస్య పత్రాలను అపహరించిందంటూ నిందలు వేస్తూ బెదిరింపులకు పూనుకుంది. ఈ వైఖరిని అడ్డుకోకపోతే ఈ ప్రభుత్వం లేదా రాబోయే పాలకులు మరొకరు ఈ నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను మరింతగా అమలు జరిపే ప్రమాదం పొంచి వుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చౌకీదారుగా నరేంద్రమోడీ – సిఇఓగా చంద్రబాబు విఫలం !

07 Thursday Mar 2019

Posted by raomk in AP, BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP, CEO chandrababu naidu, chandrababu naidu, chowkidar narendra modi, Data Theft, Narendra Modi, trs, ysrcp

Image result for as chowkidar narendra modi

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం పెద్ద రాజకీయ వ్యాపారం నడుస్తోంది. దీనికి నేరపూరిత అంశాలు తోడవుతున్నాయి. నేను దేశానికి పెద్ద కాపలాదారును అని ప్రధాని నరేంద్రమోడీ పదే పదే చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి అని పిలిపించుకోవటం కంటే సిఇఓ అంటేనే నాకు పెద్ద కిక్కబ్బా అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పుకొని ఎంతో తృప్తి పొందారు. ఇప్పుడు ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు అని చెప్పక తప్పదు. పెద్ద కాపలాదారు సంరక్షణలో వున్న రాఫెల్‌ విమానాల లావాదేవీలు, చర్చల పత్రాలు చోరీకి గురైనట్లు మార్చి ఆరవతేదీన అటార్నీ జనరల్‌ కె వేణుగోపాల్‌ సుప్రీం కోర్టుకు తెలిపారు. రెండు దశాబ్దాలకుపైగా తాము నిల్వచేసిన తమ పార్టీ సమాచారం చోరీకి గురైందని తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణా పోలీసులు, మరికొందరి మీద గుంటూరు జిల్లాలో ఫిర్యాదు చేశారు. అతి పెద్ద కాపలాదారు రక్షణలో వున్న రక్షణ శాఖ పత్రాల చోరీ గురించి ఎలాంటి ఫిర్యాదు లేదా కేసు నమోదు లేకుండానే ఏకంగా వున్నత న్యాయ స్ధానానికి తెలియచేయటం సరికొత్త వ్యవహారశైలికి నిదర్శనం. సమాచార చౌర్యం గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో చర్యలు, చర్చ మొదలైన వారం రోజులకు తమ సమాచారం పోయిందని తెలుగుదేశం గొల్లు మంటూ కేసు దాఖలు చేసింది. సామాన్యులు ఈ పరిణామాలను ఒక పట్టాన అర్ధం చేసుకోవటంలో విఫలమైతే జుట్టుపీక్కోవటం తప్ప ఏమీ చేయలేరు.

రెండు అంశాలు స్పష్టం. రాఫెల్‌ పత్రాలు చోరీకి గురైనట్లు మోడీ సర్కార్‌ కోర్టుకు నివేదించటం అంటే హిందూ పత్రిక వెల్లడించినవి వాస్తవమే అని నిర్ధారించటం. రెండవది చేయాల్సిన పని చేయనందుకు పెద్ద కాపలాదారు మీద ముందు కేసు నమోదు చేసి వుద్యోగం నుంచి వూడగొట్టాలి. ఏండ్ల తరబడి సేకరించిన సమాచారాన్ని నిర్లక్ష్యంగా చోరీ చేసేందుకు వీలుగా వుంచి కాపాడుకోవటంలో విఫలమైన తెలుగుదేశం కంపెనీ సిఇవో లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని బాధ్యతల్లో కొనసాగించటమా లేదా అన్నది సదరు కంపెనీ లేదా పార్టీకి వదిలివేద్దాం. దొంగలు దోచుకుపోయిన తరువాత ఇంటికి తాళాలు వేసినట్లు తెలుగుదేశం వెబ్‌సైట్‌ను మూసివేశారు. ఎందుకాపని చేశారంటే మిగిలిన సమాచారాన్ని కాపాడుకొనేందుకు అంటున్నారు. రాఫెల్‌ విమానాల కొనుగోలు ధర ఎక్కువా, తక్కువా, ఎంతో అనుభం వున్న ప్రభుత్వ రంగ సంస్ధను పక్కన పెట్టి ఎలాంటి అనుభవం లేని రిలయన్స్‌ కంపెనీకి కట్టబెట్టారా లేదా అన్న చర్చ జరుగుతోంది, వున్నత న్యాయస్ధానంలో విచారణలో వుంది. వాటిని పక్కన పెడితే రాఫెల్‌ విమానాలో మరొకటో మన వాయుసేనకు అవసరం అనేదానిలో ఎలాంటి తేడాలు లేవు. రాఫెల్‌గాక పోతే మరోకంపెనీ లావాదేవీలు లేదా ప్రభుత్వం చెబుతున్నట్లు అత్యంత రహస్య సమాచారాన్ని నరేంద్రమోడీ సర్కారు జాగ్రత్త పరచలేదు అన్నది తేలిపోయింది. సదరు పత్రాలు హిందూ పత్రిక చోరీ చేసిందని కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఆరోపించింది.

