• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

ప్రపంచీకరణకు అనుకూలమెవరు, వ్యతిరేకమెవరు ? ఎందుకు ?

01 Tuesday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Economics, Environment, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Others, UK, USA

≈ Leave a comment

Tags

anti globalisation, anti globalization movement, anti-neoliberal, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ పర్యవసానాలు-2

     ప్రపంచీకరణ గురించి రెండు అభిప్రాయాలు వున్నాయి. అది ప్రపంచానికి మంచి చేస్తుందని కొందరంటే చెడు చేస్తుందని మరికొందరు చెబుతారు. చరిత్రలో వర్గాలు లేనటు వంటి ఆదిమ సమాజాన్ని( దాన్నే ఆదిమ కమ్యూనిస్టు సమాజం అని కూడా పిలుస్తారు) మినహాయిస్తే సమాజంలో వర్గ విభజన జరిగినప్పటి నుంచి ప్రతి కొత్త దశలోనూ దాని మంచి చెడ్డలపై రెండు అభిప్రాయాలు వెలువడుతూనే వున్నాయి. బానిస, అర్ధబానిస లేదా ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ వ్యవస్థలన్నింటా ఒక వర్గానికి మేలు జరుగుతూనే వుంది. అలాంటి వారంతా దానిని కాపాడుకొనేందుకు అవసరమైన సాహిత్యం, మూఢనమ్మకాలు, నమ్మకాలు, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేశారు. నష్టపోయిన వర్గం ఆ వ్యవస్ధలను కూల్చివేసేందుకు, జనాన్ని కూడగట్టేందుకు తనదైన సాహిత్యం, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం చర్చనీయాంశంగా వున్న ప్రపంచీకరణ భావన, పద్దతుల గురించి కూడా ఇదే విధమైన రెండు రకాల సాహిత్యాలు వెలువడుతున్నాయి. ఒక గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పుకు దారితీయాలంటే అందుకు అనువైన పరిస్థితులు తయారు కావాలి. ఆవిరి రావాలంటే నీరు వంద డిగ్రీల వుష్ణోగ్రత వరకు మరగాల్సిందే. ఆలోగా కుండ లేదా పాత్ర లోని నీటిలో అనేక మార్పులు జరుగుతాయి తప్ప అవి మనకు కనిపించవు. అందరూ ఇష్టపడే అందమైన సీతాకోక చిలుక అవతరించటానికి ముందు అది అసహ్యించుకొనే గొంగళి పురుగు రూపంలో వుంటుంది. ప్రపంచీకరణ అన్నది పెట్టుబడిదారీ వర్గం రూపొందించిన తాజా అధునాతన దోపిడీ అస్త్రం.కార్మికవర్గం గుర్తించలేనంత సమ్మోహనంగా వుండి, వారి మద్దతు కూడా పొందేంత అంటే అతిశయోక్తికాదు. తెలిసో తెలియకో కార్మికవర్గం మద్దతు లేదా వుపేక్ష కారణంగానే అదింకా బతికి బట్టగలుగుతోంది. బానిస, ఫ్యూడల్‌ వ్యవస్ధలను అదుపు చేసిన వర్గాలు అవి కూలిపోయేంత వరకు శాశ్వతమనే భ్రమించాయి,భావించాయి. జనంలో చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఆ వ్యవస్ధలలో కూడా పాలకవర్గం సంస్కరణలు ప్రవేశపెట్టకపోలేదు. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్ధ కూడా అదే భావంతో, అదే బాటలో వుంది. సహజం.

     ప్రపంచీకరణను వ్యతిరేకించే వారు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారా ? కానే కాదు, ముందటి సమాజాలు, తరతరాల అనుభవసారం నుంచి దానిని గ్రహించారు.ఒక విధానం మంచిదా కాదా అని నిర్ధారించటానికి ఎంత కాలం కావాలి? ప్రాతిపదికలేమిటి ? ప్రపంచీకరణ పేరుతో తీసుకున్న లేదా ఇంకా ప్రతిపాదిస్తున్న చర్యలన్నీ సామాన్య జనానికి తక్షణం హాని చేసేవి, అయితే శరీరంలో దెబ్బతిన్న భాగాన్ని తొలగించాలంటే శస్త్ర చికిత్స చేయాలి, తొలుత బాధగానే వున్నప్పటికీ తరువాత జీవితాంతం సుఖం అనుభవిస్తారు కనుక తాత్కాలిక బాధను భరించాలని ప్రపంచీకరణ వాదులు నమ్మబలుకుతారు.చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచీకరణ కోరుకున్న వారే భిన్న స్వరాలు వినిపిస్తున్నారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/world-faces-long-period-of-stagnation-ahead  సత్యజిత్‌ దాస్‌ అనే ఒక బ్యాంకరు ‘ నిండుకున్న ప్రపంచ అమ్ముల పొది’ అనే పేరుతో బ్లూమ్‌బెర్గ్‌ వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం రాశారు. ‘ పురోభివృద్ధిని పునరుద్దరించేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తాము చేయగలిగినవి ఇంకా ఎన్నో వున్నాయని చెబుతూనే వున్న ప్రపంచ విధాన రూపకల్పనవేత్తలు ఎవరూ కూడా ఓటమిని అంగీకరించటానికి సిద్ధ పడటం లేదు. రెండు కాళ్లూ పొగొట్టుకొని దారిలో పడివున్న మల్లయ్య నేను లేస్తే మనిషిని కాను అని విజయం సాధించిన వారిని బెదిరించే మాదిరి వారి తీరు వుంది. వాస్తవం ఏమిటంటే ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకుల దగ్గర ఇంక ఆయుధాలేమీ మిగల్లేదు.’ ఇలా ప్రారంభమైంది.

     ‘ ప్రపంచవ్యాపితంగా డిమాండ్‌ మందగించటం, అనేక పరిశ్రమలు సామర్ధానికి మించి వుండటం వంటి పర్యవసానాలతో పెట్టుబడి నలిగిపోతోంది. కొన్ని బ్యాంకుల దగ్గర కొండల మాదిరి కారుచౌకగా దొరికే డబ్బు పేరుకుపోతున్నప్పటికీ రుణాలు తీసుకొనే వారు ముందుకు రావటం లేదు. ధన చలన వేగం చాలా తక్కువగా వుంది. తక్కువ లేదా ప్రతికూల వడ్డీ రేట్ల కారణంగా నిధులు సమకూర్చటం, బ్యాంకుల లాభాలు దెబ్బతింటున్నాయి. తమ పొదుపును మరోచోటికి బదలాయించుకోవటం, నగదుగా మార్చుకోవటం వంటి చర్యలను ప్రభుత్వాలు నిషేధించటం వంటి చర్యలు చేపడితే తప్ప వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు వాటిని ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు. పెన్షన్‌ నిధులు, వుద్యోగ విరమణ తరువాత ఇచ్చే లబ్ది గురించి చేసుకున్న ఒప్పందాలు, బీమా కంపెనీల సామర్ధ్యాలను ఇప్పటికే ప్రతికూల వడ్డీ రేట్లు ప్రశ్నిస్తున్నాయి. అనేక ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లు, చివరికి కంపెనీల వాటాలను కూడా కొనుగోలు చేయటం ద్వారా విత్త మార్కెట్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ జపాన్‌ రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఆ పని చేసింది.ఆర్ధిక వ్యవస్ధపై ప్రభుత్వ పట్టు పూర్తిగా వుండేందుకు లెనిన్‌ హయాంలో సోవియట్‌ యూనియన్లో జరిగిన మాదిరి రిజర్వుబ్యాంకులు తమ అధికార కత్తులను ఝళిపించటం పెరిగిందన్నది నిజం. ఇదే సమయంలో ఈ విధానాల పరిమితులన్నీ అయిపోతున్నట్లు అందరికీ కనిపిస్తోంది. జపాన్‌, ఐరోపా దేశాల రిజర్వు బ్యాంకులకు కొనుగోలు చేసేందుకు తగిన బాండ్లు కనిపించటం లేదు. అంతా అనివార్యమని చెప్పలేముగాని వడ్డీ రేట్ల మరింత తగ్గింపు, పరిమాణాత్మక ఆంక్షలు మరింత సడలింపు మార్కెట్‌ రేట్లు, ఆస్థుల ధరలు లేదా నగదు విలువలపై పెద్ద ప్రభావమే చూపుతాయి.

     ఈ పరిస్ధితి మాంద్యంగా వున్న వాటికి ప్రభుత్వాలు ఆర్ధిక వుద్దీపనలు కలిగించటం అనే ఒక నూతన ఏకాభిప్రాయాన్ని పురికొల్పింది. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు లోటుతో నడుస్తున్నాయి.కొన్ని వ్యవస్ధాగతమైన లోపాలతో వున్నాయి. వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు అదనంగా ఖర్చు చేస్తే తరువాత అది ప్రభావశీలంగా వుండాలంటే తరువాత కూడా కొనసాగించాల్సిందే. మౌలిక వసతుల వంటి వాటికి పెట్టుబడులు పెడితే తరువాత ప్రాజెక్టును బట్టి దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి. ఎందుకంటే ప్రభుత్వాలు కృత్రిమంగా తక్కువ వడ్డీ రేటు లేదా ప్రతికూల వడ్డీ రేట్లతో డబ్బు తీసుకు వచ్చి ఖర్చు చేయటం అంటే దాని అర్ధం ప్రతిఫలం లభిస్తుందని కాదు. పెద్దగా ప్రయోజనం లేని ఆస్థులపై పెట్టిన పెట్టుబడిగా మారే ప్రమాదం వుంది.’

      ప్రపంచీకరణ వెనక్కు నడుస్తోంది అనే పేరుతో మరొక సమర్ధకుడు ఒక విశ్లేషణ చేశారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/globalization-goes-into-reverse ఇది కూడా ఆసక్తి కలిగించేదే. నోవా స్మిత్‌ అనే రచయిత తన విశ్లేషణను ఇలా ప్రారంభించాడు.’ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అనేక పశ్చిమ దేశాలలో ప్రతి క్రియ జరుగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం, వలసలకు సంబంధించి అమెరికన్లు ఇప్పటికీ సానుకూల అంశాల గురించి చెప్పవచ్చు, రాజకీయ అభ్యర్ధులైన ట్రంప్‌, బెర్నీ శాండర్స్‌ వంటివారు ఒక దశాబ్దం క్రితం వూహించటానికే అవకాశం లేని ఈ రెండింటిని వ్యతిరేకించే వారిని నుంచి ఒక పరిధి మేర ఎంతో మద్దతు పొందుతున్నారు. వాణిజ్య లావాదేవీలలో అంతగా తెలియని పసిఫిక్‌ సముద్ర రాజ్యాల భాగస్వామ్య (టిపిపి) ఒప్పందం ప్రమాదంలో పడింది. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులు తీసుకోవటాన్ని కూడా ప్రపంచీకరణకు తిరస్కరణే అన్నది ఏక కంఠంతో చెప్పిన భాష్యం. కానీ నేటి ప్రపంచీకరణ వ్యతిరేక యుద్ధ వీరులు నిన్నటి యుద్ధం గురించి పోరాడుతున్నారు. ఏ విధంగా చూసినప్పటికీ 2008 సంక్షోభం నాటి నుంచి ప్రపంచీకరణ పూర్తి తిరోగమనంలో వుంది. మొదటిది వాణిజ్య విషయానికి వస్తే 2008 వరకు ఆరోగ్యకరంగా పెరిగింది. సంక్షోభం, మాంద్యం తరువాత ఇంతవరకు పూర్వపు స్థాయికి చేరుకోలేదు. రెండవది వలసల విషయానికి వస్తే ప్రపంచవ్యాపితంగా నెమ్మదిగా వలసలు పెరుగుతున్నాయి. అమెరికాకు అనూహ్య పెరుగుదల ఆగిపోయింది. మెక్సికో నుంచి అమెరికాకు వలసలు ఒక పెద్ద రాజకీయ వివాదంగా వుండేవి కాస్తా ఆ సమస్య ఇప్పుడు అటుదిటు అయింది. 2008 నుంచి 2014 వరకు అమెరికాలో నివశించే మెక్సికన్ల జనాభా పదిలక్షల మంది తగ్గిపోయారు.కారణం, అధికారికంగా నమోదు కానటువంటి మెక్సికన్‌ వలసదారులు పెద్ద సంఖ్యలో తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. తరువాత ఆర్ధికం గురించి, సంక్షోభానికి ముందు వున్న స్ధాయితో పోల్చితే అంతర సరిహద్దుల మధ్య జరిగే నగదు బదిలీలు తగ్గినట్లు యుబిఎస్‌ బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రపంచీకరణ అనూహ్య పెరుగుదల ఇరవయ్యవ శతాబ్ది చివరి నాటికే అంతమైంది. ఇరవై ఒకట శతాబ్ది ప్రారంభం ముగిసింది, ప్రపంచీకరణ చుట్ట విడిపోవటం ప్రారంభం కూడా కావచ్చు. పది సంవత్సరాల ఆలస్యంగా ప్రపంచీకరణ అపస్మారకం గురించి ఆందోళన పడుతున్నట్లుగా వుంది.’

   ఇంత త్వరగా ప్రపంచీకరణపై పెట్టుబడిదారీ మేథావులలో భ్రమలు వైదొలగటం ప్రారంభం అవుతుందని ఎవరూ వూహించలేదంటే అతిశయోక్తి కాదు.మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన సంక్షోభాలు, తీవ్ర ఆర్ధిక మాంద్యం కారణంగా అనేక దేశాలు తమ పరిశ్రమలు, వాణిజ్య రక్షణ చర్యలను తీవ్రతరం చేశాయి.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి చిన్నా, చితకా దేశాలు తప్ప వలసలు పూర్తిగా అంతరించటంతో యుద్ధ సమయంలోనే అమెరికా-బ్రిటన్‌లు యుద్ధం ముగిసిన తరువాత వాణిజ్య ఏర్పాటు ఎలా వుండాలో చర్చలు ప్రారంభించాయి. వాటి ఫలితమే 1947 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు జెనీవాలో 23 దేశాల చర్చలు ఫలించి ప్రపంచీకరణకు తెరతీసిన పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (గాట్‌) కుదిరింది. అక్కడే అత్యంత సానుకూల దేశ హోదా కూడా పురుడు పోసుకుంది. ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు సభ్య దేశాల వస్తువులకు పన్నులు, ఇతర ఆటంకాలను తగ్గించటం, ఎత్తివేయటమే గాట్‌లోని కీలకాంశం. తరువాత 2000 సంవత్సరం నుంచి దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్య సంస్ద రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

    ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన ధనిక దేశాల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలకు భిన్నంగా, వివిధ దేశాల మధ్య అసమాన ప్రయోజనాలు వస్తున్నాయని అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. చైనాను చూసి ప్రయివేటు పెట్టుబడులు అక్కడ పొందుతున్న లబ్దిని చూసి భారత్‌ సంస్కరణలు మొదలు పెట్టిందా లేక సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పెట్టుబడిదారీ ధనిక దేశాలతో అంటకాగితే ప్రయోజనం వుంటుందని పాలకవర్గం భావించి సంస్కరణలకు శ్రీకారం చుట్టిందా అన్నది ఒక చర్చ నీయాంశం. సోవియట్‌ కూలిపోక ముందే 1988లో ప్రధాని రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన జరపటం ఒక కీలకాంశం. నూతన ఆర్ధిక విధానం పేరుతో రాజీవ్‌ గాంధీ మాట్లాడిన పూర్వరంగం సంస్కరణలలో భాగమే. తరువాత సోవియట్‌, తూర్పు ఐరోపా రాజ్యాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత పీవీ నరసింహారావు రూపంలో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను తెరిచేందుకు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్కరణలు ఏ దేశానికి ఎక్కువ ప్రయోజనం కలిగించాయో తెలిసిందే. జపాన్‌కు చెందిన ‘రీతి’ సంస్ధ పరిశోధన ప్ర కారం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో మన వ్యవస్థను ముడివేసిన కారణంగా మన పరిశ్రమలు లబ్ది పొందటంతో పాటు వుపాధి అవకాశాలు కూడా పెరిగాయి. http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html అయితే అవి చైనాతో పోల్చుకుంటే చాలా పరిమితం. ఈ రెండింటితో పాటు మరికొన్ని దేశాలు లబ్ది పొందితే ఆ మేరకు ధనిక దేశాలు నష్టపోయాయి. 1995-2011 మధ్య కాలంలో ప్రపంచ విలువ గొలుసులో భారత పరిశ్రమలు చేసిన వుత్పత్తిలో తమ ఆదాయ వాటాను దాదాపు రెట్టింపు చేసుకున్నాయి. అందువలన మిగతా పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయని వేరే చెప్పనవసరం లేదు.ఈ విషయంలో మన పరిశ్రమలు రెండు నుంచి నాలుగుకు పెరిగితే చైనా నాలుగు నుంచి 16కు ఎదిగింది. ఇదే సమయంలో కేవలం విదేశాల కోసం చేసిన వుత్పత్తి విలువ మన దేశంలో 18 నుంచి 28కి పెరిగితే చైనాలో 35 నుంచి 42కు మాత్రమే పెరిగింది. అంటే చైనా కంటే విదేశాల కోసం తయారు చేసే సరకుల విషయంలో మన దేశం ఎంతో ముందుకు పోయింది. ఈ కారణంగానే మన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు మేకిన్‌ ఇండియా, మేకిన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో భారత్‌లో సరకులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోండి మంచి అవకాశాలు కల్పిస్తామని వెంపర్లాడుతున్నారు. రాయితీలు ప్రకటిస్తున్నారు. కేవలం ఎగుమతుల మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్థలను నిర్మించుకోవటం మంచిది కాదని లాటిన్‌ అమెరికా అనుభవం గ్రహించిన చైనా 2008 సంక్షోభం తరువాత తన అంతర్గత డిమాండ్‌ను పెంచటంపై కేంద్రీకరించింది. ఈ కారణంగానే సంక్షోభ ప్రభావం దాని ఆర్ధిక వ్యవస్ధపై పరిమితంగా పడిందన్నది కొందరి విశ్లేషణ.