ప్రపంచంలో ఇలా అధికారిక పత్రాలు బహిర్గతం కావటం కొత్తేమీ కాదు. అమెరికా ప్రభుత్వం అత్యంత రహస్యంగా వుంచే సమాచారాన్ని జూలియన్‌ అసాంజే అనే పెద్ద మనిషి బహిర్గతం చేసిన వాటిని సంవత్సరాల బడి చదువుతూనే వున్నా ఇంకా తరగటం లేదు. కళ్ల ముందు జరిగే ఒక దుర్మార్గం లేదా ఒక అక్రమాన్ని సహించలేని వారో లేదా సదరు లావాదేవీ పోటీలో వెనుక బడి తోటి కంపెనీ అక్రమాలకు బలైన వారో ఇలాంటి పత్రాలను స్వయంగా మీడియాకు తెచ్చి ఇవ్వటం బహిరంగ రహస్యం. అలాంటి వనరు ఏదో ఒకటి లేకుండా మీడియా వ్యక్తులు దొంగతనం చేసి సంపాదించిన దాఖలా లేదా అలాంటి వుదంతాలలో శిక్షలు పడిన వుదంతాలు నాకైతే కనపడలేదు. అదే హిందూ పత్రిక గతంలో బోఫోర్సు పత్రాలను, బిజెపి నేత మాజీ మంత్రి అయిన అరుణ్‌శౌరీ జర్నలిస్టుగా వున్న సమయంలో అనేక కుంభకోణాలను బయట పెట్టారు. కానీ అప్పుడెవరూ ప్రభుత్వ పత్రాలు చోరీ అయినట్లు ఫిర్యాదు చేయలేదు. జర్నలిస్టులను దొంగలుగా చిత్రించి కేసులు నమోదు చేస్తే ఈ దేశంలో, ప్రపంచంలో కేసులు వుండని జర్నలిస్టులు, మీడియా సంస్ధలు వుండవు.

రాఫెల్‌ లావాదేవీల అక్రమాల గురించి హిందూ పత్రిక ప్రకటించిన వెంటనే ఫిబ్రవరి ఎనిమిదిన రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారు. దానిలో చోరీ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. నెల రోజుల తరువాత చోరీ జరిగిందని అధికార రహస్యాల వెల్లడి చట్టం కింద వాటిని బయట పెట్టిన రెండు పత్రికల మీద విచారణ, చర్యను పరిశీలిస్తున్నట్లు అటార్నీ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు. అది కూడా ఈ లావాదేవీలపై సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలన్న పిటీషన్లపై విచారణ ప్రారంభమైన తరుణంలో అన్నది గమనించాలి. కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు కోర్టులో చేసిన వాదనను చూస్తే అధికార రహస్యాల చట్ట వుల్లంఘన అనే కత్తిని మీడియా మీద ప్రయోగించేందుకు పూనుకుందన్నది స్పష్టం. దాన్నే రక్షణగా చేసుకొని పునర్విచారణను అడ్డుకోవాలని చూస్తోంది. పునర్విచారణ పిటీషన్‌ విచారణకు ముందే వార్తా పత్రికలు సంబంధిత అంశాలను ప్రచురించటం కోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకే అని అందువలన ఇది కోర్టు ధిక్కారం కూడా అని ఏజి వాదించారు. దీనికి ప్రతిగా పిటీషన్‌దారైన ప్రశాంత భూషణ్‌ కోర్టుకు వాస్తవాలను వివరించే పిటిషనర్లను అడ్డుకొనే ప్రయత్నమే ఏజి ప్రకటనలని నిజానికి అవే కోర్టు ధిక్కరణకిందికి వస్తాయన్నారు.

ప్రపంచంలో ప్రజాస్వామ్యం వున్న ఏదేశంలోనూ ఒక వార్త మీడియాకు ఎలా వచ్చిందో చెప్పాలని ఆదేశించే హక్కు ఏ కోర్టుకూ లేదు. మీడియాకు అనేక వనరుల నుంచి వార్తలు వస్తాయి. వాటిని బయటకు వెల్లడించబోమనే ఎలాంటి రాతకోతలు లేని హామీతోనే స్వీకరిస్తాయి, ప్రచురిస్తాయి.అలాంటి విశ్వసనీయతను మీడియా కాపాడుకొంటూ వస్తోంది. ఈ వుదంతంలో హిందూ పత్రిక ప్రచురించిన వాటి గురించి పత్రిక చైర్మన్‌, స్వయంగా రాఫెల్‌ పత్రాలను బయట పెట్టిన ఎన్‌ రామ్‌ ఈ విషయాలనే స్పష్టంగా చెప్పారు. ఈ అంశాలు కోర్టు విచారణలోనూ వస్తాయి కనుక వాటి గురించి మరోసారి పరిశీలిద్దాం.

Image result for as ceo  chandrababu naidu failed

తెలుగుదేశం- వైసిపి మధ్యలో తెరాస !

రెండవ అంశం ఆంధ్రప్రదేశ్‌, తెలుగుదేశం పార్టీ సమాచార చోరీ వివాదం.సమాచార చోరీ చాలా సంక్లిష్టమైనది. దానికి ముందే చెప్పుకున్న జూలియన్‌ అసాంజే వికీలీక్స్‌ వెల్లడించిన సమాచార వుదంతం చక్కటి వుదాహరణ. అసాంజే ఆస్ట్రేలియా కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌. అమెరికాకు చెందిన ఆఫ్ఘన్‌, ఇరాక్‌ యుద్ధాలు, సిఐఏ, అమెరికా రాయబారులు పంపే ప్రయివేటు సమాచారం లక్షల ఫైళ్లను ప్రపంచానికి విడుదల చేశాడు. అతని మీద నేరుగా చర్యలు తీసుకొనే అవకాశం లేక లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలపై స్వీడన్‌ అరెస్టు చేసి విచారణ జరిపింది, తేలిందేమీ లేదు. స్వీడన్‌తో అమెరికాకు వున్న ఒప్పందం కారణంగా రహస్యాలను బయట పెట్టిన కేసులో అమెరికాకు అప్పగిస్తామని స్వీడన్‌ ప్రకటించింది. దాంతో అతను బ్రిటన్‌ పోలీసులకు లంగిపోయాడు. పదిరోజుల పాటు విచారించి బెయిలు మీద విడుదలయ్యాడు. బ్రిటన్‌ కూడా అమెరికాకు పంపే యత్నాలను గమనించి బ్రిటన్‌ పోలీసుల కళ్లుగప్పి లండన్లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్ర యం పొందాడు. 2017లో ఈక్వెడార్‌ పౌరసత్వం కూడా పొంది అక్కడే వుంటున్నాడు. అంతర్జాతీయ రాజకీయాలు అర్దమైతే తప్ప ఇలా ఎందుకు జరుగుతోంది అనేది అర్ధం కాదు.