     వస్తూత్పత్తి రంగంలో నానాటికీ నిపుణులైన కార్మికుల అవసరం పెరుగుతోంది. ఈ విషయంలో కూడా మనం చైనాతో పోల్చుకోవటానికి లేదు. 1995-2011 మధ్య మన దేశంలో వున్నత నిపుణులైన కార్మికులు 106.8శాతం పెరిగితే చైనాలో 211.2 శాతం పెరిగారు, పరిమిత నిపుణులైన వారు చైనాలో 35.6, భారత్‌లో 49.4 శాతం పెరిగారు. నైపుణ్యం లేని కార్మికుల శాతాలు 6.3, 4.4 శాతం చొప్పున మాత్రమే పెరిగారు. మన దేశంలో మధ్య తరగతి, చివరికి కార్మికవర్గంలో కూడా ప్రపంచీకరణకు అనుకూలత వ్యక్తం చేయటానికి ఈ పరిణామం కూడా దోహదం చేసినట్లుగా కనిపిస్తున్నది. మిగతావారితో పోల్చితే నిపుణులైన కార్మికులకు వేతనాలు సహజంగానే ఎక్కువ వుంటాయి కనుక, అవి ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను ప్రపంచ వ్యవస్ధతో ముడిపెట్టిన కారణంగానే వచ్చాయి కనుక ఆ విధానాలకు ఆకర్షితులు అవుతున్నారు. 1991-2014 మధ్య మన దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు పని చేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. నైపుణ్యం లేని కార్మికులు పని చేసే పరిశ్రమలు అంతకంటే ఎక్కువగా తగ్గిపోయాయి.

Image result for globalisation: why do people are opposing and supporting ?

    ఇదే సమయంలో ధనిక దేశాలలో పరిస్థితి ఏమిటి ? అమెరికాలో వున్నత నైపుణ్యం, పరిమిత నైపుణ్యం, నైపుణ్యం లేని కార్మికుల సంఖ్య స్ధిరంగా కూడా లేకపోగా 9.6,32.6,46.6 శాతాల చొప్పున, జపాన్‌లో 7.7, 29.8, 65.7 శాతాల చొప్పున తగ్గారు. ‘రీతి’ సర్వే చేసిన దేశాలలో ఒక్క చైనా, భారత్‌లో తప్ప మిగతా ప్రధాన దేశాలైన దక్షిణ కొరియాలో 66.5, తైవాన్‌లో 36.7, జర్మనీలో 17.7, ఇండోనేషియాలో 12.3 శాతం చొప్పున తగ్గారు. అందువలన సహజంగానే అక్కడి పౌరులలో ప్రపంచీకరణ వుత్పత్తి విధానం పట్ల తద్వారా ఆదాయాలు తగ్గటం వలన ప్రపంచీకరణ వ్యతిరేకత పెరుగుతోందన్నది స్పష్టం. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన అక్కడ ఆర్ధిక అసమానతలు వున్నప్పటికీ కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. అక్కడ పెరుగుతున్న వేతనాలను చూస్తే http://money.cnn.com/2016/03/17/news/economy/china-cheap-labor-productivity/ అనుకున్నంత చౌక కాదని అమెరికన్లే చెబుతున్నారు. అమెరికాతో పోల్చితే నాలుగు శాతమే తక్కువని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ చెప్పిన విషయాన్ని నిర్ధారించుకోవాల్సి వుంది. చైనాతో పోల్చితే మన దేశంలో అత్యంత నిపుణులైన కార్మికులకు కూడా వేతనాలు తక్కువే అన్నది తెలిసిందే. ఇది కూడా మోడీ వంటి వారిని మేకిన్‌ ఇండియా నినాదాలకు పురికొల్పింది. ఒకవైపు ఇది పారిశ్రామికవేత్తలను వుత్సాహపరుస్తుంటే మరోవైపు ప్రపంచీకరణ ఫలితాలు కొంత మంది చెప్పినట్లు ఊట మాదిరి దిగువకు దిగటంలేదు. అందుకే ఆర్ధిక అసమానతలు తీవ్రం అవుతున్నాయి.నైపుణ్యం లేని, పరిమిత నైపుణ్యం గల కార్మికులందరూ కాంట్రాక్టు వుద్యోగులుగా, తక్కువ వేతనాలకు పని చేసే అసంఘటి పని వారిగా మారిపోతున్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌ కొద్ది మంది కార్మికులతో నడిచేవి తప్ప ఎక్కువ మందితో అవసరం వుండదు. అందువలన అంకెలలో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ అది వుపాధి రహితంగా వుంటోంది. రానున్న రోజుల్లో ఈ ధోరణిని మరింతగా పెంచాలని, వున్న కార్మిక చట్టాలను కూడా క్రమంగా ఎత్తివేయాలన్నది పాలకుల లక్ష్యంగా వుంది.

    సరళీకరణ, ప్రపంచీకరణ వలన కలిగే లాభాలను ఎలా చూడాలి ? తాజ్‌ మహల్‌ కట్టించిందెవరు అని కాదు, దానికి రాళ్లెత్తిన కూలీల గురించి చూడాలని శ్రీశ్రీ చెప్పినట్లుగా మన దేశంలో ఏటేటా పెరుగుతున్న ధనికుల గురించి వార్తలను లొట్టలు వేసుకుంటూ చదువుతున్నాం, చూస్తున్నాం తప్ప అందుకు దోహదం చేసిన స్ధితి గురించి ఎందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఎంత లాభం, నష్టం వచ్చిందని చూడటం సాధ్యం కాని మాట నిజమే. ఈ విధానాలకు అనుగుణ్యంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు, మినహాయింపులు ఇస్తున్నాయి. ప్రస్తుతం అవి ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయలు దాటాయి. విద్య, వైద్యం వంటి సేవలకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను చూస్తే మనకు పరిస్ధితి అర్ధం అవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం విద్యార్ధినులకు కూడా అన్ని చోట్లా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోతే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇవ్వాల్సిన దుస్ధితి ఈ సంస్కరణల కాలంలోనే జరిగింది.http://www.freshwateraction.net/content/all-govt-schools-must-have-toilet-november-end-supreme-court-india నిజానికి ఇతర సబ్సిడీలను కలుపు కుంటే అంతకంటే ఎక్కువే వుంటాయి.అన్నింటి కంటే దారుణం ఏమంటే కార్పొరేట్‌ కంపెనీలు సకల రాయితీలు పొందుతూనే చెల్లించాల్సిన పన్నులను కూడా ఏదో ఒక రూపంలో ఎగవేస్తున్నాయి.http://timesofindia.indiatimes.com/budget-2016/union-budget-2016/Budget-2016-Tax-forgone-gets-a-fancy-name-but-still-a-burden/articleshow/51202028.cms కార్పొరేట్‌ పన్ను 32.45 శాతం చెల్లించాల్సి వుండగా కేవలం 24.67 శాతమే చెల్లిస్తున్నాయని 2014-15 సంవత్సరం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అంటే దయామయులైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రాయితీలు పొంది, పన్నులు పూర్తిగా చెల్లించటం లేదన్నది స్పష్టం. ధనికులకు మరిన్ని రాయితీలిచ్చేందుకు చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు కల్పించేందుకు కూడా ప్రభుత్వాలకు లేకపోయిందంటే ప్రపంచీకరణ ఎవరికోసం ? ఎవరికి వుపయోగపడినట్లు ?  ధనిక దేశాలలో ప్రపంచీకరణ వ్యతిరేకత ఏ రూపాలలో వ్యక్తమౌతోంది ? వచ్చే భాగంలో చదవండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచబ్యాంకు ర్యాంకుల పోటీలో పాకిస్థాన్‌ కంటే వెనుకబడిన మోడీ !

30 Sunday Oct 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

anti globalization movement, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ – పర్యవసానాలు -1

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో నిత్యం అనేక అంశాల గురించి చర్చలు జరుగుతూనే వుంటాయి. చర్చ అంటేనే విరుద్ధ అంశాల మధనం. పురాణాలలో చెప్పిన దాని గురించి నమ్ముతున్నారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే నమ్మే వారు చెప్పిన క్షీర సాగర మధనం అమృతం కోసమే జరిపినప్పటికీ ఆ క్రమంలో అనేకం బయట పడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన మధనం ప్రపంచీకరణ లేదా దాని మరోపేరు సరళీకరణ ఫలితాలు, పర్యవసానాల గురించే అన్నది తెలిసిందే. నేతి బీరకాయలో నెయ్యి మాదిరి దానికి పెట్టిన పేరు వుదారవాదం. పెట్టుబడిదారీ విధానం దుష్టమైందన్న పేరు బాగా ప్రాచుర్యంలోకి రావటంతో ఎంతో తెలివిగా దాని పేరు మార్చారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ప్రపంచవాణిజ్య సంస్ధ ఇలా అనేకం ఏ పేరుతో పని చేసినా కార్పొరేట్ల లాభాలను, ఆ వ్యవస్ధను కాపాడే రూపాలు, ఆయుధాలే. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలేత్తినా దుష్ట సంహారం కోసమే అని చెప్పినట్లుగా పెట్టుబడిదారులు కూడా కార్మికవర్గాన్ని దోచుకొనేందుకు వర్తమానంలో ఎత్తిన అవతారమే ప్రపంచీకరణ. దానిపై జరుగుతున్న మధనంలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

   ప్రపంచబ్యాంకు 2017వ సంవత్సరానికి మనకు ప్రధానం లేదా దానం చేసిన వ్యాపార ర్యాంకు 131, అంతకు ముందు సంవత్సరం 130 వుంది.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు బాధ పడి నట్లుగా మన ప్రధాని, కేంద్ర మంత్రుల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ఎలాగంటే మన దేశం ఒక ర్యాంకును మెరుగుపరచుకుంటే పొరుగుదేశం పాకిస్థాన్‌ 148 నుంచి 144కు పెరిగి నాలుగు స్ధానాల ఎగువకు వెళ్లింది. చైనా 80 నుంచి 78 కి పెంచుకొని తన స్ధానాన్ని మెరుగు పరుచుకుంది. దాంతో మన కంటే ఇతర దేశాలు మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించినట్లే అనే కొందరు చేసిన వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లయింది. తాను అనేక సంస్కరణలను చేపట్టినా ప్రపంచబ్యాంకు వాటిని ఎందుకు పట్టించుకోలేదు, గతేడాది కంటే మన ర్యాంకును గణనీయంగా ఎందుకు పెంచలేదు అని ప్రధాని నరేంద్రమోడీ ఒక రాత్రంతా తనలో తాను తెగ మధన పడిపోయారు. తన మంత్రులు, అధికారులతో కూడా మధించి నెలరోజుల్లో నివేదిక ఇమ్మని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన ర్యాంకు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను మరింత కుంగదీసింది. రానున్న కొద్ది సంవత్సరాలలో మన ర్యాంకు 50కి చేర నుందని ఈ ఏడాది మే నెలలోనే ఆమె ఆనందంగా ఆశాభావం వెలిబుచ్చారు. తీరా దరిదాపుల్లో లేకపోవటంతో తీసుకున్న చర్యలన్నీ ప్రపంచబ్యాంకు విధించిన గడువులోగా అమలులోకి రానందున వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది ర్యాంకులో ఫలితం కనిపిస్తుందని ట్వీట్‌ చేశారు.

మోడీ బృందం ఎందుకు భంగపాటుకు గురైంది ? నిజానికి ఈ ర్యాంకులు అంకెల గారడీ తప్ప మరొకటి కాదు. మన విద్యావిధానాల మాదిరి ఒకేడాది నిర్ణయించిన ప్రమాణాలు మరొక ఏడాది వుండవు. వాటికి ఇచ్చే మార్కులు కూడా అంతే. కొన్ని ర్యాంకుల తీరుతెన్నులను గమనించండి. నా చిన్న తనంలో గ్రామాలలో బుర్ర కథలు, హరికథల వంటి కళారూపాలను ప్రదర్శించే వారు తమకు మంచి భోజనాలు, భారీ ఎత్తున ధన ధాన్యాలతో సత్కారాలు పొందేందుకు ఏ వూరు వెళితే ఆ వూరి వారిని వుబ్చించేవారు. చుట్టుపక్కల 66 వూళ్లకు మీ వూరు పోతుగడ్డ అని చెప్పగానే నిజమే కావాలనుకొని ప్రతి వూరి వారూ నరేంద్రమోడీ చెప్పినట్లు రొమ్ములు చరుచుకొనే వారు. తమ వ్యాపారాలకు రాయితీలు పొందేందుకు, సులభంగా అనుమతులు సంపాదించుకొనేందుకు కాస్త రూపం మార్చి ‘పోతుగడ్డ’ టెక్నిక్‌ను వాడుతున్నారు.

ఆ క్రమంలో గత రెండున్నర సంవత్సరాలలో అనేక సంస్ధలు నరేంద్రమోడీ సర్కార్‌ను ఆకాశానికి ఎత్తుతున్నాయి. ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌ ఒక్కసారిగా 16 దేశాలను దాటి 39వ ర్యాంకుకు చేరినట్లు ప్రపంచ ఆర్ధిక వేదిక( డబ్ల్యుఇఎఫ్‌ ) ప్రకటించింది. చంద్రబాబు నాయుడు వంటి వారికి ఇదొక పవిత్ర స్ధలం. ప్రతి ఏటా వెళ్లి వచ్చి ఆర్భాటం చేస్తుంటారు. వెళ్లి రావటం ఒక ఘనతగా ప్రచారం చేసుకుంటారు. అవినీతి విషయంలో అవినీతి విషయంలో ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్ధ సూచికలో ఏకంగా భారత్‌ తొమ్మిది పాయింట్లను మెరుగుపరచుకుందని వార్తలు వచ్చాయి. http://timesofindia.indiatimes.com/india/Indias-ranking-on-global-corruption-index-improves/articleshow/45358144.cms  చిత్రం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరునెలలు పూర్తి అవుతున్న సమయంలో ఈ ర్యాంకుల ప్రకటన జరిగింది. దాని ప్రకారం మన్మోహన్‌ సింగ్‌ అధికార చివరి సంవత్సరం 2013లో 94వ ర్యాంకులో వుండగా 2014లో 85వ స్ధానానికి మెరుగుపరచుకుంది. దీనికి మోడీ ప్రభుత్వం తీసుకున్న అవినీతి రహిత చర్యలే కారణమంటూ ఆయన భక్తులు బాపు సినిమా ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ఏర్పాట్లను గుర్తు చేశారు. మరుసటి ఏడాదికి ఆ ర్యాంకు 76కు చేరింది. మరో తొమ్మిది ర్యాంకులను పెంచారు.http://www.transparency.org/cpi2015#results-table  ఇది ఆ సంస్ధ అధికారిక వెబ్‌సైట్‌ చిరునామా. దీని ప్రకారం 2012,13 మనకు వచ్చిన మార్కులు నూటికి 36, మోడీ హయాం 2014,15లో వచ్చినవి 38. ఇదే సమయంలో పాకిస్థాన్‌ 27 నుంచి 30కి పెంచుకుంది. మిగిలిన దేశాలలో అవినీతి పెరిగి మన ర్యాంకు మెరుగుపడింది తప్ప మన మార్కులు పెరిగి కాదన్నది స్పష్టం అవుతోంది.

ఇక కొత్త కల్పనల సూచిక వరుసగా ఐదు సంవత్సరాలు పడిపోతూ వున్నది కాస్తా 81నుంచి 2015లో 66కు పెరగటం కూడా నరేంద్రమోడీ ఘనతే అని చెప్పారు.http://www.dnaindia.com/money/report-india-s-rank-on-global-innovation-index-improves-to-66-2247413 కొత్త కల్పనలు రహస్యంగా వుండేవేమీ కాదు. దేశ ప్రజలకు తెలియకుండా అల్లా వుద్దీన్‌ అద్బుత దీపం ఏమైనా మోడీ సర్కార్‌కు దొరికిందా అన్న అనుమానం వచ్చింది. మంత్రులు చెప్పేది, మీడియాలో వచ్చే వార్తలు ఎలా వుంటాయో తెలుసు కనుక సంస్ధ అధికారిక వెబ్‌ సైట్‌ను ఆశ్రయిస్తే http://www.wipo.int/edocs/pubdocs/en/economics/gii/gii_2013.pdf ప్రకారం 2013లో మనకు వచ్చిన మార్కులు 36.17 శాతంగానూ ర్యాంకు 66గానూ దర్శన మిచ్చింది. దీంతో మరింత ఆసక్తి పెరిగి 2016 ర్యాంకింగ్‌ల కోసం చూస్తే దానిలో మన మార్కులు 33.61శాతానికి తగ్గినా ర్యాంకు మాత్రం 66గానే వుంది. ఇదే సమయంలో మన ఇరుగు పొరుగుదేశాల స్ధితి ఎలా వుంది అన్న సందేహం కలగటం సహజం కదా ! పాకిస్తాన్‌ 23.33 మార్కులు, 137 ర్యాంకు నుంచి 22.63 మార్కులు 119వ ర్యాంకుకు మెరుగు పడింది. ఇదే సమయంలో చైనా విషయానికి వస్తే తన మార్కులు 44.66, ర్యాంకు 35 నుంచి 50.57 ర్యాంకు 25 తెచ్చుకుంది.

వివిధ వసతుల కల్పనాంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచబ్యాంకు లాజిస్టిక్స్‌ సామర్ధ్య సూచికలను ప్రకటిస్తుంది.http://www.dnaindia.com/money/report-india-moves-up-to-35th-rank-on-world-bank-s-logistics-performance-index-2230168 దీని ప్రకారం 2014లో 54వ స్ధానంలో వున్నది కాస్తా 2016 నాటికి 35వ ర్యాంకుకు చేరిందని ప్రశంసలు కురిపించారు. ప్రపంచబ్యాంకు రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే వివరాల ప్రకారం 2007లో మన ర్యాంకు 39, మనకు వచ్చిన మార్కులు 3.07, 2012లో 46 -3.08, 2014లో 54 – 3.08, 2016లో 35 -3.42 వచ్చాయి. మార్కులలో పెద్ద తేడాలు లేకపోయినప్పటికి 2007-14 మధ్య ర్యాంకు 39 నుంచి 54కు పడిపోయింది. అందువలన ఈ ర్యాంకుల గురించి సంబరపడి, అది తమ సామర్ధ్యమే అని చెప్పుకుంటే అంతకు మించి జనాన్ని మోసం చేయటం మరొకటి వుండదు.

ఇక సులభతర వాణిజ్య ర్యాంకుల విషయానికి వస్తే 2007లో మనకు వచ్చిన ర్యాంకు 116 అక్షరాలా నూట పదహారు. అది 2014 నాటికి 142కు పడిపోయింది. ర్యాంకులు కేటాయించిన పద్దతిని ప్రపంచబ్యాంకు సవరించటంతో అది 134గా నిర్ధారణ అయింది. 2015 జూన్‌ నాటికి మన ర్యాంకు 130కి మెరుగు పడింది, తరువాత దానిని 131కి సవరించారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన ర్యాంకు 130 అంటే ఎదుగూ బొదుగూ లేకుండా వుండి పోయింది. ఇది జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలలో నరేంద్రమోడీ పలుకుబడిని తగ్గించేది లేదా అనుమానాలను రేకెత్తించేది కనుకనే నరేంద్రమోడీ, ఆయన మంత్రులు అంతగా కంగారు పడుతున్నారు.

    ప్రపంచీకరణ అంటే విదేశీ సంస్ధలు మన దేశంలో సులభంగా వ్యాపారం చేసుకొనే అవకాశాలను కల్పించటం, దానికి ప్రశంసగా ప్రపంచబ్యాంకు ఇచ్చే ర్యాంకుల పిచ్చి ముదిరి వాటి కోసం మన ప్రధాని, దానికి అనుకరణగా కేంద్రం ప్రవేశ పెట్టిన ర్యాంకు కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. అదింతటితో ఆగదు, మరిన్ని పర్యవసానాలకు దారితీస్తుందని గుర్తించాలి. ప్రపంచ పెట్టుబడిదారులకు మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా తెరిచేందుకు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోనున్నారు.

    ప్రస్తుతం ప్రపంచీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నది ఎవరు అంటే కొంత మంది విశ్లేషణ ప్రకారం ధనిక దేశాలలోని కార్మికవర్గం, దానితో పాటు అక్కడి పెట్టుబడిదారీ వర్గం అంటే అతిశయోక్తి కాదు. గతంలో వర్ధమాన, తృతీయ ప్రపంచ దేశాలలో ప్రపంచీకరణకు వ్యతిరేక గళాలు బలంగా వినిపించాయి, ఇప్పటికీ అడపాతడపా వినిపిస్తూనే వున్నాయి. అయితే గతం మాదిరి పెద్ద ఎత్తున లేవన్నది వాస్తవం. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గతంలో మాదిరి సామాజిక వేదికల (సోషల్‌ ఫోరాలు) సదస్సులు ఇప్పుడు జరగటం లేదు, వెనుక పట్టు పట్టాయి. అవి సాధించిన విజయాలేమిటి ? వాటికి వున్న పరిమితులు ఎంతవరకు అన్న విషయాలను ఇక్కడ విశ్లేషించటం లేదు. మొత్తం మీద ప్రపంచీకరణ కోరుకున్న పెట్టుబడిదారులు, వారి సమర్ధకులదే పైచేయిగా వుంది, దానితో లాభాలు పొందవచ్చని కార్పొరేట్లు భావిస్తున్న కారణంగానే మరింతగా సంస్కరణల పేరుతో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అందుకు నరేంద్రమోడీ సమర్ధకుడు అని భావించిన కారణంగానే గద్దెనెక్కించటమే గాక, తమ చేతులలో వున్న ప్రచార మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున వూదరగొడుతున్నారు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగిన వుద్యమాలు సాధించిన ఫలితాలు, కార్మికులు కోల్పోయిన వాటి గురించి, పర్యవసానాల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి వుంది. కండ్లు లేనివారు ఏనుగును వర్ణించినట్లుగా ఎవరికి వారు తమ అనుభవంలోకి వచ్చిన అంశాల గురించి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. వాటన్నింటినీ కొట్టి వేయలేము, అలాగని వాటినే అంతిమ నిర్ధారణలుగా అంగీకరించలేము. అందువలన ఆ పరిమితులకు లోబడి ఈ సందర్భంగా కొన్ని విషయాలను పాఠకుల దృష్టికి తెస్తున్నాను.

     కొద్ది నెలల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలా వద్దా అనే విషయమై బ్రిటన్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. దానిలో ఎక్కువ మంది వైదొలగటానికే మొగ్గు చూపారు. సభ్య దేశాలపై పొదుపు చర్యల పేరుతో కార్పొరేట్ల లాభాలలో కోత పడకుండా చూసేందుకు ఐరోపా యూనియన్‌ రుద్దిన పొదుపు చర్యలకు జనంలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో పాటు, ఒక యూనియన్‌లో వుండి దాని తరఫున ఒక సభ్య దేశంగా ప్రపంచ మార్కెట్‌ వాటాను పరిమితంగా పంచుకోవటం కంటే విడిగా వుండి ఎక్కువ వాటాను తెచ్చుకోవచ్చన్న బ్రిటన్‌ కార్పొరేట్ల వత్తిడికూడా ఈ నిర్ణయాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ముగిసిన ప్రచారంలో కూడా వాణిజ్యంపై చర్చకు పెద్ద పీట వేయటం, ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి అమెరికా బయటకు రావాలని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించటం, కెనడా-ఐరోపా యూనియన్‌ మధ్య చర్చలలో వున్న సమగ్ర ఆర్ధిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) పట్ల వెల్లడౌతున్న వ్యతిరేకత ధనిక దేశాలలో ప్రపంచీకరణకు కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గంలోనే పెరుగుతున్న వ్యతిరేకతను సూచిస్తోంది. ఇది ఆయా దేశాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధల రక్షణాత్మక చర్యలకు దారితీస్తోంది. ధనిక దేశాల నుంచి ప్రారంభమైన ఈ క్రమం అన్ని దేశాలకు తరతమ తేడాలతో విస్తరించటం అనివార్యం.

    ఒక తత్వం ప్రకారం ఎప్పుడూ ప్రపంచీకరణ అనుకూలత, ప్రపంచీకరణ వ్యతిరేకత వ్యక్తమౌతూనే వుంటాయి. రుతువుల మాదిరి పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాంద్యాలు రావటం, దాని నుంచి ఏదో విధంగా బయట పడటం సైకిలు చక్రం మాదిరి ఒకదాని వెంట ఒకటి సంభవిస్తుంటాయి. దాని పర్యవసానాలు ప్రపంచీకరణ మీద పడతాయి. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ పర్యవసానంగా ధనిక దేశాలలో నష్టపోయిన సాంప్రదాయ మధ్యతరగతి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో వుంది.లబ్ది పొందిన వారిలో ప్రస్తుతం ప్రపంచీకరణ విధానానికి వున్న పరిమితులు తమ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా ప్రదర్శించటానికి వీలు కల్పించటం లేదనే తరగతి కూడా అదే ధనిక దేశాలలో ప్రపంచీకరణను మరొక వైపు నుంచి విమర్శిస్తుంది. ప్రపంచీకరణ విధానాన్ని కనిపెట్టిన వారు దాని పర్యవసానాలను వూహించలేకపోయారు. ప్రపంచీకరణ ఆర్ధిక అసమానతలను జెట్‌ వేగంతో పెంచింది. ఫలితంగా వలసలు పెరిగిపోయాయి. వలసలకు ఇతర అనేక కారణాలు వున్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ప్రపంచీకరణే. ఇది కొన్ని దేశాల నుంచి వలసలను పెంచితే మరికొన్నింటి నుంచి తగ్గించిందని కూడా వెల్లడైంది. శ్రమను కారుచౌకగా ఆమ్ముకొనే వలస కూలీలను ప్రోత్సహించటం కూడా ప్రపంచీకరణలో భాగమే అన్నది ఇక్కడ మరిచి పోరాదు. ధనిక దేశాలలో ప్రపపంచీకరణ తెచ్చిన అసంతృప్తికి, పేద దేశాల నుంచి సామూహికంగా వస్తున్న వలస కార్మికుల సమస్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.2008లో ప్రారంభమైన ధనిక దేశాల ఆర్ధిక మాంద్యం సమస్యను మరింత సంక్లిష్టం గావించింది. అనేక చోట్ల నిరుద్యోగం, దారిద్య్రం, వేతనాలలో కోతలు పెరిగిపోయాయి. పర్మనెంటు వుద్యోగాలు తగ్గి తక్కువ వేతనాలు లభించే తాత్కాలిక వుపాధిలో చేరే పరిస్థితికి కార్మికవర్గం చేరింది. ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితమే అని భావించటంతో ధనిక దేశాలలో వ్యతిరేక గళం వినిపించటం ప్రారంభమైంది. ఇది ఒక కోణం. మరోవైపు నుంచి పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కూడా పర్యవసానాలు ప్రతికూలంగా తయారయ్యాయి. అదెలా వుందో తాజాగా వెల్లడైంది.

    ఇటీవల రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌, ఇండస్ట్రీ అనే సంస్ధ ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది.http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html దానిలో వున్న వివరాల ప్రకారం ప్రపంచీకరణ వివిధ దేశాల మధ్య అసమాన లబ్దికి దారితీసింది. అలా లబ్ది పొందిన వాటిలో భారత్‌ ఒకటి, అయితే చైనాతో పోల్చితే చాలా తక్కువ ప్రయోజనం కలిగింది. ఈ లబ్ది పారిశ్రామికవేత్తలతో పాటు కార్మికవర్గానికి కూడా దక్కింది. ఎవరు ఎక్కువ అంటే ఈ కాలంలో దేశంలో పెరిగిన ఆదాయ, ఆర్ధిక అసమానతలు, పెరిగిన బిలియనీర్లను చూస్తే కార్మికుల కంటే పారిశ్రామిక, వాణిజ్యవర్గాలే ఎక్కువ లబ్ది పొందాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే నరేంద్రమోడీ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ సంస్కరణలు కొత్త సమస్యలను తీసుకువస్తాయని తెలిసినప్పటికీ తక్షణం లాభదాయకంగా వుంది కనుక రాబోయే పర్యవసానాల గురించి వారు అంతగా ఆలోచించటం లేదు.అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా తిరుగులేని శక్తిగా అవతరించింది. జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది. తనకున్న ఆర్ధిక శక్తి కారణంగా స్వేచ్చా వాణిజ్య నిబంధనలు, విధానాన్ని మరింత గట్టిగా అమలు జరపాలని అది కోరుతోంది. దాని దెబ్బకు గిలగిలలాడుతున్న ధనిక దేశాలు తాము ముందుకు తెచ్చిన స్వేచ్ఛా వాణిజ్యవిధానాన్ని పక్కన పెట్టాలని కోరుతున్నాయనటానికి ముందే చెప్పినట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి వైదొలుగుతానని బెదిరించటం పక్కా నిదర్శనం. పైన పేర్కొన్న పరిశోధనా పత్రంలో ప్రపంచీకరణ పర్యవసానాల గురించి ఏం చెప్పారు ? వచ్చే భాగంలో చూడండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

‘ఎన్‌కౌంటర్లు – జన స్పందన ‘

27 Thursday Oct 2016

Posted by raomk in AP NEWS, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties

≈ Leave a comment

Tags

AOB encounter, malkangir encounter, maoists, maoists encounter

ఎంకెఆర్‌

   ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని ఒడిషా మల్కన్‌గిరి జిల్లాలోని బలిమెల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న ఎన్‌కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టు నక్సల్స్‌ దుర్మరణం చెందారు. ఆ పార్టీకి ఇదొక పెద్ద దెబ్బ, విషాద, విచారకర వుదంతం. ఎప్పటి మాదిరే విరసం నాయకులు బంధుమిత్రులతో కలసి ఆ ప్రాంతానికి వెళ్లి గుర్తించిన మృతదేహాలను తీసుకువచ్చారు. అది ఎన్‌కౌంటర్‌ కాదు నిదురపోతున్నవారిని కాల్చి చంపారని చెబుతున్నారు. లేదు ఎన్‌కౌంటర్లన్నీ తెల్లవారు ఝామునే జరుగుతాయి కనుక అది వాస్తవ ఘటనే అని ఆంధ్రప్రదేశ్‌ డిజిపి ప్రకటించారు. ఎవరే డిమాండ్లు చేసినా, ఎన్‌కౌంటర్‌గా చెబుతున్న వుదంతంపై విచారణ జరపని కోరినా ఈవాళపోతే రేపటికి రెండు అన్నట్లుగా గతంలో జరిగినట్లు చెప్పిన ఎన్‌కౌంటర్ల తరువాత ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని జనం భావిస్తున్నారు. ఏం జరిగినా పట్టించుకోకపోవటం జనానికి అలవాటయి పోయిందా, అంగీకరిస్తున్నారా అన్న సందేహం కొంతమందికి కలుగుతోంది. ఇంత పెద్ద సంఘటన జరిగినపుడు మావోయిస్టు సానుభూతి పరులకే ఈ అనుమానం రానక్కర లేదు, వారి రాజకీయాలు, ఆచరణతో విబేధించేవారిలో కూడా ఏం జరుగుతున్నా జనం పట్టించుకోవటం లేదేమిటన్న ఆలోచన రావటం సహజం. అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, మత కొట్లాటలకు పాల్పడుతున్నదెవరో, నేరగాళ్లెవరో, మంచివారెవరో అరటి పండు వలచి చేతిలో పెట్టినట్లుగా తెలిసినా ఎన్నికలలో జనం ఏం చేస్తున్నారో చూస్తున్నదే. తమ పొట్టకొడుతున్నా, కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా మనకెందుకులే అని వెళ్లిపోవటం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు దుర్బేధ్యమైన అడవులలో జరిగిందని చెబుతున్న ఘటనల గురించి, నిర్ధారణ కాకుండా అందునా పోలీసులకు వ్యతిరేకంగా జనం స్పందిస్తారని ఆశించగలమా ? వూహించగలమా ?రెండు వైపులా విశ్వసనీయత సమస్య లేదా ?

    తమపై లేదా గిరిజనులపై జరుపుతున్నదాడులకు ప్రతీకారంగా లాండ్‌మైన్‌లు పేల్చి, దాడులు చేసి, బలిమెల జలాశయంలో లాంచీపై దాడిచేసి పోలీసులను, ప్రత్యేక దళాలను, తమ గురించి సమాచారం ఇచ్చిన పోలీసు ఇన్ఫార్మర్లను ప్రజాకోర్టులో విచారించి ప్రజలే హతమార్చినట్లు నక్సల్స్‌ చేసిన ప్రకటనలను కూడా పోలీసులు చెప్పే ఎన్‌కౌంటర్ల మాదిరే జనం ఒకే విధంగా స్వీకరించటానికి అలవాటు పడిపోయారన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో అలాంటి ఘటనలు జరగటం లేదు గానీ గతంలో పలు ప్రాంతాలలో సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీల నాయకులను కూడా ప్రజలే చంపివేసినట్లు ప్రకటించినపుడు, ఒక దశలో తమతో విభేదించిన వారందరికీ రివిజనిస్టులనే ముద్రవేసి నక్సలైట్లు ఏ గ్రూపు వారు ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియని గందరగోళ సమయంలో, అమాయకులైన కాకతీయ రైలు ప్రయాణీకులను సజీవ దహనం చేసినపుడు కూడా జనం మామూలుగానే తీసుకున్నారు. తరువాత ప్రయాణీకులను చంపటం తప్పిదమేనని ప్రకటించటాన్ని కూడా అలాగే తీసుకున్నారు. కోవర్టులు పోలీసులలో వున్నట్లే నక్సల్స్‌లో కూడా వుండటం కూడా మామూలేనని జనం భావించటం సాధారణమైపోయింది. గతాన్ని విస్మరించి జన స్పందన గురించి ఆలోచిస్తే ప్రయోజనం వుంటుందా ? బెంగాల్లో సిపిఎంకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ వంటి వారికి మద్దతు ఇచ్చి జనాన్ని సానుకూలంగా స్పందింప చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీని(మల్లోజుల కోటేశ్వరరావు) మట్టుబెట్టించినపుడు కూడా అదే జనం అదే విధంగా స్పందించటాన్ని చూశాము.

   తాము విశ్వసించని వ్యవస్ధను, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని హతమార్చటానికి తమకు హక్కుందని తిరుగుబాటుదారులు చెప్పినపుడు, రాజ్యానికి వ్యతిరేకంగా వున్న తిరుగుబాటుదారులను అదుపులోకి తెచ్చేందుకే తామున్నట్లు రాజ్యవ్యవస్ధ, దాని అంతర్భాగాలు చెప్పినపుడు ఎవరి వాదన వారికి సరైనదిగానే జనం భావిస్తున్నారు. తమ కులం వాడైతే గూండా అయినా, రౌడీ అయినా, అవినీతి, పార్టీ ఫిరాయింపు రాజకీయ నాయకుడు, వుద్యోగి ఎవరైనా సమర్ధించే దుస్థితిలో వున్నాం. చరిత్రలో అనేక మంది తిరుగుబాటుదార్లను రాజ్యవ్యవస్ధ అణచివేసినపుడు జనం పెద్ద ఎత్తున స్పందించి వీధులలోకి వచ్చిన వుదంతాలు ఎన్నో వున్నాయి. ఇప్పుడయినా మరొకపుడైనా అలాంటి స్పందన రావటం లేదంటే జనానికి ఏమైందని వారి గురించి ఆలోచించ వద్దని కాదు గానీ దానితో పాటు రెండోవైపు నుంచి ఏదైనా లోపమున్నదా అని అవలోకించాల్సిన అవసరం లేదా ? సాధారణ జనం కంటే తిరుగుబాట్లను, తిరుగుబాటుదార్లను సమర్ధించేవారు, వారి చర్యల ద్వారా ఏదో సాధించామని నమ్ముతున్నవారు మరింత ఎక్కువగా అంతర్మధనం చేసుకోవాలి.