స్వాతంత్య్రం తరువాత అనేక రాష్ట్రాలను చీల్చి కొత్త వాటిని ఏర్పాటు చేశారు. బహుశా ఎక్కడా లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ అధికార పార్టీల మధ్య రాజకీయ వివాదాలు చోటు చేసుకోవటం ఒక విధంగా భారత రాజకీయ రంగం మీద కొత్త అంకం అనుకోవాల్సి వుంటుంది. తెలుగు వారు గణనీయ సంఖ్యలో వున్న కర్ణాటకలో తెలుగుదేశం, తెలంగాణా రాష్ట్రసమితి(తెరాస) మధ్య మొదలైన తెరవెనుక రాజకీయ పోరు గతేడాది జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తెరమీదకు వస్తే, ఇప్పుడు అది కత్తులు దూసుకొనే స్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ఒకదానినొకటి దెబ్బతీసుకోవాలి అని అనుకోవాలేగానీ అవకాశాలు, సాకులు బోలెడన్ని.మనకు సినిమా పరిజ్ఞానం ఎక్కువ గనుక చిక్కడు-దొరకడు, రేచుక్క-పగటి చుక్క, ఎత్తుకు పై ఎత్తు, దొరికితే దొంగలు, జగత్‌ కిలాడీలు, జగత్‌ జెంత్రీలు వంటి సినిమాలను చూసి తెలుగువారు చాల మెళకువలను నేర్చుకున్నారు. తాజాగా వచ్చిన ఎఫ్‌టు అనే తెలుగు సినిమాలో ఒక అధికారి తాను తెలంగాణా లేదా ఆంధ్రకు చెందిన వాడిని అని చెబితే ఎక్కడ తేడా వస్తుందోనని కేంద్ర పాలిత ప్రాంతం యానం అని చెబుతాడు. ఇప్పుడు వర్తమానానికి వస్తే సమాచార చౌర్యం. సమస్య తెలుగుదేశం-వైసిపి వ్యవహారంలా వున్నప్పటికీ బిజెపి, తెలంగాణా రాష్ట్ర సమితి పాత్రకూడా తక్కువేమీ కాదు. దీనిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన వారు, ఫిర్యాదులు చేసిన వారందరూ సామాన్య జనాన్ని గందరగోళపరుస్తున్నారు. హైదరాబాదుకు చెందిన ఐటి గ్రిడ్స్‌ ఇండియా అనే ఒక కంపెనీ తెలుగుదేశం పార్టీకోసం సేవా మిత్ర అనే ఒక యాప్‌ను తయారు చేసిందని, దానిలో వుపయోగించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ పధకాల లబ్దిదారులు, ఓటర్ల వివరాలను తస్కరించారని హైదరాబాద్‌కు చెందిన టి లోకేశ్వర్‌ రెడ్డి అనే సమాచార విశ్లేషకుడు మార్చినెల రెండవ తేదీన హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సమాచార చోరీ వివాదం ప్రారంభమై సినిమాల్లో మాదిరి మలుపులు తిరుగుతోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటిగ్రిడ్‌ కంపెనీలో సోదాలు జరిపి సిబ్బందిని ప్రశ్నించారు. యజమాని ప్రస్తుతం పరారీలో వున్నట్లు పోలీసులు ప్రకటించారు. అతను అమరావతిలో అంటే విజయవాడలో ఏపి పోలీసుల రక్షణలో వున్నాడన్నది బిజెపి, తెరాస ఆరోపణ. దాని గురించి తెలుగు దేశం పార్టీ వారు అవుననీ, కాదనీ ఏమీ మాట్లాడరు. మార్చి మూడవ తేదీన ఏపి పోలీసులు హైదరాబాదు వచ్చి సమాచార చోరీ ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డి ఇంటి మీద దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. అతనేమీ సమాచార దొంగకాదు. ఐటి గ్రిడ్‌ సిబ్బందిని నిర్బంధించారన్న అరోపణలతో కోర్టుకు ఫిర్యాదు చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా తమను ప్రశ్నించారు తప్ప నిర్బంధించలేదని కోర్టుకు తెలపటంతో కోర్టు పిటీషన్‌ను కొట్టివేసింది. ఐటి గ్రిడ్‌ కంపెనీని వేధిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించటంతో సమాచార చౌర్యం కేసు రాజకీయ రంగు పులుము కుంది.