    మల్కన్‌గిరి వుదంతానికి ప్రతీకారంగా మావోయిస్టులు రాసినట్లు చెబుతున్న లేఖ గురించి కూడా చర్చ జరుగుతున్నది. దానిలో వాడిన భాష, పేర్కొన్న ప్రతీకార చర్యలను చూస్తే అది రాసింది నక్సల్స్‌ కాదని మీడియాలో వార్తలు వచ్చాయి. కాదు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల వారే దానిని రాశారని విశాఖ ఎస్పీ వెంటనే ప్రకటించారు. వివిధ సందర్బాలలో పోలీసులు అనుసరించే పద్దతుల ప్రకారం నకిలీ లేఖలు తయారు చేసి మీడియాకు పంపి జనాన్ని తప్పుదారి పట్టించటం, గందరగోళ పరచటం, తమ చర్యలను సమర్ధించుకోవటం బహిరంగ రహస్యం. బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగినపుడు మావోయిస్టు లేదా ఇతర నక్సల్స్‌ నుంచి ఇలాంటి లేఖలు రావటం కూడా సాధారణమే. అందువలన దాన్ని నిర్ధారించటం కష్టం. ఒక వేళ పోలీసులే రాసి వుంటే దానిలోని ఆత్మాహుతి దాడి, కుటుంబ సభ్యుల ప్రస్తావన ఇంతవరకు లేని కొత్త ఆలోచనలను కలిగించటం, ముందుకు తేవటం తప్ప వేరు కాదు. ఒక వేళ నిజంగా నక్సల్సే రాసి వుంటే తీవ్రమైన ఎదురు దెబ్బతగిలిందన్న కసితో కొత్త పద్దతుల్లో దాడులకు పూనుకుంటారని అనుకోవాల్సి వుంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నల్లధనంపై దాడులకు ఎవరు అడ్డు పడ్డారు మోడీ గారూ !

24 Monday Oct 2016

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Black Economy in India, black money, black money unearth, Modi, surgical strikes

సత్య

     కొంత మంది రాజకీయ నాయకుల మాటలు చూస్తే నేను లేస్తే మనిషిని కాదు అన్న దివ్యాంగుడైన మా మల్లయ్య మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఒక ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన మల్లయ్య కాలక్షేపానికి అరుగుమీద కూర్చుంటే కొంటె పిల్లలు ఆట పట్టించేవారు. తన చేతిలోని కర్రను చూపుతూ రేయ్‌ నేను లేస్తే మనిషిని కాను జాగ్రత్త అని హూంకరించే వాడు. పిల్లలు భయపడినట్లుగా నటించే వారు. మరుసటి రోజు కథ మళ్లా మామూలే. నల్లధనంపై ప్రధాని నరేంద్రమోడీ మాటలు కూడా మల్లయ్య కథ మాదిరే వున్నాయంటే ఆయన భక్తులకు కోపం రావచ్చు. మంత్రసాని తనం ఒప్పుకున్నాక బిడ్డొచ్చినా, మరొకటొచ్చినా పట్టక తప్పనట్లే రాజకీయాలలో వున్నతరువాత పొగడ్డలు వచ్చినపుడు జబ్బలు చరుచుకోవటం లేదా రొమ్ము విరుచుకోవటమే కాదు విమర్శలు వచ్చినపుడు ‘సహించాలి ‘ మరి.

      నరేంద్రమోడీ రెండున్నర సంవత్సరాల క్రితం చేసిన అనేక బాసలు, వూసులతో పాటు నల్లధనం వెలికితీత వాగ్దానాన్ని కూడా జనం మరచిపోయిన సమయంలో దాని గురించి మౌనం దాల్చకుండా మాట్లాడటం ఎందుకు చెప్పండి ? అది కూడా సర్జికల్‌ దాడులతో ముడిపెట్టి ‘మేం కనుక ఈ విషయంలో కూడా సర్జికల్‌ దాడులు చేస్తే ఎంత బయటికి వస్తుందో మీరు వూహించుకోవచ్చు ‘ అని నల్లధనం గురించి గుజరాత్‌లోని వడోదరాలో ప్రధానే ఆశ్చర్యం వ్యక్తం చేశారట.http://indianexpress.com/article/india/india-news-india/pm-narendra-modi-warns-of-surgical-strikes-against-blackmoney-corruption-3097294/ ప్రధాని అంతటి వ్యక్తి ఏదైనా అనూహ్యమైన విషయాన్ని ప్రకటిస్తే జనం, ప్రతిపక్షం, పాకిస్థాన్‌ ఆశ్చర్యపోవాలి గానీ ఆయన చెప్పినదానికి ఆయనే ఆశ్చర్యపోవటం వింతైన విషయమే. తనే జోక్‌ వేసి తానే అందరికంటే ముందుగా పెద్దగా నవ్వే వారిని గుర్తుకు తెచ్చారు కదూ ! నల్లధనం సంగతేమోగానీ సర్జికల్‌ దాడుల ఘనత తమదే అని స్వయంగా ప్రధాని చెప్పుకోవటం దీనిలో స్పష్టమైంది. కాంగ్రెస్‌, ఇతర అధికార యావ రాజకీయ పార్టీల వారి మాదిరే విజయాలన్నీ తన ఖాతాలో వేసుకొనే తహ తహ, తపనలో మోడీ కూడా పోటీ పడుతున్నారనుకుందాం.

     నల్ల ధనాన్ని వెలికి తీసిన ఖ్యాతిని కూడా మూట కట్టుకోమనే కదా దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. అందుకోసం సర్జికల్‌ దాడులు చేయకుండా మీ ప్రభుత్వానికి ఎవరు అడ్డుపడ్డారన్నదే ప్రశ్న. నల్లధనాన్ని స్వచ్చందంగా వెల్లడించండి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పధకం ఘోరంగా విఫలమైందని మీడియాలో విశ్లేషణలు వచ్చిన తరువాత బహుశా వాటిని జనం మరిచిపోయి వుంటారనే గట్టి నమ్మకంతో నరేంద్రమోడీ దానినొక పెద్ద విజయంగా చెప్పి తన భుజాన్ని తానే చరుచుకున్నారు. మన ప్రభుత్వాలు నిజాయితీగా వేతనం నుంచే పన్ను మొత్తాన్ని చెల్లించే వుద్యోగులకు రాయితీలు ఇవ్వటానికి ముందుకు రావన్నది అందరికీ తెలిసిన నిజం. కానీ ఎలాంటి పన్నులు చెల్లించకుండా గాదె కింది పందికొక్కుల్లా బలిసి పోతున్న వారికి మాత్రం క్షమాభిక్ష లేదా స్వచ్చందంగా ఆదాయ వెల్లడికి పధకాలను ప్రకటించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశమిస్తాయి. అందువల్లనే ప్రతి ఏటా పన్ను చెల్లించటం ఎందుకు? ప్రభుత్వం ఎర్ర తివాచీ పరచి పన్ను ఎగవేతదార్లకు అవకాశం ఇచ్చినపుడు ఎంతో కొంత చెల్లిద్దాము లెమ్మనే దేశ భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

   మెరిల్‌ లించ్‌ కంపెనీ వెల్లడించిన నివేదికల ప్రకారం 2007 నాటికి మన దేశంలో అధిక నిఖర సంపద వున్నవారి సంఖ్య లక్ష దాటింది. గతేడాది నాటికి ఆ సంఖ్య 4.2లక్షలకు చేరింది. 1997లో నల్లధనం దాచుకున్నవారికి క్షమా భిక్ష పేరుతో నాటి కాంగ్రెస్‌ పాలకులు ఒక పధకాన్ని ప్రకటించారు. దానిలో 33వేల కోట్ల రూపాయలను ప్రకటించి పది వేల కోట్ల రూపాయల పన్ను చెల్లించి గౌరవం పొందారు.అప్పటితో పోల్చితే ఇప్పుడు కనీసం పది రెట్లు దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరిగింది. ఆ లెక్కన కనీసం మూడులక్షల కోట్ల రూపాయలకు పైగా నల్లధనాన్ని వెల్లడించి వుండాలి. కానీ 65వేల కోట్లే అదీ ఒక్కొక్కరు సగటున ఒక కోటి వంతున మాత్రమే వెల్లడించారంటే మోడీ గారి పధకం ఎంత ప్రహసన ప్రాయంగా మారిందో చెప్పనవసరం లేదు. నిబంధనల ప్రకారం 40శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పాతికవేల కోట్ల రూపాయలకు పైబడే, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు.

     బిజెపి, ఎన్‌డిఏ పక్షాలు కాంగ్రెస్‌ అవినీతిని గురించి నిత్య పారాయణం చేస్తుంటాయి. తప్పులేదు, ఆ పార్టీ అందుకు తగినదే. కానీ బిజెపి పాలనలో నరేంద్రమోడీ ఏలుబడి కుంభకోణం మాటేమిటి ? ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకుండా వ్యక్తుల జేబుల్లోకి పంపేందుకు తోడ్పటమే కదా అవినీతి అంటే.తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగవేసి దర్జాగా విదేశాలకు పారిపోతుంటే ఎటు పోతున్నాడో చూడండి తప్ప అరెస్టు చేయటం వంటి అమర్యాద పనులు చేయవద్దని ఆదేశించిన ఘనత నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలోనే జరిగింది. ఆ మాల్యనే ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అలాంటి మల్లయ్యలు బ్యాంకుల నుంచి తీసుకొని దాదాపు ఎగవేసిన సొమ్ము పదకొండులక్షల కోట్ల రూపాయలు. వారిలో ఏ ఒక్కడూ కూడా వ్యాపారంలో, పరిశ్రమలో నష్టం వచ్చిందని మన రైతుల మాదిరి ఆత్మహత్య చేసుకున్నవారు లేరు. వారి ఆస్థుల నుంచి కనీసం పదో వంతు వసూలు చేసినా లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చి వుండేది. ఆ పనేమీ చేయకపోగా గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అనుమతితో బ్యాంకులు రద్దు చేసిన అలాంటి బాకీల మొత్తం 1.12లక్షల కోట్ల రూపాయలున్నదన్న సంగతి ఎంత మందికి తెలుసు. ఎందుకంటే ఈ విజయాన్ని ఎక్కడా మోడీ భక్తులు కీర్తించరు ! రైతుల రుణాలు రద్దు చేయమంటే డబ్బు లేదంటారు . మరి వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ? గత సంవత్సరం ప్రభుత్వం అందచేసిన లెక్కల ప్రకారమే వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు, ఎగుమతి దిగుమతులకు ఇచ్చిన రాయితీల వలన ప్రభుత్వానికి రావాల్సి రాకుండా పోయిన ఆదాయం ఆరులక్షల పదకొండువేల కోట్లు. ఈ మొత్తంలో లక్షా పదహారు వేల కోట్లరూపాయలు బంగారం, వజ్రాల దిగుమతులు చేసుకున్న మన దేశంలోని ‘ అత్యంత నిరుపేదలకు ‘ నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన రాయితీ అంటే ఎవరైనా నమ్ముతారా ? ఇలాంటి రాయితీలు కాంగ్రెస్‌ హయాంలో మొదలై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ హయాంలో కూడా పెరిగాయి తప్ప తరగలేదు ! కానీ ఈ విషయంలో మాత్రం నరేంద్రమోడీకి ఆశ్చర్యం కలగలేదు, సర్జికల్‌ దాడులు గుర్తుకు రాలేదు !! చంద్రబాబు నాయుడి వూతపదం ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా ఈ పాలన ఇలా ముందుకు పోవాల్సిందేనా ? జనానికి కబుర్లు, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వాల్సిందేనా ? అన్నింటి కంటే ప్రహసనం ఏమంటే నల్లధనాన్ని అరికట్టేందుకు గతంలో వంద రూపాయల నోట్లను రద్దు చేస్తే సగం అంతరిస్తుందనుకున్నారు. ఇప్పుడు ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు నాయుడు బహిరంగంగానే సలహా ఇచ్చారు. కానీ కేంద్ర త్వరలో రెండువేల రూపాయల నోట్లను చలామణిలోకి తేనున్నదని వార్తలు అంటే నల్లధన కుబేరులకు మరింత సౌకర్యం కల్పించటమేనా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వీధుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వ్యతిరేక చిందులు !-సరిహద్దుల్లో భారత్‌, చైనా మిలిటరీ విన్యాసాలు !

23 Sunday Oct 2016

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ 1 Comment

Tags

anti china, military exercise in Ladakh, RSS Outfits anti china, RSS Outfits anti china feets, Sino-Indian joint military exercise in Ladakh

సత్య

    అర  నుంచి ఇటీవలనే పొడుగు లాగూలకు మారిన ఖాకీ వాలాలు వీధులు, ఇంటర్నెట్‌ సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక చిందులు వేస్తున్నారు. వాటి బదులు మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ‘ మేకిన్‌ ఇండియా ‘ పిలుపు మేరకు ఒక చిన్న వస్తువునైనా తయారు చేసి కసితో చైనాతో సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తే వారి ‘దేశ భక్తి ‘ మరింత ఇనుమడించి వుండేది. ఏం చేయాలనేది ఎవరిష్టం వారిది కనుక వీరంగం వేసే వారిని వదిలేద్దాం. గత వారంలో మన సైనికులు సరిహద్దులలో చైనా సైన్యంతో కలిసి మన భూభాగంపై సంయ్తు విన్యాసాలు చేశారు. అదీ యురీ సైనిక శిబిరంపై పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు దాడి జరిపి మన సైనికుల ప్రాణాలు బలిగొనటం, ఆ విషయంలో మనకు గాక పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తున్నదని పెద్ద ఎత్తున ‘ ప్రచారం’ జరిపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగంలో చైనా మిలిటరీతో కలసి విన్యాసాలు జరిపినట్లు మన సైన్యమే అధికారికంగా ప్రకటించింది. తేడా ఏమిటంటే సర్జికల్‌ దాడులకు మాదిరి సైన్యంగానీ లేదా అంతకు మించి యుద్ధం చేస్తున్న మన మీడియా గానీ ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రాధాన్యత, ప్రచారం ఇవ్వలేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు గనుక సైన్యానికి ఎలాంటి వుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. కానీ మీడియా విషయానికి వస్తే దాని రేటింగ్‌ పెరగదని మార్కెటింగ్‌ విభాగం చెబితే ఎంత పెద్ద వార్తనైనా పక్కన పడేస్తుంది సంపాదక విభాగం, ఎందుకంటే మీడియాను నడిపేది సంపాదకులు కాదు, బిజినెస్‌ మేనేజర్‌, డబ్బు సంపాదించే విభాగాలే.

  అసలు కంటే కొసరు హడావుడి ఎక్కువ చేస్తుందన్న విధంగా మన ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ సైని కమాండర్లు మాత్రం బాణా సంచాలకు మినహా మిగిలిన పెద్ద వస్తువుల దిగుమతికి మినహాయింపులు ప్రకటిస్తుంటే దిగువ సైన్యం మాత్రం వీరంగం వేయటం ఇంకా కొనసాగిస్తూనే వుంది. నిజానికి బాణ సంచా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ నిషేధం వుంది. దాన్ని సక్రమంగా అమలు జరపకపోవటమే దేశ ద్రోహం. చైనా మిలిటరీతో కలసి మనం జమ్మూలో విన్యాసాలు జరపటం దేశ భక్తా, ద్రోహమా లేక చైనా అనుకూలమా ? పిల్లలను స్టెరాయిడ్లతో వుద్రేక పరిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు చెప్పాలి మరి ?

    అణు సరఫరా గ్రూపులో మన సభ్యత్వానికి చైనా మోకాలు అడ్డిందని, పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటున్నది అనే విషయాలపై అనేక మంది తమ రచనలలో ఖండన మండనలు జరుపుతున్న సమయంలో వాటిని పట్టించుకోకుండా మిలిటరీ విన్యాసాలు కొనసాగించటం విశేషమే. సర్జికల్‌ దాడులకు రాజకీయ నాయకత్వం అనుమతి ఇచ్చిందని, దానికి తాము ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో పెరగటమే కారణమని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇప్పటికే ప్రకటించారు కనుక ఈ విన్యాసాల గురించి ఏం చెబుతారు ? అనుమతించినట్లా లేదా ?

    సాధారణంగా రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు అనగానే మూడో దేశాన్ని భయపెట్టటానికో, బెదిరించటానికో అన్నది సాధారణంగా అందరూ అనుకుంటారు. అమెరికా వంటి సామ్రాజ్యవాదుల మిలిటరీ ప్రమేయం వున్నపుడు అందులో వాస్తవం కూడా లేకపోలేదు. కానీ చైనాతో మన వారు జరిపింది మరొక దేశాన్ని బెదిరించటానికో మరొకందుకో కాదు. ప్రకృతి ప్రళయాలు సంభవించినపుడు సరిహద్దులలోని జనాన్ని ఎలా ఆదుకోవాలో నేర్పేందుకు, నేర్చుకునే లక్ష్యంతో చేసినవి ఇవి. సరిహద్దులలో భూ కంపం వచ్చినపుడు ఒక గ్రామంలోని వారిని ఎలా ఆదుకోవాలన్న విషయమై విన్యాసాలు రోజంతా సాగాయి. వైద్య సహాయంతో సహా జనాన్ని రక్షించేచర్యలు తీసుకోవటంలో పెద్ద విజయం సాధించామని, వుభయ సైనికుల మధ్య విశ్వాసం,సహకారం మరింతగా పెరిగాయని మన మిలిటరీ ప్రకటించింది. సరిహద్దులలో శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు కూడా వీటిని తలపెట్టినట్లు పేర్కొన్నది. లడక్‌ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ ప్రాంతంలో చైనా ప్రాంతంలో ఫిబ్రవరి ఆరున జరిపిన విన్యాసాల కొనసాగింపుగా ఇది కొనసాగింది. ‘చేతిలో చేయి ‘ అన్న కార్యక్రమాలలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. దాని కొనసాగింపుగానే నవంబరు 15-27 మధ్య మన మిలిటరీ దక్షిణాది ప్రధాన కార్యాలయం వున్న పూనేలో మన సైన్యంతో కలిసి చైనా సైన్యం వుగ్రవాద వ్యతిరేక చర్యలపై విన్యాసాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది చైనాలోని ఏనాన్‌ రాష్ట్రంలోని చెంగ్‌డూ మిలిటరీ ఏరియాలో మన దేశం నుంచి వెళ్లిన నాగా రెజిమెంట్‌ సైనికులు చైనీయులతో కలసి ఇలాంటి విన్యాసాలే జరిపి వచ్చారు.

    ఒకవైపు చైనాకు వ్యతిరేకంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలతో పాటు భారత్‌ను కూడా తనవైపు లాక్కునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇవి కానసాగటాన్ని గమనించాలి. ప్రస్తుతం చైనా ఆధీనంలో వున్న కొంత లడఖ్‌ ప్రాంతం మనదే అని మన దేశం, మన ఆధీనంలో వున్న అరుణాచల్‌ మాదని చైనా వాదిస్తున్న విషయం తెలిసినదే. 1962లో వుభయ దేశాల మిలిటరీ యుద్ధానికి తలపడిన ప్రాంతంలోనే ఇప్పుడు చేయి చేయి కలిపి రెండు మిలిటరీలు విన్యాసాలు చేశాయి. సరిహద్దు వ్యవహారాలపై తగు పద్దతుల్లో వ్యవహరించేందుకు వుభయ సరిహద్దు సేనల మధ్య జరిగే సాధారణ విన్యాసాలు తప్ప మూడో దేశానికి వ్యతిరేకంగా కాదని చైనా విదేశాంగ శాఖ కూడా అక్టోబరు 19న జరిపిన విన్యాసాల గురించి ప్రకటించింది. కాశ్మీర్‌ సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే తమ వైఖరిలో కూడా ఎలాంటి మార్పు లేదని రాతపూర్వక వివరణలో చైనా స్పష్టం చేసింది. సరిహద్దు దేశాలు కనుక మంచో చెడో మన రెండు దేశాలు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరపటం ద్వారా వుభయుల మధ్య అనుమానాలు తొలగిపోవటానికి దారి తీస్తుంది. కానీ గతేడాది అమెరికా, జపాన్‌ సైన్యంతో కలసి మలబార్‌ విన్యాసాలు జరపటం, ఈ ఏడాది మన దేశంలోని వుత్తరాఖండ్‌లో అమెరికా మిలిటరీతో కలసి మన సైన్యం విన్యాసాలు జరపనుండటం గురించి కొంత మందిలో అనుమానాలు లేకపోలేదు. ఎవరి అనుమానాలు, ఎవరి అభిప్రాయాలు వారికి వున్నా ఇటీవలి కాలంలో మిలిటరీ విన్యాసాలు అనేవి ఒక బల ప్రదర్శన, దౌత్య ఎత్తుగడలలో భాగంగా జరుగుతున్నాయి. అన్నీ శాంతియుత ప్రయోజనాలకే అని చెప్పలేము, అదే విధంగా యుద్ధ చర్యలలో భాగమని అనలేము. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిందేమంటే మనం ఇతరులతో కలసి విన్యాసాలు జరుపుతున్నట్లే ఇతరులు కూడా జరుపుతారు. వ్యతిరేకించాల్సి వస్తే అన్నింటి పట్ల ఒకే వైఖరిని తీసుకోవాలి. మనం చేసేదే సరైనది, ఇతరులు చేసేది మనకు వ్యతిరేకం అనుకుంటేనే తేడాలు వస్తాయి. ఇదే సమయంలో మన భద్రతా చర్యలు మనం తీసుకోకతప్పదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వస్తు బహిష్కరణ అంతా మోసం గురూ !

21 Friday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

China goods, China goods boycott, DIWALI, RSS, RSS China goods, SJM

సత్య

  జాతీయ వాదం, జాతీయ వాదుల నిర్వచనాలు మారిపోతున్నాయి. వచ్చే దీపావళికి చైనాలో తయారైన బాణా సంచా కాల్చేవారు జాతి ద్రోహులు అన్న విధంగా కొందరు వుద్రేక పడుతున్నారు. చైనా సరకు సంగతి పక్కన పెట్టండి. మన దేశంలో తయారయ్యేదైనా కాల్చటం అవసరమా అని ఆలోచిస్తే మంచిది. దీపావళి సందర్భంగా కొన్నివేల కోట్ల రూపాయల బాణ సంచా కాల్చి డబ్బును వృధా చేయటంతో పాటు పర్యావరణానికి హాని కలిగించటం ఎందుకు?

   జనం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించటంలో మన దేశంలోని కొందరు మేథావులకు వున్న తెలివితేటలను సమస్యలను పరిష్కరించటానికి వుపయోగిస్తే ఎంత బాగుండునో అన్నది ఎప్పటి నుంచో వున్న పగటి కల. చైనా నుంచి అక్రమంగా వస్తున్న దిగుమతుల కారణంగా మన దేశంలోని పరిశ్రమలు దెబ్బతింటున్నాయనటం ఒక తిరుగులేని వాస్తవం. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టి అయిన స్వదేశీ జాగరణ మంచ్‌ పుట్టక ముందే మనకు తెలుసు. గ్లాస్గో, మాంచెస్టర్‌ నుంచి దిగుమతి అయిన జౌళి వుత్పత్తులు మన దేశంలోని చేనేత పరిశ్రమ నడుం విరగొట్టాయి. అందుకే స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్త్ర, వస్తు బహిష్కరణ నినాదం ఒక పెద్ద వుద్యమ రూపాన్నే తీసుకుంది. ఇటీవలి కాలంలో సంస్కరణల పేరుతో మన దేశ మార్కెట్‌ను తెరిచిన తరువాత గత పాతిక సంవత్సరాలలో విదేశీ వస్తువు లేకుండా మనకు తెల్లవారటం లేదన్నది పచ్చి నిజం. మారుతీ కార్లను అనుమతించటంతో మన అంబాసిడర్‌ కారు మాయం లేదా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. శాంసంగ్‌, సోనీ తదితర కొరియా, జపాన్‌ టీవీల సునామీతో మన ఇసి, భారత్‌, డయనోరా వంటి స్వదేశీ టీవీలు కనపడకుండా పోయాయి. మనం కంప్యూటర్ల మీద పనిచేసే ఇంజనీర్ల తయారీకి ప్రాధాన్యత ఇచ్చాము గాని కంప్యూటర్ల తయారీ గురించి పట్టించుకోని కారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇలా కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. ఆ పరంపరలోనే చైనా బాణ సంచా మన దేశంలోని శివకాశి కార్మికుల పొట్టలు కొట్టిందన్నది వాస్తవం. దీనికి కారకులెవరు ? కాంగ్రెస్‌,బిజెపి, తెలుగుదేశం, దాని నుంచి పుట్టిన టిఆర్‌ఎస్‌ వంటివాటికి ఇలాంటి పరిస్థితి తలెత్తటంలో బాధ్యత లేదా ? ఎవరి బాధ్యతేమీ లేకుండానే విదేశీ వస్తువులు ఆకాశం నుంచి వూడిపడుతున్నాయా ?

   చైనా నుంచి వస్తున్న బాణ సంచాకారణంగా తమిళనాడులోని శివకాశిలో ఐదులక్షల కుటుంబాలకు వుపాధి పోయిందని, ఆరువేల కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగిందని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి దీపావళి సందర్భంగానే మీడియాలో వార్తలు వచ్చాయి.http://www.ibtimes.co.in/chinese-exports-hit-sivakasi-firecracker-makers-5-lakh-families-suffer-losses-610963 రెండు సంవత్సరాల క్రితం చైనా నుంచి బాణ సంచా అడపాతడపా దిగుమతి అయింది. ఈ ఏడాది విపరీతంగా పెరిగిపోయి, తాము తయారు చేసిన సరకులో 35శాతం మిగిలిపోయిందని 2014 అక్టోబరులోనే బాణ సంచాతయారీదార్ల ప్రతినిధి వాపోయారా లేదా ? అక్రమంగా దిగుమతి అయిన వాటిని నాశనం చేయకుండా అపరాధ రుసుం విధించి దిగుమతి చేసుకున్నవారికి అప్పగిస్తున్నారా లేదా ? ఆ తరువాత ఆ దిగుమతులు ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి బాధ్యత ఎవరిది ? అక్రమ దిగుమతులను సక్రమంగా మార్చిన ప్రభుత్వానిదా, చౌకగా వున్నందున కొనుగోలు చేస్తున్న జనానిదా ? నిబంధనలను అమలు జరపాల్సింది ప్రభుత్వమా, మరొకరా ? మన దేశం నుంచి బాణ సంచా ఎగుమతి చేసేందుకు గాను నిల్వ వుంచటానికి తగినంత అవకాశం లేదంటూ మన రేవుల ఆధికారులు అనుమతించటం లేదని, స్వదేశీ ఎగుమతులకు గేట్లు మూసి విదేశీ దిగుమతులకు గేట్లు బార్లా తెరిచారని శివకాశీ తయారీదార్లు వెలిబుచ్చిన ఆవేదనను ఎవరైనా పట్టించుకున్నారా ?

   నరేంద్రమోడీ ఏలుబడిలో గతేడాది రెండో దీపావళి జరుపుకున్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిషేధాలు, నిరోధాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదని గత నవంబరులో వార్తలు వచ్చాయి.http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Ban-on-Chinese-crackers-fails-to-cheer-fireworks-industrythis-Diwali-Survey/articleshow/49714653.cms గుజరాత్‌ రాజధాని అహమ్మదాబాద్‌, రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌, మహారాష్ట్ర రాజధాని ముంబై, ఢిల్లీ, లక్నో నగరాలు అక్రమంగా దిగుమతి చేసుకున్న బాణ సంచా పెద్ద ఎత్తున నిల్వకేంద్రాలుగా వున్నాయని అసోచెమ్‌ చేసిన సర్వేలో గతేడాది వెల్లడైంది. వీటిలో మొదటి మూడు కేంద్రాలు బిజెపి ఏలుబడిలో వున్న రాష్ట్రాల రాజధానులు. వుత్తర భారత్‌ నుంచి డిమాండ్‌ తగ్గిపోయిందని శివకాశీ తయారీదార్లు చెప్పారు. చైనా నుంచి అక్రమంగా దిగుమతి కావటంతో పాటు రూపాయి విలువ పతనమైన కారణంగా అల్యూమినియం పౌడర్‌, బేరియం నైట్రేట్‌ వంటి ఇతర ముడి సరకుల దిగుమతి ఖర్చు కూడా పెరిగి బాణ సంచా వుత్పత్తి ఖర్చు పెరిగిందని కూడా వారు చెప్పారు.

  శివకాశీ నుంచైనా, చైనా నుంచైనా బాణా సంచా కొనుగోళ్లు దీపావళికి కొన్ని నెలల ముందుగానే జరుగుతాయి. ఇప్పుడు చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పటమంటే బడా వ్యాపారుల నుంచి కొనుగోలు చేసిన చిన్న వ్యాపారులను ముంచటం తప్ప వేరు కాదు. బాణా సంచా విక్రయించటానికి చిరు వ్యాపారులకు లైసన్సు అవసరం తమిళనాడులో అధికారులు జారీ చేసిన లైసన్సులలో విదేశీ బాణ సంచా అమ్మరాదనే నిబంధన లేదట. విదేశీ బాణ సంచా అమ్మబడదు అని పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని మౌఖికంగా చెబుతున్నారని వార్త.http://www.thehindu.com/news/national/tamil-nadu/chinese-crackers-may-sneak-in-this-deepavali/article9231948.ece చైనా వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చి సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించిన ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్‌ ఆకస్మికంగా ప్లేటు ఫిరాయించింది. చైనా నుంచి దిగుమతి చేసుకొనే భారీ యంత్రాల వంటి వాటిని బహిష్కరణ నుంచి మినహాయించినట్లు ప్రకటించింది.http://timesofindia.indiatimes.com/city/nagpur/Swadeshi-Jagran-Manch-excludes-capital-goods-from-anti-China-drive/articleshow/54965515.cms  ఎంత అవకాశవాదం? సామాన్య, మధ్యతరగతి కొనుగోలు చేసే బాణ సంచాపై పెద్ద రగడ సృష్టించింది. కానీ కార్పొరేట్లు దిగుమతి చేసుకొనే యంత్రాలను మాత్రం బహిష్కరణ నుంచి మినహాయించింది. అంటే ప్రచారం జనాల కోసం ! పని చేసేది కార్పొరేట్ల కోసమా !! చైనా వస్తుబహిష్కరణ తమ ప్రయోజనాలకు నష్టదాయకమని కార్పొరేట్లు చేసిన వత్తిడికి లొంగటం తప్ప దీనిలో ‘దేశభక్తి ‘ కనిపించటం లేదు. మన ఔషధ కంపెనీలు వుపయోగించే రసాయనాలలో 65 శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, బొగ్గుతో నడిచే విద్యుత్‌ కేంద్రాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలతో పనిచేస్తున్నాయని అసలు విషయాన్ని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌కు నాయకత్వం వహిస్తున్న కాశ్మీరీ లాల్‌ వెల్లడించారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా వస్తు బహిష్కరణ పాతాళ భైరవిలో మాంత్రికుడి శిష్యుడు చెప్పినట్లు అంతా మోసం గురూ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోబెల్స్‌ చెప్పులలో నరేంద్రమోడీ కాళ్లు ?

19 Wednesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, RELIGION

≈ Leave a comment

Tags

Goebbels, Joseph Goebbels, Narendra Modi, Nazi Joseph Goebbels, surgical strike

ఎంకెఆర్‌

   ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే నిజమౌతుందన్నది జర్మన్‌ నాజీ గోబెల్స్‌ ప్రచార సూత్రం. సర్జికల్‌ దాడుల గురించి ఏకంగా ప్రధాని, రక్షణ మంత్రే ఆ సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారని గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచార తీరు వెల్లడిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు మంగళవారం నాడు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మన విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్‌ జయశంకర్‌ మాట్లాడుతూ సర్జికల్‌ దాడులు కొత్తగా జరిపినవి కాదని, గతంలో జరిగిన వాటి గురించి సైన్యానికి మాత్రమే తెలుసునని, ఇటీవలి దాడుల గురించి తొలిసారిగా బహిరంగంగా వెల్లడించారని స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో హిమచల్‌ ప్రదేశ్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి దాడులను ఇజ్రాయిల్‌ మాత్రమే చేయగలదని విన్నామని ఇప్పుడు భారతీయ సైన్యం కూడా ఎవరికీ తీసిపోదని వెల్లడైందని అన్నారు. ఇలాంటి దాడులు తొలిసారిగా జరిగాయని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ చెప్పిన మాటలనే ప్రధాని మరొక రూపంలో చెప్పారు తప్ప అర్ధం ఒకటే.

     ఇక్కడ రెండు విషయాలు. సర్జికల్‌ దాడులు గతంలో కూడా జరిపామని విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్పిన విషయం ప్రధాని నరేంద్రమోడీకి తెలియదు అనుకోవటం అమాయకత్వం. తెలిసి కూడా ఇలాంటి దాడులు చేయగల సత్తా ఇజ్రాయెల్‌కు మాత్రమే వుందని విన్నామని చెప్పటం మన మిలిటరీని అవమానించటం తప్ప మరొకటి కాదు. నిజంగా తెలియకపోతే ప్రధానిగా రెండున్నర సంవత్సరాలలో తెలుసుకొని వుండి వుండాలి. తరతమ తేడాలతో ప్రపంచంలో ప్రతి మిలిటరీకి వుంటుందన్నది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే ఇటీవల మన మిలిటరీ జరిపిన దాడుల సందర్భంగా మీడియాలో ఈ విషయాలన్నీ చర్చించారు. అలాంటిది ఇజ్రాయెల్‌కు మాత్రమే వుందని విన్నామని ప్రధాని స్వయంగా చెప్పటం అంటే మీడియా వార్తలు కూడా ప్రధానికి తెలియవా ? రెండవది ఇజ్రాయెల్‌ పేరు ప్రస్తావించటం అంటే దాని గొప్పతనాన్ని పొగడటం, దాని మిలిటరీతో మన మిలిటరీని పోల్చటం. ఇదింకా అవమానకరం .

    ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన వాటిలో ఇజ్రాయెల్‌ మిలిటరీ ఒకటి. పై నుంచి కింది వరకు దానిలో యూదు దురహంకారం, దురాక్రమణవాదాన్ని నింపారు. మన మిలిటరీ అందుకు పూర్తిగా విరుద్ధం. అరబ్బుల ప్రాంతాలను ఆక్రమించుకోవటంతోనే ఇజ్రాయెల్‌ పుట్టింది. ఆ తరువాత దాని పరిసరాలలో వున్న జోర్డాన్‌,లెబనాన్‌, సిరియా, ఈజిప్టు ప్రాంతాలను ఆక్రమించుకొని ఇప్పటికీ తిష్ట వేసింది.అంతర్గతంగా అరబ్బుల ప్రాంతాలను అక్రమంగా ఆక్రమించుకొనేందుకు పూనుకున్న ఇజ్రాయెలీలకు రక్షణగా మిలిటరీ వ్యవహరించటం అందిరికీ తెలిసిందే. ఇజ్రాయెల్‌ దురాక్రమణను ఎదుర్కొనే క్రమంలో దాని సరిహద్దులలో అనేక దేశాల మిలిటరీ వుంటుంది. వాటిని నిరంతరం రెచ్చగొట్టటం, యుద్ధానికి కాలుదువ్వటం, అరబ్బు ప్రాంతాలలోని సాధారణ పౌరుల ప్రాంతాలపై రహస్య దాడులు జరపటం దాని నిరంతర కార్యక్రమాలలో భాగం. అందువలన అది చేసే సర్జికల్‌ దాడులు, మన మీద దాడులకు సిద్ధంగా వున్న ఆక్రమిత కాశ్మీర్‌లోని పాక్‌ ప్రేరేపిత వుగ్రవాద శిబిరాలపై మన సైన్యం దాడులు చేయటం ఒకటి కాదు. ఇజ్రాయెల్‌ చర్యలు యుద్ధోన్మాద కవ్వింపు అయితే మన సైన్యం చర్యలు ఆత్మరక్షణ, వుగ్రవాద నిరోధ చర్యలలో భాగం. ఇజ్రాయెల్‌ వంటి దుష్ట మిలిటరీ తప్ప మన సైన్యాన్ని పొగడటానికి, పోల్చటానికి మరొక మిలిటరీ దొరకలేదా ? పాలస్తీనా పౌరుల న్యాయమైన పోరాటానికి మద్దతు, ఇజ్రాయెల్‌ దాడులు, దురాక్రమణను వ్యతిరేకించే మన పశ్చిమాసియా విదేశాంగ విధాన కీలకాంశానికి విరుద్ధంగా ఇజ్రాయెల్‌ను పొగడటం తగని పని. ఒకవైపు పాలస్తీనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదంటూనే ఇజ్రాయెల్‌ను పొగడటం శకుని, శల్యసారధ్యాలను గుర్తుకు తెస్తోంది.