ఈ లోగా హైదరాబాద్‌కు చెందిన దశరధరామి రెడ్డి అనే మరోవ్యక్తి హైదరాబాద్‌ పోలీసులకు మరో ఫిర్యాదు చేశాడు. హైదరాబాదులో తాత్కాలికంగా నివాసం వుంటున్న వారి వివరాలను సేకరించి ఆంధ్రప్రదేశ్‌లోని వారి స్వస్ధలాలలో ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారన్నది దాని సారాంశం. ఫిర్యాదుదారు హైదరాబాదులో వుండటంతో తాము ఇక్కడ కేసు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. సమాచార తస్కరణ కేసు సత్వర విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు హైదరాబాదు పోలీసులు ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో గుంటూరులో తెలుగు దేశం పార్టీ నేతలు అక్కడి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలంగాణాకు చెందిన పోలీసులు, కొందరితో కుమ్మక్కై తమ పార్టీ సమాచారాన్ని అపహరించారని పేర్కొన్నారు. తెలంగాణా పోలీసులు సత్వర విచారణకంటూ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తే , దానికి పోటీగా ఏపి సర్కార్‌ రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఒకటి తెలుగుదేశ ం పార్టీ సమాచార చౌర్యం మీద అయితే రెండవది ఫారం ఏడుతో అక్రమంగా ఓటర్లను తొలగించేందుకు దరఖాస్తు చేసిన వారి మీద చర్యతీసుకొనేందుకు అని ప్రకటించారు.

చట్టపరమైన అంశాలు, కేసులు ఏమౌతాయి అన్న అంశాలను కాసేపు పక్కన పెడితే ఈ వివాదం ఎందుకు మొదలైందన్నది ఆసక్తి కలిగించే అంశం. తమ వస్తువులను అమ్ముకొనేందుకు అవసరమైన మార్కెటింగ్‌ వ్యూహాలను రచించుకొనేందుకు ప్రపంచవ్యాపితంగా కార్పొరేట్‌ కంపెనీలు జన ఆమోదంతో నిమిత్తం లేకుండా మభ్య, ప్రలోభపరచి లేదా సాధ్యంగాక తస్కరించి సమాచార సేకరణ,దాయటం అందరికీ తెలిసినదే. ఇప్పుడిది కార్పొరేట్‌ రాజకీయ పార్టీలకు పాకింది. పార్టీ కార్యకర్తల, సభ్యుల పేరుతో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో సమాచార సేకరణ, ఎన్నికల సమయంలో దాన్ని వుపయోగించుకోవటం ఎప్పటి నుంచో జరుగుతోంది.గతంలో ముఖ్య మంత్రి పేరుతో ప్రతి ఇంటికీ లేఖలు రాస్తే ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వ పధకాల లబ్దిదారులను కూడా చేర్చి తమ ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవటం అసలు వివాదానికి మూలం. విచారణలో ఏ విషయాలు బయటపడతాయో లేక ఓటుకు నోటు కేసు మాదిరి తెరవెనుకకు పోతాయో మనకు తెలియదు. ఒకటి జరిగి వుండాలి. ఇది వూహ మాత్రమే. తెలుగుదేశం పార్టీ తాను సేకరించిన సమాచారంతో పాటు ప్రభుత్వ పధకాల లబ్దిదారుల సమాచారాన్ని కూడా ఐటి గ్రిడ్‌కు అప్పగించి తన యాప్‌ ద్వారా ఓటర్లకు చేరువ అయ్యేందుకు నిర్ణయించి వుండాలి. అది తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సిపి తెలంగాణాలో తన మిత్రపక్ష సహకారంతో ఆ సమాచారాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రతి వ్యూహం రచించి వుండాలి. దానిలో భాగంగానే తస్కరణ ఫిర్యాదులు, ఐటి గ్రిడ్‌పై పోలీసుల విచారణ,సమాచార కాపీ, దాన్ని వైఎస్‌ఆర్‌సిపికి అందచేసి వుండాలి. దీనిలో మరొక అంశం ఏమంటే తమకు ఓటు వేసే అవకాశం లేదు అనుకొనే వారి ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు లక్షల సంఖ్యలో ఓటర్లకు తెలియకుండానే కొందరు కుట్ర చేసి దరఖాస్తులు చేయటం, వాటిని అధికారం యంత్రాంగం తెలిసీ లేదా తెలియనట్లు నటించిగానీ దరఖాస్తులో కోరిన మేరకు ఓటర్ల జాబితా నుంచి తొలగించటం జరుగుతోంది. ఇలాంటి చర్యలకు తెలుగుదేశం-వైసిపి రెండు పార్టీలూ పాల్పడ్డాయన్నది అందరినోటా వినిపిస్తున్న అంశం. ఎవరు సమాచారాన్ని దొంగిలించారు లేదా ఎవరు ఐటి గ్రిడ్‌కు అప్పగించారు, దాని దగ్గర నుంచి టిఆర్‌ఎస్‌ సర్కార్‌ సాయంతో వైసిపికి అందచేశారా అనేది ఒకటైతే ఆ సమాచారం అంతా అసలు మన దేశంతోనే సంబంధం లేని అమెజాన్‌, గూగుల్‌ కంపెనీల సర్వర్లకు చేరిందన్నది మరొక అంశం. మరి అదెలా జరిగినట్లు ?