     గతంలో ఇలాంటి సర్జికల్‌ దాడులు జరగలేదని, జరిగినవి ఏవైనా వుంటే స్ధానికంగా చేసినవి తప్ప ప్రభుత్వ ప్రభుత్వ ప్రమేయంతో జరగలేదని ప్రకటించిన రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ తరువాత మరొక అడుగు ముందుకు వేసి ప్రధాని, తాను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వారం కనుకనే ఈ దాడులు జరిగాయని చెప్పి దాడుల ఖ్యాతిని ఆ సంస్థకు ఆపాదించేందుకు ప్రయత్నించారు. ఇదొక ప్రమాదకర పోకడ. పేరుకు సేవా, సాంస్కృతిక సంస్ధ అని చెప్పుకుంటూ అనేక వివాదాలు, మత ఘర్ణణలను రెచ్చగొట్టే సంస్ధగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌, దాని భావజాలంతో పని చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధాని, రక్షణ మంత్రి గాలిని విదేశాంగ కార్యదర్శి తీసినట్లయింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

CPI(M) supports the demand of Muslim women on triple talaq

18 Tuesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

communal forces, CPI(M), Muslim women, triple talaq, Uniform Civil Code

The Polit Bureau of the Communist Party of India (Marxist) has issued the following statement on October 18, 2016.
The CPI(M) supports the demand of Muslim women against the practice of arbitrary and instant triple talaq. This specific practice is not permitted in most Islamic countries. Acceptance of this demand will bring relief to affected women.
All personal laws including those for the majority community require reform.
In this context the claims being made by Government spokespersons that personal laws for Hindu women have already been reformed   shows that their interest is not in securing women’s equality but in targeting the  minority communities, particularly the Muslim minority.  Even now laws concerning, adoption, property rights and even the right to choose your own partner discriminate against Hindu women.
With the offensive of the communal forces on the very identity of minority communities, any move to push the agenda of Uniform Civil Code as is being done by the Government directly and through its institutions is counterproductive for the rights of women. Uniformity is not the guarantee for equality.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రజాస్వామ్యం -మిలిటరీ- ప్రశ్నించే హక్కు ?

12 Wednesday Oct 2016

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Congress party, dadri, dalali, democracy, Media, military, right to ask a question, surgical strike

ఎంకెఆర్‌

   సమాజంలో ఎప్పుడూ విరుద్ధ భావజాలాల మధ్య సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. అయితే అన్ని వేళలా అన్నీ ఒకే విధంగా సంఘర్షించుకోవు. ఎప్పుడూ ఒకటి ప్రధాన మైన సంఘర్షణగా వుంటుంది. దీని అర్ధం మిగతావి సంఘర్షించుకోవు అని కాదు. ఏ రెండింటి మధ్య జరిగేది ప్రధాన సంఘర్షణ అన్నది గుర్తించటం ముఖ్యం. అయితే వెంటనే దానితో అందరూ ఏకీభవించకపోవచ్చు.అసలు దానిని ఒక వైరుధ్యంగా కొందరు గుర్తించకపోవచ్చు కూడా. ఇప్పుడు దేశంలో అదే పరిస్ధితి వుందన్నది అనేక మంది అభిప్రాయం. కొంత మంది విభేదించినప్పటికీ అనేక దేశాలతో పోలిస్తే మనం మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్ధలో వున్నాం. భావ ప్రకటనా స్వేచ్చ మీద జరుగుతున్న తీవ్ర దాడిని సాధారణంగా మేథావి వర్గంగా భావించే వారందరూ వ్యతిరేకించకపోయినా గట్టిగా వ్యతిరేకించే వారు కూడా వున్నారు. కలుబుర్గి హత్యను ఖండించటానికి కేంద్ర సాహిత్య అకాడమీ తిరస్కరించటం మొదలు, ఎవరు ఏమితినాలి, తినకూడదు అని నిర్ధేశించిన దానిలో భాగంగా గొడ్డు మాంసంపై తలెత్తిన వివాదం, విశ్వవిద్యాలయాలలో భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకొనే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడిన వుదంతాలు, గో సంరక్షణ ముసుగులో ముస్లింలు, దళితులపై దాడులు, చివరికి తాజా సర్జికల్‌ దాడుల వరకు అనేక వుదంతాలలో తలెత్తిన ఘర్షణలను చూస్తే పూసల్లో దారంలో తిరోగామి భావజాలానికి ప్రాతినిధ్యం వహించే ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర మనువాద, మతశక్తులు అన్ని రంగాలలో, అంశాలలో తమ ఆధిపత్యాన్ని రుద్దేందుకు ప్రయత్నించటం చూస్తున్నాం. వారేమీ దాచుకోవటం లేదు, బాహాటంగానే తెగింపుతో ముందుకు వస్తున్నారు. చర్చను ప్రమాదకర పరిస్థితిల్లోకి నెడుతున్నారు. ఇది ఒక పధకం ప్రకారం జరుగుతున్నదా? యాదృచ్చికమా అన్న గుంజాటన వున్న వారు తీరికగా ఆలోచించి దానిని తేల్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ దాడులకు ప్రతిఘటన కూడా అలాగే వుంది. అనేక మంది ఇదేదో తేడాగా వుంది అని ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటి వారు పెరుగుతారు.అయితే ఈ శక్తుల ప్రయత్నాలన్నింటికీ తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఒక ఎత్తుగడగా అయినా వెనక్కు తగ్గి కొత్త దారులు వెతుకుతున్నారు.

    కలుబుర్గి హత్యపై తలెత్తిన రచయితలు, కళాకారులు, మేథావుల నిరసనలతో ఖంగు తిన్న శక్తులు కేంద్ర సాహిత్య అకాడమీతో సంతాపం ప్రకటింపు చేయించి పరువు దక్కించుకొని బయట పడ్డాయి. ఆవు మాసం వివాదం చివరకు దళితులపై దాడులకు తెరతీయటంతో స్వయంగా ప్రధాని జోక్యం చేసుకొని లోపల ఎలా వున్నప్పటికీ దళితుల ఓట్ల కోసం గోసంరక్షకులపేరుతో దుకాణాలు తెరిచారని తీవ్ర విమర్శలు చేయాల్సి వచ్చింది. వురి శిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడిన, యాకుబ్‌ మెమెన్‌ వురి తీత సరైంది కాదని అభిప్రాయపడిన వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేసి హైదరాబాదులో రోహిత్‌ వేముల ఆత్మ హత్యకు కారకులు కావటం, జెన్‌యు విద్యార్ధులపై తప్పుడు ప్రచారం, తప్పుడు వీడియోలు, కేసులతో వేధించేందుకు పూనుకున్నారు. ఆ రెండు చోట్లా జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. ఈ విషయంలోనూ తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. తమకు రాజకీయంగా లాభం అనుకుంటే ఏ వివాదాన్ని అయినా రావణా కాష్టంలా రగిలిస్తూనే వుంటారు, తాత్కాలికంగా అయినా నష్టం అనుకుంటే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గుతారు.ఇప్పుడు సర్జికల్‌ దాడుల వివాద వుదంతాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి వుంది.

    ఒక్కొక్క అంశంపై తమ ఆధిపత్యాన్ని రుద్ధేందుకు ప్రయత్నిస్తున్న మత, తిరోగామి శక్తులు సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నించటం ఒకటైతే , తలెత్తిన పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవటం మరొకటి. అసహనం, దేశభక్తి, ఆవు నుంచి తాజా మిలిటరీ చర్యల వరకు నడుస్తున్న చర్చలో రెండు ఈ ధోరణులను మనం చూడవచ్చు. పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదుల అణచివేతలో భాగంగా మిలిటరీ చేపట్టిన సర్జికల్‌ దాడులను దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సమర్ధించాయి. ఎవరూ వాటిని వివాదం చేయలేదు. అయితే ఆ దాడులనుంచి రాజకీయ ప్రయోజనాలను పిండుకోవటానికి బిజెపి తెరతీయటం, అది తగదన్న అంశంపై తీవ్రమైన రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ముందు బోనులో నిలబెట్టాల్సింది మీడియాను అంటే అతిశయోక్తిగా కనిపించవచ్చు. సర్జికల్‌ దాడుల గురించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరించినపుడు వచ్చిన వార్తల తీరు తెన్నులను ఒక్కసారి నెమరు వేసుకోండి. దాడుల ఖ్యాతిని పూర్తిగా మిలిటరీకే ప్రతిపక్షాలు అప్పగిస్తున్నాయని, నరేంద్రమోడీకి దానిని పంచేందుకు నిరాకరించాయని రాయటాన్ని ఏమనాలి. మరణించింది సైనికులు, ప్రాణాలకు తెగించి ప్రతిదాడులు జరిపింది సైనికులు, దీనిలో రాజకీయ నాయకులు లేదా పార్టీలకు ఖ్యాతిని ఆపాదించటం ఏమిటి ? వుప్పు తిన్న విశ్వాసం లేదా కిరాయి రాతలని ఇలాంటి వాటినే అంటారు.

    మిలిటరీ చర్యలను, మిలిటరీని రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకున్న దేశాలలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన దేశాన్ని కూడా ఆ స్ధితిలోకి నెట్టదలచుకున్నారా ? కొందరి వుత్సాహం అలాగే కనిపిస్తోంది. కార్గిల్‌ యుద్ధాన్ని బిజెపి తన ఎన్నికల ప్రయోజనానికి వుపయోగించుకోవటం జగమెరిగిన సత్యం. ప్రతిపక్షం ఎంత బలహీనంగా వున్నప్పటికీ ఇది 1999 కాదు 2016 అని గుర్తించకుండా సర్జికల్‌ దాడులను కూడా అందుకు వినియోగించుకొనే ప్రయత్నం చేస్తే సహించే పరిస్థితి వుంటుందా ? మిలిటరీ చర్యలనుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించవద్దన్న అభిప్రాయాల వెల్లడి, ప్రకటనలు జాతీయ ఐక్యత ప్రదర్శించాల్సిన సమయంలో సైనికుల శౌర్య, పరాక్రమాలను అవమానించటమే అని చిత్రించటం అత్యంత ప్రమాదకర పోకడ. మొదటిది ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటనా స్వేచ్చకు ప్రతిబింబం అయితే రెండవది అందుకు విరుద్ధమైన అణచివేత వ్యవస్ధ లక్షణం.

    మన దేశంలో స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్‌ పార్టీ చేయని తప్పిదం లేదు. అత్యవసర పరిస్థితి విధించి నిరంకుశత్వాన్ని రుద్ధేందుకు ప్రయత్నించింది. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అనుసరించి సామాన్య జనజీవితాలను అతలాకుతలం చేసింది. మతోన్మాదులతో పోటీపడి ఓట్ల కక్కుర్తితో మతశక్తులతో రాజీపడి లౌకిక వ్యవస్ధకు హాని చేసింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం వేర్పాటు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చింది. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించి ఇప్పుడు ప్రతిపక్షంగా పార్లమెంట్‌లో గుర్తింపునకు తగిన సంఖ్యలో కూడా సీట్లను పొందలేకపోయింది. ఇంకా దాని తప్పిదాలు చాలా వున్నాయి.

    రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతలు జర్మనీ మిలిటరీపై నిషేధం విధించారు. అదే యుద్ధంలో జపాన్‌ను ఓడించి 1945-52 మధ్య కాలంలో తమ ఆక్రమణలో వుంచుకున్న అమెరికా ఆ దేశ రక్షణ బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు ఆ దేశంతో ఒక ఒప్పందం చేసుకొన్నది. రెగ్యులర్‌ మిలిటరీని నిషేధిస్తూ జపాన్‌ నూతన రాజ్యంగంలో ఒక అంశంగా చేర్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జర్మనీ, జపాన్‌లకు సైన్యం లేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ను బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ చిత్తుగా ఓడించింది. అంతే తప్ప కాంగ్రెస్‌ పార్టీని లేదా దాని హక్కులను గానీ జపాన్‌,జర్మనీ మిలిటరీల మాదిరి నిషేధించలేదు. అందువలన ఆ పార్టీ అయినా మరొకదానికి అయినా ఒక అంశం మీద అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్చను కలిగి వున్నాయి.

    ఆ విధంగా చూసినపుడు బిజెపి లేదా దాన్ని చూసి సమాజవాది పార్టీ గానీ రాజకీయ ప్రయోజనాల కోసం జరిపే ప్రచారంలో, పోస్టర్లలో సైన్యాన్ని వుపయోగించుకోకూడదని చెప్పేందుకు ఎవరికైనా హక్కుంది. ‘సర్జికల్‌ దాడులకు మా సంపూర్ణ మద్దతు వుందని నిర్ద్వంద్వంగా చెప్పాను. అయితే సైన్యాన్ని రాజకీయ పోస్టర్లు, ప్రచారానికి వినియోగించుకోవటాన్ని నేను సమర్ధించను ‘ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు రోజు కాస్త ఘాటుగా సైనికుల త్యాగాలను సొమ్ము చేసుకొనే దళారులుగా వ్యవహరించవద్దని విమర్శించారు. ఆ విమర్శ తమను గాక మిలిటరీని అన్నట్లే అంటూ బిజెపి విరుచుకుపడింది. సైనికుని బొమ్మను, మోడీ, బిజెపి నేతల బొమ్మలతో కలిపి ముద్రించి వుత్తర ప్రదేశ్‌లో బిజెపి ప్రచారం ప్రారంభించిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై చేసిన విమర్శలను మిలిటరీకి వర్తింప చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది.

  దళాలీ( తెలుగులో దళారీ ) అన్నది పార్లమెంటేతర భాష కాదు. భోఫోర్స్‌తో సహా అనేక కుంభకోణాలలో దళారుల పాత్ర ఏమిటో కాంగ్రెస్‌కు, బిజెపికి తెలిసినంతగా ఈ దేశంలో మరొక పార్టీకి తెలిసే అవకాశం లేదు. దానిలో భాగంగానే బిజెపి ‘ధరమ్‌ కీ దలాలీ(మతం), గాయ్‌ కీ దళాలీ( ఆవు ) గంగా కీ దళాలీ ( గంగా నది)ని వుపయోగించుకుంటున్నట్లుగానే సైనికుల త్యాగాలను కూడా వుపయోగించుకుంటున్నదని బిజెపి పోస్టర్లను వుటంకిస్తూ కాంగ్రెస్‌ ఎదురు దాడికి దిగింది. రాజకీయాలలో దళారీ పదం వాడటం వుచితమేనా అన్న ప్రశ్నకు రాజకీయాలకు తావు లేని చోట బిజెపి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నది, మోడీని రాముడిగా చిత్రిస్తూ పోస్టర్లు వేశారు, సర్జికల్‌ దాడులతో ఆయన ఛాతీ 56 అంగుళాల నుంచి వందకు పెరిగిందని చెప్పారు, జాంబవంతుడు చెప్పిన తరువాతే హనుమంతుడికి తన బలం గురించి తెలిసి వచ్చి ఒక్క వూపులో సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించినట్లుగా సర్జికల్‌ దాడుల తరువాత మన సైన్యానికి తన బలం ఏమిటో తెలిసి వచ్చిందన్నారు రక్షణ మంత్రి పరికర్‌. ఆయనను సన్మానించేందుకు సభలు జరుపుతున్నారు. బిజెపి ప్రతినిధి జివిఎల్‌ నరసింహారావు కూడా అదే రీతిలో తొలిసారిగా మిలిటరీకి తానంటే ఏమిటో తెలిసిందని మాట్లాడారు. నిజానికి ఇవి మిలిటరీని అవమానించే మాటలు. గతంలో చేసిన సర్జికల్‌ దాడులను విస్మరించటం, త్యాగాలను కించపరచటం తప్ప మరొకటి కాదు. దాడుల ఖ్యాతి పూర్తిగా సైనికులకే దక్కాలి. ఈ పూర్వరంగంలో ఒక పదం ముఖ్యం కాదు దాని వెనుక వున్న భావాన్ని అర్ధం చేసుకోవాలని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ వ్యాఖ్యానించారు. వుగ్రవాదులు పాకిస్తాన్‌ అనే వ్యాధి గ్రస్తు శరీరంలోని క్యాన్సర్‌ కణాల వంటి వారు, ప్రభుత్వం వాటిని అంతం చేయటానికి మద్దతు ఇస్తున్నాం, దానికి గుండెలు పొంగటం ఎందుకు, పోస్టర్ల ప్రచారం దేనికి, ఒక సర్జికల్‌ దాడితో వుగ్రవాదం అంతం కాదు, కానీ బిజెపి వుత్తర ప్రదేశ్‌లో ఆ పేరుతో ఓట్లు అడిగేందుకు ప్రచారం ప్రారంభించింది’ అని కూడా సిబాల్‌ చెప్పారు.

    ఆవు మాంసం కలిగివున్నారంటూ వుత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో ఒక ముస్లిం కుటుంబంపై సామాహిక దాడి చేసి కుటుంబ పెద్దను హత్య చేసిన కేసులోని ఒక నిందితుడు రవి శిశోదియా జైలులో చికున్‌ గున్యా వ్యాధితో మరణించాడు. అతని మృత దేహంపై బిజెపి నేతలు జాతీయ జండా కప్పటాన్ని ఏమనాలి. హిందూత్వ వాది కనుక కావాలంటే తమ బిజెపి జెండాను కప్పుకోవచ్చు, జాతీయ జెండాను కప్పటమంటే దానిని అవమానించటం తప్ప మరొకటి కాదు. బిజెపి ప్రవచించే జాతీయవాద నిజ స్వరూపం ఇదా ? దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల మృత దేహాలపై జాతీయ జెండా కప్పుతారు. మరి శిశోదియా ఏ త్యాగం చేశాడని ఇలా చేశారు ?