నిజానికి ఇలాంటి అక్రమాలు గతంలో కూడా జరిగాయిగానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు ఎందుకు అంటే రెండు పార్టీలు అధికారం కోసం ఎంతకైనా తెగించేందుకు పూనుకున్నాయి. ఏ పార్టీ గెలిచినా రెండో పార్టీ దుకాణం ఖాళీ అవుతుంది. గత ఎన్నికలలో తెలుగు దేశం సీట్ల పరంగా ఎక్కువ పొందినా ఓట్ల పరంగా పెద్దగా రాబట్టలేదు. రెండు పార్టీల మధ్య తేడా కొన్ని లక్షలు మాత్రమే అన్నది తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మరికొన్ని రాష్ట్రాలలో నెలకొన్న పరిస్ధితులను చూస్తే ఏ పార్టీ అయినా అధికారానికి వస్తేనే అది ఐదు సంవత్సరాలూ నిలుస్తుంది. ఏదో ఒకసాకుతో ప్రతిపక్ష పార్టీలు ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఇతర ప్రజాప్రతినిధులను టోకుగా లేదా చిల్లరగా కొనుగోలు చేస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీ తన బలాన్ని పెంచుకొంటోంది. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం వున్నప్పటికీ స్పీకర్ల అండ, చట్టంలోని లసుగులను వుపయోగించుకొని ఫిరాయింపుదార్లను రక్షిస్తున్నారు. పార్టీ మారకుండానే మంత్రిపదవులను సైతం కట్టబెట్టిన విపరీతాన్ని చూశాము. అందువలన ఎలాగైనా సరే అధికారాన్ని పొందాలన్నదే ఏకైక సూత్రంగా ఇప్పుడు అధికారపార్టీలు పని చేస్తున్నాయి.

ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎన్నికల తాయిలాలు, డబ్బులు పంచటం, కులాన్ని రంగంలోకి తీసుకురావటం పాత పద్దతులు. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలుగా వున్న వారి వ్యాపారాలు, ఇతర లావాదేవీలను దెబ్బతీస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం ద్వారా తమవైపు తిప్పుకోవటం అధికారపార్టీలు కొత్తగా ప్రారంభించిన ప్రమాదకరక్రీడ. ఎవరు అధికారంలో వుంటే వారు దీన్ని ఆడుతున్నారు. ఇది రాష్ట్రాలను దాటింది. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి తన లేదా తన మిత్రపక్ష రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు సిబిఐ, ఐటి, ఇడి వంటి సంస్ధలను వుపయోగించుతోందన్నది ఒక విమర్శ. హైదరాబాదులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులుగా వున్న వారు బహిరంగంగానే ఆరోపించిన అంశం తెలిసిందే. వైఎస్‌ఆర్‌సిపికి లబ్ది చేకూర్చేందుకు తెలంగాణా వున్న టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం ఈ పని చేస్తోందన్నది ఆరోపణ. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో ఏపికి చెందిన చంద్రబాబు నాయుడు జోక్య ం చేసుకొని తమను ఓడించేందుకు ప్రయత్నించినదానికి ఇది బదులు తీర్చుకోవటంగా కనిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ సమాచార చోరీ జరిగిందన్న ఫిర్యాదుకు, తమ సమాచారాన్ని చోరీ చేశారన్న ఆరోపణకు రెండింటికీ తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వుంది. అధికారంలో వున్న పార్టీగా అధికారిక సమాచార చోరీ నివారణకు, చివరకు స్వంత సమాచార చోరీని అడ్డుకోవటంలో ఎందుకు విఫలమైంది అన్నదానికి జవాబు చెప్పాల్సింది వారే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు జోక్యం చేసుకున్నాడని, సామాజిక మీడియాను వుపయోగించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు వచ్చిన ఆరోపణలు మనకు తెలిసిందే. అమెరికా ఎన్నికల్లో కూడా జాబితా తయారీలోనే ఓటర్లకు ప్రలోభాలు, తమకు ఓట్లు పడవు అనుకున్న ప్రాంతాలలో ఓటర్లజాబితాల్లో అక్రమాలు, కుంటి సాకులు చూపి ఓటర్లను అడ్డుకోవటం బహిరంగ రహస్యం.

ఇప్పుడు ఓటర్ల జాబితాల్లో తొలగింపుల గురించి తెలుగుదేశాంవైసిపి పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చూస్తే రేపు ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాకపోతే రెండోవారిని నిందించటానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనుకోవాలి.ఓట్ల తొలగింపు గురించి సాధారణంగా ఎన్నికల రోజు, లేదా తరువాత ఆరోపణ,ప్రత్యారోపణులు వస్తాయి.అలాంటివి ఇప్పుడు ముందే వస్తున్నాయంటే అర్ధం అదే. ఈ పూర్వరంగంలో ఎన్నికల సంస్కరణలు లేదా నిబంధనల సవరణ అంశం ముందుకు వస్తోంది. నిర్ణీత గడువులోగా ఓటర్లుగా నమోదుకు అవకాశం ఇచ్చినట్లే, రద్దు దరఖాస్తుల ప్రకారం ఏ ఓటర్లను తొలగిస్తున్నదీ, అభ్యంతరాలుంటే తెలియచేయాల్సిందిగా కోరుతూ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందచేస్తే తప్పుడు దరఖాస్తులా నిజమైనవా అన్నది తేలుతుంది. కనీసం తొలగింపు ఓటర్లను బూత్‌ల వారీ ఎలక్ట్రానిక్‌ జాబితాలను అయినా పార్టీలు, ఓటర్లకు అందుబాటులో వుంచి సరిచూసుకొనేందుకు వీలు కల్పించాలి. బోగస్‌ దరఖాస్తులుగా తేలిన వాటిని దరఖాస్తుదారులను, వాటిని విచారణ చేయకుండా ఆమోదించి ఓట్లను తొలగించిన సిబ్బంది మీద క్రిమినల్‌ చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో అటువంటివి పునరావృతం కాకుండా వుంటాయి. ఒకసారి ఓటు హక్కు వచ్చిన తరువాత ఓటరు స్వయంగా కోరితే లేదా మరణిస్తే తప్ప జాబితా నుంచి రద్దయితే దానికి జాబితా తయారు చేసినవారిని బాధ్యులుగా చేయాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d