Image result for dadri lynching,sisodia, national flag

చికున్‌ గున్యాతో మరణించిన దాద్రి హత్య నిందితుడికి జాతీయ జెండా కప్పిన బిజెపి జాతీయవాదం

    సర్జికల్‌ దాడుల గురించి చర్చించ కూడదని బిజెపి నేతలు మనకు చెబుతున్నారు. అడిగితే అది పాక్‌ ప్రచార వలలో పడినట్లే నట ! సైనిక చర్యకూ జాతీయ వాదానికి ముడి పెడుతున్నారు. గో వధ నిషేధానికీ అదే ముద్ర, చివరికి గో సంరక్షకుల ముసుగులో చచ్చిన ఆవుల చర్మం తీసే, చచ్చిన ఆవులను తొలగించటానికి నిరాకరించిన దళితులపైనా దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. వారిని అలాగే వదలి వేస్తే చివరికి గో సంరక్షక్షుల దాడుల గురించి కూడా చర్చించటం కూడా దేశ ద్రోహమే అంటారేమో ? కొన్ని టీవీ ఛానల్స్‌, కొన్ని పత్రికలు, కాషాయ దళాల దృష్టిలో భిన్న, బేదాభి ప్రాయం వ్యక్తం చేసే వారందరూ ప్రమాదకారులు, దేశద్రోహుల కింద లెక్క. కనుక అంతిమంగా అలాంటి వారి నోరు మూయాలి లేకపోతే మూయించాలి, ఇదేగా ఇస్తున్న సందేశం ! ఇది ప్రారంభం మాత్రమే. మొగ్గలోనే ఇలాంటి ధోరణులను ఎదుర్కొనకపోతే చివరికి మానులై కూర్చుంటాయి.

   మిలిటరీని విమర్శించకూడదు ! న్యాయ వ్యవస్ధను విమర్శించకూడదు !! మిలిటరీ, న్యాయవ్యవస్ధలనేవి ఆకాశంలోంచి వూడి పడలేదు, కనుక విమర్శలకు అతీతం కాదు. ఏ దేశంలో అయినా మిలిటరీ చర్యలపై , న్యాయ వ్యవస్ధ తీర్పులపై విమర్శలు సహజం. వుద్రేకాలు, విద్వేషాలను అదుపులో వుంచుకొని ఆలోచించాల్సిన విషయాలు వున్నాయి. న్యాయమూర్తి స్ధానంలో కూర్చున్న వారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలన్నది ఒక విధి. తీర్పు రాకముందే లేదా తీర్పు వచ్చిన తరువాత వారికి దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ముందుగానే మరొక కోర్టులో తన కేసును విచారించాలని కోరే హక్కు ఎవరికైనా వుంది. అంత మాత్రాన సదరు న్యాయమూర్తిని అవమానించినట్లు కాదు. కొన్ని కేసుల విచారణలో న్యాయమూర్తులు స్వచ్చందంగా తప్పుకొంటున్న విషయం విదితమే. అయితే ఒక తీర్పు వెలువడిన తరువాత దాని మంచి చెడ్డలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికైనా వుంటుంది. అంతిమ తీర్పులో కూడా తమకు న్యాయం జరగలేదని ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. మిలిటరీ వ్యవహారం కూడా అంతే . దానిలో పని చేసే వారి చిత్త శుద్ధిని శంకించటం వేరు, మిలిటరీలో జరిగే, మిలిటరీ చేసే తప్పులను ఎత్తి చూపటం వేరు అని గమనించాలి.మిలిటరీకి అవసరమైన కొనుగోళ్లలో జరిగే అక్రమాల గురించి ఎన్నో విన్నాం.సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండా అవి జరగవు. మిలిటరీ గనుక అక్కడ ఏం జరిగినా విమర్శించకూడదు, మీడియాలో దాని గురించి చర్చించకూడదు అంటే ఎలా ? కార్గిల్‌ యుద్ధంలో వందల మంది సైనికులు ప్రాణాలర్పించారు. వారి భౌతిక కాయాలను తరలించేందుకు కొనుగోలులో అక్రమాలకు పాల్పడింది అపర దేశభక్తులుగా పేరుపొందిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలనలో అన్నది తెలిసిందే. మిలిటరీ కొనుగోళ్లు కనుక విమర్శించకూడదంటే ఆ వివరాలు బయటకు వచ్చేవా ? అదే అయితే భోపోర్సు ఆయుధాల కమిషన్‌ ముడుపులూ అంతే కదా ?

    పది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం మిలిటరీలో వున్న మైనారిటీల సంఖ్య ఎంత అనే సమాచారాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. ప్రతిపక్షంలో వున్న బిజెపి, మిలిటరీ అధికారులు, మరికొందరు దానిపై నానాయాగీ చేశారు. దాంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది. మిలిటరీ అంటే త్యాగం తప్ప రిజర్వేషన్లు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ భాష మాట్లాడతారు, కుల మతాల లెక్క కాదు అన్నారు. వివరాలు సేకరించాలన్నవారి కారణాలు వారికి వుంటే వ్యతిరేకించే వారికారణాలు వారికి వున్నాయి. అయితే మిలిటరీలో కుల, మత లేదా తెగల ప్రస్తావన లేదా, ముస్లింల సంఖ్యా వివరాలు లేవా అంటే వున్నాయి. అలాంటపుడు ఎందుకు వ్యతిరేకించినట్లు ? మన రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడు. అయితే అది గౌరవం తప్ప అధికారాలు లేవు. లెక్కలు తీయాలని కోరింది రక్షణ మంత్రిత్వశాఖ. అలా లెక్కలు తీయటం మిలిటరీలో మతతత్వ బీజాలు వేయటమే అవుతుంది కనుక ఆ ప్రక్రియను నిలిపివేయాలని మాజీ సైనికాధికారి ఆర్‌ఎస్‌ కడియన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వసైన్యాధ్యక్ష హోదాలో ఇలాంటి లెక్కలు తీయటాన్ని నిలిపివేసేందుకు రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్‌ చేసింది. మాజీ సైనికాధికారులు ధర్నాలు చేశారు. కార్గిల్‌ శవపేటికల కుంభకోణం ఫేం జార్జి ఫెర్నాండెజ్‌ సైన్యాన్ని మత పూరితం చేసే దేశ ద్రోహకర చర్య అని వర్ణించారు. 2004 జనవరి తొమ్మిదిన రక్షణ మంత్రిత్వ శాఖకు సైన్యం పంపిన ఒక నోట్‌లో పదకొండు లక్షల మంది సైనికులలో ముస్లింలు 29,093 మాత్రమే అని పేర్కొన్నారు. అంటే 13శాతం జనాభాకాగా సైనికులలో వారి శాతం 2.6 మాత్రమే. వారి శాతాన్ని పెంచమని కోరటం జాతి వ్యతిరేకం అవుతుందా ? గూర్ఖా, సిక్కు, రాజపుత్ర, డోగ్రా రెజిమెంట్లలలో ముస్లింలతో సహా ఆ తరగతులకు చెందని వారికి చాలా కాలం అసలు ప్రవేశం లేని విషయం తెలిసిందే. 1984లో అమృతసర్‌ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన వుగ్రవాదులను బయటకు గెంటి వేసేందుకు చేపట్టిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ చర్య సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లో కొందరు సైనికులు తిరుగుబాటు చేసిన తరువాతే రెజిమెంట్లలో ఇతరులకు కూడా చోటు కల్పించి అఖిల భారత స్వభావం తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.

మన మిలిటరీ, న్యాయవ్యవస్ధ అయినా మన వైవిధ్య సమాజానికి ప్రతిబింబంగా వుండాలన్నదానితో ఎవరూ విబేధించనవసరం లేదు. అలా వుందా లేదా అన్నతి తెలియాలంటే వివరాలు వుండాలి, లోపం వుంటే అధిగమించేందుకు ప్రయత్నించాలి. మన దేశానికి వలస పాలన వారసత్వంగా అనేక అవలక్షణాలు వచ్చాయి. వాటిని వదలగొట్టుకోవాల్సి వుంది. వలస పాలకులు ఎందుకు అలా చేశారన్నది మరో సందర్భంలో చర్చించవచ్చు.మన సైన్యంలో సిక్కు, గూర్ఘా, జాట్‌, రాజపుత్ర, డోగ్రా,పంజాబ్‌, మద్రాస్‌, మరాఠా, బీహార్‌, ఇలా మరికొన్ని పేర్లతో రెజిమెంట్లు వున్నాయి. నిజానికి లౌకిక భారత్‌ లేదా స్వతంత్ర భారతంలో ఇలాంటివి ఇప్పటికీ కొనసాగటం ఆశ్చర్యకరమే. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తరువాత నాగా రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, దేశ రక్షణలో మరింత చురుకుగా పాల్గొనేందుకు తమ పేరుతో ఒక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని నాగాల ప్రతినిధులు కోరిన మేరకు 1970లో ఆ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. మేమెంతో మాకంత వాటా మాదిరి నినాదాలతో అస్థిత్వ భావనలు తీవ్రంగా వ్యాపించిన వర్తమాన పరిస్థితులలో ప్రత్యేక రెజిమెంట్ల ఏర్పాటు డిమాండ్‌ను ముందుకు తెచ్చేందుకు అవకాశం వుందా లేదా ?

   దేశ విభజనకు ముందు పాకిస్థాన్లో ఎంత మంది హిందువులున్నారు, ఇప్పుడు ఎంత మంది వున్నారో చూడండంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారు జనాన్ని తప్పుదారి పట్టించే లెక్కలు కొన్ని చెబుతుంటారు. మన రక్షణ శాఖ సహాయ శాఖ మంత్రిగా పని చేసిన మహావీర్‌ త్యాగి అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశ విభజనకు ముందు భారత సైన్యంలో ముస్లింలు 32శాతంగా వుండగా విభజన తరువాత రెండు శాతానికి పడిపోయింది. ఇది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, ఇతరుల శాతం ఎంత అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ? అయితే సచార్‌ కమిటీ సూచన ప్రకారం ముస్లింల సంఖ్య తెలుసుకోవాలనుకోవటంలో మైనారిటీల సంతుష్టీకరణ, దాన్ని వ్యతిరేకించటంలో మెజారిటీ సంతుష్టీకరణ కోణాలు కూడా లేకపోలేదు. అధికారంలో ఏ పార్టీ వున్నప్పటికీ రాజ్యాంగ బద్దంగా దళితులు, గిరిజనుల వుప ప్రణాళికలకు నిధులు కేటాయించాలన్నా, మత, భాషా మైనారిటీల సంక్షేమానికి చర్యలు, పధకాలను రూపొందించాలన్నా వారి సంఖ్యా, ఇతర పరిస్థితుల వివరాలు తెలియకుండా ఎలా సాధ్యం. వాటిని సేకరించటం ఆ తరగతుల సంతుష్టీకరణ అని ఇంతకాలం రాజకీయం చేసిన బిజెపి ఇప్పుడు కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో అధికారంలో వుంది. అవేమీ లేకుండానే వారికి పధకాలు రూపొందిస్తుందా? వున్న పధకాలను ఎత్తివేస్తుందా ? అమెరికా అంటే బిజెపి, సంఘపరివార్‌ శక్తులకు వల్లమాలిన అభిమానం అక్కడ వర్షం కురిస్తే ఇక్కడ గొడుగులు పడతారు. అమెరికా పర్యటన జరపాలని నరేంద్రమోడీ ఎంతగా తపించి పోయారో తెలిసిందే. అలాంటి అమెరికా సైన్యంలో ముస్లింలు, నల్లవారు, తెల్లవారు, ఇతర జాతుల వారు ఎందరున్నారో ప్రతి ఏటా సంఖ్యా వివరాలను ప్రకటిస్తారని తెలియదా ? మరి అక్కడ రాని పొరపొచ్చాలు మన దేశంలో ఎందుకు వస్తాయని భావిస్తున్నారు?

    పాకిస్తాన్‌ పాలనలో మిలిటరీ ఆధిపత్యం, ప్రభావం గురించి బహిరంగ రహస్యమే. ఆ మిలిటరీ చర్యలను కూడా అక్కడి మీడియా తప్పు పట్టి ప్రశ్నించిందన్న విషయాన్ని అంగీకరిస్తారా లేక పాక్‌ మీడియా కథలను ప్రచారం చేయటంగా కొట్టి పారవేస్తారా ?http://indiatoday.intoday.in/story/pakistan-miliatry-is-no-holy-cow/1/143245.html ఈ వ్యాసాన్ని మన భారతీయ పత్రిక ఇండియా టుడే ఐదు సంవత్సరాల క్రితం ప్రచురించింది. అందరూ చూస్తుండగానే ఇస్లామాబాద్‌లో సలీమ్‌ షహజాద్‌ అనే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు అపహరించి తరువాత చంపివేశారు.అది మిలిటరీ కనుసన్నలలో పని చేసే ఐఎస్‌ఐ పనే అని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ మిలిటరీ ఒక ప్రకటన చేసింది. వార్తలు వాస్తవం కాదని తోసి పుచ్చితే ఒక రకం, అలా కాకుండా వివరాలను వెల్లడిస్తే అది జాతీయ భద్రతకు ముప్పు వస్తుందని, సైనిక బలగాల నైతిక స్ధైర్యం దెబ్బతింటుందని పేర్కొనటమే కాదు, కస్టడీలోకి తీసుకున్న పౌరులను మిలిటరీ చిత్రహింసలు పెట్టదు, చంపదు అని, సలీమ్‌ సహజాదీ హత్యలో ఐఎస్‌ఐ ప్రమేయమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. దీనిపై పాక్‌ పత్రిక ఫ్రైడే టైమ్స్‌ పత్రిక సంపాదకుడు నజమ్‌ సేథీ వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యంలో విమర్శలకు అతీతమైవేవీ లేవు, మిలిటరీ కూడా అలాంటిదే అని రాశాడు. మరి మనది ప్రజాస్వామ్యం. కాశ్మీర్‌, ఈ శాన్య రాష్ట్రాలలో ప్రత్యేక అధికారాలు కలిగిన మిలిటరీపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. మిలిటరీ సైతిక స్ధైర్యం దెబ్బతిన కుండా వుండాలంటే ఆ చర్యలను విమర్శించకూడదా ? మిలిటరీ చర్యలతో దెబ్బతింటున్న సామాన్య పౌరుల మనో స్ధైర్యం నంగతేమిటి ?

    పౌరపాలకుల పర్యవేక్షణలో పని చేస్తున్న మిలిటరీ వ్యవస్ధలలో మనది ఒకటిగా గర్వించాల్సిందే. నిత్యం సరిహద్దులను కాపాడుతున్న వారి సామర్ధ్యం, త్యాగాలకు హారతి పట్టాల్సిందే. వారి విశ్వసనీయతను ప్రశ్నించకూడదన్నది కూడా నిజమే. సర్జికల్‌ దాడులకు మన దగ్గర సాక్ష్యాలు వున్నాయని బల్లగుద్ది మరీ చెప్పినపుడు అబ్బే అసలు దాడులే జరగలేదని పాక్‌ ప్రభుత్వం ఎత్తుగడగానే చెప్పి వుండవచ్చు, ఎందుకంటే తన పౌరులకూ అది సంజాయిషీ ఇచ్చుకోవాలి గనుక.ఈ వుదంతంలో ప్రపంచ దృష్టిలో ఎవరిది పైచేయిగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌ అసలు దాడులే జరగలేదనే వాదనకే కట్టుబడి వుంది. పరిస్థితులు సాధారణంగానే వున్నాయి చూడమంటూ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాలను చూపింది. దాడులు జరిగి వుంటే సాక్ష్యాలు వెల్లడించాలని సవాలు చేస్తున్నది. ఇది కూడా ప్రచార ఎత్తుగడే అనుకుందాం .

  మన దేశంలో జరిగిందేమిటి ? తాజా వివాదానికి అధికార రాజకీయ నేతల, మిలిటరీ వున్నతాధికారుల బాధ్యతేమీ లేదా ? సర్జికల్‌ దాడుల వివరాలతో సహా అనేక అంశాలు గోప్యంగా వుంచాల్సినవే అయినపుడు దాడులను తాము చిత్రీకరించామని, ద్రోణులను కూడా వుపయోగించామని చెప్పాల్సిన అవసరం ఏముంది. దాడులు చేశాం అని మాత్రమే చెప్పి వుంటే సరిపోయేది కదా ? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన మాదిరి కాళిదాసు కవిత్వానికి స్వంతపైత్యం జోడించి నట్లు మిలిటరీ వినియోగించిన రాత్రుళ్లు చూడగలిగే పరికరాలు మా మచిలీపట్నంలోని బెల్‌లో తయారు చేశారని, ఆ ఫ్యాక్టరీని మరింత విస్తరించేందుకు మా చంద్రబాబు నాయుడు నిమ్మలూరులో మరో ప్లాంట్‌ ఏర్పాటుకు చర్య తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు సర్జికల్‌ దాడుల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించలేదా ? సర్జికల్‌ దాడుల రీత్యా సరిహద్దులలో పాక్‌ మిలిటరీ చర్యకు పూనుకోవచ్చంటూ వందలాది గ్రామాల నుంచి పౌరులను ఖాళీ చేయించటానికి, తరువాత ఆ కార్యక్రమాన్ని వుపసంహరించుకోవటానికి బాధ్యత ఎవరిది? దాడుల గురించి గుండెలు వుప్పొంగించుకోనవసరం లేదని జబ్బలు చరుచుకోవనవసరం లేదని ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారంటూ వచ్చిన వార్తలు కూడా పాక్‌ సృష్టే అంటారా ? సర్జికల్‌ దాడుల ఖ్యాతి అంతా మోడీకే దక్కాలని రాసిన మీడియా పెద్దమనుషులే రొమ్ములు విరుచుకోవనసరం లేదని ప్రధాని చెప్పినట్లు కూడా రాయటం మోడీ వ్యక్తిత్వాన్ని పెంచటంలో భాగమని సంతోషించి వుండవచ్చు. కానీ అవి సర్జికల్‌ దాడుల తీవ్రతను తగ్గించే సందేశాన్ని కలిగి వున్నాయని గ్రహించారా ? ఎవరు ఎవరి వలలో పడ్డారు.ఈ మొత్తం వుదంతం ఎలాంటి సందేశం ఇస్తున్నది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వుగ్రవాదంపై పోరు : వేయి ఆలోచనలను వినండి !

01 Saturday Oct 2016

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Afghanistan, IS, Let a thousand ideas be heard, talibans, terrorism, war on terrorism

ఎం కోటేశ్వరరావు

     కౌరవ సభలో ద్రౌపదిని అవమానించవద్దన్న విదురుని నీతి వాక్యాలు పని చేసి వుంటే మహాభారత యుద్దమే వుండేది కాదన్నది కొందరి అభిప్రాయం. యుద్ధ చరిత్రలను చూసినపుడు దానిని అంగీకరించలేము. పాండవులకు రాజ్యభాగాన్ని ఇవ్వకుండా వుండేందుకు కౌరవులు మరొక సాకును వెతికి వుండేవారన్నది స్పష్టం. మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. అందువలన ఎవరైనా తమంతట తాముగా లేదా ఎవరి తరఫున అయినా యుద్ధం లేదా దానికి సమానమైన వుగ్రవాద దాడులు చేయాలనుకుంటే వారికి ద్రౌపదితో పని లేదు తోడేలు న్యాయం ఎలాగూ వుంటుంది. తెరవెనుక వున్న అమెరికా వైఖరిలో మార్పు వచ్చేంత వరకు ఏదో ఒక రూపంలో ప్రపంచవ్యాపితంగా వుగ్రవాదులు పుడుతూనే వుంటారు, లేదా అమెరికన్లు వారికి తొత్తులుగా వుండే పాకిస్తాన్‌ వంటి దేశాలు వుగ్రవాదులను తయారు చేస్తూనే వుంటాయి. మన దేశంపైకి వుసి కొల్పుతూనే వుంటారు. మనం నిరంతరం జాగరూకులుగా వుండాలి. దొరికినపుడు చావు దెబ్బతీయాలి.

  పొరుగు దేశం జరిపే ప్రత్యక్ష దాడులను ఎదుర్కోవటానికి, పొరుగుదేశం తయారు చేసిన వుగ్రవాదులను ఎదుర్కొనటానికి వున్న తేడాను అర్ధం చేసుకోవాలి. యురి వుదంతం తరువాత మన దేశంలో సహజంగానే వుగ్రవాద, పాకిస్తాన్‌ వ్యతిరేకత బాగా పెరిగింది.మన ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాలనే వైఖరితో వున్నట్లు చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.ఈ దశలో ప్రతీకార చర్యల గురించి ఎవరైనా భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తే అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించే పరిస్థితి కూడా వుంది. మనోభావాలు, ప్రతీకారేఛ్చ ఎక్కువగా వుండటం సహజం. అయితే వుద్రేకం, ఆగ్రహంలో వివేచనను మరచి పోకూడదు. ఎవరైనా తమ మనోభావాలకు భిన్న అభిప్రాయం వ్యక్తం చేస్తే వారి మీద ఆగ్రహించితే ప్రయోజనం లేదు. ఏడుగురు అంధులు-ఏనుగు వర్ణణ కథ తెలిసిందే. దాని నీతి ఏమిటి ఎవరి స్పర్శ, అనుభవంలోకి వచ్చిన దానిని బట్టి వారు ఏనుగెలా వుంటుందో వర్ణించారు. అలాగే సమాజంలో వున్న భిన్న వ్యక్తులు తమ అనుభవాలు, అధ్యయనంలో కలిగిన భావాలకు అనుగుణంగా పరిష్కార మార్గాలను సూచించవచ్చు,పరిష్కారాలు చెప్పవచ్చు. అంత మాత్రాన వారిపై ఆగ్రహం చూపకూడదు.

    వస్తాదుల మాదిరి వుగ్రవాదులను తయారు చేసినపుడు వారికి పని కల్పించకపోయినా, ఏకారణంతో అయినా వారికి ఎదురు చెప్పినా శిక్షణ ఇచ్చిన వారి మీదే తారసిల్లుతారు. మనకు పక్కనే వున్న శ్రీలంకలోని తమిళ వుగ్రవాదులకు మన దేశంలో శిక్షణ శిబిరాలు నిర్వహించి, ఆయుధాలు, డబ్బు సమకూర్చిన విషయం బహిరంగ రహస్యం. అలాంటి వారిని అణచివేసేందుకు మన కేంద్రమే సైన్యాన్ని పంపిన కారణంగా ఆ తీవ్రవాదులే మన ప్రధాని రాజీవ్‌ గాంధీని బలిగొన్న విషయం కూడా విదితమే. అలాగే పంజాబ్‌లో అకాలీదళ్‌ స్ధానే కాంగ్రెస్‌ను బలపరచాలనే లక్ష్యంతో ఖలిస్తాన్‌ తీవ్రవాది భింద్రన్‌ వాలేను పెంచి పోషించిన ఇందిరా గాంధీ ఆ సిక్కు తీవ్రవాదానికే బలి అయిన విషయమూ తెలిసిందే.

     తాలిబాన్లను పెంచి పోషించిన ఇప్పుడు అమెరికా,పాకిస్థాన్ల పరిస్థితి కూడా అలాగే వుంది. అందుకు మనమేమీ వారి మీద జాలి చూపాల్సిన అవసరం లేదు. తాము తయారు చేసిన ఐఎస్‌, తాలిబాన్లు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తారో తెలియక అవి కొట్టుమిట్డాడుతున్నాయి. తాలిబాన్లపై యుద్ధం ప్రకటించి ఆఫ్ఘనిస్తాన్‌కు సైన్యాలను నడిపిన అమెరికా 2001నుంచి ఇప్పటి వరకు సాధించిందేమిటి ? తాలిబాన్లపై దాడి చేయటానికి ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు అనేక దేశాల నుంచి సైన్యాన్ని రప్పించారు. జరిగిందేమిటి. తాలిబాన్ల సంఖ్య తామర తంపరగా పెరుగుతూనే వుంది. అప్పటి వరకు ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌కే పరిమితంగా వున్న వారు ప్రపంచ వ్యాపితంగా విస్తరించారు.

     పదమూడు సంవత్సరాల రెండు నెలల 21 రోజుల యుద్ధంలో అమెరికా నాయకత్వంలో అంతర్జాతీయ దేశాల కూటమి జరిపిన దాడులలో ఎందరు తాలిబాన్లు మరణించారు, ఎన్ని శిబిరాలను ధ్వంసం చేశారో ఇప్పటికీ ఇదమిద్దంగా తెలియదంటే నమ్మక తప్పదు.http://www.voanews.com/a/despite-massive-taliban-death-toll-no-drop-in-insurgency/1866009.html  సగటున రోజుకు  12 మంది తాలిబాన్లను మట్టు పెట్టినట్లు ఆఫ్ఘన్‌ పోలీసులు, మిలిటరీ చెప్పింది. ఆ లెక్కన 4,830 రోజులలో 57,960 మంది తాలిబాన్లను అంతం చేసినట్లు. ఇంత జరిగాక కూడా అప్పటికి ఇంకా 60 వేల మంది తాలిబాన్లు వున్నట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో వార్తలో పేర్కొన్నారు. ఇదే సమయంలో తాలిబాన్ల చేతులలో హతమైన వారు లేరా ? వారెందరు ? ఆప్ఘన్‌ సైనికులు 21,950,అమెరికా సైనికులు 2,356 మందితో సహా మిగతా దేశాల సైనికులు 3,456 కిరాయి సైనికులు( కాంట్ట్రార్లు )1500, గాయపడిన వారు ఆఫ్ఘన్‌ సైనికులెందరో తెలియదు, అమెరికన్లు 19,950 మందితో సహా విదేశీ సైనికులు 22,773, కిరాయి సైనికులు 15000 మంది వున్నారు. వుభయుల చేతిలో మరణించిన సామాన్య పౌరులు మరికొన్ని వేల మంది వున్నారు. ఇంత చేసి సాధించిందేమిటి ? ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు యధాతధంగా వున్నారు, అక్కడి అమెరికా తొత్తు ప్రభుత్వం, వారికి మద్దతుగా కొనసాగుతున్న పరిమిత సంఖ్యలో వున్న అమెరికా సైనికులు, పక్కనే వున్న పాకిస్థాన్‌పై తాలిబాన్లు నిరంతరం దాడులు జరుపుతూనే వున్నారు.

     ప్రస్తుతం తాలిబాన్లపై మూడున్నర లక్షల మంది ఆఫ్ఘన్‌ సైనికులు, 9,800 మంది అమెరికన్లతో సహా 40దేశాలకు చెందిన 13,000 మంది సైనికులు, దాదాపు 26వేల మంది కిరాయి సైనికులు దాడులు జరుపుతున్నారు. అయినప్పటికీ 30 నుంచి 60వేల మంది తాలిబాన్లు, వెయ్యి నుంచి మూడువేల మంది ఐఎస్‌ వుగ్రవాదులు, వారి మద్దతుదార్లు మరో పదివేల మంది వున్నారని అంచనా.తాలిబాన్లు ప్రస్తుతం తమ దేశంలో వున్న అమెరికా, తమ సైన్యం, జనం మీదనే గాక గతంలో నారు వేసి నీరు పోసిన పాకిస్థాన్‌పై నిరంతరం దాడులు జరుపుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకు పాకిస్థాన్‌లో జరిపిన దాడులలో 262 మంది సామాన్యులు మరణించారు.ఈ పూర్వరంగంలో సర్జికల్‌ దాడులకు బదులు సరిహద్దులలోని వుగ్రవాద శిబిరాలపై ప్రత్యక్ష దాడులే జరిపిందనుకుందాం వుగ్రవాదులు, వుగ్రవాదం పూర్తిగా అంతం అవుతుందా ? మన కంటే ఎన్నో రెట్లు బలమైన అమెరికన్లు ఎందుకు విఫలమయ్యారు. ఇప్పుడు సిరియాలో ఐఎస్‌ తీవ్రవాదులను అంతం చేసేందుకు అటు సిరియా సైన్యం, రష్యన్‌ వైమానిక దళం ఎంతగా శ్రమిస్తున్నదో చూస్తున్నాం. ఇరాక్‌లో ఐఎస్‌ తీవ్రవాదులు కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అందువలన వివేచనతో ఆలోచించాలి. వుగ్రవాద అంతానికి కొత్త మార్గాలను కనుగొనాలి. పిచ్చి మొక్కలు మొలకెత్త కుండా వుండాలంటే పొలాన్ని నిరంతరం సాగు చేస్తుండాలి. ఎయిడ్స్‌ వ్యాధిని నిరోధించటానికి ప్రయత్నిస్తూనే చికిత్స చేయటానికి అవసరమైన ఔషధాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుత పరిస్థితులలో వుగ్రవాదం కూడా అలాంటిదే. వుగ్రవాదులను అంత మొందించేందుకు ఎంతగా ప్రయత్నించాలో వారు తయారు కాకుండా చూసేందుకు అంతకంటే ఎక్కువగా ప్రయత్నించాలి. దానికి అనేక మంది అనేక మార్గాలు చెబుతున్నారు. నూరు పూవులు పూయనివ్వండి వేయి ఆలోచనలు వికసించనివ్వండి అన్నట్లు వాటిని స్వాగతించండి. ప్రతి ఒక్కరూ ఇతరులతో ఆలోచనలు పంచుకోండి. అంతే కాని మరోమాట వినం అనే స్థితికి పోవద్దని మనవి.

   ఈ పూర్వరంగంలో మన సైన్యం సర్జికల్‌ దాడులు జరిపి మన సత్తా ఏమిటో పాకిస్థాన్‌కు, వుగ్రవాదులకు చూపటం అభినందనీయం. ఇదే సమయంలో మన దేశంలో సరిహద్దులలోని పది కిలోమీటర్ల లోపు జనం గ్రామాలను వదలి వెళ్లిపోతున్నారని వార్తలు వచ్చాయి. నాలుగు రోజులు హైదరబాదులోని లోతట్టు ప్రాంతాలు, వాటిలో కట్టిన అపార్ట్‌మెంట్లు వర్షాలకు మునిగితే ఖాళీ చేయటానికి పడిన, పదిరోజుల తరువాత కూడా పడుతున్న ఇబ్బందుల గురించి మీడియా కథనాలను చూస్తున్నాము. అందువలన యుద్ధం అంటే ప్రాణాలకు తెగించాల్సింది వీర జవాన్లు, సరిహద్దులలోని లక్షల మంది సామాన్య జనం. ధనికులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతారు.సామాన్యులకు ఎలాంటి సౌకర్యాలు వుండని స్కూళ్లు, ప్రభుత్వ భవనాలే గతి. అందువలన ఎవరైనా యుద్ధం మినహా ఇతర పరిష్కార మార్గాలను చూడమని చెబితే వారిని దేశద్రోహులుగా చూడాల్సిన అవసరం లేదు. వారేమీ పాకిస్తాన్‌ మీద, వుగ్రవాదుల మీద ప్రతీకారం తీర్చుకోవద్దని చెప్పటం లేదు.

   పాక్‌ వుగ్రవాద ప్రోత్సాహం ఈ నాటిది కాదు, దశాబ్దాల తరబడి సాగుతున్నది, మన దేశం ఎంతో నష్ట పోయింది. అలాంటి పాకిస్థాన్‌ను దెబ్బతీయటానికి సింధు నది మీద మన దేశంలో ప్రాజెక్టులు కట్టి ప్రతీకారం తీర్చుకోవచ్చన్న సూచనలు వచ్చాయి. అలాంటి వాటిని నిర్మించమనండి దేశ ప్రజలందరూ అవసరమైతే ఒక రోజు శ్రమదానం చేయటానికి సిద్ధంగా వున్నారు. లేదూ యురి సైనిక శిబిరంలో గడ్డి పెరిగి పోయిన కారణంగా వుగ్రవాదులు నది దాటి వచ్చి గడ్డిలో దాక్కొని దాడి చేశారని చెప్పారు. గడ్డి తొలగించటానికి కావాలంటే ఎంత విరాళం కావాలంటే అంత ఇచ్చేందుకు జనం సిద్దంగా వుంటారు. లేదూ పీకమంటే రావటానికి సిద్ధం. అలాగే నది గట్లపై ముళ్ల కంచెలు వేసి వుగ్రవాదులు, శత్రు సైనికులు చొరబడకుండా చూడమనండి అందరూ తలా ఒక చేయి వేస్తారు.

    యుద్ధం అంటే ముందుగా నిజం సమాధి అవుతుంది. అనేక కట్టుకధలు ప్రచారంలోకి వస్తాయి. అనేక మంది సామాజిక మీడియాలో తాజా పరిస్థితిలో రాజకీయాలు వద్దని చెబుతున్నారు. వారి అభిప్రాయం సరైనదే. కానీ రాజకీయాలు చేస్తున్నది ఎవరు ? సర్జికల్‌ దాడుల ఖ్యాతి ఆయనకు పూర్తిగా కట్టపెట్టటానికి ప్రతిపక్షాలు ముందుకు రావటం లేదు అని ఒక పత్రిక రాసింది. ఒకవైపు మరణించి సైనికుల కుటుంబాలు ఇంకా ఆవేదన నుంచి బయటకు రాలేదు. అప్పుడే ఖ్యాతి కట్టబెట్టటం గురించి మీడియాలో వ్యాఖ్యలు చేసే వారు నిజమైన దేశద్రోహులు అనాల్సి వుంటుంది. అదంతా సైన్యం గొప్పతనమే అన్నట్లు గా ప్రతిపక్షాల వారు వ్యాఖ్యానిస్తున్నారట. గతంలో కార్గిల్‌ యుద్ధం కారణంగా బిజెపి విజయం సాధించినట్లే ఇప్పుడు సర్జికల్‌ దాడుల కారణంగా వుత్తర ప్రదేశ ఎన్నికలలో బిజెపి విజయం సాధించనున్నదని పరిశీలకులు భావిస్తున్నారట. అంటే ఒక వైపు సైన్యం అప్రమత్తంగా వుంది, మరోవైపు దాడులు జరిగితే ప్రాణాలు కాపాడుకోవాలని సరిహద్దు పౌరులు సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని దేశమంతా వుగ్గపట్టుకొని కూర్చున్నది. ఈ స్థితిలో రాజకీయ పరిశీలకుల పేరుతో ఎన్నికల లాభాల గురించి పత్రికలు రాయటాన్ని ఏమనాలి. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకునే వారికంటే నీచమిది.ఇలాంటి వ్యాఖ్యల కారణంగా రాబోయే గుజరాత్‌, వుత్తర ప్రదేశ్‌ మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల కోసమే మోడీ నాయకత్వం సర్జికల్‌ దాడులకు తెరతీసింది అనుకోవాలా ? నిజంగా వుగ్రవాద నిర్మూలన కోరుకునే వారు చేయాల్సిన పనేనా ఇది ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నష్టపరిహారం కోరుతున్న ఇరాన్‌ , అమెరికా సాధించింది ఏమిటి !
  • వృద్దులు, వితంతువుల ఉసురు తీస్తున్నదెవరు – ఒక్క రూపాయి కూడా పెన్షన్‌ పెంచని 75 ఏండ్ల పుష్కర ప్రధాని నరేంద్రమోడీ మరో పుష్కరం ఉన్నా ప్రయోజనం ఏమిటి ?
  • దెబ్బకు దెబ్బతీస్తున్న ఇరాన్‌ -మరో మలుపు తిరిగిన సంక్షోభం !
  • నరేంద్రమోడీ పాలన నిర్వాకం : నేటి పిల్లలే భావి భారత బలహీనులు, తాజా సర్వే నుంచి రక్తహీనత గాయబ్‌ !
  • యూదులకు కాదు, దురహంకారానికి వ్యతిరేకం- సోషలిస్టు మేయర్‌ జోహ్రాన్‌ మందానీ !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on అసంబద్ద వాదనలు, అడ్డగోలు మాటలు…
Sk mahesh gupta's avatarSk mahesh gupta on శనగ రైతుల సంక్షోభం
pscknr's avatarpscknr on ఆడంతే నమ్మక ద్రోహి అన్న ఇరాన్‌…
pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…

Archives

  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d